ప్రయాణికుల మధ్య తోపులాట
సత్యసాయి జిల్లాలో విషాదం
బత్తలపల్లి: బస్సు రాగానే ఎక్కేందుకు ప్రయాణికుల నడుమ తోపులాట జరగడంతో ఓ వృద్ధురాలు అదే బస్సు కింద పడి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో ఆదివారం జరిగింది. కదిరికి చెందిన భాగ్యమ్మ(80) తన కోడలు మాధవితో కలిసి ఆదివారం ధర్మవరంలో సమీప బంధువుల ఇంట్లో శుభకార్యం చూసుకుని బత్తలపల్లికి చేరుకున్నారు.
నాలుగు రోడ్ల కూడలిలో కదిరి వెళ్లే బస్సు కోసం వేచి ఉండగా బస్సు రావడంతో ఎక్కే సమయంలో ప్రయాణికుల రద్దీ కారణంగా తోపులాట జరిగింది. భాగ్యమ్మ ప్రమాదవశాత్తు బస్సు వెనుక టైరు కింద పడింది. బస్సు ముందుకు కదలగానే ఆమె తలపై నుండి వెనుక చక్రాలు వెళ్లాయి. తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు కేకలు వేయడంతో బస్సు నిలిపివేశారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసు స్టేషన్కు తరలించారు.
ఆర్టీసీ బస్సులో మహిళ మృతి
జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ శ్వాస ఆడక మృతి చెందింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన ముప్పిడి జ్యోతిరెడ్డి (50) ఆదివారం జంగారెడ్డిగూడెంకు వెళ్లేందుకు గోపాలపురంలో కొవ్వూరు ఆర్టీసీ డిపో బస్సు ఎక్కింది. బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉండగా జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్కు వచ్చేసరికి జ్యోతిరెడ్డి స్పృహ తప్పి పోయిఉంది.
తోటి ప్రయాణికులు గమనించి 108కు సమాచారమివ్వగా స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్టు చెప్పారు. జ్యోతిరెడ్డి కుమారుడు తన తల్లి అనారోగ్యంతో ఉన్నారని, ఆమె మృతిపై అనుమానాలూ లేవని చెప్పి మృతదేహాన్ని తీసుకువెళ్లారు.


