Amaravati
-
ఆదాయం పెంచాలి: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు పెంచడం ద్వారా ఆదాయం పెంచాలని, అప్పుడే తాను చెప్పిన విధంగా సంక్షేమ పథకాలను సజావుగా అమలు చేయగలనని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను కోరారు. ఆదాయం పెంచకుండా సంక్షేమం, అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఒక శాతం వృద్ధి రేటు పెంచితే అదనంగా రూ.15 వేల కోట్లు, 3 శాతమైతే రూ.45 వేల కోట్ల ఆదాయం వస్తుందని.. అప్పుడైతేనే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయగలనని పునరుద్ఘాటించారు. వచ్చే ఆర్ధిక ఏడాది 15 శాతం పైగా వృద్ధి రేటు సాధించేందుకు అనుగుణంగా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సును ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలలి, పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. మే నెలలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ద్వారా రూ.15 వేలు చొప్పున ఇస్తామని, స్కూల్స్ తెరిచేలోగా ఈ మొత్తాన్ని పంపిణీ చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద మూడు వాయిదాల్లో ఇస్తున్న మొత్తంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు, 5 వేలు, 4 వేలు చొప్పున మూడు వాయిదాల్లో రైతులకు ఇస్తామని తెలిపారు. (హామీ మేరకు రూ.6 వేలు+రూ.20 వేలు = రూ.26 వేలు ఇవ్వాలి. కానీ కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు మాత్రమే ఇస్తామని చెబుతున్నారు). మెగా డీఎస్సీ కింద 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎస్సీ వర్గీకరణతో సహా ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. స్కూల్స్ తెరిచే నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పారు. ఏప్రిల్లో మత్స్యకారుల జీవనోపాధికి రూ.20 వేలు ఇస్తామని, 2027లో పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు. కలెక్టర్లు సీఈవోలా పని చేయాలని, ఎప్పటికప్పుడు పనితీరుపై సమీక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏం చెప్పారంటే.. రెవిన్యూ సమస్యలపై దృష్టి పెట్టడం లేదు – రెవెన్యూ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కలెక్టర్లు వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కేవలం భూ సంబంధిత సమస్యలే 60–70 శాతం ఉన్నాయి. దీనిపై వర్క్షాప్ నిర్వహించాలి. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలిసిన కలెక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, మంత్రులు, నిపుణులు నెల రోజుల్లో నివేదికతో రావాలి. “వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్’ అనే నినాదంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. – ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగులకు రూ.1,030 కోట్లు విడుదల చేశాం. ఇప్పుడు మరో రూ.6,200 కోట్లు విడుదల చేస్తాం. రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరముంది. అన్ని వర్క్ ప్లేసుల్లో చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. అంతర పంటలతో అరకు కాఫీని ప్రోత్సహించాలి. – బీసీల్లో వడ్డెర కులస్తులకు క్వారీలు ఇచ్చేలా, మత్స్యకార సొసైటీలకు చెరువులు అప్పగించి చేపలు పెంచుకునేలా తోడ్పాటు ఇవ్వాలి. కల్లు గీత కార్మీకులకు కేటాయించిన వైన్ షాపులు దుర్వినియోగం కాకూడదు. – రైతులు ఇచి్చన భూములను తాకట్టు పెట్టడం, విక్రయించడం ద్వారా వచ్చే నిధులతోనే అమరావతి నిర్మాణం చేపడుతున్నాం. అనకాపల్లి వద్ద స్టీల్ ప్లాంట్, రామాయపట్నం కోసం భూములతో పాటు మిగతా ప్రాజెక్టులకు ఇదే నమూనాను అమలు చేయాలి. అనకాపల్లిలో టౌన్íÙప్, రామాయపట్నంలో మరో టౌన్ షిప్ వస్తాయి. – కలెక్టర్లు.. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన అన్ని అనుమతులను వచ్చేలా చూడాలి. సోలార్ రూఫ్ టాప్, సహజ సేద్యంను ముందుకు తీసుకెళ్లాలి. గ్రీన్ ఎనర్జీ, పర్యాటకం, వాట్సాప్ గవర్నెన్స్, పీ4 గేమ్ చేంజర్ కానున్నాయి. – వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి. పశువులకు మేతపై దృష్టి పెట్టాలి. వడగాడ్పుల వల్ల ఒక్క వ్యక్తి కూడా మృతి చెందకూడదు. కాల్ సెంటర్ నిర్వహించాలి. స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా పచ్చి మేత పెంపకానికి చర్యలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వలసలకు తావివ్వొద్దు. – మంత్రులు, శాఖాధిపతులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా, నియోజకవర్గ, మండల, సచివాలయాల స్ధాయిలో విజన్ ప్రణాళికలతో ముందుకు సాగాలి. శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీలతో కలిసి పని చేయాలి. సాంకేతికతను ఉపయోగించుకోవాలి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ప్రారంభంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో సీఎం పక్కనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కుర్చీ వేశారు. అయితే ఆయన రాకపోయినప్పటికీ ఆ చైర్ను అలాగే ఖాళీగా ఉంచి సదస్సు నిర్వహించారు. కాగా, 2025–26 ఆర్థిక ఏడాదిలో స్థూల ఉత్పత్తి లక్ష్యాలలో భాగంగా వృద్ధి శాతం 16, 17, 18 చొప్పున జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్దేశించారు. -
రోడ్డెక్కిన మిర్చి రైతులు
సాక్షి, ప్రతినిధి గుంటూరు/కొరిటెపాడు(గుంటూరు): కూటమి ప్రభుత్వ తీరుతో కడుపు మండిన మిర్చి రైతులు మరోసారి రోడ్డెక్కారు. ‘తేజ’ మిర్చి క్వింటా ధర దారుణంగా పడిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కష్టించి పండించిన మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. గుంటూరు మిర్చి యార్డు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇవే ధరలు కొనసాగితే పురుగు మందు తాగి చస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరీ ఇంత దారుణమా?గుంటూరు మిర్చి యార్డులో మంగళవారం ఉదయం తేజ రకం మిర్చి క్వింటా ధర కేవలం రూ.8 వేలు పలకడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఉదయం 9.30 ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున గుంటూరు మిర్చి యార్డు మెయిన్ గేట్ ఎదుట ఉన్న మెయిన్ రోడ్డుపైకి చేరుకొని ధర్నాకు దిగారు. మరీ ఇంత దారుణమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మిర్చి యార్డుకు చేరుకున్నారు. రైతులతో మాట్లాడి.. ధర్నాను విరమింపజేసే ప్రయత్నం చేశారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవతేజ, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక, యార్డు ఇన్చార్జి సుబ్రమణ్యం.. రైతుల వద్దకు వచ్చారు. ప్రభుత్వం క్వింటా మిర్చికి రూ.11,781 ధర ప్రకటించిందని.. అంతకన్నా తగ్గితే రైతుల ఖాతాల్లో మిగిలిన మొత్తాన్ని జమ చేస్తామని భార్గవ తేజ చెప్పారు. ప్రభుత్వం ప్రకటించాక.. ధరలు మరింత పతనం.. జేసీతో పలువురు రైతులు మాట్లాడుతూ.. గతేడాది తేజతో పాటు మిగిలిన రకాలకు క్వింటా ధర రూ.23 వేలు నుంచి రూ.27 వేల వరకు పలికిందని చెప్పారు. తాలు కాయలకు కూడా రూ.15 వేలు నుంచి రూ.18 వేలు వరకు ధర వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం క్వింటా మిర్చికి రూ.11,781 ధర ప్రకటించకముందు.. తేజ రకం రూ.13 వేలు నుంచి 15 వేలు వరకు పలికిందని తెలిపారు. ప్రభుత్వం ధర ప్రకటించాక.. నిలువు దోపిడీకి గురవుతున్నామని రైతులు మండిపడ్డారు. ఉదయం క్వింటా ధర రూ.9 వేలు పలికిందని చెబుతున్నారని.. మరో గంట తర్వాత రూ.8 వేలేనంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు 2 శాతం బదులు.. 6 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో, కూలీలకు డబ్బులెలా ఇవ్వాలో అర్థం కావడం లేదని వాపోయారు. జేసీ భార్గవ తేజ స్పందిస్తూ.. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి.. యార్డు నుంచి వెళ్లిపోయారు. దీంతో రైతులు మరోసారి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. ఇవే ధరలు కొనసాగితే పురుగు మందు తాగి ఇక్కడే చస్తామని హెచ్చరించారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పోలీసులు సర్దిచెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.కూలీలకు ఇచ్చేందుకూ సరిపోవు..నాలుగు ఎకరాల్లో తేజ రకం సాగు చేశా. గతేడాది ఎకరాకు సుమారు 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ.23 వేల నుంచి రూ.27 వేల వరకు వచ్చాయి. ఈ ఏడాది పెట్టుబడి కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు చేశా. ఇప్పుడు గుంటూరు యార్డుకు తేజ రకం మిర్చి 20 బస్తాలు తీసుకువచ్చా. క్వింటా రూ.8 వేలుకు అడుగుతున్నారు. ఈ డబ్బులు కూలీలకు కూడా సరిపోవు. ఇవే ధరలు కొనసాగితే ఆత్మహత్య చేసుకోవడమే మార్గం. – దారం ఎలీసారెడ్డి, దారంవారిపాలెం, ప్రకాశం జిల్లాధరలు ఇంత ఘోరంగా ఎప్పుడూ లేవు..గత 15 ఏళ్లుగా మిర్చి సాగు చేస్తున్నా. ఈసారి రెండు ఎకరాల్లో తేజ రకం వేశా. ఎకరాకు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేశా. తెగుళ్ల వల్ల దిగుబడి 15 క్వింటాళ్లు మించి వచ్చే పరిస్థితి లేదు. గుంటూరు యార్డుకు 40 బస్తాలు తీసుకువచ్చా. క్వింటా రూ.8 వేలకే అడుగుతున్నారు. మిర్చి ధరలు ఇంత ఘోరంగా ఎప్పుడూ లేవు. మా ఇంటిల్లిపాది నెలలు పాటు సేద్యం చేసినా.. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. ఇలాగైతే సాగు చేయలేం. – గొల్ల చిరంజీవి, పరమాదొడ్డి గ్రామం, కర్నూలు జిల్లా -
అన్నదాతకు సర్కారే శాపం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపంగా మారింది. ప్రకృతి వైపరీత్యాలు, కరువు దెబ్బతీస్తున్నా, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో 2024–25 ఖరీఫ్, రబీ సీజన్లలో వ్యవసాయమే అస్తవ్యస్తమైపోయింది. రైతులు తీవ్ర ఒడిదొడుకుల మధ్య పంటలు సాగు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరకు రైతులు తీవ్ర నష్టాలపాలయ్యారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్ సాగు ఆలశ్యం కాగా, ఆ ప్రభావం రబీ పైనా పడింది. రబీ సాగు కోసం ముందస్తు ఏర్పాట్లు చేయడంలో విఫలమైన ప్రభుత్వం రెండో పంటకు నీరివ్వడంలోనూ వైఫల్యం చెందింది. ప్రభుత్వ నిర్వాకం, పెట్టుబడి సాయం అందకపోవడం, అదనుకు విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు పడరాని పాట్లుపడ్డారు. ఈ తిప్పలన్నీ పడలేక చాలా మంది రైతులు వారి పొలాల్లో సాగే చేయకుండా వదిలేశారు. రెండు సీజన్లలో కలిపి 1.51 కోట్ల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యం కాగా, 1.24 కోట్ల ఎకరాల్లోనే సాగయ్యాయి. ఖరీఫ్లో 16 లక్షల ఎకరాలు.. రబీలో 11 లక్షల ఎకరాల్లో.. మొత్తంగా 27 లక్షల ఎకరాల్లో సాగే లేకుండా సీజన్ ముగిసింది. ఖరీఫ్లో వరుస వైపరీత్యాల బారిన పడి 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 6 లక్షల ఎకరాలు కరువు బారిన పడ్డాయి. అయినా ప్రభుత్వం నుంచి రైతులకు కనీస మద్దతు కూడా దక్కలేదు. దీంతో రైతులు కుదేలైపోయారు. దాని ప్రభావం రబీ పైనా పడింది. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. లక్షలాది ఎకరాల్లో విత్తనం నాటడానికి కూడా రైతులు సాహసించలేకపోయారు. రబీ సాగు లక్ష్యం 57.65 లక్షల ఎకరాలు కాగా.. సాగైన విస్తీర్ణం 46.40 లక్షల ఎకరాలే. అంటే 11.25 లక్షల ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకు రాలేదు. దాళ్వాలో వరి సాగు లక్ష్యం 20 లక్షల ఎకరాలు కాగా సాగైంది 16.52 లక్షల ఎకరాల్లోనే. అంటే 3.50 లక్షల ఎకరాలు ఖాళీగా ఉండిపోయాయి. సాధారణంగా రెండో పంటలో వరి కంటే ఎక్కువగా అపరాలు సాగవుతాయి. ఈసారి అపరాల సాగు లక్ష్యం 23.50 లక్షల ఎకరాలు కాగా, సాగైన విస్తీర్ణం 16.72 లక్షల ఎకరాలే. అంటే దాదాపు 6.78 లక్షల ఎకరాలు ఖాళీగా ఉండి పోయాయి. వీటిలో ప్రధానంగా శనగలు 11.17 లక్షల ఎకరాలకు గాను, 7.5 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. మినుము సాగు లక్ష్యం 8.50 లక్షల ఎకరాలు కాగా, 6.95 లక్షల ఎకరాల్లో పంట వేశారు. గతేడాది రికార్డు స్థాయిలో సాగైన మొక్కజొన్న కూడా ఈసారి తగ్గిపోయింది. ఈ ఏడాది మొక్కజొన్న సాగు లక్ష్యం 5.27 లక్షల ఎకరాలకుగాను 4.55 లక్షల ఎకరాలే సాగైంది. ఇలా పంటలన్నీ లక్ష్యానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయాయి. ఇప్పటికీ రబీ పంటల సాగు చివరి దశకు చేరుకున్నా కొన్ని ప్రాంతాల్లో సాగు నీరందక పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సీజన్ ఆరంభంలోనే ఫెంగల్ తుపాన్ దెబ్బతీయగా, ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు రైతులను దెబ్బతీశాయి. దీనికి తోడు సాగు నీటి నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట పెను శాపంగా మారింది. -
మామిడి గుజ్జు.. ఎగుమతులు నుజ్జు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: విదేశాలకు మామిడి గుజ్జు (పల్ప్) ఎగుమతులు క్షీణించాయి. గడచిన సీజన్లో ఒక్క ఏపీ నుంనే 3 లక్షల టన్నుల మామిడి గుజ్జు ఎగుమతులు జరుగుతాయని అంచనా వేయగా.. ఊహించని పరిస్థితులు తలెత్తడంతో 2.75 లక్షల టన్నుల మేర నిల్వలు ఎగుమతి కాకుండా నిలిచిపోయింది. వివిధ దేశాల్లో యుద్ధాలు. ఆర్థిక మాంద్యం, పౌర అశాంతి ప్రభావంతో దేశం నుంచి ఎగుమతులు పడిపోయాయి. ఈ ఏడాది కూడా పరిస్థితులు మరింత తీవ్రం కావడంతో ఎగుమతులు మరింత క్షీణించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితి మామిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాది అకాల వర్షాలు, వరుస వైపరీత్యాలతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడం, నాణ్యత లోపించడం వంటి కారణాలతో ధర లేక మామిడి రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. అదే సమయంలో మామిడి గుజ్జు ఎగుమతులు నిలిచిపోవడం రైతులతో పాటు ఎగుమతి దారులకు ఆశనిపాతంగా మారింది. ఆ ప్రభావం ఈసారి మార్కెట్పై మరింతగా పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ నుంచి ఏటా 2.5 లక్షల టన్నులకు పైగా ఎగుమతి రాష్ట్రంలో 9.97 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉండగా.. ఈ ఏడాది 45 లక్షల టన్నులకుపైగా దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాగయ్యే పంటలో 65–70 శాతం పంట తోతాపురి రకమే. తోతాపురి మామిడిని గుజ్జు రూపంలో యూరప్, గల్ఫ్, ఉక్రెయిన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. రాష్ట్రం నుంచి ఏటా 2.5 లక్షల టన్నులకు పైగా మామిడి గుజ్జు ఎగుమతి అవుతుంటుంది. 2019–24 మధ్య 8.5 లక్షల టన్నుల పల్ప్ విదేశాలకు ఎగుమతి చేశారు. అదేవిధంగా 550 టన్నులకుపైగా మామిడి పండ్లు సైతం విదేశాలకు ఎగుమతి అయ్యాయి. రైతులు, ఎగుమతిదారులకు ఇది కష్టకాలమే 2024–25లో ప్రపంచ దేశాల్లో యుద్ధాలు, ఆర్థిక మాంద్యం వంటి కారణాల వల్ల దేశం నుంచి మామిడి గుజ్జుతో పాటు పండ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో విదేశాల నుంచి ఆర్డర్స్ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది తోతాపురి రకం టన్ను రూ.25 వేల నుంచి రూ.30 వేలు ధర పలకగా, ఈ ఏడాది టన్నుకు రూ.10 వేల నుంచి రూ.15వేలకు మించి పలకకపోవచ్చని చెబుతున్నారు. వాతావరణ మార్పులు, చీడపీడలు, కొత్తరకం పురుగులు మామిడిపై దాడి చేయడంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గుజ్జు ఎగుమతులు కాకపోతే ధరలు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు రైతులను మరింత కలవరానికి గురి చేస్తున్నాయి.పేరుకున్న రూ.1,750 కోట్ల విలువైన గుజ్జు నిల్వలు మామిడి గుజ్జు పరిశ్రమలన్నీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. మొత్తంగా 47 ఫ్యాక్టరీలు ఉండగా.. వాటి సామర్థ్యం 8 లక్షల టన్నులు. గతేడాది 3.50 లక్షల టన్నులకు పైగా గుజ్జు ఉత్పత్తి అయ్యింది. ఇందులో స్థానిక వినియోగం పోగా.. ఇంకా 2.75 లక్షల టన్నుల నిల్వలు పేరుకుపోయాయి. వీటి విలువ రూ.1,750 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సాధారణంగా ఏటా 10–20 శాతం వరకు గుజ్జు నిల్వలు మిగులు ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి గుజ్జు ఎగుమతులు ప్రారంభం కాగా.. గతేడాది పేరుకుపోయిన నిల్వల్లో కేవలం 10 శాతం మాత్రమే ఎగుమతి అయింది. మే నాటికి పాత నిల్వలు అమ్ముడవకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతామని వ్యాపారులు చెబుతున్నారు. తమకు ఆర్థికంగా చేయూత ఇవ్వాలని చిత్తూరు జిల్లా ఫ్రూట్ ప్రోసెసర్స్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయింది.ఈసారి కూడా మామిడి కష్టమే మాకు 10 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఈసారి పూత ఆలస్యమైంది. వాతావరణ ప్రభావంతో పిందె సక్రమంగా రాలేదు. తెగుళ్లు, కొత్త రకం పురుగులు పంటను పట్టి పీడిస్తున్నాయి. ఎండ తీవ్రత అధికం కావడంతో పిందె ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. ఇప్పటివరకు 3 సార్లు మందుల పిచికారీ చేశా. ఖర్చులు విపరీతంగా పెరిగాయి. మరోవైపు మామిడి గుజ్జు నిల్వలు ఫ్యాక్టరీల్లో పేరుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు దక్కుతాయో లేదో అనుమానంగా ఉంది. – పద్మనాభరెడ్డి, ఎర్రచేను, చిత్తూరు జిల్లా అయోమయంలో ఉన్నాం మహరాష్ట్ర వెళ్లి ఎగుమతిదారులతో మాట్లాడాం. వాళ్లు ఏమాత్రం స్పందించడం లేదు. మామిడి గుజ్జు నిల్వలు అమ్ముడుపోయే పరిస్థితి కనిపించడం లేదు. యుద్ధాలు, ట్రాన్్పపోర్ట్ చార్జీలు పరిశ్రమదారులను నిండా ముంచుతున్నాయి. అప్పులు నిలిచిపోయాయి. ఈసారి ఎలా ఉంటుందో అర్థంగాక అయోమయంలో ఉన్నాం. జ్యూస్ తయారీ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఉత్పత్తులపై దృష్టి సారిస్తున్నాయి. గతంలో జ్యూస్లో 80 శాతం గుజ్జు కలిపేవారు. ఇప్పుడు 5 శాతమే గుజ్జు కలుస్తోంది. ఇది కూడా పరిశ్రమదారులను దెబ్బతీస్తోంది. వీటిపై ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలి. – తలపులపల్లి బాబురెడ్డి, గుజ్జు పరిశ్రమ యజమాని మామిడి గుజ్జు పరిశ్రమను ఆదుకోవాలి: ఏఐఎఫ్పీఏ తీవ్ర సంక్షోభంలో ఉన్న మామిడి పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలని, చిత్తూరులో మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసింగ్ అసోసియేషన్ (ఏఐఎఫ్పీఏ) కోరింది. ఈ మేరకు అసోసియేషన్ సౌత్ జోన్ చైర్మన్ కట్టమంచి గోవర్ధన్ బాబీ చిత్తూరు జిల్లా ఫ్రూట్ ప్రాసెసింగ్ ఫెడరేషన్తో కలిసి సీఎం చంద్రబాబుకు, కేంద్రానికి లేఖ రాశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పల్ప్ ఇండస్ట్రీని ఆదుకునేందుకు రుణాల వసూళ్లను ఆరునెలలు వాయిదా వేసేలా బ్యాంకర్లకు ఆదేశాలివ్వాలని కోరారు. మామిడి గుజ్జు నిల్వలు అమ్ముడయ్యేందుకు వీలుగా ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో మామిడి గుజ్జు పరిశ్రమల సమాఖ్యకు స్టాల్స్ కేటాయించాలని, మధ్యాహ్న భోజనం మెనూలో మామిడి ఉత్పత్తులు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. పల్ప్ పరిశ్రమలకు పెండింగ్ సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని కోరారు. -
సీఐడీ నమోదుచేసిన కేసు కొట్టేయండి
సాక్షి, అమరావతి: కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో నిందితులైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులతో ప్రభుత్వం కుమ్మక్కైందని, అందువల్లే ఈ కేసులో మరో నిందితుడైన యర్రం విక్రాంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విక్రాంత్రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది టి. నిరంజన్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు. వారితో ప్రభుత్వం కుమ్మక్కయినందునే వారు ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేయలేదని తెలిపారు. విక్రాంత్రెడ్డిపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టును కోరారు. తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాలను అరబిందో సంస్థ కొన్నదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడు, పోర్టు ప్రమోటర్ కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన కేసులో యర్రం విక్రాంత్ రెడ్డికి హైకోర్టు గతంలో ముందస్తు బెయిలు మంజూరు చేసింది. కాగా, ఈ కేసును కొట్టేయాలని కోరుతూ విక్రాంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం తేలేంత వరకు ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ మంగళవారం విచారణ జరిపారు. విక్రాంత్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. వాస్తవానికి వాటాల బదిలీ విషయంలో ఫిర్యాదుదారు కేవీ రావు, అరబిందో గ్రూపునకు మధ్య రాజీ కుదిరిందని, దీనిపై పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయని తెలిపారు. ఈ వాటాల బదిలీతో విక్రాంత్రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయినా దర్యాప్తు పేరుతో పిటిషనర్ను సీఐడీ అధికారులు వేధింపులకు గురి చేసే అవకాశం ఉందని చెప్పారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను బహిర్గతం చేస్తూ పత్రికల్లో కథనాలు కూడా రాయిస్తున్నారని వివరించారు. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు కాకినాడ పోర్టు యజమాని కేవీ రావుకు రూ.25 లక్షలు ఖర్చులు విధించాలని ఆయన కోర్టును కోరారు. -
నాటి స్టార్టప్ వెలుగులకు కితాబు
సాక్షి, అమరావతి : గత ఐదేళ్లలో స్టార్టప్ రంగంలో రాష్ట్రం వేగంగా దూసుకుపోయిన విధానాన్ని నారా లోకేశ్ మంత్రిగా నిర్వహిస్తున్న ఐటీ శాఖ తాజాగా విడుదల చేసిన స్టార్టప్ పాలసీలో ప్రముఖంగా ప్రస్తావించింది. వచ్చే ఐదేళ్లలోనూ స్టార్టప్లను ప్రోత్సహించేలా ఏపీ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 4.0ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గత ఐదేళ్లలో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన స్టార్టప్లలో 50 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే ఏర్పాటయ్యాయని.. రాష్ట్రంలో మొత్తం 6,600 స్టార్టప్స్ ఏర్పాటు కాగా, అందులో 2,400 స్టార్టప్లకు డీపీఐఐటీ గుర్తింపు లభించిందని కూటమి ప్రభుత్వం విడుదల చేసిన పాలసీలో పేర్కొంది. అంతే కాకుండా డీపీఐఐటీ గుర్తించిన స్టార్టప్లలో 1,159 స్టార్టప్లు మహిళల నేతృత్వంలో ఉన్నాయని చెప్పింది. ఇది రాష్ట్రంలో పారిశ్రామికీకరణ అన్ని వర్గాల్లో ఎంత బలంగా విస్తరించిందన్న విషయాన్ని ధృవీకరిస్తోందని పేర్కొంది. డీపీఐఐటీ విడుదల చేసిన 2022 స్టార్టప్ ర్యాంకుల్లో రాష్ట్రం “లీడర్’షిప్ హోదా దక్కించుకుందని, వరుసగా మూడేళ్లుగా సులభతర వాణిజ్యంలో మొదటి ర్యాంకును పొందుతూ వ్యాపారానికి ఏపీ అత్యంత అనువైన రాష్ట్రంగా నిలిచిందని ప్రశంసించింది. రాష్ట్రంలో 46 ఇంక్యుబేటర్స్ ఉండటమే కాకుండా కీలకమైన ఐవోటీ–ఏఐ, ఇండస్ట్రీ 4.0, బయోటెక్, మెడికల్ డివైసెస్, మారిటైమ్ అండ్ షిప్పింగ్, రూరల్ ఇన్నోవేషన్ సెంటర్ పేరుతో ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది. ఇదీ స్టార్టప్ పాలసీ 4.0 లక్ష్యం » వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 20 వేల స్టార్టప్ల ఏర్పాటు లక్ష్యంగా ఏపీ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 4.0 విడుదల. »హబ్ అండ్ స్పోక్ మోడల్లో స్టార్టప్ ఎకో సిస్టమ్ ఏర్పాటు ద్వారా లక్షల మందికి ఉపాధి. »కొత్తగా 10 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు, 20 సూని కార్నర్స్, 10 యూనీ కార్నర్స్ ఏర్పాటు. »కీలకమైన 15 డిపార్ట్మెంట్లలో స్టార్టప్లకు ప్రోత్సాహం. రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపు. »అమరావతి కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) ఏర్పాటు.. దీనితో అనుసంధానం చేస్తూ ఐదు ప్రాంతాల్లో స్పోక్ సెంటర్లు. ఐదేళ్లల్లో స్టార్టప్లకు నిధులు సమకూర్చేలా ఆర్టీఐహెచ్కు రూ.250 కోట్లు, ప్రతి స్పోక్ సెంటర్కు రూ.100 కోట్ల గ్రాంట్ బడ్జెట్. »ఎంపికైన ప్రతి కాన్సెప్్టకు రూ.2 లక్షల ప్రారంభ గ్రాంట్.. దశల వారీగా రూ.15 లక్షల వరకు.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకైతే రూ.20 లక్షల వరకు గ్రాంట్.. 8 శాతం వడ్డీ రాయితీ, రూ.50 లక్షల చొప్పున సీడ్ ఫండింగ్, మార్కెటింగ్ సపోర్ట్.. »ఈవెంట్స్కు వెళ్లినప్పుడు అయ్యే ఖర్చులో 75 శాతం.. గరిష్టంగా రూ.3 లక్షలు అందజేత. ఐదేళ్లు ఎస్జీఎస్టీపై 100 శాతం రీయింబర్స్మెంట్. »వేగంగా అనుమతులు మంజూరు చేసేలా ఏపీ స్టార్టప్ వన్ పోర్టల్ ఏర్పాటు. సార్టప్ పాలసీ సేŠట్ట్ నోడల్ ఆఫీసర్గా వ్యవహరించనున్న ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ.. త్వరలోనే ఆపరేషనల్ గైడ్లైన్స్ విడుదల. -
నామినేటెడ్ పదవులపై మీనమేషాలు
సాక్షి, అమరావతి: కార్యకర్తలతో ఎన్నికల్లో పని చేయించుకొని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి పదవులిచ్చే విషయంలో నానా తిప్పలు పెట్టడం సీఎం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య. అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ప్రధానమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇంకా సాగుతూనే ఉంది. ఇక జిల్లా, నియోజకవర్గస్థాయి పోస్టులు, దేవాలయాల ట్రస్టు బోర్డుల నియామకంలో ఇప్పటికీ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. రాష్ట్రవ్యాప్తంగా 200కి పైగా మార్కెట్ యార్డు చైర్మన్లు, వెయ్యికి పైగా దేవస్థానం ట్రస్టు బోర్డులు, పలు పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్ల నియామకంపై చంద్రబాబు సాగతీత వైఖరే అవలంబిస్తున్నారు. ఈ పదవుల కోసం కార్యకర్తలు ఎంతగా ఎదురు చూస్తున్నా త్వరితగతిన భర్తీ చేయకపోగా.. వాటి భర్తీలో జాప్యాన్ని ఎమ్మెల్యేలపై నెట్టేయడం అందరిలో అసహనం కలిగిస్తోంది. పదవుల కోసం విజ్ఞాపనలు ఇస్తున్న క్యాడర్ పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడిన తమకు ఈ పదవుల్లో అవకాశం ఇవ్వాలని మధ్యస్థాయి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నారు. నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతలు పట్టించుకోకపోవడంతో చాలామంది మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వచ్చి చంద్రబాబు, లోకేశ్ను కలిసి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. టీడీపీ కార్యాలయంలో వారంలో నాలుగైదు రోజులు నిర్వహించే విజ్ఞప్తుల స్వీకరణలో సగం మంది పదవుల కోసం వచ్చిన వారే ఉంటున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు పదవులు అందరికీ ఇవ్వలేమని పరోక్షంగా చెబుతున్నారు. పైపెచ్చు ఏ పదవైనా రెండేళ్లేనని, ఆ తర్వాత వేరే వారికి ఇస్తామని చెబుతున్నారు.వీటితోపాటు పదవుల భర్తీకి ఎమ్మెల్యేలు సహకరించడంలేదని, పార్టీ కోసం పనిచేసిన వారి పేర్లను సిఫారసు చేయమని అడిగితే వారు పట్టించుకోవడంలేదని ఇటీవల ఒక సమావేశంలో చెప్పారు. దీనిపై పలువురు ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క తమను పేర్లు అడుగుతూనే, మరోపక్క వారికి ఇష్టం వచ్చిన వారి పేర్లను వారే రాసేసుకుంటున్నారని చెబుతున్నారు. ఈమాత్రం దానికి తమను పేర్లు అడగడం ఎందుకని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఎమ్మెల్యేల బేరసారాలతో మరింత ఆలస్యం అనేక చోట్ల ఎమ్మెల్యేలు పదవులను బేరం పెట్టినట్టు టీడీపీ శ్రేణుల్లోనే ప్రచారం జరుగుతోంది. తమ కోసం పని చేసిన వారికి పదవులు ఇచ్చేందుకు సైతం ముడుపులు అడుగుతుండడం, వారు ఇవ్వలేమని చెబుతుండడంతో ఎవరి పేర్లనూ అధిష్టానానికి సిఫారసు చేయడంలేదనే చర్చ జరుగుతోంది. ఇలాంటి వాళ్లను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నామినేటెడ్ పదవుల భర్తీ చేయడంలో తన తప్పు లేదంటూ ఎమ్మెల్యేలపై నెపం నెట్టివేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బేరాలు పెట్టిన ఎమ్మెల్యేలను నియంత్రించి, కార్యకర్తలకు పదవులు ఇవ్వాల్సిన సీఎం.. ఎమ్మెల్యేలు సహకరించడం లేదంటూ తప్పించుకోవడాన్ని పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యే, ఎంపీల మధ్య సమన్వయం లేకపోవడం, ముడుపుల లెక్కలు తేలకపోవడం వల్లే ఈ పదవుల భర్తీలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. మరోపక్క టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పదవుల పంపకంపైనా ఏకాభిప్రాయం కుదరడంలేదని చెబుతున్నారు. టీడీపీకి 80 శాతం పోస్టులు, జనసేన, బీజేపీకి కలిపి 20 శాతం కేటాయించాలని మొదట్లో ఒప్పందం జరిగింది. అయితే ఇది సరిగ్గా అమలు కావడంలేదని క్షేత్ర స్థాయిలో జనసేన, బీజేపీ నేతలు వాపోతున్నారు. దీంతో అటు టీడీపీ, ఇటు జనసేన, బీజేపీ కేడర్లోనూ పదవుల పంపకంపై ఆందోళన నెలకొంది. -
అడుగుకు కమీషన్.. 'రూపాయి పావలా'
సాక్షి, నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేమో ఓ వైపు సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ అమలు చేస్తానని చెబుతూ.. మరోవైపు మద్యం దందా, ఇరిగేషన్ పనుల్లో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట సొంతంగా సంపద సృష్టించుకుంటుంటే, టీడీపీ ప్రజాప్రతినిధులు సైతం రెండడుగులు ముందుకేసి సొంతానికి సంపద సృష్టించుకోవడానికి వినూత్న మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఆక్రమ ఆదాయ మార్గాలను అన్వేషించడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పరిస్థితి మరీ చిల్లరగా ఉంది. కిలో చికెన్కు రూ.10 మామూళ్లు ఇవ్వాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ఇటీవల హుకుం జారీ చేసిన విషయంపై కలకలం సద్దుమణగక ముందే ఈ దంపతుల కన్ను గోడౌన్లపై పడింది. చదరపు అడుగుకు రూపాయి పావలా కమీషన్ ఇచ్చి తీరాల్సిందేనని స్వయంగా ఎమ్మెల్యేనే గోడౌన్ల యజమానులకు అల్టిమేటం జారీ చేశారు. సొంత పార్టీ నేతలైనా సరే కమీషన్ ఇచ్చిన తర్వాతే గోడౌన్ లీజుకు పర్మిషన్ ఇస్తామని తెగేసి చెప్పడంతో టీడీపీ నాయకులు సైతం గగ్గోలు పెడుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు సుమారు 14 వేల ఎకరాల్లో పొగాకు పంట సాగు చేశారు. ఇప్పటికే కోతలు పూర్తయ్యాయి. రైతుల వద్ద నుంచి కొన్న పొగాకును నిల్వ చేసుకునేందుకు పొగాకు కంపెనీలకు ఆళ్లగడ్డ, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, ఆర్.జమ్ములదిన్నెలోని గోడౌన్లు అవసరమవుతాయి. సుమారు 2.50 లక్షల చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. ఒక్కో చదరపు అడుగుకు నెలకు రూ.5.25 చొప్పున ఇస్తామని పొగాకు కంపెనీలు యజమానులకు ఆఫర్ ఇచ్చాయి. మూడేళ్ల పాటు అగ్రిమెంట్ ఇవ్వాలని చెప్పడంతో యజమానులంతా సంతోషపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సదరు ప్రజాప్రతినిధి ప్రతి అడుగుకు తనకు రూపాయి పావలా కమీషన్ ఇచ్చి తీరాల్సిందేనని ఖరాకండిగా చెప్పేశారు. కమీషన్ ఇవ్వకుంటే అగ్రిమెంట్ ఎలా చేసుకుంటారో చూస్తానని హెచ్చరించినట్లు యజమానులు వాపోతున్నారు. తమకు పెద్దగా మిగిలేది ఉండదని మొరపెట్టుకున్నా వినిపించుకోలేదని సమాచారం. దీంతో చేసేది లేక ఆమె గారు అడిగిన మేరకు అడుగుకు “రూపాయి పావలా’ కమీషన్కు ఓకే చెప్పారు. ఈ లెక్కన ప్రతి నెలా రూ.3.12 లక్షల మేర ఎమ్మెల్యేకు ముట్టజెప్పాల్సి ఉంటుంది. ఈ విషయం స్థానికంగా రైతులందరికీ తెలియడంతో ఇంత చిల్లర వ్యవహారాలు ఎక్కడా ఉండవని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
హద్దు మీరొద్దు.. పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
పోలీసుల తీరు చూస్తుంటే మాకు రక్తపోటు (బీపీ) పెరిగిపోతోంది. చాలా క్యాజువల్గా కేసులు పెడుతున్నారు. వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు. ఏదో ఒక కేసు నమోదు చేయాలి. ఎవరో ఒకరిని అరెస్టు చేయాలనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. -హైకోర్టు ధర్మాసనం తప్పు చేస్తే.. కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితేనే సమస్య. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. మీరేం చేస్తున్నా చూస్తూ ఉండాలంటారా? మేమేం చేయలేం..! మీరు మరో మార్గం చూసుకోండని పిటిషనర్లకు చెప్పమంటారా? పోలీసులకు సొంత నిబంధనలతో కూడిన మాన్యువల్ ఉంది. దాన్ని కూడా ఫాలో కావడం లేదు. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదు.. మా మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉంది. పోలీసులు ఏది దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారు. వారు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసుల ‘అతి’పై హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. పెద్దల మెప్పు కోసం పనిచేస్తే, సమస్య వచ్చినప్పుడు వాళ్లొచ్చి మిమ్మల్ని కాపాడరని వ్యాఖ్యానించింది. చట్టం, నిబంధనలు, పోలీసు మాన్యువల్కు లోబడి పని చేయాల్సిందేనని స్పష్టం చేసింది. పోలీసులు తమ పరిధులు గుర్తెరిగి విధులు నిర్వర్తించాలంది. పోలీసులు ఎలా పనిచేస్తున్నారో తమకు బాగా తెలుసని పేర్కొంది. అలాగే తాము ఏమీ చేయలేమని అనుకోవద్దని హెచ్చరించింది. ఏం చేస్తున్నా కూడా చూడనట్లుగా తమను (కోర్టు) కళ్లు మూసుకుని ఉండాలని భావిస్తున్నారని, అది ఎంత మాత్రం సాధ్యం కాదని తెలిపింది. పోలీసుల తీరు చూస్తుంటే తమకు రక్తపోటు (బీపీ) పెరిగిపోతోందంటూ వ్యాఖ్యానించింది. చాలా క్యాజువల్గా కేసులు పెట్టేస్తున్నారని, వాంగ్మూలాలను సృష్టిస్తున్నారని పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి వాటిని తాము నమ్మాలని పోలీసులు అనుకుంటున్నారని పేర్కొంది. ఏదో ఒక కేసు నమోదు చేయాలి.. ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలనే రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడింది. ప్రభుత్వాన్ని డ్రామా రూపంలో వ్యంగ్యంగా విమర్శించినందుకు కేసు పెడితే.. ప్రతి సినిమా హీరోను, ప్రతి నటుడినీ అరెస్ట్ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం తప్పా? దానిపై రీల్ చేయడం తప్పా? అని పోలీసులను నిలదీసింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కిందకు వస్తుందా? అని విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు ఎలా పడితే అలా కేసులు పెడితే విశ్వసనీయత ఏముంటుందని ప్రశ్నించింది. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదని, తమ మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. పోలీసులు ఏం దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసులు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదని, ఈ విషయాన్ని తాము ఒప్పుకుని తీరాల్సిందేనని పేర్కొంది. ఇప్పటికే పలు సందర్భాల్లో మేజిస్ట్రేట్ల తీరును ఆక్షేపించామని హైకోర్టు గుర్తు చేసింది. డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించి, రీల్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టినందుకు మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్కుమార్ అరెస్ట్ చేయడంపై సంబంధిత రికార్డులన్నీ తమ ముందుంచాలని కర్నూలు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ను ఆదేశించింది. అలాగే పోలీసులు సమర్పించిన రికార్డులు, నమోదు చేసిన వాంగ్మూలాల కాపీలను తమకు పంపాలని కర్నూలు ఫస్ట్ క్లాస్ స్పెషల్ జుడీషియల్ మేజిస్ట్రేట్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.అక్రమ నిర్భంధంపై హెబియస్ కార్పస్..పోలీసులు తన తండ్రి ప్రేమ్కుమార్ను అక్రమంగా నిర్భంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొరిటిపాటి అభినయ్ గతేడాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ నిర్వహించింది. అభినయ్ తరఫున న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించగా, పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) విష్ణుతేజ వాదనలు వినిపించారు.తప్పుల మీద తప్పులు...డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారంటూ కేసు పెడతారా? అది కూడా అరెస్టు సమయంలో రూ.300 దొరికాయంటూ! అని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, ఇలా చేస్తే సమస్యలపై సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో మహేశ్వరరెడ్డి స్పందిస్తూ.. నానాపటేకర్ నటించిన వజూద్ సినిమాలో పోలీసులు వ్యవహరించిన రీతిలో ఈ కేసులో పోలీసులు ప్రవర్తిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల పట్ల పోలీసులు ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం బేఖాతరు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో చట్ట నిబంధనల గురించి పోలీసులను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది జోక్యం చేసుకుని పోలీసుల చర్యలను సమర్థించే ప్రయత్నం చేయగా ధర్మాసనం ఆయన్ను వారించింది. తప్పు చేసిన వారిని వెనకేసుకురావద్దని హితవు పలికింది.అరెస్ట్ చేయడానికే కేసు పెడతామంటే ఎలా..?“ప్రేమ్కుమార్ను అర్థరాత్రి అరెస్ట్ చేస్తారా? అంత అత్యవసరంగా అరెస్టు చేయాల్సినంత కేసా ఇది? పైగా కర్నూలు నుంచి 8–9 గంటలు ప్రయాణం చేసి వచ్చి మరీ అరెస్ట్ చేస్తారా? ఆయననేమన్నా పారిపోతున్నారా? ప్రేమ్కుమార్ రీల్ను సోషల్ మీడియాలో చూశానంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడం.. మీరు పోలోమంటూ కర్నూలు నుంచి అర్థరాత్రి వచ్చి అరెస్ట్ చేయడం! అంతేకాదు.. అరెస్ట్ చేసి పలు ప్రదేశాలు తిప్పారు. ఇదంతా ఎవరి మెప్పు కోసం చేస్తున్నారు? ఉన్నతాధికారుల మెప్పు కోసం పనిచేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఓ వ్యక్తిని ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడి వ్యక్తులను పంచాయతీదారులుగా చూపాలి. కానీ ఈ కేసులో కర్నూలు పోలీసులు తమ వెంట అక్కడి నుంచే పంచాయతీదారులను తెచ్చుకున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పోలీసులు కొత్త కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. మీరు ఇలాంటివి చేస్తుంటే, మేం కళ్లు మూసుకుని ఉండాలని భావిస్తున్నారు. మీరు ఇలాగే వ్యవహరిస్తుంటే చాలా సమస్యలు వస్తాయి. తప్పు చేస్తే కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితేనే సమస్య’ అని ధర్మాసనం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎలా పడితే అలా చేసే ముందు బాగా ఆలోచించుకోండి...!“గుంటూరులో ప్రేమ్ కుమార్ బలవంతపు వసూళ్లకు పాల్పడితే కర్నూలు పోలీసులు కేసు ఎలా పెడతారు? మీకున్న పరిధి ఏమిటి? అసలు కర్నూలు నుంచి గుంటూరుకు వచ్చేందుకు మీ జిల్లా ఎస్పీ నుంచి అనుమతి తీసుకున్నారా? మేం ఇప్పుడు అనుమతి ఉందా? అని అడిగాం కాబట్టి వచ్చే విచారణ నాటికి అనుమతి తెస్తారు. ప్రేమ్కుమార్ అరెస్ట్ గురించి గుంటూరు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. కానీ వారికి మీరెప్పుడు సమాచారం ఇచ్చారు? మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. పోలీసుల చర్యలు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది. ప్రేమ్ కుమార్ను అర్ధరాత్రి అరెస్ట్ చేసిన కర్నూలు త్రీటౌన్ ఎస్హెచ్వో.. ఫిర్యాదులు అందగానే ఎన్ని కేసుల్లో ఇలా అప్పటికప్పుడు అరెస్టులు చేశారు? ఎన్ని కేసుల్లో ఇలా అర్ధరాత్రులు వెళ్లారు? మీరేం చేస్తున్నా చూస్తూ ఉండాలంటారా? మేమేమీ చేయలేం.. మీరు మరో మార్గం చూసుకోండని మమ్మల్ని పిటిషనర్లకు చెప్పమంటారా? పోలీసులకు వారి సొంత నిబంధనలతో కూడిన మాన్యువల్ ఉంది. దాన్ని కూడా వాళ్లు ఫాలో కావడం లేదు. ఇక్కడ మా మేజిస్ట్రేట్ల తప్పు కూడా ఉంది. ఈ కేసులో ప్రేమ్కుమార్ నేరాలు చేయడమే అలవాటైన వ్యకిŠాత్గ పేర్కొంటూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో రాస్తే మేజిస్ట్రేట్ దాన్ని కనీస స్థాయిలో కూడా పరిశీలించలేదు. రూ.300 వసూలు చేయడం అలవాటైన నేరం కిందకు వస్తుందా? అనే విషయాన్ని కూడా గమనించలేదు. ఈ కేసుకు సంబంధించిన అన్నీ రికార్డులను మేం పరిశీలించాలనుకుంటున్నాం’ అని ధర్మాసనం తెలిపింది. ఈమేరకు రికార్డులను తమ ముందుంచాలని కర్నూలు త్రీటౌన్ ఎస్హెచ్వో, మేజిస్ట్రేట్ను ఆదేశించింది.పౌర స్వేచ్ఛపై “సుప్రీం’ ఏం చెప్పిందంటే...“ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను విమర్శించడం.. నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదు..’’“స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడం, భావవ్యక్తీకరణపై ఎంత వరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకందించిన ప్రజాస్వామ్య విలువల గురించి వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది’’“భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియచేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియచేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి’’– ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో “సుప్రీం కోర్టు’’ కీలక వ్యాఖ్యలు -
ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల పరిధిలో భవనాలు, ఖాళీ స్థలాలకు 2024–25 సంవత్సరానికి చెల్లించాల్సిన ఆస్తి పన్నుతోపాటు పాత బకాయిలపై వడ్డీని 50 శాతం మాఫీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31లోగా చెల్లించే బకాయిలకు మాత్రమే వడ్డీపై 50 శాతం రాయితీ వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారుల విజ్ఞప్తి మేరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. -
వెల్లువలా ఫిర్యాదులు
సాక్షి నెట్వర్క్:⇒ పింఛన్ ఇప్పించాలంటూ వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల వేడుకోలు..!⇒ తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ కాళ్లరిగేలా తిరుగుతున్న గిరిజనులు..!⇒ రేషన్ కార్డులు, ఇళ్ల కోసం నెలల తరబడి ఆరాటంతో ఎదురు చూస్తున్న పేదలు..! ⇒ అడుగు ముందుకు పడని భూముల మ్యుటేషన్లు.. పాస్బుక్లు అందక రైతన్నల గగ్గోలు..! ⇒ స్థలాలు ఆక్రమణలకు గురై తీవ్ర ఆందోళనలో సామాన్యులు..! ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ అందక చదువులు మధ్యలో ఆగిపోయిన పిల్లలు..!ఇంతమంది ఇన్ని సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నా పరిష్కారం లభిస్తుందనే భరోసా ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఓ ప్రహసనంగా.. సమస్యల నిలయంగా మారింది! కలెక్టర్ నుంచి జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటున్న ఈ వేదిక ప్రజలకు ఏమాత్రం భరోసా కల్పించలేకపోతోంది. ప్రతి సోమవారం కలెక్టరేట్కు తరలి వస్తున్న వారితోపాటు కార్యాలయాలను కుప్పలు తెప్పలుగా ముంచెత్తుతున్న అర్జీలే ఇందుకు సాక్ష్యం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కడ చూసినా సమస్యలతో సతమతమవుతూ నెలల తరబడి తిరుగుతున్నవారే కనిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిష్కార వేదికల వద్దకు వచ్చిన వారిని ‘సాక్షి’ ప్రతినిధుల బృందం పలుకరించగా ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపించాయి. గత ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం కల్పిస్తూ అడుగులు ముందుకు వేసిందని, గ్రామ స్థాయిలో ఇంటి వద్దకే పౌర సేవలను అందచేసిందని గుర్తు చేసుకున్నారు. ఏ కారణం చేతనైనా సరే.. అర్హుల్లో ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా లబ్ధి చేకూరేలా ఏటా రెండుసార్లు జాబితాను సిద్ధం చేసి సచివాలయాల్లో పారదర్శకంగా ప్రదర్శించి వలంటీర్ల ద్వారా ఇంటికే పథకాలను చేరవేసిందని చర్చించుకోవడం కనిపించింది.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రామలింగం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాచాపురానికి చెందిన ఆయన కుమారుడు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 32లో 89 సెంట్లను రామచంద్రుడు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. ఇందులో 44 సెంట్ల భూమిని ఈశ్వరయ్య అనే వ్యక్తికి విక్రయించాడు. మిగిలిన 45 సెంట్ల భూమికి పాస్బుక్ కోసం వెళితే మూడు సార్లు సర్వే కోసం చలానా కట్టించుకున్నారు. సర్వేయర్ ఒక్కసారి కూడా వచ్చి సర్వే చేయలేదు. కోర్టు పరిధిలో భూమి ఉందంటూ దాట వేస్తున్నారు. దీంతో బాధితుడు నాలుగైదుసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నమ్మలు తన కుమారుడిని పాలిటెక్నిక్ చదివిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కాలేజీ యాజమాన్యం వారిపై ఒత్తిడి తెస్తోంది. దీంతో అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడ నుంచి దివ్యాంగుడైన తండ్రి సాయంతో కలెక్టరేట్కు వచ్చింది. కాలేజీకి ఫీజు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందించింది. నిరుపేదనైన తాను ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చే ఫీజుల డబ్బులతోనే కుమారుడిని చదివిస్తున్నానని, ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని చిన్నమ్మలు వాపోయింది.⇒ చిత్రంలో కనిపిస్తున్న గిరిజనులు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుణదతీలేసు పంచాయతీ పరిధిలోని లాబేసు గ్రామం వాసులు. వీరంతా నిరుపేదలు. గ్రామానికి చెందిన18 మంది గిరిజన రైతులు సర్వే నంబర్ 16, 11లోని కొంత ప్రభుత్వ భూమిలో తుప్పలు తొలగించి 1995 నుంచి పంటలు పండిస్తున్నారు. సాగు హక్కు పట్టాలు మంజూరు చేయాలంటూ తొమ్మిది నెలలుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు.నేను చచ్చిన తరువాత పింఛన్ ఇస్తారా? పెన్షన్ కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. కలెక్టరేట్కు వస్తే సచివాలయానికి వెళ్లమంటారు. అక్కడికి వెళితే మళ్లీ ఇక్కడికే పొమ్మంటారు. అసలు పెన్షన్ ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వబోమంటే మా పని ఏదో చేసుకొని బతుకుతాం. పేదలను ఇలా తిప్పుకోవడం మంచిది కాదు. నేను చచ్చిన తరువాత పెన్షన్ ఇస్తామంటే ఏం లాభం? గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల మంజూరు చాలా చక్కగా ఉండేది. – మద్దయ్య, బి.తాండ్రపాడు, కర్నూలు మండలం, కర్నూలు జిల్లాఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు బండిపై బాదంపాలు విక్రయిస్తూ జీవిస్తున్నా. ఒంటరి మహిళను. ఈ ఏడాది జనవరి 22వ తేదీన చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కారు ఢీకొనడంతో కాలు, చేయి విరిగాయి. ఆపరేషన్కు రూ.లక్ష ఖర్చు అయింది. ఇప్పటికీ నడవలేకపోతున్నా. నిందితుడిని గుర్తించి, పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. ప్రమాదానికి కారకుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. –షేక్ సైదాబీ, కావూరు లింగంగుంట్ల, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లాముళ్ల పొదల్లో మృతదేహాలను మోసుకుంటూ..మా గ్రామం నుంచి నంద్యాల వెళ్లే రహదారిలో మాంటిస్సోరి స్కూల్ వెనుక భాగంలో 70 సెంట్ల హిందూ శ్మశాన వాటిక స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అక్కడకు వెళ్లాలంటే రహదారి లేదు. పొలం గట్లపై, ముళ్ల పొదల్లో భయంభయంగా మృతదేహాలను మోసుకుంటూ తీసుకెళ్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే నాథుడే లేరు. – చాపిరేవుల గ్రామస్తులు, నంద్యాల జిల్లా -
రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏ పంటకూ గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడిపోతున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ గుంటూరు యార్డుకు వెళ్లేదాకా చంద్రబాబు ప్రభుత్వం.. మిర్చి రైతుల గురించి పట్టించుకోలేదని.. ఆ తర్వాతే హడావుడిగా రూ.11,781 లకు కొనుగోలు చేస్తామని ఆనాడు ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. కానీ నేటి వరకు ఒక్క కిలో మిర్చి కూడా కొనలేదు’’ అని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు.మిర్చి రైతులు ఇవాళ కూడా గుంటూరులో ధర్నాలు చేశారు. రైతు కంట కన్నీరు వస్తే ఆ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఈ ప్రభుత్వం రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదు?. వైఎస్ జగన్ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసింది?. మిర్చి రైతులతా ఆందోళనలో ఉన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేక రైతులంతా ఆవేదన చెందుతున్నారు’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.‘‘రైతులను కాదని వ్యాపారుల ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోంది. అచ్చెన్నాయుడు వైఎస్ జగన్ను ఎగతాళి చేయటమే పనిగా పెట్టుకున్నారు. దానివలన రైతులకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు’’ అని లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. -
