బాలకోటేశ్వరస్వామి సన్నిధిలో... | - | Sakshi
Sakshi News home page

బాలకోటేశ్వరస్వామి సన్నిధిలో...

Feb 16 2026 7:28 AM | Updated on Feb 16 2026 7:28 AM

బాలకో

బాలకోటేశ్వరస్వామి సన్నిధిలో...

తెల్లవారుజాము నుంచే భక్తుల కోలాహలం కిక్కిరిసిన క్యూలైన్లు భారీగా ట్రాఫిక్‌ రద్దీ ఆకట్టుకున్న ప్రభలు

గోవాడకు పోటెత్తిన భక్తులు

వేమూరు: బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం గోవాడలోని బాలకోటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. బాలకోటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. భక్తులు ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్నారు. దీంతో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతి ఏర్పాటుచేశారు. క్యూలైన్లలో నిల్చున్న భక్తులకు వాటర్‌ ప్యాకెట్లను పంపిణీ చేశారు. సాయంత్రానికి భక్తుల రద్దీ మరింత పెరిగింది. పరిసర గ్రామాల రైతులు తమ పశువులను తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. భక్తులు పోటెత్తడంతో అదుపు చేసేందుకు పోలీసులు నానా వస్థలు పడ్డారు. బాల కోటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు ట్రాక్టర్లు వేసుకొని వచ్చారు. గతేడాది కన్నా ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

భారీగా పోలీసు బందోబస్తు

శివరాత్రిని పురస్కరించుకుని ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రత్యేకంగా పోలీసు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ సమస్య లేకుండా పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. రాత్రి సమయంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నట్లు తెనాలి డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. దేవస్థానం చుట్టు పక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ జరుపుతున్నట్లు తెలిపారు.

బాలకోటేశ్వరస్వామిని దర్శించుకున్న

ప్రముఖులు

బాలకోటేశ్వరస్వామి పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ గొట్టిపాటి పూర్ణకుమారి ఉన్నారు. పలు సంఘాల ఆధ్వర్యంలో అన్నదానం బాలకోటేశ్వరస్వామి దర్శనం కోసం పలు సంఘాలు అన్నదానం ఏర్పాటుచేశాయి. ఆర్యవైశ్యులు, పద్మశాలీ, కాకతీయ ధర్మ సత్రాల వద్ద భక్తులకు ఉచితంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. బాలకోటేశ్వరస్వామి దేవస్థానం పాలక వర్గం కూడా ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించింది.

ఆర్టీసీ ప్రత్యేక సేవలు

బాలకోటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక సేవలు అందించింది. బాపట్ల, రేపల్లె, తెనాలి, గుంటూరు డిపోల నుంచి గోవాడకు ప్రత్యేక బస్సులను నడిపారు. సమాచార కేంద్రాన్ని ఏర్పాటుచేసి భక్తులకు సేవలు అందించారు. బస్సుల వద్ద రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

వైద్య సేవలు

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భక్తులకు సేవలు అందించారు. ప్రత్యేకంగా కౌంటర్‌ను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు.

తరలివచ్చిన ప్రభలు

పరిసర గ్రామాల నుంచి గోవాడకు ప్రభలు తరలివచ్చాయి. ఉదయం నుంచి ప్రభల రాక మొదలైంది. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

భక్తుల రద్దీ కారణంగా స్వామి వారి దర్శనం కోసం పడిగాపులు పడ్డారు. దీంతో కొంత మంది మహిళా భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. పడిపోయిన భక్తుల గురించి వైద్య సిబ్బంది పట్టించుకున్న పాపాన పోలేదు. భక్తులే సహాయం చేయడంతో వారు తేరుకుని అనంతరం దర్శనానికి వెళ్లారు.

బాలకోటేశ్వరస్వామిని దర్శించుకుంటున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని

బాలకోటేశ్వరస్వామి దేవస్థానం వద్ద నిలిచిన వాహనాలు

బాలకోటేశ్వరస్వామి సన్నిధిలో...1
1/4

బాలకోటేశ్వరస్వామి సన్నిధిలో...

బాలకోటేశ్వరస్వామి సన్నిధిలో...2
2/4

బాలకోటేశ్వరస్వామి సన్నిధిలో...

బాలకోటేశ్వరస్వామి సన్నిధిలో...3
3/4

బాలకోటేశ్వరస్వామి సన్నిధిలో...

బాలకోటేశ్వరస్వామి సన్నిధిలో...4
4/4

బాలకోటేశ్వరస్వామి సన్నిధిలో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement