సుప్రీం నేతగా ఎన్నికైనట్టు వార్తలు
ఖమేనీ రెండో కుమారునికే పట్టం
నియామకంలో కీలకంగా ఐఆర్జీసీ
దుబాయ్: ఇరాన్ నూతన సుప్రీం నేతగా అయతొల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా హొసేనీ ఖమేనీ నియుక్తులైనట్టు తెలుస్తోంది. 88 మంది మతపెద్దలతో కూడిన కమిటీ (అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్) మంగళవారం ఆయనను ఎన్నుకున్నట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థ బుధవారం ఈ మేరకు పేర్కొంది. దీన్ని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్పై గత శనివారం ఇజ్రాయెల్, అమెరికా జరిపిన భీకర దాడుల్లో ఖమేనీ మరణించడం తెలిసిందే. 56 ఏళ్ల మొజ్తబా ఆయన రెండో కుమారుడు. ఆయనకు పాలనానుభవమేదీ లేదు. ఇప్పటిదాకా తెర వెనకే తండ్రి తరఫున వ్యవహారాలను చక్కబెడుతూ వచ్చారు. వారసత్వ రాజకీయాలకు ప్రస్తుత ఇరాన్ పాలక వర్గం పూర్తిగా వ్యతిరేకమన్నది తెలిసిందే.
ఈ నేపథ్యంలో మొజ్తబా ఎన్నికపై కమిటీలో పలువురు అభ్యంతరం వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్లో సర్వశక్తిమంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తీవ్ర ఒత్తిడితో చివరికి ఆయన నియామకానికి పచ్చజెండా ఊపినట్టు ఇరాన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఐఆర్జీసీపై మొజ్తబాకు పూర్తిస్థాయిలో పట్టుంది. దాని వ్యవహారాలను చాలా ఏళ్లుగా పూర్తిగా ఆయనే చూసుకుంటున్నట్టు చెబుతారు. వారసత్వ పాలనను వ్యతిరేకిస్తూ రాచరికాన్ని కూలదోసిన 1979 నాటి ఇస్లామిక విప్లవంలో ఖమేనీ కీలక పాత్ర పోషించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు వారసత్వంగా పాలన పగ్గాలు చేపట్టడాన్ని ఇరాన్ ప్రజలు ఏ మేరకు ఆమోదిస్తారన్నది చూడాలి. ఇరాన్లో అధ్యక్షునిగా ఎవరున్నా సర్వం సహా అధికారాలు మాత్రం సుప్రీం నేత చెప్పుచేతల్లోనే ఉంటాయి. సైన్యంతో పాటు అత్యంత శక్తిమంతమైన ఐఆర్జీసీ కూడా పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే పని చేస్తుంది. శనివారం నాటి దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీతో పాటు మొజ్తబా భార్య జహ్రా హదద్ ఆదెల్, ఆయన చిన్న కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మొజ్తబా ఒక్కసారి కూడా బహిరంగంగా కని్పంచలేదు. ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో అజ్ఞాతంలో ఉంటూ ఇరాన్ ప్రతి దాడులను పర్యవేక్షిస్తున్నట్టు చెబుతున్నారు.
తెర వెనక ‘సుప్రీం’
మొజ్తబా. అయతొల్లా ఖమేనీ రెండో కుమారునిగానే తప్ప బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని పేరు. అయితే తెర వెనక మాత్రం దశాబ్దాలుగా ఆయన పూర్తిస్థాయి అధికారాలు చలాయిస్తూ వస్తున్నట్టు చెబుతారు. ఒకరకంగా రాజకీయ, ఆర్థిక, భద్రతా వ్యవహారాలన్నింటినీ శాసించారంటారు. ఆ క్రమంలో ఖమేనీ వారసునిగా చాలా ఏళ్లుగా మొజ్తబా పేరే వినిపిస్తోంది. ఆయన్ను సుప్రీం నేతగా నియమిస్తున్నట్టు ఏడాది క్రితమే వార్తలొచ్చినా అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదు. ఇరాన్ రాజకీయ వ్యవహారాల్లో మొజ్తబా ‘అదృశ్య శక్తి’గానే ఉంటూ వస్తున్నారు.
ఆయన 1969లో మషాద్ నగరంలో జని్మంచారు. నాటి పాలకుడు మహమ్మద్ రెజా పహ్లావీ పాలనపై తన తండ్రి ఖమేనీ తిరుగుబాటును చూస్తూ పెరిగారు. కోమ్ నగరంలో షియా మత విద్య అభ్యసించినా క్లెరికల్ హోదాతో సరిపెట్టుకున్నారు. కీలకమైన ఆయతుల్లా హోదాకు చేరలేకపోయారు. పహ్లవీ పాలన అంతమయ్యాక తన తండ్రి ఖమేనీ ఇరాన్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతున్న క్రమంలోనే మొజ్తబా సైన్యంలో చేరారు. ఇరాక్పై పోరులో ఐఆర్జీసీ విభాగమైన హబీబ్ ఇబ్న్ మజాహిర్ బెటాలియన్కు సారథ్యం వహించారు. అక్కణ్నుంచీ ఐఆర్జీసీతో ఆయన బంధం బలంగా పెనవేసుకుంటూ వచ్చింది.
1989లో ఖమేనీ సుప్రీం లీడర్ అయ్యాక మొజ్తబా ప్రాధాన్యం విస్తరిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఇరాన్ వ్యాపార వ్యవహారాలను పూర్తిగా ఆయనే నియంత్రిస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఇంటా బయటా బిలియన్ల కొద్దీ డాలర్ల ఆస్తులు కూడబెట్టారంటారు. 2000 నాటి వికీలీక్స్ కూడా మొజ్తబానే ఇరాన్లో నిజమైన అధికార శక్తిగా పేర్కొంది. 2019లో ట్రంప్ తొలి హయాంలో మొజ్తబాపై అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. 2005లో తనకు అనుకూలుడైన మతవాది అహ్మదీ నెజాద్ అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గేలా మొజ్తబా పావులు కదిపినట్టు చెబుతారు.
సుప్రీం నేతగా ఎవరు ఎన్నికైనా అంతం చేసేస్తాం: ఇజ్రాయెల్
జెరూసలేం: ఇరాన్ సుప్రీం నేతగా ఎవరు ఎన్నికైనా తక్షణమే అంతం చేసేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు సైన్యానికి ఇప్పటికే పూర్తిస్థాయి ఆదేశాలిచ్చినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ బుధవారం తెలిపారు. తమ అంతమే లక్ష్యంగా పని చేసే అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే ఉండబోదని పేర్కొన్నారు.


