సాక్షి, హైదరాబాద్: బీజేపీ కోవర్టులపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 20 ఏళ్ల నుంచి పార్టీని పట్టి పీడిస్తున్న కోవర్టులు వెంటనే వెళ్లిపోవాలన్నారు. ఇదే సమయంలో బీజేపీలో పలువురు పాత నాయకులను కోవర్టులతో పోల్చడం తీవ్ర చర్చకు దారి తీసింది. చివరగా.. నిజామాబాద్ను కరీంనగర్తో పోల్చలేమని చెప్పుకొచ్చారు.
బీజేపీ ఆఫీసులో ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ..‘ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడింది.. దక్షిణ తెలంగాణలో బలోపేతం కావాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది. కేసుల కోసమే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. వీళ్లూ ఇచ్చారు వాళ్ళు తీసుకున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక కుటుంబ అవినీతిని ఎవరు అడగకుండా ఉండేందుకు కొనడం మొదలు పెట్టారు. కేసీఆర్ వ్యవస్థను నాశనం చేశారు.. రేవంత్ రెడ్డి దాన్ని కొనసాగిస్తున్నారు. మేము ప్రక్షాళన చేయాలనుకున్నాం. అందుకే ఎవరితో కలవలేదు. అలాంటి వ్యవస్థను తెలంగాణలో పెంచుకోవాలి. కాంగ్రెస్ నేతలు కలిసి ఉండలేరు.. కలిసి ఉండటం అసంభవం.
ఇదే సమయంలో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపైన ఎంపీ అర్వింద్ స్పందిస్తూ..‘ఎవరు ఎవరి వల్ల భూస్థాపితం అయ్యారో కవితకు తెలియదా?. ఆమె వ్యాఖ్యలకు అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాస్వామ్య విలువల్ని పాటించారు. బీజేపీకి భయపడి రాయకల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మెట్పల్లిలో పార్టీ కోవర్టు వెళ్ళిపోయారు.. పార్టీకి పట్టిన పీడ పోయింది. సుఖేందర్ కోవర్టు కేసు.. ఆయనకు, ఆయన భార్యకు ఇద్దరికీ టికెట్ ఇవ్వను అని చెప్పాం.
సుఖేందర్ రెడ్డికి వీక్ క్యాండిడేట్ పెడుతామని కాంగ్రెస్ వాళ్లు కాల్ చేసి చెప్పారు. సుఖేందర్ లాంటి వారు 20 ఏళ్ల నుండి బీజేపీని మోస్తున్న అని చెప్పుకునే వారు. కానీ, అలాంటి వారు కొందరు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. ఇప్పుడు నా చేతికి మట్టి అంటకుండా ప్రక్షాళన జరిగింది. ఇలాంటి వారు ఎక్కడ ఉన్నా బయటకు వెళ్లిపోవాలి. ఇప్పటికే ఇందూర్ ప్రక్షాళన జరిగింది. జగిత్యాలను కూడా ప్రక్షాళన చేస్తా. కరీంనగర్ను నిజామాబాద్తో పోల్చలేము. నిజామాబాద్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు.


