చండీగఢ్: చమురు సంక్షోభం సెగ ఇప్పుడు పెళ్లిళ్ల వరకూ పాకింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం గ్యాస్ సరఫరాపై పడటంతో పెళ్లిళ్ల సీజన్ కాస్తా కళా విహీనంగా మారింది. పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో సుమారు 10 వేల వివాహాలు జరగనున్న తరుణంలో కమర్షియల్ ఎల్పీజీ (LPG) సరఫరా నిలిచిపోవడం గందరగోళానికి దారితీసింది. గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
పంజాబ్లో ప్రస్తుతం వివాహ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఇంటి నిండా చుట్టాలు, భాజాభజంత్రీల సందడి మధ్య గ్యాస్ కొరత అందరినీ కలవరానికి గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం అర్ధరాత్రి నుంచి వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో క్యాటరింగ్ నిర్వాహకులు, మ్యారేజ్ ప్యాలెస్ యజమానులు చేతులెత్తేస్తున్నారు. విందు భోజనాల మెనూలో కోతలు విధించక తప్పని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంజాబ్ మ్యారేజ్ ప్యాలెస్ అండ్ రిసార్ట్ అసోసియేషన్ ప్రతినిధి సుఖ్దేవ్ సింగ్ సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గ్యాస్ లేకపోతే పెద్ద ఎత్తున వంటకాలు చేయడం అసాధ్యం. ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించేందుకు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే కట్టెల పొయ్యిలకు మారాయి. ఈ పరిస్థితిపై కేంద్ర పెట్రోలియం శాఖ స్పందిస్తూ.. గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నల్లబజారును అరికట్టడానికే కఠిన నిబంధనలు తెచ్చామని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: ఏఐ పిటిషన్.. వ్యాపారికి సీజేఐ స్ట్రాంగ్ వార్నింగ్