ఆ విషయంపై టీడీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడరు?: గురుమూర్తి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం హామీలను గాలికొదిలేసిందని వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. రాష్టవ్యాప్తంగా అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నారని.. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారని నిలదీశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.‘‘21 మంది కూటమి ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఏమీ చేయటం లేదు. కేంద్రం నుంచి ఎలాంటి నిధులనూ తీసుకురాలేకపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా నిధులు వెళ్తున్నా కూటమి ఎంపీలు మాట్లాడటం లేదు. కేవలం వైఎస్సార్సీపీ ఎంపీలపై ఆరోపణలు చేయటానికే వారు పరిమితం అయ్యారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. లేని లిక్కర్ స్కాం గురించి మాట్లాడారు. చంద్రబాబు స్కిల్ స్కాం గురించి ఐటీ, ఈడీ సమన్లు కూడా ఇచ్చింది. వీటిపై పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు?’’ అని గురుమూర్తి ప్రశ్నించారు.‘‘యోగేష్ గుప్త, మనోజ్ పాత్ర ఉన్నట్టు కేంద్ర సంస్థలు గుర్తించాయి. టిడ్కోలో కూడా భారీగా ముడుపులు తీసుకున్నట్టు కేంద్రం గుర్తించింది. వీటిపై శ్రీకృష్ణ దేవరాయలు ఎందుకు ప్రశ్నించటం లేదు?. కేంద్రం చంద్రబాబుని పట్టించుకోవడం లేదు. ఏదో కేసుల్లో ఇరికించటానికి దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎక్సైజ్ శాఖతో సంబంధం లేకపోయినా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్కసిరెడ్డి, మిథున్రెడ్డిల పేర్లను కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తున్నారు’’ అని గురుమూర్తి దుయ్యబట్టారు.‘‘వైఎస్ జగన్ వచ్చాక 43 వేల బెల్టు షాపులు తొలగించారు. మద్యం అమ్మే సమయాన్ని కుదిరించారు. అలాంటప్పుడు లంచాలు ఎవరైనా ఎలా ఇస్తారు?. అయినప్పటికీ కొంతమంది పత్రికాధిపతులను అడ్డం పెట్టుకుని తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఏ ఒక్క డిస్టలరీలకూ పర్మిషన్ ఇవ్వలేదు. కనీసం బ్రాండులకు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. మార్కెట్లో ఉన్న బ్రాండులన్నిటికీ చంద్రబాబే అనుమతులు ఇచ్చారు. కానీ టీడీపీ నేతలు మాపై విష ప్రచారాన్ని చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు’’ అని గురుమూర్తి చెప్పారు. -
చంద్రబాబు సర్కార్ అంటేనే లీకేజీలు: రవిచంద్ర
సాక్షి, తాడేపల్లి: పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని నారా లోకేష్కు మంత్రిగా పనిచేసే అర్హత లేదని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది లీకేజీల ప్రభుత్వమంటూ రవిచంద్ర దుయ్యబట్టారు.కడప జిల్లాలో టెన్త్ పేపర్ వాట్సాప్లో ఎలా వచ్చింది? అంటూ రవిచంద్ర ప్రశ్నించారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎలా వెళ్తున్నాయి?. నారా లోకేష్ అసమర్థ మంత్రిగా నిలిచిపోయారు. బీఈడీ పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేకపోయారు. అధికారులను సమర్థవంతంగా ఎందుకు వినియోగించలేకపోతున్నారు?. చంద్రబాబు ప్రభుత్వం అంటేనే లీకేజీల ప్రభుత్వంగా గుర్తింపు పొందింది. రామబ్రహ్మం 1997లో ఇంటర్ పేపర్ లీక్ చేశారు. ఆ తర్వాత నారాయణ సంస్థల్లోనూ పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. నారాయణ సంస్థలకే ర్యాంకులు రావాలని పేపర్లు లీక్ చేశారు. అప్పట్లో నారాయణ సంస్థల వైఎస్ ప్రిన్సిపాల్ని కూడా అరెస్టు చేశారు’’ అని రవిచంద్ర గుర్తు చేశారు.‘2024లో చంద్రబాబు రాగానే మళ్లీ పేపర్లు లీకవుతున్నాయి. 6 లక్షల 19 వేల మంది విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏనాడూ పేపర్ల లీకేజ్ అనేదే లేదు. నారాయణ సంస్థల ఉద్యోగిని ఇంటర్మీడియట్ బోర్డులో సభ్యునిగా పెట్టారు. తద్వారా ఇంటర్మీడియట్ బోర్డును తమ చేతుల్లోకి మంత్రి నారాయణ తీసుకున్నారు’’ అని రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గురు శిష్యుల కాకమ్మ కథలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా రేవంత్ను చంద్రబాబు శిష్యుడుగానే చాలామంది భావిస్తుంటారు. దానిని రేవంత్ ఒప్పుకున్నా, లేకున్నా జనాభిప్రాయం అలాగే ఉంది. పలు విషయాలలో రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న విధానాలు చంద్రబాబు తరహాలోనే కనిపిస్తుంటాయి. మార్గదర్శి అక్రమ డిపాజిట్లకు సంబంధించి హైకోర్టులో వీరిద్దరి ప్రభుత్వాలు దాదాపు ఒకే తరహాలో రామోజీ సంస్థకు అనుకూలంగా అఫిడవిట్లు వేసిన సంగతి తెలిసిందే. అందులోనే కాదు అనేక అంశాలలో ఇదే ధోరణి కనిపిస్తుంది. గత ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఇద్దరిది ఒకటే తీరు. అప్పుల విషయంలో రేవంత్ గత కెసిఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.👉అలాగే చంద్రబాబు గత జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటారు. ఇది ఒకరకంగా చూస్తే ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా అన్నమాట. రేవంత్ అధికారంలోకి వచ్చి అప్పుడే పదిహేను నెలలు గడిచిపోయింది. అయినా ఇంకా పట్టు రాలేదని ఆయనే చెబుతున్నారు. దానికి కూడా కేసీఆర్ కారణం అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరమే అనిపిస్తుంది. అవినీతితో దోచుకుంటే పట్టు వచ్చినట్లవుతుందా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ కొద్ది రోజుల క్రితం ఒక విషయం చెప్పారు. అది ఆయన నిజాయితీతో చెప్పారా?లేక కేసీఆర్ ప్రభుత్వంపై బండ వేయడానికి చెప్పారా? అన్నది తేల్చజాలం కాని, వినడానికి మాత్రం సంచలనంగానే ఉంది. 👉తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని అన్నారు. తెలంగాణ పేరు గొప్పగాని, అప్పుపుట్టకుంది అని ఆయన అన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. డబ్బు తనవద్ద ఉంటే గంటలో రుణమాఫీ చేసేవాడినని, 25 లక్షల ఇళ్లు నిర్మించేవాడినని, ఎన్నో అద్భుతాలు చేసేవాడినని రేవంత్ అన్నారు. ఏపీలో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొంత ఇదే తరహాలో మాట్లాడడం గమనార్హం. తాను ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ సంక్షేమ స్కీములు అమలు చేయాలని ఉందని, కాని నిధులు లేవని, గల్లా పెట్టే చూస్తే ఖాళీగా కనబడుతా ఉందని చంద్రబాబు సభలలో అంటున్నారు.👉తల్లికి వందనం స్కీము కింద ప్రతి విద్యార్ధికి పదిహేనువేల రూపాయలు ఇచ్చే స్కీమును ప్రస్తావిస్తూ అప్పులు దొరకడం లేదని అన్నారు. చంద్రబాబు, రేవంత్లు ఒకవైపు రాష్ట్రాలను గత ప్రభుత్వాలు అప్పుల పాలు చేశాయని చెబుతూ, మరో వైపు అప్పటికన్నా అప్పులు అధికంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరూ మనల్ని నమ్మడం లేదని రేవంత్ చెప్పడం సంచలనమే. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ తరహాలో మాట్లాడలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా నమ్మి ఆర్థిక సంస్థలు అప్పులు ఇచ్చాయని ఎవరైనా అడిగితే రేవంత్ ఏమని సమాధానం ఇస్తారో తెలియదు.👉కాళేశ్వరానికి అధిక వడ్డీకి రుణాలు తెచ్చారని, ఆ వడ్డీరేటును తగ్గించడానికి యత్నిస్తున్నానని అన్నారు. మంచిదే. కాని అన్నిటికి ఒకే మంత్రం జపించినట్లు కేసీఆర్ వల్లే తాను ఏమి చేయలేకపోతున్నట్లుగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి?నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పులపై రేవంత్ చాలా విమర్శలు చేశారు కదా! దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసినట్లు కెసిఆర్ పై ఆరోపణలు చేశారు కదా?. కాని కాంగ్రెస్ బడ్జెట్లో అలా ఎందుకు చూపించలేకపోయారు. ఏపీలో కూడా ఇదే తంతు. మరీ ఘోరంగా జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన వివరాల ప్రకారమే గత ఏడాది ప్రభుత్వం మారేనాటికి అన్ని రకాల అప్పులు కలిసి ఏడు లక్షల కోట్లే ఉన్నాయి. ఇందులో చంద్రబాబు 2014 టరమ్ లో చేసిన అప్పులు, రాష్ట్రం విభజన నాటి అప్పులు కలిసి సుమారు మూడు లక్షలకోట్ల వరకు ఉన్నాయి.👉అంతేకాక రికార్డు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏపీ ప్రభుత్వం సుమారు లక్ష ముప్పైవేల కోట్ల అప్పులు చేసింది. ఇవి చాలవన్నట్లుగా కేశవ్ను ఢిల్లీ పంపించి మరో 68 వేల కోట్ల అప్పుకోసం యత్నిస్తున్నారని ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. రేవంత్ ఒక మాట అన్నారు. ఎన్నిరోజులు దాచిపెట్టుకోను.. ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా.. కాన్సర్ ఉంటే సిక్స్ఫ్యాక్ బాడీ అని చెప్పుకుంటే నమ్ముతారా అని ఆయన అన్నారు. ఇవి కొంచెం సీరియస్ వ్యాఖ్యలే. ఇలాంటి కామెంట్ల వల్ల తెలంగాణ ప్రభుత్వ పరపతి దెబ్బతింటుందని కొందరి అభిప్రాయం. అయితే వాస్తవ దృక్పధంతో రేవంత్ ఈ మాటలు చెప్పి ఉండవచ్చు. ఇక్కడ ఒకదానికి బేసిక్గా సమాధానం చెప్పవలసి ఉంటుంది.👉కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులపై కాని, ఇతరత్రా రుణాలపై కాని 2023 ఎన్నికల కంటే ముందుగానే రేవంత్ కాని, కాంగ్రెస్ నేతలు కాని తీవ్ర విమర్శలు చేశారు కదా?. రాష్ట్రం అప్పులకుప్ప అయిపోయిందని అన్నారు కదా!. అయినా ఆరు గ్యారంటీలు అంటూ ఎందుకు భారీ హామీలు గుప్పించారు? అన్నదానికి ఎన్నడైనా జవాబిచ్చారా? ఈ విషయంలో చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా వ్యవహరిస్తున్నారన్న భావన కలగదా! ఏపీ ఆర్థిక మంత్రి కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో జగన్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందని అంటే, తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి కూడా విధ్వంస తెలంగాణ నుంచి వికసిత తెలంగాణవైపు నడిపిస్తున్నామని చెప్పారు. అప్పు కూడా పుట్టడం లేదని ముఖ్యమంత్రి చెప్పడం తెలంగాణ వికసించడం ఎలా అవుతుంది?👉అంచనా వేసిన దానికన్నా 70 వేల కోట్ల ఆదాయం ఎలా తగ్గింది? ఏపీని రెండో ప్రపంచ యుద్ధంలో అణు బాంబులు పడిన హిరోషిమాతో కేశవ్ పోల్చితే, తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కాన్సర్తో రేవంత్ పోల్చుతున్నారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని, గత ప్రభుత్వం ఎనిమిదివేల కోట్ల బకాయిపెట్టి వెళ్లిందని రేవంత్ చెప్పారు. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో, లేక కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఆకర్షితులయ్యో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు కదా! ఎన్నికల సమయంలో ఎన్నడైనా చంద్రబాబుకాని, రేవంత్ కాని ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన తర్వాత హామీలు అమలు చేస్తామని అన్నారా?లేదే!👉రేవంత్ ఏమో తాము అధికారంలోకి రాగానే రైతు బంధు డబ్బులు మరో ఐదువేలు కలిపి ఇస్తామని, రెండు లక్షల రూపాయల రుణ మాఫీ ఒకేసారి చేసి చూపిస్తామని ఎలా హామీ ఇచ్చారో చెబుతారా?. అది కూడా రాహుల్ గాంధీతో ప్రకటింపచేశారే?. చంద్రబాబేమో తాను అప్పులు చేయనక్కర్లేదని, సంపద సృష్టించి పేదలకు పంచుతానని ప్రచారం చేసి,ఇప్పుడేమో సంపద ఎలా సృష్టించాలో తెలియదని, అదెలాగో ప్రజలే చెవిలో చెప్పాలని ఒకసారి, జనానికి సంపద సృష్టి నేర్పుతానని మరోసారి అంటున్నారు. ఒక్కోసారి ఒక్కరకంగా చెబుతూ డబ్బులు లేవని కథలు చెబితే ప్రజలను పిచ్చోళ్లను చేసినట్లు కాదా?. ఇప్పుడు రేవంత్ ప్రయారిటీ ఫ్యూచర్ సిటీ అయితే, చంద్రబాబు ప్రాధాన్యత అమరావతి అన్నది అందరికి తెలిసిందే. అమరావతికి వేల కోట్ల అప్పులు తీసుకువస్తున్న చంద్రబాబు సంక్షేమానికి వ్యయం చేయలేనని చేతులెత్తేశారు.👉రేవంత్ ప్రభుత్వం కొంతలో కొంత బెటర్. ఇచ్చిన ఆరు గ్యారంటీలలో కొంతమేర అయినా అమలు చేసే యత్నం చేసింది.కాగా ఏటా అప్పులకే 66 వేల కోట్లు మిత్తి కింద కట్టవలసి వస్తోందని రేవంత్ అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లను దండుకోవడానికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత గత ప్రభుత్వాల మీద కాకమ్మ కబుర్లు చెబుతూ ప్రజల చెవిలో పూలు పెట్టాలని చూడడం శోచనీయం. ఇవన్ని గమనించిన తర్వాత చంద్రబాబు, రేవంత్లు గురు,శిష్యులే అనిపించదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తిరుపతమ్మని ఎవరు చంపి ఉండొచ్చు?
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని కొలనుకొండలో సాయిబాబా గుడి వెనుక కృష్ణాకెనాల్కు వచ్చే జంక్షన్లో జనవరి 31న కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని ప్రాథమిక దర్యాప్తు చేయకుండా రాత్రికిరాత్రే పోలీసులు మార్చురీకి తరలించారు. 45 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు సేకరించలేదు. తాజాగా ఆదివారం రాత్రి కొలనుకొండ జాతీయ రహదారి పక్కనే జరిగిన లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసులోనూ పోలీసులు ఇలాగే వ్యవహరించారు. రాత్రి 9 గంటలకు వచ్చిన పోలీసులు 11 గంటలకల్లా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలం వద్దకు డాగ్ స్క్వాడ్ను తీసుకు రావడంలో పోలీసులు విఫలమయ్యారు. తెల్లవారుజామున ఎప్పుడో నాలుగు గంటలకు డాగ్స్కా్వడ్ వచ్చింది. అప్పటికే ఘటనా స్దలం వద్ద ఉన్న సిమెంటుతో కూడిన చెప్పులు, కండోమ్స్, హ్యాండ్బ్యాగ్, అమెరికన్ క్లబ్ సిగరెట్ పెట్టెలను తీసివేయడంతో డాగ్ స్క్వాడ్ వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. చివరకు ఎస్పీ సతీష్కుమార్ వచ్చేంత వరకు కూడా మృతదేహాన్ని ఉంచకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయానికి సమీపంలో వీవీఐపీలు నిత్యం తిరిగే ప్రాంతంలో మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైనా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎవరు చంపి ఉండొచ్చు? జెస్సీ, నజీరాతోపాటు లక్ష్మీతిరుపతమ్మ ఆదివారం రాత్రి కూడా కొలనుకొండ జాతీయ రహదారి వద్దకు వచ్చింది. జెస్సీ విటులను పిలిచి లక్ష్మీతిరుపతమ్మతో పంపేది. ఆదివారం రాత్రి కూడా తొలుత ఇద్దరు విటులు వెళ్లారు. అనంతరం చేతిలో ఒక సంచి పట్టుకుని హిందీలో మాట్లాడే పొట్టిగా నల్లగా ఉన్న వ్యక్తి లక్ష్మీ తిరుపతమ్మ వద్దకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చిన తరువాత ముళ్ల పొదలలో నుంచి తిరుపతమ్మ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన జెస్సి, నజీరా లోపలకు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడి వున్న తిరుపతమ్మ కనిపించింది. దీంతో భయపడిన వారిద్దరూ పెద్దగా కేకలు వేశారు. 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది రావడంతో లక్ష్మీ తిరుపతమ్మ మృతి చెందిందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రి 8 గంటలకు ఘటన జరిగితే తాడేపల్లి పోలీసులు రాత్రి 9.30 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో తిరుపతమ్మ మాజీ ప్రియుడు చింటూ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా తిరుపతమ్మ తనను దూరం పెడుతుందని చింటూ కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. అనాథలుగా పిల్లలు లక్ష్మీతిరుపతమ్మ మృతి వార్త తెలుసుకుని ఘటనాస్థలానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని రోధించారు. పిల్లలను ప్రభుత్వం సంరక్షించాలని విన్నవించారు.హతురాలు పామర్రు వాసి.. తాడేపల్లి రూరల్: డీజీపీ కార్యాలయం సమీపంలో ఆదివారం జరిగిన హత్యాచారం కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సతీ‹Ùకుమార్ విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ సతీ‹Ùకుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ సుప్రజ, డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. దీంతోపాటు విజయవాడకు చెందిన సీసీఎస్ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. పామర్రు స్వగ్రామం.. మృతురాలు కృష్ణాజిల్లా పామర్రు గ్రామానికి చెందిన సజ్జ లక్ష్మీ తిరుపతమ్మ (32)గా పోలీసులు గుర్తించారు. ఈమె భర్త అయిన నవీన్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి శీలం ఝాన్సీ వద్ద పిల్లలిద్దరినీ ఉంచింది. విజయవాడలో వంటపని చేస్తున్నానని ఆమెకు చెబుతూ వస్తోంది. విజయవాడలోని కృష్ణలంకలో ఉంటోంది. ఏడాది క్రితం ట్రాన్స్జెండర్ జెస్సీ పరిచయమైంది. ఆమె లక్ష్మీతిరుపతమ్మను వ్యభిచార వృత్తిలోకి దించినట్టు సమాచారం. ఆ తర్వాత మరో ట్రాన్స్జెండర్ నజీరాతోనూ తిరుపతమ్మకు పరిచయం అయింది. వీరిద్వారా తిరుపతమ్మ మాజీ ప్రియుడు రాధారంగా నగర్కు చెందిన చింటూ గురించి పోలీసులు తెలుసుకున్నారు. అతడినీ అదుపులోకి తీసుకుని ప్రశి్నస్తున్నట్టు సమాచారం. తిరుపతమ్మ తన ఇద్దరు బిడ్డలను చదివించుకోవడం కోసమే ఈ వృత్తి చేపట్టినట్లు తెలుస్తోంది.వీడియోలు, రీల్స్.. హత్య జరిగిన ప్రాంతంలో ఎన్నాళ్లగానో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలూ విస్తృతంగా జరుగుతున్నట్టు సమాచారం. మూడునెలలుగా ఇక్కడే లక్ష్మీ తిరుపతమ్మ, మరికొంతమంది మహిళలు రీల్స్, ఇంస్టాగ్రామ్ లో పాటలు పాడుతూ సెల్ఫీ వీడియోలు చిత్రీకరించినట్టు సమాచారం. తిరుపతమ్మ, ఆమె ప్రియుడు చింటూ, జెస్సీ కొలనుకొండ ప్రాంతంలో దౌర్జన్యం చేస్తూ వ్యభిచార వృత్తిలో ఉన్న ఇతరులను రానీయకుండా విటులను తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటారని, ఇక్కడ వీరి ఆధిపత్యం ఏమిటనే భావనతో ప్రత్యర్థులు ఈ హత్య చేసి ఉంటారా అనే అనుమానమూ వ్యక్తమవుతోంది. -
వాట్సాప్లో పదో తరగతి ప్రశ్నపత్రం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో సోమవారం అధికారులు తనిఖీ చేస్తుండగా, 10వ తరగతి గణితం పేపర్ వాట్సాప్లో షేర్ అయినట్లు తెలిసింది. ఆరా తీయగా స్కూల్లోని వాటర్ బాయ్ విద్యార్థుల నుంచి పేపర్ తీసుకుని వాట్సాప్ ద్వారా స్థానిక వివేకానంద పాఠశాలలో పనిచేస్తున్న విఘ్నేశ్వరరెడ్డి అనే వ్యక్తికి పంపినట్టు గుర్తించారు. వాటర్ బాయ్పై కేసు నమోదుచేసి, విచారణ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో 15 మంది సస్పెన్షన్..ఈనెల 21న జరిగిన ఇంగ్లీష్ పరీక్షలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ పాఠశాలలోని ఏ,బీ కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్కు సహకరించిన 15 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని కళేష్ సర్కిల్, బస్ స్టాండ్ రోడ్డులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఏ,బీ కేంద్రాల వద్ద భారీగా గణితం స్లిప్పులు దొరకడంతో ఇరువురు ఇన్విజిలేటర్లు సస్పెండ్ అయ్యారు. -
ఇంటర్మిడియట్లో కొత్త సిలబస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మిడియట్ విద్యలో మార్పులు చేశారు. రానున్న విద్యా సంవత్సరం (2025–26) నుంచి ఇంటర్లో కొత్తగా ఎన్సీఈఆర్టీ సిలబస్ను ప్రవేశపెడుతున్నారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు ఎన్సీఈఆర్టీ సిలబస్లో విద్యా బోధన పూర్తి చేసినందున ఇంటర్మిడియట్లోనూ ఎన్సీఈఆర్టీ సిలబస్ను, సీబీఎస్ఈ విధానాలను అమలు చేయనున్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్, 2026–27లో సెకండియర్ విద్యార్థులకు కొత్త సిలబస్లో బోధన మొదలవుతుంది. అలాగే, పరీక్షల నిర్వహణ, ప్రశ్నలు సీబీఎస్ఈ విధానంలోకి మారాయి. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ఎంబైపీసీ గ్రూప్ను ప్రవేశపెట్టారు. జేఈఈ, నీట్ పరీక్షలకు అనుగుణంగా ఎంపీపీ, బైపీసీ సిలబస్లోనూ మార్పులు చేశారు. వార్షిక పరీక్షలను ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభిస్తారు. తాజా మార్పులను ఇంటర్మిడియట్ విద్యా మండలి ప్రకటించింది.ఏప్రిల్ 1 నుంచి జూనియర్ కాలేజీలు రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అదే తేదీన ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. వచ్చే నెల 7వ తేదీ నుంచి మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభిస్తారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు ఉంటాయి. కొత్త విద్యా సంవత్సరంలో కళాశాలలకు 235 రోజులు పనిదినాలు, 79 సెలవులు ప్రకటించారు. ఎలక్టివ్ సబ్జెక్టు విధానంవిద్యార్థులకు సబ్జెక్టుల ఎంపికలో సౌలభ్యాన్ని పెంచుతూ ఎలక్టివ్ విధానం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అన్ని గ్రూపులకు పార్ట్–1లో ఇంగ్లిష్, పార్ట్–2 లో రెండో భాష (లాంగ్వేజెస్), పార్ట్–3 లో కోర్ సబ్జెక్టులు ఉండగా, పార్ట్–2లో ఎలక్టివ్ సబ్జెక్టు విధానం ప్రవేశపెట్టారు. ఇందులో లాంగ్వేజెస్, సైన్స్, హ్యుమానిటీస్ విభాగాల్లో 20 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ గ్రూప్ వారికైనా ఇంగ్లిష్ తప్పనిసరి. రెండో భాష స్థానంలో ‘ఎలక్టివ్’ సబ్జెక్టుగా తెలుగు/సంస్కృతం/ఉర్దూ/హిందీ/అరబిక్/ తమిళం/కన్నడ/ఒరియా/ ఫ్రెంచ్/పర్షియన్ (10 భాషలు) ఉంటాయి. మోడ్రన్ లాంగ్వేజెస్ (ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ)/ భూగోళశాస్త్రం/లాజిక్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/చరిత్ర/సివిక్స్/కామర్స్/ఎకనామిక్స్ (10 సబ్జెక్టులు) ఉంటాయి. వీటిలో ఒకటి విద్యార్థులు ఎంపిక చేసుకోవాలి.ఐదు సబ్జెక్టులు.. 1000 మార్కులుఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఐదు సబ్జెక్టుల విధానం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం సైన్స్ గ్రూపుల్లో 2 భాషా సబ్జెక్టులు, 4 కోర్ సబ్జెక్టులు (మొత్తం 6 సబ్జెక్టులు), ఆర్ట్స్ గ్రూప్లో 2 భాషా సబ్జెక్టులు, 3 కోర్ సబ్జెక్టులు ఉన్నాయి. ఇకపై ఏ గ్రూపులో అయినా ఐదు సబ్జెక్టులే ఉంటాయి. మేథమెటిక్స్–ఏ, బీ పేపర్లను ఒక సబ్జెక్టుగా, బాటనీ–జువాలజీ రెండు సబ్జెక్టులను కలిపి ఒక సబ్జెక్టుగా మార్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరు సబ్జెక్టులతో ‘ఎంబైపీసీ’ గ్రూప్ను ప్రవేశపెడుతున్నారు. ఎంపీసీ విద్యార్థులు బోటనీ, బైసీపీ విద్యార్థులు మేథమెటిక్స్ తీసుకుని పూర్తి చేస్తే ‘ఎంబైపీసీ’ సర్టీఫికెట్ ఇస్తారు.అన్ని గ్రూపులకు రెండేళ్లకు కలిపి 1000 మార్కుల విధానం అమల్లోకి తెచ్చారు. సైన్స్ సబ్జెక్టులకు థియరీకి 85 మార్కులు, ప్రాక్టికల్స్కు 30 మార్కులు కేటాయిస్తారు. అన్ని గ్రూపుల పరీక్షల్లోను మార్పులు చేశారు. ప్రశ్నా పత్రాల్లో వ్యాసరూప ప్రశ్నల స్థానంలో సీబీఎస్ఈ విధానాలకు అనుగుణంగా 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలు ఇస్తారు. -
సాయం అందించే చేతులకు వేదిక పీ–4
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సంపన్నవర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ–4 విధానం ద్వారా ప్లాట్ఫామ్ నిర్మిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ–పీ–4 విధానంపై సోమవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని, ఎవరినీ ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు. ఎన్నారైలు కూడా పీ–4లో భాగస్వాములు కావొచ్చన్నారు. పీ–4 విధానంలో ప్రభుత్వ పాత్ర కేవలం ఇరువర్గాలను ఒక వేదికపైకి తీసుకురావడమేనని, ప్రభుత్వం తరఫున ఎవరికీ అదనపు సాయం ఉండదన్నారు. ఉన్నతవర్గాల వాళ్లు సాయానికి ముందుకొచ్చేలా వారిలో స్ఫూర్తి నింపాలని సూచించారు. లబ్ధి పొందేవారిని ‘బంగారు కుటుంబం’గా, సాయం చేసే వారిని ‘మార్గదర్శి’గా పిలవాలని సూచించారు. బంగారు కుటుంబం ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదని, గ్రామసభ, వార్డు సభల ద్వారా తుది జాబితా రూపొందిస్తే వివాదరహితంగా ఉంటుందన్నారు. పీ–4 కార్యక్రమానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ వర్గాల ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడండి రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం వేసవి ప్రణాళిక, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధిత శాఖలతో సీఎం సమీక్ష నిర్వహించారు. పశువులకు నీరు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన రూ.39 కోట్లు విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మున్సిపల్ కార్మికులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోపు బయట ప్రాంతాల్లో పని అప్పగించొద్దన్నారు. ఆపరేషన్ మోడల్లో పోలవరం–బనకచర్ల పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఆపరేషన్ మోడల్లో నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గోదావరి జలాలను పోలవరం నుంచి లిఫ్టుల ద్వారా తరలించేందుకు అయ్యే విద్యుత్ వినియోగాన్ని ప్రాజెక్టు ప్రాంతంలోనే పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడం ద్వారా ఉత్పత్తి చేసి ఆర్థిక భారం తగ్గించవచ్చన్నారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై సోమవారం సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
రెడ్బుక్కు సహకరించకపోతే ఇక అంతే...
సాక్షి, అమరావతి: ‘రెడ్బుక్’ అరాచకాలు, కుట్రలకు అంగీకరించకుండా.. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే అధికారులను చంద్రబాబు కూటమి ప్రభుత్వం పొగబెట్టి, రాష్ట్రం నుంచి బయటకు పంపేస్తోంది. ఇదే కోవలో చంద్రబాబు ప్రభుత్వ ‘రెడ్బుక్’ అరాచకాలకు ఎదురుతిరిగి సంచలనం సృష్టించిన 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్కూ పొగ పెట్టేసింది. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం రవాణా వ్యవహారంలో చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాలని ఆయనపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన ఇక్కడ పనిచేయలేక రాష్ట్ర సర్విసులను వీడుతున్నారు. డెప్యుటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారు. ఆయన డెప్యుటేషన్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆయన సీఆర్పీఎఫ్ ఐజీగా బాధ్యతలు చేపట్టనున్నారు. వినీత్ ఐదేళ్లపాటు కేంద్ర సర్విసుల్లో కొనసాగుతారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన వినీత్ బ్రిజ్లాల్ టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్బుక్ కుట్రలకు సహకరించేందుకు ససేమిరా అనడం పోలీసు శాఖలో పెద్ద సంచలనమే సృష్టించింది. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేశారనే అభియోగాలతో నమోదైన కేసు దర్యాప్తునకు ఏర్పాటు చేసిన సిట్ చీఫ్గా ఆయన్ని ప్రభుత్వం నియమించింది. కానీ, దర్యాప్తుతో నిమిత్తం లేకుండా తాము చెప్పినట్టుగా వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు, డీజీపీ, సీఐడీ చీఫ్ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అందుకు బ్రిజ్లాల్ అంగీకరించలేదు. అయినా తాము చెప్పినట్లుగానే నివేదిక ఇవ్వాలని వారంతా పట్టుబట్టడంతో బ్రిజ్లాల్ రాజీనామాకు సిద్ధపడ్డారు. దాంతో బెంబేలెత్తిన డీజీపీ, సీఐడీ చీఫ్ ఆయన్ని బుజ్జగించి, అతి కష్టం మీద ఆ నిర్ణయాన్ని ఉపసంహరింపజేశారు. కానీ, సిట్ చీఫ్గా కొనసాగేందుకు సమ్మతించకుండా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన సిట్ వ్యవహారాలను పర్యవేక్షించలేదు. ఆయన్ని సిట్ చీఫ్ పోస్టు నుంచి తొలగించి అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేయాలని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ పెద్దల ఉద్దేశాన్ని గుర్తించిన బ్రిజ్లాల్ డెప్యుటేషన్పై కేంద్ర సర్విసులకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన్ని సీఆర్పీఎఫ్ ఐజీగా నియమించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. బ్రిజ్లాల్తో ఇక రెడ్బుక్ అరాచకాలకు ఇబ్బంది ఉండదని గుర్తించిన కూటమి ప్రభుత్వం ఆయన డెప్యుటేషన్కు అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆపరేషన్ పరివర్తన్లో కీలక పాత్ర ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లో దశాబ్దాలుగా యథేచ్ఛగా సాగుతున్న గంజాయి సాగు, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ను విజయవంతం చేయడంలో వినీత్ బ్రిజ్లాల్ కీలక పాత్ర పోషించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కమిషనర్గా ఆయన ఆధునిక సాంకేతికతను సది్వనియోగం చేసుకుంటూ రెండు దశల్లో ఆపరేషన్ పరివర్తన్ను విజయవంతం చేశారు. 11 వేలకు పైగా ఎకరాల్లో సాగవుతున్న గంజాయిని ధ్వంసం చేశారు. 2.50 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేలా గిరిజనులను ప్రోత్సహించారు.అంతటి సమర్థ అధికారిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెడ్బుక్ కుట్రకు సహకరించలేదనే అక్కసుతో పొగబెట్టి మరీ పంపించేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దలు చెప్పిన అక్రమ మార్గాల్లో పనిచేయలేక ఇప్పటికే పలువురు ఐపీఎస్లు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు. వారిలో పలువురు దరఖాస్తు కూడా చేసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా రాష్ట్రం నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
విపత్తులను మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: కరువు ఉరిమినా.. తుఫాన్లు తుడిచిపెట్టినా.. వరదలు, వర్షాలు ముంచెత్తినా.. అన్నదాతపై చంద్రబాబు ప్రభుత్వానికి కనికరం లేదు. కష్టాల్లో ఉన్న రైతులను ఉదారంగా ఆదుకోవాల్సిందిపోయి వారిని అన్ని విధాలుగా మోసం చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ముగిసి, రబీ కూడా చివరి దశకు చేరుకుంది. అయినా, ఖరీఫ్ ప్రారంభంలో దెబ్బతిన్న పంటలకూ పరిహారం ఇవ్వాలన్న ధ్యాసే లేదు. ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా అటకెక్కించి ఆ పరిహారమూ అందకుండా చేసింది. సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు చెల్లించాల్సిన రూ.26 వేల ( పీఎం కిసాన్ సాయంతో కలిపి)పెట్టుబడి సాయమూ ఇవ్వకుండా మోసం చేసింది. ఇంకొక వైపు సీజన్ ముగియకుండానే అందించాల్సిన పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) చెల్లింపులోనూ కావాలనే కాలయాపన చేస్తోంది. పంటలకు మద్దతు ధర లభించేలా చూడటంలోనూ చంద్రబాబు సర్కారుది మొండి వైఖరే. ఎరువులు, పురుగు మందులు, నాణ్యౖమెన విత్తనాలు లేక రైతులు అల్లాడుతున్నా పట్టించుకోవడంలేదు. వ్యాపారులు, దళారుల చేతిలో అన్యాయానికి గురవుతున్న అన్నదాతను ఆదుకోవాలన్న ఆలోచనే లేదు. మొత్తం మీద ప్రకృతి విపత్తులకంటే అన్నదాతకు కూటమి సర్కారు నిర్లక్ష్యమే పెద్ద విపత్తుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.అడ్డగోలు కోతలతో.. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు నెలకొక వైపరీత్యం రైతులను వెంటాడుతూనే ఉంది. ఖరీఫ్ మొదట్లోనే జూలైలో అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. 16 జిల్లాల 1.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం మాత్రం 44 వేల ఎకరాల్లోనే పంటలు దెబ్బతిన్నాయని, 31 వేల మందికి రూ.31.53 కోట్లు చెల్లించాలని లెక్కతేల్చింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కృష్ణా, వంశధార, నాగావళి నదులతో పాటు బుడమేరు, ఏలేరు వరదలు పంట పొలాలను ముంచెత్తాయి. 10 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తొలుత 5.93 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన 4 లక్షల మందికి రూ.557.63 కోట్ల పరిహారం ఇవ్వాలని అంచనావేశారు. ప్రభుత్వం ఇందులో అడ్డగోలుగా కోతలు వేసి దెబ్బతిన్న పంటల విస్తీర్ణం 3.11 లక్షల ఎకరాలకు కుదించింది. కేవలం 2 లక్షల మందికి రూ.319.08 కోట్లు ఇవ్వాలని చెప్పింది. పోనీ అదైనా ఇచ్చిందా అంటే అదీ లేదు.వైఎస్ జగన్ హయాంలో..⇒ విపత్తులకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకొనేందుకు ప్రత్యేకంగా రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు ⇒ ఏ సీజన్ పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అదే సీజన్ ముగిసేలోగా జమ. ఇలా ఐదేళ్లలో 34.41 లక్షల మందికి రూ.3,261.60 కోట్లు చెల్లించి అండగా నిలిచారు. ⇒ రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా ఐదేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్లు అందజేశారు. ⇒ వైఎస్సార్ రైతు భరోసా కింద ఐదేళ్లలో 53.58 లక్షల మందికి రూ.34,288.17 కోట్లు లబ్ధి చేకూర్చారు.చంద్రబాబు హయాంలో.. ⇒ బీమా ప్రీమియం బకాయిలు రూ.1,280 కోట్లు చెల్లించకపోవడం వల్ల రైతులకు దాదాపు రూ.2వేల కోట్లకు పైగా పరిహారం అందకుండా మోకాలడ్డారు. ⇒ 2024–25 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఈ పాటికే రూ.833 కోట్లు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఇందులో పైసా కూడా చెల్లించకపోవడంతో రైతులకు రూ.1200 కోట్లకుపైగా బీమా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. ⇒ కూటమి పాలనలో పంటల బీమా పథకం ఉందో లేదో కూడా తెలియని అయోమయ స్థితి నెలకొంది. ⇒ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్రమిచ్చే పీఎం కిసాన్ సాయంతో సంబంధం లేకుండానే ఒకే విడతలో ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున 2024–25లో చెల్లించాల్సిన రూ.10,717 కోట్లు కూడా చంద్రబాబు ఎగ్గొట్టారు.సగం మండలాల్లోనే కరువంటూ..లోటు వర్షపాతంతో రాయలసీమ జిల్లాల్లో 100 మండలాలకు పైగా కరువు కోరల్లో చిక్కుకున్నాయి. 60 రోజులకు పైగా చినుకు జాడ లేదు. 10 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం మాత్రం మొక్కుబడిగా 54 మండలాలనే కరువు ప్రభావితంగా ప్రకటించింది. వీటికీ పైసా పరిహారం విదల్చలేదు. నవంబరులో విరుచుకుపడిన ఫెంగల్ తుఫాను కోతకొచ్చిన పంటలను తుడిచిపెట్టింది. దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. అయినా రైతులను ఆదుకున్న పాపాన పోలేదు. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది జూలై మొదలుకొని డిసెంబర్ వరకు వివిధ వైపరీత్యాలకు 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని, రూ.2 వేల కోట్లకు పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. ఇందులోనూ కోతలేసి చివరికి 6.65 లక్షల ఎకరాల్లోనే పంటలు దెబ్బతిన్నట్లు, రూ.527.18 కోట్లు చెల్లించాలంటూ లెక్కగట్టింది.దీంతోపాటు ఆధార్ సీడింగ్ కాకపోవడం, సరైన బ్యాంక్ ఖాతా నంబర్లు ఇవ్వక పోవడం వంటి సాంకేతిక కారణాలతో నిలిచిన 2023, 24 సీజన్ల కరువు సాయం బకాయిలు రూ.311.39 కోట్లు విడుదల చేయకుండా మోకాలడ్డింది. ఇలా మొత్తం రూ.838.57 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో కేవలంæ 1.85 లక్షల మందికి రూ.284.56 కోట్లు చెల్లించి చేతులు దులిపేసుకుంది. అదీ కూడా ప్రజలు, వివిధ సంస్థలు ఇచ్చిన వరద విరాళాల పుణ్యమే. -
7 నుంచి ‘ఆరోగ్యశ్రీ’ బంద్
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో ఏప్రిల్ 7 నుంచి సేవలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందచేసినట్లు అసోసియేషన్ తెలిపింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ 26 సార్లు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు సీఈఓను, వైద్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని, ఐటీ శాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని కలిసి తమ ఇబ్బందులను వివరించినట్లు తెలిపారు.అయినప్పటికీ తమ సమస్యలపట్ల సానుకూల స్పందన కొరవడటంతో, ఆస్పత్రులు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయి నిర్వహించలేని దయనీయ స్థితిలో ఉన్నందున.. వచ్చేనెల 7 నుంచి పూర్తిగా సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆషా అధ్యక్షుడు డాక్టర్ కె. విజయ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం తక్షణమే రూ.1,500 కోట్లు రిలీజ్ చేయడంతో పాటు, అనంతరం చెల్లింపులపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తేగానీ ఆరోగ్యశ్రీని నిర్వహించలేని స్థితిలో నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఏకంగా రూ.3,500 కోట్ల మేర ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉందని నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ చెబుతోంది.వివిధ రూపాల్లో నిరసనలుఏప్రిల్ 7 వరకూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విజయ్కుమార్ వివరించారు. అందులో భాగంగా.. మార్చి 25న జిల్లా కలెక్టర్లు, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్స్, డీఎంహెచ్ఓలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. అంతేకాక.. తమ ఇబ్బందులను మీడియాకు వివరించనున్నట్లు తెలిపారు. మార్చి 27న ఎంఎల్ఏలు, ఎంపీలు, జిల్లా ఇన్ఛార్జిలను కలిసి వినతిపత్రాలు అందించనున్నట్లు తెలిపారు. 29న నల్లబ్యాడ్జిలతో నిరసన కార్యక్రమాలు.. ఏప్రిల్ 3న కార్పొరేట్ హాస్పిటల్స్ హెడ్స్, ఆషా ప్రతినిధులు విజయవాడ, విశాఖపట్నంలలో ప్రెస్మీట్ల నిర్వహణకు కార్యాచరణను రూపొందించినట్లు ఆషా ప్రతినిధులు తెలిపారు.నగదు రహిత వైద్యం అందించలేంనిజానికి.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 నెలల్లో 26 సార్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ బకాయిలపై ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయినప్పటికీ సర్కారు నుంచి సరైన స్పందనలేదు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఆమోదించిన బిల్లులు రూ.1,300 కోట్లు, సీఈఓ ఆమోదించనివి రూ.1,700 కోట్లు ఉన్నాయి. ఇక ఆస్పత్రులు అప్లోడ్ చేయాల్సిన బిల్స్ మరో రూ.500 కోట్ల మేర ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పెద్దఎత్తున బిల్లులు నిలిచిపోవడంతో గతేడాది నుంచే చాలావరకూ ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవల కల్పనకు వెనుకడుగు వేస్తున్నాయి. పేదలు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే.. ‘ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలేదు. నగదు రహిత వైద్యసేవలు అందించలేం’ అని యాజమాన్యాలు చెబుతున్నాయి. -
1 నుంచి మాల్స్లో పార్కింగ్ ఫీజు రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో వాహనాల పార్కింగ్ ఫీజును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్కుమార్ ఉత్తర్వులిచ్చారు. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకొస్తుందని పేర్కొన్నారు.మొదటి అర గంటకు ఎవరి నుంచీ పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని, అనంతరం గంట వరకు వాహనం ఉంచితే సదరు మాల్లో వస్తువుల కొనుగోలు బిల్లు చూపిన వారి నుంచి ఫీజు వసూలు చేయరాదని, గంటకు పైగా ఉన్న వాహనదారులకు సినిమా టికెట్ లేదా పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ బిల్లు చూపినా ఉచిత పార్కింగ్ అవకాశం వినియోగించుకోవచ్చునన్నారు. -
3న కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి తీసుకువెళ్లాల్సిన ప్రతిపాదనలను ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకల్లా సాధారణ పరిపాలన శాఖ(కేబినెట్ విభాగం)కు పంపాల్సిందిగా అన్ని శాఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. -
ఏపీ అప్పు రూ.5.62 లక్షల కోట్లు
సాక్షి, అమరావతి: ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.5.62 లక్షల కోట్లకు చేరుతాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో అప్పులు 34.70 శాతం ఉంటాయని చెప్పారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2023–24)లో జీఎస్డీపీలో అప్పులు 34.58 శాతమని వెల్లడించారు.సోమవారం లోక్సభలో ఎంపీ మనీష్ తివారి అడిగిన ప్రశ్నకు దేశంలోని రాష్ట్రాల అప్పుల వివరాలను పంకజ్ చౌదరి వెల్లడించారు. రాష్ట్రాల నికర రుణ పరిమితిని ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. అన్ని రాష్ట్రాలు ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రాలు అధికంగా తీసుకున్న రుణాలకు సర్దుబాట్లు ఏమైనా ఉంటే ఆ తర్వాత సంవత్సరాల రుణాల పరిమితుల్లో చేరుతాయని వివరించారు. ఎఫ్ఆర్బీఎం చట్టానికి అనుగుణంగా అప్పులు ఉన్నాయా..? లేదా..? అనేది రాష్ట్రాల శాసనసభలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. -
న్యాయవాదుల సంక్షేమమే ధ్యేయం
సాక్షి, అమరావతి: న్యాయవాదుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్.ద్వారకానాథరెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బార్ కౌన్సిల్ పలు నిర్ణయాలు తీసుకుంది. న్యాయవాదులు మరణించినప్పుడు వారి నామినీలకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచింది. ఈ పెంపు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నది. రాష్ట్ర బార్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం హైకోర్టులోని బార్ కౌన్సిల్లో జరిగింది. కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో న్యాయవాదుల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. న్యాయవాదులు, వారి కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న వైద్య సాయాన్ని రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు.బార్ కౌన్సిల్ రోల్స్లో నమోదు చేసుకున్న న్యాయవాదులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబసభ్యులకు రూ.5 లక్షల మేర పరిహారం అందించాలని తీర్మానించారు. ఈ కొత్త పథకాన్ని ఈ ఏడాది మే 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. వీటన్నింటికీ అవసరమైన సొమ్మును బార్ కౌన్సిల్ నిధుల నుంచి చెల్లిస్తారు. అనంతరం గుంటూరుకు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు.తెలుగు భాషకు, సాహిత్యానికి చేసిన అసాధారణమైన సేవలకు గానూ ఆయన ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎస్.కృష్ణమోహన్, సభ్యులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, ఎస్బ్రహ్మనందరెడ్డి, గంటా రామారావు, వజ్జా శ్రీనివాసరావు, రోళ్ల మాధవి, రావిగువేరా, కార్యదర్శి పద్మలత పాల్గొన్నారు. -
‘డ్రగ్స్’పై ‘డర్టీ’ ప్రచారం
సాక్షి, అమరావతి: స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు కూటమి డ్రగ్స్ దందా అంటూ యావత్ రాష్ట్రంపై అభాండాలేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్కు అడ్డాగా మారిపోయిందంటూ నిత్యం విష ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించింది. ఇదంతా కేవలం దుష్ప్రచారమేనన్న వాస్తవాన్ని కేంద్ర హోం శాఖ తాజా నివేదిక వెల్లడించింది. 2022 నుంచి 2024 వరకు దేశంలో అత్యధికంగా డ్రగ్స్ కేసులు నమోదైన 12 రాష్ట్రాల జాబితాను కేంద్ర హోం శాఖ పార్లమెంటుకు సమర్పించింది. ఈ జాబితాలో మన రాష్ట్రం పేరే లేదు.అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్ ప్రభావమే లేదని, ఎల్లో మీడియా, చంద్రబాబు ముఠా చేసిన రాద్ధాంతమంతా రాజకీయ కుట్రే అన్న విషయాన్ని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. అంతేకాదు.. గుజరాత్ పోర్టుకు వచ్చిన ఓ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నట్లు తేలగానే చంద్రబాబు ముఠా దాన్ని రాష్ట్రంతో లింకు పెట్టి రచ్చ చేసింది. విశాఖపట్నం పోర్టుకు వచ్చిన డ్రై ఈస్ట్ కంటైనర్ విషయంలోనూ ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్న చందంగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. ఈ కంటైనర్ల విషయంలో బాబు ముఠా ఆరోపణలన్నీ అవాస్తవాలేనని సీబీఐ దర్యాప్తుల్లో వెల్లడైంది.కేంద్ర హోం శాఖ తాజా నివేదిక కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. నాడు డ్రగ్స్ కేసుల జాబితాలోనే లేని ఏపీ దేశంలో 2022, 2023, 2024 సంవత్సరాల్లో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా (ఎన్డీపీఎస్) కేసులు, ఈ కేసులు అత్యధికంగా నమోదైన 12 రాష్ట్రాల వివరాలను కేంద్ర హోం శాఖ పార్లమెంటుకు నివేదించింది. ఈ మూడేళ్లలో దేశంలో ఎన్డీపీఎస్ చట్టం కింద మొత్తం 3,02,228 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఎన్డీపీఎస్ కేసుల్లో.. కేరళ దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో పంజాబ్, మూడో స్థానంలో మహారాష్ట్ర ఉన్నట్లు తెలిపింది. మొత్తం 12 రాష్ట్రాల్లో నమోదైన కేసుల వివరాలనూ ఇచ్చింది. హోం శాఖ ఇచ్చిన ఈ టాప్ 12 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేనే లేదన్న వాస్తవం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం డ్రగ్స్ దందాను సమర్ధంగా కట్టడి చేసిందన్న విషయాన్ని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.కంటైనర్ల విషయంలోనూ విష ప్రచారమేఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విదేశాల నుంచి రాష్ట్రానికి భారీగా డ్రగ్స్ దిగుమతి చేస్తున్నారంటూ చంద్రబాబు ముఠా చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అదంతా దుష్ప్రచారమేనని సీబీఐ దర్యాప్తుతో నిగ్గు తేలింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు గుజరాత్లోని కాండ్లా పోర్టుకు వచ్చిన ఓ నౌకలోని కంటైనర్లో భారీగా డ్రగ్స్ను గుర్తించారు. వెంటనే దీనిపై చంద్రబాబు కూటమి, ఎల్లో మీడియా విష ప్రచారం ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకే ఆ డ్రగ్స్ను దిగుమతి చేశారంటూ యాగీ చేశాయి. డీఆర్ఐ, సీబీఐ దర్యాప్తులో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కంటైనర్లోని మాదక ద్రవ్యాలను గుజరాత్ పోర్టులో దిగుమతి చేసి చెన్నైకు తరలించాలన్నది ఆ డ్రగ్స్ ముఠా మాస్టర్ ప్లాన్ అని ఆ రెండు కేంద్ర సంస్థల దర్యాప్తులో వెల్లడైంది. సీబీఐ చెన్నైకు చెందిన కొందరిని అరెస్ట్ కూడా చేసింది. ఇక ఎన్నికలకు ముందు ఓ ఆక్వా సంస్థ విదేశాల నుంచి డ్రై ఈస్ట్ను దిగుమతి చేసుకుంది. ఈ కంటైనర్పై అనుమానంతో సీబీఐ అధికారులు తనిఖీ చేయగానే చంద్రబాబు కూటమి మళ్లీ రాద్ధాంతం మొదలెట్టింది. డ్రై ఈస్టు పేరుతో డ్రగ్స్ను దిగుమతి చేశారంటూ కూటమి నేతలు, ఎల్లో మీడియా విష ప్రచారం చేశారు. సీబీఐ దర్యాప్తులో వాస్తవాలు వెల్లడయ్యాయి. ఆ కంటైనర్ ద్వారా దిగుమతి చేసింది డ్రై ఈస్టు మాత్రమేనని సీబీఐ నిర్ధారించింది. దీంతో ఈ రెండు కంటైనర్ల విషయంలో టీడీపీ కూటమి చేసిందంతా దుష్ప్రచారమేనన్నది నిర్ధారణ అయ్యింది. కేవలం ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయ ప్రయోజనం పొందేందుకే చంద్రబాబు ముఠా వైఎస్సార్సీపీ ప్రభుత్వంతోపాటు యావత్ రాష్ట్రంపై విష ప్రచారానికి తెగించిందన్న విషయం నిగ్గు తేలింది. -
తాడేపల్లిలో మహిళపై అత్యాచారం.. హత్య
తాడేపల్లి రూరల్: విజయవాడ–గుంటూరు జాతీయ రహదారి మధ్య డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఓ మహిళ అత్యాచారం, ఆపై హత్యకు గురైంది. స్థానికుల కథనం మేరకు.. కొలనుకొండ జాతీయ రహదారి నుంచి గుంటూరు చానల్ మీదుగా ఇప్పటం వెళ్లే రహదారిలో జాతీయ రహదారికి 100 మీటర్ల దూరంలో ఈ దారుణం జరిగింది. మహిళ మృతదేహానికి ఎడమ చేతి వైపున గొంతుపై బలంగా పొడిచినట్లు గాయం కనిపిస్తోంది. మహిళ మొహంపై పూర్తిగా రక్తం ఉండడంతో ఆమె ముఖఛాయలు సరిగా కనిపించడం లేదు. మర్మాంగం వద్ద రక్తం కారుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మహిళ రెండు కాళ్లూ మోకాలు నుంచి కిందకు వంచి ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లే సరికి హత్య జరిగి సుమారు 40 నిమిషాలు అయ్యుండొచ్చని భావిస్తున్నారు. తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అది హత్యగా నిర్ధారించారు. సంఘటన స్థలం వద్ద సెల్ఫోన్, హ్యాండ్ బ్యాగ్ లభించాయని.. వాటిని పరిశీలించి ఆ మహిళ ఎవరో గుర్తిస్తామని తెలిపారు. కాగా, డీజీపీ కార్యాలయం సమీపంలో, జాతీయ రహదారి పక్కనే ఓ హోటల్లో నిత్యం పోలీసులు ఉంటున్నప్పటికీ ఈ సంఘటన జరగడం చర్చనీయాంశమైంది. జనవరి 31వ తేదీన కూడా గుంటూరు ఛానల్ నుండి నులకపేటకు వచ్చే రహదారిలో ఇదే గ్రామంలో డీజీపీ కార్యాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఇదే తరహాలో ఓ మహిళ హత్యకు గురైంది. ఆ మహిళ ఎవరో ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. ఈ రెండు హత్యలు ఒకేలా జరగడంతో ఒకే వ్యక్తి చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.వెలిగే ఉన్న సెల్ ఫోన్ టార్చిలైట్సంఘటనా స్థలం వద్ద మహిళ మృతదేహం కనిపించేలా సెల్ఫోన్లో టార్చిలైట్ వెలిగే ఉంది. హత్య చేసిన వ్యక్తే ఈ పని చేసి ఉంటాడనే అనుమానం వ్యక్తమవుతోంది. మహిళ సెల్ఫోన్కు ఎటువంటి రక్తపు మరకలు కనిపించ లేదు. లేదా హత్య జరగక ముందే ఆ మహిళ సెల్ ఫోన్లోని టార్చ్ లైట్ను ఆన్ చేసి ఉంచిందా.. అనే దిశలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ సెల్ఫోన్ కీలకంగా మారడంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. మరో కోణంలో.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కేసులు నమోదైన నేరస్తుల ద్వారా కూడా వివరాలు సేకరించి ఆ మహిళను గుర్తించే ప్రయత్నం చేస్తామని సీఐ తెలిపారు. -
నేటి నుంచి పార్లమెంట్లో ‘అరకు’ కాఫీ ఘుమఘుమలు
సాక్షి, అమరావతి: ఢిల్లీలోని పార్లమెంట్ భవన్లో సోమవారం అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం కానున్నాయి. అరకు కాఫీకి మరింత ప్రచారం కల్పించేందుకు లోక్సభ స్పీకర్ అవకాశం కల్పించారు.సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద సోమవారం నుంచి ఈ నెల 28 వరకు స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు కోసం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జి.సంధ్యారాణి, గిరిజన కో–ఆపరేటివ్ సొసైటీ(జీసీసీ) అధికారులు ఆదివారం ఢిల్లీ వెళ్లారు. -
ఓ వైపు ఎండలు.. మరోపక్క వానలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతున్నాయి. రాయలసీమలోని అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య తదితర జిల్లాల్లో పలుచోట్ల శనివారం సాయంత్రం పిడుగులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వలసలపల్లెలో ఆదివారం 2.9 సెం.మీ. వర్షం పడింది.శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్నిచోట్ల వడగళ్ల వర్షం కురిసింది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కోస్తా జిల్లాల్లోనూ పలుచోట్ల ఆదివారం సాయంత్రం చెదురుమదురు వర్షాలు కురిశాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో జల్లులు పడ్డాయి. విజయవాడలోని గుణదల, ప్రసాదంపాడు తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో భారీ వర్షం కురిసింది.అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో చిరు జల్లులు కురిశాయి. ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు, మూడు రోజుల క్రితంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతున్నాయి. ఆవర్తనం.. ద్రోణి ప్రభావంతోనే..ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో ఒక ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం వల్ల వీచే గాలులు, ద్రోణి ప్రభావంతో వీచే గాలులు కలిసినప్పుడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు పడుతున్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. -
‘రెడ్బుక్’కు సహకరించని వారిపై బదిలీ వేటు!
