వాషింగ్టన్: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో యుద్ధంలో అమెరికా సైన్యం పనితీరుకు అసాధారణ రేటింగ్ ఇచ్చారు. అమెరికా ఇప్పుడు కమాండింగ్ స్థానంలో ఉందన్నారు. యుద్ధ రంగంలో అమెరికా సైన్యం పైచేయి సాధించిందని.. బాగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా ట్రంప్.. 15/10 రేటింగ్ ఇచ్చారు.
వైట్ హౌస్లో టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్లతో ట్రంప్ మాట్లాడుతూ..‘అమెరికా, మిత్రదేశాలు.. ఇరాన్పై యుద్ధంలో పైచేయి సాధిస్తున్నాయి. వారం కంటే తక్కువ సమయంలోనే వేగంగా పురోగతి సాధించాం. మేము యుద్ధ రంగంలో బాగానే ఉన్నాము. ఈజీగా చెప్పాలంటే. 10 స్కేల్లో 15 రేటింగ్తో ముందంజలో ఉన్నాం. మనం ఇప్పుడు చాలా బలమైన స్థితిలో ఉన్నాం. ఇరాన్ నాయకత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ఇరాన్కు నాయకుడిగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ చనిపోతారు. ఇరాన్ నాయకత్వ వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగుతుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇదే సమయంలో ట్రంప్ అణు హెచ్చరికను పునరావృతం చేశారు. ఇరాన్పై దాడి చేయాలనే నిర్ణయాన్ని అమెరికా నాయకుడు మళ్ళీ సమర్థించుకున్నారు. ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించడానికి దగ్గరగా ఉందని వాదించారు. పిచ్చివాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పుడు, ఇలాంటి చెడు విషయాలు జరుగుతాయి అని మండిపడ్డారు. ఇరాన్పై ఇంకా ఆపరేషన్ ముగియలేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల ఆయుధశాల వేగంగా తుడిచిపెట్టబడుతోందన్నారు. చివరగా.. వాషింగ్టన్ చివరికి టెహ్రాన్లో పాలన మార్పును కోరుకుంటుందో లేదో వైట్ హౌస్ నిర్ధారించకుండా ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


