న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) పాఠ్యపుస్తకాల చుట్టూ ముసురుకున్న వివాదం మరో కీలక మలుపు తిరిగింది. అన్ని తరగతులకు చెందిన పాఠ్యపుస్తకాలను సమగ్రంగా సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం ఎన్సీఈఆర్టీని ఆదేశించింది. ఈ విషయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు విన్నవించారు. న్యాయవ్యవస్థపై ఎనిమిదో తరగతి పుస్తకంలో వివాదాస్పద అంశాలు చోటుచేసుకోవడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
పాఠ్యప్రణాళికను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఆయా రంగాలకు చెందిన నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి హామీ ఇచ్చారు. అయితే ఈ సమీక్ష బాధ్యతను కేవలం ఎన్సీఈఆర్టీకి మాత్రమే వదలకుండా, కేంద్రమే స్వయంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. విద్యా ప్రమాణాలను కాపాడటంలో నిష్పాక్షికత అవసరమని కోర్టు పేర్కొంది.
ఎనిమిదో తరగతి సామాజిక శాస్త్రం పాఠ్యపుస్తకం ‘ఎక్స్ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్’లో న్యాయవ్యవస్థపై ఉన్న నాలుగో అధ్యాయం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై ఎన్సీఈఆర్టీ బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ‘న్యాయవ్యవస్థ పాత్ర’ అనే అధ్యాయంలో అభ్యంతరకర అంశాలు ఉన్నట్లు అంగీకరిస్తూ, సదరు పుస్తకాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రకటించారు. విద్యా విషయాల్లో ఖచ్చితత్వం, బాధ్యతను పాటించడంలో తాము కట్టుబడి ఉన్నామని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: పప్పన్నం పెట్టకుండా 10 వేల పెళ్లిళ్లు?


