Bapatla
-
రైతు కుటుంబానికి పరామర్శ
జె.పంగులూరు: అప్పుల పాలై గత నెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువ రైతు తల్లపనేని శ్రీనాథ్ కుటుంబాన్ని ఆదివారం డీఎస్పీ మహ్మద్ మొయిన్, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు పరామర్శించారు. మృతికి గల కారణాలు అధికారులను, స్థానికుల నుంచి తెలుసుకున్నారు. గత సంవత్సరం 2.10 ఎకరాల పొగాకు, 2.50 ఎకరాల మిర్చి, 4.80 ఎకరాల మొక్కజొన్న సాగు చేసినట్లు తెలిపారు. పంటలు సరిగా పండక, దిగుబడులు రాక రూ. 18,68,437 వరకు శ్రీనాథ్ అప్పుల పాలైనట్లు చెప్పారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.6.50 లక్షలు, బ్యాంకుల నుంచి రూ. 11 లక్షలు అప్పులు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ గ్రామంలో ఇంటి స్థలం, ఇల్లు కట్టుకునేందుకు రుణాన్ని మంజూరు చేయించాల్సిందిగా అధికారులకు సూచించారు. వివరాలు ప్రభుత్వానికి పంపించి న్యాయం జరిగే విధంగా చూస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సింగారావు, ఎస్ఐ వినోద్బాబు, ఏఓ సుబ్బారెడ్డి, ఆర్ఐ శ్వేత, వీఆర్ఓలు పావని, చింపారావు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న అధికారులు రైతు తల్లపనేని శ్రీనాఽథ్ మృతికి గల కారణాలపై ఆరా ప్రభుత్వానికి ప్రతిపాదనలు -
ప్రపంచ శాంతే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి
చిలకలూరిపేట టౌన్: ప్రపంచ ప్రార్థనల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో భక్తి శోభ అలముకున్నది. ప్రతిరోజూ ఉదయాన్నే గత 49 రోజులుగా నిరంతరాయంగా ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం 50వ రోజుతో ఘనమైన ముగింపు పలికారు. ప్రత్యేక ప్రార్థనలతో ప్రపంచ ప్రార్థనల దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులు పాస్టర్ ఎంఎన్ మూర్తి (సూరిబాబు) అధ్యక్షతన జరిగిన ఈ ప్రార్థనల్లో నియోజకవర్గానికి చెందిన వివిధ క్రైస్తవ సంఘాల పాస్టర్లు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వశాంతి నెలకొనాలని, భారతదేశం ఐక్యంగా వర్ధిల్లాలని, శాంతి, భద్ర తల వాతావరణం నిరంతరం కొనసాగాలని వారు ప్రార్థించారు. దేశాభివృద్ధికి మానవీయ విలువలు అనుసరణీయమవ్వాలన్న ఆకాంక్షను ప్రార్థనల ద్వారా వెలిబుచ్చారు. ప్రార్థనలు ముగిశాక సంఘీభావానికి ప్రతీకగా ప్రేమవిందు ఏర్పాటు చేశారు. ప్రార్థనల్లో పాస్టర్లు ఎం.ఎన్. మూర్తి, ఎన్.థామస్, జి. బుజ్జి, బసికాపురం అబ్రహం, టి. క్రీస్తురాజు, ఎం. మోషే, ఎన్. అబ్రహం, బి. సుబ్బారావు, డి. జీవరత్నం, ఎన్. వసురాజు, పాల్సారఽథి, ఎస్. డేవిడ్, ఎస్. దావీదురాజు, విజయమేరీ నక్షత్రం, ఎం. జ్ఞానయ్య, సతీష్ కుమార్, ఎం. సంసోను, కె. శాంతిసాగర్, కోటి వీరయ్య, అన్నామణి, శారా, విజయ అనసూయ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ప్రపంచ ప్రార్థన దినోత్సవం నియోజకవర్గ దైవసేవకుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన గత 50 రోజులుగా ఉదయకాల ప్రార్థనలు -
ఘనంగా నటుడు గిరిబాబు జన్మదిన వేడుకలు
మేదరమెట్ల: ప్రముఖ సినీ నటుడు యర్రా గిరిబాబు 83వ జన్మదిన వేడుకలను ఆయన స్వగ్రామం రావినూతలలో కుమారుడు, ప్రముఖ సినీనటుడు రఘుబాబు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రఘుబాబు మాట్లాడుతూ సొంత గ్రామం అంటే తన తండ్రికి ఎంతో ఇష్టం అని చెప్పారు. గ్రామంలో చిన్న కార్యక్రమం చేస్తున్నా ఆయన తప్పక హాజరయ్యేవారని తెలిపారు. ప్రస్తుతం అనారోగ్య కారణాలవల్ల రాలేక పోయారని.. ఈనెలలో గ్రామానికి తప్పక వస్తారని రఘుబాబు తెలిపారు. పలువురు మాట్లాడుతూ మరెన్నో పుట్టిన రోజు వేడుకలను గిరిబాబు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పుట్టిన రోజు కేక్ను రఘుబాబు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కార్యక్రమంలో డాక్టర్ హృదయనాథ్, సీఐ మల్లికార్జునరావు, కొరిశపాడు ఎస్ఐ సురేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి
లక్ష్మీపురం: పొగాకు పండించి కొనేవారు లేక అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు శివశంకర్ వరప్రసాద్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, వారి కుటుంబానికి నివాస స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఏ ఆధారం లేని ఆ కుటుంబానికి స్వయం ఉపాధి కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరు జీజీహెచ్ మార్చురీ వద్ద మృతుడు శివశంకర్ వరప్రసాద్ కుటుంబాన్ని నేతాజీ, జిల్లా కమిటీ సభ్యులు వై.కృష్ణకాంత్లు కలిసి పరామర్శించి ఆత్మహత్యకుగల కారణాలు అడిగి తెలుసుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలతో పంట మీద వచ్చిన ఆదాయంతో స్థలం కొనుక్కుని ఇల్లు నిర్మాణం చేసుకోవాలని కౌలు రైతు శివశంకర్ అనుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఎకరానికి రూ.20వేలు కౌలు చొప్పున 11 ఎకరాలు కౌలుకి తీసుకుని పొగాకు పంట వేశారన్నారు. బ్యాంకులు అప్పు ఇవ్వకపోవడంతో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకుని పంట వేశారన్నారు. పండించిన పొగాకు కొనేవారు లేక అప్పులు తీర్చే పరిస్థితి కనబడకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతు అత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించి వారి కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబంలో ఒకరికి స్వయం ఉపాధికి అవకాశం కల్పించాలని, నివాసం కోసం స్థలం కేటాయించి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.10లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి : కౌలు రైతు సంఘం డిమాండ్ అప్పుల బాధ తాళలేక, గిట్టుబాటు ధరలేక ప్రత్తిపాడు మండలం పెద్ద గొట్టిపాడు చెందిన పొగాకు కౌలు రైతు కావూరి శివశంకర వరప్రసాద్ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వం స్పందించి వారి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.రామకృష్ణ, కె.నాగమల్లేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావులు ఆదివారం ఒక ప్రకటలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వెంటనే పొగాకు కొనుగోలు చేయాలని, ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన కౌలు రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షలు పరిహారం చెల్లించాలని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న పొగాకు కౌలు రైతు మృతదేహానికి నివాళి -
బాపట్ల క్రీడాకారులకు బహుమతులు
బాపట్ల: రాష్ట్రస్థాయి 12వ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బాపట్లకు చెందిన క్రీడాకారులకు బహుతులు దక్కాయి. మే 31 నుంచి జూన్ రెండో తేదీ వరకు జరిగిన పోటీల్లో 74 కేజీల విభాగంలో షేక్ నజీర్ 260కేజీల బరువును ఎత్తి ద్వితీయ స్థానంతో సిల్వర్ మెడల్ సాధించారు. 65కేజీల విభాగంలో బత్తుల సాంబశివరావు 265కేజీల బరువును ఎత్తి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నారు. ఇద్దరూ కర్ణాటకలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బాపట్లలో పలువురు క్రీడాకారులను అభినందించారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి పట్నంబజారు: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదైంది. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌత్రా సెంటర్లో నివాసం ఉండే కొనగండ్ల మోహన వెంకటకృష్ణ (56) ఈనెల 7వ తేదీ సాయంత్రం ఇంటి ముందు ఉన్న పిచ్చి మొక్కలు తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగ తగలడంతో షాక్కు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పదస్థితిలోవ్యక్తి మృతి నకరికల్లు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన నకరికల్లులోని ఇనిమెట్ల రోడ్డులో ఆదివారం జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన చందా మీరావలి(38) నకరికల్లులోని ఇనిమెట్ల రోడ్డులో గల మద్యం దుకాణం వద్ద అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఐ చల్లా సురేష్, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడు కొన్నిరోజులుగా మద్యం మత్తులో తిరుగుతున్నాడని, ఆదివారం కూడా తాగేందుకు నకరికల్లు వచ్చినట్లు సమాచారం. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు. -
మెకానిక్ ముసుగులో ద్విచక్ర వాహనాలు చోరీ
గుంటూరు రూరల్: చెడు వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బు సంపాదించేదుకు చోరీలను పాల్పడుతున్న ఇరువురిని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం అడవి తక్కెళ్ళపాడులోని నల్లపాడు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశఽంలో సౌత్ జోన్ డీఎస్పీ భానోదయ తెలిపిన వివరాల ప్రకారం గోరంట్ల గ్రామానికి చెందిన పరిమిశెట్టి లక్ష్మణ్ ఆటోడ్రైవర్గా పనిచేస్తుంటాడు. అతనికి పాతగుంటూరుకు చెందిన పాత నేరస్తుడు బైక్ మెకానిక్గా పనిచేసే చల్లా అంజిబాబు పరిచయమయ్యాడు. దీంతో ఇరువురు కలిసి సులువుగా డబ్బు సంపాదించేందుకు ద్విచక్ర వాహనాలను చోరీ చేయడం ప్రారంభించారు. ఇరువురు పాత నేరస్తులే.. గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రులు, పార్కులు, ఇతర రద్దీగా ఉండే ప్రదేశాల్లో పార్కింగ్ చేసే వాహనాలను, తాళాలు వేయని వాహనాలను గుర్తించి చోరీలకు పాల్పడేవారు. ఈక్రమంలో ఈనెల 1వ తేదీన గోరంట్ల ఇన్నర్ రింగ్రోడ్డులోని విజయశ్రీ ఆసుపత్రి సమీపంలో రోడ్డుపై పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని ఇరువురు చోరీ చేశారు. బాధితుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు నల్లపాడు సీఐ వంశీధర్ కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను ఆదవారం నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా నిందితులు చేసిన నేరాలను ఒప్పకున్నారు. నిందితులు 2012 నుంచి నేర ప్రవృత్తిని కలిగి ఉన్నారని విచారణలో తేలిందన్నారు. నిందితుల వద్దనుంచి రూ.13లక్షల విలువ చేసే 22 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు ఛేదించటంలో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్ఐ జనార్దన్, సిబ్బంది సుబ్బారావు, మస్తాన్వలి, నూరుల్ల, బిక్షునాయక్, సాంబశివరావులను జిల్లా ఎస్పీ అభినందించారు. నిందితులను కోర్టుకు అప్పగించారు. బెక్ చోరీల కేసులో ఇద్దరు అరెస్టు 22 వాహనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ భానోదయ -
తాడేపల్లిలో రామ్రాజ్ షోరూం ప్రారంభం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని జాతీయ రహదారి పక్కనే ఆదివారం రామ్రాజ్ కాటన్ షోరూంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వహిందూ పరిషత్ జాతీయ ధర్మకర్త, పారిశ్రామికవేత్త డాక్టర్ పుట్టగుంట వెంకట సతీష్కుమార్ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని గుర్తు చేస్తూ రామ్రాజ్ కాటన్ దుస్తులు ఉత్పత్తి చేయడం చాలా ఆనందించ దగ్గ విషయమని, నాణ్యతా ప్రమాణాల్లో ఎంతో శ్రద్ధ తీసుకుంటుందని, మన తాడేపల్లిలో ఇలాంటి షోరూం ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయ దొంతిరెడ్డి వేమారెడ్డి (డీవీఆర్), శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.ఎస్.రామారావు, బక్షి మోటార్స్ ల్యాండ్ లార్డ్ సత్ప్రీత్ సింగ్ లాంబా, రామ్రాజ్ కాటన్ వ్యవస్థాపకులు కె.ఆర్.నాగరాజన్ పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలు ఢీ : వ్యక్తి మృతి ముగ్గురికి గాయాలు దుగ్గిరాల: ఎదురెదురుగా వస్తున్న ద్వి చక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఆదివారం చిలువూరు దగ్గర సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమర్తలూరు మండలం, ప్యాపర్రు గ్రామానికి చెందిన కొల్లూరి వీరాంజనేయులు(35) గుంటూరులో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. గుంటూరు వెళ్లి తిరిగి వస్తుండగా దుగ్గిరాల మండలం చిలువూరు వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొంది. ఘటనలో వీరాంజనేయులు తలకు తీవ్ర గాయమై, రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్పై తీవ్రంగా గాయపడిన రాయపూడి డేవిడ్ను చికిత్స నిమిత్తం ఎయిమ్స్కు, మరో ఇద్దరు క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని మంగళగిరి ఎయిమ్స్కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శ్రష్టి వర్మపై ‘మా’ అధ్యక్షుడికి ఫిర్యాదు లక్ష్మీపురం: దేశ స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసిన దేశ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు షేక్ కరీం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. గుంటూరు నగరంలోని శనివారం జరిగిన కన్నప్ప ప్రీ రిలీజ్ కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి విచ్చేసిన మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసిన కరీం ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ సినీ కొరియోగ్రాఫర్గా ఉన్న శ్రష్టి వర్మ జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూలను కించపరుస్తూ మాట్లాడారన్నారు. స్టార్ హీరోలను సైతం కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న ఆయన పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంచు విష్ణు విచారించి, ఏడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. -
ప్రహరీ కూలి మహిళ దుర్మరణం
చీరాల రూరల్: ప్రహరీ కూలి మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం చీరాల మరియమ్మపేటలో చోటు చేసుకుంది. అందిన వివరాల మేరకు.. ఆండ్ర ఆనందరావు, రోజ్మేరీ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఆదివారం సుమారు 11:30 గంటల సమయంలో మేళం హనుమంతరావు తన ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నాడు. పక్కనే నివాసముంటున్న ఆండ్ర ఆనందరావు, రోజ్మేరీలు ప్రహరీ పక్కన ఉన్న తమ సామాన్లు సర్దుకుంటున్నారు. ఇంతలోనే పక్కనే ఉన్న ప్రహరీ అకస్మాత్తుగా భారీ శబ్దంతో కూలిపోయింది. పక్కనే ఉన్న రోజ్మేరీ గోడకింద పడటంతో మృతి చెందింది. ఆమె భర్త ఆనందరావుకు తల పగిలి, కాలుకు గాయాలయ్యాయి. స్థానికులు శిథిలాలను తొలగించి ఇద్దరినీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోజ్మేరీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి భర్త ఆనందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ నాగభూషణం తెలిపారు. రోజ్ మేరీ మృతితో మరియమ్మపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో ఎంతో కలివిడిగా ఉండే ఆమె మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు -
దుర్గమ్మ సన్నిధిలో భారీ రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల సన్నిధికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పెద్దఎత్తున తరలివచ్చి ఆదిదంపతులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. తెల్లవారుజాము ఆరు గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఆలయంలోని అన్ని క్యూలైన్లలో రద్దీ కనిపించింది. ఆదిదంపతులైన దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 10–30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా రూ. 500 టికెట్ల విక్రయాలను నిలిపివేసి, రూ.300 టికెట్ల ద్వారా బంగారు వాకిలి దర్శనం కల్పించారు. మరో వైపున రూ.100, సర్వ దర్శనం క్యూలైన్లలోనూ భక్తుల రద్దీ కనిపించింది. సర్వదర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. ఉదయం 11–30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. అమ్మవారి సన్నిధిలో సూర్యోపాసన సేవ లోక కళ్యాణార్థం సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ భక్తులు సూర్యభగవానుడికి విశేష పూజలు చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ జరిగింది. సేవలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు రూ. 300 క్యూలైన్ ద్వారా ప్రత్యేక దర్శనం కల్పించారు. ఆలయ సిబ్బందిపై భక్తుడి దాడి గాలిగోపురం వద్ద ఉన్న స్కానింగ్ పాయింట్ వద్ద ఓ భక్తుడు ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. భక్తుల రద్దీ నేపథ్యంలో దేవస్థానం రూ. 500 టికెట్లు, వీఐపీ దర్శనాలు నిలిపివేసింది. అయితే, ఓ భక్తుడు ఘాట్రోడ్డు మీదుగా ఆలయానికి చేరుకునే సమయంలో రూ. 500 టికెట్లు కావాలని అడిగాడు. అయితే ఈవో ఆదేశాల మేరకు మధ్యాహ్నం 1–30 గంట వరకు వీఐపీ దర్శనాలు నిలిపి వేసినట్లు సిబ్బంది సమాధానమిచ్చారు. దీంతో గాలిగోపురం వద్దకు చేరుకున్న భక్తుడు అక్కడి సెక్యూరిటీ గార్డుతో గొడవకు దిగడమే కాకుండా ఆలయ అధికారులు, సిబ్బందిని నోటికి వచ్చినట్లు దూషించసాగాడు. ఇదేమిటని అడిగిన వన్టౌన్ కానిస్టేబుల్ను సైతం నెట్టి వేయడంతో వివాదం మరింత పెరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు భక్తుడు సెక్యూరిటీ గార్డు, ఆలయ సిబ్బందిపై దాడి చేయడంతో వారు వెంటనే అతన్ని అవుట్పోస్ట్కు తరలించారు. సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు సదరు భక్తుడిని వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆదివారం రికార్డు స్థాయిలో దర్శనాలు -
నమ్మించి నయవంచన
● మాన్యువల్ కౌన్సెలింగ్పై మాట తప్పిన విద్యాశాఖామంత్రి లోకేష్ ● వెబ్ కౌన్సెలింగ్ వద్దు.. ఉపాధ్యాయులతో పెట్టుకుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తాం ● ఉపాధ్యాయుల ముట్టడితో దద్దరిల్లిన ప్రకాశం భవన్ ● వందలాదిగా తరలివచ్చిన ఉపాధ్యాయులు ● రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఒంగోలు సిటీ: ఎస్జీటీ, పండిట్లు, పీఈటీల బదిలీలను మాన్యువల్ విధానంలో నిర్వహిస్తామని మాట ఇచ్చిన విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ నమ్మించి మోసం చేశారని, యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. వెబ్ కౌన్సెలింగ్కు వ్యతిరేకంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు ఆదివారం ప్రకాశం జిల్లా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉపాధ్యాయులు కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా గేట్లు వేశారు. ఉపాధ్యాయులను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వాకా జనార్దనరెడ్డి అధ్యక్షత వహించారు. కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులతో పెట్టుకుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తామని హెచ్చరించారు. ఇది చరిత్రలో రుజువైన సత్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 13,777 ఎస్జీటీలకుగాను 177 మంది మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. వారు కూడా అధికారుల ఒత్తిడి వల్లే దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వం అత్యంత హేయంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విద్యాశాఖామంత్రి నారా లోకేష్ జరిపిన చర్చల్లో ఎస్జీటీలకు మాన్యువల్గా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నమ్మించి మాట తప్పిన ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు ఎప్పటికీ మాన్యువల్ కౌన్సెలింగే కావాలని, వెబ్ కౌన్సెలింగ్ వద్దని తేల్చి చెప్పారు. అయితే మాన్యువల్ కౌన్సెలింగ్ సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారని, జిల్లా స్థాయిలో డీఈఓ, ఎంఈఓలకు వెబ్ కౌన్సెలింగ్కు సంబంధించిన ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్జేడీ చెబుతున్నారని తెలిపారు. ఒక్కొక్కరూ ఎన్ని ఆప్షన్లు అయినా పెట్టుకోవచ్చని నమ్మబలుకుతున్నారని, దీనిని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు ఎవరూ వెబ్ ఆప్షన్ పెట్టుకోవద్దని సూచించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎస్జీటీ, పీఈటీ, పండిట్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సీనియారిటీ జాబితాలో ఉన్న లోపాలను సరిచేసి ఫైనల్ జాబితా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ రాష్ట్ర ప్రతినిధి చల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వెబ్ కౌన్సెలింగ్ వల్ల ఉపాధ్యాయులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీయూఎస్ రాష్ట్ర ప్రతినిధి శ్రావణ్కుమార్ మాట్లాడుతూ నాయకులతో చర్చించాలని కోరారు. ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర కార్యదర్శి కె.వి.జి.కీర్తి మాట్లాడుతూ ఉద్యమం బలంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. బీటీఏ రాష్ట్ర ప్రతినిధి పర్రె వెంకటరావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల సమస్య పరిష్కారం కోసం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నాయకులు షేక్ అబ్దుల్ హై, వీరాంజనేయులు, రవి, కె.ఎర్రయ్య, బి.వెంకటరావు, లక్ష్మీనారాయణ, డి.శ్రీనివాసులు, దిలీప్కుమార్, మాధవరావు, వై.వెంకటరావు, హిమజ, పులి శ్రీను, ఎన్. అంజిరెడ్డి, పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం డీఈఓ కిరణ్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. -
సోమవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2025
అద్దంకి నియోజకవర్గం జె.పంగులూరు మండలం జనకవరానికి చెందిన రైతు తల్లపనేని శ్రీనాథ్ అప్పుల బాధతో మే నెల 23వ తేదీ రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనాథ్ కరోనా ముందువరకు బళ్లారిలో కౌలు వ్యవసాయం చేశారు. అక్కడ అప్పులు అధికమై సొంత గ్రామం జనకవరం వచ్చారు. పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. గత ఏడాది 7 ఎకరాల్లో నల్లబర్లీ, జూట్, శనగ సాగు చేశారు. మూడు పంటలను కొనేవారు లేకుండా పోయారు. రూ. 30 లక్షల వరకు అప్పులయ్యాయి. రుణాలు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక తనకున్న 2.14 ఎకరాల భూమిని అమ్మేశారు. అయినా అప్పులు తీరే పరిస్థితి లేకపోవడంతో మే నెల 23వ తేదీ రాత్రి పొలానికి వెళ్లిన శ్రీనాథ్ అక్కడే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణంతో కుటుంబం రోడ్డున పడింది. ఇంకొల్లు మండలం దుద్దుకూరు అంబేడ్కర్ నగర్కు చెందిన రైతు బిల్లా శాంసన్ 30 ఎకరాలకుపైగా కౌలుకు తీసుకొని బ్లాక్ బర్లీ, మిర్చి, శనగ పంటలు సాగు చేశారు. ఇందుకోసం బ్యాంకుల్లో బంగారం తాకట్టుపెట్టి కొంత, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద మరికొంత అప్పులు తెచ్చారు. ఈ సంవత్సరం పండించిన పంటలు కొనేవారు లేకుండా పోయారు. అప్పులు తీర్చలేనన్న ఆందోళనతో శాంసన్ మే నెల 9 వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమయానికి బంధువులు చూసి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. పర్చూరు మండలం వీరన్నపాలెంకు చెందిన ఉప్పుటూరు సాంబశివరావు ఎకరా రూ.40 వేలు చొప్పున 5 ఎకరాలు కౌలుకు తీసుకొని పొగాకు సాగు చేశారు. సుమారు రూ. 8 లక్షలు అప్పులు తెచ్చారు. పంట చేతికొచ్చి నెల దాటుతున్నా కొనేందుకు కంపెనీలు ముందుకు రాలేదు. పైగా క్వింటాల్ రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు మించి వచ్చే పరిస్థితి లేదు. ఈ ధరతో పొగాకు అమ్మినా ఖర్చులు కూడా రావు. ఇప్పటికే రూ. 15 లక్షలకుపైగా ఉన్న అప్పులు తీర్చే పరిస్థితి కాన రాలేదు. నిస్సహాయ స్థితిలో సాంబశివరావు మే నెల 6 వ తేదీన ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య యశోద, ఇంటర్ చదివే కూతురు, పది చదివిన కుమారుడు దిక్కులేని వారయ్యారు. కుటుంబం రోడ్డున పడింది. న్యూస్రీల్ -
ఏపీ ఈఏపీసెట్లో విద్యార్థుల ప్రతిభ
గుంటూరు ఎడ్యుకేషన్: కాకినాడ జేఎన్టీయూ ఆదివారం ప్రకటించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఫలితాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత నెల 18 నుంచి 27వ తేదీ వరకు జరిగిన ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్) ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో గుంటూరు నగరానికి చెందిన తెలగతోటి విక్రమ్ లెవీ 6వ ర్యాంకు కై వసం చేసుకున్నాడు. గుంటూరులోని భాష్యం ఐఐటీ–జేఈఈ అకాడమీలో చదివిన విక్రమ్ లెవీ టెన్త్, ఇంటర్మీడియెట్ స్థానికంగానే చదివాడు. విద్యార్థి తండ్రి పిచ్చయ్య విజ్ఞాన్ యూనివర్సిటీలో సీఎస్ఈ విభాగ ప్రొఫెసర్ కాగా.. తల్లి ఇవాంజిలిన్ విజయవాడలోని మేరీ స్టెల్లా కళాశాలలో అధ్యాపకురాలు. విక్రమ్ లెవీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ను ఎంపిక చేసుకున్నాడు. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్లో జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 146వ ర్యాంకు కై వసం చేసుకున్న విక్రమ్ లెవీ ముంబై ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో చేరేందుకు ఆప్షన్ నమోదు చేసుకున్నాడు. స్టార్టప్ కంపెనీ ప్రారంభించడమే లక్ష్యం అని కోరిక వెలిబుచ్చాడు. ఇంజినీరింగ్ టాప్–100లోపు ర్యాంకర్లు వీరే గుంటూరులోని వేంకటేశ్వరకాలనీకి చెందిన అంబటి నోషిక్ సాయి 25వ ర్యాంకు, నరసరావుపేట విద్యార్థి కల్లూరి శ్రీరాఘవ – 46, గుంటూరు ముత్యాలరెడ్డి నగర్కు చెందిన విన్నకోట మహేష్ చంద్ర – 56, తెనాలికి చెందిన నల్లా శాన్వి సాయి వీర – 67, తాడేపల్లికి చెందిన గుమ్మడిదల హేమంత్ సాయిరామ్ – 76, గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయి మనోజ్ఞ – 98, చందులూరి నాగవెంకట నీరజ్ – 99, గుంటూరు రూరల్ గొర్లవారిపాలెంకు చెందిన నల్లపనేని సుజిత్ 100వ ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో... అగ్రికల్చర్, ఫార్మసీ టాప్–100 ర్యాంకర్లలో గుంటూరు కొత్తపేటకు చెందిన పసుపులేటి రుద్ర శ్రీ గణేష్ 15వ ర్యాంకు, సత్తెనపల్లికి చెందిన కటకం ఏకేఎన్ హరి కిరణ్ –16, గుంటూరు కొరిటెపాడుకు చెందిన ఉమా శంకర్ తారిక శ్రీ – 28, అమరావతి రోడ్డుకు చెందిన కారుమంచి విక్రాంత్ –32, గుజ్జనగుండ్లకు చెందిన ఉప్పాల రూపశ్రీ – 40, కొలకలూరుకు చెందిన గుమ్మడిదల తేజాస్ – 54, చంద్రమౌళీనగర్కు చెందిన వేముల అన్విత్ చేతన్ – 67, శ్రీనగర్కు చెందిన ఓగిబెయిన సుష్మ కౌస్తుభరాణి – 96, పొన్నూరుకు చెందిన కూరాకుల శ్రీరామ్ యాదవ్ – 97, గుంటూరు విజయపురికాలనీకి చెందిన గుంటుపల్లి శ్రీలేఖ 110వ ర్యాంకు సాధించారు. -
గుంటూరు రైల్వేస్టేషన్లో తనిఖీలు
లక్ష్మీపురం: రైళ్లలో గంజాయి, మద్యం అక్రమంగా సరఫరా చేస్తే చట్ట పరమైన చర్యలు తీవ్రతరంగా ఉంటాయని రైల్వే జీఆర్పీ సీఐ అంజిబాబు, ఆర్పీఎఫ్ సీఐ వీరాబాబు అన్నారు. గుంటూరు రైల్వేస్టేషన్లో ఆదివారం గుంటూరు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు ఆదేశాల మేరకు జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా రైల్వే స్టేషన్లోని ప్రయాణికుల సామగ్రిని డాగ్ స్క్వాడ్ ద్వారా తనిఖీ చేశారు. ప్రయాణికులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ గంజాయి, మద్యం అక్రమంగా సరఫరా చేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైలులో ప్రయాణించే సమయంలో రైల్వే స్టేషన్లలో అనుమానితులు ఉన్నట్లు ఉంటే జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం తెలియజేయాలని కోరారు. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. తనిఖీలు చేసిన వారిలో జీఆర్పీ ఎస్ఐలు లక్ష్మీనారాయణరెడ్డి, మహిళా ఎస్ఐ దీపికా, జ్యోతి, ఆర్పీఎఫ్ సిబ్బంది శంకరరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శివాలయం ఉద్యోగి సస్పెన్షన్ పెదకాకాని: శివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎన్ఎంఆర్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్ధానంలో కొన్ని సంవత్సరాలుగా ఇల్లా ప్రదీప్కుమార్ ఎన్ఎంఆర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగు రోజుల కిందట మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఆలయ అధికారికి ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం ప్రదీప్ కుమార్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ కావడంతో ఆదివారం అతడ్ని శాశ్వతంగా విధుల నుంచి తొలగించినట్లు డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. నిత్య అన్నదానానికి విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలు అందచేశారు. హైదరాబాద్వాసి వి.బాలాజి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన ఇ.ఏడుకొండలు కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం వారికి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. బాలాత్రిపురసుందరికి బంగారు ఆభరణాలు కూచిపూడి(మొవ్వ): కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కేంద్రీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యుడు డాక్టర్ పసుమర్తి రామలింగ శాస్త్రి, పద్మ దంపతులు (హైదరాబాద్–కూచిపూడి) నాట్యాచార్యుల ఇలవేల్పైన శ్రీ బాలాత్రిపురసుందరి అమ్మవారికి బంగారు ఆభరణాలను ఆదివారం అందజేశారు. దేవాలయ పాలకమండలి ఉపాధ్యక్షుడు పసుమర్తి నారాయణమూర్తి.. అర్చకులు పెనుమూడి సుబ్రహ్మణ్యశాస్త్రికి ఎనిమిది లక్షల రూపాయలు విలువైన రెండు హారాలను, శ్రీ దాసాంజనేయ స్వామికి రూ. 38 వేల విలువైన 108 వెండి తమలపాకుల మాలను అందజేశారు. ఈ సందర్భంగా హారాలను అమ్మవారికి అలంకరింపజేసి పూజా కార్యక్రమాలు చేశారు. -
రైతుల పాలిట పాషాణ కూటమి
● కూటమి ప్రభుత్వం వచ్చాక పంటలకు మద్దతు ధర కరువు ● వరి పండినా గిట్టుబాటు ధరకు కొనని కూటమి సర్కారు ● మిర్చి, పొగాకు, శనగ, మినుము, కంది పంటలకూ అదే పరిస్థితి ● లాభాల మాట దేవుడెరుగు.. కనీసం పెట్టుబడి కూడా రాని దుస్థితి ● అప్పులు అధికమై బలవన్మరణాలకు పాల్పడుతున్న అన్నదాతలు ● పాలకులు స్పందించకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతులుసాక్షి ప్రతినిధి, బాపట్ల: వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పంటలకు గిట్టుబాటు ధర లభించడంతో రైతులకు ఇబ్బంది ఉండేది కాదు. కూటమి సర్కారు వచ్చాక అన్నదాతలకు కష్టాలు పెరిగాయి. అప్పులు చేసి పంటలు పండించినా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చిన పాపాన పోలేదు. కొనే పరిస్థితి లేకుండా పోయింది. బయట మార్కెట్లో ధరలు ఉన్నాయా అంటే అదీ లేదు. దళారులకు తక్కువ ధరకే పంటలు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో పెట్టుబడుల సంగతి దేవుడెరుగు ఖర్చులు కూడా రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వాటి నుంచి బయటపడలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతులు ప్రాణాలు తీసుకుంటున్నా కూటమి పాలకులకు చీమకుట్టినట్లుగా కూడా లేదు. వారిని ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు. వరి పంటకూ దక్కని మద్దతు ఈ ఏడాది జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 6.50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి వచ్చిందని అంచనా. ఇందులో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధరకు కొనలేదు. దీంతో రైతులు బస్తా ధాన్యం రూ. 1300 లోపే దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. పెట్టుబడులు కూడా రాక తీవ్రంగా నష్టపోయారు. మిర్చి రైతులకూ మిగిలింది కన్నీరే ఇక నగరం, సంతమాగులూరు, బల్లికురవ, మార్టూరు, యద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, జె.పంగులూరు, అద్దంకి, కొరిశపాడు మండలాల్లో 9,330 ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో క్వింటా మిర్చి రూ. 22 వేల వరకు ధర పలికింది. ఎకరాకు 20 కింటాళ్ల దిగుబడి వచ్చింది. దీంతో రైతులు లాభాలు చూశారు. ఈ ఏడాది ఎకరాకు 5 నుంచి 10 క్వింటాళ్లలోపే దిగుబడులు రాగా రూ. 8 వేల నుంచి 10 వేల లోపు మాత్రమే ధర ఉంది. ఈ ధరతో రైతులకు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేక అప్పులు మిగిలాయి. పొగాకుకూ అదే దుస్థితి.. జిల్లాలోని అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలలో 64,165 ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేశారు. దాదాపు 53 వేల ఎకరాల్లో బ్లాక్ బర్లీ సాగైంది. గత ప్రభుత్వంలో క్వింటా పొగాకు రూ. 25 వేల నుంచి రూ.30 వేల వరకు ధర పలికింది. పెట్టుబడి పోను రైతులకు మంచి లాభాలు వచ్చాయి. ఈ సంవత్సరం రూ. 5 వేల నుంచి రూ.10 వేల లోపే ధర ఉంది. ఎకరా సాగుకు రూ. 1.60 లక్షల వరకు రైతులు పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ఉన్న ధరతో కూలీల ఖర్చులు కూడా రావని వాపోతున్నారు. భారీ విస్తీర్ణంలో పొగాకు సాగు చేసిన రైతులు పెట్టుబడులు అధికమై అప్పుల నుంచి బయటపడలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి నెలకొంది. ఇవి కాకుండా రైతులు పండించిన కంది, మినుము, శనగ, పెసర తదితర పంటలకు గిట్టుబాటు ధర లేదు. పేరుకు మార్క్ఫెడ్ ద్వారా కొంటామని ప్రభుత్వం చెబుతున్నా మొక్కుబడిగా కూడా కొనుగోలు చేయలేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతుల వరుస ఆత్మహత్యలు ఊసే లేని పెట్టుబడి సాయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా సకాలంలో నిరాటంకంగా ఇచ్చారు. ఆ స్థానంలో అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు రూ. 20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు సహా కూటమి నేతలు ఆర్భాటంగా ప్రకటించారు. గద్దెనెక్కి ఏడాది దాటుతున్నా ఇప్పటికీ రైతులకు ఈ పథకం కింద పైసా ఇవ్వలేదు. గత ప్రభుత్వ పాలనలో జిల్లాలో 1,92,039 మంది రైతులకు రూ. 13,500 చొప్పున సాయం అందించారు. కూటమి నేతలు చెప్పిన హామీ ప్రకారం రైతుకు రూ. 20 వేల చొప్పున జిల్లాలో ఏటా రూ. 385 కోట్లు ఇవ్వాల్సి ఉంది. చంద్రబాబు పాలనలో రెండో ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నా ఇప్పటికీ అన్నదాత సుఖీభవ ఇవ్వక రైతులను వంచించారు. -
ఎనిమిదేళ్ల కష్టమే కన్నప్ప
నగరంపాలెం(గుంటూరువెస్ట్):ఎనిమిదేళ్ల కష్టమే కన్నప్ప చిత్రమని సినీనటుడు మంచు మోహన్బాబు అన్నారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం సాయంత్రం కన్నప్ప చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్ సంయుక్త ఆధ్వర్యంలో జరగ్గా, ఏసీ కళాశాల నుంచి ఈవెంట్ వరకు ర్యాలీ కొనసాగింది. నటుడు మోహన్బాబు మాట్లాడుతూ కన్నప్పను పరమేశ్వరుడు ఆశ్వీరదించారని అన్నారు. ఈ చిత్రంలో నటుడు మంచు విష్ణు రెండు పాత్రలు పోషించారని, చాలా అద్భుతంగా నటించాడని చెప్పారు. మళయాళం, తమిళం, హిందీ, తెలుగు భాషల్లోని అగ్రనటులు పలు పాత్రల్లో పోషించారని, ఆయా పాత్రలకు వారిని అడిగిన వెంటనే ఒప్పుకున్నారన్నారు. అగ్రనటుడు ప్రభాస్, నేను బావ అని అప్యాయంగా పిలుచుకుంటామని, పాత్ర గురించి చెప్పగానే అందులో నటించేందుకు అంగీకరించాడని అన్నారు. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతిలో ఈవెంట్ చేద్దామని భావించామని, అయితే గుంటూరులో చేయడం ఆనందంగా ఉందన్నారు. చాన్నాళ్ల తర్వాత గుంటూరు వచ్చానని పేర్కొన్నారు. 1991 నుంచి తాడిశెట్టి వెంకట్రావుతో పరిచయం ఉందన్నారు. కన్నప్ప నాలో మార్పు తీసుకొచ్చింది: విష్ణు నటుడు మంచు విష్ణు మాట్లాడుతూ నా దేవుడు నాన్న అని, ఆయన లేకపోతే నేను లేనన్నారు. నటుడు ప్రభాస్కు ఎంతగానో రుణపడి ఉంటానని పేర్కొన్నారు. కన్నప్ప చిత్ర ప్రయాణం నాలో ఎంతగానో మార్పు తీసుకువచ్చిందన్నారు. హాస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ మోహన్బాబు తమపై ఉన్న వాత్సల్యంతో ఈ చిత్రంలో పాత్ర ఇచ్చారన్నారు. పది కాలలపాటు కన్నప్పగా మంచు విష్ణు నిలిచిపోతాడని పేర్కొన్నారు. గుంటూరు బాగా పరిచయమైన స్థలమని, ఇక్కడ చదువుకున్నానని తెలిపారు. గతంలో ఈ ఊరు వచ్చి లారీలకు రంగులేశానని గుర్తుచేసుకున్నారు. దర్శకుడు ముకేష్ కుమార్సింగ్, నృత్యదర్శకుడు ప్రభుదేవా, నటులు రఘుబాబు, శివబాలాజీ, సప్తగిరి, ముకేష్రుషి చిత్ర బృందం పాల్గొన్నారు. అనంతరం మోహన్బాబును వెండి కిరిటీంతో సత్కరించగా, తాడిశెట్టి సోదరులను మోహన్బాబు సత్కరించారు. హీరో విష్ణు పది కాలాలపాటు కన్నప్పగా నిలిచిపోతాడు ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు గుంటూరులో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు మోహన్బాబు -
నిత్యాన్నదానం, బంగారు తాపడం పనులకు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి, బంగారు తాపడం పనులకు విజయవాడకు చెందిన భక్తులు శనివారం రూ. 2.52 లక్షల విరాళాన్ని అందజేశారు. నగరంలోని రామచంద్రనగర్కు చెందిన బట్టు నాగేశ్వరరావు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. నాగేశ్వరరావు పేరిట రూ. 1,51,116 విరాళాన్ని, జిష్ణురావు పేరిట బంగారు తాపడం పనులకు రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. నేడు ఏపీసీబీఈఏ రాష్ట్ర మహాసభలు చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏపీసీబీఈఏ) పదో రాష్ట్ర మహాసభలు మచిలీపట్నంలో ఆదివారం నిర్వహించనున్నట్లు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.గోపీనాథ్ శనివారం తెలిపారు. జిల్లా కోర్టు సెంటర్లోని రెవెన్యూ కల్యాణ మండపంలో మహాసభలు జరుగుతాయని పేర్కొన్నారు. మహాసభలకు 13 జిల్లాల డీసీసీబీ ఉద్యోగులు హాజరుకానున్నారని తెలిపారు. సమావేశానికి జిల్లాలోని సహకార బ్యాంకుల ఉద్యోగులు తప్పని సరిగా హాజరుకావాలని ఆయన కోరారు. వైభవంగా శోభాయాత్ర విజయవాడ కల్చరల్: వేంకటేశ్వరుడి శోభాయాత్ర వైభవంగా జరిగింది. పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణ మండప ప్రాంగణంలోని పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం దేవాలయంలో నిర్వహించిన వైదిక కార్యక్రమాలు భక్తిగా సాగాయి. ఉదయం వేంకటేశ్వర స్వామికి దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వివిధ రకాల పూలతో అలంకరించిన పల్లకీపై పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామిని దేవాలయ ప్రాంగణంలో ఊరేగించారు. దేవాలయన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
రైతులకు సక్రమంగా విద్యుత్ అందించాలి
చీరాల టౌన్: నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇసుక నేలల్లో పంటలు పండించే రైతులకు సకాలంలో విద్యుత్ అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని.. సకాలంలో విద్యుత్ అందక పైర్లు ఎండిపోవడంతో రైతులు నష్ట పోతున్నారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు కె.రమణారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో రైతులు పండిస్తున్న వేరుశనగ, ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల తోటలను రైతు విభాగం అధ్యక్షుడు ఆయా గ్రామాల రైతులతో కలిసి పరిశీలించారు. వేరుశనగ పంటలకు సకాలంలో నీరు అందక పంట ఎండిపోతోందని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు సాధ్యం కాని హామీలిచ్చి గద్దెనెక్కిందని ఫలితంగా ప్రజలు, రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉదయం 6 గంటలకల్లా విద్యుత్ను అందించి పంటల సాగుకు ఇబ్బందులు లేకుండా చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఉదయం 9 గంటలకు కూడా సక్రమంగా రైతులకు విద్యుత్ను అందించలేకపోతుందన్నారు. చీరాల నియోజకవర్గంలోని కావూరివారిపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ఇసుక భూముల్లో రైతులు పండిస్తున్న పంటలకు సాగునీరును విద్యుత్ పైపుల ద్వారా అందిస్తూ పంటలు పండిస్తున్నారన్నారు. పంటల సాగుకు కావాల్సిన నీరు సకాలంలో అందక పంటలు తెగుళ్ల బారిన పడుతున్నాయని రైతుల దీనగాథలను అర్థం చేసుకోవాలన్నారు. రైతుల పంటలకు కావాల్సిన నీటిని నిర్ణీత వేళల్లోనే అందించి అన్నదాతలను ఆదుకోవాలన్నారు. అన్నదాతలను ఇబ్బందులు పెడితే తగు రీతిలో బుద్ధి చెబుతారని, రైతులకు పంటల సాగుకు కావాల్సిన నీటి సరఫరాకు విద్యుత్ ప్రతి రోజూ ఉదయం 6 గంటలకే అందించి అండగా నిలవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలు గ్రామాల్లోని రైతులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు కె.రమణారెడ్డి -
ఆటోవాలకు మిత్ర ద్రోహం
కూటమి ఏడాది పాలనపై ఆటో డ్రైవర్ల ఆగ్రహం చదువు లేని వారు...చదుకున్నా ఉద్యోగం రాని అనేక మంది ఆటోలనే నమ్ముకుని జీవితాలను గడుపుతున్నారు. పెరిగిన డీజిల్ ధరలు, నిత్యావసరాల ధరలు..పోలీసుల వేధింపుల కారణంగా రోజంతా కష్టపడినా వచ్చే కొద్ది సంపాదనతో కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నారు. ఆటో డ్రైవర్ల కష్టాలను గుర్తించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహన మిత్ర పేరుతో ఏడాదికి రూ.10వేలు చొప్పున ఐదేళ్లూ ఒక్కొక్క డ్రైవర్కు రూ.50 వేలు అందించారు. ఆటో డ్రైవర్లు కొంత మేర ఊపిరి పీల్చుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సాయాన్ని నిలిపివేసింది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాపట్లటౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అటకెక్కించింది. ఇచ్చిన హామీలను అమలుచేయకుండా సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఊసూరుమనిపిస్తోంది. అదే కోవలో బతుకుబండికి భరోసా లేకుండా చేసింది. ఆటో, మ్యాక్సీ, క్యాబ్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లకు నిరాశే మిగిలింది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా ప్రతి ఏడాదీ వాహనమిత్ర పథకం కింద ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ మొత్తాన్ని వాహనాల ఇన్స్యూరెన్స్, ఫిట్నెస్, చిన్నపాటి మరమ్మతులకు ఉపయోగపడేది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కార్ వాహనమిత్ర పథకాన్ని అమలు చేయకపోవడంతో డ్రైవర్లపైనే ఆర్థిక భారం పడుతోంది. మరోవైపు తనిఖీల పేరుతో అధిక మొత్తంలో రుసుములు విధిస్తుండటంతో రోడ్లపై వాహనాలు నడపాలంటేనే హడలిపోతున్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి గతంలో వరుసగా ఐదేళ్లపాటు వాహనమిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆటోలు నడిపే మాలాంటి పేదలకు ప్రతి ఒక్కరికీ రూ.50 వేలు లబ్ధి చేకూరుంది. ఈ సొమ్మును ఆటో మరమ్మతులు, పిట్నెస్కు ఉపయోగించుకునేవారం. ప్రస్తుతం అధికారంలోఉన్న కూటమి సర్కార్ ఆర్థికసాయం అందించడం లేదు. మాలాంటి పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తే బాగుంటుంది. –నూకబత్తుని రమేష్, కంకటపాలెం పథకాలన్నీ అమలుచేయాలి గతంలో మాకు ఏడాదికి వాహనమిత్ర పథకం ద్వారా రూ.10 వేల చొప్పున ఐదేళ్లపాటు రూ. 50 వేలు ఆర్థికసాయం అందజేశారు. వీటితోపాటు అమ్మఒడి, మహిళలకు డ్వాక్రా రుణాలు, రైతుభరోసా లాంటి పథకాల రూపంలో ప్రతి ఏడాదీ మా అకౌంట్లో నగదు జమ అయ్యేవి. ప్రస్తుతం ఏ పథకాలు అమలుకాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పథకాలన్నీ అమలుచేస్తే మాలాంటి పేదలకు మేలు జరుగుతుంది. –గోరిపర్తి గోపి, రేపల్లె ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఓ వైపు భగభగ మండుతున్న భానుడు...పెరిగిన నిత్యావసర వస్తువులు, డీజిల్ ధరలతో ఆటోలు నడపాలంటేనే సతమతమవుతున్నాం. కనీసం రోజంతా కష్టపడినా ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో ప్రభుత్వం అందించే ఆర్థికసాయంతో వాహనాల మరమ్మతులు, ఇన్స్యూరెన్స్, ట్యాక్స్లు కట్టుకునేవాళ్లం. ప్రస్తుతం చాలా ఇబ్బందిగా ఉంది. –మాదాసు సుబ్బారావు, బాపట్ల వాహనమిత్ర ఊసే ఎత్తని కూటమి సర్కార్ నాడు వాహనమిత్రతో ఆటో డ్రైవర్లకు భరోసా వరుసగా ఐదేళ్లు పథకాన్ని అమలుచేసిన జగన్ సర్కార్ జిల్లాలోని లబ్ధిదారులకు రూ.31.80 కోట్లు అందజేత కూటమి సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు నాడు కేసులంటే తెలియని వైనం..నేడు రోడ్డెక్కాలంటేనే భయం ఇన్స్యూరెన్స్, ఫిట్నెస్ చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి
ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ సోషలిజం రేపల్లె: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించటంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ పీడీ సోషలిజం డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం తాలూకా సెంటరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఉపాధ్యాయ సంఘాల సమస్యల పరిష్కారానికి ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన చర్చలలో ఎస్జీటీ టీచర్లకు మాన్యువల్గా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న బదిలీ విభాగంలో సెకండరీ గ్రేడ్ టీచర్ల కౌన్సెలింగ్ విధానాన్ని ఎంఆర్సీల ద్వారా స్క్రోల్ చేస్తూ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించిందన్నారు. ఇది మోసపూరిత చర్య అని ఆందోళన వ్యక్తం చేశారు. వెబ్ కౌన్సెల్ విధానంలో ఉపాధ్యాయులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని, మాన్యవల్ కౌన్సెలింగ్ విధానాన్ని అమలు చేయటంతో సమస్య ఉండదని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు గలాబా శ్రీనివాసరావు, తేలప్రోలు శ్రీనివాసరావు, గద్దె రవీంద్ర, దోవా రవి, కె.వెంకటరత్నం, చెన్ను నరేంద్ర, బి.పావనకుమారి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ బదిలీలు మాన్యువల్గా నిర్వహించాలి –ఉపాధ్యాయ సంఘాల ఆందోళన బాపట్లటౌన్: ఉపాధ్యాయ బదిలీలను మాన్యువల్ పద్ధతిలోనే నిర్వహించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాస్ అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం ఎంఈవో ఎస్.నిరంజన్కు వినతిపత్రం అందజేశారు. టీచర్లు బదిలీ విషయంలో ఎస్జీటీ ఉపాధ్యాయులకు మ్యాన్యువల్ కౌన్సెలింగ్ పెడతామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ది.07.06.25 నుంచి 10.06.25 వరకు మ్యానువల్ కౌన్సెలింగ్ జరుగుతుందని హామీ ఇచ్చిందన్నారు. ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోలేక ద్వంద వైఖరిని అవలంభిస్తుందన్నారు. సెకండరి గ్రేడ్ ఉపాధ్యాయులు మాన్యువల్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మ్యాన్యువల్ కౌన్సెలింగ్ జరపలేం, వెబ్ కౌన్సెలింగ్ జరుపుతామని ప్రకటించడం శోచనీయమన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరిసిస్తూ మండల విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. సోమవారం అన్ని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రకటన విడుదల చేసిందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్బి సుభాని, ఉపాధ్యాయవాణి కన్వీనర్ పి.వి. నాగరాజు, ఎ.వి.నారాయణ, పి.శివాంజనేయులు, జి.ఉదయ్ శంకర్, సీహెచ్. శ్రీనివాస్, యూటీఎఫ్ నాయకులు ఎం.సురేష్, డి.నన్నూరయ్య, ఏపీటీఎఫ్ నాయకులు రమణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అపార్టుమెంట్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరంలో జాతీయ రహదారి వెంబడి సర్వీసు రోడ్డులో నిర్మాణంలో వున్న ఒక అపార్టుమెంట్ పై నుంచి శనివారం సాయంత్రం ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తాడేపల్లి పట్టణ సీఐ కల్యాణ్రాజు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి గుంటూరు సప్తపదిలోని విద్యానగర్కు చెందిన గండు జగదీష్ (35) గుర్తించారు. ఇతను తన ద్విచక్రవాహనంపై గుంటూరు నుంచి వచ్చి ఐదు అంతస్తుల భవనం పైకి ఎక్కి కిందకు దూకాడని, తలకు తీవ్రమైన గాయం ఏర్పడిందని, కొన ఊపిరితో ఉండడంతో భవనంలో పనిచేస్తున్న పనివారు ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా జగదీష్ మృతి చెందినట్లు సీఐ కల్యాణ్రాజు తెలిపారు. జగదీష్ మృతికి కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఇదిలా ఉండగా జగదీష్ బంధువులు మాత్రం గత ఐదు సంవత్సరాల నుంచి జగదీష్తో సన్నిహితంగా ఉండే బంధువులు హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ కారణం చేతే ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వారే హత్య చేసిఉంటారేమోననే దిశలో దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం బిల్డింగ్పై నుంచి దూకినట్లు తెలిపారు. జగదీష్ తమ్ముడిని వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా ఇప్పడు ఏమీ చెప్పలేనని, మా అన్నయ్యది ముమ్మాటికీ హత్యేనని, పోలీస్స్టేషన్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. చనిపోయేటట్లు ప్రేరేపించారని ఆరోపిస్తున్న బంధువులు -
ధర్మోరక్షతి రక్షితః ట్రస్ట్ భవనం ప్రారంభం
తాడికొండ: హైందవ ధర్మ విశిష్టత ప్రపంచానికి చాటి చెప్పడంలో శివస్వామి కృషి ఎనలేనిదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శనివారం తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలోని శైవ క్షేత్రంలో ధర్మోరక్షతి రక్షితః ట్రస్ట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రస్ట్ నూతన భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాణ దాతలు సతీష్ ఉమరాణి దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు. శివస్వామి ఈ ట్రస్ట్లో 64 సేవా విభాగాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. గో సంరక్షణ ద్వారా ఆరు వేల గోవులను రక్షించి వాటి పోషణ చూసుకోవడం అభినందనీయమన్నారు. మానసారా–మన సారె అనే కార్యక్రమం ద్వారా అనేక రాష్ట్రాల్లో అమ్మవారికి కార్యక్రమాలు నిర్వహిస్తూ సంస్కృతి పట్ల యువతకు అనేక ప్రయోజకర కార్యక్రమాలు అందిస్తున్నారన్నారు. భక్తునిగా శివస్వామికి తాను శిరస్సు వచ్చి పాదాభివందనలు చేస్తున్నారన్నారు. శివస్వామి మాట్లాడుతూ ధర్మోరక్షతి రక్షితహ భవనాన్ని ధార్మిక సేవా భావాలతో 2009 నుంచి నిర్వహిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిది వేల మంది ఈట్రస్ట్ కేంద్రంగా పనిచేస్తున్నారన్నారు. పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నేడు మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణ స్వీకారం వేమూరు: మార్కెట్ యార్డు చైర్మన్గా గొట్టిపాటి పూర్ణకుమారి ప్రమాణ స్వీకారం చేస్తారని యార్డు సెక్రటరీ అంజిబాబు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థ సారధి, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొంటారని తెలిపారు. రైలు ఢీకొని వ్యక్తి మృతి నరసరావుపేటటౌన్: ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం పట్టణంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాష్నగర్కు చెందిన ఇల్లూరి వీరాంజనేయరెడ్డి(38) మొదటి రైల్వే గేటు వద్ద రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొంది. సంఘటనలో తీవ్రగాయాలైన వీరాంజనేయరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఇన్చార్జి ఎస్ఐ దీపిక సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. విద్యుత్ షాక్తో వృద్ధుడు మృతి చేబ్రోలు: చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెం, చెన్నారెడ్డి కాలనీ ఎస్సీ కాలనీకి చెందిన వృద్ధుడు శనివారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. కొత్త రెడ్డిపాలెంకు చెందిన కారుమూరి ధనంబాబు (60) ఇంట్లోని విద్యుత్ మోటారుకు సంబంధించిన వైర్లు ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్దదిక్కు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మృతుని కుమారుడు అనారోగ్యానికి గురవడంతో వారి కుటుంబ పోషణ, ఆలనా పాలన కూడా ధనంబాబే చూడాల్సిన పరిస్థితి ఉంది. నిరుపేద కుటుంబానికి చెందిన ధనం బాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. జరిగిన సంఘటనపై స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులు పరిశీలించి నివేదికను తయా రుచేసి ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తెలిపారు. -
స్నేహమేరా జీవితం.. శాశ్వతం!
శావల్యాపురం: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలో 2004–2005 పదో తరగతి పూర్వ విద్యార్థులు బ్యాచ్ అత్మీయ సమ్మేళనం కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత తమ గురువులను పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికిన అనంతరం తాము చదువుకున్న స్కూల్లో 20 సంవత్సరాల తర్వాత అందరిని కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు అత్మీయంగా పలకరించుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను తరగతి గదుల్లో తీపి గుర్తులు మాట్లాడుకున్నారు. తమ గురువులు నేర్పిన విద్య ద్వారా ఈస్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు యర్రం హనుమంతరావు మాట్లాడుతూ తమ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఎదిగి ఐక్యంగా గురువులను గౌరవించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఉపాధ్యాయులు యర్రం హనుమంతరావు, సి.హెచ్. చంద్రశేఖర్, కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, కె.జె.రమేష్, ఆర్కె.రమేష్ తదితరులను ఘనంగా పూలమాలలు దుశ్శాలువాలతో సత్కరించారు. ఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గుత్తా వెంకటరావు, పాలడుగు శ్రీను, తులబందుల రమ్య, చిలంకూరి నాగలక్ష్మి, జవంగుల నాగరాజు, పరమేశ్వరరావు, యలవర్తి శిరీషా, పాలడుగు సాయి. 45 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. శావల్యాపురం జడ్పీ హైస్కూల్ 2003–2004 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం -
అంబేడ్కర్ స్ఫూర్తితో దళితుల అభ్యున్నతి
విగ్రహావిష్కరణ సభలో వివిధ రంగాల ప్రముఖులు తెనాలి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ స్ఫూర్తిగా దళితులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉందని కొల్లిపర మండల గ్రామం తూములూరు శివారు క్రిస్టియన్పాలెంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు. గ్రామంలో ఏర్పాటుచేసిన నిలువెత్తు విగ్రహాన్ని శనివారం రాత్రి సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్కుమార్ ఆవిష్కరించారు. సభకు విగ్రహ కమిటీ అధ్యక్షుడు కనపర్తి మోహనరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్ మాట్లాడుతూ, విద్యకు ప్రాముఖ్యత నివ్వాలని సూచించారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యపడుతుందనీ, ప్రతిఒక్కరు చదువుకోగలిగినప్పుడు సమాజంలో మార్పు వస్తుందని చెప్పారు. వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్జే విద్యాసాగర్ తన ప్రసంగంలో దళితులు కుర్చీల్లో కూర్చోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో రాజ్యాధికారం సాధించుకోవాల్సి ఉందన్నారు. అందుకు అంబేడ్కర్ విగ్రహం స్ఫూర్తి కావాలన్న ఆకాంక్షను వ్యక్తంచేశారు. విశ్రాంత వాణిజ్య పన్నుల అధికారి బొనిగల రామారావు మాట్లాడుతూ దళితులు, బలహీనవర్గాల ప్రజలే చరిత్రను నిర్మించినవారని గుర్తుచేశారు. భాషను కనుగొన్నది కూడా వాళ్లేనని చెప్పారు. దళితవాడల నుంచి ఎందరో మేధావులు, విద్యావంతులు వెలుగులోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కులవివక్ష పోరాట కమిటీ నాయకుడు ఉన్నవ వినయ్కుమార్ మాట్లాడుతూ సమాజంలో రుగ్మతలను సోదాహరణంగా వివరించారు. వివక్షత నుంచి విముక్తులు కావాల్సి ఉందన్నారు. కనపర్తి బెనహర్ తన ప్రసంగంలో, కొల్లిపర ప్రాంతానికి చెందిన దళిత ఉద్యమనేత కనపర్తి ఏసురత్నం బాటలో దళితుల అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. విగ్రహ కమిటీ కన్వీనర్ తెనాలి మోహనరావు, కనపర్తి అబ్రహాం లింకన్, మన్నవ ప్రభాకర్, అక్కిదాసు కిరణ్, బేతాళ భూషణం, యండ్రపాటి సాంబయ్య, సిద్దెల అబ్రహం, యండ్రపాటి అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
భావన్నారాయణ బహుముఖ ప్రజ్ఞాశాలి
బాపట్ల:బీఎంఎస్ ఆలిండియా వ్యవస్థాపక అధ్యక్షులు, స్వయం సేవకులు స్థానం భావనారాయణ వివిధ క్షేత్రాలలో విశేష సేవలు అందించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారని మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. బాపట్ల రోటరీ కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం స్థానం భావనారాయణ సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత స్థానం భావనారాయణ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభకు ప్రముఖ స్వయంసేవక్ నేత శ్యాం ప్రసాద్ అధ్యక్షత వహించి స్థానం భావనారాయణతో నాలుగు దశాబ్దాలపాటు కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. బీజేపీ నాయకుడు ఆర్ లక్ష్మీపతి మాట్లాడుతూ బాపట్ల పట్టణంలో పుట్టి భావనారాయణ స్వామి దేవాలయ చైర్మన్గా, వంశపారంపర్య ధర్మకర్తగా, స్వయంసేవకుగా, శిశుమందిర్ నిర్వహకులుగా వివిధ క్షేత్రాలను పనిచేసే లక్షలాదిమందికి మార్గదర్శకులుగా నిలిచారని కొనియాడారు. బావన్నారాయణ సోదరుడు ఎస్బీఎస్ తిలక్ మాట్లాడుతూ బావన్నారాయణ బాల్యం నుండి అంతర్జాతీయ వేదికలలో చేసిన ప్రసంగాల వరకు ఆయన జీవిత ప్రస్థానాన్ని వివరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బి బంగారు బాబు మాట్లాడుతూ స్వయంసేవకునిగా జీవితాన్ని ప్రారంభించి జేనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారతదేశ గళాన్ని అద్భుతంగా వినిపించిన కార్యసాధకుడు భావన్నారాయణ అని కొనియాడారు. సీబీఐ న్యాయవాది మన్నవ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ బాపట్ల ఖ్యాతిని దేశ వేదికలపైనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా వినిపించి ఎందరికో ప్రేరణగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో వల్లూరి భావనారాయణ, పార్థసారథి, బొమ్మిశెట్టి బాలాజీ, బూరెల రత్తయ్య, మన్నవ బాలాజీ, జగన్నాధశాస్త్రి, డాక్టర్ శ్రీనివాస్, లేల సుధాకర్, లేళ్ల వెంకటప్పయ్య, మెండు రజిని, ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు. సంస్మరణ సభలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్ -
పుష్కర ఘాట్ వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని కృష్ణానది దిగువ ప్రాంతంలోని సీతానగరం పుష్కర ఘాట్లో గుర్తుతెలియని మృతదేహం చెట్టుకు వేలాడుతూ మెట్లపై పడిపోయి వున్న స్థితిలో స్థానికులు గుర్తించి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి వెళ్లి మెడకు ఉరి వేసుకుని వున్న లుంగీ, కండువాను తొలగించి మృతదేహాన్ని పరిశీలించగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. లుంగీ, కండువా కలిపి కట్టుకుని ఉరి వేసుకుని ఉంటాడని ఎస్ఐ శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు మాత్రం కృష్ణానది తీరంలోని పుష్కర ఘాట్లలో, ఇసుక తిన్నెల్లో అనేక అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని, చాలా మందిని కొట్టి డబ్బులు, వస్తువులు లాక్కుని పారిపోయిన సంఘటనలు ఉన్నాయని, ఇక్కడ నిద్ర చేయడానికి వచ్చిన వ్యక్తిని ఎవరో కొట్టి చంపి చెట్టుకు వేలాడి తీసి ఉంటారని అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. -
అందరూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి
గుంటూరు మెడికల్: కోవిడ్ కేసులు మళ్లీ నమోదవుతున్న దృష్య్టా గుంటూరు జీజీహెచ్కు వస్తున్న రోగులు, వారి సహాయకులు తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి అన్నారు. శుక్రవారం ఆస్పత్రిలో మీ కోసం మేము కార్యక్రమంలో భాగంగా ఆయన రోగులు, వారి సహాయకులతో సమావేశమై వారి సమస్యలు ఆలకించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణ మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరి ప్రాణాలు రక్షించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి వైద్య సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆస్పత్రిలో వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. ప్రతి ఒక్కరు తరచుగా చేతులు పరిశుభ్రం చేసుకోవాలని, దగ్గు, జలుబు, జ్వరం ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. దగ్గు, జ్వరం ఉన్నవారు ఆస్పతిలో తిరగకుండా వార్డులో ఉంచి చికిత్స పొందాలని సూచించారు. మద్యం తాగి ఆస్పత్రికి రావద్దని ఆస్పత్రి ఆవరణంలో సిగరెట్టు తాగి వాతావరణం కలుషితం చేయవద్దని కోరారు. మీ కుటుంబ సభ్యులను మా కుటుంబ సభ్యులుగా భావించి చికిత్స అందిస్తామని, మీరు అభద్రతా భావాన్ని , అపోహలు వదిలి పెట్టలన్నారు. ఏ డాక్టర్, నర్సు తప్పు చేయరని ఆస్పత్రిలో వీడియో కెమెరాలు ఉన్నాయని తెలిపారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తోందన్నారు. గతంలో కోవిడ్ సయమంలో లక్షలు ఖర్చుపెట్టినా కాపాడలేని వారిని గుంటూరు జీజీహెచ్లో ప్రాణాలు పణంగా పెట్టి కాపాడారన్నారు. కోవిడ్ కి సంబంధించి టెస్టులన్నీ ఉచితంగా చేస్తున్నామని, ప్రజలు ఈ వైద్యసేవలను వినియోగించుకోవాలని కోరారు. జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ కుమార్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్ విస్తరిస్తున్న సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లు గురించి వివరించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి -
ఎన్ఎంఎంఎస్లో కొప్పరపాడు విద్యార్థుల ప్రతిభ
జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం బల్లికురవ:. ఎన్ఎంఎంఎస్ ఫలితాల్లో బల్లికురవ మండలం కొప్పరపాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నట్లు ఎంఈవో–2 కె. రమేశ్బాబు శుక్రవారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఈ పరీక్షలకు 15 మంది విద్యార్థులు హాజరు కాగా పది మంది ఉపకార వేతనాలకు ఎంపికై నట్లు తెలిపారు. వీరిలో బొంతు భగత్ 149 మార్కులతో మొదటి స్థానం, పి.లక్ష్మీ అమూల్య 148 మార్కులుతో రెండో స్థానం, ఎస్కే మస్తాన్ 147 మార్కులుతో మూడో స్థానం కై వం చేసుకున్నారని తెలిపారు. వీరితోపాటు మరో ఏడుమంది స్కాలర్షిప్కు ఎంపికై నట్టు ఎంఈవో తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా కొప్పరపాడు పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం ఎన్ఎంఎంఎస్కు ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు, హెచ్ఎం పి. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందించారు. ఉపకార వేతనాలకు ఎంపిక అమర్తలూరు(వేమూరు): స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్కు ముగ్గురు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు కనపర్తి నిరీక్షణరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులకు జనవరి నెలలో పరీక్షలు నిర్వహించింది. అధిక మార్కులు సాధించిన వారికి నాలుగేళ్లు స్కాలర్షిప్లు అందించనుంది. పాఠశాలకు చెందిన విద్యార్థులు పెనుకొండ ఎందీవర్ 128 మార్కులు, షేక్ చాందిని 121 మార్కులు, జొన్నా భూమిక 102 మార్కులు సాధించారు. ఏటా రూ.12,000 చొప్పన ఇంటర్ వరకు అందనున్నాయి. విద్యార్థులను ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్ వినయ్ అభినందించారు. -
వివాహేతర సంబంధంతోనే మహిళ హత్య
వేటపాలెం: వివాహేతర సంబంధం నేపథ్యంలోనే మానికల దీపిక అలియాస్ వేటగిరి ప్రమీల (24) ను అదే కాలనీకి చెందిన ఇద్దరు హత్య చేసినట్లు చీరాల డీఎస్పీ మొయిన్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మహిళ హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శుక్రవారం వివరించారు. ఈ నెల 2వ తేదీన రామన్నపేట పంచాయతీ పరిధిలోని నాగవరపమ్మ దేవస్థానం వద్ద గుర్తు తెలియని మహిళ మృత దేహం గుర్తించారు. అయితే రామన్నపేట పంచాయతీ వినాయకపురానికి చెందిన మానికల దీపిక అలియాస్ వేటగిరి ప్రమీల నెల రోజుల క్రితం అదృశ్యం అయినట్లు ఆమె అత్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అదే కాలనీకి చెందిన ఈగ వెంకటేశ్వరరావు, సైకం నాగబాబు.. గద్దల గుంటకి చెందిన ఇద్దరు బావ బావమర్దులు. వీరిద్దరే చంపి ఉంటారని కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. వీరిద్దరిని శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారించారు. కాగా గుర్తు తెలియని మహిళ విషయం తమకు తెలియదని, తాము దీపికను చంపి గ్రామ శివారులోని తోటలో పూడ్చి పెట్టినట్లు ఒప్పుకున్నారు. మృతురాలి భర్త చనిపోవడంతో వ్యసనాలకు బానిసైన ఆమె అత్త వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఇంటి వద్దనే ఉంటున్న ఈగ వెంటేశ్వరరావుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొంత కాలానికి వెంకటేశ్వరరావు కొమరిగిరి రాములమ్మని వివాహం చేసుకున్నాడు. అనంతరం అదే కాలనీకి చెందిన సైకం నాగబాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుని, వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. లేదంటే విషయం అందరికీ చెబుతానని బెదిరించడం మొదలు పెట్టింది. దీంతో ఈగ వెంకటేశ్వరరావు, సైకం నాగబాబులు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 30వ తేదీన దీపికను బైక్ పై ఎక్కించుకొని పందిళ్లపల్లి– తిమ్మసముద్రం రోడ్ వరకు వెళ్లారు. అక్కడ ఆమెతో బీరు తాగించారు. అనంతరం బీరు సీసాతో తలపై కొట్టి.. అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. మెడకు చున్నీ చుట్టి చంపివేశారు. శవాన్ని మూట కట్టి బైక్పై పెట్టుకొని రామన్నపేట శివారు తోటల్లోకి తీసుకొచ్చి పూడ్చి వేసినట్లు నిందితులు అంగీకరించారు. పూడ్చిపెట్టిన శవాన్ని తహసీల్దార్ సమక్షంలో తవ్వి బయటకు తీసి పోస్టుమార్టం చేయించారు. మోటార్ బైక్, దుస్తులు, మృతురాలి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరగా ఛేదించిన చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు, ఎస్సై మీసాల వెంకటేశ్వర్లు, ఎస్బీ హెచ్సీ అచ్చయ్య, తన్నీరు శ్రీను, పి.నరసింహారావు, ఎస్కే బాజీత్, పీసీ బాలచంద్రలను డీఎస్పీ అభినందించారు. ఇద్దరు నిందితులు అరెస్ట్ వివరాలు వెల్లడించిన డీఎస్పీ మొయిన్ -
అవగాహనతో మలేరియా కట్టడి చేయవచ్చు
గుంటూరు మెడికల్ : అవగాహనతో మలేరియాను కట్టడి చేయవచ్చని జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం అన్నారు. జాతీయ మలేరియా నివారణ మాసోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక గుండారావుపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సుబ్బరాయణం మాట్లాడుతూ వర్షాకాలంలో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ, టైఫాయిడ్ లాంటి వ్యాధులు కలుగజేస్తాయన్నారు. దోమలు పెరగకుండా ప్రతి ఒక్కరు తమ చుట్టు పక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించి దోమలు పెరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా దోమకాటు నుంచి రక్షణ కోసం ప్రతి ఒక్కరు దోమ తెరలు వాడాలని సూచించారు.10న జిల్లా సీనియర్ అథ్లెటిక్ పోటీలు గుంటూరు వెస్ట్ (క్రీడలు) : అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సింథటిక్ ట్రాక్పైన జిల్లా సీనియర్ అథ్లెటిక్ పోటీలు నిర్వహిస్తామని కార్యదర్శి జీవిఎస్ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులు ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 9వ తేదీన ఏఎన్యూలోని ఇండోర్ స్టేడియంలో వయస్సు ధృవీకరణ పత్రంతోపాటు వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఎంపిక చేసిన జిల్లా జట్టును ఇదే ప్రాంతంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామన్నారు.చికిత్స పొందుతూ వ్యక్తి మృతిక్రోసూరు: మండలంలోని బయ్యవరం గ్రామానికి చెందిన షేక్ శ్రీనివాసరావు(35)పై కొంతమంది వ్యక్తులు దాడి చేయగా తీవ్రగాయాలతో గుంటూరు ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు ఎస్ఐ పి.రవిబాబు తెలిపారు. ఈనెల 3వ తేదీ అమరావతి మండలంలోని తురకవారిపాలెం ఇటుకబట్టీలలో పనిచేసుకుంటుండగా మునుగోడు గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తితో గొడవ జరిగింది. అనంతరం సాయంత్రం గోపి, మరి కొందరు కలిసి వచ్చి బయ్యవరంలోని శ్రీనివాసరావు ఇంటి పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. శ్రీనివాసరావుకు తీవ్రగాయాలు కాగా గుంటూరు ప్రవేటు ఆసుపత్రిలో చేర్పించగా అక్రడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
పవర్ లిఫ్టింగ్లో జిల్లాకు చాంపియన్షిప్
సత్తెనపల్లి: రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పల్నాడు జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపి జూనియర్ మెన్ టీం ఛాంపియన్షిప్ సాధించింది. ఒంగోలు లోని డాక్టర్ పి.ఆనంద్ స్టేడియంలో 12వ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు గత నెల 31 నుంచి ఈ నెల 2 వరకు మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్– బెంచ్ ప్రెస్ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ మెన్, ఉమెన్ పోటీలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఈ పోటీలలో పల్నాడు జిల్లాకు చెందిన 8 మంది క్రీడాకారులు 10 బంగారం, 3 రజత, 2 బ్రొంజ్ పతకాలను మొత్తంగా 15 పతకాలను కై వసం చేసుకొన్నారు. జిల్లా ప్రతిష్టను చాటడమేగాక జిల్లా జూనియర్ మెన్ టీం చాంపియన్ షిప్ మొదటి స్థానం సాధించింది. సబ్ జూనియర్స్లో 47 కేజీల విభాగంలో గురజాలకు చెందిన కె.పల్లవి (సిల్వర్ మెడల్), 66 కేజీల విభాగంలో సత్తెనపల్లికి చెందిన ఎం.వినయ్ వెంకట శివ (సిల్వర్ మెడల్), జూనియర్–సీనియర్ మెన్ విభాగంలో 74 కేజీల విభాగంలో వెన్నా దేవీకి చెందిన శరత్ 2 బంగారు పతకాలు, 74 కేజీ విభాగంలో కంకణాలపల్లికి చెందిన రమేష్ చౌదరి బ్రాంచ్ మెడల్, 83 కిలోల విభాగంలో సత్తెనపల్లికి చెందిన పసుపులేటి వంశీ కృష్ణ 3 బంగారు పతకాలు, ఒక రజిత పతకం, 120 కేజీల విభాగంలో గుడిపూడికి చెందిన లింగిసెట్టి శివ నాగేశ్వర రావు నాలుగు బంగారు పతకాలు, సబ్ జూనియర్ మెన్ బెంచ్ ప్రెస్ విభాగంలో 53 కిలోల విభాగంలో గురజాలకు చెందిన కె కార్తీక్ సిల్వర్ పతకం,74 కిలోల విభాగంలో సత్తెనపల్లికి చెందిన షేక్ మొహిద్దీన్ బంగారు పతకం సాధించారు. శరత్ (వెన్నాదేవీ), పసుపులేటి వంశీకృష్ణ రెండు, మూడవ స్థానాల్లో రాష్ట్రస్థాయిలో జూనియర్ స్ట్రాంగ్ మెన్టైటిల్ సంపాదించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను పల్నాడు జిల్లా అసోసియేషన్ సెక్రటరీ, అంతర్జాతీయ క్రీడాకారుడైన పసుపులేటి సురేష్, పల్నాడు జిల్లా పవర్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ జిమ్రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాతంగి సాంబశివ రావు, కత్తి పవన్, మాతంగి రాహూల్ గౌతమ్, జి రమేష్, శాంతయ్య శుక్రవారం క్రీడాకారులను అభినందించారు. ప్రతిభ చూపిన జూనియర్ మెన్ క్రీడాకారులు -
అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం
బల్లికురవ: బడుగు బలహీన వర్గాలపై అధికారులు, కూటమి నాయకులు వేధింపులకు పాల్పడుతున్నారని రాష్ట్ర వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అన్నారు. శుక్రవారం మండలంలోని రామాంజనేయపురం గ్రామానికి చెందిన నాగిపోగు ఏసురత్నం తనకు ఇచ్చిన ఇంటి స్థలంలో కొంత భాగానిన మరొకరికి పట్టా ఇవ్వడం పట్ల, కలెక్టర్, రెవెన్యూ అధికారులకు విన్నవించినా.. సమస్య పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తున్నారనే మనస్థాపంతో గురువారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తొలుత అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు, అనంతరం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతున్న ఏసురత్నాన్ని ఒంగోలులోని వైద్యశాలలో కొమ్మూరి కనకరావు పరామర్శించి ధైర్యం చెప్పారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు, స్థానిక నేతలు ఉన్నారు. అలాగే మాదిగ సంక్షేమ పోరాట సమితి ప్రతినిధులు సుజన్ మాదిగ పరామర్శించారు. -
ప్రకృతి వ్యవసాయమే రైతులకు దిక్సూచి
నరసరావుపేట రూరల్: రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామాల్లో ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళీ తెలిపారు. వ్యవసాయ శాఖ, ప్రకృతి వ్వవసాయ విభాగం ఆధ్వర్యంలో సమన్వయంతో మూడో రోజు శిక్షణా కార్యక్రమం శనివారం బృందావన్ సమావేశ మందిరంలో నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మురళీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్ధితుల్లో రైతులందరూ రసాయనాలు వీడి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలు కలిసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ విభాగం నుంచి పాల్గొన్న రామచంద్రన్ మాట్లాడుతూ రాబోయే కాలంలో రైతులకు ప్రకృతి వ్యవసాయం చేయడమే శరణ్యమని తెలిపారు. ప్రతి రైతు 30 రకాల విత్తనాలతో పీఎండీఎస్ విధానాన్ని ఆచరించాలని సూచించారు. ఈ విధానం ద్వారా భూమికి అన్ని రకాల సూక్ష్మజీవులు అందుబాటులోకి రావడంతో పాటు భూమి ఉత్పాదక శక్తి పెరుగుతుందన్నారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి మాట్లాడుతూ 28 మండలాల్లో132 గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రకృతి వ్యవసాయం కొనసాగుతుందని తెలిపారు. ఈ ఏడాది 82,619 ఎకరాల విస్తీర్ణం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. జిల్లాలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో పీఎండీఎస్ కిట్స్ అందుబాటులో ఉన్నాయరని, రైతులు కిట్స్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా ఉద్యాన అధికారి రమణారెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానంలో మిరప పంట సాగు చేస్తే మార్కెట్ ధర కన్నా అధిక ధర లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమరాజు, మండల వ్యవసాయ అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థుల జీవితాలతో కూటమి చెలగాటం
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు ిసీహెచ్ వినోద్ పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వినోద్కుమార్ విమర్శించారు. పదవ తరగతి మూల్యాంకాన్ని లోపభూయిష్టంగా నిర్వహించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నగరంపాలెంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో సీవి రేణుకను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పదో తరగతి పరీక్షల నిర్వహణలో అటు పాలకులు, అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఎటువంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యూయేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. తుది ఫలితాలు వచ్చే వరకు అడ్మిషన్లను కొన్ని రోజుల పాటు నిలిపివేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల విషయంలో జరిగిన తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు. -
యోగాతో ఆరోగ్యం మెరుగు
బాపట్ల: యోగా వలన ఆరోగ్యం, మానసిక సమతుల్యత మెరుగు పడతాయని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. శుక్రవారం యోగాంధ్రలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో బాపట్ల మండలం నగరవనంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా అత్యంత ప్రాచీనమైన భారతదేశంలో రూపొందించిన ప్రక్రియ అని తెలిపారు. దయనందిన జీవితంలో సాధన చేస్తే శరీరం ఆరోగ్యంగా, మానసిక స్థితి సమతుల్యతతో ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.గంగాధర్ గౌడ్, డీఆర్డీఏ పి.డి. శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ బి.శ్రీనివాసరావు, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, జిల్లా అధికారులు, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. పొగాకు గిడ్డంగుల పరిశీలన పర్చూరు(చినగంజాం): పర్చూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఉన్న పొగాకు గిడ్డంగులను మార్క్ఫెడ్ ఎండీ మంజీర్ జిలానీ శుక్రవారం పరిశీలించారు. గిట్టుబాటు ధర లేక పేరుకుపోయిన నిల్వలను కొనే దిక్కులేని పరిస్థితిలో రైతులు ఆందోళన చేపట్టడంతో యంత్రాంగం స్పందించింది. పొగాకును ప్రభుత్వమే మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే ప్రయత్నంలో భాగంగా ఆయన యార్డును పరిశీలించారు. బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, పర్చూరు తహసీల్దార్ బ్రహ్మయ్య, అధికారులు, రైతు నాయకులు, స్థానిక రైతులు పాల్గొన్నారు. -
పొగాకు రైతులను విస్మరించిన కూటమి ప్రభుత్వం
యర్రంవారిపాలెం (కారంచేడు): ఈ ఏడాది పొగాకు సాగు చేసిన రైతులను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. శుక్రవారం యర్రంవారిపాలెంలో తనను కలిసేందుకు వచ్చిన స్థానిక పొగాకు రైతులు, విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్చూరు, అద్దంకి నియోజకవర్గాలతో పాటు సంతనూతలపాడు నియోజకవర్గంలో కొంత మేర బ్లాక్ బర్లీ, దొర పొగాకు సాగు చేశారన్నారు. ప్రస్తుతం పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. పొగాకు సాగు చేసిన రైతుల్లో ఎక్కువ శాతం కౌలు రైతులేనన్నారు. పొగాకు రైతుల పక్షాన పోరాడతానని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో అప్పటికప్పుడు ఆఘమేఘాల మీద మంత్రుల బృందం పర్యటించి పొగాకు కొనుగోలు చేస్తామని ప్రకటించిందని తెలిపారు. అయితే నెల అవుతున్నా ఇంత వరకు పొగాకు రైతుల కన్నీరు తుడవలేకపోయారన్నారు. 89 మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తే ఇప్పటికి కేవలం 25 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి పట్టీ పట్టనట్లు దోబూచులాడుతున్నారన్నారు. పొగాకు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడానని సీఎం చంద్రబాబు మాటల్లో నిజాయతీ లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకొనేంత వరకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా వెంటనే బర్లీని మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న పొగాకును మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. యర్రం లక్ష్మారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పోలూరి శివారెడ్డి, భవనం రాజగోపాల్రెడ్డి, భవనం వెంకటేశ్వరెడ్డి, మనుబోతు వెంకటరెడ్డి, గుదిబండి అంజిరెడ్డి, పమ్మి వెంకటరెడ్డి, రైతులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి -
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన ముఖ్యం
బాపట్ల: ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయాధికారి రామకృష్ణ పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై మండల వ్యవసాయాధికారులకు, ఉద్యాన శాఖ అధికారులకు మూడు రోజులపాటు కొనసాగిన శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో ప్రజలకు ప్రకృతి వ్యవసాయంపై దశలవారీగా అవగాహన కల్పించాలని సూచించారు. చిన్న, సన్నకారు, కౌలు రైతులకు అవగాహన పెంచాలని తెలిపారు. రసాయనిక ఎరువులు వాడకంతో అనర్థాలు వివరించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వాణిశ్రీ మాట్లాడుతూ సేంద్రియ సాగుకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలన్నారు. పెరటి కూరగాయల పెంపకంపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ విభాగం రాష్ట్రస్థాయి అధికారులు రామచంద్రం, భాగ్యలక్ష్మి, అడిషనల్ డీపీఎం మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న కాలనీలో సమస్యలు పరిష్కరించాలి
రేపల్లె: రేపల్లె పట్టణంలోని 18వ వార్డు అరుంధతీనగర్ సమీపంలో ఏర్పడిన జగనన్న కాలనీలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం జగనన్న కాలనీవాసులు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. సమస్యలను విన్నవించారు. రహదారులు, డ్రెయిన్లు, తాగునీటి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షం పడినా నివాస గృహాల మధ్య రోజుల తరబడి నీటి నిల్వలు ఉండటంతో దోమల బెడద, దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలతో విషసర్పాల బెడద అధికమైందని వివరించారు. అప్పులు చేసి గృహాలు నిర్మించుకున్నా కనీస వసతులు లేక ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వేసవి ప్రారంభమైనప్పటి నుంచి బోర్లు మరమ్మతుకు గురై తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. మున్సిపల్ అధికారులు మాత్రం స్పందించలేదన్నారు. సమస్యలపై పలుమార్లు అధికారులకు వినతిపత్రం అందించటం, కార్యాలయం వద్ద నిరసనలు తెలియజేసినా ఫలితం శూన్యమని గోడు వెళ్లబోసుకున్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి కావాల్సిన నిధులు కేటాయింపులు చేస్తామన్నారు. సీపీఎం పట్టణ కార్యదర్శి సీహెచ్ మణిలాల్, జగనన్న కాలనీ అభివృద్ధి కమిటీ కన్వీనర్ వి.ధనమ్మ, కో కన్వీనర్ రవికుమార్, సహాయ కార్యదర్శి నాంచారమ్మ, సభ్యులు శ్రీనివాసరావు, వీరాంజనేయులు, గోపి తదితరులు పాల్గొన్నారు. మంత్రి అనగానికి కాలనీవాసుల వినతి -
ఇసుక తోడేళ్లు
బాపట్లశ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నగరంపాలెం: లాలాపేట శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభించారు. స్వామి వారిని పెళ్లి కుమారుడిగా, అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా అలంకరించారు. క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు విజయపురిసౌత్: పర్యాటక కేంద్రం నాగార్జున కొండలో క్యూ ఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేసినట్లు నాగార్జునకొండ కన్జర్వేటివ్ అసిస్టెంట్ వెంకటయ్య తెలిపారు. ప్రసన్నాంజనేయుడికి అభిషేకాలు ఫిరంగిపురం: వేమవరంలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయ 21వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేశారు.శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025చీరాల టౌన్: రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఇసుక దిబ్బలను యథేచ్ఛగా తోడేసుకుని భూముల్లో చదును చేసుకుంటున్నారు. చీరాల ప్రాంతంలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో మాఫియా చెలరేగిపోతోంది. ఒకవైపు ఇసుక దిబ్బలు, మరోవైపు తీరం అంచును యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. మండలంలోని గవినివారిపాలెం పంచాయతీ పరిధి విజయలక్ష్మీపురం తీర గ్రామాల్లో ఇలా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. అధికారమే అండగా.. విజయలక్ష్మీపురం గ్రామంలో సీ మౌత్ను మూసేసి గుంటూరుకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే భర్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి వేస్తున్న వెంచర్ చదునుకు, ఇతర వ్యాపార అవసరాలకు సముద్రపు ఇసుకను ట్రాక్టర్లు ద్వారా రవాణా చేస్తున్నారు. ఇసుక దిబ్బలు కనుమరగుతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల రూరల్ మండలానికి చెందిన తీర ప్రాంతం నుంచి కూడా సముద్రపు ఇసుకను తరలిస్తున్నారు. కన్నెత్తి చూడని యంత్రాంగం చట్టవిరుద్ధంగా రోజుకు రూ.లక్షల విలువైన ఇసుకను రవాణా చేస్తున్నప్పటికీ మాఫియా నుంచి మామూళ్లు తీసుకున్నందునే అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖాధికారుల తీరుపై అంతా మండిపడుతున్నారు. తీర ప్రాంత గ్రామాల ప్రజల క్షేమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. అడ్డుకున్న గ్రామ ప్రజలు తీరంలో ఇసుక దిబ్బలను యథేచ్ఛగా తవ్వుతుండటంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. కానీ మళ్లీ మాఫియా చెలరేగుతుండటంతో ఫలితం లేకుండా పోయింది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీర ప్రాంతాన్ని పంచుకుని తింటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక లేకుంటే తీరప్రాంత గ్రామాల్లోని తాము చాలా నష్టపోతాయని చెబుతున్నారు. తమకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా మాఫియాకు అండగా నిలిచినట్లు ప్రవర్తిస్తున్నట్లు ఆరోపించారు. సముద్రం ఉగ్రరూపం దాల్చి అలలు ఎగసి పడినప్పుడు ఇసుక దిబ్బలు వాటికి అడ్డుకట్ట వేస్తాయి. తీరప్రాంత గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా కాపాడుతాయి. అధికారం అండ చూసుకుని రెచ్చిపోతున్న ఇసుక మాఫియా దెబ్బకు ఇక్కడి దిబ్బలు కనుమరుగైపోతున్నాయి. దీంతో ఇక్కడి గ్రామాల ప్రజలకు పెను ముప్పు తప్పేలా లేదు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ప్రజలు వాపోతున్నారు.9న్యూస్రీల్మా పరిధిలోనిది కాదుఈ విషయమై చీరాల తహసీల్దార్ గోపికృష్ణను వివరణ అడుగగా.. బాపట్ల మండలంలోని అడవి పంచాయతీ తీరప్రాంతంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిసిందన్నారు. వీఆర్వోను పంపించి వివరాలు సేకరించామని పేర్కొన్నారు. ఇది బాపట్ల తహసీల్దార్ పరిధిలోకి వస్తుందని వివరించారు. – కె.గోపికృష్ణ, తహసీల్దార్ మాఫియా దెబ్బకు సముద్ర తీరంలో ఇసుక దిబ్బలు మాయం మామూళ్ల మత్తులో అఽధికార యంత్రాంగం మునిగిందని ఆరోపణలు తీర ప్రాంత గ్రామాల ప్రజలకు పొంచి ఉన్న పెను ముప్పు -
