Mulugu
-
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
వెంకటాపురం(కె): ఏజెన్సీలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పొ అన్నారు. పీఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీఓ తొలిసారిగా మంగళవారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండల పరిధిలోని చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల 1, చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల 2ను తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పాఠశాల పునఃప్రారంభం నాటికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల 1లో వాటర్ సమస్య, చిరుతపల్లి 2 పాఠశాలలో రూప్ లీకేజీ సమస్య ఉందని పీఓ దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించి రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పొ -
20 నుంచి సాంస్కృతిక ఉత్సవాలు
● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ములుగు: ములుగు సాంస్కృతిక వైభవం ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ములుగు సాంస్కృతిక వైభవం ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఉత్సవాల షెడ్యూల్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ములుగు సాంస్కృతిక వైభవం ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో, జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల, బాలికల పాఠశాలల్లో ఈ నెల 20, 21,22 తేదీలలో మూడు రోజుల పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్, గిరిజన నృత్యాలు, కవి సమ్మేళనం అంశాలతో పాటు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా కలెక్టర్ జిల్లా కేంద్రంలోని తాత్కాలిక బస్టాండ్ ఆవరణ పరిసరాలను, ములుగు మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రకృతి వనాన్ని, చలి వేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఈవీఎం గోదాంను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నెలవారి తనిఖీ నిర్వహించారు. గోదాంలో అమర్చిన సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక పరికరాలను తనిఖీ చేశారు. నేడు సర్పంచ్లు, కౌన్సిలర్లకు శిక్షణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్య వారోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్య కార్యక్రమాలపై సర్పంచులకు, కౌన్సిలర్లకు నేడు(బుధవారం) ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సహదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు బుధవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఒక్క రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. -
ఉమ్మడి వరంగల్ నుంచి చివరి లొంగుబాటు
కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. దళాలకు దళాలే మృత్యువాత పడగా.. మరికొందరు అగ్రనేతలు, మావోయిస్టుల ఆయుధాలతో సహా లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 టార్గెట్గా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ పూర్తయిన సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ అగ్రనేతలు ముప్పాల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి, పొలిట్బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాతో పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోశ్ పేరును కూడా కేంద్రం ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీస్ కూంబింగ్లు మరింత ఉధృతంగా సాగుతున్న తరుణంలో కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అలియాస్ సంతోశ్ మంగళవారం భార్యతో కలిసి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. కాగా, ఉమ్మడి వరంగల్ నుంచి ఇంకా ఐదారుగురు మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నట్లు ప్రచారం ఉన్నా.. పోలీసు రికార్డుల్లో మాత్రం లేరు. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి పోలీసు రికార్డుల్లో కీలక నేతగా ఉన్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, సంతోశ్ లొంగుబాటు చివరిదిగా చెబుతున్నారు. అజ్ఞాత మావోయిస్టుల జాబితాలో ఉన్న నరహరి జనజీవన స్రవంతిలో కలవడంతో నక్సల్స్ రహిత జిల్లాగా మారిందంటున్నారు. -
తప్పులు లేకుండా సర్వే పూర్తిచేయాలి
● రాష్ట్ర సెన్సెస్ ఆపరేషన్ జేడీ సుబ్బరాజు ములుగు: మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఇళ్ల గణనలో తప్పులు లేకుండా సర్వే పూర్తి చేయాలని ఎన్యుమరేటర్లకు రాష్ట్ర సెన్సెస్ ఆపరేషన్ జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజు సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మున్సిపాలిటీలోని సూపర్వైజర్ సర్కిల్లో సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లు ఇంటి నంబర్లను ఎలా కేటాయిస్తున్నారో, పని సక్రమంగా జరుగుతుందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతీ ఇంటి నంబర్ ఎదురుగా శ్రీసీఎన్శ్రీ అని తప్పనిసరిగా రాయాలని సూచించారు. మ్యాపింగ్ ఎలా చేస్తున్నారో కూడా ఆయన ఆరా తీశారు. సర్వేలో వేగం పెంచాలని తెలిపారు. ఎన్యుమరేటర్లకు కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ హెచ్ఎల్బీ పరిధిని స్పష్టంగా తెలియజేసేందుకు మున్సిపాలిటీ నుంచి మూడు రోజుల పాటు సిబ్బందిని వారి వెంట పంపించాలని ఆదేశించారు. జిల్లాలోని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు బుధవారం సాయంత్రంలోపు తమకు కేటాయించిన ప్రతీ ఇంటికి ఇంటి నంబర్లు వేయడం పూర్తి చేయాలని సూచించారు. వచ్చే నెల 9వ తేదీ వరకు సర్వే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. రోజువారీ పనితీరుపై మానిటరింగ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెన్సెస్ ఇన్చార్జ్ వినయ్, ములుగు సీపీవో, జిల్లా సెన్సెస్ అధికారి ఎం.ప్రకాశ్, మున్సిపాలిటీ చార్జ్ ఆఫీసర్ కమిషనర్ సంపత్, స్టాటిస్టికల్ ఆఫీసర్ బి.లాల్నాయక్, ఫీల్డ్ ట్రైనర్లు, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు. -
సాగుకు సన్నద్ధం
ఖరీఫ్ ప్రణాళిక ఖరారు చేసిన అధికారులుములుగు: జిల్లాలో రాబోయే వానాకాలం (ఖరీఫ్ సీజన్)కు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు సమగ్ర ప్రణాళికను ఖరారు చేశారు. ఈ ఏడాది మొత్తం 1,63,229 ఎకరాల్లో వివిధ పంటలు సాగుకానున్నట్లు అధికారులు అంచనా వేశారు. జూన్ నెలలో ప్రారంభమయ్యే ఖరీఫ్ సాగును దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అధికారులు విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లాలో వివిధ పంటల సాగుకు 29,336 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని గుర్తించారు. ప్రస్తుతం 14,159 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉన్నాయి. మిగతా విత్తనాలను త్వరితగతిన విడతల వారీగా సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 10 మండలాలు.. 1,63,229 ఎకరాలు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 1,63,229 ఎకరాల్లో వానకాలం పంటల సాగు కానున్నట్లు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 1,07,700 ఎకరాల్లో వరి, 28,600 ఎకరాల్లో పత్తిపంట, 11,329 ఎకరాల్లో మొక్కజొన్న, 14,500 ఎకరాల్లో జీలుగ, 1,100 ఎకరాల్లో జనుము పండించనున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం 26,925 క్వింటాళ్ల వరి విత్తనాలు, 906 క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలు, 1,450 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు, 55 క్వింటాళ్ల జనుము విత్తనాలు, 54,286 పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరమున్నట్లు అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ సెక్టార్లలో 6,350 క్వింటాళ్ల విత్తనాలు, ప్రైవేటు సెక్టార్లలో 7,809 క్వింటాళ్ల విత్తనాలతో పాటు 28,150 పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పంటల సాగుకు 17,504 మెట్రిక్ టన్నుల యూరియా, 10 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 8 వేల మెట్రిక్ టన్నుల ఎంఓపీ ఎరువులు అవసరమున్నట్లు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో 1,63,229 ఎకరాల్లో సాగుకానున్న పంటలు 29,336 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా అందుబాటులో 14,159 క్వింటాళ్ల విత్తనాలుభూములు సిద్ధం చేస్తున్న రైతులు వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే భూముల్లోని పత్తి, మిర్చి పొరకలను తొలగిస్తూ సాగుకు రెడీ చేస్తున్నారు. మరో 20 రోజుల్లో వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో విత్తనాలను, ఎరువులను ముందస్తుగా నిల్వ చేసుకునేలా సన్నహాలు చేస్తున్నారు. ప్రతిఏటా పంటలు పండిస్తున్నా అతివృష్టి, అనావృష్టి కారణంగా అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈసారైనా మంచి దిగుబడులు రావాలని రైతులు ఆశిస్తూ ముందుకు సాగుతున్నారు. పంటల దిగుబడి పెరిగేలా వ్యవసాయ శాఖ అధికారులు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ, సమయానికి విత్తనాలు, ఎరువులు అందించాలని రైతులు కోరుతున్నారు.విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం..జిల్లాలో వానాకాలం సాగుకు ప్రణాళికలు రూపొందించాం. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లాలో రాబోయే ఖరీఫ్ సీజన్లో 1,63,229 ఎకరాల్లో పంటలు సాగుకానున్నాయి. రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – సురేశ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి -
గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
ఏటూరునాగారం: జిల్లాలోని గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదవనున్న గిరిజన విద్యార్థులకు ఈ నెల 16, 18వ తేదీల్లో రెండు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయ అధికారి(డీసీఓ) శ్రీనివాస్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏటూరునాగారం టీజీటీడబ్ల్యూఆర్జేసీ (బాలుర) కళాశాలలో ఈనెల 16న బాలురకు, టీజీటీడబ్ల్యూఆర్జేసీ (బాలికల) కళాశాలలో చేరేందుకు ఈ నెల 18న బాలికలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీసీఓ పేర్కొన్నారు. బాల బాలికలు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ పత్రాతలతో హాజరు కావాలని కోరారు. 2025–26 విద్యాసంవత్సరంలో ఎస్ఎస్సీ ఉత్తీర్ణత పొందిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. ‘కేసులు నమోదు చేయాలి’ వెంకటాపురం(కె): ఏజెన్సీలో ఆదివాసీలపై దాడులకు పాల్పడిన గిరిజనేతరులపై కేసులు నమోదు చేయాలని గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాయం సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయిలు తెలిపారు. మండలకేంద్రంలో గొండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీలపై దాడి చేసిన గిరిజనేతరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో లొసుగులు తెలుసుకుని శిక్ష తగ్గించే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏజెన్సీలో ఆదివాసీలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇరుప ప్రకాశ్, పూనెం వరప్రసాద్, రవి, అశోక్, బన్ని తదితరులు పాల్గొన్నారు. సింగరేణి క్వార్టర్స్లో చోరీగణపురం: మండలంలోని 1000 క్వార్టర్స్లో ఒకే రాత్రి 8 ఇళ్లలో చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గణపురం మండలం 1000 క్వార్టర్స్లో సింగరేణి ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో వారి స్వగ్రామాలకు వెళ్లారు. ఇది గమనించిన దుండగులు పక్కా ప్రణాళికతో శనివారం రాత్రి 8 క్వార్టర్ల తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించారు. ఆదివారం ఉదయం తోటి ఉద్యోగులు గమనించి బాధితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్టీంతో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. బ్లాక్ నంబర్ 34 రూం నంబర్ 128లో నివాసముంటున్న మల్లగాని సరస్వతికి చెందిన 3 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు, గాజుల వెంకటేశ్వర్లు 5 గ్రాముల బంగారు కమ్మలు, 4 గ్రాముల వెండి, రూ.6వేల నగదు, పాతరవేని రాజేష్కు చెందిన 2 గ్రాముల బంగారం, 4 తులాల వెండి, వేములపల్లి బాబురావు క్వార్టర్లో 10 తులాల వెండితో పాటు రూ. 1000 నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. సింగరేణి సెక్యూరిటీ ఉండి, నిత్యం జనాభాతో ఉండే 1000 క్వార్టర్లలో చోరీ జరగడం సంచలనం సృష్టించింది. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలిభూపాలపల్లి అర్బన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ బీజేపీ నాయకత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆయన ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి విచారణకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీను, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు భువనసుందర్, వెంకీయాదవ్, దేవన్, లక్ష్మి, పరమేశ్వరి, అజ్మీర జంపన్న, రమేష్, హఫీజ్, రాధా, ప్రేమ్కుమార్, నాగరాజు, కిషోర్, భిక్షపతి, పొనగంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
● ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ములుగు: జిల్లాలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో కొనసాగుతున్న పలు విద్యుత్ అభివృద్ధి పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ములుగులో కొత్తగా నిర్మిస్తున్న డిపార్ట్మెంటల్ ఎస్పీఎం షెడ్ పనులు, ప్రైవేట్ ఎస్పీఎం షెడ్ను సందర్శించారు. ఫెయిల్యూర్ ట్రాన్స్ఫార్మర్ల రికార్డులు, నిర్వహణ విధానం, పనితీరును పరిశీలించారు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల ప్రక్రియను మరింత వేగవంతం చేసి రోలింగ్ స్టాక్ పెంచుకోవాలని సూచించారు. 33కేవీ కొత్త లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు 33కేవీ లైన్ సుమారు 27 కిలోమీటర్ల అటవీ ప్రాంతం మీదుగా కర్లపల్లి సబ్ స్టేషన్ నుంచి లింగాల కొత్త సబ్స్టేషన్కు కలుస్తుందని అధికారులు సీఎండీకి వివరించారు. అదేవిధంగా పస్రా సెక్షన్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న సెక్షన్ ఆఫీస్ పనులను పరిశీలించి, ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. 33/11 కేవీ లింగాల నూతన సబ్స్టేషన్ ఏర్పాటుతో గుండాల, కొడిశెల, లింగాల పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫరా మరింత మెరుగ్గా అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎండీ వెంట సీఈ రాజుచౌహన్, ఎస్ఈ బేతి భిక్షపతి, ములుగు డీఈ (ఆపరేషన్) నాగేశ్వర్ రావు, డీఈలు పురుషోత్తం, సదానందం, ఈఈ వెంకట్రాం, ఏడీఈలు ప్రణయ్, సందీప్ పాటిల్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
ఏటూరునాగారం: పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు అకాడమిక్ మానిట రింగ్ అధికారి శ్యామ్సుందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో మంగళవారం చేపట్టిన రెమిడియల్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ మళ్లీ వారు ఉత్తీర్ణులు అయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో టెన్త్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం వచ్చిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు వచ్చాయని వివరించారు. ఫెయిలైన విద్యార్థులు నిరాశ చెందకుండా ప్రణాళికతో చదివి ఉత్తీర్ణులు కావాలని సూచించారు. అదే విధంగా జెడ్పీహెచ్ఎస్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటి వద్ద పిల్లలు టీవీలు, సెల్ఫోన్లకు అతుక్కుపోవద్దని ప్రభుత్వం సమ్మర్ క్యాంప్లు ఏర్పాటు చేసిందన్నారు. సమ్మర్ క్యాంప్ ఉత్సాహభరితంగా ఉంటుందని, విద్యార్థులు ఈ క్యాంప్ను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సాంబశివరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి
● వీసీలో సీఎం రేవంత్రెడ్డి ములుగు: మొక్కజొన్న,ఽ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. ఈ మేరకు జిల్లా నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ మహేందర్ జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రతీ ప్రైవేట్ గోదాంను అవసరమైతే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని నిల్వ సదుపాయాలను పెంచాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లు, రైతు బజార్లను తాత్కాలిక షెడ్లుగా వినియోగించాలని ఆదేశించారు. అవసరమైన వాహనాల ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. -
మైనింగ్కు ఊతం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వం మైనర్ ఖనిజ బ్లాకుల వేలం విధానంలో కొత్త మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టింది. ఖనిజాల తవ్వకాల్లో పారదర్శకత, ఆదాయం పెంపు లక్ష్యంగా హైబ్రిడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ద్వారా ఖనిజాల లీజులు కేటాయించనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనింగ్ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా గ్రానైట్, స్టోన్ మెటల్, బ్లాక్ గ్రానైట్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక వంటి ఖనిజాల తవ్వకాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు.. ఉమ్మడి వరంగల్లో ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అధికంగా క్వారీలు ఉన్నాయి. మైన్స్ అండ్ జియాలజీ శాఖ అంచనాల ప్రకారం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల పరిధిలో ప్రస్తుతం చిన్నా, పెద్దవి కలిపి సుమారు 250కు పైగా మైనింగ్, క్వారీ లీజులు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అధిక భాగం స్టోన్ మెటల్, రోడ్ మెటల్ యూనిట్లు, గ్రానైట్ తవ్వకాలు, బ్రిక్ ఎర్త్, మట్టి క్వారీలు, ఇసుక రీచ్లు ఉ న్నాయి. జయశంకర్ భూపాలపల్లి, మహబూ బాబాద్, ములుగు జిల్లాల్లో అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అధికంగా ఉండండంతో గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 40–60 కొత్త లీజులకు అవకాశం? ఇప్పటి వరకు పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు లేక వేలం జరగని అనేక ఖనిజ బ్లాకులు కొత్త ‘హైబ్రిడ్ విధానం’ ద్వారా వేలంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్లోనే మరో 40 నుంచి 60 వరకు కొత్త మైనింగ్ లీజులు, క్వారీ బ్లాకులు వేలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మైనింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్లో బ్లాక్ గ్రానైట్, భూపాలపల్లిలో రోడ్ మెటల్, ములుగులో స్టోన్ క్వారీలు, వరంగల్, హనుమకొండ పరిసరాల్లో నిర్మాణ రంగానికి అవసరమైన మెటల్ క్వారీలు అధికం. కాగా, ఆయా జిల్లాల్లో కొత్త విధానంతో వేగంగా అనుమతులు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పట్టాదారులకు తీపి కబురు ఇకపై మైనర్ ఖనిజాల వేలం మొత్తం ఆన్లైన్లోనే జరగనుంది. బిడ్డింగ్ నుంచి లీజు కేటాయింపు వరకు ప్రతీ దశ డిజిటల్ విధానంలో ఉండడంతో అక్రమాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం ముగ్గురు బిడ్డర్లు తప్పనిసరి చేయడం ద్వారా పోటీ పెరిగి ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పట్టా భూముల్లో ఖనిజ తవ్వకాలకు అంగీకరించిన భూ యజమానులకు ప్రభుత్వం అదనపు సొమ్ము చెల్లించనుంది. గ్రానైట్, మార్బుల్ మినహా ఇతర ఖనిజాలకు సీనియరేజ్ ఫీజులో 10 శాతం, గ్రానైట్, మార్బుల్కు 5 శాతం పెంచనున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని ప్రైవేట్ భూముల్లో కొత్త క్వారీలకు భూ యజమానులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. కొత్త వేలం విధానం అమలైతే ఉమ్మడి వరంగల్లో ఖనిజ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సుమారుగా ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుండడంతో రోడ్ మెటల్, స్టోన్ మెటల్, గ్రానైట్కు డిమాండ్ పెరుగుతోంది. కొత్త లీజులు మంజూరైతే ప్రభుత్వానికి రూ.25–30 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మైనింగ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మైనర్ ఖనిజాల వేలంలో భారీ మార్పులు హైబ్రిడ్ విధానానికి సర్కారు గ్రీన్సిగ్నల్ పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త లీజులు గ్రానైట్, స్టోన్ మెటల్, ఇసుక క్వారీలపై ఫోకస్ -
మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి
ములుగు: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబితాను ఎస్ఐఆర్ జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు హాజరయ్యారు. అనంతరం ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రాబోయే 15 రోజుల్లో కనీసం 90 శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. స్టేషన్ ఘన్న్పూర్, అశ్వారావుపేట వంటి నియోజకవర్గాలు ఇప్పటికే 80 శాతానికి పైగా మ్యాపింగ్ పూర్తి చేశాయన్నారు. ఒడిశా రాష్ట్రం ఇప్పటికే 90 శాతం, కర్ణాటక 81 శాతం, మహారాష్ట్ర 68 శాతం మ్యాపింగ్ పూర్తి చేశాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉందని పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు తమ బృందాలను ప్రోత్సహించి మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల పాత్ర కేవలం ఇళ్ల గుర్తింపు, వ్యక్తుల గుర్తింపుకు మాత్రమే పరిమితం కావాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు ఎస్ఐఆర్ మ్యాపింగ్ నిర్వహిస్తున్నారనే భావన ప్రజల్లో కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను అన్ని వనరుల నుంచి గుర్తించి నియమించుకోవాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రారంభమైన తర్వాత ప్రతిరోజూ ఫారాల పంపిణీ, సేకరణపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బీఎల్ఓల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్యాలకు అనుగుణంగా మ్యాపింగ్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అర్హత ఓటరు పేరు సక్రమంగా మ్యాపింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీసీలో ఆర్డీఓ వెంకటేశ్, ఎలక్షన్ సూపరింటెండెంట్ ఎండి సలీం, డిప్యూటీ తహసీల్దార్ నితీష్ కుమార్ పాల్గొన్నారు. ‘దోస్త్’ పోస్టర్ ఆవిష్కరణ ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల దోస్త్ అడ్మిషన్ పోస్టర్ను తన ఛాంబర్లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ వరకు ఎడ్యుకేషన్ వీక్ను ఘనంగా నిర్వహించాలని, కళాశాలలో అడ్మిషన్లు పెంచేందుకు ప్రతీ అధ్యాపకుడు కృషి చేయాలని సూచించారు. వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి -
హేమాచలక్షేత్రంలో ఆంజనేయస్వామి భక్తులు
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆంజనేయస్వామి భక్తులతో సోమవారం కిటకిటలాడింది. నేడు(మంగళవారం) హనుమాన్ జయంతి కావడంతో మండలం, అర్ధ మండలం దీక్ష చేపట్టిన భక్తులు స్వామివారికి ఇరుముడి సమర్పించి దీక్ష విరమించనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయానికి వెళ్లే భక్తులు మార్గమధ్యలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భారీగా తరలిరావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు సాధారణ భక్తులు సైతం భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల కొద్ది బారులుదీరారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు పవన్కుమార్ ఆచార్యులు, ఏడనూతుల ఈశ్వర్చంద్ రామా నుజందాస్, భక్తుల గోత్రనామాలతో స్వామి వారికి అర్చనలు జరిపించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
నాపేరు మీదకు ఆస్తి మార్చాలి..
నా పేరు మీద ఉన్న ఆస్తి నాకు తెలియకుండానే నా పెద్ద కోడలు తన పేరు మీదకు మార్చుకుంది. నా పెద్ద కుమారుడు మరణించిన తర్వాత నా కోడలు ఆస్తులను తన పేరు మీదకు మార్చుకుంది. నా బాగోగులు చూసుకునే వారు లేరు. అధికారులు స్పందించి నా పేరు మీదకు ఆస్తిని మార్చాలి. – అట్టం సావిత్రమ్మ, ములుగు మరమ్మతు పనులు చేయించాలి.. కంతనపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో మరమ్మతు పనులు చేపట్టడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలి. అలాగే విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలి. పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ దానిని పట్టించుకోవడం లేదు. వెంటనే ఐటీడీఏ పీఓ స్పందించి పాఠశాలలో మరమ్మతు పనులు చేయించాలి. – చింత చంద్రయ్య, కంతనపల్లి, కన్నాయిగూడెం మండలం -
ఎన్యుమరేటర్లు మార్గదర్శకాలు పాటించాలి
ములుగు: ఎన్యుమరేటర్లు జనగణనలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్న జన గణన హౌస్ లిస్టింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సన్నాహక సమావేశాన్ని సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ తెలిపారు. జనగణన కార్యక్రమం ప్రాముఖ్యత, ఇంటింటి వివరాల సేకరణ విధానం, హౌస్ లిస్టింగ్ ప్రక్రియ, ప్రజలతో సమన్వయం, ఖచ్చితమైన సమాచార సేకరణపై అధికారులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రతీ కుటుంబం వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. జనగణన ప్రక్రియ దేశాభివృద్ధి ప్రణాళికలకు ఎంతో కీలకమని, ప్రజలందరూ అధికారులకు సహకరించి సరైన సమాచారం అందించాలని తెలిపారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న వారు వారి ఐడీని వచ్చిన అధికారులకు చూపించి వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు, మాస్టర్ ట్రైనర్ ఎండి.హమీద్, ఫీల్డ్ ట్రైనర్ మధుసూధన్ పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన రైస్మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు ములుగు: కలెక్టర్ హేమంత్ సహదేవరావును ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్టినట్లు ప్రవీణ్ తెలిపారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీనిచ్చినట్లు వెల్ల డించారు. ఈ కార్యక్రమంలో ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి సహోదర రెడ్డి, కోశాధికారి ఎలగందుల మోహన్, ఉపాధ్యక్షులు కాసిడి సుదర్శన్ రెడ్డి, సహాయ కార్యదర్శి డేగల భద్రయ్య, గౌరవ సలహాదారుడు రామిని శ్రవణ్ కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మ్యూజియంలోకి పురాతన విగ్రహాలు కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21నుంచి జూన్1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు ముందుగానే మ్యూజియం ప్రారంభించాలనే ఉన్నతాధికారుల ఆదేశాలతో నిర్మాణం పూర్తికాక ముందే హడావుడిగా పురాతన విగ్రహాలను అమర్చుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం అధికారులు పురాతన విగ్రహాలను మ్యూజియంలో అమర్చారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు కాకతీయులు, చాళుక్యులనాటి ప్రాంతీయ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నప్పటికీ పూర్తిస్థాయి పనులు కాకముందే విగ్రహాల ఏర్పాటు చేపట్టడంపై స్థానికుల్లో చర్చ జరుగుతోంది. ఏరియా బీసీ, ఓబీసీ లైజనింగ్ ఆఫీసర్గా మురళీమోహన్ భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా సింగరేణి బీసీ, ఓబీసీ లైజనింగ్ ఆఫీసర్గా ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ సిలివేరి మురళీమోహన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం జీఎం కార్యాలయ చాంబర్లో సింగరేణి బీసీ ఓబీసీ జనరల్ సెక్రటరీ నల్లపురి రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఏరియాల లైజనింగ్ ఆఫీసర్లు, నాయకులు పాల్గొని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఏరియా జనరల్ మేనేజర్ లైజనింగ్ ఆఫీసర్గా నియమితులైన మురళీమోహన్ను అభినందిస్తూ శాలువాతో సన్మానించారు. -
ములుగు
మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 20267ప్రజావాణి, డివిజన్ స్థాయిలో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 67 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 11 దరఖాస్తులు రాగా పింఛన్లకు సంబంధించి 20, ఉపాధి కల్పనకు సంబంధించి 1, ఇతర సమస్యలకు సంబంధించి 13 దరఖాస్తులు వచ్చాయి. అలాగే డివిజన్ స్థాయిలో నిర్వహించిన ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించి 21, సీనియర్ సిటిజన్కు సంబంధించి 1 దరఖాస్తు అందింది. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు ఇలా.. -
విద్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దాం
● జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి ములుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దామని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి విద్యాశాఖ అధికారులకు పిలుపునిచ్చారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు పీఎంశ్రీ పాఠశాలలైన బండారుపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్, జవహర్నగర్ కస్తూర్బా గాంధీ విద్యాలయం, పస్రా నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏటూరునాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాజుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6నుంచి 9వ తరగతుల విద్యార్థులకు సమ్మర్ క్యాంపులు ప్రారంభించినట్లు తెలిపారు. రెండో రోజు పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ కోసం జిల్లాలోని బండారుపల్లి మోడల్ స్కూల్, ఏటూరునాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మూడోరోజు గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు విద్యాశాఖలో నిర్వహించనున్న విద్యా కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. నాల్లో రోజు ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఐదో రోజు గ్రంథాలయ దినోత్సవం నిర్వహించాలని, ఆరో రోజు కళలు, సాంస్కృతిక దినోత్సవం, ఏడో రోజు విద్యా దినోత్సవం నిర్వహించి క్షేత్రస్థాయిలో విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. -
ఇళ్లగణన షురూ
ములుగు: డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్న జనగణన కార్యక్రమంలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను సోమవారం జిల్లాలో ప్రారంభమైంది. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ నమోదు ప్రక్రియ నిర్వహించారు. సోమవారం నుంచి జనగణనలో భాగంగా హౌజింగ్ లిస్టింగ్ బ్లాక్ (హెచ్ఎల్బీ) కార్యక్రమానికి ఎన్యుమరేటర్లు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 807 బ్లాక్లను గుర్తించారు. ప్రతి బ్లాక్లో సుమారు 300 ఇళ్లు, 800 జనాభా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రతీ ఇంటికి ఎన్యుమరేటర్లు వెళ్లి వివరాలు నమోదు చేసేందుకు జిల్లాలో 545 మంది ఎన్యూమరేటర్లను, 97 మంది సూపర్ వైజర్లను నియమించారు. స్వీయ నమోదులో ఏమైనా వివరాలు తప్పుగా నమోదు చేస్తే ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినపుడు సరిచేసుకోవాలని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. మొదటి మూడు రోజులు మ్యాప్ తయారీ చేసి ఇళ్లకు నంబర్లను కేటాయించనున్నారు. అనంతరం 33 ఆంశాలతో కూడిన వివరాలను ఎన్యుమరేటర్లు సేకరించనున్నారు. వచ్చే 9వ తేదీలోగా హెచ్ఎల్బీ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నట్లు ఆదనపు కలెక్టర్ మహేందర్జీ తెలిపారు. జిల్లాలో 807 బ్లాకులు 545 ఎన్యుమరేటర్లతో ఇంటింటి సర్వే -
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
ములుగు రూరల్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా కేంద్రంలో వాలీబాల్ టోర్నమెంట్ను ఎస్పీ సోమవారం టాస్ వేసి ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించాలని సంకల్పించినట్లు తెలిపారు. ములుగు మావోయిస్టు రహిత జిల్లాగా మారిందని వెల్లడించారు. జిల్లాలో మత్తు, మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలన్నారు. అనంతరం రోడ్డు భద్రతా వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
వినతులిచ్చాం.. పరిష్కరించండి
ప్రజావాణిలో 67, గిరిజనదర్బార్లో 23 అర్జీల రాకములుగు రూరల్/ఏటూరునాగారం: ప్రజావాణి, గిరిజన దర్బార్లో అందజేసిన వినతులను పరిష్కరించాలని బాధితులు అధికారులను కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 67 వినతులు రాగా గిరిజన దర్బార్లో 23 వినతులను సమర్పించారు. ఈ మేరకు గ్రీవెన్స్లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అర్జీలు స్వీకరించగా ఐటీడీఏలో పీఓ లెనిన్ వత్సల్ టొప్పొ అర్జీలు స్వీకరించారు. అర్జీలను పరిశీలించి పెండింగ్లో లేకుండా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ములుగు డివిజన్ స్థాయిలో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీఓ వెంకటేశ్ ఫిర్యాదులను స్వీకరించారు. గిరిజన దర్బార్లో వచ్చిన వినతుల వివరాలు.. గోవిందరావుపేట మండలం బాలాజీ నగర్(కర్లపల్లి) గ్రామంలో గిరివికాసం పథకంలో బోరు, మోటారు ఇప్పించాలని విన్నవించారు. మంగపేట మండలం మల్లూరు గ్రామంలో 2023లో భూమి సర్వే చేపట్టి అర్హురాలిగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు పట్టాదారు పాస్పుస్తకం రాలేదని విన్నవించారు. మంగపేట మండలం మల్లూరు నుంచి గ్రౌండ్ వాటర్ బోరు మంజూరు చేయాలని కోరారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం గ్రామానికి చెందిన నాయకపోడు నాయకులు మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి ఆలయం సమీపంలో ఉన్న ఆదివాసీ నాయకపోడులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఎస్ఎస్తాడ్వాయి మండల కేంద్రంలో 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులు చేసిన భూ కబ్జా, అక్రమ కట్టడాలను నిలిపివేయాలని గిరిజనులు పీఓకు విన్నవించారు. ఇలా పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాధితులు పీఓకు వినతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంటా ప్రతాప్, డీడీ జనార్దన్, ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేశ్బాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, మేనేజర్ శ్రీనివాస్, జియాలజిస్ట్ కిశోర్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. స్వీకరించిన కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పొ పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు -
13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కాళోజీ సెంటర్: ఈనెల 13 నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు వరంగల్ డీఈఐఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఆదివారం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ఇంటర్ బోర్డు అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరంలో జనరల్ కోర్సులో 3,263 మంది, ఒకేషనల్ కోర్సులో 329 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్ కోర్సులో 2,083 మంది, ఒకేషనల్ కోర్సులో 182 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. పరీక్షల పర్యవేక్షణకు జిల్లా పరీక్షల కమిటీ, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్స్, 16 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 16 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు వివరించారు. విద్యార్థులకు ఏమైన సందేహాలు ఉంటే 9240 20 5555 నంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. -
సరస్వతీఘాట్లో భారీ సెట్టింగ్
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు భారీ సెట్టింగులు వేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఘాటుపై సరస్వతీమాత విగ్రహం, ప్లాట్ఫారంపై నాలుగు దిక్కులా తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. మెట్ల కింద నుంచి ఇసుకలో నీటి వరకు వెదురు పందిర్లు సుమారుగా 900 మీటర్ల పొడవునా వేస్తున్నారు. వేసవి దృష్ట్యా అందులో నీటి తుంపర్లు నిత్యం పడేలా చల్లదనంతో కూడా నీడనిచ్చే విధంగా తయారు చేస్తున్నారు. భక్తులు స్నానాలకు వెళ్లి వచ్చే వరకు చల్లదనం అస్వాదించనున్నారు. హారతి వేదిక వద్ద ప్రముఖుల గ్యాలరీ, భక్తులకు గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే 40 టెండ్సిటీ టెండ్లు, మాడ్రన్ లుక్తో వేస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు. -
గడువులోగా పూర్తయ్యేనా!
● 21నుంచి సరస్వతీనది అంత్య పుష్కరాలు ● పనుల్లో నాణ్యత లోపిస్తుందని విమర్శలుకాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21న సరస్వతీనది అంత్య పుష్కరాలకు ముహూర్తం ఖారారైంది. కాళేశ్వరంలో పురాతన విగ్రహాలు అమర్చడానికి రూ.1.20కోట్ల వ్యయంతో మ్యూజియం పనులు వేగిరంగా జరుగుతున్నాయి. ఈనెల 18 వరకు పూర్తి చేయాలని అఽధికారులు ఆదేశించారు. దీంతో వేగిరంగా పనులు చేస్తూ.. నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.30లక్షల వ్యయంతో నాగదేవాలయం నిర్మాణం కూడా అదే స్థాయిలో జరుగుతుంది. ఈ రెండు పనులపై రిటైర్డు డీఈ, ఏఈఈలు పర్యవేక్షణకు ఉన్నప్పటికీ గడువులోగా పూర్తయ్యేలా లేదు. క్యూరింగ్ కూడా సరిగ్గా జరుగడం లేదు. రూ.2కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు పనులు కూడా నెమ్మదిగా ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు పరీక్షలు జరుపాలని భక్తులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో చూడకపోవడంతో నాణ్యత లోపిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. పొలం గట్లు పొట్టు పొట్టు! పార్కింగ్ స్థలాల కోసం అధికారులు రైతుల పంట భూములను చదును చేయడం వివాదాస్పదమైంది. పడిదం చెరువు కింది ఆయకట్ట రైతుల సమాచారం ప్రకారం.. ముందస్తు సమాచారం లేకుండా డోజర్లతో గట్లు దున్ని భూములను చదును చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పొలం గట్టు ఎక్కడ ఉందో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. భూములు దెబ్బ తిన్న రైతులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. నష్టపరిహారంగా ఎకరానికి రూ.20 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో ప్రతిభ
ఏటూరునాగారం: 3వ తెలంగాణ అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో మండలానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. ఏటూరునాగారం మండలానికి చెందిన సాయిరాం అండర్ 16 హై జంప్లో రజత పతకం సాధించగా, హరిప్రియ అండర్ 18లో జావెలిన్త్రోలో రజత పతకం సాధించినట్లు జిల్లా కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు. ఈ క్రీడాపోటీలు ఆదివారం హనుమకొండలోని జేఎన్ఎస్లో నిర్వహించినట్లు వెల్లడించారు. డాక్టర్ శ్రీలతకు ఉత్తమ అవార్డు కాళోజీ సెంటర్: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీలత ప్రతిష్టాత్మకమైన ఉత్తమ మహిళా సైకాలజిస్ట్ అవార్డును అందుకున్నారు. టీపీఏ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ నుంచి అవార్డును స్వీకరించారు. శ్రీలత మనోవిజ్ఞాన శాస్త్ర రంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా అవార్డు లభించగా టీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని అభినందించారు. ఈ సందర్భంగా టీపీఏ సభ్యులు, ప్రముఖులు ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. -
పదిలమా.. ప్రశ్నార్థకమా?
అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాలలో బీఏఎంఎస్ సీట్ల భర్తీపై అయోమయం కాశిబుగ్గ: వరంగల్లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి సంవత్సరం యూజీ అడ్మిషన్ల సమయంలో బీఏఎంఎస్ సీట్ల భర్తీపై అయోమయం నెలకొంటుంది. సరిపడా సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కళాశాలలోని సీట్లు పూర్తిస్థాయిలో భర్తీకి నోచుకోవడం గగనమవుతోంది. తాజాగా 2026–2027 విద్యాసంవత్సరానికి యూజీ అడ్మిషన్ల కోసం నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ (ఎన్సీఐఎస్ఎం) బృందం సభ్యులు రెండు రోజులు తనిఖీలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని బనారస్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్లు అంజనా సక్సేనా, లక్ష్మీప్రసాద్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆయుర్వేద వైద్యకళాశాలలో తనిఖీలు చేశారు. కళాశాలలోని 50 సీట్లతోపాటు 13 ఈడబ్ల్యూఎస్ సీట్లు కలిపి మొత్తం 63 సీట్లకు సరిపడా ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్, ఇతర సౌకర్యాలు తెలుసుకున్నారు. టీచింగ్, టీచింగ్ డైరీ మెయింటెనెన్స్, స్టూడెంట్ అటెండెన్స్ ల్యాండ్, ల్యాబ్, లైబ్రరీ, పలు మొక్కల గార్డెన్, పరికరాలు పరిశీలించారు. సమయానికి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు వస్తున్నారా అని బయోమెట్రిక్ అటెండెన్స్, ఐరిస్ ద్వారా తెలుసుకున్నారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. బయోమెడికల్ వేస్టేజ్ నిర్వహణ, అంబులెన్స్, నర్సింగ్ స్టాఫ్ వివరాలపై ఆరా తీశారు. అలాగే, విద్యార్థులకు సంబంధించిన రెండు హాస్టళ్లను తనిఖీ చేశారు. కళాశాల అనుబంధ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలను కూడా సందర్శించారు. ఇందులో కూడా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఓపీ, ఐపీ వివరాలను నమోదు చేసుకున్నారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డైట్, మందులు, వివిధ రకాల చికిత్స గురించి తెలుసుకున్నారు. వంద పడకల ఆస్పత్రి స్థాయికి ఎలాంటి సౌకర్యాలు కల్పించారో తెలుసుకుని వివరాలను ఆన్లైన్ ద్వారా ఢిల్లీలోని స్పెషల్ అబ్జర్వర్కు అందజేశారు. హెడ్ ఆఫీస్ లింక్ ద్వారా ఆన్లైన్లో క్షుణ్ణంగా చూపించి రికార్డు చేయించారు. ఎన్సీఐఎస్ఎం నిబంధనలకు అనుకూలంగా.. ఎన్సీఐఎస్ఎం నిబంధనల ప్రకారం కళాశాలలో కొన్ని అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. బోధనపరంగా హయ్యర్, లోయర్లో 12 మంది టీచింగ్ ఫ్యాకల్టీ లేనట్లు తెలుస్తోంది. అలాగే, నాలుగు విభాగాల్లో అసలే ప్రొఫెసర్లు లేకపోవడంతో 12 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. హై ఫ్యాకల్టీ పరంగా మరో మూడు సీట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. నాన్టీచింగ్ పరంగా 71 మందికి 28 మంది, 87 మంది సిబ్బందికి 47 మంది, 23 మంది నర్సింగ్ సిబ్బంది అవసరం ఉండగా ఏడుగురు మాత్రమే ఉన్నట్లు సమాచారం. అలాగే, కళాశాలకు ప్రత్యేకంగా పరీక్ష హాల్, డిజిటల్ టైబ్రరీ, అంబులెన్స్ సదుపాయం లేదు. పదేళ్లుగా లైబ్రేరియన్ పోస్టు భర్తీ కావడం లేదు. దీంతో బీఏఎంస్ సీట్లు పదిలంగా ఉంటాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది 14 సీట్లు రద్దు.. తిరిగి సాధించుకున్న అధికారులు ఈ విద్యాసంవత్సరంలో కూడా కొన్ని గల్లంతయ్యే అవకాశం సరిపడా సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడమే కారణం తాజాగా ఎన్సీఐఎస్ఎం బృందం తనిఖీలుగతేడాది కూడా ఈ పరిస్థితులు ఉండటంతో 14 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. కళాశాల, వైద్యశాలలో ఉన్న లోపాలను సరిదిద్దుతామని ఎన్సీఐఎస్ఎం అధికారులకు హామీ ఇవ్వడం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాయడంతో యథావిధిగా సీట్లకు అనుమతించారు. కాగా, ఇలాంటి లోపాలు ఈ విద్యా సంవత్సరంలో కూడా పునరావృతం కావడంతో మళ్లీ ఆయుర్వేద సీట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ తర్వాత ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఉనికిని కాపాడాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రజ లు కోరుతున్నారు. కాగా, ఇప్పటికే విద్యార్థులు నీట్ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. -
తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి
ములుగు రూరల్: వేసవి దృష్ట్యా నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని తాగునీటి సరఫరా, సమస్యలపై ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శనివారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించగా పలు వార్డుల నుంచి ప్రజలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ సానుకూలంగా స్పందించారు. మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు అయిన కాలనీల్లో మిషన్ భగీరథ పైపులైన్ల ఏర్పాటుతో పాటు ఆన్ఆఫ్ ఏర్పాటు చేయాలని, చేతి పంపులు, పైపులైన్ల మరమ్మతులు, వాటర్ ట్యాంకుల క్లీనింగ్ వంటి సమస్యలపై ప్రస్తావించారు. ముఖ్యంగా 9వ వార్డులో నీటి సమస్య ఎక్కువగా ఉన్నట్లు సమస్యలు వెల్లువెత్తాయి. ప్రశ్న: మిషన్ భగీరథ నీరు రావడం లేదు. – తక్కపల్లి రమ, కృష్ణాకాలనీ జవాబు: మున్సిపాలిటీ పరిధిలో మిషన్ భగీరథ నీటిని రోజు మార్చి రోజు అందిస్తున్నాం. కాలనీల్లో ఏదైనా పైపులైన్ సమస్య ఉంటే తప్పా నీటి సరఫరా నిలిపివేయడం జరగదు. సిబ్బందిని కాలనీకి పంపించి సమస్యను పరిష్కరిస్తాం. ప్రశ్న: నల్లా నీళ్లు చివరి వరకు రావడం లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. – తడక సుధాకర్, 9వ వార్డుజవాబు: నల్లా నీటిని సరఫరా చేస్తున్న క్రమంలో సంపుల్లో మోటర్లు ఏర్పాటు చేయడం, పైపులైన్ బాల్స్ తొలగించడం కారణంగా నీరు చివరి వరకు అందకపోవచ్చు. అలాంటి సమస్యలు ఉండి ఉంటే సిబ్బందిని పంపి నల్లా కనెక్షన్లను పరిశీలించి మోటర్లు బిగించిన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. పైపులైన్ చివరి వరకు తాగునీరు అందిస్తాం. ప్రశ్న: మిషన్ భగీరథ నీరు వారం రోజులగా రావడం లేదు. – ఒజ్జల కుమార్, 18 వార్డు జవాబు: గొల్లవాడలో మిషన్ భగీరథ పైపులైన్ల మరమ్మతుల కారణంగా మిషన్ భగీరథ నీరు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పైపులైన్ల మరమ్మతులు పూర్తి అయ్యాయి. నీటిని నేటి నుంచి సరఫరా చేస్తాం. ప్రశ్న: కాలనీలో మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు చేయించాలి. – బండి రవి, 7వ వార్డుజవాబు: మిషన్ భగీరథ పైపులైన్ పనులు మున్సిపాలిటీ పరిధిలో కొంత మేరకు పెండింగ్లో ఉన్నాయి. దీంతో కొన్ని కాలనీలకు మిషన్ భగీరథ పైపులైన్లు లేని కారణంగా తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నాం. పైపులైన్ లేని కాలనీలను వెంటనే గుర్తించి నూతన పైపులైన్లు ఏర్పాటు చేయిస్తాం. ప్రశ్న: పబ్లిక్ నల్లాలకు ఆన్ఆఫ్ లేకపోవడంతో నీరు వృథాగా పోతుంది. – దయాకర్, కృష్ణాకాలనీజవాబు: కాలనీలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పబ్లిక్ నల్లాలకు ఆన్ ఆఫ్ ఏర్పాటు చేయలేదు. దీంతో పలు చోట్ల నీరు వృథాగా పోతుంది. వెంటనే ఆన్ఆఫ్ ఏర్పాటు చేసి నీటిని వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: నల్లాపైపులు రోడ్డు పక్కన ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. – అన్నం మోహన్కుమార్, 9వ వార్డుజవాబు: రోడ్డు అంచున ఉన్న నల్లా పైపులను మరింత భూమి లోపలి నుంచి వేయించి పైపులైన్ పాడుకాకుండా చూస్తాం. నల్లా కనెక్షన్లు ఉన్న చోట వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలి. పైపులైన్ పైనుంచి భారీ వాహనాలు వెళ్తే పైపులు దెబ్బతిని నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది. మున్సిపాలిటీలో ప్రతిరోజూ నీరందించేందుకు పాటుపడుతా నూతన కాలనీల్లో పైపులైన్ల ఏర్పాటుకు పనులు చేయిస్తా మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన -
మేడారంలో భక్తుల సందడి
సమ్మక్క గద్దె వద్ద పూజలు చేస్తున్న భక్తులుఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేల సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద షెవర్ కింద స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల్లో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, మధు, రామదేవిలు భక్తులకు సేవలందించారు. -
హేమాచలక్షేత్రంలో కోలాహలం
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈనెల 6వ తేదీతో ముగిసినప్పటికీ భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వచ్చిన భక్తులతో ఆలయం కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు రోజు కావడం, బ్రహ్మోత్సవాలకు రాలేకపోయిన భక్తులతో పాటు ఆలయ ప్రాంగణంలో జరిగిన వివాహాలకు తరలివచ్చిన వారితో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో సందడి నెలకొంది. ఆంజనేయస్వామి మాలధారుల మండలం, అర్ధ మండలం దీక్ష చేపట్టిన భక్తుల దీక్ష ముగియడంతో స్వామివారికి ఇరుముడి ఇచ్చి దీక్ష విరమించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయానికి వెళ్లే భక్తులు మార్గమధ్యలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని వెళ్తున్నారు. సైతం భక్తులు ఆలయానికి స్వామివారిని దర్శించుకునేందుకు రావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. -
విభజన హామీలు నెరవేర్చాలి
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హమీలను అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా జిల్లాలో అరెస్టు చేసిన సీపీఐ(ఎం) పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడుస్తున్నా అభివృద్ధి, ఉపాధి, సాగునీరు, పరిశ్రమలు, విద్య, సామాజిక న్యాయం వంటి రంగాల్లో తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరలేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని, కులగణన చేపట్టకపోవడం బీసీల పట్ల వివక్షకు నిదర్శనమన్నారు. ‘నిందితులను అరెస్ట్ చేయాలి’ భూపాలపల్లి అర్బన్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి సంబంధించి వెలుగులోకి వచ్చిన మైనర్ బాలికపై అత్యాచార కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ అంబాల స్వర్ణలత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలు, బాలికల భద్రతను కాపాడాల్సిన పరిస్థితిలో ఇలాంటి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీసు శాఖ వెంటనే స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు. నిందితులు ఎవరైనా చట్టం ముందు సమానమేనని, రాజకీయ హోదాలు లేదా ప్రభావంతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేయకూడదన్నారు. జ్యోతిర్లింగ దర్శనం కోసం.. కాళేశ్వరం: దేశంలోని జ్యోతిర్లింగ దర్శనం కోసం ఇద్దరు యువకులు సంవత్సర కాలంగా స్కేటింగ్తో ప్రయాణిస్తున్నారు. ఆ ప్రయాణం 20 వేల కిలోమీటర్లు కాగా ఇప్పటికి 7వేల కిలోమీటర్లు పూర్తి చేసినట్లు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్కు చెందిన మనీష్, శంబూసింగ్ తెలిపారు. దేశంలోని పలు పుణ్యక్షత్రాలను దర్శించుకోవడం గొప్పగా ఉందని పేర్కొన్నారు. వేసవికాలంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా ప్రయాణిస్తున్నామని తెలిపారు. వారి యాత్ర ఆదివారం కాళేశ్వరం చేరింది. కాళేశ్వరం క్షేత్రం గురించి తెలుసుకొని యాత్ర చేస్తున్నట్లు వివరించారు. స్వామిని దర్శించుకొని వెళుతామన్నారు. రోడ్డుపై స్కేటింగ్తో వస్తుంటే జనం ఆసక్తిగా తిలకించారు. అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి చిట్యాల: చిట్యాల మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం చిట్యాల, టేకుమట్ల , మొగుళ్లపల్లి మండలాలకు సుమారు 35 కిలోమీటర్లు ఉందని.. దీంతో అగ్రిమాపక శకటం వచ్చే సరికి భారీ నష్టం జరుగుతుందని అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. సమాచారం కోసం సంప్రదించాలి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వరకు జరుగు సరస్వతీ నది అంత్య పుష్కరాలకు సంబంధించిన సమాచారం కోసం కాళేశ్వరం దేవస్థానంలో సంప్రదించాలని ఈఓ మహేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వసతి సౌకర్యం కోసం 94910 18012, ఆర్జిత సేవలకు 94910 17012, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 94910 15252 నంబర్లలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతీ రోజు జరిగే హోమంలో పాల్గొనే భక్తులు రూ.2వేలు ఒక రోజుకు దంపతులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. దేవస్థానం నుంచి పూజాసామగ్రి అందజేస్తున్నట్లు తెలిపారు. భక్తులు గమనించాలని ఆయన తెలిపారు. నేటినుంచి ఎడ్యుకేషన్ వీక్ కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు విద్య వారోత్సవాలను మే 11 నుంచి 17వ తేదీ వరకు ఎడ్యుకేషన్ వీక్లో మహదేవపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రినిపాల్ జున్ను విజయ్కుమార్ ఆదివారం తెలిపారు. కళాశాల హాజరు శాతం పెంచడం, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం, సృజనాత్మక స్కిల్స్ పెంచడం, కళాశాల కోసం ఫండ్స్ సమకూర్చడం, అభివృద్ధి, వివిధ రకాల సదుపాయం కోసం నిర్వహణ జరుగుతుంది. (నేడు) సోమవారం కళాశాలలో ఉదయం 11 గంటలకు ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. -
నేటి వరకే స్వీయ జనగణన
● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ములుగు రూరల్: స్వీయ జనగణనకు నేటి (ఆదివారం) వరకు అవకాశం ఉందని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఆన్లైన్ ద్వారా స్వీయ గణన చేసేందుకు అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేటితో ఈ ప్రక్రియ ముగిస్తుందన్నారు. ఈ నెల 11 వ తేదీ నుంచి ఎన్యుమనేటర్లు ఇంటింటికీ వెళ్లి హౌస్ లిస్టు చేపడతారని పేర్కొన్నారు. దేశ ప్రణాళిక, భవిష్యత్ అభివృద్ధి, వనరుల పంపిణీలో జనగణన కీలకమని తెలిపారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు కూడా తమ ప్రస్తుత నివాసం నుంచే వివరాలు నమోదు చేసుకోవచ్చునని సూచించారు. జనగణన సందర్భంగా అందరూ తమ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను కచ్చితంగా అందించాలని కోరారు. ఈ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఆన్లైన్ నమోదు తదుపరి ఎన్యుమరేటర్ ఐడీ కార్డు వస్తుందని అన్నారు. ఆ నంబర్ ఆధారంగా ఎన్యుమనేటర్ ఇంటికి వచ్చినప్పడు ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని తెలిపారు. సమర్థవంతంగా నిర్వహించాలి.. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సమర్థవంతంగా కొనుగోళ్లు జరపాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ రావు అన్నారు. శనివారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పొంచి ఉన్న అకాల వర్షాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సయ్యద్ షా పైసల్ హుస్సైనీ తదితరులు ఉన్నారు. -
చెరువులో చేపల మృత్యువాత
చిట్యాల: చైన్పాక గ్రామ శివారులోని పెద్దమ్మకుంట చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో 1.50 క్వింటాళ్ల చేపలు మృత్యువాత పడ్డాయి. ముదిరాజ్ సొసైటీ అధ్యక్షుడు బండి నర్సయ్య కథనం ప్రకారం.. చెరువులో చేపలు మృత్యువాత పడి పైకి తేలడంతో గ్రామస్తులు ముదిరాజ్ సంఘం నాయకులకు సమాచారం అందించారు. దీంతో శుక్రవారం ఉదయం గ్రామస్తులు, ముదిరాజ్ సంఘం నాయకులు వెళ్లి పరిశీలించారు. కాగా, అదే ప్రాంతంలో పురుగుల మందు వాసన రావడంతో గమనించిన ముదిరాజ్ నాయకులు శనివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చెరువులో విషం కలిపిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నర్సయ్య కోరారు. -
12 రోజులు ఆధ్మాత్మిక శోభ
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆధ్యాత్మిక శోభతో మారుమోగనుంది. గతేడాది జరిగిన సరస్వతీనది ఆది పుష్కరాల మాదిరిగానే 12రోజుల పాటు అంత్య పుష్కరాలకు రోజుకొకరు చొప్పున పలువురు పీఠాధిపతులు రానున్నారు. పలువురు ప్రవచన కర్తలు తమ సందేశాన్ని భక్తులకు వినిపించనున్నారు. ప్రతీ రోజు అతిఽథుల సూచనల ప్రకారం హోమాలు నిర్వహిస్తారని ఆలయవర్గాలు తెలిపాయి. ప్రతీ రోజు కాశీపండితులతో గోదావరి హారతి, అనంతరం తెప్పోత్సవం నిర్వహిస్తారు. పీఠాధిపతులు వీరే.. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ప్రతీ రోజు పీఠాధిపతులు పుష్కర స్నానం చేసి శ్రీకాళేశ్వరముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీస్వామిగల్, నాసిక్ పీఠాధిపతి మహామండలేశ్వర ఆచార్య సంవిదానంద సరస్వతీమహారాజ్, శంకరాచార్య మహాసంస్థానం శ్రీ అద్వైతానంద భారతి, శ్రీశ్రీ అవని శృంగేరి జగద్గురువులు, ఆదిలాబాద్ పీఠం శ్రీ యోగానంద సరస్వతీస్వామీజీ, హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి, శ్రీ దత్త గిరి మహారాజ్ ఆశ్రమం పీఠాధిపతి బర్దీపూర్ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, విజయనగరం, కర్ణాటకకు చెందిన చింతామణి మఠం శివానంద భారతి చింతామణి స్వామి, చింతామణి మఠం, విశాఖపట్నం శారద పీఠం స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి, మెదక్ కొల్చారం మాధవానంద సరస్వతి రానున్నారు. ప్రవచన కర్తలు: 21 నుంచి 24 వరకు శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు, బాచంపల్లి సంతోష్ కుమార్ శాసీ్త్రతో పుష్కర వైభవ ప్రవచనం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. 23న మహాసహస్రావధాని గరికపాటి నరసింహరావుతో ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తారు. జూన్ 1న బ్రహ్మశ్రీ ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ ఆధ్యాత్మిక ప్రవచనం చెబుతారు. ఆయా రోజుల్లో సాయత్రం 5 నుంచి 6గంటల వరకు నిర్వహిస్తారు. 12 రోజులు హోమాలు.. ప్రపంచ శాంతి కోసం మహారుద్ర జప అభిషేక సహిత కామ్యార్థ హోమాలను ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు ఆలయ ఆవరణలో నిర్వహిస్తారు. 21న మహాగణపతి హోమం, 22న సుబ్రహ్మణ్య షాఢాక్షరి హోమం (సంతానప్రాప్తి, శతృబాధ నివారణార్ధం), 23న హయగ్రీవ హోమం (సకల విద్యా ప్రాచ్యర్గం), 24న నవగ్రహ హోమం (నవగ్రహ ప్రసాద సిద్యర్థం), 25న మహామృత్యుంజయ హోమం (అనమృత్యుదోష నివారణార్థం), 26న దుర్గ సూక్త హోమం (సకల ఐశ్వర్య ప్రాష్యర్థం),27న మహా సుదర్శన హోమం (సకల దృష్టి దోష నివారణార్థం), 28న మేద దక్షిణామూర్తి హోమం (మేద ధారణ సిద్యర్ధం), 29న స్వయంవర పార్వతి హోమం (శీఘ్ర వివాహ ప్రాష్యర్ధం), 30న విశాఖ దన్వంతరి హోమం (ఆయుఆరోగ్య ప్రాష్యర్థం), 31న మహారుద్ర హోమం (అష్ట ఆశ్వర్య ప్రాష్యర్థం),జూన్1న లఘు చండీ, మహా పూర్ణాహుతి (సకల పాపక్షయార్థం) నిర్వహించనున్నారు. నదీహారతి, తెప్పోత్సవం.. ప్రతీ రోజు సాయంత్రం 6.30 నుంచి 7.30గంటల వరకు త్రివేణి సంగమం వద్ద కాశీ పండితులతో నదీహారతి కార్యక్రమం, అనంతరం తెప్పోత్సవం నిర్వహిస్తారు. ప్రతీ రోజు సాయంత్రం 7.30 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రసిద్ధ నృత్య కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫలితంగా ఆధ్యాత్మిక శోభతో కాళేశ్వరం వెలుగులు విరజిమ్మనుంది. 21 నుంచి సరస్వతీనది అంత్య పుష్కరాలు రోజుకో పీఠాధిపతి రాక రోజూ నదీహారతి, తెప్పోత్సవం నిర్వహణ -
భర్త లేకపోయినా.. బాధ్యత నెరవేర్చింది
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లికి చెందిన గూడ లావణ్య – కీ.శే. భూపాల్రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు అపూర్వ, కుమారుడు అశ్విష్రెడ్డి. కూతురు బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా, లావణ్య భర్త భూపాల్రెడ్డి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతి చెందాడు. అయినప్పటికీ, తల్లి లావణ్య మనోస్థైర్యంతో తన పిల్ల లను చదివించింది. అపూర్వ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికై ంది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పని చేస్తోంది. కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా మనోధైర్యం, గుండె నిబ్బరం వీడకుండా ముందుకు సాగాలని, తన తల్లే తనకు ఆదర్శమని ఎస్సై అపూర్వరెడ్డి చెబుతున్నారు. -
నేడు మాతృదినోత్సవం
సాక్షి, మహబూబాబాద్: మాది ఉమ్మడి కుటుంబం. అమ్మాన్నాన్న లక్ష్మీ, నరసింహం. నాన్న వ్యవసాయం చేసేవారు. ఇంట్లో నేనే పెద్ద కొడుకును. చిన్నప్పటి నుంచి బాగా చదివి ఉద్యోగం సాధించాలని అమ్మ చెబుతుండేది. అమ్మ చెప్పినట్లుగానే ఉద్యోగం సంపాదించా. నన్ను చూసి మా అన్నదమ్ములు, అక్కా చెళ్లెళ్లు అందరూ బాగా చదివి మంచి పొజీషన్లో ఉన్నారు. నాన్న చనిపోయి పదేళ్లు దాటింది. అప్పటి నుంచి అమ్మ మాతోనే ఉంటోంది. ఇప్పటికీ అమ్మతో మంచీ చెడు అన్నీ పంచుకుంటాం. అమ్మ నింపిన ధైర్యమే నా ఉద్యోగం. – ఎన్.తిరుపతిరావు, డీఎస్పీ, మహబూబాబాద్ -
ఆరేళ్లుగా నిరుపయోగం
మంగపేట: మండలంలోని మల్లూరులో హరిత హోటల్ నిర్మాణం పూర్తయి ఆరేళ్లవుతున్నా అధికారులు ప్రారంభించకపోవడంతో నిరుపయోగంగా మారింది. పట్టించుకునే వారు లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కిటికీలు, భవన సీలింగ్, బాత్రూమ్లను మందుబాబులు ధ్వంసం చేశారు. చీకటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. రూ.4.19 కోట్లతో నిర్మాణం.. మంగపేట మండలం మల్లూరులో టూరిజం, పర్యాటక శాఖ రూ.4.19 కోట్ల నిధులతో 2017లో హరిత హోటల్ నిర్మాణ పనులు ప్రారంభించగా 2020లో పూర్తయ్యాయి. హోటల్ను ప్రారంభించపోవడంతో ఆరేళ్లుగా నిరుపయోగంగా ఉంది. పర్యాటకులకు ఉపయోగ పడాల్సిన హోటల్ రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వారికి ఆశ్రయంగా మారింది. నిత్యం రాత్రి వేళల్లోమందుబాబులు, గంజాయి బ్యాచ్లు అడ్డాగా మార్చుకుని చీకటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ధ్వంసమవుతున్నా పట్టించుకోరా.. హరిత హోటల్ కిటకీల అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మరుగు దొడ్లు, మూత్రశాలల డోర్లు, బేసిన్లు, సోలార్ ప్యానళ్లు, బ్యాటరీలు వందకు పైగా ఫ్యాన్లు ఎత్తుకుపోయారు. భవనంలోని గదుల్లో సీలింగ్ ధ్వంసం చేసి సీలింగ్కు వినియోగించిన సామగ్రి, ప్లాస్టిక్ పైపులు, విద్యుత్ వైర్లు, స్విచ్ బోర్డులను ఎత్తుకుపోయారు. అయినా అధికారులు మాత్రం కాపాడే ప్రయత్నం చేయడం లేదు. సౌకర్యం లేక భక్తుల అవస్థలు.. పర్యాటక హబ్గా విరాజిల్లుతున్న జిల్లాలో బొగత జలపాతం, లక్నవరం, రామప్ప, ఏటూరునాగారం అభయారణ్యం వంటి ప్రాంతాలతో పాటు మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలు కొలువై ఉన్నారు. ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాలను చూడడానికి నిత్యం వచ్చే పర్యాటకులు, రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధిగాంచిన శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యలో వస్తుంటారు. ప్రతీ శని, ఆదివారం ఆలయంలో స్వామివారి తిలతైలాభిషేకం పూజలో పాల్గొని మానవశరీరాన్ని పోలి ఉండే స్వామివారిని దర్శించుకునేందుకు ఒకటి రెండు రోజులు ఇక్కడే ఉండేందుకు ఎంతగానో ఇష్టపడుతుంటారు. పర్యాటకులు, భక్తుల సౌకర్యం కోసం మల్లూరులో నిర్మించిన హరిత హోటల్ ప్రారంభానికి నోచుకోకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీతక్క దృష్టి సారిస్తేనే.. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క హరిత హోటల్ ప్రారంభంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రారంభానికి నోచుకుంటే భక్తులు, పర్యాటకులకు హోటల్ ఉపయోగపడనుంది. మల్లూరు హేమాచల అభివృద్ధిపై కూడా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. మల్లూరులో రూ.4.19 కోట్లతో హరిత హోటల్ నిర్మాణం 2020లో పూర్తయినా ప్రారంభానికి నోచుకోని వైనం కిటికీలు, భవన సీలింగ్, బాత్రూమ్ల ధ్వంసం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా.. కన్నెత్తిచూడని అధికారులు -
ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026
తాను ఎలా ఉన్నా.. పిల్లలను ఉన్నతంగా చూడాలనుకుంటుంది. పస్తులుండైనా కన్నవారి కడుపు నింపాలనుకుంటుంది. కష్టాల కడలిని ఎదురీదైనా పిల్ల ల భవిష్యత్కు బాటలు వేయాలనుకుంటుంది. కుటుంబ పెద్ద మరణించినా అన్నీ తానై నడిపిస్తుంది. ఇలా ఉమ్మడి జిల్లాలో అనాథలకు ప్రేమను పంచుతున్న వారు ఒకరైతే.. భర్తలేకపోయినా పెంచి పెద్ద చేసిన వారు మరొకరు. ఆదర్శంగా నిలుస్తున్న వారెందరో.. అలాంటి దైవాల ప్రేమకు అక్షర రూపమిస్తూ.. నేడు(ఆదివారం) మాతృ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. ములుగు రూరల్: ములుగు మున్సిపాలిటీ పరి ధిలో తాగునీటి సమస్యపై నేడు (ఆదివారం) సాక్షి ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. కాలనీల్లో నెలకొన్న తాగునీటి సమస్యల పరిష్కారంపై మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ ప్రజలకు ఫోన్లో అందుబాటులో ఉంటారు. తాగునీటి ఇబ్బందులను నేరుగా చైర్పర్సన్తో ప్రజలు మాట్లాడవచ్చు. సమయం: ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్లు 79957 34031, 90104 04994 -
అనాథలకు అమ్మ
జఫర్గఢ్: వందలాది మంది అనాథ పిల్లలతో అమ్మ అని ఆప్యాయంగా పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్పరాణి. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద గాదె ఇన్నయ్య 20 ఏళ్ల క్రితం ‘మా ఇల్లు’ ప్రజాదరణ అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. 32 మంది పిల్లలతో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు వందకు పైగా అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమంలోని ఆడపిల్లల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధవహిస్తూ తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు. ఆశ్రమానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలకు సొంత ఖర్చులతో వివాహాలు జరిపించారు. పుష్పరాణి కృషి ఫలితంగా ఆశ్రమానికి చెందిన పిల్లలు లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నర్సులు, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్గా ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా గాదె పుష్పరాణి మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలకు అమ్మలా సేవ చేయడం, వారితో అమ్మ అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. -
సభను విజయవంతం చేయాలి : బీజేపీ
ములుగు రూరల్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నేడు (ఆదివారం) నిర్వహిస్తున్న ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ ములుగు అర్బన్ అధ్యక్షుడు ఇమ్మడి రాకేశ్యాదవ్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ ప్రదాని మోదీ ఆధ్వ ర్యంలో దేశాభివృద్ధి సాధ్యమన్నారు. నాయకులు వాసుదేవరెడ్డి, రాకేశ్, ప్రమోద్రెడ్డి, రవీందర్, ప్రవీణ్, కోటేశ్వర్ పాల్గొన్నారు.13న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష ములుగు రూరల్: పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్ష ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం శనివారం తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ములుగు, జాకారం బాలుర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీతో కలిపి రెండు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు సెంటర్లలో 675 మంది విద్యార్థులను కేటాయించినట్లు వివరించారు. 13వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని చెప్పారు. విద్యార్థులు ఇటీవల డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్తో రావాలని.. వారి వెంట హెచ్బీ పెన్సిల్, బాల్ పాయింట్ పెన్, ఎరేజర్, షార్ప్నర్ తీసుకురావాలని తెలిపారు. వాహనం ఢీకొని గేదెలు మృత్యువాతవెంకటాపురం(కె): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఐదు గేదెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మండలంలోని పాత్రాపురం గ్రామ శివారులో జరిగింది. స్థానికుల కథనం ప్రకా రం.. గ్లోగూడెం గ్రామానికి చెందిన రాంబాబు తన గేదెలను శుక్రవారం ఉదయం పాలెం వాగు సమీపంలోకి మేతకు తీసుకెళ్లాడు. కాగా, రాత్రి గేదెలు ఇంటికి రాలేదు. శనివారం ఉద యం వెతుకుతుండగా పాత్రాపురం పాలెం వాగు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృత్యువాత పని కనిపించాయి. పాత్రాపురం సర్పంచ్ బొగ్గుల పుష్పవతి ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉచిత బాల్ బాడ్మింటన్ శిక్షణ చిట్యాల: మండలంలోని నైన్పాక గ్రామంలో ఉచిత (సమ్మర్ క్యాంప్) బాల్ బ్యాడ్మింటన్ శిక్షణను ఏర్పాటు చేసినట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గూట్ల తిరుపతి, బాల్ బ్యాడ్మింటన్ కోచ్ ఉడుత మోహన్ శనివారం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు క్రీడలు ఎంతో అవసరం అన్నారు. ప్రతీ రోజు ఉదయం 6 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఈ శిక్షణలో రన్నింగ్, వ్యాయాయంతో పాటు క్రీడలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. -
అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలి
ములుగు రూరల్: జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావు, డీఎఫ్ఓ వికాష్ మీనాతో కలిసి జిల్లా అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. ప్రజా దర్భార్ ద్వారా ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశామని, అందులో వచ్చిన ఫిర్యాదుల స్థితిగతులపై పూర్తిస్థాయిలో ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు. పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. నూతన గ్రామ పంచాయతీ భవనాలకు అంచనాలు సిద్ధం చేసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, డ్రెయినేజీలు వంటి అత్యవసర పనులకే నిధుల ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పాఠశాలలు, వసతి గృహాలు ప్రా రంభమయ్యే నాటికి వాటిలో సమస్యలను గుర్తించి పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్, ఆర్డీఓ వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, తదితరులు ఉన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని జగ్గన్నపేటలో ప్రజాదర్భార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావు, డీఎఫ్ఓ వికాష్ మీనా, అదనపు కలెక్టర్ మహేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేష్, తదితరులు ఉన్నారు. చట్టాలపై అవగాహన ఉండాలి బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మంత్రి డాక్టర్ దనసరి సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీఒక్కరూ పాటుపడాలన్నారు. ఆడపిల్లలను చదివించాలని, ప్రభుత్వం అందుకు అనుగుణంగా అవకాశాలు కల్పిస్తుందన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలల వివాహాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలలపై లైంగిక వేదింపులు, దత్తత విధానం, చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ప్రేమలత, డీఎఫ్ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు. ఒలింపిక్ స్థాయికి ఎదగాలి క్రీడాకారులు ఒలింపిక్ స్థాయికి ఎదగాలని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జగ్గన్నపేట ఆశ్రమ పాఠశాలలో నిర్మన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెజ్లింగ్ కోచింగ్ సెంటర్ను కలెక్టర్ హేమంత్ సహదేవరావు, డీఎఫ్ఓ వికాస్ మీనాలతో కలిసి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల ప్రతిభను పరిశీలించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
వన్యప్రాణుల దాహం తీరేదెలా?
● అటవీలో నిరుపయోగంగా సాసర్ పిట్స్ ● వేసవిలో మూగజీవాలకు తాగునీటి కష్టాలుకన్నాయిగూడెం: మండే ఎండలకు వన్యప్రాణులు దాహంతో అల్లాడుతున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటికుంటలు (సాసర్పిట్స్) నిరుపయోగంగా మారాయి. కేవలం పేరుకుమాత్రమే సాసర్ పిట్స్ ఏర్పాటు చేశారని, వాటిలో నీటిని నింపడంలో అధికారులు చొరప చూపడం లేదని వన్యప్రాణి ప్రేమికులు అంటున్నారు. దాహం తీర్చుకునేందుకు దూరంలో ఉన్న నీటి కుంటలు, చెరువులు, రైతు పొలాల వద్దకు వెళ్తున్నాయి. దీంతో అదను చూసి వేటగాళ్లు వన్యప్రాణులను అంతం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఐలాపూర్, సర్వాయి అటవీ ప్రాంతంలో.. కన్నాయిగూడెం మండలం దాదాపు అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులు ఎక్కువగా ఉంటాయి. దీంతో అటవీశాఖ అధికారులు ఐలాపూర్, సర్వాయి, భూపతిపురం, చిట్యాల, తుపాకులగూడెం తదితర అటవీ గ్రామాల పరిధిలో సిమెంట్తో సాసర్పిట్స్ ఏర్పాటు చేశారు. వాటికి నీటి వసతి కోసం బోరు వేసి సోలార్ విద్యుత్తో మోటారు నడిచేలా ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించారు. పనిచేయని సోలార్ పంపులు.. వన్యప్రాణుల దాహం తీర్చడానికి ఏర్పాటు చేసిన సాసర్పిట్స్ నీరు లేక నిరుపయోగంగా మారాయి. అధికారుల నిర్లక్ష్యంతో సోలార్ విద్యుత్ పంపులు పనిచేయకపోవడంతో సాసర్పిట్స్ బీటలువారి ఎండిన ఆకులతో నీరు లేకుండా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సాసర్పిట్స్లో నీరు ఏర్పాటు చేయించాలని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు. -
తాగునీటికి తండ్లాట!
ములుగు రూరల్: ములుగు మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో తాగునీటి సరఫరా లేక ప్రజలు తండ్లాడుతున్నారు. పలు వార్డుల్లో పైప్లైన్లు లేకపోవడంతో నల్లా నీళ్లు ఎరుగని కాలనీలు ఉన్నాయి. తాగునీటికి భగీరథ నీరు రాకపోవడంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ మినరల్ వాటర్ కొనుగోలు చేస్తూ అవసరాలు తీర్చుకుంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీల్లో మంచినీటి సరఫరాకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో కాలనీవాసులు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సరఫరా లేకపోయినా.. అధికారులు ఇంటి పన్ను వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. భగీరథ పైప్లైన్ లేని కాలనీలు మున్సిపాలిటీ పరిధిలో 12 సంవత్సరాల క్రితం ఇళ్లు ఏర్పాటు చేసుకుని నివస్తున్నా.. పలు కాలనీల్లో భగీరథ పైప్లైన్ లేకపోవడం గమనార్హం. గత ప్రభుత్వం ప్రతీ గ్రామానికి, కాలనీకి భగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేసి తాగునీటిని అందించారు. అయి తే ములుగు మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో మాత్రం భగీరథ పైప్లైన్ ఏర్పాటు చేయలేదని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు. గతంలో చేపట్టిన మిషన్ భగీరథ కాంట్రాక్టర్ పూర్తి స్థాయిలో నల్లా పైప్లైన్లు నిర్మించకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పైప్లైన్ లేదని, తాగునీరు రావడం లేదని పలుమార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కృష్ణకాలనీ, మంజునాథపురం కాలనీల్లో నేటికీ భగీరథ పైప్లైన్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీల్లో మిషన్ భగీరథ పైప్లైన్ లేని వైనం ఇబ్బందులు పడుతున్న పట్టణవాసులు సరఫరా లేకపోయినా..పన్ను వసూలు!వార్డులు: 20జనాభా: 22,000గృహాలు: 6,600భగీరథ నల్లా కలెక్షన్లు : 10,000 -
సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ములుగు రూరల్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ మహేందర్ అన్నారు. శుక్రవారం తన చాంబర్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ఇంటర్ థియరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు, ప్రాక్టికల్ పరీక్షలు 22 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసి పరీక్షల విజయవంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఆయా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, బందోబస్తు, ఆర్టీసీ బస్సు సౌకర్యం, పోస్టల్ సేవలు తదితర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొదటి సంవత్సరం ఇంటర్ జనరల్ విభాగంలో 1,050 మంది, ఒకేషనల్ విభాగంలో 39 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 227 మంది, ఒకేషనల్ విభాగంలో 19 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ నాయిని వీరేందర్ తదితరులు ఉన్నారు. -
ప్రమాణ స్వీకారంలో ఉద్రిక్తత
● వివాదంగా మారిన వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీభూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రం మంజూరునగర్ శ్రీ భూనీల వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ప్ర మాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఉద్రిక్త వాతా వరణంలో జరిగింది. ఆలయ ఈవో మహేష్ ఆధ్వర్యంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఉద యం నుంచే ఆలయ పరిసరాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయ నాయకుల రాకపోకలు పెరగడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రాజకీయాలకు వేదిక చేయొద్దు.. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పార్టీ నాయకులతో కలిసి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గండ్ర ఆలయ నిర్మాణ పనులు పూర్తికాకముందే ఎండోమెంట్ కమిటీ నియామకం, ప్రమాణ స్వీకారం నిర్వహించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆలయాన్ని రాజకీయాలకు వేదిక చేయకుండా అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకుల ధర్నా, అరెస్ట్ ఆలయం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి సహా పలువురు నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నాయకులు, పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. అనంతరం వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు అంబేడ్కర్ సెంటర్లో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. గండ్ర జ్యోతి అస్వస్థతకు గురికావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
భూపాలపల్లి అర్బన్: సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బానోత్ సేవానాయక్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి, రమేశ్ మాట్లాడారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల భవిష్యత్ భద్రతకు ముప్పుగా మారిందన్నారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, నాయకులు అన్నారెడ్డి, పెద్దన్న, నరేష్ పాల్గొన్నారు. -
అకాలవర్షం.. తడిసిన ధాన్యం
గోగుపల్లిలో వర్షపు నీటిని పారబోస్తున్న రైతుటార్పాలిన్లో నిల్వ ఉన్న నీటిని తొలగిస్తూ..ఏటూరునాగారం: ఆరుగాలం పండించిన రైతులకు ప్రకృతి అపార నష్టాన్ని మిగిల్చింది. గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసిన ధాన్యం, ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో వాటిని ఆరబెట్టుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఆరబోసిన ధాన్యం కింద నుంచి వర్షపు నీరు ప్రవహించడంతో వాటిని బకెట్ల ద్వారా ఎత్తి పారబోస్తున్నారు. మండలంలోని గోగుపల్లి, శివాపురం, చెల్పాక తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఒక్కో రైతు ఒక్కో కష్టంగా మారింది. సరైన గోదాంలు, టార్పాలిన్లు లేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇప్పటికై న నిర్వాహకులు వేగంగా కాంటాలు నిర్వహించి మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు. ఇబ్బందులు పడుతున్న రైతులు -
ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సన్మానం
ములుగు రూరల్: ఇటీవల పది ఫలితాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ హేమంత్ సహదేవరావులు క లెక్టరేట్ సమావేశ మందిరంలో శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ వికాష్ మీనా, అదనపు కలెక్టర్ మహేందర్, ఆర్డీఓ వెంకటేష్, డీఈఓ సిద్దార్థ్రెడ్డి తదితరులు ఉన్నారు.ఏటూరునాగారం: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని కొనుగోలు కేంద్రాల్లోని తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం నిల్వ చేసుకునేందుకు సరైన ప్లాట్ఫామ్లు లేక నేలపై ఆరబెట్టుకోవడంతో వర్షం వల్ల బురదగా మారిందన్నారు. రైతులు బురదలోనే నిల్వ చేసుకోవడం బాధాకరమన్నారు. రైతులకు సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో కూనూరు అశోక్, వలిబాబా, మల్లారెడ్డి, చిన్ని, తాడూరి రఘు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్కు ఆశీర్వచనం మంగపేట: నూతనంగా జిల్లా కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన హేమంత్ సహదేవరావును హేమాచల క్షేత్రం ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వాహణ అధికారి ఎం. వీరస్వామి పూజారులతో కలిసి శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గతనెల 27 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు జరిగిన బ్రహ్మోత్సవాలు (జాతర) సందర్భంగా లక్ష్మీనర్సింహాస్వామి తిరుకల్యాణ మహోత్సవాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందజేసి స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ పూజారులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు కారంపుడి పవణ్కుమార్, ఆచార్యులు, సిబ్బంది సీతారామయ్య, శేషు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులు పెండింగ్ స్కాలర్షిప్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి ఇందిర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘దళారులను ఆశ్రయించొద్దు’ మల్హర్: రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రక్రాశ్రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తాడిచర్ల ఆధ్వర్యంలో రుద్రారం, దుబ్బపేట గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రకాశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరను పొందాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండి, సర్పంచ్లు చంద్రగిరి సంపత్, భుక్య రవీందర్, కొండ రాజమ్మ, పీఏసీఎస్ డైరెక్టర్ సంగెం రమేష్, మండల నాయకులు బడితల రాజయ్య, వేముల చంద్రమౌళి, చంద్రగిరి అశోక్, సమ్మయ్య, సీఈఓ సంతోష్, రైతులు, హమాలీలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రామప్ప భూముల వేలంలో పెరిగిన ఆదాయం
వెంకటాపురం(ఎం): శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం (రామప్ప దేవాలయం) ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి దేవస్థానం తరి భూములను రెండు పంటల కౌలు హక్కుల కోసం శుక్రవారం ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు. దేవస్థానం ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు జరిగిన వేలంలో పలువురు రైతులు పాల్గొన్నారు. రామానుజపూర్ శివారు లక్ష్మీదేవిపేట పరిధిలోని 9–09 ఎకరాల భూమిని రూ.1.40లక్షలు, పాలంపేట గార్లగడ్డ పరిధిలోని 3–11 ఎకరాల భూమి రూ.1,10,000లకు, వెంకటాపూర్ శివారులోని 2–02 ఎకరాల భూమి రూ.32,500లకు కౌలు కుదిరినట్లు అధికారులు తెలిపారు. గోవిందరావుపేట, రామానుజపూర్, బుద్దారం గ్రామాలకు చెందిన కొన్ని భూములు వేలంపాటకు రైతులు హాజరుకాకపోవడంతో వాటిని వాయిదా వేసినట్లు ఈఓ భాస్కర్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే రూ.44,500 అదనపు ఆదాయం వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి బిల్లా శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధి హామీ పనులు చేపట్టాలి
● అడిషనల్ డీఆర్డీఓ కృపాకర్ ఏటూరునాగారం: ఉపాఽధిహామీ పథకాన్ని ఒక ఉద్యమంలా రెండు నెలల పాటు చేపట్టాలని అడిషనల్ డీఆర్డీఓ కృపాకర్ అన్నారు. మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులపై రివ్యూ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామపంచాయతీలో ఉపాధి పనులను ప్రారంభించి త్వరితగతిన కూలీలు హాజరయ్యేలా చూడాలన్నారు. పనులు ముమ్మరంగా సాగేలా సర్పంచ్లు, కార్యదర్శులు, ఏపీవో, ఈసీ, టీసీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు కృషి చేయాలని సూచించారు. -
నిర్మాణ పనులు గడువులోగా పూర్తిచేయాలి
● కలెక్టర్ హేమంత్ సహదేవరావు ములుగు రూరల్: కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ హేమంత్ సహదేవరావు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను హేమంత్ సహదేవరావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండా, సమావేశపు గది, స్టేట్ బోర్డు, చాంబర్ లిస్టు టాయిలెట్స్, గార్డెనింగ్ సుందరీకరణ పరిశీలించారు. అనంతరం అధికారులకు, కాంట్రాక్టర్కు పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ శ్యామ్సింగ్, ఏఈ తదితరులు పాల్గొన్నారు. -
భూసార పరీక్షలతో మేలు
ములుగు రూరల్: భూసారానికి అనుగుణంగా పంటలను సాగు చేయించి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంలో ప్రభుత్వం సాగు భూముల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రెవెన్యూ గ్రామాల వారీగా వలంటీర్లను నియమించారు. జిల్లాలోని పది మండలాల్లో వలంటీర్లను ఎంపిక చేసి వ్యవసాయ శాస్త్రవేత్తలతో శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం భూసార పరీక్షల నిమిత్తం పంట పొలాల్లో మట్టి నమూనాలను సేకరించనున్నారు. భూసార పరీక్షల ఆధారంగా భూముల్లో పోషకాల మోతుదు తెలుస్తుంది. పోషకాలు తక్కువ ఉన్న నేలలను గుర్తించి వ్యవసాయ శాఖ అధికారులు వాటిని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించేందుకు వీలుగా ఉంటుంది. భూమిలో భాస్వరం, నత్రజని, పొటాషియం, ఐరన్, జింక్, బోరాన్, మోగ్నిషియం శాతాన్ని గుర్తిస్తారు. భూమిలోని పోషకాల ఆధారంగా సాగు చేసేందుకు అనువుగా ఉన్న పంటలను సూచిస్తారు. ఎరువుల వాడకంలో మోతాదు సిఫార్సు చేస్తారు. దీంతో ఎరువుల వినియోగం, అధిక ఖర్చులను తగ్గించుకోవచ్చు. సేద్యపు రంగంలో ఆధునిక పద్ధతులను అనుసరించి పెట్టుబడి ఖర్చు తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించే దిశగా వ్యవసాయశాఖ అడుగులు వేస్తోంది. జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 287 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో ఒక్కో రెవెన్యూ గ్రామానికి ముగ్గురు చొప్పున వలంటీర్లు 861 మందిని ఎంపిక చేశారు. కాని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్కు మాత్రమే శిక్షణ అందించారు. మిగితా వారికి అందించనున్నారు. శిక్షణ ఇచ్చిన ఒక్కో వలంటీర్కు వ్యవసాయ క్షేత్రాల ఎంపిక, మట్టి నమూనా సేకరణ విధానం, పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వలంటీర్లకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారులతో కలిసి ఇప్పటి వరకు రెవెన్యూ గ్రామానికి 10 శాంపిళ్లను సేకరించారు. ఇప్పటి వరకు వలంటీర్లు మొత్తం 2,862 మట్టి శాంపిళ్లను సేకరించి 2,854 శాంపిళ్లను వరంగల్లోని ల్యాబ్లకు పంపించారు. జిల్లాలో రైతులు వరి 1,07,700 ఎకరాల్లో సాగు చేయగా పత్తి 28,600 ఎకరాలు, మొక్కజొన్న 11 వేల 32 ఎకరాలు, మిర్చి 25 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రెవెన్యూ గ్రామాల వారీగా వలంటీర్లు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శిక్షణ క్షేత్రస్థాయిలో మట్టి నమూనాల సేకరణభూసార పరీక్షలతో రైతులు సాగు చేస్తున్న పంటలకు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని భూమికి, పంటకు అవసరమయ్యే ఎరువులను మాత్రమే వాడొచ్చు. భూమి స్వభావాన్ని బట్టి పంటలు సాగు చేసుకోవాలి. మే నెల చివరి వరకు మట్టి నమూనాలను సేకరిస్తాం. పరీక్షల అనంతరం రైతులకు వారి భూమి తత్వాన్ని వివరించి సాగు చేసుకోవాల్సిన పంటలను, వినియోగించే ఎరువులను వివరిస్తాం, దీంతో నత్రజని ఎరువుల వినియోగం తగ్గించడానికి వీలుగా ఉంటుంది. – సురేశ్కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
నలుగురికి బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డులు
ములుగు రూరల్: బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వడంలో రాష్ట్రస్థాయిలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. కృషి చేసిన నలుగురు అధికారులకు గురువారం మంత్రి సీతక్క బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డులు అందజేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని ప్రజాభవన్లో బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డులను డీఆర్డీఓ చంద్రశేఖర్, ఏపీడీ శ్రీనివాస్, బ్యాంక్ లింకేజీ డీపీఎం శ్రీనివాస్, గట్టమ్మ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పద్మలు సీతక్క చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి వెంకటాపురం(కె): గృహ విద్యుత్ పరికరాలు వినియోగించే సమయంలో జాగ్రత్తలు తప్పరిసరి పాటించాలని విద్యుత్శాఖ ఏడీఏ ఉమారావు తెలిపారు. మండల పరిధిలోని పాత్రాపురంలో విద్యుత్శాఖ ఆధ్వర్యంలో రైతు వారం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం సోలార్ కూసుమ్, పీఎం సూర్య ఘర్ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భద్రతా వారోత్సవాల సేఫ్టీ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఈ హనుమాన్ దాస్, మండల వ్యవసాయ అధికారి నవీన్, సర్పంచ్ బొగ్గుల పుష్పవతి, సబ్ ఇంజనీర్ సూర్య కుమార్ పాల్గొన్నారు.ఉచిత సమ్మర్ శిక్షణ శిబిరం వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని కాపెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ క్రీడా మైదానంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో తైక్వాండో, కరాటే, యోగాలో ఉచిత సమ్మర్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కరాటే మాస్టర్స్ హనుమంతు, సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలో గురువారం సమావేశం నిర్వహించి సమ్మర్ ఉచిత శిక్షణ శిబిరం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాయం నాగేశ్వర్రావు, ఎట్టి బాబురావు, నారాయణమ్మ, రమాదేవి, సంతోష్, కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. నేడు జగ్గన్నపేటలో ప్రజాదర్బార్ ములుగు రూరల్: నేడు ములుగు మండల పరిధిలోని జగ్గన్నపేటలో నిర్వహించనున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ హేమంత్ సహదేవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు(శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు మంత్రి సీతక్క హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీయూపీఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమానం వస్తే సమాచారం ఇవ్వండి కాళేశ్వరం: లాడ్జిల్లోకి అనుమానాస్పద వ్యక్తులు వచ్చినా, అనుమానం వచ్చిన వారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని లాడ్జ్ నిర్వాహకులను కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆదేశించారు. గురువారం కాళేశ్వరం పోలీస్స్టేషన్ పరిధిలోని లాడ్జ్ యజమానులతో డీఎస్పీ సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. నిర్వాహకులు కస్టమర్ల పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఏ పని నిమిత్తం వచ్చారో కూడా తెలుసుకోవాలని సూచించారు. లాడ్జ్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని.. రిజిస్టర్, సీసీ కెమెరా పుటేజీలను అవసరమైనప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. వన్యప్రాణులను రక్షించుకోవాలి మల్హర్(కాటారం): వన్యప్రాణుల రక్షణకు ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కాటారం రేంజ్ అధికారి స్వాతి అన్నారు. గురువారం మండలంలోని బొప్పారం, ప్రతాపగిరి గ్రామాల్లో రేంజర్ స్వాతి, సిబ్బందితో కలిసి వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడినా, హాని కలిగించినా, హతమార్చేందుకు ఉచ్చులు బిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవువుల్లో అగ్ని ప్రమాదాలు జరకుండా చూసుకోవాలని చెప్పారు. -
రైతును కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే
హన్మకొండ: రైతును కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా గురువారం ముగిసింది. చివరి రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు మేళాలో ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శించి వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతాంగానికి కావాల్సిన అన్ని అవకాశాలు కళ్ల ముందుంచాలని, యాంత్రీకరణ, పురుగు మందులు, ఎరువులు, మార్కెటింగ్ వ్యవస్థ, భవిష్యత్లో రాష్ట్రంలో ఏ రకంగా ముందుకు పోవాలి తదితర అంశాలపై రైతులను అవగాహన కల్పించేందుకే హనుమకొండలో రైతుమేళా నిర్వహించామన్నారు. రైతుకు పాడి–పంట రెండూ అవసరమని, ఈ రెండింటి వైపు రైతును ప్రోత్సహించాలన్నారు. ఆయిల్పామ్ లాభదాయకమని, రైతులు దీని సాగుపై దృష్టి సారించాలన్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాలన్నారు. రైతుబంధు పేరుతో యాంత్రీకరణ అపేసి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అష్టకష్టాల పాలు చేసిందని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా, యూరియా సరఫరాపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. రైతులు దానం చేయాలని నాడు వైఎస్ చెప్పారు.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రైతులు దానం చేయాలని, యాచించకూడదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారని, ఈ మేరకు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ ఉచిత విద్యుత్ అందించారని, ప్రాజెక్టులు నిర్మించారన్నారు. అదే బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కొనుగోళ్లు వేగంగా జరగడం లేదు.. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ధాన్యం, మక్కల కొనుగోళ్లు వేగంగా జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాలు రాకముందే కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చేతులెత్తేసిందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, రైతులు గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, లావణ్య రెడ్డి, భాగ్యలక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద, అదనపు కలెక్టర్లు ఎన్.రవి, సంధ్యారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, ఎన్పీడీసీఎల్ అధికారులు, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.ఆయిల్పాం సాగు లాభదాయకం సేంద్రియ పంటల వైపు రైతులు దృష్టి సారించాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ముగిసిన రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా -
నిఘా నీడలో..
కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కాళేశ్వరంలో సరస్వతినది అంత్య పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. గతేడాది మే 15నుంచి 26వరకు పన్నెండు రోజుల పాటు సరస్వతీనది ఆది పుష్కరాలు విజయవంతంగా నిర్వహించారు. ఈ నెల 21 నుంచి సరస్వతి నదికి అంత్య పుష్కరాలు నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పరిరక్షణకు నిఘాను తీవ్రతరం చేయడానికి పుష్కరాల్లో అడుగడుగునా సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసుశాఖ సన్నద్ధమైంది. భద్రత కట్టుదిట్టంగా.. పుష్కరాల సందర్భంగా ప్రతీరోజు వీవీఐపీ, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, పీఠాధిపతులు రానున్నారు. వారికి భద్రత ఏర్పాట్లు చేపట్టనున్నారు. కాళేశ్వరం మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్నందున పోలీసులు 12 రోజుల పాటు అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు, చోరీలు జరుగకుండా చర్యలు చేపట్టనున్నారు. ఒకవేళ ఏమైనా ఘటనలు జరిగితే క్షణాల్లో కేసును ఛేదించడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం లేకపోయినప్పటికీ అనుమానితులను పసిగట్టడానికి వినియోగించనున్నారు. ప్రముఖులు కోసం.. ప్రముఖులు రాకకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నా యి. అంత్య పుష్కరాల మొదటి రోజున సీఎం రేవంత్రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో పాటు కంచి పీఠాధిపతి రానున్నట్లు సమాచారం. దీంతో భారీఎత్తున పోలీసులు కెమెరాల ఏర్పాటుకు రంగం సిద్ధంచేస్తున్నారు. 12 రోజుల పాటు పది మందికిపైగా పీఠాధితులు పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు స్నానాలు చేస్తారని అధికారుల ద్వార తెలిసింది. వీరితో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా స్నానాలు చేసేందుకు రానున్నారని వినికిడి. కెమెరాలు ఎక్కడెక్కడంటే..? కాళేశ్వరంతో పాటు చుట్టుపక్కల శివారుల్లో సుమారు 250కుపైగా సీసీ కెమెరాలు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కాళేశ్వరం దేవస్థానానికి సంబంధించిన కెమెరాలు 60, ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేసినవి 12, ప్రధాన రహదారిలో 30కిపైగా ఉన్నాయి. దీంతో పాటు మొత్తం 25 లొకేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో లొకేషన్లో మూడు నుంచి నాలుగు వరకు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మజీదుపల్లి రోడ్డు, వీఐపీఘాటు, అక్కడే ఉన్న పార్కింగ్ స్థలాలు, ప్రధానఘాటు నుంచి వీఐపీ ఘాటు వరకు ఉన్న రోడ్డు, అక్కడే ఉన్న హెలిపాడ్ వద్ద, ప్రధానఘాటు, శ్రాద్ధ మండపాలు, గోదావరి నుంచి బస్టాండ్ వరకు, ఆలయం చుట్టు పరిసరాలు, మహారాష్ట్ర రోడ్డు అంతర్రాష్ట్ర వంతెన నుంచి కాళేశ్వరం బస్టాండ్ వరకు, అక్కడే ఉన్న పార్కింగ్, హరిత హోటల్ సమీపంలో, సబ్స్టేషన్ నుంచి పలుగుల బైపాస్ రోడ్డు వరకు, అక్కడే ఉన్న పార్కింగ్ స్థలం, ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు స్థలం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అంత్య పుష్కరాలకు భద్రత కట్టుదిట్టం తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులో ‘కాళేశ్వరం’ 250కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్రూమ్ లక్షలాదిగా తరలిరానున్న భక్తజనంకాళేశ్వరం పోలీసుస్టేషన్లోనే కమాండ్ కంట్రోల్రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. కాళేశ్వరంలో పుష్కరాల కోసం అమర్చిన సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు వీక్షించడానికి ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని ఠాణాలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నేరనియంత్రణ చేయడానికి పోలీసులు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. 12 రోజులపాటు వీక్షిస్తూ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు. -
సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడుతామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. గురువారం ఆయన ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్కు వివిధ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడారు. జిల్లా పరిధిలోని మారుమూల గ్రామాల నుంచి పేద ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి వస్తున్నప్పటికీ, సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఐదు రోజులుగా బాత్రూమ్లకు నీటి సరఫరా లేకపోవడం, తాగునీటి కొరత తీవ్రంగా ఉండడం, డాక్టర్లు సమయానికి రాకపోవడం వంటి అంశాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. రెండు రోజులలో సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మామిడి శ్రీకాంత్, మడే సంతోష్, రంజిత్ పాల్గొన్నారు. -
ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలి
ములుగు:/ములుగు రూరల్: ఇళ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన జనగణన అధికారి, సంచాలకులు భారతి హోళికేరి అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ మహేందర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు నిర్వహించే ఇళ్ల గణన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. అన్ని స్థాయిల్లో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు. 10వ తేదీలోపు వారికి మెటీరియల్ కిట్లు, గుర్తింపు కార్డులు అందజేయాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో 11వ తేదీ నుంచి ఇళ్ల గణనకు సంబంధించి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విధులు నిర్వహించే సిబ్బందికి సైతం శిక్షణ పూర్తి అయిందని వివరించారు. స్వీయ గణనకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వీయ గణనపై అవగాహన కల్పించి అక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ ప్రకాశ్, ఎస్ఓ లాల్ తదితరులు పాల్గొన్నారు. మాక్డ్రిల్ కీలకం విపత్తు నిర్వహణలో మాక్డ్రిల్ స్పందన కీలకపాత్ర పోషిస్తుందని రాష్ట్ర రెవెన్యూ విపత్తు నిర్వహణ కార్యదర్శి హరిచందన అన్నారు. ఈ మేరకు ఆమె టేబుల్ టాప్ ఎక్సర్ సైజ్కు సంబంధించి వివిధ శాఖల అధికారులతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ ఈ నెల 18న జిల్లాలో రాష్గ్రస్థాయి మాక్ ఎక్సర్సైజులు జరుగుతాయని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా నుంచి కలెక్టర్ హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ మహేందర్జీ, సివిల్ సప్లయీస్ అధికారి ఫైజల్ హుస్సేన్, డీఎంహెచ్ఓ గోపాల్రావు, డీపీఓ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. వీసీలో రాష్ట్ర ప్రధాన జనగణన అధికారి, సంచాలకులు భారతి హోళికేరి -
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
భూపాలపల్లి అర్బన్: పేద, మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇంధన ధరలు తీవ్రమైన భారంగా మారాయని, వెంటనే తగ్గించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, బూడిద తిరుపతి, ఎండియాకు పాషా, గోలి లావణ్య, పల్లెల రజిత, పొనగంటి లావణ్య, గడ్డం స్వరూప, గంప రాజు పాల్గొన్నారు. -
ఓరుగల్లునుంచే రైతుపోరు
సాక్షిప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్: ‘రైతుకు ఓపిక నశిస్తే భూకంపం పుడుతుందని పాలకులు గ్రహించాలి. భూమిని దున్నడం తెలిసిన రైతు నాగలి తిరగేసి కాంగ్రెస్ను బొంద పెడతారు.. వరంగల్ వేదికగా ఏ ఉద్యమం మొదలుపెట్టినా విజయవంతమవుతుంది. ఇప్పుడు జరిగిన ఈ రైతు సంగ్రామ సదస్సు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ హంటర్ రోడ్డులో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు నిర్వహించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల మృతికి సంతాపంగా తొలుత ఒక నిమిషం మౌనం పాటించి, నివాళులర్పించి సదస్సును ప్రారంభించారు. జై కేసీఆర్ నినాదాలతో సదస్సు ప్రాంగణం మార్మోగింది. ‘కేసీఆర్ సారు మళ్లీ రావాలి. రైతు బంధు రాజ్యం రావాలి. రాబందుల పాల న పోవాలి’ అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు నినదించారు. కాగా, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ వైఫల్యాలు, ప్రభుత్వ తీరును కేటీఆర్ తన ప్రసంగంలో ఎండగట్టారు. రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. సదస్సుకు హాజరైన పలువురు రైతులు, రైతు ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తమ అభిప్రాయాల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు. సదస్సులో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి హర్షధ్వానాల మధ్య ఆమోదించారు. రైతు సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. సదస్సులో గాయకులు మధుప్రియ, మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్ పాటలతో హోరెత్తించారు. ప్రత్యేక ఆకర్షణగా ఎడ్లబండి.. రైతు సంగ్రామ సదస్సు ప్రాంగణం ఎదుట ఏర్పాటు చేసిన కంకులతో రూపొందించిన పసుపు చీరను కట్టుకున్నట్లుగా ఎడ్లబండి, నాగలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు ఎడ్ల బండి, నాగలి వద్ద సెల్ఫీలు దిగారు. వేసవి తాపానికి అంబలి.. దాహానికి మజ్జిగ, మంచినీళ్లు సదస్సుకు వచ్చిన రైతులకు వేసవి తాపాన్ని తగ్గించేందుకు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 10 వేల మంది రైతులకు తెలంగాణ వంటకాలను ఏర్పాటు చేశారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అంబలి స్టాల్ను ఏర్పాటు చేసి దాహార్తి తీర్చారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత ఉధృతం చేస్తామన్న కేటీఆర్ జై కేసీఆర్.. సారు మళ్లీ రావాలి నినాదాలతో మార్మోగిన రైతు సంగ్రామ సదస్సు పాటలతో హోరెత్తించిన మధుప్రియ, మిట్టపల్లి సురేందర్, రసమయి అభిప్రాయాలు, కష్టాలు పంచుకున్న రైతులు.. పలు రైతు తీర్మానాలకు ఆమోదం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టిన నేతలు.. బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ -
హేమాచలక్షేత్రంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
● ఆనందోత్సాహాల నడుమ వసంతోత్సవం ● గజవాహనంపై లక్ష్మీనర్సింహస్వామి, అమ్మవార్ల ఊరేగింపుమంగపేట: మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో గతనెల 27న అంకురార్పణతో ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు(జాతర) బుధవారం వసంతోత్సవంతో ముగిశాయి. ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి ఎం.వీరస్వామి చీఫ్ ఫెస్టివల్ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థాన ఆలయ ఉపప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం పది రోజుల పాటు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు కార్యక్రమంలో భాగంగా ఆలయంలోని స్వయంభు స్వామివారికి, యాగశాలలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నవదంపతులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలతో అలంకరించారు. గజవాహనంపై ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపం నుంచి దైత అమ్మవారు(వనదేవత) ప్రాంగణం వరకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాగ్నికులు, ఆలయ పూజారులు, సిబ్బంది ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వసంతోత్సవ కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకున్న వందలాది మంది భక్తులు వసంతోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సురేశ్, ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు, అనిపెద్ది నాగరాజీవ్శర్మ, ఏడునూతుల ఈశ్వర్చంద్ రామానుజదాస్, బ్రహ్మోత్సవాల యాగ్నికులు పెరంబదూర్ మధనమోహనాచార్యులు, శ్రీకృష్ణ యజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు, బరధ్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ● కొండాయి, చిన్నబోయినపల్లిలో ప్రజాదర్బార్కు హాజరైన మంత్రి ములుగు/ములుగు రూరల్/ఏటూరునాగారం/గోవిందరావుపేట: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఏటూరునాగారం మండల పరిధిలోని కొండాయి, చిన్నబోయినపల్లిలో ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాదర్బార్ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. అందుకోసమని 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పేదల సమస్యలను సత్వరం పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుందన్నారు. కొండాయి గ్రామంలో అర్హులైన 115 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ పత్రాలను అందజేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లాలోని ఎంసీసీ కేంద్రాలకు స్వచ్ఛభారత్ మిషన్ కింద పది కంప్యూటర్లు, స్కానర్, ప్రింటర్లను మంత్రి సీతక్క అందజేశారు. అలాగే వివిధ గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పదో తరగతి ఫలితాల్లో జిల్లా మొదటి ర్యాంకు సాధించిన కోరంకున్నత్ కృష్ణను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి అభినందించారు. అలాగే చిన్నబోయినపల్లిలో 11కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలోని జంపన్నవాగుపై హైలెవల్ వంతెన పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్, సర్పంచులు మానస, నాగార్జున, రాజు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, గుడ్ల దేవేందర్, రవి, రఘు, లాలయ్య, ఎల్లయ్య, పాల్గొన్నారు. అదే విధంగా గోవిందరావుపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రైతు వారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. రైతులకు రుణమాఫీ చేపట్టి పెట్టుబడికి రైతుభరోసా ఇస్తున్నామని తెలిపారు. వ్యవసాయ యంత్రాలపై ప్రత్యేక సబ్సిడీలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే ములుగు మండల పరిధిలోని జాకారంలో రూ.3.76 కోట్లతో నిర్మించిన 11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో రూ.41 కోట్లతో 12 విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రూ.41 కోట్ల నిధులతో విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 3 ఉప కేంద్రాలు వినియోగంలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. -
సీఎంను గద్దె దించేందుకు పోరాటానికి సిద్ధం
రేవంత్రెడ్డిని గద్దె దించేందుకు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. రైతులను గోస పెడుతూ 40 ఏళ్ల నాటి కాంగ్రెస్ పాలనను తిరిగి గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో కల్లాల దగ్గరే పంట కొనుగోలు చేయగా, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్లాల దగ్గర, కాంటాల దగ్గర ఎంత ఇస్తావంటూ అవినీతి రాజ్యమేలుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు నా చాలెంజ్.. రైతు మేళాను రైతుల మార్కెట్లో పెట్టండి.. ఉరికిచ్చి కొడతారు. – ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ మంత్రి కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం పదేళ్ల కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగంలా ఉండగా, నేటి కాంగ్రెస్ పాలన రైతుల పాలిట రాబందుల పాలనగా మారింది. రైతులను గోస పెట్టుకుంటున్న రేవంత్ పాలన పోయి అన్నం పండించే రైతు మూడు పూటలా కడుపు నిండా భోజనం చేసే బీఆర్ఎస్ పాలన రావాలి. పడించిన పంటలో పావలా వంతు కూడా కొనకుండా రైతులను అరిగోస పెట్టుకుంటున్న ప్రభుత్వం చెర నుంచి రైతులకు విముక్తి రావాలి. – సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి తెలంగాణ ఊపిరి మా సదస్సు పోరాటాలకు పుట్టినిల్లు వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు పెట్టడానికి అనుమతి ఇవ్వలేదు. ఇక్కడి ఎమ్మెల్యే.. మీది ఏం సదస్సు, ఏం సభ అంటూ వెటకారంగా మాట్లాడారు. మాది తెలంగాణ ఊపిరి సదస్సు. రైతును రాజు చేయాలని, రైతు పక్షపాతి కేసీఆర్.. రైతుబంధు, రైతు భరోసా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని పథకాలు తీసుకొచ్చా రు. కానీ, కాంగ్రెస్ సర్కారు వాటిని తుంగలో తొక్కింది. – పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే, జనగామ -
కల్లాల కాడ రైతుల ఎదురు చూపులు
కాంగ్రెస్ వాళ్లకే యూరియా.. వ్యవసాయంలో వ్యత్యాసం చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్లకే ముందుగా యూరియా ఇస్తున్నారు. వాళ్ల పంటనే ముందుగా కొంటున్నారు. వర్షం వచ్చి వడ్లు తడుస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడు. అంతా అవినీతి, అక్రమాలకు నిలయంగా కాంగ్రెస్ పాలన నిలుస్తోంది. – సుబ్బారావు, రైతు, ఖానాపురం, వరంగల్ పండించిన పంటను ఎప్పుడు కొంటారు? పెట్టిన పెట్టుబడి ఎప్పుడు చేతికందుతుందని రైతులు కల్లాల కాడ.. మక్కల అమ్మకానికి నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం ఎప్పుడూ అభివృద్ధి చెందదు. కేసీఆర్ పాలనలో రైతు బంధు ద్వారా ఎకరాకు రూ.5 వేలు ఇవ్వగా, ఇప్పుడు ఒక ఎకరానికి మాత్రమే రూ.6 వేలు వేస్తున్నారు. – ఊకంటి రవి, రైతు, దుగ్గొండిరైతుబంధు పడట్లేదు.. యాక్సిడెంట్లో కాలు కోల్పోయినా కూడా కేటీఆర్ను చూసేందుకు, బీఆర్ఎస్పై మక్కువతో ఒక్క కాలితో నేలపై అతి కష్టమ్మీద సదస్సుకు వచ్చా. నాకు మూడెకరాల భూమి ఉంటే రైతు బంధు ఇస్తలేరు. కేసీఆర్ సారే సీఎం కావాలి. ఈసారి ఓటు వృథా చేసుకోం – ఎండీ మక్బూల్, రైతు, కొత్తపేట, హనుమకొండ ● -
‘పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి’
ములుగు రూరల్: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాదన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతు కూలీ సంఘం కార్యాలయంలో బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి, మొక్కజొన్న, మామిడి పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరకాల స్వామి, నాంపల్లి స్వామి, కొమురయ్య, సూరమ్మ, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. ఉపాధి పనుల పరిశీలన మంగపేట: మండల పరిధిలోని కోమటిపల్లి, తొండ్యాలలక్ష్మీపురంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను అదనపు డీఆర్డీఓ కొండా కృపాకర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉపాధిహామీ కూలీలకు ఏప్రిల్, మే రెండు నెలల్లో 2.70 లక్షల పని దినాలను కల్పించాలని వెల్లడించారు. లక్ష్యాన్ని పూర్తి చేసేలా కూలీల సంఖ్య మరింత పెరిగే విధంగా కూలీలకు ఉపాధిపనులపై మరింత అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం కోమటిపల్లి, కొత్తూరుమొట్లగూడెం పంచాయతీ పరిధిలోని తొడ్యాలలక్ష్మీపురంలో కొనసాగుతున్న ప్రాంతాలను సందర్శించారు. పనులకు వచ్చిన కూలీలతో మాట్లాడి స్వయంగా ఆయన సెల్ఫోన్లో ఫొటో క్యాప్చర్ ద్వారా కూలీల హాజరును నమోదు చేశారు. ఆయన వెంట ఈజీఎస్ ఏపీఓ అంకూస్, పీల్డ అసిసస్టెంట్లు ఉన్నారు. విద్యార్థులకు సువర్ణావకాశం ఏటూరునాగారం: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పేద, ప్రతిభగల విద్యార్థులకు సినిమా హీరో సంజోష్ ఫౌండేషన్ సువర్ణావకాశాన్ని కల్పిస్తున్నట్లు హీరో సంజోష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 900 మార్కులు దాటిన విద్యార్థులకు, పదో తరగతిలో 500 మార్కులు దాటిన విద్యార్థులకు ఉపకార వేతనాలు రూ.2 వేల చొప్పున అందజేస్తామని వెల్లడించారు. సంబంధిత విద్యార్థులు 9000203486 నంబర్కు సమాచారం అందజేసి ఉపకార వేతనం అందుకోవాలని వివరించారు. రావి ఆకుపై హీరో విజయ్ చిత్రం ఏటూరునాగారం: తమిళనాడు హీరో విజయ్ సీఎంగా ఎన్నిక కాబోతున్న శుభ సందర్భంగా రావి ఆకుపై విజయ్ బొమ్మను మండల కేంద్రానికి చెందిన డ్రాయింగ్ మాస్టర్ రమేశ్ గీశారు. మండల పరిధిలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాల డ్రాయింగ్ టీచర్ రమేశ్ వినూత్నంగా ఆలోచించారు. రావి ఆకుపై కాబోయే తమిళనాడు సీఎం విజయ్ చిత్రాన్ని అద్భుతంగా గీసి ప్రదర్శించారు. ఆయన ప్రతిభను స్థానికులు అభినందించారు. ఫైరింగ్ ప్రాక్టీస్ భూపాలపల్లి అర్బన్: జిల్లా పోలీసుల వార్షిక మొబిలైజేషన్ శిక్షణలో భాగంగా వరంగల్ జిల్లా అమ్మవారిపేట ఫైరింగ్ రేంజ్లో బుధవారం ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హాజరై.. అధికారుల ఫైరింగ్ను పరిశీలించి సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించేందుకు ఆయుధాలపై పూర్తి ప్రావీణ్యం అవసరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
తూర్పారా మిషన్లు కరువు
ఏటూరునాగారం: జిల్లాలోని 10 మండలాల పరిధిలో 140 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు కొనుగోలు కేంద్రాలకు సరిపోయే విధంగా తూర్పారా మిషన్లను ప్రభుత్వం సమకూర్చలేదు. దీనికి తోడు ఐకేపీ, జీసీసీ, సహకార సంస్థ వంటి కొనుగోలు కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం నిల్వ చేసే గిడ్డంగులు, టార్పాలిన్లు, బరకాలు, తూర్పాల పట్టే మిషన్లు రైతులకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఇవ్వకపోవడంతో ధాన్యాన్ని ఆరబోసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతూ విక్రయాలు జరపాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటికితోడు వర్షం కూడా రైతులను ఆగమాగం చేస్తోంది. గతంలో కేంద్రానికి రెండు మిషన్లు గతంలో కొనుగోలు కేంద్రాల వద్ద రెండు చొప్పున తూర్పారా మిషన్లను ఏర్పాటు చేసేది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత ధాన్యంలో ఉన్న ఎండిపోయిన పుల్లలు, తాలును పట్టిన తర్వాత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తేమశాతం పరిశీలించి 17 వరకు ఉంటేనే కొనుగోలు చేస్తారు. మిషనరీల కొరత కారణంగా రైతులే చాటలు, బస్తాలను పెట్టి ధాన్యాన్ని తూర్పారా పట్టి శుభ్రం చేసుకుంటున్నారు. దానివల్ల ధాన్యం కాంటా కాకపోవడంతో కొనుగులు కేంద్రంలో నిల్వ ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇదే సమయంలో అకాల వర్షంతో ధాన్యం తడవడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ క్రమంలో ధాన్యాన్ని తిరగబోసుకొని విక్రయాలు జరుపుకోవాల్సిన దుస్థితి ఉంటుంది. ధాన్యం తడిస్తే తేమశాతం ఎక్కువ రావడం, మొలక రావడం ఉంటుందని ధరను తగ్గించే ప్రయత్నాలను కొనుగోలు కేంద్రాల వారు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వ అధికారులు వత్తాసు పలకడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదేకాకుండా ప్రభుత్వ పరమైన ప్యాడీ క్లీనర్స్ అందుబాటులో లేక ప్రైవేట్ మిషనరీలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఒక్కో ట్రాక్టర్కు రూ.650 లు చెల్లించి క్లీనింగ్ చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కానరాని శాశ్వత గిడ్డంగులు జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం, కొనుగోలు చేసేందుకు వచ్చిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. ధాన్యం నిల్వలు చేసేందుకు పక్కాగా శాశ్వతమైన గిడ్డంగులు లేకపోవడంతో రైతులు ప్రతీ ఏడాది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గిడ్డంగుల నిర్మాణం గత ప్రభుత్వం చేపట్టినప్పటికీ అవి పూర్తికాలేదు. ఈ ప్రభుత్వంలో ఎలాంటి గిడ్డంగుల నిర్మాణాలపై దృష్టిపెట్టడం లేదు. ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలి.. కొనుగోలు కేంద్రాల వద్ద ప్యాడీ క్లీనర్లను ఏర్పాటు చేయాలి. తూర్పాల పట్టేందుకు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. ధాన్యం ఇక్కడికి తీసుకొచ్చి మిషనరీలు అందుబాటులో లేక పడిగాపులు కాయాల్సి వస్తోంది. తూర్పారా పట్టే మిషన్లను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి కొనుగోళ్ల ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలి. –చిట్టిపోతుల వినోద, చిన్నబోయినపల్లి, ఏటూరునాగారం తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కోతలు విధించవద్దు. బస్తాలను వెంటనే కొనుగోలు చేసి మిల్లుకు తరలించాలి. రైతుల ధాన్యాన్ని బయట ఆరబెట్టుకునేందుకు బర్కాలు, టార్పాలిన్ల సౌకర్యం కల్పించాలి. వర్షాలకు తడిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి. –బోజనపు భిక్షపతి, ఏటూరునాగారం ఒక్కో కొనుగోలు కేంద్రానికి ఒకటే కేటాయింపు ధాన్యానికి సరిపడా లేక రైతులు అవస్థలు పలు కేంద్రాల్లో మరమ్మతులకు గురైన మిషన్లు వర్షాలకు తడిసిముద్ధవుతున్న ధాన్యం పట్టించుకోని అధికారులు -
చెరువుల పరిరక్షణకు పూడికతీత పనులు
● ఇరిగేషన్ డీఈఈ గోపాల కృష్ణ వాజేడు: చెరువుల పరిరక్షణకు పూడికతీత పనులు చేపడుతున్నట్లు ఇరిగేషన్ డీఈఈ జె.గోపాల కృష్ణ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ డీఈఈ గోపాలకృష్ణ, ఎంపీడీఓ శ్రీకాంత్ నాయుడులు మాట్లాడారు. చెరువుల్లో మట్టితీత పనులను చేపట్టినట్లు తెలిపారు. రైతులు తమ సొంత ఖర్చులతో పూడికతీత తీయించి మట్టిని తమ వ్యవసాయ భూములకు తరలించుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు వివరించారు. ఆసక్తి కలిగిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్లతో భద్రాచలం నీటి పారుదల శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పూడికతీత మట్టి రైతులకు ఉచితంగానే ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కమర్షియల్ అవసరాల కోసం వినియోగించాలనుకునే వారు తగిన రుసుముతో డీడీ రూపంలో చెల్లించిన తరువాతే అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఈ సాయి, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మాది రైతు పక్షపాతి ప్రభుత్వం
హన్మకొండ: రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని, మాది రైతుపక్షపాతి సర్కార్ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి మెగా రైతుమేళాను బుధవారం మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పొంగులేటి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలో భాగంగా 99రోజులు అధికారులను ప్రజల ముంగిటికి పంపిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే రైతు ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 2022లో అద్భుతమైన రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెరవేరుస్తామని చెప్పి, సీఎం రేవంత్ నాయకత్వంలో రైతు పక్షపాతి ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమలు చేస్తున్నామన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా, రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారం పోయిందని కడుపునిండా విషం నింపుకుని మాట్లాడుతున్నారన్నారు. కల్లాల వద్దకు వెళ్లి సినిమాలో ఫోజులు ఇచ్చినట్లు ఇచ్చి పత్రికల్లో ఫొటోలు వేయించుకుంటున్నారన్నారు. ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా, నాలుగు సార్లు ముక్కు నేలకు రాసినా రైతులు పట్టించుకోరన్నారు. ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు.. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ను గెలిపించాలని, సీఎం రేవంత్కు అండగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా బీఆర్ఎస్ నాయకులు కళ్లుండి చూడలేని, చెవులు ఉండి వినలేని దద్దమ్మలని అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది పెడుతున్న కేంద్రం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలని చూస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనలేదని, తాము అన్నీ కొంటున్నామన్నారు. ఈ సందర్భంగా భూసార పరీక్షలు నిర్వహించుకున్న ఐదుగురు రైతులకు మంత్రుల చేతులమీదుగా పత్రాలు అందజేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. రైతును రాజును చేయడమే లక్ష్యం ప్రభుత్వం పోయిందని కడుపులో విషం నింపేసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హనుమకొండలో రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా ప్రారంభం వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు, యంత్ర పరికరాలతో ఆకట్టుకున్న స్టాళ్లు సందర్శించి వివరాలు తెలుసుకున్న అన్నదాతలు -
వైభవంగా హేమాచలుడి నాగవెల్లి
● భక్తిశద్ధలతో చక్రస్నానం ● శాస్త్రోక్తంగా పూర్ణాహుతి ● నూతన వధూవరులకు పుష్పయాగంపిల్లలకు పాఠశాలలు ముగిశాయి. వేసవి సెలవులంటే పిల్లలకు ఎంతో ఇష్టం. అమ్మమ్మ, నానమ్మ ఇంటికి వెళ్లడం, వారు చెప్పే నీతి కథలు, ఆటవిడుపుగా బొమ్మలు గీయడం, స్నేహితులతో ఈత నేర్చుకోవడం, ఆటపాటల్లో మునిగితేలుతుంటారు. ఇలాంటి అనుభవాలకు వేదికగా సాక్షి నిలుస్తోంది. సెలవుల్లో పిల్లల సందడిపై నేటినుంచి వేస‘వి’కాసం అందిస్తోంది.మంగపేట: మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి దేవతామూర్తులకు నాగవెల్లి కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు మంగళవారం రాత్రి నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలో కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి ఎం. వీరస్వామి, చీఫ్ పెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకష్ణమాచార్యుల బృందం, ఆలయ అర్చకులు ఉదయం స్వామివారికి నిత్యపూజ, సేవాకాలం, బాలభోగం నిత్యహోమం, చతుస్థానార్చన, ఉత్సవ మూర్తులకు నవకలశ అభిషేక పూజలు, మమానివేదన కార్యక్రమాలను నిర్వహించారు. చింతామణి జలపాతం వద్ద చక్రస్నానం ఉదయం 10 గంటలకు సుదర్శన చక్రం, స్వామివారికి ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద వేద మంత్రోచ్చరణ నడుమ చక్రస్నానం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9.30 గంటల వరకు యాగశాలలో మహా పూర్ణాహుతి, స్వామివారి కల్యాణ మండపంలో నూతన వధూవరులైన ఉత్సవ మూర్తులకు నాగవెల్లి, పుష్పయాగం కార్యక్రమాన్ని 12 రకాల పూలు, పండ్లతో ద్వాదశ పూజా కార్యక్రమాలను వైభవంగా జరిపించారు. సంతానం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు యాగ్నికులు గరుడప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సురేశ్, ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు, అనిపెద్ది నాగరాజీవ్శర్మ, ఏడునూతుల ఈశ్వర్చంద్ రామానుజ దాస్, బ్రహ్మోత్సవాల యాగ్నికులు పాల్గొన్నారు.అనుమతి లేని పాఠశాలలను రద్దు చేయాలి ఏటూరునాగారం: సబ్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టీఎల్.రవి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధిలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పర్మిషన్ లేకుండా వారి ఇష్టానుసారంగా ప్లెక్సీలు కట్టి ప్రచారాలు చేస్తూ పేద విద్యార్థులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలోనే యూనిఫామ్స్, పుస్తకాలు అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలల గుర్తింపు తక్షణమే రద్దు చేయాలని కోరారు. -
అడ్మిషన్లపై నజర్
ములుగుబుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026● ట్విన్నింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ● ఒక్కో పాఠశాలకు రూ.5 వేల నిధుల మంజూరు ● జిల్లాలో 10 పాఠశాలల ఎంపికములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ట్విన్నింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివి పైచదువులకు వెళ్లే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నిధులు మంజూరు ట్విన్నింగ్ కార్యక్రమం అమలుకు, ఉన్నత పాఠశాలల సందర్శనకు జిల్లాలో ఎక్కువగా విద్యార్థులు ఉన్న పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు. ఎంపికై న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెసులు బాటును బట్టి విద్యార్థులతో కలిసి పాఠశాలలను సందర్శించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. ట్విన్నింగ్ కార్యక్రమం అమలుకు ఒక్కో పాఠశాలకు రూ. 5 వేలను జిల్లాలోని పది పాఠశాలలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పాఠశాలల సందర్శన సమయంలో విద్యార్థుల రవాణా, అభ్యసన కార్యకలాపాలు, పాఠశాలల్లోని వసతుల వివరాలు రాసుకునేందుకు నోట్ బుక్కులు, పెన్నులు, తాగునీరు, స్నాక్స్ కోసం నిధులను వినియోగిస్తారు. వసతుల పరిచయం ఉన్నత పాఠశాలల్లో బోధన పద్ధతులు, పాఠశాల మౌలిక వసతుల సందర్శన, పాఠశాలల్లో చేసిన సైన్స్ ప్రయోగాలు చూపిస్తారు. బాలసభ నిర్వహణ, స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాలు వివరిస్తారు. క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకత్వ లక్షణాల పెంపునకు అవగాహన కల్పించడం, ఉపాధ్యాయుల ప్రత్యేక తరగతులతో పాఠశాలల ప్రాముఖ్యతలు వివరిస్తారు. ‘ట్విన్నింగ్’కు ఎంపికై న పాఠశాలల వివరాలు.. జిల్లాలో ట్విన్నింగ్ కార్యక్రమానికి ఎంపికై న పాఠశాలలు ములుగు ఎంపీపీఎస్ పాఠశాల, గోవిందరావుపేట మండలంలోని ఎంపీపీఎస్, చల్వాయి, ఏటూరునాగారం మండలంలోని శంకర్రాజ్పల్లి ఎంపీపీఎస్ పాఠశాల, మంగపేట మండలంలోని ఎంపీయూపీఎస్ పాఠశాల, కన్నాయిగూడెం మండల పరిధిలోని బుట్టాయిగూడెం ఎంపీపీఎస్, గుర్రేవుల ఎంపీపీఎస్, వెంకటాపురం(కె) మండల పరిధిలోని ఎంపీయూపీఎస్ పాత్రాపురం, ఎంపీయూపీఎస్ ఆర్సీ పురం, ఎంపీయూపీఎస్ ఉప్పేడు, వాజేడు మండలం పరిధిలోని ఎంపీయూపీఎస్ జగన్నాథపురం పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు అధికారుల కసరత్తు విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సర్వశిక్షా అభియాన్తో కలిసి ట్వినింగ్ కార్యక్రమం అమలు చేస్తున్నాం. జిల్లాలో 10 పాఠశాలలను ఎంపిక చేశాం. విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలల సందర్శన, బోధన పద్ధతులు, మౌలిక వసతులు, సైన్స్ ల్యాబ్ల గురించి వివరిస్తూ పాఠశాలల్లో ప్రవేశం పొందేలా చూస్తున్నాం. జిల్లాలో కార్యక్రమం పకడ్బందీగా అమలు చేస్తున్నాం. -
ఓరుగల్లు వేదికగా రైతుపోరు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రైతు సంగ్రామ సదస్సు కోసం ఓరుగల్లు ముస్తాబైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా బుధవారం హాజరవుతున్న ఈ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. సదస్సు ఏర్పాట్లను కేటీఆర్ డైరెక్షన్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్రెడ్డి, తదితర ముఖ్య నేతలు, సీనియర్లతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఉమ్మడి వరంగల్ నుంచి సుమారు 10 వేల మంది రైతులు హాజరవుతారని అంచనా వేసిన నేతలు ఆ మేరకు సదస్సులో ఏర్పా ట్లు చేశారు. కాగా, వరంగల్ నుంచే రైతుపోరుకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్.. ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. విస్తృత ఏర్పాట్లు... రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న సదస్సుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. గత నెల 26న హైదరాబాద్లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రైతు సంగ్రామ సదస్సుకు చకచకా ఏర్పాట్లు చేశారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్కు ఎదురుగా ఉన్న సుమారు ఐదెకరాల స్థలంలో సదస్సు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 10వేల మంది రైతు ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో ఎండ వేడిని తట్టుకునేలా జర్మనీ టెంట్లు వేశారు. ఆ పక్కనే హాజరయ్యే రైతుల కోసం భోజనం ఏర్పాటు చేశారు. కాగా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సదస్సుకు హాజరయ్యే రైతుల వాహనాల పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ప్రాంతాలను సూచించారు. కొలంబో మెడికల్ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో పాలకుర్తి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్, వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన వాహనాలు, తేజస్వీ స్కూల్ గ్రౌండ్తో పాటు, భారత్ పెట్రోల్ బంక్కు ఎదురుగా ఉన్న స్థలంలో స్టేషన్ఘన్పుర్, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల వాహనాలు, పాపడమ్స్ ఎదురుగా ఉన్న పద్మాలయ ఫంక్షన్ హాల్లో జనగామ నియోజకవర్గంతో పాటు జనరల్ వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు, గులాబీ తోరణాలు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సు సందర్భంగా వరంగల్ నగరంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీమయమయ్యాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్య నేతల రాక సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, గులాబీ తోరణాలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ నేతలు మంగళవారం ప్రెస్ మీట్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 9 గంటల వరకే రైతులు సదస్సుకు హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. సదస్సు ప్రారంభంలో మొదట రైతు ప్రతినిధుల నుంచి ప్రభుత్వం వైఖరి, పరిపాలన విధానాలపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఈసందర్భంగా పలువురు రైతు ప్రతినిధులను సదస్సులో మాట్లాడించనున్నారు. తర్వాత మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్యనేతలు కూడా తమ ప్రసంగం ద్వారా అభిప్రాయాలు వెల్లడించనున్నారు. అనంతరం రైతు సదస్సు ద్వారా ప్రస్తుత ప్రభుత్వ విధానాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు వివరించనున్నారు. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. నేడు బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు హంటర్రోడ్డులో 10వేల మందికి ఏర్పాట్లు ఉదయం 9 గంటలకే వచ్చేలా సమీకరణ మొదట ప్రభుత్వ వైఖరిపై రైతుల అభిప్రాయాలు అనంతరం బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రసంగం ప్రతీ పల్లె నుంచి హాజరుకానున్న రైతు ప్రతినిధులు గులాబీమయమైన వరంగల్ నగరం కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించేందుకే రైతు సదస్సు విలేకరులతో బీఆర్ఎస్ నేతలు -
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు
● అదనపు కలెక్టర్ సంపత్రావు ములుగు: ఆయిల్పామ్ పంటసాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని అదనపు కలెక్టర్ సంపత్రావు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు అధ్యక్షతన ములుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పంటలసాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యానవన, ప్రత్యామ్నాయ పంటలపై రైతులు ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు. రైతులు సేద్యం చేసే పంటల డిమాండ్ను బట్టి ధర ఉంటుందని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ కలిగిన పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. నిత్యావసర సరుకుగా ఉన్న వంట నూనె నిల్వలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ఆయిల్పామ్ పంటకు మంచి డిమాండ్ ఉందని, రైతులు సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్పామ్ సాగులో అంతర్గత పంటలను కూడా పండించవచ్చని తెలిపారు. దీంతో రైతులకు రెండు పంటల ద్వారా ఆదాయం లభించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఒకసారి ఆయిల్పామ్ సాగుబడి చేస్తే 30 సంవత్సరాల వరకు నిరంతర పంట దిగుబడితో ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ఉద్యానశాఖ అధికారి సంజీవరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,069 మంది రైతులు 3,562.40 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. ఒక ఎకరాకు ప్రభుత్వం రూ.50 వేల వరకు సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్మన్ రాజు, డీసీఓ రామ్మోహన్, కేఎన్ బయోసైన్స్ కంపెనీ ఎండి.సుధారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
ములుగు రూరల్: రైతుల ధాన్యాన్ని తరుగు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు సూడి కృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలపై అదనపు కలెక్టర్ మహేందర్జీకి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. రైతులు పండించిన ధాన్యమంతా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో కనిపించడం లేదన్నారు. రైతుల ధాన్యంలో నుంచి మిల్లర్లు ఐదు నుంచి ఆరు కిలోల కటింగ్ పెడుతున్నారని వివరించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వెంకట్రెడ్డి, రత్నం రాజేందర్, చిట్టిబాబు, గపూర్ పాషా, తదితరులు పాల్గొన్నారు. స్వీయ గణన డిజిటల్ నమోదు ములుగు: జనగణన కార్యక్రమంలో భాగంగా స్వీయ గణన డిజిటల్ నమోదును మంగళవారం ఆన్లైన్లో అదనపు కలెక్టర్ మహేందర్జీ నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు స్వీయ గణనలో తమ వివరాలు నమోదు చేసుకోవడంతో సమయం ఆదా అవుతుందన్నారు. ఆన్లైన్ ద్వారా స్వీయ గణనలో ప్రతిఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలు అందరూ జనగణన కార్యక్రమంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని ఓ ఇంటి తాళాలు పగులకొట్టి చోరీకి పాల్పడిన కేసులో మంగళవారం పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను డీఎస్పీ రవీందర్ వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది జనవరి 21న ములుగులో మేరుగు రవికి చెందిన ఇంటి తాళాలు పగులగొట్టి 65గ్రాముల బంగారం, రూ.35వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల ఆధారంగా నేరస్తులను గుర్తించినట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో బోడ గణేశ్, జబ్బ సిద్ధు, అల్వా విపిన్ కుమార్లు ఉండగా పుల్లూరు రాజేశ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు బంగారు ఉంగరాలు, జత కమ్మలు, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఉపేందర్రావు తదితరులు ఉన్నారు. నిందితుల అరెస్ట్, రిమాండ్ ఏటూరునాగారం: మండల పరిధిలోని చిన్నబోయినపల్లి సెక్షన్, బీటు పరిధిలోని అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిని వేటాడి హతమార్చిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జిల్లా కోర్టుకు రిమాండ్కు పంపినట్లు అటవీక్షేత్రాధికారి అబ్ధుల్ రహమాన్ తెలిపారు. శాపెల్లి గ్రామానికి చెందిన ఉన్నిని లచ్చిమ్, యాలం చందు, ఆకులవారిఘనపురంకు చెందిన కుడుదుల నర్సింగరావులు కొంతకాలంగా వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలో దుప్పిని హతమార్చారు. ఈ మేరకు వారిపై వణ్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసునమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి నారాయణ, ఎఫ్బీఓ కేఎం చిస్టీ, దయానంద్, బేస్క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. కాటారం ఆర్డీఓగా రవీందర్ మల్హర్ (కాటారం): కాటారం రెవెన్యూ డివిజనల్ అధికారిగా (ఆర్డీఓ) రవీందర్ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేసిన సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ హైదరాబాద్కు ఇటీవల బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా, ఆయన స్థానంలో కాటారం ఆర్డీఓగా రవీందర్ వచ్చారు. -
ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలి
ములుగు: జిల్లాలోని నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మే 8న ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే మెగా జాబ్మేళా పోస్టర్ను ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సిద్ధార్థ రెడ్డితో కలిసి ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా ఉమ్మడి జిల్లాలో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఈఈట్, టాస్క్, ఉపాధి కల్పన కార్యాలయాల సమన్వయంతో సుమారు 100 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబ్మేళా సమాచారం ప్రతి ఒక్కరికీ చేరేలా వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాను ఉపయోగిస్తూ ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూసేవారికి సమాచారం చేరేలా చూడాలన్నారు. టాస్క్లో నమోదు చేసుకున్న యువతకు కూడా సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన క్రీడల శాఖ అధికారి బి.రామ్మోహన్, ఉపాధి కార్యాలయ అధికారి కొమురయ్య, పౌర సంబంధాల అధికారి ఎండి.రఫీక్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ మహేందర్జీ -
గిరిజన దర్బార్లో వచ్చిన కొన్ని వినతులు..
వెంకటాపురం(కె) మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన గిరిజన రైతులు సాగు భూమికి సర్వే నంబర్లు ఉన్నాయని, పట్టాపాస్ పుస్తకాలు లేవని తెలిపారు. ఇప్పించాలని వేడుకున్నారు. ఏటూరునాగారం మండలం లంబాడీతండాకు చెందిన ఓ వ్యక్తి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం అందించాలని విన్నవించారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలం పంబాపురంకు చెందిన ఓ మహిళ తన భర్త పేరుపై ఉన్న పోడు పట్టా భూమిని తన పేరుపైకి మార్చాలని కోరారు. ఏటూరునాగారం మండలం షాపెల్లికి చెందిన గిరిజనుడు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పాస్పుస్తకం పోయిందని కొత్త బుక్ ఇప్పించాలని వేడుకున్నారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం ఏజెన్సీ ప్రాంతంలో 1/70 షెడ్యూల్ పరిధిలోని సర్వే నంబర్ 222లో గల 15 గుంటల ప్రభుత్వ భూమి అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరారు. ఏటూరునాగారం మండల పరిధిలోని ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాల్లో సేల్స్మెన్లను నియమించాలని తుడుందెబ్బ మండల అధ్యక్షుడు నీలాద్రి కోరారు. వాజేడు మండలం చెరుకురు గ్రామంలో పంచాయతీ కార్యాలయం పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని కాంట్రాక్టర్ మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేశ్ బాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, మేనేజర్ శ్రీనివాస్, జేడీఎం కొండల్రావు, జియాలజిస్ట్ కిశోర్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా హేమాచలుడి తెప్పోత్సవం
ఎద్దు ముక్కు ఆంజనేయస్వామికి స్నపనంకొలనులో ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం పూజలు నిర్వహిస్తున్న యాగ్నికులుమంగపేట: మల్లూరులోని హేమాచల క్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు తెప్పోత్సవం కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు మరళీకృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోచ్ఛరణతో సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం ఆలయంలోని మూలవిరాట్కు నిత్య పూజ, యాగశాలలో సేవాకాలం, బాలభోగం, చతుస్థానార్చన ఆలయ సమీపంలోని ఎద్దు ముక్కు వద్ద గల ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం(స్నపనం) మహానివేదన కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 7 నుంచి 9గంటల వరకు చతుస్థానార్చన, తెప్పోత్సవం, దోపోత్సవం, శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం, హవనం కార్యక్రమ క్రతువులను వేద పండితులు మంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెప్పోత్సవం కార్యక్రమంలో భాగంగా లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పల్లకి(సేవ)పై మంగళ వాయిద్యాలతో తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలోని కొలనులో రెండు గంటల పాటు తెప్పోత్సవం నిర్వహించారు. అనంతరం పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఆలయ ప్రాంగణంలో దోపోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు ముక్కామల శేఖర్ శర్మ, కారంపుడి పవన్కుమార్, అనిపెద్ది రాజీవ్శర్మ, ఏడునూతుల ఈశ్వర్చంద్ రామానుజం, బ్రహ్మోత్సవాల యాగ్నికులు పెరంబదూర్ మధనమోహనాచార్యులు, శ్రీ కృష్ణ యజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు, బరధ్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
వినతుల వెల్లువ
ప్రజావాణిలో 55, గిరిజన దర్బార్లో 15 అర్జీల రాకప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు భూ సమస్యలు 23పింఛన్లు 10ఇందిరమ్మ ఇళ్లు 12ఇతర సమస్యలు 10● స్వీకరించిన అదనపు కలెక్టర్ మహేందర్జీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ గంట ● దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశాలు వితంతు పింఛన్ అందించాలిఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. రెండేళ్ల క్రితం నా భర్త మృతి చెందాడు. అప్పటి నుంచి వితంతు పింఛన్ రావడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి పింఛన్ అందేలా చూడాలి. – కొలిపాక రమ, దేవగిరిపట్నం ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు వెల్లువలా వచ్చాయి. భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పాటు తదితర సమస్యలు పరిష్కరించాలని బాధితులు అధికారులకు మొరపెట్టుకున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో 55 అర్జీలు రాగా అదనపు కలెక్టర్ మహేందర్జీ ఆర్డీఓ వెంకటేశ్తో కలిసి స్వీకరించారు. అదే విధంగా ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో 15 అర్జీలు రాగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ గంట స్వీకరించారు. అధికారులు బాధితులు అందించిన వినతులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.ఇందిరమ్మ ఇంటిని రెన్యూవల్ చేయాలిమొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యింది. కుమారుడికి ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రుల చుట్టూ తిరిగి వైద్యం చేయించాం. దీంతో ఇంటి నిర్మాణం చేయలేకపోయాను. అధికారులు ఇందిరమ్మ ఇళ్లు రద్దు అయిందని అంటున్నారు. ఇందిరమ్మ ఇంటిని రెన్యూవల్ చేస్తే ఇంటి నిర్మాణం చేసుకుంటాను. – బొల్లం రమేశ్, బండారుపల్లి ● -
నానో ఎరువుల వాడకంపై అవగాహన
ములుగు రూరల్: మండల పరిధిలోని ఇంచర్ల రైతువేదికలో సోమవారం అత్మ ఆధ్వర్యంలో ఎరువుల యాజమాన్య పద్ధతులు, నానో ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త విశ్వతేజ మాట్లాడుతూ అధిక ఎరువుల వాడకంతో నేల ఆరోగ్యం దెబ్బతిని చీడపీడలు ఆశిస్తాయని తెలిపారు. పచ్చిరొట్ట ఎరువుల వాడకంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఏఓ సురేశ్కుమార్, మండల వ్యవసాయ అధికారి పరమేశ్వర్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ పద్మావతి, సర్పంచ్ కుమార్గౌడ్, ఆత్మ చైర్మన్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులకు అవగాహన సదస్సు వెంకటాపురం(ఎం): రైతు వారోత్సవాలను పురస్కరించుకుని మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ మార్కెటింగ్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి హాజరై రైతులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా నాణ్యమైన విత్తన ఎంపిక, సేంద్రీయ వ్యవసాయం, యాంత్రీకరణ, మట్టి పరీక్ష, సమగ్ర ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించినట్లు వ్యవసాయ అధికారిణి శైలజ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నవీన్, రైతులు జనార్దన్, శెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ములుగు రూరల్: ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్లో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ హరిసింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలో కళాశాలల్లో ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, హెచ్ఈసీతో పాటు ఓకేషనల్ ఫిజియోథెరఫీ, ఏటి అండ్ ఐఎం కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో టీజీటిడబ్ల్యూర్జేసీ(బాలుర) ఏటూరునాగారం కళాశాలలో ఎంపీసీలో 40, బీపీసీలో 40, హెచ్ఈసీ 40, ఏటీ 20, ఏటూరునాగారం బాలికల కళాశాలలో ఎంపీసీ–40, బీపీసీ–40, సీఈసీ–40, ఏటి–20, ఐఎం 20, వాజేడులోని టీజీటీడబ్ల్యూఆర్జేసీలో 40, బీపీసీలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2026లో పదో తరగతి ఉత్తర్ణీత సాధించారని వెల్లడించారు. కాళేశ్వరాలయంలో టీపీసీసీ అధ్యక్షుడి పూజలు కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్కుమార్ గౌడ్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ముందుగా త్రివేణి సంగమం వద్ద సైకత లింగార్చన, షోడస సోమవార వ్రత ఉద్యాపన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రాజగోపురం వద్దకు రాగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో విశేష పూజలు చేశారు. శ్రీ శుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనను స్వామి వారి శేష వస్త్రాలతో ఆలయ చైర్మన్ అవధాని మోహన్ శర్మ సన్మానించారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందజేశారు. ఆయన వెంట టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, డీసీసీ అద్యక్షుడు బట్టు కర్ణాకర్, ఈఓ మహేష్, ఽసర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్రెడ్డి, ధర్మకర్తలు ఉన్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో.. రేగొండ: రేగొండ మండలంలోని సుప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహేష్కుమార్గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఆలయ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్రావు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. -
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
కాళేశ్వరం: ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నామని కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ, ఈఓ మహేష్ తెలిపారు. సోమవారం పాలకవర్గం మొదటి సమావేశాన్ని నిర్వహించారు. అంత్య పుష్కరాల నిర్వహణ కోసం పలు తీర్మానాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. 12 రోజుల పాటు తాగునీరు, మౌలిక వసతులు ఏర్నాటు చేస్తామన్నారు. స్థానిక భక్తులకు ఉదయం నుంచి 10గంటలకు వరకు దర్శనాలకు అనుమతి ఇస్తామన్నారు. ఈఓ మాట్లాడుతూ..ఆలయంలో భక్తులకు సరిపడా లడ్డు ప్రసాదం తయారు చేస్తామన్నారు. ప్రతీ రోజు భక్తులకు అన్నదానం ఏర్పాటుచేస్తామని తెలిపారు. 12 రోజుల పాటు వీవీఐపీలు, పీఠాధిపతులు రానున్నారని తెలిపారు. హారతి కార్యక్రమానికి కాశీపండితులు వస్తున్నారని పేర్కొన్నారు. వారి వెంట ధర్మకర్తలు సీతారాం, సీతయ్య, సత్యనారాయణ, సత్తయ్య, పద్మ, నర్సయ్య, అశోక్, దుర్గయ్య, శ్రీధర్రావు, శ్యామ్దేవుడా పాల్గొన్నారు. -
‘మోదీ సభను జయప్రదం చేయాలి’
ములుగు రూరల్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 10న నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరికొండ బలరాం, సీతరాం నాయక్, నరేశ్, కృష్ణవేణి, జవహర్ లాల్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
ములుగు: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆయన సోమవారం నిర్వహించిన వీసీలో మంత్రులు వాకాటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు అదనపు కలెక్టర్ మహేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. పీపీసీ కేంద్రాలకు మొత్తం 21.34 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం చేరగా ఇప్పటి వరకు 13.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, హమాలీ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు వాతావరణ హెచ్చరికలను నిరంతరం అందించాలని అధికారులకు సూచించారు. ఈదురుగాలులు, ఆకాల వర్షాలతో విద్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద చెట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ మహేందర్జీ మాట్లాడుతూ ఎఫ్ఏక్యూ వరిధాన్యాన్ని తక్షణమే లిఫ్టింగ్ చేయాలని ఆదేశించారు. రైతులకు ఆలస్యం లేకుండా సకాలంలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. హమాలీల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ట్రక్ షీట్లు సమయానికి జెనరేట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్లో సివిల్ సప్లయీస్ అధికారి ఫైజల్ హుస్సేన్, డీఆర్డీఓ చంద్రశేఖర్, డీఎం కృష్ణవేణి, అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వీసీలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి -
ట్రాఫిక్ నియంత్రణకు వన్ వే
కాళేశ్వరం: సరస్వతీనది ఆది పుష్కరాల్లో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని.. అంత్య పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు వన్వే రూట్ ప్లానింగ్ చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాల నేపథ్యంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపాయాలపై అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్తో కలిసి కాళేశ్వరంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా వీఐపీఘాటు, సాధారణ ఘాటు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘాట్ల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, 250కి పైగా సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షిస్తామన్నారు. పోలీసుస్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించనున్నామని తెలిపారు. 12 రోజుల పాటు 2,500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పలు షిప్టుల్లో ఉంటారన్నారు. వాహనాల పార్కింగ్ కోసం సుమారు 250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వర్షం కురిస్తే వాహనాలు దిగబడకుండా ఎరుపు నేలలను కూడా గుర్తించినట్లు తెలిపారు. గంగారం ఎక్స్రోడ్డు నుంచి కాళేశ్వరం మంథని గుండా కాళేశ్వరం వచ్చే వాహనాలు గంగారం ఎక్స్రోడ్డు మీదుగా దామెరకుంట, అన్నారం, మద్దులపల్లి మీదుగా కాళేశ్వరం వస్తాయి. వరంగల్ నుంచి వచ్చే వాహనాలు బస్వాపూర్ నుంచి రుద్రారం మీదుగా కొయ్యూర్, గంగారం ఎక్స్రోడ్డు నుంచి దామెరకుంట, అన్నారం మీదుగా కాళేశ్వరం వస్తాయి. తిరిగి వెళ్లేటప్పుడు కాళేశ్వరం మీదుగా యధావిధిగా కాటారం గుండా వరంగల్, కరీంనగర్ వైపునకు వెళ్తాయి. ఆర్టీసీ బస్సులు, వీవీఐపీ వాహనాలకు వన్వే లేదు. ఎప్పటిలాగే వచ్చి వెళ్తాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మంచిర్యాల గుండా వచ్చే వాహనాలు వంతెన వద్ద పార్కింగ్ స్థలాలకు చేరుకుంటాయి. అక్కడే పార్కింగ్ చేసిన తరువాత ఆటోలు, షెటిల్ బస్సులలో వెళ్లి స్నానాలు చేసి దర్శనం చేస్తారని తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగొద్దు వన్వే ద్వారా భక్తులకు సులభంగా రాకపోకలు జరిగేలా రహదారుల అభివృద్ధి, తాగునీటి సదుపాయాల కల్పన చేపడుతున్నామని, వారి భద్రత దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు. అంత్య పుష్కరాలకు 2,500 మంది పోలీసులతో బందోబస్తు 250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
వెంకటాపురం(కె): గ్రామల్లో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విద్యుత్ శాఖ ఏడీఈ ఉమారావు అన్నారు. మండల పరిధిలోని మరికాల గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి అవసరాల కోసం తప్పనిసరిగా నాణ్యమైన విద్యుత్ వైర్లను వాడాలన్నారు. పంట పొలాల వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లు, తెగిపోయిన వైర్లు కనిపిస్తే తక్షణమే విద్యుత్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకొస్తే సిబ్బంది వాటిని తొలగిస్తారని వివరించారు. అనంతరం మరికాల గ్రామంలోని విద్యుత్ సమస్యలను సర్పంచ్ కన్నయ్య, ఉప సర్పంచ్ రాములు ఏడీఈల కు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ హనుమాన్ దాస్, సిబ్బంది పాషా, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.ఏడీఈ ఉమారావు -
సేంద్రియ వ్యవసాయ సాగుకు మొగ్గుచూపాలి
మల్హర్(కాటారం): రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకొని సేంద్రియ వ్యవసాయం సాగులో ముందుకెళ్లాలని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి నివేదిక రైతు వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని కాటారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో తిరుమల మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులంతా అధునాతన సాగు మెలకువలు పాటిస్తూ పెట్టుబడి తగ్గించుకొని అధిక లాభాలు పొందేలా వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని చెప్పారు. అనంతరం మండలంలో భూసార పరీక్షలు నిర్వహించుకున్న రైతులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పూర్ణిమ, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కిషన్నాయక్, కాటారం సర్పంచ్ సడవలి, ఏఈఓ, రైతులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి అథ్లెటిక్ పోటీలు
భూపాలపల్లి రూరల్: ఈనెల 6వతేది బుధవారం నుంచి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించనున్న అథ్లెటిక్ పోటీల్లో జిల్లాలోని క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొనేవారు బుధవారం ఉదయం ఆరు గంటలకు జనన ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. సబ్ జూనియర్, జూనియర్స్, సీ్త్రలు, పురుషుల విభాగాలలో క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 10వ తేదీన హనుమకొండలో జవహర్లాల్నెహ్రూ స్టేడియంలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించినట్లు తెలిపారు. -
గాలివాన బీభత్సం.. నేలవాలిన వరిపంట
మంగపేట : మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పలుచోట్ల చిరు జల్లులు పడగా కొత్తూరుమొట్లగూడెంలో గాలిదుమారం భారీగా వచ్చింది. దీంతో పలుచోట్ల కోత దశకు వచ్చిన వరిపైరు నేలవాలింది. మేల్ఫిమేల్ వరిపైరు సైతం నేలవాలడంతో వడ్లు రాలిపోగా తీవ్రంగా నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. గాలివాన దాటికి గుడిసెల పైకప్పులు ఎగిరిపోవడంతో ఇళ్లలోని బట్టలు, గృహోపకర వస్తువులు తడిసిపోయాయి. ఉన్నతాధికారులు స్పందించి పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
పల్లెల్లో సౌర వెలుగులు
హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పైలెట్ గ్రామాలను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు భరించి పైలెట్గా ఎంపిక చేసిన గ్రామాల్లోని ప్రతీ ఇల్లు, ప్రతీ వ్యవసాయ పంప్సెట్ను సౌర విద్యుద్ధీకరిస్తున్నారు. అయితే వీటిని మరింతంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాలను రూ.1,380 కోట్ల వ్యయంతో పూర్తిగా సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ 9 గ్రామాలను సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారు. వీటికి అదనంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని పైలట్గా ఎంపిక చేసి సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్ కో) గ్రామాలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో 12 గ్రామాలు సంపూర్ణ సోలార్ గ్రామాలుగా మారనున్నాయి. కొనసాగుతున్న పనులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముందుగా ఎంపిక చేసిన 9 గ్రామాలను సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దేపనులు కొనసాగుతున్నాయి. సోలార్ పలకల బిగింపు పనులు నడుస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంపిక చేయనున్న ఒక్క గ్రామంలో ఒక్కో ఇంటిపై 2 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తారు. ప్రతీ ఇంటికి రూ.1.36 లక్షలు ప్రభుత్వం భరిస్తుంది. ప్రతీ ఇంటికి నెట్ మీటర్ బిగిస్తారు. ఈ మీటర్ ఇంటికి వినియోగిస్తున్న విద్యుత్, మిగిలిన విద్యుత్ గ్రిడ్కు ఎంత సరఫరా జరిగిందో యూనిట్ల వారీగా రికార్డు చేస్తుంది. ప్రతీ ఇంటిపై ఏర్పాటు చేసిన 2 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్రాంట్ ద్వారా నెలకు 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గృహ సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి జరిగి గ్రిడ్కు సరఫరా చేసిన ప్రతి యూనిట్కు రూ.4.99 చొప్పున చెల్లిస్తుంది. అయితే ఇంటికి వినియోగించుకోగా మిగిలిన విద్యుత్కు మాత్రమే చెల్లింపులు చేస్తారు. గృహ విద్యుత్ వినియోగదారులు తాము వాడుకున్న విద్యుత్కు బిల్లులు చెల్లించాల్సిన అవసరముండదు. దీంతో పరోక్షంగా ఆర్థికంగా లబ్ధిపొందుతారు. గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది... ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని మోడల్ సోలార్ గ్రామంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామాల ఎంపిక పూర్తి కాగానే.. సోలార్ ఫలకల బిగింపు పనులు మొదలవుతాయి. ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో ప్రజలను సోలార్ విద్యుత్ వైపు మళ్లించేందుకు, ప్రోత్సహించేందుకు మోడల్ సోలార్ గ్రామాలుగా ఎంపిక చేసి పూర్తి సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దుతోంది. – మహేందర్ రెడ్డి, రెడ్కో మేనేజర్, హనుమకొండగ్రీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యం.. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యంగా పర్యావరణహిత సౌర విద్యుత్ అందరూ వినియోగించుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈక్రమంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పైలెట్ గ్రామాలను ఎంపిక చేసి సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దుతోంది. ఈ పథకంలో ప్రభుత్వమే ఖర్చు భరిస్తుండడంతో వినియోగదారులపై ఏ మాత్రం ఆర్థిక భారం పడట్లేదు. దీంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా సౌర విద్యుత్ మారనుంది. ఉత్తత్తి అయిన సౌర విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేయడం ద్వారా విద్యుత్ వినియోగదారుడికి ఆర్థిక లబ్ధి చేకూరనుంది.నియోజకవర్గానికో గ్రామం ఎంపిక ప్రభుత్వ ఖర్చుతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ఎంపికపై దృష్టి సారించిన రెడ్ కో -
మూతపడిన పరిశ్రమలు
ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు, సబ్జెక్టు నిపుణుల కొరత అడవి బిడ్డలకు అన్యాయం చేస్తున్నాయి. ప్రాజెక్టు మానిటరింగ్ రీసోర్స్ కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూమర్షిప్ పథకం, ఎంఎస్ఎంఈ, పీఎంఈజీపీ పథకం వంటివి అమలుకు నోచుకోవడం లేదు. ఎంఎస్ఎంఈ పథకం కింద ఏర్పాటు చేసిన చిన్న తరహా పరిశ్రమలు మూణ్నాళ్లకే మూతపడి మూలుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమకు మిషనరీలు ఇచ్చినా వాటిని ఇప్పటి వరకు అమర్చకుండా వారి ఇళ్ల ఎదుట ఎండలో పెట్టుకోవడం గమనార్హం. అలాగే గిరివికాసం పథకం కింద పోడు భూముల్లో బోర్లు వేశారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి.ఐటీడీఏ కార్యాలయం -
ప్రత్యేక రిలీజియన్ ఏర్పాటు చేయాలి
ఎస్ఎస్ తాడ్వాయి: విభిన్న కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు కలిగిన ఆదిమ తెగల ప్రజలకు ప్రస్తుతం చేపట్టిన జనగణన సర్వేలో ప్రత్యేకమైన రిలీజియన్ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర డిమాండ్ చేశారు. జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కులు సంస్కృతీ పరిరక్షణకు ఈ నెల 13న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన భవన్లో మేధావులతో ఏర్పాటు చేయనున్న సమావేశానికి సంబంధించిన కరపత్రాన్ని ఆదివా రం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో వివిధ ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సంస్కృతితో ఆదిమ తెగలకు సంబంధం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఆదిమ తెగలకు సంబంధించిన ప్రజలు సుమారుగా 12లక్షల మంది ఉన్నారని తెలిపారు. వారికి ఇప్పటి వరకు ప్రత్యేక రిలీజియన్ ఏర్పాటు చేయలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన జనగణనలో ప్రత్యేక రిలీజియన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కుల సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ పొడుగు శ్రీనాథ్, రాష్ట్ర కన్వీనర్ పాయం సత్యనారాయణ, మడవి నర్సింగారావు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్, జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పొదెం కృష్ణప్రసాద్, డోలుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర -
15 వరకు ఉపాధి హామీ పనుల జాతర
ములుగు రూరల్: ఈ నెల 15వ తేదీ వరకు ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఓ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పనుల జాతరలో రైతులకు వ్యక్తిగత లబ్ధి చేకూరేలా పశువులు, మేకలు, కోళ్లషెడ్లు, పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీలో పనిచేసిన కూలీలకు ఏప్రిల్ 15వ తేదీ వరకు పనిచేసిన వేతనాలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. అలాగే సిబ్బంది పెండింగ్ వేతనాలు సైతం చెల్లించినట్లు వెల్లడించారు. అన్ని గ్రామాల్లో చెరువుల్లో పూడికతీత మట్టిని రైతులు పొలాల్లో పోసుకోవాలని సూచించారు. పని ప్రదేశాల్లో అన్ని రకాల వసతులు కల్పించినట్లు వెల్లడించారు. నేడు సమావేశం కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం పాలకవర్గం(ట్రస్టుబోర్డు) నియామకం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. సోమవారం(నేడు) ఉదయం 10 గంటలకు చైర్మన్ అవధాని మోహన్శర్మ అద్యక్షత మొదటి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల్లో చేయాల్సిన పనులు, భక్తులకు సౌకర్యాలు కల్పించుటపై చర్చించనున్నారు. పలు తీర్మానాలు చేయనున్నారని తెలిసింది. భద్రత ఏర్పాట్లపై.. కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల భద్రత ఏర్పాట్లపై ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీసులతో సోమవారం(నేడు) సమావేశం నిర్వహించున్నారు. గతంలో ఇక్కడ పుష్కరాల్లో విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు, ప్రస్తుతం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిసింది. ఆలయ నిర్మాణానికి భూమి పూజ చిట్యాల: మండలంలోని వెంచరామి గ్రామ శివారు కుర్మపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ ఆలయ నిర్మాణానికి కమిటీ అధ్యక్షుడు మోరే ధర్మరాజు, సర్పంచ్ కాసు రమకుమార్ ఆధ్వర్యంలో ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఆలయ నిర్మాణం మూలంగా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో అతి తొందరలోనే ఆలయాన్ని పూర్తిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు అందుగుల కుమార్, సట్ల స్వామి, కార్యదర్శి గుర్రం నరేందర్, కోశాధికారి జక్కే వెంకటేశం పాల్గొన్నారు. సంఘాల వైఫల్యంతోనే కష్టాలు భూపాలపల్లి అర్బన్: ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాల వైఫల్యంతోనే సింగరేణికి కష్టాలు మొదలైనట్లు సింగరేణి కోల్మైన్ కార్మిక సంఘ్(బీఎంఎస్) కార్యదర్శి మాధవనాయక్ ఆరోపించారు. ఏరియాలోని బీఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు గత ప్రభుత్వాల విధానాలు, గుర్తింపు సంఘాల వైఫల్యమే ప్రధాన కారణమని ఆరోపించారు. తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సంస్థలు చెల్లించాల్సిన సుమారు రూ.50వేల కోట్ల బకాయిలను వెంటనే వసూలు చేయడంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రెండేళ్లుగా గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ కార్మిక సమస్యల పరిష్కారంలో, యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందన్నారు. ఈ సమావేశంలో నాయకులు మండా రమాకాంత్, అప్పాని శ్రీనివాస్, వెలబోయిన సుజేందర్, సత్కూరి శ్రీనివాస్, శ్రీరాములు, ఓ లక్ష్మణ్, భాస్కర్, పని రమేష్, కటకం శ్రీనివాస్, మల్లేష్, రాజునాయక్, దేవర సమ్మయ్య, పునీత్ రావు, ప్రవీణ్, అడప రాజు, తదితరులు పాల్గొన్నారు. -
పేదల సొంతింటి కల సాకారం
వెంకటాపురం(కె): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే పేదల సొంతింటి కల సాకారం అవుతుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. మండల పరిధిలోని పాత్రాపురంలో ఆదివారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమానికి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు -
అస్తవ్యస్తం
ఐటీడీఏలో పాలన.. ఏటూరునాగారం: ఐటీడీఏ పాలన గాడితప్పింది. అధికారులు ధీర్ఘకాలికంగా డిప్యుటేషన్లపైనే విధులు నిర్వహిస్తున్నారు. అన్ని ఐటీడీఏల్లో పరిస్థితి ఒకలా ఉంటే ఏటూరునాగారం ఐటీడీఏ మరోలా ఉంది. ఇక్కడి అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులు, ఉన్నతాధికారుల నుంచి వచ్చే సర్క్యూలర్ల అమలు సైతం బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పీఎంఆర్సీ, పీఈటీసీల్లో డిప్యుటేషన్లపై పనిచేస్తున్న ఉపాధ్యాయులు తిరిగి వారి వారి పోస్టుల్లోకి వెళ్లాల్సిందిగా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి గత నెల 20న ఉత్తర్వులు జారీ చేశారు. ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏల్లో వెంటనే అమలు చేస్తే ఏటూరునాగారంలో మాత్రం పట్టించుకోవడం లేదు. పీఎంఆర్సీ, పీఈటీసీల్లో పనిచేసే ఉపాధ్యాయులు వారు పనిచేసే పాఠశాలలకు వచ్చి విధుల్లో చేరకుండా డిప్యుటేషన్ విధుల్లోనే కొనసాగుతున్నారు. ఇదేకాకుండా ఉట్నూరు ఐటీడీఏకు చెందిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఏటూరునాగారం కార్యాలయానికి డిప్యుటేషన్ వేయించుకొని ఆయన మాత్రం వరంగల్లోని స్టడీ సర్కిల్లో పనిచేస్తున్నారు. వేతనం మాత్రం ఐటీడీఏ నుంచి ఇస్తుండగా పనిచేసేది మాత్రం స్టడీ సర్కిల్లోనే. అయితే నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే ఉద్యోగులకు ఎలాంటి బదిలీలు, డిప్యుటేషన్లు ఉండవు. కానీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం గమనార్హం. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఐటీడీఏ ఏర్పడినప్పుడే ఏటూరునాగారం పంచాయతీ పరిధిలోని ఎక్కెల గ్రామ శివారులో 24.20 ఎకరాలు స్థలం కేటాయించారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో 4.20 ఎకరాల్లో ఉద్యాన నర్సరీ శిక్షణ కేంద్రాలు(హెచ్టీసీలు) ఏర్పాటు చేశారు. వీటిలో మామిడి సపోటా, నిమ్మ, జామ తదితర పండ్ల మొక్కలు, గులాబీ, మందార వంటి పూల మొక్కలు తెచ్చి అంటుకట్టి కొత్తరకం మొక్కలు ఉత్పత్తి చేసేవారు. పండ్లు, పూల తోటల పెంపకం కోసం గిరిజనులకు ఉచితంగా అందించేవారు. వివిధ ప్రాంతాల్లో ఎంపిక చేసిన గిరిజన నిరుద్యోగ యువతకు అంటు కట్టడం , సంకరణ మొక్కలను ఉత్పత్తి చేయడంలో శిక్షణ ఇచ్చేవారు. దీంతో గిరిజన యువతకు స్వయం ఉపాధిగా ఉండేది. ప్రస్తుతం ఆ శిక్షణ కేంద్రం స్వరూపమే మారిపోయింది. హెచ్టీసీ కేటాయించిన భూమి ఆక్రమణలకు గురవుతోందని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా హయాంలో ఆ స్థలంలో పండ్లు, పూల మొక్కల పెంపకాన్ని అధికారులు చేపట్టారు. ఏటూరునాగారంలోని 4.20 ఎకరాల స్థలంలో సపోటా, నిమ్మ, మల్లెపూల మొక్కలు పెంచారు. ఎక్కెల శివారులోని 24.20 ఎకరాల స్థలాన్ని నాలుగు బ్లాకులుగా విభజించి ఒ క బ్లాకులో నర్సరీ, మిగతా బ్లాకుల్లో మోడల్ తోట లను పెంచేందుకు ప్రతిపాదించారు. ఇప్పటి వరకు మంజూరు రాలేదు. కొత్తగా వచ్చిన పీఓ లెనిన్ వత్సల్ టొప్పో ఉన్నతాధికారులతో సంప్రదించి చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. ఆరేళ్లుగా పాలకమండలి సమావేశం నిర్వహించడం లేదు. 2019 తర్వాత ప్రతీ నాలుగు నెలలకోసారి నిర్వహించే పాలకమండలి సమావేశం ఆరేళ్లయినా నిర్వహణకు నోచుకోవడం లేదు. ఐటీడీఏ గిరిజన సంక్షేమ విద్యా విభాగంలో ఇంజనీరింగ్ విభాగాలు ఎక్కువగా ఖాళీలతో వెక్కిరిస్తున్నాయి. గిరిజన సంక్షేమం విద్యా విభాగంలో నాణ్యమైన విద్య కలగానే మారింది. దీర్ఘకాలికంగా డిప్యుటేషన్లపైనే ఉద్యోగులు గిరివికాస పథకంలో బోర్లు వేసినా విద్యుత్ సదుపాయం నిల్ -
కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ములుగు రూరల్: మక్కల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మల్లంపల్లి మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు ఎదురైతే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొండెం రవీందర్రెడ్డి, కిసాన్ సెల్ అధక్షులు గోల్లపలి రాజేందర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
వనదేవత(దైత) అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్న యాగ్నికులుదేవతామూర్తుల వేదాశీర్వచనం తీసుకుంటున్న బ్రహ్మోత్సవాల యాగ్నికులు మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆదివారం రాత్రి సదస్యం(వేదాశీర్వచనం) కార్యక్రమాన్ని యాగ్నికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల(జాతర) కార్యక్రమాల్లో భాగంగా ఏడోరోజు ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి ఎం. వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల బృందం ఉదయం ఆలయంలో స్వయంభు స్వామివారి నిత్యారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. యాగశాలలో సేవాకాలం, బాలభోగం, చతుస్థానార్చన, ఆలయ ప్రాంగణంలోని వనదేవత(దైత) అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం(స్నపనం), మహానివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 7గంటల నుంచి 9 గంటల వరకు హయగ్రీవ స్తోత్ర పారాయణం, హవనం, చతుస్థానార్చన, బలిహరణ, స్వామివారి కల్యాణ మండపంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, అమ్మవార్లకు సదస్యం (వేదాశీర్వచనం) కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవకమిటీ చైర్మన్ సురేశ్, ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్ శర్మ, కారంపుడి పవన్కుమార్, ఏడునూతుల ఈశ్వర్చంద్, అనిపెద్ది రాజీవ్శర్మ, యాగ్నికులు పెరంబదూర్ మధనమోహనాచార్యులు, శ్రీకృష్ణ యజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు. బరద్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహా చార్యులు, మణిదీపాచార్యులు, విరంచి, ఆలయ సీనియర్ అసిస్టెంట్ న్యాతని సీతారాములు తదితరులు పాల్గొన్నారు. ఏడోరోజు హేమాచలక్షేత్రంలో సదస్యం వనదేవత (దైత)అమ్మవారికి స్నపనం -
తూకంలో పారదర్శకత పాటించాలి
టేకుమట్ల: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకంలో పారదర్శకత పాటించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మండలంలోని రాఘవారెడ్డి, వెల్లంపల్లి, టేకుమట్ల గ్రామాలలో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంటకు మద్దతు ధర కొనుగోలు కేంద్రాలలోనే లభిస్తుందన్నారు. తూకంలో లోపాలు జరగకుండా ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. పలు పనులకు శంకుస్థాపన బోర్నపల్లి గ్రామంలో గుట్టు మల్లన్న దేవాలయ నిర్మాణ పనులు, రామకృష్ణాపూర్ (వి)లో బీటీ రోడ్డు పనులు, వెలిశాల (కిష్టయ్యపల్లి) నుంచి రామకృష్టాపూర్(వి) వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు, వెలిశాల నుంచి రాఘవాపూర్ గుట్ట వరకు రోడ్డు నిర్మాణ పనులు, పెద్దంపల్లి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
శిక్షణ తరగతులను విజయవంతం చేయాలి
● ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ గోవిందరావుపేట: ఎస్ఎఫ్ఐ రాష్ట్రస్థాయి విద్యా–వైజ్ఞానిక శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని పస్రా గ్రామంలో ప్రజాసంఘాల కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ ఆధ్వర్యంలో కరపత్రాన్ని శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ నిరంతరం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తుందన్నారు. ఈ మేరకు ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సామాజిక చైతన్యం, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడమే లక్ష్యమన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమాజాన్ని అర్ధం చేసుకుని సమకాలిన సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ శిక్షణ తరగతుల్లో చరిత్ర, రాజకీయం, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ వంటి విభిన్న అంశాలపై నిపుణులు బోధిస్తారని వివరించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 12 విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు తరలివచ్చి శిక్షణ తరగతుల్లో పాల్గొనాలని కోరారు. -
ఎల్ఆర్ఎస్..ఎప్పటికి!
వేల దరఖాస్తులు ఎల్–1లోనే.. స్పాట్ వెరిఫికేషనే సమస్య●మొత్తం దరఖాస్తులు (2020): 1,58,265ఫీజు చెల్లించినవి: 1,43,121జీడబ్ల్యూఎంసీ పరిధిలో: 96,000మొత్తం పెండింగ్ దరఖాస్తులు: 40 శాతం పైగా క్లియరెన్స్ దశలు: ఎల్–1, ఎల్–2, ఎల్–3 పెండింగ్ స్టేజ్: ప్రధానంగా ఎల్–1 కీలక సమస్య: స్పాట్ వెరిఫికేషన్ ఆలస్యం సాక్షి ప్రతినిధి, వరంగల్: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) అమల్లో గ్రేటర్ వరంగల్తోపాటు ఉమ్మడి జిల్లాలో తీవ్ర జాప్యం నెలకొంది. 2020లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం 25శాతం రాయితీ ఇచ్చింది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఎల్ఆర్ఎస్ కోసం ఫీజు చెల్లించారు. 2026 మార్చి నాటికి కూడా పూర్తిస్థాయి క్లియరెన్స్ లేకపోవడం దరఖాస్తుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ప్రభుత్వం మరోసారి లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 25 శాతం రాయితీ ఇస్తూ జూలై 31వరకు గడువు ఇచ్చింది. ఈసారైన ఆశించిన స్థాయిలో ముందుకు వస్తారా? ఆ మేరకు ఫైళ్లు క్లియరెన్స్కు నోచుకుంటాయా? అన్న చర్చ జరుగుతోంది. స్పాట్ వెరిఫికేషన్ లేక ‘బ్లాక్’... ఐదేళ్లుగా అపరిష్కృతం... ఫీల్డ్ స్థాయిలో స్పాట్ వెరిఫికేషన్ జరగకపోవడంతో వేలాది ఫైళ్లు ముందుకు కదలడం లేదు. అధికారులు రేపు, మాపు అంటూ నెలల తరబడి వాయిదా వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఐదేళ్లయినా పూర్తిస్థాయిలో ఫైళ్లు పరిష్కారానికి నోచుకోలేదన్న ఫిర్యాదులున్నాయి. ‘గ్రేటర్‘ మున్సి పల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)తో పాటు ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా 1.58 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో 1.43 లక్షల మంది ఫీజు చెల్లించారు. ఇప్పటికీ కూడా 40శాతం ఫైళ్లు పెండింగ్లోనే ఉండగా.. రాయితీ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. ప్రభుత్వం 25శాతం రాయి తీ ప్రకటించి ప్రజలను ప్రోత్సహించినా, క్లియరెన్స్ లేకపోవడంతో ఆ ప్రయోజనం వృథా అవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్–1లోనే ఎల్ఆర్ఎస్ లాక్... 2026లో మళ్లీ రాయితీ ప్రకటించినప్పటికీ, పాత దరఖాస్తులు క్లియర్ కాకపోవడం వల్ల కొత్త ప్రకటనపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీతో భారీగా రుసుములు వసూలు చేసినప్పటికీ, వాటిలో సుమారు 40 శాతం దరఖాస్తులు ఇప్పటికీ ఎల్–1 దశలోనే పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్–1 నుంచి ఎల్–2, ఎల్–3 దశలకు ఫైళ్లు వెళ్లడంలో ఆలస్యం ప్రధాన సమస్యగా మారిందని అధికారులే చెబుతున్నారు. ప్రధానంగా మూడు శాఖల మధ్య కుదరని సమన్వయం కూడా దరఖాస్తుదారులకు శాపంగా మారుతుందంటున్నారు. అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం దశల వారీగా క్లియరెన్స్ జరుగుతోందని, త్వరలో పరిష్కరిస్తామని చెబుతున్నారు.మరోసారి రాయితీ.. 25% రిబేట్ ఇస్తూ ఉత్తర్వులు జూలై 31 వరకు గడువు... పాత దరఖాస్తుదారులకే చాన్స్ ఫైళ్ల పరిష్కారంపైనే అనుమానాలు.. గతంలో ఫీజు చెల్లించినవే అపరిష్కృతం ఇప్పటికీ పెండింగ్లో 40శాతం దరఖాస్తులు మళ్లీ 25 శాతం రాయితీ.. ఐదేళ్లు గడిచినా పూర్తిస్థాయి క్లియరెన్స్ జరగనప్పటికీ తాజాగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై 25శాతం రాయితీ మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ రాయితీ జూలై 31 వరకు ఉంటుంది. కొత్తగా అప్లై చేసే వారికి ఈ రాయితీ వర్తించదు. పాత దరఖాస్తుదారులకు మాత్రమే ప్రయోజనం. ఇదిలా ఉండగా గతంలో ఫీజు చెల్లించిన దరఖాస్తులే ఇంకా అపరిష్కృతంగా ఉండగా.. అందుకు అనేక కారణాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోవడం, ఎఫ్టీఎల్(చెరువుల పరిధి), నిషేధిత భూముల వివాదాలు, పేర్లు, సర్వే నంబర్లలో పొరపాట్లు, ఫీల్డ్ వెరిఫికేషన్ ఆలస్యం తదితర కారణాలు చెబుతున్నారు. రాయితీ ఇవ్వడం కాదు.. స్పాట్ వెరిఫికేషన్కు ప్రత్యేక బందాలు ఏర్పాటు చేసి పెండింగ్ దరఖాస్తులను వేగంగా క్లియర్ చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఆన్లైన్ సమస్యలు పరిష్కరించి , పారదర్శకత పెంచాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. -
వైద్యశాలల ఆకస్మిక తనిఖీ
వాజేడు: ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో శనివారం వాజేడు, పేరూరు వైద్యశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలకు వచ్చిన ఆయన ముందుగా హాజరు పట్టికలను పరిశీలించారు. విధులకు రాని సిబ్బందిపై ఆరా తీశారు. మందుల గదులు, రోగుల బెడ్లు, ఆస్పత్రుల్లోని అన్ని గదులను నిశితంగా పరిశీలించారు. మందులు అందుబాటులో ఉన్నది లేనిది సిబ్బందిని అడిగి తెలుసుకోవడంతో పాటు ఇన్, అవుట్ పేషెంట్ల రిజిస్టర్లను పరిశీలించారు. పేరూరు వైద్యశాలలో అందుబాటులో లేని సిబ్బందిపై ఆరా తీశారు. డీఎంహెచ్ఓతో మాట్లాడుతానని తెలిపారు. వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దళారులకు విక్రయించి మోసపోవద్దు మల్హర్: ఽరైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా సహకార అధికారి వాల్యనాయక్ అన్నారు. కాటారం మండలంలోని కాటారం, కొత్తపల్లి శంకరంపల్లి, ధన్వాడ సెంటర్లను కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల, సర్పంచ్లతో కలిసి వాల్యనాయక్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ.. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు సెంటర్ల వద్ద మౌలిక వసతుల కల్పనతో పాటు నగదు జమ అయ్యేవరకు సంబంధిత వ్యవసాయ అధికార యంత్రాంగం పూర్తి బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పీఏసీఎస్ ప్రత్యేక అధికారి రాజు, సీఈఓ ఎడ్ల సతీష్ సర్పంచ్లు పంతకాని సడవలి, సర్పంచ్ అజ్మీర కిషన్నాయక్, మహేష్కుమార్, అరుణస్వామి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఘన సన్మానం భూపాలపల్లి అర్బన్: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులను శనివారం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవి అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా సాయి చరణ్ 540, ఎండీ హఫీజ్ 534, ఎస్.హర్షవర్ధన్ 529, సాయి వరుణ్ 508, టి.అభిలాష్ 508, నవాజుద్దీన్ 502 ఉత్తమ ఫలితాలు సాధించగా కోఆర్డినేటర్ రాజశేఖర్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను శాలువాలు, మొమెంటోలతో ఘనంగా సన్మానించారు. 12న తెలంగాణ జనసమితి ప్లీనరీ భూపాలపల్లి రూరల్: ఈనెల 12న హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్లో నిర్వహించనున్న తెలంగాణ జన సమితి నాలుగో రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రత్నం కిరణ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం రత్నం కిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు తెలంగాణ జన సమితి నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, పార్టీ నాయకులు దాసరి జనార్దన్, రాళ్లపల్లి బాపు పాల్గొన్నారు. గుడుంబా పట్టివేత రేగొండ: గుడుంబా విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు కొత్తపల్లిగోరి ఎస్సై సాయి త్రిలోక్నాథ్ రెడ్డి శనివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చెన్నపూర్కు చెందిన పల్లెబోయిన శంకర్ గుడుంబా విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు దాడి చేసి 4 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
‘బాల్య వివాహాల నిర్మూలనకు పాటుపడాలి’
ఏటూరునాగారం: బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనకు పాటుపడాలని జిల్లా భరోసా కేంద్రం ఇన్చార్జ్, కో ఆర్టినేటర్ అనూష అన్నారు. మండల పరిధిలోని బోరునర్సాపురం, ఏటూరునాగారం, కొండపర్తి గొత్తికోయగుంపు ప్రజలకు మహిళలపై హింసను నిరోధించడం, బాల్య వివాహాల నిర్మూలన, మహిళల భద్రత, లింగ సమానత్వం, పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలను శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. బాల్య వివాహాలు చేస్తే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని వివరించారు. సమాజంపై అవగాహన లేకపోవడంతో కుటుంబంలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. భరోసా కేంద్రం ద్వారా బాధితులకు అవగాహన కల్పిస్తామన్నారు. -
వైభవంగా హేమాచలుడి రథోత్సవం
● కనువిందు చేసిన కళాకారుల నృత్య ప్రదర్శనమంగపేట: మండల పరిధిలోని మల్లూరులో శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల రథోత్సవాన్ని ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి ఎం.వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ సత్యనారాయణ పర్యవేక్షణలో శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. మల్లూరుగుట్టపై కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గ్రామానికి తీసుకొచ్చి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక రథంపై రాత్రి 9 గంటల నుంచి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన 16 మంది కళాకారులు వివిధ రూపాల వేషధారణతో చేసిన నృత్య ప్రదర్శనలు రథోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఉత్సవకమిటీ చైర్మన్ సురేష్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రజాపాలనలో ప్రజలకు మెరుగైన సేవలు
● అదనపు కలెక్టర్ మహేందర్ జీ ములుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నట్లు అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్ జీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓ వెంకటేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్ రావుతో కలిసి హాజరయ్యారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి వివరాలను పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మహేందర్జీ మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జనగణనలో భాగంగా ప్రతిఒక్కరూ మే 10వ తేదీ వరకు సాగుతున్న సెల్ఫ్ ఎమ్యునరేషన్లో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్ సంపత్ రావు మాట్లాడుతూ, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్, డీఎస్పీ రవీందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, జిల్లా అధికారులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదాల నివారణ విద్యుత్ ప్రమాదాలు నివారణకు రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అదనపు కలెక్టర్ మహేందర్ జీ తెలిపారు. విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) సంపత్ రావు, టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ భిక్షపతితో కలిసి సేఫ్టీ వాల్పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం పంపుసెట్లను, విద్యుత్ మోటర్లను, ఇనుప పైపులను, ఫుట్వాల్లను ఏమరపాటుగా తాకకూడదని తెలిపారు. వాటిల్లో విద్యుత్ సరఫరా ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలను, తెగిపడిన తీగలను, స్టార్టర్ డబ్బాలను ముట్టుకోకూడదని వివరించారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, డీఎస్పీ రవీందర్, డీఈపీ నాగేశ్వరరావు, మున్సిపాలిటీ చైర్పర్సన్ చంద్రకళ, వైస్ చైర్పర్సన్ ఆసియా షహీన్, డీపీఆర్వో రఫిక్ పాల్గొన్నారు. -
కొనుగోళ్లు నిల్
మక్కలు ఫుల్..ములుగు: జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 19,051 పైగా ఎకరాలలో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. ఈ మేరకు అధికారులు జిల్లా వ్యాప్తంగా 4 కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా మక్కల కొనుగోళ్లు నామమాత్రంగా ఉండడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. 20 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన మక్కలను విక్రయించేందుకు ఇప్పటి వరకు గన్నీ బ్యాగులు కూడా ఇవ్వకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన మొక్కజొన్న రాశులు పెద్దమొత్తంలో పేరుకుపోతున్నా కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద కాపలా కాస్తూ తమ పంటను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలవరపెడుతున్న మబ్బులు జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి ఆధ్వాన్నంగా మారింది. ఒకవైపు ఆకాశంలో కమ్ముకుంటున్న మబ్బులు, మరోవైపు పంటను అమ్ముకోవాలన్న తపనతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే పండించిన పంటను నిల్వ చేయడానికి సరైన సౌకర్యాలు లేవు. సాయంత్రం వేళ వచ్చే మబ్బులకు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. వర్షాల వల్ల ధాన్యం తడిస్తే నాణ్యత కోల్పోయి గిట్టుబాటు ధర వస్తుందో రాదో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నత్తనడకన కొనుగోళ్లు.. జిల్లాలో నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో మక్కలను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు 20 రోజుల క్రితం తీసుకొచ్చిన మక్కలకు ఇప్పటివరకు గన్నీ బ్యాగులు ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. దీంతో దళారులు మక్కల కొనుగోళ్లపై దృష్టిసారించారు. రైతుల పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని తక్కువ ధరకు మక్కలను కొనుగోలు చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మక్కలకు ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 మద్దతు ధర ఇస్తుండగా దళారులు రూ.1,800 నుంచి రూ.1,900లు ఇస్తూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. రైతులు పంటను ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో దళారులు గ్రామాల్లో తిష్టవేసి మక్కల కొనుగోళ్లను వేగవంతం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మక్కల కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్ 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే రాశులు తక్కువ ధరకు దళారులకు విక్రయిస్తున్న రైతులుమండలం ఎకరాలు ములుగు 3,361.14 మల్లంపల్లి 6,312.33 ఎస్ఎస్తాడ్వాయి 2,972.22 వెంకటాపురం(కె) 2,578.32 వెంకటాపురం(ఎం) 1,528.31 వాజేడు 742.36 మంగపేట 541.07 ఏటూరునాగారం 449.03 కన్నాయిగూడెం 395.29 గోవిందరావుపేట 171.21మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం తగదుములుగు రూరల్: మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేయడం తగదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోరిక గోవింద్నాయక్ అన్నారు. ఈ మేరకు మల్లంపల్లిలో జాతీయ రహదారిపై రైతులతో కలిసి శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మొక్కజొన్న పంట కోతకోసి 20 రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని తెలిపారు. దీంతో రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కారణంగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఎస్సై ఉపేందర్రావు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో అదనపు కలెక్టర్ సంపత్రావు సంఘటనా స్థలానికి చేరుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండబోయిన చంద్రయ్య, మాచర్ల ప్రభాకర్, మొర్రి రాజుయాదవ్, సురేశ్, చీదర్ల సంతోష్, రైతులు పాల్గొన్నారు. కొనుగోళ్లు చేపట్టాలి.. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కష్టపడి పంట పండించాను. పంటలను అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకవైపు వర్షాల భయం, మరో వైపు పంటను నిల్వ చేసుకునేందుకు సౌకర్యాల లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికై నా అధికారులు స్పందించి మక్కలు కొనుగోలు చేయాలి. – మొర్రి రాజు యాదవ్, మల్లంపల్లి -
5న హనుమాన్ నగర సంకీర్తన
ములుగు రూరల్: ఈ నెల 5న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అంజన్న స్వామి నగర సంకీర్తనకు హాజరు కావాలని కోరుతూ శనివారం హనుమాన్ భక్తమండలి ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు హనుమాన్ నగర సంకీర్తన కరపత్రాన్ని అందజేశారు. భక్తిభావంతో సంకీర్తన ఘనంగా నిర్వహంచనున్నట్లు నిర్వహకులు తెలిపారు. హనుమాన్ భక్తిబృందం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. రామాలయం దేవస్థానం నుంచి ములుగు పట్టణం మెయిన్ రోడ్ మీదుగా పురవీధుల గుండా శ్రీ ఆంజనేయ స్వామి శోభాయాత్ర నిర్వహించబడుతుందని తెలిపారు. ఆనంతరం రామాలయ ప్రాంగణంలో 12.30 గుంటలకు హనుమాన్ స్వాములకు, భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తమండలి సభ్యులు ఆవుల ప్రశాంత్ రెడ్డి, బాణాల రాజ్కుమార్, ఒజ్జల కుమారస్వామి, బైకాని నటరాజ్ పాల్గొన్నారు. -
గ్రాడ్యుయేషన్.. కొత్త భవిష్యత్కు నాంది
కాశిబుగ్గ: గ్రాడ్యుయేషన్ అనేది విద్యార్థుల ప్రయాణానికి ముగింపు కాదని, నూతన భవిష్యత్కు ఆరంభమని కాళోజీ యూనివర్సిటీ వైఎస్ ఛాన్స్లర్ డాక్టర్ రమేశ్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి హనుమకొండలోని కాకతీయ వైద్య కళాశాలలో 2020 బ్యాచ్కు చెందిన వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సును విజయవంతంగా ముగించుకున్న సందర్భంగా కేఎంసీ మైదానంలో 62వ గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహిహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ రానున్న కాలంలో ఇంటెలిజెన్స్ (ఏఐ) వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని, వచ్చే ఐదేళ్లలో వ్యాధుల నిర్వహణ పూర్తిగా మారిపోతుందని తెలిపారు. ప్రతి వైద్యుడు నైతిక విలువలు. శాసీ్త్రయ ఆధారాలతో కూడిన వైద్య సేవలు అందించాలని సూచించారు. కేఎంసీ పూర్వ విద్యార్థిగా తాను ఎంతగానో గర్వపడుతున్నానని అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుంకరనేని సంధ్య మాట్లాడుతూ కేఎంసీ వంటి పేరొందిన కళాశాల నుంచి తాను కూడా గ్రాడ్యుయేట్ కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డాక్టర్ రాంకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భావోద్వేగానికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సందర్భంగా 250 మంది వైద్య విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ఆ సమయంలో తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. తెల్లకోటు ధరించి వేదికపై పట్టాలు అందుకుంటున్న తమ పిల్లలను చూసి చప్పట్లు, కేరింతలతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగారు. తమ పిల్లలు వైద్యులుగా ఎదిగి సమాజానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని సంతోషపడ్డారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రమేశ్రెడ్డి కేఎంసీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు పట్టాలు అందుకున్న 2020 బ్యాచ్ వైద్య విద్యార్థులు -
మాలధారుల పాదయాత్ర
ఏటూరునాగారం: మంగపేట మండల పరిధిలోని మల్లూరు గుట్టకు 40 మంది హనుమాన్ మాలధారులు గురువారం సాయంత్రం పాదయాత్రగా బయలుదేరారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి హనుమాన్ కుటీర స్వాములు 40 మంది పాదయాత్రలో జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ పాదయాత్ర చేసుకుంటూ గుట్టకు చేరుకున్నారు. హనుమాన్ జెండాలను చేతబూని స్వామివారి చెంతకు చేరుకున్నారు. మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి తిరుకల్యాణాన్ని తిలకించి మొక్కులు సమర్పించి తిరుగు ప్రయాణంచేయనున్నట్లు గురుస్వామి గాడిచర్ల సాంబయ్య, గీకురు అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇర్సవడ్ల సంతోష్, మండల నాగరాజు, పోగు రమేశ్, శ్రీధర్, రమేష్, లక్క రమేష్, సిద్దు, గంపల శివకుమార్, ఉదయ్, భిక్షపతి పాల్గొన్నారు. -
కనులపండువగా ఎదుర్కోలు మహోత్సవం
మంగపేట : మండల పరిధిలోని శ్రీ హేమాచలక్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం గురువారం రాత్రి కనులపండువగా నిర్వహించారు. ఆలయంలో కొనసాగున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఇన్చార్జ్ ఈఓ వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో గురువారం ఉదయం భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆలయ ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం నిత్య ఆరాధన, చతుస్థానార్చన, యాగశాలలో నిత్య హోమాలు, సుదర్శన హోమం, రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో స్నపనం(అభిషేకం) కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం బలిహరణ కార్యక్రమం అనంతరం శుక్రవారం మధ్యాహ్నం జరుగనున్న స్వామివారి తిరుకల్యాణం సందర్భంగా రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోని స్వామివారి కల్యాణ మండపంలో స్వామివారు, ప్రత్యేక పల్లకిలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు భక్తజనుల మధ్య ఉత్సవ మూర్తులకు వేద మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోకంగా ఎదుర్కోలు మహోత్సవాన్ని కనులపండువగా జరిపించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి ఎదుర్కోలు మహోత్సవ కార్యక్రమం ఇతివృత్తాన్ని వివరించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకి(సేవ)పై మల్లూరు గ్రామంలో భక్తులను దర్శించుకునేందుకు వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ సురేశ్, శ్రీకృష్ణయజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు, బరధ్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహాచార్యులు, మణిదీపాచార్యులు, విరంచి, ఆలయ పూజారులు ముక్కామల రాజశేఖర్శర్మ, అనిపెద్ది రాజీవ్, కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, ఏడునూతుల ఈశ్వర్చంద్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారాములు, రికార్డు అసిస్టెంట్ లక్ష్మినారాయణ, శివరాజు శేషు, సిబ్బంది పుల్లయ్య, అజయ్ తదితరులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా సుదర్శన హోమం హేమాచలక్షేత్రంలో కొనసాగుతున్న జాతర -
కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎస్పీ
ములుగు రూరల్: జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బోర్ఖడే హేమంత్ సహదేవరావును గురువారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టే కార్యక్రమాలతో పాటు పలు ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పరస్పర సహకారంతో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్ల డించారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, సీఐ సురేశ్, ఎస్సై శంకర్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం ములుగు రూరల్: జిల్లాలోని రూరల్, ట్రైబల్ వెల్ఫేర్ మినీ గురుకులాల్లో 2026–27 విద్యా సంవత్సరంలో చేరేందుకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకులాల ప్రాంతీయ సమన్వయకర్త హరిసింగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని జాకారంలో ఒకటవ తరగతిలో 30, రెండో తరగతిలో 10, మూడులో 10, ఐదులో 10 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఎస్ఎస్ తాడ్వాయిలోని పోచాపూర్లో ఒకటవ తరగతిలో 30, రెండో తరగతిలో 13, మూడు, నాలుగో తరగతిలో 5, ఐదో తరగతిలో 7 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. అలాగే వాజేడులో ఒకటవ తరగతిలో 30, రెండో తరగతిలో 9, మూడో తరగతిలో 3, నాల్గో తరగతిలో ఒకటి, ఐదో తరగతిలో 4 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అడ్మిషన్లకు 5వ తేదీ వరకు అవకాశం ఉందని తెలిపారు. ఇద్దరికి జైలుశిక్ష ములుగు రూరల్: జిల్లాలో గంజాయి, పొక్సో కేసులో ఇరువురికి జైలుశిక్ష ఖరారు అయినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పస్రా పోలీస్ స్టేషన్లో మంగపేట మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సూర్యప్రకాశ్పై గంజాయి కేసు నమోదు కాగా పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.5వేల జరిమానా కోర్టు విధించినట్లు తెలిపారు. అదే విధంగా వెంకటాపురం(ఎం) మండలం కొండాపూర్కు చెందిన రజినీకాంత్కు పొక్సో కేసులో రెండేళ్ల జైలుతో పాటు రూ.4,200 జరిమానాను కోర్టు విధించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో నిందితులకు శిక్షపడే విధంగా కృషి చేసిన దర్యాప్తు అధికారులు శంకర్, తాజుద్దీన్లను ఆయన అభినందించారు. విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఏటూరునాగారం: విదేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు ఐటీడీఏ ద్వారా అవకాశాలను కల్పిస్తున్నట్లు పీఓ లెనిన్ వత్సల్ టొప్పో గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ ద్వారా ఆస్ట్రేలియా, జర్మనీ, ఓమన్ వంటి విదేశాల్లో ఉద్యోగాలు చేసే గిరిజన నిరుద్యోగ యువతీయువకుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సపర్రయ్ ప్రింటర్, పానేల్ బెటర్, ఆటోమెటిక్ మెషిన్ కార్స్, వెల్డర్ కంపెనీలలో ఆస్ట్రేలియాలో పనిచేసేందుకు సుమారు 500ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జర్మనీలోని ట్రాన్స్మిషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, నుర్సెన్ కంపెనీలలో సుమారు 230 వరకు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. -
కరకట్ట పటిష్టం
ఏటూరునాగారం: గోదావరి వరదకు కరకట్ట మట్టి ఒర్లిపోతుంది. పలుమార్లు దానికి రివిట్మెంట్, మట్టితో కోతలను నింపారు. కాని ప్రతీ వర్షాకాలంలో వరద తాకిడికి మట్టి తీవ్రంగా నీటి ప్రవాహంలో కలిసిపోతుంది. దానివల్ల కరకట్ట ఎప్పుడు తెగిపోతుందోనని గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎట్టకేలకు ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి వరదల నుంచి కరకట్ట రక్షణకు చేపట్టిన జియోట్యూబ్ ఏర్పాటు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో రూ. 70 లక్షల బడ్జెట్ వ్యయంతో పనులు చేపట్టారు. ప్రస్తుతం 8 జియోట్యూబ్లలో ఇసుక నింపే పనులు చేస్తూ మట్టి ఒర్లిపోకుండా అడ్డుకట్టగా పెట్టారు. మొత్తం 50 వరకు ట్యూబ్లను 250 మీటర్ల మేర అమర్చనున్నారు. ఏటా వరదల సమయంలో గోదావరి ఒడ్డు కోతకు గురవుతుండడంతో కరకట్ట పటిష్టతకు చర్యలు చేపడుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో అమర్చారు. ప్రస్తుతం అదే పద్ధతిని ఇక్కడ అవలంభిస్తున్నారు. ఏటూరునాగారం, మంగపేట, మండలాల్లో సుమా రు రూ.137 కోట్ల కరకట్ట, కాంక్రీట్ వాల్స్, గోదావరిలో నీటి కట్టలను నిర్మించడానికి 2022–23లో అప్పటి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నిధుల కేటాయింపు మరుగున పడింది. కరకట్ట ఎక్కడ బలహీనంగా ఉంది.. ఎక్కడ కాంక్రీట్ వాల్ అవసరం, ఎక్కడ నీటిలో అడ్డుకట్టలు వేయాలనేది నేషనల్ అథారిటీ ఇరిగేషన్ వారు డిటేల్డ్ ప్రాజెక్డు రిపోర్టును ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు డీపీఆర్ ఇవ్వకపోవడంతో ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. కరకట్టకు ఉన్న గేట్లను సైతం పూర్తి స్థాయిలో మార్చి వేయాల్సి ఉంది. గతేడాదిలో ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. మంగపేట మండలం పరిధిలోని గంపోనిగూడెం, కమలాపురం, ఏటూరునాగారం మండల కేంద్రంతో పాటు రామన్నగూడెం, రాంనగర్ గ్రామాలకు గోదావరి వరదతో ముంపు వాటిల్లింది. కానీ కరకట్టలు ఉండడం వల్ల గ్రామాలకు పెద్ద నష్టం జరగలేదు. మట్టి కట్టల కోతల వల్ల స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇరిగేషన్ అధికారులు నాలుగేళ్లుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ముంపు నివారణ చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రూ. 70 లక్షల నిధుల కేటాయింపు ముమ్మరంగా సాగుతున్న పనులు గోదావరి వరద ముంప్పు నివారణకు నిర్మించిన కరకట్ట కోతలకు గురికాకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం చూపాలి. కరకట్ట కోతకు గురై రివిట్మెంట్ కూలిపోవడం, ఒర్లిపోవడంతో కరకట్ట తెగే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలి. – దొడ్డ కృష్ణ, రామన్నగూడెం -
డిజిటల్ జనగణనకు సిద్ధం
ములుగు: జిల్లాలో జనగణనను డిజిటల్ విధానంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. కలెక్టరెట్లో జనగణనపై కలెక్టర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జనగణన ప్రక్రియలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యంగా స్వీయ నమోదు ద్వారా ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని ప్రజలను కోరారు. జనగణన రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో హౌస్ లిస్టింగ్ స్వీయ గణన 26వ తేదీ నుంచి మే 10 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 807 హౌస్ లిస్టింగ్ బ్లాకులు గుర్తించామని, ప్రతీ బ్లాక్లో సుమారు 300 ఇళ్లు, 800 జనాభా ఉంటుందని వివరించారు. ఈ ప్రక్రియకు 545 మంది ఎన్యుమరేటర్లు, 97 మంది సూపర్వైజర్లను (రిజర్వ్తో సహా) నియమించినట్లు తెలిపారు. స్వీయ నమోదుకు ఎస్ఈ.సీఈఎన్ఎస్యుఎస్.జీఓవీ.ఐఎన్ పోర్టల్లో కుటుంబంలోని ఒక సభ్యుడు లాగిన్ అయి వివరాలు నమోదు చేయవచ్చని తెలిపారు. నమోదు చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని, ఒకసారి నమోదు చేసిన తర్వాత సవరణకు అవకాశం ఉండదని సూచించారు. నమోదు చేసిన మొబైల్ నంబర్కు 11 అంకెల సంఖ్య వస్తుందని, ఆ సంఖ్యను ఎన్యుమరేటర్కు అందజేయాలని తెలిపారు. ఏమైనా తప్పులు ఉంటే ఎన్యుమరేటర్ ద్వారా మాత్రమే సవరించుకోవచ్చని స్పష్టం చేశారు. డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ జనగణనలో డేటా గోప్యతకు పూర్తి భద్రత ఉంటుందన్నారు. స్వీయ నమోదు ద్వారా వేగవంతంగా, ఖచ్చితమైన డేటా సేకరణ సాధ్యమవుతుందని వెల్లడించారు. స్వీయ నమోదుకు చివరి తేదీ మే 10 అని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సీహెచ్. మహేందర్ జీ, డీపీఆర్వో రఫిక్, కలెక్టరేట్ అధికారి మంజుల, జనగణన పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ హేమంత్ సహదేవరావు -
మళ్లీ పుష్కర శోభ
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక కాంతులతో మళ్లీ వెలుగులు విరజిమ్మనున్నాయి. సరస్వతీనది అంత్యపుష్కరాలు ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. సుమారుగా 30లక్షల మంది భక్తులు వస్తారని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. కంచి పీఠాధిపతి, గవర్నర్ ప్రతాప్శుక్లా, సీఎం రేవంత్రెడ్డి ప్రారంభపూజల్లో పాల్గొననున్నారని సమాచారం. దీంతో 12 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ నెలకొననుంది. సమన్వయంతో పనిచేస్తున్న శాఖలు రాష్ట్ర ప్రభుత్వం రూ.21.38 కోట్ల విడుదల చేయగా.. అధికార యంత్రాంగం తాత్కాలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లతో బిజీగా ఉంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. భక్తులకు తాగునీరు, వైద్యశిబిరాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు విస్తృతంగా చేపడుతున్నారు. ప్రస్తుతం రూ.1.20కోట్ల వ్యయంతో మ్యూజియం, వీఐపీఘాటు వద్ద ప్లాట్ఫామ్ పనులు, రూ.2కోట్ల వ్యయంతో నల్లగొండ పోచమ్మ గుడి నుంచి వీఐపీఘాటు వరకు రోడ్డు పనులు, ఆదిముక్తీశ్వరాలయం వద్ద సీసీ రోడ్డు, వీఐపీ ఘాటు నుంచి మెయిన్ ఘాటు వరకు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. 12 రోజులు హారతి కార్యక్రమాలు.. గతేడాది జరిగిన సరస్వతి ఆదిపుష్కరాల్లో నిర్వహించిన కాశీపండితులతో మళ్లీ అంత్య పుష్కరాలకు గోదావరివద్ద హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. 12 రోజుల పాటు ఎనిమిది మంది బృందంతో హారతి శోభతో వెలిగిపోనుంది. వారి రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు ఆలయంలో హోమాలు ప్రత్యేకంగా చేపడుతున్నారు. 12 రోజుల పాటు రుద్రాభిషేకం పూజలు నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పీఠాధిపతులు.. ఆది పుష్కరాల మాదిరిగానే అంత్యపుష్కరాలకు పలువురు పీఠాధిపతులు రానున్నారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనదిలో పుణ్యస్నానాలు చేసి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. వారి రాకకోసం దేవాదాయశాఖ ఏర్పాట్లు చేపట్టింది. 12 రోజుల పాటు రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు పుణ్యస్నానాలు చేయనున్నారు. ఆలయంలో దర్శనాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు.. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి నదికి పుష్కరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాళేశ్వరం గొప్పగా నిర్వహించడానికి ఇప్పటికే రూ.198 కోట్ల వ్యయంతో రాతి కట్టడాలు నిర్మాణం చేయడానికి సీఎం రేవంత్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇవి కాకుండా పుష్కరాలకు మరిన్ని నిధులు రానున్నాయి. దీంతో మరోమారు వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు వేదిక కానుంది.రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులతో పాటు స్థానిక అధికారులు ఏర్పాట్లు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. బుధవారం మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ అంత్యపుష్కరాల వాల్పోస్టర్, టీజర్ వీడియోను ఆవిష్కరించారు. దీంతో విస్తృతంగా పబ్లిసిటీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీల కోసం హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. 100 ఎకరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు అంతర్రాష్ట్ర వంతెన, వీఐపీ ఘాటు సమీపం, ఎస్సీకాలనీ వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. సరస్వతీమాత విగ్రహం వద్ద డెకరేషన్ ఏర్పాట్లు చేపట్టనున్నారు. -
బాల్యవివాహాల నిర్మూలనలో మహిళల పాత్ర కీలకం
ఏటూరునాగారం: బాల్య వివాహాల నిర్మూలనలో మహిళా గ్రూపు సభ్యుల పాత్ర కీలకమని ఐకేపీ ఏపీఎం శ్రీధర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని చైతన్య మండల సమాఖ్య కార్యాలయంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బాలల భద్రత, సంరక్షణ–డ్రగ్స్ నిర్మూలన, సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా సీసీలకు, వీఓఏలకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామాల్లో ప్రతీ ఇంటిలో ఒక గ్రూపు సభ్యురాలు ఉంటుందని, బాల్యవివాహాలతో జరిగే నష్టాలు, అనార్థాలను వివరించి అటువైపు వారి దృష్టి వెళ్లకుండా చేయాలన్నారు. అనంతరం ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పవతి, బాలల పరిరక్షణ ప్రొటెక్షన్ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ కిశోర బాలికల సమాచారం, స్నేహ క్లబ్ల ఏర్పాటులో అంగన్వాడీ టీచర్ల సహకారం గూర్చి వివరించారు. కిశోర బాలికలు వయస్సు పరంగా వచ్చే ఆకర్షణలతో అమాయకత్వంతో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. బాలికలు ఏమైన ఇబ్బందులు ఉంటే 1098 టోల్ ఫ్రీనంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి ఏటూరునాగారం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం మండలకేంద్రంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేస్తున్నారని, ఇప్పుడు టీపీఎస్ కూడా జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయడం వలన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు నష్టపోతారన్నారు. ఇది భవిష్యత్లో విద్యాపరంగా ప్రాంతీయ అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఏటూరునాగారం మండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఆట స్థలం, తరగతులు ఉన్నాయన్నారు. దీనిపై విద్యార్థి సంఘాలను కలుపుకొని జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇస్తామన్నారు. కల్యాణం.. కమనీయం రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతీ నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. శుక్రవారం అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమాచార్యులు, శ్రీనాధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తికి సన్మానం భూపాలపల్లి అర్బన్: 23 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ రమేష్బాబు శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా భూపాలపల్లి బార్ అసోసియేషన్, కోర్టు సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలువురు న్యాయమూర్తులు హాజరై రమేష్బాబు సేవలను, వారి ఆదర్శప్రాయ జీవితాన్ని కొనియాడారు. విశ్రాంత జీవితంలో కూడా సమాజ సేవ కొనసాగించాలని ఆకాంక్ష వ్యక్తంచేశారు. అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్జి సతీమణి అనంతలక్ష్మి, ములుగు ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్ర, వరంగల్ ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మల గీతాంబ, వరంగల్ మొదటి అదనపు జిల్లా జడ్జి జె.మైత్రే యి, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జి టి.కన్హయ్యలాల్, ప్రిన్సిపల్ జూని యర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్ కుమార్నా యక్, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్కుమార్, ఆకుల రాములు పాల్గొన్నారు. -
వేసవి శిబిరాల సందడి
ములుగు రూరల్: పల్లెల్లో వేసవి శిబిరాల సందడి నెలకొంది. ఈ ఎండాకాలం సెలవుల్లో విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. గ్రామ స్థాయిలో క్రీడా శిక్షణ శిబిరాల నిర్వాహణ ఎంతగానో ఉపయోగపడతాయి. విద్యార్థులకు క్రీడలతో మానసిక ఉల్లాసం, దేహదారుఢ్యం పెరగడంతో పాటు స్నేహభావం పెంపొందుతుంది. ప్రభుత్వం యువజన సర్వీస్ల క్రీడల శాఖ ఆధ్వర్యంలో శిబిరాలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు వేసవి సె లవుల్లో క్రీడా శిక్షణ శిబిరాలను వినియోగించుకొని ఆసక్తి కలిగిన క్రీడాల్లో రాణించే విధంగా కోచ్లను కూడా ఏర్పాటు చేసి శిబిరాలను నిర్వహిస్తుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో.. జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 10 క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. శిబిరాల్లో 8 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు కలిగి బాలబాలికలు అర్హులు. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శిబిరాలను కొనసాగిస్తారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇస్తారు. ఏఏ క్రీడాంశాలల్లో శిక్షణ ఇస్తారంటే.. సైక్లింగ్, ప్లోర్బాల్, హ్యాండ్ బాల్, కబడ్డీ, క్రికెట్, ఖోఖో, తైక్వాండో, వాలీబాల్, కరాటే, రెజ్లింగ్ ఎక్కడెక్కడంటే.. ములుగులో క్రికెట్, కబడ్డ్డీ, ఏటూరునాగారం కబడ్డ్డీ, మదనపల్లిలో సైక్లింగ్, జగ్గన్నపేటలో రెజ్లింగ్, యోగా, వాజేడులో వాలీబాల్, ఏటూరునాగారం హ్యాండ్బాల్, ఆకులవారి ఘణపూర్లో అథ్లెటిక్స్ శిబిరాలను కొనసాగిస్తారు. కోచ్ల ఎంపిక పూర్తి జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వాహనకు కలెక్టర్ ఆదేశాల మేరకు కోచ్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. వేసవి క్రీడా శిబిరాల నిర్వాహనకు యువజన సర్వీస్లు క్రీడల శాఖకు రూ.1.05 లక్షలను కేటాయించింది. ఇందులో కోచ్లకు రూ. 40 వేలు, క్రీడ సామగ్రి కొనుగోలుకు రూ.50 వేలు, మైదానం అభివృద్ధి, శిక్షణ శిబిరం నిర్వాహనకు 10 వేలు, క్రీడల సమయంలో ప్రమాదం జరగడం, చిన్న చిన్న గాయాలైన వెంటనే చికిత్స అందించేందుకు రూ.5 వేలను కేటాయించింది. శిబిరాల్లో కోచింగ్ ఇచ్చే వారికి నెలకు రూ.4 వేల గౌరవ వేతనం అందించనున్నారు. శిబిరం నిర్వాహనకు రూ.వెయ్యి చెల్లిస్తారు. సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో వివిధ క్రీడలకు సంబంధించిన 10 శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. శిక్షణ ఇచ్చేందుకు కోచ్ల ఎంపిక పూర్తి చేశాం. మే 1 నుంచి 31వ తేదీ వరకు శిక్షణ కొనసాగుతుంది. ఆసక్తి కలిగిన 14 సంవత్సరాల వయసులోపు బాలబాలికలు అర్హులు. జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – రామ్మోహన్, జిల్లా యువజన క్రీడల అధికారి మే 31వ తేదీ వరకు కొనసాగింపు జిల్లాలో 10 శిబిరాల ఏర్పాటు ఒక్కో శిబిరంలో 20 నుంచి 25 మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా యువజన క్రీడల అధికారి రామ్మోహన్ -
కార్మికుల శ్రమతోనే ఆర్థిక వ్యవస్థ బలోపేతం
● మంత్రి సీతక్క ● ఘనంగా మేడే వేడుకలు ములుగు: కార్మికుల శ్రమతోనే ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లాలో మేడే వేడుకలను కార్మికులు ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో హమాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకలకు మంత్రి ధనసరి సీతక్క హాజరై కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకమన్నారు. సమాజ అభివృద్ధికి కార్మికుల కృషి పునాది వంటిదని, వారి శ్రమతోనే ఆర్థిక వ్యవస్థ బలపడుతోందన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కౌన్సిలర్లు, హమాలీ సంఘం నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి: రైతులకు ఇబ్బందులు కలగకుండా మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో మార్క్ఫెడ్, మార్కెటింగ్, రవాణా, సహకార, పౌర సరఫరాలు, సంస్థ, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో మొక్కజొన్న కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 49,175 హెక్టార్లలో మొక్కజొన్న సాగు జరగగా.. ఇప్పటివరకు 3,274 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు కొనుగోలు కేంద్రాల్లో గోదాం, హమాలీ, రవాణా సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. స్వీయ జనగణనలో పాల్గొనాలి.. స్వీయ జనగణనలో ప్రతీ ఒక్కరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు జరుగనున్న స్వీయ జనగణన కార్యక్రమంపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. -
హక్కులను హరిస్తే గుణపాఠం తప్పదు
● సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డిగోవిందరావుపేట: కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తే ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి హెచ్చరించారు. సీపీఎం, సీఐటీయూ, ప్రజా సంఘాలు, గ్రామ పంచాయతీ, ఆశ, అంగన్వాడీ, భవన నిర్మాణం, ఆటో, హమాలీ సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పస్రా నుంచి చల్వాయి వరకు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చల్వాయి గ్రామంలో నిర్వహించిన సభలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకుచ్చి 129 కార్మిక చట్టాలను సవరించి కార్మికుల హక్కులను హరించిందన్నారు. కనీస వేతనం అమలుకాకుండా పెట్టుబడీ దారి వర్గానికి దోపిడీ సంస్థగా బీజేపీ మారిందన్నారు. ఈ ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని శ్రామిక వర్గం రాజ్యం ద్వారానే కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సోమ మల్లారెడ్డి, పొదిళ్ల చిట్బిబాబు, దుస్స సతీష్, ఐలయ్య, జిట్టబోయిన రమేష్, అంబాల మురళి, కోటే కృష్ణారావు, గుండు రామస్వామి, కన్నోజు సదానందం, చలసాని వెంకటేశ్వరరావు, తీగల ఆగిరెడ్డి, గొంది రాజేష్, కడారి నాగరాజు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా హేమాచలుడి తిరుకల్యాణం
