breaking news
Maharashtra
-
‘అయ్యా.. నేను ఐఏఎస్ తుకారాం ముండేని!’
ముంబై: భారత పాలనా వ్యవస్థలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగని,అవినీతిపై రాజీలేని పోరాటం చేసే నిప్పులాంటి అధికారులకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు ఐఏఎస్ అధికారి తుకారాం ముండే. తన సుదీర్ఘ కెరీర్లో నిబంధనల అమలు విషయంలో ఎక్కడా తగ్గకపోవడం వల్ల సుమారు 25 సార్లు బదిలీలు ఎదుర్కొన్న ఈ రియల్ లైఫ్ సింగం తాజాగా మహారాష్ట్రలో మరో సంచలనానికి తెరతీశారు. ఏకంగా చట్టాన్ని రక్షించే బాంబే హైకోర్టు ప్రాంగణంలోని క్యాంటీన్లనే సీల్ చేయించి దేశవ్యాప్తంగా చర్చాంశనీయంగా మారారు.ఈ ఏడాది మే నెలలో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా తుకారాం ముండే బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవి చేపట్టడమే ఆలస్యం.. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న ఆహార కల్తీ ముఠాలపై, అపరిశుభ్ర హోటళ్లపై ఉక్కుపాదం మోపారు. కేవలం రెండు నెలల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 10వేలకంటే ఎక్కువ హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులపై ముండే తన ఎఫ్డీఏ బృందాలతో మెరుపు దాడులు చేయించారు. కోట్ల విలువైన కల్తీ పాలు, నూనెలు, నిషేధిత గుట్కాలను సీజ్ చేయడమే కాకుండా, కనీస పరిశుభ్రత పాటించని వందలాది ప్రసిద్ధ సంస్థల లైసెన్స్లను కూడా తక్షణమే రద్దు చేస్తూ వస్తున్నారు.తుకారాం ముండే తీసుకుంటున్న ఈ మెరుపు చర్యలపై తీవ్రంగా నష్టపోయిన పలువురు పెద్ద పెద్ద వ్యాపారస్థులు బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు ధర్మాసనం ఎఫ్డీఏ తీరును ప్రశ్నిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. మీరు కేవలం ప్రైవేట్ హోటళ్లు, రెస్టారెంట్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే క్యాంటీన్లలో కూడా ఇలాగే తనిఖీలు చేస్తున్నారా? చట్టం అందరికీ సమానంగా వర్తించాలి’అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.కోర్టు అడిగిన ప్రశ్నకు స్పందనగా, మరుసటి రోజే మహారాష్ట్ర ఎఫ్డీఏ అధికారుల బృందం బాంబే హైకోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించింది. అప్పటికే బాంబే బార్ అసోసియేషన్ తమ ప్రధాన క్యాంటీన్ను స్వచ్ఛందంగా మూసివేసినప్పటికీ, ఎఫ్డీఏ తనిఖీలలో ఆ క్యాంటీన్కు చెల్లుబాటు అయ్యే ఫుడ్ లైసెన్స్ (FSSAI) లేదని వెల్లడైంది. దీనితో నిబంధనల ప్రకారం అధికారులు ఆ క్యాంటీన్కు 'స్టాప్ బిజినెస్' (వ్యాపార నిలిపివేత) నోటీసులు జారీ చేసి, లీగల్గా సీల్ వేశారు.చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపిస్తూ, సరైన లైసెన్స్ , పరిశుభ్రత ప్రమాణాలు పాటించని కారణంగా హైకోర్టు ప్రాంగణంలోని క్యాంటీన్పై ఈ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది. దీనితో పాటు, మహారాష్ట్ర సచివాలయ (మంత్రాలయ) పరిధిలోని ప్రభుత్వ క్యాంటీన్లలో కూడా ఎఫ్డీఏ బృందాలు దాడులు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వాటికి నోటీసులు జారీ చేసి మూసివేయించాయి.ప్రభుత్వ వ్యవస్థలను సైతం వదలకుండా తుకారాం ముండే తీసుకున్న ఈ మెరుపు నిర్ణయంపై సోషల్ మీడియాలో సామాన్య ప్రజల నుండి భారీ మద్దతు లభిస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసి 57 సార్లు ట్రాన్స్ఫర్లయిన ఐఏఎస్ అశోక్ ఖేమ్కా నిజమైన వారసుడు తుకారాం ముండే అంటూ మహారాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆయనను కీర్తిస్తున్నారు. ఐఏఎస్ అధికారి తుకారాం ముండే తన 21 ఏళ్ల సర్వీసులో రికార్డు స్థాయిలో మొత్తం 25 సార్లు బదిలీ అయ్యారు.ఆయన 2005 బ్యాంచ్ మహారాష్ట్ర కేడర్ అధికారి. అవినీతిపై రాజీలేని పోరాటం చేయడం, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయడం వల్లే ఆయనకు సగటున ఏడాదికి ఒకసారి కంటే ఎక్కువగానే బదిలీలు జరిగాయి.మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా ఆయనకు దక్కిన బాధ్యత ఆయన కెరీర్లో 25వ పోస్టింగ్. -
మనుషుల్ని ఇలా ప్రేమిద్దాం డ్యూడ్.. పోయేదేముంది?
ముంబైలోని కేల్కర్ కళాశాలలో జరిగిన ఓ సాధారణ పుట్టినరోజు వేడుక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విద్యార్థులు చేసుకున్న ఈ వేడుక తమ సహ విద్యార్థి పుట్టినరోజుకి సంబంధించింది కాదు. కాంటీన్లో పని చేసే ఉద్యోగికి పుట్టినరోజు వేడుక నిర్వహించి విద్యార్థులు ఆశ్చర్యపరిచారు. ఆ విద్యార్థులకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. దయ చూపాలంటే పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదని, చిన్న మంచి పని చేసినా చాలని చాలామంది కామెంట్లు చేశారు. ఈ వీడియో చూసిన పూర్వ విద్యార్థులు కూడా కళాశాల కాంటీన్తో తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో అజింక్య భుజ్బల్ అనే యూజర్ షేర్ చేశారు. "ఎక్కడికి వెళ్లినా ఆనందాన్ని పంచి వస్తాను" అని పేర్కొన్నారు.వీడియోలో కేల్కర్ కళాశాల విద్యార్థులు కాంటీన్ భయ్యా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ "హ్యాపీ బర్త్డే" పాట పాడారు. ఊహించని ఈ వేడుక చూసి ఆయన ఆప్యాయంగా చిరునవ్వు చిందించారు. విద్యార్థుల ప్రేమాభిమానాలకు ఆయన భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు.వీడియోలో... "మా కాంటీన్ భయ్యా పుట్టినరోజు జరిపాం. #స్ప్రెడ్ లవ్ ఎఫ్టీ కేల్కరైట్స్" అని రాసి ఉంది. ఈ వీడియో కింద వచ్చిన కామెంట్లలో విద్యార్థుల ఆలోచనను చాలామంది ప్రశంసించారు. "అందరి ప్రేమను పొందిన వ్యక్తి.. అజాత శత్రువు" అని ఓ యూజర్ పేర్కొన్నారు. "భీమ్రాజ్ ఎంత ముద్దుగా ఉన్నాడు" అని మరో వ్యక్తి అనన్నారు. "ఈ కాంటీన్తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి" అని ఇంకొకరు కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Ajinkya Bhujbal (@bhujbal_ajinkya18) -
ప్రశ్నపత్రాల లీకేజీ ముఠా గుట్టు రట్టు
ముంబై: మహారాష్ట్రలో కలకలం సృష్టించిన ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టీఈటీ) 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై సమీపంలోని థానే నగర పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేయడంతో పెద్దఎత్తున కుట్ర భగ్నమైంది. టీఈటీ పరీక్షకు కేవలం రెండు రోజుల ముందు పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు బ్రిజేంద్ర గుప్తాతో పాటు మరో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ముఠా ఒక్క టీఈటీ పేపర్ లీకేజీతో ఆగకుండా, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం నిర్వహించే ‘సెట్’ పరీక్షా పత్రాన్ని కూడా లీక్ చేయడానికి ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. ఆగ్రాలోని ఓ ముద్రణాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న సంజయ్ కుమార్ శర్మ ద్వారా ఈ పత్రాలను రహస్యంగా సేకరిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు.ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాల ద్వారా ఈ ముఠాలు ఏవిధంగా ప్రశ్నపత్రాలను తస్కరిస్తున్నాయనే విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. ప్రింటింగ్ ప్రెస్లలో నిఘా ఉంచి, కిందిస్థాయి సిబ్బందిని ఆకర్షించి పత్రాలను బయటికి పంపడం, అలాగే ఆన్లైన్ పరీక్షా కేంద్రాలను దక్కించుకుని వేరే వ్యక్తులతో పరీక్ష రాయించడం వంటి పద్ధతులను ఈ నెట్వర్క్ వాడుతున్నట్లు తేలింది.టీఈటీ పరీక్షా పత్రాన్ని రూ. 8,000 పెట్టి కొనుగోలు చేసిన ఈ ముఠా, మహారాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులకు రూ. 80,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. భివాండి నగరంలో ఈ పేపర్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో థానే పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి హరియాణా, బిహార్కు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడంతో ఈ భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది.ఇది కూడా చదవండి: కూలిన పైకప్పు.. నిద్రలోనే కన్నుమూసిన దంపతులు -
5న సీజేపీ కీలక భేటీ
ఛత్రపతి శంభాజీనగర్: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక సభ్యుల సమావేశం ఈ నెల 5వ తేదీన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో జరగనుంది. తదుపరి కార్యాచరణను ఖరారు చేయడమే అజెండాగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నివాసంలో భేటీ జరగనుందని పార్టీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. వలంటీర్లు, విద్యార్థులతో చర్చలు జరిపి, సూచనలు, సలహాలతో ఈ సమావేశానికి రావాల్సిందిగా ఇప్పటికే కీలక సభ్యులకు సమాచారం అందించామని తెలిపాయి. 5న సమావేశం అనంతరం మీడియాతో భేటీ ఉంటుందని, భవిష్యత్ కార్యాచరణను వెల్లడించే అవకాశాలున్నాయని సీజేపీ వర్గాలు వివరించాయి. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్తో సీజేపీ జంతర్మంతర్లో నిరసనలు కొనసాగించడం తెల్సిందే. -
3 పిల్లలతో కారు ముందుకు పులి.. చూస్తే ఊపిరి ఆగినంత పని..
ముంబై: అడవి సఫారీకి వెళ్లిన ఒక కుటుంబానికి తిరిగి వస్తున్న సమయంలో జీవితాంతం మర్చిపోలేని ఓ దృశ్యం కనపడింది. మహారాష్ట్రలోని తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్లో ఒక ఆడపులి తన మూడు చిన్న పిల్లలతో రోడ్డు దాటుతూ కనిపించింది. ఈ అరుదైన క్షణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.ఈ వీడియోను కంటెంట్ క్రియేటర్ అంకుశ్ జిజిల్వార్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. జులై 15 సాయంత్రం తన కుటుంబం పద్మాపూర్ గేట్ నుంచి తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్లో సఫారీ కోసం ప్రవేశించిందని ఆయన తెలిపారు. అంకుశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వారు మొహర్లీ గ్రామం దగ్గరకు చేరుకున్నప్పుడు రోడ్డు పక్కన కొన్ని వాహనాలు నిలిపి ఉండటం చూశారు. మొదట పులి అడవిలోకి వెళ్లిపోయిందని అనుకున్నారు. కానీ సాయంత్రం 7.03 గంటలకు అకస్మాత్తుగా ఎత్తైన గడ్డి మధ్య నుంచి ఆడపులి ‘ఛోటీ మధు’ బయటకు వచ్చింది.కొన్ని సెకన్ల తర్వాత గడ్డి మధ్య నుంచి ఒక్కొక్కటిగా దాని మూడు పిల్లలు కూడా బయటకు వచ్చాయి. వీడియోలో ఆడపులి ఎంతో ప్రశాంతంగా తన పిల్లలను రోడ్డు దాటిస్తున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడ ఉన్న వారంతా మంత్రముగ్ధులయ్యారు.ఈ సమయంలో ఒక బైక్పై వెళ్తున్న వ్యక్తి అనుకోకుండా ఆడపులి వైపు వెళ్లడం ప్రారంభించాడు. అంకుశ్ వెంటనే తన కారు హెడ్లైట్ను వెలిగించి అతడిని అప్రమత్తం చేశారు. బైకర్ సమయానికి ఆగి సురక్షితంగా పులికి దూరం పాటించాడు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు.అంకుశ్ స్పందిస్తూ.. అడవి వాతావరణంలో ఇంత దగ్గరగా ఆడపులిని తన మూడు పిల్లలతో చూడటం తమ జీవితంలో అత్యంత గుర్తుండిపోయే అనుభవాల్లో ఒకటని తెలిపారు. ఇలాంటి క్షణాలు అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ప్రాముఖ్యతను కూడా గుర్తు చేస్తాయని చెప్పారు. Instagramలో ఈ పోస్ట్ని వీక్షించండి Ankush Jizilwar | Chandrapur Today (@ankushjizilwar) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది -
బీజేపీకి గుడ్బై.. మోదీ వీరాభిమాని ఆస్తులెంతో తెలుసా?
షెహజాద్ పూనావాలా.. బీజేపీకి పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయన నిష్క్రమణ వెనుక మరిన్ని కారణాలున్నాయా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నిరసనలు, అలాగే పార్టీ వైఖరి నేపథ్యంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.షెహజాద్ పూనావాలా రాజీనామా వార్తలకు ముందు ఆయన తన ఎక్స్ (X) ఖాతా బయోలో కీలక మార్పులు చేశారు. తన ప్రొఫైల్ నుంచి బీజేపీ ప్రస్తావనను తొలగించారు. అయితే అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని మాత్రం కొనసాగించారు. తన ఎక్స్ బయోలో మోదీకి తాను “లైఫ్ లాంగ్ ఫాలోవర్” అంటూ పేర్కొన్నారు. దీంతో పార్టీకి దూరమైనా.. మోదీ పట్ల తన గౌరవం కొనసాగుతుందనే సంకేతాలు ఇచ్చినట్లయింది.జెన్జీ నిరసనల ఎఫెక్ట్తోనేనా?షెహజాద్ పూనావాలా నిష్క్రమణపై మరో ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. ఇటీవల నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నేతృత్వంలో జరిగిన జెన్జీ నిరసనలు, వాటి చుట్టూ ఏర్పడిన రాజకీయ వాతావరణం తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పూనావాలా రాజీనామాకు జెన్జీ నిరసనలే కారణమని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. పార్టీ వర్గాలు మాత్రం ఇది వ్యక్తిగత నిర్ణయమని చెబుతున్నాయి. దీంతో అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఎవరీ షెహజాద్ పూనావాలా?1987 అక్టోబర్ 17న మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన షెహజాద్ పూనావాలా న్యాయ విద్యను అభ్యసించారు. పుణే విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన.. న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు, కాలమిస్టుగా పనిచేశారు. ఆయన కుటుంబ విషయానికి వస్తే.. తండ్రి సర్ఫరాజ్ పూనావాలా, తల్లి యాస్మిన్ పూనావాలా. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కాంగ్రెస్ అనుకూల వాదిగా పేరున్న తహసీన్ పూనావాలా ఆయన సోదరుడు. విద్యార్థి రాజకీయాలు, పబ్లిక్ డిబేట్లలో చురుగ్గా పాల్గొన్న ఆయన.. తన న్యాయ నేపథ్యంతో వాదనలను బలంగా వినిపించే నేతగా పేరు తెచ్చుకున్నారు.కాంగ్రెస్లో పంచాయితీతో.. షెహజాద్ పూనావాలా తొలుత కాంగ్రెస్లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అయితే 2017లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్కు దూరమయ్యారు. 2021లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులై.. దేశవ్యాప్తంగా టీవీ డిబేట్లలో బీజేపీ వాణిని బలంగా వినిపించారు.బీజేపీకి బలమైన వాయిస్.. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో షెహజాద్ పూనావాలా పలు కీలక అంశాలపై పార్టీ తరఫున స్పందించారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం, రాజకీయ చర్చల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రాజకీయాలు, పాలన, జాతీయ భద్రత వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలిచాయి.ఆస్తులు ఎంత, ఆదాయ వనరులు ఏంటంటే..షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ఎలాంటి లోక్సభ లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో ఎన్నికల అఫిడవిట్ రూపంలో ఆయన ఆస్తులపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు. అయితే కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఆయన ఆస్తి విలువ సుమారు 70 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.65 కోట్ల వరకు) ఉండొచ్చని అంచనా. ఆదాయ వనరుల్లో న్యాయవాద వృత్తి, టీవీ చర్చలు, రాజకీయ విశ్లేషణలు, పబ్లిక్ ఈవెంట్లలో ప్రసంగాలు వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.ఎన్నికల బరిలోకి ఎందుకు రాలేదు?రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయనకు లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల టికెట్ కూడా లభించలేదు. అయితే దీనిపై ఆయన ఎలాంటి ప్రత్యేక కారణాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన ప్రధానంగా పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వాయిస్గా గుర్తింపు పొందారు. టీవీ డిబేట్లు, రాజకీయ విశ్లేషణలు, పార్టీ విధానాలపై వివరణ ఇవ్వడం వంటి బాధ్యతల్లోనే ఎక్కువగా కనిపించారు.కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల కంటే సంస్థాగత బాధ్యతలకు, మీడియా ప్రతినిధిత్వానికి ప్రాధాన్యం ఉన్న నేతలను ఆ పాత్రల్లోనే కొనసాగిస్తాయి. పూనావాలా విషయంలోనూ అదే జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.నెక్ట్స్ ఏంటి?బీజేపీకి రాజీనామా చేసిన షెహజాద్ పూనావాలా తదుపరి రాజకీయ ప్రయాణంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. పార్టీ నుంచి బయటకు వచ్చినా.. మోదీపై తన అభిమానాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా బయో స్పష్టం చేస్తోంది. అయితే ఆయన నిర్ణయం వెనుక అసలు కారణాలు ఏమిటి? జెన్జీ నిరసనల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావం ఉందా? లేక పూర్తిగా వ్యక్తిగత కారణాలేనా? అన్నదానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. -
జెన్జీ టెన్షన్?.. CJI కార్యక్రమం వాయిదా!
విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టమైన కాన్వొకేషన్ వేడుక. అలాంటి వేడుకకు దేశ ప్రధాన న్యాయమూర్తి హాజరు కావడంపై వాళ్లు ఒకింత ఎగ్జయిటింగ్గా ఫీలయ్యారు. తల్లిదండ్రుల కోసం టికెట్లు.. హోటల్ రూమ్స్ అన్నీ బుక్ చేసుకుని కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆ సమయంలోనే అనూహ్యంగా కార్యక్రమం వాయిదా పడడంతో వందలాది మంది నిరాశకు లోనయ్యారు.మహారాష్ట్ర ముంబైలోని ప్రతిష్ఠాత్మక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) తన 86వ కాన్వొకేషన్ వేడుకను ఆకస్మికంగా వాయిదా వేసింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే ఆగస్టు 2న జరగాల్సిన ఈ వేడుకను “అనుకోని పరిస్థితులు” కారణంగా వాయిదా వేస్తున్నట్లు TISS రిజిస్ట్రార్ విద్యార్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారు. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అయితే ఈ నిర్ణయం వెనుక భద్రతా కారణాలు ఉన్నాయనే చర్చ మొదలైంది.కాక్రోచ్ నిరసనల భయమేనా?TISS అధికారికంగా కారణాలను వెల్లడించకపోయినా.. క్యాంపస్లో భద్రతాపరమైన ఆందోళనలు, సాధ్యమైన నిరసనలపై వచ్చిన సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమానికి సంబంధించిన నిరసనలు కాన్వొకేషన్ సమయంలో చోటుచేసుకునే అవకాశం ఉందన్న నిఘా సమాచారంతో అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు ప్రముఖులు పాల్గొనే కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వేడుకను వాయిదా వేసినట్లు సమాచారం.CJIతో పాటు పలువురు ప్రముఖులు.. ఈ కాన్వొకేషన్కు జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అలాగే బాంబే హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రవీంద్ర ఘుగే కూడా కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దేశంలోని ప్రముఖ న్యాయవ్యవస్థకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే కార్యక్రమం కావడంతో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కాన్వొకేషన్ వాయిదాకు నిరసనలే కారణమని TISS అధికారికంగా ప్రకటించలేదు. భద్రతా పరిస్థితులు, అనుకోని పరిణామాల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమని మాత్రమే సంస్థ వెల్లడించింది.టికెట్లు బుక్.. చివరికి వాయిదాకాన్వొకేషన్ కోసం విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. కొందరు విమాన టికెట్లు, మరికొందరు రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు. హోటల్ గదులు కూడా రిజర్వ్ చేసుకున్నారు. చివరి నిమిషంలో కార్యక్రమం వాయిదా పడటంతో ప్రయాణ ఖర్చులు, వసతి కోసం చేసిన ఖర్చులు వృథా అయ్యాయని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులకు కొత్త తేదీ ఎప్పుడు ప్రకటిస్తారన్న ఆందోళన కూడా నెలకొంది.ఆర్థిక నష్టంపై పరిశీలనవిద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తించిన TISS.. ఆర్థిక నష్టంపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని తెలిపింది. అవసరమైన వారికి తాత్కాలిక ధ్రువపత్రాలు అందిస్తామని, కొత్త కాన్వొకేషన్ తేదీని త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది.బొద్దింకల వ్యాఖ్యలతోనే..అప్పట్లో ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ కొందరు నిరుద్యోగ యువతను ఉద్దేశిస్తూ “కాక్రోచ్లు”, “పరాన్నజీవులు” వంటి పదాలు ఉపయోగించారని ప్రచారం జరిగింది. ఆ వ్యాఖ్యలకు నిరసనగానే.. కాక్రోచ్ జనతా పార్టీని మహారాష్ట్రకే చెందిన అభిజిత్ దీప్కే ప్రారంభించాడు. అది.. నీట్ నిరసన ఉద్యమంతో ఎంత పని చేసిందో అందరికీ తెలిసిందే. అయితే.. తాను యువతను ఉద్దేశించి అలా అనలేదని, నకిలీ డిగ్రీలతో ప్రాక్టీస్ చేస్తున్న లాయర్లనే అన్నానని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తరచూ వివరణ ఇస్తూ వస్తున్నారు. మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారంటూ మొన్నీమధ్యే ఆవేదన వ్యక్తం చేశారు. అంతెందుకు.. జంతర్ మంతర్ నిరసనల పిటిషన్ను కూడా ఆయన బెంచే ఇప్పుడు విచారణ జరుపుతుండడం గమనార్హం. ఈ తరుణంలో.. CJI హాజరు కావాల్సిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అలాంటి నిరసనలు జరుగుతాయనే అనుమానంతో చివరి నిమిషంలో వాయిదా పడటం కొత్త చర్చకు దారితీసింది. -
ఎంత పని అయిపోయింది అన్న..!
-
చెట్టు మీద భర్త.. వరదలో కొట్టుకుపోయిన భార్యాపిల్లలు
క్షణాల్లో వచ్చిన వరద ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో కారు కొట్టుకుపోతుండగా.. తండ్రి చెట్టును పట్టుకుని బయటపడగలిగాడు. కానీ.. అందులో ఉన్న భార్య, ఇద్దరు కూతుళ్లు మాత్రం అతడి కళ్ల ముందే ప్రవాహంలో కలిసిపోయారు. ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది.మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. యవత్మాల్ జిల్లాలో వరద ఉధృతికి ఓ ఎస్యూవీ వాహనం కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోగా.. తండ్రి మాత్రం సమయస్ఫూర్తితో చెట్టును పట్టుకుని బయటపడ్డాడు. అయితే తన కళ్ల ముందే కుటుంబం వరదలో కొట్టుకుపోవడంతో గుండెలు పగిలేలా కన్నీటి పర్యంతం అయ్యాడు.అహిల్యానగర్ జిల్లాలోని లోని ప్రాంతానికి వెళ్తున్న అవినాశ్ ఖండారే కుటుంబం గురువారం ఈ ప్రమాదానికి గురైంది. అవినాశ్ తన భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎస్యూవీలో ప్రయాణిస్తున్న సమయంలో దర్వా ప్రాంతంలోని కుప్తి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ.. నీటి లోతు, ప్రవాహ తీవ్రతను అంచనా వేయడంలో పొరపాటు జరగడంతో వాహనం ముందుకు కదిలింది. వంతెన దాటే క్రమంలో ఒక్కసారిగా కారు అదుపుతప్పి ఉధృతమైన వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.కారు కొట్టుకుపోతున్న సమయంలో అవినాశ్ ఖండారే అప్రమత్తమై సమీపంలోని ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే కారులో ఉన్న భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలను మాత్రం రక్షించలేకపోయాడు. సహాయం కోసం ఆర్తనాదాలు చేసినా.. ఫలితం లేకపోయింది. కాసేపటి తర్వాత వరద ఉధృతి తగ్గగా.. స్థానికులు చెట్టు మీద ఉన్న అవినాశ్ను గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. శుక్రవారం వరదలో కొట్టుకుపోయిన వాహనాన్ని గుర్తించారు. కారుతో పాటు మాధవి, కుమార్తెల మృతదేహాలను వెలికితీశారు.మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 13 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. భారీ వర్షాలతో వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వందలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
కుప్పకూలిన భవనం.. తొమ్మిది మంది మృతి
ముంబై: మహారాష్ట్ర భీవండిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోజు (శుక్రవారం) ఉదయం శిథిలావస్థకు చెందిన ఓ భవనం మరమ్మత్తులు చేస్తున్న సమయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.భీవండి నిజంపూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలోని ఈ పురాతన భవనం శిథిలావస్థకు చేరుకుందని గతంలోనే మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ పట్టించుకోకుండా భవన నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో భవనం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఘటనా వివరాలు తెలుసుకున్న వెంటనే భీవండి ఫైర్ సిబ్బంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు భారీ యంత్రాల సహాయంతో సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఇద్దరి మృతదేహాలు వెలికితీశామని అధికారులు పేర్కొన్నారు. -
రాత్రంతా ప్రియురాలి మృతదేహంతోనే ప్రయాణం.. ఏకంగా 350 కి.మీ
ముంబై: ప్రియురాలికి మరొక వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉందని అనుమానించి, ఆమెను గొంతు నులిమి చంపేశాడు 40 ఏళ్ల ఓ వ్యక్తి. అనంతరం ఆమె మృతదేహాన్ని కారులో పెట్టుకుని కొల్హాపూర్ నుంచి థానే వరకు 350 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు.నిందితుడి పేరు ప్రకాశ్ ఆనంద పాటిల్ (40). ఇతడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా షిర్గావ్ గ్రామానికి చెందినవాడు. బాధితురాలు సురేఖ శివాజినే ఆరే (40). ఆమె అదే గ్రామానికి చెందిన వితంతువు. ఆమెతో పాటిల్ రిలేషన్షిప్లో ఉన్నాడు.పోలీసుల సమాచారం ప్రకారం.. సురేఖకు మరొక వ్యక్తితో సంబంధం ఉందని పాటిల్ అనుమానించాడు. ఆదివారం ఉదయం షిర్గావ్లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆమెను గొంతు నులిమి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్య తర్వాత నిందితుడు మృతదేహాన్ని చుట్టి కారులో ఉంచి, నేరం జరిగిన ప్రాంతం నుంచి 350 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న థానే జిల్లా భివాండిలోని కసేలీ వైపు రాత్రంతా కారు నడిపాడు.సోమవారం ఉదయం భివాండిలో ఓ స్థానికుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. వాహనాన్ని గుర్తించి పాటిల్ను అదుపులోకి తీసుకుని, కారులో ఉన్న మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 103(1) కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కోసం నేరం జరిగిన ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్కు కేసును బదిలీ చేశారు. థానే చేరుకున్న తర్వాత మృతదేహంతో నిందితుడు ఏం చేయాలనుకున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. -
గడ్కరీ కీలక నిర్ణయం.. టెన్షన్ మొదలైందా?
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ గురించి గత కొన్నాళ్లుగా నడుస్తున్న రచ్చ(చర్చ) సంగతి తెలిసిందే. అయితే నీట్ వ్యవహారంతో ఇన్నాళ్లు ఈ అంశం కాస్త పక్కకు జరిగిపోయింది. అయితే.. ఇప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చుట్టూ కొత్త వివాదం మొదలైంది. ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్(E20) విధానంతో గడ్కరీ కుటుంబం లాభపడుతోందని.. ఆయన కూడా రాజీనామా చేయాల్సిందేనంటూ డిమాండ్ ఒకటి తెర మీదకు వచ్చింది. ఈ తరుణంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. E20 పెట్రోల్ విధానం కేవలం స్వార్థపూరితంగా ఆయన తెచ్చారని.. దాని వల్ల ఆయనకు, తన కుటుంబానికి లాభాలు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఆయన న్యాయపోరాటానికి దిగారు. తప్పుడు పోస్టులు, డీప్ఫేక్ కంటెంట్పై బాంబే హైకోర్టును ఆశ్రయించారు.వీటిని పరువు నష్టం కలిగించే ప్రచారంగా పేర్కొన్న గడ్కరీ.. సంబంధిత సోషల్ మీడియా సంస్థలు, గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్ కేసు దాఖలు చేసేందుకు కోర్టు అనుమతి కోరారు. ఈ విధానం వల్ల తనకు పైసా లాభం లేదని.. తమ కుటుంబం నిర్వహిస్తున్న చెరకు వ్యాపారంతో లాభాలు కూడా పెద్దగా రావని అందులో వివరించారు.సమగ్ర కథనం: ఇథనాల్ అంశం.. నా వాటా ఎంతంటే..: గడ్కరీబాంబే హైకోర్టును ఆశ్రయించిన గడ్కరీగడ్కరీ దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన బాంబే హైకోర్టు.. కేసు దాఖలుకు అనుమతి ఇచ్చింది. తనపై ప్రచారం జరుగుతున్న కంటెంట్ ముంబైలోనూ అందుబాటులో ఉందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే అంశంపై నాగ్పూర్లో ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ20 ఇథనాల్ విధానానికి సంబంధించి తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు.ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత.. గడ్కరీనే టార్గెట్?ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో.. సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. తదుపరి టార్గెట్ నితిన్ గడ్కరీనే అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ20 ఇంధనంపై గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం, వాహనదారుల నుంచి వస్తున్న అభ్యంతరాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్చ మరింత వేడెక్కింది. అయితే గడ్కరీపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఇటు కేంద్రం కూడా ఇథనాల్ పెట్రోల్ విషయంలో ఎలాంటి పొరపాట్లు లేవని అంటోంది కూడా.అసలు ఈ20పై వివాదం ఏంటి?కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ20 ఇంధనం అంటే.. 80 శాతం పెట్రోల్కు 20 శాతం ఇథనాల్ను కలిపిన మిశ్రమం. ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, రైతులకు ప్రయోజనం కల్పించడం, కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే కొందరు వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు మాత్రం పాత వాహనాలపై ఈ20 ప్రభావం, మైలేజీ తగ్గుదల వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.కోర్టు బాట పట్టిన గడ్కరీతనపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు గడ్కరీ తీసుకున్న న్యాయపరమైన చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ20పై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న వేళ.. తప్పుడు ప్రచారాలపై చట్టపరంగా ఎదుర్కొంటాననే సంకేతాన్ని ఆయన ఇచ్చినట్లు కనిపిస్తోంది. -
మరో ‘నీట్’ విద్యార్థిని బలవన్మరణం
అహిల్యానగర్: మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లా కర్జాత్ తాలూకా జలాల్పూర్ గ్రామానికి చెందిన 19 సంవత్సరాల ‘నీట్’ అభ్యర్థి అంకిత సంగాలే ఆత్మహత్య చేసుకున్నారు. ‘నీట్ రీ టెస్ట్’లో తక్కువ మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికిలోనై, ఆమె తన స్టడీ రూమ్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.ఈ పరీక్షలో అంకిత 166 మార్కులు సాధించారు. ఆశించిన మార్కులు రాకపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పేపర్ లీక్ వివాదం కారణంగా రీ టెస్ట్ నిర్వహించడానికి ముందు జరిగిన పరీక్షలో ఆమె మెరుగైన మార్కులు సాధించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలంలో నీట్ స్కోర్ గురించిన ప్రస్తావన ఉన్న సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కర్జాత్ పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఎన్సీపీ (ఎస్పీ) నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ‘నీట్’ కారణంగా ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్దారు.ఇది కూడా చదవండి: ‘జంతర్ మంతర్’ లవ్ స్టోరీ.. తలకు గాయంతో వివాహం! -
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ సూత్రధారి.. బిహార్లో దొరికాడు
గత కొంతకాలంగా పరారీలో ఉన్న మహారాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు బిజేంద్ర గుప్తా ఎట్టకేలకు మహారాష్ట్ర పోలీసులకు చిక్కాడు. బీహార్లో అదుపులో తీసుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. అతడు బీహార్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి పట్టుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన అతడి అనుచరుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గుప్తా భార్యతో పాటు మరికొందరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గుప్తా మాత్రం పోలీసులకు చిక్కకుండా కొంతకాలం పరారీలో ఉండటంతో మహారాష్ట్ర పోలీసులు విస్తృతంగా గాలించారు. పేపర్ లీక్ రాకెట్తో బిజేంద్ర గుప్తా భార్యకు కూడా సంబంధం ఉందని.. సిండికేట్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఈమె సమక్షంలోనే జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, పాట్నాలలో ఆస్తుల కొనుగోలుపై దర్యాప్తు చేస్తున్నారు.బిజేంద్ర గుప్తా భార్యతో సహా 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు దేశవ్యాప్తంగా అనేక పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసులతో బిజేంద్ర గుప్తాకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.జూన్ 28న జరగాల్సిన మహారాష్ట్ర టెట్ పరీక్షకు ముందు థానేలోని కొంగావ్ ప్రాంతంలో లీకైన ప్రశ్నపత్రాలను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఆకాష్ కుమార్, రాజీవ్ కుమార్, ధీరజ్ సింగ్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ పరీక్షను వాయిదా వేసింది. ఆరు లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు బిజేంద్ర గుప్తాను ట్రాన్సిట్ రిమాండ్పై రాష్ట్రానికి తీసుకువచ్చారు. -
దురదృష్టమని వదిలేస్తే.. అదే ఇప్పుడు రూ.450 కోట్లు అయ్యింది!
ఒకప్పుడు సొంత ఇల్లు కొనడం ఓ కల మాత్రమే. చిన్న గదిలో కుటుంబంతో కలిసి జీవించిన ఓ యువ నటుడు.. ఆ తర్వాత నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బంగ్లా కొనుగోలు చేశాడు. కానీ ఆ కలల ఇల్లు కొన్నాళ్లకే అతడికి ఆందోళనకు కారణమైంది. వరుస పరాజయాలతో ఆ బంగ్లా తనకు కలిసి రావడం లేదని భావించి వదిలేశాడు. అయితే కాలం గడిచాక అదే ఆస్తి అతడి జీవితంలోనే అతిపెద్ద పెట్టుబడిగా మారింది. ఆ కథ ప్రముఖ నటుడు జీతేంద్రది.ముంబైలోని చాల్ జీవితం నుంచి స్టార్డమ్ వరకు ఎదిగిన జీతేంద్ర.. తన కెరీర్ ప్రారంభ దశలోనే ఓ పెద్ద కల నెరవేర్చుకున్నారు. అప్పట్లో ప్రముఖ నటుడు భరత్ భూషణ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో.. పాలి హిల్లోని తన బంగ్లాను విక్రయించేందుకు ముందుకొచ్చారు. జీతేంద్ర తండ్రితో చర్చించిన తర్వాత ఆ బంగ్లాను కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆ ఆస్తి ధర కేవలం రూ.4.25 లక్షలు మాత్రమే. 3,450 చదరపు అడుగుల స్థలంతో ఉన్న ఆ బంగ్లా అప్పట్లోనే ఎంతో విలువైన ఆస్తి.కొన్నాకే మొదలైన కష్టాలు..బంగ్లాలోకి మారిన తర్వాత పరిస్థితులు అనుకున్నట్లుగా సాగలేదని జీతేంద్ర గుర్తు చేసుకున్నారు. వరుసగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో ఆ ఇంటి వల్లే తనకు దురదృష్టం వెంటాడుతోందని ఆయన భావించారు. “భరత్ భూషణ్ ఈ ఇంటిని వదిలేశారు.. ఇప్పుడు నా వంతు వచ్చినట్లు అనిపించింది. ఇలాగే కొనసాగితే నా కెరీర్ మొదలయ్యేలోపే ముగిసిపోతుందేమో అనుకున్నాను” అని జీతేంద్ర గతాన్ని గుర్తు చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆ బంగ్లాను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.అన్లక్కీ అనుకున్నదే అదృష్టంగా మారిందిఏళ్లు గడిచిన తర్వాత అదే ఆస్తి విలువ ఊహించని స్థాయికి చేరుకుంది. ఆ బంగ్లాను పునర్నిర్మించాలని నిర్ణయించిన సమయంలో ఆసక్తికర విషయం బయటపడింది. పాత భవనాన్ని కూల్చినప్పుడు అందులో ఉపయోగించిన బర్మా టీక్ కలపకే రూ.11.5 లక్షలు వచ్చాయని జీతేంద్ర తెలిపారు. అంటే.. మొత్తం బంగ్లాను కొనుగోలు చేసిన ధర కంటే కలప ద్వారా వచ్చిన మొత్తం ఎక్కువ కావడం విశేషం.రూ.85కు అమ్మిన ఫ్లాట్లు.. ఇప్పుడు రూ.85 వేల ధరతర్వాత ఆ స్థలంలో జీతేంద్ర గౌతమ్ అపార్ట్మెంట్స్ నిర్మించారు. అయితే అప్పటి పరిస్థితుల్లో భవిష్యత్తుపై సందేహంతో ఫ్లాట్లను చదరపు అడుగుకు కేవలం రూ.85 చొప్పున విక్రయించారు. కానీ అదే ప్రాంతంలో ఇప్పుడు చదరపు అడుగు ధర దాదాపు రూ.85 వేల వరకు చేరిందని ఆయన కుమారుడు తుషార్ కపూర్ వెల్లడించారు.రూ.4.25 లక్షల ఆస్తి.. రూ.450 కోట్ల విలువఒకప్పుడు దురదృష్టానికి కారణమని భావించిన ఆ బంగ్లా.. ఇప్పుడు జీతేంద్ర జీవితంలో అత్యంత విలువైన ఆస్తిగా మారింది. ప్రస్తుతం ఆ భవనం ఉన్న స్థలం విలువ దాదాపు రూ.450 కోట్ల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ఓ ఆస్తిని చూసే దృష్టి కాలంతో ఎలా మారిపోతుందో జీతేంద్ర బంగ్లా కథ చెబుతోంది. అప్పట్లో భయంతో వదిలేసిన ఇల్లు.. ఇప్పుడు కోట్ల విలువైన సంపదగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.సినీ తారలకు రియల్ ఎస్టేట్ కలిసి వచ్చిన ఉదాహరణలు మరెన్నో ఉన్నాయి. తెలుగు సినీ దిగ్గజం శోభన్బాబు కూడా సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టి భారీ సంపదను సృష్టించారు. అప్పట్లో భూములపై ముందుచూపుతో పెట్టిన పెట్టుబడులు.. తర్వాత కాలంలో కోట్ల విలువైన ఆస్తులుగా మారాయి. జీతేంద్ర బంగ్లా కథ కూడా ఇలాంటి దూరదృష్టికి మరో ఉదాహరణగా నిలుస్తోంది. -
ఆమె విద్యార్థి కానే కాదు!
జోరున వర్షం కురుస్తోంది.. చుట్టూ పోలీసులు ఉన్నారు.. ఎదురుగా ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ నెమ్మదిగా ముందుకు కదులుతోంది. లాఠీ దెబ్బలకు భయపడి యువకులంతా చెల్లాచెదురైపోతున్నారు. హఠాత్తుగా దూసుకొచ్చిన ఓ యువతి.. ఆ వ్యాన్కు అడ్డుగా నిలబడింది. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా తన నిరసనను వ్యక్తం చేసింది. ఆ ఒక్క క్షణం.. ఆమె ధైర్యం.. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.నీట్ సహా పోటీ పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు.. ఢిల్లీ నుంచి మిగతా రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ఆందోళనల్లో ఓ యువతి చూపించిన తెగువ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. విమర్శకులను పక్కనపెడితే.. ఆమె చూపిన ధైర్యం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థులను తరలిస్తున్న పోలీస్ వాహనానికి అడ్డుగా నిలిచిన ఆమె వీడియో వైరల్గా మారింది.“వాళ్లు విద్యార్థులు.. వాళ్ల గొంతు వినాలి”బుధవారం దాదర్లోని శివాజీ పార్క్ సమీపంలో జరిగిన నిరసనల్లో రిహియా యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని తరలిస్తున్న పోలీస్ వ్యాన్ను ఆమె వర్షంలో నిలబడి అడ్డుకున్నారు. హూడీ, క్యాప్ ధరించిన ఆమె వ్యాన్ ముందు నిలబడగా.. చుట్టూ ఉన్న పలువురు ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు.ఈ ఘటనపై రిహియా మాట్లాడుతూ.. ‘‘పోలీసులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోతే.. ప్రజల బాధ్యతను ప్రజలమే తీసుకోవాల్సి వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. తాను విద్యార్థిని కాకపోయినా.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్య సరైంది కాదని ఆమె అన్నారు.Meet Rhiya Ahir [IG: rhiyaahir]👏One fearless young woman stood in front of a police van during the Mumbai student protests, refusing to back down.Courage can't be bought. Justice can't be silenced. Salute to her. 🫡🫡 pic.twitter.com/c9oAvhQPeq— زماں (@Delhiite_) July 22, 2026ఒక్క అడుగు.. ఓ సందేశంరిహియా చేసిన పని కేవలం ఓ నిరసన చర్యగా మాత్రమే కాకుండా.. మహిళల ధైర్యానికి ప్రతీకగా మారింది. సాధారణంగా ఆందోళనల్లో మహిళల పాత్రపై ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. కానీ రిహియా మాత్రం “ప్రశ్నించేందుకు ధైర్యం ఉంటే మార్పు సాధ్యమే” అనే సందేశాన్ని ఇచ్చారు. ఆమె వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలువురు ఆమెను అభినందించారు. కొందరు ఆమెను “ముంబై హీ(షీ)రో”గా అభివర్ణించారు. ప్రముఖ హాస్యనటుడు రోహన్ జోషి కూడా ముంబై యువత నిరసన తీరును ప్రశంసిస్తూ పోస్టు చేశారు.ఎవరీ రిహియా యాదవ్?రిహియా యాదవ్ కేవలం నిరసనకారిణి మాత్రమే కాదు. ఆమె ఓ నటి, మోడల్, వ్యాపారవేత్తగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం.. మ్యూజిక్ వీడియోల్లో నటించారు. అంతేకాకుండా చేతితో తయారు చేసే దుస్తుల కోసం ‘రిహియాసత్’ పేరుతో ఓ వ్యక్తిగత బ్రాండ్ను నిర్వహిస్తున్నారు. సృజనాత్మక రంగంలో తనదైన ముద్ర వేస్తూనే.. సామాజిక అంశాలపై కూడా స్పందించడం ఆమె ప్రత్యేకతగా నిలుస్తోంది.మహిళా సాధికారతకు ఓ ప్రతీకగా..మహిళా సాధికారత అంటే కేవలం అవకాశాలు పొందడం మాత్రమే కాదు.. అవసరమైన సమయంలో తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయడం కూడా. రిహియా యాదవ్ ఘటన అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఒక మహిళ ముందుకు వచ్చి నిలబడితే.. అది కేవలం ఒక నిరసన కాదు.. మరెందరికో ధైర్యాన్ని ఇచ్చే సందేశంగా మారుతుందనే దానికి రిహియా ఉదాహరణగా నిలించిందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. -
ప్లాన్-ఏకి భయపడి.. ప్లాన్-బీతో ఘాతుకం!
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పుణె లోహగఢ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరిన్ని సంచలనాలు బయటకు వస్తున్నాయి. యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్తో వివాహం ఇష్టం లేకనే సియా గోయల్, చేతన్ చౌదరి కలిసి హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పుడో షాకింగ్ విషయం బయటపడింది. ప్లాన్ ఏకు భయపడి.. ప్లాన్ బీను అమలు చేసి సియా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. కేతన్, సియాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో రాజస్థాన్లోని జైపూర్లో ఘనంగా వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాయి. అయితే చేతన్తో ప్రేమలో ఉన్న సియా మాత్రం ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఓవైపు కేతన్తో సన్నిహితంగా ఉంటూనే.. మరోవైపు ప్రియుడితో దారుణమైన స్కెచ్లు గీసింది. ఇందుకోసం వెబ్ సిరీస్లు, క్రైమ్ సినిమాలు చూస్తూ గంటల తరబడి గడిపింది. చివరకు.. చేతన్తో కలిసి ఈ పెళ్లి ఆపడానికి రెండు ప్లాన్లు గీసింది. అందులో.. మొదటిది కేతన్కు యాక్సిడెంట్ చేయడం!. అతడిని గాయపరిచి పెళ్లిని వాయిదా వేయాలని.. ఆ తర్వాత కలిసి పారిపోవడమో లేదంటే ఈ గ్యాప్లో మరేదైనా ప్లాన్ అమలు చేయాలని భావించింది. అయితే ఆ ప్లాన్లో రిస్క్ ఎక్కువగా ఉందని భావించి డ్రాప్ అయ్యారు. కేతన్ను ఈ విషయం తెలిసిపోతే తమ పని అయిపోయినట్లేనని భయపడ్డారు. ఒకవేళ ప్లాన్ బెడిసి కొట్టి బలవంతంగా పెళ్లి జరిగితే ఆ తర్వాత తమ బంధం కొనసాగదని భావించారు. అందుకే ప్లాన్ బీ అమలు చేయాలని ఫిక్స్ అయ్యారు. పక్కా ప్లాన్ గీసి కేతన్ను అంతమొందించారు. సస్పెన్స్ సినిమాలు.. ఆన్లైన్ సెర్చ్లుహత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పక్కా ప్రణాళిక వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం సస్పెన్స్ సినిమాలు చూసారని, హత్య తర్వాత ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఇంటర్నెట్లో సమాచారం వెతికారని తెలిపారు. సియా ఫోన్ హిస్టరీలో ఈ విషయం బయటపడిందని తెలిపారు. అంతేకాదు.. కేతన్ను ఎక్కడ హత్య చేస్తే అది ప్రమాదంలా కనిపిస్తుందో తెలుసుకునేందుకు పలు ప్రాంతాలను పరిశీలించినట్లు వెల్లడించారు. లోనావాలాలోని టైగర్ పాయింట్, విశాపూర్ కోట తదితర ప్రాంతాలను పరిశీలించిన తర్వాత లోహగఢ్ కోటను ఎంచుకున్నారని చెప్పారు.ముందుగానే రెక్కీ చేసిన సియా?దర్యాప్తులో భాగంగా సియా మే 31న కేతన్తో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ పర్యటన హత్యకు ముందు చేసిన రెక్కీ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అక్కడ ఎక్కడ నుంచి తోసేస్తే కేతన్ మృతి చెందుతాడు.. ఆధారాలు దొరకకుండా ఎలా చేయాలనే విషయాలను పరిశీలించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత జూన్ 3న మరోసారి అక్కడికి వెళ్లేందుకు కేతన్ను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.బాలి ట్రిప్ కూడా కుట్రలో భాగమేనా?సియా, కేతన్లు జూన్ 6న ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఎనిమిది రోజుల పాటు అక్కడ గడపాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ ప్రయాణం తమ కుట్రకు అడ్డుగా మారుతుందని భావించిన నిందితులు.. ఎలాగైనా ఆ పర్యటనను ఆపాలని ప్రయత్నించారు. ముంబై పర్యటన సమయంలో సియా కేతన్ పాస్పోర్ట్ను దొంగిలించిందని.. దీంతో బాలి ప్రయాణం రద్దయిందని పోలీసులు తెలిపారు.ముందే ఒకసారి హత్యాయత్నం?లోహగఢ్ కోట వద్ద జూన్ 14న సియా కేతన్ను తోసేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కేతన్ ఓ పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. ఆ సమయంలో అనుమానం రాకుండా.. పాము నుంచి కాపాడేందుకు తానే తోశానని సియా చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. తర్వాత జూన్ 18న మరోసారి లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. చేతన్తో కలిసి కేతన్ను లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరిన్ని కొత్త విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. -
ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ పరిణామాలు వే గంగా మారిపోతున్నాయి. మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లోని రెండు వర్గా లు ఒక్కటైపోయి, ఎన్డీయేలో చేరుతాయన్న ఊహాగానాలు నిజమేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలేతో కలిసి బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. మోదీతో భేటీ అనంతరం శరద్ పవార్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నీట్–యూజీ పేపర్పై విద్యార్థులు డిమాండ్లు, రైతుల సమస్యలు, వాటర్ మేనేజ్మెంట్, విద్యా రంగం సమస్యలపై తాము చర్చించినట్లు తెలిపారు. ఎన్సీపీలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గానికి శరద్ పవార్, మరో వర్గానికి ఆయన కోడలు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్ నేతృత్వం వహిస్తున్నారు. సునేత్ర పవార్ పార్టీ ఇప్పటికే ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతోంది. శరద్ పవార్ పార్టీ విపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగస్వామి. రెండు పార్టీలు విలీనమై, ఎన్డీయేలో చేరుతాయన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్ విషయంలో రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. ఈ మెజార్టీ కోసం ఎన్డీయే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్సీపీలోని వర్గాలను ఏకం చేసే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. -
‘కేతన్ నా హీరో.. చాలా కేరింగ్’.. పొగడ్తలు గుప్పించిన సియా!
ఒకప్పుడు ప్రేమ, అనుబంధానికి గుర్తుగా నిలిచిన ఓ వీడియో.. ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమవుతోంది. పుణే లోహ్గఢ్ కేసులో నిందితురాలు సియా గోయల్ కేతన్ అగర్వాల్ను పొడుగుతూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను నెటిజన్లు చూసి నెటిజన్లు.. పాపం కేతన్, అంత మంచోడిని చంపడానికి చేతులెలా వచ్చాయి? అని సియాను తిట్టుకుంటున్నారు. ఆ వీడియో కేతన్-సియా నిశ్చితార్థ వేడుకలోది. వేదికపై కేతన్, సియా కలిసి ఉన్న సమయంలో అక్కడున్న ఒకావిడ ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. అప్పటికే సియా కేతన్ను తన హీరో అని, ఆ హీరో నెంబర్ 1 అని వ్యాఖ్యానించింది. “కాబోయే భర్తగా కేతన్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? అతడిని మీ హీరో నంబర్ వన్గా భావించడానికి కారణం?” అని ప్రశ్నించారు. దీనికి సియా చిరునవ్వుతో.. “కేతన్ చాలా కేరింగ్, చాలా మంచివాడు” అంటూ సమాధానం ఇచ్చింది. ఆ మాటలు విన్న కేతన్ నవ్వుతూ స్పందించగా.. అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. అప్పట్లో ప్రేమగా కనిపించిన ఈ క్షణాలు.. ఇప్పుడు కేతన్ మృతి కేసు నేపథ్యంలో మరో కోణంలో చర్చకు వస్తున్నాయి.'Ketan Agarwal Is Caring & Kind,' Said Siya Goyal During Engagement Ceremony pic.twitter.com/xMy79rhfQg— Pune First (@Pune_First) July 20, 2026పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట సమీపంలోని లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ.. పుణె రూరల్ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వివాహంపై అసంతృప్తితో ఉన్న సియా గోయల్ (20), ఆమె స్నేహితుడు చేతన్ చౌదరి (22) కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫొటో షూట్ పేరుతో కేతన్ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. అక్కడి లోయలోకి తోసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. అంతకు ముందు(జూన్ 14న) ఇదే ప్రాంతంలో కేతన్ను చంపేందుకు మరోసారి ప్రయత్నం జరిగినట్లు కూడా తెలుస్తోంది. పుణే కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. కాబోయేవాడిని ప్రియుడి సాయంతో హతమార్చడం.. రకరకాల చర్చలకు దారి తీసింది. ఈ తరుణంలో కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. కేతన్ను తోసి చంపింది సియానా? లేదంటే చేతనా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. విచారణలో పోలీసులును సియా, చేతన్లు ఏ వివరాలు చెప్పుకుండా ముప్పు తిప్పలు పెడుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. పోలీసులు ఆమెను విచారణ కోసం పలు ప్రాంతాలకు తీసుకెళ్తున్న సమయంలోనూ మీడియా ముందు ఆటిట్యూడ్ ప్రదర్శిస్తూ వస్తోంది. సియా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలంటున్న ఆమె కుటుంబం.. మరోవైపు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండడం గమనార్హం. అయితే దర్యాప్తు ఆలస్యం అవుతుండడంతో ఆమె బెయిల్ దక్కవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తోంది కేతన్ కుటుంబం. సియా కేతన్ కలిసి దిగిన ఫొటోలు, సరదాగా గడిపిన వీడియోలు.. ఇప్పుడు “కేతన్ మంచోడు.. కేరింగ్” అని చెప్పిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటూ వైరల్ అవుతున్న ఆ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అంత మంచోడికి విషయం చెబితే సరిపోయేది కదా.. ఎందుకు చంపేశావ్? అని కామెంట్లలో సియాను తిట్టి పోస్తున్నారు. -
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
వార్ధా: మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై కారు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై నుంచి నాగ్పూర్ వైపు వెళ్తున్న మార్గంలో ఇథనాల్తో వెళ్తున్న కంటైనర్ ట్రక్కు బోల్తా పడటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో ఆ మార్గంలో వెనుక నుంచి వస్తున్న ట్రక్కు.. ముందున్న కారును బలంగా ఢీకొంది.ఈ ప్రమాదం విరుల్ గ్రామం సమీపంలో సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ను పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించారు. సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై తరచూ జరుగుతున్న ఇలాంటి ప్రమాదాలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. -
మాజీ ప్రియురాలి కాబోయే భర్తకు ఫోన్ చేసి..
"వైషు కథ ముగిసిపోయింది’’ అంటూ తన మాజీ ప్రియురాలు వైష్ణవిని దారుణంగా పొడిచి చంపిన తర్వాత.. ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి సాహిల్ లవ్హారే అనే యువకుడు ఫోన్ చేసి చెప్పిన మాటలివి. ఈ ఘోరం జరిగిన కొద్ది గంటలకే.. ఘటనా స్థలానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చెట్టుకు నిందితుడి మృతదేహం ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఉన్మాద ప్రేమికుడి దారుణ ఘటన మహారాష్ట్రలోని నాసిక్లో వెలుగుచూసింది. తన మాజీ ప్రియురాలు మరొకరిని పెళ్లి చేసుకోబోతోందనే కోపంతో నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.నాసిక్లోని ఇందిరానగర్ ప్రాంతంలోని వనసంపద గార్డెన్ సమీపంలో సాహిల్, వైష్ణవి కలుసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య సుమారు 30 నిమిషాల పాటు తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సాహిల్.. వైష్ణవిపై పదే పదే కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వైష్ణవిని హత్య చేసిన తర్వాత సాహిల్ కూడా ఆత్మహత్య చేసుకుని మరణించాడు.ఈ ఘటనలో మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. హత్య జరగడానికి కొన్ని నిమిషాల ముందు వైష్ణవికి కాబోయే భర్తతో సాహిల్ ఫోన్ మాట్లాడటం.. సాహిల్ ఇక్కడే ఉన్నాడు.. త్వరగా రా’ అంటూ వైష్ణవి ఫోన్లో తన కాబోయే భర్తకు చెప్పింది. ఆ మాట వినగానే ఆమె కాబోయే భర్త తన పనిని వదిలేసి వెంటనే ఆమె ఉన్న లొకేషన్కు బయలుదేరాడు. అయితే, అతను ఫోన్ కట్ చేయకుండా అలాగే లైన్లో ఉంచాడు. దాదాపు 22 నిమిషాల పాటు సాహిల్, వైష్ణవిల మధ్య జరిగిన గొడవను అతను ఫోన్లో వింటూనే ఉన్నాడు. కానీ అతను అక్కడికి చేరుకునే లోపే.. ‘ఆమెను చంపేశాను’ అని సాహిల్ చెప్పాడు. మృతురాలు వైష్ణవి అమరావతి జిల్లా, నిందితుడు సాహిల్ యావత్మాల్ ఉమర్ఖేడ్కు చెందినవారు. -
సీసీటీవీ, సీట్ బెల్టులు, జీపీఎస్..
ముంబై: విద్యార్థుల భద్రతకు పెద్ద పీట వేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం స్కూలు బస్సులకు కఠిన నిబంధనలను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్కూలు బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు, సీట్ బెల్టులు, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలను తప్పని సరి చేసింది. స్కూలు బస్సులు, వ్యానులు, విద్యా సంస్థల బస్సుల కనీస చార్జీలను సైతం తామే నిర్ణయిస్తామని తెలిపింది. 2011 నాటి నిబంధనలను మారు స్తూ మహారాష్ట్ర మోటార్ వెహికల్స్ (రెగ్యులే షన్ ఫర్ స్కూల్ బస్సెస్) (మొదటి సవరణ) నిబంధనలు–2026ను ఈ నెల 16వ తేదీన నోటిఫై చేసింది. కిలోమీటర్కు చొప్పున ఒక్కో విద్యార్థి నుంచి వసూలు చేసే చార్జీల బేస్ రుసుమును ఆర్టీఏలు ఖరారు చేస్తాయని తెలిపింది. గతంలో ఇలాంటి నిబంధనేదీ లేక పోవడం గమనార్హం. నెలవారీ లేదా మూడు నెలలకు గాను ప్రాంతీయ రవాణాధికారి నిర్ణయించే రుసుముకు 10 శాతానికి తక్కువ కాకుండా, 10 శాతానికి మించకుండా వసూలు చేయవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది. నిబంధనల అమలు, విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల ఫిర్యాదుల పరిష్కారం అంశాలపై స్కూల్ ట్రాన్స్పోర్ట్ కమిటీ పరిశీలన జరిపి జిల్లా స్కూల్ బస్ సేఫ్టీ కమిటీలకు మూడు నెలలకోసారి నివేదిక అందజేయాల్సి ఉంటుంది. అదేవిధంగా, కొత్తగా జీపీఎస్ లైవ్ ట్రాకింగ్, పానిక్ బటన్, సీసీటీవీ నిఘా, డిజిటల్ అటెండెన్స్, ఆటోమేటిక్ అలెర్టులు తల్లిదండ్రులకు కూడా అందుబాటులో ఉంచటం తప్పనిసరి చేసింది. సీసీటీవీ ఫుటేజీని కనీసం 30 రోజులపాటు భద్రపర్చాలి. మొబైల్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచాలని నోటిఫికేషన్లో సూచించింది. బస్సులోని అన్ని సీట్లకు బెల్టులను అమర్చేలా నవీకరించాలని కోరింది. బస్సుల్లో అగ్ని ప్రమాదం పై అలారమ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం తప్పనిసరని తెలిపింది. ఐదో తరగతి వరకు విద్యార్థుల కోసం బస్సుల్లో మహిళా అటెండెంట్ను నియమించడం, అవకరాలు కలిగిన చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు తప్పనిసరి చేసింది. -
శ్రీ తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకున్న తిలక్ వర్మ (ఫొటోలు)
-
కార్పొరేటర్ బెయిల్ రద్దు చేసిన హైకోర్టు.. మళ్లీ జైలుకి!
ముంబై: వైద్యులు, ఇతర సిబ్బందిపై శివసేన( (ఏకనాథ్ షిండే వర్గం) ) కార్పొరేటర్ రమేష్ మహాత్రే జరిపిన దాడిని బాంబే హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కార్పొరేటర్ రమేష్ మహత్రే బెయిల్ను రద్దు చేసింది. అదే సమయంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది బాంబే హైకోర్టు.జూలై 6వ తేదీన డోంబివిలిలోని మున్సిపల్ శాస్త్రి నగర్ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు, నర్సులపై కార్పొరేటర్ రమేష్ మహాత్రే, అతని అనుచరులు తీవ్రంగా దాడి చేశారు. దిగువ కోర్టు తీర్పు: ఈ కేసులో అరెస్టయిన రమేష్ మహాత్రేకు జూలై 14న కల్యాణ్ లోని స్థానిక మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. వారి బెయిల్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. రమేష్ మహాత్రేపై గతంలో హత్య, హత్యాయత్నం వంటి సుమారు 18 నేరారోపణ కేసులు ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది. వాటిలో 17 కేసులలో అతను నిర్దోషిగా విడుదలైనప్పటికీ, బెయిల్ ఇచ్చేటప్పుడు అతని నేర చరిత్ర తీవ్రతను మేజిస్ట్రేట్ కోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని ఆక్షేపించింది. ఈ క్రమంలోనే వారి బెయిల్ను రద్దు చేసి తిరిగి పోలీసులకు లొంగిపోవాలంటూ ఆదేశించింది. ప్రభుత్వ, మున్సిపల్ ఆసుపత్రుల వైద్యులపై ఇలాంటి దాడులు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రమేష్ మహాత్రే నిర్ణీత సమయంలోగా లొంగిపోకపోయినా, పరారైనా ఆయన స్థిరాస్తులను జప్తు చేయడంతో పాటు చట్టపరమైన తదుపరి చర్యలకు తీసుకోవడానికి అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉందని బాంబే హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ ఘటనకు నిరసనగా జూలై 22 నుండి సమ్మెకు పిలుపునిచ్చిన వైద్యులను ఆ సమ్మెను విరమించుకోవాలని కోరింది హైకోర్టు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తమ సమ్మెను విరమించుకోవాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. కాగా, వైద్యులపై దాడికి సంబంధించి జూలై 8వ తేదీన అరెస్టైన సదరు కార్పొరేటర్.. జూలై 14వ తేదీన బెయిల్పై బయటకొచ్చాడు. దీన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్ఏ) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జూలై 22వ తేదీన మహారాష్ట్ర అంతటా ఆస్పత్రుల్లో 24 గంటల షట్డౌన్ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో అత్యవసర సేవా విభాగాలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని పేర్కొంది. -
అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్ గేమ్!
మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తెర వెనుక కదలికలు మొదలయ్యాయా? కొంతకాలంగా దూరంగా ఉన్న రాజకీయ శిబిరాల మధ్య పెరుగుతున్న రాకపోకలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న నేతలు అధికార కూటమి పెద్దలను కలుస్తుండటం.. కీలక నాయకుల మధ్య జరుగుతున్న భేటీలు.. భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాలను దశాబ్దాలుగా ప్రభావితం చేస్తున్న పవార్ కుటుంబం చుట్టూ చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ఢిల్లీ నుంచి ముంబై వరకు హాట్టాపిక్గా మారాయి.ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో శరద్ పవార్ వర్గానికి చెందిన నేతల భేటీలు, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో శరద్ పవార్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ సమావేశాలు అధికారికంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసమేనని నేతలు చెబుతున్నప్పటికీ.. తెర వెనుక రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు మాత్రం జోరందుకున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలోని NCP (శరద్చంద్ర పవార్) ఎన్డీఏ వైపు అడుగులు వేయబోతోందా? అనే ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఈ పరిణామాల వెనుక బీజేపీ ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోందన్న చర్చ ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.బీజేపీ వ్యూహం ప్రకారం.. ముందుగా విడిపోయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వర్గాలను మళ్లీ దగ్గర చేయడం, ఆ తర్వాతే ఎన్డీఏతో సంబంధాలపై ముందుకు వెళ్లడం లక్ష్యంగా కనిపిస్తోంది. అంటే కేవలం శరద్ పవార్ వర్గాన్ని కూటమిలోకి తీసుకోవడం కాకుండా.. మొత్తం ఎన్సీపీని ఒకే రాజకీయ శక్తిగా మార్చి ఎన్డీఏలోకి తీసుకురావాలన్న ఆలోచన ఉన్నట్లు సమాచారం.2023 జూలైలో అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి బీజేపీ-శివసేన (షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించి పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కేటాయించింది. శరద్ పవార్ వర్గం మాత్రం ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) పేరుతో కొనసాగుతోంది.ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ వర్గం అధికారంలో భాగస్వాములుగా ఉన్నాయి. మరోవైపు శరద్ పవార్ వర్గం ప్రతిపక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు దగ్గరవడం జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులకు అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.బీజేపీ వ్యూహంలో మూడు దశలు?రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. బీజేపీ వ్యూహం మూడు దశల్లో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మొదట పవార్ వర్గాల మధ్య సయోధ్యకు మార్గం సుగమం చేయడం, రెండో దశలో ఎన్సీపీ పునరేకీకరణ, మూడో దశలో ఎన్డీఏతో అధికారిక అనుబంధం వంటి అంశాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శరద్ పవార్ వర్గాన్ని నేరుగా ఎన్డీఏలోకి తీసుకోవడంపై బీజేపీలో కొంత సంకోచం ఉందని సమాచారం. ముందుగా పార్టీ అంతర్గత విభేదాలు పరిష్కారమైతేనే దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనం ఉంటుందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.బీజేపీకి అసలు లాభం ఏంటి?ఈ మొత్తం పరిణామాల్లో బీజేపీకి ఉన్న ప్రధాన రాజకీయ లాభం ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్రలో శరద్ పవార్కు దశాబ్దాలుగా ఉన్న రాజకీయ ప్రభావం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు ఉన్న పట్టు బీజేపీకి కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీకి అధికార బలం ఉన్నప్పటికీ.. మరాఠా రాజకీయాల్లో పవార్ కుటుంబ ప్రభావాన్ని పూర్తిగా పక్కన పెట్టడం అంత సులువు కాదు. శరద్ పవార్ వర్గం ఎన్డీఏకు దగ్గరైతే.. ప్రతిపక్ష శక్తులను బలహీనపరచడంతో పాటు, భవిష్యత్ ఎన్నికల్లో కూటమికి అదనపు బలం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ముఖ్యంగా 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చూస్తే.. మహారాష్ట్రలో ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయడం బీజేపీకి కీలక వ్యూహంగా మారనుంది. ప్రస్తుతం శరద్ పవార్ వర్గం ఇండియా కూటమిలో భాగంగా ఉండటం వల్ల ప్రతిపక్షాలకు ఓ రాజకీయ ఆధారం లభిస్తోంది. ఆ వర్గం ఎన్డీఏ వైపు వస్తే.. ఇండియా కూటమికి ఇది గట్టి ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా పార్లమెంట్లో కీలక బిల్లులపై సంఖ్యాబలం కూడా బీజేపీకి ఉపయోగపడుతుంది. లోక్సభలో ఎనిమిది మంది సభ్యులు ఉన్న NCP(SP) మద్దతు లేదా అనుకూల వైఖరి కేంద్రానికి రాజకీయంగా ప్రాధాన్యత కలిగించవచ్చు.మరోవైపు మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ రాజకీయాల్లో కూడా పవార్ వర్గాల కలయిక బీజేపీ-షిండే-అజిత్ కూటమికి అదనపు బలం ఇవ్వగలదన్న అంచనాలు ఉన్నాయి.అయితే దీనికి మరో వైపు కూడా ఉంది. శరద్ పవార్ వంటి సీనియర్ నేతను ఎన్డీఏలోకి తీసుకురావడం వల్ల కూటమిలో అంతర్గత సమతుల్యత ఎలా ఉంటుందన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గాల మధ్య సయోధ్య సాధ్యమవుతుందా? అన్నదే అసలు సవాల్గా మారనుంది.కేంద్ర కేబినెట్ ఆశలు.. అజిత్ వర్గం ఎదురుచూపులుఇదిలా ఉండగా.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేంద్ర స్థాయిలో మరింత ప్రాధాన్యత కోసం ఎదురుచూస్తోంది. భవిష్యత్ కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తమ పార్టీకి ప్రాతినిధ్యం రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడు పార్థ్ పవార్కు కేంద్ర కేబినెట్లో అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే తుది నిర్ణయం మాత్రం ఢిల్లీ బీజేపీ పెద్దల చేతుల్లోనే ఉందని తెలుస్తోంది.ఆమె ఖండించినా.. కొనసాగుతున్న ప్రచారంమరోవైపు శరద్ పవార్ వర్గం మాత్రం ఎన్డీఏలో చేరే ప్రచారాన్ని ఖండిస్తోంది. NCP(SP) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కూడా ఇలాంటి వార్తలను పలుమార్లు తోసిపుచ్చారు. తనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందంటూ గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోందని, అలాంటి ఊహాగానాల్లో వాస్తవం లేదని ఆమె వ్యాఖ్యానించారు.అయితే పార్లమెంట్ లెక్కలు, రాబోయే రాజకీయ పరిణామాల నేపథ్యంలో శరద్ పవార్ వర్గం ప్రాధాన్యతను కొట్టిపారేయలేమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. లోక్సభలో NCP(SP)కు ఉన్న ఎనిమిది మంది ఎంపీల సంఖ్య కూడా కీలకంగా మారే అవకాశం ఉంది.మొత్తంగా చూస్తే.. మహారాష్ట్రలో బీజేపీ రాజకీయ లెక్కలు కొత్త దిశలో సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి. పవార్ కుటుంబంలో మళ్లీ ఐక్యత వస్తుందా? ఎన్సీపీ పునరేకీకరణ జరుగుతుందా? లేక ఇవన్నీ కేవలం రాజకీయ వ్యూహంలో భాగమా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. -
సియా గోయల్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
పూణే: కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కేసు దర్యాప్తుకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తున్నప్పటికీ.. తమ కుటుంబాన్ని పదే పదే లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తన దుకాణంపై సోదాలపై ఆయన మాట్లాడుతూ.. జూలై 14వ తేదీ ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి నమూనాలను సేకరించారని తెలిపారు.లైసెన్స్కు సంబంధించిన ఈ తనిఖీలు జరిగాయని.. ఇప్పటికే తాము కొత్త లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నామని.. మరో ఎనిమిది నుండి పది రోజుల్లో అది వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అధికారులు ఆదేశించిన ప్రకారం ప్రస్తుతానికి దుకాణాన్ని మూసి ఉంచామని.. అయితే దుకాణాన్ని సీజ్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తన కుమార్తె కేసు గురించి ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని తాము గౌరవిస్తామన్నారు.‘‘నా కుమార్తె చేసిన తప్పుకు మమ్మల్ని శిక్షిస్తున్నారు. ఒకవేళ ఆమె దోషిగా తేలితే ఆమెను ఉరితీయండి.. దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను న్యాయవ్యవస్థకు, చట్టానికి కట్టుబడి ఉన్నాను. దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తాను. కానీ దయచేసి మమ్మల్ని శిక్షించకండి. మమ్మల్ని రోజురోజుకూ చంపేస్తున్నట్లు అనిపిస్తోంది. నేను తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తున్నానని కన్నీటిపర్యంతమయ్యారు.కొందరు వ్యక్తులు కావాలనే తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని.. తప్పు చేయకపోయినా తాము శిక్ష అనుభవిస్తున్నామని ఆయన వాపోయారు. పూణే మార్కెట్ యార్డ్లోని ప్రవీణ్ గోయల్కు చెందిన దుకాణంపై మహారాష్ట్ర ఎఫ్డీఏ.. జూలై 14న దాడులు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనల కింద రూ. 8.14 లక్షల విలువైన 4,172 కిలోల ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కేతన్ అగర్వాల్ హత్య కేసులో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. జూన్ 18న లోనావాలా సమీపంలోని లోహగడ్ కోట ట్రెక్కింగ్ సమయంలో కేతన్ అగర్వాల్ మృతి చెందగా.. మొదట ప్రమాదంగా భావించారు. అయితే, సియా గోయల్, చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్ ప్రకారం కేతన్ను కొండపై నుంచి నెట్టి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు.ట్రెక్కింగ్కు వెళ్లాలని సియా పదే పదే ఒత్తిడి చేయడం, బాలి పర్యటనకు ముందు కేతన్ పాస్పోర్ట్ అదృశ్యం కావడం.. వీరి వెంట హుడీ ధరించిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సీసీటీవీ విజువల్స్ లభించడంతో ఈ కేసులో కీలక ఆధారాలు లభించాయి. నిందితులిద్దరిపై హత్య, నేరపూరిత కుట్ర కేసులు నమోదు చేసి పోలీస్ కస్టడీకి తరలించారు. -
సియా గోయల్ కుటుంబానికి బిగ్ షాక్
యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సియా గోయల్ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమె బెయిల్ కోసం తీవ్రంగా యత్నిస్తున్న కుటుంబానికి ఇప్పుడు పెద్ద షాకే తగిలింది. సియా కుటుంబం నిర్వహించే మసాలా, డ్రై ఫ్రూట్స్ వ్యాపార సంస్థపై మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం (FDA) చర్యలు తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనలు, కల్తీ అనుమానాల నేపథ్యంలో దుకాణ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పుణెలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ఉన్న బీజీ గోయల్ అండ్ కంపెనీ (M/s BG Goyal and Company) అనే సంస్థను సియా కుటుంబం నిర్వహిస్తోంది. ఈ షాపులో తాజాగా ఎఫ్డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఉత్పత్తులను గుర్తించారు. వీటిలో పసుపు పొడి, నువ్వులు, సోయాబీన్ చంక్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. తనిఖీల సందర్భంగా మొత్తం 4,172 కిలోల ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.8.14 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (FSS Act) ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను సంస్థ ఉల్లంఘించిందని ఎఫ్డీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. లైసెన్స్ వివరాల్లో అవసరమైన మార్పులు చేయాలని గతంలో సూచించినప్పటికీ.. సంస్థ నుంచి సరైన స్పందన రాకపోవడంతో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్పత్తుల లేబులింగ్లో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు, కల్తీ జరిగి ఉండొచ్చన్న అనుమానంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా.. సియా గోయల్ పేరు దేశం అంతటికి తెలిసిందే. తన కాబోయే భర్త కేతన్ (25)ను ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి లోహగఢ్ కోట వద్ద నుంచి తోసి హత్య చేసిన కేసులో ఆమె నిందితురాలిగా ఉంది. జూన్ 18న ఈ ఘటన జరగ్గా.. అనేక మలుపులు తిరిగిన ఈ కేసు చివరకు సియా, చేతన్ అరెస్ట్తో ఓ కొలిక్కి వచ్చింది. అయితే కేతన్ను తోసిందెవరు? అనే మిస్టరీ ఇంకా వీడాల్సి ఉంది. ఈ విషయంలో నిందితులిద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అలాగే ఇద్దరూ రహస్య వివాహం చేసుకున్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇటు హత్య కేసు విచారణ కొనసాగుతున్న వేళ.. తాజాగా ఆమె కుటుంబ వ్యాపారంపై FDA చర్యలు తీసుకోవడం పుణెలో చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో ఎఫ్డీఏ దూకుడు ప్రదర్శిస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ తుకారాం ముండే కల్తీపై కొరడా ఝుళిపిస్తున్నారు. కల్తీ ఆహారం, నిషేధిత ఉత్పత్తులు, నాసిరకం మందులపై వరుస దాడులు జరుగుతున్నాయి. గతంలో కఠిన నిర్ణయాలతో గుర్తింపు పొందిన ముండే.. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పలు జిల్లాల్లో అక్రమ తయారీ కేంద్రాలు, గుట్కా విక్రయదారులు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపార సంస్థలపై కేసులు, సీజ్ చర్యలు కొనసాగుతున్నాయి. -
2 వారాల పాటు అక్కడ చికెన్, మటన్ బంద్
సాక్షి ముంబై: ఆషాఢీ వారీ సందర్భంగా విఠోబా దర్శనం కోసం లక్షలాది మంది వార్కరీలు పండరీపూర్కు చేరుకోనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల మతపరమైన మనోభావాలను గౌరవిస్తూ నేటి నుంచి 29 వరకు మహారాష్ట్రలోని పండరీపూర్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో మాంసం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోలాపూర్ జిల్లా ఇంచార్జి మంత్రి జయకుమార్ గోరే సూచనల మేరకు జిల్లా కలెక్టర్ ఈ ఆదేశాలు జారీ చేశారు.ఆషాఢీ వారీ సమయంలో రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పాదయాత్రగా పండరీపూర్కు చేరుకుంటారని, ఈ పవిత్ర వేళలో మాంసం విక్రయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఆదేశాలను ఉల్లంఘించి మాంసం లేదా మటన్ అమ్మకాలు కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని వార్కరీ సంఘాలు స్వాగతించాయి.గజానన్ మహారాజ్ పల్లకీ యాత్రకు ముమ్మర ఏర్పాట్లు సోలాపూర్: శ్రీ క్షేత్ర షేగావ్ నుంచి పండరీపూర్ బయలుదేరిన శ్రీ గజానన్ మహారాజ్ పల్లకీ, వార్కారీల పాదయాత్ర ఈనెల 18న సోలాపూర్ చేరుకోనుంది. పల్లకీ, వార్కరీలు రెండు రోజులు ఇక్కడే బస చేయనున్న నేపథ్యంలో మేయర్ వినాయక కొండ్యాల్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట స్టాండింగ్ కమిటీ చైర్మన్ రంజిత చాకోతే, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ సచిన్ ఓంబాసే, అదనపు కమిషనర్ వీణా పవార్, కార్పొరేటర్లు వందన గైక్వాడ్ , శ్రీదేవి పూలారే, కల్పన కదం , గౌతం కస్బే, దిలీప్ కొల్హె, సిటీ ఇంజనీర్ సారిక ఆకులువార్, అగ్నిమాపక విభాగం ప్రముఖ అధికారి రాకేష్ సాలుంకే, శ్రీ గజానన మహారాజ్ షేగావ్ సంస్థాన్కు చెందిన స్థానిక ప్రతినిధులు సునీల్ కులకర్ణి, సునీల్ ఫాల్కే, ఉద్యానవన అధికారి కోమల్ కాశిది సంబంధిత విభాగాల అధికారులు ఉన్నారు.రూప భవాని చౌక్, తుల్జాపూర్ వేస్, కస్తూర్బా మార్కెట్, సామ్రాట్ చౌక్ శ్రీ సద్గురు ప్రభాకర్ స్వామి మహారాజ్ మందిర్, బాలివేస్ టెలిఫోన్ భవన్, కుంబార్ వేస్, కౌంతం చౌక్, కన్నా చౌక్ మార్గాలతో పాటు పద్మశాలీ శిక్షణ సంస్థకు చెందిన కుఛన్ పాఠశాలల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే వార్కారీలు బస చేసే ఉపలపు కళ్యాణ మండపాన్ని, అక్కడి నుండి తరలి వెళ్లే మోదీ రైల్వే బ్రిడ్జి, ధమాని నగర్ మార్గాల వద్ద సన్నాహాలను సమీక్షించారు.చదవండి: ఆ రూట్లో వెళ్లే వాహనాలకు టోల్ ఫీజు లేదువార్కరీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా మేయర్ అధికారులను ఆదేశించారు. పల్లకి మార్గంలో అడ్డువచ్చే చెట్ల కొమ్మలను వెంటనే కొట్టివేయాలని అలాగే రోడ్లపై గుంతలను పూడ్చాలని, పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చెప్పారు. కమిషనర్ డాక్టర్ సచిన్ ఓం బాసే పల్లకి మార్గాల వెంబడి అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని, అలాగే పారిశుధ్యం, నీటి సరఫరా, ఆరోగ్య, అగ్నిమాపక, అత్యవసర విభాగాల సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని సూచించారు. -
ఆ షరతుకు ఒప్పుకుంటేనే ఎన్డీయేకు మద్దతు!!
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంటాయి. ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న నేతల మధ్య అనూహ్య భేటీలు, మారుతున్న సమీకరణాలు అక్కడి రాజకీయాలను మరింత ఉత్కంఠగా మారుస్తుంటాయి. తాజాగా మరోసారి అలాంటి పరిణామమే తెరపైకి వచ్చింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిపక్ష కూటమిలో ఉన్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) వైఖరి మారే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు శరద్ పవార్ వర్గం సిద్ధమవుతోందన్న వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అయితే ఈ మద్దతుకు ఓ షరతు ఉందని తెలుస్తోంది. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం లోక్సభ స్థానాల పెంపు కల్పిస్తేనే బిల్లుకు అనుకూలంగా ఓటేస్తామని ఎన్సీపీ వర్గాలు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ప్రతిపక్ష శిబిరంలో ఉన్న శరద్ పవార్ ఎన్సీపీ.. ఎన్డీఏకు దగ్గరవుతోందా? అనే చర్చ మొదలైంది.ప్రతిపక్ష కూటమికి షాక్?గత పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా వ్యతిరేకించాయి. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం అదే బిల్లుపై శరద్ పవార్ వర్గం భిన్నమైన వైఖరి తీసుకుంటే.. ప్రతిపక్ష ఐక్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.50 శాతం సీట్ల పెంపు ఉంటే మద్దతుఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఈ అంశంపై స్పందిస్తూ.. బిల్లులో అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా స్పష్టమైన నిబంధనలు ఉంటే మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. “అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపునకు అవకాశం కల్పిస్తే, అమలు విధానం స్పష్టంగా ఉంటే మద్దతు ఇస్తాం” అని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.ఇదే అంశంపై గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హామీ ఇచ్చారు. ఏ రాష్ట్రానికీ నష్టం జరగకుండా లోక్సభ స్థానాలను పెంచేలా సవరణ తీసుకొస్తామని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఎన్డీఏలో భాగం కానప్పటికీ.. కీలక సమయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది.అసలు డీలిమిటేషన్ బిల్లు ఏంటి?లోక్సభ స్థానాల సంఖ్యను పెంచడం, మహిళా రిజర్వేషన్ అమలుకు మార్గం సుగమం చేయడం లక్ష్యంగా కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చింది. రాజ్యాంగం (131వ సవరణ) బిల్లుగా పిలుస్తున్న ఈ ప్రతిపాదనలో లోక్సభ స్థానాల సంఖ్యను పెంచే అంశం ఉంది. అయితే జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. జనాభా నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలకు సీట్లు తగ్గే ప్రమాదం ఉందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.రహస్య భేటీలతో పెరిగిన చర్చతాజా రాజకీయ పరిణామాలకు మరో కారణం ఎన్సీపీకి చెందిన రెండు వర్గాల నేతల కదలికలు. శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో రహస్యంగా సమావేశమైనట్లు వార్తలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ పరిణామాలతో శరద్ పవార్ మళ్లీ బీజేపీకి దగ్గరవుతున్నారా? ఎన్సీపీ రెండు వర్గాలు తిరిగి ఒక్కటయ్యే అవకాశం ఉందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.అయితే ఎన్సీపీ నేతలు మాత్రం ఈ భేటీలకు రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతున్నారు.కాంగ్రెస్ ఆందోళనమరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఈ పరిణామాలపై స్పందిస్తూ.. శరద్ పవార్ ఎన్సీపీ, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని కోరారు. ప్రస్తుత డీలిమిటేషన్ విధానం వల్ల జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.శరద్ పవార్ వ్యూహం ఏమిటి?మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ ఎప్పుడూ వ్యూహాత్మక నిర్ణయాలకు పేరుగాంచారు. ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న పార్టీలతోనూ అవసరానికి అనుగుణంగా రాజకీయ సమీకరణాలు మార్చుకోవడం ఆయన శైలిలో భాగమని విశ్లేషకులు చెబుతుంటారు. తాజా పరిణామాలు కేవలం ఒక బిల్లుపై మద్దతుకే పరిమితమా? లేదంటే భవిష్యత్ రాజకీయ పొత్తులకు సంకేతమా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.డీలిమిటేషన్ బిల్లుపై వైఖరి మారితే.. అది మహారాష్ట్రతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశం ఉంది. మరి ప్రతిపక్ష కూటమితో కలిసి నడుస్తున్న శరద్ పవార్ ఎన్సీపీ.. కీలక సమయంలో మిత్రపక్షాలకు హ్యాండ్ ఇస్తుందా? లేక షరతులతో కూడిన మద్దతుకే పరిమితం అవుతుందా? అన్నది వేచి చూడాలి. -
వైద్యుల భద్రతే ఆరోగ్య భద్రత
మహారాష్ట్రలోని ఒక ఆసుపత్రిలో వైద్యులు, నర్సులపై స్థానిక కార్పొరేటర్ దాడి చేశాడనే వార్తలొచ్చాయి. అరెస్టు చేయబోతున్నారని తెలియగానే, ఆ కార్పొరేటర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడని సమాచారం. తాను దాడి చేసిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుంచే తనకు వైద్యం అందాలని ఆయన ఏ సంకోచం లేకుండా ఆశించడం హాస్యాస్పద విషాదం.ఇదే సంఘటన సింగపూర్లో జరిగితే పరిస్థితి వేరేలా ఉండేది. ‘ఆరోగ్య సంరక్షణ రంగంలో దాడులు, వేధింపుల నివారణకు త్రైపాక్షిక విధానం’ అక్కడ అమలవుతోంది. దాడి చేసిన వ్యక్తికి (అత్యవసరం కాని) చికిత్సను నిరాకరించడంతో పాటు, మెడికల్ రికార్డులలో ‘దురుసుగా ప్రవర్తించే వ్యక్తి’గా శాశ్వతంగా ముద్రించే అవకాశం ఉంది. వైద్యులపై హింసకు అక్కడ జీవితకాల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.భారతదేశంలో ఆరోగ్య సంరక్షకులపై హింస సాధారణమై పోయింది. వైద్యులు, నర్సులు ఇప్పటికే సుదీర్ఘ పనివేళలు, మాన సిక ఒత్తిడి, వసతుల కొరతతో సతమత మవు తుండగా... ఇప్పుడు బెదిరింపులు, భౌతిక దాడుల భయం పెరుగుతున్నాయి. ‘ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్’లో ప్రచురి తమైన ఉత్తరాఖండ్ అధ్యయనం వివరాల ప్రకారం, 75% మంది వైద్యులు ప్రతీకార దాడులు ఎదుర్కొన్నారు. ఇందులో 68% దాడులు రోగుల బంధు వులు చేస్తే, కేవలం 18% కేసులు మాత్రమే పోలీసుల దృష్టికి వెళ్లాయి. సఫ్దర్ జంగ్ వంటి ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల నెట్వర్క్లలో జరిగిన ఆడిట్ ప్రకారం అధిక ఒత్తిడి షిఫ్ట్లలో హింస రేటు 63.6%గా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసా గితే వైద్య శాస్త్రాన్ని అభ్యసించడానికి ప్రతిభావంతులైన విద్యార్థులు ముందు కురారు. ఫలితంగా దేశంలో వైద్య నిపుణుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై హింసను, ఆసుపత్రులకు నష్టం కలిగించ డాన్ని నిషేధిస్తూ అనేక రాష్ట్రాలు చట్టాలను రూపొందించాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ‘హెల్త్కేర్ సర్వీసెస్ పర్సనల్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ వయొలెన్స్ అండ్ డామేజ్ టు ప్రాపర్టీ) బిల్లు’ ముసాయిదాను 2019లో రూపొందించింది. అయితే అది చట్టంగా మారలేదు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో, ‘అంటు (ఎపిడమిక్) వ్యాధుల చట్టాన్ని’ సవరించి, వైద్య సిబ్బందిపై హింసకు పాల్పడటాన్ని నాన్– బెయిలబుల్ నేరంగా పరిగణించి, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా 2020లో చట్టం తీసుకువచ్చినా ఆశించిన స్థాయిలో ప్రభావం కనిపించడం లేదు. వైద్యుల భద్రత – జాతీయ ఆరోగ్య భద్రతకు కీలకం. వైద్యులను గౌరవించడం అంటే – ఆరోగ్య సంరక్షణ పొందే పౌరుల రాజ్యాంగ హక్కును కాపాడటమే.– శ్రీనివాస్ మాధవ్, సామాజిక కార్యకర్త -
సునేత్రా పవార్కు బిగ్ షాక్.. ఎన్సీపీలో కొత్త ట్విస్ట్!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అధికార నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ ఎన్నికైన విధానాన్ని సవాల్ చేస్తూ పార్టీ సీనియర్ నాయకుడు సచ్చిదానంద్ సింగ్ న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు పంపించారు. అధ్యక్ష ఎన్నిక చెల్లదని, పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ ప్రక్రియ నిర్వహించారని ఆరోపిస్తూ, తాజాగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిణామం ఎన్సీపీలో నాయకత్వంపై కొత్త రాజకీయ చర్చకు దారితీసింది.వివాదం ఎలా మొదలైంది?అజిత్ పవార్ మరణానంతరం పార్టీ నాయకత్వంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో సునేత్రా పవార్ను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రక్రియలో పార్టీ రాజ్యాంగం ప్రకారం సభ్యులకు నోటీసులు ఇవ్వలేదని, నామినేషన్లకు అవకాశం కల్పించలేదని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించలేదని సచ్చిదానంద్ సింగ్ ఆరోపిస్తున్నారు. ఎన్నిక పేరుతో కేవలం ఒక అధికారిక ప్రక్రియ మాత్రమే నిర్వహించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.లీగల్ నోటీసులో డిమాండ్లు.. ఆమె ఎన్నికపై సింగ్ పంపిన నోటీసులో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. సునేత్రా పవార్ ఎన్నికను రద్దు చేయాలి. పార్టీ రాజ్యాంగం ప్రకారం కొత్త ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి. పార్టీలో అర్హులైన సభ్యులకు పోటీ చేసే అవకాశం కల్పించాలి. ఎన్నికల ప్రక్రియను స్వతంత్రంగా, పారదర్శకంగా నిర్వహించాలి అని అన్నారు. అయితే, పార్టీ ఈ డిమాండ్లపై స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశముందని కూడా నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యలుఈ వివాదం వెలుగులోకి వచ్చిన సమయంలో ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ కూడా పార్టీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని అంగీకరించారు. పార్టీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు సరిదిద్దే చర్యలు అవసరమని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత అసంతృప్తి ఉందనే చర్చకు మరింత బలం చేకూర్చాయి. కాగా, సునేత్రా పవార్ నాయకత్వాన్ని న్యాయపరంగా సవాలు చేయడం వల్ల ఎన్సీపీలో నాయకత్వ స్థిరత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోర్టు ఈ పిటిషన్ను స్వీకరిస్తే అధ్యక్ష ఎన్నికల చెల్లుబాటుపై విచారణ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై కూడా దీని ప్రభావం ఉండవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
డిప్యూటీ సీఎం కొడుకుతో నిశ్చితార్థం.. ఎవరీ కైనత్?
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్ కుటుంబంలో త్వరలో శుభకార్యం జరగనుంది. ఆమె పెద్ద కుమారుడు, రాజ్యసభ సభ్యుడు పార్థ్ పవార్ పెళ్లి చేసుకోబోతున్నారు. మోడల్, వ్యాపారవేత్త కైనత్ ధర్ను ఆయన వివాహమాడనున్నారు. జులై 29న పుణెలో వీరిద్దరి నిశ్చితార్థం జరగనుంది. నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పవార్ కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవార్ ఫ్యామిలీలోకి కోడలిగా అడుగుపెట్టబోయే కైనత్ ధర్ గురించి తెలుసుకునేందుకు మహారాష్ట్ర ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.ఎవరీ కైనత్ ధర్?కైనాత్ ధర్ ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఆమె మోడల్గా, వ్యాపారవేత్తగా పనిచేస్తున్నారు. ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేసి అక్కడే తన వృత్తి జీవితాన్ని నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె మోడలింగ్ రంగంలో చేసిన ప్రాజెక్టులు, వ్యాపార కార్యకలాపాలు లేదా విద్యార్హతల గురించి పూర్తి వివరాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవడానికే ఆమె ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.పవార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలుపార్థ్ పవార్, కైనత్ ధర్ (Kaiynaat Dhar) బంధం గురించి కొంతకాలంగా ప్రచార మాధ్యమాల్లో ఊహాగానాలు వస్తున్నాయి. ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయాన్ని పార్థ్తో కలిసి కైనత్ సందర్శించిన ఫొటోలు వైరల్ కావడంతో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు ప్రచారం మొదలైంది. ఇటీవల జరిగిన ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ వేడుకల్లో కైనత్ పాల్గొనడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. పార్థ్ కుటుంబం కష్టకాలంలో ఉన్న సందర్భాల్లో కైనత్ వారి వెంట కనిపించారని, ఆమెకు పవార్ కుటుంబంతో సన్నిహిత అనుబంధం చాలా కాలంగా ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.జూలై 29న నిశ్చితార్థంపార్థ్ పవార్, కైనత్ ధర్ల నిశ్చితార్థం (Parth Pawar, Kaiynaat Dhar Engagement) జులై 29న పుణెలో జరగనుంది. ఈ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే నిర్వహించనున్నట్లు సమాచారం. అతిథుల జాబితా, వేదిక వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.చదవండి: ఆ రూట్లో వెళ్లే వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యంఅజిత్ పవార్ రాజకీయ వారసుడుమహారాష్ట్ర రాజకీయాల్లో పార్థ్ పవార్ కుటుంబం కీలక పాత్ర పోషిస్తోంది. ఆయన తల్లి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రి అజిత్ పవార్. మహారాష్ట్రలో అత్యధిక కాలం డిప్యూటీ సీఎంగా పని చేసిన ఆయన ఈ ఏడాది జనవరిలో జరిగిన విమాన ప్రమాదంలో అకాల మరణం చెందారు. అజిత్ పవార్ మరణానంతరం ఆయన సతీమణి సునేత్రకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. వీరి పెద్ద కుమారుడు పార్థ్ పవార్ ఈ ఏడాది ఏప్రిల్ 9న మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. -
ఆ రూట్లో వెళ్లే వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యం
సాక్షి ముంబై: ఆషాఢ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పుణ్యక్షేత్రమైన పండరీపూర్కు వెళ్లే భక్తుల వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యం కల్పించింది. దీంతో ఉత్సవాలకు రాకపోకలు సాగించే భక్తులకు ఎంతో ఊరట లభించింది. ఈ సౌకర్యం సొంత వాహనాల్లో వెళ్లే భక్తులతోపాటు టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు, అద్దె కార్లు, ఇతర పికప్ వాహనాలు సహా గ్రూపు బుకింగ్ చేసుకున్న మహరాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ (ఎమ్మెస్సార్టీసీ) బస్సులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందు నుంచి ముగిసేవరకూ.. ఈ నెల 25న పండరీపూర్లో ఆషాఢ ఏకాదశి (Ashadi Ekadashi) ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల నుంచి భక్తులు పల్లకీలతో సహా కాలినడకన పక్షం రోజుల ముందే పండరీపూర్కు బయలుదేరతారు. ఏకాదశికి ముందు లేదా అదేరోజున అక్కడికి చేరుకుంటారు. కొందరు భక్తులు సొంత వాహనాల్లో మరికొందరు అద్దె వాహనాల్లో వస్తారు. దీంతో పండరీపూర్ సుమారు వారం రోజులపాటు భక్తులతో కిటకిటలాడుతుంది. ఉత్సవాలకు మూడు రోజుల ముందు నుంచి ముగిసేవరకు అంటే ఈ నెల 29 వరకు అన్ని రకాల వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాస్ ఇలా పొందాలి... అయితే ఈ సౌకర్యాన్ని పొందాలనుకునేవారు కొ న్ని నియమ, నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్ప ష్టం చేసింది. పండరీపూర్ వెళ్లే వాహనాలు ‘ఆషాఢి ఏకాదశి–2026’ అనే స్టిక్కర్ లేదా పాస్ కోసం ముందుగా స్ధానిక పోలీసు స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రాఫిక్ ఫోలీసు శాఖ లేదా ప్రాంతీయ రవాణా కార్యాలయం అనమతి పొందాలి. ఈ స్టిక్కర్ లేదా పాస్ను వాహనం విండ్ షీల్డ్ (అద్దం ముందు భాగం) పై అతికించాలి. గ్రూపు బుకింగ్ చేసుకునే బస్సులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. అప్పుడే టోల్ నాకాల మీదుగా ఉచితంగా ఒకసారి వెళ్లి , తిరిగి రావడానికి (వన్ టైం) వీలుంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.చదవండి: బీజేపీ నాయకులపై రాజ్ఠాక్రే ధ్వజంఅన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలి ఇదిలాఉండగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షం (Mumbai Rains) కారణంగా అనేక చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఉత్సవాలకు ముందే మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వాహనాల్లో వెళ్లే వారితోపాటు పల్లకీలతో కాలిబాటన వెళ్లే భక్తులు మార్గమధ్యంలో ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయాలని సూచించింది. వాహనాలను క్రమబద్దీకరించేందుకు మార్గమధ్యలో ట్రాఫిక్ పోలీసులను నియమించాలని, రోడ్డు ప్రమాదానికి గురైన, రిపేర్లతో ఆగిపోయిన వాహనాలను తరలించేందుకు టోవింగ్ వ్యాన్లు అందుబాటులో ఉంచాలని స్ధానిక పోలీసు స్టేషన్లకు సూచించింది. -
కుంభమేళా ఏర్పాట్లకు ప్రకృతి బ్రేక్.. సాధుగ్రామ్కు కొత్త స్థలం!
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్–త్రయంబకేశ్వర్లో 2027లో జరగనున్న సింహస్థ కుంభమేళా ఏర్పాట్లలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధువుల కోసం ఏర్పాటు చేయనున్న సాధుగ్రామ్ స్థలాన్ని మార్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం కేటాయించిన ప్రాంతం పూర్తిగా నీటమునిగి, బురదమయంగా మారడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఎత్తైన ప్రాంతంలో కొత్త స్థలాన్ని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు.త్రయంబకేశ్వర్ కుంభమేళా దేశంలోని అత్యంత పవిత్ర హిందూ ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటి. ఇక్కడ శైవ సంప్రదాయానికి చెందిన దశనామి అఖాడాల సాధువులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. మరోవైపు నాసిక్లో వైష్ణవ సంప్రదాయానికి చెందిన సాధువులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఈ కారణంగా ప్రతి కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు, సాధువులు తరలివస్తారు. అయితే ఈసారి భారీ వర్షాలు ఏర్పాట్లను తీవ్రంగా ప్రభావితం చేశాయి. రహదారుల నిర్మాణం, కుశావర్త తీర్థం అభివృద్ధి పనులు, సరస్సుల సుందరీకరణ వంటి ప్రాజెక్టులు మందగించాయి. ముఖ్యంగా సాధువుల నివాస శిబిరం ఏర్పాటు చేయాల్సిన స్థలం పూర్తిగా బురదమయంగా మారడంతో అక్కడ శిబిరం ఏర్పాటు చేయడం ప్రమాదకరమని అధికారులు భావిస్తున్నారు.దీంతో వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, నీరు నిల్వ కాకుండా ఉండే ఎత్తైన ప్రాంతాన్ని ప్రత్యామ్నాయంగా ఎంపిక చేస్తున్నారు. అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలను వేగంగా పూర్తి చేసి, సాధువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పరిపాలనా వర్గాలు తెలిపాయి. 2027 సింహస్థ కుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. వర్షాల సవాళ్లు ఉన్నప్పటికీ, కుంభమేళా ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులు కృషి చేస్తున్నారు. -
ఉగ్ర నెట్ వర్క్ పై ATS నిఘా
-
పవన్కు ముంబైలో సర్జరీ పూర్తి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు శనివారం ముంబైలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. కుడి భుజానికి (రొటేటర్ కఫ్) జరిగిన ఈ సర్జరీ సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం పవన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని వైద్య బృందం తెలిపింది.ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో పవన్ కల్యాణ్ రెండు భుజాల కండరాలు (రొటేటర్ కఫ్) తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. కండరాలు పూర్తిగా చిట్లిపోవడంతో శస్త్రచికిత్స తప్పనిసరి అని వైద్యులు సూచించారు. అయితే రెండు భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, తొలిదశలో కుడి భుజానికే శస్త్రచికిత్స నిర్వహించారు. మరో భుజానికి దాదాపు రెండు నెలల తర్వాత మరో సర్జరీ చేయనున్నట్లు సమాచారం.పవన్ కల్యాణ్కు ఈ గాయాలు ఒక్కసారిగా ఏర్పడినవి కావని తెలుస్తోంది. దబాంగ్ రీమేక్ 'గబ్బర్ సింగ్' సినిమా చిత్రీకరణ సమయంలో ఆయనకు భుజానికి గాయమైంది. అనంతరం 2019లో రాయలసీమ పర్యటనలో, ఎన్నికల టైంలో నిర్వహించిన వారాహి యాత్ర సందర్భంగా కూడా భుజాలపై ఒత్తిడి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్లో ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకునే ముందు నిర్వహించిన సమగ్ర వైద్య పరీక్షల్లో రెండు భుజాల్లోనూ రొటేటర్ కఫ్ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికావడంతో పవన్ అభిమానులు, జనసేన శ్రేణులు ఊరట వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనల మేరకు పవన్ కల్యాణ్ కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం ఫిజియోథెరపీతో పాటు పునరావాస చికిత్స కొనసాగనుంది. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. Wishing Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu a full and speedy recovery. I pray for his good health and wish him strength during this time.@PawanKalyan— N Chandrababu Naidu (@ncbn) July 11, 2026 -
అయోధ్య విరాళాల చోరీపై పశ్నించకూడదా?
సాక్షి, ముంబై: పుణే–ముంబై ఎక్స్ప్రెస్వేపై నిర్మిస్తున్న ‘మిస్సింగ్ లింక్’ ప్రాజెక్టు, అయోధ్య రామమందిరంలో కానుకల చోరీ, రైల్వేల్లో స్థానికుల ఉద్యోగాల అంశాలపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మహాయుతి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర నవనిర్మాణ రైల్వే కార్మిక్ సేన వార్షికోత్సవం, నూతన కార్యాలయం, లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.బెదిరింపు ధోరణి తగదు ‘మిస్సింగ్ లింక్’ ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజ్ ఠాక్రే విమర్శించారు. మహారాష్ట్ర శాసనసభలో మరాఠీ సభ్యుల మధ్య హిందీలో మాట్లాడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రిగా ఉండి ’చూసుకుంటాం’ అనే భాష ఉపయోగించడం సరికాదు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కానీ బెదిరింపుల ధోరణి తగదు‘ అని వ్యాఖ్యానించారు. ‘మిస్సింగ్ లింక్’ ప్రాజెక్టులో చోటుచేసుకున్న లోపాలపై ప్రజలు ప్రశ్నిస్తే దానిని మహారాష్ట్రకు అవమానంగా చిత్రీకరించడం సరికాదని రాజ్ ఠాక్రే అన్నారు. ప్రజలు అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రశ్నించే హక్కు కలిగి ఉన్నారని, అధికారంలో లేనప్పుడు ఇదే అంశాలపై బీజేపీ కూడా ఉద్యమాలు చేసిందని గుర్తుచేశారు.అన్నీ సహజమేనా?ప్రభుత్వం ప్రతి లోపాన్నీ ’సహజం’గా పేర్కొంటోందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నందుకే అన్ని ఘటనలను సమర్థించుకోవడం సరికాదని, రేపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే వైఖరి అవలంబిస్తారా అని ప్రశ్నించారు. అయోధ్య రామమందిరంలో విరాళాలు, నిధుల చోరీ ఆరోపణలపై స్పందించిన రాజ్ ఠాక్రే.. భక్తుల దేవుడి సొమ్ము భద్రతపై ప్రశ్నిస్తే మతవ్యతిరేకులుగా ముద్ర వేయడం సరికాదన్నారు. రామమందిర ట్రస్ట్లో కేంద్ర ప్రభుత్వం నియమించిన సభ్యులు ఎక్కువ మంది ఉన్నారని పేర్కొంటూ, అలాంటి పరిస్థితుల్లో చోరీ ఎలా జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.చదవండి: ప్రజల మరణాలపై వెకిలి నవ్వులా?‘స్థానిక’ హక్కులపై అప్రమత్తంగా ఉండాలి 2008లో రైల్వే నియామకాల కోసం చేపట్టిన ఉద్యమాన్ని గుర్తు చేసిన రాజ్ ఠాక్రే.. ఆ పోరాటం వల్లే స్థానిక భాషల్లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి వచ్చిందన్నారు. భవిష్యత్తులో కూడా రైల్వే నియామకాలు, స్టాళ్ల కేటాయింపుల్లో స్థానికుల హక్కులు దెబ్బతినకుండా అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. -
టీసీఎస్ కేసు.. జైల్లో ప్రసవ వేదన భరించలేనిది!
నాసిక్ టీసీఎస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితురాలిగా అభియోగాలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్కు నాసిక్ లోకల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలులోనే బిడ్డకు జన్మనివ్వాల్సి రావడం ఏ మహిళకైనా తీవ్రమైన వేదనతో కూడుకున్నదన్న కోర్టు.. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జనన ప్రస్తావన తేస్తూ కీలక వ్యాఖ్యలు గమనార్హం. మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలకు సంబంధించిన కేసులో నిదా ఖాన్ నిందితురాలిగా ఉంది. ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలయ్యాక ఆమె పరారయ్యింది. అయితే.. దాదాపు 25 రోజుల తర్వాత మే 7న ఆమెను ఛత్రపతి శంభాజీనగర్లోని ఓ అద్దె ఇంటి నుంచి పోలీసులు అరెస్టు చేశారు. అయితే పరారీలో ఉన్న టైంలో తాను గర్భంతో ఉన్నానని.. ముందస్తు బెయిల్ కావాలని ఆమె వేసిన పిటిషన్ను నాసిక్ రోడ్ కోర్టు కొట్టేసింది. తాజాగా.. మరోసారి ఆమె గర్భధారణను ప్రధాన కారణంగా చూపిస్తూ బెయిల్ పిటిషన్ వేయగా.. జులై 6న బెయిల్ మంజూరు చేసింది. కోర్టు రూ.75 వేల వ్యక్తిగత బాండ్తో పాటు అదే మొత్తానికి ఒక పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది.నిదా ఖాన్ బెయిల్ వాదనను పోలీసులు, బాధితుల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. లైంగిక దాడి, బలవంతపు మత మార్పిడి ఆరోపణలకు సంబంధించి దర్యాప్తులో తగిన ఆధారాలు లభించాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిదా ఖాన్ తరఫు న్యాయవాది రాహుల్ కస్లీవాల్ మాత్రం ఆమె నిర్దోషి అని, తప్పుడు కేసులో ఇరికించారని కోర్టుకు తెలిపారు. ఆమె ఉన్నత విద్యావంతురాలని, టీసీఎస్లో అసోసియేట్గా పనిచేసిందని పేర్కొన్నారు.జైలులో ప్రసవం వేదన భరించలేనిది..బెయిల్ తీర్పు సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి కేజీ జోషి తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. “శ్రీకృష్ణుడి జననం జైల్లో జరిగింది. అలాంటి పరిస్థితుల మాదిరిగా ఓ బిడ్డకు జైలులో జన్మనివ్వాల్సి రావడం వల్ల కలిగే మానసిక వేదన, సామాజిక కళంకం ఏ మహిళకైనా తట్టుకోలేనిది. కాబట్టి పుట్టబోయే బిడ్డ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. అలాంటి బాధాకర పరిస్థితులను నివారించేందుకు న్యాయ విచక్షణను ఉపయోగించడం సముచితమని కోర్టు భావిస్తోంది అంటూ తీర్పు ఇచ్చారు. అంతేకాకుండా.. దర్యాప్తు పూర్తయి చార్జిషీట్ దాఖలైన నేపథ్యంలో ఆమెను జైలులో కొనసాగించడం వల్ల ప్రత్యేక ప్రయోజనం లేదని న్యాయస్థానం పేర్కొంది.టీసీఎస్ కేసులో ఆరోపణలు ఏమిటి?నాసిక్లోని టీసీఎస్ యూనిట్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, మత మార్పిడికి ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలపై పోలీసులు మొత్తం తొమ్మిది కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిదా ఖాన్కు సంబంధించిన కేసులో.. మతపరమైన విషయాలతో ప్రభావితం చేయడం, బురఖా, మత గ్రంథాలు ఇవ్వడం, బాధితురాలి మొబైల్లో కొన్ని అప్లికేషన్లు ఇన్స్టాల్ చేయడం, నమాజ్ నేర్పించడం, హిజాబ్ ధరించే విధానం వివరించడం వంటి ఆరోపణలు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లతో పాటు.. బాధితురాలు దళితురాలు కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.టీసీఎస్ వివరణఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత టీసీఎస్.. వేధింపులు, బలవంతపు చర్యల విషయంలో తమ సంస్థకు జీరో టాలరెన్స్ విధానం(ఉపేక్షించేది లేదని) ఉందని స్పష్టం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు తెలిపింది.శ్రీకృష్ణుడు దేవకి–వసుదేవులకు మధుర కారాగారంలో జన్మించాడు. కంసుడి నుంచి రక్షించేందుకు వసుదేవుడు ఆయనను గోకులానికి తీసుకెళ్లగా.. నందుడు, యశోద దంపతులు పెంచి పెద్ద చేశారు. అందుకే శ్రీకృష్ణుడిని జన్మనిచ్చిన తల్లి పేరుతో దేవకీనందనుడు, పెంచిన తల్లి–తండ్రుల పేర్లతో యశోదానందనుడు, నందలాలా అని కూడా పిలుస్తారు. -
మహా రాజకీయం.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మధ్య జరిగిన భేటీ తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. ఈ సమావేశం తర్వాత ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (MVA)లో విభేదాలు తలెత్తాయా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ పరిణామంపై శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కాగా, శరద్ పవార్ మహారాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా ఏక్నాథ్ షిండే కార్యాలయానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం తన పార్టీ ఎమ్మెల్యేలతో కూడా అక్కడే సమావేశమయ్యారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అధికార పక్షం-ప్రతిపక్షం మధ్య ఏదైనా కొత్త రాజకీయ సమీకరణలు ఏర్పడుతున్నాయా అనే చర్చ మొదలైంది.ఈ భేటీపై స్పందించిన సంజయ్ రౌత్..‘శరద్ పవార్పై మాకు పూర్తి గౌరవం ఉంది. ఆయన సిద్ధాంతంపై, ఆయన రాజకీయ నిబద్ధతపై మాకు ఎలాంటి అనుమానం లేదు. కానీ ఏక్నాథ్ షిండే కార్యాలయానికి వెళ్లి సమావేశం నిర్వహించడం మాకు బాధ కలిగించింది. మా దృష్టిలో పార్టీని చీల్చిన వారు ద్రోహులు. అలాంటి వారికి గౌరవం, గుర్తింపు ఇచ్చినట్టుగా ఈ సమావేశం కనిపించింది. ఈ సమావేశానికి మరో స్థలం దొరకలేదా? తప్పనిసరిగా షిండే కార్యాలయంలోనే ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? అంటూ ప్రశ్నించారు. ఈ పరిణామం వల్ల శివసేన (UBT) కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా బాధపడ్డారు. ప్రజల్లో కూడా తప్పుడు సంకేతాలు వెళ్లాయి’ అని వ్యాఖ్యానించారు.ఎన్సీపీ నేతలు ఫైర్.. అయితే, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(SP) నాయకులు మాత్రం ఈ విమర్శలను ఖండించారు. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనని, ఎంవీఏ కూటమిని వీడే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి రాజకీయ రంగు పులమడం సరికాదని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ భేటీ రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. అయితే శరద్ పవార్ వర్గం నుంచి మహా వికాస్ అఘాడీ కూటమిని వీడుతున్నట్లు లేదా అధికార కూటమితో చేతులు కలుపుతున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఊహాగానాలకే పరిమితమయ్యాయి. -
మహారాష్ట్రలో భూకంపం
మహారాష్ట్రలో భూకంపం వచ్చింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత హింగోలి, నాందేడ్, పర్భనీ జిల్లాలలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రగా 4.6 గా నమోదైంది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించనట్లు తెలుస్తోంది.నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వివరాల ప్రకారం, గురువారం తెల్లవారుజామునహింగోలి జిల్లాలో వరుసగా భూమి స్వల్పంగా కంపించింది. రెండు గంటల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. హింగోలిలో నమైదన భూకంపం 4.6 తీవ్రతతో నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ నాలుగు భూకంపాలు హింగోలి జిల్లాలోని సమీప ప్రాంతాలలోనే సంభవించాయని, 10 కిలోమీటర్ల లోతులో ఇవి నమోదైనట్లు పేర్కొన్నారు. వీటితో పాటు లాతూర్, పర్భణి, నాందేడ్ సహా పొరుగు జిల్లాల్లో సైతం భూప్రకంపనలు సంభవించాయి. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో ఇలాంటి భూకంపాలు చాలాసార్లు సంభవించాయి. జూలై 2, 2026న, హింగోలిలో 5 కిలోమీటర్ల లోతులో 3.6, 3.5 తీవ్రత గల రెండు భూకంపాలు నమోదయ్యాయి. అంతకుముందు, ఏప్రిల్ 11, 2026న, 10 కిలోమీటర్ల లోతులో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. కాగా ఇటీవల ఇలా వరుసగా భూకంపాలు సంభవించడం కలకలం రేపుతోంది. Maharashtra: Earthquake tremors were felt in Nanded, Hingoli and Parbhani districts of Marathwada region in the state. The tremors were recorded between 1.37 am and 3.23 am and measured between 3.6 and 4.6 on the Richter scale. pic.twitter.com/i9pxCOhc9i— Vani Mehrotra (@vani_mehrotra) July 9, 2026 -
నదిలోకి కొట్టుకుపోయిన.. 3000 LPG సిలిండర్లు
-
ఫడ్నవీస్ను కాదని షిండేతో భేటీ దేనికి?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. సాధారణ మర్యాదపూర్వక భేటీగానే ఇరు వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఈ సమావేశం జరిగిన సమయం, కలిసిన నేతల ప్రాధాన్యం రాజకీయ చర్చలకు దారితీస్తోంది.మహారాష్ట్ర–కర్ణాటక సరిహద్దు వివాదంపై ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు శరద్ పవార్ బుధవారం అసెంబ్లీకి వచ్చారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన నేరుగా ఏక్నాథ్ షిండే ఛాంబర్కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వెంట ఎన్సీపీ (ఎస్పీ) నేతలు జయంత్ పాటిల్, జితేంద్ర అవ్హాద్, శశికాంత్ షిండే కూడా ఉన్నారు.ఆ సమయంలో షిండే క్యాబినెట్ సమావేశంలో ఉన్నారు. పవార్ వచ్చిన విషయం తెలుసుకున్న షిండే సమావేశం నుంచి బయటకు వచ్చి ఆయనను కలిశారు. ఇద్దరు నేతలు దాదాపు 15 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అనంతరం షిండే తిరిగి క్యాబినెట్ సమావేశానికి వెళ్లగా.. పవార్ కొంతసేపు తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.అసలు చర్చంతా ఫడ్నవీస్ చుట్టూనే..ఈ భేటీలో ఆసక్తిని పెంచిన అంశం ఒక్కటే కాదు. మహారాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక నిర్ణయాధికారిగా ఉన్నప్పటికీ.. పవార్ ఆయనను కాకుండా షిండేను కలవడం రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. అయితే దీన్ని కేవలం ఫడ్నవీస్ను పక్కన పెట్టిన చర్యగా చూడలేమని విశ్లేషకులు చెబుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో షిండేకు ఉన్న ప్రత్యేక రాజకీయ స్థానం ఈ భేటీకి కారణంగా కనిపిస్తోంది.శివసేనలో చీలిక తర్వాత షిండే వర్గం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా మారింది. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన నుంచి పలువురు నేతలు షిండే శిబిరంలోకి వెళ్లడం, ఇటీవల ఆ వర్గంలో చోటుచేసుకున్న పరిణామాలు.. షిండేను ఒక ప్రత్యేక రాజకీయ కేంద్రంగా నిలిపాయి.షిండే ఎందుకు కీలకం?శరద్ పవార్కు మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉంది. ప్రత్యర్థి పార్టీల నేతలతోనూ రాజకీయ సంబంధాలు కొనసాగించడం ఆయన శైలిలో భాగం. ఈ నేపథ్యంలో షిండేతో భేటీని కూడా అదే రాజకీయ సంప్రదింపుల కోణంలో చూడాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మరోవైపు.. శివసేనలోని పరిణామాలు, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో నెలకొన్న అంతర్గత సమస్యల నేపథ్యంలో ఈ సమావేశం కొత్త ఊహాగానాలకు కారణమైంది.ఎంవీఏలో పెరుగుతున్న ఒత్తిళ్లుకాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) కలిసి ఉన్న మహా వికాస్ అఘాడీకి ఇటీవలి కాలంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే వర్గంలోకి వెళ్లడం ప్రతిపక్ష కూటమిలో కలకలం రేపింది. భవిష్యత్ రాజకీయ పోరాటాలకు ముందు కూటమి ఐక్యతపై ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో పవార్–షిండే భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.రాజకీయ సంకేతమా? లేక..అయితే ఈ సమావేశంలో రాజకీయ సమీకరణాలపై చర్చ జరిగిందని ఎలాంటి అధికారిక సమాచారం లేదు. షిండే కార్యాలయం దీనిని మర్యాదపూర్వక సమావేశంగానే పేర్కొంది. పవార్ కూడా భేటీ వివరాలను వెల్లడించలేదు. కానీ మహారాష్ట్ర రాజకీయాల్లో నేతల మధ్య జరిగే ప్రతి భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా శరద్ పవార్ వంటి సీనియర్ రాజకీయ నాయకుడు.. అధికార కూటమిలో కీలకంగా ఉన్న షిండేను ప్రత్యేకంగా కలవడం సహజంగానే చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: ఆపరేషన్ ఫడ్నవీస్.. షిండేకు బీజేపీ పెద్దల సాయం? -
మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరద (ఫొటోలు)
-
కుండపోత వర్ష బీభత్సం.. 5000 సిలిండర్లు గల్లంతు..
