breaking news
Bapatla
-
అభివృద్ధి పేరుతో అనైతిక పనులు సహించం
మంగళగిరి టౌన్ : శతాబ్దాల చరిత్ర కలిగిన ముస్లింల పవిత్ర ఖబరస్తాన్ను రహదారి విస్తరణలో భాగం చేయడమే కాకుండా అభివృద్ధి పేరుతో ఖబరస్తాన్పై ఫ్లై ఓవర్ నిర్మించాలని చూడడం సరికాదని ఖబరస్తాన్ పరిరక్షణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా మంగళగిరి పట్టణంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జామియా మసీద్ వద్ద ప్రారంభమై ఎంటీఎంసీ కార్యాలయం, మెయిన్ బజార్, మిద్దె సెంటర్ మీదుగా తిరిగి గౌతమ బుద్ధ రోడ్ నుంచి నిడమర్రు కూడలి వరకు జరిగింది. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా ఖబరస్తాన్ పై నుండి ఎందుకు ఫ్లై ఓవర్ నిర్మాణం చేస్తామని అంటున్నారని నిలదీశారు. ముస్లింల మనోభావాలతో చెలగాటం తగదని అన్నారు. ఖబరస్తాన్ భూమిలో ఫ్లై ఓవర్ వంటి నిర్మానాలు చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేయడం ముస్లిం మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి చేసినట్టేనని విమర్శించారు. దానిని కాపాడుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ యూసుఫ్, అహ్లె సున్నతువల్ జమాద్ అధ్యక్షులు మునీర్, తబ్లీగ్ జమాత్ అధ్యక్షులు ఱఫీ, జమాత్ ఏ ఇస్లామీ హింద్ అధ్యక్షులు అజీమ్, జమియ్యతే అహలే హదీస్ అధ్యక్షులు రఫీ, ముస్లిం యువతరం గౌరవ అధ్యక్షులు ఇక్బాల్ అహ్మద్, ముస్లిం ఫ్రంట్ అధ్యక్షులు ముహమ్మద్ రఫీ, జమాతుల సభ్యులు, ముస్లిం మహిళలు, తదితరులు పాల్గొన్నారు. -
మహాకాళేశ్వరుడికి విశేషపూజలు
ఫిరంగిపురం: మండలంలోని పలు గ్రామాల్లో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం శివాలయాల్లో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. వేములూరిపాడులోని జలపాలేశ్వరుడికి, ఫిరంగిపురంలోని కాళహస్తీశ్వరస్వామికి, రామాలయంలోని నగరేశ్వరస్వామికి, వేమవరంలోని మహాకాళేశ్వరుడికి అర్చకులు విశేషపూజలు చేశారు. వేమవరంలోని కోటిలింగాల క్షేత్రంలోని మహాకాళీ సమేత మహాకాళేశ్వరుడికి అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ముఖమండపం వద్ద అన్నపూర్ణాదేవి ఉత్సవమూర్తిని ఏర్పాటు చేసి భక్తుల స్వహస్తాలతో అక్షయ బియ్యంతో అభిషేకాలు నిర్వహింపజేశారు. అనంతరం ఏడు అడుగుల వెంకటేశ్వరుడి విగ్రహానికి భక్తులు అభిషేకాలు చేశారు. సాయంత్రం శివపార్వతుల ఉత్సవ మూర్తులకు శాంతి కల్యాణం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కోటి లింగాల క్షేత్రంలో కరసేవకులుగా పనిచేసేందుకు తుని, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, ఆరేపల్లి ముప్పాళ్ల, గుంటూరు, కడియం, మేడికుండూరు ప్రాంతాల నుంచి సుమారు 300 మంది వరకు వచ్చారు. నుదురుపాడు పీహెచ్సీ ఆధ్వర్యంలో భక్తుల కోసం వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి శౌరిజోజి తెలిపారు. కోటిలింగాల క్షేత్రంలో భక్తుల కోలాహలం -
భక్తిశ్రద్ధలతో శివరాత్రి వేడుకలు
మంగళగిరి టౌన్: మహాశివరాత్రి పర్వదినం భక్తకోటిలో అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతులు నింపింది. పరమేశ్వర పాహిమాం, శివశివ శంకర.. భక్త శుభంకర అంటూ శివనామ స్మరణతో ఆలయాలు ప్రతిధ్వనించాయి. మహాశివుడు విశేష పూజలందుకున్నాడు. లయకారుడు లంకేశ్వరుడు కరుణ కోసం ఆలయాల ఎదుట భక్తులు బారులు తీరారు. ఉపవాసాలు ఆచరిస్తూ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాత్రంతా భక్తులు జాగరణ చేశారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లోని శివాలయాలతో పాటు పలు ఆలయాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులు ఆలయాలకు చేరుకున్నారు. అభిషేక ప్రియుడైన భోళాశంకరుడికి పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు నిర్వహించారు. మంగళగిరి పట్టణ పరిధిలోని శ్రీ గంగాభ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఉదయం నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. పాత మంగళగిరిలోని శ్రీహరిహర క్షేత్రంలో తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పలు సేవా సంస్థలు అన్నదాన తదితర కార్యక్రమాలు నిర్వహించాయి. ఆలయాల వద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవదాయ శాఖ అధికారులు, ఆయా ఆలయాల కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆలయాల వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
వీఐపీలకు సేవ.. భక్తులకు లేదు తోవ
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట రూరల్: కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకే పెద్దపేట వేస్తామన్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారి దర్శనానికి వచ్చిన సామాన్య భక్తులు వీఐపీల తాకిడితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూ. 200, రూ.500 అభిషేక దర్శనం క్యూలైన్లను భక్తులు స్వామివారిని దర్శించుకున్నందుకు దాదాపు నాలుగు గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. వీఐపీలతోపాటు అధికారుల కుటుంబ సభ్యులను పెద్ద సంఖ్యలో దర్శనానికి అనుమతించారు. కింద నుంచి నేరుగా లిఫ్ట్ సదుపాయంతో వస్తున్న అధికారపార్టీ నేతలు, కార్యకర్తల వల్ల ఆ ప్రదేశంలో భారీ క్యూ కనిపించింది. ఈ సమయంలో శీఘ్ర ,అభిషేక దర్శనం క్యూలైన్ను నిలిపివేయడంతో భక్తులకు స్వామివారి దర్శనం ఆలస్యం అయింది. పోలీసులతో భక్తుల వాగ్వాదం .. స్వామి వారికి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతుందటంతో భక్తుల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. వీవీఐపీల సేవలలోనే తరిస్తారా సామాన్య భక్తులను పట్టించుకోరా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడ చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భక్తుల్లో ఆగ్రహం చల్లారకపోవడంతో పోలీసులు బెదిరింపు ధోరణిలో విరుచుకుపడ్డారు. మాకు ప్రోటోకాల్ ఉంటది ఇష్టం ఉంటే ఉండండి లేకుంటే బయటకు వెళ్లిపోండి అంటూ పోలీసులు భక్తులపై ఫైర్ అయ్యారు. ఆగ్రహంతో మాట్లాడుతున్న భక్తులు పట్ల పోలీస్ అధికారులు అసభ్యకరంగా బూతుల దండకాన్ని అందుకున్నారు. కొంతసేపటి తర్వాత జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ అక్కడికి చేరుకొని వీ వీఐపీ దర్శనాలలో ఇతరులు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్ టికెట్ల దర్శనం భేష్... ఆలయంలో ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానంలో కొనుగోలు చేసే వీఐపీ టికెట్ల విధానం సత్ఫలితాలను ఇచ్చింది. గతంలో వీఐపీ పాసుల పేరుతో ఉచితంగా దర్శనానికి అనుమతి ఇచ్చేవారు. దీని వల్ల దేవస్థానానికి ఆర్థికంగా నష్టంతో పాటు సామాన్య భక్తులు ఇబ్బందిపడేవారు. ఈ ఏడాది వీఐపీ దర్శనానికి రూ.300 టికెట్ ను నిర్ణయించి ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. దాదాపు 6 వేల మంది కి పైగా ఆన్ లైన్లో భక్తులు దర్శన టికెట్లను కొనుగోలు చేశారు. టైం స్లాట్లో స్వామివారిని శీఘ్రంగా దర్శించుకున్నారు. నరసరావుపేట నుంచి కోటప్పకొండ తిరుణాలకు వెళ్లిన భక్తులు ఆదివారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నరసరావుపేట వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను పెట్లూరువారి పాలెం రోడ్ లో నిలిపివేశారు. అక్కడ నుంచి కొండ దిగున ఘాట్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక బస్టాండ్ కు భక్తులు కాలినడకన చేరుకోవాల్సి వచ్చింది. కిలోమీటర్కు పైగా ఉన్న బస్టాండ్కు చేరుకోవాలంటే వృద్ధులు, వికలాంగులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో లేని విధంగా నరసరావుపేట వైపు నుంచి వచ్చే బస్సులను దూరంగా నిలిపివేయటంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. భక్తుల గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్న అధికారుల తీరుపై మండిపడ్డారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏడాది నుంచి ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల కోటప్పకొండకు వచ్చిన సమయంలో ప్రకటించారు. తిరునాళ్ల రోజు అందరికి స్వామి వారి ఉచిత ప్రసాదం అందజేస్తామన్నారు. అయితే ఆదివారం కొంతమందికే ఉచిత లడ్డూ ప్రసాదం అందింది. ఉదయం 11 గంటల వరకు దర్శనం చేసుకొని బయటకు వచ్చే భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేసి తరువాత లడ్డూలు లేవంటూ నిలిపివేశారు. పలువురు భక్తులు దీనిపై ప్రశ్నించడంతో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పంపిణీని తిరిగి ప్రారంభించారు. -
తరలిన భారీ విద్యుత్ ప్రభలు
చేబ్రోలు: మహాశివరాత్రి సందర్భంగా వడ్లమూడి క్వారీ తిరునాళ్లలో ఆదివారం రాత్రి భారీ విద్యుత్ ప్రభలు కాంతులు వెలుగులు నింపాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోటప్ప కొండ తరువాత పేరు గాంచిన చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ తిరునాళ్లకు ఈ ఏడాది 15 భారీ విద్యుత్ ప్రభలు తరలివచ్చాయి. నారాకోడూరు నుంచి గ్రామ ప్రభ, సెంట్రల్ యూత్, మిత్రమండలి ప్రభలు వచ్చాయి. సుద్దపల్లి గ్రామ కాపు సంఘం, చేబ్రోలు, గొడవర్రు, గుండవరం, వడ్లమూడి, శలపాడు గ్రామాల నుంచి ప్రభలు తరలివచ్చాయి. నారా కోడూరు మీదుగా వడ్లమూడి క్వారీ దేవాలయం వరకు వెళ్లే మార్గాల వద్ద ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. -
నేడు గుంటూరు పోలీస్ గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా పోలీస్ బందోబస్త్ దృష్ట్యా ఈనెల 16న జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరగాల్సిన పీజీఆర్ఎస్ (గ్రీవెన్స్)ను తాత్కలికంగా రద్దు చేసినట్లు డీపీఓ కార్యాలయపు వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. జిల్లాలోని ప్రజలు గమనించాలని, తద్వారా పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి రూరల్: రాజధాని ముఖద్వారమైన ఉండవల్లి కరకట్ట వెంబడి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ రానున్నారు. వారి రాకను పురస్కరించుకుని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం ఉండవల్లి చిన్నడొంకలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు, బిల్గేట్స్లు రాజధానిలో పలు ప్రాంతాలను పరిశీలించనున్నారని తెలిపారు. ఆ ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో పూర్తిచేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యానశాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ నగర్: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం, స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ ఎన్నికకు ఆదివారం 17 నామినేషన్లు దాఖలు అయ్యాయని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్, ఎన్టీఆర్ స్టేడియం ఎక్స్ అఫిషియో జాయింట్ సెక్రటరీ, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికల అధికారి సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. పాలకవర్గ ఎన్నికకు ఆదివారం సెక్రటరీకి 4, వైస్ ప్రెసిడెంట్ 1, ట్రెజరర్కి 2, జాయింట్ సెక్రటరీకి 4, ఎగ్జిక్యూటివ్ మెంబర్కు 6 (పురుషులు 5, మహిళలు 1) నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. నామినేషన్లకు 16వ తేదీ చివరి రోజు అని అన్నారు. గుంటూరు వెస్ట్: వడ్లమూడి వెంకట లక్ష్మమ్మ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున తెనాలికి చెందిన డాక్టర్ వడ్లమూడి బాబు రాజేంద్ర ప్రసాద్ , వడ్లమూడి గోపాలకృష్ణయ్యలు ఆదివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాకు రూ.10 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి ఈ మొత్తం వెచ్చిస్తామన్నారు. పీ4 లో భాగంగా ఈ మొత్తం చెక్కును దాతలు అందజేశారన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీఓ లక్ష్మీకుమారి, డిప్యూటీ స్టాటిస్టికల్ అధికారి జెట్టి సౌలరాజు, ప్రతిపాటి సురేష్ పాల్గొన్నారు. వ్యక్తికి తీవ్ర గాయాలు తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని కొలనుకొండ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి గుంటూరు చానల్ పక్కనే ఉన్న నీళ్లులేని కాలువలోకి దూసుకు వెళ్లింది. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా పెదకాకానిలో నివాసముండే అనురాగ్ స్థానికంగా పార్శిల్ సర్వీస్లో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగా కొలనుకొండ వద్ద అతని కారు డివైడర్ను ఢీకొని అదుపుతప్పి గుంటూరు చానల్ పక్కనే ఉన్న మరో కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసమైంది. స్థానికులు 108కు, తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి కారులో ఇరుక్కుపోయిన అనురాగ్ను బయటకు తీసి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ ఖాజావలి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పూర్తి తిరోగమన బడ్జెట్
చినగంజాం: ఇది తిరోగమన బడ్జెట్ తప్ప పేద వర్గాలకు మేలు చేసే విధంగా లేదు. సూపర్ సిక్స్ హామీలలో మహిళలకు నెలకు ఇస్తామన్న రూ.1500 బడ్జెట్లో కనిపించలేదు. విద్యారంగంలో రూ.15 వేల కోట్ల నుంచి రూ.14 వేల కోట్లకు కేటాయింపులు తగ్గించారు. సంక్షేమానికి 17.03 శాతం నుంచి 16 శాతానికి తగ్గించారు. అంగన్వాడీ, ఆశాలు వంటి స్కీం వర్కర్లకు సంబంధించి జీతాల పెంపుపై బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావనే లేదు. చేనేత వర్గాలకు రిక్తహస్తం చూపారు. పేద వర్గాల వారిపై కక్షతో ఇళ్లస్థలాలు గాని, ఇళ్ళు కట్టించే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నీ చూస్తుంటే పేద వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది. –బత్తుల బ్రహ్మానందరెడ్డి వైఎస్సార్సీపీ బాపట్ల, ప్రకాశం జిల్లాల టాస్క్ఫోర్స్ పరిశీలకులు -
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు వెన్నుపోటు
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను తుంగ లో తొక్కింది. విద్యా రంగానికి కేటాయింపులు పెంచకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్యాయం చేశారు. తల్లికి వందనం పథకానికి నిధులను తగ్గించడం ద్వారా వేలాది మంది విద్యార్థులను అనర్హులుగా చేయాలని ఆలోచన తగదు. – వై.థామస్ రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
బాలకోటేశ్వరస్వామి సన్నిధిలో...
వేమూరు: బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం గోవాడలోని బాలకోటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. బాలకోటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. భక్తులు ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్నారు. దీంతో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతి ఏర్పాటుచేశారు. క్యూలైన్లలో నిల్చున్న భక్తులకు వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. సాయంత్రానికి భక్తుల రద్దీ మరింత పెరిగింది. పరిసర గ్రామాల రైతులు తమ పశువులను తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. భక్తులు పోటెత్తడంతో అదుపు చేసేందుకు పోలీసులు నానా వస్థలు పడ్డారు. బాల కోటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు ట్రాక్టర్లు వేసుకొని వచ్చారు. గతేడాది కన్నా ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నారు. భారీగా పోలీసు బందోబస్తు శివరాత్రిని పురస్కరించుకుని ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రత్యేకంగా పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. రాత్రి సమయంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నట్లు తెనాలి డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. దేవస్థానం చుట్టు పక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ జరుపుతున్నట్లు తెలిపారు. బాలకోటేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రముఖులు బాలకోటేశ్వరస్వామి పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, మార్కెట్ యార్డు చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి ఉన్నారు. పలు సంఘాల ఆధ్వర్యంలో అన్నదానం బాలకోటేశ్వరస్వామి దర్శనం కోసం పలు సంఘాలు అన్నదానం ఏర్పాటుచేశాయి. ఆర్యవైశ్యులు, పద్మశాలీ, కాకతీయ ధర్మ సత్రాల వద్ద భక్తులకు ఉచితంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. బాలకోటేశ్వరస్వామి దేవస్థానం పాలక వర్గం కూడా ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. ఆర్టీసీ ప్రత్యేక సేవలు బాలకోటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక సేవలు అందించింది. బాపట్ల, రేపల్లె, తెనాలి, గుంటూరు డిపోల నుంచి గోవాడకు ప్రత్యేక బస్సులను నడిపారు. సమాచార కేంద్రాన్ని ఏర్పాటుచేసి భక్తులకు సేవలు అందించారు. బస్సుల వద్ద రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వైద్య సేవలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భక్తులకు సేవలు అందించారు. ప్రత్యేకంగా కౌంటర్ను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. తరలివచ్చిన ప్రభలు పరిసర గ్రామాల నుంచి గోవాడకు ప్రభలు తరలివచ్చాయి. ఉదయం నుంచి ప్రభల రాక మొదలైంది. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా స్వామి వారి దర్శనం కోసం పడిగాపులు పడ్డారు. దీంతో కొంత మంది మహిళా భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. పడిపోయిన భక్తుల గురించి వైద్య సిబ్బంది పట్టించుకున్న పాపాన పోలేదు. భక్తులే సహాయం చేయడంతో వారు తేరుకుని అనంతరం దర్శనానికి వెళ్లారు. బాలకోటేశ్వరస్వామిని దర్శించుకుంటున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానిబాలకోటేశ్వరస్వామి దేవస్థానం వద్ద నిలిచిన వాహనాలు -
కాళ్లు దువ్విన కోళ్లు
నరసరావుపేటటౌన్: కోడి పందేలకు.. కోత ముక్కలకు.. గుండు ఆటకు రొంపిచర్ల మండలం కేరాఫ్ అడ్రస్గా మారిందా అంటే.. అవుననే అంటున్నారు అనుభవజ్ఞులు. ఇటీవల కాలంలో పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలోని పలు గ్రామాల్లో పేకాట, కోతముక్కా, గుండు ఆట, కోడిపందేలు పెచ్చుమీరాయి. విప్పర్ల, కొనకంచివారిపాలెం, గ్రామాల్లో శివరాత్రి పండుగ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కోడి పందేలలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. పందెగాళ్లకే కాకుండా చూడటానికి వెళ్లిన ప్రేక్షకుల వద్ద కూడా ద్విచక్ర వాహనానికి, కార్లకు పార్కింగ్ ఫీజు వసూలు చేశారు. కోతముక్క, గుండాట ఆడే పందెగాళ్ల వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఎంట్రీ ఫీజు వసూలు చేసి సకలం ఏర్పాట్లు చేశారు. కోడికి కూడా ఐదు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు, పోరులో గెలిచిన పందెం కోడి యజమాని వద్ద నుంచి రూ.ఐదు వేల రూపాయలు వసూలు చేశారు. రాత్రి వేళ కూడా నిర్వహించేందుకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. ముందే తెల్సినా నియంత్రించలేదు.. శివరాత్రి పండగకూ ముందే కోడిపందేలు, పేకాట నిర్వహణకు బరులు ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ అధికారులు దృష్టి సారించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతల ఆధ్వర్యంలో బరులు ఏర్పాటు చేయటంతో అధికారులు మిన్నకున్నారు. బరుల నిర్వాహకుల వద్ద లంచం తీసుకొని వారికి సహకరించారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా రొంపిచర్లలో బహిరంగంగా జూదం నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది. -
వైభవంగా అరవపల్లి బాలకోటయ్య తిరునాళ్ల
భక్తజన సందోహంతో సందడిగా మారిన ఆలయం రేపల్లె: హరహర మహదేవ... శంభో శివశంకర అంటూ శివ నామస్మరణతో రేపల్లె నియోజకవర్గంలోని శైవక్షేత్రాలు మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని అరవపల్లి గ్రామంలో వేంచేసియున్న బాలకోటేశ్వరస్వామి తిరునాళ్ళ ఆదివారం వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే స్వామివారికి సుప్రభాత సేవలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలు, పువ్వులతో అలం కరించారు. భక్తులతో కిటకిటలాడిన ఆలయం తిరునాళ్ళను పురస్కరించుకుని భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. రేపల్లె పరిసర ప్రాంతాలతో పాటు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన అరవపల్లి బాలకోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. -
అంకెల గారడిలా రాష్ట్ర బడ్జెట్
చీరాల:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడిలా ఉంది. సున్నాలు పెంచుకుంటూ పోవడం వల్ల ప్రయోజనం లేదు. మేనిఫెస్టోలో ఏ విధంగా చెప్పారో అది అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్ హామీలకు ఏ మేర కేటాయింపుల చేశారో స్పష్టత లేదు. నిరుద్యోగ భృతి, సున్నా వడ్డీ, ఆడబిడ్డ నిధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50ఏళ్లకే పింఛన్ వంటి హామీలకు కేటాయింపులు లేవు. – కరణం వెంకటేష్బాబు, వైఎస్సార్ సీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి -
కౌలు రైతులను విస్మరించిన బడ్జెట్
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్లో కౌలు రైతుల పంట రుణాల ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో 70 శాతం సాగుభూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని, వారికి యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు మంజూరు చేస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని ప్రభుత్వం విస్మరించింది. అలాగే గుంటూరు జిల్లాకు నిధులు కేటాయింపులోనూ అన్యాయం జరిగింది. 50 గ్రామాలకు తాగునీరు అందించే గుంటూరు చానల్ పర్చూరు వరకు పొడిగింపునకు, నల్లమడ వాగు ఆధునీకరణకు నిధులు కేటాయింపు లేక పోవడం శోచనీయం. సంక్షేమ రంగానికి, వ్యవసాయ అభివృద్ధికి తగిన కేటాయింపులు లేవు. – పాశం రామారావు, కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు -
పోలు రాధా ఎడ్ల పందేలలో బాపట్ల జిల్లా హవా
చినగంజాం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని సోపిరాల శ్రీ లలితా రామకోటేశ్వరాలయంలో నిర్వహించిన రెండు తెలుగు రాష్ట్రాల రాష్ట్ర స్థాయి సీనియర్ విభాగం నాటుబండి పోలు రాధా ఎడ్ల పందేలు శనివారం వేకువజాముతో ముగిశాయి. చినగంజాం, సోపిరాల టైరుబండ్ల యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో మొత్తం 12 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ టీఎస్సార్ ఆంజనేయులు చేతుల మీదుగా విజేతలైన కోడెల యజమానులకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతిని బాపట్ల జిల్లా అమృతలూరు మండలం పెదపూడికి చెందిన ఆళ్ల హరికృష్ణ యాదవ్ ఎడ్ల జత సాధించగా రూ.30 వేల నగదు బహుమతిని ఆలయ కమిటీ చైర్మన్ టీఎస్సార్ ఆంజనేయులు అందజేశారు. ద్వితీయ బహమతిని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పగడాలవారిపాలెం శ్రీలతారెడ్డి, ప్రణీత్రెడ్డి ఎడ్ల జత సాధించగా రూ.25 వేలు నగదు బహుమతిని ఆమంచి రత్తయ్య జ్ఞాపకార్థం కుమారులు వెంకటేశ్వరరావు, బ్రహ్మయ్య అందజేశారు. మూడో బహుమతి చినగంజాం మండలం ఆవులదొడ్డిగొల్లపాలేనికి చెందిన గోగినేని జ్ఞానసాయి దీపక్చౌదరి ఎడ్ల జత సాధించగా రూ. 20 వేలు నగదు బహుమతిని పోలకం నరసింహారావు, ప్రయత్నం దినపత్రిక ఎడిటర్ పోలకం శ్రీనివాసరావు అందజేశారు. నాలుగో బహుమతిని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం జజ్జర యలమంద, వెంకట గోపాలకృష్ణ, జజ్జర తవిరికల ఎడ్ల జత సాధించగా రూ.15 వేల బహుమతిని వైస్ ఎంపీపీ తుమ్మలపెంట ప్రసన్నలక్ష్మి, శ్రీనివాసరావు అందజేశారు. ఐదో బహుమతిని ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన బొడ్డు బాలకృష్ణ ఎడ్ల జత సాధించగా రూ.11 వేలు నగదు బహుమతిని ఉలిచి వెంకటరావు జ్ఞాపకార్థం అంజినాయుడు అందజేశారు. ఆరో బహుమతిని బాపట్ల జిల్లా చినగంజాం మండలం సోపిరాల గ్రామానికి చెందిన దేవరకొండ సుబ్బారావు ఎడ్ల జత సాధించగా రూ.7 వేల నగదు బహుమతిని తుమ్మలపెంట శ్రీనివాసరావు, బ్రహ్మయ్య, రాఘవయ్య అందజేశారు. అలాగే తొమ్మిది వరుస బహుమతులు అందించారు. కార్యక్రమంలో తుమ్మలపెంట జయరావు, రాఘవయ్య, ఆమంచి బ్రహ్మయ్య, ఆమంచి సుబ్బారావు, గంట సుబ్బారావు, ముంగర అప్పారావు, రాయని కృష్ణ, పుల్లయ్య, టి.చిన్న, టి. బాపయ్య, టి.వెంకటేశ్వరరావు, జి.నరసింహారావు, కుర్రి రమణారావు, వి. రామసుబ్బారావు, పోలకం శరభారావు, జి.వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్–ఫార్మా మాఫియాపై ఆందోళన
లక్ష్మీపురం: మెడికల్, ఫార్మా రంగాల్లో పెరుగుతున్న అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా రాష్ట్ర సమితి పిలుపుతో గుంటూరు జిల్లా సీపీఐ సమితి ఆధ్వర్యంలో శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత, రాజ్యాంగ హక్కు అని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. నాణ్యమైన ఆరోగ్యసేవలు అందించకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ప్రైవేట్ కళాశాలల్లో స్టైఫండ్ ఎగవేతపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి అధ్యక్షత వహించారు. కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, మేడా హనుమంతరావులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కేశవా..కనికరం లేదా!
బడ్జెట్లో బాపట్ల జిల్లాకు మొండిచెయ్యి హార్బర్ ఆశలు.. ఆవిరి! ● కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ గాలికి ● కృష్ణా కరకట్టలను పట్టించుకోని వైనం ● మెడికల్ కళాశాల, నిజాంపట్నం హార్బర్లపై సవతి ప్రేమ ● సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులు లేవు ● సాగర్మాల తొలి దశలో చీరాల ప్రాజెక్టుకు ప్రతిపాదన ● రూ.409 కోట్లతో నిర్మాణానికి మార్గం సుగమం ● ఫిషింగ్ హార్బర్కు అప్పటి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన ● తరువాత పట్టించుకోని చంద్రబాబు సర్కార్ ● ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మంది ఉపాధికి గండి ● నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ పనుల పూర్తిపైనా నిర్లక్ష్యం మంగళగిరి టౌన్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న గంగ, పార్వతి (దుర్గా) సమేత మల్లేశ్వర స్వామి వారికి మంగళగిరికి చెందిన బహుత్తమ పద్మశాలీ సేవా సంఘం ప్రతినిధులు శనివారం చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు. ఏటా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. పట్టు వస్త్రాలను సమర్పించేందుకు విచ్చేసిన సేవా సంఘం సభ్యులకు ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలి కారు. సేవా సంఘం సభ్యులు తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం స్వామికి పట్టువస్త్రాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. పట్టువస్త్రాలు సమర్పించిన వారిలో చిల్లపల్లి మోహన్రావు, అందే నాగవరప్రసాద్, చిల్లపల్లి శ్రీనివాస్, తమ్మిశెట్టి జానకీదేవి, గంజి చిరంజీవి, గుత్తికొండ ధనుంజయరావు, దామర్ల నాగమణి, రామనాధం శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు శనివారంతో 8వ రోజుకు చేరుకున్నాయి. స్వామి వారు పొగడ వృక్ష వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పురవీధుల్లో నిర్వహించిన ఊరేగింపులో భక్తులు ఆయా కూడళ్లలో స్వామివారిని దర్శించుకుని టెంకాయలు, హారతులు సమర్పించారు. మంగళగిరి పట్టణానికి చెందిన జంజనం ప్రసన్న కోటేశ్వరరావు, అనిత దంపతులు, వంగర కవిత, దుర్గా వెంకట మహేష్ దంపతులు, కుటుంబ సభ్యులు ఉత్సవ కై ంకర్య పరులుగా వ్యవహరించారు. దేవస్ధాన ఈ.వో. గోపీ ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. గుంటూరు బ్రాడీపేటకు చెందిన పి.కామేశ్వరరావు కుటుంబం ఈఓ శీనానాయక్ను కలిసి రూ.1,01,116 విరాళం అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. పర్యాటక రంగానికి నామమాత్రమే.. మెడికల్ కళాశాల ఊసే లేదు మొక్కుబడిగా విద్యుత్ సబ్సిడీ చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్లో బాపట్ల జిల్లా మొండిచెయ్యి చూపింది. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ప్రధాన సాగునీటి వనరు కొమ్మమూరు కాలువ ఆధునికీకరణకు మొక్కుబడిగా నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంది. చీరాలలో చేనేత క్లస్టర్, నిజాంపట్నంలో వాన్పిక్ సిటీ, చీరాలలో ఐటీ హబ్లకు నిధులు కేటాయించిన పాపాన పోలేదు. బడ్జెట్పై జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. – సీహెచ్.గంగయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి –తన్నీరు సింగరకొండ, సీపీఐ జిల్లా కార్యదర్శి– మజుందార్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఇక్కడ మినీ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఈపురుపాలెం స్ట్రయిట్ కట్ అడవి పంచాయతీ పరిధిలో జెట్టీ ఏర్పాటుకు కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి. అన్ని అనుకూలించాక పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. – శ్రీనివాస్ నాయక్, జేడీ, మత్స్యశాఖ, బాపట్ల చీరాలఅర్బన్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పటి చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ నియోజవకర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వాడరేపు ఫిషింగ్ హార్బర్కు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ ఊసే లేకుండా పోయింది. స్థానిక ప్రజా ప్రతినిధులకు కూడా చిత్తశుద్ధి లేకపోవటమే దీనికి కారణమని ప్రజలు మండిపడుతున్నారు. మినీ హార్బర్ పేరుతో అంచనా వ్యయం తగ్గించి డీపీఆర్ తయారు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాగర్మాల తొలిదశలో.. కేంద్ర ప్రభుత్వం సాగర్మాల తొలి దశలో భాగంగా ప్రతిపాదించిన వాటిలో చీరాల మండలం వాడరేవు ఫిషింగ్ హార్బర్ ఒకటి. పీఎంఎస్వై (ప్రధాన మంత్రి మత్స్యసంపద సమృద్ధి యోజన)కింద రూ.409 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో కేంద్రం వాటా 60 శాతం. మిగతాది రాష్ట్రం ఇవ్వాలి. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ దాదాపు 80 శాతం నిర్మాణం పూర్తయింది. దీనిని ఆయన ప్రారంభించిన రోజే వర్చువల్ విధానంలో వాడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చంద్రబాబు సర్కార్ వచ్చాక దీనిని గాలికి వదిలేసింది. స్థానిక ఎమ్మెల్యే కొండయ్య దృష్టి పెట్టలేదు. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటైతే సుమారు 10వేల మందికి ఉపాధి లభించేదని స్థానికులు తెలిపారు. చంద్రబాబు సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు ఆర్థికంగా లబ్ధి పొందేవారు. వారి వారసులకు మంచి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో మినీ హార్బర్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగా బెంగళూరుకు చెందిన సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఫిషరీస్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ సదరు మినీ హార్బర్కు సంబంధించిన డీపీఆర్ తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పనులు ఎప్పుడు మొదలవుతాయో, ఎప్పుడు పూర్తి చేస్తారో ఇప్పటికీ తెలియదు. జెట్టీ ఏర్పాటుకు ఆటంకాలు? ఒక దశలో ఫిషింగ్ హార్బర్కు ప్రత్యామ్నాయంగా వాడరేవు సమీపంలోని ఈపురుపాలెం స్ట్రయిట్కట్ వద్ద మత్స్యకారులు పడవలు నిలుపుకొనేందుకు జెట్టీ (ఫిష్ ల్యాండ్ సెంటర్)ఏర్పాటు చేయనున్నట్లు పాలకులు సెలవిచ్చారు. సుమారు రూ.1.50 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో స్ట్రయిట్ కట్లో బోట్లు ఉంటే డీజిల్ తదితరాలు నీటిని కలుషితం చేసి పంటలకు నష్టం వాటిల్లుతుందని కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. అక్కడ జెట్టీ ఏర్పాటుకు కూడా ఆటంకం ఏర్పడిందని అధికారులు, మత్స్యకారులు తెలిపారు. -
2029లో కూటమి అధికారంలోకి రాదు
గుంటూరు ఎడ్యుకేషన్/పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరులోని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు విజయలక్ష్మి, మౌనిక, మనోజ్ఞలను శనివారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, వైఎస్సార్ సీపీ యువజన విభాగం వర్కింగ్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధ్రెడ్డిలు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ● వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలో బలమైన నాయకుల ఇళ్లపై భౌతికదాడులకు తెగబడుతున్న కూటమి 2029లో అధికారం కోల్పోనుందని అన్నారు. 1988లో వంగవీటి మోహనరంగా హత్యానంతరం టీడీపీ అధికారానికి దూరమైందని, 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత 2016లో ముద్రగడ పద్మనాభంను చిత్రహింసలకు గురి చేసిన ఫలితమే 2019లో అధికారం కోల్పోయిందని అన్నారు. తాజాగా కాపు నాయకుడైన అంబటి రాంబాబుపై దాడికి పాల్పడిన ఫలితాన్ని టీడీపీ, జనసేన, మౌనంగా ఉన్న బీజేపీ అనుభవిస్తాయని అన్నారు. ప్రధానంగా 2029లో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగలనుందని స్పష్టం చేశారు. ● కాపులందరూ డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంట ఉన్నారనుకోవడం భ్రమ అని, పవన్ కల్యాణ్కి కూటమిలో గుర్తింపు లేదన్నారు. పవన్ కల్యాణ్కి కనీస ఫ్రొటోకాల్ ఇవ్వడం లేదనీ, రాజధాని నిర్మాణ వ్యవహారాలతోపాటు వైజాగ్లో జరిగిన సమ్మిట్లోనూ ఆయనను ఆహ్వానించలేదన్నారు. పవన్ కల్యాణ్తో ఉన్న అనేక మంది కాపులు వాస్తవాలు గ్రహించి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని చెప్పారు. ● అంబటి నివాసంపై గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆమె భర్త గళ్లా రామచంద్రరావు దగ్గర ఉండి దాడులు చేయించారని, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కమ్మని కుట్ర చేశారని అన్నారు. వారి ప్రోద్బలంతోనే కాపు నేత అంబటి రాంబాబుపై హత్యాయత్నం జరిగిందని, మా కాపుల ఓట్లతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. పార్టీలకతీతంగా కాపులకు అండగా ఉంటామన్నారు. 40 ఏళ్లుగా టీడీపీ అధికారం కోసమే కాపులను వాడుకుంటోందని, కాపు సమాజం తీవ్రమైన ఆవేదనతో ఉందన్నారు. ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం వర్కింగ్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిందన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై 2వేల మంది దాడి చేస్తే.. అందులో బాధితుడు అయిన ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటే.. నిందితులు స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారని తెలిపారు. ఒక మాజీ మంత్రిపై ఇంత కక్ష సాధింపు ఉంటే, సామాన్యుడికి భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. అంబటి అంటే గాలిలో ఒక సారి గెలిచిన ఎమ్మెల్యే కాదని, చిత్తశుద్ధితో పార్టీ కోసం పాటుపడే వ్యక్తి అని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, అంబటి రాంబాబు కుమార్తె మౌనిక పాల్గొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ కాపు నేతలపై దాడులు రాష్ట్రంలో వంగవీటి రంగా హత్య మొదలు ఇదే జరుగుతోంది వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ -
క్రీడాకారులకు గెలుపు, ఓటములు సహజం
●ఇండియన్ వాలీబాల్ కోచ్ ఆరికపూడి ●భట్టిప్రోలులో అట్టహాసంగా రాష్ట్ర స్థ్ధాయి వాలీబాల్ పోటీలు భట్టిప్రోలు: క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని జాతీయ అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ఇండియన్ వాలీబాల్ కోచ్ ఆరికపూడి రమణరావు అన్నారు. భట్టిప్రోలు టీఎం రావు హైస్కూల్లో పులికొండ రాధాకృష్ణ గుప్తా, కొసన సుబ్బారావు(ఎన్డీఎస్) మెమోరియల్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ను ఎం.రవీంద్రనాథ్ ఠాగూర్తో కలసి శనివారం ప్రారంభించారు. రమణారావు మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని అతిథులు ప్రేరణనిస్తారని అన్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు, బాపట్ల, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి 15 టీమ్లు హాజరవుతున్నట్లు నిర్వాహక కమిటీ అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు పి. మల్లికార్జునరావు, అల్లాభక్షు, కరింశెట్టి సుబ్బారావు(కన్వీనర్), వి.శేషగిరిరావు(సెక్రటరీ) తెలిపారు. పోటీలను షేక్ కరిముల్లా, గార్యాల వెంకటేశ్వరరావు, జీవీఎస్ నాగేశ్వరరావు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు కిరణ్, ప్రసాద్, పీఈటీ చేబ్రోలు శ్రీనివాసరావు, పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి
గుంటూరు వెస్ట్: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ సర్వీసు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాషా శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రవేశపెట్టిన సీపీఎస్ విధానం ఆమోదయోగ్యంగా లేదన్నారు. దీని రద్దుకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన పాలకులు నేడు చర్యలు తీసుకోవడం లేదున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపీఎస్ గురించి కూడా ప్రస్తావించడం లేదని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. ఇప్పటి వరకు ఫలితం లేదని వాపోయారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్ బాషా -
కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి
నరసరావుపేట ఈస్ట్: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలు డిమాండ్ చేస్తూ ఎస్టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన దశల వారీ ఉద్యమంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో కోటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తన హామీల్లో భాగంగా 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలనీ, అప్పటి వరకు 30 శాతం మధ్యంతర భృతిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు అధ్యక్షత వహించిన ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి మాట్లాడుతూ, రూ.34 వేల కోట్లను దశల వారీగా విడుదల చేయాలని పెండింగ్లో ఉన్న 4 డీఏలను విడుదల చేయాలని కోరారు. -
వనదుర్గాదేవిగా భ్రమరాంబ అమ్మవారు
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజైన శుక్రవారం భ్రమరాంబ అమ్మవారు వనదుర్గాదేవిగా భక్తులను అనుగ్రహించారు. దేవస్థానంలో శుక్రవారం ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, పంచహారతులతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 7 గంటలకు గ్రామ బలిహరణ, 8:30 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 1 గంటకు మహానివేదన, నిత్యౌపాసన, గ్రామబలిహరణ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పంచహారతులు ఇచ్చారు. మహా శివరాత్రి రోజున ఆదివారం రాహు కేతు పూజలు, 100 అభిషేకాలు మినహా అన్ని అర్జిత సేవలు నిలిపివేయడం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. తెనాలి రమేష్బాబు బృందంచే భక్తిరంజని, నటరాజ నృత్యనిలయం విజయవాడ వారిచే కూచిపూడి నృత్యం, వెనిగండ్ల ఉల్లంగుల బ్రహ్మం ఆధ్వర్యంలో గయోపాఖ్యానం నాటకం నుంచి యుద్ధసీను, నిడుబ్రోలు వేపసూరి వెంకట్రావు ఆధ్వర్యంలో బాలనాగమ్మ నాటకం నుండి ఫకీరు, సంగు సీన్లు అద్భుతంగా ప్రదర్శించారు. మహాశివరాత్రి కల్యాణ బ్రహోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం అంతటా విద్యుత్ కాంతులతో కళకళలాడుతుంది. -
అమరావతిలో భక్తుల కోసం వైద్య శిబిరాలు
అమరావతి: అమరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసే భక్తుల కోసం ఏర్పాటు చేయనున్న వైద్యశిబిరాలపై శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి సమీక్షించారు. అమరేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ రాజా వాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్, ఈవో రేఖలతో కలిసి వైద్య శిబిరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై చర్చించారు. అనంతరం సిబ్బందికి, శిబిరాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రతలు వివరించా రు. భక్తులకు అరోగ్యశాఖ సేవలు 24గంటలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఐఓ డాక్టర్ హనుమకుమార్, డాక్టర్ శివరత్నకుమార్, డాక్టర్ మౌనిక ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వరున్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు మంత్రి వాసంశెట్టి సుభాష్కు స్వాగతం పలికి దేవాలయంలోకి ఆహ్వానించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి సుభాష్కు ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రంతోపాటు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. వైభవంగా రాజరాజ నరేంద్ర స్వామి వార్షిక మహోత్సవాలు పెదపులివర్రు(భట్టిప్రోలు):భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో కొలువైన బాలా త్రిపుర సుందరి సమేత రాజరాజ నరేంద్ర స్వామి వార్షిక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ ఆమంచి సృజన్ కుమార్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిపారు. శుక్రవారం ఉదయం, సాయంత్రం నిత్యహోమం బలిహరణ కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారి గ్రామోత్సవం, నెమలి వాహన సేవ జరిగింది. కార్యక్రమాలను ఈవో ఇ.సాంబశివరావు పర్యవేక్షించారు. మహాశివరాత్రికి మల్లయ్య గట్టుకు లాంచీలు ఏర్పాటు విజయపురిసౌత్: ఏపీ పర్యాటక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 15వ తేదీ మహాశివరాత్రి పర్వదినాన అనుపు నుంచి ఏలేశ్వరం స్వామి మల్లయ్య గట్టుకు ప్రత్యేక లాంచీలను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక లాంచీ స్టేషన్ యూనిట్ మేనేజర్ మస్తాన్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున ఏలేశ్వరం గట్టుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం స్పెషల్ లాంచీలను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.150 గా నిర్ణయించడమైందన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. స్పెషల్ లాంచీల కోసం భక్తులు 97051 88311, 94414 53115 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మ కాయలు కనిష్ట ధర రూ.5200, గరిష్ట ధర రూ.6300, మోడల్ ధర రూ.5800 వరకు పలికింది. -
బీజేపీ మహిళ మోర్చా నూతన కమిటీ
గుంటూరు మెడికల్: బీజేపీ జిల్లా మహిళా మోర్చా నూతన కమిటీ సభ్యులు శుక్రవారం గుంటూరు లాల్పురం రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు సమక్షంలో జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శనక్కాయల రాజామాధవి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసి ప్రమాణం చేయించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ అన్నారు. మహిళ మోర్చా ఉపాధ్యక్షునిగా వాణి వెంకట్, సాధువాణి, లక్ష్మీదేవి, చాముండేశ్వరి, స్వాతి, విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శులుగా కాసు శ్రీదేవి, కఠారి పద్మజ, కార్యదర్శులుగా రాధిక, రమ్య, రమాదేవి, లక్ష్మీప్రసన్న, పర్హానా, కోశాధికారిగా డాక్టర్ స్రవంతి, సోషల్మీడియా కన్వీనర్గా వెంకటలక్ష్మి, కార్యనిర్వాహక సభ్యులుగా లీలారాణి, ఉష, లీల, దుర్గా, పద్మా, బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహిళ మోర్చా కమిటీకి మహిళ మోర్ఛా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నడ్డి నాగమల్లేశ్వరి, గుంటూరు మిర్చి యార్డు డైరెక్టర్ శ్రావణ్కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈదర శ్రీనివాసరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కుమార్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భజరంగ్ రామకృష్ణ, తదితరులు అభినందనలు తెలిపారు. -
పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టాలి
బాపట్ల: పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టంపై అవగాహన కల్పిస్తూ సార్డ్స్ సంస్థ రూపొందించిన గోడపత్రాలను కలెక్టర్ శుక్రవారం విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత రంగాలలో పనిచేసే మహిళలకు భద్రత కల్పించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. పదిమంది అంతకుమించి ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తుంటే ఆ ప్రాంతంలో అంతర్గత కమిటీలను నియమించాలన్నారు. మహిళలపై లైంగిక వేధింపులు నివారణ, నిషేధం, పరిష్కార మార్గంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలి బాల కార్మిక వ్యవస్థను జిల్లాలోని అధికారులు పూర్తిగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్ ఆదేశించారు. బాల కార్మిక నిర్మూలన జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాల కార్మిక నిర్మూలన చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. బాపట్ల జిల్లాలో బాల కార్మికులు ఉండరాదన్నారు. రెస్క్యూ బృందాలు నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. ఇ–శ్రమ పోర్టల్ అమలు తీరు, కార్మిక శాఖ పన్నుల వసూళ్లపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇ–శ్రమ పోర్టల్లో కార్మికులందరి పేర్లు నమోదు చేయించాలని అన్నారు. జిల్లాలో 3.54 లక్షల మంది కార్మికులను ఇ–శ్రమ పోర్టల్లో చేర్పించాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు 1.93 లక్షల మంది వివరాలు నిక్షిప్తం చేశామన్నారు. పన్నుల వసూళ్లు వేగవంతం చేయండి అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ ఫలాలు అందించడానికి పన్నులు పక్కాగా వసూలు చేయాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. జిల్లా పరిషత్, ఆర్డబ్ల్యూఎస్ (గ్రామీణ నీటి సరఫరా విభాగం), మున్సిపాలిటీలలో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులపై చట్ట ప్రకారం పన్నుల రూపంలో రూ.1.25 కోట్లు కార్మిక శాఖకు వచ్చిందన్నారు. మున్సిపాలిటీలలో చేపట్టిన అభివృద్ధి పనులు, వివిధ రకాల పన్నుల ద్వారా కార్మిక శాఖకు రూ.13.33 కోట్లు వచ్చాయన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాలలో చేపట్టిన 8,904 పనులకు గాను పన్నుల రూపంలో రూ.10.06 కోట్లు వసూలు జరిగాయన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండేలా వైద్య అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రాంగణంలో బాలల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా రూపొందించిన ‘బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష’ వాహనాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండేలా వైద్య అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
హరహర.. త్రికోటేశ్వరా..
సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ మట్టం శుక్రవారం 536.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 20,641 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 4900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నిల్వ 36.0467 టీఎంసీలు. అమ్మవారికి బోనాలు గురజాల:పల్లెగుంత రోడ్డులో వేంచేసి ఉన్న లక్ష్మీతిరుపతమ్మ గోపయ్యస్వామి వారికి శుక్రవారం బోనాలు సమర్పించారు. మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి పూజలు చేశారు.నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏకాదశి నుంచి మహాశివరాత్రి వరకు మూడు రోజుల పాటు కోటప్పకొండలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం కోటప్పకొండలో భక్తుల రద్దీ నెలకొంది వేలాది మంది స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తుల రద్దీ దృష్ట్యా మూలవిరాట్ అభిషేకాలు నిలిపివేయడంతో అభిషేక మండపంలో నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు పాల్గొన్నారు. -
కొత్త పింఛన్లు ఇచ్చేదెన్నడో?
వేటపాలెం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా నేటికీ ఒక్క సంక్షేమ పథకం కూడా సమర్థంగా అమలు చేసిన దాఖలాల్లేవు. చివరకు ఏ దిక్కూ లేని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు కూడా పింఛన్లు మంజూరు చేయడం లేదు. పలువురు అర్హులు ఎప్పుడు పింఛన్ మంజూరు చేస్తారంటూ సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇటీవల స్పౌజ్ కేటగిరిలో పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే మాత్రమే భార్యకు ఆ పింఛన్ను బదిలీ చేస్తున్నారు. అసలు పింఛన్ రాని వ్యక్తి చనిపోతే ఆయన భార్యకు ఇవ్వాల్సిన వితంతు పింఛనుకు మొండి చేయి చూపిస్తున్నారు. వివిధ సామాజిక పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారిని పట్టించుకోవడం లేదు. బాపట్ల జిల్లాలో ప్రస్తుతం 2,27,868 మంది సామాజిక పెన్షన్దారులు ఉన్నారు. చీరాల నియోజకవర్గం పరిధిలో 30,239 మంది ఉండగా వీరిలో చీరాల అర్బన్ పరిధిలో 8,093 మంది, రూరల్ పరిధిలో 11,438 మంది, వేటపాలెం మండలం పరిధిలో 10,718 మంది సామాజిక పింఛన్లు పొందుతున్నారు. అమలు కాని ఎన్నికల హామీ.. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారికి 50 ఏళ్లకే పింఛన్ అందజేస్తామని హామీ ఇచ్చింది. ఇంత వరకు దీనిని ఆచరణలో పెట్టలేదు. ఎప్పటి నుంచి అమలు చేస్తుందో కూడా ప్రకటించలేదు. దీంతో జిల్లాలో అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు, కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి రోజూ సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయానికి వస్తున్నారు. ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని వారికి సచివాలయ సిబ్బంది సమాధానం చెబుతుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువ శాతం పింఛన్ మంజూరు చేయమని అర్జీలు అందిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న ఆరు నెలల్లోనే కొత్త పింఛన్లు మంజూరయ్యేవి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగేది. నేడు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేకుండా ప్రస్తుత ప్రభుత్వం పెన్షన్కు సంబంధించి వెబ్సైట్ నిలిపేయడంతో అర్హులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్హులైన వారు నిత్యం గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నారు. పింఛన్ల మంజూరులో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అనుసరించిన విధానమే సరైందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్దారులకు ఇంటి వద్దే పింఛను అందించేవారు. భర్త చనిపోయిన వారికి వితంతు పింఛన్లు మరుసటి నెలలోనే మంజూరు చేసేలా చర్యలు తీసుకునేవారు. అదే విధంగా ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లు మంజూరుకు అవకాశం కల్పించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతో అర్హులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
పీఆర్సీ కమిషన్ నియమించాలి
లక్ష్మీపురం: పీఆర్సీ కమిషన్ను నియమించాలని ఏపీ ఎస్టీయూ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్టీయూ మలి విడత ఉద్యమ కార్యచరణలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి సి.హెచ్.జోసఫ్ సుధీర్బాబు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డి.పెదబాబులు మాట్లాడుతూ దీర్ఘకాలిక ఆర్థిక బకాయిల చెల్లింపులకు రోడ్ మ్యాప్ ప్రకటించి వెంటనే చెల్లించాలన్నారు. నాలుగు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని పేర్కొన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలని తెలిపారు. సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం వర్తించేలా చేయాలన్నారు. పదవీ విరమణ చేసిన మరుసటి రోజునే ఉద్యోగికి ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సెక్రెటరీ ఎం.శ్రీధర్, రాష్ట్ర బాధ్యులు ఎస్. రామచంద్రయ్య, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ బాజీ, వై.శ్యాంబాబు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కె.విజయబాబు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల భవిష్యత్తో ఆటలొద్దు
పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలిగుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా చేబ్రోలు: విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు వద్దని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థుల హాజరు తక్కువగా ఉండటంపై కలెక్టర్ ప్రశ్నించగా వడ్లమూడి క్వారీలో గల బాలకోటేశ్వర స్వామి ఆలయంలో జాతీయ సేవా కార్యక్రమాలు నిర్వహించుటకు తీసుకువెళ్లినట్లు అద్యాపకులు తెలిపారు. అక్కడ నుంచే వస్తున్నామని అక్కడ విద్యార్థులు ఎవరు కనిపించలేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్తితుల్లో తక్షణం మార్పు రావాలని ఎన్ఎస్ఎస్ కార్యక్రమం ఎక్కడో చేయటానికి ముందు మీ కళాశాల పరిసరాలలో చేపట్టాలన్నారు. పరిసరాలలో పరిశుభ్రత అధ్వానంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యాపకుల అనధికార గైర్హాజరును ప్రశ్నించారు. మూమెంట్ రిజిస్టర్ సైతం పరిశీలించి ఎటువంటి అనుమతులు నమోదు చేయకపోవడంతో ఆరుగురు అధ్యాపకులకు షోకాజ్ నోటీస్లు జారీ చేయాలని ఆదేశించారు. గ్రంథాలయ నిర్వహణ తీరుపైనా మండిపడ్డారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. చేబ్రోలులోని సూర్య దేవర నరసయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కూడా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. జూనియర్ కళాశాలను తనిఖీ చేసి పరీక్షల సంసిద్ధత, ఏర్పాట్లు తెలుసుకున్నారు. చీలిపాలెం ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పరిశుభ్రత మెరుగుపరచాలని సూచించారు. నారా కోడూరు గ్రామంలో మైక్రో ఇరిగేషన్ క్రింద నిర్వహిస్తున్న షెడ్ను, యూనిట్లను పరిశీలించారు. జిల్లా విద్యా శాఖాధికారి షేక్ సలీం బాషా, తహసీల్దారు కె. శ్రీనివాశర్మ, ఎంఈవో రాయల సుబ్బారావు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్: జిల్లాలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. పది, ఇంటర్ పరీక్షలపై శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలన్నారు. తాగునీరు, వైద్య శిబిరాలు, అత్యవసర మందులు ఉండాలని చెప్పారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. సకాలంలో కేంద్రాలకు చేరుకొనేందుకు బస్ సౌకర్యం ఉండాలని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో అనవసరపు వదంతులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం బాషా మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు మార్చి 16వ తేదీన ప్రారంభం అవుతాయన్నారు. జిల్లాలోని 149 కేంద్రాల్లో 27,699 మంది పరీక్షలు రాస్తారని తెలిపారు. 1,714 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు. ఓపెన్ స్కూలింగ్ 10వ తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయన్నారు. 12 కేంద్రాల్లో 1,083 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు. ఓపెన్ స్కూలింగ్ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 2వ తేదీ నుండి ప్రారంభం అవుతాయని, ఉదయం 9 – 12 గంటల వరకు జరుగుతాయన్నారు. 9 కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు 2,003 మంది హాజరు అవుతున్నారని తెలిపారు. ప్రాంతీయ పర్యవేక్షక అధికారి జి.సునీత మాట్లాడుతూ రెగ్యులర్ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయని చెప్పారు. జిల్లాలో 87 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, మొత్తం 68,898 మంది హాజరు అవుతున్నారని తెలిపారు. -
గజ వాహనంపై దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ఏడో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం స్వామి వారు గజ వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పురవీధుల్లో నిర్వహించిన ఊరేగింపులో భక్తులు ఆయా కూడళ్లలో స్వామివారిని దర్శించుకుని టెంకాయలు, హారతులు సమర్పించారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంగళగిరి పట్టణ శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం వారు ఉత్సవ కై ంకర్య పరులుగా వ్యవహరించారు. దేవస్థాన ఈఓ గోపి ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు. దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావుతోపాటు పలువురు పాలకమండలి సభ్యులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. -
వినియోగదారుల హక్కులు కాపాడాలి
గుంటూరు వెస్ట్: వినియోగదారుల హక్కుల పరిరక్షణ ముఖ్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... కమిటీ సభ్యులు సూచించిన అంశాలసౌ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో నీళ్ల ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో వివిధ రకాల పరీక్షలు, స్కానింగ్కు నిర్దేశిత ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆహార తనిఖీ విభాగం హోటళ్లపై నిఘా పెట్టి కేసులు నమోదు చేయాల్సి ఉందని వివరించారు. గ్యాస్ డెలివరీ బాయ్ వినియోగదారుల నుంచి అధికంగా నగదు వసూలు చేస్తున్నారని, ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల వద్ద రంగుల ఐస్ క్రీములు, హానికరమైన ఆహార పదార్థాల విక్రయాన్ని కట్టడి చేయాలని సూచించారు. నగరంలో ప్లాస్టిక్ తయారీ కేంద్రాలను గుర్తించి, వాటిని తనిఖీ చేయాలని అన్నారు. సమావేశంలో డీఎస్ఓ పి.కోమలి పద్మ, డ్వామా పీడీ కె.కళ్యాణ చక్రవర్తి, సీపీడీసీఎల్ కార్యనిర్వహక ఇంజినీర్ రమేష్, అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. గుండవరం(చేబ్రోలు): మహాశివరాత్రి సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి తిరునాళ్లలో భారీ విద్యుత్ ప్రభలు ప్రధాన ఆకర్షణ. దీనిలో భాగంగా ఆలయం నిర్మాణం జరిగినప్పటి నుంచి గొడవర్రు గ్రామ ప్రభ, గుండవరం గ్రామ ప్రభలు క్రమం తప్పకుండా ఆనవాయితీగా ముందు వరసలో ఉంటాయి. వంద సంవత్సరాల నుంచి గ్రామ ప్రభలు భారీ విద్యుత్ ప్రభలను నిర్మించుకొని భక్తిశ్రద్ధలతో గ్రామంలో మహాశివరాత్రి ముందురోజు ఊరేగింపు నిర్వహించి అనంతరం పండుగ రోజున భక్తుల శివనామస్మరణలతో ఆలయానికి చేరుకుంటాయి. గుండవరం గ్రామానికి చెందిన చుక్కా వంశస్తులు ఒక సంవత్సరం, టంకశాల వంశస్తులు మరో సంవత్సరం గ్రామ ప్రభను నిర్మించి క్వారీ ఆలయానికి గ్రామ ప్రభను తీసుకువెళ్లటం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ ఏడాది చుక్కా వంశస్తులు గ్రామ ప్రభను నిర్మిస్తున్నారు. గుంటూరు జేసీ అశుతోష్ శ్రీవాస్తవ -
రీ సర్వే సక్రమంగా నిర్వహించాలి
కర్లపాలెం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమం సక్రమంగా నిర్వహించాలని బాపట్ల ఆర్డీవో పి.గ్లోరియా ఆదేశించారు. గురువారం ఆర్డీవో యాజలి గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ యాజలి గ్రామ సచివాలయ పరిధిలో రీ సర్వే పనులు మందకొడిగా జరుగుతున్నాయని రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులలో అలసత్వం వహించే సిబ్బందిపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూముల రీసర్వేతో పాటు ప్రభుత్వ సర్వేలన్నీ సకాలంలో పూర్తి చేయాలని సచివాలయం సిబ్బందికి చెప్పారు. ఆర్డీవో వెంట కర్లపాలెం తహసీల్దార్ శ్రీదేవి ఉన్నారు. ఎన్పీటీఈఎల్ ర్యాంకింగ్స్లో విజ్ఞాన్ యూనివర్సిటీకి ‘ఏఏ గ్రేడ్’ చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీకి ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన జాతీయస్థాయి స్వయం ఎన్పీటీఈఎల్ ర్యాంకింగ్స్లో ప్రతిష్టాత్మక ‘ఏఏ గ్రేడ్’ లభించిందని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జి వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ స్వయం ఎన్పీటీఈఎల్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో విజ్ఞాన్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 29వ ర్యాంక్ సాధించి ‘ఏఏ గ్రేడ్’ను సొంతం చేసుకుందన్నారు. ఎన్పీటీఈఎల్ నిర్వహించిన వివిధ ఆన్లైన్ కోర్సులలో విజ్ఞాన్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొత్తం 4,881 కోర్సు సర్టిఫికెట్లు సాధించారని తెలిపారు. వీటిలో 145 గోల్డ్ సర్టిఫికెట్లు, 424 సిల్వర్ సర్టిఫికెట్లు, 2,136 ఎలైట్ సర్టిఫికెట్లు, 2,176 సాధారణ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు ఉన్నాయని వివరించారు. 61 ఎన్పీటీఈఎల్ స్టార్స్ సర్టిఫికెట్లు లభించడంతో పాటు, 106 మంది విద్యార్థులు టాపర్స్గా నిలిచారని వెల్లడించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ వరుసగా తొమ్మిదవ సారి జాతీయ స్థాయిలో టాప్–100లో స్థానం సంపాదించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ‘ఏఏ గ్రేడ్’ సాధించడానికి కృషి చేసిన టీం సభ్యులను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య అభినందించారు. -
వెట్టి చాకిరీ తీవ్రమైన నేరం
చీరాలటౌన్: వెట్టి చాకిరీ తీవ్రమైన నేరం.. ఎవరైనా వెట్టిచాకిరీకి వ్యక్తులను నియమించుకోవడం నేరమని చీరాల ఆర్డీవో తూమాటి చంద్రశేఖరనాయుడు తెలిపారు. వెట్టి చాకిరి చట్టం అమలులోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయినందున జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా ప్రజల్లో అవగాహన పంపొందించేందుకు వెట్టి చాకిరి నేరం వాల్పోస్టర్ గురువారం చీరాల ఆర్డీవో ఆవిష్కరించారు. ఆర్డీవో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం వెట్టిచాకిరి నిర్మూలించిందని, ఎవరైనా ముందస్తుగా డబ్బు, అప్పులు, ఇతర కారాణాలతో వ్యక్తులను బలవంతంగా పని చేయడం విరుద్ధమన్నారు. చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎక్కడైనా వెట్టి చాకిరికి నియమించుకున్న సమాచారం తహసీల్దార్ కార్యాలయాల్లో అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో షాడోస్ ప్రతినిధి రాజా సాల్మన్, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్ భగవాన్ దాస్, షాడోస్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయకుంటే తీవ్ర ఉద్యమం
లక్ష్మీపురం: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లు నష్టదాయకమైనవని, వాటిని రద్దు చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వివిధ కార్మిక, ఉద్యోగ, రైతుసంఘాల నాయకులు హెచ్చరించారు. దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం గుంటూరు నగరంలోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ నగర కన్వీనర్ బి.ముత్యాలరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎ.అరుణ్కుమార్ అధ్యక్షతన సభ నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్.వి.నరసింహారావు, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.రాధాకష్ణమూర్తి, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఎన్.వి.కృష్ణ, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఝాన్సీ, వైఎస్సార్ టీయూ నగర అధ్యక్షులు మురళి, రైతు కూలీ సంఘం నాయకులు పాటిబండ్ల కోటేశ్వరరావు, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కిషోర్, లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ నాయకులు ప్రసాద్, రైతుసంఘ జిల్లా కార్యదర్శి కె. అజయ్కుమార్, ఏఐకెయంయస్ రాష్ట్ర కార్యదర్శి ఘనిరాజులు మాట్లాడారు. కనీసం వేతనం రోజుకు రూ.168 ఉంటే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని విమర్శించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కనీస వేతనం రూ.800లుగా నిర్ణయించి అమలు చేస్తుందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక నిర్ణయాలను అమలు చేయబోమని చెప్పిన ఏకై క రాష్ట్ర ప్రభుత్వం కేరళ అని గుర్తు చేశారు. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేయటం నేరమని, ఆందోళనలు చేస్తే జైళ్లకు పంపేందుకు అనుకూలంగా కార్మిక కోడ్లు రూపొందించారని విమర్శించారు. యూనియన్లు పెట్టుకునే హక్కును, కార్మికశాఖ అధికారులతో తనిఖీలు చేయించి చిన్న చిన్ని పొరపాట్లకు రిజిస్టర్ యూనియన్లను రద్దు చేసే అధికారం లేబర్ కోడ్లలో ఉందన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రశ్నించేవారి గొంతు నులమటమేనని అన్నారు. ఇటీవల మోడీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం మన దేశ రైతాంగానికి తీవ్రమైన సష్టం చేస్తుందని పేర్కొన్నారు. నూతన విత్తన చట్టాన్ని రద్దు చేయాలని కార్మిక, రైతు సంఘాలు ఏకకంఠంతో వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశ, మున్సిపల్, టింబర్ ముఠా, ఆటో, అగ్రికల్చర్ యూనివర్సిటీ, రిటైర్డ్ పెన్షనర్స్, కోల్డ్స్టోరేజి ముఠా, అల్యూమినియం వర్కర్స్, సివిల్ సప్లయీస్ ముఠా, 104, 108, విద్యుత్ కాంట్రాక్టు, మెడికల్ ఈ హెల్త్ తదితర రంగాల కార్మికులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ ఫలితాల్లో శ్రీమేధ–కెరీర్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ
గుంటూరు ఎడ్యుకేషన్: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇటీవల ప్రకటించిన డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాల్లో శ్రీమేధ – కెరీర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో టాప్ మార్కులు సాధించారని సంస్థ డైరెక్టర్లు శేషసాయి బాబు, అన్నా నందకిషోర్ తెలిపారు. గురువారం కొత్తపేటలోని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బీకాం జనరల్ తృతీయ సెమిస్టర్ ఫలితాల్లో 600 మార్కులకు ఫాలక్ జైన్ 519 మార్కులు, పి.జైన్ 512, రిద్ది జైన్ 496, చింతపల్లి శ్రీచిన్న మల్లేశ్వరి 490, మొహమ్మద్ ఫర్హానా బేగం 482 మార్కులతోపాటు, బీకాం కంప్యూటర్స్ విభాగంలో 800 మార్కులకు గాను ఆదిత్య 674 మార్కులు, ఓర్సు వెంకటేశ్వర్లు 669, లక్షితా జైన్ 649 మార్కులతో యూనివర్సిటీ టాపర్లుగా నిలిచిచారని తెలిపారు. 5వ సెమిస్టర్ ఫలితాల్లో బీకాం కంప్యూటర్స్ విభాగంలో 850 మార్కులకు గాను బట్టు షారోనికా 726 మార్కులు, షేక్ నగినా 723, షేక్ క్యూబా కౌసిన్ 694, బి.కాం జనరల్ విభాగంలో 650 మార్కులకుగాను శరత్చంద్ర 583 మార్కులు, రితిక కుమారి 576, తేజోష్ బొత్రాజైన్ 576, షేక్ సుమయ 553, ఎం. మోక్షిత 547 మార్కులతో యూనివర్సిటీ టాపర్లుగా నిలిచారని తెలిపారు. విద్యార్థులతోపాటు అధ్యాపక, ఆధ్యాపకేతర సిబ్బందిని అభినందించారు. -
శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయాలి
బాపట్ల బాపట్ల పట్టణంలోని జాతీయ రహదారి వద్ద మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే తిరిగి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య డిమాండ్ చేశారు. విగ్రహానికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని గురువారం చల్లా రామయ్య సందర్శించారు. ఉమ్మడి రాష్ట్రాల తెలుగు ప్రజల గుండెచప్పుడుగా ఉన్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం, స్మృతివనం నిర్మించేందుకు మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ముందుకొచ్చి శంకుస్థాప చేపడితే అడ్డంకులు కల్పించటం సరైన పద్ధతి కాదన్నారు. స్మృతివనం ప్రదేశంలో మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకోవటం మంచి పద్ధతి కాదన్నారు. ఇటువంటి కుట్రలను చూస్తూ ఊరుకునేదిలేదని హెచ్చరించారు. విగ్రహాన్ని శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ఏర్పాటు చేసేవరకు దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పార్టీ నాయకులు బోడా జాన్ (నాని), డి.పాల్, ఆవుల గోపిరెడ్డి, బి.సోమ య్య, డి.సంజీవులు, బి.గోపి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా -
కేంద్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యం
ప్రత్తిపాడు: దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే కేంద్రం లక్ష్యమని టుబాకో బోర్డు చైర్మన్ సీహెచ్. యశ్వంత్ అన్నారు. వట్టిచెరుకూరు మండలం వింజనంపాడులోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం కేంద్ర బడ్జెట్ 2026పై గెస్ట్ లెక్చర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా టుబాకో బోర్డు చైర్మన్ సీహెచ్.యశ్వంత్ హాజరయ్యారు. యశ్వంత్ మాట్లాడుతూ వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డ్ సృష్టించారన్నారు. సబ్కా సాథ్ సబ్ కా వికాస్ లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. 2026 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వడం అభినందనీయమన్నారు. డిజిటల్ మౌలిక వసతుల విస్తరణ, ఈ–గవర్నెన్స్ బలోపేతం, ఎగుమతుల ప్రోత్సాహానికి టెక్నాలజీ వినియోగం వంటి చర్యలు భారత వాణిజ్య రంగాన్ని బలపరుస్తాయని వివరించారు. భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు అనిమేష్ బిశ్వాస్ మాట్లాడుతూ టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి, పెట్టుబడుల వృద్ధి ద్వారా ‘వికసిత భారత్‘ లక్ష్య సాధన వేగవంతమవుతుందని వివరించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు, కార్యదర్శి కోయి శేఖర్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.బాబు, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె.హరిబాబు అధ్యాపకులు, పాల్గొన్నారు. కోటప్పకొండకు 50 బస్సులు చీరాల: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు చీరాల ఆర్టీసీ డిపో నుంచి 50 బస్సు లు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ జె.శ్యామల గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోటప్పకొండకు ఆదివారం ఉదయం నుంచి చీరాల బస్టాండ్ నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటుచేశామన్నారు. చినగంజాం సమీపంలోని సోపిరాలకు బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
దేవుడితో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు
రేపల్లె: తిరుపతి లడ్డూ ప్రసాదంపై టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ స్వలాభం కోసమేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి యార్లగడ్డ మదన్ మోహన్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. గురువారం ఆయన రేపల్లెలో విలేకరులతో మాట్లాడారు. తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం రాజకీయ ప్రయోజనాల కోసం బూటకపు ప్రచారాలు చేసుకోవటం దుర్మార్గమన్నారు. దేవుడితో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు చర్యని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. విద్యార్థుల ఫీజులు, రైతుల సమస్యలు, నిరుద్యోగం వంటి అసలు సమస్యలపై సమాధానం చెప్పలేక, ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ లడ్డూ వివాదాన్ని లేవనెత్తుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి యార్లగడ్డ మదన్మోహన్ గౌడ్ -
విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కేసులు
ప్రత్తిపాడు: విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కేసులు నమోదు చేస్తామని విద్యుత్శాఖ ఎస్ఈ సీహెచ్.రమేష్ హెచ్చరించారు. పెదనందిపాడు మండలంలోని అన్నపర్రు, అన్నవరం, కాట్రపాడు, పాలపర్రు, పుసులూరు, రాజుపాలెం, రావిపాడు, ఉప్పలపాడు, వరగాని గ్రామాల్లో గురువారం విద్యుత్ విజిలెన్స్ విభాగం, ఆపరేషన్స్ విభాగం ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్ఈ సీహెచ్ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో 40 మంది అధికారులు, 120 మంది సిబ్బంది, 40 బృందాలుగా ఏర్పడి 3,010 సర్వీసులను తనిఖీ చేశారు. అనంతరం పెదనందిపాడు విద్యుత్ సబ్ స్టేషనులో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్ఈ తనిఖీల వివరాలను వెల్లడించారు. మీటరు ఉన్నప్పటికీ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఇద్దరికి రూ.40 వేలు, అనుమతించిన లోడుకంటే అదనంగా విద్యుత్ వాడుతున్న 84 మందికి రూ.3.06 లక్షలు, వినియోగం కంటే బిల్లు తక్కువగా వచ్చిన ఒకరికి రూ.ఐదు వేల చొప్పున మొత్తం రూ.3.51 లక్షల అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని, విద్యుత్ చౌర్యానికి సంబంధించిన పూర్తి వివరాలను 9440812263, 9440812361 నంబర్లకు నేరుగా లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలన్నారు. తనిఖీల్లో ఈఈలు ఎఏ.కరీమ్, ఏ.సత్యనారాయణ, డీఈఈలు ఏ.వెంకటేశ్వరరావు, ఎన్.మల్లికార్జునప్రసాద్, ఏఈలు డి.మురళీకృష్ణ, యూ.శివశంకర్, ఎం.సతీష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
గుండవరం(చేబ్రోలు): పాత కక్షలు, ఆస్తి గొడవల కారణంగా జరిగిన హత్యాయత్నం కేసులోని ముగ్గురు నిందితులను చేబ్రోలు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. చేబ్రోలు పోలీసుస్టేషన్లో ఎస్ఐ పి వీరనారాయణ వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని గుండవరం గ్రామానికి చెందిన సాతర్ల వెంకటేష్కు సాతర్ల గోపి, సాతర్ల శ్రీకాంత్ల మధ్య ఆస్తి, భూ వివాదాలు, పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాతర్ల గోపి, సాతర్ల శ్రీకాంత్, తొడెమల వెంకట గోపిలు ముగ్గురు కలిసి పథకం ప్రకారం వెంకటేష్పై కత్తితో దాడి చేశారు. బాధితుడికి మెడతోపాటు పలు చోట్ల కత్తి గాయాలయ్యాయి. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, తెనాలి డీఎస్పీ జనార్థనరావు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేశారు. నిందితులను గురువారం నారాకోడూరు మినీ బైపాస్ వద్ద అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ పి వీరనారాయణ తెలిపారు. -
అందరి సహకారంతో శివాలయం అభివృద్ధి
పెదకాకాని: అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ధర్మకర్తల మండలి నూతన చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు అన్నారు. పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవం గురువారం ఘనంగా జరిగింది. మొత్తం 13 మంది పాలకమండలి సభ్యులతోపాటు ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి ధనమహేశ్వరప్రసాద్లచే ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు కోసూరు పూర్ణచంద్రరావును చైర్మన్గా పాలకవర్గం సభ్యుడు వరికూటి వీరసుధాకర్ ప్రతిపాదించగా మరొక సభ్యుడు కంభంపాటి వెంకయ్య బలపరచడంతో కోసూరి పూర్ణచంద్రరావును పాలకవర్గం చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే డి నరేంద్రకుమార్ సమక్షంలో ధర్మకర్తల మండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ కోసూరి మాట్లాడుతూ స్వామివారికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, తన నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ నూతన పాలకవర్గం సభ్యులుగా చేబ్రోలు వెంకట భాస్కర పున్నారావు, కంభంపాటి వెంకయ్య, కొమ్మూరి మల్లికార్జునరావు, భైరపనేని ధనలక్ష్మి, కొండా లత, ధూపాటి శివ శంకరరావు, వడ్లమూడి సువర్ణలక్ష్మి, వుల్లం రాజేశ్వరి, బండారు మల్లేశ్వరి, వరికూటి వీర సుధాకరరావు, బాణావత్ మంగమ్మ, పాముదుర్తి నాగలక్ష్మి, ఎక్స్అఫిషియోసభ్యుడు పేటేటి ధనమహేశ్వరప్రసాద్లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
తిరునాళ్లలో సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
చినగంజాం: శివరాత్రి తిరునాళ్ల నిర్వాహణలో సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఆలయాల కమిటీలు చర్యలు తీసుకోవాలని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సూచించారు. శివరాత్రి తిరునాళ్లను పురస్కరించుకొని ఆయన గురువారం చినగంజాంలోని లలితా రామకోటేశ్వరస్వామి ఆలయం, బాలకోటేశ్వర స్వామి ఆలయాలను సందర్శించారు. రెండు ఆలయ కమిటీలు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాయి. ఆయన ఆలయాల పరిసర ప్రాంతాలను, క్యూలైన్ల ఏర్పాట్లను, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించే ప్రదేశాలను, విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేసే స్థలాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం స్థానిక వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ప్రసిద్ధి గాంచిన రెండు దేవాలయాలకు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ, దేవదాయ, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్యం, విద్యుత్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఆలయ కమిటీలతో సమావేశం నిర్వహించారు. గతేడాది భక్తులు 30 వేల మందికిపైగా వచ్చినట్లు అంచనాలున్నాయని, ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, తగిన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. క్యూలైన్లు, బారికేడ్లు, పార్కింగ్ ప్రదేశాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్ల్ ద్వారా నిఘా ఉంచుతామన్నారు. ఆలయ ప్రాంగణంలో వృద్ధులకు, చిన్నపిల్లలకు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ముఖ్యంగా రెండు ఆలయాలకు వచ్చే భక్తుల్లో 80 శాతం మంది రైల్వే ట్రాక్లు దాటుకొని వస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారులు సమన్వయంతో తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు. చీరాల ఆర్డీఓ కె.చంద్రశేఖర్ నాయు డు, డీఎస్పీ ఎండీ మొయిన్, తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు, ఎంపీడీఓ ధనలక్ష్మి, ఎస్బీ సీఐ నారాయణ, ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య, ఎస్ఐ శీలం రమేష్, ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్పీ ఉమామహేశ్వర్ సూచన -
శిలా శాసనాల డిజిటలైజేషన్కు శ్రీకారం
మంగళగిరి టౌన్ : భారతీయ చారిత్రక వారసత్వాన్ని భద్రపరిచే దిశగా భారత్శ్రీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో చైన్నె పురావస్తు, పురాతత్వ శాఖ శాసన విభాగ బృందం శిలాశాసనాల డిజిటలైజేషన్ కార్యక్రమానికి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గురువారం శ్రీకారం చుట్టారు. ఈ దేవస్థానంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చైన్నె, ఎపిగ్రాఫీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఏసుబాబు బృందం శ్రీకృష్ణదేవరాయల హయాం నుంచి 18వ శతాబ్దం వరకు శిలాశాసనాలను సాంకేతికత విధానంతో పరిశీలన జరిపి అధ్యయనం చేశారు. ఏసుబాబు మాట్లాడుతూ శిలాశాసనాల లిపి ఆధారంగా స్థానిక భాషల్లో అనువదింపజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మంగళగిరి పరిధిలోని చారిత్రక ఆధారాలు, శిలాశాసనాలను అధ్యయనం చేసి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన అధికారులకు నివేదిక అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్, ప్రీలాన్స్ ఆర్కియాలజిస్ట్ రామగంగాధర్ పాల్గొన్నారు. -
హాస్టల్ విద్యార్థులకు సరైన భోజనం పెట్టకపోతే చర్యలు
ఫుడ్ కమిషన్ సభ్యులు ఇ.లక్ష్మీరెడ్డి బాపట్ల: హాస్టల్ విద్యార్థులకు సరైన భోజనం పెట్టకపోతే చర్యలు తప్పవని ఫుడ్ కమిషన్ సభ్యులు ఇ.లక్ష్మీరెడ్డి పేర్కొన్నారు. బాపట్లలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్లోని ఆహారపదార్థాలను గురువారం ఆయన పరిశీలించారు. సరైన ఆహారం వడ్డించకపోవటంపై సిబ్బందిపై మండిపడ్డారు. ఇదేవిధంగా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలుత ఎంఎల్ఎస్ పాయింట్ను తనిఖీ చేశారు. నిల్వలను అడిగి తెలుసుకున్నారు. పెదపులివర్రు(భట్టిప్రోలు): మహా శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా వ్యాఘ్రపుర క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన భట్టిప్రోలు మండలం పెదపులివర్రులోని శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలుత స్వామి వారిని పెండ్లి కుమారుడిని చేశారు. గ్రామానికి చెందిన కొసరాజు శశి కుమార్, సోదరులు దివంగత కొసరాజు అఖిలాండేశ్వరి కుటుంబ సభ్యులు, జువ్వలపాలెంకు చెందిన వేముల పల్లి రాఘవయ్య ఉభయ దాతలు పాల్గొన్నారు. సాయంత్రం ధ్వజారోహణ జరిగింది. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్బాపట్ల: డీఎంఎఫ్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఇంజినీరింగ్ అధికారులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో గురువారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో రూ.54.80 కోట్లు ఉండగా, 42 పనులకు అధికారికంగా ఆమోదం లభించిందన్నారు. ఇప్పటివరకు రూ.6.62 కోట్లతో 11 పనులు పూర్తి చేశామన్నారు. మిగిలిన 31 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మిగిలిన పనులన్నీ త్వరగా టెండర్లు పూర్తిచేసి, పనులు ప్రారంభించాలన్నారు. రబీ సీజనుకు సరిపడా యూరియా రబీ సీజనుకు సరిపడా యూరియా జిల్లాలో రైతులకు అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే 21 రోజులకు 8,017 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నందున రైతులు ఆందోళన చెందవద్దన్నారు. 45 కిలోల యూరియా బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.266.50.మాత్రమేనని, ఎక్కువ ధరకు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
బాల సదనం నుంచి ఇద్దరు చిన్నారులు పరారీ
రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నట్లు గుర్తించి తీసుకొచ్చిన పోలీసులు బాపట్ల టౌన్: బాపట్లలోని బాలిక సదనంలో 3వ తరగతి, 5వ తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులు బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో వసతిగృహం నుంచి పారిపోయారు. తల్లిదండ్రులు లేని వారు, అనాథలు, రక్షణ కరువైన బాలికలకు నీడ కల్పించడమే బాల సదనం ముఖ్య ఉద్దేశం. 6–18 ఏళ్ళలోపు బాలికలకు ఉచిత ఆశ్రయంతోపాటు పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బుధవారం అర్ధరాత్రి బాపట్ల బాలిక సదనంలో జరిగిన ఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. వసతిగృహం వార్డెన్లు, సూపరింటెండెంట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొంది. సహచర విద్యార్థులు ఈ విషయాన్ని చెప్పడంతో గంట తర్వాత వారు అప్రమత్తమయ్యారు. ఆచూకీ లభించకపోవడంతో రాత్రి 10.30 గంటల సమయంలో పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంతోపాటు శివారు ప్రాంతాల్లో గాలించారు. పట్టణ శివారులోని కంకటపాలెం గేటు సమీపంలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ కొన్నేళ్లుగా వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్నారు. అధికారులు వారిని చిత్రహింసలకు గురిచేయటం, వెట్టిచాకిరి చేయించడంతోనే పారిపోవాల్సి వచ్చిందని సమాచారం. ఇటీవల బంధువులకు ఫోన్ చేసినప్పుడు కూడా తాము ఇక్కడ ఉండలేకపోతున్నామని, ఇంటికి వచ్చేస్తామని వాపోయినట్లు తెలిసింది. బాల సదనం సూపరింటెండెంట్ ఎస్.సుబ్బలక్ష్మి మాట్లాడుతూ... హాస్టల్ గేటుకు వేసిన తాళాలు తీసుకొని వారిద్దరు పారిపోయారని, పోలీసుల సహాయంతో రాత్రి 10.45 గంటల సమయంలో తిరిగి తీసుకొచ్చామని తెలిపారు. -
మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ చర్యలు
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా, ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో గురువారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా 65 శివాలయాలలో ఉత్సవాలు జరుగుతాయని కలెక్టర్ చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. దేవాలయాలలో పూజా కార్యక్రమాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో చేరితే సురక్షితమైన విధానంలో క్రమబద్ధంగా నియంత్రణ చేయాలన్నారు. ప్రతి ఆలయంలో క్యూ పద్ధతిని అమలు చేయాలన్నారు. విగ్రహాల భద్రత, దొంగతనాలు, తొక్కిసలాటలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజలు అధికంగా వచ్చే ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆధిపత్యం కోసం గొడవలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలిగితే కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వాలన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈనెల 14, 15, 16 తేదీల వరకు మద్యం దుకాణాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. అమర్తలూరు మండలంలో గోవాడ గ్రామం, రేపల్లె మండలం అడవిపల్లి గ్రామంలో బాల కోటేశ్వర స్వామి దేవాలయం, చిన్నగంజాం మండలం సోపిరాల గ్రామం, చిన్నగంజాం మండలం బాలకోటేశ్వర స్వామి దేవాలయం, చుండూరు మండలం బాలకోటేశ్వర స్వామి దేవాలయం కొల్లూరు మండలం కోటిపల్లి శివాలయాలకు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారన్నారు. ప్రాచుర్యం పొందిన దేవాలయాలున్న ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నడపాలని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు దేవాలయాలలో నిర్వహించే ఉత్సవాలపై అధికారులు సమన్వయంతో పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి ఆలయం వద్ద అగ్ని ప్రమాదాల నివారణకు 200 లీటర్ల సామర్థ్యం ఉండే రెండు డ్రమ్ములకు నీరు నింపి బకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ ... శివరాత్రి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ చెప్పారు. ఆలయ ప్రాంగణంలో జాగ్రత్తలు, వెలుపల వైపు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. దేవాలయాల వద్ద శుక్రవారం నుంచి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. 13వ తేదీ సాయంత్రంలోగా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. బందోబస్తు అవసరమైన చోట అధికారులు ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు. అధికారులంతా తప్పనిసరిగా సమన్వయంతో పర్యవేక్షణ చేయాలని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఇన్చార్జి డీఆర్ఓ లవన్న, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, డీఎల్డీవోలు,తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
బాపట్ల
శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026పరిష్కారం దొరకదు.. కొమ్మమూరు కాలువకు ఎప్పుడూ మరమ్మతులేనా ! అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 36.0923 టీఎంసీలు.తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4,800, గరిష్ట ధర రూ.6,000, మోడల్ ధర రూ.5,400 వరకు పలికింది. మోంథా తుఫాన్ సమయంలో పడ్డ గండ్లు పూడ్చాం. తాత్కాలికంగా రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందిస్తున్నాం. దిగువ భూములకు కూడా పూర్తిస్థాయిలో నీరందించాం. ఆయకట్టు పరిధిలో సమస్యలపై అధికారులకు నివేదికలు అందజేస్తున్నాం. – ఎన్కేవీ ప్రసాదరావు, డీఈఈ, నీటిపారుదల శాఖ, చీరాల I -
రుద్రాక్ష వాహనంపై మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గురువారం స్వామి వారు రుద్రాక్ష వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉత్సవ కై ంకర్య పరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మాజేటి ఉదయ్ శ్రీనివాస్, మురళీకృష్ణ, ఉదయ్కుమార్, బాలగంగాధర గుప్తా, రంగా సత్యనారాయణ, శివ మోహన్మూర్తి సురేంద్రబాబు, పెద్దబాబు, శివప్రసాదరావు, రంగారావు గుప్తా, రవీంద్రనాఽథ్ గుప్తా, గోపాలకృష్ణ కుమార్, మధు సూదన వెంకట సుబ్బారావు, చెన్నకేశవ శేషగిరిరావులు వ్యవహరించారు. ఈవో గోపీ ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు. మంగళగిరి టౌన్ : మంగళగిరిలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని మంగళగిరి రూరల్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన వివరాల మేరకు గురువారం తెల్లవారుజామున విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న వాహనాన్ని పలువురు గోసంరక్షణ వాదులు వెంబడించి కాజ టోల్గేటు వద్ద అడ్డుకుని మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వాహనాన్ని స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా గో సంరక్షణ, బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఓ చిన్న వాహనంలో సుమారు 25 దూడలను పెట్టి, వాటికి ఊపిరి ఆడకుండా చేయడంతో వాటిలో ఏడు దూడలు మృత్యువాత పడ్డాయని, సుమారు 12 గంటల పాటు వాటికి నీళ్లు, ఆహారం లేక సొమ్మసిల్లి పోయాయని తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 21వ తేదీన జరగనుంది. ఈ మేరకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన 21న ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, జెడ్పీటీసీలు హాజరై అజెండాలోని అంశాలపై చర్చిస్తారు. తాడికొండ: తుళ్ళూరు మండలం పెదపరిమిలోని మువ్వా చిన్న బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి దాతలు ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామ మాజీ సర్పంచ్ కొండా సాంబిరెడ్డి లక్ష రూపాయలు, మేక భారతి లక్ష రూపాయలు, కొల్లి కోటిరెడ్డి 50 వేల రూపాయలు చెక్కులను గురువారం మేనేజింగ్ ట్రస్ట్ ఎంవీ రామిరెడ్డికి అందజేశారు. దాతలు కొండా సాంబిరెడ్డి, మేక భారతి మాట్లాడుతూ నిస్వార్థంగా సేవలందిస్తున్న ట్రస్ట్కు సహకారం అందించడం బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. అనంతరం దాతలను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మోంథా తుఫాన్ నేపథ్యంలో..
చీరాల అర్బన్: చంద్రబాబు సర్కార్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. కొమ్మమూరు ఆయకట్టు జిల్లా ధాన్యాగారం. ఏడాదికి రెండు పంటలు. మాగాణి రైతులకు సిరులు కురిపించిన ఆయకట్టు. రైతు, రైతు కూలీలమని గర్వంగా చెప్పుకునే పరిస్థితి. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఏడాదికి ఒక పంటకే పరిమితమైన పరిస్థితి. సకాలంలో సాగునీరు అందకపోవటం అందుకు కారణం. ప్రకృతి వైపరీత్యాలతో కాలువ కట్టలకు గుండ్లు పడి వరదనీరు పంటలను ముంచెత్తుతున్నాయి. ప్రతి ఏడాది తాత్కాలిక మరమ్మతులతో అధికారులు మమ అనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెడబ్ల్యూడీ (కృష్ణా వెస్ట్రన్ డెల్టా)లోని కొమ్మమూరు కాలువకు గండ్లు పడకుండా, ఇతర మరమ్మతులు శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టి తమకు న్యాయం చేయాలని ఆయకట్టు రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు. మట్టి పనులతో మమ.. కాలువ కట్టలకు గండ్లు పడటం, వాటిని పూడ్చటం పరిపాటిగా మారింది. మట్టి పనులు ఏ మేరకు చేశారనేది నీటి మీద రాతల మాదిరిగా ఉంటాయని రైతులు అంటున్నారు. ప్రతి ఏడాది వరదల సమయంలో పంట నష్టపోతున్న తమ సమస్యపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. మట్టి పనులయితే ఎవరి వంతు లబ్ధి వారికి చేకూరుతుందనే కోణంలో పాలకులు, అధికారులు అడుగులు వేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నీటి తీరువా వసూళ్లు అంతంత మాత్రమే.. ఆయకట్టు పరిధిలో నీటి తీరువా వసూళ్లు బాధ్యత రెవెన్యూ శాఖది. నీటి తీరువా వసూళ్లు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. పంటలు నీట మునిగి నష్టాలు చవిచూస్తున్న నేపథ్యంలో రైతులు నీటి తీరువాను కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతోంది. సక్రమంగా సాగునీరు అందించి, పంటలు నష్టపోకుండా చర్యలు చేపడితే తమకు నీటి తీరువా చెల్లించటం ఏ మాత్రం భారం కాదని రైతులు చెబున్నారు. నేటికీ అందని పంట నష్టపరిహారం.. మోంథా తుఫాన్ నేపథ్యంలో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం నేటికీ అందలేదు. కేంద్ర ప్రభుత్వ బృందం నివేదికపై అందాల్సిన నష్టపరిహారం ఎప్పటికి మంజూరు అవుతుందో తెలియని పరిస్థితి. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే చంద్రబాబు దీనికి ఏం సమాధానం చెప్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. వేసవికి ముందే తాగునీటి చెరువులు నింపుకోవాల్సిన ఆవశ్యకత ప్రస్తుతం కొమ్మూరు కాలువలో నీరు పుష్కలంగా ఉంది. ఈ క్రమంలో కాలువలో పారుదల ఆగే లోపు ఒక పర్యాయం తాగునీటి చెరువులకు నీరు నింపేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. అలానే మున్సిపల్ పరిధిలో కూడా సమ్మర్ స్టోరేజి ట్యాంకులకు కూడా నీరు నింపుకునేందుకు కూడా మున్సిపల్ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. కొమ్మమూరు ఆయకట్టు పరిధిలో అధికారికంగా, అనధికారికంగా సుమారు 3,70,000 ఎకరాల సాగుభూమి ఉంది. ప్రధాన పంటవరి. గతంలో ఖరీఫ్, రబీలో రెండు పర్యాయాలు వరి పండించేవారు. కానీ కాలక్రమేణా అది ఒక పంటకు పరిమితం అయ్యింది. దీంతో లేట్ ఖరీఫ్ లేదా రబీలలో సాగుచేస్తున్నారు. సాగునీరు సక్రమంగా అందుతుందో లేదో తెలియని స్థితి. దీంతో ఆయకట్టు పరిధిలో మాగాణి సాగు గాలిలో దీపంలా తయారయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మోంథా తుఫాన్ నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. తిరిగి వరి నాట్లు వేయాల్సిన పరిిస్థ్ధితి ఏర్పడింది. దీంతో సాగుదారులకు ఆర్థిక భారం పెరిగింది. వర్షాలకు కొమ్మమూరు కాలువకు అధికార గణాంకాల ప్రకారం చీరాల డీఈఈ కార్యాలయ పరిధిలో 123 గండ్లు పడ్డాయి. అయితే మరి కొన్ని గండ్లు కూడా పడ్డట్లు రైతులు చెబున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు గండ్లు పూడ్చారు. చిన్న, చిన్న గండ్లును రైతులే అవసరమైనచోట పూడ్చుకున్నారు. ఇది వారికి అదనపు భారం. -
పచ్చనేతల ఆక్రమణలపై చర్యలు తీసుకోండి
సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాలోని బాపట్ల మండలం ఈపూరుపాలెం స్ట్రెయిట్కట్ను సముద్రతీరంలో కలిసేచోట ధ్వంసం చేసి రూ.50 కోట్ల విలువైన భూములను ఆక్రమించిన గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావుకు చెందిన భ్రమర ఇన్ఫ్రా, చీరాల టీడీపీ నేత బుర్ల వెంకట్రావులపై పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోని సెక్షన్ 5,10, 19ల ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న వేటపాలెంకు చెందిన జర్నలిస్ట్ నాగార్జునరెడ్డి ఫిర్యాదుకు జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. ఈ మేరకు తీరం భూములు కబ్జాచేసి పర్యావరణానికి విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని గురువారం జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ను ఆదేశించింది. ఆక్రమణ దారులతోపాటు వారికి సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
మహాశివరాత్రికి పటిష్ట భద్రత కల్పించాలి
జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అమృతలూరు(కొల్లూరు): మహా శివరాత్రిని భక్తులు ప్రశాంతంగా నిర్వహించుకునేలా పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశించారు. అమృతలూరు మండలం గోవాడలో ఉత్సవాల నేపథ్యంలో ఆయన బుధవారం బాలకోటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. పలు శాఖల అధికారులు, ఆలయ కమిటీతో సమన్వయ సమావేశం నిర్వహించారు. తొలుత దైవదర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేపల్లె డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు, ఆర్డీఓ రామలక్ష్మి, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాగయ్య, సీఎఫ్ఓ అనుపమ, తహసీల్దార్ నెహ్రూ, ఎంపీడీఓ శేషమాంబ, సర్పంచి విజయలక్ష్మి, ఆలయ చైర్మన్ రమేష్, ఈఓ విఠల్ శ్రీనివాస్ వర్మ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఏడుగురు నిందితుల అరెస్ట్
చేబ్రోలు: ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటనపై బుధవారం చేబ్రోలు పోలీసులు ఏడుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల జిల్లా చుండూరుకు చెందిన భరత్ నాగార్జున యూనివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నాడు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో జరిగిన యువజనోత్సవాలకు హాజరై తిరిగి వస్తుండగా వివాదం జరిగింది. ఈ నేపథ్యలో శ్రీరామ్, ఆదర్శ్తోపాటు మరో ఏడుగురు కలిసి భరత్పై విచక్షణరహితంగా దాడి చేసి గాయపరిచారు. విద్యార్థి తండ్రి అరుణ్కుమార్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ పి.వీరనారాయణ కేసు నమోదు చేశారు. సంఘటనకు కారణమైన తొమ్మిదిమంది నిందితులతో ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. సోషల్ మీడియాలో వైరల్ గంజాయి, మద్యం మత్తులో యువకులు విచక్షణరహితంగా దాడి చేస్తున్న సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోని తోటలోకి తీసుకొని వెళ్లి విద్యార్థిపై తొమ్మిదిమంది కలిసి కొడుతున్నట్లు వీడియోలో ఉంది. పొన్నూరు, శేకూరు, తెనాలి, వినుకొండ, కొలకలూరు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కర్రలు, బెల్టుతో అతడిని తీవ్రంగా గాయపరిచారు. ముఖంపై, నడుము, కాళ్లు, చేతులు, వీపుపై దాడి చేస్తున్న సంఘటనకు సంబందించిన వీడియో వైరల్ అయింది. -
డాక్టర్ మేరీ గ్లౌరీ సేవలు మరువలేనివి
గుంటూరు మేత్రాసనం పీఠాధిపతి చిన్నబత్తిని భాగ్యయ్య నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): సేవకు ప్రతిరూపంగా నిలిచే గుంటూరు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో 36 ఏళ్లు సుదీర్ఘంగా వేలాది మంది రోగులకు చికిత్సలు చేసి, తన చేతి స్పర్శతో వారిని ఆరోగ్యవంతులుగా చేసిన దివంగత డాక్టర్ మేరీ గ్లౌరీకి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ఆమెను సెయింట్గా గుర్తించే క్రమంలో రెండవ దశ అయిన పూజ్యనీయ (వెనరబుల్గా) స్థానాన్ని పొందడం గుంటూరుకే గర్వకారణమని గుంటూరు మేత్రాసనం పీఠాధిపతి చిన్నబత్తిని భాగ్యయ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక సెయింట్ జోసెఫ్స్ పాఠశాల ఆవరణలో డాక్టర్ మేరీ గ్లౌరీకి దక్కిన గౌరవ పురస్కారం సందర్భంగా జె.యం.జె. సభ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవం నిర్వహించారు. 17, 22 తేదీల్లో శాప్ లీగ్స్ క్రీడా పోటీలు గుంటూరు వెస్ట్(క్రీడలు): శాప్ ఆదేశాల మేరకు 31 క్రీడాంశాల్లో శాప్ లీగ్స్ పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా 17వ తేదీ ఉదయం 9 గంటలకు స్థానిక బీఆర్ స్టేడియంలో అండర్–13, 15, 17, 19 బాల బాలికలు, యువతీ యువకుల చెస్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ప్రతిభ కనబరచిన వారిని ఎంపిక చేసి ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పంపిస్తామన్నారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 9 గంటలకు స్థానిక బీఆర్ స్టేడియంలో అండర్–18 యువతీ యువకుల జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు జరుగుతాయన్నారు. ఎంపికై న వారిని ఈ నెల 28 నుంచి మార్చి 1 వరకు విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు పంపిస్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు శాప్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. వివరాలకు స్కేటింగ్ కోచ్ షేక్ అబ్దుల్ సలామ్ 94934 47566, సైక్లింగ్ కోచ్ కనకరావు సెల్ నెంబర్ 63011 77119ను సంప్రదించాలని కోరారు. -
విభిన్న ప్రతిభావంతులపై ప్రత్యేక శ్రద్ధ
ఎక్సప్షనల్ లెర్నెంగ్ ఫౌండర్ అండ్ సీఈవో జినో ఆరుషి రేపల్లె: విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎక్సప్షనల్ లెర్నెంగ్ ఫౌండర్ అండ్ సీఈవో డాక్టర్ జినో ఆరుషి చెప్పారు. పట్టణంలోని భవిత కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించి విభిన్న ప్రతిభావంతులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. వైకల్యమనేది శరీరానికేగాని మనస్సుకు కాదన్నారు. వారి మనస్సులో ఎక్కడా వైకల్య ప్రస్తావన తీసుకురాకుండా ఉత్తములుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు పిల్లలకు ప్రోత్సాహం, ఆత్మవిశ్వాసం కల్పిస్తే వారు అన్ని రంగాలలో ముందుకు సాగగలరన్నారు. చిన్నారుల అభివృద్ధికి దృష్టియాప్ను రూపొందించటం జరిగిందన్నారు. ఉపాధ్యాయులు చిన్నారులకు కేంద్రంలో నేర్పించే అంశాలు, విధానాలు ఈ యాప్లో పొందుపరచటం జరుగుతుందన్నారు. ఈ యాప్ను సహిత విద్య రీసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్పీ)లతో పాటు తల్లిదండ్రుల ఫోన్లలో సైతం పొందుపరచబడునన్నారు. ఈ యాప్ను రాష్ట్రంలోని అన్ని భవిత కేంద్రాలలో ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. యాప్లో ఐఈఆర్పీలు బోధించే విధానాన్ని ఇంటి దగ్గరే ఉండి తల్లిదండ్రులు ఆ అంశాలను నేర్పిస్తూ చిన్నారులకు మరింత మానసికాభివృద్ధి చేయవచ్చన్నారు. కేంద్రాలకు వచ్చే తల్లిదండ్రులు తమ చిన్నారులతో పాటు వారి తోటి చిన్నారులకు సైతం బాసటగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా భవిత కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న బోధనా పద్ధతులు, బోధనోపకరణాలను పరిశీలించారు. భవిత కేంద్రం ద్వారా తల్లిదండ్రులు తమ చిన్నారులు మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందుతున్న విధానాన్ని వివరించి, కేంద్రానికి శాశ్వతంగా ఫిజియోథెరఫిస్ట్ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా స్థాయిలో విభిన్న ప్రతిభావంతులకు నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో సెంటరుకు చెందిన హేమశ్రీని అభినందించారు. కార్యక్రమంలో సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్ మట్టా జ్యోత్న్స, సహిత విద్య రీసోర్స్ పర్సన్స్ ఎన్.అనురాధ, సుకన్య, సిబ్బంది సీతా మహాలక్ష్మి, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ విగ్రహ ఏర్పాటుపై రాజకీయాలొద్దు
బాపట్ల: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటుపై రాజకీయ జోక్యం సరికాదని వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి పేర్కొన్నారు. విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలంలో మరో విగ్రహం ఏర్పాటు చేయటాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డిని బుధవారం కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆనాటి శంకుస్థాపన ఫొటోలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కోకి రాఘవరెడ్డి మాట్లాడుతూ.. బాపట్లలోని జాతీయ రహదారిలో కర్లపాలెం వెళ్లే కూడలి ప్రాంతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం నిర్మించేందుకు మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కోర్టు వివాదంతో నిర్మాణ పనులు నిలుపుదల చేశారన్నారు. అప్పుడు ఉన్న నిబంధనలు ఇప్పుడు వర్తించకపోవటం బాధాకరమన్నారు. విగ్రహాలు ఏర్పాటుపై ఇష్టానుసారం వ్యవహరించటం, రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికై నా వైఎస్సార్ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదిత స్థలం జోలికి రావద్దంటూ సూచించారు. ఈ సమావేశంలో పార్టీ కార్యదర్శి చేజర్ల నారాయణ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, జిల్లా స్పోక్స్పర్సన్ గవిని కృష్ణమూర్తి, మాజీ ఎంపీటీసీ మచ్చా శ్రీనివాసరెడ్డి, నాయకులు జోగి రాజా, గోపి తదితరులు ఉన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి -
బాలకోటయ్యా... నిను చేరేదెలా?
రేపల్లె: మహాశివరాత్రిని పురస్కరించుకుని అరవపల్లి గ్రామంలో వేంచేసియున్న బాలకోటేశ్వరస్వామి తిరునాళ్లను ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. స్వామివారు ఈ క్షేత్రంలో వెలసిన నాటి నుంచి భక్తులు అపార భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు. దాదాపు 300 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉన్న ఈ ఆలయానికి చేరాలంటే భక్తులకు తిప్పలు తప్పటంలేదు. దూరప్రాంతాల నుంచి భక్తుల రాక... మహాశివరాత్రి రోజున పరిసర గ్రామాల నుంచే కాకుండా ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు, జాగరణ వంటి కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది. తిరునాళ్ళను పురస్కరించుకుని రేపల్లె పట్టణంతో పాటు చుట్టు పక్కల పెదఅరవపల్లి, నల్లూరుపాలెం తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలోనే భక్తులు ప్రభలను కట్టుకుని బాలకోటయ్యను దర్శించేందుకు వస్తుంటారు. ఈ పవిత్ర క్షేత్రానికి చేరుకునే ప్రధాన రహదారి అధ్వాన్నంగా ఉండటంతో ప్రభలను ఆలయం వద్దకు సురక్షితంగా తరలించటం కష్టమవుతుందని భక్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రహదారులకు త్వరితగతిన మరమ్మతులు నిర్వహించాలి.. ప్రత్యేకంగా పండుగ సమయాల్లో వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చే నేపథ్యంలో రహదారి మరమ్మతులు చేపట్టకపోవడం పట్ల గ్రామస్తులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు, ఇతర వాహనాలు కూడా ఆలయానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, బాలకోటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రహదారిని శాశ్వతంగా మరమ్మతులు చేయాలని భక్తులు కోరుతున్నారు. స్వామివారి తిరునాళ్లు మరింత వైభవంగా సాగాలంటే మౌలిక వసతుల కల్పన అత్యవసరమని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. -
విధులు బారెడు .. నిధులు మూరెడు
చీరాల అర్బన్: చీరాల డ్రైనేజీ కార్యాలయం డివిజన్ హెడ్ క్వార్టర్.. విధులు ఎక్కువ నిధులు తక్కువగా ఉంది. వెంటాడుతున్న సిబ్బంది కొరత. పట్టించుకోని పాలకులు, అధికారులు. ఒక ఒక వైపు రైతాంగం, మరో వైపు సాధారణ ప్రజలు ఇలా అంతా ఇబ్బంది పడుతున్నారు. వీటిపై దృష్టి సారించాల్సిన ప్రజాప్రతినిధులు మీసాలు దువ్వుకోవటానికి, అసభ్య పదజాలంతో సవాళ్లు విసరడానికే పనికి వస్తున్నారని.. ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల అభివృద్ధిపై ర్యాంకులు ఇచ్చిన చంద్రబాబు చీరాల నియోజకవర్గానికి పనితీరును చూసి, లేక పైరవీలను చూసి ర్యాంకులు ఇచ్చారో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలపై స్పందించేవారని, ప్రత్యేకంగా రైతాంగ సమస్యలపై దృష్టి సారించిన తీరును గుర్తు చేసుకుంటున్నారు. నాడు శంకుస్థాపన చీరాలలో 1970లో కృష్ణా వెస్ట్రన్ డెల్టా డ్రైనేజి స్కీమ్ నేపథథ్యంలో కార్యాలయానికి అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి రొండా నారపరెడ్డి శంకుస్థాపన చేశారు. ఎస్ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు. అప్పట్లో విధులకు సరిపడా నిధులు, పనులకు తగ్గట్లు సిబ్బంది ఉండేవారని చెబున్నారు. అయితే కార్యాలయ విధులు వికేంద్రీకరణ నేపథ్యంలో ప్రస్తుతం డ్రైనేజీ చీరాల డివిజన్ కార్యాలయంగా ఉంది. రైతులకు తప్పని తిప్పలు చీరాల నియోజకవర్గంలో వ్యవసాయం, అనుబంధ వృత్తులే జీవనాధారంగా ఉన్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. డ్రైయినేజీ పరిధిలో ఈపురుపాలెం స్ట్రయిట్కట్, వేటపాలెం స్ట్రయిట్కట్, కుందేరు ప్రధానమైనవి. స్ట్రయిట్ కాలువల కింద వేల ఎకరాల సాగుభూమి ఉంది. కొన్ని చోట్ల కనీస పూడికలు తీయక సాగునీరు సక్రమంగా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులను ప్రశ్నించిన వారికి నిధులు లేవనే సమాధానం వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కుందేరు ప్రక్షాళన పనులు కాగితాలకే పరిమితం అయింది. స్థానిక డ్రైనేజీ అధికారులకు డివిజన్ పరిధిలో విధులు ఎక్కువగా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా నిధులు లేవని చెబున్నారు. ఈ క్రమంలో రైతుల ప్రయోజనాలను కాపాడటంలో మురుగునీటి పారుదల శాఖ విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏటా ముంపునకు గురవుతున్న పొలాలు అందుకు నిదర్శనమంటున్నారు. దీంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది లేమితో.. డివిజన్ కార్యాలంలో ఈఈ ఒకరు, డీఈఈలు ముగ్గురు ఉన్నారు. ఏఈలు 16 మందికి గాను 12 మంది మాత్రమే ఉన్నారు. వర్క్ ఇన్స్పెక్టర్ ఒకరు మాత్రమే ఉన్నారు. ఇక క్షేత్ర స్థాయిలో లస్కర్లు 180 మంది ఉండాల్సి ఉండగా ఒకరు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పనులు కుంటుపడుతున్నాయి. ఉన్న వారిపై పనిభారం పెరుగుతోంది. అయితే సిబ్బంది ఖాళీల భర్తీకి సంబంధించి అటు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక మరమ్మతులకు నోచుకోని డ్రైనేజీ కార్యాలయం, అతిథి గృహాలు ఆ శాఖ ఆర్థిక స్థితికి దర్పణం పడుతోందంటున్నారు. ఉన్నంతలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల లేమి కొంతమేర ఉన్నమాట వాస్తవమే. క్షేత్రస్థాయి సిబ్బంది కొరత ఉంది. ప్రభుత్వానికి నివేదించాం. – మురళీకృష్ణ, ఈఈ, మురుగునీటి పారుదలశాఖ, చీరాల డివిజన్ -
ఈత పోటీల్లో తండ్రీ కుమారుల సత్తా
రేపల్లె: ఓపెన్ రివర్ స్విమ్మింగ్ పోటీల్లో తండ్రి కొడుకులు తమ ప్రతిభను చాటి పలువురి ప్రశంసలు పొందారు. ఇండియన్ నేవీలో మాస్టర్ చీఫ్ పెట్టి ఆఫీసర్గా విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్న రేపల్లె మండలం ఉప్పూడి గ్రామానికి చెందిన పానుగంటి హరికృష్ణ, ఆయన కుమారుడు పానుగంటి జైతిక్ కార్తికేయ ఇటీవల విజయవాడలో కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్నారు. 1.5 కిలోమీటర్ల దూరాన్ని పానుగంటి హరికృష్ణ 39 నిమిషాల్లో పూర్తి చేయగా, ఆయన 10 ఏళ్ల కుమారుడు జైతిక్ కార్తికేయ అదే దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో పూర్తి చేసి విశేష ప్రతిభ కనబరిచాడు. చిన్న వయస్సులోనే ధైర్యం, పట్టుదలతో ఈ ఘనత సాధించడం ప్రత్యేకంగా నిలిచింది. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి పోటీలో పాల్గొని అద్భుత ప్రదర్శన కనపరిచి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఉప్పూడి గ్రామస్తులతో పాటు పట్టణానికి చెందిన పలువురు తండ్రి కొడుకులను అభినందించారు. ఓపెన్ రివర్ స్విమ్లో అద్భుత ప్రదర్శన -
బాబు దారుణ హామీ!
పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రుణాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు సర్కార్ వారిని నిండా ముంచేసింది. గద్దెనెక్కి రెండేళ్లు కావస్తున్నా నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. బీసీ, ఈబీసీల కోసం కార్పొరేషన్ల ద్వారా విడుదల చేసిన రాయితీ రుణాలను టీడీపీ నేతలు చెప్పిన వారికి ఇవ్వడానికి నిర్ణయించారు. అవీ ఇంకా మంజూరు కాలేదు. ఇక అర్హులకు రుణాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. చీరాల టౌన్: కేవలం టీడీపీ నేతలు చెప్పిన వారికే రుణాలను మంజూరు చేసేలా తుది జాబితాలను బ్యాంకులకు పంపారు. వారిలోనూ ఒక్కరికీ కూడా రుణాలను అందించలేకపోయారు. ఫలితంగా నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై అందించే రుణాలు దక్కక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సబ్సిడీ రుణం వస్తే చిన్న వ్యాపారం ప్రారంభించుకుని కుటుంబాన్ని పోషించుకుందామని ఆశించిన వారి ఆశలు చంద్రబాబు సర్కార్ వైఖరితో నీరుగారిపోయాయి. అధికారుల అలసత్వం, టీడీపీ నేతల వైఖరితో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను లబ్ధిదారులకు అందించేందుకు కమిటీకి కన్వీనర్గా ఎంపీడీఓ, సభ్యులుగా ఈఓఆర్డీ, పలు బ్యాంకుల మేనేజర్లను నియమించారు. స్క్రీనింగ్ కమిటీని మొక్కుబడిగా ఏర్పాటు చేశారు. ముఖ్యనేత ఆమోదం పొందిన వారికే రుణాలకు అర్హులను నిర్ధారించారు. ఎంపీడీఓ కార్యాలయానికి టీడీపీ నాయకులు వచ్చి నేరుగా తమవారికి రుణాలు ఖరారయ్యాయో.. లేదో.. అని జాబితాలను చూసుకున్నారు. అర్హులను గుర్తించి వారి వివరాలను బ్యాంకర్లకు అందించడం అధికారుల విధి. ఏడాది క్రితం చీరాల మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలను నిర్వహించారు. అధికారులు మాత్రం రుణాలకు అర్జీలు దాఖలు చేసి ఎదురుచూస్తున్న లబ్ధిదారుల వివరాలను బ్యాంకులకు కాకుండా ముందుగానే ముఖ్య నేతకే అందించారు. ఆ నేత ఎంపిక చేసిన వారికే రుణాలు అందించేలా హుకుం జారీ చేయగానే మండల పరిషత్ అధికారులు ఆదేశాలను పాటించారు. 612 మంది అభ్యర్థులు.. చీరాల మండలానికి ప్రభుత్వం చీరాల బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించేందుకు మండలానికి 90 యూనిట్లు మాత్రమే కేటాయించారు. దరఖాస్తులు మాత్రం 621 మంది అభ్యర్థులు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి బ్యాంకు సిబిల్ రేటు, ధ్రువీకరణ పత్రాలను బ్యాంకు మేనేజర్ల సమక్షంలో మండల పరిషత్ అధికారులు విచారణ చేపట్టారు. మండలానికి కేటాయించిన 90 యూనిట్లు బీసీ, ఈబీసీ సబ్సిడీ రుణాలకు రూ.1.69 కోట్లు బ్యాంకు మేనేజర్లు రుణాలను అందించనున్నారు. ఎంపిక ఇంటర్వ్యూలు నిర్వహించగా 612 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మిగిలిన పార్టీల నేతలకూ మొండిచేయి.. టీడీపీ అధికారంలోకి రావడానికి ముఖ్యపాత్ర పోషించిన జనసేన, బీజేపీ నాయకులకు చీరాల్లో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీల నేతలు ఇచ్చిన జాబితాలోని వారికి సబ్సిడీ రుణాలు ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనం. గత ఎన్నికల సమయంలో వేరే పార్టీకి పనిచేసి ప్రస్తుతం అధికార పార్టీ పంచన చేరిన మండలంలోని కొందరు నేతలు అంతా తామే అన్నట్లు రుణాల పంపిణీలో చక్రం తిప్పడాన్ని కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి ఆశలు అడియాశలేనా..? చేనేతలు, రోజువారీ కూలీలు, చదువుకుని ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు చేయూతనిచ్చే రుణాల ఎంపికలో టీడీపీ నేతలకే ప్రాధాన్యం ఇవ్వడంతో అధికారులు, టీడీపీ నేతల తీరుపై ప్రజలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేతలు సిఫార్సు చేసిన వారికి మాత్రమే రుణాలు కేటాయించడంతో గ్రామాల్లోని అర్హులు మాత్రం బాహాటంగా మండిపడుతున్నారు. రుణాల కోసం ఎదురుచూపులు చూస్తున్న లబ్ధిదారుల ఆశలపై చంద్రబాబు సర్కార్ నీళ్లు చల్లింది. కార్పొరేషన్ల సబ్సిడీ రుణాలకు సంబంధించి ఇంటర్వ్యూలను పూర్తి చేశాం. ఎంపిక కమిటీ జాబితాను ఆయా బ్యాంకులకు పంపించాం. సిబిల్ స్కోరు ప్రకారం రుణాలు అందిస్తాం. బ్యాంకులు నిర్ధారించిన నమ్మకమైన వ్యక్తులకే రుణాలు లభిస్తాయి. ప్రభుత్వం సబ్సిడీ నగదును బ్యాంకులకు కేటాయించకపోవడంతోనే కార్పొరేషన్ రుణాలు ఇవ్వలేపోయారు. మండలంలో బీసీల్లో 80 మందిని, ఈబీసీల్లో 12 మందిని అర్హులుగా నిర్ధారించారు. – ఎల్.విజయ, ఎంపీడీఓ, చీరాల కార్పొరేషన్ రుణాలన్నీ అర్హులకు కాకుండా కేవలం టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారికే మంజూరు అవుతున్నాయని చెబుతున్నారు. అధికారులు మాత్రం ముఖ్యనేత సిఫార్సుతో కేవలం టీడీపీ నాయకులు సూచించిన వారికే ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు వదులుతున్నారు. రుణాల ఎంపికకు సంబంధించి తుది జాబితాలను సైతం జిల్లా కార్పొరేషన్ కార్యాలయాల కంటే ముందుగా టీడీపీ నేతలకు చూపించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
అంతర్ జిల్లా నేరస్తుల ముఠా అరెస్టు
మార్కాపురం టౌన్: ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా నేరస్తుల ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నిందితుల నుంచి ఒక పల్సర్, 3 బుల్లెట్ బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పి.సుబ్బారావు తెలిపారు. బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో పట్టణ, రూరల్ ఎస్సైలు సైదుబాబు, వేమనతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. మార్కాపురం టౌన్లోని 10వ వార్డుకు చెందిన సయ్యద్ మసీద్ అలియాస్ ఆసిఖ్, ఇదే వార్డులోని విజయ థియేటర్ వద్ద ఉండే దూదేకుల మొహిద్దీన్ షా, గుంటూరు టౌన్లోని నల్లచెరువు 7వ లైన్లో తాత్కాలిక నివాసముంటున్న పులి అంజిరెడ్డి ముగ్గురూ ఒక ముఠాగా ఏర్పడి మోటారు సైకిళ్లను చోరీ చేస్తున్నారు. వీరిపై ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు పోలీసు స్టేషన్లలో చోరీ కేసులు నమోదయ్యాయి. జైల్లో ఉన్న సమయంలో స్నేహితులైన ముగ్గురు యువకులు బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత బైకు చోరీలకు అలవాటుపడ్డారు. ఈ నెల 2వ తేదీన మార్కాపురం రైల్వేస్టేషన్ సమీపంలోని రాయవరం వద్ద బైకు చోరీ కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఉదయం మార్కాపురం మండలంలోని కుంట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నంద్యాల వైపు బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్లో విచారించగా గుంటూరులో 2, వినుకొండలో 1, రాయవరంలో 1 బైకు చోరీ చేసి నికరంపల్లి సమీపంలోని చిల్లచెట్లలో దాచిపెట్టినట్లు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. -
జీజీహెచ్లో హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో ఈ సంవత్సరం హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు మెడికల్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి బుధవారం తెలిపారు. కార్యక్రమాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబులు పర్యవేక్షించారు. 145 మంది హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ వేయడం జరిగిందన్నారు. గురువారం కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్, హాజీ హసన్ బాషా పాల్గొన్నారు. తెనాలి: నియోజకవర్గంలోని కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో వేంచేసి ఉన్న శ్రీవారాహి అమ్మవారి దేవస్థానంలో ఉచిత కోటి కుంకుమార్చన కార్యక్రమం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ మాచిరాజు వేణు గోపాల్, పెనుగొండ పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పాల్గొన్నారు. ముందుగా వారాహి అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉచిత కోటి కుంకుమార్చనను మహిళలతో చేయించారు. ఈ సందర్భంగా శ్రీవారాహి అమ్మవారి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. నిర్వాహకులు చివరిగా అతిథులను సత్కరించారు. దాచేపల్లి : మండలంలోని సారంగపల్లి అగ్రహారంలో లక్ష్మీతిరుపతమ్మ, గోపయ్య స్వామి కల్యాణ మహోత్సవం బుధవారం కనుల పండువలా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అమ్మవారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. పురోహితుడు జానపాటి సీతారామశర్మ ఆధ్వర్యంలో అమ్మవారి కల్యాణం జరిపించారు. పుణ్యదంపతులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. వేద పండితులు భక్తులకు ఉత్సవ విశిష్టతను వివరించారు. ఉత్సవ కై ంకర్య పరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మాజేటి సూర్యవేణుగోపాల కృష్ణ శ్రేష్టి, కృష్ణకుమారి దంపతులు, ఎల్ కే శర్మ ఇందిరాదేవి దంపతులు వ్యవహరించారు. ఈవో గోపీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
కారులో చెలరేగిన మంటలు
మంగళగిరి టౌన్: కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైన ఘటన మంగళగిరి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు అనంతపూర్కు చెందిన ఆదిత్య జగ్గయ్యపేటలోని కెనరా బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటున్నాడు. గుంటూరులో ఉన్న కెనరా బ్యాంక్ బ్రాంచ్లో బ్యాంకుకు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు బుధవారం తన కారులో వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో తాడేపల్లిలోని బంధువుల ఇంటికి వెళుతుండగా మంగళగిరి రత్నాల చెరువు జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి రాత్రి 7.30 గంటలు అయ్యింది. ఈ క్రమంలో కారు బ్యానెట్లో నుంచి పొగలు రావడం ఆదిత్య గమనించాడు. వెంటనే కారు పక్కన ఆపి కారులో నుంచి దిగాడు. క్షణాల్లో కారులో మంటలు భారీగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అప్పటికే కారు దాదాపుగా దగ్ధమైపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకుని ఉండవచ్చని, సుమారు 4 లక్షల వరకు నష్టం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. పట్టణ పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థి అవయవదానం తాడేపల్లిరూరల్: ఖమ్మం జిల్లా మధిరకు చెందిన విజయ్కుమార్ (20) తాడేపల్లిలోని ఓ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య పరీక్షల అనంతరం విజయ్కుమార్కు బ్రెయిన్ డెడ్గా బుధవారం వైద్యులు నిర్ధారించారు. విజయ్కుమార్ తండ్రి సైదేశ్వరరావు, కుటుంబ సభ్యులు విజయ్కుమార్ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ జీవన్దాన్ చైర్మన్ డాక్టర్ కె.రాంబాబు, హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో అవయవ దానం చేశారు. గుండె, కాలేయం మణిపాల్ హాస్పిటల్లో అవసరమైన వారికి ట్రాన్స్ప్లాంటేషన్ చేయగా, ఊపిరితిత్తులను హైదరాబాద్ కిమ్స్కు, కిడ్నీలకు విధాత హాస్పిటల్కు, కంటి కార్నియాను విజయవాడ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించారు. -
మృతుని కుటుంబ సభ్యులకు పరామర్శ
కర్లపాలెం: నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. మంగళవారం గుండెపోటుతో మృతి చెందిన నక్కా నాగేశ్వరరావు భౌతికకాయాన్ని బాపట్ల ఏరియా వైద్యశాల నుంచి స్వగ్రామం తరలించేందుకు ఆర్థిక స్థోమత లేక కుటుంబ సభ్యులు బైక్పై తీసుకువెళ్ళిన సంఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. బుధవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగేశ్వరరావు భార్యకు భర్త మరణ ధ్రువీకరణ పత్రం అందజేశారు. వితంతు పింఛను మంజూరు చేయటంతోపాటు నివాస స్థలం, పక్కా గృహం మంజూరు చేయాలని కలెక్టర్ స్థానిక అధికారులను ఆదేశించారు. అనంతరం రెడ్క్రాస్ ప్రతినిధులు పేద కుటుంబాలకు సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పి.గ్లోరియా, జిల్లా ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి అబ్బులు తదితరులు ఉన్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు బాపట్ల: ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన రవాణా చార్జీల మేరకే ఫీజులు వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనివార్య పరిస్థితుల్లో రోగులు మృతి చెందిన సందర్భాల్లో మృతదేహాన్ని గౌరవప్రదంగా తరలించే బాధ్యత సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్లదేనని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా కర్లపాలెంలో బైకుపై మృతదేహం తరలింపు ఘటనపై మంత్రి పార్థసారథి ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్యం అందాలిప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్యం అందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. బాపట్ల పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలను జిల్లా కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. రోగులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. సంతృప్తి స్థాయిలో వైద్యం అందించాలని చెప్పారు. రోగులతో మాట్లాడారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. విజయమ్మ, డీసీహెచ్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ పద్మావతి, సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ తదితరులు ఉన్నారు. -
అక్రమ ఆదాయమే అభివృద్ధా..
చీరాల: వైఎస్సార్ సీపీ హయాంలో పనులు ప్రస్తుతం చేస్తూ వాటినే అభివృద్ధి అంటే ఎవరూ నమ్మరని, రేషన్ బియ్యం, ఇసుక వ్యవహారంలో వచ్చే ఆదాయం ఎటు వెళుతుందో ప్రజలంతా గమనిస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మేరిబాబు మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో తానే ఎంతో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చెప్పడంతో పాటు ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే చీరాల్లో ఓ యువతిపై లైంగిక దాడి చేసి హతమార్చారని చెప్పారు. ఈ ఘటనపై ఇంత వరకు చర్యలు లేవన్నారు. ఇటీవల కాల్మనీ వ్యవహారంలో తల్లి, కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని, చికిత్స పొందుతూ ఇచ్చిన వాగ్మూలంలోని వ్యక్తులపై ఏం చర్యలు తీసుకున్నారన్నారు. గత ఏడాది వాన్పిక్ భూముల్లో అక్రమంగా ఇసుక తరలించడంపై జిల్లా గనులు, భూగర్భశాఖ అధికారి విచారణ చేసి రూ.51 లక్షలు జరిమానా వేసిందన్నారు. రేషన్ బియ్యంలో నెలకు రూ.25 లక్షలు ఎవరికి చేరుతుందో పరిశీలించుకోవాలని కోరారు. చీరాలను మినీ గోవాగా తీర్చిదిద్దుతామని అసెంబ్లీలో చెప్పారన్నారు. అయితే సముద్రతీరంలో రిసార్ట్స్కు వచ్చి చనిపోయినవారు ఎవరూ లేరని, సముద్రంలో ముగిని పర్యాటకులు చనిపోయారన్నారు. అయితే రిసార్ట్స్ యజమానులందరినీ ఐక్యం చేసి పర్యాటకుల భద్రత పేరుతో నిధులు వసూలు చేశారన్నారు. అయితే నిధులు వసూలు చేసిన తర్వాత కూడా ఎంతోమంది సముద్రంలో మునిగి చనిపోయారన్నారు. అలానే కౌన్సిలర్ బత్తుల అనిల్ మాట్లాడుతూ మండలంలోని బుర్లవారిపాలెం, అక్కాయిపాలెం రైతుల సమస్య దృష్ట్యా కరణం బలరామకృష్ణమూర్తి కృషితో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయించామని వివరించారు. ఇప్పటి వరకు రెండో వైస్ చైర్మన్ నోటిఫికేషన్ రాకుండా చేశారన్నారు. చీరాల్లో హ్యాండ్లూమ్ పార్కు స్థల వ్యవహారం గురించి తెలుసుకోవాలని కోరారు. కరణం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వేరే వ్యక్తులు ఆ స్థలాన్ని ఇతర పనులకు వినియోగించాలని చూస్తే కరణం బలరామకృష్ణమూర్తి హైకోర్టు నుంచి స్టే తీసుకువచ్చి ఆ స్థలాన్ని కాపాడారన్నారు. ఆర్వోబీ తీసుకొస్తే.. మున్సిపాలిటీ పరిధిలో రూ.9 కోట్లతో విద్యుత్ స్తంభాలు వేయించామన్నారు. రూ.73 కోట్లతో ఆర్వోబీని తీసుకువస్తే అది గుంటూరుకు తరలిపోయిందని.. ఎమ్మెల్యేనే అసెంబ్లీలో మాట్లాడారని నాయకులు తెలిపారు. వాడరేవులో రూ.400 కోట్లతో గత ప్రభుత్వంలో పోర్టు చేయాలని గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎంతో మాట్లాడి పోర్టు తీసుకువస్తే ప్రస్తుతం అది ఎటుపోయిందో తెలియదన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సమావేశంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ల వాసు, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు చీమకుర్తి బాలకృష్ణ, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు గోసాల అశోక్, రైతు విభాగం కన్వీనర్ కావూరి రమణారెడ్డి, కౌన్సిలర్ గుంటూరు ప్రభాకరరావు, పట్టణ ఉపాధ్యక్షులు జాన్ చిరంజీవి, వేటపాలెం మండల అధ్యక్షుడు సాధు రాఘవ, రమేష్ పాల్గొన్నారు. -
బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అంకమ్మ చౌదరి
బాపట్ల: బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరిని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని బాపట్ల క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సలహాదారులు గంటా అంజిబాబు తెలిపారు. స్థానిక బాపట్ల క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల క్రికెట్ అసోసియేషన్ గత పాలకవర్గ కమిటీ కాలపరిమితి ముగిసినందున నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతన కమిటీలో ప్రెసిడెంట్ ఎర్ర అంకమ్మ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ బీ.జేరామ్ రెడ్డి ,సెక్రటరీ బిల్లా స్టాండ్లీ విమల్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఎలవల నరేష్ ,ట్రెజరర్ అబ్దుల్ కరీం అదేవిధంగా బాపట్ల క్రికెట్ అసోసియేషన్కు గౌరవ అధ్యక్షులుగా బందా బాబు, సీహెచ్ రోశయ్యలను ఎన్నుకున్నారు. వీరితోపాటు సభ్యులుగా పఠాన్ రాజేష్, ఎం. శ్రీనివాసరావు ,కొట్ర వెంకటరావు, కొమరోలు శ్రీనివాసరావుని కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ అంకమ్మ చౌదరి మాట్లాడుతూ బాపట్ల క్రికెట్ అసోసియేషన్ బలోపేతనానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. బాపట్ల జిల్లాలో యువ క్రికెట్ క్రీడాకారుల అభివృద్ధికి కమిటీ సభ్యులందరూ తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. -
ధైర్యంగా ఉండండి.. న్యాయ పోరాటం చేద్దాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం కొత్త నారికేళ్ళపల్లి (కేఎన్ పల్లి) వైఎస్సార్సీపీ స్ధానిక నాయకులు కలిశారు. టీడీపీ మూకలు బరితెగించి అర్ధరాత్రి తమ ఇళ్ళపై దాడి చేశారని, తలుపులు బద్దలు కొట్టి ధ్వంసం చేసి బంగారం, నగదు దోచుకున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.చుండూరు మండలం కొత్తనారికేళ్ళపల్లిలో వైఎస్సార్సీపీ బీసీ నేత, సర్పంచ్ అంగిరేకుల నాగేశ్వరరావు ఇంటిపై టీడీపీకి చెందిన రౌడీషీటర్ బాలకోటిరెడ్డి పచ్చమూకలతో కలిసి దాడిచేశాడని.. వైఎస్ జగన్కు వేమూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు వివరించారు. కేఎన్పల్లిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులను టార్గెట్గా చేసుకుని బాలకోటిరెడ్డి తరుచూ మారణాయుధాలతో మూకుమ్మడి దాడులు చేస్తున్నాడని, గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఉన్నా తమను కాపాడడం లేదంటూ వైఎస్ జగన్ వద్ద కేఎన్ పల్లి వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై బాపట్ల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా తమ కుటుంబాలకు, ప్రాణాలకు రక్షణ కరువైందని, ప్రాణభయంతో కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నామన్న బాధిత కుటుంబాలు. టీడీపీ ప్రభుత్వంపై నమ్మకం లేక, ఆత్మహత్యకు అనుమతివ్వాలని కలెక్టర్ కార్యాలయంలో కోరిన విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి నాయకులు తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీ క్యాడర్ ఎవరూ భయపడొద్దని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చిన వైఎస్ జగన్.. టీడీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొందామని, పార్టీ లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని వెల్లడించారు. వ్యవస్ధలు దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు.వైఎస్ జగన్ను కలిసిన వారిలో గాదె శివరామిరెడ్డి (మాజీ జెడ్పీటీసీ), రఘురామిరెడ్డి (చుండూరు మండల పార్టీ అధ్యక్షుడు), అంగిరేకుల నాగేశ్వరరావు, శివమ్మ, విష్ణు, ఊరుబండి కోటేశ్వరరావు, బాలాజీ నాయక్, స్వప్న, అంగిరేకుల తిరుపతమ్మ, శ్రీను, ఉయ్యూరు రవిశంకర్రెడ్డి, మోహన్రెడ్డి (వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యుడు) ఉన్నారు. -
ప్రభల భక్తికి ప్రతీక
బాపట్లబుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026● పురుషోత్తమపట్నంలో భారీ విద్యుత్ ప్రభల నిర్మాణం ● ఒకే ప్రాంతం నుంచి 11 ప్రభలు ● కోటప్పకొండ తిరునాళ్లకు సిద్ధమవుతున్న పల్నాడు భక్తి శ్రద్ధలతో ప్రభలు కట్టి దక్షిణామూర్తిని దర్శిస్తే పుణ్యం దక్కుతుందని ప్రతీతి. తిరునాళ్లకు ప్రభలను నిర్మించటం మనదైన, అరుదైన సంప్రదాయం. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. భారీ ప్రభలకు కోటప్పకొండ తిరునాళ్ల పెట్టింది పేరు. మహాశివరాత్రికి రూ.లక్షలు వెచ్చించి ప్రభలు కట్టి చేదుకో...కోటయ్యా...మమ్మాదుకో కోటయ్యా అంటూ దైవ నామస్మరణ చేస్తూ కొండకు వెళ్లటం ఆనవాయితీగా వస్తుంది. – చిలకలూరిపేట సాధారణంగా ఒక గ్రామం నుంచి ఒకటి లేదా రెండు ప్రభలు నిర్మించటం పరిపాటి. అయితే చిలకలూరిపేట పట్టణ పరిధిలోని పురుషోత్తమపట్నం ప్రభల నిర్మాణానికి పెట్టింది పేరు. ఈ ఒక్కచోట నుంచే 11 ప్రభలు నిర్మాణం చేసుకుంటూ ఉండటం ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ ఒకదానికి మించి మరో ప్రభను రూ.లక్షలు వెచ్చించి విద్యుత్ దీపాలు అలంకరించి అందంగా తీర్చిదిద్దుతున్నారు. ● మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ ప్రభల నిర్మాణంలో పురుషోత్తమపట్నం వాసులు పూర్తిగా తలమునకలయ్యారు. సుమారు 136 ఏళ్ల కిందట పురుషోత్తమపట్నం నుంచి ఒకే ఒక్క గ్రామ ప్రభను నిర్మించి తిరునాళ్లకు తీసుకువెళ్లేవారని పెద్దలు చెబుతారు. తరువాత కాలంలో క్రమేణ ఇళ్ల పేర్లతో ప్రభలు నిర్మించి తిరునాళ్లకు వెళ్లటం ఆనవాయితీగా మారింది. ● ఇక్కడ గ్రామప్రభతో పాటు విడదల వారి ప్రభ, బైరావారి ప్రభ, తోటపుల్లప్పగారి ప్రభ, చిన్నతోటవారి ప్రభ, యాదవరాజుల ప్రభలు రెండు భారీ విద్యుత్ ప్రభలు. వీటికి తోడు తోట కష్ణమ్మగారి ప్రభ, బ్రహ్మంగారి గుడి వీధి ప్రభ, మండలనేనివారి ప్రభలు రెండుమధ్యస్థమైనవి. ఇందులో ఏడు భారీ విద్యుత్ ప్రభలు ఒక్కొక్కటి రూ. 18 లక్షలు నుంచి రూ.20లక్షలు పైబడి వెచ్చించి తీర్చిదిద్దుతున్నారు. లైటింగ్ ఏర్పాటుకే ఒక్కో ప్రభకు రూ.14 లక్షలు పై బడి ఖర్చు పెడుతున్నట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు. ● తిరునాళ్లకు ముందురోజు ప్రభలను రాతి చక్రాల బండ్లపై క్రేన్ల సహాయంతో యువకులు మోకులు చేతబట్టి భక్తి శ్రద్ధలతో నిలబెట్టే కార్యక్రమం చేపడతారు. ● ప్రభలను నిర్మించటం వాటిని కోటప్పకొండకు తరలించటం ఒక యజ్ఞంలా కొనసాగిస్తారు. ఆర్థిక పరిస్థితులు సహకరించినా, సహకరించకున్నా ప్రతి ఏటా క్రమం తప్పకుండా తమ సంప్రదాయ ప్రభల నిర్మాణానికి ఎలాంటి లోటు తలెత్తకుండా ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతారు. ● తిరునాళ్లకు ముందు రెండు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తిరునాళ్ల నాటికి కొండవద్దకు చేరుకోవటానికి సిద్ధమవుతారు. కోటప్పకొండకు తరలివెళుతున్న పురుషోత్తమపట్నం ప్రభలు (ఫైల్) సిద్ధమవుతున్న విడదల వారి ప్రభ విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 538.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్కి 20,641 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
ఉరి వేసుకొని వివాహిత మృతి
మాదల(ముప్పాళ్ళ): కుటుంబ కలహాల నేపధ్యంలో వ్యక్తి ఇంట్లోని దర్వాజాకు ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని మాదల గ్రామంలోని బీసీ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. సంఘటనకు సంబందించి పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన వల్లెపు దుర్గారావు(42) ఆరు నెలల క్రితం భార్యతో కలిసి విజయవాడ పనులకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. భార్యకు ఆమె అక్క భర్తతో వివాహేతర సంబంధం ఉందనే విషయంలో తరచూ గొడవలు పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో పదిరోజుల క్రితం మాదల వచ్చి ఉంటున్నాడు. సోమవారం విజయవాడ నుంచి భార్యను పిలిపించి పెద్దల సమక్షంలో మాట్లాడగా అక్కడ కూడా గొడవ పడి వెళ్లిపోయాడు. దీంతో భార్య తిరిగి విజయవాడ వెళ్లగా దుర్గారావు మాదలలోనే తన తల్లి వద్దే ఉంటున్నాడు. తల్లి తెల్లవారుజామున లేచిచూడగా దుర్గారావు జాడ కనిపించక పోవటంతో వెతుకులాట చేయగా దుర్గారావు కొత్తగా నిర్మించుకుంటున్న ఇంట్లోనే దర్వాజాకు ఉరిపోసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే దుర్గారావును చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. జరిగిన సంఘటనపై దుర్గారావు సోదరుడు చెన్నకేశవరావు ఇచ్చిన ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.అనిల్కుమార్ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. -
బాపట్లలో టీడీపీ విగ్రహాల రాజకీయం
● రాజన్న స్మృతి వనం ప్రతిపాదన స్థలంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు ● కౌన్సిల్ తీర్మానాలు ఉన్నా కేపీఆర్ సర్కిల్కు అభ్యంతరాలు ● బాపట్లలో తీవ్ర చర్చనీయాంశంబాపట్ల: జిల్లాలో టీడీపీ రోజుకో కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చి వివాదాలను రెచ్చగొడుతోంది. కొద్ది రోజుల కిందట చీరాలలోని వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కిల్లో ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని నిబంధన ఉన్నా టీడీపీ నాయకులు తిరుమల లడ్డూ విషయమై ఫ్లెక్సీ ఏర్పాటుచేసి కవ్వింపునకు పాల్పడ్డారు. తాజాగా బాపట్లలో విగ్రహాల ఏర్పాటు పేరుతో వివాదానికి శ్రీకారం చుట్టారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్మృతి వనం, చీలు రోడ్డులోని కోన ప్రభాకరరావు సర్కిల్కు కౌన్సిల్ తీర్మానం ఉన్నప్పటికీ వాటిని పెడచెవినపెట్టారు. మహానేత స్మృతి వనానికి కేటాయించిన స్థలంలో ఏకంగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు టీడీపీ నాయకులు నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం హడావిడిగా స్థల పరిశీలన చేశారు. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్మృతివనం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న మహానేత డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని రోడ్డు విస్తరణలో తొలగించారు. ఈ మేరకు బాపట్లలోని మార్కెట్ యార్డు వద్ద జాతీయ రహదారి పక్కన 1.5 ఎకరాలలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్మృతివనం నిర్మాణం చేపట్టేందుకు అప్పటి డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ముందుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా 2023 సంవత్సరంలో పనులకు శంకుస్థాపన చేశారు. పోలవరం నిర్మాణదాతగా ఉన్న మహానేత గుర్తుగా అదే నమూనాతో అక్కడ స్మృతివనం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు కౌన్సిల్ తీర్మానం కూడా చేపట్టారు. కొద్దిపాటి ఆలస్యం, కొంతమంది కల్పించిన కోర్టు అడ్డంకులతో ఆ పనులు నిలిచిపోయాయి. తాజాగా అదే ప్రదేశంలో ఎన్టీఆర్ విగ్రహానికి కూటమి ప్రభుత్వం ముందుకువచ్చింది. అక్కడే వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ పంతానికి పోయి స్మృతివనం కేటాయింపు స్థలం జోలికే వస్తున్నారు. కేపీఆర్ సర్కిల్ విషయంలోనూ... పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద ఉన్న మాజీ గవర్నర్ కోన ప్రభాకరరావు విగ్రహాన్ని రోడ్డు విస్తరణలో తొలగించారు. బాపట్ల అభివృద్ధి ప్రదాత కోన ప్రభాకరరావు జ్ఞాపకార్థం చీలు రోడ్డు సెంటర్లో కోన ప్రభాకరరావు సర్కిల్ ఏర్పాటు చేయాలని కౌన్సిల్ తీర్మానం చేసింది. కోన ప్రభాకరరావు తనయుడు రఘుపతి ఈమేరకు ఆ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. అక్కడ రోడ్డు విస్తరణ పనులు కూడా చేపట్టారు. తాజాగా ఈ ప్రాంతాన్ని కేపీఆర్ సర్కిల్ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పలు సాకులు చెబుతూ కాలం గడుపుతోంది. -
విద్యుత్ అదాలత్లతో సమస్యల పరిష్కారం
సీజీఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానుయేల్ కొరిటెపాడు(గుంటూరు): ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో ఉన్న ఏడు సర్కిల్స్లో అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కన్జూమర్ గ్రీవెన్సె రెడ్రస్సెల్ ఫోరం(సీజీఆర్ఎఫ్) పనిచేస్తోందని సీజీఆర్ఎఫ్ చైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి ఎన్.విక్టర్ ఇమ్మానుయేల్ తెలిపారు. గుంటూరు–పొన్నూరు రోడ్లోని విద్యుత్ శాఖ సమావేశ మందిరంలో మంగళవారం విద్యుత్ అదాలత్ జరిగింది. అదాలత్లో 20 మంది విద్యుత్ వినియోగదారులు వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. వాటిలో 19 మంది సమస్యలను తక్షణమే పరిష్కరించారు. ఈ సందర్భంగా విక్టర్ ఇమ్మానుయేల్ మాట్లాడుతూ ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ఒంగోలు, పల్నాడుతో పాటు సీఆర్డీఏ సర్కిళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సర్కిళ్ల పరిధిలో ఉన్న వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సీజీఆర్ఎఫ్ పని చేస్తోందన్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేందుకు విద్యుత్ వినియోగదారుల అదాలత్లు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు సుమారు వెయ్యికి పైగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఫిర్యాదులు అందాయన్నారు. ఐదు సమస్యలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, మిగిలిన వాటిని పరిష్కరించామని వెల్లడించారు. కార్యక్రమంలో సాంకేతిక సభ్యులు డి.కృష్ణనాయక్, ఆర్థిక సభ్యులు కె.కృష్ణ, స్వతంత్ర సభ్యులు ఏ.సునీత, గుంటూరు పర్యవేక్షక ఇంజనీర్ సీహెచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొరిటెపాడు(గుంటూరు): ఈ నెల 12వ తేదీన జాతీయ సమ్మెలో భాగంగా మిర్చి యార్డులోని అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నట్లు నాయకులు తెలిపారు. దీనిలో భాగంగానే మిర్చి యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి చంద్రికకు మంగళవారం అన్ని సంఘాలు కలిపి సమ్మె నోటీస్ అందజేశాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ ‘కార్మిక కోడ్‘ల పేరుతో ఇప్పటివరకు ఉన్న చట్టాలను నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం కోసం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నియంత్రణలో ఉండే వ్యవసాయం, మార్కెటింగ్ వ్యవస్థ స్థానంలో ప్రైవేట్ మార్కెటింగ్కు అవకాశం కల్పిస్తూ చట్టాలు మారుస్తున్నారని, దీంతో ప్రస్తుత మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్న రైతులు, కార్మికులు, ఉద్యోగులకు చివరకు చిన్న వ్యాపారస్తులకు కూడా నష్టమేనని తెలిపారు. పై సమస్యల పరిష్కారానికై గురువారం మిర్చి యార్డులో పనిచేసే అన్ని రకాల ముఠా కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో భాగస్వాములు అవుతున్నట్లు తెలిపారు. 12వ తేదీన సమ్మె కారణంగా ఎలాంటి లావాదేవీలు జరగవు కాబట్టి రైతులు ఎవరూ మిర్చి బస్తాలు తీసుకురావద్దని తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చిన వారిలో మిర్చి యార్డు ఎగుమతి, దిగుమతి, కాపలా ముఠా కార్మిక సంఘాల నాయకులు మర్రి శ్రీనివాస్, నాగ గౌడ్, వేమెన్స్ అసోసియేషన్ నాయకులు బాబు, కృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా కోల్డ్ స్టోరేజ్ వర్కర్స్ యూనియన్ నాయకులు గోవిందరావు తదితరులున్నారు. చిలకలూరిపేట/యడ్లపాడు: సొంత పార్టీ వర్గీయులే తమకు అన్యాయం చేస్తున్నారంటూ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నివాసం వద్ద మంగళవారం రాత్రి టీడీపీ నేతలు ఆందోళనకు దిగిన సంఘటన సంచలనంగా మారింది. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో అధికార పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. గ్రామ మాజీ సర్పంచ్ వర్గీయులైన రేషన్ డీలర్లను తొలగించి కొత్తవారికి కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ టీడీపీ గ్రామ మాజీ అధ్యక్షుడు పావులూరి పిచ్చయ్య ఆధ్వర్యంలో యడ్లపాడు తహసీల్దార్ కార్యాలయం ముందు టీడీపీ వర్గీయులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న రేషన్ డీలర్లను ఈ నెల డీడీలు కట్టవద్దని ఎందుకు ఆదేశించారు... ఉన్న వాళ్లను తొలగించేందుకే కదా అంటూ ఆందోళన నిర్వహించారు. దీనికి అధికారుల నుంచి సరైన సమాధానం లభించలేదు. దీంతో ఆగ్రహించిన తిమ్మాపురం గ్రామస్తులు చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురంలో ఉన్న ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు -
నకిలీ లాకెట్తో టోకరా
చీరాల: మహిళలు, వృద్ధులే టార్గెట్గా చేసుకొని వారికి మాయమాటలు చెప్పి అందినకాడికి డబ్బులు తీసుకెళ్లాడో ఘనుడు. కేంద్ర ప్రభుత్వం రజక మహిళలకు, వృద్ధులకు పింఛన్ అందిస్తున్నారని, త్వరలోనే పింఛన్లు వస్తాయని నమ్మబలికి మోసం చేశాడు. ఈ సంఘటన పేరాలలో మంగళవారం వెలుగు చూసింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు... పేరాలకు చెందిన శివమ్మ అనే వృద్ధురాలు ఇళ్ళలో పనులు చేసుకుంటూ జీవిస్తుంది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి టక్ చేసుకొని టోపి పెట్టుకొని బైక్పై ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. ఆమె ఇంటి పేరుతో సహా చెప్పి మీకు పింఛన్ రావడం లేదు కదా.. త్వరలోనే మీకు పింఛన్ వస్తోందని నమ్మబలికాడు. అలానే కేంద్ర ప్రభుత్వం రజకుల్లో పెద్ద ముత్తైదువులకు విజయవాడలో పూజ చేయించిన బంగారు లాకెట్ అందిస్తున్నారని, రూ.2600లు ఇస్తే అవి మీకు పంపిస్తామని చెప్పాడు. అంత డబ్బు తమ దగ్గర లేదని చెప్పడంతో ఉన్నంత వరకు ఇవ్వమని చెప్పడంతో ఆమె వద్ద ఉన్న రూ.1500 ఇచ్చింది. ఆమెకు లక్ష్మీ దేవిబొమ్మతో ఉన్న లాకెట్ ఇచ్చి వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన ఆమె పరిశీలించగా అది నకిలీ అని తేలడంతో నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత పరిసర ప్రాంతాల్లో వాకబు చేయగా మరికొందరికి ఇదే తరహాలో ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి నగదు తీసుకెళ్లాడని తెలిసింది. -
పెదకాకాని శివాలయం పాలకమండలి నియామకం
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, వేదిక (తెలుగు నాటక పరిషత్ సంఘం) సంయుక్తంగా మార్కెట్ కూడలిలోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న భారత రంగ్ మహోత్సవ్ ● అంతర్జాతీయ నాటకోత్సవం మంగళవారంతో ముగిశాయి. ఈసందర్భంగా జరిగిన సభకు వేదిక అధ్యక్షుడు డాక్టర్ ఎం.సురేష్బాబు అధ్యక్షత వహించారు. అనంతరం గుంటూరు నగర వీధుల్లో భారీగా కళాకారుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, కళాకారులు హాజరయ్యారు. గుంటూరు వెస్ట్ ( క్రీడలు) : హాకీ ఆంధ్రప్రదేశ్ గౌరవ జనరల్ సెక్రటరీగా ఉన్న గంధం హర్షవర్ధన్ను ఎఫ్ఐహెచ్–ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ సెంట్రల్ ప్యానెల్ సభ్యునిగా నియమించారని సీనియర్ హాకీ క్రీడాకారుడు కె.క్రాంతి కుమార్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ను స్థానిక తమ కార్యాలయంలో ఘనంగా సత్కరించామన్నారు. జిల్లాలో తమతోపాటు హాకీని ప్రారంభించిన ఆయన జాతీయ జట్టుతోపాటు పలు టోర్నమెంట్లలో భారత్కు ప్రాతినిధ్యం వహించారన్నారు. దీంతోపాటు అంతర్జాతీయ హాకీ రిఫరీగానూ కొనసాగుతున్నారన్నారు. జాతీయ క్రీడైన హాకీకి పట్టణంలో ఇప్పటి వరకు మైదానం లేకపోవడంతో హర్షవర్ధన్ దీనిని ఏర్పాటు చేయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు నివ్వడం సంతోషకరమన్నారు. ఈ నియామకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. హర్షవర్ధన్ సతీమణి సత్తె గీత కూడా డబుల్ ఒలింపియన్ అని పేర్కొన్నారు. సీనియర్ హాకీ క్రీడాకారులు ఇఏ. రాజ శేఖర్, జి. మాణిక్యాలరావు, సుభాని, జి.ప్రసన్న కుమార్లు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారన్నారు. నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజన, వసతి సౌకర్యాలు కల్పించేలా సంక్షేమ శాఖ అధికారులు నిబద్ధతతో బాధ్యతగా విధులు నిర్వహించాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆదేశించారు. మంగళవారం గుంటూరు వైద్య కళాశాల ఎదుట ఉన్న ఏపీఎన్జీవో కల్యాణ మండపంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ డైరెక్టర్ మల్లికార్జున, ఎక్స్ అఫీషియల్ సెక్రటరీ సత్యన్నారాయణ, ప్రాంతీయ జిల్లాల బీసీ సంక్షేమ అధికారులు, సహాయ బీసీ సంక్షేమ అధికారులు, వసతి గృహా సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వనతి గృహాల నిర్వహణ, రాబోయే టెన్న్త్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాల సాధనపై గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ప్రకాశం, మార్కాపురం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల వసతి గృహా సంక్షేమ అధికారులతో జిల్లాల వారీగా, వసతి గృహాల వారీగా మంత్రి సమీక్ష నిర్వహించారు. పదవ తరగతి పరీక్షల్లో సీ గ్రేడ్ లో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారు ఉత్తమమైన మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళగిరి టౌన్ : ఓ వివాహిత ఇద్దరు బిడ్డలతో అదృశ్యమైన ఘటన మంగళగిరి మండలం యర్రబాలెంలో మంగళవారం చోటు చేసుకుంది.తిరుపతికి చెందిన బోయ నానికి లక్ష్మి అనే మహిళతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా యర్రబాలెంలో నివాసముంటున్నారు. భర్త నాని డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. భార్య లక్ష్మి గత కొన్ని సంవత్సరాలుగా మతిస్థిమితం లేక బాధపడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తన ఇద్దరు బిడ్డలతో అదృశ్యమైంది. -
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల:గుంటూరుకు చెందిన ఎన్.సుధా రాణి టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. విజయపురిసౌత్: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల/ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, జూనియర్ ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వాణి రాణి మంగళవారం తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులు http://apgpcet.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 19వ తేదీలోపు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7569333798 ఫోన్ నంబర్ను సంప్రదించాలని ఆమె కోరారు. రేపల్లె: పట్టణంలో ని శాఖా గ్రంథాలయాన్ని ఏపీ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సభ్యురాలు మగతాల పద్మజ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. పత్రికా విభాగం, పుస్తక విభాగం, రిజిస్టర్లు, రికార్డులు, శిక్షణ ఫౌండేషన్ కంప్యూటర్ రిజిస్టర్లను పరిశీలించారు. పట్టణంలోని చంద్రమౌళి పార్కులో గ్రంథాలయానికి సంబంధించిన 15 సెంట్ల భూమిలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేట:జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించిన మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ విద్యార్థి షేక్ జమీర్బాషాను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అభినందించారు. మంగళవారం కలెక్టరేట్కు పిలిపించి అభినందనలు తెలియచేశారు. విద్యార్థి తల్లితండ్రులు, డీఈవో రామారావు, ప్రధానోపాధ్యాయులు టి.రవికాంత్ను సైతం అభినందించారు. జమీర్బాషా జిల్లాకే కాకుండా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ‘పరీక్షలపై చర్చ’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కో విద్యార్థిని మాత్రమే ఎంపిక చేయగా, ఏపీ నుంచి నరసరావుపేట మున్సిపల్ బాయ్స్ హైస్కూల్కు చెందిన జమీర్బాషా ఎంపికయ్యారు. ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడి తన ప్రతిభను చాటుకున్నారు. జమీర్బాషాకు ఎడ్యుకేషన్ కమిషనర్ విజయరామరాజు శుభాకాంక్షలు తెలియచేశారు. తెనాలి:పట్టణానికి చెందిన సంగీత సంస్థ శ్రీ సీతారామ గానసభ శాసీ్త్రయ సంగీత ఉత్సవా లు మంగళవారం సాయంత్రం స్థానిక శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఆరంభించారు. తొలుత త్యాగరాజస్వామి, గానసభ వ్యవస్థాపకులు నారుమంచి సుబ్బారావు, మాజీ అధ్యక్షుడు పిరాట్ల నారాయణమూర్తి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంగీత ఉత్సవాన్ని ప్రారంభించారు. మొదట రోజు విజయవాడకు చెందిన కుమారి మల్లాది సింధు రాజేశ్వరి సంగీత కచేరి హృద్యంగా సాగింది. వాగ్దేవి కీర్తనలను ఆలపించారు. వయొలిన్పై మీద విజయవాడకు చెందిన అంబటిపూడి కామాక్షి, మృదంగంపై విజయవాడకు చెందిన మాస్టర్ మల్లాది శివానంద ఎస్.ఎస్.వి వాయి ద్య సహకారం అందించారు. గానసభ అధ్యక్షులు పిరాట్ల రమణి పర్యవేక్షించారు. -
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యునిగా డాక్టర్ జి. నందకిషోర్
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పాలకవర్గం సభ్యులకు సోమవారం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఎన్నికలలో గుంటూరు ఐఎంఏ శాఖకు చెందిన డాక్టర్ జి.నందకిషోర్ సభ్యునిగా ఎన్నికయ్యారు. 13 మంది సభ్యుల ఎంపికకు మొత్తం 84 మంది వైద్యులు పోటీపడ్డారు. ఆన్లైన్లో ఎన్నికలు జరగగా అత్యధిక ఓట్లు సాధించి ఎన్నికై న 13 మందిలో డాక్టర్ నందకిషోర్ ఒకరు. 30 వేల మందికి పైగా వైద్యులు ఈ ఎన్నికలలో పాల్గొన్నారు. గతంలో డాక్టర్ నందకిషోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ కార్యదర్శిగా, అధ్యక్షునిగా పనిచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ సభ్యునిగా వైద్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఎన్నిక పట్ల ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షుడు డాక్టర్ టి.సేవ కుమార్, కార్యదర్శి డాక్టర్ బి.సాయికృష్ణ, స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ డి.అమర్, పలువురు సీనియర్ వైద్యులు అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల కు రాష్ట్ర సెకండరీ హెల్త్ డైరెక్టర్ కె.వి.ఎన్. చక్రధర బాబు రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరించారు. -
పులి వాహనంపై మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం స్వామి వారు వ్యాఘ్ర వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. వేదపండితులు భక్తులకు ఉత్సవ విశిష్టతను వివరించారు. ఉత్సవ కై ంకర్య పరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన శిందె నారాయణ వ్యవహరించారు. దేవస్థాన ఈ.వో. గోపి ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు. -
చివరి మజిలీ.. కన్నీళ్లు మిగిల్చె..
కర్లపాలెం: ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి శవాలను తీసుకెళ్లడానికి పేదలు పడే బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. మంగళవారం బాపట్ల జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో అమాననీయ ఘటన చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా చింతాయపాలెం గ్రామానికి చెందిన నక్కా నాగేశ్(55) అలియాస్ నాగేశ్వరరావు మంగళవారం ఉదయం భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు బైక్పై బాపట్ల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నాగేశ్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని చింతాయపాలెం తరలించేందుకు బాపట్ల ఏరియా ఆస్పత్రిలో మహాప్రస్థానం వాహనం కావాలని అడిగారు.వాహనం లేకపోవడంతో ఓ ఆటోవాలాను సంప్రదించగా రూ.3 వేలు కిరాయి అడగడంతో.. అంత డబ్బు వారి వద్ద లేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. విధి లేని పరిస్థితుల్లో మృతదేహాన్ని మోటారు బైక్పైనే కూర్చోబెట్టుకుని 13 కిలోమీటర్ల మేర ప్రయాణించి గ్రామానికి తీసుకెళ్లారు. మృతిచెందిన నాగేశ్కు భార్యతో పాటు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. మహాప్రస్థానం కోసం ప్రతిపాదనలు పంపాం: జిల్లా కలెక్టర్ మృతదేహాన్ని మోటారు బైక్పై తీసుకెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
‘సీఐఎస్ఎఫ్’ సైకిల్ యాత్ర అభినందనీయం
చెరుకుపల్లి: దేశంలోని తీరప్రాంతం రక్షణలో గానీ, ప్రగతిలో గానీ సీఐఎస్ఎఫ్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని అస్సాం సీఐఎస్ఎఫ్ కమాండెంట్ రోషన్ రాజా పేర్కొన్నారు. సీఐఎస్ఎఫ్ యూనిట్ హెచ్పీసీఎల్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో గత 13 రోజుల క్రితం ప్రారంభమైన సైకిల్ ర్యాలీ సోమవారం చెరుకుపల్లి చేరుకుంది. సందర్భంగా స్థానిక తహసీల్దార్ సీహెచ్ పద్మావతి మండలంలోని అధికారులు, విద్యార్థులు, నాయకులతో కలసి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ కమాండెంట్ రోషన్ రాజా మాట్లాడుతూ సీఐఎస్ఎఫ్ 57వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు తీర ప్రాంతంలో ఈ సైకిల్ ర్యాలీని 75మందితో పశ్చిమ తీరం గుజరాత్ నుంచి ఒక టీము, మరో 50మందితో తూర్పు తీరం పశ్చిమ బెంగాల్ నుంచి మరో టీం ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ రెండు టీములు ఈ నెల 28వ తేదీ నాటికి 1500 కిలో మీటర్లు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ గుజరాత్ నుంచి కేరళలోని కొచ్చిన్ బీచ్ కు చేరుకుంటాయని ఆయన తెలిపారు. ఈ సైకిల్ ర్యాలీలో మహిళలు కూడా ఉన్నారని వారు కూడా పురుషులతో సమానంగా రోజుకు 100 కి.మీ వరకు ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఈ సైకిల్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం తీర ప్రాంత ప్రజలతో మమేకమవుతూ వారికి తీర ప్రాంతంలో జాతీయ భద్రత గురించి అవగాహన కల్పించటం, ఎక్కువగా తీరప్రాంతం నుంచే డ్రగ్స్ ఎగుమతులు జరుగుతుంటాయి కాబట్టి డ్రగ్స్ నియంత్రణ పై అవగాహన తో పాటు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన జాతీయ గీతమైన వందేమాతరం పాట యొక్క విశిష్టతను, జాతీయ సేవ భావనను ప్రోత్సహించటమేనన్నారు. కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ డిపూటీ కమాండెంట్ రిషబ్ దేవగన్, అసిస్టెంట్ కమాండెంట్ అరవింద్ కుమార్ శర్మ, మండల నాయకులు ఎంఆర్కే మూర్తి, దివి రాంబాబు, కొనకాల రవికిరణ్, మల్లాది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చెరుకుపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మధ్యాహ్న భోజనం విరామం అనంతరం సైకిల్ ర్యాలీ కొనసాగింది. తహసీల్దార్ సీహెచ్ పద్మావతి చెరుకుపల్లి చేరుకున్న సైకిల్ యాత్ర -
మూట్ కోర్టు పోటీల్లో విజేతగా ‘సత్యభామ’
గుంటూరు ఎడ్యుకేషన్: రెండు రోజులపాటు జేకేసీ కళాశాల రోడ్డులోని జేసీ లా కళాశాలలో నిర్వహించిన 5వ జాతీయస్థాయి మూట్ కోర్టు పోటీల్లో తమిళనాడుకు చెందిన సత్యభామ స్కూల్ ఆఫ్ లా, ఈరోడ్ న్యాయ కళాశాల విద్యార్థి బృందాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో విజేతలుగా నిలిచాయి. ఆదివారం రాత్రి వరకు జరిగిన పోటీల్లో విజేతలకు వరుసగా రూ.37,500, రూ.30 వేలు చొప్పున నగదు బహుమతులను అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ సుధాకర్బాబు సోమవారం తెలిపారు. ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కళాశాల కరస్పాండెంట్ వేమన కుప్పుస్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయస్థాయికి తెలుగు నాటకం
నగరంపాలెం: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా/ వేదిక (తెలుగు నాటక పరిషత్ల సంఘం) సంయుక్తంగా మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్ – అంతర్జాతీయ నాటక ఉత్సవం నాలుగో రోజుకి చేరింది. సోమవారం జరిగిన సభకు వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు అధ్యక్షత వహించగా, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, వైద్యురాలు ముత్తవరపు భార్గవిచౌదరి జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం జరిగిన సభలో తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు నాటకం అంతర్జాతీయ స్థాయికి సాటి అని నిరూపించేలా భారత్ రంగ్ మహోత్సవ్ కొనసాగుతుందని అన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రభావంతో నాటక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో అంతర్జాతీయ నాటకోత్సవాలను ఏపీకి తేవడం అభినందనీయమన్నారు. సీనియర్ కళాకారులు సుబ్బరాయశర్మ, బుద్దాల వెంకట్రావు, వి.పురుషోత్తమం, దేవేంద్రలను సత్కరించారు. అనంతరం ‘ఏ వెరీ సింపుల్ స్టోరీ’ అనే రష్యన్ నాటకం ప్రదర్శించారు. రష్యన్ దర్శకుడు అలెక్సి బ్లాకి అద్భుత సృజన దృశ్యరూపంగా మలిచారు. మనుషుల స్వార్థానికి, జంతువుల నిస్వార్థ ప్రేమకు మధ్య ఉన్న సన్నని గీతను నాటకం ఆవిష్కరించింది. కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా భాషా సరిహద్దులను చెరిపేస్తూ అద్భుత అభినయంతో కరుణ, స్నేహం, పరస్పర అవగాహనే జీవిత పరమార్థమని ఈ నాటకం చాటిచెప్పింది. మానవీయ విలువలు చాటిన రష్యన్ నాటకం ‘ఎ వెరీ సింపుల్ స్టోరీ’ -
అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటిన సిబ్బందికి అభినందనలు
నగరంపాలెం: గతనెల 30 నుంచి ఈనెల రెండు వరకు రాజస్థాన్ అజ్మీర్లోని పటేల్ సింథటిక్ స్టేడియంలో ఆల్ ఇండియా పోలీస్ అథ్లెటిక్స్ పోటీలు జరగ్గా, గుంటూరు జిల్లా పోలీసులు ప్రతిభ చాటారు. పలు పోటీల్లో పతకాలు సాధించిన ఏఆర్ హెచ్సీ ఎండీ షాహిదుల్లా (బంగారు పతకం), కానిస్టేబుల్ ఎం.లక్ష్మయ్య (వెండి పతకం), విశేష ప్రతిభ చాటిన ఏఎస్ఐ ఎం.సాంబశివరావును సోమ వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి పాల్గొన్నారు. -
మాల్కీలాద్రి..!
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ బియ్యం నల్లబజారుకు తరలించే మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. అయినా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. ఈ అక్రమ రవాణాను చంద్రబాబు ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్లబజారుకు తరలించే రేషన్ బియ్యంలో పట్టుబడేది ఐదు శాతం కూడా ఉండదని, 95 శాతంపైగా మిల్లులు, పోర్టులకు తరలుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విజి‘లెన్స్’శాఖ పనితీరుపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. – చీరాల అర్బన్ చీరాల నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలుతున్నాయని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మాల్యాద్రి అనే వ్యక్తి ప్రధాన పాత్రధారని, అతనికి పచ్చ నేత అండ సంపూర్ణంగా ఉందని, అందుకు ప్రతిగా పచ్చనేతకు ప్రస్తుతం నెలకు రూ.20 లక్షలు అందుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కేసులు నమోదులోనూ మాల్యాద్రి మార్క్ మంత్రాంగం రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందనేది బహిరంగ రహస్యం. అయితే కార్డుదారుల నుంచి డీలర్లు కొంటున్నారు. డీలర్లు నుంచి మేం కొంటున్నాం. మిల్లర్లుకు, లేదా విదేశాలకు తరలించేందుకు పోర్టులకు తరలిస్తుంటాం. ఇందులో తప్పేంటని మాల్యాద్రి అండ్ కో అంటుంటారనే ప్రచారం ఉంది. ఇక సంబంధిత అధికారులకు, అక్రమార్కులకు మధ్య ఎన్ఫోర్స్మెంట్లో దీర్ఘకాలంగా పనిచేస్తూ, చీరాలతో అవినాభావ సంబంధం ఉన్న ఓ అధికారి చక్రం తిప్పుతున్నారని సమాచారం. ఆ క్రమంలో అప్పుడప్పుడు కేసులు నమోదుకు సంబంధించి సదరు అక్రమార్కులే ఏ డీలర్లు మీద 6ఏ కేసులు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలనేది చెబుతుంటారని వినికిడి. అధికారులు తమ బాధ్యతను నిర్వహిస్తున్నారని చెప్పుకోవటానికి, ఏఏ డీలర్లు అయితే తమకు సరుకు ఇవ్వరో వారిని భయపెట్టేందుకు అక్రమార్కులకు ఉభయతారకంగా ఆ పని చేస్తుంటాయని విషయం తెలిసిన వారు అంటున్నారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం గతంలో రేషన్ బియ్యం నల్లబాజరుకు తరలించే క్రమంలో పలుమార్లు పట్టుబడ్డ వారికి సంబంధించి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసేందుకు సంబంధిత అధికారులు ఫైల్ సిద్ధం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రేషన్ బియ్యం నల్లబజారుకు తరలకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టాలంటే జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. దాడులు చేస్తున్నాం ... కేసులు కడుతున్నాం రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి డీఎస్ఓ జమీర్ బాషాను ఫోన్లో వివరణ కోరగా, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి దాడులు చేస్తున్నాం. కేసులు కడుతున్నామని చెప్పారు. అయితే ఇప్పటికి మీరు ఎన్ని దాడులు నిర్వహించారు, ఎన్ని కేసులు కట్టారనే ప్రశ్నకు జవాబు దాట వేస్తూ, ఆ విషయాలు మీరు స్థానిక తహసీల్దార్, అక్కడి అధికారులను అడగాలని చెప్పారు. అందరికి సమాధానం చెప్పలేక పోతున్నామన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఫీల్డ్లో కేసులు నమోదు చేసేందుకు ప్రత్యేక పంథాతో మాల్యాద్రి మార్క్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఓ పాత ఆటోలో 30 లేదా 40 బస్తాలు రేషన్ బియ్యం ఉంచి నల్లబజారుకు తరలించే క్రమంలో పట్టుకున్నట్లు, సంబంధికులపై 6ఏ, క్రిమినల్ కేసులు నమోదు చేసేటట్లు చేయటం ప్రత్యేకతని ప్రచారం జరుగుతోంది. చీరాల నుంచి గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లకు, కొత్తపట్నం మిల్లులకు అక్రమంగా తరలిస్తున్నారని చెప్పుకుంటున్నారు. గతంలో డీఎస్ఓ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు, గస్తీ ముమ్మరంగా ఉండేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నల్లబజారుకు తరలుతున్న రేషన్ బియ్యంపై చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతానికి ఇప్పటికి నమోదవుతున్న కేసులు అందుకు నిదర్శనమంటున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి మా విధులు మేం నిర్వహిస్తున్నాం. మా పరిధిలో 20 నియోజకవర్గాలు ఉంటాయి. ప్రత్యేకంగా చీరాల అని చెప్పలేం కానీ మేం దాడులు నిర్వహిస్తున్నాం. పలు చోట్ల పెద్ద మొత్తాల్లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాలు పట్టుకుని సీజ్ చేశాం. కేసులు నమోదు చేశాం. అలానే ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వయిరీలకు సంబంధించి అన్ని నివేదికలు సమర్పించాం. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేవారు ఎవరైనా ఉపేక్షించం. – చంద్రశేఖర్, సీఐ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, గుంటూరు. -
భూ వివాదాలపై అధిక ఫిర్యాదులు
నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు భూ వివాదాలపై అధిక ఫిర్యాదులు అందాయి. నరసరావుపేట మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటరమణ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక సమస్యలతో పాటు పలు మోసాలకు సంబంధించిన 99 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అధికంగా భూ వివాదలపై 27, ఆర్థిక సమస్యలపై 24, భార్యభర్తల వివాదాలు 14, ఆస్తి వివాదాలు 11, ఉద్యోగాల పేరుతో మోసాలపై నాలుగు ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను డీఎస్పీ ఆదేశించారు. లండన్లో ఉద్యోగం అంటూ మోసం హోటల్ మేనేజ్మెంట్ రంగంలో లండన్లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.4లక్షలు తీసుకుని మోసం చేసినట్టు సత్తెనపల్లి మండలం దీపాల దిన్నెపాలెంకు చెందిన యువకుడు ఫిర్యాదు చేశాడు. 2024 డిసెంబర్లో నగదు తీసుకుని ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. మోసానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తప్పుడు లెక్కలతో ‘ఫైనాన్స్’ వేధింపులు.. కారంపూడి మండలం కాకానివారిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి 2023లో పాతఆటోను ఫైనాన్స్లో రూ.2.20లక్షలకు తీసుకున్నాడు. ఇందుకు గాను రూ.25వేలు డౌన్ పేమెంట్ కట్టి ప్రతి నెల రూ.9వేలు చెల్లించేవిధంగా ఒప్పందం చేసుకున్నాడు. 24 నెలల పాటు డబ్బులు చెల్లించినా బండి క్లియరెన్స్ ఇవ్వకుండా ఆటో ఫైనాన్స్ వారు వేధిస్తున్నారని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాడు. రైల్వే ఉద్యోగం పేరిట టోకరా.. పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన యువకుడు కేతనకొండ ఆర్కే కాలేజీలో పాలిటెక్నిక్ రెండవ సంవత్సరం చదువుతూ మానేశాడు. ఆ సమయంలో కడపకు చెందిన వ్యక్తి పరిచయమై రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.35.18లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడని తెలిపాడు. పలు మార్లు ఫోన్లో సంప్రదించగా రూ.3లక్షలు తిరిగి ఇచ్చాడని, ఇప్పుడు ఫోన్లో కూడా స్పందించడం లేదని న్యాయం చేయాలని వేడుకున్నాడు. పీజీఆర్ఎస్కు 99 అర్జీలు ిస్వీకరించిన మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ -
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్
వెట్టి చాకిరీ రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దుదాం బాపట్ల: వెట్టి చాకిరి రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. వెట్టి చాకిరి నిర్మూలన చట్టం అమల్లోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా బాండెడ్ లేబర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ, కార్మిక శాఖ షాడోస్ డీబీఆర్సీ, ఎస్ఎఫ్ఐ, ఆర్డీ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో పోస్టర్లను జిల్లా కలెక్టర్ వి వినోద్కుమార్ సోమవారం ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెట్టి చాకిరి ఒక అమానుష సామాజిక దురాచారమని, దీనిని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం 1976లో వెట్టి చాకిరి నిర్మూలన చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు. చట్టం అమలులోకి వచ్చి ఐదు దశాబ్దాలు గడిచాయని, బాపట్ల జిల్లాను వెట్టిచాకిరి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలనీ పిలుపునిచ్చారు. జిల్లా కార్మిక శాఖ ఏసీఎల్ శివప్రసాద్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు గౌరవంగా, స్వేచ్ఛతో జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని, వెట్టి చాకిరి చట్టవిరుద్ధమే కాకుండా మానవ హక్కుల ఉల్లంఘన అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, షాడోస్ ప్రతినిధులు రాజాసల్మాన్, భాగ్యలక్ష్మి, అలేఖ్య, డీబీఆర్సీ ప్రతినిధులు శ్రీలత, భగవాన్దాస్, ఎస్ఎఫ్ఐ ఆర్డీ ప్రతినిధులు కిశోర్, తిరుపతిరావు, సుజని తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెప్పుడు స్వామీ..!
మహాశివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్ల మహోత్సవాలకు గడువు దగ్గర పడుతుంది. ఈ నెల15వ తేదీ మహాశివరాత్రికి రెండు రోజుల ముందు ఏకాదశి నుంచే కోటప్పకొండకు భక్తుల రాక ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచే తిరునాళ్ల ప్రారంభమైనట్టు భక్తులు భావిస్తారు. ఇందుకు ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఏర్పాట్లు కొలిక్కి రాలేదు. కొండకు వచ్చే రహదారులు గోతులమయంగా ఉన్నా ఆ శాఖ ఇప్పటి వరకు మరమ్మతు పనులు చేపట్టలేదు. – నరసరావుపేట రూరల్ క్యూలైన్ వద్ద చలువ పందిళ్లు కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై మూడుసార్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం సమీక్షలో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరునాళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరునాళ్లకు మరో మూడు రోజులే సమయం ఉన్నా పనుల్లో వేగం కనిపించడం లేదు. రహదారుల పరిస్థితి ఆధ్వానం ... కోటప్పకొండకు చేరుకునే ప్రధాన రహదారుల మినహా మిగిలిన రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. చిలకలూరిపేట మేజర్ కెనాల్ రోడ్డు పెద్ద పెద్ద గోతులతో నిండిపోయింది. ప్రభలు కొండకు చేరుకునే సమయంలో అర్ధరాత్రి ఈ మేజర్ కెనాల్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోతుంటుంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు ఈ రోడ్డును వినియోగిస్తారు. అలాగే ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించే కొండకావూరు రోడ్డులో కూడా మరమ్మతు పనులు చేపట్టలేదు. యూటీ నుంచి క్రషర్స్ మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తారు. ఈ రోడ్దు దుమ్ముతో నిండిపోయి ఉంది. చినతురకపాలెం నుంచి గొనెపూడి, గురవాయపాలెం నుంచి గొనెపూడి రోడ్లు మరమ్మతు పనులు ప్రారంభించలేదు. జాతర జరిగే కొండ దిగువున ప్రధాన రోడ్లులో విద్యుత్ దీపాలు ఏర్పాట్లు పనులను ఆర్అండ్బీ ఎలక్ట్రీకల్ విభాగం ప్రారంభించింది. ప్రధాన రోడ్డులో ఐరెన్ పోల్స్కు విద్యుత్ దీపాలు బిగించే పనులు నిర్వహిస్తున్నారు. బారికేడింగ్ పనులు ప్రారంభించలేదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నూతన ట్రాన్స్ ఫార్మర్స్ను ఏర్పాటు చేసే పని విద్యుత్ శాఖ చేపట్టింది. మేజర్ కెనాల్ వద్ద భక్తులు స్నానాలు ఆచరించే ప్రాంతంలో తాత్కాలిక మరుగుదొడ్లు పనులు ప్రారంభం కాలేదు. -
మంగళగిరిలో మేఘాలయ ఎన్హెచ్ఎం బృందం పర్యటన
మంగళగిరిటౌన్:గుంటూరు జిల్లా మంగళగిరి లో మేఘాలయ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) బృందం పర్యటించింది. ఈ మేరకు అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం కింద రాష్ట్ర ఆరోగ్య, వైద్యశాఖ అవలంబిస్తున్న విధానాలను మంగళగిరిలోని పలు యూపీహెచ్ సెంటర్లలో సోమవారం బృందం సమీక్షించింది. ఇందిరానగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్ను సందర్శించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పథకాల అమలు పై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనీమియా కింద గర్భిణులు, బాలింతలు, బాలికలు, విద్యార్థుల్లోని రక్తహీనత తగ్గించేందుకు అందిస్తున్న మాత్రలు, ఇతర చర్యల గురించి వైద్య అధికారులు వివరించారు. కార్యక్రమంలో మేఘాలయ ఎన్హెచ్ఎం సీనియర్ అధికారులు డాక్టర్ నోవెరినా మరక్, బాదోండర్ షిల్లా, ఇందిరానగర్ యూపీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ అనూష తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చిత్రకారులు వజ్రగిరి జెస్టిస్కు జాతీయ గోల్డెన్ మాస్టర్ స్ట్రోక్ అవార్డు వినుకొండ:క్రియేటివ్ ఆర్ట్స్ అధినేత అంజి ఆకొండి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మాస్టర్ స్ట్రోక్ జాతీయ చిత్రకళా ప్రదర్శనలో వినుకొండ పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారులు డాక్టర్ వజ్రగిరి జెస్టిస్ గీసిన మహేంద్ర మాత మేదరి చిత్రటానికి గోల్డెన్ స్ట్రోక్ అవార్డు లభించింది. జాతీయ సీనియర్ చిత్రకారులు దాకోజు శివప్రసాద్, వర్థమాన నటుడు సుబ్బు, ఆర్టిస్ట్ ఆనంద్, ప్రొఫెసర్ సుందర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. అవార్డు పొందిన జెస్టిస్ను పలువురు అభినందించారు. ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ చిలకలూరిపేట: లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సోమవారం చోటు చేసుకుంది. గుంటూరు రేంజ్ ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట పంచాయతీరాజ్ డీఈ కార్యాలయంలో పీవీ లక్ష్మీ సత్యనారాయణాచార్యులు ఏఈగా విధు లు నిర్వహిస్తున్నారు. ఓ అప్రోచ్రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ పెద్ద మస్తానయ్యకు రూ.8 లక్షలు బిల్లు చెల్లించేందుకు మూడు శాతం అంటే రూ. 24 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించటంతో, ముందస్తు వ్యూహం ప్రకారం రూ. 24వేలు లంచం తీసుకుంటుండగా ఏఈను పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు నాగరాజు, సుబ్బారావు, సురేష్, మన్మథరావు పాల్గొన్నారు. గాయత్రీ మాత ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు గుంటూరురూరల్: చౌడవరం గ్రామం దాసరిపాలెంలో కొలువై ఉన్న ప్రసిద్ధ పంచముఖి గాయత్రీ మాత దేవాలయంలో 74వ బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం గాయత్రీ మాత సూర్యనారాయణస్వామి కల్యాణమహోత్సవ 16 రోజుల పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు వెండి పట్టుచీరె అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చుట్టుపక్కల గ్రామాలు, నగరంలోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ మహోత్సవాల నిర్వహణను దేవాలయ మేనేజింగ్ ట్రస్టీ వడ్డే రామిరెడ్డి, సెక్రటరీ వడ్డే విజయభాస్కర్రెడ్డి, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. -
నయన మనోహరంగా శ్రీవారి పుష్పయాగం
బాపట్ల: స్థానిక కోన కళాక్షేత్రంలో లలితా త్రిపుర సుందరీ పీఠం ఆధ్వర్యాన సోమవారం సాయంత్రం నయన మనోహరంగా శ్రీవారి పుష్పయాగం సాగింది. పుష్పయాగ శోభాయాత్ర, శ్రీ సీతారామ కోలాట సమాజం వారి కోలాటం, భక్త జన సందోహంతో పురవీధుల్లో వైభవంగా సాగింది. నెమలికంటి హనుమంతరావు సారధ్యంలో ముత్తేవి శ్రీనివాస శశికాంత్ యాగ్నీక పర్యవేక్షణలో రొంపిచర్ల కేశవాచార్యులు, పరాశరం రఘురామ్, గోపాలాచార్యులు, కౌండిన్య, సాయి వెంకట్, ప్రసాద్ స్వామి, విఖనస మూర్తి, మణికంఠ, బండి రాంబాబు, కృష్ణగౌడ్ బాలాజీ, అంజిరెడ్డి, నాళం శ్రీను, సుదర్శన్, రాజు, వేలాదిగా భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ పాల్గొన్నారు. -
వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి
నరసరావుపేట: వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వెట్టి చాకిరి వ్యవస్థ (బాండెడ్ లేబర్) నిర్మూలన దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమ వారం కలెక్టరేట్ నుంచి చేపట్టిన ర్యాలీకి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ర్యాలీ సాగింది. జేసీ మాట్లాడుతూ సమష్టి కృషితోనే సమసమాజం సాధ్యమవుతుందన్నారు. వెట్టిచాకిరి ఒక సామాజిక దురాచారమని, భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, గౌరవప్రద జీవనానికి అవకాశం కల్పిస్తుందని చెప్పారు. కార్మిక శాఖ సహాయ కమిషనర్ షేక్ మహబూబ్ సుభాని, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆర్థిక అక్షరాస్యతపై పోస్టర్ ఆవిష్కరణ.. నరసరావుపేట: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆధ్వర్యంలో సోమవారం నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం సందర్భంగా ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన పోస్టర్లను కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ సంజన సింహ ఆవిష్కరించారు. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో కీలకమని, సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలు, పొదుపు అలవాట్లు, ఆర్థిక మోసాల నుంచి రక్షణపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కేఎస్ రాంప్రసాద్, ఝాన్సీరాణి పాల్గొన్నారు. పల్నాడు జాయింట్ కలెక్టర్ సంజన సింహా -
బాపట్ల
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 36.1380 టీఎంసీలు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 538.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 12,864 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5200, గరిష్ట ధర రూ.6800, మోడల్ ధర రూ.6400 వరకు పలికింది. 7 -
సున్నా వడ్డీకి మంగళం
క్రాఫ్ రుణాలు సకాలంలో చెల్లించినా పైసా విదల్చని ప్రభుత్వం వేటపాలెం: రైతులు పంటల సాగు కోసం తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే ఇస్తున్న సున్నా వడ్డీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు రూ.18 నెలల కాలంలో ఇప్పటి వరకూ నయా పైసా కూడా వడ్డీ రాయితీ విడుదల చేయలేదు. ఫలితంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దాదాపు లక్ష పైచిలుకు మంది రైతులు నష్టపోయారు. అన్నదాతలకు ఎంతో మేలు చేసే ఈ పథకానికి 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. తాను నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో పంట పెట్టుబడి కోసం రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా చూసిన ఆయన ఈ పథకాన్ని ప్రకటించారు. అప్పటి వరకు రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను ఒక్క సంతకంతో మాఫీ చేశారు. ఆ తరువాత రైతులు తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లిస్తే 4 శాతం వడ్డీ రాయితీ చెల్లిస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద పంట రుణాలు తీసుకున్న రైతుల నుంచి ఏడాదికి వసూలు చేసే వడ్డీలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం చొప్పున భరిస్తున్నాయి. తద్వారా రైతులపై వడ్డీ భారం పడదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు ఐదేళ్లూ పూర్తి వడ్డీ రాయితీ అందించి ఎంతో మేలు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం అమలును పూర్తిగా నీరుగార్చింది. జిల్లాలోని జాతీయ, గ్రామీణ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పరిధిలో దాదాపు లక్ష మందికిపైగా రైతులు వివిధ పంటల సాగు కోసం సుమారు రూ.600 కోట్ల రుణాలు పొందారు. ఇందులో సన్న, చిన్నకారు రైతులు రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు తీసుకున్న పంట రుణాలకు వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రాయితీకి ఎగనామం పెట్టడం వల్ల అసలుతోపాటు మొత్తం వడ్డీ రైతులే చెల్లించాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏటా రుణాలు సక్రమంగా చెల్లించే ప్రతి రైతుకు క్రమం తప్పకుండా రూ.3 వేల చొప్పున వడ్డీ రాయితీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా కింద ఇవ్వాల్సిన రూ.4 వేల వడ్డీ రాయితీని 18 నెలలుగా ఇవ్వడం లేదు. ఈ విధంగా జిల్లాలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.190 కోట్ల మేరకు వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉందని సమాచారం. ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేస్తే ఆ మొత్తాన్ని తిరిగి జమ చేస్తామని చెబుతూ బ్యాంకులతోపాటు సొసైటీలు రైతు నుంచి వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఎవరైనా రైతులు వడ్డీ చెల్లించకపోతే వారికి రుణాలిచ్చేందుకు ఆయా బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. దీంతో కొంత మంది రైతులు బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తున్నారు. అలా చెల్లించలేనివారు తమకు పంట రుణాలు ఏ విధంగా వస్తాయో అర్థంగాక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వడ్డీ రాయితీ చెల్లిస్తుందని గతేడాది బ్యాంకులకు చెల్లించలేదు. ఇటీవల రుణం కోసం బ్యాంకులకు వెళ్తే.. ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేయలేదని అక్కడి అధికారులు చెప్పారు. గతేడాది తీసుకున్న రుణంపై వడ్డీ వసూలు చేశారు. వెంటనే వడ్డీ రాయితీ బకాయిలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. –డీ వసుంధర, మహిళా రైతు, వేటపాలెం ఏటా రుణాలు సక్రమంగా చెల్లించడంతో బ్యాంకులు తిరిగి రుణాలివ్వడంతోపాటు ప్రభుత్వం వడ్డీ రాయితీ కూడా సక్రమంగా అందించేది. కానీ రెండేళ్లుగా రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా వడ్డీ రాయితీ రావడం లేదు. బ్యాంకు అధికారులు రుణాలు సకాలంలో చెల్లించాలని ఒత్తిడి తేవడంతో వడ్డీ కూడా చెల్లిస్తున్నాం. –బలరామిరెడ్డి, రైతు, వేటపాలెం -
పిన్నెల్లి సోదరులతో వైఎస్సార్ సీపీ నేతల ములాఖత్
వెల్దుర్తి: జంట హత్యల అక్రమ కేసులో జైలుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను సోమవారం ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, పార్టీ వెల్దుర్తి మండల నాయకులు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా వెల్దుర్తి నాయకులు ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అధికార పార్టీలో ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులను అన్యాయంగా ఇరికించి వారిని ఇబ్బందులకు గురిచేయటం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం చంద్రబాబు ప్రభుత్వానికి తగదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. అందులో భాగంగానే పిన్నెల్లి సోదరులపై కుట్రతో జంట హత్యల కేసును బనాయించిందన్నారు. ఇలాంటి అక్రమ కేసులు తమ నాయకులను ఏమీ చేయలేవన్నారు. ములాఖత్ అయినవారిలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రాయంకుల గోపాల్, మండాది సర్పంచ్ శీలం సైదారెడ్డి, కండ్లకుంట సొసైటీ మాజీ అధ్యక్షుడు తాడికొండ పుల్లారెడ్డి, కండ్లకుంట మాజీ సర్పంచ్ అమరయ్య, అంజిరెడ్డి ఉన్నారు. డీఎస్పీ ఎం.హనుమంతరావు నరసరావుపేట టౌన్: మహాశివరాత్రి సందర్బంగా కోటప్పకొండ తిరునాళ్లలో ఏర్పాటు చేసే విద్యుత్ ప్రభల వద్ద నిర్వహించే కార్యక్రమాల్లో అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు హెచ్చరించారు. సోమ వారం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15వ తేదీన జరిగే కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్ల సందర్భంగా సాధారణ ప్రభలు 100, విద్యుత్ ప్రభలు 30 నుంచి 40 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆలయాల పరిసరాలలో డెకరేషనన్ లైటింగ్ ఏర్పాటు చేసే ప్రదేశాలు, విద్యుత్ ప్రభల వైర్ల వద్దకు భక్తులు, పిల్లలు వెళ్లకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభల నిర్వాహకులకు సూచించారు. స్థానిక పోలీసు అధికారులు, ఆలయ కమిటీసభ్యులు, ప్రాథమిక ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారుల సమన్యయంగా వ్యవహరిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటారన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరునాళ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరునాళ్లకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన ముందుస్తు చర్యలు తీసుకున్నామని, వాహనాల పార్కింగ్కి అనువైన ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో తిరునాళ్ల ఉత్సవాలు జరిగేలా భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. డీఎస్పీతో పాటు సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రేపు అండర్–17 జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపిక గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి గుంటూరు రూరల్ లాల్పురంలోని కాటూరి పబ్లిక్ స్కూల్లో అండర్–17 బాలబాలికల సబ్ జూనియర్ పోటీలు నిర్వహిస్తామని అసోసియేషన్ చైర్మన్ మార్కపూడి రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు జనవరి 1, 2010 తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు 8639922978 నెంబర్లో సంప్రదించాలన్నారు. -
జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో పతకాలు
బాపట్ల: రాజస్థాన్లో జనవరి 30 నుంచి ఈనెల 2వ తేదీ వరకు జరిగిన జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో బాపట్ల క్రీడాకారులకు పతకాలు సాధించారని బాపట్ల అసోసియేషన్ కార్యదర్శి షేక్ నజీర్ పేర్కొన్నారు. ఈ మేరకు క్రీడాకారులను సోమ వారం స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అభినందించారు. 60 ఏళ్లు పైబడిన గ్రూపులో బత్తుల సాంబశివరావు హైజంప్లో సిల్వర్ మెడల్, 50 ఏళ్లు పైబడిన గ్రూపులో ఎం.మురళీకృష్ణారెడ్డి పోల్వాల్ట్లో సిల్వర్ మెడల్, 75 ఏళ్లు పైబడిన విభాగంలో 5 కిలోమీటర్లు వాకింగ్లో ముప్పలనేని రామారావు బ్రాంజ్మెడల్ సాధించారు. ఈ మేరకు క్రీడాకారులను బాపట్లలో పలువురు సన్మానించారు. -
‘పది’లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
యాజలి(కర్లపాలెం): పదవ తరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని బాపట్ల జిల్లా విద్యాశాఖాధికారి డి.శ్రీనివాస్ చెప్పారు. బాపట్ల డివిజన్ పరిధిలో పదవతరగతి చదువుతూ చదువుల్లో వెనుకబడిన బాలికల కోసం యాజలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని డీఈఓ శ్రీనివాస్ సోమవారం సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం బాలికా విద్యను ప్రోత్సహిస్తుందని చెప్పారు. బాలికలందరూ పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించటమే లక్ష్యంగా ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ తరగతులను నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. పదవ తరగతిలో మంచి మార్కులతో పాసయ్యే విధంగా ప్రత్యేకమైన సిలబస్ను రూపొందించి బోధించటం జరుగుతుందని తెలిపారు. ఎంఈఓ విజయశ్రీ మాట్లాడుతూ బాపట్ల డివిజన్ పరిధిలోని 12 మండలాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదువుతూ చదువులో వెనుకబడిన బాలికలు చక్కగా చదివి పాసయ్యే విధంగా యాజలి ఉన్నత పాఠశాలలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. యాజలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం బి.సుగుణమణి, డెప్యూటీ డీఈఓ శివబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డి. శ్రీనివాస్ -
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సమావేశం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి సీతానగరంలోని సీతా భవన్లో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యక్రమాలపై సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆరు నెలల కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికల ప్రకారం మార్చి 8వ –10 తేదీ వరకు కంచి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి స్వామి వారి సూచనల మేరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి హంసల దీని వరకు దేవత వృక్షాలను నాటడం జరుగుతుందని తెలిపారు. ఆషాడ మాసం వ్యాస పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. గ్రామాల కేంద్రంగా ఉన్న దేవాలయాల్లో నిరంతర పూజా కార్యక్రమాలు, దీప ప్రజ్వలనలు, ధూపదీప నైవేద్యాలు నిరాటంకంగా కొనసాగేందుకు ఆర్థిక సహకారం అందించే పెద్దల మద్దతుతో చర్యలు తీసుకుంటామన్నారు. ట్రస్ట్ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్లు ఊడ్చి పీఏసీఎస్ ఉద్యోగుల నిరసన కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు శ్యామలానగర్లోని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చొక్కాలు విప్పి చీపుర్లు చేతబట్టి రోడ్లు శుభ్రం చేస్తూ, సమస్యలు పరిష్కరించి తమ ఆకలి తీర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏలూరు, కోనసీమ జిల్లాలకు చెందిన పీఏసీఎస్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ వెంటనే జీఓ నంబర్ 36ను అమలు చేసి పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతర భృతిని ఇవ్వాలని కోరారు. అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యూటీ సీలింగ్ను రూ.2 లక్షల నుంచి ఎత్తి వేయాలన్నారు. గ్రాట్యూటీ చట్టం ప్రకారం చెల్లింపులు చేయాలన్నారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పరభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా, రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ను చేయించాలని సూచించారు. -
బాపట్ల ఫొటోగ్రాఫర్కు జాతీయస్థాయి అవార్డు
బాపట్ల టౌన్: బాపట్ల ఫొటోగ్రాఫర్ డాక్టర్ పీవీఎస్ నాగరాజుకు ఫొటోగ్రఫీలో జాతీయ అవార్డు దక్కింది. ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్ అండ్ ఫొటో ఫైన్ ఎక్స్పో–2026, సిగ్మా ఆర్ట్ ఫొటోగ్రఫీ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో బాపట్ల మండలం, ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పవన్ క్లాసిక్ ఫొటోగ్రఫీ అధినేత డాక్టర్ పీవీఎస్ నాగరాజు తీసిన వెడ్డింగ్ ఫొటోకు జాతీయస్థాయి అవార్డు లభించింది. అవార్డును ఈనెల 8న హైదరాబాద్లోని ఎల్బీ నగర్ కేబీఆర్ ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ, ఫెడరేషన్ ఇండియన్ ఫొటోగ్రఫీ ప్రెసిడెంట్ సీఆర్ సత్యనారాయణ, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఆనంద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అవార్డు అందుకున్న పీవీఎస్ నాగరాజును పట్టణ ఫొటోగ్రాఫర్లు అభినందించారు. -
ఇంటర్కు ఇన్విజిలేటర్లేరీ?
ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో కీలకమైన ఇన్విజిలేషన్ విధులకు గుంటూరు జిల్లాలో అధ్యాపకుల కొరత ఏర్పడింది. ఈ నెల 23వ తేదీ నుంచి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు జరుగుతున్న ప్రాక్టికల్స్ ఈ నెల 10వ తేదీన ముగియనున్నాయి. థియరీ పరీక్షలపై దృష్టి సారించిన అధికారులకు ఇన్విజిలేటర్ల కొరత ఇబ్బందికరంగా మారింది. జిల్లాలోనే అధికం ప్రైవేటు అధ్యాపకులకు బాధ్యతలు -
ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీడీపీ కుట్రలు
చెరుకుపల్లి: రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని అబద్ధపు ఆరోపణలు చేస్తోందని, వైఎస్సార్సీపీ నాయకులపై కక్షపూరిత దాడులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున ఆరోపించారు. మండలంలోని గుళ్ళపల్లి గ్రామంలో డాక్టర్ ఈవూరు గణేష్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామిని కూడా అపవిత్రం చేశారన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే ఒక అసత్య ప్రచారానికి తెరలేపి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన బృందం ఇలా పైశాచిక ఆనందం పొందుతోందని ధ్వజమెత్తారు. లడ్డూ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు, అత్యున్నత న్యాయస్థానాలు సైతం కల్తీ జరగలేదని తేల్చి చెప్పినా కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల ప్రసాదాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు పవిత్రంగా భావిస్తూ స్వీకరిస్తుంటే దానిని దెబ్బతీసేలా ఫినాయిల్ కూడా కలిసిందని టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం దారుణమని పేర్కొన్నారు. మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలో ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేయటం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. పరిపాలన తీరుపై ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ నాయకులపై, కార్యకర్తలపై విచక్షణరహితంగా దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇది మంచి సంస్కృతి కాదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే చంద్రబాబు ప్రభుత్వ బెదిరింపులను లెక్క చేయకుండా గుంటూరులో మంత్రి అంబటి రాంబాబు ఇంటికి, ఇబ్రహీంపట్నంలో మంత్రి జోగి రమేష్ నివాసానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చినప్పుడు ప్రజలు వెంట నడిచారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా పేదలకు సంక్షేమం అందిస్తూనే విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చి నాణ్యమైన విద్య అందించారని తెలిపారు. దౌర్భాగ్యపు సీఎం అనంతరం వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ మాట్లాడుతూ ప్రతి పేద విద్యార్థికి వైద్య విద్య అందాలనే పట్టుదలతో ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని అనుమతులతో 17 మెడికల్ కళాశాలలను కట్టించాలని నిర్ణయించారన్నారు. నేడు అది కూడా ఓర్వలేక ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అమ్ముకునేందుకు మార్కెట్లో పెట్టిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి చంద్రబాబు అని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు, ఇతర టీడీపీ నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న దాడులను, లడ్డూపై చేస్తున్న అసత్య ప్రచారాలను ఆపి వేసి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని డాక్టర్ మేరుగ నాగార్జున, డాక్టర్ ఈవూరు గణేష్లు వెంకటేశ్వరస్వామిని ప్రార్థించారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ దుండి వెంకట రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
బహిరంగంగా మద్యం తాగేవారిపై చర్యలు
మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, హాజరైన జిల్లాలోని పోలీసు అధికారులుబాపట్ల టౌన్: బహిరంగంగా మద్యం తాగే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జిల్లాలోని పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న రౌడీ షీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తులపై పీడీచట్టం ప్రయోగించాలన్నారు. మహిళల సంబంధిత నేరాలు, పోక్సో కేసులు, మిస్సింగ్ కేసులు, హత్యా నేరాలు, దొంగతనాలు, దోపిడీలు, రోడ్డు ప్రమాదాలు, నేరాలకు పాల్పడిన వారికి న్యాయస్థానాల్లో విధించబడిన శిక్షలు, డ్రోన్ నిఘా, స్మార్ట్ పోలీసింగ్, యాప్ల వినియోగంపై అధికారులకు పలు సూచనలు చేశారు. విచారణ దశలో ఉన్న కేసుల దర్యాప్తుపై ఆరా తీశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిర్దిష్ట గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానాలలో చార్జ్షీట్ దాఖలు చేయాలన్నారు. నేరాలు జరగకుండా ముందస్తుగా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీరి ఆగడాలు అరికడితే నేరాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రేపల్లె, చీరాల, బాపట్ల డీఎస్పీలు ఎ. శ్రీనివాసరావు, ఎం.డి.మోయిన్, పి.జగదీష్ నాయక్, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ -
కొనసాగుతున్న వైద్య ప్రదర్శన
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో మెడ్ ఫ్యూజన్ పేరుతో ఈ నెల 4వ తేదీ నుంచి జరుగుతున్న వైద్య ప్రదర్శన ఆదివారం కూడా కొనసాగింది. డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనాటమీ, జనరల్ సర్జరీ సహా పలు విభాగాల ప్రదర్శనను సందర్శించారు. వాటి వివరాలను తమ కుమార్తెకు వివరిస్తూ, చూపించారు. వైద్య విద్యార్థులతో ముచ్చటించారు. తాను ఎంబీబీఎస్ చదివే రోజులను గుర్తు చేసుకున్నారు. ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అనంతరం ఆయన్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి శాలువాతో సత్కరించారు. ఒక్కరోజే 4,184 మంది సందర్శన... ఆదివారం 4,184 మంది ప్రదర్శనను సందర్శించారని ప్రిన్సిపల్ తెలిపారు. ముందస్తుగా వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని రావాలని సందర్శకులకు విజ్ఞప్తి చేశారు. కళాశాల వద్ద నేరుగా టికెట్లు తీసుకోవడం వల్ల ఒక్కసారిగా రద్దీ ఏర్పడే అవకాశముందని పేర్కొన్నారు. బుకింగ్ ద్వారా సమస్యను నివారించవచ్చని తెలిపారు. -
ఏఆర్ బలగాలకు విజయవంతంగా శిక్షణ
నగరంపాలెం: ఏఆర్ బలగాల శారీరక దృఢత్వం, ఆయుధాల వినియోగంలో నైపుణ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా శిక్షణ (మొబిలైజేషన్) నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఆదివారం పోలీస్ కవాతు మైదానంలో జిల్లా ఏఆర్ బలగాలకు డి–శిక్షణ నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఏటా ఏఆర్ బలగాలకు శిక్షణ, డి–శిక్షణ నిర్వహించడం తప్పనిసరని అన్నారు. వీవీఐపీ, వీఐపీ కార్యక్రమాలు, విస్తృత బందోబస్త్ విధులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. పోలీస్ సిబ్బంది శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని అన్నారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు మాట్లాడుతూ ఏఆర్ బలగాలకు విజయవంతంగా శిక్షణ నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం ఏఆర్ బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పరేడ్ను జిల్లా భద్రత విభాగ ఆర్ఐ శ్రీనివాసరావు పరేడ్ కమాండర్గా వ్యవహరించారు. జిల్లా భద్రత విభాగపు పోలీస్ జాగిలం (సింబా) ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాగిలం ప్రతిభను జిల్లా ఎస్పీ ప్రశంసించారు. కార్యక్రమంలో డీఎస్పీలు సంకురయ్య (ఏఆర్), అరవింద్ (గుంటూరు పశ్చిమ), సీఐలు నాగుల్మీరా, బిలాలుద్దీన్, ఆర్ఐలు శివరామకృష్ణ, శ్రీహరిరెడ్డి, సురేష్, శ్రీనివాసరావు, ఆర్ఎస్లు, ఏఆర్ బలగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలం మల్లన్న తలపాగా గ్రామోత్సవం
మంగళగిరి టౌన్: మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలం మల్లి కార్జున స్వామికి అలంకరించే తలపాగాకు మంగళగిరిలో గ్రామోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. మంగళగిరి పట్టణంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో తలపాగాకు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఓం నమశ్శివాయ నామస్మరణతో తలపాగాను శిరస్సుపై ఉంచుకుని పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఊటుకూరు సుబ్రహ్మణ్యస్వామి, మాడిశెట్టి శివశంకరయ్యలు మాట్లాడుతూ మల్లికార్జున స్వామి వారి పెండ్లికుమారుని ఉత్సవం, దేవాంగులు నేసిన తలపాగా వస్త్ర విశిష్టత గురించి కొనియాడారు. రాష్ట్ర పద్మశాలీయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మంగళగిరి అధ్యక్షులు బల్లా వెంకటరమణ, అల్లక తాతారావు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో నేడు పీజీఆర్ఎస్ రద్దు
బాపట్ల: స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతోపాటు కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు తెలిపారు. మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్ కొనసాగుతుందని తెలిపారు. -
మహాశక్తి దేవతగా బగళాముఖి అమ్మవారు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం మహాశక్తి అలంకరణలో పూజలు అందుకున్నారు. అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేశారు. పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. అమరావతి: మండల పరిధిలోని అత్తలూరు గ్రామంలో అత్యంత పురాతనమైన పునీత తోమాసవారి ఉత్సవాలను ఆదివారం ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే ప్రార్థన కార్యక్రమాలలో భాగంగా గుంటూరు మేత్రాసన విశ్రాంత బిషప్ రెవరెండ్ గాలిబాలి, జిల్లా వ్యాప్తంగా పలు చర్చిల నుంచి వచ్చిన 40 మంది విచారణ గురువులతో దివ్య పూజాబలి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అత్తలూరు తోమాస చర్చి ఫాదర్ చాట్ల కస్పార్ మాట్లాడుతూ అందరూ దైవం పట్ల విశ్వాసంతో, తోటి మానవుల పట్ల కరుణతో జీవించాలన్నారు. ఏసుప్రభువు మానవులకు చేసిన అనేక మంచి కార్యాలకు కృతజ్ఞతగా ఈ పండుగను నిర్వహిస్తున్నామన్నారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించిన కోలాట ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఐదు గంటలకు కొవ్వొత్తులతో వీధులలో ప్రదర్శన నిర్వహించారు. రాత్రికి ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో, పూలతో అలంకరించిన తేరుపై ఏసుప్రభువు విగ్రహాన్ని ఉంచి పురవీధులలో తేరు ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో విచారణ గురువులు, మఠ కన్యలతోపాటు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 3.3 సెంటీమీటర్ల అతి సూక్ష్మ వరల్డ్ కప్ నమూనా తయారీ చీరాల: అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో చరిత్ర సృష్టించిన భారత్ జట్టుకు బాపట్ల జిల్లా చీరాలకు చెందిన స్వర్ణకారుడు నక్కా వెంకటేష్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో 3.3 సెంటీమీటర్ల అతి సూక్ష్మమైన అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ నమూనా తయారు చేశారు. క్రికెట్లో ఇంగ్లండ్ను ఓడించిన భారత్ యువ క్రికెటర్లకు దీనిని అంకితం చేశారు. ఈ కప్పును 0.500 మిల్లీగ్రాముల బంగారాన్ని, 2.900 మిల్లీగ్రాముల వెండిని ఉపయోగించి రెండు రోజులు పాటు శ్రమించి తయారు చేసినట్లు తెలిపారు. నకరికల్లు: సీనియర్ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ మండలంలోని అడ్డరోడ్డులో గల అభయాంజనేయ స్వామిని ఆదివారం దర్శించుకున్నారు. కొండవీడు ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయన మార్గమధ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకుడు విను కొండ కొండామాచార్యులు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. రాజేంద్ర ప్రసాద్ను కలిసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. -
కోర్టు భవన నిర్మాణంలో నాణ్యత పాటించండి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లుపర్చూరు (చినగంజాం): పర్చూరు కోర్టు భవన నిర్మాణంలో నాణ్యత పాటిస్తూ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అన్నారు. పర్చూరులోని కోర్టు భవనం శిథిలావస్థకు చేరడంతో అద్దె భవనంలోకి కోర్టును మారుస్తున్న క్రమంలో ఆదివారం అద్దె భవనాల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు పర్చూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.జాన్బాబు అధ్యక్షత వహించారు. హైకోర్టు జడ్జిలు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వై.లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా మాట్లాడారు. కోర్టు పాత భవనం శిథిలావస్థకు చేరినందున దాని స్థానంలో కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు అద్దె భవనంలో కోర్టు కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. కొత్త భవన నిర్మాణంలో ఎటువంటి నాణ్యత లోపాలు లేకుండా కోర్టు నిర్వహణ అవసరాలను గుర్తించి ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత విభాగాలకు సూచించారు. కోర్టు భవనాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తులు జస్టిస్ టి.సునీల్ చౌదరి, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు, ప్రకాశం జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి టి.రాజ్యలక్ష్మి, జిల్లా సెషన్స్ రిటైర్డ్ జడ్జి ఎ. భారతి తదితరులు పాల్గొన్నారు. -
బాలకోటేశ్వరస్వామి ఆలయానికి విరాళం
గోవాడ(వేమూరు): మహాశివరాత్రిని పురస్కరించుకుని గోవాడలోని బాలకోటేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఘంటా నిర్మలమ్మ దంపతులు రూ.లక్ష విరాళం అందజేసినట్లు దేవస్థానం చైర్మన్ రమేష్ తెలిపారు. భక్తులకు తాగునీటి సౌకర్యార్థం తెనాలి కుమార్ పంప్స్ అధినేత సబ్రహ్మణ్యం రూ.70 వేల విలువైన ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం దాతలు ఆలయంలో పూజలు నిర్వహించారు. రేపల్లె: ప్రమాదవశాత్తూ కృష్ణాదిలో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ వివరాల మేరకు... మండలంలోని తుమ్మల పంచాయతీ గాదెవారిపాలేనికి చెందిన గాదె అర్జునరావు (78) ఇటీవల పట్టణంలోని తన కుమార్తె ఇంటికి వచ్చాడు. శనివారం విజయవాడలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లే క్రమంలో పెనుమూడి వద్ద కృష్ణానదిలో కాళ్లు కడుకుంటూ ప్రమాదవశాత్తూ ముందుకు పడి నీటిలో మునిగిపోయి మృతి చెందాడన్నారు. మృతుని కుమారుడు శ్రీహరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తెనాలి: తెనాలి కెమెరా క్లబ్కు చెందిన ఫొటోగ్రాఫర్, శిక్షకుడు కోకాటి నాగేశ్వరరావు (నాగు) ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్లో ద్రోణాచార్య సేవా పురస్కారం స్వీకరించారు. హైదరాబాద్లోని కేబీఆర్ ఫంక్షన్హాలులో జరుగుతున్న మూడురోజుల ఫెస్టివల్లో ఆదివారం ఈ పురస్కారాన్ని జేఎన్ఏఎఫ్యూ (ఫొటోగ్రపీ), హైదరాబాద్ ప్రిన్సిపాల్ ఆనంద్, హెచ్ఓడీ కమల్రాయ్ చేతులమీదుగా బహూకరించారు. నాగేశ్వరరావును తెనాలి కెమెరా క్లబ్ సభ్యులు, పట్టణానికి చెందిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అభినందించారు. రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నాగమల్లేశ్వరరావు నరసరావుపేట: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎస్ఎ) జిల్లా అధ్యక్షుడిగా పిడుగురాళ్ల తహసీల్దార్ కె.నాగమల్లేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నరసరావుపేటలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న రెవెన్యూ భవనంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన నెల్లూరు జిల్లా అధ్యక్షులు పెంచలరెడ్డి పేర్కొన్నారు. అసోసియేట్ అధ్యక్షులుగా దాచేపల్లి తహసీల్దార్ జి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా కారంపూడి తహసీల్దార్ ఆర్.వెంకటేశ్వర్లునాయక్, నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయ టైపిస్టు శిరిగురి నాగరాజకుమారి, బొల్లాపల్లి తహసీల్దార్ ఏవీ సుధాకర్, పల్నాడు జిల్లా కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ షేక్ బాజి ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా అచ్చంపేట తహసీల్దార్ సీహెచ్.శ్రీనివాసరావు, కార్యదర్శిగా క్రోసూరు తహసీల్దార్ వీవీ.నాగరాజు, సంయుక్త కార్యదర్శులుగా పెరుసుమల నరసయ్య, నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయానికి చెందిన నంద్యాల ఆంజనేయులు, వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయ టైపిస్టు వి.నాగవల్లి, రెంటచింతల తహసీల్దార్ కార్యాలయ ఎంఆర్ఐ ఎం.మనమోహన్ప్రసాదు, కోశాధికారిగా సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కె.కోటేశ్వరరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా కలెక్టరేట్లోని జూనియర్ అసిస్టెంట్ పి.వీరప్రతాప్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా గురజాల ఆర్డీఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ వి.వెంకటరెడ్డి, మాచవరం తహసీల్దార్ కార్యాలయ టైపిస్టు పి.నరేష్ ఎన్నికయ్యారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా రెండోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేశారు. రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికై న నాగమల్లేశ్వరరావును ఉన్నతాధికారులు, రెవెన్యూ సిబ్బంది సత్కరించారు. పిడుగురాళ్ల ప్రజలు తమ తహసీల్దార్ జిల్లా స్థాయి గుర్తింపు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. -
టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదు
పెదకూరపాడు: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదని జలాలపురం గ్రామానికి చెందిన వ్యాపారి, సీనియర్ నాయకులు సరిపూడి రామారావు ఆవేదన వ్యక్తంచేశారు. జలాలపురంలోని తన స్వగృహంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గెలుపు కోసం సొంత డబ్బులు ఖర్చు చేశానన్నారు. గ్రామంలోనే టీడీపీకి చెందిన వారు నాపై హత్యాయత్నం చేసినా ఎమ్మెల్యే ప్రవీణ్ కనీసం పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాపై దాడి చేసిన వారే నాపై కేసులు పెట్టించారని తెలిపారు. పార్టీలో న్యాయం జరగదని భావించి సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా పత్రాన్ని టీడీపీ మండల అధ్యక్షులు ఏటుకూరి బ్రహ్మయ్యకు అందజేస్తామన్నారు. తనతోపాటు తన అనుచరులు కూడా త్వరలోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని తెలిపారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. -
పోటీలలో పాల్గొంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశాతాడేపల్లి రూరల్: చిన్నవయసులోనే ఈత నేర్చుకోవడమే కాకుండా పోటీల్లో పాల్గొనడం వల్ల చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశా పేర్కొన్నారు. ఆదివారం ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేన్ ఆధ్వర్యంలో 26వ కృష్ణా రివర్ క్రాస్ ఈతపోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశా మాట్లాడుతూ ఈత అనేది ఒకరకమైన వ్యాయామ క్రీడ అని పేర్కొన్నారు. ఈత శరీరానికి మంచి వ్యాయామం అని అన్నారు. ఏపీ ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ పి.వెంకటరమణ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతుల చెక్కులు, మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె. లక్ష్మీశాను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజు గంగరాజు ఆశీస్సులతో గత 26 సంవత్సరాలుగా కృష్ణానదిలో ఈత పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 10 సంవత్సరాల నుండి 88 సంవత్సరాల వయస్సు వారు మొత్తం 634 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారని, మొత్తం 8 కేటగిరీలలో ఆడ, మగ పోటీదారులకు విడివిడిగా 16 గ్రూపులుగా పోటీలు నిర్వహించామని తెలిపారు. వేసవి కాలంలో సుమారు 300 మంది పిల్లలకు ఈత నేర్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరి యార్లగడ్డ రమేష్కుమార్, కన్వీనర్ వడిపినరాము, వైస్ ప్రెసిడెంట్ గోపాలం సాంబశివరావు, కె.వి.రామయ్య, ఎ. రామిరెడ్డి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు పోలీస్ గ్రీవెన్స్ రద్దు
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరవుతారని, పోలీస్ బందోబస్త్ ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో తాత్కలికంగా రద్దు చేశామని, అర్జీదారులు గమనించాలని అన్నారు. తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కొలనుకొండ వద్ద ఒక లారీ క్యాబిన్లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలో లారీ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. సేకరించిన వివరాల ప్రకారం... విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో ఓవర్లోడ్తో వెళుతున్న ఇసుక లారీ కొలనుకొండ ప్రాంతానికి వచ్చే సరికి లారీ క్యాబిన్లో నుంచి మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ లారీ దిగి ప్రాణాలతో బయట పడ్డారు. వారి కళ్లముందే నిమిషాల వ్యవధిలో లారీ దగ్ధమైంది. సమాచారం అందుకున్న మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. సాంకేతిక లోపం, ఓవర్ లోడ్ వల్ల లారీ ఇంజిన్ వేడి ఎక్కి ఈ మంటలు వ్యాపించి ఉంటాయని లారీ డ్రైవర్లు చెబుతున్నారు. -
జిల్లాలో భారీగా ఫోన్ల రికవరీ
బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ బాపట్లటౌన్: జిల్లాలో జనవరి మాసంలో రూ.50 లక్షల విలువైన 237 ఫోన్లను రికవరీ చేశామని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం బాధితులకు ఫోన్లను అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ తక్కువ ధరకు వస్తున్నాయని బిల్లులు లేని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. 2026 జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో ఐటీ కోర్ బృందం, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేసి, వివిధ ప్రాంతాల్లో పోయిన 237 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారన్నారు. నేటి ఆధునిక సమాజంలో మొబైల్ ఫోన్ అనేది ప్రతి వ్యక్తికి అత్యంత ఆవశ్యకమైన, విలువైన వస్తువుగా మారిందన్నారు. కేవలం సమాచార మార్పిడికే కాకుండా, వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఆర్థిక లావాదేవీలు ఇతర పలు వివరాలను ప్రతి ఒక్కరు ఫోన్లలో నిక్షిప్తం చేసుకుంటున్నారన్నారు. అనుకోని పరిస్థితుల్లో ఫోన్ పోగొట్టుకుంటే దానిలో ఉన్న సమాచారాన్ని తిరిగి పొందడం కష్టసాధ్యంగా ఉంటుందన్నారు. ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసేందుకు జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే www.ceir.gov.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు. ఆ పోర్టల్లో బ్లాక్ స్టాలెన్/లాస్ట్ మొబైల్ ఆప్షనన్ను ఎంచుకుని, ఫోన్ ఐఎంఈఐ నంబర్, మొబైల్ కొన్న రసీదు కాపీని అప్లోడ్ చేయాలన్నారు. ఇలా ఫిర్యాదు చేయడం ద్వారా పోయిన ఫోన్న్ను ఎవరైనా వాడాలని ప్రయత్నిస్తే ఆ ఫోన్ సిగ్నల్ పనిచేయకుండా బ్లాక్ అవుతుందన్నారు. తద్వారా ఫోన్ ట్రేసింగ్ సులభమవుతుందన్నారు. బిల్లులు లేని ఫోన్లను కొని అనవసరమైన ఇబ్బందుల్లో పడవద్దని ప్రజలను ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎం.డి.మొయిన్, రేపల్లె డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు, సోషల్ మీడియా సీఐ వి.సూర్యనారాయణ, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రధాన ఆకర్షణగా ‘ఆ ఊరు – ఈ ఊరు’
నగరంపాలెం: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా/ వేదిక (తెలుగు నాటక పరిషత్ల సంఘం) సంయుక్తంగా మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్ – అంతర్జాతీయ నాటక ఉత్సవం ఆదివారం మూడో రోజుకి చేరింది. వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు అధ్యక్షత వహించారు. దేశ, విదేశీ భాషలు, విభిన్న కళారూపాల సమ్మేళనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు ప్రముఖ రచయితలు, కళాసంస్థలు, నాటక పరిషత్ నిర్వాహకులు, కళాకారులు తరలివచ్చారు. బళ్లారి రాఘవయ్య ఓపెన్ థియేటర్లో పాటలు, ఆటలు, కోలాటాలు, చెక్క భజనలు, డప్పు వాయిద్యాల విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. సాయంత్రం జ్యోతిప్రజ్వలన చేసి, తెలుగు రాష్ట్రాల్లోని పలు కళాపరిషత్ నిర్వాహకులను సత్కరించారు. అనంతరం నటమిత్రారు హవ్యాసి కళా సంఘం (తిరుత్తహల్లి, కర్నాటక) ప్రదర్శించిన ఆ ఊరు – ఈ ఊరు నాటకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పల్లెటూరు కుటుంబ నేపథ్యంతో సమాజంలోని లోపాలను నిర్భయంగా ప్రశ్నిస్తూ, ప్రేక్షకులను ఆలోచనల లోకంలోకి తీసుకెళ్లింది. ఈ నాటకం జి.బి.జోషి రచించగా, హుళుగప్ప కట్టిమాని దర్శకత్వం వహించారు. కన్నడ భాషలో ప్రదర్శించినా.. కళాకారుల హావభావాలు, అభినయాలు భాషా అవరోధాలను చెరిపివేస్తూ ప్రేక్షకులకు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చాయి. కొనసాగిన ‘భారత్రంగ్ మహోత్సవ్’ -
లబోదిబోమంటున్న మహిళ
తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పోలకంపాడు నుంచి ఉండవల్లి దళితకాలనీకి వెళ్లే కరకట్టపై పట్టపగలు నలుగురు మహిళలు ఉండగా ఒక మహిళను టార్గెట్ చేసి ఆమె అరువు తెచ్చుకున్న బంగారపు గొలుసును చైన్స్నాచర్లు లాక్కెళ్లిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి పరిధిలోని దళిత కాలనీకి వెళ్లే కరకట్టపై ఉదయం కోటిచుక్కల లక్ష్మి తన బంధువులతో కలసి శుభకార్యానికి వెళుతున్నారు. ఇదే సమయంలో ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై ఎదురుగా వచ్చి వీరిని దాటుకుని వెళ్లారు. రెండునిమిషాల వ్యవధిలో తిరిగి వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న లక్ష్మి మెడలోని బంగారం గొలుసును, సూత్రాలతో సహా లాక్కెళ్లారు. ఈక్రమంలో కోటిచుక్కల లక్ష్మి కింద పడిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే చైన్ స్నాచర్లు పరారయ్యారు. పక్కనే ఉన్న మహిళలు బండి ఢీకొందని అనుకున్నారు. కానీ మెడలో తాడు లాక్కెళ్లారని చెప్పడంతో మిగిలిన మహిళలు పెద్దగా కేకలు వేశారు. అప్పటికే ద్విచక్రవాహంపై వారు పరారయ్యారు. కోటిచుక్కల లక్ష్మి బంధువుల ఇళ్లలో శుభకార్యానికి వెళుతూ.. పక్క ఇంటిల్లోని వారు గొలుసును అరువుకు తెచ్చుకుని మెడలో వేసుకుంది. సుమారు 30 గ్రాములు ఉండే ఆ బంగారు గొలుసు లాక్కెళ్లడంతో గొలుసు యజమానికి డబ్బులు ఎలా కట్టాలని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సమాచారం అందుకున్న తాడేపల్లి ఎస్ఐ సంఘటనా స్థలానికి వచ్చి బాధిత మహిళ వద్ద వివరాలు తెలుసుకున్నారు. నలుపు, ఎరుపు ద్విచక్రవాహనంపై ఒకరు హెల్మెట్ ధరించి ఉండగా, మరొకరు వెనుక కూర్చున్నారని, వారిలో ఒక టక్ చేసుకుని ఉన్నారని లక్ష్మి తెలిపింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఐ ఖాజావలి పలుచోట్ల సిసి కెమెరాలను పరిశీలించగా ఆమె చెప్పిన గుర్తులతో ఉన్న యువకులు ద్విచక్రవాహనాన్ని వేగంగా నడుపుకుంటూ ఉండవల్లి సెంటర్వైపు వెళ్లారు. జరిగిన సంఘటనపై ఎస్ఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ చుట్టుపక్కల చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న బిహార్కు చెందిన వ్యక్తులు అని పోలీసులు భావిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ ఖాజావలి సూచించారు. ఉయ్యూరు: ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో ఆదివారం భక్తిపారవశ్యం వెల్లివిరిసింది. కల్పవల్లికి భక్తజనం నీరాజనం పలికారు. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చి పాల పొంగళ్లు, చలువ కావిళ్లు, జోడు పొట్టేళ్ల ప్రభ బండ్లు కానుకగా సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఉయ్యూరు పట్టణం అంతా వీరమ్మతల్లి నామస్మరణతో భక్తజన సంద్రంగా మారింది. పలువురు భక్తులు ప్రసాదాలు పంపిణీ చేసి అమ్మవారి సేవలో తరించారు. -
వినుకొండ ఫొటోగ్రాఫర్కు ‘సిగ్మా’ అవార్డు
వినుకొండ: పట్టణానికి చెందిన కేసానపల్లి సుబ్బారావు జాతీయ స్థాయిలో వివాహ ఆచారాల కేటగిరిలో సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు అందుకున్నారు. ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్–2026లో భాగంగా సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ నిర్వహించిన పోటీలలో వెడ్డింగ్ మూమెంట్స్ ఫొటోకు అవార్డు దక్కింది. హైదరాబాద్లో ఆదివారం జరిగిన అవార్డు ప్రదానం కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా సుబ్బారావు అవార్డు అందుకున్నారు. సుబ్బారావును పల్నాడు జిల్లా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్బీకే, వినుకొండ ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు సూర్య, బ్రహ్మం, వెంకటేష్, పెద్దమల్లయ్య, శ్రీకాంత్, సీపీ కృపాకర్, వేణు, నరేంద్ర అభినందించారు. పిడుగురాళ్ల ఫొటోగ్రాఫర్లకు అవార్డులు పిడుగురాళ్ల: ిపడుగురాళ్ల పట్టణానికి చెందిన ఫొటోగ్రాఫర్లు అవార్డులు అందుకున్నారు. హైదరాబాద్లోని ఈఎంఆర్సీ–ఉస్మానియా యూనివర్సిటీ సమర్పణలో ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్ ఫొటో పరివార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ పరివార్ విశిష్టసేవా పురస్కార వేడుకల్లో పిడుగురాళ్ల పట్టణనికి చెందిన ఫొటోగ్రాఫర్లు సీదా రామరావు, రామిశెట్టి చంద్రశేఖర్రావు, రామినేని భరత్కుమార్లు వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, బిజినెస్ ఎక్స్లెన్స్ అవార్డును అందుకున్నారు. -
కేంద్ర బడ్జెట్ ఓ విక‘సిక్’ బడ్జెట్
ప్రముఖ విద్యావేత్త శ్రీనివాసరావు రెంటచింతల: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్ సామాన్యులకు ఓ విక‘సిక్’ బడ్జెట్ అని దీనివలన వారికి ఒరిగేదేమి లేదని కేవలం ఇది కార్పొరేట్లకు మాత్రమే ఉపయోగపడేలా ఉందని కన్నెగంటి హనుమంతు ఫౌండేషన్ అధ్యక్షుడు, ప్రముఖ విద్యావేత్త శ్రీనివాసరావు అన్నారు. శనివారం మండల కేంద్రమైన రెంటచింతలలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశ,దిశ లేని బడ్జెట్ మాత్రమే కాక స్పష్టతలేని ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు మెండిచేయి చూపించారని విమర్శించారు. కీలక రంగాలకు సరైన కేటాయింపులు లేవని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు యువత, మహిళ, కౌలురైతు, విద్యారంగం ఉద్యోగులకు శ్రామిక, పేద, మధ్య తరగతి వర్గాలకు పన్ను సడలింపులో ప్రత్యేక ఉపశమనం లేదన్నారు. ఎరువుల సబ్సిడీ తగ్గించడంతోపాటు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, రాజకీయాలకు సంబంధించి బడ్జెట్లో పరిష్కారమార్గాలు చూపలేకపోయారన్నారు. ప్రజలు బాధలు తీర్చలేని నిరాశ బడ్జెట్అని, ఆర్థిక వ్యవస్థను దిగజార్చే బడ్జెట్ అన్నారు. దేశంలో 147 కోట్ల మందికి ఒక్కొక్కరి తలపై 1.34 లక్షల అప్పు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్కు కొత్త ప్రాజెక్టులు కేటాయించకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. విశాఖ ఉక్కు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రం నుంచి 22 మంది ఎంపీలు ఉన్నా సాధించింది ఏంలేదన్నారు. రాష్ట్ర విభజన హామీలను సైతం విస్మరించారని గుర్తు చేశారు. ఈ బడ్జెట్లో సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. -
చివరి మజిలీలో చింతింపే..!
చీరాల రూరల్: మనిషి బతికుండగా కన్నీళ్లు, కష్టనష్టాలు, ఎన్నో బాధలు.. అంతకు మించిన ఆవేదన. అదే మనిషి కన్నుమూసిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకూ అగచాట్లు వెంటాడుతున్నాయి. మానవ మృతదేహాలను ఖననం చేయాలన్నా, దహన సంస్కారాలు నిర్వహించాలన్నా పేద, మధ్య తరగతి ప్రజలకు ఖరీదైన వ్యవహారమే కాదు.. కాస్త శ్రమతో కూడుకున్న పని. కర్రలు పోగు చేయడం దగ్గర నుంచి మృతదేహం పూర్తిగా కాలిపోయే వరకు శ్మశానంలో పడిగాపులు కాయాల్సి ఉంటంది. ఈ క్రమంలో వర్షం కురిస్తే మృతుడి బంధువుల వేదన వర్ణనాతీతం. దేహాలు పూర్తిగా కాలకపోతే అరిష్టమని, ఆత్మలు శాంతించవని పెద్దలు చెబుతుంటారు. అంతేగాక మృతదేహాలు కాలే సమయంలో శ్మశానం చుట్టుపక్కల నివాసముంటున్న వారు దుర్వాసనను తప్పక భరించాల్సిన పరిస్థితి. చీరాల పట్టణంలోని కారంచేడు రోడ్డులో గల హిందూ శ్మశానవాటికలో ఈ సమస్యలన్నింటికీ చమరగీతం పాడేందుకు నాలుగేళ్ల క్రితం అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నడుం బిగించింది. గత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి విజ్ఞప్తి మేరకు రూ.1.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. దాదాపు పనులన్నీ పూర్తయినప్పటికీ హిందూ శ్మశానవాటికను చీరాల ప్రజలు సక్రమంగా వినియోగించుకోలేని దుస్థితి. విద్యుత్, నీటి వసతికి సంబంధించి స్వల్ప స్థాయి పనులు చేపడితే శ్మశానవాటిక అందుబాటులోకి వస్తుందని తెలిసినా ప్రస్తుత పాలకులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడంపై చీరాల వాసులు దుమ్మెత్తిపోస్తున్నారు. రూ.1.40 కోట్లతో వసతులు హిందూ శ్మశానవాటికలో అభివృద్ధి పనులకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.20 కోట్ల నిధులు విడుదల చేసింది. మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించిన అధికారులు దహన యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు నూతన భవనం పూర్తి చేశారు. భవనం చుట్టూ వాహనాలు తిరగటానికి వీలుగా సిమెంట్ రోడ్లు, మంచినీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ సౌకర్యం కల్పించారు. దహన యంత్రాన్ని చైన్నెలో కొనుగోలు చేసి అక్కడి నిపుణులను చీరాల రప్పించి సంబంధిత పనులు సైతం పూర్తి చేయించారు. మృతదేహాన్ని కాల్చే సమయంలో చుట్టుపక్కల నివాసముంటున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పొగను నేరుగా బయటకు పంపించేందుకు భవనం పక్కనే 100 అడుగుల పొడవుతో భారీ గొట్టాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఈ దహన యంత్రం అందుబాటులోకి వస్తే మృతదేహాల అంతిమ సంస్కార ప్రక్రియ కేవలం గంట వ్యవధిలోనే పూర్తవుతుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్మశానవాటికలో వసతులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. స్వల్ప మొత్తంలో నిధులు మంజూరు చేస్తే దహనవాటిక అందుబాటులోకి వస్తుందని పాలకులకు తెలిసినా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ శ్మశానవాటికలో భవన నిర్మాణం పూర్తి చేయడంతోపాటు యంత్ర పరికరాలు ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. మరికొంత నిధుల కొరత కూడా ఉంది. పనులను కొద్ది రోజుల్లో పూర్తి చేసి దహన యంత్ర సేవలను అందుబాటులోకి తీసుకువస్తాం. – రఘురాం, మున్సిపల్ డీఈ -
అస్తవ్యస్తంగా శ్మశానవాటిక
చీరాలలోని కారంచేడు రోడ్డులో గల హిందూ శ్మశానవాటిక సుమారు 13 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఉంది. అయితే మృతదేహాలను ఖననం చేసేందుకు, దహనసంస్కారాలు నిర్వహించేందుకు శ్మశానవాటికలో పరిస్థితులు అనుకూలంగా లేవు. ఒకవైపు ఏపుగా పెరిగిన చిల్లచెట్లు, ముళ్లపొదలు పెరిగిపోవడంతోపాటు పల్లంగా ఉన్న మరి కొంత స్థలంలో మురుగు నిలిచి తటాకాన్ని తలపిస్తోంది. ఈ పరిస్థితుల్లో దహన వాటిక అవసరం అందరినీ ఆలోచింపజేస్తోంది. దహన యంత్రం అందుబాటులో ఉంటే పేద, మధ్య తరగతి ప్రజలకు డబ్బు ఆదా కావడంతోపాటు ఎక్కువ సమయం అక్కడ పడిగాపులు కాసే సమస్య ఉండదని చీరాల వాసులు అభిప్రాయపడుతున్నారు. చివరి మజిలీలో ఎదురవుతున్న తిప్పలను తప్పించాలని కోరుతున్నారు. -
విద్యతో పాటు నైతికత ముఖ్యం
ఏఎన్యూ(పెదకాకాని): ప్రతి విద్యార్థి విద్యతో పాటు నైతిక విలువలు కలిగి ఉండాలని ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శనివారం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం – నైతిక విలువలు అనే అంశంపై ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.సురేష్కుమార్ అధ్యక్షత వహించారు. ఏఎన్యూ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. విలువలతో కూడిన జీవితం ప్రతి విద్యార్థి విజయానికి మార్గమన్నారు. గురువు గౌరవాన్ని కాపాడలేని చదువు వ్యర్ధమన్నారు. విలువలతో కూడిన విద్య అభ్యసించిన వారు తప్పక విజయం సాధిస్తారన్నారు. కష్టపడిన వారు ఎప్పటికీ నష్టపోరని.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్, గొప్ప ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నెల్సన్ మండేలా, బెనారస్ యూనివర్సిటీ స్థాపనకర్త మదన్మోహన్ మాలవ్య, భూదాన ఉద్యమదాత ఆచార్య వినోభా బావే వంటి మహనీయులు సమాజంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని విజేతలుగా నిలిచారని గుర్తు చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యాసంస్థ, గురువులు గర్వించేలా సమాజంలో ఉత్తమ గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. వర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య కె.గంగాధరరావు, రిజిస్ట్రార్ జి.సింహాచలం, రెక్టార్ ఆర్.శివరాంప్రసాద్లు ప్రసంగించారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు -
గంజాయి విక్రయించే ముఠా అరెస్ట్
గుంటూరు రూరల్: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను కాకుమాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నగరంలోని సౌత్ సబ్డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ భానోదయ తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి వినియోగం విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్దనుంచి 3.95 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా గంజాయి సంబంధిత అక్రమ కార్యకలాపాలను నిర్మూలించడమే లక్ష్యంగా పాత నేరస్తులు, గంజాయి కేసుల్లో పాల్గొన్న నిందితులు, ఇతర అనుమానితుల కదలికలపై జిల్లా పోలీసులు కఠిన నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలో గతంలో గంజాయి కేసులో పట్టుబడి, జువైనల్ హోంలో ఉన్న ఓ మైనర్ ఇచ్చిన సమాచారం మేరకు దేవరకొండ వెంకటరంజిత్కుమార్, మరికొంత మంది గంజాయి వ్యాపారంలో పాల్గొంటున్నట్లు నిర్ధారించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా కొనసాగించామన్నారు. నిఘాలో శుక్రవారం కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపట్ల పెదనందిపాడు రహదారిలో ఉన్న డంపింగ్ యార్డు వద్ద గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద గంజాయి లభ్యమైందన్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా, వారు విశాఖపట్నం, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయిని అక్రమంగా తెచ్చి బాపట్ల, మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు అంగీకరించారన్నారు. నిందితులు బాపట్లకు చెందిన దేవరకొండ వెంకట రంజిత్కుమార్, బాపట్లకు చెందిన జూటు చైతన్య పరమేశ్వరరావు, మచిలీపట్నంకు చెందిన జొన్నకూటి ఉదయ కిరణ్, బాపట్లకు చెందిన మల్లెల ఆరాధన రాజా, పొట్లూరు గణేష్ అలియాజ్ బుడ్డ గణేష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఆపరేషన్లో పాల్గొన్న ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, కాకుమాను ఎస్ ఏకానాథ్ సిబ్బంది నరసింహ, అశోక్, ప్రసాద్, శ్రీను, చిరంజీవి తదితరులను డీఎస్పీ అభినందించారు. -
11 నుంచి సూరేపల్లిలో శివపార్వతుల కల్యాణోత్సవాలు
సూరేపల్లి(భట్టిప్రోలు): మహా శివరాత్రిని పురస్కరించుకుని భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో కొలువైన కేదారేశ్వర వాయులింగ ఆలయంలో శివపార్వతుల కల్యాణం, తిరునాళ్ల కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు విశ్వేశ్వరబాబు ఆధ్వర్యంలో సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రభను, గూడు బండ్లను అందంగా తీర్చిదిద్దారు. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు ప్రతి రాత్రి 7 నుంచి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. 15వ తేదీ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు స్వామి వారికి భక్తులచే స్వయంగా అభిషేకాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చెరుకుపల్లి: గ్రామ దేవత నెల్లెమ్మ తల్లి ఆలయ మొదటి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా శనివారం ఆరుంబాక గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవాని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ రావూరు నాగేశ్వరరావు, డేగల పాపారావు, రావూరి వెంకట సుబ్బయ్య దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పసుపు కుంకుమ గాజులు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కారెంపూడి: మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి రెండు రోజుల తిరునాళ్ల వైభవంగా జరుగుతోంది. రెండవ రోజు శనివారం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. బ్రహ్మంగారి గుడి ఆవరణలో ఉన్న శివపార్వతుల గుడిలో శివపార్వతుల కల్యాణాన్ని దంపతులు పీటలపై కూర్చుని జరిపించారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రికి ప్రభలు కట్టి స్వామి వారికి మొక్కులు చెల్లించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం వీరబ్రహ్మేంద్రస్వాములు గోవిందమాంబల కల్యాణాన్ని జరిపించారు. గ్రామస్తులు భారీగా తరలివచ్చి బ్రహ్మంగారికి గోవిందమాంబలకు పూజలు చేశారు. తెనాలి టౌన్: జాతీయస్థాయిలో ఉత్తమ సర్పంచ్గా అవార్డు పొందడం అభినందనీయమని ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ కొనియాడారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అభినందన సభలో నందివెలుగు సర్పంచ్ ధూళ్ళిపాళ్ల పవన్కుమార్, ఎంపీటీసీ తిన్నలూరి విజయలక్ష్మి, గ్రూప్–1 పరీక్షల్లో విజయం సాధించి డీఎస్పీగా ఉద్యోగం పొందిన నాగేశ్వరరావులను దుశ్శాలువా, పుష్పగుచ్ఛంతో అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అత్తోట దీప్తి, సీడీపీవో విజయగౌరి, డిప్యూటీ ఎంపీడీవో వైవిడి ప్రసాద్, మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. -
వైభవంగా మల్లేశ్వరుడి గ్రామోత్సవం
మంగళగిరిటౌన్: మంగళగిరి గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజులో భాగంగా ఉదయం స్వామివారికి పెళ్లికుమారుడి ఉత్సవం శోభాయమానంగా నిర్వహించారు. గణపతిపూజ, పంచామృత అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవ మూర్తిని పెళ్లి కుమారుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు. రాత్రి 7 గంటలకు మల్లేశ్వరుడి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామోత్సవంలో పెళ్లి కుమారుడిని దర్శించిన భక్తులకు పవిత్ర చేకూరి సకల శుభాలు అందుకుంటారనేది భక్తుల నమ్మకం. పట్టణానికి చెంది న జంజనం నాగేంద్రరావు, విజయలక్ష్మి దంపతు లు పెండ్లి కుమారునికి మధుపర్కాలు సమర్పించారు. కార్యక్రమ ఏర్పాట్లను దేవస్థాన కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించారు. -
చందాలిస్తే..సమస్యలు పరిష్కరిస్తాం
● ప్రభుత్వ ఆస్పత్రులు, వసతిగృహాలు, పాఠశాలలు, అంగన్వాడీలలో సమస్యల తిష్ట ● నిధులివ్వని చంద్రబాబు ప్రభుత్వం ● చందాల కోసం ‘బాపట్ల సేవా సేతు’ వెబ్సైట్ ● దాతలు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపు ● అధికారులకు దాతలను తెచ్చే బాధ్యత -
పచ్చ నేతల పైసా వసూల్!
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026చీరాల అర్బన్: పైసా వసూల్ పరమావధిగా పచ్చ నేతలు ముందుకు సాగుతున్నారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ అక్రమ వ్యాపారాలకు కొమ్ముకాస్తున్న కీలక నేత, యువనేతలు తాజాగా రామాపురంలో డబ్బుతో పేకాట ఆడేందుకు ఓ సొసైటీ నిర్వహకులతో మిలాఖత్ అయినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అందుకు కోర్టు అనుమతి ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం చేయాలని వారికి ఉచిత సలహా ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అందుకు ప్రతిగా నెలకు రూ.75లక్షలు తమకు గిఫ్ట్గా ఇవ్వాలని సూచించినట్లు చర్చించుకుంటున్నారు. అందుకు ప్రతిగా ఐజీతో మాట్లాడి పోలీస్ అనుమతి ఇప్పిస్తామని సొసైటీ నిర్వహకులకు యువనేత భరోసా ఇచ్చినట్లు రాజకీయ వర్గాలతో పాటు, విషయం తెలిసిన వారందరిలోను చర్చ నడుస్తోంది. అంతిమంగా నెలకు రూ.2కోట్లు అక్రమార్జనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రేషన్ మాఫియాతో మిలాఖత్.. నెలకు రూ.25 లక్షలు అక్రమార్జన ఒంగోలుకు చెందిన మాల్యాద్రి అనే వ్యక్తికి చీరాల నియోజకవర్గం నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేందుకు సహకరిస్తున్నారు. అందుకు మొదట నెలకు రూ.25లక్షలు కప్పం చెల్లించగా, తాజాగా తమకు నష్టాలు వచ్చాయని రూ.5 లక్షలు తగ్గించి రూ.20లక్షలు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలిసారి.. పందెం బరి! నియోజకవర్గంలో తొలిసారిగా బరులు పెట్టి కోడి పందేలు జరిపించారు. ఇది సరికొత్త జూదానికి తెరతీసినట్లయ్యింది. ఇక పందిళ్లపల్లి ఓ తోటలో కొంత కాలం కోత ముక్క ఆటకు అండగా నిలిచారు. అందుకు రోజుకు రూ.2.50 లక్షలు నజరానాగా పొందినట్లు ప్రచారం జరిగింది. బిట్టు బిట్టుకూ పర్సంటేజీ జిల్లాలో అత్యధిక అనధికారిక లేఅవుట్లు ఉన్న ప్రాంతాలలో చీరాల నియోజకవర్గం ఒకటి. ఈ క్రమంలో అనధికారిక లేఅవుట్లు వేసిన వారు ముందస్తుగా ఒక మొత్తం, తరువాత క్రయ,విక్రయాలకు సంబంధించి కీలక నేత, యువనేతలకు పర్సంటేజీలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించి పెద్ద మొత్తాలు జమవుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించటం అందుకు నిదర్శనమంటున్నారు. ఐజీ గారికి చెప్తాం.. అధైర్యపడొద్దు! తాజాగా రామాపురంలో ఓ సొసైటీ నిర్వహకులు డబ్బు పెట్టి పేకాట అడించేందుకు తమకు కోర్టు అనుమతి ఉందని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. అందుకు సంబంధించి పోలీస్ అనుమతి కోసం డీఎస్పీని కలసినట్లు తెలిసింది. అయితే ఆయన వారికి ఎలాంటి అనుమతి ఇవ్వబోమని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యువనేత సదరు సొసైటీ నిర్వహకులకు అధైర్య పడకండి, ఐజీ గారికి చెప్తాం. మీ పనులు మీరు చేసుకోండని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రామాపురంలో ఓ సొసైటీ నిర్వాహకులు తమ కార్యకలాపాలకు సిద్ధం చేసుకుంటున్న నిర్మాణంఓ సొసైటీ నిర్వహకులు రామాపురంలో డబ్బుతో పేకాట ఆడేందుకు అనుమతి ఇవ్వమని నన్ను కలిశారు. అనుమతి ఇవ్వబోమని చెప్పాం. ఇది మంచి సంస్కృతి కాదని చెప్పాను. వారు మాట్లాడే తీరుకు కొట్టినంత పనిచేశాం. వెళ్లిపోయారు. మాకు కోర్టు నుంచి ఎలాంటి డైరెక్షన్ అందలేదు. ఏదిఏమైనా జూద క్రీడలను ప్రోత్సహించేది లేదు. అలానే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే చర్యలను ఉపేక్షించం. – ఎండీ మొయిన్, డీఎస్పీ, చీరాల అక్రమ ఇసుక దందా చేసేవారికి కొమ్ముకాసేందుకు ఒక్కో ట్రాక్టరుకు(ట్రిప్పుకు) రూ.500 వసూలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కొండలు మాదిరిగా ఉన్న ఇసుక తిన్నెలు కరిగిపోతుండటం అందుకు నిదర్శనం. చీరాల నియోజకవర్గంలో ఇసుక తవ్వకాలు, రవాణాకు అనుమతులు లేకున్నా రోజుకు సుమారు 400 ట్రిప్పుల ఇసుక అక్రమంగా తరలుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రాత్రిళ్లు మాత్రమే అక్రమ త్వకాలు, రవాణా జరుగుతోంది. అందుకు రమారమి రోజుకు రూ.2లక్షలు చొప్పున, నెలకు రూ.60లక్షలు నేతల ఖజానాకు జమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంబంధిత అధికారుల తనిఖీలు మొక్కుబడిగా ఉంటున్నాయనేది జనవాణి. అందుకు తిలాపాపం తలా పడికెడు అన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పేకాట ఆడించండి .. ఐజీ గారికి చెబుతామని ఓ సొసైటీ నిర్వాహకులకు టీడీపీ నేతల ఎర పోలీస్ అనుమతి ఇప్పించినందుకు నెలకు రూ.75 లక్షలు ఇవ్వాలని ఒప్పందం ముందు డెన్ తెరవండి.. డబ్బు నిదానంగా ఇవ్వచ్చులే అంటూ సన్నాయి నొక్కులు కోర్టు ఆర్డర్ ఉందనే ప్రచారం విస్తృతంగా చేయాలని ఉచిత సలహా రామాపురంలో ఓ సొసైటీ నిర్వాహకులు, కీలక నేత, యువనేత మధ్య పంచాయితీ అక్రమ ఆదాయం నెలకు రూ.2 కోట్లు రాబట్టే దిశగా పావులు -
పొలాలు ఇచ్చేందుకు అంగీకరించని రైతులు
గోవాడ(వేమూరు): మహా శివరాత్రి సందర్భంగా గోవాడలోని బాలకోటేశ్వరస్వామి ఆలయానికి వచ్చే వాహనాలు పార్కింగ్ చేసేందుకు తమ పొలాలు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. దీంతో దేవస్థానం అధికారులు, పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అమర్తలూరు మండలం గోవాడలోని బాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈనెల 13వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బాలకోటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో వస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వాహనాలను పార్కింగ్ చేసేందుకు ప్రతి ఏడాది రైతులు తమ పొలాలు ఇస్తుంటారు. ట్రాఫిక్ నియంత్రణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది. అయితే ఈ ఏడాది రైతులు తమ పొలాలు ఇచ్చేందుకు అంగీకరించలేదు. తహసీల్దారు నెహ్రుబాబు, చుండూరు సీఐ, ఆనందరావు, ఎంపీడీవో మారుతి శేషాంబలు శుక్రవారం వాహనాలు పార్కింగ్ చేసేందుకు స్థలం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. రైతులు పొలాలు ఇచ్చేందుకు అంగీకరించలేదు. అధికారులలో అయో మయం నెలకొంది. ట్రాఫిక్ నియంత్రణ గురించి పోలీసు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రైతులు పొలాలు ఇస్తే ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా నిర్వహించి, భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడటం జరుగుతుందని పోలీసులు పేర్కొంటున్నారు. రైతులు పొలాలు ఇవ్వకపోతే ట్రాఫిక్ నియంత్రణ చేయడం కష్టంగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. రైతులు పొలాలు ఇచ్చి సహకరిస్తే మహాశివరాత్రి ఎలాంటి సమస్యలు లేకుండా జరుగుతుందని, రైతులు పూర్తిగా సహకరించాలని అధికారులు కోరుతున్నారు. తిరునాళ్ల సమయంలో ట్రాక్టర్లు తిప్పడంతో పంట దెబ్బతిని నష్టపోతున్నామని రైతులు పేర్కొంటున్నారు. -
వెంకటసుబ్రహ్మణ్యానికి జీవన సాఫల్య పురస్కారం
పెదకాకాని: గుంటూరు విశ్వనాథ సాహిత్య అకాడమీ దశమ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ కూచిపూడి నాట్య గురువు, సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకుడు డాక్టర్ కాజ వెంకట సుబ్రహ్మణ్యంకు విశ్వనాథ సాహిత్య అకాడమీ జీవన సాఫల్య పురస్కారం అందించారు. వీవీఐటీయూ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. మండల పరిధిలోని నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, అకాడమీ చైర్మన్ డాక్టర్ మద్దినేని సింహకౌటిల్య చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుబ్రహ్మణ్యం దంపతులను చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ సత్కరించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి బృందం ప్రదర్శించిన కూడిపూడి నృత్యనాటకం భక్తప్రహ్లాద ప్రేక్షకులను అలరించింది. అకాడమీ కార్యదర్శి మోదుగుల రవికృష్ణ. సభ్యులు పి.సత్యనారాయణరాజు, భూసురుపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఇది రాజకీయమా .. కవ్వింపా..!
రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న చీరాల టీడీపీ శ్రేణులు చీరాల అర్బన్(చీరాల): చీరాల టీడీపీ నేతలు దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారు. అది రాజకీయమా..లేక కవ్వింపా అని చీరాల గడియార స్తంభం సెంటర్లో శుక్రవారం జరిగిన ఘటన చూసి అక్కడి జనాలు ఇలా వ్యాఖ్యానించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం సర్కిల్ వద్ద ఎలాంటి ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయకూడదని గతంలో మున్సిపల్ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం టీడీపీ శ్రేణులు వైఎస్సార్ సర్కిల్ వద్ద టీడీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు అక్కడికి చేరారు. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించి సమీపంలో ఉన్న వీరరాఘవస్వామి దేవస్థానం వద్ద ఉంచారు. అయితే టీడీపీ శ్రేణులు పోలీసుల సాక్షిగా తిరిగి ఆ ఫ్లెక్సీని తిరిగి వైఎస్సార్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం విమర్శలకు తావిచ్చింది. దీనిపై వైఎస్సార్ సీపీ శ్రేణులు పోలీసులను ప్రశ్నించే క్రమంలో పోలీసులు, వైఎస్సార్ సీపీ శ్రేణులను అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి పంపించారు. వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి వారు బయటకు రాకుండా పహారా ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీకి సంబంధించిన ర్యాలీలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య గడియార స్తంభం సెంటర్లో మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీ ముందుకు సాగింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులు బయటకు వచ్చి గడియార స్తంభం సెంటర్లో ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదని సీబీఐ, సిట్ పేర్కొందన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు దానిని మభ్యపెట్టేందుకు నెయ్యిలో రసాయనాలు కలిశాయని కొత్త పాటకు తెరలేపారన్నారు. కవ్వింపు చర్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కేసులో సంబంధం లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీలు వేయడం దారుణమన్నారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ఫ్లెక్సీలు వేసి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఫ్లెక్సీ వ్యవహారంలో గుంటూరు సంఘటనలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన సంఘటన మరువకముందే చీరాలలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారన్నారు. టీడీపీ చేపట్టిన ర్యాలీ ఇదే మార్గంలో రావడంతో ఎమ్మెల్యే మెప్పు కోసం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న చీరాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే అప్పటికప్పడు ఫ్లెక్సీ వేశారని ఆరోపించారు. అభివృద్ధి పనులపై దృష్టి సారించకుండా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. టీడీపీ నీచ రాజకీయాలకు చరమగీతం పాడాలని నినాదాలు చేశారు. వైఎస్సార్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసి ఫ్లెక్సీని తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని మానవహారంగా ఏర్పడ్డారు. దీంతో పోలీసులు మనుషులను పెట్టి ఆ ఫ్లెక్సీని తొలగించారు. మొత్తం మీద ఉద్రిక్తతల అనంతరం ప్రశాంత వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు వాసిమళ్ళ వాసు, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు చీమకుర్తి బాలకృష్ణ, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు గోసాల అశోక్, కౌన్సిలర్లు బత్తుల అనిల్, కంపా అరుణ్, గుంటూరు ప్రభాకరరావు, పార్టీ నాయకులు చెల్లి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆందోళనతో ఫ్లెక్సీని తొలగించడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే, కవ్వింపు చర్యలను ప్రజలు చూస్తూన్నారని, తాము చట్టపరంగా, ధర్మబద్ధంగా, న్యాయపరంగా మాత్రమే అడుగులు వేస్తామని పేర్కొన్నారు. అంతిమంగా పరిస్థితులు మితిమీరితే తాము కూడా అదే తీరున స్పందించటంలో ఏమాత్రం వెనకాడబోమని పేర్కొన్నారు. సదరు టీడీపీ ఫ్లెక్సీ ఏర్పాటులో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి కీలక పాత్ర పోషించటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలో సదరు ఉద్యోగి ఫ్లెక్సీ ఏర్పాటుకు ఫ్లెక్సీని పట్టుకున్న సమయంలో ఫొటోలు తీస్తున్న ఓ పత్రికా విలేకరిని నువ్వెవరు ఫొటోలు, వీడియోలు తీయడానికంటూ.. రుబాబుగా ప్రశ్నించటం కూడా విమర్శలకు తావిచ్చింది. -
ఆకతాయి చేష్టలతో ‘బాంబు’ కలకలం
లక్ష్మీపురం: గుంటూరు వైద్య కళాశాలలో జరుగుతున్న ఎగ్జిబిషన్లో ఫీడ్బ్యాక్ బోర్డుపై గుర్తు తెలియని యువకుడు శుక్రవారం అల్లాహు అక్బర్ భూమ్ అని రాసి బాక్స్లో వేయడంతో బాంబు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయి ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎగ్జిబిషన్కు పలువురు విద్యార్థులు వస్తున్నారు. వారి ఫీడ్బ్యాక్ కోసం బోర్డు ఏర్పాటు చేశారు. శుక్రవారం విజయవాడలోని నాగార్జున నర్సింగ్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు వచ్చారు. ఫీడ్ బ్యాక్ బోర్డు వారిలో ప్రదీప్ సాహిత్య అనే యువకుడు ఇలా రాశాడు. బాంబు బెదిరింపు అనుకుని ఎగ్జిబిషన్ను కొద్దిసేపు నిలిపి వేశారు. నగరంపాలెం పోలీసులకు సమాచారం అందడంతో ఎవరినీ లోనికి అనుమతించలేదు. ఓ యూట్యూబ్ చానల్కు చెందిన యువకుడు దీని గురించి అడిగి, బాంబు కలకలం అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. క్లూస్ టీమ్, బాంబ్ స్క్వాడ్ కళాశాల ప్రాంగణం అంతా పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైరల్ అవ్వాలనే ఇలా చేసినట్లు చెప్పిన విద్యార్థి ప్రదీప్ సాహిత్యను మందలించి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సొంత పూచీకత్తుపై పంపించేశారు. నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కోసం స్లిప్ రాసిన విద్యార్థి -
అంకితభావంతో పనిచేసినప్పుడే గుర్తింపు
జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: అంకితభావంతో పనిచేసినప్పుడే పోలీసులకు సరైన గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న వార్షిక మొబలైజేషన్ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ముగింపు సందర్భంగా జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో క్యాంప్ ఫైర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ నిత్యం ఉండే పని ఒత్తిడిని పక్కన పెట్టి, సిబ్బంది కొద్దిసేపు ఆహ్లాదకరంగా గడిపేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పునశ్చరణ చేసుకోవడానికి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇది ఒక మంచి వేదికన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ నిరంతర ప్రక్రియని, ప్రజల విశ్వాసాన్ని పొందడమే పోలీస్ వ్యవస్థకు అసలైన పునాదని పేర్కొన్నారు. జిల్లాలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలీస్ సిబ్బంది ప్రజా సేవకుడిగా పనిచేస్తూ వారి మన్ననలు పొందాలని వివరించారు. మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమం ముగింపులో భాగంగా ఎస్పీ క్యాంప్ ఫైర్ను వెలిగించి వేడుకలను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్, సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్ పాల్గొన్నారు. -
ఆలయ పునఃప్రతిష్ట అదృష్టంగా భావించాం
బాపట్ల: బాపట్లలోని క్షీరభావన్నారాయణస్వామి దేవాలయాన్ని పునఃప్రతిష్ట చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. దేవాలయ పునఃప్రతిష్ట సందర్భంగా చేపట్టిన పనులు, సేకరించిన నిధులకు సంబంధించిన లెక్కల ఆడిట్ రిపోర్టును మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, అప్పటి పునరుద్ధరణ కమిటీ సభ్యులతో కలసి శుక్రవారం విడుదల చేశారు. కోన మాట్లాడుతూ భావదేవున్ని ఊరేగింపునకు కాగడాల్లో నూనె కూడా లేని పరిస్థితి బాధ కలిగించినట్లు తన తండ్రి కోన ప్రభాకరరావు అప్పట్లో దీక్షితులు రచించిన భావదేవుని చరిత్ర పుస్తకంలో ముందు మాటగా రాశారని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దేవాలయాన్ని పునఃప్రతిష్ట చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమానికి అప్పటి అర్బన్ బ్యాంకు చైర్మన్ కొల్లిమర్ల సత్యనారాయణను కమిటీ అధ్యక్షులుగా ముందుకెళ్లామని చెప్పారు. ఆయన మరణంతో లెక్కలకు సంబంధించి కొద్దిపాటి ఆలస్యం జరిగిందని వివరించారు. రూ.40 నుంచి రూ.50 లక్షలలోపు విరాళాలు వస్తాయని, ఆ మేరకు పనులు పూర్తి చేద్దామని మొదలుపెట్టగా రూ.2.34 కోట్లు వరకు విరాళాలు రావడం సంతోషకరమన్నారు. స్వామివారికి వెండి, బంగారాన్ని రూ.1.11కోట్లతో కొనుగోలు చేయగా వాటి విలువ ప్రస్తుతం రూ.నాలుగు కోట్లకు పెరిగిందన్నారు. వీటితోపాటు తనకు వచ్చిన 13 వెండి కిరీటాలు, వెండి తోడుగు వంటివి తాను స్వయంగా చేయించానని చెప్పారు. ఆలయానికి దీర్ఘకాలిక ఆదాయాన్ని సమకూర్చేందుకు మాకర్లపూడి రామాంజనేయ కూటమిని అభివృద్ధి చేశామని, నెలకు రూ.2లక్షలు వరకు ఆదాయం వచ్చేవిధంగా ఏర్పాటు చేశామని చెప్పారు.పాతబస్టాండ్లోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయానికి రూ.15లక్షలు ఇవ్వటం జరిగిందన్నారు. రెండు ధ్వజస్తంభాలు కొత్తవి ఏర్పాటు చేశామని చెప్పారు. గాలిగోపురం నిర్మాణానికి అధికారులు తనతో టెంకాయలు కొట్టించారని, ఆ స్వామి ఆ పనులను మాతో చేయించుకోవటం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. వీటికి సంబంధించిన పూర్తి లెక్కలను అడిట్ చేయించామని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు చేజర్ల నారాయణరెడ్డి, వక్కలగడ్డ శ్రీనివాసరావు, రామకృష్ణ భరధ్వాజ్, గురువులు తదితరులు పాల్గొన్నారు. -
భారత్ రంగ్ మహోత్సవం ప్రారంభం
ఐదురోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు నగరంపాలెం(గుంటూరు వెస్ట్): నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా–వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్, అంతర్జాతీయ నాటక ఉత్సవం శుక్రవారం గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు నేతృత్వంలో ఐదురోజులు కొనసాగనున్న ఈ ఉత్సవాలను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రతినిధి లీలాశర్మ, బెంగళూరు ప్రతినిధి వీణాశర్మ, ఏఎన్యూ థియేటర్ ఆర్ట్స్ డైరెక్టర్ నాగభూషణం, ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి రామచంద్రరాజు, నాటకరంగ ప్రముఖుడు కందిమళ్ళ సాంబశివరావు, నటుడు గోపీనాయుడు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా లీలాశర్మ మాట్లాడుతూ నాటకం కేవలం వినోద సాధనం మాత్రమేకాదని, సమాజాన్ని ప్రశ్నించే శక్తిమంతమైన మాధ్యమమని చెప్పారు. విశ్వవిద్యాలయ స్థాయిలో థియేటర్ ఆర్ట్స్కు లభిస్తున్న ప్రాధాన్యతను ఏఎన్యూ థియేటర్ ఆర్ట్స్ డైరెక్టర్ నాగభూషణం వివరించారు. అనంతరం కోరస్ రిపెర్టరీ థియేటర్ (మణిపురి) ఆధ్వర్యంలో కనుప్రియ నాటకాన్ని ప్రదర్శించారు. అంతకుముందు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. గుంటూరు, నరసరావుపేట, యడ్లపాడు నుంచి వచ్చిన విద్యార్థినుల సంప్రదాయ నృత్యాలు, కోలాటం, నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. -
స్టేషన్లో ప్రత్యక్షమైన బాలికలు
వేటపాలెం: నెల్లూరు హోం నుంచి పారిపోయి వచ్చిన ముగ్గురు బాలికలు వేటపాలెం పోలీస్స్టేషన్లో ఉన్నట్లు ఎస్సై పి.జనార్దన్ శుక్రవారం తెలిపారు. ముగ్గురు బాలికలు మధ్యాహ్నం వేటపాలెం బైపాస్ రోడ్డులో తిరుగుతుండగా పోలీసులు కంట పడ్డారని తెలిపారు. బాలికలను విచారించగా కట్ట జ్యోతి (కావలి), గందల చందన (నెల్లూరు), గురుశి మిఽథున్ (నెల్లూరు)గా చెప్పినట్లు ఎస్సై తెలిపారు. వీరు ముగ్గురు నెల్లూరు హోం నుంచి పారిపోయి ఇక్కడకి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం వేటపాలెం పోలీస్ వారి సంరక్షణలో ఉన్నట్లు వివరించారు. వివరాలకు 9121102141, 912102143 నంబర్లను సంప్రదించాలని తెలియజేశారు. -
గనులు భూగర్భశాఖలో ఏసీబీ సోదాలు
ఒంగోలుసిటీ:ఒంగోలులోని గనులు, భూగర్భజలా ల (మైన్స్ అండ్ జియాలజీ) శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ ఆసిఫ్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు అందిన సమాచారం ఆధారంగా అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం స్థానిక మంగమూరు రోడ్డు వేద రెసిడెన్సీలోని కార్యాలయంలో సోదాలు చేపట్టిన ఏసీబీ బృందం ఆసిఫ్ను అదుపులోకి తీసుకుని విజయవాడకుతరలించింది. ఆసిఫ్ది మార్కాపురం కాగా కనిగిరిలో వివాహం చేసుకుని ప్రస్తుతం విజయవాడలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఆయన గతంలో కడప, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పనిచేశారు. ఏడాదిగా ఒంగోలు డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. నెల్లూరులో పనిచేస్తుండగా ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి పక్కా సమాచారం అందిన నేపథ్యంలో నెల్లూరు ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. ఆసిఫ్ నివాసం విజయవాడలో ఉండటంతో అక్కడి స్వగృహంతోపాటు మార్కాపురం, కనిగిరి, నెల్లూరు, గుంటూరుల్లోని బంధువుల ఇళ్లల్లో కూడా ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాల్లో అతని అక్రమ ఆస్తులకు సంబంధించి వివిధ డాక్యు మెంట్స్ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారు లు తెలిపారు. అక్రమ ఆస్తు ల్లో రెండు ఇళ్లు, ఒక ఇంటి స్థలం, 22ఎకరాల వ్యవసా య భూమి, రూ.2,82,264 నగదు, సుమారు 620 గ్రాముల బంగారం, సుమా రు 500 గ్రాముల వెండి, రూ.3,54,000 ల ప్రాంసరీనోట్లు, 16 చేతిగడియారాలు, ఒక మోటారు సైకిల్, విలువైన గృహోపకరణాలు ఉన్నట్లు తెలిపారు. ఇవికాక అసిఫ్ హెచ్డీఎఫ్సీ ఇన్సూరెన్స్లో రూ.15 లక్షలతో పాలసీలు తీసుకొన్నట్లు చెప్పారు. టొయోటా హై రైడర్ కారు కొనడానికి రూ.20 వేలు అడ్వాన్స్గా ఇచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సోదాల్లో ఒక లాకర్ను గుర్తించారు. సోదాల అనంతరం సర్వేయర్ను అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్నట్లు చెప్పారు.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సర్వేయర్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు -
సందడిగా విజ్ఞాన్ మహోత్సవ్
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి 19వ ఎడిషన్ విజ్ఞాన్ మహోత్సవ్ కార్యక్రమం రెండో రోజు శుక్రవారం సందడి సందడిగా సాగింది. విజ్ఞాన మహోత్సవ్లో భాగంగా నిర్వహిస్తున్న పోటీల్లో విద్యార్థులు నువ్వా–నేనా అన్న రీతిలో పోటీ పడ్డారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం (చాంపియన్ మూవీ) మాట్లాడుతూ నటుడిగా ఎదగాలంటే భాషపై పట్టు అవసరమని, మంచి నటుడిగా మారాలంటే భాషలో నైపుణ్యం పెంపొందించుకోవాలని విద్యార్థు లకు సూచించారు. మంచి విమర్శలను అంగీకరించడం ద్వారా మాత్రమే వ్యక్తి ఎదుగుదల సాధ్యమని వివరించారు. జీవితాన్ని, పుస్తకాలను, సినిమాలను గమనిస్తే అనేక మంచి ఆలోచనలు వస్తాయన్నారు. భవిష్యత్తులో ఇంట్లో కూర్చొని కూడా ‘అవతార్’ తరహా సినిమాలను రూపొందించే స్థాయికి సాంకేతికత ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు -
ఆ ఫ్లెక్సీలు తొలగించండి. వైఎస్సార్సీపీ నిరసన
చీరాల: బాపట్ల జిల్లాలోని చీరాలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ టీడీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. టీడీపీ కట్టిన ఫ్లెక్సీలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిరసన చేపట్టింది. దీనిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలను తొలగించేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు యత్నించాయి. అయితే టీడీపీ కట్టిన ఫ్లెక్సీల వద్దకు వెళ్లకుండా పోలీసుల అడ్డుకున్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలను తొలగించాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు బైఠాయించాయి. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. -
శాంతి భద్రతల పరిరక్షణలో ఏఆర్ విభాగం కీలకపాత్ర
●సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని విధులు నిర్వర్తించాలి ●డీ మొబిలైజేషన్ ముగింపు సమావేశంలో జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: శాంతిభద్రతల పరిరక్షణలో ఏఆర్ పోలీస్ విభాగం పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా సాయుధ బలగాలకు నిర్వహించిన మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ వృత్తిపరమైన, వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తూ పోలీసుశాఖ ప్రతిష్ట మరింత పెరిగేలా సాయుధ బలగాల పనితీరు ఉండాలన్నారు. తొలుత పరేడ్ పరిశీలన వాహనంలో వెళ్లి పోలీసు బలగాల ప్లటూన్లను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్, బ్యాండ్ ప్రదర్శన చక్కగా ప్రదర్శించారన్నారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ ఏఆర్ సిబ్బంది విధుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రతి సంవత్సరం మొబిలైజేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. సాధారణ బందోబస్తు విధుల నుంచి శాంతిభద్రతల సమస్యల పరిరక్షణ వరకు ఏఆర్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. సిబ్బందికి ఎవరికి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే సత్వర పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే సిబ్బందికి సబ్సిడీ ధరలకే నిత్యావసర సరుకులు, వస్తువులు అందించేందుకు బాపట్లలో త్వరలోనే పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ● అదేవిధంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహన చోదకులకు హెల్మెట్ ధరించాలని చెప్పేముందు పోలీసు సిబ్బంది సైతం హెల్మెట్ ధరించి, వారికి మార్గదర్శకులుగా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులు, సిబ్బందిని, పరేడ్ కమాండర్ అడ్మిన్ ఆర్ఐ షేక్ మౌలుద్దీన్లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఇన్చార్జ్ డీఎస్పీ (సీసీఎస్ డీఎస్పీ) పి.జగదీష్ నాయక్, జిల్లాలోని సీఐలు, ఏఆర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వారాహి దేవస్థానంలో కోటి కుంకుమార్చన