సాక్షి, అమరావతి: రెడ్బుక్ కుట్రలకు సహకరించని పోలీస్ అధికారులకు పొగబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడుతోంది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, సీఐడీ విభాగంలో ఐజీ వినీత్ బ్రిజ్లాల్లను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసేందుకు సిద్ధపడుతోంది. దీర్ఘకాలిక సెలవు నుంచి తిరిగొచ్చిన డీజీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంను కీలక పోస్టులో నియమించాలని భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీకి ప్రభుత్వం ఉపక్రమించింది. ఐజీ నుంచి డీజీ స్థాయి అధికారుల బదిలీ ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో భాగంగా.. ⇒ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చీని బదిలీచేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆయనపట్ల టీడీపీ ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విశాఖపట్నం వంటి కీలక నగరంలో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడుకోవాలని అమరావతిలోని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు. కానీ, అందుకు శంఖబత్ర బాగ్చీ సహకరించడంలేదని ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని బదిలీ చేయాలని ప్రభుత్వ పెద్దలు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఆయన స్థానంలో విశాఖపట్నం సీపీగా ప్రస్తుత గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అక్రమాలకు ఆయన ఏకపక్షంగా కొమ్ముకాసిన విషయం తెలిసిందే. ఇక తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు కళంకం ఆపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన వివాదంపై దర్యాప్తు కోసం నియమించిన సిట్లో ఆయన్నే సభ్యునిగా చేర్చారు. ఈ నేపథ్యంలో.. నిబంధనలతో నిమిత్తం లేకుండా టీడీపీ పెద్దల ఆదేశాలను అమలుచేస్తారనే నమ్మకంతోనే సర్వశ్రేష్ఠ త్రిపాఠిని విశాఖ పోలీస్ కమిషనర్గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ⇒ అలాగే, నిబంధనల మేరకు మాత్రమే పనిచేసే అధికారిగా గుర్తింపు పొందిన సీఐడీ విభాగంలో ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్లాల్ను కూడా బదిలీచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెడ్బుక్ కుట్రలో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు దర్యాప్తు కోసం నియమించిన సిట్ ఇన్చార్జ్గా ఈయన ఉన్నారు. దర్యాప్తుతో నిమిత్తం లేకుండా తాము చెప్పినట్లు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడికి ఆయన ఏమాత్రం లొంగలేదు. నిబంధనల మేరకు దర్యాప్తు చేస్తా.. లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోతానని వినీత్ స్పష్టంచేసి సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో.. అప్పటికప్పుడు ఆయన్ను బదిలీచేస్తే అభాసుపాలవుతామని ప్రభుత్వ పెద్దలు వెనుకంజ వేశారు. అందుకే ప్రస్తుతం సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ పేరుతో ఆయన్ని సీఐడీ విభాగం నుంచి తప్పించి అప్రాధాన్య పోస్టుకు పరిమితం చేయాలని చూస్తున్నారు. ⇒ ఇక దీర్ఘకాలిక సెలవు ముగించుకుని వచ్చిన డీజీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంను ప్రభుత్వం కీలక పోస్టులో నియమించనుంది. ఆయనకు పోలీసు శాఖలో పోస్టు ఇస్తారా లేదా ఇతర శాఖలో ముఖ్య కార్యదర్శిగా నియమిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఐటీ శాఖలో ఆయన్ను నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ⇒ మరోవైపు.. తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి కేటాయించిన డీజీ స్థాయి అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిస్త్ ఇంకా రాష్ట్రంలో రిపోర్టు చేయలేదు. మరో ఐపీఎస్ అభిషేక్ మహంతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారు ఏపీలో రిపోర్ట్ చేసిన అనంతరం వారిని ఏ పోస్టుల్లో నియమిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఉన్న అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారులను కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారులను ఈ వారంలోనే బదిలీ చేసే అవకాశాలున్నాయని పోలీసుశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
అకాల వర్షం.. అపార నష్టం.. నేడు పరిశీలించనున్న వైఎస్ జగన్
ఇది నిన్నటి దృశ్యం.పచ్చటి అరటి తోటలు.. బారెడు గెలలతో కోతకు సిద్ధమయ్యాయి.. తమ ఆశలు పండించేలా ఉన్న తోటల్ని చూసి రైతు కళ్లల్లో ఆనందం తాండవించింది. ఇక అప్పులన్నీ తీరతాయని ధైర్యం వచ్చింది. ఇది నేటి పరిస్థితి.ఎటు చూసినా విరిగిన అరటి చెట్లు.. నేలవాలిన తోటలు. చేతికందే దశలో పంట నేలపాలై కంట నీరు పెట్టుకుంటున్న రైతులు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని దీనస్థితి. అమరావతి/లింగాల/అనంతపురం అగ్రికల్చర్: అకాల వర్షాలకు వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. పెద్దకుడాల గ్రామానికి చెందిన రామాంజనేయరెడ్డి అనే రైతు మాట్లాడుతూ.. 3 ఎకరాల్లో యాలకి (సుగంధాలు) అరటి సాగు చేయగా.. పంట చేతికొచ్చే సమయంలో పూర్తిగా నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. గోరుచుట్టుపై రోకలి పోటులా.. గోరుచుట్టుపై రోకలి పోటులా అకాల వర్షం వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లోని అరటి రైతులను దెబ్బతీసింది. గత నెలలో టన్ను అరటి ధర రూ.23 వేల నుంచి రూ.25 వేలు ఉండేది. ఇప్పుడు ధరలు పడిపోవడంతో పెట్టుబడులు దక్కుతాయో లేదోనని అరటి రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పులు చేసి పంటల్ని సాగుచేస్తే చేతికందాల్సిన పంట నేలనంటిందని వాపోతున్నారు. పురుగు మందులు, ఎరువుల ధరలు ఏటా పెరుగుతుంటే.. పంట సాగుచేసిన తమకు గిట్టుబాటు ధరలేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటల్ని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. రైతుల్ని ఆదుకుంటాం: సీఎం అకాల వర్షాలు ఈదురు గాలులకు పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పంటలు దెబ్బతిన్న జిల్లాల కలెక్టర్లతో సీఎం ఫోన్లో మాట్లాడారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయి అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లికి చెందిన ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై సీఎం ఆరా తీశారు. ఆ ఇద్దరు రైతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.ప్రభుత్వం ఆదుకోవాలికోటి ఆశలతో అప్పులు చేసి అరటి పంటను సాగు చేస్తే అకాల వర్షం, ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ వర్షానికి తీవ్రంగా నష్టపోయాం. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. – శ్రీనివాసులరెడ్డి, అరటి రైతు, ఎగువపల్లెఈ స్థితి వస్తుందనుకోలేదుఏటా ఏప్రిల్, మే నెలల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసేవి. ఆలోగా రైతులు అరటి పంట దిగుబడి చేతికందేది. ఈ ఏడాది ముందుగానే భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో తీవ్రంగా నష్టపోయాం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. – రామాంజనేయరెడ్డి, అరటి రైతు, పెద్దకుడాలనేడు వైఎస్ జగన్ పర్యటన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని వైఎస్సార్సీపీ మండల కన్వినర్ బాబురెడ్డి తెలిపారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె గ్రామాల్లో శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిన అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారన్నారు. -
సిండికేటు లూటీ!
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కాజేసిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు తమకు సన్నిహితులైన కాంట్రాక్టర్లతో సిండికేట్ను ఏర్పాటు చేసి రాజధాని నిర్మాణ పనులను అధిక ధరలకు కట్టబెడుతున్నారు. మొన్న.. రూ.10,696.79 కోట్ల వ్యయంతో 37 ప్యాకేజీల కింద రాజధాని ముంపు నివారణ, రహదారుల నిర్మాణంలో మిగిలిన పనులకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏడీసీఎల్) నిర్వహించిన టెండర్లలో సిండికేట్ బాగోతం బట్టబయలైంది. నేడు.. రూ.16,463.83 కోట్ల వ్యయంతో 22 ప్యాకేజీల కింద భూసమీకరణ ద్వారా భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు లేఅవుట్ల అభివృద్ధి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్.. మంత్రులు, జడ్జిలు, ఐఏఎస్ అధికారులకు బంగ్లాల నిర్మాణ పనులకు సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ఖరారు చేసిన టెండర్లలోనూ ప్రభుత్వ పెద్దల లాలూఛీ బాగోతం మరోసారి బట్టబయలైంది. ఏడీసీఎల్, సీఆర్డీఏ రెండు కలిసి రూ. రూ.27,160.62 కోట్ల కాంట్రాక్టు విలువతో 59 ప్యాకేజీల కింద పనులకు టెండర్లు పిలిచాయి. ఈ పనులను రూ.28,209.62 కోట్లకు సిండికేట్లోని ఎనిమిది కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వ పెద్దలు పంచి పెట్టారు. కాంట్రాక్టు విలువ కంటే సగటున 3.94 నుంచి 4.34 శాతం అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ఖజానాపై రూ.1,049 కోట్లు భారం మోపారు. అదే రివర్స్ టెండరింగ్ విధానం అమల్లో ఉండి ఉంటే కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి కనీసం 8 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చేవారని.. దీనివల్ల ఖజానాకు రూ.2,500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల మేర ఆదా అయ్యేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సిండ్ఙికేటు’ రాజ్యం..!రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలవక ముందే సన్నిహిత కాంట్రాక్టు సంస్థలతో ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపారు. ఆ కాంట్రాక్టర్లతో సిండికేట్ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 2014–19 మధ్య షాపూర్జీ పల్లోంజీ కాంట్రాక్టు సంస్థ నుంచి ముఖ్యనేత తరఫున కమీషన్లు వసూలు చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సాక్ష్యాధారాలతో పట్టుబడిన అధికారే ఇప్పుడూ ప్రభుత్వ పెద్దల తరఫున సిండికేట్ కాంట్రాక్టర్లతో చక్రం తిప్పుతున్నారు. సిండికేట్లోని కాంట్రాక్టర్ల ప్రతిపాదన మేరకే వారికి అధికంగా పనులు కట్టబెట్టేందుకు వీలుగా బిడ్ కెపాసిటీని 2 ఎన్ఎన్–బీ నుంచి 3 ఏఎన్–బీకి పెంచుతూ ఫిబ్రవరి 10న ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయించారు. అంతకు ముందే అంచనాలను ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి, సిండికేట్ కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ జారీ చేయడానికి వీలుగా జ్యుడీషియల్ ప్రివ్యూ విధానాన్ని కూడా రద్దు చేశారు. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్డానికి వీలుగా రివర్స్ టెండరింగ్ విధానానికి కూడా మంగళం పాడారు. తమ అక్రమాలకు అడ్డొచ్చే వ్యవస్థలు.. విధానాలను అన్నింటినీ రద్దు చేశాకే రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు.పూలింగ్ లేఅవుట్ల అభివృద్ధికి రూ.14,887.64 కోట్లు..భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) పథకం కింద రాజధానికి రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. ఆ పథకం కింద రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలి. అందుకు రహదారులు, విద్యుత్, తాగునీటి సౌకర్యం వంటి కనీస సదుపాయాలు కల్పించడం ద్వారా లేఅవుట్లను అభివృద్ధి చేయాలి. రాజధానికి భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వడానికే 17 వేల ఎకరాలు భూమి అవసరం. ఇందులో లేఅవుట్ల అభివృద్ధి పనులకు 18 ప్యాకేజీల కింద సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఈ పనులన్నింటినీ కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకే సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. రూ.14,887.64 కోట్లకు ఆ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ తదితర పన్నుల రూపంలో కాంట్రాక్టర్లకు అదనంగా ఇస్తామని సీఆర్డీఏ చెప్పిన మొత్తాన్ని కూడా కలిపితే ఈ పనుల వ్యయం రూ.17 వేల కోట్లకు చేరుతుంది. అంటే ఎకరం భూమిలో లేఅవుట్ అభివృద్ధి చేయడానికే సగటున రూ.కోటి చొప్పున వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలే చెబుతున్నాయి. వాస్తవానికి అత్యాధునిక సదుపాయాలతో లేఅవుట్ను అభివృద్ధి చేయడానికి ఎకరానికి రూ.50 లక్షలకు మించి వ్యయం కాదని స్పష్టం చేస్తున్నారు. ఇక సీఆర్డీఏ ద్వారా ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగుతూ చేపట్టిన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్.. మంత్రులు, జడ్జీలకు బంగ్లాలు.. ఐఏఎస్లకు బంగ్లాల నిర్మాణ పనులను నాలుగు ప్యాకేజీల కింద కాంట్రాక్టర్లకు అప్పగించారు.– ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన కృష్ణారెడ్డికి చెందిన మేఘా సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లే అవుట్లు అభివృద్ధి చేసేందుకు సంబంధించిన ఐదు ప్యాకేజీల పనులను కట్టబెట్టారు. ఈ పనుల విలువ రూ.5,608.7 కోట్లు.– ఈనాడు కిరణ్ సోదరుడి వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి నాలుగు పనులను ప్రభుత్వ పెద్దలు అప్పగించారు. ఈ పనుల విలువ రూ.2,813.66 కోట్లు.– బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్లకు సంబంధించి ఎనిమిది ప్యాకేజీల పనులను అప్పగించారు. వీటి విలువ రూ.3,945.47 కోట్లు.– ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఏవీ రంగరాజు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఎన్సీసీ సంస్థకు హ్యాపీ నెస్ట్తోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణం, ఓ ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ పని అప్పగించారు. వీటి విలువ రూ.3,438.21 కోట్లు.– మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఆయన తరఫున ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన కనకమేడల వరప్రసాద్కు చెందిన కేఎమ్వీ ప్రాజెక్ట్స్కు ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనులు కట్టబెట్టారు.– సీఎం చంద్రబాబుతో ఆది నుంచి సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్ అభివృద్ధి చేసే ఒక ప్యాకేజీ పనిని అప్పగించారు.ఎనిమిది సంస్థలకే పనులన్నీ..రాజధాని అమరావతిలో వరద మళ్లింపు, రహదారుల అభివృద్ధి పనులను 37 ప్యాకేజీల కింద చేపట్టేందుకు రూ.15,095.02 కోట్లతో ఏడీసీఎల్కు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇక ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్ల అభివృద్ధి, హ్యాపీనెస్ట్, మంత్రులు, జడ్జిలు, ఐఏఎస్ అధికారుల బంగ్లాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణ పనులను 22 ప్యాకేజీల కింద చేపట్టడానికి రూ.22,607.11 కోట్లతో సీఆర్డీఏకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ రెండూ మొత్తం 59 ప్యాకేజీల కింద పనులకు టెండర్లు పిలిచాయి. వాటన్నింటినీ సిండికేట్లోని ఎనిమిది సంస్థలే దక్కించుకున్నాయి. ఎన్సీసీ సంస్థ రూ.6,124.08 కోట్లు, బీఎస్సార్ ఇన్ఫ్రా రూ.6,216.47 కోట్లు, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ రూ.6,031.79 కోట్లు, మేఘా రూ.7,022.38 కోట్లు, ఎమ్వీఆర్ ఇన్ఫ్రా (నారా లోకేష్ తోడల్లుడు విశాఖ ఎంపీ భరత్ సన్నిహితుడికి చెందిన సంస్థ)కు రూ.796.04 కోట్లు, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే కృష్ణయ్యకు చెందిన బీఎస్పీసీఎల్కు రూ.779.82 కోట్లు, ఎల్ అండ్ టీ సంస్థకు రూ.809.88 కోట్లు, కేఎమ్వీ ప్రాజెక్ట్స్కు రూ.429.23 కోట్ల విలువైన పనులను కట్టబెట్టబెట్టారు.నీకింత.. నాకింత..సీఆర్డీఏ, ఏడీసీఎల్ 59 ప్యాకేజీల కింద పనులకు పిలిచిన టెండర్లను ప్రభుత్వం ఆమోదించింది. ఆ పనులను రూ.28,209.62 కోట్లకు ఎనిమిది కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వ పెద్దలు పంచి పెట్టారు. ఆ పనులను అప్పగిస్తూ సీఆర్డీఏ, ఏడీసీఎల్ వాటితో ఒప్పందం చేసుకున్న వెంటనే కాంట్రాక్టు విలువలో పది శాతం అంటే రూ.2,820.96 కోట్లను ఆ సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెబుతాయి. అందులో 8 శాతం అంటే.. రూ.2,256 కోట్లను ప్రభుత్వ పెద్దలు తొలి విడత కమీషన్లుగా రాబట్టుకోనున్నారు. ఇందుకోసమే గత ప్రభుత్వం రద్దు చేసిన మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని పునరుద్ధరించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. సిండికేట్ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసే బాధ్యతను గతంలో ఆదాయపు పన్ను శాఖకు చిక్కిన అధికారికే ప్రభుత్వ పెద్దలు అప్పగించినట్లు చర్చ సాగుతోంది. -
విలువే లేకుండా పోయింది.. ఎందుకీ ఊడిగం!
కూటమి విజయానికి మనమే కారణం అయ్యాం... మనం లేకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేనా.. ఆయన సీఎం అయ్యేనా.. కాపులంతా గంపగుత్తగా ఓట్లేయకపోతే కూటమికి ఇంత మెజారిటీ ఎలా వస్తుంది.. ఇన్ని సీట్లు ఎలా వస్తాయి..ఈ కూటమి ప్రభుత్వ రథానికి మనమే చక్రాలం..మనమే ఇరుసు..మనమే ఇంధనం కానీ ఇప్పుడు మనం కరివేపాకులం అయిపోయాం. పులుసులో ముక్కలం అయిపోయాం .. మనకు ఎక్కడ విలువ గౌరవం దక్కడం లేదు.దేనికోసం ఇంత త్యాగాలు చేయాలి అంటూ జనసేన ఎమ్మెల్యేలు మదన పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామి.. అందులో 21 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వారిలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఈ ముగ్గురికి క్యాబినెట్లో స్థానం దక్కింది.. మిగతా 18 మంది వట్టి ఎమ్మెల్యేలు గానే ఉన్నారు. అయితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోతుందని జనసేన బాధపడుతుంది.జనసేన ఎమ్మెల్యే కన్నా టిడిపి ఇంచార్జీ మిన్నతాము ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీని ఆ నియోజకవర్గాల్లో టిడిపి ఇన్చార్జిలకే అధికారులు గౌరవిస్తున్నారని వారి మాట వింటున్నారని తమకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని జనసేన ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతూ కాసేపటి క్రితం విజయవాడలోని హోటల్లో సమావేశం అయ్యారు. దీనికి నాదెండ్ల మనోహర్ కొందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మనోహర్ తో ఎమ్మెల్యేలంతా ఈ విషయాన్ని మొరపెట్టుకున్నట్లు తెలిసింది. స్థానికంగా తమ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీని తమ మాటను పోలీసులు రెవెన్యూ పంచాయతీ అధికారులు ఎవరూ వినడం లేదని తెలుగుదేశం వారు చెబితేనే అక్కడ మాట చెల్లుబాటు అవుతుందని మనోహర్ ఎదుట వాపోయారు.మంత్రులుగా ఉన్న ఆ ముగ్గురికి నియోజకవర్గంలో కాస్త గౌరవం ఉన్నప్పటికీ మిగతా ఎమ్మెల్యేలు ఎవరికి ఇండిపెండెంట్గా పని చేసే అవకాశం దక్కడం లేదు. నియోజకవర్గాల పెద్ద పని ఏదైనా ఉంటే ఆ జిల్లా మంత్రి వద్దకు వెళ్లాల్సి వస్తుంది. పైగా ఆ మంత్రి కూడా లోకేష్ కంట్రోల్లో పనిచేస్తున్నారు. లోకేష్ కూడా జనసేన ను పెద్దగా పట్టించుకోకుండా జిల్లాల తన సొంత టీం ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు. దీంతో అనివార్యంగా జనసేన నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. పలుచోట్ల వ్యాపారాల్లోనూ అక్రమ ఆదాయం తెలుగుదేశం జనసేన మధ్య పోటీ నెలకొన్న తరుణంలో తెలుగుదేశం వారు పలువురు జనసేన కార్యకర్తలను వెంటాడి కొట్టిన ఘటనలు ఉన్నాయి.ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు తెలుగుదేశానికి ఊడిగించేయడం కోసమే తమ పార్టీ ఉందా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని తెలుగుదేశం ఇన్చార్జిలకు అధికారులు గౌరవం ఇవ్వడం దానికి ఎంత అవమానం అన్నది ఈ సమావేశంలో వారంతా నాదెండ్ల మనోహర్ కు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పెద్దలతో మాట్లాడి సెటిల్ చేస్తే జిల్లాలో తమ గౌరవం నిలబడుతుందని అంతిమంగా పార్టీ కూడా బలపడే అవకాశం ఉంటుందని వారు చెప్పుకున్నారు.కానీ జనసేన బలపడాలని తెలుగుదేశం ఏ కోశానా కోరుకోదు. జనసేన బలం తమకు బలం కావాలని తెలుగుదేశం భావిస్తుంది తప్పితే జనసేన సొంతంగా తన కాళ్లపై తన నిలబడి పోటీ చేసే పరిస్థితి వస్తే తెలుగుదేశానికి ఎంత ఇబ్బంది అన్నది చంద్రబాబు లోకేష్ లకు తెలుసు. అందుకే ఎక్కడికి అక్కడ జనసేన నాయకులను కార్యకర్తలను తమ కాళ్ళ కింద పెట్టి ఉంచుతూ ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం క్యాడర్ను మాత్రమే గుర్తిస్తూ పనులు పథకాలు పైరవీలు అని వాళ్ల ద్వారా జరిగేలా చూస్తున్నారు.నియోజకవర్గాల్లో పనులు అంటూ జరిగితే తెలుగుదేశం వారి ద్వారానే జరగాలి లేదంటే లేదు. అంతేతప్ప జనసేన నాయకుడికి ఎక్కడా మర్యాద దక్కకూడదు అనే సింగల్ పాయింట్ ఏజెండాతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇదంతా తమకు అవమానంగా భావిస్తున్న జనసేన ఎమ్మెల్యేలు తమ గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే అంటూ మనోహర్ మీద ఒత్తిడి తెచ్చారు. మరోవైపు లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ శాఖను సైతం హైజాక్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదంతా జనసేన మనుగడకు.. భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని వారు కలవరపడుతూ దిద్దుబాటు చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏ స్థాయి ఫలితాలు ఇస్తుందో చూడాలి.-సిమ్మాదిరప్పన్న -
ధర్నాచౌక్ సాక్షిగా ప్రజాగ్రహం
సాక్షి, అమరావతి: ప్రజాగళం వినిపించే ప్రతిపక్షానికి చోటు లేకుండా చేసి ఆత్మస్తుతి–పరనింద ధ్యేయంగా మారిన అసెంబ్లీ సమావేశాలు ఒకపక్క జరుగుతుండగా, మరోపక్క కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు చేసిన ఆందోళనకు విజయవాడ ధర్నాచౌక్ కేంద్రంగా నిలిచింది. ఉద్యోగ, అంగన్వాడీ, ఆశా, వ్యవసాయ కార్మిక, ఉపాధి హామీ కూలీలు సహా 20కిపైగా విభాగాలకు చెందిన సామాన్య ప్రజానీకం తమ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తెచ్చేలా పది రోజులకుపైగా మండుటెండను సైతం లెక్క చేయకుండా సాగించిన ఉద్యమ హోరు కూటమి ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే పెల్లుబికిన అసంతృప్తికి అద్దం పట్టింది. డిమాండ్లు నాలుగు నెలల్లోగా పరిష్కరించకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ప్రజానీకం అల్టిమేటం ఇచ్చింది. వెల్లువెత్తిన ఆందోళనలు.. » అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వేతనాల పెంపు, గ్రాట్యుటీ, తదితర డిమాండ్స్ నెరవేర్చాలని మహాధర్నాను నిర్వహించారు. » పెద్ద ఎత్తున ఫీజు పోరు, బకాయిల విడుదలకు ఆందోళన జరిగింది. » ఆశా వర్కర్లు కనీస వేతనం నెలకు రూ.26 వేలతోపాటు పలు డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ ధర్నాకు దిగారు. » వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, నెలకు రూ.10వేలు వేతనం హామీని నిలబెట్టుకోవాలని మహాధర్నా జరిగింది. » రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని, తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని, ఐదు నెలలుగా ఉన్న వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (వీఓఏ) ధర్నా నిర్వహించారు. » కనీస వేతనాలు వర్తింపజేయాలని ఏపీ గ్రామ పంచాయతీ కార్మికులు ఉద్యమించారు. » గ్రామ, వార్డు సచివాలయాల్లోని హెల్త్ సెక్రటరీలను వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తూధర్నా జరిగింది. » కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది పొట్టగొట్టేలా.. ఆప్కాస్ విధానం రద్దును విరమించుకోవాలని ఉద్యమించారు. » ఆరు నెలల్లో సమస్య పరిష్కరించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అగ్రిగోల్డ్ బాధితులు అల్టిమేటం ఇచ్చారు. » డప్పు కళాకారుల రిజిస్ట్రేషన్ పేరుతో పెన్షన్ తొలగించడంపై ధర్నా నిర్వహించారు. » ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులకు నెలవారి పెన్షన్ రూ.10 వేలకు పెంచాలని కోరుతూ ధర్నా చేశారు. » నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి ఆదుకోవాలంటూ కాటికాపరులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. » మిలియపుట్టి సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను ఏర్పాటు చేయాలని ఆదివాసీలు ధర్నా చేశారు. » మెప్మా, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు, ఉపాధి హామీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు తదితర అనేక విభాగాలకు చెందిన వారు కూటమి ప్రభుత్వం హామీలిచ్చి మోసం చేసిందని ధర్నాచౌక్లో నినదించారు. -
వైఎస్ ఇచ్చిన వరం.. మా బతుకు బంగారం
నూజివీడు: ట్రిపుల్ ఐటీ.. ఈ పేరు చెబితేనే వాటి వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు అందరి మదిలో మెదులుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పిల్లలకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను ప్రభుత్వమే అందించి వారి కుటుంబాల్లో మార్పు తీసుకురావాలనే సత్సంకల్పంతో 2008లో వైఎస్ ఈ ట్రిపుల్ ఐటీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అనాటి ఉమ్మడి కృష్ణాజిల్లా.. ప్రస్తుత ఏలూరు జిల్లా నూజివీడులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటైంది. అప్పట్లో ఇక్కడ చదువుకున్న మొదటి బ్యాచ్ (2008–14) విద్యార్థుల సమ్మేళనం శనివారం స్థానిక ట్రిపుల్ ఐటీ ఆడిటోరియంలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాచ్ విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడ్డారు. 400 మంది విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్ ఐటీలను స్థాపించి ఉండకపోతే తమ భవిష్యత్తు సాదాసీదాగానే ఉండేదని, తమ జీవితాలు ప్రస్తుతం ట్రిపుల్ ఐటీకి పూర్వం, ట్రిపుల్ ఐటీ తరువాత అన్నట్లుగా చెప్పుకోవచ్చని వారు తెలిపారు. ట్రిపుల్ ఐటీలవల్లే తాము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని వారంతా ముక్తకంఠంతో చెప్పారు. పలువురు విద్యార్థుల భావాలు వారి మాటల్లోనే.. ఏడాదికి రూ.35 లక్షల వేతనం వస్తోంది 2008లో ట్రిపుల్ ఐటీలో చేరి ఈసీఈ బ్రాంచితో ఇంజనీరింగ్ పూర్తిచేశా. మా నాన్న సన్నకారు రైతు, రైతు కూలీ. చదువు పూర్తవగానే సెమీ కండక్టర్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరా. ప్రస్తుతం ఏఆర్ఎం సెమీ కండక్టర్స్ కంపెనీలో జాబ్చేస్తున్నా. ఏడాదికి రూ.35 లక్షల వేతనం వస్తోంది. ట్రిపుల్ ఐటీవల్లే ఈ స్థాయిలో ఉన్నా. – నుగ్గు ఆదినారాయణ, గొల్లపల్లి, పొదిలి మండలం, ప్రకాశం జిల్లా అమెరికన్ కంపెనీలో లీడ్ ప్రొడక్ట్ మేనేజర్గా.. అమెరికన్ కంపెనీలో లీడ్ ప్రొడక్ట్ మేనేజర్గా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా. ఏడాదికి రూ.36 లక్షల వేతనం వస్తోంది. ఈసీఈ చదివాక ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చింది. ఈ స్థాయిలో ఉండటానికి కారణం కేవలం ట్రిపుల్ ఐటీనే. వీటిని స్థాపించకపోయి ఉంటే సాదాసీదా చదువులు చదివేవాడిని. ఇలాంటి విద్యా సంస్థ నెలకొల్పిన వైఎస్ రాజశేఖరరెడ్డికి సెల్యూట్. – పక్కి కార్తీక్, గజపతినగరం, విజయనగరం జిల్లా ఏడాదికి రూ.50 లక్షల వేతనం వస్తోంది.. వైఎస్ రాజశేఖర్రెడ్డి స్థాపించిన ట్రిపుల్ ఐటీలో చదువుకోవడంవల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా. ప్రస్తుతం ఇన్ఫర్మేటికల్ సంస్థలో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నా. ఏడాదికి రూ.50 లక్షల వేతనం వస్తోంది. మా నాన్న రైతు కూలీగా పనిచేస్తూ నన్ను చదివించారు. ట్రిపుల్ ఐటీ లేకపోతే నేను మా ఊరిలోనే ఉండేవాడినేమో. – పప్పల సురేష్, గోరింట, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా హెచ్పీసీఎల్ రిఫైనరీలో మేనేజర్గా.. నా సొంతూరు విశాఖపట్నంలోని గాజువాక. నూజివీడు ట్రిపుల్ ఐటీలో మొదటి బ్యాచ్లో నేను కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ఆ తరువాత విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ రిఫైనరీలో మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నా. మా నాన్న లారీ డ్రైవర్గా పనిచేసేవారు. ట్రిపుల్ ఐటీ అనేది లేకపోతే మేం లేం. ట్రిపుల్ ఐటీ అనేది మా జీవితంలో భాగమైంది. – భీశెట్టి గోపి, మేనేజర్, విశాఖ రిఫైనరీ, విశాఖపట్నం ఏడాదికి రూ.36 లక్షల వేతనం ట్రిపుల్ ఐటీ లేకపోతే చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాడిని. ఈసీఈ చదివి ప్రస్తుతం ఒడెస్సా సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్గా చేస్తున్నా. వేతనం ఏడాదికి రూ.36 లక్షలు వస్తోంది. మా నాన్న ప్రైవేటు టీచర్గా పనిచేసేవారు. ఇంజనీరింగ్ చేసిన తరువాత ఐఐఎం ఇండోర్లో ఎంబీఏ చదివి ఆ తరువాత ఉద్యోగంలో చేరా. – నంబూరు మధుబాబు, చల్లవానిపేట, జలుమూరు మండలం, శ్రీకాకుళం జిల్లా ఇస్రోలో సైంటిస్ట్గా విధులు నిర్వహిస్తున్నా..ప్రస్తుతం నేను తిరువనంతపురంలో ఇస్రోకు చెందిన విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్లో సైంటిస్ట్–ఈ కేడర్లో పనిచేస్తున్నా. ట్రిపుల్ ఐటీలో ఈసీఈ పూర్తిచేసి రగ్పూర్ ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేశా. ఆ తరువాత ఇస్రోలో చేరా. ఆరేళ్లపాటు ట్రిపుల్ ఐటీలో మా భవిష్యత్తుకు బంగారు బాట వేశారు. – కారుమూరి వంశీ, దేవరపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా స్టార్టప్ ప్రారంభించా.. మా నాన్న సన్నకారు రైతు. వ్యవసాయ కూలి పనులకూ వెళ్లేవాడు. ట్రిపుల్ ఐటీ మొదటి బ్యాచ్లో చేరి మెకానికల్ ఇంజనీరింగ్ చేశా. ఆ తరువాత ఐఐఎం లక్నోలో ఎంబీఏ చేశా. తర్వాత ఏడాదికి రూ.45 లక్షల వేతనంతో సాఫ్ట్వేర్ జాబ్ చేశా. ప్రస్తుతం స్టార్టప్ ప్రారంభించా. వైఎస్ రాజశేఖరరెడ్డి, రాజిరెడ్డి ఇద్దరూ మా జీవితాల్లో వెలుగులు నింపారు. ట్రిపుల్ ఐటీలు లేకపోతే మా కుటుంబ ఆరి్థక పరిస్థితికి పాలిటెక్నిక్ గాని, డిగ్రీ గాని మాత్రమే చదివేవాడిని. – పరిటాల శివాజీ, కారంపూడి, గుంటూరు జిల్లా రియాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ట్రిపుల్ ఐటీ లేకపోతే స్థానికంగా ఏదోక కాలేజీలో డిగ్రీ చదివి ఉండేవాడిని. ప్రస్తుతం టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీలో సౌదీలోని రియాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఏడాదికి రూ.72 లక్షల వేతనంతో పనిచేస్తున్నాను. ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరికీ వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుడు. మా అందరికీ లైఫ్ ఇచ్చారు. – సంజయ్ఖాన్, ఖాజీపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లా సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా చేస్తున్నా.. ఈసీఈ బ్రాంచిలో ఇంజనీరింగ్ పూర్తిచేసి ప్రస్తుతం అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీలో రూ.30 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా చేస్తున్నా. ఇక్కడ ఆరేళ్ల పాటు చదవడం ఒక రకంగా స్వర్ణయుగం. ట్రిపుల్ ఐటీలో చదవడం వరం. ఇలాంటి విద్యాసంస్థను ఏర్పాటుచేయడం గొప్ప విషయం. – పసుపురెడ్డి వివేక్, హరిపురం, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా ట్రిపుల్ ఐటీ మా జీవితాన్నే మార్చేసింది.. మా నాన్న మోటార్ మెకానిక్. ట్రిపుల్ ఐటీలో సీఎస్ఈ చదివా. ఆ తరువాత కాకినాడ జేఎన్టీయూలో ఎంటెక్ పూర్తిచేశా. కొంతకాలం టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశా. ఆ తరువాత 2018 నుంచి గుంటూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సీఎస్ఈ లెక్చరర్గా పనిచేస్తున్నా. ట్రిపుల్ ఐటీ మా జీవితాన్నే మార్చేసింది. – గజ్జా ప్రణయని, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా -
దొంగ ఓట్లకు ఇకనైనా చెల్లుచీటీ!
