breaking news
Andhra Pradesh
-
‘కదిరి రథోత్సవంలో పాల్గొనేందుకు వీలులేదు’.. బీజేపీ నేతపై ఆంక్షలు
సాక్షి,అనంతపురం: కదిరిలో టీడీపీ వర్సెస్ బీజేపీ నేతల మధ్య విభేదాలు చర్చాంశనీయంగా మారాయి. బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఆంక్షలు విధించారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనవద్దని హుకుం జారీ చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ వైఖరిని బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి ఖండించారు.గత 30ఏళ్లుగా రథోవ్సవంలో పాల్గొంటున్నా. నాపై ఆంక్షలు విధించడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఆంక్షలు లెక్క చేయనని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, విష్ణువర్ధన్రెడ్డి కట్టడి చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. -
కూటమిలో రోడ్డెక్కిన విభేదాలు
ఎన్టీఆర్ జిల్లా: అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అంటే ఒకేసారి చేస్తారు. కానీ కూటమి ప్రభుత్వంలో అలా జరగదు. ఒకరు ఉదయం భూమి చేస్తే.. అదే కార్యక్రమానికి సాయంత్రం మరొకరు భూమి పూజ చేస్తారు. ఇలా భూమి పూజతో అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమిలో వర్గ విభేదాలు రోడ్డెక్కాయి. ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఒకే రోడ్డుకు రెండు సార్లు భూమిపూజ నిర్వహించారు కూటమి నేతలు. కోడూరు మండలం కోడూరు ఎస్సీ కాలనీ రోడ్డుకు భూమి పూజలో రగడ నెలకొంది. ఉదయం జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ భూమి పూజ చేశారు. మధ్యాహ్నం అదే రోడ్డుకు కోడూరు మండల టిడిపి నాయకులు మళ్లీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘కూటమి పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసమే’
తాడేపల్లి : కూటమి పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసమే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. ఏ రంగంలో చూసినా అంత విధ్వంసమేనన్నారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన శైలజానాథ్.. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారన్నారు. ‘నిరుద్యోగుల జీవితాలను అన్యాయం చేశారు. వ్యవసాయ రంగాన్ని మరింత నాశనం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని మోసం చేశారు. PPP మోడ్ కింద ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పనంగా ఇస్తున్నారు. కొన్ని జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలను రుణాలు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు.. ఎస్సీ,ఎస్టీలకు వివిధ కార్పొరేషన్ల కింద ఇచ్చిన రుణాలను భేషరతుగా మాఫీ చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
ఏపీ రైతులపై అత్యధిక అప్పుల భారం..
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రైతులు దేశంలోనే అత్యధిక అప్పుల భారాన్ని మోస్తున్నారు. 2025, డిసెంబర్ 31 నాటికి ఏపీలో రైతన్నల నెత్తిన 3,75,254 కోట్ల రూపాయల అప్పుల భారం పడింది. ఈ పరిస్థితిని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంట్లో అధికారికంగా వెల్లడించింది. లోక్ సభలో లిఖిత పూర్వక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. రైతుల పై 2,01,744 కోట్ల రూపాయల పంట రుణాల భారం ఉండగా, టర్మ్ లోన్ భారం 1,73,510 కోట్ల రూపాయలగా ఉంది. మొత్తం కలిపి రైతులపై 3,75,254 కోట్ల రూపాయల రుణ భారంగా మారింది. దేశంలో తమిళనాడు తర్వాత రుణభారం లో తల్లడిల్లుతున్నారు ఏపీ రైతులు.ఫలితంగా దేశంలోనే రైతుల రుణభారంలో రెండో స్థానంలో ఏపీ ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులకు ఆదరణ కరువు అన్న దానికి ఇది సంకేతంగా నిలుస్తుంది. అరకొరగా రైతులకు వాగ్దానాలు అమలు చేస్తుండటంతో ఏపీ రైతులపై అప్పుల భారం తడిపి మోపడైంది. ఇక పక్క రాష్ట్రం తెలంగాణలో రైతులపై 1,75,960 కోట్ల రూపాయల అప్పుల భారం ఉంది. తెలంగాణలో రైతులపై క్రాప్ లోన్ 95,167 కోట్లు రూపాయలు, 80,792 కోట్ల రూపాయల టర్మ్ లోన్ గా ఉంది. -
టీడీపీ ప్రభుత్వంలో ‘వైఎస్సార్సీపీ అంటే ఓట్లు తొలగింపే’
సాక్షి,తాడేపల్లి: 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం 40 లక్షల ఓట్లు తొలగించింది. మన ఓటర్లను మనమే కాపాడుకోవాలి. వారి ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బూత్ లెవల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా, జోనల్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, నియోజకవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడారు. ‘ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా పార్టీ ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలి. అవసరమైతే టాస్క్ఫోర్స్లా ఏర్పడి పని చేయాలి. ఈ విషయంలో బూత్ కమిటీలదే కీలకపాత్ర. 2019 ఎన్నికలకు మందు టీడీపీ ప్రభుత్వం 40 లక్షల ఓట్లు తొలగించింది. ఇంటింటికి వెళ్లి వైఎస్సార్సీపీ సానుభూతిపరులని తెలియగానే ఓట్లు తీసేశారు.దీనిపై అప్పట్లో మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మన ఓటర్లను కాపాడుకోవాలి. వారి ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలి.అందుకు అవసరమైతే టాస్క్ఫోర్స్ కూడా ఏర్పాటు చేసుకుందాం. బూత్ లెవెల్ పరిధిలో నాయకులను ఈ ప్రక్రియలో ప్రమేయం చేయాలి’ అని సూచించారు. -
‘చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సూపర్ సిక్స్ పేరుతో మహా దగా చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. మహిళలను మోసం చేసి మహిళా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన వరుదు కళ్యాణి.. చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ అంటూ ధ్వజమెత్తారు.‘మూడు జనరేషన్లను ఛీట్ చేసిన వ్యక్తి చంద్రబాబు. మహిళలను వేధించిన ఎమ్మెల్యేలను పక్కన కూర్చోపెట్టుకుని మహిళా దినోత్సవం జరుపుకుంటారా?, మహిళా ద్రోహి పార్టీ టీడీపీ. జగన్ తెచ్చిన పథకాలను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ఇప్పటికీ రాయితీలు ఇవ్వలేదు. డ్రాక్రా మహిళలకు సున్నా వడ్డీ డబ్బులే ఇవ్వకుండా వారిని కూడా పారిశ్రామిక వేత్తలను చేస్తానంటున్నారు. చంద్రబాబు పాలనలో డ్వాక్రా గ్రూపుల పరపతి తగ్గింది. బ్యాంకర్లు రుణాలను ఇవ్వటం తగ్గించారు. మరి పారిశ్రామిక వేత్తలను చేస్తానంటూ ఎలా మాట్లాడతారు?, జగన్ సున్నావడ్డీ కింద దాదాపు రూ.5 వేల కోట్లు మహిళలకు ఇచ్చారు. చంద్రబాబు వలన డ్వాక్రా గ్రూపులన్నీ నిర్వీర్యం అవుతున్నాయి. ఫ్రీ బస్, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలెండర్ పథకాలు ఎవరికిచ్చారు?, సగం మందికి కూడా ఇవ్వకుండా సక్సెస్ చేశామని ఎలా చెప్పుకుంటారు?, అసెంబ్లీలో, బయటా డ్రామా చేయడమే చంద్రబాబుకు తెలుసు. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం.. అన్నీ చంద్రబాబేమంత్రులు, ఎమ్మెల్యేలు కేరక్టర్ ఆర్టిస్టులుగా మిగిలి పోయారు. చంద్రబాబు, వైఎస్ జగన్ పాలనకు నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్ అన్ని వర్గాల మహిళలకూ మేలు చేశారు. చంద్రబాబు అందరినీ నిలువునా మోసం చేశారు. మహిళా ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారు. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు మహిళలకు కనపడకుండా తిరుగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నిలదీస్తారని భయపడుతున్నారు. రాష్ట్రంలో రోజూ మహిళలపై లైంగిక దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?, కాల్ సెంటర్కు కాల్ చేసినా ఏపీ పోలీసులు స్పందించటం లేదని సాక్షాత్తూ కేంద్ర మంత్రి అమిత్షానే లెటర్ రాశారుదేశంలోనే అట్టడుగు స్థానంలోకి ఏపీ పోలీసు వ్యవస్థ వెళ్లిపోయింది. మహిళలు, చిన్నారులకు ఏపీలో అసలు రక్షణే లేదు. హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలోనే గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి పండించటం సిగ్గుచేటు. మహిళను వేధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?, లోకేష్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త మహిళల ఫోటోలు తీస్తూ దొరికాడు. మహిళలు అర్ధరాత్రి వరకు ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ. మూడు జనరేషన్లను ఛీట్ చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనమంటూ ఉచిత సలహా ఇస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. -
‘దేవుడికి దాతలు భూములిస్తారు.. మీరు దేవుడికి భూములు అమ్ముతారు’
తిరుపతి: తిరుమల శ్రీవారిని కూడా రాజకీయ అవసరాలకు వాడుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ధ్వజమెత్తారు. టీటీడీ చరిత్రలో ఆలయాలకు భూమి కొన్నది లేదని, కానీ అమరావతి వెంకటాయపాలెంలో టీటీడీ ఆలయానికి భూమి కొన్నారని మండిపడ్డారు. వెంకటాయపాలెంలో దేవాలయ నిర్మాణానికి స్థలాన్ని దాతలు కానీ, సంస్థలు కానీ ఇస్తాయని, మరి దాన్ని పక్కనపెట్టి భూమి కొనడం ఏంటని ప్రశ్నించారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వతేదీ) తిరుపతి నుంచి మాట్లాడిన భూమన.. ‘ దేవుడికి దాతలు భూములిస్తారు.. మీరు దేవుడికి భూములు అమ్ముతారు.ఉచితంగా టీటీడీ భూమి కోరితే సవాలక్ష నిబంధనలు పెట్టారు. వివిధ సంస్థలకు మాత్రం ఉచితంగా భూములు కేటాయించారు. టీటీడీ రూ. 12 కోట్ల సొమ్మును సీఆర్డీఏ వెనక్కి ఇవ్వాలి. మహిళల జోలికొచ్చిన టీటీడీ చైర్మన్ను చూస్తే అసహ్యించుకుంటున్నారు’ అని విమర్శించారు.ఎవరూ ఈ సాహసం చేయలేదు..నవీ ముంబైలో అప్పటి సీఎం ఏక్ నాథ్ షిండే వెంకటేశ్వర స్వామి ఆలయంకు ఉచితంగా స్థలం కేటాయించారు. జమ్మూకశ్మీర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూలో ఉచితంగా శ్రీవారి ఆలయం నిర్మాణంకు ఉచితంగా స్థలం కేటాయించారు. పల్లవ మహారాణి సమవాయి, చోళ రాణి పరాంతక మణి, యాదవ రాజులు, విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కౌనకాలు, ఆస్తులు ఇచ్చారు. టీటీడీ చరిత్రలో ఏ ఒక్క చోట దేవాలయాలకు స్థలం కొన్నది లేదు. సీఎం చంద్రబాబు అమరావతి వెంకటాయ పాలెంలో 25 ఎకరాలు వెంకటేశ్వర స్వామి ఆలయంకు స్థలం కొనుగోలు చేశారు. ఎకరా 50 లక్షలకు అమ్మారు. రూ. 12 .50 కోట్లు ధర చెల్లించారు. ప్రపంచంలో ఏ ఒక్కరు ఇలాంటి సాహసం చేయలేదు. ఆర్థికంగా వివిధ సంస్థలకు ఏపీ ప్రభుత్వం భూములు కేటాయింపు ఉచితంగా చేసింది. ఏపీ హ్యూమన్ రిసోర్స్ సంస్థకు ఉచితంగా స్థలాలు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం సంస్థ సెంట్రల్ ఇనిస్టిట్యూటల్ డిజైన్ ఉచితంగా భూమి కేటాయింపు చేసింది. మరి అమరావతిలో టీటీడీ ఆలయం నిర్మాణంకు రూ. 12.50 కోట్లతో కొనుగోలు చేశారు. వ్యాపార రాజధాని కు వెంకటేశ్వర స్వామి వాణిజ్య అవసరాలకు వాడుకున్నారని స్పష్టంగా అర్థం అవుతోంది. తమిళనాడు చెన్నై జీ స్క్వేర్ రియల్ ఎస్టేట్ సంస్థ స్థలంలో వెంకటేశ్వర ఆలయం నిర్మాణం చేస్తున్నారు. చెన్నై ఆలయం విస్తరణకు టీటీడీ దాతలు సహాయంతో చేశారు. నటి కాంచన ఇచ్చిన స్థలంలో అమ్మవారు ఆలయం నిర్మాణం చేశారు. బీఆర్ నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు..గత ఏడాది కాలంగా మీరు చేస్తున్న అరాచకాలతో, హిందువులను అపహాస్యం చేస్తున్నారు.. భగవద్గీత పై రూ. 50 కోట్లు ఖర్చు అని బీఆర్ నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కోటి పుస్తకాలకు 52 లక్షలు పుస్తకాలు ప్రింట్ అయ్యాయి, భగవద్గీతకు ఇప్పటివరకు మూడున్నర కోట్లు ఖర్చు చేశారు. పుస్తకానికి .3 రూపాయలు 71 పైసలు ఖర్చు అయ్యింది. బీఆర్ నాయుడు బుకాయిస్తే సరిపోదు..పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
ఎయిమ్స్లో డయేరియా.. మూడు రోజులుగా తీవ్ర అవస్థలు
గుంటూరు, సాక్షి: మంగళగిరి ఎయిమ్స్లో డయేరియా కలకలం రేగింది. హస్టల్లోని వైద్య విద్యార్థులతో పాటు సిబ్బంది గత మూడు రోజులుగా వాంతులు, విరేచనాలతో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. దీంతో 10 మంది విద్యార్థులకు ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. అయితే డయేరియాకు గల కారణాలు ఏంటి.. ఫుడ్ పాయిజన్, కలుషిత నీరు వల్ల సంభవించిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళల పట్ల టీడీపీ నాయకుడి అమానుషం
గుంటూరు జిల్లా: మహిళల ఫొటోలను ఐటీడీపీకి చెందిన నాయకుడు తీసి మార్ఫింగ్ చేస్తున్న సంఘటన వెలుగు చూసింది. ప్రశ్నించిన మహిళలపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఆగ్రహించిన మహిళలు ఆందోళనకు దిగారు. సేకరించిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన నల్లమామిడి అంజయ్య కళాశాల విద్యార్థునులు, మహిళల ఫొటోలు తీసి మార్ఫింగ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ విద్యార్థిని గుర్తించి శనివారం రాత్రి అంజయ్య ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ నర్రా శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని ‘ఏం చేస్తారు మీరు అంటూ దురుసుగా మాట్లాడి, కేసులు పెట్టినా, వెంటనే తీసుకువచ్చి ఇదే రోడ్డులో తిప్పుతానని’ బెదిరించాడు. సమాచారం తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల మహిళలు తెనాలి– మంగళగిరి రహదారిపై ఆందోళనకు దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకోకుండా సుమారు మూడు గంటల పాటు పక్కన ఉన్న చర్చిలో ఉంచారు. గతంలో కూడా ఫొటోలు తీస్తున్న విషయం గమనించి కొందరు మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు. అయినా కూడా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదని బాధితులు అంటున్నారు. కేవలం దళిత పిల్లల్ని ఫొటోలు తీయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతు పలికారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు, మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాలుగు గంటల అనంతరం పోలీసులు నిందితుడిని దుగ్గిరాల పోలీసుస్టేషన్కు తరలించారు. -
జీడిమామిడీ మధురమిక..
రంపచోడవరం: ఏజెన్సీలో జీడిమామిడి పంట విస్తీర్ణం పెంచేందుకు కార్యాచరణ సిద్ధమైంది. ఏటా జీడిమామిడి పిక్కలను బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తుండడంతో ఈ పంట తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మొక్కలు నాటి వాటి విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల కేరళ రాష్ట్రం త్రిచూర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ అంశంపై జాతీయస్థాయి సమావేశం నిర్వహించారు. అల్లూరి జిల్లాలో జీడిమామిడి పంటను మరింతగా ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలను డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ పీసీ వెంగయ్య వివరించారు. ఇందులో భాగంగా గిరిజన ప్రాంతంలో జీడిమామిడి అభివృద్ధికి గిరిజనులకు ఉచితంగా మొక్కల పంపిణీ, పాత తోటల స్థానంలో అంటు మొక్కలు వేయించడం, వాటికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిచడం వంటి విషయాలపై ప్రణాళికలు రూపొందించారు. పరిశ్రమలకు ప్రోత్సాహం జీడిమామిడి ఉత్పత్తులకు పరిశ్రమలను ప్రోత్సహించడం, జీడిమామిడి పండు నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం, జీడిమామిడి తోటల పెంపకం, చీడ పీడల నుంచి రక్షణకు శిక్షణ ఇవ్వడం, జీడిపప్పు, జీడిపండు ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించడం, సబ్సిడీ ఇవ్వడం, ఏజెన్సీలోని ఉత్పత్తులకు ఆర్గానిక్ బ్రాండ్ కల్పించడం తదితర చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు శిక్షణ ఇచ్చేందుకు కొచ్చిలోని జీడి మామడి అభివృద్ధి సంస్థకు అవకాశం కల్పించారు. పండ్లతో అనేక ఉత్పత్తులు.. జీడిమామిడి పండ్లతో జెల్లీ, వైన్, పచ్చళ్ల వంటి అనేక రకాలైన ఆహార పదార్థాలు తయారు చేయవచ్చు. జీడిమామిడి పండులో విలువైన పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. మిగతా పండ్లతో పోల్చితే నాలుగు రేట్లు అధికంగా ఉంటుంది. ఐరన్, మాంస కృత్తులు 0.15 శాతం, కొవ్వు పదార్థాలు 0.5 శాతం, పీచు పదార్థాలు 0.5 నుంచి 1 శాతం ఉంటాయి. జీడిమామిడి పండ్లు తీయగా ఉన్నçప్పటికీ నేరుగా తింటే పినాలిక్స్ వల్ల గొంతులో కీచు ఏర్పడుతుంది. దీనిని అధిగమించి విలువ అధారిత ఉత్పత్తుల తయారీకి ఉద్యాన పరిశోధన శాస్త్రవేత్తలు చర్యలు చేపడుతున్నారు. ఏటా 40 లక్షల టన్నులు వృధా జీడిగింజ ఉత్పత్తికి మాత్రమే జీడిమామిడి పంట సాగు చేస్తున్నారు. జీడిగింజ కంటే 8 నుంచి 10 రెట్లు పరిమాణంలో ఉన్న ఆ పండు మాత్రం వృథాగా తోటల్లో మిగిలిపోతోంది. ఏటా 40 లక్షల టన్నుల జీడిమామిడి పండ్లు తోటల్లో వృ«థా అవుతున్నాయి. జీడిమామిడి పండులో 85 శాతం రసం, 10 శాతం చక్కెర ఉంటాయి. పండు రసంలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్, మాల్టోజ్, మాలిక్ ఆమ్లం ఉంటాయి. తోటల అభివృద్ధికి కృషిజిల్లాలో 50 వేల ఎకరాల్లో జీడిమామిడి పంట సాగులో ఉంది. ఈ విస్తీర్ణం మరింత పెంచేందుకు ఇటీవల కేరళలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇందు కోసం పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించనున్నారు. జీడిమామిడి పిక్కల కంటే ఆ పండ్ల లభ్యత ఎక్కువగా ఉంటుంది. కాని వాటి వల్ల ఇప్పటి వరకు ఇక్కడ రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. చెట్ల నుంచి పిక్కలను సేకరించి పండ్లను వదిలేయడంతో అవి వృథాగా పోతున్నాయి. ఏజెన్సీలో రైతులు కేవలం పిక్కలను మార్కెట్ చేయడంపై మాత్రమే దృష్టి పెట్టారు. కానీ ఆ పిక్కల నుంచి పప్పు సేకరణకు ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోలేదు. జాతీయ స్థాయిలో జరిగిన సమావేశంలో రైతులు కొత్తగా జీడిపప్పు పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం లభించనుంది. దేశంలో కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు జీడిమామిడి పంట ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో ముందున్నాయి. తాజాగా జీడిమామిడి అభివృద్ధి సంస్థ తీసుకున్న నిర్ణయంతో ఏజెన్సీ ప్రాంతంలో జీడిమామిడి అభివృద్ధికి బాటలు పడనున్నాయి. గిరిజనుల ఆర్థిక ప్రగతికి గిరిజనుల ఆర్థిక ప్రగతికి జీడిమామిడి పంటతో విలువ అధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారిస్తున్నాం. పిక్క నుంచి వచ్చే మొక్కల వల్ల దిగుబడి అంతగా రాదు. వాటి స్థానంలో అంటు మొక్కలను రైతులకు ఇస్తాం. జీడిమామిడి పంట ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో ఆర్థికంగా ఉపయోగ పడేలా కార్యచరణ, శిక్షణ ఇస్తాం. – పీసీ వెంగయ్య, హెచ్ఆర్ఎస్ అధిపతి, ఫుడ్ సైంటిస్ట్, పందిరిమామిడి -
సీనరేజ్ భారీగా పెంచిన ప్రభుత్వం
అనంతపురం టౌన్: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిననాటి నుంచి నేటి వరకు ప్రజలపై వివిధ రకాలుగా భారం మోపుతూనే ఉంది. ఇప్పటికే రెండుమార్లు భూముల ధరలను పెంచి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పాతాళంలోకి నెట్టేసింది. విద్యుత్ వినియోగదారులపై సైతం డెవలప్మెంట్ చార్జీల పేరిట వేల రూపాయల భారం మోపింది. తాజాగా ఖనిజ రవాణాపై సీనరేజ్ ధరలను అమాంతం పెంచేసింది. గతంతో పోలిస్తే 50 శాతం మేర సీనరేజ్ను పెంచింది. దీంతో క్వారీ నిర్వాహకులతో పాటు రోడ్డు మెటల్ కొనుగోలుదారులపై అదనపు సీనరేజ్ భారం పడనుంది. గత ప్రభుత్వంలో ఒక క్యూబిక్ మీటర్ రోడ్డు మెటల్ తవ్వి తరలిస్తే రూ.90 మేర సీనరేజ్ చెల్లించాల్సి ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం రూ.150కి పెంచింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 146 రోడ్డు మెటల్ క్వారీల్లో 120కిపైగా రన్నింగ్లో ఉన్నాయి. రోజువారీగా వేల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ తవ్వకాలు చేస్తున్నారు. ప్రస్తుతం పెంచిన ధరల మేరకు క్వారీ నిర్వాహకులు సీనరేజ్ను చెల్లిస్తున్నారు. గ్రానైట్పై సైతం సీనరేజ్ను పెంచేశారు. గ్రానైట్ రకాన్ని బట్టి కలర్, బ్లాక్, గెలాక్సీ తదితర రకాలపై రూ.240 నుంచి రూ.500 వరకు క్యూబిక్ మీటర్పై పెంచేశారు. జిల్లా వ్యాప్తంగా 193 గ్రానైట్ క్వారీల్లో ప్రస్తుతం 100కు పైగా నడుస్తున్నాయి. పెరగనున్న రోడ్డు మెటల్ ధరలు సీనరేజ్ పెరగడంతో రోడ్డు మెటల్ ధరలను సైతం క్వారీ నిర్వాహకులు పెంచే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం 40 ఎంఎం మెటల్ ఒక యూనిట్కు రూ.2,500లు, 20 ఎంఎం యూనిట్కు రూ.3 వేల చొప్పున వినియోగదారులకు విక్రయిస్తున్నారు. సీనరేజ్ పెంపుతో రోడ్డు మెటల్ ధరలను సైతం పెంచేందుకు క్వారీ నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. క్వారీ నిర్వాహకుల అసోసియేషన్ సమావేశం నిర్వహించి.. ఎంతమేర పెంచాలో నిర్ణయం తీసుకొని వారం రోజుల్లో పెంచనున్నట్లు సమాచారం. రోడ్డు మెటల్ ధరలు పెరిగితే భవన నిర్మాణ యజమానులు, రోడ్డు కాంట్రాక్టర్లు, బిల్డర్లపై అదనపు భారం పడనుంది.సీనరేజ్ పెరిగింది ఖనిజాలపై సీనరేజ్ను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన మాట వాస్తవమే. పెంచిన సీనరేజ్ ధరలను ఇప్పటికే అమలు చేస్తున్నాం. రోడ్డు మెటల్పై క్యూబిక్ మీటర్కు రూ.60 మేర పెంపు చేశారు. ప్రస్తుతం క్యూబిక్ మీటర్ ధర రూ.150 మేర ఉంది. గ్రానైట్పై సైతం స్వల్పంగా పెంచారు. గ్రానైట్ సైజులను బట్టి సీనరేజ్ ధరలు పెరగనున్నాయి. – ఆదినారాయణ, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ -
ప్రాణాలకు భద్రత కరువు
ఉదయగిరి: రాష్ట్రంలో రోడ్డెక్కాలంటే భయంతో వణికిపోవాల్సి వస్తోంది. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోననే ఆందోళన వాహనదారుల్లో నెలకొంది. నిబంధనలను ప్రభుత్వం, రవాణా అధికారులు కచ్చితంగా అమలు చేయకపోవడంతో వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎంతోమంది క్షత్రగాతులుగా మారుతున్నారు. కేంద్ర మోటార్ వాహనాల చట్టాన్ని తెలంగాణలో గత నెల 20 నుంచి అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే రాష్ట్రంలోనూ ఈ విధానానికి శ్రీకారం చుట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇదీ పరిస్థితి.. రాష్ట్ర పరిధిలో మొత్తం 55 జాతీయ రహదారులు.. 8638.15 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ మార్గాల్లో నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి వేళ, పొగమంచు కురిసే సమయాల్లో ముందున్న వాహనాలు అతి సమీపానికి వచ్చేంత వరకు కనిపించవు. దీంతో ప్రమాదాల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. రాష్ట్ర రవాణా, పోలీస్ శాఖల వివరాల మేరకు రెండేళ్లలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు, క్షత్రగాతుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. చలి కాలంలో ముందున్న వాహనాలు కనిపించక రాష్ట్రంలో 1550 ప్రమాదాలు జరగ్గా, ఇందులో 700 మంది మృత్యవాత పడగా, మరో 1530 మంది గాయపడ్డారు. స్పష్టమైన విధానాలేవీ..? రిఫ్లెక్టివ్ టేపుల వినియోగంపై రాష్ట్రంలో నేటికీ స్పష్టమైన విధానమే లేదు. మరోవైపు నకిలీవి మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. ప్రత్యేక విజిబిలిటీ చెకింగ్ డ్రైవ్లను రాత్రి వేళ చేపడుతున్న దాఖలాల్లేవు. ఇలా తిలాపాపం తలా పిడికెడు అనే రీతిలో ప్రభుత్వం.. అధికారులు వ్యవహరిస్తుండటంతో యాక్సిడెంట్లు నిత్యకృత్యమవుతున్నాయి. తెలంగాణలో అమలు.. తెలంగాణలో ఈ విధానాన్ని అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోంది. క్యూఆర్ కోడ్ ఉన్న సరి్టఫైడ్ రిఫ్లెక్టివ్ టేపులను అమర్చాలి. ప్రభుత్వం ఎం ప్యానల్ చేసిన వాటిని మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఒక వేళ ఇవి లేకపోతే ఫిట్నెస్ పత్రాన్ని జారీ చేయరు. రాత్రి వేళ విజిబిలిటీ చెకింగ్, కఠినమైన జరిమానాలను విధిస్తున్నారు. గత నెల 20న ఈ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ పద్ధతికి ఇక్కడా శ్రీకారం చుట్టాలని వాహనదారులు కోరుతున్నారు.చట్టం అమల్లో నిర్లక్ష్యం కేంద్ర మోటార్ వాహనాల చట్టం అమల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తోంది. వాస్తవానికి ఈ నిబంధన మేరకు యజమానులు తమ వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులను విధిగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు కాంతివంతమైన లైట్లనూ బిగించుకోవాలి. అయితే రాష్ట్రంలో ఇవి అమలుకు నోచుకోవడంలేదు. ఫలితంగా నెల్లూరు, ఎన్టీఆర్, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో చలికాలంలో తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉండి, ముందున్న వాహనాలు సమీపానికి వచ్చేంత వరకు డ్రైవర్లకు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై నిలిపిన లారీలు, ట్రక్కులు, ట్రాక్టర్లు తదితరాలకు ఈ టేపుల్లేకపోవడంతో ప్రమాదాలు రాత్రి వేళ ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక వేళ వినియోగించినా, నాణ్యమైన టేపులు కాకపోవడం సైతం ప్రమాదాలకు కారణంగా నిలుస్తోంది. -
ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలి దుర్మరణం
బత్తలపల్లి: బస్సు రాగానే ఎక్కేందుకు ప్రయాణికుల నడుమ తోపులాట జరగడంతో ఓ వృద్ధురాలు అదే బస్సు కింద పడి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో ఆదివారం జరిగింది. కదిరికి చెందిన భాగ్యమ్మ(80) తన కోడలు మాధవితో కలిసి ఆదివారం ధర్మవరంలో సమీప బంధువుల ఇంట్లో శుభకార్యం చూసుకుని బత్తలపల్లికి చేరుకున్నారు. నాలుగు రోడ్ల కూడలిలో కదిరి వెళ్లే బస్సు కోసం వేచి ఉండగా బస్సు రావడంతో ఎక్కే సమయంలో ప్రయాణికుల రద్దీ కారణంగా తోపులాట జరిగింది. భాగ్యమ్మ ప్రమాదవశాత్తు బస్సు వెనుక టైరు కింద పడింది. బస్సు ముందుకు కదలగానే ఆమె తలపై నుండి వెనుక చక్రాలు వెళ్లాయి. తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు కేకలు వేయడంతో బస్సు నిలిపివేశారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసు స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ బస్సులో మహిళ మృతిజంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ శ్వాస ఆడక మృతి చెందింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన ముప్పిడి జ్యోతిరెడ్డి (50) ఆదివారం జంగారెడ్డిగూడెంకు వెళ్లేందుకు గోపాలపురంలో కొవ్వూరు ఆర్టీసీ డిపో బస్సు ఎక్కింది. బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉండగా జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్కు వచ్చేసరికి జ్యోతిరెడ్డి స్పృహ తప్పి పోయిఉంది. తోటి ప్రయాణికులు గమనించి 108కు సమాచారమివ్వగా స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్టు చెప్పారు. జ్యోతిరెడ్డి కుమారుడు తన తల్లి అనారోగ్యంతో ఉన్నారని, ఆమె మృతిపై అనుమానాలూ లేవని చెప్పి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. -
నీటిగుంతలో మునిగి 10వ తరగతి విద్యార్థి మృతి
మంగళగిరి టౌన్: నీటిగుంతలో మునిగి 10వ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. కృష్ణాయపాలేంకు చెందిన కంతేటి ప్రకాష్, విమల దంపతుల కుమారుడు ప్రజ్వల సంతోష్ (15) పదో తరగతి చదువుతున్నాడు. పరీక్షల నేపథ్యంలో పెనుమాకలోని ట్యూషన్కు ఆదివారం వెళ్లాడు. ట్యూషన్ అనంతరం ఇంటికి వచ్చే మార్గంలో నీటిగుంతలో ఈతకు దిగి మునిగిపోయాడు. స్థానికులు గమనించి ఒడ్డుకు చేర్చేలోపే సంతోష్ మృతిచెందాడు. కాగా, రాజధాని రోడ్డు నిర్మాణ పనుల కోసం తవి్వన నీటిగుంతలోనే బాలుడు మృతిచెందినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాలుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదం జరిగిన నీటిగుంత వద్ద ఎటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం వల్లే బాలుడు మృతి చెందాడని పలువురు స్థానిక దళితనాయకులు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు ప్రభుత్వం, సంబంధిత కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాలుడి మృతిని ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తున్నట్లు ఉద్ఘాటించారు. పోలీసులు సుమోటాగా తీసుకుని దీనికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
పింఛన్లు, రేషన్ కోసం.. కుటుంబాలు విడిపోతున్నాయి
సాక్షి, అమరావతి: పింఛన్లు, రేషన్ కోసం కుటుంబాలు విడిపోతున్నాయని.. దీనిని నివారించేందుకు కొత్త విధానం తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చే లబ్ధి చిన్న కుటుంబాలకు కాకుండా పెద్ద కుటుంబాలకే ఇస్తానని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధానిలో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. కుటుంబమే మనకు ఒక భద్రత అన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే మహిళలకు మాదిరిగానే పురుషులకు కూడా రెండునెలల వరకు సెలవు ఇస్తానని తెలిపారు. ఒకప్పుడు ముగ్గురు పిల్లలను కనొద్దని చెప్పిన తానే ఇప్పుడు రాష్ట్రంలో జనాభా తగ్గుదల నేపథ్యంలో ‘ముగ్గురు పిల్లలు ముద్దు’ అంటూ ఫ్యామిలీ మ్యానేజ్మెంట్ అంటున్నానన్నారు. ‘రాబోయే పదేళ్లు నేను చెప్పింది వినండి, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండకపోతే అప్పుడు నన్నడగండి’.. అంటూ వ్యాఖ్యానించారు. బాబు ఇంకా ఏమన్నారంటే..సెర్ప్, మెప్మాను ఒకే గొడుగు కిందకు తెస్తా..మా పార్టీ అధికారంలో లేనప్పుడు ఆయా ప్రభుత్వాలు పొదుపు సంఘాలను పట్టించుకోలేదు. బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను 99.89 శాతం తిరిగి కట్టే వ్యవస్థ డ్వాక్రా వ్యవస్థే. రాబోయే రోజుల్లో మెప్మా, డ్వాక్రా (సెర్ప్) రెండింటిని వెలుగు అనే ఒక గొడుగు కిందకు తెస్తా. పొదుపు సంఘాల మహిళలు తయారుచేసే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించేలా స్వయం పేరుతో ఒక బ్రాండ్ను ప్రారంభించా. ఈ ఏడాది మహిళల్లోనే లక్షల మంది పారిశ్రామికవేత్తలు తయారయ్యారు. మీకేదైనా అయితే నాకు ఫోను చేయండి.. ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మన దగ్గర పెట్రోల్, గ్యాస్ రేట్లు పెరిగే పరిస్థితి ఉంది. ఓపెన్ మార్కెట్లో సిలిండర్ ధరలు పెరిగినా.. మా ఆడబిడ్డలకు నేను ఇచ్చే 3 సిలిండర్లు ఉచితంగానే ఇస్తా. ఐదేళ్లు గంజాయి బ్యాచ్లను తయారుచేశారు. ఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయింది. మీకేదైనా జరిగితే నాకు ఫోన్ చేయండి. ఎవడైనా సరే.. తాటతీస్తా. ఇక ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాలకు రూ.10,100 కోట్ల రుణాల చెక్కును సీఎం చంద్రబాబు అందజేశారు. -
రేటు పెంచి పంచుకున్నారు..
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఏ చివర కూర్చున్నా పర్వాలేదు అన్నది సామెత... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే చాలు ఎల్–1గా రాకపోయినా సరే హెరిటేజ్ ఫుడ్స్కు అడ్డదారిలో టెండర్లు దక్కుతుండడం ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది. నెయ్యి ధరను అమాంతంగా పెంచేసి మరీ కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులను బరితెగించి కొల్లగొడుతున్నారు. ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అండ్ కో చేసిన దుష్ప్రచార రాద్ధాంతం వెనుక ఎంతటి కుట్ర ఉందో తెలిపే వాస్తవాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఇందాపూర్, ఇంకా హెరిటేజ్ అనుకూల డెయిరీలు మాత్రమే టీటీడీ టెండర్లలోపాల్గొనేలా.. అసలు నెయ్యి టెండర్లంటేనే ఇతర డెయిరీలు భయపడేలా చంద్రబాబు అండ్ కో కల్తీ దు్రష్పచార కుట్ర సాగించింది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు అడ్డగోలుగా కట్టబెట్టిన విషయం ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడింది. టీటీడీ టెండర్లలో ఎల్–1గా వచి్చన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (నందిని డెయిరీ)ని అడ్డంపెట్టుకుని ఇందాపూర్ డెయిరీకి భారీగా నెయ్యి కాంట్రాక్టులు కట్టబెట్టిన తీరు ఇదిగో ఇలా ఉంది... కిలో నెయ్యి ధర రూ.495 నుంచి రూ.716.92కు పెంచారు.. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టుల పేరిట దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా కథ నడిపింది. అందుకే టీటీడీ నెయ్యిని ఎంత ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే అంతగా అవినీతికి పాల్పడవచ్చని స్కెచ్ వేసింది. అందుకే 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత పక్కా పన్నాగంతో టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధరను క్రమంగా పెంచారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం... టీటీడీ పాలకమండలి ఆమోదించిన తీర్మానాల వివరాలు చూస్తే నెయ్యి ధరలను క్రమంగా ఎలా పెంచుతూ పోయారో అర్థం చేసుకోవచ్చు. » 2024 నవంబరులో కిలో నెయ్యి రూ.495 చొప్పున కొనుగోలుకు టీటీడీ పాలకమండలి ఆమోదించింది. » రెండు నెలల్లోనే... అంటే 2025 జనవరిలో కిలో నెయ్యి కొనుగోలు ధరను రూ.513కు పెంచింది. » 2025 మేలో నెయ్యి ధరను మరింత పెంచుతూ కిలో రూ.600గా ఖరారు చేసింది. » అంతటితో ఆగలేదు... 2025 అక్టోబరులో కిలో నెయ్యి ధరను రూ.716.92కు పెంచింది. » దాదాపు ఏడాదిలోనే కిలో నెయ్యి ధరను రూ.495 నుంచి రూ.716.92కు పెంచింది. అంటే నెయ్యి ధర 44.83 శాతం పెరిగిందన్నమాట. అయితే ఎందుకు ఇలా నెయ్యి ధరలను పెంచుతూ పోయారు? దీని వెనక ఉన్న మతలబేమిటి? సంప్రదింపులకు యత్నించకుండానే ఏకపక్షంగా... నందిని డెయిరీ టీటీడీ టెండర్లలో పాల్గొని భారీ ధరలకు టెండరు కోట్చేసింది. అయినా టీటీడీ ఏమాత్రం సంకోచించకుండా ఆమోదించేసింది. సాధారణంగా ధరలు అమాంతంగా పెంచుతూ సంస్థలు బిడ్లు దాఖలు చేస్తే ప్రభుత్వంగానీ, టీటీడీగానీ ఇతర డెయిరీలతో సంప్రదింపులు జరపాలి. ధరలు తగ్గించమని కోరాలి. ఎందుకంటే 2025 అక్టోబరులో ఇందాపూర్ డెయిరీ బహిరంగ మార్కెట్లో నెయ్యి కిలో రూ.529కి విక్రయిస్తోంది. ఇక ఏపీలోని సహకార రంగ విజయ డెయిరీ కిలో రూ.675కు, తెలంగాణలోని సహకార రంగంలోని టీజీ విజయ డెయిరీ కిలో రూ.637 చొప్పునే రిటైల్ మార్కెట్లో విక్రయిస్తున్నాయి. రీటైల్ మార్కెట్లో విక్రయించే నెయ్యిని ప్యాకింగ్ చేసి విక్రయిస్తారు. ప్యాకింగ్ చార్జీలతోపాటు ఏజెన్సీకి లాభం(కమీషన్) అదనంగా భరించాల్సి ఉంటుంది. అదే టీటీడీకి నెయ్యిని ట్యాంకర్లలో సరఫరా చేస్తారు కాబట్టి ప్యాకింగ్ వ్యయం ఉండదు. మధ్యలో ఏజెన్సీ ఉండదు కాబట్టి కమీషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధర తక్కువగా ఉండాలి. కానీ దానిని చంద్రబాబు ప్రభుత్వం, టీటీడీ పట్టించుకోలేదు. వివిధ డెయిరీలతో సంప్రదింపులు జరిపితే నెయ్యి ధర తగ్గుతుందనే వాస్తవాన్ని కూడా ప్రభుత్వం, టీటీడీ విస్మరించాయి. ఏకపక్షంగా కిలో రూ.716.92లు చొప్పుననెయ్యికాంట్రాక్టు ఖరారు చేసేశారు. నందిని, ఇందాపూర్ ఫిఫ్టీ ఫిఫ్టీ... నెయ్యి ధరను అమాంతంగా పెంచుతూ టెండరు ఖరారు చేసిన తర్వాత అసలు దోపిడీ కథను ఎల్లో సిండికేట్ తెరపైకి తెచి్చంది. ముందుగా 2025 అక్టోబర్లో 20 లక్షల కిలోల నెయ్యి టెండర్లలో ఎల్–1గా వచ్చిన నందిని డెయిరీకి కాంట్రాక్టు ఖరారు చేశారు. అదీ కిలో రూ.716.92లు చొప్పున. ఆ మేరకు టీటీడీ పాలకమండలి తీర్మానం ఆమోదించిన తర్వాత.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నందిని డెయిరీ తాము 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయలేమని చెప్పింది. తాము 10 లక్షల కిలోల నెయ్యి మాత్రమే సరఫరా చేయగలమని తెలిపింది. కూటమి ప్రభుత్వ పెద్దలే ఆ విధంగా నందిని డెయిరీతో చెప్పించారన్నది బహిరంగ రహస్యం. మరి 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయలేని సంస్థ అసలు టెండర్లలో ఎందుకు పాల్గొంటుంది? అంటే కూటమి ప్రభుత్వ పెద్దలతో ముందుగా కుదుర్చుకున్న డీల్ ప్రకారమే నందిని డెయిరీ ఆ ప్రకటన చేసిందన్నది స్పష్టమవుతోంది. ఆ తర్వాత నందినీ డెయిరీకి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు చేశారు. మిగిలిన 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టును హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీకి కట్టబెట్టేందుకు పావులు కదిపారు. ఆ మేరకు టీటీడీ నెయ్యి కాంట్రాక్టుల్లో సవరణలు చేసి 2025 డిసెంబర్లో పది లక్షల కిలోల నెయ్యి చొప్పున మొత్తం మీద 20 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు కోసం రెండు వేర్వేరు టెండర్లు పిలిచింది. ఇందాపూర్ డెయిరీకి కాంట్రాక్టు ఖరారయ్యేలా ఇతర డెయిరీలనూ మేనేజ్ చేశారు. ఇందాపూర్ డెయిరీకి అడ్డగోలుగా నెయ్యి కాంట్రాక్టులను ఖరారు చేస్తూ టీటీడీ పాలకమండలి ప్రత్యేకంగా రెండు తీర్మానాల (590 తీర్మానం, 605 తీర్మానం) ద్వారా కథ నడిపింది. అవి ఇలా ఉన్నాయి... » టీటీడీ తీర్మానం 590 ప్రకారం 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు ఖరారు చేశారు. అందులో ఇందాపూర్ డెయిరీకి 65 శాతం వాటాతో... అంటే 6.50 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. మదర్ డెయిరీకి 35 శాతం వాటా... అంటే 3.50 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు కేటాయించారు. » ఇక టీటీడీ తీర్మానం 605 ప్రకారం మరో 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు ఖరారు చేశారు. అందులో ఇందాపూర్కు 35 శాతం వాటా.. అంటే 3.50 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. మదర్ డెయిరీకి 65 శాతం వాటా... అంటే 6.50 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు కేటాయించారు. ధర మాటున మతలబు ఇందాపూర్ డెయిరీకి అనుకున్నట్టుగానే 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కింది. మరీ కిలో రూ.716.92 అంటే బాగుండదు అనుకున్నారో ఏమో.. టీటీడీ తీర్మానం 590 ప్రకారం కిలో నెయ్యి రూ.658 చొప్పున ఇందాపూర్ డెయిరీకి 6.50 లక్షల కిలోల నెయ్యి టెండర్ ఖరారు చేశారు. ఇక టీటీడీ తీర్మానం 605 ప్రకారం కిలో నెయ్యి రూ.649 చొప్పున ఇందాపూర్ డెయిరీకి 3.50 లక్షల కిలోల నెయ్యి టెండరు కట్టబెట్టారు. ఇలా మొత్తంగా రూ.65.48 కోట్ల విలువైన నెయ్యి సరఫరా కాంట్రాక్టును అడ్డగోలుగా కట్టబెట్టారు. అంటే ఇందాపూర్ డెయిరీకి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టును కట్టబెట్టేందుకే పక్కా పన్నాగంతోనే ఈ కథంతా నడిపారని, నందిని డెయిరీకి నష్టం లేకుండా.. కిలో నెయ్యి ధరను రూ.495 నుంచి రూ.716.92కు పెంచారన్నది బట్టబయలైంది. ఇక ఇందాపూర్ డెయిరీకి ఖరారు చేసిన ధరలను ఏడాది క్రితం టీటీడీ నెయ్యి ధరతో పోలిస్తే చంద్రబాబు ముఠా దోపిడీ పన్నాగం బయటపడుతోంది. ఏకంగా 33 శాతం అధిక ధరకు ఇందాపూర్ డెయిరీకి కాంట్రాక్టు ఖరారు చేశారన్నది తేటతెల్లమవుతోంది. అందుకు సహకరించిన నందినీ డెయిరీకి కూడా రూ.76.19 కోట్ల కాంట్రాక్టు ఖరారు చేశారు. వెరసి దొంగలు దొంగలు కలిపి ఊళ్లు పంచుకున్నట్టుగా... నందిని డెయిరీ, ఇందాపూర్ డెయిరీ కలిపి తిరుమల శ్రీవారి నిధులను కొల్లగొట్టాయన్నది స్పష్టమైంది. చేతులెత్తేసి... మళ్లీ టెండర్లలో పాల్గొన్న ‘నందిని’... ఇక తిరుమల శ్రీవారి నిధులు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠా పన్నిన పన్నాగం టీటీడీ సవరణ టెండర్ల వ్యవహారంలో బట్టబయలైంది. మొదట 20 లక్షల కిలోల నెయ్యి టెండర్లలో పాల్గొన్న నందిని డెయిరీ... తీరా టెండరు ఖరారు అయ్యాక (ముందుగా వేసుకున్న పథకం ప్రకారం) తాము 10 లక్షల కిలోలే సరఫరా చేయగలమని చేతులెత్తేసిన విషయం తెలిసిందే. దాంతో ఆ డెయిరీని కిలో రూ.716 చొప్పున 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టుకే పరిమితం చేశారు. తద్వారా ఇందాపూర్ డెయిరీకి 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు మార్గం సుగమం చేశారు. అందుకోసం టీటీడీ 10 లక్షల కిలోల నెయ్యి చొప్పున రెండు వేర్వేరు అంటే 20 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు కోసం సవరణ టెండర్లు పిలిచింది. వాటిలో టీటీడీ 605 తీర్మానం ద్వారా ఆమోదించిన ఒక టెండరులో నందిని డెయిరీ కూడా పాల్గొనడం గమనార్హం. అంటే 10 లక్షల కిలోల కంటే ఎక్కువ సరఫరా చేయలేమని 2025 అక్టోబరులో పక్కకు తప్పుకొన్న నందినీ డెయిరీ... ఆ వెంటనే.. అంటే 2025 నవంబరులోనే పిలిచిన టెండర్లలో మరో 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయగలమని బిడ్ దాఖలు చేసి ఎల్–3గా నిలిచింది. అంటే 2025 సెప్టెంబరులో పిలిచిన టెండర్లలో కూడా 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయగల సామర్థ్యం నందిని డెయిరీకి ఉందనేది స్పష్టమైంది. కేవలం ఇందాపూర్ డెయిరీ కోసమే ఆ రోజు 10 లక్షల కిలోల నెయ్యి టెండరు నుంచి నందిని పక్కకు తప్పుకొంది. మళ్లీ 2025 డిసెంబర్లో పిలిచిన సవరణ టెండర్లలో కిలో నెయ్యి రూ.716 చొప్పున బిడ్ దాఖలు చేసింది. అంటే ఇందాపూర్ డెయిరీకి కిలో రూ.658 చొప్పున కాంట్రాక్టు ఖరారు చేసేందుకే ఆ విధంగా అధిక ధరకు బిడ్ దాఖలు చేసింది. ఆ విధంగా చంద్రబాబు ముఠా ఇందాపూర్ డెయిరీకి అడ్డగోలుగా టెండరు ఖరారు చేసేందుకు పక్కాగా కథ నడపిందన్నది స్పష్టమవుతోంది. -
చీకటి కాలం.. దుశ్శాసన పర్వం
సాక్షి, అమరావతి: మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలమని, ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత కూడా లేదని నిప్పులు చెరిగారు. మూడు రోజులుగా చంద్రబాబు సర్కారు ప్రజలకు మూడు డ్రామాలు చూపించిందని, అసెంబ్లీలో ఒక డ్రామా.. పగటి వేషాలు వేసుకున్న అదే ఎమ్మెల్యేతో మరో డ్రామా.. ఈ రెండింటికీ కొనసాగింపుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు నాయుడు ట్రూప్ ఇంకో డ్రామా ఆడిందంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం ఆయన పోస్టు చేశారు. ‘నేను నేరుగా చంద్రబాబునాయుడిని అడుగుతున్నా.. జనాభాలో 50 శాతం ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల ముందు మీరిచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు సక్రమంగా అమలు చేయకపోయినా, అన్నీ చేసేసినట్లు విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, పట్టపగలు డ్రామాలాడిన మీకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత ఉందా?’ అని నిలదీశారు. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో భాగంగా 19–59 మధ్య వయసున్న ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి, 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం కోటి 80 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1,500 అంటే సంవత్సరానికి రూ.18 వేల చొప్పున ఒక్కో అక్కచెల్లెమ్మకు మూడేళ్లలో రూ.54 వేల చొప్పున బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?⇒ 50 ఏళ్లకే పింఛన్ మరో హామీ. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.4 వేలు చొప్పున ఒక్కొక్కరికి ఏటా రూ.48 వేలు ఇవ్వాలి. మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు? ⇒ బడికి వెళ్లే ప్రతి పిల్ల వాడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద ఇస్తామన్నారు. మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారు. రాష్ట్రంలో యూడీఐఎస్ఈ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్–యూడైస్) ప్రకారం 2023–24 నాటికి బడికి పోయే పిల్లలు 87,41,885 మంది ఉంటే రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగరగొట్టారు. చివరకు 67.27 లక్షల మందికి మాత్రమే.. అది కూడా కొందరికి రూ.8 వేలు.. రూ.9 వేలు.. రూ.10 వేలు, మరి కొంత మందికి రూ.13 వేలు ఇచ్చారు. మరి వీళ్లందరికీ మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తారు? ఎగ్గొట్టిన మొదటి ఏడాది డబ్బులు ఎప్పుడిస్తారు? ⇒ సూపర్ సిక్స్లో ఉచిత గ్యాస్ చిన్న హామీ. ఇక్కడ కూడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న గ్యాస్ కనెక్షన్ల సంఖ్య దాదాపు 1.59 కోట్లు. వీరికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్ ధర రూ.855 చొప్పున మూడు సిలిండర్లకు ఏడాదికి రూ.3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం రూ.786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం బడ్జెట్లో రూ.2,199.99 కోట్లు కేటాయించారు. 2026–27లో బడ్జెట్లో ఈ పథకానికి పెట్టింది రూ.2,601 కోట్లు. అంటే మొత్తంగా రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు గారూ?⇒ ఉచిత బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చని మహిళలకు హామీ ఇచ్చారు. కడప నుంచి వైజాగ్కు పోవచ్చు.. శ్రీకాకుళం వాళ్లు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు.. మధ్యలో కనకదుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే.. కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్ ఎగరగొట్టేశారు. రెండో ఏడాది ఆర్నెల్ల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలు పెట్టారు. చేసిన ఖర్చు రూ.1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గాను రూ.2,460 కోట్లు కేటాయించారు. అంటే రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?⇒ సూపర్ సిక్స్లో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఇలా వంచనగా మార్చటం వల్ల ప్రతి కుటుంబాన్ని, అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతను, మొత్తంగా మన రాష్ట్రంలో ఇంటింటి భవిష్యత్తును మీరు ఎంతగా దెబ్బతీశారో అర్థమవుతోందా?⇒ అక్కచెల్లెమ్మల పేరిట వాళ్లకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చాం. అందులో 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించాం. అందులో 10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబునాయుడు అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి చేసిన ప్రామిస్ ఏంటి? పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. 3 బడ్జెట్లు అయిపోయాయి. ఈ రోజుకు కూడా ఒక్క కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. దీని కోసం ఒక్క గజం కూడా స్థలం కొనలేదు. ఉన్న ఇళ్ల నిర్మాణాలను గాలికొదిలేశారు. మరి ఆ ఇళ్ల నిర్మాణాలను అక్కచెల్లెమ్మలకు ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారు? ⇒ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకానికి మూడు బడ్జెట్లలో అతీగతీ లేదు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పారు. పెంచడం సంగతి దేవుడెరుగు.. మామూలుగా ఇంతకు ముందు ఇస్తున్నట్టు ఇచ్చేది కూడా ఆగిపోయింది. మా హయాంలో కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. మీరు వచ్చి మూడు బడ్జెట్లు పెట్టారు. ఇప్పటికి ఒక్క పైసా కూడా సున్నా వడ్డీ కింద ఇవ్వలేదు. ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ⇒ వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,189 కోట్లు.. వైఎస్సార్ ఆసరా కింద 78,94,169 మందికి రూ.25,570 కోట్లు.. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3,58,613 మందికి రూ.2,029 కోట్లు.. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మరో రూ.1,876 కోట్లు ఇచ్చాం. నిజంగా స్త్రీ శక్తి ఎక్కడైనా లభించింది అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అంటే అది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతాం. ఈ పథకాలన్నీ మీరు అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. మరి మీకు మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత ఉందా?⇒ మీ పాలనలో ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం అనే పథకమే లేదు. మీకు కాపుల్ని మభ్య పెట్టి.. వారి ఓట్లు కొల్లగొట్టే ప్యాకేజీ పథకాలు బాగా తెలుసుగానీ, కాపు నేస్తంగా ఒక్క రూపాయి కూడా ఆ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన చరిత్ర మీకు కానీ, మీకు మద్దతిస్తున్న వారికి కానీ లేదు.⇒ ఇలా ఇవ్వక పోవటం కూడా మీకున్న విజన్లో భాగమే అని నమ్మించగల ఎల్లో మీడియా మీ చేతిలో ఉంది కాబట్టి.. ఇదీ గొప్ప ఎంపవర్మెంట్ అని పత్రికల్లో రాయించటం, టీవీల్లో వేయించటమే ఇక మిగిలింది!⇒ అక్కచెల్లెమ్మల కాపురాల్లో చిచ్చుపెట్టేలా వీధికో బెల్టుషాపు, ఊరికో మద్యం షాపు, బారు తెరవటమే మీకు తెలిసిన మహిళా సాధికారత. అదే మీకు తెలిసిన మహిళా భద్రత.⇒ దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్ను కూడా నిర్వీర్యం చేశారు. చివరికి రాష్ట్రాన్ని మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ టీటీడీ చైర్మన్.. అత్యాచార ఆంధ్రప్రదేశ్ను నిర్మించారు. పసి పిల్లల్ని, ఆడపిల్లల్ని, చివరికి ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళల్ని మీరు, మీకు మద్దతిస్తున్న వాళ్లు పెంచి పోషిస్తున్న కామాంధులంతా ఎలా చిదిమేస్తున్నారో చూసి కూడా మీకు సిగ్గనిపించడం లేదా?⇒ మా పాలనలో 90 శాతం అక్కచెల్లెమ్మల పేరిట డీబీటీ పథకాలే. మేం ఇచ్చిన ఇళ్ల స్థలాలన్నీ అక్కచెల్లెమ్మల పేరుమీదే. దేశ చరిత్రలో తొలిసారిగా.. మేం ఇచ్చిన వేల కొద్దీ నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వాటా వారికే.⇒ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఎక్కువ మంది మహిళలకు ఎమ్మెల్సీలు, క్యాబినెట్ మంత్రులుగా అవకాశం ఇచ్చింది కూడా మా పాలనలోనే. అందుకే మా పాలన మహిళా సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ⇒ ఇప్పటి పరిస్థితి ఏమిటంటే.. మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలం. రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వం. -
నారా వారి నిర్వాకానికి 'నారీ విలాపం'!
నాడు: మహిళలకు స్వర్ణయుగం. అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే కుటుంబంతో పాటు రాష్ట్రం ప్రగతి బాట పడుతుందని వైఎస్ జగన్ ప్రత్యేకంగా పథకాలు అందించారు. ఆర్థిక సాధికారతతోపాటు రాజకీయంగానూ ఎదిగేలా ప్రోత్సాహం అందించారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం మహిళలకే దక్కేలా చట్టం చేసి మరీ అమలు చేశారు. వైఎస్సార్ ఆసరా, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ పథకాలతో పాటు మహిళల పేరిటే ఇళ్ల పట్టాలు అందించి పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను సైతం చేపట్టారు. పొదుపు మహిళలకు అండగా నిలిచారు. ‘చేయూత’ ద్వారా మహిళా సాధికారతకు వైఎస్ జగన్ ప్రభుత్వం బాటలు వేసింది. మహిళలు వివిధ వ్యాపారాల్లో రాణించి తమ కాళ్లపై తాము నిలదొక్కుకునేలా వారి ఉత్పత్తులను అమూల్, రిలయన్స్, ఐటీసీ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లీవర్ లాంటి ప్రముఖ సంస్థలతో అనుసంధానించి, రుణాలు అందచేసి తోడ్పాటునిచ్చారు. తద్వారా మహిళలను అన్ని రంగాల్లో అగ్రపథాన నిలిపారు.నేడు: 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు వరాల వల విసిరారు. జగన్ ఇచ్చిన వాటి కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని నమ్మబలికారు. మహిళల ఓట్లు కొల్లగొట్టారు. అధికారం చేపట్టాక వారిని విస్మరించారు. ఒక్కటంటే ఒక్క హామీని అమలు చేయకుండా మహిళలకు మొండి చేయిచూపారు. ఒక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎగ్గొట్టడం ద్వారానే మహిళలకు దాదాపు రూ.లక్ష కోట్ల మేర బకాయి పడ్డారు. గతంలో వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలను చంద్రబాబు ఇవ్వకపోగా, తాను ఇస్తానన్న వాటిని సైతం ఎగ్గొట్టారు. దీంతో చంద్రబాబును నమ్మి మోసపోయామని, 20 నెలలుగా ప్రతి అడుగులోనూ మోసమేనని, దేశంలో ఏ రాజకీయ నాయకుడూ ఇలా మోసాలు చేసి, హామీలను నెరవేర్చానని నిస్సిగ్గుగా బుకాయించరని మహిళలు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ పాలన స్వర్ణ యుగమని, మహిళలను మహరాణులుగా చేశారని గుర్తు చేసుకుంటున్నారు.సాక్షి, అమరావతి: నారా వారి నిర్వాకానికి నారీలోకం విలపిస్తోంది! చంద్రబాబు ఎన్నికల మోసాలు.. సూపర్ సిక్స్ హామీల ఎగవేత.. ఓటు బ్యాంకు రాజకీయాలు.. మహిళా దినోత్సవం సాక్షిగా మరోసారి బట్టబయలయ్యాయి. ప్రధానంగా మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు మూడు బడ్జెట్లలోనూ కేటాయింపులు జరపని చంద్రబాబు అమరావతిలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో సైతం ఆడబిడ్డ నిధి, డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ, 50 ఏళ్లకే పెన్షన్, పెళ్లి కానుక.. తదితర పథకాల ఊసెత్తకపోవడం గమనార్హం. 2024 ఎన్నికల ముందు మేనిఫెస్టో పేరుతో ఇంటింటికి బాండ్లు, కరపత్రాలు పంచి పెట్టిన చంద్రబాబు ఇప్పుడు మహిళలను నయవంచన చేశారని ఆక్రోశిస్తున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అటకెక్కించడంతోపాటు చంద్రబాబు కనీసం తానిచ్చిన హామీలను సైతం నెరవేర్చకుండా దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి బకాయిలు రూ.97,200 కోట్లు ప్రతి అక్క చెల్లెమ్మకు మూడేళ్లలో రూ.54,000 ఎగవేత..! సూపర్ సిక్స్లో అతిముఖ్యమైన హామీ.. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున చంద్రబాబు ఏటా రూ.18 వేలు చొప్పున ఇస్తానన్నారు. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు మహిళలు 1.80 కోట్ల మంది ఉన్నారు. హామీ ప్రకారం ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.18 వేల చొప్పున ఏటా మొత్తం రూ.32,400 కోట్లు చెల్లించాలి. కానీ ఈ పథకానికి మూడు బడ్జెట్లలో కేటాయించింది సున్నా. మూడేళ్లకు కలిపి అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు బకాయి పడ్డ సొమ్ము అక్షరాలా రూ.97,200 కోట్లు. ప్రతి అక్కచెల్లెమ్మకు ఈ స్కీమ్ కింద మూడేళ్లలో రూ.54 వేలు ఎగరగొట్టారు! సున్నా వడ్డీకి శూన్యం.. మహిళలకు రూ.15 వేల కోట్లు బాకీ పొదుపు మహిళల సున్నా వడ్డీకి మూడు బడ్జెట్లలోనూ అతీగతి లేదు. స్వయం సహాయ సంఘాలకు వడ్డీలేని రుణాలను రూ.3 లక్షల నుంచి ఏకంగా రూ.10 లక్షలకు పెంచుతామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చకపోగా గత ప్రభుత్వంలో అమలు చేసిన దాన్ని కూడా నిలిపివేశారు. గత ప్రభుత్వంలో కోటి మందికిపైగా పొదుపు మహిళలు సున్నా వడ్డీ ద్వారా దాదాపు రూ.ఐదు వేల కోట్ల మేర లబ్ధి పొందారు. మూడు బడ్జెట్లలోనూ నిధులు కేటాయించకుండా సున్నా వడ్డీ కింద పొదుపు మహిళలకు చంద్రబాబు ఏకంగా రూ.15 వేల కోట్లు మేర ఎగ్గొట్టారు! ఇక చంద్రబాబు ప్రభుత్వంలో పొదుపు సంఘాల పరపతి గణనీయంగా క్షీణించింది. నాబార్డ్ డేటా ప్రకారం 2023–24లో మహిళల పొదుపు రుణాలు రూ.49,626 కోట్లు కాగా చంద్రబాబు హయాంలో 2025–26 (డిసెంబర్ వరకు) రూ.30,698 కోట్లకు పడిపోయింది. మహిళలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పరపతి తగ్గిపోతోంది. 50 ఏళ్లకే పింఛన్.. వంచన ఒక్కొక్కరికీ రూ.1.44 లక్షలు బకాయి సూపర్ సిక్స్లో ఇచ్చిన మరో హామీ 50 ఏళ్లకే పింఛన్. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దాదాపు 20 లక్షల మందికి పైగానే ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.4 వేల చొప్పున సంవత్సరానికి రూ.48 వేలు ఇవ్వాలి. ఈ లెక్కన ఏడాదికి మొత్తం రూ.9,600 కోట్లు అవుతుంది. దీని ప్రకారం మూడేళ్లలో మొత్తం రూ.28,800 కోట్లు కేటాయించాల్సి ఉండగా మూడు బడ్జెట్లలో ఇచ్చింది సున్నా. ఒక్కొక్కరికీ రూ.1.44 లక్షలు మేర చంద్రబాబు బాకీ పడ్డారు. అసలు కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్నవాటికే కోత పెడుతున్నారు. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య 66,34,372 కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 60,96,108 మందికే ఫించన్లు ఇచ్చారు. అంటే ఏకంగా 5,38,264 పింఛన్లు కట్ చేశారు. మరోవైపు 2014లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 39 లక్షల పింఛన్లు మాత్రమే ఉండగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ సంతృప్త స్థాయిలో అందచేస్తూ 66 లక్షలకుపైగా పింఛన్లు ఇచ్చింది. మళ్లీ చంద్రబాబు వచ్చిన రెండేళ్లకే పింఛన్లు 66 లక్షల నుంచి 60 లక్షలకు తగ్గిపోవడం గమనార్హం. తల్లులకు బాబు దగా.. మూడేళ్లలో రూ.24,504 కోట్లు ఎగవేత తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. ఈ పథకానికి ఒక్కొక్కరికీ ఏటా రూ.15 వేల వంతున ఏడాదికి మొత్తం రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో కేవలం 67.27 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. రెండేళ్లలో తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా బకాయిపడ్డారు. ఇక తాజా బడ్జెట్లో రూ.8457.07 కోట్లు మాత్రమే ప్రతిపాదించి ఏకంగా రూ.4,655.75 కోట్ల మేర కోతలు పెట్టారు. తద్వారా మూడేళ్లలో పిల్లలకు రూ.24,504 కోట్ల మేర చంద్రబాబు ఎగ్గొట్టారు! ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఉచిత బస్సు, గ్యాస్.. తుస్సు మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి. తొలి ఏడాది హామీని పూర్తిగా ఎగ్గొట్టారు. ఇక రెండో ఏడాది ఆర్నెల్ల తరువాత ఆగస్టు నుంచి అరకొరగా మొదలుపెట్టి రూ.1,040 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఇక ఈ స్కీమ్ కోసం మూడో బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గానూ రూ.2,460 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే మహిళలకు ఉచిత బస్సులో ఏకంగా రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. అంతేకాదు.. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. ఇక ఉచిత గ్యాస్ కూడా మోసమే. రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1.59 కోట్లు కాగా ఏటా మూడు సిలెండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.3,990 కోట్లకుపైగా ఇవ్వాలి. ఇలా మూడేళ్లకు మొత్తం లబ్ధిదారులకు రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు.అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల హామీ ఏమైంది..? చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాల కోసం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి మూడు బడ్జెట్లలోనూ పైసా కేటాయించలేదు. ఒక్కరికి కూడా సెంటు భూమి పట్టా ఇవ్వలేదు. పైగా వైఎస్సార్సీపీ హయాంలో 10 లక్షల ఇళ్లు పూర్తి కాగా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న మిగతా వాటిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించి 10 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేశారు. ఆడబిడ్డలకు రక్షణ కరువు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైంది. గంజాయి, బ్లేడ్బ్యాచ్లు చెలరేగిపోవడంతో రాష్ట్రంలో రోజుకి నలుగురు, ఐదుగురు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రోజుకు 50 నుంచి 60 మందిపై లైంగిక వేధింపుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మహిళలపై నేరాలు 10 శాతం పెరగగా.. హోంమంత్రి అనిత ఇన్చార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలోనూ నేరాలు పెరిగాయని, లోకేశ్ నియోజకవర్గంలోనూ మహిళలపై నేరాలు పెరిగాయని పోలీస్ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. మదనపల్లెలో గంజాయి మత్తులో ఓ క్రూరమృగం ఏడేళ్ల బాలికపై హత్యాచారానికి తెగబడి డ్రమ్ములో పడేయడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. అరవ శ్రీధర్ అనే కూటమి ఎమ్మెల్యే తనను ఐదుసార్లు గర్భవతిని చేసి అబార్షన్లు చేయించినట్లు బాధితురాలు మొర పెట్టుకున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరించింది. పలువురు టీడీపీ, జనసేన ప్రజా ప్రతినిధులు మహిళలకు లైంగిక వేధింపులకు దిగడం రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులకు, సర్కారు వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.జగన్ పాలనలో మహిళలకు స్వర్ణయుగంవైఎస్ జగన్ నవరత్నాల పాలన మహిళలకు స్వర్ణయుగంగా సాగింది. అమ్మ కడుపులోని బిడ్డ నుంచి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ వరకు ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి వైఎస్ జగన్ పథకాలను అమలు చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మహిళలకు పలు పథకాల ద్వారా డీబీటీ, నాన్ డీబీటీతో ఏకంగా రూ.2,83,866.34 కోట్లు అందించారు. చట్టం చేసి మరీ 50 శాతం పదవులు.. నామినేటెడ్ పోస్టుల నుంచి కేబినెట్ వరకు మహిళలకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారు. రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్, హోం, వైద్య ఆరోగ్య, పర్యాటక శాఖల మంత్రులుగా మహిళలకు పట్టం కట్టారు. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పద్ధతిలో ఇచ్చే కాంట్రాక్ట్ పనుల్లో కూడా మహిళలకు 50 శాతం కేటాయిస్తూ చట్టం చేసి మరీ అమలు చేశారు. అక్క చెల్లెమ్మల పేరిటే ఇళ్లు.. స్థలాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంతగూడు ఉండాలన్న సంకల్పంతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు చేశారు. అక్క చెల్లెమ్మల పేరిట స్థిరాస్తిని సమకూర్చడం దేశంలోనే సరికొత్త చరిత్ర. సొంత ఇళ్లు లేని అక్కచెల్లెమ్మలకు ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందజేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా భూముల కొనుగోలు కోసం రూ.11,871 కోట్లు, ఇళ్ల నిర్మాణాలకు రూ.20,338 కోట్లు ఖర్చు చేశారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.35,209 కోట్లు వెచ్చించి అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చి, ఇళ్లు కట్టించి ఇచ్చి లక్షాధికారులను చేశారు. ఇదే విషయాన్ని సాక్ష్యాత్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్లో లోక్సభ సమావేశాల్లో లిఖిత పూర్వకంగా వెల్లడించడం గమనార్హం.మహిళా రక్షణకు పెద్దపీట.. మహిళల రక్షణ, భద్రత కోసం వైఎస్ జగన్ పలు వినూత్న చర్యలు చేపట్టారు. ప్రధానంగా దిశ బిల్లు తెచ్చి దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లతో అక్క చెల్లెమ్మలకు రక్షణ కవచంలా నిలిచారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఒక మహిళా పోలీస్ను నియమించారు. ఏ మహిళకు ఆపద వచ్చినా సమాచారం అందుకున్న నిమిషాల వ్యవధిలోనే పోలీసులు రంగంలోకి దిగి అండగా నిలిచేలా దిశ యాప్ ద్వారా చర్యలు చేపట్టారు. -
టీ20 వరల్డ్ కప్ విజేత భారత జట్టుకు వైఎస్ జగన్ ప్రశంస
సాక్షి, తాడేపల్లి: టీ20 వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించిన సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు మొత్తం టీమ్ ఇండియాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by YS Jagan Mohan Reddy (@ysjagan)అద్భుతమైన ఆటతీరు కనబరిచిన అభి, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లకు ప్రత్యేక అభినందనలు. దేశం అంతా గర్వపడే లాంటి విజయం సాధించారు. ఈ గెలుపు ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆనందంతో నింపింది అని పేర్కొన్నారు. భారత్ జట్టు కృషి, పట్టుదల, జట్టు స్పూర్తి వల్లే ఈ విజయాన్ని సాధించగలిగిందని జగన్ అన్నారు. ఈ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి
రాజమహేంద్రవరం: కల్తీ పాల ఘటనలో మరొకరు మృత్యువాత పడ్డారు. రాజమండ్రి శివారు లాలాచెరువు ప్రాంతానికి చెందిన శానాపతుల రామలక్ష్మి(73) మృతి చెందారు. ఈరోజు(ఆదివారం, మార్చి 8వ తేదీ) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణం కోల్పోయారు. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి డెల్టా హాస్పిటల్లో రామలక్ష్మి చికిత్స పొందుతున్న ఆమె.. ఈరోజు తుది శ్వాస విడిచారు. దాంతో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. అయితే అనధికారికంగా మృతుల సంఖ్య 12గా ఉంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురు రోగులు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు. కాగా, రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 21 మంది ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురై, నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో రోజుకొకరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూండటం.. బాధిత కుటుంబాలను తీరని విషాదంలో ముంచుతోంది. మరోవైపు చికిత్స పొందుతున్న వారి పరిస్థితి సైతం విషమంగానే ఉంది. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. అయితే, వారి విషయంలో విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణులు సైతం ఇప్పటికే చేతులెత్తేశారు. ప్రస్తుతం జరుగుతున్న చికిత్సే కొనసాగించాలంటూ ఉచిత సలహా ఇచ్చి వెనుదిరిగారు. తాజాగా మరొకరు మృతి చెందడంతో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. -
బొమ్మూరు ట్రాన్స్కో స్టోర్స్లో అగ్ని ప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి రూరల్ బొమ్మూరు విద్యుత్ శాఖ స్టోర్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్క్రాప్ ఉంచిన గదిలో మంటలు చెలరేగాయి. స్క్రాప్, సామాగ్రీ దహనమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని ప్రాథమికంగా భావిస్తున్నారు.ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ ఇంజిన్లతో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు వ్యాపించకుండా అదుపుచేశారు. ట్రాన్స్కో ఎస్ఈ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ప్రమాదం కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యగా బొమ్మూరు విద్యుత్ కేంద్రం నుండి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు బొమ్మూరు నుంచే విద్యుత్ సరఫరా జరుగుతుంది. -
జనసేన సభ్యత్వ నమోదులో రచ్చకెక్కిన ఇరు వర్గాలు
కంకిపాడు: కృష్ణా జిల్లాలోని కంకిపాడులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇరు వర్గాల వార్ రచ్చకెక్కింది. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటే తమకు ఇవ్వడం లేదంటూ జనసేనలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. చింతకింద సునీల్, మేక స్వాతి తేజ్ల మధ్య వివాదం రాజుకుంది. ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై రగడ చోటు చేసుకుంది. బ్యానర్లు కట్టుకోవడాని తనకు అనుమతి ఇవ్వకపోవడం జనసేనకు చెందిన స్వాతీ తేజ్ మండిపడ్డారు. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మహిళలకు మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మహిళలకు మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని.. ఐదేళ్లలోనే యాభై ఏళ్ల సంస్కరణలు తెచ్చారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉమెన్స్ డే వేడుకల్లో మాట్లాడుతూ.. పార్టీలో మహిళా విభాగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అన్నిఅనుబంధ విభాగాల్లోనూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సజ్జల అన్నారు.‘‘మండల, గ్రామస్థాయిలో కమిటీలను పూర్తి చేయాలి. అప్పుడు క్షేత్రస్థాయిలో మహిళా విభాగం మరింత పటిష్టంగా మారుతుంది. ఏదైనా సమస్యలపై గట్టిగా పోరాటం చేయవచ్చు. స్థానికంగా ఉన్న సమస్యలపై అక్కడే పోరాటం చేయాలి. పార్టీ పిలుపునిచ్చే రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. మీ దృష్టికి వచ్చిన సమస్యలను స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేయాలి. లీడర్లుగా ఎదగాలంటే చొరవ చూపి ముందుకు నడవాలి. చంద్రబాబు మహిళలకు అన్యాయం చేశారు. ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయకుండానే చేసినట్లు చెప్పుకుంటున్నారు...వైఎస్ జగన్ అనేక పథకాలను మహిళలే కేంద్రంగా అమలు చేశారు. మహిళల జీవన ప్రమాణాలను పెంచేలా కృషి చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. దీని వలన జరుగుతున్న నష్టాలపై ఎక్కడికక్కడే సమావేశాలు పెట్టాలి. అందరిలోనూ చైతన్యం తీసుకు రావాలి. వచ్చే ఎన్నికల నాటికి మహిళలే కీలక పాత్ర పోషించేలా నాయకత్వం వహించాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
ఏపీలో నారావారి నరకాసుర పాలన: ఆర్కే రోజా
సాక్షి, తాడేపల్లి: మహిళా సాధికారత కోసం కృషి చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహిళలు రాజకీయాల్లో ఎదగాలంటే చాలా కష్టమని.. కానీ వైఎస్ జగన్ ప్రోత్సాహంతో పార్టీలో ఎంతోమంది మహిళలు ఎదిగారని ఆమె పేర్కొన్నారు. ఆదివారం.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళా నేతలు ఆర్కే రోజాతో పాటు వరుదు కళ్యాణి, రాయన భాగ్యలక్ష్మి, పూజిత, హారిక సహా పలువురు పార్టీ నేతలు కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. ‘‘నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రి పదవి ఇచ్చి వైఎస్ జగన్ ప్రోత్సాహించారన్నారు. కష్టపడే వారికి, టాలెంట్ఉన్న వారికి వైఎస్ జగన్ ఎప్పుడూ అవకాశం కల్పిస్తారు. వరుదు కళ్యాణి తన ఎమ్మెల్సీ పదవి అలంకార ప్రాయం కాదని.. ఆయుధమని నిరూపించారు. ప్రతి మహిళ ఒక శక్తిగా ఎదగాలి. టీమ్ వర్క్గా పని చేసి మళ్లీ జగన్ను సీఎంగా చేసుకోవాలి’’ అని ఆర్కే రోజా పేర్కొన్నారు.‘‘రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతోంది. మహిళలకు రక్షణ కల్పించలేని దిక్కమాలిన ప్రభుత్వం ఇది. హోంమంత్రి అనిత తన పదవిని పట్టించుకోకుండా ఆట, పాటలతో కాలం గడుపుతోంది. అనితతో పాటు మరో ఇద్దరు మంత్రులు మహిళలకు ఏం మేలు చేశారు?. అలాంటి మంత్రులు సబిత, అనిత, గుమ్మడి సంధ్యారాణిలకు మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. అన్యాయానికి గురైన మహిళలు ఫిర్యాదులు చేస్తే వారిమీదే కేసులు పెడుతున్న దుస్థితి నెలకొంది...కులం, మతం, పార్టీ చూడకుండా వైఎస్ జగన్ అందరికీ మేలు చేశారు. చంద్రబాబు మాత్రం కులం, మతం, పార్టీ చూసి అందరికీ వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి పేరు చెప్పుకుని, ఆమె తల్లి కన్నీటిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసిన వ్యక్తి. ముప్పై వేల మంది మహిళలు కనిపించకపోయారని చెప్పిన పవన్ ఈ ఇరవై నెలల్లో ఎంతమందిని తిరిగి తీసుకు వచ్చారు?.మనం చేసిన మంచి వలనే ఇప్పటికీ జనం మనల్ని గౌరవవిస్తున్నారు. కూటమి నాయకులు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితే లేదు. చంద్ర మండలానికి కూడా చంద్రబాబు సీఎం అవుతాడని ఎల్లో మీడియా జాకీలు ఎత్తుతోంది. బీఆర్ నాయుడు తప్పు చేస్తే అందులో తప్పేం ఉందని ఎల్లోమీడియా ప్రశ్నిస్తోంది. బీఆర్ నాయుడుకి ఒళ్లంతా అహంకారమే. లడ్డూపై విష ప్రచారం చేసిన వారందరి లెక్కలూ వెంకటేశ్వరస్వామి తేల్చుతున్నాడు’’ అని ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళా నేతలు ఆర్కే రోజా, వరుదు కల్యాణి, కల్పలతారెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి సహా పార్టీ మహిళా ముఖ్య నేతలు కేట్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, అన్ని జిల్లాల మహిళా అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. -
ఇనుప రాడ్డుతో సహచర విద్యార్థి దాడి.. ఏపీ విద్యార్థి మృతి
సాక్షి,బెంగళూరు: సాక్షి,బెంగళూరు: తొమ్మిదో తరగతి విద్యార్థి విచక్షణ కోల్పోయాడు. హాస్టల్ గదిలో గాఢ నిద్రలో ఉన్న సహచర విద్యార్థులు, హాస్టల్ వార్డెన్ని సైతం ఇనుప రాడ్డుతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్ర గాయాలపాలైంది. ఓ విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి తండ్రి.. దాడికి పాల్పడ్డ విద్యార్థి మతి స్థిమితం కోల్పోవడం, లేదంటే డ్రగ్స్ మత్తులో దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా ‘గురుకులం’హాస్టల్లో చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి బళ్లారి ‘గురుకులం’ ఓ విద్యార్థి కలకలం సృష్టించాడు. తోటి విద్యార్థులపై ఇనుప రాడ్డుతో దాడికి తెగబడ్డాడు. విద్యార్థుల పక్కనే నిద్రిస్తున్న హాస్టల్ వార్డెన్పై దాడికి దిగడం ఆయన తీవ్రంగా గాయాపడ్డారు. ఘటనపై అప్రమత్తమైన స్థానికులు, ఇతర హాస్టల్ సిబ్బంది బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం బళ్లారి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(బీఎంఐఎస్)తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది.వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.సమాచారం అందుకున్న బ్రూస్పేట పోలీసులు ఘటన జరిగిన హాస్టల్తో పాటు విద్యార్థులు చికిత్స పొందుతన్న బీఎంఐఎస్ ఆస్పత్రికి చేరుకున్నారు. తోటి విద్యార్థులపై ఇనుప రాడ్డుతో ఎందుకు దాడి చేశాడు? దాడికి ముందు ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గురుకులంలో విద్యార్థులపై దాడి ఘటనతో తల్లిదండ్రులు హుటాహుటీన ఆస్పత్రికి తరలివచ్చారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి తల్లిదండ్రుల రోదనలు స్థానికుల్ని కంటితడి పెట్టిస్తున్నాయి.ఈ సందర్భంగా విద్యార్థి దాడిలో మృతి చెందిన ఏపీ విద్యార్థి హేమంత్ తండ్రి లక్ష్మీకాంత్ అనుమానం వ్యక్తం చేశాడు. శనివారం రాత్రి 11గంటల సమయంలో హాస్టల్ ఘటనపై సమాచారం అందింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా తన కొడుకు హత్యకు గురైనట్లు తెలిసింది.విద్యార్థుల్ని రక్షించడంలో, పర్య వేక్షించడంలో యాజమాన్యం విఫలమైంది. విద్యార్థి.. తోటి విద్యార్థులపై జరిపిన దాడి తీరును చూస్తుంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడ్డ మానసిక సమస్యతో బాధపడటం లేదంటే డ్రగ్స్ మత్తులో ఘోరానికి పాల్పడ్డాడేమోనన్న అనుమానం ఉందని చెప్పారు. -
మానవ మృగాల పాశవికం.. మతిస్థిమితం లేని యువతి గర్భిణి
కొందరు మనుషులు మృగాల కన్నా హీనంగా మారారు. మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మానవ మృగాలు చేసిన గాయాలతో శరీరం పుండుగా మారింది. అయినా వదల్లేదు. తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో గర్భం దాల్చి రోడ్డున అనాథగా సంచరిస్తున్న ఆమెను మానవతావాది అయిన ఓ ఉపాధ్యాయురాలు గుర్తించి పోలీసుల సాయంతో అనాథాశ్రమానికి చేర్చింది. ప్రస్తుతం ఆ యువతి నిండు గర్భిణి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఓ అభాగ్యురాలి దీనగాథ పలువురిని కలిచి వేస్తోంది.అనంతపురం కల్చరల్: మతిస్థిమితం లేని యువతిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన ఘటన కళ్యాణదుర్గం ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. అయినా నేటికీ దోషులెవరో బయటపడలేదు. వారు చేసిన పాపం యువతి గర్భంలో పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. అనాథగా రోడ్డుపై సంచరిస్తూ... కొన్ని నెలల క్రితం కళ్యాణదుర్గంలోని రహదారులపై మతిస్థిమితం లేకుండా ఒంటరిగా తిరుగుతున్న యువతిని ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శశికళ గమనించింది. పలకరించే ప్రయత్నం చేయడంతో సమాధానం ఇవ్వలేదు. ఆకలిగా ఉందా? అని ప్రశ్నించినా మౌనమే సమాధానమైంది. దీంతో అప్పటికప్పుడు ఆహారాన్ని కొనుగోలు చేసి యువతి చేతికి ఇవ్వడంతో ఎన్నాళ్లుగా ఆకలితో ఉందో తెలియదు కానీ గబగబా మొత్తం తినేసింది. ఆ సమయంలో యువతి బెదురు చూపులు గమనించిన శశికళ... ఆమె ఏదో ప్రమాదంలో ఉందని గ్రహించి, విషయాన్ని వెంటనే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సాయంతో యువతిని అనంతపురం రూరల్ పరిధిలోని కాట్నేకాలువలో ఉన్న ఆశ్రయ అనాథాశ్రమానికి చేర్చారు. శరీరమంతా పుండుగా మారి.. మతి స్థిమితం కోల్పోయి బెదురు చూపులతో ఆశ్రమానికి చేరుకున్న యువతిని నిర్వాహకులు కృష్ణారెడ్డి, దేవి దంపతులు అప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. 25 ఏళ్ల వయస్సులోనూ ఆరేళ్ల చిన్నారిలా ప్రవర్తిస్తున్న ఆ యువతిని ఎంత ప్రశ్నించినా తన తల్లిదండ్రులెవరో చెప్పలేని స్థితిలో ఉంది. శరీరంపై గాయాలు ఉండడంతో ఆస్పత్రికి పిలుచుకెళ్లి చూపించారు. ఆ సమయంలో గాయాలను పరిశీలించిన వైద్యులు అవి మానవ మృగాలు చేసినవిగా నిర్ధారించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె గర్భంతో ఉన్నట్లుగా ధ్రువీకరించారు. ఆ సమయంలో అత్యాచారం జరిగిన విషయం గాని తెలియని స్థితిలో యువతి అమాయకంగా చూస్తుండడం గమనించిన వైద్యులు, సిబ్బంది హృదయాలు ద్రవించి పోయాయి. చికిత్స అనంతరం ఆమెను ఆశ్రమానికి చేర్చిన కృష్ణారెడ్డి దంపతులు అప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. పుండుగా మారిన శరీరాన్ని రోజూ శుభ్రం చేస్తూ ఆమెకు పౌష్టికాహారాన్ని అందజేస్తూ వచ్చారు. ప్రస్తుతం యువతి నిండు గర్భిణి. రేపో.. మాపో ప్రసవమయ్యే సూచనలు ఉన్నాయి. తలుచుకుంటేనే భయమేస్తోంది మానవత్వమున్న ఉపాధ్యాయురాలు గుర్తించి ఈ యువతిని మా ఆశ్రమానికి చేర్చారు. ఆమె ఆశ్రమానికి వచ్చేనాటికి శరీరం మొత్తం పుండుగా మారి ఉంది. మానవ మృగాలు ఎంత పైశాచికంగా పాడు చేశారో తలుచుకుంటేనే భయమేస్తోంది. కనీసం తన తల్లిదండ్రులెవరు అనే విషయం కానీ, తనపై అత్యాచారం జరిగిందనే విషయం గాని ఆమెకు తెలియదు. ఎంతో అమాయకంగా ఉంది. ఆమె భవిష్యత్తు తలుచుకుంటే భయమేస్తోంది. ఆశ్రమంలో ఎందరో అనాథలు ఉన్నారు. వీరెవ్వరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేవు. వీరి దైన్య స్థితిపై అధికారులు స్పందించి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మంజూరు చేస్తే ఆదుకునే అనాథాశ్రమాలకు ఎంతో మేలు చేసిన వారవుతారు. – దేవి, ఆశ్రయ అనాథాశ్రమ నిర్వాహకురాలుఆమె పరిస్థితి చూసి చలించిపోయాను నేను ప్రస్తుతం ఆత్మకూరు మండలం పంపనూరులోని ఎంపీపీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నిరాశ్రయులైన మహిళలెవరైనా కనిపిస్తే అనాథశ్రమాలకు చేరుస్తుంటాను. అలా ఒకసారి కళ్యాణదుర్గంలోని పోలీసుస్టేషన్ సమీపంలో డివైడర్ వద్ద రెండేళ్లుగా దిక్కు లేకుండా కూర్చొని ఉన్న ఓ యువతి కనిపించింది. ఆ సమయంలో ఆమె పరిస్థితి చూసి చలించిపోయాను. వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి, వారి సహకారంతోనే ఆశ్రయ అనాథాశ్రమానికి చేర్చాను. రోజులు గడుస్తుండగా ఆమె శరీరంలో మార్పులు గమనించి వైద్యులకు చూపిస్తే గర్భిణి అని తెలిసింది. ఈ అమానుషంపై ఎవరూ స్పందించకపోవడం బాధాకరం. – శశికళ, ఉపాధ్యాయురాలు -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 08-15)
-
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాంకాక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అమూల్యమైనది, వారి ఆర్థిక ఎదుగుదలతో కుటుంబాలు బలపడతాయి.. రాష్ట్రం ముందుకు సాగుతుందన్న నమ్మకంతో మన ప్రభుత్వంలో మహిళల సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేశాం. పథకాలలోనే కాకుండా కీలక పదవుల్లో కూడా వారికి అగ్ర తాంబూలం ఇచ్చాం. కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్న ప్రతి మహిళకూ పేరు పేరున హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.’అని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అమూల్యమైనది, వారి ఆర్థిక ఎదుగుదలతో కుటుంబాలు బలపడతాయి.. రాష్ట్రం ముందుకు సాగుతుందన్న నమ్మకంతో మన ప్రభుత్వంలో మహిళల సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేశాం. పథకాలలోనే కాకుండా కీలక పదవుల్లో కూడా వారికి అగ్ర తాంబూలం ఇచ్చాం. కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2026 -
వచ్చే మంగళవారం బాబు సర్కారు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్లీ రూ.3,000 కోట్లు అప్పు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ అప్పు తీసుకోనుంది. 13 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,000 కోట్లు, 15 సంవత్సరాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 17 సంవత్సరాల వ్యవధితో రూ.1,000 కోట్లు చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయనున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నోటిఫై చేసింది.చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే బడ్జెట్ పరిధిలో రూ.1,79,264 కోట్లు అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేసే రూ.3,000 కోట్ల అప్పుతో కలిపి మొత్తం బడ్జెట్ పరిధిలోనే చంద్రబాబు సర్కారు 21 నెలల్లో చేసిన అప్పు రూ.1,82,264 కోట్లకు చేరనుంది. -
మహిళల అభ్యున్నతే సమాజ ప్రగతికి కొలమానం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మహిళలతోపాటు యావత్ మహిళలందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే వారు నిజమైన పురోగతి సాధించినట్లని పేర్కొన్నారు. మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుందని, తద్వారా గ్రామం, రాష్ట్రం చివరకు దేశం కూడా బాగుంటాయని తెలిపారు. అందుకే మహిళల సంక్షేమం, అభివృద్ధితోపాటు మహిళా సాధికారత లక్ష్యంగా తమ ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేసిందని గుర్తుచేశారు. అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా పథకాల ద్వారా వారికి భరోసా కల్పించామని చెప్పారు. మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకుమించిన పాత్ర పోషిస్తున్న మహిళల అభ్యున్నతే... ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం అని తన సందేశంలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
దారిదాపుల్లో మలుపులే!
కొండ కోనలు.. చూడచక్కని పచ్చని అందాలు.. వాగులు.. ఆపై ఘాట్ రోడ్లు.. ముచ్చట గొలిపే ప్రకృతి సోయగాలు.. వన్యప్రాణులు.. పక్షుల కిలకిలరావాలు.. ఇలా ఆహ్లాదంగా సాగిపోతున్న ఏజెన్సీ ప్రయాణంలో ఓ ‘మలుపు’ జీవితాన్నే మార్చేస్తోంది.. కొందరిని తిరిగి రాని లోకాలకు తీసుకుపోతుంటే, మరికొందరు గాయాలతో బయట పడుతున్నారు.. పర్యాటక అందాలు తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది తరలి వస్తుంటారు.. అలాంటి వారికి ఇక్కడి రోడ్లపై అవగాహన లేక, ఆపై మద్యం మత్తు, మరోపక్క వేగానికి కళ్లెం లేకపోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రంపచోడవరం: ప్రకృతి అందాలకు నిలయమైన మన్యంలో రోడ్డు ప్రమాదాలు అనేక మంది ప్రాణాలను హరిస్తున్నాయి. మితిమీరిన వేగం.. ఆపై మలుపులపై అవగాహన లేకపోవడం.. మద్యం మత్తులో ప్రయాణంతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. జిల్లాలో రంపచోడవరం, మారేడుమిల్లి అందాలు చూసేందుకు అనేక మంది వచ్చి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలను నివారణకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు కూడా నిర్వహిస్తున్నా, ఎక్కడ తగ్గడం లేదు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం వైపున పోక్సుపేట వద్ద ఏజెన్సీ ముఖ ద్వారం ప్రారంభమవుతోంది. గోకవరం – రంపచోడవరం రోడ్డులో అనేక చోట్ల ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఈ ప్రాంతానికి బైక్లపై వచ్చేవారు వేగంగా వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. గోకవరం నుంచి రంపచోడవరం గ్రామానికి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పోక్సుపేట దాటిన వెంటనే చిన్నబాపనమ్మ తల్లి గుడి వద్ద ప్రమాదకర మలుపు ఉంది. తరువాత ఏ–1 రిసార్ట్స్ వద్ద మరో మలుపు ఆందోళనకు గురిచేస్తోంది. ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నరసాపురం దాటిన తరువాత రోడ్డు ఎక్కువ దూరం దిగుడుగా ఉండి ఒక పెద్ద మలుపు ఉంటుంది. సీతపల్లి గుడి తర్వాత ప్రమాదకర మలుపు ఉంది. గతంలో ఇక్కడ అనేక మంది మృత్యువాత పడ్డారు. వేగంగా వచ్చే వాహనదారులు దగ్గర మలుపు కావడంతో కంట్రోల్ చేయలేక ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఐ.పోలవరం గ్రామానికి సమీపంలోని పాలకాలవ దగ్గరలో, జాగరంపల్లి జంక్షన్ వద్ద మలుపులు ఉన్నాయి.రంపచోడవరం– గోకవరం రోడ్డులో ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయి. తాజాగా ఏడుగురాళ్లపల్లికి చెందిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులు పాలకాలువ సమీపంలో వాహనాన్ని ఢీకొని మృతి చెందారు. ఇదే మలుపులో బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. రంపచోడవరం –మారేడుమిల్లి మార్గంలోనూ మలుపులు హడలెత్తిస్తున్నాయి. రంపచోడవరం అటవీశాఖ చెక్పోస్టు, ఏపీఆర్ కళాశాల వద్ద ప్రమాదకర మలుపు ఉంది. మారేడుమిల్లి రోడ్డులో అనేక చోట్ల టరి్నంగ్ పాయింట్లు ఉన్నాయి. గెద్దాడ గ్రామం దాటిన తరువాత సీమగండి వద్ద ఒంపుగా మలుపు ఉంది. ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగాయి. సున్నంపాడు – దేవరపల్లి వద్ద కూడా ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. మారేడుమిల్లి నుంచి వస్తూ అనేక మంది పర్యాటకులు ప్రమాదాల బారిన పడ్డారు. తాజాగా మారేడుమిల్లి రోడ్డులో దేవరపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో వైటీసీ మేనేజర్ మృతి చెందారు. ఘాట్ రోడ్లలోనూ.. మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్డులో అనేక చోట్ల భద్రతా చర్యలు లేవు. దీంతో వాహనాలు లోయలో పడి ఎందరో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. పాములేరు నుంచి ప్రారంభమయ్యే ఘాట్ రోడ్డు 22 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డులో అనేక చోట్ల ప్రమాదకర పరిస్థితులు ఉన్నా పట్టించుకునే నా«థుడే లేడు. ఇటీవల ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడి అనేక మంది మృత్యువాత పడ్డారు. గతంలో కర్ణాటకాకు చెందిన యాత్రికుల మినీ బస్సు ఘాట్ రోడ్డులో పైమలుపు నుంచి అదుపుతప్పి కిందపడి ఏడుగురు వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కనీస చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. అనేక చోట్ల రక్షణ గోడలు, ఐరన్ గడ్డర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మత్తు వీడక.. ఏజెన్సీలో వివిధ ప్రాంతాలకు అనేక మంది సరదాగా గడిపేందుకు వస్తుంటారు. మధుర స్మృతులను మూటగట్టుకోవాలని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో కొందరు మద్యం తాగుతుంటారు. తర్వాత వేగంగా వెళ్తూ తెలియని మలుపుల్లో ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ మత్తు ఎందరినో తిరిగిరాని లోకాలకు తీసుకెళ్తుంది. దీనిపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఎక్కడా మార్పు రావడం లేదు. చివరికి అనర్థాలు జరిగిపోతూనే ఉన్నాయి. తరచూ ప్రమాదాలు ఏజెన్సీ ప్రాంతానికి వస్తున్న అనేక మంది పర్యాటకులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్కో ప్రమాదంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ అందాలు చూడటానికి వచ్చి ప్రమాదాల బారిన పడడం వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. –గొర్లె బాలాజీబాబు, జెడ్పీటీసీ సభ్యుడు, మారేడుమిల్లి అవగాహన కల్పిస్తున్నాం.. మితిమీరిన వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడంతోనే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీనిపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇక్కడ ప్రమాదకర మలుపుల వద్ద త్వరలోనే బోర్డులు కూడా ఏర్పాటు చేస్తాం. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. –గోపి నరేంద్రప్రసాద్, సీఐ, మారేడుమిల్లి -
ఆమెకు అవస్థలు !
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వ ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరి సంఖ్య పెరుగుతోంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు తగిన వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం కూడా చేసింది. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కనిపించడం లేదు. విధి నిర్వహణలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటికి చెప్పుకోలేని బాధలతో అల్లాడుతున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగులను పనిసమయం ముగిసినప్పటికీ గంటల తరబడి పనులు చేయిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాగేనా మహిళలను గౌరవించేది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లు ఏవీ? ప్రభుత్వ కార్యాలయాల్లో విధిగా మహిళా రక్షణ సెల్ (ఉమెన్ ప్రొటెక్షన్ సెల్) ఉండాలని కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం చెబుతోంది. కలెక్టరేట్ కాంప్లెక్స్, సంక్షేమభవన్, సర్వజనవైద్యశాల, జిల్లా పరిషత్, నగరపాలకసంస్థ, ఆర్డీవో కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. వీటిలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కనిపించడం లేదు. వాటి బాధ్యతలను మహిళలకే అప్పగించాల్సి ఉంది. సంబంధిత కార్యాలయాల్లో మహిళలు ఏ విధంగా వేధింపులకు గురైనా, మహిళలకు సంబంధించిన పైళ్లు పెండింగ్లో పెట్టినా.. మహిళల హక్కులు, ప్రయోజనాలకు భంగం కలిగించినా ఈ సెల్లో ఫిర్యాదు చేయవచ్చు. మహిళల నుంచి ఫిర్యాదులు వస్తే ఈ విభాగం ఇన్చార్జ్లు సంబందిత హెచ్ఓడీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే వీలుంది. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటులో ప్రభుత్వం చేసిన చట్టం కాగితాల మీద ఉంది తప్ప కార్యరూపం దాల్చడం లేదు. పస్తులే దిక్కు ప్రభుత్వ మహిళ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనంలో కూడిన 180 రోజుల మెటర్నటీ లీవ్లు ఉన్నాయి. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో మహిళలు 50 శాతం వరకు ఉన్నారు. మహిళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలల పాటు మెటర్నటీ లీవ్లు ఇస్తున్నప్పటికీ ఈ కాలానికి వేతనాలు చెల్లించడం లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అంతంతమాత్రంగా రూ.20 వేలలోపు ఉన్నాయి. వేతనంతో కూడిన సెలవులు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఆరు నెలలు మెటర్నటీ లీవ్ల్లో ఉన్న సమయానికి ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వీరికి వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్లు ఇవ్వాలని ఉద్యోగసంఘాలు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం స్పందిచడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సౌకర్యాలు కను‘మరుగు’ కర్నూలు జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టరేట్లోనే మహిళా ఉద్యోగులకు కనీస సదుపాయాలు లేవు. కలెక్టరేట్లో 30 ప్రభుత్వ శాఖల జిల్లా అధికారుల కార్యాలయాలు ఉన్నాయి. రెవెన్యూ, పౌరసరఫరాలు, సర్వే, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, డీఆర్డీఏ, డ్వామా, సహకార శాఖ, ప్రణాళిక విభాగం తదితర కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం కావడంతో మహిళా ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. రన్నింగ్ వాటర్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెస్ట్ రూములు లేవు. కొన్ని శాఖల్లో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లు కాగితాల మీదనే కనిపిస్తున్నాయి. రెస్ట్ రూములు ఏర్పాటు చేయాలి మహిళా ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు సానుభూతితో వ్యవహించాలి. ప్రధానంగా వార్డు, గ్రామ సచివాయాల్లో పనిచేసే వారికి పని ఎక్కువగా ఉంటోంది. ఉదయం 8 గంటలకే విధులకు వెళ్లి రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పనిచేయాల్సి వస్తోంది. మొత్తంగా 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు కచ్చితమైన పని వేళలు అమలు చేయాలి. మహిళలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రెస్ట్ రూములు ఏర్పాటు చేయాలి. – ఎస్.చందన, ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ మహిళా విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షురాలు సమస్యలను పరిష్కరించాలి ప్రభుత్వ శాఖల్లో మహిళా ఉద్యోగులు సంఖ్య భారీగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులు మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్లకుండా ఆఫీసుల్లోనే భోజనాలు చేస్తున్నారు. ఇటువంటి వారికి తగిన వసతి కల్పించాలి. ఉమన్ ప్రొటెక్షన్ సెల్లను మరింత పకడ్బందీగా అమలు చేయాలి. మరుగుదొడ్లను ఆధునీకరించాలి. మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. – సరస్వతి, మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతప్రత్యేక సదుపాయాలు నిల్అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉండాలి. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇవి కనిపించడం లేదు. అంతేగాకుండా మహిళలకు ప్రత్యేక వెయిటింగ్ రూమ్ ఉండాలి. మధ్యాహ్నం భోజనం చేయడానికి, అరగంటపాటు విశ్రాంతి తీసుకోవడానికి వెయిటింగ్ రూమ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కాని ఎక్కడా మహిళలకు వెయిటింగ్ రూములు లేవు. ప్రస్తుతం గ్రామస్థాయి కార్యాలయం నుంచి మండలం, డివిజన్, జిల్లా స్థాయి కార్యాలయాల వరకు మహిళా ఉద్యోగులు ఉన్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో చెప్పుకోలేని బాధలతో సతమతం అవుతున్నారు. -
తిరుచానూరులో నకిలీ మద్యం తయారీ
సాక్షి టాస్క్ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వంలో ఇటీవల అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ స్థాయిలో నకిలీ మద్యం ప్లాంట్లు బట్టబయలవ్వడం కళ్లెదుట కదలాడుతుండగా, తాజాగా తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలోనే నకిలీ మద్యం తయారీ కేంద్రం వెలుగు చూడటం కలకలం రేపుతోంది. తిరుచానూరు పోలీసులు శనివారం చేపట్టిన కార్టెన్ సెర్చ్లో ఈ బాగోతం బట్టబయలైంది. చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం తిరుపతి రూరల్ మండలం పాడిపేట శేషాద్రి నగర్లో ఐదుగురు సీఐలు, పది మంది ఎస్ఐలు, సిబ్బందితో కలసి కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఇంటింటికి వెళ్లి నివాసం ఉంటున్న వారి వివరాలను సేకరించారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు గంజాయి సేవిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శేషాద్రి నగర్లో తనిఖీలు చేస్తుండగా నాగేష్ రెడ్డి ఇంట్లో పదుల సంఖ్యలో నకిలీ మద్యం బాటిళ్లను చూసి పోలీసులు నివ్వెరపోయారు. అక్కడ నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 40కి పైగా నకిలీ మద్యం ఫుల్ బాటిళ్లను, నకిలీ మద్యం తయారీకి అవసరమైన ముడి సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీడీలు, సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు.తిరుపతిలోని ఓ ల్యాబ్లో పనిచేస్తున్న నాగేష్ రెడ్డి యూ ట్యూబ్లో మద్యం తయారీ విధానాన్ని పరిశీలించారు. ద్రాక్ష, చక్కెర, మరికొన్ని ద్రవాల మిశ్రమంతో కొంతకాలంగా ఇంట్లోనే మద్యం తయారు చేస్తున్నాడు. నిందితుడిని పోలీసులు తిరుచానూరు పోలీసుస్టేషన్కు తరలించారు. ఈ అక్రమ దందాలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందనేది విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.ఏడాది క్రితం ఇదే పోలీస్స్టేషన్ పరిధిలో..గత ఏడాది జనవరిలో ఇదే తిరుచానూరు పోలీస్స్టేషన్ పరిధిలోని దామినేడు వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దామినేడు ఇందిరమ్మ కాలనీలోని ఓ నివాసంలో సెలబ్రిటీ, ఓల్డ్ అడ్మిరల్, ట్రాపికానాకు కంపెనీ లేబుళ్లతో ఉన్న 591 నకిలీ మద్యం బాటిళ్లు, 6,600 ఖాళీ మద్యం బాటిళ్లు, మూతలు, 805 లీటర్ల స్పిరిట్ని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రాయల్ క్యాన్ విస్కీ, ట్రాపికానా బ్రాందీ, హనీబీ బ్రాందీ, కేరళ మాల్ట్ విస్కీ, మంజీరా, నైసీ హార్స్, సెలబ్రిటీ చాయిస్ కంపెనీలకు చెందిన నకిలీ లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేసి తిరుపతి, రైల్వే కోడూరు ప్రాంతాల్లో బెల్టు దుకాణాల ద్వారా విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. నకిలీ మద్యం తయారు చేసే ముఠాకు చెందిన అయ్యప్ప, నారాయణ రాజులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ మద్యం తయారీలో అసలు సూత్రధారి అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం పింఛా గ్రామానికి చెందిన వెంకట రమణగా గుర్తించినట్లు నాటి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. అతను గల్ఫ్లో కొంత కాలం ఉండి దామినేడులోని ఇందిరమ్మ గృహాలను అడ్డాగా చేసుకున్నట్లు తెలిపారు. ఇదే తరహాలో ఇప్పుడు మరో నకిలీ మద్యం తయారీ కేంద్రం వెలుగు చూడటం గమనార్హం. -
వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల కూల్చివేత
నిడదవోలు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లు, ఆస్తులను టార్గెట్ చేస్తూ ధ్వంసం చేస్తున్నారు. తాజాగా శనివారం తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో వైఎస్సార్సీపీ నేతల ఆస్తులు కూల్చివేతతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రధాన ఆర్అండ్బీ రోడ్డును నెల రోజులుగా విస్తరిస్తున్నారు. అయితే ఎటువంటి ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా.. నిబంధనల ప్రకారం యజమానులకు తగినంత సమయం ఇవ్వకుండా ఆక్రమణల పేరిట ఆస్తుల విధ్వంసానికి అధికారులు పూనుకున్నారు. నిబంధనలు పక్కన పెట్టి మరీ టీడీపీ నాయకుల ఆదేశాలతో కేవలం వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లు, షాపులను లక్ష్యంగా చేసుకుని ఇళ్ల ముందు భాగాలను కూల్చివేశారు. టీడీపీ, జనసేన నాయకుల ఇళ్లు, షాపులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. టీడీపీ ఉండ్రాజవరం మండల అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, మరో నాయకుడు గన్నమనేని వెంకట సుబ్రహ్మణ్యం తమ అనుచరులతో కలసి దగ్గర ఉండి మరీ వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేయించారు. సింహాద్రి రామకృష్ణ ఆదేశాలతో పోలీసుల అండతో రోడ్డు విస్తరణ పేరిట అధికారులు పలు ప్రైవేటు ఆస్తులను పొక్లెయిన్తో ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూరుగుపల్లి సుబ్బారావు అక్కడకు చేరుకుని, ఆస్తుల ధ్వంసాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రోడ్డుకు సంబంధించిన రికార్డులు చూపించాలని తహసీల్దార్ ప్రసాద్, ఆర్అండ్బీ ఏఈ శ్రీనివాసాచార్యులును నిలదీశారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అభివృద్ధికి తాము ఏనాడూ అడ్డు చెప్పలేదని, అయితే రోడ్డు విస్తరణకు సంబంధించిన రికార్డులు చూపించాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. రోడ్డు కొలతలు చూపించాలని, నిజంగా ప్రైవేటు భవనాల్లో ఆక్రమణలు ఉంటే ప్రభుత్వం తొలగించవచ్చని తేల్చి చెప్పారు. నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. -
కంపెనీ పెట్టెయ్.. భూములు కొట్టెయ్!
సాక్షి, అమరావతి: ముక్కుతూ మూలుగుతూ రూ.లక్ష మూలధనంతో ఏర్పాటైన నెలలు నిండని కంపెనీలు రూ.వందల కోట్ల పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తాయట! సత్తాలేని సంస్థలకు ఆగమేఘాలపై ఖరీదైన భూముల సంతర్పణ! పెట్టుబడుల ముసుగులో చంద్రబాబు సర్కారు భూముల పందేరం ఇదీ! తాజాగా ఎన్ఏఎన్ గ్రీన్మెట్, స్కై స్టోరేజ్ సంస్థలకు కూటమి ప్రభుత్వం ఇదే విధంగా భూములను కేటాయించింది. మూడు నెలల క్రితం కేవలం రూ.లక్ష మూలధన పెట్టుబడితో ముంబై కేంద్రంగా ఏర్పాటైన ఎన్ఏఎన్ గ్రీన్మెట్ లిమిటెడ్కు నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద 21.36 ఎకరాలను కేటాయిస్తూ పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వేదాంత గ్రూపు సమీప బంధువులైన అనన్య అగర్వాల్, నైవేద్య అగర్వాల్ 2025 నవంబర్10న ఎన్ఏఎన్ గ్రీన్మెట్ ప్రైవేట్ లిమిటెడ్ను నెలకొల్పారు. కంపెనీని ఏర్పాటు చేయడం.. రాష్ట్ర ప్రభ్వుత్వంతో చర్చలు జరపడం.. ఎస్పీసీ, ఎస్పీబీ, మంత్రివర్గం ఆమోదం పొందడం.. ఆ వెంటనే ఉత్తర్వులు జారీ అయ్యే విధంగా ఫైళ్లు శరవేగంగా పరిగెత్తాయంటే దీని వెనుక ఉన్న శక్తిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నాయుడుపేటలో రూ.కోట్లు పలుకుతున్న భూమిని ఎకరం కేవలం రూ.30 లక్షలు చొప్పున కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కారు చౌకగా భూమితో పాటు పెట్టుబడిలో 60.38 శాతం రాయితీల రూపంలో తిరిగి ఇవ్వనున్నారు. స్కై స్టోరేజ్ సొల్యూషన్స్.. వేర్ హౌసింగ్, లాజిస్టిక్ సేవలను అందించేలా స్కై స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2025 డిసెంబర్ 5న విశాఖ కేంద్రంగా ఏర్పాటైంది. కేవలం రూ.లక్ష మూలధనంతో పవన్ ప్యాలెస్, దొడపర్తి, అక్కయ్యపాలెం, విశాఖ చిరునామాతో సిదార్థ అగర్వాల్, యోగేష్ శాంతిలాల్ పటేల్లు దీన్ని నెలకొల్పారు. ఈ కంపెనీ ఏర్పాటైన రెండు నెలల్లోనే అనకాపల్లిలో 15 ఎకరాలు కేటాయిస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరం రూ.80 లక్షలు చొప్పున తక్కువ ధరకు ఏపీఐఐసీ భూమిని కేటాయించింది. నాయుడుపేటలో ఎన్ఏఎన్ గ్రీన్మెట్ లిమిటెడ్కు అత్యంత విలువైన భూమిని ఎకరం రూ.30 లక్షలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ⇒ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ లిమిటెడ్కు ఎకరా రూపాయి చొప్పున విశాఖ జిల్లా తర్లువాడ వద్ద 30 ఎకరాలు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సెమి కండక్టర్స్ పాలసీ కింద తొలి కంపెనీగా ప్రత్యేకంగా గుర్తిస్తూ ఎకరా రూపాయికే భూమిని కేటాయించినట్లు పేర్కొన్నారు. దీంతోపాటు పెట్టుబడిలో 40 శాతం వరకు ప్రోత్సాహకాల రూపంలో తిరిగి ఇవ్వనున్నారు. సిగాచీ ఇండస్ట్రీస్కు గుట్టపాడు క్లస్టర్లో ఎకరా రూ.30 లక్షలు చొప్పున 94.70 ఎకరాలు కేటాయించారు. వీటితోపాటు 45.02 శాతం రాయితీలు ఇవ్వనున్నారు. ⇒ వారీ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్కు కూటమి సర్కారు అనకాపల్లిలో సుమారు 300 ఎకరాలు ఎకరా రూ.50 లక్షలు చొప్పున కేటాయించింది. 59.73 శాతం ఫిక్స్డ్ క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వనున్నారు. ⇒ పల్నాడు జిల్లా కొండవీడు వద్ద 12.31 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు అర్షథాతు గ్రీన్ నానోటెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎకరానికి రూ.5 లక్షల క్యాపిటల్ సబ్సిడీతోపాటు ఆ భూమిని 22 ఏ నుంచి తొలగించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ⇒ సిఫి ఇన్ఫినిటీ స్పేసెస్ ఐటీసెజ్కు కేటాయించిన భూములకు సకాలంలో నగదు చెల్లింపులో విఫలం కాగా ఎటువంటి వడ్డీ లేకుండా చెల్లించేందుకు 90 రోజుల గడువు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.⇒ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్కు నెల్లూరు జిల్లా దత్తులూరు వద్ద 400 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ⇒ రేమాండ్ అనుబంధ కంపెనీ జేకే మైనీకి కేటాయించిన భూములకు ఎటువంటి వడ్డీ లేకుండా చెల్లించడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ⇒ విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న ఫార్మా యూనిట్కు పెట్టుబడిలో 40 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ⇒ బయోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో 28.05 ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 14.28 ఎకరాలను కేటాయిస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. -
కల్తీ పాల ఘటనను ‘కూల్’ చేశారు!
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్తీ పాల మరణాలకు కారణం ఏమిటనే విషయమై కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు అధికారులు తెరదించారు. మంగళగిరిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్), విజయవాడలోని రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఆర్ఎఫ్ఎస్ఎల్) నుంచి శనివారం ఐదుగురి మరణాలకు సంబంధించిన ఫోరెన్సిక్ తుది అభిప్రాయం వెల్లడైనట్టు ఓ ప్రకటన ద్వారా అధికారులు వెల్లడించారు. కూలెంట్ నుంచి లీకైన విషపూరిత ఇథలీన్ గ్లైకాల్ కలిసిన పాలు తాగడం వల్లే పలువురు కిడ్నీలు ఫెయిలై మృతి చెందినట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా నిర్ధారణకు వచ్చినట్టు ప్రకటించారు. ఈ నివేదిక ప్రతులను మాత్రం బహిర్గతం చేయలేదు. కేవలం ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీనినిబట్టి చూస్తే.. విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నివేదిక కాపీలను బహిర్గతం చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇథలీన్ గ్లైకాల్ కాకుండా మరేదైనా కలిసినట్టు ఆ రిపోర్టుల్లో నిర్ధారించారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నివేదికలను ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరిశీలించి తుది అభిప్రాయం తెలిపారని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 9 కేసులకుగాను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులకు సంబంధించి ఈ నివేదికలు వచ్చాయన్నారు. ల్యాబ్ల నుంచి వచ్చిన రిపోర్టులు, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరిశీలించి ఇచ్చిన ఫైనల్ ఒపీనియన్ ఆధారంగా విషపూరితమైన ఈజీ–ఇథలీన్ గ్లైకాల్ కలిసిన పాలు తాగడం వల్ల కిడ్నీ, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో ఈ ఐదుగురూ మృతి చెందినట్టు నిర్ధారించారు. మిగిలిన వారి రిపోర్టులు ఎందుకు ఆలస్యమవుతున్నాయనే ప్రశ్నలకు జవాబు లేదు. -
‘విజయ’ పేరుతో కల్తీ నెయ్యి
లాలాపేట: సహకార స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం విజయ డెయిరీ బ్రాండ్(ఏపీ)ను మేఘనా ఫుడ్స్ అనే ప్రైవేట్ సంస్థకు ఫ్రాంచైజీ అప్పజెప్పడంతో వారు వెజిటెబుల్ ఆయిల్స్తో నెయ్యి తయారు చేసి ఏపీ విజయ పేరుతో కల్తీ నెయ్యి విక్రయిస్తున్నారని తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) తెలంగాణ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. ఒక్క హైదరాబాద్లోనే నెలకు దాదాపు 100 టన్నుల కల్తీ నెయ్యి విక్రయిస్తూ విజయ బ్రాండ్కు చెడ్డపేరు తీసుకురావడంతోపాటు తెలంగాణ పాడి రైతాంగానికి తీవ్రమైన నష్టం కల్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెజిటెబుల్ ఆయిల్తో తయారు చేసిన నెయ్యిలో మోతాదుకు మించి హానికరమైన రసాయనాలు ఉన్నట్లు ఎన్డీడీబీ(నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) పరీక్షలు చేసి తేల్చిందని అమిత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం లాలాపేటలోని విజయ భవన్లో ఎండీ చంద్రశేఖర్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాటాడారు. ఏపీ డెయిరీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్లో రైతుల నుంచి పాల సేకరణగానీ, పాల విక్రయం కానీ చేయడంలేదన్నారు. ప్రైవేట్ వ్యక్తులు గుజరాత్లో తయారు చేసిన నెయ్యిని ఏపీ విజయ డెయిరీ పేరుతో హైదరాబాద్లో విక్రయిస్తూ ఇక్కడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. రైతుల ద్వారా సేకరించిన పాలు, పాల పదార్థాల నాణ్యతకు మారుపేరుగా తెలంగాణ విజయ నిలుస్తోందన్నారు. ప్రభుత్వ రంగసంస్థ అయిన విజయ తెలంగాణ బ్రాండ్ విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విజయ పేరుతో ఎవరూ కల్తీ చేసినాఅడ్డుకుని తీరుతామన్నారు.అవసరమైతే రైతులు రోడ్డెక్కి పోరాటం చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పలు లేఖలు రాసామని, స్వయంగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా స్పందనలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం స్పందించి మేఘనా ఫుడ్స్కు ఇచ్చిన విజయ ఫ్రాంచైజీని విరమించుకోవాలని, లేదంటే తెలంగాణ సహకారంతో దాన్ని తామే అడ్డుకుంటామన్నారు. పాలు, పాల పదార్థాలు కొనేటప్పుడు నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ విజయ లోగోను చూసి మాత్రమే పాలు, నెయ్యి ఇతర పాల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి వినియోగదారులకు సూచించారు. -
గ్రామ సర్వేయర్లపై చంద్రబాబు సర్కారు కక్ష
సాక్షి, అమరావతి: న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆందోళన బాట పట్టిన గ్రామ సర్వేయర్లపై చంద్రబాబు సర్కారు కక్షసాధిస్తోంది. ఇప్పటికే 40 మంది సర్వేయర్లను సస్పెండ్ చేసింది. అందులో గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, గ్రామ సచివాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మధుబాబు కూడా ఉన్నారు. ఈ చర్యల ద్వారా మిగిలిన ఉద్యోగులను భయపెట్టవచ్చని సర్కారు యోచనగా కనిపిస్తోంది. అనుమతి లేకుండా యూనియన్లు పెట్టి పోరాటం చేస్తున్నారంటూ ప్రభుత్వం సస్పెన్షన్ ఆర్డర్స్లో పేర్కొంది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈనెల 5 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సర్వేయర్లు రాష్ట్రవ్యాప్తంగా సహాయ నిరాకరణ ప్రారంభించారు. రీ సర్వే కార్యక్రమంలో పాల్గొనకుండా తమ డిమాండ్లపై చర్చించాలని కోరారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను కలిసినా ఉపయోగం లేకపోవడంతో ఆందోళనను ఉధృతం చేశారు. దీంతో ప్రభుత్వం మూడు రోజుల నుంచి వరుసగా సస్పెన్షన్లు ప్రారంభించింది. అయినా సర్వేయర్లు వెనక్కి తగ్గకుండా సర్వే శాఖ జిల్లా కార్యాలయాల వద్ద ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. ఇవీ డిమాండ్లు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఇతర ఉద్యోగుల మాదిరిగానే తమ పే రోల్లో మార్పు చేయాలనేది సర్వేయర్ల ప్రధాన డిమాండ్. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రూ.30 వేల బేసిక్ పే ఉండగా, సర్వేయర్లకు మాత్రం రూ.25,200 మాత్రమే ఉంది. దీన్ని అందరితో సమానంగా పెంచుతామని, ప్రమోషన్ ఛానల్ కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం యధావిధిగా ఆ హామీని తుంగలో తొక్కింది. కనీస వేతనం కూడా ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్న జీతాన్నే కేవలం పోస్టు పేరు మార్చి ఇచ్చేందుకు ప్రభుత్వం నివేదిక తయారు చేసినట్లు చెబుతున్నారు. దీంతో సర్వేయర్లు ఆందోళన బాట పట్టారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన విరమించేది లేదని సర్వేయర్లు స్పష్టం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సర్వేయర్ల సంఘం సన్నాహాలు చేస్తోంది. -
కబ్జాల గీతం.. సర్కారు తాళం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు తన బంధువులకు, బినావీులకు ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు, 99 పైసలకు కట్టబెడుతుండటంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి, వాటిని సక్రమం చేసుకునేందుకు మంత్రి లోకేశ్ తోడల్లుడు, సినీనటుడు బాలకృష్ణ అల్లుడు, విశాఖపట్నం టీడీపీ ఎంపీ భరత్కు చెందిన ‘గీతం’ సంస్థ బరితెగించి అన్ని అడ్డదారులూ తొక్కుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ అండతో జీవీఎంసీలో దౌర్జన్యం చేసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవిఎంసీ) సమావేశంలో ఎలాంటి చర్చ లేకుండానే తను ఆక్రమంచిన రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరించుకుంది. ఈ బరితెగింపు, దౌర్జన్యంపై యావత్ ప్రజా సంఘాలు, రాష్ట్ర ప్రజలు ఓ వైపు మండిపడుతుండగా.. ఆ స్థలాన్ని ‘గీతం’ తన ఆధీనంలోకి తీసుకుని చదును చేసే పనులు మొదలు పెట్టడం కలకలం రేపుతోంది. తీర్మానం మేరకు ఇంకా జీవో విడుదల కాకముందే అధికారం అండ చూసుకుని గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన భూములను సొంతం చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. జీవీఎంసీ పాలకవర్గ సమావేశంలో అధికార బలాన్ని ప్రయోగించి, దాడులకు తెగబడి ఆ భూముల క్రమబద్ధీకరణకు తీర్మానాన్ని ఆమోదించుకున్న వైనంపై ఓ వైపు ఇంకా చర్చ జరుగుతూనే ఉండగా, ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. పైగా గతంలో ఈ భూములు ప్రభుత్వానికి చెందినవి అంటూ ప్రభుత్వం పాతిన బోర్డులను సైతం పీకేశారు. లారీల్లో ఎర్రమట్టిని తరలించి కబ్జా భూముల్లో చదును చేసే (లెవలింగ్) పనులు చురుగ్గా చేస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల్లో అక్రమంగా ‘గీత’ దాటి చేపడుతున్న పనుల వైపు రెవెన్యూ యంత్రాంగం కన్నెత్తి చూడటం లేదు. కొద్దిపాటి జాగాలో వ్యాపారం చేసుకుని పొట్టపోసుకునే చిరు వ్యాపారులపై ఆపరేషన్ లంగ్స్ పేరిట ప్రతాపం చూపిన ప్రభుత్వం.. రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిలో గీతం పనులు చేస్తున్నా, అడ్డు చెప్పడానికి సాహసించడం లేదు. ఇప్పటికి ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్న ఈ భూములు తమవే అన్నట్లు గీతం వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం కాపాడితే.. ఈ ప్రభుత్వం ధారాదత్తంఅధికారికంగా గీతం యూనివర్సిటీ కోసం కేటాయించిన భూముల్లో మాత్రమే కాకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల్లోకి సైతం గీతం ఆక్రమణల పర్వం మొదలైంది. ఈ ఆక్రమణలన్నీ సక్రమం చేసుకునేందుకు 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. ‘గీతం’ పావులు కదిపింది. ఇందులో భాగంగా గీతం ఆక్రమణ చెరలో ఉన్న భూముల్ని సదరు వర్సిటీకి ఎలినేషన్ కింద బదలాయించేందుకు సన్నాహాలు చేశారు. తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖ భూ కుంభకోణాలపై చర్యలకు ఉపక్రమించింది. ఇలా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకంగా 2 వేల ఎకరాల మేర భూములను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంరక్షించింది. వీటి విలువ రూ.6 వేల కోట్ల మేర ఉంటుందని అంచనా. ఇందులో భాగంగా గీతం భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. 40.51 ఎకరాలకుపైగా ఆక్రమించుకున్న స్థలాల్ని దశల వారీగా స్వాధీనం చేసుకున్నారు. భూమిని ఆక్రమించి చేపట్టిన రక్షణగోడ, గార్డెన్, గ్రావెల్ బండ్ నిర్మాణాల్ని అప్పట్లో గత ప్రభుత్వం తొలగించింది. ఇది ప్రభుత్వ స్థలం అంటూ బోర్డులను పాతింది. ఇంకా ఆక్రమిత భూములున్నాయని రెవెన్యూ అధికారులు చెప్పడంతో.. గీతం యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. మిగిలిన 14 ఎకరాలకు పైగా భూమికి సంబంధించి కోర్టులో విచారణ పెండింగ్లో ఉంది. తుది తీర్పు వచ్చే వరకు ఆ భూముల్లో ఎలాంటి కొత్త చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. గీతం చెరలో ఉన్న భూములు ఆక్రమించినవేనని చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో వేసిన ‘సిట్’ కూడా స్పష్టం చేసింది. కబ్జా భూముల్లో లెవలింగ్ పనులు చేపట్టిన దృశ్యం బోర్డులను సైతం పీకేసి.. బలం లేకపోయినప్పటికీ వైఎస్సార్సీపీకి చెందిన మేయర్ను అధికార చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా తొలగించింది. కేవలం గీతం భూముల కోసమే మేయర్ పీఠాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేజిక్కించుకుందని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. కౌన్సిల్ సమయం ముగుస్తున్న సమయంలో హడావుడిగా ఎజెండాలో చివరి అంశంగా గీతం భూముల విషయాన్ని చేర్చి, ఆమోదం పొందేలా ఒత్తిడి తెచ్చిందని స్పష్టం అవుతోంది. సీఎం, లోకేశ్ పేషీ నుంచి జీవీఎంసీపై ఒత్తిడి నేపథ్యంలో ఆ భూముల్ని గీతం వర్సిటీకి క్రమబద్ధీకరించి, బదలాయింపు ప్రక్రియ వేగవంతం చేసింది. ఇందుకోసం కౌన్సిల్ సమావేశంలో పక్కాగా రౌడీయిజానికి దిగడం.. ఎటువంటి చర్చ, ఓటింగ్ లేకుండానే అన్ని అంశాలు ఆమోదం పొందినట్లుగా ఎజెండాను మేయర్ స్వయంగా చదివి ప్రకటించడం తెలిసిందే. జీవీఎంసీ తీర్మానం తర్వాత అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) జారీ చేయాల్సి ఉంటుంది. అయితే అప్పటి వరకు వేచి చూడలేమంటూ ‘గీతం’ ఈ భూముల్లో బరితెగించి లెవలింగ్ పనులు పెద్ద ఎత్తున చేస్తోంది. ప్రభుత్వ భూములంటూ పాతిన బోర్డులను సైతం పీకేసింది.పప్పు బెల్లాలకు భూ పందేరాలురాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రభుత్వ పెద్దల బంధువులు, బినామీలకు భూ పందేరాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. పప్పు బెల్లాలకు, 99 పైసలకే భూములిచ్చేస్తున్నారు. పైగా ఎకరం 99 పైసలకు కాదు.. ఆయా సంస్థలకు కావాల్సిన మొత్తం భూమిని 99 పైసలకే ఇస్తామని నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు. రెండు మూడు నెలల క్రితం కంపెనీలు పెట్టి.. వాటి పేరుతో భూ దోపిడీ సాగిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు సైతం భూములు కేటాయించిన ఘనత ఒక్క చంద్రబాబు ప్రభుత్వానికే దక్కింది. -
ఏపీ సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘన
చంద్రబాబు నాయుడు రాజకీయ ఎజెండాలోకి ఇప్పుడు కొత్త మాటలు కావాలి. రికార్డులు అరిగేలా పదేపదే పాడేసిన పాత పాటలు ఇప్పుడు చెల్లుబాటు కావడం లేదు. ఇరవై మాసాల్లో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకుందామంటే ‘క్రెడిట్ చోరీ’ దొంగాట వెక్కిరిస్తున్నది. ‘సంపద సృష్టి’ అనే మాటకు యెల్లో నిఘంటువు అర్థం ‘రుణ సమీకరణ’ అని తేలిపోయింది. తన రాజకీయ వారసత్వం కొనసాగాలంటే తుప్పు పట్టిన అస్త్రతూణీరం అక్కరకు రాబోదని అర్థమైంది. కొత్త బాణాలు కావాలి. అరువు తెచ్చుకున్న నయా తత్వాలు పాడేందుకు సరికొత్త బాణీలు కావాలి. వాటినెలా సాధించాలి? కిం కర్తవ్యం అన్న ప్రశ్నకు ఒకే ఒక మార్గాంతరం ఆయనకు కనువిప్పు కలిగించినట్టుంది.‘అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ అంటూ మతాన్ని పులిమేసుకోవడం మొదలుపెట్టారు. మతాన్ని రాజ కీయాలతో ముడిపెట్టకూడదన్న రాజ్యాంగ స్ఫూర్తినీ, సర్వోన్నత నాయ్యస్థానాల ఆదేశాలనూ ఆయన గణించదలుచుకోలేదు. మనుగడకు మరో మార్గం లేదేమో! ‘ఉదర పోషణార్థం బహుకృత వేషం’ అన్న నానుడి చందంగా అవసరార్థం మత వేష ధారణ. ఆషాఢభూతిని ఆదర్శంగా తీసుకునేవారికి మతమైనా, రాజకీయమైనా ఒకటే. మతం కూడా రాజకీయమే. ఈ కొత్త వేషంలో ఆయనకింకో సౌలభ్యం ఉన్నది. తాను ప్రవచించే తాజా తాత్విక ధారలో కరిగి, జనం ఐహిక విషయాలు వదిలేయాలి. ఆ ట్రాన్స్లో మైమరిచిపోవాలి. ‘సూపర్ సిక్స్’ను సూపర్ హిట్ చేశానంటే తలలూపాలి. ఇరవై మాసాల్లో ఆరు లక్షల ఉద్యోగాలిచ్చేశానంటే నమ్మేయాలి. తన పేరును పఠించ గానే ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులుగా పరుగెత్తుకొని వచ్చా యంటే నిజమే అనుకోవాలి. ఇంకో ఇరవై లక్షల ఉద్యోగాలను చిటికేసి ఇచ్చేస్తానంటే మహాప్రసాదమని మురిసిపోవాలి.చంద్రబాబు, ఆయన పార్టీ, కూటమి కలిసి మత ఎజెండాను ముందు పెట్టుకొని రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తు న్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా దాడి చేస్తున్నారు. అందుకోసం చట్టసభలను కూడా వేదికలుగా చేసుకోవడానికి తెగించడం తీవ్రంగా ఆందో ళన కలిగిస్తున్నది. ‘‘... శాసనము ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతా చూపుతాననీ...’’ అంటూ ప్రమాణాలు చేసి చట్టసభల్లో ప్రవేశించిన నేతలు ఒట్టు తీసి గట్టుమీద పెట్టి రాజ్యాంగం పట్ల విద్రోహపూరితంగా మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ ఉభయ సభల్లో ఈవారం చోటు చేసుకున్నాయి. శాసన మండలిలో గౌరవ సభాధ్యక్ష స్థానాన్ని ఉద్దేశించి రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు విజ్ఞులందరికీ దిగ్భ్రాంతిని కలిగించాయి. ‘మీరు క్రిస్టియన్! మీ నాయకుడు క్రిస్టియన్. వెంకటేశ్వర స్వామిపై కక్ష కట్టారు. యేసు మాత్రమే దేవుడా... వెంకటేశ్వరస్వామి కాదా?’... ఈ రక మైన వాచాలతతో ఆయన చెలరేగి పోయారు. శాసనసభలో మంత్రులు మాట్లాడే మాటలను ప్రభుత్వ వాణిగానే పరిగణిస్తారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు మంత్రిమండలి సమష్టిగా బాధ్యత వహించవలసి ఉంటుంది. తాను ఒక మతానికి ప్రతి నిధి అన్నట్టుగా వకాల్తా పుచ్చుకొని మాట్లాడినట్టుగా ఆయన భాషావేశం, భావాభినివేశం తేటతెల్లం చేస్తున్నాయి. ఇది సంపూ ర్ణంగా రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన. శాసనసభ్యునిగా చేసిన ప్రమాణానికి విరుద్ధంగా రాజ్యాంగానికి ఆయన అవిధేయతను ప్రకటించినట్టే పరిగణించాలి.భారత్ను లౌకిక (సెక్యులర్) రిపబ్లిక్గా మన రాజ్యాంగ పీఠిక ప్రకటించింది. లౌకికత్వమనేది రాజ్యాంగ మౌలిక స్వరూ పంలో భాగమనీ, అది అనుల్లంఘనీయమైన ప్రాథమిక హక్కు అనీ సర్వోన్నత న్యాయస్థానం వివిధ తీర్పుల్లో ప్రకటించింది. ఏ మతాన్నీ అధికారిక మతంగా రాజ్యాంగం గుర్తించలేదు. అన్ని మతాల పట్ల సమాన గౌరవాన్నీ, సమాదరణనూ ప్రకటించింది. మత, కుల, ప్రాంత, లింగభేదాల ఆధారంగా ఎటువంటి వివక్షా లేదని ప్రాథమిక హక్కుల్లోని 15వ అధికరణం స్పష్టం చేసింది. ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఒక మతం పట్ల ప్రత్యేక అభిమానంతో వ్యవహరిస్తే అది రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించినట్టేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అటువంటి రాష్ట్ర ప్రభుత్వంపై 356వ అధిక రణం కింద చర్య (ప్రభుత్వ బర్తరఫ్) తీసుకోవచ్చునని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మతాన్ని రాజకీయాలతో ముడి వేయడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.గౌరవ సభాధ్యక్షులు తాను క్రిస్టియన్ కాదు, హిందువునని చెప్పినందువలన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని అచ్చెన్నాయుడు మండలిలో చెప్పారు. అంటే సభాధ్యక్ష స్థానంలో హిందూయేతర వ్యక్తి కూర్చుని ఉంటే అతని మీద నిందలు మోపవచ్చునా? సభాధ్యక్షుడు క్రిస్టియన్ అయ్యుంటే తన మాటలను వెనక్కు తీసుకునేవాడిని కాదనే అర్థం ఆయన స్పందనలో ధ్వనించింది. ఇది కచ్చితంగా మత విద్వేష ప్రకటన. మత విషయాల్లో రాజ్యాంగ యంత్రాంగం తటస్థ పాత్ర పోషించాలన్న రాజ్యాగ స్ఫూర్తిని అవహేళన చేశారు. శాసన సభ్యునిగా తాను చేసిన ప్రమాణాన్ని గాలికొదిలి రాజ్యాంగ అవిధేయతకు ఆయన పాల్పడ్డారు. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానాల తీర్పులను కూడా ఆయన ఖాతరు చేయలేదు.శాసన మండలిలో అచ్చెన్నాయుడు ప్రహసనం గురువారం నాడు చోటుచేసుకున్నది. శుక్రవారం నాడు శాసనసభలో స్వయానా ముఖ్యమంత్రే అచ్చెన్న పాటకు కోరస్ అందు కున్నారు. సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక భారతదేశ చరిత్రలో బహుశా పార్లమెంట్లో గానీ, రాష్ట్రాల శాసనసభల్లో గానీ ఏ ప్రధానీ, ఏ ముఖ్యమంత్రీ ఈ తరహాలో మాట్లాడి ఉండరు. ‘ఏసుక్రీస్తుకయితే క్షమాపణ చెబుతారా... వెంకటేశ్వర స్వామికి మాత్రం చెప్పరా’’ అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తిరుమలలో ఆధ్యాత్మికవేత్తలూ, వేద పండితులూ వద్దువద్దని వారిస్తున్నా వినకుండా వేయికాళ్ల మండపాన్ని కూల్చేసిన చంద్రబాబే ఈ ప్రశ్న వేశారు. ఆధ్యాత్మిక సుధలను అనుదినం ప్రవర్ధితం చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్ ప్రభుత్వం ప్రారంభించిన ఎస్వీబీసీ భక్తి ఛానల్ ఎందుకూ, డబ్బులు దండ గని ఈసడించుకున్న చంద్రబాబే వెంకన్నకు క్షమాపణ చెప్పరా అని ప్రశ్నిస్తున్నారు. ‘50 కోట్ల ఖర్చుతో భగవద్గీత పుస్తకాలు అచ్చేశారు. ఏముంది అందులో, ఆ పుస్తకాలను చూస్తే మొహాన ఉమ్మేస్తార’ని చెబుతున్న టీటీడీ బోర్డు అధ్యక్షుని మీద ఈగ వాలకుండా కాపుకాస్తున్న ముఖ్యమంత్రే ఈ ప్రశ్న వేస్తున్నారు.దేవుని మీద నిజమైన భక్తి విశ్వాసాలు ఉన్నవారు ఎవరైనా తనకు తెలిసో, తెలియకో తన వల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అపచారం జరిగిందని భావిస్తే తప్పనిసరిగా క్షమాపణ కోరు తారు. దేవుడిపై నమ్మకం ఉండేవారు శివుడూ, వేంకటేశ్వరుడూ, ఏసుక్రీస్తూ, అల్లా అనే తేడాలు చూడరు. అన్ని రూపాల్లోని అన్ని విశ్వాసాల్లోని దైవత్వాన్ని ఆరాధిస్తారు. ‘మీ దేవుడూ, మా దేవుడూ’ అనే మీమాంస భక్త వేషధారులకుంటుందేమో గానీ భక్తి విశ్వాసాలు కలవారికి ఉండదు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి శాసనసభ సాక్షిగా ఒక మతం తరఫున వకాల్తా పుచ్చుకొని రాజ్యాంగం నిర్దేశించిన ‘రాజ్య తటస్థత’ నియమాన్ని బాబు ఉల్లంఘించారు.రాజ్యాంగ ఉల్లంఘన మాత్రమే కాదు... సత్యదూరమైన విషయాన్ని ప్రశ్నగా సంధించి ఆయన సభను తప్పుదోవ పట్టించారు. ఏడుకొండల స్వామికి క్షమాపణ చెప్పవలసింది ఎవరు? ప్రభుత్వం ప్రచారం చేసినట్టు జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్’ స్పష్టం చేసినా కూడా ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని వాదిస్తున్నారు కదా! ఆ నెయ్యి శాంపుల్స్ ఎప్ప టివి? చంద్రబాబు ముఖ్యమంత్రయిన కొన్నాళ్ల తర్వాత టీటీడీ నాణ్యతా పరీక్షలో విఫలమైన నాలుగు ట్యాంకర్ల నుంచి సేకరించిన నమూనాలివి. పరీక్ష ఫెయిలైన ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు. ఆ శాంపిల్స్ను పరీక్ష కోసం బాబు నియమించిన ఈవో శ్యామలరావు ఎన్డీడీబీకి పంపించారు. వెనక్కు మళ్లిన ట్యాంకర్లు ఎన్నడూ లేని విధంగా బాబు ఏలుబడిలోనే తొలి సారిగా డెయిరీ లేబుళ్లు మార్చుకొని తిరుమలకు వెళ్ళాయి.కూటమి పాలనా కాలంలో, కూటమి నియమించిన ఈవో పంపించిన నెయ్యి శాంపిల్స్లో కల్తీ జరిగి ఉంటే అందుకు ఎవరు బాధ్యత వహించాలి? నాణ్యతా పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు మళ్లీ తిరుమలలోకి ప్రవేశించాయంటే అందుకు ఎవరిని నిందించాలి? వైసీపీ పాలనా కాలం నుంచే టీడీడీలో నాణ్యతా పరీక్షలకు ఏర్పాట్లున్నాయి. అప్పుడు కూడా చాలా సార్లు పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు వెనక్కు మళ్లాయని రికార్డులు చెబుతున్నాయి. అయినా, 2024 జూలై తర్వాత వచ్చిన శాంపిల్స్ను పరీక్షించి అంతకుముందు కాలంలో కల్తీ జరిగిందని తీర్పులు చెప్పడం ఎలా కుదురుతుంది? ఈ ఆరోపణ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా? ‘మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మా మూతులు వాసన చూడండి’ అన్నాడట వెనుకటికి ఒకాయన! కూటమి తీరు ఆ విధంగానే ఉన్నది.ఆదాయ వనరుల్లేని వేలాది చిన్న దేవాలయాల్లో దీప ధూప నైవేద్యాలకు నిధులనూ, అర్చక స్వాములకు భృతినీ ఏర్పాటు చేసిన రాజశేఖరరెడ్డి మీద, తిరుమలేశుని వైభవానికి దిగంతాల దాకా ప్రాచుర్యం కల్పించాలనే లక్ష్యంతో వేలాది ఆలయాలను నిర్మించిన జగన్మోహన్రెడ్డి మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి కూటమి సర్కార్ పడరాని పాట్లు పడుతున్నది. ‘బట్ట కాల్చి మీదేస్తాం’ అనే బరితెగింపు ధోరణి ఇది. ఏడు కొండలూ తిరుమలేశునికే చెందుతాయని వైఎస్సార్ సర్కార్ ఇచ్చిన జీవోను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పిందెవరు? ఆ వీడియోలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. అవి ఫేక్ వీడియోలని ఇంకా ప్రకటించలేదెందుకో? ఏ హిందూ పీఠాధి పతులు చెప్పారని తిరుమలలోని వేయికాళ్ల మండపాన్ని కూల్చి వేశారు? వెంకటేశ్వరుని సేవకు ఆధ్యాత్మిక ఛానల్ ఎందుకు, డబ్బులు దండగన్నది ఎవరు? హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతలో ఏమున్నదని ఎవరి హయాంలోని టీటీడీ అధ్యక్షుడు హేళన చేశారు? ‘దళిత గోవిందం’ పేరుతో శ్రీవేంకటేశ్వర మహాత్మ్యాన్ని దళితవాడల్లో వినిపించిన పాలకు లపై హిందూ వ్యతిరేక ముద్ర వేయాలని చూడటం ఎంత దిగజారుడుతనం?... ఒక్క వేలు చూపి ఒరులను నిందించ వెక్కిరించు నిన్ను మూడు వేళ్లు!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మహిళలందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే వారు నిజమైన పురోగతి సాధించినట్లు అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. తద్వారా గ్రామం, రాష్ట్రం చివరకు దేశం కూడా బాగుంటుంది.. అందుకే మహిళల సంక్షేమం, అభివృద్ధితో పాటు, మహిళా సాధికారత లక్ష్యంగా మా హయాంలో పలు పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేశాం...అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాం. దాదాపు 32కు పైగా పథకాల ద్వారా మహిళలకు భరోసా కల్పించాం. మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకు మించిన పాత్ర పోషిస్తున్నారు. మహిళల అభ్యున్నతే.. ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
‘పబ్లిసిటీ మాత్రం ఉంటుంది.. ప్రజలకు చేసేదేమీ ఉండదు’
ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసేదేమీ ఉండదని, కేవలం పబ్లిసిటీ కోసమే తపిస్తూ ఉంటారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలతో కాలం గడుపుతారని, ప్రజలకు చేసేది మాత్రం శూన్యమని విమర్శించారు. ఈరోజు(శనివారం, మార్చి 7వ తేదీ) ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మాట్లాడిన కురసాల కన్నబాబు.. ‘ కాగ్ నివేదిక చూస్తే.. రాష్ట్ర పరిస్థితి ఎంత దిగజారిపోయిందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెబితే... చంద్రబాబు మాత్రం ప్రజలను అసెంబ్లీలో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకంగా ఆర్థిక వ్యవస్థ నడిపిస్తున్నారు.. అప్పు చేయని రోజు అంటూ లేదు. యుద్ధాలతో సంక్షోభంలో ఉన్న దేశాల కన్నా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతకన్నా దారుణమైన స్థితిలో ఉంది. ఆర్బీఐ వద్ద అప్పుచేసి 300 కోట్ల పైనే వడ్డీ కట్టారు. వాహనాల పన్ను జీఎస్టీని కేంద్రం తగ్గిస్తే... అది కూడా రోడ్ టాక్స్ కింద మలిచి ప్రజలపై బారాలు మోపుతున్నారు చంద్రబాబు. ఎఫ్ఆర్ఎంబి చట్టం నిబంధనలను ఉల్లంగించారు చంద్రబాబుపరిమితికి మించి అప్పులు చేయడం ద్వారా రాష్ట్ర అధోగతి పాలుఅవబోతున్నది. ఎఫ్ఆర్ఎంబి లోటు 2.7 శాతం ఉండాల్సింది 3.75 గా ఉంది. మూడు లక్షల 18 వేల కోట్లు రూపాయలు అప్పులు చంద్రబాబు చేసి పెద్ద ఘనతగా చెబుతున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు.రాజమండ్రిలో కల్తీ పాలతో ప్రజలు చనిపోతే పట్టించుకోవడం లేదు. వేట్లపాలెంలో అనేకమంది చనిపోతే వారి ఊసే పాలకులకు పట్టడం లేదు. శ్రీకాకుళంలో నీరు కలుషితమై ఆరుగురు చనిపోయిన వీరికి పట్టడం లేదు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు పేదల సమస్యలు చర్చించకుండా... ఏకపాత్రాభినయాలు, పేదల పెన్షన్లపై కూడా స్కిట్లు చేస్తూ ప్రజలను మభ్యపెట్టి గడిపేస్తున్నారు. చంద్రబాబు అప్పులు చేసిన డబ్బు ఏ సంక్షేమ పథకానికి ఖర్చు చేశారు. సూపర్ సిక్స్ హామీలకు ఖర్చు చేశారా చూపండి’ అంటూ సవాల్ చేశారు.‘జగన్మోహన్రెడ్డిన తట్టుకోవడం కష్టం అని ఒకే ఒక కారణంతో మీరు కలిసి ఉంటున్నారు. జగన్పై ఉన్న భయం ఒకటే మిమ్మల్ని కలిపి ఉంచుతుంది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ నీడ్ శాతం 41.8 శాతం తగ్గిపోయింది. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేకపోతున్నారు. అంచనాలే అందుకోలేని విధంగా.... మీ బడ్జెట్ ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఇచ్చే గ్రాంట్లు రూ. 10వేల 620 కోట్లు తగ్గిపోయాయి. మూలధన వ్యయం రూ. 45 కోట్లు చేస్తామని రూ. 16 కోట్లు చేశారు. రాష్ట్రం దివాళా తీసే దిశగా ఆర్థిక వ్యవస్థ ఉందని కాగ్ నివేదిక వేదిక చెప్పింది.రెవెన్యూలో లోటు పెరిగిపోయింది...365 రోజుల్లో 364 రోజులు అప్పులు చేసే పరిస్థితికి.. రాష్ట్రాన్ని దిగజార్చారు’ అంటూ విమర్శించారు. -
‘మీరు అమలు చేసేది సూపర్ సిక్స్ కాదు. సూపర్ స్కామ్’
తాడేపల్లి : ఏపీ అసెంబ్లీలో కాకి లెక్కలు చెబుతూ కూటమి ప్రభుత్వం కాలం గడిపిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం లెక్కలు వాస్తవాలకు సంబంధంల లేకుండా ఉందని మండిపడ్డారు. సూపర్ సిక్స్ అమలు చేయమంటే.. సూపర్ స్కామ్ చేస్తున్నారని కూటమి ప్రభుత్వ పెద్దల వైఖరిని తప్పుబట్టారు చంద్రశేఖర్.ఈరోజు(శనివారం, మార్చి 7వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్.. అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు మత విద్వేషాలు పెంచేలా మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇందుకేనా అసెంబ్లీని నిర్వహించేది? అంటూ ప్రశ్నించారు. ‘ జనంతో నడిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది జగన్. అదే జనాన్ని పొడిచి ప్రభుత్వంలోకి వచ్చింది చంద్రబాబు. వైఎస్ జగన్ని దూషించటం, లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మటానికే అసెంబ్లీలో ప్రాధాన్యత ఇచ్చారు. మండలి ఛైర్మన్ని మతం పేరుతో అవమాన పరిచారు. లడ్డూ మీద చర్చ జరిగితే వారి పాపాలు బయటకు వస్తాయని భయపడ్డారు. అందుకే ఛైర్మన్కి మతాన్ని ఆపాదించారు. మంత్రులేమో కామిడీలు చేస్తుంటే, కామిడీ ఆర్టిస్టులు మంత్రుల్లాగ మాట్లాడుతున్నారు. ఉద్యోగాల కల్పనలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన చంద్రబాబు ఇకమీదట దేశ రాజకీయాల్లోకి వెళ్తారట. ఆర్థిక క్రమశిక్షణ లేని వైనం మీద కాగ్ కడిగి పారేసింది. జాబ్ కేలండర్ అడిగితే లోకేష్ డేట్లు మార్చుకుంటూ పోతున్నారు. లూటీ చేసి లాఠీలతో బెదిరిస్తున్నారన్నారు’ అని విమర్శించారు. -
వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, కెమికల్ కలిపారని దుష్ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీని రాజకీయంగా దెబ్బతీయాలని చంద్రబాబు ప్లాన్. వైఎస్సార్సీపీ హయాంలో క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ను తీసుకొచ్చాం. మార్కెట్లో ఫిబ్రవరి 24న కేజీ హెరిటేజ్ నెయ్యి రూ.541 ఉంది. అదే రోజు మార్కెట్లో ఇందాపూర్ నెయ్యి రూ.578గా ఉంది. కేజీ అమూల్ నెయ్యిని రూ.525కే ఇస్తున్నారు’ అని సజ్జల తెలిపారు.అడ్డగోలుగా దోపిడీ చేయటానికే.. తిరుమల లడ్డూపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘నెయ్యి కాంట్రాక్టును కైవసం చేసుకోవటానికే ఇష్టానుసారం మాట్లాడారు. అధిక ధరలతో నెయ్యి కాంట్రాక్టు తీసుకుని స్వామి వారి సొమ్మును కాజేస్తున్నారు. అడ్డగోలుగా దోపిడీ చేయటానికే లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశారు. చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాల వెనుక పెద్ద స్కాం ఉంది.స్వామి వారి డబ్బును దోచుకోవటానికి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశారు. లడ్డూ ఇష్యూలో ప్లాన్ ప్రకారమే మా పార్టీపై బురద చల్లారు. లడ్డూ కాంట్రాక్టు వెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం ఉంది. దీనిపై సీబీఐ విచారణ జరపాలి. అప్పుడే కుంభకోణాలన్నీ బయటకు వస్తాయి. అమరావతిలో జరుగుతున్న స్కాం మదరాఫ్ ఆల్ స్కామ్స్. నెయ్యి ఇష్యూ అంతకంటే పెద్ద స్కాం. సెప్టెంబరు 18న నెయ్యి గురించి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు.జంతువుల కొవ్వు ఉందని అనడమే దారుణం అనుకుంటే బాత్రూమ్ కెమికల్స్ కలిపారని కూడా చంద్రబాబు మళ్లీ మాట్లాడారు. సాధారణ మనుషులు ఎవరూ ఊహించని మాటలతో అందరినీ ఆందోళనకు గురి చేశారు. దీనంతటి వెనుక భారీ స్కాం చేయటానికి పన్నిన కుట్ర దాగి ఉంది. 2023లో జగన్ తిరుమలలో అత్యాధునిక ల్యాబులను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇలాంటిది ఒక్కటీ చేయలేదు. బీఆర్ నాయుడి వ్యవహారం బయటపడినా ఆయనను చంద్రబాబు ఎందుకు తొలగించలేదు? మా హయాంలో పృథ్వీ విషయం తెలియగానే రాజీనామా చేయించాం. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి. భక్తుల విశ్వాసాలంటే చంద్రబాబుకు లెక్క లేదని అర్థం అయింది’ అని ధ్వజమెత్తారు. -
ఏపీలో ఆర్థిక మందగమనం.. పయ్యావులపై బొత్స సీరియస్
సాక్షి, తాడేపల్లి: ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి.. కాగ్ రిపోర్టు డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేయలేకపోతున్నానని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఏపీలో ఆందోళనకరమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. కల్పిత జీఎస్డీపీ గణాంకాలతో వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రచారం చేస్తున్నారంటూ కాగ్ లెక్కలను బహిర్గతం చేశారు. తప్పుడు లెక్కలపై బొత్స మండిపడ్డారు.విపక్షనేత బొత్స సత్యనారాయణ ట్విట్టర్ వేదికగా..‘ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కి, మూడు సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా, అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తిగా, మీరు కాగ్ వెబ్సైట్ నుండి డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేయలేకపోతున్నానని చెప్పడం నిజంగా ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు మీరు సిద్ధంగా లేరన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, 23 రాష్ట్రాలకు సంబంధించిన CAG MKI నివేదికలను ఈ ట్వీట్కు జతపరుస్తున్నాము. అలాగే వృద్ధి రేట్లు ఎలా గణించారో వివరింగా తెలియజేసే స్లైడ్స్ను కూడా ఈ ట్వీట్లో పొందుపరుస్తున్నాం. (https://tinyurl.com/teswmtu2)రాష్ట్రం ప్రస్తుతం ఒక ఆందోళనకరమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాల్లో అది స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, మీ ప్రభుత్వం కల్పితమైన GSDP గణాంకాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్న తప్పుడు అభిప్రాయాన్ని కల్పిస్తోంది.2024–25లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.75% (నామినల్ GSDP) వృద్ధి సాధించిందదని మీ ప్రభుత్వం చెప్తోంది. కాని అదే సమయంలో దేశ వృద్ధి రేటు 9.8% మాత్రమే. అలాగే 2025–26లోకూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 10.75% వృద్ధి సాధిస్తుందని చెప్తున్నారు. కాని దేశ వృద్ధి రేటు 8.0%గానే అంచనా వేశారు. దీని ప్రకారం 2023–24 నుంచి 2024–25 వరకు రెండు సంవత్సరాల కాలానికి CAGR 11.09%గా వస్తుంది. అదేవిధంగా రియల్ GSDP వృద్ధిలో ఈ సంవత్సరం రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలలో 3వ స్థానంలో ఉందని మీ ప్రభుత్వం చెప్పుకుంటోంది.అయితే మీ ప్రభుత్వం తరఫున మీరు ఇస్తున్న అంకెలు, గణాంకాలు ఏ స్వతంత్ర సంస్థ విడుదల చేసినవి కావు. ఇవన్నీచంద్రబాబుగారి కార్యాలయం తయారు చేసిన గణాంకాలు, కాకిలెక్కలు. ఈ గణాంకాలు నిజమైతే, అదే స్థాయిలో ప్రభుత్వ ఆదాయాల్లో కూడా వృద్ధి కనిపించాలి. CAG ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 9 నెలలకు సంబంధించి విడుదలచేసిన గణాంకాలు చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా వెల్లడి అవుతోంది. ఈ రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఆదాయాలు కేవలం 1.97% CAGR మాత్రమే పెరిగాయి.11.09% GSDP వృద్ధి చూపిస్తున్న రాష్ట్రం, కేవలం 1.97% పన్ను ఆదాయ వృద్ధిని మాత్రమే సాధించడం ఎలా సాధ్యమో ప్రపంచంలోని ఆర్థిక శాస్త్రవేత్తలకూ ఆశ్చర్యం కలిగించే విషయం. మీరు చెప్పుకుంటున్నట్టుగా ‘విజనరీ నాయకత్వం’ కింద తయారుచేసిన కల్పిత గణాంకాల వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. దీంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి 9 నెలలకు సంబంధించి 23 రాష్ట్రాలకు వచ్చిన ఆదాయాలకు సంబంధించిన ఖాతాలనుకూడా CAG అప్లోడ్ చేసింది.ఆ రాష్ట్రాలతో పోల్చి చూస్తే పన్ను ఆదాయ వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. 23 రాష్ట్రాలలో పన్ను ఆదాయ వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది — అంటే కిందనుంచి రెండవ స్థానం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయం అదే కాలంలో 9.64% పెరిగింది, కానీ ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాలు కేవలం 1.97% మాత్రమే పెరిగాయి.🚨 #CAGExposedCBNరాష్ట్ర ఆర్థిక శాఖమంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారికి ( @PayyavulaOffl ),మూడు సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా, అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తిగా, మీరు CAG వెబ్సైట్ నుండి డాక్యుమెంట్లు డౌన్లోడ్… pic.twitter.com/iaDv2RTCSM— YSR Congress Party (@YSRCParty) March 7, 2026కానీ, మీరు ఆర్థిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పనితీరు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మించి ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారు. బాధ్యత గల విపక్షంగా వాస్తవాలను మేం శాసన మండలిలో ప్రస్తావించినప్పుడు, రాష్ట్రం చూపుతున్న ఈ నిరాశాజనక ఆర్థిక పనితీరుపై ఒక ఆర్థిక మంత్రిగా మీరు ఆత్మపరిశీలన చేసుకోకుండా, మేం సభద్వారా ప్రజలముందు ఉంచిన ఈ గణాంకాలను ఎగతాళి చేస్తూ, వ్యంగ్యంతో వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం. ఇప్పుడు మేము జతపరిచిన అన్ని పత్రాలను మీరు పూర్తిగా పరిశీలించి, మేము చేసిన ఆరోపణలను ఖండించగలరా? అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వంత పన్ను ఆదాయం (State’s Own Tax Revenues) వృద్ధి రేటు CAGR 1.97% కంటే ఎక్కువగా ఉందని మీరు చెప్పగలరా?. పన్ను ఆదాయ వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ స్థానం 22వది కాదని, అంతకంటే మెరుగైన స్థానంలో ఉందని మీరు నిరూపించగలరా?. ఈ గణాంకాలను మీరు ఖండించకపోతే, బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తిగా మీరు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని భావించినట్టే! అని పోస్టులో పేర్కొన్నారు. -
విజయవాడలో కాల్పుల కలకలం
సాక్షి, విజయవాడ : విజయవాడలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులపైనే కాల్పులు జరిపేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడు. అయితే, ట్రిగ్గర్ బ్లాక్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం, అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని బాలాజీ హోటల్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ దుండగుడు పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో గన్ ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాలేదు. దీంతో, అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. సదరు వ్యక్తిని పట్టుకున్నారు. దుండగుడి వద్ద నుంచి 9 ఎంఎం పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కాల్పులు జరిపిన వ్యక్తిని వరంగంల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతడిని ఈగల్ టీమ్ విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పుకొచ్చారు. -
మూగ బంధం.. అంతులేని మమకారం
విశాఖపట్నం: కుటుంబ సభ్యులను కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం. అయితే, ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా మనకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించే మూగజీవాలు దూరమైనా ఆ వ్యధ అంతకంటే ఎక్కువే ఉంటుంది. విశ్వాసానికి మారుపేరైన శునకాలను కేవలం పెంపుడు జంతువుల్లా కాకుండా, ఇంట్లో బిడ్డల్లా సాకుతున్న ఎందరో విశాఖవాసులు.. ఆ మూగజీవాలపై తమకున్న అంతులేని ప్రేమను కొత్తగా చాటుకుంటున్నారు. సాధారణంగా మనుషులకు సమాధులు కట్టి వారి జ్ఞాపకాలను పదిలపరుచుకోవడం మనం చూస్తుంటాం. కానీ, అప్పుఘర్ పార్క్ సమీపంలో ఉన్న సాగరతీరానికి వెళితే.. హృదయాన్ని హత్తుకునే అరుదైన దృశ్యాలు కనిపిస్తాయి. అక్కడ ఇసుక తిన్నెల్లో పదుల సంఖ్యలో శునకాలకు నిర్మించిన సమాధులు దర్శనమిస్తాయి. ఇంటికి కాపలాగా ఉంటూ, యజమాని చుట్టూ తిరుగుతూ, ఎలాంటి స్వార్థం లేకుండా ఎనలేని ప్రేమను పంచేవి శునకాలు. కొన్ని నెలలో, సంవత్సరాలో తమతో గడిపి, సంతోషాన్ని పంచిన ఆ మూగజీవాలు మరణిస్తే యజమానులు తట్టుకోలేకపోతున్నారు. అవి తమనుంచి దూరమైన తరువాత, వాటికి గౌరవప్రదమైన రీతిలో ఆఖరి మజిలీ నిర్వహిస్తున్నారు. సముద్ర తీరంలో వాటి కోసం ప్రత్యేకంగా సమాధులను కట్టించి తమ శాశ్వతమైన ప్రేమకు రూపమిస్తున్నారు. ఒక్కో సమాధి నిర్మాణానికి సుమారు రూ. 20వేల నుంచి రూ. 25 వేల వరకు ఖర్చవుతోంది. అయినా సరే, తమ కుటుంబంలో ఒకరిగా మెలిగిన జీవులకు ఘనంగా తుది వీడ్కోలు పలకడానికి వారు ఏమాత్రం వెనకాడటం లేదు. సముద్రపు అలల సాక్షిగా వెలసిన ఈ స్మృతి చిహా్నలు.. వ్యక్తులకు, మూగజీవాలకు మధ్య ఉన్న స్వచ్ఛమైన అనుబంధానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్ విశాఖపట్నం -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,855 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,690 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.82 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
పోలవరంలో పెను విధ్వంసం బాబు తప్పిదమే..!
సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో 2017, 2018లో చంద్రబాబు సర్కార్ పాల్పడిన తప్పిదాల వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతినడంతోపాటు పెను విధ్వంసం చోటుచేసుకుందని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చి చెప్పింది. ప్రాజెక్టు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) నిర్మాణ షెడ్యూల్ ప్రకారం గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేశాక.. ప్రధాన డ్యాం నిర్మాణం పునాది డయాఫ్రం వాల్ను నిర్మించాలని గుర్తు చేసింది. కానీ.. దానికి విరుద్ధంగా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్ పనులను 2017 ఫిబ్రవరిలో రూ.399.77 కోట్లతో ప్రారంభించి 2018 జూన్ నాటికి పూర్తి చేశారని పేర్కొంది. 2019 వర్షాకాలం ప్రారంభానికి ముందే ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయాలనే లక్ష్యంతో 2018 నవంబర్లో పనులు చేపట్టారని తెలిపింది. కానీ.. నిర్వాసితులకు పునరావాసం కల్పించలేకపోవడంతో ఎగువ కాఫర్ డ్యామ్కు ఇరువైపులా 600 మీటర్ల వెడల్పుతో ఖాళీలను వదిలేశారని పేర్కొంది. దీంతో 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద.. ఎగువ కాఫర్ డ్యాంలో వదిలిన 600 మీటర్ల ఖాళీ ప్రదేశంలో కుంచించుకుపోయి ప్రవహించాల్సి వచ్చిందని.. ఫలితంగా వరద ఉద్ధృతి మరింత పెరిగి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతిందని, ప్రధాన డ్యాం గ్యాప్–2లో భారీగా కోతకు గురైందని స్పష్టం చేసింది. అదే.. నిర్మాణ షెడ్యూలు ప్రకారం పనులు చేపట్టి ఉంటే ఈ విధ్వంసం చోటుచేసుకునేది కాదని.. డయాఫ్రం వాల్ కోసం చేసిన రూ.399.77 కోట్ల వ్యయం వృథా అయ్యిందని కాగ్ స్పష్టం చేసింది. ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యానికి ఇదే కారణమైందని పేర్కొంది. డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో దానికి సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని యధాస్థితికి తెచ్చే పనులకు రూ.2020.05 కోట్లతో 2023 ఏప్రిల్లో సర్కార్ పరిపాలన అనుమతి ఇచ్చిందని పేర్కొంది. పోలవరం పనులపై 2017–18 నుంచి 2023 మార్చి వరకూ అధ్యయనం జరిపి కాగ్ నివేదిక ఇచ్చింది. నిర్మాణ పనుల్లో తప్పిదాలు.. నామినేషన్ పద్ధతిలో భారీ ఎత్తున పనులు అప్పగించడం.. కాంట్రాక్టర్లకు భారీ ఎత్తున ప్రయోజనం చేకూర్చడం.. భూసేకరణలో జరిగిన లోటుపాట్లను కాగ్ తన నివేదికలో తూర్పారబడుతూ చంద్రబాబు సర్కార్ను కడిగిపారేసింది. ప్రధాన డ్యాం పనులు సజావుగా సాగేందుకు నిర్మాణ షెడ్యూలుకు కట్టుబడి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చూడాలంటూ చంద్రబాబు సర్కార్కు అక్షింతలు వేసింది. కాగ్ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘన.. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్(జలాశయం) పనులను రూ.4,054 కోట్లకు ట్రాన్స్ట్రాయ్ 2013 మార్చిలో ఈపీసీ(ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో దక్కించుకుంది. 2018 మార్చి నాటికి పనులు పూర్తి చేసేలా ట్రాన్స్ట్రాయ్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిరి్మంచాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. ట్రాన్స్ట్రాయ్తో ప్రభుత్వం 2013లో కుదుర్చుకున్న ఒప్పందం 25వ నిబంధన ప్రకారం ప్రాజెక్టు పనులకు అవసరమైన సామగ్రి, పనిముట్లను కాంట్రాక్టరే సమకూర్చుకోవాలి. కానీ.. దానికి విరుద్ధంగా సామగ్రి, ఇతర ఖర్చుల కోసం కాంట్రాక్టర్కు 2017 మే నుంచి 2018 మే వరకూ రూ.170 కోట్లను ఇంప్రెస్ట్ అమౌంట్ కింద ప్రభుత్వం ఇచ్చింది. మొబిలైజేషన్ అడ్వాన్సుతో కలిపి రూ.446.32 కోట్లు కాంట్రాక్టర్కు ఇచ్చినట్లయింది. అందులో 2018 నవంబర్ నాటికి రూ.302.10 కోట్లను కాంట్రాక్టర్ నుంచి ప్రభుత్వం వసూలు చేసింది. మిగతా రూ.144.22 కోట్లలో బ్యాంకు గ్యారంటీల రూపంలో రూ.123.07 కోట్లను 2019 మార్చిలో వసూలు చేసింది. ఇప్పటికీ ట్రాన్స్ట్రాయ్ నుంచి ఇంకా రూ.21.15 కోట్లను వసూలు చేయాల్సి ఉందని కాగ్ పేర్కొంది. » 2018, జనవరి నాటికి రూ.1,755.05 కోట్ల విలువైన పనులను మాత్రమే ట్రాన్స్ట్రాయ్ చేసింది. పనుల్లో వేగం పెంచడం పేరుతో ఏపీడీఎస్ఎస్లో 60(సీ) నిబంధన ప్రకారం రూ.2,019.67 కోట్ల విలువైన పనులను ట్రాన్స్ట్రాయ్ నుంచి తొలగించి.. ఈపీసీ పద్ధతిలో కాకుండా ఎల్ఎస్(లంప్సమ్)విధానంలో నవయుగకు నామినేషన్ పద్ధతిలో 2018 ఫిబ్రవరి 17న నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు సర్కార్ అప్పగించింది. ఇది నిబంధనలకు విరుద్ధమని కాగ్ స్పష్టం చేసింది. » ఏపీడీఎస్ఎస్లో 60(సీ) నిబంధన ప్రకారం పనుల ఒప్పందం విలువలో 5 శాతం అంటే రూ.269.29 కోట్లను ట్రాన్స్ట్రాయ్కు జరిమానాగా విధించి వసూలు చేయాలి. ఈపీడీఎసీఎల్కు రూ.26.02 కోట్లను ట్రాన్స్ట్రాయ్ చెల్లించాలి. ఇంప్రెస్ట్ అమౌంట్పై వడ్డీ రూ.30.61 కోట్లను కూడా కలుపుకొంటే మొత్తం రూ.331.90 కోట్లను ట్రాన్స్ట్రాయ్ నుంచి వసూలు చేయాలి. అయితే ట్రాన్స్ట్రాయ్ దివాలా తీసింది. రూ.331.90 కోట్లను వసూలు చేయడానికి ఎన్సీఎల్టీలో ప్రభుత్వం దావా కూడా వేయకపోవడాన్ని కాగ్ ఆక్షేపించింది. » నవయుగకు నామినేషన్ పద్ధతిలో అప్పగించిన పనులను నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది. వాటితోపాటు జలవిద్యుత్కేంద్రం పనులకు రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్ నిర్వహించడంతో ఖజానాకు రూ.628.43 కోట్లు ఆదా అయ్యిందని కాగ్ నివేదికలో వెల్లడించింది. జలవిద్యుత్కేంద్రం పనుల్లో నవయుగకు రూ.145.47 కోట్లు అనుచిత లబ్ది.. » పోలవరం జలవిద్యుత్కేంద్రం పనులను 2017 డిసెంబర్లో రూ.3,220.28 కోట్లకు నవయుగ దక్కించుకుంది. టర్బైన్ నమూనా పరీక్ష విజయవంతంగా పూర్తయిన తర్వాత వడ్డీ లేని ముందస్తు చెల్లింపు కింద రూ.145.47 కోట్లను నవయుగకు చెల్లించింది. కానీ దీనికి జెన్కో బోర్డు ఆమోదంగానీ ప్రభుత్వం ఆమోదంగానీ లేదు. దీన్ని బట్టి చూస్తే నవయుగకు రూ.145.47 కోట్లను అనుచితంగా లబ్ధి చేర్చారని కాగ్ తప్పుబట్టింది. » కుడి, ఎడమ కాలువ తవ్వకంలో 12.02 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి కాలువ గట్లపై ఉంది. దీని విలువ రూ.1,660.15 కోట్లు. మట్టిని అమ్మితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దొంగతనం కాకుండా చూడాలని ప్రభుత్వానికి కాగ్ సూచించింది. భూసేకరణలో లోపం... పునరావాసం కల్పనలో నిర్లక్ష్యం.. » పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే భూమితోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి మొత్తం 1,79,770 ఎకరాల భూమిని సేకరించాలని అంచనా వేశారు. ఇందులో 1,67,765 ఎకరాల భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2023 మార్చి నాటికి 1,13,119 ఎకరాలు సేకరించారు. మరో 54,646 ఎకరాలు సేకరించాల్సి ఉంది. » పోలవరం కోసం సేకరించాల్సిన భూమిలో 8,185.27 ఎకరాలకు డీకేటీ పట్టాలు జారీ చేశారు. 1,838.64 ఎకరాల ఆక్రమణకు గురైంది. మొత్తం ఈ 10,023.91 ఎకరాల సేకరణకు రూ.619.83 కోట్లు పరిహారం చెల్లించి సేకరించాల్సి వచ్చిందని కాగ్ పేర్కొంది. » ప్రాజెక్టుతో 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ గ్రామాల్లోని 1,06,006 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. 2014 నాటికి 6 గ్రామాల్లోని 714 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తే.. 2014–15 నుంచి 2018–19 వరకూ 11 గ్రామాల్లోని 3,066 కుటుంబాలకు.. 2019–20 నుంచి 2023, మార్చి వరకూ 21 గ్రామాల్లోని 7,897 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. ఇంకా 94,329 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని కాగ్ ఆక్షేపించింది. -
'లెక్క'లేక చిక్కులు!
సాక్షి, అమరావతి : తన పాలనలో రాష్ట్రం వృద్ధిలో దూసుకుపోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న గణాంకాలన్నీ మిథ్యేనని తేలిపోయింది. బాబు తొలి బడ్జెట్ అంకెల గారడీతో మోసం చేయడమే తప్ప కేటాయింపులకు తగినట్లు వ్యయం లేదని స్పష్టమైంది. 2024–25లో అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే రెవెన్యూ రాబడులు ఏకంగా 3.51 శాతం తగ్గిపోయాయని తేటతెల్లమైంది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించిన 2024–25 ఆర్థిక ఏడాది ఆర్థిక, ద్రవ్య అకౌంట్స్పై కాగ్ నివేదికలో ఈ విషయాలన్నీ పూసగుచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా తిరోగమనంలో పయనిస్తున్నట్లు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రెవెన్యూ రాబడులు కూడా 2024–25లో రాలేదని ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25 ఆర్థిక ఏడాదిలో ఆదాయ వసూళ్లలో 3.51 శాతం తగ్గుదల ఉందని వెల్లడించింది. ఇదే రీతిలో రాష్ట్ర పన్నేతర ఆదాయం 19.64 శాతం తగ్గిపోయిందని స్పష్టం చేసింది. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే ఏకంగా 41.82 శాతం తగ్గిపోయిందని ఎత్తి చూపింది. 2024–25 ఆర్థిక ఏడాది బడ్జెట్లో రెవెన్యూ రాబడులు రూ.2,69,928 కోట్లుగా పేర్కొనగా, వాస్తవంగా రూ.2,49,191 కోట్లే వచ్చాయని కాగ్ పేర్కొంది. అంటే రెవెన్యూ రాబడులు ఏకంగా రూ.20 వేల కోట్ల మేర తగ్గిపోయాయి. మూల ధన వ్యయం బాగా తక్కువ బడ్జెట్లో కేటాయింపుల మేరకు మూల ధన వ్యయం చేయలేదని.. ఇరిగేషన్, గృహ నిర్మాణం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు వ్యయం చేయలేదని కాగ్ స్పష్టం చేసింది. 40 రంగాల్లో.. 10 రంగాలకు చేసిన గ్రాంట్లలో 50 శాతం కన్నా తక్కువ వ్యయం చేసినట్లు ఎత్తి చూపింది. మరో పక్క గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలతోపాటు ఇతర సంస్థలకు గ్రాంట్లు కూడా అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25లో ఏకంగా రూ.10,620 కోట్లు తగ్గిపోయినట్లు పేర్కొంది. 2024–25లో మూల ధన వ్యయం కింద రూ.45,382 కోట్ల వ్యయం చేయనున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ, వాస్తవంగా రూ.16,141 కోట్లే వ్యయం చేశారని తెలిపింది. ఇది జీఎస్డీపీలో కేవలం ఒక శాతం మాత్రమేనని ఎత్తి చూపింది. అదే 2023–24 ఆర్థిక ఏడాదిలో మూల ధన వ్యయం రూ.23,330 కోట్లు అని పేర్కొంది. -
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి
మంగళగిరి టౌన్ : గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఏప్రిల్ 20 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతారని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. మంగళగిరి ఆటోనగర్లోని సీసీఎల్ఏ కార్యాలయం వద్ద శుక్రవారం ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా వీఆర్ఏలందరికీ పే స్కేలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వేతనాలు సరిపడాలేవన్నారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లక్షలాది రూపాయల వేతనాలు ఇస్తున్నారుగానీ వీఆర్ఏలకు మాత్రం పెంచడంలేదన్నారు. ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 22 నెలలవుతున్నా నేటికీ వీఆర్ఏల సమస్యల్లో ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు. నిబంధనలకు విరుద్ధమైన డ్యూటీలు వేస్తున్నారని, రీ సర్వే పేరుతో మైళ్లకొద్దీ ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్లకార్డులతో ప్రదర్శన.. ధర్నా అంతకుముందు.. ఎన్ఆర్ఐ వై–జంక్షన్ నుంచి సీసీఎల్ఏ కార్యాలయం వరకు వీఆర్ఏలు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ బందగీ సాహెబ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు, సంఘం కోశాధికారి రవికుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ త్రినాథరావు, ఉపా«ధ్యక్షులు నాగేంద్ర, సుబ్బయ్య, రాష్ట్ర నాయకులు కొండబాబు, శేఖర్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి భూములు ఎందుకివ్వాలి?
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఎడ్యుకేషన్ : అమరావతి రాజధాని పేరుతో సంవత్సరానికి మూడుపంటలు పండే భూములను తీసుకోవద్దన్న సూచనలు, సలహాలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ భూములను కాంక్రీట్తో నింపేశారని రైతునేత వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. భూసేకరణ సమయంలో ఇచి్చన హామీలకు దిక్కు ఎవరని ప్రశ్నించారు. రాజధాని పేరుతో రైతుల నుంచి అడ్డగోలుగా భూములు లాక్కుని వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రెండోవిడత భూసేకరణకు రైతులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ రెండోదశకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చావేదిక శుక్రవారం గుంటూరులో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నిర్మాణమే లేని రాజధానిలో ఐదువేల ఎకరాల్లో ఎయిర్పోర్టు, 1,500 ఎకరాల్లో రైల్వేస్టేషన్ అంటూ సీఎం చంద్రబాబు, మున్సిపల్శాఖ మంత్రి నారాయణ ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. సీఆర్డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందానికి చట్టబద్ధత లేదని, మొదటివిడతలో భూములిచ్చిన రైతులు నెత్తీనోరు బాదుకుంటున్నారని చెప్పారు. రెండోవిడత భూములు తీసుకునేముందు మొదటివిడతలో భూములిచి్చన రైతులకు ఏం న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన మెడికల్ కళాశాలల నిర్మాణాలను పూర్తిచేసేందుకు రూ.4,400 కోట్లు లేవని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి చుట్టూ నిర్మించేందుకు ప్రతిపాదించిన ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్)కు రూ.వేలకోట్లు ఏ విధంగా ఖర్చుచేస్తుందని ప్రశ్నించారు. మొదటివిడతలో భూములిచ్చిన రైతుల పిల్లల కోసం ఉచిత విద్య, వైద్య సదుపాయాలను కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్న చంద్రబాబు సర్కారు.. రెండోవిడతకు వచ్చేసరికి దాన్ని ఉచిత విద్య, వైద్యానికి అర్హులు అని మార్పులు చేయడంతోనే భూసేకరణ వి«ధానంలోనే లోపముందని అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. రైతుల అంగీకారం లేకుండా సెంటు భూమి కూడా సైతం తీసుకోలేరని స్పష్టం చేశారు. భూముల కోసం వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు భూములిచ్చేది లేదని తెగేసి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు కుర్రా వసుంధర, మహదేవ్, విశ్రాంత ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య, మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, చార్టర్ అకౌంటెంట్ పి.మల్లికార్జునరావు, హైకోర్టు న్యాయవాది కేవీఎం రజని, ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయరెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. -
ప్రజాప్రతినిధులకు ఒకే రూల్ ఉండాలి
తాడేపల్లి రూరల్: ప్రజా ప్రతినిధులమైన తమపట్ల చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు ధ్వజమెత్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృది్ధశాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ప్రజాప్రతినిధులందరికీ ఒకే రూలు ఉండాలని, వివక్ష సరికాదని నినదించారు. ఈ సందర్భంగా ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మేకల హనుమంతరావు, రెడ్డప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన అందరికీ ఒకే నిబంధన ఉండాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రం అవసరమైన అన్నింటిని సమకూర్చుకుని ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లకు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు రెండేళ్లవుతున్నా సీఎం అమలు చేయడంలేదన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృది్ధశాఖ మంత్రిగా పవన్కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తరువాత తమ సమస్యలపై ఒక్కసారి కూడా పెదవి విప్పలేదని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నెలనెలా జీతాలు, అలవెన్సులు తీసుకుంటున్నారని, 30 నెలలుగా ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, వార్డు సభ్యులకు ఒక్క రూపాయి వేతనం కూడా చెల్లించలేదని చెప్పారు. మండల పరిషత్ నిధులతో చేపట్టిన పనుల బిల్లులు కూడా చెల్లించలేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలన్నారు. నెలకు ఎంపీపీలకు రూ.25 వేలు, ఎంపీటీసీ సభ్యులకు రూ.10 వేలు వేతనాలివ్వాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తేయాలన్నారు.సొమ్మసిల్లిన కాకినాడ జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృది్ధశాఖ కమిషనర్ కృష్ణతేజకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో తీవ్ర ఆందోళనకు గురైన కాకినాడ జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు గొల్లపల్లి నరసింహమూర్తి సొమ్మసిల్లి కిందపడిపోయారు. ఆయన్ని వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు ఒత్తిడి తీసుకురావడం వల్లే నరసింహమూర్తి అస్వస్థతకు గురయ్యారని ఎంపీపీలు చెప్పారు. -
అప్పులు తప్ప దాచడానికి ఏమీ లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అప్పులు తప్ప ఏమీ దాచడానికి లేదని శాసనమండలి సాక్షిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కుండబద్దలు కొట్టారు. బడ్జెట్ను పూర్తి పారదర్శకంగా తీసుకు వస్తున్నామని, ఇందులో ఏమీ దాచడం లేదని రాష్ట్రంలో అప్పులు తప్ప ఇక దాచడానికి ఏమీ లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను దాస్తున్న విషయాన్ని ఆర్థిక మంత్రి పరోక్షంగా అంగీకరించారు. శుక్రవారం మండలిలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా 2026–27 బడ్జెట్ పత్రాల్లో బడ్జెట్ బయట చేసే అప్పులు (ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్) దాచిన విషయంపై ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ గట్టిగా నిలదీసింది. బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎందుకు పేర్కొనలేదని, బడ్జెట్లో పేర్కొన్న రెవెన్యూ, ఆర్థిక లోటులను ఏ విధంగా పూడ్చుకుంటారన్న విషయాలు ఎక్కడున్నాయంటూ మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. గత ప్రభుత్వం మాకు రూ.9.74 లక్షల కోట్ల అప్పును వారసత్వంగా ఇచ్చి వెళ్లిందంటూ ఆర్థికమంత్రి కేశవ్ పేర్కొంటున్నారని, కానీ ఈ అప్పులు బడ్జెట్ పత్రాల్లో ఎక్కడ అంటూ ప్రశ్నించారు. బడ్జెట్ పత్రాల్లో చూపించకుండా అప్పులు ప్రభుత్వం విడుదల చేసిన వైట్పేపర్లో ఉన్నాయంటూ ఎలా చెపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కాగ్ గణాంకాల ప్రకారం రాష్ట్రం సొంత ఆదాయార్జనలో 22వ స్థానంలో ఉందని, ఆయా రాష్ట్రాల కాగ్ నివేదికలను పరిశీలిస్తే ఇది తెలుస్తుందన్నారు. వాస్తవాలు లేకుండా ఈ బడ్జెట్ను పూర్తిగా అంకెలగారడీగా మార్చేశారంటూ దుయ్యబట్టారు.సూపర్ సిక్స్లో మూడు సిక్స్లు ఔట్సూపర్ సిక్స్లో కీలకమైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇస్తామన్న హామీలకు బడ్జెట్లో ఒక్క రూపాయికూడా కేటాయించలేదంటూ బొత్స ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్లో మూడు సిక్స్లను ఎగరగొట్టేసి సూపర్ హిట్ అంటూ ఎలా ప్రచారం చేసుకుంటారంటూ దుయ్యబట్టారు. కనీసం ఈ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా చెప్పకుండా అమలు చేసేశామంటూ మభ్య పెడుతున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు, రైతులకు సున్నా వడ్డీ రుణాలకు మంగళం పాడేసి మహిళలను లక్షాధికారులను ఎలా చేస్తారంటూ నిలదీశారు. రాష్ట్రంలో ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందిపడుతున్న మాట వాస్తవం కాదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్ఆర్జీఎస్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ వాటా పెట్టకుండా కేంద్రం ఇస్తున్న రూ.8,500 కోట్లను చూపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నడవడానికి ద్రవ్యవినిమయ బిల్లు అత్యంత ప్రాధాన్యమైనది కావడంతో బడ్జెట్లో పేర్కొన్న అంకెల గారడీని నిరసిస్తూ మౌనంగా సభలోనే ఉంటామంటూ బొత్స ప్రకటించారు. అంతకుముందు వైఎస్సార్సీపీ సభ్యుడు మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ మేనిఫెస్టోలోని పథకాలకు, కేటాయించిన నిధులకు సంబంధం లేదన్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. కాగా, వేతనాల పెంపు కోసం అంగన్వాడీలు ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతోందంటూ వైఎస్సార్సీపీ సభ్యులు మండలిలో విమర్శించారు. అంగన్వాడీల వేతనాల పెంపునకు 2024 జనవరిలోనే అప్పటి తమ ప్రభుత్వం అగ్రిమెంట్ రూపంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అంగన్వాడీలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు బొత్స ప్రకటించారు. -
వాళ్లు 11 మందే అయినా.. 1,100 మందితో సమానం
సాక్షి, అమరావతి: శాసనసభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 11 మందే అయినా 1,100 మందితో సమానమన్నట్లు మాట్లాడుతారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా ఉండకపోతే వైఎస్సార్సీపీ బలపడుతుందని స్పష్టం చేశారు. ‘వైఎస్సార్సీపీ వాళ్లు చెప్పిన దానిని చాలా బలంగా నమ్ముతారు. కానీ, మనం చేసే పనులు మనం చెప్పుకోలేం. ఎందుకు సంకోచిస్తున్నామో తెలీదు. మనలో (కూటమి) ఏకాభిప్రాయం, ఏకత్వం ఉండాలి. వైఎస్సార్సీపీ వాళ్లను ఎదుర్కోవాలంటే కూటమి సభ్యులు చాలా బలంగా ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. -
అసెంబ్లీలో భజన.. కౌన్సిల్లో పలాయనం
సాక్షి, అమరావతి: చంద్రబాబు, ఆయన తనయుడు లేకపోతే ఈ రాష్ట్రమే లేదనే స్థాయిలో అసెంబ్లీలో భజన.. మరోవైపు ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్కు ఉన్న సంబంధం గురించి కనీస ప్రస్తావన కూడా రానీయకుండా కౌన్సిల్లో పలాయనం. 17 రోజులపాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆసాంతం ఆత్మస్తుతి, పరనిందను తలపించాయి. అసెంబ్లీలో చంద్రబాబును కారణజన్ముడిగా, లోకేశ్ను అపర మేధావిగా, దేవాన్ష్ ను భావినేతగా కీర్తిస్తూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబు కీర్తన సభలుగా మార్చివేశారు. కౌన్సిల్లో మాత్రం బయటపడిన తమ గుట్టుపై చర్చ జరక్కుండా కుతంత్రాలకు దిగజారారు. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాలను లేని గొప్పల్ని చెప్పుకోవడం, గత వైఎస్ జగన్ పాలన గురించి అబద్ధాలు చెప్పడానికే కూటమి ప్రభుత్వం పూర్తిగా ఉపయోగించుకుంది. అవాస్తవాల బడ్జెట్14వ తేదీన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా నిధులు కేటాయించకుండా వాటికి తిలోదకాలు ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. చేసిన అప్పుల గురించి వాస్తవాలు చెప్పకుండా, ఈ ఏడాది మాత్రం మరో రూ. లక్ష కోట్ల అప్పులు చేస్తామని నిర్భీతిగా బడ్జెట్లో పెట్టడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. బడ్జెట్ ప్రసంగంలో సైతం చంద్రబాబును పొగడ్డానికే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాధాన్యత ఇచ్చారు. 20 నెలలుగా చేసిందేమిటో చెప్పుకోలేక బడ్జెట్ ప్రసంగంలోనూ పదేపదే గత ప్రభుత్వంపై నిందలు మోపే ప్రయత్నం చేశారు. ప్రతిరోజూ జరిగిన ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చల్లోనూ చంద్రబాబును, లోకేశ్ను ఆకాశానికి ఎత్తేసి వారికి దగ్గరయ్యేందుకు కూటమి సభ్యులు అత్యుత్సాహం చూపారు. జనసేన ఎమ్మెల్యేలు సైతం బాబును పొగిడేందుకు పోటీపడడం గమనార్హం. జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మరో అడుగు ముందుకేసి చంద్రబాబు, లోకేశ్తోపాటు లోకేశ్ కొడుకు దేవాన్‡్షను కూడా పొగుడుతూ స్వామిభక్తిని చాటుకోవడం చర్చనీయాంశమైంది. పీఏసీ చైర్మన్గా ఉన్న మరో జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు ఏకంగా చంద్రబాబును కారణ జన్ముడిగా అభివర్ణించారు. చర్చ ఏదైనా అందులో బాబు, లోకేశ్ను ఆకాశానికి ఎత్తడం, జగన్ను తిట్టడమే పనిగా అసెంబ్లీ నడించింది.టీడీపీ నేతల్లా స్పీకర్, డిప్యూటీ స్పీకర్అదే సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పీకర్ స్థానంలో కూర్చుని టీడీపీ నేతలా ప్రతిపక్షంపైనా, వైఎస్ జగన్పైనా విమర్శలు చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేలను ఏకవచనంతో సంబోధించడం, వారు మాట్లాడిన తర్వాత దానిపై జడ్జిమెంట్ ఇచ్చేయడం, అది అయ్యే పని కాదంటూ తీర్మానించి చెప్పేయడం, మాట్లాడిన సభ్యులను కామెంట్ చేసి అసెంబ్లీ స్థాయిని దిగజార్చారనే చర్చ అధికారపక్షంలోనే చోటుచేసుకుంది. చివరికి కూటమి ఎమ్మెల్యేలు తాము చేసిన భజనపై తమకే విసుగొచ్చి ప్రతిపక్షం లేకపోతే సభ బాగోలేదంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కౌన్సిల్ సమావేశంలో జరగనీయకుండా కుతంత్రాలు... మండలిలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం అడ్డగోలు కుతంత్రాలకు తెరలేపింది. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ సంస్థకు ఉన్న బంధం గురించి సమాధానం చెప్పలేమనే భయంతో మొత్తం సమావేశాలు స్తంభించేలా వ్యవహరించింది. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ తమ సొంత సంస్థ కోసం మంత్రులు, కూటమి ఎమ్మెల్సీలను ఉపయోగించుకుని ప్రజా సమస్యలు తమకు పట్టవని తేల్చేశారు. ఇందాపూర్ డెయిరీ–హెరిటేజ్ ప్రస్తావన రాకుండా చేసేందుకు చర్చను కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంది. స్వయంగా లోకేశ్ మండలికి వచ్చి తమ సంస్థకు మద్దతుగా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్సీలను మోహరించి చర్చ జరగనీయకుండా చేయడం స్పష్టంగా కనిపించింది. చర్చకు ఒప్పుకుని చివరికి ప్లేటు ఫిరాయింపు వరుసగా నాలుగు రోజులు సభను స్తంభింపచేసి చివరికి విమర్శలు వస్తుండడంతో అధికారపక్షం బీఏసీ సమావేశం నిర్వహించి ఇతర అంశాలతోపాటు ప్రతిపక్షం కోరుతున్న అంశంపై చర్చించేందుకు అంగీకరించి ఆ తర్వాత ప్లేటు ఫిరాయించింది. ఇతర అంశాలన్నింటిపై చర్చించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు సహకరించినా.. ఇందాపూర్–హెరిటేజ్ అంశంపై వచ్చేసరికి మాట మార్చి సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కింది. ఈ విషయంలో మండలి చైర్మన్ మోషేన్రాజు అనుమతి లేకుండా మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయడానికి ప్రయత్నించారు. చైర్ అనుమతి లేకుండా స్టేట్మెంట్కు ప్రయత్నించి చైర్మన్ స్థానాన్ని అవమానించారని మోషేన్ రాజు విచారం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి సభను తప్పుదోవ పట్టించారని స్వయంగా చైర్మన్ సభలో ప్రకటించడాన్ని బట్టి టీడీపీ ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా అదే అంశంపై ప్రతిపక్షం చర్చకు పట్టుబట్టగా మంత్రి అచ్చెన్నాయుడు చైర్మన్కు మతం ఆపాదించి అధ్యక్ష స్థానాన్నే అవమానించి చర్చ జరక్కుండా సమస్యను పక్కదారి పట్టించారు. ఇందాపూర్–హెరిటేజ్ బంధం గురించి మండలిలో చర్చ జరక్కుండా చేసేందుకు చివరికి టీడీపీ మత రాజకీయాలకు దిగి అభాసుపాలైంది. మొత్తంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రజా సమస్యలు కంటె టీడీపీ రాజకీయాలు, చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ప్రయోజనాల కోసమే జరిగినట్లు తేటతెల్లమైంది. -
చేబదుళ్లకూ భారీగా వడ్డీ చెల్లింపు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ఏడాది పాలనలోనే ఆర్థిక ఆరాచకం సృష్టించారు. ఏడాదిలో 365 రోజుల్లో 357 రోజులు చేబదుళ్లతోనే ఆర్థిక నిర్వహణను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించిందని కాగ్ నివేదిక పేర్కొంది. పైగా చేబదుళ్లకు కూడా భారీగా వడ్డీలు చెల్లించిందని వెల్లడించింది. సాధారణంగా ఎవరైనా వ్యక్తులు డబ్బులు చేబదులు తీసుకుంటే చెప్పిన సమయానికి తిరిగి చెల్లించేస్తారు. అందుకు వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యక్తుల తరహాలనే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆర్బీఐ చేబదుళ్లకు వెసులుబాటు కల్పిస్తుంది. ఆ వెసులుబాటు సమయం వరకు చేబదుళ్లు వాడుకుని తిరిగి చెల్లించేస్తే ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే చంద్రబాబు సర్కారు తొలి ఏడాది పాలనలోనే సకాలంలో చేబదుళ్లు తిరిగి ఇవ్వలేక భారీగా వడ్డీలు చెల్లించిందని 2024–25 ఆర్థిక ఏడాది బడ్జెట్ అకౌంట్స్పై కాగ్ నివేదిక స్పష్టం చేసింది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పొందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ వద్ద కేవలం ఎనిమిది రోజులు మాత్రమే కనీస నగదు నిల్వను నిర్వహించడం ఘోరమని కాగ్ నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ స్ఫెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలను కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలో కనీస నగదు బ్యాలెన్స్ రూ.1.94 కోట్లలోపు ఉంటే ఈ సౌకర్యాలను వినియోగించుకుంటాయి. ఆర్థిక అరాచకానికి నిదర్శనం2024–25 ఆర్థిక ఏడాదిలో చంద్రబాబు సర్కారు 71 రోజులు రూ.42,004 కోట్ల మేర స్పెషల్ వేస్ అండ్ మీన్స్, 179 రోజులు రూ.73,897 కోట్ల మేర వేస్ అండ్ మీన్స్ వినియోగించుకుందని కాగ్ వెల్లడించింది. 107 రోజులు రూ.56,631 కోట్ల మేర ఓవర్ డ్రాఫ్ట్ను వినియోగించుకుందని స్పష్టం చేసింది. ఈ మొత్తాలను నిర్దేశిత సమయంలోగా తిరిగి చెల్లించక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.303 కోట్ల మేర వడ్డీగా ఆర్బీఐకి చెల్లించినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. చేబదుళ్లకే వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిందంటే ఆర్థిక నిర్వహణ ఎంత దారుణంగా దిగజారిపోయిందో అర్థం అవుతోంది. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ను వినియోగించుకోవడంలో తప్పులేదు కానీ ఆ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా వడ్డీ భారం పడకుండా చూడాలి. అందుకు భిన్నంగా ఏడాదిలోనే చేబదుళ్లకు ఏకంగా రూ.303 కోట్లు వడ్డీ చెల్లించడం అంటే బాబు ప్రభుత్వ ఆర్థిక అరాచకానికి నిదర్శనం.స్ఫెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్42,004 (24%)189వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్73,897 (43%)82మొత్తం1,72,532303ఓవర్ డ్రాఫ్ట్56,631 (33%)32 -
మన టాప్ ర్యాంక్ 23
సాక్షి, హైదరాబాద్: సివిల్స్–2025 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏపీలోని కాకినాడకు చెందిన జీను శ్రీజశ్వంత్చంద్ర ఆలిండియా 23వ ర్యాంక్ సాధించగా తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన గూడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించారు. తెలంగాణకు చెందిన 20 మందికి వెయ్యిలోపు ర్యాంకులు లభించాయి.ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం తుది ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తోపాటు కేంద్ర ప్రభుత్వ సర్విసుల్లో 1,087 పోస్టులు ఖాళీగా ఉండగా తుది ఫలితాల్లో 659 మంది పురుషులను, 299 మంది మహిళలను కలిపి మొత్తంగా 958 మందిని సివిల్స్ విజేతలుగా యూపీఎస్సీ ప్రకటించింది. టాప్ 25 ర్యాంకులు సాధించిన వారిలో 14 మంది పురుషులు ఉండగా 11 మంది మహిళలు ఉన్నారు. మొత్తం అర్హుల్లో 317 మంది జనరల్ కేటగిరీ వారుకాగా 306 మంది ఓబీసీలు, 158 మంది ఎస్సీలు, 73 మంది ఎస్టీలు, ఉన్నారు.అలాగే ఆర్థికంగా వెనుకబడిన (ఈడబ్ల్యూఎస్) విభాగం నుంచి 104 మంది ఈ జాబితాలో స్థానం సంపాదించారు. అలాగే ఐఏఎస్కు 180 మంది, ఐపీఎస్కు 150 మంది, ఐఎఫ్ఎస్కు 55 మంది, కేంద్ర సర్విసుల (గ్రూప్–ఏ)కు 507 మంది, గ్రూప్–బీ సర్విసులకు 195 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. సివిల్స్ ప్రిలిమ్స్ను 5,76,793 మంది రాయగా 14,161 మంది మెయిన్స్కు ఎంపికయ్యారు. వారిలో 2,736 మంది మాత్రమే ఇంటర్వ్యూ దశకు చేరుకున్నారు.]గతేడాదికన్నా సంఖ్య తగ్గింది సివిల్స్–2025 ఫలితాల్లో ఏపీ, తెలంగాణ అభ్యర్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే కొద్దిగా తగ్గింది. గతేడాది రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన గ్రూప్–1 పరీక్షలకు సన్నద్ధత వల్ల అభ్యర్థులు సివిల్స్పై ఎక్కువ దృష్టి సారించలేకపోయారు. విజేతల్లో ఎ క్కువ శాతం మంది ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారు, సివిల్స్ రీ–అటెంప్ట్ చేసిన వారే ఉన్నారు. తొలిసారి పరీక్ష రాసిన వారి సంఖ్య తక్కువగానే ఉంది. – వి. గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీఅనూజ్ అగ్నిహోత్రి టాపర్ రాజస్తాన్కు చెందిన అనూజ్ అగ్నిహోత్రి జాతీయ స్థాయి టాపర్గా నిలిచాడు. అనూజ్ ఎయిమ్స్ జో«ద్పూర్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తొలి ప్రయత్నంలో ఢిల్లీ, అండమాన్–నికోబార్ దీవుల సివిల్ సర్వీసు (డీఏఎన్ఐసీఎస్)లకు ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉన్న అతను తాజాగా మూడో ప్రయత్నంలో ఆలిండియా టాపర్గా సివిల్స్కు ఎంపికయ్యాడు. చెన్నైకి చెందిన రాజేశ్వరి సువే తన రెండో ర్యాంకు సాధించారు.అన్నా యూనివర్సిటీ నుంచి బీటెక్ చేసిన ఆమె ఐదో ప్రయత్నంలో సివిల్స్ సాధించారు. అలాగే ఢిల్లీ యూనివర్సిటీ కామర్స్ గ్రాడ్యుయేట్ ఆకాన్‡్ష ధుల్ మూడో ర్యాంక్ పొందారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన బీఏ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ భార్గవ్ ఝన్ఝన్వాలా నాలుగో ర్యాంకు సాధించగా ఢిల్లీ లా యూనివర్సిటీ నుంచి బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) చేసిన ఇషాన్ భటా్నగర్ ఐదో ర్యాంకు పొందారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నందుకే ఈ ఫలితం: అనూజ్ సివిల్స్ ఫలితాల విడుదల అనంతరం అనుజ్ అగ్నిహోత్రి మీడియాతో మాట్లాడుతూ ‘ఈ విజయం అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తోంది. గత రెండు ప్రయత్నాల్లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని అంకిత భావంతో సన్నద్ధం కావడం వల్లే ఈ ఫలితం లభించింది’అని పేర్కొన్నాడు. మరోవైపు ఆలిండియా టాపర్గా నిలిచిన అనుజ్ అగ్నిహోత్రికి రాజస్తాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా అభినందనలు తెలిపారు.ఐపీఎస్ టు ఐఏఎస్.. 23వ ర్యాంక్ సాధించిన కాకినాడకు చెందిన జీను శ్రీజశ్వంత్ చంద్ర ఐఐటీ కాన్పూర్లో బీటెక్ చేశారు. 2018లో బెంగళూరులో శామ్శాంగ్ సంస్థలో మూడేళ్లపాటు ఉద్యోగం చేశారు. సివిల్స్ కోసం ఉద్యోగానికి స్వస్తిపలికి 2020లో తొలి ప్రయత్నంలో ర్యాంక్ రాకపోయినా మరో ప్రయత్నంగా 2021లో రాసి 314వ ర్యాంక్ సాధించి పోస్టల్ శాఖలో ఉద్యోగం పొందారు. 2022లో మరోసారి సివిల్స్ రాసి ఐఆర్ఎంఎస్తోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్విసులోనూ కొలువు సాధించారు.2023లో సివిల్స్లో ఆలిండియా స్థాయిలో 162వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ ఏపీ కేడర్కు ఎంపికయ్యారు. అప్పటి నుంచీ హైదరాబాద్లోని నేషనల్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతూనే ఐఏఎస్ కోసం 2024లో మళ్లీ పరీక్ష రాశారు. 390వ ర్యాంక్ రావడం, లక్ష్యం నెరవేరకపోవడవంతో మరింత సాధన చేసి 2025లో మరోసారి పరీక్ష రాసి 23వ ర్యాంక్తో ఐఏఎస్కు ఎంపికయ్యారు. శ్రీజశ్వంత్ చంద్ర తండ్రి మాణిక్యాలరావు కుటుంబం పిఠాపురం నుంచి జగ్గంపేట వెళ్లి స్థిరపడింది. తల్లి వరలక్ష్మి ఉపాధ్యాయిని.సింగరేణి కార్మీకుడి కుమార్తెకు 55వ ర్యాంకు సివిల్స్ ఫలితాల్లో సింగరేణి కార్మీకుడి కుమార్తె జాతీయ స్థాయిలో 55వ ర్యాంకుతో సత్తా చాటింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నారు గ్రామానికి చెందిన గుడెల్లి రాజేశం–రాణి దంపుతుల కుమార్తె గుడెల్లి సృజన ఆరో ప్రయత్నంలో విజయం సాధించింది. తండ్రి రాజేశం ఆర్జీ–3 ఏరియాలోని ఓసీపీ వన్లో జనరల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. మంథని జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశాక.. 2018లో ఢిల్లీ వెళ్లి శిక్షణ తీసుకుంది. అమ్మనాన్నల ప్రోత్సాహంతోనే.. ‘మేము ముగ్గురం పిల్లలం. ఐఏఎస్ కావాలనే నా కలను అమ్మానాన్నలు వారి కలగా మార్చుకున్నారు. నా ప్రయత్నాలను ప్రోత్సహించారు. గతేడాది ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనక్కి వచ్చా. మరోసారి ప్రతి్నంచాలని ప్రోత్సహించారు. గ్రూప్–1 రాసి డీఎస్పీగా శిక్షణ తీసుకుంటూనే మరోసారి సివిల్స్కి ప్రిపేరయ్యా. అమ్మానాన్నల మాట ఈరోజు నిజమైంది. అప్పటి కరీంనగర్ కలెక్టర్ స్మితాసబర్వాల్ను స్ఫూర్తిగా తీసుకొని సివిల్స్కు ప్రిపేరయ్యా. మహేశ్ ఎం.భగవత్ సర్ సలహాలతో ఈరోజు సివిల్స్లో మంచి ర్యాంకు సాధించా.’ఐఎఫ్ఎస్ వచ్చినా ఐఏఎస్పై గురి 103వ ర్యాంకు సాధించిన బిపుల్ గుప్తా విశాఖవాసి. ఆయన తండ్రి విశాఖ స్టీల్ప్లాంట్ బ్లాస్ట్ఫర్నేస్ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ పవన్ కుమార్ గుప్తా. 2024 సివిల్స్ పరీక్షల్లో బిపుల్కు 368వ ర్యాంకు రావడంతో ఐఎఫ్ఎస్ అధికారిగా ఏపీ కేడర్లో చేరారు. ప్రస్తుతం డెహ్రాడూన్లో శిక్షణ పొందుతున్నారు. అయినా ఐఏఎస్ లక్ష్యంగా మళ్లీ సివిల్స్ రాసి ఇప్పుడు 103వ ర్యాంకు సాధించారు. బిపుల్ 2022లో ఐఐటీ మద్రాస్లో బీటెక్ పూర్తి చేశారు. తైక్వాండోలో బ్లాక్బెల్ట్ సాధించిన బిపుల్ గుప్తా తల్లి డాక్టర్ దీప గుప్త ప్రముఖ యూట్యూబర్. ఈసారి ఐఏఎస్ లభించే అవకాశం ఉందని బిపుల్ తెలిపారు.నాలుగో ప్రయత్నంలో 393వ ర్యాంకు సివిల్స్లో మూడుసార్లు విఫలమైనా పట్టుదలతో చదివి నాలుగో ప్రయత్నంలో 393వ ర్యాంకు సాధించారు తిరుపతికి చెందిన యారాశి తుషారికరెడ్డి. ఆమె తండ్రి వై.ఎం. గురువారెడ్డి తిరుపతి బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి, తల్లి మల్లీశ్వరి టీటీడీలో సూపరింటెండెంట్. తుషారిక చెన్నైలోని ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీటెక్ చేశారు. ప్రస్తుతం ఐఆర్ఎస్ లేదా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ పోస్టు రావచ్చని ఆమె అంచనా వేస్తున్నారు. గ్రూప్–2తో మురిసి.. సివిల్స్లో మెరిసి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు లక్ష్మి కుమారుడు సౌరోతు రాము సివిల్స్లో 463వ ర్యాంకు సాధించారు. రాముది సాధారణ వ్యవసాయ కుటుంబం. తండ్రి చిన్నప్పుడే చనిపోగా.. తల్లి కష్టపడి కుమారుడిని చదవించారు. ఆయన ఎన్ఐటీ వరంగల్లో బీటెక్ పూర్తి చేశారు. గత నెలలో గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. ఇప్పుడు మొదటి ప్రయత్నంలోనే సివిల్స్లో ర్యాంకు కొట్టారు.నాలుగో యత్నంలో 573వ ర్యాంకు విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎల్ఎంఎం విభాగంలో జనరల్ ఫోర్మెన్గా పనిచేస్తున్న రాజబాబు, విజయలక్ష్మి దంపతుల రెండో కుమార్తె శ్వేత ఐఐటీ హైదరాబాద్లో పూర్తి చేశారు. అనంతరం రెండుసార్లు సివిల్స్ ప్రిలిమ్స్లో విఫలమైన ఆమె మూడోసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా అనుకున్న ఫలితం రాలేదు. నాలుగో ప్రయత్నంలో 573 ర్యాంక్ సాధించారు. ప్రజాసేవ చేయాలన్నదే తన లక్ష్యమని శ్వేత పేర్కొన్నారు. ⇒ ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన గోగుళ్ల రాజశేఖర్కు చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమైనా సివిల్ సర్విసెస్లో 920వ ర్యాంకు సాధించారు. ఒడిశాలోని భువనేశ్వర్ ఐఐటీలో ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ చదివారు. నాలుగు ప్రయత్నాల్లో విఫలమైనా కుంగిపోకుండా ఐదోసారి పరీక్షలు రాసి విజయం సాధించారు.⇒ విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన ప్రమోద్విష్ణు సత్తా చాటారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 640వ ర్యాంకు సాధించారు. ఆయన విజయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ⇒ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన రాఘవేందర్ పదుకొనె, మమత దంపతుల కూతురు ఇంద్రార్చిత సివిల్స్లో 627 ర్యాంకు సాధించారు.నాలుగో ప్రయత్నంలో 178వ ర్యాంకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కాకతీయనగర్కు చెందిన బానోతు లక్ష్మీరచన సివిల్స్ ఫలితాల్లో 178వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి బానోతు వెంకటరమణ విప్రోలో ఉద్యోగి కాగా తల్లి తులశమ్మ గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఐఐటీ ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ తర్వాత బజాజ్ సంస్థలో అసోసియేట్ సైంటిస్ట్గా పనిచేస్తూ సివిల్స్ సాధించాలని మూడుసార్లు ప్రయతి్నంచింది. చివరకు నాలుగో ప్రయత్నంలో లక్ష్మీరచన 178వ ర్యాంకు సాధించింది. ఐఐటీ ఇండోర్లో ఆమె చదివింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సివిల్స్ సాధించాలన్న తన తండ్రి కోరిక నెరవేరలేదని.. దాంతో తనను సివిల్స్ రాయమన్నారని.. ఇప్పుడు తన తండ్రి కల నెరవేర్చినట్లయిందన్నారు.ఎంపీడీఓకు 472వ ర్యాంకుసిద్దిపేట జిల్లా మర్కూక్ మండల అభివృద్ధి అధికారి బేతి విక్రమ్ సివిల్స్లో 472 ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ విక్రమ్ మాట్లాడుతూ సాధించాలనే కృషి ఉంటే ఏదీ అసాధ్యం కాదని, తాను ఐఏఎస్ కోసం చాలా కష్ట పడ్డానన్నారు. తన కల సాకారమైందన్నారు. డిప్యూటీ కలెక్టర్కు 358వ ర్యాంకు మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి చెందిన ఎం.వెంకటేశ్ ప్రసాద్ సాగర్ సివిల్స్లో 358వ ర్యాంకు సాధించారు. గతేడాది ఫలితాల్లో ఆయనకు 700వ ర్యాంకు వచ్చింది. గ్రూప్–1లోనూ సత్తా చాటిన వెంకటేశ్.. ప్రస్తుతం నల్లగొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్లో శిక్షణలో ఉన్నారు. ఆయన తండ్రి సత్యయ్య ట్రాన్స్కో ఏఈగా పనిచేస్తున్నారు. తల్లి యశోద గృహిణి. ఈసారి ఐఏఎస్ రాకపోతే మరోసారి ప్రయతి్నంచి లక్ష్యాన్ని చేరుకుంటానని వెంకటేశ్ ప్రసాద్ తెలిపారు.రెండో ప్రయత్నంలో...హైదరాబాద్లోని యాప్రాల్కు చెందిన ఆర్మీ విశ్రాంత అధికారి కల్నల్ శ్రీనివాస్, విశ్రాంత ఉపాధ్యాయిని బిందుల కుమారుడు డి.ఎస్.కె ప్రచేత్ సివిల్స్లో 193వ ర్యాంకు సాధించాడు. రెండో ప్రయత్నంలో సివిల్స్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. మద్రాస్ ఐఐటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.మూడో ప్రయత్నంలో 259వ ర్యాంకు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన శనిగరం వర్షిత్ రెడ్డి సివిల్స్లో 259వ ర్యాంక్ సాధించారు. వర్షిత్ హైదరాబాద్లోని బిట్స్ క్యాంపస్లో 2023లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కస్టమ్స్ విభాగంలో జీఎస్టీ విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా గతేడాది ఉద్యోగం సాధించి ప్రస్తుతం విజయవాడలో ఉద్యోగం చేస్తున్నారు. మూడో ప్రయత్నంలో సివిల్స్లో ర్యాంక్ సాధించారు. ఆయన తండ్రి శనిగరం నవీన్రెడ్డి వ్యాపారవేత్త, తల్లి కవితరెడ్డి.అటెండర్ కొడుకుకు 768వ ర్యాంకు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన కుమ్మరి శ్రవణ్కుమార్ సివిల్స్లో 768 ర్యాంకు సాధించాడు. ఆయన తండ్రి కుమ్మరి యాదగిరి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో అటెండర్గా పనిచేస్తుండగా తల్లి జ్యోతి ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గ్రూప్–1లో ట్యాక్స్ ఆఫీసర్గా ఎంపికై ఉద్యోగ శిక్షణ ఉంటూనే సివిల్స్ కోసం ప్రయతి్నంచి 6వ ప్రయత్నంలో శ్రవణ్కుమార్ లక్ష్యం చేరుకున్నాడు. లక్ష్యం పెట్టుకొని చదివానని.. సమాజంలో విద్యాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పాడు.సివిల్స్లో అన్నదమ్ములకు ర్యాంకు నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన అంజిరెడ్డి, ఆలివేలు దంపతుల కుమారులు వేలిమినేటి విక్రమసింçహారెడ్డి, విజయసింçహారెడ్డి సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. విక్రమసింçహారెడ్డి 541 ర్యాంకు, విజయసింçహారెడ్డి 682 ర్యాంకు సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోదరులిద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇటీవల జరిగిన గ్రూప్–1 పరీక్షల్లో విక్రమ్సింçహారెడ్డి 208 ర్యాంక్ సాధించి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉద్యోగంలో చేరగా విజయసింహారెడ్డి గ్రూప్–1లో 340 ర్యాంక్ సాధించి మహబూబ్నగర్లో ఎంపీడీవోగా పనిచేస్తున్నాడు.అమ్మానాన్న ప్రోత్సాహంతోనే.. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే సివిల్స్లో ర్యాంక్ సాధించానని 748వ ర్యాంకర్ పూదరి రాహుల్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన పూదరి గంగలక్షి్మ–మల్లేశం దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు రాజశ్రీకి వివాహం కాగా, పెద్దకుమారుడు రవితేజ సివిల్ సర్జన్గా శిక్షణ పొందుతున్నారు. చిన్నకుమారుడు రాహుల్ సివిల్స్లో 748వ ర్యాంక్ సాధించారు. -
అప్పులతో అభివృద్ధి శూన్యం
సాక్షి, అమరావతి : చంద్రబాబు ఏడాది పాలనలో ప్రస్తుత అభివృద్ధి దేవుడెరుగు, భవిష్యత్ అభివృద్ధిని కూడా శూన్యం చేశారని, ఆర్థిక క్రమ శిక్షణ, ఆర్థిక స్థిరత్వం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొంది. భవిష్యత్ అభివృద్ధికి చోటు లేకుండా ఏడాదిలోనే భారీగా అప్పులు చేశారని తూర్పారపట్టింది. 2024–25 ఆర్థిక ఏడాది ఆర్థిక, ద్రవ్య వినియోగ అకౌంట్స్పై కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించింది. అప్పులు తప్ప అభివృద్ధి లేదని, చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వినియోగించలేదని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. అప్పు చేయకుండా రోజు గడవడం లేదని, రోజువారీ ఖర్చులకు అప్పులు చేశారని, దీంతో వడ్డీ భారం గణనీయంగా పెరిగిందని ఎండగట్టింది. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను తొలి ఏడాదిలోనే చంద్రబాబు సర్కారు తుంగలో తొక్కిందని, నిబంధనలకు మించి రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు పెరిగి పోయిందని ఎత్తి చూపింది. భారీగా అప్పు చేసినప్పటికీ మూల ధన వ్యయం తగ్గిపోయిందని, ఇది రుణ స్థిరత్వాన్ని మరింత దిగజార్చడంతో పాటు భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక అవకాశాన్ని తీవ్రంగా పరిమితం చేసిందని కాగ్ పేర్కొంది. అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25 ఆర్థిక ఏడాదిలో మూల ధన వ్యయం 12 శాతం తగ్గిందని, ఇది దీర్ఘకాలిక ఆస్తుల సృష్టిపై తగ్గిన ప్రాధాన్యతను సూచిస్తోందని వెల్లడించింది. రోజువారీ అవసరాలకూ అప్పులే ఆధారం» మూల ధన వ్యయం నుంచి రెవెన్యూ వ్యయం వైపు నిరంతరం మార్పు ఉందని, ఆఖరుకు రోజువారీ అవసరాలకు కూడా అప్పులపై ఆధార పడటం పెరిగిందని, ఇది ఆర్థిక క్రమ శిక్షణ, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని కాగ్ వ్యాఖ్యానించింది. » 2024–25లో చేసిన అప్పులు అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 16.68 శాతం పెరిగినట్లు కాగ్ పేర్కొంది. ఇది అప్పులపై ఆధారపడటం పెరగడాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే అప్పుల శాతం పెరిగినప్పటికీ, మూల ధన వ్యయం అంతకు ముందు ఏడాదితో పోల్చితే 12 శాతం తగ్గిపోయిందని, ఇది దీర్ఘకాలిక ఆస్తుల సృష్టిపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పింది. » 2024–25లో ప్రభుత్వ రెవెన్యూ లోటు ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు జీఎస్డీపీలతో 2.7 శాతం ఉండాల్సి ఉండగా, 3.75 శాతానికి పెరిగిందని, అలాగే ప్రభుత్వ ద్రవ్య లోటు ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు జీఎస్డీపీలో 4 శాతం ఉండాల్సి ఉండగా.. 5.05 శాతానికి పెరిగిందని పేర్కొంది. » 2024–25లో మొత్తం అప్పు రూ.81,071 కోట్లు చేసినట్లు కాగ్ తెలిపింది. దీంతో వడ్డీ భారం గణనీయంగా పెరిగిందని స్పష్టం చేసింది. 2024–25 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు రూ.5.67లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. » రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడం ద్వారా మార్కెట్, ఆర్థిక సంస్థలు, వివిధ కార్పొరేషన్లు, సహకార సంఘాల ద్వారా నేరుగా అప్పులు చేస్తోందని కాగ్ పేర్కొంది. ఆ సంస్థలు రుణాలు చెల్లించడంలో విఫలమైన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తుందని చెప్పింది. ఈ అప్పులు రాష్ట్ర బడ్జెట్ వెలుపల అప్పులుగా అంచనా వేసినట్లు తెలిపింది.» ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదిత ఆఫ్–బడ్జెట్ అప్పులు మొత్తంతో పాటు వాటిని ఎక్కడి నుంచి తీసుకుంటున్నారనే విషయాన్ని వెల్లడించలేదని కాగ్ ఎత్తి చూపింది. అయితే 2024–25లో ఎటువంటి ఆఫ్–బడ్జెట్ బాధ్యతలను పొందలేదని, కేవలం 2025 మార్చి 31 నాటికి రూ.27,241 కోట్లు బకాయి ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలియజేసిందని పేర్కొంది.» 2024–25లో వోచర్ల పరిశీలన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను రూపొందించి, ఆఫ్ బడ్జెట్ రుణాల కారణంగా సహాయం, గ్రాంట్ల కోసం రూ.7,240.57 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసిందని, అయితే దీన్ని నిర్ధారించాలని తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది.నిబంధనలు తప్పుగా వర్గీకరింపురాష్ట్ర ఆర్థిక అంశాలపై చట్టబద్ధమైన నిబంధనలను తప్పుగా వర్గీకరించడం, పాటించకపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిందని కాగ్ పేర్కొంది. రెవెన్యూ వ్యయం రూ.3,375.60 కోట్లు తక్కువగా, మూలధన వ్యయం రూ.2,648.92 కోట్లు అధికంగా, నగదు నిల్వ రూ.95.70 కోట్లు తక్కువగా అంచనా వేసినట్లు స్పష్టం చేసింది. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా నిబంధనలను, షరతులను పాటించకుండా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.5,005.31 కోట్ల రుణాలను హడ్కోకు, రాష్ట్ర ఆర్థిక సర్వీసు కార్పొరేషన్కు పంపిణీ చేసినట్లు కాగ్ తప్పు పట్టింది. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. ఆమె ప్రమాణ స్వీకారంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరుతుంది. జస్టిస్ లీసా గిల్ ప్రస్తుతం పంజాబ్, హర్యానా హైకోర్టులో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆమెను ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో జస్టిస్ లీసా నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆమె వచ్చే వారం న్యాయమూర్తిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. జస్టిస్ లీసా గిల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఇటీవల నిర్ణయం తీసుకుంది. మొదట జస్టిస్ లీసా గిల్ను న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేసి, ఆ తరువాత హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ చేసిన వెంటనే ఆమెను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు.అపార అనుభవంజస్టిస్ లీసా గిల్ 1966 నవంబర్ 15న జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్ల తరఫున వాదించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తొలుత న్యాయమూర్తిగా ఎందుకంటే..?ఒక హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని నిర్ణయించిన న్యాయమూర్తిని సదరు హైకోర్టులో సీజే పోస్టు ఖాళీ అవడానికి కనీసం రెండు నెలల ముందే న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొత్త విధాన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే జస్టిస్ లీసా గిల్ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేసింది. జస్టిస్ లీసా గిల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైతే ఆమె ఆం«ధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. కాగా, 2028లో పదవీ విరమణ చేసే జస్టిస్ లీసా వచ్చే ఏడాది చివరి కల్లా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. -
ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ.. 15 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు
విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారి ఇంద్రకీలాద్రి కొండపై చోరీ జరిగింది. ఓ భక్తురాలి వద్ద 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు పెళ్లికి వచ్చిన మహిళా భక్తురాలు నగలు పొగొట్టుకుంది. ఇవాళ కుంభాభిషేకం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో దర్శనానికి వెళ్లిన ఆమె బ్యాగ్లో ఉన్న బంగారు చోరీకి గురైంది.దీంతో విజయవాడలోని వన్ టౌన్ పోలీసులకు మహిళా భక్తురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. కుంభాభిషేకం ఏర్పాట్లలో భాగంగా ఆలయ ప్రాంగణంలో టెంట్లు ఏర్పాటు చేశారు. దీంతో సీసీ కెమెరాలకు అడ్డంగా టెంట్స్ ఉండడంతో దొంగను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. -
‘అప్పుడేమో అబద్ధాలతో అధికారంలోకి.. ఇప్పుడేమో బోగస్ లెక్కలు’
తాడేపల్లి: అసెంబ్లీలో కూటమి నేతలు పచ్చి అబద్ధాలు, కాకి లెక్కలు చెబుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అన్ని బోగస్ లెక్కలే చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు(శుక్రవారం, మార్చి 6వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన పేర్ని నాని.. ‘ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చంద్రబాబుకు రూ. 8 వేల కోట్ల బడ్జెట్ అప్పచెప్పింది. 2019లో వైఎస్ జగన్కు చంద్రబాబు రూ. 100 కోట్ల బడ్జెట్ మాత్రమే అప్పచెప్పారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు అనేక అబద్ధాలు చెప్పారు. వైఎస్ జగన్పై విష ప్రచారం చేసి కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చాక మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టింది. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలి. కరెంట్ చార్జీలు తగ్గిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాబోయే 60 రోజుల్లో 57 వేల కోట్లు సంపద సృష్టిస్తామని తప్పుడు లెక్కలు చెబుతున్నారు’ అని విమర్శించారు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆదాయాలు రాకపోగా, లోటు కనిపిస్తోందిఅంచనాలకు, వాస్తవ పరిస్థితికి చాలా తేడా కనిపిస్తోందిచివరికి బడ్జెట్ కూడా దొంగతనంగా పెడుతున్నారురూ.98 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకుంటామని రూ. లక్షా 3 వేల కోట్లు గతేడాది అప్పు చేశారుఈ ఏడాది రూ. 97 వేల కోట్ల అప్పు తీసుకుంటామని బడ్జెట్ లో చెప్పారువివిధ కార్పొరేషన్ల నుండి తీసుకుంటున్న అప్పులను బడ్జెట్లో చూపటం లేదుఈ విషయాన్ని ఎల్లోమీడియా కూడా రాసిందిరెండు నెలల్లో రూ. 57 వేల కోట్ల ఆదాయం ఎలా వస్తుంది?రాష్ట్రం ఆర్థికంగా కుంగిపోతుంటే గాడిన పెట్టామంటూ అబద్దపు మాటలు ఎందుకు చెప్తున్నారు?చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ఇల్లు ఎవరిదో ఎందుకు చెప్పటం లేదు?లింగమనేని రమేష్దా? సీఆర్డీఏదా? చంద్రబాబుదా?రైతుల భూమిని 22A లో ఎక్కించిన వ్యక్తి చంద్రబాబుదీనిపై రాజకీయ పార్టీలు, మీడియా ఎదుట విచారణకు సిద్దమా?టాటా మోటర్స్ కి ఎకరా రూ.38 లక్షల చొప్పున గుజరాత్ లో మోడీ ప్రభుత్వం ఇచ్చిందికానీ ఎకరం రూపాయికే ఇచ్చారంటూ లోకేష్ పచ్చి అబద్దాలు చెప్పారు1100 ఎకరాలను రూ.400 కోట్లకు టాటా మోటర్స్ కొనుగోలు చేసిందిప్రపంచ వ్యాప్తంగా రూపాయి విలువ పడిపోయిందికానీ విశాఖలో రూపాయి విలువ విపరీతంగా పెరిగిందిఅందుకే విశాఖలో 99 పైసలకే భూములను ఇస్తున్నారురాష్ట్రంలో సెంటు భూమి ఆక్రమించి ఇల్లు కట్టుకున్నా వాటిని కూల్చేశారుకానీ గీతం యూనివర్సిటీ ఆక్రమంచిన వేల కోట్ల విలువైన భూమిని మాత్రం క్రమబద్దీకరిస్తున్నారుఇల్లు కోల్పోయిన పేదల కన్నీటి వరదలో కూటమి ప్రభుత్వం కొట్టుకు పోతుందిగీతం యూనివర్సిటీ ఓనరు నారా లోకేష్ తోడల్లుడు కాబట్టే క్రమబద్దీకరిస్తారా?వెయ్యి కోట్ల విలువైన భూమినే తాను కబ్జా చేసినట్టు గీతం ఓనరు చెప్పారువెయ్యి కోట్ల భూమిని కబ్జా చేయటం అంటే ఈ ప్రభుత్వాన్ని ఏం అనాలి?వైఎస్ జగన్ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో ఆరోపించారుఅసెంబ్లీలోనేమో జగన్ కలిపాడని లేదనీ, టీటీడీ పాలకమండలిదే బాధ్యత అంటూ మాట మార్చారుబోలేబాబా, సంగం డెయిరీ, వైష్ణవి, ఏఆర్ డెయిరీ అన్నీ చంద్రబాబువే4 వేల కోట్ల టర్నోవర్ హెరిటేజ్ కు ఉందని భువనేశ్వరి చెప్పారుతనకు లక్ష కోట్ల ఆస్తి ఉందని చంద్రబాబు ప్రకటించారుఅసెంబ్లీలో మాత్రం కుటుంబ బతుకు తెరువు కోసమే వ్యాపారం చేస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కారుహెరిటేజ్ సంస్థ నుండి కొనుగోలు చేసిన మజ్జిగ ప్యాకెట్లనే ప్రజలకు పంచాలని జీవోలు ఇచ్చారుకానీ తాము ప్రభుత్వానికి అసలు మజ్జిగ అమ్మలేదని పచ్చి అబద్ధం చెప్పారుచివరికి టీటీడీకి కూడా హెరిటేజ్ ద్వారా నెయ్యి సరఫరా చేశారుదీనిపై చర్చించటానికి చంద్రబాబుకు దమ్ముందా?పాలపొడి, నెయ్యి సరఫరా చేయలేదని చంద్రబాబు చెప్పగలరా?ఈ విషయాలన్నీ చెబుతుంటే హిస్టరీ వద్దంటూ పయ్యావుల కేశవ్ మాట్లాడటం సిగ్గుచేటునెయ్యితో చేసిన లడ్డూకి నెయ్యి వాసన రావటానికి నెయ్యిని స్ప్రే చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు చంద్రబాబు అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పారుఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో ఆ వివరాలను ఆన్ లైన్ లో పెట్టే సత్తా ఉందా?రాష్ట్ర అప్పులు రాకెట్ వేగంతో చేస్తూ, ఆ డబ్బును ఏం చేస్తున్నారో ఎందుకు చెప్పటం లేదు?20 నెలల్లోనే రూ. 3.20 లక్షల కోట్ల అప్పుకు లెక్క చెప్పాలిఅనిత తన శాఖను వదిలేసి జగన్ దూషణ శాఖామంత్రిగా పని చేస్తున్నారుసొంత పార్టీ ఎమ్మెల్యేనే మోంథా తుపాను పరిహారం రైతులకు ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారుమైకులు పని చేయక అసెంబ్లీని వాయిదా వేసిన ఘనత ఈ ప్రభుత్వానిదిఅసెంబ్లీ నడపటం చేతగానీ ప్రభుత్వ పెద్దలు తుపాను తీవ్రతను తగ్గించామని బడాయి మాటలు చెప్పారుప్రతి జనవరిలో జాబ్ కేలండర్ అంటూ లోకేష్ పిట్టలదొర మాటలు చెప్తున్నారుకూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేయలేదుజగన్ కట్టించిన ఇళ్లని చంద్రబాబు ఉగాదికి ప్రారంభించబోతున్నారువిమానయాన శాఖ మంత్రి కార్పొరేట్ సేవకుడుసొంత జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఎయిర్ పోర్ట్ ను కనీసం పట్టించుకోవటం లేదుభోగాపురం ఎయిర్ పోర్టు జీఎంఆర్ కడుతుంటే రామ్మోహన్ నాయుడు హడావుడి చేస్తున్నారుప్రభుత్వ ఎయిర్ పోర్ట్ అయిన గన్నవరం ఎయిర్ పోర్టును ఎందుకు పట్టించుకోవటం లేదు?రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తామని ప్రమాణం చేసిన మంత్రులు మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారుహిందూ ఆలయాలను ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ తర్వాత చంద్రబాబేఆయన హయాంలోనే తిరుమల వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చారుచంద్రబాబు హిందూ మతాన్ని పాటించే వాడైతే ఆ మంటపాన్ని కూల్చుతారా?జంతువుల తోలుతో చేసిన బూట్లు వేసుకుని పూజలు చేసే ఏకైక వ్యక్తి చంద్రబాబుతల్లి, తండ్రి చనిపోతే కనీసం పిండప్రదానమైనా చేశారా?మరి ఏ రకంగా చంద్రబాబు హిందువు?జంతువుల కొవ్వు, టాయిలెట్ యాసిడ్ లను లడ్డూలో కలిపితే జనం బతికేవారా?తిరుమల కొండ మీద కూడా అన్యమత ప్రచారం చేసుకోవచ్చని చంద్రబాబు హామీ ఇవ్వలేదా?రైతులకు రుణమాఫీ అని చెప్పి మోసం చేశారుసూపర్ సిక్స్ అని ఇప్పుడు మోసం చేశారుఇక ఆయన మాటలు విని ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారికి పోషణ పరిస్థితి ఏంటి?చంద్రబాబు లాంటి బడాబాబుల ఇళ్లలో పని చేయించుకోవడానికి సామాన్యులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలా?11 మంది ఎమ్మెల్యే మాకు ఉన్నా 11వేల మందిలాగా పోరాడుతున్నాంనిజాయతీనే మాకు ధైర్యంలడ్డూ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందునే హెరిటేజ్ అతలాకుతలం అయిందిచంద్రబాబు ఎన్ని పాపాలు చేస్తున్నారో అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారుఅసలు లడ్డూలో కల్తీ జరిగితే అది చంద్రబాబు హయాంలోనేఅందుకు చంద్రబాబే క్షమాపణ చెప్పాలికాగ్ నివేదికలు ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియని మంత్రులు ఏపీలో ఉన్నారు -
కూటమి నేతలు దిగజారిపోయి మాట్లాడుతున్నారు: రోజా
సాక్షి, భీమవరం: తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు తెలిపిందని మాజీ మంత్రి రోజా అన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పిన తర్వాత కూడా సీఎం, డిప్యూటీ సీఎం, చివరికి హోం మంత్రి కూడా దిగజారి మాట్లాడుతున్నారని చెప్పారు. వారి తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.ఇవాళ భీమవరంలో రోజా మాట్లాడుతూ.. ‘శాసన మండలిలో కూడా చైర్పర్సన్ మోషన్రాజు కులం గురించి మాట్లాడే స్థాయికి దిగజారిపోయే పరిస్థితికి కూటమి ప్రభుత్వం వచ్చింది. అసెంబ్లీలో కూటమి నేతలు లేనిపోనివన్నీ మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు ఒక్కరోజు కూడా సక్రమంగా మాట్లాడారా?కూటమి నేతలు భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దు. లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేయడానికి కులాల ప్రస్థావన తీసుకురాకూడదు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూటమిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నారు.. ప్రజలకు మంచి చేయండి.. లేదా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి’ అని అన్నారు. ఇదీ చదవండి: నేపాల్ ఎన్నికల ఫలితాలు భారత్కు ఎందుకింత కీలకం? -
శాసనమండలిలో బొత్సకు స్వల్ప అస్వస్థత
విజయవాడ: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శాసన మండలిలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్యుల్ని శాసనమండలికి పిలిపించిన అధికారులు.. పరీక్షలు చేయించారు. బీపీలో హెచ్చుతగ్గుల వల్ల బొత్స స్వల్ప అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. బొత్స సత్యనారాయణ హైబీపీ కారణంగా ఇబ్బందిపడినట్లు వైద్యులు తెలిపారు. ఒకవేళ బీపీ కంట్రోల్లోకి రాకపోతే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. దీనిలో భాగంగా బొత్సతో సిటీన్యూరో ఆస్పత్రి వైద్యులు ఫోన్లో మాట్లాడారు. ఆరోగ్యం విషయంలో బొత్సకు డా. చంద్రశేఖర్రెడ్డి జాగ్రత్తలు చెప్పారు. అనారోగ్యం కారణంగా మండలి నుంచి ఇంటికి వెళ్లిపోయారు బొత్స. -
తప్పు చేస్తే ఎవరికైనా దేవుడి శిక్ష తప్పదు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ప్రకాశం: తప్పు చేస్తే ఎవరికైనా దేవుడి శిక్ష తప్పదని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి సన్నిధిలో పొరపాటు జరిగితే దేవుడే చూసుకుంటారన్నారు. టీటీడీ ఛైర్మన్పై నింద వచ్చింది కాబట్టి తప్పుకుంటే మంచిందన్నారు. కల్తీ నెయ్యి అంశాన్ని కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తుందన్నారు. నెయ్యి విషయంలో ఈ ప్రభుత్వంలోనే తప్పు జరిగింది. రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్లు దొడ్డిదారిలో తీసుకున్నారు. సీబీఐ కూడా రిపోర్టులో అదే చెప్పిందని వైవీ అన్నారు.‘‘వెంకటేశ్వరస్వామిపై వైఎస్ జగన్కు పూర్తి నమ్మకం ఉంది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి చిత్తశుద్ధితో మొక్కుకోవడం జరిగిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘బాలిలేని మాటలకు నేను స్పందించడం ఏంటి? జిల్లా నాయకులు ఉన్నారు. ప్రస్టేషన్తో బాలినేని ఏదో మాట్లాడితే నేనెందుకు దానిపై కామెంట్ చేయాలి’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. -
యాడున్నరో.. ఎట్టున్నరో..?
మార్కాపురం జిల్లా: పశ్చిమాసియాలోని అరబ్ దేశాల్లో కమ్ముకున్న యుద్ధ మేఘాలు మార్కాపురం జిల్లాలోని వందలాది కుటుంబాలను తీవ్ర భయాందోళనకు గురిచేయడమే కాదు కన్నీళ్లు కురిపిస్తున్నాయి. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫోన్లు, వాట్సప్లు, వీడియో కాల్స్పై అక్కడి ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతోపాటు తాత్కాలికంగా నిలిపివేయడంతో బంధుమిత్రుల సమాచారం తెలియక వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం, కంభం, గిద్దలూరు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 100 మంది గల్ఫ్ దేశాలైన దుబాయ్, కువైట్, ఖతార్లో ఉంటున్నారు. పొట్ట చేతపట్టుకుని కొందరు, గల్ఫ్లో బంధువుల వద్దకు మరికొందరు వెళ్లారు. ఈ క్రమంలో ఇరాన్కు ఇజ్రాయేల్, అమెరికా మధ్య యుద్ధం తలెత్తడంతో గల్ఫ్ దేశాలకు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నా విమానాల రద్దుతో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రోజురోజుకూ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. అరబ్ దేశాల్లో ఉంటున్న వారు సాధారణంగా ప్రతి రంజాన్ పండగకు స్వగ్రామాలకు వచ్చి కొద్దిరోజులు ఉండి మళ్లీ అక్కడికి వెళ్తుంటారు. ఈసారి మాత్రం పండగ 15 రోజుల్లో ఉందనగా ఇరాన్పై ఇజ్రాయేల్, అమెరికా క్షిపనులతో విరుచుకుపడటం, ఇరాన్ భీకర ప్రతిదాడులకు దిగడంతో వారి ప్రయాణానికి అవాంతరం ఏర్పడింది. తాము స్వదేశానికి రాలేమంటూ పలువురు తమ బంధువులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. గత సోమవారం మధ్యాహ్నం నుంచి అక్కడి ప్రభుత్వాలు వీడియో, వాట్సప్ కాల్స్ను నిలిపివేయడంతో మార్కాపురం, కంభం, గిద్దలూరు ప్రాంతాల్లో ఉంటున్న బంధువులు ఆందోళన చెందుతున్నారు. విమానం టికెట్ రద్దయింది నా కూతురు, అల్లుడు కువైట్కు సమీపంలోని ఫర్మేనియా సిటీలో ఉంటున్నారు. నేను ఫిబ్రవరి 18వ తేదీన వారి వద్దకు వచ్చాను. మార్చి 6వ తేదీన మళ్లీ మార్కాపురం వచ్చేందుకు విమానం టికెట్ బుక్ చేసుకున్నా. ఆదివారం ఉదయం ఊహించని విధంగా యుద్ధం ప్రారంభం కావడంతో విమాన టికెట్లు క్యాన్సిల్ చేశారు. కువైట్ మీద కూడా ఇరాన్ బాంబులు వేసింది. మా ప్రాంతంలో ప్రస్తుతానికి ప్రాణనష్టం లేదు. బయట కూడా ఎవరూ తిరగడం లేదు. కువైట్ రాజు మా ప్రాంతానికి వచ్చి యోగక్షేమాలు అడిగారు. కానీ, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. పరిస్థితులు త్వరగా చక్కబడితే బాగుంటుందని కోరుకుంటున్నాం. – ఎన్.బద్రి, మార్కాపురం దుబాయ్లో టెన్షన్గా ఉంది నా కుమారుడు అబ్దుల్ రహీమ్ దుబాయ్లో ఐటీ వింగ్లో పనిచేస్తున్నాడు. యుద్ధం కారణంగా ప్రభుత్వం వాట్సప్, వీడియో కాల్స్ నిషేధించింది. అతి కష్టంమీద ఈ రోజు ఫోన్లో మాట్లాడాడు. ప్రస్తుతానికి వర్క్ఫ్రమ్ హోం కింద దుబాయ్లోని ఇంట్లోనే ఉంటున్నాడు. కానీ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. – అజీజ్, మార్కాపురం -
రఘురామపై టీడీపీ నేత తిరుగుబాటు.. అసెంబ్లీకి పంచాయితీ..
సాక్షి, అమరావతి: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం అసెంబ్లీ వరకు చేరింది. అసెంబ్లీ ప్రాంగణం బయట ఉండి నియోజకవర్గం వెలివర్రు గ్రామ టీడీపీ నేత వెంకటేశ్వర రాజు నిరసనకు దిగారు. టీడీపీ నుంచి రఘురామను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు తాను అసెంబ్లీకి వచ్చినట్టు తెలిపారు.ఈ క్రమంలో వెంకటేశ్వర రాజు.. ఎన్టీఆర్ విగ్రహంతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు యత్నం చేశారు. తనకు జరిగిన అన్యాయం, నియోజకవర్గంలో రఘురామ కృష్ణంరాజు వేధింపులను చంద్రబాబుకు వివరిస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, అసెంబ్లీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వెంకటేశ్వర రాజు మాట్లాడుతూ..‘పార్టీని నమ్ముకున్నందుకు ఇటువంటి బహుమతి ఇస్తారా?. రఘురామ కృష్ణంరాజు నా పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. నేను 40 ఏళ్లుగా టీడీపీలో ఉన్నాను. సొంత పార్టీ నేతపై కక్ష సాధింపు చర్యలు దిగారు. ఉండిలో రఘురామ కృష్ణంరాజు పార్టీని నాశనం చేస్తున్నారు.అధికారులను, పోలీసులను అడ్డం పెట్టుకొని నా ఇల్లు, నా పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారు. నా ఆఫీసుకు అన్ని అనుమతులు ఉంటే కూల్చాల్సిన అవసరం ఏం వచ్చింది?. ఉండిలో చర్చిలు, మసీదులు కూలగొడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మా మోర ఆలకించాలి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, టీడీపీ నేత వెంకటేశ్వర రాజు అంతకుముందు కూడా రఘురామపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
నకిలీ ఫేస్బుక్ ఖాతా.. వివాహితకు అసభ్య మెసేజ్లు..
విశాఖపట్నం జిల్లా: నకిలీ ఫేస్బుక్ ఖాతాతో ఓ వివాహితకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని నగర సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ వివాహితకు ఒక వ్యక్తి నకిలీ ఫేస్బుక్ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అనంతరం ఆమె ఖాతాలోని ఫొటోలను డౌన్లోడ్ చేసి మారి్ఫంగ్ చేశాడు. ఆ ఫొటోలను ఆమెకు పంపిస్తూ, తనతో చాటింగ్ చేయకపోతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. అసభ్య పదజాలంతో మెసేజ్లు చేస్తూ తీవ్ర వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని కొబ్బరితోటకు చెందిన గరుబిల్లి భాస్కరరావుగా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అపరిచిత వ్యక్తుల నుంచి సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తే అంగీకరించవద్దని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. -
కట్నం రక్కసికి వివాహిత బలి
విశాఖపట్నం జిల్లా: వరకట్న దాహానికి మరో వివాహిత బలైంది. అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. న్యూపోర్టు పోలీసుల కథనం ప్రకారం.. గంగవరం గ్రామానికి చెందిన ఎరిపిల్లి నాగమణి కుమార్తె రమాదేవిక అలియాస్ ప్రత్యూష (23) ప్రస్తుతం బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ప్రత్యూషకు అదే ప్రాంతానికి చెందిన మాద ధనరాజుతో 2022 ఫిబ్రవరిలో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.3లక్షల కట్నం ఇస్తామని ఒప్పందం కుదుర్చుకోగా, అప్పట్లో రూ.1.50లక్షలు చెల్లించారు. మిగిలిన సొమ్ము కోసం భర్తతో పాటు అత్తమామలు కూడా ప్రతి రోజూ ఆమెను వేధిస్తుండేవారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ప్రత్యూష, ఈ నెల 3న ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను గాజువాకలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం ప్రత్యూష మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. తన కుమార్తె మృతికి అత్తమామల వేధింపులే కారణమని తల్లి నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీపీ చిట్టిబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాషాయ కండువా కప్పుకోనున్న వీరశివా !
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ ఎమ్మెల్యే గండ్లూరు వీరశివారెడ్డి బీజేపీలో చేరికకు గ్రీన్సిగ్నల్ లభించింది. ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. తెలుగుదేశం, బీజేపీలోని ఒక సెక్షన్ నేతలు వీరశివా బీజేపీ చేరికకు మోకాలొడ్డారు. ఎట్టకేలకు అడ్డంకులన్నీ అధిగమించి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి మరోమారు పార్టీ ఫిరాయింపునకు తెర లేపారు. బీజేపీలో చేరిక వ్యవహారం గత కొంత కాలంగా ఊగిసలాటలో ఉండిపోయింది. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మొగ్గు చూపగా, తెలుగుదేశం, బీజేపీ నేతలు కొంతమంది ఇప్పుడు ఆయన అవసరం ఏమిటంటూ అడ్డుతగిలారు. అధికారం కోసమే బీజేపీలో చేరుతున్నారని మండిపడ్డారు. అన్నీ అంశాలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పుత్తాకు పక్కలో బల్లెం... కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డికి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పక్కలో బల్లెం కానున్నారా...అంటే విశ్లేషకులు అవును అని వెల్లడిస్తున్నారు. బీజేపీలో చేరకముండే కమలాపురం నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా వ్యవహారంపై స్పందించారు. కోట్లాది రూపాయాల దోపిడీ వ్యవహారం బహిర్గతం చేశారు. పుత్తా కుటుంబానికి నిత్యం రూ.30లక్షలు అక్రమ ఆదాయం లభిస్తోందని మీడియా సమావేశాలల్లో వ్యాఖ్యనించారు. అదే విషయమై చట్ట పరమైన చర్యలకు సిద్ధమైయ్యారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారాన్ని కట్టడి చేసేందుకు అన్నీ రకాల ఎత్తుగడలు అవలంభిస్తున్నారు. ఈపరిస్థితులల్లో బీజేపీలో చేరిన తర్వాత మరింత దూకుడు పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అనుచరగణాన్ని సమీకరించుకున్న తర్వాత వేగంగా రాజకీయ పావులు కదపనున్నట్లు సమాచారం. -
మంత్రి పయ్యావుల కేశవ్కు బొత్స స్ట్రాంగ్ రిప్లై
06-03-20265.25PMఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా4:19 PMమంత్రి పయ్యావుల కేశవ్కు బొత్స స్ట్రాంగ్ రిప్లై ఆదాయంలో ఏపీకి 22వ స్థానం ఎలా వచ్చిందో చూపించిన బొత్సకాగ్ నివేదిక లింక్ ను పయ్యావులకు సభలో పంపిన బొత్సమీకు డౌన్ లోడ్ చేయడం చేతకాకపోతే చేసి పంపిస్తానన్న బొత్సగత ఐదేళ్లలో పంటల కొనుగోళ్ల వివరాలను ఇచ్చిన బొత్సవైఎస్ జగన్ హయాంలో రూ. 7800 కోట్లతో పంటల కొనుగోలు చేశాంపంటల వారీగా కొనుగోలు చేసిన వివరాలు ఇస్తున్నా చూస్కోండిబొత్స డాక్యుమెంట్లు ఇవ్వడంతో ఖంగుతిన్న మంత్రి పయ్యావుల కేశవ్రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు.. వారిని ఆదుకొండిప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంతా అంకెల గారడీ ఏపీ శాసనమండలి నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల వాకౌట్👉అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్👉అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమంపై వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్న👉సభను తప్పుదోవ పట్టించకండి: విపక్షనేత బొత్స సత్యనారాయణఆనాటి ప్రభుత్వం చాలా హామీలు నెరవేర్చిందిచాలా హామీలకు సంబంధించి అధికారులను పిలిపించి సమాచారం తీసుకోండిలేనిపోని కల్లబొల్లి కబుర్లు చెప్పకండిసమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్న వారిని అవమానించకండిమంత్రి సమస్యల పరిష్కారం కోసం ఏ అగ్రిమెంట్ ఏమీ చేసుకోలేదంటున్నారు.ముందు అంతకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి.అంగన్వాడిల పట్ల సానుభూతితో ఈ ప్రశ్నకు సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం👉గీతం యూనివర్సిటీ రూ.5 వేల కోట్ల భూ దోపిడీపై సభలో చర్చించాలని కోరుతూ శాసనమండలి వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, పండుల రవీంద్రబాబు, పాలవలస విక్రాంత్లు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు.👉దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గీతం యూనివర్సిటీపై చర్చించాల్సిందేనని సభలో వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనకు దిగడంతో సభకు ఐదు నిమిషాల పాటు ఛైర్మన్ విరామం ప్రకటించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు.👉తల్లికి వందనం పథకంపై చంద్రబాబు సర్కార్ను వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీశారు. తల్లికి వందనం పథకం తల్లికి వంచనగా మారిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రతీ ఇంటి వెళ్లి నీకు 15 వేలు, నీకు 15 వేలు అని ప్రచారం చేశారంటూ దుయ్యబట్టారు.ఇది పెద్ద భూ కుంభకోణం: కుంభ రవిబాబు మండలి మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడుతూ.. గీతంకి ప్రభుత్వ భూములు ఇవ్వడంపై వాయిదా తీర్మానం ఇచ్చామని.. ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. రూ. 5 వేల కోట్ల భూములు గీతంకి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని.. ఇది పెద్ద భూ కుంభకోణమని ఆయన అన్నారు.‘‘గీతంకి భూములు ఇవ్వడంపై విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఇవ్వాలని తీర్మానం చేసినప్పుడు వ్యతిరేకత వచ్చింది. గీతం ఒక వ్యాపార సంస్థ. విద్యా వ్యాపారం చేస్తున్న సంస్థకి 5000 కోట్లు భూములు ఇవ్వడంపై వైఎస్సార్సీపీ అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన గీతంకి ఉచితంగా భూములు ఇవ్వడం పరిపాటిగా మారింది. గతంలో ఎకరం 15 లక్షలకు ఇచ్చారు...రుషికొండలో ప్రభుత్వ భవనాలను వైఎస్ జగన్ కడితే కూటమి గగ్గోలు పెట్టింది. ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు.51 ఎకరాల 71 సెంట్లు కట్టబట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. అనేక కంపెనీలకి 99 పైసలకే భూములు ఇస్తుంది. భూములు అప్పనంగా కట్టబెట్టడాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది. విలువైన భూములను కారు చౌకగా గీతంతో పాటు ఎన్నో సంస్థలకు ఇచ్చేందుకు ప్రభుత్వం పూనుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అని రవిబాబు తేల్చి చెప్పారు.గీతం కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకోవాలి: వరుదు కళ్యాణిగీతం యూనివర్సిటీ కబ్జా చేసిన భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. రెగ్యులరైజేషన్ ఆపాలి. 99 పైసలకు తన బినామీలు అనుచరులకు చంద్రబాబు భూములు కట్టబడుతున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన భూములు తన కుటుంబ సభ్యులకు కట్టబడుతున్నారు. విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటూ దోపిడీ క్యాపిటల్లా మార్చారు. బీసీ మహిళా మేయర్ని అడ్డగోలుగా పదవి నుంచి దించారు.కబ్జా భూమిని రెగ్యులరైజ్ చేయడం కోసమే మేయర్ ని తప్పించారు. కబ్జా చేసిన భూములపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలి.. కానీ రెగ్యులరేజ్ చేస్తున్నారు. చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుంటే ప్రోక్లైన్లతో తొలగించారు. పేదలు చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటే వాటిని తొలగించారు. కుటుంబ సభ్యులకు మాత్రం 5 వేల కోట్లు కట్టబెట్టారు. స్థానిక సంస్థల ఆధీనంలో ఉన్న భూములు ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదంటూ కోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు అంటే కూటమి పెద్దలకు చంద్రబాబుకి భయం లేదు. గీతం కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అప్పటివరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆగదు. -
బందరులో బరితెగింపు..
మచిలీపట్నంటౌన్: మద్యం మాఫియా అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగులతో ప్రచారం హోరెత్తిస్తోంది. జిల్లా కేంద్రంలో మహనీయుల విగ్రహాలకు అడ్డుగా ఫ్లెక్సీలు కడుతున్నా అధికారులు చోద్యం చూస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అధిక ధరలకు తోడు సమయపాలన లేకుండా మద్యం విక్రయాలు జరుపుతూ మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ వ్యాపారం సాగిస్తున్నారు మచిలీపట్నంలోని మద్యం వ్యాపారులు. మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్లోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బార్ హోర్డింగ్ ఏ కూడలి చూసినా ఫ్లెక్సీలే..బందరులో ఏ కూడలి చూసినా మద్యం ప్రచార ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. జిల్లా పరిషత్ సెంటర్లో ఉన్న ఆంధ్రాబ్యాంక్ వ్యవస్థాపకుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, లక్ష్మీ టాకీస్ సెంటర్లోని బీఆర్ అంబేడ్కర్, జిల్లా కోర్టు సెంటర్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు, బస్టాండ్ సెంటర్లోని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, రేవతి సెంటర్లోని మున్సిపల్ మాజీ చైర్మన్ రమణయ్య నాయుడు వంటి మహనీయుల విగ్రహాల వద్ద ఈ హోర్డింగులను ఏర్పాటు చేశారు. ఆయా విగ్రహాలను ఏర్పాటు చేసిన కమిటీల ప్రతినిధులు ఈ హోర్డింగులు ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. మహనీయుల విగ్రహాల వద్ద అభ్యంతరకరంగా ఉన్న హోర్డింగ్లను తొలగించాలని పలువురు నగర కమిషనర్ బాపిరాజుకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. జిల్లా పరిషత్ సెంటర్లో భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు ఆందోళన చేసినా బార్లా తెరిచారు... నగరంలోని హైనీచర్చి సమీపంలో నవ్య రెస్టారెంట్ అండ్ బార్ను నూతనంగా ఏర్పాటు చేశారు. చర్చి సమీపంలో బార్ ఏర్పాటుపై ఇటీవల క్రైస్తవులు ఆందోళన వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఈ బార్ను గురువారం ప్రారంభించేశారు కూడా. దీనిలో భాగంగా బార్ నిర్వాహకుడు ఏకంగా పెద్ద పెద్ద హోర్డింగులను నగరంలోని మహనీయుల విగ్రహాల వద్ద ప్రచారానికి ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలి. కానీ అదేదో మందుబాబులకు ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నట్టు ఎమ్మార్పీకే మద్యం విక్రయిస్తామంటూ మద్యం బాటిళ్ల ఫోటోలతో బాహాటంగా వ్యాపారులు ఇలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనార్హం. కోర్టు సెంటర్లో అమరజీవి విగ్రహం వద్ద ఇలా.. -
గన్నవరం ఎయిర్పోర్టును కమ్మేసిన పొగమంచు
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం ఎయిర్పోర్టులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. గాల్లో పలు విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. సేఫ్ ల్యాండింగ్కు క్లియరెన్స్ లేకపోవడంతో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. చెన్నై, హైదరాబాద్, సింగపూర్, ఢిల్లీ విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్కి వీలులేకపోవడంతో అధికారులు.. రాజమండ్రికి దారి మళ్లించారు.పొగమంచు ప్రభావం తగ్గే వరకు విమానాల రాకపోకల్లో అంతరాయం కొనసాగుతుందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. కొన్ని రోజులుగా గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నాలుగు రోజుల క్రితం పొగ మంచు కారణంగా ఇస్తాంబుల్ నుండి వచ్చిన ప్రత్యేక విమానం, ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టాయి. -
ఔను.. రాధికకు రాయితీలిచ్చాం
సాక్షి, అమరావతి: ఔను.. రాధిక వెజిటబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 44 శాతం మేర రాయితీలిచ్చిన మాట వాస్తవమేనని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో డాక్టర్ గెడ్డం శేఖర్బాబు స్పష్టం చేశారు. ‘రాధికకు ఇన్ని రాయితీలా?’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై గురువారం ప్రభుత్వం తరఫున ఆయన వివరణ ఇచ్చారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం రూ.200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే వాటిని మెగా పరిశ్రమలుగా పరిగణిస్తున్నామన్నారు. రూ.200 కోట్లకు పైగా ఉన్న మెగా ప్రాజెక్టులకు ఈ పాలసీ ప్రకారం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చే వెసులుబాటు ఉందన్నారు. రాధిక వెజిటబుల్ ఆయిల్స్ లిమిటెడ్ ప్రాజెక్టు మూలధన పెట్టుబడి రూ.218 కోట్లకు పైగా ఉన్నందున పాలసీ ప్రకారం స్థిర మూలధన పెట్టుబడిలో 75 శాతం వరకు ప్రోత్సాహకాలు మంజూరు చేయవచ్చన్నారు. ఈ మేరకు రాయితీలిచ్చామని చెప్పారు. 'రాధిక'కు ఇన్ని రాయితీలా!? -
నన్ను చంపేస్తారేమో!
తిరువూరు: ‘టీడీపీ ఎమ్మెల్యేనే అయినా నన్ను చంపేస్తారేమో. నన్ను భూమి మీద లేకుండా చేయాలని ఏ.కొండూరు మండల టీడీపీ అధ్యక్షుడు పీక్లా నాయక్ అన్నారంటే.. నన్ను చంపడానికే టీడీపీలోని ఒక వర్గం ప్రయత్నిస్తోందని అర్థమవుతోంది. వీళ్లంతా నన్ను చంపడానికి చూస్తున్నారు’ అంటూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తిరువూరులో మీడియాతో కొలికపూడి మాట్లాడుతూ.. ‘టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు అధికమయ్యాయి. కూటమి ప్రభుత్వంలో రౌడీయిజం, పేకాట క్లబ్బులు, రేషన్ మాఫియా ఆగడాలు పెచ్చుమీరిపోయాయి.వీటిని వ్యతిరేకించినందుకే నాపైనా దాడి జరిగింది. నన్ను ధైర్యంగా ఎదుర్కోలేనివారే దొంగచాటు వ్యవహారాలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తిరువూరు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలపై అక్రమ కేసులు బనాయించి వేధించాలని ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం నుంచి పోలీసులకు ఒత్తిడి వస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు. గంపలగూడెం మండలం పెదకొమెర, తిరువూరు మండలం గానుగపాడు గ్రామాల్లో దళితులపై కేసులు నమోదు చేయడం తగదని తాను విజయవాడ పోలీస్ కమిషనర్ను కలిసి చెప్పానన్నారు. ఇకనైనా అక్రమ కేసులను ఆపకపోతే బాధితులతో కలిసి ఆందోళన చేస్తానని హెచ్చరించానని ఎమ్మెల్యే వెల్లడించారు. దాడి సమాచారం తెలిసినా రక్షణ కల్పించరా?నెమలి శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో స్వామి కల్యాణోత్సవ సమయంలో తనపై కొందరు దాడిచేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం వచ్చినా రక్షణ కల్పించలేదని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు. గంపలగూడెం మండలం కొణిజర్ల, ఊటుకూరు గ్రామాల్లో ఎంపీ అనుచరులు తనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నా స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో తనకున్న చట్టపరమైన హక్కులను ఎవరైనా బలవంతంగా లాక్కుంటే సహించబోనని స్పష్టం చేశారు. ఎంపీ కార్యాలయం నుంచి తనపై దాడికి ముందస్తు ఆదేశాలు వెళ్లాయని, జనసమీకరణ చేయాలని స్థానిక నేతలకు సమాచారం వెళ్లిందని ఎమ్మెల్యే తెలిపారు.తనను జాగ్రత్తగా ఉండాలని నిఘా భద్రతా వర్గాలు తన గన్మెన్ ద్వారా సూచించినా పోలీసులు ఒక్క కానిస్టేబుల్నూ ఇవ్వలేదన్నారు. నెమలి కల్యాణం జరిగేటప్పుడు కరెంటు సరఫరా నిలిపివేసి తనపై దాడి చేయాలని పథకం వేస్తే పోలీసులు అంగీకరించలేదని కూడా ఎమ్మెల్యే పేర్కొన్నారు. తన కారు అద్దాలు పగులగొట్టి, టైర్లలో గాలి తీసివేసి దాడి చేయాలని చూశారని.. వీటికి తన వద్ద స్పష్టమైన సమాచారం ఉందన్నారు. తిరువూరు నియోజకవర్గానికి సంబంధం లేని బాలకోటయ్య విమర్శలు చేయడం హేయమన్నారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించిన నేతలు.. మిగిలిన నియోజకవర్గాల్లో ఆ విధంగా ఎమ్మెల్యేలు లేకుండా ఎందుకు సమావేశాలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.రౌడీయిజం చేసినందునే ఆర్యవైశ్యులు తిరువూరులో టీడీపీకి 20 ఏళ్లపాటు ఓట్లు వేయలేదని, తాను వచ్చాక మార్పు తెచ్చానన్నారు. తన గురించి చిట్టా ఉందనేవారు వాటిని బయట పెట్టాలని అన్నారు. అరవ శ్రీధర్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వంటి వారి వీడియోలు బయటకు వచ్చాయని, తన ఫొటో మార్ఫింగ్ చేసి పెట్టిన వారి ఫొటో కూడా తాను పెట్టానన్నారు. తనపై ఎంపీ అనుచరులు చేస్తున్న ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ చేశారు. చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నానని, తనను భూమిపై లేకుండా చేస్తానన్న కుట్రలపై హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలావుండగా.. ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి చెందిన వారు గురువారం మధ్యాహ్నం తిరువూరు ఫ్యాక్టరీ సెంటర్లో ఎమ్మెల్యేపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించగా, సాయంత్రం ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. -
పోలవరంలో బాబు అవే తప్పులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో ప్రధాన(ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం పనులను నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తీవ్రంగా ఆక్షేపించారు. ప్రధాన డ్యాం గ్యాప్–2లో చేస్తున్న పనుల్లో సాంకేతిక లోపాలపై సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) అభ్యంతరాలు వ్యక్తం చేయడం దీనికి నిదర్శనమన్నారు. తక్షణమే సాంకేతిక లోపాలను సరిదిద్ది సీడబ్ల్యూసీ డిజైన్లు, మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టు పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబుకు ఉండవల్లి గురువారం లేఖ రాశారు.ఈ లేఖను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి కందుల దుర్గేష్ లకు కూడా పంపారు. గతంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి, గోదావరి ప్రవాహాన్ని మళ్లించాల్సి ఉండగా, ఆ పనులు చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మించడంతో వరద ఉద్ధృతికి అది కోతకు గురై దెబ్బతిందని, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం కోతకు గుౖరె విధ్వంసం చోటుచేసుకుందని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.దానివల్లే ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్ నిర్మించడానికి, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకు రూ.3 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఆ మేరకు ప్రజాధనం వృథా అయిందంటూ ఎత్తిచూపారు. ఆ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిందిపోయి చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అవే తప్పులను చేస్తోందంటూ దుయ్యబట్టారు. సాంకేతిక లోపాలను సరిదిద్దకుండా ప్రాజెక్టును పూరి్తచేస్తే భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం వాటిల్లితే దిగువ ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుందని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. ఉండవల్లి లేఖలో ప్రధానాంశాలు ఇవీ..⇒ పోలవరం ప్రాజెక్టు పనులను జనవరి 19, 20, 21 తేదీల్లో నిపుణుల కమిటీ, పలు సాంకేతిక సంస్థలు, ఆఫ్రి వంటి అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రతినిధులతో సీడబ్ల్యూసీ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టు పనులపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ సమావేశం మినిట్స్ను జనవరి 30న లేఖ రూపంలో సీడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ⇒ ప్రధాన డ్యాం గ్యాప్–2లో గోదావరి నదీ గర్భం సముద్రమట్టానికి 8.32 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి ప్రధాన డ్యాం నిర్మించాలి. కానీ.. 15.50 మీటర్ల నుంచి ప్రధాన డ్యాంను నిరి్మస్తున్నారు. దీని వల్ల డ్యాం కింద ఇసుక పొరలు కోతకు గురై డ్యాం కోతకు గురై ప్రమాదం ఉంది. ⇒ టెయిల్ వాటర్ లెవల్ను ఎలాంటి బలమైన సాంకేతిక కారణం లేకుండా 25 మీటర్ల నుంచి 16 మీటర్లు, 13.5 మీటర్లకు తగ్గించడం వల్ల నీటి ప్రవాహం వెనక్కి ఎగదన్ని ప్రధాన డ్యాం దెబ్బతినే ప్రమాదం ఉందని సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తం చేసింది. ⇒ ఫిల్టర్ డిజైన్, స్లోప్ స్టెబిలిటీ, వేవ్ రన్ అప్(అలల తాకిడి ప్రభావం) తదితర డిజైన్లు డిజైనర్ ఆఫ్రి నుంచి ఇంకా అందలేదని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. డ్యాం భూకంపాలకు తట్టుకోగలదా అనే అంశంపై ఆఫ్రి ఇచి్చన నివేదికలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని సీడబ్ల్యూసీ ఎత్తిచూపింది. ⇒ డిజైన్లు ఆమోదం పొందకుండా పనులు పూర్తి చేయడం.. ఆ తర్వాత వాటికి ఆమోదం పొందడం(పోస్ట్ ఫ్యాక్టో ఆప్రూవల్స్) అత్యంత ప్రమాదకరమని సీడబ్ల్యూసీ హెచ్చరించింది. ఒక సారి డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత దానిలో లోపాలు కన్పిస్తే వాటిని మార్చడం సాంకేతికంగా అసాధ్యమని.. దీని వల్ల భారీగా నష్టం వాటిల్లుతుందని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. -
కట్టెడు దుఖం
విద్యార్థులకు వడ్డించే ఆహారం తయారీకి మన్యంలో ఇంకా కట్టెల పొయ్యిలనే వినియోగిస్తున్నారు. తరగతి గదుల పక్కనే వంటలు చేయడంతో పొగతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఏళ్లకాలంగా పరిస్థితిలో మార్పురాక పొగమాటున విద్యాభ్యాసం సాగుతోంది. చంద్రబాబు సర్కారులో విద్యారంగానికి గ్రహణం పట్టింది. ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్టు తయారైంది. వంట తయారు చేసే వారికి ‘కట్టె’డు దుఖం మిగులుతోంది. రంపచోడవరం: ఎన్నో ఆశల నడుమ కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటైంది. ఇక అభివృద్ధి పరుగులు పెడుతుందని అందరూ భావించారు. కానీ ఇక్కడ వి ద్యార్థుల కష్టాలు తీర్చే నాథుడే లేకపోయారు. పాఠశాలలు, వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. జిల్లాలో 79 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 16,238 మంది విద్యా ర్థులు చదువుతున్నారు. ఇక 15 వసతి గృహాల్లో 1,281 మంది విద్యను అభ్యసిస్తున్నారు. అయితే జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో కట్టెల పొయ్యిలపైనే విద్యార్థులకు భోజనాలను తయారు చేస్తున్నారు. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు గ్యాస్ సిలిండర్లను ఉయోగించి వంటలు చేసుకుంటున్నా, ఇక్కడ మాత్రం ఇంకా కట్టెల పొయ్యిలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఏళ్ల కాలంగా ఈ పరిస్థితి ఉంది. కంట్లో పొగ.. ఇదో సెగ పాఠశాలల భవనాల పక్కనే కట్టెల పొయ్యిపై విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారు. వంట సమయంలో వెలువడుతున్న పొగతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉన్నా ఉన్నతాధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. పొగ కారణంగా చదువులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. వంట షెడ్లను నిర్మించకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. చాలా చోట్ల తరగతి గదులకు దగ్గరలోనే వంట చేయడంతో విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లాలోని ఐటీడీఏల పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు గ్యాస్ సరఫరా చేయడం లేదు. అన్ని చోట్లా కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. ఇష్టారాజ్యం వంట కోసం గ్యాస్ అందించాలని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగులు కోరుతున్నా, ఫలితం లేకుండా పోతోంది. కట్టెల పొయ్యి కారణంగా పొగచూరి ఆహార పదార్థాలకు పట్టడంతో ఒక్కోసారి తినడానికి ఇబ్బందిగా ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు. గతంలో ఆశ్రమ పాఠశాలలకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేశారు. కొన్ని నెలలు తర్వాత ఎక్కడా అవి కనిపించలేదు.కనీసం ఆయా ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన లెక్కలే లేవు. కాగా.. ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలకు సంబంధించిన ఖాళీ గోనె సంచులు, విద్యార్థులు ఉపయోగించి, పాడైన ఐరన్ పెట్టెలు, పాత పుస్తకాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఫలసాయం డబ్బులను ట్రెజరీ ద్వారా గిరిజన సంక్షేమ శాఖ పద్దులో జమ అయ్యేటట్లు బ్యాంకు ద్వారా చెల్లించాలి. కానీ ఎక్కడా ఇదీ జరగడం లేదు. తమ ఇష్టారాజ్యంగా వార్డెన్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపాదనలు పంపించాం ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో గ్యాస్పైనే వంట చేసే విధంగా సిలిండర్ల సరఫరాకు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్కు ఇక్కడి పరిస్థితిపై నివేదిక అందజేశాం. ప్రస్తుతం అన్ని చోట్లా గ్యాస్ సరఫరా చేసేందుకు అవకాశం ఉంది. జీసీసీ ద్వారానే గ్యాస్ సరఫరా చేసే అంశాలను ఆలోచన చేస్తున్నాం. – రుక్మాంగదయ్య, డీడీ, రంపచోడవరంఇబ్బంది పడుతున్నాం ఎంపీపీ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండేందుకు నెలకు ఒక్క సిలిండర్ మాత్రమే ఇస్తున్నారు. దీంతో రెండు వారాలకే అది ఖాళీ అవుతోంది. ఆ తర్వాత కట్టెల పొయ్యిపైనే వంట చేయాలి. కట్టెల పొయ్యిపై వంట చేయడం వలన పొగ వచ్చి ఇబ్బంది పడుతున్నాం. నెలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తే బాగుంటుంది. – లక్షి్మ, వంటమనిషి, ఎంపీపీ స్కూల్, ఎర్రంపాలెంపొగతో ఆరోగ్యానికి ముప్పు ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కట్టెల పొయ్యిపై వంట చేసి భోజనం పెడుతున్నాం. దీని వల్ల పొగతో చాలా ఇబ్బంది పడుతున్నాం. కళ్లు పాడైన వారు, ఊపిరితిత్తులు పాడైన వారు కూడా ఉన్నారు. కట్టెల పొయ్యిపై వంట చేసే బాధను తప్పించాలి. – జమయమ్మ, ఆశ్రమ పాఠశాల, గంగవరం -
గ్రామ సచివాలయానికి జనసేన సర్పంచ్ తాళం
నరసాపురం రూరల్: చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమంటూ జనసేన పార్టీ కి చెందిన సర్పంచ్ గ్రామ సచివాలయానికి తాళం వేసి నిరసన చేపట్టిన ఉదంతం సంచలనం కలిగించింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పసలదీవిలో గురువారం ఈ ఘటన జరిగింది. పసలదీవి సర్పంచ్ కొట్టు రామాంజనేయులు, పదిమంది వార్డుసభ్యులు, ఎంపీటీసీ సభ్యుడు జనసేన పార్టీ కే చెందినవారు. అయినప్పటికీ తమ గ్రామంలో అభివృద్ధి జరగడం లేదని, అభివృద్ధిలో వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ సర్పంచ్ రామాంజనేయులు సచివాలయానికి తాళం వేసి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్కు పంచాయతీరాజ్శాఖ కేటాయించడంతో తమ గ్రామం అభివృద్ధిలో ముందుంటుందని అప్పట్లో ఆశపడినట్లు సర్పంచ్ చెప్పారు. తమ పదవీకాలం పూర్తయిందిగానీ.. అభివృద్ధి మాత్రం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు సొంత నిధులతో గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. వీటికి బిల్లుల చెల్లింపులో గ్రామ కార్యదర్శి తనకు, పంచాయతీ పాలకవర్గానికి కనీస విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయానికి తాళం వేయడంతో కొంతమంది ఉన్నతాధికారులు తనతో మాట్లాడారని, త్వరలో సమస్య పరిష్కరిస్తామని చెప్పారని ఆయన తెలిపారు. ప్రభుత్వంలో భాగమైన జనసేన పార్టీ కి చెందిన సర్పంచ్ ఈ తీరుగా నిరసన చేపట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ కి చెందిన ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ నరసాపురం ఎమ్మెల్యే కావడటంతో ఈ సంఘటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. -
‘స్కిల్’ కేసు క్లోజర్ కాపీ ఇప్పించండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి సీఎం చంద్రబాబుపై గతంలో నమోదు చేసిన కేసును మూసివేసే నిమిత్తం సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను సవాల్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పటి చైర్మన్ అజయ్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తాను ఫిర్యాదుదారు అయితే సీఐడీ తనకు నోటీసు ఇవ్వకుండా క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనను థర్డ్పార్టీగా పేర్కొంటూ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. అజయ్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అజయ్రెడ్డి ఫిర్యాదుదారు అని తెలిపారు. సీఐడీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఫిర్యాదుదారు కాలమ్లో అజయ్రెడ్డి పేరే ఉందన్నారు. స్కిల్ కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దాఖలు చేసిన పలు వ్యాజ్యాల్లోనూ అజయ్రెడ్డిని డీఫ్యాక్టో ఫిర్యాదుదారుగా పేర్కొంటూ ప్రతివాదుల జాబితాలో కూడా చేర్చారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్పై తనకు ముందస్తు నోటీసు ఇవ్వాలని, ఆ రిపోర్ట్ను వ్యతిరేకించే అవకాశం కల్పించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో అజయ్రెడ్డి ఓ పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. అయితే అజయ్రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదంటూ, ఈ కేసులో అతన్ని థర్డ్ పార్టీగా పరిగణిస్తూ ఆ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసిందన్నారు. కేసును పూర్తిగా మూసివేస్తూ కోర్టు తుది నిర్ణయం తీసుకునేలోపు, సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ ‘ప్రొటెస్ట్ పిటిషన్’ దాఖలు చేసే అవకాశం పిటిషనర్కు ఇవ్వాలని కోరారు. సీఐడీ సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, మాధవ్ ఖురానా స్పందిస్తూ.. అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. స్కిల్ కేసులో అజయ్రెడ్డి పిటిషనరే కాదన్నారు. ఈ దశలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేశారు. ఐఆర్ఆర్ కేసును ‘ప్రత్యేక’ కోర్టుకు బదిలీ చేయండిహైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాథమిక చార్జిషీట్, క్లోజర్ రిపోర్ట్ కాపీలు ఇప్పించాలంటూ మరో పిటిషన్సాక్షి, అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్, మాస్టర్ ప్లాన్ అక్రమాలకు సంబంధించి తానిచి్చన ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన కేసును విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కుంభకోణం కేసులో సీఐడీ 2024లోనే చార్జిషీట్ దాఖలు చేసిందని, ఈ కేసును ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయకుండా సాధారణ ఏసీబీ కోర్టులో విచారించడం చట్టవిరుద్ధమని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి, ఓ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారని తెలిపారు. నిందితుల హోదాను బట్టి కేసు విచారణ కేవలం ప్రత్యేక కోర్టులోనే జరగాల్సి ఉంటుందన్నారు. అయితే, ప్రస్తుతం ఈ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు విచారిస్తోందని తెలిపారు. తదుపరి చర్యలన్నీ నిలిపేయండి అశి్వనికుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచి్చన చరిత్రాత్మక తీర్పు ప్రకారం ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను విచారించేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018లో విజయవాడలో ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిందన్నారు. నిందితుల హోదాను బట్టి కేసు విచారణ కేవలం ఈ ప్రత్యేక కోర్టులోనే జరగాలని, సాధారణ ఏసీబీ కోర్టులో కాదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణానికి సంబంధించిన కేసుపై ఏసీబీ స్పెషల్ కోర్టులో జరుగుతున్న విచారణలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. ‘క్లోజర్’ కాపీలు ఇప్పించండి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కుంభకోణం కేసులో 2024లో దాఖలు చేసిన ప్రాథమిక చార్జిషీట్, తాజాగా దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ కాపీలను తనకు అందచేసేలా సీఐడీని ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు 2014–19 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణంపై 2022లో తాను సీఐడీకి ఫిర్యాదు చేశానని రామకృష్ణారెడ్డి తెలిపారు. దర్యాప్తు జరిపిన సీఐడీ కుంభకోణానికి సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించిందని తెలిపారు. 2024లో చార్జిషీట్ కూడా దాఖలు చేయగా.. కోర్టు దానిని సాంకేతిక కారణాలతో వెనక్కి పంపిందన్నారు. ప్రభుత్వం మారడంతో ఐఆర్ఆర్ కుంభకోణం కేసును మూసివేసేందుకు సీఐడీ సిద్ధమై విజయవాడ ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో గత నెల 18న సీఐడీ అధికారులు తనకు ఓ నోటీసు పంపి కేసును మూసివేస్తున్నట్లు తెలిపారన్నారు. 2024 నాటి తొలి చార్జిషీట్ కాపీని గానీ, ఇప్పుడు దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ కాపీని కానీ తనకు అందించడం లేదని వివరించారు. దీంతో సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ కోర్టులో ‘ప్రొటెస్ట్ పిటిషన్’ దాఖలు చేయడం సాధ్యం కావడం లేదన్నారు. చార్జిషీట్ను, క్లోజర్ రిపోర్ట్ను ఫిర్యాదుదారునికి అందించడం దర్యాప్తు అధికారి బాధ్యత అని పిటిషన్లో పేర్కొన్నారు. -
అటవీ సంపదకు చెదలు
అటవీ శాఖ మొండితనం, వ్యాపారుల పట్టుదల వెరసి..రూ.కోట్ల విలువైన ప్రభుత్వ సంపద పనికిరాకుండా పోతోంది. నిబంధనల సాకుతో అటవీ శాఖ అధికారులు, నాణ్యత లేదంటూ వ్యాపారులు బేరసారాలకు దిగడంతో మూడేళ్లుగా సుమారు రూ.2 కోట్ల విలువైన మారుజాతి కలప డిపోల్లోనే మట్టిపాలవుతోంది. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సేకరించిన ఈ కలప, అధికారుల మధ్య సమన్వయ లోపం, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం అటవీశాఖ ఆదాయంపై ప్రభావం చూపనుంది.కొయ్యూరు: అటు అటవీ శాఖకు, ఇటు వ్యాపారులకు మధ్య మూడేళ్లుగా సాగుతున్న ధరల బేరం కొలిక్కి రాకపోవడంతో దాదాపు రూ. 2 కోట్ల విలువైన ‘మారుజాతి’ కలప మట్టిలో కలిసిపోతోంది. తాము నిర్ణయించిన ధరకు ఇవ్వాల్సిందేనని వ్యాపారులు, నిబంధనల ప్రకారం తగ్గించేది లేదని అటవీ శాఖ పట్టుబట్టడంతో ప్రభుత్వానికి రావలసిన ఆదాయం గంగలో కలిసే పరిస్థితి ఏర్పడింది. వివాదానికి కారణం.. : జాతీయ రహదారి 516ఈ విస్తరణలో భాగంగా చింతాలమ్మ, రంపుల ఘాట్ ప్రాంతాల్లోని రిజర్వ్ ఫారెస్ట్ చెట్లను తొలగించారు. ఈ కలపను కాకరపాడు, లోతుగెడ్డ, వెదురునగరం డిపోలకు తరలించారు. ఇందులో ఎక్కువగా సంపెంగ, తినంగి, తంగేడు వంటి మారుజాతి రకాలు ఉన్నాయి. ధరల వ్యత్యాసం.. అటవీ శాఖ అడుగుకు రూ. 550 ధర నిర్ణయించగా, నాణ్యత లేని ఈ కలపకు రూ. 250 కంటే ఎక్కువ ఇవ్వలేమని వ్యాపారులు చెబుతున్నారు. పరిమితి అధికారాల వల్లే..స్థానిక డీఎఫ్వోకు ధరకు కేవలం పది వరకు మాత్రమే తగ్గించే అధికారం ఉంది. అంతకంటే ఎక్కువ తగ్గించాలంటే ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. క్షేత్రస్థాయిలో.. కాకరపాడు, వెదురునగరం, లోతుగెడ్డ డిపోల్లో సుమారు 1,500 క్యూబిక్ మీటర్ల కలప నిల్వ ఉంది. దీనిపై ఏడాది క్రితమే పరిస్థితిని వివరిస్తూ పీసీసీఎఫ్కు చింతపల్లి డీఎఫ్వో లేఖ రాశారు. అయినా నేటికీ ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఎండకు ఎండి, వానకు తడిసి కలప పటుత్వం కోల్పోతోంది. ఇప్పటికే చాలా వరకు కలపకు చెదలు పట్టడంతో వ్యాపారులు అసలు కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. బంగారు, వేగిస వంటి నా ణ్యమైన కలప అమ్ముడవుతున్నా, మారుజాతి కలప మాత్రం పేరుకుపోయి స్థలాన్ని ఆక్రమిస్తోంది. ⇒ వెదురునగరం వంటి డిపోల్లో వెదురు, టేకు తప్ప ఇతర రకాల విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక ధర తగ్గింపు ఉత్తర్వులు ఇవ్వకపోతే, రూ. 2 కోట్ల విలువైన సంపద పూర్తిగా పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. మొండితనం వీడి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణ యం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.పరిస్థితి నివేదించాంకలప పాడైపోతుందని ఇక్కడ పరిస్థితిని పీసీసీఎప్కు వివరిస్తూ లేఖ రాశం. వ్యాపారులు తగ్గించమన్నంత తగ్గించే అవకాశం లేకపోయినా కొంత వరకు తగ్గుతుంది. దీనిపై ఉన్నతా«ధికారుల నుంచి ఆదేశాలు రావాలి. తమ పరిధిలో పది శాతంకు మించి తగ్గించే అవకాశం లేదు. మరోసారి ఇక్కడ మారుజాతి కలప విక్రయం కాని వైనాన్ని వివరిస్తూ లేఖ రాస్తాం – వైవీ నర్సింగరావు, డీఎఫ్వో, చింతపల్లి -
పచ్చటి కొండ కొల్లగొట్టు
పచ్చనేతలు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు. అది అటవీశివారు గ్రామం.. ఆ ఊళ్లో కొండపై పచ్చనేతల కళ్లుపడ్డాయి.. రాళ్లు, కంకర, మట్టి యథేచ్ఛగా తరలించేస్తున్నారు. పచ్చటి కొండను కొల్లగొడుతున్నారు.. కాపాడాలని స్థానికులు కోరుతున్నా.. మామూళ్ల మత్తులో అధికారులు జోగుతున్నారు. ఫలితంగా ఆ ఎత్తైన కొండ కరిగిపోయింది. మిగిలిన హెచ్చుతగ్గులు చదునైపోయి రికార్డులు పుడుతున్నాయి. అయినా అడిగేవారు లేక.. అడ్డుకునే వారు రాక ప్రకృతి ప్రసాదితమైన కొండ మాయమైంది. సాక్షి, టాస్క్ ఫోర్స్: బాబు సర్కారులో పచ్చనేతలు కొండలను చదును చేసి.. పొలాలుగా మార్చేస్తున్నారు. అయినా అడిగేవారు కరువయ్యారు. వివరా ల్లోకి వెళితే.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపా ళెం మండలం నెరబైలు గ్రామ రెవెన్యూ లెక్క దాఖ లా సర్వే నంబర్ 160914లో ఉన్న 1.10 ఎకరాల గుట్టను గత పది రోజులుగా భారీ యంత్రాలతో ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే విలువైన మట్టిని బయటకు తరలించగా కొండ మొత్తం కరిగి పోయింది. ఆ నేలను చదును చేసి పంట పొలాలుగా తీర్చుతుర్చున్న ఘటనపై పలుసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఎత్తైన కొండ కళ్లముందే కరిగించేస్తున్నా అధికారులు స్పందించక పోగా ఆ భూముల కు అక్రమ మార్గంలో ఆక్రమణ దారుల పేరిట రికార్డులు సృష్టించేందుకు సాయం చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దీని వెనుక టీడీపీ మండలస్థాయి నేతలిద్దరితో పాటు గ్రామానికి టీడీపీ సాను భూతి పరులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. పల్లె రోడ్లు ఛిద్రం కొండను తవ్వి మట్టి యథేచ్ఛగా తరలిస్తుండడంతో పల్లె రోడ్లు ఛిద్రమవడంతోపాటు చుట్టు పక్కల పొలాలు సైతం దెబ్బతింటున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను లొంగతీసుకుని ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తుండడంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎత్తైన కొండలు, గుట్టలను తవ్వి పొలాలుగా మార్చుకోవడం, ఆపై రికార్డులు తయారు చేయడం నిరంతర ప్రక్రియగా మార్చుకోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్త మవుతుండగా అన్ని రాజకీయ పారీ్టలు పోరాటాలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అధికారులపై న్యాయ పోరాటం ప్రకృతి వనరులను ధ్వంసం చేసే భూ ఆక్రమణ దారులకు అండగా నిలుస్తున్న స్థానిక రెవెన్యూ అధికారులపై న్యాయ పోరాటం చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులందరికీ ఫిర్యాదులు చేశామని, భూ ఆక్రమణలు, ప్రకృతి వనరులను కాపాడడంలో మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు. -
గుడారాల పండుగ ప్రారంభం
అమరావతి: పల్నాడు జిల్లా లేమల్లె గ్రామంలో 49వ గుడారాల పండుగ గురువారం వైభవంగా ప్రారంభమైంది. లక్షలాది మంది విశ్వాసులు తరలివచ్చారు. దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తును స్తుతి గీతాలతో ఆరాధించారు. ఈ సందర్భంగా హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహం మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే గుడారాల పండుగకు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన విశ్వాసులకు క్రీస్తు కృపాకటాక్షాలు నిత్యం ఉండాలని ప్రార్థించారు. తొలుత దక్షిణాఫ్రికాకు చెందిన దైవజనులు పాస్టర్ జాషువామోజెస్ ప్రత్యేక ప్రార్థనలు చేసి విశ్వాసుల కరతాళ ధ్వనుల మధ్య భారత జాతీయ పతాకంలోని మూడు రంగుల బెలూన్లను, శ్వేతవర్ణ పావురాలను ఎగురవేసి పండుగను ప్రారంభించారు. అనంతరం విశ్వాసులు ఆలపించిన క్రీస్తు స్తుతిగీతాలు ఆకట్టుకున్నాయి. ‘‘హోసన్నా సౌందర్యపూర్ణుడా..’’ అనే పాటల పుస్తకాన్ని ఏలూరుకు చెందిన జ్యోతిరాజ్, స్పర్ధనరాజ్ ఆవిష్కరించారు. స్తుతి గీతాల వీడియో ఆల్బమ్ను అమెరికాకు చెందిన దైవజనులు ఎర్నెట్పాల్ ఆవిష్కరించారు. తొలిరోజు దైవజనులు అబ్రహం, జాన్వెస్లీ, రమేష్, ప్రెడ్డిపాల్, రాజు ఆలపించిన స్తుతిగీతాలు విశ్వాసులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి. -
టిడ్కో ఇంటికి రూ.2 కోట్ల కరెంటు బిల్లు
సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట జగ్గమ్మగారిపేటలో 18–9–70 డోర్ నంబరు గల టిడ్కో ఇంట్లో దాసరి దుర్గ నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటికి రూ.1,99,91,809 కరెంటు బిల్లు వచ్చింది. అది చూసి దుర్గ ఒక్కసారిగా అవాక్కయ్యింది. తన ఇంటికి కరెంటు బిల్లు ఎప్పుడూ రూ.200 కూడా రాదని, అటువంటిది రూ.2 కోట్లు రావడమేమిటని ఆమె విలేకర్ల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఏపీఈపీడీసీఎల్ ఏడీఈ కిరణ్ను ‘సాక్షి’ వివరణ కోరగా మీటర్ నంబరుతో రీడింగ్ పొరపాటున తీయడం వల్ల అంతమొత్తంలో బిల్లు వచ్చినట్లు గుర్తించామని చెప్పారు. వెంటనే సరిచేసి రూ.147కు బిల్లు ఇచ్చామని వివరించారు. -
ఉద్యోగాల్లేవ్.. భృతీ లేదు
సాక్షి, అమరావతి: అధికారం కోసం కూటమి ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన హామీలపై శాసనమండలి అట్టుడికింది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి, సభలో ఒకలెక్క, మండలిలో మరో లెక్క చెబుతున్నారని, అబద్ధాలు చెబుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం శాసనమండలిలో ఈ అంశంపై వాడీవేడీగా చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ సభ్యులు రాజగొల్ల రమేష్యాదవ్, డాక్టర్ మొండితోక అరుణ్కుమార్, డాక్టర్ పెనుమత్స వరాహ వెంకట సూర్యనారాయణరాజు నిరుద్యోగ సమస్యపై మంత్రిని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందా?, ఉంటే నివారణకు తీసుకున్న చర్యలు, నిరుద్యోగ యువతకు అందిస్తున్న ఆర్థిక సాయం వివరాలు వెల్లడించాలని ప్రశ్నించారు. దీనికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సమాధానమిస్తూ నిరుద్యోగ భృతి చెల్లించడం లేదని, దానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వంలో 5,72,280 ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు వాస్తవాలు చెప్పాలని నిలదీశారు. నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారునిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని, ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని ప్రభుత్వం వచ్చాక మోసం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రాజగొల్ల రమేష్ యాదవ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తప్పుడు సమాచారం ఇస్తూ నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత 20 నెలల కాలంలో రాష్ట్రంలో ఎంత శాతం నిరుద్యోగం ఉంది, ప్రభుత్వం ఏమైనా నివారణ చర్యలు తీసుకున్నారా? అని అడిగితే, పొంతన లేని సమాధానాలు చెబుతున్నారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేసి 15 వేల ఉద్యోగాలు డీఎస్సీ ద్వారా ఇచ్చి భారీ బహిరంగ సభలు పెట్టిన వారు 5,72,280 ఉద్యోగాలు ఇస్తే అసలు ఆగుతారా అంటూ ప్రశ్నించారు. ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడిచ్చారో ప్రజలకు తెలియాలని పట్టబట్టారు. ‘‘గడిచిన 20 నెలల్లో రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగులున్నారో లెక్క ఏమైనా ఉందా? దీనిపై ఏమెనా కమిటీ వేశారా? శాసనసభ సాక్షిగా సీఎం 6,28,320 ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పారు, ఇప్పుడు మంత్రి 5,72,280 ఉద్యోగాలు అంటున్నారు. ఇద్దరిలో ఎవరు అబద్ధం చెబుతున్నారు? డిసెంబర్లో రాజ్యసభకు ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగం 5.2 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్లో 8.2 శాతం ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం సమాధానం చెబుతుంది? ఎన్నికల్లో మొదటి హామీగా 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ప్రకటించారు. ఇప్పటి దాకా జాబ్ కేలండర్ ఇచ్చిన పాపాన పోలేదు. దీనిపై మంత్రి సమాధానం చెప్పాలి’’ అంటూ నిలదీశారు. దేశంలో అత్యధిక నిరుద్యోగం ఏపీలోనేఎకనమిక్స్ సర్వే 2025–26 నివేదిక ప్రకారం ఏపీలో నిరుద్యోగం 8.2 శాతం ఉందని, ఇది దేశంలోనే అత్యధికమని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా భారత ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్సు సర్వేలో కూడా 8.2 శాతం నిరుద్యోగంతో రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం నిరుద్యోగ శాతం 8.2 శాతంతో దేశంలోనే ఏపీ టాప్లో ఉన్నట్టు ప్రకటించారని గుర్తు చేశారు. దీన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని అడిగితే పొంతనలేని సమాధానం చెబుతున్నారన్నారు. ‘కేంద్రం చెబుతున్న గణాంకాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏకీభవిస్తే నిరుద్యోగ నివారణకు తీసుకున్న చర్యలేంటి? ఉద్యోగాల కల్పనలో అసెంబ్లీలో సీఎం ఒక నంబర్, మండలిలో మంత్రి చెబుతున్న నంబర్లలో ఏది కరెక్టు? మీరు చెబుతున్న 5,72,280 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో జిల్లాల వారీగా, వారికి చెల్లిస్తున్న వేతనాలతో సమగ్రంగా రాతపూర్వకంగా ఇవ్వాలి’ అని పట్టుబట్టారు. జగన్ 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలిచ్చారు, మీరేమిచ్చారు?నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించేందుకు ఎలాంటి పథకం అమలు చేయడం లేదని సభలో మంత్రి చెప్పడం సరికాదని ఎమ్మెల్సీ పెనుమత్స వరాహæ వెంకట సూర్యనారాయణరాజు అన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి, జాబ్ కేలండర్ ఇస్తామని యువతకు హామీ ఇచ్చారని, ఇప్పుడు జాబ్లెస్ కేలండర్గా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి దాకా జాబ్ కేలండర్నే అమలు చేయలేదు. వైఎస్ జగన్ 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. మీ ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఎంత మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చారు, వారిలో ఎంత మందికి ఉద్యోగాలు లభించాయో జిల్లాల వారీగా నివేదిక ఇవ్వాలి. యువతకు స్వయం ఉపాధికోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పాల’ని డిమాండ్ చేశారు.ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి అని చెప్పాం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అనంతరం మంత్రి రాంప్రసాద్ సమాధానమిస్తూ తాము ఎన్నికల్లో ఇచ్చిన సూపర్–6 హామీల్లో చెప్పింది సరిగా అర్ధం చేసుకోలేదన్నారు. తాము ‘‘20 లక్షల ఉద్యోగాలు లేదంటే నిరుద్యోగ భృతి’’ ఇస్తామన్నామన్నారు. రాష్ట్రానికి కంపెనీలు తీసుకొస్తున్నామని, అవి వస్తేనే ఉద్యోగాలు వస్తాయన్నారు.ఆ లెక్కలు అప్పటివి.. ఈ లెక్కలు ఇప్పటివి: మంత్రి అచ్చెన్న నిరుద్యోగంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ సభలో సీఎం, మండలిలో మంత్రి తప్పుడు లెక్కలు చెబున్నారని, వీరిద్దరిలో ఎవరు చెప్పింది నిజమో చెప్పాలని నిలదీశారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకున్నారు. ‘‘నిన్న సభలో సీఎం చెప్పిన ఫిగరు 6,28,320 ఉద్యోగాల కల్పన పాతది. మండలిలో మంత్రి చెప్పిన 5,72,280 ఉద్యోగాలు ఇప్పటివి.. ఇది తెలుసుకోవాలి’’ అనగానే వైఎస్సార్సీపీ సభ్యులతో పాటు సభలోని చాలామంది సభ్యులు నవ్వుకున్నారు. ఒక్కరోజులోనే లక్ష ఉద్యోగాలు ఎలా తగ్గిపోతాయని ప్రశ్నించారు.టీటీడీ చైర్మన్ను తొలగించాలిమండలిలో వైఎస్సార్సీపీ డిమాండ్ సాక్షి, అమరావతి: కళంకిత ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ చైర్మన్ను ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ గురువారం మండలిలో డిమాండ్ చేసింది. గురువారం ఈ అంశంపై అత్యవసర చర్చ కోరుతూ ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వరుదు కళ్యాణి, భరత్ మండలి చైర్మన్ మోషేన్రాజుకు వాయిదా తీర్మానం అందజేశారు. కాగా, సభ ప్రారంభం కాగానే చైర్మన్ మోషేన్రాజు వైఎస్సార్సీపీ సభ్యులు ఇచ్చిన ఆ వాయిదా తీర్మానం తిరస్కరిస్తున్నట్టు ప్రకటించి, ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రకటించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ‘టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి’ అని నినాదాలు చేస్తూ పోడియం వద్ద నిలబడి ఆందోళన కొనసాగించారు. చైర్మన్ మోషేన్ రాజు వారించినప్పటికీ శాంతించని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు కొందరు పోడియం పైకి వెళ్లి నినాదాలు కొనసాగించారు. దీంతో, సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఛైర్మన్ ప్రకటించారు. వాయిదా అనంతరం దాదాపు అరగంట తర్వాత సభ ప్రారంభం కాగా, ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగింది. -
వేట్లపాలెం ఘటనలో మరో ఇద్దరి మృతి
సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్వర్క్స్లో ఇటీవల జరిగిన ఘోర విస్ఫోటనంలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ పెద్దాపురానికి చెందిన మోర్త శ్రీను (30), వేట్లపాలేనికి చెందిన సప్ప సత్యవేణి (34) గురువారం మృతి చెందారు. బాణసంచా తయారీ కేంద్రంలో గత శనివారం జరిగిన పేలుడులో అక్కడికక్కడే 20 మంది సజీవ దహనమైన విషయం విదితమే. ఇదే ప్రమాదంలో గాయపడిన 9 మందిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఇప్పటి వరకూ 8 మంది మృతి చెందారు. సామర్లకోట కుమ్మర వీధికి చెందిన వేమగిరి దావీదు మృత్యువుతో పోరాడుతున్నాడు. -
విచారణకు హాజరైన సునీల్ నాయక్
నగరంపాలెం: శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో బిహార్ ఐజీ సునీల్ నాయక్ విచారణ నిమిత్తం గురువారం గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. ఉదయం పది గంటలకు హాజరైన ఐజీ సునీల్ నాయక్ సాయంత్రం ఐదు గంటలకు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ విచారణ అధికారిగా వ్యవహరించారు. మరో నాలుగు రోజులు ఆయన్ను విచారించనున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో ఆ రోజు ఎంత మంది ఉన్నారని అడిగినట్లు తెలిసింది. -
సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు రాదు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడంపై ‘సాక్షి’ ప్రచురించిన వార్తాకథనం సభాహక్కుల ఉల్లంఘన కిందకు రాదని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరాం గురువారం హైకోర్టుకు నివేదించారు. సభ లోపల జరిగిన వ్యవహారాలపై రాసిన కథనాలకే సభాహక్కుల ఉల్లంఘన వర్తిస్తుందని చెప్పారు. సభ వ్యవహారాలతో సంబంధంలేని అంశాలపై వార్తా కథనం ప్రచురించడం తప్పు కాదన్నారు. సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని చెప్పారు. ప్రాథమిక ఆధారాలు లేకుండానే సభా హక్కుల ఉల్లంఘనపై ముందే ఓ నిర్ణయానికి వచ్చి, అందుకనుగుణంగా శాసనసభ సెక్రటరీ జనరల్ నోటీసులు జారీ చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఆ కథనం కేవలం పరిపాలనపరమైన అంశానికి సంబంధించింది మాత్రమేనన్నారు. అసలు ఆ కథనం సభా హక్కుల పరిధిలోకి వస్తుందా.. రాదా.. అన్న విషయాన్ని ముందు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాస్తవానికి ఏది సభాహక్కుల పరిధిలోకి వస్తుంది, ఏది రాదు అన్న విషయంపై ఎక్కడా నిర్దిష్టమైన నిర్వచనం లేదని తెలిపారు. తమ కథనం సభాహక్కుల పరిధిలోకి వస్తుందా.. రాదా.. అన్నదానిపై ఓ వైపు న్యాయస్థానం విచారణ జరుపుతుండగానే, ప్రచురించిన వార్తా కథనానికి సంబంధించిన ఆధారాలతో తమ ముందు హాజరుకావాలంటూ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ తాజాగా మరో నోటీసు ఇచ్చారని చెప్పారు. ఆ నోటీసుకు తాము సమాధానం కూడా ఇచ్చామని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో ముందుకెళ్లకుండా ప్రివిలేజ్ కమిటీని, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ సమయంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. ఎలాంటి రాతపూర్వక ఉత్తర్వులు అవసరం లేదని, తదుపరి విచారణ వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వబోమని చెప్పారు. ఏజీ చెప్పిన ఈ వివరాలను నమోదు చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సభా హక్కుల కమిటీకి నివేదించిన స్పీకర్ సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దాన్ని తాను సభలో ప్రస్తావించేందుకు అనుమతించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య గత ఏడాది ఫిబ్రవరి 25న అసెంబ్లీ స్పీకర్ను కోరుతూ నోటీసు ఇచ్చారు. దీంతో స్పీకర్ ఈ వ్యవహారాన్ని సభాహక్కుల కమిటీకి నివేదించారు. ఈ కమిటీ ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ‘సాక్షి’కి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యే నోటీసుతోపాటు సెక్రటరీ జనరల్ ఇచ్చిన షోకాజ్ నోటీసును సవాలు చేస్తూ సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ ఫణికుమార్ గత ఏడాది జూన్లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. ఇచ్చింది షోకాజ్ నోటీసు మాత్రమేనని, దీని తరువాత చాలా ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవంటూ వాటిని కొట్టేశారు. ధర్మాసనం ముందు అప్పీళ్లు ఈ తీర్పును సవాలు చేస్తూ ధనంజయరెడ్డి, ఫణికుమార్ వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై గురువారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరాం, వేలూరు మహేశ్వర్రెడ్డి, అనూప్ కౌషిక్ వాదనలు వినిపించారు. శాసనసభ కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్నప్పుడు, వాటిని అడ్డుకున్నప్పుడే సభాహక్కుల ఉల్లంఘన అవుతుందని శ్రీరాం వివరించారు. సాక్షి కథనం ఎక్కడా సభ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం లేదన్నారు. శిక్షణ తరగతులు నిర్వహించకపోవడం వల్ల ప్రజాధనం వృథా అయిందన్న విషయాన్ని మాత్రమే ఎత్తి చూపిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఉదహరించారు. రూ.కోట్ల ప్రజాధనం వృథాపై సాక్షి కథనం ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల నిర్వహణ విషయంలో సరైన ప్రణాళిక, అవగాహన లేకపోవడంతో కోట్ల రూపాయల మేర ప్రజాధనం వృథా అయింది. ఎమ్మెల్యేలకు రెండు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించాలని శాసనసభ వర్గాలు గత ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించాయి. ఎమ్మెల్యేలకు, అతిథులకు హోటళ్లు, భోజనాలు, బహుమతులు తదితరాల కోసం భారీగా ఖర్చు చేశారు. అయితే లోక్సభ స్పీకర్ ఈ కార్యక్రమానికి రాకపోవడంతో ఆ ఖర్చంతా వృథా అయింది. దీనిపై సాక్షి గత ఏడాది ఫిబ్రవరి 22న ‘కోట్లు ఖర్చు.. శిక్షణ తుస్సు’ శీర్షికన వార్తా కథనం ప్రచురించింది. ఈ వార్తా కథనంతో కంగుతిన్న అధికార పార్టీ నేతలు సాక్షిపై కక్షసాధింపు చర్యలు చేపట్టారు. -
చర్చలేకుండా డైవర్షన్
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంపై అధికారపక్షం అసలు చర్చే జరగనివ్వలేదు. శాసనమండలిలో గురువారం కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు పదేపదే అడ్డుతగులుతూ చర్చను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తన కుటుంబ సంస్థ హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం కల్తీ నెయ్యి పేరుతో అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, దానిపై చర్చిద్దామంటే సభ నుంచి ఆ పార్టీ సభ్యులు పారిపోతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. అశ్లీల వీడియోల్లో ఉన్నది తానేనని బీఆర్ నాయుడు అంగీకరించిన తర్వాత కూడా ఆయన్ను టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించడానికి చంద్రబాబు ఎందుకు భయపడిపోతున్నారని ప్రశ్నించారు. హెరిటేజ్ అనుబంధ ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి కాంట్రాక్టు కోసమే కల్తీ నాటకాన్ని తెరపైకి తెచ్చారని బయటపడడంతో అధికారపక్షం ఇరుకున పడిపోయింది. గురువారం తిరుమల లడ్డూపై దేవదాయ శాఖ మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతుండగా అడ్డుపడి అచ్చెన్నాయుడు లేచి సమస్యను పక్కదారిపట్టించేందుకు ప్రయత్నించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ పోడియంలోకి దూసుకు వచ్చారు. ఈ నిరసన కార్యక్రమం మధ్యనే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్టేట్మెంట్ను చదివేసి మమ అనిపించారు. వైఎస్సార్సీపీ సభ్యుల నిరసనతో సభను చైర్మన్ అయిదు నిమిషాలు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే విధమైన పరిస్థితి కొనసాగడంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.చర్చకు దూరంగా పలాయనం..కల్తీ ఆరోపణలపై చర్చిద్దామంటే అధికారపక్షం పూర్తిగా పలాయనం చిత్తగించింది. దానిపై చర్చ జరగనీయకుండా రకరకాల వాదనలతో సమస్యను డైవర్ట్ చేయడానికి ఆపసోపాలు పడుతోంది. హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు కల్తీ నెయ్యి ఆరోపణలు చేశారని ఆధారాలతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు మండలిలో నిరూపించారు. ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్కి టీటీడీ నిధులు దోచిపెట్టడానికి చేసిన ప్రయత్నాలను వివరించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీటీడీకి కిలో రూ.278కే నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీ ఇప్పుడు ఏకంగా కిలో రూ.658 చొప్పున సరఫరా చేయడానికి కాంట్రాక్టు దక్కించుకుందని వారు పేర్కొన్నారు. ఇందాపూర్ డెయిరీ.. హెరిటేజ్ అనుబంధ సంస్థేనని ఒకసారి, కాదు.. అక్కడ హెరిటేజ్ ఉత్పత్తులు మాత్రమే తయారవుతాయని మరోసారి.. హెరిటేజ్ వెబ్సైట్ను మార్చడమే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ సభ్యులు వివరించారు. హెరిటేజ్ ఆధ్వర్యంలో ఏఆర్, ఇందాపూర్, సంగం, ప్రీమియర్ ఆగ్రో, భోలేబాబా డెయిరీలతో ఏర్పడిన డెయిరీ సిండికేట్ గుట్టును బయటపెట్టడంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వం చర్చలో పాల్గొనకపోవడమంటే హెరిటేజ్ అవినీతిని అంగీకరించినట్లేనని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు పేర్కొన్నారు. కల్తీ జరగలేదని సీబీఐ సిట్ చార్జిషీట్లో పేర్కొనడాన్ని బట్టి రాజకీయ స్వార్థం కోసమే తిరుమల శ్రీవారిని చంద్రబాబు రాజకీయాల్లోకి లాగారని ప్రజలు అర్ధంచేసుకున్నారని వారు వివరించారు. సమాధానం చెప్పలేకే డైవర్షన్..రాజకీయ లబ్ధి, హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం చంద్రబాబు ఘోరమైన కుట్రచేశారని తేలిపోయింది. దానిపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోతోంది. ఏఆర్ డెయిరీ పేరుతో వచ్చిన నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపితే దాన్ని వైష్ణవి డెయిరీ పేరుతో తిరిగి రప్పించి లడ్డూ తయారీకి ఎలా వాడారని అడిగితే దానికి దేవదాయ శాఖ మంత్రి నుంచి సమాధానం లేదు. టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టిన ఇందాపూర్ డెయిరీపై సస్పెన్షన్ ఎత్తివేసింది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. భోలేబాబా డెయిరీకి టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చింది కూడా చంద్రబాబే. వీటిలో దేనికీ సమాధానం చెప్పలేక కూటమి సభ్యులు వేరే అంశాలను లేవనెత్తి సభను డైవర్ట్ చేశారు.టీటీడీ చైర్మన్ను పదవి నుంచి తొలగించాలి..టీటీడీ పవిత్రతను దెబ్బతీసిన బీఆర్ నాయుడు చైర్మన్ పదవికి అనర్హుడు. అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ‘ఆ వీడియోలో తప్పేముందని.. ఆమె కుటుంబంతో 30 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ఆ వీడియోలు, చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్కు బాధిత మహిళ రాసిన లేఖలపై పూర్తిస్థాయి విచారణ జరపాలి. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరం. పవన్ నిజంగా హిందువైతే బీఆర్ నాయుడిని ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలి.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. -
‘ఆశ’యమే ఆగ్రహజ్వాలై
చంద్రబాబు సర్కారు నిరంకుశత్వంపై ఆశా కార్యకర్తలు గర్జించారు. ఆశయ సాధన కోసం రణన్నినాదం మోగించారు. ప్రభుత్వ విధానాలు, వెట్టిచాకిరీ, బానిసత్వంపై నిప్పులుగక్కారు. బెజవాడలో మండుటెండనూ లెక్కచేయక నిరసన గళమెత్తారు. పది డిమాండ్లతో బాబు కూటమికి అల్టిమేటం ఇచ్చారు. సర్కారు వెన్నులో వణుకుపుట్టించారు. సాక్షి, అమరావతి: ఆశా కార్యకర్తలు విజయవాడలో గురువారం చేపట్టిన ధర్నా జయప్రదమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వర్కర్లు చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవులు ఇవ్వకుండా, కనీసం మానవత్వం లేకుండా రేయింబవళ్లూ సర్వేల పేరుతో వేధించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత దారుణంగా మభ్యపెడుతోందని మండిపడ్డారు. ఎన్నిసార్లు వినతులు సమర్పించినా సమస్యలను పెడచెవిన పెట్టిందని ధ్వజమెత్తారు. అనేక రకాల విధులు అప్పగించి తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న చంద్రబాబు సర్కారు తమను బానిసలుగా చూస్తోందని దుమ్మెత్తిపోశారు. పనిభారం తీవ్రమై, చాలీచాలని జీతంతో నరకం అనుభవిస్తుంటే, ప్రభుత్వ వైఫల్యాలను తమపై నెట్టి సర్కా రు మానసిక క్షోభకు గురిచేస్తోందని ఆవేదన వెళ్లగక్కారు. అందుకే ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఆత్మగౌరవం గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు తమ ఆత్మగౌరవాన్ని పెంచిందని ఆశా కార్యకర్తలు చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే గౌరవ వేతనాన్ని రూ.పదివేలకు పెంచారని గుర్తుచేసుకున్నారు. కానీ, చంద్రబాబు ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి రాగానే నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాలి.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనం పెంచాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.10 వేలు అసలు చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో రవాణా ఖర్చులకు రూ.3 వేలు నుంచి రూ.4 వేలు ఖర్చుచేయాల్సి వస్తోందనిన్నారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, అన్ని రకాల సెలవులు మంజూరు చేయాలని, పనిభారం తగ్గించి వెట్టిచాకిరీ, బానిసత్వం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా కార్యకర్తలుగా మార్చాలని, ఖాళీలను భర్తీ చేయాలని, టీఏ, డీఏలు, ఏఎన్ఎం–జీఎన్ఎం శిక్షణ పొందిన వారికి పర్మినెంట్ పోస్టు, రూ.10 లక్షల బీమా, నాణ్యమైన మొబైల్స్, యూనిఫామ్ ఇవ్వడంతోపాటు విధినిర్వహణలో మృతి చెందిన వారికి దహన సంస్కార ఖర్చులుగా రూ.20వేలు ఇవ్వాలనే 10 రకాల డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఇదిలా ఉంటే ఆశా కార్యకర్తల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఆశా కార్యకర్తలు ఆశాల పోరాటం వాయిదా ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హా మీ ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ఆందోళ న, పోరాటాలను తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. చర్చల్లో రమణకుమారి, కమల, వాణిశ్రీ, సత్యవతి, పద్మ, లక్ష్మి పాల్గొన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి ఆశా కార్యకర్తలకు ఇచ్చే గౌరవ వేతనం పెంచాలి. అరకొర వేతనాలతో అవస్థలు పడుతున్నాం. ధరలు పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనం రూ.26వేలకు పెంచాలి. పనిభారం తగ్గించాలి. సెలవులు మంజూరు చేయాలి. వేధింపులు ఆపాలి. వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలి. – ఎ.కమల, భవానీపురం, విజయవాడఉద్యోగ భద్రతేదీ? మా బతుకులకు ఉద్యోగ భద్రత లేదు. సెలవులు ఇవ్వడం లేదు. వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. దీంతో అనారోగ్యాల బారిన పడుతున్నాం. సెలవులు, మెడికల్ లీవులు ఇవ్వాలి. పనిభారం తగ్గించాలి. ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టులు భర్తీ చేయాలి. కనీస వేతనాన్ని రూ.26వేలకు పెంచాలి. ఉద్యోగ భ««ద్రత కల్పించాలి. – బి.సరళ, చింతలపూడి ఎలా బతకాలి? కనీస వేతనాలు ఇవ్వకుండా మాతో అన్ని రకాల పనులు చేయిస్తున్నారు. ముఖ్యంగా యాప్ల పేరుతో సర్వేల భారం మోపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదు. ఆ నెపాన్నీ తమపైనే మోపి వేధింపులకు పాల్పడుతున్నారు. సిమ్లు సైతం పనిచేయకపోవటంతో సొంత డబ్బుతో రీచార్జి చేయించుకుని పని చేయాల్సి వస్తోంది. ఇచ్చే రూ.పదివేలలో రవాణా, ఇతర విధుల ఖర్చులకే నలభైశాతం ఖర్చుచేయాల్సి వస్తోంది. ఇక మిగిలి వాటితో ఎలా బతకాలి? – సీహెచ్ పద్మ, కాకినాడసెలవుల్లేవు.. లాస్ ఆఫ్ పేనే ఏఎన్ఎం శిక్షణ పూర్తిచేసుకున్న ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎం పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం సెలవు కూడా ఇవ్వకుండా అన్ని రకాలుగా చాకిరీ పనిచేయిస్తున్న పభుత్వం కనీస వేతనం ఇవ్వటం లేదు. ఆన్లైన్ సర్వేలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు వెల్నెస్ సెంటర్లోనే కూర్చోమని చెప్పటం ఇబ్బందిగా ఉంది. సెలవులు లేకపోవటం వల్ల శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పుడు లాస్ ఆఫ్ పే భరించాల్సి వస్తోంది. – ఎం.రాధ ధవళేశ్వరం -
హిందూ ధర్మంపై వైఎస్సార్సీపీ డాక్యుమెంటరీ
తాడేపల్లి : హిందూ ధర్మంపై వైఎస్సార్సీపీ డాక్యుమెంటరీ రూపొందించింది. ప్రధానంగా తిరుమల లడ్డూ అంశంతో పాటు మరిన్ని బురదజల్లే కార్యక్రమాలతో ఏడుకొండలను కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తున్న నేపథ్యంలో గోవిందుడు పేరుతో డాక్యుమెంటరీ రూపొందించింది వైఎస్సార్సీపీ.గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీవారికి ఏడు కొండలు ఉండాలని, తిరుమల పవిత్రతను కాపాడుతూ అన్యమత ప్రచారంను నిషేధిస్తూ జీవోలు తెస్తే.. దానిపై చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా బురదజల్లారు. హిందూ ధర్మం కోసం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత నిబద్ధతతో పని చేస్తే.. ఓర్వలేనితనంతో చంద్రబాబు అబద్ధాలు చెప్పి నిందలు వేశారు. ఆఖరికి కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీవారి లడ్డూపై అసత్యాలతో విష ప్రచారం చేసి హిందూ ధర్మానికి చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. వీటిన్నింటిపైనా వైఎస్సార్సీపీ డాక్యుమెంటరీ రూపొందించింది.ధర్మాన్ని హననం చేసిన వారిని ఆ ధర్మమే హననం చేస్తుందని, భక్తి ముసుగులో ద్రోహం చేస్తుంటే ఆ దేవదేవుడు ఊరుకుంటారా చంద్రబాబు?’ అని వైఎస్సార్సీపీ ఈ సందర్భంగా ప్రశ్నించింది. -
రాజమండ్రిలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి నగరం పేకాట అడ్డాగా మారుతోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాజమండ్రిలో పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా పెరిగిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. రాజమండ్రి క్వారీ ఏరియాలో టీడీపీ నేత.. పేకాట క్లబ్బులను భారీగా నిర్వహిస్తుండగా.. స్పెషల్ పార్టీ పోలీసుల దాడుల్లో కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి.జూదంలో పాల్గొన్న 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సంఘటన స్థలంలో కోట్ల రూపాయలు దొరికితే అధికారికంగా వేల రూపాయలు మాత్రమే చూపించే ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాజకీయ నేతలు, పోలీసుల సహకారంతో రాజమండ్రిలో పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయి. పట్టుబడిన డబ్బు గోల్మాల్ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఏపీలో అట్టడుగున లా అండ్ ఆర్డర్: మనోహర్రెడ్డి
సాక్షి, నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో సమర్థవంతమైన అధికారులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం వారిని ప్రత్యర్థి రాజకీయ పార్టీలను వేధించడానికి 'ప్రైవేటు సైన్యం'లా వాడుకుంటోందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, హోంమంత్రి నియోజకవర్గాల్లో హత్యలు, అత్యాచారాలు, గంజాయి విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా 'పొలిటికల్ గవర్నెన్స్'(రాజకీయ పాలన) నడుస్తోందని, శిలాఫలకాలను పగలగొట్టడం నుంచి భౌతిక దాడుల వరకు విధ్వంసమే ధ్యేయంగా కూటమి నేతలు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం దేశంలోనే ఏపీ అట్టడుగు స్థానంలో నిలిచిందని మనోహర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయని మండిపడ్డారు.మాజీ మంత్రి కాకాణిపై 20కి పైగా అక్రమ కేసులు బనాయించిన కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. చివరకు ప్రెస్ మీట్లు పెడితే వాటిపైనా కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. "సూపర్ సిక్స్ హామీల వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తున్నారని.. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రతి అధికారి పేరును డిజిటల్ డెయిరీలో నమోదు చేసి.. భవిష్యత్తులో ప్రభుత్వం మారిన తర్వాత చట్టపరమైన శిక్షలు తప్పవు" అని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ఆపి, శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలని.. లేనిపక్షంలో న్యాయస్థానాల ద్వారా గట్టి పోరాటం చేస్తామని మనోహర రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..భక్తులకు సైతం రక్షణ లేని దుస్థితి:దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో అట్టడుగు స్ధానంలో నిల్చింది. చిట్టచివరి స్ధానంలో ఉన్నప్పటికీ శాంతిభద్రతలు మెరుగుపర్చడానికి కానీ, హత్యలు, అత్యాచారాలు, గంజాయి అమ్మకాలు నియంత్రణలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సీఎం, హోంమంత్రి, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి నియోజకవర్గాల్లో ఇవే సంఘటనలు జరుగుతున్నా చీమకుట్టినట్లైనా లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అత్యంత సమర్థవంతంగా శాంతిభద్రతలు నిర్వహణ ఉండేది. ఇవాళ గుడికి వెళ్తున్న భక్తులకు సైతం రక్షణ లేకుండా పోయింది.అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసులు..పోలీసులు అధికార పార్టీ నేతలకు సలామ్ కొడుతూ వారి ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. పోలీస్ స్టేషన్ పైకి వెళ్లి దాడి చేసిన ఘటనలు గతంలో ఎప్పుడూ లేవు. కూటమి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైన దుస్థితి. నెల్లూరు జిల్లాలో వైయస్సార్సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పెద్ద సంఖ్యలో అక్రమ కేసులు బనాయించారు.మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేసి... దాడికి పాల్పడిన వారిని వదిలేసి, తిరిగి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసి, హత్యాయత్నం చేస్తే, వారిపై బెయిలబుల్ సెక్షన్లు కింది అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. దాడికి గురైన అంబటి రాంబాబు గారిపై నాన్ బెయిల బుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు.కాకాణిపై కక్ష సాధింపు..కాకాణి గోవర్ధన్ రెడ్డి పై 20 కు పైగా అక్రమ కేసులు బనాయించింది. చివరకు గతంలో ఛార్జిషీట్ ఫైల్ చేసిన కేసుల్లో ముద్దాయి కాకపోయినప్పటికీ.. ఎవరో ఒక నిందితుడో లేక సాక్షిగా ఉన్న వ్యక్తో వాంగ్మూలం ఇచ్చారని... నాలుగైదు సంవత్సరాలు తర్వాత గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేస్తున్నారు. మరికొన్ని కేసుల్లో 2019లో ఎవరో మద్యం పంచారని, ఎవరినో తీసుకొచ్చి బెదిరించి, బలవంతం సాక్ష్యం ఇప్పించి.. అందులో గోవర్థన్రెడ్డి ప్రమేయం ఉందని కేసు నమోదు చేస్తున్నారు.సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అనుచరులుతో ఫిర్యాదు చేయించి కేసులు నమోదు చేస్తున్నారు. విలేకరిని బెదిరించిన విషయంపై ప్రశ్నిస్తే.. దాని మీద కేసు నమోదు చేశారు. శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ.. ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారు.. దీనికి ప్రాయశ్చిత్తం చేసుకొండి, టీడీపీ నేతలకు ఇప్పటికైనా బుద్ధి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలకు పిలుపునిస్తూ.. ఆ కార్యక్రమం గురించి మీడియాతో మాట్లాడితే దానిపైనా కేసు నమోదు చేశారు.సోషల్ మీడియాకు సంబంధించి కూడా దాదాపు 8 కేసులు నమోదు చేశారు. ఇటీవల కొవూరులో బాధిత బాలికను పరామర్శించి ప్రెస్ మీట్ పెడుతూ.. శాంతిభద్రతలు కాపాడ్డంలో పోలీసులు విఫలమయ్యారు, పోలీసులు తమ పనితీరు మార్చుకోవాలని మాట్లాడితే దానిపైనా కేసు నమోదు చేశారు. అది కూడా పోలీసుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూటమి పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే మరో కేసు నమోదు చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రూ.3 లక్షలు తీసుకొంటున్నారంటూ బీజేపీ నేత శేషాచలం వాట్సప్లో వీడియో పెడితే.. దాన్ని ఫార్వార్డ్ చేశారని కాకాణి గోవర్ధన్ రెడ్డి పై మరో కేసు పెట్టారు.చరిత్రలో ప్రెస్ మీట్ పెడితే కేసు నమోదు చేయడం ఇంతవరకు లేదు. తెలంగాణా హైకోర్టు ఇటీవల నల్లబాలు కేసులో రాజకీయ నాయకులు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు జాగ్రత్తగా పరిశీలించి.. నిరాధారంగా కేసులు పెట్టడానికి వీల్లేదని చెప్పింది. ప్రజాస్వామ్యంలో కనీస భావప్రకటనా స్వేచ్చే లేకపోతే ఎలా అని తీర్పునిస్తే.. సుప్రీం కోర్టు దాన్ని యథాతథంగా అమలు చేయమని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పింది. అదే విధంగా బాధితులే కేసు పెట్టాలని స్పష్టం చేసింది.కానీ ఈ రాష్ట్రంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆయన ఇంటిపై దాడి చేయడమే కాకుండా.. ఒక ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు నమోదు చేసింది. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఇదే తరహా కక్ష సాధింపు కేసులు నమోదు చేస్తున్నారు. చివరకు విలేకరులు, న్యాయవాదులపైనా కేసులు నమోదు చేస్తున్నారు.న్యాయవాదులపైనా అక్రమ కేసులు..కడప జిల్లా లీగల్ సెల్ ప్రతినిధి నాగిరెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టారు. వైఎస్సార్సీపీ నేతల తరపున కేసులు టేకప్ చేస్తున్నాడని భయపెట్టడానికి ఆయన మీదే కేసు పెట్టారు. చివరకు నా మీద కూడా కేసు నమోదు చేశారు. దానిపై హైకోర్టు తీవ్రంగా మందలించింది. సాక్షిలో వార్తలు రాస్తున్నారని కేసులు పెడుతున్నారు. అదే టీవీ5, ఈటీవీలో ఎంత అసభ్యకరవార్తలు రాసినా, ప్రచారం చేసినా వారిపై ఏ కేసులు ఉండవు. కూటమి ప్రభుత్వంపై వార్తలు రాస్తే మాత్రం... సాక్షితో పాటు యూట్యూబర్స్ పైనా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ తరహా విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైంది.అందుకే దేశంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో అట్టడుగ స్ధానానికి దిగజారింది. ఈ నేపధ్యంలో ఇప్పటికైనా పోలీసులు తమ తీరు మార్చుకోవాలని సూచించారు. పోలీసుల తల ఉన్నది టోపీ పెట్టుకోవడానికే తప్ప ఆలోచించడానికి కాదన్న ఓ కవి మాటలను పోలీసులు నిజం చేస్తున్నట్టే కనిపిస్తోంది. సూపర్ సిక్సి హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలా అక్రమ కేసులు నమోదు చేయడం. .వాటిపై మీడియాలో చర్చలు పెడుతూ తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు.మరోవైపు తమ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తూ వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసిస్తున్నాం. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమై ఇదే తరహాలో వ్యవహరిస్తే.. భవిష్యత్తులో ప్రభుత్వం మారిన తర్వాత వీరి పరిస్థితి ఏంటన్నది ఆలోచన చేసుకోవాలి. అలా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికారులందరి పేర్లను డిజిటల్ డెయిరీలో నమోదు చేస్తున్నాం. ఇలాంటి అధికారులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోకపోతే... వీరందరినీ భవిష్యత్తులో చట్టపరంగా శిక్షించడం ఖాయమని మనోహర్రెడ్డి హెచ్చరించారు. -
15 రోజుల కదిరి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
భక్తుల చేత వసంత వల్లభుడిగా, కాటమరాయుడిగా, ప్రహ్లాద వరదుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రం శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఉంది. గత 27న అంకురార్పణంతో అత్యంత వైభవంగాప్రారంభమయిన ఖాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు పక్షం రోజుల పాటు సాగుతాయి. భక్తప్రహ్లాద సమేత నారసింహుని దర్శనం ఇక్కడ తప్ప మరెక్కడా ఉండదు.హిరణ్యకశిపుని శిక్షించేందుకు, అలాగే తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించేందుకు ‘నర–సింహ’ అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం ఉగ్రరూపంలో సమీపంలోని కదిరికొండ తంలో సంచరించారు. మహర్షులు ఆయనను శాంతింపజేసేందుకు ఆ కొండపై నుండి నారసింహుని వేడుకున్నారు. దీనికి గుర్తుగా ఆ కొండపై నారసింహుని ఆలయం కూడా ఉంది. అదేకొండపై శ్రీవారి పాద ముద్రికలు కూడా ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ‘ఖాద్రి’ అని పిలిచారు. ‘ఖా’ అంటే విష్ణుపాదమని, ‘అద్రి’ అంటే కొండ అని అర్థం. ఖాద్రి కాస్తా ఇప్పుడు కదిరి అని పిలుస్తున్నారు. కదిరి ప్రాంతంలో ఒకప్పుడు ఖాదిరి వృక్షాలు (చండ్ర వృక్షాలు) ఎక్కువగా ఉండేవి. వీటికింద ఒక పుట్టలో నారసింహుడు స్వయంభువుగా వెలిశాడని, అందుకే ఖాద్రీ నారసింహుడని పిలుస్తున్నారని మరో కథనం.రంగనాయకుడి స్వప్నం10వ శతాబ్దంలో అప్పటి పట్నం పాలేగారైన రంగనాయకుడికి చెందిన గోవులు ప్రతిరోజూ ఖాదిరి వృక్షం కింద ఉన్న ఓ పుట్టలో పాలు వదిలేవి. ఆ పాలను నారసింహుడు తాగేవారని, అందువల్లనే రంగనాయకులు ఆర్థికంగా బాగా ఎదిగారని ఒక కథనం. ఓరోజు ఆయనకు శ్రీవారు కలలో కన్పించి తాను స్వయంభువుగా వెలిశానని, పుట్టలో ఉన్న తన విగ్రహాన్ని వెలికితీసి తనకు గుడి కట్టించమని కోరితే ఆలయం నిర్మించినట్లు బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తోంది. నాటి ఆలయం కాలగతిలో అదృశ్యం కావడంతో బుక్కరాయలు, హరిహర రాయలు, తర్వాత శ్రీకృష్ణ దేవరాయుల కాలంలో ఈ గుడి సంపూర్ణ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది.వసంత వల్లభుడని కూడా...శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం భృగుమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడని, అందుకు మెచ్చిన విష్ణువు తాను కోనేటిలో వెలిశానని, తన విగ్రహాలను వెలికితీసి పూజాది కార్యక్రమాలు చేయాలని కోరినట్లు ఇంకో కథనం. ఉత్సవ విగ్రహాల వెలికితీత వసంత మాసంలో జరగడంతో స్వామివారిని వసంత వల్లభుడని కూడా పిలుస్తున్నారు. అందుకే కోనేరును భృగుతీర్థమని కూడా పిలుస్తారు. ఆ ఉత్సవ విగ్రహాలనే ఇప్పటికీ బ్రహ్మోత్సవాల్లో పక్షం రోజులపాటు ప్రతిరోజూ తిరువీధుల్లో ఊరేగిస్తారు.దేశంలోనే 3వ అతి పెద్ద బ్రహ్మరథంస్వామివారి బ్రహ్మ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు. 130 ఏళ్ల క్రితం ఈ బ్రహ్మరథం తయారు చేశారు. రథంపై సుమారు 256 శిల్పకళాకృతులను టేకుతో అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తర్వాత 3వ అతిపెద్దది ఈ ఖాద్రీశుడి బ్రహ్మరథం.ఏ రోజు ఏ ఉత్సవం?గత నెల 27వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం గావించారు. 28న శ్రీవారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ నెల 4వ తేదీన బ్రహ్మ గరుడసేవ, 5న శేషవాహనం, 6న పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనం, 7న మోహినీ ఉత్సవం, 8న ప్రజాగరుడసేవ, 9వ తేదీన గజవాహనం, 10న బ్రహ్మ రథోత్సవం, 11న అశ్వవాహనం, 12న తీర్థవాది ఉత్సవం చివరగా 13వ తేదీన జరిగే పుష్పయాగోత్సవంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.– చెరువు శ్రీనివాసరెడ్డి, సాక్షి, కదిరిపక్షం రోజుల బ్రహ్మోత్సవాలు15 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరిగేది కదిరిలో మాత్రమే. ఇంకెక్కడా జరగవు. ప్రహ్లాద సమేత నారసింహుడి దర్శనం కూడా ఇంకెక్కడా ఉండదు. ప్రతినెలా స్వాతినక్షత్రం రోజు మూల విరాట్కు అభిషేకం చేస్తాం. ఆ సమయంలో స్వామివారికి చెమట పట్టడాన్ని గమనించవచ్చు.– నరసింహాచార్యులు ఆలయ ప్రధాన అర్చకులు, కదిరి -
‘జాబ్ కేలండర్ అదిగో, ఇదిగో అంటూ నమ్మించి దగా చేశారు’
తాడేపల్లి : నిరుద్యోగులను చంద్రబాబు నిలువునా మోసం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ ధ్వజమెత్తారు. జాబ్ కేలండర్ అదిగో, ఇదిగో అంటూ నమ్మించి దగా చేశారని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, మార్చి 5వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన మొండితోక అరుణ్కుమార్.. చంద్రబాబు హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు కంటే తొలగించినవే ఎక్కువంటూ విమర్శించారు. ‘చంద్రబాబు మాటలేమో మిలియన్స్లో ఉంటాయి, గ్రౌండ్లోనేమో అన్నీ వేకెన్సీలే కనబడుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సొల్లు కబుర్లు చెప్పారు. నారా లోకేష్ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. మంత్రి 5.77 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. చంద్రబాబేమో ఏకంగా 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ముగ్గురూ మూడు రకాల మాటలు చెప్పారు. అందరూ కలిసి ప్రజలను మభ్యపెట్టటమే పనిగా పెట్టుకున్నారు. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో ఆ వివరాలు ఇవ్వమంటే పారిపోతున్నారు. అసలు ఈ ప్రభుత్వ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి?, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా ఎందుకు చెప్పరు?, కాకి లెక్కలతో కాలం వెళ్లబుచ్చటమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. ఏపీలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని కేంద్రమే పార్లమెంటులో ప్రకటించింది. ఏపీలో నిరుద్యోగం రేటు 4.1% పెరిగిందని కేంద్రమే తేల్చి చెప్పింది. అనేక సర్వే సంస్థలు 8% నిరుద్యోగం పెరిగిందని చెప్తున్నాయి. చీఫ్ జాబ్ క్రియేటర్ని అని చెప్పుకునే లోకేష్ మరి 8% నిరుద్యోగం పెరుగుతుంటే ఏం చేస్తారు?, దీన్ని బట్టే లోకేష్ క్రియేటివిటీ, సమర్ధత ఏపాటిదో అర్ధం అవుతోంది. ఏపీకి పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు పెరిగితే మరి జీఎస్టీ ఎందుకు తగ్గుతోంది?, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఏమయ్యాయి?, ప్రజల్లో కొనుగోలు శక్తి ఏమయ్యాయి?, మా హయాంలోని డీఎస్సీ అమలు చేసి అదికూడా తమ గొప్పగా లోకేష్ చెప్పుకోవటం సిగ్గుచేటు.ఉద్యోగాలు భారీగా పెరిగితే గతేడాది ప్రతి 18 గంటలకు ఒక నిరుద్యోగి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?, ఏ విభాగంలో ఎన్ని ఉద్యోగాలు, ఎవరెవరికి ఇచ్చామో డీటైల్స్ అన్నీ డొమైన్ లో పెట్టాం. మరి చంద్రబాబు ఇచ్చినట్టు చెప్తున్న 6.28 లక్షల ఉద్యోగాల వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టటం లేదు?, చంద్రబాబు హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు కంటే తొలగించినవే ఎక్కువ. ఒకవైపు నిరుద్యోగం పెరుగుతుంటే.. మరోవైపు ఎక్కువ మంది పిల్లల్ని కనమని చంద్రబాబు సలహా ఇస్తున్నారు. ఇదేనా చంద్రబాబు విజన్?, ముందు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ తర్వాత సలహాలు ఇస్తే బాగుంటుంది’ అని సూచించారు. -
భారత్ కనెక్ట్ ఈ-చలాన్: ఏపీ, తెలంగాణలో భారీ స్పందన
భారత్ కనెక్ట్ ప్లాట్ఫామ్లో ప్రారంభించిన ఈ-చలాన్ సేవకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి స్పందన లభిస్తోంది. 2025 అక్టోబర్ నుంచి ఏపీ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో 4.5 లక్షలకు పైగా, తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో 1.3 లక్షలకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి.ఫిబ్రవరి 2026లోనే ఏపీలో 1.02 లక్షలు, తెలంగాణలో 22,882 లావాదేవీలు జరిగాయి. భారత్ కనెక్ట్ ద్వారా ట్రాఫిక్ చలాన్ వివరాలు తెలుసుకుని డిజిటల్గా చెల్లించే వెసులుబాటు లభిస్తోంది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు హైదరాబాద్లో డ్రోన్ ప్రచారం కూడా నిర్వహించారు. ప్రధాన ట్రాఫిక్ కూడళ్ల వద్ద ఇంటరాక్టివ్ స్క్రీన్లను డ్రోన్ల ద్వారా ప్రదర్శిస్తూ ఈ-చలాన్ సేవపై ప్రచారం చేశారు. ప్రస్తుతం 700కు పైగా యాప్లు, బ్యాంకుల ద్వారా ఈ సర్వీసు అందుబాటులో ఉంది.ఢిల్లీ, గుజరాత్లో కూడా ఈ కేటగిరీ ప్రస్తుతం అందుబాటులో ఉంది.“భారత్ కనెక్ట్లోని ఈ-చలాన్ సేవ, డిజిటల్ అప్గ్రేడ్ మాత్రమే కాదు. ప్రభుత్వ సంస్థలు, టెక్నాలజీ ప్లాట్ఫాంలు కలిసి పని చేస్తే పౌరులకు అందించే సేవలను సరికొత్తగా నిర్వచించేందుకు వీలవుతుందని తెలియజెప్పేందుకు ఇదొక శక్తివంతమైన ఉదాహరణ. ఈ ప్రయత్నంలో మాకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ పోలీస్, తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ శాఖలకు కృతజ్ఞతలు. ప్రజలకు అవసరమైన కీలక చెల్లింపులను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తేవడంలో ఇది కీలక అడుగు,” అని ఎన్బీబీఎల్ (NBBL) ఎండీ & సీఈఓ నూపూర్ చతుర్వేది తెలిపారు. -
‘అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలి’
విజయవాడ: కులమతాలను రెచ్చగొట్టేలా సభలో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్పీలు డిమాండ్ చేశారు. అన్ని మతాలను గౌరవించాలని రాజ్యాంగం చెబుతుంటే, అచ్చెన్నాయుడు మాత్రం కులమతలాను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మండిపడ్డారు. ఈరోజు(గురువారం, మార్చి 5వ తేదీ) శాసనమండలి సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ.. ‘ అచ్చెన్నాయుడితో మాట్లాడిస్తున్నది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. రేపు వ్యవసాయం పై జరగాల్సిన చర్చను డైవర్ట్ చేయడం కోసమే ఇలా చేస్తున్నారు. అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలి. బీఆర్ నాయుడిని తొలగిస్తారా లేదా?’ అని ప్రశ్నించారు.మరో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘ సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. కులమత రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటు. మమ్మల్ని కాదు.. చంద్రబాబుని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించాలి. వెనక్కి పంపించిన ట్యాంకర్లు ఎందుకు వాడారో చంద్రబాబుని అడగాలి.ఇందాపూర్ కు ఎందుకు నెయ్యి టెండర్లు ఇచ్చారో చంద్రబాబుని అడగాలి. దేవుడి సొమ్మును ఎందుకు పక్కదారి పట్టించారని అడగాలి’ అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ తిరుపతి లడ్డూ పై అపవిత్రమైన మాటలు మాట్లాడింది చంద్రబాబు. లడ్డు పై మా ప్రశ్నలకు దేవాదాయ శాఖ మంత్రి సమాధానం చెప్పలేకపోయారు. కల్తీ జరిగింది మీ హయాంలోనే. వెనక్కి పంపిన నెయ్యి ట్యాంకర్లు వాడింది మీ హయాంలోనే. ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ కు దోచిపెట్టడానికే నెయ్యి ధరలు పెంచారు. దీని వెనుక పెద్ద ఆర్ధిక దోపిడీ కుట్ర ఉంది’ అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ లడ్డు పై చర్చను పూర్తిగా కొనసాగనివ్వలేదు. లడ్డు పై మా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతీసారీ కల్తీ నెయ్యి తిరుమలకు వెళ్తోంది. తమ బండారం బయటపడుతుందని వాస్తవాలను రానివ్వడం లేదు. తిరుమల దర్శనం చేసిన తర్వాతే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా దేవదేవుడిని దర్శించుకున్నారు’ అని స్పష్టం చేశారు. -
చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి లేఖ
రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టులోని GAP-2 ఎర్త్ కోర్ రాక్ ఫిల్ (ECRF) డ్యామ్ రూపకల్పనలో వ్యత్యాసాలు, భద్రతా పరమైన ముప్పు గురించి లేఖలో ప్రస్తావించారు.సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) నివేదికలను పరిశీలించిన తర్వాతే ఈ అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళుతున్నట్టు ఉండవల్లి స్పష్టం చేశారు.ఉండవల్లి లేఖలో ప్రధాన అంశాలు..పూర్తి సాంకేతిక, డిజైన్ అనుమతులు లేకుండా పనులు కొనసాగించడం డ్యామ్ పటిష్టతకు, ప్రజా భద్రతకు ముప్పునది మట్టం కంటే 7.18 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరుగుతోంది డ్యామ్ కింద ఉండే డయాఫ్రమ్ వాల్ కేవలం నీటి సీపేజీని అడ్డుకోవడానికి (Cut-off wall) మాత్రమే, అది డ్యామ్కు పునాది కాదు .పునాది లోపభూయిష్టంగా ఉంటే భవిష్యత్తులో ఇసుక కోతకు గురై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది . ఎటువంటి సరైన కారణం లేకుండా టెయిల్ వాటర్ లెవల్ను +25 మీటర్ల నుండి +16.0 / +13.5 మీటర్లకు మార్చడంపై CWC అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతర్జాతీయ కన్సల్టెంట్ AFRY నుండి రావాల్సిన ఫిల్టర్ డిజైన్, స్లోప్ స్టెబిలిటీ వంటి కీలక పత్రాలు ఇంకా CWCకి అందలేదు. ఇవి లేకుండా పనులు ముందుకు తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధం భూకంపాలను తట్టుకునే సామర్థ్యం (Seismic resilience) విషయంలో పాత మరియు కొత్త ప్రమాణాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి, వీటిని సరిచేయాల్సి ఉందిభవిష్యత్తులో సరిదిద్దలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది . -
రాజమండ్రి కల్తీ పాల ఘటన.. మరో మహిళ మృతి
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరో మహిళ మరణించింది. లాలాచెరువుకు చెందిన వెంకటలక్ష్మి (69) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. దీంతో, కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. అయితే, అనధికారికంగా ఇప్పటివరకు పదిమంది మృతి చెందినట్టు సమాచారం.ఇక, రాజమండ్రి కల్తీ పాల బాధితులు వరుసగా నాలుగు రోజులుగా రోజుకొకరు చొప్పున ప్రాణాలు విడుస్తున్నారు. కల్తీ పాలతో అనారోగ్యం పాలై ఇంకా 11 మంది నాలుగు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురికి వైద్యులు..వెంటిలేటర్పై డయాలసిస్ చేస్తున్నారు. అలాగే, మరో నలుగురికి డయాలసిస్ కొనసాగుతోంది. -
ప్రొద్దుటూరులో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశ్వీరాదం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. వైఎస్సార్ జిల్లా పర్యటించారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ క్రమంలో నవ దంపతులు కృష్ణ కావ్య, వినీత్ రెడ్డిలను వైఎస్ జగన్ ఆశ్వీరదించారు.ఇక, వైఎస్ జగన్ ప్రొద్దుటూరు వస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు హెలీప్యాడ్, కల్యాణ మండపం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. తమ అభిమాన నేతలకు స్వాగతం పలికారు. దారి పొడవునా పూల వర్షం కురిపించారు. దీంతో, అభిమానులకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు కదిలారు. -
చిన్నాన్న ఇంట్లో తమ్ముడు బందీ..?
పశ్చిమగోదావరి : ‘మా తమ్ముడిని నన్నూ కలపండి.. చిన్నాన్న ఇంటి వద్ద తమ్ముడు బందీగా ఉన్నాడు’ అంటూ పాలకొల్లులో మేనమామ వద్ద ఉంటున్న అన్న కోటి శ్రీహర్ష ఆవేదన చెందుతున్నాడు. మేనమామ నరేష్ బాధిత బాలుడు హర్ష తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన మర్రి నాగేంద్రబాబు, నాగమల్లేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కోటి శ్రీహర్ష 10వ తరగతి, చిన్న కుమారుడు తులసి విశ్వాంత్ 9వ తరగతి చదువుతున్నాడు. నాగేంద్రబాబు విద్యుత్ లైన్మెన్గా పనిచేశారు. 2023లో నాగమల్లేశ్వరి కేన్సర్తో, 2025లో నాగేంద్రబాబు అనారోగ్యంతో మరణించారు. దీంతో పాలకొల్లుకు చెందిన మేనమామ కొమిరిశెట్టి నరేష్ పిల్లలిద్దరినీ పాలకొల్లు తీసుకువచ్చి చదివిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో పిల్లల చిన్నాన్న రఘునాథ్ పాలకొల్లు వచ్చి నాగేంద్రబాబు కార్యక్రమం చేయాలని చెప్పి శ్రీహర్ష, విశ్వాంత్ను వినుకొండ తీసుకువెళ్లాడు. నెల రోజులు గడిచినా పిల్లలను పంపకపోవడంతో నరేష్ నిలదీశాడు. దీంతో రఘునాథ్ అసలు స్వరూపం బయటపడింది. పిల్లల తండ్రి నాగేంద్రబాబు చాలా అప్పులు చేశాడని, ఆ బాకీలు ఎవడు తీరుస్తాడని అంటూ.. పిల్లలు కావాలంటే రెండు చెక్కులు, రెండు నోట్లు ఇవ్వాలని అన్నాడు. తెలివితేటలు చూపిస్తే అంతుచూస్తానని బెదిరించాడు. దీంతో నరేష్ గత నెల 12న పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు రంగంలోకి దిగారు. పల్నాడు జిల్లా అధికారులకు సమాచారం అందించగా.. అక్కడి అధికారులు రఘునాథ్ ఇంటికి వెళ్లి విచారించి శ్రీహర్షను మాత్రమే విడిపించి పాలకొల్లు పంపించారు. విశ్వాంత్ను అక్కడే ఉంచడంపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులను అడగ్గా.. బాబాయి ఇంటి వద్ద బాగానే ఉందని చెప్పాడని, దీంతో అక్కడే ఉంచేసినట్టు సమాచారం ఇచ్చారు. తాళం వేసి ఇంట్లో ఉంచేవారు తాను పాలకొల్లు వచ్చి పది రోజులు కావస్తుందని, తమ్ముడు ఒక్కసారి మాత్రమే ఫోన్ చేశాడని శ్రీహర్ష అన్నాడు. తమ్ముడు ఏమీ మాట్లాడలేకపోతున్నాడని, తనను పంపడం లేదని అన్నాడని కన్నీటి పర్యంతమయ్యాడు. మా నాన్న చేసిన అప్పుల కోసం మమ్మల్ని నిలదీస్తున్నారని, దయచేసి తమ్ముడినీ నన్నూ కలపండని వేడుకుంటున్నాడు. ఈనెల 16 నుంచి పదో తరగతి పరీక్షలు మొదలవుతున్నాయని, తమ్ముడిపై బెంగతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. వినుకొండలో తమను తాళం వేసి ఇంట్లోనే ఉంచేవారని, కనీసం టాయిలెట్కు వెళ్లాలన్నా వాళ్లకు చెప్పాల్సి వచ్చేదని అంటున్నాడు. ఇదిలా ఉండగా శ్రీహర్షను మాత్రమే విడిపించి విశ్వాంత్ను అక్కడే ఉంచిన చైల్డ్ వెల్ఫేర్ అధికారుల తీరుపై అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎర్రబుక్లు, పిచ్చిబుక్లు మమ్మల్ని ఏమీ చేయలేవు: అంబటి
సాక్షి, విశాఖపట్నం: తన ఇంటిపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మానిటర్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలీసుల సాక్షిగా తన ఇంటిపై దాడి జరిగిందన్నారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. భగవంతుడి దయ వల్ల తనను చంపలేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కాపు నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. విశాఖలోని కరణం ధర్మశ్రీ నివాసంలో విశాఖ కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఇటీవల పరిణామాలపై కాపు నేతలు చర్చించారు. అలాగే, కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు, అరెస్ట్లపై కాపు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేతలు పాల్గొన్నారు.అనంతరం, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీకి చెందిన వారు నా ఇంటిపైకి వచ్చారు.. కులం పేరుతో దూషించారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు?. గుంటూరు నడి బొడ్డున నా ఇంటిపై దాడి చేశారు. నా ఇంటిపై దాడిని టీవీ చానెల్స్ లైవ్ ఇస్తున్నా ప్రభుత్వం తెలియనట్టుగా ఉంది. భగవంతుడి దయ వల్ల నన్ను చంపలేదు. రెడ్బుక్ను మా కుక్క లెక్కచేయదంటే లోకేష్కు కోపం వచ్చిందేమో.నేను సెంటర్ జైల్లో ఉన్నప్పుడు నా మీద ఎంతో ప్రేమ అభిమానం చూపించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు తరలి వచ్చారు. నా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నాపై దాడి చేసి అక్రమంగా జైలుకు పంపారు. నన్ను 18 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు. నాపై జరిగిన దాడి ఒక కులంపై మరొక కులం చేసిన దాడిగా భావించాలి. చరిత్రలో ఎన్నడు ఎప్పుడు జరగని దాడి నాపై జరిగింది. టీడీపీ గుండాలకు అలుపు వచ్చే వరకు దాడి చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 12 గంటలకు దాడి జరిగింది. చంద్రబాబు పతనం ప్రారంభమైంది. నాపై చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాను. ఎర్రబుక్కులు, పిచ్చిబుక్కులు మమ్మల్ని ఏమీ చేయలేవు.కులాలను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు. టీడీపీ గూండాలు వంగవీటి రంగాను దారుణంగా చంపారు. పోలీసులు సహకారంతో రంగాను హత్య చేశారు. అదేవిధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని నాపై దాడి చేశారు. కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీ కోసం ముద్రగడ ఉద్యమం చేశారు. కాపుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడను జైల్లో పెట్టారు, చంపాలని చూశారు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు కాబట్టి కాపులు మా వైపు ఉన్నారనుకుంటే అది మీ భ్రమ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
బీఆర్ నాయుడిని వెంటనే తప్పించాలి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..శాసనమండలి మీడియా పాయింట్..ఉద్యోగాలపై ప్రశ్న..నిరుద్యోగ యువతకు ఆర్ధిక సాయంపై సభలో ప్రశ్నించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్..5,72, 280 ఉద్యోగాలిచ్చామని మంత్రి చెబుతున్నారువైఎస్ జగన్ ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసిన ప్రభుత్వం ఇదిపట్టుమని 15 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారురాష్ట్రంలో నిరుద్యోగుల లెక్క ఏమైనా ఉందా?నిరుద్యోగుల కోసం ఏమైనా కమిటీ వేశారా?సాక్షాత్తూ సీఎం చంద్రబాబు 6,28,320 ఉద్యోగాలిచ్చామని చెప్పారుఉద్యోగాలపై సీఎం చెప్పింది అబద్ధమా మంత్రి చెప్పింది అబద్ధమా?ఏపీలో 8.2% శాతం నిరుద్యోగం ఉందని కేంద్రం చెప్పింది20 లక్షల ఉద్యోగాలు, మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి హామీ ఏమైందిఎమ్మెల్సీలు భరత్, తూమాటి మాధవరావు కామెంట్స్..టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తక్షణమే తప్పించాలిబీఆర్ నాయుడి చరిత్ర గురించి ఇందులేఖ అనే మహిళ చంద్రబాబు లేఖరాశారుఅలాంటి వ్యక్తిని చంద్రబాబు ఎలా చైర్మన్ గా నియమిస్తారుబీఆర్ నాయుడు వంటి వ్యక్తి చైర్మన్గా కొనసాగడం వల్ల తిరుమల పవిత్ర దెబ్బతింటోందిఎన్నో ఫిర్యాదులు వచ్చినా బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా నియమించారుఅపవిత్రమైన వ్యక్తిని టీటీడీ చైర్మన్ చేయడం వల్లే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయి30 ఏళ్ల నుంచి ఆ మహిళతో తనకు సంబంధం ఉందని బీఆర్ నాయుడు చెబుతున్నారుభగవద్గీతలో ఏముందని మాట్లాడటానికి నువ్వు అసలు మనిషివేనా?రెండు మీడియా సంస్థల మధ్య జరుగుతున్న యుద్ధంలో వైఎస్సార్సీపీని బలిచేయాలని చూస్తున్నారుసోషల్ మీడియాలో మీ వీడియోలు బయటికి వచ్చాయిహిందూ ధర్మాన్ని కాపాడటం కోసమే మేం పోరాడుతున్నాంబీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..బీఆర్ నాయుడు అత్యంత కళంకితుడుఅలాంటి వ్యక్తిని చంద్రబాబు టీటీడీ చైర్మన్ను చేశారుచంద్రబాబుకి హిందువులంటే గౌరవం ఉంటే బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలిబీఆర్ నాయుడు చాలా నీచంగా మాట్లాడుతున్నారుభగవద్గీత అంటే గౌరవం లేని వ్యక్తి టీటీడీ చైర్మన్గా కొనసాగడానికి అర్హుడా?.మీకు వ్యాపారాలే ముఖ్యమైతే తక్షణమే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయండిబీఆర్ నాయుడిని చైర్మన్గా చేసిన తర్వాతే తిరుమల అపవిత్రమైందిలడ్డు కల్తీ ప్రచారంతో కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారువైకుంఠ ఏకాదశి రోజున భక్తులు చావుకు కారణమయ్యారుగోశాలలో భారీగా గోవులు చనిపోయాయిబీఆర్ నాయుడు నైతిక విలువలు లేని వ్యక్తిఅందుకే తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయిహీరోయిన్లకు 15 నిమిషాల్లో దర్శనం చేయిస్తారు.సామాన్య భక్తులను గాలికి వదిలేస్తారు.హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, పవన్, బీఆర్ నాయుడికి ఉందా? టీడీపీ అంటే టెంపుల్ డెమాలిష్ పార్టీహిందూ మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబులడ్డూ విషయంలో పవన్ దుర్గగుడి మెట్లు కడిగారుసనాతన ధర్మం కోసం పనిచేస్తానన్న పవన్ ఇప్పుడు ఏ మెట్లు కడుగుతారుకళంకిత వ్యక్తిని టీటీడీ చైర్మన్గా చేసినందుకు పవన్ తిరుమల మెట్లు కడగరా?. సమావేశాలు ప్రారంభం.. ప్రారంభమైన మండలి సమావేశాలుమండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల వాయిదా తీర్మానంకళంకిత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తొలగించాలని కోరుతూ వాయిదా తీర్మానంవాయిదా తీర్మానం ఇచ్చిన ఎమ్మెల్సీలు తుమాటి మాధవరావు, వరుదు కల్యాణి, భరత్వైఎస్సార్సీపీ తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్వాయిదా తీర్మానంపై చర్చించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నినాదాలుబీఆర్ నాయుడును తొలగించాలని నినాదాలువైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలతో మండలి వాయిదా. -
27న పెళ్లికి ముహూర్తం.. ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
ఇద్దరూ కూతుళ్లే అని ఆ తల్లిదండ్రులు కుమిలిపోలేదు. భారంగా భావించనూ లేదు. తాహతుకు మించి పెంచారు.. ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న పెద్దమ్మాయికి పెళ్లి చేసి బాధ్యత నెరవేర్చాలనుకున్నారు. మంచి సంబంధం చూసి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసిన ఆ తల్లిదండ్రుల ఆనందం అంతలోనే ఆవిరి అయిపోయింది. పెళ్లికూతురి ముస్తాబులో కళకళలాడాల్సిన కుమార్తె పట్టాల మీద ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా మారడం వారిని కలచి వేసింది. ఇంతకూ ప్రవల్లిక మరణానికి కారణం ఏమిటి..! బలవన్మరణానికి పాల్పడిందా? పెళ్లి ఇష్టం లేదా?? ఇంకేదైనా బలమైన కారణం ఉందా??? పోలీసు దర్యాప్తులోనే తేలుతుంది.టెక్కలి రూరల్/నందిగాం: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో ఐటీ సెకెండియర్ చదువుతున్న కింతలి ప్రవల్లిక(19) బుధవారం రైలు కింద పడి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. నందిగాం మండలం వేణుగోపాలపురం గ్రామానికి చెందిన కింతలి గోపాలరావు, శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ప్రవల్లిక ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుండగా, చిన్న కుమార్తె హారిక గుంటూరులో బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. గోపాలరావు తాపీమేస్త్రీ కాగా శిరీష గృహిణి. ప్రవల్లికకు ఈ నెల 27న వివాహం చేసేందుకు నిశ్చయించారు. ఎప్పట్లాగే బుధవారం ఉదయం కాలేజీకి వెళ్లిన ప్రవల్లిక టెక్కలి మండలం తలగాం సమీపంలో సాయంత్రం వచ్చే రాజారాణి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి మృతి చెందింది. గమనించిన స్థానికులు ఐడీ కార్డు ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెలవిసేలా రోదించారు. కొద్ది రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఇలా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా,కాలేజీకి వెళ్లిన ప్రవల్లిక నందిగాం వైపు రాకుండా నౌపడ రూట్ ఎందుకు వెళ్లింది.. మృతి చెందడానికి కారణాలు ఏంటనే విషయాలు తెలియాల్సి ఉంది. -
విశాఖలో వైఎస్ జగన్.. పోటెత్తిన అంతులేని అభిమానం (ఫొటోలు)
-
‘అచ్చో’సిన మతవిద్వేషం
సాక్షి, అమరావతి: కుల మతాలకు అతీతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేస్తామంటూ ప్రమాణం చేసిన మంత్రులే బుధవారం శాసనమండలి సాక్షిగా వ్యక్తులకు మతాలను ఆపాదిస్తూ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ‘‘మీరు, మీ పార్టీ నాయకుడు క్రిస్టియన్లు కాబట్టే వెంకటేశ్వరస్వామి, హిందుసమాజంపై కక్ష కట్టి వ్యవహరిస్తున్నారు’’ అంటూ మంత్రి కె.అచ్చెన్నాయుడు నేరుగా మండలి చైర్మన్ మోషేన్ రాజు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం తిరుమల లడ్డూపై చర్చ జరుగుతున్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేరుగా చైర్మన్ స్థానానికే మతాలను ఆపాదించడంతో సభ ఒక్కసారిగా భగ్గుమంది. మంత్రులమనే బాధ్యత మరిచి మరీ చట్ట సభలోనే ఎస్సీ వర్గానికి చెందిన హిందువైన మోషేన్ రాజు మతాన్ని మార్చే దుస్సాహసానికి టీడీపీ ఒడికట్టింది. తిరుపతి లడ్డూపై చర్చను పక్కదోవ పట్టించే పక్కా ప్రణాళికతో టీడీపీ మంత్రులు సభలో లేని వైఎస్ జగన్మోహన్రెడ్డి మత ప్రస్తావనను పదేపదే తీసుకొచ్చారు. వైఎస్ జగన్ను మతం ఆధారంగా నిందించడం, తిరుపతి లడ్డూకు కళంకం తేవడమే లక్ష్యంగా మంత్రులు ప్రవర్తించారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన తెలిపారు. తక్షణం ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించడంతో పాటు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నన్ను క్రిస్టియన్ అనడానికి మీరు ఎవరు? మీరు ఎలా చెప్పారం’టూ నిలదీయడంతో పాటు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరారు. అయినా అచ్చెన్నాయుడు ‘ఆ మాటలకు కట్టుబడి ఉన్నా... క్షమాపణ చెప్పేది లేదం’టూ భీష్మించి కూర్చున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తాను హిందువునని, తన మతాన్ని, కులాన్ని కించపర్చడం సరికాదని గట్టిగా చెప్పారు. మంత్రి వ్యాఖ్యలతో అధికారపక్షం కూడా ఇరుకునపడటంతో పలువురు మంత్రులు అచ్చెన్నాయుడు వద్దకు వచ్చి దీన్ని నుంచి ఎలా బయటడాలన్నదానిపై తీవ్ర తర్జనభర్జనలు చేశారు. అయినా అచ్చెన్నాయుడు తన అహాన్ని వీడకుండా ‘మీరు సభ సాక్షిగా హిందువునని చెప్పినందుకు ఎటువంటి భేషజాలకు పోకుండా ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా’ అని ప్రకటించారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందానని, ఇక చర్చను కొనసాగిద్దామని చైర్మన్ చెప్పారు. అయితే వైఎస్సార్సీపీ సభ్యులు అచ్చెన్నాయుడు సభకు క్షమాపణ చెప్పాలిందేనంటూ పట్టుపట్టారు. దీంతో సభను అయిదు నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.తిరిగి అదే మత విద్వేష వ్యాఖ్యలుతిరిగి గంటన్నర తర్వాత మొదలైన తర్వాత కూడా అధికారపార్టీ సభ్యులు అదే విధంగా మత విద్వేష వ్యాఖ్యలను కొనసాగించారు. వెంకటేశ్వరస్వామి మీకు దేవుడు కాదా అంటూ మరింత విద్వేషకర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా చైర్మన్ నిజంగా హిందువైతే వైఎస్సార్సీపీ సభ్యులను కంట్రోల్ చేయాలంటూ మరోమారు చైర్మన్కు మతం రంగుపూసే ప్రయత్నం చేశారు. రూ.620లకు కేజీ నెయ్యిని కొనడాన్ని వ్యతిరేకించేవారు హిందువులు కారంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండటంతో చైర్మన్ సభను గురువారానికి వాయిదా వేశారు. -
దేవుడిపై భక్తి ఉన్నవారు ఇలా చేస్తారా? బాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి దేవస్థానం నిర్వహణ అత్యంత పవిత్రమైన బాధ్యతని.. సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలిసి కూడా ఆరోపణలున్న వ్యక్తినే టీటీడీ చైర్మన్గా నియమించి ఆలయ ప్రతిష్ట, పవిత్రతను చంద్రబాబు కాలరాశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్ నాణ్యత లేదంటూ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు తిరిగి టీటీడీకి రావడం.. రిజెక్ట్ చేసిన వాటిని అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ సిట్ ఛార్జిషీట్లో స్పష్టం చేయడం ఆందోళనకరమన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేపుతూ.. నెయ్యి ధరల విషయంలో తప్పుడు ప్రచారం చేసి లాభాలు ఆర్జించడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. దేవుడిపై భక్తి ఉన్న వారు ఎవరైనా ఇలా చేస్తారా? అని సీఎం చంద్రబాబు నిలదీశారు. ఆలయాల పవిత్రత, భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వాల తొలి బాధ్యత అని గుర్తు చేశారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. టీటీడీ నిర్వహణలో చంద్రబాబు సర్కార్ తీరును సాక్ష్యాధారాలతో ఎండగడుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ బుధవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..దేవుడిపై బాబుకు భక్తి, శ్రద్ధ, భయం లేదని మరోసారి రుజువైంది..దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత. అది అత్యంత నిష్టతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కళంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ట కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారు. ఒక బాధిత మహిళ చంద్రబాబు గారికి లేఖ రాస్తూ.. ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పని కోసం ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు గారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా, విచారణ, చర్యలన్నవి పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ చైర్మన్గా నియమించి, ఆలయ ప్రతిష్ట, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబుకు భక్తీ లేదు.. శ్రద్ధ అంతకన్నా లేదు. దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది.టీటీడీకి నెయ్యి సరఫరాను సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు..ఈ రకంగా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరిమీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నారు. మరోవైపు 2014–19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278– రూ.330 ఉంది. 2019–24 మధ్య కూడా నెయ్యి సగటు రేటు దాదాపుగా అంతే ఉంది. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ.. తన హెరిటేజ్కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ డెయిరీకి కిలో నెయ్యి రూ.658లకు 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు.. శ్రద్ధ లేదు.. నిష్ట లేదు.. నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.నాణ్యత లేని నెయ్యిని అనుమతించింది.. లడ్డూ తయారీలో వాడింది బాబు హయాంలోనే..లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుది అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ(నాణ్యత) బాగోలేదని ఈ చంద్రబాబు గారి హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా.. మళ్లీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి రావడం.. ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ–సిట్ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జిషీటు 44వ పేజీలోనూ చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తీ లేదు.. ఆలయాల నిర్వహణపట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ. -
సమాధానం చెప్పలేక సత‘మతం’!
సాక్షి, అమరావతి: పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చార్జిషీట్లో సీబీఐ తేల్చేసినా, కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు నిర్ధారించినా పశ్చాత్తాపం లేదు..! కనీసం చట్టసభలోనూ కూటమి సర్కారు స్పందించలేదు! 2014–19 మధ్య టీటీడీకి కిలో రూ.278కే నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీకి ఇప్పుడు ఏకంగా కిలో రూ.658 చొప్పున సరఫరా కాంట్రాక్టు అప్పగించడంపైనా జవాబు లేదు! ఇటీవల వరకు హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్గా చూపించిన ఇందాపూర్ డెయిరీని గుట్టు చప్పుడు కాకుండా కో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చేయడంపైనా నోరు విప్పలేదు! చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీటీడీ రిజెక్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్లను దొడ్డి దారిన రప్పించి తిరిగి అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూల తయారీకి వాడినట్లు సాక్షాత్తూ సీబీఐ తేల్చేసినా సమాధానం లేదు! ప్రభుత్వ టెండర్లలో హెరిటేజ్ ఎప్పుడూ పాల్గొనలేదంటూ చంద్రబాబు చెబుతున్న మాటల్లో నిజం లేదని.. మండలి సాక్షిగా విపక్షం ఆధారాలను బహిర్గతం చేస్తే సమాధానం అంతకంటే లేదు!!చర్చకు భయపడి పక్కదారి పట్టించేందుకేతిరుమల లడ్డూపై చంద్రబాబు దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు, సీబీఐ చార్జిషీట్లో తేల్చేయడం.. ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ వ్యాపార అనుబంధం.. నెయ్యిపై రాజకీయ, ఆర్థిక కుట్రలు బహిర్గతం కావడం.. ఇదంతా చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్కు లబ్ధి చేకూర్చేందుకేనని తేటతెల్లం కావడం.. టీడీపీ కూటమి సర్కారుకు దుర్బుద్ధి లేకుంటే దీనిపై చట్టసభలో చర్చకు ఎందుకు జంకుతోందని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా చర్చించుకోవడం.. శాసన మండలి చైర్మన్ న్యాయం వైపు గట్టిగా నిలబడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చర్చకు ఒప్పుకున్నట్లు నటిస్తూనే చంద్రబాబు సర్కారు డ్రామాలాడటం పట్ల హైందవ ధార్మిక సంస్థలు, హిందూ సమాజం తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇన్ని రోజులూ మొహం చాటేసిన చంద్రబాబు సర్కారు కుట్ర బుద్ధితో టాపిక్ డైవర్షన్ రాజకీయాలకు తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్వయంగా అధికార పక్షమే ఇన్ని రోజులు సభను అడ్డుకున్న దాఖలాలు దేశ చరిత్రలో లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. లడ్డూపై శాసన మండలిలో బుధవారం చర్చ మొదలు కాగానే మంత్రులు అడ్డుపడటం.. మతం ప్రస్తావన తేవడం.. ఎస్సీ వర్గానికి చెందిన మండలి చైర్మన్పై వ్యక్తిగత విమర్శలు చేయడం అంతా వ్యూహం ప్రకారం లడ్డూపై చర్చకు భయపడి పక్కదారి పట్టించేందుకేనని మండలి సాక్షిగా బహిర్గతమైందని పేర్కొంటున్నారు. లడ్డూపై సభలో చర్చ జరిగితే చంద్రబాబు రాజకీయ, ఆర్థిక కుంభకోణం కుట్రలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో టీడీపీ తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ పాలిటిక్స్ను ఎంచుకుందని స్పష్టం చేస్తున్నారు. వెబ్సైట్లో తీసేస్తే హెరిటేజ్కు, ఇందాపూర్కు ఉన్న సంబంధాలు తెగిపోతాయా? ఒక పరిశ్రమ మరో పరిశ్రమతో కలసి వ్యాపారం చేస్తోందంటే వెబ్సైట్లో తీసేస్తే అయిపోతుందా? అంటూ వ్యాఖ్యానించిన మంత్రి అచ్చెన్న దీన్ని కవర్ చేసుకునేందుకే ‘మతం’ ప్రస్తావన తెచ్చారని విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ సీపీ సభ్యుడు చంద్రశేఖర్రెడ్డి మొత్తం 19 నిమిషాలు మాట్లాడితే అందులో 12 సార్లు అడ్డుపడ్డారంటే అధికారపార్టీ ఏ స్థాయిలో భయపడిందో చెప్పేందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.బాబూ.. హిందూ సమాజం నిన్ను క్షమించదు..!రాజకీయ కుట్రతో ప్రారంభమైన నెయ్యి వ్యవహారం ఆర్థిక కుట్రగా ఎలా మారిందో విపక్ష సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, తూమాటి మాధవరావు సాక్ష్యాధారాలతో శాసన మండలిలో ఎండగట్టారు. పరమ పవిత్రమైన తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేప కొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును హిందూ సమాజం క్షమించబోదని చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నియమించిన సిట్పై నమ్మకం లేకనే వైవీ సుబ్బారెడ్డి సీబీఐ దర్యాప్తు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని గుర్తు చేశారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్కు ఇందాపూర్ డెయిరీతో ఉన్న సంబంధాలను సాక్ష్యాధారాలతో వివరించారు. హెరిటేజ్ వెబ్సైట్లో ఇన్నాళ్లూ తమ తయారీ సంస్థగా చూపించిన ఇందాపూర్ డెయిరీని ఆరోపణలు రాగానే హఠాత్తుగా కో–మాన్యుఫాక్చర్గా మార్చడంతో పాటు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్తో రాజీనామా చేయించిన వైనాన్ని వివరించారు. 2016లో టీటీడీ నాణ్యత పరీక్షల్లో ఇందాపూర్ డెయిరీ ఫెయిల్ అయ్యిందని, ఇప్పుడు అదే ఇందాపూర్కి రూ.680కి నెయ్యి సరఫరా అప్పగించడం వెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం దాగి ఉందన్నారు. ఏఆర్ డెయిరీ, బోలేబాబా డెయిరీలను టీడీపీ ప్రభుత్వమే అనుమతించిందని, వారి హయాంలోనే ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసిందన్నారు. నాణ్యతా ప్రమాణాలు లేనందున నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరిస్తే వాటిని ఎవరి ఒత్తిడి మేరకు సంగం డెయిరీతో సంబంధం ఉన్న వైష్ణవీ డెయిరీ ద్వారా అనుమతించారో చెప్పాలంటూ నిలదీశారు. కల్తీ నెయ్యి సరఫరా టీడీపీ హయాంలో జరిగితే వైఎస్సార్ సీపీకి ఏం సంబంధమంటూ ప్రశ్నించారు. ఎన్డీడీబీ రిపోర్టు, సీబీఐ చార్జిషీటులో ఎక్కడా కూడా జంతుకొవ్వు కలిసిందని లేకపోయినా 120 కోట్ల మంది హిందువుల విశ్వాసాన్ని హేళన చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం దారుణమన్నారు. సీబీఐ చార్జిషీటులో టీటీడీ జీఎం ఫిర్యాదును ప్రస్తావిస్తే, అదే నివేదిక అంటూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శించారు. హెరిటేజ్ ప్రభుత్వ టెండర్లలో ఎప్పుడూ పాల్గొనలేదంటూ శాసన సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. టీటీడీకి పాలపొడి సరఫరా టెండర్లలో పాల్గొందని పేర్కొన్నారు. ఒకసారి టీటీడీకి హెరిటేజ్ పాలపొడి సరఫరా చేయగా బిల్లులు ఆగిపోతే ఒత్తిడి తెచ్చి ప్రత్యేకంగా రిజల్యూషన్తో డబ్బులు తీసుకున్న వైనాన్ని ఆధారాలతో వివరించారు. హెరిటేజ్ మజ్జిగ సరఫరాకు సంబంధించి కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలను కూడా సభ ముందుంచారు. చంద్రబాబు కుటుంబంతో కలసి గత ఐదేళ్లలో పలుదఫాలు తిరుమల వెళ్లి ప్రసాదం తిన్నారని మరి ఎప్పుడైనా లడ్డూ కల్తీ జరిగిందని ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. అయోధ్యకు వెళ్లి బాగుందంటూ తిరుమల లడ్డూలు తిన్న కూటమి నేతలు ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ నిలదీశారు. ఇందాపూర్ కోసం నిబంధనలు మార్చామని స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యుడే స్వయంగా శాసనసభలో వెల్లడించారని గుర్తు చేశారు. కేవలం గేదె పాలను మాత్రమే సేకరిస్తున్న సంగం డెయిరీ ఆవు నెయ్యి ఎలా సరఫరా చేస్తుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ⇒ ఒకానొక దశలో తమ సభ్యుడు చంద్రశేఖర్రెడ్డి మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని కోరిన తూమాటి మాధవరావుపై మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి దాడి చేసే యత్నం చేశారు. ఇంత గందరగోళ పరిస్థితుల మధ్యలో కూడా విపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు పూర్తి ఆధారాలతో చంద్రబాబు కుట్రను మండలి సాక్షిగా బయటపెట్టారు.⇒ అంతకుముందు స్వల్పకాలిక చర్చ కంటే ముందు మంత్రి స్టేట్మెంట్ ఇస్తారంటూ అధికారపార్టీ సభ్యులు చర్చ జరగకుండా అడ్డుకున్నారు. అయితే సభలో కొత్త సంప్రదాయాలకు అవకాశం లేదని, నిబంధనల ప్రకారమే చర్చ తర్వాత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుందంటూ చైర్మన్ చర్చను ప్రారంభించారు. టీడీపీ తరపున అనురాధ మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డితో పాటు వైఎస్ జగన్పై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. -
‘రాధిక’కు ఇన్ని రాయితీలా!?
