అడ్డదారుల్లో మరింత పతనం | Moshe Raju reacts on ignoring protocol | Sakshi
Sakshi News home page

అడ్డదారుల్లో మరింత పతనం

Mar 5 2026 2:37 AM | Updated on Mar 5 2026 2:37 AM

Moshe Raju reacts on ignoring protocol

రాజ్యాంగబద్ధమైన పదవికి మతం రంగు పులిమే యత్నం

దళితవర్గానికి చెందిన మండలి చైర్మన్‌కు మరోసారి అవమానం 

ప్రోటోకాల్‌ పాటించకుండా.. ఆహ్వానించకుండా.. పలుమార్లు అవమానం 

దళితనేత చైర్మన్‌ స్థానంలో ఉండడం సహించలేకపోతున్న అధికారపార్టీ

హిందువునని చెప్పుకోవాల్సి రావడం బాధాకరమన్న మోషేన్‌రాజు

సాక్షి, అమరావతి: రాజకీయ లబ్ధి కోసం కలియుగదైవమైన వెంకటేశ్వరస్వామినే వివాదంలోకి లాగి కల్తీ డ్రామా ఆడి అభాసుపాలుకావడంతో అధికార టీడీపీ దాన్నుంచి బయటపడడానికి రకరకాల అడ్డదారులు వెతుకుతూ మరింత పతనావస్థకు చేరుతోంది. తాజాగా బుధవారం శాసన మండలి సాక్షిగా రాజ్యాంగబద్ధమైన శాసన మండలి చైర్మన్‌కు సైతం మతం రంగు పులిమారు. దళిత వర్గానికి చెందిన కొయ్యే మోషేన్‌రాజు క్రిస్టియన్‌ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు పదే పదే ప్రస్తావించి ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. 

ఇది ముమ్మాటికీ అధికార టీడీపీ ఆగడాలకు పరాకాష్ట అని రాష్ట్ర ప్రజలు తప్పుబడుతున్నారు. శాసన మండలి చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక దళితవర్గానికి చెందిన నాయకుడిని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చైర్మన్‌ పదవి ఇచ్చి గౌరవించారు. అటువంటి గొప్ప సామాజిక సంస్కరణను స్వాగతించాల్సింది పోయి టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగానే దళిత వర్గానికి చెందిన మండలి చైర్మన్‌ను అవమానిస్తోంది. తిరుపతిలో మహిళా పార్లమెంట్‌ నిర్వహించిన సందర్భంలో మోషేన్‌రాజును ఆహ్వానించకుండా కించపరిచారు. 

శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్‌ వద్ద నిర్మించిన కొత్త భవనం ప్రారంభోత్సవంలో శిలాఫలకంపై మోషేన్‌రాజు పేరు లేకుండా చేశారు. అధికార టీడీపీ తీరుపై అప్పట్లో విమర్శలు రావడంతో ప్రారంభోత్సవం అయ్యాక శిలాఫలకంపై పేరు పెట్టారు. ఇటీవల ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి శాసనమండలి చైర్మన్‌ను ఆహ్వానించ లేదు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇలా అనేక సందర్బాల్లో ఆయనకు ఇవ్వాల్సిన ఫ్రొటోకాల్‌ను విస్మరించడం, శిలాఫలకాలపై పేరు లేకుండా చేయడం, అధికారిక కార్యక్రమాలకు పిలవకపోవడం వంటి చర్యలతో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆయన చైర్మన్‌ అయ్యారనో? దళిత వర్గానికి చెందిన వ్యక్తి అనో? ఉద్దేశపూర్వకంగానే ప్రోటోకాల్‌ విస్మరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఆయనకు మతాన్ని కూడా ఆపాదించడం మరింత దుర్మార్గం. 

హిందువునని చెప్పుకోవాల్సిరావడం బాధాకరం..
శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ తీరుపై మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజును బుధవారం రాత్రి సాక్షి సంప్రదించింది. సభలో మంత్రుల తీరుపై విచారం వ్యక్తం చేస్తూ తాను హిందువుగానే పుట్టానని, హిందువుగానే జీవిస్తున్నానని మోషేన్‌రాజు బదులిచ్చారు. తన సొంత గడ్డ అయిన భీమవరంలో వినాయక చవితి పందిళ్లు వేసి ఉత్సవాల్లో పాలుపంచుకుంటానని, మావూళ్లమ్మ ఉత్సవాల్లోనూ భాగస్వామిని అవుతానని, తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని వాటికి సంబంధించిన ఫొటోలను సైతం విడుదల చేశారు. తాను హిందువునే అని చెప్పుకోవాలి్సన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement