వయనాడ్: కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన, ఇళ్లు కోల్పోయిన వారి కోసం పార్టీ ప్రకటించిన ‘100 ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు’కు లోక్సభ ప్రతిపక్ష నేత, వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ఫిబ్రవరి 26న శంకుస్థాపన చేయనున్నారు. త్రిశూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ ఈ వివరాలను వెల్లడించారు.
ఇప్పటికే కేరళలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం బాధితులకు 178 ఇళ్లను అప్పగించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, కాంగ్రెస్ తన సొంత ప్రాజెక్టుతో ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టు కోసం వయనాడ్ జిల్లాలోని మెప్పాడి కున్నంపట్టా వద్ద ఇప్పటికే 3.24 ఎకరాల భూమిని రిజిస్టర్ చేసినట్లు సన్నీ జోసెఫ్ పేర్కొన్నారు. దీనికి అదనంగా ఎళంకిర వద్ద మరో 5.45 ఎకరాల భూమిని కూడా గుర్తించారు. మొత్తం 100 ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి దశలో భాగంగా 50 ఇళ్లను రాబోయే ఆరు నెలల్లోనే పూర్తి చేసి బాధితులకు అందజేయాలని కేపీసీసీ నిర్ణయించింది.
ఒక్కో ఇంటిని ఎనిమిది సెంట్ల విస్తీర్ణంలో, సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్నారు. కేవలం ఇళ్లే కాకుండా, విపత్తు కారణంగా నష్టపోయిన వ్యాపార సంస్థలకు కూడా కాంగ్రెస్ అండగా నిలవనుంది. కొండచరియల విపత్తులో ఆస్తి నష్టాన్ని చవిచూసిన ఒక్కో వాణిజ్య సంస్థకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని కేపీసీసీ పంపిణీ చేయనుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సహకారంతో కేపీసీసీ సమీకరిస్తుందని, మిగిలిన మొత్తాన్ని ప్రజల నుండి విరాళాల రూపంలో సేకరిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొనే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: బట్టతలపై జుట్టు.. ‘మ్యాజిక్ క్యాప్’తో ఊహకందని అద్భుతం!