సాక్షి, అమరావతి: దొడ్డిదారిన ప్రజాధనం లూటీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమకు ఆర్థిక చేయూతనివ్వకుండా ప్రైవేటు రంగంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు రాయితీల రూపంలో అడ్డగోలుగా లబ్ది చేకూరుస్తోంది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొత్తకి గ్రామం వద్ద రూ.240 కోట్లతో ప్రైవేటు రంగంలో ఆయిల్పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు‘రాధిక వెజిటబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు ప్రభుత్వం ఇస్తోన్న రాయితీలే ఇందుకు నిదర్శనం. ఎన్నడూ లేనివిధంగా ప్రాజెక్టు వ్యయంలో 44 శాతానికి పైగా రాయితీలు కల్పిస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవో ప్రకారం చూస్తే ఏ స్థాయిలో దోపిడీకి స్కెచ్ వేశారో ఇట్టే అర్థమవుతుంది.ఆయిల్ ఫెడ్ యూనిట్ను నిర్వీర్యం చేస్తూ..ఆయిల్ పామ్ రైతులకు ఓఈఆర్ (నూనె వెలికితీత నిష్పత్తి) నిర్ధారణలో కీలక పాత్ర పోషిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఏపీ ఆయిల్ ఫెడ్ ప్లాంట్ను చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది మొదలు ఏదో విధంగా మూసివేసి తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తూనే ఉంది. వైఎస్ జగన్ హయాంలో రూ.10 కోట్లతో ఆధునికీకరణ పనులు పూర్తిచేసుకుని గంటకు టన్ను సామర్థ్యం కల్గిన ఈ ప్లాంట్ నేడు 24 టన్నుల క్రషింగ్ చేస్తోంది. 2018–19లో 90 వేల టన్నులు ప్రాసెస్ చేయగా, ప్రస్తుతం 1.20 లక్షల టన్నులు ప్రాసెస్ చేసే స్థాయికి చేరింది. దాదాపు రూ.200 కోట్లకు పైగా లాభాల్లో నడుస్తున్న ఈ యూనిట్ను ఆధునికీకరణతో పాటు కాకినాడ, ఏలూరుల్లో కొత్త యూనిట్ల ఏర్పాటుకు చేయూతనివ్వాలని ఏపీ ఆయిల్ ఫెడ్ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. కొత్త యూనిట్ల ఏర్పాటుకు రూ.250 కోట్ల రుణం ఇచ్చేందుకు ఎన్సీడీసీ, ఎన్డీడీబీ ముందుకొచ్చినా, ప్రభుత్వం మాత్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదు. పైగా గతంలో టీడీపీ హయాంలో ఎగ్గొట్టిన రూ.156 కోట్ల బకాయిలను చెల్లిస్తే, పెదవేగి యూనిట్ను ఆధునికీకరించుకుంటామని చెప్పినా స్వలాభం కోసం ఆ ప్రతిపాదనను గాలికొదిలేసింది. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్న యూనిట్లను మూడుకు విస్తరించగా ఏపీలో మాత్రం ఉన్న ఏకైక యూనిట్ను మూసివేయాలని కుట్రలు చేయటం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో 14 ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఏకైక యూనిట్ను నిర్వీర్యం చేసి ఆయిల్ పామ్ రంగంలో గుత్తాధిపత్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమే లక్ష్యంగా ప్రైవేటురంగంలో ఈ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రూ.240 కోట్ల ప్రాజెక్టుకు.. రూ.95.98 కోట్ల రాయితీలా?సాధారణంగా ఏ ప్రభుత్వమైనా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు 10–15 శాతానికి మించవు. క్యాపిటల్ సబ్సిడీ రూపంలో నేరుగా రూ.42.50 కోట్లు ఉచిత గ్రాంట్ రూపంలో ఇచ్చేస్తున్నారు. రాష్ట్ర జీఎస్టీ రీయింబర్సుమెంట్ రూపంలో ఐదేళ్ల పాటు 100 శాతం అంటే రూ.31.50 కోట్లు తిరిగి ఇచ్చేయనున్నారు. 304 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నందున ఉపాధి సబ్సిడీ రూపంలో రూ.13.64 కోట్ల రాయితీ ఇస్తున్నారు. అంటే ఒక్కో ఉద్యోగికి ప్రభుత్వం రూ.4.5 లక్షల చొప్పున సబ్సిడీ ఇస్తోంది. డీకార్బోనైజేషన్ సబ్సిడీ కింద రూ.3 కోట్లు, విద్యుత్ రాయితీల రూపంలో రూ.3.74 కోట్లు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు రూపంలో రూ.60లక్షల మేర రాయితీలు ఇస్తోంది. ఇలా రాయితీల రూపంలో ప్రాజెక్టు వ్యయంలో 44.02శాతం (రూ.95.98 కోట్లు)మేర లబ్ధి చేకూర్చడం పలు అనుమానాలకు తావిస్తోంది.అడ్డగోలు దోపిడీ కోసమే ఈ రాయితీలు..ఇంత పెద్దఎత్తున రాయితీ కల్పిస్తున్న ప్రభుత్వానికి ఈ కంపెనీలో వాటా కానీ, లాభాల్లో వాటా కానీ ఏమైనా ఇస్తున్నారా అంటే అదీ లేదు. తెరవెనుక పెద్దలకు ఈ కంపెనీలో వాటాలుండడం వలనే ఈ స్థాయిలో రాయితీలు ఇస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. రాబడి లేని రాయితీలు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ఆయిల్పామ్ రైతులు నిలదీస్తున్నారు.. ఇంత పెద్దఎత్తున రాయితీలివ్వడానికి బదులుæ ప్రభుత్వ యూనిట్ను ఆధునికీకరించడం లేదా ప్రభుత్వ రంగంలోనే కొత్త యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందంటున్నారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి కాకుండా.. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడిచే, ఎంపిక చేసిన వ్యక్తులు, సంస్థలకు లబ్ధి చేకూర్చడం ద్వారా తమ జేబులు నింపు కోవడమే లక్ష్యంగా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0ని రూపొందించినట్టు కన్పిస్తోందంటున్నారు. ఇది ముమ్మాటికి నీకింత..నాకింత తరహా దోపిడీకి తెరతీయడమేనని ఆరోపిస్తున్నారు. తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని ఆయిల్ పామ్ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
నేలవాలిన అరటి ధర
కర్నూలు (అగ్రికల్చర్): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఏ పంటకూ కనీస గిట్టుబాటు ధర కూడా రాకపోగా, అన్నదాతలు నష్టాలపాలయ్యారు. ఆ జాబితాలో ఇప్పుడు అరటి రైతులు కూడా చేరారు. సాగు కలిసిరాక.. పంటకు ధరలేక దిక్కుతోచని రైతులు తోటలను ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఒకప్పుడు రూ. 30 వేలు పలికిన టన్ను అరటి ధర ఇప్పుడు రూ. 5 వేలకు పడిపోయింది. అయినా చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించడంలేదు. దీంతో దిక్కుతోచని రైతులు తోటలను దున్నేస్తున్నారు. కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలంలోని కర్లకుంట, బాపనదొడ్డి, కోయిలకొండ గ్రామాల్లో దాదాపు 50 ఎకరాల్లో అరటిని తొలగించేశారు. అరటిరైతులను ఆదుకునేదిశగా చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించడంలేదు. రాయలసీమ జిల్లాల్లో మామిడి తర్వాత అరటి ప్రధాన పంట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 13,500, అనంతపురం జిల్లాలో 40 వేలు, వైఎస్సార్ కడప జిల్లాలో 36 వేలు, చిత్తూరు జిల్లాలో 6,500 ఎకరాల్లో.. మొత్తం 96 వేల ఎకరాల్లో అరటి సాగవుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది, ఓర్వకల్లు మండలాల్లో సుగంధాలు, చిన్న పచ్చ అరటి సాగుచేస్తారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో టిష్యూకల్చర్ (గ్రాండ్ నైన్) అరటి మాత్రమే సాగుచేస్తారు. అనేకమంది రైతులు ల్యాబ్ల్లో వృద్ధిచేసిన పిలకలు తెచ్చి నాటుతున్నారు. అరటిసాగు కలిసి వస్తుండటం, గిట్టుబాటు ధరలు లభిస్తుండటంతో 2024–25, 2025–26 సంవత్సరాల్లో కూడా దీని సాగుపై ప్రత్యేకదృష్టి కేంద్రీకరించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ధరలు తారుమారవడంతో నష్టాలు తప్పని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ధరలు పడిపోయినపుడు చంద్రబాబు ప్రభుత్వం హడావుడి చేసింది. అరటి రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించకుండా ఫ్రూట్కేర్ యాక్టివిటీస్ చేపట్టాలని సూచించింది.ధరాఘాతం: గత ఏడాది నుంచి ఒక్కసారిగా ధరలు నేలను తాకడంతో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. టిష్యూకల్చర్ అరటిలో ఎకరాకు 25 టన్నుల దిగుబడి వస్తుంది. టన్నుకు కనీసం రూ.25 వేల ధర ఉంటే రైతుకు మేలు కలుగుతుంది. విదేశాలకు ఎగుమతి చేసే రకాలకే ధరలు పడిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. గత అక్టోబర్, నవంబర్ నెలల్లో జి–9 అరటి టన్నుకు సగటున రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు మాత్రమే ధర లభించిందంటే రైతులు ఏ స్థాయిలో నష్టపోయారో తెలుస్తుంది. తర్వాత ధరలు పెరిగినప్పటికీ అరటి కోతలు చురుగ్గా జరుగుతున్న వేళ ఇప్పుడు మళ్లీ ధరలు పడిపోయాయి. ఇటీవల టన్ను ధర రూ.20 వేల వరకు వెళ్లినా.. సరుకు మార్కెట్కు వచ్చే సమయానికి ఉన్నట్టుండి టన్ను ధర రూ.5 వేలకు పడిపోయింది.వక్రభాష్యం: అరటి ఒకసారి నాటుకుంటే మూడేళ్ల పాటు గెలలు వస్తాయి. ఏటా పిలకలు అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. మెయిన్టెనెన్స్పై ప్రత్యేకదృష్టి పెడతారు. ఇప్పుడు ధరలు పడిపోవడానికి చెబుతున్న కారణాలు వింతగా ఉంటున్నాయి. అనేకమంది రైతులు తక్కువ పెట్టుబడితో మూడోపంట తీస్తారు. రైతులను ఆదుకోవడానికి ముందుకురాని చంద్రబాబు ప్రభుత్వం.. ధరలు పడిపోవడానికి మూడోపంటే కారణమని ఉద్యాన అధికారులతో చెప్పిస్తోంది. మూడోపంటలో నాణ్యత ఉండదని, అందువల్ల గిట్టుబాటు ధరలు లభించవని చెబుతున్నారు. కొన్నేళ్లుగా అరటిలో రైతులు మూడోపంట తీస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మాత్రమే ధరలు పడిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం నష్టపోతున్న రైతులను ఆదుకునేదిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో విదేశాలకు ఎగుమతి రాయలసీమ జిల్లాల్లో 2019–20 నుంచి 2023–24 వరకు రైతులకు అరటిసాగు కలిసి వచి్చంది. అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించే విధంగా టిష్యూకల్చర్ అరటిసాగుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. అప్పట్లో టన్ను ధర రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు లభించింది. నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లాల నుంచి విదేశాలకు అరటి ఎగుమతి అయింది. వైఎస్సార్సీపీ హయాంలో రాయలసీమ జిల్లాల నుంచి రైతులు విదేశాలకు 1.25 లక్షల టన్నుల టిష్యూకల్చర్ అరటిని ఎగుమతి చేశారు. ఏ పంట సాగుచేసినా.. ఆదుకోని చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఏం పంట సాగుచేసినా రైతులను ఆదుకున్న దాఖలాల్లేవు. 2024లో మిర్చి రైతులకు చేయూత ఇవ్వలేదు. మామిడి రైతులకు ఎలాంటి భరోసా దక్కలేదు. పొగాకు రైతు నష్టపోకుండా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయిస్తామని ప్రకటించి తర్వాత చేత్తులెత్తేశారు. ఉల్లి ధరలు పడిపోవడంతో క్వింటా రూ.1,200 మద్దతు ధరతో కొంటామని హడావుడి చేసి మూన్నాళ్ల ముచ్చటగా ముగించారు. తర్వాత ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లిస్తామని అరకొరగానే ఇచ్చారు. మొక్కజొన్న ధరలు పడిపోయి రైతులు గగ్గోలు పెట్టినా మద్దతు ధరతో కిలో కూడా కొనలేదు. ధరలు పడిపోయి టమాట రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయినప్పటికి చంద్రబాబు ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు.20 ఎకరాల్లో అరటిని ట్రాక్టరుతో దున్నేశాం మాకు అరటి ప్రధానపంట. కొన్నేళ్లుగా సాగుచేస్తున్నాం. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి అరటిసాగులో నష్టాలు మూటగట్టుకున్నాం. మేం నాలుగెకరాల్లో 2024లో అరటి సాగుచేశాం. రెండేళ్లు పంట తీసుకున్నాం. నాలుగెకరాల్లో ఆరువేల మొక్కలున్నాయి. మొదటి ఏడాది మూడువేల గెలలే అమ్ముడుపోయాయి. మరో మూడువేల గెలల్లో నాణ్యత లేదని వ్యాపారులు కొనలేదు. రూ.ఆరులక్షల పెట్టుబడి పెడితే మొదటి ఏడాది పంట పెట్టుబడి వరకే వచ్చింది. రెండో ఏడాది నష్టాలు మూటగట్టుకున్నాం. మామూలుగా మూడోపంట కూడా సాగుచేస్తాం. అయితే మార్కెట్లో ధరలు పడిపోవడం, మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో మా కుటుంబానికి చెందిన 20 ఎకరాల్లో అరటి తోటలను ఫిబ్రవరి మొదటి వారంలో ట్రాక్టరుతో దున్నేశాం. అరటిలో మొదటిసారిగా నష్టాలొచ్చాయి. – కృష్ణ, బాపనదొడ్డి, క్రిష్ణగిరి మండలం, కర్నూలు జిల్లా -
ప్రమాద ఘంటిక.. మాయిస్ట్ హీట్
సాక్షి, అమరావతి: వేసవి అంటే మనకు గుర్తుకు వచ్చేది సెగలు గక్కే ఎండలు, వడగాడ్పులు. కానీ ఈ వేసవి సీజన్లో వాతావరణం ఒక కొత్త రూపం దాల్చబోతోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎండలు సాధారణంగానే ఉన్నట్లు అనిపించినా రానున్న రోజుల్లో ‘మాయిస్ట్ హీట్’ (తేమతో కూడిన వేడి) ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ, అంతర్జాతీయ పరిశోధన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. గాలిలో ఉష్ణోగ్రతతో పాటు తేమ కూడా అధికంగా ఉండటాన్ని ‘మాయిస్ట్ హీట్’ అంటారు. సాధారణ పరిభాషలో దీన్ని ఉక్కపోతగా పేర్కొంటారు. సాధారణ ఎండల కంటే ఇది భిన్నమైంది. పొడి ఎండల్లో చెమట పడితే గాలికి ఆవిరై శరీరం చల్లబడుతుంది. కానీ గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట ఆవిరి కాదు. దీనివల్ల శరీరం తనను తాను చల్లబరుచుకునే సహజ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రస్తుతం వాతావరణ పరిశోధనల్లో ‘వెట్–బల్బ్ టెంపరేచర్’ అనే పదం ప్రముఖంగా వినిపిస్తోంది. గాలిలోని వేడి, తేమను కలిపి కొలిచే కొలమానాన్నే ఇలా పిలుస్తున్నారు. సాధారణంగా వెట్–బల్బ్ ఉష్ణోగ్రత 31 డిగ్రీలు దాటితే అది మానవ శరీరానికి ఇబ్బందికరంగా మారుతుంది. ఒకవేళ ఇది 35 డిగ్రీలకు చేరితే అత్యంత ఆరోగ్యవంతులు కూడా నీడలో ఉన్నా తట్టుకోవడం కష్టమవుతుందని నేచర్ క్లైమేట్ చేంజ్ వంటి అంతర్జాతీయ జర్నల్స్ పేర్కొన్నాయి. తీర ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ వరకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో గాలి మందగించడం వల్ల తేమ ఒకే చోట పేరుకుపోయి మాయిస్ట్ హీట్ పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. వాతావరణ వ్యవస్థలు అస్థిరంగా ఉండడం వల్ల సముద్రపు గాలులు భూభాగంపైకి ఎక్కువ తేమను మోసుకొస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. రెండు మూడేళ్లుగా ఇదే ధోరణి.. వాస్తవానికి ఈ మార్పు ఇప్పుడు హఠాత్తుగా వచ్చిందేమీ కాదు. గత రెండు, మూడేళ్లుగా ఈ ధోరణి కనిపిస్తోంది. 2024, 2025 వేసవి కాలాల్లో ఉక్కపోత తీవ్రంగానే ఉంది. కానీ ఈ ఏడాది ఎల్నినో పరిస్థితులు, అస్థిరమైన సముద్రపు గాలుల కలయిక వల్ల తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పట్టణాల్లో పెరుగుతున్న కాంక్రీట్ కట్టడాల ప్రభావం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చివేసింది.ముప్పు ఏమిటి? గాలిలో తేమ 70 శాతం ఉండి, ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉన్నా అది మన శరీరానికి 48 డిగ్రీల ఎండలో ఉన్నంత ప్రభావం చూపుతుంది. ఈ వేసవిలో ఇలాంటి అసౌకర్య రోజులు గతం కంటే 15 – 20 రోజులు అదనంగా ఉంటాయని అంచనా. జాగ్రత్తలు ముఖ్యం.. హీట్ ఇండెక్స్ గమనించండి: కేవలం డిగ్రీలను మాత్రమే కాకుండా ‘హీట్ ఇండెక్స్’ (గాలిలోని తేమను కలిపి చూపే ఉష్ణోగ్రత)ను గమనించాలి. ఫోన్లలోని వాతావరణ యాప్స్లో ఫీల్స్ లైక్ అని ఉండే ఉష్ణోగ్రతే దీనికి సంకేతం. నీటి వినియోగం: దాహం వేయకపోయినా నీరు తాగుతూ ఉండాలి. మాయిస్ట్ హీట్లో చెమట ఆవిరి కాకపోయినా శరీరం లోపల నీటి శాతం తగ్గుతుంది. గాలి సరఫరా: గదుల్లో గాలి ధారాళంగా ఆడేలా చూసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం ఫ్యాన్ వేసుకున్నా వేడి గాలి మాత్రమే వస్తుంది. కాబట్టి కిటికీలు తెరిచి ఉంచడం లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వాడడం మంచిది. -
13న కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 13వ తేదీ ఉదయం 10.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశానికి తీసుకువెళ్లాల్సిన ప్రతిపాదనలను ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటలకల్లా సాధారణ పరిపాలన శాఖ (కేబినెట్ విభాగం)కు పంపాల్సిందిగా అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. -
ఆ ప్రజాప్రయోజన ప్రాజెక్టు ఆగిపోకూడదు
సాక్షి, అమరావతి: బెంగళూరు–మైదుకూరు–అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే భూ సేకరణకు జాతీయ రహదారుల చట్టం కింద వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2022–23లో జారీ అయిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. 124 కిలోమీటర్లు, 12 మండలాలు, 49 గ్రామాలకు సంబంధించిన పెద్ద ప్రజా ప్రయోజన ప్రాజెక్ట్ అని, కొద్దిమంది అభ్యంతరాలతో మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోకూడదని న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు.అంతా సక్రమమే: హైకోర్టుబెంగళూరు–మైదుకూరు–అమరావతి గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణం కోసం వైఎస్సార్ కడప జిల్లాలో భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారుల చట్టం కింద 2022–23లో భూ సేకరణ నోటిఫికేషన్లు జారీ చేసింది. తరువాత గెజిట్ నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. వీటిని సవాలు చేస్తూ పలువురు భూ యజమానులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్రెడ్డి వాదనలు వినిపించారు. నోటిఫికేషన్లపై పిటిషనర్ల అభ్యంతరాలను హైకోర్టు తిరస్కరించిన తీరిది.. » జాతీయ రహదారుల చట్టం కింద భూములు సేకరిస్తుంటే, భూ సేకరణ నోటిఫికేషన్లో ఆ భూముల వివరాలను సంక్షిప్తంగా పేర్కొంటే సరిపోతుంది. » భూముల యజమానుల పేర్లను భూ సేకరణ నోటిఫికేషన్లో పేర్కొనాల్సిన అవసరం లేదు. » జాతీయ రహదారుల చట్టంలోని సెక్షన్ 3ఏ (1) ప్రకారం భూ సేకరణ నోటిఫికేషన్ను ఏవైనా రెండు స్థానిక పత్రికల్లో ప్రచురిస్తే సరిపోతుంది. ఆ పత్రికల సర్క్యులేషన్ ఎంత అన్నది అవసరం లేదు. » సాంకేతిక నిపుణుల ద్వారా రూపొందించిన జాతీయ ప్రాజెక్టుల విషయంలో న్యాయ సమీక్షా పరిధి చాలా పరిమితంగా ఉంటుంది. » పెద్ద ప్రాజెక్టులకు భూములిచ్చేందుకు మెజారిటీ యజమానులు అంగీకరించినప్పుడు, కొద్ది మంది అభ్యంతరాల ఆధారంగా ఆ ప్రాజెక్టును నిలిపివేయడం సాధ్యం కాదు. » పైగా చట్ట ప్రకారం పిటిషనర్లు 21 రోజుల్లో అభ్యంతరాలు తెలపాల్సి ఉండగా, ఆ గడువులో అభ్యంతరాలు చెప్పలేదు. » డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ మధ్యలో ఉన్న భూములు కూడా హైవేలో భాగమే. » సేకరించిన భూములను వాణిజ్య కార్యకలాపాల కోసం వాడతారనే అనుమానం ఆధారరహితం. -
రోడ్డెక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెం వార్డు సచివాలయంలో ఎమినిటీస్ సెక్రటరీ కె.శ్రీనివాస్పై మున్సిపల్ డీఈఈ షేక్ అబ్దుల్ రహీం ఇటీవల నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడాన్ని నిరసిస్తూ సచివాలయాల ఉద్యోగులు రోడ్డెక్కారు. మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. అనంతరం.. ఎన్ఆర్టీ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు షేక్ మొహమ్మద్ ఆలీ మాట్లాడుతూ.. ఒకవైపు సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఉన్నతాధికారుల తీరులో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. సభ్యసమాజం వినలేని విధంగా మున్సిపల్ డీఈఈ ఫోన్లో దూషణలకు పాల్పడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండేళ్ల కాలంలో ఇప్పటికి వందమంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందులో కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా, మరికొందరు గుండెపోటుతో మృతిచెందారన్నారు. మున్సిపల్ డీఈఈ తీరు తరచూ ఇలాగే ఉంటోందని.. ఐదు నెలల కిందట మరో సచివాలయ ఉద్యోగిపట్ల కూడా ఆయన ఇలాగే వ్యవహరించారని షేక్ మొహమ్మద్ ఆలీ మండిపడ్డారు.మూడు నెలలుగా సర్వేల పేరుతో ఒత్తిడిఏపీ ఎన్జీఓల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి కొమ్మాలపాటి ప్రతాప్కుమార్ మాట్లాడుతూ.. బానిసలపట్ల కూడా ఇంత అవమానకరంగా ఎవరూ మాట్లాడరని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా సర్వేల పేరుతో ఉన్నతాధికారులు దారుణంగా వ్యవహరిస్తున్న కారణంగా ఎందరో ఉద్యోగులు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వోద్యోగం అంటే గౌరవంగా ఉంటుందని భావించి వచ్చామని.. కానీ, పై అధికారుల వేధింపులు, తిట్లు తట్టుకోలేకే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, సంబంధిత డీఈఈపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్రస్థాయిలో ఉద్యమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ ఆందోళన విషయం తెలుసుకుని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అక్కడికొచ్చి ఆందోళనకారులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, తమ ఆందోళన విరమించేదిలేదని వారు స్పష్టంచేసి మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబుకు వినతిపత్రం అందజేశారు. -
సీతారామలక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు
ఒంటిమిట్ట: వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో బుధవారం సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలకు పారిశ్రామికవేత్త పుట్టంరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీదేవి రూ.2.85 కోట్ల విలువైన 2.241 కిలోల స్వర్ణ కిరీటాలను సమర్పించారు. దాతలకు ఆలయ అధికారులు లాంఛనాలతో స్వాగతం పలికి, స్వర్ణ కిరీటాలతో ఆలయ ప్రదక్షణ చేయించి, గర్భాలయంలోని మూల విరాట్ చెంత కిరీటాలను ఉంచి ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం వారు తీసుకొచ్చిన స్వర్ణ కిరీటాలను ఆలయ ఇన్చార్జి డిప్యూటీ ఈవో ఎ.శివప్రసాద్కు అందజేశారు. -
అడ్డదారుల్లో మరింత పతనం
సాక్షి, అమరావతి: రాజకీయ లబ్ధి కోసం కలియుగదైవమైన వెంకటేశ్వరస్వామినే వివాదంలోకి లాగి కల్తీ డ్రామా ఆడి అభాసుపాలుకావడంతో అధికార టీడీపీ దాన్నుంచి బయటపడడానికి రకరకాల అడ్డదారులు వెతుకుతూ మరింత పతనావస్థకు చేరుతోంది. తాజాగా బుధవారం శాసన మండలి సాక్షిగా రాజ్యాంగబద్ధమైన శాసన మండలి చైర్మన్కు సైతం మతం రంగు పులిమారు. దళిత వర్గానికి చెందిన కొయ్యే మోషేన్రాజు క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు పదే పదే ప్రస్తావించి ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఇది ముమ్మాటికీ అధికార టీడీపీ ఆగడాలకు పరాకాష్ట అని రాష్ట్ర ప్రజలు తప్పుబడుతున్నారు. శాసన మండలి చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక దళితవర్గానికి చెందిన నాయకుడిని వైఎస్ జగన్మోహన్రెడ్డి చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు. అటువంటి గొప్ప సామాజిక సంస్కరణను స్వాగతించాల్సింది పోయి టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగానే దళిత వర్గానికి చెందిన మండలి చైర్మన్ను అవమానిస్తోంది. తిరుపతిలో మహిళా పార్లమెంట్ నిర్వహించిన సందర్భంలో మోషేన్రాజును ఆహ్వానించకుండా కించపరిచారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద నిర్మించిన కొత్త భవనం ప్రారంభోత్సవంలో శిలాఫలకంపై మోషేన్రాజు పేరు లేకుండా చేశారు. అధికార టీడీపీ తీరుపై అప్పట్లో విమర్శలు రావడంతో ప్రారంభోత్సవం అయ్యాక శిలాఫలకంపై పేరు పెట్టారు. ఇటీవల ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి శాసనమండలి చైర్మన్ను ఆహ్వానించ లేదు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అనేక సందర్బాల్లో ఆయనకు ఇవ్వాల్సిన ఫ్రొటోకాల్ను విస్మరించడం, శిలాఫలకాలపై పేరు లేకుండా చేయడం, అధికారిక కార్యక్రమాలకు పిలవకపోవడం వంటి చర్యలతో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆయన చైర్మన్ అయ్యారనో? దళిత వర్గానికి చెందిన వ్యక్తి అనో? ఉద్దేశపూర్వకంగానే ప్రోటోకాల్ విస్మరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఆయనకు మతాన్ని కూడా ఆపాదించడం మరింత దుర్మార్గం. హిందువునని చెప్పుకోవాల్సిరావడం బాధాకరం..శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ తీరుపై మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజును బుధవారం రాత్రి సాక్షి సంప్రదించింది. సభలో మంత్రుల తీరుపై విచారం వ్యక్తం చేస్తూ తాను హిందువుగానే పుట్టానని, హిందువుగానే జీవిస్తున్నానని మోషేన్రాజు బదులిచ్చారు. తన సొంత గడ్డ అయిన భీమవరంలో వినాయక చవితి పందిళ్లు వేసి ఉత్సవాల్లో పాలుపంచుకుంటానని, మావూళ్లమ్మ ఉత్సవాల్లోనూ భాగస్వామిని అవుతానని, తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని వాటికి సంబంధించిన ఫొటోలను సైతం విడుదల చేశారు. తాను హిందువునే అని చెప్పుకోవాలి్సన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. -
మండలి చైర్మన్పై మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన అవమానకరం
సాక్షి, అమరావతి: శాసనమండలిలో బుధవారం చోటుచేసుకున్న ఘటనల కారణంగా ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోతుందని వైఎస్సార్సీపీ నేతలు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు పట్ల మంత్రులు, టీడీపీ సభ్యులు అమానవీయంగా, అవమానకరంగా ప్రవర్తించారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని గౌరవించాల్సింది పోయి కులం, మతం పేరుతో లక్ష్యంగా చేసుకోవడం చట్టసభల సంస్కృతికి విరుద్ధమన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ దాడులు జరిగాయని స్పష్టమైందని ఆరోపించారు. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికం కాదని, దీనివెనుక స్పష్టమైన దురుద్దేశం ఉందన్నారు. మంత్రి లోకేశ్ సభలో ఉండగానే ఈ ఘటన జరగిందన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న దళిత వ్యక్తిని మతం, కులం పేరుతో అవమానించడం కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాకుండా సామాజిక న్యాయం, సమానత్వంపై దాడి అని స్పష్టం చేశారు. చైర్మన్ను ఏ మతానికి చెందినవారు అని ప్రశ్నించడం చట్టసభల గౌరవాన్ని మంటగలిపిందని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారాన్ని రాజకీయ దుమారంగా మార్చి.. ఆ నీడలో హెరిటేజ్ ఫుడ్స్ అనుమానాస్పద లావాదేవీలపై వస్తున్న ఆరోపణలను దారి మళ్లించేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తిరుమల నెయ్యి కొనుగోళ్లలో అవకతవకలపై ఆధారాలతో ప్రశ్నలు లేవనెత్తగానే అధికార పక్షం అసహనానికి లోనైందన్నారు. మార్కెట్ ధరకంటే అధిక ధరలకు నెయ్యిని సరఫరా చేస్తూ హెరిటేజ్ యూనిట్ ద్వారా లాభాలు పొందుతున్నారనే అంశాలపై సమాధానం చెప్పలేకపోయినందుకే సభను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. మండలిని వారి చేతుల్లోకి తీసుకోవాలన్న దురుద్దేశంతోనే చైర్మన్పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరంగా వ్యవహరించిన మంత్రి అచ్చెన్నాయుడిపై తక్షణ చర్యలు తీసుకుని, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
వైఎస్ జగన్ ఆపన్నహస్తం
సాక్షి, విశాఖపట్నం: బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఏడేళ్ల పాపకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆపన్నహస్తం అందించారు. రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్ను 39వ వార్డుకు చెందిన ఎండీ హఫీజ్ కలిసి తన పాప దయనీయ స్థితిని విన్నవించారు. దీంతో చలించిపోయిన వైఎస్ జగన్ తక్షణమే పాప చికిత్స నిమిత్తం వైఎస్సార్సీపీ నుంచి రూ.2 లక్షల సాయం అందజేశారు. -
గుజ్జుపై బాంబు
మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు తయారైంది మామిడి రైతుల పరిస్థితి. గత ఏడాది కాయలకు గిట్టుబాటు ధర లేక నష్టాలపాలైతే.. ఈ సీజన్ కూడా దెబ్బకొట్టేలా ఉండడంతో దిక్కుతోచని దుస్థితి దాపురించింది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు.. గల్ఫ్ యుద్ధం కాస్తా గుజ్జు పరిశ్రమను అయోమయంలో పడేసింది. ఇప్పటికే లక్షల టన్నుల పల్ప్ నిల్వ ఉండడం ఫ్యాక్టరీల యజమానులను ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఈ తరుణంల్చో ఎగుమతులు నిలిచిపోవడం.. ఎప్పుడు పునఃప్రారంభమవుతాయో తెలియకపోవడం అయోమయానికి గురిచేస్తోంది. కాణిపాకం : చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలను యుద్ధ మేఘాలు కమ్మేశాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మూసివేశారు. దీంతో గల్ఫ్ దేశాలకు సరుకు తరలింపులు ఆగిపోయాయి. కంటైనర్ షిప్ నిర్వాహకు లు రవాణాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఫ్యాక్టరీలకు మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. ఎప్పుడు రవాణా పునఃప్రారంభమవుతుందో స్పష్ట త లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. దీంతో మామిడి గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. గల్ఫ్ దేశాలే ఆధారం జిల్లాలో తయారయ్యే మామిడి గుజ్జులో ఎక్కువ శాతం గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంది. దుబాయ్, సౌదీ అరేబియా, ఉమెన్న్, కతార్ వంటి దేశాలే ప్రధాన కొనుగోలుదారులు. ఏటా ఆగస్ట్ నుంచి గుజ్జు ఎగుమతులు నత్తనడకన నడిచినా... ఫిబ్రవరి నుంచి జూ¯న్ వరకు జోరందుకుంటాయి. అయితే తరచూ గల్ఫ్ దేశాల్లో తలెత్తే ఉద్రిక్తతలు మామిడి గుజ్జు పరిశ్రమలను కుదిపేస్తున్నాయి. ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. 2024లో ఇదే పరిస్థితి ఎదురైతే..పరిశ్రమ యజమానులు పలు బ్యాంకులకు అప్పులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం కూడా యుద్ధ ప్రభావంతో ఆర్డర్లు నిలిచిపోయాయి. హార్బర్లు సక్రమంగా పనిచేస్తాయో లేదో తెలియని దుస్థితి ఏర్పడింది. గుజ్జు అధికంగా కొనుగోలు చేసే దేశాలపై బాంబుల వర్షం కురవడంతో పరిశ్రమ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. కొంత మంది ఫ్యాక్టరీ నిర్వాహకులు ముందస్తుగానే అప్రమత్తమై గుజ్జు అమ్మకాలు పూర్తి చేసుకోవడం గమనార్హం. రూ.36 వస్తేనే గిట్టుబాటు గత ఏడాది నవంబర్లో గుజ్జు కేజీ ధర రూ.30 పలికింది. ప్రస్తుతం రూ.31 వద్దే నిలిచిపోయింది. అయితే పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, కారి్మక, రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటే కేజీకి కనీసం రూ.36 వస్తేనే గిట్టుబాటు అవుతుందని ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు. ధరలు పెరగకపోవడంతో నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. యుద్ధం నిలిస్తేనే.. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులే మామిడి గుజ్జు పరిశ్రమ భవిష్యత్ను నిర్ణయిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుని రవాణా సాధారణ స్థితికి వస్తేనే ఎగుమతులు పునరుద్ధరించబడే అవ కాశం ఉంది. లేకపోతే ఈసారి మామిడి రంగానికి గడ్డుకాలమేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. యుద్ధ మేఘాలు తొలగకపోతే..జిల్లాలో మామిడి రైతుల నుంచి గుజ్జు ఫ్యాక్టరీల వరకు నష్టపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. తాళం వేయాల్సిందే..! ఎగుమతులు నిలిచిపోవడంతో పరిశ్రమల యజ మానులకు బ్యాంకు రుణాలు, వడ్డీలు, కారి్మకుల జీతాలు, విద్యుత్ బిల్లులు భారంగా మారాయి. గుజ్జు నిల్వలు అమ్ముడుపోకపోవడంతో నగదు ప్రవాహం నిలిచిపోయింది. ఈ పరిస్థితి మరికొన్ని నెలలు కొనసాగితే ఫ్యాక్టరీలకు తాళం వేసే పరిస్థితి వస్తుందని నిర్వాహకులు వాపోతున్నారు. రైతుల ఆందోళన ఈసారి మామిడి పూత విస్తారంగా రావడంతో దిగుబడి బాగుంటుందనే అంచనాలు ఉన్నాయి. చెట్టు నిండా పూతతో కళకళలాడుతున్నాయి. అయితే గుజ్జు పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపేస్తే కాయలకు డిమాండ్ తగ్గిపోతుందని రైతులు భయపడుతున్నారు. కొనుగోలు శక్తి తగ్గిపోతే ధరలు పడిపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా నిలిచిపోయింది ఇప్పుడిప్పుడే గుజ్జు ఎగుమతులు ప్రారంభయ్యాయి. ఢోకా లేదు అనుకున్న తరుణంలో యుద్ధం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఎక్కడైతే గుజ్జు ఎక్కువ అమ్ముడవుతుందో అక్కడే బాంబులు పడుతున్నాయి. షిప్లు కూడా ఆగిపోయాయి. రవాణా నిలిచిపోయింది. కంటైనర్లు తరలించబోమని మెయిల్ కూడా వచ్చింది. యుద్ధం కొనసాగితే గుజ్జు అలానే ఉండిపోయే ప్రమాదముంది. ఫ్యాక్టరీలకు తాళం వేయడం తప్ప..వేరే మార్గం లేదు. – గోవర్ధన్ బాబీ, ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్ అసోసియేషన్, న్యూఢిల్లీ -
శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవంలో అపశృతి
నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలో అపశృతి చోటు చేసుకుంది. బోగోలు మండలంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవంలో ఒక్కసారిగా తెప్ప పక్కకు ఒరిగిపోయింది. దీంతో భక్తులంతా నీళ్లలో పడిపోయారు. సామర్థ్యానికి మించి ఒకేసారి తెప్పపైకి 80 మందికి పైగా ఎక్కడంతో ఈ ఘటన జరిగింది. తెప్ప ఒకపక్క మునిగిపోవడంతో.. స్వామివారిని చేతులతోనే మోస్తూ భక్తులు ఊరేగింపు నిర్వహించారు. -
వాయుసేనలో అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: భారత వాయుసేనలో అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల నియామకాల అధికారి, సికింద్రాబాద్–12 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ కమాండింగ్ ఆఫీసర్ వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ప్రవేశాలు పొందడానికి ఈ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ అద్భుతమైన అవకాశం అని ఆయన వివరించారు. ఈ నెల 9, 10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహిళా అభ్యర్థులకు, 12, 13 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులకు, 15, 16 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర పురుష అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుందన్నారు. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయసు ఉన్న అవివాహిత యువతీ యువకులు ఉద్యోగాలకు అర్హులన్నారు. అభ్యర్థుల కనీస ఎత్తు 152 సెం.మీ, ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష, మూడేళ్ల డిప్లొమా ఇంజనీరింగ్ (పాలిటెక్నిక్), రెండేళ్ల ఒకేషనల్ కోర్సుల్లో (ఐటీఐ) ఉత్తీర్ణత సాధించినవారు అర్హులన్నారు. ఆయా విద్యార్హతల్లో మొత్తం మార్కుల్లో 50 శాతం, ఆంగ్లంలో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ రిజి్రస్టేషన్ చేసుకోనవసరం లేదని, నేరుగా ర్యాలీకి హాజరుకావచ్చని వివరించారు. అభ్యర్థులు ఒరిజినల్ లేదా డిజీలాకర్ ద్వారా ధ్రువపర్చిన విద్యార్హత పత్రాలు, స్థానికత ధ్రువీకరణ పత్రం, ఎన్సీసీ సరి్టఫికెట్ (ఉంటే), ఆధార్ కార్డు, ఇటీవల తీసుకున్న 10 పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటోలు, ప్రతి ధ్రువపత్రానికి సంబంధించిన 6 జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహిళా అభ్యర్థులు మార్చి 9న, ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులు 12న, తెలంగాణ పురుష అభ్యర్థులు 13న ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏపీ గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో హాజరుకావాలన్నారు. 1.6 కిలోమీటర్ల పరుగు పోటీ, భౌతిక, శారీరక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి రాత పరీక్ష ఉంటుందన్నారు. ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలను https:// agnipathvayu. cdac.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ సీఈసీ సభ్యునిగా పామిరెడ్డిగారి పెద్ద నాగిరెడ్డి(నంద్యాల), ఎస్ఈసీ సభ్యునిగా వైసి గోవర్ధనరెడ్డి(మడకశిర), పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కంగాటి ప్రదీప్ రెడ్డి (పత్తికొండ), పార్టీ రాష్ట్ర సెక్రటరీ (పార్లమెంటు) పోరెడ్డి నరసింహారెడ్డి (ప్రొద్దుటూరు) నియమితులయ్యారు.కాగా, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ల నియామకం జరిగిన సంగతి తెలిసిందే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు కురసాల కన్నబాబు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు బూడి ముత్యాలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. -
‘అంగన్వాడీ వర్కర్లపై పోలీసుల దాడి అమానుషం’
సాక్షి, తాడేపల్లి: అంగన్వాడీ వర్కర్లపై పోలీసుల దాడి అమానుషమని, ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న అక్కచెల్లెమ్మలను దారుణంగా వేధించిందని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు, రెండేళ్లుగా మభ్యపెడుతూ వచ్చారని వివరించారు.టెంట్లో ఉండి నిరసన వ్యక్తం చేస్తున్న ఉన్న మహిళలను వేకువ జామున ఒక్కసారిగా ఈడ్చి వ్యాన్లలోకి తరలించడం హేయమని చర్యగా పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్లకు వైయస్సార్సీపీ అండగా ఉంటుందని, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని నలమారు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..రెండేళ్లుగా మభ్యపెడుతున్నారుఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అత్యంత అమానుషంగా వ్యవహరించింది. ప్రభుత్వంతో చర్చలకు పిలుస్తామని ముందురోజు రాత్రి నమ్మబలికి వేకువజామున టెంట్లు కూల్చేసి అక్రమంగా అరెస్టు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అనేక దఫాలు శాంతియుతంగా నిరసనలు తెలిపిన అంగన్వాడీలను చంద్రబాబు ప్రతిసారీ మభ్యపెడుతూ వచ్చారు.ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టక పోవడంతో సోమవారం నిర్వహించిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీగా పోటెత్తారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అందరూ నిద్రిస్తుండగా వందలాది మంది మగ పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి అంగన్వాడీ మహిళలను ఈడ్చి పారేశారు. వారు తేరుకునేలోగా టెంట్లు పడేసి, ప్లెక్సీలు చించేసి, ప్లకార్డులు విసిరేసి, అంతా చిందరవందర చేసేశారు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులు వ్యవహరించిన తీరును వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. వారికి పార్టీ అండగా ఉండి వారి తరఫున ఉద్యమిస్తుంది.హామీ అమలు చేయాలని కోరడం తప్పా?శాంతియుతంగా ఉద్యమించిన మహిళలపై కర్కశంగా వ్యవహరించింది. రోడ్డు పైనే సొమ్మసిల్లిన అంగన్వాడీలపై చంద్రబాబు సర్కారు పోలీసులను ప్రయోగించి విరుచుకుపడింది. అంగన్వాడీలు తేరుకుని ఏం జరుగుతోందో గ్రహించేలోపే మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పారేసి పోలీసు వ్యాన్లలోకి ఎక్కించేశారు. గతంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన నీచ చరిత్ర చంద్రబాబుది. అంగన్వాడీలు బయటకు వెళ్లే అవకాశం లేకుండా చుట్టూ రోప్ పార్టీతో పోలీసులు దిగ్బంధించారు.రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన వారిని కనీసం బ్యాగులు, సెల్ఫోన్లు కూడా తీసుకోనివ్వకుండా నిర్బంధించారు. చేతికి దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేసి వ్యాన్లలోకి తోసేశారు. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? అని ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా గెంటేశారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో పలువురు అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమను అక్రమంగా అరెస్ట్ చేసి కనీసం టాయిలెట్స్కు వెళ్లడానికి కూడా అనుమతించలేదని అంగన్వాడీ వర్కర్స్ వాపోతున్నారు. అంగన్వాడీ వర్కర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చూసి దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది.మూల్యం చెల్లించుకోక తప్పదుఅంగన్వాడీలు మాత్రమే కాదు.. టీచర్లు, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు, పెన్షనర్లు ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఇప్పటికే అనేకసార్లు వినతులు, నిరసనలు తెలియజేశారు. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన ఉండటం లేదు. వైయస్సార్సీపీ హయాంలో ఉన్న పీఆర్సీ చైర్మన్ తో రాజీనామా చేయించిన చంద్రబాబు.. రెండేళ్లుగా కొత్త పీఆర్సీ కమిషన్ వేయకుండానే కాలయాపన చేస్తున్నారు.కనీసం ఒకటో తేదీన జీతాలు ఇస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేదు. ఉద్యోగులకు రావాల్సిన దాదాపు రూ. 35 వేల కోట్ల బకాయిలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. బినామీ కంపెనీలకు 99పైసలకు వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్న ప్రభుత్వం... ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకపోతే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదని నలమారు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. -
వేట్లపాలెం ఘటన.. 26కు చేరిన మృతుల సంఖ్య
సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 26కి చేరుకుంది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతు కాతేటి శ్రీను(33) మృతిచెందాడు. ఇవాళ ఒక్కరోజే(బుధవారం, మార్చి 4) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు. 70-100 శాతం కాలిన గాయాలు, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్తో బాధితుల ఆరోగ్యం విషమిస్తోంది. జీజీహెచ్లో మరో ముగ్గురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.వేట్లపాలెంలో గత నెల ఫిబ్రవరి 28న(శనివారం) భారీ విస్ఫోటనం సంభవించిన సంగతి తెలిసిందే. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రం.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలిపోయి భస్మీపటలమైంది. 20 మంది కూలీలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతులందరూ పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం, సామర్లకోట, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం, గూడపర్తి గ్రామాలకు చెందిన వారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు.సామర్లకోట – పెదపూడి రోడ్డును ఆనుకుని పంట పొలాల మధ్య సుమారు మూడెకరాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. ఉదయం బాణసంచా కేంద్రంలోని నాలుగు షెడ్లలో 60 మంది వరకూ కూలీలు మందు గుండు తయారీలో నిమగ్నమయ్యారు. సహజంగా ప్రతి రోజూ ఈ కేంద్రంలో 10–15 మంది పని చేస్తూంటారు. అయితే జగ్గంపేట మండలం మల్లిశాలలో జాతరకు భారీ ఆర్డర్ రావడంతో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో బాణసంచాకు డిమాండ్ పెరిగింది. దీంతో 60 మందికి పైగా కూలీలతో పని చేయిస్తున్నారు. రాకెట్లు, జువ్వలు, సెర్చ్లైట్లు, మిడతల దండు, డిస్కో బుడ్లు, చిచ్చు బుడ్లు తయారు చేస్తున్నారు.మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. నాలుగు షెడ్లలో ఉన్న బాణసంచా ఒకదాని తర్వాత మరొకటి పేలిపోవడంతో చెవులు చిల్లులు పడేలా భయంకరమైన శబ్దం వినిపించింది. పేలుడు ధాటికి షెడ్లలో ఉన్న కూలీలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీర భాగాలు 20–30 అడుగుల ఎత్తున ఎగిరిపడ్డాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో కాలిపోయిన మృతదేహాలు తునాతునకలైపోయాయి. -
కల్తీపాలకు మరోకరు బలి.. 9కి చేరిన మృతులు
సాక్షి, రాజమండ్రి: కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతుంది. తాజాగా ఈ ఘటనలో సూర్యకళ అనే మహిళ ప్రాణాలు వదిలింది. కల్తీపాలు సేవించి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కాగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ సూర్యకళ మృతి చెందింది. దీంతో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మరి కొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
మండలి ఛైర్మన్ను అవమానించడం దారుణం: శ్రీకాంత్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మండలి చైర్మన్కి మతం, పార్టీ ఆపాదిస్తూ మాట్లాడిన సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని, సభలో అడుగుపెట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.రాజకీయ లబ్ధి కోసం ఇన్నాళ్లు దేవుడిని రాజకీయాల్లోకి లాగి ఆలయ ప్రతిష్టను మసకబార్చిన కూటమి నాయకులు.. మాట్లాడాల్సిన సబ్జెక్టుని పక్కన బెట్టి శాసనమండలి చైర్మన్ని చర్చలోకి లాక్కురావడమే కాకుండా ఆయన్ను కులమతాల పేరుతో కించపరచడం దారుణమని ఆయన ఆక్షేపించారు. రాజ్యాంగ వ్యవస్థలో ఈరోజును చీకటిరోజుగా చూడాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్రెడ్డి స్పష్టం చేశారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:కల్తీ నెయ్యి పేరుతో టీటీడీ నిధుల దోపిడీకి పాల్పడిన హెరిటేజ్ అంశం మండలిలో చర్చకు రావడంతో దానికి సమాధానం చెప్పలేక సభలో లేని వైఎస్ జగన్, మండలి చైర్మన్లు క్రిస్టియన్లు అని మాట్లాడుతూ సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం అత్యంత హేయమైన చర్య. పైగా మీ నాయకుడు జగన్ అంటూ మండలి చైర్మన్కు పార్టీని ఆపాదించి అవమానించారు. ఇది దారుణం. ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్ చేసిన టీటీడీ నిధుల దోపిడీపై వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పుకోలేని ప్రభుత్వం సభను పక్కదోవ పట్టించడానికి చైర్మన్ని రాజకీయాల్లోకి లాగి మతాన్ని, పార్టీని ఆపాదించింది.అధికార పక్ష సభ్యుల అనైతిక ప్రవర్తన:అధికార పార్టీ సభ్యులం అన్న విషయమే మరిచిపోయి వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతుండగా ప్రసంగానికి పదులసార్లు అడ్డుతగలడమే కాకుండా మంత్రులంతా పోడియం చుట్టుముట్టి సభలో ఆందోళన చేయడం సిగ్గుచేటు. నేను ఫలానా మతం అని మండలి చైర్మన్ చెప్పుకునే దుస్థితి కల్పించినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి. పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోతే ఎవరికైనా కులమతాలు అంటగట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తామని కూటమి నాయకులు చెప్పకనే చెబుతున్నారు.అచ్చెన్నాయుడిపై చర్య తీసుకోవాలి:ఇప్పటికైనా సీఎం చంద్రబాబు కలగజేసుకుని మంత్రి కె.అచ్చెన్నాయుడిని రాబోయే మూడేళ్లపాటు సభలో అడుగుపెట్టకుండా శాశ్వతంగా సభ నుంచి సస్పెండ్ చేయాలి. మంత్రి అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటిస్తే సరిపోదు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేయాలి. శ్రీవారిని రాజకీయాల్లోకి లాగినందుకు కూటమిని ప్రజలు అసహ్యించుకుంటుంటే దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కులమతాలతో రాజకీయాలు చేయడం అత్యంత హేయమైన చర్య అని శ్రీకాంత్రెడ్డి అభివర్ణించారు. -
చిత్తూరులో కాల్పుల కలకలం..
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. పేకాట.. ఒకరి ప్రాణం తీసింది. చిత్తూరు రూరల్ మండలంలోని తుమ్మిందపాళ్యంలో ఘటన జరిగింది. పేకాట ఆడుతున్న సమయంలో ఇద్దరు స్నేహితుల మధ్య పాత బాకీ విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మాటమాట పెరిగి నాటు తుపాకీతో సాయికుమార్ను ఢిల్లీ బాబు కాల్చి చంపాడు. -
మండలి చరిత్రలోనే ఇది చీకటి రోజు: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: తిరుపతి లడ్డూ, కల్తీ నెయ్యి, హెరిటేజ్ ఇందాపూర్ డెయిరీ మధ్య సంబంధాలపై శాసనమండలిలో లఘు చర్చ సందర్బంగా సభలో రగడ చోటుచేసుకుంది. అధికార పక్షం అడుగడుగునా అడ్డుకోవడంతో చివరకు సభ వాయిదా పడింది. అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.విలువలు మంటగలిపేలా అచ్చెన్న వ్యాఖ్యలు: లేళ్ల అప్పిరెడ్డిశాసనమండలి చరిత్రలో ఇవాళ జరిగిన ఘటనలు చీకటి రోజుగా నిలిచిపోతాయి. తిరుమల లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలని వైఎస్సార్సీపీ.. సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచీ నాలుగుసార్లు వాయిదా తీర్మానాలు ఇచ్చింది. మండలిని కూడా స్తంభింపజేశాం. ఎట్టకేలకు బీఏసీలో 23వ తేదీన మండలిలో చర్చకు అంగీకరించిన తర్వాత కూడా మంత్రులు చర్చ రాకుండా అడ్డుకున్నారు.తిరిగి వైఎస్సార్సీపీ సభ్యుల ఒత్తిడి మేరకు చర్చ ప్రారంభించినా.. మంత్రులు అడుగడుగునా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలోనే మండలికి ఉన్న గౌరవాన్ని మంటగలిపేలా సాక్ష్యాత్తు ఛైర్మన్పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన అధికారాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఛైర్మన్ మతాన్ని ఉద్దేశించి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువల్ని మంటగలిపేలా ఉన్నాయి.మంత్రులు ఆరోపణలు చేస్తున్నా ఆధారాలు ఉండట్లేదు. దీంతో వారు కంగుతిన్నారు. అందుకే ఏదో విధంగా సభను డైవర్ట్ చేసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే సభలో లేని జగన్మోహన్ రెడ్డిగారితో పాటు ఛైర్మన్ మతాల ప్రస్తావన తెచ్చారు. లడ్డూ కల్తీ ఆరోపణలు చేసిన ప్రభుత్వం.. ఇందాపూర్ లింకులు బయటపడే సరికి ఆత్మరక్షణలో పడిపోయింది. చివరికి హెరిటేజ్ కోసమే లడ్డూ కల్తీ వ్యవహారం తెరపైకి తెచ్చారని తేలిపోయింది. మా సభ్యులు చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఛైర్మన్ కు ఇచ్చాం. దీనికి సమాధానాలు చెప్పలేక ఛైర్మన్ మత ప్రస్తావన తీసుకురావడం దారుణం. మోషేను రాజు ఛైర్మన్ గా ఉండటం మీకు ఇష్టం లేదా, ఎందుకు ఆయనపై అడుగడుగునా వివక్ష చూపుతూ అవమానిస్తున్నారు?.చంద్రబాబు తీరును ఆధారాలతో ఎండగట్టాం: పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితిరుమల లడ్డూ నెయ్యిపై వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే 14 రోజులుగా ప్రయత్నిస్తున్నాం. ఇవాళ మండలిలో చర్చ ప్రారంభమయ్యాక ప్రతీ అంశంపై ఆధారాలు సమర్పించి మాట్లాడాం. ఇన్ని ఆధారాలతో రాజకీయ కుట్రను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తే.. అధికార పక్షం వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉంది. సభలో లేని వైఎస్ జగన్ ప్రస్తావన తెచ్చి ఆయనపై విమర్శలు చేశారు. తన కుమారుడి పట్టాభిషేకం కోసం వైఎస్ జగన్ను అడ్డు తొలగించుకోవాలన్న రాజకీయ కుట్రే ఇందులో ఉంది.మీ హయాంలో టీటీడీలో నాలుగు నెయ్యి ట్యాంకర్ల నెయ్యిని కల్తీ పేరుతో వెనక్కి పంపి, తిరిగి వైష్ణవీ డెయిరీ ద్వారా లోపలికి పంపుకున్నారు. కల్తీ జరిగితే అది జరిగింది మీ ప్రభుత్వంలోనే, దాన్ని మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దాదాపు కిలో నెయ్యి రూ.300కు తీసుకుంటే, మీ హెరిటేజ్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీకి కిలో రూ.600 కు ఇచ్చేలా టెండర్ కట్టబెట్టారు. భోలేబాబా, ప్రీమియర్ డెయిరీ కూడా మీ హయాంలోనే 95 శాతం నెయ్యి సరఫరా చేసింది, ఇప్పుడు అదే ప్రీమియర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యి నాణ్యత లేకపోతే వైఎస్సార్సీపీకి అంటగట్టి ఆరోపణలు చేస్తున్నారు. భోలేబాబాకు అనుమతులు ఇచ్చింది మీ హయాంలోనే. ప్రజలకు మేం చెప్పాలనుకున్నది సభలో చెప్పాం. ప్రజలే దీనిపై నిర్ణయిస్తారు.హెరిటేజ్పై దొరికిపోయిన ప్రభుత్వం: తూమాటి మాధవరావుగత వారం అసెంబ్లీలో జరిగిన తిరుమల లడ్డూ చర్చలో హెరిటేజ్కు టీటీడీతో సంబంధాలు లేవని, కేజీ నెయ్యి కూడా సరఫరా చేయలేదని, టెండర్లలో పాల్గొనలేదని చంద్రబాబు ప్రకటించారు. కానీ 1998లో టీటీడీకి కేజీ రూ.70 చొప్పున టెండర్ లేకుండానే హెరిటేజ్ పాల పౌడర్ సరఫరా చేసిందని మేం ఆధారాలు బయటపెట్టాం. నిబంధనలకు విరుద్దంగా టెండర్ లేకుండా ఎలా డబ్బులు చెల్లిస్తారని టీటీడీ ఆపేస్తే.. తిరిగి బోర్డుకు పంపి ఆమోదం తీసుకుని చెల్లింపులు చేసారు. అదే విషయం ఇవాళ ప్రశ్నిస్తే 1998 విషయం ఎందుకు మాట్లాడుతున్నారని ఎదురు దాడి చేశారు. పాల పౌడర్ తిరుమలలో దేనికి వాడారో చంద్రబాబు సమాధానం చెప్పాలి.2008లో కాంగ్రెస్ ప్రభుత్వంలో టీటీడీ టెండర్లలో పాల్గొని ఎల్–3గా వచ్చారని కూడా ఆధారాలు చూపించాం. కేజీ రూ.117.75 చొప్పున టిన్నుల్లో సరఫరా చేస్తామని టెండర్ వేశారు కదా అని అడిగితే మేం ఎల్–1కాదని బుకాయించారు. దీనిపై నిలదీస్తే మాపై దాడికి ప్రయత్నించారు. మా సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతుంటే ఆర్ధికమంత్రి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అనుమతించాలని మండలి ఛైర్మన్ ను అడుగుతుంటే నన్ను అడ్డుకున్నారు. మా గొంతు నొక్కేందుకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను వెనక్కి తగ్గేది లేదు.అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి: తోట త్రిమూర్తులులడ్డూపై చర్చించాలని పది రోజులుగా కోరుతున్నా వెనక్కి పారిపోయిన ప్రభుత్వం.. ఎట్టకేలకు ఒప్పుకున్నట్లు చూపించి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్ కూ ఉన్న సంబంధం, వీళ్ల అవినీతి బయటపెట్టే సరికి జీర్ణించుకోలేకపోయారు. అందుకే సభను పక్కదారి పట్టించేలా సభలో లేని జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తెచ్చి ఆయనపై ఓ ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. వైఎస్ జగన్ పలుమార్లు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి.కడప జిల్లాలో తాజాగా నందేశ్వర ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అయినా ఆయన హిందూ మతానికి వ్యతిరేకం అని ముద్ర వేసేందుకు కుట్ర చేస్తున్నారు. వైఎస్సార్ హయాంలో రెండు కొండలుగా ఉన్న తిరుమలను ఏడు కొండలంటూ జీవోలు ఇచ్చిన చరిత్ర ఉంది. వైఎస్సార్ ఇచ్చిన జీవోల్ని రద్దు చేస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబా కాదా అనేది ప్రజలు గమనించాలి. ఎప్పుడూ తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే భక్తి ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎప్పుడైనా ఆయనకు తలనీలాలు సమర్పించారా చెప్పాలి. లడ్డూ నెయ్యిపై చర్చ పెట్టి తిరుమల ప్రతిష్టను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు. సభలో లేని వైఎస్ జగన్ ప్రస్తావన తెచ్చినందుకు మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి.లడ్డూ నెయ్యిపై వాస్తవాలు చెప్పేశాం: వంకా రవీంద్రనాథ్ఇవాళ మంత్రులు తొలిసారి మండలిలో సభ్యులపై అనుక్షణం దాడికి ప్రయత్నించారు. మా వాదన వినిపించకుండా అడ్డుకున్నారు. ఈ సభ ద్వారా ప్రజలకు వాస్తవాలు చేరడం వారికి ఇష్టం లేదు. అయినా మా సభ్యులు లడ్డూ నెయ్యి మీద ప్రజలకు ఆధారాలతో వాస్తవాలు చెప్పారు. ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో పాలు, ఇతర కల్తీల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వచ్చే మూడు రోజుల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని కోరుకుంటున్నాం.ఛైర్మన్ను మతం పేరుతో అవమానిస్తారా?: వరుదు కల్యాణిపది రోజులుగా లడ్డూ నెయ్యి మీద చర్చ అడుగుతుంటే ఇవాళ్టికి ఒప్పుకున్నారు. కానీ మా సభ్యులు మాట్లాడుతుంటే అధికార పక్షం దిగజారిపోయి ఛైర్మన్ ను కూడా మతం పేరుతో టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామా లేమా అనే పరిస్ధితిని కూటమి మంత్రులు కల్పించారు. లౌకిక దేశంలో ఇలాంటి ఘటనలు దురదష్టకరం. దీన్ని బట్టి ఈ చర్చకు మీరు ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది.లడ్డూ నెయ్యి మీద అనవసర ఆరోపణలు చేసి చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. దీనిపై సమాధానం అడిగితే చెప్పరు. తిప్పిపంపిన నెయ్యి ట్యాంకర్లు మళ్లీ ఎందుకు వాడారని అడిగితే సమాధానం లేదు. పాల ధర 2 రూపాయలు పెరిగితే నెయ్యి ధర 250 రూపాయలు ఎక్కడైనా పెరుగుతుందా చెప్పాలి. హెరిటేజ్, ఇందాపూర్ బంధాన్ని మా సభ్యులు బయటపెడితే సమాధానం చెప్పలేకపోయారు. ఈవోను ఎందుకు మార్చారంటే చెప్పరు. చర్చ జరగడం ఇష్టం లేదు కాబట్టే మిమ్మల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారుఆధారాలు బయటపడే సరికి అడ్డుకునే యత్నం: ఎంవీ రామచంద్రారెడ్డిబడ్జెట్ సమావేశాలు పెట్టినప్పటి నుంచీ చంద్రబాబు లడ్డూపైన చేసిన వ్యాఖ్యలపై చర్చ అడుగుతుంటే ఇవాళ స్వల్ప చర్చకు అనుమతించారు. ఇవాళ హెరిటేజ్, ఇందాపూర్ బంధంపై మా సభ్యులు ఆధారాలు బయటపెడుతుంటే మంత్రులు అడుగడుగునా అడ్డుకున్నారు. రాష్ట్రంలో పాలతో పాటు అన్నీ కల్తీ అవుతున్నాయి. వీటిపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు ఎక్కడున్నారు. సభలో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా పూజించే శ్రీవారి జోలికి రావొద్దని, మీ తప్పులకు పశ్చాత్తాపం చెందాలని అధికారపక్షాన్ని కోరాం.ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయి: కల్పలతారెడ్డిలడ్డూ నెయ్యిపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు తెలియాలనే వాయిదా తీర్మానాలు ఇచ్చాం. ఎట్టకేలకు చర్చకు ఒప్పుకున్నా వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడకుండా అడ్డుపడ్డారు. తిరుమల లడ్డూ కల్తీపై వాళ్లు చేసిన తప్పుడు ఆరోపణలకు ఎక్కడ కౌంటర్ ఇస్తామో అని భయపడి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా మా సభ్యులు మాత్రం ఆధారాలతో అన్ని విషయాలు బయటపెట్టారు. ప్రజలకు ఈ విషయాలు తెలిసేలా చేశారు. మంత్రుల తీరునూ ప్రజలు గమనించారు.ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు: మొండితోక అరుణ్కుమార్ఎస్సీ,ఎస్టీ పారిశ్రామిక వేత్తలను ఈ ప్రభుత్వం బిచ్చగాళ్లుగా మార్చింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఈ ప్రభుత్వం మోసం చేసింది. టీడీపీ కండువా కప్పుకున్న వారికి 40%, సానుభూతి పరులకు 20% మాత్రమే ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఇన్సెంటివ్లు ఇవ్వాలంటే టీడీపీ ఎమ్మెల్యేల సంతకాలు కావాలని వేధించిన ప్రభుత్వం ఇది. తమకు న్యాయం చేయండని ధర్నా చేసినందుకు లాఠీఛార్జి చేశారు. టీడీపీ బడా నేతల కంపెనీలకు ఇన్సెంటివ్లు ఇస్తారు. కానీ ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు.సుమారు 500 మంది నారా లోకేష్ను కలవడానికి వస్తే కుదరదన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను కలిసేందుకు కేవలం ఐదుగురికే అనుమతిచ్చారు. ఎంఎస్ఎంఈలపై మండలిలో మా ప్రశ్నకు మంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మంత్రిపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం. కోర్టుకు వెళతాం. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు మేం అండగా ఉంటాం. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇన్సెంటివ్లు విడుదల చేయాలి. -
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: మండలి ఛైర్మన్పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మండలి ఛైర్మన్ను క్రిస్టియన్ అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నన్ను క్రిస్టియన్ అనడానికి నువ్వు ఎవరు?’’ అంటూ మండిపడ్డ మండలి ఛైర్మన్.. తాను క్రిస్టియన్ కాదని స్పష్టం చేశారు. తాను హిందువునని.. క్రిస్టియన్ కాదని మండలి ఛైర్మన్ తెలిపారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. బాబూ.. మీ మంత్రులకు ఇదేనా నేర్పింది?: బొమ్మి ఇజ్రాయెల్శాసనమండలి మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ మాట్లాడుతూ.. కులాల మధ్య కుంపటి పెట్టిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు బాటలోనే మంత్రులు నడుస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘సభ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు.. ఛైర్మన్ను అవమానించారు. ఛైర్మన్ దళితుడనే కారణంతో ఆయన్ని అవమానించారు. మీ నాయకుడు, మీ ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ మంత్రి అవమానించారు. అయ్యా చంద్రబాబు.. మీ మంత్రులకు ఇదేనా మీరు నేర్పింది?..దళితులు, క్రిస్టియన్ల పట్ల మీకెందుకు అంత వివక్ష. లోకేష్ సమక్షంలోనే అచ్చెన్నాయుడు మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడితో లోకేష్ ఇలా మాట్లాడించారా?. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు క్రిస్టియన్లకు క్షమాపణ చెప్పాలి. హెరిటేజ్, ఇందాపూర్, సంఘం డెయిరీలు, వైష్ణవి కంపెనీలను కాపాడుకోవడానికే మీ ప్రయత్నం. కచ్చితంగా దేవుడే మీకు బుద్ధి చెబుతాడు. తిరుమల లడ్డూపై చర్చకు రావాలని మేం వారం రోజుల నుంచి కోరుతున్నాం. చర్చకు రాకుండా పారిపోతున్నారు. ఈరోజుకి ఎట్టకేలకు చర్చకు అంగీకరించారు. చర్చకు పదే పదే మంత్రులు అడ్డుపడ్డారు’’ అంటూ బొమ్మి ఇజ్రాయెల్ మండిపడ్డారు. -
జనసేన ఎమ్మెల్యేలు డమ్మీలేనా?
సాక్షి, అమలాపురం: ‘అధికారం ఒకరిది... పెత్తనం మరొకరిది’’ అన్నట్టుగా ఉంది రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో రాజకీయం. మిత్రధర్మాన్ని పక్కనబెట్టి టీడీపీ నాయకులు పెత్తనం చేస్తున్నారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న లీడర్ విత్ క్యాడర్ పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి అర్జీలు స్వీకరిస్తున్నామనే వంకతో ప్రభుత్వ పథకాల పంపిణీలో జోక్యం చేసుకుంటున్నారు. అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేసేస్తున్నారు. తద్వారా స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యేలను డమ్మీలుగా మార్చేస్తున్నారు. ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీలో ఉండి కూడా తమకు జరుగుతున్న అన్యాయం, అవమానంపై ఎవరిని అడగాలో తెలియని దైన్య స్థితిలో జనసేన శ్రేణులు మధనపడుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. రాజోలు నుంచి దేవ వరప్రసాద్, పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ గెలిచారు. వీరిద్దరూ ఆయా నియోజకవర్గాలకు చెందినవారే అయినా ఉద్యోగ రీత్యా ఎన్నికల ముందు వరకు స్థానికులతో పెద్దగా పరిచయాలు లేవు. అభ్యర్థులు ఎవరూ నియోజకవర్గ ఓటర్లకు తెలియకుండానే విజయాలు సాధించారు. ఆ తరువాత కూడా వారు స్థానికులతో పెద్దగా సంబంధాలు పెట్టుకున్న దాఖలాలు లేవు. కనీసం క్యాడర్తో కూడా సన్నిహిత సంబం«ధాలు లేవు. ఈ కారణంగానే టీడీపీకి చెందిన నాయకులు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను పక్కనబెట్టి నేరుగా అధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజోలులో.. రాజోలు నియోజకవర్గంలో జనసేన, టీడీపీలలో వర్గ పోరు అధికంగా ఉంది. ముఖ్యంగా రాజోలు జనసేనలో సామాజిక మాధ్యమాల ద్వారా సాగుతున్న వర్గ పోరు పోలీసు స్టేషన్ల వరకు చేరిన విషయం తెలిసిందే. దీనిని ఆసరాగా చేసుకుని ఈ నియోజకవర్గంలో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. రాజోలు పార్టీ ఇన్చార్జి గొల్లపల్లి అమూల్య నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై స్వీకరించిన వినతులలో కొన్నింటిని మాత్రమే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళుతున్నారు. మరికొన్ని టీడీపీ అధిష్టానం వద్దకు తీసుకుని వెళ్లడం లేదా నేరుగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పరిపాటిగా మారింది. ఇటీవల పార్టీ కార్యక్రమం పేరుతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నేరుగా లబ్ధిదారులకు అందజేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధ పల్లంరాజుల సమక్షంలోనే చెక్కులు పంపిణీ చేశారు. ఈ ముగ్గురికి ఎటువంటి అధికార హోదా లేకపోవడం ఇక్కడ గమనార్హం. పి.గన్నవరంలో.. పి.గన్నవరంలో కూడా పరిస్థితి ఇంచుమించు ఇదే తీరుగా ఉంది. ఇక్కడ కూడా టీడీపీ నాయకులు పెత్తనం చేస్తున్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు వంటి పార్టీ సీనియర్ నాయకులకు పొగబెట్టిన ఇక్కడ నాయకులు అంతా తామే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్, నియోజకవర్గ కో కన్వీనర్ మోకా ఆనందసాగర్, నియోజకవర్గ పార్టీ కో కన్వీనర్ డి.వి.వి.సత్యనారాయణ వంటి వారు లీడర్ విత్ క్యాడర్ అంటూ నియోజకవర్గంలో కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా కార్యక్రమాలు చక్కబెట్టేస్తున్నారు. ఫించన్లకు, ఇతర ప్రభుత్వ పథకాలకు నేరుగా అధికారులకే సిఫారసులు చేసేస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ‘‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’’ను నిర్వహిస్తున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు ఇక్కడ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి కొన్నింటికైనా పరిష్కారం చూపిస్తున్నారు. కలెక్టరేట్తోపాటు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంలో భాగమైన అధికారులే నేరుగా అర్జీలు స్వీకరిస్తుంటే టీడీపీ నాయకులు లీడర్ విత్ క్యాడర్ పేరుతో అవే సమస్యల పరిష్కారం కోసం అంటూ చేస్తున్న హంగామా, ప్రచార ఆర్భాటం చూసి సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. అక్కడ అణగిమణగి.. జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, పదవులు కూడా లేని నాయకులు పెత్తనం చేస్తుంటే పార్లమెంట్ పరిధిలో మిగిలిన ఐదు నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట జనసేన రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కూడా అణగిమణగి ఉండాల్సిందే. స్థానిక ఎమ్మెల్యేలను కాదని వీరు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, పెత్తనాలు చేయడమనేది కలలో కూడా ఊహించుకోలేకపోతున్నారు. ఆ పార్టీ నుంచి టిక్కెట్ ఆశించిన బండారు శ్రీనివాసరావు కొత్తపేటలోను, రాష్ట్ర సాగునీటి అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉన్న వేగుళ్ల లీలాకృష్ణ మండపేటలోను, పవన్ కళ్యాణ్కు సన్నితంగా ఉన్న పార్టీ నాయకులు నల్లా శ్రీధర్ అమలాపురంలోను, నియోజకవర్గ ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ రామచంద్రపురంలోను కిమ్మనకుండా ఉండాల్సిందే. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కనీసం వీరి ఉనికిని కూడా గుర్తించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇదే జనసేన నేతలకు మింగుడుపడని అంశంగా మారింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట పెత్తనం చేస్తూ.. టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ సీనియర్లకు కనీస గుర్తింపు ఇవ్వడం లేదని వారు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, పార్టీ పెద్దలకు చెప్పినా సర్దుకు పొమ్మంటున్నారే తప్ప పట్టించుకునే స్థితిలో లేకపోవడంతో లోలోనే మధనపడుతున్నారు. -
టీటీడీ చైర్మన్ వ్యవహారం, లడ్డూ కాంట్రాక్టుపై వైఎస్ జగన్ సీరియస్
సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలి, తిరుమల లడ్డూ కాంట్రాక్టులో స్కాంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమల ఆలయ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారంటూ విమర్శించారు. పవిత్రమైన తిరుమలను స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల. తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత. అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్ఠను మంటగలిపేలా వ్యవహరించారు.ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబుగారికి లేఖ రాస్తూ, ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా విచారణ, చర్యలు పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ చైర్మన్గా నియమించి ఆలయ ప్రతిష్ఠను, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా?. ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా. చంద్రబాబుకు భక్తి లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడి పట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది.దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ ఛైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత,…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 4, 2026లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుది అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ బాగోలేదని ఈ చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా, మళ్లీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు, ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి రావడం, ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం, అక్కడ నుంచి తిరుమల లడ్డూ తయారీలో వాడటం, ఇదే విషయాన్ని సీబీఐ-సిట్ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జిషీటు 44వ పేజీలోనూ చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తి లేదు, ఆలయాల నిర్వహణ పట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.ఈ రకంగా చంద్రబాబు.. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరి మీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నాడు. మరోవైపు 2014-19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278-330గా ఉంది. 2019-24 మధ్య కూడా నెయ్యి సగటు రేటు దాదాపుగా అంతే. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ తన హెరిటేజ్కి చెందిన మానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇందాపూర్ డెయిరీకి, కిలో నెయ్యి రూ.658లకు, 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు, శ్రద్ధ లేదు, నిష్ఠ లేదు, నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ’ అని పోస్టులో పేర్కొన్నారు. -
మండలిలో ఉద్రికత్త.. టీడీపీ సభ్యుల జులం
అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..మీడియా పాయింట్:లడ్డూపై చర్చను పక్కదారి పట్టించేందుకు మంత్రులు యత్నించారు: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులులడ్డూపై చర్చ జరపాలని మండలి మొదటి రోజు నుంచి డిమాండ్ చేస్తున్నాంశాసనమండలిలో లడ్డు పై చర్చ కోసం పదిరోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాంఈరోజు చర్చకు ఒప్పుపుకుని నిజాలు బయట పడుతుంటే తట్టుకోలేకపోతున్నారుసభలో లేని వైఎస్ జగన్ గురించి మాట్లాడారువైఎస్ జగన్ రాష్ట్రంలో అనేక దేవాలయాలను దర్శించారునిన్నకాక మొన్న నందీశ్వరుడి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారుతిరుమలకు ఏడుకొండలు ఉండాలని జీవో ఇచ్చింది వైఎస్సార్వైఎస్సార్ ఇచ్చిన జీవోలను రద్దు చేస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబువెంకటేశ్వరస్వామిపై ఎనలేని భక్తి ఉందని చంద్రబాబు చెప్పుకుంటాడుఒక్కసారైనా తిరుపతిలో తలనీలాలు ఇచ్చారా?లడ్డూపై నిందలు వేసి చర్చకు తెచ్చింది ఎవరు?వైఎస్ జగన్కి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలిలడ్డూపై చర్చ జరగకుండా పదేపదే అడ్డుపడ్డ మంత్రులుటీడీపీ ఎమ్మెల్సీల తీరుపై వైఎస్సార్సీపీ ఆందోళనఅచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ పట్టుఏపీ శాసనమండలి రేపటికి వాయిదానెయ్యికి పూతపూసింది టీడీపీ ప్రభుత్వంలోనే కదా: తూమాటి మాధవరావుజంతు కొవ్వు కలవలేదని సీబీఐ ఛార్జ్ షీట్ 209 పేజీలో చాలా క్లియర్గా చెప్పింది2019-24 మధ్య చంద్రబాబు సహా మీరంతా తిరుమల వెళ్లుంటారు కదాఆ సమయంలో కల్తీ జరిగిందని ఎందుకు ఫిర్యాదు చేయలేదు?అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా కల్తీ అయ్యాయంటున్నారుమీరంతా అయోధ్యకు వెళ్లి తిన్నారు కదా.. ఎందుకు ఫిర్యాదు చేయలేదు?దేశంలో ఉన్న అన్ని డెయిరీలు ఏ కెమికల్స్ వాడుతున్నాయో బయటపెట్టే ధైర్యం ఉందా?తిరుమలతో హెరిటేజ్ సంబంధం పెట్టుకోలేదని చంద్రబాబు చెప్పారుటెండర్లు పిలవకుండానే తిరుమలకు హెరిటేజ్ మిల్క్ పౌడర్ సప్లై చేశారులడ్డూపై ఆరోపణలు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారుహెరిటేజ్ పేరు తూమాటి ప్రస్తావించగానే ఉలిక్కిపడ్డ మంత్రులుతూమాటి ప్రసంగానికి పదేపదే అడ్డుపడ్డ మంత్రి పయ్యావుల అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాల్సిందే..మండలి ఛైర్మన్పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు మీరు క్రిస్టియన్ అనుకున్నా. కానీ కాదని మీరు చెప్పారు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టిన ఎమ్మెల్సీలు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం మండలి ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలుతాను క్రిస్టియన్ కాదని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్ తనను క్రిస్టియన్ అనడానికి నువ్వు ఎవరని అచ్చెన్నాయుడికి ప్రశ్నతాను హిందువునని క్రిస్టియన్ కాదని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండిపడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుఅచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?: తూమాటితూమాటి మాధవరావు ప్రసంగాన్ని అడ్డుకుంటున్న మంత్రులు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కామెంట్స్..1998లో హెరిటేజ్ టీటీడీకి మిల్క్ పౌడర్ సప్లై చేసింది. అడిట్ డిపార్ట్మెంట్ పేమెంట్ ఇవ్వొద్దని ఆదేశించింది.అయినప్పటికీ టీటీడీ ద్వారా బిల్లు పాస్ చేసుకున్నారునెయ్యికి పూత రాసింది టీడీపీ ప్రభుత్వంలోనే కదా.ఫిర్యాదుకు, సీబీఐ రిపోర్టుకు తేడా తెలియకుండా టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారు.జంతు కొవ్వు కలవలేదని సీబీఐ చార్జ్షీట్ 209 పేజీలో చాలా క్లియర్గా చెప్పారు.2019-24 మధ్య చంద్రబాబు సహా మీరంతా తిరుమలకు వెళ్లుంటారు కదా.ఆ సమయంలో కల్తీ జరిగిందని ఎందుకు ఫిర్యాదు చేయలేదు?.అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా కల్తీ అయ్యాయంటున్నారు.మీరంతా అయోధ్యకు వెళ్లి తిన్నారు కదా.. ఎందుకు ఫిర్యాదు చేయలేదు?.దేశంలో ఉన్న అన్ని డెయిరీలు ఏ కెమికల్స్ వాడుతున్నాయో బయట పెట్టే ధైర్యం ఉందా?.తిరుమలతో హెరిటేజ్ సంబంధం పెట్టుకోలేదని చంద్రబాబు చెప్పారు.టెండర్లు పిలవకుండానే తిరుమలకు హెరిటేజ్ మిల్క్ పౌడర్ సరఫరా చేశారు.బిల్లులు ఆలస్యమైతే బోర్డు ముందుకు తెచ్చి మరీ బిల్లులు తెచ్చుకున్నారు.2024-26 వరకు తిరుమలలో ఏం జరిగిందో విచారణకు ఆదేశించే దమ్ము మీకుందా?.మండలిలో సంచలన విషయాలను బయటపెట్టిన తూమాటి. టీడీపీ ఎమ్మెల్సీపై చైర్మన్ ఆగ్రహం..టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధపై మండలి చైర్మన్ ఆగ్రహంసభలో వైఎస్సార్సీపీ నేతలను నిందితులుగా చదివిన అనురాధఈ క్రమంలో మీరు ఏమైనా.. పోలీసా, సీబీఐ అధికారా అంటూ చైర్మన్ ఆగ్రహంమండలిలో ఉద్రిక్తత.. ఏపీ శాసన మండలిలో అధికార పార్టీ సభ్యుల రచ్చ..లడ్డూపై చర్చ జరగకుండా అధికార పార్టీ సభ్యుల జులుం.పోడియం దగ్గర అధికార పార్టీ సభ్యుల రచ్చ. మండలి చైర్మన్ ఆగ్రహం..తన మైక్ కట్ చేస్తున్నారంటూ చైర్మన్ ఆవేదన.మండలి ప్రతిష్ట నిలబడేలా చర్చ జరగాలన్న చైర్మన్.చర్చ ప్రారంభమైన 20 నిమిషాల్లో 17 సార్లు అడ్డుపడిన మంత్రులు.పర్వతనేని మాట్లాడుతుండగా నిమిషానికోసారి అడ్డుకున్న మంత్రులు.రూల్స్ మాట్లాడుతున్నామంటూనే వాస్తవాలు బయటకు రాకుండా మంత్రుల అరుపులు. మంత్రులు అడ్డుకుంటున్నారు: వైఎస్సార్సీపీ లడ్డూపై చర్చను పదేపదే అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులు.హెరిటేజ్, ఇందాపూర్ బంధంపై చర్చకు టీడీపీ సభ్యుల అభ్యంతరం.వైఎస్సార్సీపీ సభ్యులు ప్రసంగాన్ని పదేపదే అడ్డుకుంటున్న పయ్యావుల.హెరిటేజ్ ప్రస్తావన రాకుండా పదేపదే అడ్డుకుంటున్న మంత్రులు.వాస్తవాలు బయటకు రాకుండా మంత్రులు అడ్డుకుంటున్నారు: వైఎస్సార్సీపీ భోలే బాబా డెయిరీ ఎక్స్లెంట్ అంటూ పర్మిషన్ ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే.అసెంబ్లీ సాక్షిగా హెరిటేజ్పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారు.ఫ్లెక్సీలు వేసి దేవుడిని రోడ్డుపైకి తెచ్చారు.2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హెరిటేజ్ దగ్గర మజ్జిగ కొనుగోలు చేసింది.ప్రభుత్వ టెండర్లలో హెరిటేజ్ పాల్గొనలేదని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. మంత్రుల అత్యుత్సాహం..లడ్డూపై వాస్తవాలు బయటకు రాకుండా పదేపదే మంత్రులు అడ్డుకుంటున్నారు.హెరిటేజ్, ఇందాపూర్ వ్యవహారం బయటకు రాకుండా మంత్రుల అడ్డగింత.సంఘం డెయిరీ, వైష్ణవీ డెయిరీ వ్యవహారం ప్రస్తావనకు రాగానే మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు అడ్డగింత.లడ్డూపై మండలిలో చర్చ.. మంత్రుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి కామెంట్స్..ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ యూనిట్.ఈ అంశంలో పెద్ద ఆర్ధిక కుట్ర దాగి ఉంది.ఆర్థిక కుంభకోణం బయటకు రాగానే హెరిటేజ్ వైబ్సైట్ నుంచి ఇందాపూర్ డెయిరీని కోమ్యానుఫ్యాక్చరింగ్గా మార్చేశారు.ప్రతీ మాట, ప్రతీ పదం ఆధారాలతోనే మాట్లాడుతున్నాను.కల్తీ నెయ్యి సరఫరా చేయడం వల్లే ఇందాపూర్ డెయిరీ తిరస్కరణకు గురైంది.టీడీపీ ప్రభుత్వంలోనే ఏఆర్ డెయిరీ నుంచి నాలుగు ట్యాంకర్లు వచ్చాయి.ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది.లడ్డూ ప్రసాదంపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది.స్వయంగా సీఎం చంద్రబాబే అబద్ధాలు చెప్పారు.టీడీపీ ప్రభుత్వంలో కల్తీ జరిగితే వైఎస్సార్సీపీకి అంటగట్టాలని చేస్తున్నారు.రాజకీయ లబ్ధిగా మొదలైన కుట్ర.. ఆర్థిక కుంభకోణంగా బయటకు వచ్చింది.నాలుగు ట్యాంకర్ల కల్తీ నెయ్యితో లడ్డూలు చేసింది కూటమి ప్రభుత్వంలోనే.మంత్రి గారు పదేపదే మా గొంతు నొక్కుతున్నారు.ఏఆర్ డెయిరీ ట్యాంకర్లను వైష్ణవి డెయిరీ పేరుతో టీటీడీకి పంపారు.సంగం డెయిరీ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్లది.కల్తీ నెయ్యి ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చాయి?.తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లను ఎవరి ఒత్తిడితో అనుమతించారు?.సీబీఐ చార్జ్షీట్లో క్లియర్గా ఎటువంటి జంతు కొవ్వు లేదని చెప్పింది.ఫిర్యాదును పట్టుకుని సీబీఐ రిపోర్టు అంటూ ప్రచారం చేస్తున్నారు. చర్చ ప్రారంభించిన వెంటనే పర్వతరెడ్డిని అడ్డుకున్న మంత్రి అచ్చెన్నాయుడు.చంద్రబాబు అనలేదంటూ మండలి సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు అబద్ధాలు.పర్వతరెడ్డి ప్రసంగానికి పదేపదే అడ్డుతగులుతున్న మంత్రులు.పర్వతరెడ్డి చర్చ మొదలుపెట్టిన ఐదు నిమిషాల్లోనే ఐదు సార్లు అడ్డుకున్న మంత్రులు.పర్వతరెడ్డి ప్రసంగాన్ని పదే పదే అడ్డుకుంటున్న మంత్రి పయ్యావుల. మంత్రి అచ్చెన్నాయుడు ఓవరాక్షన్..వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలపై మంత్రి అచ్చెన్నాయుడు నోటి దురుసుఓపిక లేకపోతే పో.. అంటూ దురుసు వ్యాఖ్యలుఅచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీల ఆగ్రహం లడ్డూపై చర్చకు ప్రభుత్వం భయపడుతోంది: వైఎస్సార్సీపీప్రభుత్వం భయంతోనే సభలో గందరగోళం సృష్టించాలని చూస్తోంది.చైర్మన్ సీరియస్.. మంత్రుల వాదనలతో నేను ఏకీభవించడం లేదు: చైర్మన్తిరుమల లడ్డూ విషయం చాలా సున్నితమైనది.లడ్డూ ప్రసాదంపై చర్చ చాలా మర్యాదగా, గౌరవప్రదంగా జరగాలి. మండలిలో మంత్రుల రగడ.. చర్చ కంటే ముందు ప్రభుత్వం ప్రకటన చేస్తుందని మంత్రి పయ్యావుల మెలిక.చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం ప్రకటన చేయవచ్చన్న చైర్మన్.చైర్మన్తో మంత్రుల వాగ్వాదం.మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: చైర్మన్నేను తప్పు చేస్తున్నా అనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.కొత్త సాంప్రదాయం తీసుకు రావద్దన్న మండలి చైర్మన్. చైర్మన్ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా అధికార సభ్యుల గందరగోళం. తిరుమల లడ్డు ప్రసాదంపై మండలిలో చర్చ జరగకుండా ప్రభుత్వం కుట్ర.ముందుగా స్టేట్మెంట్ ఇస్తామని ప్రభుత్వం పట్టు.స్వల్పకాలిక చర్చలో స్టేట్మెంట్ అనేది ఉండదు: చైర్మన్మండలి నిబంధనలపై చైర్మన్ మాట్లాడుతుండగా అడ్డుకుంటున్న మంత్రులు. మండలిలో తిరుమల లడ్డుపై చర్చ.. మండలిలో లడ్డుపై చర్చకు చైర్మన్ అనుమతి. మండలి చైర్మన్తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల భేటీ..శాసనమండలి చైర్మన్తో భేటీ అయిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుతిరుమల లడ్డుపై మండలిలో చర్చకు మండలి చైర్మన్ అనుమతిప్రశ్నోత్తరాలు ముగిసిన తరవాత తిరుమల లడ్డుపై చర్చముందుగా వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడిన తర్వాత.. ప్రభుత్వం స్టేట్మెంట్ పాస్ చేసేలా నిర్ణయంగతవారం లడ్డుపై చర్చ సందర్భంగా ప్రభుత్వం ముందు స్టేట్మెంట్ పాస్ చేయడంపై అభ్యంతరం తెలిపిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలునేడు తిరుమల లడ్డుపై చర్చకు ఆమోదం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణపై అరుణ్ కుమార్ ప్రశ్న..అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణపై రైతుల అభ్యంతరాలను సభలో ప్రశ్నించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..భూసేకరణపై అభ్యంతరాలకు తక్కువ సమయం ఇచ్చారుగ్రామసభలు, ప్రజాభిప్రాయసేకరణ పెట్టకుండానే భూ సేకరణపై ముందుకు వెళ్లారుభూ యజమానిని సంప్రదించకుండా భూములు తీసుకోవడం సరికాదుగెజిట్లో 140 మీటర్ల రోడ్డును 250 మీటర్లు చేశారుబఫర్ జోన్ను 500 మీటర్లు చేశారుదేశంలో ఎక్కడా ఔటర్ రింగ్ రోడ్డుకి ఇలా చేయలేదుమార్కెట్ రేట్ ప్రకారం గత మూడేళ్లలో ఎంత ఎక్కువ ఉంటే అంత ఇవ్వాలికానీ అలా ఫాలో అవ్వడం లేదుసేకరించిన భూమిని వినియోగించకపోతే తిరిగి వెనక్కి ఇచ్చేయాలి..ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదుఅమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను రద్దుచేయాలి2013 భూ సేకరణ చట్టం ప్రకారం కొత్త గెజిట్ ను విడుదల చేయాలి.. రైతులను ఆదుకోవాలిమండలి సమావేశాలు ప్రారంభం..ప్రారంభమైన శాసన మండలి సమావేశాలుప్రశ్నోత్తరాలు ప్రారంభం -
Chittoor: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి,పలమనేరు: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. కారు పూర్తిగా ధ్వంసమైపోయింది. సమాచారం అందుకున్న పలమనేరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుల వివరాలను సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, మృతులు కర్ణాటక రాష్ట్రం వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కారు అధిక వేగంతో ప్రయాణిస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.మృతుల వివరాలుమృతులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం రాజాజీ నగర్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. చనిపోయిన వారి వివరాలు మోహన్ దాస్ (71),నాగరాజరావు (61),కుసుమ (61)జయంతి (59), పూజ (33)గా నిర్ధారించారు. -
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
వైఎస్ జగన్ విశాఖ పర్యటన అప్డేట్స్.. 👉విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుటుంబసభ్యులను వైఎస్ జగన్ కలిశారు. విశాఖ రాణాప్రతాప్ నగర్లోని ఆయన నివాసంలో ఇటీవల వివాహం జరిగిన వాసుపల్లి గణేష్ రెండో కుమారుడు వాసుపల్లి సాకేత్, శ్రావణిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు.అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుఅరకు వ్యాలీ తుంగల్గూడ గ్రామంలోని రాధాక్రిష్ణ ఆలయంలో వివాహా వేడుకవివాహ వేడుకలో నూతన వధూవరులు అశ్వని, చాణక్యలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన వైఎస్ జగన్ వైఎస్ జగన్కు స్వాగతం అరకు చేరుకున్న వైఎస్ జగన్అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరు కానున్న వైఎస్ జగన్.గిరిజన సాంప్రదాయ దింసా నృత్యంతో వైఎస్ జగన్కు స్వాగతం పలకనున్న మహిళలు..👉విశాఖ బయలుదేరిన వైఎస్ జగన్. 👉వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ వేడుకకు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్కు హాజరవుతారు.👉గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం, విశాఖ నుంచి హెలికాప్టర్లో అరకు వ్యాలీ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తంగులగూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయం వద్దకు వెళ్తారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ రిసెప్షన్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.👉మధ్యాహ్నం అరకు నుంచి హెలికాప్టర్లో తిరిగి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన మర్రిపాలెం రాణా ప్రతాప్నగర్కు చేరుకుని అక్కడ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చిన్న కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై ఆశీస్సులు అందజేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్పోర్టు నుంచి విమానంలో బయలుదేరుతారు. -
తిరుమల అలిపిరిలో చిరుత సంచారం.. జింకపై దాడి
సాక్షి, తిరుమల: తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో చిరుత సంచరించింది. ఈ క్రమంలో జింకపై చిరుత దాడి చేసింది. దీంతో, జింక అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భక్తులను అప్రమత్తం చేసింది. చిరుత సంచారంలో అలిపిరి మార్గంలో వెళ్లాలంటే భక్తులు భయపడిపోతున్నారు. -
చిన్నారులకు వైఎస్ జగన్ అన్నప్రాసన
సాక్షి, అమరావతి: తల్లిదండ్రుల కోరిక మేరకు ఇద్దరు చిన్నారులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నప్రాసన చేశారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట 18వ వార్డు మెంబర్ చిట్లూరి వెంకటేష్, లక్ష్మీ చంద్రిక దంపతులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు.వారి విజ్ఞప్తి మేరకు వారి కుమారుడు ఆర్యన్కు వైఎస్ జగన్ అన్నప్రాసన చేసి, ఆశీస్సులు అందజేశారు. అలాగే నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా విభాగం కార్యదర్శి శ్రావ్య రెడ్డి, జీవన్ రెడ్డి దంపతుల కోరిక మేరకు వారి కుమారుడు శ్రియాన్ రెడ్డికి వైఎస్ జగన్ అన్నప్రాసన చేసి, ఆశీస్సులు అందజేశారు. దీంతో ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
హామీలు అమలు చేయమంటే అంగన్వాడీలపై దౌర్జన్యమా!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని శాంతియుత నిరసన తెలిపిన అంగన్వాడీలను ప్రభుత్వం దౌర్జన్యంగా పోలీసులతో అరెస్టులు చేయించడాన్ని వైఎస్సార్టీయూసీ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. విజయవాడలో అంగన్వాడీలను పాశవికంగా అరెస్టు చేయడాన్ని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కాల్వపల్లి చిన్నమ్మ, ఉపాధ్యక్షురాలు మద్దా చంద్రకళ తప్పుబట్టారు.ఈ మేరకు మంగళవారం ప్రకటన చేస్తూ.. అంగన్వాడీ మహిళల పట్ల మగ పోలీసులు అమానవీయంగా వ్యవహరించిన తీరుపై హోంమంత్రిగా ఉన్న మహిళ సమాధానం చెప్పాలన్నారు. గతంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు మహిళల ఆగ్రహానికి గురయ్యారన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనను అణచివేసేందుకు ప్రయత్నించి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరుఅంగన్వాడీ మహిళల అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చంద్రబాబు ప్రభుత్వాన్ని అంగన్వాడీ యూనియన్ నేతలు హెచ్చరించారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కె.ధనలక్ష్మి, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధ యూనియన్ల నాయకులు లక్ష్మీదేవి. జైని, రత్నకుమారి, లలితమ్మ, సుజాత తదితరులు విజయవాడలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీలు నిద్రమత్తులో ఉండగా ప్రభుత్వం దుర్మార్గంగా అక్రమ అరెస్టులకు పాల్పడిందన్నారు.అరెస్టు చేసిన వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి అంగన్వాడీలకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్లో పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అలాగే, శాంతియుతంగా ధర్నా చేసిన అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వామపక్ష పార్టీలు మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించాయి. అంగన్వాడీలు నిద్రిస్తుండగా తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డాయి. -
వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డీనేటర్స్ నియామకం
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని ఆ పార్టీ రీజినల్ కో–ఆర్డీనేటర్స్గా నియమించారు.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు కురసాల కన్నబాబు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు బూడి ముత్యాలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం జాబితా విడుదల చేసింది. -
అ'భయారణ్యం'
ఆకలేస్తే తప్ప పులి వేటాడదు. ఏ జీవికీ హాని తలపెట్టదు. గత నెలలో తూర్పు గోదావరి జిల్లాలో సాగిన దాని సంచారమే దీనికి రుజువు. రెండు మూడు రోజులకోసారి తప్ప అది జంతువులను హతమార్చింది లేదు. చివరకు అది పట్టుబడిన రోజు కూడా రాయవరం మండలం కూర్మాపురంలోని ఓ పాకలో దూరినా.. అందులో గేదెలున్నా వాటికి ఏమాత్రం హాని తలపెట్టలేదు. కానీ, మనిషి అలా కాదు.. తనకు అవసరమున్నా లేకపోయినా.. రేపటి కోసం దాచాలనే యావలో ప్రకృతికి చేటు తెస్తున్నాడు. తన మనుగడను కొనసాగించడంలో ఇతర జీవరాశులు, మొక్కల పాత్రను గుర్తించలేని దురవస్థలో ఉన్నాడు. ఫలితంగానే జీవ వైవిధ్యానికి ముప్పు తెస్తున్నాడు.రంపచోడవరం: విశిష్టమైన జీవ వైవిధ్యానికి, విభిన్న జంతుజాతులకు నెలవు మన మన్యసీమ. పోలవరం జిల్లా విస్తీర్ణం 6,528.52 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ 53,771.85 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. ఇందులో పాపికొండలు నేషనల్ పార్కు 1,012.858 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. ఇందులో 2,531 జాతుల పుషి్పంచే మొక్కలు, అనేక రకాల వెదురు మొక్కలు, రకరకాల ఔషధ మొక్కలు, విలువైన వృక్షాలు ఉన్నాయి. అలాగే, హైనా, చిరుతపులి, గొర్రగేదెలు, సాంబార్, మచ్చల జింక వంటి అనేక జంతుజాలాలకు ఈ వనసీమ నెలవు. నెమళ్లు, అడవి కోళ్ల వంటి 92 రకాల పక్షి జాతులున్నాయి. కింగ్ కోబ్రా వంటి అనేక రకాల సర్పాలున్నాయి. ఇంతటి జీవవైవిధ్యానికి నెలవైన పాపికొండలు ప్రాంతంలో జీవజాలాన్ని, వృక్షజాలాన్ని సంరక్షించేందుకు వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఈ ప్రాంతాన్ని పాపికొండలు జాతీయ అభయారణ్యంగా 1972లోనే ప్రభుత్వం ప్రకటించింది. అఖండ గోదావరి నదికి ఇరువైపులా కాకినాడ, ఏలూరు, పాల్వంచ, భద్రాచలం అటవీ డివిజన్ల పరిధిలో పాపికొండలు విస్తరించి ఉన్నాయి. అయితే, విలువైన వృక్షాలపై మనిషి వేటు వేయడం.. వన్యప్రాణులను విచ్చలవిడిగా వేటాడుతూండటంతో అభయారణ్యం కాస్తా ఆయా జీవరాశులకు ‘భయారణ్యం’గా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. యథేచ్ఛగా గొర్ర గేదెల వేట పాపికొండల ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో గొర్ర గేదెలున్నాయి. వీటి మాంసానికి డిమాండ్ ఉండటంతో వాటిని విచ్చలవిడిగా వేటాడుతున్నారు. గతంలో దేవీపట్నం మండలం పోతవరం, మద్దిరాతిగూడెం, నేలకోట తదితర ప్రాంతాల్లో ఉచ్చుల్లో పడి పలు గొర్ర గేదెలు మృత్యువాత పడ్డాయి. గొర్ర గేదెలు గుంపులుగా తిరగడంతో వాటిని విల్లుతో వేటాడే అవకాశం ఉండదు. అందువలన వీటి వేటకు నాటు తుపాకులు వాడుతున్నారు. ఇక్కడ గొర్ర గేదెలు ఎక్కువగా ఉండటంతో వాటిని నల్లమల అడవులకు తరలించి, అక్కడ పెంచే అవకాశాలను ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన బృందం పరిశీలించింది. అయితే, వీటి బరువు ఎక్కువగా ఉండటంతో తీసుకువెళ్లడం క్లిష్టతరం కావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించారు. జనారణ్యంలోకి జింకలు అడవుల నుంచి జింకలు అనేకసార్లు సమీపంలోని జనారణ్యంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వీటిపై కుక్కలు దాడి చేస్తున్న సంఘటనలు అనేకం జరిగాయి. స్థానికుల సమాచారం మేరకు అటవీ అధికారులు వాటికి చికిత్స అందించి, అడవుల్లో వదిలిపెడుతున్నారు. అయితే, అడవుల విస్తీర్ణం తగ్గిపోవడమే ఆయా జంతువులు బయటకు రావడానికి ప్రధాన కారణమని పరిశీలకులు చెబుతున్నారు. కింగ్ కోబ్రాలు మన్యసీమలో కింగ్కోబ్రాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. గతంలో, రంపచోడవరం, మోతుగూడెం, రాజవొమ్మంగి తదితర ప్రాంతాల్లో కింగ్క్రోబాలు జనావాసాల్లోకి రావడంతో ప్రజలు హడలెత్తిపోయిన సందర్భాలున్నాయి. మోతుగూడెంలోనైతే కింగ్కోబ్రా ఏకంగా పీహెచ్సీలోకే ప్రవేశించింది. రంపచోడవరం మండలం పెద్దగెద్దాడలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన కింగ్క్రోబాను స్థానికుడే పట్టుకుని గోనె సంచిలో వేసి అడవిలో వదిలిపెట్టారు. చిరుతలు అడ్డతీగల మండలం ఎల్లవరం వద్ద పొలాల మధ్య కాలువ వద్దకు వెళ్తున్న ఓ చిరుత పులి 2023 నవంబర్ 30న కోతులకు పెట్టిన వలలో చిక్కుకుంది. ఆ వలను లాక్కుంటూ వెళ్లి, చెట్టు ఎక్కడంతో వేలాడుతూ రోజుంతా అక్కడే ఉండిపోయింది. తీవ్ర జాప్యం అనంతరం ఉన్నతాధికారుల నుంచి అనుమతి రావడంతో అటవీ అధికారులు దానికి మత్తు మందు ఇచ్చి కిందకు దింపారు. ఆ తరువాత అది చనిపోయింది. అడవి పందులు రంపచోడవరం, మారేడుమిల్లి, వై.రామవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో అడవి పందుల వేట విచ్చలవిడిగా సాగుతోంది. కరెంట్ ఉచ్చులు అమర్చి మరీ వాటిని కొంత మంది హతమార్చుతున్నారు. అడవి పందుల మాంసానికి కూడా మంచి డిమాండ్ ఉండటంతో వేటగాళ్లు వాటాలు వేసి మరీ విక్రయిస్తున్నారు. పొలాల్లోకి వస్తున్న అడవి పందులను ఒకవైపు తరుముకుంటూ వచ్చి వల అమర్చుతారు. ఆ వలలో చిక్కిన వాటిని కొట్టి చంపుతారు. కొంత మంది పందుల వేటకు విల్లుతో పాటు నాటు తుపాకులు కూడా ఉపయోగిస్తున్నారు.పులి.. దారి తప్పి.. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం వద్ద పట్టుకున్న పెద్దపులిని పాపికొండలు నేషనల్ పార్కు పరిధిలోని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. అయితే, ఆ పులి అక్కడి నుంచి మారేడుమిల్లి, రంపచోడవరం మండలాలకు వచ్చి, పలు గ్రామాల్లో పశువులపై దాడి చేసి, హతమార్చింది. ప్రస్తుతం తాళ్లపాలెం, బోలగొండ అటవీ ప్రాంతంలోనే ఈ పులి ఉంది. ఈ పులి మైదాన ప్రాంతానికి రావడానికి అడవులు తగ్గిపోవడం కూడా ఓ కారణమని అంటున్నారు. పులులు సాధారణంగా తమ పరిధిని చాలా ఎక్కువగా విస్తరించుకుంటాయి. గతంలో ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతం నుంచి కూడా పులులు పాపికొండలు అభయరణ్యంలోకి వచ్చేవి. అయితే, వేటతో వాటి సంఖ్య తగ్గిపోయింది. జాతీయ పక్షి నెమలి ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా కనిపించేది. వాటి సంతతి చాలా వరకూ తగ్గిపోయింది.అవగాహన కల్పిస్తున్నాం జంతువుల ఆవశ్యకతపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. అడవులు, జంతువులు వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ చైతన్యం కల్పిస్తున్నాం. పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన తదితర పోటీలు నిర్వహించి, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పెంపొందిస్తున్నాం. – బి.కొండలరావు, అటవీ అధికారి, ఇందుకూరు రేంజ్ -
భూ దాహం తీరనిది!
సాక్షి, అమరావతి: ఇప్పటికే 53,748 ఎకరాల్లో (217.23 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణ పనులను చేపట్టిన ప్రభుత్వం.. రెండో దశలో 50 గ్రామాల పరిధిలో 1,75,347.43 ఎకరాల్లో (709.57 చదరపు కిలోమీటర్లు) రాజధానిని విస్తరించడానికి ‘మాస్టర్ ప్లాన్’ రూపకల్పనకు ఫిబ్రవరి 16న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో బిడ్ల దాఖలు గడువు బుధవారంతో ముగియనుంది. అదే రోజున సాంకేతిక, గురువారం ఆర్థిక బిడ్ను తెరిచి అర్హత సాధించే కన్సల్టెన్సీకి మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతలు అప్పగించనుంది. తొలి దశ, రెండో దశ కలుపుకుంటే మొత్తం 926.8 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి వందేళ్ల సమయం పట్టొచ్చునని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఈ లెక్కన 1.75 లక్షల ఎకరాల్లో రాజధాని విస్తరణకు ఇంకెన్ని వందల ఏళ్లు పడుతుందని సామాజిక, ఆర్థిక వేత్తలు, సిటీ ప్లానర్లు నిలదీస్తున్నారు. దేశంలో మహా నగరాలైన గ్రేటర్ హైదరాబాద్ 650 కి.మీ, గ్రేటర్ చెన్నై 438, బృహత్ బెంగళూరు 741, గ్రేటర్ ముంబై విస్తరించింది 603.4 చదరపు కిలోమీటర్లలోనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఆ మహా నగరాలను ఎవరూ నిర్మించలేదని, వాటంతట అవే మహా నగరాలుగా అభివృద్ధి చెందాయని స్పష్టం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు రూ.47,438 కోట్లు అప్పు తెచ్చారని.. నగర నిర్మాణం పూర్తయ్యే సరికి రూ.లక్షల కోట్ల అప్పు తేవాల్సి ఉంటుందని.. ఇది రాష్ట్రాన్ని పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అమరావతి రాజధాని 2,29,095.43 ఎకరాల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 11 ఏళ్లుగా ప్రాథమిక దశను దాటని రాజధాని ⇒ రాజధానిపై ముందే వందిమాగధులు, బినామీలకు లీకులు ఇచ్చి, ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి కారుచౌకగా భూములు కాజేసిన తర్వాత 2015లో గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల పరిధిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో 53,748 ఎకరాల్లో (217.23 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ⇒ ఇందులో ప్రభుత్వ, అటవీ భూమి పోనూ 34,390 ఎకరాలను రైతుల నుంచి భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా సమీకరించింది. పల్లపు ప్రాంతం.. కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రభావిత ప్రాంతమైన ఆ భూమిలో రాజధాని నిర్మించడానికి కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరం అవుతుందంటూ అప్పట్లో కేంద్రానికి సీఎం చంద్రబాబు డీపీఆర్ సమర్పించారు. ⇒ కానీ.. 11 ఏళ్లవుతున్నా ఇప్పటికీ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. 2014–19 మధ్య రాజధాని నిర్మాణానికి రూ.5,500 కోట్లు వ్యయం చేసినా, శాశ్వత నిర్మాణం ఒక్కటంటే ఒక్కటీ కట్టలేదు. తాత్కాలిక నిర్మాణాల ముసుగులో కాంట్రాక్టర్లతో కలిసి భారీ ఎత్తున దోచుకున్నారని.. షాపూర్జీ పల్లోంజీ నుంచి సీఎం వ్యక్తిగత కార్యదర్శి కమీషన్లు తీసుకుని, ఐటీ శాఖకు పట్టుబడటాన్ని బట్టి చూస్తే రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సర్కార్కు అప్పట్లో ఎంత చిత్తశుద్ధి ఉందన్నది స్పష్టమవుతోందని ఆర్థిక నిపుణులు ఎత్తిచూపుతున్నారు. ⇒ 2024 జూన్ 12న మళ్లీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అధికారంలోకి వచ్చి ఇప్పటికే 21 నెలలు పూర్తయింది. రాజధాని నిర్మాణ పనుల కోసం రూ.47,387 కోట్లు అప్పు తెచ్చి.. సుమారు రూ.60 వేల కోట్ల అంచనాతో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ.. పనుల పురోగతిని పరిశీలిస్తే నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు సాగడం లేదని అధికార వర్గాలే చెబుతున్నాయి. తొలి విడత సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని, ఆ పదేళ్లు కౌలు చెల్లిస్తామని సీఆర్డీఏ చట్టం ద్వారా హామీ ఇచ్చారు. కానీ.. ఆ మేరకు హామీ అమలు చేయలేదు. దాంతో రైతులకు కౌలు చెల్లింపును మరో ఐదేళ్లు పొడిగించారు.పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రం ⇒ రాజధానికి ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని 2016–18 మధ్య కేంద్రానికి ప్రభుత్వం డీపీఆర్లు పంపింది. గతేడాది ఏప్రిల్ 16న రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు.⇒ ప్రస్తుత ధరల ప్రకారం 1.75 లక్షల ఎకరాల్లో రాజధానిని విస్తరించాలంటే మౌలిక సదుపాయాల కల్పనకే రూ.3.50 లక్షల కోట్లు అవసరం. ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధికి వందేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.లక్షల కోట్లకు చేరుతుందని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ⇒ ఈ లెక్కన రాజధానిని 1.75 లక్షల ఎకరాలకు విస్తరించే పనులు పూర్తి కావాలంటే ఇంకెన్ని వందల ఏళ్లు పడతాయి? ఇంకెన్ని రూ.లక్షల కోట్లు వ్యయం అవుతుంది? ఇంకెన్ని రూ.లక్షల కోట్ల అప్పు తేవాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరుతో తెచ్చే అప్పులతో పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తొలి విడతకు మూడింతలు.. ⇒ రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే చిన్న మున్సిపాలిటీగా మిగిలి పోతుందని, భూముల ధరలు పెరగాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని.. అందుకోసం రెండో విడత భూ సమీకరణ తప్పదని సీఎం చంద్రబాబు తెగేసి చెప్పారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాలు.. వెరసి ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాల్లో (82.9 చదరపు కిలోమీటర్లు) భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ⇒ వాటితోపాటు గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, తాడికొండ మండలాలు, పల్నాడు జిల్లాలో అమరావతి, యడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లోని 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు (626.67 చదరపు కిలోమీటర్లు) రాజధాని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 50 గ్రామాల్లో 709.57 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ⇒ ఇందులో ఏడు గ్రామాల్లోని 20,494 ఎకరాలను తొలుత భూ సమీకరణ చేసి.. ఆ తర్వాత అవసరమైనప్పుడు మిగతా భూమిని విడతల వారీగా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా రాజధానిని ఆనుకుని ఉత్తరాన కృష్ణా నది నుంచి దక్షిణాన అవుటర్ రింగ్ రోడ్డు వరకు.. తూర్పున చెన్నై–కోల్కతా జాతీయ రహదారి వరకు ఉన్న ప్రాంతంలో రాజధాని విస్తరణకు మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ⇒ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు 6 నెలలు గడువుగా నిర్దేశించింది. తొలుత భూ సమీకరణ చేస్తున్న ఏడు గ్రామాల్లో వివరణాత్మక ప్రణాళిక.. ఆ తర్వాత మిగిలిన 43 గ్రామాల్లో రాజధాని విస్తరణకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్దేశించింది. రహదారులు, వరద నీటి నియంత్రణ, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల కల్పన.. ఆ పనులకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకోవడం.. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించగా సీఆర్డీఏకు మిగిలే భూమిని విక్రయించడం, దీర్ఘకాలిక లీజు, జాయింట్ డెవలప్మెంట్ వంటి నమునాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణ వంటి మార్గాలను అన్వేషిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్దేశించింది. -
ఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్– ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్–2026ను వచ్చేనెల 25న నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 చెల్లించి ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులను https://polycetap.ap.gov. in లో సమర్పించవచ్చు. -
స్వదేశంలోనే విదేశీ విద్య
సాక్షి, అమరావతి: భారతీయ విద్యార్థులకు స్వదేశంలోనే విదేశీ విద్య అందుబాటులోకి వస్తోంది. ప్రపంచ యూనివర్సిటీలు భారత్ బాట పడుతున్నాయి. విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లకు అనువైన ఎంపికగా భారత్ మారుతోంది. 2040 నాటికి 5.60 లక్షల మందికి పైగా విద్యార్థులకు మన దేశంలో ఏర్పాటయ్యే విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లు సేవలందిస్తాయని డెలాయిట్ ఇండియా, నైట్ఫ్రాంక్సంస్థల సంయుక్త అధ్యయనం వెల్లడించింది. అలాగే ఏకంగా 113 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని తెలిపింది. 40 భారతీయ నగరాలకు సామర్థ్యం.. విదేశీ వర్సిటీలకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం 40 భారతీయ నగరాలకు ఉందని నివేదిక స్పష్టం చేసింది. వీటిలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై టాప్లో ఉన్నాయి. ఇక్కడ పరిశోధనకు అనువైన వాతావరణం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల రాకకు అనుకూలంగా ఉండటం, మౌలికవసతులు, పరిశ్రమ–విద్య అనుసంధానం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అడ్డంకులను అధిగమిస్తూ.. అధ్యయనం ప్రకారం.. ఉన్నత విద్య చదివే వయసున్న యువత కలిగిన దేశంగా భారత్ టాప్లో ఉంది. ప్రస్తుతం దేశంలో 15.50 కోట్ల మంది ఉన్నత కళాశాలల స్థాయి యువత ఉండగా.. 2030 నాటికి వారి సంఖ్య 16.50 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో 2035 నాటికి విద్యార్థుల స్థూల నమోదును ప్రస్తుత స్థాయి నుంచి 50 శాతానికిపెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు దేశీయ ఉన్నత విద్య సామర్థ్యం సరిపోవట్లేదని భావించిన విద్యార్థులు అమెరికా, యూకే, కెనడా, ఆ్రస్టేలియా తదితర దేశాలు వెళ్తుండేవారు. మారిన పరిస్థితుల్లో ఆయా దేశాలు వీసా నియమాలను కఠినతరం చేస్తుండడంతో భారత విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా పెరుగుతున్న ఖర్చులు కూడా వారికి అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో భారత్లోనే తమ క్యాంపస్ల ఏర్పాటుకు ప్రపంచ వర్సిటీలు ముందుకొస్తున్నాయి. విదేశీ వర్సిటీల ఏర్పాటుకు వెసులుబాటు..నూతన విద్యా విధానం తర్వాత దేశంలో ఉన్నత విద్యాసంస్థలను స్థాపించాలనుకునే విదేశీ వర్సిటీలకు వెసులుబాటు లభించింది. విదేశీ వర్సిటీల ఆఫ్షోర్ క్యాంపస్లు, జాయింట్ వెంచర్లు, ట్రాన్స్నేషనల్ ఎడ్యుకేషన్ మోడల్స్ ద్వారా భారత్లో స్వతంత్రంగా పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం బహుళ మార్గాలను కల్పించింది. వీటిలో పన్ను ప్రోత్సాహకాలు, సింగిల్ విండో క్లియరెన్స్ తదితరాలున్నాయి.ఫలితంగా 18 విదేశీ యూనివర్సిటీలు భారత్లో తమ క్యాంపస్ల ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం పొందాయి. ఇందులో ఆ్రస్టేలియాకు చెందిన డీకిన్, వోలోన్గాంగ్ వర్సిటీలు గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ(గిఫ్ట్సిటీ)లో, యూకేకు చెందిన సౌతాంప్టన్ వర్సిటీ గురుగ్రామ్లో తమ క్యాంపస్లు ప్రారంభించాయి. -
కూటమి మోసంపై నిరుద్యోగుల కన్నెర్ర!
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి సర్కారు నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోగా... ఉద్యోగాలను పెద్ద ఎత్తున కల్పించినట్లు పచ్చి అబద్ధాలను ప్రచారం చేసుకుంటోంది. ఏపీ శాసన సభలో ఫిబ్రవరి 25న విద్యాశాఖ మంత్రి లోకేష్ తప్పుడు ఉద్యోగ కల్పన గణాంకాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,587 జాబ్ మేళాలు జరిపి, 1,08,747 ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి, సీడాప్ ద్వారా 74 వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అందులో 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 క్లస్టర్లను గుర్తించినట్లు సభలో ప్రకటించారు. అనేక సదస్సులు జరిపి 770 ప్రాజెక్టులతో ఒప్పందాలు (ఎంవోయూలు) జరిగినట్లు గొప్పగా తెలిపారు. ఐదు లక్షల మంది నిరుద్యోగులకు పారా మెడికల్ శిక్షణ ఇచ్చి వారందర్నీ విదేశా లకు పంపాలని ప్రభుత్వం భావిస్తుందని అసెంబ్లీలో చెప్పు కొచ్చారు. నిజానికి లోకేష్ ప్రకటించిన గణాంకాలన్నీ వాస్తవ విరుద్ధ మైనవే! 1,587 జాబ్ మేళాలు నిర్వహించి 1,08,747 ఉద్యోగాలు కల్పిస్తే వాటికి సంబంధించిన ఆధారాలను, బహిర్గతం చేయాలి కదా! ఆ పని చేయలేదు. నిరుద్యోగుల్ని వంచించే కుట్ర ఇది. అధికారం చేపట్టక ముందు రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని లోకేష్ నెత్తీ, నోరు బాదుకున్నారు. అధికారం చేపట్టగానే ఇంటికో ఉద్యోగం ఇస్తామనీ, సంవత్సరానికి నాలుగు లక్షల చొప్పున ఐదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనీ ‘యువగళం’ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ప్రతీ జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇది జరగకుంటే తన చొక్కా కాలర్ పట్టుకుని నిలదీసి అడగండని నిరుద్యోగ యువతకి మాటిచ్చారు. అధికారం చేపట్టి ఇరవై నెలల సమయం అవుతున్నా ఈ హామీ ఏమయ్యింది?ఉద్యోగాలిచ్చేంత వరకూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భృతి చెల్లిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ప్రతీ నెల మూడువేల రూపాయల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని అన్నారు. కానీ చిల్లిగవ్వ కుడా చెల్లించలేదు. రాష్ట్రంలో 1.75 లక్షల కుటుంబాలున్నాయి. ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు దాదాపు రెండేళ్లకి కలిపి రూ. 14,400 కోట్లు నిరుద్యోగ భృతికి బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. 2026 బడ్జెట్ కూడా కలుపుకొంటే మొత్తం రూ. 21,600 కోట్లు చెల్లించాలి. అంటే రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ప్రభుత్వం డెబ్భై రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి బాకీ ఉందన్నమాట.వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విరివిగా కల్పించారు. సుమారు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఒకేసారి 1.30 లక్షల శాశ్వత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు కల్పించారు. 2.66 లక్షల వాలంటీర్ల నియామకాలు చేపట్టారు. ఆప్కాస్ ద్వారా 96 వేల ఉద్యోగాలిచ్చారు. ఆర్టీసీ విలీనం ద్వారా 58 వేల మంది ఉద్యోగుల్ని జగన్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. భారీ పరిశ్రమలలో లక్ష మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) రంగంలో 32 లక్షల 79 వేల 970 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం 40 లక్షల 13 వేల 552 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించింది. ఇప్పటికైనా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. నిరుద్యోగ భృతి చెల్లించాలి. లేకపోతే యువత ఉద్యమిస్తుంది.– ఎ. రవిచంద్ర ‘ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగంరాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ -
బొబ్బిల్లంకలో మాజీ భార్య, అత్త హత్య
సీతానగరం: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక సుబ్బారావుపేటలో మాజీ భార్య, అత్త దారుణ హత్య సంచలనం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సుబ్బారావుపేటకు చెందిన సోడదాసి సీతారామరాజు (పండు), అదే వీధిలో ఉంటున్న లత (30)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సీతారామరాజు ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవాడు. గతంలో పోక్సో కేసులో కొన్నాళ్లు రిమాండ్లో ఉన్నాడు. అతడి బెయిల్ కోసం లత ఫైనాన్స్ వ్యాపార లావాదేవీలు చూసుకునేది. బెయిల్పై వచి్చన సీతారామరాజు భార్య లతపై అనుమానం పెంచుకున్నాడు. ఒకసారి మద్యం మత్తులో ఆమెను తీవ్రంగా కొట్టాడు. భర్తపై అప్పట్లో సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మనస్పర్థలు పెరగడంతో ఏడాదిన్నర కిందట విడిపోయారు. పిల్లలు ముగ్గురూ తండ్రి సీతారామరాజు వద్దే ఉంటున్నారు. రెండో పెళ్లి చేసుకున్న సీతారామరాజు సీతారామరాజు తన ఇంటి ఎదురుగా ఉంటున్న కుమారిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె గర్భిణి అని చెబుతున్నారు. ఇదిలా ఉండగా కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామంలోని తన చెల్లి, బంధువుల ఇంట్లో ఉంటున్న లత ఇటీవల బొబ్బిల్లంకలోని తల్లి గుమ్మడి లక్ష్మి (50) వద్దకు వచ్చింది. ఆమెను సీతారామరాజు గమనించాడు. తనను వదిలేసిన మొదటి భార్య లత జీవితాన్ని ఎంజాయ్ చేస్తోందని, పిల్లల ఆలనా పాలనా తానే చూసుకోవాల్సి వస్తోందని, ఆమెను హతమార్చాలని పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కత్తులు తీసుకుని ముగ్గురు స్నేహితులతో కలిసి మాజీ అత్త లక్ష్మి ఇంటికి వెళ్లాడు. ఇద్దరు స్నేహితులు గేటు బయట ఉండగా, మరో స్నేహితుడు గుమ్మం వద్ద నిలబడ్డాడు. ఇంట్లోకి వెళ్లిన సీతారామరాజు నిద్రిస్తున్న తన మొదటి భార్య లత చేతులు, భుజాలు, మెడ, ముఖంపై కత్తితో నరికాడు. ఆమె భయంతో కేకలు వేసింది. అది గమనించిన అత్త లక్ష్మి గట్టిగా అరుస్తూ అతడికి అడ్డం వచ్చింది. ఆమెను కూడా సీతారామరాజు కత్తితో నరికి హతమార్చాడు. కత్తిని గోదావరిలోకి విసిరేసి, నేరుగా సీతానగరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసుల విచారణ.. సంఘటన స్థలాన్ని రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్, కోరుకొండ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి మంగళవారం సందర్శించారు. నిందితుడు సీతారామరాజుకు నేర చరిత్ర ఉందని తెలిపారు. పన్నెండేళ్ల కిందట రోడ్డుపై ఓ వ్యక్తిని చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడని, అటువంటి వాడు బతకకూడదదని కుటుంబ సభ్యులు పోలీసుల వద్ద రోదించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యల్లో సీతారామరాజుకు సహకరించిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సీఐ మూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల మూత
కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలోని పలు ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం ముక్కంటి ఆలయం, సింహాచలం అప్పన్న ఆలయాలు పూజల అనంతరం మూసివేశారు. గ్రహణానంతర శుద్ధి కార్యక్రమాల తరువాత తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాత్రి 8.30 గంటలకు తెరిచారు. మరికొన్ని ఆలయాలు బుధవారం ఉదయం తెరిచి శుద్ధి, సంప్రోక్షణ, పూజాధికాల అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. – తిరుమల/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/సింహాచలం/శ్రీశైలం టెంపుల్తిరుమల శ్రీవారి ఆలయం చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకూ మూసివేశారు. గ్రహణానంతర శుద్ధి కార్యక్రమాల అనంతరం రాత్రి 8 గంటలకు ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. అన్నప్రసాద సముదాయం, లడ్డూ కౌంటర్లు కూడా రాత్రి 8.30 గంటల నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి.కుమారధార తీర్థ ముక్కోటి నిర్వహణ ఇదిలా ఉండగా, మంగళవారం సాయంత్రం కొంతమంది భక్తులు కుమారధార తీర్థం ముక్కోటిని ఆచరించారు. అయితే చంద్రగ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులు తీర్థంలో పవిత్రస్నానం చేసి మధ్యాహ్వానికే తిరిగి వెళ్లిపోయారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆలయ అర్చకులు అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారాలను కవాట బంధనం చేశారు. బుధవారం తెల్లవారుజామున సంప్రోక్షణ, అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. విశాఖ జిల్లాలోని సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని గ్రహణం కారణంగా మూసిశారు. రాత్రి 7గంటల సమయంలో ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ పూజలు చేశారు. బుధవారం ఉదయం 6.30గంటల నుంచి భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. శ్రీశైలం ఆలయ ద్వారాలు చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మూసివేశారు. తిరిగి రాత్రి 7.30గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, తదితర పూజాదికాల తరువాత రాత్రి 9గంటలకు స్వామిఅమ్మవార్ల దర్శనాలను పునఃప్రారంభించారు. గ్రహణ కాలానికి అతీతం.. శ్రీకాళహస్తీశ్వరాలయంశ్రీకాళహస్తి: దేశంలో ఉన్న ఆలయాలు గ్రహణ కాలంలో మూసివేయడం ఆనవాయితీ. అయితే శ్రీకాళహస్తీశ్వరాలయం గ్రహణాలకు అతీతంగా ఉంటుంది. గ్రహణ కాలంలో కూడా ఈ ఆలయం తెరచి ఉంచుతారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. గ్రహణ కాలంలో రాహు–కేతు పూజలు అధిక సంఖ్యలో జరిగాయి. 35వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శివయ్య సేవలో నెలరేడు గ్రహణానంతరం పౌర్ణమి చంద్రుడు శివయ్యను సేవిస్తున్నాడా..? అన్నట్టుగా శ్రీకాళహస్తీశ్వరాలయం వద్ద ఉన్న భక్త కన్నప్పకొండపై గల శివపార్వతుల ముందు దర్శనమిచ్చారు. భక్తులు పున్నమి చంద్రుడ్ని ఫొటోలు తీస్తూ మురిసిపోయారు. -
అంగన్వాడీలపై ఆటవిక దాడి!
2000 జూలై 26..సమైక్యాంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో వేతనాలు పెంచాలని శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న అంగన్వాడీలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అమానవీయంగా గుర్రాలతో తొక్కించి, బాష్ప వాయువు ప్రయోగించి, అక్రమ అరెస్టులకు దిగింది.2026 మార్చి 3..విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని విజయవాడలో.. హామీలు నెరవేర్చాలని, వేతనాలు పెంచాలని శాంతియుతంగా నిరసన తెలిపి టెంటులో రోడ్డుపై నిద్రిస్తున్న అంగన్వాడీలపై చంద్రబాబు సర్కారు తెల్లవారుజామున విరుచుకుపడింది. పోలీసులతో ఈడ్చేసి అక్రమంగా అరెస్టులు చేసింది. మహిళల పట్ల చంద్రబాబు మార్కు దౌర్జన్యం, పాతికేళ్లుగా మారని బాబు తీరుకు ఈ రెండు ఘటనలు నిదర్శనం!సాక్షి, అమరావతి, నెట్వర్క్: నమ్మించి నయవంచన చేయడంలో తాను ఏమాత్రం మారలేదని సీఎం చంద్రబాబు అంగన్వాడీల విషయంలో రుజువు చేసుకున్నారు! 2024 ఎన్నికల ముందు వేతనాల పెంపు కోసం ఉద్యమించిన అంగన్వాడీలను కలిసిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని నమ్మబలికారు. అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీం కోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తానని టీడీపీ, జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పెట్టారు. దీంతో చంద్రబాబు అధికారంలోకి వస్తే తమకు వేతనాలు పెంచుతారని, డిమాండ్లు పరిష్కరిస్తారని అంగన్వాడీలు ఆశ పడ్డారు. కానీ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా అంగన్వాడీల వేతనాల పెంపు, గ్రాట్యుటీ చెల్లింపు లాంటి హామీలకు అతీగతీ లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అనేక దఫాలు శాంతియుతంగా నిరసనలు తెలిపిన అంగన్వాడీలను చంద్రబాబు ప్రతిసారీ మభ్యపెడుతూ వచ్చారు. తాజాగా అంగన్వాడీలు ‘ఛలో విజయవాడ’కు పిలుపునివ్వడంతో వారిని మరోసారి మోసగించేందుకు.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ రెండు రోజుల ముందు మంత్రులు వంగలపూడి అనిత, ఫరూక్, బాలవీరాంజనేయులు తదితరులతో ప్రకటనలు గుప్పించారు. అయితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో సోమవారం నిర్వహించిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీగా పోటెత్తారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు చొరవ చూపని చంద్రబాబు మంత్రి అచ్చెన్నను రంగంలోకి దించి చర్చల పేరుతో మభ్య పెట్టారు. ఈ క్రమంలో అంగన్వాడీ నాయకులకు మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్ చేసి ప్రభుత్వం మంగళవారం రోజు చర్చలకు పిలుస్తుందని సమాచారం ఇచ్చినట్లు యూనియన్ నేతలు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని భావించిన అంగన్వాడీలు రాత్రి ధర్నా టెంట్లోనే రోడ్డుపై నిద్రకు ఉపక్రమించారు. అయితే నమ్మించి దగా చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు తెల్లవారుజామున పోలీసులను ప్రయోగించి అంగన్వాడీలను దౌర్జన్యంగా ఈడ్చేశారు! మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అందరూ నిద్రిస్తుండగా వందలాది మంది మగ పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి అంగన్వాడీ మహిళలను ఈడ్చి పారేసిన తీరు దుశ్శాసన పర్వాన్ని తలపించింది. వారు తేరుకునేలోగా టెంట్లు పడేసి, ప్లెక్సీలు చించేసి, ప్లకార్డులు విసిరేసి, అంతా చిందరవందర చేసిన పోలీసులు కిష్కింధకాండను తలపించారు!!విజయవాడలో తెల్లవారుజామున అంగన్వాడీలను ఈడ్చుకెళ్తున్న పోలీసులు ఉద్యమంపై ఉక్కుపాదం..దుర్వాసన వెదజల్లే డ్రైయిన్.. ముసురుకున్న దోమల నడుమ పట్టు వదలకుండా, నిరసన చేపట్టిన టెంట్లోనే.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన అంగన్వాడీలపై చంద్రబాబు సర్కారు పోలీసులను ప్రయోగించి విరుచుకుపడింది. చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ శాంతియుతంగా ఉద్యమించిన మహిళలపై కర్కశంగా వ్యవహరించింది. విజయవాడలో తెల్లవారుజామున అంగన్వాడీలు నిద్రిస్తున్న టెంట్లలోకి చొరబడిన వందలాది మంది పోలీసులు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. అంగన్వాడీలు తేరుకుని ఏం జరుగుతోందో గ్రహించే లోపే మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పారేసి పోలీసు వ్యాన్లలోకి ఎక్కించేశారు. చుట్టూ రోప్ పార్టీ (తాడుతో వలయం) ఏర్పాటు చేసుకున్న పోలీసులు.. అంగన్వాడీలు బయటకు వెళ్లే అవకాశం లేకుండా దిగ్బంధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చిన వారిని కనీసం బ్యాగులు, సెల్ఫోన్లు కూడా తీసుకోనివ్వకుండా నిర్బంధించారు. చేతికి దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేసి వ్యాన్లలోకి తోసేశారు. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? అని ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా గెంటేశారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో పలువురు అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమను అక్రమంగా అరెస్ట్ చేసి కనీసం టాయిలెట్స్కు వెళ్లడానికి కూడా అనుమతించలేదని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబీ రాణి, సుబ్బరావమ్మ వాపోయారు. అంగన్వాడీల అక్రమ అరెస్టులకు నిరసనగా ఏలూరులో భారీ ర్యాలీ చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు తాము చేసిన తప్పేమిటని సత్తెనపల్లి టౌన్ పోలీసుస్టేషన్ ఎదుట ఆక్రోశించారు. అరకొర వేతనాలు, అదనపు బాధ్యతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు వేతనాలు పెంచాలని కోరడం మినహా ఏం నేరం చేశామని నిలదీశారు. పోలీసుల దాడిలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి ఎడమ చేయి విరిగిందని పేర్కొన్నారు. ఈ దుర్మార్గమైన చర్యలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ మహిళలకు ఇచ్చిన గిఫ్ట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. వేతనాలు పెంచి న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే కూటమి ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. ఈడ్చేసిన మగ పోలీసులు..టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో యాక్షన్లోకి దిగిన పోలీసులు కేవలం 30 నిమిషాల్లో నిరసన దీక్ష టెంట్ను కకావికలం చేసి అంగన్వాడీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. మగ పోలీసులు అంగన్వాడీ మహిళలను ఇష్టానుసారంగా పట్టుకుని ఈడ్చేసి వ్యాన్ల్లోకి ఎక్కించారు. కనీసం మహిళల వ్యక్తిగత ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా గంటల తరబడి వ్యానుల్లోనే మగ్గిపోవడంతో నరక యాతన ఎదుర్కొన్నారు. విజయవాడ నుంచి పోలీస్ వ్యాన్ల్లో సుమారు 60 నుంచి వంద కిలోమీటర్ల దూరంలోని గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాల్లోని మారుమూల చోట్లకు తరలించి అక్కడ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి చంద్రబాబు మార్కు దౌర్జన్యాన్ని ప్రత్యక్షంగా చూపించారు.నెల్లూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు భగ్గుమన్న మహిళలు..చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొని సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు శాంతియుతంగా నిరసన తెలిపిన అంగన్వాడీలు నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున చంద్రబాబు సర్కారు అక్రమ అరెస్టులకు దిగడంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు భగ్గుమన్నారు. అన్ని జిల్లాల్లో రోడ్లపైకి చేరుకుని నిరసన తెలిపారు. అరెస్టు చేసిన అంగన్వాడీలను తరలించిన సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్ స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున బైఠాయించారు. తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో అరెస్టు చేసిన కార్యకర్తలను ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, చాట్రాయి లాంటి మారుమూల ప్రాంతాలకు తరలించగా స్థానిక అంగన్వాడీలు పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అణచివేత విధానాలను అనుసరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు తీరుకు నిరసనగా విశాఖ కలెక్టరేట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో అంగన్వాడీలు నల్ల బ్యాడీ్జలతో నిరసన తెలిపారు.కర్నూలులో కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్తున్న అంగన్వాడీలు బాబు మారలేదు.. అంగన్వాడీలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులతో కబురు పంపించిన చంద్రబాబు మరోవైపు పోలీసులను ప్రయోగించి అక్రమ అరెస్టులు చేయడం పట్ల సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధ యూనియన్ల రాష్ట్ర కీలక నేతలు కె.సుబ్బరావమ్మ, జె.లలిత, వీఆర్ జ్యోతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు మారాడనుకున్నామని, అయితే ఆయన ఏమాత్రం మారలేదని రుజువైందన్నారు. దీనికి పర్యవసానం అనుభవించక తప్పదని హెచ్చరించారు. అరెస్టులకు భయపడేది లేదని, జిల్లాల్లో నిరసన ఉద్యమాన్ని కొనసాగించాలని అంగన్వాడీలకు పిలుపునిచ్చారు. పోలీసుల లాఠీలు, అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈమేరకు మూడు యూనియన్ల నేతలు సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు.‘సాక్షి’ కెమెరా లాక్కున్న పోలీసులుచంద్రబాబు సర్కారు ఆదేశాలతో స్వామి భక్తి ప్రదర్శించిన పోలీసులు రెచ్చిపోయి అంగన్వాడీ మహిళలను అరెస్టు చేస్తున్న దృశ్యాలను ఎవరూ చిత్రీకరించకుండా జాగ్రత్త పడ్డారు. అంగన్వాడీల వద్ద సెల్ఫోన్లు లాక్కున్నారు. పోలీసుల దమనకాండను చిత్రీకరిస్తున్న ‘సాక్షి’ కెమెరామెన్ను దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరించి కెమెరా గుంజుకున్నారు. -
హామీలు అమలు చేయాలని అడిగితే తప్పా..?
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై చంద్రబాబు సర్కారు ప్రదర్శించిన దమనకాండ అత్యంత హేయమని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ‘ఛలో విజయవాడ’కు తరలివచ్చిన అంగన్వాడీ మహిళలను నిద్రిస్తున్న సమయంలో అత్యంత దారుణంగా అక్రమంగా అరెస్టులు చేయడాన్ని వైఎస్ జగన్ తప్పుబట్టారు. ఈ మేరకు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఎక్స్’లో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పు అవుతుందా? రెండేళ్లు అవుతున్నా.. ఆ హామీలకు దిక్కూ మొక్కూ లేదని నిలదీయడం, ప్రశ్నించడం నేరం అవుతుందా? అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయం. మహిళలని కూడా చూడకుండా వారిపై లాఠీఛార్జీ.. పోలీసుల చేత బలప్రయోగం.. ఎక్కడికక్కడ నిర్బంధం.. వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా? వాళ్లు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే... ఈరోజు ఉదయం చర్చలకు పిలుస్తామని చెప్పి, ముందు రోజు రాత్రే నిరసన శిబిరాలకు కరెంటు తీసివేసి, కంచెలు వేసి, కనీసం ఆహారం, తాగునీళ్లు అందకుండా చేయడం దారుణం కాదా? ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు ఎగరగొట్టి పచ్చి మోసాలు ఎలా చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు. ఒక్క అంగన్వాడీలకే కాదు.. రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి మీరు చేస్తున్న అన్యాయాలు, వెన్నుపోట్లు శిశుపాలుడి పాపాల్లా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తప్పకుండా మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. చంద్రబాబుగారూ.. మీరు తక్షణం అంగన్వాడీలు, వర్కర్లకు క్షమాపణలు చెప్పాలని, వారికిచి్చన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నా!! -
రాయితీలు ఇవ్వకుంటే ఏపీఐఐసీ స్థలాలకు నగదు చెల్లించలేం
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన రాయితీలు ఇస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) స్థలాలకు నగదు చెల్లించలేమని ఏపీ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అనార్ బాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 1,600 మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు జీవో 7 ద్వారా ప్లాట్లు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీకి నగదు చెల్లించేందుకు మరో మూడు నెలలు మాత్రమే గడువు పొడిగించిందని ఆయన పేర్కొన్నారు. మూడు నెలల గడువు ఈ నెల 8తో ముగుస్తున్నందున మరో నాలుగు నెలలపాటు గడువు పెంచాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్కు అనార్ బాబు సోమవారం లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆ లేఖను ముఖ్యమంత్రి, పరిశ్రమలశాఖ మంత్రికి కూడా పంపారు. నిర్దిష్టమైన కారణాల వల్ల జీవో 7 ద్వారా ప్లాట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు నగదు చెల్లించలేకపోతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు రావడం లేదని, సబ్సిడీ నగదు ప్రభుత్వం వద్దనే ఆగిపోవడంతో బ్యాంకులు అదనపు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. జీవో 7 పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1600 మంది ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులన్నారని, ఇందులో సగం మందికి నూరు శాతం సబ్సిడీలు రాలేదన్నారు. వారిలోనే ఎక్కువ మంది ఏపీఐఐసీకి నగదు చెల్లించాల్సిన వారు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రావాల్సిన సబ్సిడీ నగదు పరిశ్రమల శాఖ వద్దే ఉన్నందున ఆ నగదును ఏపీఐఐసీకి బదిలీ చేసి సర్దుబాబు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. సబ్సిడీలు వచ్చేంత వరకు మరో నాలుగు నెలలపాటు గడువు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వర్గాలకు జీవో నెంబర్ 7 కింద ఇచి్చన ప్లాట్లను రద్దు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఎస్సీల నుంచి రుణాలను ముక్కుపిండి రికవరీ చేయండి
సాక్షి, అమరావతి: జాతీయ దళిత ఆర్థిక సంస్థ(ఎన్ఎస్ఎఫ్డీసీ), జాతీయ సఫాయి కర్మచారీస్ ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్ఎస్కెఎఫ్డీసీ) పథకాల కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీల స్వయం ఉపాధి కోసం మంజూరు చేసిన రుణాలను వారి నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేకంగా రికవరీ బృందాలను ఏర్పాటు చేసింది. మండల స్థాయిలో రికవరీ బృందాలను ఏర్పాటు చేసి ఆ రుణాలను వసూలు చేయాలని జిల్లా యంత్రాంగాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రికవరీ బృందాల పనితీరుపై దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించింది. కొన్ని సంవత్సరాలుగా ఎస్సీల స్వయం ఉపాధి కోసం రూ.396.96 కోట్లను రుణాలుగా మంజూరు చేశారు. ఇందులో ఇప్పటికే రూ.100.68 కోట్లను రికవరీ చేశారు. మిగతా 296.28 కోట్లను వసూలు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా రూ.30.69 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.25.10 కోట్లు, అనంతపురం జిల్లాలో రూ.7.68 కోట్లు ఎక్కువ బకాయిలున్నాయని, వాటిని రాబట్టాలని సూచించింది. ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందితో మండలాల వారీగా రికవరీ బృందాలను ఏర్పా టు చేసి ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారు. -
పండుగ వేళ విషాదం
సుభాష్నగర్/బోధన్/ఆర్మూర్టౌన్/హాలియా: హోలీ వేడుకలు ఆ కుటుంబాల్లో విషాదం నింపాయి. తెలంగాణ, ఏపీలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఎనిమిది మంది మృతి చెందారు. హోలీ సంబరాలను ముగించుకొని నది/చెరువులోకి స్నానాలకని వెళ్లిన వారు మృతి చెందారు. మరో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. విగత జీవులైన పిల్లలను చూసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సూరారంలో... పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీకి చెందిన సాగర్, అజయ్, ఛత్రపతి, కృష్ణనగర్కు చెందిన అభిషేక్, శ్రీరామ్నగర్కు చెందిన విగ్నేష్ స్నేహితులు. వీరు బహదూర్పల్లిలోని తాము చదువుకుంటున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విశ్వకర్మ కాలనీని ఆనుకొని ఉన్న రామన్ చెరువులో స్నానానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అజయ్, విగ్నేష్, ఛత్రపతి.. షాపులో షాంపూలు కొనితెస్తామని చెప్పగా.. సాగర్, అభిషేక్ చెరువు వద్దకు వెళ్లి లోపలికి దిగారు. అంతలోనే మిగతా ముగ్గురు స్నేహితులు అక్కడికి రాగా ఆ ఇద్దరు చెరువులో మునిగిపోతూ చేతులు ఊపారు. దీంతో బయట ఉన్న ముగ్గురు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నీళ్లలోకి దిగారు. అయితే, అక్కడ లోతుగా ఉండటంతో సాగర్, అభిషేక్ మునిగిపోయారు. ఇద్దరి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మెదక్ జిల్లా హవేలీ గణపురం మండలం తొగుట గ్రామానికి చెందిన ఏసు, జ్యోతిల కుమారుడు అభిషేక్. విశ్వకర్మ కాలనీకి చెందిన సంతోష్ కుమార్, రేఖ దంపతుల చిన్న కుమారుడు సాగర్. మంజీరలో మునిగి... స్నేహితులతో హోలీ సంబరాలు జరుపుకుని మంజీరనదిలోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని ఒకటో వార్డు పరిధిలోని ఆచన్పల్లికి చెందిన సాయికుమార్ (20), రోని చౌదరి (18) మంగళవారం సాలూర సమీపంలోని మంజీర నదికి వెళ్లారు. స్నానాలు చేస్తూ నీటిలో గల్లంతై మృతి చెందారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు నదికి చేరుకుని మృత దేహాలను బయటకు తీయించారు. సాయికుమార్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి పది రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. రోని చౌదరి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆర్మూర్లో విషాదం : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో స్థానిక గోల్ బంగ్లా ప్రాంతానికి చెందిన బోగడ నరేష్ పెద్ద కుమారుడు హర్షిత్ (15) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. హర్షిత్ మంగళవారం స్నేహితులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నాడు. అనంతరం గుండ్ల చెరువు వద్ద ఉన్న ట్యాంక్బండ్కు వెళ్లాడు. ఈ క్రమంలో కాలుజారి చెరువులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో హర్షిత్ నీటిలో మునిగిపోయి మరణించాడు. సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు గల్లంతు నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సిరసనగండ్ల గ్రామానికి చెందిన కన్నకుంట్ల బబ్లూచారి(17), నిడమనూరు మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన ఆలేటి కార్తీక్(14), అదే మండలం శాఖాపురం గ్రామానికి చెందిన పోలేపల్లి నాని స్నేహితులు. వీరు హాలియాలో నివాసముంటున్నారు. బబ్లూచారి బైక్ వాషింగ్ సెంటర్లో పనిచేస్తుండగా.. కార్తీక్ 9వ తరగతి చదువుతున్నాడు. నాని ఆటోలకు రెగ్జిన్ పనిచేస్తున్నాడు. ముగ్గురు కలిసి బిర్యానీ పార్సిల్తో మంగళవారం సాయంత్రం హాలియాలోని అక్విడెక్ట్ వద్దకు వెళ్లారు. బిర్యానీ తిన్న అనంతరం కార్తీక్ చేతులు కడుక్కోవడానికి సాగర్ ఎడమ కాల్వలోకి దిగుతుండగా కాలుజారి అందులో పడిపోయాడు. కార్తీక్ను రక్షించేందుకు బబ్లూచారి కాల్వలోకి దిగుతుండగా.. అతడు కూడా కాలుజారి నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. నాని ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పగా.. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. చీకటిగా ఉండటంతో వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఏపీలో... గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం శివారు కండ్రిగలో ముగ్గురు స్నేహితులు చెరువులోకి దిగి మృతిచెందారు. బోళ్ల సాయి (15), ముచ్చు వెంకట జోసఫ్ (15), దుప్పుల వినయ్కుమార్(12) హోలీ పండుగ జరుపుకొని అనంతరం గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. కాలుజారి సాయి, వెంకట జోసఫ్, వినయ్కుమార్ చెరువులో పడి మృతిచెందారు. వీరు గొల్లనపల్లి జెడ్పీ హైసూ్కల్లో చదువుతున్నారు.


