బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్ లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎప్)తన దాడులను మరింత ఉధృతం చేసింది. బుధవారం ఉదయం బీరుట్లోని దహీహ్ ప్రాంతంలో హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండ్ కేంద్రాలు, ఆయుధ నిల్వ కేంద్రాలే లక్ష్యంగా ఐడిఎఫ్ దాడులను విజయవంతంగా పూర్తి చేసింది. హిజ్బుల్లా మౌలిక సదుపాయాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
దీనికిముందు బీరుట్తో పాటు లెబనాన్లోని టైర్ ప్రాంతంలో కూడా ఐడిఎఫ్ మెరుపు దాడులు చేపట్టింది. అక్కడి హిజ్బుల్లా ప్రధాన కమాండ్ సెంటర్ను వైమానిక దాడుల ద్వారా ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. ఇరాన్ మద్దతుతో ఇజ్రాయెల్ భూభాగంపై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద ముఠాల ఆటకట్టించడమే లక్ష్యంగా తమ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
ఈ దాడుల సమయంలో పౌరులకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఐడిఎఫ్ గరిష్ట జాగ్రత్తలు తీసుకుంది. దాడులకు ముందే పౌరులను హెచ్చరించడం, లక్ష్యాలను ఛేదించే అత్యాధునిక మందుగుండు సామగ్రిని ఉపయోగించడం, నిరంతర వైమానిక నిఘా తదితర చర్యల ద్వారా పౌర హానిని తగ్గించడానికి ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు. జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న హిజ్బుల్లా వ్యూహాలను తిప్పికొట్టేలా ఈ దాడులు సాగాయని ఇజ్రాయెల్ పేర్కొంది.
ఇజ్రాయెల్ పౌరుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, దేశవాసులకు హాని కలిగించే ఏ ప్రయత్నాన్ని సహించబోమని ఐడిఎఫ్ పునరుద్ఘాటించింది. ఇరాన్ పాలన ప్రోద్బలంతో హిజ్బుల్లా తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, ఉగ్రవాద నిర్మూలనపై తాము గట్టి సంకల్పంతో ఉన్నామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు మరోమారు స్పష్టం చేశాయి.
ఇది కూడా చదవండి: ‘ఎన్సీఈఆర్టీ’ వివాదంలో మరో మలుపు


