breaking news
Andhra Pradesh
-
ఆ ఫ్లెక్సీలు తొలగించండి. వైఎస్సార్సీపీ నిరసన
చీరాల: బాపట్ల జిల్లాలోని చీరాలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ టీడీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. టీడీపీ కట్టిన ఫ్లెక్సీలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిరసన చేపట్టింది. దీనిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలను తొలగించేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు యత్నించాయి. అయితే టీడీపీ కట్టిన ఫ్లెక్సీల వద్దకు వెళ్లకుండా పోలీసుల అడ్డుకున్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలను తొలగించాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు బైఠాయించాయి. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. -
వైఎస్ జగన్ భద్రతపై వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి,తాడేపల్లి: పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రపై వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల టీడీపీ గూండాల దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని శుక్రవారం వైఎస్ జగన్ పరామర్శించారు. జోగి రమేష్ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అయితే, తిరుగు ప్రయాణంలో జగన్ భద్రతను పోలీసులు పట్టించుకోలేదు. గ్రామాలు, ఇరుకైన రోడ్ల మీదుగా వైఎస్ జగన్ కాన్వాయ్ను మళ్లించారు. జగన్ భద్రతా సిబ్బందికి సైతం సమాచారం ఇవ్వలేదు. పూర్తి నిర్లక్ష్యం ఖాకీలు రెగ్యులర్ రహదారి మీదుగానే తీసుకువెళ్తున్నామని చెప్పి, చివరికి ఇరుకైన రోడ్ల మీదుగా కాన్వాయ్ను మళ్లించారు. ఈ ఉదయం పోలీసుల విజ్ఞప్తి మేరకు వైఎస్సార్సీపీ సహకరించింది. విజయవాడ ప్రధాన రహదారుల మీదుగా కాకుండా, పోలీసులు సూచించినట్టుగానే వెస్ట్రన్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. కానీ తిరుగు ప్రయాణంలో ఎటు వెళ్తున్నామో పోలీసులు చెప్పలేదు. జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కలిగిన మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతను పోలీసులు గాలికి వదిలేయడం బాధాకరమని వైఎస్సార్సీపీ తీవ్రంగా విమర్శించింది. ఈ నిర్లక్ష్యాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. -
జర్రమొచ్చింది.. సైలెంట్ మోడ్లో సేనాని!
సరిగ్గా పరీక్షలు ఉన్నప్పుడే బడీ దొంగ పిల్లాడికి జ్వరం వచ్చినట్లు, ఇంట్లో ఎక్కువ పని ఉన్నప్పుడే తోడికోడలు కడుపునొప్పి అంటూ పని ఎగ్గొట్టినట్లు.. పెద్ద మేనేజర్ తో మీటింగ్ ఉన్నరోజే తెలివైన చిన్న మేనేజర్ క్యాజువల్ లీవ్ పెట్టినట్లు. పవన్ కళ్యాణ్ కూడా సరిగ్గా సమయం చూసి టాలెంట్ చూపెడుతున్నారు. సమయం .. సందర్భం చూసి తనకు సమాధానం చెప్పే దమ్ము లేదని తెలుసుకుని ఆ ఎపిసోడ్ నుంచి తప్పుంచుకుని రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు. గతంలో పలుమార్లు ఉద్దేశపూర్వకంగా ఏపీ కేబినెట్ సమావేశాలను ఎగ్గొట్టిన పవన్ కళ్యాణ్ ఆనాడు జరిగిన నిర్ణయాలు, భూ కేటాయింపులకు తానూ బాధ్యుడిని కాను అని లోకానికి చెప్పే అప్షన్ తనవద్ద ఉంచుకున్నారు. రేపు ఎప్పుడైనా ఈ భూకేటాయింపులు.. అస్తవ్యస్త నిర్ణయాలమీద ప్రజా వ్యతిరేకత మొదలైతే తనకు ఆ అంశంతో సంబంధం లేదని చెప్పుకునేందుకు స్విచ్ తనవద్దనే ఉంచుకున్నారు.విశాఖ పెట్టుబడుల సదస్సుతోబాటు దావోస్కు సైతం పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. వేరే ఏదో కారణాలు చెప్పి అయన దూరంగా ఉంటున్నారు. దీంతో బాటు అసెంబ్లీ సమావేశాలకు సైతం తరచూ పవన్ డుమ్మాకొడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా ఆమధ్య టీడీపీ కార్యకర్తలు చిరంజీవిని సైతం ఒక అంశంలో దుమ్మెత్తి పోశారు.. చిరంజీవి ఇమేజిని దెబ్బతీస్తూ సోషల్ మీడియాలో పోస్టులమీద పోస్టులు పెట్టారు. ఆ సందర్భాల్లో కూడా పవన్ సైలెంట్ అయ్యారు.. పైగా జ్వరం అంటూ హైదరాబాద్ వెళ్లిపోయారు తప్ప ఈ అంశంలో ఎక్కడా ఒక్క మాట కూడా అనలేదు. టీడీపీ వారిని కంట్రోల్ చేయలేకపోయారా ? లోలోన వేరే ఏదో ఎజెండాతో సైలెంట్ అయ్యారా అనేది మాత్రం ఇప్పటికీ మిష్టరీగా ఉంది. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ శని ఆదివారాల్లో ప్రచారం చేస్తారని షెడ్యూల్ విడుదల చేసారు. ఈమేరకు తెలంగాణాలో జనసేన అభిమానులు సైతం దీనికోసం ఏర్పాట్లు చేసారు. కానీ అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ జర్రమొచ్చింది అంటూ మంచమెక్కారు. ప్రచారం షెడ్యూలు రద్దు అంటూ సమాచారం వచ్చింది. తెలంగాణాలో బిజెపి.. జనసేన తరఫున అయన ప్రచారం చేస్తారని అన్నారు కానీ అయన తన నిర్ణయం మార్చుకున్నారు.ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా ఉన్నారన్న సమాచారం తెలంగాణ వ్యాప్తంగా పాకింది. పవన్ ఇమేజ్ సైతం బాగా తగ్గింది.. ఈనేపథ్యంలో అయన ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం లేదని పార్టీ వర్గాలు భావించి ఇదే సమాచారాన్ని ఆయనకు చేరవేయగా ఓడిపోయేదానికి ప్రచారం ఎందుకులే అని ఆయనే జ్వరం పేరిట ప్రచారాన్ని ఎగ్గొట్టారని అంటున్నారు. మొత్తానికి మాంచి టైం చూసి పవన్కు జ్వరం వస్తుంది అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది::సిమ్మాదిరప్పన్న -
ఎట్టకేలకు దొరికిన పులి.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు
సాక్షి,తూర్పు గోదావరి: జిల్లాలో గత కొద్దిరోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పులి కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. కూర్మాపురంలో మత్తు ఇంజక్షన్ ఇచ్చి బెబ్బులిని బంధించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పులిని పట్టుకోవడానికిన పూణేకు చెందిన ప్రత్యేక బృందం రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐదు గంటల పాటు ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేసి దానిని పట్టుకున్నారు. జిల్లాలో గత వారం రోజులుగా ఎక్కడ చూసిన పులి జాడ హాట్ టాపిగ్గా మారింది. రోజుకో,పూటకో రూటు మారుస్తూ అటవీ శాఖ అధికారులకు దొరకకుండా ముప్పుతిప్పలు పెట్టింది. ఆరురోజుల కిందట సీతానగరం మండలం తొర్రేడులో ఆవులపై దాడి చేసి చంపిన పులి రఘనాథపురంలో గేదేను బలికొంది. అనంతరం యర్రపాలెంలో మూడు లేగదూడలను చంపింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. పులి తమపై ఎక్కడ దాడి చేస్తుందా అని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ క్రమంలో పులిని పట్టుకునేందుకు నేషనల్ ఎక్స్ఫర్ట్ టీమ్ను తెప్పించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పులిని పట్టుకునేందుకు థర్మల్ డ్రోన్లు, ట్రాప్ కెమెరాలను సిద్ధం చేశామన్నారు. అయితే ఈ రోజు( శుక్రవారం) ఉదయం రాయవరం మండలంలోకి ప్రవేశించన పులి జి. ఎర్రపాలెం నుంచి చెల్లూరు మీదుగా కూర్మాపురం వెళ్లింది. తాజాగా అక్కడే రెస్క్యూ బృందాలు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పులిని బంధించారు. దీంతో జిల్లా హమ్మాయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. -
అబద్ధాన్ని సృష్టించి.. దానికి రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం చేశారు: వైఎస్ జగన్
విజయవాడ: వరుసగా వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ గూండాలు చేస్తున్న దాడులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు.అక్కడ(గుంటూరులో) అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడి విధ్వంసం.. ఇక్కడ జోగి రమేష్( విజయవాడ, ఇబ్రహీంపట్నం) ఇంటిపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడులు చేయడం కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు నిదర్శనమంటూ మండిపడ్డారు వైఎస్ జగన్. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 06) జోగి రమేష్ ఇంట్లో దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన వైఎస్ జగన్.. ఆపై కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం,వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అంబటి రాంబాబు ఇంట్లో కొనసాగించిన జంగిల్ రాజ్ పరంపరను జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారని ధ్వజమెత్తారు. ‘గుంటూరులో అంబటి రాంబాబు అన్న ఇంటిని.. ఇక్కడ జోగి రమేష్ అన్న ఇంటిని ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడ్డారు.. విధ్వంసం సృష్టించారు. అంబటి కుటుంబ సభ్యులపై దుర్భాషలాడారు. పక్కనున్న అంబటి ఆఫీస్ను కూడా తగలబెట్టారు. అంబటి ఇంట్లో, ఆఫీస్లో జరిగిన జంగిల్ రాజ్ను.. జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారు. అసత్య ప్రచారం చేస్తున్న మీ చిప్ సరి చేసుకోమన్నందుకే జోగిరమేష్పై దాడి చేశారు. చిప్ సరిగ్గా లేకనే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. చిప్ సరిగ్గా లేకనే సీబీఐ రిపోర్టుపై అసత్య ప్రచారం చేశారు’ అంటూ వైఎస్ జగన్ విమర్శించారు.రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం...చంద్రబాబు అబద్ధాలను సీబీఐయే తేటతెల్లం చేసింది. తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని సీబీఐ స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కానీ ఎటువంటి పంది కొవ్వు కలపలేదని సీబీఐ రిపోర్ట్లో పేర్కొంది. శ్రీ వెంకటేశ్వరస్వామిని అగౌరపరిచిన, అవమానపరిచిన వ్యక్తి చంద్రబాబు. ఒక అబద్ధాన్ని సృష్టించి.. దానికి రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ విష ప్రచారం చేశారు. చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు హయాంలో సేకరించిన నమూలను కేంద్ర సంస్థలైన ఎన్డీడీబీకి, ఎన్డీఆర్ఐకి పంపింది. ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పాయి. సీబీఐ ఇంకొకటి కూడా చెప్పింది. టీటీడీ చైర్మన్లుగా పని చేసిన తమ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిలు సమయంలో ఎటువంటి తప్పు జరగలేదని సీబీఐ క్లీన్చిట్ కూడా ఇచ్చింది. సీబీఐ ఇచ్చిన చార్జ్షీట్లో.. పేజ్ నం 62లో వాళ్లు మెన్షన్ చేసింది ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జూలైలో టీటీడీ వాళ్లు నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. అవే ట్యాంకర్లను దొడ్డిదారిని మళ్లీ టీటీడీకి రప్పించి, వాటినే వాడారని సీబీఐ చెప్పింది. మరి ఇప్పుడు పాపం చేసింది ఎవరు అనేది ప్రశ్నిస్తున్న చంద్రబాబుని. కూటమి నేతల్ని కూడా ప్రశ్నిస్తున్న తప్పు ఎవరు చేశారు? పాపం ఎవరు చేశారు? అని, జంతువుల కొవ్వు ఉందని గొడ్డుమాంసం ఉందని ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పాయి. ఎవరూ చెప్పలేదు. అది చంద్రబాబు సృష్టి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబే సృష్టించారు’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అరాచకాన్ని నిలదీస్తే.. దాడులు చేస్తారా? ఒక అబద్ధాన్ని స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు సృష్టిస్తే.. దానికి ఆయన తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్లు వంత పాడారు. వీరికి ఎల్లో మీడియానే ఈ విషయాన్ని పదే పదే విష ప్రచారం చేశాయి. దుష్ప్రచారం చేసి దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు. ఆ దుష్ప్రచారం తప్పు అని చెప్పినప్పుడు.. చంద్రబాబు ఏం చేయాలి. క్షమించమని లెంపలు వేసుకోవాలి. తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి వారి చిప్లు బాగు చేయమని గుడుల్లోకి పూజలు చేయడం తప్పా?, సీబీఐ క్లీన్చిట్ ఇచ్చినప్పడు.. తప్పుడు ఫ్లెక్సీలు కట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు. దాన్ని నిలదీస్తే.. ఈ అరాచకం మొదలుపెట్టారు. ఈ జంగిల్ రాజ్ పరిపాలన ఆరంభించారు’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.పోలీసులతో కలిసి టీడీపీ గూండాలు స్కెచ్దీన్ని ప్రశ్నించే వారిపై ఎటాక్ చేశారు. అంబటి రాంబాబు ఇంటిపై ఆపై జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారు. రమేష్ ఇంటిపై పెట్రోల్, యాసిడ్లతో దాడులు చేశారు. ఓ పెద్దాయన(జోగి రమేష్ తండ్రి) ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేయడం హత్యాయత్నం కాదా? అని అడుగుతున్నా. జోగి రమేష్ ఇంటిపై దాడిక జరగకమునుపు.. కుట్ర చేశారు. నాలుగు గంటల ప్రాంతంలో దాడి జరిగితే.. రెండు గంటలకు ఓ స్కెచ్ వేశారు. పోలీసులే.. టీడీపీ నాయకులతో కలిసి స్కెచ్ వేశారు( జోగి రమేష్ ఇంటిపై దాడికి ముందస్తు పన్నాగం ఎలా చేశారో పలు దృశ్యాలను చూపిస్తూ) వైఎస్ జగన్ తూర్పూరాబట్టారు.. ఆశ. ఫతుల్లా, సుబ్బారావులు కలిసి పెట్రోల్ బాంబులతో జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వీరంతా టీడీపీ నేతలే అనడానికి ఇవే రుజువులు అంటూ కొన్ని క్లిప్పింగ్స్ చూపించారు వైఎస్ జగన్. ఆశ కూతురు పెళ్లికి చంద్రబాబు వెళ్లడం, ఫతుల్లాకి లోకేష్కి సన్నిహిత సంబంధాలను వైఎస్ జగన్ మీడియా సాక్షిగా చూపించారు. దాడులకు సంబంధించి అన్నిఆధారాలున్నాయని, దీనిపై ఎన్హెచ్ఆర్సీ, సుప్రీంకోర్టులను ఆశ్రయిస్తామన్నారు వైఎస్ జగన్. మీకు చిత్తశుద్ధి లేదనడానికి ఇది నిదర్శనం కాదా?తాము తప్పు చేసి ఉంటే, తమ హయాంలో పని చేసిన అనిల్ సింఘాల్ను మళ్లీ టీటీడీ ఈవోగా ఎందుకు తెచ్చావ్ చంద్రబాబూ అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ‘ గత చంద్రబాబు హయాంలో అనిల్ సింఘాల్ టీటీడీ ఈవోగా పని చేశారు. మేము ఆయన్ను మా హయాంలో కూడా కొనసాగించాము. ఇప్పుడు అదే అనిల్ సింఘాల్ను మళ్లీ టీటీడీ ఈవోగా చంద్రబాబు తెచ్చుకున్నారు. మరి ఇందులో అర్థమేమిటి చంద్రబాబు. అంటే చంద్రబాబు చేసే ఆరోపణలకు చిత్తశుద్ధి లేదు అనడానికి ఇది నిదర్శనం కాదా? అని అడుగుతున్నా. అదే సమయంలో టీటీడీ ఈవోగా చేసిన శ్యామలరావును తొలగించడానికి కారణాలను కూడా వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘ మీరు అధికారంలోకి రాగానే టీటీడీ ప్రక్షాళన అంటూ శ్యామలరావును తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఆయన్ను తీసేశారు. టీటీడీ ప్రక్షాళన జరిగిందా చంద్రబాబు?అని వైఎస్ జగన్ నిలదీశారు. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, అదే శ్యామలరావు టీటీడీ ఈవో ఉండగానే నాలుగు నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు వచ్చాయని, వాటిని రిజెక్ట్ చేసి పంపితే మళ్లీ దొడ్డిదారిన అవి మళ్లీ అక్కడకే వచ్చాయనేది సీబీఐ చెబుతున్న నేపథ్యంలో ఇది చంద్రబాబు ప్రభుత్వానికి మచ్చ కాదా? అని ప్రశ్నించారు జగన్. -
ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్లు
ఏపీ విజయవాడ: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. పట్టాభిపురం, నగరం పాలెం, మంగళగిరి, నల్లపాడు పోలీస్ స్టేషన్లలో తనపై అక్రమంగా కేసులు నమోదు చేశారని వాటిని క్వాష్ (కొట్టివేయాలని) చేయాలని కోరారు. ఇప్పటికే నల్లపాడు పీఎస్ కేసు క్వాష్ ఈ నెల 11కి వాయిదా పడింది. మంగళగిరిలో నమోదైన కేసులో 35 (3) BNSS ప్రొసీజర్ ఫాలో అవ్వాలని మంగళగిరి పోలీసులకు ఇవాళ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది. అంబటిపై పిటి వారెంట్ కోసం మంగళగిరి కోర్టులో మంగళగిరి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరో ఐదు కేసుల్లో క్వాష్ పిటిషన్లు వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
సీఎం చంద్రబాబుకు నిరసన సెగ
సాక్షి,కర్నూలు: సీఎం చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పర్యటనలో విద్యార్థి సంఘాలు చంద్రబాబు కాన్వాయ్ ఎదుట నిరసన చేపట్టాయి. అధికారం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదంటూ ప్రశ్నించారు.సీఎం గోబ్యాక్ అంటూ విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘం నేతలను ఈడ్చిపడేశారు. అనంతరం, విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. -
ఏపీ కూటమి ప్రభుత్వానికి ఇదో గట్టి హెచ్చరిక!
మూలకు నెట్టేసి కొట్టే ప్రయత్నం చేస్తే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందట. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా ఇప్పుడు పులుల్లా తిరగబడే పరిస్థితి వచ్చేసింది. అణచివేతలు, అడుగుఅడుగునా నిర్బంధాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడం తాజా తార్కాణం. టీడీపీ అరాచక శక్తుల దాడి బాధితుడైన వైసీపీ నేత అంబటి రాంబాబును పరామర్శకు ఈ స్థాయిలో జనాదరణ లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. కేవలం 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆరేడు గంటల సమయం పట్టిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. పైగా ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న కూటమి ప్రభుత్వం ఈ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని శతధా ప్రయత్నించింది. జగన్ టూర్లో పాల్గొనడానికి వెళుతున్నారనుకుంటే చాలు.. ప్రజలను స్టేషన్లకు తరలించారన్న వార్తలొస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలను, నేతలను ఇళ్లకే పరిమితం చేసేందుకూ ప్రయత్నాలు జరిగాయి. ఇళ్లపై నోటీసులు అతికించడం, కొందరిని గృహ నిర్బంధంలో ఉంచడం కూడా తెలియవచ్చింది. కానీ.. ఇవన్నీ జనాదరణ ముందు వెలవెలబోయాయి. జగన్ను చూసేందుకు, ఆయన వెంట నడిచేందుకు జనం ఉరకలెత్తారు. ఏడాదిన్నరగా మభ్యపెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నం.. రెడ్బుక్ పేరిట సాగిస్తున్న దమనకాండలకు విసుగెత్తిన ప్రజలు ఇక చాలన్నట్టుగా రోడ్లపైకి వచ్చారు. జగన్తోనే మేము అన్న స్పష్టమైన సంకేతం ఇచ్చారు. తమ అసహనాన్ని తెలియచేశారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తానని మాత్రమే వైఎస్ జగన్ చెప్పారు. జనం తరలి రావాలన్న పిలుపు ఎక్కడా ఇవ్వలేదు. అయినా ఆయన పర్యటన అంటే చాలు.. రహదారులు జన సంద్రమవుతున్నాయి. జగన్ కార్యక్రమాలలో ఆయన ప్రసంగం ఒక ఎత్తయితే ఆయన కోసం తరలివచ్చే జన తరంగాలు ఇంకో ఎత్తు. ఇది కేవలం అభిమానం ఒక్కటితోనే సాధ్యమయ్యేది కాదు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ, ఇష్టారాజ్య ధోరణలు కుదరవని ప్రజలిస్తున్న స్పష్టమైన సందేశం. జెన్-జీ నేతృత్వంలో నేపాల్లో జరిగిన తిరుగుబాటు లాంటిదన్నమాట. టీడీపీ గూండాలు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై జరిపిన దాడి, మరో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై పెట్రోలు బాంబులు విసరడం వంటి ఘటనలు సామాన్యులను సైతం ఆలోచించేలా చేశాయనడంలో సందేహం లేదు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే అరాచకశక్తులకు అండగా నిలబడటమూ వారిని కలవరానికి గురి చేసింది. ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడం కంటే.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమాలకు పాల్పడటంపైనే ఎక్కువ దృస్టి పెట్టిందన్న సత్యం కూడా ప్రజలకు బోధపడినట్టు ఉంది. రెడ్బుక్ అమలు సంగతి సరేసరి. జగన్ గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అంబటి టీడీపీ వారి బూతులకు స్పందించారే మినహా తనంత తాను దూషించలేదని స్పష్టం చేశారు. ఇదే విషయమై అంబటి వివరణ కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యే దంపతులు అంబటి ఇంటిపై దాడి చేయించి విధ్వంసం సృష్టించి, పార్టీ ఆఫీస్ను దగ్దం చేసిన ఘటనను విశ్లేషించి దీనంతటి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, వారి రెడ్ బుక్ అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు విషపు విత్తనాలు నాటుతున్నారని, అవి పెరిగి చెట్లుగా మారితే టీడీపీకే నష్టమని కూడా హెచ్చరించారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసినా కులమతాలను రెచ్చగొట్టేలా కూటమి నేతలు ఫ్లెక్సీలు కట్టడం ఏమిటని నిలదీశారు. జగన్ ప్రశ్నలకు ఇప్పటివరకూ సమాధానం లేదు. పైగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు లేని ఆరోపణలు మళ్లీ, మళ్లీ చేసి తిరుమల ఆలయానికి తీరని అపచారం చేస్తున్నారని, అప్రతిష్ట తెస్తున్నారని భక్తులు బాధపడుతున్నారు. అయినా వారు ఆ దిశగా ఆలోచించకుండా ఏదో కొత్త కమిటీ అంటూ మరో డ్రామాకు తెరదీస్తున్నారు. వారికి ఎల్లో మీడియా వంతపాడుతూ ప్రజల మనసులను కలుషితం చేయడానికి విశ్వయత్నం చేస్తోంది. అయితే ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తున్నారన్న విషయం నిఘా నివేదికలలో బయటపడుతోంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఏకాంత మంతనాలు జరిపి తర్జనభర్జన పడినట్లు కనిపిస్తుంది.ఎల్లో మీడియా ద్వారా జగన్ కుట్రలు చేస్తున్నారని, దీనిపై జనంలోకి వెళ్లాలని వారు భావించారని రాయించారు. నిజానికి జంతు కొవ్వు ఆరోపణ మొదలు, నెయ్యి కల్తీ అంటూ ఫ్లెక్సీలు పెట్డడం, వైసీపీ నేతలపై,వారి ఇళ్లపై దాడులు చేయించడం వరకు కుట్రలు చేస్తున్నది టీడీపీ వారైతే, ఎల్లో మీడియా మాత్రం వైసీపీ అంటూ చంద్రబాబు పాటను ప్రజలలోకి తీసుకువెళ్లాలని చూస్తూ రోజురోజుకు దిగజారుతోంది. జాతీయ మానవ హక్కుల సంఘం, హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి గుణపాఠం కలగాలి. ఏపీలో జంగిల్ రాజ్ అంటే ఆటవిక పాలన సాగుతున్న తీరును వైసీపీ ఎంపీలు సాక్ష్యాధారాలతో చూపించగలిగారు. దాంతో ఫ్యాక్ట్ కమిటీని వేస్తామని కమిషన్ ఛైర్మన్ రామసుబ్రహ్మణ్యం చెప్పారని వార్తలు వచ్చాయి. అలాగే సాల్మన్ అనే వైసీపీ కార్యకర్త టీడీపీ వారి చేతిలో హత్యకు గురవడం, దళితులను గ్రామంలోకి రానివ్వకుండా టీడీపీ వారు అడ్డుకుంటున్న వైనంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసిందన్న సమాచారం వచ్చింది. ఇక ఏపీ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలను రోడ్డుపై నడిపిస్తూ అవమానిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ వారు ఎంత పెద్ద నేరాలు చేసినా, పట్టించుకోకపోగా, కొన్నిచోట్ల వారికి పోలీసులే అండగా ఉంటున్న వైనం ప్రజలందరికి తెలిసిపోయింది.కూటమి ఇచ్చిన హామీలను విస్మరించి జనాన్ని మభ్య పెట్టడానికి పూనుకోవడం, విశాఖలో రూ.ఐదు వేల కోట్ల విలువైన భూమిని తమ బంధువైన లోక్సభ సభ్యుడు శ్రీభరత్ కాలేజీకి కట్టబెట్టడానికి సిద్దపడడం, ఇలా అనేక అంశాలలో ప్రజలకు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది.నేరుగా స్పందించలేని పరిస్థితి ఉంది కనుక, తమ వద్దకు వచ్చిన జగన్పై అభిమానం కనబరచడమే కాకుండా, తమ మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని భావించవచ్చు.ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ కళ్లు తెరుస్తుందా?ఇంకా కుట్రలనే నమ్ముకుంటుందా?,, :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబూ.. లడ్డూపై ప్రశ్నిస్తే కోపమెందుకు?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపులంటే కక్ష అని ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. తిరుమలపై రాజకీయం చేస్తున్న చంద్రబాబు ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం కాపులను టార్గెట్ చేసింది. కాపులంటేనే చంద్రబాబు కక్ష సాధింపు. వంగవీటి రంగాను హత్య చేశారు. ముద్రగడను అనేక రకాలుగా వేధించారు. అంబటి మీద దాడి చేసి ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు. ఎవరికి అన్యాయం జరిగినా వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. రేపు ఉదయం అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్నాం. దాడులు చేసిన వారిని వదిలేశారు. అంబటి రాంబాబుపై తప్పుడు కేసులు వ్యవహారంలో న్యాయ పరంగా పోరాటం చేస్తాము.మేము చేసేది సంఘీభావ యాత్ర మాత్రమే.. రాజకీయ యాత్ర కాదు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ నివేదిక జంతు కొవ్వు కలవలేదని చెప్పిన తర్వాత కూడా మరొక కమిటీ ఎందుకు?. టీటీడీ లడ్డూలో జంతు కొవ్వు ఉందని చెప్పించడం కోసం చంద్రబాబు కమిటీ వేశారా?. వైఎస్సార్సీపీ మీద నెపం నెట్టడం కోసం మరొక కమిటీ వేస్తున్నారా. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు లేదని వచ్చిన నివేదికపై మీడియా అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుంది. గతంలో తాను నాస్తికుడుని అని ప్రకటించుకున్న నాగేంద్రబాబు నేడు సనాతన ధర్మం కోసం ఎలా మాట్లాడుతున్నారు. నాగబాబు పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో ఉంది. కల్తీ లడ్డుపై పవన్ కళ్యాణ్ స్టాండ్ ఎప్పటికప్పుడు మారిపోతుంది’ అని ఎద్దేవా చేశారు.కరణం ధర్మ శ్రీ మాట్లాడుతూ..‘కాపులను కూటమి ప్రభుత్వం వేధిస్తుంది. తప్పుడు కేసులు పెడుతోంది. అంబటి రాంబాబు కుటుంబానికి కాపులు అందరూ అండగా ఉంటారు. రేపు అంబటి రాంబాబు కుటుంబాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేతలు అందరూ పరామర్శిస్తారు. రాంబాబుపై అక్రమంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. అంబటిని చంపేందుకు టీడీపీ గుండాలు ప్రయత్నం చేశారు. కాపు అనే వారికి అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
జంగిల్రాజ్పై ఆగ్రహం.. జగన్ పర్యటనల్లో జనవాహిని
ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగంతో కూటమి ప్రభుత్వపు ఆటవిక పాలన కొనసాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. తప్పుడు ప్రచారాలు, దాడులు, అరెస్టులతో ప్రతీకార రాజకీయాలు నడిపిస్తోంది. జనం ఈ జంగిల్రాజ్పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలోనే జగన్ వెంట నడుస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వెళ్లిన ప్రతీ చోటకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కూటమిని నమ్మి మోసపోయామని వాపోతున్నారు. మంచి ప్రభుత్వమంటూ ముంచేస్తోందని, పైగా శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బ తిన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ పోరాటాలకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇది సాధారణంగానే కూటమి ప్రభుత్వానికి సహించడం లేదు. అందుకే జనాలను జగన్ దగ్గరగా వెళ్లకుండా.. శతవిధాల ప్రయత్నిస్తోంది. మొన్న గుంటూరు.. ఇవాళ ఇబ్రహీంపట్నం.. మొత్తం పోలీసుల ఆంక్షల వలయమే. కేవలం జగన్ వస్తున్నారని.. వైఎస్సార్సీపీ శ్రేణులు తరలి రాకూడదనేది వాళ్ల కూటమి ఆలోచన. కానీ, ఆ కుట్రను భగ్నం చేస్తూ జనాలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఎంతలా అంటే.. జగన్ను దగ్గరుండి వాళ్లే ముందుకు తీసుకెళ్లేలా!.జగన్ పర్యటనలతో కూటమి ప్రభుత్వం వణుకుతోంది. చివరి నిమిషంలో రూట్ మార్చమని నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఆదేశించినంత మాత్రాన పోలీసులు అత్యుత్సహాం ప్రదర్శించడం ఎందుకు?. జగన్ పర్యటనకు జనం స్వచ్ఛందంగా తరలి వస్తారు అని జోగి రమేష్ అన్నారు. జగన్ పర్యటనకు రూట్మ్యాప్ ముందే సమర్పించాం. అయినా చివరి నిమిషంలో కావాలనే రూట్మ్యాప్ మార్చమని నోటీసులు ఇచ్చారు. వైఎస్ జగన్కు వచ్చే జనాదరణను ఆపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ప్లాన్లు వేసినా.. జనాన్ని ఆపలేరు. జగన్ అభిమానుల్ని ఆపే శక్తి ప్రభుత్వానికి లేదు అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జగన్ పర్యటనకు జనం రాకుండా చేయాలని కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ప్రయోగిస్తోంది. కానీ, అది జరిగే పని కాదు. ఏం జరిగినా.. జగన్ వెంటే జనం ఉంటారు అని జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. -
East Godavari: కూర్మాపురంలో పెద్దపులి.. రాత్రంతా ఆ ఇంట్లోనే..
రోజుకో రూటులో పులి తిరుగుతోంది.. ఎటెళ్తుందో ఎవరికీ అంతు‘చిక్కకుండా’ పోతోంది.. దానిని పట్టుకునేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖలు శ్రమిస్తున్నా, ఆనవాళ్లను మాత్రమే వదిలి వెళ్తోంది.. అయితే పులి పంజాకు మూగజీవులు బలైపోవడం పరిపాటిగా మారింది.. ఇలా వారం రోజులుగా అధికారులను పులి పరుగులు పెట్టిస్తోంది. ఎక్కడా ఆగకుండా రోజుకో చోట ప్రత్యక్షమవుతోంది.. దీంతో ఆయా గ్రామాల్లో భయాందోళన నెలకొంది. అదిగో పులి.. ఇదిగో పులి.. వారం రోజులుగా అందరి నోటా ఇదే మాట. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం అంతటా హాట్ టాపిక్ అయ్యింది. వెళ్లిన రూటులో వెళ్లకుండా రోజుకో రూటు మారుస్తూ, ఎవరికీ దొరకుండా తిరుగుతున్న పెద్ద పులిని పట్టుకోవడం అటవీ శాఖకు సవాలుగా మారింది. దానిని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి.ఈ క్రమంలో మూగజీవాలు దాని ఆకలికి బలైపోతున్నాయి. ఆరు రోజుల కిందట సీతానగరం మండలం తొర్రేడులో ఆవులపై దాడి చేసి ఆకలి తీర్చుకుంది. కోలమూరు, గాడాల, పాలచర్ల, దివాన్చెరువు మీదుగా రఘునాథపురం చేరుకుని గేదెను బలికొంది. తాజాగా భూపాలపట్నంలో ఆవును చంపింది. అక్కడి నుంచి జి.యర్రంపాలెం ఆయిల్పామ్ తోటల్లోకి వెళ్లిపోయింది. ఈ గ్రామంలో పులి దెబ్బకు మూడు లేగ దూడలు మృతి చెందాయి.హడలెత్తిపోతున్న జనం.. పెద్దపులి సంచారంతో రాజమహేంద్రవరం పరిసర మండలాల్లోని ప్రజలు హడలిపోతున్నారు. చిక్కదు.. దొరకదు అనే రీతిలో జరుగుతున్న పులి పయనంతో ఎప్పుడు ఎటువైపు వస్తుందోననే భయంతో అంతా వణికిపోతున్నారు. రాత్రి వేళల్లోనే కాదు పగటి సమయంలో కూడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులలో రాజానగరం మండలం దివాన్చెరువు, భూపాలపట్నం, పుణ్యక్షేత్రం, నామవరం, జి.యర్రంపాలెం, తుంగపాడు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని స్థితిలో ఉంటే పొలాల్లో ఉండే మూగజీవాలైన ఆవులు, గేదెలు, లేగదూడలు మాత్రం పెద్ద పులికి ఆహారంగా మారిపోతున్నాయి. ఆరు రోజులుగా నాలుగు ఆవులు, ఆరు లేగ దూడలు, రెండు గేదెలు పులి పంజాకు మృత్యువాత పడ్డాయి.రెస్క్యూ బృందాల రాక: జిల్లా కలెక్టర్ పెద్ద పులిని సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలేందుకు రెస్క్యూ బందాలను రాజమహేంద్రవరానికి రప్పించామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జి.యర్రంపాలెంలోని ఆయిల్పామ్ తోటల్లోకి పులి వెళ్లిందనే ప్రచారం నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని అటవీ శాఖ సిబ్బందితో కలసి కలెక్టర్ గురువారం సందర్శించి, పులి పాదముద్రలను పరిశీలించారు. పులిని పట్టుకోవడంలో నేషనల్ ఎక్స్ఫర్ట్ టీమ్ ఇప్పటికే జిల్లాకు చేరుకుందన్నారు. సీసీఎఫ్ మార్గదర్శంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన బృందాలు కూడా పనిచేస్తున్నాయన్నారు. అలాగే థర్మల్ డ్రోన్, ట్రాప్ కెమెరాలను సిద్ధం చేశామని అన్నారు.వెటర్నరీ వైద్యులు, వన్యప్రాణి నిపుణులు రంగంలోకి వచ్చారని వివరించారు. పులి జాడ తెలిసిన వెంటనే పట్టుకునే విధంగా ఏర్పాట్లు చేశారన్నారు. అయితే పులి సంచరించిన చోట పాదముద్రలను చెడగొట్టకుండా గ్రామస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పులి సంచరించే ప్రాంతాల్లోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ అ«ధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. దానిని రెచ్చకొట్టే పనులు మాత్రం చేయవద్దని కోరారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జిల్లా ఎస్పీ నరసింహకిశోర్, డీఎఫ్ఓ బి.ప్రభాకరరావు, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పీవీ చలపతిరావు, సీపీఎఫ్ బీఎన్ఎన్ మూర్తి, ఎఫ్ఆర్ఓ దావీదురాజు నాయుడు, ఎనీ్టసీఏ అధికారి రాజశేఖర్, మత్తు వైద్యులు ఫణీంద్ర ఉన్నారు. కేశవరంలోకి..మండపేట మండలం కేశవరం గ్రామ శివారు కోకాకోలా ఫ్యాక్టరీ సమీపంలోని ఉండమట్ల లక్ష్మయ్య వ్యవసాయ క్షేత్రంలో పులి సంచరిస్తోందని అధికారులు భావిస్తున్నారు. గురువారం రాత్రి సుమారు ఐదు సెకన్ల పాటు పులి సంచరించినట్టు ఆ ప్రాంతంలోని డ్రోన్ కెమెరాలో పడినట్లు చెబుతున్నారు. అయితే పులి మండపేట మండలం నుంచి పక్కన అనపర్తి మండలంలోకి వెళ్లే అవకాశం ఉండడంతో పోలీస్, అటవీ తదితర శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు.మండపేట మండలం కేశవరం ద్వారపూడి వేములపల్లి జెడ్ మేడపాడు గ్రామ పరిధిలో పులి సంచరిస్తున్నట్లు తెలిపారు. ఆ గ్రామాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయట సంచరించవద్దని మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు తెలిపారు.రాయవరం మండలంలోకి..ఇవాళ ఉదయం(శుక్రవారం) పెద్దపులి.. రాయవరం మండలంలోకి ప్రవేశించినట్లు అధికారులు చెబుతున్నారు. జి.ఎర్రం పాలెం నుంచి చెల్లూరు మీదుగా కూర్మాపురం వెళ్లిన పులి. మనుషుల్లేని ఇంట్లో రాత్రంతా ఉన్నట్లు తెలిపారు. కూర్మాపురానికి చేరుకున్న పెద్దపులి.. పాలచర్ల రాజు గారికి చెందిన ఓ ఇంట్లోకి చేరింది. కుక్కలు మొరగడంతో స్థానికులు గుర్తించారు. ఆ ఇంటి వద్దకు అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. కూర్మాపురం పరిసర గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. -
బాబు, పవన్ను వేంకటేశ్వరస్వామి క్షమించడు: ఆర్కే రోజా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని.. పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడమే అందుకు తార్కాణం అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని రోజా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పలువురు నేతలు శుక్రవారం పరిశీలించారు. జోగి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. ‘‘ఏకంగా మాజీ మంత్రి ఇంటిపైనే దాడులకు తెగబడ్డారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. పోలీసుల సమక్షంలోనే దాడులకు తెగబడుతున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం గురించి చంద్రబాబు, పవన్ నీచంగా మాట్లాడారు. వాళ్ల పార్టీకి వాళ్లే సమాధి కట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలను ఈ ఇద్దరూ క్షమాపణలు కోరాలి. కానీ, అలాంటి వాళ్లను వేంకటేశ్వరస్వామి మాత్రం క్షమించడు’’ అని రోజా కామెంట్ చేశారు. జగన్ పర్యటనకు జనం రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ జనం జగన్ వెంటే ఉన్నారని వాళ్లు గుర్తించాలి అని రోజా అన్నారు.ఏపీలో ఇలాంటి పరిస్థితి ఎన్నాడూ చూడలేదని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి తలెత్తిందని అన్నారామె. -
సుప్రీం కోర్టు కన్నా చంద్రబాబు గొప్పేంకాదు: వైఎస్ జగన్
వైఎస్ జగన్ పర్యటనపై చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. అకస్మాత్తుగా రూట్ మార్చాలంటూ పోలీసుల నోటీసులు ఇచ్చారు. గుంటూరు జన ప్రభంజనం దెబ్బకి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. నేడు జోగి రమేష్ నివాసానికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లనున్నారు. రెండు రోజుల కిందటే వైఎస్సార్సీపీ.. రూట్ మ్యాప్ ఇవ్వగా.. హఠాత్తుగా వైఎస్ జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడలోకి జగన్ని రానీయకుండా కుట్రలు పన్నుతున్నారు. -
కోనపై కాలుష్యం కాటు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతంలో ఎంతో సస్యశ్యామలంగా ఉండే తొండంగి మండలం కోన ప్రాంత ప్రజలు కాలుష్యం ముప్పుతో కలవరపడుతున్నారు. అటు పశ్చిమ గోదావరి, ఇటు విశాఖపట్నం జిల్లాల సరిహద్దుల నుంచి కొంత మంది స్వార్థపరులు పారిశ్రామిక, రసాయనిక వ్యర్థాలను ట్యాంకర్లతో తీసుకొచ్చి, ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలో కుమ్మరిస్తున్నారు.ఎటువంటి అనుమతీ లేకుండా ఇలా నెలల తరబడి ఇక్కడ ఆ వ్యర్థాలను పారబోస్తున్నారు. ఈ వ్యర్థాలను కుమ్మరించేందుకు వచ్చిన ఓ ట్యాంకర్ ఇటీవల ఏవీ నగరం వద్ద పిఠాపురం బ్రాంచి కెనాల్(పీబీసీ)కి అనుసంధానంగా ఉన్న పంట కాలువలో బోల్తా పడింది. దీంతో, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతాన్ని కాలుష్య మయం చేస్తూండటంతో ఇక్కడి పంట భూములు, తాగునీటి వనరులు కలుషితమైపోతున్నాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికార పార్టీ నేతలు పైసల కోసం కక్కుర్తి పడి ఈ ట్యాంకర్లను అడ్డుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. 50 వేల మందిపై ప్రభావం! కోన ప్రాంత ప్రజల తాగు, సాగునీటి అవసరాలకు పిఠాపురం బ్రాంచ్ కెనాలే (పీబీసీ) దిక్కు. గొల్లప్రోలు మండలం నుంచి మల్లవరం చెరువుకు అనుసంధానంగా ఉన్న ఈ కెనాల్ నుంచి సముద్ర తీరంలోని ఏవీ నగరం, రావికంపాడు గ్రామాల మీదుగా కోదాడ ఉప్పు చెరువుకు నీటిని మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి కోదాడ, శృంగవృక్షంపేట, వాకదారిపేట, గోర్సపాలెం తదితర గ్రామాల్లోని ఏడెనిమిది వేల ఎకరాలకు సాగునీరు సరఫరా చేస్తారు. ఈ ఆయకట్టుపై సుమారు 1,200 మంది రైతులు ఆధారపడి ఉన్నారు.ఏవీ నగరం శివారు కొమ్మనాపల్లిలో 2003లో అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ రెండు గ్రామాలతో పాటు కోన ప్రాంత తాగునీటి అవసరాలను తీర్చేందుకు మంచినీటి పథకం ఏర్పాటు చేశారు. ఇక్కడి తాగునీటి స్టోరేజి ట్యాంకు ద్వారా ఏవీ నగరం, రావికంపాడు, కొమ్మనాపల్లి, కోదాడ, పెరుమాళ్లపురం పంచాయతీల్లోని సుమారు 23 గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 50 వేల మందికి నిత్యం 15 లక్షల లీటర్ల తాగునీటిని పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇన్ని గ్రామాలకు తాగు, సాగు నీరు సరఫరా అవుతున్న ఈ ప్రాంతంలోనే రసాయనిక వ్యర్థాలను కుమ్మరించేస్తున్నారు.ఫలితంగా తమకు తాగేందుకు గుక్కెడు నీరు కూడా గగనమే అవుతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి పంట పొలాల్లో గతంలో రెండు పర్యాయాలు స్పిరిట్ పారబోశారు. ఫలితంగా పంట భూములు కలుషితమయ్యాయి. అయితే, ఈ విషయాన్ని అప్పట్లో తాము గుర్తించలేకపోయామని పీబీసీ ఆయకట్టు రైతులు చెబుతున్నారు. తరువాత దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు, పాలకులు ముడుపులు మెక్కి మిన్నకుండిపోయారని ఆరోపిస్తున్నారు. ‘లక్ష’ణంగా దండుకుంటున్నారు కోన ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్థాల డంపింగ్ తెలుగు తమ్ముళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. పంట భూములు కాలుష్య కాసారాలవుతున్నా.. అధికార టీడీపీలో నంబర్–2గా చక్రం తిప్పిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్వగ్రామం సైతం ఈ కాలుష్యం బారిన పడుతున్నా.. అధికార పార్టీ నేతలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. దీనినిబట్టి వారు ఏ స్థాయిలో లబ్ధి పొందుతున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వ్యర్థాల డంపింగ్కు వస్తున్న ఒక్కో ట్యాంకర్కు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకూ గుంజుతున్నారనే ఆరోపణలున్నాయి.వ్యర్థాల డంపింగ్పై ఎవరైనా ప్రశ్నించే లోపే ఆ ట్యాంకర్లను తప్పించేస్తున్నారు. గతంలో చీకటి పడిందంటే చాలు.. రావికంపాడు రైల్వే గేటు సమీపాన ఉన్న మామిడి తోటల్లో భారీ ట్యాంకర్లతో రసాయన వ్యర్థాలు పారబోసేవారు. దీనిపై అప్పట్లో రైతులు గగ్గోలు పెట్టారు. ఎంతో సస్యశ్యామలమైన కోన ప్రాంతం తమ్ముళ్ల స్వార్థానికి ఈ విధంగా బలైపోతోంది. ఏవీ నగరం వద్ద ఇటీవల ట్యాంకర్ బోల్తా పడిన వెంటనే తెలుగు తమ్ముళ్లు గుట్టు చప్పుడు కాకుండా దానిని బయటకు తీసి, వ్యవహారాన్ని చక్కబెట్టే ప్రయత్నాలు చేశారు.అయితే, సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం వైరల్ కావడంతో అధికారులు, పాలకుల తీరును రైతులు ఎండగట్టారు. ఆ సందర్భంగా రైతులను అక్కడి పోలీసులు గెంటేశారు. బాధిత రైతులకు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మద్దతుగా నిలిచారు. రసాయన వ్యర్థాల పారబోత, బోల్తా పడిన ట్యాంకర్ ఆధారంగా సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.రెండెకరాల పంట నష్టపోయాను పీబీసీ పక్కన పంట కాలువలో తరచుగా రసాయన వ్యర్థాలు పారబోస్తూండటంతో సాగునీరు కలుషితమై, పక్కనే ఉన్న నా రెండెకరాల పంట దెబ్బ తింది. రెండోసారి దమ్ము చేసి వరి నాట్లు వేయించుకోవాల్సి వచ్చింది. స్పిరిట్ పంట కాలువలో పారబోస్తూండటంతో నీరు రంగు మారడంతో పాటు చుట్టుపక్కల ఉండలేనంతగా దుర్వాసన ఉంటుంది. ఈ వ్యర్థాల పారబోత పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – సిద్దా సత్యనారాయణ, రైతు, రావికంపాడు, తొండంగి మండలం నీరు కలుషితం కాకుండా చూడాలి పీబీసీ వద్ద ఆరెకరాల్లో వరి సాగు చేస్తున్నాను. పీబీసీ ద్వారా కొమ్మనాపల్లి వాటర్ స్టోరేజీ ట్యాంకుకు నీటిని పంపి, అక్కడి నుంచి రావికంపాడుతో పాటు ఏవీ నగరం, కోన గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. రసాయన వ్యర్థాలు పారబోయడంతో పంట కాలువలోని నీరు కలుషితమవుతోంది. దీంతో, తాగునీటి సరఫరా నిలిపివేశామని అధికారులు చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యం, పంటల సాగును దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాంతంలో రసాయన వ్యర్థాలు పారబోయడాన్ని పూర్తిగా నియంత్రించాలి. – వెల్నాటి గంగారావు, రైతు, రావికంపాడు, తొండంగి మండలం -
సొంత వైద్యం.. మొదటికే మోసం
పుట్టపర్తికి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి వారం క్రితం జలుబు చేసింది. ఈ క్రమంలో గూగుల్లో మాత్రల కోసం వెతికి స్థానికంగా ఉండే ఓ మెడికల్ స్టోర్లో రెండు, మూడు రకాల మాత్రలు తీసుకుని మింగాడు. జలుబుతో పాటు దగ్గు, జ్వరం ఎక్కువైంది. మాట్లాడేందుకు కూడా కాలేదు. వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాడు. మోతాదుకు మించి మందులు తీసుకోవడంతోనే సమస్య తలెత్తినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సుమారు రూ.10 వేల వరకు ఖర్చు అయినట్లు బాధితుడు తెలిపాడు.ధర్మవరానికి చెందిన ఓ 55 ఏళ్ల మహిళకు జనవరి రెండో వారంలో జ్వరం సోకింది. వెంటనే తనకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా మందుల ఫొటోలు తెప్పించుకుంది. అనంతరం స్థానికంగా ఓ మెడికల్ షాపులో వాటిని తెచ్చుకుని మింగింది. మరుసటి రోజున ఉదయం నుంచి వాంతులు కావడంతో పాటు నీరసం వచ్చి స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన పలు పరీక్షలు చేసిన తర్వాత రోగానికి సంబంధం లేని మాత్రలు మింగడంతో సమస్య తలెత్తిందని తేల్చాడు. అప్పటికే సుమారు రూ.5 వేల వరకు ఖర్చయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వీరే కాదు.. జిల్లాలో చాలామంది ఇటీవల సొంతంగా వైద్యం చేసుకుంటున్నారు. మొదటికే మోసం తెచ్చుకుంటున్నారు. సాక్షి, పుట్టపర్తి: ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే గూగుల్లో పరిశోధించి మందులు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య సత్యసాయి జిల్లాలో రోజురోజుకీ పెరిగిపోతోంది. అందులోనూ ఎక్కువగా పారాసిటమాల్ మాత్రను కొనుగోలు చేస్తున్నారు. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జ్వరం, జలుబు ఏది సోకినా.. డాక్టర్ను సంప్రదించకుండానే ఆ మాత్రను మింగేయడం అలవాటుగా మార్చుకున్నారు. డాక్టర్ ఇచ్చిన మందుల గురించి కూడా గూగుల్లో వెతికి వాటి ద్వారా వచ్చే దుష్ఫలితాలను తెలుసుకుని వాడకుండా పడేస్తున్నారు. సొంత నిర్ణయాలు తీసుకుని కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. అతి తెలివితో ప్రమాదం పల్లె ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేని వారు ఏ చిన్న అనారోగ్యం వచ్చిన డాక్టర్ను సంప్రదిస్తున్నారు. అయితే విద్యావంతులు, ఉద్యోగులు ఆస్పత్రులకు వెళ్లలేక స్మార్ట్ఫోన్ ద్వారా గూగుల్లో పరిశోధించి మెడిసిన్ కొనుగోలు చేస్తున్నారు. అలాంటి మందులు తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా దీర్ఘకాలిక రోగాలకు దారి తీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలామంది కిడ్నీ బాధితుల్లో అతిగా మాత్రల వినియోగంతోనే సమస్య తలెత్తినట్లు చెబుతున్నారు. విచ్చలవిడిగా విక్రయాలు డాక్టర్ ప్రి్రస్కిప్షన్ లేకున్నా మెడికల్ షాపుల్లో విచ్చలవిడిగా మందులు విక్రయిస్తున్నారు. మొబైల్లో చూపించినా, వాట్సాప్ ద్వారా డాక్టర్ను సంప్రదించినట్లు తెలిపినా మందులిస్తున్నారు.డాక్టర్ను సంప్రదించకుండా వెళ్లే వారిని మెడికల్ షాపుల నిర్వాహకులు కట్టడి చేసే అవకాశం ఉన్నప్పటికీ వ్యాపారం పోగొట్టుకోలేక విక్రయాలు చేస్తున్నారు. వైద్యులను సంప్రదించాలి జబ్బు చేసినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి. గూగుల్లో పరిశోధించి కొనే మాత్రలతో లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. డాక్టర్ వద్దకు వెళ్తే రోగ తీవ్రత ఆధారంగా మాత్రల మోతాదు ఇస్తారు. అతి తెలివి ప్రదర్శించి లేని పోని రోగాల బారిన పడొద్దు. జబ్బు ముదిరి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. గూగుల్లో దొరికే సమాచారమంతా కచ్చితమైనది కాదు. – డాక్టర్ ఫైరోజబేగం, డీఎంహెచ్ఓ -
సాగర తీరాన సమర భేరి
విశాఖ సిటీ : భారత నావికాదళ చరిత్రలో మరో కీలక ఘట్టానికి విశాఖ వేదిక అవుతోంది. దశాబ్ద కాలం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు మెగా ఈవెంట్లకు ముస్తాబవుతోంది. ఈ నెల 15 నుంచి 25 వరకు తీరం అంతర్జాతీయ నౌకా బలగా లతో కిక్కిరిసిపోనుంది. ఈ నెలలో 18వ తేదీన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), 19న మిలాన్– 2026 విన్యాసాలతో పాటు 20న ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం(ఐఓఎన్ఎస్) సదస్సుకు అతిథ్యమిస్తోంది. ప్రపంచ దేశాల మధ్య మైత్రిని పెంపొందించడం, సముద్ర భద్రతలో పరస్పర సహకారాన్ని చాటుతూ ఈనెల 21 నుంచి 25 వరకు భారత నౌకాదళం నిర్వహించే ప్రతిష్టాత్మక ‘మిలాన్–2026 సీ ఫేజ్’ విన్యాసాలకు మెరుగులు దిద్దుకుంటోంది. దశాబ్ద కాలం తర్వాత ఐఎఫ్ఆర్ సముద్ర భద్రత, సహకారం, స్థిరత్వం, సమన్వయాన్ని పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా ఈ ఫ్లీట్ రివ్యూ ఉంటుంది. దేశ చరిత్రలోనే మొదటి సారిగా అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్షను 2016లో ఇక్కడే నిర్వహించారు. దాదాపు పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్ఆర్–2026కు సాగరతీరం రెండోసారి ఆతిథ్యమిస్తోంది. ఈనెల 15 నుంచి 20వ తేదీల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈసారి ఫ్లీట్ రివ్యూకు ’యునైటెడ్ త్రూ ఓషన్స్’ (సముద్రాల ద్వారా ఏకమవుదాం) అనే ప్రత్యేక థీమ్తో నిర్వహిస్తున్నారు. తీరప్రాంత భద్రత, బ్లూ ఎకానమీ, కొత్త సాంకేతికత అనే అంశాలపై ఫ్లీట్ రివ్యూలో చర్చించనున్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు సముద్ర గర్భంలో భారత రక్షణ శక్తి సామర్థ్యాలు ఆవిష్కృతం కానున్నాయి. రాష్ట్రపతి సమక్షంలో ‘ఫ్లీట్ రివ్యూ’ ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం ఈనెల 18న జరగనుంది. భారత రాష్ట్రపతి, త్రివిధ దళాల సర్వసైన్యాధ్యక్షురాలు ద్రౌపదీ ముర్ము విశాఖ తీరంలో జరిగే నౌకల కవాతుకు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆమె ప్రెసిడెన్షియల్ యాచ్లో నౌకాదళ విన్యాసాలను పరిశీలిస్తారు. భారత నౌకాదళానికి చెందిన సుమారు 90 యుద్ధ నౌకలు, 45 విమానాలతో పాటు సుమారు 20కి పైగా విదేశీ యుద్ధ నౌకలు సముద్రంలో బారులు తీరి రాష్ట్రపతికి వందనం సమర్పిస్తాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసాలు ఐఎఫ్ఆర్, మిలాన్ విన్యాసాలకు భారతదేశం తన స్వదేశీ రక్షణ పరిజ్ఞానాన్ని ఈ వేదికపై ప్రపంచానికి చాటి చెప్పనుంది. సముద్రం పైన యుద్ధ నౌకలు ఉంటే, ఆకాశంలో యుద్ధ విమానాలు గర్జించనున్నాయి. విమానవాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈ విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటు ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మోర్ముగావ్ వంటి శక్తివంతమైన డిస్ట్రాయర్లు, కల్వరి క్లాస్ సబ్ మెరైన్లు పాల్గొంటాయి. అలాగే అత్యాధునిక డిస్ట్రాయర్లు ఐఎన్ఎస్ విశాఖపట్నం, తారాగిరి సముద్ర గర్భం నుంచి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే యుద్ధ విన్యాసాలను భారత నేవీ ప్రదర్శించనుంది. గగనతలంలో నౌకాదళానికి చెందిన మిగ్–29కె ఫైటర్ జెట్లు, పి–8ఐ నిఘా విమానాలు, సముద్రపు గద్దలుగా పేరుపొందిన ఎంహెచ్–60ఆర్ రోమియో హెలికాప్టర్లు, సీ కింగ్, ధృవ్ హెలికాప్టర్లు ఆకాశంలో అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించనున్నాయి. విదేశీ వైమానిక దళాలకు చెందిన ఆధునిక విమానాలు కూడా ఈ ప్రదర్శనలో భాగం కానున్నాయి. 60కి పైగా దేశాల భాగస్వామ్యం ఐఎఫ్ఆర్, మిలాన్ కోసం భారత నౌకాదళం మొత్తం 137 దేశాలకు ఆహా్వనం పింపింది. ఇందులో ఇప్పటి వరకు 60కి పైగా దేశాలు భాగస్వామ్యం అవుతున్నట్లు ధృవీకరణ వచ్చింది. ఇందులో 4 వేల మంది విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నారు. అలాగే విదేశీ నౌకాదళాధిపతులు 25 నుంచి 30 మంది వరకు రానున్నారు. ఇందులో అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, ఇరాన్ వంటి దేశాల నుంచి 23కి పైగా యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచే వివిధ దేశాల నౌకలు విశాఖ తీరానికి చేరుకోవడం ప్రారంభమవుతుంది.విన్యాసాల షెడ్యూల్ ఇలా..⇒ ఈ నెల 15న నావల్ బేస్ వద్ద ‘మిలాన్ విలేజ్’ ప్రారంభమవుతంది. 21వ తేదీ వరకు భారతీయ హస్తకళలు, సంస్కృతి, సంప్రదాయాలు అద్దం పట్టే కార్యక్రమాలు, రుచికరమైన వంటకాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ⇒ 18వ తేదీ ఉదయం అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ప్రారంభమవుతుంది. ⇒ 19వ తేదీ ఉదయం మిలాన్–2026 రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఆరంభమవుతుంది. ⇒ 19వ తేదీ సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్డులో అంతర్జాతీయ సిటీ పరేడ్ జరగనుంది. ఇందులో దేశ విదేశీ నౌకాదళాల కవాతు, ఎయిర్ పవర్ డెమో (వైమానిక ప్రదర్శన) ఉంటాయి. ⇒ 19, 20 తేదీల్లో మిలాన్ విన్యాసాల్లో భాగంగా ’హార్బర్ ఫేజ్’లో అంతర్జాతీయ సెమినార్లు, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. ⇒ 20న ఐవోఎన్ఎస్ సదస్సు జరగనుంది. ఇందులో హిందూ మహాసముద్ర దేశాల నౌకాదళాధిపతులు భేటీ అవుతారు. ఇందులో 25 సభ్యదేశాలు, 9 అబ్జర్వర్ దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ⇒ 21 నుంచి 25 వరకు ‘మిలాన్’ సీ ఫేజ్ విన్యాసాలు జరుగుతాయి.మిత్ర దేశాల కలయిక.. మిలాన్–2026 ఈనెల 19న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ చేతుల మీదుగా ‘మిలాన్–2026’ విన్యాసాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ‘సౌభ్రాతృత్వం, సహకారం, సమన్వయం‘ అనే నినాదంతో ఈ విన్యాసాలు జరగనున్నాయి. దీనికి సుమారు 137 దేశాలను ఆహ్వానించారు. ఇప్పటివరకు 60కి పైగా దేశాలు తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించాయి. మిలాన్ విన్యాసాలు రెండు దళల్లో జరుగుతాయి. ఈ నెల 19, 20 తేదీల్లో ‘హార్బర్ ఫేజ్’లో భాగంగా అంతర్జాతీయ సెమినార్లు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. 21 నుంచి 25 వరకు ‘సీ ఫేజ్’ ప్రారంభమవుతుంది. ఈ దశలో సముద్ర తీరంలో వివిధ దేశాల నౌకలు ఉమ్మడిగా యుద్ధ విన్యాసాలు, కమ్యూనికేషన్ డ్రిల్స్ నిర్వహిస్తాయి.రక్షణ దళాల సమీకరణ (బలగాల వివరాలు) మొత్తం యుద్ధ నౌకలు - 110కి పైగా (భారత్ + విదేశీ)భారత నౌకాదళ నౌకలు - 90 వరకు విదేశీ యుద్ధ నౌకలు - 23 నుంచి 25 విమానాలు హెలికాప్టర్లు - 60కి పైగా ప్రధాన యుద్ధ నౌకలు - ఐఎన్ఎస్ విక్రాంత్, విక్రమాదిత్యపాల్గొనే దేశాలు, ప్రతినిధులు అంశం - వివరాలు మొత్తం ఆహ్వానిత దేశాలు - 137 భాగస్వామ్యాన్ని ధృవీకరించిన దేశాలు - 60+ విదేశీ ప్రతినిధుల సంఖ్య - సుమారు 4వేలు విదేశీ నౌకాదళాధిపతులు - 25 నుంచి 30 మంది -
జనాదరణకు బెంబేలెత్తి.. జగన్ పర్యటనపై ఆంక్షల కత్తి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న జనాదరణ చూసి చంద్రబాబు కూటమి ప్రభుత్వం బెంబేలెత్తుతోంది. జగన్ పర్యటనలప్పుడు ఎక్కడికక్కడ పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజాభిమానాన్ని నియంత్రించాలని చూస్తున్నా, సర్కారు కుయుక్తులు పారడం లేదు. బారికేడ్లు, చెక్ పోస్టులు, ఇతరత్రా అడ్డంకులను అధిగమించి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తుండటంతో చంద్రబాబు సర్కారుకు దిక్కుతోచడం లేదు. ఇలాగే వదిలేస్తే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత అత్యంత తీవ్రంగా ఉందనే సంకేతాలు వెళతాయని ఆందోళన చెందుతోంది. బుధవారం గుంటూరు పర్యటనలో వైఎస్ జగన్ ప్రజా ప్రభంజనాన్ని చూసి, శుక్రవారం పర్యటనకు మరింత అడ్డంకులు కలిగించేలా కుట్రకు తెరలేపింది. శుక్రవారం కనదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండు, భవానిపురం, గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లి, టీడీపీ మూకల దాడిలో దెబ్బతిన్న మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసాన్ని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. జోగి రమేశ్ను పరామర్శించునున్నారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రెండు రోజుల క్రితమే రూట్ మ్యాప్ను విడుదల చేసింది. అయినప్పటికీ గురువారం రాత్రి రూట్ మ్యాప్ మార్చుకోవాలంటూ విజయవాడ సీపీ రాజశేఖరబాబు ద్వారా నోటీసులు ఇప్పించడం ప్రభుత్వ కుట్రకు అద్దం పడుతోంది. బెజవాడలో బ్రహ్మరథం పడతారని.. జననేత పర్యటన విజయవాడ మీదుగా సాగనున్న నేపథ్యంలో ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటోంది. బెజవాడలోనూ జననేత వైఎస్ జగన్కు ప్రజలు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందని పసి గట్టిన ప్రభుత్వం, రూట్ మ్యాప్ మార్చడం ద్వారా జనాభిమానాన్ని అడ్డుకోవచ్చుననే ఎత్తుగడకు తెరలేపిందని పరిశీలకులు చెబుతున్నారు. పరామర్శకు వెళ్తున్న వారిని మీరు ఆ రూట్లో వెళ్లకండి, ఈ రూట్లో వెళ్లండి అని పోలీసులు సూచించడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే భావన వ్యక్తమవుతోంది. పోలీసులూ పెద్ద బాస్ చెప్పిందే తడవుగా, ఆయన వద్ద మార్కులు కొట్టేందుకు నోటీసులు జారీ చేశారనే చర్చ సాగుతోంది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నప్పుడూ పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. దాడిలో పాల్గొన్న వారిపై నామమాత్రం కేసులు పెట్టి, తిరిగి బాధితులపైనే తీవ్ర కేసులు నమోదు చేసి స్వామి భక్తి ప్రదర్శించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసులు అభాసుపాలయ్యారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీ సాకుతో.. ఇదిలా ఉంటే ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కనకదుర్గ వారధి మీదుగా కాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేశ్ ఇంటికి వెళ్లాలని వైఎస్ జగన్కు నోటీసు అందించినట్లు ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు ప్రకటన ద్వారా తెలిపారు. -
నేడు జోగి రమేష్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. టీడీపీ గూండాలు దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించి, జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం వైఎస్ జగన్ తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
శ్రీవారి పేరుతో జగన్పై కుట్ర
సాక్షి ప్రతినిధి, తిరుపతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామినే రాజకీయ ఆయుధంగా మార్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. దైవ ద్రోహం పేరుతో వైఎస్ జగన్పై కుట్రకు తెగబడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ తాము తప్ప మరెవ్వరూ భక్తులు కారన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గతంలో తన రాజకీయాల కోసం వ్యవస్థలను వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు తిరుమల శ్రీవారినే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో గురువారం భూమన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు లేదని సీబీఐ సిట్ తేల్చిచెప్పినా చంద్రబాబు అబద్ధాలు, దుష్ప్రచారం ఆగడంలేదని మండిపడ్డారు. భూమన ఇంకా ఏమన్నారంటే..అడ్డంగా దొరికి చంద్రబాబు నంగి మాటలు..గత పత్రికా సమావేశంలో నోటికొచ్చినట్లు మాట్లాడిన కూటమి నేతలు ఇవాళ ప్రజలకు దొరికిపోయామన్న భావన వారి మాటల్లో స్పష్టంగా కనిపించింది. సీబీఐ సిట్ నివేదికతో పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు ఇప్పుడు కూటమి పార్టీలనూ తన తప్పులో భాగస్వామ్యులను చేస్తున్నాడు. గత పదేళ్లలో పవన్కళ్యాణ్ అనేకసార్లు ‘నేను బాప్టిజమ్ తీసుకున్నాను. మా నాన్న దేవుడి దీపంతోనే సిగరెట్ ముట్టించేవాడు. మా ఇంట్లో ఏ రకమైన దైవ పూజలు జరగవు.. అవసరమైతే నేను గొడ్డు మాంసం తింటాను’.. అంటూ చెప్పాడు. ఆయన ఇవాళ సనాతన హైందవ ధర్మ పరిరక్షక అవతారిగా మారి చంద్రబాబు ఆలోచనలకు అమ్ముడుపోయాడు. ఆలయాలపై మీ అరాచకాలు మర్చిపోయావా బాబూ.. తన హయాంలో పదుల సంఖ్యలో దేవుడి ఆలయాలను కూల్చివేసిన చంద్రబాబు ఇప్పుడు జగన్ దేవాలయాలన్నీ నాశనం చేశాడంటున్నారు. నిజానికి.. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాకే తిరుమల కొండ మీద మద్యం, మాంసాలు దొరికాయి. బిర్యానీలు తింటూ, తాగి గొడవలు చేస్తూ పట్టుబడ్డారు. కొద్దిరోజుల కిందటే మద్యం బాటిళ్లు విచ్ఛలవిడిగా పడి ఉంటే.. దాన్ని ప్రశ్నించిన మా పార్టీ కార్యకర్త మీదే కేసు బనాయించారు. బాబు హయాంలోనే వైకుంఠ ఏకాదశి రోజు జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు. అయోధ్య లడ్డూల పైనా అబద్ధాలు..పవన్కళ్యాణ్ అయితే మరింత దారుణంగా.. అయోధ్యకి పంపించిన లడ్డూలు కల్తీ అన్న విషయాన్ని ఆ రోజు ఎవరో చెబితే మాట్లాడానని చెప్పిన వ్యక్తి.. ఇవాళ మళ్లీ అయోధ్యకి పంపిన లడ్డూలు జంతుకొవ్వుతో తయారుచేసినవే అని మాట్లాడుతున్నాడు. ఆ రోజు అయోధ్యకు పంపించిన లక్ష లడ్డూలు.. మీ ప్రభుత్వ హయాంలోనే పాలక మండలి సభ్యుడైన సౌరబ్ బోరా రూ.30 లక్షల విలువైన నెయ్యి డొనేషన్తో తయారుచేసి అయోధ్యకి పంపించారు. పవన్కళ్యాణ్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. వైవీ సుబ్బారెడ్డే సీఎఫ్టీఆర్ఐ రిపోర్టు కోసం పంపిస్తే.. ఆయనే తొక్కి పెట్టారని చెప్పడం అసమంజసం. అసలు విచారణకు పంపించిందే మేమైతే తిరిగి మాపైనే లాజిక్ లేకుండా అపవాదులు వేస్తున్నారు. అడ్డంగా దొరికిపోవడంతో ఏకసభ్య కమిషన్తో కుట్ర..ఇక సీబీఐ సిట్ మమ్నల్ని దోషులుగా ప్రకటించలేదు. దీంతో వారు అడ్డంగా దొరికిపోవడంతో ఇప్పుడు ఏకసభ్య కమిషన్ అంటున్నారు. ఇది మమ్మల్ని ఎలాగైనా నేరస్తుల్ని చేయాలన్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇవాళ నేరస్తుడిగా ఉన్న ప్రీమియర్ డెయిరీ 2014–19 వరకు 80 శాతం మేర మీ హయాంలోనే నెయ్యి సరఫరా చేసింది. క్షమాపణ చెప్పాల్సిందే..మేం తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ సిట్ మమ్మల్ని దోషులుగా నివేదికలో పేర్కొనలేదు. అయినా మాపై దారుణంగా దుష్ప్రచారం చేస్తున్న మీరు క్షమాపణ చెప్పాల్సిందే. వైఎస్ రాజశేఖర్రెడ్డి రెండు కొండలే చేశాడని చంద్రబాబు మరో పచ్చి అబద్ధం కూడా చెబుతున్నాడు. అయితే, 2007 మే 12న వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో చాలా స్పష్టంగా మొత్తం 120 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏడు కొండలు శ్రీ వేంకటేశ్వరస్వామివే అని జీఓ ఇచ్చారు. ఈ నిజాలన్నింటినీ దాచి చంద్రబాబు మమ్నల్ని దైవ ద్రోహులుగా చిత్రీకరించే అతిపెద్ద కుట్రకు తెగబడుతున్నాడు. మీలాంటి వాళ్లను మాత్రం దేవదేవుడు క్షమించడు.శ్రీవారి విశేష సేవలో వైఎస్సార్, జగన్..వాస్తవానికి.. వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన దైవసేవ ఎవ్వరూ చేయలేదు. అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం చేయాలన్న ఆలోచన కూడా ఎప్పుడూ మీకు రాలేదు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో మా హయాంలోనే పాదరక్షలు ధరించకూడదని నిబంధన విధించాం. శ్రీ వేంకటేశ్వరస్వామి అఖండ కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ కూడా మా హయాంలోనే తీసుకొచ్చాం.కొండమీద హరినామ సంకీర్తన ఏర్పాటుచేసింది, నాద నీరాజనాన్ని తీసుకొచ్చింది కూడా మేమే. తిరుమలలో నిరంతరాయంగా భాగవతం, భారతంతో పాటు వేదఘోష నిర్వహించాలని నిర్ణయం కూడా మేమే తీసుకున్నాం. వందకు పైగా పీఠాధిపతులతో సదస్సులు కూడా నిర్వహించాం. అన్యమతాల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేసిన మంగళసూత్రాలతో దాదాపు 46 వేల పెళ్లిళ్లు కూడా మా హయాంలోనే నిర్వహించాం. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ, గ్రామానికి శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని కూడా మేమే తీసుకెళ్లాం. వైఎస్ జగన్ హయంలో దేశవ్యాప్తంగా స్వామివారి ఆలయాలు.. అంతేకాదు.. ఇవాళ మేం కొత్తగా ఐదు వేల ఆలయాలను కట్టబోతున్నామని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి.. వైఎస్ జగన్ హయాంలోనే రాష్ట్రవ్యాప్తంగా 3,500 ఆలయాలు కట్టారు. వాటి నిర్మాణ భాగస్వామ్యం ఆరెస్సెస్కు సంబంధించిన సంస్థకు అప్పగించాం. మా హయాంలో శ్రీవాణి పథకంపై విమర్శలు చేసిన మీరు ఇవాళ అదే శ్రీవాణి డబ్బుతో అమరావతిలో గుడి కడుతున్నారు. అదే డబ్బుతో గట్టు ఆంజనేయస్వామికి పవన్కళ్యాణ్ డబ్బులిప్పించారు. జమ్మూకశ్మీర్లోనూ, నవీ ముంబై, విశాఖలో శ్రీవారి ఆలయాలను వైఎస్ జగన్ నిర్మించారు. చెన్నైలో పద్మావతి ఆలయాన్ని నిర్మించారు. కానీ, మీరు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామికి చెందిన రూ.3 వేల కోట్ల విలువైన స్థలాన్ని ప్రైవేటు హోటల్కి కట్టబెట్టారు. వైకుంఠ ఏకాదశికి 10 రోజులు ఎందుకని ప్రశ్నించారు. మీరెన్ని అభాండాలు వేసినా వైఎస్సార్సీపీ హయాంలో ఎలాంటి తప్పులూ జరగలేదు.కల్తీ నెయ్యితో చేసిన లడ్డూలకు నెయ్యి అద్దింది మీరే..భోలేబాబాను చంద్రబాబు 2018లోనే రప్పించారు. అలాగే, గత ప్రభుత్వ పాలనలో లడ్డూ నాణ్యత బాగోలేదు.. అందుకే భక్తుల సంఖ్య తగ్గిపోయిందని దారుణమైన అబద్ధాలు చెబుతున్నారు. దీనిపై మీరు విచారణకు సిద్ధమా? ఇక 2018 ఫిబ్రవరిలో లడ్డూలకు వాసన రావడానికి మీరు రోజుకు 975 కేజీల నెయ్యిని రూ.3.87 కోట్లకు కొన్నారు. (ఆధారాలు చూపించారు). అంటే.. మీరు ఆ రోజు కల్తీ నెయ్యితో లడ్డూలు తయారుచేయడంవల్ల అవి వాసన రాకుండా వాటిపై మళ్లీ నెయ్యి అద్దడం కోసమే రూ.3.87 కోట్లతో నెయ్యి కొన్నారు. ఇది మీ హయాంలోనే జరిగిన విషయం. కొద్దిమంది అవినీతి అధికారులు, మీ హయాంలో మీరు ఏర్పాటుచేసిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్, డెయిరీ సంస్థలు కుమ్మక్కై చేసిన నేరాన్ని సిట్ బయటపెట్టింది. -
మా పార్టీ అధికారంలో ఉంది.. దిక్కున్న చోట చెప్పుకోండి
ఒంగోలు టౌన్: జిల్లా కేంద్రమైన ఒంగోలు నార్త్ బైపాస్లోని హెచ్సీజీ క్యాన్సర్ ఆస్పత్రి వెనక ఉన్న కార్మిక నగర్ను బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు నేలమట్టం చేశారు. సుమారు 200 మంది ప్రైవేటు సైన్యం, మూడు జేసీబీలను తీసుకొచ్చి కాలనీపై విరుచుకు పడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. ముక్తినూతలపాడు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 186లో సుమారు 12 ఎకరాల ఈనాం భూములు ఉన్నాయి. గత 11 ఏళ్లుగా కూలినాలి చేసుకునే కొందరు నిరుపేదలు రేకుల షెడ్లు, గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. కాలనీలో విద్యుత్, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు లేనప్పటికీ కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల కార్మికనగర్లో భూముల విలువ భారీగా పెరిగింది. ఎకరం రూ.12 కోట్ల చొప్పున పలుకుతుండడంతో అధికార పార్టీకి చెందిన బడా నాయకుల కన్నుపడింది. శరవేగంగా తెరవెనుక తతంగం నడిపించారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు. అయినా నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 7 గంటల సమయంలో టీడీపీ నేతలు తమ ప్రైవేటు సైన్యంతో కార్మిక నగర్లోకి ప్రవేశించారు. అక్కడ 60 ఇళ్లల్లో నివాసం ఉండే నిరుపేదలకు ఏం జరుగుతుందో తెలియలేదు. చీకట్లోనే జేసీబీలతో ఇళ్లను వరుసగా నేలకూల్చారు. అడ్డు వచ్చిన వారిని బెదిరించడంతో పాటు దాడికి దిగారు. ఒక ఇంటిని తగులబెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. కేవలం గంటన్నర లోపే కాలనీలో షెడ్లు, గుడిసెలు నేలమట్టయ్యాయి. బాధితుల రోదనలు మిన్నంటినా పట్టించుకునే వారు లేరు. మహిళలు అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. కనీసం సామాన్లు సర్దుకునేందుకు సమయం ఇవ్వమంటూ కాళ్లు చేతులు పట్టుకుని బతిమాలినా వినలేదని బాధిత మహిళలు రోదిస్తున్నారు. అడ్డు వస్తే మనుషులను కూడా కూల్చేస్తాం.. ‘ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉంది.. ఇప్పుడు కాకపోతే మరోసారి ఈ భూములను తీసుకోలేం.. మీకు దిక్కున్నచోట చెప్పుకోండి’ అని బెదిరింపులకు దిగినట్లు చెబుతున్నారు. ఇప్పుడు కేవలం ఇళ్లను మాత్రమే కూల్చేశాం.. రేపు అవసరమైతే మనుషులను కూడా ఇలాగే కూల్చేస్తామని హెచ్చరించినట్లు బాధితులు వాపోయారు. ఇదంతా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులే చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విధ్వంసం జరుగుతున్న సమయంలో ఒక మహిళా ఏఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ విషయమై తాలుకా సీఐ విజయకృష్ణను విచారించగా డయల్ 100కు ఫోన్ వస్తే తమ సిబ్బంది వెళ్లారని, ఏదో భూవివాదం జరుగుతుండడంతో తమకు సంబంధం లేదని.. వెనక్కి వచ్చేశారని చెప్పారు. జేసీబీల విషయం తమకు తెలియదని.. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
చంద్రబాబు సర్కారుకు ‘వక్ఫ్’ దెబ్బ
సాక్షి, అమరావతి: రూ.వందల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతం కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం జరగాల్సిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు సమావేశానికి సభ్యులంతా గైర్హాజరవడంతో సమావేశం వాయిదా వేయాల్సి వచ్చింది. చినకాకాని, మల్లాయపాలెంలోని వక్ఫ్ భూముల అన్యాక్రాంతాన్ని నిరసిస్తూ సభ్యులు తీసుకున్న నిర్ణయం మేరకు సమావేశానికి గైర్హాజరు కావడం వక్ఫ్ బోర్డు చరిత్రలోనే సంచలనంగా మారింది. వక్ఫ్ ఆస్తులను ఏపీఐఐసీకి బదలాయించి.. ఆపై ఇండ్రస్టియల్ ఎస్టేట్ పేరుతో అయిన వారికి ఫలహారంగా పంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. గురువారం ఉదయం వక్ఫ్ బోర్డు సమావేశం నిర్వహిస్తున్నట్టు బుధవారం అర్ధరాత్రి వాట్సాప్ ద్వారా సమాచారం (అజెండా) ఇవ్వడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మెప్పు కోసం వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలపై మండిపడ్డారు. వారంతా మూకుమ్మడిగా గైర్హాజరవడంతో చేసేది లేక సమావేశాన్ని వాయిదా వేసినట్టు చైర్మన్ అజీజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు 13వ సమావేశానికి కొంతమంది సభ్యులు అత్యవసర పరిస్థితుల కారణంగా హాజరు కాలేకపోయారని, అందరూ ఉన్నప్పుడే సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పీపీపీ అంటూ కొత్త పల్లవి వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేసేందుకు వేసిన భూ సేకరణ పాచిక పారకపోవడంతో ఇప్పుడు పీపీపీ పద్ధతి, దీర్ఘకాలిక లీజు అంటూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త పల్లవి అందుకుంది. వాస్తవానికి వక్ఫ్ బోర్డు చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన టైటిల్ను వేరొక సంస్థకు, ప్రభుత్వ శాఖకు బదలాయించకూడదు. అయినా మల్లాయపాలెం, చినకాకాని వక్ఫ్ భూములపై ప్రభుత్వం దొంగాట ఆడుతోందని ముస్లిం నేతలు మండిపడుతున్నారు. గతేడాది గుంటూరు జిల్లా పెద్ద మసీదుకు చెందిన ప్రత్తిపాడు మండలం మల్లాయపాలెంలోని 226 ఎకరాల వక్ఫ్ భూమిని ఏపీఐఐసీకి భూ సేకరణ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి సేకరించేందుకు చేసిన ప్రయత్నాలపై ముస్లిం నేతలు, వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలతో వక్ఫ్ బోర్డు వెనకడుగు వేసింది. దీంతో భూ సేకరణ ద్వారా ఆ భూముల్ని ఇవ్వడం లేదని.. పీపీపీ లేదా లీజు పద్దతిలో ఇస్తామంటూ వక్ఫ్ బోర్డు సమావేశ అజెండాలో పేర్కొన్నారు. గతంలో సభ్యుల గైర్హాజరుతో రెండు పర్యాయాలు సమావేశాలు వాయిదా పడ్డాయి. చివరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ సొంత ప్రాంతమైన నెల్లూరులో నిర్వహించిన మూడవ సమావేశంలో గుంటూరు మసీదుకు చెందిన వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతానికి తాము వ్యతిరేకమని, పీపీపీ పద్ధతి, దీర్ఘకాలిక లీజుకు సైతం సభ్యులు అంగీకరించకపోడంతో బోర్డు నిర్ణయం తీసుకోలేకపోయింది. తాజాగా గుంటూరు అంజుమన్–ఇ–ఇస్లామియా సంస్థకు చెందిన చినకాకానిలోని 71.57 ఎకరాల భూమిని భూ సేకరణ ద్వారా ఏపీఐఐసీకి ఇచ్చేందుకు నిర్ణయించారు.ముస్లిం పెద్దల ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం మళ్లీ పీపీపీ, దీర్ఘకాలిక లీజు పల్లవిని అందుకుంది. చివరకు మల్లాయపాలెం, చినకాకాని భూములను పీపీపీ, దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేలా తీర్మానం చేసేందుకు వక్ఫ్ బోర్డు సమావేశ అజెండా చేర్చారు. దీనికి కూడా సభ్యులు దీటైన బదులివ్వడం చర్చనీయాంశంగా మారింది. వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతాన్ని వ్యతిరేకిస్తూ వక్ఫ్ బోర్డు సమావేశానికి గైర్హాజరైనట్టు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, వక్ఫ్బోర్డు సభ్యుడు ఎండీ రుహుల్లా ప్రకటించారు. మల్లాయపాలెం, చినకాకానిలోని వక్ఫ్ భూములను ఏపీఐఐసీకి అప్పగించేలా సమావేశ అజెండాలో పేర్కొనడాన్ని నిరసిస్తూ సమావేశానికి సభ్యులు హాజరు కాలేదన్నారు. -
పీజీ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఓ యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. విధి నిర్వహణలో ఉన్న ఆమె ఆపరేషన్ థియేటర్లోనే కుప్పకూలి మరణించారు. అనంతపురానికి చెందిన డాక్టర్ బత్తుల దీపిక(26) అక్కడి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎనస్థీషియా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఆమె బుధవారం ప్రభుత్వాస్పత్రి ‘సీ’ బ్లాక్లోని జనరల్ సర్జరీ ఆపరేషన్ థియేటర్లో మరో పీజీ వైద్య విద్యార్థినితో కలిసి నైట్ డ్యూటీలో ఉన్నారు. ఆమె రాత్రి పది గంటలకు సహచర విద్యార్థితో క్యాంటీన్ నుంచి ఆహారం తెప్పించుకుని తిన్నారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో డాక్టర్ దీపిక నలతగా ఉందని, వాంతులు అయ్యేట్లు ఉన్నాయని చెప్పడంతో సహచర పీజీ విద్యార్థి ఆమె చేతికి కాన్సులా పెట్టి జోఫర్ ఇంజక్షన్ చేసినట్లు చెబుతున్నారు. అనంతరం డాక్టర్ దీపిక ఆపరేషన్ థియేటర్ చాంబర్లోని రూమ్లో ఉండగా, మరో విద్యార్థి 1.10 గంటల సమయంలో సర్జరీకి కేసును తీసుకొచ్చేందుకు వెళ్లారు. ఆమె తిరిగి 1.40 గంటలకు ఆపరేషన్ థియేటర్ చాంబర్కు వచ్చి చూడగా, డాక్టర్ దీపిక కనిపించలేదు. సర్జరీ చేసే థియేటర్కు వెళ్లగా, డాక్టర్ దీపిక ఒక మూలన కుప్పకూలి ఉంది. దీంతో ఇతర సిబ్బందిని పిలిచి పరిశీలించగా, అప్పటికే శ్వాస తీసుకోవడం లేదని గ్రహించి వెంటనే ఆర్ఐసీయూకు తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించింది. కాగా, డాక్టర్ దీపిక తండ్రి బత్తుల కోదండరామిరెడ్డితోపాటు తల్లి భారతి కూడా వైద్యశాఖలో పని చేస్తున్నారు. సోదరి డాక్టర్ మౌనిక హైదరాబాద్లో గైనకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మృతికి తెలియని కారణం తొలుత హార్ట్ అరెస్ట్ కారణంగా డాక్టర్ దీపిక మృతిచెంది ఉండవచ్చని సహచరులు, వైద్యులు భావించారు. ఆ తర్వాత ఇంజక్షన్ విషయం బయటకు వచ్చింది. దీంతో ఇంజక్షన్ వికటించి మరణించిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఐవీ ఇచ్చినప్పుడు హార్ట్ అరెస్ట్ కావడం చాలా అరుదని వైద్యులు చెబుతున్నారు. కాగా, డాక్టర్ దీపిక నోటి వెంట నురగ రావడం, చేతికి కాన్సులా పెట్టి ఉండటం, మరోచోట బ్యాండెడ్ వేసి ఉండటంతో ఆమె ఇంకా వేరే ఇంజక్షన్ ఏమైనా చేసుకున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆమెకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు లేవని కుటుంబ సభ్యులతోపాటు సహచర విద్యార్థులు చెబుతున్నారు. రాత్రి 1.10 గంటల వరకు బాగానే ఉన్న తమ కుమార్తె 30 నిమిషాల్లోనే మరణించడంపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. డాక్టర్ మౌనిక ఫిర్యాదు మేరకు విజయవాడ మాచవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. గురువారం పోలీసులు మృతురాలి తల్లిదండ్రులు వచ్చి ఆపరేషన్ థియేటర్కు సంబంధించిన సీసీ ఫుటేజీలను పరిశీలించారు. బుధవారం రాత్రి వైద్యులు మినహా బయటి వ్యక్తులు ఎవరూ ఆపరేషన్ థియేటర్కు వెళ్లలేదని నిర్ధారణకు వచ్చారు. డాక్టర్ దీపిక తన రూమ్ నుంచి థియేటర్కు వెళ్తున్న దృశ్యాలు కూడా రికార్డు అయ్యాయి. డాక్టర్ దీపిక మృతికి కచ్చితమైన కారణం తెలియడం లేదని, పోస్టుమార్టం నివేదికలో తేలుతుందని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు తెలిపారు. -
‘చలో పోతిరెడ్డిపాడు’ గ్రాండ్ సక్సెస్
సాక్షి ప్రతినిధి కర్నూలు: చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. గురువారం ఉదయం సభ.. బుధవారం మధ్యాహ్నం వరకు పోలీసులు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వ పెద్దలు అడ్డుపడ్డారు.. అనుమతి నిరాకరించి సభ జరగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ కుట్ర పసిగట్టిన వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ నేత కాటసాని రాంభూపాల్రెడ్డితో పిటిషన్ వేయించింది. దీంతో సభకు కొన్ని గంటల ముందు అనుమతి లభించింది. ఈ క్రమంలో గోపాల్రెడ్డి పొలంలో సభ నిర్వహించుకునేందుదు ఆత్మకూరు డీఎస్పీ అనుమతిచ్చారు. దీంతో బుధవారం మధ్యాహ్నం తర్వాత నేతలు అక్కడికి చేరుకున్నారు.కాటసాని రాంభూపాల్రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ధారా సుధీర్ తదితరులు రాత్రంతా పనులు చేయించి తెల్లవారే సరికి వేదికను సిద్ధం చేశారు. నేతలంతా చేయి చేయి కలిపి సభను గ్రాండ్ సక్సెస్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ను పూర్తి చేయిస్తామని శపథం చేశారు. అయినా చంద్రబాబు చలించకపోతే జగన్ అధికారంలోకి రాగానే తక్కిన పనులు పూర్తి చేస్తామని ప్రతినబూనారు. సభకు వచ్చిన వారే కాదు ‘గ్రేటర్ రాయలసీమ’ పరిధిలోని ప్రతి ఇంట్లో సభను లైవ్లో వీక్షించారు. గురువారం గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఏ పల్లెలో, ఎక్కడ నలుగురు గుమికూడినా రాయలసీమ లిఫ్ట్పైనే చర్చ జరిగింది.ఇంత తక్కువ వ్యవధిలో ‘సీమ’ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం నేతలు, కార్యకర్తలు, రైతులు సభకు వేలాదిగా తరలి రావడం గమనార్హం. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలు తరలివచ్చారు. పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సీమకు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని నేతలు వివరిస్తున్నప్పుడు రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. స్వచ్ఛందంగా తరలి వచ్చిన రైతులు‘చలో పోతిరెడ్డిపాడు’ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్సీపీ నేతలతో పాటు రైతులు సైతం సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. జనాలను తరలించేందుకు ఎవరూ కూడా ఒక బస్సు, లారీ ఏర్పాటు చేయలేదు. నందికొట్కూరు, పాణ్యం, ఆత్మకూరుతో పాటు నంద్యాల జిల్లాలోని నియోజకవర్గాలు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎవరికి వారు సొంత ఖర్చులతో తరలి రావడం విశేషం. గురువారం ఉదయం 10 గంటలకే రైతులు చేరుకున్నారు. నేషనల్ హైవే నుంచి పోతిరెడ్డిపాడు వరకు ట్రాఫిక్ జాం అయితే రైతులు పొలాల గట్ల వెంట నడుస్తూ వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ సభ పూర్తయ్యే వరకూ ఓపిగ్గా నేతల ప్రసంగాలను ఆలకించారు.కుర్చీలు లేకపోతే వేదిక చుట్టూ వేల సంఖ్యలో నిల్చుని ఆద్యంతం నేతల ప్రసంగాలు విన్నారు. దీన్నిబట్టి ప్రభుత్వం ఎంతగా అణిచి వేయాలని చూసినా, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు తమకు ఎంత విలువైందో చాటి చెప్పారు. ప్రాజెక్టు కోసం ఎందాకైనా ఉద్యమించాలనే కసి, పట్టుదల స్పష్టంగా కన్పించింది. సభ నిర్వాహకులను సజ్జల, పెద్దిరెడ్డి తదితర నేతలు అభినందించారు.ఈ కార్యక్రమంలో కర్నూలు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, రమేష్ బాబు, రామసుబ్బారెడ్డి, కల్పలతా రెడ్డి, కర్నూలు పార్లమెంటు పరిశీలకులు గంగుల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, బ్రిజేంద్రా రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కంగాటి శ్రీదేవి, కేతిరెడ్డి వెంకటరావిురెడ్డి, దుద్దేకుంట శ్రీధర్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, అంజద్ బాషా, రఘురామి రెడ్డి, అన్నా రాంబాబు, శ్రీకాంత్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, తలారి రంగయ్య, కర్నూలు మేయర్ బీవై రామయ్య, కోడుమూరు ఇన్చార్జి ఆదిమూలపు సతీష్, కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
కళ్లలో కారం కొట్టి.. కత్తితో గొంతు కోసి!
