ముంబై: దేశవ్యాప్తంగా వీధి కుక్కల బీభత్సం నానాటికీ పెరుగుతుంది. సుప్రీంకోర్టు స్థానిక ప్రభుత్వాలు వీటిని నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలు కనబడడం లేదు. తాజాగా మహారాష్ట్రలో రోడ్డుపై ఆడుకుంటున్న 7 సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.
థానే జిల్లాలోనే కళ్యాణ్ ప్రాంతంలో కుశిల్ శంకర్ వాఘే అనే 7సంవత్సరాల బాలుడు ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. అయితే ఇంతలోనే అక్కడే ఉన్న వీధికుక్కలు అతనిపై దాడి చేశాయి. ఇది గమనించిన అతని మిత్రుడు నిలేశ్ బాగ్లే పరిగెత్తుతూ వచ్చి అతనిని కాపాడే యత్నం చేశాడు. అయితే ఆ కుక్కలు ఆ బాలుడిపై కూడా దాడి చేశాయి.
దీంతో ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన వారి తల్లిదండ్రులు వెంటనే వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు అధికంగా కావడంతో కుశిల్ అనే బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రస్తుతం నిలేశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని డాక్టర్లు తెలిపారు.
అయితే ఈ ఘటనపై ఆ పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో వీధికుక్కల బెడద విపరీతంగా ఉందన్నారు. అక్కడి ప్రజలపై తరచుగా దాడులకు తెగబడుతన్నాయన్నారు. స్థానిక ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.


