ఖమేనీ హత్య: కేంద్రం తీరుపై నిప్పులు చెరిగిన సోనియా | Govt's silence on Khamenei assassination not neutral Sonia | Sakshi
Sakshi News home page

ఖమేనీ హత్య: కేంద్రం తీరుపై నిప్పులు చెరిగిన సోనియా

Mar 3 2026 9:37 AM | Updated on Mar 3 2026 10:53 AM

Govt's silence on Khamenei assassination not neutral Sonia

న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న మౌనం తటస్థ వైఖరి కాదని, అది బాధ్యత నుండి తప్పుకోవడమేనని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మంగళవారం ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో రాసిన ఒక వ్యాసంలో ఆమె కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అంతర్జాతీయ నిబంధనలను తుంగలో తొక్కి, ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ జరిగిన ఈ హత్యను ఖండించకపోవడం భారత విదేశాంగ విధానం  విశ్వసనీయతపై సందేహాలను కలిగిస్తోందని సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. గత శనివారం అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతిని ప్రస్తావిస్తూ, ఎటువంటి ముందస్తు యుద్ధ ప్రకటన లేకుండా, దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న సమయంలోనే ఒక దేశాధినేతను అంతమొందించడం అంతర్జాతీయ సంబంధాల్లో  అలజడులకు దారితీస్తుందని ఆమె హెచ్చరించారు.

ప్రధాని నరేంద్ర మోదీ తీరును తప్పుబడుతూ, ఇజ్రాయెల్-అమెరికా జరిపిన భారీ దాడులను విస్మరించి, కేవలం యూఏఈపై ఇరాన్ చేసిన ప్రతిదాడిని మాత్రమే ప్రధాని ఖండించడాన్ని సోనియా గాంధీ తప్పుబట్టారు. ‘చర్చలు, దౌత్యం’ అంటూ ఆయన చెబుతున్న మాటలు అర్థరహితమని, ఎందుకంటే ఈ దాడులకు ముందే అటువంటి దౌత్య ప్రక్రియలు కొనసాగుతున్నాయని ఆమె గుర్తుచేశారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం ఏ దేశంపై కూడా బలప్రయోగానికి పాల్పడకూడదని, అటువంటి ప్రాథమిక సూత్రాల ఉల్లంఘన జరిగినప్పుడు  భారత్ అభ్యంతరం తెలపకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని వచ్చిన 48 గంటల్లోనే ఈ హత్య జరగడం, నెతన్యాహు ప్రభుత్వానికి భారత్ మద్దతు ప్రకటించడం గమనార్హమని ఆమె పేర్కొన్నారు.

బ్రిక్స్ దేశాలైన రష్యా, చైనాతో పాటు గ్లోబల్ సౌత్ దేశాలన్నీ ఈ వ్యవహారంలో సంయమనం పాటిస్తుంటే, భారత్ ఒక వర్గానికి మద్దతు ఇవ్వడం విదేశాంగ విధానంలో ఆందోళనకరమైన మార్పు అని సోనియా విమర్శించారు. 2001లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఇరాన్‌తో భారత్‌కు ఉన్న నాగరిక, చారిత్రక సంబంధాలను బలోపేతం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం ఆ వారసత్వాన్ని మరిచిపోయిందని ఆమె విమర్శించారు. ‘వసుధైక కుటుంబం’ అనేది కేవలం ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాకూడదని, న్యాయం, శాంతి కోసం గొంతు ఎత్తడమే దాని అసలు అర్థమని సోనియా గాంధీ గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: నేడు ఆకాశంలో అద్భుతం.. అంతటా ‘బ్లడ్ మూన్’ సందడి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement