సినిమాలో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు. ఊహించని కాంబో సెట్ కావచ్చు. ఇందుకు తాజా ఉదాహరణ నటి మృణాల్ ఠాకూర్నే. తెలుగులో సీతారామం అనే ఒక్క చిత్రంతో దక్షిణాదిలో పాపులర్ అయిన ఈ ఉత్తరాది బ్యూటీకి భారీగానే ఛాన్స్లు వచ్చాయి. ఆ తరువాత కొన్ని తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ.., హాయ్ నాన్న చిత్రం మినహా ఏదీ ఆశించిన విజయాలను అందుకోలేదు. దీంతో అవకాశాలు ముఖం చాటేశాయనే చెప్పాలి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నటించిన డెకాయిట్ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇకపోతే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో ఒక నాయకిగా ఈ బ్యూటీ నటిస్తున్నారు. ఆ చిత్రం మాత్రమే చేతిలో ఉంది.
హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తున్నా, తమిళంలో అవకాశాలు దోబూసులాడుతూనే ఉన్నాయి. ఈ మధ్య నటుడు ధనుష్తో ప్రేమాయణం అంటూ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాన్ని ఈమె కొట్టి పారేశారు కానీ, ధనుష్కు జంటగా ఒక చిత్రంలో నటించడానికి సిద్ధం అవతున్నారనే ప్రచారం మాత్రం జరిగింది.అయితే అది ఇప్పటి వరకూ ఫైనలైజ్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరో సంచలన నటుడు శింబుతో జత కట్టే అవకాశాన్ని అందుకున్నారన్నది తాజా సమాచారం. శింబు ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర చెన్నై నేపధ్యంలో సాగే గ్యాంగ్స్టార్ కథాంశంతో కూడిన ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ను పూర్తి చేసుకుంది.
కాగా శింబు మరో చిత్రానికి గ్రీస్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకు ముందు ఓ మై కడవులే, డ్రాగన్ వంటి సక్సెస్పుల్ చిత్రాలను తెరకెక్కిన అశ్వద్ మారిముత్తు తాజాగా దర్శకత్వం వహించినున్న చిత్రంలో శింబు నటించనున్నారు. దీన్ని ఏజీఎస్ ఎంటర్ట్రైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. కాగా ఇందులో నటుడు సంతానం ముఖ్య భూమికను పోషించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. కాగా ఇందులో నాయకిగా నటి మృణాల్ ఠాకూర్ నటించనున్నారన్నది తాజా సమాచారం. అరసన్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత శింబు ఈ చిత్రంలో నటించడానికి రెడీ అవుతారట. మొత్తం మీద చాలా కాలం పోరాటం తరువాత మృణాల్కు కోలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యిందన్నమాట.


