Bapatla
-
రీ సర్వేలో రెవెన్యూ చేతివాటం
చుండూరు (వేమూరు): ముడుపులు చెల్లిస్తే బ్లాక్ లిస్టులో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసిన అధికారుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. కోర్టు వివాదంలో ఉన్న పొలాలకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు బ్లాక్ లిస్టులో ఉన్నాయి. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకొని ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. చుండూరు మండలంలోని చినపరిమి గ్రామంలో అనంతగిరి ముసలయ్యకు 56 సెంట్లు మాగాణి సాగు భూమి ఉంది. ఆయనకు ఆరుగురు కుమారులు, కుమార్తె సంతానం. కుమార్తెకు మాటలు రావు. ఆ భూమిని కుమార్తె పేరిట వీలునామా రాశారు. ఆమె అనంతరం కుమారులకు హక్కులు కల్పించారు. ఐదుగురు అన్నదమ్ముల్లో ఒక తమ్ముడు కొడుకు అనంతం శ్రీనివాసరావు రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇచ్చి 2020 పట్టాదారు పాస్ పుస్తకాలు పొందాడు. హక్కుదారులైన మగిలిన అన్నదమ్ములు చుండూరు తహసీల్దారు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్ పుస్తకం బ్లాక్ లిస్టులో పెట్టారు. అనంత శ్రీనివాసరావు తెనాలి సివిల్ కోర్టును ఆశ్రయించాడు. శ్రీనివాసరావు నకిలీ పత్రాలు ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందాడని మిగతావారు చుండూరు పోలీసు స్టేషన్ను ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఆధారాలను పరిశీలించిన అనంతరం శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. 2026లో చుండూరు తహసీల్దారు నాగరాజు లంచం తీసుకొని బ్లాక్లో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకం శ్రీనివాసరావుకు ఇచ్చారు. హక్కుదారులు మార్చి 30వ తేదీన దీనిపై జిల్లా కలెక్టరుకు అర్జీ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల 4వ తేదీన చుండూరు తహసీల్దారును కలిశారు. కోర్టు వివాదంలో ఉన్న పొలాలకు పట్టాదారు పాస్ పుస్తకం ఎందుకు మంజూరు చేశారని అడిగారు. తహసీల్దారు కార్యాలయంలోని వీఆర్వోలు కోర్టు వివాదంలో ఉన్న చినగాదెలవర్రు, పెదగాదెలవర్రు గ్రామాలకు చెందిన పొలాలకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారని బాధితులు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చుండూరు మండలంలోని కొంతమంది వీఆర్వోల హవా కొనసాగుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొంత మంది వీఆర్వోలను బదిలీ కావడం లేదు. కొంతమంది రైతుల వద్ద డబ్బులు తీసుకొని నకిలీ దస్తావేజులు పుట్టిస్తున్నారు. వాటి ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీఆర్వోలు అంటే తహసీల్దారు కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. -
చినపులివర్రులో ఉద్రిక్తత
కొల్లూరు: మండలంలోని చినపులివర్రు గ్రామంలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమర్థించడం ఎంతవరకు సమంజసం అంటూ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా వేమూరు నియోజకవర్గ కన్వీనర్ బాణాల తనీష్బాబు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే కార్యాలయానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఆదివారం తెల్లవారుజామున మఫ్టీలో తనీష్బాబు ఇంటికి వెళ్లిన పోలీసులు గోడలు దూకి ఇంటిలోకి వెళ్లి అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ప్రశ్నించిన తనీష్బాబు భార్య పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు గ్రామానికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనీష్కు మద్దతుగా వస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులను, చినపులివర్రు వాసులను వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు, వివిధ పోలీసుస్టేషన్ల ఎస్ఐలు అడ్డగించారు. కొల్లూరు సమీపంలో రేపల్లె ● తెనాలి ప్రధాన రహదారిపై భారీగా మోహరించిన పోలీసులు అశోక్బాబు, తనీష్ కుటుంబ సభ్యులు మాత్రమే స్టేషన్ వద్దకు రావాలని ఆంక్షలు విధించారు. స్టేషన్ వద్దకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం కొల్లూరు పోలీసుస్టేషన్లో తనీష్కు పోలీసులు రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు సమక్షంలో 41 నోటీసులు అందజేశారు. అనంతరం తనీష్ భార్య అనూష పోలీసులపై ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు. -
తీరం.. ఫలహారం!
చీరాల అర్బన్: తమ భూములపై హక్కును కోల్పోయేలా మత్స్యకారులను ప్రభావితం చేయటం వెనుక పెద్ద కుట్ర దాగుందనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేటపై నిషేధం విధించనున్నారు. మత్స్యసంపద పునరుత్పత్తి జరిగే సమయం కావటం అందుకు కారణం. పర్యాటక రంగం అభివృద్ధి ముసుగులో అతిక్రమణలకు తెర తీశారు. అందులో రిసార్టుల నిర్వాహకులు ముందున్నారు. రిసార్టుల ఎదురు రోడ్డు నుంచి సముద్ర తీరం వరకు ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతంపై వారసత్వ హక్కు ఉన్న మత్స్యకారులను ఆర్థికంగా ప్రలోభపరచుకున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వీరికి లాభమేంటంటే.. తీరం నుంచి రోడ్డు వరకు ఉన్న తీర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవటంతో సీవ్యూ పేరుతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నారు. దీంతో పాటు రాత్రి వేళల్లో క్యాంప్ ఫైర్ పేరుతో విందు, వినోదాలు ఏర్పాటు చేసి ప్రత్యేక రుసుం వసూలు చేస్తున్నారు. చిన్న, మధ్య తరహా ఫంక్షన్లు కూడా తీరం వెంట నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి భారీగా డబ్బు వసూలు చేసి అడ్డగోలుగా ఆర్జిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘన అతిక్రమణలపై అధికారుల నియంత్రణ శూన్యమనే చెప్పాలి. వారిని కూడా నిర్వాహకులు తమదైన శైలిలో తృప్తి పరుస్తుండటం అందుకు కారణంగా విమర్శలు వస్తున్నాయి. ఒకటి, రెండు రిసార్టులకు మినహా మిగిలిన వారికి అనుమతులు లేవు. అనుమతులు ఉన్న వాటిలో కూడా అతిక్రమణలు ఉన్నాయి. ఇది అన్ని శాఖల అధికారులకు తెలిసిన బహిరంగ రహస్యం. అధికార ముద్ర పడితే చాలు ‘‘అనుమతులా? అవెందుకు? ఎమ్మెల్యేతో ప్రారంభించుకుంటాం. దాంతో అధికార ముద్ర పడుతుంది. అవసరమైతే వారిని సంతృప్తి పరుస్తాం. దీంతో పాటు పార్టీ ఫండ్ ఇచ్చి సహకరిస్తామని చెప్తాం. అది చాలు. అంతేకానీ ఆ అనుమతి, ఈ అనుమతి అంటూ వివిధ శాఖల అధికారులు చుట్టూ ఎక్కడ తిరుగుతాం. తిరిగినా పని కాదు. నిబంధనల మేరకు రిసార్టు కట్టాలంటే అయ్యే పని కాదు. అయినా మమ్మల్ని ఏమన్నా చేయాలంటే మాకన్నా ముందు కట్టిన వారిపై చర్యలు చేపట్టండని అడుగుతాం. మరి ఇప్పుడు కూడా జరుగుతున్న నిర్మాణాల సంగతేంటని అడుగుతాం. ఇదో కందిరీగల తుట్టె. ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇస్తున్నాం. ఇక మాపై చర్యలేంటి?’’ అనే మాటలు రిసార్టుల యజమానుల నుంచి వినిపిస్తున్నాయి. పరిష్కారం ముఖ్యం పాలకులు, అధికారుల్లో చిత్తశుద్ధి ఉంటే రిసార్టుల నిర్మాణం లేదా నిర్వహణ నిబంధనల మేరకు సాగించటమనేది పెద్ద కష్టమేమీ కాదు. అలా చేస్తే ఒక విధమైన క్రమశిక్షణ వస్తుంది. తీరంలో భద్రత పెరుగుతుంది. అలా చేస్తే సంబంధికుల వ్యక్తిగత ప్రయోజనాలకు గండి పడుతుంది. అందుకే వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సునామీ సమయంలో 8 మంది మృతి చంద్రబాబు సర్కారు నిర్వాకంతో సముద్ర తీరం పరాధీనమవుతోంది. వేట విరామ సమయంలో మత్స్యకారుల భృతికి తీరం వెంట కేటాయించిన అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మడచెట్లు మాయం అయ్యాయి. అందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా రిసార్టుల నిర్వాహకులు కారణం. చర్యలు చేపట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో విలువైన సహజ సంపద ప్రమాదంలో పడుతోంది. గతంలో సునామీ విపత్తు వచ్చినప్పుడు పొట్టిసుబ్బయ్యపాలెం తీరంలో 8 మంది మృత్యువాత పడ్డారు. అన్నీ సక్రమంగా ఉంటే అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అతిక్రమణలతో జరిగే ప్రమాదాలు కనిపించవు. ఏదన్నా సునామీ లాంటి విపత్తు ఎదురై ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగితే అందుకు ప్రస్తుతం కొమ్ముకాస్తున్న పాలకులు, అధికారులు బాధ్యత వహిస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి తీరం వెంట అటవీ భూమి సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారుల భృతి కోసం కేటాయించింది. తీరం వెంట ఉన్న మడ చెట్లతోపాటు వారికి కేటాయించిన భూముల్లో సరిగ, యూకలిప్టస్, సుబాబుల్ వంటి సామాజిక వనాలను పెంచాలి. అందులో జీవాలు, పశువులను మేపుతూ భృతి పొందాలి. కోతకు వచ్చిన వనాల కలపను విక్రయించి వచ్చిన డబ్బుతో వారి జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవాలి. ఇది ఈ ప్రక్రియ లక్ష్యం. తమకు కేటాయించిన ప్రాంతం ఎప్పుడైతే వివిధ కారణాలతో పరాధీనం అయ్యిందో, అప్పటి నుంచి తీరంలో సామాజిక వనాలు, మడచెట్లు పూర్తిగా కనుమరుగయ్యాయి. మత్స్యకార గ్రామాల్లో పలువురు జీవాలు, గేదెల మేపునకు కూడా సరైన వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది ఆరంభం మాత్రమే. ఇదే పరిస్థితులు కొనసాగితే భవిష్యత్లో వారు తమ ఉనికినే కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
గ్యాస్ గోడౌన్ వద్ద వినియోగదారుల ఆందోళన
పర్చూరు(చినగంజాం): పర్చూరులో గ్యాస్ సిలిండర్ల సరఫరా లోపం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం పర్చూరు గ్యాస్ గోడౌన్ వద్ద సిలిండర్ల పంపిణీ విషయమై కాస్తంత గందరగోళం నెలకొంది. గోడౌన్ వద్దకు సిలిండర్ల స్టాకు వచ్చిందన్న సమాచారం రావడంతో ముందుగా సిలిండర్లు బుక్ చేసుకున్న వినియోగదారులు భారీగా వచ్చి చేరారు. అందరికీ సిలిండర్ల పంపిణీ చేయలేమన్న నిర్వాహకులతో వినియోగదారులు వాగ్వాదానికి దిగి ఆందోళన చేపట్టారు. ఆమెరికా–ఇరాన్ యుద్ధ నేపథ్యంలో దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదంటూ అధికారులు ప్రకటనలు విడుదల చేస్తున్న నేపథ్యంలో పర్చూరులో గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాణిజ్య సిలిండర్ల సరఫరా తక్కువగా ఉండటం, గృహ వినియోగ సిలిండర్లు రెగ్యులర్గా పంపిణీ జరుగుతుండటంతో వ్యాపారులు వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్లను బ్లాక్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటూ గృహ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. పర్చూరులో గ్యాస్ సరఫరా సమస్యలతో ప్రజల ఇబ్బందులు -
ఓఆర్ఆర్ మలుపులపై రైతుల నిరసన
గుంటూరు రూరల్: ఔటర్ రింగ్ రోడ్డు 2017లో తొలిసారిగా ఇచ్చిన ఎలైన్మెంట్ను తుంగలో తొక్కి 2025లో ఇష్టం వచ్చినట్లు మలుపులు తిప్పుతూ మరోసారి ఎలైన్మెంట్ మార్చిన ప్రభుత్వం తీరుపై వట్టిచెరుకూరు మండలం రైతులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో రైతులు ప్రస్తుతం ఔట్ రింగ్ రోడ్డు వెళుతున్న మార్గంలో పొలాల వద్ద బైటాయించి నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని ఇంజనంపాడు చమళ్ళమూడి, కుర్నూతల పుల్లడిగుంట గ్రామాల మీదుగా వెళుతున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం మలుపు తిరగడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారని వారు పేర్కొన్నారు. 2017 అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం చేసిన ఎలైన్మెంట్ సజావుగా ఉందని, 2025–26 మ్యాప్ ఎలైన్మెంట్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. చైన్నె, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో లేని వెడల్పాటి 140 మీటర్ల రోడ్లు తమకొద్దని, 70 మీటర్ల రోడ్డు నిర్మాణం చాలని రైతులు తెలిపారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల భూములకు ఇప్పుడు ఇస్తున్న పరిహారం సరిపోదని, సరైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు నిర్వహించి బాధిత రైతుల డిమాండ్లను తెలుసుకుని, వాటిని అమలు చేయాలని కోరారు. లేని పరిస్థితుల్లో ధర్నా, రాస్తారోకోలు నిర్వహిస్తామని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు మలుపులు తిప్పి రైతులను ఇబ్బందులకు గురిచేయటమే ఈ ఎలైన్మెంట్ లక్ష్యంగా ఉందన్నారు. ఈ మార్పుల వల్ల చమల్ళమూడి, కుర్నూతల పరిధిలోని రైతులకు ప్రస్తుత బహిరంగ మార్కెట్తో ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి కనీసం పొంతన లేదని వాపోయారు. పాత ఎలైన్మెంట్ను పరిగణనలోకి తీసుకుని రోడ్డు నిర్మాణం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. -
అధికారం ఉందని అహంకారంతో మాట్లాడకు..
నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయకపోగా..వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని తాను చేసినట్లుగా చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ..అధికారం ఉందనే అహంకారంతో ఏది పడితే అది మాట్లాడితే ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెదకూరపాడు సమన్వయకర్త నంబూరు శంకరరావు అన్నారు. ఆదివారం గుంటూరు నగరంలోని పార్టీ కార్యాలయంలో శంకరరావు మాట్లాడుతూ మా పార్టీ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో తిరుగుతుంటే ఓ వ్యక్తి మా గ్రామానికి నువ్వు ఏం చేశావని ప్రశ్నిస్తే దానికి నేను సమాధానం చెప్తే నీ కెందుకు..నన్ను ఎందుకు కదిలిస్తున్నావని ప్రశ్నిస్తున్నారు. నీ పని నువ్వు చేసుకో..నా జోలికి వస్తే నువ్వు చేసే అరాచాకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు బయటకు తీస్తానని అన్నారు. వంద గ్రామాలు..వంద రోజులు అని కార్యక్రమం పెట్టి రోజుకు ఒక అరగంట తిరిగి తానేదో పనిచేసున్నట్లు హై కమాండ్కి చెప్పుకోవడమే తప్ప ప్రజలకు ఈ రెండేళ్లలో ఏ సంక్షేమ కార్యక్రమం కానీ..అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టావా..ప్రజల సమస్యలను పరిష్కరించావా అని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ను ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అక్కడే పరిష్కరించడంతోపాటు టీడీపీ నాయకుల ఇళ్లకు కూడా వెళ్లి వారి సమస్యలను అక్కడే పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామాల్లో నీ గురించి ప్రజలు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకో..తెలియకపోతే నీ మనిషిని పెట్టుకుని తెలుసుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గంలోకి నన్ను రానివ్వవా..రానివ్వపోవడానికి నువ్వు ఎవరివి..ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు..అధికారం ఉందని..కళ్లు నెత్తికెక్కితే ప్రజలే నీ అధికారాన్ని దించుతారు..నియోజకవర్గంలోకి ఎవరిని రానివ్వాలో..ఎవర్ని రానివ్వకూడదో ప్రజలే తేలుస్తారన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.682.58కోట్లతో అభివృద్ధి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పెదకూరపాడు నియోజకవర్గంలో రూ.1483.24 కోట్లతో సంక్షేమం, రూ.682.58 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. రూ.148కోట్లతో అమరావతి, బెల్లంకొండ డబుల్ రోడ్, రూ.60 కోట్లతో మాదిపాడు వద్ద కృష్ణా నదిపైన బ్రిడ్జి, రూ.7.25 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజ్, రూ.4 కోట్లతో పెదమద్దూరు బ్రిడ్జి, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేవాలయాల నిర్మాణానికి రూ.5.80 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఒక్క రైతుకై నా ప్లాటు ఇచ్చారా? రాజధాని నిర్మాణం పేరుతో 54 వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి లాక్కుని 9 వేల ఎకరాల్లో భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తామని చెప్పిన మీరు...ఏ ఒక్క రైతుకై నా ప్లాట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. 9 వేల ఎకరాలు పోతే మిగిలిన 43 వేల ఎకరాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. మీరేమో వ్యాపారాలు చేసుకోవాలి, రైతుల్ని మాత్రం ముంచేయాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని..రాజధాని పేరుతో జరుగుతున్న భూ దోపిడీకి వ్యతిరేకమన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలుపుతూ మావిగన్ రాజధాని చేయాలని వైఎస్ జగన్ ప్రతిపాదించారు. చంద్రబాబునాయుడు కూడా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంతో కలిపి సీఆర్డీఏ ఉంటుందని చెప్పారు. రూ.20 వేల కోట్లతో పూర్తయే రాజధాని కావాలా..రూ. 2లక్షల కోట్లతో పూర్తయ్యే రాజధాని కావాలో ప్రజలే గ్రహించాలని అన్నారు. నియోజకవర్గ పరిశీలకులు యెనుమల మురళీధర్రెడ్డి, పెదకూరపాడు ఎంపీపీ బెల్లంకొండ మీరయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు కొండవీటి కోటేశ్వరరావు, భవిరిశెట్టి హనుమంతరావు, నర్సిరెడ్డి, అప్పిరెడ్డి, సాయిరెడ్డి, నాయుడు రాంబాబు, షేక్ సుభాని పాల్గొన్నారు. -
గోవాడలో 16 నుంచి మహా కుంభాభిషేకం
అమృతలూరు(భట్టిప్రోలు): అమృత లూరు మండలం గోవాడలో వేం చేసియున్న గంగా పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి దేవస్థానం నిర్మితమై శత వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహణాధికారి ఎంవీఎస్ వర్మ ఆదివారం ఒక ప్రకనలో పేర్కొన్నారు. ఆలయ ముఖ్య అర్చకులు చావలి శ్రీధర్శర్మ, ఐలూరి సుబ్రహ్మణ్య దీక్షులచే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 16న ప్రవచన విద్వాంసురాలు అనుగ్రహభాషణ, 17న వేదాంతం సునీత భాషణం, 18న మాతా శివానంద సరస్వతి (శివకేశవ పీఠాధిపతులు) అనుగ్రహ భాషణం, సాయంత్రం గ్రామోత్సవం, 19న పెనుగొండ క్షేత్ర పీఠాథిపతి పజ్ఞానంద సరస్వతి బాల స్వామి అనుగ్రహ భాషణం, సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త నోరి నారాయణమూర్తి ప్రవచనం, 20న మహా కుంభాభిషేకం, మధ్యాహ్నం అన్న సంతర్పణ జరుగుతుందని వివరించారు. డీఈఓ రామారావు నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. కేబీఆర్ కళాశాల ప్రాంగణంలోని పది మూల్యాంకన కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి మూల్యాంకనం కొనసాగుతున్న తీరును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మూల్యాంకన కేంద్రానికి 1,75,700 పేపర్లు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు 60 శాతం మూల్యాంకనం పూర్తయినట్టు వివరించారు. ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, ప్రతి గదిలోనూ ఫ్యాన్, లైట్లు ఏర్పాటు చేశామన్నారు. తాగునీరు, వైద్యసేవలకు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఖమ్మం జిల్లాకు చెందిన భక్తులు ఆదివారం రూ.1.28 లక్షల విరాళాన్ని అందజేశారు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన జయలక్ష్మి, వంశీకృష్ణ కుటుంబం ఆదివారం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసిన వారు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1.28,166 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
నాటక రంగానికి యువత అవసరం
యడ్లపాడు: నాటక రంగానికి యువతరం ఊపిరి కావాలని విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య చెప్పారు. కొండవీడు కళా పరిషత్ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు రోజు ప్రదర్శనలను లింగారావుపాలెం మాజీ సర్పంచ్ షేక్ కరిమూన్ జ్యోతి ప్రజ్వలన చేయగా, వ్యాపారవేత్త దెందుకూరి రవిరాజా నటరాజ పూజ చేసి కార్యక్రమాల్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు నంబూరు వీరాంజనేయులు సభాధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య మాట్లాడుతూ నాటక రంగం పూర్వ వైభవాన్ని తీసుకురాగల సత్తా యువతలోనే ఉందని అభిప్రాయపడ్డారు. వారిని కళారంగంవైపు మళ్లించి తీసుకురావల్సిన బాధ్యత ముందు కుటుంబం నుంచి ప్రారంభం కావాలన్నారు. మరో అతిధి అనంతలక్ష్మి నూలుమిల్లు ఎండీ సామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ ఒకప్పుడు నాటకాల్లో పురుషులే సీ్త్రపాత్రల్ని పోషించేవారని, నేడు సీ్త్రలే సీ్త్రపాత్రలు చేయడంతో పాటు ఒక్కో నాటికలో ఎక్కువ మంది సీ్త్రలు ఉండటం శుభపరిణామమన్నారు. రాకీ కమ్యూనికేషన్ చైర్మన్ నల్లపాటి రామచంద్రప్రసాద్, పఠాన్ యూసఫ్, గరికపాటి సుబ్బారావు, మలినేని సుబ్బారావు, ఆలోకం సుబ్బారావు, ముద్దన రాఘవయ్య చౌదరి ప్రసంగించార. కార్యక్రమంలో పరిషత్ ప్రతినిధులు కట్టా శ్రీహరిరావు, ఆలోకం సాంబశివరావు, మండెపూడి శ్రీనివాసరావు, నంబూరి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య -
ముగిసిన కొండవీడు కళా సంబరాలు
యడ్లపాడు: కొండవీడు కళాపరిషత్ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు కళల పండుగలా కొనసాగాయి. మూడో రోజు ఆదివారం మూడు అద్భుత కళారూపాలు ప్రదర్శితం అయ్యాయి. వేటికవే గొప్ప కథనాలతో కళాకారుల పోటాపోటీ అభినయంతో ప్రేక్షకుల్ని అలరించాయి. నిర్వాహకులు కట్టా శ్రీహరిరావు, తోకల సాంబశివరావు, నంబూరు వీరాంజనేయులు, మండెపూడి శ్రీనివాసరావు, మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, బ్రహ్మవరప్రసాద్ కృషిని దాతలు, కళాభిమానులు అభినందించారు. ‘అమ్మచెక్కిన బొమ్మ’ సృష్టిలోని అనంతమైన వైవిధ్యాన్ని ఆస్వాదించలేక..మూసధోరణిలో బతుకుతున్న నేటి సమాజపు సంకుచిత మనస్తత్వాన్ని నిలదీసే అద్భుత కళారూపం అమ్మచెక్కిన బొమ్మ నాటిక. ఆడ, మగ అనే రెండు పార్శ్వల మధ్య నలిగిపోతూ, తన గుర్తింపు కోసం పరితపించే మూడో ప్రకృతి అస్తిత్వ పోరాటాన్ని ఈ నాటిక కళ్లకు కట్టింది. గోవాడ క్రియేషన్స్ వేదికగా వచ్చిన ఈ నాటికకు జ్యోతిరాజ్ భీశెట్టి మూలకథను అందించగా, డాక్టర్ వెంకట్ గోవాడ తన నాటకీకరణతో, దర్శకత్వ ప్రతిభతో దీనికి ప్రాణం పోశారు. ‘అందరూ మంచివారే కానీ..!’ కన్నప్రేమను మించిన కరుణతో సాగాల్సిన అనుబంధాలు, కాసుల కక్కుర్తి ముందు ఎలా కరిగిపోతాయో సాక్షాత్కరించింది అందరూ మంచివారే కానీ..నాటిక. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న మరదలి ప్రాణం కంటే డబ్బే ముఖ్యమని భావించిన ఒక వదిన స్వార్థం, ఆ ఇంటి మమకారాన్ని బలితీసుకోవడం వీక్షకుల మనసును కలచివేసింది. క్లిష్ట పరిస్థితుల్లో మంచితనం మంటగలిసి, రక్తసంబంధం ఆర్థిక సంకెళ్లకు బందీ కావడాన్ని ఈ ప్రదర్శన అత్యంత సహజంగా ఆవిష్కరించింది. జరుగుల రామారావు రచన, దర్శకత్వంలో మానవత సాగరి (యడ్లపాడు) బృందం అద్భుతంగా రంగస్థలంపై ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంది. ‘ఇది అతని సంతకం’ సమకాలీన సమాజంలో మనిషి వ్యక్తిత్వానికి, పట్టుదలకు నిలువుటద్దంలా నిలుస్తుంది ఇది అతని సంతకం నాటిక. జీవిత చరమాంకంలో ఎవరికీ భారంగా మారకూడదని, తనకంటూ ఒక నిర్దిష్టమైన జీవన శైలిని రూపొందించుకున్న కృష్ణమూర్తి అనే వ్యక్తి, అబద్ధం లేని సిద్ధాంతాలతో సమస్యల నెదురిస్తూ సాగించిన ప్రయాణం ఇందులో స్ఫూర్తిదాయకంగా సాగుతుంది. ఈ నాటికను గుంటూరు అభినయ ఆర్ట్స్ ప్రదర్శించగా, శ్రీస్నిగ్థ రచించారు. ఎన్.రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఎనిమిది మందికి గాయాలు సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలైన సంఘటన సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి 20 మంది మత్స్యకారులు ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామంలోని చెరువులో రొయ్యలు పట్టేందుకు వస్తున్నారు.బొల్లేరో వాహనంలో మత్స్యకారులు వస్తుండగా సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్దకు చేరుకోగానే డ్రైవర్కు నిద్రమత్తు రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో సంగడి జోగేశ్వరరావు (45) మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాలువకు రెయిలింగ్ లేకపోవడంతో ప్రమాదం.. -
ఏటీఎంలో రూ. 87 లక్షల నగదు చోరీ
పిడుగురాళ్ల: ఏటీఎంలలో నగదు ఉంచాల్సిన ఉద్యోగి ఆ నగదును దొంగిలించి పరారైన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించి పిడుగురాళ్లపట్టణ సీఐ శ్రీరామ్ వెంకట్రావు తెలిపిన వివరాల మేరకు... పిడుగురాళ్ల పట్టణంలోనే ఎస్బీఐ బ్రాంచ్కు చెందిన నాలుగు ఏటీఎంలలో అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక ఏటీఎంలో శుక్రవారం రూ. 48 లక్షలు ఉదయం సమయంలో తోటి సిబ్బందితో సీఎంఎస్ గుంటూరు బ్రాంచ్కు చెందిన కస్టోడియన్ మామిడి నరేష్ అనే ఉద్యోగి ఏటీఎంలో నగదును పేర్చారు. అతనితోపాటు ఉద్యోగులు కూడా ఉండటంతో తెలివిగా ఏటీఎంలలో నగదును ఏర్పాటు చేసినా లాక్ వేయలేదు. తోటి ఉద్యోగులతోపాటు తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంతలోనే వేరే పని ఉందని చెప్పి గుంటూరుకు వెళ్లకుండా మార్గమధ్యలోనే దిగాడు. తోటి ఉద్యోగులు గుంటూరు వెళ్లిపోయారు. ఆ తరువాత మామిడి నరేష్ ఏటీఎంలకు వచ్చి మొత్తం రూ. 87 లక్షలకుపైగా నగదును ఏటీఎంలో నుంచి తీసుకొని పరారయ్యాడు. ముందుగా ఏటీఎంలలో ఏర్పాటుచేసిన రూ. 48 లక్షలు, అంతకుముందు ఏటీఎంలో ఉన్న మిగిలిన నగదుతో కలిపి మొత్తం రూ. 87 లక్షలకు పైగా ఉన్న నగదును అపహరించారు. నరేష్ పథకం ప్రకారం తిరిగి వచ్చి ఏటీఎంలలో ఉన్న నగదు మొత్తాన్ని చోరీ చేశాడు. ఏటీఎంలో నగదు రాకపోవడంతో పలువురు బ్యాంకు కస్టమర్లు ఆయా బ్యాంకు మేనేజర్లకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి చూడగా విషయం తెలిసింది. సమాచారం తెలుసుకున్న అధికారులు ఫిర్యాదు చేయగా సీఐ శ్రీరామ్ వెంకట్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన వైఎస్ జగన్
గుంటూరు ఎడ్యుకేషన్ : అట్టడుగు వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పరిపాలనలో ఆచరణలో పెట్టారని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవన్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. శనివారం బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, తాడికొండ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు)లతో కలసి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ 200 ఏళ్ల క్రితమే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని, అణగారిన, అట్టడుగు వర్గాల్లో అంటరానితనాన్ని పారద్రోలి సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా ముందుకు వెళ్లేందుకు బాటలు వేసిన మహనీయుడని కొనియాడారు. 1848లోనే సీ్త్ర విద్య కోసం తన సతీమణి సావిత్రిబాయి పూలేకు అండగా నిలిచి, ప్రత్యేకంగా విద్యాసంస్థలను స్థాపించేందుకు కృషి చేశారని అన్నారు. జ్యోతిరావు పూలే ఆశించిన విధంగా అట్టడుగు వర్గాల సంక్షేమం, రాజకీయంగాచైతన్య, చట్టసభల్లో ప్రాధాన్యాన్ని వైఎస్ జగన్మోన్రెడ్డి గత ప్రభుత్వంలో ఆచరణలో చూపించారని అన్నారు. బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించిన ఏకై క ముఖ్యమంత్రిగా నిలిచారని, రాష్ట్రంలో జ్యోతిరావ్ పూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ హక్కు ఉందన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ విభాగ అధ్యక్షడు తాడిబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో బీసీలకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. బీసీలకు న్యాయం చేసి, అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించిన వ్యక్తిగా వైఎస్ జగన్ నిలిచారని చెప్పారు. -
తొలి సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే
గుంటూరు ఎడ్యుకేషన్: సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన తొలి సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే అని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హెనీ క్రిస్టినా మాట్లాడుతూ భారత ప్రప్రథమ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు, వందల ఏళ్లుగా అణచివేతకు గురైన బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడిగా జ్యోతిరావు పూలే నిలిచారని అన్నారు. మహిళా సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడిగా మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలు నిరుపమానమని చెప్పారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, వివిధ విభాగాల పరిపాలనాధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు చంద్రమౌళీనగర్కు చెందిన ఉప్పలపాటి శేఖర్, మాధవి రూ.1,00,001 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి నాగేశ్వరరావు, డీవీవీ సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి సన్నిధిలో ఇంటెలిజెన్స్ ఐజీపీ మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఏపీ ఇంటెలిజెన్స్ ఐజీపీ పీహెచ్డీ రామకృష్ణ కుటుంబ సమేతంగా శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలోపాలు పోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందించి సత్కరించారు. చల్లపల్లి సీఐ ఈశ్వరావు, స్థానిక ఎస్ఐ పి.గౌతమ్కుమార్. ఆలయ అధకారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దుర్గమ్మకు కానుకగా బంగారు హారం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన భక్తులు శనివారం రూ.5 లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన కె.శ్రీనివాసుమూర్తి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 33 గ్రాముల బంగారం, రూ.5 లక్షలతో తయారు చేయించిన హారాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఎఈవో వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు. -
భానుడు.. భగ భగ
రెంటచింతలలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నిర్మానుష్యంగా మారిన మాచర్ల–గుంటూరు రహదారిగుంటూరులో ఎండలు మండిపోవడంతో గొడుగులు ఉపయోగిస్తున్న మహిళలు, సోడా బండి వద్ద వే చి చూస్తున్న కొనుగోలుదారులుకొద్ది రోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎల్నినో ప్రభావం వలన ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన విషయం విదితమే. దీంతో ఉదయం 10 గంటల నుంచే తీవ్రత పెరిగింది. అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా రెంటచింతలలో శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 43.4 డిగ్రీలుగా నమోదైంది. మధ్యాహ్న సమయంలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత నుంచి కొబ్బరిబొండాలు, చెరుకురసం, శీతల పానీయాల దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు/ రెంటచింతల -
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అడహక్ కమిటీ ఏర్పాటు
బాపట్ల: బాపట్ల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అభివృద్ధి చేసేందుకు జిల్లా అడహక్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సత్యనారాయణరావు, ప్రధాన కార్యదర్శి ఎం రమేష్కుమార్లు తెలిపారు. బాపట్లలో ఏర్పాటు చేసిన ఉద్యోగుల సంఘం సమావేశంలో వారు మాట్లాడుతూ అడహాక్ కమిటీ చైర్మన్గా జీవీవీ రాఘవరెడ్డి, కన్వీనర్గా పసుమర్తి శ్రీనివాసరావు, సభ్యులుగా కే రోశయ్య, జే సుధాకర్, కే అంజిబాబు, జే మార్తా, వై రాజేష్బాబు, ఎన్ పెద్ద పుల్లారావు, టీ తరుణ్రాజ్లను నియమించినట్లు తెలిపారు. చైర్మన్గా ఎంపికై న రాఘవరెడ్డి మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని అన్ని తాలుకా కమిటీలను బలోపేతం చేస్తామని, జిల్లా మొత్తం పర్యటించి సభ్యత్వ నమోదు చేయిస్తామని తెలియజేశారు. ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సత్యనారాయణ, కార్యదర్శి రమేష్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
మేడికొండూరు: రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడిన ఘటన మండలంలోని జంగంగుంట్లపాలెం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నరసరావుపేట మండలం మక్కినవారిపాలెంలో రాత్రి జరిగిన వివాహానికి హాజరైన దీపక్, చాణిక్య, వారి కుటుంబ సభ్యులతో సత్తెనపల్లి నుంచి గుంటూరు వైపు వెళ్తున్నారు. వీరు జంగంగుంట్లపాలెం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న మరొక కారు బలంగా ఢీకొంది. ఎదురుగా వస్తున్న మరొక కారులో ఉన్న జొన్నలగడ్డ ప్రసూనతో పాటు భర్త బాంబే సుబ్రహ్మణ్యం, కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న మేడికొండూరు సీఐ మధుసూదనరావు, ఎస్ఐ ఖాజీబాబు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని పోలీసు వాహనంలో గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు గంగమ్మ తల్లి తిరునాళ్ల
కారంచేడు: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగాను, సంతాన లక్ష్మిగాను పేరొంది విరాజిల్లుతున్న గ్రామదేవత గంగమ్మ తల్లి తిరునాళ్లను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. కారంచేడు పుట్టాయిపాలెంలో కొలువైన అమ్మవారికి 39 సంవత్సరాలుగా శిడి మహోత్సవాలను కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నాలుగు రోజుల నుంచి అమ్మవారికి వివిధ రకాల ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ, గ్రామస్తులు పెద్దఎత్తున నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఆదివారం వేకువజామునుంచే అమ్మవారిని వివిధ రకాల ప్రత్యేకమైన పూలతో అలంకరిస్తారు. గ్రామస్తులు ఎక్కడ ఉన్నా గ్రామానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. తమ పాడి పశువులను, వాహనాలను సైతం అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించుకుంటారు. తిరునాళ్ల సందర్భంగా వివిధ ప్రాంతాలు, జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, మజ్జిగ, పులిహోర, అల్పాహారం వంటి స్టాల్సు సైతం ఏర్పాట్లు జరుగుతున్నారు. విద్యుత్ ప్రభలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. పెద్ద ఎత్తున హాజరు కానున్న భక్తులు.. ఈ ఏడాది గంగమ్మ తిరునాళ్లను పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నాలుగు రోజుల నుంచి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామానికి చెందిన ఆడపడుచులు, భక్తులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారితోపాటు, తెలంగాణ, తమిళనాడు, కేరళం, కర్ణాటకల నుంచి కూడా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. గ్రామానికి వచ్చే భక్తులు ఆలయం వద్దకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆలయం చుట్టూ ప్రదిక్షణలు చేస్తారని కమిటీ సభ్యులు చెప్పారు. పటిష్టమైన పోలీసు బందోబస్తు.. తిరునాళ్లు ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వేకువజాము వరకు నిర్విరామంగా జరుగుతాయి. ఇంకొల్లు సీసీ వైవీ రమణయ్య కారంచేడు పోలీస్ స్టేషన్లో ఏర్పాట్లపై సమీక్షించారు. వేల సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారనే సమాచారంతో పోలీస్ బందోబస్తును పటిష్టంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వివిధ స్టేషన్ల నుంచి ఎస్ఐలు, ఏఎస్ఐలు, పోలీస్, హోంగార్డులను బృందాలుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరునాళ్లు జరిగే తీరును ఆయన ఆలయ కమిటీ సభ్యులతో చర్చించారు. -
ఇకపై కోర్టుకో కానిస్టేబుల్ నియమాకం
నగరంపాలెం: జిల్లాలోని న్యాయస్థానాలలో కేసులు పరిష్కరించేందుకు ఇక నుంచి ప్రతి కోర్టుకు ఒక కానిస్టేబుల్ను నియమించనున్నట్లు సీఐలు ప్రభాకర్ (డీసీఆర్బీ), ధర్మేంద్రబాబు (కోర్టు మానిటరింగ్ సిస్టం– సిఎంఎస్) చెప్పారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు శనివారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో ‘కోర్టుల వారీగా అంకితభావం కల్గిన కానిస్టేబుళ్లు మోడల్పై నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించారు. సీఐలు మాట్లాడుతూ ఇప్పటి దాకా పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల రికార్డులను/పత్రాలను కోర్టులలో దాఖలు చేసేవారని అన్నారు. ఆ కేసుల్లో సత్వర పరిష్కారానికి ప్రతి పోలీస్స్టేషన్ (పీఎస్) నుంచి కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు విధులు నిర్వర్తించేవారని గుర్తుచేశారు. ఇక నుంచి డీజీపీ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి కోర్టుకు అవసరమైన పోలీస్ సిబ్బందిని కేటాయిస్తారని తెలిపారు. కోర్టులలో ఫైల్ చేసిన కేసులకు సంబంధించి పీఆర్సీ నంబర్లు, కేసు చార్జిషీటు దాఖలు చేశాక సీసీ నంబర్లు వచ్చేలా పర్యవేక్షించాలని అన్నారు. బాధితులకు న్యాయం అందించేందుకు సాక్షులను, ఆధారాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే కేసులను గుర్తించి పరిష్కరించాలని అన్నారు. విచారణ కేసులకు హాజరవ్వని ముద్దాయిలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలన్నారు. కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు పడే శాతాన్ని పెంపొందించాలని అన్నారు. పీపీలు, ఏపీపీలతో సమన్వయంతో కేసుల పురోగతికి చర్యలు చేపట్టాలని చెప్పారు. సమావేశంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నిత్యాన్నదానానికి రూ. 90,001 విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి గుంటూరుకు చెందిన భక్తులు ధరణికోట గిరిజ శుక్రవారం రూ. 90.001 విరాళంగా సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ సూపరిటెండెంట్ అచ్యుత మదుసూధనరావుకు అందచేశారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో దాతను సత్కరించారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): న్యూ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఆధ్వర్యంలో అండర్–18 బాల బాలికల బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రేవతి, జి.ఆంజనేయులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న క్రీడాకారులు పాల్గొనవచ్చన్నారు. ఈ పోటీలను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులోని టాప్ కిడ్స్ స్కూల్లో ఏర్పాటు చేశామన్నారు. పాల్గొనే వారు పోటీలకు అరగంట ముందు రిపోర్ట్ చేయాలని తెలిపారు. వయస్సు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ తప్పక తీసుకురావాలని పేర్కొన్నారు. వివరాలకు ఆంజనేయులు 98663 34528 నెంబర్కు సంప్రదించాలని కోరారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సెస్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శనివారం ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా స్పెషల్ కమిషనర్ సౌమ్య, కమిషనర్ డాక్టర్ కె.రవిశంకర్ హాజరయ్యారు. ఈ స్పోర్ట్స్ మీట్లో భాగంగా క్రికెట్, టెన్నిస్, షటిల్, టెన్నికాయిట్, చెస్, 2 కే రన్, 1కే రన్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ తదితర విభాగాల్లో క్రీడలు నిర్వహించారు. కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి కె.మురళీకృష్ణ, కల్చరల్ సెక్రటరీ జగదీష్బాబు పాల్గొన్నారు. పట్నంబజారు(గుంటూరుఈస్ట్) రాజధాని అమరావతి గురించి ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టింగ్ పెట్టాడనే నెపంతో సోషల్ యాక్టివిస్ట్పై కొత్తపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. రాజధాని అమరావతి గురించి జగన్ వారియర్ అనే పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ ద్వారా రాజధానికి సంబంధించిన పలు అంశాలు ప్రస్తావిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టాడు. దీనిపై పలువురు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ యాక్టివిస్ట్ కోసం గాలిస్తున్నట్లు సమాచారం. నరసరావుపేట రూరల్: విషం సేవించి యువకుడు మృతిచెందిన ఘటన ఇస్సపాలెం– జొన్నలగడ్డ బైపాస్రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు. బెల్లంకొండ మండలం పాపాయపాలేనికి చెందిన బిట్రగుంట వెంకట్రావు(28) పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. మానసిక ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో గతంలో ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. హైదరాబాద్లో చికిత్స పొంది కోలుకున్న వెంకట్రావు ఆసుపత్రిలో విధులకు హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఇస్సపాలెం–జొన్నలగడ్డ బైపాస్లోని పంట పొలంలో వెంకట్రావు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో రూరల్ ఎస్ఐ కిషోర్ ఘటాన స్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. నగరంపాలెం: గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విధులు నిర్వర్తించే డీఎస్పీ బి.సునీల్ బదిలీయ్యారు. కొద్దిరోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఎస్పీల బదిలీలు జరగ్గా, ఆయన్ను విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన్ డీఎస్పీగా బదిలీ చేశారు. గుంటూరు సీఐడీలో సుమారు ఏడాదిపాటు సునీల్ విధులు నిర్వర్తించారు. -
పకడ్బందీగా టెన్త్ మూల్యాంకనం
బాపట్ల: పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూల్యాంకనం జరుగుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బాపట్లకు వచ్చిన పదో తరగతి పరీక్షల ప్రశ్న పత్రాలను పరిశీలించారు. పలు గదులలో జరుగుతున్న మూల్యాంకనం తీరును ఆయన తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఏర్పడకుండా విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. రెగ్యులర్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం కోసం 750 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1,77,819 మంది విద్యార్థుల ప్రశ్నాపత్రాలు వచ్చాయన్నారు. ఆరో తేదీన ప్రారంభమైన ఈ మూల్యాంకనం 15వ తేదీతో ముగుస్తుందన్నారు. ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా మొదలైందన్నారు. 15వ తేదీ వరకు జరిగే ఈ మూల్యాంకనంలో 60 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారని, 12,408 మంది విద్యార్థుల ప్రశ్నపత్రాలు వచ్చాయన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం జరుగుతుందన్నారు. ఒక్కొక్క ఉపాధ్యాయుడు సగటున 40 మంది జవాబుపత్రాలు మూల్యాంకనం చేసేలా ప్రణాళికలు రూపొందించారన్నారు. ప్రభుత్వ అసిస్టెంట్ ఎగ్జామినర్ శివకుమార్, ఇద్దరు ఉప విద్యాశాఖ అధికారులు ఈ కేంద్రాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సింగ్, ఉపాధ్యాయుడు సాదిక్ తదితరులు ఉన్నారు. ఆటిజం పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలి ఆటిజంతో బాధపడే పిల్లలకు విద్యాబుద్ధులు, వైద్యంతోపాటు వారి జీవన నైపుణ్యాలను అధికారులు మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న సపోర్ట్ సెంటర్ను కలెక్టర్ శనివారం పరిశీలించారు. బాధిత పిల్లల ఎదుగుదల కోసం ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలతో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ చెప్పారు. విభిన్న ప్రతిభావంతులైన మతిస్థిమితం లేని వారు, ఆటిజం పిల్లలకు సెంటర్ ఎంతో సాయం అందిస్తుందన్నారు. ఈ కేంద్రాల నిర్వహణపై సమగ్ర శిక్ష అభియాన్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఆటిజం మూడు దశల్లో వైకల్యం ఉంటుందని వైద్యులు కలెక్టర్కు వివరించారు. మానవ వనరుల అభివృద్ధి చేయడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు. పిల్లల మేధో శక్తిని పెంచడానికి అనువైన వాతావరణం, పరికరాలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆటిజంతో బాధపడే పిల్లల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్సింగ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాజేంద్ర, విద్యాశాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
ఛాన్స్ చూసి ఏసీయ్..!
గుంటూరు మెడికల్: కంచె చేను మేసిందన్న చందంగా గుంటూరు జీజీహెచ్లో పరిస్థితి ఉంది. గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఏసీలను అపహరిస్తూ పట్టుబడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కొంతకాలంగా పలు వార్డుల్లో, ఆపరేషన్ థియేటర్లలో ఏసీలు పనిచేయడం లేదు. ఉక్కపోతతో వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు అల్లాడిపోతున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఏసీలు పనిచేయక వైద్య సేవలు అందించేందుకు చమటోడుస్తున్నారు. ఆసుపత్రికి గుండెకాయలాంటి కీలకమైన అత్యవసర సేవల విభాగంలో ఏసీలు పనిచేయక అల్లాడిపోతున్నారు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులకు చీమకుట్టినట్లైనా లేదు. రోగులు, వైద్యులు అల్లాడిపోతున్నా, అధికారుల గదుల్లో ఏసీలు బాగా చల్లగా పనిచేస్తుండటంతో, రోగుల బాధలు, వైద్యుల బాధలు అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరమ్మతుల మాటే మరిచారు ఆసుపత్రిలో ఏసీల మరమ్మతుల మాట మరిచిపోయారు. మరమ్మతులకు గురైన వాటిని బయటకు తీసి నిబంధనలకు విరుద్ధంగా అమ్మేస్తున్నారు. కొత్తవాటిని కొనుగోలు చేసి అమరుస్తున్నారు. మరమ్మతుల పేరుతో ఆయా వార్డుల్లో తొలగించిన ఏసీలు ఎక్కడకు వెళుతున్నాయో ఎవరికి తెలియడం లేదు. వీటిని పర్యవేక్షణ చేయాల్సిన వారు మిన్నకుండి పోవడం విమర్శలకు తావిస్తుంది. మండుతున్న ఎండలు వేసవి ప్రారంభమైందంటే మార్చి నెల నుంచే గుంటూరులో ఎండలు మండిపోతుంటాయి. గుంటూరు నగరంలో 40 డిగ్రీలకు పైగా ఎండలు ఉన్నాయి. గుంటూరు జీజీహెచ్లో పలు వార్డుల్లో ఏసీలు పనిచేయక రోగులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆపరేషన్ థియేటర్లలో సైతం ఏసీలు పనిచేయడం లేదు. ఇటీవల కాన్పుల వార్డులో కూడా ఏసీలు పనిచేయక బాలింతలు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుండెజబ్బుల వార్డు, ఇతర వార్డులు, క్యాజువాల్టిలో ఎప్పటి నుంచో ఏసీలు పనిచేయడం లేదు. అయినప్పటికీ మరమ్మతులు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోవడం విమర్శలకు తావిస్తుంది. ఏసీలు మరమ్మతులు చేయకపోయినా కాంట్రాక్టర్లకు దొడ్డిదారిలో బిల్లులు చెల్లించేందుకు ఆసుపత్రి అధికారులు రంగం సిద్ధం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్లో 32కుపైగా వైద్య విభాగాలు ఉన్నాయి. 15 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు ఎంతో కీలకమైన విభాగాలు. వీటిల్లో తప్పనిసరిగా ఏసీలు ఉంటేనే వైద్యులు పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఐసీయూల్లో ఏసీలు పనిచేయకపోతే రోగుల శరీర ఉష్ణోగ్రత్తల్లో తేడా వచ్చి కొన్ని సార్లు ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఐసీయూల్లో ఏసీలు పనిచేయకపోవడం వల్ల అత్యవసర వైద్య పరికరాలు సక్రమంగా పనిచేయక వాటి పనితీరులో తేడాల వల్ల ప్రాణాపాయ చికిత్స పొందుతున్న రోగులు ఆపరేషన్ చేయించుకున్న రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఆసుపత్రుల్లో ఎంతో కీలకమైన ఏసీలకు మరమ్మతులు చేసేందుకు టెక్నీషియన్ లేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కొంతకాలంగా ఆసుపత్రిలో ఏసీలు అపహరణకు గురవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి సిబ్బంది సైతం వీటి గురించి చర్చించుకుంటున్నారు. శుక్రవారం ఇరువురు ఉద్యోగులు ఎమర్జెన్సీ వార్డుపైన ఏసీలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించి సీసీ కెమెరాల్లో రికార్డు అవడం ద్వారా పట్టుబడ్డారు. దీంతో ఆసుపత్రి అధికారులు అప్రమత్తమై గతంలో పోయిన ఏసీలను కూడా ఎవరు చోరీ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. గతేడాది కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు దాతలు, బ్యాంకులు, పారిశ్రామిక వేత్తలతో జీజీహెచ్లోని పేద రోగుల కోసం ఏసీలను డొనేషన్ చేయించారు. ఆ ఏసీలు ఎక్కడ ఉన్నాయో, ఏ వార్డులో వాడుతున్నారో ఎవరి వద్దా లెక్కలు లేవు. గతంలో ఉన్న ఏసీలకు సైతం లెక్కలు లేవు. వర్క్షాప్ ద్వారా ఏసీల నిర్వహణ గతంలో ఉండేది. నేడు వర్క్షాప్ నుంచి అధికారుల వద్దకు ఏసీల నిర్వహణ బాధ్యతలు మారడంతో ఏసీల అపహరణలు జరుగుతున్నాయి. -
ఘనంగా జాతీయ సర్వే దినోత్సవం
గుంటూరు మెడికల్: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న నిర్వహించే ‘జాతీయ సర్వే దినోత్సవం’ వేడుకలు ఆంధ్రప్రదేశ్ సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. గౌరవ అతిథులుగా ఏపీ ఎన్జీజీవో సంఘ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, సర్వే శాఖ డెప్యూటీ డైరెక్టర్ తోయజాక్షరావు, అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ కుమార్లు జాతీయ సర్వే దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలకు గౌరవ అతిథులు బహుమతులు అందజేశారు. రక్తదాన శిబిరంలో 36 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి, తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు తమ వంతు సహాయాన్ని అందించారు. ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో సర్వే శాఖ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. సమాజ సేవలో భాగంగా రక్తదానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సర్వే ఉద్యోగులు సామాజిక బాధ్యతను చాటుతున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్వే ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.లక్ష్మీనారాయణ, డివిజనల్ అధ్యక్షుడు కట్ట వరప్రసాద్, ఎం.శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీ జీవో సిటీ ఉపాధ్యక్షుడు భావన్నారాయణ, సర్వే అధికారులు, సర్వే ఉద్యోగులు పాల్గొన్నారు. -
సందేశాత్మకం.. అద్భుత కళారూపం
యడ్లపాడు: లింగారావుపాలెం వేదికగా సాగుతున్న కొండవీటి కళా పరిషత్ 27వ జాతీయస్థాయి కళా సంబరాలు రెండోరోజు శనివారం మూడు నాటికలు ప్రదర్శితమయ్యాయి. ఆయా నాటికల్లోని సంఘటనలు నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ నిత్యం చూస్తున్న వాస్తవ ఘటనలకు దర్పణం పట్టాయి. ‘శ్రీమాత్రే నమః’ ఆకాశమంత ఆశ.. అమెరికా వెళ్లాలన్న ఆశయం.. కెరీర్ పరుగులో అందరికంటే ముందుండాలన్న తపన.. ఇదీ నేటితరం ప్రతినిధి అయిన ఒక ఆధునిక యువతి జీవన చిత్రానికి కళారూపమే సీ్త్ర మాత్రే నమః నాటిక. అయితే జీవితం ఎప్పుడూ మనం గీసుకున్న గీతల్లోనే సాగదు. అనూహ్యంగా ఎదురైన ఒక ప్రమాదం ఆమె ఆశల విమానాన్ని నేలకూల్చడమే కాదు, ఆమె జీవన ప్రయాణాన్నే ఓ మలుపు తిప్పిందని సునిశితమైన సంఘర్షణలతో అద్భుతంగా ఆవిష్కరించింది నాటిక. స్వర్ణసూర్య డ్రామా లవర్స్(హైదరాబాద్)వారు సమర్పించగా మూలకథను పూర్ణిమా పెమ్మరాజు అందించగా, ఉదయ భాగవతుల రచన, దర్శకత్వం వహించారు. ‘మమ్మల్ని బతకనివ్వండి’ కుండపోత వర్షంలో భార్య ప్రాణం గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతుంటే, సాయం కోసం గొంతు చించుకుని విలపిస్తున్న ఆర్తనాదాలు వినిపించింది కనిపించింది కేవలం వ్యాపారమే. మనిషి ప్రాణం కంటే డబ్బుకే విలువ పెరిగిన ఈ కాలంలో, తన వద్ద ఉన్న సర్వస్వాన్ని ధారపోసినా ఆ వృద్ధుడికి మిగిలింది మరణమే. వరద భీభత్సంలో మూర్ఛవ్యాధికి చిక్కి తన కళ్ల ముందే ఇల్లాలు కన్నుమూస్తుంటే, నిస్సహాయుడై ఆ ముసలాయన రోదించిన తీరు ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఒకవైపు ప్రకృతి విలయాన్ని, మరోవైపు అంతకుమించిన మనుషుల నైతిక పతనాన్ని కళ్లకు కట్టి చూపిందీ నాటిక. విజయవాడ సాంస్కృతిక సమితి వారు ప్రదర్శించిన ఈ రూపకం, పల్లెటూరి యాసతో, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగుతూ చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేసింది. రచన, దర్శకత్వం సుఖమంచి కోటేశ్వరరావు వహించారు. ‘తరమెళ్లిపోతున్నదో..’ మరణం తర్వాత కూడా మనిషి జ్ఞాపకం బతకాలంటే, అతడు బ్రతికున్నప్పుడు పంచిన ప్రేమలో నిజాయితీ ఉండాలి. తోడునీడగా ఉండాల్సిన రక్తసంబంధాల మధ్య ఆస్తులు, అంతస్తులు చిచ్చుపెడితే, కోట్లు ఉన్నా ఆ మనిషి ఒంటరివాడేనని కథనమే తరమెళ్లిపోతున్నదో నాటిక. శేషయ్య, దశరథ రామయ్య అనే ఇద్దరు మిత్రుల నేపథ్యంతో మొదలయ్యే ఈ కథ, విద్య యొక్క విలువను, త్యాగంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూనే, ఆధునిక సమాజంలోని కృత్రిమ బంధాలపై చావుదెబ్బ కొట్టింది. తండ్రి చదివించకపోయినా, తన కొడుకు రాఘవరావును గొప్ప ఆఫీసర్గా చూడాలనుకున్న ఒక పేద తండ్రి ఆశయం వెనుక, మరో కొడుకు రంగనాథం చేసిన నిశ్శబ్ద త్యాగం ఈ నాటికలో ప్రతి ఒక్కరినీ కదిలించివేసింది. తమ ఇంట శుభకార్యానికి ఊరంతా పిలిచి తోడబుట్టిన వారిని వెలివేసే నేటి తరం వికృత పోకడలను బొమ్మిడి రామకృష్ణ తన దర్శకత్వంతో కళ్లకు కట్టారు. దీనిని కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్(గుంటూరు) వారు ప్రదర్శించిన ఈ నాటిక నవసమాజానికి మేలుకొలుపుగా నిలిచింది. -
కోన ప్రభాకరరావు కీలక పాత్ర
దేశ రాజకీయాల్లో బాపట్ల: దేశ రాజకీయాల్లో కోన ప్రభాకరరావు కీలకపాత్ర పోషించారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. పాతబస్టాండ్లో ఏర్పాటు చేసిన కోన ప్రభాకరరావు విగ్రహాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. నాగార్జున మాట్లాడుతూ బాపట్ల ప్రాంత అభివృద్ధితోపాటు దేశ చరిత్రలోనే బాపట్లకు గుర్తింపు తీసుకువచ్చిన ఘనత కోన ప్రభాకరరావుకు దక్కిందన్నారు. కోన ప్రభాకరావు మహారాష్ట్ర గవర్నర్గా పనిచేయటంతోపాటు కాంగ్రెస్పార్టీలో కీలకమైన పదవులు ఎన్నో చేపట్టారని గుర్తు చేసుకున్నారు. కోన ప్రభాకరరావు తనయుడు మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ కోన ప్రభాకరరావు కుమారుడుగా పుట్టడం తాను చేసుకున్న అదృష్టంగా పేర్కొన్నారు. క్రీడా, రాజకీయ, సినీరంగం, న్యాయవాది.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్నతంగా రాణించటం కోన ప్రభాకరరావుకే దక్కిందన్నారు. అనునిత్యం బాపట్ల ప్రాంత అభివృద్ధికి ఆయన కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. బాపట్లను విద్యకేంద్రంగా రూపాంతరం చెందేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలే ఈ ప్రాంతాభివృద్ధికి బీజాలు అని చెప్పారు. బాపట్ల నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లినా తాగు, సాగునీటిని అందించారని ప్రభాకరరావును ప్రజలు గుర్తు చేసుకోవటం తనకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. బాపట్ల ప్రాంతంలో పాతబస్టాండ్ రోడ్డు విస్తరణ సందర్భంగా విగ్రహాన్ని తొలగించారని, తిరిగి విగ్రహం ఏర్పాటు చేస్తారా... లేదా... అనే సందేహాల మధ్య విగ్రహం ఏర్పాటు చేయటం ఎంతో సంతోషకరమని చెప్పారు. ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, సమన్వయ కర్తలు వరికూటి అశోక్బాబు, కరణం వెంకటేష్బాబు, పీటా నాగ మోహన్కృష్ణ, చింతలపూడి అశోక్, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, పార్టీ నాయకులు కొక్కిలిగడ్డ చెంచయ్య, వడ్డి ముక్కల డేవిడ్, దొంతిబోయిన సీతారామిరెడ్డి, కోకి రాఘవరెడ్డి, చేజర్ల నారాయణరెడ్డి, చల్లా రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
రంగస్థలిపై మానవీయ సంతకాలు
యడ్లపాడు: జగతిని జాగృతం చేసేవి కళారూపాలేనని ఏపీ రాష్ట్ర తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. రసవత్తరమైన నటనకు, భావోద్వేగాలకు వేదికగా నిలిచే లింగారావుపాలెంలో కొండవీటి కళా పరిషత్ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథి ఏపీ తెలుగు నాటక అకాడమీ చైర్మన్న్ గుమ్మడి గోపాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేయగా, పుడమి మైన్స్ డైరెక్టర్ ముత్తవరపు అరుణకుమారి నటరాజ పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిషత్ అధ్యక్షులు కట్టా శ్రీహరిరావు అధ్యక్షత వహించారు. గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను ఎండగట్టే గొప్ప శక్తి సింగిల్ టేక్లో ప్రదర్శించే ఒక్క నాటకానికి మాత్రమే ఉందన్నారు. సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య మాట్లాడుతూ నాటక రంగాన్ని నడిపిస్తున్నవి పరిషత్తులు, దాతలు మాత్రమే అన్నారు. ముత్తవరపు అరుణకుమారి మాట్లాడుతూ నాటక రంగానికి పూర్వవైభవానికి తీసుకువచ్చే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం నేత చలసాని శ్రీనివాస్, విరించి రిసార్ట్స్ అధినేత నెల్లూరి వంశీకష్ణ, పఠాన్ సుభాని, ఆలోకం అమరలింగస్వామి, కిలారు వెంకటరావు, నంబూరు నరసింహారావు, కృష్ణారావు, శొంఠినేని సాంబశివరావు పాల్గొని ప్రసంగించారు. వ్యాపారమైన మాతృత్వంపై కన్నీటికి విలువెంత..? సమాజంలోని అతి కిరాతకమైన వైద్య మాఫియా ముఖాన్ని బట్టబయలు చేసింది. అమ్మ ప్రేమను కూడా అంగడి సరుకుగా మారుస్తున్న డాక్టర్ సరోజినీ దేవి అరాచకాలను, సామాన్య సీ్త్రల పోరాట పటిమను ఈ నాటిక అద్భుతంగా చిత్రించింది. నర్సు నందిని అందించిన సహకారంతో, బాధితులు సీతాలు, మాధవి తమ కన్నీటిని ఆయుధాలుగా మలిచి వ్యవస్థలోని అన్యాయంపై సమరశంఖం పూరించారు. డి.కామేశ్వరి కథను దృశ్యరూపంలోకి మలిచిన విధానం, బీవీకే క్రియేషన్స్ వారి నటన.. వైద్య రంగంలో మంటగలుస్తున్న నైతిక విలువలను ప్రశ్నించడమే కాకుండా, సీ్త్ర శక్తి తలచుకుంటే ఎంతటి కుట్రనైనా ఛేదించగలదని నిరూపించింది. మాయాలోకంలో మనీషిని వెతికిన మంచి మనసులు.. స్వార్థం రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో నిస్వార్థ సేవ యొక్క ప్రాధాన్యాన్ని హృదయాలకు హత్తుకునేలా చాటిచెప్పింది. తోటి మనిషి కష్టాన్ని తనదిగా భావించేవాడే అసలైన దైవమని, రక్త సంబంధాల కంటే ఆపన్న హస్తం అందించే మానవ సంబంధాలే మిన్న అని చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వ ప్రతిభతో సాక్షాత్కరించారు. అందరి క్షేమాన్ని కాంక్షించే ఉన్నత ఆశయమే సమాజానికి ప్రాణవాయువు అని చాటుతూ, ఉషోదయ కళానికేతన్ (కట్రపాడు)బృందం ప్రదర్శించిన ఈ రూపకం మనుషుల మధ్య అంతరించిపోతున్న మమకారాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. అందం వర్సెస్ అమ్మతనం.. ఇక శ్రీరమణా కళానిలయం సమర్పించిన మాతృత్వం నాటిక ఆడతనం అంటే కేవలం బాహ్యా సౌందర్యం కాదని, అది అమ్మతనంలోనే పరిపూర్ణత చెందుతుందని లోతైన విశ్లేషణ చేసింది. వృత్తి, అందం అనే వ్యామోహంలో పడి సంతానాన్ని భారంగా భావించిన లావణ్య అనే యువతి పాత్ర ద్వారా నేటి తరం ధోరణిని సునిశితంగా విమర్శించారు. అహంకారం నుంచి పశ్చాత్తాపం వైపు సాగిన ఆమె ప్రయాణం, పక్షవాతంతో ఉన్న అత్తగారి మాతృత్వ హృదయాన్ని చూసి కళ్లు తెరుచుకోవడం వంటి దృశ్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సుఖమంచి కోటేశ్వరరావు రచనకు, పొగర్తి నాగేశ్వరరావు ప్రాణం పోయగా, మారుతున్న కాలంలో మసకబారుతున్న కుటుంబ విలువలను సరిదిద్దే కనువిప్పుగా ఈ నాటిక నిలిచింది. -
ప్రకృతి సాగుతో ఆరోగ్యకర జీవనం
నరసరావుపేట: అందుబాటులో ఉన్న స్థలాన్ని వినియోగించి న్యూట్రి గార్డెన్ మోడల్స్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం న్యూట్రి, కమ్యూనిటీ, కిచెన్ గార్డెన్స్, సూర్య మండలం, ఏటీఎం మోడల్స్, టెర్రస్, బయో–రిసోర్స్ సెంటర్లపై సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు బడులు, అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలలు, మహిళల ఇళ్ల వద్ద ఈ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రోజువారీగా పోషక విలువలతో కూడిన ఆహారం పొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించడం అత్యంత అవసరమని తెలిపారు. చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. న్యూట్రి గార్డెన్స్ ప్రోత్సాహం కోసం గ్రామస్థాయిలో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలని సూచించారు. బయో–రిసోర్స్ ఇన్పుట్ సెంటర్ల ఏర్పాటు, పాయింట్ పర్సన్స్ బాధ్యతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం వల్ల నేల నాణ్యత దెబ్బతినడం, ఆరోగ్య సమస్యలు పెరగడం వంటి సమస్యల గురించి వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారాన్ని కాపాడుతూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధ్యం అవుతాయని తెలిపారు. న్యూట్రి, కిచెన్, కమ్యూనిటీ గార్డెన్స్, సూర్య మండలం, ఏటీఎం మోడల్స్, టెర్రస్ ప్రాముఖ్యతను వివరించారు. శిక్షణలో భాగంగా విత్తనాల ఎంపిక, నీటి నిర్వహణ, సేంద్రియ ద్రావణాల తయారీపై అవగాహన కల్పించారు. కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార భద్రత పెంపొందించడంతోపాటు ప్రకృతి వ్యవసాయం విస్తరణకు, రైతుల ఆర్థిక స్థితి మెరుగుదలకు దోహద పడుతుందని అధికారులు తెలిపారు. స్పెషల్ కలెక్టర్ మనోజ్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, మెప్మా, డీఆర్డీఏ, ఐసీడీఎస్, డీపీఓ, ఎంపీడీఓలు, ఎంసీలు, ఏపీఎంలు, ఎంఈఓలు, సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. జిల్లా జీఎస్టీ కో ఆర్డినేషన్ సమావేశం కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, పన్నుల విభాగ గుంటూరు జాయింట్ కమిషనర్ జాన్ స్టీవెన్సన్ పాత్రో పల్నాడు జిల్లా జీఎస్టీ కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. జీఎస్టీ వసూళ్లు పెంచడంలో వివిధ విభాగాలు అందించాల్సిన సహకారం, ఆవశ్యకత వివరించారు. జిల్లాలో పనిచేస్తున్న వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల అసిస్టెంట్ కమిషనర్లు హాజరయ్యారు. జిల్లాలో రైల్వే సంస్థ చేపట్టిన ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి), ఆర్యూబీ (రోడ్ అండర్ బ్రిడ్జి)ల నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, డీఆర్ఓ నారదముని, ఆర్డీఓ మురళీకృష్ణ, రైల్వే శాఖ ప్రధాన అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా -
మాతృ మరణాలు పునరావృతం కాకూడదు
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి మాతృ మరణాలపై శుక్రవారం వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. అడిషనల్ డైరెక్టర్ మెటర్నల్ హెల్త్ డాక్టర్ కే.అనిల్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 వరకు జిల్లాలో సంభవించిన 14 మాతృ మరణాలపై సమావేశంలో సమీక్షించారు. మాతృ మరణాలకు గల కారణాలను సమీక్షించిన కమిటీ సభ్యులు పైన సంభవించిన మరణాలలో ఏడు నివారించదగినవని, మిగితా ఏడు నివారించలేనివని నిర్ధారించారు. డాక్టర్ అనిల్కుమార్ మాట్లాడుతూ ప్రతి మాతృమరణాన్ని సమాజ స్థాయిలో, ఆసుపత్రి స్థాయిలో సమగ్రంగా సమీక్షంచుకొని, మున్ముందు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఈ విషయాలపై వైద్యాధికారులకు, పారామెడికల్ సబ్బందికి రీ ఓరియంటేషన్ ట్రైనింగ్ నిర్వహించాలని తెలిపారు. గర్భిణులు, వారి కుటుంబసభ్యులకు, గర్భస్థ దశలో ప్రమాదకర పరిస్థితులపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు పరస్పరం కలిసి పనిచేసి మాతృ మరణాలు తగ్గించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కుమార్, స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సి.హెచ్.శిరీష, డాక్టర్ నిర్మలగ్లోరి, స్టేట్ కన్సల్టెంట్ యూనిసెఫ్ డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు, ప్రోగ్రాం ఆఫీసర్లు కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. -
బియ్యం బుక్కి... పేద కడుపు కొట్టి...
చీరాల అర్బన్: చీరాల నియోజకవర్గంలో రేషన్ బియ్యం దారి మళ్లుతోంది.. ఇదంతా ఒంగోలుకు చెందిన దివ్యాద్రి అనే నల్లబజారు వ్యాపారి కనుసన్నల్లో జరుగుతోంది. అందుకు కీలక నేత, యువనేత అండ ఉండటమే కారణం. ఈ క్రమంలో నల్లబజారు వ్యాపారి పలువురు డీలర్లపై జులుం ప్రదర్శిస్తున్నాడు. అందుకు సంబంధిత అధికారులు స్వామి కార్యం.. స్వకార్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారని చెప్పుకొంటున్నారు. తాము చెప్పిన మేరకు బియ్యం ప్రతి నెలా ఇవ్వాల్సిందేనని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో డీలర్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందని చెప్పుకుంటున్నారు. బియ్యం బదులు డబ్బులు తీసుకోమంటే పలు చోట్ల కార్డుదారులు వ్యతిరేకిస్తున్నారు. తమకు బియ్యమే కావాలని డిమాండ్ చేస్తున్నారు. వైకుంఠపురంలో జరిగిన సంఘటనలు అందుకు నిదర్శనమని ఆయా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో నల్లబజారు వ్యాపారి చెప్పినట్లు వినకపోతే డీలర్లును మారుస్తామని బెదిరిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. ఇప్పటికే పలువురు డీలర్లను మార్చారని సమాచారం. గతంలో ఇలాంటి ధోరణి లేదని పలువురు డీలర్లు వాపోతున్నారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులు స్వామి కార్యం... స్వకార్యం అన్నట్లు డీలర్లలో అస్మదీయులైతే ఒక రకంగా, తస్మదీయులైతే మరో రకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చర్యలు శూన్యం నల్లబజారు వ్యాపారికి అనుకూలంగా వ్యవహరించే డీలర్ల నుంచి రేషన్ బియ్యం సేకరించే సమయంలో ఎవరన్నా సమాచారం ఇచ్చినా సంబంధిత అధికారులు స్పందించటం లేదు. వారిపై చర్యలు చేపట్టకుండా రవాణాకు రైట్ రైట్ అంటున్నారు. గత నెలలో కారంచేడు గేటు సెంటర్లో రాత్రి వేళ రేషన్ బియ్యం లోడింగ్ జరిగే సమయంలో సమాచారం అందించినా స్పందించకపోవటం అందుకు నిదర్శమనే వాదనలు వినిపిస్తున్నాయి. వెలుగులోకి వచ్చిన సంఘటన ఇదొక్కటే. అయితే ప్రతి నెలా 5 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజు రేషన్ బియ్యం నల్లబజారుకు తరలుతూనే ఉందని విషయం తెలిసిన వారు చెబుతున్నారు. రేషన్ బియ్యం నల్లబజారుకు తరలే క్రమంలో నైట్ బీట్ పోలీసులకు ఎప్పుడు కూడా కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అలానే సివిల్ సప్లయిస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల పరంగా చర్యలు కూడా లేవని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అన్నీ నిజాలే.. కార్డుదారులకు ప్రతి నెల పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని కొంత ఇచ్చి, మరికొంత కార్డుదారుల అంగీకారంతో, ఇంకొంత డీలర్ల చేతివాటంతో సమీకరిస్తున్నారు. అధికారుల తనిఖీల్లో రేషన్ షాపుల్లో వెలుగులోకి వస్తున్న అక్రమాలు అందుకు నిదర్శనం. అధికారులు ఎప్పుడు చర్యలు చేపడతారో .. వేచి చూడాల్సిందే. బుధవారం ఉదయం స్వర్ణరోడ్డులో ఆటోలో రేషన్ బియ్యం తరలుతున్నాయనే సమాచారంతో వన్టౌన్ పోలీసులు వలపన్ని ఆ ఆటోను పట్టుకున్నారు. అందులో 12 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఆటో సహా స్టేషన్కు తరలించారు. సంబంధికులపై కేసు నమోదు చేశారు. అవి నల్లబజారు వ్యాపారి దివ్యాద్రి , అతని అనుచరులకు తెలియకుండా ఇళ్ల వెంట తిరిగి ఓ మహిళ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. నల్లబజారు వ్యాపారికి ఎక్కడా గుప్పెడు బియ్యం కూడా తగ్గకుండా ఉండేందుకు, మరొకరు రేషన్ బియ్యం కొనుగోలు చేయకుండా ఉండేందుకు ఓ మహిళ ఇళ్ల వెంట తిరిగి సేకరించుకున్న రేషన్ బియ్యాన్ని తరలించే క్రమంలో పోలీసులు తమకు అందిన సమాచారం మేరకు పట్టుకున్నట్లు చెబుతున్నారు. ప్రతి నెల 5 నుంచి 15వ తేదీ వరకు వందల రేషన్ బియ్యం బస్తాలు నల్లబజారుకు తరలుతున్నాయని, వాటి సమాచారం పోలీసులకు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయిస్ అధికారులకు అందకపోవటం విస్మయం కలిగిస్తోందని ప్రజలు మండపడుతున్నారు. -
వైఎస్ జగన్తోనే సంక్షేమ పాలన సాధ్యం
బాపట్ల: రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమ పాలన సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. బాపట్ల జిల్లా బూత్ కమిటీ సమావేశంలో స్థానిక వీ కన్వన్షన్ హాలులో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మేరుగ నాగార్జున మాట్లాడుతూ అబద్ధాలతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు పాలనపై ప్రజల్లో విశ్వాసం లేదన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయారని వివరించారు. ప్రజల నుంచి వ్యతిరేకతను రెండేళ్లకే చవిచూడాల్సిన పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వానికి పట్టిందన్నారు. ప్రజల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆదరణ పెరిగిపోతోందనే విమర్శలు రోజురోజుకు పెంచుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ మరో రూ. 2లక్షల కోట్లు ఖర్చుపెడితే అందులో కమీషన్లు నొక్కేందుకు భారీ స్కెచ్ వేశారని దుయ్యబట్టారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి మావిగన్ పేరుతో అభివృద్ధి చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన ప్రతిపాదనకు ప్రజల్లో విశేష స్పందన వచ్చిందన్నారు. కచ్చితంగా కేవలం రూ.20 వేల కోట్లు పెడితే ఈ మూడు నగరాలను కలిపి మెరుగైన రాజధానిగా నిర్మించవచ్చని ఆయన చెప్పినట్లు గుర్తుచేశారు. బూత్ లెవల్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్క ఓటు విషయంలో అత్యంత జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి మంచి పదవులు తప్పక వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల సమన్వయకర్త కరణం వెంకటేష్బాబు, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు, రేపల్లె సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు చేజర్ల నారాయణరెడ్డి, మోదుగుల బసవ పున్నారెడ్డి, యార్లగడ్డ మదనమోహన్, బాపట్ల పరిశీలకులు జి.సురేంద్ర, అద్దంకి పరిశీలకులు ప్రసాద్, పర్చూరు కోటేశ్వరరావు, పార్టీ నాయకులు వాసుమల్లి వాసు, కొక్కిలిగడ్డ చెంచయ్య, కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఇనగలూరి మాల్యాద్రి, కోకి రాఘవరెడ్డి, చల్లా రామయ్య, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, వడ్డిముక్కల డేవిడ్, దొంతిబోయిన సీతారామిరెడ్డి, కటికల యోహోషువా ఉన్నారు. ప్రతి ఓటును కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ బూత్ కమిటీ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అధ్యక్షుడు కె.సుధాకర్రెడ్డి సూచించారు. ఓట్లు ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా సీరియల్స్ ఉంటాయి, ఏ విధంగా చేర్పులు ఉంటాయని అనే విషయాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు. మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలకు దోచుకోవటం, దాచుకోవటంపై సీఎం చంద్రబాబు శిక్షణ ఇచ్చి మరీ ప్రజలపైకి పంపుతున్నారని పేర్కొన్నారు. ఒక పక్క అవినీతి పెరిగిపోతోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబునాయుడు అమరావతిని తెరపైకి తెచ్చారన్నారు. అమరావతి కాకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి మావిగన్గా అభివృద్ధి చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించటంతో కూటమి ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చిందన్నారు. దీంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కోన దుయ్యబట్టారు. కచ్చితంగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, కష్టపడిన ప్రతి నాయకుడికి మంచి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. మత్స్యకారులను ముంచేసిన ప్రభుత్వం ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు తూమాటి మాధవరావ మాట్లాడుతూ... మత్స్యకారులను చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. వేట సమయంలో ఇతర దేశాలకు అనుకోని పరిస్థితులలో మన జాలర్లు వెళితే తిరిగి తీసుకువచ్చేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మన జలాలలోకి తమిళనాడు మత్స్యకారులు వచ్చి వేట సాగిస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. మన వారి పడవలు తమిళనాడుకు వెళ్లినప్పుడు అక్కడ భారీగా అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. -
నరసరావుపేటలో 18 సిలిండర్లు స్వాధీనం
నరసరావుపేట టౌన్: గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్నట్టు గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు 18 సిలిండర్లను శుక్రవారం సీజ్ చేసి కేసు నమోదు చేశారు. వివరాలు... వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్న గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తున్న విస్తృత తనిఖీలలో భాగంగా శుక్రవారం విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ నేతృత్వంలో పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాసనగర్కు చెందిన గంటా ఫకీరయ్య 18 గృహ అవసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. మధ్యవర్తుల సమక్షంలో సిలిండర్లను స్వాధీనం చేసుకొని నరసరావుపేట మండల పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్కు అప్పగించారు. ఈ ఘటనలపై అత్యవసర సరుకుల చట్టం, 1955 లోని సెక్షన్ 6–ఏ కింద కేసు నమోదు చేసినట్టు విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16న సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉండగా, వివిధ కారణాలతో 22న నిర్వహించేందుకు నిర్ణయించారు. 25న స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 25వ తేదీన జెడ్పీ కార్యాలయంలో జరగనున్నాయి. ఈ మేరకు సీఈవో వి.జ్యోతిబసు షెడ్యూల్ విడుదల చేశారు. నగరంపాలెం: జిల్లాలోని మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలిచ్చి, వారిని ప్రమాదాలకు గురిచేయవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన నిమిత్తం గురువారం జిల్లా అంతటా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నిబంధనలు ఉల్లఘించిన చోదకులు, వారి తల్లిదండ్రులకు శుక్రవారం నగరంపాలెం పోలీస్ కవాతు మైదానంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 842 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో 206 వాహనాలు సీజ్ చేయగా, 636 వాహనాలకు రూ.3.36 లక్షల జరిమానా విధించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహన డ్రైవ్ చేపట్టామని అన్నారు. మైనర్ల డ్రైవింగ్, ర్యాష్/ ట్రిపుల్ రైడింగ్లు, లైసెన్సు, బీమా, హెల్మెట్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు గుర్తించామని చెప్పారు. మైనర్లకు ప్రేమతో తల్లిదండ్రులు వాహనాలు అప్పగిస్తే, తర్వాత వారి పిల్లల ప్రాణాలకే ముప్పు అని చెప్పారు. డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అబ్దుల్ అజీజ్ (గుంటూరు తూర్పు), శ్రీనివాసులు (ఎస్బీ), సీఐలు ఎ.అశోక్కుమార్ (తూర్పు ట్రాఫిక్), సింగయ్య (పశ్చిమ ట్రాఫిక్), గంగా వెంకటేశ్వర్లు (పట్టాభిపురం పీఎస్), శివప్రసాద్ (లాలాపేట పీఎస్), ఆరోగ్యరాజు (అరండల్పేట పీఎస్), సత్యనారాయణ (నగరంపాలెం పీఎస్), ఆర్ఐ శ్రీహరిరెడ్డి పాల్గొన్నారు. లక్ష్మీపురం: గుంటూరు చంద్రమౌళినగర్లోని ఆక్స్ఫర్డ్ కళాశాల యాజమాన్యానికి చెందిన ఐదుగురిపై పట్టాభిపురం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు చంద్ర మౌళినగర్లోని ఆక్స్ఫర్డ్ కళాశాలలో జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చిన విషయం విదితమే. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆక్స్ఫర్డ్ కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. రూ.లక్షల ఫీజులు వసూలు చేసి భవితవ్యంతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు ఆక్స్ఫర్డ్ కళాశాల సీఈఓ సన్ని, కళాశాల డీన్ మురళీకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ దీప, హాస్టల్ ప్రిన్సిపల్ ప్రసన్న, కంప్యూటర్ ఆపరేటర్ మూర్తిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాపట్ల
శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడం లేదు. దిగువకు 2100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.0200 టీఎంసీలు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 528.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 8,314 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,500, గరిష్ట ధర రూ.11,000, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది. 7 -
జీజీహెచ్లో బకాయిల రోగం
● రూ. లక్షల్లో పేరుకుపోయినా చెల్లించని వ్యాపారులు ● వసూలుకు కనీసం చర్యలు చేపట్టని ఆసుపత్రి అధికారులు ● హెచ్డీఎస్కు నిధుల కొరత ఉన్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం కనీసం నోటీసూ లేదు.. హెచ్డీఎస్ ఆదాయానికి గండి గుంటూరు జీజీహెచ్లో వ్యాపారాలు చేస్తున్న వారిలో కొందరు నెలల తరబడి.. మరికొందరు సంవత్సరానికి పైబడి కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. అద్దెలు కట్టడం లేదు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఒక్కొక్కరు రూ. లక్షల్లోనే కరెంటు బిల్లులు, అద్దె చెల్లించాల్సి ఉంది. ఏళ్ల తరబడి బకాయిలు చెల్లించకపోయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చర్చనీయాంశం అయింది. -
సీఎం ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన ప్రజలు
భట్టిప్రోలు(వేమూరు): మండలంలోని సూరేపల్లిలో గురువారం జరిగిన సీఎం సభలో ప్రజలు మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. మధా్య్హ్నం 12 గంటలకు ప్రజావేదిక సభ ప్రారంభం కాగా.. సీఎం చంద్రబాబు నాయుడు 12.30 నిమిషాలకు మాట్లాడడం ప్రారంభించారు. మీటింగ్ వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, డ్వాక్రా గ్రూపుల మహిళలు మధ్యాహ్నం 1 గంటకల్లా సగం మంది వెళ్లి పోయారు. సీఎం ప్రసంగం మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా గ్రూపుల మహిళలు వెళ్లి పోవడంతో కుర్చీలు ఖాళీ అయ్యాయి. అసలే ఆశించినంత మంది ప్రజలు సభకు రాక స్థానిక టీడీపీ నేతలు తలలు పట్టుకోగా.. సీఎం ప్రసంగిస్తుండగానే చాలామంది లేచి వెళ్లిపోవడంతో చేసేదేమి లేక చూస్తు ఉండిపోయారు. బాపట్లటౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాపట్లకు చెందిన ఇరువురికి పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించింది. పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీగా బాపట్లకు చెందిన చెరుకూరి కిరణ్, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరిగా బాపట్లకు చెందిన జి.ఎ.మణిభూషణ్లు నియమితులయ్యారు. కారంచేడు: కొనుగోలు చేసిన మిరపకాయల డబ్బు ఇవ్వకపోవడంతో రైతు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. విచారణ జరిపిన పర్చూరు కోర్డు నిందితునికి రెండేళ్ల జైలుశిక్షతో పాటు, రూ.5000 జరిమానా విధించారు. కారంచేడు ఎస్సై షేక్ ఖాదర్బాషా అందించిన సమాచారం మేరకు.. మండలంలోని కేశవరప్పాడు గ్రామానికి చెందిన రైతుల నుండి అదే గ్రామానికి చెందిన కొసరాజు నాగేశ్వరరావు, మరో వ్యక్తి రామిశెట్టి కోటేశ్వరరావు రూ.19 లక్షల విలువైన మిరపకాయలు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వారు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో 2021 జూన్ 14వ తేదీన కారంచేడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తగిన సాక్షులను సేకరించి కోర్టుకు హాజరుపర్చడంతో ప్రథమ నిందితునిగా ఉన్న నాగేశ్వరరావుకు కోర్టు రెండేళ్ల జైలుశిక్షతోపాటు, రూ.5 వేల జరిమానా విధించించిట్లు తెలిపారు. గుంటూరువెస్ట్(క్రీడలు): మూలపాడులో ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు జరిగే ఏసీఏ సీనియర్ టీ–20 పురుషుల అంతర్ జిల్లాల మ్యాచ్లలో పాల్గొనే క్రికెట్ జట్టును ఎంపిక చేశామని జిల్లా క్రికెట్ అసోసియేషన్ త్రీమెన్ కమిటీ సభ్యుడు టీవీ శివరామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న క్రికెటర్ల వివరాలు.... ఓ.రషీద్(కెప్టెన్) కె.మహీప్, ఎం.వంశీకృష్ణ (వికెట్ కీపర్), ఎస్.అఖిల్, జి.సమన్విత్, సిహెచ్.సిద్ధార్థ, ఎ.ప్రణయ్కుమార్, ఎం.రేవంత్కుమార్, ఎస్.కె.అస్లాం బేగ్, జి.ఆకాష్, పి.సిద్దు కార్తీక్రెడ్డి, కె.మనోహర్, ఎస్.కె.తౌఫిక్, జె.జయచంద్రకేశవ్, ఓ.బాజీ. స్టాండ్ బైస్: కె.పి.సాయి రాహుల్, పి.శరత్ చంద్ర, ఈ.రోహ్ని అమోల్, ఎస్.గోపికృష్ణ, అబ్దుల్ షరీఫ్, డి.హేమంత్. కోచ్గా వి.వి.బి.సరస్వతిరెడ్డి వ్యవహరిస్తారన్నారు. శావల్యాపురం: గుంటూరు–కర్నూలు జాతీయ రహదారి మార్గంలో మండలంలోని కనమర్లపూడి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. ఎస్ఐ మోర్ల వెంకటేష్బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకు చెందిన నంబూరి రవీంద్ర (16) ఉదయం టిఫిన్ తీసుకొని రావటానికి తన తాతాయ్య నంబూరు పేరయ్య చెందిన మోపెడ్పై దుకాణానికి వస్తుండగా,అదే సమయంలో వినుకొండ వైపు నుంచి నరసరావుపేటకు వెళుతున్న మినీ ట్రక్కు వాహనం డ్రైవరు చలంచర్ల వెంకటేశ్వర్లు అతివేగంతో వచ్చి ఎదురుగా వస్తున్న మోపెడ్ను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయాలు కావటంతో సంఘటన స్థలంలో బాలుడు రవీంద్ర మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్లో నంబూరి రవీంద్ర పదో తరగతి పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. నంబూరి డేవిడ్కు ఇద్దరు సంతానం కాగా మొదట కుమారుడు అకాలంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. వినుకొండ ప్రభుత్వ వైద్యశాల్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేశామని ఎస్ఐ మోర్ల వెంకటేష్ బాబు తెలిపారు. -
మ్యూజియాన్ని సందర్శించిన పల్నాడు జిల్లా కలెక్టర్
అమరావతి: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రమైన అమరావతిలోని కాలచక్ర మ్యూజియాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గురువారం సందర్శించారు. మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న జిల్లా పర్యాటక మండలి సభ్యులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అభ్యర్థన మేరకు కలెక్టర్ మ్యూజియాన్ని సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ కాలచక్ర మ్యూజియంలో శుభ్రత పనులను తక్షణమే ప్రారంభించాలని పర్యాటకశాఖ అధికారులను ఆదేశించారు. విదేశాలకు తీసుకువెళ్లిన శిల్పాలను వీలైనంత త్వరగా ఇక్కడకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న విద్యుత్ పనులను అత్యవసర ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కనీస అవసరమైన పనులను పూర్తిచేసి, మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. 15వ తేదీన అమరావతిలో పర్యాటకశాఖ అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ, ఏపీటీడీసీ యూనిట్ ఇన్చార్జి మణికుమార్, డీఈ కుమార్, తహసీల్దార్ డానియేల్, ఎంపీడీఓ పార్వతి పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. చందోలు(కర్లపాలెం): పిట్టలవాని పాలెం మండలం చందోలులో వేంచేసియున్న శక్తి స్వరూపిణి బగళాముఖి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 నుంచి మే 3వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్రెడ్డి, ఈవో నరసింహ మూర్తి తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారి భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు పండ్లు, తాంబూలం, అమ్మవారి ప్రసాదాలను వారికి అందజేశారు. అభివృద్ధి కమిటీ చైర్మన్, ఈవో మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా క్యూలైన్లలో వెళ్లి అమ్మ వారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. యడ్లపాడు: చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచే కొండవీడు కోట, ఇప్పుడు సాహస పర్యాటకానికి వేదిక కానుంది. జిల్లా పాలన యంత్రాంగం, అటవీశాఖ, అవుట్ రైవల్ అడ్వెంచర్స్ బృందం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నుంచి కొండవీడు కొండలపై నైట్ టెంట్ క్యాంప్ ఫైర్ను ఏర్పాటు చేయనున్నారు. కొండల నడుమ గడిపేలా ప్యాకేజీని రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. సాహసయాత్ర శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అవుతుందని, అతిథుల కోసం కొండపై అత్యాధునిక సౌకర్యాలతో కూడిన టెంట్లను సిద్ధం చేసినట్లు వివరించారు. రాత్రి వేళ మ్యూజికల్ నైట్ స్వరాలు, క్యాంప్ ఫైర్ వెలుగులు పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతాయన్నారు. వీటికి తోడు స్థానిక రుచులతో కూడిన అల్పాహారం, విందు ఉంటుందని, మరుసటి రోజు ఉదయం ప్రకృతి అందాల మధ్య సాగే ట్రెక్కింగ్, ఉత్సాహాన్ని నింపే బోటింగ్, కయాకింగ్ వంటి సాహస క్రీడలు ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు. పెద్దలకు రూ.2 వేలు, ఎనిమిదేళ్లలోపు పిల్లలకు రూ.వెయ్యిగా రుసుమును నిర్ణయించారు. ఇందులో భోజన, వసతి సదుపాయాలన్నీ కలిపి ఉండటం పర్యాటకులకు కలిసొచ్చే అంశం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. -
రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలి
బాపట్ల : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. బాపట్ల టౌన్ పోలీసు స్టేషన్ వేమూరి రాధాకృష్ణపై గురువారం ఫిర్యాదు చేశారు. మహిళలపై అసభ్యమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న చంద్రబాబుపై అభినందనల వర్షం కురిపించే రాధాకృష్ణ మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణను భగ్నం చేసేందుకు కుట్ర పూరితమైన రాతలు రాస్తున్నారని కోన వివరించారు. ప్రజాస్వామ్య విలువలు సైతం దెబ్బతినేవిధంగా రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, బాపట్ల మండల అధ్యక్షుడు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఇనగలూరి మాలాద్రి, అడే చందు, నర్రావుల వెంకట్రావు, కటికల ఝెహోషువ, పాలపర్తి గోపి, తదితరులు పాల్గొన్నారు. మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి డిమాండ్ -
చావులో ఒక్కటయ్యారు..