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాపై పెద్దఎత్తున వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేస్తూ.. పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. ఓటరు కార్డుకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం ద్వారా బోగస్ ఓట్లతో పాటు ఒకే వ్యక్తి పలుచోట్ల ఓటరుగా నమోదు కావడానికి అడ్డుకట్ట వేయనుంది. ఆంధ్రప్రదేశ్లో దొంగ, మల్టిపుల్ ఓట్లపై వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసినట్లుగానే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, మహారాష్ట్ర ఓటర్ల జాబితాపై పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ అనుమానాలు లేవనెత్తడంతో ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ దొంగ ఓట్ల నివారణే లక్ష్యంగా ఓటర్ల జాబితాకు ఆధార్ను అనుసంధానం చేయడానికి న్యాయ, సాంకేతికపరమైన ఇబ్బందులను పరిష్కరించడానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, లెజిస్లేటివ్ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈవోలతో కీలక సమావేశం నిర్వహించారు. » ఓటరు కార్డును ఆధార్తో అనుసంధానించడం అనేది ఆరి్టకల్ 326లోని నిబంధనల ప్రకారం మాత్రమే జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఆధార్ కార్డ్ ఒక వ్యక్తికి గుర్తింపు ఇస్తుందని, ఓటరు కార్డు ద్వారా ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పిస్తామంది. ఇంతకాలం ఆధార్ అనుసంధానం అనేది ఆప్షనల్గా ఉండగా ఇకమీదట తప్పనిసరి చేయనున్నారు. 2015లో శ్రీకారం ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం 2015లో మొదలుపెట్టినా సుప్రీంకోర్డు ఉత్తర్వులతో ఆగిపోయింది. ఒకే వ్యక్తి పలుచోట్ల ఓటు కలిగి ఉండడంతో వీటి ఏరివేతే లక్ష్యంగా 2015 ఫిబ్రవరిలో ఆధార్ అనుసంధానం చేపట్టింది. మూడు నెలల్లోనే 30 కోట్ల కార్డులను లింక్ చేసింది. కానీ, దీనిపై కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆధార్ అనుసంధానానికి అడ్డుకట్ట పడింది. తర్వాత ఎవరి ఇష్టాన్ని బట్టి వారు అనుసంధానం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే 66 శాతంపైగా ఓటరు కార్డులు అనుసంధానం అయినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. » ప్రస్తుతం రాష్ట్రంలో 4.14 కోట్ల మంది ఓటర్లుండగా, 70 శాతంపైనే ఆధార్తో అనుసంధానం అయినట్లు ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. » రాష్ట్ర విభజన తర్వాత చాలామంది అటు తెలంగాణ, ఇటు ఏపీలో ఓటు కలిగి ఉంటూ రెండుచోట్లా హక్కును వినియోగించుకుంటుండటంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. » గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించి మరీ ఓటర్లుగా చేర్పించడంపై వైఎస్సార్సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అనేక పార్టీల నుంచి ఇదే విధమైన విమర్శ వస్తుండటంతో పారదర్శక ఓటర్ల జాబితా తయారీ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. ఓటరు ఐడీ–ఆధార్ అనుసంధానంతో ప్రయోజనాలు » ఓటరు జాబితాకు సంబంధించిన లోపాల పరిష్కారం » ధ్రువీకృత ఓటర్ల జాబితాను దేశానికి సమర్పించడం » ఓటరు జాబితాలో మోసపూరిత పేర్లను చేర్చడాన్ని నివారించడం » రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదుల పరిష్కారం. » వ్యక్తులు వేర్వేరుచోట్ల నమోదు చేసుకునే అవకాశాన్ని తొలగించడం » ఎవరూ రెండు వేర్వేరు ప్రదేశాలలో నమోదు చేసుకోలేరని నిర్ధారించడం -
అమ్మో... కాటు!.. 600 మంది మృతి
దేశంలో మూడేళ్లుగా పాముకాట్లు పెరుగుతున్నాయి. పాము కాటుకు గురై మృతి చెందిన వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. 2022 నుంచి 2024 వరకు గత మూడేళ్లలో దేశంలో 2.69 లక్షల పాము కాటు కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాము కాటుకు మృతి చెందిన వారి సంఖ్య 600కు చేరింది. పాము కాటు కేసులు అత్యధికంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, అసోం రాష్ట్రాల్లో నమోదైనట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. పాము కాటుకు గురై చనిపోయిన వారు కర్ణాటక, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశాలో అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించింది. – సాక్షి, అమరావతివైద్య వ్యవస్థ బలోపేతానికి చర్యలుపాము కాటు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపింది. పాముకాటు నివారణకు మార్గదర్శకాలను కూడా జారీ చేసినట్లు పేర్కొంది. పాము కాటుకు చికిత్స అందించేందుకు వైద్య వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అత్యవసర మందులు, పరికరాలు, రవాణా యంత్రాంగం, ఇతర సౌకర్యాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం అందిస్తోందని తెలిపింది. జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన ఔషధాల జాబితాలో పాలీవాలెంట్ యాంటీ స్నేక్ వెనంను చేర్చినట్లు పేర్కొంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉచిత ఔషధాలకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులు ఇస్తున్నట్లు తెలిపింది. దేశంలో పాటుకాటు నివారణ కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పాము కాటు నిర్వహణ, అత్యవసర సంరక్షణ తదితర అంశాలపై వైద్య నిపుణులకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రజా వైద్య శాలల్లోని వైద్యులను పాము కాటు కేసుల అత్యవసర నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. -
మద్యం షాపులపై... బార్ ఓనర్స్ వార్
నరసరావుపేటటౌన్: మద్యం దుకాణాల యజమానులు అనధికారికంగా పర్మిట్ రూములు ఏర్పాటుచేసి నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా అమ్మకాలు సాగించడంపై బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు ఆందోళనబాట పట్టారు. అధికార కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ఎక్సైజ్ అధికారులు తమను నిండా ముంచేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేసి యజమానులు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తాము బార్లు నిర్వహించలేమని తాళాలను అధికారులకు అప్పగించారు. ఇప్పటికే నరసరావుపేట పట్టణంలో 17 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం మరో 11 వైన్ షాపులకు అనుమతులు ఇచ్చింది. ఆ వైన్ షాపుల్లో అనధికారికంగా పర్మిట్ రూములు ఏర్పాటుచేసి బార్ అండ్ రెస్టారెంట్లకు దీటుగా నిర్వహిస్తున్నారు.మాంసం, బిర్యానీ, ఇతర తినుబండారాలను అందుబాటులో ఉంచుతున్నారు. అక్కడ అన్ని సదుపాయాలు ఉండటం, మద్యం కూడా బార్ అండ్ రెస్టారెంట్ల కన్నా తక్కువ ధరకు వస్తుండటంతో ఎక్కువ మంది వైన్ షాపుల వద్దకే వెళుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి పెట్టిన బార్ అండ్ రెస్టారెంట్లు వెలవెలబోతున్నాయి. కూటమి నేతలకు మేలు చేసేలా అధికారుల తీరు ఎక్సైజ్ శాఖ ఆడుతున్న ఆటలో తాము బలైపోతున్నామంటూ నరసరావుపేటలోని బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. తమ బార్ అండ్ రెస్టారెంట్లకు తాళాలు వేసి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బార్ల తాళాలను ఎక్సైజ్ శాఖ సీఐ సోమయ్యకు అందజేసి తాము వ్యాపారం చేయలేమని తేల్చి చెప్పారు. వైన్ షాపుల్లో అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకునేవరకు తాము బార్లు తెరవబోమని స్పష్టం చేశారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బార్లు ఏర్పాటు చేసుకుంటే తమకు నెలకు రూ.5లక్షల వరకు నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేక పోతున్నామన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ శాఖాధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. కూటమి నేతలకు మేలు చేసేలా అధికారుల తీరు ఉందని, ఇలాగైతే వ్యాపారం చేయలేం మహాప్ర¿ో... అంటూ రెండు చేతులెత్తి దండం పెట్టారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఎక్సైజ్ సీఐ హామీ ఇవ్వడంతో బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు ఆందోళనను విరమించి వెనుదిరిగారు. -
సామూహిక అత్యాచారం కేసులో మరో నలుగురి అరెస్ట్
గన్నవరం : బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో నలుగురు నిందితులను కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం ఏఎస్పీ వీవీ నాయుడు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన బాలిక(14) సన్నిహితులతో కలిసి ఇటీవల కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం వీరపనేనిగూడెం జాతరకు వచ్చి.. సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలికను స్వగ్రామం తీసుకెళతామని నమ్మబలికిన వీరపనేనిగూడేనికి చెందిన ఇద్దరు మైనర్లు ముందుగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మైనర్లు ఇచ్చిన సమాచారంతో అదే గ్రామానికి చెందిన బాణావత్ జితేంద్ర, పగడాల హర్షవర్ధన్ అక్కడికి వెళ్లి బాలికపై లైంగికదాడి చేశారు. తర్వాత ఆ బాలికను కేసరపల్లిలోని కొండేటి అనిల్ సహకారంతో అతని ఇంట్లో నిర్బంధించారు. అక్కడ జితేంద్ర, హర్షవర్ధన్లతో పాటు వారి స్నేహితులైన పరసా సంజయ్, ఉయ్యూరు నవీన్కుమార్, పరసా రాజేష్ ఆ బాలికపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని విచారణలో తేలింది. ఇప్పటికే జితేంద్ర, హర్షవర్ధన్తో పాటు ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా అరెస్ట్ చేసిన అనిల్, సంజయ్, నవీన్కుమార్, రాజేష్ లను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. -
ఒక్క మందు.. ఊబకాయం, షుగర్ ఔట్!
భారత్లో ఏటేటా ఊబకాయుల శాతం పెరిగిపోతోంది. తద్వారా మధుమేహం బారినపడుతున్నవారూ ఎక్కువగానే ఉంటున్నారు. దేశంలో సుమారు 10 కోట్ల మంది వరకు మధుమేహ బాధితులు ఉన్నట్టు అంచనా. అదే సమయంలో జనాభాలో 6.5 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వీరిలో సగం మందికిపైగా ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదని పలు అధ్యయనాలు తేల్చాయి కూడా. సరైన ఔషధాలు అందుబాటులో లేకపోవడం, అవగాహన లేమి వంటివి కారణమవుతున్నాయి.ఇలాంటి నేపథ్యంలో మన దేశంలోకి ‘మవుంజారో (టైర్జెపటైడ్)’ పేరిట స్థూలకాయాన్ని, మధుమేహాన్ని నియంత్రించే ఔషధం అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఎలీ లిల్లీ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో గుర్తింపు పొందిన ఈ ఔషధాన్ని తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఊబకాయంతోపాటు మధుమేహాన్నీ ఏకకాలంలో నియంత్రించగల ఈ ఔషధం అనేక మంది బాధితులకు ఆశారేఖ కాగలదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. – సాక్షి స్పెషల్ డెస్క్ఎలా పని చేస్తుంది?వారానికి ఒక ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే.. అటు బరువు తగ్గడంతోపాటు ఇటు మధుమేహాన్ని అదుపులో ఉంచే ఔషధాల్లో మొట్టమొదటిది ‘మవుంజారో’. ఇది ‘గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రాపిక్ పాలీపెప్టైడ్ (జీఐపీ)’, ‘గ్లూకగాన్ లైక్ పెప్టైడ్–1 (జీఎల్పీ–1)’ హార్మోన్ రెసెప్టార్లను ప్రేరేపించడం ద్వారా బరువునూ, చక్కెర మోతాదులను నియంత్రిస్తుంది’’ అని ఎలీ లిల్లీ కంపెనీ చెబుతోంది. ప్రస్తుతానికి ఈ మందు విషయంలో భారత్లో ఏ స్థానిక కంపెనీతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకోలేదని తెలిపింది.క్లినికల్ ట్రయల్స్లో భాగంగా 72 వారాల పాటు.. ఎంపిక చేసిన వ్యక్తులకు తగిన ఆహారం, వ్యాయామాలతోపాటు ఈ ‘మవుంజారో’ ఔషధాన్ని ఇచ్చి పరిశీలించామని వెల్లడించింది. ఈ మందు 15 ఎంజీ మోతాదులో ఇచ్చినవారు 21.8 కిలోలు బరువు తగ్గారని.. 5 ఎంజీ మోతాదు ఇచ్చినవారు 15.4 కిలోల బరువు తగ్గారని తెలిపింది.‘‘భారతీయుల్లో స్థూలకాయం, టైప్–2 డయాబెటిస్తో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువే. వారందరికీ ప్రయోజనం కలిగేలా భారతీయ ప్రభుత్వ వర్గాలతో, ఇక్కడి కంపెనీల సహకారంతో ఈ మందుపై అవగాహన కలిగించేందుకు మేం ప్రయత్నిస్తాం’’ అని ఎలీ లిల్లీ ఇండియా ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ విన్సెలోవ్ టక్కర్ పేర్కొన్నారు.నెలకు రూ.17,500 వరకు ఖర్చుతో..‘మవుంజారో’ ఔషధాన్ని ఇంజెక్షన్ రూపంలో వారానికి ఒక మోతాదు తీసుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో ఔషధాలు, కాస్మెటిక్స్ నియంత్రణ సంస్థ అయిన ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ)’ ఆమోదంతో దీని ధరను 2.5 ఎంజీకి రూ.3,500గా, 5 ఎంజీ రూ.4,375 గా నిర్ణయించారు. అంటే ఒక నెలకు రూ.14,000 నుంచి రూ.17,500 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. వ్యక్తుల బరువు, ఆరోగ్య స్థితి, ఇతర అంశాల ఆధారంగా ఎంత మోతాదులో ఇవ్వాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు.అందుకు అనుగుణంగా నెలవారీ ఖర్చులో హెచ్చుతగ్గులు ఉంటాయి. నిజానికి ఈ ఔషధాన్ని మనదేశంలో తక్కువ ధరకే తెచ్చారు. యూఎస్ఏలో దీనికి నెలకు 1,000 – 1,200 డాలర్లు ఖర్చవుతుంది. అంటే మన కరెన్సీలో రూ.86,000 నుంచి రూ.లక్ష అన్నమాట. భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా బాధితులపై పెద్దగా భారం పడకుండా, విలువకు తగిన ప్రయోజనం చేకూరేలా ధరను నిర్ణయించామని ఎలీ లిల్లీ కంపెనీ చెబుతోంది.మరికొన్ని మందులున్నా..బరువు తగ్గించే కొన్ని రకాల మందులు ఇప్పటికే భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నోవో నార్డిక్స్ కంపెనీకి చెందిన ‘రైబెల్సస్’ ఔషధం మూడేళ్ల కింద అంటే.. 2022 జనవరి నుంచే ఇక్కడ వినియోగంలో ఉంది. ఇది ఇప్పటికే యాంటీ–ఒబేసిటీ మందుల మార్కెట్లో 65 శాతాన్ని చేజిక్కించుకుంది.డ్యూలాగ్లూటైడ్, ఆర్లిస్టాట్, లిరాగ్లూటైడ్ వంటి బ్రాండ్లు కూడా వినియోగంలో ఉన్నాయి. మరోవైపు ఇదే తరహాకు చెందిన ‘సెమాగ్లూటైడ్’ ఔషధం పేటెంట్ కాలవ్యవధి వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. అప్పుడు దాని జనరిక్ మందును తయారు చేసేందుకు ప్రముఖ భారతీయ ఔషధ కంపెనీలు సంసిద్ధంగా ఉన్నాయి. అది తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.వందల కోట్ల మార్కెట్..ఫార్మాట్రాక్ వంటి మార్కెట్ రీసెర్చ్ సంస్థల అంచనా ప్రకారం.. భారత్లో యాంటీ ఒబేసిటీ మందులకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ తరహా మందుల మార్కెట్ 2020లో రూ.137 కోట్లుగా ఉండగా.. 2024 నవంబర్ నాటికి రూ.535 కోట్లకు చేరింది. ఇది మరింతగా పెరుగుతోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.టైప్–1 డయాబెటిస్ వారికి ఉపయోగపడదుమవుంజారో వారానికి ఒకసారి ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సిన మందు. స్థూలకాయంతోపాటు టైప్–2 డయాబెటిస్ ఉన్నవారు వాడాల్సిన ఔషధం. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 కంటే ఎక్కువగా ఉండి, డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగపడుతుంది. కిడ్నీ, గాల్ బ్లాడర్, సివియర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు ఉన్నవారు వాడకపోవడమే మంచిది.టైప్–1 డయాబెటిస్కు పనిచేయదు. కొంతమంది సెలెక్టెడ్ పాపులేషన్కు మాత్రమే ఉపకరించే ఔషధం. వైద్యుల పర్యవేక్షణలో, వారి సూచనల మేరకు మాత్రమే దీనిని వాడాలి. – డాక్టర్ శివరాజు, సీనియర్ ఫిజీషియన్మంచిదే కానీ.. ఇదే మ్యాజిక్ డ్రగ్ కాదు..భారత్లో మధుమేహం, స్థూలకాయం సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మవుంజారో మందు ఆశాజనకంగా కనిపిస్తోంది. షుగర్ను తగ్గించడంలోనే కాదు బరువు నియంత్రించడంలో కూడా మంచి ఫలితాలను చూపుతోంది. అయితే ఇదొక్కటే ‘మ్యాజిక్ పిల్’ అని పరిగణించడం తప్పుడు భావన. దీర్ఘకాలికంగా ఈ మందు ఎలా పనిచేస్తుందో ఇంకా పూర్తి సమాచారం లేదు.దీనికి తోడు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండొచ్చు. అందుకే ఈ మందును ఎవరైనా వాడాలనుకుంటే.. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వినియోగించాలి. జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వంటివి కూడా ఈ మందుతోపాటు తప్పనిసరిగా కొనసాగాలి. అప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తాయి. – డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి..మవుంజారో మందును కేవలం డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి ఇవ్వాల్సిన మోతాదు, డయాబెటిస్ నియంత్రణకు ఇచ్చే మోతాదు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే వాడాల్సిన మందు అన్నది గుర్తుంచుకోవాలి. బరువు తగ్గించే మందులతోపాటు డయాబెటిస్ను నియంత్రించే ఈ తరహా మందులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఈ ‘మవుంజారో’ ఔషధం ప్రపంచవ్యాప్తంగా కాస్తంత గుర్తింపు పొందింది.స్థూలకాయం, అధిక బరువు కారణంగా మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల అరుగుదలతోపాటు డయాబెటిస్, హైపర్టెన్షన్, స్లీప్ ఆప్నియా వంటి 200 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఉన్న మందులకు తోడు మరో రెప్యూటెడ్ బ్రాండ్ కావడంతో ఎలీ లిల్లీ వాళ్ల ఔషధం మరో ప్రత్యామ్నాయం అవుతుంది. – డాక్టర్ గురవారెడ్డి, సీనియర్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ఈ ఔషధం చాలావరకు సురక్షితమే.. కానీ..: – డాక్టర్ అమర్ వెన్నపూస, సీనియర్ బేరియాట్రిక్ సర్జన్మవుంజారోను ఇప్పుడు అధికారికంగా భారత్లో ప్రవేశపెట్టారుగానీ ఇప్పటికే విదేశాల నుంచి తెప్పించుకుని వాడినవాళ్లు ఉన్నారు. ఇందులో బరువు తగ్గడమనేది జీఐపీ, జీఎల్పీ–1 హార్మోన్ల ఆధారంగా జరుగుతుంటుంది. బేరియాట్రిక్ సర్జరీలో దాదాపు 200కుపైగా బరువును నియంత్రించే హార్మోన్లలో మార్పులు వస్తాయి. అందులో ముఖ్యమైనవి జీఎల్పీ–1, జీఐపీ. సాధారణంగా ఇన్సులిన్ ఆధారితంగా చక్కెరను నియంత్రించినప్పుడు బరువు పెరగడం జరుగుతుంది.కానీ ఈ ఔషధంతో ఇటు చక్కెరను అదుపులో ఉంచడం, అటు బరువును తగ్గించడం ఈ రెండూ జరుగుతాయి. ఇది చాలావరకు సురక్షితమైనదే. కొందరిలో మాత్రం.. వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు, ఆకలి తగ్గడం, మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలతోపాటు అరుదుగా కళ్లు మసకబారడం, కిడ్నీ సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు, పాంక్రియాటైటిస్, థైరాయిడ్ కేన్సర్, సివియర్ అలర్జిక్ రియాక్షన్ వంటివీ రావచ్చు. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మోతాదులో వాడాలి. నిజానికి బరువు తగ్గదలచిన కొందరు తమ జీవనశైలి మార్పులతో, ఆహార నియంత్రణతో బరువు తగ్గుతారు.ప్రాణాంతకమైన మార్బిడ్ ఒబేసిటీ ఉన్నవారికి బేరియాట్రిక్ చికిత్స తప్పదు. కానీ కొందరిలో అటు మార్బిడ్ ఒబేసిటీ కాకుండా, ఇటు జీవనశైలి మార్పులతో బరువు తగ్గకుండా ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారికి ఈ ఔషధం మంచిదే. ఇక బేరియాట్రిక్ చికిత్స తర్వాత కూడా బరువు పెరుగుతున్నప్పుడు ఈ మెడిసిన్ వాడవచ్చు. బరువు తగ్గడం, చక్కెర నియంత్రణ రెండూ జరుగుతాయి కదా అంటూ ఎవరు పడితే వారు వాడటం సరికాదు.లైఫ్స్టైల్ మార్పులతో బరువు తగ్గడమనేది ఎప్పటికైనా మంచిది. జీవనశైలి మార్పులతో ఫలితాలు కనిపించనప్పుడు దీన్ని ఒక ఉత్ప్రేరకంగా (కిక్ స్టార్లా) వాడవచ్చు. తగ్గిన బరువును అలాగే కొనసాగించడానికి జీవనశైలి మార్పులను అనుసరించడమే ఆరోగ్యకరం. -
‘పచ్చ’ బంధాలతో ‘రొచ్చు’ బిజినెస్
అప్పట్లో టీడీపీ పాలనలో కాల్మనీ కాలనాగులు.. ఇప్పుడు కూటమి సర్కారులో స్పా సెంటర్ల విష సర్పాలు..! నాడు మహిళలకు అధిక వడ్డీకి అప్పులిచ్చి.. తీర్చలేనివారిని వ్యభిచార రొంపిలోకి దించింది పచ్చ మూక..! నేడు స్పా సెంటర్ల ముసుగులోనూ అదే తీరున గలీజు దందా..! దాదాపు పదేళ్ల కిందట రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్మనీ రాకెట్ కొత్త అవతారంలో పుట్టుకొచ్చిందా అన్నట్లు.. ప్రస్తుతం స్పా రాకెట్ సాగుతోంది..! అప్పుడు.. ఇప్పుడు ఈ అరాచకానికి బలవుతున్నది మహిళలే కాగా.. అడ్డా విజయవాడనే కావడం.. గమనార్హం..! సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పైకి మసాజ్ కేంద్రాలు.. లోపల వ్యభిచార దందా..! అధికార కూటమి పార్టీలలోని ముఖ్య, ద్వితీయ స్థాయి నేతలతో ఉన్న సత్సంబంధాలే పునాది.. సమాజంలో ఉన్న పలుకుబడేపెట్టుబడి..! వాటితోనే కోట్లాది రూపా యల దందా..! కాల్ మనీ–సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో మునిగితేలిన టీడీపీ నాయకుల బాగోతాలు ఇదివరకే బట్టబయలయ్యాయి. ఇప్పుడు ‘స్పా’ (మసాజ్) సెంర్ల వంతు వచ్చింది. విజయవాడ నగరంలోని స్పా సెంటర్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మాచవరం పోలీసులు గత నెలలో దాడిచేసి పది మంది మహిళలు, 13 మంది విటులను అరెస్టు చేశారు. ఆ తర్వాత స్పాలలోని లోగుట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్పాల నిర్వాహకులతో ‘క్రిడ్ ప్రోకో’ సంబంధాలున్న నాయకులు, పోలీసులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. కూటమి వచ్చాక పట్టపగ్గాల్లేకుండా.. ఆరేడు నెలల్లో ‘స్పా’లలో వ్యభిచార, ఇతర జుగుప్సాకర వ్యవహారాలు పెరిగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రస్థాయిలోని కొందరు కూటమి ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయకుల సహకారంతోనే నిర్వాహకులు నిర్భయంగా కార్యకలాపాలు సాగిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా ధనికులు నివసించే కాలనీలు, కాస్త చాటుగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని స్పాలను నెలకొల్పుతూ, ప్రాచుర్యం పొందిన తర్వాత అక్కడినుంచి మార్చేస్తూ కొత్త పేర్లతో నెలకొల్పుతూ దందా నడిపిస్తున్నారు. అబ్బో భార్గవ్.. అతడే సూత్రధారి చలసాని ప్రసన్నభార్గవ్.. విజయవాడ స్పా సెంటర్ల దందాలో ఇతడే కింగ్ పిన్. స్టూడియో 09, ఏపీ22 పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ అదే భవనం పైన స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నడిపిస్తున్నాడు. గత నెలలో పోలీసులు దాడి చేసింది ఇతడి స్పా సెంటర్ పైనే. అయితే, పోలీసుల రాకపై నిర్వాహకుల హెచ్చరికలతో పలువురు తప్పించుకున్నారు. కాగా, ఏలూరుకు చెందిన భార్గవ్ తనకు కూటమి పార్టీల్లోని పలువురు ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయంటూ వేర్వేరు సందర్భాల్లో వారితో కలిసి దిగిన ఫొటోలను చూపుతూ హల్చల్ చేస్తున్నాడు. విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ తదితరులతో కలిసి దిగిన ఫొటోలను అవసరమైన చోట ప్రదర్శిస్తూ ఫలానా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే తమ బంధువులని, ప్రభుత్వమూ తమవాళ్లదేనంటూ హడావుడి చేస్తున్నాడు. దీనికోసం యూట్యూబ్ చానల్నూ అడ్డుపెట్టుకుంటున్నాడు. నల్ల అద్దాలతో కూడిన ఖరీదైన వాహనాలకు కూటమి పార్టీల లోగోలు ఏర్పాటు చేసుకుని అమ్మాయిల తరలింపునకు వాడుతున్నారు. విజయవాడ కేంద్రంగా పోలీసు అధికారులు, ముఖ్య నాయకులతో ఉన్న సంబంధాలతో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాద్ తదితర నగరాల్లోనూ స్పాల మాటున వ్యభిచార గృహాలను నడుపుతున్నాడనే ఫిర్యాదులు ఉన్నాయి. భార్గవ్.. తెలుగు రాష్ట్రాల్లోని స్పా సెంటర్లకు అధ్యక్షుడిగా, ఆర్గనైజర్గానూ వ్యవహరిస్తుండడం గమనార్హం. విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్పాల ముసుగులో నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచార కేంద్రాలకు అమ్మాయిల సరఫరాను భార్గవ్ విజయవాడ నుంచి మార్గదర్శనం చేస్తుంటాడు. ఈ నెట్వర్క్ను పూర్తిగా ఫోన్లు, ల్యాప్టాప్ల ద్వారానే సాగిస్తున్నాడు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడికి వెళ్లాలి? ఏ అకౌంట్లో ఎంత మొత్తం జమ చేయాలి? ఏయే ఖాతాలకు బదిలీ చేయాలి? డెన్ల చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను ఎప్పటికప్పుడు పరిశీలించడం.. అంతా ఫోన్తోనే. దీంతో ప్రసన్న భార్గవ్ వేర్వేరుచోట్ల ఉన్నా రాకెట్ను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నాడు. రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు డిపాజిట్ స్పా సెంటర్లకు.. ఇదివరకే పరిచయాలున్న, వృత్తికి అలవాటుపడిన ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలను, వారి ద్వారా కొత్తవారిని పిలిపిస్తుంటారు. వారినుంచి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు డిపాజిట్ చేయించుకుంటారు. ఈ డబ్బు తిరిగివ్వరు. కొందరినైతే రెండు, మూడు నెలలు కాంట్రాక్టు పద్ధతిన నిర్ణీత మొత్తానికి కుదుర్చుకుంటారు. వీరిని బృందాలుగా విభజించి ఇతర స్పాలకూ పంపుతుంటారు. డిపాజిట్ మొత్తాన్ని బట్టి సౌకర్యాలున్న రూంలను వారం, పది, పదిహేను రోజుల చొప్పున కేటాయిస్తారు. భార్గవ్ బృంద సభ్యులు సమాచారం ఇచ్చి విటులను రప్పిస్తుంటారు. వారి నుంచి రూ.5 వేలు–రూ.25 వేలు, అవగాహనను బట్టి ఇంకా ఎక్కువ యువతులు వసూలు చేసుకుంటారు. తమ డిపాజిట్ను మించి సంపాదించుకుని స్వస్థలాలకు, లేదా నిర్వాహకులు సూచించిన ఇతర ప్రాంతాల్లోని స్పా సెంటర్లకు వెళ్లిపోతారు.