చిత్తూరు అర్బన్: వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్త, అత్తను చంపేయాలని మహిళ చెప్పడంతో వృద్ధురాలిని హత్య చేయబోయాడు ఓ బాలుడు. చిత్తూరు వన్టౌన్ సీఐ మహేశ్వర కథనం మేరకు.. చిత్తూరు నగరం, గిరింపేటకు చెందిన ఓ 17 ఏళ్ల బాలుడు స్థానికంగా నివాసం ఉంటున్న 37 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు పెళ్లయి, 15 ఏళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బాలుడితో ఉన్న బంధం కారణంగా తరచూ ఇంట్లో గొడవలు అయ్యేవి. ఈ నేపథ్యంలో తమకు అడ్డుగా ఉన్న తన భర్త, అత్తను చంపేయాలని ఆ మహిళ, బాలుడికి అతను చెప్పడంతో బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి కళ్లల్లో కారం కొట్టి, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి హత్యకు ప్రయత్నించాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు గమనించి, ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని ప్రేరేపించిన మహిళ పరారీలో ఉండటంతో ఆమె కోసం గాలిస్తున్నారు. -
సీబీఐ క్లీన్చిట్పై ‘ఏకసభ్య’ డ్రామా!
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారానికి సీబీఐ సిట్ రిపోర్టుతో చెక్ పడటం.. కథ అడ్డం తిరగడంతో ఇప్పుడు ఏకసభ్య విచారణ కమిషన్ అంటున్నారని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. ప్రభుత్వాన్ని తదుపరి చర్యలు తీసుకోమని సీబీఐ సిట్ చెప్పలేదని.. దోషులపై చర్యలు తీసుకోవాలని మాత్రమే చెప్పిందని గుర్తు చేశారు. మరి సిట్ రిపోర్టులో వైఎస్సార్సీపీ నేతల పేర్లు ఎక్కడైనా ఉన్నాయా? అని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు, సీబీఐ సిట్ చార్జిషీట్లో స్పష్టంగా తేల్చినా నిస్సిగ్గుగా ఇంకా కుట్రలు పన్నుతారా? అని ధ్వజమెత్తారు. ఏమీ లేకపోయినా రాజకీయ కుట్రలతో వైఎస్సార్ సీపీపై మూకుమ్మడిగా విష ప్రచారానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సుప్రీం’ జోక్యంతో సాగని బాబు ఆటలు.. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిశాయని దారుణమైన అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. తన ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్ను నియమించి వాటినే రిపోర్టులో ఇచ్చేద్దామని భావించారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ సిట్ ఏర్పాటు కావడంతో ఆయన ఆటలు సాగలేదు. సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ దర్యాప్తులో అన్నీ తేలిపోవడంతో.. చంద్రబాబు తనను తదుపరి చర్యలు తీసుకోమని చెప్పిందంటున్నారు. కానీ సీబీఐ సిట్ చెప్పింది.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోమనే. ఆ దోషుల్లో మీరు ఇంతగా విషం చిమ్ముతున్న జగన్ పేరు ఉందా? సిట్ రిపోర్టులో జగన్ కానీ, అప్పటి దేవదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేరు కానీ, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీటీడీ ఈవో, జేఈవో.. ఎవరి పేర్లు ఉన్నాయో చెప్పండి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం సిఫార్సు చేసిన అధికారులే ఇందులో ఉన్నారు. ఈ పాపం వైఎస్ జగన్కు ఆపాదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నెయ్యి కిలో రూ.291కే మీరు కొనలేదా? శ్రీవారి ప్రసాదంలో కెమికల్స్ కలిశాయని, మార్కెట్ కన్నా తక్కువ రేటు రూ.319కే ఎలా ఆవు నెయ్యి కొన్నారని అడుగుతున్నారు. తక్కువ రేటుకు నెయ్యి కొన్నారు కాబట్టి కల్తీ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీలో ఇద్దరు అధికారులు హర్‡్ష ఫ్రెష్ అనే డెయిరీని 2019 ఫిబ్రవరిలో ఆమోదిస్తే... ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. నాడు ఫిబ్రవరి తర్వాత ఉన్న ప్రభుత్వం మాదే అయితే మే నెలలో ఈసీతో పోట్లాడి మీరు క్యాబినెట్ మీటింగ్ ఎలా పెట్టారు? ఎలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు? పోలింగ్ తర్వాత కూడా మీ ప్రభుత్వం యాక్టివ్గానే పని చేసింది. 2019లో జగన్ సీఎం కాకముందే మీ ఆపద్ధర్మ ప్రభుత్వంలోనే ఈ హర్‡్ష ఫ్రెష్ డెయిరీని తీసుకొచ్చారు. ఆ తర్వాత అదే భోలే బాబా డెయిరీగా పేరు మార్చుకుంది. అప్పట్లో వీళ్లు 82 వేల కేజీలు ట్యాంకర్లలో, 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. మీరు కిలో నెయ్యి రూ.291కి ఎలా కొన్నారు? మా హయాంలో రూ.319, రూ.329కి కొనుగోలు చేస్తే తప్పు అంటున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా.. టెండర్లు వివరాలు తేదీలతో సహా బయటపెట్టండి. ఎవరు దొంగో ఎవరు దొరో తేలుతుంది. రోజుకో మతం పేరుతో పవన్ డ్రామా.. పవన్ కళ్యాణ్ ఉచ్ఛం నీచాలు మరిచి విషం చిమ్మే వ్యక్తి! క్రిస్టియన్ అంటారు.. బాప్టిజం తీసుకున్నా అంటారు. నన్ను, చంద్రబాబును తిడుతుంటే మీరు కాచుకోరా? అని పవన్ కళ్యాణ్ ఆయన అన్నయ్యను తిట్టారని జనసేన నేతలే చెబుతున్నారు. దేవుడంటే భయం లేని వారు ఇవాళ మాట్లాడుతున్నారు. అదే అన్నయ్య.. గతంలో దేవుడే లేడని అంటాడు! దేవుడిని విమర్శించను.. లేని వారి గురించి ఎలా మాట్లాడతా? అంటాడు. తమ్ముడు కోటింగ్ ఇచ్చాక బయటికి వచ్చి.. నేను సనాతన హిందువును! వైఎస్ జగన్ క్రిస్టియన్ అంటూ దిగజారి మాట్లాడుతున్నాడు. రామతీర్ధంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన వాళ్లెవరో పవన్కు తెలియదా? ఆ ఘటన తర్వాత నెల రోజుల్లో కొత్తగా విగ్రహం చేయించి హైందవ సంప్రదాయాల ప్రకారం గత ప్రభుత్వం పునఃప్రతిష్టించిన విషయం తెలియదా? అంతర్వేది రథాన్ని కాల్చారంటూ మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్.. మీ ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం పక్కన పెంటపాడులో రథాన్ని తగలబెడితే చర్యలు తీసుకున్నారా? అంతర్వేదిలో దగ్ధమైన రథాన్ని మేం మళ్లీ ఉత్సవాల కల్లా కొత్తది చేయించి పెట్టాం. మరి మీరు పెంటపాడులో రథం తిరిగి చేయించారా? గుళ్లు ధ్వంసం చేసిన చరిత్ర బాబుదే 2015–16లో విజయవాడలో కృష్ణా పుష్కరాల పేరుతో పలు ఆలయాలను ధ్వంసం చేసిన చంద్రబాబు... 250 గుళ్లు జగన్ ధ్వంసం చేశారని అనటానికి సిగ్గుందా? మతం పేరుతో విషం చిమ్ముతున్న మీ ప్రభుత్వంలో జరిగిన ఘటనలే కదా అవి. ఉత్సవమూర్తులే కాదు.. గర్భగుడిలో ఉన్న మూర్తులను కూడా మీ ప్రభుత్వంలో ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన గుళ్లలో కనీసం సంప్రోక్షణ చేశారా? అపచారం చేశామని చెంపలు వాయించుకున్నారా? ఎక్కడైనా మెట్లు కడిగారా? మీరు కూలదోసిన ప్రతీ ఆలయాన్ని జగన్ తిరిగి నిర్మించారు. దేవుడి మీద పగ పెట్టుకున్నారని అంటున్న పవన్.. ఆ దేవుడిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నందుకు ఏమైపోతారో ఆలోచించుకోవాలి. అయోధ్యకు జంతుకొవ్వు, పందికొవ్వుతో లక్ష లడ్డూలు పంపించారని పవన్ ఈ రోజుకూ మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నీచమైన రాజకీయం ఉంటుందా? నాటి టీటీడీ బోర్డు సభ్యులు సౌరభ్ బోరా, మైహోం రామేశ్వరరావు అయోధ్యకు శ్రీవారి ప్రసాదం లక్ష లడ్డూలు పంపిద్దామని, అందుకు కావాల్సిన శ్రేష్టమైన 2 వేల కిలోల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు. ఈ నిర్ణయానికీ, మా ప్రభుత్వానికీ సంబంధం లేదు. అది టీటీడీ బోర్డు నిర్ణయమే. కానీ పవన్ కళ్యాణ్ కొవ్వుతో చేసిన లడ్డూలు పంపించారని ఇవాళ్టికీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. జగన్ హిందూ ధర్మాన్ని గౌరవించలేదంటున్న పవన్.. తోలు బూట్లు వేసుకుని దేవుడికి పూజలు చేస్తూ హారతిస్తున్న మీ మిత్రుడు చంద్రబాబును ఏమంటారు? తండ్రి చనిపోయినా తలనీలాలు ఇవ్వని పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నట్లా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాజకీయాల్లో పతనానికి పరాకాష్ట. తిరుమలను దివ్యక్షేత్రంగా ప్రకటించింది వైఎస్సారే ఏడు కొండలను నాడు వైఎస్సార్ రెండు కొండలు అన్నారంటూ చంద్రబాబు, పవన్ దు్రష్పచారం చేస్తున్నారు. తిరుమల ఏడు కొండలను దివ్యక్షేత్రం అని పిలవాలని, ఆ కొండల మీద అన్యమత ప్రచారం నిషిద్ధమని 2007 జూన్ 2న వైఎస్సార్ జీవో ఇచ్చింది నిజం కాదా? ఇప్పుడు సర్వనాశనం అయిపోయేది, మట్టికొట్టుకుపోయేది ఎవరో పవన్ కళ్యాణ్ చెప్పాలి. తమ ఇంట్లో నుంచి చూస్తుంటే ఏడు కొండలు కనిపిస్తాయని, భక్తి పారవశ్యం చెందుతున్నట్లు చంద్రబాబు చెబుతున్న మాటలు.. వందకోళ్లను తినేసే తోడేలు సాయంత్రం ప్రవచనాలు చెబుతున్నట్లుంది! మీ మాటలు నమ్మటం లేదని పవన్ కళ్యాణ్తో చెప్పిస్తున్నట్లున్నారు. జనం ఆయన మాటలు కూడా నమ్మడం ఎప్పుడో మానేశారు.జంతు కొవ్వు ప్రచారం మీ నలుగురిదే వైఎస్ జగన్ క్రిస్టియన్ అని... శ్రీవేంకటేశ్వరస్వామికి హిందూ భక్తులను తగ్గించేయడానికే ఇదంతా చేశారని నిర్లజ్జగా పిచి్చమాటలు చెబుతున్న మీకు.. కల్తీ నెయ్యి నాలుగు ట్యాంకర్లు వాడి లడ్డూలు తయారు చేసినా నీచం అనిపించదు! జంతువుల కొవ్వు లేదని ఎవరు చెప్పారని గద్దిస్తున్న చంద్రబాబు... అది ఉందని ఎవరు చెప్పారో బయటపెట్టాలి. చంద్రబాబు, పవన్, లోకేశ్, పురందేశ్వరి మినహా నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఎవరూ చెప్పలేదు. 80 ఏళ్ల వయసులో ఏం మూటగట్టుకుపోదామని ఈ డ్రామాలు చంద్రబాబూ? పవన్ కళ్యాణ్ ఒక్కో దశలో ఒకలా.. క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, హిందువు అని మాట్లాడుతుంటారు. పీఏ అప్పన్నకు రూ.4.65 కోట్లు వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. మరి మీ పీఏ శ్రీనివాస్కు రూ.2 వేల కోట్లు వచ్చాయని ‘ఈడీ’ చెప్పిన విషయాన్ని మర్చిపోతున్నారు. అది బహిర్గతం కాగానే ఆయన విదేశాలకు పారిపోయాడు. మీరు తిరిగి ముఖ్యమంత్రి కాగానే అమెరికా నుంచి తిరిగి ఇక్కడ వాలిపోయాడు. వైఎస్ జగన్ను రాజకీయంగా దెబ్బతీసి తానూ, తన కుమారుడు కలకాలం అధికారంలో ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. సీబీఐ సిట్ చార్జ్షీట్లో ఎక్కడా వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ వితండవాదం చేస్తున్నారు. రేపు కొత్త కమిషన్ (వన్మెన్ కమిషన్) వేసి జగన్ను, వైవీ సుబ్బారెడ్డిని చేర్చే దుర్బుద్ధితో ఉన్నారని దీన్నిబట్టి అర్ధం అవుతోంది. దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా వీళ్ల మాటలున్నాయి. మతం పేరుతో జగన్ను నాశనం చేయాలని ఇలాంటి విషపూరిత మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అపచారాలను ప్రశ్నించాలని, కట్టడి చేయాలని స్వామీజీలను ప్రవచనకారులను, హైందవ ధర్మ పరిరక్షకులను కోరుతున్నాం.ఇప్పుడు చెప్పండి.. ఎవరు పాపాత్ములు? శ్రీవేంకటేశ్వరస్వామివారికి తలపెట్టిన అపచారం తన మనసులో దహించేయడం వల్లే ప్రెస్మీట్లో అస్మదీయులు అడుగుతున్న ప్రశ్నలను కూడా చంద్రబాబు భరించలేకపోతున్నారు. టీటీడీని ప్రక్షాళన చేయమని మీరు బాధ్యతలు అప్పగించిన ఈవో శ్యామలరావు ఇప్పుడు అక్కడ ఎందుకు లేరు? చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నియమించిన ఈవో శ్యామలరావు... నాలుగు ట్యాంకర్ల నెయ్యి కల్తీ జరిగిందని వెనక్కి పంపేశామని, వాటి శాంపిల్స్ ఎన్డీడీబీ ల్యాబ్కు పంపితే వనస్పతి ట్రేసెస్ ఉన్నాయని తేలిందని చెప్పారు. ఇందులో జంతువుల కొవ్వు కలిసిందని ఆయన ఎక్కడా చెప్పలేదు. కేవలం వనస్పతి కలిసిందని మాత్రమే చెప్పారు. జంతుకొవ్వు కలిసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని లోకేశ్, చంద్రబాబు చెప్పారు. ఆవునెయ్యి కాకుండా జంతువుల కొవ్వు, నాసిరకం సరుకులతో జగన్ లడ్డూలు చేయించారని, తాము మాత్రం నాలుగు లారీలను వెనక్కి పంపామని చెప్పుకున్నారు. ఏఆర్ డెయిరీ నుంచి తెప్పించి వెనక్కి పంపిన నాలుగు లారీలు వైష్ణవీ డెయిరీకు వెళ్లాయని సిట్ రిపోర్టులో పేర్కొంది.ఈ విషయం భోలేబాబా వాళ్లే విచారణలో చెప్పారు. నెల రోజుల పాటు ఈ నాలుగు ట్యాంకర్లు కాళహస్తిలోని ఓ పెట్రోల్ బంకులో నిల్వ ఉంచి చివరికి సీలు కూడా తీయకుండా, సరుకు మార్చకుండా తిరిగి వైష్ణవీ డెయిరీ పేరుతో కొండపైకి పంపారు. లడ్డూల్లో కలిపేశారు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు పాపాత్ములు? ఎవరు మట్టికొట్టుకుపోవాలి? ఎవరు సర్వనాశనం అవుతారు? -
సమాధానం చెప్పలేక బాబు అసహనం
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ వ్యవహారం గురించి మాట్లాడేందుకు జనసేన, బీజేపీతో కలసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తీవ్ర అసహనం ప్రదర్శించారు. సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేయడంపై తన అనుకూల మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులతో సీఎం గురువారం సమావేశం నిర్వహించి లడ్డూ వ్యవహారంపై చర్చించారు. అనంతరం వారందరితో పాటు ఐదుగురు మంత్రులతో కలసి మీడియాతో మాట్లాడారు. సిట్ చార్జిషీట్లో జంతువుల కొవ్వు లేదని ఉంది కదా? అన్న విలేకరుల ప్రశ్నకు ఒక్కసారిగా ఆయనలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘లేదని ఎక్కడుంది..? నీకేమైనా కల వచ్చింందా..? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా..? వాట్ ఆర్ యూ టాకింగ్..? మర్యాదగా చెబితే వినాలి..’ అంటూ చిందులు తొక్కారు. ఆ ప్రశ్న అడిగింది ఎల్లో మీడియా రిపోర్టరే కావడంతో కొంత తమాయించుకున్నా, ఆగ్రహాన్ని మాత్రం దాచుకోలేకపోయారు. సిట్ వేసిన చార్జిషీట్ ఇంకా నంబర్ అవలేదని, ఒక నివేదికను తమకు పంపి చర్యలు తీసుకోవాలని కోరిందని తెలిపారు. దానిపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైతే కోర్టుకు అదనపు వివరాలు ఇస్తామని చెప్పారు. సిట్ నివేదికలో రసాయనాలు, పామాయిల్తో నెయ్యి తయారైనట్లు ఉందన్నారు. సీబీఐ నివేదికలో ఎక్కడా కల్తీ లేదని చెప్పలేదన్నారు. ఎన్డీడీబీ నివేదికలోని అంశాన్నే తాను ప్రస్తావించానని చెప్పారు. హిందూ మతంలో విడాకులు ఇవ్వడం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఎన్డీడీబీ నివేదికను చంద్రబాబు తమకు చదివి వినిపించారని పవన్ కళ్యాణ్ చెప్పారు. టీటీడీ సహా అనేక పెద్ద ప్రాజెక్టుల్లో అక్రమాలకు గత ప్రభుత్వం తెర తీసిందని పీవీఎన్ మాధవ్ ఆరోపణలు చేశారు. -
‘లిఫ్ట్’ తాకట్టుపై ‘సీమ’ కన్నెర్ర
సాక్షి, ప్రతినిధి, కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఆయన ఏలుబడిలో అప్పుడు, ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు సహా రాయలసీమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబుతో మాట్లాడి ఆపించానని స్వయంగా తెలంగాణ సీఎం చెప్పడమే ఇందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగిపోయిన లిఫ్ట్ పనులను రెండు నెలల్లో తిరిగి ప్రారంభించాలని, లేదంటే ఉద్యమం మహోగ్ర రూపం దాలుస్తుందని స్పష్టం చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరించారు. రాయలసీమలో పుట్టి.. పుట్టిన గడ్డకే ద్రోహం చేయడం చంద్రబాబుకే చెల్లిందని ధ్వజమెత్తారు. లిఫ్ట్ను వెనువెంటనే పూర్తి చేయాల్సిందిపోయి.. ప్రాజెక్టు దండగంటూ తన టీడీపీ నేతలతో దుష్ప్రచారం చేయించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. చేసిన తప్పులను సరిదిద్దుకోకపోతే ప్రజలు తరిమికొడతారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేయాల్సిందేనని తీర్మానం చేశారు. చంద్రబాబు, రేవంత్రెడ్డి చీకటి ఒప్పందంలో భాగంగా నిలిచిపోయిన ‘రాయలసీమ లిఫ్ట్’ పనులు పూర్తి చేయాలనే డిమాండ్తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాడులో గురువారం ‘చలో పోతిరెడ్డిపాడు’ పేరుతో పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అధ్యక్షత బహిరంగ సభ నిర్వహించింది. ఆగిపోయిన లిఫ్ట్ పనులను పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నేతలు పరిశీలించిన అనంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సభ ప్రారంభమైంది. సీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఆవశ్యకత, చంద్రబాబు ప్రభుత్వం చేసిన ద్రోహం.. ‘సీమ’లోని కూటమి నేతల నిర్లిప్తత, ప్రభుత్వంపై భవిష్యత్తులో ఉద్యమించే తీరుపై పార్టీ నేతలు ప్రసంగించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలు, భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ప్రభుత్వం స్పందించి రెండు నెలల్లో పనులకు పూనుకోకపోతే రైతులతో కలిసి కడపలో భారీ ఎత్తున మహా సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాధాన్యతపై ఆరు జిల్లాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తామని హెచ్చరించారు. చలో పోతిరెడ్డిపాడు సభకు భారీగా తరలి వచ్చిన రైతులు ‘సీమ’లో పారే ప్రతి నీటి బొట్టుపై వైఎస్సార్ పేరు 40 ఏళ్ల కిందట వైఎస్సార్ చేసిన పాదయాత్ర, నిరాహార దీక్షతోనే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు బీజం పడింది. ఆ రోజు వైఎస్సార్తో పాటు నడిచిన కాటసాని, చవ్వా రాజశేఖర్రెడ్డి ఈ రోజు ఈ వేదికపై కూడా ఉన్నారు. రాయలసీమ, నెల్లూరుకు వెళ్లే ప్రతీ నీటి చుక్కపై వైఎస్సార్ పేరు ఉంది. ఇది చరిత్ర, ఎవ్వరూ మార్చలేరు. రాయలసీమ లిఫ్ట్ పనులు 80 శాతం పూర్తి చేశాం. తక్కిన 20 శాతం పూర్తి చేస్తే కనీసం మంచి పని చేసిన పేరైనా చంద్రబాబుకు ఉండేది. అది కూడా లేకుండా ప్రాజెక్టును ఆపి ద్రోహం చేశారు. రేవంత్రెడ్డి మాటలతో వాస్తవాలు వెలుగు చూశాయి. రేవంత్రెడ్డి తన మాటలపై కావాలంటే నిజ నిర్ధారణ కమిటీకి సిద్ధమని ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పలేదు. ప్రాజెక్టు దండగని టీడీపీ నేతలతో ప్రచారం చేయిస్తున్నాడు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు భయపడి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలు యథేచ్ఛగా అక్రమ ప్రాజెక్టులు నిర్మించి మనకు దక్కాల్సిన నీటిని తోడేస్తున్నాయి. నీళ్లు, రైతు, వ్యవసాయం బాగుంటే రాష్ట్రమంతా బాగుంటుంది. ఈ ఆలోచన వైఎస్కు ఉంది కాబట్టే పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కులకు పెంచారు. పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేపట్టారు. 2014–19లో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఆ పనులు పూర్తి చేయలేదు. 2019లోజగన్ అధికారంలోకి వచ్చాక ఆర్అండ్ఆర్ పూర్తి చేసి ప్రాజెక్టును వాడకంలోకి తెచ్చారు. రాయలసీమ లిఫ్ట్తో జగన్ చేసిన మేలు ప్రతీ ఇంటికీ తెలియాలి. పూర్తయ్యే దశలోని ప్రాజెక్టును చంద్రబాబు ఆపి మహాపాపం చేశారు. మూల్యం చెల్లించుకోక తప్పదు – సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప బాబుకు ఏమీ పట్టదు కరోనా సంక్షోభాన్ని లెక్క చేయకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు చివరి దశకు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్దే. రెండేళ్లలోనే 80 శాతం పనులు పూర్తి చేశారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారు. రాయలసీమ లిఫ్ట్ నిలిచిపోతే కేసీ కెనాల్, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, ఎస్సార్బీసీకి నీళ్లుండవు. అనంతపురం రైతులకు మేలు చేయాలని హంద్రీ–నీవా కాలువను 3,800 నుంచి 6,500 క్యూసెక్కులకు జగన్ పెంచారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పనులు నిలిపేశారు. అంతేకాదు రూ.2 వేల కోట్లతో కాంక్రీట్ లైనింగ్ పనులు చేశారు. చంద్రబాబు ప్రాతినిథ్యం వహించే కుప్పానికి నీరిచ్చిన ఘనత కూడా జగన్దే. గాలేరు–నగరి ద్వారా చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు నీళ్లిచ్చే పనులను 50 శాతం పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని కూడా పక్కన పెట్టేసింది. ‘సీమ’లోని ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కానీయకుండా చంద్రబాబు అమరావతి జపం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పాట్లు పడుతున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నాడు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ ఏకతాటిపై పోరాడుదాం 1986లో లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు వైఎస్సార్తో కలిసి నేను పాదయాత్ర చేశాను. వైఎస్ కృషితోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఎనీ్టఆర్ 4 వేల నుంచి 11 వేల క్యూసెక్కులకు పెంచారు. దీన్ని 44 వేల క్యూసెక్కులకు వైఎస్సార్ పెంచారు. అలాగే హంద్రీ–నీవా, గాలేరు–నగరి లాంటి ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేసి భగీరథుడిగా నిలిచారు. జగన్ 80 శాతం పూర్తి చేసిన రాయలసీమ లిఫ్ట్ను చంద్రబాబు నిలిపేశారు. రాయలసీమ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అంతా ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబు సర్కారుపై పోరాడాలి. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు మోసాలను ప్రతి ఒక్కరికీ వివరించాలి తిరుమల లడ్డూ విషయంలోనే భక్తుల మనోభావాలతో ఆడుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై ప్రజలను మాయ చేయడం చిన్న విషయం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే చంద్రబాబు.. జగన్కు మంచి పేరొస్తుందని రాయలసీమ ప్రాజెక్టును ఆపేశాడు. ఆంధ్రాకు సీఎంగా ఉండి, చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశాడని రుజువైనా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. చంద్రబాబుకు రాయలసీమ మీద ఏమాత్రం ప్రేమ లేదని 40 ఏళ్లుగా ఆయన్ను చూసిన వారికి ఎవరికైనా తెలిసిపోతుంది. ఇలాంటి చంద్రబాబు మెడలు వంచి ఆపేసిన ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా ఒత్తిడి తీసుకొద్దాం. చంద్రబాబు మోసాలను గ్రేటర్ రాయలసీమ పరిధిలో ప్రతి పౌరుడికీ తెలిసేలా వివరిద్దాం. – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రబాబుకు వ్యవసాయం అంటే చిన్నచూపు రాయలసీమకు చంద్రబాబు చేసిన మోసం బహిర్గతం అయ్యాక ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన టీడీపీ నాయకులు ఈ ప్రాజెక్టు దండగ అన్నట్లు తప్పుడు ప్రచారం ప్రారంభించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్న చంద్రబాబు.. ఇతర సీఎంలు ప్రారంభించిన ప్రాజెక్టులకు శిలాఫలకాలు వేయడం, పూర్తయిన వాటికి రిబ్బన్ కటింగ్లు చేసుకోవడం తప్పించి, ఆయన ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటీ లేదు. అంటే చంద్రబాబుకు సాగు నీటి రంగమన్నా, రైతులన్నా, వ్యవసాయమన్నా చిన్నచూపు. అన్ని ప్రాజెక్టులకు నీరివ్వాలన్నా నందికొట్కూరు నుంచే పోవాలి. శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఈ ప్రాంత రైతులు త్యాగాలు చేసి భూములు కోల్పోయారు. సర్వస్వం కోల్పోయి వలసలు పోతున్న రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఉద్యోగాలిస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదు. – బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రాజకీయాలకు అతీతంగా ఉద్యమిద్దాం వైఎస్సార్ సీఎం అయిన వెంటనే దుర్భిక్ష పరిస్థితుల మధ్య వ్యవసాయం చేసే రాయలసీమ ప్రాంత రైతుల కష్టాలను తీర్చేసి దేవుడయ్యాడు. గాలేరు–నగరి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులతో రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలను తీర్చారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేసినా వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాయలసీమ రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. అనుమతులు లేకుండా పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటూ మనకు దక్కాల్సిన నీటిని వాడుకుంటే చంద్రబాబుకు ఇంకా జ్ఞానోదయం కలగడడం లేదు. చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలందరికీ వివరించాలి. రాయలసీమ ప్రాంత ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాజెక్టు కోసం ఉద్యమించాలి. – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఎన్జీటీకి ఫిర్యాదు చేసి ప్రాజెక్టును చంద్రబాబు ఆపించాడు: నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు రాయలసీమ ప్రాంతంలో పుట్టి, ఇక్కడ నుంచే గెలిచి ముఖ్యమంత్రి అవుతున్నా ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే వృథాగా పోతున్న నీటిని రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించాలని ఆలోచన చేస్తే ఎన్జీటీకి ఫిర్యాదు చేసి చంద్రబాబు ఆపించాడు. అయినా నిర్మాణం ఆపకుండా 80 శాతం పూర్తి చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్. ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్లో తిరగలేరు. – దారా సుదీర్, నందికొట్కూరు పార్టీ ఇన్చార్జి రాయలసీమకు చంద్రబాబు ద్రోహం రాయలసీమ నుంచి కరువులు ఆగిపోయాయంటే ఆ ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్సార్ 44 వేల క్యూసెక్కులకు పెంచితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక మరింతగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించి రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేసి 80 శాతం పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల్లో తట్టమట్టి కూడా తీయలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం ఆయనతో కుమ్మక్కై రాయలసీమ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశాడని అర్థమైపోయింది. – అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే తల తెగ నరికినా మా మొండెం ఉద్యమిస్తుంది ‘సీమ’ అంటే చంద్రబాబుకు ఎప్పుడూ ఇష్టం లేదు. అందుకే రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపి ద్రోహం చేశాడు. కర్నూలుకు రావల్సిన హైకోర్టును, నేషనల్ లా యూనివర్సిటీని అమరావతికి తీసుకెళ్లారు. ‘అనంత’కు మంజూరైన ఎయిమ్స్ను మంగళగిరికి తరలించారు. ఆఖరుకు కడపలో ఉన్న కో ఆపరేటివ్ బ్యాంకును కూడా తరలించుకుపోయాడు. ఆనాడు వైఎస్సార్ సీఎంగా ఉండగా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతుంటే ప్రకాశం బ్యారేజీ మీద దేవినేని ఉమాతో ధర్నాలు చేయించి అడ్డుకునే ప్రయత్నం చేసిన రాయలసీమ ద్రోహి చంద్రబాబు. ఇక్కడి రైతులు, ప్రజల భవిష్యత్తును చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కాలరాస్తున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఉద్యమానికి ఇప్పుడు మళ్లీ బీజం పడింది. ఉద్యమం మొదలయ్యాక తల తెగ నరికినా మా మొండెం ఉద్యమిస్తుందే కానీ ఉద్యమం మాత్రం ఆగదు. – సాకె శైలజానాథ్, మాజీ మంత్రి ఓటుకు కోట్లు కేసుకు భయపడే.. రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు రాయలసీమ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, మనకు హక్కుగా దక్కాల్సిన నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నా సీఎంగా ఉన్న చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాడు కేసీఆర్కు, నేడు రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా తలూపుతున్నాడు. రాయలసీమ ప్రాజెక్టును తిరిగి ప్రారంభింపజేసేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. రాయలసీమ ప్రాజెక్టు కోసం రాయలసీమ పౌరుషం చూపించాలి. – ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు గోదావరి–బనకచర్ల పేరుతో కాలయాపన శ్రీశైలం డ్యాంకు ఎక్కువ శాతం భూములు కోల్పోయింది రాయలసీమ ప్రాంతమే. కృష్ణా జలాలపై అత్యధిక క్యాచ్మెంట్ ఏరియా రాయలసీమలోనే ఉంది. చంద్రబాబు ఏనాడూ రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆలోచించ లేదు. దివంగత వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు ఎవరూ ఈ ప్రాంతం గురించి ఆలోచించలేదు. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నాడు. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు నీటిని తరలిస్తుంటే ఎగువ రాష్ట్రాలు అంగీకరించవు అని తెలిసే సాధ్యం కాని ప్రాజెక్టుతో చంద్రబాబు తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడు. కృష్ణా, తుంగభద్ర నదులపై నిరి్మంచాల్సిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించడం మూర్ఖత్వం. వైఎస్ జగన్ గెలిచి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయేది కాదు. అభివృద్ధి అంటే అమరావతి మాత్రమే కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు లిఫ్ట్తోనే రాయలసీమ రైతుల భవిష్యత్తు ఈ ప్రాంతానికి సంజీవని లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రాజకీయాలకు అతీతంగా రాయలసీమ వాసులంతా ఒక్కటై ఉద్యమించాలి. రాయలసీమను ఎడారిగా మార్చే చంద్రబాబు కుట్రలను దీటుగా ఎదుర్కోవాలి. మళ్లీ కరువు కాటకాలతో రాయలసీమ ప్రజలు వలసలు వెళ్లకుండా నిరోధించాలంటే రాయలసీమ ప్రాజెక్టు పూర్తి కావాలి. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావాలనే డిమాండ్తో త్వరలో కడపలో రెండో మహాసభ నిర్వహిస్తాం. – రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేసుకుందాం రాష్ట్రంలో సాగు నీటి రంగానికి మేలు చేసిన ఘనత నాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిదైతే, ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమ లిఫ్ట్ పూర్తవుతుంది. ఈ లిప్్టతో ఉమ్మడి ప్రకాశం, నెలూర్లు, రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. ఈ ఉద్యమంలో ఎంత వరకైనా ముందుకు నడుస్తాం. ప్రాజెక్టు పూర్తి చేస్తాం. – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బాబు కుట్రలను అంతం చేద్దాం రాయలసీమ దేశంలోనే అత్యంత కరువు ప్రాంతం. నీళ్లు లేక వ్యవసాయం చేయలేక ఏడాదిలో రెండు నెలలు మినహా 10 నెలలు వలసోయి బతికే పరిస్థితి. పిల్లలు, వృద్ధులు మాత్రమే ఇళ్ల వద్ద ఉంటారు. అలాంటి ప్రాంతానికి నీళ్లిచ్చేందుకు మా నాయకుడు సిద్ధమైతే దాన్ని అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు. రాయలసీమకు చంద్రబాబు కంటే ద్రోహం చేసేవారు బహుశా ఎవ్వరూ ఉండరు. చంద్రబాబు కుట్రలను అంతం చేసి రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేస్తాం. – గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం సభకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు చేసింది. ఎంత నిర్బంధిస్తే అంతగా తిరగబడతాం. ఎంత అణచివేస్తే అంత పైకి లేస్తాం. రాయలసీమ నీటి అవసరాలు తీర్చడానికి తీసుకొచ్చిన లిఫ్టును రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు ఆపేశాడు. రాయలసీమ ప్రజలకు ద్రోహం చేశాడు. కూటమి నాయకుల వికృత రాజకీయ క్రీడను గ్రామ గ్రామానికి తీసుకెళ్తాం. నందికొట్కూరులో మొదలు పెట్టింది ప్రారంభ సభ మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం. – భూమన కరుణాకర్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈ ప్రాజెక్టును తిరిగి మొదలు పెట్టేదాకా ఉద్యమిస్తాం రాష్ట్ర సాగు నీటి రంగం గురించి చర్చించాల్సి వస్తే వైఎస్సార్కు ముందు.. వైఎస్సార్ తర్వాత అని చెప్పుకోవాలి. నెల్లూరు జిల్లాలో కండలేరు, సోమశిల ప్రాజెక్టులను పూర్తి సామర్థ్యం మేరకు నీరు నిలిపిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే నెల్లూరు జిల్లాకు మరింత మేలు చేకూరుతుంది. తాను కోరిన మీదటే చంద్రబాబు రాయలసీమ లిఫ్టును ఆపేశాడని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఈ ప్రాజెక్టును తిరిగి మొదలు పెట్టేదాకా ఉద్యమిస్తాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే జగన్ సీఎం కావడం ఖాయం. – కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు -
లడ్డూపై అబద్ధాల ప్రచారం రాజకీయ కుట్రే!
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగకుండానే జరిగిందని ప్రచారం చేయడం పెద్ద నేరం. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు లడ్డూలో కల్తీ జరిగిందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ను దోషిగా నిలబెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన స్వామివారి ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డుకు ఈడ్చడం ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఏమాత్రం తగనిది. సీబీఐ నేతృత్వంలోని స్వతంత్ర సిట్ దర్యాప్తులో ఈ విషయాలన్నీ నేడు స్పష్టమయ్యాయి. అయినా వైఎస్సార్ సీపీని టార్గెట్ చేసేందుకు మళ్లీ దర్యాప్తు కమిటీని నియమిస్తామంటున్నారు. సీబీఐ తమకు అనుకూలంగా నివేదిక ఇవ్వనందుకే ఈ కమిటీని నియమిస్తున్నారా?రాజకీయ లబ్ధి కోసం భక్తుల భావోద్వేగాలతో ఆడుకున్న చంద్రబాబు, ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని ప్రజలకు క్షమాపణ చెబుతారని ఆశించినవారికి నిరాశే మిగిలింది. తన తప్పు బయటపడకుండా ఉండేందుకు అనుకూల మీడియాతో కలిసి ప్రజ లను తప్పుదోవ పట్టించే కొత్త పంథాను ఆయన అనుసరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ‘నేను మారిన మనిషిని, నన్ను నమ్మండి’ అని చెప్పి అధికారం దక్కించుకున్నాక, తన సహజ స్వరూపాన్ని మరో సారి బయటపెట్టుకున్నారు. సీబీఐ ఛార్జ్షీట్లో జంతు కొవ్వు కలవ లేదని తేలినా, పదే పదే అబద్ధాలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేటప్పుడు ఓపిక, సహనం ఉండాలి. ఎటు వంటి విచారణ లేకుండా, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండా ముఖ్యమంత్రే స్వయంగా కల్తీ జరిగిందని ప్రకటించడం వెనుక ఉన్న ప్రాతిపదిక ఏమిటో అర్థం కావడం లేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సైతం ఘాటుగా స్పందించింది. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి అపోహలు సృష్టించడం తగదని మందలించింది.భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అనుబంధ సంస్థ లైన హరియాణాలోని ‘నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్ లోని ‘నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు’ పరిశోధనల ప్రకారం లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయింది. సీబీఐ ఛార్జ్షీట్లో కూడా జంతు కొవ్వు ప్రస్తావనే లేదు. ఇలాంటప్పుడు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసినందుకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హిందువుల మనోభావాలను తాకట్టు పెట్టి చేసిన ఈ రాజకీయ క్రీడ అత్యంత దురదృష్టకరం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు, ఇప్పటికైనా బాబు తన తప్పును ఒప్పుకుని హుందాగా వ్యవహరించడం అవసరం.దేవుని పేరుతో రాజకీయం చేసే బీజేపీ నాయకత్వం ఈ విష యంలో అనుసరిస్తున్న మౌనం విస్మయకరంగా ఉంది. ఒక మహిళా నేత తమ పార్టీకి కష్టం వచ్చినప్పుడు మౌనంగా ఉండి, పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీకి చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే స్పందిస్తున్నారు. గతంలో కేంద్రం తెచ్చిన రైతు చట్టాలపై సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పుడు నోరు మెదపని ఆమె, ఇప్పుడు కోర్టు చేసిన వ్యాఖ్యలపై వింతగా స్పందిస్తున్నారు. తన బంధువు దోషిగా తేలుతారని తెలిసి ఇటువంటి విమర్శలు చేస్తున్నారా? మరొక నాయకుడు ఆలయ మెట్లు కడుగుతూ, సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. తన రాజకీయ భాగస్వామిని రక్షించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జరిగిన తప్పునకు బాధ్యత వహిస్తూ భక్తులకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది.డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డివ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు -
వైఎస్ జగన్ పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్ర
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రకు తెరలేపింది.వైఎస్ జగన్ శుక్రవారం విజయవాడ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్నారు. జోగిరమేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే ఇందుకోసం అవసరమైన అనుమతులు తీసుకున్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా రూట్ మార్చాలని పోలీసుల నోటీసులు జారీ జారీ చేశారు. విజయవాడ సీపీ స్వయంగా వైఎస్ జగన్కు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. టీడీపీ గూండాల దాడితో భయాందోళనకు గురవుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబసభ్యుల్ని బుధవారం వైఎస్ జగన్ పరామర్శించారు. ఇందుకోసం తాడేపల్లి నివాసం నుంచి గుంటూరు పట్టాభిపురంలో అంబటి నివాసానికి వైఎస్ జగన్ వెళ్లారు. నిన్నటి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకు కదలి వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి కూటమి ప్రభుత్వ కుట్రకు తెరలేపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేపు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్న జగన్.. కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు. రెండు రోజుల కిందటే పార్టీ రూట్ మ్యాప్ ఇచ్చినా, హఠాత్తుగా పోలీసులు ఆంక్షలు విధించడంతో పర్యటనపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయి. -
నాలుక మడతేసిన పవన్.. నాగబాబు కొత్తరాగం..
కొత్తగా మతం మారినవాళ్లకు నామాలు ఎక్కువ అన్న సామెత మెగా బ్రదర్స్కు సరిగ్గా సరిపోయేలా ఉంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ సైతం తేల్చి చెప్పడంతో ఈ విషయంలో గాయిగత్తర చేసి అర్జెంట్గా సనాతని గెటప్ వేసుకుని మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది. చంద్రబాబుకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడల్లా జనంలోకి వచ్చి టాపిక్ డైవర్ట్ చేసిన పవన్ ఇప్పుడు లడ్డు విషయంలో అడ్డంగా దొరికిపోవడంతో ఏం చేయాలో.. ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక తికమకపడుతున్నారు.దీంతో ఇప్పుడు తాను లడ్డు విషయంలో ఆనాడు చేసిన వ్యాఖ్యల ఉద్దేశ్యం వేరని, తాను ఫలానా వాళ్లు అందులో కొవ్వు కాలిపారని అనలేదని ఏదేదో మాట్లాడుతూ తప్పించుకోవాలని చూశారు. వాస్తవానికి పవన్ తనకు తానూ ఓ కమ్యునిస్ట్ అని, తనకు దేవుడిపై నమ్మకం లేదని పలుమార్లు రాజకీయ వేదికల మీద చెప్పారు. తన తండ్రి మరీ పెద్ద కమ్యూనిస్ట్ అని, తన తల్లి దేవుడికి హారతి ఇస్తే ఆ హారతిలో సిగరెట్ వెలిగించుకునేవారని రాజకీయ వేదికలమీద చెప్పారు. ఇక తిరుమల లడ్డులో కొవ్వు కలిసింది అని, సనాతని గెటప్ వేసుకుని మెట్లు కడిగేశారు. తీరా ఇప్పుడు సీబీఐ నివేదికలో ఆ కొవ్వు అంశం లేకపోవడంతో ఏం చేయాలో తెలీక ఏదేదో మాట్లాడి పరిస్థితిని తన వైపునకు తిప్పుకునేందుకు యాతనపడుతున్నారు. ఇన్నాళ్లు అబద్ధాల మిషన్ సినిమాల్లో చూడటమే కానీ ఇలా మానవరూపంలో చూడడం ఇదే మొదటి సారి అంటూ నెటిజెన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.I am sorry to use this statement నువ్వు బ్రతికేది కుడా ఒక బ్రతుకేనా @NagaBabuOffl 👊💦ఏ మూల నుండి నువ్వు హిందువువి అయ్యావ్ ❓దేవుడునే నమ్మని నువ్వు ఎట్టా సనాతనివి అవుతావ్ ❓👊కష్టపడి పైకి వచ్చిన చిరంజీవి గారు, ఏ రోజు రాజకీయాలు కోసం ని తమ్ముడు లగా ని లాగా లుచ్చా మాటలు… pic.twitter.com/G6Ghrb5JZc— Ravindra 🙏❤️ (@kurapati1005) February 4, 2026ఇక ఎమ్మెల్సీ నాగబాబు అయితే మరింత ఎక్కువ యాక్టింగ్కు దిగిపోయారు. గతంలో అసలు దేవుడే లేడు.. అదొక మిథ్య.. ప్రజలు.. తమ సౌకర్యం కోసం దేవుడిని సృష్టించుకున్నారు. నేనైతే దేవుణ్ణి నమ్మను అని చెప్పిన నాగబాబు ఇప్పుడు తానూ సనాతన వాదిని అని, హిందూ ధర్మానికి రక్షకుడిని అని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు ఒకేసారి ఇద్దరు అన్నదమ్ములను గుత్తకు తీసుకుని మరబొమ్మను ఆడించినట్లు ఆడిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో కూటమి ప్రభుత్వాన్ని మీడియా ముఖంగా నిలదీయడంతో ఇక ప్రభుత్వం నుంచి సమాధానం కరువైంది. గురువారం చంద్రబాబు.. మంత్రులు.. నాయకులు కలసికట్టుగా మీడియాతో మాట్లాడి మళ్ళీ లడ్డు అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబుకు లడ్డు అంశం ఒక ఆయుధంగా మారిందని.. రాష్ట్రంలో ఇంకేం సమస్యలు లేనట్లుగా ఇదే అంశాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. -సిమ్మదిరప్పన్న. -
తప్పు చేసి దొరికిపోయి.. డిఫెన్స్లో చంద్రబాబు, పవన్: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి భాగస్వామ్య పార్టీలతో కలిసి చంద్రబాబు.. వైఎస్ జగన్పై విష ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. లడ్డూలో కల్తీ జరగలేదని కేంద్ర దర్యాప్తు సంస్థలే చెప్పాయి. పవన్ కల్యాణ్ పదే పదే చెప్పిన అబద్ధమే చెబుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. భోలే బాబాను తీసుకువచ్చింది ఎవరు? అని ప్రశ్నించారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజల ముందు నటిస్తున్నారు. కెబినెట్ సమావేశంలోనే మంత్రి పార్థసారథి పచ్చి అబద్దాలు చెప్పారు. సీబీఐ నేతృత్వంలోని సిట్ మమ్మల్ని దోషులుగా ప్రకటించలేదు. మమ్మల్ని దోషులుగా చూపించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తప్పు చేసి, తప్పుగా మాట్లాడి దొరికిపోయి.. మళ్లీ ఇప్పుడు ఏకసభ్య కమిషన్ అంటున్నారు. 2014-2019 మధ్య అధిక శాతం నెయ్యి సరఫరా ప్రిమియర్ డెయిరీనే. 2018లోనే భోలే బాబాను చంద్రబాబు తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాపై విచారణ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా?. ఇప్పుడు ఉన్న అధికారులే చంద్రబాబు హయాంలో ఉన్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో పవన్ చెప్పినవి ఇవే.. జగన్ రాజకీయ జీవితాన్ని సమూలంగా నాశనం చెయ్యడానికి ఏదైనా వాడుకోవడానికి సిద్దంగా ఉన్నారు. మీడియా సమావేశంలో నంగిలా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం భయంతో చంద్రబాబు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పూర్తిగా డిఫెన్స్లో పడ్డారు. చంద్రబాబు దేవుడికి క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు అందరికి నవ్వు తెప్పిస్తుంది. పదేళ్ల కాలంలో పవన్.. అనేక మార్లు బాప్టజం తీసుకున్న, మా నాన్న దీపంలో సిగరెట్ వెలిగించేవారు, గొడ్డు మాంసం తింటే తప్పేంటి అన్న వ్యక్తి. కానీ, నేడు సనాతన ధర్మం అంటున్నారు. చంద్రబాబు తనంత భక్తుడే లేడని అంటారు. భగవంతునికి చంద్రబాబు ఒక్కడే భక్తుడు కాదు, రోజుకు లక్షమంది వస్తారు. చంద్రబాబు హయాంలో కొండపై మద్య మాంసాలు అనేమార్లు దొరికాయి. మత్తులో ఘర్షణలకు పాల్పడ్డారు. తొక్కిసలాటలో భక్తులు మరణించారు.చంద్రబాబుది దైవ ద్రోహం.. చంద్రబాబు అలిపిరిలో జరిగిన దాడికి మొదట బాధపడిన వ్యక్తి వైఎస్సార్, నేను. వైఎస్సార్ అలిపిరి వద్ద నిరసన కూడా చేశారు. దేవుడి దయవల్ల చంద్రబాబు బతికారు. ఆయన ఏం చెప్పినా నమ్మించడానికి పచ్చ పత్రికలు ఉన్నాయి. నెయ్యిలో నెయ్యే లేకుండా జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు మాట్లాడారు. సుప్రీంకోర్టు చంద్రబాబుకు చీవాట్లు పెట్టి సిట్ వేసింది. సిట్ రిపోర్టులో క్లియర్గా ఉంది. ఎక్కడ కూడా జంతువుల కొవ్వుతో లడ్డులు తయారు కాలేదని రిపోర్ట్ చెప్పారు. దైవ ద్రోహానికి పాల్పడే పరిస్థితిలో ఈ ఘటన ఉంది. అయోధ్య పంపిన లడ్డులో నెయ్యి కలిసిందని అంటున్నారు పవన్. ప్రస్తుతం పాలకమండలి సభ్యులుగా ఉన్న వారు విరాళంగా ఇచ్చిన నెయ్యితో అయోధ్య లడ్డు తయారు చేశారు.వైవీ సుబ్బారెడ్డి హయాంతో నెయ్యి టెస్ట్ రిపోర్ట్ దాచేసారని మరో అబద్దం ఆడుతున్నారు. కరుణాకర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడు మాత్రమే, నాకు ఎటువంటి హక్కు ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈ నిబంధనలు మార్పు చేసాము, అందులో మా దురుద్దేశం ఏమీ లేదు. మమ్మల్ని ఇరికించడానికే ఏకసభ్య కమిషన్ వేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాల్సిన అవసరం చంద్రబాబు, కూటమి నేతలకు ఉంది. చంద్రబాబు పచ్చ అబద్దం చెప్తారు. వేంకటేశ్వరస్వామిని మీ రాజకీయాలకు వాడుకుంటారా?. పచ్చ పత్రికలలో ఎన్ని తూటాలు ఎక్కుపెట్టినా మమ్మల్ని భయపెట్టలేరు. మేము ఒక్క తప్పు కూడా చేయలేదు. చంద్రబాబు లాంటి వాళ్లను దేవుడు క్షమించరు’ అని అన్నారు. -
పవన్.. రాజకీయాల కోసం ఇంతకు దిగజారాలా?: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజకీయాల కోసం పవన్ కల్యాణ్ దిగజారి ప్రవర్తిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. భోలే బాబా నుంచి రూ.291కి నెయ్యి ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్లో కిలో ఆవు నెయ్యి ఎంతకు అమ్ముతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రం చేస్తున్న అప్పులను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు చెప్పరు. ఆర్థిక శాఖపై కేశవ్కు పట్టింపు లేదు. తిరుమల లడ్డూపై కూటమి నేతలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భోలే బాబా డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది చంద్రబాబు హయాంలోనే. భోలే బాబా నుంచి రూ.291కి నెయ్యి ఎలా కొనుగోలు చేశారో చెప్పాలి. హెరిటేజ్లో కిలో ఆవు నెయ్యి ఎంతకు అమ్ముతున్నారో చెప్పాలి. గతంలో అనేకసార్లు పవన్ దేవుడిపై నమ్మకం లేదని చెప్పారు. రాజకీయాల కోసం పవన్ కల్యాణ్ దిగజారి ప్రవర్తిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
‘ఇల్లు నాదే’ .. కబ్జాకు టీడీపీ నేత కుట్ర
సాక్షి,ఒంగోలు: ఏపీలో కూటమి నేతల ఆగడాలు రోజురోజుకీ శృతిమించిపోతున్నాయి. అధికార మదంతో రెచ్చిపోతున్నారు. యజమానులను బెదిరించి కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రశ్నిస్తే ‘నువ్వు కట్టుకున్న ఇల్లు నాదే.. నీ దిక్కున్న చోట చెప్పుకో పో’.. అంటూ బెదిరింపులకు దిగుతున్నారు.తాజాగా, ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం బాలాజీ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న శివకుమార్ అనే వ్యక్తి ఇంటిపై టీడీపీ నేత కాట్రగడ్డ రఘు కన్నుపడింది. అంతే అనారోగ్యంతో బాధపడుతున్న శివకుమార్ను రఘు అనుచరులు ఇంట్లోకి ప్రవేశించి, ఆయనను బలవంతంగా బయటకు గెంటివేశారు. అనంతరం ఆ ఇంటికి తాళం వేసి.. ‘ఇల్లు మాది’ అంటూ బెదిరింపులకు దిగారు. బాధితుడు శివకుమార్ మాట్లాడుతూ.. తాను స్థలం కొనుగోలు చేసి, కష్టపడి ఇల్లు నిర్మించుకున్న తర్వాతే ఈ సమస్యలు మొదలయ్యాయని వాపోయాడు. రఘు,ఆయన అనుచరులు తమను టార్గెట్ చేస్తూ, ఇల్లు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దిక్కున చోటు చెప్పుకో పో’ అంటూ రఘు అనుచరులు బెదిరింపులకు దిగారని మీడియా ఎదుట వాపోయారు. తమకు న్యాయం చేయాలని, దాడులకు తెగబడుతున్న రఘును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ
సాక్షి,విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అంబటి రాంబాబుపై కేసును క్వాష్ చేయాలని రిమాండ్ చట్ట విరుద్ధమని అంబటి న్యాయవాది కోర్టులో వాదించారు.పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదిపరి విచారణ ఈనెల 11కు వాయిదా వేసింది. అంబటి రాంబాబు అరెస్టుఅంతకుముందు అంబటి రాంబాబును పోలీసులు గుంటూరులోని తన నివాసం వద్ద అరెస్టు చేశారు. గత శనివారం రాత్రి గం. 10.30 ప్రాంతంలో అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. ఆయనను నల్లపాడు పీఎస్కు తరలించారు. అంబటి రాంబాబు కేసును సమోటోగా తీసుకొని బీఎన్ఎస్ 126(2),132, 196(1), 352, 351(2),292 రెడ్విత్ 3(5),-BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైకోర్టులోఅంబటి సతీమణి హౌస్ మోషన్ పిటిషన్ అరెస్టుపై అంబటి సతీమణి విజయలక్ష్మి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనతోపాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్భందించారని ఆమె అందులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, శాంతి భద్రతల సమస్య ఉందని పిటిషన్లో వివరించారు. తనకు 24 గంటలు భద్రత కల్పించాలని, అందుకు అనుగుణంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి కోరిన విషయం తెలిసిందే. -
అడ్డంగా దొరికి.. అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా?
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ మహాప్రసాద వ్యవహారంపై సీబీఐ నివేదికతో కూటమి పెద్దల వెన్నులో వణుకు మొదలైంది. కల్తీ జరిగిందని పదే పదే చెప్పాలంటూ తమ పార్టీల నేతలకు నేతలకు పవన్, చంద్రబాబు హుకూం జారీ చేశారు. అయితే అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో భారీ ప్రెస్మీట్తో ఇప్పుడు మరో నాటకానికి తెర తీశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై దర్యాప్తు వ్యవహారంలో కూటమి పెద్దలు గురువారం ప్రెస్మీట్ నిర్వహించారు. ఇప్పటికే అబద్ధాలు ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అండ్ కో.. తాము చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ.. దొంగే దొంగా దొంగా అన్నచందాన మరోసారి అబద్ధపు ప్రచారాన్ని ఉధృతం చేశారు. మీడియాపై చంద్రబాబు అసహనంతిరుమల లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతుకొవ్వు కలవలేదని.. కూటమి సర్కార్ ఆధ్వర్యంలో ఉన్న సీబీఐ, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ లాంటి సంస్థలే తేల్చి చెప్పాయి. కానీ, ఎల్లో మీడియా మాత్రం సీబీఐ విచారణ, ఆ నివేదికలపైనా బురద జల్లుతూ తప్పుడు రాతలు రాస్తోంది. ఇదే విషయాన్ని పరోక్షంగా కొందరు మీడియా ప్రతినిధులు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. అది విని ఆయన ఒక్కసారిగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నివేదికలనే ఆయన తప్పుబట్టారు. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక ఇచ్చిందని.. ఇప్పటిదాకా వచ్చిన నివేదీకలన్నీ ఏకసభ్య కమిటీ ముందు ఉంచుతామని.. సీబీఐ నివేదికపై ఆ కమిటీ విచారణ చేస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఊగిపోయిన పవన్జంతు కొవ్వు లేదని సీబీఐ కోర్టుకు స్పష్టం చేసినా.. ఉందంటూ మళ్లీ ప్రచారంతో అపచారం చేస్తున్నారు. లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని అన్ని నివేదికల్లో తేటతెల్లమైందంటూ ఇటు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఇష్టానుసారం మాట్లాడారు. ఏ నివేదికలోనూ వైఎస్సార్సీపీ నేతలకు క్లీన్ చిట్(అసలు ఎవరి పేరు లేదు కూడా) ఇవ్వలేదు. తాను, చంద్రబాబు ఒక్కటేనని.. మాట్లాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటామని.. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబోమని ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీతో మహా పాపం జరిగిందంటూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీ కీలక నేతలు వైవీసుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిని బద్నాం చేయాలనే కూటమి కుట్రలు సీబీఐ నివేదికతో పటాపంచలు అయ్యాయి. దీంతో కక్కలేక మింగలేని స్థితిలో ఉన్న కూటమి బ్యాచ్.. ఈ విషయంలో తప్పుడు ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని భావించింది. అందుకే సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ నిర్వహించి.. ఆపై మీడియా ఎదుట ప్రకటనలు చేసింది. ఇది చూసి అడ్డంగా దొరికిపోయి.. అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా? అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.ముందే చెప్పిన వైఎస్ జగన్చంద్రబాబు ఏకసభ్య కమిషన్ డ్రామా గురించి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ముందే చెప్పారు. బుధవారం అంబటి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, రాక్షసుడో ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిసిందని తాను చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పు అని స్పష్టంగా తేలడం, ఆధారాలతో సహా రుజువు కావడంతో ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారానికి తెర తీశారు. ఈ అంశంలో తానే ఓ కమిషన్ వేస్తామని చెబుతున్నారు. సీబీఐ చెప్పింది తప్పు..! ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులు తప్పు అని చెప్పిస్తూ, తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి మరో కమిషన్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. తాను చెప్పినట్టే నివేదిక రావాలని ఒత్తిడి చేసి, దానిని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఉండరు’’ అంటూ మాట్లాడారు. జగన్ చెప్పినట్లే.. ఇవాళ చంద్రబాబు ఏకసభ్య కమిషన్ సీబీఐ సహా నివేదికలన్నింటిపైనా విచారణ జరుపుతుందంటూ ప్రకటించారు. -
భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా బాబు వ్యాఖ్యలు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు ఘోరంగా మాట్లాడారని వైఎస్సార్సీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. తిరుమల లడ్డూ విషయంలో సిట్పై నమ్మకం లేకనే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారించింది. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘సిట్ విచారణతో జంతు కొవ్వు కలవలేదని నివేదికలో స్పష్టమైంది. సీబీఐ స్పష్టం చేసినా కూటమి మళ్లీ మళ్లీ విషప్రచారం చేస్తోంది. ఫ్లెక్సీలు పెట్టి వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి. చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. సీఎఫ్టీఆర్ఐ రిపోర్టుపై కూడా మంత్రులు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాం నుంచే ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. టీటీడీలో నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. ఎలాంటి ప్రమాణం చేయడానికైనా నేను సిద్ధం.దేవుడు ముందే ప్రమాణం చేస్తా.. నేనే ఏ తప్పు చేయలేదు. సత్య శోధన పరీక్షకి సిద్ధంగా ఉన్నాను. ఎన్డీడీబి నుంచి కన్ఫర్మేషన్ లేకుండానే జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. పరీక్షలు జరపాలని సీఎఫ్టీఆర్ఐకు లేఖ రాసిందే నేను. అలాంటప్పుడు నేను నివేదిక ఎలా తొక్కి పెడతాను. నివేదికపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. నెయ్యి సప్లయ్ పెంచడం కోసమే నిబంధనలు సవరించాం. నిపుణుల కమిటీ సిఫారసుల ప్రకారమే నిబంధనలు సడలించాం. నాణ్యత విషయంలో రాజీ పడలేదు. నిబంధనల సవరణకు ముందే బోలె బాబా కంపెనీ టీటీడీకి సరఫరా చేసింది. చిన్న అప్పన్న నా పీఏ కాదు. ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్ అని క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులపై బురద చల్లడానికే ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. నేను తప్పు చేస్తే సుప్రీంకోర్టుకు, సీఎఫ్టీఆర్ఐకు ఎందుకు వెళ్తాను. దేవుడిపై రాజకీయాలు చేయొద్దు. రాజకీయ నాయకుల ప్రమేయం లేదని సిట్ తేల్చి చెప్పింది. వైఎస్సార్సీపీ టార్గెట్గా మళ్ళీ విచారణ అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎంక్వయిరీ కమిటీ వేయడం కుట్రలో భాగమే. వైఎస్సార్సీపీ నేతలను ఇరికించడమే లక్ష్యంగా కమిటీ వేశారు. దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటాం’ అని అన్నారు. వైఎస్సార్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు. ఘోరమైన తప్పులు చేస్తున్నారు. చంద్రబాబు చెప్పింది తప్పు అని సిట్ తేల్చి చెప్పింది. దాంతో అంబటి రాంబాబు, జోగి రమేష్పై దాడి చేశారు. చంద్రబాబు చెప్పిన తప్పులే.. నిజమని చెప్పేందుకు మళ్లీ కమిటీ వేశారు. తప్పు చేసిన వ్యక్తి అయితే.. వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు ఎలా వెళ్తారు?. సత్యశోధన పరీక్షకు సిద్ధమని చెప్పారు. సుబ్బారెడ్డి వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు. ఆయనపై ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గం. రాజకీయ ఆరోపణ చేయడం తోక ముడవడం చంద్రబాబుకు పరిపాటి. టీడీపీ హయాంలో కూడా ట్యాంకర్లు తిరస్కరించారు’ అని తెలిపారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. సీబీఐ సిట్ నివేదిక టీడీపీకి చెంపపెట్టు లాంటిది. ఆ నివేదికను జీర్ణించుకోలేక మళ్లీ కమిటీ అంటూ కుట్రలకు పాల్పడుతున్నారు. ఈ కుట్రలకు దేవుడు.. ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. టీడీపీ హయాం నుంచి బోలే బాబా కంపెనీ నెయ్యి సరఫరా చేస్తోంది. అన్ని కంపెనీలను ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే నిబంధనలు సడలించారు. ఆరోపణలు వచ్చిన వెంటనే బోలె బాబాను బ్లాక్ లిస్టులో పెట్టారు. మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి పైన మాపై ఎందుకు రుద్దుతున్నారు. ఆ ట్యాంకర్లను బ్యాక్ డోర్ ద్వారా వాడుకున్నారు. టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్షన్ కోసం లడ్డు విషయాన్నీ వాడుకుంటున్నారు. గత జనవరి నుంచి టీటీడీ పూర్తిగా అప్రతిష్ట పాలైంది’ అని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబూరావు మాట్లాడుతూ..‘లడ్డు ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. సత్యశోధన పరీక్షకు సిద్ధమని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దమ్ముంటే మీరు సత్యశోధన పరీక్షలు చేయండి.. విషయాలు తేల్చండి అని సవాల్ విసిరారు. -
ఈ టైంలో బాబు-పులి కథ చెప్పాల్సిందే!
సాక్షి, నంద్యాల: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. గురువారం వైఎస్సార్సీపీ నిర్వహించిన చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ ఉద్యమకారులు అని చెప్పుకునేవాళ్లు కూడా గత రెండు మూడు రోజులుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వేస్ట్ అని మాట్లాడుతున్నారు. మద్ధతు ఇవ్వమని కోరితే.. టీఎంసీ, క్యూసెక్కులు అంటే ఏంటో చెప్పాలంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. అవే చదువుకుని కుంటే ఏ ఇంజినీర్లు అయ్యి ఉండేవాళ్లు కదా. ఇదంతా కేవలం వాళ్ల రాజకీయ స్వార్థం కోసమే. తెలుగు దేశం వాళ్లు ఒక్క పని చేయరు. చంద్రబాబుకు తెలిసిందల్లా రెండే.. ఒకటి శిలాఫలకం వేయడం, రెండోది పని ఎవరైనా పూర్తి చేశాక వచ్చి తనదే ఆ క్రెడిట్ అని చెప్పుకోవడం.. అందుకే ఇప్పుడు వేటగాడి కథ చెప్పుకోవాలి..ఒక వేటగాడు ఉన్నాడు. భయంకరమైన యుద్ధం చేసి పులిని చంపాడు. ఆ నొప్పులు తట్టుకోలేక మందు కోసమని వెళ్లాడు. ఈలోపు చంద్రబాబు లాంటోడు వచ్చాడు. పులి గోళ్లు, పళ్లు ఎత్తుకెళ్లి.. నేనే చంపాను అంటూ చెప్పుకుని తిరిగాడు. హంద్రీ-నీవా సుజల స్రవంతి(HNSS) పనులు తానే చేశానని చెప్పుకుంటున్నాడు. కానీ, ఆ పనులు ఎన్టీఆర్ కాలం నాడే మొదలయ్యాయి. పూర్తి చేసింది రాజశేఖర్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి.. చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదు అని బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి అన్నారు. లడ్డూ గురించి అడిగితే చంద్రబాబు దాడులు చేయిస్తున్నారు. యూరియా కొరత గురించి అడిగితే.. ఆ వాడకం మంచిది కాదు కేన్సర్ వస్తుందటారు. మహిళలకు ఎన్నికల్లో ఇస్తానన్న భృతి గురించి అడిగితే.. నా దగ్గర భద్రంగా ఉంటుందని అంటున్నారు. ఇంక పవన్ కల్యాణ్ తిరిగేది రెండు మూడు నియోజకవర్గాలే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గం. చంద్రబాబు అండ్ కో పదే పదే అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుతున్నారు అని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ చంద్రబాబు జాగీరు కాదని.. మెడలు వంచైనా సరే సాధించుకుంటామని ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. ప్రజా , రైతు సంఘాలు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపాయి. -
టీడీపీది రాక్షసానందం.. జగనన్న మాకు ధైర్యం చెప్పారు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతల దాడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చిన్న కుమార్తె శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన శ్రీజ.. జగనన్న తమ ఇంటికి వచ్చి అండగా నిలిచారని.. మా తల్లి, అక్కలతో మాట్లాడి ధైర్యం నింపారన్నారు. ‘‘టీడీపీ వాళ్లు మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. కానీ నిన్న వేలమంది అభిమానంతో మా ఇంటికి వచ్చారు. మా నాన్న చెప్పినట్టే మాకు అండగా వెంకటేశ్వరస్వామి ఉన్నారు’’ అని శ్రీజ పేర్కొన్నారు.‘‘దేవుడి అండ ఉన్నంతవరకు మాపై వేసే ప్రతీ రాయి పువ్వుగా మారుతుంది. ఆయనే మాకు ఓ రక్షణ కవచంలా ఉంటారు. మా ఇంటిపై అత్యంత దారుణంగా అటాక్ చేశారు. 9 గంటల పాటు తండోపతండాలుగా జనం దాడి చేశారు. ఉదయం గుడికి వెళ్లిన నాన్నపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. కర్రలతో వచ్చి అంబటి రాంబాబుపై దాడి చేశారు. టీడీపీ మహిళలు బూతులతో ఆయనను తిట్టారు. ఆ సమయంలోనే మా నాన్న అలా మాట్లాడారు. దానికి ఆయన రియలైజ్ అయ్యి ఆ మాట అనకూడదన్నారు. లీగల్గా ఎదుర్కొంటానని కూడా చెప్పారు..కానీ మా ఇంట్లో ఆడవాళ్లని దారుణంగా తిడుతూ అటాక్ చేశారు. కాపు కులంకి బూతులు జోడించి తిట్టారు. ఒక డాక్టర్ అయిన కేంద్రమంత్రి దీనిని నడిపించడం దారుణం. ఆయన మేథస్సు ఆయన్ని సరైన మార్గంలో పెట్టలేదా అని అనిపిస్తోంది. అంబటి రాంబాబుని నాలుగు గోడల మధ్య భౌతికంగా వేధించడం దారుణం. ఆయనను వేధించి రాక్షసానందం పొందారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని తెలుసుకొవాలి. దాడి చేసిన దానికంటే.. నాలుగు రెట్ల జనం అభిమానంతో వచ్చారు’’ అని శ్రీజ చెప్పారు. -
రేపు జోగి రమేష్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి: టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీమంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 6న పరామర్శించనున్నారు. ఆ రోజు ఉ.10.30 కు తాడేపల్లి నివాసం నుంచి జగన్ ఇబ్రహీంపట్నం బయల్దేరుతారు.కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. వైఎస్ జగన్ మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అపోలో హాస్పిటల్స్ ప్రతాప్రెడ్డికి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: అపోలో ఆస్పత్రుల గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఒక సాధారణ డాక్టర్ స్థాయి నుండి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేలా సాగిన మీ ప్రయాణం స్ఫూర్తిదాయకం. మీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. Warmest birthday wishes to Dr. Prathap C. Reddy Garu. Your journey from a professional physician to a global healthcare pioneer has been exemplary. Wishing you good health and happiness always. pic.twitter.com/qYgaPHxb06— YS Jagan Mohan Reddy (@ysjagan) February 5, 2026 -
చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా?
మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందని ఓ సామెత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి కూడా ఇలాగే ఉంది. ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో టీడీసీ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ, అరెస్టులు చేస్తూ... భౌతిక దాడులకు దిగుతూ రెడ్బుక్ అరాచకం సృష్టిస్తున్న పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు... వీటన్నింటికీ కారణం వైసీపీనేనని, వారి ట్రాప్లో పడవద్దని కేడర్కు చెబుతున్నారట. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని టెలికాన్ఫరెన్స్లో ఆయనగారు వక్కాణించిన మాటలను కొన్ని విశేషణాలు చేర్చి యథాతథంగా ప్రచురించుకుని తరించింది ఎల్లో మీడియా! ప్రజలు మాత్రం ఇదేం చోద్యమన్నట్టు నోళ్లెళ్లబెడుతున్నారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడినే ఉదాహరణగా తీసుకుందాం. పక్కా రౌడీలు మాత్రమే అలాంటి విధ్వంసం సృష్టించగలరు. లకారాలతో ఈ దాష్టీకంలో పాల్గొన్న టీడీపీ మహిళ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె భర్త రామచంద్రరావులు మాత్రం ఇప్పటివరకూ అరెస్ట్ కూడా కాలేదు. తెలుగుదేశం కార్యకర్తలు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత కూడా రాష్ట్రమంతటా అనుచితమైన ఫ్లెక్సీలు కట్టడంతోనే ఈ సమస్యంతా మొదలైంది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సిట్ స్పష్టం చేయడంతో చంద్రబాబు బృందం,ఎల్లో మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతుల సాయంతో ఈ ఫ్లెక్సీల డ్రామాకు తెరలేపారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలపై నెపం నెట్టేస్తూ తప్పుడు ఆరోపణలతో కట్టిన ఈ ఫ్లెక్సీలను పోలీసులు సకాలంలో తీసివేసి ఉంటే పరిస్థితి చేయిజారేదీ కాదు. పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించి.. ఆ ఫ్లెక్సీలను తామే తొలగిస్తామనడం అంబటి పాపమైంది. ఫ్లెక్సీ కట్టిన రోడ్డు ద్వారా గుడికి వెళ్లి వస్తూంటే... టీడీపీ కార్యకర్తలో లేక వారు తెచ్చుకున్న కిరాయి మూకో కర్రలతో అంబటి కారుపై దాడి చేశారు. కర్రలు, రాడ్లతో వీరు దాడులు చేస్తూంటే.. పోలీసులు వారికి రక్షణగా ఉండటం రాష్ట్రంలో శాంతి భద్రతల దుస్థితికి అద్దం పడుతుంది. ఇది హింస అన్న విషయం చంద్రబాబుకు తెలియదా!. అంతేకాదు. గ్రంధాలయ సంస్థ ఛైర్ పర్సన్ అయిన టీడీపీ మహిళా నేత అకారణంగా అంబటిని బండబూతులు తిట్టడం ఏ రకమైన సభ్యతో వారికే తెలియాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఇలాంటి చౌకబారు రాజకీయాలను ఖండించాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఆయన నిస్సహయత అనుకోవాలి. ఇంత జరిగిన తరువాత కదా అంబటి కూడా ఆవేశానికిలోనై ప్రతి దూషణకు దిగింది. అయితే ఆ వెంటనే ఆయన తన తప్పు తెలుసుకుని అలా మాట్లాడకుండా ఉండాల్సిందని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా... తాను ‘ఆ’ మాటలు అన్నది చంద్రబాబును ఉద్దేశించి కాదని కూడా స్పష్టం చేశారు. తనను అదే మాటలతో తిట్టిన వారినే తాను దూషించానని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ వారు వైసీపీ కార్యాలయం, అంబటి ఇంటిపై దాడులకు తెగబడ్డారు. విధ్వంసం సృష్టించారు. ఇళ్లపై దాడులు చేసి కార్లు, ఫర్నీచర్ పగులగొట్టిన టీడీపీ వాళ్లు అమాయకులు, శాంతికాముకులని చెప్పడం చంద్రబాబు మాటల్లోని ఉద్దేశమా? అంబటిపై జరిగింది హత్యా యత్నం! ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తామని స్వయంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్న కొన్ని గంటలకే అంబటి ఇంటిపై దాడి జరిగిన విషయం చంద్రబాబుకు తెలియదా? పైగా దీనికి నేతృత్వం వహించింది స్వయానా టీడీపీ మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త. సిగ్గుచేటు. అంబటి దొరికి ఉంటే.. చంపేసేవారమని టీడీపీ వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటే ఎవరు ఎవరి ట్రాప్లోపడ్డట్టు? బాధితులు ఎవరు?.. అంబటి భార్య, కుమార్తెలు ఇంటిలో ఉంటే మహిళా ఎమ్మెల్యే ఆద్వర్యంలో దాడి చేస్తారా? వారిని భయభ్రాంతులను చేస్తారా? వారు లోపల బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. స్ల్రీల పట్ల కూడా కనికరం లేకుండా చంద్రబాబు మాట్లాడడమా! దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంత పాడడమా! ఎంత అన్యాయం. రెచ్చగొట్టేది, హింసకు తెగబడేది, బూతులు తిట్టేది, విధ్వంసం చేసేది టీడీపీ వారే. ఆఖరికి విధ్వంసకారులకు పోలీసులు తోడుగా నిలబడటం, రక్షించాలని వేడుకున్నా ఓ పోలీసు ఉన్నతాధికారి పట్టించుకోకపోవడం రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి దర్పణంగా నిలిచింది. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా మారి, చివరికి బాధితుడైన రాంబాబును అరెస్టు చేసి రిమాండ్కు పంపడం ఎంత దారుణం? ఇలాంటి ఘటనలే కదా దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువును పలుచన చేస్తున్నది? జాతీయ మానవ హక్కుల సంఘం స్వయంగా ఈ ఘటనపై స్పందించిందంటేనే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం గత టర్మ్లోనూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పోలీసులతో ఎలా వేధించిందీ, ఆయన కుటుంబ మహిళలను ఎంత దారుణంగా దూషించిందీ కంటతడి పెట్టుకుని ముద్రగడే ఆవేదనతో చెప్పుకోవల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇంకో కాపు నాయకుడు అంబటి రాంబాబు కుటుంబంపై టీడీపీ గూండాలు దాడి చేయడం సహజంగానే ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అంబటి కుమార్తె మౌనిక ఒక ప్రశ్న వేశారు. తన తండ్రి ఆ క్షణంలో ఆవేశానికిలోనై ఒక మాట అన్నా... వెంటనే సారీ చెప్పారని, చంద్రబాబు గతంలో వైసీపీ నేత జగన్ను ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ గూండాలు ఒక కాపు మహిళపై దాడికి తెగబడితే కనీసం ప్రశ్నించలేవా? అని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ను నిలదీశారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పుకోవాలి. టీడీపీ సోషల్ మీడియా వారు తన కుటుంబాన్ని దూషిస్తూ పెట్టిన పోస్టులపై కేసులు నమోదు చేసేందుకు అంబటి సాక్షాత్తూ హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇక మరో మాజీమంత్రి జోగి రమేష్ మంత్రి లోకేశ్ను రాజకీయంగా విమర్శిస్తే ఆయన ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరి నిప్పు పెట్టారు. ఇలా దాడి చేసినవారి వెంట పోలీసులు ఉన్నా కనీసం ఆపే యత్నం చేయలేదు. మొక్కుబడిగా కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు మాజీమంత్రి పరిటాల రవి హత్యకు గురైనప్పుడు టీడీపీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మరీ బస్సులు దగ్దం చేయించారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో బంద్లలో హింస ఎలా చేయాలో చంద్రబాబు చెప్పేవారని తెలిపిన విషయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి హింసలకు టీడీపీ తెగబడుతోందంటే అధికార అహంకారంతో కాక మరేమిటి? చంద్రబాబు, లోకేశ్ల ప్రోద్బలం కాదని ఎవరైనా అనుకుంటారా? ఇలా ఈ రెండేళ్లలో కనీసం ఇరవై మంది వైసీపీ నేతలపై దాడులు జరిగాయి. కార్యకర్తలపై ఎన్ని దాడులు చేసింది లెక్క చెప్పలేం. తిరిగి వీరిపైనే కేసులు పెట్టే ధోరణి ఇప్పడే చూస్తున్నాం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: సుప్రీంకోర్టులో వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసుపై విచారణ జరిగింది. ఒక అంశంపైనే దర్యాప్తు చేయాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సునీత రెడ్డి సవాల్ చేశారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని సీబీఐ తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీబీఐ పేర్కొంది.విచారణలో భాగంగా జస్టిస్ సుందరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేమని.. ఇలా అయితే మూడు, నాలుగేళ్లు పడుతుందన్నారు. ఇది అంతులేకుండా ముందుకు వెళ్తుంది. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగించొచ్చు. ఎవరిని విచారించాలన్న అంశంపై ఎలాంటి ఆదేశాలివ్వం అని జస్టిస్ సుందరేష్ స్పష్టం చేశారు.గత విచారణలో(జనవరి 20) కూడా.. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ విచారణ కొసాగింపునకు ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించగా.. ‘ఇంకెంతకాలం సీబీఐ దర్యాప్తు కొనసాగించాలి?. మళ్లీ మినీ ట్రయల్ కోరుకుంటున్నారా?. ఇలా అయితే సీబీఐ దర్యాప్తు పూర్తయ్యేందుకు పదేళ్లు పడుతుంది’’ అంటూ జస్టిస్ సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా.. సునీత పిటిషన్పై వైఖరి తెలియజేయాలని సీబీఐని కోరారు. అయితే.. తమ వైఖరి తెలియజేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరడంతో.. తదుపరి విచారణను నేటికి (ఫిబ్రవరి 5) వాయిదా వేసింది. ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగించొచ్చని ఎవరిని.. విచారించాలన్న అంశంపై ఎలాంటి ఆదేశాలివ్వమని పేర్కొంది. -
కడపలో ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సోషల్ మీడియాలో లైకులు, షేరులు.. పాపులారిటీ కోసం కొందరు చేసే ప్రయత్నాలు విసుగు పుట్టిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ యువకుడు రీల్స్ పిచ్చితో ప్రాణాలు పొగొట్టుకున్నాడు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ముబారక్(20) తన స్నేహితుడితో కలిసి బైక్ స్టంట్ చేస్తూ రీల్స్ చేస్తుంటాడు. వాటికి కొద్ది కొదద్దిగా వ్యూస్ రావడం ప్రారంభించింది. దీంతో ఎక్కువ వ్యూస్ రావాలనే ఆశతో మితిమీరి స్టంట్స్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో.. బైక్పై విన్యాసాలు చేస్తూ అదుపు తప్పి పడిపోయాడు. ఈ ఘటనలో ముబారక్ అక్కడికక్కడే మరణించాడు. వెనకాల కూర్చున్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఈ ఘటనలో స్కూటీ తక్కుతుక్కుగా ధ్వంసం కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. -
ఓటుకు నోటు భయం.. రాయలసీమ లిఫ్ట్ తాకట్టు: సజ్జల
సాక్షి, కర్నూలు జిల్లా: పోతిరెడ్డి పాడు నిరసన ఆరంభం మాత్రమేనని.. రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. సీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారంటూ మండిపడ్డారు. ఇవాళ చలో పోతిరెడ్డిపాడుకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. సీమ లిఫ్ట్ పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. చలో పోతిరెడ్డిపాడుకు ప్రజా, రైతు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.ముందుగా వైఎస్సార్సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, పలువురు నేతలు పోతిరెడ్డిపాడును సందర్శించారు. అనంతరం పోతిరెడ్డిపాడు దగ్గర నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహానికి సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయలసీమ జిల్లాల నుంచి బహిరంగ సభకు రైతులు తరలివచ్చారు. ఈ సభలో వైఎస్సార్సీపీ సీమ జిల్లాల అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, మాజీ మంత్రులు శైలజానాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి, విశ్వేశ్వరరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు మంగమ్మ శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, కంగాటి శ్రీదేవి, బుట్టా రేణుక పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతలను నిర్దాక్షిణ్యంగా ఆపేసి ఈ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ప్రజానీకం కన్నెర్ర చేస్తోంది. ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాల్సిందేనని నినదిస్తోంది. ‘సీమ’కు ద్రోహం చేస్తున్న ‘జల’కంటక సర్కారుపై గళమెత్తి గర్జిస్తోంది. ‘తీరుమారకుంటే పతనం తప్పదు ఖబడ్దార్’ అంటూ హెచ్చరిస్తోంది. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గం. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి నిజాలు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు?. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేకపోతే చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదు. తెలంగాణ మాదిరే రాయలసీమకు 800 అడుగుల స్థాయిలోనే శ్రీశైలం నీరు రావాలి. చంద్రబాబుకు ఓటుకు నోటు భయం ఉంది. హైదరాబాద్లో ఆస్తులను కాపాడుకునేందుకు రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే కారణంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దారుణం. రైతులకు సమృద్ధిగా నీరందిస్తేనే అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్ ఏనాడో గుర్తించారు. సీమ తాగు సాగు నీటి కష్టాలకు ఏకైక పరిష్కారం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడమే. 80 శాతం పూర్తయిన ప్రాజెక్టును ఆపేయడం మహాపాపం అని చంద్రబాబు గుర్తించాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబుకు రాయలసీమ ప్రయోజనాలు పట్టవు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్కు తాకట్టు పెట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల్లోనే తెలంగాణ తీసుకుంటూ ఉంటే రాయలసీమ ఎందుకు తీసుకోకూడదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఇప్పుడు అర్ధాంతరంగా పనులు నిలిపివేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ సుభిక్షంగా ఉందంటే అది ఒక్క వైఎస్సార్ వలనే.. రాయలసీమ ప్రజలు నిత్యం సుభిక్షంగా ఉండాలని వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకువచ్చారన్నారు. రేవంత్ రెడ్డి మాటలు విని చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపారని సతీష్రెడ్డి మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆగలేదు. కరువు సమయంలో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. వైఎస్ జగన్ తెచ్చిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు అపాల్సి వచ్చింది?. రేవంత్ మాటలను చంద్రబాబు ఎందుకు ఖండించలేదు సమాధానం చెప్పాలి. జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎంఎస్ఎస్కి పిడికెడు మట్టి తీయలేదు. రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. రాయలసీమ రైతులపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోంది. పోతిరెడ్డిపాడు నిరసన ఆరంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉదృతం చేస్తాం’’ అని సతీష్రెడ్డి హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఏనాడు రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదు. రాయలసీమకు వచ్చిన ఎయిమ్స్, హైకోర్టు తరలించుకు పోయారు.శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రయోజనాలను సీఎం చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టాడన్నారు. రాయలసీమ ద్రోహిగా చరిత్రలో చంద్రబాబు మిగిలి పోతారన్నారు. రాయలసీమకు మేలు చేసిన ఏకైక కుటుంబం వైఎస్సార్ మాత్రమే.. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలం చేయాలని వైఎస్ జగన్ శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించాలి. సీమ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించాలి. -
విశాఖ: రిటైర్డ్ సూపరిండెంట్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
సాక్షి, విశాఖపట్నం: రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరావు.. పంచాయితీరాజ్ శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. విశాఖ, మధురవాడ, సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా, హైదరాబాద్లోని శేరిలింగంపల్లిలోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
సాక్షి,పశ్చిమగోదావరి: శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోసేన్రాజు కుమారుడి వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. పెదఅమిరం శ్రీరాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు తేజ రిషిత, చిట్టిరాజు (ఐపీఎస్)లకు వైఎస్ జగన్.. వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. -
ఆంధ్రజ్యోతికి హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రజ్యోతి దినపత్రికకు విశాఖలో రూ.కోట్ల విలువైన భూమిని కట్టబెడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఆమోద పబ్లికేషన్స్ (ఆంధ్రజ్యోతి)కి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన నక్కా నిమ్మిగ్రేస్ హైకోర్టులో ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ... చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి...
-
గ్రూప్స్ ‘నవ తరం’గాలు
సాధారణ పేద కుటుంబాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ గ్రూప్స్లో జయకేతనం ఎగురవేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వీరు ప్రణాళికబద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించారు. క్రమశిక్షణతో కూడిన తర్ఫీదు, ప్రిపరేషన్, కఠోర సాధనే తమను గెలుపు వాకిళ్లలో నిలబెట్టిందని సగర్వంగా ప్రకటించారు. – సాక్షి ఎడ్యుకేషన్ నా తండ్రి కూరగాయల వ్యాపారి ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ మాక్ ఇంటర్వ్యూ సమయంలో అడిగిన కొన్ని ప్రశ్నలు సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూలో ఎదురవడం కలిసొచ్చింది. కోచింగ్ చాలాబాగా ఉపయోగపడింది. నా తండ్రి తెనాలిలో కూరగాయల వ్యాపారి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను గ్రూప్–1లో డీఎస్పీ ఉద్యోగం సాధించా. ఆనందంగా ఉంది. – అడపాల ఓంకార వెంకట నాగేశ్వరరావు, గ్రూప్–1 విజేత, తెనాలి సి‘విల్ పవర్తో’.. సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి గ్రూప్–1 కోసం ప్రిపేర య్యాను. రెండేళ్ళపాటు మరో ప్రపంచం తెలీకుండా పూర్తిగా గ్రూప్–1 కోసమే శ్రమించా. ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో సివిల్స్ కోసం తీసుకున్న కోచింగ్ గ్రూప్–1 విజయానికి చాలా సహాయపడింది. – భారతాల ఉదయ్ శంకర్, ఏపీపీఎస్సీ గ్రూప్–1 విజేత స్టడీ సర్కిల్ ‘మిత్ర’లాభం గ్రూప్–1 మెయిన్స్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ఆర్సీరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో తీసుకున్న క్లాసులు బాగా హెల్ప్ అయ్యాయి. ఇంటర్వ్యూ సమయంలో సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ సంఘ మిత్ర సలహాలు పనికొచ్చాయి. – బి.నిఖిలశ్రీ, ఏపీపీఎస్సీ గ్రూప్–1, విజేత దృఢ ‘సంకల్పసిద్ధి’ ఏపీపీఎస్సీ గ్రూప్–1లో సత్తాచాటి డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికయ్యా. ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ ఇచ్చిన బలమైన మద్దతుతో దృఢ సంకల్పంతో ముందడుగు వేసి విజయం సాధించా. – విఖిలశ్రీ, గ్రూప్1 విజేత, ఎన్టీఆర్జిల్లా శిక్షణ.. మంచి ‘స్కోర్’ ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్లో తీసుకున్న ప్రత్యేక శిక్షణ కలిసొచ్చి ంది. ప్రిలిమ్స్, మెయిన్స్లోనూ మంచి స్కోర్కు ఉపయోగపడింది. గ్రూప్–1లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ పోస్టుకు ఎంపికయ్యాను. –నరహరిశెట్టి భానుప్రకాష్, గ్రూప్–1 విజేత, అవనిగడ్డ, కృష్ణాజిల్లా 50మందికిపైగా ఆర్సీ స్టడీ సర్కిల్ అభ్యర్థుల విజయం హైదరాబాద్ ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు అత్యధికులు ఏపీపీఎస్సీ గ్రూప్1లో ఉద్యోగాలు సాధించారు. మేం సిలబస్తోపాటు ఎగ్జామ్ ఓరియెంటేషన్పైనా దృష్టిసారిస్తాం. సీనియర్ ఫ్యాకల్టీలు అందుబాటులో ఉన్నారు. 43 ఏళ్లుగా స్టడీసర్కిల్ నడుపుతున్నాం. మా సంస్థ అభ్యర్థులు వేయిమందికిపైగా ఇప్పటి వరకు సివిల్స్ టాపర్లుగా రాణించారు. గత వారంలో ప్రకటించిన ఏపీపీఎస్సీ గ్రూప్–2 ఫలితాల్లోనూ అత్యధిక శాతం మంది విజేతలు మా సంస్థ వారే. మా నాన్న ఆర్సీ రెడ్డి జీవితకాల కృషి ఫలితం ఈ ఇన్స్టిట్యూట్. ఆయన స్ఫూర్తిని మా చెల్లి దీప్తితో కలిసి ముందుకు తీసుకెళ్తున్నా. –బి.సంఘమిత్ర, ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ -
నిందితులను రోడ్లపై ఎలా పెరేడ్ చేయిస్తారు?
సాక్షి, అమరావతి: పోలీసులు సామాన్య ప్రజలతో అమానవీయంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. చట్ట నిబంధనలను పాటించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తేల్చి చెప్పింది. చట్టానికి లోబడే పోలీసులు శాంతి భద్రతలను కాపాడాల్సి ఉంటుందని చెప్పింది. వివిధ కేసుల్లో అరెస్టు చేసిన నిందితులను రోడ్లపై పెరేడ్ చేయిస్తూ.. ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియా ముందు ఎందుకు ప్రవేశపెడుతున్నారని పోలీసులను నిలదీసింది. నేరం నిరూపణ అయ్యేంత వరకు నిందితులు నిరపరాధులేనని స్పష్టం చేసింది. నిందితులను పెరేడ్ చేయిస్తున్న వ్యవహారంలో రాష్ట్ర‡ ప్రభుత్వానికి, డీజీపీ, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.వివిధ కేసుల్లో అరెస్టు చేసిన నిందితులను రోడ్లపై పెరేడ్ చేయిస్తూ, ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియా ముందు ప్రవేశపెట్టడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పరసా సురేష్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.పోలీసులే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, నిందితులను రోడ్లపై పెరేడ్ చేయించడం ఇటీవలి కాలంలో పెరిగిపోయిందని, ఇలా పెరేడ్ చేయించి మీడియా ముందు ప్రవేశపెట్టడం సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్దమని తెలిపారు. ఇలా చేయడం ఓ రకంగా నేరం చేశారని తీర్పునిచ్చేయడమేనన్నారు. వాస్తవానికి నేరం చేశారా లేదా అన్నది తేల్చాల్సింది న్యాయవ్యవస్థ మాత్రమేనని, అయితే రాష్ట్రంలో పోలీసులే న్యాయ నిర్ణేతల్లా వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.నేరారోపణ ఉన్న ప్రతి వ్యక్తీ దోషి కాదని, అలాంటప్పుడు వారిని రోడ్లపై పెరేడ్ చేయించడం వారి హక్కులను హరించడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఉత్తర భారతదేశంలో ఓ ద్విచక్ర వాహనదారుడిని పోలీసులు దూషిస్తూ కొడుతున్నారని, ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్ తమకు వచి్చందని తెలిపింది. సామాన్య ప్రజల పట్ల పోలీసులు అమానవీయంగా వ్యవహరిస్తున్నారంది. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ.. ఓ కేసులో నిందితుడిని తీసుకెళ్లే వాహనం మరమ్మతులకు గురి కావడంతో పోలీసులు అతన్ని నడిపించుకు తీసుకెళ్లారని, దీన్ని ఫోటోలు తీసి ప్రచారం చేశారని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చింది. -
చంద్రబాబు, పవన్ ఏకాంత చర్చలు
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని అడ్డగోలుగా విష ప్రచారం చేసి దొరికిపోయిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇద్దరూ రెండున్నర గంటలపాటు ఏకాంతంగా చర్చలు జరిపినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్ధాలని సీబీఐ సిట్ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ ద్వారా బయటకొచ్చిన నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు శ్రీ వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగి పాపం మూటగట్టుకున్నారని ప్రజలు నమ్ముతుండడం.. వారు చెప్పిన అబద్ధాలను ఎంత సమర్థించుకుంటున్నా ప్రజలు నమ్మకపోవడంతో దీనిపై ఏం చేయాలని కూటమి నేతలు రెండ్రోజులుగా తర్జనభర్జన పడుతున్నారు. అందులోభాగంగానే చంద్రబాబుతో పవన్కళ్యాణ్ బుధవారం సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది.ఇక లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయాలపై టీడీపీ శ్రేణులతో దాడి చేయించడంవల్ల ప్రభుత్వం తీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోవడంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. ఈ అంశంపైనే ఎక్కువగా వీరు మాట్లాడుకున్నట్లు టీడీపీ నేతల ద్వారా తెలిసింది. అలాగే, త్వరలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల పంపకం పైనా ప్రాథమికంగా చర్చలు జరిపారు. బీజేపీ రెండు రాజ్యసభ స్థానాలు తమకే కావాలని పట్టుబడుతుండడంతో దానిపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. టీడీపీ, జనసేన చెరొకటి పంచుకోవాలా లేక బీజేపీని ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాలని ఒప్పించాలా అనే అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలిసింది. అయితే, ఈసారి జనసేనకు ఒక స్థానం కచ్చితంగా ఇవ్వాలని చంద్రబాబును పవన్ కోరినట్లు తెలిసింది. అలాగే, తన సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం వంటి అంశాలను కూడా పవన్ ప్రస్తావించినట్లు సమాచారం. దీంతోపాటు ఇంకా భర్తీ కావాల్సిన నామినేటెడ్ పదవులతోపాటు రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లేకపోవడంవల్ల ఎదురవుతున్న సమస్యలపైనా చర్చించినట్లు తెలిసింది. -
రెండేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే చంద్రబాబు కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. గుంటూరు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపైన, ఆయన ఇంటిపైన జరిగిన దాడి ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరిగిందని ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రెస్మీట్ పెట్టి, చేసిన హెచ్చరికలు ప్రభుత్వం పట్ల ఆగ్రహానికి కారణం అయ్యాయని ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ నివేదికలో ఇంకా ఏం చెప్పారంటే.. » తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్ ఛార్జిషీట్ స్పష్టం చేసినప్పటికీ, అదేపనిగా ఇంకా ప్రభుత్వం దు్రష్పచారం చేస్తుండటాన్ని అత్యధికులు తప్పు పడుతున్నారు. » ప్రతిపక్షంగా ఈ విషయంపై వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతుండటం సహజమని, ఎందుకంటే ఆ రోజు జంతువుల కొవ్వు కలిపారని చెప్పింది ప్రభుత్వ పెద్దలే కనుక.. ఈ మాత్రం ప్రభుత్వ పెద్దలను నిలదీయడంలో తప్పు లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. » ఇప్పటికైనా ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా, మళ్లీ విచారణ అంటూ నిర్ణయం తీసుకోవడం కక్ష సాధింపుగా కనిపిస్తోందని ప్రజలు చెబుతున్నారు. »ఇదే విషయంపై అంబటి రాంబాబు మాట్లాడినందుకు శనివారం ఉదయం నుంచి టీడీపీ శ్రేణులు ఆయనపై దాడికి యత్నించాయని, వెంటపడి వేధించాయని.. ఓ దశలో ఆయన్ను తీవ్రంగా రెచ్చగొట్టారని.. అందువల్లే ఆయన పరుషంగా మాట్లాడారని చెబుతున్నారు. ఆ పరిస్థితిలో ఆయన స్థానంలో ఎవరున్నా అంతే స్థాయిలో ఆగ్రహానికి గురవుతారని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. » మళ్లీ పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు అంబటి ఇంటి వద్దకు వెళ్లి గొడవకు దిగడం, కార్లు, కార్యాలయంలో ఫరి్నచర్ను ధ్వంసం చేయడం ఏమాత్రం సరికాదని తప్పుపడుతున్నారు. » ఈ నేపథ్యంలో అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరుకు వచ్చినప్పుడు చాలా మంది ప్రజలు స్వచ్ఛందంగా ఆయన్ను చూడటానికి వచ్చారు. చాలా చోట్ల బారికేడ్లు పెట్టినా మహిళలు సైతం రోడ్డుపైకి రావడం కనిపించింది. -
‘జల’కంటక సర్కారుపై పోరుకేక..
సాక్షి ప్రతినిధి కర్నూలు: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతలను నిర్దాక్షిణ్యంగా ఆపేసి ఈ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై ప్రజానీకం కన్నెర్ర చేస్తోంది. ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాల్సిందేనని నినదిస్తోంది. ‘సీమ’కు ద్రోహం చేస్తున్న ‘జల’కంటక సర్కారుపై గళమెత్తి గర్జిస్తోంది. ‘తీరుమారకుంటే పతనం తప్పదు ఖబడ్దార్’ అంటూ హెచ్చరిస్తోంది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం ‘చలో పోతిరెడ్డిపాడు’కు రాయలసీమ రైతాంగం సిద్ధమైంది. అనుమతివ్వకుండా అడ్డంకులు రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాధాన్యం, చేసిన పనులు, ప్రాజెక్టు ఆవశ్యకత సీమ ప్రజలకు తెలిసేందుకు జనవరిలోనే వైఎస్సార్సీపీ నేతలు సమావేశమై ఈనెల 5న పోతిరెడ్డిపాడు వద్ద సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత నంద్యాల వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి సభ అనుమతి కోసం యత్నించారు. అయితే ప్రభుత్వ ఆదేశంతో పోలీసులు చివరి క్షణం వరకూ సభకు అనుమతివ్వలేదు. పోలీసులు అనుమతి చ్చినా, ఇవ్వకపోయినా ‘సీమ’ ప్రయోజనాల కోసం ఆటంకాలను అధిగమించి, పోతిరెడ్డిపాడుకు చేరుకుని నిరసన తెలపాలని రైతాంగం సిద్ధమైంది. వైఎస్సార్సీపీ నేతలూ దృఢ సంకల్పంతో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా పోలీసులు అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా భారీగా రైతులు, ప్రజలు తరలివస్తారని తెలుసుకున్న సర్కారు.. అనుమతివ్వకపోతే అభాసుపాలవుతామని జంకింది. ఫలితంగా పోతిరెడ్డిపాడు సభకు షరతులతో కూడిన అనుమతులిస్తూ ఆత్మకూరు డీఎస్పీ బుధవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకే చలో పోతిరెడ్డిపాడు తెలంగాణ సీఎం రేవంత్తో, చంద్రబాబు చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగానే రాయలసీమలిప్ట్ ఇరిగేషన్ పనులు నిలిచిపోయాయి. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. దీంతో చంద్రబాబు, ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు అసలు రాయలసీమ లిప్ట్ అవసరం లేదని, ఇది వృథా ప్రాజెక్టు అని ఏకంగా జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతోపాటు కూటమి ప్రభుత్వంలోని పలువురు వితండవాదానికి దిగారు. ఈ క్రమంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాధాన్యం, తెలంగాణ చేస్తున్న జలదోపిడీ, చంద్రబాబు చేస్తున్న ద్రోహం, ఇప్పటి వరకూ జరిగిన రూ.990 కోట్ల విలువైన పనులను ప్రజలకు చూపించడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ చలో పోతిరెడ్డిపాడుకు పిలుపునిచ్చిoది. పిడికిలి బిగించిన సీమ నేతలు రాయలసీమ ప్రయోజనాలపై రాజీపడబోమని సీమ నేతలు, రైతులు పిడికిలి బిగించారు. మరోవైపు వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పోతిరెడ్డిపాడు వద్ద సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగురోజులుగా అక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వైఎస్సార్సీపీ నందికొట్కూరు సమన్వయకర్త ధారా సుధీర్ కూడా ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. శిల్పా రవి, ఎమ్మెల్సీ ఇసాక్తో పాటు పలువురు నేతలు ఇప్పటికే పోతిరెడ్డిపాడును సందర్శించారు. అలాగే ‘సీమ’లోని అన్ని జిల్లాల అధ్యక్షులు, ఎంపీ మిథున్రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు భారీగా తరలిరానున్నారు. వీరికి సంఘీభావంగా ‘సీమ’ ప్రయోజనాలు కాంక్షించే పలు రైతు, ప్రజా సంఘాల నేతలు సభలో పాల్గొననున్నారు. హైకోర్టులో పిటిషన్తో దిగొచ్చిన పోలీసులుసాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి సీఎం చంద్రబాబు రాయలసీమ, నెల్లూరు జిల్లాకు చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు అనుమతి ఇచ్చే విషయంలో పోలీసులు దిగొచ్చారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో బహిరంగ సభ నిర్వహించేందుకు నంద్యాల జిల్లా ఎస్పీ అనుమతి ఇచ్చారు. దీంతో పిటిషన్ను పరిష్కరిస్తూ న్యాయమూర్తి జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 5న ఉదయం 10 నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు పోతులపాడు గ్రామంలో మాజీ సర్పంచ్ గోపాల్రెడ్డికి చెందిన పొలంలో సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రా గా రాంభూపాల్రెడ్డి తరఫు న్యాయవాది మహేశ్వర్రెడ్డి స్పందిస్తూ.. తాము ఈ వ్యాజ్యం దాఖలు చేసిన తరువాత సభ నిర్వహణకు అనుమతి ఇస్తూ పోలీసులు ప్రొసీడింగ్స్ ఇచ్చారన్నారు. పోలీసులు ప్రొసీడింగ్స్ను రికార్డ్ చేస్తూ కేసును పరిష్కరించాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీమకు ద్రోహం చేస్తావా బాబూ? ‘సీమ’కు మేలు చేయని అనుభవం, అధికారం ఎందుకు చంద్రబాబు? రాయలసీమ అత్యంత వెనుకబడింది. కరువులతో వలసలు ఎక్కువయ్యాయి. అయినా ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తావా చంద్రబాబూ..! రాయలసీమ లిఫ్ట్ ఆపిన ఈ పాపం ఊరికేపోదు. వైఎస్ జగన్ ప్రారంభించిన ఎత్తిపోతలను రాజకీయ ప్రయోజనాల కోసం నిర్దాక్షిణ్యంగా ఆపేస్తావా? నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు జాగ్రత్త. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, నంద్యాల ప్రభుత్వ తీరును ఎండగడతాం సభ జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది. సభ విఫలం కావడానికి సర్కారు చేస్తున్న యత్నాలు ఫలించవు. సభకు చివరి నిమిషం వరకు అనుమతివ్వని ప్రభుత్వం జనంలో పలుచన అవుతామనే భయంతో చివరికి అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది. కానీ షరతులు విధించింది. సభ నాలుగు గంటలే జరపాలంట. నాలుగైదు వేలమందే రావాలంట. ఏదేమైనా గురువారం పోతిరెడ్డిపాడు వద్ద రైతులు పెట్టే పొలికేక ఈ సర్కారు గుండెల్లో సమరభేరై మోగుతోంది. బాబు ప్రభుత్వ తీరును ఎండగట్టి తీరతాం. – బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
అసెంబ్లీ నుంచి అనేకమార్లు కాల్ చేశాడు
బంజారాహిల్స్: రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనకు అసెంబ్లీ నుంచి ప్రతిసారీ కాల్ చేసేవాడని, అక్కడ జరిగే అన్ని విషయాలూ చూపించేవాడని అతని బాధితురాలు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్–2లోని కమలాపురికాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మద్దతుతోనే కేసు నమోదైందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేను రూ.25 కోట్లు తాను అడగలేదని స్పష్టం చేశారు. సంజీవని ఆస్పత్రిలో డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ వేసుకున్నాకే అబార్షన్ అయిందని పేర్కొన్నారు. అరవ శ్రీధర్ తనతోనే కాకుండా మరో ఐదుగురితోనూ రాసలీలలు నడిపేవాడని చెప్పారు. తనకు ఆ విషయాలు తెలిశాక ఇదంతా ఆపేద్దామని అన్నానని, అందుకే సేఫ్ సైడ్గా అన్ని ఆధారాలూ ఉంచుకున్నానని పేర్కొన్నారు. తనను అతను పెళ్లి చేసుకుంటానని చెప్పిన విషయం వాళ్ల ఇంట్లో వారందరికీ తెలుసునని వివరించారు. టీడీపీ నేత ముక్కా రూపానందరెడ్డే వెనుక ఉండి శ్రీధర్ను నడిపిస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ నుంచి కాల్స్ చేయడం నిబంధనలకు విరుద్ధం కదా..! దీనిపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. తాను డబ్బులు డిమాండ్ చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. శ్రీధర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే శ్రీధర్కు శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు. విచారణ కమిటీ వేయాలి: న్యాయవాది ఆజాద్ బాధితురాలి తరఫు న్యాయవాది ఆజాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యేపై మహిళా విచారణ కమిటీ వేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ను కోరుతున్నట్లు చెప్పారు. బాధితురాలు రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు ఫుల్ ఆడియో లేదని పేర్కొన్నారు. ఆ ఆడియో ఉంటే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆస్తులు రూ.3 లక్షలు మాత్ర మే అని అఫిడవిట్లో ఉందని, అలాంటిది రూ.25 కోట్లు ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు. అక్రమంగా సంపాదిస్తే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీలో పోర్న్ వీడియో చూసిన ఎమ్మెల్యేపై స్పీకర్ చర్యలు తీసుకున్నారని, మరి ఏపీ అసెంబ్లీలో కూర్చొని ఇలాంటి పనులు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్పై స్పీకర్ చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. సాక్ష్యాలు కోర్టులోనే సమర్పిస్తా మరో వీడియో విడుదల చేసిన అరవ శ్రీధర్ బాధితురాలు పుల్లంపేట: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో సాక్ష్యాధారాలను కోర్టులోనే సమర్పిస్తానని బాధితురాలు తెలిపారు. బుధవారం ఆమె మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ ముందు అరవ శ్రీధర్ తన వాదనలు వినిపించారని, తనకూ త్రిసభ్య కమిటీ నుంచి పిలుపు వచ్చిందని వెల్లడించారు. త్రిసభ్య కమిటీ ముందు హాజరై అన్ని విషయాలూ వివరిస్తానని చెప్పారు. సాక్ష్యాధారాలను మాత్రం కమిటీకి ఇచ్చే ప్రసక్తే లేదని, కోర్టులోనే సమర్పిస్తానని ఆమె స్పష్టంచేశారు. ఎమ్మెల్యేపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా కేసు నమోదుచేయలేదని, జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడంతో కమిషన్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ వల్ల తాను ఐదుసార్లు గర్భం దాల్చానని సంజీవని హాస్పిటల్లో స్కానింగ్ చేసుకున్నానని చెప్పారు. సంజీవని హాస్పిటల్కు ఎమ్మెల్యే శ్రీధర్ ఫోన్ చేసి అబార్షన్ చేయాలని చెప్పడంతోనే తనకు ఆస్పత్రి వర్గాలు మాత్రలు ఇచ్చారని వెల్లడించారు. అబార్షన్ చేయించడం చట్టరీత్యా నేరమని, ఈ విషయంలో ఆధారాలు, రిపోర్టులు తన దగ్గరే ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో మహిళా కమిషన్ను కలిసి వివరాలు సమర్పించి న్యాయం కోసం డిమాండ్ చేయనున్నట్లు వెల్లడించారు. -
దీర్ఘకాలిక లీజుకా.. పీపీపీకా?
సాక్షి, అమరావతి: గుంటూరు అంజుమన్ ఇ ఇస్లామియా సంస్థకు చెందిన రూ.కోట్ల విలువైన భూములను అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో వాటిని మరో మార్గంలో మళ్లించేందుకు చంద్రబాబు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే ముస్లిం సమాజం నుంచి ఆగ్రహం పెల్లుబుకడంతో ఆ భూములను ఏపీఐఐసీకి బదలాయించేందుకు చేపట్టిన భూసేకరణ విషయంలో పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో.. గుంటూరు జిల్లా చినకాకానిలోని 71.57 ఎకరాల అంజుమన్ ఇ ఇస్లామియా సంస్థకు చెందిన భూములను ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకునే అంశాన్ని వక్ఫ్బోర్డు పరిధిలోకి ప్రభుత్వం నెట్టింది. దీంతో.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముస్లిం సమాజాన్ని మభ్యపెట్టేందుకు ఏపీ వక్ఫ్బోర్డు రంగంలోకి దిగింది.దీర్ఘకాలిక లీజుకు ఇద్దామా? ప్రభుత్వ శాఖలకు, ప్రైవేట్ వ్యక్తులకు పీపీపీ పద్ధతిలో అప్పగిద్దామా? అనే దానిపై తీర్మానం చేసేందుకు వక్ఫ్బోర్డు రంగం సిద్ధంచేసింది. ఇందుకోసం గురువారం విజయవాడలో ఏపీ వక్ఫ్బోర్డు కీలక సమావేశం నిర్వహిస్తోంది. అయితే, ఈ సమావేశం ఎజెండాను బుధవారం సాయంత్రం వరకు పలువురు సభ్యులకు అందించలేదు. మల్లాయపాలెంతో మొదలైన ప్రయత్నాలు.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రాగానే రూ.వందల కోట్ల విలువైన వక్ఫ్ భూములను ఏపీఐఐసీకి బదలాయించి తద్వారా పచ్చనేతలకు పప్పుబెల్లాల్లా పంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ, ప్రభుత్వ ప్రయత్నాలు వక్ఫ్ చట్టానికి విరుద్ధమని న్యాయ నిపుణులు, ముస్లిం నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తుల టైటిల్ను వేరొక సంస్థ, వ్యక్తి పేరున మార్చడానికి వీల్లేదు. అయినా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం–2018లోని సెక్షన్–22 అనుసరించి అతితక్కువ ధరకు ఏపీఐఐసీకి అప్పగించాలనే ప్రతిపాదన తెచ్చింది. ఇందులో భాగంగా.. తొలుత గుంటూరు షాహీ జామియా మసీదుకు చెందిన మల్లాయపాలెంలోని 233.18 ఎకరాలను ఇండ్రస్టియల్ పార్కు పేరుతో ఏపీఐఐసీకి భూసేకరణ ద్వారా బదలాయించేందుకు గతేడాది యత్నించింది. ఈ ప్రయత్నాలపై ముస్లిం సమాజం మండిపడడంతో వెనక్కి తగ్గింది. భూసేకరణను వాయిదా వేసి దీర్ఘకాలిక లీజు లేదా పీపీపీ పద్ధతిలో అప్పగించేందుకు వక్ఫ్బోర్డు ప్రతిపాదన చేసేలా స్కెచ్ వేసింది. కానీ, వక్ఫ్బోర్డు సభ్యుల నుంచి ముస్లిం నేతల వరకు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో మల్లాయపాలెం భూముల బదలాయింపునకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఇప్పుడు అంజుమన్ ఇ ఇస్లామియా భూముల వంతు.. ఈ నేపథ్యంలో.. చినకాకానిలోని అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు చెందిన 71.57 ఎకరాలను ఇండ్రస్టియల్ పార్కు పేరుతో ఏపీఐఐసీకి భూసేకరణ ద్వారా బదలాయించేందుకు నోటిఫికేషన్ జారీచేశారు. దీనిపై కూడా తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఇప్పుడు దీర్ఘకాలిక లీజుకు ఇద్దామా? పీపీపీ పద్ధతిలో ఇద్దామా? అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. వాస్తవానికి.. వక్ఫ్ భూములు లీజు, విక్రయం, బహుమతి (గిఫ్ట్)గా ఇవ్వడం కుదరదని వక్ఫ్ చట్టం–1995లోని సెక్షన్–51 స్పష్టంచేస్తోందని ముస్లిం ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. వక్ఫ్బోర్డు సమావేశం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. -
ప్రజా సేవకులమని మర్చిపోయి.. పాలకుల్లా వ్యవహరిస్తున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది. అధికారులు ప్రజా సేవకులన్న విషయాన్ని మర్చిపోయి, వారే పాలకులన్నట్లు వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. అధికారులందరూ ఒక కుటుంబంగానే ఉంటారని, కానీ ప్రజలను ఎల్లవేళలా ఓ ప్రతిపక్షంలా చూస్తుంటారని తెలిపింది. కోర్టులు ఏం చేస్తాయిలే అనుకునే అధికారులను ఎవ్వరూ కాపాడలేరని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ కోర్టు ఆదేశాలను అమలుచేసి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. కోర్టులో మా ఆదేశాలను అమలుచేస్తామని చెప్పి, ఆఫీసులకు వెళ్లిన తరువాత మూలన పడేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. సింగిల్జడ్జి ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టర్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావును న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం బుధవారం ఆదేశించింది. ప్రజాధనంతో పథకాలు తెస్తూ ప్రచారం కోసం వాడుకుంటున్నారు సర్వశిక్ష అభియాన్ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన మెమోను పరిశీలించిన ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వ తీరును కూడా తప్పుపట్టింది. పథకాలను ప్రచారం కోసమే వాడుకుంటున్నారు తప్ప, అమలు బాధ్యతను తీసుకోవడంలేదని వ్యాఖ్యానించింది. దీనివల్ల పథకం ఉద్దేశం నెరవేరడంలేదని తెలిపింది. ప్రభుత్వాలు బాధ్యతల నుంచి తప్పుకున్నా న్యాయస్థానాలు మాత్రం బాధ్యత నుంచి తప్పుకోవని హైకోర్టు స్పష్టం చేసింది. పథకం అమలుపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది.నోటీసులిచ్చి చేతులు దులిపేసుకుంటారా? తమను అర్ధంతరంగా తొలగించడాన్ని సవాలు చేస్తూ కేజీబీవీ పార్ట్టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ) దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. వారి సేవలను కొనసాగించాలని ఆదేశించారు. ఈ తీర్పుపై అధికారులు దాఖలు చేసిన అప్పీల్పైన, సింగిల్ జడ్జి తీర్పును అమలు చేస్తామంటూ కోర్టుకిచ్చిన హామీని ఉల్లంఘించినందుకు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావుపై తమ ఆదేశాల మేరకు నమోదైన సుమోటో కోర్టు ధిక్కార వ్యాజ్యం పైనా జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ధర్మాసనం ఆదేశాల మేరకు కోర్టుకు హాజరైన శ్రీనివాసరావును సింగిల్ జడ్జి ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించగా.. కింది స్థాయి అధికారుల తీరు వల్ల తన ఆదేశాలు అమలు కాలేదని, ఆ అధికారులకు నోటీసులు ఇచ్చానని ఆయన చెప్పగా, నోటీసులిచ్చి చేతులు దులిపేసుకున్నారా అంటూ నిలదీసింది. మరో ప్రశ్నకు శ్రీనివాసరావు సూటిగా సమాధానం చెప్పకపోవడంతో.. ‘ఇది మీ అధికారుల రివ్యూ మీటింగ్ కాదు. మీకు తోచింది చెప్పడానికి. కోర్టు అన్న విషయం గుర్తు పెట్టుకోండి’ అని ధర్మాసనం మండిపడింది. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తరఫున హాజరైన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) విష్ణుతేజ అధికారుల చర్యలను సమర్థించబోగా.. ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సుమోటో కేసులో కోర్టు సహాయకారిగా వ్యవహరించాల్సిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సైతం అధికారులను సమర్థించేలా వాదించకూడదని స్పష్టం చేసింది. ఏజీ ఓ ప్రాసిక్యూటర్గా వ్యవహరించాలంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
నిధులు లేకుండానే రోడ్లు మంజూరు
సాక్షి, అమరావతి: ప్రత్యేకించి తగినన్ని నిధులు లేని పద్దు కింద గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా రూ.2,123 కోట్ల రోడ్ల పనులు మంజూరు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఆ రోడ్ల పనులకు భారీగా మార్పులు చేస్తూ బుధవారం కొత్తగా మరో ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో రాష్ట్ర గ్రామీణ రహదారుల బలోపేతం ప్రాజెక్టు కింద 4007 కిలోమీటర్ల పొడవున 1299 గ్రామీణ రహదారుల నిర్మాణానికి రూ.2,123 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 9న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయా రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ఆ ఉత్తర్వులో పేర్కొన్నఆర్థిక శాఖ పద్దులో తగిన నిధులు కేటాయించకుండా.. ఆయా నిధులను ప్రస్తుత ఏడాది, వచ్చే ఏడాది కాలంలో నాబార్డు రుణం లేదంటే కేంద్రం ఇచ్చే సాస్కీ (ఎస్ఏఎస్సీఐ – స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) నిధులకు మారి్పడి జరుగుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఆయా రోడ్ల పనులను మంజూరుకు పరిపాలనపరమైన అనుమతులు తెలిపి దాదాపు రెండు నెలలు పూర్తవలేదు. అందుకు అవసరమైన నిధుల పైనా ఇంకా స్పష్టత లేదు. కానీ బుధవారం రెండు నెలల క్రితం మంజూరు చేసిన పనులను భారీగా మార్పులు చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు మంజూరు చేసిన 4007 కిలోమీటర్లకు సంబంధించిన 1299 పనుల స్థానంలో అదే రూ.2123 కోట్ల ఖర్చుతో కొత్తగా 4,122 కిలోమీటర్లకు సంబంధించిన 1392 రోడ్డు పనులకు పరిపాలనా అనుమతులిస్తున్నట్లు బుధవారం జారీ చేసిన ఉత్వర్వుల్లో పేర్కొంది. ఆయా పనుల వివరాలను కూడా ఉత్తర్వులకు జత పరిచింది. తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో కూడా ఈ పనులకు అవసరమయ్యే నిధులకు పాత జీవోలో పేర్కొన్న ఆర్థిక శాఖ పద్దునే పేర్కొంది. ఆ పద్దుకు ఇప్పటికీ తగిన నిధుల కేటాయించకుండా.. ఆయా నిధులను ప్రస్తుత ఏడాది, ఈ ఆర్థిక ఏడాది లేదా వచ్చే ఆర్థిక ఏడాది కాలంలో నాబార్డు రుణం లేదంటే కేంద్రమిచ్చే సాస్కీ (ఎస్ఏఎస్సీఐ– స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) నిధులకు మారి్పడి జరుగుతుందని పేర్కొనడం గమనార్హం. -
బాబు జంగిల్ రాజ్ – భయానక పాలనతో 'ప్రజాస్వామ్యం ఖూనీ'!