తెనాలి: కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో కొలువైన వారాహి దేవస్థానంలో ఈనెల 11–15 తేదీల్లో జరగనున్న అమ్మవారికి కోటి కుంకుమార్చనలో ప్రజలందరూ పాల్గొనాలని పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామి) సూచించారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠంలో గురువారం కోటి కుంకుమార్చన ఆహ్వాన పత్రికను బాలస్వామీజీ ఆవిష్కరించారు. 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 15వ తేదీ మధ్యాహ్నం వరకు కుంకుమార్చన జరుగుతుందని తెలిపారు. ఆహ్వానపత్రిక ఆవిష్కరణలో యోగ గురువు ముద్దాభక్తుని రమణయ్య, వీ–ఫర్నిచర్ మాల్ అధినేత వక్కలగడ్డ రామమోహనరావు, తుంగల శ్రీనివాస్, వారాహి అమ్మవారి దేవస్థానం వ్యవస్థాపకులు తన్నీరు శ్రీనివాసబాబు, సంగీత టీచర్ పోతూరి వెంకట ఆదిలక్ష్మి, పెనుగొండ ప్రమీలరాణి, గోపు ప్రభారాణి, కోట లక్ష్మీకుమారి, ముద్దాభక్తుని సామ్రాజ్యం, వరలక్ష్మి, లక్ష్మి, సువర్ధ తదితరులు పాల్గొన్నారు. భట్టిప్రోలు: భట్టిప్రోలు మండలం గొరిగపూడిలోని ఓ ప్రైవేట్ గోడౌన్ పై విజిలెన్స్, పౌర సరఫరాల అధికారులు బుధవారం రాత్రి దాడి చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 450 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రేపల్లె సీఎస్డీటీ ఓంకార్ తెలిపారు. వీటిని అక్రమంగా నిల్వ చేసిన నాగ మల్లేశ్వరరావు, శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గుంటూరుఎడ్యుకేషన్: జేకేసీ కళాశాల రోడ్డు లోని జాగర్లమూడి చంద్రమౌళి న్యాయ కళాశాలలో (జేసీ లా) ఈ నెల 7, 8వ తేదీల్లో 5వ జాతీయస్థాయి మూట్ కోర్టు పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల కార్యదర్శి వేమన కుప్పుస్వామి తెలిపారు. గురువారం జేసీ లా కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ సుధాకర్ బాబుతో కలిసి పోటీలకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించారు. జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న మూట్ కోర్టు పోటీలకు దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల నుంచి 32 కళాశాలల విద్యార్థులు టీంలుగా పాల్గొంటున్నారని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రామకృష్ణప్రసాద్ పోటీలను ప్రారంభించనుండగా, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి ముగింపు కార్యక్రమానికి హాజరవుతున్నట్లు చెప్పారు. పోటీలకు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారని తెలిపారు. తాడికొండ: ఈనెల 7వ తేదీన క్వాంటం వ్యాలీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా గురువారం ఉద్దండరాయునిపాలెం వద్ద జరగనున్న కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆహ్వానితులు అందరూ మధ్యాహ్నం 1.30 గంటలకు సభాస్థలకిక చేరుకోవాలని, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, పలు అంశాలపై సంబంధిత అధికారులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
కడలి వెంట కాసుల వేట
మత్స్యకారులు ఆందోళనకు దిగకుండా... మత్స్యకారుల నుంచి ఆందోళనలు రాకుండా ముందస్తుగా వారికి చీరాల బడాబాబు పలు హామీలు ఇచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగా గ్రామం నుంచి సముద్రపు క్రీకు వరకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇక మురుగుకాలువ వద్ద జెట్టీ నిర్మాణం జరుగుతుందని కూడా నమ్మబలికినట్లు మత్స్యకారులు సంభాషించుకుంటున్నారు. అలానే గ్రామ ఉమ్మడి అవసరాలకు కూడా కొంత మొత్తం చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రాంతంలో జెట్టీ ఏర్పాటుకు సంబంఽధించి మత్స్యశాఖ పరంగా ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవటం గమనార్హం. అధికారులు ఏం చేస్తున్నారో! అధికారులకు తెలియకుండా ఏ అంశానికి సంబంధించి కూడా సంబంధీకులు అడుగులు వేయరనేది ఈ ప్రాంత నానుడి. ముందస్తుగా సమాచారం తెలిసినా మిన్నకుంటారు. ఫిర్యాదులు అందినా పరిశీలిస్తామంటారు. అందుకు వారిని తగిన రీతిలో సంతృప్తి పరుస్తారనేది బహిరంగ రహస్యమంటున్నారు. ఈ క్రమంలో అక్రమార్కులు తమ పనిని పూర్తి చేసుకుంటారు. కొద్ది రోజులు పాలపొంగు లాంటి ఆందోళనలు, వాటిపై రాజకీయ, అధికార అండ అనే నీళ్లతో ఆ ఆందోళనల పొంగును చల్లబరుస్తారు. క్రమేణా ప్రజలు ఆ విషయాలను మర్చిపోతారు. అంతిమంగా భావి తరాలకు అందాల్సిన సహజ వనరులు కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో పారదర్శకత, దార్శనికత అనే పెద్ద, పెద్ద మాటలను పదే,పదే ఉపయోగించే చంద్రబాబు దృష్టికి ఇలాంటి అంశాలు వెళ్లవా అని ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతిమంగా ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. సముద్రంలో వాలు కలిసే చోట అడ్డుకట్ట వేస్తే, సముద్రం వెంటే సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో తీరప్రాంతం ఖాళీగా ఉంటుంది. దీన్ని ప్రస్తుతం ఎవరైతే కొనుగోలు, విక్రయాలు జరుపుకుంటున్నారో వారు ఆ 50 ఎకరాల ప్రదేశాన్ని కూడా తమ స్థలంలో కలుపుకునేందుకు (కబ్జా) అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ మనుషులుగా గుర్తింపు పొందిన వ్యక్తులు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విక్రయించే భూమిలో చీరాల బడాబాబు గతంలో కొంత ప్రభుత్వ భూమిని కూడా కలుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు సంబంధించి సంబంధిత అధికారులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసి క్రమబద్ధీకరించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పూర్వ రికార్డులు పరిశీలిస్తే కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విషయం తెలిసిన వారంటున్నారు. -
అంతర్జాతీయ షూటింగ్ బాల్ పోటీల్లో బాపట్ల విద్యార్థికి స్వర్ణం
కర్లపాలెం: బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెం గ్రామానికి చెందిన పిట్టు అనూరాధ రెడ్డి ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం సాధించింది. ఏట్రవారిపాలెం గ్రామానికి చెందిన పిట్టు అనూరాధరెడ్డి గుంటూరు జిల్లా తెనాలి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ డిగ్రీ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈనెల 1వ తేదీ నుంచి 3వరకు జవహర్లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొని విజయం సాధించి బంగారు పతకం కై వసం చేసుకుందని బాపట్ల జిల్లా షూటింగ్ బాల్ కార్యదర్శి నాగలక్ష్మి తెలిపారు. బంగారుపతకం సాధించి గురువారం రాత్రి బాపట్ల వచ్చిన అనూరాధ రెడ్డిని ఏట్రవారిపాలెం గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి, శ్రీనివాసరెడ్డి దంపతులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికి శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. బంగారు పతకం సాధించిన అనూరాధ రెడ్డిని పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు. -
అంబటి కుటుంబానికి పరామర్శ
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా కన్వీనర్ జయప్రకాష్ (జేపీ), ఉంగుటూరు కన్వీనర్ పప్పుల శ్రీనివాసరావు, నూజివీడు కన్వీనర్ మేకా ప్రతాప్ అప్పారావులు గురువారం పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంబటి ఇంటిపై, కార్యాలయంపై దాడికి వ్యూహరచన చేసిన టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త రామచంద్రరావులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా విధ్వంసం సృష్టిస్తే పార్టీ శ్రేణులు భయపడతాయని అనుకోవడం టీటీపీ నేతల అవివేకం అన్నారు. అంబటి కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం ధ్వంసమైన కార్యాలయాన్ని పరిశీలించారు. రాంబాబు ఇంటిని కాపు సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. -
కేఎల్యూకు పురస్కారాలు
తాడేపల్లి రూరల్ :వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీకి గ్రీన్ ఉర్జా మరియు ఎనర్జీ ఎఫిషియెన్సీ గోల్డ్ అవార్డులు వచ్చాయని వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవీష్ గురువారం పేర్కొన్నారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, డెలాయిట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ గ్రీన్ ఉర్జా మరియు ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డ్స్ కార్యక్రమంలో ఢిల్లీలో ఈ నెల 4వ తేదీన ఈ అవార్డులు ప్రదానం చేశారని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు వీటిని స్వీకరించారని తెలిపారు. -
మహిళలకు చదువే వజ్రాయుధం
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్బాపట్ల: డ్వాక్రా సంఘంలో ఉన్న ప్రతి మహిళ చదువుకోవడం ద్వారా వ్యక్తిగత అభివృద్ధితోపాటు కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. ఈతేరు గ్రామంలోని ఎంపీపీ పాఠశాల ఆవరణలో ఉన్న వయోజన విద్యా కేంద్రంలో వయోజన విద్యాశాఖ ద్వారా నిర్వహిస్తున్న అక్షర ఆంధ్రలో గురువారం నిర్వహించిన ‘అందరికీ విద్య మనందరిదీ బాధ్యత‘ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వలంటీర్ల ద్వారా సంఘంలో ఉన్న మహిళలకు చదువు చెప్పడంతోపాటు చదవడం, రాయడం నేర్పించాలని వారికి బుక్స్ను ఇంటికి పంపించాలన్నారు. మహిళలతో కలెక్టర్ స్నేహపూర్వకంగా మాట్లాడారు. చదువు ప్రాముఖ్యతను మహిళలకు కలెక్టర్ వివరించారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని మహిళలను కలెక్టర్ ప్రశ్నించగా తాగునీరు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు ఏర్పాటు చేయాలని కోరారు. మీరు చెప్పిన సమస్యలు పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ మారతమ్మ, డీఆర్డీఏ పీడీ సింగయ్య, తహసీల్దార్ షేక్ సలీమా, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీరాములు, వయోజన విద్యాశాఖ అధికారులు మధుసూదనరెడ్డి, మనోరంజన్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. పన్నుల వసూళ్లలో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి వాణిజ్య పన్నుల వసూళ్లలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులంతా సమష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. వాణిజ్య పన్నుల వసూలు ప్రక్రియపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లో గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన పన్నులు పెండింగ్ లేకుండా రావాలన్నారు. జీఎస్టీ పన్నుల రూపంలో బాపట్ల జిల్లా నుంచి రూ.35 కోట్లు వసూలు జరుగుతున్నాయన్నారు. జీఎస్టీ పన్నుల పెంపుదలకు ట్రేడ్ లైసెనన్స్ల జాబితాలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. జీఎస్టీ అరియర్స్ పన్నుల వసూలు పెండింగ్లో ఉండడంపై ఆరా తీశారు. ప్రతి నెలా జీఎస్టీ పన్నుల వసూలు లక్ష్యం, వాటి పురోగతిపై అధికారులతో సమీక్షిస్తామన్నారు. గ్రానైట్, అనుబంధ పరిశ్రమల నుంచి పన్ను ఎగవేతదారులను అరికట్టాలన్నారు. సమావేశంలో జిల్లా వాణిజ్య పన్నులశాఖ ఉప కమిషనర్ మురళీకృష్ణ, కమిటీలోని వివిధశాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పట్టణ ప్రాంతాలలో వెలువడే చెత్త, మురుగును పద్ధతి ప్రకారం తొలగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను అనుసరించి చెత్త తొలగింపుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణ, తొలగింపుపై మునిసిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యావరణ సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చీరాల పట్టణం నుంచి 35.7 టన్నుల చెత్త తొలగింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేకరించిన ఘన వ్యర్థాలను జిందాల్ ఫ్యాక్టరీకి పంపేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంతో అధికారులు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో కమిటీ కన్వీనర్ బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్రెడ్డి, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు, ప్రజారోగ్య శాఖ అధికారులు, రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణ భట్టు తదితరులు పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలి గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక న్యూ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ మాట్లాడారు. ఉద్యోగస్తుల డిప్యూటేషన్లు, ఓడీల వివరాలను ఈ ఆఫీసులో పొందుపరచాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ పి.గ్లోరియా, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, డీపీఓ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
యూజీ ఐదో సెమిస్టర్ ఫలితాలు విడుదల
పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేషన్ ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను గురువారం వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. ఏఎన్యూ పరిధిలో గత ఏడాది నవంబరులో జరిగిన అండర్ గ్రాడ్యుయేషన్ రెగ్యులర్ ఐదో సెమిస్టర్ పరీక్షలకు 6,991 మంది హాజరు అయ్యారని తెలిపారు. వారిలో 6,721 మంది ఉత్తీర్ణులు అయ్యారన్నారు. రీవాల్యూయేషన్కు ఈ నెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, యూజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో ఈ నెల 20వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. సబ్జెక్ట్కు ఫీజు రూ.1,640 కాగా, పర్సనల్ వెరిఫికేషన్ ఫీజు కూడా అంతేనని వివరించారు. వివరాలు వర్సిటీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. తాడికొండ: తుళ్ళూరు మండలం వెంకటపాలెంలో అస్సాంకు చెందిన కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామంలోని వాజ్పేయి విగ్రహం సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించారు. ఆధార్ కార్డు ప్రకారం అతడు అస్సాంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. జేబులో డ్రైవింగ్ లైసెన్సు కూడా ఉంది. రాజధాని భవన నిర్మాణ కూలీగా లేదా డ్రైవర్గా వచ్చి ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరుకు చెందిన మల్లవరపు జీవారత్నం (58) గత నెల 28వ తేదీన పేరేచర్ల నుంచి టెంట్ హౌస్ సామగ్రిని ఆటోలో తీసుకుని గుంటూరు వైపుగా వెళుతున్నాడు. ఈ క్రమంలో చిన్నపలకలూరు రైల్వే గేటు సమీపంలో ఆటో బోల్తా కొట్టింది. జీవరత్నంకు తీవ్రగాయాలు కాగా... స్థానికులు చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుని కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళగిరి టౌన్ : ఆంధ్రప్రదేశ్ పోలీస్ జీతాల ప్యాకేజీ కింద రూ. 1.11 కోట్ల బీమా క్లయిమ్ చెక్కును బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు గురువారం రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ గుంటూరు బ్రాంచ్ అధికారి సతీష్కుమార్ మాట్లాడుతూ పోలీస్ శాఖతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ఉద్యోగికి రూ. 1.11 కోట్ల వరకు బీమా రక్షణ కల్పించబడుతుందన్నారు. ఇటీవల ఏపీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న కీర్తి వెంకటరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలిపారు. ఆయన భార్య నన్నూరమ్మకు ఈ క్లయిమ్ మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేసినట్లు పేర్కొన్నారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో హరీష్కుమార్ గుప్తా చేతుల మీదుగా చెక్కును అధికారికంగా అందజేశామని పేర్కొన్నారు. బ్యాంకు గుంటూరు ప్రాంతీయ కార్యాలయ ఏజీఎం, రీజనల్ హెడ్ కిరణ్రెడ్డి, విజయవాడ ప్రాంతీయ కార్యాలయ డీజీఎం, రీజనల్ హెడ్ అనుపమ్ శ్రీవాత్సవ, హైదరాబాద్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వయిజర్ బ్రిగేడియర్ సంజయ్ కుమార్ ప్రసాద్ పాల్గొన్నారు. -
ఎంబుక్ లేకుండా నిధులు డ్రా?
● ప్రత్తిపాడు పంచాయతీలో అధికారుల నిర్వాకం ● విచారణకు ఆదేశించిన డీపీఓ ప్రత్తిపాడు: అధికారుల నిర్వాకంతో పంచాయతీ నిధులు గోల్మాల్ అయినట్లు తెలుస్తోంది. ఎం బుక్ లేకుండానే రూ. లక్షల్లో నిధులు డ్రా చేసి నిధులు కాజేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రత్తిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ రక్షిత మంచి నీటి చెరువుకు ఆయిల్ ఇంజిన్లు ద్వారా నీటిని పెట్టినట్లుగా లెక్కలు చూపుతూ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి జనవరిలో సుమారు రూ. 6 లక్షల వరకు డ్రా చేసినట్లుగా సమాచారం. వాస్తవంగా చెరువుకు నీరు పెడితే, ఆ సమయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యవేక్షించి, చెరువు నింపడం పూర్తయిన తరువాత ఎంబుక్ రికార్డు చేయాలి. ఆ తరువాతనే అధికారులు ఎంబుక్ ఆధారంగా గ్రామ పంచాయతీ నుంచి నిధులు డ్రా చేసుకోవాలి. కానీ అసలు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎంబుక్ చేయలేదని చెబుతుండగా, పంచాయతీ అధికారులు మాత్రం దర్జాగా డబ్బులు డ్రా చేసేశారు. ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో పంచాయతీ అధికారులు ఇరకాటంలో పడ్డారు. ఎంబుక్ కనిపించడం లేదని, ఎంబుక్ ఆడిట్ కార్యాలయంలో ఉందని, బీరువాల్లో దాచిపెట్టారని పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. ఎమ్మెల్యే దృష్టికి కూడా దీనిని కొందరు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వినీల్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఈ పనికి సంబంధించి ఎంబుక్ చేయలేదని స్పష్టం చేశారు. ఈవోపీఆర్డీ షేక్ ఆదంషఫీని వివరణ కోరగా ఎంబుక్ తాను కూడా చూడలేదని, ఆడిట్ కార్యాలయంలో ఉందని ఓ ఉద్యోగి చెప్పారని, వారు సంతకం చేయమంటే తాను చేశానని చెప్పారు. డీపీవో బి.వి.నాగసాయికుమార్ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి కూడా రావడంతో విచారణకు ఆదేశించామన్నారు. విచారణాధికారిగా డీఎల్పీవోను నియమించామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
గుండెపోటుతో ఏఎస్ఐ మృతి
బాపట్ల టౌన్: బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ కె.వెంకటరమణ గుండెపోటుతో మృతిచెందారు. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కె. వెంకటరమణ (57) ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తెనాలిలోని హరిత హాస్పిటల్లో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన భౌతిక దేహాన్ని పొన్నూరు మండలం, గాయంవారిపాలెంలోని వారి స్వగృహం నందు ఉంచగా, బాపట్ల సబ్ డివిజన్ ఇన్చార్జ్ డీఎస్పీ (సీసీఎస్ డీఎస్పీ) పి.జగదీష్ నాయక్, బాపట్ల పట్టణ సీఐ ఆర్.రాంబాబు, ఇతర పోలీసు అధికారులు, సహద్యోగులు సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటరమణ 1990 సంవత్సరంలో కానిస్టేబుల్గా పోలీస్ శాఖలోకి ప్రవేశించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించి ఏఎస్ఐగా పదోన్నతి పొంది ప్రస్తుతం బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మృతిచెందారన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్ఐ భౌతిక దేహానికి పోలీస్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మట్టి ఖర్చుల నిమిత్తం రూ. లక్ష నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం గాయంవారి పాలెం సమీపంలో గల స్మశాన వాటికలో పోలీస్ అధికార లాంఛనాలతో ఏఎస్ఐ మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
రైతులు పంట నమోదు చేసుకోవాలి
15వ తేదీలోపు జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల చెరుకుపల్లి: ప్రతి రైతు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా నూతనంగా ప్రవేశ పెట్టిన ఫార్మర్ యాప్లో పంట నమోదు చేసుకోవచ్చని బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల తెలిపారు. గురువారం మండలంలోని గూడవల్లి గ్రామంలో వ్యవసాయ అధికారులతో కలసి పంట నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులను అడిగి తెలుసుకున్నారు. విజయనిర్మల మాట్లాడుతూ ఈనెల 15వ తేదీలోపు తాము సాగు చేసిన వివిధ పంటలను వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా లేదా ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలని రైతులకు వివరించారు. అనంతరం ఫార్మర్ యాప్ను నమోదు చేసుకునే పద్ధతిని రైతులకు తెలిపారు. కార్యక్రమంలో రేపల్లె వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎ.లక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయ అధికారి డి.వెంకటరామయ్య, మండల వ్యవసాయ శాఖ అధికారి ఎండి.ఫరూఖ్, గూడవల్లి పీఏసీఎస్ అధ్యక్షుడు ఎ,నరేంద్ర, ఏఈవో రామకృష్ణ, వీఏఏ శివసాయి తేజ, గ్రామ అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. -
అసిస్టెంట్ మలేరియా అధికారులుగా పదోన్నతి
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం పరిఽధిలో ఎంపీహెచ్ఈఓలుగా పనిచేస్తున్న ఇరువురికి అసిస్టెంట్ మలేరియా అధికారులుగా (ఏఎంఓ) పదోన్నతి లభించింది. గురువారం గుంటూరులోని ఆర్డీ కార్యాలయంలోఉత్తర్యులు అందజేశారు. ఆరుగురికి హెడ్నర్సులుగా పదోన్నతి... ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్టాఫ్నర్సులుగా పనిచేస్తున్న ఆరుగురికి హెడ్నర్సులుగా పదోన్నతి ఇచ్చారు. వీరిలో గుంటూరు జీజీహెచ్కు నలుగురిని, నెల్లూరుకు ఇరువురిని ప్రమోషన్ ఇచ్చి బదిలీ చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆర్డీ డాక్టర్ జి.శోభారాణి, డెప్యూటీ డైరక్టర్ బెజ్జం పాల్ప్రభాకర్, ఆఫీస్ సూపరింటెండెంట్లు సత్యం, రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్స్ శ్రీకాంత్, గాబ్రియేల్ పాల్గొన్నారు. -
సముద్రంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
●విషాదంగా మారిన పుట్టినరోజు వేడుకలు ●గల్లంతైన విద్యార్థుల కోసం తీవ్రంగా గాలింపు చినగంజాం: పుట్టిన రోజును ఆనందంగా గడుపుదామనుకున్న నలుగురు స్నేహితుల ఆనందం చివరకు విషాదం మిగిల్చింది. స్నేహితుడు పుట్టిన రోజు నాడు సముద్రంలోకి సరదాగా వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ సంఘటన గురువారం చినగంజాం సముద్ర తీరంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల సమాచారం మేరకు..ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన నలుగురు స్నేహితులు చందలూరి శ్రీరామ్ (15), బిక్కి అవినాష్ (15), గుంజి హేమవర్థన్, తాటిపర్తి హేమంత సాయిలు స్నేహితుడు శ్రీరామ్ పుట్టినరోజును పురస్కరించుకొని సరదాగా సముద్రంలో స్నానం చేసేందుకు చినగంజాం మండలం పల్లెపాలెం పంచాయతీ బాపయ్యనగర్ సముద్ర తీరానికి వచ్చారు. వీరంతా దుద్దుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నలుగురు విద్యార్థులు ఆనందంగా సముద్రంలో గడుపుతున్న సమయంలో అలల తాకిడికి బిక్కి అవినాష్, చందలూరి శ్రీరామ్లు కన్పించకుండా సముద్రపు నీటిలో చిక్కుకొని గల్లంతయ్యారు. ఇద్దరు స్నేహితుల ఆచూకీ తెలియకపోవడంతో సముద్రం నుంచి బయటకు వచ్చిన హేమవర్ధన్, తాటిపర్తి హేమసాయిలు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు, ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్యలకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను విచారించి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. నలుగురు స్నేహితులు కలిసి చినగంజాం సముద్రతీరానికి ఒకే మోటారు బైక్పై వచ్చినట్లు ఘటన నుంచి బయటపడ్డ విద్యార్థులు తెలిపారు. గురువారం సాయంత్రం సంఘటనా స్థలానికి చేరుకున్న గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ఆచూకీ లభించక పోవడంతో శోక సముద్రంలో మునిగిపోయారు. వారు రోదిస్తున్న తీరు చూపరులను కలచి వేసింది. సముద్రంలో ప్రత్యేకంగా గాలింపు గల్లంతైన ఇద్దరు విద్యార్థుల కోసం అగ్నిమాపక సిబ్బంది, మైరెన్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది గాలించారు. ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య ఆధ్వర్యంలో స్థానికంగా ప్రత్యేక బోటు తెప్పించి సముద్రంలో ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. తీరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి బాగా పొద్దుపోయేంతవరకు గాలించినా ఫలితం లేదు. గాలింపు చర్యల్లో ఇంకొల్లు ఎస్సై జి.సురేష్, చినగంజాం పోలీస్ సిబ్బందితోపాటు మైరెన్ సీఐ రమేష్ బాబు, డీఎఫ్ఓ కె.వినయ్, చీరాల ఏడీఎఫ్ వీవీ రామకృష్ణ పాల్గొన్నారు. పేద కుటుంబాలకు చెందిన వారే.. నలుగురు విద్యార్థుల్లో చందలూరి శ్రీరామ్, బిక్కి అవినాష్, గుంజి హేమవర్ధన్ ఇంకొల్లు మండలంలోని దుద్దుకూరు గ్రామానికి చెందిన వారు కాగా తాటిపర్తి హేమంత్ సాయి రాచపూడి గ్రామానికి చెందిన వాడు. గల్లంతై వారిలో చందలూరి శ్రీరామ్ తండ్రి వాసు వ్యవసాయ కూలీ కాగా తల్లి సునీత ఒంగోలు ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తోంది. ఇతనికి ఒక సోదరుడు కాగా, మరో విద్యార్థి బిక్కి అవినాష్ తండ్రి అశోక్ వ్యవసాయ కూలీ, తల్లి అంజమ్మ గృహిణి, ఇతనికి ఒక సోదరి ఉంది. శ్రీరామ్ పుట్టిన రోజు పురస్కరించుకొని గురువారం పావులూరులోని ఆంజనేయస్వామి గుడికి వెళ్లి వచ్చారు. ఇంతలోనే కొడుకు గల్లంతు కావడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. గల్లంతయిన బిక్కి అవినాష్ (ఫైల్) గల్లంతైన చందలూరి శ్రీరామ్(ఫైల్) -
దళితులపై మారణకాండ ఆపాలి
గుంటూరు వెస్ట్: ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకుడు టి.ఎం. రమేషన్ దారుణ హత్యపై ప్రభుత్వం విచారణ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోందని రాష్ట్ర కో–కన్వీనర్ ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయడంలో పారదర్శకంగా వ్యవహరించడం లేదన్నారు. ఈ ఏడాది జనవరిలో కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, బొందిమడుగుల గ్రామానికి చెందిన రమేష్ను దారుణంగా కొట్టిచంపారన్నారు. దీనిని దళిత, ప్రజా సంఘాలు ఖండించాయని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. అనంతరం డీఆర్వో షేఖ్ ఖాజావలికి విజయ్ కుమార్, కారుమూరు బెర్నార్డ్ మాదిగ, ఎస్ప్రసాదరావు మాదిగ, కె.వీరబాబు మాదిగ వినతిపత్రం అందజేశారు. నిర్వహణకు కేంద్రాల ఏర్పాటు సిద్ధం చిలకలూరిపేటటౌన్: నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతి ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహిస్తున్నట్లు మద్దిరాల జేఎన్వీ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే ఈ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లాల పరిధిలో 2031 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరిలో 9వ తరగతికి 838 మంది, 11వ తరగతికి 1193 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా పరీక్షల నిర్వహణకు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసినట్లు వివరించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 10 గంటలకంటే ముందే చేరుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. హాజరయ్యే విద్యార్థులు తమ వెంట అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఈ రెండూ లేనిదే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదన్న విషయాన్ని అభ్యర్థులు, తల్లిదండ్రులు గ్రహించాలన్నారు. అడ్మిట్కార్డులో పొందు పరిచిన పరీక్ష కేంద్రం పేరు, చిరునామా, తేదీ, సమయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సరి చూసుకోవాలని తెలిపారు. అడ్మిట్ కార్డును ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడంలో ఏవైన ఇబ్బందులు, సందేహాలు ఉంటే నవోదయ ప్రిన్సిపాల్ సెల్ 9014307677, 9494676751 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. -
హత్యకేసు నిందితులను నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు
చీరాల: ఘోరమైన నేరాలకు పాల్పడేవారిని ఉపేక్షేంచేది లేదని వన్టౌన్ సీఐ ఎస్.సుబ్బారావు హెచ్చరించారు. చీరాల్లో ఇటీవల సంచలనం కలిగించిన యువకుడు కొండే త్రినాథ్ హత్య కేసులో ఐదుగురు నిందితులను వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితులను బుధవారం వన్టౌన్ పోలీస్స్టేషన్ నుంచి ఏరియా వైద్యశాల వరకు రోడ్డుపై నడిపించి ప్రజలకు హెచ్చరికగా చూపించారు. ఇటువంటి ఘోరమైన నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారిపై చట్టపరంగా శిక్షలు తప్పవని తెలిపారు. -
అనుమానాస్పదస్థితిలో బాలుడు మృతి
కారంచేడు: ఎప్పటిలానే అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన మూడు సంవత్సరాల బాలుడు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ అపస్మారకస్థితికి చేరుకుని ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. ఈ సంఘటనపై బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కారంచేడు ఎస్ఐ షేక్ ఖాదర్బాషా కేసు నమోదు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. కారంచేడు మండలం రంగప్పనా యుడువారిపాలెం పంచాయతీ శివారు గ్రామం నందిగుంటపాలేనికి చెందిన పల్లపోతుల రాంబాబు–సువార్త దంపతులకు 4 సంవత్సరాల దీపిక, 2 సంవత్సరాల మూడు నెలల రోహిత్ సంతానంగా ఉన్నారు. వీరు అదే ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్తుంటారు. బుధవారం ఉదయం కూడా వెళ్లగా, బాలుడు రోహిత్ మధ్యాహ్న సమయంలో ఏడుస్తుండగా తల్లి వచ్చి అంగన్వాడీ సిబ్బందిని అడిగింది. బయట ఆడుకుంటూ ఉన్న సమయంలో కాలి మడమ, చిటికెన వేలికు చిన్న ముల్లు గుచ్చుకుని ఉన్నట్లు గమనించి మందు రాశానని సిబ్బంది చెప్పారు. ఏడుపు ఆపకుండా ఉండటంతో పాటు అపస్మారకస్థితికి చేరుకున్న బాలుడిని వెంటనే చీరాల ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు మృతిచెందినట్లు తెలిపారు. బాలుడికి ఏమైనా పాము కరిసిందా, ఇంకై మైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ జరిపించాలని తండ్రి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని ఎస్ఐ ఖాదర్బాషా తెలిపారు. బాలుడి మృతితో నందిగుంటపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఒక్కగానొక్క కుమారుడు ఆకస్మికంగా మృతిచెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులచే కంటతడి పెట్టించింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు -
పిన్నెల్లిలో హింసను రూపుమాపేందుకు చర్యలు
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ జవహర్ నరసరావుపేట: పిన్నెల్లి ఘటనపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ బుధవారం మున్సిపల్ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ గ్రామ ప్రజలు శాంతిని బలంగా కోరుకుంటున్నారని, పోలీసులు, ప్రజ లు, అధికారుల సహకారంతో హింసను రూపు మాపేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు. ఎస్పీ బి.కష్ణారావు, డీఆర్వో నారదముని, ఆర్డీవో మురళీకృష్ణ, కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. సాల్మన్ హత్య బాధాకరం గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో జరిగిన మందా సాల్మన్ హత్య చాలా దురదృష్టకరం, బాధాకరమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కేఎస్.జవహర్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంఘటనలో దాడిచేసిన వారు, దాడికి గురైన వారు ఇరువురూ దళితులే అన్నారు. ప్రాణం పోయింది దళితుడిది కాబట్టి తమ కమిషన్కు బాధ్యత ఉందన్నారు. చాలా పారదర్శకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో నిజనిర్ధారణకు ఒక కమిటీని వేశామని, వీరు బాధితులతోపాటు మిగిలిన వారి నుంచి సమాచారం సేకరించి ఒక నివేదికను తయారుచేశారని చెప్పారు. ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగతమైన వివాదాల వలనే సంఘటన జరిగినట్లుగా నిజనిర్ధారణ కమిటీ నిర్ధారించిందన్నారు. ఇది ప్రేరేపితమైన సంఘటన కాదని, కేవలం యాధృచ్ఛికమైందన్నారు. తాడికొండ: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పనున్న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపనకు జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రద్యుమ్న, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాలు బుధవారం పరిశీలించారు. ఉద్దండరాయునిపాలెం వద్ద స్థల పరిశీలన చేసి పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఆర్టిజీఎస్ అధికారులు ప్రకార్ జైన్, గీతాంజలి శర్మ, రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి కోమలి పద్మ పాల్గొన్నారు. కొరిటెపాడు(గుంటూరు): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులోని శ్యామలానగర్లో గల రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరసన, వంట– వార్పు కార్యక్రమం ఏడవ రోజుకు చేరుకుంది. బుధవారం ఉమ్మడి శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పీఏసీఎస్ల ఉద్యోగులు పాల్గన్నారు. ప్లకార్డులు చేతబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించి, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు నిరసన, వంట వార్పు కార్యక్రమం, 13వ తేదీన కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయాల ముట్టడి, కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. అప్పటికీ ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకపోతే, 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల రాష్ట్ర నాయకులు తోట వెంకట రామయ్య, మువ్వా వెంకటేశ్వరరావు, బి.రఘురామ్, ఎస్.ఖాజామొహిద్దీన్, జీబీ రంగనాథ్, యెర్నేని పాపినాయుడు, ఎం.సత్యనారాయణ, పి.విజయభాస్కర్, పి.కృష్ణశాస్త్రి, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో అక్షర ఆంధ్రా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో అక్షర ఆంధ్రా క్రింద శిక్షణ పొందుతున్న వయోజనుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, రానున్న పరీక్షలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని సూచించారు. పటిష్ట పర్యవేక్షణ ఉండాలని, కేంద్రంలో అభ్యసిస్తున్న ప్రతీ ఒక్కరూ చక్కని చదవడం, రాయడం రావాలని ఆదేశించారు. అక్షర ఆంధ్రాలో గుంటూరు జిల్లా ఆదర్శంగా నిలవాలని సూచించారు. తమ కేంద్రంలో 140 మంది శిక్షణ పొందుతున్నారని, మండలంలో 4100 మంది అక్షర ఆంధ్రా కార్యక్రమంలో ఉన్నారని అక్షర ఆంధ్రా పర్యవేక్షకులు దాసరి వెంకటస్వామి వివరించారు. ప్రతి రోజూ సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నామని. డ్వాక్రా, ఉపాధి హామీ సభ్యులు ఇందులో అభ్యాసకులుగా, అక్షరాస్యులుగా ఉన్న సభ్యులు వాలంటీర్లుగా ఒక్కొక్కరు 10 మందికి బోధిస్తున్నారని చెప్పారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి కె శిల్ప పాల్గొన్నారు. -
యూనివర్సిటీ క్రీడాకారుల ఎంపిక
వేటపాలెం: సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో రెండు రోజులుగా జరుగుతున్న ఇంటర్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్ సెలక్షన్లు బుధవారం ముగిశాయని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్.లక్ష్మణరావు తెలిపారు. ఈ సెలక్షన్స్లో జేఎన్టీయూ పరిధిలోని 25 కళాశాలల్లో చదువుతన్న 175 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ కె.జగదీష్బాబు తెలిపారు. సెలక్షన్స్లో ఎంపికై న విద్యార్థులు యూనివర్సిటీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మహిళల కేటగిరీలో 57 కేజీల విభాగంలో పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒంగోలుకు చెందిన ఎం.కావ్య, 69 కేజీల విభాగంలో ఆర్వీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. చేబ్రోలుకు చెందిన ఎం.తేజశ్విని, 83 కేజీల విభాగంలో పి.వందన.. ఎస్వీఈసీ ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీ భీమవరం, బి.సృజన.. ఐడియా ఇన్స్టిట్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. యునివర్సిటీ టీం కింద ఎంపికై నట్లు తెలిపారు. పురుషుల కేటగిరీలో 83 కేజీల విభాగంలో పి.వివేక్ ఆర్అండ్డీ ఆర్హెచ్ఎస్ మిక్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, కంచికచర్ల, పి.భార్గవరామ్ ప్రియదర్శిని.. చింతలపూడి యునివర్సిటీ టీంలో ఎంపికై ట్లు వ్యాయామ ఉపాధ్యాయులు జేఎన్టీయూకే స్పోర్ట్స్ మెంబర్ అన్న శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో అక్రిడిటేషన్స్ డైరెక్టర్ సి.సుబ్బారావు, అడ్మినిస్టేషన్ డైరెక్టర్ వనా దోరనాగ సాయినాథ్, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఇళ్ల మధ్య నుంచి హైటెన్షన్ విద్యుత్లైన్
వేటపాలెం: దేశాయిపేట పంచాయతీ ఎస్సీ కాలనీ మధ్యలో నుంచి నూతనంగా నిర్మాణం చేపట్టిన 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ల నిర్మాణం పనులను కాలనీ వాసులు బుధవారం అడ్డగించారు. దేశాయిపేట సిలోన్ కాలనీ వద్దగల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నుంచి కొత్తగా 33 కేవీ విద్యుత్ లైన్ చల్లారెడ్డిపాలెం పంచాయతీ బైపాస్ రోడ్డు వద్ద గల సబ్ స్టేషన్ వద్దకు హైటెన్షన్ విద్యుత్ లైన్ నూతనంగా వేస్తున్నారు. సిలోన్ కాలనీ వద్దగల సబ్ స్టేషన్ నుంచి నూతనంగా కొత్త లైన్ గ్రామ పంచాయతీ వరకు ప్రధాన రహదారి పక్క నుంచి వేశారు. అక్కడ నుంచి గ్రామం, ఎస్సీ కాలనీ మీదుగా చల్లా రెడ్డిపాలెం సబ్స్టేషన్ వరకు నిర్మాణం జరగాల్సి ఉంది. రెండు నెలల క్రితం రెండు పర్యాయాలు కాలనీ నుంచి విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తున్న సమయంలో కాలనీ వాసులు అడ్డుకున్నారు. దీంతో అప్పడు తాత్కాలికంగా లైన్ నిర్మాణం నిలుపుదల చేశారు. బుధవారం తిరిగి విద్యుత్ లైన్ల నిర్మాణం కోసం విద్యుత్ సిబ్బంది ట్రాక్టర్ విద్యుత్ స్తంభాలు తీసుకొని రాగా కాలనీ మధ్య నుంచి లైన్ ఏర్పాటు చేయడాని వీల్లేదని అడ్డగించారు. సమాచారం అందుకున్న ఏడీఏ పెరుగు శ్రీనివాసరావు కాలనీకి వచ్చి కాలనీ వాసులతో మాట్లాడారు. అయితే కాలనీలో నివాసులు నివాస గృహాల మధ్యలో హైటెన్షన్ విద్యుత్ లైన్లు వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఇళ్ల మధ్య అధిక ఓల్టేజీ విద్యుత్ లైను వేయడానికి వీల్లేదని ఏడీఏ దృష్టికి తీసుకొచ్చారు. హైటెన్షన్ లైన్ని గ్రామ చివర నుంచి తరలించుకోవాలని కాలనీ వాసలు ఏడీఏని కోరారు. కాలనీలో కాకుండా గ్రామం చివరగా హైటెన్షన్ లైన్ డిజైన్ మార్చుకోవాలన్నారు. పనులు అడ్డగించిన దేశాయిపేట పంచాయతీ ఎస్సీ కాలనీ వాసులు ఎస్సీ కాలనీలో నివాసాలకు ఇబ్బంది లేకుండా లైన్ నిర్మాణం చేపడతాం. విద్యుత్ స్తంభాలు 30 అడుగుల ఎత్తులో ఉంటాయి. విద్యుత్ వైర్లు 30 అడుగుల ఎత్తులో వెళుతుంటాయి. ఇళ్లకు ఇబ్బంది లేకుండా చూస్తాం. – పెరుగు శ్రీనివాసరావు, ఏడీఏ, వేటపాలెం


