పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తే అవకాశం ఉండడంతో భారత్తో పాటు ఇతర దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎల్పీజీ సిలిండర్ల కొరత నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు బంద్ను సైతం ప్రకటించాయి. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ పరిస్థితి ఏలా ఉంది అనే వివరాలు తెలుసుకోవాలనుందా అయితే మరెందుకు ఆలస్యం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
ఇరాన్ యుద్దం ఎఫెక్ట్ భారత్పై ఇప్పుడిప్పుడే మొదలైంది. ప్రెట్రోల్, డీజీల్ ధరలపై ఈ ప్రభావం ఇప్పటికే పెద్దగా లేకపోయినా ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రారంభమైంది. గ్యాస్ కొరతతో బెంగళూరులో వ్యాపారులు ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్ల బంద్ను పాటిస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా 25 శాతానికి పైగా హోటళ్లు మూతపడ్డాయి. రేపటి నుంచి ఈ సంఖ్య 50 శాతానికి పెరిగినా ఆశ్చర్యం లేదని ముంబై హోటల్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలోని విశాఖలో కూడా హోటళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. హైదరాబాద్ నగరంలో సాధారణంగానే రద్దీ ఉండగా ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతుంది. దీంతో గ్యాస్ కొరత ప్రభావం హోటళ్లు, బేకరీలపై పడుతుందనే ఆందోళన వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది.
గ్యాస్ కొరతపై కేంద్రం స్పందన
యుద్ధం ప్రారంభమైన ఒకట్రెండు రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం గ్యాస్పై ఎలాంటి ప్రభావం ఉండదని, మన వద్ద 21 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రకటన చేసింది. అయితే.. తాజాగా హోటళ్లు, రెస్టారెంట్ల బంద్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమైంది. ఈ అంశంపై సీరియస్గా దృష్టి సారించింది. అత్యవసర సేవల చట్టం.. ఎస్మా పరిధిలోకి గ్యాస్ సరఫరాను తీసుకువచ్చింది. బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ మేరకు జిల్లాల వారీగా కలెక్టర్లు ఇప్పటికే రంగంలోకి దిగారు. తమ పరిధిలోని ఎల్పీజీ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సిలిండర్ల పంపిణీని రేషనలైజేషన్ చేస్తున్నట్లు సమాచారం.
దీని ప్రభావం ఇతర రంగాలపై ఎలా ఉంటుంది?
హోటళ్లు, రెస్టారెంట్లకు, పర్యాటక రంగానికి ముడిపడి ఉంటుందనేది నిర్వివాదాంశం. పర్యాటక ప్రదేశాల్లో హోటళ్లు మూతపడితే.. ఆ ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. పట్టణ, నగర ప్రాంత పర్యాటక ప్రదేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
ఆటో ఎల్పీజీ
మహానగరాల్లో ఇప్పుడు ఆటో ఎల్పీజీ స్థానాన్ని అధికస్థాయిలో సీఎన్జీ ఆక్రమించింది. అయినప్పటికీ వేల సంఖ్యలో ఆటోరిక్షాలు ఇప్పటికీ ఆటో ఎల్పీజీపైనే ఆధారపడ్డాయి. గత నెలలో ఆటో ఎల్పీజీ ధర లీటరుకు 55 రూపాయల వరకు ఉంది. మూడ్రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరను పెంచడంతో ఇప్పుడు ఆటో ఎల్పీజీ ధర 63 రూపాయలకు చేరుకుంది. ఎల్పీజీ బంకుల్లో కూడా షార్టేజీ భయంతో ఆటోరిక్షాలు, కార్లు క్యూకడుతున్న పరిస్థితులు ఎల్పీజీ బంకుల వద్ద కనిపిస్తోంది.

మరెంత కాలం సంక్షోభం?
పశ్చిమాసియాలో పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ ఇంధన సరఫరా చైన్కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద నౌకలు స్తంభించిపోయాయి. అటుగా వచ్చే నౌకలను ఇరాన్ టార్గెట్గా చేసుకుంటోంది. అయితే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం రేషనలైజేషన్ ద్వారా పంపిణీపై దృష్టి సారించేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్ ఎల్పీజీ విషయాన్ని పక్కనపెడితే.. డొమెస్టిక్తోపాటు.. ఆస్పత్రులు, స్కూళ్లు, హాస్టళ్ల విషయంలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పరిశ్రమలకు అవసరమయ్యే ఎల్పీజీ సరఫరాకు సంబంధించి ఆయిల్ కంపెనీలకు సంబంధించిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ ఇదివరకే ఎక్స్లో ట్వీట్ చేసింది.
భారత్లో ఎల్పీజీ డిమాండ్
ఒకప్పటితో పోలిస్తే.. భారత్లో ఎల్పీజీ డిమాండ్ చాలా పెరిగిందని చెప్పవచ్చు. ఉజ్వల వంటి పథకాలతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై పేదలకు సిలిండర్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.. అంతకు ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దీపం పేరుతో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేలా పథకాలు కొనసాగాయి. మొత్తానికి కమర్షియల్, డొమెస్టిక్ కలిపి దేశంలో ఏటా 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీ వినియోగం జరుగుతోంది. ఇందులో 87 శాతం డొమెస్టిక్ వినియోగమే కావడం గమనార్హం. మిగతా 13 శాతంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆటో ఎల్పీజీ వినియోగం ఉంటుంది.
దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి ద్వారా కొరతను అధిగమించలేమా?
భారతదేశ ఎల్పీజీ అవసరాలు తీరాలంటే 62 శాతం మేర దిగుమతులు తప్పనిసరి. మిగతా 38 శాతం మాత్రమే ప్రస్తుతం మన వద్ద ఉత్పత్తి అవుతుంది. హోర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు తగ్గితే.. వెను వెంటనే మన దేశానికి దిగుమతి కావాల్సిన ఎల్పీజీ అందుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ చెబుతోంది. మన దిగుమతుల్లో 90 శాతం వరకు సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నుంచి వస్తున్నాయి. అయితే.. భారత్లో ఇంధన నిల్వలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