యడ్లపాడు: కొండవీడు కోట సాక్షిగా ఒక ప్రేమ కథ విషాదాంతమైంది. ప్రేమకు పెద్దలు నిరాకరించడంతోపాటు యువతికి వేరే వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసినా తమ ప్రేమను మరిచిపోలేక ఆ జంట మృత్యువు ఒడికి చేరుకుంది. పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమికులు... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు... గుంటూరు స్వర్ణభారతినగర్కు చెందిన రసిక మణికంఠరాజు (20), కలెక్టరేట్ సమీపంలోని అంకమ్మనగర్కు చెందిన యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన మణికంఠరాజు తల్లిదండ్రులు యువతి ఇంటికి వెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అందుకు యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. వెంటనే తమ కుమార్తెకు సుమారు 20 రోజుల కిందట వేరొక యువకుడితో వివాహం జరిపించారు. అయినప్పటికీ తన ప్రియుడు మణికంఠ రాజును మరువలేని ఆ యువతి, భర్తతో కలిసి ఉండలేనని చెప్పి గుంటూరుకు తిరిగి వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రేమికులిద్దరూ కొండవీడు కోటకు చేరుకున్నారు. అక్కడ తమ వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. వారిని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. జీజీహెచ్లో చావుబతుకుల మధ్య పోరాడుతూ మణికంఠ రాజు బుధవారం రాత్రి చనిపోగా, యువతి కూడా గురువారం మృతి చెందింది. మణికంఠరాజు తల్లి నళిని, యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్లపాడు ఎస్ఐ టి. శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మణికంఠ రాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవగా, యువతి మృతదేహానికి శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. -
‘శిరో రక్ష – ప్రాణరక్ష’ స్టాల్ సందర్శన
భట్టిప్రోలు: మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లిలో గురువారం నిర్వహించిన ప్రజా వేదిక సభకు ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిరోరక్ష – ప్రాణ రక్ష స్టాల్ను సీఎం పరిశీలించారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ సీఎంకు వివరించారు. శిరో రక్ష–ప్రాణరక్ష కార్యక్రమం ద్వారా హెల్మెట్ వాడకంపై విసృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి హెల్మెట్ ధరించడం తప్పని సరి చేస్తున్నామని చెప్పారు. నిరంతర కృషి వల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో 9.47 శాతం తగ్గుదల, మరణాల్లో 11.63 శాతం గణనీయమైన తగ్గుదల నమోదయిందని తెలిపారు. ఈ గణాంకాలను పరిశీలించిన సీఎం జిల్లా ఎస్పీని అభినందించారు. జిల్లా ఎస్పీకి ఐజీ అభినందనలు.. భట్టిప్రోలు: పటిష్ట ప్రణాళికతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సమర్ధవంతంగా బందోబస్తు నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ను గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి అభినందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అద్భుతమైన ప్రణాళికతో బందోబస్తును సమర్ధవంతంగా నిర్వహించిన విధానాన్ని త్రిపాఠి అభినందించారు. అదేవిధంగా బందోబస్తు విధులను సమర్ధవంతంగా నిర్వహించిన పోలీస్, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలి
పెదకాకాని: భారతదేశంలో ఇప్పటికీ వ్యవసాయ రంగమే ప్రధానంగా జీవిస్తున్నారని, అలాంటి వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు చిన్న చూపుచూస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. పెదకాకానిలో గురువారం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం గుంటూరు జిల్లా నాలుగవ మహాసభ నిర్వహించారు. కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్ల రామకృష్ణ జెండాను ఆవిష్కరించారు. సభకు అధ్యక్షవర్గంగా బి రామకృష్ణ, కందుల శ్రీనివాసరావు వ్యవహరించారు. కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు కార్యవర్గ నివేదిక ప్రవేశపెట్టారు. లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతు ప్రాధాన్యతను గుర్తించడం లేదని వ్యవసాయ రంగానికి సబ్సిడీలు, రుణాలు నానాటికీ తగ్గిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అధిక భాగం భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారన్నారు. వ్యయ ప్రయాసలకు ఓర్చి కౌలు రైతులు వ్యవసాయం చేస్తుంటే అధిక వర్షాలు, చీడపీడలు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. గుంటూరు ఛానల్ అభివృద్ధి చేస్తామని చెబుతున్నారే తప్ప పనులు ఎక్కడ జరగట్లేదన్నారు. పల్నాడులో నాగార్జునసాగర్ పక్కనే ఉంచుకొని రైతులు తాగు, సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై రాధాకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో కౌలు రైతులది కీలకపాత్ర అన్నారు. -
ఆప్కాస్.. వెతనాలు!
నెహ్రూనగర్ : ఇచ్చేదే అంతంతమాత్రం జీతాలు.. అవీ సకాలంలో అందకపోవడంతో ఆప్కాస్ కింద పనిచేసే ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. గుంటూరు నగరపాలక సంస్థలో ఆప్కాస్ కింద సుమారు 3 వేల మంది వరకు ఉన్నారు. ఈ నెల ఇంకా జీతాలు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం దీనిపై స్పష్టత ఇచ్చేవారు లేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. స్పందించే వారేరి? గుంటూరు నగరపాలక సంస్థలో 9వ తేదీ వచ్చినప్పటికీ జీతాల జమపై ఎటువంటి స్పష్టత లేకపోవడంతో ప్రజారోగ్య విభాగంలో పనిచేసే పారిశుద్ద్య కార్మికులు, ఇంజనీరింగ్, ఇతర విభాగాల్లో పనిచేస్తే ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం వారికి జీతాలు జమ చేసే అంశంలో స్పందించడం లేదు. నగరపాలక సంస్థ అధికారులు ఏం సమాధానం చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీతం సమయానికి పడకపోవడంతో ఈఎంఐలు కట్టాల్సిన వారు సకాలంలో కట్టకపోవడంతో చెక్లు బౌన్స్ అవుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి జీతాలు అందే విధంగా తగిన చొరవ చూపాలని కార్మికులు కోరుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి నెల చివరి మాసం కావడంతో ఏప్రిల్ నెలలో 2026– 27 సంవత్సరానికి ఆస్తి డిమాండ్ జనరేట్కు సంబంధించి సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్) సైట్ ప్రాసెస్ చేస్తుంటారు. ఈ ప్రాసెస్ ఇంకా పూర్తి కాకపోవడంతో ట్యాక్సులు చెల్లించే వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు జనన, మరణ ధ్రువపత్రాలు, ఇతర సేవలు పొందేందుకు సీడీఎంఏ పోర్టల్ ద్వారానే లావాదేవీలు జరుపుతుంటారు. 9వ తేదీ వస్తున్నప్పటికి సైట్ అందుబాటులోకి రాకపోవడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై న ప్రభుత్వం స్పందించి త్వరితగతిన సీడీఎంఏ సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు సేవలందించాలని నగర వాసుల కోరుతున్నారు. -
మధురం.. అ‘పూర్వ’ జ్ఞాపకం
బాపట్ల: వ్యవసాయ కళాశాల 1980 బ్యాచ్ విద్యార్థులు గురువారం సందడి చేశారు. కళాశాలలో పూర్వ విద్యార్థుల పదో సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కళాశాలను చూసేందుకు పదేపదే రావటం ఎంతో ఉత్సాహాన్ని నింపుతుందని పూర్వవిద్యార్థులు పేర్కొన్నారు. వ్యవసాయ కళాశాల బాపట్ల మాజీ ఏడీ ఏ.శ్రీనివాసరావు తనకు ఈ కళాశాలతో 24 ఏళ్ల అనుబంధం ఉందని తెలియజేశారు. 1980 బ్యాచ్ విద్యార్థులు కళాశాల అభివృద్ధి కోసం చాలా సాయం చేశారని తెలియజేశారు. పి.ప్రసన్న రాణి, ఎ.శ్రీనివాసరావు, ఎస్.హరిప్రసాద్, ఎండీ ఆఫ్ మీవా గ్రూప్స్ నిర్వహకులను సన్మానం చేశారు. హరిప్రసాద్ రూ.50 లక్షలు ఎటిక్ బిల్డింగ్ కోసం విరాళం ఇచ్చారు. ఉగాది పురస్కారం అందుకున్న వి.గోపీచంద్ను ఘనంగా సన్మానించారు. -
అభివృద్ధికి పరిశుభ్రత కీలకం
మంగళగిరిటౌన్: జాతీయ అభివృద్ధికి పరిశుభ్రత ఒక ప్రాథమిక స్తంభం అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్లో గురువారం స్వచ్ఛత పక్షోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఏప్రిల్ 1 నుండి 15వ తేదీ వరకు జరుగుతున్న స్వచ్ఛత పక్షోత్సవ కార్యక్రమాన్ని సమీక్షించి అండర్ గ్రాడ్యుయేషన్ గర్ల్స్ హాస్టల్ను శ్రీవాస్తవ ప్రారంభించారు. క్యాంపస్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛత పక్వాడాపై ఎయిమ్స్ తయారుచేసిన ఐ.ఇ.సి. సామాగ్రి ప్రదర్శన స్టాల్ను సందర్శించి అభినందించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ నమూనాలను ప్రదర్శించారు. అనంతరం శ్రీవాస్తవ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ దార్శనికతకు అనుగుణంగా స్వచ్ఛత పక్షోత్సవాలను అమలు చేస్తున్నామన్నారు. ఆరోగ్య సంరక్షణ, నివారణ, ప్రోత్సాహక అంశాలను బలోపేతం చేయడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ రంగం సంరక్షణ రంగంలో మంగళగిరి ఎయిమ్స్ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని తెలిపారు. కాన్వాస్ పెయింటింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్ధులకు అవార్డులు అందజేశారు. ఎనిమిది రోజులు జరుగుతున్న స్వచ్ఛత పక్షోత్సవ ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తలను అభినందించి సత్కరించారు. ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ విభాగం, అబా రిజిస్ట్రేషన్ ప్రాంతం, మామోగ్రఫీ, బ్రాకీ థెరపి మొదలైన అధునాతన క్యాన్సర్ సౌకర్యాలు వున్న రేడియేషన్ అంకాలజీ యూనిట్, ఇన్పేషెంట్ వార్డులు, క్యాజువాలిటీని సందర్శించారు. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ డాక్టర్ అహంతమ్ శాంతాసింగ్ సంస్థ సాధిస్తున్న పురోగతిని శ్రీవాస్తవకు వివరించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ -
సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్
పెట్రోల్ బాటిల్తో బెదిరింపు మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో గురువారం ఓ వ్యక్తి సెల్టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ, అక్రమ కేసులు బనాయించారంటూ పెట్రోల్ బాటిల్తో సెల్ టవర్ ఎక్కి న్యాయం చేయాలంటూ ఆందోళన చేశాడు. సమాచారం అందుకున్న మంగళగిరి పట్టణ, రూరల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది ఆ వ్యక్తిని శాంతింపజేసేందుకు గంటల తరబడి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే... మంగళగిరి పట్టణానికి చెందిన గోలి రామాంజనేయులుపై మంగళగిరి పట్టణ పోలీస్స్టేషన్లో పలు కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల రౌడీషీట్ కూడా తెరిచారు. ఒక కేసులో రిమాండ్ నుంచి బయటకు వచ్చిన రామాంజనేయులును కొన్ని రోజుల కిందట నార్త్ సబ్ డివిజన్ ఉన్నతాధికారి పిలిపించి బెదిరించారంటూ రామాంజనేయులు భార్య ఆరోపించింది. అక్రమ కేసులు ఎత్తివేయాలని, రౌడీషీట్ తొలగించాలని సెల్ టవర్ ఎక్కిన రామాంజనేయులు టవర్పై నుండి నినాదాలు చేస్తూ హల్చల్ చేశాడు. నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ హైడ్రామాలో పరిశీలన చేస్తామని పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో రామాంజనేయులు సెల్ టవర్ దిగి కిందకు వచ్చాడు. అయితే గురువారం ఉదయం తాడేపల్లి ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటానని రామాంజనేయులు హడావుడి చేశాడు. అక్కడి పోలీసులు అడ్డుకుని పంపించివేశారు. గతంలో మంగళగిరి పట్టణం రత్నాల చెరువులో మహిళలను కులం పేరుతో ధూషిస్తూ దిగంబరంగా రామాంజనేయులు హల్చల్ చేసిన వీడియాలో అప్పట్లో సంచలనం రేపాయి. గోలి రామాంజనేయులపై రెండు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసులు, మహిళపై దాడి కేసు పట్టణ పోలీస్స్టేషన్లో నమోదు అయ్యాయని, రౌడీషీట్కూడా తెరిచినట్లు పోలీసులు తెలిపారు. రామాంజనేయులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పోలీసులు పేర్కొన్నారు. -
టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్లిన కారు
చిలకలూరిపేట: టిఫిన్ సెంటర్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మద్యం, గంజాయి మత్తులో వేగంగా వాహనం నడుపుతూ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలో గురువారం దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.... విజయవాడకు చెందిన ఇందుపల్లి హరీష్, విశాఖపట్నానికి చెందిన దూషిక్, మరో ముగ్గురు యువతులు కలసి విజయాబ్యాంకు సెంటర్కు సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వీరంతా డ్యాన్సర్లు. బుధవారం వేరే ప్రాంతంలో నృత్య ప్రదర్శనలు ఇచ్చి వచ్చాక రాత్రంతా మద్యం తాగుతూ గడిపారు. దీనికి తోడు గంజాయి తీసుకుంటారని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కారు తీసుకొని ఇరువురు సిగరెట్లు తెచ్చుకొనేందుకు బయలుదేరారు. మత్తులో మునిగిపోయి ఉన్న ఇరువురు జాతీయ రహదారి పక్కన విజయా బ్యాంకు సెంటర్లోని ఈగల్ రెస్టారెంట్ సమీపంలోని టిఫిన్ సెంటర్లోకి దూసుకువెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే ఈ సెంటర్లో అదృష్టవశాత్తు కారుకు ఎవరూ అడ్డు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు వేగానికి రెస్టారెంటుకు సంబంధించిన భారీ విద్యుత్ బోర్డు వాహనంపై పడిపోయింది. టిఫిన్ సెంటర్లోని వస్తువులు ధ్వంసం అయ్యాయి. వేగంగా వచ్చి కారు పెద్ద శబ్దంతో ఢీకొనడటంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. టిఫిన్ ఇతర అవసరాల కోసం వచ్చిన ప్రజలు కేకలు వేస్తూ భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు కారు ప్రమాదానికి కారణమైన ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. వాహనం నడిపిన ఇందుపల్లి హరీష్కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. -
స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం వద్ద ఆందోళన
గుంటూరు ఎడ్యుకేషన్: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) మలిదశ పోరాటంలో భాగంగా గురువారం నల్లచెరువురోడ్డులోని మహావీర్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఫ్యాప్టో గుంటూరు జిల్లా చైర్మన్ కె.నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న నాలుగు విడతల డీఏను మంజూరు చేయాలన్నారు. ఎస్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సీహెచ్ జోసఫ్ సుధీర్ బాబు మాట్లాడుతూ సీపీఎస్ను రద్దు చేసి, విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ (257) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. బసవలింగారావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు రద్దు చేయడంతోపాటు ఉపాధ్యాయుల అంతర మున్సిపాలిటీల బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్పాట్ వాల్యుయేషన్ విధులకు హాజరైన ఉపాధ్యాయులందరూ సాయంత్రం 4.00 గంటల నుంచి గంటసేపు సమస్యలపై నిరసన గళం విన్పించి న్యాయ పోరాటాన్ని విజయవంతం చేసినట్లు నరసింహారావు తెలిపారు. ధర్నాలో జిల్లా ఫ్యాప్టో కో–చైర్మన్ ఫైజుల్లా, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు.రాజశేఖర్రావు, మహమ్మద్ ఖాలీద్, జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ బాజీ, దాసు, జిల్లా నాయకులు మేకల సుబ్బారావు, ఎంవీ ప్రసాద్ జె.విజయానంద్, బి.ప్రసాద్, వై.మనోజ్ కుమార్, బి.గోపీకృష్ణ పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కొండవీటి గడ్డపై కళా సౌరభం
యడ్లపాడు: కొండవీటి గడ్డపై మళ్లీ కళాకారుల సందడి మొదలుకానుంది. చరిత్రకు నిలువుటద్దంగా నిలిచే కొండవీడు కోట నీడన, లింగారావుపాలెం వేదికగా నాటక వైభవం మళ్లీ పురుడుపోసుకోనుంది. మొన్ననే సుందరయ్య కళానిలయంలో జరిగిన ప్రదర్శనల మధుర స్మృతులు ఇంకా మనసుల్లో మెదులుతుండగానే, అప్పుడే కొండవీటి కళా పరిషత్ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు రోజుల సంబరం, అటు చారిత్రక వారసత్వాన్ని, ఇటు ఆధునిక కళా చైతన్యాన్ని మేళవించి తెలుగు నాటక రంగానికి కొత్త ఊపిరి పోయనుంది. పాతికేళ్ల ప్రస్థానం... పాతికేళ్లకుపైగా నాటక కళే శ్వాసగా సాగుతున్న ఈ పరిషత్ ప్రయాణం అభినందనీయం. గ్రామీణ వాతావరణంలో జాతీయ స్థాయి నాటికలను ప్రదర్శిస్తూ, కళామతల్లి సేవలో తరిస్తున్న ఈ సంస్థ వెనుక నిర్వాహకుల అకుంఠిత దీక్ష కనిపిస్తోంది. సినీ నటులు పోసాని కృష్ణమురళి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈ పరిషత్ను కట్టా శ్రీహరిరావు, తోకల సాంబశివరావు, నంబూరు వీరాంజనేయులు, మండెపూడి శ్రీనివాసరావు, మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, నంబూరు బ్రహ్మవరప్రసాద్, జరుగుల రామారావులు నిబద్ధతతో సమన్వయంగా ముందుకు నడిపిస్తున్నారు. కేవలం వినోదం కోసమే కాకుండా భవిష్యత్తు తరాలకు మన సాంస్కృతిక వారసత్వాన్ని అందించాలనే గొప్ప సంకల్పంతో ఈ వేదికను తీర్చిదిద్దారు. కళలకు మారుపేరు.. చారిత్రక కొండవీటి కోట వైభవాన్ని స్మరించుకుంటూనే, నేటి సమాజానికి కళల ద్వారా చైతన్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ పోటీలు సాగనున్నాయి. గ్రామ ప్రజలను, దూర ప్రాంతాల నుంచి వచ్చే కళాభిమానులను అలరించేందుకు సర్వం సిద్ధం చేసిన ఈ నాటక సంబరాలు, రాబోయే మూడు రోజుల పాటు ఈ ప్రాంతాన్ని ఒక కళా ప్రపంచంగా మార్చనున్నాయి. కళల కోలాహలంతో కొండవీటి గడ్డ మరోసారి తన ఘనకీర్తిని చాటుకునేందుకు ముస్తాబైంది. ● 12వ తేదీ ఆదివారం.. ముగింపు రోజున రాత్రి 8 గంటలకు నంబూరు నరసింహరావు జ్యోతిప్రజ్వలన చేయనున్నారు. లింగారావుపాలెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ షేక్ కరీమూన్ మాబుసుభాని నటరాజ పూజతో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. 8.30 గంటలకు హైదరాబాద్ గోవాడ క్రియేషనన్స్ వారి అమ్మ చెక్కిన బొమ్మ నాటిక, గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ఇది అతని సంతకం నాటిక ప్రదర్శితం కానున్నాయి. అనంతరం మానవత సాగరి బృందం వారి అందరూ మంచివారే కానీ నాటిక ప్రదర్శితం కానుంది. ప్రదానోత్సవం జరుగుతుందని నిర్వాహక కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. తొలిరోజు 10వ తేదీ శుక్రవారం రాత్రి 8 గంటలకు ఏపీ తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేయనున్నారు. పుడమి మైన్స్ డైరెక్టర్ ముత్తవరపు అరుణకుమారి నటరాజ పూజ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు ఆకెళ్ల సత్యనారాయణ కళాప్రాంగణంలో కాకినాడ జీవీకే క్రియేషన్స్ వారి కన్నీటికి విలువెంత నాటికతో పోటీలు మొదలవుతాయి. ఆ తర్వాత 10.30 గంటలకు ఉషోదయ కళానికేతన్ వారి మంచి మనుషులు, రాత్రి 11 గంటలకు శ్రీరమణ కళానిలయం వారి మాతృత్వం నాటికలు ప్రదర్శితం కానున్నాయి. రెండో రోజున శనివారం రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ స్వర్ణసూర్య డ్రామా లవర్స్ వారి సీ్త్రమాత్రే నమః నాటికతో ప్రదర్శనలు పునఃప్రారంభమవుతాయి. అనంతరం రాత్రి 11 గంటలకు విజయవాడ సాంస్కృతిక సమితి వారి మమ్మల్ని బ్రతకనివ్వండి, అర్ధరాత్రి 12 గంటలకు గుంటూరు కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్ వారి తరమెల్లిపోతున్నదో నాటికలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖుల సమక్షంలో సభా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. -
తెలంగాణ నుంచి ధాన్యం రాకుండా చెక్పోస్టులు ఏర్పాటు
నరసరావుపేట: తెలంగాణ రాష్ట్రం నుంచి పల్నాడు జిల్లాకు ధాన్యం రాకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ మిల్లర్లు అందరూ జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు గురజాల, మాచర్ల మండలాల రైతులు వద్ద నుంచి ఫిర్యాదులు వచ్చాయని, వీటిని విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2025–26కు సంబంధించి రబీలో 51 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, మిల్లర్లు అందరూ బ్యాంకు గ్యారెంటీలు అందజేయాలని, కావాల్సిన గోనెసంచులు, రవాణా వాహనాలకు జీపీఎస్ అమర్చి సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసఫరాల శాఖ అధికారి జీవీ ప్రసాదు, మిల్లర్ల అసోసియేషన్ నాయకులు ఊర భాస్కరరావు పాల్గొన్నారు. -
జై చెన్నకేశవ.. జై జై చెన్నకేశవ..
మాచర్ల: పల్నాడు ప్రజల ఆరాధ్య దైవం, భక్తుల కొంగుబంగారంగా పిలుచుకునే శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా సాగింది. వేలాది మంది భక్త జన సందోహంతో కనుల పండువగా వేడుక జరిగింది. శ్రీదేవి భూదేవి చెన్నకేశవ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి రథం పైకి ఎక్కించి కుమ్మరి వారు కుంభం పోసి హారతి రథం ఊరేగింపునకు సిద్ధం చేశారు. అర్చకులు అడిగొప్పల చెన్నకేశవాచార్యులు, శ్రీనివాసాచార్యులు, చైర్మన్ కొమెర అనంతరాములు, ఈఓ సైదారావుల ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి రథోత్సవంలో పాల్గొన్నారు. అర్చకులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హారతినిచ్చి రథం ముందు దిష్టి గుమ్మడికాయ దిష్టి తీసి రథం ఊరేగింపును ప్రారంభించారు. రథంపై నగారా మోగిస్తూ జై చెన్నకేశవ అంటూ భక్తులు గొలుసులు చేతబట్టి రథాన్ని పురవీధుల్లో నడిపించేందుకు ఉత్సాహంగా పోటీ పడ్డారు. రథశాల నుంచి లక్ష్మీదేవి మిద్దెల మీదుగా బురుజు సెంటర్ వరకు జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ నినాదాల మధ్య, గోవింద నామస్మరణతో రథోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది. బ్రహ్మోత్సవాలలోని ప్రముఖ ఘట్టమైన రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పల్నాటి ప్రాంతం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పారవశ్యంతో పులకించారు. ఆర్యవైశ్య సంఘం, ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం, ప్రసాదాలు పంపిణీ చేశారు. ముందుగా తెల్లవారుజాము నుంచి ఆలయంలో శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి శ్రీదేవి, భూదేవి లను ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు జరిపారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. యువకులు పోటీ పడి రథాన్ని లాగారు. ఏఎస్పీ సంతోష్, గురజాల ఇన్చార్జి డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు తరలివచ్చి బందోబస్తు నిర్వహించారు. పలు సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రసాదాలు, పానీయాలు, అన్నదానం చేశాయి. మాచర్ల పట్టణంలో ఎటుచూసినా శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి తిరునాళ్ల సందడి కనబడింది. సాయంత్రం రథోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. -
మోతీలాల్ నగర్లో కూల్చివేతల కలకలం
నెహ్రూనగర్: ‘మీకు ఓట్లు వేసి గెలిపించిన పాపానికి మమ్మల్ని ఇప్పుడు రోడ్లపాలు చేయాలని చూస్తున్నారా.. ఎమ్మెల్యే గారు.. మా ఇళ్లు కూల్చేందుకు రైల్వే అధికారులు వస్తున్నారు.. మీరు వచ్చి అడ్డుకోవాలి. లేదంటే మాపైనుంచి జేసీబీలు పంపి ప్రాణాలు తీశాకే నివాసాలు కూల్చండి’ అంటూ నెహ్రూనగర్ పరిధిలోని మోతీలాల్ నగర్ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెహ్రూనగర్ రైల్వే గేటు దగ్గరలోని మోతీలాల్నగర్లో గత 60 సంవత్సరాలుగా పలు పేద కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ట్రాక్ పక్కనే డ్రైనేజీ నిర్మాణం చేపట్టేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఆ పనులతో సుమారు 80 కుటుంబాలకు చెందిన నివాసాలు పూర్తిగా తొలగించే పరిస్థితి నెలకొంది. కూల్చివేతలకు చర్యలు తీసుకుంటున్నారని తెలిసి వారు దిక్కుతోచని స్థితిలో ఆందోళన బాట పట్టారు. ప్రత్యామ్నాయం చూపాకే తొలగించండి అర్ధంతరంగా మా ఇళ్లును తొలగించాలని రైల్వే అధికారులు వస్తున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వద్దకు వెళితే కనీస వసతులు లేని ప్రాంతాల్లోకి వెళ్లి ఉండాలని ఆయన చెబుతున్నారని వాపోయారు. అక్కడ ఉండే పరిస్థితులు లేవని తెలిపారు. కనీసం ఉండేందుకు మౌలిక వసతులు కల్పిస్తే అక్కడికి వెళ్తామని చెప్పినా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు వేసి గెలిపిస్తే ఏసీ రూముల్లో ఉంటూ తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికా తాము ఓట్లు వేసి గెలిపించిందంటూ ఆగ్రహిస్తూ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మా ఇళ్లను కూల్చ వద్దంటూ రైల్వే అధికారులను కోరినప్పటికీ బుధవారం ఉదయం జేసీబీలతో వచ్చి కూలుస్తామని చెప్పారని బాధితులు వాపోయారు. మంగళవారం రాత్రి కరెంట్ కట్ చేసేందుకు వచ్చారని వాపోయారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వచ్చి ఈ కూల్చివేతను ఆపాలని, లేకపోతే తమను చంపిన తరువాత కూల్చాలని బాధితులు విలపిస్తూ కోరారు. తమకు తగిన న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
అదనపు కోర్టుల కోసం భవనాల పరిశీలన
అమరావతి: అనుమతించబడిన అదనపు కోర్టుల ఏర్పాటు నిమిత్తం మంగళవారం స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను పలువురు న్యాయమూర్తులు పరిశీలించారు. ఈ పరిశీలనలో గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ చక్రవర్తి, సత్తెనపల్లి సీనియర్ సివిల్ జడ్జి విజయకుమార్ రెడ్డి, సత్తెనపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అహ్మద్, ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రియ దర్శిని, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సృజన్కుమార్, సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి రాములు, తహసీల్దార్ డానియేల్, ఎంపీడీఓ పార్వతి, సీఐ అచ్చియ్య, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిరూరల్: తాడేపల్లిలోని బాలాజీ హెచ్పీ గ్యాస్ కంపెనీలో పౌర సరఫరాల డైరెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ మంగళవారం తనిఖీలు చేశారు. ఆన్లైన్ గ్యాస్ బుకింగ్ నమోదులను, డెలివరీ బాయ్స్ గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ చేసే విధానాన్ని గ్యాస్ ఏజన్సీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ కంపెనీ వద్ద ఉన్న వినియోగదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గ్యాస్ బుకింగ్ తేదీ ప్రకారం ముందుగా బుక్ చేసుకున్న వారికి సరఫరా చేయాలని నిర్వాహకులకు ఆదేశించారు. గ్యాస్ గోడౌన్ల వద్ద సిలిండర్లను డెలివరీ చేయవద్దని, తప్పని సరిగా డోర్ డెలివరీ చేయాలన్నారు. వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించారు. ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే ఆయా ఏజన్సీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు గ్యాస్ డెలివరీ సమయంలో డెలివరీ బాయ్స్కు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గుంటూరు డీఎస్ఓ కోమలి పద్మ, తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య, మంగళగిరి సివిల్ సప్లయీస్ డీటీ శ్రీనివాసరావు, వీఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు స్వీకరించిన జేసీ
భట్టిప్రోలు: భట్టిప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. దీనివల్ల భట్టిప్రోలు మండలం నుంచి ప్రజలు సులువుగా తమ సమస్యలను విన్నవించేందుకు అవకాశం ఉంటుందని జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట అన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధరగౌడ్, డీఎంహెచ్వో డాక్టర్ ఎస్. విజయమ్మ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయ నిర్మల, డీఎస్వో జమీర్ బాషా, ఎంపీడీవో సాతులూరి వెంకటరమణ, ఇన్చార్జి తహసీల్దార్ వి. వెంకటేశ్వర్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కాగా, పీజీఆర్ఎస్ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ఉంటుందని అధికారులు ప్రకటించారు. కానీ 11:30 గంటలకు ప్రారంభమైంది. కలెక్టర్ రాకపోవడంతో జాయింట్ కలెక్టర్ 72 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. రెండున్నర గంటలపాటు అర్జీదారులు అధికారుల కోసం నిరీక్షించారు. -
ఘనంగా పోలేరమ్మ తిరునాళ్ల
గుంటూరు రూరల్: కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో శ్రీ పోలేరమ్మ తిరునాళ్ల మహోత్సవాలు మంగళవారం కనుల పండువగా జరిగాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలను నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎస్పీ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ప్రజల యోగక్షేమాల కోసం ప్రత్యేకంగా అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సిడిమాను ఊరేగింపు మహోత్సవానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయించి, బ్యారికేడ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గుడికి వచ్చే రాకపోకల మార్గాల్లో 12 పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేశామని తెలిపారు. ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు, ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, ఆలయ ఈవో జక్కా శ్రీనివాసరావు, కాకుమాను ఎస్సై హరికృష్ణ, ప్రత్తిపాడు ఎస్సై నరహరి, ఇతర శాఖల అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
శ్రామిక మహిళలకు కనీస వేతనాలివ్వాలి
లక్ష్మీపురం: ఇంటి పనులు, బయట పనులతో శ్రమిస్తూ ఉత్పత్తిలో ముఖ్య భూమిక పోషిస్తున్న శ్రామిక మహిళలకు హక్కులు కల్పించటంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సీఐటీయూ ఆలిండియా సెక్రటరీ ఎస్.వరలక్ష్మి అన్నారు. సీఐటీయూ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర 10వ సదస్సు మంగళవారం విజయలక్ష్మి, శేషకుమారి, జి.నాగమణి, సీత అధ్యక్షతన గుంటూరు బ్రాడీపేటలోని జాషువా విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాల ప్రకారం సముచిత, గౌరవప్రదమైన ఉద్యోగాలు భారతదేశంలో లేవన్నారు. ఐఎల్ఒ ప్రకారం కార్మికులకు న్యాయమైన వేతనాలు అమలు చేయాల్సి ఉందని, కానీ కనీస వేతనాలు కూడా అమలు చేయట్లేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాజ్యాంగం సీ్త్ర, పురుషులకు సమానహక్కులు కల్పించినా వేతనాలలో వివక్ష కొనసాగుతుందన్నారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కట్లేదన్నారు. శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్ కె.ధనలక్ష్మి నివేదిక ప్రవేశపెట్టారు. పలు తీర్మానాలు ఆమోదించారు. -
ఉత్తమ నైపుణ్యం కలిగిన వైద్యులుగా తీర్చిదిద్దుతాం
గుంటూరు మెడికల్: ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్, మల్టీ స్పెషాలిటీ విభాగాలు కలిగిన సాయి భాస్కర్ హాస్పిల్కు ఆర్థో విభాగంలో రెండు డీఎన్బీ సీట్లు కేటాయిస్తూ ఎన్.బి.ఇ.ఎం.ఎస్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్(ఎన్.బి.ఇ.ఎం.ఎస్) సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ను జాతీయస్థాయిలో ఆర్థోపెడిక్ పీజీ ట్రైనింగ్ సెంటర్గా గుర్తిస్తూ డిప్లమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డీఎన్బీ) సీట్లను కేటాయించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్లో గుజరాత్కు చెందిన డాక్టర్ జీల్ కటిరా, రాజస్థాన్కు చెందిన డాక్టర్ యశా జైన్, హాస్పిటల్ను ఎంపిక చేసుకున్నారు. మంగళవారం అరండల్పేటలోని హాస్పిటల్ లో డాక్టర్ నరేంద్రరెడ్డి ఎదుట తమ తొలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ వైద్య విద్యలో అత్యంత ప్రతిష్టాత్మకమైన డీఎన్బీ సీట్లను తమ హాస్పిటల్కు కేటాయించడం గర్వంగా ఉందని తెలిపారు. మూడు సంవత్సరాల పాటు డీఎన్బీలో విద్యను అభ్యసించాల్సి ఉంటుందన్నారు. ఎముకలు కీళ్ల విభాగంలో ఉత్తమ వైద్యులుగా తీర్చిదిద్ది తద్వారా జాతీయస్థాయిలో గుంటూరుకు గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని డాక్టర్ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కొనకల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి -
అంజుమన్ ఇస్లామియాభూమిని లాక్కుంటే ప్రజా ఉద్యమం
తెనాలి: ముస్లిం ధార్మిక సంస్థ అంజుమన్ ఇస్లామియాకు చెందిన మంగళగిరి మండలం చినకాకానిలోని భూమిని చంద్రబాబు ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు కోసం చేసిన భూసేకరణ ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ భూమిని తీసుకోవాలని చూస్తే ముస్లింలంతా రోడ్డుపైకి వస్తారని, అందరం ఏకతాటిపైన ఉన్నామని స్పష్టంచేశారు. చినకాకానిలోని అంజుమన్ ఇస్లామియాకు చెందిన 71.57 ఎకరాల వ్యవసాయ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు కోసం సేకరించేందుకు డిసెంబరులో నోటిఫికేషన్ జారీచేసిందని, దీనిపై సంస్థ జీవితకాల సభ్యులు, వివిధ ముస్లిం సంస్థల నాయకులు ప్రభుత్వానికి అభ్యంతరాలను తెలియజేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో తెనాలి సబ్కలెక్టర్ స్వయంగా వచ్చి తమ అభ్యంతరాలను తెలియజేయాలని నోటీసులు పంపారు. ఆ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం అంజుమన్ ఇస్లామియా సంస్థ జీవితకాల సభ్యులతో కలిసి నూరి ఫాతిమా రాతపూర్వక అభ్యంతరాలను ఇన్చార్జి సబ్కలెక్టర్ లక్ష్మీకుమారికి తెలియజేశారు. గతేడాది జూన్లో ఆ భూమికి సంబంధించి 25 శాతం నష్టపరిహారం ఇచ్చినట్టుగా సబ్కలెక్టర్ నోట్లో ఉందనీ, పీపీపీ పద్ధతిలో తీసుకుంటామని చెప్పినట్టుగా వక్ఫ్బోర్డు చైర్మన్ అజీజ్ బోర్డు మీటింగులో వెల్లడించారని నూరి ఫాతిమా అన్నారు. ఇలా రకరకాలుగా ప్రభుత్వం ఎర వేస్తోందన్నారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ కలీం మాట్లాడుతూ చినకాకానిలో అంజుమన్ ఇస్లామియాకు గల భూమి 1915లో దాతలు ఇచ్చినదిగా గుర్తుచేశారు. 1962లో ప్రభుత్వ గెజిట్లో, తర్వాత సర్వే కమిషన్ రిపోర్టులో, 1998లో రెవెన్యూ రికార్డుల్లోనూ ఇంజుమన్ ఇస్లామియాను యజమానిగా నమోదై ఉందని గుర్తుచేశారు. అలాంటి భూమిని వక్ఫ్ పర్యవేక్షణలో ఉన్నట్టుగా చూపుతూ భూసేకరణ నోటిఫికేషన్ జారీచేయటంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. వెంటనే ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లింకు గల ఏకై క ఆస్తిని ప్రభుత్వం తీసుకోవాలని చూడటాన్ని చందోలుకు చెందిన ముస్లిం సమైక్య కమిటీ నాయకుడు మౌలా బేగ్ తీవ్రంగా ప్రశ్నించారు. ప్రాణాలైనా వదులుతామనీ, భూమిని వదులకోమని స్పష్టంగా చెప్పారు. ఆ భూమిని తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల ప్రజాఉద్యమం తప్పదని పలువురు హెచ్చరించారు. అన్ని అభ్యంతరాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని ఇన్ఛార్జి సబ్కలెక్టర్ లక్ష్మీకుమారి తెలిపారు. వీరితో మంగళగిరి తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర కూడా ఉన్నారు. -
సీఎం సభావేదిక పనుల పరిశీలన
చంద్రబాబు రాకతో యంత్రాంగం అప్రమత్తం భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ ఉమామహేశ్వర్.. భట్టిప్రోలు: సీఎం జిల్లా పర్యటన పురస్కరించుకుని అడ్వాన్డ్స్ సెక్యూరిటీ లైజన్ క్లోజ్ను మంగళవారం బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి గురువారం నియోజకవర్గంలోని భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామానికి విచ్చేయనున్నారు. ఈసందర్భంగా ముందస్తు భద్రత ఏర్పాట్లను ఏఎస్జీ, ఇతర విభాగాల అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ పరిశీలించారు. హెలికాప్టర్ దిగేందుకు నిర్ణయించిన ప్రాంతంలో భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. హెలిపాడ్ ప్రాంతానికి వచ్చే వాహనాల పార్కింగ్, పార్టీ కేడర్ సమావేశం జరుగు ప్రదేశం, ప్రజావేదిక, పార్కింగ్, వీఐపీ, వీవీఐపీ వాహనాల పార్కింగ్ ప్రదేశాలను, సీఎం కాన్వాయి వెళ్లే మార్గాలు క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు పోలీసు అధికారులు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ వెంట రేపల్లె డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ పి.నారాయణ, ఏఎస్జీ, అధికారులు, పోలీసు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. – అధికారులకు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే ఆనందబాబు -
స్థిరంగా ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ సరఫరా
ఏపీ ఆయిల్ ఇండస్ట్రీస్ స్టేట్ లెవెల్ జనరల్ మేనేజర్ ఎన్.భాస్కర్రెడ్డి తాడేపల్లిరూరల్: రాష్ట్రంలో ఎల్పిజి, పెట్రోల్, డీజిల్ సరఫరాలు స్థిరంగా ఉన్నాయని ఏపీ ఆయిల్ ఇండస్ట్రీ స్టేట్ లెవెల్ జనరల్ మేనేజర్ ఎన్.భాస్కరరెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి పట్టణ పరిధిలోని రిటైల్ రీజనల్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు హెచ్పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం సంస్థలు సమన్వయంతో సరఫరాలను సజావుగా కొనసాగిస్తున్నాయని తెలిపారు. గృహ వినియోగ సిలిండర్ల సరఫరా 100 శాతం జరుగుతోందని తెలిపారు. హాస్పిటల్స్, స్కూల్స్, రైల్వే క్యాంటీన్స్, ఇండస్ట్రియల్ క్యాంటీన్స్, నూరుశాతం సరఫరా అందిస్తుమని రెస్టారెంట్లు, వ్యవసాయం ఇతర రంగాలకు 70శాతం కంటే ఎక్కువ సరఫరా కొనసాగుతోందని పేర్కొన్నారు. రోజుకు సుమారు 2.3 లక్షల నుంచి 2.4 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని ఓటీపీ ఆధారిత డెలివరీ విధానం ద్వారా 90 శాతం వరకు పారదర్శకత సాధించారని అన్నారు. బ్లాక్ మార్కెటింగ్ నివారణ కోసం(1079) దాడులు నిర్వహించి, 4300 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో గ్యాస్ దొరకదని భయంతో బుకింగ్ చేయవద్దని సరఫరాల విషయంలో ఎలాంటి కొరత లేదని సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో హెచ్పిసిఎల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉపేంద్ర, చీప్ రీజినల్ మేనేజర్ హెచ్పిసిఎల్ అభిషేక్ ప్రదీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ గుంటూరు లీగల్: బాల్య వివాహాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు మంగళవారం నిర్వహించారు. వంద రోజుల అవగాహన సదస్సులో భాగంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ గుంటూరు అండ్ మెప్మా ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ బాల్య వివాహాలు లేని సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అన్నారు. గౌరవ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆశ (అవేర్నెస్, సపోర్ట్ అండ్యాక్షన్) సోప్– 2025 అనే కొత్త కార్యాచరణను రూపొందించిందని వివరించారు. జిల్లా స్థాయిలో యూనిట్ ఏర్పాటు చేసి ఈ యూనిట్ ద్వారా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, పోలీసులు, న్యాయ సేవాధికార సంస్థలు సమష్టిగా పని చేస్తాయని చెప్పారు. సీడబ్ల్యూసీ, జేజేబీ సంస్థలు పిల్లలకు అవసరమైన అన్ని చట్టపరమైన సేవలు ఉచితంగా అందుతాయని అలాగే పిల్లల హక్కుల రక్షణ కోసం చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణంలో న్యాయం జరిగేలా చూడటం మన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సి. హెచ్. విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
బాలుడి ప్రాణాలను బలిగొన్న ఈత సరదా
చిలకలూరిపేటటౌన్: ఈత కొడదామని వెళ్లిన ఆ బాలుడు విగతజీవిగా తిరిగిరావడంతో స్థానిక సుభాని నగర్లో విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట పట్టణంలోని ఓగేరు వాగులో మునిగి ఐదో తరగతి విద్యార్థి చందు (11) మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. తమ ఇంటి సమీపంలోని వాగు వద్దకు వెళ్లాడు. నీటి లోతుపై అవగాహన లేకపోవడంతో, లోపలికి వెళ్లిన చందు ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చిలకలూరిపేట అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత నీటిలో మునిగి ఉన్న చందుని బయటకు తీయించారు. అయితే అప్పటికే శ్వాస ఆగిపోవడంతో బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్లముందే ఆడుకోవాల్సిన బిడ్డ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆటపాటలతో గడపాల్సిన వయసులో ఈత సరదా ఇలా ప్రాణాలు తీయడం స్థానికులను సైతం కలచివేసింది. -
గంజాయి నిందితుల అరెస్ట్
తాడేపల్లిరూరల్: గంజాయి కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ వీరేంద్రబాబు తెలిపారు. తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వివరాలు వెల్లడించారు. రూరల్లో ఈగల్టీమ్ మెరుపుదాడి చేసి పాత నేరస్తుడితో పాటు మరో ముగ్గురు కొత్త నేరస్తులను గంజాయితో సహా పట్టుకుని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు, ఎస్ఐలు ఖాజావలి, అపర్ణ మరికొంతమంది సిబ్బందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేసి మంగళవారం ప్రాతూరు కరకట్ట వద్ద పట్టుబడిన నలుగురితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచినట్లు చెప్పారు. ఇందులో ప్రాతూరు గ్రామానికి చెందిన బండ్ల ప్రసాద్, గతంలో తాడేపల్లి పోలీస్స్టేషన్లో మూడు కేసుల్లో నిందితుడని, మంగళగిరిలో ఒక కేసులో ఉన్నట్లు వివరించారు. ప్రాతూరు కిరణ్ ఒక కేసులో, వల్లపనేని పవన్కళ్యాణ్పై విజయవాడ, దుగ్గిరాల, తాడేపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో ఆరు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వీరితో పాటు పాతూరు కిరణ్, పాతూరు సతీష్, గుండిమెడ జోజిబాబు, కొవ్వూరు లాజర్ను అరెస్ట్ చేశామని, ఒక్కొక్కరి వద్ద 50 గ్రాముల చొప్పున 400 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వీరందరికి విజయవాడకు చెందిన చైతన్య అనే గంజాయి నేరస్తుడు గంజాయి సరఫరా చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని వెల్లడించారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నేడు ఏఎన్యూలో ఈడబ్ల్యూఎస్ వర్క్షాప్ ఏఎన్యూ(పెదకాకాని): ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంట్రప్రెన్యూర్షిప్ ఒకరోజు శిక్షణ శిబిరం ఏన్ఎన్యూలో నిర్వహించనున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.సునీత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో బుధవారం జరిగే వర్క్షాప్ను ఈడబ్ల్యూఎస్, బీసీ, చేతివృత్తులు, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్, వస్త్రాలు, చేతివృత్తులు, హస్తకళలు వంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాల్లో ఉన్న అవకాశాలతో పాటు, యుద్ధానంతర ప్రపంచ పరిస్థితుల్లో వాటి భవిష్యత్ను ఈ శిబిరంలో చర్చిస్తారని తెలిపారు. -
వేటపాలెం పోలీస్ స్టేషన్లో తెలంగాణ బాలుడు
వేటపాలెం: తెలంగాణ మంచిర్యాల ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలుడు తప్పిపోయి వేటపాలెం పోలీస్స్టేషన్ సంరక్షణలో ఉన్నట్లు ఎస్సై సురేష్ మంగళవారం తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన వేటపాలేనికి చెందిన బాలగోపి విజయవాడ నుంచి వేటపాలెం రైలులో వస్తున్న సమయంలో బాలగోపిని.. ఓ బాలుడు కలిసి ఆకలి వేస్తుందని డబ్బులు ఇవ్వాలని కోరాడు. బాలుడు తప్పిపోయి వచ్చినట్లు గుర్తించిన బాలగోపి ఆ పిల్లవాడిని వేటపాలెంలోని తన ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి వివరాలు అడిగాడు. బాలుడు ఎటువంటి వివరాలు చెప్పలేదు. దీంతో బాలుడిని తీసుకొచ్చి వేటపాలెం పోలీస్స్టేషన్లో అప్పగించాడు. ఎస్సై బాలుడిని వివరాలు అడగ్గా తన పేరు సంతోష్ అని తెలంగాణలోని మంచిర్యాల రైల్వేస్టేషన్ దగ్గర వాళ్ల నాన్న రోడ్డు పని చేస్తుంటాడని వివరాలు తెలిపాడు. లారీ ఢీ కొని వ్యక్తి మృతి వేటపాలెం: బైక్పై రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. జాతీయ రహదారి 216లో రామన్నపేట జంక్షన్ వద్ద సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల మేరకు రామచంద్రాపురానికి చెందిన మత్స్యకారుడు బసంగారి రాజు (36) బైక్పై వేటపాలెం వచ్చి సొంత పనులు చూసుకొని తిరిగి రామచంద్రాపురం వెళుతున్నాడు. బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద రోడ్డు దాటే సమయంలో వేగంగా వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. బైక్ పై నుంచి కింద పడిన రాజు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ను ఢీకొట్టిన లారీ ఆగకుండా వెళ్లిపోయింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీస్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సాగర్ కాల్వలో విద్యార్థి గల్లంతు కారెంపూడి: సాగర్ కాల్వలో ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతైన ఘటనలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామంలోని వడియరాజుల కాలనీకి చెందిన కొమెర రాజారావు తోటి స్నేహితులతో కలసి దగ్గర్లో ఉన్న సాగర్ కుడి కాల్వకు ఈతకు వెళ్లారు. అందరూ ఈత కొడుతుండగా విద్యార్థి రాజారావు(13) ప్రవాహవేగానికి గల్లంతయ్యా డు. స్నేహితులు చూసిన వారు తల్లిదండ్రులు, బంధువులకు సమాచారం అందించారు. మృతదేహం కోసం గాలిస్తున్నారు. కొమెర ఏసు రాజు దంపతులకు రాజారావు ఒక్కగానొక్క కుమారుడు, 7వ తరగతి పరీక్షలు రాశాడు. ఈ కాల్వలోనే చాలా మంది ఈతలు కొడుతుంటారు. పిల్లలను కాల్వలకు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. -
చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల సభకు వైఎస్సార్ సీపీకి ఆహ్వానం
గుంటూరు మెడికల్: బీపీ మండల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో సోమవారం కలిశారు. డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై జరిగే సమావేశానికి ఆహ్వానించారు. డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏప్రిల్ 19న విజయవాడలోని మాకినేని బసవపునయ్య విజ్ఞాన కేంద్రంలో చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల ఆవశ్యకత అనే అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొని చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్లపై తమ వైఖరిని వెల్లడించాలని సజ్జల రామకృష్ణారెడ్డిని కోరారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు అనుకూలమని తెలిపారు. తమ పార్లమెంటరీ పార్టీ గతంలోనే రాజ్యసభలో ఈ విషయం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. 19న జరిగే అఖిలపక్ష సమావేశంలో తమ పార్టీ పాల్గొని తమ వైఖరిని స్పష్టంగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. సజ్జలను కలిసిన వారిలో రైల్వే ఓబీసీ సంఘ అధ్యక్షుడు బీవీఎన్ సత్యనారాయణ, నాయకులు ఉన్నారు. భట్టిప్రోలు: భట్టిప్రోలు మండల పరిషత్ కార్యాలయం సమావేశపు హాలులో మంగళవారం ఉదయం 9 గంటలకు పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సాతులూరి వెంకట రమణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ పాల్గొంటారని తెలిపారు. ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. బాపట్ల: బాపట్ల జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు 2026–2027 సంవత్సరానికి సోమవారం జరిగిన ఎన్నికలలో నూతన అధ్యక్షులుగా విన్నకోట సత్యప్రసాద్ ఘన విజయం సాధించారు. బాపట్ల జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఉపాధ్యక్షులుగా కంచర్ల రవిబాబు, ప్రధాన కార్యదర్శిగా సి ప్రేమ్చంద్, లైబ్రరీ కార్యదర్శిగా కారుమూరి సురేంద్ర నాథ్, సాంస్కృతిక కార్యదర్శిగా చాపల వెంకట ప్రవీణ్ కుమార్లు గెలుపొందారు. నూతనంగా ఎన్నికై న వారిని పలువురు ప్రముఖులు అభినందించారు. మంత్రి లోకేష్కు జెడ్పీ చైర్పర్సన్ వినతిగుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్కు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.34 కోట్ల రిజిస్ట్రేషన్ సర్చార్జి నిధులు విడుదల చేయించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా విజ్ఞప్తి చేశారు. సోమవారం మంత్రి లోకేష్ను ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసిన హెనీ క్రిస్టినా, కత్తెర సురేష్కుమార్ దంపతులు జెడ్పీకి రావాల్సిన నిధులు, బకాయిల విషయమై ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన లోకేష్ నిధుల విడుదలకు హామీ ఇచ్చినట్లు హెనీ క్రిస్టినా తెలిపారు. మాచర్ల: సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో ఆమె తండ్రి కామనబోయిన చంద్రశ్రీను, మేనమామ పచ్చిపాళ్ల శ్రీనులను సోమవారం రాత్రి గురజాల ఇన్చార్జి డీఎస్పీ వెంకటరమణ అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన చంద్ర శ్రీను కుమార్తె ప్రేమించిన నాగరాజుతో వెళ్లి వివాహం చేసుకుంది. ఇందుకు సంబంధించి చౌడేశ్వరి అదృశ్యమైనట్లు, దానికి కారణం జమ్మలమడక గ్రామానికి చెందిన నాగరాజు అని మృతురాలి తల్లిదండ్రులు చంద్రశ్రీను, గంగమ్మలు పోలీసులను ఆశ్రయించారు. ఆ తరువాత ఈ నెల 18న చౌడేశ్వరి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చెప్పారు. అయితే ఇది హత్య కేసుగా పోలీసు పరిశోధనలో తేల్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్య కేసులో నిందితులు చంద్రశ్రీను, పచ్చిపాళ్ల శ్రీనులను అరెస్టు చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అర్థరాత్రి హాజరుపర్చనున్నారు. -
పేలుడులో గాయపడ్డ పోలీసులకు అండగా ఉంటాం
మంగళగిరి టౌన్: కృష్ణాజిల్లా చల్లపల్లి పోలీస్స్టేషన్లో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన బాధితులకు అండగా ఉంటామని రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మంగళగిరి మండల పరిధిలోని చినకాకాని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చల్లపల్లి పోలీస్స్టేషన్ ఎస్ఐ దుర్గ ఆంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజులను సోమవారం హోమ్ మంత్రి అనిత పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులకు ధైర్యం చెప్పి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చికిత్స పొందుతున్న పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించినట్లు పేర్కొన్నారు. కానిస్టేబుల్ అబ్దుల్లా 50–60 శాతం గాయాలతో ఉన్నారని చికిత్సకు సహకరిస్తున్నట్లు వైద్యులు తెలిపారన్నారు. మిగిలిన ఇద్దరిని ప్రాణాపాయం లేదని తెలిపారు. గాయపడిన పోలీసుల ఆరోగ్య పరిస్థితులను కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు. కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం చికిత్సపొందతున్న వారికి మెరుగైన వైద్య అందించాలని ఎన్ఆర్ఐ వైద్యులను ఆదేశించారు. మాచవరం: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి వాటిలో ఉన్న రాగి తీగను దొంగిలించిన సంఘటనలో ఐదుగురు నిందితులతోపాటు, వాటిని కొనుగోలు చేసిన మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు గురజాల ఇన్చార్జి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మాచవరం పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పొలాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు లక్ష్యంగా చేసుకొని తెనాలి, మంగళగిరి ప్రాంతాలకు చెందిన ఓ ముఠా ఈ చోరీలకు పాల్పడుతుందని వెల్లడించారు. మాచవరం మండలం గోవిందపురం గ్రామానికి చెందిన వేముల ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం ఉదయం మండలంలోని గోవిందపురం బల్లకట్టు వద్ద కొందరు వ్యక్తులు అనుమానంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకొని విచారించగా రాగి తీగలను దొంగతనం చేసే వ్యక్తులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో మొలిక ముత్యం, ఏ గసిరి కోటయ్య , పెండ్ర , వెంకటేష్ కట్టా వెంకటేశ్వర్లులు ఉన్నారు. వీరు దొంగిలించిన రాగి తీగను మంగళగిరి ప్రాంతానికి చెందిన బత్తుల తారకేశ్వరరావు, వారణాసి సతీష్లకు విక్రయిస్తున్నారు. వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 20 కేసుల్లో సుమారు 85 ట్రాన్స్ఫార్మర్ల నుంచి దొంగిలించిన 350 కిలోల రాగి వైర్కుగాను 170 కిలోల రాగి వైర్ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రైతులు పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలనీ సూచించారు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు దొంగతనానికి గురైనట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అన్నారు. నిందితులను అరెస్టు చేసిన మాచవరం ఎస్సై పవన్ కుమార్ పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. హోం మంత్రి అనిత -
రిసార్ట్స్, అక్రమ లేఅవుట్స్పై చర్యలు తీసుకోవాలి
మాజీ ఎమ్మెల్యే ఆమంచిబాపట్ల: చీరాల ప్రాంతంలో పర్యావరణ, అటవీ సంరక్షణ చట్టానికి విరుద్ధంగా రిసార్ట్స్, అక్రమ లేవుట్స్ను ఏర్పాటు చేయటంపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కోరారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ను సోమవారం కలెక్టరేట్లో కలిసి వినతిపత్రం అందించారు. చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలంలోని చల్లారెడ్డిపాలెం గ్రామం పంచాయతీ, కఠారివారిపాలెం పరిధిలో రిసార్ట్స్, నిబంధనలకు విరుద్ధంగా లేవుట్స్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఏవిధంగా అనుమతులు ఇచ్చారో అర్థంకావటంలేదని వివరించారు. సముద్రతీరం అనుకుని నిర్మాణం చేపడుతున్న మౌనంగా ఉండటంపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన రిసార్ట్స్ నిర్వహణను నిలుపుదల చేయటంతోపాటు అక్రమ లే అవుట్స్ను తొలగించాలని కోరారు. వేటపాలెం మాజీ ఎంపీపీ బండ్ల తిరుమలాదేవి, కొత్తపేట మాజీ సర్పంచి చుండూరు వాసు, సుధార్, బుజ్జిబాబు, బొనిగల పేతురుబాబు, మల్లెల బుల్లిబాబు, పృద్వి, రమేష్, ముంగర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భూగర్భ జలాలను సంరక్షించుకోవాలి భూగర్భ జలాలను సంరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. జలభద్రత, సాగునీటి సంఘాల బాధ్యతపై సోమవారం స్థానిక బాపట్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సాగు, తాగునీటి చెరువులన్నీ అభివృద్ధి చేసుకోవాలన్నారు. నాణ్యమైన, పరిశుభ్రమైన జలాలను ప్రజలకు సరఫరా చేయాలన్నారు. చెరువు కట్టలు, పంట కాల్వల కట్టలు బలోపేతం చేయాలన్నారు. జలాల సంరక్షణలో భాగంగా 100 రోజుల కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విలువైన ప్రతి నీటి చుక్కను భద్రం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లాలో ఉన్న 133 చెరువులు, వాటి కట్టల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. మే నెల 15వ తేదీన సాగర్ నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన సాగునీటి కాల్వల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. భూగర్భ జలాలను పెంచడానికి యుక్త ధార కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, ప్రజలు సహకరించాలని డ్వామా పీడీ విజయలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో జల వనరుల శాఖ అధికారులు సత్యనారాయణ, ధనలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, నీటి సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం తెల్లవారుజామున మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి పట్టణం సలామ్ హోటల్ సెంటర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఈ కార్యక్రమంలో పాల్గొని గతంలో గంజాయి, ఇతర కేసుల్లో పట్టుబడిన వారి నివాసాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపుగా 200 నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎస్పీతోపాటు నార్త్జోన్ డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు, జిల్లా కేంద్రంతోపాటు తాడేపల్లి, మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల నుంచి దాదాపు 100 మంది సిబ్బంది పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్ అనంతరం ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గంజాయి విక్రయించడంతో పాటు తాగుతున్నారని సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 39 ప్రాంతాల్లో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. తాడేపల్లిలో పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ చేశామని, సలాం హోటల్ సెంటర్లో నిర్వహించగా 65 ద్విచక్రవాహనాలకు ఎటువంటి పత్రాలు లేకుండా ఉన్నాయని, వాటన్నింటి పత్రాలను పరిశీలించి డాక్యుమెంట్ ఉన్న వాహనాలను ఇచ్చివేస్తామని, లేని పక్షంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
వాజ్పేయి చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ గుంటూరు మెడికల్: మాజీ ప్రధాని వాజ్పేయి చరిత్ర ప్రతి ఒక్కరికీ ఆదర్శమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్.మాధవ్ పేర్కొన్నారు. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గుంటూరు లక్షీపురంలోని వాజపేయి సర్కిల్లో వాజపేయి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాధవ్ మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావం జరిగి నేటీకి 46 వసంతాలు పూర్తయ్యాయన్నారు. మన ఊరు–మన జండా కార్యక్రమం ఆరునెలలపాటు కొనసాగిస్తామని తెలిపారు. ప్రతి గ్రామానికి రూ.2 కోట్లు నిధులు కేంద్రం విడుదల చేసిందని తెలిపారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. అటల్ బీహారి వాజ్పేయి చరిత్ర బీజేపీ చరిత్రతో ముడిపడి ఉందన్నారు. ఒక చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో కూటమి అజండా ఉండాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా రూ.15 లక్షల కోట్లు ఏపీకీ కేంద్ర కేటాయించిందన్నారు. కార్యక్రమంలో బెహరా గాయత్రి, పాలపాటి రవికుమార్, డాక్టర్ స్రవంతి, లకరా, పవన్ సాయి, సోలంకి, మహాలక్ష్మి, మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, పనతల సురేష్, సయ్యద్ బాషా, యడ్లపాటి స్వరూపరాణి, కొత్తూరు వెంకట సుబ్బారావు, భీమినేని చంద్రశేఖర్, గంగాధర్, నేరళ్ల మాధవరావు, వక్కలగడ్డ తిరుమలరావు, నాగేశ్వరరావు, భజరంగ్ రామకృష్ణ, దేసు సత్యనారాయణ, కారంశెట్టి రమేష్, శ్రావణ కుమారి, అనుమోలు ఏడుకొండలు గౌడ్, రాచుమల్లు భాస్కర్, జితేంద్ర గుప్తా, ప్రవీణ్, రావుల రాజశేఖర్, అబ్రహం, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయం వాజ్ పేయి భవన్ వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీన్ మాధవ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. -
ఉత్తమ ప్రదర్శన ‘అమ్మ చెక్కిన బొమ్మ’
యడ్లపాడు: పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం వేదికగా మూడు రోజులపాటు సాగిన 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఆద్యంతం పారదర్శకంగా, హృద్యంగా సాగిన ఈ వేడుక నాటక ప్రేమికుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఉత్తమ ప్రదర్శనగా ‘అమ్మ చెక్కిన బొమ్మ’ ఉత్తమ ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్(హైదరాబాద్)వారి ‘అమ్మచెక్కిన బొమ్మ’ నాటిక, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా విజయవాడ సాంస్కృతిక సమితి(విజయవాడ) వారి ‘మమ్మల్ని బ్రతకనివ్వండి’ నాటిక. ఉత్తమ తృతీయ ప్రదర్శన స్వర్ణసూర్య డ్రామా లవర్స్ (హైదరాబాద్) వారి ‘సీ్త్రమాత్ర నమః’ నాటిక. చతుర్థ ప్రదర్శన ఉషోదయ కళానిలయం(కట్రపాడు) ‘మంచి మనసులు’ నాటిక. వీటితోపాటు ‘కన్నీటికి విలువెంత..‘మాతృత్వం’ నాటికలు ప్రత్యేక ప్రదర్శన బహుమతుల్ని సాధించుకున్నాయి. తెరవెనుక కృషీవలురు ఉత్తమ నాటక రచనకు..మంచి మనసులు, అమ్మచెక్కిన బొమ్మ, ఉత్తమ దర్శకులు, ఉత్తమ సంగీత దర్శకులు అమ్మచెక్కిన బొమ్మ, ఉత్తమ రంగాలంకరణ మమ్మల్ని బ్రతకనివ్వండి, ఉత్తమ ఆహార్యం చిటికెన వేలు నాటికలకు లభించాయి. వేదికపై వెలిగిన కళాకారులు ఉత్తమ నటీమణులు..అనసూయ పాత్రధారి జ్యోతిరాజ్ భీశెట్టి (అమ్మచెక్కిన బొమ్మ), రమణమ్మ పాత్రధారి ఆర్ రాజేశ్వరీ (మమ్మల్ని బ్రతకనివ్వండి), ఉత్తమ నటులు చిట్టి పాత్రధారి కార్తీక్ (సీ్త్రమాత్రే నమః), శశి–2 పాత్రధారి భానుప్రకాష్ (అమ్మచెక్కిన బొమ్మ), సోమన్న పాత్రధారి కె సత్యనారాయణ (చిటికెలవేలు) బహుమతుల్ని గెలుచుకున్నారు. ద్వితీయ ఉత్తమ నటులు..వైబీ చౌదరి (దీపం కింద చీకటి), పొగర్తి నాగేశ్వరరావు (మాతృత్వం), ఉదయ భాగవతుల (సీ్త్ర మాత్రే నమః), పీఎస్ పవన్కుమార్ (మమ్మల్ని బ్రతకనివ్వండి), అమృత వర్షిణి (మంచి మనసులు) నటులకు దక్కాయి. కళా సేవకులకు సన్మానం... కళా, సామాజిక రంగాల్లో విశేష కృషి చేసి, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలు అందుకున్న ఈదర హరిబాబు, రాయప్రోలు భగవాన్, నన్నపనేని రాఘవరావు, జాస్తి వెంకట మోహన్రావు, బుడ్డా వెంకట రామారావు, అన్నమనేని ప్రసాదరావు, కాట్రగడ్డ కృష్ణప్రసాద్లను కమిటీ సన్మానించారు. అనంతరం ముఖ్య అతిధి నాటక రంగ విశ్లేషకులు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, సన్మానితులు ప్రసంగించారు. నాటక కళను బతికించేందుకు సురేష్బాబు దంపతులు చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. కార్యక్రమంలో పరిషత్ కార్యవర్గం జరుగుల రామారావు, శంకర్రావు, నూతలపాటి కాళిదాసు, ఆలోకం పెద్దబ్బయ్య, నూతలపాటి మాధవరావు, చెరుకూరి సృజన, షేక్ బాజి, నంబూరి శ్రీనివాసరావు, ఎం పద్మారావు, పోపూరి అనంతలక్ష్మి, సీహెచ్ హనుమంతరావు, కె సులోచన, తోకల కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, కట్టా శ్రీహరి, సాంబశివరావు, పోపూరి శివరామకృష్ణ, జగన్, మాణిక్యమ్మ, మానుకొండ రామారావు ఉన్నారు. రంగస్థల చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా స్టేజీపై నటించిన 19 మంది మహిళా కళాకారులకు ఆడపడుచు లాంఛనాలతో (చీర, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు) సత్కరించారు. గ్రామవాసి డాక్టర్ ముత్తవరపు భార్గవిచౌదరి ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా, ఉత్తమ రచన, దర్శకత్వ విభాగాలకు నగదు బహుమతులు అందజేశారు. అలాగే నాటికలను వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకులకు లక్కీ డ్రా నిర్వహించి, మూడు రోజుల్లో మొత్తం 120 మందికి బహుమతులు అందజేశారు. ప్రతిరోజూ రాత్రి ప్రేక్షకులకు అల్పాహారం ఏర్పాటు చేయడం విశేషం. -
విజ్ఞాన్ నిరులా విద్యార్థినికి గోల్డ్ మెడల్ ప్రదానం
గుంటూరు రూరల్: ఇటీవల కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన 12వ స్నాతకోత్సవ వేడుకల్లో విజ్ఞాన్ నిరులా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఐటీ విభాగ విద్యార్థిని గుండా ప్రియాంకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడం విశేష గౌరవంగా నిలిచిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ రాధిక తెలిపారు. సోమవారం పెదపలకలూరు రోడ్డులోని కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థిని అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ గుండా ప్రియాంక తన కృషి, పట్టుదల, అంకితభావంతో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకుని సంస్థకు మరింత ఖ్యాతిని తీసుకువచ్చిందన్నారు. ఆమె సాధించిన ఈ విజయం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. ప్రియాంకను విజ్ఞాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, ఉపాధ్యక్షులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఐటీ విభాగాధిపతి డాక్టర్ కె.వి.ఎస్. రామకృష్ణ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. -
అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి
బాపట్ల: అభివృద్ధి, సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమం స్థానిక కలెక్టరేట్లో సోమవారం జరిగింది. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. అభివృద్ధి రేటులో బాపట్ల జిల్లా రానున్న మూడు నెలల్లో 10వ ర్యాంకులోకి వెళ్లాలని జిల్లా ప్లానింగ్ బోర్డ్ చైర్మన్, ఇన్చార్జి మంత్రి పార్థసారథి చెప్పారు. అన్ని రంగాల్లో జిల్లా ఎదిగేలా అధికారులంతా సమష్టిగా కృషి చేయాలన్నారు. జిల్లా అధికారుల్లో ఆరోగ్యకరమైన పోటీ రావాలి, స్ఫూర్తితో పనిచేయాలన్నారు. వ్యవసాయ, పాల ఉత్పత్తులు, చేపలు, రొయ్యల ఉత్పత్తులు జిల్లాలో అధికంగా ఉన్నందున ప్రాసెసింగ్ యూనిట్ల పెరగడానికి కృషి చేయాలన్నారు. ఇలాంటి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలన్నారు. గొర్రెలు, మేకలు పెంపకంతో పాటు మాంసం ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా మాంసం ఎగుమతులకు విదేశీ మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్నందున ఆ దిశగా అధికారులు పనిచేయాలన్నారు. ఒప్పందాలు చేసుకున్న పెట్టుబడిదారుల వద్దకు అధికారులు వెళ్లి పరిశ్రమల స్థాపనకు ఆహ్వానించాలని మంత్రి సూచించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి -
పోలీసంటే.. అలుసు!
చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులకే భద్రత లేకుండా పోతోంది. కూటమి నేతల అండ చూసుకుని చోటా మోటా నాయకులు సైతం పోలీసులను బెదిరించడం.. దుర్భాషలాడడం.. దాడులకు సైతం పాల్పడడం పరిపాటిగా మారింది. తెనాలిలో నెల రోజుల వ్యవధిలో జరిగిన రెండు సంఘటనలు పోలీసులపై కూటమి నేతల దాష్టికానికి నిదర్శనాలుగా మారాయి. గత నెలలో జనసేన నాయకుడు హెడ్ కానిస్టేబుల్పై దాడిచేయగా.. తాజాగా నడిరోడ్డుపై మద్యం తాగవద్దని వారించిన ఎస్ఐపై టీడీపీకి చెందిన వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. తెనాలి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులపై దాడులు పెచ్చరిల్లుతున్నాయి. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు విధినిర్వహణలో ఉన్న పోలీసులపై యథేచ్ఛగా దాడి చేస్తున్నారు. తాజాగా రద్దీగా ఉండే ప్రధాన రహదారి కూడలిలో మద్యం సేవిస్తూ, అదేమని అడిగిన ఎస్ఐపై దాడి చేయడం ఇందుకు నిదర్శనం. గతేడాది ఓ కానిస్టేబుల్పై దాడిచేశారంటూ ముగ్గురు దళిత యువకులను బహిరంగంగా పోలీసు అధికారులే భౌతిక హింసకు పాల్పడిన విషయం తెలిసిందే. గత నెలలో హెడ్కానిస్టేబుల్పై దాడిచేసిన నిందితుడిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు. అసలేం జరిగిందంటే.. పట్టణంలోని సమైక్య వెండి వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు పఠాన్ ఫజల్ఖాన్ జన్మదిన వేడుకలను ఆదివారం మధ్యాహ్నం బోసురోడ్డులో ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ల ఫ్లెక్సీలతో తమ నాయకుడి ఫొటోతో కూడి న భారీ ఫ్లెక్సీని నడిరోడ్డు కూడలిలో ఏర్పాటుచేసి, జన్మదిన కేక్ను కట్ చేసి, వేడుక జరిపారు. అదేరోజు సాయంత్రం ఆ ఫ్లెక్సీని పట్టణంలో ఊరేగించేందుకని కొందరు వర్కర్లు ఆ కూడలికి చేరుకుని, తమ నాయకుడి పేరుతో అక్కడే జేజేలు చేస్తున్నారు. అక్కడికి సమీపంలోని గాంధీచౌక్లో ట్రాఫిక్ విధుల్లో ఉన్న వన్టౌన్ ఎస్ఐ కె.విజయ్కుమార్కు రోడ్డుపైనే యువకులు మద్యం సేవిస్తున్నారనే సమాచారం వచ్చింది. దీంతో ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మయ్య, కానిస్టేబుల్ కృష్ణమూర్తి, హోంగార్డ్ రాజుతో కలిసి ఎస్ఐ విజయకుమార్ అక్కడకు చేరుకున్నారు. పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించినవారిలో ముగ్గురిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరారయ్యేందుకు ప్రయత్నించినవారు వెనక్కివచ్చారు. నడిరోడ్డుపై మద్యం సేవించటం చట్టప్రకారం నేరం అని ఎస్ఐ విజయ్కుమార్ చెబుతుండగానే ఆయనపై దాడిచేశారు. రోడ్డుపైకి తోసివేసి పరారయ్యారు. ఈ ఘటనను పోలీసుల్లో ఒకరు రికార్డు చేశారు కూడా! దీనిపై వన్టౌన్ పోలీస్స్టేషనులో కేసు నమోదుచేశారు. నిందితుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మిగిలినవారికోసం గాలిస్తున్నారని తెలిసింది. ఇదిలావుంటే గత నెల రెండోవారంలో త్రీటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు ఘర్షణపడ్డారు. బీరు సీసాతో జరిగిన దాడిలో ఇండ్ల వెంకట్రావు అనే వ్యక్తి గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెడికో లీగల్ కేసుగా త్రీటౌన్ పోలీస్స్టేషన్కు వచ్చిన సమాచారం ప్రకారం ఆసుపత్రి డ్యూటీలో ఉండే త్రీటౌన్ హెడ్కానిస్టేబుల్ టి.తిరుమలరావు, క్షతగాత్రుడి దగ్గరకు వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. అదే సమయంలో జనసేన పార్టీ నాయకుడు ఎయిర్టెల్ నాగేశ్వరరావు వెంకట్రావుపై దాడిచేసిన వ్యక్తిని వెంటబెట్టుకుని ఆసుపత్రికి చేరుకున్నారు. తిరుమలరావు దగ్గరకు వెళ్లి, ‘మావాడిని కూడా కొట్టారు. ముందు మా వాడు చెప్పిన వివరాలు తీసుకోండి’ అంటూ హుకూం జారీ చేశాడు. అది వీలుపడదని చెప్పిన హెడ్ కానిస్టేబుల్ తిరుమలరావుతో ఘర్షణపడి అక్కడే అతడిపై దాడిచేశాడు. దీనిపై తిరుమలరావు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం త్రీటౌన్ పీఎస్లో 42/2026 కేసు నమోదైంది. నిందితుడు ఎయిర్టెల్ నాగేశ్వరరావును ఇప్పటివరకూ అరెస్టు చేయలేదని తెలిసింది. -
కరుణించమ్మా.. పోలేరమ్మా !
భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పేరాల పోలేరమ్మ తల్లి చీరాల: కోరిన కోర్కెలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న పేరాల పోలేరమ్మ తల్లి శిడిమహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరగనుంది. పోలేరమ్మ గుడి స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సర తిరునాళ్ల జరగనున్నాయి. మంగళవారం శిడి మహోత్సవం, తిరునాళ్ల జరగనున్నాయి. చీరాల పట్టణంలో జరిగే పోలేరమ్మ తిరునాళ్లకు ఎంతో విశిష్టత ఉంది. స్థానిక హరిప్రసాద్నగర్లో పోలేరమ్మ తల్లి వేంచేసి ఉంది. గత 50 ఏళ్లుగా ప్రతి ఏడాది అమ్మవారి తిరునాళ్లను ఘనంగా నిర్వహిస్తారు. శక్తి స్వరూపం కలిగి, భక్తుల పాలిట కొంగు బంగారంగా ఉండే పోలేరమ్మ అమ్మవారి గుడి అంటే చీరాల ప్రాంతంలో ప్రసిద్ధి. తొలుత స్థానిక గ్రామస్తులు చిన్న గుడిని ఏర్పాటు చేసి అమ్మవారిని స్థాపించగా ప్రస్తుతం ఆ దేవాలయం దినదినాభివృద్ధి చెంది పట్టణంలోనే విశిష్టత కలిగిన అమ్మవారిగా పేరు పొందింది. దేవాలయం అభివృద్ధిలో దేవస్థాన కమిటీ, సభ్యులు విశేష కృషి చేశారు. ప్రతి మంగళ, ఆదివారాల్లో భక్తులు విరివిరిగా వచ్చి విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఆపదలో ఉన్న భక్తుల కష్టాలు, కోర్కెలను తీర్చే తల్లిగా పోలేరమ్మ తల్లికి పేరుంది. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
చేబ్రోలు: చేబ్రోలులోని కొమ్మమూరు బ్రిడ్జి ప్రాంతంలో సోమవారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. చేబ్రోలు శివారులోని కొమ్మమూరు బ్రిడ్జిపై నుంచి చానల్లోకి ప్రమాదవశాత్తూ టిప్పర్ బోల్తా పడిపోవటంతో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. పేరేచేర్ల ప్రాంతానికి చెందిన టిప్పర్ మెటల్ను లోడ్ చేసుకొని దిగుమతి చేసి తిరిగి బయలుదేరింది. చేబ్రోలు శివారులోని కొమ్మమూరు బ్రిడ్జి సమీపంలోకి వచ్చే సమయానికి టిప్పర్ అదుపుతప్పి బ్రిడ్జి రైయిలింగ్ను ఢీకొని సుమారు 25 అడుగుల లోతున ఉన్న కొమ్మమూరు చానల్లో బోల్తా పడింది. ఈ సంఘటనలో టిప్పర్ డ్రైవర్ కసుకర్తి లక్ష్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చేతులు, కాళ్లు, నడుంకు బలమైన గాయాలైన డ్రైవర్ లక్ష్మయ్యను 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ బ్రిడ్జి రైయిలింగ్ను ఢీకొని ఛానల్లో పడిపోయిన సమయంలో ఎదురుగా ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బ్రిడ్జి పై భాగంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఉంటే పెను ప్రమాదం జరిగిన ప్రాణ నష్టం జరిగే ఉండేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. పొన్నూరు వైపు నుంచి వస్తున్న టిప్పర్ కట్టెంపూడి అడ్డరోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. మునిపల్లె వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని, మంచాల గ్రామం వద్ద అతివేగంగా వాహనాన్ని నడిపిన డ్రైవర్ చివరకు కొమ్మమూరు బ్రిడ్జిపై నుంచి చానల్లోకి బోల్తా కొట్టినట్లు వాహనదారులు తెలిపారు. -
ముందు బుక్ చేసిన వారికి సిలిండర్ డెలివరీ చేయాలి
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: ముందు బుక్ చేసిన వారికి ముందు సిలిండర్ డెలివరీ చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. జిల్లాలో ఎల్.పి.జి సేల్స్ ఆఫీసర్స్, గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లుతో సోమవారం వీడియో కాన్ఫరెనన్స్లో జేసీ మాట్లాడుతూ ఎక్కువ పెండెన్సీ ఉన్న ఏజెన్సీలు అదనపు లోడ్స్ తెప్పించాలని సేల్స్ ఆఫీసర్స్కు సూచించారు. గ్యాస్ ఏజెన్సీలు ఖచ్చితంగా డోర్ డెలివరీ మాత్రమే చేయాలనని, ముందు బుక్ చేసుకున్నవారికి ముందు పంపిణీ చేసే పద్ధతిని పాటించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డెలివరీ బాయ్స్ను ఎక్కువ ట్రిప్పులు తిరిగి అధిక సంఖ్యలో పంపిణీ చేయాలని తెలిపారు. మార్చి నెలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐ.వి.ఆర్.ఎస్ సర్వేలో దీపం పథకానికి జిల్లా మొదటి స్థానం సాధించిందని అందరినీ అభినందించారు. ఇకపై కూడా ఇదే పనితీరును కనబరచాలని అన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, తహసీల్దార్లు పాల్గొన్నారు. కొండపాటూరుకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు పట్నంబజారు: కొండపాటూరు అమ్మవారి ఉత్సవాలు పురస్కరించుకుని ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం డి.సాంబ్రాజ్యం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 7న ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొండపాటూరులో వేంచేసియున్న పోలేరమ్మ తిరునాళ్ల మహోత్సవానికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 7వ తేదీ ఉదయం 5 నుంచి ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సును ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఈ బస్సుల్లో గుంటూరు డిపో–1 నుంచి పొన్నూరు నుంచి 20 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. పెద్దలకు గుంటూరు డిపో–1 నుంచి రూ.55, పిల్లలకు రూ.30 ప్రయాణ చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు. పొన్నూరు నుంచి పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30 నిర్ణయించామని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్పెషల్ బస్సులతోపాటు, నిత్యం తిరిగే సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలు, దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. భట్టిప్రోలు: భట్టిప్రోలు మండలంలో గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సూరేపల్లి–వేమవరం మధ్య 216–ఎ జాతీయ రహదారి సమీపంలో బహిరంగసభ నిర్వహించనున్నారు. సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, బాపట్ల ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు అధికారుల బృందం బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించారు. వీరు అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట రేపల్లె ఆర్డీవో బి.శ్రీదేవి, డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, వేమూరు సీఐ వీరాంజనేయులు, ఇన్చార్జి తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు ఎస్ఐ ఎం.శివయ్య తదితరులు ఉన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు సోమవారం బంగారు మంగళ సూత్రాలను కానుకగా సమర్పించారు. విజయవాడ ఆచార్యరంగానగర్కు చెందిన జి.శరత్బాబు కుటుంబం సుమారు 22 గ్రాముల బంగారంతో రూ. 4లక్షలతో తయారు చేయించిన రెండు మంగళ సూత్రాలను ఆలయ చైర్మన్ రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల జవాబు పత్రాలకు మూల్యాంకన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. నల్లచెరువు మెయిన్రోడ్డులోని మహావీర్ మెమోరియల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో మూల్యాంకన విధులకు నియమించిన ఉపాధ్యాయులు హాజరయ్యారు. స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో షేక్ సలీమ్ బాషా ఉపాధ్యాయులకు విధులను అప్పగించారు. గుంటూరుజిల్లాలో మూల్యాంకనం జరిపేందుకు ప్రభుత్వం 1,83,369 ఆన్సర్ స్క్రిప్ట్లను కేటాయించగా, వాటికి 10రోజుల వ్యవధిలో మూల్యాంకనం నిర్వహించాల్సి ఉంది. ఇందుకు గానూ చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్లతో పాటు స్పెషల్ అసిస్టెంట్స్ విధుల్లో వివిధ కేడర్లకు చెందిన 950 మంది ఉపాధ్యాయులను నియమించారు. అదే విధంగా అనారోగ్య పరిస్థితులతో పాటు వివిధ కారణాలతో స్పాట్ వాల్యూయేషన్ విధుల నుంచి మినహాయింపు కోరుతూ ఉపాధ్యాయులు అధికారుల ఎదుట క్యూ కట్టారు. ఉపాధ్యాయుల ఇబ్బందులు తెలుసుకున్న అధికారులు వారి నుంచి మెడికల్ సర్టిఫికెట్లు, ధ్రువపత్రాలు పరిశీలించి విధుల నుంచి మినహాయింపు కల్పించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన.. సమస్యలు పరిష్కరించని ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం నల్లచెరువు మెయిన్రోడ్డులోని మహావీర్ మెమోరియల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో ఫ్యాప్టో పిలుపు మేరకు ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలను ధరించి విధులకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఫ్యాప్టో గుంటూరు జిల్లా చైర్మన్ కె.నరసింహారావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేశామని, ఇందులో భాగంగా నల్లబ్యాడ్జీలతో స్పాట్ వాల్యూయేషన్ విధులకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు.రాజశేఖర్రావు, మహమ్మద్ ఖాలీద్, జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ బాజీ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు సత్వరం పరిష్కరించండి
జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట కొల్లూరు: ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట అన్నారు. సోమవారం కొల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు కట్టుబడి ఉండాలన్నారు. పీజీఆర్ఎస్లో సమస్యలపై వచ్చిన అర్జీలను శాఖల వారీగా సంబంధిత అధికారులు పరిశీలించి, నెల రోజుల వ్యవధిలో క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. పలు సమస్యలపై 75 అర్జీలు అందినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా కృష్ణానదీ వరదలు, తుపాను కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని సీఐటీయూ నాయకులు అర్జీ అందించారు. జొన్న, మొక్కజొన్న పంట ఉత్పత్తులకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ జేసీకి అర్జీలు అందజేశారు. వీటితోపాటు స్మశాన స్థలాలు, చుక్కల భూముల సమస్యలు, వివాదాస్పద డొంకరోడ్డు సమస్యలను పరిష్కరించాలని అర్జీలు అందాయి. కార్యక్రమంలో భూ రికార్డ్స్ సర్వే శాఖ ఏడీ సాంబశివరావు, ప్రత్యేక అధికారిణి పద్మావతి, ఎంపీడీఓ ఎ.స్పందన, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ను ఆదర్శంగా తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: గొప్ప సామాజిక సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడైన డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు. జగ్జీవన్రామ్ జయంతి మహోత్సవ కార్యక్రమం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అధికారులతో కలసి జగ్జీవన్రామ్ చిత్రపటానికి పుష్పమాలలతో నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని తెలుగు తల్లి గేయంతో ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జగ్జీవన్రామ్ దళిత కులం నుంచి తొలి రాజకీయ నాయకుడు, భారత ఉప ప్రధానిగా ఎదిగిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. మంత్రి పదవులను సమర్థంగా నిర్వహించారని, మంత్రిగా ఆయన పనిచేసిన కాలంలో హరిత విప్లవం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. పేదరికం నుంచి వచ్చిన జగ్జీవన్రామ్ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని, భారతదేశ సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్గౌడ్, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ సాధికారత అధికారి రాజాదెబోరా, డీఆర్డీఏ పీడీ సింగయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, జిల్లా అధికారులు, ఎస్సీ, ఎస్టీ నాయకులు చార్వాక, ఎన్ మోహన్ కుమార్ ధర్మ, పల్నాటి శ్రీరాములు, భగవాన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగని అక్రమ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం
నరసరావుపేట: పట్టణంలోని శ్రీరాంపురం జామియా మసీదు పక్కన వక్ఫ్బోర్డు స్థలంలో ఆ సంస్థల ముందస్తు అనుమతి లేకుండా, మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూనే ఉంది. శనివారం కూడా కొందరు కూలీలు పనులు చేస్తూ కన్పించారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తుంగలో తొక్కి వక్ఫ్బోర్డు అధికారులను పట్టించుకోకుండా టీడీపీ ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమార్కులు యథేచ్ఛగా నిర్మాణం చేస్తున్నారు. కొందరు టీడీపీ మైనార్టీ నాయకులు పాత షాపుల యజమానులను పక్కనపెట్టి పట్టణంలోని కొందరు వ్యక్తుల వద్ద లక్షలకు లక్షలు డబ్బులు వసూలుచేసి వారికి షాపులు కేటాయిస్తున్నారని మాజీ కౌన్సిలర్ షేక్ జాని మౌలాలీ ఆరోపిస్తున్నారు. వివరాలు.. వక్ఫ్బోర్డు స్థలంలో ముస్లిం మైనార్టీలు 72 షాపులతో వ్యాపారాలు చేస్తుండగా 2018లో నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పేరుతో టీడీపీ నాయకులు కాంప్లెక్స్ను కూల్చివేశారు. వెంటనే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయలేకపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం మారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాత వ్యాపారులకే షాపులు కేటాయించటం జరుగుతుందని, ఎవరికీ అన్యాయం చేయబోమని ప్రకటించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టగా కొందరు టీడీపీ వ్యక్తులు కోర్టును ఆశ్రయించి నిర్మాణంపై స్టే తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొందరు వ్యక్తులు జామియా మసీదుకు తామే వారసులం అంటూ అదిలే సున్నత్ జామియా మసీదు సంఘం పేరుతో ఒక ప్రైవేటు సంఘం సృష్టించారు. పాత షాపుల యజమానులు, మరికొందరు నూతన వ్యక్తుల వద్ద డబ్బులు వసూలు చేసి అనధికారికంగా నిర్మాణం చేపట్టారు. దీనిపై మాజీ కౌన్సిలర్, మసీదు మేనేజ్మెంట్ కమిటీ సెక్రటరీ షేక్ జాని మౌలాలి, మరో వ్యక్తి కలిసి హైకోర్టును ఆశ్రయించగా నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి, వారం రోజులలో తమకు నివేదిక అందజేయాలని షేక్ రహమత్ఆలీ, మున్సిపల్, వక్ఫ్బోర్డు అధికారులు, పిటిషనర్లు సూచించిన నిర్మాణ దారులకు నోటీసులు జారీ చేసింది. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. దీంతో నిర్మాణ మేస్త్రిగా ఉన్న వ్యక్తిని తప్పించి మరో వ్యక్తి ద్వారా కూలీల సహాయంతో నిర్మాణం చేస్తున్నారు. దీనిపై జాని మౌలాలి వక్ఫ్బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీనిపై వక్ఫ్బోర్డు అనుమతిలేకుండా షాపులు ఎందుకు నిర్మిస్తున్నారు, ఎంత డబ్బులు వసూలు చేశారో చెప్పాలని కోరుతూ రహమత్ఆలీ అనే వ్యక్తికి బోర్డు సీఓ నోటీసులు ఇచ్చారు. దీనిపై జిల్లా వక్ప్బోర్డు ఇన్స్పెక్టర్ నూహ్ ఆలీషాను వివరణ కోరగా జరుగుతున్న నిర్మాణాలను ఆపాలని నోటీసులు అందజేశామని, అయినప్పటికీ నిర్మాణం జరుగుతూనే ఉందని, దీనిపై పోలీసుల సహాయంతో నిర్మాణం ఆపేందుకు వక్ఫ్బోర్డు అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. -
వలస కూలీలపై నిర్లక్ష్య ధోరణి వీడాలి
నరసరావుపేట: రాష్ట్రంలోని వలస కార్మికులకు రక్షణ చట్టం తక్షణమే అమలు చేసి చనిపోయిన వారికి రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. వలస ప్రాంతాల్లో ఉచిత రవాణా, నివాసం, తాగునీరు, వైద్యం, రేషన్ సదుపాయాలు కల్పించడంతో పాటు పిల్లల విద్య ఆగిపోకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలు జిల్లా నుండి మిర్చి కోత పనుల కోసం నరసరావుపేట మండలం కేసానుపల్లి, ఇర్లపాడు గ్రామాలకు వలస వచ్చిన కార్మికులను ఆదివారం సంఘం రాష్ట్ర నాయకుడు వి.వెంకటేశ్వర్లు, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల కార్యదర్శులు జి.రవిబాబు, ఈ.అప్పారావు, కంకణాల ఆంజనేయులు పరామర్శించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికుల దుస్థితి దారుణంగా మారిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి లేక గ్రామాలు ఖాళీ అవుతుండగా, వలసల బారిన పడిన కూలీల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని మండిపడ్డారు. నాలుగు నెలలుగా గ్రామాల్లో వ్యవసాయ కార్మికులకు పనులు లేకపోవడంతో పాటు, ఉపాధి హామీ పనులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ పరిస్థితుల వల్ల లక్షలాది మంది కూలీలు పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్లాల్సి వస్తోందని, ఈ వలసలలో జరిగిన ప్రమాదాల్లో ఇప్పటికే 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇటీవల కోసిగి మండలానికి చెందిన ఓ వ్యవసాయ కార్మికుడు వడదెబ్బతో మతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ, అతని కుటుంబం అనాధగా మారిందని, అయినా ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదని విమర్శించారు. -
సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతున్న నాటికలు
మూడో రోజుకు చేరిన ప్రదర్శనలుయడ్లపాడు: పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు చివరి రోజైన ఆదివారం అట్టహాసంగా కొనసాగాయి. తెలుగు నాటక పరిషత్ల సమ్మేళన సంఘం వేదిక, సుందరయ్య కళా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు నేతృత్వంలో నిర్వహిస్తోన్న ఈ కళారూపాలు సమకాలీన పరిస్థితుల్ని ఆవిష్కరించాయి. వీటితోపాటు యడ్లపాడు మానవతా సాగరి వారి ప్రత్యేక ప్రదర్శన మంచివారే కానీ..నాటిక హాస్యం, సామాజిక బాధ్యత అవశ్యం అంశాల్ని సున్నితంగా స్పృశించాయి. ఇక మూడోరోజున ముచ్చటగా ప్రదర్శించిన మూడు నాటికలు ప్రేక్షకులను ఎంతో రంజింపజేశాయి. ముగింపు లేని కన్నీటి కావ్యం ‘మమ్మల్ని బతకనివ్వండి’ రెక్కలు వచ్చి ఎగిరిపోయిన పిల్లల జ్ఞాపకాల మధ్య, పెన్షన్ డబ్బులే ప్రాణాధారంగా బతుకుతున్న ఆ వృద్ధ జంటను జలప్రళయం చుట్టుముట్టగా, రక్షించాల్సిన వారే రాబందులై దోచుకున్న వైనం సమాజపు నైతిక పతనాన్ని ఈ నాటిక కళ్లకు కట్టింది. కుండపోత వర్షంలో చావుకు చేరువైన భార్యను కాపాడుకునేందుకు ఆ వృద్ధుడు తన వద్దనున్న సర్వస్వాన్ని ధారపోసినా, చివరకు ఆమె మూర్ఛవ్యాధితో కన్నుమూయడం ప్రేక్షకులను కంటతడి పెట్టించే విషాదాంతం. ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవాల్సిన మానవత్వం మంటగలిసి, వాణిజ్య విలువల ముసుగులో సామాన్యుడి ప్రాణం ఎలా గాలిలో కలిసిపోతుందో ఈ నాటిక లోతైన సందేశాన్ని ఇచ్చింది. విజయవాడ సాంస్కృతిక సమితి(విజయవాడ) వారు ప్రదర్శించిన ఈ నాటికకు సుఖమంచి కోటేశ్వరరావు అందించిన రచన, దర్శకత్వం వహించారు. మానవత్వం నిండుకున్న ‘మంచి మనసులు’ ఆపదలో ఉన్న తోటి మనిషిని చూసి ముఖం చాటేయకుండా, కష్ట సుఖాలను పంచుకుంటూ చేయూతనివ్వడమే నిజమైన దైవత్వమని ఈ నాటిక ఇతివృత్తం. స్వార్థం రాజ్యమేలుతున్న కాలంలో మనుషుల మధ్య కేవలం అవసరాల బంధాలే కాకుండా, అంతకు మించిన సున్నితమైన అనుబంధాలు, నిస్వార్థమైన సేవ ఉండాలని చూపిన ప్రతి సన్నివేశం మనసులను కదిలిస్తుంది. అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలనే ఉన్నత ఆశయంతో, సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ సమాజం సుభిక్షంగా ఉండటానికి మానవీయ విలువలూ ప్రాణవాయువు లాంటివని ఈ నాటిక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఉషోదయ కళానికేతన్ (కట్రపాడు) వారు ప్రదర్శించిన ఈ నాటిక రచన, దర్శకత్వం చెరుకూరి సాంబశివరావు వహించారు. తెగిన తరాల అనుబంధం ‘చిటికెన వేలు’ అడవి తల్లి ఒడిలో స్వేచ్ఛగా సాగే సోమన్న జీవన పోరాటాన్ని, నాగరికత పేరిట ప్రవేశించిన దోపిడీ శక్తులు ఎలా కబళించాయో చిటికెన వేలు నాటిక అద్దం పడుతుంది. తాతా మనవళ్ల మధ్య వారసత్వంగా అందిన చిటికెన వేలు బంధం మారుతున్న కాలం తెచ్చిన కొత్త పోకడల వల్ల తెగిపోవడం..తన భూమిని, ఉనికిని కోల్పోయి సోమన్న ఒంటరివాడవ్వడం నేటి సామాజిక మార్పులోని క్రూరత్వాన్ని ఎండగట్టింది. గూడెం సంస్కృతిని మింగేస్తున్న ఆధునికతను నిరసిస్తూ, మూలాలను కోల్పోతున్న మనిషి నిస్సహాయతను ఈ కథాంశం సమాజానికి ఒక హెచ్చరికలా చాటిచెప్పింది. తెలుగు కళాసమితి(విశాఖపట్నం) వారు ప్రదర్శించిన ఈ నాటికను అట్టాడ అప్పలనాయుడు రచించగా చలసాని కృష్ణప్రసాద్ దర్శకత్వం వహించారు. -
బాపట్ల
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5844 టీఎంసీలు.బాపట్ల: బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో ఈనెల 9వ తేదీన జరిగే పట్టదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠ రోజురోజుకూ మసకబారుతోంది. ప్రజలకు తామున్నామని భరోసా ఇవ్వాల్సిన పోలీసు అధికారులు వరుస ఆరోపణలతో బజారున పడుతున్నారు. దీంతో ఆ వ్యవస్థపై విశ్వసనీయత దెబ్బతింటోంది. ఇటీవల కాలంలో జిల్లాలో వెలుగుచూసిన అనేక సంఘటనలు పోలీసు వ్యవస్థలో లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో పల్నాడులో పోలీసు వ్యవస్థ దారితప్పుతోంది. పల్నాడు జిల్లాలోని దాచేపల్లి పోలీసుస్టేషన్లో పనిచేసిన సీఐ భాస్కర్ ఓ మహిళతో సహజీవనం చేశాడన్న ఆరోపణలపై వారం క్రితం వీఆర్కు పంపినట్టు తెలుస్తోంది. గతంలో మహిళతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఈ సీఐ వ్యవహారాన్ని ఆధారాలతో పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధికి అందించాడు. త్వరలో మీడియా ముందు బహిర్గతం చేస్తానని చెప్పాడు. అదే జరిగితే పోలీసు శాఖకు మాయని మచ్చగా మిగులుతుందని భావించిన ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. వాస్తవానికి సీఐపై వచ్చిన ఆరోపణ తీవ్రత దృష్ట్యా సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేయాల్సి ఉంది. అతనికున్న రాజకీయ పలుకుబడి కారణంగా నామమాత్రపు చర్యలు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇది ఇలా ఉండగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై పోలీసులు ప్రతి చర్యకు దిగినట్టు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళతో ఫిర్యాదు చేయించి అతన్ని అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతన్ని బెదిరించి ఎలాగైనా తనకున్న పలుకుబడితో మళ్లీ దాచేపల్లికి సీఐగా రావాలని భాస్కర్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. హత్యకు సహకరించిన సీఐపై వేటు... మాచర్లకు చెందిన చౌడేశ్వరి నెల కిందట నాగరాజు అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ వ్యవహారంలో తలదూర్చిన మాచర్ల టౌన్ సీఐ వెంకటరమణ.. యువతి తండ్రి చంద్రశ్రీనుతో బేరం కుదుర్చుకొని యువతిని బలవంతంగా తండ్రికి అప్పగించాడు. దీంతో కుమార్తెను గత నెల 18వ తేదీన తండ్రి హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడు. విషయం బయటకు రావడంతో సదరు సీఐ వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం చేశాడు. వైద్యురాలు సహకరించకపోవడంతో వ్యవహారం బెడిసికొట్టింది. మీడియాలో కథనాలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో సీఐ అవినీతి బాగోతం వెలుగుచూసింది. సుమారు రూ.6.5 లక్షలు చేతులు మారినట్టు నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆదివారం సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. సివిల్ పంచాయితీలకు ఆ స్టేషన్ అడ్డా... పిడుగురాళ్ల పోలీసు స్టేషన్ సివిల్ పంచాయితీలకు అడ్డాగా మారింది. అక్కడ ప్రజాప్రతినిధి అండతో ద్వితీయ శ్రేణి నాయకులు నిత్యం ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఆర్యవైశ్య వ్యాపారులను అనేక మందిని బలవంతంగా స్టేషన్లో ఉంచి వారిచే ఆస్తులను రాయించుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల కంట పడకుండా వెనుక ఉన్న క్వార్టర్ట్స్లో ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నారట. గత ఏడాది డిసెంబర్లో ఓ ఆర్యవైశ్య మహిళ పిడుగురాళ్ల పోలీసు స్టేషన్లో పోలీసుల వేధింపులు తాళలేక కత్తితో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంత జరిగినా ఆ సీఐపై చర్యలు తీసుకోకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు. బుకీలను తప్పించిన పోలీసులు... క్రికెట్ బెట్టింగ్ నిర్మూలనపై పల్నాడు జిల్లా ఎస్పీ దృష్టి సారించి బుకీల ఏరివేతకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులను రంగంలోకి దించారు. విషయం తెలుసుకున్న జిల్లాలోని కొంతమంది అవినీతి అధికారులు ఆ సమాచారాన్ని బుకీలకు ముందుగానే చేరవేశారు. దీంతో బుకీలంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. వారి ఆచూకీ కోసం ఎస్బీ పోలీసులు గాలిస్తున్నా ప్రయోజనం దక్కడం లేదు. అందరి సెల్ఫోన్ సిగ్నల్లు ఇతర రాష్ట్రాలలో ఉన్నట్టు కనిపిస్తుండటంతో వారిని పట్టుకోవడం సవాలుగా మారింది. ఐపీఎల్, వర్డల్ కప్, ఇతర ముఖ్యమైన మ్యాచ్లు జరిగే సమయంలో బుకీల వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఆయా స్టేషన్లలో పనిచేసే కొంతమంది అధికారులు, సిబ్బంది మామూళ్లు తీసుకుంటున్నారు. బుకీలు చిక్కితే వీళ్ల అవినీతి బాగోతం బయటపడుతుందని పరారీకి సహకరించినట్టు సమాచారం. నేరుగా బుకీలతో సంబంధం పెట్టుకొని బెట్టింగ్ ఆడిస్తున్న ఓ సీఐపై వ్యవహారంపై జిల్లా ఎస్పీ దృష్టి సారించినట్టు తెలియవచ్చింది. వీఆర్కు వెళ్లిన దాచేపల్లి సీఐ భాస్కర్ సస్పెన్షన్కు గురైన మాచర్ల టౌన్ సీఐ వెంకటరమణ7కుటుంబంలో కలహాలు పొడచూపినా.. అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు తలెత్తినా.. బలహీనులపై బలవంతుల దౌర్జన్యాలు పేట్రేగినా బాధితులకు కనిపించే ఏకై క ధైర్యం.. పోలీసులు. అలాంటిది పల్నాడు జిల్లాలో కొందరు పోలీసు అధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది. అధికారం అండగా చెలగేరిపోతున్నారు. బాధితులకు అందాల్సిన న్యాయాన్ని పోలీసు స్టేషను మెట్ల వద్దే సమాధి చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో తొక్కేయాల్సిన వారు అరాచకాలకు పాల్పడేవారికి అండగా నిలుస్తున్నారు. తాజాగా ఓ సీఐ రాసలీలల బాగోతం, మరో సీఐ లంచావతారం, ఇంకో సీఐ అధికార పార్టీ దాసోహం... ఇలా జిల్లా పోలీసు వ్యవస్థకు మాయని మచ్చగా మారాయి. ఇప్పటికే చిలకలూరిపేట పట్టణం పేకాటకు అడ్డాగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి జూదగాళ్లు తరలి వస్తున్నారు. నిత్యం రూ.కోట్లు చేతులు మారుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలోని తిమ్మాపురం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ పేకాట శిబిరాలపై సీఐ దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకొని పేకాట రాయుళ్లను స్టేషన్కు తరలించాడు. ఇక్కడి రెండు వర్గాల్లో ఓ వర్గానికి మద్దతుగా రెండో వర్గం వారిపై ఇలా దాడులు జరిగాయి. కానీ ఈ వ్యవహారంలో చినబాబు వద్ద పనిచేసే వ్యక్తి కలుగుజేసుకొని సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో సీఐ వెనక్కితగ్గి ఆ పేకాట రాయుళ్లను కేసు లేకుండా విడిచిపెట్టాడు. మిగతా చోట్ల సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
కోటి విలువైన మున్సిపల్ స్థలం హాంఫట్
చదునుచేసి ఆక్రమించుకున్న అధికార పార్టీ నేతనరసరావుపేట: నరసరావుపేటలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులను లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారు. ఖాళీ ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు..దానిపై కర్చీఫ్ వేసి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక బరంపేటలోని కాపుల ఆరామక్షేత్రం–స్టేడియం గోడకు మధ్యనున్న రూ.కోటి విలువైన సుమారు ఏడు సెంట్ల మున్సిపల్ స్థలంపై నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరుడి కళ్లు పడ్డాయి. ఇతను బీసీ కాలనీలో ఉంటూ అధికార పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటాడు. రెండు రోజుల నుంచి ఈ స్థలాన్ని ప్రొక్లయినర్తో చదును చేశాడు. సమీపంలోని మహిళలు ఇదేమిటని ప్రశ్నించే ప్రయత్నం చేయగా వారిని తన రౌడీల సహాయంతో బెదిరించాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో సెంటు భూమి ధర రూ.15లక్షలు ఉంటుందని చెబుతున్నారు. పట్టణంలో భూముల ధరలు విపరీతంగా పెరగటంతో అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలపై కన్నేశారు. సత్తెనపల్లిరోడ్డులోని కత్తవ కాలువ స్థలాన్ని కొంతమంది ఆక్రమించేందుకు ప్రయత్నించగా స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో ఇటీవలనే మున్సిపల్ అధికారులు ఆక్రమణలను తొలగించారు. దీనిని కూడా స్వాధీనం చేసుకొని అక్రమార్కుల నుంచి విలువైన స్థలాన్ని కాపాడాలని కోరుతున్నారు. దీనిపై మున్సిపల్ టీపీఓ సాంబయ్యను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నరసరావుపేట రూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు. నరసరావుపేటలోని బరంపేటకు చెందిన తెల్లగోర్ల చందు(28) ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఆదివారం చిలకలూరిపేట వైపు నుంచి పల్సర్ బైక్ వచ్చే క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి ముందుగా వెళ్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిన చందు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రూరల్ పోలీసులు ఘటనా స్దలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ కిషోర్ తెలిపారు. మద్యంమత్తులో యువకుల హాల్చల్ కేసానుపల్లిలో మద్యం మత్తులో యువకులు హల్చల్ చేశారు. రోడ్డు ప్రమాదంలో చందు మృతిచెందిన సమాచారం తెలుసుకున్న కారంపూడి, ఓబులేసులపల్లి, నరసరావుపేటకు చెందిన పలువురు యువకులు ఘటనా స్థలానికి బయలుదేరారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులు కేసానుపల్లిలోని వాటర్ప్లాంట్ సమీపంలోని బెల్ట్షాపులో మద్యం సేవించారు. ఈ సమయంలో బెల్ట్షాప్ నిర్వాహకుడిపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న గ్రామస్తులపై కూడా యువకులు దుర్భాషలాడారు. గ్రామస్తులు యువకులకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో చిలకలూరిపేట–నరసరావుపేట రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. -
బాబూ జగ్జీవన్రామ్ ఆదర్శనీయుడు
బాపట్ల: వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినప్పటికీ విద్యలోనూ, ఉన్నత విలువల సాధనలోను అకుంఠిత దీక్షతో పోరాడి సమానత్వ భావన కోసం విశేషంగా కృషి చేసిన మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ విద్యార్థి లోకానికి ఆదర్శనీయుడని వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు ఇనగలూరి మాల్యాద్రి పేర్కొన్నారు. బాబూ జగ్జీవన్రామ్ జయంతి కోన భవనంలో ఆదివారం నిర్వహించారు. మాల్యాద్రి మాట్లాడుతూ మహాత్మాగాంధీ ప్రారంభించిన అంటరానితనం వ్యతిరేక ఉద్యమంలోను, సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలోను చురుకుగా పాల్గొన్నందుకు రెండుసార్లు జైలు శిక్ష అనుభవించిన జగ్జీవన్రామ్ స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్లో కార్మిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఆ పదవికే వన్నె తెచ్చారన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా వ్యవసాయాన్ని ఆధునికీకరించడంలో ఆయన నిర్వహించిన పాత్ర గణనీయమైనదని, భారత దేశంలో హరిత విప్లవ సాధనలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనదన్నారు. 1974లో కరువు సంభవించినప్పుడు ఆహార ధాన్యాల కొరతను నివారించడం కోసం ఆయన అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించి, ఆ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించి రైతాంగం మన్ననలు పొందారన్నారు. తొలుత జగ్జీవన్రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో బాపట్ల పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్ బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. జగ్జీవన్రామ్ జీవితం యువతకు ఆదర్శం బాపట్లటౌన్: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జీవితాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళుర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ అణగారిన వర్గాలు వివక్షకు గురౌతున్న తరుణంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిస్వార్థ పోరాటాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు తన వంతు కృషి చేశారన్నారు. అలాంటి గొప్ప నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడుని స్మరించుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. ఆదర్శనీయమైన మహోన్నత వ్యక్తి నుంచి సద్గుణాలను అలవర్చుకుని సమాజం కోసం మనవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్బి సీఐ బి.నారాయణ, ఆర్ఎస్ఐ శ్రీనివాస్, సీసీ హరికృష్ణ, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి జగ్జ్జీవన్రామ్ బాపట్లటౌన్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆహర్నిశలు శ్రమించిన ఘనుడు బాబూ జగ్జీవన్రామ్ అని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని బాపట్లలోని ఎంపీ కార్యాలయంలో జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఎంపీ మాట్లాడుతూ యువతరం జగ్జీవన్రామ్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పటాన్ రాజేష్, భోగిరి రామారావు, నర్రా ఏడుకొండలు, బడుగు పృధ్వీరాజ్, ఆర్ నాగేశ్వరావు, నీలాంబరం, బోగిరి పృధ్వీరాజ్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు ఇనగలూరి మాల్యాద్రి -
మార్టూరులో ఐజీ ఆకస్మిక పర్యటన
మార్టూరు: గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆదివారం రాత్రి మార్టూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో స్టేషన్కు చేరుకున్న ఐజీ మొదట రికార్డులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసులు వాటి వివరాలు గురించి అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి, సిబ్బంది పని తీరుపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర్, సీఐ వై.శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రేపల్లె: బాపట్ల జిల్లా రేపల్లె పట్టణానికి చెందిన మద్దుల ఏసుకుమారి(27) ఆదివారం అంబులెన్ ్సలోనే పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. పూరిటి నొప్పులతో ఆమెను రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా హీమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండటం, నొప్పులు అధికంగా ఉండటంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో 108లో తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవ వేదనలు పెరిగి అంబులెన్స్లోనే ప్రసవం జరిగింది. అనంతరం వారిని తెనాలి ఆసుపత్రికి చేర్చగా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఈఎంటీ కేసన మహేష్ బాబు తెలిపారు. దుగ్గిరాల: మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. యువకులు మద్యం సేవించి చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలివానలా మారి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు...ఆదివారం కంఠంరాజుకొండూరు గ్రామంలోని అమ్మవారి దేవస్థానం దగ్గర ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. తాడేపల్లికి చెందిన పేరుపోగు వంశీని తలపై ఇనుపు రాడ్డుతో తెనాలికి చెందిన వ్యక్తులు కొట్టగా తల పగిలింది. మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ వైద్యశాలకు తరలించారు. మద్యం షాపు పక్కనే ఉండటం వల్ల ఆలయానికి దర్శనం కోసం వచ్చిన వారు బాగా మద్యం సేవించి గొడలు పడుతున్నారని పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. దుగ్గిరాల: కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీటి విడుదలను ఆదివారం నుంచి నిలిపివేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రబీ సాగు చేసిన మొక్కజొన్న, జొన్న మినుము, నువ్వులు, పెసర పంటలు కోతలు పూర్తయ్యాయని తెలిపారు. మైలవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మైలవరం మండలం పుల్లూరులోని చిలుకూరువారిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రెడ్డిగూడెం మండలం రుద్రవరం తండాకు చెందిన దేవావతు రవి(30) ద్విచక్రవాహనంపై మైలవరం బయలుదేరాడు. ఈ క్రమంలో పుల్లూరు సెంటర్ సమీపంలో ఉన్న చిలుకూరువారిగూడెం జెడ్పీ హైస్కూల్ వద్దకు వచ్చే సమయానికి మైలవరం నుంచి తిరువూరు వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొని రవి రహదారిపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రవిని స్థానికులు 108 వాహనంలో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గొల్లపూడిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు. సంఘనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
నరసరావుపేట రూరల్: మండలంలోని ములకలూరులో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గ్రామ శివారులోని వాగు పోరంబోకు భూముల్లో కొన్ని రోజులుగా ఈ తవ్వకాలు సాగిస్తున్నారు. మూడు జేసీబీ మిషన్లను ఉపయోగించి మట్టిని తవ్వి పదుల సంఖ్యలో లారీలతో మట్టిని బయటకు తరలిస్తున్నారు. పగలు, రాత్రీ తేడా లేకుండా సాగుతున్న అక్రమ తవ్యకాలపై గ్రామస్తులకు రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి స్పందన లేదు. కూటమి నాయకులు అక్రమ తవ్యకాలు నడిస్తుండటంతో అధికారులు అటువైపు చూసేందుకు జంకుతున్నారు. మట్టిని టిప్పర్ల ద్వారా నరసరావుపేటకు తరలించి విక్రయిస్తున్నారు. ఒక్కో టిప్పర్కు రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. పార్లమెంట్ ప్రజాప్రతినిధికి చెందిన కార్యాలయం నిర్మాణానికి మట్టి అవసరమని చెప్పి కూటమి నాయకులు ఈ మట్టి దందాను సాగిస్తున్నారు. అక్రమ మట్టి తవ్యకాలను పరిశీలించేందుకు వెళ్లిన ఎంఐఎం నాయకులు, మీడియా ప్రతినిధులపై నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడ్డారు. -
‘మన గ్యాస్–మన హక్కు’ కోసం పోరాడాలి
నరసరావుపేట: రాష్ట్రంలోని సహజ వనరులను పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం వల్లే గ్యాస్ సంక్షోభం ఏర్పడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ‘మన గ్యాస్–మన హక్కు’ కోసం కేంద్రంపై పోరాటం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం కోటప్పకొండ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా–గోదావరి (కేజీ బేసిన్) ప్రాంతంలో విస్తారంగా గ్యాస్, ఆయిల్ నిల్వలు ఉన్నప్పటికీ వాటిని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఉన్న ఈ వనరులను వినియోగించకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి అధిక ధరలకు గ్యాస్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి రావడం విచారకరమన్నారు. రాష్ట్రానికి చెందిన గ్యాస్ పైప్లైన్ల ద్వారా గుజరాత్, మహారాష్ట్రలకు తరలించి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పంపుతూ కార్పొరేట్ సంస్థలు రూ.వేల కోట్ల లాభాలు పొందుతున్నాయన్నారు. 12వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి గ్యాస్, ఆయిల్పై సగం హక్కు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని సాధించేందుకు ప్రయత్నించలేదని విమర్శించారు. గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడి రాష్ట్ర హక్కులను సాధించాలన్నారు. ఇక ఐటీ రంగంపై మాట్లాడిన ఆయన ప్రభుత్వం ప్రకటిస్తున్న పెట్టుబడులు ఉద్యోగాలపై వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. పెద్ద కంపెనీలు ఉద్యోగాల తొలగింపులు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగులకు భద్రత కల్పించే విధానాలు తీసుకురావాలని కోరారు. ‘మన గ్యాస్–మన హక్కు’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు వి.శ్రీనివాసరావు ప్రకటించారు. -
సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
సూరేపల్లి(భట్టిప్రోలు): భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ వి. వినోద్కుమార్ శనివారం తనిఖీ చేశారు. సచివాలయంలో రికార్డులు పరిశీలించి సిబ్బంది హాజరు తనిఖీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. ఆయన వెంట భూ రికార్ుడ్స శాఖ ఏడీ సాంబశివరావు, రేపల్లె ఆర్డీవో శ్రీదేవి, వీఆర్వో చొప్పర రవి, పంచాయతీ కార్యదర్శి పృద్వీరాజ్, సచివాలయ సిబ్బంది ఉన్నారు. బాపట్లటౌన్: ఏన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు తూట్లు పొడవటం సరికాదని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు అన్నారు. దళిత హక్కుల సాధన కోసం శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దళిత సంఘాల నాయకులతో కలిసి ఆందోళన చేశారు. నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులో హైకోర్టు కూడా యాంటీ స్పెటర్ బెయిల్ ఇవ్వకూడదని చట్టం చెబితే అగ్రకుల అరాచక శక్తులను రక్షించడానికి మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు ఏడు సంవత్సరాల శిక్ష పడే వీలున్న ఎస్సీ ఎస్టీ కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతుందన్నారు. ఆందోళన చేసిన వారిలో మాల మహానాడు అధ్యక్ష కార్యదర్శులు దారా అంజయ్య, కాకుమాను రవి, వివిధ సంఘాల నాయకులు పట్రా బంగారం, మేడికొండ మురళి, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గుద్దే రాజారావు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. హైదరా బాద్ మోతీనగర్కు చెందిన పి.రజనీకాంత్ శర్మ ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధి కారులను కలిసి వేలంమర్రి సాంబశివ శర్మ, పద్మావతి పేరిట నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం అందజేశారు. బాపట్ల జిల్లా రేపల్లె రైలుపేటకు చెందిన ద్రోణవజ్జల బ్రహ్మ అవధాని దంపతులు, విజయవాడ సూర్యా పేటకు చెందిన బమిడిపాటి శ్రీమన్నారాయణ కుటుంబం, బమిడిపాటి శారద కుటుంబం రూ.లక్ష చొప్పున విరాళాలు అందజేశాయి. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం, ఆలయ ఏఈఓ వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. గుంటూరు మెడికల్: రోగి మెలకువగా ఉండగానే గుండె బైపాస్ సర్జరీ చేసి అతడి ప్రాణాలు కాపాడినట్లు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్బాబు చెప్పారు. ఆపరేషన్ వివరాలను ఆయన శనివారం గుంటూరులో మీడియాకు వెల్లడించారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన జయరావు(64)కు 2018లో కేన్సర్ సోకి ఊపిరితిత్తుల సంబంధిత సమస్య ఏర్పడటంతో ఒక ఊపిరితిత్తిని తొలగించారు. ఇటీవల చాతిలో తీవ్రమైన నొప్పి వచ్చి, తమ వద్దకు రాగా..యాంజియోగ్రామ్ చేసి, 3 రక్తనాళాలు పూడినట్లు నిర్థారించామన్నారు. రోగికి గుండె బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించి, ఊపిరితిత్తుల సమస్య ఉండి, ఒక లంగ్ తీసివేయడంతో, రోగి మెలుకువగా ఉండగానే బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించామన్నారు. రెండు రోజుల క్రితం కరోనరి ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ను విజయవంతంగా చేసినట్లు తెలిపారు. జయరావుకు మధుమేహం, బీపీ కూడా ఉన్నాయని, అత్యంత క్లిష్టమైన అనారోగ్య సమస్యలతో ఉన్న రోగికి తాము విజయవంతంగా బైపాస్ సర్జరీ చేశామని చెప్పారు. కార్యక్రమంలో హాస్పిటల్ డిప్యూటీ ఎండీ డాక్టర్ రాయపాటి మమత, ఆపరేషన్లో పాల్గొన్న గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ జయరామ్పాయ్, సీనియర్ మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ లోకనాథన్, వైద్యులు శివప్రసాద్, మృత్యుంజయ్, అశోక్కుమార్, భరత్ సిద్ధార్థ, శ్రీకాంత్ మహాపాత్ర, క్లస్టర్ బిజినెస్ హెడ్ డాక్టర్ కార్తీక్ చౌదరి పాల్గొన్నారు. -
చైతన్య ప్రబోధాలు పరిషత్ నాటికలు
యడ్లపాడు: యడ్లపాడులో పుచ్చలపల్లి సుందరయ్య కళా నిలయం 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల రెండోరోజు పోటీలు ఘనంగా జరిగాయి. శనివారం జరిగిన పోటీల్లో ప్రదర్శించిన పలు నాటికలు ఆహుతులను అలరించడమే కాకుండా ఆలోచింపజేశాయి. అస్థిత్వ పోరులో కన్నీటి సంతకం! ప్రకృతి వైవిధ్యంలోని అరుదైన వర్ణాలను అంటరానితనంతో వెలివేస్తున్న ఆధునిక సమాజపు సంకుచిత తత్వాన్ని ఎండగట్టిన కళారూపమే అమ్మచెక్కిన బొమ్మ నాటిక. సీ్త్ర, పురుష ధ్రువాల మధ్య నలిగిపోతున్న తృతీయ ప్రకృతి అస్తిత్వాన్ని, ఆత్మగౌరవం కోసం వారు చేస్తున్న అలుపెరగని పోరాటాన్ని ఈ నాటిక చూసిన ప్రతి గుండెను తట్టి ప్రశ్నిస్తుంది. గోవాడ క్రియేషన్స్ సమర్పించిన ఈ నాటిక జ్యోతిరాజ్ భీశెట్టి మూలకథ కాగా, డాక్టర్ వెంకట్ గోవాడ నాటకీకరణ, దర్శకత్వం వహించారు. బాధ్యతలో ఒదిగిన బంధం.. శ్రీమాత్రే నమః అమెరికా కలలు, కెరీర్ ఎదుగుదల కోరుకున్న ఓ ఆధునిక యువతి జీవితంలో జరిగిన ఓ ప్రమాదంతో ఊహించని విధంగా మళ్లీన ఆమె జీవన ప్రయాణమే సీ్త్ర మాత్రే నమః నాటిక. ఆశయాలకు, అనుబంధాలకు మధ్య నలిగిపోతున్న ఆమెకు ఒక పెద్దాయన తోడ్పాటుతో ధైర్యం చిక్కి, కన్నతల్లి కాకపోయినా తన సుఖాలను వదులుకుని త్యాగమూర్తిగా నిలిచే గొప్ప సందేశం ఇందులో కనిపిస్తుంది. స్వర్ణసూర్య డ్రామా రివర్స్ (హైదరాబాద్) వారి ప్రదర్శించిన ఈ నాటిక మూలకథ పూర్ణిమా పెమ్మరాజు రాయగా, ఉదయ భాగవతుల అందించిన అద్భుత నాటకీకరణ, దర్శకత్వం ఈ ప్రదర్శనకు ప్రాణం పోసి ఆలోచింపజేశాయి. శారీరక సౌందర్యపు పొరలు విడిచి.. మాతృత్వం! బాహ్య సౌందర్యం కోల్పోతాననే భయంతో మాతృత్వాన్ని నిరాకరించిన ఒక యువతి, విధి ఆడిన వింత నాటకంలో తన అహం వీడి అమ్మగా మారిన అద్భుత పరిణామమే ఈ నాటిక కథాంశం. శ్రీరమణా కళానిలయం (గుంటూరు) సమర్పణలో సుఖమంచి కోటేశ్వరరావు రాసిన ఈ నాటకానికి, పొగర్తి నాగేశ్వరరావు తన సునిశిత దర్శకత్వంతో దృశ్యరూపం ఇచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. నీడలా వెంటాడే కొంత స్వార్థం! అన్యోన్యంగా ఉండే ఒక రైతు కుటుంబంలో ప్రాణప్రియమైన మరదలి వైద్యం కోసం డబ్బు ఖర్చు చేయవద్దని వదిన అడ్డుపడటంతో తలెత్తిన మమకారాల సంఘర్షణే ఈ నాటిక ఇతివృత్తం. జరుగుల రామారావు రచన, దర్శకత్వంలో మానవత సాగరి (యడ్లపాడు) బృందం అద్భుత నటనతో సామాన్యుల గుండెలను పిండేలా ఈ నాటికను అందరి మనసుల్ని తాకింది. నేటి కార్యక్రమాలు.. సుందరయ్య కళానిలయం ఆధ్వర్యాన 5వ తేదీ ఆదివారం నిర్వహించే కార్యక్రమాలు... రాత్రి 7.15 గంటలకు విజయవాడ సాంస్కృతిక సమితి (విజయవాడ) వారి ‘మమ్మల్ని బ్రతక నివ్వండి’ నాటిక, 8.15 గంటలకు ఉషోదయ కళానికేతన్(కట్రపాడు) వారి ‘మంచి మనసులు’ నాటిక, 9.30 గంటలకు తెలుగు కళాసమితి(విశాఖపట్నం) వారి ‘చిటికిన వేలు’ నాటికల అనంతరం బహుమతి ప్రదానం ఉంటుంది. -
అంతర్జాతీయ పోటీలకు తాడేపల్లి క్రీడాకారుడు ఎంపిక
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని డోలాస్నగర్కు చెందిన స్కేటింగ్ క్రీడాకారుడు తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్–2026 అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. తైవాన్ దేశం సించు ప్రాంతంలో చైనీస్ తైపీ రోలర్ స్టోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి 19వ వరకు జరిగే అంతర్జాతీయ పోటీల్లో క్రీడాకారుడు మెరుగుపాల హశిష్ పాల్గొననున్నాడు. హశిష్ అండర్–15 విభాగంలో మన దేశం నుంచి స్కేటింగ్లో ఐదు విభాగాలైన క్వాడ్ ఫ్రీ, ఇన్లైన్ ఫ్రీ స్టయిల్, కపిల్ డాన్స్, హెయిర్ స్టైల్, క్వార్టెట్ పోటీల్లో తలపడనున్నారు. హశిష్ తమిళనాడు రాష్ట్రం దిండిగల్లో శిక్షణ పొందుతున్నాడు. హశిష్ను స్థానికులు అభినందించారు. హశిష్కు సహాయ సహకారాలు అందిస్తున్న మంత్రి నారా లోకేష్కు, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సభ్యులకు హశిష్ తల్లిదండ్రులు మెరుగుపాల రాజు, మాధవి ధన్యవాదాలు తెలియజేశారు. -
ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రేపల్లె: చేనేత, పవర్లూమ్ రంగాలకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళిశాఖ అభివృద్ధి అధికారి సిహెచ్ ప్రశాంత్ అన్నారు. ఇసుకపల్లిలోని చేనేత సహకార సంఘం కార్యాలయంలో శనివారం చేనేత కార్మికులతో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మిక కుటుంబాలకు 200 యూనిట్లు, పవర్లూమ్కు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో నేతన్నల కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. చేనేత కుటుంబాలకు విద్యుత్ వినియోగం కేవలం గృహ అవసరాలకే పరిమితం కాకుండా వారి వృత్తి నిర్వహణలో సైతం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 93వేల చేనేత కుటుంబాలు, 11,488 పవర్లూమ్ యూనిట్ల ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ పథకం అమలు తీరు వివరాలను తెలిపారు. మాజీ కౌన్సిలర్ ఆకురాతి గంగమ్మ, మేనేజర్ కౌతరపు శోభన్బాబు, చేనేత నాయకులు ముత్తవరపు స్వతంత్ర తేజ్కుమార్, కేవీ నాంచారరావు, అడిగోపుల వీరశంకర్, సీతారామయ్య పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చేనేత జౌళిశాఖ అభివృద్ధి అధికారి ప్రశాంత్ -
ప్రజల వద్దకు పాలనలో భాగమే జిల్లాల ఏర్పాటు
బాపట్లటౌన్: ప్రజల వద్దకు పాలన తీసుకురావడంలో భాగంగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఈటీసీ కార్యాలయంలో శనివారం ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. తొలుత జిల్లా ఆవిర్భావ దినోత్సవంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన 12 మంది విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందజేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళారత్న హంస పురస్కారాన్ని అందుకున్న మోదుకూరుకు చెందిన టి సీతారామిరెడ్డిని కలెక్టర్ సత్కరించారు. బాపట్ల సేవా సేతు కింద యాజలి గ్రామ అభివృద్ధికి కోటి రూపాయలు విరాళం అందజేసిన జి.సత్యనారాయణను కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ పునర్విభజన తర్వాత 20 మండలాలతో ఏర్పడిన బాపట్ల జిల్లాకు తొలి కలెక్టర్గా పనిచేసే అవకాశం లభించడం సంతోషదాయకమన్నారు. జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తోందని, ప్రతి ఒక్కరూ రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలన్నారు. బాపట్ల జిల్లాను టూరిజం హబ్గా అభివృద్ధి చేయడానికి చర్యలు మొదలయ్యాయని ఏపీ మానవవనరుల అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి, సంచాలకులు విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణి అన్నారు. గొప్ప చారిత్రాత్మక జిల్లాగా బాపట్ల జిల్లా చరిత్ర నిలిచిపోయిందని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల జిల్లా కార్యదర్శి పి సి సాయిబాబు తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, ఏపీ హిస్టరీ కాంగ్రెస్ సెక్రటరీ ఎం శ్రీనివాసరెడ్డి, సంఘం నాయకులు గురజాల శ్రీనివాసరావు, జి వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు.. లింగ నిర్ధారణ పరీక్షలను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భ్రూణ హత్యలు బాపట్ల జిల్లాలో పూర్తిస్థాయిలో నిరోధించాలన్నారు. గర్భంలో ఉన్న బిడ్డను పుట్టకముందే నాశనం చేయడం చాలా బాధాకరం అన్నారు. ఇలాంటివి ప్రభుత్వం నిషేధించిందన్నారు. జిల్లాలో ఉన్న స్కానింగ్ సెంటర్ల తనిఖీలు పకడ్బందీగా కొనసాగించాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించాలని సీనియర్ సివిల్ జడ్జి జి.వాణి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, డీసీహెచ్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పద్మావతి, కమిటీ సభ్యులు డాక్టర్ రామకృష్ణ హనుమాన్, మరియమ్మ, షాడో ప్రతినిధి రాజాసాల్మన్ పాల్గొన్నారు. స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం.. స్వచ్ఛత అనేది ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అన్నారు. శనివారం, జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన సామూహిక మరుగుదొడ్ల (పురుషులు) సముదాయాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్లను స్వచ్ఛ భారత్ మిషన్ పథకం నుంచి రూ.21 లక్షలు, జిల్లా పరిపాలన నిధుల నుంచి రూ. 9 లక్షలు మొత్తం రూ.30 లక్షలతో అధునాతన హంగులతో నిర్మించామన్నారు. మహిళల మరుగుదొడ్ల సముదాయాన్ని బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
ప్రజల్లోకి సుందరయ్య ఆశయాలు
యడ్లపాడు: సుందరయ్య ఆశయాలను కళారూపాల ద్వారా సమాజంలోకి తీసుకెళ్తామని కళానిలయం స్థాపక అందుకే చేసినట్లు తెలుగు నాటక కళాపరిషత్ల సమ్మేళన సంఘం వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు చెప్పారు. యడ్లపాడులో పుచ్చలపల్లి సుందరయ్య కళా నిలయం 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల రెండోరోజు పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన ఉత్తమోత్తమ ప్రదర్శలను ఎంపిక చేసి ఇక్కడకు తీసుకురావడం జరిగిందన్నారు. గ్రామస్తులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కళాభిమానులు, నాటక పరిషత్తుల నిర్వాహకులు రోజుకు 2500 మంది రావడం సంతోషదాయకమన్నారు. ముందుగా పరిషత్ నిర్వాహకులు, న్యాయనిర్ణేతలు దాతలు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించగా, అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులు తమ అభ్యుదయ గీతాలతో సుందరయ్యకు కళాంజలి సమర్పించారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారులు జరుగుల రామారావు, నూతలపాటి కాళిదాసు, ఆలోకం పెద్దబ్బయ్య, ఉపాధ్యక్షులు జరుగుల శంకర్రావు, ప్రధాన కార్యదర్శి ముత్తవరపు రామారావు, కార్యదర్శి నూతలపాటి మాధవరావు, సహాయ కార్యదర్శి చెరుకూరి సృజన, కోశాధికారి షేక్ బాజి, సభ్యులు నంబూరి శ్రీనివాసరావు, ముత్తవరపు పద్మారావు, పోపూరి అనంతలక్ష్మి, చెన్నుపాటి హనుమంతరావు, కల్లూరి సులోచన, తోకల కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, కట్టా శ్రీహరి, సాంబశివరావు, పోపూరి శివరామకృష్ణ, జగన్, మాణిక్యమ్మ, మానుకొండ రామారావు, నూలు మిల్లు ఈడీ సామినేని ఫణికుమార్ ఉన్నారు. -
