‘ధారావి’సందర్శించడానికి పర్యాటకుల ఆసక్తి
రెండు గంటలకు రూ.15వేలు సంపాదిస్తున్న స్థానిక గైడ్స్
ముంబై: ముంబై మహానగరం.. ఎంతో మందికి కలల నగరం. ఆకాశన్నంటుకునే భవనాలున్నట్టే.. అత్యంత పేదరికంలోని మురికి వాడలూ ఉన్నాయి. అందులో అందరికీ తెలిసింది ధారావి. ఇక్కడి పేదరికమే అమ్మకపు సరుకు. దాన్ని డాలర్లకు అమ్ముతున్నారు స్తానికులు. మన దేశంలో మురికి వాడల పర్యాటకం ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పుడు ధారావి ‘గరీబీ దర్శన్’కో ప్రత్యేకత ఉంది. అది ధనిక ముంబైకర్లకే కాదు.. పేద ధారావి వాసులకూ ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. ధారావి ఇరుకు గల్లీల్లో విదేశీయులను ఓ రెండు గంటలు తిప్పితే చాలు.. రూ.15 వేల రూపాయలు మీ చేతికొస్తాయి.
అవును.. ఒకప్పుడు ఇలాంటి పర్యటనలను శిక్షణ పొందిన గైడ్లే నిర్వహించేవారు. అదంతా వ్యవస్థీకృతంగా ఉండేది. కానీ ఇప్పుడు గైడ్లు ధారావి నిర్వాసితులు. ఎందుకంటే కిలోమీటర్ల మేర, మూడు అడుగుల వెడెల్పు మాత్రమే ఉన్న ఇరుకైన గల్లీలలో చాలా సులభంగా తీసుకెళ్లగలిగేది, బయటికి తీసుకురాగలిగేది వారు మాత్రమే. అలా తీసుకెళ్లి, ధారావిని చూపించి, క్షేమంగా బయటపడేసినందుకు వారు చేసే ఛార్జ్ ఒక్కొక్కరికి రూ.15,000. ఒక్కోసారి బృందాలుంటాయి.
ఐదుగురు సభ్యులున్న బృందం వస్తే.. రూ.75వేల రూపాయలు చేతికొచ్చినట్టే. ఇదో కార్పొరేట్ ఉద్యోగి నెల జీతం. ఒకప్పుడు గైడ్లకే పరిమితమైన ఈ వ్యాపారాన్ని ధారావికర్లు స్వయంగా చేస్తున్నారు. అయితే ఇలా మురికివాడలను చూడటానికి కేవలం విదేశీయులే రావడం లేదు.. ఇలాంటి చోట్లకు ఎప్పుడూ వెళ్లని కొందరు ముంబై వాసులు.. దేశంలోని ఇతర ప్రాంతాల వాళ్లూ ఆసక్తి చూపుతున్నారు.
అయితే అలాంటి పర్యటనకు మన దేశం వాళ్లు వెళ్లే మాత్రం రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. ‘వాయూరిజం’అని పిలిచే ఈ పర్యాటకం ధారావి వాసులకు ఆదాయ మార్గమైంది. తమ ఇంటిని చూపించే.. ఇల్లు గడుపుతున్నారు. అయితే అక్కడి పరిస్థితుల ఫొటోలు తీసుకోవాలంటే మాత్రం వారి అనుమతి తీసుకోవాలి. అయితే ప్రారంభంలో ధారావికి సందర్శకులను తీసుకెళ్లే ఆలోచనను చాలా మంది వ్యతిరేకించారు. ఇది పేదరిక పర్యాటకంలా అనిపించింది.
ఒకరి ఆకలి, పేదరికం మరొకరికి దర్శనీయం కావడం ఇబ్బందిగా అనిపించింది. కానీ.. యూరోపియన్ సామాజిక కార్యకర్త క్రిస్ వే, కృష్ణ పూజారి 2005లో ప్రారంభించిన రియాలిటీ టూర్స్ ఆలోచనా తీరును మార్చింది. గైడ్స్గా స్థానిక విద్యార్థులుంటే.. వారికి చదువుకోసం డబ్బు వారే సంపాదించుకోవచ్చని కొత్త ఆలోచనతో ‘ధారావి’నడక ప్రారంభించారు. అలా ధారావిలో మురికివాడల పర్యాటకం ఒక కుటీర పరిశ్రమగా మారింది. ఇప్పుడు పనికొచ్చే రెండు ఇంగ్లిష్ మాట్లాడగలిగేవాళ్లు.. గైడ్గా మారిపోవచ్చు. అయితే, ధారావి పునరాభివృద్ధి తరువాత ఈ పరిస్థితిపై అనిశ్చితి ఉంది.