విశ్వాసానికి త్యాగానికి ప్రతీక
● మానవతా వెలుగుతో ఉదయించాలన్నదే అల్లాహ్ సందేశం ● బక్రీద్–శాంతి సందేశం, మానవతా దీప్తి పండుగ రోజున ఫజర్ నమాజ్ను తమ వీధిలోని మసీదులోనే విధిగా చదవాలి. పరిశుభ్రంగా, మంచి దుస్తులతో అత్తర్, సుర్మా రాసుకుని దారి పొడువునా ‘తక్బీర్’ చదువుతూ తమ ప్రాంతంలోని ఈద్గాకు వెళ్లి మాత్రమే సామూహిక నమాజ్ చేయాలి. ఈద్ నమాజ్ అయ్యే వరకు ఏమీ తినరాదు. ఈద్గా వద్దకు వెళ్లి, వచ్చే మార్గాలు వేర్వేరుగా ఉండాలి. ఈద్ నమాజ్ తర్వాతనే ఖుర్బానీ ప్రక్రియ ప్రారంభించాలి. వాటిని స్వీకరించాలి. – అబ్దుల్ కలీమ్, ముఫ్తీసాబ్ యడ్లపాడు: పవిత్ర రంజాన్ పర్వదినం అనంతరం ముస్లింల జీవితాల్లో మరొక ఆధ్యాత్మిక సందడిని నింపే పండుగ బక్రీద్. ‘బకర్’ అంటే జంతువు, ‘ఈద్’ అంటే పండుగ– రెండింటి కలయికే బక్రీద్. ఇది ఖుర్బానీ (బలిదానం) పండుగ కూడా. అందుకే దీనిని ‘ఈదుల్ ఖుర్బానీ’ లేదా ‘ఈద్ ఉల్ అదా’గా పిలుస్తారు. రంజాన్ తర్వాత 70 రోజులకు వచ్చే ఈ పండుగకు జిల్లాలోని ఈద్గాలు, మసీదులను మత పెద్దలు సిద్ధం చేశారు. శనివారం బక్రీద్ పండుగ జరుపుకోవాలని ప్రకటించారు. బక్రీద్ ముందు రోజు ‘ఆరఫా’ దినంగా భావిస్తారు. ఇది అల్లాహ్ ప్రేమ పొందడానికి అత్యంత శ్రేష్టమైన దినం. నరకం నుంచి విముక్తి కోరుతూ ఆ రోజు ఉపవాసం ఉండటం ద్వారా చిన్నచిన్న పాపాలు కూడా క్షమించబడతాయని ముస్లింల విశ్వాసం. ఇదే రోజున చనిపోయిన తమ పెద్దల్ని స్మరించుకుంటూ పెద్దల పండుగ నిర్వహించుకుంటారు. అంతేకాదు ప్రతి ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా పవిత్ర మక్కా యాత్ర చేయాలన్నది మత విధి. అది ఈ పర్వదినం నాడే చేయడం జరుగుతుంది. ఈ పండుగలోనే హజ్యాత్ర... ఇస్లాం మతంలోని ఐదు మూల స్తంభాల్లో హజ్ యాత్ర ఒకటి. ఈ పర్వదినం ప్రాముఖ్యత, హజ్ యాత్రతో మొదలవుతుంది. ఇస్లాం క్యాలెండరులో చివరి నెల ‘జిల్హిజ్’. ఈ నెల 9వ రోజున హజ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా మక్కా, మదీన క్షేత్రాలను దర్శించుకుంటారు. మక్కాలోని కాబా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు, ఆధ్యాత్మిక శుద్ధికి సంకేతం. ఇది కేవలం ఓ యాత్ర మాత్రమే కాదు –ఇది ఆత్మాన్వేషణకు ఆరంభమైన సాధన. తనలోని స్వార్థాన్ని వదిలి, మానవతా మార్గంలో పయనించాలనే సంకల్పంతో చేసే యాత్ర ఇది. ఆ మరుసటి రోజునే బక్రీద్ జరుపుకుంటారు. నిరుపమానమైన త్యాగానికి ప్రతీక– ఖుర్బానీ... మక్కా నగరంలో హజరత్ ఇబ్రహీం ప్రవక్తకు ముదిమి వయసులో కలిగిన ముద్దుల పుత్రుడు ఇస్మాయిల్ను అల్లాహ్కు బలిదానం చేసేందుకు సిద్ధమైన పవిత్ర ఘటనను స్మరిస్తూ బక్రీద్ నిర్వహిస్తారు. చివరికి, అల్లాహ్ ప్రత్యక్షమై, ఇస్మాయిల్ బదులు ఒక పొట్టేలును ఖుర్బానీ చేయాలని ఆదేశించాడు. అప్పటి నుంచి ఈ పండుగను జీవన త్యాగానికి జ్ఞాపకంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈద్ నమాజ్ ఇలా.. ఖుర్బానీ ఎవరు, ఎలా చేయాలి బక్రీద్ పండుగలో ఖుర్బానీ అత్యంత పవిత్రమైన ఆచారం. దానిని ధనంతో కాదు, మనసుతో చేసే త్యాగమే నిజమైన అర్పణ. ఖుర్బానీ ఇచ్చిన పొట్టేలు మాంసం మూడు భాగాలుగా విభజించి పేదలు, బంధువులు, మూడో భాగాన్ని తామే తీసుకోవాలి. చనిపోయిన వారి పేరుతో ఖుర్బానీ చేయాలంటే ఆ మాంసం పూర్తిగా ఇతరులకే పంచాలి. ఇది కేవలం మాంసం పంచడం కాదు, మానవతా భావన పంచడంగా భావిస్తారు. 52 తులాల వెండి లేదా 7.5 తులాల బంగారం కలిగిన ముస్లింలు విధిగా ఖుర్బానీ చేయాలి. -
నాడు ప్రగతి.. నేడు అధోగతి
నాడు–నేడు ద్వారా జిల్లావ్యాప్తంగా 1488 పాఠశాలల్లో రూ. 804.1 కోట్ల వ్యయంతో 2048 పనులు జరిగాయి. అద్దంకి నియోజకవర్గంలోని 280 పాఠశాలల్లో రూ.75.09కోట్లతో 458 పనులు జరిగాయి. బాపట్లలోని 210 పాఠశాలల్లో రూ.45.08 కోట్లతో 237 పనులు, చీరాలలోని 125 పాఠశాలల్లో రూ.38.16కోట్లతో 180 పనులు, పర్చూరులోని 263 పాఠశాలల్లో రూ.53.70కోట్లతో 371 పనులు, రేపల్లెలోని 282 పాఠశాలల్లో రూ.46.21కోట్లతో 381 పనులు, వేమూరు నియోజకవర్గంలోని 273 పాఠశాలల్లో రూ.45.86కోట్లతో 424 పనులు జరిగాయి. నేటి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గత ప్రభుత్వంలో మంజూరైన పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. -
విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ
విద్యార్థులకు మెరుగైన విద్యాబుద్ధులు అందించాలనే లక్ష్యంలో 2022–23 విద్యాసంవత్సరంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 22 వేలు విలువచేసే ట్యాబ్లు, దానిలో రూ. 15 వేల విలువ చేసే బైజూస్ కంటైన్ను నిక్షిప్తం చేసి పంపిణీ చేశారు. గరిష్టంగా ఒక్కో ట్యాబ్కు రూ. 37 వేలు ఖర్చుచేసి పేద విద్యార్థులకు అందించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ట్యాబ్లను అందించకపోగా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ (ఐఎఫ్పీ) విద్యాబోధన విధానాన్ని అటకెక్కించింది. -
పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత
ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ బాపట్ల: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి కృష్ణ ప్రసాద్ తెలిపారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాపట్ల మండలం సూర్యలంక దగ్గర నగరవనంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ చెట్లు నరకడం వలన గ్లోబల్ వార్మింగ్ ఏర్పడిందన్నారు. అది పెను విపత్తుకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి మాట్లాడుతూ కాలుష్య నివారణ, పర్యావరణ సమతుల్యత లక్ష్యాలుగా పర్యావరణ దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. ఈ ఏడాది ‘ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం’ అనే అంశంతో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. జిల్లాలోని 477 పంచాయతీలలో సోలార్ సిస్టం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆప్కో చైర్మన్ డా.సజ్జల హేమలత, డీఎఫ్ఓ కె.వినోద్ కుమార్, బాపట్ల ఆర్డీఓ పి. గ్లోరియా, కమిషనర్ రఘునాథరెడ్డి పాల్గొన్నారు. పీ–4 మార్గదర్శిల నమోదులో బాపట్ల ప్రథమం బాపట్ల: పీ–4 మార్గదర్శిల నమోదులో బాపట్ల జిల్లా 60 శాతం పురోగతి సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. పీ–4, యోగాంధ్ర, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై అనుబంధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహసిల్దార్లతో గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు మూడు వేలమంది మార్గదర్శిలు పీ–4లో నమోదైనట్లు చెప్పారు. బంగారు కుటుంబాలను మార్గదర్శిలు ఎంపిక చేసుకోవడం, దత్తత చూసుకోవడంపై అధికారులు అవగాహన కల్పించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ జూలైలో బాపట్ల జిల్లాకు రానున్నారని కలెక్టర్ చెప్పారు. ఐటీసీ కంపెనీ 80,000 మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తుండగా, ఆ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. సీపీఓ శ్రీనివాసరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ నాగిరెడ్డి, డీఈఓ పురుషోత్తమరావు, తదితరులు పాల్గొన్నారు. రూ. 5.72 కోట్ల రాయితీ సొమ్ము విడుదల జిల్లాను పారిశ్రామికంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల ఎగుమతుల కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు జిల్లాలో పరిశ్రమల కోసం 202 దరఖాస్తులు చేసుకోగా కమిటీ పరిశీలించి దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేసిందన్నారు. 186 పరిశ్రమలకు రూ.5.72 కోట్ల రాయితీ సొమ్ము మంజూరైనట్లు కలెక్టర్ వివరించారు. -
ఏడాదిగా తిరోగమనంలో ప్రభుత్వ విద్య
బాపట్ల టౌన్: చదువుకు పేదరికం అడ్డురాకూడదు...ప్రతి తల్లీ తన బిడ్డలను ఉన్నత చదువులు చదివించుకోవాలన్న లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రతిష్టాత్మ కంగా అమలు చేసింది. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి ఖాతాకు నేరుగా రూ.15 వేలు చొప్పున విద్యా సంవత్సరం ఆరంభంలోనే జమ చేసింది. జిల్లాలో లక్షలాది మంది విద్యార్థులు, వేలాది మంది తల్లులు లబ్ధి పొందారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ’అమ్మ ఒడి’ పేరును ’తల్లికి వందనం’గా మార్పు చేసి ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రతిఒక్కరికీ రూ.15 వేలు చొప్పున జమ చేస్తామంటూ కూటమి నేతలు ఊరూరా ఊదరగొట్టారు. తీరా కూటమి సర్కార్ కొలువుతీరి ఏడాది గడిచినా ఇప్పటికీ దీనిపై విధివిధానాలు లేవు. నాడు పౌష్టికాహారం.. నేడు అధ్వానం పిల్లలు చదువులో రాణించాలంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో పౌష్టికా హారం అందించారు. అది కూడా రోజుకో మోనుతోపాటు కోడిగుడ్డు, రాగిజావ, చిక్కీ అందజేస్తున్నారు. దీంతో పిల్లలు ఆడుతూ పాడుతూ విద్యనభ్యసిస్తూ సంతోషంగా ఉన్నారు. వీటితోపాటు నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లోని విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్, గ్రీన్ చాక్బోర్డులు, కిచెన్ షెడ్లు, ఇంగ్లిష్ ల్యాబ్, పెయింట్స్, బోర్ సౌకర్యం, మరుగుదొడ్లు తదితర పనులు చేయించారు. నేడు జిల్లాలోని అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెనూ సక్రమంగా అమలు కాని దుస్థితి. కొన్నిచోట్ల కోడిగుడ్డు కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. కొందరు విద్యార్థులు ఇంటినుంచి క్యారియర్లలో భోజనం తెచ్చుకుంటున్నారు. -
అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు
దుగ్గిరాల: డ్రైవరు మద్యం మత్తులో ఉండగా అదుపు తప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లిది. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో గురువారం మధ్యాహ్నం చిలువూరు నుంచి కె.ఆర్.కొండూరు గ్రామం వైపు కారు వేగంగా వెళుతోంది. ఈ క్రమంలో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు చూసి కారులోని డ్రైవరును బయటకు తీశారు. అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చిలువూరులో పక్కపక్కనే రెండు మద్యం దుకాణాలు ఉండటం వల్ల కొందరు నిత్యం తాగి వేగంగా ద్విచక్రవాహనాలు, కార్లను నడుపుతున్నారని స్థానికులు చెప్పారు. పలువురు ప్రమాదానికి గురవుతున్నారని తెలిపారు. అధికారులకు అనేకసార్లు ఇక్కడ మద్యం దుకాణాలు తొలగించాలని కోరినా స్పందించలేదని పేర్కొన్నారు. -
అదుపు తప్పిన రెండు కార్లు
కారంచేడు : దగ్గుబాడు నుంచి చీరాలకు వస్తున్న కారు నాలుగురోడ్ల సెంటర్ దాటి మామిడి తోట సమీపంలోకిగా రాగానే గాడిలో టైర్లు పడటంతో అదుపుతప్పి రోడ్డు మార్జిన్ ఉన్న పంట కాలువలో పడిపోయింది. బెలూన్లు ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న వీరగంధం రామకృష్ణ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. మధ్యాహ్నం పోతినవారిపాలేనికి చెందిన ఎనికపాటి మస్తాన్రావు చీరాలకు వెళ్తుండగా పోతినవారిపాలెం గ్రామం దాటిన ఒక కిలోమీటరు దూరంలోనే ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలో పడిపోయింది. దీంతో ఆయన కారులోను బెలూన్లు ఓపెన్ అయ్యాయి. ఆయన కూడా స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. పంట కాలువల్లో బోల్తా -
‘కూటమి’ విష సంస్కృతి
● వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై వేఽధింపులు ● నూతన విద్యుత్ స్తంభాలు నిలిపివేత ● గ్రామంలో కూటమి నాయకులకే వత్తాసు పలుకుతున్న విద్యుత్ అధికారులు జె.పంగులూరు: నిన్నటి వరకు కలిసిమెలిసి ఒకే కుటుంబంలా జీవించే గ్రామాలు నేడు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. కులమతాలకు, రాజకీయాలుకు అతీతంగా ఉండే గ్రామాలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో చితికి పోతున్నాయి. కూటమి పెద్దలు వైఎస్సార్ సీపీ సానుభూతి పరులపై రాజకీయ కక్ష పెంచుకొని, వారిని అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని చందలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని 8వ వార్డులో గొట్టిపాటి వారి బజారు ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆ వార్డు నుంచి కుంచాల రమాదేవి అనే మహిళ వార్డు మెంబరుగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరురాలిగా గెలిచింది. అయితే గొట్టిపాటి వారి బజారు నుంచి వార్డు మెంబరుగా నిలబడి గెలవడమే ఆ బజారు వారు చేసిన తప్పుగా మారింది. 2024 లో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వారిని అన్ని విధాలుగా ఇబ్బందులు గురిచేస్తున్నారు. 40 ఏళ్ల నాటి కరెంటు స్తంభాలు గొట్టిపాటి వారి బజారుకి 1984లో మూడు స్తంభాలు వేసి కరెంటు లైన్ లాగారు. అయితే ప్రస్తుతం చందలూరు గ్రామంలో పాత స్తంభాల స్థానంలో కొత్తవి వేస్తున్నారు. అందరితో పాటు తమకూ వేస్తారులే అని అ బజారు వారు అనుకున్నారు. కానీ ఊరు మొత్తం కొత్త స్తంభాలు వేసి కరెంటు లైన్లు లాగిన సిబ్బంది.. ఆ బజారును మాత్రం అలానే వదిలేశారు. 40 సంవత్సరాల నాటి స్తంభాలు పూర్తిగా వంగి పోయి కరెంటు వైర్లు కిందికి జారాయి. ఎప్పడు విరిగిపోతాయో తెలియని దుస్థితి నెలకొంది. అధికారులు మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటానికే నిర్ణయించుకున్నట్లుంది. కలెక్టర్కు అర్జీ గొట్టిపాటి వారి బజారుకు చెందిన స్థానికులు ఏప్రిల్ 7న బాపట్ల కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన కలెక్టర్ వెంటనే 15 రోజుల్లో సమస్య పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కొత్తం స్తంభాలు వేస్తామని, అడ్డు వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సంతకాలు చేయించుకొని.. ఆన్లైన్లో అర్జీ రద్దు చేశారు. చేసేది లేక తిరిగి గొట్టిపాటి బజరు వారు మే 19న కలెక్టర్కు మరో సారి అర్జీ ఇచ్చారు. కలెక్టర్ సమస్య పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉచిత సలహాలు ఇస్తున్న అధికారులు విద్యుత్ ఏఈ గొరంట్ల అనిల్ కుమార్కు ఫోన్ చేసి తీగలు వేల్లాడుతున్నాయని చెబితే.. కర్రలు అడ్డు పెట్టుకోమని తమకు ఉచిత సలహాలు ఇస్తున్నారని స్థానికులు వాపోయారు. స్తంభాలు ధ్వంసం అయ్యాయని తెలిపినా.. వాటి జోలికి వస్తే ఊరుకోమంటూ దురుసుగా మాట్లాడారని తెలిపారు. -
నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాకు మంచిపేరు తీసుకురండి
● కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాబు హుస్సేన్ ● జిల్లాస్థాయి సబ్ జూనియర్స్, జూనియర్స్ బాల, బాలికల ఫుట్బాల్ జట్ల ఎంపిక సత్తెనపల్లి: క్రీడాకారులు క్రీడానైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాబు హుస్సేన్ అన్నారు. స్థానిక సుగాలీకాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పల్నాడు జిల్లాస్థాయి సబ్ జూనియర్స్, జూనియర్స్ బాలబాలికల ఫుట్బాల్ సెలక్షన్ ట్రయల్స్ గురువారం జరిగాయి. ఈ సెలక్షన్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 70 మంది బాలురు, 50 మంది బాలికలు ఫుట్బాల్ క్రీడలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు విజయమే లక్ష్యంగా పెట్టుకొని రాణించాలన్నారు. సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీరామ్ రెడ్డి, అచ్చిరెడ్డి, మహబూబ్ సుభాని, నరసింహారావులు మాబు హుస్సేన్ను ఘనంగా సత్కరించారు. పల్నాడు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు సెలెక్ట్ అయిన ఫుట్బాల్ క్రీడాకారులు త్వరలో జరిగే స్టేట్ మీట్లో పాల్గొంటారన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా సబ్ జూనియర్స్, జూనియర్స్ బాల, బాలికల జట్లను ప్రకటించారు. -
బంగారం కోసమే వృద్ధురాలి హత్య
తెనాలి ముత్తెంశెట్టిపాలెం కేసును ఛేదించిన పోలీసులు తెనాలి రూరల్: తెనాలి ముత్తెంశెట్టిపాలెంలో ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున వృద్ధురాలి హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. తెనాలి వన్ టౌన్ పోలీస్స్టేషన్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి. జనార్దనరావు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ముత్తెంశెట్టిపాలెంలో తాడిపత్రి మల్లీశ్వరి టిఫిన్ బండి నిర్వహిస్తూ ఒంటరిగా జీవిస్తోంది. కుమార్తె, కుమారుడికి వివాహాలయ్యాయి. వారు ఇదే ప్రాంతంలో వేర్వేరుగా ఉంటున్నారు. ఒంటరిగా ఉంటున్న మల్లీశ్వరి బంగారు ఆభరణాలను ధరించి ఉండడాన్ని ఆమె ఇంటి పక్కనే నివసిస్తున్న 24 ఏళ్ల నన్నెపాముల తారక జోషి గమనించాడు. ఇతడు గతంలో బాపట్ల జిల్లా నగరం మండలం ధూళిపూడి గ్రామంలో నివసించేవాడు. వివాహమై, చెడు వ్యసనాలతో అప్పులపాలైన అతను ఆ ఆభరణాలను దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తమ్ముడు సతీష్కుమార్ సహాయం తీసుకున్నాడు. 3వ తేదీ తెల్లవారుజామున ఐదు గంటలకు మల్లీశ్వరి నీళ్ల కోసం పంపు వద్దకు రాగా ఆమెను గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టారు. బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఆ బంగారంలో కొంత తారక జోషి తనకు పరిచయమున్న సంగంజాగర్లమూడి గ్రామానికి చెందిన మహిళ గాజులవర్తి కీర్తికి ఇచ్చాడు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారిస్తున్న క్రమంలో చిక్కిన నిందితులు నేరానికి పాల్పడినట్టు గుర్తించారు. ఆ ఆభరణాలను ఆమె తాకట్టు పెట్టిందని, వాటిని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. కేసును 48 గంటల్లో ఛేదించిన వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు, సిబ్బందిని ఆయన అభినందించారు. -
నల్లబర్లీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి
మంత్రి గొట్టిపాటికి రైతుల వినతి జె.పంగులూరు: మండల కేంద్రమైన పంగులూరు గ్రామంలోని మార్కెట్ యార్డులో నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు రైతులు విజ్ఞప్తి చేశారు. మండలంలోని చందలూరు గ్రామంలో గురువారం పర్యటించిన ఆయన్ను పలువురు పొగాకు రైతులు కలిశారు. మండలంలో సుమారు 43 వేల క్వింటాళ్ళకు పైగా నల్లబర్లీ పొగాకు నిల్వ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు ప్రాంతాల్లో అధికంగా పొగాకు నిల్వలు ఉనందున ఆ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పంగులూరు పరిసర ప్రాంతాల గ్రామ రైతులు పొగాకు నిల్వలను విక్రయించుకునేందుకు అనువుగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో రైతులు అడ్డగద సతీష్, అడ్డగడ సుబ్బయ్య, కర్రి వెంకటసుబ్బారావు, రావూరి రమేష్ బాబు, ఎన్టీర్ వెంకటేశ్వర్లు, నార్వే శ్రీనివాసరావు, కుక్కపల్లి ఏడుకొండలు తదితరులు ఉన్నారు. మొక్క నాటిన మంత్రి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండలంలోని చందలూరులో వన మహోత్సవం సందర్భంగా మొక్క నాటారు. ఎంపీడీఓ కె. స్వరూపరాణి, ఏపీఓ కె. సంతోషం, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ డీఈ శ్రీనివాస్, ఏఈ శివయ్య, ఈఓఆర్డీ సుమంత్, పంచాయతీరాజ్ ఏఈ గడ్డం హనుమంతరావు పాల్గొన్నారు. -
కౌలు రైతులకు రుణాలు పెంచాలి
గుంటూరు వెస్ట్: జిల్లాలో కౌలు రైతులకు ఇవ్వాల్సిన రుణ లక్ష్యాలను ఆశించిన స్థాయిలో బ్యాంకర్లు పూర్తి చేయలేదని, దీన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో 2025 త్రైమాసికానికి సంబంధించి డీసీసీ, డీఎల్ఆర్సీ బ్యాంకర్ల సమవేశం జరిగింది. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ కౌలు రైతులకు రూ. 180 కోట్ల రుణ లక్ష్యం కాగా, రూ. 60 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. దీన్ని మరింత పెంచి పెండింగ్ రుణాలు అందించాలన్నారు. విద్య, గృహ రుణాలు పెంచేందుకు బ్యాంకర్లు, విద్యా సంస్థలు, ఇంజినీరింగ్ కళాశాలలు, తదితర రద్దీ ప్రాంతాల్లో రుణ మేళా నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహించాలన్నారు. దీనిలో భాగంగా కనీసం రూ. 20 వేల మందికి రుణాలు ఇవ్వాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పీఎం విశ్వకర్మ, పీఎం ఈజీసీఎం, పీఎంఎఫ్ ఎంజీ, ముద్ర రుణ లక్ష్యాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. గత ఆర్థిక సంవత్సరం 2024–25 కు సంబంధించి వ్యవసాయ రంగానికి రూ.13,613 కోట్ల రుణ లక్ష్యం కాగా, రూ.16,266 కోట్లు అంటే 119 శాతం మంజూరు చేశారన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 9,495 కోట్లు రుణ లక్ష్యం కాగా, రూ. 10,679 కోట్లు అంటే 112 శాతం మంజూరు చేశారన్నారు. ప్రాధాన్యత రంగానికి సంబంధించి విద్యా రుణాలు రూ.114.5 కోట్లు లక్ష్యం కాగా, రూ.95.87 కోట్లు మంజూరు చేశారన్నారు. గృహ రుణాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని అసహనం వ్యక్తం చేశారు. దీనిలో రూ.664 కోట్లు లక్ష్యం నిర్ణయిస్తే, రూ.182 కోట్లు అంటే కేవలం 27.5 శాతం మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. మొత్తం వార్షిక రుణ లక్ష్యం రూ.34,730 కోట్లకు గాను, రూ.44,918 కోట్లు అంటే రూ.129 కోట్లు మంజూరు చేసి రుణ లక్ష్యాలను దాటినందుకు బ్యాంకర్లను అభినందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లాకు సంబంధించి నాబార్డు పీఎల్పీ 2025 –26 పుస్తకాన్ని ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ, యూడీఐ రీజనల్ హెడ్ జవహర్, జిల్లా లీడ్బ్యాంకు మేనేజర్ మహిపాల్రెడ్డి, నాబార్డు డీడీఎం శరత్, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఆర్బీఐ ఎల్డీవో నవీన్లు ఆవిష్కరించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ -
పర్యావరణ సమతుల్యతకు మొక్కలు నాటాలి
అదనపు సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎం. లావణ్య నరసరావుపేట టౌన్: పర్యావరణ సమతుల్యం కోసం మొక్కలు నాటాలని అదనపు సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎం. లావణ్య సూచించారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా గురువారం రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు స్థానిక న్యాయస్థానం ఆవరణలో పర్యావరణ పరిరక్షణపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని ప్రసంగించారు. మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలనీ, కాలుష్యాన్ని నివారించడం కోసం అందరమూ కృషి చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి సంరక్షించడంతోపాటు ప్లాస్టిక్ బ్యాగ్ల వాడకాన్ని నివారించాలని తెలిపారు. అనంతరం న్యాయస్థాన భవనాల ఆవరణలో న్యాయాధికారి లావణ్య మొక్కలు నాటారు. కార్యక్రమంలో పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, కోర్ట్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకుని వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఐ ఎం.వి. చరణ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ లోక్నాథ్, ఎస్ఐలు కిశోర్, అశోక్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆధునిక వ్యవసాయ విధానంతో అధిక దిగుబడులు
కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వర్లు పెదకూరపాడు: ఆధునిక వ్యవసాయ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వర్లు చెప్పారు. కృషి విజ్ఞాన్ కేంద్రం వారి ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప యాత్ర పెదకూరపాడులో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు అంటే డ్రోన్ల ప్రాముఖ్యత, అధునాతన యంత్రాలు గురించి వివరించారు. అవి ఎలా ఉపయోగపడతాయో తెలియచేశారు. కృషి విజ్ఞాన కేంద్రం లాంఫాం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.గంగాదేవి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయం, అనుబంధ రంగాల పథకాల గురించి వివరించారు. ఈనామ్ పోర్టల్ వినియోగం, కిసాన్ సారధి టోల్ ప్రీనెంబరు గురించి వివరించారు. ఉద్యానశాఖలో అమలవుతున్న పండ్ల తోటలు, పూల తోటలకు ఇచ్చే సబ్సిడీల వివరాలను ఉద్యానవన శాఖాధికారి యు.శ్రీ నిత్య వివరించారు. పశు సంవర్థకశాఖ పథకాలను గురించి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పి.శ్రీదేవి తెలియచేశారు. వ్యవసాయ శాఖలో అమలవుతున్న పీఎం కిసాన్ మట్టి నమూనాల సేకరణ, 50 శాతం రాయితీపై పచ్చిరొట్టె విత్తనాలు పంపిణీ, వ్యవసాయ యాంత్రీకరణ మొదలైన పథకాల గురించి ఏవో ఐ శాంతి తెలియచేశారు. జీవ శిలీంద్రనాసిని అయిన ట్రైకోడెర్మావిరిడి ప్యాకెట్లను కృషి విజ్ఞాన కేంద్రం, లాంఫాం శాస్త్రవేత్తలు రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతులు, గ్రామ వ్యవసాయ సహాయకులు బి.జ్యోతి, పి.ధనలక్ష్మీ షేక్ హసన్ బాజీ పాల్గొన్నారు. -
జిల్లా స్థాయి సీనియర్ చెస్ విజేత ధ్రువేష్
గుంటూరు వెస్ట్ (క్రీడలు): జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక అమరావతి రోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి సీనియర్ ఓపెన్ చెస్ పోటీల్లో విజేతగా డి.ధ్రువేష్ నిలిచాడు. ఆ తర్వాత మూడు స్థానాల్లో కె.హర్షవర్ధన్, ఎ.హరిసూర్యనారాయణ, కీర్తి రానా నిలిచారు. ఈ నెల 7, 8వ తేదీల్లో విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ నలుగురు పాల్గొంటారని నిర్వాహకుడు వైవీకే చక్రవర్తి తెలిపారు. అనంతరం విజేతలకు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాజు, హిందూ ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి రామకృష్ణమూర్తి, చక్రవర్తి బహుమతి ప్రదానం చేశారు. -
16 మందికి హెడ్ నర్సులుగా ఉద్యోగోన్నతి
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్టాఫ్ నర్సులుగా పని చేస్తున్న 16 మందికి గురువారం కౌన్సెలింగ్ నిర్వహించి హెడ్ నర్సులుగా ప్రమోషన్ ఉత్తర్వులు ఇచ్చారు. గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో జరిగిన కౌన్సెలింగ్కు 17 మంది స్టాఫ్ నర్సులను ప్రమోషన్ కోసం పిలువగా, ఒకరు ప్రమోషన్ వద్దని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. ప్రమోషన్ ద్వారా గుంటూరు జీజీహెచ్లో ఎనిమిది మంది, ఒంగోలు జీజీహెచ్లో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు హెడ్ నర్సులుగా చేరారు. సుమారు ఆరు నెలలుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న నర్సింగ్ సిబ్బంది ఎట్టకేలకు కౌన్సెలింగ్ జరగడంతో నర్సింగ్ యూనియన్ నేతలతో కలిసి గురువారం మెడికల్ అండ్ హెల్త్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ కె.సుచిత్రాదేవిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆర్డీతోపాటు, డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్ షేక్ నాగూర్ షరీఫ్, సీనియర్ అసిస్టెంట్ సుబ్బారావు పాల్గొన్నారు. ఆర్డీకి కృతజ్ఞతలు తెలిపిన వారిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా సెక్రటరీ వెల్లంపల్లి పద్మజ, వైస్ ప్రెసిడెంట్ శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సునీత, అరుణ తదితరులు పాల్గొన్నారు. -
కురిచేడు ఎంపీడీఓ సస్పెన్షన్
కురిచేడు: కురిచేడు ఎంపీడీఓ, ఈఓఆర్డీగా విధులు నిర్వహిస్తున్న బి.సతీష్ బాబుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. గతంలో బాపట్ల జిల్లా భట్టిప్రోలు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో నిధులు దుర్వినియోగం చేసినట్లు నిరూపణ కావడంతో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ మంగళవారం సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు రాగా గురువారం ఎంపీడీఓ విధుల నుంచి వైదొలిగారు. కురిచేడు ఇన్చార్జి ఎండీపీఓగా దొనకొండ ఎంపీడీఓ ఎం.శ్రీదేవిని నియమించారు. ఏపీఐఐసీ భూముల పరిశీలన మాచర్ల రూరల్: మండలంలోని రాయవరం గ్రామ సమీపంలోని ఏపీఐఐసీకి చెందిన భూములను తైవాన్ దేశానికి చెందిన ఏషియా కంపెనీ పారిశ్రామికవేత్తలు పరిశీలించారు. లెదర్ పార్కు ఏర్పాటు కోసం గురువారం వారు ఆయా భూముల గురించి తెలుసుకున్నారు. భవన నిర్మాణాలకు అనుకూలత, నీటి వసతి, విద్యుత్, భూగర్భ జలాలు, నేషనల్ హైవే, ఇతర రహదారి మార్గాలను వారు పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ బి. కిరణ్ కుమార్తో పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో రెవెన్యూ, ఇండస్ట్రియల్ అధికారులు పాల్గొన్నారు. నేడు సత్తెనపల్లిలో సీఐటీయూ మహాసభ సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సీఐటీయూ) 4వ రాష్ట్ర మహాసభ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో గల పుతుంబాక వెంకటపతి భవన్ నందు శుక్రవారం నిర్వహించనున్నట్లు వీఆర్ఏల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ బందగీ సాహెబ్ గురువారం తెలిపారు. మహాసభకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు హాజరవుతారని తెలిపారు. ముఖ్యంగా మహాసభలలో వీఆర్ఏల సమస్యలపై చర్చ, భవిష్యత్తు కార్యాచరణ, నూతన కార్యవర్గం తదితర అంశాల మీద చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకత్వం, డివిజన్ నాయ కులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. త్వరలో పిడుగురాళ్ల వైద్య కళాశాల ప్రారంభిస్తాం రెంటచింతల: పిడుగురాళ్ల వైద్య కళాశాలను రానున్న విద్యాసంవత్సరంలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి సత్యకుమార్ వెల్లడించారు. గురువారం రాత్రి రెంటచింతలలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 3100 ఆరోగ్య ఉప కేంద్రాలను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులు మళ్లించి అసంపూర్తిగా నిర్మించిందని తెలిపారు. కేంద్రం నిధులతో కూటమి ప్రభుత్వం మరో 1700 ఆరోగ్య ఉప కేంద్రాలను గ్రామాలలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు బిఎస్సీ నర్సింగ్ చదివిన విద్యార్థులను వినియోగించుకుంటామని ఆయన తెలిపారు. -
బర్లీపై బేఖాతర్ !