కచ్చితంగా ప్రతిఘటన.. ఇలాంటివి మళ్లీ జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. దానికి కచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది. అవసరమైతే రాష్ట్రవ్యాప్త బంద్కి కూడా పిలుపునిస్తాం. ఇప్పటికైనా ఆపకపోతే అడుగులు ఇంకా వేగంగా పడతాయి. ఇష్యూస్ పెద్దవి అవుతాయని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నా. ఈ ఘటనలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తున్నాం. సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం. అన్నిరకాల పోరాటాలు చేస్తాం.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితనకు కావాల్సిన వారిని నియమించుకుని..చంద్రబాబు తనకు కావాల్సిన కొంతమందిని మాత్రమే సీఐలు, ఎస్సైలు, డీఎస్పీలు, డీఐజీలుగా నియమించుకున్నారు. ఎస్పీలు గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు. బిహార్లో ఏం జరుగుతోందో తెలియదు కానీ రాష్ట్రంలో వీరందరితో చంద్రబాబు జంగిల్ రాజ్ పాలన సాగిస్తున్నారు. దాదాపు 200 మంది సీఐలు, ఎస్సైలు, డీఎస్పీలను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. అలా రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన సాగుతోంది.అలా అనుకుంటే బాబు మూర్ఖుడే!వైఎస్సార్ సీపీపై ఈ రకంగా దాడులు చేస్తే కార్యకర్తలు భయపడతారని చంద్రబాబు అనుకుంటే ఆయన కన్నా మూర్ఖుడు ఇంకొకరు లేనట్టే. బంతిని ఎంత బలంగా నేలకేసి కొడితే అంతకన్నా నాలుగింతలు బలంగా పైకి లేస్తుందన్నట్లుగా.. మా కార్యకర్తలు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తారు.- మీడియాతో వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు జంగిల్ రాజ్ను నడుపుతూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదని దేశంలోనే ప్రఖ్యాత ల్యాబ్లు ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ నిర్థారిస్తూ రిపోర్టులు ఇచ్చినా.. అదే విషయాన్ని సీబీఐ తన చార్జిషీట్లో పొందుపరిచినా.. పాపభీతి లేకుండా, తప్పు ఒప్పుకోకుండా చంద్రబాబు ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. చేసిన తప్పులకు లెంపలు వేసుకోవాల్సింది పోయి దీనిపై ప్రశ్నిస్తుంటే భౌతిక దాడులు, విధ్వంసం, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరులో టీడీపీ గూండాల చేతిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని బుధవారం వైఎస్ జగన్ పరిశీలించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..గుంటూరులోని చుట్టుగుంట సెంటర్లో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం అబద్ధాలతో ఫ్లెక్సీలు..తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు, సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తమ తప్పులకు లెంపలు వేసుకుని శ్రీవేంకటేశ్వరస్వామివారిని, ప్రజలను క్షమాపణ కోరాల్సిందిపోయి.. అంతా కూడబలుక్కుని మళ్లీ అవే అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. తప్పుడు సమాచారాలతో, కులమతాలను రెచ్చగొట్టే విధంగా, అబద్ధాలతో ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇదే చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చి అబద్ధాలతో మోసగించారని మేం కూడా ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా? ఇది హత్యాయత్నం కాదా..? కుట్రలో భాగం కాదా?ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే సాయంత్రం 5 గంటల నుంచి అర్థరాత్రి వరకు జరిగాయి. పోలీసుల సమక్షంలోనే ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు, ఆఫీసు మొత్తం తగలబెట్టారు. ఇంట్లో అద్దాలు, సామగ్రిని, ఆఫీసులో ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఇంట్లో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా లోపలికి వచ్చి ధ్వంసం చేశారు. ఇది హత్యాయత్నం కాదా..? పోలీసులు దగ్గరుండి మరీ ఈ కుట్రలో భాగం కాలేదా? పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఈ మాదిరిగా జరిగేదా? ఇక్కడి నుంచి డీజీపీ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు కూతవేటు దూరంలోనే ఉన్నాయి. ఎంత మంది డీఎస్పీలు, సీఐలు లేరు..? మంగళగిరిలో పోలీసు బెటాలియన్ కూడా ఉంది. కనీసం ఫోన్ చేస్తే కూడా పోలీసులు స్పందించలేదు. మా పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ తదితరులు ఇంటెలిజెన్స్ డీజీ, ఎస్పీ, ఐజీ, ఇతర అధికారులు, చీఫ్ సెక్రటరీ ఆఫీసులకు ఫోన్లు చేస్తే స్పందించలేదు. మరి ఇది కుట్రలో భాగంగా కాదా? సాయంత్రం ఐదు గంటల నుంచి ఒంటి గంట దాకా విధ్వంసం చేశారు. ఇది ధర్మమేనా? న్యాయమేనా? ఇంతటితో ఆగకుండా ఆ రాత్రి రాంబాబు అన్నను అరెస్టు చేశారు. చంద్రబాబును తిట్టాడని కేసు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబుని తిట్టినందుకు రాంబాబును అరెస్టు చేసినప్పుడు.. మరి రాంబాబు ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించి, ఐదు కార్లను ధ్వంసం చేసి, అద్దాలన్నీ పగలగొట్టి, ఆఫీసుకు నిప్పంటించడం అంతా ఎమ్మెల్యే, ఆమె భర్త సమక్షంలో జరిగితే వారివీుద ఏం యాక్షన్ తీసుకున్నారు? సింపుల్గా స్టేషన్ బెయిలిచ్చి పంపేశారు. అంబటి మీడియా సమక్షంలో వివరణ ఇచ్చారు. జరిగిన దానికి క్షమాపణ కూడా కోరారు. అయినా ఆయన ఇంటిపై దాడి చేశారు. అసలు మీరు మనుషులేనా? ఇది జంగిల్రాజ్ కాదా? రాంబాబును అక్రమంగా అరెస్టు చేయడమే కాదు.. అర్థరాత్రి దాటిన తరువాత ఆయన్ను నల్లపాడు స్టేషన్లో ముగ్గురు సీఐలు దారుణంగా హింసించి వేధించారు. ఓ మాజీ మంత్రి పట్ల ఆ విధంగా వ్యవహరించడం, టార్చర్ చేయడం ఏం న్యాయం? మరి ఇది జంగిల్రాజ్ కాకపోతే మరేమిటి? మాజీ మంత్రి అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్... విలువలున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఆయన్ను తీవ్రంగా దూషించి కొట్టారు. ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అని అనుమానం కలుగుతోంది. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు...!మరుసటి రోజు జోగి రమేష్ ఇంటిపై దాడి! అక్కడా మళ్లీ పోలీసుల సమక్షంలోనే. అక్కడ ఏకంగా పెట్రోల్ బాంబులు. బాటిళ్లలో పెట్రోల్ పోసి వాటిని ఇంట్లోకి విసిరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు విధ్వసం సృష్టించారు. దాదాపు 300–400 మంది పోగయ్యారు. వారంతా అక్కడికి వచ్చేటప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసుల సమక్షంలో అదంతా జరుగుతున్నా చూస్తుండిపోయారు. పోలీసుల సమక్షంలోనే జోగి రమేష్ ఇంటికి నిప్పంటించారు.పోలీసుల సమక్షంలోనే..అంతకు ముందు రోజు విడదల రజిని గుడిలో పూజ చేసుకుని వస్తుంటే ఆమెను అడ్డగించి తిట్టారు. దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఆమెపై దాడికి యత్నించారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. తిరిగి ఆమె మీదే కేసు పెట్టారు. అది కూడా ఏమని? ఆమె గుడికి వెళ్లి వారందరిపై అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారని! మాట్లాడటానికి హద్దూ పొద్దూ ఉండాలి! ఇది జంగిల్ రాజ్ కాదా? బొల్లా బ్రహ్మనాయుడు అన్న చేసిన పాపం ఏమిటి..? చంద్రబాబు, ఆయన కుమారుడు, పవన్ కళ్యాణ్కు జ్ఞానోదయం కలగాలని కోరుతూ పూజ చేయటానికి ఆయన గుడికి బయలుదేరారు. దారిలో ఆయన మీద అటాక్ చేశారు. అది కూడా పోలీసుల సమక్షంలోనే జరిగింది. కాకాణి గోవర్ధన్రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. అసలు తప్పు చేసింది బాబేఅసలు తప్పు చేసింది చంద్రబాబు. తప్పుడు ఆరోపణలు చేసిందీ చంద్రబాబే. అవి తప్పుడు ఆరోపణలనీ దేవుడు మొట్టికాయలు వేసినా.. ఏకంగా సీబీఐ చార్జిషీట్లోనే చెప్పినా.. కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు నెయ్యిపై క్లీన్ చిట్ ఇస్తే... దేవుడు, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి చంద్రబాబు చేస్తున్నదేమిటి? ప్రతి విషయంలోనూ దుర్మార్గమైన రాజకీయాలే! సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని ఎన్నికలప్పుడు మాట ఇచ్చారు. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుందో చెబుతూ సంతకాలతో సహా హామీ ఇచ్చారు. మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా? ఇదిగో మీకు రూ.36 వేలు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఇదిగో మీకు రూ.15 వేలు. మీ ఇంట్లో రైతులు ఉన్నారా? ఇదిగో మీకు రూ.26 వేలు. మీ ఇంట్లో చిన్నమ్మలు, పెద్దమ్మలు 55 ఏళ్ల వయసులో ఉన్నారా? వాళ్లకు రూ.48 వేలు అంటూ ప్రజలను మోసం చేశారు. సూపర్ సిక్స్, సెవెన్ అమలు చేశామంటూ సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారు. చంద్రబాబు చేస్తున్నది తప్పని, మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే.. కేసులు పెట్టి జైలుకు పంపుతున్నాడు. చివరకు పిల్లలని కూడా చూడకుండా సోషల్ మీడియా యాక్టివిస్టులపై గంజాయి కేసులు పెట్టి జైలుకు పంపి వారి కెరీర్ నాశనం చేస్తున్నాడు.బాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. చేసేవన్నీ మోసాలే!చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. చేసేవన్నీ మోసాలే! టీడీపీ సైన్యానికి లాటరీలో ప్రైవేటు మద్యం షాపులన్నీ కట్టబెడతాడు. ఏకంగా ఎమ్మెల్యేలు దగ్గరుండి ప్రతి గ్రామంలో ఆక్షన్ పాడుతూ బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. లిక్కర్ షాపుల పక్కనే ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతూ పెగ్గులతో అమ్ముతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. అవి పక్కదోవలో చంద్రబాబుకింత... ఎమ్మెల్యేల కింత... వారి మాఫియా సైన్యానికింత.. అని లూటీ పద్ధతిలో పంచుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఒకటి, రెండు కాదు. పది వరకు బెల్టు షాపులున్నాయి. లిక్కర్ ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. అది సరిపోదన్నట్లు ఏకంగా ప్రతి ఐదు బాటిళ్లకు ఒకటి నకిలీ. వీళ్లే కుటీర పరిశ్రమను పెట్టి చీప్ లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నారు. ఆ కల్తీ లిక్కర్ తాగి ఇంజనీరింగ్ విద్యార్థులు నలుగురు చనిపోయారు. నకిలీ లిక్కర్ను టీడీపీ నాయకులే తయారు చేస్తూ సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. తంబళ్లపల్లెలో టీడీపీ తరఫున పోటీచేసిన జయచంద్రారెడ్డి కల్తీ లిక్కర్ తయారు చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు దొరికాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నదంతా ఇదే. ఎక్సైజ్ అధికారులకు, జయచంద్రారెడ్డికి వాటాలు పంచుకోవడంలో తేడాలొచ్చి దొరికిపోతే మా నాయకుడు జోగి రమేష్ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఒకపక్క రాక్షస పాలన సాగిస్తున్న టీడీపీ నాయకులతో కలిసి మా పార్టీకి చెందిన జోగి రమేష్ కల్తీ లిక్కర్ తయారు చేయడం సాధ్యమేనా? వీళ్లు నకిలీ లిక్కర్ తయారు చేసి చంద్రబాబు తీసుకొచ్చిన బెల్ట్ షాపుల్లో జోగి రమేష్ అమ్ముతున్నాడని అక్రమ కేసు పెట్టారు. నకిలీ, కల్తీ లిక్కర్ తయారు చేసేది వారే! బెల్ట్ షాపులు తీసుకొచ్చిందీ వారే! వాటిలో కల్తీ లిక్కర్ అమ్మకాలు చేసేదీ వారి మనుషులే! కానీ కేసు మాత్రం జోగి రమేష్ మీద పెట్టి జైలుకు పంపారు. విచారణ చేయిస్తాం... వడ్డీతో చెల్లిస్తాంఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. కళ్లు మూసి తెరిచేలోపు మరో మూడేళ్లు గడిచిపోతాయి. అప్పుడు వచ్చేది మా ప్రభుత్వమేనని ఖచ్చితంగా చెబుతున్నా. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఆయనకు కొమ్ము కాస్తున్న ఇతర పార్టీ నాయకులకు, కొంతమంది పోలీసు అధికారులకు కూడా చెబుతున్నా.. ఎల్లకాలం ఇలాగే అన్యాయం చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఖచ్చితంగా వీరికి మొట్టికాయలు పడతాయి. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఈ అరాచకాల్నంటి మీదా విచారణలు చేయిస్తాం. వడ్డీతో సహా చెల్లిస్తాం. అందర్నీ బోన్లలో నిలబెట్టి సాక్ష్యాధారాలతో వారి యూనిఫాంలు విప్పిస్తాం. ఈ దారుణాల్లో భాగస్వాములైన కూటమి నాయకులు ఎవరున్నా వారిని జైలుకు పంపించి బాధితులకు న్యాయం చేసి తీరుతామని ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నా.మా కార్యకర్తలూ ఇలాగే స్పందిస్తే..రాష్ట్రంలో విషపు విత్తనాలు నాటుతున్నారు. ఈ సంస్కృతిని ఇప్పటికైనా ఆపండి. ఈ విషపు విత్తనాలు, కూటమి నాయకులు చేస్తున్న అన్యాయాల కారణంగా గ్రామ స్థాయి నుంచి ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త, నాయకుడు దెబ్బతిని ఉన్నారు. ఈ విషపు విత్తనాలు పెరిగి పెద్దవై చెట్టుగా మారినప్పుడు, రేప్పొద్దున్న మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా నాయకులు, కార్యకర్తలు ఇలాగే స్పందిస్తే మీకు ఏం జరుగుతుందో ఆలోచన చేసుకోవాలని చంద్రబాబుని గట్టిగా హెచ్చరిస్తున్నా.అంబటి నివాసంలో టీడీపీ మూకల దాడిలో ధ్వంసమైన కారును పరిశీలిస్తున్న వైఎస్ జగన్ చేతనైతే ఇవన్నీ చెయ్ బాబూ..!ఇప్పటికైనా దేవుడంటే భయం, భక్తితో వ్యవహరించి బుద్ధి జ్ఞానం తెచ్చుకుని మంచి పరిపాలనతో ప్రజలకు మేలు చేసి వారి వద్ద మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు చేయాలి. చేతనైతే సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ విషయంలో అబద్ధాలు చెప్పకుండా, మోసాలు చేయకుండా నెరవేర్చే కార్యక్రమం చేయాలి. కూటమి వచ్చాక నిర్వీర్యం అయిన స్కూళ్లను బాగుచేయాలి. 8 క్వార్టర్లకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలి. పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే ఆలోచన చేయాలి. చేతనైతే ఆపేసిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసి పేద, మధ్యతరగతి వారికి నాణ్యమైన వైద్యం అందించే కార్యక్రమం చేసి చూపించాలి. చేతనైతే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అన్నదాత సుఖీభవ కింద రూ.10 వేలిచ్చి వదిలేశారు. బకాయి పడ్డ రూ.30 వేలు కూడా తక్షణం చెల్లించాలి. వ్యవసాయాన్ని చక్కబెట్టే కార్యక్రమం చేయాలి. కానీ మీకు వీటన్నింటి మీద ధ్యాస లేదు. అన్నీ అబద్ధాలు, మోసాలు, ప్రశ్నించే గొంతులు నొక్కడమే. తనకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకే కమిషన్!చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, రాక్షసుడో ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిసిందని తాను చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పు అని స్పష్టంగా తేలడం, ఆధారాలతో సహా రుజువు కావడంతో ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారానికి తెర తీశారు. ఈ అంశంలో తానే ఓ కమిషన్ వేస్తామని చెబుతున్నారు. సీబీఐ చెప్పింది తప్పు..! ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులు తప్పు అని చెప్పిస్తూ, తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి మరో కమిషన్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. తాను చెప్పినట్టే నివేదిక రావాలని ఒత్తిడి చేసి, దానిని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఉండరు.వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, విడదల రజిని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, నంబూరు శంకరరావు, అన్నాబత్తుని శివకుమార్, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దేవినేని అవినాష్, వనమా బాలవజ్రబాబు, అంబటి మురళీకృష్ణ, షేక్ నూరీ ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, దేవభక్తుని చక్రవర్తి, తన్నీరు నాగేశ్వరరావు, పోతిన మహేష్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పలువురు రాష్ట్ర కార్యదర్శులు, అధికార ప్రతినిధులు జగన్ పర్యటనలో పాల్గొన్నారు.దేవుడంటే కనీసం భయం, భక్తి లేకుండా..రాష్ట్రంలో ఈరోజు జంగిల్ రాజ్ ఏ స్థాయిలో ఉందంటే.. ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం జరుగుతోంది. అంబటి రాంబాబు ఇంటిపైన దాడి.. జోగి రమేష్ ఇంటి మీద దాడి.. విడదల రజినిపై అటాక్.. బొల్లా బ్రహ్మనాయుడు మీద అటాక్.. ఇవన్నీ జంగిల్ రాజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు కొన్ని ఉదంతాలు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినమ్మ, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్రెడ్డి, కాకాణి గోవర్ధన్ అన్న చేసిన తప్పేమిటి? చంద్రబాబు దాదాపు ఏడాదిన్నరగా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసిందంటూ రకరకాలుగా చంద్రబాబు, ఆయన కుమారుడు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారు. దేవుడంటే కనీసం భయం, భక్తి లేకుండా స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారు.ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చిన ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీనెయ్యిపై చంద్రబాబు ఆరోపణలన్నీ అవాస్తవం అని ఎన్డీఆర్ఐ (నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్), ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) రిపోర్టు ఇచ్చాయి. ఈ రెండూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబ్లు. వీళ్ల హయాంలో.. వీళ్లే ఇచ్చిన టెస్ట్ శాంపిళ్లు అవి. వాటిని విశ్లేషించి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వుగానీ, గొడ్డు మాంసం కొవ్వులు గానీ, పందికొవ్వు గానీ, చేప నూనెగానీ.. ఇటువంటివి ఇంకొకటిగానీ ఇంకొకటి గానీ లేవని నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇచ్చాయి. అదే విషయాన్ని సీబీఐ తన చార్జిషీట్లో పొందుపరిచి ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ సర్టిఫికెట్లను జత చేసి క్లోజర్ కూడా ఇచ్చింది. సీబీఐ క్లీన్చిట్ ఇస్తోంది. ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు కూడా క్లీన్ చిట్లు ఇస్తున్నాయి.ఏ తప్పూ చేయలేదు కాబట్టే సీబీఐ క్లీన్చిట్..ఒకవేళ వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్రెడ్డి తప్పు చేసి ఉంటే వారి పేర్లు ఎందుకు చేర్చలేదు? వారు ఒకవేళ తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే, తప్పు నిజమే అయితే ఎందుకు అరెస్టు చేయలేదు? వారు ఏ తప్పూ చేయలేదు కాబట్టే సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ఎటువంటి తప్పూ జరగలేదు కాబట్టే వారి పేర్లు చార్జిషీట్లో పెట్టలేదు. తప్పు చేయలేదు కాబట్టే అరెస్టు చేయలేదు. అసలు ఈ వ్యవహారంలోకి సీబీఐ ఎలా వచ్చిందో తెలుసా..?రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని, దీనిపై విచారణకు ఆదేశించాలని వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లి పిటిషన్ వేశారు కాబట్టే దీనిపై స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించింది.ప్రశ్నిస్తుంటే దాడులు...దుర్బుద్ధితో ఫ్లెక్సీలు పెట్టి భావోద్వేగాలను రెచ్చగొడుతున్న చంద్రబాబును.. ఎందుకయ్యా అబద్ధాలు చెప్పావు? అన్యాయం చేశావు? ఎందుకయ్యా శ్రీవారి ప్రసాదం ప్రతిష్టను దెబ్బ తీశావు? అని ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఆయన ఏం చేశారో తెలుసా..? అంబటి రాంబాబు అన్న మీద దాడి! ఆ రోజు (శనివారం) ఉదయం ఆయన గుడికి వెళ్లి చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని పూజ చేసి బయటకు వస్తుంటే.. గుడి నుంచి ఇంటికి వచ్చే మార్గంలో ఏకంగా కట్టెలు పట్టుకుని, పోలీసులను పెట్టుకుని అడ్డుకున్నారు. (కర్రలు పట్టుకున్న టీడీపీ కార్యకర్తల ఫోటోలను చూపారు). కారులో ఉన్న రాంబాబును అడ్డగించి, కారును కర్రలతో బాదుతూ, పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలు అంటూ బూతులు తిట్టారు. ఒకేసారి అంతమంది దుండగులు చేతిలో కర్రలతో కారుపైకి దూసుకు రావడం.. బూతులు తిడుతూ మీదకు రావడంతో ఆయన కాస్త ఘాటుగా స్పందించాడు. ఆయన నోటి నుంచి ఒక తిట్టు పదం వచ్చింది. ఒక రియాక్షన్గా జరిగింది. అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ మీద ఎటువంటి అటాక్ లేకపోయినా రొటీన్గా తిడుతున్నారు. అంబటి రాంబాబు అన్న ప్రాణం మీదకు వచ్చినప్పుడు రియాక్షన్గా ఆయన తిడితే మాత్రం ఇంకో రకంగా చిత్రీకరిస్తున్నారు. అయినప్పటికీ రాంబాబు ఇంటికి వచ్చిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ప్రెస్మీట్ పెట్టి జరిగిన విషయమంతా వివరించారు. ఆయన పెద్ద మనిషి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి తాను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని చేతనైతే పొగడాలి. కానీ వాళ్లు దాన్ని కూడా వక్రీకరిస్తూ ఏకంగా రాంబాబు అన్నను హత్య చేయడానికి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు సాక్షాత్తూ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మనుషులను వేసుకుని వచ్చి అంబటి ఇంటిపై దాడి చేశారు. ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇంట్లో కిటికీల అద్దాలు, సామగ్రి ధ్వంసం చేశారు. పక్కనున్న ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఆ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు. వారి ప్రాణాలకు నష్టం జరిగే విధంగా.. వారిని తిడుతూ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం. -
జగనన్న 2.0 లోడింగ్
సాక్షి, అమరావతి: ‘జగనన్న 2.0 లోడింగ్’.. అంటూ సామాజిక మాధ్యమాల్లో వైఎస్ జగన్ పేరు హోరెత్తిపోతోంది. మాజీ మంత్రి అంబటిపైనా, ఆయన ఇంటిపైనా కూటమి రౌడీ మూకల దాడి నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్ బుధవారం గుంటూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఉవ్వెత్తున జన అభిమాన తరంగం ఎగిసిపడింది. కార్యకర్తలకు జగన్ అండగా ఉంటాడని, ఎవరికీ భయపడేది లేదనే మీమ్స్ను నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. జగన్ కాన్వాయ్ వీడియోలను వైరల్ చేస్తున్నారు. జగన్ పర్యటనకు జనం భారీ స్థాయిలో రావడం అనేది సహజం. కానీ అంతే స్థాయిలో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆయనకు మద్దతు లభిస్తుండటం, వాట్సప్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో, వాటి గ్రూపుల్లో లెక్కకు మించి జగన్ పర్యటనపై పోస్టులను నెటిజన్లు షేర్ చేస్తుండటం విశేషం. -
జనం కేక.. జంగిల్రాజ్ను తరిమికొడదాం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రోడ్డుపై కిలోమీటర్ల కొద్దీ కనుచూపు మేర జనం.. జంగిల్ రాజ్కు వ్యతిరేకంగా ఏకమయ్యారు.. చంద్రబాబు సర్కారు దుర్మార్గాన్ని ధైర్యంగా దుయ్యబట్టారు.. సర్కారు ఆంక్షలను లెక్క చేయకుండా రోడ్డుపైకి వచ్చారు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అడుగులో అడుగేస్తూ దిక్కులు పిక్కటిల్లేలా జై జగన్ అంటూ నినాదాలు చేశారు.. జంగిల్ రాజ్కు రోజులు దగ్గర పడ్డాయని గర్జించారు.. ఇందుకు బుధవారం గుంటూరు వేదికైంది.. గుంటూరు నగరం జన సంద్రమైంది.. నినాదాలతో దద్దరిల్లింది. తెలుగుదేశం పార్టీ గూండాల దాడికి గురైన అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన సందోహం అపూర్వ స్వాగతం పలికింది. జగన్ పర్యటన ఖరారైందని తెలిసిన వెంటనే జిల్లాలో 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు ప్రకటించి, నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దని పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు ఇంటి వరకు మార్గ మధ్యంలో అనేక చోట్ల బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. జగన్ కాన్వాయ్ను మాత్రం అనుమతించి.. ఆయన వెనుక వస్తున్న వాహనాలను, జన సందోహాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఇన్ని అడ్డంకుల మధ్య కూడా వైఎస్ జగన్ పర్యటన విజయవంతమైంది. 35 కిలోమీటర్లు.. ఆరు గంటలు » తాడేపల్లి నుంచి గుంటూరు నగరంలోని అంబటి రాంబాబు నివాసం వద్దకు 35 కిలోమీటర్ల దూరం చేరుకోవడానికి వైఎస్ జగన్కు ఏకంగా ఆరు గంటల సమయం పట్టిందంటే జనం ఎంతగా పోటెత్తారో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ను చూడటానికి స్వచ్ఛందంగా వెళ్తున్న వేలాది మంది ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులకు అడుగడుగునా ఆంక్షలతో ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. » జగన్ కాన్వాయ్ తాడేపల్లిలో బయలుదేరిన తర్వాత కాజా టోల్గేట్ వద్ద వాహనాలను ఆపారు. ఆయనతోపాటు కొద్ది వాహనాలు మాత్రమే పంపి మిగతా వాటిని నిలువరించారు. అనంతరం కాన్వాయ్ గుంటూరు ఆటోనగర్ వై జంక్షన్కు చేరుకోగానే అక్కడ బారికేడ్లు అడ్డుగా పెట్టి పూర్తి స్థాయిలో వాహనాలు ఆపేశారు. » ఏటుకూరు బైపాస్ వద్ద కూడా కార్యకర్తలు పత్తిపాడు నుంచి గుంటూరు నగరంలోకి రాకుండా బారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ నిలువరించారు. బైక్లపై వస్తుంటే బైక్ల తాళాలు లాక్కున్నారు. గుంటూరు జిల్లాను దిగ్బంధనం చేశారు. పల్నాడు జిల్లా నుంచి గుంటూరుకు వెళ్లే సరిహద్దు మండలాలైన నరసరావుపేట, యడ్లపాడు, సత్తెనపల్లి, అమరావతి మండలాల పరిధిలో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు.» ఎక్కడికి వెళ్తున్నారు.. ఎందుకు వెళ్తున్నారు.. అంటూ ఆరా తీశారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని అడ్డుకొని వెనక్కి పంపారు. కొందరిని పోలీసు స్టేషన్లకు తరలించి సాయంత్రం ఐదు గంటల తర్వాత వదిలిపెట్టారు.జననేతకు జనం జేజేలు» గుంటూరు నగరానికి వచ్చిన జననేత వైఎస్ జగన్కు ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు జేజేలు పలికారు. విద్యార్థి విభాగం నేతలు, యువజన విభాగం నేతలు, అనుబంధ విభాగాల నేతలు, యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ జన నేతకు ఎదురేగి స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ లీగల్ విభాగం నేతలు, న్యాయవాదులు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ వైఎస్ జగన్ పర్యటనకు మద్దతు తెలిపారు.» కంకరగుంట ఓవర్ బ్రిడ్జి, పట్టాభిపురం స్వామి థియేటర్ వద్ద సైతం ప్రజలు భారీగా చేరుకుని పూల వర్షం కురిపించారు. చేబ్రోలు హనుమయ్య కంపెనీ, గుజ్జనగుండ్ల సెంటర్లో తీన్మార్ డప్పు వాయిద్యాలతో స్థానిక నేతలు స్వాగతం పలికారు. యువత భారీగా బైక్ ర్యాలీలతో సందడి చేశారు. జగన్ గుంటూరు చేరుకున్న తర్వాత ఏటుకూరు వద్ద సర్వీస్ రోడ్డు మీదుగా వీఐపి రోడ్లోకి రావడానికి ముందుగా పోలీసులు ఆ దారిన వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం దాటిన తర్వాత కంకర్ గుంట ఓవర్ బ్రిడ్జి వద్ద సైతం వాహనాలను నిలువరించారు. అయినా జన సందోహం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. » గుంటూరు రోడ్లన్నింటిపై ప్రజలు, అభిమానుల కోలాహలం కనిపించింది. ఉదయం 10 గంటల నుంచే రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నేత కోసం ఎదురు చూశారు. పెద్ద సంఖ్యలో వస్తున్న నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అంబటి ఇంటికి వెళ్లనీయకుండా ఆపివేసినప్పటికీ.. సాయంత్రం 5 గంటలయ్యే సరికి ఆ ప్రాంతం జనసంద్రంగా మారిపోయింది. » గుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో చుట్టుగుంట సెంటర్ నుంచి అంబటి రాంబాబు నివాసానికి వచ్చేందుకు ఏకంగా 3 గంటలకుపైగా సమయం పట్టింది. అంబటి రాంబాబు నివాసంతో పాటు చుట్టుపక్కల ఇళ్లపైన, గోడలపైకి ఎక్కి ప్రజలు తమ అభిమాన నేతను చూశారు. పర్యటన ఈ స్థాయిలో విజయవంతం కావడంతో అధికార పార్టీ నేతల్లో గుబులుపుట్టింది.అడుగడుగునా అడ్డంకులే..సాక్షి, నరసరావుపేట: జంగిల్ రాజ్ అరాచకాలను ఎండగట్టేందుకు గుంటూరు నగరానికి వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా వెళ్తున్న వేలాది మంది ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులకు అడుగడుగునా ఆంక్షలతో ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. పల్నాడు జిల్లా నుంచి గుంటూరుకు వెళ్లే సరిహద్దు మండలాలైన నరసరావుపేట, యడ్లపాడు, సత్తెనపల్లి, అమరావతి మండలాల పరిధిలో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. జగన్ను చూడటానికి వెళ్తున్న వారిని గుర్తించి వెనక్కు పంపారు. ఉదయం 7 గంటల నుంచే వాహనాల తనిఖీలు ప్రారంభించారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ, యడ్లపాడు మండలం బోయపాలెం హైవే వద్ద, సత్తెనపల్లి మండలం నందిగం అడ్డరోడ్డు వద్ద పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. సత్తెనపల్లి, సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ల, రాజుపాలెం, దాచేపల్లి, అచ్చంపేట, బెల్లంకొండ తదితర మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు వెళ్తున్న వాహనాలను సత్తెనపల్లి నందిగం అడ్డరోడ్డు వద్ద సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఆపేశారు. వారిని సత్తెనపల్లి పోలీస్స్టేషన్కు తరలించి సాయంత్రం 6 గంటల వరకు స్టేషన్లోనే నిర్బంధించారు. సత్తెనపల్లి కార్యకర్తలను సైతం ఇదే స్టేషన్లో సాయంత్రం వరకు ఉంచారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనేందుకు అనుమతి లేదంటూ పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు గుంటూరులోని నివాసంలో పోలీసులు నోటీసులు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ఎంత కట్టడి చేసినా పల్నాడు జిల్లా మీదుగా గుంటూరు నగరానికి వేలాది మంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలి వెళ్లడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు అద్దం పడుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
బాబు సీమ ద్రోహానికి ప్రతిఘటన
సీమ సమాజం నీళ్లను కలవరిస్తోంది, పలవరిస్తోంది. నీళ్లలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉన్నాయి. నీళ్లలో సుఖ సంతోషాలున్నాయి. నీళ్లలో నాగరికత ఉంది. నీళ్లలో సృష్టి రహస్యం దాగివుంది. నీళ్లలో బీడు భూముల్ని సస్యశ్యామలం చేసే మహాద్భుత శక్తి ఉంది. నీళ్లలో పవర్ ఉంది. నీళ్లలో అమ్మ ప్రేమ, తండ్రి సాంత్వన ఉన్నాయి. అసలు సమస్త ప్రపంచం మనుగడే నీళ్లలో ఉంది. అలాంటి నీళ్లకు రాయలసీమ సమాజం దశాబ్దాల తరబడి నోచుకోలేదు. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే కృష్ణా జలాలే దిక్కు. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుని నోట్లో శని అనే సామెత చందంగా రాయలసీమ వాసుల పరిస్థితి తయారైంది. కళ్లెదుటే కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా, వాడుకోలేని దయనీయ స్థితి. సీమకూ, కృష్ణా జలాలకూ అడ్డంకిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే సీమకు పట్టిన ‘చంద్ర’గ్రహణం బాబు అని మా కరవు సమాజం భావిస్తోంది.మరో స్వాతంత్య్ర పోరాటంబ్రిటిష్ వారి పీడన పాలనను ప్రత్యక్షంగా చూడని తరం... దాని గురించి కథలు కథలుగా విని ఉంటారు. కానీ బాబు పీడన పాలనను ప్రత్యక్షంగా చూస్తూ, నరకాన్ని అనుభవిస్తున్నాం. రాయల సీమ అంటే కరవు పీడిత ప్రాంతం కాదు, బాబు పీడిత ప్రాంతమని గతంలో చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. బాబు పీడన పాలన నుంచి రాయల సీమకు సాగు, తాగునీటి హక్కుల్ని సాధించుకునేందుకు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఔను, రాయలసీమ ప్రజలు నీళ్ల కోసం అలమ టిస్తున్నారు. ఇక్కడి బీడు భూములు నీళ్ల కోసం నోళ్లు బార్లా తెరుచు కున్నాయి. నీళ్లంటే రాయలసీమ సమాజానికి ఒక కలగా మారింది. రాయలసీమ ప్రాంతం నుంచి రాజకీయంగా ఎదిగిన నారా చంద్రబాబు నాయుడు తన మాతృభూమికి చేసింది శూన్యం. కరవు ప్రాంతం నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తొమ్మిదేళ్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ను చంద్రబాబు పాలించినా, ఏనాడూ కరవు ప్రాంతానికి గుక్కెడు సాగు, తాగునీళ్లు అందించాలన్న ఆలోచన చేసిన పాపాన పోలేదు. ‘ఏ దేశ మేగినా ఎందుకాలిడినాఏ పీఠ మెక్కినా, ఎవ్వ రేమనినపొగడరా నీతల్లి భూమి భారతినినిలుపరా నీ జాతి నిండు గౌరవం’ అని మహాకవి రాయప్రోలు సుబ్బారావు జన్మనిచ్చిన గడ్డ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చంద్రబాబు సీఎం పీఠమెక్కినా, తానొచ్చిన ప్రాంతాన్ని విస్మరించడం, ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ఒక నాయకుడి విజన్ అంటే... సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడం. తాను పాలిస్తున్న ప్రాంత జీవనోపాధి ఏంటో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా సమృద్ధిగా సౌకర్యాలు కల్పించడం.రాయలసీమ కరవు కాటకాలతో అల్లాడుతోందని అక్కడ పుట్టి పెరిగిన చిన్నపిల్లలకు కూడా తెలుసు. తొమ్మిదేళ్లుగా సీఎంగా ప్రజలు అవకాశం కల్పిస్తే, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం, అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న చెడ్డపేరు తప్ప, ప్రజలు గుర్తించుకునేలా ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు. అధికారంలో ఎంత కాలం ఉన్నామన్నది ముఖ్యం కాదు, ప్రజలకు ఏం చేశామన్నదే ప్రధానం.మంచి పాలకులంటే, ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. భౌతికంగా మన నుంచి దూరమైనా, మానసికంగా సంబంధం కలిగి ఉండేలా పాలించాలి. అలాంటి ఘనతను దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి దక్కించుకున్నారు. రాయలసీమ సమాజం ఆయనను అపర భగీరథుడిగా ఆరాధిస్తోంది. ఈ ప్రజాభిమానం ఊరకే రాలేదు. రాయలసీమకు తాగు, సాగునీళ్లు అందించేందుకు ఐదేళ్ల పాలనలో ఆయన చేసిన కృషిని కరవు (బాబు) పీడిత సమాజం గుర్తించింది. సాగు, తాగునీటికి గేట్ వే! సాగు, తాగునీళ్ల విలువ బాగా తెలిసిన రాజశేఖరరెడ్డి, 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సామ ర్థ్యాన్ని 11,500 క్యూసెక్కుల నుంచి ఏకంగా 44 వేల క్యూసెక్కులకు పెంచారు. అప్పట్లో ఈ పెంపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వివా దానికి దారి తీసింది. ఇటు కాంగ్రెస్లోని స్వపక్షం, అటు చంద్రబాబు నాయకత్వంలోని విపక్షం కలిసి రాజశేఖరరెడ్డిపై దండెత్తాయి. ఎవరెంతగా ఒత్తిడి తెచ్చినా, రాయలసీమకు సాగు, తాగునీళ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన భీష్మించారు. అదీ మాతృగడ్డపై ప్రేమ అంటే! కరవు ప్రాంతానికి నీళ్లు అందించి, పీడన నుంచి విముక్తి కల్పించాలనే నిజమైన సంకల్పం ఉన్న నాయకులు చేయాల్సిన పని. అందుకే రాయలసీమ గుండెల్లో వైఎస్సార్ కొలువుదీరారు.తండ్రి ఆశయ సాధనలో భాగంగా 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పది అడుగులు ముందు కేశారు. రాయలసీమను శాశ్వతంగా కరవు నుంచి విముక్తి చేసేందుకు రూ. 3,825 కోట్ల ఖర్చుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ను శ్రీశైలం ప్రాజెక్ట్లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూపకల్పన చేశారు. 2023 ఆగస్టు 11న జగన్ ప్రభుత్వం మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ రూపకల్పన వెనుక ఎంతో దూరదృష్టి ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. అయితే 854 అడుగులకు చేరినప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం. అది కూడా రోజుకు 7 వేల క్యూసెక్కులు మాత్రమే. ఈ పద్ధతిలో ఎప్పటికీ రాయలసీమను సస్యశ్యామలం చేయలేమని జగన్ భావించారు. 854 అడుగుల కంటే ఒక అడుగు తక్కువ ఉన్నా పోతిరెడ్డిపాడు నుంచి చుక్క నీరూ అందదు. ఈ ఇబ్బందిని గమనించి, రావాల్సిన నీటిని 800 అడుగుల నుంచే తీసుకునేలా పోతి రెడ్డిపాడు దిగువన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి నీటిని పోతిరెడ్డిపాడు కాలువలో ఎత్తిపోసే పనులు చేపట్టడం ఒక చరిత్ర. రాయలసీమ పాలిట సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టిన మహా నాయకుడిగా, తండ్రిని మించిన తనయు డిగా వైఎస్ జగన్ ను కరవు ప్రాంతం గుర్తుంచుకుంటుంది. అడుగడుగునా అడ్డంకులుశ్రీశైలం నీటిమట్టం 854 అడుగులకు చేరుకోకపోయినా, 800 అడుగుల నుంచే హక్కుగా రావాల్సిన నీటిని దక్కించుకోవచ్చని రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించడంపై కరవు ప్రాంతం ఆనందానికి అవధుల్లేవు. 2024 మే నెల నాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి రూ.990 కోట్ల విలువైన పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కింది. అయితే ఆ ప్రాజెక్ట్ రూపకల్పన సమయంలోనే చంద్రబాబు నేతృత్వంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించి, రాక్షసుల్లా అడ్డంకులు సృష్టించడం జగమెరిగిన సత్యం. ఈ అడ్డంకుల్ని లెక్క చేయకుండా మా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయడంలో అడుగులు ముందుకే వేసింది. అందుకే ఆ మాత్రం పనులు పూర్తయ్యాయి.ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పొరుగు రాష్ట్రంలో శిష్యుడైన రేవంత్రెడ్డి ప్రలోభాలకు తలొగ్గి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని అర్ధంతరంగా నిలుపుదల చేసింది. తాను చెప్పడం వల్లే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని నిలుపుదల చేసినట్టు అసెంబ్లీ వేదికగా రేవంత్రెడ్డి ప్రకటించడం ఆశ్చర్యం, ఆందోళన కలిగించాయి. సీమకు కృష్ణా జలాలు అందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేలకు జగన్ పెంచడమే ఒక అద్భుతం. రాయలసీమతో పాటు నెల్లూరు, చెన్నైకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఒక సంజీవనిగా జగన్ భావించారు. సాగు, తాగునీళ్లకు నోచుకోని రాయలసీమ ప్రాంతా నికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఇక ఇన్సూరెన్స్ పాలసీగా భావించి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే, దాని గొంతుకోసిన పాల కుడిగా చంద్రబాబు చరిత్రలో చీకటి అధ్యాయాన్ని రాసుకున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు!రాయలసీమకు తాగు, సాగునీటితో పాటు నెల్లూరు సాగునీటికి చేస్తున్న ద్రోహాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఫిబ్రవరి 5న ‘చలో పోతిరెడ్డిపాడు’ తలపెట్టింది. ఇది రాయలసీమ సమాజం చేపట్టిన నీటి స్వాతంత్య్ర పోరాటంగా చూడాలి. తమ ప్రాంతానికి చంద్ర బాబు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టడానికి రాయలసీమ, అలాగే నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాతో పాటు ప్రజానీకాన్ని అక్కడికి వెళ్ల కుండా నిలువరించాలని చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తోంది. యావత్ బాబు పీడిత సమాజానికి వాస్తవాలు తెలియకూడ దనేదే ప్రభుత్వ దురుద్దేశంగా కనిపిస్తోంది. బాబు సీమ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే పోయేదేమీ లేదు... సాగు, తాగునీళ్లను సాధించుకోవడం తప్ప! తద్వారా గొంతుల్ని తడుపు కోవచ్చు, బీడు భూముల్ని సస్యశ్యామలం చేసుకోవచ్చు. పచ్చని పంటలతో కోనసీమను తలపించేలా రాయలసీమను తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వస్తే, తిరుపతి పూర్తి దాహార్తి కూడా తీరుతుంది. రాయలసీమ వ్యాప్తంగా 9.6 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించి కరవు నుంచి విముక్తి చేయాలన్న వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చడానికి అందరం కలిసి పోరాడుదాం. ఆశయ సాధనలో పిడికిలి బిగిద్దాం.రాయలసీమ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. అయితే రాజకీయ విభేదాలు సృష్టించడం చంద్రబాబుకు తెలిసిన విద్య. రాయలసీమ విడిపోవడమే చంద్రబాబుకు బలం. కావున రాయలసీమను సస్యశ్యామలం చేసుకునేందుకు సాగు, తాగునీటి హక్కుల కోసం చేపట్టే నీటి స్వాతంత్య్ర పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వేడుకుంటున్నా. మన భవిష్యత్ తరాలకు తాగు సాగునీళ్ల కంటే మనమిచ్చే ఆస్తి మరొకటేదీ లేదు. ఎందుకంటే, ఈ ఆస్తికి వెలకట్టలేం! భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త తిరుపతి మాజీ శాసన సభ్యులు(నేడు ‘చలో పోతిరెడ్డిపాడు’) -
Arava Sreedhar: రాసలీలల ఎమ్మెల్యేపై బిగుస్తున్న ఉచ్చు
సాక్షి,హైదరాబాద్: జనసేన నేత, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చూట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు అరవ శ్రీధర్పై కేసులు నమోదు చేశారు. అయితే, అరవ శ్రీధర్ అసెంబ్లీలో ఉండగా తనకు వీడియో కాల్స్ చేశారు. ఇదే అంశంపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని బాధితురాలు మీడియాకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత బాధితురాలిపై బెదిరింపులు, అసత్య ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంపై బాధిత మహిళ మీడియాతో మాట్లాడారు. అరవ శ్రీధర్ స్త్రీ లోలుడు. ఆయన బాధితుల్లో నేనే కాదు. నాతో పాటు మరో ఐదుగురు ఉన్నారురూ.25 కోట్లు నేను అడగలేదు. డబ్బులు డిమాండ్ చేసినట్లు నాపై వస్తున్న ఆరోపణల్నీ అవాస్తవాలే. అరవ శ్రీధర్ ప్రతిసారి అసెంబ్లీ నుండి కాల్ చేసేవాడు. అక్కడ జరిగే అన్ని విషయాలు చూపించేవాడు. ఇదే అంశంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తాం. సంజీవని ఆస్పత్రిలో డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్ వేసుకున్నాకే అబార్షన్ అయ్యింది. అతను నాతోనే కాదు. మరో ఐదుగురితో ఇలాగే చేశాడు. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఆయన మోసాలన్నీ నాకు తెలిసి ఇదంతా ఆపేద్దాం అన్నాను. అందుకే సేఫ్ సైడ్గా అన్ని ఆధారాలు ఉంచుకున్నానునన్ను అతను పెళ్లి చేసుకుంటానని వాళ్ళ ఇల్లు మొత్తానికి తెలుసు. శ్రీధర్కు రైల్వేకోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానంద్ రెడ్డి అండదండలున్నాయి. అతనే వెనక ఉంది శ్రీధర్ను నడిపిస్తున్నారు’అని ఆరోపించారు. ఈ సందర్భంగా అరవ శ్రీధర్ అరాచకాల్ని బయటపెట్టినందుకు బాధితురాలిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలుంటే బహిర్గతం చేయాలని ఆమె తరుఫు న్యాయవాది మీడియాతో మాట్లాడారు.మహిళా విచారణ కమిటీ వేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ను కోరుతున్నాము. బాధిత మహిళ రూ.25 కోట్లు మహిళా డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు. ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి. ఎమ్మెల్యే ఆస్తులు రూ.3 లక్షలు మాత్రమే అని అఫిడవిట్లో ఉంది. అలాంటిది రూ. 25 కోట్లు ఎలా డిమాండ్ చేస్తారు. అక్రమంగా సంపాదిస్తే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాము. కర్ణాటక అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూసిన ఎమ్మెల్యేపై స్పీకర్ చర్యలు తీసుకున్నారు. మరి అసెంబ్లీలో కూర్చొని ఇలాంటి పనులు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ పైన స్పీకర్ చర్యలు ఉండవా?? అని ప్రశ్నించారు. -
వచ్చేది మా ప్రభుత్వమే.. వడ్డీతో సహా చెల్లిస్తాం: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు.. మూడేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మాజీ మంత్రి అంబటి కాపు కులానికి టైగర్.. అలాంటి వ్యక్తిని స్టేషన్లో నల్లపాడు, పట్టాభిపురం సీఐలు దారుణంగా కొట్టారన్న వైఎస్ జగన్.. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. అన్నింటిపై ఎంక్వైరీలు వేస్తాం.. వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు.‘‘మా ప్రభుత్వం వచ్చాక అన్ని లెక్కలు తేలుస్తాం. విషపూరిత విత్తనాలు నాటడం ఆపండి. రేపు మా కార్యకర్తలు స్పందిస్తే ఏమవుతుందో ఆలోచించండి. చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. రాష్ట్రవాప్తంగా బంద్కు కూడా పిలుపునిస్తాం. మేం భయపడతామనుకుంటే చంద్రబాబు ముర్ఖుడే. వైఎస్సార్సీపీ శ్రేణులు నాలుగింతలు రెచ్చిపోయి కూటమి ప్రభుత్వాన్ని పెకిలిస్తారు’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.‘‘200మంది సీఐ, ఎస్సైలు వీఆర్లో ఉన్నారు. మీకు కావాల్సిన వారినే పోలీసులు నియమించుకున్నారు. బిహార్ సంగతేమో కానీ.. ఏపీలో మాత్రం జంగల్ రాజ్ నడుస్తోంది. తప్పు చేసిన అధికారుల్ని ఆధారాలతో సహా కోర్టులో నిలబెడతాం’’ అని వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. -
అంబటిని హత్య చేసేందుకు ప్రయత్నించారు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ( ఫిబ్రవరి 4, బుధవారం) గుంటూరులో పర్యటించారు. టీడీపీ గుండాలు మొత్తం విధ్వంసం చేసిన, గుంటూరులోని అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్ను సందర్శించి, ఆ విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూశారు. అంబటి కారును ఏ విధంగా ధ్వంసం చేసింది చూసిన ఆయన, దాడి ఏ స్థాయిలో చేశారనేది గమనించారు. మొత్తం దాడి ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అంబటి రాంబాబు భార్య, కుమార్తెలు, కుటుంబ సభ్యులను కలుసుకుని పరామర్శించిన వైఎస్ జగన్.. అంబటి రాంబాబు కుటుంబానికి ఓదార్చారు. ఏ మాత్రం అధైర్యపడొద్దని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జంగిల్రాజ్ నడుస్తోందన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని మండిపడ్డారు. ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు. ఈరోజు అంబటి విషయంలో జరిగింది అయితే ఏమి, అలాగే జోగి రమేష్ ఇంటిమీద దాడి అయితేనేమి, విడదల రజిని, బొల్ల బ్రహ్మనాయుడి మీద దాడి.. ఇవన్నీ ఇటీవలి కొన్ని ఘటనలు. ఇవన్నీ రాష్ట్రంలో జంగిల్రాజ్ను సూచిస్తున్నాయన్నారు. అసలు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్, భూమన కరుణాకర్రెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు.. వారంతా చేసిన తప్పేమిటి? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..తిరుమల శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించేలా..:దాదాపు ఏడాదిన్నర నుంచి చంద్రబాబు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ, ప్రజలను మభ్య పెట్టే పని చేస్తున్నారు. పవిత్రమైన తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, కుట్రపూరితంగా, ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసింది అంటూ.. రకరకాలుగా దుష్ప్రచారం చేశారు. చంద్రబాబునాయడు, ఆయన కొడుకు లోకేష్, పవన్కళ్యాణ్.. ఉద్దేశపూర్వకంగా, శ్రీవెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భయం, భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుణ్ని వాడుకున్నారు.వారు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ.. రెండు ల్యాబ్లు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి. ఆ రెండు ల్యాబ్లు వీరు పంపించిన నెయ్యిని పరీక్షించారు. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేపనూనె వంటి ఏ అవశేషాలు లేవని సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ నివేదికా ఆధారంగా సీబీఐ, సిట్ ఛార్జ్షీట్ వేసింది.వారు నిజంగా తప్పు చేసి ఉంటే..!:ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే, ఆ ఛార్జ్షీట్లో వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్రెడ్డి పేర్లు ఎందుకు లేవు? వారిని ఎందుకు అరెస్టు చేయలేదు?. ఎందుకంటే వారు తప్పు చేయలేదు కాబట్టి, సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ల్యాబ్లు కూడా వాస్తవం చెప్పాయి. అసలు సీబీఐ ఎందుకు వచ్చింది? వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. కేసులో నిజాలు నిగ్గు తేల్చాలని.. సీబీఐ దర్యాప్తు చేసి, వాస్తవాలు వెల్లడించింది.క్షమాపణ కోరాల్సింది పోయి..:కాబట్టి, చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్, పవన్కళ్యాణ్ చేసిన తప్పుకు చెంపలేసుకుని, క్షమాపణ కోరాల్సింది పోయి.. మళ్లీ మళ్లీ అవే అబద్ధాలు ప్రచారం చేస్తూ.. వాస్తవాలు వక్రీకరిస్తూ, ఫ్లెక్సీలు పెట్టారు. తప్పుడు సమాచారంతో, రెచ్చగొట్టే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుందా?. మేము కూడా ఇలా ఫ్లెక్సీలు పెడితే ఎలా ఉంటుంది చంద్రబాబు?. సూపర్సిక్స్, సూపర్సెవెన్ అని చెప్పి మోసం చేశారని ఫ్లెక్సీలు పెడితే ఊర్కుంటారా?. అబద్దాలు చెబుతూ, దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు పెట్టడం తప్పు. వాస్తవాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్లు స్పష్టంగా చెప్పినా, చంద్రబాబు వెనక్కు తగ్గడం లేదు.ప్రశ్నిస్తే సహించడం లేదు!:ఎవరైనా చంద్రబాబును గట్టిగా నిలదీస్తే, ప్రశ్నిస్తే..ఏం చేస్తున్నారు?. అంబటి రాంబాబు మీద దాడి చేశారు. ఆరోజు ఉదయం గుడికి వెళ్లి పూజ చేసి వస్తుంటే.. ఆ మార్గంలో కట్టెలు పట్టుకుని, పోలీసుల సమక్షంలో రాంబాబును అడ్డగించాలని చూశారు. (అంటూ ఆ ఫోటోలు చూపారు). పోలీసులను పక్కన పెట్టుకుని, కర్రలతో రాంబాబు కారును అడ్డగించి, కారును బాదారు. ఇంకా తనను బూతుల తిట్టి, ఆయన కారుపై దాడి చేస్తే.. రాంబాబుగారు స్పందించారు. తన ఒక్కడి మీద అంత మంది దాడి చేస్తే, తన కారును అడ్డగిస్తే, బూతులు తిడితే.. ఆయన స్పందించారు. ఆ సందర్భంగా ఆయన నోటి నుంచి.. కాస్త కటువైన పదం దొర్లింది. ఒకవైపు ఆయన కారుపై దాడి. మరోవైపు బూతులు తిట్టడంతో ఆయన కాస్త గట్టిగా స్పందించారు.మరి ఇదే చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాణ్.. మీరు అంత కంటే దారుణంగా మాట్లాడుతున్నారు. అంటే మీరు మాట్లాడితే ఒకటి. రాంబాబు గారు మాట్లాడితే ఒకటినా? అయినా రాంబాబుగారు, ఇంటికి వచ్చిన తర్వాత, మీడియాతో మాట్లాడి, తాను తిట్టినందుకు క్షమాపణ చెప్పారు. తాను ఏ పరిస్థితిలో తిట్టాడన్నది కూడా చెప్పారు. చాలా సంస్కారంగా వివరణ కూడా ఇచ్చారు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని చేతనైతే పొగడాలి. వారు తన కారుపై దాడి చేశారు. తిట్టారు. దాంతో అలా స్పందించాడు. ఆయన క్షమాపణ చెప్పినా.. ఆయన మాటలు వక్రీకరిస్తూ.. ఏకంగా అంబటి రాంబాబును హత్య చేయడానికి సాయంత్రం 5 గం. నుంచి అర్ధరాత్రి వరకు విధ్వంసం సృష్టించారు.స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి. మనుషులతో వచ్చి విధ్వంసం సృష్టించారు. 5 కార్లు ధ్వంసం చేశారు. ఇంట్లో, ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఆయన గల్లా మాధవి భర్త. ఆయన సాక్షాత్తూ అంబటి రాంబాబు ఆఫీసు పగలగొట్టారు. చివరకు నిప్పు పెట్టారు. (అంటూ ఆ ఫోటోలన్నీ చూపారు) ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగాయి. 5 కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు, ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్నా, వెనక్కి తగ్గలేదు.వారు కుట్రలో భాగస్వాములే కదా?:ఇది హత్యాయత్నం కాక మరేమిటి? పోలీసులు కూడా ఈ కుట్రలో భాగస్వాములు కాదా?. పోలీసులు బాధ్యతగా వ్యవహరించి ఉంటే, ఇంత విధ్వంసం జరిగేదా?. ఇక్కడికి ఎంత దూరంలో ఎస్పీ ఆఫీస్ ఉంది. కూతవేటు దూరంలో డీజీపీ ఆఫీస్ ఉంది. అక్కడ బెటాలియన్ ఉంటుంది. మా పార్టీ నాయకులు ఏ అధికారికి ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదు. మరి ఇది కుట్ర కాదా? ఇది ధర్మమా? న్యాయమా?. మరోవైపు రాంబాబుగారిని అరెస్టు చేశారు. దానికి కారణం ఏం చెప్పారు? చంద్రబాబును తిట్టినందుకు అని చెప్పారు. మరి రాంబాబు ఇల్లు, ఆఫీసుపై దాడి చేసి, 5 కార్లు ధ్వంసం చేసి, మొత్తం పగలగొడితే.. ఏం చేశారు?. ఎమ్మెల్యే, ఆమె భర్తను ఏం చేయలేదు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు.అక్కడ జోగి రమేష్ ఇంటిపై దాడి:అక్కడ కూడా పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. ఇంటిమీద దాడి చేసి, నిప్పంటించారు. అంతకు ముందు విడదల రజిని. ఆమె గుడిలో పూజ చేసి వస్తుంటే, గుడి బయట అడ్డుకుని, తిడుతూ.. పోలీసుల సమక్షంలోనే ఆమెపై దాడికి ప్రయత్నించారు. ఇంత జరిగినా, ఆమెపైనే తిరిగి కేసు పెట్టారు.బొల్లా బ్రహ్మనాయుడు చేసిన తప్పేమిటి?చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, పవన్కళ్యాణ్కు జ్ఞానోదయం కలగాలని గుడిలో పూజ చేసి వస్తుంటే, ఆయనపైనా దాడి చేశారు. కాకాణి గోవర్థన్రెడ్డి పైనా అదే స్థితి. ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది.స్వార్థ రాజకీయాల కోసం..:తప్పులన్నీ చంద్రబాబు చేస్తున్నారు. కేసులు మా పార్టీ వారిపై పెడుతున్నారు. చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ క్లీన్చిట్ ఇచ్చినా.. చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పకుండా చేస్తోంది ఏమిటి?. స్వార్థ రాజకీయాల కోసం దేవుణ్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నాడు. ఎన్నికల ముందు ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, సూపర్సిక్స్, సూపర్ సెవెన్ హామీలిచ్చి..ఏవీ చేయకుండా,అన్నీ చేశామని సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి, జైలుకు పంపిస్తున్నాడు. అక్రమ కేసులు, తప్పుడు సాక్ష్యాలు. చివరకు సోషల్ మీడియా కార్యకర్తలను కూడా వదలడం లేదు. ఇంకా దారుణంగా గంజాయి కేసులు కూడా పెడుతున్నారు.అంతా అరాచకం. ఎక్కడికక్కడ దోపిడీ:నకిలీ మద్యం దందా. తన పార్టీ వారికి మద్యం షాప్లు. వేలం పాట పాడి బెల్టుషాపులు అప్పగిస్తున్నారు. మద్యం షాప్ల పక్కనే, పర్మిట్రూంలు నడుతున్నారు. అలా యథేచ్ఛగా దోచుకుంటున్నారు. వైన్షాప్ల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. పర్మిట్రూమ్ల్లో పెగ్గుల వారీగా అమ్ముతున్నారు. ఆ ఆదాయం కూడా ప్రభుత్వానికి రావడం లేదు. అంతా వాళ్ల జేబుల్లోకి పోతోంది. ప్రతి 5 బాటిళ్లకు ఒకటి నకిలీ మద్యం. దాన్ని తయారు చేసింది తంబళ్లపల్లె నుంచి టీడీపీ నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి. అయినా మా పార్టీ నాయకుడు జోగి రమేష్పై అక్రమ కేసు పెట్టి, జైలుకు పంపారు. నకిలీ మద్యం తయారీ. సరఫరా, అమ్మకం అంతా టీడీపీ నాయకులదే. అంత దారుణంగా దోచుకుంటున్నారు.జంగిల్రాజ్కు పరాకాష్ట:అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడిపై దాడి. అంబటి రాంబాబు కాపు కులంలో మంచి నాయకుడు. ఆయన ఆ కులంలో ఒక టైగర్. అలాంటి ఆయన్ను దారుణంగా హత్య చేయాలని చూశారు. ఇంకా ఆయనను అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా, నల్లపాడు పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ముగ్గురు సీఐలు టార్చర్ చేశారు. ఒక మాజీ మంత్రిని అలా వేధిస్తారా?. దాదాపు 200 మంది పోలీసు అధికారులకు పోస్టింగ్ లేదు. మీకు కావాల్సిన వారిని ఎంచుకుని, జంగిల్రాజ్ చేస్తున్నారు.ఎవ్వరినీ వదిలిపెట్టబోము:ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇప్పటికే రెండేళ్లు గడిచాయి. మిగిలింది మూడేళ్లు. చూస్తుండగానే గడిచిపోతాయి. మా ప్రభుత్వం వస్తుంది. అప్సుడు ఎవ్వరినీ వదిలిపెట్టబోము. ఇప్పుడు తప్పుడు పని చేస్తున్న పోలీసులను యూనిఫామ్తో బోనులో నిలబెడతాం. వడ్డీతో సహా బదులిస్తాం. విచారణ జరిపిస్తాం. ఇప్పుడు తప్పుడు పనులు చేస్తున్న పోలీసులు పద్ధతి మార్చుకోవాలి. విషబీజాలు నాటుతున్నారు:ఈ రోజు విషపూరిత విత్తనాలు నాటుతున్నారు. అవి రేపు వృక్షాలవుతాయి. అప్పుడు పరిస్థితి ఏమిటన్నది ఒక్కసారి ఆలోచించండి. ఇకనైనా వైఖరి మార్చుకొండి. ఇలాంటి పనులు ఆపండి. హమీలు నిలబెట్టుకొండి. పిల్లలకు ఫీజులు చెల్లించండి. ఆరోగ్యశ్రీ పక్కాగా అమలు చేయండి. 10 మెడికల్ కాలేజీల అమ్మకం ఆపండి. వ్యవసాయ రంగాన్ని నిలబెట్టండి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించండి. పెట్టుబడి సాయం చేయండి.ఎదుర్కొంటాం.. పోరాడుతాం.. ఎండగడతాం:అడిగితే గొంతు పట్టుకోవడం సరికాదు. మీరు ఇలాగే కొనసాగిస్తే.. రాష్ట్ర బంద్కు పిలుపునిస్తాం. గట్టిగా పోరాడుతాం. ఢిల్లీలో కూడా మీ వ్యవహారాన్ని ఎండగడతాం. ఎన్హెచ్చార్సీకి కూడా ఫిర్యాదు చేస్తాం. ఇలా చేస్తే, వైయస్సార్సీసీ కార్యకర్తలు భయపడతారనుకుంటే, చంద్రబాబు ఒక మూర్ఖుడు. బంతి నేలకు కొడితే, అంతే బలంతో లేస్తుంది. మా కార్యకర్తలు కూడా అంతే.అంత దిగజారిన నాయకుడు ప్రపంచంలోనే ఉండడు:చంద్రబాబు ఎంత తప్పుడు మనిషి అంటే, ఆయన ఆరోపణలన్నీ అవాస్తవమని తేలింది. ఆయన చేసిన తప్పు ప్రజలందరికీ తెలిసింది. దీంతో తన అబద్దాలు నిజం అని చెప్పడానికి, ఆయన తనకు కావాల్సిన వారితో కమిషన్ వేసుకుంటాడట! అలా తనకు అనుకూలమైన నివేదిక తెప్పించుకునే ప్రయత్నం. అందుకే చంద్రబాబు వంటి దిగజారిపోయిన నాయకుడు.. ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండడుఅడుగడుగునా అంతులేని అభిమానం..తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్కు అడుగుడుగునా ప్రజలు ఘనస్వాగతం పలికారు. రెడ్బుక్ రాజ్యాంగం, విధ్వంస పాలనతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు, జగన్ను చూసేందుకు పోటెత్తారు. దీంతో తాడేపల్లి నుంచి గుంటూరు, సిద్ధార్థనగర్లో ఉన్న రాంబాబు ఇంటికి చేరుకోవడానికి దాదాపు 6 గంటలు పట్టింది. కుంచనపల్లి క్రాస్రోడ్స్, ఖాజా టోల్గేట్, మంగళగిరి బైపాస్, కాకాని, ఏటుకూరు బైపాస్ సర్వీస్ రోడ్, గుంటూరులోని కేవీపీ (వీఐపీ) రోడ్, చుట్టుగుంట, కలెక్టర్ ఆఫీస్, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల మీదుగా సిద్దార్ధనగర్లోని అంబటి రాంబాబు నివాసానికి శ్రీ వైయస్ జగన్ చేరుకున్నారు.మరోవైపు వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రతి చోటా ప్రయత్నించింది. ఎక్కడకక్కడ జగన్గారి వెంట వస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. పలు చోట్ల బారికేడ్లు అడ్డం పెట్టారు. ఒకటి, రెండు చోట్ల లారీలను కూడా రోడ్డు మీద అడ్డుగా పెట్టుకుని అడ్డుకున్నారు. అయినా జగన్గారి అభిమానులు, కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. ఆయన వెంట తరలి వచ్చారు. గుంటూరు నగరం జనసముద్రంగా మారింది. -
అంబటి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. టీడీపీ గూండాల దాడితో వణికిపోయిన కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. బుధవారం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన జన సందోహం నడుమ సాగింది. సాయంత్రం అంబటి నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్.. తొలుత టీడీపీ రౌడీమూకల దాడిలో ధ్వంసమైన ఇంటిని, ఆఫీస్ను పరిశీలించారు. ఆ తర్వాత అంబటి కుటుంబ సభ్యులను కలిసి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ సమయంలో జగన్ వెంట పార్టీ ముఖ్య నేతలు పలువురు ఉన్నారు. -
అంబటి నివాసం వద్ద ఉద్రిక్తత
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద బుధవారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ ప్రియతమ నేత వైఎస్ జగన్ వస్తున్నారనే సమాచారంతో అంబటి ఇంటికి భారీగా తరలి వచ్చినవారిపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ గూండాలు అంబటి రాంబాబు నివాసంపై దాడి చేసి.. ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని హతమార్చాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉల్టా అంబటిపైనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించింది చంద్రబాబు ప్రభుత్వం. దాడితో భయాందోళనకు గురైన అంబటి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించేందుకు వచ్చారు. జగన్ రాక నేపథ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో అంబటి నివాసం వద్దకు తరలి వచ్చారు. అయితే.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వాళ్లను అడ్డుకుని బారికేడ్లు పెట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగడం పరిస్థితి హీటెక్కింది. అయితే.. జగన్ వచ్చాక మరోసారి అలాంటి పరిస్థితే కనిపించింది.అంతకు ముందు.. గుంటూరు నగరంలో అంతకు ముందు గుంటూరు నగరంలోకి వచ్చే సమయంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. గుంటూరు నగరంలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్కు స్వాగతం చెప్పేందుకు వైఎస్సార్సీసీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అయితే, వైఎస్ జగన్ కాన్వాయి వాహనాలను మాత్రమే నగరంలోకి అనుమతిచ్చారు.ఫాలో ఆప్ వాహనాలను చెక్పోస్ట్ వద్ద అడ్డుకున్నారు. అంబటి రాంబాబు నివాసానికి వచ్చేందుకు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్న తమను పోలీసులు అడ్డుకున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ శ్రేణుల్ని నెట్టే ప్రయత్నం చేయగా అక్కడ సైతం ఉద్రిక్తత నెలకొంది. ఇలా అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు చేపట్టిన వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగున్నా అడ్డంకులు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అయినప్పటకీ జగన్పై ఉన్న అమితమైన అభిమానం ఎప్పటికీ తగ్గదని అభిమానులు, శ్రేణులు నిరూపించారు. భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన జనసంద్రాన్ని తలపించింది. -
రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని దృశ్యమిది!
వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజల నుంచి దూరం చేయడానికి కూటమి ప్రభుత్వం ఎన్ని ఎత్తులు.. ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా అవేవీ ఫలించడం లేదు. ప్రభుత్వం ఎత్తులు వేసే కొద్దీ ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది తప్ప ఇసుమంతైన తగ్గడం లేదు. కేవలం 40 కిలోమీటర్ల ప్రయాణానికి 6 గంటకు పైనే సమయం.. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని దృశ్యమిది!తెలుగుదేశం గుండాల దాడిలో విధ్వంసానికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించేందుకు తాడేపల్లిలో బయలుదేరిన వైఎస్ జగన్ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు చేరేందుకు దాదాపు ఏడు గంటల సమయం పట్టింది. జననేతకు అడుగడుగునా వేలాదిమంది అభిమానులు కార్యకర్తలు నీరాజనం పట్టారు. నిన్నటికి నిన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియాలో మాట్లాడుతూ ఎవరికైనా దమ్ముంటే గుంటూరు రావాలని వస్తే వాళ్ళ లెక్క తేలుస్తామని హెచ్చరించారు. ఈసారి మేం చేసే విధ్వంసం చూస్తే వారి ఆస్తులు అమ్ముకున్న రికవరీ కాలేరు అంటూ గమ్మత్తైన వార్నింగులు ఇచ్చారు. అయితే ఇవేవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, బాబు జంగిల్ రాజ్ పాలనపైనా ఆగ్రహంతో ఉన్న సామాన్య ప్రజలను కానీ ఆపలేకపోయాయి. తాడేపల్లి, వడ్డేశ్వరం, నాగార్జున యూనివర్సిటీ, కాజా టోల్ గేటు, మంగళగిరి మీదుగా గుంటూరు చేరుకున్న వైఎస్ జగన్ వెంట అశేషమైన ప్రజావాహిని తరలి వెళ్లింది. పోలీసులు ఎక్కడికి అక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలను నియంత్రించాలని చూసినప్పటికీ వేలాదిగా కార్లు మోటార్ సైకిళ్లలో అభిమానులు జగన్ను అనుసరించారు. తిరుమల లడ్డు అంశాన్ని రాజకీయం చేసి.. ప్రజల్లో వైఎస్సార్సీపీని, జగన్ను పలుచన చేయడానికి చంద్రబాబు ఆయన మీడియా ఎన్నో ఎత్తులు వేసింది. కానీ, అవేవీ ప్రజలను ప్రభావితం చేయలేకపోయాయని జగన్ వెంట ఇవాళ నడిచిన జనాన్ని చూస్తే అర్థమవుతుంది.కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతప్రభుత్వ ఏర్పడిన కేవలం రెండేళ్లలోనే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఎన్నడూ చూడలేదని జగన్ పర్యటనను దూరం నుంచి చూస్తున్న కొందరు పోలీసులే చెబుతున్నారు. జగన్ వెంట వేలాదిగా వచ్చిన వాళ్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదని, సామాన్యమైన ప్రజలు మహిళలు యువత విద్యార్థులు సైతం ఉన్నారని ఇది కచ్చితంగా ప్రతి ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అని ఇంటెలిజెన్స్ వర్గాలు కూటమి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తున్నట్లు సమాచారం. జగన్ వెంట జనం సాధారణమైన విషయమే. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు ఆందో ళనలు ఉద్యమాలు చేపట్టింది. అంతేకాకుండా అధినేత వైఎస్ జగన్ సైతం పలు పరామర్శలు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంలో కూడా ప్రజలు అభిమానులు విపరీతంగా ఆయన వెంట పరుగులు తీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు వైయస్ జగన్ గుంటూరు పర్యటన మొత్తం రాష్ట్రాన్ని కుదిపేసింది అని పోలీసు వర్గాల్లోనే అంతర్గత చర్చ నడుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఈ జనాదరణను చూసి కచ్చితంగా భయపడరంటారా?. వైఎస్ జగన్ వెంట ఇసుకేస్తే రాలనంత జనం చూస్తుంటే ఇది మరో ప్రజా ఉద్యమంలా ఉందని తటస్థ ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు.::సిమ్మాదిరప్పన్న -
హక్కుల సంఘం దృష్టికి ఏపీ జంగిల్ రాజ్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున ఆటవిక పాలనను వైఎస్సార్సీపీ, జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. బుధవారం ఆ పార్టీ నేతల బృందం ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ రమాసుబ్రమణ్యంను కలిసి అరాచక పాలన గురించి ఆధారాలతో సహా వివరించింది. తాజాగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను, అలాగే.. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో తమ కార్యకర్త మందా సాల్మన్ రాజును టీడీపీ శ్రేణులు ఎలా హత్య చేశాయో మానవ హక్కుల సంఘం చైర్మన్ దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు.. టీడీపీ నేతలు తమ పార్టీ వాళ్లను ఎలా చంపాలని చూశాయో తెలియజేస్తూ.. దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయన ముందు ఉంచింది. ఫిర్యాదును స్వీకరించిన చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ను కలిసిన బృందంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, తనూజా రాణి, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సుధాకర్ బాబు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలం సురేష్, ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, ఎమ్మెల్యే చంద్రశేఖర్ , ఎమ్మెల్సీఅరుణ్ కుమార్ , మాజీ ఎమ్మెల్సీజూపూడి ప్రభాకర్ రావు తదితరులు ఉన్నారు.వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. టీడీపీ చేస్తున్న దాడుల పైన దర్యాప్తు చేయాలని ఎన్హెచ్ఆర్సీని కోరాం. టీడీపీ దాడులపై దర్యాప్తు చేసేందుకు చైర్మన్ అంగీకరించారు. డీజీపీ ద్వారా నివేదిక తెప్పించుకుంటానని అన్నారు. త్వరలోనే దర్యాప్తు కమిటీ రాష్ట్రానికి వస్తుందని భావిస్తున్నాం. చంద్రబాబు అనే నరహంతకుడు ప్రజల్ని చంపేస్తున్నారు. ఈ ఆటవిక పాలన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలి అని కేంద్రాన్ని కోరుతున్నాం. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఏపీలో దళితుల పైన దాడులు పెరిగిపోయాయి. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు హత్యలను మానవ హక్కుల సంఘానికి వివరించాం. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ల పైన పెట్రోల్ బాంబులు వేసి చంపేయాలని చూశారు. దళితులపై దాడులు ఏమాత్రం జరుగుతున్న పట్టించుకోవడం లేదు. మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ మాట్లాడుతూ.. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థ పనిచేయడం లేదు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అందుకే జాతీయ మానవ హక్కుల సంఘం ఆశ్రయించాం. వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడులు, హత్యలు చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న దారుణాలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరాం. డీజీపీ ద్వారా నివేదిక తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. ఏపీలో సంపూర్ణంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. మందా సాల్మన్ రాజు సోదరుడు మాట్లాడుతూ.. మాలాంటి దుస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. మా గ్రామంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని వేడుకుంటున్నాం. మానవ హక్కు సంఘానికి నివేదిక ఇచ్చాం. -
ఏపీలో జంగిల్రాజ్కు వ్యతిరేకంగా ఒక్కటైన జనం
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. జంగిల్ రాజ్కు వ్యతిరేకంగా జనం అంతా ఒక్కటయ్యారు. బుధవారం గుంటూరులో పోలీసుల ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రోడ్లపైకి భారీ సంఖ్యలో చేరి వైఎస్ జగన్ వెంట కదులుతూ చంద్రబాబు సర్కార్పై తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తున్నారు. సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ మోహన్రెడ్డి గుంటూరు పర్యటనలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా స్పష్టంగా కనిపించింది. టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించాలని చూస్తే.. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా పోలీస్ వ్యవస్థను రంగంలోకి దించి ఆ పర్యటనను విఫలం చేసే ప్రయత్నాలకు దిగింది. అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులిచ్చి మరీ బెదిరింపులకు దిగింది. గుంటూరుకు వెళ్లే రోడ్లన్నింటినీ పోలీసు చెక్పోస్టులతో నింపేయించింది. వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు.. ఆఖరికి అభిమానులను సైతం అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించింది. కానీ.. ఈ పరిణామాలన్నింటిని ప్రజలు నిశితంగా పరిశీలించారు. ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్న టీడీపీ అరాచకాలను చూసి అసహ్యింంచుకుంటున్న జనం.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. ఏపీలో జంగిల్రాజ్కు వ్యతిరేకంగా జనం ఒక్కటయ్యారు. జగన్ పర్యటనను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తే.. పోలీసుల ఆంక్షల వలయాల్ని చేధించుకుని స్వచ్ఛందంగా.. భారీగా, వేల సంఖ్యలో రోడ్లపైకి చేరుకున్నారు. పోలీసులు ఎప్పటిలాగే జగన్ పర్యటనలో భద్రత కల్పించకుండా దూరంగా ఉంటే.. ఆ జననేతకు జనమే సాదర స్వాగతం పలికారు. గుంటూరు పర్యటనలో అరుదైన దృశ్యాలు కనిపించాయి. జనం స్వచ్ఛందంగా ముందుండి వైఎస్ జగన్ కాన్వాయ్ను ముందుకు నడిపించారు. జగన్ రాక నేపథ్యంలో గుంటూరు వెళ్లే రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. ఈ పరిణామాలను చూస్తున్న రాజకీయ విశ్లేషకులు.. ఇది కూటమి ప్రభుత్వంపై పెల్లుబికిన ప్రజాగ్రహమేనని, జగన్ వెంటనే తాము ఉన్నామంటూ ఇచ్చిన సంకేతాలని అంటున్నారు. -
జగన్ రాకతో దద్దరిల్లిన గుంటూరు (చిత్రాలు)
-
ముగియనున్న మూడు నెలల మూఢం
శ్రీకాకుళం కల్చరల్/శ్రీకాకుళం: మూడు నెలల విరామం తర్వాత మంచి ముహూర్తాలు రావడంతో మళ్లీ వివాహాల సందడి మొదలైంది. గత ఏడాది నవంబరు 26 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 13 వరకు మూఢాలు కావడంతో చాలామంది వివాహాది శుభకార్యాలకు దూరంగా ఉన్నారు. మాఘ మాసం వివాహాలకు మంచిదైనప్పటికీ మూఢం కారణంగా ఫిబ్రవరి 18 వరకు సరైన ముహుర్తాలు లేకుండాపోయాయి. ఎట్టకేలకు ఫిబ్రవరి 19 నుంచి ఫాల్గుణ మాసం మొదలు కావడంతో వివాహాలకు సిద్ధమవుతున్నారు. అంతటా బిజీబిజీ.. ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది అపురూప ఘట్టం. వివాహ మధురానుభూతులను జీవితాంతం గుర్తుగా దాచుకోవాలనుకుంటారు. పెళ్లి ముహూర్తాలు మొదలుకావడంతో వివాహ సంబంధిత వ్యాపారాలైన భాజాభజంత్రీలు, డెకరేషన్ నిర్వాహకులు, కర్పూర దండల షాపులు, లైటింగ్, మైక్సెట్ నిర్వాహకులు, వస్త్ర వ్యాపారులు, బంగారం షాపుల వద్ద హడావిడి బాగా పెరిగింది. పెళ్లి మండపాలకు డిమాండు బాగానే ఉంది. ఇక, ముహుర్తాల కోసం జాతకాలు తీసుకొచ్చే వారితో జ్యోతిషాలయాల కిటకిటలాడుతున్నాయి. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. భోజనాల్లో తగ్గేదేలే.. వివాహ వేడుకల్లో భోజనాలదీ కీలక ఘట్టమే. దీనికోసం జిల్లాలో అనేక కేటరింగ్ సరీ్వసులు సిద్ధంగా ఉన్నాయి. వడ్డించే ఐటెమ్స్ బట్టి ధరలు ఉన్నాయి. ప్లేట్ రూ.150 నుంచి రూ.1000 వరకు ధరలు పలుకుతున్నాయి. కొందరు దూరప్రాంతాలైన విశాఖ, విజయవాడ, రాజమండ్రిల నుంచి సైతం కేటరింగ్ సర్వీసులను రప్పిస్తున్నారు. 19 నుంచి శుభముహూర్తాలు గత ఏడాది నవంబరు నెలాఖరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు మూఢాలు ఉండడంతో మంచి ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 19 నుంచి శుభముహుర్తాలు మొదలు కానున్నాయి. చాలా మంది వివాహాలకు సన్నద్ధమవుతున్నారు. – తెన్నేటి విక్రమశర్మ, పంచాంగకర్త మంచి ముహూర్తాలివే.. ఫిబ్రవరితో పాటు మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఆగస్టు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఎక్కువగా పెళ్లిళ్లు జరగనుట్లు పంచాంగకర్తలు చెపుతున్నారు. ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26 మార్చి : 4, 5, 6, 7, 8, 11, 12, 13, 14, 20, 21, 25, 29 ఏప్రిల్: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 21, 25, 26, 28, 29, 30 మే: 1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13 జూన్: 19, 20, 21, 24, 25, 26, 27, 28, జూలై: 1, 2, 3, 4, 5, 8, 9 ఆగస్టు: 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, సెపె్టంబరు : 1, 3, 4, 5 , అక్టోబరు : 11, 14, 29, 30 నవంబరు: 5, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 25, 26 ,డిసెంబరు : 2, 3, 4, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 30, 31అభిరుచికి తగ్గట్టు.. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా పెల్లి మండపాన్ని అలంకరిస్తుంటారు. కొందరు ప్లాస్టిక్ పూలతో సరిపెట్టుకోగా, మరికొంత మంది నిజమైన పూలతో మండపం సిద్ధం చేయమంటారు. వారి కోసం బెంగళూరు వంటి దూర ప్రాంతాల నుంచి సైతం పూలు, ఇతర సామగ్రి తెస్తుంటాం. – గోపి, క్లాత్ డెకరేషన్, శ్రీకాకుళం ముహూర్తాలు మళ్లీ మొదలుఏడాదిలో ఎన్ని పెళ్లి ముహుర్తాలు ఉంటే అంత ఆదాయం. ఈ ఏడాది మూడునెలలు మూఢాల వల్ల వివాహాది శుభకార్యాలు చాలా వరకు వాయిదాపడ్డాయి. మళ్లీ ముహుర్తాలు మొదలు కావడంతో వివాహాలు జరుపుకునేందుకు మా వద్దకు వస్తున్నారు. – పి.నర్సింహమూర్తి, పురోహితులు -
జగన్ వెంట జనం.. గుంటూరులో జనసంద్రం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. కాసేపటి క్రితమే వైఎస్ జగన్.. అంబటి ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పర్యటనకు భారీగా జనం తరలివచ్చారు.వైఎస్ జగన్ వెళ్తున్న సమయంలో భారీగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా సంఖ్యలో తరలివచ్చారు. జగన్ కాన్వాయ్ వెంట వారంతా ముందుకు సాగుతున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. ఆయన కారుపై పూలు చల్లుతూ తమ అభిమానం చాటుకున్నారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో వైఎస్ జగన్ క్వానాయ్ నెమ్మెదిగా ముందుకు కదులుతోంది.మరోవైపు.. వైఎస్ జగన్ పర్యటనకు భారీగా జనం తరలివచ్చారు. గుంటూరుకు వెళ్లే రోడ్డు జనసంద్రమైంది. వైఎస్ జగన్ వస్తున్న సందర్భంగా కూటమి సర్కార్ జంగిల్ రాజ్కు వ్యతిరేకంగా జనం ఒక్కటయ్యారు. ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న జనాగ్రహంతో వైఎస్ జగన్కు గుంటూరు ప్రజలు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ను వ్యతిరేకిస్తూ జనం రోడ్లపైకి వచ్చారు.ఇదిలా ఉండగా.. వైఎస్ జగన్ పరామర్శ యాత్రకు వెళుతుంటే కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపింది. అభిమానులను, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్నటికీ అవన్నీ విఫలమయ్యాయి. జననేత జగన్ కోసం భారీగా తరలివచ్చిన జనం ముందుండి వైఎస్ జగన్ను నడిపించారు. ప్రజలను అడ్డుకోడానికే చేసిన కుట్రలను అభిమానులు చేధించారు. జంగిల్ రాజ్ కుట్రలకు ఎదురు తిరిగి ముందుకు సాగారు. గుంటూరులో పరిణామాలపై అటు ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. -
లడ్డూ వ్యవహారంపై మళ్లీ బుకాయింపే!
