ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఫైనల్కు రంగం సిద్ధమైంది. టీమిండియా- న్యూజిలాండ్ ఆదివారం టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజాలు ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్ ఫైనల్ విజేతపై తమ అంచనాలు తెలియజేశారు. డివిలియర్స్ యూట్యూబ్ చానెల్ వేదికగా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే.. ప్రతి ఒక్కరు సౌతాఫ్రికాను ‘చోకర్స్’ అని పిలవడానికి ఇష్టపడతారు. కీలక మ్యాచ్లలో మనం ఓడిపోవడం ఇందుకు కారణం.
ఇది అసాధ్యం
అయితే, న్యూజిలాండ్ విషయంలోనూ నేను ఇదే మాట అంటాను. న్యూజిలాండ్ ఇప్పటి వరకు వరల్డ్కప్లు గెలవనేలేదు. సౌతాఫ్రికా మాదిరే ఎన్నోసార్లు ఫైనల్కు చేరినా ట్రోఫీని అందుకోలేకపోయింది. ఈసారైనా గెలిచేందుకు ప్రయత్నించండి.
నిజానికి నాకు న్యూజిలాండ్ జట్టు అంటే చాలా ఇష్టం. కానీ వాళ్లు టీమిండియాను ఓడించలేరు. ఇది జరగాలంటే మాత్రం ఏదో ఒక చారిత్రాత్మక తప్పిదాన్ని భారత జట్టు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇది అసాధ్యం. కివీస్ గెలవాలనే కోరుకుంటున్నా. కానీ వాళ్లు భారత్ను ఓడించగలరా?.. అంటే లేదనే చెప్తాను’’ అని పేర్కొన్నాడు.
జట్టు గెలవాలని నాకూ ఉంది
ఇందుకు డివిలియర్స్ బదులిస్తూ... ‘‘అవును.. న్యూజిలాండ్కు గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఆ జట్టు గెలవాలని నాకూ ఉంది. కానీ వారికి ఆ అవకాశం దాదాపుగా లేదనే చెప్పాలి’’ అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా ఐసీసీ టోర్నీ ఫైనల్స్లో న్యూజిలాండ్ ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే నెగ్గింది.
రెండుసార్లు టీమిండియాను ఓడించి
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని 2000 సంవత్సరంలో కైవసం చేసుకున్న కివీస్.. మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ విజేతగానూ 2021లో అవతరించింది. ఈ రెండుసార్లూ న్యూజిలాండ్ ప్రత్యర్థి టీమిండియానే కావడం విశేషం. అయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్తో తలపడిన కివీస్కు ఈ సారి పరాజయమే ఎదురైంది. భారత్ విజేతగా అవతరించింది.
అయితే, కివీస్ ఇంత వరకు ఒక్క వరల్డ్కప్ ట్రోఫీ గెలవకపోగా.. భారత్ మూడు ప్రపంచకప్ టోర్నీలు గెలిచింది. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్, 2024 టీ20 ప్రపంచకప్ ట్రోఫీలను సొంతం చేసుకుంది.
చదవండి: T20 WC Final: పిచ్ ఎలా ఉండబోతోంది?.. ఎర్ర మట్టితోనా?


