సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీజీఎస్పీడీసీఎల్లో అవినీతి ఇంజినీర్లపై వేటు పడింది. ఏకంగా ఒకేసారి ఎనిమిది మంది ఇంజినీరింగ్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే, వీరంతా అవినీతికి పాల్పడినట్టు ఆధారాలతో నిరూపితమైంది.
వివరాల ప్రకారం.. తెలంగాణ దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ(TGSPDCL) అవినీతి ఇంజినీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బుధవారం ఒకేసారి ఎనిమిది మంది ఇంజినీరింగ్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్కు గురైన వారిలో ఏడీఈలు, ఏఈలు, సబ్ఇంజినీర్లు ఉన్నారు. కాగా, యాంటీ బ్రైబరీ సెల్కు వచ్చిన ఫిర్యాదులపై ఇంటెలిజెన్స్ విభాగం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
విచారణలో భాగంగా.. కొత్త కనెక్షన్లు, ప్యానెల్ బోర్డుల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ మంజూరు వంటి వాటికి విద్యుత్ ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్లు వెల్లడైంది. ఫోన్పే వంటి డిజిటల్ పేమెంట్ ద్వారా లంచాలు స్వీకరించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ అంశంలో ఇప్పటి వరకు 150 ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం చర్యలకు దిగింది. వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.