ముంబై: మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, తాజాగా రాయ్గఢ్ జిల్లాలో వరదలు తీవ్ర నష్టం కలిగించాయి. భారీ వర్షాల కారణంగా సుమారు 5,000 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ సిలిండర్లు కనిపిస్తే ప్రజలు వాటిని తాకవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే, వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సిలిండర్లు నివాస ప్రాంతాలు, రోడ్లు, నదీ ప్రవాహాల సమీపంలో కనిపించవచ్చని అధికారులు తెలిపారు. వాటిని తరలించేందుకు లేదా తెరవడానికి ప్రయత్నిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు. సిలిండర్లలో గ్యాస్ మిగిలి ఉండే అవకాశం ఉన్నందున లీకేజీ, మంటలు లేదా పేలుడు వంటి ప్రమాదాలు సంభవించవచ్చని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా సిలిండర్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత గ్యాస్ సరఫరా సంస్థలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.Raigad,Maharashtra - Several empty cylinders of HPCL were washed away in a sudden flood at Chavane village in Khalapur taluka.The empty tanks had been brought to the HPCL plant in Chavane for processing and refilling. However, heavy rainfall on the hilltop caused a massive surge… pic.twitter.com/08PVx2k5XJ— NextMinute News (@nextminutenews7) July 8, 2026మరోవైపు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. కొట్టుకుపోయిన సిలిండర్లను గుర్తించి సురక్షితంగా తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక యంత్రాంగం ప్రజల భద్రత కోసం పర్యవేక్షణ పెంచింది. ఇక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితులు నెలకొన్నాయి. రాయ్గఢ్లో రవాణా, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలపై కూడా ప్రభావం పడినట్లు అధికారులు వెల్లడించారు.ముంబైపై పంజా..ఇదిలా ఉండగా.. ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నగర జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. గత ఏడు రోజుల్లో నమోదైన వర్షపాతం రికార్డు స్థాయికి చేరుకుంది. శాంతాక్రూజ్ వాతావరణ కేంద్రంలో 1,017.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత ఏడాది మొత్తం జూలై నెలలో కురిసిన వర్షపాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైలు, విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.मुंबई और उसके आसपास के इलाकों में मूसलाधार बारिश के कारण कई जगहों पर रेलवे ट्रैक जलमग्न हो गए हैं।भारी बारिश होने के कारण। pic.twitter.com/n0Jn1MFtRW— Cockroach Janta Party (@CJP_for_India) July 9, 2026భారత వాతావరణ శాఖ (IMD) ముంబై, థానే ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కొనసాగించింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. ఇక భారీ వర్షాలతో ముంబైకి తాగునీటిని అందించే విహార్, తులసి సరస్సులు పూర్తిగా నిండిపోయాయి. దీంతో నగర నీటి సరఫరాపై ఉన్న ఆందోళనలు కొంత మేర తగ్గినట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీరు నిలిచిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. Mumbai rains giving no respite this time! Hope it stops soon. 🙁 Stay safe#MumbaiRain pic.twitter.com/o9OSpM6GA2— Puneet Kumar (@puneetiitm) July 8, 2026 -
రైలు బోగీనే హనీమూన్ సూట్!.. వైరల్ వీడియోపై విమర్శలు
ముంబై: కొత్తగా పెళ్లైన ఓ జంట తమ తొలి రైలు ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చుకోవాలనుకుంది. అందుకోసం రైలులోని కూపేను ఏకంగా హనీమూన్ సూట్లా అలంకరించింది. గులాబీ బెలూన్లు, పూలమాలలు, గులాబీ రేకులు, "ఐ లవ్ యూ" బోర్డుతో కూపేను అందంగా తీర్చిదిద్దింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే స్పందించాల్సి వచ్చింది.. జూలై 6న ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్–పండర్పూర్ నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ జల్నా స్టేషన్కు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బయటకు చెందిన డెకరేషన్ సిబ్బందిని రైలులోకి అనుమతించి, ప్రయాణికుల కూపేను ప్రత్యేకంగా అలంకరించారు. కొద్దిసేపటికే ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.వీడియోలు వైరల్ కావడంతో దక్షిణ మధ్య రైల్వే వెంటనే విచారణకు ఆదేశించింది. ప్రయాణికులు తమ సీట్లు లేదంటే కూపేను చిన్నపాటి వ్యక్తిగత అలంకరణలతో అందంగా మార్చుకోవడంపై ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే అనుమతి లేకుండా బయటి వ్యక్తులను రైలులోకి తీసుకురావడం, భారీగా అలంకరణలు చేయడం మాత్రం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.ఈ ఘటనలో అసలు తప్పు కొత్త దంపతులది కాదని, భద్రతా నిబంధనలు పాటించకుండా బయటి వ్యక్తులను అనుమతించిన సిబ్బందిదేనని రైల్వే భావిస్తోంది. దీంతో విధుల్లో ఉన్న ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)ను సస్పెండ్ చేశారు. అలాగే అనుమతి ఎలా ఇచ్చారు? భద్రతా తనిఖీలు ఎందుకు విఫలమయ్యాయి? అనే అంశాలపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది.కొత్త దంపతులపై మాత్రం ఎలాంటి జరిమానా లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. రైల్వే దృష్టి మొత్తం భద్రతా నిబంధనల ఉల్లంఘనపైనే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటన హాట్టాపిక్గా మారింది. కొందరు "ఇలాంటి సర్ప్రైజ్ జీవితంలో ఒక్కసారే వస్తుంది" అంటూ కొత్త దంపతుల ఆలోచనను మెచ్చుకోగా, మరికొందరు ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి ఏర్పాట్లకు అనుమతి ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు సరదాగా ఈ రైలుకు "సుహాగ్రాత్ ఎక్స్ప్రెస్" అని పేరు పెట్టి మీమ్స్ సృష్టించారు.Hello @AshwiniVaishnaw, does Indian Railways permit passengers to use a First AC coach for a suhagraat? pic.twitter.com/nDUQMkxEyt— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) July 8, 2026ఒక జంట తమ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చుకోవాలన్న ప్రయత్నం.. చివరకు రైల్వే భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తి అధికారుల విచారణ వరకు వెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.Honeymoon coach on Indian Railways. Ticket checker suspended. South Central Zone A couple travelling in Train No. 11002 Nandigram express on 6/7/26 had privately engaged a decorator online to decorate their 1st AC coupe. The decorator's entry into the coach was… pic.twitter.com/1ati4A13G4— Rajendra B. Aklekar (@rajtoday) July 8, 2026 -
ఆగస్టు 1 నుంచి ‘బైక్ టాక్సీలు’ చట్టబద్ధం!
మహారాష్ట్ర రవాణా విభాగంలో భారీ మార్పు రాబోతుంది. గత కొంతకాలంగా చట్టపరమైన చిక్కులు, ఆంక్షల నడుమ యాప్ ఆధారిత బైక్ టాక్సీలకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బైక్ టాక్సీలను చట్టబద్ధం చేస్తూ సరికొత్త రవాణా విధానాన్ని అమలు చేయబోతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ శాసనసభలో అధికారికంగా ప్రకటించారు. ఈ సరికొత్త విధానానికి సంబంధించిన కొన్ని అంశాలు చూద్దాం.4.5 లక్షల బైక్ టాక్సీలుప్రస్తుతం మహారాష్ట్రవ్యాప్తంగా సుమారు 4-4.5 లక్షల బైక్ టాక్సీలు ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. జులై చివరి నాటికి రవాణా శాఖ ఈ కొత్త పాలసీకి తుది అనుమతులు ఇవ్వనుండటంతో ఆగస్టు 1 నుంచి ఈ అసంఘటిత రంగం నియంత్రణ చట్రం పరిధిలోకి రానుంది. గతంలో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో ఓలా, ఉబర్, రాపిడో వంటి అగ్రిగేటర్ల తాత్కాలిక లైసెన్సులను రద్దు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు స్థానిక యువత ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని సవరించుకోవడం గమనార్హం.నిబంధనలు ఇవే!స్థానిక నిరుద్యోగ యువత ప్రయోజనాలను రక్షించేందుకు ప్రభుత్వం ఈ పాలసీలో కొన్ని కీలకమైన నిబంధనలు పెట్టింది.స్థానికంగా మహారాష్ట్ర నివాసితులకు మాత్రమే బైక్ టాక్సీ పర్మిట్లు మంజూరు చేస్తారు.బైక్ టాక్సీ నడిపే డ్రైవర్లు స్థానిక భాష మరాఠీ కచ్చితంగా అర్థం చేసుకోగలగాలి.మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మహారాష్ట్ర మోటార్ వెహికల్స్ రూల్స్, 1989 ప్రకారం సూచించిన పబ్లిక్ సర్వీస్ వెహికల్ బ్యాడ్జ్ కలిగి ఉండాలి.డ్రైవర్ల సంక్షేమం కోసం నిధిబైక్ టాక్సీ రంగాన్ని క్రమబద్ధీకరించడంతోపాటు డ్రైవర్ల సామాజిక భద్రతకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా సరికొత్త రెవెన్యూ మోడల్ను ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ఆపరేటర్లు లేదా డ్రైవర్లు రోజుకు రూ.5 చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రతి రైడ్ బుకింగ్పై వచ్చే ఆదాయంలో 2 శాతం నిధులను డ్రైవర్ల సంక్షేమ పథకాల(ఆరోగ్య, జీవిత బీమా, పీఎఫ్) కోసం కేటాయించాలి.‘మహారాష్ట్రలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే మా లక్ష్యం. ఈ కొత్త విధానం ద్వారా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. అలాగే రైడర్ల సంక్షేమం కోసం 2 శాతం నిధిని కూడా వినియోగిస్తాం’ అని ప్రతాప్ సర్నాయక్ అన్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే.. -
ఆ జిల్లాలకు భారీ వర్షాల ముప్పు.. IMD అలర్ట్!
-
శివసేన తరహా కష్టమే ఆ పార్టీకి!
మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన ఎదుర్కొన్న ‘‘పార్టీ ఎవరిది?” అనే సంక్షోభం.. దేశ రాజకీయాల్లోనే పెద్ద మలుపుగా నిలిచింది. నాయకత్వం, గుర్తు, ఎమ్మెల్యేలు.. అన్నీ ఒకేసారి చీలిపోయి చివరికి పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిన తీరు అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు అదే తరహా రాజకీయ తుపాను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చుట్టూ తిరుగుతుండడంతో.. బెంగాల్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.తాజాగా కోల్కతాలోని టీఎంసీ ప్రధాన కార్యాలయం కేంద్రంగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ సంక్షోభాన్ని మరింత ముదిర్చాయి. రితాబ్రత బెనర్జీ నేతృత్వంలోని ఎమ్మెల్యేల తిరుగుబాటు వర్గం కార్యాలయంలోకి తాళాలు పగలగొట్టి ప్రవేశించడం.. లోపలే సమావేశాలు నిర్వహించడం.. “మాదే అసలు టీఎంసీ” అంటూ ప్రకటించుకోవడం.. మళ్లీ తాళాలు వేసుకుని వెళ్లడం వంటి చర్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గం ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. పార్టీ అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇప్పుడు బహిరంగ బల ప్రదర్శన స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఇది అప్పటి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన.. మహా పొలిటికల్ డ్రామాను తలపిస్తోంది.మహారాష్ట్రలో శివసేన సంక్షోభం కూడా ఇదే తరహా రాజకీయ ఉత్కంఠకు దారి తీసింది. అప్పట్లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని వర్గానికి పెద్ద షాక్ తగిలింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు బాట పట్టి, అసెంబ్లీ సంఖ్యాబలం ఒక్కసారిగా మారిపోయింది. గోవా, గుజరాత్ క్యాంప్లలో జరిగిన రాజకీయ కదలికల తర్వాత చివరికి పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు ఉద్ధవ్ వర్గం, మరోవైపు షిండే వర్గం అంటూ అసలు శివసేన ఎవరిదన్న వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ గుర్తు, పేరు, అధికారిక హక్కులపై జరిగిన పోరులో.. షిండే పై చేయి సాధించారు. దీంతో బెంగాల్లోనూ సీన్ రిపీట్ కాక తప్పదా? అనే చర్చ జోరందుకుంది.ఇక బెంగాల్ టీఎంసీ సంక్షోభానికి కేవలం ఎమ్మెల్యేల స్థాయిలోనే కాకుండా ఎంపీల స్థాయిలో కూడా కొనసాగుతుందని తెలిసిందే. టీఎంసీకి చెందిన 28 మంది లోక్సభ ఎంపీల్లో 20 మంది సభ్యులు ఎన్సీపీఐ అనే రాజకీయ వేదికలో విలీనం కావడం.. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్కు బయటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటిస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ సమర్పించడం.. తెలిసిందే. ఇది జరిగిన కొద్దిరోజులకు..ఇదే తరహా రాజకీయం మహారాష్ట్రలోనూ కనిపించింది. అక్కడ ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గానికి చెందిన ఎంపీల్లో కొందరు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు సిద్ధపడ్డారు. శివసేన సంక్షోభ సమయంలో ఎలా అయితే ఎమ్మెల్యేల మార్పు జరిగిందో.. ఇప్పుడు బెంగాల్లోనూ అదే తరహా చీలిక ఎపిసోడ్ నడుస్తోంది. అలాగే.. ఇరు చోట్ల “పార్లమెంటరీ షిఫ్టింగ్” ఒకేసారి చోటు చేసుకోవడం కొత్త చర్చకు దారి తీసింది. పార్టీలో అంతర్గత చీలిక.. ఎమ్మెల్యేల వేరు వర్గం.. ఎంపీల షిఫ్టింగ్.. మహారాష్ట్ర, బెంగాల్ రాజకీయాల్లో ఒకే ట్రెండ్ కొనసాగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ వద్ద టీఎంసీ పార్టీ పేరు, గుర్తు, నిర్మాణంపై హక్కుల వివాదం పెండింగ్లో ఉంది. ఇవన్నీ కలిపి చూస్తే శివసేన తరహా సంక్షోభమే ఇప్పుడు టీఎంసీకి కూడా ఎదురవుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. -
ఇంత బలుపా? మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్
-
పోలీసులు రాజకీయ నాయకుల సేవకులేం కాదు
ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ప్రతీ పౌరుడికీ ఉంటుందని చెబుతూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అలాగే.. పోలీసులు రాజకీయ నాయకులకు సేవకులు కాదని.. ప్రజా సేవకులని స్పష్టం చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రన చర్యలు తీసుకోవడం సరికాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.ముంబై పోలీసులు ఒక రాజకీయ కార్యకర్తపై విధించిన నగర బహిష్కరణ (externment) ఆదేశాన్ని తాజాగా ముంబై హైకోర్టు రద్దు చేసింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ జందార్ పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పౌరులు ప్రభుత్వానికి బానిసలు కారు. నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు కూడా ఉంది. పోలీసులు ప్రజల సేవకులు.. అంతేకానీ రాజకీయ నాయకుల సేవకులు కారు’’ అని వ్యాఖ్యానించారు.సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) ప్రధాన కార్యదర్శి సయ్యద్ వహీద్ చౌదరిపై ముంబై పోలీసులు నగర బహిష్కరణ విధించారు. ఆయన 2019 నుంచి 2024 మధ్య వివిధ నిరసనల్లో పాల్గొన్నారని ఆరోపిస్తూ పోలీసులు పలు FIRలు నమోదు చేశారు. అందులో సీఏఏ, ఎన్ఆర్సీతోపాటు బాబ్రీ మసీదు–జ్ఞానవాపి వివాదాలు, ఇంధన ధరల పెరుగుదల వ్యతిరేక నిరసనల్లాంటివి ఉన్నాయి. ఈ కేసుల ఆధారంగా కొంకణ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ 2025 డిసెంబర్లో చౌదరిని ముంబై నగరం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక సంవత్సరం పాటు బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను డివిజనల్ కమిషనర్ కూడా సమర్థించారు. ఈ బహిష్కరణ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు, వాటిని పూర్తిగా కొట్టివేసింది. పోలీసులు తీసుకున్న చర్యలు చట్టబద్ధంగా నిలబడవని స్పష్టం చేసింది.కోర్టు ప్రధాన పరిశీలనలుకేవలం నిరసనల్లో పాల్గొన్నందుకే నగర బహిష్కరణ విధించడం సరైనదికాదు. ఇది పౌరుల భావప్రకటన స్వేచ్ఛ (Article 19), జీవించే హక్కు (Article 21)ను ఉల్లంఘిస్తుందని తేల్చింది. అలాగే, ఆ ఆరోపణలు ప్రజా భద్రతకు తీవ్రమైన ముప్పుగా పోలీసులు నిరూపించలేకపోయారు అని బాంబే హైకోర్టు పేర్కొంది. దీంతో ముంబై పోలీసులు జారీ చేసిన నగర బహిష్కరణ ఆదేశాన్ని, అలాగే అప్పీల్ స్థాయిలో ఇచ్చిన ఆమోదాన్ని కూడా హైకోర్టు రద్దు చేసింది. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన హక్కు మూలాధారం అని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం నేరం కాదని ఈ తీర్పు ద్వారా న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
పుణే కేసు: అసభ్య సైగ చేసిన సియా.. వీడియో వైరల్
పుణే: యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. లోహగఢ్ ఫోర్ట్ సమీపంలోని లోయలో అతన్ని ఎవరు తోసి చంపారన్న అంశంపై పోలీసులు ఇప్పటికీ స్పష్టమైన నిర్ధారణకు రాలేకపోయారు. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, దర్యాప్తులో పరస్పర విరుద్ధమైన వాదనలు బయటపడుతుండటంతో కేసు మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ మరోసారి వివాదంలో చిక్కుకుంది.క్రైమ్ రీక్రియేషన్లో భాగంగా.. పోలీసులు ఆమెను తన నివాసానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో బయటకు తీసుకువస్తున్న సమయంలో మీడియా ఎదుట ఆమె మిడిల్ ఫింగర్(అసభ్య సైగ) చూపింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ఆమె ప్రవర్తనను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. Pune, Maharashtra: Siya Goyal, accused in the Ketan Agarwal murder case, was taken by Pune Rural Police to her Market Yard residence for investigation. After the investigation was completed, while leaving the house, Siya Goyal allegedly made obscene gestures and showed the middle… pic.twitter.com/mHnQKlfRrq— IANS (@ians_india) July 2, 2026జూన్ 18న పుణే సమీపంలోని లోహ్గఢ్ కోట వద్ద కేతన్ అగర్వాల్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. మొదట ఈ ఘటనను ప్రమాదవశాత్తు మరణంగా నమోదు చేసినప్పటికీ.. దర్యాప్తులో ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా తేలింది. సియా గోయల్, కేతన్ అగర్వాల్ కుటుంబాలు ముందే వివాహాన్ని ఖరారు చేశాయి. నవంబర్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. ప్రియుడు చేతన్తో కలిసి కేతన్ను సియా హతమార్చింది. అయితే.. కేసులో ఎవరు నిజంగా కేతన్ను లోయలోకి తోశారన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో పోలీసులు లై డిటెక్టర్ పరీక్ష అవసరమని కోర్టును అభ్యర్థించారు. నిందితులు మౌనం వహిస్తున్నందున దర్యాప్తుకు ఇది కీలకంగా మారిందని అధికారులు చెబుతున్నారు. అయితే నిందితురాలి సమ్మతి తప్పనిసరి అని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు. పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితాలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా పరిగణించబడవని, అవి కేవలం దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు సహాయపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోర్టు తీర్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది.మరోవైపు దర్యాప్తులో కీలకంగా జనవరి నుంచి జూన్ వరకు సియా–చేతన్ మధ్య 2,000కు పైగా కాల్స్ జరిగినట్లు కాల్ డేటా విశ్లేషణలో బయటపడింది. ఘటన అనంతరం కేతన్ మొబైల్ ఫోన్ కొంతసేపు సియా వద్దే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు కూడా లభించినట్లు సమాచారం. 33 డిగ్రీల ఎండలోనూ చేతన్ హుడీ ధరించి అనుమానాస్పదంగా తిరుగుతున్న సీసీటీవీ దృశ్యాలు కూడా పోలీసులు గుర్తించారు.దర్యాప్తులో భాగంగా పోలీసులు రెండు దశల్లో ఘటన స్థలంలో సీన్ రీక్రియేషన్ నిర్వహించారు. సియా సమక్షంలో డమ్మీ సాయంతో ఒకసారి, చేతన్ను తీసుకెళ్లి మరోసారి లోహగఢ్ ఫోర్ట్ వద్ద సంఘటనను పునర్నిర్మించినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో ఫోరెన్సిక్ విశ్లేషణ, డిజిటల్ ఆధారాల రికవరీపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ కేసును ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించింది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103 (హత్య), 61 (కుట్ర) కింద కేసు నమోదు కాగా, నిందితుల పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. ఒకవైపు నిందితురాలి వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతుండగా, మరోవైపు లై డిటెక్టర్ టెస్ట్ కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నం ఈ కేసును మరింత కీలక దిశలోకి తీసుకెళ్లింది. -
ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి
సాక్షి ముంబై: ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు మహారాష్ట్రపై పూర్తిస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. ముంబైతో పాటు థానే, నవీ ముంబై, కల్యాణ్–డోంబివలీ, భివండి, పాల్ఘర్, రాయగడ్, కొంకణ్ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ముంబైకి ఐదు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ , రత్నగిరికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. జూలై 2న పాల్ఘర్, జూలై 3, 4 తేదీల్లో రాయగడ్, జూలై 4న థానే, జూలై 5న సతారా ఘాట్ ప్రాంతాలకు, జూలై 2 నుంచి 4 వరకు పుణే ఘాట్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుంది. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.కొంకణ్, మరాఠ్వాడా, పశ్చిమ మహారాష్ట్రకూ హెచ్చరిక కొంకణ్ ప్రాంతంలోని చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. మరాఠ్వాడాలో చాలా ప్రాంతాల్లో, ఉత్తర మహారాష్ట్రలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ మహారాష్ట్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగనున్నట్లు అంచనా వేసింది.ముంబై జలమయం.. అంధేరి సబ్వే మూసివేత ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అంధేరి సబ్వేలో నాలుగు నుంచి ఐదు అడుగుల మేర నీరు చేరడంతో అధికారులు వాహనాల రాకపోకలను చాల సమయం పాటు పూర్తిగా నిలిపివేశారు. జోగేశ్వరి, గోరేగావ్, మలాడ్, కాందివలి, బోరివలి, కుర్లా, ములుండ్, శాంతాక్రూజ్, బాంద్రా తదితర ప్రాంతాల్లో రహదారులపై భారీగా నీరు నిలవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.హైవేలపై భారీ ట్రాఫిక్.. లోకల్ రైళ్లకు అంతరాయం నవీ ముంబైలోని జూయినగర్ సమీపంలో సైన్–పన్వేల్ జాతీయ రహదారిపై భారీగా నీరు చేరడంతో ముంబై వైపు వెళ్లే మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు భివండి బైపాస్ వద్ద ముంబై–నాసిక్ జాతీయ రహదారిపై కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. భారీ వర్షాల ప్రభావంతో సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాల్లో లోకల్ రైళ్లు 15–20 నిమిషాలు, వెస్ట్రన్ రైల్వేలో 5–10 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ములుండ్లోని బీఎంసీకి చెందిన ఎం.టి. అగర్వాల్ ఆస్పత్రి ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.రైతులకు ఊరట.. ప్రజలకు అప్రమత్తత రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఖరీఫ్ పంటల విత్తనాలు వేయడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని హర్షం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ముంబై మహానగర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీటమునిగిన రహదారుల్లో ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.చదవండి: ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్రయాణికులు ఫైర్కల్యాణ్–డోంబివలీ జంట నగరాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. శిల్ఫాటా ప్రాంతంలో రహదారి పక్కన నిలిపిన కార్లు దాదాపు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. కల్యాణ్ తూర్పులోని ఆడివలి, ఢోకళి ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. భాండుప్ విలేజ్ రోడ్డులో కాలువలు పొంగిపొర్లడంతో విద్యార్థులు వరద నీటిలోనే ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. థానే జిల్లాలోని భివండీ, ఉల్హాస్నగర్, అంబర్నాథ్, బద్లాపూర్, షాహాపూర్, ముర్బాడ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాగ్లే ఎస్టేట్లో చెట్టు కూలి ఓ వ్యక్తి గాయపడగా, పలు చోట్ల చెట్లు కూలి వాహనాలు దెబ్బతిన్నాయి. డోంబివలీ ఎంఐడీసీ ప్రాంతంలో విద్యుత్ లైన్లపై చెట్టు పడటంతో కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ మ్యాన్హోల్లో పడి..
ముంబైలో గురువారం భారీ వర్షాలు కురిశాయి. వర్షం మధ్య తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అంధేరి-సాకినాకా, జోగేశ్వరి ప్రాంతాలను కుర్లా, ఘాట్కోపర్తో కలిపే ఖైరానీ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అతడు మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నట్టు సమాచారం.ఘటనాస్థలిలో అతడి గొడుగు, చెప్పులు కనిపించాయి. ముంబై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది సంయుక్తంగా గాలింపు చేపట్టారు. దాదాపు 2 గంటల తర్వాత అతడి మృతదేహాన్ని వెలికితీశారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్వహిస్తున్న మరమ్మతుల పనుల వల్ల మ్యాన్హోల్ మూత తెరిచి ఉంచారు. డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడీ మాట్లాడుతూ.. ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తూ సంబంధిత కాంట్రాక్టర్పై హత్య కేసు నమోదు చేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్టు చెప్పారు.ఈ ఘటనకు 2 రోజుల ముందే ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో స్కూల్ బస్సుపై చెట్టు కూలి 11 ఏళ్ల బాలుడు మృతి చెందగా, మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆ ఘటనపై ప్రాథమిక విచారణలో నిర్లక్ష్యం బయటపడటంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఓ అధికారిని సస్పెండ్ చేసింది.ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలుగురువారం కూడా ముంబైలో భారీ వర్షం కొనసాగింది. దాదర్, పరేల్, హింద్మాతా, చార్కోప్, వర్లీ, గోరేగావ్, అంధేరి సహా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.గురువారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల్లో తూర్పు శివారు ప్రాంతాల్లో సగటున 189 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర ప్రధాన ప్రాంతాల్లో 172 మిల్లీమీటర్లు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.ముంబై జీవనాడిగా భావించే లోకల్ రైలు సర్వీసులపై కూడా వర్షం ప్రభావం పడినట్లు తెలుస్తోంది. పట్టాలపై నీరు చేరడంతో ఉదయం రైళ్లు 10 నుంచి 15 నిమిషాలు ఆలస్యంగా నడిచాయని ప్రయాణికులు తెలిపారు. అయితే రైల్వే అధికారులు మాత్రం రైలు సర్వీసులు ఎలాంటి అంతరాయం లేకుండా సాధారణంగానే నడుస్తున్నాయని వెల్లడించారు. -
పుణే కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్!.. తెరపైకి లై డిటెక్టర్ టెస్ట్
పుణే: దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసిన కేతన్ అగర్వాల్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితురాలు సియాపై లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు పోలీసులు గురువారం పుణే కోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో నిజానిజాలు వెలికితీయడానికి ఈ పరీక్ష అవసరమని వారు వాదించినట్లు సమాచారం.కేతన్ను లోహన్గఢ్ కోట వద్ద ఎవరు లోయలోకి తోసి చంపారనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదని పోలీసులు కోర్టుకు నివేదించారు. తొలుత సియా ప్రియుడు చేతన్ తోశాడని.. తర్వాత సియానే తోసిందని.. ఆపై చేతన్ స్నేహితుడి ప్రమేయం ఉందని.. ఇలా రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, ఎవరు తోశారో కచ్చితంగా చెప్పగలిగే ఆధారం మాత్రం లభించలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో నిందితులు మౌనం వహిస్తున్నారని వివరించారు. ఈ తరుణంలో లై డిటెక్టర్ పరీక్ష ఒక్కటే మార్గమని కోర్టును అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అయితే, సియా తరఫు న్యాయవాది విపుల్ దుషింగ్ మాత్రం లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలంటే కోర్టు అనుమతి మాత్రమే సరిపోదని, నిందితురాలి సమ్మతి కూడా తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. అంతేకాదు, పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితాలను కోర్టు ప్రత్యక్ష సాక్ష్యంగా పరిగణించదని, అవి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త ఆధారాలు, లీడ్స్ సేకరించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.కేసు ఇప్పటికే మిస్టరీగా మారిన నేపథ్యంలో, ఎవరి పాత్రపై కూడా ఇప్పటివరకు తేలికైన ఆధారాలు లభించకపోవడం దర్యాప్తును మరింత క్లిష్టతరం చేస్తోంది. కోర్టు ఈ అభ్యర్థనపై ఎలా స్పందిస్తుందన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట సమీపంలోని లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మరణించారు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ, పుణె రూరల్ పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో ఇది పక్కా ప్లాన్తో జరిగిన హత్యగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. వివాహం విషయంలో అసంతృప్తిగా ఉన్న కేతన్ను ఆయన కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) కలిసి ముందస్తు ప్రణాళికతో లోయలోకి తోసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఫోటో షూట్ సమయంలో కేతన్ను 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసి ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అంతేకాదు అంతకు ముందు.. జూన్ 14న ఇదే కోట వద్ద జరిగిన మరో ప్రయత్నం విఫలమైనట్లు కూడా దర్యాప్తులో బయటపడింది.దర్యాప్తులో కీలకంగా, 33 డిగ్రీల ఎండలోనూ చేతన్ చౌదరి హుడీ ధరించి అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అలాగే జనవరి నుంచి జూన్ మధ్యలో సియా–చేతన్ మధ్య 2,000కుపైగా కాల్స్ జరిగినట్లు కాల్ డేటా విశ్లేషణలో బయటపడింది. కేతన్ మరణం అనంతరం అతని మొబైల్ ఫోన్ కొంతసేపు సియా వద్దే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు దొరికాయి. ఈ ఆధారాల నేపథ్యంలో జూన్ 23న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.కేసు అత్యంత కీలక దశలో ఉండగా, దీనిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు ప్రభుత్వం అప్పగించింది. ఈ కేసులో.. కేతన్ తరఫున ప్రముఖ క్రిమినల్ న్యాయవాది ఉజ్వల్ నికమ్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్స్ 103 (హత్య), 61 (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు కాగా, నిందితుల పోలీస్ కస్టడీని కోర్టు జూలై 3 వరకు పొడిగించింది.దర్యాప్తులో భాగంగా పోలీసులు జూన్ 28న సియా సమక్షంలో డమ్మీ సాయంతో ఘటన పునర్నిర్మాణం (Crime Scene Recreation) నిర్వహించారు. జూలై 1న చేతన్ చౌదరిని నేరుగా లోహగఢ్ కోటకు తీసుకెళ్లి మరోసారి సీన్ రీక్రియేషన్ చేసినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో గైట్ అనాలిసిస్, డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలు, అలాగే డిలీట్ చేసిన డేటా రికవరీపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ ఘటనకు ముందు.. మరో కోట వద్ద ఈ ఇద్దరూ కేతన్ను ఎలా తోసి చంపాలో రిహార్సల్స్ సైతం నిర్వహించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో.. లై-డిటెక్టర్ పరీక్షపై కోర్టు నిర్ణయం దర్యాప్తులో తదుపరి కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
మహా రాజకీయాల్లో బాంబు పేల్చిన జూనియర్ థాక్రే
మహారాష్ట్ర యువనేత ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలు అక్కడి రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమ యూబీటీ(ఉద్దవ్ థాక్రే) శివసేన నుంచి జరుగుతున్న వరుస వలసలు యాదృచ్ఛికం కాదని, దీని వెనక పెద్ద కుట్ర దాగుందని అంటున్నారాయన. ఈ క్రమంలో.. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై సంచలన ఆరోపణలు చేశారు. ఇవన్నీ షిండే నేతృత్వంలో జరుగుతున్న ‘‘ప్లాన్డ్ పొలిటికల్ ఆపరేషన్’’లో భాగమని ఠాక్రే ఆరోపించారు.ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జూనియర్ థాక్రే.. మహారాష్ట్రలో గత కొంతకాలంగా జరుగుతుందని ఆపరేషన్ టైగర్ కాదని.. దానిని ఆపరేషన్ దేవేంద్ర ఫడ్నవిస్ అని అభివర్ణించారు. దీని వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దల వ్యూహాత్మక హస్తం ఉందని, షిండేను ముందుంచి ఆ పెద్దలు ఈ డ్రామాను నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆపరేషన్ ఉద్దేశం.. ఫడ్నవిస్ను ఎదగకుండా అడ్డుకోవడమే సంచలన వ్యాఖ్యలు చేశారు.శివసేన (UBT) నుంచి ఇటీవల 9 మంది ఎంపీల్లో 6 మంది షిండే వర్గానికి చేరిన విషయాన్ని ప్రస్తావించిన ఆదిత్య ఠాక్రే.. తమ పార్టీని ఈ పెద్ద రాజకీయ ఎత్తుగడలో “కాలాటరల్ డ్యామేజ్”గా(లక్ష్యంగా కాకపోయినా దెబ్బతినడం) వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఫడ్నవీస్ భవిష్యత్తులో కేంద్ర మంత్రివర్గానికి తరలించబడే అవకాశం ఉందని, ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు తాత్కాలికమేనని ఆయన అభిప్రాయపడ్డారు.‘‘బహుశా ఇది దేవేంద్ర ఫడ్నవీస్కు చివరి అసెంబ్లీ సెషన్ కావచ్చు’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. షిండే కూడా తిరిగి ముఖ్యమంత్రి పదవిని పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.వలసల వెనుక డబ్బు పాత్ర ఉందన్న ఆరోపణలను కూడా ఆదిత్య ఠాక్రే పునరుద్ఘాటించారు. కొన్ని వీడియోలు, మీడియా క్లిప్స్ను ఆధారంగా చూపుతూ, ఎమ్మెల్యేలు పార్టీ మారిన వెంటనే ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. “పార్టీ మారిన వెంటనే లగ్జరీ ఫ్లాట్లు, ఖరీదైన కార్లు ఎలా వస్తాయి?” అని ఆయన వ్యాఖ్యానించారు.అదేవిధంగా బీజేపీపై కూడా ఆదిత్య ఠాక్రే తీవ్ర విమర్శలు చేశారు. రామమందిర ట్రస్ట్ నిధులపై వచ్చిన వివాదాలను ప్రస్తావిస్తూ, పారదర్శకతపై ప్రశ్నలు ఉన్నాయని అన్నారు. బీజేపీని ‘‘బాబర్ జనతా పార్టీ’’గా అభివర్ణించారు.అయితే ఈ ఆరోపణలపై బీజేపీ, షిండే వర్గాలు ఇంకా స్పందించలేదు. అయితే.. ఉద్దవ్ శివసేన (UBT) రాజకీయంగా ఒత్తిడిలో ఉండటం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వారు గతంలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక బీజేపీని బాబర్జనతా పార్టీగా అభివర్ణించడమూ రాజకీయంగా పెద్ద దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. -
మహారాష్ట్రను శాసిస్తున్న ‘షుగర్ సామ్రాజ్యం’
మహారాష్ట్ర రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంది? ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉందనేది కేవలం ఎన్నికల ముంగిట కనిపించే ముచ్చట మాత్రమే.. తెరవెనుక మాత్రం అందరిదీ ఒకటే వ్యాపార సామ్రాజ్యం.. అదే చక్కెర మిల్లులు! ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (పెట్రోల్లో ఇథనాల్ కలపడం) వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ, మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయంపై నోరు మెదపడం లేదు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఇంతకంటే పెద్ద ఆయుధం దొరకకపోయినా ప్రతిపక్షాలు ఎందుకు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి? ఈ నిశ్శబ్దం వెనుక ఉన్న ‘షుగర్ ఫ్యాక్టరీ’ కనెక్షన్ ఏంటి? మహారాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ఆ చక్కెర సామ్రాజ్యం గురించిన పూర్తి వివరాలు..పాలిటిక్స్ కాదు.. ఇది ఇథనాల్ బిజినెస్మహారాష్ట్రలో రాజకీయంగా ప్రత్యర్థులైనప్పటికీ, చక్కెర వ్యాపారంలో మాత్రం నాయకులంతా భాగస్వాములే. ఒకప్పుడు కేవలం పంచదార ఉత్పత్తికే పరిమితమైన ఈ షుగర్ మిల్లులు, ఇప్పుడు ఆధునిక ‘బయో-రిఫైనరీలు’గా మారిపోయాయి. చెరకు నుండి చక్కెర మాత్రమే కాకుండా, గ్రీన్ ఫ్యూయల్ అయిన ఇథనాల్ను తయారు చేస్తూ ఈ మిల్లులు కోట్లాది రూపాయల లాభాలను గడిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇథనాల్ బ్లెండింగ్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండటంతో ఈ వ్యాపారానికి ఎనలేని డిమాండ్ ఏర్పడింది. అందుకే, ప్రజా సమస్యగా మారిన ఈ అంశంపై ఏ ఒక్క విపక్ష నేత కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం లేదు.బీజేపీ నేతల చక్కెర సామ్రాజ్యందేశంలోనే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ విధానాన్ని ముందుకు తీసుకెళ్లిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నాగపూర్లో మూడు చక్కెర మిల్లులు కలిగిన షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అలాగే బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత సుభాష్ దేశ్ముఖ్ సోలాపూర్లో మూడు మిల్లులున్న ‘లోకమంగళ్ గ్రూప్’ను నడుపుతున్నారు. వీరితో పాటు దేవేంద్ర ఫడ్నవీస్, వినోద్ తావ్డే, హరిభావూ బగాడే, బబన్రావ్ పాచ్పుతే వంటి దిగ్గజాలు, ఇటీవల ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ అతుల్ భోసలే (యశ్వంత్రావ్ మోహితే కృష్ణ మిల్స్), మనోజ్ ఘోర్పడే, అభిమన్యు పవార్ వంటి బీజేపీ నాయకులకు ఈ చక్కెర పరిశ్రమలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి.శరద్ పవార్, అజిత్ పవార్ల హవాఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లోని రెండు గ్రూపుల నేతలను పరిశీలిస్తే, మహారాష్ట్ర షుగర్ బెల్ట్పై వీరి పట్టు అంతా ఇంతా కాదు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు శ్రీ అంబాలికా షుగర్ (అహ్మద్ నగర్), దౌండ్ షుగర్ (పూణే), జరందేశ్వర్ షుగర్ మిల్స్ (సతారా) వంటి భారీ ప్రైవేట్ మిల్లులతో సంబంధాలు ఉన్నాయి. ఆయన సోదరుడు రాజేంద్ర పవార్ ‘బారామతి ఆగ్రో’ అధ్యక్షుడిగా ఇందాపూర్, కన్నడ ప్రాంతాల్లో మిల్లులను నడుపుతున్నారు. స్వయంగా శరద్ పవార్ ‘వసంతదాదా షుగర్ ఇన్స్టిట్యూట్’ అధ్యక్షుడిగా ఉంటూ ఈ మొత్తం పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. జయంత్ పాటిల్, దిలీప్ వాల్సే-పాటిల్, హసన్ ముష్రిఫ్, రాజేష్ తోపే, ధనంజయ్ ముండే వంటి ఎన్సీపీ కీలక నేతలందరికీ సొంతంగా మిల్లులు ఉన్నాయి.కాంగ్రెస్, శివసేనల హస్తం కూడా ఇందులోనేప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, మాజీ సీఎం విలాస్రావ్ దేశ్ముఖ్ స్థాపించిన లాతూర్లోని జాగృతి షుగర్, మంజ్రా శేత్కరీ మిల్లులను ప్రస్తుతం అమిత్ దేశ్ముఖ్, దిలీప్రావ్ దేశ్ముఖ్ పర్యవేక్షిస్తున్నారు. సాంగ్లీలో పతంగ్రావ్ కదమ్ స్థాపించిన సోనహీరా సహకారి మిల్లును ఆయన కుటుంబ సభ్యులు నడుపుతున్నారు. అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరట్, సతేజ్ పాటిల్, విశ్వజీత్ కదమ్ వంటి కాంగ్రెస్ ప్రముఖులకు ఈ వ్యాపారాలు ఉన్నాయి. అలాగే శివసేనకు చెందిన శంభూరాజ్ దేశాయ్ (బాలాసాహెబ్ దేశాయ్ షుగర్ ఫ్యాక్టరీ), విజయ్ శివతారే (స్వామి సమర్థ్ షుగర్) లాంటి నేతలు కూడా ఇందులో భాగస్వాములే.గ్రామీణ ఓటు బ్యాంక్కు ఇదే కీలకంఈ చక్కెర మిల్లుల నెట్వర్క్ కేవలం లాభాలు ఆర్జించే వ్యాపారం మాత్రమే కాదు, మహారాష్ట్ర గ్రామీణ రాజకీయాల్లో పట్టు సాధించడానికి ప్రధాన వనరు. ఈ మిల్లుల ద్వారానే నాయకులు స్థానిక రైతులను, జిల్లా సహకార బ్యాంకులను, విరివిగా నడిచే డైరీ సొసైటీలను తమ గుప్పిట్లో ఉంచుకుంటారు. తద్వారా ఎన్నికల్లో భారీగా ఓట్లను, నిధులను సమీకరించుకోగలుగుతారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం మహాయుతి కూటమికి చెందిన నాయకుల మిల్లులకు రూ.487 కోట్ల మార్జిన్ ఫండ్ను కేటాయించడం, రాజకీయాలకు-చక్కెర పరిశ్రమకు మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని స్పష్టం చేస్తోంది.మౌనమే నీ నైజమా విపక్షమా?ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్ల ఇంజన్ల సామర్థ్యం తగ్గడం, మైలేజీ సమస్యలు రావడం వంటి ఎన్నో సాంకేతిక, ఆర్థిక లోపాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నా ప్రతిపక్షాలు ఎందుకు వీధి పోరాటాలు చేయడం లేదు? మహాయుతి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాకపోయినా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సమాధానం స్పష్టం.. అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా మహారాష్ట్రలోని టాప్ లీడర్లందరి ప్రయోజనాలు ఈ ఇథనాల్ పరిశ్రమతో ముడిపడి ఉన్నాయి.ఇది కూడా చదవండి: సరళా భట్ కేసు: కశ్మీర్ ‘రియల్’ ఫైల్స్ రీ ఓపెన్! -
చిన్నారి ప్రాణం తీసిన చెట్టు.. మంత్రి షాకింగ్ కామెంట్
ముంబైలో రోడ్డుపక్కన ఉన్న చెట్టు స్కూల్ బస్సుపై కూలి ఓ బాలుడు మృతి చెందిన ఘటనపై మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి సంజయ్ షిర్సాట్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చెట్లు కూలడం సహజమే అంటూ చాలా సింపుల్గా తీసిపారేశారు. "నిన్న జరిగిన ఘటన గురించి అందరికీ తెలుసు. ఈ విషయంపై ప్రభుత్వం ఈరోజు సభలో ప్రకటన చేస్తుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్కు కూడా ఆదేశాలు ఇచ్చాం" అని ఆయన బుధవారం చెప్పారు. సంజయ్ షిర్సాట్ మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి మంత్రిగా ఉన్నారు.జర్నలిస్టుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్న కొద్దీ ఆయన సమాధానాలు కాస్త మారుతూ వచ్చాయి. "ఒకటి-రెండు చెట్లు కూలడం, పిడుగు పడడం మనిషి చేతిలో ఉండదు. ఏ చెట్టు ఇప్పుడు కూలబోతోందో ముందే తెలిసిపోదు" అని అన్నారు.ఇదీ చదవండీ: స్కూల్ బస్సుపై పడ్డ చెట్టుమంగళవారం మధ్యాహ్నం ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో సుమారు 70 ఏళ్ల చెట్టు వేర్లతో పాటు కూలి, యూనివర్సల్ హై స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్న మేక్ ఫోర్స్ సంస్థ స్కూల్ బస్సుపై పడింది. ఈ ప్రమాదంలో 11 ఏళ్ల విహాన్ శ్రీవాస్తవ్ మృతి చెందాడు. బయటకు తీసిన పిల్లల్లో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.చెట్ల తనిఖీ చేయడం కూడా బాధ్యతే కదా? అని సంజయ్ను మీడియా ప్రశ్నించింది. "తనిఖీలు చేస్తూనే ఉంటాం" అని మంత్రి చెప్పారు. ఆ ప్రాంత ప్రజలు చెట్ల తనిఖీ సరిగా జరగలేదని చెబుతున్నారని మీడియా మళ్లీ ప్రశ్నించింది.దీనికి సంజయ్ స్పందిస్తూ... "అలా కాదు. పనులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. చెట్లు కూలడం సహజం. కొన్నిసార్లు గాలి బలంగా వీచితే అవి కూలిపోతాయి" అని అన్నారు. అయితే ఈ ప్రమాదం బాధాకరమని మంత్రి స్పష్టం చేశారు.మంత్రి సంజయ్ వ్యాఖ్యలను "సిగ్గుచేటు"గా శరద్ పవార్ పార్టీ ప్రతినిధి క్లైడ్ కాస్ట్రో అభివర్ణించారు. "ఇది పూర్తిగా సిగ్గుచేటైన వ్యాఖ్య. ఒక చిన్నారి ప్రాణం పోయింది. అలాంటి సమయంలో చెట్టు కూలడం సహజ ప్రక్రియ అని చెప్పడం ఎంత సిగ్గుచేటు. ఇది బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత. చెట్ల తనిఖీ సరిగా జరగలేదని చదివాను. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ రోడ్ల శాఖపై నింద వేస్తోంది. ప్రతి వర్షాకాలానికి ముందు చెట్ల తనిఖీ తప్పనిసరిగా జరగాలి" అని కాస్ట్రో అన్నారు.కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే ఈ ప్రమాదాన్ని హైకోర్టు స్వయంగా పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. "ఈ అంశంపై సభలో ప్రభుత్వ నుంచి నాకు ఎలాంటి సమాధానం రాలేదు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ను దోచుకుంది. అలాంటి ప్రభుత్వం నుంచి ఇంకేం ఆశించగలం" అని నానా పటోలే అన్నారు.ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన మహారాష్ట్ర మంత్రి యోగేశ్ కదమ్ మాట్లాడుతూ.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు."ఈ ఘటన దురదృష్టకరం. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా చూస్తాం. ఎక్కడ ఇలాంటి ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకుంటాం" అని కదమ్ చెప్పారు.భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సంజయ్ ఉపాధ్యాయ్ ఈ ఘటనను "అత్యంత దురదృష్టకరం"గా పేర్కొంటూ సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు. "చెంబూర్లో రావిచెట్టు స్కూల్ వాహనంపై కూలి చిన్నారి మృతి చెందిన ఘటన అత్యంత దురదృష్టకరం. వర్షాకాలంలో చెట్ల కొమ్మలను సమయానికి కత్తిరించడం చాలా అవసరం. నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. చెట్లను సంరక్షించాలి. అదే సమయంలో మానవ ప్రాణాలు కూడా అమూల్యం. నిన్న జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదు. మున్సిపల్ పరిపాలన చెట్ల కొమ్మలను కత్తిరించాలి. బలహీనంగా ఉన్న చెట్లను తొలగించాలి" అని చెప్పారు. -
కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనానికి పాజిటివ్గా చర్చలు
శరద్ పవార్(85)కు చెందిన ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు మార్గం సుగమమవుతున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ పార్టీ, కాంగ్రెస్ విలీన చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని, తుది దశకు చేరినట్లు సమాచారం.ఇందుకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడెట్టివార్ ఓ జాతీయ మీడియాకు తెలిపారు. శరద్ పవార్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అయ్యే అవకాశంపై చర్చలు కొనసాగుతున్నాయని ధ్రువీకరించారు. విలీనంపై అధిష్ఠానంతో చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. "కాంగ్రెస్, శరద్ పవార్ లౌకికవాద సిద్ధాంతాలను విశ్వసించే వారికి మా పార్టీలోకి ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతాం" అని ఆయన చెప్పారు.శరద్ పవార్ 1999లో కాంగ్రెస్ నుంచి విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. 2023లో శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ కూడా అదే విధంగా ఎన్సీపీని చీల్చారు. అజిత్ పవార్ తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను తీసుకుని మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరారు. దీంతో ఆ ప్రాంతీయ రాజకీయ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది.మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే వంటి ప్రాంతీయ నాయకులకు ఇటీవల రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలిన సమయంలో కాంగ్రెస్తో విలీనం జరిగే అవకాశంపై చర్చలు మొదలయ్యాయి. ఆయా పార్టీల్లో కీలక నేతలు ఇటీవల ప్రత్యేక వర్గాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో సొంత పార్టీల నుంచి దూరమయ్యారు. కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) ఎమ్మెల్యేలు, ఎంపీలకు కాంగ్రెస్ నాయకత్వం ఆమోదం తెలిపిందని కూడా సమాచారం. ఎన్డీఏలో చేరదాం శరద్ పవార్ పార్టీ భవిష్యత్తుపై రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని సమాచారం. ఒక వర్గం ఎన్డీఏలో చేరాలని భావిస్తోంది. పార్టీకి ఉన్న పార్లమెంటు బలం ఆధారంగా ఎన్డీఏలో భాగస్వామ్యం లభిస్తుందని ఆ వర్గం వాదిస్తోంది. ప్రతిపక్షంలో ఉండటం వల్ల రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో అభివృద్ధి పనులు, నియోజకవర్గ సమస్యల పరిష్కారం కష్టంగా మారిందని కూడా ఆ వర్గ నాయకులు భావిస్తున్నారని సమాచారం.పార్టీ రెండు వర్గాలు మళ్లీ కలిస్తే ఎన్డీఏలోనే కొనసాగాలని దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కోరుకున్నారని కూడా సమాచారం. ఆయన మరణం తర్వాత రెండు ఎన్సీపీ వర్గాలు మళ్లీ ఒక్కటయ్యే అవకాశం తగ్గిపోయిందని సమాచారం. అయినప్పటికీ స్వతంత్రంగా ఎన్డీఏలో చేరేందుకు ఎలాంటి అడ్డంకి ఉండదని ఆ వర్గం భావిస్తోంది. అయితే పార్టీలోని మరో వర్గం కాంగ్రెస్లో విలీనం కావాలని కోరుకుంటోందని సమాచారం. -
లవ్ ఎఫైర్ ముందే పసిగట్టిన కేతన్?