బాపట్ల
శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 20267అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5844 టీఎంసీలు. తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.9000, గరిష్ట ధర రూ.12500, మోడల్ ధర రూ.10500 వరకు పలికింది. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 532.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయింది. భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే నిర్వహించారు. క్రీస్తుకు శిలువ వేసే వృత్తాంతాన్ని తెలియచేస్తూ కళాకారులు ప్రదర్శనలిచ్చారు. క్రైస్తవులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రీస్తు చూపిన మార్గంలో నడవాలని మత గురువులు బోధించారు. ప్రేమ, కరుణతో జీవించాలని సూచించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు7 -
కుటుంబం సహా వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నరసరావుపేట రూరల్: పోలీసుల అప్రమత్తత నలుగురి ప్రాణాలను రక్షించింది. ఓ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు సకాలంలో స్పందించి వారిని రక్షించారు. వివరాలు.. దుర్గి మండల కేంద్రానికి చెందిన శ్రీపతి అమరేంద్ర , త్రివేణి దంపతులు వారి కుమారుడు, కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని శుక్రవారం రాత్రి రూరల్ పోలీసులకు సమాచారం అందింది. సంతమాగులూరు రోడ్డు నుంచి నరసరావుపేట వైపు కారులో వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. గుంటూరు రోడ్డులోని డంపింగ్ యార్డ్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గర మీరు ప్రయాణిస్తున్న కారును పోలీసులు గుర్తించారు. రూరల్ ఎస్ఐ కిషోర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. తాము ఆత్మహత్యకు పాల్పడటం లేదని ముందు బకాయించిన దంపతులు పోలీసులు కౌన్సెలింగ్తో నిజాన్ని అంగీకరించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు ఒప్పుకొన్నారు. రూరల్ ఎస్ఐ కిషోర్ మాట్లాడుతూ దుర్గి నుంచి బయలుదేరిన అమరేంద్ర, త్రివేణి దంపతులు సంతమాగులూరులో తన స్నేహితుని వద్ద నుంచి కారు తీసుకున్నారని తెలిపారు. అందరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని త్రివేణితో భర్త అమరేంద్ర చెప్పడంతో అప్రమత్తమైన ఆమె ఈ విషయాన్ని తన మామ చందుకి ఫోన్ ద్వారా తెలియజేసిందన్నారు. చందు ఇచ్చిన సమాచారంతో అమరేంద్ర దంపతులు ప్రయాణిస్తున్న కారును గుర్తించి వారిని రక్షించినట్లు వివరించారు. -
కాంస్య పతకాలతో మెరిసిన అక్కాచెల్లెలు
ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రెసిడెంట్ మహమ్మద్ కలీం కొరిటెపాడు(గుంటూరు): ఎన్నికలు, నియామకాల ద్వారా ఏర్పడే సహకార రంగ సంస్థల పాలకవర్గాల్లో రిజర్వేషన్ (1964 సహకార రంగ చట్ట ప్రకారం) అమలు చేయాలని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రెసిడెంట్ మహమ్మద్ కలీం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సహకార రంగ సంస్థల పాలకవర్గాల్లో పేద, బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ, రాష్ట్రంలోని దాదాపు 2,500 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలకు (డీసీఎంఎస్), ఏపీ సహకార బ్యాంక్ (ఆప్కాబ్)లతోపాటు 1964 చట్టం పరిధిలోని సహకార రంగ సంస్థలకు పాలకవర్గాల్లో రిజర్వేషన్ అమలు పరుస్తూ నియామకాలు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం, సహకార శాఖ కమిషన్, సహకార శాఖ రిజిస్ట్రార్లకు ఆరు నెలల క్రితం పోస్ట్ ద్వారా వినతిపత్రం పంపించడం జరిగిందని వెల్లడించారు. 2026 జనవరి నెల 28వ తేదీన సుమారు 2000లకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు రిజర్వేషన్ అమలు చేయకుండా జీఓ నంబర్–60 ద్వారా పాలకవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు. అంతేకాకుండా ఉమ్మడి 13 జిల్లాల కేంద్ర సహకార బ్యాంకుల చైర్మన్లను అఫీషియల్ పర్సన్ ఇన్చార్జిలుగా నియమిస్తూ, ఆప్కాబ్ చైర్మన్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ల పదవి కాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సహకార సంస్థలకు ఎన్నికలు నిర్వహించి, పేద, బడుగు, బలహీనవర్గాల వారికి పదవుల్లో న్యాయం చేయాలని ఆయన కోరారు. . -
కాబోయే జంటను బలిగొన్న ప్రమాదం
దుర్గి: ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్న తరుణంలో కాబోయే జంటను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని ఓబులేశునిపల్లె ప్రధాన రహదారి పక్కన రైస్ మిల్లు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన నేలపాటి సందీప్ (21), నరసరావుపేట ప్రాంతానికి చెందిన సౌమ్య (20)లకు 20 రోజుల క్రితం నిశ్చయతాంబూలం తీసుకున్నారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని మొక్కు తీర్చుకునేందుకు నాగార్జున సాగర్ సాగర్మాత ఆలయానికి వెళ్లారు. మొక్కు తీర్చుకొని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణం అయ్యారు. ఓబులేశునిపల్లె రైస్ మిల్లు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను వారి బైకు ఢీ కొంది. ఇరువురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. అనంతరం మృతదేహాలను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వార్డుల పెంపుతో నేతల్లో ఆశలు
చీరాల: జిల్లాలో చీరాల, బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలున్నాయి. వార్డుల పెంపు ఉత్తర్వులు ప్రజలకు తెలియజేసేలా పురపాలక కమిషనర్లు నోటీసు బోర్డుల్లో ఏర్పాటు చేసి వారం రోజుల్లో అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంది. అభ్యంతరాలు పరిశీలించిన అనంతరం వార్డుల సంఖ్య పెంపుపై మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకోనుంది. మున్సిపాలిటీలో జనాభా సంఖ్య ఆధారంగా వార్డుల విభజన ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టింది. చీరాల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులు, రేపల్లె మున్సిపాలిటీలో 28 వార్డులున్నాయి. బాపట్ల మున్సిపాలిటీలో శివారు గ్రామాల విలీనంపై హైకోర్టులో విచారణలో ఉండడంతో గత ఎన్నికలు నిర్వహించలేదు. జనాభా ప్రాతిపదికన విభజన.. మున్సిపాలిటీల్లో జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన ప్రక్రియపై అంచనాలు వేశారు. చీరాల మున్సిపాలిటీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 87 వేల మంది ఉన్నారు. ప్రస్తుతం జనాభా లక్ష వరకు ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా.. ఈ సంఖ్యను 44కు పెరగనుంది. అలానే రేపల్లె మున్సిపాలిటీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 54 వేల మంది ఉండగా ప్రస్తుతం 60 వేల వరకు పెరిగింది. ప్రస్తుతం 28 వార్డులు ఉండగా.. ఈ సంఖ్య 36కు చేరనుంది. వార్డుల పెంపు పట్ల తీసుకోవాల్సిన విధి విధానాలపై అధికారులు చర్చిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో పాలకవర్గాల పదవీకాలం పూర్తి కావడంతో స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతోంది. బాపట్ల మున్సిపాలిటీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 77 వేల మంది జనాభా ఉండగా ప్రస్తుతం లక్ష వరకు పెరిగింది. ఏడు శివారు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉత్తర్వులపై గ్రామాల ప్రజలు 2020 సంవత్సరంలో హైకోర్టుకు వెళ్లడంతో కోర్టు స్టే విధించింది. ఈ కారణంగా 2021 మార్చిలో మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన వార్డుల సంఖ్య పెంపుదల, ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. కోర్టులో స్టే తొలగిస్తేనే ఎన్నికలు జరిగేందుకు అవకాశం ఉంది. మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య పెంచడంతో ఆశావహుల సందడి మొదలైంది. 1,500 మందికి ఒక వార్డు చొప్పున కేటాయింపులు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఎక్కువ జనాభా ఉన్న వార్డులను రెండుగా చేస్తారని, పెరిగిన జనాభాకు అనుగుణంగా వార్డుల సంఖ్య పెరగనుండటంతో వార్డుల్లో ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీల్లో చురుగ్గా ఉండేవారు ఈ సారి ఎన్నికల బరిలో నిలబడేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వార్డుల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి దోహదపడుతూ, పార్టీలో ఉత్సాహంగా ఉంటూ, పలుకుబడి ఉన్న నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వార్డు కౌన్సిలర్గా నిలబడేందుకు ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు. -
తిరుపతమ్మ వారిని తాకిన సూర్య కిరణాలు
పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ వారిని శుక్రవారం సూర్య కిరణాలు తాకాయి. గర్భాలయంలో ఉదయం అర్చకులు అభిషేకాలు చేస్తున్న సమయంలో మూలవిరాట్ను ఉదయం 6.30 నుంచి 6.45 గంటల మధ్యలో సూర్యకిరణాలు తాకాయి. పాదాల నుంచి ముఖం వరకు అమ్మవారిని సూర్య కిరణాలు వెలిగించిన దివ్య తేజస్సును చూసి భక్తులు పరవశులయ్యారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయం చుట్టూ సిమెంట్ రోడ్డుపై నీటితో తడుపుతూ, మ్యాట్లు కూడా ఏర్పాటు చేశారు. బంగారు గొలుసు కానుక గామంలోని శ్రీతిరుపతమ్మవారికి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామానికి చెందిన బూరుగుపల్లి శివరామకృష్ణ– వాణి దంపతులు, వారి బంధువు భోగవల్లి దివ్యతేజలు కలిసి 25.950 గ్రాముల బంగారు గొలుసును ఆలయ సూపరింటెండెంట్ రాజు చేతుల మీదుగా అమ్మవారికి కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించారు. ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఉత్సవ కమిటీ మాజీ సభ్యుడు చుంచు రమేష్బాబు, నాయకులు రేగండ్ల రవికుమార్ పాల్గొన్నారు. -
బాలవనం పనులు త్వరగా పూర్తి చేయాలి
బాపట్ల టౌన్: బాలవనం పార్క్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం బాపట్ల మున్సిపల్ పరిధిలోని ప్యాడిసన్ పేట, బాపట్ల – గుంటూరు రోడ్డు ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేస్తున్న బాలవనం నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ జి.రఘునాథ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదివారం, సెలవుల రోజుల్లో పిల్లలు వచ్చి చక్కగా గడిపేలా పార్క్ను తీర్చిదిద్దాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. వివిధ ఆట పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు. వంతెన గోడలకు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే అంశాలను చిత్రీకరించాలన్నారు. భౌగోళిక శాస్త్రంలోని చిత్రాలను వేయాలని, చిన్నారులకు విజ్ఞానాన్ని పెంపొందించేలా ఆ చిత్రాలు ఉండాలన్నారు. పిల్లలతోపాటు వచ్చే పెద్దలు పార్కులో వాకింగ్ చేసే విధంగా ట్రాక్ ఏర్పాటు చేయాలన్నారు. పూల మొక్కలు పెంచాలని, బాలవనం పనులు వేగంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట పురపాలక శాఖ డీఈ, సచివాలయ సిబ్బంది ఉన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్ -
ఆంఽధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం మావిగన్
చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం ‘మావిగన్’ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. చిలకలూరిపేట పట్టణంలోని మాజీ మంత్రి విడదల రజిని నివాసంలో ఆమెతో కలసి అంబటి రాంబాబు శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నేడు రాష్ట్రమంతటా వైఎస్సార్ సీపీ అధినేత ప్రతిపాదించిన మావిగన్ గురించే ముమ్మరంగా చర్చించుకుంటున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లెక్కల ప్రకారం అమరావతి రాజధాని పూర్తి చేసేందుకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఇది ఏ మాత్రం పూర్తి చేయలేని పథకం అని వివరించారు. ప్రొఫెసర్ రామచంద్రయ్య అమరావతి గురించి మాట్లాడుతూ తాను ప్రపంచంలో ఎన్నో పట్టణాలు చూశానని, అయితే అమరావతి వంటి పట్టణాన్ని చూడలేదని తెలిపినట్లు పేర్కొన్నారు. ఎందుకంటే ఆయన మాటల ప్రకారం ఎక్కడైనా నదుల నుంచి నీటిని తోడి చెరువులకు పెడతారని, అమరావతిలో మాత్రం నీళ్లు తోడి నదిలో పోయాల్సి వస్తున్నదని తెలిపినట్లు చెప్పారు. అమరావతి లోతట్టు ప్రాంతమని, అది పూర్తయ్యే అవకాశం ఏ మాత్రం లేదని చెప్పారు. అమరావతిని మార్చడానికి వీలులేకుండా ఎందుకు చట్టం తెచ్చారని ప్రశ్నించారు. మీరు తిరిగి అధికారంలోకి రాలేమనే నమ్మకమా? లేక మీరు చట్టం చేస్తే భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేవారు చట్టం మార్చలేరనా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు రాజకీయ పరిజ్ఞానం ఉందని భావించే వారు అమాయకులని వెల్లడించారు. రాజకీయ పరిజ్ఞానం, అభివృద్ధిపై పట్టు ఉంటే గుంతలో రాజధాని ఎందుకు పెడతారని ప్రశ్నించారు. వర్షం వస్తే నిండిపోయే చెరువులాంటి అమరావతిలో రాజధాని ఎందుకు కడతారని నిలదీశారు. కేవలం స్వార్థం, డబ్బు సంపాదన, కొడుకును అధికారంలోకి తీసుకురావాలనే కోరికతోనే ఇలాంటి పనులకు పాల్పతున్నారని ఆరోపించారు. అమరావతి పూర్తి అయ్యే ప్రాజెక్టు కాదని, అది మనల్ని అగాథంలోకి దించే ప్రాజెక్టు అని అభివర్ణించారు. పోలీసుల తీరు అమానుషం రాష్ట్రంలో పోలీసుల తీరు అమానుషంగా ఉందని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసులు సంఘాన్ని హింసిస్తున్నారని పేర్కొన్నారు. మార్చి 31వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు తిరుపతిలో తంబిరెడ్డిని మఫ్టీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను చితక్కొట్టి, హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాక మాత్రమే కోర్టులో హాజరు పరిచారని తెలిపారు. తన ఇంటిపై 7 గంటల 20 నిమిషాల పాటు టీడీపీ దుండగులు దాడి చేస్తే.. జిల్లా ఎస్పీ ఆ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లారని ఆరోపించారు. తనపై దాడి చేసిన వారిపై నామమాత్రపు కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారని గుర్తుచేశారు. తనను మాత్రం 18 రోజుల పాటు జైలులో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల తీరు ఏ మాత్రం సరిగా లేదని, అలాంటి వారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిందో ఇటీవల నరసరావుపేట ఎస్పీ కార్యాలయం లోపలివైపు నుంచి టీడీపీ ఎమ్మెల్యే తాళం వేసిన సంఘటన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఈ సంఘటనలో స్వయంగా పోలీసు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి వచ్చి తలుపులు పగలగొట్టించాల్సి రావడం హాస్యాస్పందంగా ఉందన్నారు. తనపైన, మాజీ మంత్రి విడదల రజినిపైన, పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపైన అనేక తప్పుడు కేసులు పెట్టారని వివరించారు. అయితే ఇలాంటి తప్పుడు కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. న్యాయపోరాటంతోపాటు ప్రజా పోరాటాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. అరాచక పాలన చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చి వేస్తామని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటామని స్పష్టం చేశారు. -
వైభవంగా చెన్నకేశవస్వామి కల్యాణోత్సవం
మాచర్ల: పట్టణంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లను గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, చెన్నకేశవాచార్యులు, ఈఓ ఐ. సైదారావుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కొమెర అనంతరాములు, ఈఓ ఆధ్వర్యంలో రాత్రి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పలువురు దంపతులు పాల్గొన్నారు. కాపాడిన స్థానికులు వేటపాలెం: మండల కేంద్రం వేటపాలెంలో జింక పిల్ల ప్రత్యక్షం అయింది. ఈ జింక పిల్లను కుక్కలు తరుముకుంటూ వచ్చాయి. వాటి నుంచి తప్పించుకున్న జింక రైల్వే ట్రాక్ దగ్గరలోని సమైక్యనగర్ ప్రాంతానికి వచ్చింది. గమనించిన స్థానికులు వెంటనే కుక్కలను తరిమేశారు. అప్పటికే జింక వెనుక కాళ్ల వద్ద కుక్కలు కరిచాయి. స్థానికులు దానిని రిక్షాపై పశువైద్యశాలకు తరలించారు. అటవీశాఖ అధికారులకు అప్పగించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంపై కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. జింక పిల్ల వేటపాలెం రావడం ఇదే మొదటి సారి కావడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు. జూనియర్ సివిల్ జడ్జిగా బాపట్ల వాసి ఎంపిక బాపట్ల టౌన్: గతేడాది నిర్వహించిన జ్యూడీషియల్ పరీక్ష ఫలితాలను గురువారం రాత్రి రాష్ట్ర హైకోర్టు వెలువరించింది. ఫలితాల్లో బాపట్ల పట్టణం, ఇమ్మడిశెట్టివారిపాలెంకు చెందిన ఇమ్మడిశెట్టి యలమందరావు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. యలమందరావు బాపట్లలోని జేమ్స్ స్కూల్లో 10వ తరగతి వరకు చదివారు. ఇంటర్నేషనల్ డిఫెన్స్ అకాడమీలో, బాపట్లలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఎస్సీ, ఎల్ఎల్బీని ఒంగోలులోని ఐపీఎస్సీ లా కళాశాలలో పూర్తి చేశారు. సుబ్బారావు, నాగలక్ష్మి దంపతులకు మొదటి సంతానం యలమందరావు కాగా, రెండవ కుమారుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి కుమార్తె కూడా ఉన్నారు. మొదటి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై న యలమందరావును బాపట్లలోని జూనియర్ న్యాయవాదులు, మిత్రబృందం సభ్యులు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు శుక్రవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. యనమలకుదురుకు చెందిన గొట్టిపాటి పూర్ణచంద్రరావు, ప్రమీలరాణి దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు దుర్గగుడికి విచ్చేశారు. వారి 60వ పెళ్లిరోజు పురస్కరించుకుని అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళంగా అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేయగా, కమిటీ చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
సుందరయ్య పురస్కారం అందుకోవడం అదృష్టం
యడ్లపాడు: తన యావదాస్తిని పేదల కోసం త్యాగం చేసిన నిష్కళంక నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో పురస్కారం అందుకోవడం అదృష్టం, అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చిందని సినీ, రంగస్థల నటులు, దర్శకులు ఉప్పలూరి సుబ్బరాయశర్మ అన్నారు. యడ్లపాడు సుందరయ్య కళానిలయం నాటికల పోటీల తొలిరోజు కార్యక్రమంలో ఆయనకు రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ చేతుల మీదుగా సుందరయ్య కళానిలయం ప్రతిష్టాత్మక పురస్కారం శుక్రవారం అందించారు. అనంతరం దశాబ్దాల పాటు పౌరాణిక నాటక రంగంలో అఖండ కీర్తి గణించిన గోపాలకృష్ణను కమిటీ సభ్యులు సత్కరించారు. పురస్కార గ్రహీత సుబ్బరాయశర్మ మాట్లాడుతూ సుందరయ్య నడయాడిన ప్రాంగణంలో సన్మానం అందుకోవడం గొప్ప వరమని, కళల పట్ల ముత్తవరపు సురేష్బాబు కుటుంబం చూపుతున్న అంకితభావం వారి సంస్కారానికి నిదర్శనమని కొనియాడారు. ఈ కళాబంధం కలకాలం నిలవాలని కోరారు. గోపాలకృష్ణ మాట్లాడుతూ ఇటీవల గుంటూరులో అంతర్జాతీయ నాటకోత్సవాలను అద్భుతంగా నిర్వహించిన వేదిక అధ్యక్షులు సురేష్బాబును ప్రశంసిస్తూనే, ఆయన వెన్నంటూ ఉంటూ ప్రోత్సహిస్తున్న సీ్త్రశక్తి అరుణకుమారి పాత్రను వక్తలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అభినందించారు. అలాగే తన సుదీర్ఘ కళా ప్రస్థానంలోని మధుర స్మృతులను గుర్తుచేసుకుంటూ, సురేష్బాబు కుటుంబాన్ని పద్యరూపంలో అభినందించి పౌరాణిక పద్యాలతో సభికులను మంత్రముగ్ధులను చేశారు. అరుణకుమారి పరిచయ వాక్యాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి సురేష్బాబు అధ్యక్షత వహించగా, అనంతరం అతిథులను సన్మానించి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ భార్గవి చౌదరి, వై రాధాకృష్ణ, ప్రజాశక్తి సంపాదకులు ఎంవీఎస్ శర్మ, గోపరాజు రమణ, నూతలపాటి కాళిదాసు, కృష్ణయ్య, ముత్తవరపు పద్మారావు, జరుగుల శంకర్రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
నేటి నుంచి జాతీయ నాటికల పండగ
యడ్లపాడు: యడ్లపాడు గడ్డపై శుక్రవారం నుంచి 23వ జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం కానున్నాయి. కళాభిమానులను అలరించేందుకు ముస్తాబయ్యాయి. తొలిరోజే వైవిధ్య భరితమైన ఇతివృత్తాలతో కూడిన నాటికలు రంగస్థలంపై మెరవనున్నాయి. శుక్రవారం రాత్రి 7 గంటలకు వీరన్నపాలెం(కళానికేతన్) వారి ‘దీపం కింద చీకటి’తో మొదలయ్యే ఈ కళాయజ్ఞం, ఆపై ప్రముఖ సినీ నటులు ఉప్పులూరి సుబ్బరాయశర్మకు అందించే ‘సుందరయ్య–2026’ కళా పురస్కార ప్రదానోత్సవంతో మరింత శోభాయమానం కానుంది. అనంతరం విశాఖపట్నం (చైతన్య కళాస్రవంతి) వారి ‘(అ) సత్యం’ నాటిక సమాజంలోని ముసుగులను ప్రశ్నించనుంది. అన్నిటికంటే ముఖ్యంగా, కాకినాడ(బీవీకే క్రియేషన్స్) బృందం ప్రదర్శించే ‘కన్నీటికి విలువెంత’ నాటికలో ఏడుగురు మహిళా కళాకారిణులు ప్రధాన పాత్రలు పోషించడం నాటక చరిత్రలోనే రికార్డుగా నిలువనుంది. లక్ష్మీపురం: ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గుంటూరు రీజనల్ మేనేజర్ కార్యాలయం వద్ద ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు గురువారం ధర్నా నిర్వహించారు. పి.శేషగిరిరావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె.గంగాధరరావు హాజరయ్యారు. నాయకులు మాట్లాడుతూ 2020 జనవరి 1 నుంచి నేటి వరకు రిటైర్డ్ అయిన వారికి లీవ్ ఎన్క్యాష్మెంట్, గ్రాడ్యూటీ ఇవ్వాలన్నారు. అనంతపురం, రాజమండ్రిలలో రిఫరల్ హాస్పటల్ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం రీజనల్ మేనేజర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి.నాగేశ్వరరావు, జి.వెంకటస్వామి, సీహెచ్ వెంకటేశ్వర్లు, రామచంద్రరావు, తెనాలి నుంచి సుబ్రహ్మణ్యం, గద్దె రవీంద్ర, శంకర రావు తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల: పౌర సేవల్లో తాత్సారం చేస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు సచివాలయ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. నాదెండ్ల ఒకటో సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న తాటిబోయిన ఈశ్వరయాదవ్, గ్రామ సర్వేయర్గా పనిచేస్తున్న వాసిమళ్ల సుందర్పాల్, సంకురాత్రిపాడు వీఆర్వో ఇత్తెల నాగజ్యోతి, డిజిటల్ అసిస్టెంట్ సయ్యద్ అహ్మదుల్లాలను సస్పెండ్ చేస్తూ గురువారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. స్వర్ణ గ్రామ సచివాలయాల్లో వివిధ పనులపై వచ్చే స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తూ సకాలంలో పనులు చేయటం లేదని సస్పెండైన సిబ్బందిపై ఆరోపణలున్నాయి. ఫోన్కాల్ ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరించే ఐవీఆర్ఎస్ సర్వే ఆధారంగా వీరిపై ఫిర్యాదులు అందాయి. దీంతో ఉన్నతాధికారులు స్పందించి సస్పెన్షన్ వేటు వేశారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 16న నిర్వహించేందుకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరగనున్న సమావేశంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు, వైద్య ఆరోగ్యశాఖ, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్, విద్య, సమగ్ర శిక్ష, వయోజన విద్యాశాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, గృహ నిర్మాణ, పౌర సరఫరాల శాఖ, పరిశ్రమల శాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, డీఆర్డీఏ శాఖల వారీగా ప్రగతిపై చర్చించనున్నారు. మూడు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు, ఆయా శాఖల అధికారులకు ఈ మేరకు సమాచారాన్ని పంపారు. -
ట్రాలీ ఆటో ఢీకొని ఇద్దరు మృతి
చీరాల: చీరాల మండలం విజయనగర్కాలనీ సమీపంలోని వాడరేవు– పిడుగురాళ్ల 167ఏ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న ముగ్గురు వ్యక్తులను వేగంగా వస్తున్న ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. అందిన వివరాల మేరకు... చీరాల మండలం విజయనగర్ కాలనీకి చెందిన తేళ్ల పెద్ద లక్ష్మయ్య (68), రేణుమాల సుబ్బయ్య (60), చుండూరి వీరయ్యలు గురువారం ఉదయం పొలానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. బాపట్లకు చెందిన గోపీ అనే ఆటోడ్రైవర్ చిలకలూరిపేటలో మిరపకాయల లోడు దింపి పర్చూరు నుంచి చీరాల వైపు వస్తున్నాడు. రోడ్డుపై వెళుతున్న ముగ్గురిపైకి ఆటో దూసుకెళ్లడంతో తేళ్ల పెద్ద లక్ష్మయ్య, రేణుమాల సుబ్బయ్య తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. చుండూరి వీరయ్యకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు స్పందించి ఆటోడ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. తేళ్ల పెద్ద లక్ష్మయ్య సోషల్ వెల్ఫేర్ శాఖలో విశ్రాంత ఉద్యోగి కాగా, రేణుమాల సుబ్బయ్య హైవే అథారిటీలో ఇంజినీర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో విజయనగర్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న టూటౌన్ సీఐ అశోక్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవే అధికారులు సరైన హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆటిజమ్ సెంటర్ను త్వరగా ప్రారంభించాలి
బాపట్లటౌన్: ఆటిజమ్ సెంటర్ను త్వరగా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆటిజమ్ సెంటర్, భవిత సెంటర్లను కలెక్టర్ గురువారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులైన వారికి జీవన నైపుణ్యాలు, వైద్యం, విద్యాబుద్ధులు నేర్పేలా ఆటిజమ్ సెంటర్ ఉపకరిస్తుందన్నారు. విభిన్న ప్రతిభావంతులైన మతిస్థిమితం లేని వారు జిల్లాలో 3,394 మంది ఉన్నారన్నారు. ఆటిజమ్తో బాధపడేవారు 79 మంది ఉన్నారన్నారు. వారందరికీ విద్యాబుద్ధులు నేర్పడం, అవసరమైన వైద్యం అందించడం, వారి జీవన నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిందన్నారు. ఈ కేంద్రాలను త్వరలో ప్రారంభించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలతో వీటిని ఏర్పాటు చేయాలన్నారు. ఆటిజమ్ తో బాధపడే వారి తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. మరుగుదొడ్లు పరిశీలన కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సామాజిక మరుగుదొడ్లను కలెక్టర్ పరిశీలించారు. స్వచ్ఛ ఆంధ్ర నిధులు, డీఎంఎఫ్ నిధులతో నిర్మించిన సామాజిక మరుగుదొడ్ల భవన సముదాయాన్ని ఆయన పరిశీలించారు. త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టరేట్కు వచ్చే ప్రజల సౌకర్యార్థం సామాజిక మరుగుదొడ్లు తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్సింగ్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, సమగ్ర శిక్ష అభియాన్ సలహాదారులు రాంకమల్, విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
తండ్రి స్ఫూర్తితో సివిల్ జడ్జిగా ఎంపిక
చిలకలూరిపేట టౌన్: కఠిన శ్రమ, తండ్రి మార్గదర్శకత్వంతో విజయం వరించిందని చిలకలూరిపేటకు చెందిన సాతులూరి యమున తెలిపారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఆమె సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. యమున తండ్రి భాగ్యరావు పట్టణంలో ప్రముఖ న్యాయవాది. ఆయన బాటలోనే యమునతోపాటు ఆమె సోదరి కూడా న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. కేఎల్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తి చేసిన తర్వాత, తండ్రి వద్దే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. రెండేళ్లుగా కోర్టు పరిసరాల్లో ఉంటూ మరింత నేర్చుకున్నారు. తండ్రి వృత్తి పట్ల ఉన్న గౌరవంతోనే తాను ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు యమున తెలిపారు. గత రెండేళ్లుగా తండ్రి పర్యవేక్షణలోనే ఉంటూ, ఆయన అందించిన శిక్షణతో సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధమైనట్లు వివరించారు. తన విజయానికి స్ఫూర్తి ఆయనేనని తెలిపారు. తొలి ప్రయత్నంలోనే జడ్జిగా ఎంపికై తండ్రి పేరును, పట్టణ కీర్తిని నిలబెట్టిన యమునను న్యాయవాదులు, పట్టణ ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: జిల్లాలో ‘మనబడి – మన భవిష్యత్‘ కార్యక్రమంలో పాఠశాలల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యాశాఖ అధికారి, ఎంఈఓలు, ఇంజినీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో తక్కువ మరమ్మతులు అవసరం ఉండి, త్వరగా అందుబాటులోకి వచ్చే తరగతి గదులు, టాయిలెట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమానికి ‘100 రోజులు – 100 తరగతి గదులు’గా నామకరణం చేస్తూ జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయిన తరగతి గదులు, మరుగుదొడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
రైల్వే డివిజన్ ఆదాయం రూ.766.57 కోట్లు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ రూ.766.57 కోట్ల ఆదాయం సమకూరిందని, ఇది గతేడాది కంటే 7.65 శాతం వృద్ధి అని డీఆర్ఎం సుధేష్ఠ సేన్ చెప్పారు. గుంటూరు పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని సరుకు రవాణాకు రూ.452.13 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. మార్చి నెలలో 0.6 మిలియన్ టన్నుల అత్యధిక లోడింగ్ జరిగిందని, దానికి సంబంధించి రూ.61.6 కోట్లు ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చిందన్నారు. సరుకు రవాణాలో 1376 క్రాక్ స్పెషల్ రైళ్లు 2154 రేకుల నిర్వహణ, న్యూ గుంటూరులో ఎక్స్క్లూజివ్ కార్గో టెర్మినల్ పునరుద్ధరణ జరిగిందని తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కోసం జీసీటీ ద్వారా మెరుగైన రవాణా చేశామని తెలిపారు. పండుగల సమయంలో 2,226 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద 16 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే మంగళగిరి, కంభం స్టేషన్లు సిద్ధమయ్యాయని తెలిపారు. గుంటూరు డివిజన్ పనితీరు, భద్రత, సేవలలో నూతన ప్రమాణాలు నెలకొల్పుతూ రైల్వేలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని తెలిపారు. సమావేశంలో డివిజన్ సంబంధిత విభాగాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
చచ్చినా చావే అంటున్న కుంకలమర్రు ఎస్సీ కాలనీ
కారంచేడు: ఒక వ్యక్తి మృతి చెందిదే ఆ వ్యక్తిని కన్నీటితో సాగనంపుతారు. ఈ సాగనంపే ప్రక్రియలో మృతదేహంతో నానా అగచాట్లు పడాల్సి వస్తుందని మండలంలోని కుంకలమర్రు గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీవాసులు వాపోతున్నారు. కొన్ని సంవత్సరాలుగా మా పెద్దలు, పూర్వీకులు మృతి చెందినప్పుడు ఎస్సీ కాలనీ వారి శ్మశాన వాటికకు తీసుకెళ్లడం చాలెంజ్గా మారిందని చెప్తున్నారు. మృతదేహాన్ని భుజాలపైన ఉంచుకొని రోడ్డు సరిగ్గా లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామన్నారు. సమాధుల ప్రాంతంలో కూడా గ్రామంలోని మురుగు నీరు అక్కడకు వచ్చి చేరుతుందని, దీని వలన మరింత ఇబ్బందికరంగా మారిందన్నారు. సమాధి చేయడానికి గుంతలు తీస్తుంటే నీరు చేరుతోందన్నారు. గతంలో చాలా సార్లు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఇప్పటికై నా స్పందించి క్రైస్తవ శ్మశానవాటికకు వెళ్లే మార్గాన్ని సరి చేయడంతోపాటు, శ్మశానవాటిక ప్రాంతంలో మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు వాపోతున్నారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్ట్
లక్ష్మీపురం: రైళ్లలో నిద్రిస్తున్న ప్రయాణికుల నుంచి విలువైన లాప్ ట్యాప్లు, సెల్ఫోన్లను చోరీ చేసే ముఠాను గుంటూరు రైల్వే జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 20 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు రైల్వే జీఆర్పీ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఆర్పీ సీఐ అంజిబాబు వివరాలు వెల్లడించారు. మార్చి 29న గుంటముక్కల సత్యనారాయణ అనే వ్యక్తి పిఠాపురం నుంచి గుంటూరుకు రాయగఢ ఎక్స్ప్రెస్లో వస్తుండగా.. అతని ల్యాప్ ట్యాప్, సెల్ఫోన్, ఐటీసీ సంస్థకు చెందిన డ్యాంగిల్లు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితుడు సత్యానారాయణ గత నెల 30వ తేదీన గుంటూరు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి రైల్వే ఆర్పీఎఫ్ ఏఎస్సీ శైలేష్కుమార్, గుంటూరు జీఆర్పీ డీఎస్పీ పి.అక్కేశ్వరరావుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు ప్రారంభించారు. సీసీ కెమెరాల సహాయంతో నూతన టెక్నాలజీతో రైళ్లలో నిద్రిస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి విలువైన సెల్ఫోన్లు, లాప్ట్యాప్లు చోరీ చేసే వారిని గుర్తించారు. చోరీ చేసిన వారిలో తెనాలికి చెంది మవల్కర్ రమేష్, కొవ్వూరు మండలంకు చెందిన కీర్తి రూపీకుమార్, చుండూరు మండలం మోదుకూరుకు చెందిన కుంభ వెంకట్లుగా గుర్తించి వారి కోసం ప్రత్యేక గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఒకటో నంబర్ ప్లాట్ఫారం పై జీఆర్పీ పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో వారు పట్టుబడ్డారు. వారి బ్యాగులను తనిఖీ చేయగా సెల్ఫోన్లు, ల్యాప్ ట్యాప్, డ్యాంగిల్లు లభ్యం అయ్యాయి. నలుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన రైల్వే జీఆర్పీ ఎస్ఐ షేక్ మహబూబ్ సుభాని, ఆర్పీఎఫ్ ఎస్ఐ ఎం.శ్రీనివాసరెడ్డి, రైల్వే పోలీసులు వలి, అశ్విన్, వాసులను రైల్వే ఆర్పీఎఫ్ ఏఎస్సీ, డీఎస్పీలు అభినందించారు. నలుగురిని అరెస్ట్ చేసిన జీఆర్పీ పోలీసులు -
పరువు కోసం కుమార్తె హత్య?
యువతి మృతి వెనుక మిస్టరీని ఛేదించిన పోలీసులుమాచర్ల: యువకుడిని ప్రేమించినందుకు యువతిని కన్న తల్లిదండ్రులే హత్య చేశారని సమాచారం. వివరాలు ఇవీ.. మాచర్ల పట్టణంలోని యాదవ వార్డుకు చెందిన కామనబోయిన చౌడేశ్వరి మండలంలోని జమ్మలమడకలోని నాగరాజు ప్రేమించుకున్నారు. దీనికి పెద్దలు ఒప్పుకోరని ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో చౌడేశ్వరి తండ్రి చంద్ర శ్రీను పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. తమ కుమార్తె అదృశ్యమైనా పోలీసులు పట్టించుకోవటం లేదని భార్యతో కలిసి ఆందోళన చేశాడు. కుమార్తె ఆచూకీ తెలుసుకొని పోలీసులు మాచర్లకు మార్చి 15వ తేదీన తీసుకొచ్చారు. ఆ రోజు ఇరు వైపులా పెద్దలను పిలిచించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇరువర్గాలు చర్చించుకొని ఓ నిర్ణయం తీసుకోవాలని వారిని ఇళ్లకు పంపారు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. కుమార్తె ప్రేమ వ్యవహారం ఇష్టం లేని తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినా కుమార్తె మాట వినటం లేదని భావించాడు. మార్చి 18వ తేదీన చౌడేశ్వరి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారమిచ్చాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం తరువాత పోలీసులకు అనుమానం వచ్చినట్లు తెలిసింది. ఇది హత్యగా పోలీసులు భావించారు. దీనికి కారకులు తండ్రి చంద్ర శ్రీను, తల్లి, మేనత్త, మేనమామ, మరొకరు అని తేల్చినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో విచారణ నిమిత్తం ఐదుగురిని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు. ఇప్పటికి ఆత్మహత్య కేసుగానే నమోదు చేసినా... పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయని సమాచారం. హత్య కేసుగా మారే అవకాశం ఉందని తెలిసింది. చౌడేశ్వరిని, నాగరాజును పోలీసు స్టేషన్కు తీసుకొచ్చేటప్పటికే వారు ‘వివాహం చేసుకున్నామని, తాము మేజర్లని చెప్పినట్లు’ సమాచారం. ఎక్కడ పెళ్లి చేసుకున్నారో వివరాలు చెప్పి, ఆధారాలను కూడా చూపించారని తెలిసింది. అయినప్పటికీ ఇళ్లకు పోలీసులు పంపించి వేశారు. ఈ నేపథ్యంలో చౌడేశ్వరిని సొంత కుటుంబ సభ్యులే పరువు హత్య చేశారని సమాచారం. -
క్రీస్తు సందేశం... శాంతి మార్గం
సత్తెనపల్లి: క్రీస్తు అనగానే క్షమ, కరుణ గుణాలు గుర్తుకు వస్తాయి. లోకంలోని పాపులను పరిశుద్ధులు చేసేందుకు, వారికి క్షమను అందించేందుకు కరుణామయుడైన ఏసుక్రీస్తు.. శిలువపై తన ప్రాణాలను బలిపెట్టిన రోజే గుడ్ ఫ్రైడే. దీనినే శుభ శుక్రవారం అని కూడా అంటారు. తన ఆత్మ బలిదానంతో పాపులకు దేవుని పరిశుద్ధ సన్నిధిలో స్థానం కల్పించిన ఈ శుక్రవారాన్ని ప్రపంచంలోని క్రైస్తవులందరూ శుభ శుక్రవారంగా భావిస్తారు. దయామయుడైన క్రీస్తు శిలువపై చిందించిన రక్తం మానవాళికి శుభాలను చేకూర్చింది. అందువల్ల క్రైస్తవులు, విశ్వాసులు గుడ్ఫ్రైడేని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. గుడ్ ఫ్రైడే నాడే కల్వరిగిరిపై క్రీస్తును శిలువపై శిక్షించారు. చర్చిల్లో ప్రత్యేక ఏర్పాట్లు జిల్లాలో గుడ్ ఫ్రైడే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించుకునేందుకు క్రైస్తవులు, విశ్వాసులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అందులో భాగంగా పాస్టర్లు చర్చిల్లో ఉపవాస ప్రార్థనలు చేయనున్నారు. ఏసుప్రభువు చూపిన మార్గాన్ని అనుసరించి ఆరాధించే వారికి పరలోక ద్వారాలు తెరుచుకొని ఉంటాయని విశ్వాసుల ప్రగాఢ నమ్మకం. ఏసు మరణం సృష్టిలో ఓ అద్భుతమైన త్యాగపూరిత మరణం. దేవునితో మానవునికి శాశ్వత బంధాన్ని ఏర్పరిచిన గొప్ప మరణం. రేపటితో ముగియనున్న లెంట్ డేస్.. గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని క్రైస్తవులు, విశ్వాసులు 40 రోజులపాటు లెంట్డేస్ (శోక దినాలు) నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమైన లెంట్ డేస్ శనివారంతో ముగియనున్నాయి. లెంట్ డేస్ సందర్భంగా క్రైస్తవులు 40 రోజులు శుభ కార్యాలకు దూరంగా ఉంటారు. నిరంతరం దైవధ్యానంలోనే గడుపుతారు. పొరపాటున కూడా చెడు వ్యాపకాల వైపు మనసు మరల్చకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. లెంట్డేస్ సందర్భంగా చర్చిల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేకంగా మౌనంగా ప్రార్థనలు నిర్వహిస్తారు. శుక్రవారం గుడ్ ఫ్రైడేని, ఆదివారం ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు, విశ్వాసులు ఘనంగా నిర్వహించుకోనున్నారు. పునరుత్థానమే ఈస్టర్ కల్వరి కొండ మీద శిలువపై మరణించిన క్రీస్తును .. అక్కడి కొండ గుహలో సమాధి చేస్తారు. మూడవ రోజు ఏసుక్రీస్తు పునరుత్థానం పొంది తిరిగి తన శిష్యులకు దర్శనమిచ్చారు. ‘నేను జీవమును’ అనే మాటకు నిదర్శనంగా నిలిచి లోకానికి తన దివ్య మహిమను చాటారు. ప్రభువు పునరుత్థానం చెందిన ఆదివారాన్ని ఈస్టర్ సండేగా పిలుచుకుంటారు. అశాంతితో తల్లడిల్లుతున్న నేటి ప్రపంచానికి క్రీస్తు ప్రబోధించిన ప్రేమ, దయ, కరుణ, క్షమ గుణాలు ఆదర్శం కావాలని పాస్టర్లు చెబుతున్నారు. జిల్లాలో పలు చర్చిల్లో క్రీస్తు ఆత్మ బలిదానం, శిలువ యాగం తదితర ఘట్టాలను ప్రదర్శించనున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఏసు ప్రభువు కల్వరి కొండపై బలిదానం చేసిన ఘట్టాలను క్రైస్తవులు, విశ్వాసులకు పాస్టర్లు తెలియజేయనున్నారు. -