అదే సమయంలో స్పా నిర్వాహకులు కౌంటర్ ఫీజు కింద విటుల నుంచి రూ.2,500–రూ.6,500, ఒక్కో యువతి నుంచి టిప్ కింద రూ.1,500–రూ.2 వేల వరకు లాగేసుకుంటున్నారు. మొత్తంమీద నెలకు 80 నుంచి 90 మంది యువతుల ద్వారా డిపాజిట్లు, టిప్స్, కౌంటర్ ఫీజు తదితరాల రూపంలో భార్గవ్ ముఠా నెలకు రూ.రెండున్నర నుంచి రూ.3 కోట్లు పోగేసుకుంటోంది. ఇందులో పోలీసులతో పాటు ఎవరి వాటా వారికి చేరుతుంది. అనుచర బృందంతో వ్యవహారాలు చలసాని ప్రసన్న భార్గవ్కు అత్యంత నమ్మకమైన సహచర బృందం ఉంది. వీరిలో మహిళలే అధికం. భార్గవ్ వ్యక్తిగత అనుచరుడు కుమార్ తన సోదరి పేరిట స్పాలు, సెలూన్లు నిర్వహిస్తున్నారు. సతీష్ యువతుల సరఫరా మొదలు ఇతర పనులు చేస్తుంటాడు. గోపీచౌదరి వ్యాపార భాగస్వామి. పోలీసులు, మీడియా వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు యువతుల సరఫరాలో ప్రధాన బాధ్యత ఇతడిదే. నాలుగు నెలల కిందటే ఫిర్యాదు చేసినా‘నాలుగైదు నెలల కిందటే పై విషయాలన్నింటినీ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మహిళా సంఘాల వారికీ వివరించాం. వారు ఉన్నతా«ధికారులకు చెప్పారు. ఏసీపీ స్థాయి అధికారి ఒకరు ఒకటి, రెండు స్పా సెంటర్లకు వెళ్లి భారీఎత్తున బేరం కుదుర్చుకున్నారు. హెచ్చరికలు చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. మొక్కుబడిగా స్పా ముసుగులోని ఓ వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఇలాంటివి విజయవాడలో ఎన్ని ఉన్నాయో పోలీసులకు బాగానే తెలుసు. –భార్గవ్ బాధితురాలు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ ప్రెసిడెంట్గా.. చలసాని ప్రసన్న భార్గవ్ ‘హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా– ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్’ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. 2024 నవంబరు 28 నుంచి 2025 నవంబరు 27 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు సర్టిఫికెట్ ఉంది.కోడ్ పేర్లతో ఎర.. రాష్ట్రంలోని తన స్పాలకు వచ్చే యువతులు, విటులతో పాటు ఇతర స్పాలకు క్లయింట్లుగా వెళ్లి సమాచారాన్ని రాబట్టడం, ఆ తరువాత బ్లాక్ మెయిల్కు పాల్పడడం భార్గవ్ బృందం దందాలో మరో కోణం. టెలిగ్రామ్, సీక్రెట్ నంబర్ల ద్వారా స్పాకు కొత్త యువతులు వచ్చారంటూ విటులకు సమాచారం చేరవేస్తుంటారు. ‘ఫ్రెషర్స్, ఓన్లీ ఫ్యూ ఫ్లవర్స్ అవైలబుల్, ఫ్రెష్ లుక్స్, హాయ్ ఫ్రెండ్స్, న్యూ చాక్లెట్ అవైలబుల్’ వంటివి వారి కోడ్ పదాలు. ఆటో లిఫ్ట్, పిక్ అప్ మి లాంటి యాప్స్ ద్వారా అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా ఆహ్వానాలు ఉంటాయని సమాచారం. దాదాపు ఎనిమిది మంది సిబ్బందికి అదే పని. స్పాలలో డిజిటల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. స్టాఫ్కు కూడా వీటి వివరాలు తెలియవు. స్పాల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ స్థానిక పేద విద్యార్థినులు, యువతులను కూడా రొంపిలోకి దింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారాల ముసుగులో.. చలసాని ప్రసన్న భార్గవ్.. చలసాని కన్స్ట్రక్షన్స్, చలసాని మీడియా, పాంపరింగ్ రిసార్ట్స్ అండ్ స్పా, ఏపీ23 న్యూస్, స్టూడియో 9 సెలూన్ అండ్ స్పా, కోజి 9 సెలూన్ అండ్ స్పా, సిగ్నేచర్ సెలూన్ అండ్ స్పాతో పాటు మరికొన్నింటిలో వ్యాపార భాగస్వామి. ఇతరుల వ్యాపారాల గురించి తెలుసుకోవడం, పెట్టుబడిదారుగా చేరడం, కొంతకాలానికి వారిని దెబ్బతీయడం అతడి నైజమని బా«ధితులు వాపోతున్నారు. విజయవాడతో పాటు ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఆయన చేతిలో మోసపోయినవారున్నారని గుర్తు చేస్తున్నారు. కాగా, భార్గవ్ తన బృందంలోని ముఖ్యులకు ఏరోజుకారోజు రాబడిలో పది నుంచి ముప్పయి శాతం వాటా ఇస్తున్నాడు. దీంతో యువతుల రాకపోకల నుంచి విటులకు ఆహ్వానాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. భిన్న రకాల మీడియా మాటున ఏ రంగం వారినైనా బ్లాక్ మెయిల్ చేయడానికి వెనుకాడడని, తనకు సమాచారం ఇచి్చనవారికి దండిగానే ముట్టజెబుతాడని సమాచారం. -
చెప్పింది చేయాల్సిందే
సాక్షి, అమరావతి: అడ్డగోలు వ్యవహారాలకు చిరునామాగా మారిన కూటమి ప్రభుత్వంలో పలువురు ఎమ్మెల్యేలు సామాన్య ప్రజలనే కాకుండా, ఉన్నతాధికారులను సైతం బెంబేలెత్తిస్తున్నారు. తాము చెప్పిన ఎలాంటి పని అయినా నిబంధనలతో నిమిత్తం లేకుండా చేసేయాలని ఒత్తిడి చేస్తున్నారు. చేయకపోయినా, ఆ పని ఆలస్యమైనా వారిపై విరుచుకు పడుతున్నారు. ఏ స్థాయి అధికారి అయినా సరే బెదిరించడానికి, ఇష్టం వచ్చినట్లు తిట్టడానికి వెనుకాడడం లేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రెవెన్యూ ఉన్నతాధికారులపై వీరంగం వేసిన వ్యవహారం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఇళ్ల స్థలాల క్రమబద్ధికరణకు సంబంధించి ప్రశ్నోత్తరాల్లో ఒక ప్రశ్న అడిగిన ఆయన.. మంత్రి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత అసెంబ్లీలో అధికారులు ఉండే రూమ్లోకి వెళ్లి రెచ్చిపోయారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జయలక్మిని తన పని ఎందుకు చేయలేదంటూ ఇష్టానుసారం తిట్టిపోశారు. అరుపులు, కేకలతో వారిపైకి దూసుకెళ్లారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకుని సర్ది చెప్పినా వినిపించుకోలేదు. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఏకవచనంతో సంబోధిస్తూ తిట్టడం చూసిన మిగిలిన అధికారులు బిత్తరపోయారు.పలువురు ఎమ్మెల్యేలు ఆయన్ను బలవంతంగా బయటకు తీసుకెళుతుండగా.. మీ సంగతి తేలుస్తానంటూ అధికారులను బెదిరించడం గమనార్హం. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు (2014–19) కూడా బొండా ఉమ... విజయవాడలో అప్పటి రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను అందరి ముందు తిట్టి రభస సృష్టించడం సంచలనం రేకెత్తించింది. ఎక్సైజ్ కమిషనరేట్లో నరసరావుపేట ఎమ్మెల్యే వీరంగం ఇటీవల నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్బాబు ఎక్సైజ్ శాఖ కమిషనరేట్కు వెళ్లి నానా బీభత్సం సృష్టించడం అధికార వర్గాల్లో కలకలం రేపింది. నరసరావుపేటలోని మద్యం డిపోలో తాను సిఫారసు చేసిన 10 మందిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించలేదంటూ డైరెక్టర్ నిషాంత్కుమార్ ఛాంబర్లోకి వెళ్లి ఆయన్ను కదలనీయకుండా అడ్డుకున్నారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతూ తాను రాసిన లేఖను ఎందుకు పట్టించుకోలేదంటూ నిలదీశారు. ఇప్పటికిప్పుడు తాను చెప్పిన వారికి పోస్టింగ్లు ఇవ్వాలని, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లనని బీభత్సం సృష్టించారు.ఛాంబర్లోనే ఉన్న సోఫాలో పడుకుని హడావుడి చేయడంతో డైరెక్టర్.. సంబంధిత మంత్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. మంత్రి వెంటనే.. ఎమ్మెల్యేకు ఫోన్ చేసి వెనక్కు వచ్చేయాలని, తాను ఆ పని అయ్యేలా మాట్లాడతానని చెప్పినా ఆయన వినలేదు. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా అరవింద్బాబు పట్టించుకోలేదు. రెండున్నర గంటలపాటు ఛాంబర్లోనే ఉండడంతో గత్యంతరం లేక డైరెక్టర్ ఆయన చెప్పిన వారికి పోస్టింగ్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాతే అరవింద్బాబు అక్కడి నుంచి బయటకు వచ్చారు. మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్పై జనసేన ఎమ్మెల్యే దాడి కొద్ది రోజుల క్రితం కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై జనసేనకు చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేయడం కలకలం సృష్టించింది. విద్యార్థులు ఆడుకోవాల్సిన కాలేజీలో బయట వ్యక్తులకు అనుమతి లేదని చెప్పడంతో రెచ్చిపోయిన నానాజీ అనుచరులు వెంటనే ఆయన్ను పిలుచుకుని వచ్చి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేశారు. ఎమ్మెల్యే నానాజీ సైతం బూతులు తిడుతూ డాక్టర్ మాస్క్ని లాగిపడేశారు.⇒ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్థానిక అధికారులను బెదిరించడం, తిట్టడం సర్వసాధారణం కావడం అందరికీ తెలిసిందే. తన వద్దకు వచ్చే అధికారులను ఎలా పడితే అలా మాట్లాడుతుండడంతో వారు బెంబేలెత్తుతున్నారు. అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా ఇప్పటికే ఆయన పేరుగాంచారు. ⇒ శ్రీకాళహస్తి, తాడిపత్రి, ఆమదాలవలస, దెందులూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్రెడ్డి, కూన రవికుమార్, చింతమనేని ప్రభాకర్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి (ఈయన కుమారుడు ఎమ్మెల్యే), తదితరులు అధికారులను బూతులు తిట్టడం పరిపాటిగా మారింది. ⇒ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో తనకు ఇష్టం లేని అధికారిని మున్సిపల్ కమిషనర్గా నియమించారని అక్కడి టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ దుర్భాషలాడుతూ ఆయన్ను కార్యాలయంలోనికి రానీయకుండా అడ్డుకుని రభస చేశారు. చంద్రబాబు అండతో రుబాబు విధి నిర్వహణలో ఉన్న తమను బెదిరించడం, అసభ్యంగా తిడుతుండడాన్ని ఐఏఎస్ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీలో బొండా ఉమ, ఎక్సైజ్ కమిషనరేట్లో అరవింద్బాబు సృష్టించిన రభస ఉన్నతాధికారుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇలాగైతే పని చేయడం కష్టమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోతున్నారు. దీంతో ఇదంతా సీఎం ప్రోత్సాహంతోనే జరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశాల్లో తనది పొలిటికల్ గవర్నెన్స్ అని సీఎం చెప్పడం, ఆ క్రమంలోనే అధికారులపై ఎమ్మెల్యేలు విరుచుకు పడడం జరుగుతుండడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే అధికారులు.. ఎమ్మెల్యేల దగ్గర కుక్కిన పేనుల్లా పడి ఉండి, వారు చెప్పిన తప్పుడు పనులు చేయడమేనా.. అనే చర్చ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని ఒత్తిడి చేయడం, చేయకపోతే దాడులు, దౌర్జన్యాలు చేసే సంస్కృతి రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేదని ఉన్నతాధికారులు చర్చించుకుంటున్నారు.ఇప్పుడు కూటమి పాలనలోనే ఆ సంస్కృతి కొత్తగా మొదలైందని, ఉన్నతాధికారులపై దాడులు జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయని వాపోతున్నారు. సీఎం చంద్రబాబు ఇలాంటి సీరియస్ అంశాలపై కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండడం, ఊరికే వారిపై సీరియస్ అయినట్లు, విచారణ జరుపుతున్నట్లు మీడియాకు లీకులిచ్చి, తర్వాత వదిలేయడం పొలిటికల్ గవర్నెన్స్లో భాగంగానే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. -
ఎరువుల్లేవ్.. అంతా సమస్యల దరువే!
సాక్షి, అమరావతి : ఇది పక్కన చెప్పుకొన్న ఉదాహరణలోని గిరిజన రైతు సమస్యనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కోసం అన్నదాతలు పడుతున్న వెత.. ప్రభుత్వ సేవలపై ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా ఎరువుల సరఫరాపై ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే దీనికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత రాష్ట్రంలో ఎరువుల సరఫరా అధ్వాన్నంగా ఉందంటూ వారంతా తేల్చి చెప్పారు. సకాలంలో, సరైన సమయానికి అవసరానికి తగ్గట్టు లభ్యం కావడం లేదని స్పష్టం చేశారు. పైగా గతంలో ఎన్నడూలేని విధంగా పంపిణీలో కూడా అవినీతి చోటుచేసుకుంటోందని కుండబద్దలు కొట్టారు. కూటమి పాలనలో కష్టాలు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి నప్పటి నుంచి ఎరువుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల (పూర్వపు ఆర్బీకేలు) ద్వారా ఎరువుల సరఫరాను నిలిపివేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారా కూడా అరకొరగానే ఇస్తున్నారు. దీంతో సకాలంలో దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇదివరకు తరహాలో మండల కేంద్రాలకు పరుగులు తీస్తూ సొసైటీల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. కాంప్లెక్స్ మోత ఓపక్క కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు రూ.100 నుంచి రూ.255 మేర పెంచడంతో అన్నదాతలు భారం మోయలేక తల్లడిల్లుతున్నారు. మరోపక్క కృత్రిమ కొరత సృష్టిస్తూ డీలర్లు అందినంత దోచుకుంటున్నారు. యూరియా, డీఏపీ ఎరువుల బస్తాపై రూ.100–500 వరకు అదనంగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు ఖరీఫ్లోనే కాదు.. రబీలోనూ దోపిడీ కొనసాగుతూనే ఉంది.రైతు భరోసా లేదు.. అంతా బాదుడే పది ఎకరాల్లో కాఫీ, పసుపు, మిరియాలు, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్స్తో పాటు వరి సాగు చేస్తుంటా. వరి మినహా మిగిలిన పంటలన్నీ సేంద్రియ పద్ధతిలోనే పండిస్తా. వరికి కావాల్సిన ఎరువులు గతంలో గ్రామంలోని రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే)లోనే దొరికేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక సరఫరా నిలిపివేశారు. దీంతో 25 కి.మీ. దూరంలో ఉన్న చింతపల్లి, అక్కడ లేకపోతే 40 కి.మీ. దూరంలోని నర్సీపట్నం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. ఎరువుల కట్ట కోసం రోజంతా వృథా అవడమే కాదు. చార్జీలకు రూ.500 పైగా ఖర్చవుతోంది. ఎమ్మార్పీపై బస్తాకు రూ.50 నుంచి రూ.వంద వరకు వసూలు చేస్తున్నారు. అవసరం లేని పురుగు మందులు అంటగడుతున్నారు. ఎరువుల్లో నాణ్యత కూడా ఉండడం లేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఏంటిది? అని అధికారులను అడిగితే మేమేం చేయగలం? అని అంటున్నారు. – బౌడు కుశలవుడు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం గొందిపాకలు గ్రామ గిరిజన రైతు. ఎరువుల సరఫరాపై ఐవీఆర్ఎస్ సర్వేలో ‘ఎరువులు లేవు’ అని చెప్పిన రైతులు 41.2% జనవరిలో44% మార్చిలో74% అత్యధికంగాఏజెన్సీ జిల్లాల్లో56% శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో‘నాసిరకం’ అని చెప్పిన రైతులు 22.4% జనవరిలో34% మార్చిలో67% అత్యధికంగా ఏజెన్సీ జిల్లాల్లో 49% అనంతపురం జిల్లాలో48% కర్నూలు జిల్లాలోఎరువుల సరఫరా సందర్భంగా సహకార సంఘాలు,రైతు సేవా కేంద్రాల్లో అవినీతి జరుగుతోందని చెప్పిన రైతులు 39% జనవరిలో37% మార్చిలో45% అత్యధికంగా పల్నాడు,కర్నూలు జిల్లాల్లోసరిపడాఎరువులు అందుబాటులోఉన్నాయా..?అన్ని జిల్లాల్లోనూ లేవు అని చెబుతున్న వారు 40- 44%అవసరమైనప్పుడు, కోరుకున్న ఎరువులు దొరకడం లేదు..41%ఎమ్మార్పికి మించి యూరియాకు వసూలు చేస్తున్నారు. 60%ఎరువులతో పాటు అవసరం లేని మందులను అంటగడుతున్నారు 60% -
విద్యుత్తు ఉద్యోగులకు బదిలీల ‘షాక్’
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమ్మతితో పని లేదు.. సాధారణ బదిలీల్లో ఇచ్చే వెసులుబాట్లూ లేవు.. ఎప్పుడూ ఉండే.. వైకల్యం, భార్యాభర్తలు, అనారోగ్యం, స్థానికం ‘ఆప్షన్లు’ లేవు.. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ..! విద్యుత్తు శాఖలో ఇప్పుడీ అంశం కలకలం రేపుతోంది. ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏ ప్రభుత్వ విభాగంలోనూ ఇలాంటి నిర్భంధ బదిలీలు జరగలేదని, ఎందుకింత కఠినం అని ఉన్నతాధికారులను అడిగితే.. ‘మేం చెప్పిన చోటకు వెళ్లండి.. లేదంటే మానేయండి’ అనే సమాధానం వస్తోందని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. విమర్శలు రావడంతో అనుమతి పాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వంలో 13 జిల్లాలను 26గా చేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లలో దాదాపు 1.92 కోట్లమంది విద్యుత్తు వినియోగదారులకు సేవలందించేందుకు కొత్తగా ఏర్పడ్డ 13 జిల్లాలకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ (ఈఈ) స్థాయి అధికారులను ఇన్చార్జులుగా నియమించారు.కూటమి ప్రభుత్వంలో కొత్త జిల్లాల్లో సర్కిల్, డివిజన్, ఏఈ కార్యాలయాల ఏర్పాటుతో పాటు అధికారులు, సిబ్బందిని కేటాయించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంపై విమర్శలొచ్చాయి. దీంతో కొంతకాలం క్రితం కొత్త సర్కిళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. చెరో జిల్లాకు భార్యాభర్తలు..!రాష్ట్రంలోని 3 డిస్కంలలో సుమారు 23 వేల మంది శాశ్వత సిబ్బంది ఉన్నారు. వీరినే పాత, కొత్త డివిజన్లకు సర్దుబాటు చేసుకోమని, కొత్త పోస్టులు ఇవ్వడం కుదరదని చెప్పింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా సర్కిళ్లు ఏర్పాటు చేయాలంది. డిస్కంలు దీనికితగ్గట్లు.. కమిటీలు వేసి ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. అయితే, సాధారణ బదిలీల్లో అనుసరించే నిబంధనలను పక్కనపెట్టాయి. ఈ కారణంగా ఒక డిస్కం పరిధిలో భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉంటే వారు చెరో జిల్లాకు బదిలీ కావాల్సి వస్తోంది. కొత్త సర్కిళ్ల పేరు చెప్పి ఇప్పటికే సగం సర్వీసులు తగ్గించేశారు. కొన్ని సర్కిళ్లలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎస్ఏవో) పోస్టులను తీసేశారు. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏవో) పోస్టులను ఎత్తేశారు. టెక్నికల్ పోస్టులను కుదించేశారు. ఒక్కో ఉద్యోగి రెండు మూడు విభాగాల పనిచేసే విధంగా భారం మోపుతున్నారు. వీటితోనే సతమతం అవుతున్న ఉద్యోగులు శాశ్వత కేటాయింపులపై ఆందోళనకు గురవుతున్నారు. -
1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలని.. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి( YS Jagan Mohan Reddy) వివరించారు. జాతీయ ప్రాధాన్యతగా జనాభా నియంత్రణను నిజాయితీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ప్రక్రియ శిక్షగా మారకూడదని స్పష్టంచేశారు. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్ కసరత్తు చేపడతామని హోం మంత్రి అమిత్షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ అమలుకు అడ్డంకిగా మారిన రాజ్యాంగంలోని 81(2)(ఏ) అధికరణ(ఆర్టికల్)ను సవరిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. దీనివల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయని, లోక్సభలో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న అంశం ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి వైఎస్ జగన్ శుక్రవారం లేఖ రాశారు. శనివారం మీడియాకు విడుదల చేశారు. కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యంతోపాటు ఆయా రాష్ట్రాల ప్రజల మనోభావాలను డీలిమిటేషన్ ప్రక్రియ ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. డీలిమిటేషన్ ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక, రాజకీయ సామరస్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉన్నందున, ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని ప్రధాని మోదీని కోరారు. ఈ విషయంలో ప్రధానిగా మీ నాయకత్వం, మార్గ నిర్దేశం చాలా ముఖ్యమని.. మీరిచ్చే హామీ అనేక రాష్ట్రాలకున్న భయాలను, అపోహలను తొలగించడానికి దోహద పడుతుందని ప్రధానికి వైఎస్ జగన్ వివరించారు. లోక్సభలో ఇప్పుడున్న సీట్ల పరంగా ఆయా రాష్ట్రాలకు ఉన్న వాటాను కుదించకుండా పునర్విభజన (డీలిమిటేషన్) కసరత్తు చేపట్టాలని కోరారు. ఆ లేఖలో ఇంకా ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకూడదు రాజ్యాంగంలో 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026లో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. కానీ.. దీనికి ముందుగా 2021లో చేపట్టాల్సిన జనాభా లెక్కింపు ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. 2026 నాటికి జనాభా లెక్కల ప్రక్రియను పూర్తి చేయడానికి ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇది జరిగిన వెంటనే డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందన్న అంశం అనేక రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఈ ప్రక్రియ ద్వారా తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణను నిజాయితీగా చేయడం వల్లే.. జనాభా నియంత్రణ కోసం వివిధ రాష్ట్రాలు అనేక విధానాలు అమలు చేశాయి. అయితే వాటి ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. దీని వల్ల జనాభా పెరుగుదల వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంది. దేశ వ్యాప్తంగా జనాభా వృద్ధి ఒకే తరహాలో లేదు. అసమతుల్యత ఉంది. దీని వల్ల డీలిమిటేషన్ అంశం విస్తృత స్థాయిలో ఆందోళనకు దారి తీస్తోంది. 42వ.. 84వ రాజ్యాంగ సవరణల ద్వారా ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపును నిలిపేశారు. కాలక్రమేణా అన్ని రాష్ట్రాలు జనాభా నియంత్రణ కసరత్తులో భాగంగా ఒకే స్థాయిలో ఫలితాలు సాధిస్తాయని భావించి ఈ సీట్ల కేటాయింపును నిలిపేశారు. దేశ జనాభాలో ఆయా రాష్ట్రాల వాటా 1971 నాటికి అనుకున్న స్థాయికి చేరుకుంటుందని భావించారు. కానీ, 2011 జనాభా లెక్కల గణాకాంలను చూస్తే.. దశాబ్దాల తరబడి జనాభా వృద్ధి, దాని అంచనాలు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేవని తేలింది. 1971, 2011 మధ్య 40 సంవత్సరాల్లో దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. గత 15 సంవత్సరాల్లో జనాభా మరింత తగ్గిందని మేం నమ్ముతున్నాం. జనాభా నియంత్రణను జాతీయ ప్రాధాన్యతగా తీసుకున్నందున, దక్షిణాది రాష్ట్రాలు నిజాయితీగా తమ విధానాలను అమలు చేయడం వల్ల ఈ వాటా తగ్గింది. 1971 జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు 24.80 శాతం అయితే, 2011 జనాభా లెక్కల ప్రకారం 20.88 శాతంగా ఉంది. అపోహలు, భయాలు తొలగించండి రాష్ట్రాల్లో ఇప్పుడున్న జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే దేశ విధానాల రూపకల్పన సహా శాసన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాలకు సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్ కసరత్తు చేపడతామని హోం మంత్రి అమిత్షా హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అయితే ఈ హామీని అమలు చేయాలంటే రాజ్యాంగ పరంగా చేయాల్సిన సడలింపును కూడా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 (2) (ఎ) జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు జరగాలని పేర్కొంది. దీని ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియలో ముందుకు వెళ్తే ఈ నిబంధన వల్ల హోంమంత్రి అమిత్షా ఇచ్చిన హామీని అమలు చేయడంలో అడ్డంకులు ఏర్పడతాయి. అందువల్ల దామాషా ప్రకారం ప్రతి రాష్ట్రానికి సీట్ల కేటాయింపుపై రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. దీని వల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయి, ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే అంశం ఉత్పన్నం కాదు. డీలిమిటేషన్ ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక, రాజకీయ సామరస్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉన్నందున ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాను. ఈ విషయంలో ప్రధానిగా మీ నాయకత్వం, మార్గనిర్దేశం చాలా ముఖ్యం. మీరిచ్చే హామీ అనేక రాష్ట్రాలకున్న భయాలను, అపోహలను తొలగించడానికి దోహద పడుతుంది.డీఎంకే నాయకులకు లేఖ ప్రతి డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష కమిటీ సమావేశం శనివారం చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశం నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు.. ఆయన ప్రధాని మోదీకి రాసిన లేఖ ప్రతిని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి డీఎంకే నాయకులకు పంపారు. -
వర్రా రవీంద్రారెడ్డికి బెయిల్.. జైలు నుంచి విడుదల
అమరావతి: సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్టైన వైఎస్సార్ జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు వర్రా రవీంద్రారెడ్డి శనివారం బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. మడకశిరలో వర్రా రవీంద్రా రెడ్డిపై నమోదైన కేసులో బెయిల్ వచ్చింది. దీంతో వర్రాపై నమోదైన 26 కేసుల్లోనూ వర్రాకు బెయిల్ మంజూరైనట్లయ్యింది. దీంతో వర్రా రవీంద్రా రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు.సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ అభియోగాలు మోపుతూ కూటమి ప్రభుత్వం వేధింపుల పర్వం కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం. వైఎస్సార్సీపీ మద్దతుదారు వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసింది. వర్రా రవీంద్రారెడ్డిని గత నవంబర్ లో అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. ఇలా రవీంద్రారెడ్డిపై 26 కేసులు నమోదు చేశారు. మొత్తం అన్ని కేసుల్లో ఇప్పటికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు వర్రా రవీంద్రారెడ్డి -
జేఈఈ మెయిన్స్-2 నిబంధనలివీ..
