గురుగ్రామ్: హర్యానాలో మంగళవారం తెల్లవారుజామున రెండు వేర్వేరు చోట్ల పెను విషాదాలు చోటుచేసుకున్నాయి. గురుగ్రామ్లోని ఒక భవన నిర్మాణ ప్రాంతంలో భారీ మట్టి దిబ్బ పడి, ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, జింద్ జిల్లాలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో మరో ఏడుగురు మహిళా కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ రెండు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి.
గురుగ్రామ్లోని సిద్ధ్రావలి ప్రాంతంలో ఓ ప్రైవేట్ నిర్మాణ ప్రాంతంలో భారీ ఎత్తున పోగుపోసిన మట్టి ఒక్కసారిగా జారిపోవడంతో అక్కడ పనిచేస్తున్న సుమారు 20 మందికి పైగా కార్మికులు దాని కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను వెలికితీయగా, మరో నలుగురిని కాపాడారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా పది మందికి పైగా కార్మికులు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
జింద్లో అగ్నిప్రమాదం
జింద్ జిల్లా సఫిడాన్ ప్రాంతంలోని ఒక పెయింట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న ఏడుగురు మహిళా కార్మికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసులు ఫ్యాక్టరీ యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ రెండు దుర్ఘటనలపై హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జింద్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: ఖమేనీ మృతితో రంగంలోకి విధ్వంసక శక్తులు?