ముంబై: పూణేకి చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో రోజుకో మలుపు తిరుగుతుంది.తనకు కాబోయే భార్య సియా గోయల్ ప్రవర్తనపై కేతన్కు మొదటి నుంచే అనుమానాలు ఉన్నాయని.. పెళ్లికి ముందు ఆమె బ్యాక్గ్రౌండ్సర్గిగా చెక్చేశారా లేదా అని ఆయన తన కుటుంబ సభ్యులను గట్టిగా నిలదీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విచారణలో కేతన్ తండ్రి ఈ వివరాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.తండ్రి వద్ద ఈవిషమమై ఆందోళన వ్యక్తం చేసిన కేతన్పోలీసుల కథనం ప్రకారం... సియా ప్రవర్తన, ఆమె మాటల్లో పదే పదే 'చేతన్ చౌదరి' పేరు రావడంపై కేతన్ తనతో పలుమార్లు మాట్లాడాడు. జూన్ 6న ప్లాన్ చేసిన ప్రీ-వెడ్డింగ్ బాలి (ఇండోనేషియా) ట్రిప్ రద్దయినప్పటి నుండి కేతన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. సియా చిన్న చిన్న విషయాలకే తనతో గొడవ పడుతోందని తండ్రికి చెప్పాడు. అయితే, ఆమె వయసులో చిన్నదని, తాము ఆమెకు నచ్చజెబుతామని తండ్రి కేతన్ను ఊరడించారు. కేతన్ ఫోన్ చేసినప్పుడల్లా సియా ఫోన్ బిజీగా వచ్చేదని, వారి సంభాషణల్లో ఆమె తరచూ చేతన్ గురించి ప్రస్తావించేదని కేతన్ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిపారు. కేతన్ ఇన్ని అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, గోయల్ కుటుంబం తమ బంధువులకు తెలిసినవారే కావడంతో ఆందోళన పడాల్సిన అవసరం లేదని కేతన్ కుటుంబ సభ్యులు అతనికి నచ్చజెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది.లోహగఢ్ కోట పర్యటన తర్వాత పెరిగిన అనుమానంజూన్ 14న లోహగఢ్ కోటను సందర్శించి వచ్చిన తర్వాత, కేతన్ మళ్లీ తన తండ్రిని కలిసి... అసలు పెళ్లి నిశ్చయించే ముందు సియా గురించి పూర్తిస్థాయిలో బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా లేదా అని గట్టిగా నిలదీశాడు. సియా ప్రవర్తన రోజురోజుకూ అనుమానాస్పదంగా మారుతోందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడని తెలిపారు. అయినప్పటికీ వారు పెద్దగా పట్టించుకోలేదని పేర్కొన్నారు.లవ్ ట్రయాంగిల్... చివరకు దారుణ హత్యపూణేకి చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్కు, సియా గోయల్ కు ఈ ఏడాది నవంబర్లో వివాహం జరగాల్సి ఉంది. అయితే, అప్పటికే చేతన్ చౌదరి (22) అనే యువకుడితో ప్రేమలో ఉన్న సియా, కేతన్ను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది.జూన్ 18న లోహగఢ్ కోటపైకి కేతన్ను తీసుకెళ్లిన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి అతడిని కొండపై నుండి కిందకు తోసి దారుణంగా హత్య చేశారు.సియా పాయింట్'గా మారిన ఘటనా స్థలంఈ ఘోర హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత, పూణేలోని లోహగఢ్ కోటకు పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. కేతన్ను ఏ పాయింట్ నుండి అయితే కిందకు నెట్టేశారో, ఆ క్రైమ్ స్పాట్ను స్థానికులు, సందర్శకులు ఇప్పుడు 'సియా పాయింట్' అని పిలుస్తూ, ఆ స్థలాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున టూరిస్టులు తరలివస్తున్నారు. -
లోహగఢ్ కోటకు అమాంతం పెరిగిన రద్దీ
ఒక విషాద ఘటన.. ఇప్పుడు ఓ పర్యాటక ప్రాంతాన్ని కొత్త కారణంతో వార్తల్లోకి తెచ్చింది. వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. అదే ఘటన జరిగినట్లు ప్రచారంలోకి వచ్చిన మహారాష్ట్రలోని లోహగఢ్ కోటకు ఇప్పుడు పర్యాటకుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా కేతన్ను తోసేశారని చెబుతున్న ప్రదేశాన్ని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతుండటం చర్చనీయాంశంగా మారింది.కేతన్ అగర్వాల్ హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత లోహగఢ్ కోటకు వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు స్థానికులు, టూరిజం వర్గాలు చెబుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం పర్యాటకుల రద్దీ దాదాపు 25 శాతం పెరిగినట్లు సమాచారం. ఈ కేసులో నిందితురాలు సియా అనే యువతి పేరు పదేపదే వినిపించడంతో.. కేతన్ను లోయలోకి తోసేశారని ప్రచారంలోకి వచ్చిన ప్రాంతాన్ని సందర్శకులు ‘సియా పాయింట్’ గా పిలవడం ప్రారంభించారు. అధికారికంగా అలాంటి పేరు లేకపోయినా.. సోషల్ మీడియా ప్రభావంతో ఆ పేరు వేగంగా ప్రాచుర్యం పొందుతోంది.కోటకు వెళ్లే పర్యాటకులు అక్కడి గైడ్లను, స్థానికులను సియా పాయింట్ ఎక్కడ ఉంది? కేతన్ను తోసింది ఇదే ప్రదేశమా? అంటూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఆ ప్రాంతంలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ధోరణిపై స్థానికులు, పర్యాటక రంగానికి చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన లోహగఢ్ కోటను ఒక నేర ఘటనతో గుర్తుపెట్టుకోవడం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనాల ఆధారంగా ప్రచారంలోకి వచ్చిన పేర్లను నిజాలుగా భావించొద్దని కూడా సూచిస్తున్నారు.మరో వైపు, ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ లోహగఢ్ కోట కూడా అనూహ్యంగా దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువుగా మారింది. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ కోట.. ఇప్పుడు ఒక సంచలన హత్య కేసు కారణంగా కొత్త గుర్తింపును సొంతం చేసుకోవడం విశేషం. -
ఉద్ధవ్కు మరో షాక్: షిండే గూటికి ఎమ్మెల్సీ సచిన్ అహిర్
ముంబై: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీకి మహారాష్ట్రలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ సచిన్ అహిర్ ఉద్ధవ్ వర్గాన్ని వీడి, ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. షిండే గూటికి చేరిన వెంటనే, అహిర్ మహారాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి శివసేన అభ్యర్థిగా తన నామినేషన్ను దాఖలు చేశారు. ప్రత్యర్థి పార్టీల నుండి, ముఖ్యంగా ఉద్ధవ్ క్యాంప్ నుండి నేతలను తమ వైపుకు తిప్పుకోవడానికి ఎకనాథ్ షిండే వ్యూహాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆపరేషన్ టైగర్’ లో భాగంగానే ఈ తాజా చేరిక చోటుచేసుకుంది.ఈ పరిణామానికి కొన్ని రోజుల ముందే శివసేన (యూబీటీ) కి చెందిన ఆరుగురు లోక్సభ ఎంపీలు షిండే నేతృత్వంలోని శివసేనకు మద్దతు ప్రకటించి ఉద్ధవ్కు కోలుకోలేని దెబ్బ తీశారు. ఢిల్లీలో జరిగిన కీలక పార్లమెంటరీ పార్టీ సమావేశానికి గైర్హాజరైన ఈ ఎంపీలు సంజయ్ దేశ్ముఖ్ (యావత్మాల్), సంజయ్ జాదవ్ (పర్భని), సంజయ్ దినా పాటిల్ (ముంబై నార్త్ ఈస్ట్), నాగేష్ పాటిల్-అష్టికర్ (హింగోలి), ఓంప్రకాష్ రాజేనింబాల్కర్ (ధారాశివ్), భౌసాహెబ్ వాక్చౌరే (శిరిడీ)—దక్షిణ ముంబైలోని యశ్వంతరావు చవాన్ ప్రతిష్ఠాన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా షిండే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో ఉద్ధవ్ వర్గంలో ముగ్గురు లోక్సభ ఎంపీలు మాత్రమే మిగిలారు.ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు ఏకనాథ్ షిండే మాట్లాడుతూ, తమ వ్యూహాలు పక్కాగా సాగాయని, ‘ఆపరేషన్ టైగర్’ ఇప్పుడు పూర్తిస్థాయిలో విజయవంతమైందని ప్రకటించారు. చేరిన ఎంపీలను క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న దిగ్గజాలుగా ఆయన అభివర్ణించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన అభ్యర్థులపై గెలిచిన ఈ ఎంపీల మార్పుతో మహారాష్ట్ర రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. గత ఎన్నికల్లో గెలిచిన తొమ్మిది స్థానాల్లో ఆరు స్థానాలను షిండే లాక్కోవడంతో, అధికార మహాయుతి కూటమి (బీజేపీ, అజిత్ పవార్ ఎన్సీపీ)లో షిండే బేరసారాల శక్తి మరింత బలపడింది. మరోవైపు, దేవేంద్ర ఫడ్నవీస్ను ప్రధానమంత్రి రేసు నుండి తప్పించడానికి అమిత్ షాయే ఈ ‘ఆపరేషన్ టైగర్’ ను నడిపించారని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
కేతన్ కేసులో రోజుకో ట్విస్ట్.. నిండు ప్రాణం తీసిన సియా మౌనం
-
లోహగడ్ కోటపై ఏం జరిగింది?.. సీన్ రీక్రియేషన్
పూణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 10 రోజుల కిత్రం ఈ ఘోరం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఇవాళ (ఆదివారం) నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలను లోహగడ్ కోటపైకి తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేశారు. జూన్ 18న జరిగిన ఈ హత్య ఉదంతంలో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి కేతన్ను కొండపై నుండి నెట్టేసిన సంగతి తెలిసిందే.పూణే రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. నిందితులను సరిగ్గా ఘటన జరిగిన లోహగఢ్ కోట ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ను రీక్రియేట్ చేశాం. వారు కోటకు ఏ మార్గంలో వచ్చారు, ఎక్కడెక్కడ నిలబడ్డారు? కేతన్ను ఎలా నెట్టేశారు అనే పూర్తి వివరాలను నిందితుల ద్వారా అడిగి తెలుసుకున్నామని తెలిపారు.మరో సీనియర్ పోలీస్ అధికారి పిటిఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడుతూ.. బాధితుడిని ఏ పాయింట్ నుంచి అయితే కిందకు తోసేశారో.. సియా గోయల్ను సరిగ్గా అదే చోటుకి తీసుకెళ్లాం. ఆమె ప్రియుడు చేతన్ను విడిగా కోటపైకి తీసుకెళ్లి విచారించాం. సీన్ రీక్రియేషన్ ద్వారా నిందితులు చెబుతున్న వాదనల్లో నిజమెంత ఉందో తేలనుంది.క్రైమ్ సీన్ రీక్రియేషన్ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. నిందితులు కోటకు ఎలా చేరుకున్నారు? కేతన్ను తోసేయడానికి ముందు సియా తన ప్రియుడికి ఎలాంటి సిగ్నల్ ఇచ్చింది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు చేతన్ చౌదరి అసలు టికెట్ తీసుకోకుండానే కోటలోకి ప్రవేశించి, ఈ జంటను వెంబడించాడా అనే కోణాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణ సజావుగా సాగడం కోసం లోహగఢ్ కోటలోకి పర్యాటకుల ప్రవేశాన్ని పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు.కేతన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సియా పోలీసుల ఎదుట అంగీకరించింది. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే కుటుంబ పరువు పోతుందనే భయంతోనే ప్రియుడితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. శనివారం.. సియా గోయల్ తల్లిదండ్రులు ప్రవీణ్, పూజలతో పాటు ఆమె సోదరుడు సాహిల్ను లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్లో సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అంతకుముందు శుక్రవారం కూడా సాహిల్ను 10 గంటల పాటు ప్రశ్నించారు. కేతన్ అగర్వాల్ కుటుంబం నివసించే గహుంజే ప్రాంతంలో స్థానికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పరీక్ష పత్రాల లీకేజీల పరంపరకు పుల్స్టాప్ పడేలా కనిపించడం లేదు. సంచలనం రేపిన నీట్ లీకేజీ వ్యవహారం మరువక మునుపే తాజాగా మహారాష్ట్రలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆదివారం, ఈ నెల 28న జరగాల్సిన మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (మహా–టెట్) 2026 ప్రశ్నపత్రం లీకైంది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి (ఎంఎస్సీఈ) చివరి నిమిషంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పోలీసుల ఆకస్మిక దాడులు.. మహారాష్ట్ర వ్యాప్తంగా 37 ప్రాంతాల్లోని 1,728 కేంద్రాల్లో 6 లక్షల మంది అభ్యర్థులు హాజరు కావాల్సిన టెట్ పరీక్షకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే శనివారం తెల్లవారుజామున థానే జిల్లా పరిధిలోని భివండీలో కొందరి వద్ద టెట్ ప్రశ్నపత్రాలు ఉన్నట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. వెంటనే పోలీసులు భివండీలోని ఓ కేంద్రంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో పరీక్షకు సంబంధించిన కీలకమైన పత్రాలు లభ్యం కావడంతో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఎంఎస్సీఈ అధికారుల నిర్ధారణ అనుమానితుల వద్ద లభ్యమైన పత్రాలను పరిశీలించేందుకు పోలీసులు వెంటనే పుణేలోని మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి (ఎంఎస్సీఈ) ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న విద్యాశాఖ, పరీక్షల మండలి అధికారులు ఆ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితుల వద్ద ఉన్న పత్రాల్లోని ప్రశ్నలు, ఆదివారం జరగాల్సిన అసలు టెట్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిపోలుతున్నట్లు నిర్ధారించారు. దీంతో పేపర్ లీకైనట్లు అధికారికంగా స్పష్టమైంది. త్వరలో కొత్త తేదీల ప్రకటన .. పేపర్ లీకైనట్లు నిర్ధారణ కావడంతో ఆదివారం జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి ప్రకటించింది. ఈ స్థాయిలో పరీక్షను నిర్వహించేందుకు కనీసం మూడు వారాల సమయం అవసరమవుతుందని ఎంఎస్సీఈ డిప్యూటీ కమిషనర్ ప్రియా షిండే చెప్పారు. పారదర్శకతను కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే పరీక్ష నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీలను అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అయితే, అభ్యర్థులు మరోసారి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు. తదుపరి అధికారిక అప్డేట్స్ కోసం అభ్యర్థులు వేచిచూడాలని సూచించారు. కాగా, లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో కాలంగా సిద్ధమవుతున్న తరుణంలో ఇలా చివరి నిమిషంలో పరీక్ష రద్దు కావడంపై అభ్యర్థులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.ముగ్గురిపై క్రిమినల్ కేసు ఈ వ్యవహారంపై భివండీ పోలీస్ స్టేషన్లో ముగ్గురు అనుమానితులపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ లీకేజీ వెనుక ఉన్న ప్రధాన కుట్రదారులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీని వెనుక ఏదైనా ముఠా హస్తం ఉందా అనే కోణంలో విచారణ సాగుతోంది.యువత భవిష్యత్తును దోచుకోవడమే: రాహుల్ గాంధీ మహారాష్ట్ర–టెట్ను లీకేజీ ఆరోపణలతో వాయిదా వేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది కేవలం పరీక్ష పత్రం లీక్ మాత్రమే కాదు..యువత భవితను దోచుకోవడమేనన్నారు. ‘మరో పేపర్ లీక్. మరో పరీక్ష రద్దు, ఈసారి మహారాష్ట్ర టెట్ వంతు..!’అంటూ ఆయన ఎక్స్లో వ్యాఖ్యానించారు. పరీక్షల విధానాన్ని వసూళ్ల దందాకు అడ్డాగా మార్చుకున్నారంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో తరచూ చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ విమర్శించారు. లీకేజీ సూత్రధారులు అన్ని రకాలుగా ప్రభుత్వం రక్షణలను పొందుతున్నారన్నారు. లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష పత్రమే లీకైనప్పుడు ఇక ఏ పరీక్ష కూడా సురక్షితంగా కానేకాదని ఎన్సీపీ(ఎస్పీ) వ్యాఖ్యానించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, విద్యార్థులు, తల్లిదండ్రులకు వ్యవస్థలపై నమ్మకం కల్పించాలని పేర్కొంది. -
మరో పేపర్ లీకేజీ కలకలం.. మహా 'టెట్' పరీక్ష వాయిదా
మహారాష్ట్రలో మరో పేపర్ లీకేజీ కలకలం రేపింది. దీంతో మహారాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) వాయిదా పడింది. భివాండీలో పరీక్షా పత్రం లీక్ అయినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ (MSCE) ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించడానికి పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.మహా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,028 కేంద్రాల్లో జూన్ 28న టెట్ పరీక్ష జరగాల్సి ఉంది. ఇటీవల నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలను దృష్టిలో ఉంచుకుని, మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్ని భద్రతా చర్యలను ముందే కట్టుదిట్టం చేసిందని అధికారులు పేర్కొన్నారు. పేపర్ లీకేజీపై పోలీసులకు, రాష్ట్ర విద్యాశాఖకు సమాచారం అందగా తక్షణమే స్పందించిన పోలీసులు భివాండిలో టెట్ పేపర్ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం టెట్ పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. పేపర్-1 ఉదయం 10.30 గంటల నుంచి పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరగాల్సి ఉంది. -
హరప్పా కంటే కొంకణ్ రాతి శిల్పాలు ప్రాచీనమా?
ముంబై: మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో విస్తరించి ఉన్న వేలాది సంవత్సరాల నాటి ప్రాచీన రాతి శిల్పాల (పెట్రోగ్లిఫ్స్) రహస్యాలను ఛేదించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సాంకేతికతను ఆశ్రయించింది. ఈ కళాఖండాలను శాస్త్రీయంగా విశ్లేషించి, వాటి వెనుక ఉన్న చారిత్రక ఆధారాలను వెలికితీయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)సాంకేతికతను ఉపయోగించనున్నారు. భారతదేశం తరఫున ఈ అరుదైన ప్రాంతానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపును సాధించడమే లక్ష్యంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించారు.హరప్పా నాగరికత కంటే పురాతనమైన శిల్పాలుఈ పెట్రోగ్లిఫ్స్ మహారాష్ట్ర తీర ప్రాంతాలైన రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లోని లాటరైట్ పీఠభూములపై లభించాయి. ఇక్కడ రాళ్లపై చెక్కిన తాబేళ్లు, ఏనుగులు, నెమళ్లు, ఖడ్గమృగాల ఆకారాలు అబ్బురపరుస్తున్నాయి. పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ శిల్పాలు క్రీస్తుపూర్వం 20,000 నుండి 10,000 సంవత్సరాల నాటివి. అంటే ఇవి హరప్పా నాగరికత కంటే కూడా ఎంతో పురాతనమైనవి. కొంకణ్ ప్రాంతంలోని 107 గ్రామాల్లో దాదాపు 150 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ శిల్పాలు, భారతదేశంలోనే ఆదిమానవుల తొలి కళాత్మక నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.రంగాన నిలిచిన ఐఐటీ మద్రాస్ సాంకేతికతఈ భారీ శిల్పాలను మానవ రహితంగా డాక్యుమెంట్ చేయడం కష్టతరమైన పని కావడంతో, మహారాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రూ. 15 కోట్ల బడ్జెట్ను కేటాయించి, నాలుగేళ్ల ప్రాజెక్టును రూపొందించింది. ఈ బాధ్యతను ఐఐటీ మద్రాస్కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ‘ఐఐటీ ప్రవర్తక్’ సంస్థకు అప్పగించారు. ఈ ప్రాజెక్ట్ కింద డ్రోన్ల ద్వారా హై-రిజల్యూషన్ వైమానిక చిత్రాలను సేకరించి, వాటిని ఏఐ సిస్టమ్స్ ద్వారా విశ్లేషిస్తారు. రాతి ఉపరితలాలు దెబ్బతిన్న చోట ఏఐ సాయంతో వాటిని పునర్నిర్మించి, ప్రపంచంలోని ఇతర పురాతన నాగరికతలతో పోల్చి పరిశోధనలు చేస్తారు.యునెస్కో గుర్తింపే అంతిమ లక్ష్యంఈ శిల్పాల్లో గుర్రాలు, ఎద్దుల ఆకారాలు ఎక్కడా కనిపించకపోవడం విశేషం. ఇది అవి వ్యవసాయం, రవాణా యుగానికి పూర్వపు మధ్యరాతి యుగానికి చెందినవని నిరూపిస్తోంది. 2025లోనే ఈ ప్రాంతం యునెస్కో తాత్కాలిక జాబితాలో చేరినప్పటికీ, శాశ్వత గుర్తింపు కోసం పూర్తి స్థాయి పరిశోధన నివేదిక అవసరం. రాబోయే 2030 నాటికి యునెస్కో తుది నామినేషన్ దక్కించుకోవడమే లక్ష్యంగా ఈ ఏఐ అధ్యయనాన్ని వినియోగిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను, పురాతత్వ పరిశోధనలను మిళితం చేస్తూ సాగుతున్న ఈ ప్రయోగం మహారాష్ట్ర ప్రాచీన సంపదను ప్రపంచ వేదికపై నిలపనుంది. -
కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్..? కేతన్ బట్టతలే హత్యకు కారణమా?
-
కేతన్ అగర్వాల్ కేసులో బిగ్ ట్విస్ట్..? కొత్త విషయాలు వెలుగులోకి!
-
దయచేసి ఇక ఆపండి! కేతన్ కుటుంబం భావోద్వేగ విజ్ఞప్తి
ఒక కుటుంబం జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన విషాదం.. ఇప్పుడు సోషల్ మీడియాలో వినోదంగా మారింది. చనిపోయిన కొడుకును టెక్నాలజీ సాయంతో మళ్లీ "బతికించినందుకు" సంతోషించాలా? లేక అతని హత్య కేసులో నిందితురాలితో కలిసి నవ్వుతూ, మాట్లాడుతున్నట్లు వీడియోలు సృష్టిస్తున్నందుకు బాధపడాలా? అనే వేదనలో కేతన్ అగర్వాల్ కుటుంబం మునిగిపోయింది. కేవలం వ్యూస్, లైక్స్ కోసం జరుగుతున్న ఈ ఏఐ ట్రెండ్ వారికి మరోసారి తీరని మానసిక వేదనను మిగులుస్తోంది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే లోహగడ్ హత్య కేసు ఇప్పుడు మరో కారణంతో చర్చనీయాంశమైంది. ఇన్స్టాగ్రామ్తో పాటు పలు సోషల్ మీడియా వేదికల్లో కేతన్ అగర్వాల్, నిందితురాలు సియా గోయల్ కలిసి ఉన్నట్లు చూపించే ఏఐ వీడియోలు, ఫోటోలు, రీల్స్ భారీగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు పూర్తిగా కల్పితమైనవే అయినప్పటికీ, లక్షలాది మంది వాటిని వీక్షిస్తూ, షేర్ చేస్తుండటంతో ఈ ట్రెండ్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. "దయచేసి ఇలాంటి ఏఐ వీడియోలు చేయడం ఆపండి" అంటూ వారు సోషల్ మీడియా వినియోగదారులను భావోద్వేగంగా వేడుకుంటున్నారు. అలాగే.. కేతన్-సియాల వీడియోలను కూడా వైరల్ చేయడం ఆపమంటున్నారు.People out there are really making AI edits of Ketan and Siya, Instagram is full of it now pic.twitter.com/Rg6yy86Oyq— Shubham2.0 (@bhav_paaji) June 26, 2026పుణేకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫిబ్రవరిలో సియా గోయల్తో ఆయనకు నిశ్చితార్థం జరిగింది. అయితే సియాకు అప్పటికే చేతన్ చౌదరితో ప్రేమ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులకు చెప్పకుండా, కేతన్ను అడ్డంకిగా భావించి హత్యకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది.'Killing Ketan Was Easier Than Confronting My Family': Siya Goyal's Confession to Pune PoliceThe Ketan Agarwal murder investigation has taken a fresh turn after police claimed that accused Siya Goyal made a startling statement during interrogation.According to investigators,… pic.twitter.com/FZYImt2ZIm— upuknews (@upuknews1) June 26, 2026జూన్ 18వ తేదీన లోహగడ్ కోట వద్ద ఫొటోషూట్ కోసం తీసుకెళ్లి లోయలోకి తోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మొదట ప్రమాదంగా భావించిన ఈ ఘటన, తర్వాత పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా మారింది. ఈ కేసులో సియా గోయల్, చేతన్ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు.అయితే ఈ విషాద ఘటనను ఇప్పుడు కొందరు ఏఐ కంటెంట్గా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కేతన్, సియా మళ్లీ కలిసి మాట్లాడుకుంటున్నట్లు, ప్రేమలో ఉన్నట్లు, అలాగే ప్రియుడితో కలిసి కేతన్ను సియా ఎలా చంపిందోనంటూ వీడియోలు విపరీతంగా ప్రచారం పొందుతున్నాయి. కొంతమంది వాటిని నిజమని కూడా భావిస్తుండటంతో గందరగోళం నెలకొంటోంది. అదే సమయంలో సియాకు సంబంధించినవంటూ కొన్ని వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.Meet Siya Goyal who is accused of murdering her fiancée businessman Ketan AgarwalLook closer story was posted on 2022She is 20 yo nowIt means she was consuming alcohol at 16 yo even before turning on 18This is women empowerment for feminists pic.twitter.com/FCsfL99RJB— aaru (@buttermasale) June 27, 2026ఈ వీడియోలను చూసిన కేతన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొడుకును కోల్పోయిన బాధ నుంచి బయటపడలేకపోతున్నామని, ఇప్పుడు ఇలాంటి ఏఐ వీడియోలు ప్రతిరోజూ ఆ బాధను మళ్లీ గుర్తు చేస్తున్నాయని వాపోయారు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్, ఫాలోవర్ల కోసం ఒక కుటుంబం విషాదాన్ని వినోదంగా మార్చొద్దని విజ్ఞప్తి చేశారు. దయచేసి ఆపండి.. Please Stop అంటూ సోషల్ మీడియా వినియోగదారులకు భావోద్వేగ పిలుపునిచ్చారు.ఈ ఘటనతో ఏఐ సాంకేతికత దుర్వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది. మరణించిన వ్యక్తుల పేరుతో నకిలీ వీడియోలు తయారు చేయడం బాధిత కుటుంబాల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ సృష్టించిన ఫేక్ కంటెంట్ను నియంత్రించేందుకు సోషల్ మీడియా సంస్థలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వీడియోలను ప్రోత్సహించవద్దని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదీ చదవండి: కొండపై నుంచి తోసేసింది అతడుకాదు! -
కొండపై నుంచి తోసేసింది సియానే!
పుణే: దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భార్య సియా గోయల్ స్వయంగా అతడిని కొండపై నుంచి తోసివేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ దారుణం వెనుక సియా చౌదరి ప్రియుడు చేతన్ చౌదరి ప్రోద్బలం ఉన్నట్లు బహిర్గతమయ్యింది. కేతన్ అగర్వాల్ను సాధ్యమైనంత త్వరగా అంతం చేయాలంటూ చేతన్ చౌదరి తన ప్రియురాలు సియా చౌదరిపై పదేపదే ఒత్తిడి చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. పూర్తిగా అతడి మైకంలో పడిపోయిన సియా చౌదరి మరో ఆలోచన లేకుండా.. కాబోయే భర్తను చేతులారా చంపేసిందని తెలిపారు. ఇద్దరు నిందితులను ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రియుడి ఒత్తిడి వల్లే చేతన్ను లోహగఢ్ కోటకు రప్పించి హత్య చేసినట్లు సియా గోయల్ ఒప్పుకుందని స్పష్టంచేశారు. ఆమె సోదరుడిని కూడా ప్రశ్నిస్తున్నామని అన్నారు. మరోవైపు ఈ కేసులో ఫాస్ట్–ట్రాక్ కోర్టు ట్రయల్ నిర్వహించాలంటూ కేతన్ అగర్వాల్ కుటుంబం డిమాండ్ చేయగా, మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రఖ్యాత లాయర్ ఉజ్వల్ నికమ్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసుతోపాటు మరికొన్ని ముఖ్యమైన కేసుల్లో ఉజ్వల్ నికమ్ వాదించారు. 20 ఏళ్ల సియా గోయల్, 22 ఏళ్ల చేతన్ చౌదరి గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 18న కేతన్ అగర్వాల్(25)ను పుణే సమీపంలోని లోహగఢ్ కోటలో అంతమొందించిన సంగతి తెలిసిందే. హత్యకు పకడ్బందీగా ప్లాన్ కేతన్ అగర్వాల్ హ త్యకు నిందితులు పకడ్బందీగా ప్లాన్ చేశా రు. ఆధారాలు దొర క్కుండా జాగ్రత్తపడ్డా రు. హత్యకు ముందు, తర్వాత తమ సెల్ఫోన్లలో చాటింగ్ హిస్టరీని పూర్తిగా తొలగించారు. రీసైకిల్ బిన్లను కూడా ఖాళీచేశారు. వారి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. డిలీట్ చేసిన వివరాలను తిరిగి రప్పిస్తే కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని అన్నారు. సియా గోయల్, కేతన్ చౌదరి మధ్య ఫోన్లలో 238 గంటలపాటు సంభాషణ జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. వారిద్దరూ గత ఆరు నెలల వ్యవధిలో 2,004 ఫోన్కాల్స్ చేసుకున్నారు. హత్య జరిగిన రోజు ఓ హోటల్లో కలుసుకున్నారు. మర్డర్ ప్లాన్ గురించి చర్చించుకున్నారు. కేతన్ బట్టతల నచ్చకనే హత్య! కాబోయే భర్త కేతన్ అగర్వాల్కు బట్టతల ఉండడం, అది కనిపించకుండా విగ్గు లాంటిది ధరించడం తనకు నచ్చలేదని, అందుకు అడ్డు తొలగించుకున్నానని సియా చౌదరి చెబుతున్నట్లు సమాచారం. బట్టతల కారణంగానే కేతన్ హత్యకు గురయ్యాడంటూ ప్రచారం సాగుతోంది. అయితే, ఈ విషయాన్ని కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ఖండించారు. కేతన్కు బట్టతల ఉందన్న విషయంలో ఎంగేజ్మెంట్కు ముందే సియా గోయల్కు, ఆమె కుటుంబానికి తెలుసని అన్నారు. బట్టతల విషయంలో ఆమె ఏనాడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెప్పారు. తన కుమారుడు నిజంగా నచ్చకపోతే ముందే చెప్పాలి తప్ప ఇలా హత్య చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు. కేతన్ హత్యకు అతడి బట్టతల అంశం ఒక్కటే కారణం కాదని పోలీసులు తెలిపారు. -
వ్యాక్సిన్ తీసుకుంది.. స్పాట్లో కుప్పకూలింది!
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 17 ఏళ్ల బాలిక టీకా తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలి మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, టీకా తీసుకున్న వెంటనే మరణం సంభవించినప్పటికీ, టీకానే మరణానికి కారణమని ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ కాలేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. పూర్తి స్థాయి వైద్య, ఫోరెన్సిక్, శాస్త్రీయ దర్యాప్తు అనంతరమే అసలు కారణం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు.ఘటన ఎలా జరిగింది?నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాధారణ రోగనిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 17 ఏళ్ల బాలికకు టెటానస్–డిఫ్తీరియా (Td) బూస్టర్ టీకా ఇచ్చారు. మధ్యాహ్నం సుమారు 12:40 గంటలకు టీకా తీసుకున్న అనంతరం ఆమె కొద్దిసేపు వైద్యుల పరిశీలనలో ఉండి బయటకు వచ్చింది. ఆ తర్వాత సమీపంలోని మెడికల్ షాప్ వద్దకు వెళ్లిన ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. తల తిరుగుతోందని చెప్పిన కొద్ది క్షణాల్లోనే స్పృహ తప్పి రోడ్డుపై కుప్పకూలింది. పడిపోయే సమయంలో తలకు తీవ్రంగా గాయమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికులు వెంటనే ఆమెను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.సీసీటీవీలో రికార్డైన ఘటనఈ మొత్తం ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. వీడియోలో బాలిక సాధారణంగా నడుచుకుంటూ వస్తుండగా, ఒక్కసారిగా తూలి కిందపడిపోవడం కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, బాలిక మరణానికి టీకానే కారణమని సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నప్పటికీ, అధికారులు వాటిని ఖండించారు. ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేసిన వివరాల మేరకు.. ప్రస్తుతం టీకా వల్లే మరణం సంభవించిందని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది టీకా వల్ల వచ్చిన అరుదైన ప్రతికూల ప్రతిస్పందనా? లేక ముందుగా ఉన్న గుండె సంబంధిత లేదా ఇతర ఆరోగ్య సమస్య వల్ల జరిగిందా?. లేదా కిందపడినప్పుడు తలకు తగిలిన గాయం కారణమా? అనే కోణాల్లో అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.Nashik - A tragic and shocking incident has sent shockwaves through Nashik, where a 17-year-old girl died within minutes after receiving a routine vaccination. Shravani Anil Patil collapsed shortly after being administered the TT vaccine — meant to prevent tetanus, often given in… pic.twitter.com/iBVVxIsTWh— NextMinute News (@nextminutenews7) June 25, 2026టీకా బ్యాచ్ నిలిపివేత.. ఈ ఘటన అనంతరం అప్రమత్తమైన అధికారులు. ప్రజల్లో అనుమానాలు తలెత్తకుండా ఉండేందుకు, బాలికకు ఇచ్చిన అదే టీకా బ్యాచ్ వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ బ్యాచ్కు చెందిన నమూనాలను ప్రభుత్వ ప్రయోగశాలకు పంపించారు. వాటి నాణ్యత, భద్రతపై ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అదే టీకా సీసా నుంచి మరో ఆరుగురికి టీకాలు ఇచ్చారు. వీరిలో నలుగురు గర్భిణులు, ఒక 16 ఏళ్ల బాలిక, ఒక 10 ఏళ్ల బాలుడు ఉన్నారు. వారిలో ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు నమోదు కాలేదు. అదే టీకా బ్యాచ్కు చెందిన డోసులతో ఈ ప్రాంతంలో ఇప్పటికే దాదాపు 120 మందికి టీకాలు ఇచ్చారు. వారిలో కూడా ఎలాంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు నమోదుకాలేదని అధికారులు తెలిపారు.కుటుంబ సభ్యుల ఆరోపణలుమృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం టీకా తీసుకున్న వెంటనే తమ కుమార్తె కుప్పకూలిందని, అందువల్ల ఈ మరణానికి టీకానే కారణమై ఉండొచ్చని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై న్యాయపరమైన విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో యువతి ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్న ఆరోగ్య శాఖ పలు స్థాయిల్లో విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా యువతికి పూర్తి స్థాయి పోస్ట్మార్టం నిర్వహించారు. రక్తం, ఇతర జీవ నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. టీకా బ్యాచ్ నాణ్యతపై ప్రత్యేక ప్రయోగశాల పరీక్షలు జరుగుతున్నాయి. అవసరమైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం కూడా కేసును విశ్లేషించనున్నారు.ఆరోగ్య శాఖ ఏమంటోంది?ఈ ఘటన నేపథ్యంలో ఆరోగ్య శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు. అధికారిక నివేదికలు వెలువడే వరకు టీకాలపై అపోహలు సృష్టించవద్దు. టీకాలు ఇప్పటికీ ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైనవేనని అధికారులు స్పష్టం చేశారు. కాగా, పోస్ట్మార్టం, ఫోరెన్సిక్, ప్రయోగశాల నివేదికలు వచ్చిన తర్వాతే బాలిక మరణానికి గల అసలు కారణంపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
నా బిడ్డను కూడా అక్కడి నుంచే తోసేయండి: సియా తండ్రి
ముంబై: మహారాష్ట్రలో సంచలనం రేపిన లోహగడ్ కోట హత్యకేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన కుమార్తెపై ఆరోపణలు నిజమని కోర్టు తేల్చితే ఆమెకు అత్యంత కఠిన శిక్ష విధించాలన్నారు. ఇదే సమయంలో అవసరమైతే కేతన్ అగర్వాల్ను తోసేసిన అదే కోటపై నుంచి ఆమెను కూడా తోసేయాలని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.తాజాగా మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ గోయల్..‘నా కుమార్తె ఇలాంటి ఘోరానికి పాల్పడిందని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆమె ఎప్పుడూ నాతో అబద్ధం చెప్పలేదు. కానీ పోలీసులు చూపుతున్న ఆధారాలు చూసిన తర్వాత నేను కూడా దిగ్భ్రాంతికి గురయ్యాను. నిజం ఏదైనా కోర్టే తేల్చాలి. చట్టం ముందు అందరూ సమానమే. నేను ముందుగా ఒక పౌరుడిని, తర్వాత తండ్రిని. చట్టం ముందు ఎవరూ పెద్దవారు కాదు. నా కుమార్తె నేరం చేసినట్లు రుజువైతే ఆమెకు అత్యంత కఠిన శిక్ష పడాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. నా కూతురు అయినా న్యాయానికి అడ్డుకావద్దు. తండ్రిగా నాకు బాధ ఉన్నా, న్యాయం జరగాల్సిందే’ అని అన్నారు. కాగా, ఈ ఘటనతో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, కుమార్తె అరెస్టు వార్త విన్న తర్వాత షాక్కు గురై ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందాల్సి వచ్చిందని కూడా ఆయన వెల్లడించారు.Ketan Agarwal Siya Goyal this video proves:Not everything you see on SOCIAL MEDIA is real. Filters hide flaws. Edits hide truth. pic.twitter.com/OvfbL3zrt3— बुलेट bhaiya (@bullet_bhaiya_) June 25, 2026కేసు ఏమిటి?మహారాష్ట్రలోని పూణేకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ జూన్ 18న తన నిశ్చితార్థమైన సియా గోయల్తో కలిసి లోహగడ్ కోటకు ట్రెక్కింగ్కు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయి మరణించినట్లు తొలుత భావించిన పోలీసులు, అనంతర దర్యాప్తులో ఇది పక్కా హత్య అని నిర్ధారించారు. సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి ముందుగానే కుట్ర పన్ని కేతన్ను లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు ఆరోపించారు. ప్రస్తుతం ఇద్దరూ కస్టడీలో ఉన్నారు. దర్యాప్తు సందర్భంగా సియా, చేతన్ ఒకరిపై ఒకరు నేరారోపణలు చేసుకుంటున్నారని, అయితే ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు సియానే ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి అనే దిశగా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపగా, బాధిత కుటుంబం కూడా నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది. -
షాకింగ్ : ఆమె అలా సిగ్నల్ ఇచ్చింది.. ప్రియుడు తోసేశాడు!
పుణేకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత దీన్ని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించినప్పటికీ, అతని కాబోయే భార్య (ఫియాన్సే) సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి పక్కా స్కెచ్తో చేసిన హత్య అని పుణే రూరల్ పోలీసులు వెల్లడించారు. మొదటి ప్రయత్నంలో ఒకసారి కొండంపై నుంచి తోసేసినప్పటికీ, కాబోయే భార్యను గుడ్డిగా నమ్మిన కేతన్ చివరకు ఆమె కుట్రకు బలికాక తప్పలేదు. వారు పక్కాగా అమలు చేసిన వారి ప్లాన్ గురించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గజానన్ టోంపే మరికొన్ని దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు.పక్కా ప్లాన్ ప్రకారం హత్యపోలీసుల విచారణ ప్రకారం జూన్ 18న సియా గోయల్ తన పుట్టినరోజు వేడుకల నెపంతో కేతన్ను లోహగఢ్ కోటకు తీసుకువెళ్లింది. సియా ప్రియుడైన చేతన్ చౌదరి, ఆ జంటను రహస్యంగా లోహగఢ్ కోట వరకు ఫాలో అయ్యాడు. అంతేకాదు తన ఫోన్ను రూంలోనే వదిలి వచ్చాడు. కోటపై ఉన్న ఒక నిర్దేశిత ప్రదేశానికి చేరుకున్నాక, సియా ముందుగా అనుకున్న సిగ్నల్ ఇచ్చింది. ఏంటా సిగ్నల్అందేంటి అంటే సడెన్ కూడా ఒకచోట కూర్చోవడం. అలా యాక్షన్కు "సమయం వచ్చింది" అని సైగ (సిగ్నల్) చేయాలి. అలా ఒకచోట కూర్చుని సియా సిగ్నల్ ఇవ్వగానే, వెనుక నుండి మాటు వేసిన చేతన్ చౌదరి, కేతన్ను ఒక్కసారిగా లోయలోకి తోసేసి అక్కడి నుండి పారిపోయాడు.దీనికి సంబంధిచి పోలీసులు కీలక ఆధారారాలను కూడా సేకరించారు. కోట కింద ఉన్న సీసీటీవీ విజువల్స్ పరిశీలించగా.. తలకి హుడీ (టోపీ) ధరించి పాలో అయిన వ్యక్తి చేతన్ చౌదరి అని పోలీసులు గుర్తించారు. చేతన్ చౌదరి కేవలం 50 నిమిషాల్లోనే కోట ఎక్కి, పని ముగించుకుని కిందకు దిగాడు. కోట పైన అతను గడిపింది కేవలం 10 నిమిషాలు మాత్రమే. ఎక్సర్సైజ్ కోసం వచ్చానని అక్కడ ఉన్నసెక్యూరిటీ గార్డుతో అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని సెక్యూరిటీ గార్డు పోలీసులకు ధృవీకరించాడు.ఇదీ చదవండి: అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్ చెప్పిన షాకింగ్ నిజాలుసాధారణ రోజుల్లో (వీక్డేస్) పెద్దగా జనం ఉండరనే కారణంతో పవనా డ్యామ్ వైపు ఉండే 'వించు కాటా' (Vinchu Kata) అనే లోయ ప్రాంతాన్ని వారు ఎంచుకున్నారు.ఇది నాలుగో ప్రయత్నంఅంతేకాదు కేతన్ను చంపేందుకు సియా, చేతన్లు అంతకుముందు కూడా మూడుసార్లు విఫలయత్నాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒకసారి పాము నుండి రక్షిస్తున్నట్లు నటిస్తూ కేతన్ను తోసేయడానికి సియా ప్రయత్నించిందని విచారణలో తేలింది. అలాగే ఎలాగైనా కేతన్ను మట్టుబెట్టాలనే ఉద్దేశంతో తన పుట్టినరోజు వేడుకల పేరుతో జూన్ 18న లోహగడ్ కోటను సందర్శించేలా సియా, కేతన్ను ఒప్పించినప్పుడు ఆ అవకాశం లభించిందని పోలీసులు ఆరోపిస్తున్నారు.ఇదీ చదవండి: రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్ : కేతన్ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు -
మనం కలిసే ఉన్నామా?.. ఉద్ధవ్ వ్యాఖ్యల కలకలం
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయా? మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. తన పార్టీకి చెందిన ఆరుగురు లోక్సభ సభ్యులు షిండే శిబిరంలో చేరిన నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే..‘మనం నిజంగానే కలిసి ఉన్నామా?’ అంటూ కూటమి భాగస్వాములనే ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఇటీవల శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు అధికార శివసేన నేత ఏక్నాథ్ షిండే వర్గంలో చేరడం ఉద్ధవ్కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ పరిణామం తర్వాత పార్టీ శ్రేణులతో సమావేశమైన ఉద్ధవ్.. కేవలం పార్టీ అంతర్గత పరిస్థితులపైనే కాకుండా, కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)తో కలిసి ఉన్న ఎంవీఏ కూటమి ఐక్యతపైనా సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.ఫిరాయింపుతో పెరిగిన ఒత్తిడి2022లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో పార్టీ చీలిన తర్వాత ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే భారీ రాజకీయ నష్టాన్ని చవిచూశారు. ఇప్పుడు ఆరుగురు ఎంపీలు కూడా పార్టీని వీడటంతో ఆయన నాయకత్వంపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష శిబిరం బలపడుతుందని భావించిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ఉద్ధవ్కు ఇబ్బందికరంగా మారింది.ఎంవీఏలో సమన్వయం లోపిస్తోందా?ఉద్ధవ్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం కేవలం ఎంపీల ఫిరాయింపులే కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ వ్యూహాలు, నాయకత్వ అంశాల్లో ఎంవీఏ భాగస్వాముల మధ్య పూర్తి స్థాయి సమన్వయం లేదనే భావన శివసేన (యూబీటీ)లో పెరుగుతోందని చెబుతున్నారు. అందుకే మనం నిజంగానే కలిసి ఉన్నామా? అనే ప్రశ్న ద్వారా ఉద్ధవ్ తన మిత్రపక్షాలకు పరోక్షంగా హెచ్చరిక పంపినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు షిండే వర్గం మాత్రం దీనిని ఉద్ధవ్ నాయకత్వ వైఫల్యంగా అభివర్ణిస్తోంది. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వరుసగా బయటకు వస్తుండటం ఉద్ధవ్పై విశ్వాసం తగ్గిపోవడానికే నిదర్శనమని ఆ వర్గం వాదిస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో షిండే-బీజేపీ కూటమి మరింత బలపడుతుండగా, ప్రతిపక్ష శిబిరంలో అనిశ్చితి పెరుగుతోందని పేర్కొంటోంది.ముందున్న సవాళ్లుఎంవీఏ కూటమికి రాబోయే స్థానిక ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ఈ సమయంలో భాగస్వామ్య పార్టీల మధ్య ఐక్యతపై అనుమానాలు వ్యక్తమవడం ప్రతిపక్షానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఉద్ధవ్ థాక్రే పార్టీని కాపాడుకోవడమే కాకుండా, కూటమి భాగస్వాములను ఒకే తాటిపైకి తీసుకురావాల్సిన సవాలు కూడా ఎదుర్కొంటున్నారు. మొత్తానికి ఉద్ధవ్ వేసిన ప్రశ్న ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఇది కేవలం ఒక వ్యాఖ్య మాత్రమేనా? లేక ఎంవీఏలో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతమా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. -
కుట్ర లవర్స్దే.. మరి తోసిందెవరు?
పెళ్లికి పెద్దల అంగీకారం.. ఒకరికొకరు ప్రేమలో మునిగి తేలడం.. బయటకు కనిపించిన కథ ఇదే. కానీ ఆ నవ్వుల వెనుక ఓ చీకటి కుట్ర నడిచింది. రహస్య ప్రేమ, కేఫ్లలో జరిగిన గుట్టుచప్పుడు కాకుండా సమావేశాలు, వేల ఫోన్ కాల్స్, వరుస విఫల హత్యాయత్నాలు... చివరకు లోహగడ్ కోట అంచున ఓ యువ వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. పుణేకు చెందిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కుట్ర వెనుక ఉన్న దాదాపు అన్ని కోణాలను పోలీసులు ఛేదించారు. కానీ ఇప్పటికీ ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. తొలుత కనిపించిన దృశ్యం ఒక సాధారణ ప్రమాదం. ట్రెక్కింగ్కు వెళ్లిన యువకుడు లోయలో పడి మృతి చెందాడు. కాబోయే భార్య కన్నీళ్లు పెట్టుకుంది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కూడా ప్రమాద మరణంగానే కేసు నమోదు చేశారు. కానీ ఆ కథలో ఏదో తేడా ఉందనే అనుమానం మొదట కేతన్ కుటుంబ సభ్యులకే వచ్చింది. ముఖ్యంగా కేతన్ సోదరి సంజనా అడిగిన కొన్ని ప్రశ్నలకు.. నిందితురాలు సియా గోయల్ ఇచ్చిన సమాధానాలు దర్యాప్తును పూర్తిగా కొత్త దిశలోకి మళ్లించాయి. అక్కడి నుంచే ఒక్కొక్కటిగా బయటపడిన ఆధారాలు.. ప్రేమ, మోసం, కుట్ర, హత్యతో కూడిన భయంకర కథను వెలుగులోకి తీసుకొచ్చాయి.జూన్ 18న లోహగడ్ కోట వద్ద ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ సమయంలో జరిగిన ఘటన తర్వాత కేతన్ మృతదేహాన్ని వెలికితీశారు. తొలుత ప్రమాద మరణంగా కేసు నమోదైంది. అయితే అంత్యక్రియలు పూర్తైన నాలుగు రోజుల తర్వాత కేతన్ సోదరి సంజనా సియాకు ఫోన్ చేసింది. ఇంటికి రమ్మంటూ పిలిచింది. సోదరుడి గురించి మాట్లాడుకుంటూ ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. అలా.. అసలు ఆ రోజు ఏం జరిగిందని ప్రశ్నించింది. సియా చెప్పిన వివరాల్లో తేడాలు కనిపించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు మళ్లీ మొదలైంది.విచారణలో బయటపడిన అంశాలు ఒక్కొక్కటిగా సియాపై అనుమానాలను పెంచాయి. కేతన్ మరణానికి ముందు ఆమె పలుమార్లు లోహగడ్కు రావాలని ఒత్తిడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. మే 31న మొదటిసారి అక్కడికి తీసుకెళ్లింది. ఆ తర్వాత జూన్ 4న కూడా వెళ్లాలని పట్టుబట్టిందని, కానీ కేతన్ తల్లి అనుమతి ఇవ్వకపోవడంతో అది జరగలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మే 31న ప్రదేశాన్ని ముందుగా పరిశీలించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.జూన్ 14న మరోసారి ఇద్దరూ లోహగడ్కు వెళ్లారు. అక్కడే మొదటి హత్యాయత్నం జరిగి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. లోయ అంచు వద్ద కేతన్ను నెట్టినప్పుడు అతడు పొదలను పట్టుకుని బయటపడ్డాడని, వెంటనే సియా పాము కనిపించిందంటూ నాటకం ఆడి పరిస్థితిని చక్కబెట్టిందని పోలీసులు చెబుతున్నారు. అప్పట్లో అది ప్రమాదంగా కనిపించినా.. ఇప్పుడు అదే ఘటన హత్యా కుట్రలో భాగమని భావిస్తున్నారు.ఇదిలా ఉండగా, పెళ్లికి ముందు బాలి ట్రిప్ కూడా కేసులో కీలక అంశంగా మారింది. ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్ కోసం కేతన్, సియా ఇండోనేషియా వెళ్లాల్సి ఉంది. అయితే ప్రయాణానికి ముందు కేతన్ పాస్పోర్ట్ కనిపించకుండా పోయింది. దీంతో ట్రిప్ రద్దయింది. ఈ ఘటన వెనుక కూడా సియా పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేతన్ను బాలి వెళ్లకముందే హత్య చేయాలన్న ఉద్దేశంతోనే పాస్పోర్ట్ను మాయం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.దర్యాప్తులో మరో కీలక మలుపు సీసీటీవీ ఫుటేజీలతో వచ్చింది. టికెట్ కౌంటర్ వద్ద కేతన్, సియా నడుచుకుంటూ వెళ్తుండగా.. కొంత దూరంలో హుడీ ధరించిన ఓ వ్యక్తి వారిని వెంబడిస్తున్న దృశ్యాలు కనిపించాయి. 33 డిగ్రీల ఉష్ణోగ్రత.. అంతా వేడిలోనూ కూడా ముఖం కనిపించకుండా హుడీ, హెడ్సెట్తో తిరగడం పోలీసులకు అనుమానం కలిగించింది. తర్వాత అతడే చేతన్ చౌదరి అని గుర్తించారు.చేతన్ తన మొబైల్ను ఇంట్లో వదిలేసి, ఒక ఉద్యోగి ఫోన్తో ప్రయాణించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. లోకేషన్ ట్రాకింగ్ నుంచి తప్పించుకోవడానికే ఈ ప్లాన్ వేసినట్లు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, సోషల్ మీడియా ఫొటోలు, డిజిటల్ ఆధారాలను సరిపోల్చిన తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని కాల్ రికార్డులు మరింత బలపరిచాయి. జనవరి 1 నుంచి జూన్ 18 వరకు సియా, చేతన్ల మధ్య 2,004 ఫోన్ కాల్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గంటల తరబడి మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వ్యాపార పరిచయంతో మొదలైన సాన్నిహిత్యం ప్రేమగా మారిందని, కేతన్తో పెళ్లి విషయంలో సియా ఆసక్తి చూపకపోవడానికి ఇదే కారణమని దర్యాప్తులో తేలింది.పోలీసుల కథనం ప్రకారం.. సియా, చేతన్లు గత ఏడాది దీపావళి వేడుకల్లో పరిచయమయ్యారు. ఆ తర్వాత తరచూ కేఫ్లలో కలుస్తూ హత్యా ప్రణాళికను రచించినట్లు అనుమానిస్తున్నారు. సియా పెళ్లికి మానసికంగా సిద్ధంగా లేదని, కుటుంబ ఒత్తిడితో సంబంధాన్ని కొనసాగించిందని విచారణలో వెల్లడైంది. అయితే చేతన్తో పారిపోవడానికి కూడా ఆమె ఇష్టపడలేదని చెబుతున్నారు. నిశ్చితార్థం రద్దు చేసి ప్రేమికుడితో వెళ్లిపోతే కుటుంబ పరువు పోతుందని భావించిందని చేతన్ విచారణలో చెప్పినట్లు సమాచారం.కేతన్, సియా వివాహం నవంబర్లో ఉదయ్పూర్లో జరగాల్సి ఉంది. కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ జూన్ 18న జరిగిన ట్రెక్కింగ్ ప్రయాణమే కేతన్ జీవితానికి చివరి ప్రయాణమైంది.పోలీసుల ప్రకారం, ఘటన రోజున చేతన్ ముందుగానే లోహగడ్కు చేరుకుని అక్కడ మాటు వేసి ఉన్నాడు. తర్వాత సియా, కేతన్లను అనుసరిస్తూ ఏకాంత ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి కేతన్ను సుమారు 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టే ప్లాన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఆపై సియా కేకలు వేస్తూ భద్రతా సిబ్బందిని పిలిచి, అది ప్రమాదంలా కనిపించేలా ప్రయత్నించినట్లు అభియోగాలు నమోదు చేశారు.ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. చేతన్ స్నేహితుడు నీరజ్ను కూడా అదుపులోకి తీసుకుని అతడి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు, డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, ఘటనాస్థల పరిశీలన కొనసాగుతోంది.అయితే ఈ కేసులో ఇప్పటికీ ఒక ప్రశ్నకు సమాధానం దొరకలేదు. కేతన్ను చంపాలన్న కుట్ర ఇద్దరిదేనని పోలీసులు చెబుతున్నారు. కానీ చివరి క్షణంలో లోయ అంచున నిలబడ్డ కేతన్కు నెట్టేసి చంపింది ఎవరు?.. పక్కనే నడుస్తున్న సియానా?.. లేక మాటు వేసి ఎదురుచూస్తున్న చేతనా?.. లేదంటే ఇద్దరూనా?. వీళ్లకు సహకరించిన నీరజా? ఈ విషయంలో నిందితుల నుంచి మౌనమే పోలీసులకు ఎదురవుతోంది. అదే సమయంలో.. వాళ్ల తల్లిదండ్రులు ఒకరి మీద ఒకరు నెపం నెట్టేసుకుంటున్నారు. దర్యాప్తు మొత్తం ఇప్పుడు ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగి.. ఆ సమాధానం బయటపడే వరకు ఈ కేసు అతిపెద్ద మిస్టరీ అలాగే కొనసాగనుంది. -
పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీ.. ప్రభుత్వం కొత్త ప్లాన్
ముంబై: బాల్యవివాహాల నియంత్రణకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న నిబంధనను పరిశీలిస్తోంది. ఇకపై పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించేలా సరికొత్త నిబంధన తీసుకురావాలని యోచిస్తున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అదితి తట్కరే బుధవారం అసెంబ్లీలో వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ సభ్యుడు అతుల్ భత్ఖాల్కర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను సభకు తెలిపారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో బాల్యవివాహాల రేటును 10 శాతం కంటే కిందకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను ముద్రించే విధానం ఇప్పటికే రాజస్థాన్లో అమల్లో ఉందని, దీనిపై అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, న్యాయ శాఖలతో సంప్రదింపులు జరిపి, ఈ విధానాన్ని మహారాష్ట్రలోనూ అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. -
‘రాబందు’ రాజసం!
రెక్కల నిండా స్వేచ్ఛను నింపుకొంది. దిక్చక్రాల సరిహద్దులు దాటింది. ఆకాశాన్నే సామ్రాజ్యంగా మార్చుకుందా రాజ విహంగం. పంజరాల గోడల మధ్య పుట్టి పెరిగినా, ప్రకృతి పిలుపు అందుకోగానే అడవి బాట పట్టింది. మహారాష్ట్ర కొండల్లో రెక్కలు విప్పిన ఓ రాబందు.. మధ్యప్రదేశ్ వనసీమలను దాటుకుంటూ, ఏకంగా మూడు వేల కిలోమీటర్ల అవతల ఉన్న రాజస్థాన్ రాజకోటను ముద్దాడింది. అంతరించిపోతున్న తన జాతి మనుగడకు సరికొత్త ఆశల రెక్కలు తొడుగుతూ.. వన్యప్రాణి సంరక్షణ చరిత్రలోనే ఒక అద్భుతమైన ‘మహా యాత్ర’ను లిఖించింది..మూడు రాష్ట్రాల మీదుగా.. వన్యప్రాణి సంరక్షణలో ఒక సరికొత్త రికార్డు నమోదైంది. మహారాష్ట్రలోని మేల్ఘాట్ అడవుల్లో శాస్త్రవేత్తలు స్వేచ్ఛగా విడిచిపెట్టిన ‘ఎక్స్–67’ (ఎక్స్67) అనే ఐదేళ్ల ఆడ రాబందు.. కేవలం 27 రోజుల్లో మూడు రాష్ట్రాల మీదుగా ఏకంగా 3,334 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, రాజస్థాన్లోని ప్రసిద్ధ రణథంబోర్ టైగర్ రిజర్వ్కు చేరుకుంది. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ డైరెక్టర్ కిశోర్ రీథే బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. మానవ సంరక్షణలో పెరిగి, అడవిలోకి వెళ్లిన పక్షులు.. మనుషుల సాయం లేకుండా స్వయంగా ఆహారాన్ని వెతుక్కోగలవని, ప్రకృతి శైలికి అద్భుతంగా అలవాటుపడగలవని ఈ ఘనత నిరూపించింది. భారతదేశంలో వేగంగా అంతరించిపోతున్న రాబందుల జనాభాను తిరిగి పెంచేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇది పెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు.అడవుల నెట్వర్క్లోనే బసఈ ఏడాది జనవరి 2న మేల్ఘాట్ నుంచి సోలార్ ట్రాకింగ్ ట్యాగ్లు అమర్చి వదిలిన 15 రాబందులలో ఈ ‘ఎక్స్–67’ ఒకటి. మొదట నాలుగు నెలల పాటు స్థానిక అడవుల్లోనే తిరుగుతూ ప్రకృతికి అలవాటుపడిన ఈ పక్షి.. మే 28న తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది. మహారాష్ట్ర నుంచి బయలుదేరి మధ్యప్రదేశ్లోని సాత్పురా టైగర్ రిజర్వ్, భోపాల్ ప్రాంతం, చిరుతలను పునరుద్ధరించిన కునో నేషనల్ పార్క్లలో తాత్కాలికంగా బస చేస్తూ.. మంగళవారం నాటికి రాజస్థాన్ రణథంబోర్ చేరుకుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
తిరుగుబాటు ఎంపీల లేఖ ఇవ్వండి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గంలో చేరిన తమ పార్టీకి చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎంపీలు సమర్పించిన వినతిపత్రం ప్రతులను తమకు అందజేయాలని శివసేన (యూబీటీ) లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరింది. బుధవారం సాయంత్రం స్పీకర్తో భేటీ అయిన అనంతరం ఆ పార్టీ ఎంపీలు అనిల్ దేశాయ్, అరవింద్ సావంత్ విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ నిబంధనలను నిలబెట్టాలని స్పీకర్ను అభ్యర్థించామని, తిరుగుబాటుదారులు ఇచ్చిన డిమాండ్ల ప్రతి ఇవ్వాలని కోరామని వారు వెల్లడించారు. రెబెల్స్ నుంచి ఇప్పటివరకు లిఖితపూర్వకంగా ఎలాంటి లేఖ అందలేదని స్పీకర్ చెప్పారని అరవింద్ సావంత్ పేర్కొన్నారు. ఒకవేళ రెబల్ ఎంపీలు తన కార్యాలయానికి ఏవైనా పత్రాలు సమర్పించి ఉంటే, ఆ వివరాలను పరిశీలించి అప్డేట్ ఇస్తానని స్పీకర్ హామీ ఇచ్చారని దేశాయ్ పేర్కొన్నారు. -
చంపేందుకే లోహగఢ్ ట్రెక్కింగ్ ప్లాన్ CCTV కెమెరాలో అంతా రికార్డ్
-
రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్ : కేతన్ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు
మహారాష్ట్రలోని లోహగడ్ కోటవద్ద రియల్ ఎస్టేట్ డైరెక్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి చేసి కాబోయే కోడల్ని ఎంతో ఆనందంగా ఇంటికి తీసుకురావాలని ఎన్నో ఆశలతో ఎదురు చూసిన ఆ కుటుంబం చివరికి కాబోయే కోడలి క్రూరత్వానికి బలైపోయింది. జీవితంలో ఎప్పటికీ కోలుకోలేని తీవ్ర ఆవేదన మిగిల్చింది.కన్నతల్లి ఆవేదన.. ఆఖరి మాటలుకొడుకు మరణవార్త విన్న కేతన్ తల్లి రాఖీ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ గుండెకోత తట్టుకోలేక స్పృహతప్పి పడిపోతున్నారు. తనే పంపించానని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. అసలు ఆ రోజు లోహగఢ్ కోట ట్రిప్కు వెళ్లమని కేతన్ను ఒప్పించింది అతని తల్లే. దాంతో కొడుకును మృత్యుపాశంలోకి తానే నెట్టేసానని తల్లి తల్లడిల్లిపోతోంది. ఆమె తీరని ద్రోహం చేసింది. మా యింటి పిల్ల అనుకున్నాం. కలిసి షాపింగ్లు చేశాం, కలిసి భోంచేశాం కానీ ఇంత దారుణానికి తెగ బడుతుందని అస్సలు ఊహించలేదని కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కాబోయే కోడలి గురించి తల్లి, కొడుకుతో చెప్పిన చివరిమాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు."My son is no more. Siya betrayed us. We treated her like family, went shopping and had dinners together, but never imagined this," said Ketan Agarwal's grieving mother. 💔 Meanwhile, Ketan's father has appealed for a fast-track trial and the strictest punishment for the… pic.twitter.com/ebQ5MkWggS— Megh Updates 🚨™ (@MeghUpdates) June 24, 2026చివరి మాటలుకేతన్ ట్రిప్కు బయలుదేరే ముందు తల్లి రాఖీ అగర్వాల్ అతనికి చెప్పిన చివరి మాటలు.. ‘‘సియాను జాగ్రత్తగా చూసుకో. ఆమెను అస్సలు ఇబ్బంది పెట్టకు’’ అని కొడుకు ప్రాణాలు తీయబోయే అమ్మాయి గురించే ఆ తల్లి ఆఖరి నిమిషం వరకు అంతగా తాపత్రయపడటం అందరినీ కలచివేస్తోంది.35 ఏళ్ల బంధంఅగర్వాల్, గోయల్ కుటుంబాల మధ్య 35 ఏళ్ల పరిచయం అందుకే రాఖీ అగర్వాల్ కాబోయే కోడలు సియాను తన సొంత కూతురిలా చూసుకున్నారు. అలాంటి సియానే తన కొడుకును చంపడానికి కుట్ర పన్నిందని తెలిసి ఆమె కుప్పకూలిపోయారు.తండ్రి మరో వాదనకేతన్ తండ్రి పుణేలో ప్రముఖ వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్ ఈ హత్యకు సంబంధించిన మరికొన్ని భయంకరమైన వివరాలను పంచుకున్నారు. కేతన్ను కోట పైనుంచి కిందకు నెట్టేయడానికి ముందే.. సియా, చేతన్ చౌదరి ఇద్దరూ కలిసి పదునైన ఆయుధంతో కేతన్ తలపై బలంగా కొట్టారు. అతడు స్పృహ తప్పేలా లేదా కనీసం తప్పించుకోలేనంత బలహీనపడేలా చేసిన తర్వాతే పైనుంచి కిందకు నెట్టేసి చంపేశారని వాపోయారు.ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడాలిపోలీసులు చాలా వేగంగా దర్యాప్తు చేసి నిజాన్ని బయటపెట్టారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి, నిందితులకు త్వరగా అత్యంత కఠినమైన శిక్ష పడేలా చేయడమే నా ఏకైక డిమాండ్. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చేయాలనుకునే వారికి ఇదొక హెచ్చరిక కావాలి అని తండ్రి విశాల్ అగర్వాల్ ప్రభుత్వాన్ని కోరారు.బర్త్డే వేడుక కోసం స్టార్ హోటల్లో 70 రూములు తన కుమారుడి కాబోయే భార్య సియా గోయల్ పుట్టినరోజు వేడుకను మహారాష్ట్రలోని హిల్ స్టేషన్ మహాబలేశ్వర్లోని ఒక ఫైవ్-స్టార్ హోటల్లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే, సియా మనసులో తన కుమారుడికి సంబంధించి ఒక భయంకరమైన పథకం ఉందని ఆయనకు తెలియదు.జూన్ 20న మహాబలేశ్వర్లో సియా పుట్టినరోజును కేతన్, సియా, కుటుంబాలు కలిసి జరుపుకోవాలని అనుకున్నాయి. ఇందుకోసం కేతన్ తండ్రి ఆ హిల్ స్టేషన్లోని ఒక ఫైవ్-స్టార్ హోటల్లో 70 గదులను బుక్ చేశారు. అయితే, ఆ ప్లాన్ను రద్దు చేసుకుని, దానికి బదులుగా పుణె సమీపంలోని లోహగడ్ కోటకు ఒంటరిగా వెళ్లేలా సియా కేతన్ను ఒప్పించింది. ప్రియుడితో కలిసి తన ప్లాన్ను పక్కాగా అమలు చేసిన కేతన్ను హతమార్చింది.రూ. 17 కోట్ల పెళ్లి వేడుక.. అంతలోనే విషాదంకేతన్ (26), సియా (20) ల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరిగింది. నవంబర్లో రాజస్థాన్లోని ఉదయపూర్లో వీరి వివాహం జరగాల్సి ఉంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం జైపూర్లోని ఒక ప్యాలెస్ను రూ. 17 కోట్ల భారీ బడ్జెట్తో బుక్ చేశారు. బంధువులను, అతిథులను తీసుకురావడానికి రెండు ప్రైవేట్ విమానాలను కూడా సిద్ధం చేశారు. పెళ్లి కొడుకు ముస్తాబులో చూడాలనుకన్న తమ కుమారుడు ఇలా విగత జీవిగా మారిపోవడం కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది.ఇదీ చదవండి: 11 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం : ఆ తర్వాత తాపీగా క్యాబ్ డ్రైవింగ్ఎవరీ కేతన్ అగర్వాల్కుటుంబ యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ 'సక్సెస్ గ్రూప్'కు డైరెక్టర్గా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO)గా ఉండేవారు. పూణేలో నివసించేవారు.ఓలిన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంటర్ప్రెన్యూర్షిప్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేశారు. సింబయాసిస్ యూనివర్సిటీ నుండి బీబీఏ డిగ్రీని కూడా పొందారు. కేతన్ లింక్డ్ఇన్ బయో ప్రకారం, సుస్థిరత, ఆవిష్కరణలకు కట్టుబడి ఉండటమే కాదు, కేవలం ఆర్థిక వృద్ధిని పెంపొందించడమే కాకుండా, పచ్చని భవిష్యత్తుకు దోహదపడే ప్రాజెక్టులపై దృష్టి సారించారు.ఇదీ చదవండి : కేతన్ అగర్వాల్ హత్యలో ఎన్ని ట్విస్టులో: అపుడు తప్పిందనీ ప్లాన్ ‘సి’ సిద్ధం!కాగా కేతన్, సియాల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరిగింది, నవంబర్లో వారి వివాహం జరగాల్సి ఉంది. కానీ జూన్ 18న, సియాతో కలిసి లోహగడ్ కోటలో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు కేతన్ లోయలో పడి మరణించాడు. సియా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం అని భావించినప్పటికీ, విచారణలో సియా ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి ఎత్తు నుండి కిందకు తోసేశారని తేలింది. ఇదీ చదవండి: అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్ చెప్పిన షాకింగ్ నిజాలు -
మేయర్కు ఊహించని అనుభవం.. మ్యాన్హోల్లో పడ్డ కార్మికుడు
ముంబై మేయర్ రీతూ తావ్డేకు ఊహించని అనుభవం ఎదురైంది. ముంబైవ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించడానికి ఆమె నగర వీధులలో పర్యటించారు. అయితే అనూహ్యంగా ఆమె కళ్లెదుటే ఓ వ్యక్తి మ్యాన్హోల్లో పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ఆయనను రక్షించారు. ఇది చూసిన మేయర్ తీవ్ర అసహానంతో ఆగ్రహం చెందారు. నిన్న(మంగళవారం) ముంబైలో విపరీతంగా వర్షం కురిసింది. రాత్రంతా కురిసిన కుండపోత వర్షాల వల్ల నగరంలో రోడ్లు జలమయమవడమే కాకుండా, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల గోడలు కూలిపోవడం వంటి నష్టాలు కూడా జరిగాయి. దీంతో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి మేయర్ నగరంలో పర్యటించారు.బుధవారం ఉదయాన్నే దాదర్, హింద్మాతా, గాంధీ మార్కెట్ వంటి ప్రభావిత ప్రాంతాలకి వెళ్లారు. ఈ తనిఖీల సమయంలో ఒక పారిశుధ్య కార్మికుడు అక్కడే డ్రైనేజ్ తెరిచి ఉండడంతో అందులో పడిపోయాడు. అయితే ఈ సమయంలో అక్కడే ఉన్న మేయర్ ఈ ఘటనపై స్పందించారు. సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని, సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.అయితే ఈ ఘటన అనంతరం మేయర్ మీడియాతో మాట్లాడారు. భారీవర్షాల కారణంగా పేరుకపోయిన వ్యర్థాలను తొలగించడం కోసమే ఆ మ్యాన్హోల్ పారిశుద్ధ్య కార్మికులు పక్కకు జరిపారని వివరించారు. ఆ సమయంలో అక్కడ అక్కడ ఏర్పాటు చేసిన 'అలర్ట్' (హెచ్చరిక) బోర్డులను, బారికేడ్లను ప్రజల గమనించాలని సూచించారు.అయితే ముంబై వర్షాలపై ప్రతిపక్ష శివసేన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆదిత్య థాకరే, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బీఎంసీ నిధులను పూర్తిగా ఖాళీ చేసిందని ఆరోపించారు. గతంలో థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం సూచించినట్లుగా రెయిన్ వాటర్ ట్యాంకులను నిర్మించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందన్నారు.అయితే ఈ వ్యాఖ్యలకు మేయర్ కౌంటరిచ్చారు. "ఇంట్లో కూర్చుంటే పనులు కావు, క్షేత్రస్థాయిలోకి రావాలి" అంటూ ఎద్దేవా చేశారు. కోవిడ్ సమయంలో ఆధిత్య థాకరే ఇంట్లోనే కూర్చుని పాలన సాగించారని ఆరోపించిన మేయర్, ప్రతిపక్షాలు ముందుగా రోడ్లపైకి వచ్చి చూడాలని హితవు పలికారు.पालिका कर्मचारी महापौर ऋतू तावडे यांच्यासमोर man hole मध्ये पडला…आज मुंबईत मुसळधार पाऊस झाला त्याची पाहणी महापौर करत असताना सदर घटना घडली pic.twitter.com/gJMDQYptEd— Seema Adhe (@AdheSeema) June 24, 2026 -
అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్ చెప్పిన షాకింగ్ నిజాలు
మహారాష్ట్రలోని లోహగడ్ కోట హత్య కేసులో వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ సినిమా లాంటి సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భార్య సియా గోయల్ చేతిలో హత్యకు గురైన రియల్ ఎస్టేట్ డైరెక్టర్ కేతన్ అగర్వాల్ (Ketan Agarwal) కేసు దర్యాప్తులో పోలీసుల విచారణ ద్వారా మరికొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో సి ప్రియుడు చేతన్ చౌదరి సంచలన విషయాలను వెల్లడించాడు.హత్య కుట్రకు గల కారణంపోలీసుల విచారణలో నిందితుడు చేతన్ చౌదరి అసలు విషయాన్ని అంగీకరించాడు. "కేతన్ను చంపే బదులు, మీరిద్దరూ పెళ్లి రద్దు చేసుకుని ఎక్కడికైనా పారిపోవచ్చు కదా?" అని పోలీసులు ప్రశ్నించగా చేతన్ సమాధానం విని పోలీసులు విస్తుపోయారు. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని, చేతన్తో కలిసి పారిపోవడం సియా గోయల్కు ఇష్టం లేదనీ, అలా చేస్తే తమ కుటుంబ పరువు పోతుందని, సమాజంలో అవమానం జరుగుతుందని ఆమె భయపడిందని తెలిపాడు. కుటుంబ పరువు కోసం పెళ్లి ఆపలేక, ప్రియుడితో కలిసి జీవించడం కోసం కేతన్ను పూర్తిగా వదిలించుకోవడమే దారి అని భావించి ఈ హత్యకు ప్లాన్ చేశామని వెల్లడించాడు. ఇదీ చదవండి : కేతన్ అగర్వాల్ హత్యలో ఎన్ని ట్విస్టులో: అపుడు తప్పిందనీ ప్లాన్ ‘సి’ సిద్ధం!జూన్ 18న కేతన్ లోహగఢ్ కోట పైనుంచి కాలుజారి పడిపోయాడని సియా అందరినీ నమ్మించింది. తన కాబోయే భర్త మరణం తర్వాత సియా ప్రవర్తనలో ఎలాంటి విచారం కనిపించకపోవడం, పొంతన లేని సమాధానాల కారణంగా కేతన కుటుంబ సభ్యుల అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. అలా మొదలైన దర్యాప్తులో సియా, చేతన్ కుట్ర బట్టబయలైంది. కోట టికెట్ కౌంటర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పోలీసుల దర్యాప్తును పూర్తిగా మార్చేసింది.33 డిగ్రీల సెల్సియస్ ఎండలో హుడీ ధరించిన వ్యక్తి కదలికలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సియా, చేతన్ ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే కేతన్ను వెంబడించి హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితులను జూన్ 29 వరకు పోలీస్ కస్టడీకి తరలించారు. ఇదీ చదవండి : ఆ ఒక్కడి వల్ల ముగ్గురు బలి : గాయని చిన్మయి ఫైర్ -
కేతన్ అగర్వాల్ హత్యలో ఎన్ని ట్విస్టులో: అపుడు తప్పిందనీ ప్లాన్ ‘సి’ సిద్ధం!
మహారాష్ట్రలోని లోహగఢ్ కోట సమీపంలో జరిగిన కేతన్ అగర్వాల్ (26) మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించిన ఈ ఘటన.. అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పన్నిన క్రూరమైన హత్య కుట్రగా తేలడం అందర్నీ షాక్కు గురిచేసింది.తన కాబోయే భార్య సియాను ఎంతగానో ప్రేమించిన కేతన్ ఆమె పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆమెతో ఏడు అడుగులు వేయాలని కలలు కంటున్న తరుణంలో జూన్ 18న సియా చేతిలో హత్యకు గురయ్యాడు. మొదట అతడు కాలు జారి పడిపోయాడని అందరూ భావించారు.సోదరి అనుమానంతో గుట్టు రట్టుకానీ, కేతన్ అంత్యక్రియలు జరిగిన నాలుగు రోజుల తర్వాత సియా వారి కుటుంబ సభ్యులను కలవడానికి వచ్చినపుడు అనుమానం మొదటైంది. ఆ సమయంలో ఆమె చెప్పిన వివరాలలో తేడాలు ఉండటాన్ని కేతన్ సోదరి గమనించింది. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు సియా ఫోన్ రికార్డులను పరిశీలించడంతో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.6 నెలల్లో 2004 కాల్స్సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి గత ఆరు నెలల్లో ఏకంగా 2,004 సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారు. మొత్తం 238 గంటలకు పైగా ఫోన్ కాల్స్లో గడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కాల్ డేటానే ఈ హత్య కుట్రను ఛేదించడానికి కీలక ఆధారంగా మారింది.పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నంఘటన జరిగిన రోజు చేతన్ చౌదరి తన లొకేషన్ దొరకకూడదని చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5:40 గంటల వరకు తన ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ను ఆపివేశాడు. తన మొబైల్ ఫోన్ను ఎవరూ ట్రాక్ చేయకుండా తన దుకాణంలోనే వదిలేశాడు.ఇదీ చదవండి : ఆ ఒక్కడి వల్ల ముగ్గురు బలి : గాయని చిన్మయి ఫైర్లోహగఢ్ కోటకు వెళ్లేటప్పుడు తన దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి మొబైల్ ఫోన్ను తీసుకు వెళ్లాడు. అయితే, పోలీసులు డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ/సర్వైలెన్స్ డేటా ద్వారా అతడు అక్కడికి వెళ్లినట్లు నిర్ధారించారు. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరినీ కోర్టు జూన్ 29 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది.మండుటెండలో హుడీసీసీటీవీ ఫుటేజ్ ప్రకారం 33 డిగ్రీల సెల్సియస్ మండుటెండలో ట్రెకింగ్ చేస్తుండగా హుడీ ధరించిన వ్యక్తి అనుమానాస్పద కదలికలు,ఇంత ఎండలో హైకింగ్కు వెళ్లేటప్పుడు ఎవరైనా హుడీ ఎందుకు ధరిస్తారనే అనుమానమే ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. పోలీసుల కథనం ప్రకారం, కోట వద్ద కేతన్, అతని కాబోయే భార్య సియా కలిసి నడుస్తుండగా సీసీటీవీలో కనిపించింది. సియా ప్రియుడైన చేతన్ చౌదరిగా గుర్తించబడిన మరో వ్యక్తి, వారికి సుమారు 20 నుండి 30 అడుగుల దగ్గర నుండి వారిని ఫాలో అయ్యాడు. అతను షార్ట్స్, ముఖాన్ని కప్పివేసే హుడీ ధరించి కనిపించాడు. హుడీపై హెడ్సెట్ కూడా పెట్టుకున్నాడు.మరో సీసీటీవీ ఫుటేజ్లో, సియా అకస్మాత్తుగా హుడీ ధరించిన వ్యక్తి వైపు వెనక్కి తిరిగి చూసి, వెంటనే కూర్చుండిపోయింది. సియా, చేతన్ల మధ్య బలమైన సంబంధం ఉందని, పక్కా ప్రణాళికతో పన్నిన కుట్ర అని కూడా టెక్నికల్ డేటా ద్వారా తేలింది.ఇదీ చదవండి: 11 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం : ఆ తర్వాత తాపీగా క్యాబ్ డ్రైవింగ్అపుడే తోసేసింది..కానీ కేతన్, సియాలు మే 31, జూన్ 14 , జూన్ 18 తేదీలలో మూడుసార్లు లోహగడ్ కోటకు ట్రెక్కింగ్కు వెళ్లినట్టు తెలుస్తోంది. కేతన్ హత్యకు కొన్ని రోజుల ముందు, అంటే గత నెలలో, ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం కేతన్, సియా బాలికి వెళ్లాల్సి ఉంది. అయితే, ముంబై విమానాశ్రయంలో తన పాస్పోర్ట్ కనిపించడంలేదని డ్రామా ఆడింది. సియా కావాలనే పాస్పోర్ట్ను దాచిపెట్టి ఆ ప్రయాణాన్ని అడ్డుకుందని బాధితుడి తండ్రి ఆరోపించారు.ఆ తర్వాత లోహగడ్ కోటకు వెళ్ళినప్పుడు, జూన్ 14న సియా కేతన్ను హత్యకు తొలిసారి ప్రయత్నించి విఫలమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొండపై నెంచి అతణ్ని నెట్టేసింది. అయితే అతను కొండ అంచున ఉన్న పొదను పట్టుకుని ప్రాణాలు కాపాడుకో గలిగాడు. తన చర్యను కప్పిపుచ్చుకోవడానికి, పాము కనిపించిందని అరుస్తూ అందరి దృష్టి మళ్లించి, ఆపై అతన్ని వాటేసుకుని బావురుమంటూ నాటకం ఆడింది. అలా తొలి ప్రయత్నం విఫలం కావడంతో ఈసారి ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ వేసి కేతన్ను మట్టుబెట్టారు. అంతేకాదు ఒకవేళ అనుకున్నట్టు జరగకపోతే, 'ప్లాన్ సి' (మూడో ప్లాన్) కూడా సిద్ధం చేసుకున్నారట.మరోవైపు,చేతన్ తరపు న్యాయవాది రామ్ షహానే ఈ ఆరోపణలను ఖండించారు. ఎఫ్ఐఆర్లో చేతన్కు ఈ మరణంతో సంబంధం ఉన్నట్లు ఎక్కడా ప్రత్యక్ష ఆధారాలు లేవని, ఘటన జరిగిన సమయంలో అతడు లోహగఢ్ ప్రాంతంలో ఉన్నట్లు ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ లేదా పత్రాలను పోలీసులు చూపించలేదని వాదించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో మరిన్ని డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు. సియా ఒక బేకరీని నడుపుతుండగా, చేతన్ డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసేవాడు.ఇదీ చదవండి: ముగ్గురికి గుడ్బై : వ్యాపారవేత్తతో 62 ఏళ్ల మోడల్ ఎంగేజ్మెంట్కాగా మహారాష్ట్రకు చెందిన ప్రముఖవ్యాపారవేత్త కుమారుడైన కేతన్, సియాల నిశ్చితార్థం ఈ ఏడాది ఫిబ్రవరిలోజరిగింది. ప్రైవేట్ జెట్లు, రాజభవనాల వేదికగా ఈ ఏడాది నవంబర్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలనుకున్నాడు కేతన్. కానీ అనూహ్యంగా అనంత లోకాలకు చేరడం విషాదం. -
'లోహగడ్ కోట' కేసులో.. కొత్త కోణం!
మండు వేసవిలో ఉక్కపోస్తుండగా ఎవరైనా హుడీ ధరిస్తారా? ఇదే అనుమానం పుణే పోలీసులకు వచ్చింది. వెంటనే ఈ దిశగా దర్యాప్తు సాగించడంతో అసలు నిజం బయటపడింది. అప్పటి వరకు ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పరిగణించబడిన కేసు కొత్త మలుపు తిరిగింది. పథకం ప్రకారం హత్య చేశారని వెల్లడైంది.పుణే: మహారాష్ట్రలో సంచలనం రేపిన పుణే వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 18న లోహగడ్ కోట వద్ద 400 అడుగుల లోతు లోయలో పడిపోయి విశాల్ చనిపోయాడు. తనను ఫొటోలు తీస్తూ ప్రమాదవశాత్తు అతడు లోయలో పడిపోయాడని అతడికి కాబోయే భార్య సియా గోయల్ (Siya Goyal).. లూనావాలా రూరల్ పోలీసులకు చెప్పింది. అయితే ప్రియుడితో కలిసి విశాల్ను ఆమె లోయలోకి తోసేసిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.ఎలా కనిపెట్టారంటే.. ?కాబోయే భార్య సియా గోయల్తో కలిసి కేతన్ అగర్వాల్ (Ketan Agarwal).. ఈనెల 18న చారిత్రక లోహగడ్ కోటకు వెళ్లాడు. వీరిని కొంత దూరం నుంచి ఓ వ్యక్తి వ్యక్తి అనుసరిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి షార్ట్, ముఖాన్ని పూర్తిగా కప్పే హుడీ ధరించి.. తలకు హెడ్సెట్ పెట్టుకున్నాడు. ఆ రోజు ఉష్ణోగ్రత సుమారు 33 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఇలాంటి ఉక్కపోత వాతావరణంలో అతడు హుడీ ఎందుకు ధరించాడనే సందేహం పోలీసులకు వచ్చింది. వెంటనే ఈ దిశగా దర్యాప్తు సాగించారు. మరో వీడియోలో సియా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగా, వెంటనే హుడీ ధరించిన వ్యక్తి కూర్చోవడం కనిపించింది. దీంతో అనుమానం బలపడింది.మరోవైపు కేతన్ మరణించిన తర్వాత కూడా సియా ముఖంలో ఎలాంటి బాధ కనిపించకపోవడాన్ని పోలీసులు గమనించారు. పెళ్లి ఇష్టం లేనట్టుగా సియా గోయల్ కనిపించిందని కేతన్ మామ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. పెళ్లిని ఏడాది పాటు వాయిదా వేయవచ్చా అని ఒకసారి తనను అడిగిన విషయాన్ని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కుట్ర కోణంలో దర్యాప్తు మొదలుపెట్టడంతో అసలు నిజం బయటకు వచ్చింది. ప్రియుడు చేతన్ చౌధరి (Chetan Choudhary)తో కలిసి సియా గోయల్ తనకు కాబోయే భర్తను హత్య చేసిందని నిర్ధారణయింది.2,004 ఫోన్ కాల్స్ !సాంకేతిక ఆధారాలతో సియా, చేతన్ మధ్య సన్నిహిత సంబంధాలు బయటపడ్డాయి. చేతన్ సోషల్ మీడియా ఫోటోలను సీసీటీవీ దృశ్యాలతో పోల్చి చూడగా, ఫుటేజ్లో కనిపించిన వ్యక్తి అతడేనని పోలీసులు నిర్ధారించారు. ఇక గత ఏడు నెలల్లో సియా, చేతన్ మధ్య 2,004 ఫోన్ కాల్స్ జరిగినట్లు, వాటి మొత్తం వ్యవధి 238 గంటలకుపైగా ఉన్నట్లు విచారణలో తేలింది. గతేడాది నవంబరు నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు తెలిసింది. సియా బేకరీ వ్యాపారం నిర్వహిస్తుండగా, చేతన్ డ్రైఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్నాడు. తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి కేతన్తో పెళ్లికి సియా ఒప్పుకుందని సమాచారం. మొదటి హత్యాయత్నం విఫలం!కేతన్ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సియా, చేతన్తో కలిసి అతడిని హత్య చేయాలని కుట్ర చేసింది. ఇందులో భాగంగా కేతన్ను సియా.. ఫొటో షూట్ పేరుతో లోహగడ్ కోటకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడికి వచ్చిన చేతన్తో కలిసి కేతన్ను లోయలోకి తోసేసి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మొదటి హత్యాయత్నం విఫలమైందని వెల్లడించారు. జూన్ 14న కూడా లోహగడ్ కోట వద్ద సియా కేతన్ను లోయలోకి నెట్టేసి చంపేందుకు ప్రయత్నించింది. అయితే అతడు పక్కనే ఉన్న పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి అనుమానం రాకుండా ఉండేందుకు కట్టుకథ అల్లింది. పాము కనిపించడంతో భయంతో అతడి మీద పడ్డానని చెప్పడంతో కేతన్ నమ్మేశాడు.చదవండి: బంధం ముగిస్తే సరిపోదా.. బలి ఎందుకు?ప్లాన్- సీ కూడా సిద్ధం!మొదటి ప్రయత్నం విఫలం కావడంతో జూన్ 18న మళ్లీ పథకం అమలు చేసి కేతన్ను హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రయత్నం కూడా విఫలమైతే అమలు చేసేందుకు మరో ప్రత్యామ్నాయ ప్రణాళికను ("ప్లాన్-సీ") సిద్ధం చేసుకున్నట్లు కేసు పత్రాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌధరిలను హత్య, నేరపూరిత కుట్ర కేసుల్లో అరెస్టు చేసిన పోలీసులు వారిని ఏడు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
ముంబైపై వరుణుడి దండయాత్ర.. ఆర్థిక రాజధాని అతలాకుతలం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహా నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు రుతుపవనాల రాక ఉపశమనం కలిగించినప్పటికీ, ఒక్కసారిగా కురిసిన కుండపోత వానతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పశ్చిమ శివారు ప్రాంతాల్లో అత్యధికంగా 190 మిల్లీమీటర్ల, తూర్పు శివారు ప్రాంతాల్లో 154 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, నగరవ్యాప్తంగా సగటున 184 మి.మీ. మేర భారీ వర్షం కురిసింది. దీంతో పలు కీలక రహదారులపై ట్రాఫిక్ నెమ్మదించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. #WATCH | Maharashtra | An underpass in Mumbai's Andheri area was closed after it was flooded due to severe water logging amid heavy rains in the city.A BMC Official Rhitik says, "... We have not been able to find a temporary solution for this severe water logging... Our… pic.twitter.com/QsN7WbXjYw— ANI (@ANI) June 23, 20262:15 AM - Mumbai is covered by rainbands from all sides! 🟠 Rain seems unstoppable and is likely to continue overnight leading to waterlogging in many areas. Rains likely to stay consistent moderate to heavy at least till morning ⛈️⚠️Stay tuned for live updates #MumbaiRains pic.twitter.com/DOb0oXnwWT— Mumbai Rains (@rushikesh_agre_) June 23, 2026అర్ధరాత్రి ముంచెత్తిన వాన.. జలమయమైన రోడ్లుమంగళవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా హింద్మాతా, మాతుంగా, కుర్లా, అంధేరి వంటి ప్రాంతాల్లో వీధులన్నీ చెరువులను తలపించాయి. ఈ ఆకస్మిక వరద పరిస్థితి కారణంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెంట్రల్ ముంబైలోని నాయర్ హాస్పిటల్ పరిధిలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 7 గంటల మధ్య అత్యధికంగా 78.96 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే ఎన్ఎమ్ జోషి మార్గ్-లోయర్ పరేల్లో 78.4 మి.మీ, పరేల్ టీటీలో 72.63 మి.మీ, పశ్చిమ శివారులోని మలాడ్ బస్ డిపో వద్ద 61.8 మి.మీ వాన పడింది. Happy Monsoon, Mumbai 😄#MumbaiRainspic.twitter.com/VcxWA1lAde— Mumbai Rains (@rushikesh_agre_) June 23, 202613 రోజులు ఆలస్యంగా రుతుపవనాల ఎంట్రీసాధారణంగా జూన్ 10 నాడే ముంబైని తాకాల్సిన నైరుతి రుతుపవనాలు, ఈసారి 13 రోజులు ఆలస్యంగా మంగళవారం నాడు నగరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ముంబై చరిత్రలో ఇది అత్యంత ఆలస్యమైన ప్రవేశం ఏమీ కాదు. 2023లో జూన్ 25న రుతుపవనాలు రాగా, అత్యంత సుదీర్ఘ ఆలస్యంగా 1958, 1974 సంవత్సరాల్లో జూన్ 28న రుతుపవనాలు ముంబైని తాకాయి. ప్రస్తుతం ఈ రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంతో పాటు మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బిహార్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.#WATCH | Maharshtra | Heavy downpour continues across various parts of Mumbai city. pic.twitter.com/YYDSD1GObh— ANI (@ANI) June 24, 2026అప్రమత్తమైన అధికారులుభారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ముంబై నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది. ప్రధాన సబ్వేలన్నీ తెరిచే ఉన్నాయని, సబర్బన్ రైల్వే సర్వీసులు, బెస్ట్ బస్సులు ఎలాంటి అంతరాయం లేకుండా నడుస్తున్నాయని తెలిపింది. అయితే, రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో, లోతట్టు ప్రాంతాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.ఇది కూడా చదవండి: పిడుగుల ఊచకోత: ఒకే రోజు 11 మంది దుర్మరణం -
కాబోయే భర్తను లోయలోకి తోసేసిన భార్య
-
ఫొటోల వంకతో కాబోయే భర్తను లోయలోకి తోసేసిందా..?
ముంబై: పుణె వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన ప్రమాదవశాత్తు చనిపోలేదని కావాలనే లోయపై నుంచి తోసి వేశారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భార్య 'సియా గోయల్', ఆమె స్నేహితుడు 'సుధాన్షు చౌదరి'లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల నిర్ధారణతో వెలుగుచూసిన అంశాలతో అంతా షాకింగ్ గురయ్యారు.ఏం జరిగిందిపుణేకు చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ జూన్ 18న చారిత్రక లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోతు లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాము ట్రెక్కింగ్కు వచ్చామని, కేతన్ తనను ఫొటోలు తీస్తుండగా హోరుగాలికి పట్టుతప్పి లోయలో పడిపోయాడని కేతన్ కాబోయే భార్య పోలీసులకు తెలిపింది. దాంతో ప్రమాదంగా భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.అయితే విచారణ సందర్భంగా కేతన్ కాబోయే భార్య పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. హత్య కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అతడిది హత్య అని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ కేసులో కేతన్ కాబోయే భార్యను, ఆమె మిత్రుడిని అదుపులోకి తీసుకున్నట్లు విచారణ చేపట్టారు.పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్.. తన కుటుంబ స్థిరాస్తి వ్యాపార కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. ఇటీవలే అతడికి వివాహం నిశ్చయమైంది. నవంబర్లో జరిగే పెళ్లి వేడుక కోసం ఉదయ్పుర్లోని ఖరీదైన ప్యాలెస్ను కూడా బుక్ చేశారు. జూన్ 19న కాబోయే భార్య పుట్టినరోజు ఉండటంతో ఆ వేడుకల కోసం కేతన్ కొంతమంది మిత్రులతో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లారు. అక్కడే ఈ విషాద ఘటన జరిగింది.అంగరంగ వైభవంగా వివాహ వేడుక వివాహం ఈ నవంబర్లో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరగాల్సి ఉంది. దీని కోసం ఇరు కుటుంబాలు జైపూర్లో రూ.17 కోట్ల వ్యయంతో ఒక ప్యాలెస్ను బుక్ చేశారు. అంతేకాకుండా అతిథుల కోసం రెండు ప్రైవేట్ విమానాలను ఏర్పాటు చేశారని మృతుడి బంధువులు తెలిపారు. ఆ సమయంలో ఇలాంటి ఘటన జరగడం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. -
మరి ఇంత అహంకారామా? శ్రీలీలను అవమానించిన సీఎం భార్య
-
ఉద్ధవ్ ‘సేన’లో చీలిక
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన (యూబీటీ) పార్లమెంటరీ పార్టీ అధికారికంగా చీలిపోయింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు లోక్సభ ఎంపీలు అధికార పక్షం, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అధికారికంగా చేరారు. తాజా పరిణామంతో శివసేన (యూబీటీ) తిరుగుబాటు ఎంపీల రాజకీయ భవితవ్యంపై కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. తాజా పరిణామంతో శివసేనపై షిండే పట్టు మరింత బలపడటంతోపాటు, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రభావం మరింతగా పెరిగింది. సోమవారం ముంబైలో షిండే, సీనియర్ నేతలు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఉద్ధవ్ వర్గంలోని ఆరుగురు ఎంపీలు శివసేనలో చేరారు. అనంతరం, ఆరుగురితో కలిసి షిండే మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ టైగర్ విజయవంతంగా పూర్తయిందని ఈ సందర్భంగా ప్రకటించారు. ‘ఈ రోజు ఇక్కడ నా పక్కన ఏకంగా ఆరు పులులున్నాయి. ఈసారి మేం సిక్స్ కొట్టాం’అని చెప్పారు. ఈ 6 ఎంపీలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన రాజకీయ దురంధరులు అంటూ పొగిడారు. వీరి చేరిక కోసం పక్కా ప్రణాళికతో చేపట్టిన ఆపరేషన్ టైగర్ విజయవంతంగా పూర్తయిందంటూ చెప్పుకొచ్చారు. 13కు చేరిన షిండే వర్గం ఎంపీలు ఢిల్లీలో ఐదు రోజుల క్రితం జరిగిన శివసేన (యూబీటీ) పార్లమెంటరీ పార్టీ భేటీకి మొత్తం 9 మంది ఎంపీలకుగాను ఆరుగురు డుమ్మాకొట్టగా ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. ఆ ఆరుగురే తాజాగా షిండే పార్టీలో చేరారు. వారు..సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాదవ్, సంజయ్ దినా పాటిల్, నగేశ్ పాటిల్, ఓం ప్రకాశ్ రాజే నింబాల్కర్, భావుసాహెబ్ వాక్చౌరె ఉన్నారు. వీరంతా కలిసి బయటకు రావడంతో ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రాకుండా ఉండేందుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ ఈ వర్గానికి లభించినట్లయింది.ఉద్ధవ్ భేటీకి ఎమ్మెల్సీ, ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా శివసేన(యూబీటీ)లో మరో ముసలం మొదలయిందా అంటే, అవుననే అంటున్నారు. సోమ వా రం ఆరుగురు లోక్సభ ఎంపీలు షిండే శివసేనలో చేరారు. అదే సమయంలో ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఏర్పాటు చేసిన భేటీకి ముగ్గురు కీలక ప్రజాప్రతినిధులు మొహం చాటేయడమే ఇందుకు కారణంగా మారింది. వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు శివసేన(యూబీటీ) ప్రధాన కార్యాలయం శివాలయ్లో ఉద్ధవ్ ఠాక్రే సమావేశం ఏర్పాటు చేశారు. భేటీకి ఎమ్మెల్యేలు సంజయ్ పొట్నిస్, రాహుల్ పాటిల్, ఎమ్మెల్సీ సునీల్ షిండే డుమ్మా కొట్టారు. -
మహా రాజకీయం.. ఉద్ధవ్కు బిగ్ షాక్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన(UBT)కు చెందిన ఆరుగురు లోక్సభ ఎంపీలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అధికారికంగా చేరనున్నట్లు సమాచారం. ఈ పరిణామం ఉద్ధవ్ వర్గానికి భారీ రాజకీయ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. మహారాష్ట్రలో కొన్ని రోజులుగా సాగుతున్న ‘ఆపరేషన్ టైగర్’కు ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు.గత కొన్ని రోజులుగా శివసేన (యూబీటీ)లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎంపీలు వరుసగా షిండే వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో ఆరుగురు ఎంపీలు.. ఏక్నాథ్ షిండే సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. షిండే వర్గంలో చేరుతున్న వారిలో ఎంపీలు సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాధవ్, భౌసాహెబ్ వక్చౌరే, నాగేశ్ పాటిల్ అష్టికర్, ఓంప్రకాశ్ రాజే నింబాల్కర్ ఉన్నట్లు సమాచారం. వీరిలో కొందరు ఇప్పటికే బహిరంగంగా షిండే నాయకత్వానికి మద్దతు ప్రకటించగా, మరికొందరు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం అధికార పక్షంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.ఇటీవలే ఎంపీ ఓంప్రకాశ్ రాజే నింబాల్కర్ అధికారికంగా షిండే శివసేనలో చేరడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆ వెంటనే మరికొందరు ఎంపీలు కూడా అదే బాట పట్టడంతో ఉద్ధవ్ థాక్రే వర్గంలో ఆందోళన నెలకొంది. లోక్సభ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరిచిన యూబీటీకి ఇది ఊహించని పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర అధికార కూటమి ఈ పరిణామాన్ని తమ రాజకీయ విజయంగా ప్రచారం చేస్తోంది. అధికార పక్షంతో ఉంటేనే ప్రజల సమస్యలను సమర్థంగా పరిష్కరించగలమనే అభిప్రాయంతో పలువురు ప్రజాప్రతినిధులు ముందుకు వస్తున్నారని పలువురు మంత్రులు చెబుతున్నారు.అయితే ఉద్ధవ్ థాక్రే వర్గం మాత్రం ఈ పరిణామాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. కొందరు అసంతృప్త ఎంపీలు ఇంకా తమతోనే సంప్రదింపులు జరుపుతున్నారని, పార్టీని వీడిన వారిలో కొందరు తిరిగి వచ్చే అవకాశమూ ఉందని చెప్పారు. శివసేన (యూబీటీ) బలహీనపడలేదని, కార్యకర్తల మద్దతు తమకే ఉందని ఆయన స్పష్టం చేశారు.2022లో జరిగిన శివసేన చీలిక తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇప్పుడు అదే తరహాలో ఎంపీల స్థాయిలోనూ వలసలు కొనసాగడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తాజా చేరికలతో మహారాష్ట్రలో షిండే వర్గం మరింత బలోపేతం అవుతుండగా, ఉద్ధవ్ థాక్రే వర్గం ముందు కొత్త సవాళ్లు నిలుస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలపై గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
ప్రీవెడ్డింగ్ షూట్లో చిన్నారి పెళ్లికూతురు
బీడ్: సామాజిక మాధ్యమాల్లో పెళ్లికి ముందు ఫొటోషూట్లు, రీల్స్ అప్లోడ్ చేసే ధోరణి పెరిగిపోయింది. ఈ ధోరణే ఓ బాల్య వివాహాన్ని ఆపింది. 15 ఏళ్ల బాలికను కాపాడింది. పెళ్లికి ముందు చేసిన ఫొటోషూట్ ఓ బాల్య వివాహాన్ని అడ్డుకుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన చిత్రాలు అధికారుల దృష్టికి చేరడంతో వెంటనే చర్యలు చేపట్టారు. 15 ఏళ్ల బాలికను రక్షించి, పెళ్లిని నిలిపివేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసిన ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చిత్రాలపై జిల్లా కలెక్టర్ వివేక్ జాన్సన్కు సమాచారం అందింది. జియోరాయ్ తాలూకాలో 15 ఏళ్ల బాలికకు 23 ఏళ్ల యువకుడితో జరగాల్సిన పెళ్లిని కలెక్టర్ జోక్యంతో నిలిపేశారు. వారి పెళ్లిని జూన్ 19న నిలిపివేశారని బాలల సంక్షేమ కమిటీ ఛైర్పర్సన్ అశోక్ టాంగడే తెలిపారు.‘బాలిక చేతులపై మెహందీ’తో కనిపెట్టి..అశోక్ టాంగడే తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారుల బృందం వెంటనే గ్రామానికి చేరుకుంది. అక్కడ పెళ్లి జరుగుతున్నట్టు బయటకు కనిపించే ఆనవాళ్లు ఏవీ లేకపోయినా, బాలిక చేతులపై వరుడి పేరు ఉన్న పెళ్లి మెహందీ కనిపించింది. పెళ్లికి ముందు ఫొటోషూట్ చిత్రాలను పరిగణనలోకి తీసుకున్న బృందం బాలికను రక్షణ కస్టడీలోకి తీసుకుందని, దర్యాప్తు కొనసాగుతోందని అశోక్ టాంగడే తెలిపారు. బాల్య వివాహం విషయంలో సంబంధం ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. -
నీట్ రీ-ఎగ్జామ్: నాగ్పూర్, అహిల్యానగర్, లాతూర్లలో టైట్ సెక్యూరిటీ
ముంబై: గత దఫాలో చోటుచేసుకున్న పేపర్ లీకేజీ ప్రకంపనల నేపథ్యంలో, నేడు (ఆదివారం) దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్-యూజీ పునఃపరీక్షకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహారాష్ట్రలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నీటీ యూజీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నాగ్పూర్, అహిల్యానగర్, లాతూర్ తదితర ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. పరీక్షలు పూర్తి పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసులు, కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు, సీసీటీవీ కెమెరాలతో కూడిన గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా పరీక్షకు హాజరుకావాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు.నాగ్పూర్లో ఉచిత ప్రయాణం నాగ్పూర్లోని 30 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 12,512 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీలు ముమ్మరం చేయడంతో అక్కడ దాదాపు ‘పోలీస్ క్యాంప్’ వాతావరణం తలపిస్తోంది. అభ్యర్థుల గుర్తింపును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. మరోవైపు, విద్యార్థులకు రవాణా ఇబ్బందులు కలగకుండా నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ తమ ‘ఆప్లీ బస్’ సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. అడ్మిట్ కార్డ్ చూపించి విద్యార్థులు ఈ ఏసీ బస్సుల్లో పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు.అహిల్యానగర్లో సీఆర్పీఎఫ్ పహారాఅహిల్యానగర్ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు జరిగే ఈ పరీక్ష కోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 5,385 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ప్రశ్నపత్రాల రవాణాలో ఎలాంటి లోపాలు జరగకుండా స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక వైద్య బృందాలను కూడా అందుబాటులో ఉంచారు.లాతూర్లో తగ్గిన కేంద్రాలు గత వివాదాల దృష్ట్యా లాతూర్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడం కోసం పరీక్షా కేంద్రాల సంఖ్యను గతేడాది ఉన్న 34 నుండి ఈసారి 24కి తగ్గించింది. ఇక్కడ సుమారు 14,000 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతను సమీక్షించారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించడానికి డ్యూటీ మేజిస్ట్రేట్లు, రాష్ట్ర అబ్జర్వర్లను ప్రత్యేకంగా నియమించారు. -
నాటి ఇందిర ట్విస్ట్ నుండి నేటి శివసేన చీలిక వరకూ..
మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న హైడ్రామా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరాఠా గడ్డపై పార్టీల చీలికలు, అర్ధరాత్రి ప్రభుత్వాల ఏర్పాటు, నమ్మినవారే నట్టేట ముంచడం వంటి పరిణామాలు ఈనాటివి కావు. 1960ల కాలం నుండి సాగుతున్న ఈ అధికార వ్యూహ ప్రతివ్యూహాల వెనుక ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. నాటి కాంగ్రెస్ విభజన, శరద్ పవార్ తొలి తిరుగుబాటు నుండి నేటి శివసేన సంక్షోభం వరకు మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న సంచలనాలివే..కాంగ్రెస్ చారిత్రాత్మక చీలిక: ఇందిరా గాంధీ బహిష్కరణభారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన అత్యంత కీలకమైన ఘట్టం నవంబర్ 1969లో చోటుచేసుకుంది. రాష్ట్రపతి ఎన్నికల సమయం నుండి కాంగ్రెస్లో రాజుకుంటున్న విభేదాలు.. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బహిష్కరించేలా చేశాయి. పార్టీ అధ్యక్షుడు ఎస్. నిజలింగప్ప నేతృత్వంలోని వర్కింగ్ కమిటీ ఇందిరకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోగా, ఇందిరా గాంధీ మాత్రం మెజారిటీ ఎంపీల మద్దతు తనకే ఉందంటూ తిరుగుబాటు చేశారు. 167 మంది ఎంపీల మద్దతుతో ఆమె కాంగ్రెస్ (ఆర్) గ్రూపును ఏర్పాటు చేసి తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు.38 ఏళ్ల వయసులోనే సీఎం.. శరద్ పవార్ తొలి తిరుగుబాటు1969 కాంగ్రెస్ చీలిక తర్వాత మహారాష్ట్రలో యశ్వంతరావు చవాన్, ఆయన శిష్యుడైన శరద్ పవార్ ఇందిరా గాంధీ పక్షాన నిలిచారు. అయితే, 1977 అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) తర్వాత కాంగ్రెస్ మరోసారి విడిపోయింది. ఇందిరా గాంధీ కాంగ్రెస్ (ఐ) ఏర్పాటు చేయగా, చవాన్, పవార్ కాంగ్రెస్ (యు) లో ఉండిపోయారు. ఆ తర్వాత జనతా పార్టీని అధికారానికి దూరంగా ఉంచేందుకు రెండు కాంగ్రెస్ గ్రూపులు చేతులు కలిపి వసంత్దాదా పాటిల్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కానీ 1978లో శరద్ పవార్ కేవలం 38 ఏళ్ల వయసులో కాంగ్రెస్ (యు) నుండి విడిపోయి, జనతా పార్టీ మద్దతుతో 'ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్' కూటమిని ఏర్పాటు చేసి మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.మరాఠా గడ్డపై శివసేన శకం.. బీజేపీతో దోస్తీకాంగ్రెస్ అంతర్గత పోరు నడుస్తున్న సమయంలోనే, 1966లో బాల్ కేశవ్ థాకరే (బాలాసాహెబ్ థాకరే) శివసేన పార్టీని స్థాపించారు. ముంబై వేదికగా మరాఠీ ప్రజల హక్కుల కోసం పోరాడుతూ, దూకుడు రాజకీయాలతో క్షేత్రస్థాయిలో ఈ పార్టీ బలమైన శక్తిగా ఎదిగింది. ఇదే క్రమంలో హిందుత్వ ఎజెండాతో బీజేపీతో శివసేనకు 25 ఏళ్ల సుదీర్ఘ బంధం కుదిరింది. మహారాష్ట్రలో శివసేన పెద్దన్న పాత్ర పోషించగా, 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక రాష్ట్రంలో బీజేపీ బలం పెరగడంతో ఈ సమీకరణలు మారడం ప్రారంభించాయి. 1995లో మొదటిసారి శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి మనోహర్ జోషి సీఎం అయ్యారు.విదేశీ మూలాల వివాదం: ఎన్సీపీ ఆవిర్భావం1999లో సోనియా గాంధీ విదేశీ మూలాల అంశాన్ని తెరపైకి తెస్తూ శరద్ పవార్ కాంగ్రెస్ నుండి రెండోసారి బయటకు వచ్చారు. ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. విడిపోయినప్పటికీ, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమిని అడ్డుకోవడానికి కాంగ్రెస్, ఎన్సీపీ చేతులు కలిపి విలాస్రావ్ దేశ్ముఖ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఆ తర్వాత పవార్ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంలో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.ఐదు రోజుల ముచ్చటైన ప్రభుత్వం.. మహా వికాస్ అఘాడీ2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసినప్పటికీ సీఎం పదవి విషయంలో వచ్చిన విభేదాలతో కూటమి విడిపోయింది. ఆ సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా తెల్లవారుజామున ప్రమాణ స్వీకారం చేయడం సంచలనం సృష్టించింది. కానీ ఈ ప్రభుత్వం కేవలం ఐదు రోజులే నిలిచింది. శరద్ పవార్ వ్యూహాత్మకంగా తన ఎమ్మెల్యేలను కాపాడుకుని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలను కలిపి ‘మహా వికాస్ అఘాడీ’ కూటమిని తెరపైకి తెచ్చారు. దీనితో ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి అయ్యారు.2026 కొత్త సంక్షోభం.. ఉద్ధవ్ చేజారిన ముంబై కోటజూన్ 2022 లో ఏకనాథ్ షిండే తిరుగుబాటుతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కూలిపోయింది. షిండే మెజారిటీ ఎమ్మెల్యేలతో బీజేపీతో కలిసి సీఎం అయ్యారు. పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తు కూడా షిండే వశమయ్యాయి. ఆ మరుసటి ఏడాది 2023 లో అజిత్ పవార్ సైతం ఎన్సీపీని చీల్చి షిండే ప్రభుత్వంలో చేరారు. కాగా, 2026 లో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యుబిటి) మరో భారీ చీలిక వైపు వెళ్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆరుగురు లోక్సభ ఎంపీలు స్పీకర్కు లేఖ ఇవ్వడం, ఢిల్లీ సమావేశానికి గైర్హాజరు కావడం కలకలం రేపుతోంది. దశాబ్దాలుగా ఉద్ధవ్ చేతిలో ఉన్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ తన మేయర్ను కూర్చోబెట్టడంతో ప్రస్తుతం ఉద్ధవ్ కేవలం ఒకే ఒక్క మున్సిపల్ కార్పొరేషన్కు పరిమితమయ్యారు. -
కూలిన హనుమాన్ మందిరం మండపం.. ఆరుగురు మృతి
మహారాష్ట్ర పర్భనీ జిల్లా యశ్వాడీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న హనుమాన్ మందిరం మండపం కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందగా శిథిలాల కింద మరో 20 మందికి పైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అక్కడి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మళ్లీ నిర్లక్ష్యం?.. నాగ్పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ సెంటర్
నీట్ రీటెస్ట్కు సిద్ధమవుతున్న ఓ విద్యార్థికి ఊహించని షాక్ తగిలింది. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన అభ్యర్థి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోగా.. పరీక్షా కేంద్రం ఏకంగా యూఏఈలోని అబుదాబిగా కనిపించింది. పాస్పోర్టే లేని విద్యార్థికి విదేశంలో పరీక్షా కేంద్రం కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..రేపు(జూన్ 21న) జరగనున్న రీ-నీట్ యూజీ 2026 పరీక్ష కోసం నాగ్పూర్కు చెందిన అబ్దుల్లా మహ్మద్ తాలిబ్ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకున్నాడు. అయితే అందులో పరీక్షా కేంద్రంగా భారత్లోని నగరం కాకుండా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని అబుదాబిలోని ఓ భారతీయ పాఠశాల పేరు కనిపించింది. నాగ్పూర్ నుంచి దరఖాస్తు చేసుకున్న తాను విదేశీ పరీక్షా కేంద్రం ఎలా పొందానని విద్యార్థి, అతని కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.పాస్పోర్టే లేదు.. పరీక్ష ఎలా?..ఈ ఘటనలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. అబ్దుల్లా వద్ద పాస్పోర్టు కూడా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అబుదాబికి వెళ్లి పరీక్ష రాయడం అసాధ్యమని పేర్కొన్నారు. అడ్మిట్ కార్డులోని వివరాల స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం మరింత చర్చనీయాంశమైంది.ఎన్టీఏ స్పందనఈ విషయాన్ని విద్యార్థి కుటుంబ సభ్యులు వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న అధికారులు ఇది టెక్నికల్ గ్లిచ్ (సాంకేతిక లోపం) కారణంగా జరిగిందని అంగీకరించినట్లు సమాచారం. అలాగే తప్పును సరిదిద్ది, సరైన పరీక్షా కేంద్రంతో కొత్త అడ్మిట్ కార్డు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఎన్టీఏ నుంచి ఈ-మెయిల్ కూడా వచ్చినట్లు వెల్లడించారు.ఇదేకాదు.. రేపటి రీటెస్ట్ నేపథ్యంలో ఎన్టీఏ నిర్లక్ష్యం బయటపడుతోంది. హాల్ టికెట్స్, ఎగ్జామ్ టైమింగ్.. సెంటర్లలో గందరగోళం నెలకొంది. మరో విద్యార్థికి సాయంత్రం 4గం.ఎగ్జామ్ అని సమాచారం. అయితే కంగారుపడక్కర్లేదంటూ ఆయా విద్యార్థులకు ఎన్టీఏ సందేశాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. #UPDATE | Responding to reports of a Nagpur student being allotted an Abu Dhabi examination centre for the NEET UG 2026 re-exam, NTA DG Abhishek Singh tells ANI that the issue has been resolved and the “candidate has now been allotted a centre in Nagpur.”(File photo) https://t.co/dvlYNBdYPN pic.twitter.com/Q6S5l8g1SL— ANI (@ANI) June 20, 2026నీట్ యూజీ పరీక్ష కోసం విదేశాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఉంటాయి. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, NRIలు, OCI అభ్యర్థుల కోసం ఎన్టీఏ కొన్ని అంతర్జాతీయ నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. గత కొన్నేళ్లుగా అబుదాబి, దుబాయ్, దోహా, కువైట్ సిటీ, మస్కట్, మనామా, రియాద్, షార్జా, సింగపూర్, కౌలాలంపూర్ వంటి నగరాల్లో NEET పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.నాగ్పూర్లో దరఖాస్తు చేసిన విద్యార్థికి పొరపాటున అబుదాబి కేంద్రం కేటాయించడమే ఈ వివాదానికి కారణమైంది.జూన్ 21న రీ-నీట్పేపర్ లీకేజీ నేపథ్యంలో రద్దైన నీట్ పరీక్షను.. రేపు మధ్యాహ్నాం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు పెన్-అండ్-పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డులో వ్యక్తిగత వివరాలు, పరీక్షా కేంద్రం తదితర అంశాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని ఎన్టీఏ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మాక్డ్రిల్ కూడా నిర్వహించబోతోంది. -
ఉద్ధవ్ థాక్రే సంచలన ప్రకటన
ముంబై: తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు ప్రకటించడంపై శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్ని సవాళ్లు, అవరోధాలు ఎదురైన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సుమారు 13 ఏళ్లుగా పార్టీకి సారథ్యం వహిస్తున్నానంటూ ఆయన.. తన హయాంలోనే పార్టీ తీవ్ర సవాళ్లను, వ్యక్తిగత దాడులను ఎదుర్కొందని చెప్పారు. పార్టీ నన్ను వద్దనుకుంటే బాధ్యతల నుంచి వైదొలిగేందుకు సైతం సిద్ధంగా ఉన్నానన్నారు.నాలుగేళ్లలో రెండుసార్లు పార్టీలో చీలిక రావడంపై ఆయన శుక్రవారం మొదటిసారిగా పైవిధంగా స్పందించారు. శివసేన 60వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఉద్ధవ్ మాట్లాడారు. తనకు నాయకత్వ బాధ్యతల్లో కొనసాగాలన్న కాంక్ష లేదని చెప్పారు. ‘పార్టీకి చెందిన వారు తదుపరి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తానని ముందుకు వస్తే సంతోషిస్తా. అదే సమయంలో, ద్రోహులు, దొంగలకు పార్టీని అప్పగించబోను’ అని ఆయన పేర్కొన్నారు.అసలు సినిమా ముందుంది: ఏక్నాథ్ షిండేఅసలు సినిమా ముందుందంటూ శివసేన చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ ఎంసీ ఏక్నాథ్ షిండే పరోక్షంగా ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పులి తోలు కప్పుకున్నంత మాత్రాన తోడేలు పులిగా మారిపోదంటూ ఎద్దేవా చేశారు. ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే పక్షాన చేరారంటూ వస్తున్న వార్తల వేళ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.మరోవైపు ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు పార్టీని వీడేందుకు సిద్ధమవడం ఆ వర్గానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఈ పరిణామంతో షిండే వర్గం పార్లమెంటు స్థాయిలో మరింత బలోపేతం అవుతుండగా, ఉద్ధవ్ వర్గం అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మొత్తంగా చూస్తే, 2022లో జరిగిన శివసేన చీలిక తర్వాత మొదటిసారిగా ఉద్ధవ్ వర్గం మరో పెద్ద తిరుగుబాటును ఎదుర్కొంటుండగా, షిండే వర్గం మాత్రం దీనిని తమ రాజకీయ విజయంగా ప్రచారం చేస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
41% లోటు వర్షపాతం
న్యూఢిల్లీ: చినుకులతో రైతన్నకు చిరునవ్వులు తెప్పించే నైరుతి రుతుపవనాలు ఈసారి కర్షకులతో దోబూచులాడుతున్నాయి. దీంతో జూన్ 4 నుంచి జూన్ 18వ తేదీ వరకు నమోదవ్వాల్సిన వర్షపాతంలో 41 శాతం లోటు కన్పించిందని భారత వాతావరణ శాఖ గురువారం ప్రకటించింది. ఈ మేరకు వాతావరణ శాఖ తాజా గణాంకాలను విడుదలచేసింది. జూన్ 4వ తేదీ నుంచి రెండు వారాలపాటు సగటున 72.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సిఉండగా 42.6 మిల్లీమీటర్ల వర్షపాతం దక్కిందని వాతావరణ శాఖ వ్యాఖ్యానించింది.ప్రాంతాల వారీగాచూస్తే మధ్యభారతం(67శాతం), తూర్పు, ఈశాన్య భారతం(42శాతం), దక్షిణభారతం(22 శాతం), వాయవ్యభారతం(6శాతం) లోటు వర్షపాతాలను చవిచూశాయి. రుతుపవనాలు బలంగా, వేగంగా ముందుకు కదలడానికిదోహదపడే విస్తృతస్థాయి వర్షపాత అనుకూల పరిస్థితులు పూర్తి స్థాయిలో లేవు. అందుకే రుతుపవనాలు మహారాష్ట్ర అంతటా విస్తరించకుండా అక్కడే ఆగిపోయాయి. దీంతో దక్షిణభారతంలోని ఇతర రాష్ట్రాలకు రుతపవనాల విస్తృతస్థాయి విస్తరణ ఆలస్యమవుతోంది. ఎందుకీ లోటు? ఉత్తరదిశలో విస్తరణ ఆలస్యం కావడానికి ఐదు అంశాలు కారణమవుతున్నాయి. అరేబియా సముద్రం నుంచి తోడ్పాటు కరువైంది. అరేబియా సముద్రం నుంచి తేమ గాలులు తక్కువ స్థాయిలో రావడంతో రుతుపవనాల విస్తరణ వేగం తగ్గింది. అరేబియా సముద్రం మీదుగా తక్కువ ఎత్తులో భారత్లో ఈశాన్య వైపునకు వీచే గాలులు తగ్గిపోయాయి. ఇవి తగ్గడంతో తేమ సమతులంగా మహారాష్ట్రపై బట్వాడా కావడం సైతం క్షీణించింది. దక్షిణార్థ గోళం నుంచి ఉత్తరార్థ గోళం దిశగా వస్తూ హిందూ మహాసముద్ర పశ్చిమ భాగం, అరేబియా సముద్రం మీదుగా సాగే గాలుల్లోనూ వేగం తగ్గింది. ఈ గాలులే నైరుతు రుతుపవనాలకు తేమను అందిస్తాయి. తేమ తగ్గడంతో వర్షపాతమూ తగ్గిపోయింది. -
ఆరుగురు ఎంపీలు డుమ్మా
న్యూఢిల్లీ: ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) పార్టీలో చీలిక ఖాయమని స్పష్టమవుతోంది. ఇందుకు బలం చేకూర్చేలా గురువారం ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పష్టమైన వైఖరిని ప్రదర్శించారు. పార్టీకి చెందిన 9 మంది లోక్సభ ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు కచ్చితంగా ఢిల్లీలో పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరవ్వాలని అగ్రనాయకత్వం విప్ జారీచేయగా గురువారం నాటి సమావేశానికి ఆరుగురు తిరుగుబాటు ఎంపీలు నగేశ్ పాటిల్ అష్టికర్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాధవ్, సంజయ్ దినా పాటిల్, ఓం ప్రకాశ్ రాజే నింబాల్కర్, భావూసాహెబ్ వాక్చౌరే రాలేదు.కేవలం ముగ్గురు లోక్సభ ఎంపీలు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభావూ వాజే, ఒక రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ మాత్రమే హాజరయ్యారు. మెజారిటీ ఎంపీల గైర్హాజరుపై రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఈ ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీచేస్తాం. విప్ను ఉల్లంఘిస్తూ ఎందుకు సమావేశానికి డుమ్మా కొట్టారని కారణం అడుగుతాం.స్పందన తెలియజేసేందుకు ఏడు రోజుల గడువు ఇస్తాం. స్పందించకపోతే వీళ్లను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాస్తాం’’అని రౌత్ చెప్పారు. అయితే ఇప్పటికే ఆరుగురు రెబల్ ఎంపీలు స్పీకర్ను కలిసి ఒక లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో తమను కలిపేస్తూ, లోక్సభలో తమకు సీట్లు విడిగా కేటాయించాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి.‘‘ఈ నమ్మకద్రోహులను వదిలిపెట్టేదే లేదు. స్వస్థలాలు, సొంత నియోజకవర్గాల్లో వాళ్లను స్వేచ్ఛగా తిరిగనివ్వం. వాళ్లకు సరైన గుణపాఠం చెప్తాం. మా భయంతో వాళ్లు ఇళ్లకు చేరుకోవాలంటే ఆర్మీ సాయం తప్పదు. భద్రతకు వాయుసేన సాయం తప్పదు. దేశంలో ఇలాంటి పార్టీ ఫిరాయింపుల ఉదంతాలపై సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’’అని అన్నారు.రెబల్స్కు భద్రత పెంపు అధికార పార్టీలోకి మారబోతున్నామనే ప్రకటన నేపథ్యంలో ఆ ఆరుగురు రెబల్స్కు మహారాష్ట్రలోని షిండే సర్కార్ వై ప్లస్ భద్రత కల్పించింది. జూన్ 17వ తేదీ నుంచే ఆ ఆరుగురు ఎంపీలకు భద్రత పెంచుతున్నట్లు ఇంటెలిజెన్స్ కమిషనర్ శిరీష్ జైన్ పేరుతో ఉత్త్తర్వు వెలువడింది. తలో రూ.10 కోట్లు తీసుకున్నారు ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత రౌత్ మీడియాతో మాట్లాడారు. ‘‘విశ్వాసఘాతకులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది. నమ్మక ద్రోహులైన ఎంపీల సంగతి తేలుస్తాం. వాళ్లను వేటాడేందుకు ఆపరేషన్ తుడ్వాను ఆరంభిస్తాం. రెబల్స్ ఇప్పటికే తలో రూ.15 కోట్లు అందుకున్నారు. తాజాగా మరో రూ.10 కోట్లు తీసుకున్నారు. ఢిల్లీలో భద్రత లేదనే భయంతో రాజస్థాన్కు వెళ్లిపోయారు. వాళ్లలో కాస్తయినా నైతికత ఉంటే తక్షణం ఎంపీలుగా రాజీనామా చేయాలి. ఎంపీ హోదా లక్షలాది పార్టీ మద్దతుదారులు, కార్యకర్తల కష్టార్జితం’’అని రౌత్ అన్నారు. -
ఉద్దవ్ ఠాక్రేకు బిగ్ షాక్.. ఆరుగురు ఎంపీలు జంప్
-
ఉద్దవ్ సేనలో చీలిక.. ఎవరీ సంజయ్ జాధవ్?
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఉద్దవ్ థాక్రే శివసేన వర్గంలో చీలిక దాదాపు ఖాయమన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇవాళ జరిగిన పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశంలో వెలుగులోకి వచ్చిన పరిణామాలు ఆ శిబిరంలో అంతర్గత అసంతృప్తిని స్పష్టంగా బయటపెట్టాయి. శివసేన (యూబీటీ) పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం గురువారం పార్లమెంట్ భవనంలో జరిగింది. సమావేశానికి హాజరైన వారిలో అనిల్ దేశాయ్, అర్వింద్ సావంత్, రాజాభావ్ వాజే మాత్రమే ఉన్నారు. మిగతా ఎంపీలు గైర్హాజరయ్యారు. ఈ గైర్హాజరు పార్టీ శిబిరంలో మరోసారి కలకలం రేపింది. విలీనం జరగబోతందనే ప్రచారాన్నిఖరారు చేసే దిశగా అడుగులు వేయిస్తోంది. మొత్తం తొమ్మిది మంది UBT లోక్సభ ఎంపీలలో ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో చేరే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గైర్హాజరును ఉద్ధవ్ ఠాక్రే సీరియస్గా తీసుకున్నారు. హాజరుకాని ఎంపీలపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. పార్టీ విప్ ఉన్నప్పటికీ సమావేశానికి రాకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గైర్హాజరైన ఆరుగురు ఎంపీలు త్వరలోనే కొత్త పార్లమెంటరీ గ్రూప్ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎంపీలు లోక్సభ స్పీకర్ను కలిసి శివసేన (షిండే) వర్గంలో తమ విలీనాన్ని గుర్తించాలని లేఖ సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. అదే గనుక జరిగితే.. ఉద్ధవ్ శిబిరానికి పెద్ద రాజకీయ దెబ్బ తగలనుంది. మరోవైపు.. ఈ కొత్త ఫ్రాక్షన్కు నాయకుడిగా పర్భణీ ఎంపీ సంజయ్ హరిభావు జాధవ్ (బండు జాధవ్) పేరు ముందుకు రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సంజయ్ హరిభావు జాధవ్.. అందరూ ‘‘బండు భాయ్’’ అని పిలుచుకుంటారు. శివసేనలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న నేత. పర్భణీకి చెందిన ఆయన రాజకీయ ప్రస్థానం స్థానిక స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగింది.రెండుసార్లు పర్భణీ ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన.. ఆపై హ్యాట్రిక్ ఎంపీగా అదే లోక్సభ స్థానం నుంచి నెగ్గారు. సాధారణ శివసేన కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగిన నేతగా ఆయనకు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. అయితే గతంలోనే పార్టీ అంతర్గత అసంతృప్తి కారణంగా ఆయన పేరు వివాదాల్లో కూడా వినిపించింది. 2020లో మిత్రపక్షం ఎన్సీపీ వైఖరి కారణంగా కేడర్కు న్యాయం చేయలేకపోతున్నానంటూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి.. ఎంపీ పదవికి రాజీనామా చేయబోయారు. అయితే ఉద్దవ్ సర్దిచెప్పడంతో దానిని వెనక్కి తీసుకున్నారు.ఇప్పుడు శివసేన (UBT)లో జరుగుతున్న పరిణామాలు ఆయన చుట్టూ మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు నిబద్ధమైన, పార్టీ కార్యకర్తల పక్షాన నిలిచే విధేయ శివసైనికుడిగా ఆయనను చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉద్దవ్ చీలిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం.మరోవైపు, ఉద్దవ్ సేన నేత సంజయ్ రౌత్ ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందిస్తూ పార్టీ బలాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. “పార్టీకి రాని వారు మనవారు కాదు” అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తే, శివసేన (UBT) లోక్సభ శిబిరంలో విభజన దాదాపు ఖాయమన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. సంజయ్ బండు జాధవ్ వంటి అనుభవజ్ఞుడైన నేత పేరు ముందుకు రావడంతో శివసేన (UBT)లో చీలిక అంశం మరింత సీరియస్గా మారిదంటున్నారు. -
ఆ భర్త బాత్రూంలోనూ సీసీ కెమెరా పెట్టాడు!
అనుమానం అతడిని మృగంలా మార్చింది.. అదనపు కట్నం డిమాండ్లు ఆమె జీవితాన్ని భారంగా మార్చాయి. ప్రతి కదలికపై నిఘా, ప్రతి మాటపై అనుమానం, అత్తింటి వేధింపులు.. ఇలా 48 రోజుల కాపురమే ఓ నవవధువుకు నరకయాతనగా మారింది. చివరకు ఆ మానసిక వేదనను తట్టుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడి.. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చింది.పుణే వైష్ణవి హగ్వానే కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అరకేజీ బంగారం, నగదు, కాస్ట్లీ కారు కట్నంగా ఇచ్చినప్పటికీ.. సరిపోలేదంటూ అత్తింటి కుటుంబం వైష్ణవిని బలి తీసుకుంది. ఈ ఘటన తర్వాత.. వరకట్నం విషయంలో కొన్ని కులాల పెద్దలు ‘తల్లిదండ్రులు తమకు ఉన్నంతలోనే వివాహం చేయాలి’ అని తీర్మానాలు కూడా చేశారు. అయితే ఆ ఘటన మరువక ముందే.. అదే తరహాలో మహారాష్ట్రంలోనే మరో వరకట్న వేధింపులకు నవవధువు బలైన ఘటన చోటు చేసుకుంది. అంబర్నాథ్లో పెళ్లైన 48 రోజుల్లోనే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు.. దీనికి తోడు ప్రతీ చిన్న విషయానికి భర్త అనుమానించడం విశాఖ తిల్కర్(26)ను దారుణంగా కుంగదీశాయి. పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు చెబుతోంది ఏంటంటే.. విశాఖకు ఈ ఏడాది ఏప్రిల్ 30న వైద్యుడు నితిన్ తిల్కర్తో వివాహమైంది. అడిగినంత కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. అయితే అత్తింట అడుగు పెట్టిన మరుసటి రోజు నుంచే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. తాము అనుకున్నంత కట్నకానుకలు రాలేదని తల్లి, మరిది సూటిపోటి మాటలతో వేధించసాగారు. ఇటు నితిన్ కూడా చీటికి మాటికి విశాఖను అనుమానించడం మొదలుపెట్టాడు. ఇంటి లోపల, బయట.. ఆఖరికి బాత్రూమ్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విశాఖ ప్రతి కదలికను గమనించాడట.... ఎవరితో మాట్లాడినా ప్రశ్నించడం, అనుమానించడం, దాడి చేయడం తరచూ జరిగేది. విశాఖ బలవన్మరణానికి పాల్పడే రెండు రోజుల ముందు పొరుగును ఉన్నవాళ్లతో మాట్లాడిందని నితిన్ తీవ్రంగా కొట్టాడు. అప్పటిదాకా మౌనంగా భరిస్తూ వచ్చిన ఆమె.. పుట్టింటికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. దీంతో ఆమెను ఆ నరకం నుంచి బయటపడేయాలని తల్లిదండ్రులు భావించారు. ఈలోపే.. ఏం జరిగిందో ఏమోగానీ జూన్ 16న ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై శివాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త నితిన్ తిల్కర్తో పాటు అతని తల్లి ఛాయా, సోదరుడు నినాద్పై మానసిక, శారీరక వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగాల కింద కేసులు పెట్టారు. నితిన్ను అరెస్టు చేయగా, మిగిలిన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. పెళ్లై రెండు నెలలు కూడా పూర్తికాకముందే అనుమానం, నిఘా, వేధింపుల మధ్య తమ బిడ్డ జీవితం అర్థాంతరంగా ముగిసిందంటూ ఆ తల్లిదండ్రులు పెట్టిన కన్నీళ్లు పలువురిని కదిలించాయి. -
షిండేకు షాక్.. ఢిల్లీ ప్లాన్ ఫెయిల్!
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. శివసేన (ఉద్ధవ్ బలాసాహెబ్ ఠాక్రే) వర్గంలో తిరుగుబాటు ఊహాగానాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలు ఒక్కసారిగా ఢిల్లీ కేంద్రంగా కీలక మలుపు తిరుగుతాయని అంతా భావించారు. ఈ తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కీలకంగా భావించిన రాజకీయ భేటీ చివరి నిమిషంలో రద్దు కావడం రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. దీంతో షిండే వర్గం వ్యూహానికి ఉద్ధవ్ శిబిరం చెక్ పెట్టినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.శివసేన (యూబీటీ)కి చెందిన కొంతమంది లోక్సభ ఎంపీలు ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శిబిరంలో చేరతారనే ప్రచారం కొంతకాలంగా కొనసాగుతోంది. “ఆపరేషన్ టైగర్”లో భాగంగా ఉద్ధవ్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆరుగురు ఎంపీలు విలీనం అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. పార్టీ విభజనకు అవసరమైన రెండు మూడవ వంతు మెజారిటీకి ఈ సంఖ్య దగ్గరగా ఉండటంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్ 19న శివసేన ఆవిర్భావ దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ కదలికలు వేగం పుంజుకున్నాయి.ఈ నేపథ్యంలో ఢిల్లీలో శ్రికాంత్ షిండే నివాసంలో బుధవారం జరగాల్సిన కీలక భేటీ చివరి క్షణంలో రద్దు కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. సమావేశానికి ముందు ఎంపీలు లోక్సభ స్పీకర్కు విలీనంపై లేఖ సమర్పిస్తారని లీకులు అందాయి. అలాగే భేటీకి ఏక్నాథ్ షిండే కూడా ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో.. అనూహ్యంగా మొత్తం ప్లాన్ నిలిచిపోయింది. మరోవైపు ఉద్ధవ్ శిబిరం ముందస్తుగా అప్రమత్తమైంది. పార్టీ ఎంపీలకు విప్ జారీ చేస్తూ ఢిల్లీలో జరిగే పార్టీ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే అనర్హత వేటు తప్పదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది.ఉద్ధవ్ శిబిరం తరఫున సంజయ్ రౌత్ మాట్లాడుతూ తిరుగుబాటు ప్రయత్నానికి అవసరమైన సంఖ్య ప్రత్యర్థి వర్గానికి లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఇది ఒత్తిడి రాజకీయాల భాగమని, ఎంపీలను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు చేశారు. రూ.15 కోట్ల ఆఫర్ అంశం కూడా రాజకీయ వేడిని పెంచింది. మొత్తం 50 కోట్ల రూపాయలతో ఎంపీలకు ఎర వేస్తున్నారని.. అడ్వాన్స్గా 15 కోట్లు చెల్లించారని సంజయ్ రౌత్ ఆరోపించారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడే సమయంలో వెంట కేవలం ముగ్గురు ఎంపీలే ఉండడం గమనార్హం. అంతకు ముందు.. ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ పరిణామంపై స్పందించారు. 2022 శివసేన చీలిక సమయంలోనే పరిస్థితులను అర్థం చేసుకున్నానని, కానీ ఎవరిపైనా ఒత్తిడి చేయడం తన ఇష్టం లేదని అన్నారాయన. మరోవైపు పార్టీ నేతలు అనిల్ దేశాయ్, ఆదిత్య ఠాక్రే మాత్రం పార్టీ ఐక్యతపై నమ్మకం వ్యక్తం చేశారు.మొత్తం పరిస్థితిని చూస్తే ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ రాజకీయ డ్రామాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లే కనిపిస్తున్నప్పటికీ, మహారాష్ట్ర రాజకీయాల్లో అస్థిరతపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్ సమీకరణాలను మళ్లీ మార్చే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసిన ఎంపీలు.. ఢిల్లీకి జంప్!
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామాలు తప్పవా?. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఎంపీలు పార్టీని వీడబోతున్నారన్న ఊహాగానాలకు బలం చేకూరే వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు లోక్సభ ఎంపీలు 24 గంటలుగా అదిష్టానానికి అందుబాటులో లేకపోవడంతో ఉద్దవ్ శిబిరం ఆందోళన చెందుతోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఉద్ధవ్ ఠాక్రే స్వయంగా కొందరు ఎంపీలతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నించినప్పటికీ వారు ఫోన్కు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ‘‘ఆరుగురు ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. ఇంటికి వెళ్తే లేరనే సమాధానం వచ్చింది. ఎక్కడున్నారో ఆరా తీస్తే.. ఢిల్లీకి వెళ్లారని తెలిసింది. పార్టీ పార్లమెంటరీ కమిటీ సమావేశం కోసం వెళ్లామని వాళ్లు చెప్పారట. కానీ, మా అధిష్టానం మాత్రం అలాంటి మీటింగ్ ఏం నిర్వహించడం లేదు’’ అని ఉద్దవ్ వర్గానికి చెందిన ఓ నేత చెబుతున్నారు. అయితే.. ఏక్నాథ్ షిండే వర్గం ఆ మీటింగ్ నిర్వహిస్తుండడంతో.. తిరుగుబాటు ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్ముఖ్, నాగేశ్ పాటిల్ అష్టికర్, ఓంరాజే నింబాల్కర్, భౌసాహెబ్ వక్చౌరే, సంజయ్ జాధవ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు రాజాభౌ వాజే కూడా చేరే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఢిల్లీలో శ్రికాంత్ షిండే నివాసంలో కొందరు యూబీటీ ఎంపీలు సమావేశమయ్యే అవకాశం ఉందని, ఆ సమావేశానికి ఏక్నాథ్ షిండే కూడా హాజరయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అనంతరం వారు లోక్సభ స్పీకర్ను కలిసి, ముందుగా ప్రత్యేక పార్లమెంటరీ గ్రూప్గా ఏర్పడి, తర్వాత షిండే శివసేనలో విలీనం అయ్యే దిశగా అడుగులు వేయొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఢిల్లీ కేంద్రంగా రాజకీయ వ్యూహాలు..ఈ ఎంపీలు ముందుగా ప్రత్యేక లోక్సభ గ్రూప్ను ఏర్పాటు చేసి, ఆ తర్వాత షిండే శివసేనలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో వారు లోక్సభ స్పీకర్ను కూడా కలిసే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక షిండే వర్గం కూడా ఈ పరిణామాలపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ మాట్లాడుతూ.. బాల్ ఠాక్రే సిద్ధాంతాలను విశ్వసించే ప్రజాప్రతినిధులకు తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించారు. దీంతో విలీనం ఖాయమనే చర్చా జోరందుకుంది.ఉద్ధవ్ వర్గం కౌంటర్2024 లోక్సభ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 9 సీట్లు గెలుచుకోగా, ఏక్నాథ్ షిండే వర్గం 7 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం యూబీటీకి ఉన్న ఈ 9 మంది ఎంపీల్లో పలువురు షిండే శిబిరంతో టచ్లో ఉన్నారనే ప్రచారం మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశానికి తొమ్మిది మంది ఎంపీల్లో కేవలం నలుగురే ప్రత్యక్షంగా హాజరు అయ్యారు. మిగిలిన వారు ఆన్లైన్, ఫోన్ ద్వారా పాల్గొన్నారని పార్టీ వర్గాలు చెబుతుండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో ఉద్ధవ్కు అత్యంత సన్నిహితులుగా భావించే ఎంపీలు అర్వింద్ సావంత్, అనిల్ దేశాయ్ ఢిల్లీకి చేరుకోగా, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఇప్పటికే అక్కడే మకాం వేశారు. మరోవైపు, ఇటీవల ఉద్ధవ్ నిర్వహించిన సమావేశానికి గైర్హాజరైన ఎంపీ సంజయ్ దేశ్ముఖ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాధవ్తో భేటీ కావడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ ప్రచారాన్ని ఉద్ధవ్ వర్గం మొదటి నుంచి ఖండిస్తోంది.పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఎంపీలంతా ఉద్ధవ్ ఠాక్రేతోనే ఉన్నారని, పార్టీ చీలికపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. పార్టీకి ఎలాంటి తక్షణ ప్రమాదం లేదని, 60 ఏళ్ల చరిత్ర కలిగిన శివసేన ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కొందరు ఎంపీలను ఆకర్షించేందుకు ఒక్కొక్కరికి రూ.15 కోట్ల చొప్పున అడ్వాన్స్లు ఇస్తున్నారనే సంచలన ఆరోపణలు కూడా చేశారు.ఆపరేషన్ టైగర్2022లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన చీలిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో మరోసారి అసంతృప్తి సంకేతాలు కనిపిస్తుండటం, ఆ ఎంపీలను తమ గూటికి చేర్చుకునేందుకు షిండే వర్గం ప్రయత్నిస్తోందనే ప్రచారం మహారాష్ట్ర రాజకీయాలను మళ్లీ వేడెక్కిస్తోంది. ఈ రాజకీయ వ్యూహానికే "ఆపరేషన్ టైగర్" అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒకవేళ ఈ వ్యూహం ఫలిస్తే ఉద్ధవ్ ఠాక్రే శిబిరానికి ఇది మరో భారీ రాజకీయ ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ వర్గాలు ఇటీవల పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్లో వెలుగుచూసిన అసంతృప్తి పరిణామాలతో పోలుస్తున్నాయి. అక్కడి పరిణామాల తరహాలోనే యూబీటీలోనూ తిరుగుబాటు జరుగుతుందా? లేదంటే ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితిని చక్కదిద్దగలరా? అన్న ఉత్కంఠ ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. -
షాకింగ్ : ఐఏఎఫ్ ఆఫీసర్ భార్యపై అఘాయిత్యం, మత మార్పిడి..!
మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగపూర్లో భారత వైమానిక దళ (IAF) అధికారి భార్యపై ఆమె పాత క్లాస్మేట్ దారుణానికి పాల్పడిన వైనం దిగ్భ్రాంతి రేపింది. మత్తుమందిచ్చి అత్యాచారం చేశారని, అసభ్యకరమైన వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేశారని, అలాగే మతం మారేలా ఒత్తిడి చేశారని బాధిత ఆరోపించారు. దీనికి సంబంధించి వీడియో కీలక సాక్ష్యంగా మారింది.బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం 24 ఏళ్ల బాధిత మహిళను ఆమె పాత క్లాస్మేట్ అయిన అయాజ్ తాజ్ మదారే (26) ఆస్తి కొనుగోలు నెపంతో నాగపూర్లోని వార్ధా రోడ్డులో ఉన్న ఒక హోటల్కు పిలిపించాడు. అక్కడ ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను అశ్లీల వీడియోలుగా, ఫోటోలుగా రికార్డు చేశాడు. ఆ వీడియోలను చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ, ఆమెపై నిందితుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె నుండి రూ. 3.09 లక్షలు వసూలు చేశాడు. ఇదీ చదవండి: ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లిఅంతేకాదు బాధితురాలిని ఇస్లాం మతంలోకి మారాలని నిందితుడు ఒత్తిడి చేశాడు. మే నెలలో ఆమెను ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అమీన్ షేక్, హజ్రత్ మౌలానా అనే మరో ఇద్దరి సహాయంతో మతమార్పిడి ఆచారాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయ్యింది, అందులో మహిళ తనను వదిలేయమని అరుస్తున్నప్పటికీ నిందితుడు బలవంతంగా పట్టుకుని మంత్రాలు చదువుతూ కనిపించాడు. ఆ తర్వాత ఆమెకు అయాజ్తో పెళ్లయిందని చెప్పి, మళ్లీ అత్యాచారానికి ప్రయత్నించారు.🚨Nagpur police arrests two men after Air Force personnel's wife accused them of rape, blackmail, forced religious conversion, and occult practices pic.twitter.com/7WuOn51lDL— The Tatva (@thetatvaindia) June 16, 2026ఈ ఘటన 2025 ఫిబ్రవరిలో జరిగినప్పటికీ, భయంతో మౌనంగా ఉన్న మహిళ ఇటీవల తన భర్తకు విషయం చెప్పింది. జూన్ 13న నాగపూర్లోని సోనేగావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు అయాజ్ తాజ్ మదారే, అమీన్ షేక్లను అరెస్ట్ చేశారు. కోర్టు వారికి 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. మూడో నిందితుడు మతమార్పిడిలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మౌలానా (మత గురువు) కోసం మధ్యప్రదేశ్కు ఒక బృందాన్ని పంపారు.మహిళ తన ఫిర్యాదులో అత్యాచారం, బెదిరింపులు, మతమార్పిడి, క్షుద్రపూజలు జరిగినట్లు ఆరోపించిదని సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ సురేష్ రెడ్డి వెల్లడించారు.ఇదీ చదవండి: అఫ్గాన్లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా! -
బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్.. 14 మంది మృతి
సోలాపూర్: మహారాష్ట్రలోని సోలాపూర్లో విషాదం జరిగింది. బావిలోకి వ్యాన్ దూసుకెళ్లడంతో 14 మంది మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్లు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్.. రహదారి పక్కనే ఉన్న పొలంలోని బావిలోకి దూసుకెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులను పండరపూర్ తాలూకాలోని రంజని గ్రామస్తులుగా గుర్తించారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మైనర్పై ఫుట్బాల్ కోచ్ లైంగిక దాడి : వీడియోలతో బ్లాక్మెయిల్
పాల్ఘర్, మహారాష్ట్ర: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఒక ఫుట్బాల్ కోచ్, మైనర్ క్రీడాకారిణిపై లైంగిక దాడికి పాల్పడిన వైనం కలకలం రేపింది. అత్యాచారం, బెదిరింపుల ఆరోపణలపై ప్రైవేట్ ఫుట్బాల్ కోచ్ను 36 ఏళ్ల అభిజిత్ మెండల్పై పోక్సో కింద కేసు నమోదు చేశారు.పోలీసుల కథనం ప్రకారం దిగ్భ్రాంతికరమైన కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2023లో వసాయిలోని తన ఫుట్బాల్ శిక్షణా అకాడమీలో చేరిన 17 ఏళ్ల బాలికపై మెండల్ పదేపదే అత్యాచారం చేస్తూ వచ్చాడు. గత మూడేళ్లుగా, పలుమార్లు లైంగిక దాడిచేయడంతోపాటు కొన్ని అభ్యంతరకరమైన వీడియోలను తీసి, బెదిరించి, తద్వారా తన కోరికలను తీర్చుకునేవాడు. ఈ మానసిక వేధింపులను తట్టుకోలేక ఆ బాలిక, చివరకు తన కుటుంబం సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ అనంతరం మెండల్ను అరెస్టు చేశారు.ఫుట్బాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, ప్రలోభపెట్టాడని బాధితురాలు వాపోయింది. వేధింపులతో విసిగి, అతడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించింది. దీంతో వీడియోలు, ఫోటోలతో తనను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడని ఆరోపించింది. తనకు లొంగకపోతే, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతాననిబెదిరించాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసి, కస్టడీకి అప్పగించారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: డేంజరస్ స్టంట్ : యెమెన్ స్పైడర్ మ్యాన్ దుర్మరణం -
మహిళా ఉద్యోగిపై పాశవికం.. కొడవలితో దాడి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. పాల్టర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిపై ఒక వ్యక్తి అత్యంత పాశవికంగా దాడి జరిపాడు. ఆమెపై ఎనిమిది సార్లు కొడవలితో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలైన మహిళా ఉద్యోగిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిన్న( శుక్రవారం) సాయంత్రం పాల్ఘర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో విధులు నిర్వహిస్తున్నస్నేహల్ సావంత్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఈ సందర్భంలో నిందితుడు హఠాత్తుగా వెనుక నుండి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి కొడవలితో ఒక్కసారిగా దాడి చేశాడు. ఆ మహిళ మెడ, వీపు, భుజాలు , నడుము భాగాలపై దాదాపు ఎనిమిది సార్లు కొడవలితో విచక్షణారహితంగా నరికాడు. దీనితో ఆమెకు తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిపోయింది.అయితే ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత సైతం ఏ మాత్రం కనికరం లేకుండా పలుమార్లు దాడి చేశాడు. ఈ ఘటన వివరాలు అక్కడ సమీపంలో ఉన్న సీసీటీటీ కెమెరాలో రికార్డయ్యాయి. దాడి చేసిన అనంతరం, నిందితుడు తన బ్యాగ్ను, దాడికి ఉపయోగించిన కొడవలిని అక్కడే వదిలేసి పరారయ్యాడు.అయితే తీవ్ర రక్తస్రావంతో అక్కడే పడి ఉన్న మహిళను స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్నేహల్ను మొదట పాల్ఘర్లోని ఒక రూరల్ హాస్పిటల్కు తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ దాడికి గల అసలు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని అమోల్ ములేగా గుర్తించారు. అతను ఒక కోర్టు ప్యూన్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో, పోలీసులు అతడిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. -
ఇల్లు దక్కలేదని.. నడిరోడ్డుపైనే 82 ఏళ్ల తండ్రి హత్య
ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. కోర్టులో తండ్రికి వ్యతిరేకంగా ఆస్తి కేసు ఓడి పోయాననే ఆగ్రహంతో ఒక వ్యక్తి తన 82 ఏళ్ల తండ్రిని నడిరోడ్డుపైనే కత్తితో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది.ఛత్రపతి సంభాజీనగర్లో ఉంటున్న జలవనరుల శాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి జాఫర్కమరుద్దీన్ సయ్యద్ పటేల్కు, మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న కుమారుడు అబ్దుల్ రెహమాన్తో చాలాకాలంగా వివాదం నడుస్తోంది. నిత్యం కుటుంబ సభ్యులతో గొడవపడుతూ, వారిపై దాడిచేసేవాడు. దీంతో బాధితుడు జాఫర్ కొడుకు ప్రవర్తనతో విసుగు చెంది, ఇంటి కోసం కేసు వేయడానికి ముందు పూణేలోని తన కుమార్తె ఇంటికి వెళ్లిపోయాడు.కుమారుడి ప్రవర్తనతో వేగలేక, అతడిని ఇల్లు ఖాళీ చేయించడానికి కోర్టును ఆశ్రయించాడు. రెండేళ్లపాటు న్యాయపోరాటం చేశాడు. చివరికి కోర్టు తండ్రికి అనుకూలంగా తీర్పు ఇచ్చి, కుమారుడిని ఇల్లు ఖాళీ చేయించాలని ఆదేశించింది. ఆస్తి యాజమాన్యాన్ని తండ్రికి పునరుద్ధరించింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో విచక్షణ మరిచిన కొడుకు ఉత్తర్వులతో కోర్టు నుండి ఇంటికి తిరిగి వస్తుండగా జాఫర్పై ఎటాక్ చేశాడు. తండ్రి ప్రయాణిస్తున్న ఆటోరిక్షాను ఆపి, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తితో పొడిచి చంపాడు. పటేల్తో పాటు ఆయన కుమార్తె కూడా ఈ దాడిలో గాయపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
ఎద్దు లేదని భార్యనే నాగలికి కట్టిన రైతు.. సీఎం స్పందించి..
ముంబై: ఎద్దు స్థానంలో భార్యను ఉంచి నాగలి లాగుతున్న ఓ రైతు వీడియో ఇటీవల వైరల్ అయింది. ఇటీవల అకాల వర్షాల సమయంలో పిడుగు పడి ఒక ఎద్దు చనిపోవడంతో రైతు కాశీనాథ్ గైక్వాడ్ తన భార్య హౌసాబాయిని నాగలి లాగేందుకు ఎద్దు స్థానంలో ఉపయోగించిన దృశ్యాలు కనిపించాయి. కొత్త ఎద్దును కొనుగోలు చేసే స్తోమత లేకపోవడం, కీలకమైన విత్తనాల సీజన్ కోల్పోతామనే భయంతో ఆ దంపతులు కౌలుకు తీసుకున్న భూమిని సాగు చేయడం కొనసాగించేందుకు ఈ సాహసం చేశారు.మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లా, దేవోని తహసీల్ పరిధిలోని బోంబ్లీ ఖుర్ద్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీని గురించి తెలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెంటనే లాతూర్ జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి కుటుంబ పరిస్థితిపై సమగ్ర నివేదిక కోరారు. రైతుకు ఆలస్యం లేకుండా ప్రత్యామ్నాయ ఎద్దు అందించాలని, అత్యవసర సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి జోక్యం తర్వాత జిల్లా యంత్రాంగం స్థానిక గోశాల నుంచి ఒక ఎద్దును వెంటనే ఏర్పాటు చేసింది. దీంతో ఆ కుటుంబానికి తక్షణ ఉపశమనం లభించింది. కాశీనాథ్, హౌసాబాయి గైక్వాడ్ దంపతులు ఎన్నో ఏళ్లుగా పంటలో వాటా పద్ధతిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలల క్రితం వారు ఒక జత ఎద్దులను కొనుగోలు చేసేందుకు రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టారు. అయితే ఇటీవల తుపాను సమయంలో పిడుగు పడి ఒక ఎద్దు చనిపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. మరో ఎద్దు కొనుగోలు చేసే స్థితిలో లేకపోయింది.జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎద్దు మరణంపై అధికారిక అంచనా ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుటుంబానికి త్వరలో రూ.32,000 పరిహారం నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.పరిహార ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి వేగంగా స్పందించడం, వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవడం పట్ల ప్రశంసలు దక్కుతున్నాయి. సంక్షోభ సమయంలో ఇబ్బందులు పడుతున్న రైతు కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వ సున్నిత వైఖరి, తక్షణ చర్యలను లాతూర్ ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు ప్రశంసిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నేరుగా డబ్బు ఇచ్చి కొత్త ఎద్దు కొనుగోలు చేయకపోయినా ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత పశుసంవర్ధక శాఖ ప్రత్యామ్నాయంగా ఎద్దును ఏర్పాటు చేసి గైక్వాడ్ కుటుంబానికి అప్పగించింది. -
పుస్తకాలు పూసే ఊరు
ఒక గ్రామం గొప్పదవ్వాలంటే అక్కడ పెద్ద భవనాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక మంచి గ్రంథాలయం ఉంటే చాలు. ఒక దేశం గొప్పదవ్వాలంటే అక్కడ పెద్ద నగరాలు ఉండాల్సిన అవసరం లేదు. పుస్తకాలను ప్రేమించే పౌరులు ఉంటే చాలు. ‘భిలార్’ గ్రామం ఇందుకు నిదర్శనం. ఆ ఊరి వీధుల్లో నడుస్తుంటే గోడలు మాట్లాడతాయి. ఇళ్ల ముందర పూలకుండీలతో పాటు పుస్తకాల అలమారాలు కనిపిస్తాయి. మహారాష్ట్ర, సతారా జిల్లాలోని అందమైన పర్వత విహార కేంద్రాలైన పంచగని, మహాబలేశ్వర్ మధ్యలో ఉన్న ఈ ప్రశాంత గ్రామం చాలాకాలంగా స్ట్రాబెర్రీ సాగుకు ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామంలోని గోడలపై పుస్తకాల నుంచి ఎంపిక చేసిన భాగాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం భిలార్ను భారతదేశపు తొలి ‘పుస్తకాల గ్రామం’గా ప్రకటించడంతో ఈ చిన్న గ్రామం ఒక్కసారిగా పుస్తకాభిమానుల ఆకర్షణ కేంద్రంగా మారింది. సందర్శకులు గంటల తరబడి తమకు నచ్చిన పుస్తకాల్లో మునిగిపోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తూ, పఠన సంస్కృతిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. పుస్తక దుకాణాలు, సాహిత్య ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన బ్రిటన్లోని వేల్స్ ప్రాంతంలోని హే–ఆన్–వై పట్టణం ఈ ఆలోచనకు స్ఫూర్తి. ఈ భావనను మహారాష్ట్ర మరాఠీ భాషా శాఖ, రాష్ట్ర మరాఠీ వికాస్ సంస్థ ప్రతిపాదించాయి. ఈ కాలంలో ఒక గ్రామం తనను తాను పుస్తకాలతో నిర్వచించుకోవడం ఎంత గొప్ప విషయం! ఇవ్వాళ జ్ఞానం విస్తరిస్తోంది. కానీ లోతైన ఆలోచన క్రమంగా అరుదవుతోంది. అలాంటి సమయంలో భిలార్ ఒక ప్రత్యామ్నాయ స్వప్నంలా కనిపిస్తుంది. గ్రామంలోని ఇరవై ఐదు ప్రదేశాలలో ఉన్న ప్రత్యేక పఠన కేంద్రాలలో– కవిత్వం, నవలలు, బాలసాహిత్యం, మహిళల రచనలు, చరిత్ర, పర్యావరణం, జానపద సాహిత్యం, జీవిత చరిత్రలు, ఆత్మకథలు... ఇలా ఒక్కో కేంద్రంలో ఒక్కో విభాగానికి చెందిన పుస్తకాలు ఉంటాయి. ప్రతి కేంద్రం ఒక ప్రత్యేక ప్రపంచం. పాఠకుడు తన ఆసక్తిని బట్టి ఆ ప్రపంచంలోకి ప్రవేశించవచ్చు. గ్రామంలోని ఇళ్లు, పాఠశాలలు, సమావేశ భవనాలు, విశ్రాంతి స్థలాలు అన్నీ చిన్న చిన్న గ్రంథాలయాలుగా మారిపోయాయి.భిలార్ కథలో అత్యంత అందమైన అంశం ఏమిటంటే... అది ప్రభుత్వ ప్రాజెక్టుగా మొదలై, గ్రామ ప్రజల ఉద్యమంగా మారడం. తమ ఇళ్లలోని గదులను గ్రంథాలయాలుగా మార్చిన గ్రామస్థులు నిజమైన కథానాయకులు. తెలుగు రాష్ట్రాలు ఈ ప్రయోగం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ప్రతి జిల్లాలో ఒక పుస్తకాల గ్రామం ఎందుకు ఉండకూడదు? వేమన గ్రామం. గురజాడ గ్రామం. కాళోజీ గ్రామం. శ్రీశ్రీ గ్రామం. దాశరథి గ్రామం. సినారె గ్రామం... ఒక రచయిత పేరుతో కాదు, ఒక పఠన సంస్కృతి పేరుతో. భవిష్యత్తులో మన పిల్లలు ఏ ప్రపంచంలో జీవిస్తారో మనకు తెలియదు. కృత్రిమ మేధస్సు వస్తోంది. సాంకేతికత మరింత విస్తరిస్తోంది. కానీ ఒక విషయం మాత్రం మారదు. మనిషిని మనిషిగా నిలబెట్టేది అతని ఊహాశక్తి. ఆ ఊహాశక్తికి మూలం పుస్తకాలే. అందుకే భిలార్ ఒక గ్రామం మాత్రమే కాదు, మన కాలానికి అవసరమైన ఒక సందేశం. రోడ్లు అభివృద్ధిని తీసుకురాగలవు. పరిశ్రమలు సంపదను తీసుకురాగలవు. కానీ పుస్తకాలు మాత్రమే సంస్కృతిని తీసుకురాగలవు. – వారాల ఆనంద్, కవి–అనువాదకుడు -
పాక్ నిషేధం లేదా?.. జాతరలో కొన్న బెడ్షీట్పై మేడ్ ఇన్ పాకిస్తాన్ ముద్ర
ముంబై: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ వెలుగుచూసింది. ఓ జాతరలో కొనుగోలు చేసిన బెడ్షీట్పై ‘మేడ్ ఇన్ పాకిస్తాన్’ (Made in Pakistan) అనే లేబుల్ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియోను మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, పాకిస్తాన్కు చెందిన వస్తువులు భారత్లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పూణే సమీపంలోని పింప్రి-చించ్వాడ్ పరిధిలో ప్రసిద్ధ శ్రీ మోరయా గోసావి ఆలయంలో బుధవారం సంకష్ట చతుర్థి జాతర జరిగింది. ఈ జాతరకు పూణేకు చెందిన ఓ మహిళ వెళ్లింది. జాతరలో ఆమె.. బెడ్షీట్ను కొనుగోలు చేసింది. కొనుగోలు సమయంలో దానిపై ఎలాంటి అనుమానాస్పద గుర్తులు లేవు. అయితే, ఇంటికి వెళ్లాక దానిని వాష్ చేయడంతో ఒక మూలన దాచిన లేబుల్ స్పష్టంగా కనిపించింది. దానిపై మేడ్ ఇన్ పాకిస్తాన్ అని రాసి ఉండటం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో, వెంటనే దీన్ని ఫోన్లో రికార్డు చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పోలీసులు గుర్తించారు.पुणे के चिंचवड़ में मोरया गोसावी मंदिर के संकष्टी चतुर्थी के दिन मेले में मेड इन पाकिस्तान चीजों की बिक्रीहिंदू महिला ने किया उजागर वीडियो हुआ वायरल pic.twitter.com/JN859goEf9— Amrendra Bahubali 🇮🇳 (@TheBahubali_IND) June 5, 2026ఈ వైరల్ వీడియోపై తక్షణమే స్పందించిన పింప్రి-చించ్వాడ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బెడ్షీట్ను అమ్మిన సదరు వీధి వ్యాపారి ఎవరు? అతడికి ఈ స్టాక్ ఎక్కడి నుంచి సరఫరా అయింది? స్థానిక మార్కెట్లోకి ఈ పాకిస్తాన్ వస్తువులు ఎలా ప్రవేశించాయి? అనే సప్లై చైన్ నెట్వర్క్ను ఛేదించే పనిలో పడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్కు లేఖ రాశారు. అయితే, మహారాష్ట్రలోని శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లాలో కూడా ‘మేడ్ ఇన్ పాకిస్తాన్’ అని ఉన్న కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జాతరలు, స్థానిక మార్కెట్లలో విక్రయించే వస్తువులపై నిఘా వర్గాలు ప్రత్యేక నిఘా పెట్టాయి.ఇదిలా ఉండగా.. 2019లో జరిగిన పుల్వామా అటాక్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య వాణిజ్య సంబంధాలు గణనీయంగా తగ్గాయి. భారత్.. పాకిస్తాన్కు ఇచ్చిన Most Favoured Nation (MFN) హోదాను రద్దు చేసింది. అనంతరం పాకిస్తాన్ కూడా అనేక భారతీయ వస్తువుల దిగుమతులపై పరిమితులు విధించింది. అందువల్ల ‘Made in Pakistan’ అనే లేబుల్ ఉన్న వస్తువు భారత మార్కెట్లో కనిపిస్తే అక్రమంగా దేశంలోని వచ్చేనట్టే లెక్క. ఈ నేపథ్యంలో సరిహద్దు భద్రత, దిగుమతి నియంత్రణలు, అక్రమ సరఫరా గొలుసులపై ప్రశ్నలు లేవనెత్తుతాయి. -
బీజేపీ అభ్యర్థి కొడుకుతో సూలే కుమార్తె పెళ్లి
నాగ్పూర్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి వివాహం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అరుణ్ లఖానీ కుమారుడు శరంగ్ లఖానీతో రేవతి వివాహం ఈ నెల 20న జరగనుంది. మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో చంద్రపూర్-వర్ధా-గడ్చిరోలీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన అరుణ్ లఖానీ కుటుంబంతో సుప్రియా సూలే వియ్యమందుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అయితే రాజకీయాలు, కుటుంబ వ్యవహారాలు వేర్వేరని అరుణ్ లఖానీ స్పష్టం చేశారు.మహారాష్ట్రలో పెద్ద రాజకీయ కుటుంబమైన పవార్ ఫ్యామిలీతో పెళ్లి సంబంధం కలుపుకుంటున్నామని వెల్లడించారు. పవార్ కుటుంబంతో తమకు బంధుత్వం కూడా ఉందని తెలిపారు. వేర్వేరు రాజకీయ పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న తాము ఆయా పార్టీల సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. బంధుత్వానికి రాజకీయాలకు సంబంధం లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగి ఎంపికైన తనకు సుప్రియా సూలే అభినందనలు చెప్పినట్టు మరాఠీ న్యూస్ చానల్తో అరుణ్ లఖానీ చెప్పారు.గెలుపుపై దీమాప్రజలు తమ కోసం పనిచేసే వారినే ఎన్నుకుంటారని అరుణ్ లఖానీ (Arun Lakhani) అన్నారు. చంద్రపూర్-వర్ధా-గడ్చిరోలీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రజలతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. లక్ష్మణరావు మాంకర్ ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.పారిశ్రామికవేత్తలకే బీజేపీ ప్రాధాన్యంఅరుణ్ లఖానీకి బీజేపీ ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత విజయ్ వడెట్టివార్ విమర్శలు గుప్పించారు. క్షేత్రస్థాయి కార్యకర్తల కంటే పారిశ్రామికవేత్తలకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోందని కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ ఇప్పటికే తన అభ్యర్థులను ఖరారు చేసిందని, పూర్తి స్థాయిలో పోటీకి దిగుతుందన్నారు. తగిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ బీజేపీ చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించడం ఆ పార్టీ అంతర్గత ఆందోళనలకు సంకేతమని ఆరోపించారు. చంద్రపూర్ స్థానానికి కాంగ్రెస్ జాతీయ కిసాన్ సెల్ కార్యదర్శి, పలు రాష్ట్రాల ఇన్ఛార్జిగా ఉన్న శైలేంద్ర అగ్రవాల్ను అభ్యర్థిగా నిలబెట్టినట్లు విజయ్ వడెట్టివార్ తెలిపారు.18న ఎన్నికలుమహారాష్ట్రలో స్థానిక సంస్థల నియోజకవర్గాలకు చెందిన 16 శాసన మండలి స్థానాలకు, నాగ్పూర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఉపఎన్నికకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక స్వపరిపాలన సంస్థల ప్రతినిధులు ఓటర్లుగా వ్యవహరించే ఈ ఎన్నికలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్వహించనున్నారు. -
అవసరమైతే ‘సింధూర్ 2.0’కు సిద్ధం
పుణే: ఒకవేళ ‘ఆపరేషన్ సింధూర్ 2.0’ అవసరం తలెత్తితే అందుకు భారత సైనిక దళాలు సర్వసన్నద్ధం ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టంచేశారు. భూతల, గగనతల, సముద్ర యుద్ధానికి అతీతంగా ఆధునిక బహుళ–రంగ యుద్ధం కోసం త్రివిధ దళాలు సమన్వయాన్ని పెంచుకుంటున్నాయని తెలిపారు. మహారాష్ట్రలోని పుణే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(డీఎన్ఏ)లో శనివారం పాసింగ్ ఔట్ పరేడ్కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణలు తాత్కాలికంగా నిలిచి పోయినప్పటికీ.. మళ్లీ మొదలైతే అందుకోసం త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. గత ఏడాది పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద వివరాలు, శిక్షణ కేంద్రాలను సైన్యం నేలమట్టం చేసింది. పలువురు ముష్కరులను హతమార్చింది. పాక్ యుద్ధ విమానాలను కూల్చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ 2.0 ఎప్పుడు మొదలైనా సరే వెంటనే రంగంలోకి దిగేలా మన సైన్యం అన్ని రకాల సన్నాహాలతో సిద్ధంగా ఉందన్నారు. యుద్ధక్షేత్రాలు పారదర్శకం భవిష్యత్తులో యుద్ధం కేవలం భూమి, సముద్రం, గగనతలానికి పరిమితం కాదని జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. అంతరిక్ష యుద్ధాలు, సైబర్ సైబర్ యుద్ధాలు జరుగుతాయన్నారు. యుద్ధ రీతులు నానాటికీ మారిపోతున్నాయని గుర్తుచేశారు. ఆధునిక యుద్ధక్షేత్రాలు పారదర్శకంగా మారాయని వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రతి కదలిక అవతలివారికి వెంటనే తెలిసిపోతుందన్నారు. అందుకే సైనిక మోహరింపులు, బలగాల రక్షణ చర్యల విషయంలో సైనిక వ్యూహకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్రమబద్ధమైన, కచ్చితమైన, ప్రయోజనాత్మకమైన ప్రతిస్పందనలో భారతదేశ సంకల్పాన్ని, సాయుధ దళాల సామర్థ్యాన్ని ఆపరేషన్ సింధూర్ చాటిచెప్పిందని ఉద్ఘాటించారు. సమగ్ర ప్రణాళిక, రియల్ టైమ్ నిఘా, కచ్చితమైన లక్ష్య నిర్దేశం, పటిష్టమైన వాయు రక్షణ, సురక్షిత సమాచార మార్పిడి, వివిధ రంగాల మధ్య సమన్వయం ప్రాముఖ్యతను ఈ ఆపరేషన్ నొక్కిచెప్పిందని వివరించారు. భారత సైన్యం ఆధునీకరణ మార్గంలో ముందుకు సాగుతోందన్నారు. ‘భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే శక్తి’గా మనం రూపాంతరం చెందుతున్నామని, ఇందులో యువతరం పాత్ర కీలకమని స్పష్టంచేశారు. -
అద్భుత చికిత్సల పేరుతో మోసం.. పతంజలి ఉత్పత్తులు సీజ్
ముంబై: ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వ్యక్తులు, సంస్థలపై ఇకపై కఠిన చర్యలు తప్పవని మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (FDA) స్పష్టం చేసింది. తప్పుడు వైద్య ప్రకటనలు, అద్భుత చికిత్సల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.73 లక్షల మందులను అధికారులు స్వాధీనం చేశారు. తనిఖీల్లో భాగంగా 33 మంది అరెస్ట్ చేసి 27 సంస్థలను సీజ్ చేశారు. కాగా, పతంజలి బ్రాండ్తో విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తులు కూడా ఈ దాడుల్లో పట్టుబడటం గమనార్హం.ఈ సోదాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలో ఇటీవల ఎఫ్డీఏ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తుకారం ముండే ప్రజారోగ్య పరిరక్షణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మే 25న బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి, చట్టవిరుద్ధ ఔషధ తయారీ, విక్రయాలు, ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆ ఆదేశాల మేరకు మే 29న మహారాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి భారీ తనిఖీలు నిర్వహించారు. ముంబై, కొంకణ్, పూణే, నాసిక్, అమరావతి, నాగపూర్, శంభాజీనగర్ ప్రాంతాల్లో డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్) యాక్ట్-1954ను ఉల్లంఘిస్తున్న సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపారు.నివారణ పేరుతో మోసంపలు సంస్థలు తమ ఆయుర్వేద, హెర్బల్ ఔషధాలను ప్రచారం చేస్తూ క్యాన్సర్, మధుమేహం, లైంగిక సమస్యలు, స్థూలకాయం, వంధ్యత్వం వంటి తీవ్రమైన వ్యాధులను పూర్తిగా నయం చేస్తామని ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు "100 శాతం ఫలితం", "శస్త్రచికిత్స అవసరం లేదు", "కొద్ది రోజుల్లో వ్యాధి మాయం" వంటి వాదనలతో ప్రజలను ఆకర్షిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇలాంటి ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, సరైన వైద్య చికిత్సకు దూరం చేసే ప్రమాదం ఉందని ఎఫ్డీఏ పేర్కొంది. ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్, స్థానిక టీవీ ఛానళ్లు, పత్రికలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ఈ ప్రచారం సాగుతున్నట్లు గుర్తించారు.భారీగా స్వాధీనం..రాష్ట్రవ్యాప్తంగా అధికారులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో మొత్తం రూ.73.24 లక్షల విలువైన ఆయుర్వేద, అల్లోపతి ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు.కొంకణ్ విభాగంలో – రూ.18.58 లక్షలుపుణే విభాగంలో – రూ.14.68 లక్షలునాగ్పూర్ విభాగంలో – రూ.7.26 లక్షలునాసిక్ విభాగంలో – రూ.7.10 లక్షలుగ్రేటర్ ముంబైలో – రూ.1.85 లక్షల మందులుఅదనంగా రూ.21.83 లక్షల విలువైన మిస్ బ్రాండెడ్ అల్లోపతి మందులు కూడా స్వాధీనం చేశారు.పతంజలి ఉత్పత్తులపైనా చర్యలుహరిద్వార్కు చెందిన దివ్యా ఫార్మసీ తయారు చేసిన, పతాంజలి బ్రాండ్తో విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తులు కూడా ఈ దాడుల్లో పట్టుబడ్డాయి. తీవ్రమైన వ్యాధులకు హామీ చికిత్స ఇస్తామని ప్రచారం చేసిన నేపథ్యంలో వాటిపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 60 రకాల ఉత్పత్తులను కలిపి రూ.28.78 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేశారు.కఠిన హెచ్చరికఈ సందర్భంగా కమిషనర్ తుకారం ముండే మాట్లాడుతూ..‘ప్రజల ఆరోగ్యంతో ఆటలాడేవారిని వదిలిపెట్టం. తప్పుడు ప్రకటనలు, అక్రమ ఔషధాలు, కల్తీ ఆహారంపై మరింత కఠిన చర్యలు తీసుకుంటాం’ అనిహెచ్చరించారు. మొత్తంగా కమిషనర్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ దాడులు కల్తీ ఆహారం, తప్పుడు వైద్య ప్రకటనల మాఫియాకు గట్టి హెచ్చరికగా మారాయి. -
పుణేలో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి
ముంబై: పుణేలో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందారు. శివారు ప్రాంతమైన పింప్రి చించ్వాడ్లో ఈ ఘటన జరిగింది. పింప్రి చించ్వాడ్లోని వాన్వాడి ప్రాంతంలో అక్రమ మద్యం సేవించి గురువారం ఎనిమిది మంది మరణించగా.. ఇవాళ (శుక్రవారం) ఉదయం మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 11కి చేరింది. మద్యం సేవించిన తర్వాత బాధితులు స్పృహ తప్పి పడిపోయారని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వారు మరణించినట్లు ప్రకటించారు.ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని స్థానిక ఎన్సీపీ నేత యోగేష్ బహాల్ డిమాండ్ చేశారు. పోలీసులు, అధికారుల అండదండలతోనే అక్రమ, కల్తీ మద్యం బహిరంగంగా విక్రయిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. పోలీసుల కళ్ల ముందే కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారని.,. చర్యలు తీసుకోవాల్సింది పోయి.. 11 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దందాలో వారు కూడా భాగమయ్యారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఎండతీవ్రత, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ మరణాలు సంభవించి ఉండవచ్చని పేర్కొంటూ... ఈ 11 మరణాలు కల్తీ మద్యం వల్లే జరిగాయని ధృవీకరించడానికి పోలీసులు నిరాకరించారు. పోస్ట్మార్టం రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన ఆదేశించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం నెట్వర్క్ను అధికారులు గుర్తించారని.. దీని వెనుక ఎంతమంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. -
పుణేలో అమానవీయ ఘటన.. ప్రియురాలిపై యువకుడి దాడి..
