ఎల్ఎన్జీ ఉత్పత్తి నిలిపివేసిన ఖతర్
భారత్కి సరఫరాపై ప్రతికూల ప్రభావం
దేశీయంగా పరిశ్రమలకు 40% వరకు కోత
ఆందోళనలో పరిశ్రమలు, సిటీ గ్యాస్ ఆపరేటర్లు
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, అమెరికా–ఇరాన్ యుద్ధం, భారత్కి తలనొప్పి వ్యవహారంగా మారింది. కీలకమైన రస్ లఫాన్ ప్లాంటుపై ఇరాన్ డ్రోన్ల దాడుల దెబ్బతో ఖతర్ ఉత్పత్తిని నిలిపివేయడంతో భారత్కి ఎల్ఎన్జీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీనితో దేశీయంగా పరిశ్రమలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) కంపెనీలకు ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) సరఫరాలో 40 శాతం వరకు కోత పడింది. ఫలితంగా ఆయా పరిశ్రమలు గగ్గోలు పెడుతున్నాయి. కొన్ని సంస్థలు ఇతర ప్రత్యామ్నాయాలకు మళ్లే అవకాశం ఉన్నప్పటికీ, అది ఖరీదైన వ్యవహారంగా మారింది.
ఖతర్తో కుదుర్చుకున్న కాంట్రాక్టు రేటుతో పోలిస్తే స్పాట్ మార్కెట్లో రెట్టింపు రేటుకి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు సరఫరాలో కోత పడగా మరోవైపు స్పాట్ మార్కెట్లో కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో ప్రాధాన్యత రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని గ్యాస్ సరఫరా దిగ్గజం గెయిల్ సీఎండీకి సీజీడీ సంస్థల సమాఖ్య ఏసీఈ లేఖ రాసింది. గృహాలు, సీఎన్జీ కస్టమర్లు, చిన్న పరిశ్రమలకు నిరాటంకంగా గ్యాస్ సరఫరా చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, కాకపోతే గ్యాస్ లభ్యతపై స్పష్టతనివ్వాలని కోరింది.
ప్రత్యామ్నాయాలపై దృష్టి..
కీలక రవాణా మార్గమైన హర్మూజ్ జల సంధిలో నౌకలు ప్రయాణించే పరిస్థితి లేకపోవడం వల్ల సరఫరా దాదాపు నిలిచిపోయినట్లు ఖతర్ ఎనర్జీ, పెట్రోనెట్ వెల్లడించాయి. యుద్ధ సమయం కావడం వల్ల కాంట్రాక్టు నిబంధనల ఉల్లంఘనలపరమైన వివాదాలేమీ తలెత్తకుండా లాంఛనంగా ఫోర్స్ మెజూర్ నోటీసులను పరస్పరం ఇచ్చుకున్నాయి. అటు గెయిల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియంలకు కూడా ఈ నోటీసులు జారీ చేసినట్లు పెట్రోనెట్ తెలిపింది.
దీనితో గెయిల్, ఐవోసీ ప్రత్యామ్నాయంగా స్పాట్ మార్కెట్లో కొనుగోళ్ల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, టర్మ్ కాంట్రాక్టు రేట్లకు రెట్టింపు స్థాయిలో స్పాట్ మార్కెట్లో యూనిట్ (ఎంబీటీయూ) ఎల్ఎన్జీ ధర 10 డాలర్ల నుంచి 25 డాలర్లకు ఎగిసినట్లు పేర్కొన్నాయి. గ్యాస్ సరఫరాపరమైన సవాళ్ల వల్ల ఎరువులు, విద్యుత్ తదితర పరిశ్రమలు ఖరీదైన ప్రత్యామ్నాయాలకు మళ్లితే వ్యయాల భారంతో ధరలు పెరిగిపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎరువుల విషయం తీసుకుంటే ప్రభుత్వంపై సబ్సిడీ భారం మరింతగా పెరుగుతుందని పేర్కొన్నాయి.
సగం అవసరాలకు దిగుమతులే ఆధారం..
దేశీయంగా గ్యాస్ను ఎరువులు, విద్యుదుత్పత్తి మొదలైన వాటి కోసం ఉపయోగిస్తున్నారు. భారత్లో కూడా సహజ వాయువును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ డిమాండ్లో సగానికి మాత్రమే సరిపోతోంది. దీనితో ఎల్ఎన్జీని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. భారత్కి ఏటా వచ్చే 27 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీలో ఖతర్ వాటా 40 శాతం పైగా ఉంటోంది. దేశీయంగా పెట్రోనెట్ ఎల్ఎన్జీ సంస్థ అత్యధికంగా దిగుమతి చేసుకుని ఇక్కడ మిగతా కస్టమర్లకు సరఫరా చేస్తోంది. ఏటా 8.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని కొనుగోలు చేసేందుకు ఖతర్తో పెట్రోనెట్కి ఒప్పందం ఉంది. స్పాట్ మార్కెట్లో కూడా పెట్రోనెట్ కొనుగోలు చేస్తోంది. ఖతర్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చే క్రూడాయిల్ మొదలైన వాటికి కూడా హర్మూజ్ జల సంధి కీలక రవాణా మార్గంగా ఉంటోంది. ఇది ఇరాన్ నియంత్రణలో ఉంది. సగటున రోజుకు 91–135 నౌకలు దీని గుండా రాకపోకలు సాగిస్తాయని, కానీ ప్రస్తుతం ఈ సంఖ్య 26కి పడిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.