ముగిసిన అండర్–7 చిన్నారుల చెస్ పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): జిల్లా చెస్ అసోసియేషన్, రవీంద్ర రాజు చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో అండర్–7 బాలబాలికల చెస్ పోటీలు ముగిశాయి. గురువారం స్థానిక జేకేసి కళాశాల రోడ్డులోని నందనవనం 1వ లైన్లోని అజయ్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో నిర్వహించిన పోటీల్లో బాలురల్లో నితీష్ అగస్త్య ఓసూరి, గొల్లా శర్వానంద్ రామ్లు ప్రథమ, ద్వితీయ స్థానాలు గెలుపొందగా బాలికల విభాగంలో పామర్తి గాయత్రి ధన్యశ్రీ, పగడాల నిషితలు ప్రధమ, ద్వితీయ స్థానాలు గెలుపొందారని చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చల్లా రవీంద్రరాజు తెలిపారు. ఈ నలుగురు చిన్నారులు శనివారం ఏలూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చిన్నారులకు రవీంద్రరాజు బహుమతులు ప్రధానం చేశారు. భవనం పై నుండి జారిపడిన మెడికల్ విద్యార్థి మంగళగిరి టౌన్: భవనంపై నుంచి మెడికల్ విద్యార్థి జారిపడి తీవ్ర గాయాలైన ఘటన మంగళగిరి ఎన్నారై మెడికల్ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు మంగళగిరి మండలం చిన కాకానిలోని ఎన్నారై మెడికల్ కళాశాలలో అభిమన్యు మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మధ్యాహ్నం కొన్ని తరగతులు ముగిసిన అనంతరం బ్రేక్ టైంలో థర్డ్ ఫ్లోర్లోని బాల్కనీ వద్దకు చేరుకున్నాడు. అనుకోకుండా భవనంపై నుంచి జారీ కింద పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఎన్నారై వైద్యశాలలో చికిత్స నిమిత్తం తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం అభిమన్యు వెన్నెముకకు తీవ్రగాయమైందని, ప్రమాదం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం పట్టివేత నగరంపాలెం: పాతగుంటూరు శ్రీఆంజనేయస్వామి గుడి వద్ద గురువారం ఉదయం అనధికారికంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని జిల్లా పోలీస్ టాస్క్ఫోర్స్ పట్టుకున్నారు. ఈ మేరకు జేకేసీ రోడ్డుకి చెందిన వాహన డ్రైవర్ వి.చంద్రశేఖర్రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. మిర్చియార్డుకి చెందిన షేక్.అలీకి చెందిన యాభై కిలోల 55 బస్తాలుగా గుర్తించారు. అనంతరం డ్రైవర్ని, 2.75 టన్నుల 55 బస్తాలను పాతగుంటూరు పోలీసులకు అప్పగించారు. చీరలు దొంగలిస్తూ పట్టుబడిన మహిళలు నగరంపాలెం: వస్త్ర దుకాణంలో చీరలు దొంగలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలను నిర్వాహకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మంగళగిరిరోడ్డు ప్రధాన రహదారిలోని వైష్ణవి కాంప్లెక్స్లో వస్త్ర దుకాణాలు నెలకొన్నాయి. గురువారం మధ్యాహ్న వేళ అందులోని ఓ దుకాణంలో చీరలు కొనుగోలు చేసేందుకు పలువురు మహిళలు వచ్చారు. వస్త్రాలను చూసే క్రమంలో చీరలను దొంగలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలను వస్త్ర దుకాణదారుడు సత్యనారాయణ, మిగతా దుకాణాల నిర్వాహకులు చాకచాక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఇద్దర్ని పాతగుంటూరు పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన ఇద్దరి మహిళల వద్ద 16 చీరలు గుర్తించగా, దుకాణదారుడు సత్యనారాయణ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హెచ్పీవీ వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి
గుంటూరు మెడికల్: క్యాన్సర్ వ్యాధి భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఒక ఆరోగ్య సమస్యగా పరిణమించిందని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న మూడు నెలల హెచ్పీవీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ గురించి తెలిపారు. గర్భాశయ ముఖ ద్వారా (సర్వయికల్) క్యాన్సర్ భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఒక ఆరోగ్య సమస్యగా పరిణమించిందన్నారు. ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ ద్వారా సంక్రమిస్తుందని తెలిపారు. దీని నివారణకు సురక్షితమైన హెచ్పీవీ వ్యాక్సిన్ను 14 సంవత్సరముల ఆడపిల్లలకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. అర్హత గల వారు తమ పేర్లు యు–విన్ పోర్టర్ లో నమోదు చేసుకొని, వ్యాక్సిన్ వేయించుకొని సర్టిఫికెట్ పొందవచ్చని చెప్పారు. వ్యాక్సిన్ రక్షణకు ఒక అవకాశం అని, సంరక్షణ కోసం ఒక దశ అని తెలిపారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అర్హులైన 14,167 మందికి గాను ఇప్పటివరకు 2601 మందికి అంటే 18.36 శాతం వ్యాక్సిన్ అందజేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ఈ వాక్సినేషన్ను వేగవంతం చేయాలన్నారు. మరింత సమాచారం కోసం దగ్గరలోని సచివాలయం ఆరోగ్య కార్యకర్తను, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని సంప్రదించాలని సూచించారు. -
ఎక్కువ మందికి పని కల్పించేందుకు చర్యలు
ఇంకొల్లు(చినగంజాం): వీబీజీ రామ్జీ పథకం ద్వారా గ్రామాల్లో ఎక్కువ మందికి పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివన్నారాయణ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండలంలో 1 ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చి 2025 వరకు చేసిన పనులకు సంబంధించి గురువారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మొత్తం 517 పనులకు సామాజిక తనిఖీ బృందం ప్రజావేదిక ద్వారా బహిరంగంగా విచారించి సమీక్ష నిర్వహించారు. కూలీలకు రూ.8.98 కోట్లు, మెటీరియల్కు రూ 3.24 కోట్లు, మొత్తం రూ.12.22 కోట్లు ఖర్చు చేశారని సామాజిక తనిఖీ రిసోర్స్పర్సన్లు వివరించారు. ఆడిట్ నిర్వహించిన అనంతరం రూ.2.95 లక్షల నగదును రికవరీ చేయాల్సిందిగా గుర్తించారు. అనంతరం ఏపీడీ మాట్లాడుతూ ఆడిట్లోగుర్తించిన అంశాలను తెలుసుకొని మళ్లీ తిరిగి జరగకుండా రికార్డు ప్రకారం పనిచేయించాలని సిబ్బందికి ఆయన సూచించారు. గ్రామాల్లో కూలీలకు ఎక్కువగా పనులు కల్పించాలని, కూలీల మస్టర్కు సంబంధించి యాప్ను ఉపయోగించాలని, యాప్ పనిచేయకపోతే వెంటనే తెలియజేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో హ్యూమన్ రిసోర్స్పర్సన్ చంద్రశేఖర్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి సతీష్, స్టేట్ రిసోర్స్పర్సన్ నాగరాజు, డిప్యూటీ ఎంపీడీవో కే సత్యనారాయణ, ఏపీఓలు బుల్లిబాబు, రేణుక, జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్లు, జిల్లా రిసోర్స్ పర్సన్లు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివన్నారాయణ -
ప్రకృతి వ్యవసాయంతో ఎల్నిలోను అధిగమించొచ్చు
ప్రకృతి వ్యవసాయం సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ రామచంద్రం కొరిటెపాడు(గుంటూరు): ప్రకృతి వ్యవసాయం మోడల్స్తో వర్షాభావ పరిస్థితుల(ఎల్నిలో)ను అధిగమించవచ్చని ప్రకృతి వ్యవసాయం సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ రామంద్రం పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై కృషి భవన్లో ఏడీఏలు, ఏఓలు, ఉద్యాన శాఖ అధికారులు, ఏపీఎంలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా రామచంద్రం మాట్లాడుతూ ఎల్నిలోను ఎదుర్కోవడానికి పీఎండీఎస్ విత్తనాలు, విత్తన గులికల ప్రక్రియతో 365 రోజులు సిద్ధంగా ఉండాలని సూచించారు. గుంటూరు జిల్లా జేడీఏ ఎం.పద్మావతి మాట్లాడుతూ వ్యవసాయశాఖ అధికారులు తమ మండలాల్లో పీఎండీఎస్ కిట్స్ విత్తనాలను రైతులు అందరితో విత్తు చేయించే దిశగా కృషి చేయాలన్నారు. ఆత్మ ప్రాజెక్టు మేనేజర్ జి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మూడు రోజుల శిక్షణా కార్యక్రమాలు సమర్ధవంతగా నిర్వహించారని కొనియాడారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.రాజకుమారి మాట్లాడుతూ 30 రకాల విత్తనాలతో పీఎండీఎస్ కిట్స్ సిద్ధంగా ఉన్నాయని, ప్రతిఒక్కరూ ఇచ్చిన టార్గెట్స్ పూర్తి చేయాలనాఇ కోరారు. సమావేశంలో డీఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్ ఎల్హెచ్ అశోక్, పలువురు ఏడీఏలు, ఏఓలు, ఉద్యాన శాఖ అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి కేసులో నిందితులకు రిమాండ్ నరసరావుపేట టౌన్: పట్టణ శివారు టిడ్కో గృహాల వద్ద గంజాయి విక్రయిస్తున్న కేసులో నిందితులైన పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జకీర్, నితిన్ సాయి, అమర్నాథ్, హర్షవర్ధన్, గోపీనాథ్, అబ్దుల్ అజీజ్ లకు రిమాండ్ విధిస్తూ స్థానిక మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి ఆవుల సలోమి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 31వ తేదీన నిందితులు టిడ్కో గృహాల వద్ద గంజాయి విక్రయిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు రూరల్ పోలీసులు దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 1500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. -
గంజాయి మత్తులో యువకుల హల్చల్
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్యారీ కంపెనీలో గంజాయి బ్యాచ్ గురువారం హల్చల్ చేసింది. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడిపై కత్తితో దాడి చేయడంతో ఆ యువకుడు స్పృహ కోల్పోయాడు. సేకరించిన వివరాల ప్రకారం.. చదల వెంకన్న అన్నయ్య కుమారుడు రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. అతడ్ని వెతికే క్రమంలో వెంకన్న, మరో అన్నయ్య కుమారుడు అశోక్ చక్రవర్తి ఫుల్గా మద్యం తాగి ఇంటికి వచ్చారు. అప్పటికే గంజాయి సేవించి అక్కడ ఉన్న కొంతమంది యువకులు మీ అన్నయ్య కొడుకుని మేమేదో చేశామని మాట్లాడుతున్నారని ఘర్షణకు దిగారు. ఈ గంజాయి బ్యాచ్లోని ఓ యువకుడు జేబులో నుంచి కత్తి తీసి చదల వెంకన్నను ఎడమ చేతివైపు డొక్కల్లో పొడవగా స్వల్ప గాయమైంది. వెంటనే అదే కత్తితో తలపై పొడవడంతో వెంకన్నకు తీవ్ర రక్త స్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు, ఎస్ఐ ఖాజావలి హడావుడిగా సంఘటనా స్థలానికి వచ్చారు. పోలీసుల రాకను గమనించిన గంజాయి బ్యాచ్ అక్కడి నుండి పరారైంది. కత్తితో దాడిచేసిన వ్యక్తి కత్తుల పేటకు చెందిన యోహాన్గా పోలీసులు గుర్తించారు. గతంలో కూడా ఇదే బ్యాచ్ పలు ప్రాంతాల్లో కత్తులతో పలువురిని బెదిరించినట్లు విశ్వసనీయ సమాచారం. కత్తుల పేటలో నివాసముండే వారు స్థానికంగా ఉన్న అందరిపై ఇదేవిధంగా దౌర్జన్యం చేస్తున్నారని బహిరంగంగానే కత్తులు పట్టుకుని తిరుగుతున్నారని, ఈ రహదారిలో ప్రయాణించాలంటూ తీవ్ర ఇబ్బందిగా ఉన్నట్లు పలువురు తెలియజేశారు. గంజాయి బ్యాచ్ కోసం సీఐ వీరేంద్రబాబు సిబ్బందితో ప్యారీ కంపెనీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన చదల వెంకన్నను వైద్య నిమిత్తం 108 ద్వారా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స నిర్వహించిన 108 సిబ్బంది ప్రాణానికి ఎటువంటి హాని లేదని, మద్యం మత్తులో ఉండడం వల్ల స్పృహ కోల్పోయాడని తెలియజేశారు. -
దుకాణాలను పరిశీలించిన అధికారులు
పర్చూరు(చినగంజాం): ఓ దుకాణంలో కొనుగోలు చేసిన నెయ్యి ప్యాకెట్లో సరైన నాణ్యత లేకపోవడంతో ఓ వినియోగదారుడు జిల్లా ఆహార భద్రతా అధికారులను ఆశ్రయించాడు. వినియోగదారుని ఫిర్యాదుకు సత్వరం స్పందించిన అధికారులు గురువారం పర్చూరులో దుకాణంపై తనిఖీలు నిర్వహించారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు.. పర్చూరు బొమ్మల సెంటర్లో నిర్వహిస్తున్న ఓ దుకాణంలో పర్చూరుకు చెందిన పేర్ని హరిబాబు ఓ కంపెనీకి చెందిన నెయ్యి ప్యాకెట్ కొనుగోలు చేశాడు. నెయ్యి ప్యాకెట్ను ఇంటికి తీసుకొని వెళ్లి వినియోగిస్తున్న క్రమంలో దానిలో నెయ్యి లక్షణాలు లేకపోగా వాసన కూడా లేకపోవడాన్ని గమనించాడు. దాంతో అనుమానం వచ్చిన హరిబాబు బాపట్ల జిల్లా ఆహార భద్రతాధికారి ప్రణీత్కుమార్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న అధికారి సత్వరం స్పందించి ఫిర్యాదు చేసిన దుకాణంపై గురువారం తనిఖీలు నిర్వహించి ఫిర్యాదు చేసిన బ్యాచ్కు చెందిన నెయ్యి ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని పరిశీలించి నమూనాలను సేకరించాడు. ఆ నమూనాలను ప్రయోగశాల పరీక్షల కోసం హైదరాబాద్ పంపుతున్నట్లు అధికారి తెలిపారు. వినియోగదారుని ఫిర్యాదుతో స్పందించిన ఆహార భద్రతాధికారులు -
బాబు జగ్జీవన్రామ్ ఆశయాలు ఆదర్శనీయం
ఏఎన్యూ(పెదకాకాని): రిజర్వేషన్ల ఫలాలలను సంబంధిత వర్గాలన్నింటికీ చేరువ చేయడంలో బాబు జగ్జీవన్రామ్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహార్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బాబు జగ్జీవన్రామ్ చైర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకలకు శామ్యూల్ జవహార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత బాబు జగ్జీవన్రామ్ చైర్లోని ఆయన చిత్రపటానికి, యూనివర్సిటీలోని జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన జయంతి ఉత్సవ సభలో శామ్యూల్ జవహార్ మాట్లాడుతూ మన సమాజంలో నేటికీ కుల వివక్షత అంతం కాలేదన్నారు. ఎస్సీ కులస్థుడనే కారణంతో ఎస్సీ కమిషన్ చైర్మన్ స్థాయి వ్యక్తికి కూడా క్షవరం చేసేందుకు నిరాకరించిన విచారకర పరిస్థితిని, హోటల్లో కులాల వారీగా బల్లలు ఉండటాన్ని తాను స్వయంగా చూశానన్నారు. పెత్తందారీ ధోరణి, ఆధిపత్యం, అసమానతలు పోవాలని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పటేల్, పట్వారీ వ్యవస్థలు రద్దు చేశారని కానీ ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరలేదన్నారు. ● పట్టణాలలో కుల వివక్షత లేదనే భావన ఉందని పక్కన ఏ జరుగుతుందో పట్టణంలో పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టే మనకు కుల వివక్షత అర్ధం కావడం లేదన్నారు. 75 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ రిజర్వేషన్ ఫలాలు చాలా మందికి అందటం లేదని, పరిస్థితి ఇలాగే ఉంటే మరో 75 సంవత్సరాలైనా ఫలితం ఉండదన్నారు. అన్ని వర్గాలకు సంపూర్ణ రిజర్వేషన్ల ఫలాలు అందజేయడంలో బాబు జగ్జీవన్రామ్ సిద్దాంతాలను స్పూర్తిగా తీసుకుని ముందుకుసాగాలన్నారు. ● వీసీ ఆచార్య కె.గంగాధరరావు అధ్యక్షోపన్యాసం చేస్తూ మన దేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్రామ్ చేసిన కృషి, తెచ్చిన సంస్కరణలు ఎప్పటికీ ఆదర్శనీయమనన్నారు. బాబు జగ్జీవన్రామ్ చైర్ డైరెక్టర్ ఆచార్య పీజే రత్నాకర్ చైర్ నివేదికను సమర్పిస్తూ చైర్ అభివృద్ధికి వర్సిటీ ఉన్నతాధికారులు ప్రత్యేక సహకారం అందిస్తున్నారని, కానీ కిందిస్థాయి అధికారులు చాలా అంశాల్లో చైర్ పట్ల వివక్షత చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ● అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్ వై.అశోక్ కుమార్ ప్రసంగిస్తూ మన సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్, బాబు జగ్జీవన్రామ్లు ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఫూలే చైర్ డైరెక్టర్ ఆచార్య ఎం.త్రిమూర్తిరావు, ఆచార్య పి.బ్రహ్మాజీరావు, డాక్టర్ నూతక్కి అశోక్కుమార్, ఉద్యోగ సంఘ నాయకులు కె.కోటేశ్వరరావు, ఎ.వెంకటేశ్వర్లు, ఎ.రమేష్, థెరిస్సాబాబు, డాక్టర్ అబ్రహం లింకన్, పరిశోధకులు పి.అభిషేక్, రాజేష్, దాసు, పలువురు అధ్యాపకులు, సిబ్బంది, పరిశోధకులు పాల్గొన్నారు. -
పారదర్శకతకు తూట్లు పొడిస్తే సహించం
మంగళగిరి టౌన్: ఉన్నత విద్య ప్రక్షాళన పేరుతో పారదర్శకతకు తూట్లు పొడిస్తే సహించబోమని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలరాజు, బందెల నాజర్లు హెచ్చరించారు. మంగళగిరి పట్టణ పరిధిలోని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత విద్యామండలి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. ఎలాంటి చర్చలు లేకుండా, విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకోకుండా చీకటి జీవోల ద్వారా ఉన్నత విద్యావ్యవస్థలో మార్పులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. 40 సంవత్సరాలుగా పారదర్శకంగా కొనసాగుతున్న వ్యవస్థను అకస్మాత్తుగా నిర్వీర్యం చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా జీవో ద్వారా ఉన్నత విద్యా కమిషనర్కు అన్ని అధికారాలు కేంద్రీకరించడం వల్ల పారదర్శకత కోల్పోతుందని పేర్కొన్నారు. ప్రైవేటు కాలేజీల అనుమతులు, కోర్సుల ప్రారంభం, అడ్మిషన్ కౌన్సెలింగ్, ఫీజు నిర్వహణ వంటి కీలక అంశాలను ఒకే అధికారికి అప్పగించడం ద్వారా విద్యావేత్తల పాత్ర తగ్గిపోతుందని, విద్యారంగం వ్యాపారంగా మారే ప్రమాదముందన్నారు. పరీక్షలు, ప్రవేశాల ప్రక్రియలను వేరుచేయడం చట్టవిరుద్ధమని విమర్శించారు. ఉన్నత విద్యారంగం ప్రక్షాళన అంశంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రెడ్డి సుబ్రహ్మణ్యంతో పాటు ఏడుగురు కమిటీ ఇచ్చిన నివేదికను వెంటనే బహిర్గతం చేసి మంత్రి వర్గంలో సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేశారు. జీవో నెం. 3ను వెంటనే ఉపసంహరించుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు యశ్వంత్, ప్రణీత్, అమరనాధ్, అజయ్, గణేష్, సతీష్ పాల్గొన్నారు. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా జీఓ నెం.3ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ -
జెడ్పీ పీఎఫ్ సిబ్బందిపై చర్యలు తీసుకోండి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులకు సంబంధించిన పీఎఫ్ లోన్ ప్రతిపాదనల ఫైళ్లను నెలల తరబడి పెండింగ్లో ఉంచుతున్న జెడ్పీ పీఎఫ్ విభాగంలోని సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు గుడిపాటి దాస్, మహమ్మద్ ఖాలీద్ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం జెడ్పీ డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణను జెడ్పీ కార్యాలయంలో కలసిన ఏపీటీఎఫ్ బృందం ఆయనకు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.దాస్ మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తూ గతేడాది 2025 డిసెంబర్, 2026 జనవరి మధ్య ఉద్యోగ విరమణ పొందిన అన్ని కేడర్లకు చెందిన హెచ్ఎంలతో పాటు ఉపాధ్యాయుల ఫైనల్ క్లోజర్స్ జెడ్పీ పీఎఫ్ విభాగంలో సబ్మిట్ చేసి, నాలుగు నెలలు గడిచినా, ప్రాసెస్ చేయకుండా అకారణంగా పెండింగ్లో ఉంచారని ఆధారాలతో డిప్యూటీ సీఈఓకు వివరించారు. గత మార్చి వరకు ప్రాసెస్ చేసిన రుణ, ఇతర అన్ని ఫైల్స్ క్లియర్ చేసిన ప్రభుత్వం ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాల్లో నగదు జమ చేసిందని, పీఎఫ్ సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా కొందరికి డబ్బులు పడలేదని తెలిపారు. ఉపాధ్యాయుల క్లోజర్స్, రుణ ఫైల్స్ క్లియర్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరో ఆర్నెల్ల వరకు పీఎఫ్ నగదు రాదని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ● ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ రూ.5 లక్షల లోపు పీఎఫ్ లోన్స్పై అసిస్టెంట్ సివిల్ సర్జన్, రూ.5 లక్షలు దాటితే సివిల్ సర్జన్ సంతకాలు ఉండాలనే నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. 15 రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవ లింగారావు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఈవోను కలసిన వారిలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.నాగశివన్నారాయణ, జిల్లా కార్యదర్శి పచ్చల శివరామకృష్ణ, జిల్లా కౌన్సిలర్లు బి.కృష్ణారావు, వి.కిషోర్ షా, చెన్నుపాటి పెదలక్ష్మయ్య ఉన్నారు. గుంటూరు వెస్ట్: గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సిఎం సాయి కాంత్ వర్మను గుంటూరు జిల్లా జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీజిఓ సంఘ అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి ఏ శ్యామ్ సుందర్ శ్రీనివాస్, ఏపీ ఎన్జీజివో సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికార యంత్రాంగం, ఉద్యోగులు, ప్రజల సమన్వయంతో గుంటూరు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు. స్పందించిన కలెక్టర్ జిల్లా అభివృద్ధి కోసం అందరి సహకారం ఎంతో అవసరమన్నారు. అధికార యంత్రాంగం, ఉద్యోగుల సమన్వయంతో పారదర్శక పరిపాలన అందించడానికి వృషి చేస్తానని తెలిపారు. అలాగే ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతమైన పురోగతికి ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్. శ్రీధర్ రెడ్డి, సిహెచ్ అనిల్, బి. వృష్ణ కిషోర్, డి. శ్రీనివాస్, కే. నరసింహారావు, కే.విజయ్, గుంటూరు సిటీ కార్యదర్శి సిహెచ్ కళ్యాణ్ కుమార్, సిటీ ట్రెజరర్ జీవి కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
చిలకలూరిపేట: ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర రాజకీయ,సాంస్క్రతిక, విద్య,వైద్య రాజకీయ శిక్షణ తరగతులు మే నెలలో ఐదు రోజుల పాటు కోటప్పకొండలో నిర్వహించనున్నారు. శిక్షణా తరగతుల నిర్వహణ కోసం పార్టీ నేతలతో కలసి కోటప్పకొండ ను సందర్శించి అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో కలసి బుధవారం చిలకలూరిపేట పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్దిలో సైతం ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో రెండేళ్ల కాలంలో విధ్వంసకర పాలన జరుగుతుందని ధ్వజమెత్తారు. ప్రశ్నించినవారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అభివృద్ధిలో ఆమడ దూరం కూడా పోలేని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ పొంగిపొర్లుతుంటే పల్నాడులో అనేక ప్రాంతాలు గుక్కెడు నీటికి అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ రూ. 500 కోట్లు ఖర్చు చేస్తే, లక్ష ఎకరాలకు సాగునీరు అందే వరికపుడిశెలకు దిక్కులేదుగాని, రూ.81 వేల కోట్లతో ఎక్కడో పోలవరం దగ్గర నుంచి కర్నూలు జిల్లా పెనకచర్లకు నీళ్లు తీసుకెళ్తామని గొప్పలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 151 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకో వచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి వీకేంద్రీకరణ జరగాలని, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అలా కాకుండా రాజధాని పేరుతో ఒకే ప్రాంతంలో నిధులు కేంద్రీకృతం చేస్తే ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతీ వరప్రసాద్, సహాయ కార్యదర్శులు షేక్ హుస్సేన్, కాసా రాంబాబు, ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సంతోష్, యుగంధర్ పాల్గొన్నారు. రాజధాని పేరుతో అభివృద్ధి కేంద్రీకరణ ఒకే చోట తగదు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య -
డిప్యూటీ స్పీకర్ వైఖరి ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు
నరసరావుపేట: ఉప సభాపతి పదవిలో కూర్చుని ఒక వర్గం కొమ్ముకాస్తూ దళితులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్న రఘురామ కృష్ణంరాజు వైఖరి ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ పేర్కొన్నారు. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షుడు విస్తాల జయరావు ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జాన్పాల్ మాట్లాడుతూ అసెంబ్లీలో అందరినీ సమానంగా చూడాల్సిన ఉప సభాపతి, వీధుల్లోకి వచ్చి కుల విద్వేషాలు రెచ్చగొట్టడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. రఘురామకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని స్పష్టం చేశారు. ఆకివీడులో ప్రశాంతంగా ఉన్న దళితులపై దాడులు చేయించడమే కాకుండా తిరిగి బాధితులైన 57 మంది దళితులపైనే నాన్–బెయిలబుల్ కేసులు పెట్టించడం రఘురామ అరాచక పాలనకు పరాకాష్ట అన్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేక రఘురామ ’రాజరిక’ పాలనా అని ప్రశ్నించారు. ఆకివీడు దళితులపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలి, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దళిత శక్తిని ఏకంచేసి అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి తెలిసేలా మా పోరాటం ఉంటుందని హెచ్చరించారు. నరసరావుపేట నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు సేవా సామేలు, మండల అధ్యక్షుడు ముచ్చు బ్రహ్మ పాల్గొన్నారు. ఆకివీడు దళితులపై అక్రమ కేసులు రద్దు చేయాలి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ -
ఏపీకి వైఎస్ జగన్ నాయకత్వం అవసరం
కాంగ్రెస్ పార్టీ మాజీ నేత మోపిదేవి శ్రీనివాసరావు రేపల్లె: రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన అరుదైన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ పార్టీ రేపల్లె నియోజకవర్గ మాజీ ఇన్చార్జి మోపిదేవి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు నేతృత్వంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీసుకుంటున్న నిర్ణయాలు వైఎస్సార్ కుటుంబానికి తీరని నష్టం చేకూరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉండి పథకాలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా కేవలం వైఎస్ జగన్ను టార్గెట్ చేస్తూ చంద్రబాబు సారథ్యంలో విమర్శలు చేయడం తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జనసేన అధినేత పవన్కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. మెగా ఫ్యామిలీని రాజకీయంగా దుష్ప్రచారం చేసింది టీడీపీ నాయకులేనని పవన్కళ్యాణ్ మర్చిపోవడం బాధాకరమన్నారు. వంగవీటి మోహనరంగా వంటి నేతల పోరాట స్ఫూర్తితో వైఎస్సార్ చూపిన మార్గంలోనే వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని చెప్పారు. 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చదలవాడ శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్లు బేతపూడి కోటేశ్వరరావు, రెడ్డి శివశంకర్, నీలా లక్ష్మణ్బాబు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
నరసరావుపేట: ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈ నెల 28న రాష్ట్ర సచివాలయం ముట్టడికి పిలుపునిస్తామని యూటీఎఫ్ నాయకులు హెచ్చరించారు. స్థానిక స్టేషన్రోడ్డు గాంధీ పార్క్ వద్ద ధర్నా చౌక్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ‘‘రణభేరి 3.0’’ సందర్భంగా నిరాహార దీక్ష చేపట్టారు. శిబిరాన్ని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు ప్రారంభించారు. రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. 12వ పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు, బకాయిల చెల్లింపు, మెమో–57 అమలు, హెల్త్ స్కీమ్ వంటి కీలక అంశాలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. పీఆర్సీ అమలులో తీవ్ర ఆలస్యం జరుగుతోందని, ఇప్పటికే 30 నెలలకు పైగా ప్రయోజనాలు కోల్పోయామని తెలిపారు. డీఏలు సకాలంలో ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యా రంగంపై తగిన నిధులు ఖర్చు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దిగజారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులతో ప్రజలను దోపిడీ చేస్తున్నాయని అన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టత లేకపోవడం, తాత్కాలిక ఉద్యోగాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ మెంబర్ పి.ప్రేమ్కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. పీఆర్సీ ఏర్పాటు, పెండింగ్ డీఏలు, బకాయిల చెల్లింపు, మెమో నెంబర్ 57 వర్తింపు, సీపీఎస్ రద్దు తదితర ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటం చేస్తామన్నారు. 29శాతం ఐ.ఆర్ ప్రకటించి పెండింగ్ డీఏలు విడుదల చేయాలన్నారు. కరోనా సమయంలో మరణించిన 953 పంచాయతీ రాజ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని అన్నారు. పల్నాడు జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు కె.శ్రీనివాసరెడ్డి, మద్దుకూరి మోహనరావు, జిల్లా సహాధ్యక్షులు ఎ.భాగేశ్వరిదేవి, జెవిడి వాల్యా నాయక్, గౌరవ అధ్యక్షులు షేక్ ఖాసీం పీరా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్.సుందరరావు, షేక్ అయేషా సుల్తానా ఆయా మండల అధ్యక్ష, కార్యదర్శులు, 250 మందికిపైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి ఆంజనేయనాయక్, ఏపీ ఎన్జీఓ–ఏపీ జేఏసీ పల్నాడు అధ్యక్షులు ఎం.రామకృష్ణ, ఆనంద్, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఆదయ్య, ఏపీటీఎఫ్ 1938 పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షులు పమ్మి వెంకటరెడ్డి, వివిధ సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రేమ్కుమార్ నిరాహార దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపపజేశారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి, డీఈఓకు వినతిపత్రం అందజేశారు. యూటీఎఫ్ రాష్ట్ర నాయకుల వినతి -
ఉక్కపోత.. రోగుల వెత
గుంటూరు మెడికల్: రెండు తెలుగు రాష్ట్రాల్లో పేదల పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు జీజీహెచ్లో ఏసీలు పనిచేయక పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క ఎండాకాలం ప్రారంభమై ఏప్రిల్లో ఎండలు మండిపోతున్నాయి. ఆపరేషన్ థియేటర్స్, వార్డుల్లో ఏసీలు పనిచేయక రోగులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. రోగులకు వైద్య సేవలు అందించే వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఏసీలు పనిచేయక ఉక్కపోతతో చెమటోడ్చుతున్నారు. ఏసీల రిపేర్లు చేసే టెక్నీషియన్ ఒక్కరు కూడా ఆస్పత్రిలో లేరు. ఏసీల కాంట్రాక్టర్ సైతం కాంట్రాక్ట్ కాల పరిమితి దాటిపోవటంతో పత్తా లేకుండా పోయాడు. అయినప్పటికీ కాంట్రాక్టర్కు రూ.లక్షల బిల్లులు చెల్లించేందుకు ఆస్పత్రి అధికారులు రంగం సిద్ధం చేయటం తీవ్ర విమర్శలకు తావునిస్తోంది. గుండెజబ్బు రోగులకు అవస్థలు.... జీజీహెచ్లో గుండె జబ్బు రోగులకు అవస్థలు తప్పడం లేదు. ప్రతిరోజూ ఇబ్బంది పడేవారు కొంత ఉపశమనం కోసం వస్తే ఏసీలు పనిచేయక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కార్డియోథొరాసిక్ సర్జరీ ఆపరేషన్ థియేటర్లో సైతం ఏసీలు పనిచేయటం లేదు. ఏసీల రిపేర్లతో గుండె ఆపరేషన్లు చేసేందుకు వైద్యులు నానా అగచాట్లు పడుతున్నారు. ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి. మరోపక్క ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు గదిలో ఏసీలు పనిచేయక ఊపిరాడక నానా అగచాట్లు పడుతున్నారు. గుండె జబ్బు రోగులకు సరిపడ గాలి, వెలుతురు లేని పక్షంలో ఊపిరి అందక ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు తీవ్ర నిర్లక్ష్య ధోరణితో ఏసీలు రిపేర్లు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోతున్నారు. అత్యవసర విభాగంలోనూ... జీజీహెచ్కు గుండెకాయ మాదిరిగా ఉండే అత్యవసర వైద్య సేవల విభాగం (ఎమర్జన్సీ వార్డు)లో ఏసీలు పనిచేయక రోడ్డు ప్రమాద బాధితులు, అత్యవసర వైద్యసేవల కోసం తీవ్ర అనారోగ్యంతో వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండలు మండుతూ ఉండటంతో మధ్యాహ్నం సమయంలో వార్డులో ఉండి చికిత్స పొందాలంటే ఉడికిపోవాల్సిందే. వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఎమర్జన్సీ వార్డులో వైద్యసేవలు అందించేందుకు చెమటోడ్చుతున్నారు. కీలకమైన వైద్య విభాగాల్లో, ఆపరేషన్ థియేటర్స్లో ఏసీలు పనిచేయకపోయినా ఆస్పత్రి అధికారుల్లో ఏ మాత్రం చలనం లేకపోవటం విమర్శలకు తావు ఇస్తోంది. ఏడాదికి రూ.40 లక్షల బిల్లులు ఆస్పత్రిలో సుమారు 100 నుండి 125 ఏసీలు పనిచేస్తున్నాయి.గత ఏడాది కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పలు బ్యాంకులు , కంపెనీల ద్వారా సామాజిక బాధ్యతలో భాగంగా సుమారు 30 వరకు ఏసీలు ఉచితంగా జీజీహెచ్కు అందజేశారు. వీటి నిర్వహణ కోసం ప్రతి ఏడాది ఏసీల కాంట్రాక్టర్కు రూ. 35 లక్షల నుంచి రూ.40 లక్షలు చెల్లిస్తున్నారు. గత ఏడాది కాంట్రాక్టర్ సక్రమంగా పనిచేయలేదని వైద్య విభాగాధిపతులు చెప్పినా ఆస్పత్రి అధికారులు అతడికి దొడ్డిదారిలో బిల్లులు చెల్లించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఆస్పత్రిలో సుమారు మూడు నెలలుగా ఏసీ కాంట్రాక్టర్ లేరు. ఆస్పత్రిలో ఒక్క ఏసీ మెకానిక్ పోస్టు కూడా లేదు. ప్రతి ఏడాది ఏసీల కాంట్రాక్టర్కు ఇచ్చే రూ.40 లక్షలతో కొత్త ఏసీలు 100 వరకు కొనుక్కొని కంపెనీ వారు ఇచ్చే వారంటీతో ఏడాది నుంచి మూడేళ్లపాటు ఉచిత సర్వీసులు పొందవచ్చు. ఆసుపత్రి అధికారులకు సంబంధించిన గదుల్లో ఏసీలు బాగానే పనిచేస్తున్నాయి. రోగులకే దిక్కు లేదు. -
పేదల బియ్యం పక్కదారి
యథేచ్ఛగా రేషన్ బియ్యం అక్రమ రవాణా చీరాల అర్బన్: చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయి. అవినీతి రాజ్యమేలుతోంది. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. దీనిపై నిఘా పెట్టాల్సిన సంబంధిత అధికారులు శీతకన్ను వేస్తున్నారు. దీంతో రేషన్ మాఫియాగా గుర్తింపు పొందిన ఓ వ్యక్తి దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అతను చీరాలతోపాటు కందుకూరు, గుంటూరులలో కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒంగోలులో ప్రజా ప్రతినిధిగా చెలామణి అవడం, చీరాల్లో కీలక నేత, యువనేతల అండ అందుకు కారణమనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి స్థాయిని బట్టి నజరానాలు అందటం బహిరంగ రహస్యాలనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చీరాల నియోజకవర్గంలో సేకరిస్తున్న రేషన్ బియ్యాన్ని తొలుత చిలకలూరిపేటకు, అక్కడ నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద ముందస్తుగా నల్లబజారు వ్యాపారులకు చెందిన వాహనాల నంబర్లు చెప్పి, వాటిని ఆపకుండా ఒక వ్యవస్థను తయారు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చీరాల నియోజకవర్గం నుంచి ప్రతి నెలా సుమారు 10 వేల బస్తాల రేషన్ బియ్యం నల్లబజారుకు తరలుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పలువురు డీలర్లు కొంతమేర కార్డుదారుల నుంచి కొనుగోలు చేయటం, మరికొంత చేతివాటంతో సేకరిస్తున్నారని చెప్పుకుంటున్నారు. స్థానికంగా డీలర్లు వద్ద రేషన్ బియ్యాన్ని నల్లబజారు వ్యాపారి దివ్యాద్రి కేజీ రూ.14లకు కొనుగోలు చేస్తున్నాడు. ఆ బియ్యాన్ని చిలకలూరిపేటకు తరలిస్తున్నాడు. అక్కడ ప్రత్యేక గోతాల్లో నింపుతారు. వాటిని పెద్ద, పెద్ద టర్బోలకు లోడ్ చేసి, కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. పోర్టు నుంచి దక్షిణాఫ్రికా దేశాలకు తరలుతున్నాయి. ఇటీవల కాకినాడ పోర్టులో సుమారు 140 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పట్టుబడటం గమనార్హం. చిలకలూరిపేట మిల్లర్కి సదరు వ్యక్తి కేజీకి రూ.24 చొప్పున చెల్లిస్తున్నాడని, మిల్లర్ అక్కడ నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. అక్కడ మిల్లర్కు కేజీకి రూ.29.50 చొప్పున ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి స్థాయిని బట్టి మామూళ్లు ముడుతున్నాయి. మొదటి స్థానంలో రాజకీయ అండ కోసం కీలక నేత, యువనేతలకు పెద్ద మొత్తం అందుతోంది. తరువాత మిగిలిన వ్యవస్థల్లో ఇస్తుండటంతో వారు కూడా మౌనముద్ర దాలుస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు అందుకు దర్పణం పడుతున్నాయని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మా వంతు బాధ్యతలను మేం సక్రమంగా నిర్వహిస్తున్నాం. గత నెలలో ఎంఎల్ఎస్ పాయింట్ను, మూడు రేషన్ దుకాణాలను తనిఖీ చేశాం. పెద్దగా లోపాలు లేవు. రేషన్ బియ్యం పక్కదారి పడుతుంటే తెలిసిన వారు మాకు సమాచారం అందించాలని కోరుతున్నాం. ఏ డీలరైనా బియ్యం బదులు డబ్బులిస్తామని ఇబ్బంది పెడుతుంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. వాటిని రికార్డు చేస్తాం. మా పరంగా ఎవరినీ ఉపేక్షించం. ఎలాంటి ప్రలోభాలకు తావివ్వం. – చంద్రశేఖర్, విజిలెన్స్ సీఐ, గుంటూరు గత నెలలో చీరాల్లో ఏడు రేషన్ షాపులను తనిఖీ చేశాం. సరుకులో వ్యత్యాసాలతో ఆయా షాపుల నిర్వహకులపై 6ఏ కేసులు నమోదు చేశాం. విజలెన్స్ అధికారుల బృందం కూడా ఎంఎల్ఎస్ పాయింట్ను తనిఖీ చేశారు. రేషన్ సరుకుల పంపిణీ, రవాణాలో అవకతవలు జరగకుండా సక్రమంగా మా వంతు బాధ్యతలు మేం నిర్వహిస్తున్నాం. – ఓంకార్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ, చీరాల రేషన్ డీలర్లులో పలువురు పేరు మాది, ఫలితం మరొకరిదని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే డీలర్గా ఉండాలంటే ఎక్కడా నోరు మెదపకూడదని, అలానే చెప్పినప్పుడు అడిగిన ఇండెంట్కు ప్రతి ఒక్కరూ సహకరించాలనే నిబంధన పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. కాదంటే సంబంధిత రేషన్ డీలర్ల దుకాణాలపై తమకు అనుకూలమైన అధికారులతో దాడులు చేయిస్తామనే బెదిరింపులు ఎదురవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకు ఓ అధికారి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే బహిరంగంగా తమకు జరుగుతున్న కష్టాన్ని, నష్టాన్ని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని పలువురు డీలర్లు వాపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
రైల్వే వీక్ పురస్కారాల ప్రదానం
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్లో 70వ రైల్వే వీక్ అవార్డులు 14 మందికి రావడం అభినందనీయం అని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ కార్యాలయంలో బుధవారం 70వ రైల్వే వీక్ అవార్డులను డీఆర్ఎం ప్రదానం చేశారు. ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలలో అవార్డులు అందుకున్న వారి కృషి, నిబద్ధతను ప్రశంసించారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం ఎం.రమేష్కుమార్, సంబంధిత డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సూర్యలంకలో త్వరితగతిన అభివృద్ధి పనులు
బాలవనం త్వరితగతిన పూర్తి చేయాలి పింఛన్లు పంపిణీ వేమూరు: పేదలకు పింఛన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలంలోని మోపర్రు గ్రామంలో పింఛను పంపిణీ చేశారు. వృద్ధుల వద్దకు వెళ్లి బుధవారం పింఛన్లు అందజేశారు. గ్రామంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మండల పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. విద్యార్థులను చదువు గురించి, మధ్యాహ్న భోజనం పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులతో మాట్లాడారు. గ్రామంలోని ప్రజలు కొన్ని సమస్యలను అయన దృష్టికి తీసుకెళ్లారు. -
బాపట్ల జిల్లాలో 14 సిలిండర్లు స్వాధీనం
నగరంపాలెం: గృహ ఎల్పీజీ సిలిండర్లను వినియోగించే వ్యాపార దుకాణాలు, హోటళ్లల్లో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం బాపట్ల జిల్లా ఇంకొల్లు మండల పరిధిలోని గొల్లపాలెం రోడ్డులో ఉన్న బాలాజీ మెస్లో ఆరు సిలిండర్లు, మసీద్ సెంటర్లోని మస్తాన్ బాబా ముబారక్ హోటల్లో ఎనిమిది గృహ ఎల్పీజీ సిలిండర్లను గుర్తించారు. అక్రమంగా వినియోగిస్తున్న 14 సిలిండర్లను స్థానిక డిప్యూటీ తహసీల్దార్కు అప్పగించారు. ఆయా హోటళ్ల యాజమానులపై రెండు 6–ఎ కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్న్స్, పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. కర్లపాలెం: చేపలవేటకు వెళ్లి వలకు చిక్కుకుని ఓవ్యక్తి మృతిచెందిన సంఘటన కర్లపాలెం మండల పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... కర్లపాలెం పంచాయతీ పరిధిలోని లంక కాలువ కట్టపై నివసిస్తున్న అద్దూరి వెంకటరావు(50) యాజలి రెవెన్యూ పరిధిలోని తుంగభద్ర కాలువపై ఉన్న గుడిపూడి వంతెన వద్ద చేపల వేటకు దిగి కట్టువలకు చిక్కుకుని ఊపిరాడక మృతిచెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య సముద్రాలు కుమారుడు శివనాగరాజు ఉన్నారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీపీఎస్సీ–2023 బ్యాచ్లో ఎంపీడీఓగా ఎంపికై కొల్లూరు మండలంలో పోస్టింగ్ పొందిన అమర్తలూరి స్పందనకు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మంగళవారం జెడ్పీ క్యాంపు కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు, డెప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, ఏఓ జె.పూర్ణచంద్రారెడ్డి పాల్గొన్నారు. గుంటూరు లీగల్: పెదకాకాని పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన హుండీలోని కానుకలు లెక్కింపు సమయంలో కొంత సొమ్ము చోరీకి గురైంది. మల్లేశ్వరస్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామ రఘునందనరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ గౌస్ నిందితురాలైన తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీరావమ్మకు మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధించారు. ఈ కేసుకు సకాలంలో సాక్ష్యాధారాలను అందించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వై.వినోద్కుమార్ కోర్ట్ కానిస్టేబుల్ కే.ప్రేమ్కుమార్కు సంబంధిత అధికారులు అభినందనలు తెలిపారు. కేసు లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి మురళీకష్ణ వాదనలు వినిపించారు. రెంటచింతల: మండలంలోని పాలువాయిగేటు గ్రామ సమీపంలో ఉన్న టోల్ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడకక్కడే మృతిచెందాడు. పాతపాలువాయికి చెందిన ఇండ్లచెరువు పుల్లారావు(28) జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మాచర్ల నుంచి రెంటచింతల వైపు వెళ్తున్న వాహనం పుల్లారావును ఢీ కొట్టి ఉంటుందని ఆ ప్రాంతంలో వాహనానికి సంబంధించిన అద్దాలు ఉండటంవలన అనుమానిస్తున్నారు. పుల్లారావు భార్య కోటేశ్వరితో కొంతకాలంగా మనస్పర్థలు ఉన్న నేపథ్యంలో ఆమె కొత్తపల్లి గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఘటన వివరాలు తెలుసుకున్న ఎస్ఐ సీహెచ్ నాగార్జున ప్రమాద స్థలానికి చేరుకుని విచారించారు. భార్య కోటేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
మద్యం.. మాయాజాలం!
బాపట్టబుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ప్రజలను మత్తుతో చిత్తు చేస్తున్న చంద్రబాబు సర్కార్ – ఎస్.శ్రీనివాసులు, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ, చీరాల వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలో తగ్గుతున్న విక్రయాలు పుట్టగొడుగుల్లా బెల్ట్ దుకాణాలు జోరుగా ఎన్డీపీ లిక్కర్ విక్రయాలు పలుచోట్ల నకిలీ మద్యం కూడా అమ్మకం నరసరావుపేట రూరల్: ఇస్సపాలెంలోని మహంకాళి ఆలయ నిర్మాణానికి కొనకంచి లక్ష్మయ్య, కుమారి దంపతులు రూ.1.01,116 విరాళంగా అందజేశారు. -
బాపట్ల అభివృద్ధి ఊసేలేని కూటమి ప్రభుత్వం
బాపట్ల: బాపట్ల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సంఘ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లులా ముందుకుపోతున్నామని చెప్పే నాయకులు ఎక్కడ, ఏవిధమైన అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో బాపట్ల ప్రాంతాభివృద్ధి మరో పదేల్లుపాటు వెనక్కిపోయిందన్నారు. పేదోళ్లకు అవసరమైన మెడికల్ కళాశాలను బాపట్ల నిర్మించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కృషి చేస్తే కూటమి ప్రభుత్వం మోకాలు అడ్డుపెట్టి చోద్యం చూస్తోందని చెప్పారు. ఇప్పటికై న కూటమి ప్రభుత్వం పేదోళ్లకు అందే వైద్య సేవలు అడ్డుకునే కార్యక్రమాలు మానుకోవాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు తన్నీరు అంకమ్మరావు, కటికల మోషే, పాల్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
విశ్రాంత ఉద్యోగులకు అండగా పోలీస్శాఖ
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వరరావుబాపట్లటౌన్: ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు పోలీస్శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం చీరాల వన్ టౌన్ ఏఎస్ఐ ఎం.ముస్తఫా ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్శాఖలో 33 సంవత్సరాలపాటు విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ చేసిన ముస్తఫా దంపతులను సన్మానించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో సైతం సమర్ధవంతంగా విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. గతంలో నక్సల్స్ ఉద్యమం ముమ్మరంగా ఉన్న సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, నిర్వహించిన విధుల గురించి ముస్తఫా తన అనుభవాలను వెల్లడించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని అన్నారు. నిబద్ధతతో విధులు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అందించిన సహకారం వెలకట్టలేనిదన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ ఆర్.ఐ మౌలుద్దీన్, చీరాల ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ పవన్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రెవెన్యూ అధికారుల బాధ్యతలు కీలకం
బాపట్ల: నిషేధిత భూముల జాబితాలో పెండింగ్ ఉన్న కేసులను వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోదకుమార్ అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని న్యూ వీసీ హాలులో 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించే ప్రక్రియపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిషేధిత జాబితాలో పొరపాటున చేర్చబడిన భూములను గుర్తించి, సరైన ఆధారాలతో త్వరితంగా తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు. నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించడం, భూమి యజమానులకు హక్కు కల్పించాలన్నారు. గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకు 410 అర్జీలు వచ్చాయన్నారు. అందులో 44 అర్జీలకు సంబంధించిన భూములను తొలగించి, భూమి యజమానులకు యాజమాన్య హక్కు కల్పించామన్నారు. కొన్ని మండలాలలో పూర్వ జిల్లాలు గుంటూరు, ప్రకాశం జిల్లాల పేర్లు ఉన్నాయని వెంటనే తొలగించి బాపట్ల జిల్లా పేరు రాయాలని తహసీల్దార్లను ఆదేశించారు. సమావేశంలో జిల్లా స్థాయి కమిటీలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, చీరాల, బాపట్ల ఆర్డీఓలు చంద్రశేఖర్, బి.శ్రీదేవి, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, అనుబంధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. అట్రాసిటీ కేసులలో బాధితులకు పరిహారం అందేలా చర్యలు అట్రాసిటీ కేసుల్లో బాధితులకు చెల్లించాల్సిన పరిహారం, ఉద్యోగాలు, ప్రత్యేక పింఛన్లు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో లేవనెత్తిన సమస్యల పరిష్కారంపై పురోగతిని పరిశీలించిన కలెక్టర్, జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు ప్రస్తావించిన అంశాలను శ్రద్ధగా విన్నారు. బాధిత కుటుంబాలకు అందాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రత్యేక పింఛన్ల అంశాలపై ప్రత్యేకంగా చర్చించి, ఇప్పటికే కొన్ని కేసుల్లో పింఛన్ల మంజూరు పూర్తయ్యిందని తెలిపారు. మిగిలిన కేసుల్లో కూడా ఆలస్యం లేకుండా పరిష్కారం చూపించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సింగయ్య, చీరాల, రేపల్లె ఆర్డీవోలు చంద్రశేఖర్, శ్రీదేవి, డీఎంహెచ్వో విజయమ్మ, పొలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వేము భగవాన్దాస్, ఆల్ఫ్రెడ్ రాజా, సల్మాన్, మిల్టన్ లూథర్ శాస్త్రి, కే వెంకట ప్రసాద్, డి.పోతురాజు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత ఉంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. ఈవీఎం గోదాములు, వీవీ ప్యాట్స్ గోదాముల త్రైమాసిక పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. గోదాములకు సీల్ వేసిన తాళాలు, సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును, భద్రతా సిబ్బంది విధులను అడిగి తెలుసుకున్నారు. గోదాములను తెరిచి లోపల ఉన్న గదులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్గౌడ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ, బీజేపీ నాయకులు రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు దోనేపూడి రవి, సీపీఐ నాయకులు గంగయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బాలాజీరెడ్డి, బీఎస్పీ నాయకులు రాజారావు పాల్గొన్నారు. -
ముగిసిన గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు
గుంటూరు లీగల్: గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఏడాది 2023 మంది న్యాయవాదులు ఓటు హక్కు కలిగి ఉండగా 1608 మంది ఓటు వేశారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా ప్రస్తుత బార్ అధ్యక్షుడు యంగలశెట్టి శివ సూర్యనారాయణ వ్యవహరించారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, జి.శాంత కుమార్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాత్రి 9 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంత సమయం అయినప్పటికీ రాత్రికి ఫలితాలు వెల్లడిస్తామని సూర్యనారాయణ వెల్లడించారు.. చేబ్రోలు: ఉద్యోగాన్ని ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరంగా నిర్వర్తించాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా అన్నారు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో మంగళవారం మండల విద్యాశాఖాధికారి రాయల సుబ్బారావు ఉద్యోగ విరమణ సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. మండలంలోని ఉపాధ్యాయులు, హెచ్ఎంలు తదితరులు ఎంఈవో దంపతులను సన్మానించారు. డీఈఓ మాట్లాడుతూ 37సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో రాయల సుబ్బారావు సమర్ధవంతంగా పనిచేసి అందరి మన్ననలు పొందారని కొనియాడారు. భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందన కార్యక్రమానికి హాజరయ్యారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
తహసీల్దార్ కృష్ణకాంత్
పెదకాకాని: గ్రామానికి చెందిన బెజవాడ సాంబయ్య, విజయలక్ష్మి దంపతులకు నలుగురు కొడుకులు ఉండగా చిన్న కుమారుడు బెజవాడ కృష్ణమూర్తి మాత్రమే సంతానం అని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చిన మాట వాస్తవమేనని తహసీల్దార్ పి.కృష్ణకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘సాక్షి’ లో మంగళవారం రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం పేరుతో కథనం ప్రచురితమైంది. ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్(ఎఫ్ఎంబీ) నా హయాంలో ఇవ్వలేదు, గతంలో ఇక్కడ పనిచేసిన పెల్లూరి రత్నం అనే తహసీల్దార్ విచారించి మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆ ఎఫ్ఎంబీ ఆధారంగా బెజవాడ కృష్ణమూర్తి తన తల్లి పేరిట ఉన్న 38 సెంట్ల భూమికి 1బీ, అడంగల్, పాస్ పుస్తకానికి దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఆ దరఖాస్తును విచారించి బెజవాడ కృష్ణమూర్తి, మరో ఇద్దరు అని ఉదహరిస్తూ 38 సెంట్లకు హక్కు కల్పించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. గురజాల: వీఆర్ఏల డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బదంగి సాహెబ్ డిమాండ్ చేశారు. స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద మంగళవారం వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పే స్కేల్ జీతాలు అమలు చేయాలని, వన్టైమ్ సెటిల్మెంట్ ద్వారా వీఆర్వో, రికార్డు అసిస్టెంట్, అటెండర్, నైట్ వాచ్మెన్ పోస్టులకు భర్తీ చేయాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జీతాలు పెరుగుతాయని, ప్రమోషన్లు వస్తాయని ఆశించామని.. కానీ నేడు ఆ పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ఈ ప్రభుత్వంలో వీఆర్ఏల సమస్యలు గురించి చర్చించిన దాఖలాలు కనిపించలేదన్నారు. రీ సర్వే పేరుతో మమ్ములను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పలు డిమాండ్లను సత్వరమే కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం పరిపాలనాధికారిణికి వినతిపత్రం అందించారు. ఇమాం వలి, ఏడుకొండలు, దేవ సహాయం, రవి, మునాఫ్, పాపారావు, వెంకటేష్, మస్తాన్వలి, ముస్తఫా, రామకృష్ణ, అశోక్, రాజారావు, గురవయ్య, సైదా పాల్గొన్నారు. వీఆర్ఏల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బదంగి సాహెబ్ -
స్వర్ణ గ్రామ కార్యాలయానికి టీడీపీ నేతలు తాళాలు
కొల్లూరు : స్వర్ణ గ్రామ కార్యాలయానికి టీడీపీలోని ఓ వర్గం నాయకులు తాళాలు వేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు... మండలం లోని క్రాప స్వర్ణ గ్రామ కార్యాలయం స్వీపర్ శుభ్రం చేసి తలుపులకు గడియ పెట్టి వెళ్లాడు. పంచాయతీ సెక్రటరీ కార్యాలయంలో ఉండగా టీడీపీలోని ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కార్యాలయానికి తాళాలు వేశారు. క్రాప గ్రామంలోని ఓ చెరువు వ్యవహారంలో టీడీపీకి చెందిన వర్గాల మధ్య వివాదం నడుస్తుంది. మంగళవారం చెరువు కొలతలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో కోర్టులో కేసు నడుస్తుండగా కొలతలు ఎలా నిర్వహిస్తారంటూ టీడీపీకి చెందిన మరో వర్గం వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్వర్ణ గ్రామ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. చెరువు వ్యవహారం కోర్టులో ఉండగా పంచాయతీ కార్యదర్శి ఓ వర్గానికి కొమ్ముకాస్తూ తమకు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వర్గానికి చెందిన కుటుంబం ఇచ్చిన స్థలంలో నిర్మించిన కమ్యూనిటీ భవనంలో స్వర్ణ గ్రామ కార్యాలయం తొలగించాలంటూ కార్యాలయానికి తాళాలు వేశారు. కార్యాలయానికి తాళాలు వేసి ఉండడాన్ని చూసి సిబ్బంది అవాక్కయ్యారు. కొద్ది సమయం అనంతరం కార్యాలయానికి వేసిన తాళాలను పగలగొట్టి తలుపులు తెరసి సిబ్బంది విధులు నిర్వహించారు. -
వర్సిటీ బడ్జెట్కు ఆమోదముద్ర
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 90వ అకడమిక్ సెనేట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వర్సిటీలోని డైక్మెన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో సోమవారం సాయంత్రం జరిగిన పాలకమండలి, ఫైనాన్స్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. నూతనంగా ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కోర్సుకు, బీటెక్లో స్పేస్ టెక్నాలజీ కోర్సులను 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు సెనేట్ ఆమోదం తెలిపింది. ఏఎన్యూ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ విజయోత్సవాలను నిర్వహించాలని పలువురు మాజీ వీసీలు సూచించారు. 50 ఏళ్లకు గుర్తుగా ఒక ప్రత్యేక నిర్మాణం చేపట్టాలని చర్చించారు. లైబ్రేరియన్ ఆచార్య వెంకట్రావ్ మాట్లాడుతూ అధ్యాపకులు తన పరిశోధన పత్రాలను వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్లో నమోదు చేసుకుంటే పబ్లిక్కు అయ్యే ఖర్చులను ఆ సంస్థ భరిస్తుందన్నారు. సమావేశానికి హాజరైన మాజీ వీసీ ఆచార్య హరగోపాల్రెడ్డి పెన్షనర్లకు బకాయిలు విడుదల చేయాలన్నారు. మాజీ వీసీ ఆచార్య వియన్నరావు మాట్లాడుతూ ఏఎన్యూ రీసెర్చ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందేందుకు అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా పాలకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విశ్రాంత వీసీ బాలమోహన్దాస్ మాట్లాడుతూ ఏఎన్యూ 50 ఏళ్ల సందర్భంగా ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కోరాలని సూచించగా మాజీ వీసీ ఆచార్య రాఘవులు ఐకానిక్ భవనం నిర్మాణం చేపట్టాలని కోరారు. మాజీ వీసీ ఆచార్య ఎల్.వేణుగోపాల్రెడ్డి మాజీ ప్రొఫెసర్ సేవలను వర్సిటీ వాడుకోవాలన్నారు. మాజీ వీసీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 50 ఏళ్ల వేడుకకు నోబెల్ విన్నర్లను తీసుకురావాలన్నారు. అనంతరం బడ్జెట్కు ఆమోదముద్ర వేశారు. ఇన్చార్జి వీసీ గంగాధరరావు వర్సిటీ నివేదికను వివరించారు. సమావేశంలో రెక్టార్ ఆచార్య ఆర్.శివరాంప్రసాద్, రిజిస్ట్రార్ జి.సింహాచలం, పాలకమండలి సభ్యులు వెంకటేశ్వరరావు, షాహేదా అక్తర్, సుమంత్ కుమార్, జగదీష్ నాయక్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్పర్సన్ రత్నషీలామణి పాల్గొన్నారు. కఠిన చర్యలు.. దూరవిద్య కేంద్రం నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన ఆరోపణలపై వర్సిటీ ఉన్నతాధికారులు నియమించిన ప్రత్యేక తనిఖీ బృందం కమిటీ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని దూరవిద్య పరీక్షల విభాగం కో–ఆర్డినేటర్ డి.రామచంద్రన్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ తనిఖీ బృందం (స్క్వాడ్) సమర్పించిన నివేదికలో పొందుపరిచిన అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కళాశాలలకు చెందిన విద్యార్థుల పరీక్ష ఫలితాలను తాత్కాలికంగా విత్హెల్డ్లో ఉంచుతున్నామన్నారు. ఇంపర్సనేషన్ (ఇతరుల స్థానంలో పరీక్ష రాయడం), మాల్ప్రాక్టీస్ వంటి అక్రమాలకు పాల్పడిన విద్యార్థులపై వర్సిటీ నిబంధనలకు అనుగుణంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తనిఖీ బృందం నివేదికలో సూచించిన ఆరోపణలు ఉన్న పలు పరీక్ష కేంద్రాలను భవిష్యత్లో పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వబోమని, అవసరమైతే వాటి అనుబంధాన్ని రద్దు చేసే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇప్పటికే సమర్పించిన నివేదికలో కొన్ని అంశాలు అసంపూర్తిగా ఉన్నందున, సంబంధిత కమిటీ నుంచి పూర్తి వివరాలను మరోసారి సేకరించడం జరుగుతుందని వివరించారు. అనంతరం మరిన్ని కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్లు దూరవిద్యాకేంద్రం పరీక్షా విభాగం కో–ఆర్డినేటర్ ఆచార్య రామచంద్రన్ తెలిపారు. -
శ్రీమన్నారాయణకు జాతీయ ఉత్తమ కౌన్సిలర్ అవార్డు
బాపట్ల: బాపట్ల జిల్లా వాసి శ్రీమన్నారాయణకు జాతీయ స్థాయిలో ఉత్తమ కౌన్సిలర్గా అవార్డు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు. జాతీయస్థాయి శిక్షణ కార్యక్రమంలో ఉత్తమ కౌన్సిలర్గా అవార్డు పొందిన శ్రీమన్నారాయణ జిల్లా కలెక్టర్ను మంగళవారం కలెక్టరేట్లో కలిశారు. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో మార్చి 25 నుండి 29 వరకు అంతర్రాష్ట్ర జూనియర్ రెడ్క్రాస్ స్టడీ కం ట్రైనింగ్ క్యాంపు జరగ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బృందానికి బాపట్ల జిల్లాకు చెందిన పిన్నిబోయిన శ్రీమన్నారాయణ కౌన్సిలర్గా ప్రాతినిధ్యం వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన రెడ్క్రాస్ బృందాలు వివిధ కార్యక్రమాలు నిర్వహించాయి. ఏపీకి ఉత్తమ కౌన్సిలర్ అవార్డును ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి సుమారు రెండు వందలకు పైగా ప్రతినిధులు ఈ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. ప్రకృతి విపత్తుల నిర్వహణ, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్, సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్, జాతీయ సమగ్రత వంటి అంశాలలో శిక్షణలు ఇచ్చారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ కనబరచిన ఉత్తమ కౌన్సిలర్గా గుర్తించి రెడ్క్రాస్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బిఎస్ నారాయణ భట్టు, తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో తాత్సారం తగదు
● ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ ● ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట నిరసన రేపల్లె: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం తాత్సారం చేయటం తగదని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు కె.ఝాన్సీ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. గతంలో 42 రోజుల పోరాటంతో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేసి, వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ విధానంలో మార్పులు చేసి అందరికీ వర్తించేలా చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి సీహెచ్.మణిలాల్ మాట్లాడుతూ 22 నెలలుగా వేతనాల పెంపుదల లేకపోవడం అంగన్వాడీలను నిరాశకు గురిచేస్తోందన్నారు. ఇతర ఖర్చులపై దృష్టి పెట్టే ప్రభుత్వం, అంగన్వాడీల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికై నా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీడీపీవో ఎం.సుచిత్రకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కే.రత్నకుమారి, నిర్మల జ్యోతి, ఎన్.కష్ణకుమారి, డి.జ్యోతి, జయప్రద, అమల, శారద, రాజ్యలక్ష్మి, హేమలత తదితరులు పాల్గొన్నారు. నిజాంపట్నం మండలం పల్లపట్ల ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు వై.మేరీమణి, అంగన్వాడీలు పాల్గొన్నారు. -
మందుబాబులకు అడ్డాగా పూసపాడు
ఇంకొల్లు(చినగంజాం): చంద్రబాబు ప్రభుత్వంలో తాగునీరు దొరకదేమో కాని మద్యం మాత్రం పుష్కలంగా దొరుకుతోంది. మండలంలోని పూసపాడు గ్రామంలో మందుబాబుల ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మద్యం ప్రియులు గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగుతూ మహిళలను, చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గ్రామంలో మందుబాబుల విచ్చలవిడితనం విపరీతంగా పెరిగి పోతోంది. వీధుల్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితికి గ్రామ వాతావరణాన్ని తీసుకువస్తున్నారు. ముఖ్యంగా మహిళలు వీధుల్లో తిరగాలంటే భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలోని అరుగులు, వీధులు, ఖాళీ ప్రదేశాలు, చిన్నకొద్ది డొంకలు, ఆఖరుకు పొలాలకు వెళ్లే బహిరంగ ప్రదేశాలలో మందుబాబులు తమ పనులను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మహిళలు పొలం పనులకు వెళ్లాలంటే అక్కడ మందుబాబులు తిష్ట వేసి ఉంటారేమో అన్న భయానికి గురవుతున్నారు. పొలానికి వెళ్లాలన్నా, ఇంటికి తిరిగి రావాలన్నా కష్టంగా మారింది. గ్రామంలో ఎక్కడ చూసినా ఖాళీ మద్యం సీసాలు నిత్యం దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామంలో ప్రధాన సమస్యగా మందుబాబుల వ్యవహారం తయారైంది. ఈనేపథ్యంలో పోలీసులు గ్రామంలో నిఘా పెట్టి బహిరంగంగా మద్యం తాగుతూ ప్రజలకు ఇబ్బందులకు కలుగజేస్తున్న మందుబాబులను దండించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. -
నాట్యకళే ఆయన జీవితం
తెనాలి: 1995 సంవత్సరంలో ఒకరోజు... ఎన్వీఆర్ కల్యాణమండపం వేదికపై ‘అభిజ్ఞాన శాకుంతలము’ నృత్యరూపకం ప్రదర్శన. శకుంతల వృత్తాంతంతో కూడిన ఆ రూపకంలో పాత్రధారుల ఆహార్యం అద్భుతం. సన్నివేశాల కనుగుణమైన రంగాలంకరణ మరో ప్రత్యేకత! ఇక నటీనటుల ఆంగికం, అభినయం రక్తికట్టింది. మొత్తంమీద రంగస్థలంపై ఓ దృశ్యకావ్యం చూసిన అనుభూతితో ప్రేక్షకులు కరతాళధ్వనులు మిన్నంటాయి. ● ఎక్కడివారో తెలీదు...తెనాలిలో స్థిరపడిన ఓ నాట్యాచార్యుడు తీర్చిదిద్దిన నృత్యరూపకమది. అందులో శకుంతల పాత్రధారి జంధాల్య వేదవల్లి భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ ఫెలోషిప్ను అందుకుని నృత్యగురువుగా దేశవిదేశాల్లో ఎందరికో శిక్షణనిస్తున్నారు. ఆమె ఒక్కరే కాదు... చిలకలూరిపేట కళానిలయం సంస్థ ‘నాట్యమయూరి’ అవార్డును తొలిగా గెలుచుకున్న తెనాలికి చెందిన భాస్కర్ల రంగనాయకి, మరో శిష్యురాలు చల్లా బాలత్రిపురసుందరి, ఆలపాటి ప్రజ్ఞ...వీరంతా ఆ నాట్యాచార్యుడి శిష్యులే. ప్రస్తుతం అందరూ నృత్యగురువులుగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. కళల తెనాలి గౌరవాన్ని ప్రకాశింపజేస్తున్నారు. ● నృత్యరంగానికి ఘనమైన వారసులను తీర్చిదిద్దిన ఆ నాట్యాచార్యుడు ఎం.దస్తగిరి...ఎండీ గిరిగా సుపరిచితులు. తెనాలిలో గల నృత్య శిక్షణ సంస్థ శ్రీగిరిజా ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకులు. స్వస్థలం అనంతపురంలోని బోగాలకట్ట గ్రామంగా చెబుతారు. సంపన్న రైతుకుటుంబంలో జన్మించారు. నాయనమ్మ మరణంతో మనసు చెదిరి 1964లో ఏడో తరగతి చదువుతుండగానే ఇంటినుంచి వచ్చేశారు. 1969 నాటికి చీరాలకు చేరుకుని నాట్యాచార్యులు సీహెచ్ ఆంజనేయులు వద్ద కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు. స్నేహితుడి సలహాపై విజయవాడకు వెళ్లారు. జీవనోపాధి కోసం అక్కడ హోటల్ క్యాషియర్గా ఏడేళ్లు పనిచేశారు. నాట్యంపై ఆశ, ఆసక్తితో నాట్యాచార్యులు పరమానంద పిళ్లై, భాగవతుల యజ్ఞనారాయణశర్మ వద్ద శిక్షణ పొందారు. కొంతకాలం యజ్ఞనారాయణశర్మకు సహాయకునిగా ఉన్నారు. ● దేశీయ నృత్యరీతులను, వాటి వైశిష్ట్యాన్ని వ్యాప్తి చేయటానికి 1987లో శ్రీగిరిజా ఆర్ట్ అకాడమీని స్థాపించారు. ఆ మరుసటి సంవత్సరమే తొలి ప్రదర్శన ఇచ్చారు. దీనిని తిలకించిన పద్మశ్రీ నటరాజ రామకృష్ణ స్వయంగా గిరిని ఆహ్వానించి మెలకువలను నేర్పారు. నాట్యం అభ్యసిస్తూనే ‘మోహినీ భస్మాసుర’ నృత్యరూపకాన్ని ప్రదర్శించి, కళాభిమానుల ప్రశంసలను అందుకున్నారు. ఈ నృత్యరూపకాన్ని గిరితో సాటిగా ప్రదర్శింపగల మరో కళాకారుడు లేడని ఆ రోజుల్లోనే గురువు పరమానంద పిళ్లై రంగస్థల వేదికపై ప్రకటించారు. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, రతీమన్మథ, శిలువ ప్రభావం, ఇరవై సూత్రాల పథకం వంటి నృత్యరూపకాలను రచించి, ప్రదర్శనలతోపాటు శిక్షణనూ ఇవ్వసాగారు. నృత్యరూపకాలపై చేసిన కృషికి గుర్తింపుగా ‘దేవపారిజాతం’ అవార్డును వేదాంతం సత్యనారాయణశర్మ చేతులమీదుగా స్వీకరించారు. ‘నాట్యభూషణ’ గౌరవాన్నీ అందుకున్నారు. ● నటరాజ రామకృష్ణ శిక్షణలో ఉంటూనే ఆంధ్ర నాట్యం వ్యాప్తికి తగిన శిక్షణనివ్వాలని భావించిన గిరికి, అందుకు తెనాలి అనువైనదిగా ఎంచుకున్నారు. 1986లో తెనాలి చేరుకుని శ్రీగిరిజా ఆర్ట్ అకాడమీని ఇక్కడ ప్రారంభించారు. తెనాలి ప్రజల అభిరుచికి అనుగుణంగా గురువు అనుమతితో కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యంలో శిక్షణను ఆరంభించారు. పురాణాలు, ఇతిహాసాల్లోని ప్రధానాంశాలను నృత్యరూపకాలుగా మలచి కళాభిమానులను రంజింపజేయటం కత్తిమీద సాము. నటనలో పరిణతి, కళాకారుల సమష్టి కృషి అవసరం, వీటికితోడుగా రంగస్థల అలంకరణ నుంచి వాయిద్య సంగీత వరకు అవసరమైన వనరులుంటేనే నృత్యరూపకం రక్తి కడుతుంది. ఇన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని నాట్యకళ పవిత్రతకు భంగం వాటిల్లకుండా కళాకారులకు శిక్షణనిచ్చి, దృశ్యకావ్యం అనిపించుకునేలా తెనాలిలో ‘అభిజ్ఞాన శాకుంతలము’ నృత్యరూపకాన్ని ప్రదర్శింపజేశారు ఎండీ గిరి. ● ఆ విధంగా తెనాలిలో నాలుగు దశాబ్దాలపాటు ఎందరో నృత్యకళాకారులను తీర్చిదిద్దారు. వీరి శిష్యులు కొందరు ఆయన బాటలోనే నృత్యగురువులుగా ఎదిగారు. ఆవిధంగా ఎక్కడనుంచో వచ్చి, తెనాలిలో స్థిరపడి సొంత కుటుంబమంటూ లేకుండా తన శిష్యబృందమే లోకంగా, నాట్యకళే ఊపిరిగా కొనసాగిన నాట్యాచార్యుడు ఎండీ గిరి, కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురై ఆదివారం మృతిచెందారు. తన కళావారసత్వాన్ని శిష్యుల రూపంలో వదిలి వెళ్లారు. ఆయన భౌతికంగా లేకుండా నాట్యరీతుల్లో ఆయన అడుగులు మువ్వల సవ్వడుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ‘నాట్యమయూరి’, ‘సూపర్ డ్యాన్స్ ఆర్టిస్ట్’ వంటి పలు అవార్డులతో సహా భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ ఫెలోషిప్ను పొందిన నన్ను నాట్యంలో తీర్చిదిద్దిన ఘనత గిరి మాస్టారుదే. మాస్టారుతో కలిసి రూపొందించిన నృత్యరూపకం ‘అభిజ్ఞాన శాకుంతలము’ అద్భుతం. పెళ్లయ్యాక కువైట్లో కొన్నేళ్లు ఉన్నాను. అక్కడ నృత్యశిక్షణాలయం నడిపాను. ఇప్పుడు హైదరాబాద్లో నటశిక్షణను కొనసాగిస్తున్నా. – జంధ్యాల వేదవల్లి, నృత్యగురువు తెనాలిలో కన్నుమూసిన ప్రముఖ నాట్యాచార్యుడు ఎండీ గిరికి నివాళిగా.... ‘దేవపారిజాతం’ అవార్డు గ్రహీత ఎండీ గిరి నృత్యరూపకాలతో తరగని ఖ్యాతి తెనాలిలో స్థిరపడి నృత్యశిక్షణ నృత్యగురువులుగా రాణిస్తున్న శిష్యబృందం -
బెట్టింగ్ బంగార్రాజులు!
చీరాల టౌన్: ఉత్కంఠగా సాగే ఐపీఎల్ క్రికెట్ పోటీలను కొందరు ఎంజాయ్ చేస్తుంటే.. అంతకు రెట్టింపు స్థాయిలో వ్యక్తులు తమ కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. క్రికెట్ బెట్టింగ్ భూతం కారణంగా వందలాది కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నాయి. చివరకు పాఠశాలల్లో చదివే విద్యార్థులు సైతం పాకెట్ మనీ డబ్బును బెట్టింగ్కు వెచ్చిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లోనే బెట్టింగ్ యాప్లు, క్రికెట్ యాప్ల ద్వారానే అధికంగా పందేలు కాస్తున్నారు. పేదలు, యువత, రోజువారీ కూలీలు, ప్రైవేటు ఉద్యోగుల కూడా కష్టపడి సంపాదించిన డబ్బుతో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడి అప్పుల పాలువుతున్నారు. – చీరాలలో కోట్లాది రూపాయలు బెట్టింగ్ కారణంగా చేతులు మారుతున్నాయి. వేటపాలెం నుంచి ఈపూరుపాలెం వరకు పెద్ద ఎత్తున బుకీలుగా ఏజెంట్లు కథ నడుపుతున్నారు. ఆన్లైన్లో సాగుతున్న ఈ బెట్టింగ్ దందాను పోలీసులు పసిగట్టేలోపే అంతా దుకాణం సర్దేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో చిన్న, మద్యతరగతి కుటుంబాల వారు ఈ బెట్టింగ్తో చితికిపోతున్నారు. – గతంలో క్రికెట్ బెట్టింగ్ కారణంగా అప్పులపాలై, తిరిగి చెల్లించలేక మానసిక వేదనతో పేరాలలోని ఓ హోటల్ యజమాని తనయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గడియార స్తంభం సెంటర్లో మెడికల్ షాపు నిర్వాహకుడు బెట్టింగ్ కోరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. పేరాలలోని ఓ వ్యాపారి తన వ్యాపారాన్ని సైతం బెట్టింగ్ కారణంగా వదిలేసి అప్పులపాలై తనువు చాలించాడు. బహిర్గతం కాని ఇటువంటి సంఘటనలు చీరాలలో చాలా ఉన్నాయి. బెట్టింగ్కు డిపాజిట్! చీరాలలో 10 మందికి పైగా బుకీలు ఏజెంట్లు ఉన్నారు. నియోజకవర్గంలోని పేరాల, చీరాల పట్టణం, జాండ్రపేట, వేటపాలెం, ఈపూరుపాలెం, చీరాల ప్రాంతాలలో జరిగే బెట్టింగ్లను నడుపుతున్నారు. అయితే ఎప్పటికికప్పుడు పోలీసులకు సమాచారం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నగదు లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే సాగుతున్నాయి. ఫలితాన్ని బట్టి బెట్టింగ్రాయుళ్లకు డబ్బు అందుతుంది. ఇందుకు నమ్మకస్తులను మాత్రమే ఎంచుకుంటున్నారు బుకీ ఏజెంట్లు. నమ్మకంలేని వారి వద్ద ముందే డబ్బు డిపాజిట్ చేసుకుంటున్నారు. బెట్టింగ్ బాబులు బుకీ ఏజెంట్లకు ముందుగానే రూ. 30 వేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. చితుకుతున్న కుటుంబాలు చీరాల ప్రాంతంలో అధికంగా నివసించే చిన్న, మధ్య తరగతి కుటుంబాల వారు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని ఆర్థిక ఇబ్బందులతో విలవిల్లాడుతున్నారు. బెట్టింగ్లో డుబ్బ పోగొట్టుకుని గతంలో కొందరు ప్రాణాలు తీసుకుంటే మరికొందరు ఊరు వదిలి వెళ్లిపోతున్నారు. బెట్టింగ్ల కోసం చేసిన అప్పులు వడ్డీతో సహా పేరుకుపోయి అవి తిరిగి చెల్లించలేని స్థితిలో వడ్డీ వ్యాపారుల ఒత్తిడి తట్టుకోలేక ఇళ్లలోని బంగారం తాకట్టు పెడుతున్నారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఎక్కువగా యువకులు, విద్యార్థులు, వ్యాపారులే బలైపోతున్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లతోపాటు చీరాల, పర్చూరు ప్రాంతాల్లో కొందరు బుకీలు, బెట్టింగ్ రాయుళ్లు పోలీసు సిబ్బందిలో కొందరితో సత్సంబంధాలు నెరుపుతూ, మామూళ్లు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెట్టింగ్ దందాకు పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఛిద్రమవుతున్న జీవితాలు గ్రామాలకు పాకిన బెట్టింగ్ భూతం ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లో జోరుగా పందేలు పెద్ద ఎత్తున బుకీ ఏజెంట్లు కట్టడి చేయలేని స్థితిలో ఖాకీలు -
ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
పెదకూరపాడు: అతివేగం ఇద్దరు మైనర్ల ప్రాణాల మీదకు తెచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకూరపాడుకు చెందిన ఇస్మాయిల్, సుభానీలు ద్విచక్ర వాహనంపై సినిమా హాల్వైపు వెళుతున్నారు.. ఈక్రమంలో వ్యక్తిగత పనులపై పెదకూరపాడు బస్టాండ్ వైపు వెళుతున్న షేక్ బాజీ వాహనం గ్రామంలోని కట్టెల అడితి వద్ద ఇరుకు బ్రిడ్జిపై ఒకరికొకరు ఢీకొనగా ఇస్మాయిల్, సుభానిలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి గుంటూరు జీజీహెచ్కి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావటంతో ఇరువురు పరిస్థితి విషమంగా ఉంది. బాజీకి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అతివేగంగా రావడంతో రెండు ద్విచక్ర వాహనాలు టైర్లు పేలి దగ్ధమయ్యాయి. రెండు గంటల ఆలస్యం.. నెడితే గానీ కదలని వైనం.. ఇదిలా ఉండగా.. క్షతగాత్రుల కుటుంబ సభ్యులు 108 వాహనానికి ఫోన్ చేయడంతో ఘటనాస్థలానికి రెండు గంటల ఆలస్యంగా వాహనం వచ్చింది. ఈ క్రమంలో హుటాహుటిన కుటుంబ సభ్యులు క్షతగాత్రులను వాహనంలోకి ఎక్కించారు. వాహనం ఎక్కించిన వెంటనే సెల్ఫ్ డౌన్ అయి వాహనం ఎంతసేపటికి కదలికి పోవడంతో గాయపడిన క్షతగాత్రుల బంధువులు వాహనాన్ని రెండు మూడు పర్యాయాలు నెట్టినా స్టార్ట్ కాలేదు. చివరికి ఎక్కువ మంది వచ్చి వాహనాన్ని నెట్టడంతో స్టార్ట్ అయింది. ఇది మరో రెండు గంటల పాటు జరగటంతో క్షత గాత్రుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే వాహనం ఇదే రోజు మూడు పర్యాయాలు మరమ్మతులకు గురైనట్లు పైలెట్ తెలిపారు. అదిచేశాం.. ఇది చేశాం.. అంటూ గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు ప్రభుత్వం కనీసం ఆపద్భాందవి అయిన 108 వాహనాలకు మరమ్మతులు సైతం చేయించలేకపోతోందని స్థానికులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. -
పెదకాకానిలో రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం
పెదకాకాని: కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారుల పనితీరు ఇష్టారాజ్యంగా మారింది. టీడీపీ నాయకులు సిఫార్స్లు చేస్తే చాలు రికార్డులు తారుమారు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒక్కరే ఉన్నట్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు మంజూరు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఆధారంగా భూముల రికార్డులు మార్చేస్తున్నారు. ఈక్రమంలో నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన పెదకాకాని గ్రామానికి చెందిన బెజవాడ సాంబయ్య, విజయలక్ష్మి(బుల్లెమ్మ) దంపతులకు బెజవాడ గణపతి, సుబ్రహ్మణ్యం, సీతారామాంజనేయులు నలుగురు సంతానం. వారిలో చిన్న కుమారుడు బెజవాడ కృష్ణమూర్తి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్(ఎఫ్ఎంబీ) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనతో పాటు చుట్టు పక్కల వారిని విచారించిన రెవెన్యూ అధికారులు కృష్ణమూర్తి ఒక్కడే సంతానం అని ఎఫ్ఎంబీ మంజూరు చేశారు. ఆ తరువాత కొంతకాలానికి ఒక్కడి పేరిటే ఎఫ్ఎంబీ ఇచ్చారని తెలుసుకుని తహసీల్దార్ను ఆశ్రయించారు. బెజవాడ సాంబయ్యకు నలుగురు సంతానం ఉండగా ఒక్కరే ఉన్నట్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చారని మిగిలిన ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కూడా చేర్చాలని, లేని పక్షంలో రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు. – 2025, జనవరి నెలలో తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తిరిగి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ద్వారా అదే నెలలో ఫిర్యాదు చేశారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకూ సమస్య పరిష్కారం కాకపోగా ఆ ఎఫ్ఎంబీ ఆధారంగా తల్లి పేరిట సర్వేనెంబరు 228 బి లో ఉన్న భూమి 38 సెంట్లకు చిన్న కుమారుడైన కృష్ణమూర్తి పేరిట 1బి, అడంగల్ నమోదు చేశారు. సమస్యను పరిష్కరించకపోగా ఫిర్యాదు చేసిన తరువాత 1బి, అడంగళ్ నమోదు చేయడంపై మార్చి 10వ తేదిన మళ్లీ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకూ ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నలుగురు పేర్లు నమోదు చేసి ఎఫ్ఎంబీ ఇవ్వాలని, దాని ఆధారంగా ఇచ్చిన 1బి అడంగళ్ను రద్దు చేయాలని బాధితులు కోరుతున్నారు. టీడీపీ నాయకులు ఫోన్ చేస్తే.. చేయాల్సి వచ్చింది టీడీపీ నాయకుల సిఫార్సుల ఆధారంగా 1బి అడంగళ్ చేయాల్సి వచ్చిందని రెవెన్యూ అధికారి చెప్పడం దారుణంగా ఉందని బాధితుడు సీతారామాంజనేయులు దంపతులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం సహకరించని వయసులో భార్యభర్తలం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా న్యాయం చేయాలని కోరుతున్నారు. రికార్డులు తారుమారు చేస్తున్న వైనం నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒక్కరే ఉన్నట్లు ఫ్యామిలీ మెంటర్ సర్టిఫికెట్ 15 నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న బాధితులు సమస్య పరిష్కరించకపోగా ఫిర్యాదు చేసిన తరువాత 1బి, అడంగళ్ మంజూరు చేసిన అధికారులు టీడీపీ నాయకుడు ఫోన్ చేస్తే ఇచ్చామన్న ఆర్ఐ -
దళితులను దూషించిన వ్యక్తి అరెస్ట్
తెనాలి రూరల్: దళితుల్లోని మాల, మాదిగ సామాజిక వర్గ ప్రజలను రాయలేని పదాలతో అసభ్యకరంగా దూషించి, వీడియోలను సాషల్ మీడియాలో పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వీడియోలో అతని తల్లి కూడా దళితుల గురించి అసభ్యంగా మాట్లాడడంతో ఆమైపెనా కేసు నమోదు చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్ధనరావు వివరాలు వెల్లడించారు. ● మండలంలోని ఖాజీపేటకు చెందిన చల్లా నాగరాజు చైన్నెలో కరెంటు పనులకు వెళుతుంటాడు. వచ్చిన డబ్బుతో మద్యం తాగి తిరుగుతుంటాడు. ఈ నెల 26న చైన్నె నుంచి వచ్చిన అతను 27న ఫూటుగా మద్యం తాగాడు. నందివెలుగు–గుంటూరు రోడ్డులో గుంటూరు నుంచి కొలకలూరుకు చెందిన బుల్లా వివేక్, అతని భార్య బైక్పై వస్తుండగా ఖాజీపేట వద్ద ఆవుల మంద అడ్డు వచ్చింది. అదే సమయంలో నాగరాజు వివేక్తో ఘర్షణ పడి దుర్భాషలాడి దాడి చేశాడు. అడ్డుకోబోయిన వివేక్ భార్యనూ నెట్టివేసి అసభ్యంగా దూషించాడు. ● దంపతులు వెళ్లిపోయిన అనంతరం నాగరాజు బైక్పై కొలకలూరు సెటరులోని అంబేడ్కర్, బాబు జగ్జీవన్రామ్ విగ్రహాల వద్దకు వెళ్లి ఫేస్ బుక్ లైవ్ వీడియో పెట్టి మాల, మాదిగ సామాజిక వర్గ ప్రజలను అసభ్యంగా దూషించాడు. తిరిగి ఇంటికి వెళ్లి తీవ్ర అసభ్యపదజాలంతో వీడియో చేసి పోస్ట్ చేశాడు. దీనిపై దళిత సంఘాలు ఆందోళన చేశాయి. – బాధితుడు వివేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ జనార్ధనరావు తెలిపారు. ● నిందితుడు ఇంట్లో వీడియో రికార్డు చేస్తుండగా అతని తల్లి పద్మ అలియాస్ వెంకమ్మ దళితులను కించపరిచే విధంగా మాట్లాడడంతో ఆమె పైనా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నాగరాజుకు 2019లో వివాహం కాగా మద్యంకు బానిసైన భర్తతో వేగలేక భార్య 2024లో విడిచిపెట్టిందని చెప్పారు. నిందితుడిపై రౌడీ షీట్ తెరవనున్నట్టు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ నాయబ్రసూల్, ఎస్ఐ కె. ఆనంద్, సిబ్బంది ఉన్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. -
ప్రతి అర్జీని ఆడిట్ చేయాలి
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో అర్జీదారులు అందజేసే ప్రతి అర్జీని ఆడిట్ చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్గౌడ్ జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్తోపాటు రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీదారులు అందజేసే అర్జీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరం చూపాలని అధికారులను ఆదేశించారు. అర్జీ పరిష్కారం కాలేదన్న సమాచారం అర్జీదారులకు స్పష్టంగా సూచించాలని తెలియజేశారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ ఈ వేసవిలో ఎండలు అధికంగా ఉంటాయని ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పని ఉంటేనే బయటకు వెళ్లాలని, ఎక్కువగా నీటిని తీసుకోవాలని ప్రజలకు సూచించారు. డ్వామా పీడీ విజయలక్ష్మి మాట్లాడుతూ లేబర్ బడ్జెట్కు సంబంధించి ఎంపీడీఓలకు ఆదేశాలు అందజేశారు. డీఆర్డీఏ పీడీ బి.సింగయ్య మాట్లాడుతూ ఏప్రిల్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీపై ఎంపీడీఓలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ లవన్న, ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ డిప్యూటీ సీఈఓ కృష్ణ, డీపీఓ ఎల్.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని దుర్గగుడి అర్చకుడి దుర్మరణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కారు డ్రైవర్ నిర్లక్ష్యం దుర్గగుడి అర్చకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరానికి చెందిన పాణిగ్రాహి జగన్మోహన శర్మ అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. గత గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన జగన్మోహనశర్మను తాడేపల్లి పీహెచ్సీ సెంటర్కు వచ్చే సరికి కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో జగన్మోహనశర్మ రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది. ప్రమాదస్థలం నుంచి హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. మరి కొద్ది రోజుల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన జగన్మోహన శర్మ మరణం కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ప్రమాదంపై జగన్మోహన శర్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ప్రమాదానికి కారణమైన కారు యజమానిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన శర్మ భౌతికకాయాన్ని దుర్గగుడి దేవస్థానానికి చెందిన పలువురు అధికారులు, అర్చకులు, సిబ్బంది సందర్శంచి నివాళులర్పించారు. పెనుగంచిప్రోలు: గ్రామంలో ఉన్న శ్రీతిరుపతమ్మ వారి ఆలయం వద్ద ఏడాది పాటు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు సోమవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన బహిరంగ వేలం, ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా ఆలయానికి రూ.92.90 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆలయం వద్ద కొబ్బరికాయలు విక్రయించుకునే లైసెన్స్ హక్కునకు రూ.50,05,000(పచ్చల శివప్రసాద్), మట్టికుండలు నిర్వహణ లైసెన్స్ హక్కునకు రూ.10,50,000(పచ్చల శివప్రసాద్), మునేరు అవతల 7 షెడ్లు, 4 ఏసీ గదులు, ఒక కల్యాణ మండపం నిర్వహణకు రూ.9,50,000(కొత్తపల్లి సతీష్కుమార్), ఆలయం వద్ద సంచారంగా ఐస్క్రీమ్ విక్రయించుకునే లైసెన్స్ హక్కునకు రూ.5,10,000(ముండ్లపాటి నాగరాజు), భక్తుల సామాన్లు, పాదరక్షలు భద్రపరచు లైసెన్ప్ హక్కునకు రూ.3,15,000 (గడిపూడి గోపి), సులభ కాంప్లెక్స్ నిర్వహణకు రూ.11,80,000(నూతలపాటి సురేష్), పువ్వులు, పాలు, బియ్యం పోగుచేసుకునే హక్కునకు రూ.2,80,000(దండా పుష్పలత), హెచ్చు పాటదారులుగా నిలిచి లైసెన్స్ హక్కును పొందారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. కోడూరు: పార్కింగ్లో పెట్టిన కారులోమంటలు చెలరేగి కారు దగ్ధం అయిన ఘటన కోడూరులో సోమవారం చోటు చేసుకుంది. కోడూరుకు చెందిన షేక్ కరిముల్లా తన కారును రామకృష్ణా థియెటర్కు చెందిన ఖాళీ ప్రదేశంలో పెట్టారు. ఉదయం 10 గంటల సమయంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు మొత్తం అగ్నికి అహుతైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, అవనిగడ్డ ఫైర్ అధికారులు వచ్చి మంటలు అదుపు చేశారు. ఘటనాస్థలాన్ని కోడూరు ఎస్ఐ పరిశీలించి, వివరాలు సేకరించారు. కారుకు ఎవరైనా నిప్పుపెట్టారా, కారు లోపల నుంచి మంటలు వ్యాపించాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
టీచర్పై సస్పెన్షన్ ఎత్తివేత
గుంటూరు ఎడ్యుకేషన్: అకారణంగా ఉపాధ్యాయురాలిపై విధించిన సస్పెన్షన్ను గుంటూరు జిల్లా విద్యా శాఖ అధికారి షేక్ సలీంబాషా వెనక్కి తీసుకున్నారు. ఉపాధ్యాయురాలికి జరిగిన అన్యాయంపై ‘సాక్షి’లో వచ్చిన కథనం విద్యాశాఖలో కలకలం సృష్టించిన నేపథ్యంలో ఎట్టకేలకు క్షేత్ర స్థాయిలో విచారణ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెన్షన్ ఎత్తివేశారు. గుంటూరు బీఆర్ స్టేడియం ఎదుట ఉన్న మహాకవి తిక్కన – శ్రీ పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 23న మధ్యాహ్న భోజనం తనిఖీ చేసేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే ఎం.డి.నసీర్ అహ్మద్ పథకంలో తలెత్తిన లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంఘటనతో సంబంధంలేని ఉపాధ్యాయురాలు సి.హెచ్.అరుణరాణిని మరుసటి రోజే డీఈఓ సస్పెండ్ చేశారు. విచారణ లేకుండా సస్పెండ్ చేసిన విషయమై ‘సాక్షి’లో కథనం ప్రచురించడంతో దిగి వచ్చిన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ‘సాక్షి’ కథనంతో దిగివచ్చిన విద్యాశాఖ అధికారులు -
మూల్పూరులో గృహ ప్రవేశాలు
వేమూరు: నిరుపేదలకు ఇళ్లు నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్టి తెలిపారు. వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం మూల్పూరు గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన గృహాల ప్రవేశాల కార్యక్రమంలో సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.58 లక్షల గృహాలను జయప్రదంగా గృహా ప్రవేశాలు కార్యక్రమం చేపట్టిందన్నారు. సొంత స్థలాలు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇంటి స్థలాలు కేటాయించడంతోపాటు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గృహాలు మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లాలో 335 గృహ ప్రవేశాలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వరరావు, రేపల్లె ఆర్డీఓ, శ్రీదేవి, తహసీల్దార్ నెహ్రుబాబు, గృహ నిర్మాణ శాఖ డీఈ పాల్గొన్నారు. -
అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మరోసారి డ్రామా
బాపట్ల: అమరావతే రాజధాని అంటూ మూడోసారి తీర్మానం చేయటం చూస్తుంటే చంద్రబాబు ప్రజలను ఏవిధంగానైనా మోసం చేయగలరని మరోసారి నిరూపితమైందని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోన రఘుపతి మాట్లాడారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే ఉద్దేశంతో హడావిడిగా శాసనసభ ఏర్పాటుచేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అగౌరపరిచే విధంగా మాట్లాడించటం బాధాకరమన్నారు. శాసనమండలిలో తగినంత బలం లేకపోవటంతో శాసనసభలో తీర్మానం చేసి మమ అనిపించారని పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం చేసిన చంద్రబాబు అన్నింటిని తాత్కాలికం పేరుతో అసెంబ్లీ, పరిపాలనభవనం, హైకోర్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటో అర్ధం కావటంలేదన్నారు. తాజాగా మరో తీర్మానం చేసి మరికొంత భూమిని కాజేసేందుకు చంద్రబాబు టీమ్ సిద్ధంగా ఉందని కోన ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటం చేతకాని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను పక్కదారి పట్టించేందుకు కుటిల రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బాపట్ల అభివృద్ధిపై ఎమ్మెల్యే వేగేశన పెద్దవి విప్పాలి వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు బాపట్ల కేంద్రంగా జిల్లాను సాధించుకున్నామని కోన రఘుపతి గుర్తు చేశారు. ప్రస్తుతం బాపట్లలో జరుగుతున్న అభివృద్ధిపై ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ పెద్దవి విప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు రూ.530 కోట్లతో మెడికల్ కళాశాలను సాధించుకున్నామని, ఇప్పుడు నిలిచిపోయిన ఆ పనులను ఏవిధంగా చేపడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. సూర్యలంక ప్రాంతాభివృద్ధికి వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడే కేంద్రమంత్రి కిషన్రెడ్డికి రూ.100కోట్లతో ప్రతిపాదనలు పంపటం జరిగిందన్నారు. ఆ ప్రతిపాదనలపై ఇప్పుడు నిధులు విడుదల కాగా వాటిని ఏవిధంగా ఖర్చుపెడుతున్నారో బహిరంగంగా తెలియజేయాలని అన్నారు. సమావేశంలో బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు జి.సురేంద్ర, రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, నాయకులు వడ్డిముక్కల డేవిడ్, గంగిశెట్టి రత్తయ్య, నక్కా వీరారెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, పిట్టు శ్రీనివాసరెడ్డి, చీరాల వెంకటేశ్వరెడ్డి, గవిని కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. -
గోవాడ ప్రాశస్త్యాన్ని కాపాడుకుందాం
తెనాలిటౌన్: వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానం గోవాడ తిరునాళ్ల ప్రాశస్త్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ కమిటీ సభ్యులు ఆరోపించారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ హాల్లో ఆదివారం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కమిటీ కన్వీనర్ దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ తెనాలి దగ్గరలోని గోవాడ శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు రెండు తెలుగురాష్ట్రాల నుంచి ఈ తిరునాళ్ళకు లక్షల సంఖ్యలో వస్తారని చెప్పారు. ఆలయ సమీపంలోని గోవాడ నుంచి కావూరు డొంకలో ఉత్సవం కోసం నిర్దేశించిన స్థలంలో ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కుకు స్థలం కేటాయిస్తూ ఏపీఐఐసీ వారికి స్థలం అప్పగించడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూవుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే కేటాయింపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 1943 నుంచి అనేకసార్లు ఈ స్థలాన్ని వేరేవారికి కేటాయించగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఉత్సవ విశిష్టతను తెలుసుకుని కేటాయింపులు రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే, తహసీల్దార్ ఈ స్థలం కేటాయింపునకు ప్రాధాన్యం కనబరుస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో తుమ్మల జగదీష్, మండవ మల్లీశ్వరి, కెవి సత్యనారాయణ, వేదాంతం ఫణీంద్ర, కె.వాసుదేవనాయుడు, కడియాల నంద కిషోర్, బసవపున్నయ్య, ఆర్.శివశంకరరావు, రాజేష్ పాల్గొన్నారు. -
అంతర్జాతీయ కోచింగ్ కోర్సుకు శ్రీనివాసరావు ఎంపిక
యడ్లపాడు: మండలంలోని మైదవోలు గ్రామానికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు, కోచ్ నక్కా శ్రీనివాసరావు చైనాలో జరగనున్న ప్రతిష్టాత్మక ఎఫ్ఐవీబి లెవల్–3 అంతర్జాతీయ కోచింగ్ కోర్సుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తనపేరును అధికారికంగా సిఫార్సు చేసినట్లు ఆదివారం తెలిపారు. చైనా వేదికగా ఈ ఏడాది జూలై 17 నుండి 25 వరకు ఈ అత్యున్నత స్థాయి శిక్షణ తరగతులు జరగనున్నాయి. వాలీబాల్ కోచింగ్లో అత్యున్నత ప్రమాణంగా భావించే లెవల్–3 కోర్సుకు ఇంత చిన్న వయసులోనే ఎంపిక కావడం విశేషం. శ్రీనివాసరావు ఎంపిక పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు.