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రైతుల వద్ద ఉన్న బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని మే నెల 24న పర్చూరు ప్రాంతంలో పర్యటించిన మంత్రుల బృందం ఆదేశించినా టుబాకో కంపెనీలు ఐ డోంట్కేర్ అంటున్నాయి. పొగాకు కొనాలని 22 కంపెనీలను ఆదేశిస్తే ఒకటి రెండు కంపెనీలు మినహా మిగిలినవి మొక్కుబడిగా కూడా కొనడం లేదు. కొన్ని కేవలం 10 టన్నులు కొని చేతులు దులుపుకున్నాయి. ప్రభుత్వం ఆదేశించి రెండు వారాలు దాటుతున్నా గురువారం నాటికి కేవలం 24,571 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశాయి. ఒక్క జీపీఐ లిమిటెడ్ కంపెనీ 3,426 మెట్రిక్ టన్నులు, ప్రధాన కంపెనీగా ఉన్న ఐటీసీ కేవలం 758 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. యార్లగడ్డ ఆగ్రోస్ 771 టన్నులు, కార్టెల్ 1933, అలి ఎంటర్ ప్రైజెస్ 766, మహమ్మద్ ఎంటర్ ప్రైజెస్ 918, కళ్యాణీ టుబాకో 525, ఎస్బి ఇంపెక్స్ 460 టన్నుల చొప్పున కొనుగోలు చేయగా ఇక వేహా 12 టన్నులు, ప్రేవైల్ 46, ట్రేడ్ వెల్ 16, మహంకాళీ 10, ఎలైట్ ఆగ్రో 50 టన్నుల చొప్పున మాత్రమే కొనుగోలు చేసి మమ అనిపించాయి. వంద మెట్రిక్ టన్నుల లోపే... కొన్ని కంపెనీలు వంద మెట్రిక్ టన్నుల లోపే బ్లాక్బర్లీ కొనుగోలు చేశాయి. మొత్తంగా 22 కంపెనీలు కలిపి కేవలం 24, 571 మెట్రిక్ టన్నులు కొనగా ఒక్క జీపీఐ 3,500 టన్నులు కొంది. జీపీఐ నిత్యం రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేస్తోంది. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం రైతుల వద్ద 87.23 మెట్రిక్ టన్నుల పొగాకు దిగుబడి ఉండగా గురువారం నాటికి 24.57 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. పట్టించుకోని సర్కార్ జిల్లాలో రైతుల వద్ద ఉన్న బ్లాక్బర్లీ పొగాకు మొత్తం కొనుగోలు చేయిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత కొనుగోళ్లను ఏమాత్రం పర్యవేక్షించక చేతులెత్తేసింది. దీంతో కొనుగోళ్లు దాదాపు నిలిచిపోయాయి. మే 24న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లతో కూడిన మంత్రుల కమిటీ పర్చూరు నియోజకవర్గంలో పర్యటించి రైతుల వద్ద పొగాకు కొనాలని కంపెనీలను ఆదేశించాయి. మొత్తం పొగాకు కొనిపిస్తామని మాటిచ్చారు. ప్రధానంగా ఐటీసీ లాంటి పెద్ద కంపెనీలు కేవలం 758 మెట్రిక్ టన్నులు కొని చేతులు దులుపుకోవడం విమర్శలకు దారితీసింది. పొగాకు కొనిపించే విషయంలో ప్రభుత్వం శ్రద్ధ చూపించడం లేదనడానికి ఇదే నిదర్శనమని ప్రతిపక్ష వైఎస్సార్సీపీతోపాటు రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం కొన్నా 20 వేల మెట్రిక్ టన్నులకు మించి కొనుగోలు చేసే పరిస్థితి ఉండక పోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు నియోజకవర్గంలోని పచ్చపార్టీ కార్యకర్తల పొగాకు మాత్రమే కొని చేతులు దులుపు కునే అవకాశముందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ ఆదేశాలు లెక్క చేయని టుబాకో కంపెనీలు రైతుల వద్ద బ్లాక్ బర్లీ కొనాలన్న ప్రభుత్వం జీపీఐ మినహా పొగాకు కొనని ఇతర కంపెనీలు మొక్కుబడి కొనుగోళ్లతో సరిపెట్టిన ఐటీసీ పేరుకు 22 కంపెనీలు ఉన్నా 25 వేల టన్నులు కూడా కొనని వైనం ఇంకా రైతుల వద్ద 62 వేల టన్నుల బ్లాక్ బర్లీ పొగాకు నిల్వలు -
వెన్నుపోటుపైజనాగ్రహం
సూపర్–6 హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఏడాదైనా వాటిని అమలు చేయకపోవడంపై కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. వాగ్దానాల అమలును గాలికొదిలేసి, తమను రోడ్డున పడేసిన వైనంపై జనం కన్నెర్ర చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందేనంటూ వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి కదం తొక్కారు. కూటమి ప్రజాకంఠక పాలన పోవాలంటూ నినదించారు. పోలీసు ఆంక్షలను ఛేదించి వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేశారు.సాక్షి ప్రతినిధి,బాపట్ల: సూపర్సిక్స్ పథకాలను ఇస్తామని ఎన్నికల్లో ఓట్లేయించుకున్న కూటమి పాలకులు గద్దెనెక్కాక ఒక్కహామీనీ నెరవేర్చక ప్రజలను వంచించారు. పథకాల ఆశచూపి నిరుపేదల కడుపుపై కొట్టారు. ఏడాది పాలనలో ఎన్నికల్లో చెప్పిన ఏ ఒక్క పథకాన్నీ ప్రజలకు ఇవ్వలేదు. మాటచెప్పి అన్నివర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. కూటమి సర్కార్ ప్రజలను వంచించడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ బుధవారం వెన్నుపోటు దినం పేరుతో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. ప్రభుత్వ వంచనను ఖండించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వంపై నిరసన తెలిపారు. కొల్లూరులో కదం తొక్కిన శ్రేణులు కొల్లూరులో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు చేపట్టిన నిరసనకు పోలీసులు అడుగడుగునా అడ్డుతగిలారు. ఆయనను తహశీల్దారు కార్యాలయానికి వెళ్లనివ్వలేదు. వాస్తవానికి ఉదయం కొల్లూరు మండలం మొసలిపాడు వద్దనుంచి వైస్సార్ సీపీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్దమైంది. కూటమి వంచనను వివరించేలా అశోక్బాబు వినూత్న నిరసన చేపట్టారు. ఎండీయూ వాహనాలకు కూటమి మోసపూరిత సూపర్సిక్స్ హామీలను ఫ్లెక్సీలుగా వేసి ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు వాహనాలను అనుమతించబోమంటూ డ్రైవర్ల వద్దనుంచి తాళాలు లాక్కున్నారు. ఆ తర్వాత ర్యాలీని అడ్డుకున్నారు. పోలీసులు వైఎస్సార్ సీపీ కార్యకర్తల మధ్య పలుదఫాలుగా తోపులాట జరిగింది. మధ్యాహ్నం సమయానికి ర్యాలీ రేపల్లె – తెనాలి రోడ్డుపైకి చేరింది. అప్పటికే ఎండతీవ్రత పెరగడం, పోలీసులు అడ్డకోవడం ఆగకపోవడంతో అశోక్బాబు సొమ్మసిల్లి పడిపోయారు. నేతలు, కార్యకర్తలు నిరసన తెలుపుతూ అక్కడే బైటాయించారు. ఆ తర్వాత వెళ్లి తహసీల్దార్కు వినతిపత్రం ఇస్తామన్నా పోలీసులు అనుమతించలేదు. చివరకు నిరసన కార్యక్రమం వద్దకే తహసీల్దారును పిలిపించి అక్కడే వినతిపత్రం ఇప్పించారు. పోలీసుల తీరుపై అశోక్బాబు మండిపడ్డారు. కూటమి సర్కార్ తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ శ్రేణులు నినాదాలతో విరుచుకుపడ్డాయి. బాపట్లలో పోటెత్తారు బాపట్లలో మాజీ డిప్యూటీ స్వీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో కూటమి సర్కార్ మోసపూరిత హామీలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోన భవన్ నుంచి పాతబస్టాండు మీదుగా తహసీల్దారు కార్యాలయం వరకూ ర్యాలీ సాగింది. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం హామీలతో గద్దెనెక్కి వాటిని నెరవేర్చక వంచించారని కోన విమర్శించారు. కార్యక్రమంలో వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య కూటమి వెన్నుపోటుకు నిరసనగా తలనీలాలు సమర్పించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో కోకి రాఘవరెడ్డి, సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బూటకపు హామీలను నిరసిస్తూ.. రేపల్లెలో సమన్వయకర్త ఈవూరు గణేష్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు పట్టణశివారు ఇసుకపల్లి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ తప్పుడు వాగ్దానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూటమిప్రభుత్వం ప్రజలను వంచించిందని గణేష్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు తదితరులు పాల్గొన్నారు. చీరాలలో.. చీరాలలో సమన్వయకర్త కరణంవెంకటేశ్ ఆదేశాలతో పార్టీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ జైషన్బాబు తదితరుల నేతృత్వంలో పార్ర్టీశ్రేణులు స్థానిక గడియారం స్థంభం సెంటర్ నుంచి వైఎస్సార్ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి కొద్దిసేపు అక్కడే ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చక ప్రజలను వంచించిందని విమర్శించారు. వెన్నుపోటు చంద్రబాబుకు బుద్ధి చెబుతామని ప్రజలు నినదించారు. వంచనపై జనాగ్రహం పర్చూరు నియోజకవర్గంలో సమన్వయకర్త గాదె మధుసూదన్రెడ్డి ఆధ్వ ర్యంలో పార్టీశ్రేణులు పర్చూరు బొమ్మలసెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు మహానేత వైఎస్సార్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. చంద్రబాబు సర్కార్ ఎన్నికల్లో హామీలు ఇచ్చి గద్దెనెక్కాక వాటిని నెరవేర్చక ప్రజలను వంచిందన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు భవనం శ్రీనివాసరెడ్డి, కొల్లా వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా వెన్నుపోటు దినం ర్యాలీలు సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొల్లూరులో వేమూరు సమన్వయకర్త ఆధ్వర్యంలో వినూత్న నిరసన బాబు సూపర్సిక్స్ పథకాలు అమలు చేయకపోవడంపై ఫ్లెక్సీల ప్రదర్శన నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగిన అశోక్బాబు ఈవూరు గణేష్ ఆధ్వర్యంలో రేపల్లెలో ర్యాలీ కోన రఘుపతి నేతృత్వంలో బాపట్లలో నిరసన ప్రదర్శన పర్చూరులో ర్యాలీ నిర్వహించిన గాదె మధుసూదన్రెడ్డి హనిమిరెడ్డి నాయకత్వంలో అద్దంకిలో ఆందోళన కరణం వెంకటేశ్ ఆదేశాలతో చీరాలలో నిరసన కార్యక్రమం వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి కదం తొక్కిన జనంప్రజాగ్రహానికి అద్దం పట్టిన ర్యాలీఅద్దంకిలో పానెం హనిమిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కూటమి వంచన పాలనకు నిరసనగా కార్యక్రమం నిర్వహించాయి. స్థానిక వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. స్థానికంగా ఉన్న మహానేత వైఎస్సార్, డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఆతర్వాత తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక వంచనకు పాల్పడిందని హనిమిరెడ్డి విమర్శించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, రైతువిభాగం నేత ఈదా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైకుంఠపురం కొండకు అపచారం
అమరావతి: పవిత్ర పుణ్యక్షేత్రమైన వైకుంఠపురంలో స్వయంభూగా వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి కొండకు అపచారం జరుగుతోంది. కూటమి నేతల అండదండలతో కొందరు అక్రమంగా గ్రావెల్ కోసం కొండను తవ్వేస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు. వివరాల్లోకెళితే.. రాజధాని అమరావతికి సమీపాన ఎంతో చారిత్రక నేపధ్యం కలిగిన వైకుంఠపురం కొండపై వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈకొండ పక్కనుంచే పవిత్ర కృష్ణానది ఉత్తర దిక్కుగా ప్రవహించి ఉత్తరవాహినిగా పేరుగాంచింది. ఈకొండ చుట్టూ అష్టదిగ్బంధనంలాగా ఎనిమిది ఆంజనేయస్వామి వారి విగ్రహాలు ప్రతిష్టించి ఉన్నాయని గ్రామస్తులు నమ్మకం. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన కొండను కూటమి నేతల అండదండలతో పలువురు ఉత్తరవాహిని సమీపంలో తవ్వి గ్రావెల్ తరలిస్తున్నారు. రోజుకు వందలాది ట్రక్కులకు పైగా భారీ పొక్లెయిన్లతో మట్టి తవ్వి తరలిస్తున్నారు. దీనిపై స్థానిక రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈకొండను తాము ఎంతో పవిత్రంగా పూజిస్తామని అటువంటి కొండను తవ్వడం అపచారమంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు అక్రమ గ్రావెల్ తవ్వకాలపై దృష్టిసారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. కూటమి నేతల అండతో తవ్వి తరలింపు -
దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా ఉండాలి
బాపట్ల: అనాధ శిశువుల దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. బాలల సంక్షేమ కమిటీ సమావేశం బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగింది. అనాధ శిశువులను దత్తతతో తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని కలెక్టర్ చెప్పారు. చెత్త కుండీల వద్ద, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్టాండ్ల వద్ద వదిలేసిన శిశువులు మహిళ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే శిశు గృహ, బాల సధన్లలో ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు. అలాంటి శిశువులు, బాలలు ఏడుగురు ప్రభుత్వ సంరక్షణలోని శిశు గృహంలో ఉన్నారన్నారు. శిశు గృహానికి వచ్చిన వారందరికీ తల్లిదండ్రుల ప్రేమ అందించాలన్నారు. మొదటిసారిగా బాపట్ల జిల్లా నుంచి దత్తత ఇవ్వడానికి అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. కారా (చైల్డ్ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) ద్వారా ఈ ప్రక్రియ జరగనుందన్నారు. ప్రస్తుతం ఇరువురికి దత్తత ఇవ్వడానికి జిల్లాస్థాయి కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. కారా నిబంధనలను అనుసరించి బాలిక లావణ్య, బాలుడు కార్తీక్లకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీకి ఫోన్లోనే కలెక్టర్ ఆదేశాలిచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధా మాధవి, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, జువైనెల్ వెల్ఫేర్ కమిటీ ప్రొబిషన్ అధికారి సౌందర్య, ఐసీడీఎస్ డీసీపీఓ పురుషోత్తమరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. యోగాంధ్ర సభ్యుల నమోదు వేగవంతం.. బాపట్ల: యోగాంధ్రలో సభ్యుల పేర్ల నమోదును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. బుధవారం, స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఎంపీడీఓలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా నుంచి 6,31,435 మంది సభ్యులను నమోదు చేసేందుకు లక్ష్యాలను నిర్దేశించామన్నారు. అందులో ఇప్పటివరకు 5,55,218 మంది సభ్యులు పేర్లు నమోదు చేశారన్నారు. మండలాల వారీగా ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయడంలో వెనుకబడిన మండల ఎంపీడీఓలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల నమోదులో సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు యోగా గ్రూప్ని తయారు చేయాలని, నిర్దేశించిన లక్ష్యాల పురోగతిపై పర్యవేక్షణ చేయాలని డీఆర్డీడీఏ పీడీకి సూచించారు. చెత్త నుంచి సంపద సృష్టించాలి జిల్లాలో ప్రతి గ్రామంలో నూరుశాతం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోనికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గ్రామంలో చెత్తను డోర్ మిత్ర, క్లాప్ మిత్ర సభ్యులచే ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించాలని ఆయన తెలిపారు. సేకరించిన చెత్తను రెండు భాగాలుగా విడగొట్టి వాటిని ఎస్డబ్ల్యూపీసీ కేంద్రాలకు తరలించాలని ఆయన తెలిపారు. డీఈఓ పురుషోత్తం, డీపీఓ ప్రభాకర్, బాపట్ల డీఎల్డీఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి -
తాళం వేసిన ఇంట్లో నగలు, నగదు చోరీ
బెల్లంకొండ: తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దొంగలు నగలు, నగదు చోరీ చేసిన ఘటన మండలంలోని నాగిరెడ్డి పాలెం గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై డి.ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎరబ్రద్దూరి చిన రమణారెడ్డి కుటుంబ సభ్యులతోపాటు గ్రామంలోని మరి కొంతమందితో కలిసి సోమవారం శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో రమణారెడ్డి ఇంట్లోకి దొంగలు కిటికీ గుండా చొరబడ్డారు. బీరువా పగలుకొట్టి 23.5 సవర్ల బంగారం, 15 వేల నగదు చోరీ చేశారు. మంగళవారం ఉదయం ఇరుగు పొరుగువారు ఇంటి పరిసర ప్రాంతాల్లో వస్తువులు చెల్లాచెదురుగా ఉండడాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని రమణారెడ్డి బంధువులతో చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చి పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నట్లు పెదకూరపాడు సీఐ సురేష్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. వివాహ వేడుకల్లో బంగారు నగ చోరీ లక్ష్మీపురం: వివాహ వేడుకల్లో బ్యాగ్లోని 8 సవర్ల బంగారు ఆభరణం చోరీకి గురైన ఘటన పై బుధవారం అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడికొండ మండలం రావెల గ్రామానికి చెందిన మూలుపురి హనుమంతరావు మే 5వ తేదీన కుటుంబ సభ్యులతో అమరావతి రోడ్డులోని విజయం కల్యాణ మండపంలో మేనల్లుడి వివాహ వేడుకలకు హాజరయ్యారు. వివాహం జరిగే సమయంలో హనుమంతరావు భార్య 8 సవర్ల బంగారు నెక్లెస్ను వరుడు గదిలోని బ్యాగ్లో పెట్టారు. వివాహం అయిన తరువాత గదిలో వెళ్లి చూసే సరికి బ్యాగ్ కనిపించలేదు. దీంతో చుట్టు పక్కల పరిశీలించగా కనిపించలేదు. దీంతో బుధవారం హనుమంతరావు అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ఫిరంగిపురం: ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని నిర్మించనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమానికి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లను బుధవారం రాత్రి నారాయణ పరిశీలించారు. ముఖ్యమంత్రి మొక్కలు నాటే ప్రాంతాన్ని పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవం సందర్భంగా ఐదు కోట్ల మొక్కలు నాటుతామన్నారు. రాజధాని ప్రాంతాన్ని అత్యున్నత నిర్మాణాలతోపాటు గ్రీన్ అండ్ బ్లూ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు. పచ్చదనం కోసం ఒకే రకం మొక్కలు కాకుండా సింగపూర్, జపాన్తో సంప్రదించి అక్కడి మాదిరిగా ప్లాంటేషన్ ఉండేలా చూడమని చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఎండీ లక్ష్మీపార్థసారథి, ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ సుజాత, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిరంగిపురం(తాడికొండ): తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో గురువారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే వన మహోత్సవానికి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పర్యటన ఏర్పాట్లను ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, రాష్ట్ర ఏపీఎంఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఆర్డీవో శ్రీనివాసరావులు పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎ.భార్గవ్ తేజ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు చేపట్టాల్సిన వివిధ పనులపై తగిన సూచనలు అందజేశారు. శానిటేషన్, పార్కింగ్, బ్యారికేడ్ పనులు సజావుగా చేపట్టాలని చెప్పారు. నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. వారి వెంట ఫారెస్ట్ కన్జర్వేటర్ రాజు, అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) రవికుమార్, డీఎస్పీ మురళీకృష్ణ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎండీ నజీమా బేగం, ఏపీఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బసవేశ్వరరావు, తుళ్లూరు సీఐ శ్రీనివాసరావు, తహసీల్దార్లు సుజాత, వెంకటేశ్వర్లు, పలు శాఖల అధికారులు ఉన్నారు. అత్యుత్తమ నగరంగా అమరావతి నిర్మాణం -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కారంచేడు: వ్యాపార నిమిత్తం చీరాలకు తన ద్విచక్ర వాహనంపై వెళుతున్న కూరగాయల వ్యాపారి ప్రమాదంలో మరణించాడు. కారంచేడు ఎస్ఐ వి. వెంకట్రావు తెలిపిన వివరాల మేరకు.. పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన వేమా శివయ్య (57) తన ద్విచక్ర వాహనంపై కూరగాయలు, ఆకు కూరలు ఊరూరు తిరిగి అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ప్రతి రోజూ ఆయన నూతలపాడు నుంచి చీరాలకు ద్విచక్ర వాహనంపై వచ్చి మార్కెట్లో కూరగాయలు, ఆకుకూరలు కొనుగోలు చేసుకొని తిరిగి వెళ్ళి అక్కడ అమ్ముకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో బుధవారం కూడా ఆయన చీరాలకు బయలు దేరాడు. వాడరేవు–పిడుగురాళ్ళ ప్రధాన రహదారిలో కారంచేడు–చీరాల మార్గంలో హోలి చర్చ్ సమీపంలో ఎదురుగా వస్తున్న గేదెలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు 108కు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బంధువులు వచ్చి చీరాల ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి మృతి చెందాడని తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. -
బదిలీల కలవరం
కరోనా కలకలం... ● వైద్య ఉద్యోగుల్లో ఆందోళన ● ఐదేళ్లు దాటితే స్థాన చలనం ● యూనియన్లకు ప్రాధాన్యత అంతంతే కొల్లూరు మండలం మొసలిపాడు వద్ద రేపల్లె – తెనాలి రహదారి పక్కన నిరసన తెలుపుతూ సొమ్మసిల్లిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్బాబుగుంటూరు మెడికల్: జిల్లాలో ఒక పక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోపక్క గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా సోకి ఇబ్బంది పడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులను కూడా ఈ పరిణామాలు కలవరపెడుతున్నాయి. గతంలో అనేక మంది వైద్య ఉద్యోగులు కరోనా బారిన పడి చికిత్స పొందారు. కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. మరోసారి కరోనా కేసులు రావడం ఉద్యోగుల్లో ఆందోళనకు దారి తీసింది. మరోపక్క వైద్య ఉద్యోగుల బదిలీలను ప్రభుత్వం చేపట్టింది. ఈ నెల 19వ తేదీలోపు ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేయనున్నారు. ఐదేళ్లు సర్వీసు పూర్తయితే బదిలీ ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వైద్యులు, వైద్య సిబ్బందికి తప్పనిసరిగా స్థానచలనం కలిగించనున్నారు. గతంలో దీర్ఘకాలం ఉన్న సిబ్బందిలో 20 శాతం మందిని మాత్రమే బదిలీ చేసేవారు. దీంతో అందరూ ఇబ్బంది పడేవారు కాదు. ఇప్పుడు ఐదేళ్ల సర్వీసు, కొన్ని కేడర్లలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరిని బదిలీ చేయాలని నిబంధన పెట్టారు. దీంతో బదిలీల కలవరం ప్రారంభమైంది. ప్రాక్టీస్ వదిలి వెళ్లలేక.. దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేయడం వల్ల గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల, జిల్లాలోని పలు ఆసుపత్రుల వైద్యులు ఎక్కువ శాతం మంది సొంత క్లీనిక్లు పెట్టుకున్నారు. గుంటూరులోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో వైద్యులు ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తప్పనిసరి బదిలీ నిబంధనతో ప్రాక్టీస్ వదిలి వెళ్లేందుకు పలువురు సంశయిస్తున్నారు. వైద్య సిబ్బంది సైతం గుంటూరు చుట్టుపక్కల పిల్లలను చదివించుకుంటూ, గృహాలు నిర్మించుకుని ఇక్కడే స్థిరపడ్డారు. విద్య, వైద్య రంగంలో ఎప్పటి నుంచో గుంటూరు జిల్లాకు పేరుండటంతో అనేక మంది స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. బదిలీల పేరుతో ప్రభుత్వం వేరేచోటకు పంపించేందుకు సిద్ధమడంతో వారు ఆందోళన పడుతున్నారు. జూనియర్ అసిస్టెంట్ల ఆందోళన జీజీహెచ్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు పదోన్నతులు వదులుకొని సుమారు 20 –30 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నారు. ప్రమోషన్ తీసుకుంటే ఇతర జిల్లాలకు బదిలీ చేస్తారన్న భయంతో ఇలా చేశారు. అందులోనూ గుంటూరు జీజీహెచ్లోనే జీవితాంతం పనిచేసేందుకు అన్ని బెన్ఫిట్స్ వదులుకుని పలువురు జూనియర్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా వారిని సైతం బదిలీ చేస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. దీంతో జీజీహెచ్ మినిస్టీరియల్ ఉద్యోగులంతా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రపతి అనుమతి లేకుండా గుంటూరు జీజీహెచ్ యూనిట్ సిబ్బందిని బదిలీ చేసే అధికారం ఎవరికీ లేదనే విషయాలను బయటపెట్టారు. సదరు విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి సైతం పంపించారు. దీంతో ఈ ఏడాదికి జూనియర్ అసిస్టెంట్లకు బదిలీలు లేనట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. యూనియన్లకు ఆంక్షలు గతంలో యూనియన్ పేరుతో ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఒకే ప్రాంతంలో ఉండేవారు. నేడు ఒకేచోట లేకుండా పలు మార్గదర్శకాలను సంఘ నాయకులకు ప్రభుత్వం విడుదల చేసింది. యూనియన్లో చేరిన సభ్యత్వాల రశీదులు, ఎన్నికల్లో పాల్గొన్నట్లు జాబితా, యూనియన్ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వివరాలు సమర్పించాలని పేర్కొంది. దీంతో నేతలకు సైతం స్థానచలనం తప్పడం లేదు. నగరంలో ఒక చోట నుంచి మరోచోటికి యూనియన్ నేతలు బదిలీ కోరుకునేలా కొంత మినహాయింపు ఇచ్చారు. 20 రోజుల ప్రక్రియ వైద్య ఆరోగ్య శాఖలో బదిలీ ప్రక్రియ 20 రోజులపాటు జరుగనుంది. మే 31 నుంచి జూన్ 19వ తేదీ వరకు నిర్వహిస్తారు. జూన్ 17 – 19 వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. తర్వాత బదిలీ ఉత్తర్వులు అందజేస్తారు. ఒకేచోట రెండేళ్లకుపైగా పనిచేస్తున్న వారు రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులకు, ఉద్యోగులైన భార్యభర్తలకు నిబంధనల ప్రకారం బదిలీలు నిర్వహిస్తారు. గురు, శుక్రవారాల్లో అభ్యర్థులు బదిలీ ఆప్షన్లు ఎంచుకునేందుకు గడువు ఇచ్చారు. గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయం, గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు ప్రాంతీయ వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు, అధికారులు కొద్దిరోజులుగా బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. -
తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత
అచ్చంపేట: ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిన బాలుడిని సామాజికవేత్త షేక్ కమల్సైదా బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు. అచ్చంపేట ఎస్సీ కాలనీకి చెందిన సందెపోగు వివేక్ గత 29న గుంటూరు వెళ్లి రైల్వేస్టేషన్లో రైలు ఎక్కి మహారాష్ట్రలోని జనగావ్ జిల్లా స్టేషన్ పోలీసులకు చిక్కినట్లుగా కమల్సైదా సమాచారం తెలుసుకున్నారు. మహారాష్ట్రలోని పోలీస్ వారితో మాట్లాడి వివేక్ పల్నాడు జిల్లా అచ్చంపేట గ్రామానికి చెందినవాడిగా సమాచారం అందించారు. తిరిగి అచ్చంపేటకు రప్పించారు. గత వారం రోజులుగా కుమారుడి కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు అతడిని అప్పగించడంతో ఆనందపడ్డారు. దీనిపై పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బీరువాల సైదా తదితరులున్నారు. -
కానిస్టేబుల్కు జాతీయస్థాయిలో రజత పతకం
అభినందించిన ఎస్పీ తుషార్డూడీ బాపట్లటౌన్: పట్టుదలతో పోరాడినప్పుడే విజయాలు మన సొంతమవుతాయని జిల్లా ఎస్పీ తుషార్డూడీ తెలిపారు. కర్లపాలెం పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహించే వీరంకి నరేంద్ర 13వ జాతీయ స్థాయి పెన్ కాక్ సిలాట్ చాంపియన్ షిప్–2025లో రజత పతకం సాధించారు. కానిస్టేబుల్ను బుధవారం ఎస్పీ తుషార్డూడీ అభినందించారు. ఎస్పీ తుషార్డూడీ మాట్లాడుతూ 2025 మే 9 నుంచి 12వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో కేడీ సింగ్బాబు స్టేడియంలో జరిగిన 13వ జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్ చాంపియన్ షిప్–2025 లో వీరంకి నరేంద్ర సత్తా చాటి రజత పతకం గెలుపొందారన్నారు. క్రీడలలో సత్తా చాటి జిల్లా పోలీస్ ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింప చేస్తూ పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. గతంలో కూడా జాతీయ స్థాయిలో రెండు మెడల్స్ సాధించాడని, 2024లో జరిగిన సెకండ్ ఆల్ ఇండియా పెన్కాక్ సిలాట్ చాంపియన్ షిప్లో కాంస్య పతకం, 2018లో 3వ ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్లో కాంస్య పతకం సాధించాడన్నారు. రాబోయే రోజుల్లో మంచి తర్ఫీదు పొంది అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఎస్పీ ఆకాక్షించారు. జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది క్రీడల్లో పాల్గొనాలన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యం, మానసిక దృఢత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయన్నారు. క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచినవారిని ప్రోత్సహిస్తామన్నారు. -
ప్రతి ఇల్లు యోగా కేంద్రం కావాలి
ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ గుంటూరు వెస్ట్: ప్రతి ఇల్లు యోగా కేంద్రంగా మారితే ఆ ఇంట ఆరోగ్య, మానసిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. బుధవారం యోగాంధ్రాలో భాగంగా స్థానిక బృందావన్గార్డెన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనతోపాటు నగర మేయర్ కోవెలమూడి రవీంద్రనాథ్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, డెప్యూటీ మేయర్ షేక్ షజిల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని రోజులుగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శారీరక, మానసిక ప్రయోజనాలు కలిగించే యోగాపై ప్రజలు విస్తృతంగా అవగాహన పెంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో యోగ ఒక భాగం కావాలన్నారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు యోగాసనాలు వేశారు. -
మూడు వాహనాలు ఢీ.. ఒకరు మృతి
రొంపిచర్ల: మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన రొంపిచర్ల సమీపంలోని శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్వేపై బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సు కందుకూరుకు వెళ్తోంది. రొంపిచర్ల విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలోకి రాగానే బస్సు ఆగటంతో 8 మంది ప్రయాణికులు దిగారు. అదే సమయంలో వెనుకగా వస్తున్న కంటైనర్ లారీ అదుపు తప్పి ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సు రోడ్డు మార్జిన్కు దూసుకు రాగా, ఢీకొట్టిన లారీ రోడ్డుపైనే నిలబడింది. ఇంతలో అదే రూట్లో వస్తున్న ప్రయివేటు ట్రావెల్ బస్సు అదుపుతప్పి కంటైనర్ లారీని ఢీకొంది. కంటైనర్ లారీ ముందు భాగంలో నిల్చొని ఉన్న ప్రయాణికుడు బెల్లంకొండ మాధవరావు(40)పై నుంచి లారీ వెళ్లింది. మాధవరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అతనిది ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం పరిధిలోని గుడ్లూరి మండలం, మిట్టపాలెం గ్రామం అని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సులు, లారీకి నష్టం వాటిల్లింది. వెంటనే ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ సహాయంతో పోలీసులు తొలగించారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న నరసరావుపేట రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ సీహెచ్ మణికృష్ణలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అయితానగర్లో జనతరంగం
తెనాలి:ఎటుచూసినా జనతరంగం... దారిపొడవునా ఉప్పొంగిన అభిమానం... ప్రియతమ నేతను కనులారా చూసేందుకు ఆత్రుత, ఆరాటం... వెల్లువలా కదిలివచ్చిన జనంతో కిక్కిరిసిన రోడ్లు... జననేత కనిపించగానే చిరునవ్వులు చిందిస్తూ, ఆ క్షణాలను సెల్ఫోన్లలో బంధిస్తూ... హృదయం నిండా సంతోషంతో అభిమానులు మురిసిపోయారు. ‘సీఎం.. సీఎం..’ అంటూ తమ మనసులోని కోరిక ను పదేపదే నినదించారు. నడిరోడ్డుపై బహిరంగంగా పోలీసుల దాష్టీకానికి గురైన ముగ్గురు దళిత, మైనారిటీ యువకుల తల్లిదండ్రులను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళ వారం చేసిన పర్యటన ఆద్యంతం జనసంద్రాన్ని తలపించింది.పేదలకు అండగా నిలిచేందుకు...స్థానిక కానిస్టేబుల్పై ఏప్రిల్ 24వ తేదీ రాత్రి దాడి చేశారన్న ఫిర్యాదుపై పట్టణానికి చెందిన యువకుడు, ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు మంగళగిరి యువకులను ఏప్రిల్ 27వ తేదీన పోలీసులు అరెస్టు చూపారు. వాస్తవానికి ఘటన జరిగిన మరుసటిరోజునే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్స్టేషనులో థర్డ్ డిగ్రీ ప్రయోగించటమే కాకుండా, అరెస్టు చూపటానికి ముందే 26, 27వ తేదీల్లో జయప్రకాష్నగర్లోని సత్యం సమాధి దగ్గర నడిరోడ్డుపై, అయితానగర్లోని కూడలి ప్రదేశం నన్నపనేని లింగారావు సెంటరులో టూటౌన్, త్రీటౌన్ సీఐలు ఆ యువకులను బహిరంగంగా లాఠీలతో హింసించారు. ఇందులో సత్యం సమాధి దగ్గర చేసిన భౌతికదాడి కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ కావటం తెలిసిందే. ఏదైనా కేసులో నిందితులను చట్టప్రకారం అరెస్టు చేసి, రిమాండ్కు పంపాల్సిన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటంపై దళిత, ప్రజాసంఘాలు ఆగ్రహించాయి. మానవ హక్కుల కమిషన్, ఎస్సీ కమిషన్కు ఫిర్యాదులు వెళ్లాయి. బాధితుల కుటుంబసభ్యులు టూటౌన్ పోలీస్స్టేషనులో పోలీస్ అధికారులపై ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో బాధిత యువకుల తల్లిదండ్రులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం తెనాలి వచ్చారు.నాయకుల ఘనస్వాగతంపార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, పార్టీ వేమూరు ఇన్చార్జి వరికూటి అశోక్బాబు, పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గెడ్డటి సురేంద్ర, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావులు ఘనంగా స్వాగతం పలికారు. వందలాది ద్విచక్ర వాహనాలు ముందు బయలుదేరగా.. వైఎస్ జగన్ కాన్వాయ్ అనుసరించింది.అర్ధగంటపాటు పరామర్శలుమధ్యాహ్నం 12.12 గంటలకు దోమా రాకేష్ నివాసంలో రాకేష్ తల్లిదండ్రులు వాసు–మాధవి, మంగళగిరికి చెందిన షేక్ బాబులాల్ తల్లిదండ్రులు అమీర్బాషా–రహమ్తున్, చేబ్రోలు జాన్విక్టర్ తండ్రి ఇశ్రాయెల్ను కలిశారు. పోలీసుల హింసకు సంబంధించిన వివరాలను వారి నుంచి తెలుసుకు న్నారు. తమ బిడ్డలను దారుణంగా కొట్టిన పోలీసు అధికారులపై తాము పెట్టిన కేసు రిజిస్టరు చేయాలని, చట్టప్రకారం సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని బాధిత యువకుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దాదాపు అర్ధగంటసేపు వారితో గడిపిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆ ఇంటికి సమీపంలోనే మీడియాతో మాట్లాడారు. -
రైలు ఢీకొని వృద్ధుడు మృతి
చీరాల రూరల్: రైలు ఢీకొన్న సంఘటనలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చీరాల–స్టుపర్టుపురం రైల్వేస్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపిన వివరాల మేరకు.. విజయవాడవైపు వెళ్లే డౌన్లౌన్లో వృద్ధుడు మృతి చెందాడనే సమాచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు. మృతుడి వయస్సు 55 నుంచి 60 ఏళ్లు ఉంటాయని, రైలు ఢీకొని మృతి చెందినట్లు తెలిపారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని.. మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుని గురించి ఎవరికై నా సమాచారం తెలిస్తే 9440627646 నంబర్కు సమాచారం అందించాలని కోరారు. -
ప్రైమరీ హెచ్ఎం పోస్టులను ఎస్జీటీలతో భర్తీ చేయాలి
చిలకలూరిపేట: ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో సంఘ సభ్యుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల పోస్టులన్నీ ఎస్జీటీలతోనే భర్తీ చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ, సదరు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కేటాయిస్తున్నారనే సమాచారం రావడం బాధాకరమన్నారు. అలాగే మోడల్ ప్రాథమిక పాఠశాలలకు కేటాయించిన హెచ్ఎం పోస్టులను 100 శాతం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని కోరారు. అలాకాకుండా స్కూల్ అసిస్టెంట్ల స్థాయిని తగ్గిస్తూ వారిని తాత్కాలిక ప్రాతిపదికన ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా నియమించటం సరికాదన్నారు. ఈ చర్యను ఉపాధ్యాయ లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలన్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టేలోగా దీనిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. స్కూల్ అసిస్టెంట్ల సేవలను ఉన్నత పాఠశాలల్లో మాత్రమే ఉపయోగించుకోవాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ నాయకులు వినుకొండ అక్కయ్య, మేకల కోటేశ్వరరావు, వి.జయప్రకాశ్, షేక్ మగ్బూల్ బాష, బొంతా రవి, షేక్ మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు -
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
బాపట్ల: చిన్నగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటో తేదీన నిర్వహించిన పీ–4 కార్యక్రమంలో భాగంగా ఎంపికై న చిన్నగంజాం మండలం కొత్తగొల్లపాలెం గ్రామానికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆ గ్రామంలో ప్రజలు కోరిన సదుపాయాల గురించి వాటి పురోగతిపై ఆరా తీశారు. గృహ నిర్మాణాల కోసం 42 మంది, ఇళ్ల స్థలాల కోసం 13 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారికి పొజిషన్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందజేసినట్లు చిన్నగంజాం తహసీల్దార్ జిల్లా కలెక్టర్కు వివరించారు. గృహ నిర్మాణాలకు సంబంధించి దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్ చేసినట్లు గృహ నిర్మాణ సంస్థ అధికారి కలెక్టర్కు వివరించారు. గ్రామంలో 17 మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయని వాటిలో రెండు పూర్తి చేశామని, మిగిలిన పనులు జరుగుతున్నాయని, 304 ట్యాప్ కనెక్షన్లను జలజీవన్ మిషన్ పథకం ద్వారా పూర్తికి చర్యలు తీసుకోవడమైనదని, గ్రామంలో 131 సోక్ పిట్స్ మంజూరయ్యాయని, ఆ పనులన్నీ జరుగుతున్నాయని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వివరించారు. గ్రామంలో 4.48 కిలోమీటర్ల అంతర్గత సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు కోసం నిధులు మంజూరయ్యాయని, ఈ పనులను త్వరలో ప్రారంభిస్తామని పంచాయతీరాజ్ ఎస్ఈ కలెక్టర్కు వివరించారు. పర్చూరు నియోజకవర్గంలో ఆరు విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి రూ.25 కోట్లు ఖర్చు అవుతుందని, ప్రతిపాదనలు సమర్పించడమైనదని ఏపీ ఎస్పీడీసీఎల్ ఈఈ వివరించారు. బాపట్ల పురపాలక సంఘ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న నూతన భవన పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని సర్వ శిక్ష అభియాన్ అధికారి వివరించారు. కొత్త గొల్లపాలెం అభివృద్ధి పనులను అధికారులందరూ చిత్తశుద్ధితో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, గృహ నిర్మాణ సంస్థ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, డ్వామా పీడీ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.విజయమ్మ, ఏపీ సీపీడీసీఎల్ ఈఈ మల్లికార్జునరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి విలియమ్స్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దెబోరా, చిన్నగంజాం తహసీల్దార్ ప్రభాకర్, సర్వ శిక్ష అభియాన్ అధికారి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి కొత్తగొల్లపాలెం అభివృద్ధిపై సమీక్ష -
చదువుల ఒడిలో గుడి...!
నూజెండ్ల: భవిష్యత్ తరాలకు ఉపాయోగపడాల్సిన పాఠశాల గ్రామస్తుల పంతాలకు వేదికై ంది. దీంతో అక్కడ చదువుతున్న 35 మంది విద్యార్థుల చదువులు ప్రశ్నార్ధకమయ్యాయి. పాఠశాల ఆవరణలో గుడి నిర్మించాలని ఓ వర్గం నడుం బిగించగా విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుంది వేరే చోట ఏర్పాటు చేయాలని మరో వర్గం వారు నిలవరించటానికి ప్రయత్నిస్తున్నారు. మండలంలోని కొత్త కొత్త పాలెం ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల ఆవరణలో చేపడుతున్న గుడి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఇందు కోసం గత ప్రభుత్వ హయాంలో పాఠశాల ఆవరణలో చేపట్టిన నాడు నేడు మరుగుదొడ్లను సైతం కూల్చి వేశారు. రాత్రికి రాత్రి స్థలాన్ని చదును చేశారు. నిర్మాణ పనులు వేగవంతం చేశారు. భక్తులకు అందుబాటులో గుడి నిర్మాణం చేపట్టడం ఆనందమే కానీ ప్రశాంత వాతావరణంలో చదువుకోవాల్సిన విద్యార్థులకు ఇబ్బంది కాదా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అనుకూలమైన మరో ప్రాంతంలో గుడి ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. అయితే గుడి కట్టాల్సిందే ఎవరు అడ్డు వస్తారో చూస్తామంటూ.. ఎంత వారించినా వినకుండా ఇటువంటి అనైతిక దుశ్చర్యకు కొంత మంది పాల్పడుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు స్పందించి బడి స్థలంలో నిర్మాణాలు అడ్డుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వివాదంపై ఎంఈఓ రవిచంద్రను వివరణ కోరగా కొంత మంది గ్రామస్తులు ఫిర్యాదు చేశారని సంఘటనా స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. పంతాలకు వేదికగా మారిన కొత్త కొత్తపాలెం ఎస్సీ కాలనీలోని పాఠశాల నాడు – నేడు మరుగుదొడ్లను సైతం కూల్చివేసిన వైనం -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
అద్దంకి రూరల్: సరిగ కర్రల తోటలో గుర్తు తెలియని మృతదేహం అద్దంకి మండలంలో మంగళవారం లభ్యమైంది. సీఐ సుబ్బరాజు తెలిపిన వివరాల మేరకు.. అద్దంకి –నార్కెట్పల్లి నామ్ రహదారిపై మండలంలోని శాంతినగర్ గ్రామ పొలాల్లోని సరిగ తోటలో గుర్తు తెలియని మృతదేహం చెట్టుకు వేలాడుతుండటం గమనించిన స్థానిక రైతులు సీఐకి సమాచారం ఇచ్చారు. వ్యక్తి నాలుగు రోజుల కిందట మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతదేహం కుళ్లి పోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉందని సీఐ తెలిపారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉందని వివరించారు. తాళం వేసిన ఇంట్లో చోరీ తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఇప్పటం గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. మంగళవారం ఇద్దరు మహిళలు అక్కడ అనుమానంగా తిరుగుతుండడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సేకరించిన వివరాల ప్రకారం.. ఇప్పటం గ్రామానికి చెందిన పోతగాని గోపి వేసవి సెలవులకు వేరే ఊరు వెళ్లారు. పక్కనే ఉండే గోపి తమ్ముడు పులి మనోజ్ ఇక్కడే ఉన్నారు. గోపి ఇంటి తాళాలు పగలకొట్టి ఉండడం, అక్కడే ఇద్దరు మహిళలు ఉండడంతో వారిని అనుమానించి పోలీసులకు అప్పగించారు. ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.10 వేలతో పాటు వాచ్ పోయిందని గోపి ఫిర్యాదు ఇచ్చారు. సదరు మహిళలు మాత్రం తాము రైల్వే ట్రాక్ వెంబడి ప్లాస్టిక్ డబ్బాలు సేకరిస్తుంటామని, చోరీ చేసే ధైర్యం లేదని, తాగునీరు పట్టుకుని ఇంట్లో జామకాయలు కోస్తుండగా పట్టుకున్నారని చెబుతున్నారు. ఒకవేళ దొంగతం చేస్తే ఆ డబ్బు, వస్తువులు తమ వద్ద ఉండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. తాడేపల్లి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహాసభను జయప్రదం చేయండి సంఘం జిల్లా అధ్యక్షుడు చినరామిరెడ్డి నరసరావుపేటఈస్ట్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈనెల 5వ తేదీన విజయ వాడలో తలపెట్టిన 3వ రాష్ట్ర కౌన్సిల్ మహాసభను జయప్రదం చేయాలని సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు స్వర్ణ చినరామిరెడ్డి కోరారు. సంఘం యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, పార్ట్టైమ్ ఉద్యోగులు సమావేశానికి హాజరు కావాలని కోరారు. సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఆహ్వానించామని, ఆయన సానుకూలంగా స్పందించటంతోపాటు సమావేశానికి హాజర య్యే ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి చుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చట్ట విరుద్ధం
అద్దంకి: దళిత యువకులపై పోలీసులు చేసిన దమనకాండపై హోం మంత్రి అనిత వ్యాఖ్యలు చట్టవిరుద్దమని దళిత సంఘ నాయకుడు నీలం నాగేంద్రరావు మండిపడ్డారు. మంగళవారం తెనాలిలో దళిత యువకులపై జరిపిన తాలిబన్ తరహా కూటమి ప్రభుత్వ ఖాకీ దమనకాండపై అద్దంకిలోని అంబేడ్కర్ భవన్ నుంచి బంగ్లా రోడ్లోని అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నాగేంద్ర మాట్లాడుతూ దళిత యువకులపై దమనకాండకు కారకులైన తెనాలి 2 టౌన్ సీఐ రాములు నాయక్, 3 టౌన్ సీఐ రమేష్ బాబులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ను మంత్రివర్గం నుంచి చంద్రబాబు నాయుడు తొలగించాలని డిమాండ్ చేశారు. తెనాలి దళిత యువకులపై పోలీసు అధికారులు చేసిన రాజ్య హింసపై కూటమి ప్రభుత్వం చేసిన కుట్ర పూరిత వ్యాఖ్యలు చట్ట విరుద్ధమని, రాజ్యాంగ వ్యతిరేకమని మండిపడ్డారు. తెనాలి దళిత యువకులపై స్థానిక మంత్రి నాదెండ్ల మనోహర్ కుట్ర పూర్వకంగా పోలీసుల చేత అనాగరిక దాడి జరిపించారని ఆరోపించారు. మూడు నెలల క్రితం తెనాలి అయితానగర్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని పోలీసులు మున్సిపల్ అధికారులచే అధికార బలంతో తొలగించాలని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రయత్నించారన్నారు. కానీ స్థానిక దళితుల ఆందోళనలతో ఆ ప్రయత్నం నీరుగారి పోయిందన్నారు. ఆ ఘటనలో పోలీస్ అధికారులకు స్థానిక దళితులకు మధ్య వివాదం నెలకొందన్నారు. చిరంజీవి అనే విశ్వాసమైన పోలీస్ కానిస్టేబుల్తో ఫిర్యాదు తీసుకొని పోలీస్ మామూళ్ల కోసం వేధించి, తెనాలిలో దళిత, ముస్లిం యువకులపై తెనాలి 2 టౌన్ సీఐ రాములు నాయక్, 3 టౌన్ సీఐ రమేష్ బాబులు తాలిబన్ తరహా పోలీస్ శిక్ష వేశారన్నారు. ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరిని కిరాతకంగా హత్య చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పోలీస్ అధికారులు ఎలా చూశారో, దళిత యువకుల పట్ల ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసన్నారు. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ని నడిరోడ్డుపై పోలీసులు దాడి చేసి కొట్టినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న అనిత డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్లి పరామర్శించలేదా అని ప్రశ్నించారు. హోం మంత్రి అనిత గతంలో ఉపాధ్యారాలేనని, రాజ్యాంగ నిపుణురాలు కాదని, న్యాయశాస్త్రం చదవలేదని తెలుసుకోవాలన్నారు. చట్ట ప్రకారం పోలీసులు కేసు నమోదు చేస్తే కోర్టులు శిక్షలు విధించాలి కానీ, శిక్షలు విధించే అధికారం ఏ ప్రభుత్వంలోనైనా పోలీసులకు లేదన్నారు. కేవలం తాలిబన్లు మాత్రమే బహిరంగ శిక్షలు వేస్తారని గుర్తు చేశారు. నేరానికి, పోలీస్ శిక్షలకు కులం ఉంటుందని తెలుగుదేశం న్యాయదేవత, రాజ్యాంగ నిపుణురాలు హోం మంత్రి అనిత తెలుసుకోవాలన్నారు. నిందితులైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రకారం అరెస్టు చేయాలన్నారు. మాల మహానాడు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దారా అంజయ్య, అద్దంకి నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షుడు అంకం కిరణ్కుమార్, కాకుమాను రవి ఈ నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. యానాది సేవా సమితి నాయకులు పోలా జీవరత్నం, ఆదినారాయణ ఎమ్మార్పీఎస్ నాయకులు యోహాన్, అంబేడ్కర్ పోరాట వేదిక కన్వీనర్ ఎర్రమల శ్రీనివాసరావు, గొడ్డటి రవి కిరణ్, తదితరులు పాల్గొన్నారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో అద్దంకిలో ఆత్మరక్షణ ర్యాలీ -