● భారీగా తరలివచ్చిన భక్తులు ● పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క మంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో లక్ష్మీనర్సింహాస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వాహణ ఇన్చార్జ్ అధికారి ఎం.వీరస్వామి, చీఫ్ పెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో లక్ష్మీనర్సింహాస్వామి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకుడు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోశ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ప్రధానాలయంలోని స్వయంభు స్వామివారిని నూతన వస్త్రాలంకరణ చేసి నిత్యారాదన, తిరు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. సుమారు రెండు గంటల పాటు స్వామివారి కల్యాణ మహోత్సవ క్రతువును నిర్వహించారు. 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో జిలకరబెల్లం, మాంగళ సూత్రదారణ, ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. హేమాచలుడికి పట్టువస్త్రాలు అందించిన మంత్రి సీతక్క హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి మంత్రి ధనసరి సీతక్క, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్తో కలిసి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందించారు. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఆలయ ఈఓ వీరస్వామి, ఉత్సవకమిటీ చైర్మన్ యరంగారి సురేష్, పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ దంపతులు, జిల్లా గ్రథాలయ చైర్మన్ భానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్, రేగ కల్యాణి, ములుగు ఆర్డీ వెంకటేష్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్బట్, టీఎస్ ఈజీసీ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, ఆలయ పూజారులు ముక్కామల శేఖర్ శర్మ, కారంపుడి పవన్కుమార్, బ్రహ్మోత్సవాల యాగ్నికులు అనిపెదిద రాజీవ్శర్మ, ఏడునూతుల ఈశ్వర్చంద్ రామానుజం, సీతారాములు, గోనె లక్ష్మినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తాం.. 2027లో జరిగే స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం నాటికి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. 2027లో జాతరతో పాటు, గోదావరి పుష్కరాల నిర్వాహణ ఉండటంతో పెద్ద ఎత్తున నిధులు కెటాయించాలని ప్రభుత్వాన్ని కోరామని, ఆయా నిధులతో రోడ్లు, పుష్కరఘాట్ల అభివృద్ధితో పాటు నూతనంగా గ్రానైట్తో శాశ్వత నిర్మాణం పనులు చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. కాగా జాతరకు ఆర్టీసీ బస్సులు అవసరమైన మేరకు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఎర్రటి ఎండలో పార్కింగ్ స్థలాల నుంచి గుట్టపైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్ ఎస్సై టీవీఆర్ సూరీ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెల్లడంతో ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. హేమాచల క్షేత్రంలో శ్రీచక్రానికి అవమానం హేమాచల క్షేత్రంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల సాక్షిగా హిందూ తంత్రశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన శ్రీ చక్రం యంత్ర శిలకు అవమానం జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరం క్రితం ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తీసుకువచ్చిన చక్రాన్ని ఆలయ అధికారులు ప్రాంగణంలోని ఆర్చీ పక్కన పడేశారు. దాని పవిత్రతను తెలియని కొందరు అక్కడే పాదరక్షలు వదిలారు. ఇది చూసిన ఆంజనేయస్వామి భక్తులు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. తక్షణమే స్పందించి ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
కేయూ క్యాంపస్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకుగాను దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్)– 2026కు ఉమ్మడి జిల్లాలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 14 కేంద్రాల్లో కలిపి 6,016మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 11గంటల నుంచే సెంటర్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1–30గంటలకు మెయిన్ గేట్లను మూసివేస్తారు. ఆ తరువాత వచ్చేవారికి అనుమతించబోరు. దివ్యాంగ అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు అదనంగా గంట సమయం ఇస్తారు. ఆయా అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. హనుమకొండ, వరంగల్లోని పరీక్ష కేంద్రాల్లో ఐదుగురు స్క్రైబర్స్ను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు రెండు జిల్లాల నీట్ నోడల్ ఆఫీసర్ భిక్షపతి తెలిపారు. నిబంధనలు కఠినం.. ● అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, 4x6 సైజ్ ఫొటో ఒకటి, ఏదైనా గుర్తింపుకార్డు వెంట తీసుకునిరావాలి. ● పెన్ను, పెన్సిల్ తీసుకురావొద్దు. వీటిని పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు. ● బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు. ● ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్లు తీసుకురావొద్దు, ● మహిళలు బంగారు నగలు పెట్టుకొని రాకూడదు. ఒకవేళ పెట్టుకుని వస్తే కేంద్రం వద్ద తీసివేయిస్తారు. ● కాళ్లకు షూస్ ధరించకూడదు. జీన్స్లాంటివి గాకుండా ఇతర సాధారణ దుస్తులు ధరించి రావాలి. ● పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్స్ను తీసుకురావచ్చు. ● డయాబెటిక్ కలిగిన అభ్యర్థులుంటే వారు పండ్లు (అరటి, యాపిల్) తీసుకొని రావచ్చు. ● ప్రతి గదిలో, మెయిన్ గేట్వద్ద అందరికీ కనిపించేలా గడియారాలు ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి జిల్లాలో పరీక్షకేంద్రాలు ఇలా.. ● వరంగల్ నిట్లో రెండు సెంటర్లు, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీకళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్), వరంగల్లో సీకేఎం కళాశాల, ఎల్బీ కళాశాల, కేంద్రియ విద్యాలయం, యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాల. ● జయశంకర్ భూపాలపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో), ప్రభుత్వ జూనియర్ కళాశాల. ● జనగామ జిల్లా కేంద్రంలోని ఏవీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల విద్యాలయం. ● మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోగల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల. ● మహబూబాబాద్లో నీట్ నోడల్ ఆఫీసర్గా కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ముఖేశ్కుమార్ వ్యవహరించనున్నారు. రేపు మధ్యాహ్నం 2నుంచి 5 గంటల వరకు నిర్వహణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు ఉదయం 11గంటల నుంచే సెంటర్లలోకి అనుమతి మధ్యాహ్నం 1–30గంటల తర్వాత నో ఎంట్రీ హాజరుకానున్న 6,016 మంది అభ్యర్థులుజిల్లా సెంటర్లు అభ్యర్థులుహనుమకొండ, వరంగల్ 09 4,600 జయశంకర్ భూపాలపల్లి 02 374 జనగామ 02 566 మహబూబాబాద్ 01 476 -
పకడ్బందీ ఏర్పాట్లు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: నీట్ నిర్వహణ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన(రేపు) జరుగనున్న నీట్ సందర్భంగా 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా నిలవడం నిషేధమని, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదన్నారు. మైకులు, డీజేలు వినియోగించడం పూర్తిగా నిషేధమని, పరీక్ష సమయంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచీలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు. జిల్లా కేంద్రంలోని రెండు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతామని ఎస్పీ సంకీర్త్ అన్నారు. -
బుద్ధుడి బోధనలు ఆదర్శం
మల్హర్(కాటారం): బుద్ధుడి బోధనలు ప్రపంచ మానవాళికి ఆదర్శమని టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ అన్నారు. గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా శుక్రవారం మండలంలోని కాటారం గారేపల్లిలోని జై భీమ్ అంబేడ్కర్ కార్యాలయంలో బుద్ధుడు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పి ంచారు ఈ సందర్భంగా పీక కిరణ్ మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుడు ధర్మాన్ని సత్యాన్ని న్యాయాన్ని ప్రేమను అందించి ఆచరించి ప్రపంచ మానవాళికి ఆదర్శనీయులయ్యారని చెప్పారు. ప్రతి ఒక్కరూ బుద్ధుడి బోధనల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు సంపత్ మహారాజు, యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్, కొండన్న, రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విజయభేరి
విద్యారణ్యపురి: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఎస్ఆర్ స్కూల్స్ విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి బుధవారం తెలి పారు. సి. సంస్కృతారెడ్డి 600 మార్కులకు 589, పిరంజి వంశీ 588, ఎస్.కీర్తన 587, అంకం సౌజన్య 587, ఎ. సంజయ్ 586, టి. వైష్ణవి 585, బాశెట్టి సాయిశ్రీ 584 మార్కులు సాధించారని వారు తెలి పారు. క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్నామని, పాఠ్యప్రణాళిక, అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందం విద్యాబోధన చేశారని వారు పేర్కొన్నారు. తమ విద్యార్థులు పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా ఐఐటీ అండ్ మెడికల్ ఫౌండేషన్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా బృహత్తర పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రైమ్స్కూళ్లను ప్రారంభించామని వారు వివరించారు. -
బాల్య వివాహాల నిర్మూలనకు పాటుపడాలి
ఏటూరునాగారం: బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో బుధవారం బాలల భద్రత, సంరక్షణ, డ్రగ్స్ నిర్మూలన వారోత్సవాల కార్యక్రమాన్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ అధికారి హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ పౌరులందరికీ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయన్నారు. బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ గంటా మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనేక చోట్ల డబ్బులు పోగొట్టుకుని ఇబ్బంది పడుతున్న విషయాలు చూస్తున్నామన్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. బాలికలు చిన్న చిన్న విషయాలకు ఆకర్షణకు గురవుతుంటారని వివరించారు. తల్లిదండ్రులు వారిపట్ల బాధ్యతగా ప్రేమతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ -
అంత్యపుష్కరాలను విజయవంతం చేయాలి
కాళేశ్వరం: సరస్వతీ నది అంత్యపుష్కరాలను అధి కారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయఽశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం హైదరాబాద్లో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల నిర్వహణకు సంబంధించి మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతీ అంత్య పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ రాహుల్ శర్మ మంత్రులకు వివరించారు. పుష్కరాల నిర్వహణలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు, రవాణా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. మంత్రి దుద్దిళ్ళ శ్రీ ధర్బాబు మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున చేపట్టిన ఏర్పాట్లును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సరస్వతీ అంత్య పుష్కరాల వాల్ పోస్టర్, పుష్కరాల టీజర్ను విడుదల చేశారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, గోవిందహరి, కృష్ణవేణి, రామకృష్ణారావు, ఈఓ మహేష్, దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ, అర్చకులు పణీంద్రశర్మ, శరత్చంద్ర, ధర్మకర్తలు శ్యామ్, పద్మ, అశోక్, సత్త య్య, శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు. మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్బాబు పుష్కరాల వాల్పోస్టర్ ఆవిష్కరణ -
‘ఏకశిల’ విద్యార్థుల ప్రతిభ..
హసన్పర్తి: టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఏకశిల విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వరుసగా 585,582,580,578 ,577,576,574,573,572,571,570 మార్కులతో రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచినట్లు ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా హసన్పర్తి మండలం పెంబర్తిలోని ఏకశిల టెక్నో స్కూల్లో బుధవారం అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకశిల విద్యాసంస్థలో విద్య అంటే మార్కులు మాత్రమే కాదు.. భవిష్యత్ను నిర్మించే శక్తి అన్నారు. నాణ్యమైన విద్యతోపాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జీవిత నైపుణ్యాలను పెంపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాలతో ఏకశిల విద్యాసంస్థకు మరింత గౌరవం పెరిగిందన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల డైరెక్టర్లు బేతి కొండల్రెడ్డి, గౌరు సువిజారెడ్డి, ప్రిన్సిపాళ్లు బేతి శైలజారెడ్డి, ముచ్చ స్వప్నరెడ్డి, ఎం.డి. బాబా, కె.డి. స్వర్ణరాజ్, లవకుమార్, అడ్మినిస్ట్రేషన్ ఇన్చార్జ్ జి.రాంప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘షైన్’ విజయకేతనం..
హన్మకొండ : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో షైన్ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. తమ పాఠశాల విద్యార్థులు ఎ.అక్షర 588 మార్కులు, ఎల్.రేవంత్, ఎండి అఫ్రోజ్ 586, సమీరా నయీం 585, వెలుదండి సీమ, జి.సంహిత, కె.సుమిత్ 584, టి హాసిని, ఎ.ప్రశాంతి, ఎ.సుశాంత్, సీహెచ్.సిరి 583, వి.జాహ్నవి, మార్క శ్రీధన్ 582, ఎ.హరిణి 581, పి.యతిస్, పి.హర్షిత 580 మార్కులు సాధించారని షైన్ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్ యాదవ్ వివరించారు. ఐఐటీ ఫౌండేషన్, నీట్తోపాటు పదో తరగతి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోనే ఈ ఫలితాలు సాధించామన్నారు. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించారన్నారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు, వారి ఉన్నతికి శ్రమించిన అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో కరెస్పాడెంట్ మూగల రమ, షైన్ పబ్లిక్ స్కూల్ ఎరగ్రట్టుగుట్ట బ్రాంచ్ సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేశ్ యాదవ్, ప్రిన్సిపాళ్లు పి.విశాల్, కె.దినేశ్, రాజ్ కుమార్, కవిత, ప్రగతిరెడ్డి, సబిత, మానస, కాలేజీ ప్రిన్సిపాళ్లు రాజుగౌడ్, పి.శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. -
‘తేజస్వి’ విద్యార్థుల సత్తా..
నయీంనగర్ : పదో తరగతి ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. 591 మార్కులతో కందిక సాహిత్య ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎం.అభివర్షిని 590, ఎం.శ్రీతిక 588, జి.సాయి శ్రేష్ఠ, ఆర్. తన్మయి, ఎ.హర్షిత్, ఎండి.సుమేర్ అహ్మద్, అమృత వర్షిణి 587, కె.హిమవర్షిత, కె.నాగస్వామి, మణి సాయి ప్రణవ్ 586, జి.సౌమ్య శ్రీ, ఎల్.కిరణ్ తేజ్, సిహెచ్.మహిన్వద, ఎం.దీప్తి, ఎన్.కార్తికేయ 585, పి.సాయిసాన్వి, పి.శ్రీపాద రెడ్డి 584, సి.హెచ్.శ్రేష్ఠ 583, జునైరియా నౌరిన్, ఎల్.వర్ష, ఎ.రేష్మిత, ఎ.వర్షిణిశ్రీ 582, ఎం.గీతిక, ఎం.మేద, బి.లాస్య, ఎ.నీలిమైథిలి, టి.శశిధర్ 581, జి.సింధు 580 మార్కులు సాధించింది. 570– 579 మధ్య 78 మంది విద్యార్థులు, 560– 569 మధ్య 67 మంది, 550–559 మధ్య 73 మంది, 540 – 549 మధ్య 48 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 539 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 161 మందితో నయీంనగర్, పోచమ్మకుంట, ప్రశాంత్నగర్ బ్రాంచ్లలో జిల్లా స్థాయిలో అధిక మార్కులు సాధించడం తేజస్వి ఘనత. విజయ పరంపర కొనసాగించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులకు పాఠశాల చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి, పిల్లలమర్రి చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు. -
‘లా’ ఫలితాలు వెల్లడి..
సాక్షి, వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ ‘లా’ విద్యార్థులకు ఫలితాల వెల్లడి ఆలస్యమవుతుండడంతో ‘ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్’కు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతున్నారంటూ బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘లా’ విద్యార్థులకు టెన్షన్’ అనే కథనంపై కదలిక వచ్చింది. ఏమాత్రం బ్యాక్లాగ్స్ లేని మూడేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఐదో సెమిస్టర్ మెమో, ఐదేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులకు తొమ్మిదో సెమిస్టర్ మెమో ఈ పరీక్షకు అవసరం ఉండడంతో ఆయా విద్యార్థుల్లో ఆందోళన నెలకొందంటూ వారి వెతలను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగాధికారులు చాలెంజ్గా తీసుకుని రాత్రంతా శ్రమటోడ్చి బుధవారం సాయంత్రం ఫలితాలు ప్రకటించారు. కేయూఎగ్జామ్స్.ఆర్గ్లో ఫలితాలు అందుబాటులో ఉంచారు. దీనిపై పలువురు విద్యార్థులు ‘సాక్షి’కి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ‘ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్’కు దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ దరఖాస్తుకు సుగమం నేటితో అఖరు కావడంతో అప్లయ్ చేసుకునేందుకు ఛాన్స్ ‘సాక్షి’కి విద్యార్థుల కృతజ్ఞతలు -
గొత్తికోయల సమస్యలు పరిష్కరిస్తాం
గోవిందరావుపేట : గొత్తికోయ గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పస్రా ఎస్సై తాజుద్దీన్ అన్నారు. మండలంలోని కన్నయ్య గొత్తికోయల నివాస ప్రాంతాన్ని బుధవారం టీజీఎస్పీ బలగాలు, పోలీస్ సిబ్బందితో కలిసి పస్రా ఎస్సై తాజుద్దీన్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాల లబ్ధిపొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గిరిజనులు తమ గోడును వెల్లబోసుకున్నారు. వారి సమస్యలను విన్న ఎస్సై తాజుద్దీన్ వెంటనే స్పందిస్తూ, ఈ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడుతామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని, గిరిజనులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. -
సేంద్రియ ఎరువులతో భూసారం పెంపు
● శాస్త్రవేత్త మధు వెంకటాపురం(కె): పంటల మార్పిడి, సేంద్రియ ఎరువుల వాడకం తో భూసారం పెరుగుతుందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ వరంగల్ శాస్త్రవేత్త మధు అన్నారు. మండల పరిధిలోని పాత్రాపురం రైతు వేదికలో ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. సేంద్రియ ఎరువుల వాడకం ప్రకృతి వ్యవసాయం, పంటల మార్పిడితో నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించవచ్చని తెలిపారు. పంటల మార్పిడి, సేంద్రియ ఎరువుల వాడకంతో భూమిలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి భూములు సారవంతంగా మారుతాయని తెలిపారు. రైతులు సాంప్రదాయ యూరియా కంటే నానో యూరియా, నానో డీఏపీ వాడితే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏడీఏ అవినాష్ వర్మ, ఆత్మ డైరెక్టర్లు మన్నెం సునీల్ బాబు, పల్నాటి నాగేశ్వనావు, కొండపర్తి సీతాదేవి, మండల వ్యవసాయ అధికారి నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
‘బాలయేసు’ విజయదుందుభి..
దేవరుప్పుల : జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో మరోసారి విజయదుందుభి మోగించారు. 582 మార్కులతో బాకి అభిజ్ఞాన్ దేవరుప్పుల మండలంలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మహ్మద్ రైసున్నీసా 576, కున్సోతు స్వాతి 566 మార్కులు, మొత్తం 32 మంది విద్యార్థుల్లో 22 మంది 500కు పైగా మార్కులు సాధించారని, ఇది ఎంతో గర్వకారణమని పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతీ విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు మదన్ మోహన్, మహేశ్, కృష్ణ, పాషా, షబానా, సంధ్య.. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. -
పదిలో నంబర్ వన్
ములుగు/ములుగు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా సత్తా చాటింది. జిల్లాకు చెందిన విద్యార్థులు గతంకంటే అత్యుత్తమ ఫలితాలు సాధించి ఈ ఏడాది రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచారు. జిల్లాలో మొత్తం 3,287 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 3,264 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో 99.30 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 1,697 మంది బాలురకు 1,681 మంది ఉత్తీర్ణత సాధించారు. 1,590 మంది బాలికలకు 1,583 మంది ఉత్తీర్ణత సాధించారు. మంత్రి సీతక్క హర్షం టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలవడంతో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. కష్టపడి చదివి అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారికి మార్గనిర్ధేశం చేసిన ఉపాధ్యాయులకు, జిల్లా యంత్రాంగానికి మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. 99.30 శాతం ఉత్తీర్ణత సాధించడం జిల్లాకే గర్వకారణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,731 ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. గురుకుల విద్యార్థుల ప్రభంజనం ములుగు మండలంలోని తెలంగాణ గురుకుల పాఠశాల, ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాల దేవగిరిపట్నం, పిఎం శ్రీ మోడల్ పాఠశాల బండారుపల్లి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థి జె.మనోహర్ 571 మార్కులు సాధించారు. సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన హనీశ్రీ 565 మార్కులు సాధించారు. అలాగే దేవగిరిపట్నం మైనార్టీ గురుకుల పాఠశాలలో ఎం.సాత్విక 567 మార్కులు సాధించారు. బండారుపల్లి మోడల్ పాఠశాలకు చెందిన కె.సిరి చందన 563 మార్కులు సాధించారు. జిల్లా కేంద్రంలోని కస్తూ ర్బా గాంధీ బాలికల పాఠశాలలో రేగుల సింధుప్రియ 544 మార్కులు సాధించారు. జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన పవన్ కల్యాణ్ 549, మైనార్టీ గురుకుల పాఠశాలలో 54 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు 37 మంది విద్యార్థినులు 500పైగా మార్కులు సాధించారు. బండారుపల్లి మోడల్ పాఠశాలలో 95 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 94 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా 17 మంది 500 పైగా మార్కులు సాధించారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 33 మంది పరీక్షలకు హాజరు కాగా 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆరుగురు విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. ఏటూరునాగారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థిని కోరంకున్నత్ కృష్ణ 589 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచింది. అలాగే గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల పట్టుదల విజయానికి దోహదపడ్డాయి. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులే పలు మండలాల్లో టాపర్లుగా నిలవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా టాపర్గా నిలిచిన కృష్ణను పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు డీఈఓ సిద్ధార్థరెడ్డి, విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. -
కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ ములుగు రూరల్: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. మండల పరిధిలోని పాల్సబ్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు పద్మదేవ్సింగ్, నల్లెల స్వాతి, భరత్ కుమార్, తిరుపతి రెడ్డి, తదితరలు పాల్గొన్నారు. -
సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్గా విద్యావతి
వెంకటాపురం(ఎం): బీజేపీ మహిళా మోర్చా సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్గా మండల పరిధిలోని నర్సాపూర్కు చెందిన పెరుమాండ్ల విద్యావతిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి, జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, రాష్ట్ర, జిల్లా నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రామప్పలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుటుంబ సమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ భాస్కర్ వారిని శాలు వాతో సత్కరించారు. టూరిజం గైడ్ విజయ్కుమార్ ఆలయ విశిష్టత గురించి వివరించగా శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. భూపాలపల్లి అర్బన్: మేడే పోరాట స్ఫూర్తితో కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య పిలుపునిచ్చారు. 140వ మేడే సందర్భంగా బుధవారం స్థానిక యూనియన్ కార్యాలయంలో కరపత్రాల ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా గట్టయ్య మాట్లాడుతూ ఓపెన్ టెండర్లను వ్యతిరేకిస్తూ సింగరేణి సంస్థను కాపాడుకోవాలని, నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం పోరాటాలు మరింత బలపడాలన్నారు. ఉద్యోగ భద్రతకు కార్మిక వర్గం సంఘటితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులపై లేబర్ కోడ్లు అమలు చేసి పని గంటలను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి జనార్దన్, కిరణ్, ప్రసాద్ పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
ఏటూరునాగారం: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మి రైతులు మద్దతు ధర పొందాలని ఆత్మ చైర్పర్సన్ కర్ల అరుణ అన్నారు. మండల పరిధిలోని రామన్నగూడెం, పప్కాపురం, రొయ్యూరు, శివాపూర్, శంకరాజుపల్లి గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అరుణ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. రైతుల కష్టానికి తగిన మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ధాన్యం విక్రయాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్ల దేవేందర్, చిటమట రఘు, వసంత శ్రీనివాస్, కొండగొర్ల పోశయ్య, సర్పంచ్ విజయ్కుమార్ పాల్గొన్నారు.ఆత్మ చైర్పర్సన్ కర్ల అరుణ -
పట్టణాభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలి
ములుగు: ములుగు పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి అన్నారు. ములుగు మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి కమిషనర్ అధ్యక్షత వహించగా ఆమె హాజరై మాట్లాడారు. మున్సిపల్ నిధుల నుంచి పారిశుద్ధ్య కార్మికుల జీతభత్యాలు, పారిశుద్ధ్య వాహనాల మరమ్మతు, పారిశుద్ధ్య సమస్యలు, ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ సప్లై, చేతిపంపుల రిపేర్లు, వీధి దీపాల సమస్యలపై కౌన్సిలర్లతో చర్చించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో జిల్లా కేంద్రంలో రోడ్డు వెడల్పునకు సంబంధించిన సర్వే, రెవెన్యూ విభాగానికి సంబంధించి ములుగు పట్టణంలోని గృహ వాణిజ్య, వ్యాపార బిల్డింగ్లను కొలతలతో సీజీజీ పోర్టల్లో గ్రామ పంచాయతీ రేటుతోనే ఆధునీకరించడంపై చర్చించి సభ్యులు ఏకగ్రీవ తీర్మాణం చేశారు. కోఆప్షన్ సభ్యుల ఎంపిక ములుగు మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించినట్లు కమిషనర్ రమేశ్ తెలిపారు. తెలంగాణ మున్సిపాలిటీస్ కో ఆప్షన్ మెంబర్ రూల్స్ 2020కి అనుగుణంగా పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగి ఉన్న ఇద్దరు సభ్యులు ఓడ సుజాత, కుక్కల నాగరాజును, అల్పా సంఖ్యాక వర్గం నుంచి సయ్యద్ ఆసియా, ఎండి.షర్పోద్ధీన్లను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికై నట్లు తెలిపారు.మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ -
డీజిల్ దొరకలేదు..
మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం చుట్టూ పక్కల ఉన్న అన్ని బంకులు తిరిగినా చుక్క డీజిల్ దొరకలేదు. దుక్కులు దున్నే సమయంలో ట్రాక్టర్లో ఇంధనం లేక ఇంటి దగ్గర ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పెట్రోల్ లేక టూవీలర్ మీద తిరిగే పరిస్థితి లేదు. పెట్రోల్, డీజిల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – నల్లెబోయిన సమ్మయ్య, పూసూరు, వాజేడు మండలం ముప్పనపల్లి వద్ద ఉన్న పెట్రోల్ బంక్లో ఎప్పుడు స్టాక్ లేదనే బోర్డులే దర్శనమిస్తున్నాయి. వారంలో మూడు రో జులు నోస్టాక్ బోర్డులే పెడుతున్న పరిస్థితి నెలకొంది. స్టాక్ ఉండే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. – దుర్గం రాజు కుమార్, కన్నాయిగూడెం -
పలుచోట్ల బ్లాక్లో అమ్మకాలు
జిల్లాలోని ప్రతీ బంకులో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహనదారులు బ్లాక్లో పెట్రోల్, డీజిల్ను కొనుగోలు చేస్తున్నారు. బంక్లలో లీటర్ పెట్రోల్ రూ.107, డీజిల్ రూ. 95లు ఉండగా సుమారు రూ.130ల నుంచి రూ.150లకు బయట విక్రయిస్తున్నారు. బంక్లకు పెట్రోల్ రాగానే బ్లాక్లో పెట్రోల్, డీజిల్ అమ్మే వ్యాపారులు బంక్ యజమానులతో కుమ్మకై ్క వాహనదారులకు పోయకుండా వ్యాపారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రబీ సీజన్ సందర్భంగా డీజిల్ లేక వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు ముందుకు కదలడం లేదు. దీంతో వర్షాలు కురిస్తే తమ పంటల పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులు చేసుకునే సమయంలో రైతాంగానికి ఇంధన కొరతతో ఇక్కట్లకు గురవుతున్నారు. -
ఇంధన ఇక్కట్లు
జిల్లాలోని బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ములుగు: పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇంధనం వస్తుందని తెలియగానే బంకుల వద్దకు రాత్రి, పగలు తేడా లేకుండా వెళ్లి క్యూలు కడుతున్నారు. జిల్లాలో మంగళవారం 5 పెట్రోల్ బంక్లకు ఇంధనం రాగా గంటల వ్యవధిలోనే అమ్మకాలు పూర్తయ్యాయి. కొన్ని చోట్ల పోలీసుల ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు కొనసాగాయి. దొరకదనే ప్రచారంతో ఆందోళన ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ దొరకదనే ప్రచారంతోనే వాహనదారులు ఆందోళనకు గురవుతుండడంతో ఇంధనం కొరత మరింత తీవ్రమైంది. ఇంధనం దొరకదనే నెపంతో వాహనదారులు ఫుల్ ట్యాంక్ నింపుకోవడమే కాకుండా క్యాన్లలో ఇంధనాన్ని తీసుకొని వెళ్తూ స్టాక్ చేసుకుంటున్నారు. దీంతో వాహనాలు నడిపి జీవించే ఆటోవాలాలు, జీపు యజమానులు, అద్దెకార్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జిల్లాలోని 10 మండలాల పరిధిలో 39 పెట్రోల్ బంక్లు ఉండగా పలు బంక్ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంధనం కొరత లేదని ఒకవైపు అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాహనదారులు పడుతున్న ఇబ్బందులను అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఇంధనాన్ని ప్రతిరోజూ సరఫరా చేసే చమురు కంపెనీలు వారం నుంచి రెండు వారాల సమయం తీసుకొని ట్యాంకర్లను పంపిస్తుండడంతో సమస్య తలెత్తుతుందని బంకుల యజమానులు పేర్కొంటున్నారు. వాహనదారులకు తప్పని కష్టాలు రాత్రి, పగలు తేడా లేకుండా క్యూలు కొరత లేదంటున్న అధికారులు -
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు
గోవిందరావుపేట: మండల పరిధిలోని ధాన్యం కొనుగోళ్లలో పలువురు రైస్ మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. నాలుగు నుంచి ఐదు కిలోల వరకు తాలు పేరుతో కటింగ్ చేస్తున్నారని నిరసిస్తూ అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో 163 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు తుమ్మల వెంకట్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడారు. మిల్లర్ల కటింగ్లతో ఒక్కో లారీకి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలకు మించి కటింగ్ చేయడం అన్యాయమన్నారు. కటింగ్లను వెంటనే నిలిపివేయాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైతులు ధాన్యం అమ్మకాల సమయంలో తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడితే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టిబాబు, రామస్వామి, నరసింహ నాయక్, సాంబశివుడు, సుధాకర్ రెడ్డి, చందూలాల్, సదానందం, సాంబయ్య, సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు. తాలు పేరుతో కటింగ్లకు పాల్పడుతున్న రైస్ మిల్లర్లు నిరసిస్తూ ఎన్హెచ్పై అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో -
బాలల పరిరక్షణపై అవగాహన
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయంలో మంగళవారం బాల్య వివాహాలు, బాలల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో ముత్తమ్మ మాట్లాడారు. బాలికలు తప్పకుండా విద్యను అభ్యసించాలన్నారు. సామాజిక మాద్యమాలకు ఆకర్షితులు కావద్దని సూచించారు. బాల్య వివాహాలు, బాలల పరిరక్షణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో లీగల్ కమ్ ప్రొహిబిషన్ అధికారి సుజాత, తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ సందర్శన ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని సమ్మక్క,–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని మంగళవారం హైదరాబాద్ ఎయిమ్స్ సీనియర్ వైద్యులు రాహుల్ నారన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కళాశాల వైస్ చాన్స్లర్ శ్రీనివాస్ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్లర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఆరోగ్య సేవలు మెరుగుపడేందుకు యూనివర్సిటీని నోడల్ కేంద్రంగా చేసుకొని పలు కార్యక్రమాలు ప్రారంభించాలని ఎయిమ్స్ ప్రతిపాధించిందని వెల్లడించారు. ఎయిమ్స్ హైదరాబాద్, సమ్మక్క,–సారక్క యూనివర్సిటీల మధ్య పరస్పర సహకారానికి అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వివరించారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం ములుగు రూరల్: కార్మికుల హక్కులను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలరాస్తుందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పార్టీ మండల కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కులను నేడు కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు. కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్స్ పేరుతో కార్మికులను అగాధంలోకి నెట్టివేస్తున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పని విధానాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి గపూర్ పాషా, రత్నం ప్రవీణ్, రాజు, రవీందర్, రూప్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా గరుడాదివాసం
మంగపేట: మల్లూరులోని శ్రీ హేమాచల క్షేత్రంలో భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆలయ ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం గరుడాదివాసం కార్యక్రమాన్ని మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. రెండోరోజూ కార్యక్రమంలో భాగంగా ఆల య ఇన్చార్జ్ ఈఓ వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ సత్యనారాయణ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల యాగ్నికులు ఉదయం 8 గంటలకు ఆలయ ప్రాంగణంలోని పంచముఖాంజనేయ స్వామి వారి కి స్నపనం (అభిషేకం) పూజలు నిర్వహించారు. యాగశాలలో పూజలు యాగశాలలో మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవ మూర్తులకు సేవాకాలం, బాలబోగం నివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు గరుడాదివాసం కార్యక్రమంలో భాగంగా వైనతేయ లేఖనం(గరుడ) గరుడ చిత్రపటం వేసి ఆవాహనం పూజలు నిర్వహించారు. నేత్రోన్మీలన, గరుడాదివాసం, సేవాకాలం, నివేదన, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. గర్భాలయంలోని స్వయంభు స్వామివారికి వేదమంత్రోశ్చరణతో ప్రత్యేక అర్చనలు జరిపించి వెండి కవచం, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణయజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు. బరధ్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహాచార్యులు, మణిదీపాచార్యులు, విరంచి, ఆలయ పూజారులు ముక్కామల రాజశేఖర్ శర్మ, అనిపెద్ది రాజీవ్, కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, ఏడునూతుల ఈశ్వర్చంద్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారాములు, రికార్డు అసిస్టెంట్ లక్ష్మినారాయణ, శివరాజు శేషు, సిబ్బంది పుల్కలయ్య, అజయ్ తదితరులు పాల్గొన్నారు. జాతరకు పటిష్ట బందోబస్తు వచ్చే నెల 6వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయమైన సంఘటనలు తలెత్తకుండా నలుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, 100 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్ తెలిపారు. బందోబస్తు ఏర్పాట్ల పరిశీలనకు మంగళవారం వచ్చిన ఆయన ఎస్సై సూరి, ప్రొహిబిషన్ ఎస్సై శ్రీకాంత్తో కలిసి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. మే 1న జరుగనున్న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ సమస్య తల్తెకుండా ఉండేందుకు మల్లూరు, గుట్టమార్గం మధ్యలో రెండు ప్రైవేటు వాహనాల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి అక్కడ నుంచి భక్తులను ఆటోలు, ప్రైవేట్ బస్సులలో ఉచితంగా గుట్టపైకి తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అభయాంజనేయ స్వామికి స్నపనం స్వయంభు లక్ష్మీనర్సింహస్వామికి ఆభరణాల అలంకరణ -
– సాక్షి, మహబూబాబాద్/తొర్రూరు
బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నాన్నా.. చాక్లెట్లు కొనిస్తానన్నావు.. ఊరంతా తిప్పి ఊరవతలికి తీసుకువచ్చావు ఎందుకు నాన్నా.. చెట్టుకిందికి తీసుకువచ్చి తాడు తీస్తుంటే ఏదో ఊయల కడుతున్నావు అనుకున్నాం. నాకు, తమ్ముడి మెడకు చుట్టావు. ఏదో ఆట అనుకున్నాం. కొమ్మపైనుంచి తీసి లాగుతున్నావు. ఊపిరి ఆడట్లేదు నాన్న. ఇంకోసారి చాక్లెట్లు అడగము. గొంతు బిగుసుకుపోతోంది. తాడు తీయ్ నాన్నా.. నేను తమ్ముడు బాధ భరించలేకపోతున్నాం. మమ్ముల్ని కిందికి దింపు నాన్నా.. అమ్మకు, నీకు మధ్య మేము అడ్డుగా ఉన్నామా.. మీరిద్దరు పంచాయితీ పెట్టుకుంటే మాదా తప్పు. మేమేం చేశాం నేరం.. మీ పిల్లలుగా పుట్టడమా.. ’ అంటూ ఆ చిన్నారులు తమ ఆఖరి క్షణాల్లో తండ్రిని వేడుకున్నారేమో.. ఆ మాటలకు తండ్రి మనస్సు కరిగి కిందికి దించి ఉంటే రెండు ప్రాణాలు దక్కేవి. కానీ, పిల్లల రోదనలు వినే పరిస్థితిలో లేని తండ్రి.. ఇద్దరి ప్రాణాలు పోయేవరకు అక్కడే రాయిలా నిలబడి చూశాడు. విగతజీవులయ్యారని నిర్ధారించుకున్నాక సమాజం తనను ఛీ కొడుతుందని భావించి తనూ అదే చెట్టుకు ఉరివేసుకున్నాడు. కిన్నెర గుంశావలి (ఫైల్)బిడ్డలకోసం నూటొక్క ముడుపులు కట్టి.. కోటొక్కా.. పూజలు చేసిన వారు ఉన్నారు.. ఇది సమాజంలో ఒకవైపు ఉంటే.. భార్యాభర్తల తగాదాలు, వివాహేతర సంబంధాలు, క్షణికావేశాలతో కన్నబిడ్డలను కర్కశంగా చంపిన ఘటనలు మరోవైపు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సోమవారం జరగగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని ఆ పసికూనలను ఓ తండ్రి చంపి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. కింద పడితేనే తండ్రి గుండె పగిలినంత బాధ ఉంటుందంటారు.. కానీ, పిల్లలను ఉరివేసి వారి ప్రాణం పోయేదాక చూసిన అతను ఎంత కర్కోటకుడోనని, అతనికి మనస్సెట్టా వచ్చిందని.. ఆ బిడ్డలు ఎంత తల్లడిల్లిపోయారో అంటూ ఈ ఘ టన చూసిన, విన్న స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లలను తన దగ్గరికి రానివ్వడం లేదన్న అక్కసుతో.. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి (29), అదే గ్రామానికి చెందిన కిన్నెర కాంతను 11 ఏళ్ల క్రితం వివాహమాడాడు. వారికి కూతురు విన్య, కుమారులు విలాస్ (5), వికేష్ (3) ఉన్నారు. గుంశావలి తొర్రూరులోని ఓ బైక్ మెకానిక్ షాప్లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన గుంశావళి రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఈ బాధలు భరించలేక కాంత పది రోజుల క్రితం అదే గ్రామంలోని నానమ్మ సీతమ్మ ఇంటికి పిల్ల లను తీసుకొని వెళ్లింది. గుంశావలి.. పది రోజులుగా పిల్లల కోసం వెళ్తే ఆమె పంపించడం లేదు. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. తనకు దక్కని పిల్లలు భార్య వద్ద కూడా ఉండొద్దని కక్ష గట్టాడు. కాంత సోమవారం రోజువారీగా కూలి పనికి వెళ్లగా ఇద్దరు కుమారులు ఇంటి వద్దనే ఉన్నారు. కూతురు ఆడుకోవడానికి మరోచోటికి వెళ్లింది. సమయం చూసి వచ్చిన గుంశావలి పిల్లలకు చాక్లెట్లు కొనిస్తానని ఆశ చూపగా మానాన్న కొనిస్తాడు అంటూ హుషారుగా తండ్రి బైక్పై ఎక్కారు. గుంశావలి తొర్రూరుకు వచ్చి ఓ దుకాణంలో తాళ్లు కొనుగోలు చేశాడు. పిల్లలు నాన్నా చాక్లెట్లు ఏవీ అంటే కొనిస్తానని నమ్మబలికాడు. సాయంత్రం వరకు అటు ఇటు బైక్పై తిప్పాడు. పిల్లలు కూడా సరదాగా ఉందనుకున్నారు. సాయంత్రం తొర్రూరు మార్కెట్ సమీపంలో చెట్టుకు మొదట ఇద్దరు పిల్లలకు ఉరివేసి తరువాత తనూ ఉరేసుకున్నాడు. కాగా, కాంతకు సొంత ఇల్లు, జాగ లేదు. బంధువులింటి సమీపంలో ఓ టెంట్ వేసుకుని భర్త, పిల్లల మృతదేహాల కోసం ఎదురుచూడడం గమనార్హం. విలాస్ (ఫైల్)వికేష్ (ఫైల్)పనికి వెళ్లిన భార్య కాంత సాయంత్రం ఇంటికి వచ్చి తమ్ముళ్లు ఎక్కడికి వెళ్లారని కుమార్తె విన్యను అడగగా నాన్న తీసుకువెళ్లాడని బదులిచ్చింది. ఆందోళన చెందిన కాంత స్థానికుల సహాయంతో ఆటో తీసుకొని బావులు, చెరువులు, సమీప ప్రాంతాల్లో గాలించగా ఆచూకీ తెలియరాలేదు. మంగళవారం ఉదయం తొర్రూరులో పిల్లలు చంపిన ఘటన వెలుగులోకి రావడం.. పోలీసులు వివరాలు సేకరించి తల్లికి సమాచారం అందించారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై భార్య కాంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి మెడకు తాళ్లు బిగించావు.. ఎప్పుడూ చాక్లెట్లు అడగము.. నొప్పిగా ఉంది.. తాడు విప్పి దించు నాన్నా.. అయినా నీ మనస్సు కరగలేదా..తొర్రూరులో ఇద్దరు కొడుకులకు మరణశాసనం రాసి తనూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి కుటుంబ కలహాలకు పిల్లలు బలి గుండెలవిసేలా రోదించిన తల్లి, బంధువులు -
నానో యూరియాపై అవగాహన ఉండాలి
ఏటూరునాగారం: నానో యూరియాపై రైతులు అవగాహన కలిగి ఉండాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం సైంటిస్ట్ మధు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు ఆత్మ ఆధ్వర్యంలో సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఒక రోజు శిక్షణలో భాగంగా సమగ్ర ఎరువుల యజమాన్య పద్ధతిపై అవగాహన పెంచుకోవాలన్నారు. సాయిల్ హెల్త్ కార్డులు పొందాలని సూచనలు చేశారు. రైతులు కేవలం రసాయన ఎరువులే కాకుండా పశువుల పెంట, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చి రొట్ట ఎరువులు, పీఎస్బీ(భాస్వరాన్ని కరిగించు భ్యాక్టిరియా), రైజోబియం వంటి జీవన ఎరువులు వాడి మంచి దిగుబడులూ సాధిస్తూ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిచవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ అరుణ, ఏడీఏ అవినాష్వర్మ, ఏఓ వేణుగోపాల్, ఏఈఓలు రవికుమార్, రాజు, ఉద్యాన అధికారి లావణ్య పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయంపై దృష్టిసారించాలి కన్నాయిగూడెం: మండల రైతులు రసాయణ ఎరువుల వాడకాన్ని తగ్గించి భూసారాన్ని పెంచే సేంద్రియ ఎరువులతో సేంద్రియ వ్యవపాయంపై దృష్టిసారించాలని వ్యవసాయ శాస్త్ర వేత్త మధు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి ముంజ మహేశ్ ఆధ్వర్యంలో పంటల సాగుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రానున్న వర్షాకాలంలో ఎలాంటి పంటలు సాగు చేయాలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వాడాల్సిన ఎరువుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్త మధు హాజరై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సంధర్భంగా మధు మాట్లాడుతూ రాబోయే వర్షకాలంలో సన్నరకం వడ్లల్లోని మంచి రకాలను ఎంచుకోవాలని సూచించారు. అనంతరం ఉద్యానవన శాఖ విస్తరణ అధికారి రమేశ్ మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగుచేయడం వల్ల అనేక లాభాలు వస్తాయని తెలిపారు. సైంటిస్ట్ మధు -
గిరిజన దర్బార్లో వినతులు ఇలా..
