రియాద్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం సౌదీపై కనిపిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం స్థానిక ప్రజలకు శుభవార్త చెప్పింది.
పవిత్ర రంజాన్ మాసం ముగింపును పురస్కరించుకుని జరుపుకునే ఈద్ అల్ ఫితర్ (రంజాన్) పండుగ వేళ సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రైవేట్, స్వచ్ఛంద రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు నాలుగు రోజుల పాటు సెలవులను ప్రకటిస్తూ, అక్కడి మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
కార్మిక నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఈ షెడ్యూల్ ప్రకారం.. మార్చి 18వ తేదీ (బుధవారం) పనిదినం ముగిసిన తర్వాత నుంచి ఈ సెలవులు ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు మార్చి 18 సాయంత్రం నుంచి మార్చి 21 (శనివారం) వరకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. తిరిగి మార్చి 22వ తేదీన ఆయా కంపెనీల పని వేళల ప్రకారం ఉద్యోగులు విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన సెలవుల వివరాలను ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా వెల్లడించనుంది.
పండుగకు ముందుగానే ఈ ప్రకటన చేయడం వల్ల పలు కుటుంబాలు తమ ప్రయాణాలను, వేడుకలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవడానికి వీలుంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. గల్ఫ్ దేశాలైన యూఏఈ, ఖతార్ కూడా ఇప్పటికే ఇలాంటి ప్రకటనలే చేయడంతో ఈ ప్రాంతమంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఈద్ అల్ ఫితర్ పండుగ తేదీ నిర్ణయం నెలవంక దర్శనంపైనే ఆధారపడి ఉంటుంది. ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల 29 రోజులు పూర్తయి, నెలవంక కనిపిస్తే మార్చి 19న ఈద్ జరుపుకుంటారు. ఒకవేళ నెలవంక కనిపించని పక్షంలో, రంజాన్ 30 రోజులు పూర్తయ్యాక మార్చి 20వ తేదీన పండుగ నిర్వహిస్తారు. దీనిని సౌదీలోని మూన్ సైటింగ్ కమిటీలు అధికారికంగా ధృవీకరించనున్నాయి. పండుగ రోజున సూర్యోదయం తర్వాత ప్రత్యేక ప్రార్థనలతో వేడుకలు మొదలై, పేదలకు చేసే ‘జకాత్ అల్ ఫితర్’ దానధర్మాలతో కొనసాగుతాయి.
ఇది కూడా చదవండి: హోలీలో విషాదం: మనవడిపై నాన్నమ్మ పైశాచికం