టిప్పర్ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ముందు వెళ్తున్న టిప్పర్ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండం కిలేశపురం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. బాపట్ల మండలం గుడిపూడికి చెందిన వెంపరాల ఆంజనేయులు (45), వెంపరాల నవీన్, వెంపరాల ఓలయ్య, బి.లక్ష్మి, వై.ముత్యాలు(డ్రైవర్) పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి కారులో వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు కిలేశపురం వద్ద అదుపుతప్పి ముందువెళ్తున్న టిప్పర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ముందుసీటులో కూర్చున్న వెంపరాల ఆంజనేయులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన నవీన్, ఓలయ్య, బి.లక్ష్మి, వై.ముత్యాలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రెండు 108 అంబులెన్సుల్లో, ఒక హైవే టోల్గేట్ అంబులెన్స్లో విజయవాడ వైద్యశాలకు తరలించారు. ఆంజనేయులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకరు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు తిరుపతమ్మ దర్శనానికివెళ్లొస్తుండగా ప్రమాదం -
రూ.51 కోట్లతో అభివృద్ధి పనులు
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో సుమారు రూ.51 కోట్లతో పలు డివిజన్లలో అభివృద్ధి పనులను నిర్వహించడానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మంగళవారం స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ చాంబర్లో జరిగింది. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో నగరంలోని ఆయా డివిజన్లకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు, నగర పాలక సంస్థ అధికారులు ప్రతిపాదించిన 143 అంశాలకు సంబంధించిన అభివృద్ధి పనులపై సభ్యులు, వివిధ విభాగాధిపతులతో చర్చించి, ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర శివారు, నగర పాలక సంస్థలో విలీనమైన గ్రామాలలో రోడ్లు, డ్రైయిన్లు, వీధి దీపాలు, తాగు నీటి పైపులైన్లు ఏర్పాటు వంటి పనులకు ఆమోదం తెలిపామన్నారు. నాజ్ సెంటర్, స్వామి థియేటర్ వద్ద, అడవితక్కెళ్ళపాడులలోని షాపింగ్ కాంప్లెక్స్లలో లీజు గడువు పూర్తయిన షాపులకు నిబంధనల ప్రకారం రెన్యూవల్ చేయడానికి ఆమోదించామన్నారు. గుంటూరు నగరంలో వీధి కుక్కల బెడద అధికంగా ఉండటంతో వాటికి శస్త్రచికిత్సలు, యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేసేందుకు అదనంగా ముగ్గురు పశువుల డాక్టర్లు, ఆపరేషన్ థియేటర్ సహాయకులను నియమించాలని నిర్ణయించామని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు ఈరంటి వరప్రసాద్, షేక్ మీరావలి, కొమ్మినేని కోటేశ్వర రావు, నూకవరపు బాలాజీ, దాసరి లక్ష్మీదుర్గ, ముప్పవరపు భారతి, నగర పాలక సంస్థ ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సీఎంఓహెచ్ డాక్టర్ అమృతం పాల్గొన్నారు. ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమిటీ -
మోసగించిన వారిపై చర్యలు తీసుకోండి
నాదెండ్ల: ఓ వివాహిత తనకు జరిగిన మోసం, అన్యాయంపై పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన మంజుభార్గవి బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో తన నానమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంది. ఆ సమయంలో విశ్వభారతి జూనియర్ కాలేజ్ డైరెక్టర్, తమ దూరపు బంధువు అయిన సోడిశెట్టి రామానాయుడు తనను ప్రేమ పేరిట లోబరుచుకున్నాడని, గర్భిణిని చేశాడని పేర్కొంది. వివా హం చేసుకోమని అడిగితే ముఖం చాటే శాడని, అధికకట్నం తీసుకుని మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడని పేర్కొంది. ఈ విషయపై తాను 2022 ఫిబ్రవరి 8న నరసరావుపేటలోని దిశా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. రామానాయుడు తల్లి వెంకటసుబ్బమ్మ, బంధువులైన దుర్గాప్రసాద్, విజయవాడలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న మేకల నరేంద్ర తనతో మా ట్లాడి రామానాయుడితో వివాహం జరిపిస్తామన్నారు. కొన్ని రోజుల తర్వాత రామానాయుడు సోదరుడు కామేశ్వరరావును వివాహం చేసుకోవాలంటూ తన ను బలవంతం చేయటంతో అంగీకరించానన్నారు. కామేశ్వరరావుతో తనకు వివాహమైన మూడు రోజుల తర్వాత 16 రోజుల పండుగకు వస్తానని చెప్పి కామేశ్వరరావు వెళ్లిపోయాడని పేర్కొంది. రామానాయుడు తనకు అసభ్యకరరీతిలో వాట్సాప్లో మెసేజీలు పెట్టేవాడని వాపోయింది. విషయాన్ని కామేశ్వరరా వుకు ఫోన్లో చెప్పినా పట్టించుకోలేదని, నీకు తగిన శాస్తి జరిగిందంటూ తిట్టాడని వాపోయింది. 2023 ఏప్రిల్ 27న తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి అత్తారింటికి వెళ్లగా, తన అత్త చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయిందన్నారు. అప్పటి నుంచి తన తల్లితో అద్దంకిలోనే ఉంటున్నానని పేర్కొంది. ఏఆర్ కానిస్టేబుల్ నరేంద్ర, దుర్గాప్రసాద్లు తన ఫోన్ను హ్యాక్ చేసి 2023లో తనపై బంధువులకు చెడుగా ప్రచారం చేశారని వాపోయింది. వారు పలుమార్లు తనపై హత్యాయత్నం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తనను మోసగించిన రామానాయుడు, తన భర్త కామేశ్వరరావు, ఏఆర్ కానిస్టేబుల్ నరేంద్ర, దుర్గాప్రసాద్లపై చర్యలు తీసుకొని తనకు న్యా యం చేయాలని కోరింది. ఈ విషయ మై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్ లకు ఫిర్యాదు అందించినట్లు తెలిపింది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళ -
వృద్ధురాలు అనుమానాస్పద మృతి
తెనాలి రూరల్: తెనాలిలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లైంగికదాడి తర్వాత హత్య చేసి, ఆభరణాలు చోరీ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, స్థానికుల కథనం మేరకు... పట్టణ ముత్తెంశెట్టిపాలెం తూర్పు కాల్వ కట్ట రోడ్డులో కబేళా వంతెన నుంచి వైకుఠపురం వెళ్లే మార్గంలో అయ్యప్పస్వామి గుడి పక్కనే తాడిపత్రి మల్లీశ్వరి (60) ఒంటరిగా నివసిస్తోంది. టిఫిన్ బండి, టీ స్టాల్, కూల్డ్రింక్ దుకాణం నిర్వహిస్తోంది. ప్రతి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు లేచి టిఫిన్ బండి పనులను ప్రారంభిస్తుంటుంది. అదే సమయంలో టీ కూడా విక్రయించడంతో ఉదయాన్నే అక్కడి వారు టీ తాగేందుకు వస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వచ్చిన వారు మల్లీశ్వరి బయటకు రాలేదని, ఇంటి కిటికీ నుంచి చూశారు. ఇంకా మంచంపైనే ఉంది. పిలిచినా స్పందన లేకపోవడంతో ఇదే ప్రాంతంలో నివసించే ఆమె కుమార్తెకు సమాచారం ఇచ్చారు. ఆమె వచ్చి చూడగా మల్లీశ్వరి మృతి చెంది ఉన్నట్టు గుర్తించింది. మృతురాలి ఒంటిపై బంగారు ఆభరణాలు, బీరువాలోని నగలు చోరీకి గురైనట్టు తెలిసింది. స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్ టౌన్ సీఐ వి. మల్లికార్జునరావు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని తెనాలి వైద్యశాలకు తరలించారు. మృతిపై అనేక అనుమానాలు.. మల్లీశ్వరి మృతిపై స్థానికుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి తలుపునకు బయట గడి పెట్టి ఉండడం, విగతజీవిగా పడి ఉన్నప్పుడు శరీరంపై దుస్తులు సరిగా లేకపోవడం, ఆభరణాలు మాయమవడంతో ఆమైపె లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. అనంతరం ఆభరణాలు, నగదు దోచుకెళ్లి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మల్లీశ్వరిది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని సీఐ తెలిపారు. లైంగికదాడి అనంతరం హత్య చేసి ఉంటారని స్థానికుల అనుమానం -
బాపట్ల
మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 512.20 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడి కాలువ కు 5,292 క్యూసెక్కులు విడుదలవుతోంది.శివాలయానికి బారికేడ్లు విరాళం పెదకాకాని: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం ఇర్లపాడుకి చెందిన ఆరుమళ్ల వెంకటరావు, అనూష దంపతులు 25 బారికేడ్లను శివాలయానికి సోమవారం అందజేశారు.గుట్టలు తొలగించేది ఎప్పుడో! తెనాలి అర్బన్: పట్టణంలోని తూర్పు కాల్వలో వ్యర్థాలను తొలగించి రోడ్డు పక్కనే పడే శారు. పది రోజులు దాటుతున్నా తొలగించకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నడి రోడ్డున పడ్డాం వాస్తవంగా 2027 వరకు ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడంతో మేమంతా జీవనోపాధి కోల్పోయి నడిరోడ్డున పడ్డాం. జిల్లాలో 294 మంది ఎండీయూ వాహనాల ఆపరేటర్లగా పని చేస్తున్నాం. గతంలో మాకు వాహనమిత్ర కింద అందించే రూ. 10 వేలతో బ్రేక్, ఇన్స్యూరెన్స్ చేయించుకునే వాళ్లం. ఈ ఏడాది జనవరిలో మా అకౌంట్ నుంచి ఇన్స్యూరెన్స్ కింద రూ. 8773 కట్ చేశారు. వాహనం బ్రేక్ చేయాలంటే మరలా రూ. 20 వేలు కట్టాలంటున్నారు. ప్రస్తుతం వాహనాలను ఏం చేసుకోవాలో మాకు అర్థం కావడం లేదు. – గొరిపర్తి గోపి, ఎండీయూ యూనియన్ అధ్యక్షులు, రేపల్లె మండలం కలెక్టర్ను కలిసినా ఫలితం శూన్యం నేను పమిడిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలిగా 2008లో చేరా. ఇప్పటికి 16 సంవత్సరాలుగా పని చేస్తున్నా. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నేను పని చేసుకుంటూనే ఉన్నా. పాఠశాలలు తెరిచిన తర్వాత యథావిధిగా వెళ్లా. జూన్ 16న హెచ్ఎం పట్టాభిరామిరెడ్డి తమకు రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయని, విధులు నుంచి తొలగాలన్నారు. ఇదేమని అడిగితే సమాధానం చెప్పలేదు. జూన్ 21న నన్ను విధుల నుంచి తొలగించారు. అప్పటినుంచి ఎంఈవో, డీఈవోల వద్దకు తిరిగినా ప్రయోజనం లేదు. కలెక్టర్కు ఇప్పటికి మూడు సార్లు అర్జీలు ఇచ్చా. అయినా ఫలితం లేదు. – బేతంశెట్టి కనకమ్మ, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు పమిడిపాడు కొరిశపాడు మండలం ఇంటికొచ్చి తల పగలకొట్టారు నేను 20 ఏళ్లుగా తొట్టెంపూడిలో యానిమేటర్గా పని చేస్తున్నా. నేను ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. నా కుటుంబ సభ్యులు కూడా వాటికి దూరంగా ఉంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నన్ను విధుల నుంచి తప్పుకోమన్నారు. నేను ఎందుకని అడిగాను? సమాధానం చెప్పలేదు. టీడీపీకి చెందిన జాలాది సురేష్బాబు, ఆయన భార్య వాణి, పద్మ మా ఇంటి కొచ్చి నా భర్త ముసలయ్య, మా అమ్మ కమలమ్మలపై దాడి చేసి తల పగలకొట్టారు. నన్ను కిందపడేసి వారికిష్టమొచ్చినట్లు కొట్టారు. పైగా నా భర్తపై రేప్ కేసు పెట్టారు. పోలీసులు కూడా వారికే అనుకూలంగా వ్యవహరించారు. –తమనం సునీత, తొట్టెంపూడి, చుండూరు మండలం మా పొట్టకొట్టడం సరికాదు అప్పు చేసి మరీ వాహనాలను కొన్నాం. మమ్ములను విధుల నుంచి తొలగించి మా పొట్టపై కొట్టడం దారుణం. ఇప్పటికి మేము మొబైల్ వ్యాన్ ఆపరేటర్లుగా నాలుగున్నరేళ్లు పాటు సేవలు అందించాం. ఈ ఉద్యోగం భవిష్యత్లో బాగుంటుందని, ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామానికి వచ్చేశాం. ప్రతి నెలా మాకు రూ.21 వేల జీతం వచ్చేది. మమ్మల్ని ఇప్పుడు అర్ధంతరంగా తొలగించడంతో భయమేస్తోంది. – పేర్లి రమేష్, యూనియన్ అధ్యక్షులు, వేటపాలెం మండలం Iన్యూస్రీల్ -
ముగిసిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ జిల్లాల 11వ సీనియర్ ఆక్వాటిక్ చాంపియన్షిప్– 2025 పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. రన్నర్స్ స్థానంలో కర్నూలు జిల్లా నిలిచింది. శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్లో నిర్వహించిన ఈ పోటీల్లో పురుషుల వ్యక్తిగత చాంపియన్షిప్ను ఎం.శరత్ (ఎన్టీఆర్ జిల్లా) సాధించగా, మహిళల విభాగంలో సన్వి కొంగర, యు.ప్రేమాంమృత (ఎన్టీఆర్జిల్లా) సంయుక్తంగా వ్యక్తిగత చాంపియన్షిప్కు ఎంపికయ్యారు. ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కొంగర రవికాంత్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించిన పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. పోటీలలో భాగంగా ఎంపిక చేసిన రాష్ట్ర స్విమ్మింగ్ జట్టు క్రీడాకారులు త్వరలో ఒడిశాలోని భువనేశ్వర్లో జరగనున్న 78వ సీనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఓబుల్రెడ్డి, వెంకట్రామ్మోహన్, పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఏ.ఏ.రామలింగారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, కోశాధికారి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓవరాల్ చాంప్ ఎన్టీఆర్జిల్లా రన్నర్స్గా కర్నూలుజిల్లా -
ఆత్మరక్షణ కోసం ఆయుధం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రతి చిన్న సమస్యని పెద్దదిగా చూడడం, ఆందోళన చెందడం, క్రమశిక్షణ లోపించడం తదితర అంశాలను నేటిచిన్నారుల్లో తరచూ చూస్తుంటాం. తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లల చదువుకు అధిక ప్రాధాన్యతనిచ్చి పెద్ద కళాశాలల్లో సీట్లు సాధించాలనే తపన ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, కొందరు మాత్రం విద్యావంతులుగానూ ఆత్మ రక్షణ విద్యలోనూ మేటిగానూ చూడాలనుకుంటున్నారు. దీనికి తగ్గట్లుగా శిక్షణా శిబిరాల్లో చేర్పించి దీటుగా తీర్చిదిద్దుతున్నారు. ఇలా శిక్షణ పొందిన కొందరు చిన్నారులు పోటీల్లోనూ రాణిస్తున్నారు. గుంటూరు విద్యానగర్లోని కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో సుమారు 100 మందికిపైగా మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతూ అద్భుతంగా రాణిస్తున్నారు. గత నెల 24 నుంచి 26 వరకు తమిళనాడులోని కోయంబత్తూర్లో జరిగిన 5వ అంతర్జాతీయ కర్రసాము పోటీల్లో 9 బంగారు, 5 రజతాలు 3 కాంస్య పతకాలు సాధించి ఔరా అనిపించారు. అకాడమీ కోచ్ కాశీనాథ్ రెడ్డి ప్రత్యేక శిక్షణలో రాటుదేలుతున్న వీరు కర్రసాముతోపాటు తైక్వాండాలోనూ విశేషంగా రాణిస్తున్నారు. కర్రసాము, తైక్వాండోల్లో రాణిస్తున్న చిన్నారులు అంతర్జాతీయ పోటీల్లో పతకాల పంట మారుతున్న తల్లిదండ్రుల ఆలోచన ధోరణి -
6న ఐటీఐ అభ్యర్థులకు కౌన్సెలింగ్
మాచర్ల: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2024–25 సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు మాచర్లలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో కౌన్సెలింగ్ జరుగుతుందని జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ ప్రసాద్బాబు సోమవారం తెలిపారు. అభ్యర్థులు పదో తరగతి మార్కు లిస్టు, స్టడీ సర్టిఫికెట్ ఒరిజినల్స్తో హాజరు కావాలని తెలిపారు. ఇతర వివరాలకు మాచర్ల ఐటీఐ కాలేజీలో సంప్రదించాలన్నారు. నేడు లక్ష్మీ వినాయకస్వామి ఆలయ వార్షికోత్సవం పాత పాలువాయి(రెంటచింతల): పాత పాలువాయి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వినాయకస్వామి ఆలయ 31వ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు గార్లపాటి శివప్రసాద్ సోమవారం తెలిపారు. వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, గణపతి పూజ, పలు రకాల అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థానాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఘనంగా త్రిశక్తి పీఠం నాలుగో వార్షికోత్సవం పెదకూరపాడు: పెదకూరపాడులోని మహాలక్ష్మీ మహా సరస్వతి సమేత శ్రీ వాసవీ మాత దేవస్థానం నాలుగో వార్షికోత్సవం సోమవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఆలయ శాశ్వత ధర్మకర్త పొట్టి నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో యజ్ఞ హోమాది కార్యక్రమాలు జరిగాయి. అమ్మవార్లను చందనంతో అలంకరించారు. సోమవారం రాత్రి భక్తులకు అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బావిలో జారిపడి విద్యార్థి మృతి నూజెండ్ల: పొలంలోని వ్యవసాయ బావిలో జారిపడి విధ్యార్థి మృతి చెందిన సంఘటన మండలంలోని తంగారాల గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పమిడి ఏడుకొండలు, నాగరాజ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు పవన్కుమార్ (21) బీటెక్ రెండో సంవత్సరం గుంటూరులో చదువుతున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చిన ఏడుకొండలు తండ్రికి సాయంగా పొలం వెళ్లాడు. దాహం తీర్చుకోవటానికి బావిలో దిగాడు. ఆ క్రమంలో జారిపడటంతో బావి లోతుగా ఉండటంతో మునిగిపోయి ఉంటాడని బంధువులు భావిస్తున్నారు. బావి సుమారు 25 అడుగుల లోతు ఉంటుందని, ఆరు ఇంజన్లు సాయంతో నీరు తోడటంతో మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. చేతికి అంది వచ్చిన కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న ఐనవోలు ఎస్ఐ ఎంవీ కృష్ణారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పీజీఆర్ఎస్ అర్జీలకు సత్వర పరిష్కారం
బాపట్ల: పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు కలెక్టర్ను కలసి సమస్యలపై వినతి పత్రాలు అందించారు. కార్యక్రమంలో 142 అర్జీలు నమోదయ్యాయి. తన పరిధిలోని వాటికి కలెక్టర్ తక్షణమే పరిష్కార మార్గం చూపారు. కొన్నింటిని పరిశీలించాలని, మరికొన్నింటిని విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో నమోదైన ప్రతి అర్జీని క్షుణ్ణంగా చదివి, పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్య పరిష్కారమైతే అర్జీదారులకు లిఖిత పూర్వకంగా ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలని చెప్పారు. తెలుగు భాషలోనే వాటిని జారీ చేయాలని, పరిష్కారమైన వాటిని నిబంధన ప్రకారం ఫొటోలతో అప్లోడ్ చేయాలని తెలిపారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించాలి యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. ఈనెల 7న క్విజ్, వక్తృత్వం తదితర 15 రకాల పోటీలు నిర్వహించాలని తెలిపారు. 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జిల్లా స్థాయిలో కళాశాల విద్యార్థులకు పోటీలు జరపాలని, విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపాలని సూచించారు. యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లాలో జయప్రదంగా నిర్వహించాలని ఆదేశించారు. క్షయ వ్యాధి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నెల రోజులు పాటు అవగాహన కార్యక్రమాలు జిల్లాలో ఉంటాయని వెల్లడించారు. అనుమానం ఉన్న వారంతా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. అదే క్రమంలో మలేరియా నిర్మూలనపై కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు బాపట్ల జిల్లాలో నమోదు కాలేదని, అయినప్పటికీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓ పి. గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశం -
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త అరెస్ట్
లక్ష్మీపురం: వ్యసనాలకు అలవాటు పడిన భర్తను వదిలి పుట్టింట్లో ఉంటూ పని చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్న మహిళను ఆమె భర్త కత్తి పొడిచి గాయాలపాలు చేశాడు. నిందితుడిని పట్టాభిపురం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కోబాల్డ్పేటకు చెందిన మెరిగల రాజేష్, కల్పనకు 2014లో వివాహం అయింది. రాజేష్ పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, కొంతకాలంగా రాజేష్ వ్యసనాలకు అలవాటు పడి మద్యం తాగుతూ భార్యను వేధించడం ప్రారంభించాడు. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేక కల్పన ఏడాది క్రితం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలను పోషించేందుకు చంద్రమౌళీనగర్లోని సంస్థలో చిరు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే రాజేష్ మద్యం తాగి పిల్లలు కావాలంటూ, కాపురానికి రావాలంటూ భార్య పని చేసే ప్రదేశానికి వెళ్లి వేధిస్తుంటాడు. ఈ నేపథ్యంలో గత నెల 25న రాత్రి ఆమె పనిచేసే ప్రదేశానికి వెళ్లి వాగ్వివాదానికి దిగిన రాజేష్ వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి తీవ్ర గాయాలపాలు చేశాడు. దీన్ని గమనించిన స్థానికులు కల్పనను హుటాహుటిన జీజీహెచ్కు తరలించారు. సమచారం తెలుసుకున్న పట్టాభిపురం పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలో విచారించి, బాధితురాలు కల్పన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు ఉడాయించడంతో అతనికోసం గాలింపు చేపట్టారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ తరంగిణిలకు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి కోబాల్డ్పేట 7వ లైన్లో నిందితుడు ఉన్నట్లు తెలియడంతో మెరిగల రాజేష్ను అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించి సోమ వారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
కూటమి పాలనలో అభివృద్ధి సున్నా
● మాజీ డెప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ● ప్రజా వ్యతిరేక విధానాలపై రేపు నిరసన బాపట్ల: కూటమి ప్రభుత్వంలో ఆర్భాటాలే తప్పా అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విమర్శించారు. సోమవారం స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 4న ప్రభుత్వ వెన్నుపోటు కార్యక్రమాన్ని వైఎస్సార్ సీపీ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ప్రదర్శన చేపట్టి తహసీల్దార్కు వినతి పత్రం అందిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా తాను చేసిన అభివృద్ధి తప్పా ఎక్కడా వీసమెత్తు అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. అనేక అబద్ధపు ప్రచారాలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. పెన్షన్ మాత్రమే అందిస్తూ సంక్షేమ పథకాల అమలు చేయడంలో పూర్తిస్థాయిలో వెనకబడి ఉందని తెలిపారు. సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం రూ. 97 కోట్లు మంజూరు చేశామని ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని, అక్కడ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల డీపీఆర్ తయారు చేసి బహిరంగపరచాలని కోన డిమాండ్ చేశారు. జిల్లా ప్రజలకు అత్యంత ఉపయోగపడే మెడికల్ కళాశాల నిర్మాణ పనులను ఆపేశారని, తక్షణమే ప్రారంభించి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ నెల 4న నిర్వహించనున్న ప్రభుత్వ వెన్నుపోటు కార్యక్రమాలను పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని కోరారు. పలువురు ఉపాధికి గండి రాష్ట్రంలో ఉన్న 64లక్షల పెన్షన్లలో రెండు లక్షలు తొలగించి కూటమి ప్రభుత్వం వృద్ధులకు తీరం అన్యాయం చేసిందని విమర్శించారు. వలంటీర్లతో పాటు రేషన్ సరఫరా చేసే వాహనాలను సైతం తొలగించి ఎంతో మంది ఉపాధిని దెబ్బతీసిందని తెలిపారు. అధికారంలోకి వస్తే ఉపాధి కల్పన చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదని విమర్శించారు. నేరుగా వైఎస్. జగన్మోహన్రెడ్డి లబ్ధిదారుల ఖాతాలోకి నగదు జమ చేయడం వల్ల ఎంతో మంది ఆర్థిక పరిస్థితులు మెరుగు పడ్డాయని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, బాపట్ల ఏఎంసీ మాజీ చైర్మన్ డి. సీతారామిరెడ్డి, పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి జయభారతరెడ్డి, నాయకులు చేజర్ల నారాయణరెడ్డి, జోగి రాజా, చల్లా రామయ్య, నర్రావుల వెంకట్రావు, బంగారురెడ్డి, ఇమ్మడిశెట్టి అంకమ్మ, తన్నీరు అంకమ్మరావు పాల్గొన్నారు. -
చిరుద్యోగులకు చంద్ర గ్రహణం
● కక్ష సాధింపులకు పాల్పడుతున్న కూటమి సర్కార్ ● జిల్లాలో యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లకు ఉద్వాసన ● మధ్యాహ్న భోజన నిర్వాహకులు, శానిటేషన్ వర్కర్లను వదలని వైనం ● నెలల తరబడి జీతాలు చెల్లించకుండానే తొలగింపు ● ఎండీయూ వాహనాలు రద్దు ● వందల మంది ఆపరేటర్ల పొట్టపై కొట్టిన ప్రభుత్వం ● పాలకులు తీరుపై మండిపడుతున్న చిరుద్యోగులు బాపట్ల టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు చిరుద్యోగుల పొట్ట కొడుతోంది. ఒక్కొక్కరికీ ఉద్వాసన పలుకుతోంది. ఉద్యోగాలను ఊడబెరుకుతూ రోడ్డున పడేస్తోంది. అధికారంలోకి రాక మునుపు వలంటీర్లను కొనసాగిస్తామని, నెలకు రూ.10 వేల చొప్పున జీతం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక వారిని తొలగించింది. డ్వాక్రా సంఘాల యానిమేటర్లను మోసం చేసింది. పొదుపు సంఘాలు తన మానసపుత్రికలు అంటూ ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పలువురిని తొలగించారు.వీరితో పాటు వందల సంఖ్యలో ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, శానిటేషన్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే ఎండీయూ ఆపరేటర్లు... ఇలా అన్ని రంగాలకు చెందిన చిరుద్యోగులను విధుల నుంచి తొలగించారు. జె.పంగులూరు మండలంలో– 21, యద్దనపూడి–10, మార్టూరు– 14, అద్దంకి –8, పిట్టలవానిపాలెం–1, చెరుకుపల్లి –3, నగరం– 21, చుండూరు– 12 మంది చొప్పున జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మంది యానిమేటర్లను విధుల నుంచి తొలగించి వారిస్థానంలో పచ్చనేతల భార్యలకు అవకాశం కల్పించారు. ● జిల్లాలోని 435 గ్రామ సచివాలయాల పరిధిలోని 5220 మంది వలంటీర్లను తొలగించారు. ● కేంద్రప్రభుత్వం సహకారంతో నిర్వహించే ఉపాధిహామి పథకంలోకి 459 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించారు. ● గత ప్రభుత్వం ఆధ్వర్యంలో వైన్షాపుల్లో సేల్స్మెన్, సూపర్వైజర్లుగా జిల్లాలోని 117 వైన్షాపుల్లో 468 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని తొలగించారు. ● పచ్చపార్టీ వారికి అవకాశాలు కల్పించేందుకు ఇంటింటికి తిరిగి వైద్యసేవలు అందించే 250 మంది ఆశావర్కర్లను తొలగించారు. ● ప్రభత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వాహకులు, హెల్పర్లుగా విధులు నిర్వహించే వారిలో సుమారు 1500 మందిని కుట్రపూరితంగా విధుల నుంచి తొలగించారు. ● 173 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లను తొలగించారు. ● ఇంటింటికీ రేషన్ అందించే ఎండీయూ వాహనాల ఆపరేటర్లు, హెల్పర్లను 600 మందికి పైగా విధుల నుంచి తొలగించారు. -
వెన్నుపోటుకు పేటెంట్ చంద్రబాబుదే !
గుంటూరు రూరల్: వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, ఈవిషయంలో పేటెంట్ ఆయనదేనని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సోమవారం మండలంలోని ఏటుకూరు బైపాస్ నందున్న వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యాలయంలో ఈనెల 4వ తేదీన నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమంపై కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు తనకు పిల్లను ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడన్నారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తా.. ఆదాయాన్ని సృష్టిస్తా అని అబద్ధ్దాలు చెప్పి గద్దెనెక్కి నేడు రాష్ట్రంలోని ప్రజలకు పథకాలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. సంపద సృష్టి పేరుతో పేదల కష్టం దోపిడీ వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పి విద్యుత్ చార్జీలను పెంచి పేదలు, రైతులను వెన్నుపోటు పొడిచాడన్నారు. సంపద సృష్టి పేరుతో గ్రామాల్లో వీధికి నాలుగు బెల్ట్ షాపులను నిర్వహిస్తూ మద్యాన్ని ఏరులా పారించి పేదల కష్టాన్ని దోచుకుంటున్నాడన్నారు. పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు పేదలు సంతోషంగా ఉంటే నచ్చదని, వారిని అణగదొక్కేందుకు ఎల్లపుడూ చూస్తుంటాడన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా నేటికి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేకపోయారన్నారు. దానికితోడు నిత్యం వేల కోట్ల అప్పులు చేసి నేటికి ఆంధ్రరాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడన్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ బలసాని కిరణ్కుమార్ మాట్లాడుతూ ఈనెల 4న ఉదయం 10 గంటల నుంచి వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని పాత మల్లాయపాలెంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించి అక్కడినుంచి ర్యాలీగా వెళ్లి ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు. పొన్నూరు నియోజకవర్గ ఇన్చార్జ్ అంబటి మురళీకృష్ణ, నగర అధ్యక్షురాలు, ఈస్ట్ నియోజకవర్గ ఇన్చార్జ్ నూరి ఫాతిమా, మంగళగిరి ఇన్చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఏటుకూరులో వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ -
కారు బోల్తా..ఐదుగురికి గాయాలు
ఉలవపాడు: ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై రాజుపాలెం జంక్షన్ వద్ద సోమవారం ఈ సంఘటన జరిగింది. వివరాలు... గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సీహెచ్.బాలభాస్కర్ కుటుంబ సభ్యులు, బంధువులు కలసి ఏడుగురు కారులో అరుణాచలానికి బయలుదేరారు. అందరూ మాట్లాడుకుంటూ సంతోషంగా వెళుతున్న సమయంలో రాజుపాలెం జంక్షన్ వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ఉన్న వారిలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఏ.విజయలక్ష్మి, లక్ష్మీవాణి, కామాక్షి, బాలభాస్కర్, సీతారావమ్మలకు గాయాలు కాగా వీరిని హైవే అంబులెన్స్ సిబ్బంది ఉలవపాడు సీహెచ్సీ వైద్యశాలకు తరలించారు. రోడ్ సేఫ్టీ సిబ్బంది బాధితులను హైవే అంబులెన్స్ లో ఎక్కించి పంపించారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అరుణాచలం వెళ్తుండగా ఘటన -
లోక్అదాలత్లో అధిక కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలి
రేపల్లె: లోక్ అదాలత్లో అధిక కేసులు పరిష్కారం అయ్యేలా పోలీసులు కృషి చేయాలని మండల న్యాయాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల కోరారు. జులై 5వ తేదీన జరగనున్న జాతీయ లోక్అదాలత్లో అత్యధిక కేసుల పరిష్కారం కోసం సోమవారం స్థానిక కోర్టు హాలులో డివిజన్ పరిధిలోని పోలీసులు, న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలన్న లక్ష్యంతో న్యాయశాఖ లోక్ అదాలత్తో పాటు ప్రతి నెలా జాతీయ లోక్అదాలత్ను నిర్వహిస్తోందని వివరించారు. డివిజన్ పరిధిలో కేసులను గుర్తించి పరిష్కారం అయ్యేలా పని చేయాలని తెలిపారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవిసాయి శ్రావణి, రేపల్లె రూరల్ సీఐ సురేష్ బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీవీ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. -
టీబీ కేసులు గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలి
జిల్లాలో టీబీ కేసులు గుర్తించడంతోపాటు మరణాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జె.వెంకట మురళి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి టీవీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టీబీ కేసులపై వాల్పోస్టర్లను ఆయన సోమవారం ఆవిష్కరించారు. జిల్లాలో సోమవారం నుంచి టీవీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో టీబీ కేసులు వేగవంతంగా గుర్తించి మరణాలను తగ్గించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆయన వివరించారు. వృద్ధులు, పోషకాహార లోపం ఉన్నవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, హెచ్ఐవీ బాధితులు, ధూమపానం, మద్యపానం చేసే వారికి స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు. పౌష్టికాహారం అందించాలని చెప్పారు. కార్యక్రమంలో డీఎంఅండ్హెచ్ఓ డాక్టరు విజయమ్మ, లెప్రసీ, క్షయ నివారణ అధికారి డాక్టర్ మహమ్మద్ సాదిక్ పాల్గొన్నారు. -
సుద్దపల్లిలో వ్యక్తి దారుణహత్య
వివాహేతర సంబంధమే కారణం చేబ్రోలు: వివాహేతర సంబంధం నేపఽథ్యంలో వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన సోమవారం సుద్దపల్లిలో చోటు చేసుకుంది. చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన కొమ్మూరి గోప య్య(35)ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హతమార్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చేబ్రోలు సీఐ వై.కోటేశ్వరరావు, ఎస్ఐ డి.వెంకటకృష్ణలు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి తల్లి కొమ్మూరి రమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి.వెంకటకృష్ణ తెలిపారు. మహిళకు ఇద్దరు వ్యక్తులతో ఉన్న వివాహేతర సంబంధం నేపథ్యంలో చోటు చేసుకున్న వివాదం కారణంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. -
అర్జీదారులతో సహృదయంతో వ్యవహరించాలి
బాపట్ల టౌన్: అర్జీదారులతో సహృదయంతో వ్యవహరించాలని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా చట్టపరిధిలో సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. అర్జీదారులతో సహృదయ భావనతో వ్యవహరించినప్పుడే సమస్య, వారు పడే ఆవేదన అర్థం అవుతుందని చెప్పారు.అప్పుడే వేగంగా స్పందించి వారి సమస్యలు పరిష్కరించగలమని చెప్పారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. జిల్లా నలుమూలల నుంచి 44 మంది బాధితులు ఎస్పీకి తమ సమస్యలను తెలియజేశారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ తుషార్ డూడీ -
బాబు నోరు తెరిస్తే అబద్ధాలే
అద్దంకి: చంద్రబాబు ఎప్పటిలాగానే గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రజలంతా తెలుసుకున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ‘వెన్నుపోటు దిన’ సమాయత్త సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేని హామీలు ఎప్పుడూ ఇవ్వలేదని గుర్తు చేశారు. అందుకు విరుద్ధంగా చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. మరో వైపు కూటమి ప్రభుత్వ పాలనలో విద్య, వైద్యానికి భరోసా లేకుండా పోయిందని విమర్శించారు. నాడు వ్యవసాయం పండుగగా సాగితే నేడు పంటలను కొనేవారు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు పొగాకు, మిరప రైతులకు వెన్నుదన్నుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉందన్నారు. నేడు ఒక్క పొగాకు కాడ కూడా కొనుగోలు చేసే స్థితిలో ఈ ప్రభుత్వం లేదన్నారు. నల్లబర్లీ, తెల్లబర్లీ రైతులు పూర్తిగా పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రతి రైతుకు గిట్టుబాటు ధర లభించిందని గుర్తు చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా రైతన్నలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలు, చేతగానితనాన్ని ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసమే ఈ నెల 4న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్కు మోమోరాండం అందజేస్తామని చెప్పారు. మండల పార్టీ నాయకుడు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, వివిధ మండలాల అధ్యక్షులు గుజ్జుల జగన్మోహన్రెడ్డి, కృష్ణ, నాగేశ్వరరావు, బీసీ సెల్ నాయకుడు గోలి రమణబాబు, కొల్లా భువనేశ్వరి, అవిశెన ప్రభాకర్రెడ్డి, వివిధ మండలాల నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు. పావులూరు: సభలో ప్రసంగిస్తున్న మేరుగ నాగార్జున మాయమాటలు చెప్పి ప్రజలను మోసగిస్తున్న సీఎం వెన్నుపోటు దిన ఏర్పాట్లపై సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున ధ్వజంఇంకొల్లు(చినగంజాం): ఎన్నికల్లో నెరవేర్చలేని హామీలిచ్చి రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, బాపట్ల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. జూన్ 4న వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం సన్నాహాల్లో భాగంగా ఆదివారం ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. సమాజంలో అసమానతలు పోయేలా నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించారన్నారు. రూ. 2 లక్షల 78 వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి తాను ఇచ్చిన హామీలకు మించి అమలు చేసిన ఘనత ఆయనదన్నారు. ఏడాది తిరగకుండానే చంద్రబాబు పాలన అవినీతిమయంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 4 నాటికి ఏడాది అవుతుందని, ఈ కాలంలో తల్లికి వందనం, విద్యార్థులకు విద్య, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ వంటి పలు పథకాలను తొలగించి రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని దారుణంగా మోసం చేశారన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తొలగించి లక్షల మందిని వీధులపాలు చేశారన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జూన్ 4వ తేదీన చేపట్టిన వెన్నుపోటు దినాన్ని పర్చూరులో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు, రైతులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి గాదె మధుసూదన రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ మేలు జరిగేలా ఐక్యంగా పోరాటం చేద్దామన్నారు. జిల్లా అధికార ప్రతినిధి బంజారు ప్రభాకరరావు పుట్టినరోజు కార్యక్రమాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ పరిధిలోని మండలాల కన్వీనర్లు జంపని వీరయ్య చౌదరి, మున్నం నాగేశ్వరరెడ్డి, కఠారి అప్పారావు, జువ్వా శివరాం ప్రసాద్, చిన్ని పూర్ణారావు, జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, ఎస్సీ సెల్ కన్వీనర్ కె. బాబురావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నూతలపాటి బలరాం, సోషల్ మీడియా అధ్యక్షుడు కుమ్మరి చందు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బిల్లాలి డేవిడ్, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
యోగాతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం
నరసరావుపేట: యోగాతో శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. యోగాంధ్రలో భాగంగా ఆదివారం నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్, పెద్ద చెరువు రోడ్డు వద్ద కార్యక్రమాలను పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ 30 నిమిషాల నుంచి గంట వరకు యోగాభ్యాసం చేయాలని సూచించారు. యోగాతో శారీరక రుగ్మతలు దూరమవుతాయని పేర్కొన్నారు. యోగా అనేది చాలా ప్రాచీనమైనదని, వందల ఏళ్ల నుంచి గుర్తింపు పొందిందని అన్నారు. జూన్ 21 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
నాడు సంక్షేమం.. నేడు సంక్షోభం
కూటమి ఏడాది పాలనలో అన్నివర్గాలకు తీరని అన్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సంక్షేమ జాతర సాగింది. అభివృద్ధికి కూడా గత ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. కరోనా వంటి కష్టకాలంలోనూ సంక్షేమాన్ని కొనసాగించింది. సంక్షేమ పథకాలతో నాడు ఇంటింటా పండగ చేసుకున్న ప్రజానీకానికి నేడు కూటమి ప్రభుత్వం షాకులు మీద షాకులిస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను దారుణంగా మోసగించింది. చంద్రబాబు కేవలం మాటలకే పరిమితం అయ్యారు. బాపట్ల టౌన్ : కూటమి అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమాన్ని అందిస్తామని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను కొనసాగిస్తూ, సూపర్–6 పథకాలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఊకదంపుడు ప్రసంగాలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా అవేమీ అమలుకు నోచుకోలేదు. ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలెండర్ల పథకం ప్రారంభమైనప్పటికీ అరకొరగానే అమలు జరిగిందనే విమర్శలు అధికంగానే వినిపిస్తున్నాయి. పింఛన్లు పెంచి ఇస్తున్నా.. లబ్ధిదారుల సంఖ్యను దారుణంగా తగ్గిస్తున్నారు. దీంతో కూటమి సర్కార్ తీరుపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మహిళలు అయితే దుమ్మెత్తిపోస్తున్నారు. పథకాలు అమలు కాకపోవడంపై అంతా చర్చించుకుంటూ గత పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. నాడు విప్లవాత్మక పథకాలు ప్రజా సంకల్పయాత్రలో ప్రజల కష్టాలను చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎంగా పలు విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. తర్వాత ప్రభుత్వ సేవలను ఇంటి ముంగిటకే అందించాలని సంకల్పించారు. ఇందుకోసం సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థలను తీసుకొచ్చారు. వీరి ద్వారా పింఛన్లు, ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలు, కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యవసర సేవలు, మందులు ఇలా ఎన్నో సేవలను అందించారు. వైఎస్సార్సీపీ మార్క్ సుపరిపాలనకు కూటమి ప్రభుత్వ ఏడాదిలోనే స్వస్తి పలికింది. పేదలపై కక్ష కట్టి వలంటీర్ లాంటి వ్యవస్థను తొలగించింది. ప్రజలను ఇబ్బందుల పాలుచేసింది. నాడు ప్రగతి పరుగులు చీరాల ఓడరేవు నుంచి పల్నాడు జిల్లా చిలకలూరిపేట వరకు రూ.900 కోట్లతో నాలుగు లేన్ల రహదారిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పనులు సగానికి పైగా పూర్తయ్యాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే జిల్లాలో పర్యాటకం మరింత అభివృద్ది చెందనుంది. రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నం వద్ద రూ. 451 కోట్లతో వేగంగా హార్బర్ రెండవ ఫేజ్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే 500 బోట్లు నిలిపే అవకాశం ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలో 705 సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటికి ప్రోత్సాహకరంగా ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో రూ.110.69 కోట్లు రాయితీ అందించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో గడపగడపకు మన ప్రభుత్వం కింద రూ.12 కోట్లతో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టారు. రూ.15 కోట్ల ఎంపీ నిధులతో ప్రభుత్వం సిమెంట్రోడ్లు, కమ్యూనిటీ భవనాలను నిర్మించింది. రూ.885 కోట్లతో 4,750 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటివరకు 2 వేలకుపైగా పూర్తయ్యాయి. రూ.6 కోట్లు వెచ్చించి రైతులకు రాయితీపై విత్తనాలను అందించారు. రూ.10 కోట్లతో ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలు అందించారు. ఉద్యాన పంటలకు రూ.11 కోట్లు రాయితీలు, మత్స్యకార భరోసా కింద రూ.100 కోట్లు ఇచ్చారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కింద రూ. 20 కోట్లు, పశుగ్రాసం రాయితీ కింద రూ. 6 కోట్లు, జల్జీవన్ మిషన్ కింద రెండు విడతల్లో రూ.1,040 కోట్లు కేటాయించి ఇప్పటివరకు 1,43,497 కుళాయిల ద్వారా నీరు అందించారు. పథకం లబ్ధిదారుల అందించిన సంఖ్య మొత్తం (రూ.కోట్లలో) ఆసరా 2,76,290 953.37 అమ్మఒడి 1,16,019 489 వైఎస్సార్ చేయూత 85,846 439.13 జగనన్న వసతి దీవెన 30,611 29.16 జగనన్న విద్యా దీవెన 31,046 92.28 పింఛను కానుక 2,35,791 2,668 రైతు భరోసా 1,92,037 1,181 ఇన్పుట్ సబ్సిడీ 1,71,415 406.62 ఉచిత పంట బీమా 99,580 179.23 తుపాన్ పరిహారం 1,23,056 115.85 వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 62,170 33.15 ఆరోగ్యశ్రీ 1,37,421 331.83 వైఎస్సార్ బీమా 2,376 31.52 సున్నా వడ్డీ (మహిళలు) 31,764 166.60 మత్స్యకార భరోసా 21,726 21.72 మత్స్యకార డీజిల్ సబ్సిడీ 2,663 4.54 ఆక్వాకు విద్యుత్ సబ్సిడీ 2,620 76 గోరుముద్ద 76,975 0.31 జగనన్న విద్యాకానుక 1,11,520 26.77 వైఎస్సార్ సంపూర్ణ పోషణ 77,718 1.26 సంపూర్ణ మిశ్రమ దాణా 5,924 1.11 పశుగ్రాస విత్తనాల సరఫరా 10,768 2.27 పశుగ్రాస యంత్రాల పంపిణీ 111 15.8 పశువుల పంపిణీ 9,214 69.10 భవనం పేరు సంఖ్య వ్యయం (రూ.కోట్లలో) గ్రామ సచివాలయాలు 401 160.04 రైతు భరోసా కేంద్రాలు 315 66.40 వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు 343 58.48 బల్క్మిల్క్ సెంటర్లు 40 7.20 డిజిటల్ లైబ్రరీలు 128 20.49 నేడు వైద్యానికి నోచుకోని పేదలు పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. అందులో భాగంగా వైద్య సేవలను మరింత మెరుగు పరిచింది. జిల్లాలో రూ. 15 కోట్లు వెచ్చించి 7 కొత్త పీహెచ్సీలను నిర్మించింది. మరో రూ. 10 కోట్లు ఖర్చు చేసి 34 పీహెచ్సీలను ఆధునికీకరించింది. గడిచిన అయిదేళ్లలో 60 మంది కొత్త డాక్టర్లను, 43 మంది ఏఎన్ఎంలను రిక్రూట్ చేసింది. 343 డాక్టర్ వైఎస్సార్ హెల్త్ సెంటర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలోని బాపట్ల, చీరాల ఏరియా అసుపత్రులలో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రెండు విడతల్లో వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు వైద్య సేవలు అందించారు. రెండు ఫేజ్లలో 2,69,495 మందికి పరీక్షలు నిర్వహించారు. 4,223 మందికి వైద్యసేవలు అందించారు. జగనన్న కంటి వెలుగు ద్వారా 300 మందికి సర్జరీలు చేసి 29 వేల మందికి కంటి అద్దాలు అందజేశారు. జిల్లాలో 3,49,767 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చారు. ప్రభుత్వం రూ.550 కోట్లతో బాపట్లకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలను మంజూరు చేసింది. 55 ఎకరాల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 30 శాతం పనులు పూర్తయ్యాయి. నేడు వైద్యానికి కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.312.61 కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాల వివరాలువైఎస్సార్సీపీ పాలనలో జిల్లాలో సంక్షేమ పథకాల కింద అందించిన మొత్తం వివరాలు నాడు పథకాలతో కళకళ... నేడు లబ్ధి అందక ప్రజలకు కష్టాలు దారుణంగా మోసపోయామని జిల్లా ప్రజల ఆవేదన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సేవలను ఇప్పటికీ మరువని జనం రూ. వేల కోట్లతో నాడు జిల్లాలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు ప్రస్తుతం ఏ చిన్న పని కావాలన్నా కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధరలు లేక కన్నీరు కారుస్తున్న రైతులు చేతిలో చిల్లిగవ్వ లేదంటున్న మహిళలు కూటమి సర్కారు ఏడాది పాలనపై భగ్గుమంటున్న సామాన్యులు -