-
టెన్త్ డ్రాపౌట్..ఆయుధాలు, డ్రోన్ సాంకేతికత అందించే కంపెనీ..!
ఒక వ్యక్తి ఒకానొక టైంలో చదువుని మధ్యలోనే ఆపేసినా..పరిస్థితులు, కష్టాలు, అసామాన్య ప్రతిభను వెలికితీస్తాయి అనేందుకు ఈ కథే ఉదాహరణ. ఆర్థిక కష్టాలు పదోతరగతికి మించి ఉన్నత చదువుని అందుకునే పరిస్థితి కల్పించికపోతేనేం..అచంచలమైన దృఢ సంకల్పంతో ఒక్కోమెట్టు ఎక్కుతూ.. వ్యవస్థాపకుడిగా మారాడు. అక్కడ నుంచి దేశమే గర్వించేలా రక్షణవ్యవస్థ సామర్ధ్యాన్ని బలోపతేం చేసే పేలుడు పదార్థాలు, డ్రోన్ సాంకేతికత అందించే కంపెనీని రన్ చేసే స్థాయికి చేరుకున్నాడు.అతడే రాజస్థాన్కి చెందిన సత్యనారాయణ్ నువాల్. రాజస్థాన్లోని భిల్వారా గ్రామానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వ రెవెన్యూ అధికారిగా పనిచేసేవారు. తండ్రి పదవీ విరమణతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో పదితోనే చదువు ఆపేయాల్సిన వచ్చింది. దాంతో 1970వ దశకంలో నువాల్ జీవనోపాధి కోసం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఉన్న బల్హర్షాకు వెళ్లారు. కనీస వసతి లేక ఆయన రాత్రుళ్లు రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అనేక చిన్న చిన్న వ్యాపారాలు ప్రయత్నించారు. 18 ఏళ్ల వయసులో ప్రారంభించిన ఫౌంటెన్-పెన్ ఇంక్ తయారీలో నష్టం రావడం వంటి పలు ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కి తగ్గక.. గెలుపు పిలుపు వినిపించ్చేదాక ఏదో ఒక చిన్న వ్యాపార ప్రయత్నం చేస్తూనే ఉండేవారు. ఆ క్రమంలోనే పేలుడు పదార్థాల వ్యాపారి అబ్దుల్ సత్తార్ అల్లాభాయ్ని కలిశారు. అదే ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. వెయ్యితో మొదలై..కోట్లకు విస్తరించేలా..ఆ వ్యాపారితో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఆయన వద్ద నుంచి లైసెన్సు, నిల్వ సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి నెలకు రూ. 1,000 చెల్లిస్తూ వ్యాపారం మెదలుపెట్టాడు. ఆయన రూ. 250లకు పేలుడు పదార్థాలు కొని వాటిని రూ. 800లకు అమ్మే వ్యాపార చతురత నువాల్లని ఎంతగానో ఆకర్షించింది. అలా ఆయన బ్రిటిష్ సంస్థ ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ (ICI)లో పంపిణీదారుడిగా నియామకం పొంది కీలకమైన పరిశ్రమ అనుభవాన్ని సంపాదించుకుని ఆర్థిక స్థిరత్వాన్ని పొందాడు. ఆ విధంగా 1995లో రూ. 60 లక్షల రుణంతో నువాల్ నాగ్పూర్లో సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ను స్థాపించారు. ఈ సంస్థ 1996లో ప్యాకేజ్డ్ పేలుడు పదార్థాలు, బల్క్ పేలుడు పదార్థాలు, డిటోనేటర్ల తయారీతో కార్యకలాపాలను ప్రారంభించింది. మొదట చిన్న తరహా సంస్థగా ప్రారంభమైన..కొద్ది కాలంలోనే విస్తరించి భారతదేశంలోనే అతి పెద్ద పేలుడు పదార్థాల ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఈ సంస్థ ఎదిగింది. రక్షణ వ్యవస్థ కోసం పనిచేయడం..నాగస్త్రకు అనుబంధంగా భార్గవస్త్ర అనే ఒక అధునాతన కౌంటర్-డ్రోన్ (C-UAS) వ్యవస్థ ఉంది. ఈ మైక్రో-క్షిపణి ఒకేసారి 60 లక్ష్యాల వరకు ఛేదించగలదు. ఈ సామర్థ్యం ఇతర దేశాలు మోహరించిన వ్యవస్థలను మించిపోయింది. మాములుగా ఇవి సాధారణంగా ఒకేసారి నాలుగు ప్రయోగాలను మాత్రమే నిర్వహించగలుగుతాయి. దీంతో 2010 నాటికి సోలార్ ఇండస్ట్రీస్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. అలా రక్షణ దళాల కోసం పేలుడు పదార్థాలను తయారు చేయడానికి భారత ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన తొలి ప్రైవేట్ భారతీయ సంస్థగా ఇది నిలిచింది. ఆ లైసెన్స్ కాస్తా పేలుడు పదార్థాల నుంచి అత్యాధునిక సాంకేతిక రక్షణ వ్యవస్థల వైపు మళ్లడానికి నాంది పలికింది. ఆ విధంగా నువాల్ నాయకత్వంలో సంస్థ అనూహ్యంగా వృద్ధి చెంది ఇప్పుడు భారతదేశం అంతటా 27 తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. అంతేగాదు ఎనిమిది దేశాల్లో ఉత్పత్తి యూనిట్లను కలిగి ఉండటమే గాక సుమారు 75 నుంచి 90 దేశాలకు ఎగుమతి చేస్తోంది కూడా. 2023 నాటికి, సోలార్ ఇండస్ట్రీస్ ఏకంగా రూ. 8వే కోట్లు ఆదాయంతో ప్రపంచంలోనే ఐదు అగ్ర పేలుడు పదార్థాల తయారీలో ఒకటిగా నిలిచింది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1 లక్ష కోట్లను దాటి, దాదాపు రూ. 1.54 లక్షల కోట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇందులో నువాల్ సుమారు 70 శాతం ఈక్విటీని కలిగి ఉన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ సదుపాయాలను సందర్శించి, కంపెనీ సాంకేతిక పురోగతిని ప్రశంసించారు. అలా నువాల్ కంపెనీ రక్షణ వ్యవస్థ కోసం పనిచేయడం ప్రారంభించింది. అంతేగాదు ఆపరేషన్ సింధూర్లో సైతం నాగాస్త్రంతో ఒక నిర్ణయాత్మక పోషించారు. అందుకుగాను భారత ప్రభుత్వం జనవరి 26, 2026న పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి గౌరవించింది. ఒకప్పుడు చదువు మధ్యలో ఆపేసిన వ్యక్తి భారతదేశ రక్షణ ఉత్పాదక విప్లవంలో అగ్రగామిగా ఉన కంపెనీకి సారథ్యం వహించే స్థాయికి చేరడం నిజంగా స్ఫూర్తిదాయకం కదూ..!.(చదవండి: మురికి వాడ నుంచి ఏఐ ఎక్స్పర్ట్ రేంజ్కి..! పేదింటి అమ్మాయి విజయగాథ) -
వరుడు కుటుంబం రిటర్న్ గిఫ్ట్ అదుర్స్..! మొత్తం గ్రామానికి రూ. 34.6 కోట్ల..
వివాహం అనగానే ఓ పండుగ వాతావరణంలో ఉంటుంది. మా ఊర్లో ఫలాన వాళ్లది పెళ్లి అని అంతా సంతోషంగా చెప్పుకుంటారు కూడా. ఆ ఆనందం పెళ్లిని నిర్వహిస్తున్న కుటుంబాలకే చెందినదైనా..ఆ ఊరు లేదా ఆ గ్రామంలోని అందరి కళ్లలో సంతోషం వెల్లివెరిస్తుంది. అయితే ఇక్కడ ఈ వివాహ వేడుక ఈ సంతోషం తమకు మాత్రమే గాక ప్రజలందరూ సంబరపడే ఉండాలని ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి యావత్తు గ్రామం ఫిదా అవ్వడమే కాదు.. కళ్లు చెమర్చాయ్. ఆహా..! మీ వివాహ వేడుక మా ఆర్థిక భద్రతగా మారిందా అని అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఈ వింత ఘటన మహారాష్ట్రలోని బహదర్పురా గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మంచి సంగీతం, విందు భోజనంతో పాటు ఈ వేడుక సంతోషం అందరికి చేరువవ్వాలిని అపురూపమైన రిటర్న్ గిఫ్ట్లు అందించింది వరుడి కుటుంబం. వివాహ తంతులో సాంప్రదాయ జ్ఞాపికలు లేదా బహుమతులకు బదులుగా వరుడు సిద్ధేశ్వర్ పేఠ్కర్ అతని కుటుంబం గ్రామంలోని 3,465 మంది నివాసితులందరికీ రూ. 34.6 కోట్ల విలువైన ప్రమాద బీమా కవరేజీని బహుమతిగా ఇచ్చింది.అర్హులైన ప్రతి గ్రామస్తునికి భీమా సౌకర్యం..పేఠ్కర్ కుటుంబం స్థానిక గ్రామ పంచాయతీ పేరు మీద గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసింది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, అలాగే ఎవ్వరూ మినహాయించబడకుండా ఉండేలా గ్రామ ఓటర్ల జాబితానే నేరుగా బీమా కంపెనీకి సమర్పించింది. దాంతో అర్హులైన ప్రతి నివాసికి స్వయంచాలకంగా రూ. 1 లక్ష ప్రమాద బీమా లభించేందుకు మార్గం సులభమైంది. ఈ బీమా పాలసీ ఒక ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. అలాగే భవిష్యత్తు పునరుద్ధరణపై చర్చలు కూడా జరగనున్నాయి. అయితే, పాలసీ కోసం చెల్లించిన మొత్తం ప్రీమియంను వెల్లడించకూడదని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. ఈ మేరకు వరుడు కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. "మన సంస్కృతిలో దానధర్మాల గురించి అందరికీ చాటింపు వేయం. అందుకే ఎవ్వరికీ ఆ మొత్తం సొమ్ము గురించి చెప్పాలనుకోవడం లేదు. మాకు కేవలం ఆశీర్వాదం చాలు. చప్పట్లు పొగడ్లతో పనిలేదు. ఆకస్మిక ప్రమాదాలు గ్రామీణ కుటుంబాలను ఆర్థికంగా ఎలా నాశనం చేస్తాయో ప్రత్యక్షంగా చూడటం వల్ల తమకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలలో పాముకాట్లు, పిడుగుపాటు, వ్యవసాయ సంబంధిత ప్రమాదాలు సర్వసాధారణం, పైగా బీమా సౌకర్యం చాలా అరుదుగా ఉంటుంది. మా ఆనందం మా ఇంటికే పరిమితం కాకూడదనే ఇలా చేశాం. ఈ పెళ్లి కేవలం జ్ఞాపకంగా మాత్రమే కాకుండా రక్షణగా మారాలని ఆశించే ఇలా చేశామని అన్నారు" వరుడు సిద్ధేశ్వర్ కుటుంబీకులు. అక్కడి గ్రామస్తులు సైతం ఇప్పటివరకు ఇలాంటి పెళ్లి కానుకను చూడలేదని.. మొత్తం గ్రామానికే సాముహిక సంరక్షణను అందించే ఆర్థిక భద్రతను అందించిందంటూ సదరు వరుడి కుటుంబంపై ప్రశంసల వర్షం కురిపించారు. చదవండి: రూ. 300 కోట్ల కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగానికి రిజైన్..! ఆ క్షణమే అమ్మ, బార్య.. -
తెలంగాణ ఇక్కత్ చీరలో రాధికరాజే గైక్వాడ్ ! ఏకంగా నాలుగేళ్లు..
పూర్వపు బరోడా (వడోదర) రాచరిక రాష్ట్ర మహారాణి సాంప్రదాయ భారతీయ నేత కళల పునరుద్ధరణ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారామె. అంతేగాదు ఒకప్పుడు కేవలం మరాఠా రాజ కుటుంబాల కోసం మాత్రమే నేయబడి..ఇప్పుడు కనుమరుగైన చారిత్రాత్మక బరోడా శాలు పునరుద్ధరణ కోసం, రాజమాత శుభాంగిని రాజేతో కలిసి నాయకత్వం వహించారు కూడా. ఆమె వద్ద 100 ఏళ్లకు ముందు ఉండే పురాతనమైన వారసత్వపు చీరలతో సహా, అబ్బురపరిచే చీరల సేకరణ కూడా ఉంది. ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రసిద్ధ నేత చీరలను ధరించి, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అవి నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఆమె ఇన్స్టాగ్రామ్ పురాతన చీరలకు నిధిలా ఉంటుంది. అవి మనకు రకరకాల నేతలు, వాటి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నట్లుగా ఉంటుంది. అలానే తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమంలో సంచలనంగా మారింది. ఆ చీరకు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలిస్తే విస్తుపోతారు. మరి అవేంటో సవివరంగా తెలుసుకుందామా.!.మహారాణి రాధికరాజే గైక్వాడ్ తాజా ఇన్స్టాగ్రామ్లో సికింద్రాబాద్కు చెందిన వరశ్రీ వారు రూపొందించిన తెలంగాణ సుప్రసిద్ధ ఇక్కత్ చేనేత చీరలో కనిపించారు. ఆ చీరపై డబుల్ ఇక్కత్, కంబైన్డ్ ఇక్కత్ పద్ధతులు అరుదైన సమ్మేళ్లనంతో 30 రంగులలో నేసిన 108 అసలైన తేలియా రుమాల్ జ్యామితీయ నమూనాలు ఉన్నాయి. ఆమె ఆ పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. తెలంగాణ ఇక్కత్లలో ఒక అద్భుతమైన కొత్త భాష ఉంటుంది. ఇది సాంప్రదాయ నైపుణ్యం, గణితం, సహనం, సృజనాత్మకత, ఆవిష్కరణల కలయిక. ఈ కళ సంక్లిష్టత మాత్రమే తనని ఆకట్టుకోలేదని, దాని వెనుకున్న అంకితభావం, నెలల తరబడి పరిశోధన, మరచిపోయిన నమునాల సంగ్రహాలు, అంతులేని గ్రాఫ్ పేపర్లు, 60 రంగులద్దే సెషన్లు, నిపుణులైన సమిష్ట స్ఫూర్తి తదితరాలు ఎంతగానో ఆకట్టుకుంటాయని అన్నారామె. అందువల్ల తనకు ఆ చీర అత్యంత గొప్పదిగా కనిపిస్తుందని అన్నారు. ఇక్కడ రాధికారాజే ధరించిన చీర ఏకంగా నాలుగు నెలలపాటు నేశారట. ఇంద్రధనుష్గా పిలిచే ఈ చీరలో మోటీఫ్ల మధ్య ఇంద్రధనుస్సుని తలపించే రంగులు, డబుల్ ఇక్కత్ మోటిఫ్లలో చదరంగం గళ్ల వంటి నిర్మాణాలు, తెలంగాణ ఇక్కత్ కోసం కొత్తగా అభివృద్ధి చేసిన ఫ్యాబ్రిక్ టెక్స్చర్ తదితరాలు కూడా ఉన్నాయి. ఇలాంటి చీరలు చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఈ చీర అరుదైన కలెక్షన్స్కి చెందిన శారీగా పేర్కొనవచ్చు అని రాధికారాజే అంటున్నారు.తెలియా రుమాల్ చరిత్రతెలియా రుమాల్ అనేది తెలంగాణలోని నల్గొండ జిల్లా పుట్టపాక, ఆంధ్రప్రదేశ్లోని చీరాలలో ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ చేనేత వస్త్ర కళ. ఈ కళలో నూలును నువ్వుల నూనె, ఆముదం తదితర మూలికలతో శుద్ధి చేసి, డబుల్ ఇక్కత్ పద్ధతిలో జ్యామితీయ నమూనాలతో నేస్తారు. ఇది 19వ శతాబ్దానికి చెందిన కళ. దీనికుండే జిడ్డు స్పర్శ, వాసన వాటన్నింటిని సూచిస్తుంది. సాధారణంగా ఇలాంటి ఫ్యాబ్రిక్ని తల లేదా మెడ, నడుము కట్టుకునే వస్త్రాలుగా ఉపయోగించేవారు. దీన్ని 'ఆసియా రుమాల్' గా వాణిజ్య ఎగుమతి చేసేవారు. గుజరాత్కు చెందిన పటోలా లాగా, చేనేత మగ్గంపై నేయడానికి ముందు వార్ప్, వెఫ్ట్ దారాలు రెండింటికీ రెసిస్ట్-డైయింగ్ చేసే డబుల్ ఇకాట్ పద్ధతిలో నేయబడిన కొన్ని దక్షిణాసియా వస్త్రాలలో ఇది ఒకటి. ఈ తేలియా రుమాల్లోని నూనె దుమ్మును దూరంగా ఉంచడం తోపాటు వాష్బుల్ కానీ విధంగా ధరించేవారట.ఇక డబుల్ ఇక్కత్ అనేది ఒక సంక్లిష్టమైన నేత పద్ధతి, దాని ఫలితంగా, తేలియా రుమాల్ వస్త్రంలో ఉపయోగించే మూలాంశాలు మొదట్లో "వజ్రాలు, నక్షత్రాలు, చతురస్రాలు, చుక్కలు, చారలు, గడులు వంటి సరళమైన జ్యామితీయ ఆకారాలుగా ఉండేవి, ఇవి తరచుగా మొజాయిక్ పనిని పోలిన కలయికలలో అమర్చబడేవి. అయితే, 1920, 1930ల మధ్య, అవి మార్పులు చోటు చేసుకోవడంతో మనుషుల నమూనాలను, విమానాలు, గ్రామఫోన్లు, గడియారాలు వంటి కొన్ని సమకాలీన మూలాంశాలను కూడా చేర్చడం మొదలైంది. అంతేగాదు 2020లో తెలంగాణకు చెందిన తేలియా రుమాల్కు భౌగోళిక గుర్తింపు (GI ట్యాగ్) కూడా లభించింది. View this post on Instagram A post shared by Radhikaraje Gaekwad (@radhikaraje) (చదవండి: Tai Chi walking: ‘తాయ్ చి’ వాకింగ్ ట్రెండ్..! ఇది పెద్దలకు మంచిదా?) -
బ్రహ్మపురిః47.2
న్యూఢిల్లీ: దేశంలోని చాలా రాష్ట్రాలు మండుతున్న ఎండలతో అల్లాడుతున్నాయి. ఆదివారం మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలో ఉన్న బ్రహ్మపురిలో దేశంలోనే అత్యధికంగా 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగత్ర రికార్డయ్యింది. ఇది సాధారణం కంటే 4.6 డిగ్రీలు ఎక్కువ. యూపీలోని బాందాలో 46.8, రాజస్తాన్లోని గంగానగర్లో 46 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 46, మహారాష్ట్రలోని చంద్రాపూర్లో 45.6, వార్థాలో 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. రాజస్తాన్లో 47 డిగ్రీల వరకు నమదయ్యే అవకాశముందంది. కాగా, మే 29వ తేదీ తర్వాత క్రమేపీ ఎండల నుంచి ఉపశమనం కలగనుందని ఐఎండీ అంచనా వేసింది. -
నలుగురు మహిళల మృతి.. ఎట్టకేలకు చిక్కిన పులి
ముంబై: మహారాష్ట్రలో బీభత్సం సృష్టించి నలుగురు మహిళల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న పులిని ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు బంధించారు. ఈ రోజు( ఆదివారం) పులిని బంధించడానికి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో పులి చిక్కినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.కాగా రెండురోజుల క్రితం చంద్రపూర్ జిల్లా గంజేవాహి అడవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో మహిళలు బీడీ ఆకులు ఏరుకోవడానికి అడవికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే మాటు వేసిన పులి విచక్షణ రహితంగా వారిపై దాడి చేసింది. మెుత్తంగా 13 మందిపై బెబ్బులి దాడి చేయగా అందులో నలుగురు మృతిచెందారు.మృతిచెందిన వారు దాదాజి మెహర్లే, సంగీతా సంతోష్ చౌదరీ, కౌశిక్ మెుహర్లే, అనుబాయి దాదాజీ మెుహర్లేగా గుర్తించారు. దీంతో వివరాలు తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. పులిని బంధించడానికి అధికారులు ప్రయత్నాలు చేయగా ఎట్టకేలకు బోనులో చిక్కింది. -
మహిళలపై పులి దాడి.. అక్కడికక్కడే నలుగురు మృతి
-
మహిళలపై పులి పంజా.. నలుగురు మృతి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో బెబ్బులి బీభత్సం సృష్టించింది. బీడీ ఆకులు ఏరుకునడానికి అడవికి వెళ్లిన మహిళలపై తన పంజా విసిరింది. మెుత్తం 13 మంది మహిళలపై బెబ్బులి దాడి చేయగా అందులో నలుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.చంద్రపూర్ జిల్లా గంజేవాహి అడవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో మహిళలు బీడీ ఆకులు ఏరుకోవడానికి అడవికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే మాటు వేసిన పులి విచక్షణ రహితంగా వారిపై దాడి చేసింది. వారికి పారిపోయే అవకాశం ఇవ్వకుండా విరుచుకపడింది. మెుత్తంగా 13 మందిపై బెబ్బులి దాడి చేయగా అందులో నలుగురు మృతిచెందారు.మృతిచెందిన వారు దాదాజి మెహర్లే, సంగీతా సంతోష్ చౌదరీ, కౌశిక్ మెుహర్లే, అనుబాయి దాదాజీ మెుహర్లేగా గుర్తించారు. దీంతో వివరాలు తెలుసుకున్న అడవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా ఇటీవల కాలంలో మహారాష్ట్రలోని అటవీ ప్రాంతాల్లో మనుషులు-వన్యప్రాణుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చంద్రపుర్ జిల్లాలో పులుల సంఖ్య అధికంగా ఉండటంతో తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గడం, మానవ నివాసాలు అటవీ ప్రాంతాలకు దగ్గర కావడం వంటి కారణాలతో పులులు గ్రామాల వైపు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. పులుల భయం తగ్గేలా అటవీశాఖ అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. -
దాహం తీర్చండయ్యా..
ఒక రోజంతా తిండిలేకుండా ఉండగలవేమోగానీ ఒకపూట అందులోనూ ప్రచండ ఎండల్లో ఆరుబయట చుక్కనీరులేకుండా తిరగడం అస్సలు సాధ్యంకాని పని. వేసవికాలంలో నోరులేని మూగజీవాల సంగతి చెప్పనక్కర్లేదు. అటవీప్రాంతాల్లోని వానరాలు, కొండముచ్చుల దాహార్తి ఇక ఎవరికీ పట్టదు. కొండ మీద స్వేచ్ఛగా తిరిగే కొండముచ్చులు మండే ఎండల ధాటికి తాగడానికి నీరులేక రహదారి సమీపానికి వచ్చాయి. ఒక కొండముచ్చు ప్రాణాలకు తెగించి రోడ్డుకు అడ్డంగా కూర్చుని దప్పిక తీర్చమని అరి్థంచింది. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో జరిగింది. పుసాద్ పట్టణం సమీపంలోని ఖండాలా ఘాట్ గుండా గురువారం మధ్యాహ్నం ప్రయాణికులతో మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా బస్సు ఖండాలా ఘాట్ అటవీప్రాంతం గుండా వెళ్తుండగా హఠాత్తుగా ఒక కొంచముచ్చు రోడ్డు మధ్యలోకి వచ్చి ఆగింది. డ్రైవర్ వెంటనే బస్సును ఆపి కిందకు దిగొచ్చి ఎంతలా అదిలించినా అది అస్సలు అక్కడి నుంచి కదల్లేదు. చుక్క నీరులేక దప్పికతో ఉందని దానిని తేరిపారా చూశాక డ్రైవర్కు అర్థమైంది. వెంటనే నీళ్లసీసాతో దానికి నీళ్లు పట్టాడు. ఆబగా అది నీళ్లు తాగడం చూసి సమీపంలోని డజనుపైగా కొండముచ్చులు సైతం రోడ్డు మీద కొచ్చి ప్రయాణికుల వైపు నిస్సహాయంగా చూడడం మొదలెట్టాయి. ఇదంతా గమనించిన ప్రయాణికుల మనసు చివుక్కుమంది. వెంటనే ప్రతి ఒక్క ప్రయాణికుడు తమ వెంట తెచ్చుకున్న నీళ్లసీసాలతో కొండముచ్చులకు నీళ్లు పట్టే ప్రయత్నంచేశారు. ఈ హృదయవిదారక దృశ్యాలను లతా శ్రీవాస్ అనే ప్రయాణికురాలు వీడియో తీయగా ఇప్పుడది వైరల్గా మారింది. అటవీప్రాంతంలో మధ్యాహ్నం ఎండకు తాగునీటి కోసం వెతికి వెతికి అవన్నీ నీరసించిపోయి కన్పించాయని ప్రయాణికులు తెలిపారు. కరువు కోరల్లో చిక్కుకున్న విదర్భ ప్రాంతంలో జనం నీళ్లకోసం ఎంతగానో శ్రమిస్తుంటే ఇక అటవీప్రాంతంలోని మూగజీవుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మండు వేసవిలో అటవీప్రాంతంలోని కోతుల కోసం అటవీశాఖ సిబ్బంది కొన్ని చోట్ల కృత్రిమ నీటికుంటలను ఏర్పాటుచేస్తున్నా అవి ఎండలకు చుక్కనీరులేకుండా పోతున్నాయి. ఖంఢాలా ఘాట్లో కోతులకు కనీసం నీటిసదుపాయం కల్పించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని సోషల్మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వడగాల్పుల వేసవిలో ఇళ్లలో ఉండే జనమే తిప్పలుపడుతుంటే ఇక కొండల్లో ఉండే కోతుల పరిస్థితి ఏంటి?. వన్యప్రాణాల గొంతులు పిడతగట్టుకుపోతుంటే పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. మారుతున్న వాతావరణ పరిస్థితుల ధాటికి వర్షాలు బాగా తగ్గిపోయి, పండ్ల చెట్లు నశించి అడవుల్లో వన్యప్రాణులకు సరైన తిండి కూడా దొరకట్లేదు’’అని ఒక నెటిజన్ ఆవేదన వ్యక్తంచేశాడు. – ముంబై -
బిడ్డల్ని వదిలేసి, డబ్బు, స్కూటర్ తీసుకొని ప్రియుడితో పరార్
ఎంత కష్టమొచ్చినా..కన్నీళ్లొచ్చినా.. బిడ్డల్ని కళ్లల్లో పెట్టుకొని కాపాడేది తల్లి. అలాంటి తల్లే కన్న బిడ్డలకి తీరని అన్యాయం చేస్తే.. ఇక ఆ బిడ్డలకు దిక్కెవ్వరు? సరిగ్గా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో వెలుగుచూసింది. కేవలం పిల్లలను వదిలేయడమే కాదు, తన తండ్రి డబ్బును, స్కూటర్ను కూడా దొంగిలించి ప్రియుడితో చెక్కేసిన షాకింగ్ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.అసలేం జరిగింది?పంఢరపూర్ - శంభాజీనగర్ రూట్లో వెళ్తున్న ఒక బస్సులో ఈ ఘటన జరిగింది. ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను బస్సు ఎక్కించి, తన తండ్రి స్కూటర్ వేసుకుని ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది. బస్సులో ఆ పిల్లలు ఇద్దరూ ఒంటరిగా ఏడవడం గమనించిన కండక్టర్, వారి దగ్గరకు వెళ్లి పరిశీలించాడు. ఆ సమయం లోనే ఒకరి జేబులో ఉన్న చీటీని చూసి, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.బస్సులో ఏడుస్తున్న ఒక చిన్నారి జేబులో ఉన్న చీటీలో ఏముంది అంటే "ఈ పిల్లలకు తల్లిదండ్రులు లేరు, దయచేసి వీరిని యావత్మాల్ వెళ్లే బస్సు ఎక్కించండి." అని ఉన్న హృదయవిదారకమైన వాక్యాలివి. ఆ నోట్ పక్కనే ఒక మొబైల్ నంబర్ కూడా ఉంది. పోలీసులు ఆ నంబర్కు ఫోన్ చేసి విచారించగా నమ్మలేని ఒక షాకింగ్ నిజం బయట పడింది. సరిగ్గా అదే సమయంలో, యావత్మాల్కు చెందిన ఒక వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురు ఇంట్లో ఉన్న డబ్బు, స్కూటర్ తీసుకుని పారిపోయిందని ఆ ఫిర్యాదు సారాంశం. కేసు నమోదు చేసుకున్న బీడ్ (Beed) జిల్లా పోలీసులు ఆ వృద్ధుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించారు. బస్సులో ఒంటరిగా దొరికిన ఆ ఇద్దరు పిల్లలు మరెవరో కాదు, తన స్వంత మనవడు, మనవరాలేనని అతను గుర్తించాడు. ఆ పిల్లల కన్నతల్లే వారిని నడిరోడ్డుపై వదిలేసి, తన ప్రియుడితో కలిసి పారిపోయిందని తెలిపాడు.మరో షాకింగ్ సంగతి ఏంటంటే. బిక్కు బిక్కుమంటున్న పిల్లల్ని చూశాక తాత ప్రవర్తన పోలీసులనే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒంటరిగా ఉన్న పిల్లల్ని చూసి తాత మనసు కరగలేదు, కనీసం ఓదార్చ లేదు. వారిని ఇంటికి తీసుకెళ్లడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు సరికదా పిల్లల భవిష్యత్తు కంటే, పోయిన తన స్కూటర్ గురించే అతడు ఎక్కువ ఆందోళన చెందడం మరింత విస్మయ పర్చింది. ఆ పిల్లల బాధ్యతను తీసుకోవడం తన వల్లకాదని తెగేసి చెప్పాడు. చివరకు, పోలీసులే ఆ పిల్లల రక్షణకు ఏర్పాట్లు చేశారు. బీడ్ జిల్లా శిశు సంక్షేమ కమిటీ (Child Welfare Committee), జిల్లా పరిపాలనా యంత్రాంగం సహాయంతో ఆ ఇద్దరు పిల్లలను సురక్షితమైన చిల్డ్రన్ హోమ్కు తరలించారు. -
కేన్స్లో ప్రజక్తా మాలి ట్రెడిషనల్ లుక్! సగర్వంగా భారతీయత..
ఫ్యాషన్ ప్రపంచంలో ఇది ‘కేన్స్’ సీజన్! పేరుకి ఫిల్మ్ ఫెస్టివల్... కానీ ప్రపంచమంతా సెలెబ్రిటీల దుస్తులు, రెడ్ కార్పెట్ మీద వారి లుక్స్ తదితరాలే హాట్టాపిక్గా నిలుస్తుంటాయి. అందుకోసం తారలు, సెలబ్రిటీలు తల నుంచి పాదాల వరకు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చూపుతిప్పుకోని విధంగా రెడి అయ్యేందుకు కొన్ని నెలల ముందు నుంచే సన్నద్ధమవుతుంటారు. అయితే ఈ ప్రపంచ వేదిక కేన్స్ రెడ్ కార్పెట్పై మెరిసే లాంగ్ గౌనులు, పాశ్చాత్య స్టైలిష్ వేర్లే సందడి చేస్తుంటాయి. అలాంటిది ఈసారి భారతీయ డిజైనర్లు మన భారతీయ సంప్రదాయ వారసత్వానికే పెద్దపీట వేశారు. ఒక్కో ప్రాంతంలో ఉన్న సంప్రదాయ చీరలు, ఆభరణాలతో తారలు, ప్రముఖులు సందడి చేయడం విశేషం. తాజాగా ఆ కోవలోకి మరాఠి నటి ప్రజక్తా మాలి కూడా చేరిపోయారు. ఆమె ఈ ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ రెడ్ కార్పెట్పై మహారాష్ట్ర సంస్కతిని సగర్వంగా చూపించారామె. తన మూలాలను చాటి చెప్పేలా సాంప్రదాయ నీలి రంగు నౌవారీ చీరలో మెరిశారామె. రిచ్ బ్లూ, పర్పుల్ రంగుల మేళవింపుతో ఉన్న మహారాష్ట్రలో చీరలో వయ్యారంగా నడుస్తూ..అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచం మొత్తాన్ని తనవైపుకి తిప్పుకునేలా ప్రత్యేకంగా కనిపించింది. ఆమె రూపం సంప్రదాయ సాంస్కృతికి గర్వాన్ని ఎలుగెత్తి చాటింది. ఆఖరికి తన ఆహార్యానికి తగ్గట్టుగా చక్కగా జుట్టు ముడివేసి, సాంప్రదాయ బిందీ, ప్రత్యేకమైన నాథ్, చోకర్, గాజులు, కమర్బంద్ వంటి యాక్సెసరీలు ధరించారామె. మరాఠి సంప్రదాయలో రాజసమైన లుక్లో ఆకర్షించారామె. అంతేగాదు ప్రజక్తా కెమెరాలకు చేతులు జోడించి అభివాదం చేస్తూ ఇచ్చిన ఫోజులు ఆత్మీయత, ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పుతున్నట్లుగా ఉంది. ఇలా ప్రపంచ వేదికపై సగర్వంగా భారతీయతను చాటడం ముఖ్యంగా మరాఠీ ప్రేక్షకులను ఎంతోగానో అలరించడం కాదు, గర్వించే క్షణంగా మారింది. కాగా, ప్రజక్తా మాలి, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్కార్పెట్పై అరంగేట్రం చేసిన దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ..సాంప్రదాయ నౌవారీ చీర, మరాఠీ నాథ్తో కేన్స్లో నడవం ఎంతో గర్వంగా ఉందని పోస్ట్లో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Prajaktta Mali (@prajakta_official) (చదవండి: బ్రాండ్స్ కాదు..పర్ఫెక్ట్ కలర్ గేమ్ ఛేంజర్ తెలియాలి !) -
నీట్ పేపర్ లీకేజీ కేసు.. లాతూర్లో కోచింగ్ సెంటర్ యజమాని అరెస్ట్
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ అధికారులు మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన కోచింగ్ సెంటర్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. రేణుకాయీ కెమిస్ట్రీ క్లాసెస్(ఆర్సీసీ) పేరుతో కోచింగ్ సెంటర్ నెలకొల్పిన శివరాజ్ రఘునాథ్ మోటెగావొంకర్ ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇతడి ఫోన్లో ఈ నెల 3వ తేదీన లీకైన నీట్ ప్రశ్నపత్రం లభించింది. అంతకుముందు లాతూర్లోని శివనగర్లో ఉన్న కోచింగ్ సెంటర్తోపాటు అతడి నివాసంలోనూ సోదాలు జరిపారు. శివరాజ్ను అతడి నివాసంలోనే దాదాపు 8 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. పేపర్ లీకేజీ ముఠాలో శివరాజ్ కీలకంగా ఉన్నాడని, ఇతడి కోచింగ్ సెంటర్కు 9 బ్రాంచీలుండగా, లాతూర్లోనిది ప్రధాన కేంద్రమని అధికారులు వెల్లడించారు. లీకేజీ కుట్రలో భాగంగా పరీక్షకు దాదాపు 10 రోజులు ముందుగానే, ఏప్రిల్ 23వ తేదీనే ప్రశ్నపత్రం, జవాబులు ఇతడికి అందాయన్నారు. వీటిని ఇతడు చేత్తో రాసిన నోట్స్ రూపంలో ఇతరులకు అందజేశాడని, పరీక్ష అనంతరం వీటిని తగులబెట్టారన్నారు. నీట్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)తో సంబంధాలున్న కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకరి్ణకి శివరాజ్ సన్నిహితుడని వివరించారు. ఇతడి ఇల్లు, కోచింగ్ సెంటర్లలో జరిపిన సోదాల్లో 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షలోని ప్రశ్నలున్న కెమిస్ట్రీ క్వశ్చన్ బ్యాంక్ లభించిందని చెప్పారు. ‘గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని ఐదు చోట్ల సోదాలు చేపట్టి, కీలక పత్రాలతోపాటు ల్యాప్టాప్లు, సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నాం. వీటిని విశ్లేషించే పని చురుగ్గా సాగుతోంది’అని సీబీఐ ప్రతినిధి తెలిపారు. ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, పుణే, లాతూర్, అహల్యానగర్లలో 10 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఇలా ఉండగా, సోమవారం శివరాజ్ రఘునాథ్ మొటెగావొంకర్ను సీబీఐ అధికారులు ఢిల్లీలోని కోర్టులో హాజరుపర్చారు. ఇతర ఆధారాలతోపాటు నీట్ పేపర్లోని ప్రశ్నలను తన కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు వెల్లడిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను కూడా చూపారు. దీంతో, ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి అజయ్ గుప్తా అతడిని 9 రోజుల సీబీఐ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. -
పెట్రోల్ బంక్ వద్ద భారీ క్యూ.. ట్యాంకర్ రాగానే భీకర పోరు
వాషిం జిల్లా: పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరి, క్యూలైన్లలో ఎదురుచూస్తున్నారు జనాలు. డీజిల్ లేదని వాహనదారులకు సిబ్బంది చెప్పారు. కొద్దిసేపటికి అక్కడకు డీజిల్ ట్యాంకర్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా డీజిల్ కోసం జనాలు తన్నుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వాషిం జిల్లా, అకోలా నాకా ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జిల్లాలో ఇంధన కొరత పెరగడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో డీజిల్ నింపించుకునేందుకు ఓ బంక్ వద్ద ఎదురుచూస్తున్న రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.మొదట వెయిట్ చేసే సమయంలో వాహనదారుల మధ్య మొదలైన వాగ్వాదం తర్వాత డీజిల్ ట్యాంకర్ చేరుకున్న తర్వాత పరిస్థితి ఇంకా అదుపుతప్పింది. భౌతిక దాడుల వరకు వెళ్లింది. రెండు వర్గాల వారు పరస్పరం కొట్టుకున్నారు. డీజిల్ డబ్బాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. పెట్రోల్ బంక్ వద్ద పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడడం వీడియోలో చూడొచ్చు. డీజిల్ నింపించుకునేందుకు ఎదురుచూస్తున్న వారు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లడంతో తొక్కిసలాట కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో వాహనాలు, జనాలతో భారీ రద్దీ మధ్య జనాలు తోసుకోవడం, కొట్టుకోవడం కనిపించాయి. ఈ ఘటనపై అధికారులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. గాయాలు, అరెస్టులపై ఇంకా స్పష్టత రాలేదు. గత కొన్ని రోజులుగా వాషిం జిల్లాలో తీవ్ర డీజిల్ కొరత కొనసాగుతోంది. పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి.FUEL AND FURYFor the third consecutive day, Washim, Maharashtra witnessed a severe diesel shortage. Amid the rush to procure diesel, two groups clashed with each other, leading to a violent brawl. A video of the incident has surfaced. The footage is said to be from a petrol pump… pic.twitter.com/m0SO9JbP1G— Rahul Shivshankar (@RShivshankar) May 17, 2026 -
ఆ రాష్ట్రంలో క్యాబ్, బైక్ ట్యాక్సీలపై నిషేధం!
నగరాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా.. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటివి బుక్ చేసుకుని వెళ్లిపోతుంటారు. అయితే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ క్యాబ్, రైడ్ సేవలను నిలిపివేయాలని.. యాపిల్, గూగుల్ తమ యాప్ స్టోర్స్ నుంచి సంబంధిత యాప్స్ తొలగించాలని నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో అక్రమంగా బైక్, ట్యాక్సీ సేవలను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.మహారాష్ట్రలో బైక్ ట్యాక్సీలు చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ సైబర్ విభాగానికి రాసిన లేఖలో వెల్లడించారు. ఆ కంపెనీల యజమానులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రాపిడోకు అగ్రిగేటర్ లైసెన్స్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో, 2022 చివరిలో బైక్ ట్యాక్సీలతో కొనసాగుతున్న వివాదం ప్రారంభమైంది. రాపిడో సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, జనవరి 2023 నాటికి అన్ని బైక్ ట్యాక్సీ సేవలు నిలిపివేశారు. చివరికి బైక్ ట్యాక్సీల కోసం ఒక అగ్రిగేటర్ విధానాన్ని రూపొందించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
భార్య ముందు అవమానించారని..
ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. భార్య ముందు తనను అవమానించారనే కోపంతో ఓ వ్యక్తి కన్న తల్లిదండ్రులనే రోకలితో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన.. శుక్రవారం మధ్యాహ్నం ధూలే జిల్లాలోని శిర్పూర్లోని మహావీర్ సొసైటీలో జరిగింది. తమ కుమార్తె పెళ్లి ముగించుకుని తల్లిదండ్రులు అదే రోజు ఇంటికి తిరిగి రాగా.. ఇంటికి వచ్చిన తర్వాత వారు ఏదో కారణంతో తన కుమారుడిని మందలించడమే కాకుండా.. కోడలి ముందే అతడిని తక్కువ చేసి మాట్లాడారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుమారుడు.. ఇంట్లో ఉన్న రోకలిని తీసుకుని తన తల్లిదండ్రుల తలపై బలంగా బాదాడు.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి రంజుదేవి మహతో, తండ్రి ఇందారామ్ మహతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటన అనంతరం నిందితుడు చందన్ ఇందారామ్ మహతో అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా.. గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
టిక్.. టిక్.. టిక్.. సినీ ఫక్కీలో టైమ్ బాంబు నిర్వీర్యం
బాంబు ఉందని సమాచారం అందుకోవడం.. ముసుగులేసుకుని స్క్వాడ్లు అక్కడికి చేరుకోవడం.. ఏ వైర్ తెంపాలో అనే ఉత్కంఠ చివరిదాకా.. ఇలాంటి సీన్లు సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. అయితే.. మహారాష్ట్ర పుణేలో ఈ తరహాలోనే ఓ ఘటన జరిగింది. ఓ ఆస్పత్రి ఆవరణలో లైవ్ బాంబు బయటపడడం తీవ్ర కలకలం రేపింది.పుణే సిటీలోని హడప్సర్ కామధేను ఎస్టేట్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం బాంబు బయటపడింది. తొలుత అనుమానాస్పద వస్తువుగా భావించినప్పటికీ.. ఆ తర్వాత అది టైమర్ బాంబ్ అని తేలడంతో అందరి గుండెలు గుభేల్మన్నాయ్. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), అగ్నిమాపక సిబ్బంది, డాగ్ స్క్వాడ్ను సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆసుపత్రి పరిసరాలను ఖాళీ చేయించి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.ఈ పరిణామాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే.. పరిశీలనలో అది 7 గంటల తర్వాత పేలేలా టైమర్తో అమర్చిన లైవ్ బాంబు అని తేలింది. బీడీడీఎస్ సిబ్బంది బాంబును సురక్షిత ప్రదేశానికి తరలించి.. ఓపెన్ ఫీల్డ్లో నిర్వీర్యం చేశారు. బాంబులో తక్కువ శక్తి గల పేలుడు పదార్థం ఉందని నిర్ధారించారు."నగరంలో తక్కువ శక్తి గల IED (ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్) కనుగొనబడింది. దానిని నిర్వీర్యం చేశాం. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది." అని పుణే పోలీస్ కమిషనర్ నితేష్ కుమార్ తెలిపారు. క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
మహారాష్ట్రలో కుప్పకూలిన ట్రైనీ విమానం
సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఒక శిక్షణ విమానం కుప్పకూలింది. రెడ్ బర్డ్ ఏవియేషన్'(Red Bird Aviation) సంస్థకు చెందిన టూ-సీటర్ శిక్షణ విమానం సాంకేతిలోపం కారణంగా కూలిపోయింది. బారామతిలోని గోజుబావి గ్రామం వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. సరిగ్గా నాలుగు నెలల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన విమాన ప్రమాదంలో, అప్పటి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించిన ఘటన జరిగిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.పుణే రూరల్ పోలీస్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ విమానంలో కేవలం ఒకే ఒక ట్రైనీ పైలట్ ఉన్నారు. విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడు సాంకేతిక లోపం తలెత్తిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానం ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నేలపై పడిపోయింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.Maharashtra | A training aircraft crashes near Baramati airport in Pune district. More details awaited: Pune Rural Police pic.twitter.com/wgVAMxAZiP— JAMMU LINKS NEWS (@JAMMULINKS) May 13, 2026 కాగా ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న లియర్జెట్ 45 వివిమానం బారామతి విమానాశ్రయం వద్ద క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మరో నలుగురు (ఒక పీఎస్ఓ, ఒక అటెండెంట్ , ఇద్దరు పైలట్లు) అక్కడికక్కడే మరణించిన ఘటన సంచలనం సృష్టించింది.ఇదీ చదవండి: సోదరుడి ఆకస్మిక మృతి, అఖిలేష్ యాదవ్ స్పందన -
అమ్మగా గర్వించే క్షణం..!
