ఈనెల 9 నుంచి ఏపీలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: భారత వాయుసేనలో అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల నియామకాల అధికారి, సికింద్రాబాద్–12 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ కమాండింగ్ ఆఫీసర్ వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ప్రవేశాలు పొందడానికి ఈ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ అద్భుతమైన అవకాశం అని ఆయన వివరించారు.
ఈ నెల 9, 10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహిళా అభ్యర్థులకు, 12, 13 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులకు, 15, 16 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర పురుష అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుందన్నారు. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయసు ఉన్న అవివాహిత యువతీ యువకులు ఉద్యోగాలకు అర్హులన్నారు. అభ్యర్థుల కనీస ఎత్తు 152 సెం.మీ, ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష, మూడేళ్ల డిప్లొమా ఇంజనీరింగ్ (పాలిటెక్నిక్), రెండేళ్ల ఒకేషనల్ కోర్సుల్లో (ఐటీఐ) ఉత్తీర్ణత సాధించినవారు అర్హులన్నారు.
ఆయా విద్యార్హతల్లో మొత్తం మార్కుల్లో 50 శాతం, ఆంగ్లంలో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ రిజి్రస్టేషన్ చేసుకోనవసరం లేదని, నేరుగా ర్యాలీకి హాజరుకావచ్చని వివరించారు. అభ్యర్థులు ఒరిజినల్ లేదా డిజీలాకర్ ద్వారా ధ్రువపర్చిన విద్యార్హత పత్రాలు, స్థానికత ధ్రువీకరణ పత్రం, ఎన్సీసీ సరి్టఫికెట్ (ఉంటే), ఆధార్ కార్డు, ఇటీవల తీసుకున్న 10 పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటోలు, ప్రతి ధ్రువపత్రానికి సంబంధించిన 6 జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహిళా అభ్యర్థులు మార్చి 9న, ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులు 12న, తెలంగాణ పురుష అభ్యర్థులు 13న ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏపీ గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో హాజరుకావాలన్నారు. 1.6 కిలోమీటర్ల పరుగు పోటీ, భౌతిక, శారీరక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి రాత పరీక్ష ఉంటుందన్నారు. ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలను https:// agnipathvayu. cdac.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.