ఆరోగ్యానికి సైక్లింగ్
నరసరావుపేట ఈస్ట్: ఆరోగ్యకర జీవనానికి సైక్లింగ్ ఉత్తమ వ్యాయామంగా దోహదపడుతుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి తెలిపారు. కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆదివారం ఎర్త్ హీరో ఫౌండేషన్ భాగస్వామ్యంతో హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ స్వచ్ఛంద సేవా సంస్థ సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించారు. సతైనపల్లిరోడ్డులోని డీఎస్ఏ స్టేడియంలో సైకిల్ ర్యాలీని ప్రారంభించిన డీఎస్ఓ నరసింహారెడ్డి మాట్లాడుతూ కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ప్రపంచ సైకిల్ దినోత్సవంతో పాటు సండేస్ ఆన్ సైకిల్ నిర్వహించాలని ఆదేశించినట్టు వివరించా రు. శరీరానికి వ్యాయామాన్ని అందించే సైక్లింగ్ను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూ చించారు. హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.ఆనంద్ బెంజిమెన్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పర్యావరణ రక్షణ, ఆరోగ్యవంతమైన జీవనశైలిని పౌరులకు పరిచయం చేసేందుకే సండేస్ ఆన్ సైకిల్ నిర్వహిస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో స్టేడియం కోచ్లు చావా శ్రీనివాసరావు, మద్దాలి సైదారావు, ఖేలో ఇండియా పీఈ టీ ఇజ్రాయిల్ ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. డీఎస్ఓ నరసింహారెడ్డి -
కార్డుదారులకు సరుకులు సక్రమంగా అందించాలి
చీరాల టౌన్: కార్డుదారులకు రేషన్ సరుకులు సక్రమంగా అందించాలని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖరనాయుడు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా మండలంలోని ఈపురుపాలెం, తోటవారిపాలెం, పట్టణంలోని పలు వార్డుల్లోని రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు సరుకులు పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రతి డీలర్ విధిగా ప్రతి నెలా 15వ తేదీలోగా కార్డుదారులకు సరుకులు అందించాలని ఆదేశించారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరచి ఉంచాలని తెలిపారు. ప్రతి డీలర్ విధిగా స్టాక్ రికార్డులు, బోర్డుల్లో సరుకుల కేటాయింపులు, నిల్వలను తెలియజేయాలని చెప్పారు. సరుకుల పంపిణీలో వ్యత్యాసాలు, అధిక ధరలకు అమ్మకాలు, బియ్యాన్ని ఇవ్వకుండా డబ్బులకు కొనుగోలు చేయడం నేరమని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణ, వీఆర్వోలు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో చేనేత వ్యవస్థ నిర్వీర్యం
చీరాల: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత వ్యవస్థ నిర్వీర్యమైందని దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. చేనేత సహకార సంఘాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రభుత్వం వెంటనే ఎన్నికలు, పాలక మండలి నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నేతన్న నేస్తం ద్వారా మగ్గం ఉన్న వారికి ఏడాదికి రూ.24 వేలు ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. ఈ పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 200 యూనిట్లు విద్యుత్ జీఓకే పరిమితం అయిందని, వెంటనే అమలు పరచాలని ఆయన కోరారు. ఆప్కోకు చైర్మన్ను నామినేట్ చేసి ఇప్పటి వరకు జీఓ ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. చేనేత వర్గం మద్దతుతో గెలిచిన నారా లోకేష్ దీనిపై స్పందించాలని కోరారు. ఎన్నికల్లో జీఎస్టీ గురించి హామీ ఇచ్చిన ఆయన ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని తెలిపారు. చేనేతలు అభివృద్ధితో పాటు ఆకలి చావులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరిట కొంగ జపం చేస్తున్న కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం పట్టించుకోకపోవడంతో ప్రజల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చేనేతలకు అందిన లబ్ధి శూన్యమని పేర్కొన్నారు. -
‘గ్రీన్లైట్ ఏరియా’ కథా సంపుటి ఆవిష్కరణ
అద్దంకి రూరల్: వడలి రాధాకృష్ణ (చీరాల) రచించిన కథా సంపుటి ‘గ్రీన్ లైట్ ఏరియా’ ఆవిష్కరణ ఆదివారం రాత్రి స్థానిక కమఠేశ్వరస్వామి ఆలయంలో సృజన, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించి తొలి ప్రతిని చెన్నుపాటి రామాంజనేయులుకు అందజేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య అధ్యక్షత వహించారు. కథా రచయిత్రి పాలపర్తి జ్యోతిష్మతి మాట్లాడుతూ రాధాకృష్ణ కథలు ప్రత్యేకమైన శైలిలో సమాజంలోని సమస్యల పరిష్కారం దిశగా సాగుతాయని తెలిపారు. అనంతరం ఇటీవల ఉగాది పురస్కారం పొందిన వడవల్లి రాధాకృష్ణ, ఎన్టీఆర్ జాతీయ కీర్తి పురస్కారాన్ని అందుకున్న నాగనేని రామకృష్ణ, ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకున్న మన్నం త్రిమూర్తులు, పెద్దినేని సురేంద్రబాబు, రక్తదాన ప్రోత్సాహకులు చుండూరి మురళీ సుధాకర్లను సృజన, రోటరీ క్లబ్ సభ్యులు దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సృజన అధ్యక్షుడు గాడేపల్లి దివాకరదత్తు, వీరవల్లి రుద్రయ్య, కోట అంజమ్మ, కొల్లా భువనేశ్వరి, జ్యోతి చంద్రమౌళి, కృష్ణమోహన్, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, షేక్ మస్తాన్, రావూరి రంగయ్య, లెవీ ప్రసాద్ పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల తాకిడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వేసవి సెలవులు ముగియ నుండటంతో, వివాహ ముహుర్తాల నేపథ్యంలో నూత న వధూవరులు, భక్తులు, యాత్రికులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి కనిపించగా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దేవస్థాన కేశకండనశాలలో తలనీలాలు సమర్పించారు. ఘాట్రోడ్డు, మహామండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. సర్వదర్శనంతో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ల క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండున్నర గంటలు, రూ.100, రూ.300 టికెట్పై దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. వీఐపీ దర్శనాలను బ్రేక్ ఉదయం 11–30 గంటల నుంచి మధ్యాహ్నం 1–30 గంట వరకు వీఐపీ దర్శనాలను దేవస్థాన అధికారులు నిలిపివేశారు. అమ్మవారికి మహానివేదన నిమిత్తం ఉ దయం 11–45 గంటల నుంచి 12–15 గంటల వరకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. మహానివేదన అనంతరం రూ. 500టికెట్ల విక్రయాలను నిలిపివేసి, రూ. 300 టి కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు బంగారువాకిలి దర్శ నం కల్పించారు. మధ్యాహ్నం 2గంటలవరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీసేవలో పలువు రు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం ఏడు గంటలనుంచి భక్తుల తాకిడి కనిపించింది. మహానివేదన తర్వాత వీఐపీ దర్శనాలకు బ్రేక్ అంతరాలయ దర్శనం రద్దు -
అండర్పాస్లో ఇరుక్కుపోయిన లారీ
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ కరకట్ట నుంచి సీతానగరం వచ్చే మార్గంలో బకింగ్హామ్ కెనాల్ వద్ద ఉన్న రైల్వే అండర్పాస్లో మరో సారి భారీ వాహనం ఆదివారం ఇరుక్కుపోయింది. సీతానగరం నుంచి ఎన్టీఆర్ కరకట్ట వైపు వెళుతున్న లారీ రైల్వేబ్రిడ్జి సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన గడ్డర్ను దాటి ముందుకు వచ్చేసింది. బ్రిడ్జి కిందకు రాగానే లారీపై ఉన్న లోడ్ తగిలి ఇరుక్కుపోవడంలో డ్రైవర్ నిలిపివేశాడు. చివరకు టైర్లలో గాలి తీసి ముందుకు తీసుకువెళ్లారు. రైల్వే బ్రిడ్జి కింద తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో పెను ప్రమాదం జరిగే అవకాశముందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. రైల్వే అధికారులు స్పందించి రైల్వే బ్రిడ్జికి ప్రమాదం కలగకుండా సమాంతరంగా గడ్డర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ సంఘటనపై తెనాలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులతో మైదానాలు కళకళలాడాలి గుంటూరు వెస్ట్ (క్రీడలు): చిన్నారులతో క్రీడా మైదానాలు కళకళలాడాలని, ఆ విధంగా స్టేడియాన్ని తీర్చిదిద్దుతామని తూర్పు శాసన సభ్యుడు మొహమ్మద్ నసీర్ అహ్మద్ తెలిపారు. మూడు రోజల నుంచి స్థానిక బీఆర్ స్టేడియంలో జరుగుతున్న అండర్–16 బాలబాలికల ఓపెన్ టెన్నిస్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ రూ.100 కోట్లతో స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పోటీల నిర్వాహకుడు, టెన్నిస్ కోచ్ షేక్ అహ్మద్ మాట్లాడుతూ అండర్–16 బాలుర విజేతగా కె.విన్సెంట్, రన్నర్గా జయ సాయి కుమార్ నిలిచాడన్నారు. బాలికల్లో గోలి జోషిత విజేత కాగా తనిక్షరెడ్డి రన్నర్గా నిలిచిందని చెప్పారు. విజేతలకు బహుమతులను నసీర్ అహ్మద్, టోర్నమెంట్ స్పాన్సర్ డాక్టర్ రామకృష్ణ, రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వరరావు అందజేశారు. -
క్రీడాకారులను తీర్చిదిద్దడం గొప్ప విషయం
చినగంజాం: క్రీడాకారులను ప్రతిభావంతులుగా తీర్చి దిద్దడం గొప్ప విషయం అని హైదరాబాద్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్ను వేణుగోపాల్ అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీ ఆవరణలో 40 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి కబడ్డీ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరానికి శిక్షకుడుగా అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు గిరిబాబు వ్యవహరించి ప్రతి రోజూ శిక్షణ అందించారని, అనేక మంది యువ క్రీడాకారులు ప్రేరణ పొందారన్నారు. ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు మాట్లాడుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 నుంచి జూన్ 1వ తేదీ వరకు గ్రామీణ యువతకు కబడ్డీపై శిక్షణ ఇచ్చే కార్యక్రమం నిర్వహించామని.. శిబిరం విజయవంతంగా ముగిసిందన్నారు. కోచ్ గిరిబాబు మాట్లాడుతూ శిబిరంలో మొత్తం 150 మంది బాలలకు శిక్షణ ఇచ్చామని, శిక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు డాక్టర్ నల్లూరి సుబ్బారావు రూ.లక్ష విరాళంగా అందజేశారని తెలిపారు. దీంతో క్రీడాకారులకు పౌష్టికాహారం, కబడ్డీ కిట్లు అందజేశామన్నారు. శిబిరంలో సీనియర్ క్రీడాకారులు బి.నాగాంజనేయులు, వెంకటేశ్, కె.సతీష్రెడ్డి, బి.శివారెడ్డి, డి.సుబ్బారెడ్డి, వి. వెంకటేశ్, జీటీ అంకిరెడ్డి, ఎం.భాను ప్రకాష్రెడ్డి తదిరులు పాల్గొనగా వారి సలహాలు సూచనల మేరకు శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి క్రీడాకారులకు భోజన వసతి కల్పించేందుకు అన్ను వేణుగోపాల్ రూ.40 వేలు ఆర్థిక సాయమందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మచిలీ పట్నం జిల్లా అదనపు పోలీస్ అధికారి సత్యం, ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ దాత డాక్టర్ నల్లూరి సుబ్బారావు, అసోసియేషన్ చైర్మన్ చంద్రమోహనరెడ్డి, అసోసియేషన్ కార్యదర్శి వై.పూర్ణచంద్రరావు, డి.రమేష్, డాక్టర్ రవిప్రకాష్ రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిరిగిరి రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఈత పోటీలు ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: ఈత అత్యుత్తమ వ్యాయామమని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్లో 11వ సీనియర్ అంతర్ జిల్లాల స్విమింగ్ ఛాంపియన్షిప్– 2025 పోటీలను నిర్వహించారు. పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు పలు ప్రణాళికలు రూపొందించిందని వివరించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 105 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఛైర్మన్ డాక్టర్ కె.రవికాంత్, అధ్యక్షుడు ఓబుల్రెడ్డి, కార్యదర్శి మోహనవెంకటరామ్, కోశాధికారి రమేష్, పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి, జాయింట్ సెక్రటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘వెన్నుపోటు దినం’ విజయవంతం చేయాలి
చీరాల అర్బన్: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ అన్నారు. శుక్రవారం రామకృష్ణాపురంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున హాజరయ్యారు. కరణం వెంకటేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్గా పెట్టుకుని అక్రమ కేసులు, అరెస్ట్లతో కాలం వెళ్లదీస్తోందన్నారు. నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తూ సాగిస్తున్న అరాచక పాలనపై వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాలకు అన్యాయమే పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే దాటవేత ధోరణితో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయమే జరుగుతోందన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులకు న్యాయం జరగడం లేదని తెలిపారు. కౌలు రైతులు, పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను సుపరిపాలన అందించాలన్నారు. ఆరాచక పాలనపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. వెన్నుపోటు దినం నిరసన ర్యాలీని అందరూ విజయవంతం చేయాలన్నారు. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కర్నేటి వెంకటప్రసాద్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ వాసు, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు బత్తుల అనిల్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ కబీర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ -
ప్రకృతి వనరులను కాపాడుకోవాలి
గుంటూరు వెస్ట్: ప్రకృతి పంచిన అరుదైన వనరులను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన చిత్తడి నేలల పరిరక్షణ కమిటీ సమావేశంలో ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం జిల్లాలోని ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని కన్జర్వేటివ్ రిజర్వ్గానూ, మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలోని మంచినీటి చెరువును చిత్తడి నేలగానూ మార్గదర్శకాల ప్రకారం ప్రతిపాదనలు పంపామన్నారు. వీటిని గ్రామ సభల ద్వారానూ సంబంధిత శాఖాధికారుల ద్వారా ఆమోదం లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపాల్సి ఉందని తెలిపారు. సమావేశంలో డీపీఓ సాయి కుమార్, పశుసంవర్ధక శాఖ జేడీఏ సత్యనారాయణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ నజీమా బేగం, అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ -
ప్రతి మహిళ లక్షాధికారి కావాలి
డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావుకర్లపాలెం: డ్వాక్రా స్వయం సహాయక సంఘాలలోని ప్రతి మహిళ లక్షాధికారి కావాలని డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు అన్నారు. మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం మండల సమాఖ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పీడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి మహిళను లక్షాధికారిని చేసేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తుందని చెప్పారు. మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వారికి కావాల్సిన రుణాలు మంజూరు చేసేందుకు సూక్ష్మరుణ ప్రణాళికలను తయారు చేసినట్లు చెప్పారు. మహిళలు వ్యాపారం, వ్యవసాయం, సేవా రంగాలతో పాటు కుటుంబ అవసరాలకు వారు కోరినంత రుణాలను బ్యాంకుల ద్వారా శ్రీ నిధి ఉన్నతి, సీఐఎఫ్ల ద్వారానే కాక ఇతర ప్రభుత్వ శాఖల నుంచి సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తారని చెప్పారు. మహిళలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి సిబిల్ స్కోర్ పెంచుకునే విధంగా కృషి చేయాలన్నారు. సిబిల్ స్కోర్ సక్రమంగా ఉంటే గ్రూపు రుణాలతోపాటు ఉమెన్ లెడ్ ఎంటర్ ప్రైజస్ కింద కోరినంత రుణాలివ్వటానికి బ్యాంకర్లు అనుకూలంగా ఉన్నారని పీడీ చెప్పారు. ఏపీఎం శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ మహిళలకు ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో తమ ఇళ్లపై సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రూ.2.10లక్షల రుణం మంజూరు చేస్తుందని దీనిలో రూ.78వేలు సబ్సిడీ పోగా రూ.1.32లక్షలు ఐదు సంవత్సరాలపాటు వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చని తెలిపారు. సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకోవటం వలన గృహ విద్యుత్ వినియోగంలో తక్కువ బిల్లు వస్తుందని మన దగ్గర ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ప్రభుత్వానికి విక్రయించటం ద్వారా అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. సమావేశంలో మండల సమైఖ్య అధ్యక్షురాలు ధనలక్ష్మి, సమైఖ్య ప్రతినిధులు నసీమా, శివలీలా, ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు, ఇండియన్ బ్యాంక్ డీజీఎం గౌరీశంకర్, బ్యాంకు మేనేజర్లు, యూనియన్ బ్యాంక్ మానస, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ రత్నజ్యోతి, సీసీలు శివప్రభ, రాఘవ, డ్వాక్రా సమైఖ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే
సజ్జా వెంకట నాగేశ్వరరావు సంస్మరణ సభలో ప్రజా సంఘాల ఆరోపణ చీరాల రూరల్: అటవీ సంపదను విదేశీ కంపెనీలకు దోచిపెట్టడం కోసం దేశ పౌరులను కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా హత్యలు చేయిస్తోందని అమరుల బంధుమిత్రుల సంఘం, ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. అందులో భాగంగానే సజ్జా వెంకట నాగేశ్వరరావు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని జాండ్రపేట చౌడేశ్వరి దేవాంగ కల్యాణ మండపం ప్రాంగణంలో కుటుంబ సభ్యులు, అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో సజ్జా వెంకట నాగేశ్వరరావు సంస్మరణ సభను అంజమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు సోదరుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నాగేశ్వరరావు విద్యాభ్యాసం చేసే రోజుల్లోనే రాడికల్ ఉద్యమానికి ఆకర్షితుడై ప్రజల కోసం ఉద్యమ బాట పట్టినట్లు చెప్పారు. తన ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు కోసం పోరాడి ప్రాణత్యాగం చేసినట్లు పేర్కొన్నారు. పౌర హక్కుల సంఘం నాయకుడు చిలకా చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒకపక్క ఇతర దేశాలతో శాంతి చర్చలు జరుపుతూ మరోపక్క మన దేశంలోని పౌరులను ఎటువంటి చర్చలు జరపకుండా ఆపరేషన్ కగార్ పేరుతో నరహత్య చేస్తోందని మండిపడ్డారు. కగార్ పేరుతో అనేకమందిని పొట్టనపెట్టుకున్న కేంద్రం 1,27,000 చెట్లను నరికివేసేందుకు పర్యావరణ అనుమతులు పొందడం అందులో భాగమేనని ఆయన ఆరోపించారు. హైకోర్టు న్యాయవాది యూడీ భీమ్రావ్ మాట్లాడుతూ ఎదురు కాల్పుల పేరుతో చంపిన దేశ పౌరుల మృత దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని అత్యున్నత న్యాయస్థానాలను ఆశ్రయించామన్నారు. కనీసం కుటుంబ మృతదేహాలను చూపకుండా కేంద్రం నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ కోర్టు ధిక్కారానికి కూడా పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చీరాల సాధన సమితి నాయకుడు శీలం రవికుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై గొంతెత్తి ప్రశ్నించినవారు అర్బన్ నక్సలైట్, మావోయిస్టులయితే తాము కూడా అలాంటి వారిమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర చేనేత జన సమాఖ్య నాయకుడు దేవన వీర నాగేశ్వరరావు, బీసీ ఫెడరేషన్ నాయకుడు ఊటుకూరి వెంకటేశ్వర్లు, సీపీఎం న్యూడెమోక్రసీ మేకల ప్రసాద్, దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం నాయకుడు వై. వెంకటేశ్వర్లు, నిర్బంధ వ్యతిరేక పోరాట కమిటీ రవిచంద్ర, భారత్ బచావో నవజ్యోతి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా ర్యాలీ నిర్వహించారు. -
పొగాకు.. ఆరోగ్యానికి చేటు
● నేడు నో టుబాకో డే ● బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం ● పొగాకు వినియోగంతో అనేక నష్టాలు గుంటూరు మెడికల్: యవ్వనంలో సరదా కోసం మొదలుపెట్టే ధూమపానం చివరకు ప్రాణాలనే హరిస్తుంది. సిగరెట్, బీడీ, చుట్ట తాగే అలవాటు వ్యసనంలా మారి మనిషిని బానిసను చేసుకుంటుంది. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తుల మోజులో పడి యువత భవిష్యత్తును అంధకారం చేసుకుంటోంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో 40 శాతం మంది పొగతాగటం, పొగాకు ఉత్పత్తులు వాడటం ద్వారానే వ్యాధి బారిన పడి మరణిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ధూమపానంతో కలిగే అనర్థాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రపంచ వ్యాప్తంగా మే 31వ తేదీన నో టుబాకో డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. జిల్లాలో బాధితులు అధికమే... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం 35 శాతం మంది యువత ధూమపానం చేస్తున్నారు. వివిధ రోగాలతో 30 – 39 ఏళ్ల వయస్సు వారిలో చనిపోతున్న ప్రతి ఐదుగిరిలో ఒకరు పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్లేనని తేలింది. గుంటూరు జీజీహెచ్లో ప్రతి నెలా 1,200 మంది పురుషులు, 2 వేల మంది మహిళలు వివిధ రకాల క్యాన్సర్లతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 40 శాతం మంది కేవలం పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల క్యాన్సర్ బారిన పడ్డారు. జిల్లాలో క్యాన్సర్ రోగులకు వైద్యసేవలు అందించేందుకు 15 ఆస్పత్రులు, క్లీనిక్లు ఉన్నాయి. వీటిల్లో రోజూ 400 మంది వరకు క్యాన్సర్ చికిత్స పొందుతున్నారు. చట్టం ఏం చెబుతోందంటే.. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్ట ప్రకారం రైల్వే స్టేషన్లు, సినిమా హాల్స్, బస్ స్టేషన్లు, జనసంచారం ఉండే మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ధూమపానం చేయకూడదు. ముఖ్యంగా పాఠశాలలు, గుడులకు సమీపంలో పొగాకు ఉత్పత్తులు అమ్మటం చట్టరీత్యా నేరం. 18 ఏళ్లలోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు చట్టరీత్యా విక్రయించకూడదు. చట్టాన్ని అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తారు. ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో మాత్రమే ధూమపానం చేసేందుకు అనుమతించాలి. పొగాకు వినియోగంతో క్యాన్సర్ క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే వారిలో 40 శాతం మంది పొగాకు, దాని ఉత్పత్తుల వాడకం వల్ల క్యాన్సర్కు గురవుతున్నవారే. పొగతాగటం, పొగాకు ఉత్పత్తులైన ఖైనీ, గుట్కా, పాన్పరాగ్ వంటి వాటిని వినియోగించటం వల్ల నోరు, గొంతు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, మూత్రాశయ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు నేడు ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. చికిత్స తీసుకుని త్వరితగతిన వ్యాధి నుంచి కోలుకోవచ్చు. – డాక్టర్ ఎం.జి.నాగకిషోర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గుంటూరు ధూమపానంతో గుండెజబ్బులు పొగతాగే వారిలో రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొగాకులో 400 రకాల విషపదార్థాలు ఉంటాయి. కార్బన్ మోనాకై ్సడ్ వల్ల గుండెపోటు, టార్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. నపుంసకత్వం, పక్షవాతం పొగరాయుళ్లను వదలవు. పొగతాగే వారికి చుట్టుపక్కల ఉన్నవారిపై కూడా పొగాకు ప్రభావం ఉంటుంది. గుండె జబ్బులతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చే వారిలో 70 శాతం మంది ధూమపానం చేసేవారే. – డాక్టర్ బొర్రా విజయ్చైతన్య, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్, గుంటూరు జీజీహెచ్ జీజీహెచ్లో ఉచిత కౌన్సెలింగ్ గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల వైద్య విభాగంలో పొగాకు ఉత్పత్తుల అలవాటు మానేయాలనుకునే వారికి ఉచితంగా కౌన్సెలింగ్ చేసి, ఔషధాలు ఇస్తున్నారు. 2019 నుంచి డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. గత ఏడాది 1,263 మందికి చికిత్స అందించడం ద్వారా కొంత మంది స్మోకింగ్ అలవాటు మానేశారు. స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి ఛాతీ ముందు భాగంలో, భుజానికి, తొడకు.. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో వెంట్రుకలు లేని చోట నికోటిన్ ట్రాన్స్థర్మల్ ప్యాచ్ను అంటిస్తారు. ఈ ప్యాచ్ అంటించి కౌన్సెలింగ్ చేయడం ద్వారా ప్రతి నెలా పది మందికి పైగా పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానివేస్తున్నట్లు గుర్తించామని సెంటర్ ఇన్చార్జి డాక్టర్ వడ్డాది వెంకట కిరణ్ తెలిపారు. -
ప్రధానోపాధ్యాయులకు ఉద్యోగోన్నతి ధ్రువపత్రాలు అందజేత
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ, మున్సిపల్, నగరపాలకసంస్థ పాఠశాలల్లో ఉద్యోగోన్నతులపై నియమితులైన ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ధ్రువపత్రాలు అందజేశారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి జనరేట్ అయిన ఉద్యోగోన్నతుల ధ్రువపత్రాలను హెచ్ఎంలకు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ హెచ్ఎం ఏ.తిరుమలేష్, హెచ్ఎంగా ఉద్యోగోన్నతి పొందిన షేక్ మొహ్మద్ ఖాసిం పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లల ఆరోగ్యం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): పిల్లలు శారీరకంగా, ఽమానసికంగా ధృఢంగా ఉండాలంటే క్రీడా సాధన ఎంతో కీలకమని ఏసీబీ డైరెక్టర్ ఆర్.జయలక్ష్మి తెలిపారు. ఇది పూర్తిగా తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బీఆర్ స్టేడియం సింథటిక్ కోర్టులో అండర్–16 ఓపెన్ బాలబాలికల టెన్నిస్ పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జయలక్ష్మి మాట్లాడుతూ కొందరు తల్లిదండ్రులు చదువులకిచ్చే ప్రాధాన్యత పిల్లల ఆరోగ్యానికి ఇవ్వడం లేదన్నారు. దీంతో పిల్లల్లో అధిక శాతం ఊబకాయ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. జంక్ ఫుడ్తోపాటు మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వీలైనంత వరకు వారికి దూరంగా ఉంచాలని సూచించారు. టెన్నిస్ విలువ తెలిసిన సీనియర్ ఆటగాడు ఎస్.రామకృష్ణ ఈ టోర్నమెంట్ను స్పాన్సర్ చేయడం అభినందనీయం అన్నారు. పోటీల నిర్వాహకుడు షేక్ అహ్మద్ మాట్లాడుతూ పోటీలు మూడు రోజులపాటు జరుగుతాయన్నారు. మొత్తం 36 మంది చిన్నారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. అనంతరం పోటీలను జయలక్ష్మి,, రామకృష్ణ ప్రారంభించారు. కార్యక్రమంలో చీఫ్ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ బీఎన్ఎన్ మూర్తి, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ పి.శామ్యూల్ జొనాథన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి, ఎన్.సాంబశివరావు, జీవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్సగుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడినట్లు జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ చెప్పారు. శుక్రవారం జీజీహెచ్ జనరల్ సర్జరీ విభాగంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మాదారం గ్రామానికి చెందిన పాలిపోగు ప్రసాద్ (62) రెండు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. తీవ్రమైన కడుపునొప్పి, కామెర్లు, చలిజ్వరం రావడంతో ఒంగోలులో 25 రోజులు చికిత్స తర్వాత గుంటూరు జీజీహెచ్కు వచ్చాడు. హైడాటిడ్ సిస్ట్ వ్యాధి (కాలేయంలో నీటిబుడ్డ)తో బాధపడుతున్నట్లు నిర్ధారించామన్నారు. కుక్కల వల్ల, కలుషిత నీటిని తాగడం వల్ల వ్యాధి వస్తుందన్నారు. కొన్నిసార్లు మాంసం పూర్తిగా ఉడకకుండా తినడం వల్ల కూడా వస్తుందని చెప్పారు. ప్రసాద్ కాలేయం, ఇతర అవయవాలకు ఇబ్బంది ఉండటంతో సర్జరీ చేశామని, దీనికి నాలుగు గంటల సమయం పట్టిందన్నారు. సుమారు 40 రోజులపాటు వార్డులో చికిత్స అందించి డిశ్చార్జి చేశామన్నారు. సుమారు రూ.10 లక్షల ఖరీదైన ఆపరేషన్ను ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఉచితంగా చేశామని తెలిపారు. ఆపరేషన్ ప్రక్రియలో వైద్యులు నాగ సంతోష్కుమార్, సాదిక్ బాషా, వేణుగోపాల్, మేఘన, అవిన్, హరి, పోలయ్య, శ్యాంసన్, శ్వేత, ప్రసాద్, హనుమంతరావు, నర్సింగ్ సిబ్బంది రాజ్యలక్ష్మి, స్రవంతి, అనిత, ఉష, నంద పాల్గొన్నట్లు వెల్లడించారు. వృద్ధుడి ప్రాణాలు కాపాడిన వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ అభినందించారు.పోలీసులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్తెనాలి రూరల్: లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిరాటంకంగా అమలు చేస్తూ దళిత, మైనార్టీ యువకులపై విచక్షణారహితంగా దాడి చేసిన సీఐలు, ఇతర పోలీసు సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి అందే శ్యాం డిమాండ్ చేశారు. తెనాలి ఐతానగర్లో బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం వారు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. -
వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చందన్ నాగ్
రేపల్లె: వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన మేరుగ చందన్ నాగ్ నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఈ ఉత్తర్వులను విడుదల చేసింది. వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున తనయుడు చందన్ నాగ్ ఇప్పటివరకు వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా యువజన విభాగం అధ్యక్షులుగా ఉన్నారు. రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా నియమితులు కావడంతో పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలలో చోటు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియమించిన పార్టీ అనుబంధ విభాగ కమిటీలలో బాపట్ల జిల్లాకు చెందిన పలువురు నేతలకు చోటు లభించింది. రాష్ట్ర యువజన విభాగ జనరల్ సెక్రటరీగా బాపట్లకు చెందిన నక్క వీరారెడ్డి, రాష్ట్ర యువజన విభాగ సెక్రటరీగా బాపట్లకు చెందిన దొంతిబోయిన జయ భరత్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగ అధికార ప్రతినిధిగా రేపల్లెకు చెందిన నీలం వీరేంద్రనాథ్ , రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రటరీలుగా అద్దంకికి చెందిన సి.రాజ్ కుమార్, వేమూరుకు చెందిన జల్లి జోషికాంత్, పరుచూరికి చెందిన ఉప్పలపాటి అనిల్ చౌదరి, రాష్ట్ర వలంటీర్స్ వింగ్ సెక్రటరీగా అద్దంకికి చెందిన కొల్లి వెంకటరావు, రాష్ట్ర వాణిజ్య విభాగ జాయింట్ సెక్రటరీగా వేమూరుకు చెందిన మద్దుల గిరిధర్లను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. -
బాలలకూ విచ్చలవిడిగా మద్యం సరఫరా
ఆదాయమే పరమావధి నరసరావుపేట టౌన్: ఉజ్వలంగా వెలగాల్సిన విద్యార్థుల జీవితాలు కూటమి ప్రభుత్వ ధనదాహం, అధికారుల మామూళ్ల మత్తులో చిత్తవుతున్నాయి. వైన్ షాపు నిర్వాహకులు కక్కుర్తితో టీనేజ్ కూడా దాటని పిల్లలతో బహిరంగంగా మద్యం తాగిస్తున్నారు. పర్మిట్ రూములకు అనుమతులు లేకపోయినా.. ఏకంగా కుర్చీలు, బల్లలు వేసి పిల్లలకు మద్యం సరఫరా చేస్తూ వారి జీవితాలను చీకట్లోకి నెట్టేస్తున్నారు. జీవితాలతో చెలగాటం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం విధానాన్ని ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి తీసుకెళ్లింది. వారికి టార్గెట్లు ఇచ్చి మరీ మద్యం అమ్మకాలకు తెరతీసింది. ఈ క్రమంలో వైన్స్ నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు మద్యం విక్రయాలు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అనుమతులు లేకుండానే పర్మిట్ రూములు ఏర్పాటు చేస్తున్నారు. వేళాపాళా లేకుండా మద్యం విక్రయిస్తున్నారు. ఇవన్నీ తెలిసినా ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు యథేచ్ఛగా పర్మిట్ రూముల ఏర్పాటు మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్న వైనం మామూళ్ల మత్తులో ఎకై ్సజ్ అధికారులు కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాలను సర్కారే నిర్వహించేది. ఆ క్రమంలో ప్రజలను మద్యానికి దూరం చేసేందుకు ప్రయత్నించింది. తద్వారా యువత మద్యం జోలికి వెళ్లకుండా కట్టడి చేయగలిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చివరకు మైనర్లకు కూడా మద్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. నరసరావుపేట రావిపాడు రోడ్డులోని ఓ వైన్ షాపులో అనుమతులు లేకుండానే పర్మిట్ రూము ఏర్పాటు చేశారు. ఇక్కడ 18 ఏళ్లు కూడా నిండని బాలలు మద్యం తాగుతూ కనిపించారు. మైనర్లకు మద్యం విక్రయించరాదనే నిబంధనలను నిర్వాహకులు తుంగలో తొక్కారు. వీటిపై ఎకై ్సజ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏడాదిగా ప్రజలకు వెన్నుపోటు
చీరాల అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తికావస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేయలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి మేరుగ నాగార్జున అన్నారు. శుక్రవారం చీరాల రామకృష్ణాపురంలోని పార్టీ కార్యాలయంలో చీరాల ఇన్చార్జి కరణం వెంకటేష్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అమలు కాని ఎన్నో హామీలను ప్రజలకు చెప్పి అధికారం చేపట్టిందన్నారు. సంవత్సర కాలం పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్ట్లతో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్ సీపీ నేతలు, నాయకులపై కేసులు బనాయించి అరెస్ట్ల పర్వానికి తెర తీశారన్నారు. ప్రగల్భాలు చెప్పుకునేందుకే మహానాడు తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహించిన మహానాడు కార్యక్రమాన్ని చూస్తే ప్రగల్భాలు చెప్పుకునేందుకే నిర్వహించినట్లుగా ఉందన్నారు. ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకునేలా మహానాడు నిర్వహించారా అని ప్రశ్నించారు. సంవత్సర కాలంలో ప్రజలకు ఏం చేశామో చెప్పాలి గాని.. వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడంతో చేయడంతోనే సరిపెట్టడం ఏంటన్నారు. నిరుద్యోగులకు ఎటువంటి రిక్రూట్మెంట్ ఇవ్వలేదని, రైతుల కన్నీటి గోడు కూడా వినలేని విమర్శించారు. రాష్ట్రంలో పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుందని కనిపించడంలేదా అని ప్రశ్నించారు. పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు ప్రాంతాల్లో పొగాకు రైతులు పడుతున్న కష్టాల కన్నీళ్ల గోడు ఈ ప్రభుత్వానికి వినిపించడం లేదన్నారు. గత ప్రభుత్వం పొగాకును ఎంతకు కొనుగోలు చేసిందో చూడాలన్నారు. కౌలు రైతులు, మిర్చి రైతుల గోడును మహానాడులో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మంత్రి అచ్చెన్నాయుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. రైతుల సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని, పొగాకు రైతుల వద్దకు వెళితే వారు చెప్పే సమస్యలు వింటే ఎంతగా నష్టపోతున్నారో తెలుస్తుందన్నారు. హామీలు గాలికి.. కుట్రలు బయటకు.. చెరుకుపల్లి: ప్రజలకు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని, అయితే బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయినా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున పేర్కొన్నారు. శుక్రవారం గుళ్ళపల్లిలోని డాక్టర్ ఈవూరి గణేష్ క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జూన్ 4వ తేదీన రేపల్లె ఆర్డీఓ కార్యలయం వద్ద నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరుతూ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో డాక్టర్ మేరుగ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు ఏడాది కాలంగా ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికొదిలి, తమ జేబులు నింపుకొనేందుకే వెచ్చించారన్నారు. కూటమి ఏడాది పాలనలో చిన్నారులను, మహిళలను, విద్యారంగాన్ని, వైద్యరంగాన్ని, చివరకు శాంతిభధ్రతలను పట్టించుకోకుండా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు. అనంతరం డాక్టర్ గణేష్ మాట్లాడేతూ 4వ తేదీ జరిగే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు దుండి వెంకట రామిరెడ్డి, ఇంకొల్లు రామకృష్ణ, కరేటి శేషగిరిరావు, యార్లగడ్డ వెంకట రాంబాబు, నాయకులు డాక్టర్ హతిక్, పట్టెం శ్రీనివాసరావు, లుక్కా బాపనియ్య, నిజాంపట్నం కోటేశ్వరరావు, ఉల్లంగుంట శ్రీరాంమూర్తి, పాగోలు వెంకటేశ్వరరావు, కందుల సురేష్, చదలవాడ శ్రీనివాసరావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. హామీలు నెరవేర్చకుండా ప్రగల్భాలతోనే సరి అక్రమ కేసులు, అరెస్టులే తప్ప అభివృద్ధి శూన్యం జూన్ 4న వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున జూన్ 4న వెన్నుపోటు దినం కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 4న వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ మాట్లాడుతూ నియోజవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ సంవత్సర కాలం వేచి చూశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కర్నేటి వెంకటప్రసాద్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ వాసు, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు బత్తుల అనిల్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ కబీర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ బొనిగల జైసన్బాబు, పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సేవల్లో ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’
తెనాలి: పవిత్రమైన వైద్యవృత్తిలో నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తే వృత్తిజీవితంలో సంతృప్తినే కాదు... ఏకంగా రాష్ట్ర, జాతీయ అవార్డులు కూడా వరిస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా శుక్రవారం జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును స్వీకరించిన వలివేటి శుభావతి ఇందుకు చక్కని నిదర్శనం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్నుంచి ఈ అవార్డును అందుకున్న ఏకై క మహిళ కూడా శుభావతినే. ఏఎన్ఎం విధుల్లో వైద్యవృత్తి ప్రాధాన్యతను గుర్తెరిగి, అంకితభావంతో నిర్వహిస్తూనే ఉన్నత కోర్సులు చేస్తూ, వరుస పదోన్నతులతో మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్టర్ హోదాకు ఎదిగారు. ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డునే దక్కించుకున్నారు. సంగం జాగర్లమూడి స్వస్థలం తెనాలి రూరల్ మండల గ్రామం సంగంజాగర్లమూడి వలివేటి శుభావతి స్వస్థలం. తల్లిదండ్రులు సీతారావమ్మ, సుబ్రహ్మణ్యం. వైద్యరంగంలో తొలిగా ఉమ్మడి గుంటూరు జిల్లా నాదెండ్ల పీహెచ్సీ పరిధిలోని చందవరం సబ్సెంటర్లో ఏఎన్ఎంగా శుభావతి వృత్తిజీవితం ఆరంభమైంది. ఉద్యోగ బాధ్యతల్లో ఉంటూనే పీజీ కోర్సులు చేస్తూ వచ్చారు. 13 ఏళ్ల సర్వీసులో మూడు పీజీలు చేశారు. ఫలితంగా పదోన్నతిపై ఇదే జిల్లాలోని నకిరేకల్లో హెల్త్ ఎడ్యుకేటర్గా నియమితులయ్యారు. అక్కడ 12 ఏళ్లపాటు పనిచేశారు. కర్నూలులోని రీజినల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్ (మేల్)కు మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తూ గత జనవరిలో ఉద్యోగ విరమణ చేశారు. పేద రోగులకు సేవలు వైద్యరంగంలో తన 39 ఏళ్ల సర్వీసులో శుభావతి పేద ప్రజలు, అవసరమైన వారికి తగిన సేవలను అందిస్తూ వచ్చారు. తన సమర్థత, నిబద్ధతను గుర్తించిన ఉన్నతాధికారులు అప్పగించిన అన్ని బాధ్యతలను ఆమె సక్రమంగా నిర్వర్తించారు. అనేక అవార్డులను అందుకున్నారు. నకిరేకల్లో ఉండగా, హెచ్ఐవీ/ఎయిడ్స్ ప్రాజెక్టుపై శుభావతిని నాటి జిల్లా కలెక్టర్ ప్రత్యేక శిక్షణకని ఢిల్లీ పంపారు. అదే ప్రాజెక్టుపై జిల్లాలోని ఆర్ఎంపీ/పీఎంపీలతో సహా ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని డిపార్టుమెంటు ఉద్యోగులకు శుభావతి హెచ్ఐవీపై అవగాహన కల్పించారు. ఆ కృషికి గుర్తింపుగానే అప్పటి రాష్ట్రమంత్రి కొణిజేటి రోశయ్య నుంచి అవార్డును అందుకున్నానని శుభావతి చెప్పారు. ఎక్కడ పనిచేసినా నాతోటి సిబ్బంది, ప్రజలు ఎంతో ప్రేమను చూపటం నాకు గుర్తుండి పోతుందని అంటారు శుభావతి, ‘ఎంతో కష్టపడి పనిచేశాను. అందరి మన్ననలు పొందాను. డబ్బు కోసం ఆశపడలేదు. స్వచ్ఛందంగా బాధ్యతలను నిర్వర్తించాను. ఇప్పుడు జాతీయ అవార్డు లభించిందంటే నా వృత్తి జీవితం మొత్తానికి అందిన గౌరవంగా భావిస్తున్నాను అన్నారు శుభావతి. భారత రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయస్థాయి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్న వలివేటి శుభావతి ఉభయ తెలుగు రాష్ట్రాల్నుంచి అవార్డు దక్కించుకున్న ఏకై క మహిళగా గుర్తింపు ఎన్నో అవార్డులు.. రివార్డులు ఆకాశవాణి, విజయవాడ కేంద్రం ఆహ్వానంపై బాల్య వివాహాలు, మాతాశిశు మరణాలు, బాలికా శిశు సంరక్షణ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక ప్రసంగాలు చేశారు. గుంటూరు జిల్లాలో బాల్య వివాహాల నిరోధంపై రిసోర్స్ పర్సన్గానూ వ్యవహరించారు. దీనిపై పలు పాటలు రాసి, స్వయంగా గానం చేశారు. అప్పట్లో నెల్లూరు జిల్లా కలెక్టర్లనుంచి అవార్డులను అందుకున్నారు. 2014 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కలెక్టర్ సూచనపై ఓటరు అవగాహనపై పాట రాశారు. చైన్నెలో సినీ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్తో స్వరకల్పన చేయించారు. ఈ సందర్భంగా నాటి కలెక్టర్ రేఖారాణి ప్రశంసాపత్రం అందించారు. రక్తహీనతపై అవగాహన కోసం పాట రాశారు. శ్రీకాకుళంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ నిర్వహించిన సేవలకు అవార్డులు దక్కాయి. గత ప్రభుత్వ హయాంలో శానిటేషన్, న్యూట్రిషన్పై శుభావతి రాసిన పాట పాపులరైంది. ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్లోనూ ఏఎన్ఎంల పుస్తకంలో తొలి పేజీలోనే ఆ పాటను ముద్రింపజేశారు. ఏపీ కల్చరల్ అవేర్నెస్ రాష్ట్రస్థాయి ఉత్తమ పౌరురాలి అవార్డు, శ్రీకాకుళంలో ఆంధ్రరత్న అవార్డు వంటివెన్నో తనకు అలంకారాలుగా మారాయి. భర్త ప్రైవేటు ఉద్యోగి, ఏకై క కుమారుడు హైదరాబాద్లోని ప్రముఖ కార్పొరేట్ హాస్పటల్లో పని చేస్తున్నారు. రిటైరయ్యాక సొంత జిల్లా గుంటూరులోనే స్థిరపడ్డారు. -
జవహర్ నవోదయ కోసం స్థల పరిశీలన
బల్లికురవ: కేంద్ర ప్రభుత్వం అద్దంకి నియోజకవర్గానికి జవహర్ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది. విద్యాలయం ఏర్పాటుకు సంబంధించి రెవెన్యూ అధికారులు శుక్రవారం అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. విద్యాలయం ఏర్పాటుకు సంబంధించి 25 ఎకరాల భూమి కావాల్సి ఉంది. బల్లికురవ తహసీల్దార్ రవినాయక్ వల్లాపల్లి గ్రామంలోని పేరంటాళ్ల తల్లి ఆలయం సమీపంలో, గుంటుపల్లి గ్రామంలోని సచివాలయం సమీపవంలో భూములను పరిశీలించారు. జిల్లా అధికారులకు నివేదించన్నుట్లు తహసీల్దార్ వివరించారు.కోన నీరజకు టైమ్స్ పవర్ ఉమెన్ అవార్డుబాపట్ల: సినీ ఇండస్ట్రీలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్గా, దర్శకురాలుగా పనిచేస్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కుమార్తె కోన నీరజకి ది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకమైన టైమ్స్ పవర్ ఉమెన్ అవార్డు దక్కింది. ఈమేరకు గురువారం హైదరాబాదులో జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును ఆమె అందుకున్నారు. సినీ ఇండస్ట్రీలో వెలుగొందడంతో పాటు పుస్తక రచయితగా, దర్శకురాలుగా ఆమె శక్తివంతమైన మహిళగా రూపుదిద్దుకుంటున్నారని ది టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ కొనియాడింది. ఈ సందర్భంగా కోన రఘుపతి తన కుమార్తె కోన నీరజకు శుభాకాంక్షలు తెలియజేశారు. నీరజ అవార్డు అందుకోవడం బాపట్ల ప్రాంతానికి ఎంతో గర్వకారణమన్నారు.నేటి నుంచి రైల్వే గేటు మూసివేతఫిరంగిపురం: ఫిరంగిపురం నుంచి సత్తెనపల్లి వెళ్లే మార్గంలోని అల్లంవారిపాలెం వద్ద ఉన్న రైల్వేగేటు ఎల్సీ 298కి శనివారం నుంచి అత్యవసర మరమ్మతులు నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ నల్లపాడు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ పి. ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రటనలో పేర్కొన్నారు. మరమ్మతు పనుల్లో భాగంగా శనివారం నుంచి జూన్ మూడో తేదీ వరకు గేటు మూసివేస్తామన్నారు. ప్రత్యామ్నాయంగా ఆరోగ్యనగర్ వద్ద ఉన్న అండర్ పాస్ను వాహనదారులు వినియోగించుకోవాలని సూచించారు.రైల్వే గడ్డర్ను ఢీకొన్న భారీ వాహనంతాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం రైల్వే ట్రాక్ వద్ద ఏర్పాటుచేసిన రైల్వే గడ్డర్ను ఓ భారీ వాహనం ఢీకొట్టిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం రైల్వేట్రాక్ అండర్పాస్ వద్ద భారీ వాహనాల రాకపోకల నిషేధానికి ఏర్పాటు చేసిన రైల్వే గడ్డర్ను చూసుకోకుండా వాహన డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ రైల్వే గడ్డర్ను తరచూ భారీ వాహనాలు ఢీకొంటున్నాయని, ఆ గడ్డర్ వద్ద సరైన సూచిక బోర్డులు లేకపోవడం వల్ల వాహనాల డ్రైవర్లకు అంచనా లేకపోవడంతో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్ధానికులు చెబుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహన దారులు కోరుతున్నారు.యోగాతో సంపూర్ణ ఆరోగ్యంవీసీ ఆచార్య కె గంగాధరరావుఏఎన్యూ: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని వీసీ ఆచార్య కె గంగాధరరావు అన్నారు. యోగాంధ్రలో భాగంగా శుక్రవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధికారులు, సిబ్బంది, పరిశోధకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం యూనివర్సిటీ యోగా సెంటర్లో యోగా సాధన చేశారు. వీసీ ఆచార్య కె గంగాధరరావు యోగా ఆవశ్యకతను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా ఆవశ్యకతను మనం గుర్తించడంతోపాటు, సమాజానికి అవగాహన కల్పించాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, ప్రిన్సిపాల్స్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్, ఆచార్య పి సిద్దయ్య, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి వెంకటేశ్వర్లు, డిగ్రీ పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య ఎన్వీ కృష్ణారావు, బాలుర వసతి గృహాల చీఫ్ వార్డెన్ ఆచార్య కె మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
గాలిలో దీపంలా వ్యవసాయం
జె.పంగులూరు: దేశంలో రైతాంగ సంక్షోభానికి, వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వ విధానాలేనని, ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలిలో దీపంగా మార్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం మండలంలోని జనకవరం గ్రామంలో జరిగిన నల్లబర్లీ పొగాకు కౌలు రైతుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. రైతాంగాన్ని ప్రోత్సహించిన ఐటీసీ, జీపీఐ కంపెనీలు నల్ల బర్లీ పొగాకును సాగు చేయించాయన్నారు. అయితే ప్రస్తుతం కంటికి కనిపించకుండా, కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నాయన్నారు. రైతులది అత్యాశ అని వ్యవసాయ శాఖ మంత్రి అనడం సరైంది కాదన్నారు. మూడు నెలల కాలంలో షేర్ మార్కెట్లో ఐటీసీ, జీపీఐ షేర్లు నాలుగు శాతం పెరిగాయని, కానీ రైతుల ఆదాయం 40 శాతానికి పడిపోయిందన్నారు. మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖమంత్రి చెప్పినా ఇంతవరకు కొన్న దిక్కులేదన్నారు. కౌలు రైతుల కోసం పనిచేస్తామని ప్రగల్భాలు పలికిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అడ్రస్ లేడన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య, రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాయిణి వినోద్బాబు, రైతు సంఘం సీనియర్ నాయకులు కందిమల్ల రామకోటేశ్వరరావు, రైతు పాల్గొన్నారు. శ్రీనాథ్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి అప్పుల బాధ భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న నల్లబర్లీ పొగాకు కౌలు రైతు తల్లపనేని శ్రీనాఽథ్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని జనకవరం గ్రామానికి చెందిన నల్లబర్లీ పొగాకు కౌలు రైతు తలనేని శ్రీనాఽథ్ ఈ నెల 24వ తేదీని పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం పాఠక విధితమే. దీంతో మృతుని కుటుంబాన్ని శ్రీనివాసరావు శుక్రవారం పరామర్శించారు. ఆయన భార్య వందన, తల్లిదండ్రులు నరసమ్మ, హరిబాబుకు ధైర్యం చెప్పారు. కంపెనీల చేతుల్లో ప్రభుత్వం ప్రతి ఏటా కంపెనీల లాభాలు పెరుగుదల రైతుల ఆదాయం తగ్గుదల నల్ల బర్లీ పొగాకు కౌలు రైతులు సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు -
పవిత్ర పూజాక్షేత్రంగా ఓంకారాశ్రమం
తెనాలి: ఆంధ్యా ప్యారిస్ తెనాలిలోని బుర్రిపాలెంరోడ్డులో తొమ్మిది దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఓంకారాశ్రమం ఇప్పుడు పవిత్ర పూజాక్షేత్రంగా భక్తులకు అందుబాటులోకి వచ్చింది. రూ.కోట్ల విలువైన ఆస్తులున్నా స్వార్థపరుల కారణంగా కునారిల్లుతూ వచ్చిన ఆశ్రమమిది. ఆశ్రమ స్థలాన్ని పవిత్ర సందర్శనీయ స్థలంగా చేయాలని గత ప్రభుత్వ హయాంలో దేవదాయశాఖ సంకల్పించింది. అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చొరవతో నిధులు మంజూరయ్యాయి. ఫలితంగానే ఇప్పుడు ఆశ్రమ స్థలంలో పరివార దేవతా, శిఖర, ధ్వజస్తంభ, శ్రీశరభ సాళ్వేశ్వరస్వామి, శ్రీపార్వతీ సమేత శ్రీఓంకారేశ్వరస్వామి వార్ల ఆలయం నిర్మించారు. ప్రతిష్టా మహోత్సవాలు గురువారం నుంచి ఆరంభించారు. తెనాలి బుర్రిపాలెంరోడ్డులోని ఓంకారాశ్రమం 1932లో ఏర్పాటైంది. కాకుమాను శ్రీరాములు అనే ఆధ్యాత్మిక చింతనాపరుడు ఆశ్రమాన్ని స్థాపించారు. సాధువులు ధ్యానం చేసుకునేందుకు, వారి పోషణ కోసమనే భావనతో ఏర్పాటైన ఆశ్రమానికి అప్పట్లో శ్రీవ్యాస ఆశ్రమ నిర్వాహకుడు మలయాళస్వామి శంకుస్థాపన చేశారు. ఆశ్రమం తరపున పేదలకు వైద్యం, విద్యార్థులకు విద్య కోసమని దాతలు 12.83 ఎకరాల మాగాణి భూమిని సమకూర్చారు. దాతల లక్ష్యం నిర్విఘ్నంగా నెరవేరింది. యజ్ఞయాగాది క్రతువులు వైభవంగా జరిగాయి. అప్పట్లో ఆశ్రమానికి స్వామీజీలు ట్రస్టీలుగా ఉండేవారు. 1947–1963 మధ్య ఆశ్రమానికి గల మాగాణి భూమిని విక్రయించారు. ఆ డబ్బుతో గంగానమ్మపేటలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి గుడి వీధిలో రెండు ఇళ్లు, చెంచుపేటలోని గోడౌన్ కొనుగోలు చేశారు. ట్రస్టీల వ్యవహారంలో వివాదాలు మలయాళస్వామి మరణంతో ఆశ్రమ ట్రస్టీల వ్యవహారంలో వివాదాలు మొదలయ్యాయి. 1980 వరకు పరంపరగా సాగాయి. అనంతరం ట్రస్టీలు ఏర్పాటైనా 1996లో ఆశ్రమ నిర్వహణ దేవదాయ, ధర్మదాయశాఖ పరిధిలోకి వెళ్లింది. అప్పట్నుంచి అభివృద్ధి శూన్యమైంది. పైగా 1983లో ఆశ్రమంలో గల ధ్యానమందిరాన్ని కూల్చారు. 1998లో ఆశ్రమ స్థలంలోని 80 సెంట్ల స్థలాన్ని ఓ ప్రైవేటు విద్యాసంస్థకు లీజుకిచ్చారు. కోర్టు వివాదంతో ప్రైవేటు విద్యాసంస్థకు లీజు ఆగిపోయింది. లాడ్జికి అద్దెకు ఇచ్చిన భవనం శ్రీవేణుగోపాలస్వామి గుడి వీధిలోని భవనాన్ని గతంలో కొంతకాలం లాడ్జికి అద్దెకిచ్చారు. కొన్ని నెలలు రిక్రియేషన్ క్లబ్ కూడా నడిచింది. దేవదాయశాఖ చర్యలతో ఏడాదికి రూ.5.23 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. ఆశ్రమానికి 2022లో అవుతు శ్రీనివాసరెడ్డి ఈవోగా వచ్చారు. వేలం ఆదాయం పెరిగేలా చూశారు. అప్పట్నుంచి ఏడాదికి రూ.7 లక్షలకు పైగా ఆదాయం లభిస్తోంది. నిరుపయోగంగా ఉన్న ఆశ్రమ స్థలాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు చేసిన కృషి ఫలించింది. 1.40 ఎకరాల ఆశ్రమం స్థలం ముందుభాగంలో ఆలయం నిర్మాణానికి 2023 డిసెంబరులో శంకుస్థాపన చేశారు. దేవదాయశాఖ రూ.26.66 లక్షలు, ఆశ్రమ నిధులు రూ.13.34 లక్షలు, దాతల సహకారంతో నిర్మాణం పూర్తయింది. రేపు ప్రతిష్టా మహోత్సవం ఈనెల 31వ తేదీన ఉదయం 8.19 గంటలకు ప్రతిష్టా మహోత్సవం జరగనుంది. గురువారం వేదస్వస్తి పూర్వకంగా యాగశాల ప్రవేశం చేసి, సంప్రదాయ పూజలను ఆరంభించారు. రెండురోజుల పూజల అనంతరం 31న యంత్రబింబ, ధ్వజ ప్రతిష్టలు, కళాన్యాసము, ప్రాణప్రతిష్ట జరుగుతాయి. ప్రతిష్టా కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, దేవదాయశాఖ డీసీ కె.బసవ శ్రీనివాసరావు పాల్గొంటారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని ఈఓ అవుతు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆశ్రమంలో ఓంకారేశ్వరస్వామి ఆలయం ఆరంభమైన ప్రతిష్టా మహోత్సవాలు -
తోడికోడళ్ల మృతితో తెనాలిలో విషాదం
తెనాలిరూరల్: అరుణాచలేశ్వరుని దర్శనం కోసం బయలుదేరిన తోడికోడళ్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తెనాలిలో విషాదం అలముకుంది. ఎంతో ఆప్యాయంగా ఉండే తోడికోడళ్ల బంధం మరణంలోనూ వీడలేదు. పట్టణానికి చెందిన కన్నెగంటి సూర్యకుమారి, కన్నెగంటి సరస్వతి కుమారి, కన్నెగంటి ఝాన్సీరాణిలు తోడికోడళ్లు. ఝాన్సీరాణి కుమారుడు నాగార్జున, ఆడపడుచు పార్వతితో కలిసి వీరు ముగ్గురు గురువారం అరుణాచలానికి కారులో పయనమయ్యారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల సమీపంలోని జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో ఝాన్సీరాణి అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలపాలైన నలుగురిని ఒంగోలు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సూర్యకుమారి, సరస్వతికుమారి కూడా ప్రాణాలు కోల్పోయారు. సూర్యకుమారి తన భర్త నరసింహారావుతో కలిసి ఇక్కడి కవిరాజపార్కు రోడ్డులో అక్షర గీత విద్యానికేతన్ను స్థాపించారు. సరస్వతికుమారి భర్త వెంకటేశ్వరరావు ఆర్మీలో పనిచేసి రిటైరై తెనాలిలో రెడీమేడ్ దుస్తుల వ్యాపారం ప్రారంభించారు. ఝాన్సీరాణి భర్త నాగేశ్వరరావు గాంధీచౌక్లో పారగాన్ వాచ్ కంపెనీ నిర్వహించేవారు. ముగ్గురు అన్నదమ్ములు గతంలోనే మృతి చెందారు. ఆప్యాయంగా ఉండే తోడి కోడళ్లు అరుణాచలం దర్శనం కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ ఆడపడుచు పార్వతిని వెంటబెట్టుకుని ఝాన్సీరాణి కుమారుడు నాగార్జునతో కలిసి తమకు తెలిసిన వారి కారు తీసుకుని బయలుదేరారు. రోడ్డుప్రమాదం రూపంలో వీరి కుటుంబాలను మృత్యువు కబళించింది. సూర్యకుమారికి ఇద్దరు కుమారులు ఉండగా. తెనాలి ప్రభుత్వ వైద్యశాల సమీపంలో తన కుటుంబంతో నివాసం ఉంటోంది. సరస్వతికుమారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కవిరాజపార్కు రోడ్డు లో నివసిస్తున్నారు. ఝాన్సీరాణి పెద్దకుమారుడు గతంలో మృతి చెందగా, ప్రస్తుతం సుల్తానాబాద్ ఆలపాటి నగర్లోని సాయిబాబా ఆలయం వద్ద సాయి పథం అపార్ట్మెంట్లో చిన్న కుమారుడు నాగార్జున కుటుంబంతో కలసి నివసిస్తున్నారు. ముగ్గురు తోడి కోడళ్లు మృతి చెందారన్న వార్త తెలియడంతో తెనాలిలో విషాదఛాయలు అలముకున్నాయి. బాపట్ల జిల్లాలో కారు ప్రమాదం ముగ్గురు మృత్యువాత -
జీఎస్టీతో వేగంగా ఆర్థికాభివృద్ధి
లక్ష్మీపురం: వస్తు సేవల పన్నుతో దేశం వేగంగా ఆర్థికంగా ముందుకు వెళుతుందని, పన్ను వ్యవస్థ పూర్తిగా చక్కబడిందని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ అన్నారు. గురువారం గుంటూరు కన్నవారితోటలోని జీఎస్టీ భవన్లో ప్రీ జీఎస్టీ డే వేడుక నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ జీఎస్టీతో పన్నులను అంగీకరించే సమాజం ఏర్పడిందన్నారు. పన్ను చట్టాల్లో పారదర్శకత పెరగటమే కాకుండా, పన్ను అధికారులకు, పన్ను చెల్లింపుదారుల మధ్య స్నేహభావం ఏర్పడిందన్నారు. ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం, పన్ను చెల్లింపులు పెంచడం వంటి అంశాలలో జీఎస్టీ ప్రాధాన్యతను వివరించారు. జీఎస్టీ విజయవంతంగా అమలు కావడంలో పరిశ్రమ భాగస్వాముల సహకారాన్ని అభినందించారు. జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జీఎస్టీ ప్రయాణాన్ని గుర్తుచేసే ఒక ముఖ్యమైన కార్యక్రమంగా ఈ వేడుక నిర్వహిస్తున్నామన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరరావు మాట్లాడుతూ జీఎస్టీ ప్రారంభంలో తెలియక చాలా మంది వ్యాపారులు తమ రిటన్స్లో తప్పుడు వివరాలు నమోదు చేశారని, ప్రస్తుతం జీఎస్టీ ఆడిట్లో అవన్నీ పట్టుబడుతున్నాయన్నారు. అవి కావాలని చేసిన తప్పులు కావన్నారు. నేషనల్ కనూ్స్య్మర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు చదలవాడ హరిబాబు మాట్లాడుతూ ప్రాణ రక్షణ కోసం వాడే మందులపై జీఎస్టీని తక్షణమే తీసివేయాలన్నారు. చేనేత మగ్గాలపై విధించే ఐదు శాతం పన్నును కూడా రద్దు చేయాలన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు యేల్చూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీఎస్టీపై వ్యాపారుల ఇబ్బందులను ప్రతి మూడు నెలలకొకసారి అధికారులు సమీక్ష చేయాలన్నారు. ఇండియన్ టెక్స్టైల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ రేట్లలో రెండు స్లాబులే ఉండాలని సూచించారు. పలువురు పరిశ్రమ ప్రతినిధులు జీఎస్టీ అంశాలపై తమ అభిప్రాయాలను తెలిపారు. కమిషనర్ సుజిత్ మల్లిక్ను ట్రేడ్ వర్గాల వారు సన్మానించారు. కార్యక్రమంలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్లు ఎం.నాగరాజు, బి.రవికుమార్, వి. వెంకటేశ్వరరావు, మనోజ్ కుమార్, మరియదాసు, రాయలు, ఆనందరావు, చాంబర్ మాజీ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ -
గోళ్లమూడి చెరువును మోడల్గా అభివృద్ధి చేయాలి
పెదకాకాని: గోళ్లమూడి తాగునీటి చెరువును మోడల్గా అభివృద్ధి చేయాలని ఉపాధి హామీ పథకం రాష్ట్ర సంచాలకులు వైవీ షణ్ముఖకుమార్ అన్నారు. పెదకాకాని మండలం గోళ్లమూడి, ఉప్పలపాడు గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ పథకం నిర్వహణ పరిశీలన కోసం గురువారం రాష్ట్ర బృందం పర్యటించింది. షణ్ముఖ కుమార్ మాట్లాడుతూ గోళ్లమూడి గ్రామంలోని తాగునీటి చెరువును పల్లె పుష్కరిణి కింద చేపట్టి అభివృద్ధి చేయాలని సూచించారు. తాగునీటి అవసరాలపై గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం ఉప్పలపాడు గ్రామంలో పంట కుంట(ఫాం పాంట్స్) తవ్వుతున్న తీరును పరిశీలించారు. ఈ పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రామికులకు రోజువారి వేతనం కనీసం రూ.290 ఉండేలా చూడాలన్నారు. పంట కుంట నిర్మాణం చేపట్టిన రైతులతో మాట్లాడి సూచన చేశారు. అనంతరం లాలుపురం గ్రామంలో పర్యటించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ వి శంకర్, ఎంపీడీఓ రమావత్ శ్రీనివాసనాయక్ పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం రాష్ట్ర సంచాలకులు షణ్ముఖకుమార్ గోళ్లమూడి, ఉప్పలపాడు గ్రామాల్లో పర్యటన -
తప్పిపోయిన చిన్నారి
మంగళగిరి టౌన్: ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయిన ఓ చిన్నారిని కేవలం గంట వ్యవధిలోనే తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన మంగళగిరిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరి అజయ్నగర్కు చెందిన తేజస్విని అనే పాప ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏడుస్తూ కనిపించింది. అదే సమయంలో విధుల్లో ఉన్న సీఐ వినోద్ కుమార్ కంటపడింది. వెంటనే చిన్నారి వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అజయ్నగర్ అని, తండ్రి పేరు విజయ్ అని చెప్పడంతో ఆ చిన్నారిని తీసుకుని అజయ్నగర్లోని పాప నివాసానికి వెళ్లి తేజస్విని తండ్రికి అప్పగించారు. తప్పిపోయిన చిన్నారి సురక్షితంగా ఇంటికి రావడంతో ’ఠీఐ వినోద్కుమార్కు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. గంట వ్యవధిలో తల్లిదండ్రులకు అప్పగింత -
బిల్లుల్లోనూ పచ్చపాతం
నెహ్రూనగర్: జనవరి 10వ తేదీన గుంటూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వచ్చారు. ఆయన పర్యటించే ప్రాంతం ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి చేబ్రోలు హనుమయ్య కంపెనీ వరకు రోడ్లు అందంగా కనిపించేందుకు షో మొక్కలు తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి రూ.35 లక్షలు వెచ్చించి తెప్పించారు. ఎన్ని తెప్పించారో.. ఎన్ని ఉన్నాయో నేటికీ నగరపాలక సంస్థ అధికారుల వద్ద లెక్క లేదు. అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మొక్కలు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. కొన్ని మొక్కలు ఎండిపోయాయి. దీనిపై సాక్షిలో ఏప్రిల్ 13వ తేదీన ‘ఎండిన మొక్కలు..తేలని లెక్కలు’ పేరిట కథనం ప్రచురితమైంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్గా మారింది. దీంతో ఎక్కడ ఈ బిల్లు ఆపితే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో అని అప్పుడు ఏడీహెచ్గా పనిచేసిన శ్రీనివాస్ను సరెండర్ చేసి మరీ సదరు బిల్లు రూ.35లక్షలు ప్రాసెస్ చేసినట్లు సమాచారం. ఖర్చుల బిల్లు వస్తే ఒట్టు 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలక్షన్ రోజు పోలింగ్, తర్వాత కౌంటింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, బ్యారికేడింగ్, డిపార్ట్మెంట్ సిబ్బందికి సంబంధించిన భోజనాలు, టీ, కాఫీలు, స్నాక్స్, ఇతర స్టేషనరీ వంటి పనులు కాంట్రాక్టర్లు సుమారు 1.50 కోట్ల వర్కులు ఇంజినీరింగ్ అధికారుల హాహీతో చేపట్టారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ బిల్లులను అధికారులు ప్రాసెస్ చేయకుండా పక్కన పెట్టారని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. వడ్డీలకు తీసుకొచ్చి... కొంతమంది కాంట్రాక్టర్లు బ్యాంకుల్లో స్థలాలు, ఇళ్లు తనాఖాలు పెట్టి పనులు చేశారు. ఆ వర్కులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి వడ్డీ పడుతోంది. మరికొంత మంది కాంట్రాక్టర్లు బయట వ్యక్తుల వద్ద నుంచి వడ్డీ కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీని వలన తాము అప్పుల్లో కూరుకుపోతున్నామని బహిరంగంగానే వాపోతున్నారు. ఏదో విధంగా బిల్లు ప్రాసెస్ చేయించాలని ఇంజినీరింగ్ అధికారులను వేడుకుంటున్నారు. సిఫార్సులు.. పర్సంటేజీలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత సర్కారు హయాంలో చేసిన వర్కుల బిల్లులు ప్రాసెస్ చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చేసిన వర్కులకు మాత్రమే బిల్లులు ప్రాసెస్ అవుతున్నట్లు కాంట్రాక్టర్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఎవరైపా వడ్డీలు కట్టుకోలేక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎంతకొంత ముట్టజెప్పి సిఫార్సు చేయించుకుంటున్నారు. ఇక్కడ నగరపాలక సంస్థ అధికారులు కూడా పర్సంటేజీ ఇస్తేనే బిల్లు ప్రాసెస్ చేస్తామని చెబుతున్నారు. చేసేదేమీ లేక అధికారులు అడిగినంత ఇచ్చుకుని ప్రాసెస్ చేయించుకుంటున్నారు కాంట్రాక్టర్లు. బిల్లుల ప్రాసెసింగ్లో మున్సిపల్ అధికారుల తీరిది తమ అనుకునే వారికి మాత్రమే అత్యధిక ప్రాధాన్యత అవసరం లేదనుకున్న వారికై తే నెలల తరబడి పెండింగ్ ఇటీవల సీఎం పర్యటనకు రూ.35 లక్షల విలువైన మొక్కలు ఎక్కడున్నాయో.. ఏమైపోయాయో కూడా తెలియని దుస్థితి రూ.35 లక్షల బిల్లుకు ఆగమేఘాలపై ప్రాసెస్ పూర్తి ఇంకా పెండింగ్లోనే ఏడాది క్రితం నాటి ఎన్నికల ఖర్చు బిల్లులు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. తమ అనుకునే కాంట్రాక్టర్ల బిల్లులు ప్రాసెస్ చేయడంలో చూపుతున్న ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది. మిగతా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో మొండి చేయి చూపుతున్నారనేది జగమెరిగిన సత్యం.. గత ప్రభుత్వంలో రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లలో కొంత మందికి బిల్లులు చెల్లింపులు జరపకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు పర్సంటేజ్ రూపంలో ముడుపులు సమర్పించుకుంటే ఎప్పటి బిల్లు అయినా ప్రాసెస్ చేస్తున్నారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకే చెల్లింపులు ఎవరైనా కాంట్రాక్టర్ అత్యవసరం అని అడిగితే సదరు బిల్లుల చెల్లింపులు కమిషనర్ ఆదేశాల మేరకు ప్రాసెస్ చేస్తున్నాం. – నమ్రత్కుమార్, అకౌంటెంట్ -
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తీరు
ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలు.. సాక్షి ప్రతినిధి,బాపట్ల: ఎన్నికల ముందు నిరుద్యోగులకు చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. అధికారం చేపట్టాక వారితో కన్నీరు పెట్టిస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాటికి పీకేసి ఉపాధిని దెబ్బతీస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి జూన్ 12 నాటికి ఏడాది పూర్తి కావస్తోంది. నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన బాటలో నిరుద్యోగులు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ముగుస్తున్నా మాట నిలబెట్టుకోకపోవడంతో మోసపోయిన యువత ఆందోళన బాట పడుతోంది. మెగా డీఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగులు పలుమార్లు ఆందోళనకు దిగారు. చిరకు అరకొర పోస్టులతో ప్రకటన చేసింది. వలంటీర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విధుల నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతోపాటు కోర్టులను ఆశ్రయించారు. ఊసేలేని భృతి ఎన్నికల సమయంలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేవరకూ నెలకు రూ.3 వేలు భృతి ఇస్తానని ప్రకటించిన చంద్రబాబు గద్దెనెక్కి ఏడాదైనా దాని ఊసే ఎత్తడంలేదు. ఇంటికొకరికి నిరుద్యోగ భృతి అనుకుంటే నెలకు రూ.149.10 కోట్ల చొప్పున చెల్లించాల్సి వుంది. కానీ పైసా ఇవ్వలేదు. 2014లోనూ చంద్రబాబు ఇంటికొక ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక ఎగనామం పెట్టారు. ఇంటికొక నిరుద్యోగి జిల్లాలో జిల్లాలో 459 గ్రామపంచాయతీల పరిధిలో 944 గ్రామాలు ఉండగా వాటి పరిధిలో 4,97,000 గృహాలు ఉన్నాయి. ఈ లెక్కన ఇంటికొకరు అనుకున్నా జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారంతా ఉద్యోగాలకోసం ఎదురుచూపులు చూస్తున్నారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో ఇలా.... వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రభుత్వం చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. జిల్లాలో 477 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటుచేసి 5,247 ఉద్యోగాలు కల్పించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల పరిధిలో వేలాది మందికి వలంటీర్ ఉద్యోగాలు ఇచ్చింది. 348 హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి 348 ఎంఎల్హెచ్పీ ఉద్యోగాలు కల్పించింది. ఇవికాకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చింది. ఇక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచి వారి శ్రమను గుర్తించింది. ఇవి కాకుండా ఎంఎస్ఎంఈల ద్వారా జిల్లాలో 705 యూనిట్లు ఏర్పాటు చేసి వారికి రూ.110.69 కోట్ల మేర రాయితీలు కల్పించింది.‘‘అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం... ఉద్యోగావకాశాలు రానివారికి నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తాం...వలంటీర్లకు నెలకు రూ.10 వేలు వేతనం ఇస్తాం...ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం...కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం’’ అంటూ చంద్రబాబుతోపాటు కూటమి నేతలు ఊదరగొట్టారు. నిరుద్యోగ భృతికి ఎగనామం ఎన్నికలప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న చంద్రబాబు గద్దెనెక్కాక ఒక్క ఉద్యోగం కల్పించని వైనం డీఎస్సీ పేరుతో దగా ఇంటికొకరు అనుకున్నా జిల్లాలో 5 లక్షల మంది నిరుద్యోగులు ఆందోళనలో యువత వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూటమి పాలన తీరుపై యువత ఆగ్రహం ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కూటమి పభుత్వం చదువుకున్న యువతకు తక్షణం ఉద్యోగాలు కల్పించాలి. 20 లక్షల ఉద్యోగాలిస్తామన్న మాట నిలబెట్టుకోవాలి. మాటలు చెప్పి ఓట్లేయించుకున్న ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోవాలి. జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి. – మాచవరపు రవికుమార్, రాష్ట్రకార్యదర్శి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం -
పరిశుభ్రతతోనే ఆరోగ్య పదిలం
కర్లపాలెం: పరిశుభ్రతతోనే ప్రజల ఆరోగ్య పదిలంగా ఉంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. దమ్మనవారిపాలెం సంపద సృష్టి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. గ్రామంలోని చెత్త తీసుకువచ్చి ఒక చోట గుట్టగా వేయటాన్ని చూసిన కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టి కేంద్రానికి తీసుకువస్తున్న చెత్తను ఎందుకు ప్రాసెసింగ్ చేయటం లేదని అఽధికారులను నిలదీశారు. తక్షణమే ప్రాసెసింగ్ పనులు చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ 350 గృహాలు ఉన్న గ్రామంలో చెత్తను తొలగించేందుకు క్లాప్మిత్రలు ఇద్దరే ఉండటం ఏమిటని జనాభా సంఖ్యను బట్టి క్లాప్మిత్రలను ఏర్పాటు చేసుకోవాలని డీపీవో ప్రభాకర్కు సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు వేరుగా, ఇనుప వస్తువులు వేరుగా, గాజు వస్తువులు వేరుగా భూమిలో కుళ్లిపోయే పదార్థాలు వేరుచేసి సంపద సృష్టించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ గురపసాల వెంకటేశ్వరమ్మ, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ సుందరమ్మ, ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, కార్యదర్శి సునీత తదితరులు ఉన్నారు. కాలువల మరమ్మతులు సక్రమంగా చేయాలి పంట కాలువల పూడికతీత, మరమ్మతు పనులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ జె.వెంకటమురళి జల వనరుల శాఖాధికారులను ఆదేశించారు. కర్లపాలెం మండలంలో రూ.12లక్షలతో చేపట్టిన పీటీ చానల్ మరమ్మతు పనులను గురువారం కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని పంట కాలువల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. వర్షాలు కురవకముందే పూర్తి చేయాలని తెలిపారు. జలవనరుల శాఖ ఎస్ఈ డి.వెంకటరత్నం, డీఈ జాకీర్, తహసీల్దార్ సుందరమ్మ, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఇన్చార్జి ఆర్డీవో లవన్న తదితరులు ఉన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ పరిశ్రమలను నిర్వహించుకోవాలి జిల్లాలో పర్యావరణాన్ని కాపాడుతూ పరిశ్రమలను నిర్వహించుకోవాలని కలెక్టర్ జె.వెంకట మురళి సూచించారు. గురువారం కలెక్టరేట్లో ఆక్వా పరిశ్రమలు, రిసార్డ్స్ యజమానులు, హోట ల్ యజమానులతో పర్యావరణ పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా పరిశ్రమల్లో విడుదల చేసిన వ్యర్థ పదార్థాలను నిల్వ చేయడానికి తప్పనిసరిగా అర ఎకరా భూమిని కేటాయించాలని చెప్పారు. ఆక్వా పరిశ్రమల్లో విడుదల చేసిన వ్యర్ధ పదార్థాలను పంట కాలువలోకి విడుదల చేయకుండా కట్టడి చేయాలని చెప్పారు. ఇరిగేషన్ వనరులు దెబ్బతినకుండా పర్యావర ణా న్ని కాపాడాలని యజమానులను కలెక్టర్ కోరారు. రొయ్య ప్రాసెసింగ్ యూనిట్లు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని యాజమాన్యానికి సూచించారు. రొయ్య ప్రాసెసింగ్ యూనిట్లు 45 రోజుల్లోగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో ఆక్వా యాచరీలు 20 ఉన్నాయని, వీటిలో ఏడింటికి లైసెన్న్స్లు లేవని అన్నారు. నెలరోజుల్లోగా లైసెన్సులు తీసుకోవాలని ఆదేశించారు. రిసార్డ్స్ యజమానులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి గాజు ప్లేట్లను, బాటిల్స్ వినియోగించాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి, మత్స్య శాఖ జేడీ, జిల్లా పర్యాటక శాఖఅధికారి, పొల్యూషన్ బోర్డ్ అధికారులు పరిశ్రమలను, రిసార్డ్స్ను, హోటళ్లను జాయింట్గా పరిశీలన చేయా లని కలెక్టర్ ఆదేశించారు. డీపీఓ ప్రభాకర్, గ్రామీణ నీటి సరఫరాశాఖ ఎస్ఈ అనంతరాజు, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రామకృష్ణ, పొల్యూషన్ బోర్డ్ ఈఈ రాఘవరెడ్డి,ఆర్డీవోలు పి.గ్లోరియా, చంద్రశేఖర్ ఉన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి సంపద సృష్టి కేంద్రం సందర్శన సిబ్బంది తీరుపై ఆగ్రహం -
అధైర్య పడొద్దు .. అండగా ఉంటాం..
సత్తెనపల్లి: ‘‘మీరేమీ ఇబ్బంది పడవద్దు, భయపడ వద్దు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మీకు అండగా ఉన్నారు. మేమందరం మీకు తోడుగా ఉన్నాం..’’ అంటూ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో వారు గురువారం పర్యటించారు. ఏడాది క్రితం టీడీపీ, జనసేన నేతల దాడులు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉపసర్పంచ్, వైఎస్సార్ సీపీ క్రియాశీలక నాయకుడు కొర్లకుంట శివనాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యా న్ని కలిగించారు. మృతుడు తండ్రి, పాకాలపాడు పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కొర్లకుంట వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. అనంత రం వారు మాట్లాడుతూ.. జూన్ 3న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెంటపాళ్ల గ్రామా న్ని సందర్శిస్తారని చెప్పారు. కొర్లకుంట శివనాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులర్పిస్తారన్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రూట్ మ్యాప్ను పరిశీలించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి, డాక్టర్ గజ్జల నాగభూషణ్ రెడ్డి, డీఆర్యూసీసీ మెంబర్ చల్లంచర్ల సాంబశివరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ నాగుర్ మీరాన్, సత్తెనపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, ఎంజే ఎం రామలింగారెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వర రెడ్డి, ఇందూరి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు షేక్ మౌలాలి(సత్తెనపల్లి టౌన్), వేపూరి శ్రీనివాసరావు (రాజుపాలెం), భవనం రాఘవరెడ్డి (నకరికల్లు), నక్కా శ్రీను(ముప్పాళ్ల), వైఎస్సార్ సీపీ నాయకులు బండి కోటినాగిరెడ్డి, ఏకుల మత్తయ్య, పల్లె గాబ్రియేలు, కోట ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డి, నేతల బృందం రెంటపాళ్ళ ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ జూన్ 3న రెంటపాళ్ళకు వైఎస్ జగన్ రాక నేపథ్యంలో రూట్మ్యాప్ పరిశీలన -
ప్రజా పాలనపై ఎన్టీఆర్ చెరగని ముద్ర
గుంటూరు వెస్ట్: సంక్షేమ పాలనతో ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును ఎప్పటికీ మరచిపోలేమని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ కొనియాడారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఇన్చార్జి కలెక్టర్తోపాటు శాసన మండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎ.భార్గవ్ తేజ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో విప్లవాత్మకమైన మార్పులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో స్టెప్ సీఈఓ చంద్రముని, మెప్మా పీడీ విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏఓ పూర్ణచంద్రరావు, కార్పొరేటర్లు స్మిత పద్మజ, వెంకట రమణ, చిష్టీ, మీరావలి, పాల్గొన్నారు. తెలుగు వారి ఖ్యాతి చాటిన ఎన్టీఆర్ నగరంపాలెం: తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో బుధవారం దివంగత సీఎం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు రాజకీయాల్లో అరంగేట్రం చేసి సీఎంగా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలురెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో... నెహ్రూనగర్: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బుధవారం గుంటూరు జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణకుమారి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఇ.మారయ్య బాబు పాల్గొన్నారు. ఇన్చార్జి జిల్లా కలెక్టర్ -
జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్గా విజయలక్ష్మి
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్గా కుమ్మమూరు విజయలక్ష్మి నియమితులయ్యారు. విజయలక్ష్మి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీకాం చేశారు. గుల్బర్గా యూనివర్సిటీలో 1991లో న్యాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. 1992లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ అయ్యారు. సోదరుడు కృష్ణకిషోర్ వద్ద న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. బుధవారం గుంటూరు జిల్లా కన్జ్యూమర్ ఫోరం చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఒకటిన జిల్లా క్రికెట్ జట్లు ఎంపిక గుంటూరు వెస్ట్ ( క్రీడలు ): జిల్లా క్రికెట్ సంఘం త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీన స్థానిక అరండల్పేటలోని పిచ్చుకులగుంటలో జిల్లా జట్ల ఎంపిక నిర్వహిస్తామని సభ్యులు యు.మహతి శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–19 యువకులు జట్టుకు ఉదయం 8 గంటలకు, అండర్–19 యువతులకు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. నవంబర్ 1,2006 తర్వాత జన్మించినవారై ఉండాలి. అండర్–15 బాలికలకు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. నవంబర్ 1, 2010 తర్వాత జన్మించిన వారై ఉండాలి. అండర్–23 ఉమెన్స్కు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. వీరు నవంబర్ 1,2001 తర్వాత జన్మించినవారై ఉండాలి. పోటీలకు హాజరయ్యే క్రికెటర్లు వైట్ డ్రెస్తోపాటు సొంత కిట్ కలిగి ఉండాలి. వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ను తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు మహతి శంకర్ను 98491 50249 నంబరులో సంప్రదించాలన్నారు. నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష గుంటూరు లీగల్: అత్యాచార యత్నం కేసులో నిందితుడికి జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 86 సంవత్సరాల వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నించిన పాలపర్తి మంజు అనే 21 సంవత్సరాల యువకుడిపై పెదనందిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఈ మేరకు తీర్పు వచ్చింది. నిందితుడికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధిస్తూ గుంటూరు ఐదో జిల్లా కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు. బాధితురాలి తరఫున ప్రాసిక్యూషన్ న్యాయవాదిగా పల్లపు కృష్ణ వాదనలు వినిపించారు. 11 నెలలుగా అందని జీతాలు ఏపీజీఏఈ జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా గుంటూరు వెస్ట్: స్థానిక బీఆర్ స్టేడియంలో ఔట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 11 నెలలుగా జీతాలు అందడం లేదని ఏపీజీఏఈ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్లోని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ అంతంత మాత్రపు జీతాలతో నెట్టుకొచ్చే చిరుద్యోగులకు నెలవారీ జీతాలు అందకపోతే చాలా ఇబ్బందులు పడతారన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పులు చేస్తున్నారని తెలిపారు. తక్షణం ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అసోసియేషన్ నాయకులు లక్ష్మీనారాయణ, వై.నాగేశ్వరరావు, కోటా సాహెబ్, పెదరత్తయ్య, జాన్ పాల్గొన్నారు. -
బీచ్ కబడ్డీ పురుషుల రాష్ట్ర జట్టుకు శిక్షణ
చెరుకుపల్లి: జూన్ 5 నుంచి 8వ తేదీ వరకు మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో నిర్వహించనున్న 12వ జాతీయ బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర పురుషుల జట్టుకు శిక్షణ ఇస్తున్నట్టు ఏపీ కబడ్డీ అసోసియేషన్ కోశాధికారి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సుబ్బరాజు తెలిపారు. జట్టుకు మండలంలోని పొన్నపల్లి గ్రామంలో శిక్షణ శిబిరాన్ని బుధవారం సుబ్బరాజు ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 3వ తేదీ వరకు శిక్షణ కొనసాగనున్నట్లు తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన కుంచల శ్రీనివాసరెడ్డి స్పాన్సర్గా వ్యవహరించనున్నట్టు చెప్పారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వై.శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించన్ను పోటీలకు పురుషుల జట్టుకు పర్యవేక్షకులుగా విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు వైఎస్సార్ ప్రసాద్, రాధాకృష్ణమూర్తి వ్యవహరిస్తారని తెలిపారు. శిబిరానికి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరు అయ్యారని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం తుది జట్టును ఎంపిక చేయనున్న వివరించారు. -
రెండు బైక్లను ఢీకొట్టిన ఆటో
అద్దంకి: ముందు వెళ్తున్న రెండు మోటారు బైక్లను ఆటో ఢీ కొట్టిన ఘటనలో ఒక వ్యక్తి దుర్మణం చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని శింగరకొండ సమీపంలో అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిలో బుధవారం జరిగింది. అందిన సమాచారం మేరకు.. కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామానికి చెందిన వెంకట్రావు (35) అద్దంకిలోని భవానీ సెంటర్లో చేపలు దుకాణం నడుపుతుంటాడు. శింగరకొండ భవనాశి చెరువులో చేపలు పడుతున్నారని తెలిసి బెక్పై వెళ్లాడు. అదే విధంగా మండలంలోని కలవకూరు గ్రామానికి చెందిన లక్ష్మీపతి కూడా మరో బైక్పై వెళ్లాడు. పరిచయస్తులైన వీరిద్దరూ అక్కడి నుంచి తిరిగి వస్తుండగా, శింగరకొండ సమీపంలో వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీ కొట్టింది. దాంతో వెంకట్రావు బైక్ మీద నుంచి కిందపడి తల పగలడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. లక్ష్మీ పతి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్వల్పగాయాలైన వ్యక్తిని 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
కేశవకుమార్ సాహిత్యంలో ధిక్కార స్వరం
కవితా సంపుటాల ఆవిష్కరణలో వక్తలు తెనాలి: గత మూడున్నర దశాబ్దాల తెలుగు కవిత్వంలో కేశవకుమార్ది ముఖ్యమైన గొంతుక అని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విప్లవాత్మక భావజాలం ద్వారా ప్రేరణ పొందిన కవి అని ప్రముఖ సాహితీ విమర్శకుడు, ప్రొఫెసర్ బి.తిరుపతిరావు ప్రశంసించారు. ఆయన కవిత్వం సామాజిక– రాజకీయ విమర్శ, తాత్విక అన్వేషణల శక్తిమంతమైన సమ్మేళనాన్ని సూచిస్తుందని అన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర ప్రొఫెసర్, తెనాలి సమీపంలోని మండల కేంద్రం అమృతలూరుకు చెందిన కేశవకుమార్ రచించిన కవితలతో తీసుకొచ్చిన రెండు కవితా సంపుటాలను బుధవారం సాయంత్రం హోటల్ గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఆవిష్కరించారు. ‘భిన్నస్వరాలు’ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు జీఎస్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. కేశవకుమార్ కవితా సంపుటి ‘ఆదిమ పౌరుడు’ను బి.తిరుపతిరావు, ‘ఎగిరే పళ్లెం నడిచే మంచం ఓ కూనిరాగం’ సంపుటిని ప్రముఖ కవి సీతారాం ఆవిష్కరించారు. తిరుపతిరావు మాట్లాడుతూ అమృతలూరులో పుట్టి, దళిత ఉద్యమాలు, దళితుల ఆర్థిక, సామాజిక, రాజకీయ ఎదుగుదలను చూస్తూ పెరిగిన క్రమంలో కేశవకుమార్ వాటిని సొంతం చేసుకున్నారని చెప్పారు. ఆయన భావాలన్నీ అంబేడ్కర్ ఆలోచనల చుట్టూ తిరుగుతుంటాయన్నారు. రాడికల్గా సమీక్షించటం, విమర్శించటం ఆయన రచనల్లో గోచరిస్తుందని చెప్పారు. విస్తృతంగా రాస్తున్న కవితలు, వ్యాసాల్లో వ్యంగ్యాన్ని జోడించి విమర్శనాత్మకంగా రాయటం కేశవకుమార్ శైలి అన్నారు. సమకాలీన విషయాలపై తక్షణం స్పందించి రాయటం ఆయన ప్రత్యేకతగా చెప్పారు. కవి సీతారాం మాట్లాడుతూ, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థుల ప్రతిఘటన, నిరసన ఉద్యమాల్లో కేశవకుమార్ ముందుండి గొంతెత్తారని చెప్పారు. అంబేడ్కర్, పూలే భావధారలో తనను తాను రూపుదిద్దుకున్న కేశవకుమార్ రచనలు, తెలుగునాట దళితవాద సాహిత్యానికి ప్రోత్సాహాన్ని, ప్రేరణను ఇస్తాయని చెప్పారు. ప్రముఖ దళిత సీ్త్రవాద రచయిత్రి చల్లపల్లి స్వరూపరాణి తన ప్రసంగంలో విప్లవ సాహిత్యానికి కేంద్రబిందువుగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన కేశవకుమార్ కవితా సంపుటాల్లో దళిత, బహుజన సాహిత్యంలో వచ్చిన ధోరణులు ప్రతిబింబిస్తాయని చెప్పారు. కత్తి కళ్యాణ్ మాట్లాడుతూ కేశవకుమార్ కవిత్వంలో నిరసన, ధిక్కారం, వ్యంగ్యం ప్రదర్శిస్తూ సమాజానికి అనేక ప్రశ్నలు సంధించారని చెప్పారు. సభలో శిఖా–ఆకాష్, నూకతోటి రవికుమార్, ఎన్జే విద్యాసాగర్, శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు, తంగిరాల సోని మాట్లాడారు. కేశవకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. భిన్నస్వరాలు బాధ్యులు జుగాష్విలి, ఉమ తదితరులు పాల్గొన్నారు. -
జీజీహెచ్లో కరోనా వైద్య సేవలు
గుంటూరు మెడికల్: కొన్నేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి వెలుగులోకి వచ్చింది. పలువురు బాధితులు కరోనాతో బాధపడుతుండటంతో గుంటూరు జీజీహెచ్లో కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా 15 పడకలతో వార్డు ఏర్పాటు చేశారు. ఇన్పేషెంట్ విభాగంలో బీ క్లాస్ రూములో కూడా బాధితుల కోసం సిద్ధం చేసి ఉంచారు. అత్యవసర విభాగం వల్ల నూతనంగా నిర్మించిన స్టెప్ డౌన్ ఐసీయూ గదిని కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తెలిపారు. ఇప్పటికే కరోనా అనుమానంతో వచ్చిన ఐదుగురికి వైద్య పరీక్షలు చేశామని, రిపోర్టు నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. జీజీహెచ్లో కరోనా బాధితులకు ప్రత్యేకంగా ఓపీని ప్రారంభించామన్నారు. ఆక్సిజన్ కాన్సెట్రేటర్స్, సీక్యాప్ మిషన్లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచామన్నారు. జనరల్ మెడిసిన్ వైద్యులు ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పడి కరోనా వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వైద్య సేవలకు సిద్ధంగా ఉండండి రాష్ట్రవ్యాప్తంగా టీచింగ్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య సేవలు అందించేందుకు ఆయా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు సిద్ధంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డీఎంఈ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించారు. సమావేశంలో డీఈఓ డాక్టర్ నరసింహం మాట్లాడుతూ గుంటూరు జీజీహెచ్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఎక్కువ మంది చికిత్స పొందేలా చూడాలన్నారు. ఈ – హాస్పిటల్ వైద్య సేవలు పెంచాలన్నారు. సమావేశానికి హాజరు కాని జీజీహెచ్ వైద్యులకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. సమీక్షలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణతోపాటు పలు వైద్య విభాగాధిపతులు, ఆయా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
‘యోగాంధ్ర’ లక్ష్యాలను చేరుకోవాలి
బాపట్ల: యోగాంధ్రలో సభ్యత్వ నమోదు లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమాలు, సభ్యత్వ నమోదుపై జిల్లా మండల స్థాయి అధికారులతో బుధవారం ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. యోగాంధ్ర కార్యక్రమాలు బాపట్ల జిల్లాలో జయప్రదంగా నిర్వహించడానికి ట్రైనర్లకు సమర్థంగా శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. జూన్ 21వ తేదీన మెగా డే నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో 6,31,435 మందిని సభ్యులుగా చేర్చాల్సి ఉండగా ప్రస్తుతం 1,21,213 మంది సభ్యులయ్యారన్నారు. మాస్టర్ ట్రైనర్లకు ఈ నెల 29 నుంచి జూన్ రెండో తేదీ వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. జాతీయస్థాయి కార్యక్రమం విశాఖపట్నంలో నిర్వహిస్తున్నందున అక్కడకు వెళ్లే వారిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ నగదు పంపిణీ ప్రక్రియను ఈనెల 31వ తేదీన ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. డీఆర్డీఏ పి.డి. శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, డీపీఓ ప్రభాకర్ రావు, డీటీసీ పరంధామరెడ్డి, ఎస్ఎస్ఏ ఏపీసీ నాగిరెడ్డి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి కె.పాల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల సంరక్షణకు చర్యలు బాపట్ల: బాలల ఆశ్రమాలు, సంరక్షణ కేంద్రాలు చట్ట ప్రకారం నడిచేలా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. సీసీఐఆర్సీ జిల్లా కమిటీ సమావేశం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగింది. బాలల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో 23 బాలల ఆశ్రమాలు, సంరక్షణ కేంద్రాల లైసెన్సుల పునరుద్ధరణకు సంబంధించిన దస్త్రాలను పునఃపరిశీలన చేయాలన్నారు. ఆ సంస్థల పనితీరుపై క్షేత్రస్థాయిలో విచారించిన అధికారులు కమిటీకి నివేదించారు. కమిటీ నివేదికను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. అనాధలకు ఆశ్రయం కల్పించే సంస్థలలో మౌలిక సదుపాయాలు, కనీస వసతులు, సిబ్బంది పనితీరు, అందిస్తున్న సేవలు, సంబంధిత దస్త్రాలను పరిశీలించిన తదుపరి లైసెన్సులు ఇవ్వాలన్నారు. జువెనల్ జస్టిస్ సంక్షేమ ప్రొబిషన్ అధికారి సౌందర్య, సీ్త్ర శిశు సంక్షేమశాఖ పీడీ రాధా మాధవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, డీసీపీఓ పురుషోత్తమరావు, బాలల సంరక్షణ, సంక్షేమ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తడి భూములను సంరక్షించాలి.. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: జల వనరుల సమీపంలోని భూములు, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. తడి భూమి సంరక్షణ జిల్లాస్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ తడి భూమి సంరక్షణపై కమిటీలోని అధికారులు బాధ్యత వహించాలన్నారు. జిల్లాలో 601 తడి భూములు ఉన్నాయన్నారు. ఈ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించరాదని, భూముల చుట్టూ రసాయనాల వినియోగం నిషేధమన్నారు. ఈ భూములపై సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అటవీశాఖ అధికారి వినోద్ కుమార్, కమిటీలోని సభ్యులైన వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
తీరనున్న రహదారిద్య్రం!
పర్చూరు(చినగంజాం): ఇంకొల్లు – పర్చూరు(పాత మద్రాస్) రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ 23.88 కోట్లు మంజూరు చేసింది. ‘సాక్షి’ వరుస కథనాలతో ఆర్ అండ్బీ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి రూ 22 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఇంకొల్లు సినిమా హాలు సెంటర్ నుంచి పర్చూరు బొమ్మల సెంటర్ వరకు 19 కి.మీ పొడవు, 7 మీటర్ల వెడల్పు పెంచే విధంగా బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు మిత్రా కంపెనీ 2021 డిసెంబర్ 31న అగ్రిమెంట్ చేసుకుంది. ఇంకొల్లులో సిమెంట్ రోడ్డు నిర్మాణంతో పాటు రహదారిలోని కల్వర్టు పనులను దాదాపు పూర్తి చేశారు. మొత్తం రూ.4.50 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. అప్పటి వరకు జరిగిన పనులకు బిల్లులు చెల్లించే విషయంలో జాప్యం జరగడంతో కాంట్రాక్టర్ పనులను నిలిపి వేశారు. దాంతో రోడ్డు నిర్మాణానికి బ్రేక్ పడింది. కొత్త అంచనాలతో నిధులు మంజూరు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన రూ 22 కోట్ల నిధులకు సంబంధించి పనులు నిలిచి పోవడం, కాలం గడవడంతో నిర్మాణ వ్యయం పెరిగింది. దాంతో ఆర్అండ్బీ అధికారులు కొత్త అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపి నిధులు మంజూరు అయ్యేందుకు చర్యలు తీసుకున్నారు. రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ పర్చూరు– ఇంకొల్లు పాత మద్రాస్ రోడ్డుకు బుధవారం భూమి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్అండ్బీ అధికారులు డీఈ నళిని, జేఈ శ్రీకాంత్, మండల పార్టీ టీడీపీ అధ్యక్షుడు షంషుద్దీన్, పర్చూరు ఏఎంసీ చైర్మన్ గుంజి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. అన్నీ గుంతలే.. అక్కడక్కడ రోడ్డు.. రహదారి దుస్థితిరహదారి దుస్థితిపై సాక్షిలో ప్రచురితమైన కథనం ‘సాక్షి’ వరుస కథనాలతో స్పందించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు రోడ్డు నిర్మాణానికి రూ 23.88 కోట్లు మంజూరు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే రూ.22 కోట్లు మంజూరు పనులు మొదలు పెట్టి రూ 4.50 కోట్ల మేర పూర్తయిన వైనం బిల్లులు అందక నిర్మాణ పనులు నిలిపేసిన కాంట్రాక్టర్ ఇంకొల్లు పర్చూరు రోడ్డు అధ్వానంగా ఉండటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రోడ్డుపై ప్రయాణం తీవ్ర అసౌకర్యంగా ఉండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కనీసం ద్విచక్రవాహనాలు వెళ్లేందుకు కూడా చాలా కష్టంగా మారింది. ఈ రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో పలువురు వాహన చోదకులు ప్రాణాలు సైతం కోల్పోయారు. ఈ మార్గంలో సరైన వంతెనలు, చప్టాలు లేక పోవడంతో వర్షాల సమయంలో వాగులు పొంగి రోడ్డుకు అడ్డంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించి పోతుంటాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పై నుంచి వస్తున్న వర్షపు నీటితో కప్పల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ద్విచక్రవాహనదారులు సైతం ఇబ్బంది పడ్డారు. పర్చూరు నుంచి చిలకలూరి పేట, గుంటూరు, విజయవాడ, పల్నాడు మీదుగా హైదరాబాద్కు, ఇంకొల్లు నుంచి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చైన్నెలకు వెళ్లేందుకు ఈ మార్గం అనువైనది. కాగా గతంలో జాతీయ రహదారులు పూర్తి స్థాయిలో నిర్మాణం జరక్క మునుపు ఇదే మార్గాన్ని వినియోగించేవారు. దాంతో ఈ మార్గానికి పాత మద్రాస్ రోడ్డు అనే పేరు స్థిర పడిపోయింది. రహదారి అధ్వాన పరిస్థితి, వాహనచోదకుల వెతలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. -
గుంటుపల్లిలో ధాన్యం కొనుగోళ్లు
బల్లికురవ: బల్లికురవ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా బుధవారం గుంటుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. ఈనెల 19న సాక్షిలో ‘ధాన్యం.. కలవరం’ అన్న శీర్షికతో ప్రచురించిన కథనానికి జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి, వ్యవసాయ శాఖాధికారులు, సొసైటీ అధికారులు తక్షణమే స్పందించారు. గ్రామాల వారీగా ఈ–పంట నమోదుతో రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణమే వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మండల వ్యవసాయాధికారి ఎస్వీపీ కుమారి రైతు సేవా కేంద్రాల్లోని వీఏఏలు గ్రామాల వారీగా రైతుల వద్ద నిల్వ ఉన్న ధాన్యం వివరాలు సేకరించి జిల్లా అధికారులకు నివేదించారు. నెల్లూరు సన్నాలు కొనుగోళ్లకు అనుమతులు లభించటంతో గుంటుపల్లి గ్రామంలోని రైతుల వద్ద సుమారు 300 బస్తాలు నిల్వ ఉన్నట్లు సొసైటీ పర్సన్ ఇన్చార్జి బ్రహ్మయ్య గుర్తించి 75 కేజీల బస్తా రూ. 1740 లెక్కన కాటాలు వేసి ట్రాక్టర్ ద్వారా మిల్లుకు చేర్చారు. స్థానిక వ్యాపారులు బస్తా రూ. 1200 లకు కొనుగోళ్లు చేస్తూ కాటాలో నిలువుదోపిడి చేస్తున్న పరిస్థితులను ‘సాక్షి’లో కథనం ప్రచురించి సొసైటీ ద్వారా కొనుగోళ్లు జరిగేలా చేసి తమను ఆదుకోవటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, వ్యవసాయశాఖ, సొసైటీ అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రాక్టర్కు లోడ్ చేస్తున్న కూలీలు కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం నెల్లూరు సన్నాలు కొనుగోళ్లు ప్రారంభం ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు -
పచ్చిరొట్ట పైరుతో ప్రయోజనాలు
తెనాలి టౌన్: ఖరీఫ్ సాగుకు ముందు పచ్చిరొట్ట పైరు సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ రాష్ట్ర సంచాలకులు ఎస్.ఢిల్లీరావు రైతులకు సూచించారు. రూరల్ మండలం ఎరుకలపూడి గ్రామంలో రైతు ముళ్ళపూడి రంగయ్య ప్రయోగాత్మకంగా చేపట్టిన పీఎండీఎస్ క్షేత్రాన్ని బుధవారం ఎస్.ఢిల్లీరావు పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ సంస్థ 7, 8 సంవత్సరాలుగా పరిశోధించి 32 రకాల పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. వీటిని వేసుకోవడం వలన సేంద్రియ కర్బనం పెరుగుతుందని తెలిపారు. ఎరువుల మోతాదు తగ్గించుకోవచ్చని వివరించారు. జనుము, జీలుగ, పిల్లి పెసర విత్తనాలను వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ విధానం వలన కాంప్లెక్స్ ఎరువులు, పురుగు మందుల ఖర్చు భారీగా తగ్గించుకోవచ్చని అన్నారు. భూమి గుల్లబారి ఆరోగ్యంగా ఉంటుందని, సూక్ష్మపోషకాలు త్వరగా లభ్యమవుతాయని అన్నారు. ప్రతి రైతును చైతన్యపరచి పచ్చిరొట్ట విత్తనాలు వేసుకోనేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎన్.వెంకటేశ్వర్లు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.రాజకుమారి, ఏడీఏ ఎన్.ఉషారాణి, ఏవో జి.ప్రేమ్సాగర్, ఏఈవోలు, వీఏఏలు, పలువురు రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ రాష్ట్ర సంచాలకులు -
లోక్ అదాలత్లో ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి
గుంటూరు లీగల్: లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్చక్రవర్తి పేర్కొన్నారు. బుధవారం కోర్టు ప్రాంగణంలో ఈ నెల 28 నుంచి జూన్ 7వ తేదీ వరకు జరుగనున్న లోక్ అదాలత్పై కంపెనీ సభ్యులు, కౌన్సిలర్లు, ఇన్స్యూరెన్స్ కంపెనీల న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు. అందరూ సహకరించాలని సూచించారు. సమావేశంలో ఒకటో అదనపు జిల్లా జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి, గుంటూరు ఫ్యామిలీ కోర్టు జడ్జి జి. చక్రపాణి, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్. శరత్ బాబు, ఐదో అదనపు జిల్లా జడ్జి కె. నీలిమ, మూడో అదనపు జిల్లా జడ్జి సి.హెచ్.వి.ఎన్. శ్రీనివాసరావు, పోక్సో కోర్ట్ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి షమీ పర్వీన్ సుల్తానా బేగం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సయ్యద్ జియావుద్దీన్, బార్ అధ్యక్షుడు వై.సూర్య నారాయణ పాల్గొన్నారు. -
ట్రాక్టర్ కింద పడి బాలిక దుర్మరణం
బెల్లంకొండ: ట్రాక్టర్ కింద పడి బాలిక మృతి చెందిన ఘటన మండలంలోని న్యూ చిట్యాల సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో న్యూ చిట్యాలకు చెందిన అడావత్ సంధ్య భాయి (13) అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ చిట్యాలకు చెందిన సంధ్య భాయి మంచినీళ్ల కోసం బంధువుల బైక్పై బెల్లంకొండలోని వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్తుంది. కాగా కొండ సమీపంలోకి రాగానే బెల్లంకొండ నుంచి మన్నెసుల్తాన్పాలెం వైపు వెళ్తున్న మరో బైక్ వీరిని ఢీకొంది. ఈ క్రమంలో సంధ్య భాయి బైక్ పై నుంచి రోడ్డు మీద పడిపోయింది. ఈ క్రమంలో వారి వెనకగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ సంధ్య భాయిని తొక్కుకుంటూ వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మృతి చెందిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
కర్రసాములో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
గుంటూరు వెస్ట్ (క్రీడలు): కర్రసాము అంతర్జాతీయ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచినట్లు కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకుడు కాశీనాథ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన పోటీల్లో వారు ప్రతిభ చూపారన్నారు. అంతర్జాతీయ కర్రసాము సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 9 బంగారు, 5 రజత, 3 కాంస్య పతకాలు సహా మొత్తం 17 పతకాలను చిన్నారులు సాధించారని పేర్కొన్నారు. సాయి సుబ్రహ్మణ్యం, విజయ్ శిక్షణలో చిన్నారులు ఈ విజయం సాధించారని తెలిపారు. -
నైపుణ్యాభివృద్ధి తరగతులు ప్రారంభం
తాడికొండ: మహిళలు, యువతకు నైపుణ్యాభివృద్ధి, సెన్సిటైజేషనుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాల ద్వారా సాధికారత సాధించవచ్చని ఏపీ సీఆర్డీఏ నైపుణ్యాభివృద్ధి అధికారులు తెలిపారు. అమరావతి ప్రాంతంలో మహిళలకు సాధికారత కల్పించడం, యువతకు నైపుణ్యాలను అందించేందుకు తుళ్ళూరులో ఈ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. నిర్మాణ స్థలాల వద్ద కార్మికుల రాకను దృష్టిలో ఉంచుకొని జెండర్ కమిటీల సభ్యులైన 368 స్వయం సహాయక బృంద మహిళలకు లింగ ఆధారిత హింసపై సెన్సిటైజేషన్ శిక్షణ ఇస్తున్నారు. వీరు సంబంధిత ఫిర్యాదులపై పని చేస్తారని అధికారులు తెలిపారు. ఏపీ సీఆర్డీఏ స్కిల్ హబ్ తుళ్ళూరులో పెయింటింగ్ కోర్సులో 22 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు 30 మంది, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్ కోర్సులో 29 మందికి శిక్షణ ప్రారంభమైందన్నారు. -
చట్టవిరుద్ధంగా వ్యవహరించిన పోలీసులు
తెనాలి: నిందితుల అరెస్టు విషయంలో తెనాలి పోలీసులు చట్టవిరుద్ధంగా, అమానుషంగా వ్యవహరించారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ పేర్కొన్నారు. వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్పై దాడి ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో నడిరోడ్డుపై లాఠీలతో జులుం ప్రదర్శించటాన్ని ఖండించారు. బాధిత కుటుంబాన్ని ఈ మేరకు మంగళవారం సీపీఎం జిల్లా కమిటీ పరామర్శించింది. అయితానగర్కు చెందిన నిందితుల్లో ఒకరైన దోమ రాకేష్ నివాసానికి వెళ్లి, ఆయన తండ్రిని కలిసింది. కుటుంబ నేపథ్యాన్ని, ఘటన వివరాలను సభ్యులు తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం చెంచుపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో నేతాజీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెనాలిలో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. పోలీసుల వైఖరిని ఖండిస్తున్నామని చెప్పారు. గత నెల 24వ తేదీన రాత్రి వేళలో కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై నిందితులు దాడి చేశారని, ఆ క్రమంలో దాడికి గురైన కానిస్టేబుల్ను వెంటపెట్టుకొని పోలీసులు 25న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. 27న మధ్యాహ్నం వరకు పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులను చిత్రహింసలకు గురి చేశారని బాధిత కుటుంబికులు చెప్పారని తెలిపారు. దానికి తోడు బహిరంగంగా నిందితులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన వీడియో వారి నిరంకుశ ధోరణికి అద్దం పడుతోందన్నారు. దళితులు, మైనారిటీలు అనే కోణంలోనే పోలీసులు దాడి చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. నిందితులపై విచక్షణారహితంగా దాడి చేయాలని ఏ చట్టంలోనూ చెప్పలేదన్నారు. అయినా పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని, ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ పై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. కానిస్టేబుల్పై యువకులు దాడికి పాల్పడిన ఘటన వెనుకనున్న ఆంతర్యాన్ని పోలీస్ ఉన్నతాధికారులు వెలికితీయాలన్నారు. కానిస్టేబుల్ కన్నా చిరంజీవి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పలు అభియోగాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అమానుషంగా వ్యవహరించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు భావన్నారాయణ, తెనాలి ఏరియా కార్యదర్శి కె. బాబుప్రసాద్, ములకా శివసాంబిరెడ్డి పాల్గొన్నారు. నిందితులను చిత్రహింసలకు గురిచేశారు కానిస్టేబుల్ చిరంజీవిపైనా పలు అభియోగాలు సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ఆరోపణ బాధిత కుటుంబానికి సీపీఎం బృందం పరామర్శ -
దురాచారాల నిర్మూలనలో పరిషత్ల కృషి ఎనలేనిది
నాదెండ్ల: నేటి సమాజంలో సాంఘిక దురాచారాలను నిర్మూలించేందుకు నాటికల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు కళాపరిషత్లు చేస్తున్న కృషి అభినందనీయమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు చెప్పారు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయస్థాయి నాటికల పోటీలు నాలుగోరోజు మంగళవారం కొనసాగాయి. సభాధ్యక్షులుగా హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వ్యవహరించారు. అతిథులుగా అనంతవరం ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు గూదే పాండురంగారావు, సినీ హీరో సందేశ్ హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా రాష్ట్రంలో వేల కళాపరిషత్ నాటికలు సమాజంలో నెలకొన్న దురాచారాలు, మూఢ నమ్మకాల నిర్మూలనకు విశేష కృషి చేస్తున్నాయన్నారు. అనంతరం దర్శకుడు, రచయిత సుంకర కోటేశ్వరరావు, నాటక రూపశిల్పి కె.థామస్లను కళాపరిషత్ సభ్యులు శాలువాలు, మెమొంటోలతో సత్కరించారు. కార్యక్రమాలను కళాపరిషత్ అధ్యక్షుడు నడింపల్లి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు... హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారి జ్యోతిరాజ్ రచనలో, వెంకట గోవాడ దర్శకత్వం వహించిన ‘అమ్మచెక్కిన బొమ్మ’ నాటిక ఆకట్టుకుంది. న్యూఢిల్లీ వారి అనశ్వరం నాటిక, చిలకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ వారి ‘మా ఇంట్లో మహాభారతం’ నాటికలు ఆకట్టుకున్నాయి. నేటి ప్రదర్శనలు... తాడేపల్లి అరవింద ఆర్ట్స్ ‘విడాకులు కావాలి’, తెనాలి అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ ‘ఎవరు’, కాట్రపాడు ఉషోదయ కళానికేతన్ ‘కిడ్నాప్’ నాటికలు బుధవారం ప్రదర్శించనున్నారు.కొనసాగుతున్న జాతీయస్థాయి నాటిక పోటీలు -
విద్యుత్ ఉద్యోగుల అభ్యున్నతికి కృషి చేయాలి
తెనాలి టౌన్: విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్ను ఎనర్జీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అందె రాజేష్ కోరారు. మంగళవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీఎండీ పుల్లారెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్ను యూనియన్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. యూనియన్ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సర్వీసు కండీషన్లు, పదోన్నతులపై చర్చించినట్లు రాజేష్ తెలిపారు. అలవెన్స్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని కోరారు. లీవ్ ఎన్క్యాష్మెంట్కు సంబంధించిన ఆర్డర్ను కూడా త్వరలో ఇస్తామని డైరెక్టర్ చెప్పినట్లు వివరించారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలీ, ఎగ్జిక్యూటివ్ మెంబరు బీటీ కృష్ణ తదితరులు ఉన్నారు. -
ఉద్యోగోన్నతులకు ధ్రువపత్రాల పరిశీలన
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉపాధ్యాయులు హాజరు గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్–3 పరిధిలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, తత్సమాన కేడర్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు గ్రేడ్–2 హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు మంగళవారం గుంటూరులోని ఆర్జేడీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో ఆరు, ప్రకాశం జిల్లాలో ఏడు, నెల్లూరు జిల్లాలో నాలుగు హెచ్ఎం పోస్టులను భర్తీ చేసేందుకు ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పిలిచారు. సీనియార్టీ జాబితాలో పొందుపర్చిన ఉపాధ్యాయులు తమ ధ్రువపత్రాలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో సీనియర్ హెచ్ఎంలు, ఉద్యోగులు ధ్రువపత్రాలను పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు సర్వీసు రిజిస్టర్, సామాజిక ధ్రువీకరణ పత్రం ఒరిజినల్, విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఉపాధ్యాయ బదిలీలతో ఏర్పడే ఖాళీల్లో సంబంధిత స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించనున్నారు. అర్హత లేని వారికి ప్రాధాన్యం గ్రేడ్–2 హెచ్ఎం పోస్టుల్లో ఉద్యోగోన్నతులు కల్పించేందుకు రూపొందించిన సీనియార్టీ జాబితాలో అర్హత లేని వారికి ముందు వరుసలో స్థానం కల్పించినట్లు పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. మెరిట్, రోస్టర్ను పాటించకుండా యథేచ్ఛగా అర్హత లేని వారికి ప్రాధాన్యతను ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. తద్వారా అర్హులైన ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని, ఆర్జేడీ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జెడ్పీ, మున్సిపల్ హెచ్ఎం పోస్టులకు... గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ, నగరపాలక సంస్థ, మున్సిపల్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ మంగళవారం పాత బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని జిల్లా పరీక్షా భవన్లో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక పర్యవేక్షణలో సీనియార్టీ జాబితాలో పొందుపర్చిన ఉపాధ్యాయులు విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయనున్న హెచ్ఎం పోస్టుల్లో జెడ్పీ–59, మున్సిపల్–8, కార్పొరేషన్–9 చొప్పున ఉన్నాయి. ఆయా పోస్టుల వారీగా అర్హులైన ఉపాధ్యాయులను ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. బదిలీల ప్రక్రియ అనంతరం ఖాళీల ఆధారంగా సంబంధిత స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించనున్నారు. సీనియర్ హెచ్ఎంలు, ఉద్యోగులు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో పాల్గొన్నారు. -
ముగిసిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు
గుంటూరుఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టు లు (సీబీటీ) మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 19న ప్రారంభమైన పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగాయి. ఈ నెల 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 22 కేంద్రాల పరిధిలో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 41,384 మంది విద్యార్థుల్లో 39,693 మంది హాజరయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే... ● గుంటూరు జిల్లాలోని 15 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న 25,731 మందిలో 24,607 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 21,590 మందికిగాను 20,765 మంది, అగ్రిల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షకు 4,141 మందికిగాను 3,842 మంది హాజరయ్యారు. ● పల్నాడు జిల్లాలోని 5 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసిన 11,142 మందికిగాను 10,746 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్కు 9,214 మందికిగాను 8,944 మంది, అగ్రిల్చర్, ఫార్మసీ పరీక్షకు 1,928 మందికిగా ను 1,802మంది విద్యార్థులు హాజరయ్యారు. ● బాపట్ల జిల్లాలో బాపట్ల, చీరాలలో ఏర్పాటు చేసిన 2 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న 4,511 మందికిగాను 4,340 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్కు 3,409 మందికిగాను 3,304; అగ్రిల్చర్, ఫార్మసీ పరీక్షకు 1,102 మందికిగాను 1,036 చొప్పున హాజరయ్యారు. -
కొండవీడుకోటలో ఉద్రిక్తత
యడ్లపాడు: పర్యాటక కొండవీడుకోట ప్రాంతంలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుంటూరు మిర్చి యార్డు సమీపంలోని సాయినగర్కు చెందిన లక్ష్మీప్రియ, భర్త ముని కోటేశ్వరరావు, కుమార్తె, మేనల్లుడు సోమవారం సాయంత్రం సందర్శనకు రాగా, కొండవద్ద ఉన్న స్ట్రైకర్ల (ఔట్సోర్సింగ్)తో వాగ్వాదం జరిగింది. స్ట్రైకర్ల సమాచారంతో గ్రామస్తులు సందర్శకుల కారును ఆపి దాడిచేసి, కారు అద్దాన్ని ధ్వంసం చేశారంటూ ఘటన స్థలం నుంచి బాధితులు పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం పోలీసులు ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారు. చిలకలూరిపేట రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణతో కలిసి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. కొత్తపాలెం ఘాట్రోడ్డుకు చేరుకొని అటవీశాఖ ఆధీనంలో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందితోపాటు గ్రామస్తులను కలిశారు. ఘటన సమయంలో విధుల్లో ఉన్న స్ట్రైకర్లు, అటవీశాఖ అధికారులు, గ్రామ పెద్దలతో మాట్లాడి ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితుల్ని తెలుసుకున్నారు. సమగ్ర విచారణ అనంతరంకేసులు నమోదు సోమవారం రాత్రి జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ తర్వాత కేసు నమోదు చేయనున్నట్లు సీఐ సుబ్బానాయుడు చెప్పారు. కొండవీడుకోటకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఘాట్రోడ్డుపై విధుల్లో ఉన్న స్ట్రైకర్లు యూనిఫారమ్, గుర్తింపు కార్డులు లేకుండా విధులు నిర్వహించడమే ప్రధానంగా సందర్శకుల్లో అపోహలు కలగడానికి దారితీసినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. స్ట్రైకర్లు సహనం పాటించకపోవడం, గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతోనే స్థానికులు కారును అడ్డగించి దాడికి పాల్పడినట్లు తెలిసిందని వివరించారు. సోమవారం రాత్రి యడ్లపాడు పోలీసులకు ఘటన సమాచారం అందగానే కానిస్టేబుల్ కొత్తపాలెం గ్రామానికి చేరుకునేలోపు వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. సందర్శకుల కారు నంబర్ ఆధారంగా వారి ఫోన్ నెంబర్లను సేకరించి, వ్యక్తులతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకుంటామన్నారు. మంగళవారం సాయంత్రం వరకు బాధితుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదన్నారు. సమగ్ర సమాచారం వెలుగులోకి వచ్చిన అనంతరం ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ బి సుబ్బానాయుడు స్పష్టం చేశారు. -
విజయకీలాద్రిపై సుదర్శన హోమం
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం సుదర్శన హోమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి వారి మంగళాశాసనాలతో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9 గంటల నుంచి సర్వ రక్షాకర సుదర్శన హోమాన్ని నిర్వహించామని తెలిపారు. అమావాస్య రోజున హోమం, పారాయణం, శాంతులు, దానాలు చేయడం ఎంతో ఉన్నత ఫలితాలను ఇస్తాయని వివరించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. ఆర్జిత సేవలకు డిమాండ్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వైశాఖ అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చనలో ఆలయ ఈవో శీనానాయక్ దంపతులతో పాటు 27 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఇక మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో నిర్వహించిన చండీహోమంలో 183 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఆలయ యాగశాలలో కూర్చునేందుకు వీలు లేకపోవడంతో యాగశాల ఆరు బయట కూర్చుని భక్తులు యాగంలో పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
కొరిశపాడు రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: కొరిశపాడు రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి అధికారులను ఆదేశించారు. యర్రం చినపోలిరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి 1.33 టీఎంసీలతో బాపట్లలో 20వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొరిశపాడు రిజర్వాయర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిందని, వాటికి సంబంధించిన పనులపై సంబంధిత ఇంజినీర్లను ఆరా తీశారు. రిజర్వాయర్ పనులలో మిగిలిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కలెక్టర్కు వివరించారు. కొరిశపాడు రిజర్వాయర్లో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కోసం ప్రతిపాదన పంపామని చెప్పారు. భూ సేకరణకు రూ.6.65 కోట్లు మంజూరు చేశారని ఈఈ చెప్పారు. ఆ మొత్తం ఫీడర్ కెనాల్ పనులకు అవసరమైన 41 ఎకరాల భూమి కొనుగోలుకు సరిపోతాయని అన్నారు. భూ సేకరణకు సంబంధించిన బకాయి బిల్లుల చెల్లింపునకు సత్వర చర్యలు తీసుకోవాలని గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ను కలెక్టర్ ఆదేశించారు. రిజర్వాయర్ పనుల కోసం ప్రభుత్వం రెండు కోట్ల నిధులు మంజూరు చేసిందని, ఈ పనులు చేసేందుకు తూర్పుపాలెం, పెద్దూరు గ్రామస్తులు నిరాకరిస్తున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి ఇంజినీర్లు తీసుకువచ్చారు. ఆయా గ్రామాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి రిజర్వాయర్ వలన కలిగే ప్రయోజనాలను వివరించి ఒప్పించాలని కలెక్టర్ చీరాల ఆర్డీఓను ఆదేశించారు. ముంపు ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించాలి కందుల ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ముంపు ప్రాంత ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ ముంపు ప్రాంతాల గురించి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆరా తీశారు. పూర్తిగా ఒక గ్రామం పాక్షికంగా ఐదు గ్రామాలు ముంపునకు గురయ్యాయని అధికారులు వివరించారు. ముంపు గ్రామ ప్రజలందరూ ఆయా గ్రామాలను ఖాళీ చేసి వారికి కేటాయించిన ప్రదేశానికి తరలి వెళ్లారా లేదా అనే విషయంపై కలెక్టర్ ఆరా తీశారు. వారిలో కొంతమంది అదే ప్రాంతంలో ఉన్నారని, మరి కొంతమంది కొత్త ప్రాంతానికి తరలివెళ్లారని అధికారులు చెప్పారు. కొత్త ప్రాంతాలకు తరలి వెళ్లిన ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇచ్చిన భూములపై పూర్తి హక్కు కల్పించే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ కందుల ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రత్యేక ఉప కలెక్టర్ను ఆదేశించారు. కార్యక్రమంలో కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు ప్రత్యేక ఉప కలెక్టర్ సీహెచ్ విజయ జ్యోతికుమారి, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్, గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు జె.శ్రీహరి, ఎం రవి, డీఈలు ఏఈలు పాల్గొన్నారు. పక్కా గృహాల నిర్మాణ లక్ష్యాలను చేరుకోవాలి పక్కా గృహాల నిర్మాణంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఆదేశించారు. పక్కా గృహ నిర్మాణాల లక్ష్యాలపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో మంగళవారం ఆయన కలెక్టరేట్ నుంచి సమీక్ష నిర్వహించారు. గృహ నిర్మాణాలలో పురోగతి కనిపించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 10వ తేదీన మెగా గృహప్రవేశాల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. బాపట్ల జిల్లాలోనూ నిర్మాణాలు పూర్తిచేసిన వాటిని ప్రారంభించాలన్నారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, మండల ప్రత్యేక అధికారులు, ఈఈలు, డీఈలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. దైనందిన జీవితంలో యోగా భాగం కావాలి మనిషి దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని, యోగా చేయడం వల్ల ఆరోగ్యంతోపాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. మంగళవారం ఉదయం యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా భావనారాయణస్వామి గుడి ఎదురు రథం బజారులో యోగా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో డీఆర్వో జి గంగాధర్గౌడ్, డీఆర్డిఏ పీడీ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి ఇన్చార్జి లవన్న, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, బాపట్ల తహసీల్దార్ సలీమా పాల్గొన్నారు. -
సారూ..డబ్బులు ఎప్పుడిస్తారు!
● ఏప్రిల్ 1న కొత్తగొల్లపాలెంలో చంద్రబాబు పింఛన్ల పంపిణీ ● సీఎం వస్తున్నారని మార్చి 28న రైతుల ధాన్యాన్ని తీసుకెళ్లిన అధికారులు ● ఏడు రైస్ మిల్లులకు మూడు వేల బస్తాల ధాన్యం తరలింపు ● రెండునెలలు దాటినా రైతుల ఖాతాలకు డబ్బులు జమచేయని ప్రభుత్వం ● కలెక్టరేట్ చుట్టూ అన్నదాతల ప్రదక్షిణ ● రేపు, మాపు అంటూ దాటవేస్తున్న అధికారులు ● రూ.50 లక్షలు ఆగిపోవడంతో లబోదిబోమంటున్న అన్నదాతలు సాక్షి ప్రతినిధి,బాపట్ల: ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనేది పాత సామెత. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అన్నదాతలను నిలువునా ముంచింది. బాబుగారు వస్తున్నారని కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని హడావుడిగా ఎత్తుకెళ్లారు. ధాన్యం తీసుకున్న 48 గంటల్లోనే డబ్బులు జమచేస్తామని చెప్పిన అధికారులు 1440 గంటలు (60 రోజులు) దాటుతున్నా ఒక్క రూపాయి కూడా జమచేయలేదు. ఇప్పటికి పలుమార్లు జిల్లా కలెక్టర్ను కలిసి మొరపెట్టుకున్నా వారి సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. అదిగో వేస్తాం ఇదిగో వేస్తామంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా డబ్బులు ఇవ్వాలని వేడుకుంటున్నారు. జరిగింది ఇలా.. ఏప్రిల్ ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చినగంజాం మండలం కొత్త గొల్లపాలెం గ్రామానికి వచ్చారు. అప్పటికే రైతులు హార్వెస్టింగ్ పూర్తిచేసుకొని కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకున్నారు. ఇళ్లల్లో వసతి లేక కొందరు ఆరిన ధాన్యాన్ని ఆరు బయటనే నిల్వ చేశారు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనలేదని రైతులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే.. మొట్టికాయలు పడతాయని భయపడ్డ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కలెక్టర్ వెంకట మురళి, అప్పటి జేసీ ప్రఖర్జైన్, పౌరసరఫరాల అధికారి విలియమ్స్లు ధాన్యాన్ని ఇళ్లలో దాచుకోవాలని రైతులకు సూచించారు. వసతి లేదని వారు నిరాకరించారు. బెంబేలెత్తిన అధికారులు హుటాహుటిన 60 మంది రైతులకు చెందిన 3,000 బస్తాల ధాన్యాన్ని తూకాలు వేచించి ట్రాక్టర్ల ద్వారా చీరాల, వేటపాలెం, ఈపురుపాలెంల పరిధిలోని రాధాకృష్ణ, చెక్కబాబు, మారుతీట్రేడర్స్, బాలాజీ, వసంతలక్ష్మి, సుబ్రమణ్యం ట్రేడర్స్, సత్యనారాయణ రైస్మిల్లులకు తరలించారు. 48 గంటల్లో మద్దతు ధర ప్రకారం బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని రైతులతో నమ్మబలికారు. ధాన్యం మిల్లులకు చేరడంతో కనీసం వారంలో డబ్బులు పడతాయని ఆశగా ఎదురు చూసిన రైతులకు నిరాశ తప్పలేదు. నెలలు దాటుతున్నా రైతుల ఖాతాల్లో పైసా జమకాలేదు. కొంపముంచిన అధికారుల హడావుడి రైతులు ధాన్యాన్ని అమ్మాలంటే వ్యవసాయ సహాయకులు ఇచ్చే ఈ క్రాప్ వివరాలతోపాటు షెడ్యూలింగ్, డేటా ఎంట్రీ, ఆర్ఎస్కె ఇచ్చే ట్రాక్ షీట్, జీపీఎస్ వెహికల్, ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్, మిల్లు నుంచి ఎక్నాలెడ్జిమెంట్లు అవసరం. ఇవన్నీ లేకుండా రైతు ధాన్యం కొనడం, డబ్బులు ఖాతాల్లో వేయడం జరగదు. సీఎం సభలో రైతులు గొడవచేయకూడదన్న అజెండాతో అధికారులు నిబంధన లు పాటించక ధాన్యాన్ని మిల్లులకు తరలించడంతో సాంకేతిక సమస్యలతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయలేని పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. 48 గంటల్లో ఇస్తామన్నారు... 1440 గంటలు గడిచిపోయింది.. లక్ష బస్తాల దిగుబడి.. కొన్నది మూడు వేల బస్తాలే.. నమ్మించి మోసగించారు పది ఎకరాల్లో వరి సాగు చేశాను. ముఖ్యమంత్రి వచ్చేముందు వరకు కల్లాల్లోనే ధాన్యం ఉంది. అధికారులు వచ్చి ధాన్యం మిల్లులకు తరలిస్తామన్నారు. ట్రాక్టర్ బాడుగలు, కాటా కూళ్లు మా చేతే పెట్టించారు. 200 బస్తాల ధాన్యం ఈపురిపాలెం చెక్కా బాబు మిల్లుకు తోలాం. తేమశాతం లేకపోయినా క్వింటాకు 12 కేజీలు కోత పెట్టారు. ప్రభుత్వం ధాన్యం డబ్బులు ఒక్క రూపాయి ఇవ్వలేదు. అధికారులు పలకడంలేదు. – వడ్లమూడి హరిబాబు, రైతు, కొత్తగొల్లపాలెం మాడబ్బులు మాకివ్వాలి నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. 112 బస్తాల ధాన్యం మిల్లులకు తోలాం. ఈ క్రాప్ వివరాలతోపాటు పద్ధతి ప్రకారం ధాన్యం కొనడంలేదని అనుమానించాం. అయినా కలెక్టర్, జిల్లా అధికారులు వచ్చి దగ్గరుండి ధాన్యం మిల్లులకు పంపిస్తుంటే డబ్బులు ఇస్తారని అనుకున్నాం. ఇంతలా మోసగిస్తారని అనుకోలేదు. రెండునెలలు దాటినా పైసా ఇవ్వలేదు. వెంటనే డబ్బులు ఇవ్వాలి. – ఎల్లవల సురేష్, రైతు, కొత్త గొల్లపాలెం ఆవులదొడ్డి కొత్తగొల్లపాలెం గ్రామంలో ఖరీఫ్ సీజన్లో 1500 ఎకరాల్లో వరి సాగుచేయగా ఎకరాకు 30 నుంచి 35 బస్తాల చొప్పున 45 వేల బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. రబీలో దాదాపు 2 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 60 వేల బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ఖరీఫ్లో 90 వేల మెట్రిక్ టన్నులు, రబీలో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి పర్యటన నాటికి కొత్త గొల్లపాలెంలో ఒక్క బస్తా ధాన్యాన్నికూడా కొనలేదు. ముఖ్యమంత్రి పర్యటన పుణ్యమాని 3 వేల బస్తాలైనా కొన్నారు. వాస్తవానికి ట్రాక్టర్ బాడుగలు, ధాన్యం కాటాల డబ్బులను సైతం మాతోనే పెట్టించారని రైతులు వడ్లమూడి హరిబాబు, మల్లయ్య, అంజయ్య, సోమయ్య, సురేష్, నాగరాజు, రమేష్, గోపి, వెంకటేశ్వర్లు, గడ్డం సూరి ‘సాక్షి’తో వాపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
పొగాకు రైతుపై ఎందుకీ పగ!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతులను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. గత నాలుగేళ్లు లాభాల బాటలో ఉన్న రైతులను ఒక్కసారిగా నష్టాల ఊబిలోకి నెట్టివేస్తోంది. పొగాకు సాగు కోసం ఎకరాకు రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేసిన రైతులు లాభాల సంగతి దేవుడెరుగు... కనీసం పెట్టుబడి అయినా వస్తే చాలనుకునే దుస్థితికి దిగజార్చింది.టుబాకో కంపెనీలు, వ్యాపారులు, దళారులు అంతా కలిసి రైతులను నిండా ముంచేస్తున్నా కూటమి ప్రభుత్వం ఏమీ పట్టనట్లే వ్యవహరిస్తోంది. సీజన్ ప్రారంభమై 75 రోజులైనా ఇప్పటికీ 20 శాతం పొగాకును కూడా రైతుల నుంచి కొనుగోలు చేయలేదు. అయినా కంపెనీలకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వం.. రైతుల వేదనను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడిలో సగం కూడా రావడం లేదు..⇒ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గతేడాది పొగాకుకు మంచి ధర పలికింది. కిలో రూ.366 వరకు అమ్ముడుపోయింది. దాంతో ఈ ఏడాది రైతులు అత్యధికంగా పొగాకు వైపు మొగ్గు చూపారు. కంపెనీలు ప్రోత్సాహించాయి.⇒ ప్రకాశం రీజియన్ (ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లా)లోని 11 వేలం కేంద్రాల పరిధిలో 30వేల మందికిపైగా రైతులు పొగాకు సాగు చేశారు. ఈ ఏడాది 68,500 హెక్టార్లలో సాగుకు అనుమతివ్వడంతోపాటు కంపెనీల ప్రోత్సాహంతో పరిమితికి మించి 88వేల హెక్టార్లలో సాగు చేశారు. ⇒ మార్చి 10న పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తొలిరోజు కిలో రూ.280 పలకడంతో పొగాకు రైతులు గట్టెక్కుతామని భావించారు. ⇒ కొద్దిరోజులకే రైతుల అంచనాలు తలకిందులయ్యాయి. విదేశాల నుంచి ఆర్డర్లు రావడంలేదని, నాణ్యతలేదని కంపెనీలు సాకులు చెప్పడం ప్రారంభించాయి. రైతులను మానసికంగా దెబ్బతీసి తక్కువ ధరలకు అమ్ముకునేలా వ్యూహం పన్నాయి. కూటమి ప్రభుత్వమూ పట్టించుకోలేదు. దాంతో ఇప్పుడు నాణ్యమైన పొగాకు ధర కిలో రూ.200 కన్నా తక్కువకు పడిపోయింది.కిలో రూ.280 దాటితేనే రైతులు గట్టెక్కుతారు⇒ రైతులు ఎకరాకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షలవరకు ఖర్చు చేశారు.⇒ ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల పంట దిగుబడి వచి్చంది. ఈ లెక్కన క్వింటాకు సగటున రూ.13వేల వరకు రైతులకు ఖర్చయింది.⇒ గ్రేడ్–1 పొగాకు క్వింటాకు రూ.12వేలు, గ్రేడ్–2 రకం క్వింటాకు రూ.6వేలు చొప్పున కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.⇒ ఈ రేటుకు పంటను అమ్ముకుంటే ఒక్కో రైతు కనీసం రూ.30వేల నుంచి రూ.60 వేల వరకు నష్టపోయే అవకాశం ఉంది.⇒ కంపెనీలు కూడబలుక్కుని ఏ రేటు అయితే మొదటి నుంచి చెబుతున్నాయో... వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా అదే రేటుకు పొగాకు కొనుగోలు చేస్తామని చిలక పలుకులు పలుకుతున్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ⇒ వేలం పాటలు మొదలై 75 రోజులు గడిచాయి. కేవలం 20శాతం పొగాకు మాత్రమే కొనుగోలు చేశారు. మిగిలిన పంటను ‘నో బిడ్’ అంటూ వెనక్కి పంపిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఆదుకున్న జగన్ ప్రభుత్వం రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.116 కోట్లను పొగాకు కొనుగోళ్లకు కేటాయించింది. పొగాకును కొనేందుకు మార్క్ఫెడ్ను రంగంలోకి దించింది. దాంతో మార్కెట్లో పోటీ వాతావరణం నెలకొంది. ఐదేళ్లూ మంచి ధరలు వచ్చాయి. రైతులు లాభపడ్డారు. గతేడాది రికార్డు స్థాయిలో కిలో అత్యధికంగా రూ.366కు అమ్ముడుపోయింది.జగన్ పర్యటన ప్రకటనతో పాలకుల బెంబేలు పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న ప్రకాశం జిల్లా పొదిలి వస్తున్నారన్న ప్రకటన ప్రభుత్వ పెద్దలను బెంబేలెత్తించింది. నిన్నమొన్నటి వరకు పొగాకు రైతుల కష్టాలను పట్టించుకోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆఘమేఘాల మీద బాపట్ల జిల్లా మార్టూరులో పర్యటించారు.వారికి రైతు సంఘాల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ‘పొగాకు రైతులను కలిసి మాట్లాడేందుకు జగన్ వస్తున్నారు... వెంటనే పొగాకు ధరలు పెంచండి. లేకపోతే మా ప్రభుత్వం పరువు పోతుంది..’ అంటూ మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని బట్టి వైఎస్ జగన్ పర్యటన గురించి అధికార పార్టీ నేతలు ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. -
ఉమ్మడి గుంటూరు జిల్లాల ఎంయూఎఫ్ ముఖ్యనేతల నిర్ణయం
ముస్లింల చైతన్యానికి రాజకీయ వేదిక తెనాలి: ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ (ఎంయూఎఫ్)ను బలోపేతం చేసుకుంటూ అనుబంధంగా రాజకీయ చైతన్య వేదికను ఏర్పాటు చేయాలని ఎంయూఎఫ్ ముఖ్యనేతల సమావేశం తీర్మానించింది. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంయూఎఫ్ ముఖ్యనేతల సమావేశం ఆదివారం స్థానిక చినరావూరులోని సీనియర్ నేత షేక్ ఖలీల్ అధ్యక్షతన జరిగింది. ప్రస్తుత రోజుల్లో ఎంయూఎఫ్ ఆవశ్యకత అనే అంశంపై జరిగిన సమావేశానికి ఆ సంస్థ అధ్యక్షుడు ఎండీ కలీం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గత 28 ఏళ్లుగా పార్లమెంట్ వ్యవస్థను విశ్వసిస్తూ, ప్రజాస్వామ్య లౌకికవాద విధానాలను అవలంభిస్తూ, ఎన్నో కార్యక్రమాలతో ముస్లింల న్యాయమైన హక్కులను సాధించేందుకు కృషిచేసినట్టు గుర్తుచేశారు. అధ్యక్షత వహించిన షేక్ ఖలీల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంయూఎఫ్ను గుంటూరు ఉమ్మడిజిల్లాలో బలోపేతం చేసేందుకు 17 నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటుకు ముఖ్యనేతలంతా కృషిచేయాలని కోరారు. ముస్లింలను రాజకీయంగా చైతన్యపరచాల్సిన అవసరం ఉన్నందున ముస్లిం యునైటెడ్ ఫ్రంట్కు అనుబంధంగా రాజకీయ చైతన్య వేదిక ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సమావేశంలో ప్రవేశపెట్టారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించటంతో తీర్మానం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులు పర్యటించి నియోజకవర్గస్థాయి సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో గుంటూరు జిల్లా ముఖ్య నాయకులు షేక్ కరీముల్లా (ప్రత్తిపాడు), ఎంఏ సాలార్ (వినుకొండ), షేక్ ఇబ్రహీం (పెదకూరపాడు), మెమన్ బాష, సయ్యద్ జాఫర్ (పొన్నూరు), సయ్యద్ జాకీర్ హుస్సేన్ (తాడికొండ ), సయ్యద్ ఆదమ్ సాహెబ్ (గుంటూరు వెస్ట్), సయ్యద్ గౌస్ బాషా, షేక్ వహీద్ (గుంటూరు ఈస్ట్)తోపాటు తెనాలి నియోజవర్గంలోని మండలాల నాయకులు పాల్గొన్నారు. నేడు రైతుల నిరసన దీక్ష చిలకలూరిపేట: నల్లబర్లీ పాగాకును వెంటనే కొనుగోలు చేయాలని మంగళవారం ఉదయం 10 గంటలకు ఐటీసీ కంపెనీ వద్ద రైతుల నిరసన దీక్ష నిర్వహిస్తున్నట్లు రైతు సంఘాల సమన్వయ సమితి సభ్యులు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సమక్షంలో పొగాకు కంపెనీలు అంగీకరించిన విధంగా కొనుగోళ్లు చేయకపోవడంతో ఈ దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. క్వింటా ఒక్కింటికి గత ఏడాది కొన్న రూ.15 వేలకు తక్కువ కాకుండా బర్లీ పొగాకు కంపెనీల చేత ప్రభుత్వం కొనిపించాలన్నారు. పొగాకు కంపెనీలు న్యాయమైన ధరకు కొనుగోలు చేయకపోతే మార్కెఫెడ్ ద్వారా కొని రైతులను ఆదుకోవాలన్నారు. పొగాకు బోర్డు పరిధిలోకి బర్లీ పొగాకును చేర్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం పొగాకు కంపెనీలకు పెద్దన్నగా వ్యవహరిస్తున్న ఐటీసీ కంపెనీ ముందు నిర్వహిస్తున్న నిరసన దీక్షలో రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.