పిల్లలు ప్రయోజకులైతే అంతకుమించిన ఆనందం ఇంకొకటి ఉండదు. అత్యంత అపురూపమైన క్షణం కూడా. మన పెంపకానికి సార్థకత అంటే పిల్లలు మంచి స్థితిలో ఉండేటమే కదా..!. అలాంటి భావోద్వేగపు ఆనందాన్నే దక్కించుకుంది ఈ మహిళ. అందుకు సంబంధించిన వీడియోని పారిశ్రామిక దిగ్గంజ ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు.ఆ వీడియోలో మహారాష్ట్రలోని సింధుదుర్గ్కు చెందిన మహిళ తన కొడుకుని అభినందిస్తూ కనిపిస్తుంటుంది. కూరగాయలు అమ్ముకునే ఆ మహిళ అకస్మాత్తుగా తన కొడుకు రావడం చూస్తుంటుంది. అతడు చిరునవ్వుతో ఓ శుభవార్తతో వస్తూ ఆమె కాళ్లపై పడిపోతాడు. ఆ విషయం ఏంటో తన కుమారుడు నోటితో విని సంతోషంతో ఉబ్బితబ్బిబవ్వుతుంది. అంతేగాదు కొడుకుని ఆత్మీయంగా కౌగిలించుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తుంది. అక్కడున్న కుమారుడి స్నేహితులు రంగులు చల్లుతు వాళ్ల వేడుకుని మరింత ఆనందభరితంగా మార్చడం స్పషంగా కనిపిస్తుంటుంది. ఆ తల్లి తన కుమారుడిని పాఠశాలకు పంపే స్థోమత లేక జీవితమంతా కాలిబాటన కూరగాయలు అమ్ముతూ ఎంతో శ్రమకోర్చి చదివించుకుంది. తన కుమారుడు గోపాల్సావంత్ చదువు కోసం ఆమె మహారాష్ట్రలో కాలిబాటన ఎండలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించింది. CRPFకు ఎంపికైన వెంటనే, గోపాల్ నేరుగా తన తల్లి పనిచేస్తున్న కూరగాయల మార్కెట్ వద్దకు కాలిబాటన వెళ్లి..ఆమె పాదాలపై పడి తాను సీఆర్పీఎఫ్గా ఎంపికయ్యానంటూ చెప్పాడు. ఒక్కసారిగా ఇద్దరు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రతి గొప్ప విజయం వెనుక ఓ తల్లి అపారమైన త్యాగం తప్పక ఉంటుందని ఈ సంఘటన అత్యంత శక్తిమంతంగా గుర్తుచేస్తోంది కదూ..! అంటూ అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. అంతేగాదు పిల్లల భవిష్యత్తు కోసం శ్రమించే ప్రతి తల్లికి మాతృదినోత్సవ శుభాకాక్షలు అంటూ తన పోస్ట్ని ముగించారు ఆనంద్ మహీంద్రా.Gopal Sawant’s mother spent every day under the sun selling vegetables on a Maharashtra sidewalk just to keep his education on track.After being selected for the CRPF, Gopal went straight to the dusty Kudal footpath where his mom was working. In front of her vegetable crates,… pic.twitter.com/e5EMNXLRXl— anand mahindra (@anandmahindra) May 10, 2026 (చదవండి: అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..) -
మారిన పేరు..ఏడేళ్లు జైలు శిక్ష
పేరు మనిషికి గుర్తింపునిస్తుంది. అదే పేరు తారుమారై, తప్పుగా నమోదైతే? గుర్తింపు సరిగా లేకపోతే ఏమౌతుంది? జీవితం నాశనమై, కుటుంబం కకావికలం అవుతుంది. మహారాష్ట్రలో ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఏడేళ్ల జైలు శిక్షకు కారణమైంది. కుటుంబానికి దూరం చేసింది. ‘పదిమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు. కాని, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు’ అనేది ప్రాథమిక న్యాయసూత్రం. అయితే కొన్ని సందర్భాల్లో విచారణలో పొరపాట్లు జరిగి నిర్దోషులు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. అలాంటి సంఘటనలు అరుదు. వాటి ప్రభావం బాధితుల జీవితాలపై తీవ్రంగా ఉంటుంది. ఈ తరహా ఘటనలో ఓ వ్యక్తి అత్యాచారం కేసులో నిందితుడిగా సంవత్సరాల పాటు జైలుశిక్ష అనుభవించాడు. తరువాత అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. తనకు జరిగిన అన్యాయానికి రూ. 200 కోట్లు పరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. కేసు నమోదు..శిక్ష ఖరారుమహారాష్ట్రలోని ఘట్కోపర్ రైల్వే స్టేషన్ వంతెనపై ఓ మహిళ నిద్రిస్తోంది. తెల్లవారుజామున ఓ వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేసిన వ్యక్తి పేరు ‘గోపి’ అని పేర్కొంది. పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించారు. కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. న్యాయమూర్తి దోషిగా తేల్చారు. ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 400 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో నెల కఠిన కారాగార శిక్ష అనుభవించాలని 2010లో తుది తీర్పు వెలువరించారు.నిర్దోషి అని తేలింది.. కానీబాధితురాలు చెప్పిన వ్యక్తి, పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి ఒకరేనా? నిందితుడి గుర్తింపులో పొరపాటు జరిగిందా? అనే సందేహాలు హైకోర్టు విచారణ సందర్భంగా వెల్లువెత్తాయి. బాధిత మహిళ తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి పేరు‘గోపి’ అని చెప్పింది. కానీ పోలీసులు అరెస్ట్ చేసింది గోపాల్ని. ‘ఈ కేసుకు, తనకు ఎటువంటి సంబంధం లేదని, గుర్తింపులో పొరపాటు జరిగిందని’ గోపాల్ పేర్కొన్నాడు. ట్రయల్ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాడు. అది పెండింగ్లో ఉండగా, బెయిల్ కోసం అభ్యర్థించాడు. కోర్టు తిరస్కరించింది. దీంతో జైలులోనే గడపాల్సి వచ్చింది. చివరికి హైకోర్టులో అప్పీలు పిటిషన్ విచారణకు వచ్చింది. నిందితుడి గుర్తింపును ప్రాసిక్యూషన్ సరైన విధంగా చేయలేదని హైకోర్టు తెలిపింది. ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద ట్రయల్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేసి, గోపాల్ను నిర్దోషిగా ప్రకటించింది. తప్పు చేయలేదని తేలినా, అప్పటికే కాలం కరిగిపోయింది. ఏడేళ్లు గడిచిపోయింది. శిక్షా కాలం పూర్తయిపోయింది. పరిహారం కోసం పోరాటం‘నాపై తప్పుగా కేసు నమోదు చేశారు. ఏడేళ్లపాటు అన్యాయంగా కారాగారంలో బంధించారు. నా జీవితం నాశనం అయింది. నేను జైలుకు వెళ్లడంతో నా భార్య నన్ను వదిలి వెళ్లిపోయింది. మనోవేదనతో నా తండ్రి చనిపోయాడు. పిల్లలు అనాథశ్రమంలో చేరాల్సి వచ్చింది. నా ఉద్యోగాన్నీ కోల్పోయాను. కావున నాకు రూ. 200 కోట్లు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అని గోపాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పెండింగ్లో ఉన్న సమయంలో తాత్కాలిక పరిహారంగా రూ. 100 కోట్లు ఇవ్వాలని అభ్యర్థించాడు. తనను అన్యాయంగా కేసులో ఇరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ వ్యవహారంపై సీబీఐతో పునర్విచారణ జరిపించాలని పేర్కొన్నాడు. అతడ్ని అన్యాయంగా నిర్బంధించిన కారణంగా స్వేచ్ఛను కోల్పోయాడని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుకు ఇది విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. పిటిషనర్ను హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయడం వాస్తవమే కానీ, పరిహారం ఇవ్వాల్సిన పరిస్థితులు లేవని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కేసు నమోదు చేయడంలో పిటిషనర్పై దర్యాప్తు అధికారులకు ఎటువంటి దురుద్దేశం లేదన్నారు. కోర్టు తీర్పు ఇలా..తనను ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులో ఇరికించారని పిటిషనర్ ఆరోపించారు. కానీ దురుద్దేశం ఉందని ఎక్కడా నిరూపించ లేకపోయారని కోర్టు పేర్కొంది. అతడ్ని కేసులో ఇరికించడానికి దర్యాప్తు అధికారులు, ఇతర సాక్షులు ప్రయత్నించారని అనడానికి కారణాలు కనిపించలేదు. కేవలం నిర్దోషిగా విడుదలయ్యాడనే కారణంతో పరిహారం కోరడం సరైంది కాదు’ అని కోర్టు అభిప్రాయపడింది. పబ్లిక్ లా కింద పరిహారం ఇవ్వడానికి తగిన ఆధారాలు లేవని తేల్చింది. ఈ కేసులో నిందితుడి విడుదల ‘తప్పు నిరూపించ లేకపోవడం వల్ల మాత్రమే జరిగింది. తప్పుడు కేసులో కావాలనే ఇరికించారని నిరూపణ కాలేదని పేర్కొంది. పిటిషనర్ కోరిన అభ్యర్థనకు చట్టపరంగా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఏడేళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత నిర్దోషిగా విడుదలైన వ్యక్తి పట్ల కోర్టుకు సానుభూతి ఉన్నా, చట్టపరంగా పరిశీలిస్తే అతని ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్టు ఎక్కడా నిరూపించుకోలేకపోయాడని కోర్టు పేర్కొంది. పరిహారం చెల్లించాలని ప్రతీ కేసులో చెప్పలేమని, అది పూర్తిగా కేసు పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ఈ కేసులో స్పష్టంగా తేల్చింది. పిటిషనర్కు ఎలాంటి పరిహారం లేదా ఉపశమనం ఇవ్వకుండా పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. దిలీప్ మాదిరెడ్డి(చదవండి: బొమ్మజెముడు పొద మీద నెత్తుటి మరక!) (చదవండి: ఇదేం వినికిడి సమస్య..? కేవలం పురుషుల గొంతు మాత్రమే..) -
ఎట్టకేలకు చిక్కిన నిదాఖాన్
టీసీఎస్లో మతమార్పిడి, లైంగిక వేధింపుల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసు ప్రధాన నిందితురాలు నిదాఖాన్ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గురువారం చత్రపతి శంభాజీ నగర్ వద్ద పోలీసులను చూసి ఆమె తప్పించుకోబోగా.. సినీ ఫక్కీలో చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. నాసిక్(మహారాష్ట్ర) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బీపీవో యూనిట్లో వెలుగు చూసిన ఈ కేసు దేశాన్ని నివ్వెర పోయేలా చేసింది. తోటి ఉద్యోగులను మతం మారమని బలవంతం చేయడంతో పాటు మహిళా ఉద్యోగిణులకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. నాలుగేళ్ల పాటు సాగిన ఈ వ్యవహారంలో మేనేజర్ స్థాయి వ్యక్తులతో పాటు టీం లీడర్లు, సీనియర్ ఉద్యోగులు భాగమయ్యారు. సుమారు 9 మంది బాధితులు(ఇందులో ఒక పురుషుడు కూడా) ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు కాగా.. ఇప్పటిదాకా(నిదాఖాన్తో కలిపి) 8 మంది అరెస్ట్ అయ్యారు. మత మనోభావాలు దెబ్బ తీయడం, మతమార్పిడికి ప్రయత్నించిన వాళ్లను ప్రొత్సహించడం, లైంగిక వేధింపులకు సహకరించడం.. నిదాఖాన్పై అభియోగాలు నమోదు అయ్యాయి. ఫిర్యాదులు చేయాలని ప్రయత్నించిన వాళ్లను బెదిరించి ఆపేయడంతో పాటు ఇస్లాం స్వీకరించాలని ఒత్తిళ్లు కూడా చేసేదని తేలింది. బాధితులను హిజాబ్, బుర్ఖా ధరించమని ఆమె బలవంతం పెట్టడం, వాళ్ల ఫోన్లలో మత సంబంధిత యాప్లు ఇన్స్టాల్ చేయడం చేసిందని ఆధారాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో దర్యాప్తు అనంతరం ఆమెను పోలీసులు ప్రధాన నిందితురాలిగా చేర్చింది. అయితే కేసు నమోదైనప్పటి నుంచి ఆమె జాడ లేకుండా పోయిందని. ఆమె భర్తను విచారించిన తర్వాత.. పోలీసులు బంధువుల ఇళ్లతో పాటు పలు చోట్ల తనిఖీ చేశారు. కొన్ని చోట్ల తాళాలు వేసి ఉండటం, మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఆమెను పట్టుకోవడం కష్టమైంది. ఈలోపు తాను గర్భవతినని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. అయితే ఇంటరాగేషన్ ఎదుర్కోవాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పరారీలో ఉన్న ఆమె కోసం కోసం ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర అంతటా జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో 25 రోజుల తర్వాత పోలీసులకు చిక్కడం గమనార్హం. నిదాఖాన్ అరెస్ట్తో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే డానిష్ షేక్, టౌసిఫ్ అత్తర్, రాజా మెమోన్, షారూఖ్ ఖురేసీ; అసిఫ్ అన్సారీ, పోష్ కమిటీలో పని చేసిన అశ్విన్ చయ్నానీ అరెస్ట్ అయ్యారు. ప్రధాన సూత్రధారి నిదాఖాన్గా తేలగా.. హెచ్ఆర్ మేనేజర్ అని ప్రచారం జరిగింది. అయితే ఆమె టెలికాలర్ మాత్రమేనని స్పష్టత ఇచ్చిన టీసీఎస్ యాజమాన్యం.. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆమెతో పాటు నిందితులందరినీ డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
సెకండ్ ర్యాంక్ వచ్చిందని ఎగతాళి : 9 ఏళ్ల కూతుర్నే ..!
పుణె జిల్లాలోని దౌండ్లో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కేవలం స్కూల్ మార్కుల విషయంలో వచ్చిన గొడవ కారణంగా తొమ్మిదేళ్ల బాలికను ఆమె తండ్రే కిరాతకంగా హత్య చేసిన ఉదంతం ప్రకంపనలు రేపింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నిందితుడు శాంతారామ్ దుర్యోధన్ చవాన్ కుమార్తె అనామిక (9 ఏళ్లు). ఇటీవల స్కూల్ ఫలితాలు విడుదలయ్యాయి. అందులో అనామిక తమ్ముడు (సవతి తల్లి కుమారుడు) సంస్కార్కు ఫస్ట్ ర్యాంక్ రాగా, అనామికకు రెండో ర్యాంక్ వచ్చింది. దీనిపై ఇంట్లో వాళ్లంతా ఆమెను ఎగతాళి చేశారు. ఆ అవమానంతో అనామిక తన తమ్ముడి మార్కుల జాబితాను మార్చేసింది. తద్వారా తనదే ఫస్ట్ ర్యాంక్ అని నిరూపించుకోవాలని చేసింది. అంతే .. ఇది తెలిసి తండ్రి ఆగ్రహంతో ఊగిపోయాడు. తెలిసీ తెలియని వయసులో పిల్లలు చేసిన తప్పులను అర్థం చేసుకొని, అవగాహన కల్పించాల్సింది పోయి, విచక్షణ మరిచి తండ్రి శాంతారామ్, చెక్క కోసే యంత్రం (wood-cutting machine)తో చిన్నారిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలను రూపుమాపేందుకు, మృతదేహాన్ని వస్త్రంతో చుట్టి నిప్పంటించాడు.దీనిపై పోలీసులకు సమాచారం అందడంతోవారు ఘటనా స్థలానికి చేరుకుని, పాక్షికంగా కాలిపోయిన అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. మృత దేహాన్ని డీఎన్ఏ పరీక్షలు, తదుపరి విచారణ నిమిత్తం పుణేలోని సాసూన్ ఆసుపత్రికి తరలించారు.ప్రధాన నిందితుడు తండ్రి శాంతారామ్ చవాన్తో పాటు, అతనితో కలిసి ఉంటున్న సవతి తల్లి చింకీ భోంస్లేను కూడా అరెస్ట్ చేశారు. ఈ నేరం గురించి తెలిసి కూడా అధికారులకు సమాచారం ఇవ్వనందుకు ఆమెపై కూడా కేసు నమోదైంది. చిన్నారి మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్షల కోసం పుణెలోని ససూన్ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు కొన సాగుతోంది.మరోవైపు వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనల నేపత్యంలో పూణేలో పిల్లల భద్రతపై ఆందోళన తలెత్తింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటువంటి విషాదాలను నివారించేందుకు కఠినమైన చట్టాల అమలు, జవాబుదారీతనం, తక్షణ చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.ఇదీ చదవండి: కారూ, గోల్డూ లేదు, కేసులు మాత్రం.. ఎవరీయన? -
ఆ నలుగురు పుచ్చకాయ తిని చనిపోలేదు!
ముంబై కుటుంబం మృతి కేసులో ట్విస్ట్ చేసుకుంది. ఆ నలుగురు పాడైపోయిన పుచ్చకాయ తినడం ద్వారా చనిపోలేదని నిర్ధారణ అయ్యింది. అయితే వాళ్ల శరీరంలోని ప్రధాన అవయవాలన్నీ మాత్రం రంగు మారినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మిస్టరీ కేసు విచారణ మరో మలుపు తిరిగినట్లైంది. గత వారం ఆ కుటుంబం మటాన్ పులావ్ తిని.. ఆపై పుచ్చకాయ తిని తీవ్ర అస్వస్థకు లోనైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఒక్కొక్కరుగా చనిపోయారు. అయితే వాళ్లలో ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించాయన్న వైద్యుల ప్రకటనతో కలకలం రేగింది. పులావ్ తిన్న మిగతా వాళ్లకు ఏం కాకపోవడంతో.. అందరి దృష్టి పుచ్చకాయ వైపునకు మళ్లింది. బహుశా.. కలుషితమైన పుచ్చకాయ తిని వాళ్లంతా మరణించి ఉంటారన్న ప్రచారం జోరందుకుంది. సమ్మర్లో చాలా మంది తినే పుచ్చకాయ ఇంత పని చేసిందా? అనే చర్చ నడిచింది. వాటర్మిలన్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇది మహారాష్ట్రలో పుచ్చకాయల సేల్ పడిపోవడానికి ఒక కారణం అయ్యింది కూడా. అయితే.. తాజాగా ఈ కేసు ఫోరెన్సిక్ నివేదిక బయటకు వచ్చింది. అందులో పుచ్చకాయలో ఎలాంటి కల్తీ ఆనవాళ్లు లేవని తేలింది. అలాగని ఇది సాధారణ ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆ నలుగురిలో గుండె, లివర్, బ్రెయిన్, పేగులు ఆకుపచ్చరంగులోకి మారిపోయి ఉన్నాయి. దీంతో వాళ్లపై విష ప్రయోగం ఏదైనా జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అబ్దుల్లా శరీరంలో మోర్ఫిన్ అనే శక్తివంతమైన పెయిన్కిల్లర్ ఆనవాలు లభ్యమైంది. ఇది సాధారణంగా వైద్యులు చెబితేనే వాడాలి. దీంతో ఈ అంశంపైనా అధికారులు ఇప్పుడు దృష్టిసారించారు. పోస్ట్మార్టం అనంతరం.. ఆ అవయవాలను పరీక్షల(కెమికల్) కోసం పంపారు. ఫలితాలు వచ్చాకే ఏది అనేదానిపై ఓ క్లారిటీ రానుంది. మొబైల్ రిపేర్ షాప్ నడిపించే అబ్దుల్లా డొకాదియా.. అతని భార్య, ఇద్దరు పిల్లలు. గత శనివారం రాత్రి ఇంట్లో దావత్ చేశారు. మరో ఐదుగురు బంధువుల్ని పిలిచి మటావ్ పులావ్ పెట్టారు. వాళ్లు వెళ్లిపోయాక అర్ధరాత్రి సమయంలో ఈ నలుగురు పుచ్చకాయ తిన్నారు. ఉదయం 5గం. టైంలో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 12 గంటల వ్యవధిలో అంతా ప్రాణాలు కోల్పోయారు. పుచ్చకాయ ఆందోళనలపై.. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా ఓ ప్రకటన చేసింది. ఈ నాలుగు మరణాలకు పుచ్చకాయకు సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించింది. అయితే పుచ్చకాయ కలుషితం కాకపోతే గనుక ఎవరైనా విషాన్ని ఇంజెక్ట్ చేసి ఉంటారా? అనే కోణంలోనూ దర్యాప్తు నడుస్తోంది. ఇదీ చదవండి: పుచ్చకాయ.. ఆ టైంలో తింటేనే సూపర్! -
వారెవ్వా..ఆమ్లెట్లు అమ్ముతూ, ఆట కట్టించారు!
సాక్షి, ముంబై: అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకోవడానికి పోలీసులు రహస్యంగా నిర్వహించిన అండర్ కవర్ ఆపరేషన్ విశేషంగా నిలుస్తోంది. 15 రోజుల పాటు వారు చేసిన ఈ సాహసోపేతమైన ఆపరేషన్ నెట్టింట వైరల్గా మారింది. మారువేషంలో చిరు వ్యాపారులుగా వారు చేసిన ఆపరేషన్ వివరాలేంటో తెలుసుకుందాం..పదండి! మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడానికి గుజరాత్లోని సూరత్లో 15 రోజుల పాటు మారువేషంలో పనిచేశారు. చిరు వ్యాపారులుగా నటించారు. ఉల్లిపాయలు తరుగుతూ, కస్టమర్లకు ఆమ్లెట్లు, భుర్జీ వడ్డిస్తూ అత్యంత సాహసోపేతంగా దొంగల్ని పట్టుకునేందుకు వెయిట్ చేశారు.ఆపరేషన్ సక్సెస్నిందితులు నివసించే ప్రాంతానికి సమీపంలో ఉన్న ఒక రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్లో కానిస్టేబుళ్లు యోగేష్ నవ్సరే, ప్రదీప్ దండ్వటే ఆమ్లెట్లు, భుర్జీ అమ్ముతున్నట్లు నటిస్తూ నిఘా పెట్టారు. రెండు వారాల నిరీక్షణ తర్వాత నిందితుల గుర్తింపును నిర్ధారించుకుని, ఏప్రిల్ 27న నిందితులు గురుదాస్ సురేష్ కోలి (28) అమోల్ గోకుల్ జాదవ్ (33) అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: భార్యను నమ్మించి గొంతు కోశాడు.. తర్వాత!అసలు కేసు వివరాలుమార్చి 19న వేదాంత్ నగర్లోని ఇంద్రనీల్ అపార్ట్మెంట్లో రూ. 3.23 లక్షల విలువైన నగదు, వస్తువులు చోరీకి గురయ్యాయి. పోలీసులు దాదాపు 150 సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేయగా, ఒక నిందితుడి ముఖం స్పష్టంగా కనిపించింది. పాత నేర చరిత్ర రికార్డులతో సరిపోల్చగా, నిందితులు సూరత్లోని పల్సానా తాలూకాలో ఉన్నట్లు తేలింది.ఈ ఆనవాలే దర్యాప్తు అధికారులకు దారి చూపింది.నేరస్తుల మోడస్ ఒపెరాండీవిచారణలో నిందితులు వ్యవహరిస్తున్న తీరు చూసి పోలీసులే షాకయ్యారు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించడం, లాకర్లను పగులగొట్టి క్షణాల్లో మాయమైపోవడం వీరి శైలి. కార్లకు అనేక రకాల నకిలీ నంబర్ ప్లేట్లను వాడుతూ పోలీసుల కళ్లు గప్పేవారు. పోలీసులకు దొరకకుండా చాకచక్యంగా పనిముగించుకుని తప్పించుకునేవారు. అంతేకాదు తమ సొంత ఫోన్లను వాడకుండా, కేవలం కొన్ని యాప్ల సహాయంతో టోల్ గేట్లు లేని రూట్లను గుర్తించి ప్రయాణించేవారు. ఎంతటి నేరస్తులైనా, పోలీసులు తలచుకుంటే చిక్కక తప్పదు. ఈ కేసులోనూ అదే జరిగింది. సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు, కానిస్టేబుళ్లు యోగేష్ నవసారే, ప్రదీప్ దండ్వటే సూరత్కు వెళ్లి, అనుమానితులున్న ప్రదేశంలో ఒక ఫుడ్ కార్ట్ వద్ద నిఘా వేసి దొంగల ఆట కట్టించారు. నిందితులపై ఛత్రపతి శంభాజీనగర్లో 8 కేసులు, నాసిక్లో సుమారు 28 కేసులు నమోదై ఉన్నాయి. ప్రస్తుతం కోర్టు నిందితులను మే 5 వరకు పోలీసు కస్టడీకి పంపింది. ఇతర కేసుల్లో వీరి ప్రమేయం గురించి పోలీసులు విచారిస్తున్నారు.ఇదీ చదవండి: మండే ఎండల్లో ఏసీలు పేలే ప్రమాదం : ఈ జాగ్రత్తలు మస్ట్ -
తిక్క కుదిరింది.. కీలెరిగి వాత పెట్టిన న్యాయమూర్తి!
‘ఉత్తమే క్షణ కోపస్యాత్.. మధ్యమం ఘటికాద్వయం.. అథమస్య అహోరాత్రం.. పాపిష్టే మరణాంతకం’ అని ఆర్యోక్తి. కోపం విషయంలో మనం దానిని ఎంత కాలం కలిగి ఉండాలి.. కోపాన్ని విడిచిపెట్టి ఎంత త్వరగా మనం సానుకూల వైఖరిలోకి వస్తాం అనే దానిని బట్టి.. మన వ్యక్తిత్వాన్ని అంచనా వేసి చెప్పే మాట ఇది. ఉత్తములకు కోపమొస్తే క్షణమే ఉంటుందట.. మధ్యములకు రెండు ఘడియలు ఉంటుందట. అథములకు ఒక పగలు ఒక రాత్రి వరకు ఉంటుందట. పాపిష్టి వాళ్లకైతే చచ్చేదాకా ఆ కోపం కంటిన్యూ అవుతుందట. అంటే, కోపం విషయంలో మనం ఎంత త్వరగా దానిని మరచిపోగలిగితే అంత మంచిది అని ఈ సుభాషితం చెబుతుంది.ముంబైకి చెందిన తరిణిబెన్ దేశాయ్ రచయిత్రే గానీ.. బహుశా ఆమె ఈ శ్లోకం గురించి తెలుసుకుని ఉండకపోవచ్చు. తెలిసినా ఈ శ్లోకం చెప్పే నీతి ఆమెకు రుచించి ఉండకపోవచ్చు. అందుకే తమ హౌసింగ్ సొసైటీ వాళ్ల మీద వచ్చిన కోపాన్ని రోజుల్లో మరచిపోకుండా.. పదేళ్లుగా హైకోర్టులో దావా నడుపుతోంది. ఆమెకు తొంభయ్యేళ్లు వచ్చాయి గానీ.. ఇంకా కోపం తగ్గలేదు. ఇప్పట్లో కోపాన్ని విడిచిపెట్టను అని కూడా ఆమె సంకేతం ఇచ్చింది. అందుకే న్యాయమూర్తికి కూడా కోపం వచ్చి.. చిత్రమైన ఆదేశం ఇచ్చాడు. అహంభావంతో న్యాయమూర్తి చెప్పిన పరిష్కారాన్ని పట్టించుకోకుండా వ్యవహరించిన ఆమెకు తెలిసొచ్చేలా ఆ ఆదేశం ఉంది.ఆదేశం గుణపాఠమే.. ఎందుకని? ఈ కేసు ఇప్పుడు మొదలు కాలేదు. 2017 నాటిది. అంటే దాదాపు పదేళ్ల కిందట మొదలైంది. ముంబై మలబార్ హిల్స్ లోని ఒక హౌసింగ్ సొసైటీలో అప్పట్లో మరమ్మతులు చేపట్టారు. ఆ వ్యవహారంపై రచయిత్రి తరిణిబెన్ దేశాయ్, ఆమె కుమార్తె ధ్వని కలిసి హౌసింగ్ సొసైటీ సభ్యుల మీద హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. ఇన్నాళ్లుగా విచారణ సాగుతూనే ఉంది. ఈ విషయం ప్రతివాదులు కేవలం ‘మన్నింపు’ కోరితే సరిపోతుందని.. కేసు నడపవలసిన అవసరం లేదని హైకోర్టు న్యాయమూర్తి జితేంద్ర జైన్ సూచించారు. కానీ దావా వేసిన తరిణి బెన్ దేశాయ్ అందుకు అంగీకరించలేదు. దావా నడిపి తీరాల్సిందే అని పట్టుబట్టారు. దాంతో అసహనానికి గురైన న్యాయమూర్తి జితేంద్ర జైన్ వారికి గుణపాఠం లాంటి తీర్పు చెప్పారు. ఈ దావా తదుపరి విచారణను 20 ఏళ్ల తర్వాతకు వాయిదా వేశారు.The Bombay High Court judge got miffed with the plaintiff and adjourned the matter to 2046. The judge was of the view that the defamation suit could be resolved by tendering an unconditional apology. However, the plaintiff, who is close to 90 years old, still insists on pursuing… pic.twitter.com/pE8HeRQ0Ba— Paras Nath Singh (@parasnsingh95) April 28, 2026కేవలం ఇప్పట్లో దానిని మళ్లీ విచారించే పరిస్థితి తనకు ఎదురుకాకుండా ఉండేందుకే ఆయన వాయిదా వేశారు. కానీ తీర్పులో ఇంకా చాలా ఘాటుగానే పేర్కొన్నారు. పిటిషనర్లు సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లు అనే సానుభూతితో దానిని ముందుగా హియరింగ్ కోసం లిస్ట్ చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2046కు ముందు హియరింగ్ తీసుకురావొద్దని తేల్చేశారు. పరువునష్టం పిటిషన్ వేసిన తరిణిబెన్ దేశాయ్ వయసు ఇప్పుడు 90 ఏళ్లు. మరో ఇరవై ఏళ్ల తర్వాత దావాకు హాజరై తన పంతం నెగ్గించుకోవాలంటే, తన అహం చల్లార్చుకోవాలంటే.. ఆమె 110 ఏళ్ల వయసు వరకు జీవించి ఉండాలి. కీలెరిగి వాతపెట్టడం అంటే ఇదే!. -
ఈ డెలివరీ బాయ్ చాలా మంచోడు
చిన్న చిన్న తప్పులు.. ఒక్కోసారి పెద్ద నష్టానికే దారి తీయొచ్చు. అలాంటి టైంలో ఎవరో ఒకరు కాపాడేందుకు ముందుకు వస్తే ఎలా ఉంటుంది?. వాళ్లను రియల్ హీరో అనకుండా ఉండలేం కదా!. ముంబైలో ఒక యువతి అలాంటి అనుభవం ఎదురైంది. డెలివరీ కోసమని వచ్చిన యువకుడు చేసిన పనితో ఆమె ఉబ్బితబ్బిబై నెట్టింట ఆ విషయాన్ని షేర్ చేసుకుంది. ముంబైకి చెందిన దివ్య ఉన్ని.. పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఆ కంగారులో ఇంటికి తాళం సంగతి ఏమోగానీ.. కనీసం డోర్ కూడా దగ్గరకు వేయకుండా వెళ్లిపోయింది. అయితే అప్పటికే ఆమె ఆన్లైన్లో ఓ పార్శిల్ ఆర్డర్ పెట్టింది. ఇంటికి తాళం వేయని సంగతి మర్చిపోయి.. డెలివరీ బాయ్ దానిని బయట పెట్టి వెళ్తాడులే అని అనుకుంది. అయితే డెలివరీ ఇవ్వడానికి వచ్చిన యువకుడు డోర్ తెరిచే ఉన్న విషయాన్ని గమనించాడు. ఇదే విషయాన్ని అతను ఫోన్లో ఆమెకు తెలియజేశాడు. నాలిక్కరుచుకున్న దివ్య.. ఆగమేఘాల మీద ఇంటికి చేరింది. ‘‘అతను కేవలం పార్సెల్ను వదిలి వెళ్లిపోలేదు. ఇంటి ముందు నిలబడి, ఎవరూ లోపలికి వెళ్లకుండా చూసుకున్నాడు. నా పెంపుడు పిల్లి బయటకు పారిపోకుండా చూశాడు. నేను వచ్చేదాకా ఓపికగా అక్కడే ఎదురు చూశాడు. తనను అమ్జాద్ అని పరిచయం చేసుకున్న ఈ డెలివరీ బాయ్కి దివ్య కృతజ్ఞతలు తెలిపింది.ఈ సంఘటనను దివ్య వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకోగా.. అది వైరల్ అయింది. అమ్జాద్ నిజాయితీ, బాధ్యతా భావం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. “ఇలాంటి నిజాయితీకి గుర్తింపు ఇవ్వాలి” అని కొందరు.. అతనికి టిప్ అయినా ఇవ్వాల్సింది అని మరికొందరు కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Divya Unny (@divyaunnyfilms) -
అమెరికా నుంచి వచ్చి ఆరేళ్లు : గార్డ్స్పై కత్తితో దాడి, షాకింగ్ రీజన్?
సాక్షి, ముంబై: అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన వ్యక్తి అనూహ్యంగా సెక్యూరిటీ గార్డులపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. పోలీసులు నిందితుడిని మూడు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడి చేసిన కారణం ఏంటి అనేదానిపై దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 19 ఏళ్ల పాటు అమెరికాలో ఉండి జైబ్ అన్సారీ (31) అనే వ్యక్తి 2019లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. కారణాలపై స్పష్టత లేనప్పటికీ, ముంబై సమీపంలోని మీరా రోడ్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. ఒక మతపరమైన శ్లోకాన్ని పఠించడానికి నిరాకరించినందుకు ఇద్దరు గార్డులను కత్తితో పొడిచినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో గాయపడిన ఇద్దరు గార్డులు రాజ్కుమార్ మిశ్రా, సుబ్రతో సేన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీరా రోడ్ ఈస్ట్లోని నయా నగర్లో గల 'అస్మిత గ్రాండ్ మ్యాన్షన్' కన్స్ట్రక్షన్ సైట్ వద్ద ఈ ఘటన జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఒక మతపరమైన శ్లోకాన్ని పఠించమని గార్డులను కోరాడని, వారు నిరాకరించడంతోనే దాడి చేశాడని కొన్ని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. భజరంగ్ దళ్ వంటి సంస్థలు ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) థానే విభాగానికి బదిలీ చేశారు. అసలు దాడికి గల కారణంపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనతో మీరా రోడ్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పుకార్లు వ్యాపించకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. అలాగే ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజాన్ని నిందితుడి నేపథ్యాన్ని ATS అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: వినాశకాలే విపరీత బుద్ధి : వీసీ సజ్జనార్ చీవాట్లు -
బిర్యానీ, పుచ్చకాయ తినే ఆ కుటుంబం చనిపోయిందా?
ముంబై: ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత. ఇది అత్యంత దురదృష్టకర ఘటన. విరోచనాలు, వాంతులతో కొద్దిసేటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకే కుటుంబంలో భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు చనిపోయారు. శనివారం(ఏప్రిల్ 25వ తేదీ) ముంబైలోని పైధోని ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరంతా ఫుడ్ పాయిజన్ బారిన పడే ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు, ఇతర కుటుంబ సభ్యులందరూ రాత్రి గం. 10.30ని.లకు వీరంతా డిన్నర్లో బిర్యానీ తిన్నారు. అనంతరం ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి వారు ఇళ్లకు బయల్దేరి వెళ్లిపోయారు. సుమారు ఒంటి గంట ప్రాంతంలో(తెల్లవారితే ఆదివారం) తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే మిగిలిన నలుగురు కుటుంబ సభ్యులు బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిన్నారు. పుచ్చకాయ తిన్న తర్వాత ఆ నలుగురికి ఆదివారం ఉదయం ఐదుగంటల ప్రాంతంలో వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఫుడ్ పాయిజన్ అయ్యిందనే అనుమానంతో ఫ్యామిలీ డాక్టర్ను సంప్రదించారు. ఆ ఫ్యామిలీ డాక్టర్ చూసిన తర్వాత వారిని జేజే ఆస్పత్రికి వెళ్లమని సూచించారు. వారి డాక్టర్ సూచించిన విధంగానే జేజే ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లారు. వైద్య చికిత్స చేసినప్పటికీ, చిన్న కుమార్తె ఉదయం సుమారు 10:15 గంటలకు మరణించింది. ఆ రాత్రి సుమారు 10:30 గంటలకు తండ్రి కన్నుమూశారు. అటు తర్వాత తల్లి, మరొక సోదరి కూడా చికిత్స సమయంలోనే కన్నుమూశారు. బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడమే వారి ప్రాణాలకు ముప్పు తెచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ రెండు స్పల్ప వ్యవధిలో తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందా.. ? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పోస్ట్మార్టం తర్వాతే వారి మరణానికి కారణం తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా జేజే మార్గ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మృతిచెందిన వారు అబ్దుల్లా దొకాడియా(40), నస్రీన్ దొకాడియా(35), ఐషా(16), జైనబ్(13)లుగా పోలీసులు తెలిపారు. -
పిచ్చి పట్టినట్లుగా పిచ్ తొక్కించేశాడు.. మ్యాచ్ రద్దు!
క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ట్రాక్టర్తో మైదానంలోకి దూసుకువచ్చాడు.. పిచ్చి పట్టినట్లుగా క్రికెట్ పిచ్ మొత్తాన్ని ట్రాక్టర్తో తొక్కించేశాడు.. ఫలితంగా.. ఫలితం తేలకుండానే మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన మహారాష్ట్రలోని జలగావ్లో జరిగింది. జలగావ్ రూరల్ ఎంఎల్ఏ కప్ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ యువకుడు ట్రాక్టర్పై అకస్మాత్తుగా మైదానంలోకి వచ్చాడు.నిస్సహాయంగాఏం జరుగుతుందో అర్థం కాక ఆటగాళ్లు చెల్లాచెదురై పోయారు. ఇంతలో అతడు వేగంగా పిచ్ మీదకు దూసుకువచ్చి.. ట్రాక్టర్తో పిచ్ మొత్తాన్ని ధ్వంసం చేశాడు. ఆటగాళ్లు, అంపైర్లు ఏమీ చేయలేక నిస్సహాయంగా అలా చూస్తుండిపోయారు. దీంతో మైదానంలో గందరగోళం నెలకొంది.కాగా ఈ ఘటన వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక వ్యక్తి ఒకరిని ఫైనల్ మ్యాచ్కు ఆహ్వానించకపోవడంతో సదరు వ్యక్తి ఇలా చేయించినట్లు సమాచారం. అనూహ్య ఘటనతో మ్యాచ్ రద్దైపోగా.. పిచ్ను తొక్కించిన వ్యక్తిపై మాత్రం ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఇక ఈ దృశ్యాలు వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఎవరిది బాధ్యత‘‘బహుశా ఆ మైదానం అతడిదే అయి ఉంటుంది. ఓనర్నే మ్యాచ్కు ఆహ్వానించకపోతే ఎలా? అందుకే ఇలా చేశాడు’’ అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘ఇలాంటి చర్యలను ఉపేక్షించకూడదు. ట్రాక్టర్తో వేగంగా దూసుకువచ్చిన సమయంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత. ఇలాంటి వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందే’’ అని పేర్కొంటున్నారు. Tractor Driver plows the cricket pitch mid-final in Jalgaon after the driver wasn’t invited to the tournament 😭 pic.twitter.com/LLS61mkRWJ— Ghar Ke Kalesh (@gharkekalesh) April 18, 2026 -
మిస్ ఇండియా సాధ్వీ సతీశ్
భువనేశ్వర్: గోవా సుందరి సాధ్వీ సతీశ్ సైల్ 2026 సంవత్సరానికి ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ కిరీటం దక్కించుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో శనివారం రాత్రి అట్టహాసంగా జరిగిన 61వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలేలో దాదాపు 30 మంది సుందరీమణులను వెనక్కి నెట్టి విజేతగా నిలిచారు. మహారాష్ట్రకు చెందిన రాజ్నందిని పవార్ తొలి రన్నరప్గా, జమ్మూ కశ్మీర్కు చెందిన డాక్టర్శ్రీ అద్వైత రెండో రన్నరప్గా నిలిచారు. సాధ్వీ ఆత్మవిశ్వాసం, నిబ్బరం, ఆలోచనల్లో స్పష్టత ఆమెకు కిరీటాన్ని కట్టబెట్టాయి. 75వ మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. సామాజిక సేవలో ముందు గోవాలో జన్మించిన సాధ్వీ సతీశ్ ఉన్నత విద్య అభ్యసించారు. కెనడాలో ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పీజీ చేశారు. మో డల్గా పలు ఫ్యాషన్ షోల్లో పాల్గొన్నారు. వాణిజ్య ప్రకటనల్లో నటించారు. నిర్మాణ రంగంలోకీ అడుగుపెట్టారు. ఓ కంపెనీ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఆమె పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. సామాజిక సేవ రంగంలోకీ దిగారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు సేవలందిస్తున్నారు. బధిర చిన్నారులకు అండగా నిలుస్తున్నారు. ఫెమీనా మిస్ ఇండియా గోవా–2026 కిరీటం కూడా దక్కించుకున్నారు. -
దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం
మనం సాధించే గెలింపు మనొక్కరిదే కాదు. అందుకు సహకరించి కుటుంబసభ్యులది కూడా. అయితే వారి క్రెడిట్ కనబడదు. కానీ ఈ మహిళ తన సక్సెస్ వెనుక తన తండ్రి ఉన్నాడంటూ..అందరికీ తెలియజేసేలా ఆమె చేసిన పని..అక్కడున్న వారి కళ్లలో నీళ్లుగిర్రున తిరిగేలా చేశాయ్. ఆ కమనీయ దృశ్యం ఓ ప్రేరణ కూడా.అసలేం జరిగిందంటే..మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో, సుమేధా షేక్ ఇంటిని చక్కబెడుతూ, ఇద్దరు పిల్లల భాద్యత, దివ్యాంగుడైన తండ్రి బాగోగులు చూసుకుంటూ పోలీస్ అధికారిణి అయ్యారు. ఆమె తన విజయాన్ని జరుపుకున్న విధానం అందర్నీ కంటతడి పెట్టేలా చేసింది. తండ్రిని భుజాలపై ఎత్తుకుని ఆ క్షణాన్ని ఒక హృదయపూర్వక నివాళిగా మార్చారు. ఈ భావోద్వేగభరితమైన వీడియో నెట్టింట వైరల్గా మారి అందరి హృదయాలను గెలుచుకుంది. తల్లిదండ్రుల త్యాగం ఎప్పుడూ పెద్దగా వినిపించకపోవచ్చు. కానీ మన జీవితాంతం ప్రతిధ్వనిస్తుందని అని చెప్పేలే ఈ మహిళ సెలబ్రేషన్ చేసుకుంది తన సక్సెస్ని. ఈ మేరకు కొత్తగా పోలీసు అధికారిణిగా నియమితురాలైన సుమేధా మట్లాడుతూ..తన కష్టసుఖాల్లో అండగా నిలిచి, తన లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడిన తండ్రికి ఇలా కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించారు. ఆయన రుణం ఏమిచ్చి తీర్చుకోగలను అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఆ వీడియోలో సుమేధా దివ్యాంగుడైన తన తండ్రిని భుజాలపై మోస్తూ ఆనందంగా నృత్యం చేస్తూ తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. అక్కడున్న వారు కూడా ఆమె సంతోషంలో భాగమయ్యారు. కొందరు ఆమె తన అసాధారణ విజయాన్ని తన తండ్రికే అంకితం చేస్తూ.. వేడుకగా చేసుకున్న తీరుని చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయ్. నెటిజన్లు కూడా ఈ వీడియోని చూసి ఇది 'ఉత్తమ తండ్రీ-కూతుళ్ల బంధం' అని అభివర్ణించగా మరికొందరు విజయం అనేది కేవలం వ్యక్తిగత విజయంగానే కాకుండా..ఆ ప్రయాణానికి సహకరించి బంధాలది కూడా అని చెప్పే ఘటన అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: బ్లింకిట్ డెలివరీ బాయ్గా 66 ఏళ్ల రిటైర్డ్ క్లర్క్..! కారణం తెలిస్తే అవాక్కవుతారు) -
దొంగ బాబా అశోక్ ఖరాత్ కేసులో బిగ్ ట్విస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నకిలీ బాబా' అశోక్ ఖరాత్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాంత్రిక పూజల పేరుతో పలువురు మహిళలను లైంగికంగా లోబర్చుకున్నారనే ఆరోపణలతో అరెస్టైన సంగతి తెలిసిందే. అశోక్కు అత్యంత సన్నిహితుడు జితేంద్ర శెల్కే(55) హఠాన్మరణం చెందాడు. అయితే ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.శుక్రవారం కుటుంబంతో కలిసి జితేంద్ర శెల్కే తన వాహనంలో థానే ఎక్స్ప్రెస్వేపై వెళ్తున్నారు. ఆ టైంలో ధోత్రే గ్రామం వద్ద కారు ఓ కంటైనర్ ట్రక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో జితేంద్ర, ఆయన సతీమణి అనురాధా అక్కడికక్కడే మరణించారు. శెల్కే తనయుడు మాత్రం గాయాలతో బయటపడ్డాడు. జితేంద్ర శెల్కే అశోక్కు నమ్మిన బంటు మాత్రమే కాదు వ్యాపార భాగస్వామి కూడా. అశోక్ నిర్వహించిన ట్రస్ట్కు వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ లావాదేవీలు మొత్తం చూసుకున్నాడు. అయితే లైంగిక వేధింపుల కేసు.. ఆపై అక్రమాస్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. అయినప్పటికీ దర్యాప్తు సంస్థలు జితేంద్రను ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా ట్రస్ట్ ఆస్తులు, భూ లావాదేవీలలో ఆయన పాత్రపై విచారణ జరుగుతోంది. ఇదిలా ఉండగానే.. జితేంద్ర మరణించడం హాట్ చర్చకు దారి తీసింది. మార్చి నెలలో మహారాష్ట్ర నాసిక్ 'నకిలీ బాబా' అశోక్ ఖరాత్ ఉదంతం వెలుగు చూసింది. పూజల పేరుతో తనపై మూడేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కలకలం మొదలైంది. ఈ కేసులో మార్చి 18న అశోక్ ఖరాత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై దర్యాప్తులో సంచలన విషయం వెలుగు చూసింది. పోలీసుల తనిఖీల్లో అశోక్ ఖరాత్కు సంబంధించిన డిజిటల్ పరికరాల నుంచి సుమారు 100-150 మధ్య అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకాల పేరుతో మహిళలను లోబర్చుకుని వారిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్మెయిలింగ్ చేసేవాడని తేలింది. ఈలోపు అందులోని కొన్ని వీడియోలు నెట్టింటకు చేరడంతో ఇటు సోషల్ మీడియాలోనూ ఈ బాబా కామ లీలలపై జోరుగా చర్చ నడిచింది. రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలురాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని అశోక్ ఖరాత్ ప్రధానంగా దందాను సాగించినట్లు తెలుస్తోంది. ఈ పరిచయాలతోనే.. 2018లో అప్పటి మహారాష్ట్ర సర్కారు రూ.1.05 కోట్ల నిధులను మంజూరు చేసింది. అలాగే ఆశ్రమానికి పలువురు ప్రముఖులు తరచూ వెళ్తుండేవాళ్లు. వాళ్లలో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలీ చాకంకర్, ఆమె సోదరి కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు.. ఈ సెక్స్ స్కాండల్కు రాజకీయ మరక అంటడడంతో ఫడ్నవిస్ ప్రభుత్వం.. ఐపీఎస్ అధికారణి తేజస్వి సత్పుటే నేతృత్వంలో సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ టీం ఖరాత్పై లైంగిక దాడులు, మోసం, బ్లాక్మెయిల్, మూఢనమ్మకాల ప్రోత్సాహం, మనీ లాండరింగ్ అభియోగాలపై ఆరు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈడీ సోదాలుగడిచిన కొన్నేళ్లలో అశోక్ ఖరాత్ ఏకంగా రూ.1500 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు సిట్ విచారణలో తేలింది. భారీగా భూములు, భవనాలు, విలాసవంతమైన వాహనాలు ఆయన, బినామీల పేర్ల మీద ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు మారుపేర్లతో మహారాష్ట్రలోని రెండు సహకార రుణ సంఘాల్లో 132 ఖాతాలు ఉన్నాయని.. గత రెండేళ్లలో ఈ ఖాతాల కింద రూ.62.74 కోట్లకు పైగా లావాదేవీలు జరిపినట్లు సిట్ నిర్ధారించుకుంది. దీంతో ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో మనీ లాండరింగ్ (PMLA) కేసు నమోదు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఏప్రిల్ 13వ తేదీన నాసిక్లో అశోక్ నివాసంలో ఈడీ సోదాలు జరిపింది. తిరిగి 17, 18 తేదీల్లో తనిఖీలు జరిపి కొన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్లు, కంప్యూటర్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. కోపర్గావ్ పోలీస్ స్టేషన్లో జితేంద్ర శెల్కే, ఆయన భార్య మరణంపై కేసు నమోదు అయ్యింది. అయితే సిట్ అనుమానాల నేపథ్యంలో ప్రమాదానికి గల కారణాలపై ఆర్టీవో, ఆటోమొబైల్ నిపుణుల సహకారంతో క్రాష్ అనాలిసిస్ చేయనున్నట్లు అహిల్యా నగర్ జిల్లా ఎస్పీ సోమనాథ్ ఘార్గే తెలిపారు. -
టీసీఎస్ కేసు.. ‘కడుపుతో ఉన్నా.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి’
మహారాష్ట్ర నాసిక్లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) యూనిట్లో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు వెలుగులోకి రావడంతో దేశం ఉలిక్కి పడింది. గత నాలుగేళ్లుగా సీనియర్ ఉద్యోగులు ఈ ఘాతుకాలకు పాల్పడ్డారంటూ మొత్తం తొమ్మిది మంది ఫిర్యాదులు చేశారు. సంచలన కేసు కావడంతో సిట్ లోతుగా దర్యాప్తు జరుపుతుండగా.. సంస్థపై మచ్చ పడడంతో టీసీఎస్ ఈ అంశాన్ని తీవ్రంగానే పరిగణిస్తోంది. ఈ తరుణంలో.. సిట్కు ఈ కేసు నిందితురాలు నిదా ఖాన్(Nida Khan) ఝలక్లు ఇస్తోంది. ఇప్పటికే పరారీలో ఉన్న ఆమె.. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ నాసిక్ లోకల్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. తాను గర్భవతినని, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అందులో పేర్కొంది. ప్రస్తుతం ఆమె ముంబైలో తలదాచుకున్నట్లు సిట్కు సమాచారం అందింది. ఈ మొత్తం వ్యవహారంలో నిదా ఖానే ప్రధాన నిందితురాలు అయ్యి ఉండొచ్చని సిట్ భావిస్తోంది. యాంటీసిపేటరీ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చేలోగా.. వీలైనంత త్వరగా ఆమెను అదుపులోకి తీసుకోవాలని సిట్ ప్రయత్నిస్తోంది. మరోవైపు.. వేధింపుల వ్యవహారంలో హెచ్ఆర్ హెడ్గా నిదా ఖాన్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు బృందం భావించింది. అయితే.. ఈ విషయంలోనూ పోలీసులకు మరో ఝలక్ తగిలింది. ఆమె అసలు హెచ్ఆర్ హెడ్ కాదని టీసీఎస్ ప్రకటించింది. ఆమె సాధారణ టెలికాలర్ అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లో ఆమెను హెచ్ఆర్ హెడ్గా పేర్కొనడం గమనార్హం.హైబ్రిడ్ టెర్రరిస్ట్ కుట్ర?నిదా ఖాన్కి ఢిల్లీ పేలుళ్ల నిందితులతో సంబంధం ఉందంటూ పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. జైషే (Jaish-e-Mohammed) ఉగ్రవాదిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ షాహీన్ షాహిద్తో సంబంధం ఉందని ఆ కథనాల సారాంశం. దీంతో.. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ రంగంలోకి దిగింది.నాసిక్ టీసీఎస్ బీపీవో యూనిట్లో పని చేసే ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు, ఒక పురుష ఉద్యోగి తమపై జరిగిన మానసిక, శారీరక వేధింపులు, మత అవమానాలు, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల ప్రకారం.. టీమ్ లీడర్లు, కొంతమంది సీనియర్ ఉద్యోగులు.. ‘‘మహిళా ఉద్యోగులను మానసికంగా, శారీరకంగా వేధించారు. తప్పుడు హామీలతో ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకున్నారు.హిందూ దేవతలను అవమానించారు, పండుగల సమయంలో సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలను ఎగతాళి చేశారు.నమాజ్ చేయమని బలవంతపెట్టారు, మతాన్ని అవమానించారు. ఉద్యోగులను హోటళ్లకు, రిసార్ట్స్కి రావాలని ఒత్తిడి చేశారు. వీటన్నింటికి తోడు.. చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్ విభాగం ఫిర్యాదులను పట్టించుకోకుండా నిందితులనే ప్రొత్సహించింది.ఈ కేసులో ఇప్పటిదాకా ఏడుగురిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఇందులో ఆరుగురు పురుష ఉద్యోగులు, ఒక మహిళా ఉద్యోగిణి ఉన్నారు. నిదా ఖాన్ ఇంకా అరెస్ట్ కావాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉపేక్షించేది లేదని TCS అంటోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను కంపెనీ నుంచి సస్పెండ్ చేసింది. పోలీసు విచారణకు పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం అన్నారు. కంపెనీ సీవోవో ఆరతి సుబ్రహ్మణియన్ ఆధ్వర్యంలో అంతర్గత విచారణ కొనసాగుతుందని తెలిపారాయన.ఈ కేసు దేశవ్యాప్తంగా.. మరీ ముఖ్యంగా ఐటీ రంగంలో మత మార్పిడి, లైంగిక వేధింపులపై చర్చలకు దారితీసింది. సుప్రీం కోర్టులో కూడా బలవంతపు మత మార్పిడి నియంత్రణపై పిటిషన్ దాఖలైంది. ఈ ఉదంతం దేశంలోని సార్వభౌమత్వం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, ఐక్యతకు ముప్పుగా అభివర్ణించిన పిటిషనర్ లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్.. బలవంతపు మత మార్పిడిని ‘టెర్రరిస్ట్ యాక్ట్’గా ప్రకటించాలని కోర్టును కోరారు. -
టీసీఎస్ నాసిక్ కేసు.. వెలుగులోకి మరో షాకింగ్ ఘటన!
సంచలనంగా మారిన టీసీఎస్ నాసిక్ క్యాంపస్ వ్యవహారంలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. లైంగిక వేధింపులు, మత మార్పిడులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో కొంతమంది ఉద్యోగులను(మాజీ) పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో బాధితులు ముందుకు వస్తుండడంతో విస్తుపోయే విషయాలే వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పలువురు మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఓ పురుష ఉద్యోగి మతం మారాలంటూ తననూ బలవంత పెట్టారని.. ఈ క్రమంతో తన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ‘‘నేనొక హిందువుని. వాళ్లు నా మత విశ్వాసాలను ఎగతాళి చేసేవారు. నేను మొక్కే దేవుళ్లపై అవమానకర వ్యాఖ్యలు చేసేవారు. నైట్ షిఫ్ట్ల సమయంలో బలవంతంగా బయటకు తీసుకెళ్లి నాన్ వెజ్ తినమని వేధించేవారు. వాళ్లకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా.. వదిలేవాళ్లు కాదు. 2023లో రంజాన్ టైంలో టీమ్ లీడర్ తౌసిఫ్ అట్టార్ ఓ రోజు తన ఇంటికి తీసుకెళ్లి.. నా నెత్తి మీద టోపీ పెట్టి నమాజ్ చేయమంటూ ఒత్తిడి చేశాడు. ఆ సమయంలో ఫొటోలు తీసి వాటిని కంపెనీ గ్రూపులో షేర్ చేశాడు. ఆ తర్వాత నా వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు.నా తండ్రి పక్షవాతం బారిన పడినప్పుడు.. ఇస్లాం మతం స్వీకరిస్తే ఆయన త్వరగా కోలుకుంటాడు అని చెప్పారు. అందుకు ఒప్పుకోకపోయేసరికి.. నాపై వేధింపులు ఎక్కువ అయ్యాయి. నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. ఆ విషయంపైనా వెకిలిగా ప్రవర్తించేవాళ్లు. ‘పిల్లలు కావాలంటే నీ భార్యను పంపు’ అని అసభ్యంగా మాట్లాడేవారు. ఈ విషయాలపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే.. హెచ్ ఎగ్జిక్యూటివ్ నిదా ఖాన్ వద్దని సర్దిచెప్పింది. ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ ఉంటుందని.. ఉద్యోగం పోయినా పోవచ్చని బెదిరించేది అని బాధితుడు తన వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. బీపీవో కార్యకలాపాలు నిలిపివేత..నాసిక్లో ఉన్న టీసీఎస్ క్యాంపస్లో బీపీవో(BPO) సెంటర్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి కేసుల వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులను ఇంటినుంచే పని చేయాలని (Work From Home) గురువారం నుంచి ఆదేశించారు. తదుపరి సమాచారం వచ్చే వరకు ఈ తాత్కాలిక మూసివేత కొనసాగుతుందని తెలిపారు.ఆమెకూ 14 రోజుల రిమాండ్ఈ కేసులో హెచ్ఆర్ మేనేజర్ అసిఫ్ అన్సారీ సహా ఏడుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. టీమ్ లీడర్ తౌసిఫ్ అట్టార్, సహోద్యోగి డానిష్ షేక్లను ప్రధాన నిందితులుగా చేర్చారు. మరో ఇద్దరు మహిళా ఉద్యోగులను నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ నిదా ఖాన్ పరారీలో ఉంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అశ్విని చయ్నాని కూడా కీలక పాత్ర పోషించినట్లు తేలింది. సిట్ విచారణలో.. అశ్విని చయ్నాని ప్రధాన నిందితుడు తౌసిఫ్ అట్టార్తో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారని.. 78 సార్లు ఈ వ్యవహారంపైనే ఈమెయిల్స్ ద్వారా సంప్రదింపులు జరిపారని.. అందులో కుట్రకు సంబంధించిన వివరాలు ఉన్నాయని తేలింది. మలేషియా నుంచి ఓ మత పెద్ద సూచనల మేరకు నిందితులు నడుచుకున్నారని తెలుస్తోంది. తాజాగా అశ్వినిని కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసు నిందితులంతా నాసిక్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా ఈ వ్యవహారంపై టీసీఎస్ స్పందించింది. అరెస్టయిన ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించినట్లు తెలిపింది. పని ప్రదేశంలో ఇలాంటి వేధింపులను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేసింది. పోలీసు విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని తెలిపింది.ఉలిక్కిపడ్డ ఐటీ రంగం.. నాసిక్ క్యాంపస్లో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి తన సహోద్యోగిపై ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో తనను మోసగించినట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేసే క్రమంలో మరో ఏడుగురు మహిళలు ముందుకొచ్చి.. తమపై జరిగిన వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హెచ్ఆర్ మేనేజర్ సహా అసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మేమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్ పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఓ ప్రముఖ కంపెనీలో జరిగిన ఈ వ్యవహారంతో దేశ ఐటీ రంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. టీసీఎస్ సహా అన్ని సంస్థల్లో పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిబంధనలు పాటించడంపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయను జాతీయ ఐటీ ఉద్యోగుల సంఘం కోరింది.తీవ్ర వేధింపులు..2022 ఫిబ్రవరి నుంచి నాలుగేళ్లపాటు వేధింపులకు పాల్పడినట్లు మహిళా ఉద్యోగులు తమ ఫిర్యాదుల్లో పేర్కొనడం గమనార్హం. అనుచితంగా తాకడం, అసభ్యకరమైన కామెంట్స్ చేయడం, బాడీ షేమింగ్, నాన్ వెజ్ తినాలని ఒత్తిడి చేయడం వంటివి చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై హెచ్ఆర్ విభాగానికి మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. అయితే ఏజీఎం అశ్విని ఆ ఫిర్యాదులను తీసుకోకుండా పక్కన పెట్టారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మారు వేషంలో.. ఈ వ్యవహారంపై నాసిక్ పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టారు. ఏడుగురు మహిళా పోలీసులు మారు వేషంలో టీసీఎస్ క్యాంపస్లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఓ మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆపై సీసీఫుటేజీల ఆధారంగా కేసు లోతుల్లోకి వెళ్లే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. -
180 మంది అమ్మాయిలు.. 350 అశ్లిల వీడియోలు.. కీచకుడు అయాజ్ అరెస్ట్
-
ఆటో, టాక్సీ డ్రైవర్లకు అలర్ట్!
మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజా రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. మే 1వ తేదీన ‘మహారాష్ట్ర దినోత్సవం’ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటోరిక్షా, టాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో పర్మిట్ పొందాలన్నా లేదా డ్రైవర్గా కొనసాగాలన్నా మరాఠీ భాషలో ప్రాథమిక అవగాహన ఉండటం నిబంధనగా మారింది.మెరుగైన సేవలురాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఈ నూతన విధానాన్ని వెల్లడించారు. ప్రయాణికులు, డ్రైవర్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ను తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డ్రైవర్ల వల్ల భాషా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ‘మరాఠీ మన రాష్ట్ర అధికారిక భాష. ప్రజా సేవల్లో దాని వాడకాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత. డ్రైవర్లకు మరాఠీ చదవడం, రాయడం, మాట్లాడటం వస్తేనే ప్రయాణికులకు మెరుగైన భద్రత, సేవలు అందుతాయి’ అన్నారు.అమలు తీరు.. తనిఖీలుఈ నిబంధనను కఠినంగా అమలు చేయడానికి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో భారీ ఏర్పాట్లు చేస్తోంది. మే 1 నుంచి రవాణా శాఖకు చెందిన 59 ప్రాంతీయ (ఆర్టీఓ), ఉప ప్రాంతీయ కార్యాలయాల ద్వారా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారు. తనిఖీల సమయంలో డ్రైవర్లు మరాఠీలో తమ ప్రాథమిక నైపుణ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. వారికి మరాఠీ చదవడం, రాయడం వస్తుందా లేదా అని అధికారులు ధ్రువీకరిస్తారు. కేవలం డ్రైవర్లే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు జారీ చేసే అధికారులపై కూడా నిఘా పెంచనున్నారు. అర్హత లేని వారికి లైసెన్సులు ఇస్తే సదరు అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.ఇదీ చదవండి: బంగారం ధరలు సలసల!