తప్పు చేసి దొరికినప్పుడల్లా చంద్రబాబు ప్రయోగించే టెక్నిక్.. ఎదురుదాడి!. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చిన నేపథ్యంలో కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఆయన తాజాగా మళ్లీ గళమెత్తుతున్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన సంగతి అర్థమైనా దాంతో తనకేమీ సంబంధం లేనట్టుగా నటిస్తున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ప్రచారమే చేయాలని మంత్రులు, టీడీపీ నేతలు, కేడర్ను ఆదేశించారట. తప్పని స్థితిలో మంత్రులు తమకు తోచిన ప్రకటనలు చేస్తున్నారు.మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా తప్పుడు ఫోటోలతో వైఎస్సార్సీపీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేస్తోంది. విద్వేషపూరితమైన ఫ్లెక్సీలు పెట్టించి నీచ రాజకీయాలకు వెనుకాడడం లేదు. కుప్పం టూర్లో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేతలు శ్రీవెంకటేశ్వర స్వామిని బజారుకు ఈడ్చాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారట. తనను క్షమాపణ చెప్పాలని అడుగుతారా అని ఆయన రుసరుసలాడారు. లడ్డూలో జంతు కొవ్వు అంటూ మాట్లాడింది ఎవరు? నిత్యం అదే విషయాన్ని దేశం అంతటా ప్రచారం చేసిందెవరు? ఇవి చాలవన్నట్లు టీడీపీని గట్టెక్కించడానికి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి నిస్సిగ్గుగా అబద్దపు కథనాలు రాస్తున్నాయి. ప్రతిష్ట పూర్తిగా పోయినా ప్రజలను మోసం చేయడం కోసం ఈనాడు మీడియా లాజిక్కు లేని వ్యాఖ్యలతో దిక్కుమాలిన సంపాదకీయం ఒకటి రాసింది.జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఏ తప్పు జరగనట్లేనని జగన్ పార్టీ, మురికి మీడియా ఇప్పుడు వీధికెక్కి వీరంగాలాడుతోందని రాసి ఈనాడు పత్రిక తుచ్చమైన మీడియాగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో ఏం చెప్పింది ఈనాడు మీడియాకు తెలియదా?. జంతుకొవ్వు కలిసిన నెయ్యి వాడారని కదా ఆయన చెప్పారు?. అప్పుడు అదే చంఢాలాన్ని పేజీలకు, పేజీలు రాసి ప్రజలపై రుద్దాయి ఈ పత్రికలు. ఇప్పుడు ఆ జంతు కొవ్వు అంశంలోకి వెళ్లకూడదన్నట్లుగా ఎందుకు రాస్తున్నారు? అసలు ఈనాడు మీడియాకు జంతుకొవ్వు, పామాయిల్కు తేడా తెలియదా? పోనీ పామాయిల్ కల్తీ జరిగి ఉంటే మొత్తం లడ్డూలన్నీ అలా తయారు చేస్తుంటే ఒక్క టీటీడీ అధికారి, పోటు తదితర సిబ్బంది, పూజారులు ఎవరూ పసికట్టలేకపోయారా?. అప్పట్లో జగన్ ప్రభుత్వంపై టీటీడీ విషయంలో అనేక వదంతులు, అబద్దాలు ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు తెలియకుండా ఉండేదా?. విపక్షంలో ఉన్నప్పుడు పలుమార్లు తిరుమల వెళ్లినప్పుడు లడ్డూ ప్రసాదం నాణ్యతపై ఎన్నడూ చంద్రబాబు అనుమానం వ్యక్తం చేయలేదే!. ఇవన్నీ పక్కనబెట్టి తగుదునమ్మా అటూ క్షమించరాని ఘోరాపచారమిది అంటూ రాసేసి ఈనాడు ఆత్మ వంచన చేసుకుంటే సరిపోతుందా?. తెల్లవారిలేస్తే పూజలతో గడిపే ఈనాడు యజమాని కిరణ్ ఇంతటి పాపానికి ఒడిగడుతున్నాడంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అంటే ఆర్థిక సంబంధాల ముందు భక్తి అన్నది ఒక నటనే అని అనుకోవాలా?మరో మాట చెప్పాలి. బహుశా ఆ సంపాదకీయాన్ని రాసిన వారు అంతకుముందు రోజు అదే పత్రికలో వచ్చిన సిట్ నివేదికలోని కొన్ని అంశాలను చదవకుండానో, చదివినా కావాలనో అసత్యాలు పులిమేసినట్లు కనిపిస్తుంది. జనవరి 29న ఈనాడులో వచ్చిన కథనం ప్రకారమే ‘హర్ష్ ఫ్రెష్ డెయిరీ’ 2018 నుంచే టెండర్లలో పాల్గొంటోంది. అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీనే. 2018 ఏప్రిల్ 17న ఈవో ఆదేశాల మేరకు టీటీడీ అధికారుల కమిటీ ఆ కంపెనీని తనిఖీ చేయడానికి వెళ్లింది. ఆ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చిందని సిట్ గుర్తించిందట. అప్పట్లో ఆ కంపెనీకి నెయ్యి బిడ్ రాలేదు. కానీ, 2019 ఫిబ్రవరిలో పొందగలిగిందని ఈనాడులోనే రాశారు. అంటే అప్పుడు కూడా ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా!. ఆ తర్వాత 2019 ఆగస్టులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కంపెనీని రద్దు చేసింది. ఈనాడు ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించనూ లేదు.అంటే పొరపాటున ఎవరో జర్నలిస్టు నిజాలు రాసేయడంతో వచ్చిన ఇబ్బంది నుంచి బయటపడడం కోసం సంపాదకీయం రాశారని అనుకోవాలి. ఆ తర్వాత మళ్లీ ‘భోలే బాబా కంపెనీ’గా పేరు మార్చుకుని ఇదే సంస్థ మోసం చేసిందని సిట్ తెలిపింది. మరికొన్ని కంపెనీలు 2013 నుంచి నెయ్యి సరఫరాలో ఉంటున్నాయి. వాటికి ఈ బోలేబాబాతో సంబంధాలు ఉన్నాయా? లేదా? టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూలైలో తిరస్కరించిన నెయ్యిని తిరిగి ఆగస్టులో ఎలా అనుమతించారు?. దీనికి టీడీపీ ప్రభుత్వం బాధ్యత వహించదా?. అసలు 2014-19 మధ్య నెయ్యి సరఫరా చేసిన కంపెనీల గురించి ఎందుకు విచారించలేదు? జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చినందుకు సంతోషించాల్సి టీడీపీ ఎల్లో మీడియా అందుకు విరుద్ధంగా గగ్గోలు పెడుతున్నాయి?. ఇదేనా వీరి భక్తి? హిందూ మతోద్ధరణ? కేసులో ఎలాగొలా టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి, మరికొందరు వైఎస్సార్సీపీ నేతలను ఇరికించలేకపోయామే అన్నది తప్ప ఇంకొకటి కాదు. అదేదో తమ సొంత సిట్ అయి ఉంటే ఈపాటికి ఎన్ని అరెస్టులు జరిగేవో!. ఎంత బురద వేసేవారమో కదా అన్నది వారి భావన కావచ్చు. ఇదే టైమ్లో అప్పట్లో టీటీడీ కొనుగోళ్ల కమిటీ సభ్యులుగా ఉన్న ప్రస్తుత మంత్రి పార్ధసారథి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిల గురించి ఎందుకు ఎల్లో మీడియా రాయడం లేదు? దీనిని బట్టే వీరి కుట్ర బుద్ధి అర్థం చేసుకోవచ్చు.చంద్రబాబు నాయుడు ఎదురుదాడి చేయడం కొత్త కాదు. ఎన్టీ రామారావును పదవి నుంచి దించివేసిన తర్వాత ఆయనపై ఎన్ని నిందలను మోపింది తెలిసిన విషయమే. గోదావరి పుష్కరాలలో తన కుటుంబ స్నానాలు, డాక్యుమెంటరీ తీయడం కోసం సాధారణ భక్తులందరినీ నిలిపివేయడంతో తొక్కిసలాట జరిగితే కుంభమేళాలో జరగడం లేదా? రోడ్డు ప్రమాదాలలో జరగడం లేదా? అని దబాయించారు. తుని వద్ద రైలు దగ్దం జరిగితే, అది తన ప్రభుత్వ వైఫల్యం అని అంగీకరించకుండా రాయలసీమ నుంచి గూండాలు వచ్చి దహనం చేశారని ఆరోపించారు. కానీ, గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతలపై కేసు పెట్టారు. కందుకూరు, గుంటూరులలో ఆయన సభలలో తొక్కిసలాటలు జరిగి 11 మంది మృతి చెందితే అది పోలీసుల వైఫల్యం అని విమర్శలు చేశారు. అదే వైఎస్ జగన్ టూర్లో ఒకరు ప్రమాదానికి గురైతే మాత్రం అదంతా కారులో ప్రయాణిస్తున్న జగన్ తప్పని కేసు పెట్టించారు.అలాగే ఇప్పుడు తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని ఆరోపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది ఆయనే. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా తన వంతు పాత్ర పోషించారు. అది వారికే ఎదురు దెబ్బ తగలడంతో జనాన్ని మోసం చేయడం కోసం కల్తీ జరిగిందంటూ లడ్డూ ప్రాశస్త్యాన్ని తగ్గించడానికి చంద్రబాబు అండ్ కో వెనుకాడటం లేదన్న విమర్శ వస్తోంది. పార్టీ వారితో విద్వేషపూరితమైన ఫ్లెక్సీలు కూడా పెట్టిస్తున్నారంటే శాంతిభద్రతలపై ఎంత శ్రద్ద ఉన్నది అర్ధం చేసుకోవచ్చు. అదే పని వైఎస్సార్సీపీ వారు చేసి ఉంటే ఈ పాటికి పోలీసులు ఎన్ని కేసులు పెట్టేవారో!. అయితే, అన్నిసార్లు ఎదురుదాడి ఫలించదు. కూటమిలో చాలామంది ఈ పరిస్థితికి చింతిస్తున్నారు. కాకపోతే మాట్లాడలేకపోతున్నారు. ఎల్లో మీడియా భజన బృందం సహకారంతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ వికృత విన్యాసానికి ఫుల్ స్టాప్ పడడానికి ఇంకెంత కాలం పడుతుందో!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మూడు కోళ్లు, ఊరికి రూ.12 వేలు... ఇదీ ఓ ఎస్ఐ రేటు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మీ ఊళ్లో బరి గీసుకోండి. ఊరికి మూడు కోళ్లు...రూ. 12 వేలు ఇవ్వండి! ఇది అనకాపల్లి జిల్లాలోని ఓ ఎస్ఐ సంక్రాంత్రి వసూళ్ల లెక్క! భారీగా ‘బరి’లు గీసుకోండి. మందు, డ్యాన్సులు మీ ఇష్టం. స్థానిక ప్రజా ప్రతినిధులూ పాల్గొంటున్నారు కాబట్టి ఇబ్బందేమీ లేదు. గుండాట, లాటరీ బాల్ ఏ ఆటైనా మీ ఇష్టం. మా వాటా మాకిస్తే చాలు. ఇది అనకాపల్లి జిల్లాలోని మరో రెండు నియోజకవర్గాల కథ! ఊళ్లో ఉత్సవం ఉందా? కోడి పందాలు నిర్వహించుకోండి. మేమేమీ పట్టించుకోం!! ఇది తాజాగా మరో నియోజకవర్గంలో పరిస్థితి. ఇలా అన్ని చోట్లా ఇష్టారాజ్యంగా కోడి పందాలు నిర్వహించుకుంటుంటే అటు రెవెన్యూ, ఇటు పోలీసు అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోయారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో తాజాగా చీడికాడలో కోడి పందాల నిర్వహణలో బరిలో నిలిచిన కోళ్లకు తగిలించిన కత్తి తగిలి ఏకంగా వడిసిలి అప్పలనాయుడు అనే వ్యక్తి చనిపోయారు. ఈ విషయం ఫిబ్రవరి 1వ తేదీన జరిగినప్పటికీ బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారనే ఆరోపణలున్నాయి. అయితే ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో సీఐపై బదిలీ వేటు పడినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో పాటు జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో భారీగా చేతులు తడిపిన పోలీసుల వివరాలను కూడా ఉన్నతాధికారులు సేకరించే పనిలో ఉన్నట్టు సమాచారం. కాసుల రుచి మరిగి.. సంక్రాంతి సందర్భంగా కోడి పందాల నిర్వహణతో భారీగా ఆదాయానికి అలవాటు పడిన పోలీసు, రెవెన్యూ వర్గాలు గ్రామీణ ఉత్సవాల్లోనూ అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా చీడికాడలో నిర్వహించిన కోడి పందాలతో బరిలో ఉన్న కోళ్లకు కట్టిన కత్తి తెగి ఏకంగా ఒక వ్యక్తి మరణించాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. అదేవిధంగా చోడవరంలో కూడా తాజాగా బయటకు వచ్చిన డ్యాన్సుల వీడియో కూడా హల్చల్ చేసింది. అశ్లీల నృత్యాలు కాదంటూ స్థానిక నేతలు చెబుతున్నప్పటికీ గతంలో ఎన్నడూ ఈ తరహాలో ఉత్సవాలను చూడలేదని స్థానికులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో జరిగే గ్రామ ఉత్సవాలన్నింటిలోనూ కోడి పందాల నిర్వహణకు అనుమతిలిచ్చి జేబులు నింపుకోవడానికి అటు రెవెన్యూ, ఇటు పోలీసువర్గాలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే చీడికాడలో వ్యక్తి మృతిచెందిన వ్యవహారంలో ఇప్పటి వరకు అధికారికంగా ఫిర్యాదు అందనప్పటికీ కోడి పందాలతోనే చనిపోయాడని మాత్రం గుసగుసలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐపై బదిలీ వేటు పడింది. అంతేకాకుండా ఉత్సవాల పేరుతో పందాల నిర్వహణకు అనుమతించిన పోలీసులు, వారి వసూళ్లపై ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే అనకాపల్లి జిల్లాతో పాటు విశాఖ నగర శివారులోని పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందిలో ఎవరిపై బదిలీ వేటు పడనుందనేది చూడాల్సి ఉంది. గోదావరి జిల్లాలకు దీటుగా...! గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంత్రి సందర్భంగా అనకాపల్లి జిల్లాతో పాటు విశాఖ జిల్లాలోనూ అధికార పార్టీ నేతల అండదండలతో భారీగా ‘బరి’లు రంగంలోకి వచ్చాయి. గతంలో సంక్రాంత్రి పందెం కోళ్ల బరిలను చూసేందుకు పక్కనే ఉన్న గోదావరి జిల్లాలకు వెళ్లేవారు. అయితే, ఈ దఫా మాత్రం అదే స్థాయిలో భారీ సెట్టింగులతో స్థానికంగానే నిర్వహించారు. యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ఓ రేంజ్లో పందెం బరిలు గీశారు. అలాగే పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో కూడా ఒక మోస్తరుగా పందెం బరిలు ఏర్పాటు చేసుకున్నారు. కోడి పందాలతో పాటు డ్యాన్సులూ హోరె త్తాయి. ఇంతటితో ఆగకుండా భారీగా మద్యం అమ్మకాలతో పాటు గుండాట, లాటరీ బాల్ ఆటలకూ లాటరీ పద్ధతిలో స్టాళ్ల కేటాయింపులు జరిగాయి. ఒక్కో స్టాలుకు రూ.8 లక్షల చొప్పున వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి ఉత్సవాల ఊపుతో ఇప్పుడు గ్రామాల్లో జరిగే ఉత్సవాలకు కూడా కోడి పందాల నిర్వహణ వ్యవహారం పాకడం గమనార్హం. -
మోస్ట్ వాంటెడ్ నిందితులను పట్టిచ్చిన ‘రోబో’
విశాఖపట్నం: రైల్వే స్టేషన్ అంటేనే నిత్యం వేలాది మందితో కిటకిటలాడే ఒక జనసముద్రం. ఆ రద్దీలో సామాన్య ప్రయాణికులను, మారువేషంలో తిరిగే నేరగాళ్లను వేరు చేసి చూడటం మానవమాత్రులకు కత్తిమీద సామే. కానీ.. ఆధునిక సాంకేతికత తోడైతే అసాధ్యం సుసాధ్యమని ‘రైల్ రోబోకాప్ – ఏఎస్సీ అర్జున్’ నిరూపించింది. సోమవారం నిశ్శబ్దంగా సాగిపోతున్న రాత్రి వేళ, ప్లాట్ఫారంపై తన గస్తీని కొనసాగిస్తున్న ఈ రోబో రూపంలోని కృత్రిమ మేధస్సు ఒక్కసారిగా అప్రమత్తమైంది. దాని డిజిటల్ కళ్లు రద్దీలో ఉన్న ప్రతి ముఖాన్ని నిశితంగా స్కాన్ చేస్తుండగా, ఇద్దరి వ్యక్తుల ముఖకవళికలు తన డేటాబేస్లోని ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాతో సరిపోలాయి. కనురెప్పపాటు కాలంలోనే ఆ రోబో తన విశ్లేషణను పూర్తి చేసి, కంట్రోల్ రూమ్కు ప్రమాద హెచ్చరికలను పంపింది. అప్పటివరకూ సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రోబో పంపిన నిక్కచ్చి సమాచారంతో ఆరీ్పఎఫ్ ఎస్ఐ వి. కీర్తిరెడ్డి నేతృత్వంలోని బృందం, క్రైమ్ ప్రివెన్షన్ డిటెన్షన్ స్క్వాడ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. ఎటు నుంచి ముప్పు వస్తుందో ఊహించలేక ఆ ఇద్దరు అనుమానితులు తచ్చాడుతుండగానే, పోలీసులు వారిని చుట్టుముట్టారు. ప్రాథమిక తనిఖీలో వారి వద్ద కనీసం టికెట్లు కూడా లేకపోవడం అధికారుల అనుమానాన్ని బలపరిచింది.అయితే అసలు సంచలనం వారి గతాన్నితవ్వినప్పుడు బయటపడింది. పట్టుబడిన హడప శివ, జె. బంగారు సాధారణ దొంగలు కాదని, రాయగడ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు, దోపిడీలు, దాడులు, డకాయిటీలతో భీభత్సం సృష్టించిన గజదొంగలని తేలింది. ఇన్నాళ్లూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఈ నేరగాళ్ల ఆటను ‘ఏఎస్సీ అర్జున్’ తన ఏఐ మేధస్సుతో కట్టిపడేసింది. ఈ చారిత్రాత్మక విజయంపై డీఆర్ఎం లలిత్ బోరా స్పందిస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో భద్రతను పర్యవేక్షించడంలో ఏఐ సాంకేతికత ఒక తిరుగులేని ఆయుధమని ప్రశంసించారు. -
దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం : వైఎస్ జగన్
చంద్రబాబు ఆటవిక పాలనలో వైఎస్సార్సీపీ నేతలకు రక్షణ కరువైంది. వరుసగా అక్రమ కేసులు.. అరెస్టులు.. విచారణల పేరుతో ప్రతీకార రాజకీయాలు కొనసాగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా హత్యలకు కూడా కుట్ర పన్నుతోంది.. అందుకే వైఎస్సార్సీపీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ రంగంలోకి దిగారు. -
పశ్చిమ గోదావరిలో ఎంతో ఫేమస్ ఈ ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)
-
వైఎస్ జగన్ పర్యటన.. గుంటూరు పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైఎస్ జగన్ వస్తున్న కారణంగా నగరాన్ని పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. సిటీ నలువైపులా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను అడ్డుకుంటున్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో పోలీసులు కూటమి సర్కార్కు వత్తాసు పలుకుతున్నారు. నిన్న రాత్రి నుంచే వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇంటికి అర్ధరాత్రి రెండుసార్లు పోలీసులు వెళ్లారు. గోడకు నోటీసు అంటించి పోలీసులు ఫోటోలు తీసుకున్నారు. అనంతరం, వెంటనే నోటీసులు తొలగించి పోలీసులు వెళ్లిపోయారు. దీంతో, నోటీసులు ఇచ్చినట్టు కవరింగ్ చేస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు ఆటంకాలు సృష్టించి.. సిటీకి నలువైపులా చెక్పోస్టులు పెట్టి.. వైఎస్సార్సీపీ నేతలు హాజరు కాకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు.. వైఎస్ జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో సెక్షన్-30 అమలులో ఉంది కాబట్టి ర్యాలీలు, మీటింగ్లు నిర్వహించకూడదని పోలీసులు ప్రకటన చేశారు. అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు వెళ్లి పోలీసులు హడావిడి చేశారు. పార్టీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, నంబూరు శంకర్రావు, బలసాని కిరణ్ కుమార్, వేమారెడ్డి అంబటి మురళి, విడుదల రజిని, పానుగంటి చైతన్య, మేరుగు నాగార్జున, అన్నాబత్తుని శివకుమార్, దొంతి రెడ్డి వేమారెడ్డికి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వారి ఇళ్లకు వెళ్లారు. గుంటూరులో వైఎఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో పార్టీ కార్యకర్తలు పాల్గొనకుండా నోటీసులు ఇస్తున్నారు. -
జనసేనకు బిగ్ షాక్
సాక్షి, విశాఖపట్నం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన ఆవిర్భావం నుండి పవన్ వెంట ఉన్న సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తాను నిర్వహిస్తున్న అన్ని పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయం ప్రకటించారు.అయితే, జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలపై బొలిశెట్టి కొంతకాలం అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో నామినేటెడ్ పదవులు విషయంలో జనసేన నేతలకు అన్యాయం జరుగుతుందని ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
పసి మొగ్గలపై 'విషపు కాటు'
తాచుపాముల తావుల్లో విషపు కాటుకు గురై.. పువ్వంటి బాల్యం బుగ్గిపాలవుతోంది. ఆకులు రాలి, మోడువారిన చెట్టులా వెక్కివెక్కి ఏడుస్తోంది. పరమాన్నం పెట్టేవాడు పరమాత్మ కాదని, ఆటబొమ్మలిచ్చే వాడు ఆదుకొనేవాడు కాడని గుర్తించలేక.. పసిప్రాయం కామాంధుల దాహానికి కర్కశంగా బలవుతోంది. మృగాళ్ల కాటుకు బలై.. తల్లై.. ప్రసవ వేదనతో చిక్కిశల్యమై.. కన్నవారికి బరువై తల్లడిల్లిపోతోంది. కాకినాడ క్రైం: ఆడపిల్ల పుడితే సాక్షాత్తూ ఆ శ్రీమహాలక్ష్మి తమ కడుపున పుట్టిందని తల్లిదండ్రులు మురిసిపోతారు. రెక్కలు విచ్చుకున్న సీతాకోకచిలుకలా.. ఘల్లుమనే గజ్జెల సవ్వడితో నట్టింట్లో నడయాడుతూంటే ఆనందపరవశులవుతారు.. అటువంటి పసిమొగ్గలు.. లోకం పోకడలు తెలియని ప్రాయంలోనే కామాంధుల చేతుల్లో బలైపోతున్నారు. రేపటి తరాన్ని అందించాల్సిన బాలికలపై.. అక్క, చెల్లి, కూతురు, మనవరాలు.. ఇలా అన్ని వావివరుసలనూ మరచిన మృగాళ్లు.. ముక్కుపచ్చలారని వయస్సులోనే అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఆ బాధిత బాలికలు పసి ప్రాయంలోనే గర్భవతులై జీవచ్ఛవాలుగా మిగిలిపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఏడాది వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 13 మంది బాలికలు మృగాళ్ల అఘాయిత్యాలకు గురై, గర్భం దాల్చారు. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఉంటుందన్నది అంచనా. గర్భం దాల్చిన వారు కాకుండా.. లైంగిక దాడులకు గురైన వారు మరెంతో మంది ఉంటున్నారు. విలువలు లుప్తం.. లోపిస్తున్న భయం » సమాజంలో నానాటికీ విలువలు లుప్తమవడం ఈ అకృత్యాలకు జరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతోపాటు అవగాహన లోపం, బలప్రయోగాలకు గురవడం, సరైన పెంపకం లేకపోవడం వంటివి కూడా కారణాలవుతున్నాయి. » బాలికలపై అత్యాచారం చేసి, హత్య కూడా చేసిన సంఘటనలు దేశంలో, రాష్ట్రంలో ఎన్నో జరిగాయి. అయినప్పటికీ నిందితులపై కఠిన చర్యలు చేపట్టడం లేదు. చట్ట ప్రకారం చర్యలున్నా, అవి తీవ్ర స్థాయిలో లేకపోవడంతో ఘాతుకానికి పాల్పడుతున్న వారికి భయం లేకుండా పోతోంది. ఎలాగైనా తప్పించుకోవచ్చనే భావనను కలిగిస్తోంది. కేసులు ఆలస్యంగా నమోదవడం, సాక్ష్యాలు లభించకపోవడం, రాజీ యత్నాలు, బాధిత బాలలు ఫిర్యాదు చేయలేకపోవడం మృగాళ్లకు కలిసొస్తున్నాయి. ఫలితంగా బాధితులకు తక్షణ న్యాయం లభించడం లేదు. దీంతో, చిన్నారులపై లైంగిక దాడులు నిత్యకృత్యమైపోతున్నాయి. » కొన్ని సందర్భాల్లో పిల్లలకు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరూ ఉండని దుస్థితి. కొంత మంది పిల్లలను బంధువుల ఇళ్లల్లో ఉంచి, జీవనోపాధికి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అలా తల్లిదండ్రులు లేని లోటుతో జీవితాన్ని గడుపుతున్న పిల్లలకు కామాంధులు రకరకాల ఆకర్షణలు ఎరగా వేస్తున్నారు. అలాగే, బాల కార్మికులు, బిచ్చగాళ్లుగా జీవిస్తున్న చిన్నారులు లైంగిక దోపిడీకి గురవుతున్నారు. » అసురక్షిత పరిస్థితుల్లో లైంగిక దాడులు జరుగుతూండటంతో పలువురు బాలికలు గర్భవతులవుతున్న దుస్థితి నెలకొంది.పెడోఫిలిక్ డిజార్డర్తో.. పెడోఫిలిక్ డిజార్డర్ అనే మానసిక సమస్య వల్ల కూడా పసివాళ్లపై లైంగిక వాంఛలకు లోనవుతూంటారు. వారితో తమ కోరిక తీర్చుకోవడానికి ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు. అలాగని ఘాతుకానికి పాల్పడిన ప్రతి వాడూ పెడోఫైల్ కాదు, ప్రతి పెడోఫైల్ నేరం చేస్తాడనీ లేదు. ఈ సమస్య వల్ల నేరం చేశానని తప్పించుకునే అవకాశం లేదు. వ్యక్తి సమస్యతో బాధపడుతున్నాడా లేదా అన్నది గుర్తించడం వైద్యపరంగా సులభమే. చిన్న పిల్లలపై చెడు ఆలోచనలు కలిగితే తక్షణమే మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించాలి. సైకియాట్రిక్ కౌన్సెలింగ్, బిహేవియర్ థెరపీ, ఇంపల్స్ కంట్రోల్ మెడిసిన్ ద్వారా సమస్యను నియంత్రించవచ్చు. – డాక్టర్ వానపల్లి వరప్రసాద్, మానసిక వ్యాధుల నిపుణుడు, హెచ్ఓడీ (ఇన్చార్జి), రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ‘సమ్మతి’ అనే ప్రశ్నే లేదు ఇలాంటి దురాగతాల్లో బాధిత బాలికను పెళ్లి చేసుకుంటామని ఎర వేయడం పరిపాటిగా మారింది. నిరుపేద, వెనుకబడ్డ, తల్లిదండ్రులు లేక సంరక్షకుల వద్ద బతుకీడుస్తున్న అనాథ బాలల వర్గాల్లో ఇది పరిపాటిగా మారింది. వివాహం చేసుకుంటే కేసు రద్దవదు. కేసుతో పాటు నేరం చేసినందు వల్ల చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ పరిధిలో చట్ట పరమైన చర్యలు తప్పవు. ఇది కాక, పోక్సో చట్టం వర్తిస్తుంది. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. నేర తీవ్రతను బట్టి జీవిత ఖైదు కూడా విధించవచ్చు. నేరంలో క్రూరత్వం స్పష్టమైతే మరణ దండనకూ ఆస్కారం ఉంటుంది. మైనర్లపై లైంగిక దోపిడీలో ‘సమ్మతి’ అనే ప్రశ్నే లేదు. – ఎండీ జవహర్ ఆలీ, ప్రముఖ న్యాయవాది, కాకినాడ » గత మే నెలలో కిర్లంపూడిలో 13 ఏళ్ల బాలికకు పక్కింటి వృద్ధుడు చాక్లెట్లు ఇచ్చి లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఓ తాతయ్య చాక్లెట్లు ఇస్తున్నాడని ఆ బాలిక పాఠశాలలో తోటి స్నేహితులకు చెప్పడంతో.. ఆ పిల్లలు కూడా చాక్లెట్ల కోసం వెళ్లగా.. వారిపై కూడా ఆ దుర్మార్గుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. » ఇలా ఏడుగురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణంతో ఓ బాలిక గర్భవతి కావడంతో అధికారుల అనుమతితో అబార్షన్ చేయించారు. » గండేపల్లి మండలం సూరంపాలెంలో 13 ఏళ్ల బాలికపై ఓ లారీ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పెద్దమ్మ ఇంటికి వెళ్తే కన్ను వేసి, బెదిరించి పలుమార్లు దారుణానికి తెగబడ్డాడు, ఆ మృగాడి నిర్వాకంతో ఆ బాలికకు జగ్గంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం జరిగి, ఆడ శిశువు జని్మంచింది. » కాకినాడ జగన్నాథపురంలో 14 ఏళ్ల బాలికపై పొరుగింట్లో ఉంటున్న 40 ఏళ్ల దుర్మార్గుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. గర్భవతి అయిన ఆ చిన్నారికి అబార్షన్ చేయించేందుకు ఇంటర్ చదువుతున్న ఓ యువకుడికి చెప్పాడు. అతడు కూడా ఆ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వీరిద్దరి ఘాతుకానికి బలైపోయిన ఆ బాలిక.. ఆడపిల్లకి జన్మనిచ్చింది. » గత నవంబర్లో ఉప్పాడకు చెందిన 16 ఏళ్ల బాలికకు తినుబండారాలు కొనిచ్చి, తాతయ్య వరుస అయ్యే వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడు. గర్భం దాలి్చన ఆ బాలికకు కాకినాడ జీజీహెచ్లో అధికారుల ఆదేశాలతో అబార్షన్ చేశారు. » కాకినాడ అచ్చంపేటకు చెందిన 17 ఏళ్ల బాలికను ఓ వివాహితుడు ప్రేమ పేరుతో మోసగించి, దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఆ బాలిక గత నవంబర్ 29న బాబును ప్రసవించింది. ఆ శిశువును శిశుగృహకు అప్పగించారు. » బాబాయి అత్యాచారం చేయడంతో తాళ్లరేవులో 16 ఏళ్ల బాలిక గత అక్టోబర్లో పాపను ప్రసవించింది. » పిఠాపురానికి చెందిన 15 ఏళ్ల బాలికపై సొంత బంధువే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అధికారుల ఆదేశాలతో ఆమెకు అబార్షన్ చేశారు. » కరప మండలం నడకుదురుకు చెందిన ఓ బాలికను తెలిసున్న వ్యక్తే నమ్మించి మోసం చేశాడు. కాకినాడ కోకిల సెంటర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆ బాలిక మగ శిశువును ప్రసవించింది. ఆ శిశువును అధికారులకు అప్పగించారు. » ఇవన్నీ కేవలం ఏడాది వ్యవధిలో జరిగిన దారుణాలు. మచ్చుకు కొన్నే అయినా, అభంశుభం తెలియని బాలికలపై అఘాయిత్యాలు ఏ రీతిలో జరుగుతున్నాయనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.చైల్డ్ పోర్నోగ్రఫీ అరచేతిలోకి ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణం పరిపాటిగా మారింది. వీటిని వీక్షిస్తున్న వారిని సాంకేతికత ఆధారంగా గుర్తించి భరతం పట్టాల్సిన పోలీసు శాఖ ఈ విషయంలో విఫలమవుతోంది. అశ్లీల వీడియోలు చూస్తున్న ఎంతో మంది వికృత చేష్టలతో పసిమొగ్గలను చిదిమేస్తున్నారు.చేతులెత్తేసిన సర్కారు బాలికలపై దురాగతాల్ని నిలువరించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. బాధ్యత వహించాల్సిన పోలీస్, మాతా శిశు సంక్షేమ శాఖ అనుబంధ విభాగాలు, రూ.కోట్లు వెనకేసుకుంటున్న ఎన్జీవోలు పూర్తిగా విఫలమవుతున్నాయి. అవగాహన కార్యక్రమాల పేరుతో ఫొటోలకే పరిమితమవుతున్నారు. అక్కడక్కడ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా అవి ఫలవంతంగా జరగడం లేదనే విమర్శలున్నాయి. పాఠశాల లేదా మరేదైనా ప్రాంతంలో ఒకసారి సదస్సు నిర్వహించి వదిలేస్తున్నారు. దీనివలన ప్రయోజనం ఎంతవరకూ ఒనగూడిందనే పరిశీలన ఉండటం లేదు. అలాగే, బాధిత బాలికలు చేరి, సాంత్వన పొందే విభాగంలో కనీసం వారి డేటా కూడా తగిన రీతిలో నిర్వహించడం లేదు. -
దురుద్దేశంతోనే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం
సాక్షి నెట్వర్క్: తిరుమల వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్ నివేదిక స్పష్టం చేసినప్పటికీ... దురుద్దేశంతో అసత్య ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిట్ నివేదికను వక్రీకరించి బ్యానర్లతో దుష్ప్రచారం చేస్తూ కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అలాగే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినిపై దాడులకు పాల్పడిన గూండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. » మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు విజయవాడ, కొత్తపేట సీఐ కొండలరావుకు ఫిర్యాదు అందచేశారు. వైఎస్సార్ సీపీ ఎన్టీ ఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ విజయవాడలోని మాచవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. » అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్, ఉరవకొండ సర్కిల్ కార్యాలయంలో, కదిరి పట్టణ పీఎస్లో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మడకశిర వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈర లక్కప్ప ఆధ్వర్యంలో ఎస్ఐ లావణ్యకు ఫిర్యాదు చేశారు. » వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఫోర్తుటౌన్ పోలీస్ స్టేషన్లో, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ పెందుర్తి పీఎస్లో, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి న్యూపోర్టు పీఎస్లో, విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి ఎంవీపీ పీఎస్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. » మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు నర్సీపట్నం టౌన్ సీఐకి, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు బోదెపు గోవింద్ యలమంచిలి రూరల్ ఎస్ఐకి, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు నక్కపల్లి పీఎస్లో, అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్కుమార్ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. » డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు ఫిర్యాదు చేశారు. » పి.గన్నవరం పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్కు పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్, కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఉభయ గోదావరి జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరాంజీ, తదితరులు సీఐ వైఆర్కే శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ప్రత్తిపాడులో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు తదితరులు సీఐ బి.సూర్య అప్పారావుకు ఫిర్యాదు చేశారు. » శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస, జేఆర్పురం, పాతపట్నం, టెక్కలి, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం రూరల్, నరసన్నపేట పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. » మార్కాపురం జిల్లా గిద్దలూరులో నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, యర్రగొండపాలెంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి ఫిర్యాదు చేశారు. » పశ్చిమగోదావరి జిల్లా ఆచంట పోలీస్ స్టేషన్లో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి గురుప్రసాద్ తదితరులు ఫిర్యాదు చేశారు. -
నేడు అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఆయన గుంటూరు వెళతారు.ఇటీవల టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
టీడీపీ చేతిలో ఖా‘కీలు బొమ్మలు’
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేయడంతోపాటు ఆయనపై హత్యాయత్నం జరిగిన ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ చేతిలో కీలుబొమ్మలై ఆ పార్టీ అధిష్టానం చెప్పినట్టు నడుచుకున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం గోరంట్ల గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేసి తిరిగి వస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు గోరంట్ల చిల్లీస్ సెంటర్లో కర్రలు, మారణాయుధాలతో కాపుగాశారు. అంబటి రాంబాబు వాహనాన్ని అడ్డుకుని కారు మీద చేతులతో కొడుతూ అసభ్య పదజాలంతో దూషించారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ వందనాదేవి అయితే ‘‘నువ్వు మొగోడివి అయితే రారా’’అంటూ అంబటిని రెచ్చగొట్టారు. మారణాయుధాలతో తెలుగుదేశం నేతలు పెద్ద సంఖ్యలో గుమిగూడినా వారిని నియంత్రించడంలో నల్లపాడు సీఐ వంశీధర్ విఫలమయ్యారు.పైగా టీడీపీ నేతలకు కొమ్ముగాశారు. వైఎస్సార్సీపీ నేతల నుంచి ప్రతిస్పందన రాకుండా తెలుగుదేశం మూకలకు రక్షణగా నిలబడ్డారు. పైగా అంబటి వాహనంలో మారణాయుధాలు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేశారు. వ్యూహాత్మకంగా దాడి.. అంబటిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా అతిగా స్పందించారు. రాంబాబుకు 24 గంటల్లో తామేంటో సినిమా చూపిస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు నల్లపాడు సీఐ వంశీధర్ సిద్ధార్ధనగర్లోని అంబటి ఇంటికి వెళ్లి నోటీసు ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. అయితే నోటీసు ఇవ్వకుండానే ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు అంబటి ఇంటి వద్ద ఎంతమంది ఉన్నారో గమనించి వెళ్లి టీడీపీ నేతలకు ఉప్పందించారని సమాచారం.ఈ నేపథ్యంలో అంబటిని అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారంతో మీడియా అక్కడికి చేరుకుంది. అదే సమయంలో వైఎస్సార్సీపీ శ్రేణులూ తరలివచ్చాయి. సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త లంకా మాధవి అంబటి ఇంటి వద్దకు వచ్చి అంబటిని ‘‘నా కొడకా రా..రా.. చెప్పుతో కొడతా’’అంటూ దుర్భాషలాడింది. దీనికి వైఎస్సార్సీపీ మహిళా నాయకులు ప్రతిస్పందించారు. టీడీపీ కార్యకర్తను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లంకా మాధవిని అక్కడి నుంచి తప్పించారు. అప్పటికే వ్యూహాత్మకంగా పశ్చిమఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు, అబ్బూరి మల్లి, ఇతర కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అంబటి ఇంటికి చేరుకుని ఒక్కసారిగా మారణాయుధాలు, కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అప్పటికే పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు నేతృత్వంలో వందమందికిపైగా పోలీసులు అక్కడ మోహరించినా.. వారిని అడ్డుకునే యత్నం చేయకుండా చోద్యం చూశారు. గోనుగుంట్ల కోటేశ్వరరావు అనే టీడీపీ దివ్యాంగుల విభాగం నేత మైక్ సెట్తో వచ్చి ‘‘బయటకు రారా నా కొడకా’’అంటూ అంబటిపై బూతుపురాణం లంకించుకున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ గూండాలకు అండగా నిలబడ్డారు. ఈ ఇద్దరూ అధికారపార్టీ తొత్తులే! సీఐలు గంగా వెంకటేశ్వర్లు, వంశీధర్ ఇద్దరూ అధికారపార్టీ తొత్తులేనని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు గతంలో పలుమార్లు వైఎస్సార్సీపీ ర్యాలీలు, సభలను అడ్డుకున్నారు. కొన్ని సందర్భాల్లో అంబటి రాంబాబుతో వాగ్వాదానికీ దిగారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు సీఐలు అధికార పార్టీ నేతల ఆదేశాల ప్రకారం అంబటిని ఇబ్బంది పెట్టాలనే వ్యూహరచన చేశారని వైఎస్సార్సీపీ వర్గాలు మండిపడుతున్నాయి. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై కోర్టును ఆశ్రయించడానికి సన్నద్ధమవుతున్నాయి. పక్క సబ్ డివిజన్ స్టేషన్లో ఆ సీఐకి ఏం పని?ఉదయం టీడీపీ నేతలు అంబటిపై దాడికి యత్నించిన ప్రదేశం గోరంట్ల చిల్లీస్ సెంటర్ నల్లపాడు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో అన్యాయంగా అక్రమంగా అంబటిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను శనివారం రాత్రి 10.30 గంటలకు నల్లపాడు స్టేషన్కు తరలించి లాకప్లో పెట్టారు. నల్లపాడు గుంటూరు సౌత్ సబ్డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఆ స్టేషన్లో వైఎస్సార్సీపీ శ్రేణులు అంబటిని కలవకుండా ఉండేలా ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అర్ధరాత్రి లాకప్లో నిద్రపోతున్న అంబటిని నల్లపాడు పోలీస్ స్టేషన్ పైఅంతస్తుకు పోలీసులు తీసుకువెళ్లారు. అక్కడ నల్లపాడు సీఐ వంశీధర్తోపాటు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లూ ఉన్నారని స్వయాన అంబటి రాంబాబు న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు. గంగా వెంకటేశ్వర్లు, వంశీధర్ ఇద్దరూ తనను గోడకు ఆనించి కూర్చోబెట్టి రెండు కాళ్లు చీల్చి ఇబ్బందికి గురి చేశారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పట్టాభిపురం స్టేషన్ సీఐ గంగా వెంకటేశ్వర్లుకు సౌత్ సబ్డివిజన్లోని నల్లపాడు స్టేషన్లో ఏం పని అనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
కరకట్ట ప్యాలెస్ కిరాతకమే
సాక్షి, టాస్క్ ఫోర్స్: కరకట్ట ప్యాలెస్ కేంద్రంగానే వైఎస్సార్ సీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై దాడికి వ్యూహ రచన జరిగినట్లు స్పష్టమైంది. పెదబాబు, చినబాబు ఆదేశాల మేరకే ఓ పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య నేత ఈ ధ్వంస రచన చేశారని విశ్వసనీయ సమాచారం. శనివారం గుంటూరులో అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరగ్గానే.. అదే రోజు రాత్రి పొద్దుపోయాక టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతకు చినబాబు కాల్ చేసినట్లు సమాచారం. ఆ మరుసటి రోజే.. అంటే ఆదివారం జోగి రమేశ్ ఇంటిపై దాడి చేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. దీంతో ఆ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యనేత.. విజయవాడ పశి్చమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఫతావుల్లాతోపాటు, మైనార్టీ మహిళా నేత ఆషా, గొల్లపూడికి చెందిన టీడీపీ నేతలు, విజయవాడ, మైలవరం నియోజకవర్గానికి చెందిన నేతలకు ఈ దాడి బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది. దాడిలో కీలకంగా పాల్లొన్న షేక్ ఆషా, ఫతావుల్లాలిద్దరూ చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రి అనితకు బాగా తెలుసని.. దాడులు చేయడానికి రౌడీ మూకలను కూడగట్టడంలో వారిది అందెవేసిన చేయి అని సమాచారం. ముఖ్య నేతల ఆదేశాలు కావడంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి పెట్రో బాంబులు విసిరే వారిని ఆగమేఘాలపై రప్పించి.. దాడికి పురిగొలిపినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కొందరు టీడీపీ కార్యకర్తలే బహిరంగంగా వెల్లడిస్తుండడం గమనార్హం. ‘అధికారంలో ఉన్నది మేమే.. మళ్లీ ఎన్నికలొచి్చనా గెలిచేది మేమే.. ఎలా గెలవాలో పెదబాబు, చినబాబుకు తెలుసు. అందువల్ల మాకేం భయం లేదు. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోక పోతే ఆయనకు పట్టిన గతే పడుతుంది’ అని ఆషా, ఫతావుల్లాలతోపాటు, గొల్లపూడి, మైలవరానికి చెందిన నేతలు రౌడీలను సిద్ధం చేసి దాడికి పురమాయించారు. ఈ ఇద్దరు నేతలకు ఇదివరకే ‘మీకు మంచి భవిష్యత్ ఉంటుంది. పార్టీ సూచనల మేరకు నడుచుకోండి’ అని చినబాబు దిశానిర్దేశం చేశారని.. అందువల్లే వారు, పార్టీనేతలతో కలిసి, రెచి్చపోయి ధ్వంసరచన చేసినట్లు తెలిసింది. పోలీసులకు ముందే తెలిసినా.. మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై దాడి జరుగుతుందని ముందస్తు సమాచారం ఉన్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినట్లు స్పష్టం అవుతోంది. దాడికి వెళ్తున్న పచ్చ మూకలకు రక్షణగా పోలీసులు వెళ్లినట్లు ఘటనా స్థలంలో పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోంది. ఈ దాడుల స్కెచ్లో ఓ పోలీసు అధికారి కీలక భూమిక పోషించినట్లు తెలుస్తోంది. దాడులు జరుగుతున్న సమయంలో సమీప సెంటర్లో టీడీపీ నేతలతో కలిసి ఉండి , ప్రోత్సహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన విమర్శల్లో నిజం లేదని సీబీఐ సిట్ చార్జిషీట్ తేల్చడంతో డైవర్షన్ పాలిటిక్స్ల్లో భాగంగానే మాజీ మంత్రుల ఇళ్లపై దాడులకు టీడీపీ ముఖ్యనేతలు కుట్ర పన్నినట్టు స్పష్టమవుతోంది. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరుగుతున్న సమయంలో స్పందించని పోలీసులు, ప్రభుత్వం దాడుల తంతంగమం ముగిశాక తాపీగా సీఎం చంద్రబాబు నాయుడు తాను ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులను సహించబోనని, శాంతి భద్రతల విషయంలో రాజీపడబోనని నీతి వచనాలు వల్లెవేస్తూ సన్నాయి నొక్కులు నొక్కడంపై సర్వతా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరామర్శకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై కేసులు దాడులకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులుదాడులు జరిగిన తర్వాత మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి పరామర్శకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహనరావును అడ్డుకొని, అన్యాయంగా అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేసి విజయవాడలోని పోలీసు స్టేషన్కు తరలించారు. అలానే బాధితుడైన మాజీ మంత్రి జోగి రమేష్ పైనా అన్యాయంగా అక్రమ కేసులు నమోదు చేయడం గమనార్హం. టీడీపీ మూకల దాడులపై అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నామమాత్రం కేసులతో చేతులు దులుపుకున్నారు. -
గల్లా మాధవి దంపతులకు క్లీన్ చిట్!
సాక్షి ప్రతినిధి, గుంటూరు/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, కాపునేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయంపై చేసిన దాడిపై పోలీసులు మొక్కుబడిగా కేసు నమోదు చేశారు. అంబటిరాంబాబు ఫిర్యాదు మేరకు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.అయితే, దాడికి పాల్పడిన, పురిగొల్పిన టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావుతోపాటు ముఖ్యమైన టీడీపీ నాయకుల పేర్లను తప్పించారు. అంబటిఫిర్యాదులో దాడికి పాల్పడిన ముఖ్యమైన వారి పేర్లు స్పష్టంగా పేర్కొన్నారు. అయినా టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ప్రసాద్ అలియాస్ ఇసుక బుజ్జి, మరికొందరు... అంటూ మొక్కుబడిగా కేసు నమోదు చేసి వదిలేశారు. కేసు నమోదుకు తర్జనభర్జనలు... వైఎస్సార్సీపీ లీగల్ టీం ద్వారా అంబటి రాంబాబు సోమవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేస్తే తర్జనభర్జనల అనంతరం రాత్రి 11.45 గంటలకు గుంటూరు పట్టాభిపురం పోలీసులు క్రైమ్ నంబర్ 43 /2026గా కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు టీడీపీ గూండాలతో వచ్చి తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేస్తే... పోలీసులు మాత్రం టీడీపీ నాయకుల వద్ద మరిన్ని మార్కులు కొట్టేసేందుకు కేసును నీరు గార్చే విధంగా సెక్షన్లు నమోదు చేశారు. ఎమ్మెల్యే మాధవి, భర్త రామచంద్రరావు పేర్లకు బదులు కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ప్రసాద్ అలియాస్ బుజ్జి మరి కొంతమంది.. అంటూ కేసు నమోదు చేయడంపై వైఎస్సార్సీపీ నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త రామచంద్రరావులను ఏ1, ఏ–2గా కేసు నమోదు చేసే వరకూ పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు.కాగా, అంబటి ఫిర్యాదుపై నమోదు చేసిన సెక్షన్లతో తక్కువ శిక్షలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే మాధవి టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రెస్మీట్ పెట్టి అంబటి ఇంటిపై దాడితో తమకు సంబంధం లేదని, క్షమాపణ మాత్రమే కోరామని చెప్పడం గమనార్హం. అంబటి ఇంటి వద్ద పోలీసుల హైడ్రామా.. అంబటి రాంబాబు ఇంటి వద్ద మంగళవారం పోలీసులు హైడ్రామా నడిపారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న నేపథ్యంలో... మంగళవారం సాయంత్రం అంబటి ఇంటి వద్ద క్లూస్ టీమ్తో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యక్షమయ్యారు. టీడీపీ మూకలు విధ్వంసం సృష్టించిన మూడు రోజుల తర్వాత వచ్చి అంబటి ఇంటి వద్ద పగిలిన కుండీలు, విరిగిపోయిన ఫర్నిచర్, ధ్వంసమైన కార్లను స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించారు. దీనికి అంబటి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో తూతూ మంత్రంగా క్లూస్ టీమ్తో పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నేరస్థల పరిశీలనలో కార్లు, ఫర్నిచర్, అద్దంతో కూడిన కిటికీలు ధ్వంసమైనట్లు గుర్తించామని చెప్పారు. అంబటి కార్యాలయాన్ని తగలబెట్టిన ఆనవాళ్లు కనిపించలేదన్నారు. ఇదిలా ఉండగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మనుబోలు, దుత్తలూరులో టీడీపీ నేతల ఫిర్యాదుల మేరకు పోలీసులు మంగళవారం మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు నమోదు చేశారు. -
ఆరోగ్యశ్రీ ఉద్యోగులూ ప్రైవేటుపరం!
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ పథకం అమలులో కీలకంగా వ్యవహరిస్తూ పేద ప్రజలకు సేవలు అందించిన వేలాది ఉద్యోగుల గుండెల్లో చంద్రబాబు ప్రభుత్వం రైళ్లు పరిగెట్టిస్తోంది. ఒకటిన్నర దశాబ్దంగా ప్రభుత్వంలో పనిచేస్తూ ఏదో ఒక రోజు ఉద్యోగాలు శాశ్వతం అవుతాయని వారు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా విధానంలో అమలు చేయడానికి ప్రభుత్వం టెండర్ పిలిచింది. పథకం కింద సేవలు అందిస్తున్న ఆరోగ్య మిత్ర, టీం లీడర్లు, ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉద్యోగులందరినీ బీమా కంపెనీకి అప్పజెప్పేలా టెండర్ నిబంధనలు రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల మంది ఆరోగ్య మిత్రలు, వంద మంది టీం లీడర్లు క్షేత్ర స్థాయిలో సేవలు అందిస్తున్నారు. వీరితో పాటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లోని ఉద్యోగులందరు కలిపి 2,500 మందికి పైగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరిలో మెజారిటీ శాతం 18 ఏళ్లుగా పనిచేస్తున్న వారే ఉన్నారు. అందరిలో కలవరపాటు2019–24 మధ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసిన వైఎస్ జగన్ సర్కారు.. ఈ పథకం అమలులో కీలకమైన ఉద్యోగులకు ఆరి్థకంగా భరోసా ఇచి్చంది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో మిత్రలకు రూ.6 వేలు, టీం లీడర్లకు రూ.10,600 చొప్పున వేతనాలు ఉండేవి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2019 నవంబర్లో ఆరోగ్య మిత్రలకు రూ.12 వేలు, టీం లీడర్కు రూ.15 వేల వరకూ వేతనాలను పెంచారు. ప్రభుత్వ రంగంలో నిశ్చింతగా పని చేసుకుంటూ, ఏదో ఒక రోజు ఉద్యోగాలు శాశ్వతం అవుతాయని కోరుకుంటున్న ఉద్యోగుల గుండెల్లో 2024లో చంద్రబాబు బీమా బాంబు పేల్చారు. ప్రీమియంలో వీలైనంత మిగుల్చుకోవాలనే లాభాపేక్షతో పనిచేసే బీమా కంపెనీల చేతుల్లో ప్రజారోగ్యాన్ని పెట్టడమే కాకుండా, 2500 మంది ఉద్యోగుల కుటుంబాలకు పొగ పెట్టడానికి సిద్ధం అయ్యారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, ఖర్చులను తగ్గించుకోవడం కోసం ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులను ఎడాపెడా తొలగించేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో లాభాపేక్షే పరమావధిగా పనిచేసే ప్రైవేటు బీమా కంపెనీల్లో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని చిరుద్యోగులు కలవరపాటుకు గురవుతున్నారు. -
‘సీమ’ దుమ్మెత్తిపోత
రాయలసీమను సుభిక్షం చేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కక్ష పెంచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే తన వక్రబుద్ధిని చాటారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందంతో పథకం నిర్మాణాన్ని నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. సీమకు తీరని ద్రోహం చేశారు. మాతృభూమి గుండెలపై తన్నారు. ప్రజలకు తీరని వేదన మిగిల్చారు. చంద్రబాబు చేసిన ద్రోహంపై సీమ భగ్గుమంటోంది. ఆయన తీరుపై ప్రజానీకం దుమ్మెత్తిపోస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం చలో పోతిరెడ్డిపాడుకు సిద్ధమైంది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సీమకు జరిగిన అన్యాయంపై ఎలుగెత్తనుంది. – సాక్షి ప్రతినిధి, కర్నూలు‘సీమ’ తాగు, సాగు నీటి కష్టాలు తీర్చాలని, సీమ ప్రజల భవిష్యత్తు బాగుండాలని కాంక్షించి ముందు చూపుతో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బృహత్తర పథకం రాయలసీమ ఎత్తిపోతల. ఈ పథకం ‘సీమ’జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా రైతుల తలరాత మారుస్తుంది. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ను 11వేల క్యూసెక్కుల నుంచి 44వేల క్యూసెక్కులకు పెంచి వైఎస్ రాజశేఖరరెడ్డి(వైఎస్సార్) సీమకు మేలు చేస్తే.. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘సీమ’ తాగు, సాగు నీటి కష్టాలను శాశ్వతంగా నివారించేందుకు శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీలను పోతిరెడ్డిపాడు కాలువలోకి ఎత్తిపోసేందుకు రాయలసీమ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. కానీ చంద్రబాబు మాత్రం వైఎస్ జగన్కు పేరు వస్తుందనే అక్కసుతో ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్’ పనులను ఆపేసి ‘సీమ’కు తీరని ద్రోహం చేశారు.రాయలసీమ ఎత్తిపోతల ఆవశ్యకత ఇదీ.. శ్రీశైలం ప్రాజెక్టును ‘సీమ’వాసుల త్యాగాలతో 1981లో నిర్మించారు. 1983–84 నుంచి 2003–04 వరకూ శ్రీశైలం నుంచి రోజుకు 11వేల క్యూసెక్కుల చొప్పున మాత్రమే సీమకు నీటిని తరలించే సామర్థ్యం మాత్రమే ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. 854 అడుగులకు నీటి మట్టం చేరుకున్నప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అది కూడా రోజుకు 7వేల క్యూసెక్కులు మాత్రమే తరలించవచ్చు. దీంతో ‘సీమ’కు కృష్ణాజలాలు తరలింపునకు తీవ్ర ఇబ్బంది ఉండేది. 2004 వరకూ అప్పటికే తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏ రోజూ ‘సీమ’ బాగు గురించి ఆలోచించలేదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచారు. దీంతో సీమకు కృష్ణాజలాలు తరలింపు సులువైంది. అయితే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే రోజుకు 2 టీఎంసీలు తరలించుకునేలా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల చేపట్టింది. నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ ఎత్తిపోతలతో పాటు పలు మార్గాల ద్వారా రోజుకు కృష్ణాజలాలు శ్రీశైలం చేరుకోక మునుపే రోజుకు 8 టీఎంసీలు ఎత్తిపోసుకునేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించింది. ఇదే క్రమంలో కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం సామర్థ్యం కూడా 129 టీఎంసీల నుంచి, 229 టీఎంసీలకు పెంచేందుకు అక్కడి సర్కారు ఉపక్రమించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ‘సీమ’ ఎడారిగా మారే పరిస్థితి. పైగా శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కులు తీసుకోవచ్చు! అంతకు తక్కువ ఉంటే పూర్తిస్థాయి నీటిని తీసుకోలేం. 854 అడుగుల కంటే ఒక అడుగు తక్కువ ఉన్నా పోతిరెడ్డిపాడు నుంచి ఒక చుక్క నీరు అందదు. ఈ మొత్తం పరిణామాలను నిశితంగా పరిశీలించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మనకు రావల్సిన నీటిని 800 అడుగుల నుంచే తీసుకునేలా పోతిరెడ్డిపాడు దిగువన ‘రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని’ చేపట్టి నీటిని పోతిరెడ్డిపాడు కాలువలో ఎత్తిపోసేలా పనులు చేపట్టారు. దీంతో శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులకు చేరుకోకపోయినా, తెలంగాణ 800 అడుగుల నుంచే ఎత్తిపోసినా మనం భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే మనం కూడా 800 అడుగుల నుంచే మనకు హక్కుగా రావల్సిన నీటిని దక్కించుకోవచ్చు. ఈ కారణంతోనే రాయలసీమ ఎత్తిపోతలకు జగన్ శ్రీకారం చుట్టారు.తెలంగాణ టీడీపీ సానుభూతిపరులతో కోర్టులో కేసులు రాయలసీమ ఎత్తిపోతలను రూ.3,850 కోట్ల అంచనాతో 2020 మే 5న అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందని, తన రాజకీయ మనుగడ ప్రమాదంలో పడుతుందనే విద్వేషంతో చంద్రబాబు నాయుడు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలోని టీడీపీ సానుభూతి పరులతో ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)లో కేసులు వేయించారు. ఎన్జీటీ అనుమతి తీసుకున్న తర్వాతే పనులు చేపట్టాలని 2020 అక్టోబర్ 29న ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. అయితే తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ప్రాజెక్టులకు ఎన్జీటీ అనుమతి ఉందని, ఆ ప్రాజెక్టుల కిందే చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతలకు మళ్లీ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని ట్రిబ్యునల్లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గట్టిగా వాదించింది. ఓవైపు ఎన్జీటీ అనుమతుల కోసం యత్నిసూ్తనే మరోవైపు పనులు ఆపకుండా పరుగులు పెట్టించింది. 2024 మే వరకు వేగంగా పనులు జరిగాయి. అప్పటికి రూ.990 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. చంద్రబాబు సర్కారు వితండవాదంరేవంత్, చంద్రబాబు చీకటి ఒప్పందం బట్టబయలు కావడంతో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు సర్కారు వితండవాదానికి దిగింది.. శ్రీశైలంలో 840 అడుగుల దిగువన 34 టీఎంసీలే ఉంటాయని, అందులో ఏపీ వాటా 22 టీఎంసీలేనని, ఆ నీటిని తరలించేందుకు రాయలసీమ ఎత్తిపోతల అవసరం లేదని ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడుతో ప్రకటన చేయించింది. ఈ వాదన పూర్తిగా అవాస్తవమని సాగునీటి రంగ నిపుణులూ స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు రేపే చలో పోతిరెడ్డిపాడు‘సీమ’కు చంద్రబాబు చేస్తున్న తీరని ద్రోహంపై వైఎస్సార్ సీపీ పోరాటం చేపట్టింది. ఈ నేపథ్యంలో గురువారం చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి పిలుపునిచి్చంది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు, ప్రజలు, మేధావులు, నిపుణులు, ప్రజాసంఘాల నేతలు, సీమ రైతులు ఈ కార్యక్రమానికి భారీగా తరలిరానున్నారు. ఈ క్రమంలో చలో పోతిరెడ్డిపాడు పోస్టర్లను వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు అన్ని నియోజకవర్గాల్లో ఆవిష్కరించారు.బాబు ముఖ్యమంత్రి కావడమే ‘సీమ’కు శాపమా?!:2024 మే వరకూ జరిగిన పనులు ఆ తర్వాత జూన్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక గ్రహణం పట్టింది. చంద్రబాబు సీఎం అయ్యాక 2025 జనవరి 1న కేంద్ర అటవీ, పర్యావరణశాఖ ఈఏసీ (ఎక్సపర్ట్ అప్రైజల్ కమిటీ) ఏపీ జలవనరులశాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది. రాయలసీమ ఎత్తిపోతల ఆవశ్యకతపై సమర్థంగా వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైంది. కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అడిగిన సమాచారాన్నీ 2025 ఫిబ్రవరి 27న నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరి 4న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగిస్తూ ‘చంద్రబాబుతో ఏకాంతంగా జరిగిన సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలను ఆపాలని అడిగానని, తన కోరికను ఆయన మన్నించారని తమ మధ్య జరిగిన చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చేశారు. దీంతో బాబు వక్రబుద్ధి బయట పడింది. -
చంద్రబాబు అస్తవ్యస్త పాలనతో ఆర్థిక విస్ఫోటనం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు ఆర్థిక నిర్వహణ వైఫల్యంతోపాటు అస్తవ్యస్త పాలనతో రాష్ట్రం ఆర్థిక విధ్వంసం దిశగా పయనిస్తోంది. రెండేళ్లు కూడా కాకుండానే రాష్ట్రాన్ని చంద్రబాబు రుణ విస్ఫోటనంలోకి నెట్టేశారు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పు తేవడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోంది. అప్పు తెచ్చిన డబ్బులను సూపర్ సిక్స్తోపాటు ప్రజలకిచ్చిన హామీల అమలుకు ఖర్చు చేయడం లేదు. అలాగే ప్రభుత్వ ఆస్తుల కల్పనకు వ్యయం చేయడం లేదు. అప్పు తెచ్చిన సొమ్ము మొత్తం తమ జేబుల్లోకి వచ్చేలా ప్రభుత్వంలోని కీలక నేతలు మళ్లించేస్తున్నారు. చంద్రబాబు 2024లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేవలం 20 నెలల్లోనే రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.3,27,725 కోట్ల అప్పుల భారాన్ని మోపారు. అంటే... సగటున నెలకు రూ.16,386 కోట్లు, రోజుకు రూ.546.20 కోట్లు చొప్పున అప్పు చేస్తున్నారు. బడ్జెట్ బయట అప్పులు చేసేందుకు కొత్తగా కార్పొరేషన్లను, స్పెషల్ పర్పస్ వెహికల్స్(ఎస్పీవీలు) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఖజానా ఆదాయాన్ని వాటికి మళ్లించి మరీ రాజ్యాంగ సూత్రాలు, నియమావళికి విరుద్ధంగా చంద్రబాబు సర్కారు గ్యారెంటీలు ఇస్తూ అప్పుల మీద అప్పులు చేస్తోంది. సహజ సంపద అయిన గనులను తాకట్టుపెట్టడంతోపాటు మద్యం ఆదాయాన్ని తనఖా పెట్టి మరీ అప్పు చేస్తోంది. మరోవైపు ప్రభుత్వ భూములను, వివిధ సంస్థల ఆస్తులను సైతం తాకట్టు పెట్టి దొరికిన చోటల్లా అప్పులు తీసుకుంటోంది. మళ్లీ రూ.3,300 కోట్ల అప్పుమంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ 7.71 శాతం వడ్డీతో రూ.3,300 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించింది. దీంతో బడ్జెట్ అప్పులే రూ.1,79,168 కోట్లకు చేరాయి. ఇవికాక బడ్జెట్ బయట అప్పులు మరో రూ.1,48,557 కోట్లకు చేరాయి. ఇందులో వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో తెచ్చిన అప్పులు రూ.1,01,170 కోట్లు. రాజధాని పేరుతో చేస్తున్న అప్పులు రూ.47,387 కోట్లకు చేరాయి. దీంతో రెండేళ్లు కాకుండానే రాష్ట్రాన్ని రూ.3,27,725 కోట్ల అప్పుల ఊబిలో చంద్రబాబు సర్కారు ముంచేసింది. -
‘లడ్డూ’పై విచారణకు కమిషన్!
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సాక్షాత్తూ సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సీబీఐ సిట్ దర్యాప్తులో వెల్లడికావడం.. అదే విషయాన్ని స్పష్టం చేస్తూ న్యాయస్థానంలో దర్యాప్తు సంస్థ చార్జిషీట్ దాఖలు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. చార్జిషీట్లో అప్పటి టీటీడీ పాలకమండలి చైర్మన్ సహా కమిటీ సభ్యులందరినీ చేర్చడంపై సుదీర్ఘంగా మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది. సీబీఐ ఇప్పటికే అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసినందున ఇక ‘సిట్’ పరిధి ముగిసిందనే నిర్ణయానికి వచ్చిన మంత్రివర్గం దీనిపై తదుపరి విచారణకు ఓ కమిషన్ను నియమించాలని నిర్ణయించింది.అయితే స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సీబీఐ సిట్ దర్యాప్తు నివేదిక వచ్చాక కూడా మళ్లీ విచారణ కమిషన్ ఎందుకని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. సీబీఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసినందున విచారణ పరిధి ముగిసిందని భావిస్తున్నట్లు మంత్రి కేశవ్ చెప్పారు. ‘అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సహా కమిటీ సభ్యులందరినీ నేరస్తులుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. సీబీఐ సిట్ తన లేఖలో చర్యలు తీసుకోవాలని ప్రస్తావించిన అధికారుల నుంచి వివరణ తీసుకునేందుకు స్వల్పకాలిక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. భోలే బాబా 2019 ఏప్రిల్లోనే టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ అది ఎన్నికల సమయం’ అని మంత్రి కేశవ్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, పార్ధసారధితో కలసి పయ్యావుల మీడియాతో మాట్లాడారు.చార్జిషీట్లో లోపాలపై చర్చించాం: మంత్రి పయ్యావులటీటీడీ లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో మాట్లాడారు. ఎన్డీడీబీ అనుమానిత రిపోర్టు ఆధారంగానే సీఎం మాట్లాడారు. అయితే ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్టు ఉందని సీఎం చెప్పలేదు. ఎన్డీడీబీ తన రిపోర్టులో ‘ఎస్’ విలువలో హెచ్చుతగ్గులున్నందున జంతు కొవ్వు అవశేషాలు ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేసింది. దాని ఆధారంగానే సీఎం మాట్లాడారు. నెయ్యి కొనుగోలు నిబంధనలను సడలించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీబీఐ సిట్ ప్రభుత్వానికి సూచించింది. సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో లోపాలపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాం.2022లోనే నెయ్యి కల్తీ జరిగినట్లు నివేదిక ఉన్నప్పటికీ అప్పటి టీడీటీ చైర్మన్ సహా కమిటీ సభ్యులెవరూ చర్యలు తీసుకోకుండా నివేదికను తొక్కిపెట్టారు. అంతకు ముందే నెయ్యి కొనుగోలు టెండర్ల నిబంధనలను సడలించారు. దీన్నిబట్టి మొత్తం కమిటీ సభ్యులకు తెలిసే దురుద్దేశపూర్వకంగా నెయ్యి కల్తీకి పాల్పడ్డారని ప్రభుత్వం భావిస్తోంది. సీబీఐ చార్జిషీట్ను కోర్టు ఇంకా అధికారికంగా స్వీకరించలేదు. అధికారికంగా స్వీకరిస్తే గానీ అందులో ఎవరున్నారు? ఎవరిని చేర్చలేదనేది తెలియదు. చార్జిషీట్లో లోపాలుంటే కోర్టు వెనక్కు పంపించే అవకాశం ఉంది. సప్లిమెంటరీ చార్జిషీట్లో వైవీ సుబ్బారెడ్డితో పాటు కమిటీ సభ్యుల పేర్లు లేకపోతే వారిని చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అడ్వకేట్ జనరల్ను మంత్రివర్గ భేటీకి పిలిచి సలహా కోరాం. కల్తీ నెయ్యి గురించి ప్రజల్లోకి విస్త్రృతంగా తీసుకువెళ్లాలని డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో సూచించారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగా నిజాయతీగా ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారన్నారు. కల్తీ నెయ్యి గురించి 2022లోనే నివేదిక వచ్చినా జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. శ్రీవారి లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగానే సీఎం చంద్రబాబు చెప్పారని, బోలే బాబాను తెచ్చిన ఆలీ బాబా ఎవరో తెలియాలని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. టీటీడీ కొనుగోళ్ల కమిటీలో సభ్యుడిగా ఉన్నప్పటికీ తనను కాకుండా ప్రత్యేక ఆహ్వానితులుగా కరుణాకర్రెడ్డి, భాస్కరరెడ్డిని పిలిచేవారని మంత్రి పార్ధసారధి పేర్కొన్నారు. -
రెడ్బుక్కే రాజ్యాంగం.. నేనే ‘సుప్రీం’!
సాక్షి, అమరావతి: స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రీ, ఏ ముఖ్యమంత్రీగానీ తలపెట్టని దుస్సాహసానికి సీఎం చంద్రబాబు బరి తెగించారు! దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ రాజకీయ కుట్రకు తెగబడ్డారు. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్ను పట్టించుకోకుండా.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని నిర్ధారిస్తూ ప్రముఖ సైంటిఫిక్ ల్యాబ్లు ఎన్డీఆర్ఐ, ఎన్డీబీ ఇచ్చిన నివేదికలను పక్కనపెట్టేసి సొంత విచారణకు సిద్ధమయ్యారు! సుప్రీంకోర్టు ఆదేశాలను నిర్భీతిగా ధిక్కరిస్తూ.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిపై మళ్లీ విచారణకు సొంత విచారణ కమిషన్ను నియమించాలని నిర్ణయించారు. తద్వారా తనకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకునే కుట్రలకు తెర తీశారు. దీనిపై తాజాగా మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరపగా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సీబీఐ స్వతంత్ర సిట్ దర్యాప్తు నివేదికను తాము పరిగణలోకి తీసుకోబోమని ఏకంగా రాష్ట్ర మంత్రి మండలి వేదికగా ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు ఈ కుతంత్రానికి తెగించారు. లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారాన్ని కొనసాగించేందుకు... రాజకీయ కక్ష సాధింపుతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులను నమోదు చేసేందుకు తమ వీర విధేయులతో విచారణకు ప్రత్యేకంగా కమిషన్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కుతంత్రానికి రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని వేదికగా చేసుకోవడం గమనార్హం. అంటే సుప్రీం కోర్టుతో తమకేమాత్రం సంబంధం లేదని... టీడీపీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఓ సమాంతర న్యాయ వ్యవస్థగా వ్యవహరిస్తుందని తేల్చి చెప్పారు. దేశ చరిత్రలో ఓ దుస్సాంప్రదాయానికి తెరతీశారు. తిరుమల లడ్డూల తయారీకి ఉపయోగించిన నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేనేలేదని ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైందని చార్జిషీట్లో సీబీఐ సిట్ పేర్కొన్న అంశం సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ... బాబు బరితెగింపురాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు చేతల్లో చూపించారు. అందుకోసం తిరుమల శ్రీవారి ఆలయం, ప్రసాదం పవిత్రకు కూడా భంగం కలిస్తానని... ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తానని తాజాగా నిరూపించుకోవడం విభ్రాంతి కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగించే కుట్రకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే తెరతీసిన విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ఆయన నిరాధారణ ఆరోపణలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తులు విభ్రాంతి చెందారు. అంతే కాదు ఈ రాజకీయ కుట్రకు అధికారిక ముద్ర వేసేందుకు టీడీపీ అనుకూల ఐపీఎస్ అధికారులతో సిట్ను నియమించారు. దీనిపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసి వాస్తవాలను ప్రజలకు తెలిసేలా చేయాలని కోరారు. ఈ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుళ్లను అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి హితవు చెప్పింది. ఈ క్రమంలో లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యి నాణ్యతపై విచారించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసింది. ఆ స్థానంలో స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఆ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని పేర్కొంది. దాంతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు జరిపి తన నివేదికను ఇటీవల నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసింది. దాంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. ఈ పరిణామాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఏకంగా సుప్రీంకోర్టునే ధిక్కరించడానికి తెగబడ్డారు. 2024లోనే చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్ను సుప్రీంకోర్టు రద్దు చేయడం గమనార్హం. అనంతరం సీబీఐ ఆధ్వర్యంలోని స్వతంత్ర సిట్ ద్వారా దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ సిట్ ఆ కేసులో దాఖలు చేసిన చార్జ్షీట్ ఇప్పుడు నెల్లూరు న్యాయస్థానంలో ఉంది. ఇంకా కొనసాగుతున్న ఆ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. కేబినెట్ వేదికగా న్యాయధిక్కార కుట్ర...సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్ను ఇతర మార్గాల ద్వారా సేకరించి న్యాయస్థానం పరిధిలోని అంశాలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించడం విస్మయపరుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధం. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై సమాంతరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నది కచ్చితంగా పాటించాల్సిన నిబంధన. చార్జ్షీట్లోని అంశాలపై న్యాయస్థానం పరిశీలించి విచారించాలి. దానిపై ఇరువర్గాల న్యాయవాదులు న్యాయస్థానంలో తమ వాదనలను వినిపించాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనే ‘సుప్రీం’ అన్నట్లుగా బరి తెగించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా సాగుతున్న కేసు దర్యాప్తుపై తాము ప్రత్యేకంగా కమిషన్ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కేబినెట్ సమావేశానికి ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్లతో సమావేశమై చార్జ్షీట్లోని అంశాలపై చర్చించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్వహించిన ఈ సమావేశానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్చంద్ర లడ్హ ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరు కావడం గమనార్హం. సిట్ సభ్యుడిగా ఉన్న ఓ అధికారి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం విస్మయపరుస్తోంది. అంటే సుప్రీం కోర్టు ఆదేశాలతో నియమించిన సిట్లో సభ్యుడిగా ఉన్న ఆ అధికారి... సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించే సమావేశంలో భాగస్వామి అయ్యారు. ఆది నుంచి అత్యంత వివాదాస్పదుడిగా గుర్తింపు పొందిన ఆ అధికారి మరోసారి రాజ్యాంగబద్ధ ధర్మం కంటే తన రాజకీయ విధేయతకే పెద్ద పీట వేశారు. ఇక ఎంపిక చేసిన మంత్రులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశంలో కూడా సీబీఐ చార్జ్షీట్లో పేర్కొన్న అంశాలపై చర్చించారు. అంతే కాదు... సీబీఐ చార్జ్షీట్లో పొందుపరిచిన అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు విభేదించారు. ఆ చార్జ్షీట్ సమగ్రంగా లేదని వారే తీర్పునిచ్చేశారు. ఈ విధంగా తాము సమాంతర న్యాయ వ్యవస్థ అన్నట్టుగా వ్యవహరించారు. సీబీఐ దర్యాప్తు, నివేదికను తాము గుర్తించబోమని పరోక్షంగా ప్రకటించారు.జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిజం చెప్పినందునే..చంద్రబాబు ప్రభుత్వం ఇంతగా బరితెగించి సుప్రీం కోర్టును ఎందుకు ధిక్కరించింది? అంటే కారణం ఒకటే... తిరుమల లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతోనే ఇంతటి దుస్సంప్రదాయానికి తెగబడింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్... లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిగ్గు తేల్చింది. టీటీడీకి చెందిన నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి నెయి నమూనాలను సేకరించి దేశంలోని ప్రతిష్టాత్మకమైన హర్యానాలోని ‘నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్డీఆర్ఐ), గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్డీడీబీ) ల్యాబొరేటలరీలకు పంపింది. ఆ ల్యాబరేటరీలలో పరీక్షించిన అనంతరం... ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదనే వాస్తవం నిగ్గు తేలింది. శాస్త్రీయంగా పరీక్షించిన రెండు ల్యాబొరేటరీలు సాధికారికంగా వేర్వేరు నివేదికలు ఇచ్చాయి. ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఆ రెండు నివేదికలూ స్పష్టం చేశాయి. ఆ రెండు నివేదికలను ప్రస్తావిస్తూ సీబీఐ న్యాయస్థానంలో చార్జ్షీట్ దాఖలు చేసింది. దాంతో తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయ్యింది. జాతీయ పత్రికలు సైతం అదే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. జాతీయ మీడియా చానళ్లు, డిజిటల్ మీడియా కూడా ఆ విషయాన్ని అత్యంత ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఇక రాజకీయ పార్టీలతో నిమిత్తం లేని తటస్థులు, విశ్లేషకులు కూడా లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన రాద్ధాంతం అంతా దుష్ప్రచారమేననిఅభిప్రాయపడ్డారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు కొత్త కుతంత్రానికి తెరతీశారు. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ కమిషన్ను నియమించాలని నిర్ణయించారు.నాడు పచ్చ సిట్.. నేడు పచ్చ కమిషన్!రాజకీయ కుట్ర కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు పంతం పట్టారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద సహాయక చర్యల్లో తన దారుణ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ దుష్ప్రచారానికి తెరతీశారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందనే దుష్ప్రచార కుట్రకు సీఎం హోదాలో ఆయనే నేతృత్వం వహించి ఘోర అపచారానికి పాల్పడ్డారు. శ్రీవారి ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకువచ్చే కుట్రకు రాజముద్ర వేసేందుకు చంద్రబాబు యత్నించారు. అందుకే ఈ అంశంపై దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయులైన రాష్ట్ర పోలీసు అధికారులతో సిట్ను నియమించారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన వివాదాస్పద అధికారి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్కు చీఫ్గా నియమించడం గమనార్హం. మరో వీర విధేయ అధికారి విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, అప్పటి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు (ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ)లను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్ జెట్టి ఎవరో కాదు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్గా నియమితుడైన రిటైర్ట్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్యకు ఆయన అల్లుడు. పచ్చ సిట్ ద్వారా చంద్రబాబు కుట్రలను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దాంతో ఆ సిట్ను సుప్రీంకోర్టు రద్దుచేసి స్వతంత్ర సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. దాంతో చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని తాజాగా సీబీఐ దర్యాప్తులో వెల్లడి కావడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. ఈసారి ఈ అంశంపై దర్యాప్తునకు కమిషన్ను నియమిస్తామని ప్రకటించింది. తమ వీర విధేయులైనవారిని అందులో చైర్మన్, సభ్యులుగా నియమించి తమ దుష్ప్రచార కుట్రకు అధికారిక ముద్ర వేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని స్పష్టమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.నివేదిక ఇలా ఉండాలి.. నిందితులుగా వీళ్లే!సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ మరీ సొంత కమిషన్ ఏర్పాటుకు బరితెగించడం వెనుక చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం సుస్పష్టం... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని తాము చేసిన దుష్ప్రచారాన్ని బలపరుస్తూ ఓ నివేదిక ఇప్పించుకోవాలి. అంతే కాదు తాము రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలను ఆ కేసులో నిందితులుగా చేర్చాలి. వాస్తవాలు, ల్యాబరేటరీలలో పరీక్షలు, విధి విధానాలతో నిమిత్తం లేకుండా తాము చెప్పింది చెప్పినట్టుగా చేసేందుకే కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ విషయాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం విలేకరుల సమావేశంలో పరోక్షంగా వెల్లడించారు. ఫలానా వారిని నిందితులుగా చేర్చడానికే కమిషన్ను ఏర్పాటు చేస్తున్నామన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనం. ఆ కమిషన్కు అతి తక్కువ సమయమే ఇస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పడం గమనార్హం. అంటే దర్యాప్తుతో నిమిత్తం లేకుండా, వాస్తవాలను పట్టించుకోకుండా తాము చెప్పింది చెప్పినట్టుగా నివేదిక ఇచ్చేవారినే కమిషన్ చైర్మన్, సభ్యులుగా నియమిస్తామని ప్రభుత్వం నిర్భీతిగా ప్రకటించుకున్నట్టే! అధికారంలో ఉన్నవాళ్లు తమకు నచ్చినట్టుగా నివేదికలు ఇప్పించుకుంటాం...! తమకు నచ్చనివారిపై అక్రమ కేసులు పెడతామంటే ఇక దేశంలో పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు ఎందుకు ఉన్నట్లని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలు, వ్యవస్థలను తాము పట్టించుకోమంటూ చంద్రబాబు ప్రభుత్వం నియంతృత్వానికి తెగబడుతోందని విమర్శిస్తున్నారు. -
హింసన చణ... ధ్వంస రచన!
సుప్రసిద్ధ కథా, నవలా రచయిత రావి శాస్త్రి అయిదు దశాబ్దాల క్రితం ‘సొమ్మలు పోనాయండి’ అనే నవలిక రాశారు. ఊరి ప్రెసిడెంట్ కుట్రలకు బలైన ఒక సామాన్యుడి స్వీయ కథనమది. అతని కుటుంబాన్ని కడతేర్చిన ప్రెసిడెంట్ను వదిలి, వ్యవస్థలన్నీ ఏకమై ఆ సామాన్యుడికే నరకం చూపిన వైనం అందులో కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఏణ్ణర్థంగా అచ్చం అదే రీతిలో సాగుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన దుష్ప్రచారం బూటకమని సీబీఐ నివేదిక తేల్చినప్పటి నుంచీ ఆ అరాచకం మరిన్ని రెట్లు పెరిగింది. ఎప్పటిలాగే లడ్డూ ప్రసాదం స్వచ్ఛంగా ఉన్నదనీ, కొవ్వెక్కిన ఈ మాయగాళ్ల పుర్రెలే వికృత పోకడలకు పోయాయనీ ప్రజలకు తేటతెల్లమైనప్పటి నుంచీ అధికార ముఠాకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు.ఆ పర్యవసానంగానే రోడ్లపైకొచ్చి దుర్భాషలతో, దుశ్చేష్టలతో రెచ్చిపోతున్నారు. హంతక దాడులకు తెగిస్తున్నారు. గృహ దహనాలకు పాల్పడుతున్నారు. ‘మళ్లీ మళ్లీ వస్తాం... అంతు తేలుస్తామ’ంటూ సవాళ్లు విసురుతున్నారు. సీబీఐ నివేదికను వక్రీ కరిస్తూ ఫ్లెక్సీలతో జనాన్ని ఏమార్చాలనుకుంటున్నారు. గుంటూరు నడిబొడ్డున తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త వందలాది మంది గూండాలను పోగేసి కర్రలు, రాడ్లతో వీధిన పడి మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంబటిరాంబాబు ఇంటిపై దాడికి దిగిన వైనం మీడియా సాక్షిగా ప్రపంచమంతా చూసింది.రక్షక భటులు భయభక్తులతో వారికి కాపలాగాసిన సంగతినీ అందరూ గమనించారు. ఆ మర్నాడు ఇబ్రహీంపట్నంలో అదే పునరావృతమైంది. తొలినాడు ఎంత విధ్వంసం చేసినా, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయం తగలబెట్టడానికి కష్టపడాల్సి వచ్చిందని కాబోలు... ఇబ్రహీంపట్నంలో మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైకి పెట్రోల్ బాంబులతో వచ్చారు. బండరాళ్లు విసిరారు. నిప్పుపెట్టారు. గుంటూరు నగర పోలీసుల మాదిరే ఇక్కడా ఈ కిష్కింధకాండకు పోలీసులు రక్షణగా నిలబడ్డారు.ఇదా ప్రజాస్వామ్యం?! పిల్లనిచ్చిన మామ పాలిటే కాదు... ఆంధ్రప్రదేశ్కు కూడా దశమ గ్రహంలా దాపురించి, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు వయసుడిగిన ఈ కాలంలో కూడా బాహాటంగా తన వికృత నైజాన్ని ప్రదర్శించటం చూసి జనం విస్తుపోతున్నారు. జర్నలిస్టు పింగళి దశరథరామ్, కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా తదితరుల మరణాలకు కారకులెవరో... ఇప్పుడు టీడీపీలోనే ఉన్న సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణపై ఒకానొకప్పుడు హంతక దాడికి తెగించిందెవరో... అందరికీ తేటతెల్లమే. సాక్షాత్తూ మాజీమంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావే తోడల్లుడి హింసన చణనూ, ధ్వంస రచననూ పూసగుచ్చినట్టు వివరించారు. కొన్నేళ్ల క్రితం తగలబడిన వందలాది ఆర్టీసీ బస్సులు, పదేళ్లనాడు అమరావతిలో దగ్ధమైన అరటి తోటలు ఆ ప్రావీణ్యాన్ని కథలు కథలుగా చెబుతాయి.అవిభక్త ఏపీలో 1995 తర్వాత సకల వ్యవస్థలూ భ్రష్టుపట్టడానికి కారకులెవరో అందరికీ తెలుసు. కెమెరా లేదనుకుని సాక్షాత్తూ స్వర్గీయ ఎన్టీఆర్నే ‘వాడూ...వీడూ’ అని తూలనాడిన ఘనుడు బాబు నుంచి పుత్రరత్నమైనా, మరొకరైనా నేర్చుకునే సంస్కృతి ఏముంటుంది? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు. అందుకే గుడికెళ్లి వస్తున్న అంబటిపై బూతులు లంకించుకొని రెచ్చగొట్టి, ఆయన తిరిగి తిట్టారని రెచ్చిపోయింది టీడీపీ ముఠా. సంస్కారం ఉంది గనుక క్షమించమని అడిగారాయన. ఆ మాట వెనక్కి తీసుకుంటున్నానన్నారు. కానీ పాపం పెరిగినట్టు పెరిగిన ఆ ముఠా అర్ధరాత్రి దాకా అల్లకల్లోలం సృష్టించింది. చివరకు అంబటినే ఖైదు చేయించింది. ఎంత విడ్డూరం?! ఏం జరుగుతోంది ఏపీలో? ప్రశ్నించే తత్వాన్ని హత్యాయత్నాలతో, విధ్వంసాలతో చంపేస్తారా? ఈవీఎంల సాయంతో అధికారాన్ని చేజిక్కించుకున్న అరాచకులు ఇక మారరా? ఇదే వారి నిర్ణయమైతే జనమే తొక్కి నార తీస్తారు. అదునుచూసి గుణపాఠం చెబుతారు. ప్రజాస్వామ్యంలో నారావారైనా, వేరేవారైనా ఇందుకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. -
రాష్ట్రం కన్నా స్వలాభమే మిన్నా?
కృష్ణా, గోదావరి, వంశధార నదీ జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కన్నా స్వప్రయోజనాలే తనకు ప్రధానమని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తనకు తానుగానే చాటుకుంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకమే అందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపేయించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనవరి 3న ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వాటిని చంద్రబాబు ఖండించకపోగా... రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే లేదంటూ తెగేసి చెప్పడం ద్వారా రేవంత్ చేసిన వ్యాఖ్యలను బలపరిచారు. రేవంత్తో కుదిరిన చీకటి ఒప్పందం ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేయడంపై రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఎత్తిపోతల పూర్తయితే ఆ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి ఇబ్బందే ఉండదు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు. ఆ ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 841 అడుగుల వద్ద అమర్చారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయాలి. వాటికి 101 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. ఆ ప్రాజెక్టుల కింద 10.33 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రస్తుత డిజైన్ ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రోజుకు 44 వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిపోయాయి. 881 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉండే రోజులు బాగా తగ్గాయి. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా 7 వేల క్యూసెక్కులు... 841 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి ఆస్కారం ఉంటుంది. అంత కంటే నీటిమట్టం తగ్గితే... ఆంధ్రప్రదేశ్కు నీటి కేటాయింపులు ఉన్నా సరే పోతిరెడ్డిపాడు ద్వారా ఆయకట్టుకు నీళ్లందించడానికి ఆస్కారం ఉండదు.వాటా జలాలను వాడుకోవడానికే...కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరకముందే జూరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని తెలంగాణ సర్కార్ తరలిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 777 అడుగుల నుంచి 825 అడుగుల నీటిమట్టం లోపే కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి,డిండి ఎత్తిపోతల, ఎస్సెల్బీసీ, ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 7 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. అంటే... జూరాల, శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి వినియోగం తొలి ప్రాధాన్యం తాగునీటికే! ఆ తర్వాత సాగునీరు!! శ్రీశైలం దిగువన సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు... అదీ కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకు నీటిని మాత్రమే కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు తరలించవచ్చు. కానీ తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే... దిగువన నీటి అవసరాలు లేకున్నా సరే... శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం దిగువ నుంచే యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చి నట్టుగా తెలంగాణ సర్కార్ తరలిస్తుండటంతో శ్రీశైలం నీటి మట్టం 841 అడుగులకు చేరడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. వరద ప్రవాహం నిలిచిపోయాక కూడా తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా నీటిని తరలిస్తుండటంతో శ్రీశైలం నీటి మట్టం 841 అడగులకు దిగువకు చేరుకుంటోంది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్కు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాటిని వాడుకోలేని దుఃస్థితి. 2014–19 మధ్య రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రస్థాయిలో నష్టపోవడమే అందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం విఘాతం కలగనివ్వకుండా... ఆంధ్రప్రదేశ్కు చట్టబద్ధంగా దక్కిన వాటా జలాలను వినియోగించుకోవడానికే 2020 మే 5న రూ.3,850 కోట్ల వ్యయంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. ఎత్తిపోతల రైతులకు ఇన్సూరెన్స్ పాలసీ!శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ప్రధాన కాలువలోకి ఎత్తిపోసి... ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ), తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టులో పంటలను రక్షించడం... రాయలసీమ, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తి పోతలను చేపట్టి... పనులను పరుగులెత్తించారు. ఆ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్ జగన్కు రైతులు నీరాజనాలు పలుకుతారని గ్రహించిన చంద్రబాబు... మహబూబ్నగర్ జిల్లాలోని టీడీపీ నేతలను ఉసిగొలిపి అక్కడి రైతుల ద్వారా జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో కేసులు వేయించారు. సీమ ఎత్తిపోతల వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఆ కేసులు వేయించారు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయనీ... ఆ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదనీ ఎన్జీటీలో వైఎస్సార్సీపీ సర్కార్ సమర్థ వంతంగా వాదనలు వినిపించింది. కానీ... పర్యావరణ అనుమతి తీసుకున్నాకే పనులు చేపట్టాలని 2020 అక్టోబర్ 29న ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే రాయలసీమ ఎత్తిపోతల పనులను వైఎస్సార్సీపీ సర్కార్ పరుగులు పెట్టించింది. మళ్లీ దీనిపై ఎన్జీటీలో చంద్రబాబు కేసులు వేయించారు. వాటిని ఎదుర్కొంటూనే... పర్యావరణ అను మతి కోసం ప్రయత్నిస్తూనే... తాగునీటి అవసరాల కోసం 58 టీఎంసీలను తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పనులను తొలుత పూర్తి చేయాలని 2023 ఆగస్టు 11న ఉత్తర్వులు జారీ చేసింది. 2024 మే వరకూ పనులు జరిగాయి. వాటిని చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించిన ఎం–బుక్కులే అందుకు నిదర్శనం. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తరలించే నీటిని గాలేరు– నగరి, హంద్రీ–నీవాను అనుసంధానం చేయడం ద్వారా తీసుకెళ్లి చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని హంద్రీ–నీవా రెండో దశ ఆయకట్టుకు అందించి... శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ద్వారా తరలించే 40 టీఎంసీలను కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆయకట్టుకు అందించాలన్నది వైసీపీ సర్కారు ఆలోచన. 2024 జూన్ 12న చంద్రబాబు మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక రాయలసీమ ఎత్తిపోతల పనులను పూర్తి స్థాయిలో ఆపేశారు. దానికి ప్రధాన కారణం ఏమిటన్నది తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.రాష్ట్ర ప్రయోజనాలకు ఎప్పుడూ విఘాతమే!ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో చంద్రబాబు తొలి సారిగా అధికార పీఠాన్ని అధిరోహించారు. 1996 లోక్సభ ఎన్నికల తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాననీ, అప్పటి కర్ణాటక సీఎం హెచ్డీ దేవెగౌడను తానే పీఎంను చేశాననీ చంద్రబాబు పదే పదే గొప్పలు చెప్పుకొంటారు. కానీ... అదే సమయంలో ఆనకట్టగా ఉన్న ఆల్మట్టిని కర్ణాటక రిజర్వాయర్గా మార్చేసి... దాని నీటి నిల్వ సామర్థ్యాన్ని 53 నుంచి 129 టీఎంసీలకు పెంచేసినా నోరు మెదపకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాలపై ఉన్న హక్కులను కర్ణాటకకు చంద్రబాబు తాకట్టు పెట్టారు. ఆల్మట్టి సామర్థ్యం పెంచడం వల్ల శ్రీశైలానికి జూన్ నెలా ఖరుకు రావాల్సిన వరద జూలై చివరకు... ఆగస్టు మొదటి వారానికి గానీ రావడం లేదు. దాంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఇక బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కాలపరిధి 2000తో ముగు స్తుందనీ, కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ వేస్తారనీ, ఆంధ్ర ప్రాంతంలో వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలంగా ణలో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ వంటి ప్రాజెక్టులను చేపడితే వాటికి నీటి కేటాయింపులను ట్రిబ్యునల్ చేస్తుందనీ అప్పటి సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ అధికారులు, సాగునీటిరంగ నిపు ణులు అనేక మార్లు విఙ్ఞప్తులు చేశారు. కానీ వాటిని పట్టించుకోలేదు. అప్పట్లో వాటిని చేపట్టి ఉంటే... తెలుగు గంగకు 25 టీఎంసీలు కేటాయించినట్లే ఆ ప్రాజెక్టులకు కూడా బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసేది.పోలవరం రిజర్వాయర్ కాదు బ్యారేజే!గోదావరి ట్రిబ్యునల్ అవార్డు అనుమతి ఇచ్చిన మేరకు 45.72 మీటర్ల గరిష్ఠ నీటిమట్టంతో పోలవరం ప్రాజెక్టును 2005లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆ స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 2021 జూన్ 11 నాటికే స్పిల్ వేను అప్పటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. కానీ 2024 ఆగస్టు 28న 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,157 కోట్లను మాత్రమే ఆంధప్రదేశ్ సర్కార్కు విడుదల చేయాలని కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ కేబినెట్ సమావేశంలో ఉన్న టీడీపీ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. చంద్రబాబు సర్కార్ కూడా దానిపై అభ్యంతరం చెప్పలేదు. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వ చేయవచ్చు. 41.15 మీటర్ల ఎత్తు వరకు కేవలం 119.4 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయవచ్చు. ఇక 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే... పోలవరం కుడి, ఎడమ కాలువ కింద 7 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కేవలం 1.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించడానికి వీలుంటుందని సాక్షాత్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీనే స్పష్టం చేస్తోంది. పోలవరం రిజర్వా యర్ను బ్యారేజ్గా మార్చేయడం వల్ల కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 63 టీఎంసీలను వెనుకబడిన ఉత్తరాంధ్రకు మళ్లించడానికీ ఆస్కారం ఉండదు. జీవనాడి పోలవరంలో జీవం తీసేసి రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించిన ఘనత బాబుకే దక్కుతుంది. ఇక వంశధార జలాలపై రాష్ట్ర హక్కులను వంశధార ఫేజ్–2 స్టేజ్–2ను 2004 దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టి పరిరక్షించారు. ఆ ప్రాజెక్టు వల్లే వంశధారలో 75 శాతం నీటి లభ్యతగా ఉన్న 115 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెరి సగం పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఆ బ్యారేజీ నిర్మాణం కోసం 2021 నవంబర్ 9న నాటి సీఎం వైఎస్ జగన్ ఒడిశా రాజధాని భువనేశ్వర్లో అప్పటి ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్తో చర్చలు జరిపారు. నేరడి బ్యారేజీ నిర్మాణం కోసం సంప్రదింపులు జరుపుతూనే... వంశధార జలాలను పూర్తి స్థాయిలో వాడుకుని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వంశధార ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందించేందుకు హీరమండలం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 40 శాతం పనులు పూర్తి చేశారు. కానీ... 2024 జూన్ 12 తర్వాత ఆ ఎత్తిపోతల పనులను చంద్రబాబు సర్కార్ ఆపేయడం ద్వారా వంశధార ఆయకట్టు రైతులకు తీరని అన్యాయం చేసింది.– ఆర్.జి.ఆర్. -
భోలే బాబా వెనక ఉన్న ఆలీబాబా ఎవరు?: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో జంతుకొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపిన నెయ్యి వాడారని పచ్చి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విపరీతంగా దుష్ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, అందులో ఏ మాత్రం వాస్తవం లేదన్న సీబీఐ సిట్ ఛార్జ్షీట్తో అడ్డంగా దొరికిపోయి, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానాపాట్లు పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించిన సిట్, నెయ్యిలో ఏ కొవ్వూ కలవలేదని చెప్పినా, మళ్లీ ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేయించాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వానికి చేతనైతే సిట్ రిపోర్ట్ తప్పని సుప్రీంకోర్టును ఆశ్రయించి, అక్కడ రుజువు చేయాలని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్రెడ్డి సవాల్ చేశారు. ప్రెస్ మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:సిట్ రిపోర్ట్పై క్యాబినెట్ నిర్ణయమా!:సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారుల్ని సీఎం చంద్రబాబు పిలిపించుకోవడం అసాధారణ విషయం. వారి దగ్గరి నుంచి 11 పేజీల నివేదిక తీసుకుని సుదీర్ఘమైన చర్చ చేశామని కేబినెట్ భేటీ నుంచి బయటికి వచ్చిన మంత్రులు చెప్పారు. చంద్రబాబును కాపాడటానికి, ఆయన చెప్పిన అబద్ధాల్ని కప్పిపుచ్చడానికే వీళ్ల ప్రయాస. చంద్రబాబు అధికారంలోకి రాగానే 2024 సెప్టెంబర్ 20వ తేదీన కూటమి సమావేశంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిపారని ప్రకటించడంతో, వాస్తవాలు నిగ్గు తేల్చాలని వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, ఏ విషయమూ నిర్థారణ కాకుండా మాట్లాడొద్దంటూ సూచించిన సుప్రీకోర్టు, ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసింది. అందులో సీబీఐ అధికారులతో పాటు రాష్ట్ర అధికారులు కూడా ఉన్నారు.సిట్ అధికారులు ఏడాది కాలంగా సుదీర్ఘ విచారణ చేసి నివేదిక ఇచ్చారు. సిట్ అదనపు ఛార్జిషీట్లో కానీ, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులో కానీ, చంద్రబాబు ఆరోపించినట్లు నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, చేప నూనె కానీ కలిసినట్లు ఎక్కడా చెప్పలేదు. అయినా చంద్రబాబు ఈ ఛార్జిషీట్పై సంతృప్తి చెందకుండా ఇవాళ కేబినెట్ సమావేశంలో నెయ్యి విషయంలో ప్రత్యేక విచారణ చేపడుతున్నట్లు మంత్రులతో బయట ప్రకటన చేయించారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ రిపోర్టు కాకుండా, మళ్లీ విచారణ చేయించాలన్న నిర్ణయం పూర్తిగా తప్పు.‘భోలేబాబా డెయిరీ’ వెనుక ఉన్న ‘ఆలీ బాబా’ చంద్రబాబే: ఒక మంత్రి భోలే బాబాను తెచ్చిన అలీ బాబా ఎవరని ప్రశ్నించారు. ఈ భోలే బాబాను తెచ్చిన చంద్రబాబే. 2018లోనే భోలే బాబా రంగ ప్రవేశం చేశాడు. దాదాపు 87 వేల టిన్నులకు పైగా నెయ్యి ఈ కంపెనీ సరఫరా చేసింది. అది చాలా స్పష్టంగా సీబీఐ నివేదికలోనే ఉంది. కానీ దాన్ని వదిలేసి మా హయాంలోనే నెయ్యి సరఫరా చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. భోలే బాబాకు ముందున్న పేరు హర్‡్ష –వర్‡్ష డెయిరీకి అనుమతి ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ఇప్పుడు భోలే బాబాను తెచ్చిన ఆలీ బాబా ఎవరో తెలిసిందని అనుకుంటున్నాం.ఆ నెయ్యిపైనా విచారణ జరిపించాలి:నెయ్యిలో కల్తీ లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సిట్ విచారణ 2019–24 మధ్య కాలానికి వేశారు. ఇందులో నిందితులుగా తేలిన ప్రీమియర్ డెయిరీ 2013 నుంచి 2024 వరకూ నెయ్యిని అనేకసార్లు టెండర్లలో పాల్గొని సరఫరా చేసింది. మీకు నిజంగా తిరుమల శ్రీవారి మీద భక్తి ఉంటే, మీ గత ప్రభుత్వంలో సరఫరా అయిన నెయ్యిపైనా విచారణ చేయించాలి. ఆ రోజు 90 శాతానికి పైగా నెయ్యి సరఫరా చేసిన డెయిరీయే మా హయాంలోనూ సరఫరా చేసిందన్న విషయం మీకు గుర్తు చేస్తున్నాం.2018లో టీటీడీ తీర్మానంతోనే నెయ్యి కల్తీకి బీజం:విభజిత రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే 2018, ఆగస్టు 27న టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం 87 వేల కేజీల నెయ్యిని కొనుగోలు చేసింది. నెయ్యికి ఆ వాసన తీసుకొచ్చేందుకు ఆవు నెయ్యి ఫ్లేవర్ను కలిపిన నెయ్యిని రోజుకు 975 కేజీల చొప్పున కొనుగోలు చేశారు. ఆ రోజున మీరు వాడిన నెయ్యి కల్తీ నెయ్యి కాబట్టే వాసన రాలేదు. అందుకే ఏకంగా రూ.3.75 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఫ్లేవర్ కలిపారు.అప్పటి జేఈవో అధ్యక్షతన పని చేసిన ఈ కొనుగోలు కమిటీలో విజయ్భాస్కర్రెడ్డి, సురేంద్రనాథ్ వంటి సాంకేతిక నిపుణుల్ని నియమించారు. వారే ఆ తర్వాత మా హయాంలోనూ కొనసాగారు. ఇప్పుడు సిట్ రిపోర్ట్ నిందితుల్లోనూ ఉన్నారు. అలాగే ప్రొక్యూర్మెంట్ జీఎం కూడా టీడీపీ హయాంలో ఉన్న వ్యక్తే ఇప్పుడు జైల్లో ఉన్నారు. అలాగే టెంపుల్ అఫైర్స్ ఏవో, ఎస్వీ గోశాల డైరెక్టర్ కూడా మొన్నటి వరకూ ఉన్నారు. వీళ్లంతా నెయ్యిని కొనాలని నిర్ణయించి, పలమనేరుకు చెందిన పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి నుంచి కేజీ నెయ్యి రూ.385 చొప్పున కొనుగోలు చేశారు. అప్పటికే రోజుకు 3 లక్షల లడ్డూలు తయారు చేసే కాలంలోనే ప్రతి రోజూ 975 కేజీల నెయ్యికి ఫ్లేవర్ అద్దడానికి వీళ్లు చేసిన దుర్మార్గం ఇది. 2018, ఆగస్టు 28న చేసిన టీటీడీ తీర్మానం 374 ఇందుకు నిదర్శనం.దమ్ముంటే 2014 నుంచీ నెయ్యి కల్తీపై విచారణ జరపండి:2014 నుంచి ఇదే సీబీఐ దర్యాప్తు వేయించే ధైర్యం మీకు ఉందా? టీటీడీని రాజకీయ పావుగా వాడుకోకపోతే మీ హయాంలోనే నెయ్యి సరఫరా చేసిన వాళ్లు, కొనుగోళ్లు చేసిన వాళ్ల మీద విచారణ చేయించండి. ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ దోషి అంటున్నారు. సిట్ ఏర్పాటు చేశాక జంతుకొవ్వు విమర్శలు చేసిన మీరు ఆయన్ను రెండోసారి ఎందుకు ఈవోగా నియమించారు? నెయ్యి పేరుతో అనిల్ సింఘాల్ను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారన్న అనుమానాలు వస్తున్నాయి.చంద్రబాబు, పవన్కళ్యాణ్ పదే పదే నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేప నూనె వాడారని దుష్ప్రచారం చేశారు. మీరు ఆరోపించినట్టు ఆ నెయ్యిలో అవేవీ లేవని తేలిపోయింది. అయినా మీరు ఇంకా ఎదురుదాడి చేస్తూ, గత మా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తిరుమల శ్రీవారిపై భక్తి ఉంటే, ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించకపోతే.. మీ హయాం నుంచే జరుగుతున్న నెయ్యి కల్తీపై విచారణ చేయించమని కోరుతున్నాం.మేము ఏ నిబంధనలూ సడలించలేదు: అలాగే మీ హయాంలో నుంచే ఉన్న అధికారుల్ని మేం నియమించినట్లు చెప్పడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. మేం నిబంధనల్ని సడలించడం వల్ల నెయ్యి కల్తీ జరిగిందనేది అబద్ధం. ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి స్టార్టప్ కంపెనీలను ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడులో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూపొందించినవి. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. మీరు తెచ్చిన నిబంధనల్ని మేం సడలించి తెచ్చిన కంపెనీ ఒక్కటి కూడా లేదు. భోలేబాబా వంటి కంపెనీలు మీ హయాంలోనే టెండర్లు వేసిన విషయం గుర్తుంచుకోండి. ఏఆర్ డెయిరీ, మాల్ గంగా వంటి సంస్థలు మేం నిబంధనలు కఠినతరం చేసిన తర్వాతే టెండర్లలో పాల్గొన్నాయి. అర్హతలు ఉన్నాయి కాబట్టే ఈ కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి.దోషులెవరో సిట్ చెప్పినా మాకు అంటగట్టే యత్నం:చంద్రబాబు జంతుకొవ్వు, ఆవు కొవ్వు కలిపారని చెప్పిన నాలుగు ట్యాంకర్లను తిరిగి శ్యామలరావు ఈవోగా, మీరు సీఎంగా ఉండగానే లడ్డూల్లో వాడారని సీబీఐ తన నివేదికలో చెప్పింది. ఇప్పడు చెప్పండి దొంగలెవరో? దోషులెవరో?. మా హయాంలో నాణ్యత లేని 18 నెయ్యి ట్యాంకర్లను మేం వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం కూడా 14సార్లు కూడా ఇలాంటి నాణ్యత లేని నెయ్యిని వెనక్కి పంపింది. సీఎస్ఆర్టీఐ రిపోర్టులు వచ్చాక ఛైర్మన్కు అందిస్తే ఆయన కళ్లు మూసుకున్నారని ఎలా చెప్తారు? టీటీడీ పాలక మండలి తనకున్న అధికారాల్ని ఈవోకు బదలాయించిన విషయం మీకు నిజంగా తెలియదా? అధికారులు ఈవోను కలవకుండా ఛైర్మన్ను ఎలా కలిశారు?వాస్తవాలన్నీ ఇలా ఉంటే, కేవలం దురుద్దేశంతో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీద నింద వేయాలని చూశారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యేకంగా విచారణ చేయిస్తాం అంటున్నారు. మీ దృష్టిలో మేము (గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం) నేరస్తులమని, శ్రీ వెంకటేశ్వరస్వామి మీద ఉన్న భక్తితో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా విచారణ జరిపిస్తామని కబుర్లు చెబుతున్నారు. నిజంగా నేరస్తులు అయితే శిక్షించమనే కదా మేం ముందు నుంచే అడుగుతున్నాం. సీబీఐ వంటి సంస్థే మేం నిర్దోషులమని నిర్థారించాక కొద్ది మంది అధికారులు, సరఫరా దారులు, టెక్నికల్ కమిటీ కుమ్మక్కై ఈ ద్రోహానికి పాల్పడ్డారని రిపోర్ట్ ఇస్తే మా వాళ్లను దోషులుగా చేసే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు?.మేము తప్పు చేయలేదు. అందుకే గట్టిగా నిలబడ్డాం:పవన్కళ్యాణ్ తమ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో నెయ్యిలో ఆవు కొవ్వు, పందికొవ్వు కలిసిందని, అది అబద్దమని మా పార్టీ చేస్తున్న వాదనను సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోతున్నామని, ఏం నిద్రపోతున్నారా అని కాకినాడ ఎంపీతో పాటు, తన సోదరుడిని కూడా ప్రశ్నించారు. నెయ్యిలో నిజంగా జంతుకొవ్వు కలిసినా, అది బయట పెడితే, ఎక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయోనని, సిట్ ఛార్జ్షీట్లో రాయలేదని చెబుతున్నారు.ఒకవేళ నిజంగా సీబీఐ ఆ పని చేసి ఉంటే, సనాతని, హైందవ ధర్మ పరిరక్షకుడదని చెప్పుకునే పవన్, అప్పుడు, ఇప్పుడు పదే పదే అదే మాట ఎందుకు చెబుతున్నారు. తిరుమలలో వాడిన నెయ్యిలో పందికొవ్వు, జంతుకొవ్వు, చేపనూనె కలిసిందని ఎలా ఆరోపిస్తున్నారు? సనాతనిగా ఉన్న మీరు భక్తుల మనోభావాల్ని ఎలా దెబ్బ తీస్తున్నారు?. తప్పు చేయలేదు కాబట్టే మేం ఛాలెంజ్గా మాట్లాడుతున్నాం. మీరు అబద్దాలు చెప్పారు కాబట్టే దాన్ని సమర్థించుకోలేక నానా తంటాలు పడుతున్నారు. అటు టీడీపీలో కూడా ముప్పు తిప్పలు పడుతున్నారు.సీబీఐ రిపోర్ట్ పై విచారించే అధికారం మీకు లేదు:సీబీఐ నివేదిక మీద విచారణ చేసే అధికారం మీది కాదు కోర్టుది. కానీ నేరస్తుల్ని మేమే గుర్తించామంటూ విచారణలకు సిద్దమవుతున్నారు. ఇలాంటి తీర్పులు ఇచ్చే ప్రయత్నాలు మానుకుంటే మంచిది. చంద్రబాబుకు ధైర్యం ఉంటే, నెయ్యిలో ఫ్లేవర్ కలపాలన్న నాటి టీటీడీ బోర్డు నిర్ణయానికి సమాధానం చెప్పాలి. మళ్లీ చెబుతున్నాం. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదికపై, మరో విచారణ జరిపించే అధికారం మీకు లేదు.మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..అనిల్ సింఘాల్ విషయంలో సీఎం పేషీనే పెద్ద నాటక వేదిక. ఆయన ఏ సిఫార్సుతో వచ్చారో మాకు తెలియదు కానీ, ఆయన్ను వచ్చిన రోజు నుంచే బదిలీ చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. సీబీఐ నివేదికను అడ్డు పెట్టుకుని ఇప్పుడు బదిలీ చేశారు. సర్వోన్నత న్యాయస్థానం సరైన విచారణ చేయలేదని కేబినెట్ తీర్మానం చేస్తే అప్పుడు మళ్లీ మీరు సుప్రీంకోర్టుకు వెళ్లి చెప్పుకోవాలి. చంద్రబాబు మిమ్మల్ని పట్టించడం అంటే దొంగ పోలీసును పట్టించినట్లుంది. కాబట్టి నెయ్యి మీద మీరు విచారణలు చేయడం కాదు మళ్లీ సుప్రీంకోర్టుతోనే ఆ పని జరిగేలా చూడాలని భూమన కరుణాకర్రెడ్డి స్పష్టం చేశారు. -
‘గీతం’ యూనివర్సిటీ భూముల వ్యవహారం.. ఏపీ హైకోర్టులో విచారణ
సాక్షి,విజయవాడ: ఏ హక్కుతో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీకి కట్టబెడతారంటూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గీతం యూనివర్సిటీ తరఫు న్యాయవాదులపై ఏపీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.బాలకృష్ణ చిన్నల్లుడు, మంత్రి నారా లోకేష్ తోడల్లుడు, గీతం యూనివర్సిటీ అధినేత, విశాఖ ఎంపీ శ్రీభరత్కు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విస్తుగొలుపుతున్నాయి.ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీకి కట్టబెట్టే ప్రయత్నాలపై విశాఖకు చెందిన న్యాయవాది గ్రేస్ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు.మంగళవారం ఈ పిల్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం చట్టవ్యతిరేకమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు విచారణను వాయిదా వేసింది. -
పోరంకి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సూసైడ్ కేసులో ట్విస్ట్
సాక్షి, కృష్ణాజిల్లా: పోరంకిలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. జనవరి 30న హాస్టల్ రూమ్లో ఫ్యాన్ ఉరివేసుకుని పవన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2025 డిసెంబర్లో పవన్ కుమార్కి తోటి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. జనవరి 5న పవన్పై ఆరుగురు విద్యార్థులు దాడి చేశారు. కొట్టిన దృశ్యాలను విద్యార్థులు ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. జనవరి 30న మరోసారి పవన్ కుమార్పై విద్యార్థులు దాడి చేశారు. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థి.. హాస్టల్లో ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆత్మహత్యకు గల కారకులైన వారి పేర్లను పవన్ చేతిపై రాసుకున్నాడు. ఆత్మహత్య గల కారణాలు గోప్యంగా ఉంచిన శ్రీచైతన్య యాజమాన్యం.. సాక్ష్యాలను తారుమారు చేసింది. చేతిపై ఉన్న పేర్లను శ్రీచైతన్య సిబ్బంది తుడిచేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఆరుగురు విద్యార్థులను జువెనైల్ కోర్టుకు తరలించారు. కాలేజీ ప్రిన్సిపల్ పిచ్చయ్య, ఇంచార్జ్ రవీంద్ర, జేఎల్లు రాజేష్, ఆనంద్, కృష్ణ, మెస్ బాయ్ హేమంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
రేపు వైఎస్ జగన్ గుంటూరు పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(ఫిబ్రవరి 4, బుధవారం) గుంటూరులో పర్యటించనున్నారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఇల్లు, ఆఫీసుని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు.టీడీపీ గూండాలు అంబటి నివాసంపై దాడి చేసి.. ఆయన్ని, కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించి ఓదార్చనున్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. -
ఎట్టకేలకు.. కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదు
సాక్షి,విజయవాడ: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశాలతో అరవ శ్రీధర్పై కేసు నమోదైంది. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగం కలిసి వచ్చింది. రైల్వే కోడూరు పోలీసులు పలు సెక్షన్ల కింద అరవ శ్రీధర్పై కేసులు నమోదు చేసింది. అరవ శ్రీధర్ తనపై ఏడాదిన్నరగా దారుణానికి ఒడిగట్టారంటూ బాధితురాలు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ తిరుపతి ఎస్పీకి ఫోన్ చేశారు. వెంటనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు. NHRC ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు BNS 318(2), 318(4), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ‘చర్యలుండవ్’ అంటూలైంగికంగా వేధించాడని ఆధారాలతో సహా బాధితురాలు బయటకు వస్తే.. ఆ వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోంది జనసేన పార్టీ. ఏకంగా అసెంబ్లీ నుంచే మహిళకు వీడియో కాల్స్ చేసినట్లు విషయాన్ని ఆమె బయటపెట్టింది. అయినా కూడా ‘చర్యలుండవ్’ అంటూ బహిరంగంగా చెబుతూ కమిటీ పేరిట కాలయాపన చేస్తోంది.కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలకు జనసేన ఏమాత్రం సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. వేధింపులను బాధితురాలు నేరుగా సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. దళిత మహిళ రోడ్డెక్కినా.. హోం మంత్రి అనిత స్పందించడం లేదు. ప్రభుత్వ ఒత్తిళ్లతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించడం లేదు. అందుకే ఆమె నేరుగా హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. -
‘దాడి జరిగిన వెంటనే క్లూస్ టీమ్ను ఎందుకు పంపలేదు?’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు, లోకేష్ ఆలోచనల మేరకే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారని.. ఉద్ధేశపూర్వకంగానే ఆటవిక చర్యలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు, విజయవాడ ఎంపీల నేతృత్వంలో గూండాలు, కిరాయి మనుషులు, గంజాయి బ్యాచ్ దాడి చేశారు. పెట్రోల్ బాంబ్ విసరడంలో నైపుణ్యం సాధించిన వారితో జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే వందల మంది దాడికి పాల్పడ్డారు’’ పేర్ని నాని మండిపడ్డారు.‘‘అసాంఘిక శక్తులను కంట్రోల్ చేయాల్సిన పోలీసులే ఈ దాడులకు అండగా నిలిచారు. జోగి రమేష్ ఇంటిపై దాడికి నాయకత్వం వహించిన వారితో ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ చర్చలు జరిపారు. టీడీపీ గూండాలు పోలీసును కిందపడేసి దాడి చేసినా వారికి పట్టడం లేదు. ట్రైన్డ్ కిరాయి మూకలే పెట్రోల్ బాంబులను విసరగలుగుతారు. మాజీ మంత్రికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటి?. ఆటవిక చర్యలకు కొందరు అధికారులు అండగా ఉండటం చూసి కింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..రేపోమాపో రిటైర్ అయ్యే గుణ్ణం రామకృష్ణ ఇలా దిగజారడం బాధాకరం. జనం గుమిగూడినప్పుడు లాఠీఛార్జ్ చేయకుండా ఏం చేస్తున్నారు?. జోగి రమేష్ ఇంటి పై దాడి చేస్తామని టీడీపీ సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పోస్టులే మీకు కనిపిస్తాయా?. టీడీపీ సోషల్ మీడియా పోస్టులు మీకు కనిపించవా?. దుర్గారావు అనే ఏసీపీ నిందితులతో ముచ్చటించడమేంటి?. పోలీస్ ఉద్యోగం చేయడం మర్చిపోయారా ఏసీపీ దుర్గారావు. పెట్రోల్ బాంబులు విసిరిన వారి పై 326 సెక్షన్ ఎందుకు పెట్టలేదు?. 109 సెక్షన్ ఎందుకు పెట్టలేదు. వందల మంది దొమ్మీకి పాల్పడినందుకు 191,192 ఎందుకు పెట్టలేదు?. మారణాయుధాల సెక్షన్ ఎందుకు పెట్టలేదు?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.‘‘కేశినేని చిన్ని నాయకత్వంలోనే జోగి రమేష్ ఇంటిపై దాడి చేశామని టీడీపీ నేతలు పోస్టులు పెట్టారు. వారిపై ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇదేనా మీ పోలీసింగ్. కేసులో లోకేష్ పేరును చేర్చాలి కదా ఎందుకు చేర్చలేదు?. దాడి జరిగిన వెంటనే క్లూస్ టీమ్ను ఎందుకు పంపించలేదు. ఒక్క పోలీస్ అధికారైనా ఘటనా స్థలాన్ని పరిశీలించాలి కదా. మీ కమిషనరేట్ పరిధిలో ఇంత పెద్ద విధ్వంసం జరిగితే మీరు రారా?. మేం చిన్న ధర్నా పెట్టుకున్నా సెక్షన్ 30 పెడతారు. ఇప్పుడెందుకు సెక్షన్ 30 అమలు కాలేదు..ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ కళ్లెదుటే అంతమంది గుమిగూడితే ఏం చేశారు?. లా అండ్ ఆర్డర్ దిగజారిపోతే మీరు కష్టపడి పాసై ఐపీఎస్ అయ్యి ఉపయోగం ఏంటి రాజశేఖర్ బాబు. మాజీ మంత్రుల ఇళ్లపై పట్టపగలు పెట్రోల్ బాంబ్లు విసిరిన పరిస్థితులు ఏపీలో ఇప్పుడే చూస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై ఇలా దాడులు చేయాలనుకోవడం సరికాదు. పోలీసులను నమ్ముకుని ఏ ప్రభుత్వం నడవలేదని చంద్రబాబు, లోకేష్ గుర్తుంచుకోవాలి. పోలీసులను అడ్డగోలుగా వాడుకున్న మీ పరిస్థితి భవిష్యత్ లో ఎలా ఉంటుందో ఊహించారా?. చంద్రబాబు తస్మాత్ జాగ్రత్త...ఎన్నికల కోడ్ రాగానే ఇదే పోలీసులు మీతాట తీయరా. దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటే ఏడాది పాటు ఆగండి. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో అద్భుతంగా మాట్లాడతాడు. కానీ ఇప్పుడు పవన్ ఏం చేస్తున్నాడో తెలుసుగా. భయం లేనోడే మాట్లాడతాడు. వైఎస్సార్సీపీలో ఉన్నవాళ్లు పవన్ లాంటోళ్లు కాదు. బతికినా చచ్చినా షంషేర్గా ఉంటాం. ఎవడో ఏదో చేస్తాడని మేం భయపడం. వీరమరణం పొందుదామనే మేం పోరాటం చేస్తున్నాం. జగన్ ఏమవుతాడో తెలియనప్పుడే లక్షల మంది అతని వెంట నడిచారు. కష్టాన్నైనా ఆనందంగా తీసుకునేవాళ్లే జగన్ వెంట వైఎస్సార్సీపీలోకి వచ్చారు. నన్ను వేసేస్తా.. వేసేస్తా అంటున్నారు.. ఎన్నాళ్లు దాక్కుంటాం వచ్చి వేసేయండి. పేర్నినానినో.. వేరొకరో.. మరొకరో పోతే ఏమవుతుంది.. మీ పతనం మొదలవుతుంది’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. -
తిరుమల లడ్డూ వివాదం.. బాబు సర్కార్ మరో డ్రామా
సాక్షి, విజయవాడ: తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్ మరో డ్రామాకు తెరతీసింది. సుప్రీంకోర్టు, సిట్ ఉండగా కమిటీ మరో కమిటీ వేయాలని నిర్ణయించింది. చంద్రబాబుకి వ్యతిరేకంగా సీబీఐ రిపోర్ట్ రావడంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామా మొదలుపెట్టింది. సీబీఐ చెప్పిన నిజాలను జీర్ణించుకోలేక కొత్త కమిటీ వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు విచారణలో ఉన్న అంశంపై మరో విచారణ కమిటీ అంటూ హడావుడి చేస్తోంది.జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారించగా.. సీబీఐ ఇచ్చిన నివేదిక తమకు అనుకూలంగా లేదని టీడీపీ ఫ్రస్టేషన్లో ఉంది. దీంతో సీబీఐని తప్పు పడుతూ కొద్దిరోజులుగా కుట్రపూరిత ప్రచారం చేసింది. సీబీఐ సరిగ్గా విచారించలేదంటూ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేసింది. సీబీఐ రిపోర్ట్లో లోపాలంటూ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారానికి తెరలేపింది. ఊరూరా ఫ్లెక్సీలు పెట్టి తిరుమల ప్రసాదంపై టీడీపీ తప్పుడు ప్రచారానికి ఒడిగట్టింది.దుష్ప్రచారానికి కొనసాగింపుగా మరో విచారణ కమిటీ వేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. తమ చెప్పుచేతుల్లో ఉండే అధికారులతో కమిటీ వేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. తమకు నచ్చినట్టు నివేదిక రాయించుకోవడానికి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. కమిటీ నివేదిక ఆధారంగా తిరుమలపై దుష్ప్రచారం చేయాలని వ్యూహం రచిస్తోంది. కేబినెట్ నిర్ణయాన్ని చూసి న్యాయ నిపుణులు విస్తుపోతున్నారు. -
‘ప్రశ్నిస్తానన్న పవన్ ఎమైపోయాడు’
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వ ఎక్స్పైరీ డేట్ దగ్గరలో పడిందని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాలు పెట్రోల్ బాంబులు,మారణాలయుధాలతో దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై జోగి రమేష్ కుటుంబాన్ని అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు.ఈ సందర్భంగా జోగి రమేష్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ కుమార్ మాట్లాడారు.‘కూటమి ప్రభుత్వంలో రాక్షస పాలన సాగుతోంది. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని తప్పుడు ప్రచారం చేశారు. తాను చేసింది అసత్య ప్రచారం అని తెలిసి పశ్చాత్తాపం పడకుండా దాడులు చేయిస్తున్నాడు.ప్రశ్నించిన వారి పై కేసులు పెట్టడం దాడులు చేయించడమే చంద్రబాబు పని. అంబటి రాంబాబు,జోగి రమేష్ ఇళ్ల పై వందల మంది గూండాలతో దాడి చేయించారు.జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేయించారు. దాడి సమయంలో జోగి రమేష్ తండ్రి, భార్య,కుమారుడు ఇంటిలోనే ఉన్నారు.ఇంట్లో ఉన్న మహిళలకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత.మీ పార్టీలో ఉన్నవారే మహిళలా. మీ పార్టీలో ఉన్నవారే బిసిలు,కాపులా. ప్రశ్నిస్తాననేపై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నాడు.జగన్ ఐదేళ్ల పాలనపై ఫ్యాక్షన్ ముద్ర వేశారు. నిజంగా మీరు చెప్పినట్లు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే ఏపీలో మీరు తిరగ గలిగేవారా. ప్రజలు మీకు ఓటేసింది ప్రజలకు మంచి చేయమని. ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు చేయడానికి కాదు.ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో తిరుగుబాటు తప్పదు.టీడీపీ వాళ్లు ఏమైనా చేస్తామని బెదిరిస్తున్నారు. జగన్ ఐదేళ్లలో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడలేదు.మీరు రెచ్చగొట్టే కొద్దీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వస్తారు.ప్రతీ ఒక్కరికీ ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. మీ ప్రభుత్వానికి మరో మూడేళ్లే ఎక్స్ పైరీ డేట్.అన్నారో లేదో తెలియని మాటకు చంద్రబాబు రాష్ట్రమంతా తిరిగి ఏడ్చారు.జోగి రమేష్ ఇంటి పై దాడి చేసిన సమయంలో వాళ్లింట్లో ఉన్నది కూడా మహిళలే. వెనక నుంచి దాడి చేయడం ..వెన్నుపోటు రాజకీయం చంద్రబాబుకి అలవాటు. చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడి చేయలేదు. కేవలం జోగి రమేష్ నిరసన తెలియజేశారు.జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన టీడీపీ నేతలెవరో, వారి వివరాలు ఉన్నాయని హెచ్చరించారు. -
‘చంద్రబాబు తీరుతో రాష్ట్రానికి తీవ్రమైన నష్టం’
కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుతో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకు ఈ దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, మరి దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ‘తిరుమల లడ్డూపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం ఆపడం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు ఈ దాడులు. బాధితులపైనే పోలీసులు తిరిగి కేసులు పెట్టడం దారుణం. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు దాడులు చేయిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షం ప్రశ్నించడం తప్పా. చంద్రబాబు నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇచ్చారా?, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. హామీల అమలుపై కూటమి నేతలు చర్చకు సిద్ధమా?, తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. వెంకటేశ్వరస్వామి శిక్ష నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఏపీలోని కూటమి సర్కార్.. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చిందో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
పవన్ కార్యాలయం ప్రకటనతో బట్టబయలైన లిక్కర్ దందా
కాకినాడ: ఏపీలో విచ్చలవిడిగా అధిక ధరలకు లిక్కర్ అమ్మకాలు జరుగుతున్నాయని చాలాకాలంగా వైఎస్సార్సీపీ చెబుతూ వస్తున్నమాట వాస్తవమేననేది తేటతెల్లమైంది. ఏపీలో అధిక మద్యం ధరలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రకటనతో లిక్కర్ దందా జరుగుతుందనేది బట్టబయలైంది. ఏపీలో మద్యం షాపుల్లో, బెల్టు షాపుల్లో అధిక ధరలపై తమకు వరుస ఫిర్యాదు వచ్చాయని పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రకటించింది. ఇందులో పవన్ ప్రాతినిధ్య వహిస్తున్న కాకినాడ జిల్లాలో అధిక ధరలే కాకుండా రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందని పవన్ కళ్యాణ్ కార్యాలయానికి ఫిర్యాదులొచ్చాయి. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రకటించడంతో అసలు విషయం వెలుగుచూసింఇ. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్శాఖక సూచించినట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది పవన్ కార్యాలయం. ప్రధానంగా టీడీపీ, జనసేన నేతలు కలిసి ఏపీలో లిక్కర్ షాఫులు నిర్వహిస్తున్నారు. అత్యధిక శాతం లిక్కర్ దందా అంతా కూడా కూటమి కబంధ హస్తాల్లోనే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రమంతా అత్యధిక ధరలకు మద్యం అమ్ముతూ క్యాష్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
‘పాలకులే గూండాల్లా, రౌడీల్లా వ్యవహరిస్తున్నారు’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతల సృష్టిస్తున్న అరాచకంపై మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. పాలకులే గూండాల్లా, రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘మళ్లీ వస్తాం.. మళ్లీ కొడతాం’ అని టీడీపీ నేతలు మాట్లాడటం ఏ సంస్కృతికి నిదర్శనమని ప్రశ్నించారు. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 3వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన విడదల రజిని.. ‘మళ్లీ వస్తాం.. మళ్లీ కొడతాం అని ఎమ్మెల్యే మాధవి బెదిరిస్తున్నారు. ఆమెను టీడీపీ బలిపశువు చేస్తోందని గుర్తుంచుకుంటే మంచిది. మహిళా పక్షపాతి లాగ తెగ బిల్డప్లు ఇస్తారు.. మళ్లీ మీరే దాడులు చేస్తారు.కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారు. లడ్డూ ఇష్యూను డైవర్ట్ చేసేందుకు టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారు. మాపై దాడి చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టారు. మాపై దాడి చేశారని ఫిర్యాదు చేస్తే.. కనీసం స్పందన లేదు. కూటమి పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని గుడికెళ్లి మొక్కుకుంటే తప్పా. వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు కదా. వైఎస్సార్సీపీ వాళ్లు ఏ గుడికి వెళ్లొద్దని చట్టం చేయండి. తిరుమల లడ్డూ వ్యవహారంలో జరగని కల్తీని జరిగినట్లు దుష్ర్పచారం చేస్తున్నారు. మేము కూటమి నేతలను నిలదీస్తున్నామనే మాపై దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. రాష్ట్రంలో రాజ్యాంగం లేదు.. ప్రజాస్వామ్యం లేదు.. శాంతి భద్రతలు లేవు. రాష్ట్రంలో రెడ్బుక్ పాలసీ, రెడ్బుక్ పాలన నడుస్తోంది. రెడ్బుక్ అరాచకంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మీరెన్ని దాడులు చేసినా మేము ప్రజల పక్షాన పోరాడుతాం’ అని స్పష్టం చేశారు. -
‘ప్రజల ఓట్లతో గెలిచారా?.. లేక ఈవీఎంలతో గెలిచారా?’
ఎర్రాతివారిపల్లి(అన్నమయ్య జిల్లా): ఏపీలో వరుసగా జరుగుతున్న పరిణామాలపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతల అదికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు ఈ ప్రభుత్వం.. ప్రజల ఓట్లతో గెలిచిందా.. లేక ఈవీఎంల ద్వారా మీరే గెలిపించుకున్నారా? అని నిలదీశారు. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 3వ తేదీ) అన్నమయ్య జిల్లాలోని సదుం మండలం ఎర్రాతివారిపల్లిలో పుంగనూరు నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, తిరుపతి,చిత్తూరు జిల్లాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి , మాజీ ఎంపీ రెడ్డప్ప తదితరులు హాజరయ్యారు. దీనిలో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. ‘ రాష్ట్రంలోమూడు రోజులుగా జరుగుతున్న పరిమాణాలు మీరందరు చూస్తున్నారు. ఈ ప్రభుత్వంను ప్రజలు ఓట్లతో గెలిపించారా....? ఈవీఎంలు ద్వారా గెలిపించుకున్నారా.. ?, కూటమి నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ పాలనలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదు. దీన్ని ప్రజలు గమనించాలి’ అని సూచించారు. -
గలీజు ఎమ్మెల్యే కోసం జనసేన కొత్తడ్రామా
సాక్షి, విజయవాడ/అన్నమయ్య: రైల్వేకోడూరు ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించాడని ఆధారాలతో సహా బాధితురాలు బయటకు వస్తే.. ఆ వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ జనసేన. ఏకంగా అసెంబ్లీ నుంచే అరవ శ్రీధర్ వీడియో కాల్స్ చేసినట్లు విషయాన్ని ఆమె బయటపెట్టింది. అయినా కూడా ‘చర్యలుండవ్’ అంటూ బహిరంగంగా చెబుతూ.. ఇటు కమిటీ పేరిట కాలయాపన చేస్తోందా పార్టీ.కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలకు జనసేన ఏమాత్రం సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. వేధింపులను బాధితురాలు నేరుగా సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. దళిత మహిళ రోడ్డెక్కినా.. హోం మంత్రి అనిత స్పందించడం లేదు. ప్రభుత్వ ఒత్తిళ్లతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించడం లేదు. వారం గడుస్తున్నా ఎలాంటి చర్యల్లేవ్. అందుకే ఆమె నేరుగా హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. మరోవైపు..ఎమ్మెల్యే అరవశ్రీధర్ గలీజు వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నా.. జనసేన చర్యలు తీసుకోవడం లేదు. పవన్ కల్యాణ్ ఈ అంశంపై స్పందించకుండా ముఖం చాటేస్తున్నారు. పైగా బాధితురాలిని బెదిరించిన జనసేన నేత నాగేంద్రతోనే కమిటీ వేయించారు. ఈ కమిటీలో శివశంకర్, రమాదేవి, వరుణలు ఉన్నారు. వీళ్లు ఓ హోటల్లో దిగారు. శ్రీధర్ వాళ్ల ముందు హాజరయ్యారు. ఇవాళ, రేపు అరవ శ్రీధర్ను విచారిస్తారట. ఆ వీడియోలు అసలువో.. నకిలీవో నిర్ధారించుకుంటున్నారట. అంతేగానీ అరవ శ్రీధర్ తప్పేం లేదని మాత్రం ఆ పార్టీ ప్రకటించలేకపోతోంది. అరవశ్రీధర్, జనసేనలోని అతని అనుచరులు ఇప్పటికీ బాధితురాలిని బెదిరిస్తూ తిరుగుతున్నారు. జంగిల్ రాజ్లో ఇప్పటికే మహిళలకు భద్రత కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వరుసలో.. ఓ కామాంధుడైన ఎమ్మెల్యేను ప్రభుత్వ పెద్దలు కాపాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘తిరుపతి లడ్డూ ఇష్యూను డైవర్ట్ చేసేందుకే ఈ దాడులు’
విశాఖ: ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిలైందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ప్లాన్ ప్రకారమే అంబటి రాంబాబుపై, ఆయన ఇంటిపై దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూటమి నేతలు ఫ్లెక్సీలు పెడుతున్నారని, ప్రధానంగా తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 3వ తేదీ) విశాఖ నుంచి మీడియాతో మాట్లాడిన అమర్నాథ్.. అంబటి రాంబాబు ఇంట్లోకి వెళ్లి పచ్చమూకలు విధ్వంసం సృష్టించడమే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందనే దానికి ఉదాహరణ అని అన్నారు. ‘పచ్చమూకలను చెదరగొట్టే అవకాశమున్నా పోలీసులు పట్టించుకోలేదు. జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోల్ బాంబులే వేశారు. పక్కాప్లాన్ ప్రకారమే దాడులు చేస్తూ లడ్డూ ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు కుట్ర బయటపడుతుందనే డైవర్షన్ పాలిటిక్స్. తిరుపతి లడ్డూ, చంద్రబాబు కుటుంబం భూదోపిడీని డైవర్షన్ చేసేందుకే దాడులు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ భరత్ లెక్క ప్రకారమే దోపిడీ చేసిన గీతం భూమి విలువ రూ. 1000 కోట్లు. అంటే భూమి కబ్జా చేసినట్లు ఒప్పుకున్నట్లే కదా?, ప్రభుత్వ భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టే హక్కు మీకెరిచ్చారు?, విశాఖలో ఉన్న భూములు, ఆస్తులు మీ జాగీరు కాదు’ అని హెచ్చరించారు. -
‘ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి’
సాక్షి,ఢిల్లీ: ఏపీలో కూటమి ఆటవిక పాలనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ పార్లమెంట్ ఎదుట ధర్నా చేపట్టింది. మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ ఎంపీలు ఫ్లెక్సీలతో ఆందోళనకు దిగారు. ఏపీ శాంతి భద్రతల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని.. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని నినాదాలు చేశారు.ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోంది. ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు పరిపాటిగా మారాయి. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి. శాంతి భద్రతలను పరిరక్షించాలి. రాష్ట్రపతి పాలన విధించాలి అని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రాన్ని కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతీకార రాజకీయాలు మొదలయ్యాయి. వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని.. అక్రమ కేసులు, అరెస్టులు చేయించడమే కాదు.. హత్యలకూ పాల్పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వదలడం లేదు. ఈ క్రమంలోనే.. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై అధికార టీడీపీ దాడులు చేసింది. ఈ జంగిల్ రాజ్పై చట్టబద్ధంగా, అహింసా పద్ధతుల్లో వైస్సార్సీపీ పోరాటాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ పరిస్థితులను కేంద్ర హోం శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లింది వైఎస్సార్సీపీ. త్వరలో హోంమంత్రి అమిత్ షాను కలసి పరిస్థితులను ఆయనకు వివరించాలని భావిస్తోంది.కూటమి పాలనలో ఇప్పటిదాకా.. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారుజోగిరమేష్ ఇంటిపై దాడి చేశారువలభనేని వంశీ ఇంటిపై దాడి చేశారుకొడాలి నాని ఇంటిపై దాడి చేశారుపేర్ని నాని ఇంటిపై దాడి చేశారుముద్రగడ ఇంటిపై దాడి చేశారునల్లపురెడ్డి ప్రశన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారుకామిరెడ్డి నాని ఇంటిపై దాడి చేశారుకేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేశారుఅబ్బయ్య చౌదరి ఇంటిపై దాడి చేశారుభూమన కరుణాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేశారుహిందూపుర్ వైసీపీ ఆఫీస్ పై దాడి చేశారుదాడిశెట్టి రాజాపై దాడి చేశారుఉప్పల హారికా, ఉప్పల రాముపై దాడి చేశారుదేవినేని అవినాష్ పై దాడికి యత్నించారుచిత్తూరు రెడ్డప్ప ఇంటిపై దాడి చేశారుమార్గాని భరత్ ఆఫీస్ పై దాడివిడదల రజినీపై దాడికి యత్నం నంబూరి శంకర్రావు ఆఫీసుపై దాడిఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడిడెక్కన్ క్రానికల్ ఆఫీస్ పై దాడి చేశారు సాక్షి ఆఫీసులపై దాడి చేశారు -
‘ఏపీని రావణకాష్టంగా మార్చారు’
నెల్లూరు: ఏపీని రావణకాష్టంగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అనిల్కుమార్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ నేతలు వరుసగా వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతూ ఆటవిక పాలనకు తెరలేపారన్నారు. మరో మూడేళ్లపాటు ఆటవిక పాలన భరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ‘సాక్షి’తో అనిల్కుమార్ మాట్లాడుతూ.. ‘ కాపు, బీసి నాయకులపై దాడులు శోచనీయం. శ్రీవారి లడ్డు ప్రసాదం దుష్ప్రచారంలో దొరికేసిన కూటమి నాయకులుఉ.. డైవర్షన్ కోసమే దాడులకు పాల్పడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్లో ఉన్నారు. దమ్ముంటే పోలీసు వ్యవస్థను పక్కన బెట్టి సవాలు విసరండి. మరో మూడేళ్లు ఈ ఆటవిక పరిపాలన భరిస్తాం. 2029లో రిటర్న్ గిఫ్ట ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం’ అని హెచ్చరించారు. -
మరీ ఇంతలా దిగజారాలా?
ఏపీలో కూటమి నేతల ప్రసంగాలకు వాస్తవిక పరిస్థితులకు మధ్య అస్సలు పోలికే ఉండటం లేదు. ఆఖరికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేత కూడా అబద్ధాలు వల్లెవేయించడం కూటమి నేతల దిగజారుడు తనానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో కొన్నేళ్లుగా రాష్ట్రానికి స్పష్టమైన దిశ లేకుండా పోయిందని చదివించారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం క్షీణించిందని గత ప్రభుత్వంపై విమర్శలు చేయించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, పునరుద్ధరణ లక్ష్యంగా ఆవిష్కరణ, సంస్కరణలు, సమీక్షలు చేస్తోందని, వాటి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని గవర్నర్తో పలికించారు. రాష్ట్రం కోలుకుంటోందని, మార్పు వైపు ప్రయాణం మొదలైందని, స్వర్ణాంధ్ర సాధనకు పది సూత్రాలను అమలు చేస్తున్నామని అనిపించారు. గవర్నర్ మాటలలో కొత్తదనం లేకపోవడం ఒక ఎత్తు అయితే.. గత ప్రభుత్వంపై బురదచల్లడం, కూటమి ప్రభుత్వం ఏదో చేస్తోందన్న భ్రమ కల్పించడానికి ఈ ప్రసంగాన్ని వాడుకోవడం ఇంకో ఎత్తు. సాధారణంగా గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాల వంటి జాతీయ ఉత్సవాలలో అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎంత మేరకు అమలు చేసింది చెబుతూంటారు. గవర్నర్ ప్రసంగంలో ఆ భాగం ఉన్నట్లు మీడియాలో కనిపించలేదు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ చంద్రబాబు తరచు అసత్యాలను ప్రచారం చేస్తుంటారు. గవర్నర్తో కూడా ఆ మాట చెప్పించి ఉండకపోతే అది మంచి విషయమే.. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీలు ఇప్పటికైతే గాలికి వదిలేసినట్టుగానే ఉంది. కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆవిష్కరణలు ఏమిటో, అభివృద్ది పునరుద్దరణ ఎక్కడ జరిగిందో ఎవరికి కనిపించదు. జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన పలు వ్యవస్థలను నీరు కార్చడం, వాటి పేర్లు మార్చి తామే కనిపెట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఓడరేవులు, మెడికల్ కాలేజీలు నిర్మాణం నిలిపి వేయడం అభివృద్ది ఎలా అవుతుంది? గవర్నర్ తన స్పీచ్లో రాష్ట్రంలో మార్పు మొదలైందని అనడంలో కూటమి ఉద్దేశం ఏమిటో కాని ఆ మార్పు ప్రజలకు అనుకూలమైనదా? వ్యతిరేకమైనదా? అన్నది సమీక్షించుకోవాలి. విశాఖపట్నంలో తమ సమీప బంధువు, లోక్సభ సభ్యుడు శ్రీభరత్కు చెందిన గీతం కాలేజీ ఆక్రమించిన 54 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరించడానికి కార్పొరేషన్ చర్చ లేకుండా తీర్మానం చేయడం ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పు కాబోలు. ఇందుకోసం ఫిరాయింపుల ద్వారా విశాఖ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం మరో మార్పుగా భావించాలి. ఈ భూమి విలువ సుమారు రూ.ఐదువేల కోట్లు అంటున్నారు. ప్రజలు ఏమైనా అనుకుంటారేమో అన్న చిన్నపాటి సంశయాన్ని కూడా వదిలేసి అధికారం అండగా బంధుప్రీతికి పాల్పడటం కూటమి తాలూకూ లేటెస్ట్ మార్పు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ వంటి వారి అభ్యంతరాలను పెడచెవిన పెట్టడం మరో మార్పు. విశాఖలో ఒక మీడియా సంస్థకు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కట్టబెట్టారని వార్తలు వచ్చాయి. ఇదే విశాఖలో వేలాది మంది నివసిస్తున్న దేవాలయ, ప్రభుత్వ భూములను రెగ్యులైరైజ్ చేయకపోవడం గీతం కాలేజీ యాజమాన్యంతోపాటు కొందరు నేతలు,పలుకుబడి కలిగిన వ్యక్తులు కబ్జా చేసిన భూములను గత వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే, వాటిని ఆక్రమణదారులకే ధారాదత్తం చేయడానికి వెనుకాడకపోవడం ఏ రకమైన మార్పో? వైసీపీ పాలన సమయంలో విజయసాయిరెడ్డి బంధువులు భూమి కొనుగోలు చేసినా, అదంతా దందా అని ప్రచారం చేసిన ఎల్లో మీడియా, ఇప్పుడు ఈ కబ్జాలకు వంత పాడుతుండడం కూడా మార్పే. గవర్నర్ ప్రసంగం ద్వారా అమరావతి రాజధానితోనే అన్ని జరిగిపోతాయన్న భ్రమ కల్పించే యత్నం చేశారు. ఆ క్రమంలో మళ్లీ సుమారు లక్షన్నర ఎకరాల భూమిని సేకరించడానికి ప్రభుత్వం తలపెట్టడంపై అక్కడి ప్రజలు, ముఖ్యంగా రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్న దానిపై మాత్రం భరోసా ఇచ్చినట్లు కనిపించలేదు. కేంద్రం ఏదో అమరావతిని అవకాశాల గని అని పేర్కొందని ఎల్లో మీడియా తెలిపింది. ఒకప్పుడు కాణి ప్రభుత్వ ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ కాపిటల్ అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని అప్పుల ఊబిలో దింపుతున్నారని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమా? కాదా? అన్న దానిపై గవర్నర్తో వివరణ ఇప్పించి ఉంటే సబబుగా ఉండేది!. పేదరికం లేని సమాజం, ఉపాధి నైపుణ్యం, జనాభా నిర్వహణ, నీటి భద్రత, రైతులకు అగ్రిటెక్, ప్రపంచస్థాయి లాజిస్టిక్స్, వ్యయ నియంత్రణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్వచ్ఛాంధ్ర, సేఫ్ ఆంధ్ర, డీప్ టెక్ అండ్ స్మార్ట్ గవర్నెన్స్ అంటూ పడికట్టు పదాలను గవర్నర్ స్పీచ్ వాడారు. వీటితో ఏపీ స్వర్ణాంధ్రగా మారిపోతుందని ప్రజలను నమ్మమంటున్నారు. కాని ఇది నిత్యం చెప్పే అబద్దాలలో భాగమేనని ప్రజలకు తెలియదా! సమాన అవకాశాలు కల సమాజాన్ని నిర్మిస్తున్నామని గవర్నర్తో చెప్పించారంటే అంతకన్నా పెద్ద అసత్యం ఉంటుందా? ప్రభుత్వం నిర్మించవలసిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు. విశాఖలో అతి ఖరీదైన ప్రభుత్వ భూములను పెద్ద, పెద్ద కంపెనీలకు వారు అడగకపోయినా 99 పైసలకే కట్టబెడుతున్నారు. ఇది అన్నిటికంటే అతి పెద్ద మార్పుగా ఏపీ ప్రజలు చూస్తున్నారు. గతంలో ఇలాంటివి ఎన్నడూ జరగలేదు. వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి కేవలం అమరావతిలోనే వ్యయం చేస్తున్నారు. హామీలు అమలు చేయండంటే పీపీపీ అంటున్నారు. అప్పులు, అవస్థలు ప్రజలకు, ప్రభుత్వ సంపదను కొంతమంది బడాబాబులకు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న తీరుతో ఎంతటి అరాచక పరిస్థితులు నెలకొన్నాయో క్షీణించిన శాంతిభద్రతలు చెబుతాయి. చివరికి అనుచితమైన విద్వేషపూరిత రాతలన్న ఫ్లెక్సీలకు టీడీపీ గూండాలు కర్రలు పట్టుకుని కాపలా కాస్తుంటే, పోలీసులు భద్రత కల్పించడమే మహా మార్పు. పంతొమ్మిది నెలల్లో తెచ్చిన రూ.మూడు లక్షల కోట్లకుపైగా అప్పులతో రాష్ట్రం పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సేఫ్ గా ఉందని అనుకోవాలా? లేక అన్సేఫ్గా మారుతోందని భయం కలుగుతుందా?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు ఆటవిక పాలన.. గుంటూరుకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి రేపు(ఫిబ్రవరి 04, బుధవారం) గుంటూరులో పర్యటించనున్నారు. టీడీపీ గూండాల చేతిలో దాడితో భయబ్రాంతులకు గురైన సీనియర్నేత, మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు. టీడీపీ గూండాలు అంబటి నివాసంపై దాడి చేసి.. ఆయన్ని, కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే.గుంటూరులో ఇటీవల రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తిరుపతి లడ్డూ ప్రచార నేపథ్యంలో టీడీపీ దుష్ప్రచారానికి దిగడం.. దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అంబటి రాంబాబుపై కర్రలతో దాడికి యత్నం.. ఆ క్రమంలో చోటుచేసుకున్న వాగ్వాదాలు.. చివరకు అంబటి ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి ప్రయత్నించడం తెలిసిందే. ఆ సమయంలో అంబటితో వైఎస్ జగన్ మాట్లాడారు కూడా. అయితే.. ఆ తర్వాతే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాత్రిపూట పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయగా.. సీఎంను దుర్భాషలాడారన్న కేసులో మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. అయితే.. ఈ సంఘటనతో చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంబటి, ఆయన కుటుంబ సభ్యులపై జరిగిందని దాడి కాదని.. హత్యాయత్నమేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. అదే సమయంలో మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైనా పెట్రోల్ బాంబ్ దాడి జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో బాధిత కుటుంబాలకు పరామర్శించి దైర్యం చెప్పాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. బుధవారం అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అలాగే.. శుక్రవారం జోగి రమేష్ కుటుంబాన్ని కలిసి పరామర్శించనున్నారు. అంబటి, జోగితో పాటు టీడీపీ రౌడీ మూకల చేతుల్లో దాడులకు గురైన పార్టీ నేతలు విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడులతో వైఎస్ జగన్ ఇప్పటికే ఫోన్లో మాట్లాడి.. ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే. -
నంద్యాల టూటౌన్ సీఐ ఓవరాక్షన్
నంద్యాల: చికెన్ సెంటర్ల దుకాణ యజమానుల వివాదంలో నంద్యాల టూటౌన్ సీఐ అస్రార్బాషా తలదూర్చి ఓవరాక్షన్ చేసి బాధితులపై దాడి చేయడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. బాధితురాలు రేణుక తెలిపిన మేరకు.. ఎస్బీఐ కాలనీలో జయరామిరెడ్డి, శివరామిరెడ్డిలకు చెందిన రెండు చికెన్ దుకాణాలు ఉన్నాయి. వీరి మధ్య వ్యాపార విషయంలో ఇటీవల విభేదాలు వచ్చాయి. శివరామిరెడ్డి తమ దుకాణంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, జయరామిరెడ్డి బంధువులు ఇంటి వద్దకు ఆదివారం రాత్రి అడిగేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమాచారం తెలుసుకున్న సీఐ అస్రార్బాషా గుమిగూడిన ప్రజలను చెదరగొట్టారు. ఈ క్రమంలో బాధితురాలు రేణుకను గొంతు పట్టుకొని షెట్టర్కు ఆనించి దాడి చేశారు. అక్కడే ఉన్న పూల వ్యాపారిని, రేణుక తమ్ముడు హేమేష్రెడ్డిలను రోడ్డుపైనే దాడి చేశారు. అనంతరం వారిని టూటౌన్ పోలీసు స్టేషన్కు తరలించారు. టూటౌన్ పోలీసు స్టేషన్ బయటి నుంచే తనను కొట్టుకుంటూ తీసుకెళ్లారని, స్టేషన్లోకి వెళ్లాక గొంతుపై, మెడపై బూటుకాలుతో తన్నారని హేమేష్రెడ్డి ఆరోపించారు. రోడ్డుపై సీఐ దాడి చేయడం అవమానంగా భావించిన రేణుక స్టేషన్ ఎదుటే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ఈ విషయంపై సీఐ అస్రార్బాషాను వివరణ కోరగా.. 30మంది దాకా ఎస్బీఐ కాలనీలో గుమిగూడి ఉన్నారని, వారిలో చాలా మంది తాగి ఉండటంతో ఘర్షణ జరుగుతోందని తెలిసి చెదరగొట్టామన్నారు. తాము, సిబ్బంది ఎవరిపైన దాడి చేయలేదని, ఇరువర్గాలపై చర్యలు తీసుకుంటామన్నారు. -
టీడీపీ గూండాలపై కేసులు పెట్టరా?
సాక్షి, రాజమహేంద్రవరం: ‘మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఆఫీస్, ఇంటిపై టీడీపీ గూండాలు దాడులు చేశారు. కార్లు, ఇల్లు ధ్వంసం చేశారు. ఆఫీస్ తగులబెట్టేశారు. అయినా వారిపై ఇప్పటికీ ఎందుకు కేసులు నమోదు చేయలేదు’ అని అంబటి రాంబాబు అల్లుడు ఉపేష్ ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న అంబటి రాంబాబుతో ఉపేష్, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ నాయకుడు అనిల్రెడ్డి సోమవారం ములాఖత్ అయ్యారు. అనంతరం సెంట్రల్ జైలు బయట ఉపేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అంబటిపై రెండు రోజులుగా హైడ్రామా నడుస్తోంది.వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లినప్పుడు టీడీపీ గూండాలు వచ్చి రెచ్చగొట్టి ఆయనతో మాట్లాడించారు. అంబటి రాంబాబుకు 24 గంటల్లో సినిమా చూపిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త మా ఇంటిపైకి వచ్చి భయంకరంగా దాడులు చేశారు. దారుణమైన బూతులు తిట్టారు. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీరు కేసు పెడతారా?’ అని సీఎం చంద్రబాబును నిలదీశారు.పోలీసులు, సీఐలు వెంకటేశ్వర్లు, వంశీ అంబటిని టార్చర్ చేశారని, పెమ్మసాని చెప్పిన సినిమా చూపించడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. తిరుమల ప్రసాదంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని చంద్రబాబు, లోకేశ్ స్టేట్మెంట్లు ఇచ్చారని, డైవర్షన్ కోసమే హైడ్రామా సృష్టించారని దుయ్యబట్టారు. ‘గల్లా మాధవికి ఇల్లు లేదా? ఎల్లప్పుడూ మీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందా?’ అని హెచ్చరించారు. చంద్రబాబు కళ్లు తెరవాలి జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ధోరణితో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతలపై దాడులు చేసి.. తిరిగి వారి పైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలని హితవు పలికారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మాజీ సీఎం జగన్, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డిపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తులో తేలినా.. రాజకీయ ప్రయోజనాల కోసం ఫ్లెక్సీలు పెట్టడమేమిటని ప్రశ్నించారు. దీనిని తప్పుపట్టిన అంబటి రాంబాబు ఇంటిపై దాడులు చేయించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ‘మీరు ప్రారంభించిన సంప్రదాయాన్ని రేపు చక్రవడ్డీతో తిరిగి మీకు చెల్లిస్తాం’ అని జక్కంపూడి రాజా హెచ్చరించారు.సెంట్రల్ జైల్కు అంబటి గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబును సోమవారం వేకువజామున 3.45 గంటల సమయంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటికి స్నేహా బ్లాక్లో ఓ గది కేటాయించారు. -
సైబర్ నేరాల కట్టడికి కిల్ స్విచ్
సాక్షి, అమరావతి: సైబర్ నేర ముఠాలు బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టకుండా చెక్ పెట్టేందుకు కేంద్ర హోంశాఖ సరికొత్త కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. ఆన్లైన్, డిజిటల్, యూపీఐ చెల్లింపుల ప్రక్రియలో ‘కిల్ స్విచ్’ను ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాల బాధితుల బ్యాంకు ఖాతాల లావాదేవీలను తక్షణం నిలుపుదల చేసేందుకు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. సైబర్ నేరాల కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు కేంద్ర హోంశాఖ గత ఏడాది డిసెంబరులో ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో కేంద్ర న్యాయ, ఐటీ–టెలీ కమ్యూనికేషన్లు, వినియోగదారుల వ్యవహారాల శాఖలు, ఆర్బీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తన సిఫార్సులను ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమరి్పంచింది. ‘కిల్ స్విచ్’ సాధనాన్ని అందుబాటులోకి తేవడంతోపాటు సైబర్ క్రైం నేరాలకు బీమా సౌకర్యం కలి్పంచాలని కూడా ప్రతిపాదించారు. నివేదికలోని ప్రధాన అంశాలివీ..బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, యూపీఐ చెల్లింపుల విధానంలో ఈ ‘కిల్ స్విచ్’ అనే బటన్ను ప్రవేశపెట్టాలని కేంద్ర హోంశాఖ కమిటీ ప్రతిపాదించింది. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి సంతృప్తి వ్యక్తంచేసింది. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలోని బ్యాంకింగ్ యాప్లు, యూపీఐ యాప్లలో ఈ ‘కిల్ స్విచ్’ బటన్ను ఏర్పాటుచేస్తారు. డిజిటల్ అరెస్టు, ఇతర సైబర్ నేరాల బారిన పడ్డామని గుర్తించగానే ఆ ‘కిల్ స్విచ్’ బటన్ను నొక్కితే చాలు.. వారి అన్ని బ్యాంకు ఖాతాలు వెంటనే స్తంభించిపోతాయి.ఆ ఖాతాల నుంచి ఇతర ఖాతాలకు నగదు బదిలీగానీ ఇతర లావాదేవీలుగానీ సాధ్యంకాదు. దీంతో.. సైబర్ నేర ముఠాలు బెదిరింపులకు పాల్పడి సామాన్యుల బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీ చేయించుకోవడానికి అడ్డుకట్ట వెయ్యొచ్చని కేంద్ర హోంశాఖ కమిటీ భావిస్తోంది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడంతోపాటు సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇదే అంశంపై ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రతినిధులతో కూడా సమావేశం నిర్వహించింది. సైబర్ నేరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. బ్యాంకు ఖాతాలు ఉన్నవారు బీమా చేసుకుంటే.. సైబర్ నేరాలకు గురైతే బీమా పరిహారం పొందవచ్చు. ఈ ప్రతిపాదనపై ఆర్బీఐ దేశంలోని జాతీయ బ్యాంకులు, బీమా సంస్థలతో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.సుప్రీంకోర్టు ఆగ్రహంతో కేంద్ర హోంశాఖ కార్యాచరణదేశంలో సైబర్ నేర ముఠాలు 2024–25లో దేశంలో రూ.34,771 కోట్లు కొల్లగొట్టాయి. డిజిటల్ అరెస్టులని బెదిరించి వీడియో కాల్స్లో గంటల తరబడి బంధించి రూ.3 వేల కోట్లు దోచుకున్నాయి. దీంతో.. తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాల కట్టడికి ఎలాంటి చర్యలు చేపడతారో చెప్పాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఫలితంగా.. కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ‘కిల్ స్విచ్’ బటన్ ఏర్పాటు, సైబర్ నేరాలకు బీమా భద్రతతోపాటు మరికొన్ని అంశాలను ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు పరిశీలన అనంతరం కేంద్ర హోంశాఖ తదుపరి కార్యాచరణ చేపడుతుంది. -
కొత్త లైనూ లేదు.. రైలూ లేదు
సాక్షి, అమరావతి: కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చక్రం తిరగలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రైల్వే బడ్జెట్లోనూ రాష్ట్రానికి ఈసారీ మొండిచెయ్యే మిగిలింది. ఆంధ్రప్రదేశ్కు రెడ్ సిగ్నల్ చూపిస్తూ కేంద్ర రైల్వే బడ్జెట్ బైపాస్లో వెళ్లిపోయింది. కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టుల సాధనలో మాత్రం చేతులెత్తేశారు. ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా రాష్ట్రానికి సాధించలేకపోయారు. రాష్ట్రం నుంచి ఎన్డీఏకు చెందిన 21 మంది లోక్సభ సభ్యులు ఉన్నప్పటికీ రైల్వే ప్రాజెక్టుల సాధనలో పూర్తిగా విఫలమయ్యారు.2026–27 వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రూ10,134 కోట్లు కేటాయించినట్టు రైల్వే శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గత బడ్జెట్ కంటే ఇది కేవలం రూ.717 కోట్లు మాత్రమే అధికం. పెరిగిన వ్యయంతో పోలిస్తే.. ఆ నిధులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను నత్తనడకన సాగించేందుకే సరిపోతాయి. అంతేగానీ ప్రాజెక్టులను పూర్తి చేయడంగానీ.. కొత్త ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టడంకానీ సాధ్యం కాదనే విషయం స్పష్టమైంది. బడ్జెట్ కేటాయింపుల్లో కనికట్టు చేసేందుకు రైల్వే శాఖ యత్నించింది.2009–10 వార్షిక బడ్జెట్ కంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించినట్టు రైల్వే శాఖ చెప్పుకోవడం విశేషం. పదేళ్ల క్రితం నాటి బడ్జెట్ కేటాయింపులతో పోలుస్తూ ప్రస్తుత బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపలేదనే విషయాన్ని మరుగుపరిచేందుకు యతి్నంచింది. బడ్జెట్ కేటాయింపులను వివరిస్తూ రైల్వే శాఖ పింక్ బుక్ విడుదల చేస్తేనే కొంత స్పష్టత వస్తుంది. పాత పాటే.. కొత్తగా పాడి.. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో రైల్వే శాఖ ఎలాంటి ప్రకటనా చేయలేదు. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి అమృత్ భారత్ పథకం కింద ఆ 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు మూడేళ్ల క్రితమే రూ.3,418 కోట్ల వ్యయంతో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయి.సూళ్లూరుపేట, రాయనపాడు (విజయవాడ శివారు), కాకినాడ టౌన్, మంగళగిరి, తుని రైల్వేస్టేషన్ల పనులు పూర్తయ్యాయి. ఆ విషయాన్నే రైల్వే శాఖ కనికట్టు చేసేందుకు యత్నించింది. 2014 నుంచి రాష్ట్రంలో 1,700 కి.మీ. మేర రైల్వే ట్రాక్లను నిర్మించినట్టు తెలిపింది. కవచ్ ప్రాజె క్టు కింద గతంలోనే ఆమోదించిన 3,137 కి.మీ. పను ల్లో 130 కి.మీ. పనులు పూర్తయ్యాయి. మరో 2,507 కి.మీ. పనులు కొనసాగుతున్నాయని వెల్లడించింది.కొత్త రైళ్లు లేవు ⇒ రాష్ట్రానికి కొత్త రైళ్ల కేటాయింపులోనూ రెడ్ సిగ్నలే చూపించింది. ఒక్క కొత్త రైలు కూడా వేయలేదు. రాష్ట్రం మీదుగా ఇప్పటికే నాలుగు వందే భారత్ రైళ్లు, 4 అమృత్ భారత్ రైళ్లు నిర్వహిస్తున్న విషయాన్నే రైల్వే శాఖ ప్రస్తావించింది. అంటే కొత్త రైళ్లు కేటాయించడం లేదని తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టులు ప్రశ్నార్థకమే ⇒ రాష్ట్రంలో ఇతర కీలక రైల్వే లైన్ల నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో నత్తనడకను తలపిస్తున్న ఆ లైన్ల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందన్నది అగమ్యగోచరంగా మారింది. ⇒ కాకినాడ–పిఠాపురం, మాచర్ల–నల్గొండ, కంభం–ప్రొద్దుటూరు, గూడూరు–దుగరాజపట్నం, కొండపల్లి–కొత్తగూడెం, భద్రాచలం–కొవ్వూరు, జగ్గయ్యపేట–మేళ్లచెరువు రైల్వే లైన్లకు నిధుల కేటాయింపుపై కేంద్రం చిత్తశుద్ధి చూపించలేదు. ⇒అమరావతి రైల్వే లైన్ గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నది సుస్పష్టం. రూ.2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదించినట్టు 2024 అక్టోబర్లో ప్రకటించినా నిధుల కేటాయింపుపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ⇒ అత్యంత కీలకమైన కడప–బెంగళూరు (255 కి.మీ.) రైల్వే లైన్పై కూడా కేంద్ర ప్రభుత్వం మొహం చాటేసింది. ⇒ కోటిపల్లి–నర్సాపురం, నడికుడి–శ్రీకాళహస్తి, డోన్–అంకోలా రైల్వే లైన్ల గురించి కూడా పట్టించుకోలేదు.కొత్త డిమాండ్లు బేఖాతరు కొత్త ప్రాజెక్టును కూడా కేంద్రం పరిశీలించలేదు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైనప్పటికీ ప్రతిపాదనల దశలోనే మగ్గిపోవాల్సిన అనివార్యత ఏర్పడిన ప్రాజెక్టులు ఇవీ.. ⇒ విజయవాడ–ఖరగ్పూర్, విజయవాడ–నాగ్పూర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు ⇒ తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు ⇒ విజయవాడ–గూడూరు మధ్య నాలుగో లైన్ నిర్మాణం ⇒ కడప–బెంగళూరు రైల్వేలైన్ అలైన్మెంట్ మార్పు -
ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయండి
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారుల నుంచి స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత అదనంగా వసూలు చేసిన చార్జీలను వెనక్కి ఇచ్చేయాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) ఆదేశించింది. ఇకపై కెపాసిటర్లు ఎన్ని ఉన్నా లోడ్కి ఎన్ని అవసరమో వాటినే విద్యుత్ బిల్లు వేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. విద్యుత్ పంపిణీ రంగంలో సామర్థ్యం, పారదర్శకత, విశ్వసనీయతను మెరుగుపరచడానికి ఆధునిక మీటరింగ్ సాంకేతిక పరిజ్ఞానాలకు మద్దతు ఇస్తూనే వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని కమిషన్ స్పష్టం చేసింది. మేం కట్టలేం ‘‘స్మార్ట్ మీటర్లు పెడతామని ఎవరైనా వస్తే వాటిని పగలగొట్టండి అని ఎన్నికల ముందు టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం, అవవసరమైతే తగ్గిస్తాం అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక వినియోగదారుల సమ్మతితోనే విద్యుత్ సర్విసులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామంటూ మాట మాచ్చారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టుకోకపోతే ఉన్న సర్వీసులు తొలగిస్తామంటూ నోటీసులు ఇస్తున్నారు. వీటికి తోడు ప్రజలపై దాదాపు రూ.20 వేల కోట్లకుపైగా విద్యుత్ చార్జీల భారం మోపారు.స్మార్ట్ మీటర్లు పెట్టడంతో విద్యుత్ బిల్లులు రెండు, మూడింతలు పెరిగిపోయాయి. ఇలా అయితే మేమెలా బిల్లులు కట్టాలి ? వినియోగించని విద్యుత్కు చార్జీలు ఎందుకు చెల్లించాలి.’’ అంటూ విద్యుత్ వినియోగదారులు ఏపీఈఆర్సీకి ఇటీవల మొర పెట్టుకున్నారు. బహిరంగ విచారణలో, ఈమెయిళ్ల ద్వారా, నేరుగానూ తమ సమస్యలను మండలికి చెప్పుకున్నారు. అందుకే ఎక్కువ బిల్లు వినియోగదారుల ఆందోళనను సీరియస్గా తీసుకున్న మండలి ఈ సమస్యకు తమ వంతు పరిష్కారాన్ని అన్వేషించింది. పాత ఎలక్ట్రోమెకానికల్, స్టాటిక్ మీటర్లతో పోలిస్తే కొంతమంది వినియోగదారులకు అధిక విద్యుత్ బిల్లులు వచ్చాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో మూడు సూచనలతో సోమవారం ఆదేశాలు జారీ చేసింది. లో టెన్షన్ (ఎల్టీ) విద్యుత్ సర్విసులకు స్మార్ట్ మీటర్లు అమర్చిన తర్వాత విద్యుత్ బిల్లులు భారీగా పెరిగాయి. దీనికి కెపాసిటర్లు కారణమంటూ ఏపీఈఆర్సీకి డిస్కంలు వెల్లడించాయి. వినియోగదారులు అవసరమైన దానికంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న కెపాసిటర్లను పెట్టుకోవడం వల్ల స్మార్ట్ మీటర్లు అదనపు లోడ్కి తగ్గట్టుగా యూనిట్లు లెక్కిస్తున్నాయని వివరించాయి. ఈ విషయాన్ని పరిశీలించిన తర్వాత వినియోగదారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ మీటరింగ్ ప్రోగ్రామ్కు అనుకూలమైన వాతావరణం కల్పించాల్సి ఉందని భావించినట్లు ఏపీ ఈఆర్సీ వెల్లడించింది.ఏపీఈఆర్సీ ఆదేశాలు ఇవీ ⇒ స్మార్ట్ మీటర్లలో కెపాసిటర్ల ఆధారంగా బిల్లు లెక్కింపు విధానం ఉండాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు నిలిపివేస్తున్నట్లు మండలి తెలిపింది.⇒ స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత లీడింగ్ రియాక్టివ్ ఎనర్జీ (కెపాసిటర్) కారణంగా వినియోగదారులు ఇప్పటికే చెల్లించిన అదనపు బిల్లులను ఉపసంహరించుకోవాలని డిస్కంలను ఆదేశించింది.⇒ అలా వసూలు చేసిన అదనపు మొత్తాలను సంబంధిత వినియోగదారులకు తర్వాతి నెలల విద్యుత్ వినియోగ బిల్లులలో సర్దుబాటు చేయాలని సూచించింది. -
ఏపీలో అరాచక పాలన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను ఎండగట్టారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసి తగులబెట్టారని ఆరోపించారు. వందల మంది తమ పార్టీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని, ఇళ్లను దహనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమకు మద్దతుగా ఉందన్న ధీమాతోనే చంద్రబాబు ప్రభుత్వం ఇంతటి అరాచకానికి తెగబడుతోందని విమర్శించారు. ఏపీలో కనీసం ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రిని కోరారు. రైతులకు తీరని అన్యాయం.. పీఎం కిసాన్ను పెంచండి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిందని మండిపడ్డారు. దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, 2019 నుంచి రైతులకు ఇస్తున్న రూ.6 వేలు ’పీఎం కిసాన్’ సాయం ఏమాత్రం సరిపోవడం లేదని బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని కనీసం రూ.9 వేలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బాబు మోసం.. పథకాలన్నీ బంద్! గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులకు ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందించి ఆదుకుందని, కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికల్లో రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు మొండి చేయి చూపించారని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రీమియం చెల్లించి అమలు చేసిన ’ఉచిత పంటల బీమా’ పథకాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని, దీనివల్ల 74 శాతం మంది రైతులు బీమా అర్హత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.చిన్న, సన్నకారు రైతులకు వరంలా ఉన్న ఉచిత బోరు బావుల పథకాన్ని కూడా నిలిపివేశారని, పాడి రైతులకు ఇచ్చే లీటరుకు రూ.4 బోనస్ను, కోల్డ్ స్టోరేజీల సబ్సిడీలను ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు (పీపీపీ మోడల్) చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, దీనిపై కోటి సంతకాలతో గవర్నర్కు వినతిపత్రం ఇచ్చామని, కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని ప్రైవేటీకరణను ఆపాలను పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరారు. -
ఖజానాకు గండికొట్టి.. పచ్చజేబులు నింపుకొంటూ..
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కల్తీ, అక్రమ మద్యం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్లను, బెల్టుషాపులను టీడీపీ సిండికేట్, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నడుపుతున్నారు. ఈ కల్తీ, నకిలీ మద్యం పచ్చ నేతల జేబులు నింపుతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. దీనికితోడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా మందుబాబుల ఆరోగ్యం క్షీణించడంతోపాటు రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడుతోంది.అదే సమయంలో పచ్చ చొక్కాల జేబులు మాత్రం కాసులతో ఫుల్గా నిండుతున్నాయి. గతంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ప్రభుత్వ ఖజానాకు ఎక్సైజ్ రాబడి ఏకంగా 13 శాతం క్షీణించడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతుల సమావేశంలో స్వయంగా ఆర్థిక శాఖ ప్రజెంటేషన్ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.అంతే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఎక్సైజ్ రాబడి పెరుగుతుండగా అందుకు పూర్తి విరుద్ధంగా రాష్ట్రంలో మద్యం ఆదాయం తగ్గిపోతోందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎక్సైజ్ రాబడులు ఝార్ఖండ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో భారీ వృద్ధి సాధించగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్సైజ్ ఆదాయం తిరోగమనంలో ఉంది. ‘పెద్దల’ మనసెరిగి.. ఎక్సైజ్శాఖ మౌనం మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరగకపోగా తగ్గిపోవడానికి ప్రధాన కారణం పచ్చబాబులు కల్తీ, అక్రమ మద్యం యథేచ్ఛగా విక్రయించి సొమ్ము చేసుకోవడమేనని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పడం గమనార్హం. అయితే అక్రమ మద్యం తయారీ విషయం ఎక్సైజ్ శాఖలోని కీలక అధికారులకు తెలిసినప్పటికీ ప్రభుత్వ పెద్దల మనసెరిగి మౌనం వహిస్తున్నారనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఎక్సైజ్ ద్వారా రాబడి రూ.14,380 కోట్లుండగా ఈ ఆర్థిక ఏడాది (2025–26) ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎక్సైజ్ రాబడి రూ.13,114 కోట్లే వచ్చింది. అంటే రూ.1266 కోట్ల మేర ఖజానాకు గండిపడింది. ఈ మొత్తం పచ్చ బాబుల జేబుల్లోకి వెళ్లినట్లేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.అలాగే జీఎస్టీ రాబడులు కూడా పొరుగు రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో తక్కువగా ఉన్నట్లు ఆర్థిక శాఖ ప్రజెంటేషన్లో స్పష్టం చేసింది. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జీఎస్టీ రాబడులు బీహార్, కర్ణాటక, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వృద్ధి నమోదు కాగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం 0.04 శాతం క్షీణత నెలకొందని ఆర్థిక శాఖ పేర్కొంది. -
చిరుతల దాడిలో నలుగురికి గాయాలు
శింగనమల(నార్పల): మూడు చిరుతలు ఒకే రోజు వేర్వేరుగా దాడులు చేయడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. వివరాలు.. శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మమ్మ పొలం వద్దకు వెళ్లగా చిరుత దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. ఆమె గట్టిగా కేకలు వేయడంతో పారిపోయింది. స్థానికులు బాధితురాలిని 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు.అలాగే నార్పల మండలం బొందలవాడకు చెందిన కొనంకి నాయుడు తోటలో డ్రిప్పు మందు వదులుతుండగా చిరుత దాడి చేసింది. గట్టిగా కేకలు వేయడంతో అది పారిపోయింది. ఇదే గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, గంగరాజు పొలం వద్దకు వెళ్తుండగా దాడి చేయగా గట్టిగా కేకలు వేయడంతో పారిపోయింది. లక్ష్మీదేవి గాయపడింది. మరో ప్రాంతంలో ఇదే గ్రామానికి చెందిన నారాయణస్వామి గొర్రెలు కాస్తుండగా చిరుత దాడికి దిగగా.. తప్పించుకుని సమీపంలోని వ్యక్తుల వద్దకు పరుగెత్తికెళ్లాడు. గ్రామస్తులు వెళ్లి చూడగా మూడు చిరుతలు పారిపోవడాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే అడవిపిల్లి కనిపించడంతో స్థానికులు చిరుత అనుకుని దాడి చేసి చంపేశారు. అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ అక్బర్, సిబ్బంది బొందలవాడ పరిసరాల్లో పర్యటించారు. చిరుతలను పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటామని, ఎవరూ భయపడవద్దని ప్రజలకు సూచించారు. -
వాస్తవాలను దాచిపెట్టి బాబు రాజకీయం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు వాస్తవాలను దాచిపెట్టి భక్తుల విశ్వాసాలతో రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ చంద్రబాబు దు్రష్పచార కుట్రలకు పాల్పడటాన్ని తప్పుబట్టారు. ఎన్డీడీబీ నివేదికలో జంతు కొవ్వు లేదని సీబీఐ దాఖలు చేసిన చార్జిషిట్లో తేలడంతో ఆత్మరక్షణలో పడ్డ సీఎం, టీడీపీ–జనసేన నేతలు హింసాత్మక రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఎదురుదాడికి దిగారని మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో మేయర్ డాక్టర్ శిరీష, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, నాయిబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పుల్లయ్యతో కలిసి భూమన సోమవారం మీడియాతో మాట్లాడారు. దు్రష్పచారాన్ని నమ్మకపోవడంతో దాడులు.. యానిమల్ ఫ్యాట్ కలిసే అవకాశం లేదని ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టులో ఉందని చార్జిషీట్లో సీబీఐ చాలా స్పష్టంగా పేర్కొంది. ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిపై కూడా ఎన్డీఆర్ఐ తన నివేదికలో జంతుకొవ్వు లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. 2024 జూలైలో నాటి ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీడీబీ నివేదికలో వెజిటబుల్ ఆయిల్ కలిపారని నివేదిక వచ్చిం దన్నారు.అనంతరం సెప్టెంబర్ 23న.. ఎన్డీఆర్ఐ రిపోర్టులో జంతు కొవ్వు కలిసిందని వచ్చిందంటూ చంద్రబాబు ఒత్తిడితో ఈవో మాట మార్చారు. ప్రజలు తమ దు్రష్పచారాన్ని నమ్మకపోవడంతో నెయ్యిలో కల్తీ దొంగలు అంటూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలతో దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ముఠా 3 వేల మంది రౌడీ మూకలతో అంబటి ఇంటిపై దాడికి దిగి హత్యాయత్నానికి పాల్పడింది. అసాంఘిక శక్తులను ఉసిగొల్పి పెట్రోలు బాంబులు విసిరి జోగి రమేశ్ నివాసానికి నిప్పంటించారు. రాష్ట్రమంతటా ఇదే విధ్వంసకర రాజకీయాలకు సన్నద్ధం అవుతున్నారు. బాబు హయాంలోనే భోలేబాబాకు అనుమతి.. నెయ్యిలో జంతుకొవ్వు కల్తీ జరగలేదని సీబీఐ నివేదికలో తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో అప్పటి పాలకమండలి అధ్యక్షుడు, సభ్యులు, ఉన్నతాధికారుల ప్రమేయం లేదని పేర్కొంది. టీడీపీ హయాం నుంచి ఉన్న కొద్ది మంది సాంకేతిక నిపుణులు నెయ్యి సరఫరాదారులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని అదే నివేదికలో స్పష్టం చేసింది. భోలేబాబా డెయిరీ 2018 వరకు హర్‡్ష ఫ్రెష్ పేరుతో టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ కంపెనీకి నెయ్యి సరఫరా టెక్నికల్ శాంక్షన్ ఇచ్చారు. కేజీ నెయ్యి రూ.291 చొప్పున సరఫరాకు అనుమతించారు. ఇక ప్రీమియర్ డెయిరీకి కూడా చంద్రబాబు హయాంలోనే అత్యధిక పర్యాయాలు నెయ్యి సరఫరాకు అనుమతి ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భోలేబాబాను డిస్ క్వాలిఫై చేశాం. నాణ్యమైన నెయ్యిని సరఫరా చేసేలా కఠినమైన నిబంధనలు అనుసరించాం.టీటీడీ సొంతంగా నెయ్యి ఉత్పత్తి చేసేలా..సాహి, గిర్ లాంటి ఉత్తమ ఆవులను దాతల విరాళాల ద్వారా టీటీడీకి సమకూర్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. ఆవుల ఉత్పత్తి కేంద్రంలో పెయ్య దూడలు జని్మంచేలా, టీటీడీ సొంతంగా నెయ్యి ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎన్డీడీబీ సహకారంతో అప్పటివరకు అందుబాటులో లేని బీటా సైట్స్ టెరాలసిస్ టెస్ట్ మిషనరీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి టెండర్లు పిలిచాం.కల్తీ జరిగిందని ఈవో శ్యామలరావు వెనక్కి పంపినవి.. యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు చెబుతున్న నాలుగు ట్యాంకర్ల నెయ్యిని కూటమి ప్రభుత్వంలోనే వాడారు. అంటే మీరు చెబుతున్నట్లుగా.. మీ ప్రభుత్వ హయాంలోనే పందికొవ్వు నెయ్యితో తయారు చేసిన లడ్డూలు తయారు చేశారా? ఆ నాలుగు ట్యాంకర్లలో కలిసింది పందికొవ్వు కాదని సీబీఐ తేల్చి చెప్పినా.. చంద్రబాబు మాత్రం పదే పదే జంతు కొవ్వులు కలిశాయని ఆరోపణలు చేస్తున్నారు. మీ అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదని హింసను ప్రేరేపించడం ఎంతవరకు సమంజసం? మీకంటే దైవ ద్రోహి ఇంకెవరు చంద్రబాబూ?. -
జంగిల్రాజ్పై జనాగ్రహం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో జంగిల్రాజ్ అరాచకాలను... అధికార మదంతో టీడీపీ గూండాలు, అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంస కాండను... తమ పార్టీ నేతలపై టీడీపీ గూండాలు, పచ్చ మూకలు చేస్తున్న దాడులను, చంద్రబాబు ప్రభుత్వ అక్రమ అరెస్టులను వైఎస్సార్సీపీ తీవ్రంగా పరిగణించింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ గూండాల చేతిలో హత్యాయత్నానికి గురైన అంబటి రాంబాబు కుటుంబాన్ని బుధవారం పరామర్శించనున్నారు. అలాగే టీడీపీ పచ్చ మూకలు శుక్రవారం నిప్పు పెట్టిన జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశమై టీడీపీ మూక దాడులపై మండిపడ్డారు. జంగిల్ రాజ్యాధిపతి చంద్రబాబు అరాచకాలు, ఆ పార్టీ నేతల గూండాగిరిని జాతీయ స్థాయిలో ఎండగడతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడంతోపాటు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇంకోవైపు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ అరాచకాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు, బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్లపై జరిగిన దాడులను ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కాపు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జంగిల్ రాజ్కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు బీసీ, ప్రజా సంఘాలు, కాపు నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి చంద్రబాబు ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. వెంటనే చంద్రబాబు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఉత్తరాంధ్రలో నిరసనల వెల్లువ.. టీడీపీ జంగిల్రాజ్కు వ్యతిరేకంగా, తిరుమల లడ్డూపై పచ్చ మూక చేస్తున్న దు్రష్పచారానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పార్టీ నేతలు, ప్రజా సంఘాలు, బీసీ నేతలు నిరసనకు దిగారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అండ్ కో సాగిస్తున్న అసత్య ప్రచారం... బాబు అబద్ధాలకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణకు సోమవారం వినతిపత్రమిచ్చారు. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ సిట్ నివేదిక ఇచ్చినా ఇంకా టీడీపీ నేతలు అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ దు్రష్పచారం సాగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నెల్లూరు నగరంలోని వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. కర్నూలు, నంద్యాలలో టీడీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పోలీసు స్టేషన్లో సీఐ వీరా నాయక్కు పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వారం రోజులుగా ఆటవిక, రాక్షస పాలనను తలపించేలా కూటమి ప్రభుత్వ పాలన ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ విమర్శించారు. దాడులు అరికట్టాలని పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఒంగోలులో ఇన్చార్జి చుండూరి రవిబాబు, కనిగిరిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై టీడీపీ గూండాలు చేసిన దాడులకు నిరసనగా సోమవారం అనంతపురం జిల్లా పరిషత్ ప్రాంగణంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేశారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే దాడులతో అరాచకం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, తదితరులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంతకుముందు నేతలు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. రెడ్బుక్ పాలనే... ప్రజా పాలన లేదుతిరుపతిలో జ్యోతిరావ్పూలే విగ్రహం వద్ద బీసీ సంఘ నాయకులు ఆందోళన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్షతో రెడ్బుక్ పాలనే తప్ప, ప్రజా పాలన సాగించడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ నాయకుడు తొండమల్ల పుల్లయ్య, జిల్లా అధ్యక్షులు చిన్నియాదవ్, వాసుయాదవ్ ఆరోపించారు. మాజీ మంత్రులు జోగి రమేశ్, అంబటి రాంబాబు ఇళ్లపై కూటమి గూండాలు చేసిన దాడులను ఖండిస్తూ సోమవారం తిరుపతి బాలాజీకాలనీలోని జ్యోతిరావ్పూలే విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా రాజకీయ కక్షలు మానడంలేదని, రెడ్బుక్ పాలన సాగిస్తూ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణలు సీబీఐ నివేదికతో పటాపంచలయ్యాయన్నారు. అందువల్లే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. -
రాష్ట్రాన్ని ‘జంగిల్ రాజ్’ చేశారు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ చేశారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు దుర్మార్గాలను జాతీయ స్థాయిలో ఎండగడతామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలు సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. పార్టీ స్టేట్ కో– ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు భేటీ అయ్యారు. రెండున్నర గంటలు జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు, అంబటిపై హత్యాయత్నం ఘటనలపై చర్చ జరిగింది.చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయని నేతలు అన్నారు. చంద్రబాబు దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాష్ట్రంలో పరిణామాలను జాతీయ స్థాయికీ తీసుకెళ్లాలని నిర్ణయించారు. తిరుమల శ్రీవారి భక్తుల మనసులను చంద్రబాబు గాయపర్చారని, ఆయనకు ఏ మాత్రమైనా పాపభీతి ఉంటే వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తప్పులను ప్రశి్నస్తున్నందుకే వైఎస్సార్సీపీ నేతలపైన కుట్రలకు పాల్పడుతున్నారని తెలిపారు. మూడు రోజుల్లో ముగ్గురు మాజీ మంత్రులు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై దాడులు చేశారని, అంబటి రాంబాబుపై ఏకంగా హత్యాయత్నం చేశారని, ఇవి చాలా దారుణ ఘటనలని అన్నారు.ఇలా దాడులతో భయపెడితే ఎవ్వరూ ప్రశ్నించరని చంద్రబాబు అనుకుంటున్నారని, కానీ, అది ఆయన అవివేకమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు పూర్తిగా దెబ్బతీశారన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పూర్తిగా చెడిపోయిందని తెలిపారు. రక్షణ కోసం పార్టీ నాయకులు గంటల తరబడి ఫోన్లు చేసినా పోలీసు అధికారులు స్పందించకపోవడం ఆ వ్యవస్థ దిగజారిపోయిందనడానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇక సామాన్యులకు ఏం రక్షణ కల్పిస్తారని, పైగా బాధితులపైనే కేసులు పెడుతున్నారని చెప్పారు.అంబటి రాంబాబు ఇంటిపై ఆ స్థాయిలో దాడి జరిగినా, ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని నేతలు మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, మేరుగు నాగార్జున, కారుమూరు నాగేశ్వరరావు, మాజీ ఎంపీ మార్గాని భరత్, నేతలు కరణం ధర్మశ్రీ, దేవినేని అవినా‹Ù, పూనూరు గౌతమ్ రెడ్డి, వరికూటి అశోక్ బాబు, దూలం నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, నూరి ఫాతిమ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్షి్మ, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్ పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యనేతలు ఏమన్నారంటే.. ఇంతటి దుర్మార్గాలు ఎప్పుడూ చూడలేదు : బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలు నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రాజకీయంగా ప్రశ్నించే వారిపై చంద్రబాబు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఎవరో ఏదో చేస్తారని భయపడే రోజులు లేవు. అలా భయపడే వారెవరూ ఇక్కడ లేరు. ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలు చేపడతాం. పెట్రోలు బాంబులు వేయడం అనే విష సంస్కృతిని చంద్రబాబు మళ్లీ తెచ్చారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. తిరుమల లడ్డూపై చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలను దేశమంతా తప్పుపడుతోంది. క్షమాపణ చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు బాబు అరాచకాలు ఢిల్లీలో ఎండగడతాం : సజ్జల రామకృష్ణారెడ్డి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు విడతలవారీగా ఐదున్నర గంటల పాటు దాడులకు తెగబడ్డారంటే పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించారో అర్థం అవుతోంది. మరుసటి రోజే జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే గంటల తరబడి దాడులు జరగడం శృతి మించిన అరాచకాలకు నిదర్శనం. తిరుమల లడ్డూ విషయంలో అబద్ధాలు రుద్దడంలో ఫెయిల్ కావడంతో, డైవర్షన్ కోసం ఇలా అడ్డదారిలో బరి తెగించారు. ఇవన్నీ ఢిల్లీలో ఎండగడతాం. కేంద్ర హోం శాఖ దృష్టికి కూడా తీసుకెళ్తాం.ప్రభుత్వ దుర్మార్గాలపై పార్టీ నాయకులంతా ఒక్కటై పోరాడతారు. విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడుపై దాడుల ఘటనల్లోనూ పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వీటన్నింటిపై కోర్టుల్లో దావా వేస్తాం. జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్చార్సీ) దృష్టికి కూడా తీసుకెళ్తాం. లడ్డూ విషయంలో చంద్రబాబు క్షమాపణ చెప్పేవరకు వదిలి పెట్టేది లేదు. ఫ్లెక్సీలపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు మంగళవారమూ కొనసాగుతాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన బాబు: కారుమూరు నాగేశ్వరరావు చంద్రబాబు మానవ హక్కులు హరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించి పోస్టర్లు వేస్తూ, జంతు కొవ్వు కలిసిందని వారు చేసిన ఆరోపణలు నిజమని నమ్మించే కుట్రలు చేస్తున్నారు. తిట్టకపోయినా తిట్టారనే రకం చంద్రబాబు: గుడివాడ అమర్నాథ్ అంబటి రాంబాబు వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి, రోడ్డుపై వెళ్తుంటే టీడీపీ క్యాడర్ రెచ్చగొట్టిందని, ఆ ఇన్సిడెంట్లో అలా మాట్లాడకుండా ఉండాల్సిందని రాంబాబు ఒప్పుకున్నా టీడీపీ దౌర్జన్యం చేసింది. ఏమీ తిట్టకపోయినా తనను తిట్టారంటూ రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు. పక్కా ప్లాన్ ప్రకారమే దాడులు: మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వ తప్పిదాలు, అరాచకాలు, అవినీతిపై గట్టిగా ప్రశ్నించే వారు ఎప్పుడు దొరుకుతారా అని చంద్రబాబు, లోకేశ్ ఎదురు చూస్తున్నారు. మా పార్టీ క్యాడర్ను భయపెట్టాలనే లోకేశ్ పన్నాగం పన్నారు. అయినా మేమంతా చాలా ధైర్యంగా నిలబడ్డాం. ఇంకా నిలబడతాం. -
బాబు కుతంత్రం.. సీబీఐ తేల్చినా.. తప్పుడు ప్రచారమే!
సాక్షి, అమరావతి: బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు బరి తెగించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ దారుణమైన ఆరోపణలు చేశారు. ఇందులో ఏమాత్రం నిజం లేదని ప్రఖ్యాత ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు నిర్వహించిన పరీక్షల్లో నిర్థారణ కావడం.. సాక్షాత్తూ సీబీఐ కూడా దర్యాప్తులో అదే విషయాన్ని తేల్చి న్యాయస్థానానికి నివేదించడంతో దిక్కు తోచని చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయిస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్డీడీబీ) పరీక్షల్లో నిర్ధారణ అయినట్టు చంద్రబాబు చెబుతుండటం విస్తుగొలుపుతోంది. తన రాజకీయ స్వార్థం కోసం ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి తెగబడుతున్నారు.టీటీడీ నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేదని నిర్థారిస్తూ 2025 మార్చి 27న ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక ఇవ్వగా.. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ ల్యాబొరేటరీ 2025 మే 16న రిపోర్టు ఇచ్చింది. అదే విషయాన్ని తన దర్యాప్తులో నిర్థారిస్తూ, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని పేర్కొంటూ సీబీఐ ఈ ఏడాది జనవరి 23న న్యాయస్థానంలో చార్జిషీట్ను సమర్పించింది. అయినా సరే.. ఏమాత్రం పాపభీతి లేకుండా.. దేశంలో ఏ ముఖ్యమంత్రీ సాహసించని రీతిలో చంద్రబాబు మళ్లీ అవే అబద్ధాలాడుతున్నారు. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ నియమించిన సిట్ తేల్చిచెప్పినా... లెక్క చేయకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.చేసిన పాపానికి క్షమాపణలు చెప్పి చెంపలు వేసుకోవాల్సిందిపోయి రాజకీయ కుట్రలతో చంద్రబాబు మరింత దిగజారి వ్యవహరిస్తుండటం పట్ల శ్రీవారి భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హైందవ ధర్మం, కలియుగ దైవం తిరుమల శ్రీవారి పట్ల ఏమాత్రం భయభక్తులు లేకుండా చంద్రబాబు అసత్యాలు వల్లిస్తుండటం.. లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేందుకు కుతంత్రాలకు పాల్పడటం పట్ల కన్నెర్ర చేస్తున్నారు. ఈ దారుణమైన అబద్ధాలు, నిందలను ప్రశ్నిస్తున్న వారిపై పోలీసుల సమక్షంలోనే దాడులకు పురిగొల్పుతూ ప్రభుత్వ పెద్దలు జంగిల్ రాజ్ పాలన సాగిస్తున్నారు. ఈ అరాచకాలను స్వయంగా పర్యవేక్షిస్తూ కుట్రలకు పదును పెడుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. సీబీఐ తేల్చిచెప్పినా అదే కుట్రా బాబూ! ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యా»ొరేటరీల్లో తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, గొడ్డు, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ తన చార్జిషిట్లో స్పష్టం చేసింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలె్రస్టాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ లేదని అంటే.. జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్టేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ విషయాలను జాతీయ మీడియా కూడా ప్రముఖంగా ప్రచురించింది.రాజకీయ స్వార్థంతోనే చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేశారన్నది జాతీయ స్థాయిలో స్పష్టమైంది. అయితే ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే నిరూపిస్తున్నారు. అందుకు తిరుమల లడ్డూ ప్రసాదంపై చేస్తున్న దుష్ప్రచారమే తాజా తార్కాణం. 2024 అక్టోబర్లో మొదలు పెట్టిన ఈ కుతంత్రాన్ని ఏడాదిన్నరగా కొనసాగిస్తుండటం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనం. అందుకే వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఈ కేసు విచారణను చేపట్టింది. వేర్వేరు ట్యాంకర్ల నుంచి సేకరించిన నెయ్యి శాంపిళ్లను హర్యానాలోని ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్డీఆర్ఐ)లో ల్యాబరేటరీకి పంపించి పరీక్షించింది. ఆ నెయ్యిలో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదని ఆ పరీక్షల్లో వెల్లడైంది. ఈమేరకు శాస్త్రీయంగా విశ్లేíÙంచి ఎన్డీఆర్ఐ 2025 మే 16న సాధికారికంగా వెల్లడించిన ఆ నివేదికనే సీబీఐ నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్షిట్లో స్పష్టంగా పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రైగ్లిసరైడ్ ప్రొఫైల్’ను పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ చంద్రబాబు కుట్రలడ్డూ ప్రసాదంపై తమ దు్రష్పచారం బెడిసికొట్టడంతో చంద్రబాబు కంగు తిన్నారు. దాంతో రెండు రోజుల పాటు మౌనంగా ఉన్న ఆయన మళ్లీ అదే కుట్రను పదును పెట్టడం గమనార్హం. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్డీడీబీ నివేదిక వెల్లడించడంతోనే తాను అలా మాట్లాడానని ఆయన చెప్పుకొచ్చారు. తద్వారా ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ దు్రష్పచార కుట్రకు తెగబడుతున్నారు. వాస్తవానికి నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలసి ఉండొచ్చని ఎన్డీడీబీ నివేదిక అభిప్రాయపడింది. అంటే మొక్కల నుంచి వచ్చే వెజిటబుల్ ఫ్యాట్నే ఫారిన్ ఫ్యాట్ అని కూడా చెబుతూ నివేదికలో అభిప్రాయపడింది. అది సర్వసాధారణ అంశమే. పశువులు తినే మొక్కలు, దాణాను బట్టి అది ఆధారపడి ఉంటుందని ఆహార శాస్త్ర నిపుణులే చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.కానీ చంద్రబాబు మాత్రం ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే టీటీడీ నెయ్యిపై దు్రష్పచారం కొనసాగిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతు, చేప కొవ్వు కలిపే అవకాశం లేనే లేదని గుజరాత్లోని ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైంది. అదే విషయాన్ని 2025 మార్చి 27న సీబీఐకి నివేదించింది. సీబీఐ ఇటీవల నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషిట్లోనూ అదే విషయాన్ని స్పష్టంగా పొందుపరిచింది. టీటీడీ నెయ్యిలో జంతు, చేప కొవ్వు కలిసే అవకాశమే లేదని చార్జీషిట్లోని 208వ పేజీలో పేర్కొంది. అయినాసరే చంద్రబాబు ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ లడ్డూ ప్రసాదంపై దుష్పచ్రార కుట్రలను కొనసాగిస్తున్నారు. ఎన్డీడీబీ చెప్పని విషయాలను చెప్పినట్లుగా పదేపదే విష ప్రచారం చేస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. అదే నిజమైతే సీబీఐ ప్రస్తావించేది కదా! లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్డీడీబీ నివేదిక వెల్లడించి ఉంటే... సీబీఐ తన చార్జ్షిట్లో ఆ విషయాన్ని ప్రస్తావించేది కదా అని నిపుణులు చెబుతున్నారు. కానీ 219 పేజీల చార్జ్షిట్లో సీబీఐ ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. ఎన్డీడీబీ నివేదిక గురించి కూడా చార్జ్షిట్లో ప్రస్తావించింది.. కానీ టీటీడీ నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైనట్టు ఎక్కడా పేర్కొననే లేదు. అదే సమయంలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ ఇచ్చిన నివేదికనే సీబీఐ తన చార్జ్షిట్లో ప్రముఖంగా పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ జంతు కొవ్వు కలవలేదన్న వాస్తవాన్ని అంగీకరించేందుకు చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా ఏమాత్రం ఇష్టపడటం లేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు. -
అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను కలవనున్నారు. బుధవారం అంబటి రాంబాబు కుటుంబాన్ని, శుక్రవారం జోగి రమేష్ కుటుంబాన్ని కలిసి పరామర్శించనున్నారు. ఇటీవల అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ గూండాలు దాడి చేసి నిప్పు పెట్టిన ఘటన పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలతో చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ ఈ పరామర్శలు చేయనున్నారు. -
రాజమండ్రిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రిలోని రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. దీంతో, బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.వివరాల మేరకు.. రాజమండ్రిలోని రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై సోమవారం సాయంత్రం రెండు పల్సర్ బైక్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదం కారణంగా బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి రాజమండ్రి టూ టౌన్ పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. -
Tirumala Laddu Row : ఫ్రస్టేషన్లో పవన్ కళ్యాణ్
సాక్షి,గుంటూరు: తిరుమల లడ్డూ కల్తీ జరగలేదంటూ సీబీఐ ఇచ్చిన రిపోర్టు, ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లో ఫ్రస్టేషన్ పెరిగిపోతుందా? అంటే అవుననే అంటున్నారు జనసేన పార్టీ నేతలు. అందుకు ఇవాళ గుంటూరులో జరిగిన జనసేన జనరల్ బాడీ మీటింగ్ వేదికైందని గుసగుసలాడుకుంటున్నారు. సోమవారం గుంటూరులో జనసేన జనరల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో అలిగి సమావేశం నుంచి వెళ్లిపోయారు. లడ్డూ వ్యవహారంలో తిప్పికొట్టలేకపోతున్నామంటూ పవన్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం, సమావేశం నుంచి వెళ్లిపోయారు. -
జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి.. పోలీసుల హైడ్రామా
సాక్షి,ఎన్టీఆర్: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై బాంబు దాడి ఘటనలో పోలీసులు హైడ్రామా క్రియేట్ చేశారు. జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన వారిపై పోలీసులు డమ్మీ కేసులు నమోదు నమోదు చేశారు. వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై వందలాది టీడీపీ గూండాలు దాడికి దిగారు. పెట్రోల్ బాంబులు విసిరారు. మారణాయుధాలు, రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. అయితే, జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టి, దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలు ఫతావుల్లా, మాధవ్, ఆశ సహా పలువురి అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం, వారిపై బెయిల్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోగి రమేష్ ఇంటిపై దాడి చేసేందుకు విజయవాడ నుంచి టీడీపీ గూండాలు వెళ్లడం,వారిని అరెస్టు చేసి బెయిల్ ఇవ్వడంపై పోలీసులు క్రియేట్ చేసి హైడ్రామాను చూసి నవ్వుకోవడం ప్రజల వంతైంది. -
జోగి రమేష్ ఇంటిపై దాడి.. హైకోర్టు కీలక ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాల దాడి నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జోగి రమేష్ ఇంటికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జోగి రమేష్ ఇంటి వద్ద ఎలాంటి దాడులు జరిగినా పోలీసులలే బాధ్యత అని తెలిపింది.కాగా, తమకు భద్రత కల్పించాలని జోగి రమేష్ కుమారుడు.. ఏపీలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. జోగి రమేష్ ఇంటి వద్ద భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ దాడులు జరిగితే పోలీసులదే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనలో ఇబ్రహీంపట్నం పోలీసుల హై డ్రామాకు తెరలేపారు. దాడికి పాల్పడిన వారిపై డమ్మీ కేసులు నమోదు చేసి 11 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం, వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వారిని ఇబ్రహీంపట్నం పోలీసులు వదిలేశారు. 11 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను విడుదల చేశారు. టీడీపీ నేతలు ఫతావుల్లా, మాధవ్, ఆశ సహా పలువురిని అరెస్ట్ చేసి వదిలిపెట్టారు. వీరంతా విజయవాడ నుండి దాడికి వెళ్లిన టీడీపీ నేతలు కావడం గమనార్హం. -
‘కూటమి నేతల అరాచకాల్ని ఎదుర్కొంటాం’
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనలో టీడీపీ గూండాలకు పోలీసులకు రక్షణగా నిలిచారని వైఎస్సార్సీపీ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదుగంటల పాటు పోలీసుల సమక్షంలో అరాచకం రాజ్యమేలిందని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై టీడీపీ గూండాల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిపై పరామర్శించేందుకు జోగి రమేష్ ఇంటికి సజ్జలతో పాటు ఇతర వైఎస్సార్సీపీ నేతలు వెళ్లారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. గుంటూరు పోలీసుల సమక్షంలో అంబటి రాంబాబు ఇంటిపై దాడులు చేశారు. గుంటూరులో టీడీపీ గూండాలు ఏం చేశారో రాష్ట్రప్రజలు చూశారు. టీడీపీ గూండాలకు పోలీసులు రక్షణగా ఉన్నారు. అంబటిని కలిసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు యత్నించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన పార్టీ నేతల్ని అడ్డుకున్నారు. మాజీ హోంమంత్రి ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదు. బాధితుడినే పోలీసులు అరెస్టు చేశాను. మా నేతలను ఎస్పీ కార్యాలయంలో ఎదుట గంట సేపు ఎదురు చేయించారు. ప్లాన్ ప్రకారం అంబటి రాంబాబు,జోగి రమేష్ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. టీడీపీ గూండాలను పోలీసులు కంట్రోల్ చేస్తున్నట్లు యాక్ట్ చేశారు. జోగి రమేష్ కుటుంబానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు?’. అంబటి,జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసిన గూండాలపై కేసులు పెట్టలేదు. దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టలేదు. కూటమి నేతల అరాచకాల్ని ఎదుర్కొంటాం. కూటమి అరాచకాల్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. చంద్రబాబు వైఎస్సార్సీపీ శ్రేణులు,నేతల్ని బెదిరింపులు, దాడులు చేసి బెదిరించాలని అనుకోవద్దు. అలా అనుకుంటే భ్రమే అవుతుంది’అని వ్యాఖ్యానించారు. -
ఏపీలో రూల్ ఆఫ్ లా అంటే ఇదేనేమో?
చిత్తూరు, సాక్షి: అధికారం చేతుల్లో ఉందని అరాచకాలకు పాల్పడుతోంది తెలుగు దేశం పార్టీ. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడుతోంది. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే ఈ దాడులని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక.. వైఎస్సార్సీపీ నేతలపై, ఆఫీస్లపై జరిగిన దాడులను నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రస్తావించారు. తాజాగా జరిగిన అంబటి రాంబాబు, జోగిరమేష్ ఇళ్లపై దాడులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. గతంలో వలభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, సీనియర్ నేత ముద్రగడ, అలాగే మరో సీనియర్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, చిత్తూరు రెడ్డప్ప నివాసాలపై జరిగిన దాడుల్ని ప్రస్తావించారామె. కామిరెడ్డి నాని, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అబ్బయ్య చౌదరి, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిపై కూటమి పార్టీల శ్రేణులు దాడి చేశాయని గుర్తుచేశారు. దాడిశెట్టి రాజా, ఉప్పల హారికా-ఉప్పల రాము, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడితో పాటు విడదల రజిని.. దేవినేని అవినాష్ పై దాడికి యత్నించారని రోజా అన్నారు. మార్గాని భరత్ ఆఫీస్పై, నంబూరి శంకర్రావు ఆఫీసుపై, హిందూపుర్ వైసీపీ ఆఫీస్లపై దాడి ఘటనలను ప్రముఖంగా ప్రస్తావించారు. వీటన్నింటితో పాటు తనపైనా ఆర్పీని(జబర్దస్త్ కిర్రాక్ ఆర్పీ) పెట్టి బూతుల తిట్టించారని అన్నారామె. ఇక.. డెక్కన్ క్రానికల్, సాకక్షి ఆఫీసులపై టీడీపీ అండ్ కో పార్టీలు దాడులు చేశాయని.. చంద్రబాబు చెబుతున్న రూల్ ఆఫ్ లా అంటే ఇదేనా? అని రోజా ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై జరిగిన దాడులుఅంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారుజోగిరమేష్ ఇంటిపై దాడి చేశారువలభనేని వంశీ ఇంటిపై దాడి చేశారుకొడాలి నాని ఇంటిపై దాడి చేశారుపెర్ని నాని ఇంటిపై దాడి చేశారు.ముద్రగడ ఇంటిపై దాడి చేశారునల్లపురెడ్డి ప్రశన్న కుమార్ రెడ్డి…— Roja Selvamani (@RojaSelvamaniRK) February 2, 2026 -
నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు : ఎవరో తెలుసా?
భారతదేశంలో లగ్జరీ స్టేటస్ సింబల్స్ చాలా ఉన్నాయి. వీటి గురించి ఔరా అనిపించే కథనాలు కూడా గతంలో చాలా విన్నాం కూడా. ముఖ్యంగా ఇండియాలో వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఖర్చు చేయడం ఒక విలాసం మాత్రమే కాదు. ఒక స్టేటస్ సింబల్. ఇపుడొక వ్యక్తి కేవలం ఒక నంబర్ ప్లేట్ కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచారు. అత్యంత ఖరీదైన డీల్గా చరిత్ర సృష్టించిన దీని వివరాలు తెలుసుకుందామా.ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నివాసి కిరణ్ కోల్పాకుల సంచలనం క్రియేట్ చేశారు. దేశ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో తన వాహన నెంబర్ ప్లేట్ కోసం ఒకటీ రెండూ కాదు రూ.2.08 కోట్లు వెచ్చించారు.బిగ్ బాయ్ టాయ్జ్ (BBT) వేలం యాప్ ద్వారా ‘DDC 0001’ అనే ఐడెంటిఫైయర్ ఉన్న వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్ రూ. 2.08 కోట్లకు బిడ్ అయింది. ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు అదుకే ఈ నంబర్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సంపన్నులు పోటీ పడ్డారు. ఎట్టకేలకు కిరణ్ వింటేజ్ నంబర్ ప్లేట్ను ఏకంగా రూ.2.08 కోట్లకు వేలంలో దక్కించు కున్నారు ఇది దేశంలో ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్గా నిలిచింది. ఈ వేలం ప్రధానంగా లగ్జరీ ప్రీ-ఓన్డ్ కార్లకు ప్రసిద్ధి చెందిన బిగ్ బాయ్ టాయ్స్కుప్రత్యేకంగా నిలిచింది.అలాగే అరుదైన వస్తువులను సేకరించేవారు ఎంత ధరకైనా వెనకాడరని ఈ డీల్ నిరూపించింది.ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?DDC 0001 ప్లేట్ను మొదట తొలి ఓనర్, కంపెనీ వ్యవస్థాపకుడు జతిన్ అహుజా. బిగ్ బాయ్ టాయ్స్ ఇటీవలే తన కొత్త విభాగం ఆక్షన్ హౌస్ను లాంచ్ చేసింది. ఈ వేదిక ద్వారా అత్యంత అరుదైన, విలాసవంతమైన వస్తువులను వేలం వేస్తుంది. గత సంవత్సరం, రూ.1.17కోట్లకు 'HR 88 B 8888' ప్లేట్ అమ్మకం చివరికి బిడ్డర్ చెల్లించడంలో విఫలమై నందున రద్దైంది. తరువాత దానిని రూ.26.7 లక్షలకు తిరిగి అమ్మారు. ఇపుడిక రూ.2.08 కోట్లకు DDC 0001 వేలం కొత్త రికార్డు సృష్టించింది.బిగ్ బాయ్ టాయ్స్ ఆక్షన్ హౌస్ కేవలం నంబర్ ప్లేట్లు మాత్రమే కాకుండా, ప్రముఖ సెలబ్రిటీలు వాడిన లగ్జరీ కార్లను కూడా వేలంలో ఉంచింది. ఇందులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి చెందిన మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600, ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టికి చెందిన మెర్సిడెస్ బెంజ్ CLA 200d, క్రికెటర్ దినేష్ కార్తీక్ కు చెందిన రేంజ్ రోవర్ స్పోర్ట్ SVR వంటి కార్లు ఉన్నాయి. ఇదీ చదవండి: బంగారం చూస్తే అలా..వీడేమో ఇలా! -
బండబూతులు తిడుతూ దాడి చేశారు: అంబటి కుమార్తె
సాక్షి, గుంటూరు: తమపై పక్కా ప్లాన్ ప్రకారమే మా ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక. తీవ్రమైన పదజాలంతో దాడులకు పాల్పడినట్టు చెప్పుకొచ్చారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు అని మండిపడ్డారు. అక్కడే ఉండి కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక తాజాగా గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘మహిళలపై దాడులను హోంమంత్రి అనిత సమర్థిస్తారా?. కాపు మహిళలైన మాపై కూడా దాడులు చేశారు. బండబూతులు తిడుతూ లకారాలతో మాపై దాడులకు పాల్పడ్డారు. తాను అన్నది చంద్రబాబును కాదని మా నాన్న క్లియర్గా చెప్పారు. గతంలో చంద్రబాబు కూడా వైఎస్ జగన్ను అనేక సార్లు అనరాని మాటలు అన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవికి ఏ నైతిక విలువలు ఉన్నాయి?. తాగుబోతులను మాపై ఉసిగొల్పారు. మా నాన్నకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఆయన అలా మట్లాడినందుకు క్షమాపణ కూడా చెప్పారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. ఎనిమిది గంటల పాటు మా ఇంటిపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి మాపై దాడులు చేశారు. మహిళల క్షేమం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. మా ఫిర్యాదులను పోలీసులు తీసుకోవడం లేదు. టీడీపీ గూండాలను కంట్రోల్ చేస్తున్నట్టు పోలీసులు యాక్షన్ చేశారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులుగా మాపై దాడి జరుగుతుంది. లడ్డుపై వేసిన పోస్టర్లు చింపడానికి రాంబాబు వెళ్ళలేదు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ కోసం వెళ్లారు. గుడి నుంచి ఇంటికి వస్తుంటే రాంబాబుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అసభ్యకరమైనపై భాషతో కారుపై దాడి చేశారు. ఒక మహిళ మాట్లాడిన మాటలు చూడండి ఆయన్ను రెచ్చగొట్టారు. దీంతో రాంబాబు మాట్లాడిన మాటలు తప్పు అని ఆయనే మీడియా సమావేశం పెట్టి చెప్పారు. అంత దమ్ము ఎవరికి ఉంటుంది. ఇక్కడే ఉంటాను అని చెప్పిన తర్వాత ఆయనపై దాడి చేశారు. కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉన్న ఇంటిపై ఎలా దాడి చేస్తారు. హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. మేము వైఎస్సార్సీపీ అని అధికారంలో లేమని మాపై దాడి చేశారు. దేవుడి లడ్డూ గురించి మాట్లాడారని మా ఇంటిపై దాడి చేశారు.గల్లా మాధవికి కుటుంబం ఉంది. మీకు కుటుంబం ఉంది కదా?. కొంతమంది మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు. మిమ్మల్ని బలి పశువును చేస్తున్నారు. మీ అత్మ సాక్షికే వదిలేస్తున్నాను. రాంబాబు దేని గురించి భయపడరు. మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలను ఉపయోగించి, మహిళలపై దాడి చేస్తున్నారు. రాంబాబు గారిని స్టేషన్లో చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా ఆటవికంగా ఉన్నామని నిరూపించారు. కేంద్రమంత్రి పెమ్మసాని ఒక డాక్టర్.. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. సినిమా చూపించడం అంటే మహిళలపై దాడి చేయడమా?. దీనికి పెమ్మసాని భార్య అను సమాధానం చెప్పాలి. మా భద్రత గురించి మా నాన్న ఆందోళన చెంది ఉంటారు. గల్లా మాధవి డైరెక్షన్తోనే మాపై దాడి చేశారు అని చెప్పుకొచ్చారు. -
అది దాడి కాదు.. నన్ను చంపాలనే ప్లాన్: జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్. తనపై ఎటువంటి దాడి జరిగినా లోకేష్దే బాధ్యత అని చెప్పుకొచ్చారు. తన ఇంటిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడే అని అన్నారు. తనను మట్టుబెట్టాలనే ఆలోచనే లేకపోతే దాడి ఎందుకు చేస్తారు? అని ప్రశ్నించారు. 83 రోజులు జైలులో పెట్టినా కడుపు చల్లబడలేదా చంద్రబాబు అని మండిపడ్డారు.తన ఇంటిపై టీడీపీ నేతల దాడి అనంతరం మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రేరేపిత కుట్రతోనే మా ఇంటిపై దాడి చేశారు. తప్పుడు కేసులో అకారణంగా నన్ను, నా తమ్ముడిని 83 రోజులు జైలులో పెట్టారు. మమ్మల్ని వేధించి, హింసించి రక్షసానందం పొందుతున్నారా?. ప్రజా వ్యతిరేక విధానాలపై నా గొంతుక వినిపించడం తప్పా?. మీరు బూతులు మాట్లాడితే తప్పు లేదు కానీ.. మేం ప్రశ్నిస్తే తప్పా?. మా ఇంటిపై జరిగిన దాడి బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడి అని ఘాటు విమర్శలు చేశారు.ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలోనే గంజాయి, బ్లేడ్ బ్యాచ్ దాడికి దిగింది. నన్ను, నాకుటుంబాన్ని నాశనం చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారా?. మీ బుర్రలు పాడు కాకపోతే మా ఇంటిపైకి దాడులు చేయిస్తారా?. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ గూండాలను రప్పించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలోనే మా ఇంటిపై దాడి చేశారు. పోలీసు అధికారులు, టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే మా ఇంటిపై కుట్ర జరిగింది. టీడీపీ గూండాలకు పోలీసులే రక్షణ ఇచ్చారు. పోలీసుల చేతుల్లో కనీసం లాఠీలు కూడా లేవు. పోలీసుల సమక్షంలోనే.. పోలీసుల సాక్షిగా మా ఇంటిపై దాడి జరిగింది. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షిస్తారు. లోకేష్ నీ రెడ్బుక్ తీసి మడిచిపెట్టుకో. నాపై ఎటువంటి దాడి జరిగినా లోకేష్దే బాధ్యత. నేను నిన్న మాట్లాడినందుకు మళ్లీ నాపై కేసులు పెట్టారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలవలేదని సెంట్రల్ ల్యాబ్లే నిర్ధారించాయి. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని అన్నారు. నాకు అండగా జగనన్న, వైఎస్సార్సీపీ సైన్యం ఉంది. ఏడాదిన్నర కాలంలోనే ప్రభుత్వం అసమర్ధత బయటపడింది. జోగి రమేష్ ఎక్కడికీ పారిపోడు.. ఇక్కడే ఉంటాడు. విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నా. తప్పుడు కేసులకు, అరెస్టులకు భయపడేది లేదు. నా ఇల్లు తగలబెట్టి లోకేష్ దగ్గర మార్కులు కొట్టేద్దామని కొంతమంది సంబరపడుతున్నారు. గుర్తుంచుకోండి.. ఎవరినీ విడిచిపెట్టేది లేదు. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో.. నీ ఇంటికి నా ఇల్లు కూడా అంతేదూరమని లోకేష్ గుర్తుంచుకోవాలి’ అని హెచ్చరించారు. -
చంద్రబాబు ఐదువేల కోట్ల స్కాంపై బొత్స విమర్శలు
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో దమనకాండపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్య నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో.. నారాలోకేష్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడుల్ని బొత్స ఖండించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ సోమవారం (2-2-2026) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత మూడ్రోజులుగా కూటమి సర్కార్ విధ్వాంసానికి పాల్పడింది. పోలీసులే దగ్గరుండి దాడులు చేయిస్తారా? దాడుల్ని ప్రోత్సహించి అప్రతిష్టను మూటగట్టుకోవద్దు చంద్రబాబు. చంద్రబాబు ఏది చెబితే పోలీసులు అది చేస్తారా? రాష్ట్రంలో హింసాకాండ జరుగుతుంటే జనసేన, బీజేపీ ఎందుకు స్పందించలేదు. కేంద్ర మంత్రే స్వయంగా తడాఖా చూపిస్తాం అని అంటున్నారు. కేంద్రమంత్రి హుందాగా వ్యవహరించాలి. తాటాకు చప్పుళ్లకు వైఎస్సార్సీపీ బెదరదు. రాష్ట్రంలో జరిగే దాడులను ప్రజలు గమనిస్తున్నారు.ఇంటిపై పెట్రోల్ బాంబులు వేసి చంపాలని అనుకుంటున్నారా?.ఈ ప్రభుత్వ పనితీరుపై ప్రజలే ఆలోచించాలి. పోలీసులు వారి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలి. తప్పులు చేస్తుంటే దేవుడు క్షమించరు. సంక్షేమాన్ని గాలికొదిలేసి దాడులకు తెగబడతారా?. సంపద సృష్టి పేరుతో వైజాగ్లో ఐదువేల కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టారు. రాష్ట్ర సంపదను కాకుండా తన ఇంటి సంపదను పెంచుకుంటున్నారు’ అని ధ్వజమెత్తారు. -
సుప్రీం కోర్టులో సాక్షి టీవీకి ఊరట
సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో సాక్షి టీవీకి ఊరట లభించింది. ఏపీ ఫైబర్నెట్లో సాక్షి చానెల్ తొలగించడంపై విచారణ జరపాలని డీటీ శాట్ను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో సాక్షిపై కక్షగట్టి.. మీడియా స్వేచ్ఛను హరించాలని చూస్తున్న చంద్రబాబు సర్కార్కు భారీ షాక్ తగిలినట్లైంది. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఏపీ ఫైబర్ నెట్ నుంచి సాక్షి టీవీ చానెల్ను తొలగించారు. పైగా సాక్షి టీవీని ప్రసారం చేయొద్దంటూ ఎంఎస్వోలపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ తొలగింపు వ్యవహారంపై సాక్షి యాజమాన్యం టీడీశాట్, సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో టీడీశాట్కు ఆదేశాలను కూడా ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే.. టీడీశాట్ లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. అవసరమైతే మళ్లీ తమను ఆశ్రయించవచ్చని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యానికి సూచించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ నెల 12న సాక్షి టీవీ పిటిషన్ను టీడీ శాట్ విచారణ జరపనుంది. టీడీశాట్ (TDSAT) అంటే Telecom Disputes Settlement and Appellate Tribunal. ఇది భారతదేశంలో టెలికాం రంగానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి, అప్పీలు వినడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం. -
‘చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు?’
అనంతపురం: కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.... బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగినా ఎందుకు నోరు మెదపడం లేదని మాజీ మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రతిపాదనలు కేంద్రం బుట్టదాఖలు చేసిందని... కేంద్ర బడ్జెట్లో నిధులు రాబట్టడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘెరంగా విఫలమైందని శైలజానాథ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారా అని ఆయన ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు చేయించే బదులు... రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుందని ఆయన హితవు పలికారు. -
‘అసలు ఏపీలో పరిపాలన ఉందా... లేదా?’
శ్రీకాకుళం: ఏపీలో ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తుంటే ఆందోళనకరంగా ఉందన్నారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు ఇప్పుడే చూస్తున్నానన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా.. లేదా? అని ప్రశ్నించారు. ‘అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడి దురదృష్టకరం. అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగితే నిందితులపై జిల్లా ఎస్పీ సైతం కనీస చర్యలు తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కోరుతున్నా. రాష్ట్రంలో అరాచకాల్ని రెచ్చగొడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తిరుమల లడ్డులో కల్తీ లేదు అని సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది.. మళ్ళీ దానిపై రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు?, సిబిఐ రిపోర్ట్ మీరు స్వీకరించి ఇప్పటితో ఈ చేష్టలు వదిలేస్తాం అని చంద్రబాబు అంటే హుందాగా ఉండేది. కోట్లాది మంది ఆరాధ్య దైవం వెంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ జరిగింది అంటే ఎంత దారుణం. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీయడం కాదా?, గీతం యూనివర్సిటీ అక్రమ భూములు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఎంపీ భరత్ మళ్ళీ భూ అక్రమణలకు పాల్పడడం ఎంత దారుణం. ప్రజాస్వామ్య వ్యవస్థను పట్టపగలు నిట్ట నిలువునా ఖూనీ చేశారు. చంద్రబాబు నాయుడిది అటవిక పాలన. అమరావతి కోసం లెక్క లేనంత అప్పు చేస్తున్నారు. మీరు చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లిస్తారు. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ భజన చెయ్యడానికే టైం సరిపోతుంది. కనీసం తప్పును తప్పు అని చెప్పాలి కదా?। అని ప్రశ్నించారు. -
ఎన్డీడీబీని టీటీడీకి పరిచయం చేసిందే వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: తిరుమల లడ్డూ అంశంలో వాస్తవాలను దాచిపెట్టి భక్తుల విశ్వాసాలతో రాజకీయం చేస్తున్న సీఎం చంద్రబాబు తీరుపై వైయస్సారీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీడీబీ నివేదిక ప్రకారం తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న అర్థం వచ్చేలా మాట్లాడ్డాన్ని తప్పు పట్టారు. సీబీఐ సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ ప్రకారం ఎన్డీడీబీ నివేదికలో జంతు కొవ్వు లేదని, తేలడంతో ఆత్మరక్షలో పడ్డ సీఎం, టీడీపీ–జనసేన నేతలు ఎదురుదాడికి దిగారని విమర్శించారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే వైయస్సార్సీపీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని.. అందులో భాగంగానే వైయస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, తన ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నెయ్యి కల్తీ దొంగలు వీరే అంటూ దుష్ప్రచారం చేయడం పక్కా ప్రణాళికతో జరుగుతోందని ఆరోపించారు. ప్రజలు ఈ అబద్ధాలను నమ్మడం లేదన్న అసహనంతోనే వైయస్సార్సీపీ నేతలపై దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినా, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఆయనతో పాటు జోగి రమేశ్ ఇళ్లపై దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సీబీఐ నివేదికలో బయటపడ్డ నిజాలను మరుగునపర్చేందుకే ఈ హింసాత్మక రాజకీయాలు చేస్తున్నారని తేల్చి చెప్పారు. సీబీఐ సిట్ అనుబంధ ఛార్జిషీట్ ప్రకారం, కల్తీ నెయ్యి తయారు చేసిన ప్రధాన నిందితుడు బోలేబాబా డెయిరీ (మాజీ హర్ష్ ప్రెష్ డెయిరీ) చంద్రబాబు హయాంలోనే టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని తెలిపారు. మరో నిందిత సంస్థ ప్రీమియర్ డెయిరీకి కూడా చంద్రబాబు హయాంలోనే 90 శాతానికి పైగా నెయ్యి సరఫరా అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. లడ్డూలో పందికొవ్వు, ఆవుకొవ్వు, చేపనూనె కలిసిందంటూ మాట్లాడటం ద్వారా శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రతిష్టను భంగం కలిగించినది చంద్రబాబు కాదా అని నిలదీశారు. భగవంతుడిని రాజకీయ పావుగా వాడుకున్నది ఎవరో ప్రజలే నిర్ణయిస్తారని తేల్చి చెప్పారు.సీబీఐ సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్లో చాలా స్పష్టంగా ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టులో యానిమల్ ఫ్యాట్ కలిసే అవకాశం లేదని పేర్కొంది. ఆ తర్వాత ఈవో శ్యామలరావు ఏ ఆర్ డెయిరీ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిపై ఎన్ డీ ఆర్ ఐ కూడా తన నివేదికలో జంతుకొవ్వు లేదన్న విషయం స్పష్టం చేసింది. అయినా సీఎం చంద్రబాబు, టీడీపీ, జనసేనలు సీబీఐ తన నివేదికను కోర్టుకు సమర్పించిన తర్వాత ఆత్మరక్షలో పడ్డారు. తామే తప్పు చేశామన్న సంగతి అర్దమై ఎదురుదాడికి దిగారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నెయ్యిలో కల్తీ దొంగలు వీరేనంటూ వైయస్.జగన్, వైవీ సుబ్బారెడ్డితో పాటు నా ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ జనం నమ్మే పరిస్థితి లేకపోవడం ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకొని, పక్కా ప్రణాళికతో వైయస్సార్సీపీ నేతలమీద ఏదో ఒక నెపం మోపి దాడి చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల బూతుపురాణంతో దాడికి దిగితే, దానికి స్పందించిన అంబటి ఆ తర్వాత తన మాటలకు క్షమాపణ చెప్పినా.. సహించలేని చంద్రబాబు ముఠా 3వేల మంది రౌడీ మూకలతో ఇంటిపై దాడి చేశారు. అందులో టీడీపీ నేతలు, కార్యకర్తలే కాకుండా అసాంఘిక శక్తులను కూడా ఉసిగొల్పి అంబటి రాంబాబుతో పాటు జోగి రమేశ్ ఇళ్లపై దాడికి దిగారు.బాబు హయాంలోనే భోలేబాబా డెయిరీకి అనుమతి..రాష్ట్రమంతటా ఇదే విధ్వంసకర రాజకీయం చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. సిట్ నివేదిక ద్వారా నెయ్యిలో జంతుకొవ్వు కల్తీ జరగలేదని తేల్చిచెప్పింది. అప్పటి పాలకమండలి అధ్యక్షుడు, సభ్యులు, ఉన్నతాధికారుల ప్రమేయం ఆ వ్యవహారంలో లేదని సిట్ తన అనుబంధ ఛార్జిషీట్ లో పేర్కొంది. అదే నివేదికలో కొద్ది మంది సాంకేతిక నిపుణులు ఎవరైతో టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి ఉన్న వారే, నెయ్యి సరఫరాదారులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఈ బోలేబాబా డెయిరీ 2018 వరకు హర్ష్ ప్రెష్ డెయిరీ పేరుతో టీటీడికి నెయ్యి సరఫరా చేసింది. అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ కంపెనీకి నెయ్యి సరఫరాకి టెక్నికల్ శాంక్షన్ జరిగింది. అప్పటిలో కేజీ రూ.291 చొప్పున ఈ బోలేబాబా డెయిరీ(అప్పటి హర్ష్ ప్రెష్ డెయిరీ) నుంచి సరఫరాకు అనుమతిచ్చింది. సిట్ పేర్కొన్నట్టు కల్తీ నెయ్యి తయారు చేసిన ప్రధాన నిందితుడు బోలేబాబా డెయిరీ.. చంద్రబాబు హయాంలో కూడా నెయ్యి సరఫరా చేసిన విషయాన్ని కూడా స్పష్టం చేసింది. మరో నిందితుడుగా ఉన్న ప్రీమియర్ డెయిరీ కూడా కల్తీ చేసిందని చెప్పింది. ఈ ప్రీమియర్ డెయిరీ 2013 లో రూ.273 లకు, 2016లో రూ.332, 2106 సెప్టెంబరులో రూ.364లకు, 2017 ఏప్రిల్ లో రూ.411లకు, అక్టోబరు లో రూ.378లకు, 2018 జనవరిలో రూ.320లకు, 2019 ఆగష్టులో రూ.389 లకు నెయ్యి సరఫరా చేసిన ప్రీమియర్ డెయిరీ చంద్రబాబు హాయంలోనే అత్యధిక సార్లు నెయ్యి సరఫరాకు అనుమతి ఇచ్చారు . ప్రధాన నిందితుల్లో ఒకరైన ప్రీమియర్ డెయిరీకే చంద్రబాబు హాయంలో 90 శాతానికి పైగా నెయ్యి సరఫరాకు అవకాశం ఇచ్చారు. దీంతో డిఫెన్స్ లో పడ్డ చంద్రబాబు ఇవాళ జంతుకొవ్వు కలిపారు చెప్పారు అన్న తర్వాత సాక్షాత్తూ సుప్రీంకోర్టు ముఖ్యమంత్రిస్ధాయిలో ఇలా మాట్లాడ్డం సరికాదని చెప్పి సీబీఐ విచారణకు ఆదేశించారు.మాట మార్చిన శ్యామలరావు..2024 జూలైలో ఈవో శ్యామలరావు నెయ్యి నాణ్యతపై మాట్లాడుతూ... ఎన్ డీ డీ బీ నివేదికలో వెజిటబుల్ ఆయిల్ కలిపారని నివేదిక వచ్చిందన్నారు. అయితే నెయ్యిలో లడ్డూ సీఎం చంద్రబాబు మాట్లాడిన అనంతరం సెప్టెంబరు 23న మరలా ఈవో శ్యామలరావు ఎన్ డీ ఆర్ ఐ రిపోర్టులో జంతు కొవ్వు కలిసిందని వచ్చిందంటూ చంద్రబాబుకి వంతపాడారు. కానీ సీబీఐ విచారణలో అదే ఎన్ డీ ఆర్ ఐ కు శాంపిల్స్ పంపిస్తే అందులో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని అనుబంధ ఛార్జిషీట్ లో నివేదించారు. దీంతో చంద్రబాబును మోసే ఎల్లో మీడియా సంస్థలు సిట్ ను ప్రశ్నిస్తున్నారు? సీబీఐను ప్రశ్నిస్తున్నారు? విచారణ ఫలానా విధంగా చేయలేదని వార్తలు రాస్తున్నారు. చంద్రబాబు సిట్ నియమిస్తే ఆ అధికారులు బాబు చెప్పినట్లు వినేవాళ్లు. వాళ్లు తప్పుడు నివేదికలు ఇచ్చి, వెంటనే మమ్నల్ని నిందితులు చేసే సిట్ కాకుండా... సరైన న్యాయవిచారణ కోసం సుప్రీం కోర్టు నియమించిన అధికారులతో విచారణ చేయించాలి. దీనికి మేం సిద్ధంగా ఉన్నాం. సీబీఐ తన ఛార్జి షీట్ పేజీ నెంబరు 65లో 2018లో బోలేబాబా డెయిరీ హర్ష్ ప్రెష్ డెయిరీ పేరుతో నెయ్యి సరఫరా చేసారని పేర్కొంది. వైయస్.జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే బోలేబాబాను డిస్ క్వాలిఫై చేశాం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టెండర్ నిబంధనలను సడలించడం ద్వారా ఈ సంస్థలు వచ్చి కల్తీనెయ్యి తయారు చేశాయని ఎల్లో మీడియాలో ఆరోపిస్తున్నారు. వాస్తవానికి టెండరు నిబంధనలను సరళతరం చేయడానికి ముందే హర్ష్ ప్రెష్ డెయిరీ టెండర్లలో పాల్గొంది. ప్రీమియర్ డెయిరీ కూడా గతంలో ఉంది. ఇప్పుడు కొత్తగా రాలేదు. అదే విధంగా మాల్ గంగా కూడా తర్వాత టెండర్లులో పాల్గొంది. టెండరు నిబంధనలు సరళతరం చేసిన తర్వాత టెండర్లలో పాల్గొన్న ఒక్క సంస్ద పేరు కూడా సీబీఐ పేర్కోలేదు. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలన్న నిర్ణయంతో స్ధానికంగా ఉండే తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, ఏపీలోని డెయిరీ కంపెనీలను ప్రోత్సహించడానికి నిబంధనలను సరళతరం చేశాం.జగన్ హయాంలోనే ఎన్డీడీబీతో ఒప్పందం:అయినా ఒక్క కంపెనీ కూడా రాలేదు కాబట్టి నిబంధనలను మరలా కఠినతరం చేశాం. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత సాహి, గిర్ వంటి ఉత్తమ ఆవులను విరాళాల ద్వారా తెప్పించడమే కాకుండా... ఎన్ డీ డీబీ వంటి సంస్థలను వైయస్.జగన్ ప్రభుత్వం టీటీడీకి పరిచయం చేసిందే వైయస్.జగన్ ప్రభుత్వం. గతంలో ఎన్ డీ డీ బీ ద్వారా పరీక్షలకు పంపించే పరిస్థితి లేదు. ఆ సంస్థ ద్వారా రూ.50 కోట్ల విరాళం స్వీకరించి గిర్, సాహీవాల్ ,కాంక్రీజ్ లాంటి ఆవుల ఉత్పత్తి కేంద్రంలో ఆడదూడలు పుట్టేలా చేయడం ద్వారా టీటీడీ సొంతంగా నెయ్యి ఉత్పత్తి చేసేలా పూనుకున్నదే వైయస్.జగన్. ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగానే అప్పటివరకు అందుబాటులో లేని.. బీటా సైట్స్ టెరాలసిస్ టెస్ట్ ను వైయస్.జగన్ ఆదేశాలతో ఎన్ డీ డీ బీ వాళ్ల సహకారంతో ఈ టెస్ట్ మిషనరీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి టెండర్లు పిలిచాం. మా హయాంలోనే ఈ రకమైన ఏర్పాట్లు చేశాం. మా హాయంలో నిబంధలను కఠినతం చేసినందువల్లే కల్తీకి కేంద్రబిందువుగా మారిన ఏ ఆర్ డెయిరీ డెయిరీ నాలుగు ట్యాంకర్లు నెయ్యి కల్తీ అని తెలిసింది. అలా నాలుగు ట్యాంకర్ల నెయ్యి కల్తీ అని తెలిసినా కూడా ఆ నెయ్యి వేరే ఇన్ వాయిస్ లతో వస్తే దాన్ని లడ్డూ ప్రసాదంలో వాడినట్లు సిట్ అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు. కల్తీ జరిగిందని ఈవో శ్యామలరావు వెనక్కి పంపిన.. చంద్రబాబు చెప్పినట్లు యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని కూటమి ప్రభుత్వంలోనే వాడారు. అంటే మీరు చెప్పినట్లు మీ ప్రభుత్వ హయాంలోనే పందికొవ్వు నెయ్యితో తయారు చేసిన లడ్డూలు తయారు చేశారా? సీబీఐ ఆ నాలుగు ట్యాంకర్లలో కలిసింది పందికొవ్వు కాదని చెప్పినా... చంద్రబాబు మాత్రం తాను శ్రీవేంకటేశ్వరస్వామి వీర భక్తుడని పదే పదే చెప్పిన మాటలే చెబుతూ... మరలా జంతుకొవ్వులు కలిసాయని ఆరోపిస్తున్నారు.మా ఇళ్లతో టీడీపీ నేతలు భోగిమంటలునాలుగు దశాబ్దాలుగా మిమ్నల్ని గమనిస్తున్నాను. మిగిలివాళ్లు శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు కాదా? భక్తి పేరుతో స్వామి వారి ప్రసాదాలు, స్వామి వారిని రాజకీయాలకు వాడుకోవడమే మీ నైజమా? మీరు చెప్పింది నిజమైతే సుప్రీం కోర్టు మిమ్నల్ని ఎందుకు మందలించింది? దానికి సమాధానం చెప్పాలి. మిమ్నల్ని ఆక్షేపించిన సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ దర్యాప్తులోనే ఎలాంటి జంతుకొవ్వులు కలవలేదని చెప్పిన మాట వాస్తవం కాదా? అయినా మీరు చెప్పిన అబద్దాలు ప్రచారం చేస్తూ.. వాటిని జనాలు నమ్మడం లేదని హింసను ప్రేరేపించడం ఎంతవరకు సమంజసం? ఎవరు ఎవరి ఇళ్లమీద దాడి చేస్తున్నారు? టీడీపీ, జనసేన కార్యకర్తలు వైయస్సార్సీపీ నేతల ఇళ్లు కాలబెట్టి బోగి మంటలు వేసుకుని చలికాసుకుంటున్నారు. ఇదే మీ నైజమా? అని సూటిగా ప్రశ్నించారు.లడ్డూలో పందికొవ్వు, ఆవుకొవ్వు, చేపనూనె కలిపారన్న మీ మాటలతో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిష్టకు భంగం కలిగించారు. మా ఇలవేల్పు అని చెబుతున్న మీరే స్వామి వారి లడ్డూలో ఆవుకొవ్వు కలిపారంటే ఎవరిపై అపవాదు మోపారు? భగవంతుడిని రాజకీయ పావుగా వాడుకున్నది మీరు. మీ ఆరోపణలతో 140 కోట్ల మంది భక్తుల మనోభావాలను, శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్ర మహిమని నేలమట్టం చేసేలా మాట్లాడింది మీరు కాదా చంద్రబాబూ? ఇప్పటికైనా మీ అంతరాత్మను ప్రశ్నించుకొండి. దైవద్రోహం చేసినవాళ్లను దేవుడు వాళ్ల జీవితకాలంలోనే శిక్షిస్తాడన్నారు. మీ కంటే ఎవరూ దైవద్రోహం చేసారు చంద్రబాబూ అని భూమన సూటిగా ప్రశ్నించారు. కోట్ల లడ్డూల్లో ఆవుకొవ్వు కలిపారనడం కన్నా అపవాదు ఇంకా ఏముంటుందని భూమన కరుణాకర్రెడ్డి తేల్చి చెప్పారు. -
బ్రాహ్మణుడి శాపంతో ఊరంతా ఖాళీ!
తాడిపత్రి రూరల్: మాఘపౌర్ణమి రోజున తాడిపత్రి మండలం తలారి చెరువు గ్రామం ఖాళీ అవుతోంది. పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామం ఆదివారం తెల్లవారుజాము నుంచి 24 గంటల పాటు పొయ్యి వెలగదు. అగ్గిరవ్వ కనిపించకపోవడంతో దీనిని అగ్గిపాడుగా పిలుస్తారు. గ్రామస్థులు సమీపంలోని హాజీవలి దర్గాకు బయలుదేరి వెళ్తారు. గ్రామంలో పశువులు, కోళ్లను తీసుకొని పిల్లాపాపలతో అక్కడే వంట చేసుకుంటారు. రాత్రి వరకూ ఉండి అర్ధరాత్రి తర్వాత గ్రామంలోకి వస్తారు. గ్రామం ఖాళీ చేసినా దొంగలు రాకుండా ఉండేందుకు చుట్టూ కాపలాగా ఉంటారు. ఉదయం య«థావిధిగా దినచర్య మొదలెడతారు.ఎందుకు గ్రామం ఖాళీ అవుతుందంటే..400 ఏళ్ల కిందట ఓ బ్రహ్మణుడు తన అనుచరులతో కలిసి గ్రామంపై దాడి చేసి ధాన్యం, బంగారం, విలువైన వస్తువులను దోపిడీ చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో గ్రామస్తులంతా బ్రహ్మణుడు, అతడి అనుచరులను హతమార్చారు. బ్రాహ్మణుడు మరణిస్తున్న సమయంలో బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంటుందని, గ్రామంలో వర్షాలు పడక కరవు, కాటకాలు ఏర్పడుతాయని, పుట్టిన బిడ్డలు పురిటిలోనే చనిపోతారంటూ చెప్పి మరణించాడు. అప్పటినుంచి తలారిచెరువు గ్రామంలో వర్షాలు సక్రమంగా కురియకపోగా, పంటలు పండక గ్రామంలో కరువు ఏర్పడింది. గ్రామాభివృద్ధి కుంటుపడి చిన్నారులు చనిపోవడంతో అరిష్టం పట్టుకుందని కొందరు గ్రామస్తులు పరిహారం కోసం స్వామిని సంప్రదించారు. బ్రహ్మ హత్యా పాతకం నుంచి విముక్తి కావాలంటే మాఘపౌర్ణమి రోజున గ్రామాన్ని ఖాళీ చేసి హాజీవలి దర్గాలో బసచేయాలని సూచించారు. ఆయన చెప్పిన విధంగా కుటుంబాలు గ్రామాన్ని ఖాళీ చేశాయి. దీంతో శాపం తొలగి పూర్వ వైభవం సంతరించుకుంది. అప్పటి నుంచి మాఘ పౌర్ణమి రోజు గ్రామాన్ని ఖాళీచేయడం అచారంగా కొనసాగుతోంది. -
నేడు వైఎస్సార్సీపీ కీలక సమావేశాలు
సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఆరాచకాలు తారాస్థాయికి చేరి వైఎస్సార్సీపీ నేతలపై, నివాసాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ ఇవాళ కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలతో సీనియర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ భేటీ కానున్నారు. అలాగే తిరుమల ప్రసాదం విషయంలో టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలోనూ మరో సమావేశం నిర్వహించనుంది.కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ భేటీలో వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న దాడులు, పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు, టీడీపీ గూండాల హింసాకాండపై సజ్జల, బొత్స.. జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. యధేచ్చగా సాగుతున్న అరాచకాలను అహింసా మార్గంలో ఎదుర్కొవడం.. చట్టపరమైన ఫిర్యాదులు తదితర అంశాలపైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. బ్రాహ్మణ నాయకులతోనూ.. తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ విష ప్రచారం ముదుతున్న వేళ.. బ్రహ్మణ నేతలతోనూ సజ్జల, బొత్స భేటీ కానున్నారు. తిరుమల మహా ప్రసాద అంశంతోపాటు కూటమి ప్రభుత్వం ఆలయాల ప్రతిష్టను దెబ్బతీస్తున్న వైనంపైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. -
జోగి రమేష్పై ప్రభుత్వం మరో కక్ష సాధింపు
విజయవాడ:జోగి రమేష్పై ప్రభుత్వం మరో కక్ష సాధింపుజోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము బెయిల్ రద్దు చేయాలి అని పిటీషన్ఎక్సైజ్ కోర్టులో పిటీషన్ వేసిన సిట్జోగి రమేష్ ఇంటికి నిన్న నిప్పు పెట్టిన టీడీపీ నేతలు, గుండాలుఓ వైపు జోగి ఇంటిపై దాడి చేసి..మరో వైపు జోగి సోదరులు సాక్ష్యాలు ధ్వంసం చేస్తారంటూ పిటిషన్ వేయించిన టీడీపీ గుంటూరు: లకారాలతో మా గురించి మాట్లాడారు : అంబటి రాంబాబు కామార్తె అంబటి మౌనికరెండు రోజులుగా మాపై దాడి జరుగుతుందిలడ్డుపై వేసిన పోస్టర్లు చింపడానికి రాంబాబు వెళ్ళలేదువెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ కోసం వెళ్లారుగుడి నుంచి ఇంటికి వస్తుంటే రాంబాబు పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.అసభ్యకరమైనపై భాషతో రాంబాబు కారుపై దాడి చేశారుఒక మహిళ మాట్లాడిన మాటలు చూడండి ఆయన్ను రెచ్చగొట్టారు.దీంతో రాంబాబు మాట్లాడిన మాటలు తప్పు అని ఆయనే మీడియా సమావేశం పెట్టి చెప్పారుఅంత దమ్ము ఎవరికి ఉంటుందిఇక్కడే ఉంటాను అని చెప్పిన తర్వాత ఆయనపై దాడి చేశారుఎమ్మెల్యే గల్లా మాధవిని అడుగుతున్నానుఏ నైతిక విలువలతో ఎమ్మెల్యే గల్లా మాధవి క్షమాపణ అడుగుతున్నారునేను రాంబాబు వ్యాఖ్యలను సమర్థించడం లేదుఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన సమాధానం చెప్పారుకేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉన్న ఇంటిపై ఎలా దాడి చేస్తారుహోంమంత్రి అనిత సమాధానం చెప్పాలికాపు కులస్తులు వాళ్ళ వెంటే ఉన్నారని మాపై దాడి చేశారుపవన్ కళ్యాణ్ వైపే కాపు కులస్తులు ఉన్నారని ఆయన బలం చూసి మాపై దాడి చేశారులకారాలతో మా గురించి మాట్లాడారుకాపుల్లో పుట్టినందుకు మేము గర్విస్తున్నాంమనల్ని అడ్డం పెట్టుకుని మన కంటిలో మన వేలుతో పొడుస్తున్నాంవైఎస్ జగన్ పుట్టక గురించి గురించి చంద్రబాబునాయుడు కామెంట్స్ చేయడం తప్పు కాదామేము వైఎస్సార్సీపీ అని, అధికారంలో లేమని మాపై దాడి చేశారుదేవుడి లడ్డూ గురించి మాట్లాడారని మా ఇంటిపై దాడి చేశారుగల్లా మాధవికి కుటుంబం ఉందిమీకు కుటుంబం ఉంది కదాకొంతమంది మిమ్మల్ని పావుగా పావుగా వాడుకుంటున్నారుమిమ్మల్ని బలి పశువును చేస్తున్నారుమీ అత్మసాక్షికే వదిలేస్తున్నాను.పవన్ కళ్యాణ్ మహిళల రక్షణ గురించి చాలా సార్లు చెప్పారు.మరి ఇప్పుడే సమాధానం చెబుతారు చెప్పండిరాంబాబు దేని గురించి భయపడరుమహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలను ఉపయోగించి, మహిళలపై దాడి చేస్తున్నారురాంబాబుని స్టేషన్ లో చాలా ఇబ్బంది పెట్టారుఇంకా ఆటవికంగా ఉన్నామని నిరూపించారుపోలీసులు అల్లరి మూకలను కంట్రోల్ చేయలేదుదాడి చేసిన వారికి పోలీసులు రక్షణగా ఉన్నారురాంబాబు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారుఆయన గొంతు నొక్కడానికే దాడి చేశారుకేంద్రమంత్రి పెమ్మసాని ఒక డాక్టర్ ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానుసినిమా చూపించడం అంటే మహిళలపై దాడి చేయడమేదీనికి పెమ్మసాని భార్య అను సమాధానం చెప్పాలిఅంబటి రాంబాబు నిజానికి భయపడతారుఇటువంటి దాడులకు పాల్పడరుమా భద్రత గురించి మా నాన్న ఆందోళన చెంది ఉంటారుగల్లా మాధవి డైరెక్షన్ తోనే మాపై దాడి చేశారువిజయవాడ: జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర పార్టీ నేతలుజోగి రమేష్ ఇంటిని పెట్రోల్ బాంబులతో తగల బెట్టిన టీడీపీ గూండాలుటీడీపీ గూండాల దాడిని సజ్జలకు వివరించిన జోగి రమేష్విజయవాడ: టీడీపీ దాడులపై మాజీ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం ఇది ప్రజాస్వామ్యం,బలహీన వర్గాలపై జరిగిన దాడిమేం రాజకీయాల్లో ఉండకూడదాదాడులు పేరుతో నన్ను మట్టుబెట్టాలని చూశారు. నాకేమైనా జరిగితే లోకేషే కారణంనన్నుమళ్లీ అరెస్టు చేయాలని పోలీసులు చూస్తున్నారు. నా ఇంటిపై వందల మంది టీడీపీ గూండాలు దాడులు చేశారుమీ అరాచకాలు ప్రశ్నించడం తప్పా లోకేష్ ఆదేశాలతో ఎంపీ కేసినేని చిన్నీ నాపై దాడులు చేశారుకూటమి ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షిస్తారుకూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందినాకు అండగా జగనన్న ఉన్నారు. వైఎస్సార్ సైన్యం ఉందితాడేపల్లి :సీబిఐ తేల్చిన నిజాల కన్నా చంద్రబాబు చెప్పే అబద్దాలే నమ్మాలా? : బొత్సరాష్ట్రంలో దారుణమైన పరిపాలన సాగుతోందిఅంబటి, జోగి ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేయటానికా చంద్రబాబుకు అధికారం ఇచ్చింది?ధర్మాన్ని కాపాడాల్సిన పోలీసులు రాజకీయ పార్టీల నేతల అడుగులకు మడుగులు ఎత్తుతారా?చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్న వారిపై న్యాయ పోరాటం చేస్తాంఅధినేత వైఎస్ జగన్తో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తాంఏ ప్రభుత్వం ఐనా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాలికానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థులపై ఎలా దాడులు చేయాలా అని చూస్తున్నారుజోగి రమేష్ ఇంటి మీద పెట్రోలు బాంబులు వేయటం దుర్మార్గంజోగి రమేష్ ఇంటిని తగల పెట్టారుఇంత జరుగుతుంటే డీజీపి ఏం చేస్తున్నారు?చంద్రబాబు దగ్గర డీజీపి ఊడిగం చేస్తున్నారా?డీజీపీ.. వ్యవస్థ మీద గౌరవాన్ని పోగొట్టవద్దుతనమీద దాడి చేయటానికి వచ్చిన వారినే అంబటి రాంబాబు దూషించారుతర్వాత దానిని కూడా వెనక్కు తీసుకున్నారుకానీ పోలీసులే దగ్గరుండి దాడులు చేయించటం భావ్యం కాదులడ్డూ ఇష్యూ మీద సీబిఐ నిజాలు తేల్చాక కూడా ఇంకా ఎందుకు విష ప్రచారం చేస్తున్నారు?సీబిఐ తేల్చిన నిజాల కన్నా చంద్రబాబు చెప్పే అబద్దాలే నమ్మాలా?దీనిపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు?అంబటి రాంబాబు ఎప్పుడూ లైన్ దాటి మాట్లాడరుఆయనా మనిషే. తనని బూతులు తిడితే ఒకమాట అన్నారువెంటనే వెనక్కు తీసుకున్నారు కూడాఐతే ఐదారు గంటలపాటు ఇంటిపై దాడి చేయిస్తారా?చంద్రబాబుకు చేతనైతే మంచి పాలన చేసి పేరు తెచ్చుకోవాలిఅంతేగానీ దాడులకు పురిగొల్పవద్దుసంపద సృష్టి పేరుతో వైజాగ్ లో ఐదువేల కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టారురాష్ట్ర సంపదను కాకుండా తన ఇంటి సంపదను పెంచుకుంటున్నారుఅంబటి, జోగి ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేయటానికా మీకు అధికారం ఇచ్చింది?పోలీసులు ధర్మాన్ని కాపాడాలిరాజకీయ నాయకుల అడుగులకు మడుగులు వద్దవద్దువెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగవద్దుభక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దుమమ్మల్ని అవమాన పరిచేలా ఫ్లెక్సీలు పెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నదే ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లా:వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టులపై ఫిర్యాదువైఎస్సార్సీపీ నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి మన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదువైఎస్సార్సీపీ నాయకులను పదజాలాలతో దూషించిన కూటమి నాయకురాలను వెంటనే అరెస్ట్ చేయాలిఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డిరాష్ట్రంలో రెడ్బుక్ పాలనలో రావణ కాష్టం జరుగుతున్నది. ఇండ్లను పెట్రొల్ బాంబులతో తగలబెడుతున్నారు-.ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి జోగి రోహిత్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణఏపీ హైకోర్టులో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రోహిత్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలుతమ ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయడం లేదుదీనిని చట్ట విరుద్ధంగా ప్రకటించండి ఇంటి వద్ద తగిన భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లో కోరిన రోహిత్రోహిత్ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరుపనున్న హైకోర్టునెల్లూరు:ఏపి రాష్ట్ర ఇమేజ్ను మంటగలిపారు:చంద్రశేఖర్ రెడ్డిలడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు జుగుబ్సాకరమైన వ్యాఖ్యలు చేశారుచంద్రబాబు, పవన్ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని ఎన్డిడిబీ రిపోర్ట్ ఇచ్చిందినేటికి ఆ అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టడానికి ఫ్లెక్స్ లు ఏర్పాటు చేయడం ఎంత వరకు సబబుమాజీ మంత్రుల ఇండ్లపై కుటుంబ సభ్యులు లోపల వుండగానే దాడులకు తెగబడ్డారునెల్లూరు:నెల్లూరు వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ ఫిర్యాదుశ్రీవారి లడ్డూ వ్యవహారంలో అబద్దపు, అభ్యంతకర పోస్టర్లు ఏర్పాటు పై పిర్యాదుమాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్, ఆనం విజయకుమార్ ఆధ్వర్యంలో పిర్యాదుకాకాణి కామెంట్స్రాష్ట్రంలో ఆటవిక పాలన రాజ్యం ఏలుతుందిసీఎం, డిసిఎం లు శ్రీవారి లడ్డూ పై నిరాధారమైన ఆరోపణలు చేశారుప్రపంచ వ్యాప్తంగా వున్న హిందువుల మనోభావాలు దెబ్బతీశారులడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వం పై నిందలు వేసే ప్రయత్నాలు చేశారు విజయవాడ:మాజీ మంత్రి జోగి రమేష్ను కలిసిన ఎమ్మెల్సీ తలశిల రఘురాంవిశాఖ:తిరుపతి లడ్డుపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చేసిన తప్పుడు ప్రచారంపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు..ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సిపి నాయకులు కేకే రాజు, వరుదు కళ్యాణి, మోల్లి అప్పారావు డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్..తిరుపతిమాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గుండాలు దాడి నిరసిస్తూ బాలాజీ కాలనీ పూలే విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిసి విభాగం ఆధ్వర్యంలో నిరసనరాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న బిసి నాయకులుప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఏపీ రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధించాలి-గీత యాదవ్. వైఎస్సార్సీపీ,మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనంతపురం::చంద్రబాబు హింసా రాజకీయాలపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు నిరసనగా ఆందోళన చేపట్టారు. అనంతపురం జెడ్పీ కార్యాలయంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అరాచకాలపై నల్ల కండువాలతో నిరసన తెలిపారు వైఎస్సార్సీపీ నేతలు. ‘ చంద్రబాబు పాలన.. ఆటవిక రాజ్యం’ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు బీసీ వ్యతిరేకి అంటూ నిరసన వ్యక్తం చేశారు.మొన్న(శనివారం), నిన్న(ఆదివారం) టీడీపీ గూండాలు రెచ్చిపోయి మరీ విధ్వంసం సృష్టించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు దిగారు. అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేసేందుకు యత్నించారు. ఆ క్రమంలోనే అంబటి రాంబాబు ఇంటిపై రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడులకు దిగారు. జోగి రమేష్ ఇంటికి నిప్పుపెట్టారు టీడీపీ గూండాలు. పెట్రోల్ బాంబుతో ఇంటిని ధ్వంసం చేసే యత్నం చేశారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పలేక ఆటవిక పాలనను ఎంచుకున్నారు. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబుదే తప్పు అన్న విషయం సీబీఐ సిట్ సాక్షిగా బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిలో చులకనై, వారి దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తన రౌడీలను పురమాయిస్తున్నారు. శనివారం గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై గూండాల దాడిని మరచిపోక ముందే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై విధ్వంసానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెట్రోల్ బాంబులతో బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు, టీడీపీ మూకలు రమేష్ ఇంటిపై విరుచుపడి విధ్వంసం సృష్టించారు. వందలాది మంది రౌడీలు విధ్వంసం సృష్టిస్తుంటే నిలువరించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తుండటం విస్తుగొలుపుతోంది. వెళ్లిపోండి.. వెళ్లిపోండి.. అంటూ వారిని బతిమిలాడటం పోలీసు వ్యవస్థ దీన స్థితిని తెలియజేస్తోంది. రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాస్వామ్యమా.. లేక ఆటవిక రాజ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. పైగా ఈ విధ్వంసకాండను చంద్రబాబు తనయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, సదరు టీడీపీ శ్రేణులు చెప్పుకుంటుండటం దారుణమని, ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలహీన వర్గాల గొంతు నులిమి రాక్షసానందం పొందుతూ ప్రశ్నించే తత్వాన్ని చంపేయడమే టీడీపీ పెద్దల లక్ష్యమనే భావన అత్యధికుల్లో వ్యక్తం అవుతోంది. దీనిపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తుందని వైఎస్సార్సీపీ మండిపడతోంది. -
బాబోయ్.. ఇదేం పాలన అంటున్న కూటమి అభిమానులు!
ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం (జంగిల్ రాజ్) నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఏడాదిన్నర కూటమి పాలనపై జగన్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్య అన్ని విధాలుగా తగినదే. రాజకీయాల్లో తన అనుభవం చాలా పెద్దదని తరచూ చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబు నాయుడు పాలన ఇంత అధ్వాన్నంగా, నాసిరకంగా చేయగలరని బహుశా ఆయన అభిమానులు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ప్రజాస్వామ్య విలువలకు కూటమి పాలనలో నిత్యం తిలోదకాలే. ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్షసాధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. ఈ కారణంతోనే ఒకప్పుడు టీడీపీకి మద్దతుగా నిలిచిన ఓ మిత్రుడు కూడా ‘‘అబ్బే ఇదేం పాలనండి.. చాలా ఘోరంగా ఉంది. మళ్లీ వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే’’ అని చెప్పగలుగుతున్నారు. పల్నాడు ప్రాంతానికి వెళ్లి వచ్చిన తరువాత ఆయనీ వ్యాఖ్య చేయడం గమనార్హం. అసలక్కడ ప్రభుత్వమనేది ఒకటుందా? పనిచేస్తుందా? అన్న అనుమానం వచ్చిందని, ఎటు చూసినా అధికార పార్టీ కార్యకర్తల అరాచకాలే దర్శనమిస్తున్నాయని వివరించారు. ఈ అంచనా ఈయన ఒక్కరిదే కాదు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అక్కడి అరాచకాలను ప్రత్యక్షంగా చూసిన చాలామంది ఇదే మాట అంటున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై సాగుతోన్న అణచివేత ధోరణి, అక్రమ కేసులు, అరెస్టులపై ప్రజల్లోనూ తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేకపోగా.. అన్నీ చేసేశామని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిత్యం బొంకుతూండటం, మంత్రి లోకేశ్ అహంభావ పూరిత ప్రకటనలు, జనసేన అధినేత, ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని ఊదరగొట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూండటం ప్రజల నైరాశ్యానికి కారణమన్న విశ్లేషణ వినిపిస్తోంది. హంగు, ఆర్భాటాలు, వసతులు కల్పించి విధేయుడిగా మార్చుకోవడం ద్వారా పవన్ ప్రశ్నించలేని స్థితికి చేర్చారని అంచనా. కానీ చంద్రబాబుకు తన కుమారుడిని నియంత్రించే శక్తి లేకుండా పోయిందన్నది టీడీపీలో ఒక వర్గం అభిప్రాయం. లోకేశ్, ఆయన అనుచరుల పెత్తనాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తనకు సంబంధం లేని హోం శాఖపై లోకేశ్ పెత్తనం చేస్తున్న తీరు, ఆయా శాఖలన్నిటిని పర్యవేక్షిస్తున్నారన్న భావన, టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చంద్రబాబును కాకుండా లోకేశ్ను పొగడడానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో వ్యక్తం అవుతోంది. ఈ స్థితిలో ఏపీలో జంగిల్ రాజ్ ఏర్పడిందన్న జగన్ వ్యాఖ్యను చాలామంది సమర్థిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడడం, ఇసుక, మద్యం, మైనింగ్లలో దందాలు చేస్తూ ఇష్టారాజ్యంగా సంపాదిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పోలీసు వ్యవస్థ అచేతనంగా ఉంటోంది. కోడిని కోశారంటూ వైపీసీ కార్యకర్తలపై కేసులు పెట్టి కొందరిని అరెస్టు చేసి రోడ్డుమీద నడిపించిన వైనం ఆటవిక పాలనకు దర్పణంగా నిలబడుతోందన్నది ఆ పార్టీ విమర్శ. అదే సమయంలో సంక్రాంతి సందర్భంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు బీభత్సంగా కోడిపందాలు ఆడించి, వందల కోట్ల రూపాయల మేర పందాలు నడిపించినా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. ముఖ్యమైన పదవులలో ఉన్న కొందరు దగ్గరుండి కత్తులు కట్టించి కోడి పందాలు జరపడం, అక్కడ అన్ని రకాల జూదాలు నిర్వహించడం, పలు చోట్ల పోలీసులు కూడా వారిలో భాగస్వాములయ్యారన్న విమర్శలు రావడం వంటివి కళ్లెదుటే కనిపిస్తాయి. భారీ ఎత్తున బరులు తయారు చేసి, వేలాది మంది అక్కడ జమ కూడుతున్నా పోలీసులు అసలు పట్టించుకోలేదంటేనే ఇది ఎంత అధ్వాన్న పాలన అన్నది విదితమవుతోందని ప్రజలు చెప్పుకుంటున్నారు. విశేషం ఏమిటంటే హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అనేక మంది, కొంతమంది మహిళలు సైతం భారీ ఎత్తున డబ్బు సంచులతో అక్కడకు వెళ్లి పందాలు కాసినా, పోలీసు వ్యవస్థ కాని, ఈడి వంటి సంస్థలు కాని అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇలా చేస్తున్న వారెవ్వరిని పట్టుకుని రోడ్డుమీద నడిపించలేదు. రికార్డింగ్ డాన్స్ల పేరుతో అశ్లీల నృత్యాలు చేస్తున్నా పోలీసులు ఆపలేదు.పైగా ఒక అధికారి ఎలా పాటపాడాలో, డాన్స్ చేయాలో చేసి చూపించారట. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆ రికార్డు డాన్స్లో భాగస్వామి అవడంపై లోకేశ్ ఆగ్రహించారట. చివరికి పులివెందులలో కూడా టీడీపీ నేత మూడు కోట్లు వసూలు చేసి కోడి పందాలు నిర్వహించారని జగన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి జంగిల్ సర్కార్ అని పేరు పెట్టారు. ఇక ఎమ్మెల్యేలు కొందరు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న తీరును కూడా జగన్ ప్రస్తావించారు. కూన రవికుమార్, నజీర్, ఆదిమూలం తదితర ఎమ్మెల్యేలపై వచ్చిన అభియోగాలను ప్రస్తావించారు. ఇటీవలే రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను ఏడాదిన్నరగా వేధించిన వైనం, వివాహం చేసుకుంటానని మోసం చేసిన తీరు కూడా వివరించి అసలు వీళ్లు మనుషులేనా అని జగన్ ప్రశ్నించారు.ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, డీజీపీలతో సహా పలువురు అధికారులకు బాధితురాలు మొరపెట్టుకున్నా, ఎవరూ స్పందించలేదట. దాంతో ఆమె బహిరంగంగానే తన ఆవేదనను తెలియ చేసింది. ఫలితంగా కూటమి పరువు మొత్తం పోయింది. మహిళల గౌరవానికి భంగం రానివ్వమని బోలెడన్న కబుర్లు చెప్పిన చంద్రబాబు, పవన్, లోకేష్.. ఈ ముగ్గురు నేతలు ఇన్ని ఘోరాలు జరుగుతున్నా నోరు విప్పడం లేదు. జనసేన ఎమ్మెల్యే పై వచ్చిన ఆరోపణల గురించి మీడియా ప్రశ్నించబోగా పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం విమర్శలకు దారి తీసింది. దాంతో గతంలో ఆయన మహిళల రక్షణకు సంబంధించిన వీడియోలను చూపుతూ ఇలా పలాయనం చిత్తగించడం తగునా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఒక మంత్రిగారి పీఏపై ఆరోపణలు చేసిన మహిళను జైలుకు పంపడం, మంత్రి కుమారుడు స్వయంగా జూదం ఆడుతూ దొరికిపోవడం, మరో ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్తో పట్టుబడడం.. ఒక టీడీపీ ఎమ్మెల్యే జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీయించారన్న అభియోగాలు రావడం, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఏకంగా ఒక మహిళా ఎమ్మెల్యే నేతృత్వంలో దాడి చేయడం, విధ్వంసం సృష్టించడం వంటివి ఈ ప్రభుత్వం జంగిల్ రాజ్ గా మారిన విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని అంటున్నారు. ఈ మధ్యనే పల్నాడులో సాల్మన్ అనే వైసీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు హత్య చేశారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన సుమారు వంద కుటుంబాలను గ్రామంలోకి రానివ్వకుండా తరిమేశారట. ఇలా ఒకటి కాదు.అనేక అరాచకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇవన్ని వింటుంటే ఏపీలో పరిస్థితి ఎవరికైనా ఆందోళన కలిగిస్తుంది. ప్రజలు అసహ్యించుకుంటున్నారు. జంగిల్ రాజ్ అన్న పేరు అతికినట్టు సరిపోతుందన్నమాట!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రెచ్చిపోతున్న టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ స్వాతి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్త స్వాతిరెడ్డి (స్వాతిచౌదరి) అత్యుత్సాహం ప్రదర్శించారు. అంబటి రాంబాబు అరెస్ట్ నేపథ్యంలో సోషల్ మీడియాలో అడ్డగోలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అయితే ఆదివారం ఆమె చేసిన ఓ పోస్టు.. అంబటి హత్యకు కుట్రపన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావుకు అంబటి రాంబాబు దొరికి ఉంటే ఈపాటికి ఆయన అంత్యక్రియలు పూర్తయి ఉండేవంటూ ఆదివారం స్వాతి ‘ఎక్స్’లో పెట్టిన పోస్టు కలకలం రేపింది. గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీమంత్రి అంబటి రాంబాబు ఇంటిపై శనివారం సా.4 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటలకు వరకు జరిగిన విధ్వంసకాండలో గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు కీలకం అంటూ స్వాతి తన పోస్టులో పేర్కొంది. అంతటితో ఆగకుండా.. వైసీపీ వాళ్లు రామచంద్రరావును ఏదో చేస్తామని ఆయన ఫొటోను సేవ్ చేసుకుంటున్నారని.. ‘మీరు అనుకున్నట్లుగా ఆయన వ్యక్తి కాదురా.. కనపడని శక్తి. గుంటూరు రాజకీయాల్లో ఇప్పుడే అడుగుపెట్టాడు. ఆయన దగ్గరకు వెళ్లాలంటే చాలా సైన్యాన్ని దాటుకుని వెళ్లాలి’ అంటూ రెచ్చగొట్టే పోస్టులు చేస్తోందామె. -
చంద్రబాబూ.. కట్టుబట్టలతో కాపులను వెళ్లగొట్టండి
సాక్షి, కాకినాడ: చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పుడూ కాపుల మీద రగిలిపోతూనే ఉంటారని.. అందుకే రిజర్వేషన్ల విషయం సహా ప్రతీ దాంట్లోనూ మోసం చేస్తూ వస్తున్నారని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం అంటున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి నేపథ్యం, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు ముద్రగడ సోమవారం ఓ బహిరంగ లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో గాడితప్పిన రాక్షస పాలనలో దహనకాండను చూస్తున్నాను. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్ లను ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంత వరకు న్యాయం?. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ ఇచ్చిన నివేదికతో గతంలో మీరు చెప్పింది అబద్దమని తేలిపోయింది. దానిని కప్పిపుచ్చుకోవడానికి మీరు పడుతున్నపాట్లు అంతా ఇంతా కాదు. మీరు చెప్పిన అబద్దానికి మీ పార్టీనే ఎంతో నష్టపోయింది.. .. మీ పరిపాలనలో ఎంతసేపూ కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో నా కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారు. కాపుల మీద మీరు ఎప్పుడూ రగిలిపోతునే ఉన్నారు. గతంలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని హమీ ఇచ్చి మొండి చెయ్యి చూపించారు. డిప్యూటీ సీఎం(పవన్ కల్యాణ్ను ఉద్దేశించి..) మీద ప్రేమతో మళ్ళీ కాపులు మీకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కాపులంతా మీ మీద కోపంతో ఉన్నారు. దయచేసి కాపులను ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయ్యండి’’ అంటూ చంద్రబాబు, లోకేష్ను ఉద్దేశించి ముద్రగడ పద్మనాభం లేఖలో పేర్కొన్నారు. -
వయ్యారి గోదారిపై మనసాయెరా !
రంపచోడవరం / వీఆర్ పురం: పాపికొండలు విహార యాత్ర. ఎందరో పర్యాటకులు వారి డైరీల్లో ‘టు బీ విజిట్’ జాబితాలో రాసుకునే విహార స్థలం. కొండ కోనల మధ్య గోదారి నీటి అలల సవ్వడితో.. చెవుల్లో గాలి ఈలలు వేస్తుంటే.. నునుపైన దూరపు కొండలు దగ్గరయ్యే కొద్దీ చెట్లు చేమలతో.. పచ్చదనంతో కంటి ఇంపుగా కనిపిస్తుంటే.. అక్కడక్కడా లంకల్లో ఇసుకు తిన్నెలు మనసులోని కోరికలకు రెక్కలు విప్పుతుంటే.. మనసు గంతులేయదా మరి.. ఎప్పుడెప్పుడు చూస్తామా అని. పదండి మరి ఇదే సరైన తరుణం. ఈ విహార యాత్రకు అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలం అనుకూలం. కారణం వాతావరణం బాగుండడం.. నీటిమట్టం బాగుండడం.పాపికొండల సౌందర్యం.. వాటి మధ్య నుంచి గాలిని.. నీటిని చీల్చుకుంటూ ముందుకు సాగిపోయే పడవ ప్రయాణం. మొదలైంది మొదలు చివరి వరకు సాగి తిరిగి మొదటికి వచ్చే వరకు లెక్కకు మించిన మధుర భావాలను మనసు మూటగట్టుకుంటుంది. ఎన్నో ఏళ్ల వరకు గోదారి అలలపై.. గోదారి గట్లపై ఆడిపాడిన ఆ సన్నివేశాలను కనులముందు తారాడుతూనే ఉంటాయి. ప్రయాణం మొదలైన కొద్ది సేపటికే బోటు నిర్వాహకులు పర్యాటకులకు ఎంతో వినోదాన్ని అందిస్తుంటారు. ఎన్నెన్నో పోటీలు పెడుతుంటారు. పడవ సాగే మార్గంలోని ప్రతి చిన్న స్థలానికీ ఉన్న చరిత్రను విజ్ఞానదాయకంగా వివరిస్తుంటారు. రెండు బోటింగ్ పాయింట్లు.. పాపికొండల అందాలను తిలకించేందుకు పోలవరం జిల్లాలో పర్యాటక శాఖ రెండు బోట్ పాయింట్లను ఏర్పాటు చేసింది. దేవీపట్నం మండలం పోశమ్మగండి వద్ద ఒకటి, వీఆర్ పురం మండలం పోచవరం వద్ద మరొకటి. ఈ ప్రాంతాల నుంచి బోట్ల నిర్వాహకులు పర్యాటకులను ఎక్కించుకుని పాపికొండల విహార యాత్రకు తీసుకువెళ్తుంటాయి. అలాగే పాపికొండలు సందర్శనకు రాజమహేంద్రవరం నుంచి సీతానగరం, పురుషోత్తపట్నం మీదుగా పోశమ్మ గండి బోటు పాయింట్కు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య బోటు సామర్థ్యాన్ని బట్టి పర్యాటకులను ఎక్కించుకుని బయలుదేరుతుంది.పోశమ్మగండి బోటు పాయింట్కు చేరుకున్న పర్యాటకులు ముందుగా అక్కడి అమ్మవారిని దర్శించుకుని తమ విహారయాత్ర ప్రారంభిస్తారు. బోటు అలా కదులుతూ అనేక చిత్ర నిర్మాణాలకు వేదికైన పూడిపల్లి గ్రామాన్ని సందర్శిస్తారు. తరువాత పోలవరం ప్రాజెక్టు హెడ్వర్క్స్ కనిపిస్తాయి. దేవీపట్నం చేరుకున్న తరువాత అల్లూరి దాడి చేసిన పోలీస్స్టేషన్, పోలవరం ముంపుతో మిగిలిన దేవీపట్నం గ్రామాన్ని దాటుకుంటూ వారి ప్రయాణం సాగుతుంది. కొండమొదలు దాటిన తరువాత పాపికొండలు దర్శనమిస్తాయి. ఈ విహార యాత్ర ఏడు గంటల పాటు సాగుతుంది. చివరిగా బోటు పేరంటపల్లి చేరుకుంటుంది. అక్కడ పురాతన శివాలయంలో పర్యాటకులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఆ ఆలయాన్ని స్థానిక గిరిజనులు నిర్వహిస్తున్నారు. ఆలయంలోకి ఎవరు వెళ్లి మౌనంగా ధ్యానం చేసుకుని తిరిగి బోటు వద్దకు చేరుకుంటారు. ఈ గ్రామంలో గిరిజనులు తయారు చేసిన వెదురు వస్తువులు పర్యాటకులను ఆకర్షిస్తాయి. గోదావరి అందాలను ఆస్వాదించేందుకు.. పాపికొండలు విహార యాత్రకు వెళ్లిన పర్యాటకులు కొరుటూరు వద్ద అటవీశాఖ నిర్వహిస్తున్న పర్యాటక అతిథి గృహాల్లో బస చేసే అవకాశం ఉంటుంది. బోటు పాయింట్ నుంచి బయలు దేరిన తరువాత తిరుగు ప్రయాణంలో వారిని కొరుటూరు వద్ద వదిలిపెడతారు. మరుసటి రోజులు పేరంటాలపల్లి వెళ్లి తిరిగి వచ్చే బోట్లో పోశమ్మగండి పాయింట్కు చేరుకుంటారు. సిరివాక వద్ద పర్యాటకులు రాత్రి బస చేసేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. పోచవరం పాయింట్ వద్ద నుంచి..ఉదయం 10 గంటలకు పోచవరం బోటు పాయింట్ నుంచి బయలుదేరిన లాంచీ సాయంత్రం 5 గంటలకు తిరిగి అదే స్థలానికి వస్తుంది. ఈ పాయింట్లో మొత్తంగా 20 లాంచీలు అందుబాటులో ఉంటాయి. పండగ రోజుల్లో ఈ లాంచీలు పర్యాటకులతో కిక్కిరిసిపోతాయి. శని, ఆదివారాల్లో ఐదు నుంచి ఆరు బోట్లలో 700 మంది పర్యటనకు వెళ్తారు. వారికి ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, ఉప్మా, గారెలు, వడ వంటివి అందిస్తారు. మధ్యాహ్నం పేరంటాలపల్లి వెళ్లే సరికి శాకాహార భోజనం పెడతారు. నైట్ హాల్ట్ చేయాలనుకునే పర్యాటకులకు సిరివాక వద్ద ఏర్పా ట్లు ఉంటాయి. పేరంటాలపల్లి వద్ద కొండరెడ్ల వెదురు అల్లకాలతో తయారు చేసిన పలు రకాల బొమ్మలు అల్లికలు ఆకట్టుకుంటాయి.ఈ మొత్తం ప్రయాణం బోటింగ్ పాయింట్ నుంచి తిరిగి అదే పాయింటుకు చేరే వరకు 80 కిలో మీటర్లు ఉంటుంది. మరో విశేషం ఏంటంటే ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని 2008వ సంవత్వరంలో జాతీయ ఉద్యాన వనంగా ప్రకటించింది. భద్రాచలం రాములవారి దర్శనం అనంతరం పాపికొండల పర్యాటనకు బయలు దేరుతారు. భద్రాచలంలో టికెట్ ధర పెద్దలకు రూ.వెయ్యి. చిన్న పిల్లలకు రూ.700, ఐదేళ్ల లోపు చిన్నారులకు ఉచితం. తిరిగి వారంతా పోచవరం బోటుపాయింట్కు వచ్చాక పర్యాటకులను లాంచీకి 50 మంది చొప్పున పంపిస్తారు. లాంచీ బయలు దేరే ముందు ఏపీ టూరిజం, రెవెన్యూ, నీటిపారుదల, పోలీసు శాఖలు అనుమతి ఇచ్చిన తర్వాత బోటును అనుమతి ఇస్తారు. -
మత్తు పదార్థాలిచ్చి బాలికపై అఘాయిత్యం
కోవూరు: గంజాయి మత్తులో ఇద్దరు బాలురు ఓ చిన్నారి జీవితాన్ని చిదిమేశారు. విచక్షణ మరిచి బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీలోని కొత్తకాలనీలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. కోవూరుకు చెందిన మైనార్టీ బాలిక(12)పై అదే కాలనీకి చెందిన ఇద్దరు మైనర్లు కన్నేశారు.శుక్రవారం గంజాయి మత్తులో ఉన్న వీరు బాలిక దుకాణానికి వెళ్లొస్తుండగా మాటేసి సమీపంలోని చెట్ల పొదల్లోకి లాక్కెళారు. అప్పటికే వైట్నర్ను కలిపి సిద్ధం చేసిన నీటిని తాగించారు. బాలిక స్పృహ కోల్పోగానే మృగాల్లా మారి లైంగిక దాడి చేశారు. మత్తు దిగిన తర్వాత బాధిత బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకుని, తల్లిదండ్రులకు తనపై జరిగిన అమానుషాన్ని వివరించింది. పోలీసులకు సమాచారం అందించడంతో బాలికను నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
వారందరి పేర్లూ డిజిటల్ బుక్లో నమోదు చేస్తాం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే వైఎస్సార్సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం దాడులకు తెగబడుతోందని ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంబటి ఇంటిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించిన వారితో పాటు వారికి సహకరించిన పోలీసులనూ వదిలి పెట్టబోమని, అందరి పేర్లు వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్లోకి ఎక్కిస్తామని చెప్పారు. గుంటూరులోని సిద్ధార్థనగర్లో శనివారం టీడీపీ రౌడీమూకల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంలో ధ్వంసమైన ఫర్నిచర్, కాలిపోయిన కారు, చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు, పుస్తకాలు, ఎల్రక్టానిక్ సామగ్రిని ఆదివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అంబటి రాంబాబు సతీమణి విజయలక్షి్మ, కుమార్తెలు మౌనిక, మనోజ్ఞను పరామర్శించారు.అధైర్య పడవద్దని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబుపై పథకం ప్రకారం దాడి జరిగిందని, అంబటిని అంతమొందించేందుకు వందలాదిగా వచి్చన టీడీపీ రౌడీ మూకలను పెద్ద సంఖ్యలో ఉన్న పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయలేదన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తేలడంతో గోరంట్లలోని వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో పూజలు చేసి వస్తున్న అంబటి.. గోరంట్లలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పారు.ఫ్లెక్సీని తొలగించాలని కోరితే ఆయనపై అక్కడే దాడికి పాల్పడ్డారని, టీడీపీ మూకలు నడిరోడ్డుపై బహిరంగంగా కర్రలు, రాడ్లతో తిరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని దుయ్యబట్టారు. గంటల తరబడి కొనసాగిన రౌడీ మూకల దాడిపై శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ.. డీజీపీ, అదనపు డీజీపీలకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్లు చేసినా స్పందించలేదన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీని కలిసేందుకు వెళితే మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితను ఎస్పీ ఇంటి గేటు బయటే నిలబెట్టారని చెప్పారు. గతంలో స్కిల్ స్కామ్ కేసులో దోషిగా తేలిన చంద్రబాబును చట్టపరంగా అరెస్టు చేయించామని, అంబటి రాంబాబుపై జరిగిన దాడిపై చట్ట పరంగా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సజ్జల ఇంకా ఏమన్నారంటే.. జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం ⇒ సీబీఐ సిట్ దాఖలు చేసిన చార్జిషీట్లో తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఆరోపించినట్టుగా ఆవు, పంది కొవ్వు, చేపల నూనెలు కలవలేదని దేశంలోనే ప్రతిష్టాత్మక ల్యాబ్లు ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టుల ఆధారంగా నిర్ధారణ అయ్యింది. దేవుడ్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, ఇతర కూటమి నాయకులు చేసిన క్షుద్ర రాజకీయాలను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. ⇒ దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఉద్దేశ పూర్వకంగా దాడికి టీడీపీ వ్యూహరచన చేసి, అమలు చేసింది. పోలీసుల సమక్షంలోనే జరిగినా వారు ఎక్కడా అడ్డుకోలేదు. మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్ రెడ్డిపై ఇదే విధంగా దాడి చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త సహా పలువురు నాయకులు స్వయంగా దాడిలో పాల్గొన్నారు. ⇒ అంబటి నిజంగా తప్పు చేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. నాడు వైఎస్ జగన్ను పలు సందర్భాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ సహా పలువురు టీడీపీ, జనసేన నాయకులు తీవ్రమైన భాషతో దూషించారు. వాటిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? వారు ఇప్పటికీ అలాగే దూషణల పర్వం కొనసాగిస్తున్నారు. వాటిపై ఆధారాలతో సహా పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరిపైనా చర్య లు తీసుకున్న దాఖలాలు లేవు. వారందరినీ శిక్షించి తీరుతాం ⇒ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రంలో అశాంతిని సృష్టించడం చంద్రబాబుకు అలవాటే. గతంలో మేం అధికారంలో ఉన్నప్పుడు పట్టాభితో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి పదే, పదే తీవ్రంగా తిట్టించారు. ఫలితంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. దానిని మనసులో పెట్టుకుని అంబటి రాంబాబును చంపాలన్న కుట్రతోనే టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారని కచి్చతంగా తెలుస్తోంది. ⇒ టీడీపీ గూండాల దాడిపై వైఎస్సార్సీపీ చట్టపరంగా న్యాయ పోరాటం చేస్తుంది. పార్లమెంటులో సైతం దీనిపై గళమెత్తుతాం. వీడియోలన్నీ తీసిపెట్టుకున్నాం. దాడి వెనుక ఉన్న వారు, దాడిలో పాల్గొన్న వారి పేర్లూ డిజిటల్ డైరీలో ఎక్కిస్తాం. నిందితులను చట్టపరంగా శిక్షించి తీరుతాం. ⇒ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నందిగం సురే‹Ù, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహుల్లా తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి దగ్గరుండి దాడి చేయించారు : అంబటి మౌనిక గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి నాయకత్వంలో ఇంట్లో ఉన్న మహిళలపై కూడా దాడి జరిగిందని మాజీ మంత్రి, కాపు నాయకుడు, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక స్పష్టం చేశారు. టీడీపీ గూండాల దాడిలో దెబ్బతిన్న వస్తువులను ఆదివారం ఆమె పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డికి చూపించారు. శనివారం సాయంత్రం టీడీపీ మూకలు ఒక్కసారిగా ఇల్లు, కార్యాలయంపై దాడులకు తెగబడ్డారని చెప్పారు.టీడీపీ నాయకులు తన తండ్రిని ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టారన్నారు. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి వెంట పెద్ద సంఖ్యలో వచి్చన మహిళలు బూతులు తిడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురి చేశారన్నారు. గళ్లా మాధవి ఉసికొలి్పన తర్వాతే ఇంటితో పాటు కార్యాలయంపై దాడి జరిగిందని తెలిపారు. అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయంలో ఉన్నారని తెలిసీ, టీడీపీ రౌడీమూకలు విధ్వంసానికి దిగాయన్నారు. ఆ సమయంలో తాము పిల్లలతో బిక్కుబిక్కుమంటూ గడిపామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సహాయ, సహకారాలతోనేక ఈ దాడులు జరిగాయన్నారు. -
పోలవరానికి రూ.3,320.39 కోట్లే..
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 2026–27 బడ్జెట్లో రూ.3,320.39 కోట్లు కేటాయించింది. పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కు రూ.20 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టులో 41.15 మీటర్ల (కనీస నీటిమట్టం) ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పూర్తి చేయడానికి మాత్రమే నిధులు ఇస్తామని పునరుద్ఘాటించింది. అంటే.. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని 194.6 టీఎంసీల నుంచి 119.4 టీఎంసీలకు తగ్గించడాన్ని బడ్జెట్ సాక్షిగా మరోసారి స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణానికి కేటాయించిన నిధులు రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యానికి ఇదే పక్కా నిదర్శనం. గత 2025–26 బడ్జెట్లో పోలవరానికి కేంద్రం రూ.5,936 కోట్లు కేటాయించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రీయింబర్స్మెంట్ రూపంలో రూ.459.69 కోట్లను విడుదల చేసింది. అడ్వాన్సుగా రెండు విడతల్లో రూ.5,052.71 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. వాటిని ఎస్ఎన్ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమ చేసి.. పోలవరం ప్రాజెక్టు పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి మాత్రమే వ్యయం చేసి.. 75 శాతం ఖర్చు చేశాక యూసీలు(వినియోగ ధ్రువీకరణపత్రాలు) పంపితే మళ్లీ అడ్వాన్సుగా నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ఆ నిధులను ఎస్ఎన్ఏ ఖాతాలో జమ చేయకుండా, ఇతర అవసరాలకు మళ్లించింది. ఇదే అంశంపై పీపీఏ, కేంద్ర జల్ శక్తి శాఖ అనేకమార్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో విడతల వారీగా రూ.4,352 కోట్లను ఎస్ఎన్ఏ ఖాతాలో జమ చేసి.. ప్రాజెక్టు పనులకు, నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు ఖర్చు చేసింది. అంటే 2024–25లో అడ్వాన్సుగా ఇచ్చిన నిధుల్లో ఇప్పటికీ రూ.700 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదు. దాంతో కేంద్రం 2025–26 బడ్జెట్లో కేటాయించిన రూ.5,936 కోట్లలో ఒక్క పైసా కూడా ఇప్పటి దాకా విడుదల చేయలేదు. 2026–27 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. 2025–26 బడ్జెట్ అంచనాలను సవరించిన కేంద్ర ప్రభుత్వం పోలవరానికి కేటాయింపులను రూ.3,017.20 కోట్లకు పరిమితం చేసింది. అంటే.. గతంలో కేటాయించిన నిధుల్లో రూ.2,918.80 కోట్లు కోత వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 58 రోజుల్లో ముగుస్తుంది. దీన్ని బట్టి చూస్తే... సవరించిన బడ్జెట్లో కేటాయించిన రూ.3,017.20 కోట్లను కూడా వినియోగించుకోవడం సాధ్యం కాదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తాజా బడ్జెట్లో పునరుద్ఘాటనపోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేస్తూ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇవ్వాలని కేంద్ర కేబినెట్ తీర్మానించింది. తద్వారా పోలవరం రిజర్వాయర్ను బ్యారేజీగా మార్చేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం ఆమోదించినా, ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రి కె.రామ్మోహన్నాయుడు అభ్యంతరం చెప్పలేదు. దాన్ని చంద్రబాబు సర్కార్ కూడా వ్యతిరేకించలేదు.41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ 2024–25, 2025–26 బడ్జెట్లోనూ కేంద్రం స్పష్టం చేసింది. తాజా బడ్జెట్లోనూ అదే అంశాన్ని పునరుద్ఘాటించింది. వాస్తవానికి 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను పూర్తి చేసింది. ఆ మేరకు ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి, భూ సేకరణకు అదనంగా రూ.22 వేల కోట్లకుపైగా అవసరమని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నాడు.. నేడు.. అదేతీరు...పోలవరంలో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. వరద ప్రవాహం ఉన్నప్పుడు మాత్రమే కుడి, ఎడమ కాలువల కింద 2.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. ఇక కృష్ణా డెల్టా స్థిరీకరణ, గోదావరి డెల్టాలో రబీ పంటకు నీళ్లందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు నీళ్లందించడం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేస్తేనే ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడిగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు. 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచి్చన చంద్రబాబు.. 1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో, నాటి కర్ణాటక సీఎం దేవేగౌడను ప్రధానిని చేయడంలో ప్రధాన భూమిక పోషించి, కేంద్రంలో చక్రం తిప్పానంటూ అనేక మార్లు చెప్పుకున్నారు. అప్పట్లో కర్ణాటక సర్కార్ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 506 మీటర్ల నుంచి 519.6 మీటర్లకు పెంచేసి రిజర్వాయర్గా మార్చేసి, ఏపీ నోట్లో మట్టి కొట్టినా అప్పట్లో చంద్రబాబు నోర మెదపలేదు. ఇప్పుడు పోలవరం రిజర్వాయర్ను బ్యారేజ్గా మార్చేసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ఘనత కూడా చంద్రబాబే దక్కించుకున్నారంటూ సాగు నీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. సందిగ్ధత... అస్పష్టతసాక్షి, అమరావతి: కేంద్ర రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులపై స్పష్టత కొరవడింది. కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులను ప్రత్యేకంగా ప్రస్తావించ లేదు. ప్రధానంగా 7 కొత్త హై స్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. వాటిలో హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లు ఏపీ మీదుగా వెళతాయి. చెన్నై–బెంగళూరు హైస్పీడ్ కారిడార్ పరిధిలోకి రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని పలమనేరు ప్రాంతంలో కొంత ప్రాంతం వస్తుంది. రాష్ట్రంలోని అమరావతి రైల్వే లైన్, కడప – బెంగళూరు రైల్వే లైన్, కోటిపల్లి–నర్సాపురం, నడికుడి–శ్రీకాళహస్తి, డోన్–అంకోలా తదితర రైల్వే లైన్లకు కేటాయింపులపై స్పష్టత లేదు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు నిధుల కేటాయింపుపై సందిగ్ధత నెలకొంది. -
చంద్రబాబు పరపతి తుస్సు!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీఏలో కీలకంగా ఉన్నానని, తనవల్లే కేంద్రంలో మోదీ ప్రభుత్వం నడుస్తోందని చెప్పుకునే చంద్రబాబు మాటలన్నీ ఉత్తుత్తివేనని తేలిపోయింది. పైకి ఆయనెన్ని కబుర్లు చెప్పినా కేంద్రం మాత్రం చంద్రబాబును లెక్కలోకి తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. అందుకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్టే ఉదాహరణగా నిలుస్తోంది. 2024లో అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 27 సార్లు ఢిల్లీకొచ్చి కేంద్రానికి తాను చెప్పిందే వేదమన్నట్లుగా ప్రగల్భాలు పలికారు. తీరా ఈ బడ్జెట్ చూస్తే ఆయన మాటలన్నీ తుస్సే అన్నట్లుగా ఉంది. దీంతో ఎన్డీఏలో కీలకంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ సాధించుకోలేకపోయారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ ఎక్కడ చంద్రబాబూ? 2024లో అధికారం చేపట్టిన తర్వాత ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తర్వాత చంద్రబాబు ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చారు. 2026 కల్లా ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాలను అనుసంధానిస్తూ బుల్లెట్ ట్రైన్ పనులు పూర్తవుతాయన్నారు. తీరా 2026–27 బడ్జెట్లో ఏపీకి స్పీడ్ రైలు లేదా బుల్లెట్ రైలు వంటి వాటిల్లో దేనికీ ప్రాధాన్యత ఇవ్వలేదు. కనీసం విశాఖపట్నం–చెన్నై, విశాఖపట్నం–బెంగళూరు వంటి నగరాలకు స్పీడ్ రైలు కారిడార్ను సాధించడంలోనూ చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుల కేటాయింపులు రూ.2,066.32 కోట్లు ఇక చంద్రబాబు ఢిల్లీకి వచి్చన ప్రతిసారీ అమరావతి రాజధాని నిర్మాణానికి చేయూతనివ్వాలంటూ కోరుతున్నారు. కేంద్రం మాత్రం బడ్జెట్లో నిధులు కాకుండా అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులిచి్చంది. తాజా బడ్జెట్లో వివిధ అంతర్జాతీయ బ్యాంకుల అప్పుల ద్వారా కేటాయింపులు చేసింది. వీటిలో అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంకు నుంచి రూ.432.09 కోట్ల అప్పు.. ఏపీ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టుకు జర్మనీ బ్యాంకు నుంచి రూ.155.32 కోట్లు.. ఏపీ రోడ్ అండ్ బ్రిడ్జెస్ రీ–కనస్ట్రక్షన్స్ ప్రాజెక్టుకు ఎన్బీడీ నుంచి రూ.350 కోట్లు.. ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టుకు ఏఐఐబీ నుంచి రూ.1,128.91 కోట్ల అప్పులకు కేంద్రం కేటాయింపులు చేసింది. అంటే.. 2026–27 బడ్జెట్లో కేంద్రం చంద్రబాబుకు రూ.2,066.32 కోట్ల అప్పులకు అనుమతించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ బడ్జెట్లో చంద్రబాబును కేంద్రం పట్టించుకోలేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కూటమి ఎంపీలు మాత్రం ఆహా.. ఓహో.. ఇక కేంద్ర బడ్జెట్లో తాము సాధించింది ఏమీ లేకపోయినప్పటికీ టీడీపీ కూటమి ఎంపీలు మాత్రం ఆహా.. ఓహో అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. రాష్ట్రం మీదుగా పక్క రాష్ట్రాలకు రైల్వే కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపితే.. ఇదేదో తాము సాధించిన గొప్పగా బిల్డప్ ఇస్తున్నారు. -
బడ్జెట్లో ఏపీకి మళ్లీ అన్యాయమే
సాక్షి, న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లోనూ ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయమే జరిగిందని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు రైల్వే కారిడార్లు తెచ్చుకోవడంలో కూడా చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. గతేడాది కంటే ఈ ఏడాది పోలవరం ప్రాజెక్టుకు నిధులు తగ్గడంపై మండిపడ్డారు. ఢిల్లీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథరెడ్డి, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, గొల్ల బాబూరావు, వైఎస్ అవినాశ్రెడ్డి, డాక్టర్ మద్దిల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి మాట్లాడారు. ఎన్డీఏలో కీలకంగా ఉన్నామని చెప్పుకొనే చంద్రబాబు సాధించిందేమిటని ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు 41.5 మీటర్లకే ఉంచుతూ నిధులు కేటాయించినట్లు తెలిపారు. 2026–27 బడ్జెట్లో పోలవరానికి రూ.3,320 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. దేశంలో మిగతా రాష్ట్రాల నుంచి రైల్వే కారిడార్లు ఏర్పాటు చేసిన కేంద్రం.. కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్కు హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. విశాఖ–చెన్నై, విశాఖ–బెంగళూరుకు రైల్వే కారిడార్లు ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదన్నారు. ఈ విషయాల్లో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ రెండు అంశాలపై తాము కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. బడ్జెట్లో టూరిజానికి పెద్దపీట వేయడం, ఇందులో అరకు వ్యాలీ అభివృద్ధికి కేంద్రం చేయూతనివ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. అప్పులు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చినందునే చంద్రబాబు తలొగ్గుతున్నారు ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ను కేంద్రం పూర్తిగా నిరాశపరిచిందని చెప్పారు. పోలవరం, జలజీవన్, పీఎంజేఎస్వై పథకాలకు పూర్తిగా నిధులు తగ్గించారని మండిపడ్డారు. జీరాంజీ పథకానికి రూ.58 వేల కోట్లు కోత వేశారని చెప్పారు. ఈ స్కీంను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకుందని విమర్శించారు. రాష్ట్రాలు 40 శాతం భరించే పరిస్థితులు లేవని, కేంద్రం వాటా కుదిస్తే ఇది నిర్వీర్యం అవుతుందని ఆ రోజు బిల్లు పాస్ చేసినప్పుడు పార్లమెంట్లో వైఎస్సార్సీపీ తరఫున తాను చెప్పినట్లు గుర్తు చేశారు. ఏపీ పునరి్వభజన చట్టంలో... పోలవరాన్ని తాము నిర్మిస్తామని, ఇందుకు రూ.57 వేలకోట్లు గ్రాంటు ఇస్తున్నామని కేంద్రం పొందుపరిచిందని చెప్పారు. గత బడ్జెట్లో ఎత్తు తగ్గించి, నిధులు తగ్గించారన్నారు. దాదాపు రూ.27 వేల కోట్లు తగ్గించినా, ఎత్తు తగ్గించినా చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపడం లేదని విమర్శించారు. పోలవరానికి ఏటా ఇలా నిధులు తగ్గించుకుంటూపోతే ఆ స్వప్నం ఎప్పుడు సాకారమవుతుందని ప్రశ్నించారు. రూ.30 వేల కోట్లలో రూ.3,320 కోట్లే కేటాయించారన్నారు. కేంద్రం చంద్రబాబుకు అప్పులు చేసుకునే స్వేచ్ఛను ఇవ్వబట్టే.. పోలవరం విషయంలో తలొగ్గుతున్నారని దుయ్యబట్టారు. అమరావతి పేరుతో రూ.15 వేల కోట్లు అప్పు చేయడమేగాక.. మళ్లీ కొత్త అప్పులు తెచ్చారని తెలిపారు. చంద్రబాబు 21 నెలల్లో రూ.3.5 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. గత పాలనలో వైఎస్ జగన్ ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్ల అప్పుచేస్తే రాష్ట్రం శ్రీలంక, సోమాలియా అవుతుందని వ్యాఖ్యలు చేసిన వారంతా ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబుకు ఇంత అప్పు చేయడానికి సిగ్గులేదా అని నిలదీశారు. కొత్తగా ఏపీఎండీసీ పేరుతో రూ.5 వేలకోట్లు, బెవరేజెస్ కార్పొరేషన్ పేరుతో రూ.11 వేలకోట్ల అప్పునకు పూనుకున్నారని చెప్పారు. ప్రైవేటు సంస్థ ఏదైనా ప్రభుత్వానికి అప్పు ఇస్తే.. ప్రభుత్వం కట్టని పరిస్థితుల్లో ఆ అప్పును డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చనే షరతును ప్రభుత్వం పెట్టడం దుర్మార్గమని చెప్పారు. ఇబ్బడిముబ్బడిగా అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వాన్ని అత్యంత బలహీనమైన ప్రభుత్వంగా చూడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పోలవరం పూర్తికి మరో పదేళ్లు?ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రద్ధలేదని ఈ బడ్జెట్ ద్వారా మరోసారి తేటతెల్లమైందని విమర్శించారు. ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు మాటలు వింటుంటే అక్కడ నీరు ఏరులై పారుతున్నట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. పోలవరం ఎత్తు తగ్గింపులో కూడా చంద్రబాబు, ఆయన టీం నోరు మెదపలేదని విమర్శించారు. గతేడాది కంటే ఇప్పుడు మరింతగా నిధులు తగ్గించడం చూస్తుంటే ప్రాజెక్టు పూర్తి చేయడాన్ని మరో పదేళ్ల వరకు తీసుకెళ్లేలా ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ఎంపీ మేడ రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా ఏపీకి ఏటా అన్యాయం జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రభుత్వం అప్పులాంధ్రప్రదేశ్గా చేసిందన్నారు. రాష్ట్రాన్ని కార్పొరేట్ల చేతుల్లో ఎలా పెట్టాలి, సొంత లాభాలు ఎలా గడించాలి అనేవే చంద్రబాలు ఆలోచనలని ఆయన విమర్శించారు. -
నన్ను అంతం చేయడమే వారి లక్ష్యం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్)/గుంటూరు లీగల్: తనను అంతం చేయడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని వైఎస్సార్సీపీ నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీస్స్టేషన్లో తనను హింసించారని తెలిపారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తమ విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. దీంతో శనివారం ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం రాత్రి 8.30 గంటలకు గుంటూరు మొబైల్ కోర్టులో హాజరు పరిచారు.రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అంబటి పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనివల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిపై అంబటి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. అంబటిపై నమోదైన కేసు ఎఫ్ఐఆర్ చెల్లదన్నారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే ఉన్నతాధికారుల అనుమతితో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉందని, దీన్ని పోలీసులు పట్టించుకోలేదన్నారు. అంబటిపై పెట్టిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే కాబట్టి 41ఏ నోటీసు కూడా ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం తగదన్నారు. రెండు కాళ్లు పంగ చీల్చి వేధించారుఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు తనను హింసించిన తీరును న్యాయమూర్తి ఎదుట వివరించారు. ‘గుంటూరు సిద్ధార్థనగర్లోని మా ఇంటి వద్ద నుంచి శనివారం రాత్రి 10.30 గంటలకు పోలీసులు నన్ను నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. లాకప్లో పడుకుని ఉండగా, రాత్రి రెండు గంటలప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి.. స్టేట్మెంట్ రికార్డు చేయాలంటూ మొదటి అంతస్తులోకి తీసుకువెళ్లాడు. అక్కడ నల్లపాడు సీఐ వంశీధర్, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు వచ్చి పక్కన కూర్చున్నారు. తమకు పై నుంచి ఒత్తిడి ఉందని, తప్పుగా అనుకోవద్దని చెబుతూనే కానిస్టేబుళ్లకు సైగ చేశారు. కానిస్టేబుళ్లు నన్ను గోడకు అనించి కూర్చోబెట్టి, రెండు కాళ్లు ఎడం చేసి గట్టిగా లాగి పంగ చీల్చారు. నొప్పితో అరవడంతో కాసేపు ఆపి.. రెండోసారి కూడా అలాగే చేశారు. నొప్పితో తర్వాత లేచి నిల్చుని నడవలేక పోయాను. కొంచెం సేపు నెమ్మదిగా నడిపించి కిందికి పంపారు. చాలా నొప్పిగా ఉంది. నన్ను అంతం చేసేందుకే టీడీపీ నాయకులు ఈ వ్యవహారం అంతా చేస్తున్నారు’ అని న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో న్యాయమూర్తి అంబటి రాంబాబు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. తమ విధులకు అడ్డు పడ్డారంటూ నల్లపాడు ఎస్ఐ చేత పెట్టించిన కేసులో రిమాండ్ను తిరస్కరించారు. దీంతో అంబటిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. కాగా, అంతకు ముందు రాత్రి 7.30 గంటలకు అంబటికి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. న్యాయవాదుల ఆగ్రహంకోర్టు ఆవరణలో కూడా బ్యారికేడ్లు పెట్టడం, పోలీసులు తమను పదే పదే బయటకు పంపే ప్రయత్నం చేయడంపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలీసుల వల్ల తమకు కోర్టులో కూడా రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. అంబటిని ఏ జైలుకు తరలిస్తున్నారనే విషయం కూడా అంబటి రాంబాబు తరఫు న్యాయవాదులకు చెప్పక పోవడం దారుణం అని మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి నల్లపాడు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అంబటిని పోలీసులు ‘బాగా చూసుకున్నారు’ అని ఆమె తెలిపారు.రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపుతెల్లవారుజామున నాలుగు గంటలకునేత అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రత్యేక వాహనంలో ఎస్కార్ట్ తో సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. జైలు వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు.. జైలు బయట భద్రత పెంచారు. అంబటి రాంబాబుకు తీసుకొచ్చిన దుస్తులను సంచుల్లో పంపించేందుకు సైతం అనుమతించలేదు పోలీసులు. ఈరోజు అంబటితో వైఎస్సార్సీపీ నేతలు ములాకత్ కానున్నారు.తిరుగుబాటు తప్పదుప్రభుత్వ పెద్దలు పరిపాలనను పక్కనపెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అహంకార ధోరణితో కక్షగట్టి అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారు. తిరిగి ఆయనపైనే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దుర్మార్గంతో కూడిన రాక్షస చర్య. రెడ్బుక్ పేరుతో తండ్రీకొడుకులిద్దరూ కలిసి వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులపై దాడులు చేయడం, తప్పుడు కేసులతో అరెస్ట్ చేయడం మినహా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్నారా? తప్పుడు కేసులకు, బెదిరింపులకు భయపడేది లేదు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రిఆటవిక రాజ్యంలో ఉన్నామా?అంబటి రాంబాబుపై దాడికి పాల్పడటం దుర్మార్గం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామా? సీబీఐ–సిట్ దర్యాప్తులో లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని తేల్చింది. దీనిని డైవర్ట్ చేసేందుకు టీడీపీ గూండాలు అంబటి రాంబాబు ఇంటిని, పార్టీ కార్యాలయాన్ని, ఆయన వాహనాన్ని ధ్వంసం చేసి ఇంటికి నిప్పు పెట్టారు. – రామసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీడైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే..లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ నిగ్గు తేల్చడంతో డైవర్షన్ పాలిటిక్స్ను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం తమదేనన్న మదంతో అంబటి రాంబాబు ఇంటిపై పైశాచికంగా దాడులు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని దేవాలయం మెట్లు కడిగిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఈ రోజు ఏ దేవాలయం మెట్లు కడుగుతారో చెప్పాలి. చంద్రబాబు, లోకేశ్ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. – తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యేరాష్ట్రంలో రాబందుల పాలనరాష్ట్రంలో రాబందుల పాలన నడుస్తోంది. టీడీపీ కూటమి అధికారంలో ఉన్నంతకాలం పక్క రాష్ట్రాలకు పారిపోయేలా చేస్తున్నారు. చంద్రబాబు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఘటనతో ఏపీని ఆటవిక ప్రదేశ్గా మార్చేశారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడుచంద్రబాబు నేతృత్వంలో వికృత పాలనవైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేసే వికృత రాజకీయ క్రీడ రాష్ట్రంలో కొనసాగుతోంది. లోకేశ్ తోడల్లుడికి చెందిన గీతం వర్సిటీకి రూ.5 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టడంతో రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రజల ఆలోచనలను మళ్లించేందుకు పథకం ప్రకారం అంబటి రాంబాబుపై దాడి చేశారు. – సాకే శైలజానాథ్, మాజీ మంత్రిబిహార్ తరహా ఆటవిక పాలనరాష్ట్రంలో బిహార్ తరహా పాలనకు టీడీపీ కూటమి ప్రభుత్వం తెరతీసింది. వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల ఇంటిపై అధికార పార్టీ శ్రేణులు దాడికి పాల్పడటం గర్హనీయం. అంబటి ఇంటిపైన, మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన పెట్రోల్, కిరోసిన్ బాంబులతో దాడికి దిగారు. కూటమి పాలనలో రౌడీ రాజ్యానికి ఇది నిదర్శనం. – వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రిదాడులకు భయపడం రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. వైఎస్సార్సీపీ నాయకులపై కూటమి మూకలు దాడులు చేస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై దాడి చేయడం అమానుషం. డీజీపీ పచ్చచొక్కాను వీడి ఖాకీ చొక్కా ధరించాలి. పోలీసుల సమక్షంలోనే దాడులు జరగటం సిగ్గుచేటు. వైఎస్సార్సీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రభుత్వ విధానాలపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలు చేసూ్తనే ఉంటాం. – తలశిల రఘురాం, ఎమ్మెల్సీఅమిత్షా దృష్టికి తీసుకెళ్తాం..అంబటి రాంబాబుపై జరిగిన దాడి గురించి కేంద్ర హోంశాఖకు, ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాం. కేంద్ర హోంమంత్రి అమిత్షా దృష్టికి తీసుకెళతాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై పార్లమెంట్ వేదికగా తెలియజేస్తాం. బాధితుల్ని కాపాడాల్సిన పోలీసులు దాడిచేసేవారికి రక్షణ కల్పించడం దుర్మార్గం. – వైవీ సుబ్బారెడ్డి, ఎంపీవ్యూహం ప్రకారమే దాడి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను బట్టి వ్యూహం ప్రకారమే అంబటిపై దాడి జరిగిందనిపిస్తోంది. ఈ కేసులో పోలీసుల్ని నిందితుల్ని చేయాలి. – పిల్లి సుభాష్చంద్రబోస్, ఎంపీపోలీసులు చోద్యం చూశారుఅంబటి రాంబాబు కారులో వస్తుండగా ఆయన్ని అడ్డగించి టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూశారు. సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భర్త సమక్షంలో దాడి జరిగింది. – వైఎస్ అవినాశ్రెడ్డి, ఎంపీఅంబటిని రెచ్చగొట్టారు లడ్డూ వ్యవహారంలో అంబటి రాంబాబుపై 24 గంటల ముందునుంచే వ్యూహం పన్ని ఆయన్ని రెచ్చగొట్టారు. టీటీడీ ఈవోపై ప్రభుత్వం అభాండాలు వేస్తోంది. వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి తప్పుచేయలేదని సీబీఐ చార్్జషీట్ ద్వారా నిజం బహిర్గతమైంది. – మేడ రఘునాథరెడ్డి, ఎంపీ హత్య చేయాలని చూశారుఅంబటి రాంబాబును హత్యచేసేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నం చేశారు. వందలాదిమంది ఆయన ఇంటిపై దాడిచేసి నిప్పంటించడం అత్యంత దుర్మార్గం. దీని ఉద్దేశం ఏమిటంటే హత్యచేయాలనే కదా? అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారు? వారు పోలీసులా? గూండాలా? దాడిచేసిన వారిపై కేసులు పెట్టకుండా అంబటి రాంబాబుపై కేసు పెట్టడం దారుణం. – గొల్ల బాబూరావు, ఎంపీ


