సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి మూటలు పంపేందుకు అధికారంలో ఉందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో మంత్రుల అవినీతికి సంబంధించిన చిట్టా, ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిని త్వరలోనే బయటపెడతామని బాంబు పేల్చారు.
కరీంనగర్ పదో డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ కొమురయ్య బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీకి తొలి మేయర్ను అందించిన కేంద్రమంత్రి బండి సంజయ్కి అభినందనలు తెలిపారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ..‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సహకారంతో కరీంనగర్ గెలిచాం. రాష్ట్ర, జిల్లా నాయకత్వం సమిష్టిగా అగ్రెసివ్గా కొట్లాడం. బీఆర్ఎస్.. కాంగ్రెస్, ఎంఐఎంతో కుమ్మకైంది. బీజేపీని అడ్డుకునేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుమ్మక్కయ్యాయి. కానీ అక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లు వారి అధిష్టానం మాట ధిక్కరించి అవసరం వస్తే మాకు సపోర్ట్ ఇస్తామన్నారు. కరీంనగర్ స్పూర్తితో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తాం.
ప్రజల కళ్లలో ఆనందం కంటే ఒవైసీ కళ్లలో ఆనందం చూడాలని రేవంత్ అనుకుంటారు. మజ్లిస్ కోసమే భాగ్యనగరాన్ని సీఎం రేవంత్రెడ్డి మూడు ముక్కలు చేశారు. మూడు ముక్కలు ఎందుకు ఎవరి కోసం చేశారో రేవంత్ చెప్పడం లేదు. భాగ్యనగరం గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తాం. ముంబై, ఢిల్లీ లాంటి పెద్ద నగరాలను కూడా విభజించలేదు. ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఎక్కడ ఉన్నాయి?. వచ్చిన పెట్టుబడులు అన్ని ఏఐసీసీకి పంపి దేశంలో పార్టీని బతికేస్తున్నారు. TPCC కాదు T4C అంటే తెలంగాణ కమీషన్ కలెక్షన్ కరప్షన్ కాంగ్రెస్. ఢిల్లీకి మూటలు మోయడానికే కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ మంత్రుల అవినీతి చిట్టా మా దగ్గర ఉంది. ఇంకా వివరాలు సేకరిస్తున్నాం. ఐఏఎస్ అధికారులు కూడా వీటికి మధ్యవర్తులుగా సహకరిస్తున్నారు. మేము ఒక్కో మంత్రి ఇంటి వద్ద అవినీతిపై ఆందోళన చేస్తాం అని హెచ్చరించారు.


