బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమాలకు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంటుంది. కానీ, రీసెంట్గా వీరి నుంచి వచ్చిన ‘అఖండ-2’ ఆశించినంత రేంజ్లో మెప్పించలేదు. ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను తదుపరి చిత్రంపై ఇప్పటి దాకా ఎలాంటి క్లారిటీ రాలేదు. భారీ బడ్జెట్ చిత్రాలను చేసేందుకు ఇష్టపడే బోయపాటికి బలమైన మార్కెట్ ఉన్న హీరో దొరకాలి. ఒక సమయంలో అల్లు అర్జున్తో ఒక సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, అది వర్కౌట్ కాలేదు. దీంతో బోయపాటి తన మనసుమార్చుకుని రానా దగ్గుబాటితో ఒక సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇండస్ట్రీ సమాచారం ప్రకారం, బోయపాటి తన రాబోయే చిత్రంలో ప్రధాన పాత్ర కోసం రానా దగ్గుబాటిని సంప్రదించాడని తెలుస్తోంది. చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని భావిస్తున్నప్పటికీ, ఇరువైపుల నుండి ఇంకా అధికారికంగా ధృవీకరణ రాలేదు. తన మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్తో రానాను మెప్పించే ప్రయత్నంలో బోయపాటి ఉన్నట్లు సమాచారం. కమర్షియల్ యాక్షన్ చిత్రాల వైపు ఆసక్తి చూపిస్తున్న రానా కూడా.. ఈ ప్రాజెక్ట్లో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
బోయపాటి శ్రీను కొద్దిరోజుల క్రితం ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. అట్లీ మూవీ షూటింగ్లో ఉన్న అల్లు అర్జున్ను కలిసి కథ కూడా చెప్పారట. బోయపాటి చెప్పిన కాన్సెప్ట్ బన్నీకి బాగా నచ్చిందని వార్తలు కూడా వచ్చాయి. అయితే, ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత దర్శకుడు లోకేశ్ కనకరాజ్తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత త్రివిక్రమ్తో ఒక సినిమాను లాక్ చేశాడు. ఆ వెంటనే పుష్ప-3 ఎటూ ఉంది. ఈ సినిమాలన్నీ పూర్తి కావలంటే కనీసం 4ఏళ్లు పడుతుంది. అందుకే బోయపాటి మరో కథను రెడీ చేసి రానాకు వినిపించారని తెలుస్తోంది.