ములుగు మండలం పొట్లాపురంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అక్కడి గిరిజనులు విన్నవించారు. కన్నాయిగూడెం మండలం పడిగాపురం గ్రామంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమిలో బోరు, మోటారు నిర్మించుకునేందుకు అనుమతి ఇప్పించాలని కోరారు. ఏటూరునాగారం మండలం నుంచి శంకరాజుపల్లికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని కోరారు. ములుగు మండలం పొట్లాపురం లిఫ్ట్ ఇరిగేషన్ సరిగా పనిచేయకపోవడంతో 50 మంది ఆదివాసీ రైతులు సాగునీరు లేక భూములు పడావుపడి ఉంటున్నాయని, ఇరిగేషన్ వల్ల నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని కోరారు. ఏటూరునాగారం మండలం ముళ్లకట్టలో హక్కు పత్రాలు ఉన్నప్పటికీ సాగు ఫారెస్టు అధికారులు సాగు చేయనీయడం లేదని విన్నవించారు. తదితర అంశాలను ఏపీఓ పరిశీలించి సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించేలా చూస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో డీడీ జనార్దన్, ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేశ్బాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, మేనేజర్ శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ రెహమాన్, జెడీఎం కొండల్రావు, ప్రోగ్రాం ఆఫీసర్ మహేందర్, జియాలజిస్ట్ కిశోర్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్ మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దళారులకు ధాన్యం విక్రయించొద్దు
ములుగు రూరల్: రైతులు దళారులను నమ్మి ధాన్యం విక్రయించవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి అన్నారు. మండల పరిధిలోని సర్వాపూర్, పంచోత్కుల పల్లి, అంకన్నగూడెం, కొత్తూరు, ప్రగళ్లపల్లి, కాసిందేవి పేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, పల్లె జయపాల్ రెడ్డి, దేవ్సింగ్, తదితరులు పాల్గొన్నారు. రైతులకు కూరగాయల విత్తనాలు ఏటూరునాగారం: కన్నాయిగూడెం మండలంలోని రైతులకు బీటీటీ ఏటూరునాగారం ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ అందజేసి సబ్సిడీపై కూరగాయల విత్తనాలను అందజేసినట్లు ఆత్మ చైర్మన్ కర్ల అరుణ తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన జీవన ఎరువు, జీనన పురుగు మందుల తయారీ, వివిధ పంటల వాడకంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చిన కూరగాయల విత్తనాల ప్యాకెట్లను రైతులకు ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ములుగు: జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఆ పార్టీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సానికొమ్ము రమేశ్రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మస్రగాని వినయ్కుమార్, వేములపల్లి భిక్షపతి, పో రిక సోమానాయక్, గొర్రె సమ్మయ్య, సురేష్, ముంజాల భిక్షపతి పాల్గొన్నారు. కాళేశ్వరాలయంలో భక్తులు కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి కావడంతో ఉదయం 11గంటల లోపు భక్తులు అభిషేక పూజలు, అర్చనలు అధికంగా నిర్వహించారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో దర్శనాలతో పాటు కుంకుమార్చన పూజలు చేశారు. శ్రీసరస్వతి అ మ్మవారిని దర్శించుకున్నారు. శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు నిర్వహించారు. దీంతో భక్తుల సందడి కనిపించింది. డీజిల్ కోసం క్యూ మంగపేట: వమండల పరిధిలోని కమలాపురం గాయత్రి పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ కోసం క్యూ కట్టారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో డీజిల్ వాహనం రావడంతో వినియోగదారులు భారీగా తరలివచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మంగపేట, రాజుపేటలోని 5 పెట్రోల్ బంకుల్లో ఆదివారం డీజిల్ అయిపోయింది. దీంతో కమలాపురంలోని గాయత్రి పెట్రోల్ బంకులో మాత్రమే డీజిల్ ఉండటంతో డీజిల్ కోసం రైతులు, వరికోత మిషన్ల యజమానులు క్యాన్లతో వచ్చి క్యూకట్టారు. ఆదివారం రాత్రి వరకు అక్కడ కూడా అయిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం సాయంత్రం కమలాపురం గాయత్రి పెట్రోల్ బంక్కు డీజిల్ ట్యాంకర్ వచ్చిందనే సమాచారం తెలియడంతో వివిధ గ్రామాల నుంచి మంది క్యాన్లతో బంకు వద్దకు తరలివచ్చి క్యూ కట్టారు. కొంతమంది పోటీపడడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి సర్ధిచెప్పి క్యూలో ఉంచి వెళ్లిపోయారు. -
డ్రగ్స్ రహిత తెలంగాణకు పాటుపడాలి
● అదనపు కలెక్టర్ మహేందర్ జీ ములుగు: డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రతిఒక్కరూ పాటుపడాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ(రెవెన్యూ) పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అధ్యక్షతన బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల కార్యక్రమాన్ని సోమవారం ఆదనపు కలెక్టర్ హాజరై ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలను జరిపించినా, బాలల హక్కుల పరిరక్షణలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేటి సురక్షిత బాల్యమే – రేపటి సురక్షిత తెలంగాణ నిర్మాణానికి పునాది అని పేర్కొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్ రావు మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ అనేవి చిన్నారుల ఉన్నతిని నిరోధిస్తాయన్నారు. ఈ సందర్భంగా ములుగు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ వరకు బాలల భద్రత– డ్రగ్స్ రహిత తెలంగాణ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట మానవహారంగా ఏర్పడి బాలలు, మహిళల హక్కులను కాపాడుతామన్నారు. డ్రగ్స్ రహితంగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దుతామని, సమాజంలోని మూఢ ఆచారాలు, బానిస వ్యవస్థలను రూపుమాపేలా పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్, డీసీపీఓ ఓంకార్, డీఎంసీ రమాదేవి, సీఏ లావణ్య, నరేశ్, కృష్ణవేణి, హరికృష్ణ, సంజీవ తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలను పరిష్కరించండి
ములుగు రూరల్/ఏటూరునాగారం: ప్రజావాణి, గిరిజన దర్బార్లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని బాధితులు అధికారులను వేడుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో అర్జీలను అదనపు కలెక్టర్ మహేందర్జీ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ సంపత్రావుతో కలిసి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్లో లేకుండా పరిష్కరిస్తూ ఫిర్యాదుదారులకు జవాబుదారిగా ఉండాలన్నారు. ఈ మేరకు ప్రజావాణిలో మొత్తంగా 59 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఐటీడీఏ ఏపీఓ (జనరల్) నాగోరావు అన్నారు. వివిధ సమస్యలపై గిరిజన దర్బార్లో ఏపీఓ గిరిజనుల నుంచి 36 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన వినతుల వివరాలు గ్రీవెన్స్, గిరిజన దర్బార్లో అధికారులకు బాధితుల వేడుకోలు వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఏపీఓ నాగోరావు ప్రజావాణిలో 59, గిరిజన దర్బార్లో 36 వినతుల రాక వినతులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశాలుఇందిరమ్మ ఇళ్లు 10పింఛన్లు మంజూరు 27భూ సమస్యలు 9ఇతర శాఖలకు 11ఉపాధి కల్పన 2 -
బ్రహ్మోత్సవాల శోభ
● హేమాచలక్షేత్రంలోని యాగశాలలోఅంకురార్పణ ● ఉత్సవ మూర్తులకు ఉత్సవాంగ స్నపనంమంగపేట : రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయ క్షేత్రానికి బ్రహ్మోత్సవాల శోభ సంతరించుకుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఉప ప్రధానార్చకులు అమరవాది మురళి కృష్ణమాచార్యులు, ముఖ్య అర్చకులు పెరంబదూర్ మధన మోహనాచార్యుల బృందం ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారి వీరస్వామి పర్యవేక్షణలో యాగశాలలో ఉదయం 6 గంటల నుంచి విశ్వక్షేనపూజా, భగవత్పుణ్యాహవచన, పరిషత్ప్రార్థన, రుత్విక్వరణం, రక్షాబంధన, ఉత్సవ మూర్తులకు స్నపనం(ఉత్సవాంగ స్నపనం), ఆళువార్లకు తిరువంజనం(అభిషేకం), సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పన పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాగ్నికులు కృష్ణయజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు, బరధ్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహాచార్యులు, మణిదీపాచార్యులు, విరంచి, ఆలయ పూజారులు ముక్కామల రాజశేఖర్శర్మ, అనిపెద్ది రాజీవ్, కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, ఏడునూతుల ఈశ్వర్చంద్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారాములు, రికార్డు అసిస్టెంట్ లక్ష్మినారాయణ, శివరాజు శేషు, సిబ్బంది పాల్గొన్నారు. జాతర ఏర్పాట్లపై పరిశీలన బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో ఆలయ ప్రాంగణంలో దేవాదాయశాఖ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకల ఏర్పాట్లు చేసినట్లు ఈఓ వీరస్వామి తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపం నుంచి దైత అమ్మవారి ప్రాంగణం వరకు ప్రధాన దారిలో తడుకలతో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లను ఆయన పరిశీలించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వ్యాపారాలు జరుపుకోవాలని ప్రధాన దారికి ఇరువైపులా వెలిసిన స్వీట్షాపులు, బొమ్మలు, తదితర వ్యాపారులకు సూచించారు. జాతర ప్రారంభం కావడంతో నూతనంగా ఆలయ సమీపంలో వెలి సిన వివిధ రకాల దుకాణాలు, వచ్చి పోయే భక్తులతో గుట్టపై బ్రహ్మోత్సవాల సందడి నెలకొంది. హేమాచల క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం హేమాచల క్షేత్రంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా టీఎస్ఆర్టీసీ గుట్టపైకి బస్ సర్వీస్ను సోమవారం ప్రారంభించింది. పది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో గుట్టపైకి వచ్చి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. ఏటూరునాగారం కంట్రోలర్ శ్రీనివాస్, శంకర్ స్థానిక ఎస్సై సూరితో కలిసి బస్ సర్వీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హన్మకొండ నుంచి హేమాచలక్షేత్రానికి వచ్చే భక్తులు నేరుగా మల్లూరుకు చేరుకోవచ్చన్నారు. ప్రస్తుతం 10 బస్సులను ఏటూరునాగారం నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు మల్లూరుగుట్టపైకి షటిల్ సర్వీస్లు నడుపనున్నామన్నారు. భక్తుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామన్నారు. ఏటూరునాగారం నుంచి గుట్టపైకి ఫుల్ టికెట్ రూ.50, ఆఫ్ టికెట్ రూ.30, మంగపేట, మల్లూరు నుంచి రూ.30 చార్జీ ఉంటుందని వివరించారు. అలాగే మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాల ప్రొటోకాల్ అధికారులు జీపీఓ కుందమళ్ల సురేశ్, గంపల నర్సయ్య, జబ్బ నగేశ్, ఆలయ మాజీ చైర్మన్ పూజారి సురేశ్, యర్రంగారి సమ్మయ్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
అవినీతికి.. డాక్యుమెంట్ రైటర్లు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అధికారులు ప్రతీపనికో రేటును ఫిక్స్ చేసి కొందరు ప్రైవేట్ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లను మధ్యవర్తులుగా పెట్టుకుని వసూలు చేస్తున్నారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ ప్రాంతాల్లో ఏసీబీ దాడులు, విజిలెన్స్ తనిఖీలు జరిగినా కొందరు అధికారుల తీరు మారడం లేదు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విచ్చల విడిగా వసూళ్లపర్వం సాగుతుండగా.. తాజాగా సోమవారం జనగామ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు ఏడాదిలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లన తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వసూళ్ల తతంగం ఇలా... ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 14 రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా భూములు, ఇళ్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. ప్రతీ రిజిస్ట్రేషన్కు లొసుగులును ఆసరా చేసుకుని వసూళ్లు చేస్తున్నారు. ఉదాహరణకు వరంగల్ ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతిరోజూ 80 నుంచి 98 దస్తావేజులు రిజిస్ట్రేషన్ అవుతాయి. ఇక్కడ ప్రతీ దస్తావేజుకు రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు ఆఫీస్ ఖర్చుల పేరిట.. నాలా, జీపీ ఇళ్లు, అపార్ట్మెంట్లకు రూ.5వేలనుంచి రూ.50వేల వరకు వసూలు చేసినట్లు ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో వెల్లడైంది. 126 మంది డాక్యుమెంట్ రైటర్లు ఈ కార్యాలయం పరిధిలో ఉండగా, ఇద్దరు నుంచిముగ్గురు ప్రైవేట్ వ్యక్తులతో పాటు 25 మంది డాక్యుమెంట్ రైటర్లు కేవలం డబ్బులు వసూళ్లకే పెట్టుకున్నట్లు ఏసీబీ గుట్టు విప్పింది. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 40–50 రిజిస్ట్రేషన్లు అవుతుండగా, లేఅవుట్ లేని ప్లాట్లు గజం రూ.200ల నుంచి రూ.400ల వరకు తీసుకున్నట్లు అక్కడ జరిగిన ఏసీబీ దాడుల అనంతరం వెల్లడైంది. ఇలా వరంగల్, జనగామ, స్టేషన్ఘన్పూర్, ములుగు, భూపాలపల్లి, భీమదేవరపల్లి తదితర సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ‘కథ’నడిపించేది వీరే.. అక్రమాలకు నిలయంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉమ్మడి వరంగల్లో ఏసీబీ వరుస దాడులు.. సస్పెన్షన్ వేటు పడిన మారని తీరు విజిలెన్స్ తనిఖీలకూ వెరవని అధికారులు.. తాజాగా సోమవారం జనగామలో తనిఖీలు -
కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి
ములుగు రూరల్: మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆదిలాబాద్ ఎంపీ గేడం నగేశ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, మిత్ర పక్షాలు మహిళల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుందన్నారు. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి సంబురాలు జరుపుకోవడం దారుణమన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా డిలీమిటేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తే దక్షణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించి బిల్లు ఆమోదాన్ని అడ్డుకున్నారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం పెరిగేదని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్రెడ్డి, సుమలత, జాడి వెంకట్, నరేశ్, కృష్ణాకర్, శ్రీనివాస్, విశ్వనాథ్, రవీందర్, నాగరాజు, ఇమ్మడి రాకేష్యాదవ్, లక్ష్మణ్, హరీశ్, మమన్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ -
హేమాచలక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు
మంగపేట: రెండో యాదగిరిగుట్టగా పేరుగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు జరిగే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను ఆగమశాస్త్రం ప్రకారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం, ఆలయ అర్చకులతో శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారి వీరస్వామి తెలిపారు. అత్యంత వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేశారు. అంకురార్పణతో జాతర ప్రారంభం హేమాచల క్షేత్రంలో నేడు(సోమవారం) ఉదయం 6 గంటల నుంచి బ్రహ్మోత్సవాల యాగ్నికులు యాగశాలలో విశ్వక్షేనపూజా, భగవత్ పుణ్యాహ వాచన, పసరిషత్ ప్రార్థన, రుత్విక్వరణం, రక్షాబంధనం, ఉత్సవ మూర్తులకు స్నపనం(ఉత్సవాంగస్నపనం), ఆళువార్లకు తిరువంజనం(అభిశేకం), సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పన, 28న మంగళవారం గరుడాదివాసం, 29న ధ్వజారోహనం, 30న ఎదుర్కోలు మహోత్సవం, మే 1న మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో తిరు కల్యాణ మహోత్సవం, 2న రథోత్సవం, 3న సదస్యం(వేదాశీర్వచనం), 4వ తేదీన తెప్పోత్సవం, 5న మహాపూర్ణాహుతి, నాకబలి(నాగవెల్లి), 6న ఉదయం 11 గంటలకు వసంతోత్సవం, గజవాహనసేవ, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ వీరస్వామి తెలిపారు. మే 1న స్వామివారి తిరుకల్యాణం హేమాచల క్షేత్రంలో 10 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 1న లక్ష్మీనర్సింహస్వామికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకుల అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం తిరుకల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రకృతి ఒడిలో స్వయంభువుగా వెలిసి భక్తులకు కోరిన వరాలిచ్చే లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ధృవమూర్తులకు గర్భాలయంలో ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాల యాగ్నికులు శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించనున్నారు. అనంతరం స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు కల్యాణ మండపంలో తిరుకల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. చింతామణి జలపాతం.. నాభిచందన ప్రసాదం ఆలయ సమీపంలో సహజసిద్ధంగా వెలిసిన చింతామణి జలపాతం ఆలయానికి వచ్చే భక్తులు ఔషధ గుణాల ప్రసాదంగా బావిస్తుంటారు. హేమాచల కొండపై నుంచి ఏడాది పొడవునా అన్ని కాలాల్లో ఒకే విధంగా చింతామణి జలపాతం భూమి లోపలి నుంచి పారుతూ ఉండటం విశేషం. ఆలయానికి వచ్చే భక్తులు చింతామణి జలపాతం వద్ధ స్నానమాచరిస్తారు. జలపాతం నుంచి వచ్చే నీరు అతి శీతలంగా ఔషధ గుణాలు కలిగి మినరల్ వాటర్ను తలపించే విధంగా ఎంతో రుచికరంగా ఉంటాయి. ఎన్నిరోజులు నిల్వ ఉంచినా పాడై పోకుండా ఉండటంతో నీటిని రోజు సేవిస్తే బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులు ధరిచేరవు. అలాగే ఆలయంలో ప్రతీ శని, ఆదివారం స్వామివారి నాభి నుంచి స్రవించే ద్రవాన్ని మంచి గందంతో కలిపి(నాభి చందనం) సంతానం లేని వారు సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. నేటి నుంచి పది రోజుల పాటు కార్యక్రమాలు ముస్తాబైన ఆలయం.. తరలిరానున్న భక్తజనం -
డీజిల్ కోసం వాహనదారుల క్యూ
మంగపేట: మండలంలోని వాహనదారులు కమలాపురంలోని గాయత్రి పెట్రోల్ బంక్లో డీజిల్ కోసం ఆదివారం క్యూ కట్టారు. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రంతో పాటు రాజుపేట, కమలాపురంలో మొత్తం ఏడు పెట్రోల్ బంక్లు ఉన్నాయి. అందులో ఒకటి, రెండు పెట్రోల్ బంక్లలో పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉంది. డీజిల్ లేదు. కమలాపురంలోని గాయత్రి పెట్రోల్ బంక్లో మాత్రమే డీజిల్ ఉంది. ఈ క్రమంలో మండలంలో ఎక్కడా డీజిల్ లేదని ప్రచారం జరగడంతో పలు గ్రామాల నుంచి రైతులు, హార్వెస్టర్ల యజమానులు, లారీలు, కార్ల యజమానులు డీజిల్ కోసం వాహనాలతో తరలివచ్చారు. అలాగే పలువురు క్యాన్లతో తరలివచ్చి గాయత్రి బంక్ ఎదుట బారులుదీరారు. -
సమస్యల స్వాగతం
ఐటీడీఏ పీఓకు.. మూసివేసిన కుట్టు శిక్షణ కేంద్రం● ఈఎస్ఎస్లో గ్రౌండింగ్ అంతంతే.. ● ముందుకు సాగని రైతు భరోసా, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల సరళీకృతం ● పరిష్కారానికి నోచుకోని గిరివాణి వినతులు ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా లెనిన్ వత్సల్ టొ ప్పో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంత రం పలు విభాగాల్లో తనిఖీ నిర్వహించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. నూతనంగా బా ధ్యతల చేపట్టిన పీఓకు మాత్రం ఐటీడీఏలో నెలకొ న్న అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. 2020–21 నుంచి ఇప్పటి వరకు ఎకనామికల్ సపోర్ట్ స్కీం(ఈఎస్ఎస్) పథకంలో గ్రౌండింగ్ చేయడం లేదు. 631 మందిని పథకం కింద ఎంపిక చేసి 274 మందికి గ్రౌండింగ్ చేశారు. మిగతావి పెండింగ్లో ఉన్నాయి. వాటికి ఆర్థిక శాఖ నుంచి ట్రైకార్, ట్రైబల్ వెల్ఫేర్కు నిధులు వస్తేగానీ బ్యాంకుల్లో జమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఇంతలోనే రాజీవ్ యువ కిరణాలను తెరపైకి తేవడంతో ఈఎస్ఎస్ మరుగున పడింది. అలాగే గిరివికాసం కింద రైతులకు బోరు, మోటారు, విద్యుత్ సరఫరా ఉచితంగా ఇవ్వాలని వచ్చిన 431 దరఖాస్తులు మూడేళ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్నాయి. ఇటీవల పీఎం కుసమ్ యోజన పథకం కింద గిరిజనులకు సోలార్ పంపు సెట్లు, మోటార్లను అందించేందుకు సర్వేలు చేపట్టి వాటిని కేవలం కాగితాలకు పరిమితం చేశారు. అలాగే సోలార్ ప్లాంట్స్ ఏర్పా టు చేసేందుకు ఐటీడీఏ మహిళలకు అవగాహన కల్పించి పేర్లను నమోదు చేశారు. కానీ సంఘాల పేర్ల మీద భూములు మాత్రం కేటాయించలేదు. శివాపురంలోని సబ్బుల పరిశ్రమకు జీసీసీ ద్వారా రూ. 30 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఇప్పించాలని అనేకమార్లు గిరివాణిలో వినతులు ఇచ్చినా ఫలితం లేకుండా పోవడంతో మూసివేశారు. వెంకటాపురం(కె) మండలం ముత్తారం గ్రామంలో నడుపుతున్న సొసైటీ క్వారీ మూడేళ్ల నుంచి గ్రామంలోని సభ్యులకు కమీషన్లు ఇవ్వడం లేదు. దీంతో గిరివాణిలో ఫిర్యాదు చేయగా ఇంత వరకు పట్టించుకోలేదు. సొసైటీ, క్వారీ వివరాలు సైతం గోప్యంగా ఉంచడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. హార్టికల్చర్ నర్సరీలో గతంలో రూ.23 లక్షలు వెచ్చించి పామాయిల్ ప్లాంటేషన్ ఏర్పాటు చేయగా ఒక్క మొక్క కూడా బతకలేదు. దీంతో రూ. 23 లక్షల నిధులు బురదలో పోసినట్లు అయ్యింది. మళ్లీ ఆ భూమిలో పండ్ల తోటల కోసం ప్లాన్ చేశారు కాని ఆచరణలోకి తీసుకురాలేదు. ఇలా అనేక సమస్యలతో ఐటీడీఏ కొట్టుమిట్టాడుతోంది. ఇవేకాకుండా ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న గిరివాణిలో అనేక మంది గిరిజనులు వినతులు ఇస్తున్నా పరిష్కారం కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా పీఓగా బాధ్యతలు చేపట్టిన టొప్పో తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు.గిరిజన మహిళా సంఘాలకు కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచిత కుట్టు మిషన్లను అందజేసి ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం కుట్టించి వారికి ఇచ్చేలా అప్పటి పీఓ చిత్రామిశ్రా ప్లాన్ చేశారు. కాని ఆమె బదిలీ కావడంతో ఆ పనులు మూలకుపడ్డాయి. దీంతో స్టోర్ బోసిపోయి కనిపిస్తోంది. అంతేకాకుండా కొంత మందికి ఇటుకల తయారీకి మిషనరీలు ఇవ్వగా వాటిని కేవలం ఇంటి వద్ద ఏర్పాటు చేసుకొని ఎలాంటి పరిశ్రమలను నడపడం లేదు. దీంతో లక్షలాది రూపాయల సామగ్రి తుప్పుపట్టిపోతుంది. ఇదేకాకుండా న్యూట్రిబాస్కట్ పరిశ్రమను సైతం నడిపించలేక మహిళా గ్రూపు సభ్యులు దానిని మూసివేశారు. సరైన ఆదాయం, ఉత్పత్తి లేదని చేతులు ఎత్తేశారు. -
ఎవరి వాటా వారికి రావాల్సిందే..
భూపాలపల్లి రూరల్: ఎవరి కులం ఎంతో.. వారికంత వాటా దక్కాలనే నినాదంతోనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగ బుచ్చయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కులాలను లెక్కపెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని విమర్శించారు. కుల గణన అసలు పరమార్థం.. దేశ సంపదను, భూమిని, రాజ్యాధికారాన్ని ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయడమేనని గుర్తు చేశారు. భారత రాజ్యాంగ గణతంత్ర స్ఫూర్తి అదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంపద సమ పంపిణీ జరగడం లేదన్నారు. భూమి, రాజ్యం, అధికారాలన్నీ కేవలం ఒక్క సామాజిక వర్గానికే (రెడ్డి కులానికే) అప్పగిస్తున్నారని మండిపడ్డారు. బ్యూరోక్రసీలోనూ, మంత్రి పదవుల్లోనూ అగ్రవర్ణాలకే పట్టం కడుతున్నారని, ఇదే బాటలో గత ప్రభుత్వంతో పాటు బీజేపీ కూడా నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం దక్కే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. 10 శాతం ఉన్న అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న అధికారాన్ని బహుజనుల పరం చేయడమే జేఏసీ లక్ష్యమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ నాదం కుమారస్వామి, బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ముదిరాజ్, వివిధ సంఘాల సనాయకులు అజ్మీర సమ్మయ్య, రాదండి దేవేందర్, దుగ్యాల స్వామి, చంద్రగిరి శంకర్, భీమనాదని సత్యనారాయణ, సాయిబాబా, మేకల సుమన్, కొత్తూరు రవీందర్, చిట్యాల శ్రీనివాస్, అశోక్ పాల్గొన్నారు. కుల గణన చేస్తే సరిపోదు.. సంపదను పంచాలి బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహరాజ్ -
నిరుపేదల సొంతింటి కల సాకారం
ములుగు/ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో సాకారం చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు ఆదివారం మల్లంపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి మంత్రి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను త్వరతిగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా కేటాయిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రవీందర్రెడ్డి, సర్పంచ్ ల్యాద శ్యాంరావు, నాయకులు పాల్గొన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం.. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైస్ మి ల్లర్స్ ఆసోసియేషన్ భవనాన్ని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్తో కలిసి మంత్రి సీతక్క ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్, సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించిన మంత్రి వెంకటాపురం(ఎం): మండలంలోని జవహర్నగర్ సమీపంలో గల కోపెల జనార్దన్ జ్ఞాపకార్ధం అతని కుమారుడు కోపెల కిరణ్ కుమార్ నిర్వహిస్తున్న మెగా క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఫైనల్ మ్యాచ్ను మంత్రి సీతక్క ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో మంత్రి సీతక్క సరదాగా క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పల్లె జైపాల్ రెడ్డి, కౌన్సిలర్ గుంటొజు పావని, తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క