గుంటూరు ఎడ్యుకేషన్: ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2025 రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్లలో పేపర్–1 (బీఈ, బీటెక్) పరీక్షలు జరుగుతాయి. 9 వ తేదీ ఉదయం పేపర్–2 ఎ బీఆర్క్ పరీక్ష, పేపర్ – 2బి ప్లానింగ్ పరీక్షలు జరుగుతాయి. జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ మాదిరిగానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఈ ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థుల పరీక్ష కేంద్రం వివరాలను (సిటీ ఇంటిమేషన్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పటికే వెబ్సైట్లో ఉంచింది. పరీక్షలకు మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎన్టీఏ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. వీటిని అడ్మిట్ కార్డుల్లో ఎన్టీఏ పొందుపరిచింది. వాటిని విద్యార్థులు క్షుణ్ణంగా చదువుకొని, ఆ మేరకు ముందుగానే సిద్ధమవ్వాలి.మెయిన్స్–2 పరీక్ష రాసే విద్యార్థులకు ఇవీ సూచనలు» పేపర్–1 ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో షిఫ్ట్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు జరుగుతుంది. ఉదయం షిఫ్ట్లో పరీక్షకు 7 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంటకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఎన్టీఏ సూచించింది. » పరీక్ష సమయానికి 2 గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. » పరీక్ష సమయానికి అర గంట ముందు వరకే విద్యార్థులను అనుమతిస్తారు. ఆ తరువాత ప్రధాన గేట్లను మూసివేస్తారు.» పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ వ్రస్తాలను మాత్రమే ధరించాలి.» బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను తెచ్చుకోవాలి. » ఆభరణాలు, వాచీలు ధరించ కూడదు. కాళ్లకు బూట్లకు బదులుగా సాధారణ చెప్పులనే ధరించాలి. » ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ను మాత్రమే అనుమతిస్తారు. » దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఆధార్, పాన్ తదితర ఒరిజినల్ ఐడెంటిటీ కార్డులను విధిగా తీసుకెళ్లాలి. » ఎన్టీఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు కింది భాగంలో ఇచ్చిన ఒక బాక్సులో కలర్ పాస్పోర్ట్ సైజు ఫోటోను అతికించాలి. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫొటోనే ఇక్కడ అతికించాలి. పక్కన ఉండే మరొక బాక్సులో విద్యార్థి ఎడమ చేతి వేలిముద్ర వేయాలి. పక్కన ఉన్న మూడో బాక్సులో పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన తరువాత ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేయాలి.» విద్యార్థి తమ వెంట అడ్మిట్ కార్డుతో పాటు అటెండెన్స్ షీట్పై అతికించేందుకు మరొక పాస్పోర్ట్ సైజు ఫోటోను వెంట తెచ్చుకోవాలి. » ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తారు. -
38 శాఖలు 1.32 లక్షల పెండింగ్ ఫైళ్లు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో 38 సచివాలయ శాఖల్లో 1,32,395 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయని ఈ–ఆఫీస్లో ఫైళ్ల క్లియరెన్స్ను పర్యవేక్షిస్తున్న ఆర్టీజీఎస్ తేల్చింది. ఇటీవల సీఎం వివిధ శాఖాధిపతులు, కార్యదర్శులతో జరిపిన సమీక్షలో ఈ విషయం వెలుగుచూసింది. ఉప ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల్లో అత్యధికంగా 14,140 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. ఆ తరువాత సీఎం నిర్వహిస్తున్న సాధారణ పరిపాలన శాఖలో 11,958, రెవెన్యూ శాఖలో 11,288 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో అత్యల్పంగా 42 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో ఫైలు క్లియర్ చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సగటున ఒక రోజు సమయం తీసుకుంటుండగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల శాఖ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖలు ఒక్కో ఫైలు క్లియర్ చేయడానికి సగటున రెండు రోజులు సమయం తీసుకుంటున్నాయి. న్యాయ శాఖ సగటున మూడు రోజుల్లో ఒక ఫైలు క్లియర్ చేస్తుండగా, రెవెన్యూ శాఖలో సగటున ఒక ఫైలు క్లియర్కు ఐదు రోజులు సమయం పడుతోంది. సగటున ఒక్కో ఫైలు క్లియర్ చేయడానికి అత్యధికంగా జలవనరుల శాఖ 50 రోజులు సమయం తీసుకుంటుండగా, విపత్తుల శాఖ 47 రోజులు సమయం తీసుకుంటోంది. ఈ–ఆఫీస్ వచ్చిన తరువాత సాధారణంగా రొటీన్ ఫైళ్లను ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేయవచ్చు. ఏమైనా ఆర్థిక, విధానపరమైన ఫైళ్లను క్లియర్ చేయడానికి మాత్రం సమయం పడుతుంది. అయితే మెడికల్ రీయింబర్స్మెంట్ వంటి ఫైళ్లను ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసే అవకాశం ఉన్నా, అటువంటి ఫైళ్లను ఆ శాఖలు క్లియర్ చేయడం లేదు. సీఎం అభీష్టం మేరకు ఆయన కార్యాలయ అధికారులు సంబంధిత అంశాలకు చెందిన ఫైలును సర్క్యులేట్ చేయల్సిందిగా ఆయా శాఖలకు ఆదేశిస్తారు. అలాంటి ఫైళ్లు సంబంధిత అన్ని విభాగాల్లోను వెంటనే క్లియర్ అవుతూ ఉంటాయి. కానీ ప్రజలకు సంబంధించిన లేదా ఉద్యోగులకు సంబంధించిన ఫైళ్లు అంత వేగంతో క్లియర్ కాకపోవడం గమనార్హం. -
ఆ ఐపీఎస్ అధికారిని ఏపీకి పంపాల్సిందే!
సాక్షి, అమరావతి : ఓ ఐపీఎస్ అధికారిని డిప్యుటేషన్పై యూపీ నుంచి ఏపీకి పంపాల్సిందేనని చంద్రబాబు ప్రభుత్వం పట్టుపడుతోంది. నిబంధనలకు విరుద్ధమని కేంద్ర హోం శాఖ స్పష్టం చేస్తున్నా, తమకు ఆయన కావాల్సిందేనని తేల్చి చెబుతోంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అంతగా పట్టుపడుతోందంటే..అనకాపల్లి జిల్లాకు చెందిన కె.సత్యనారాయణ 1998 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో రహదారి భద్రత విభాగం అదనపు డీజీగా ఉన్నారు. ఆయన టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి సమీప బంధువు కూడా. అందుకే 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన్ను ప్రత్యేకంగా డిప్యుటేషన్పై రాష్ట్రానికి తీసుకొచ్చారు. అప్పట్లో ఆయన సీఐడీ విభాగంలో ఐజీగా విధులు నిర్వహించారు. డిప్యుటేషన్ కాలం ముగిసిన తర్వాత తిరిగి ఉత్తరప్రదేశ్కు వెళ్లిపోయారు. చెప్పింది చెప్పినట్లు చేస్తారని.. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రభుత్వ పెద్దలు సత్యనారాయణపై దృష్టి సారించారు. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు, కక్షసాధింపు చర్యలతో విరుచుకు పడేందుకు అస్మదీయుడైన అధికారి కావాలని భావించారు. దాంతో ప్రభుత్వ ముఖ్య నేత దృష్టి సత్యనారాయణపై పడింది. అందుకే ఆయన్ను రాష్ట్రానికి డిప్యుటేషన్పై పంపాలని కేంద్ర హోం శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే.. ..ఐజీ లేదా అంతకంటే ఉన్నత స్థాయి పోలీస్ అధికారులను డిప్యుటేషన్పై ఇతర రాష్ట్రాలకు పంపేందుకు నిబంధనలు సమ్మతించవు. అదే విషయాన్ని ఆ మధ్య కేంద్ర హోం శాఖ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సత్యనారాయణను డిప్యుటేషన్పై ఏపీకి పంపేందుకు నిరాకరించింది. దీనిపై కొన్ని నెలలు మౌనంగా ఉన్న ప్రభుత్వ పెద్దలు ఇటీవల మరోసారి కేంద్రంపై ఒత్తిడి తెస్తోందని సమాచారం. ఈ ప్రయత్నాలన్నీ రెడ్బుక్ రాజ్యాంగం వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసుల బాధ్యతలను సత్యనారాయణకు అప్పగించేందుకేనని పోలీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
పెద్దపులికి పెనుముప్పు
నడకలో రాజసం.. ఒళ్లంతా పౌరుషం.. పరుగులో మెరుపు వేగం.. పెద్దపులికే సొంతం. అది ఒక్కసారి గాండ్రిస్తే అడవి అంతా దద్దరిల్లిపోవాల్సిందే. ఏ జంతువైనా తోక ముడుచుకోవాల్సిందే. టన్నుల కొద్దీ ఠీవీని తనలో ఇముడ్చుకున్న పెద్దపులి మనుగడ ప్రమాదపు అంచులకు చేరడం జంతు, పర్యావరణ ప్రేమికులతో పాటు ప్రభుత్వ యంత్రాంగాలనూ ఆందోళనకు గురిచేస్తోంది. పులి గాండ్రింపు సురక్షితం కావాలన్న ఆకాంక్ష బలంగా వినిపిస్తోంది. సాక్షి, అమరావతి: దేశంలో పెద్దపులికి పెనుముప్పు వచ్చి పడింది. ఐదేళ్లలో పులుల వేట అమాంతం పెరిగింది. పులులను వేటాడి వాటి ఎముకలు, చర్మాలను విదేశాలకు భారీగా అక్రమ రవాణా చేస్తున్నారు. అందుకోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో ప్రత్యేకంగా కొన్ని ముఠాలు వ్యవస్థీకృతమై మరీ స్మగ్లింగ్ దందాను సాగిస్తున్నాయి.పులి ఎముకలకు చైనా, తైవాన్, జపాన్లలో పెద్దఎత్తున డిమాండ్ ఉండటంతో ఈ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ప్రధానంగా 2024లో దేశంలో పులుల వేట, స్మగ్లింగ్ జోరందుకోవడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర ప్రభుత్వ విభాగం ‘వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) తాజా నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో బలైన 100 పులులు కొన్నేళ్లుగా చేపడుతున్న చర్యలతో దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని సంతోషించేలోగానే.. పులుల వేట కూడా అమాంతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో ఉన్న పెద్ద పులుల సంఖ్యలో 70 శాతం భారత్లోనే ఉన్నాయి. దేశంలో 58 టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లలో 2022 నాటికి 3,682 పెద్ద పులులు ఉన్నాయి. 2006లో కేవలం 1,411 పెద్ద పులులు మాత్రమే ఉండగా.. 2023 నాటికి వాటి సంఖ్య 3,682కు పెరగడం విశేషం.కాగా 17 ఏళ్లలో క్రమంగా దేశంలో పులుల సంఖ్య పెరగ్గా.. గత ఐదేళ్లలో పులుల వేట కూడా పెరగడం ప్రతికూలంగా పరిణమిస్తోంది. గత ఐదేళ్లలో స్మగ్లింగ్ ముఠాలు దేశంలో 100 పులులను వేటాడాయి. వాటి ఎముకలు, చర్మం, ఇతర భాగాలను అక్రమంగా రవాణా చేశాయి. 2021–23లోనే 33 పులులను హతమార్చగా... 2024లోనే 42 పులులను వేటాడారు. ఐదేళ్లలో అత్యధికంగా మహారాష్ట్రలో 41 పులులను హతమార్చారు. ఆ రాష్ట్రంలో 2024 డిసెంబర్ 30 నుంచి 2025 జనవరి 22 నాటికి.. అంటే కేవలం 24 రోజుల్లోనే 12 పులులను వేటాడటం దేశంలో స్మగ్లింగ్ ముఠాల బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. స్మగ్లింగ్లో రెండో స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్లో ఐదేళ్లలో 10 పులులు వేటగాళ్ల దెబ్బకు బలయ్యాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మూడేసి, తమిళనాడులో రెండు పులులు హతమవగా... కేరళ, ఉత్తరాఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్లో మిగిలిన పులులను వేటాడారు. మందుల తయారీ ముడిసరుకుగా పులి ఎముకలు చైనా, తైవాన్, జపాన్ తదితర దేశాల్లో పులుల ఎముకలకు భారీ డిమాండ్ ఉండటంతో వాటి వేట పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో పులి శరీర భాగాలను వాణిజ్యపరమైన డిమాండ్ ఏమీ లేదు. పులి చర్మాలను స్టేటస్ సింబల్గా కొందరు బడా బాబులు తమ బంగ్లాలలో ప్రదర్శిస్తుంటారు. కానీ.. చైనా, తైవాన్, జపాన్ దేశాల్లో పులి శరీర భాగాలకు వాణిజ్యపరమైన డిమాండ్ భారీగా ఉంది. ప్రధానంగా పులి ఎముకలకు ఆ దేశాల్లో అత్యధిక డిమాండ్ ఉంది. చైనా, తైవాన్లలో ఔషధాల తయారీకి పులి ఎముకలను వినియోగిస్తున్నారు. పులి ఎముకలను పొడి చేసి వాటిని ప్రత్యేకమైన కొన్ని ఔషధాల తయారీకి వాడుతున్నారు. ఇక జపాన్లో పులి ఎముకలను బాగా ఉడికించి ఆ రసాన్ని ఖరీదైన మద్యం తయారీకి వాడుతున్నారు. ఆ దేశాల్లో పులులు లేవు. దాంతో ఆ దేశాల్లోని ఔషధ కంపెనీలు భారత్ నుంచి అక్రమంగా పులి ఎముకలను కొనుగోలు చేస్తున్నాయి. అందుకోసం ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ముఠాలు పులులను వేటాడి వాటి శరీర భాగాలను ఆ ఏజెంట్లకు విక్రయిస్తున్నాయి. ఏజెంట్లు ఈశాన్య రాష్ట్రాల్లోని షిల్లాంగ్– సిల్చార్–ఐజ్వాల్–చంఫాయి గుండా దేశ సరిహద్దులు దాటించి మయన్మార్ మీదుగా చైనా, తైవాన్, జపాన్ తదితర దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. స్మగ్లింగ్ అడ్డుకట్టకు సిట్ ఏర్పాటు దేశంలో పులుల వేట, స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఇప్పటికే కొందర్ని అరెస్ట్ చేసింది. పులులను వేటాడే ముఠాల భరతం పట్టేందుకు కార్యాచరణను వేగవంతం చేసింది. -
ఆధారం ఉంటే ఒట్టు.. అంతా కనికట్టు!
ఫిర్యాదే ఓ కుట్ర.. నివేదికే బూటకం.. కేసే అక్రమం.. ఎఫ్ఐఆర్ కుయుక్తి.. వెరసి దర్యాప్తు పేరుతో వేధింపులు.. అబద్ధపు వాంగ్మూలాలే ఆధారం.. ఇదీ రాష్ట్రంలో సీఐడీ, సిట్ పేరిట అరాచకం. చంద్రబాబు ప్రభుత్వ కుట్రకు తార్కాణం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు పేరుతో సాగిస్తున్న రెడ్బుక్ కుతంత్రం. ఇందులో భాగంగా కూటమి సర్కారు సిట్ పేరిట ఓ అరాచక వ్యవస్థను సృష్టించి, సాగిస్తున్న వేధింపులు వెర్రి తలలు వేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు ముఠా.. అధికారంలోకి వచ్చాక ఒక్క ఆరోపణను నిరూపించలేక చేతులెత్తేసింది. దాంతో తిమ్మిని బమ్మి చేసైనా సరే వేధించాలని లక్ష్యంగా పెట్టుకుని మద్యం విధానంపై అక్రమ కేసుతో రంగంలోకి దిగింది. ఫిర్యాదు మొదలు దర్యాప్తు వరకు సాగుతున్న కుతంత్రం విస్తుగొలుపుతోంది. - సాక్షి, అమరావతికుట్రపూరితంగా ఫిర్యాదువైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు కోసం కూటమి ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతో పావులు కదిపారు. అందుకోసం కుట్రపూరితంగా ఎవరికీ అనుమానం కలగని రీతిలో వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ అనే ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను తెరపైకి తెచ్చారు. మద్యం విధానంలో అవినీతి జరిగిందంటూ.. విచారణ చేయాలని వారిద్దరూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనాకు గత ఏడాది సెప్టెంబరు 9న ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరిగిందని భావిస్తే పోలీసు, ఏసీబీ, సీఐడీ తదితర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలి. లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అంతేగానీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయరు. అయితే ఈ ఇద్దరూ అటు దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయలేదు. ఇటు న్యాయస్థానాన్నీ ఆశ్రయించ లేదు. ఎందుకంటే వీరి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి. వీరిద్దరి నుంచి ఫిర్యాదు అందుకున్న ముఖేశ్ కుమార్ మీనా.. ప్రభుత్వ పెద్దల కుట్రను కొనసాగిస్తూ తర్వాత అంకానికి తెరతీశారు. ఆయన ఆ ఫిర్యాదు కాపీని ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ఎండీకి పంపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.రూ.4 వేల కోట్ల కట్టు కథమద్యం కొనుగోళ్లు, ఇతర రికార్డులన్నీ బెవరేజస్ కార్పొరేషన్ కార్యాలయంలోనే ఉంటాయి. ఏయే తేదీల్లో ఏయే డిస్టిలరీలకు ఎంత విలువైన ఆర్డర్లు ఇచ్చారన్న వివరాలు వారి వద్దే ఉంటాయన్నది బహిరంగ రహస్యం. మద్యం విధానంలో అక్రమాలకు పాల్పడితే ఇవిగో అని చూపించవచ్చు. ఇక్కడ ఎలాంటి స్కామ్ జరగలేదు కాబట్టి బెవరేజస్ కార్పొరేషన్ ఎలాంటి ఆధారాలు చూపించ లేదు. అయితే ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా కేవలం తొమ్మిది రోజుల్లోనే అవినీతి కట్టుకథను సృష్టించారు. ఏకంగా రూ.4 వేల కోట్ల అవినీతి జరిగినట్టు నివేదిక ఇచ్చేశారు. అంటే ఎక్సైజ్ శాఖే తూతూ మంత్రపు విచారణతో రూ.4 వేల కోట్ల అక్రమాలంటూ చంద్రబాబు కుట్రను వండి వర్చేసింది. అంతా అనుకున్నట్టు కుట్ర కథను నడిపించిన తర్వాత, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా ఈ విషయంపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ సాక్షిగా అక్రమ కేసు ఇక ప్రభుత్వ పెద్దల కుట్రకు పదును పెట్టడం తమ వంతు అని సీఐడీ రంగంలోకి దిగింది. పక్కా పన్నాగంతో బెవరేజస్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక, ఎక్సైజ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్రమ కేసు నమోదు చేసేసింది. నిందితులు ఎవరో కూడా పేర్కొనకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసే నాటికి అందులోని ఏడో కాలమ్లో నిందితులను చూపించలేదు. నిందితులు ఎవరో తెలీదని కూడా వెల్లడించింది. అంటే ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లను చెబితే వారందరినీ నిందితులుగా చూపించేందుకు కుట్ర పూరితంగా వ్యవహరించింది. ఎవరు ఎవర్ని మోసం చేశారన్న కనీస సమాచారం కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన లేదు. పైగా ఐపీసీ సెక్షన్ 420ని చేరుస్తూ కేసు నమోదు చేయడం విడ్డూరం. అసలు కుట్ర ఏమిటన్నది పేర్కొనకుండా, అవినీతి ఏమిటన్నది చూపకుండా ఐపీసీ సెక్షన్లు 409, 120 బి కింద అభియోగాలు నమోదు చేసింది. తద్వారా బెవరేజస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు, ఉద్యోగులు అందరిపైనా అక్రమ కేసు నమోదు చేసేందుకు ముందస్తు ఎత్తుగడ వేసింది. ఎఫ్ఐఆర్లోని తొమ్మిదో కాలమ్లో పేర్కొనాల్సిన ఆ కేసులో అక్రమాలకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా వెల్లడించ లేదు. అవసరమైతే ప్రత్యేకంగా నివేదిస్తామని చెప్పడం గమనార్హం. అవసరమైతే.. అన్నది ఏమిటో సీఐడీ ఉన్నతాధికారులకే తెలియాలి. ఒక కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు అక్రమాలకు సంబంధించిన అంశాలు అన్నీ అవసరమైనవే కదా.. అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసే నాటికి సీఐడీ వద్ద కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్నది సుస్పష్టం. దీన్నిబట్టి బెవరేజస్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక పూర్తిగా కట్టుకథేనని స్పష్టమవుతోంది. అందుకే అక్రమాలకు సంబంధించిన ఆస్తుల వివరాలను వెల్లడించ లేకపోయారు. కానీ ఎఫ్ఐఆర్లోని పదో కాలమ్లో ఈ వ్యవహారంలో ఏకంగా రూ.4 వేల కోట్ల కంటే ఎక్కువ అవినీతి జరిగినట్టుగా పేర్కొనడం విడ్డూరం. నిందితులు తెలీదు.. ఆ కేసుకు సంబంధించిన ఆస్తుల వివరాలు లేవు.. కానీ రూ.4 వేల కోట్ల అవినీతి జరిగినట్టు మాత్రం కథ అల్లేశారు. ఈ లెక్కన ఎంతటి నిరాధార ఆరోపణలో.. ఎంతటి అక్రమ కేసో అన్నది తేటతెల్లమవుతోందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.కట్టు కథకు తగ్గట్టు వాంగ్మూలాలు ఈ కేసు దర్యాప్తు పేరిట వేధింపులు, అరాచకాల కుట్రకు బరితెగించేందుకు సీఐడీ సరిపోదని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేరుతో అరచకానికి తెగించింది. ఎలాంటి ఆధారాలు లేని కేసులో అబద్ధపు ఆధారాలు సృష్టించేందుకు సిట్ రెండు నెలలుగా పాల్పడుతున్న వేధింపులే ఇందుకు నిదర్శనం. దర్యాప్తు పేరిట బెవరేజస్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులను తీవ్ర స్థాయిలో వేధిస్తోంది. ఆ కేసులో సాక్షుల పేరిట వారిని విచారిస్తూ కనికట్టు చేస్తోంది. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరిస్తోంది. శారీరకంగా, మానసికంగా హింసిస్తోంది. సిట్ వేధింపులు తట్టుకోలేక ఉద్యోగులు ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలాలను తమ అక్రమ కేసుకు ఆధారంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో బెవరేజస్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు తాము సాక్షులుగా భావిస్తూ సిట్ నుంచి తప్పించుకునేందుకు అబద్ధపు వాంగ్మూలాలు ఇస్తున్నారు. ఓసారి వాంగ్మూలాల నమోదు పూర్తయిన తర్వాతే వారినే ఈ కేసులో నిందితులుగా చేర్చాలన్నది సిట్ పన్నాగం. ఈ కేసులో ఎవరెవరిని ఏ విధంగా ఇరికించాలి.. కనికట్టు చేసి జనాన్ని ఎలా నమ్మించాలి.. జరగని నేరాన్ని జరిగినట్లు ఏ విధంగా చూపించాలన్నది టీడీపీ ప్రధాన కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టు మేరకు జరుగుతోంది. అవే డిస్టిలరీలు.. పెరిగిన ఆదాయం.. ఇంకెక్కడ అవినీతి?వాస్తవానికి డిస్టిలరీల ముసుగులో దందా సాగించింది చంద్రబాబే. మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన మద్యం డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండి కొట్టి, నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా, వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. (వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనే లేదు) 2014 నవంబర్లో జీఓ నెంబర్ 993 ప్రకారం రెవెన్యూ (ఎక్సైజ్) డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇక అప్పటి వరకు ఊరూ పేరూ తెలియని బ్రాండ్ల మద్యం అమ్మకాలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. డిస్టిలరీలతో కుమ్మక్కై కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్ను సృష్టించి దోపిడీకి తెర తీసింది. 2015–2019 మధ్య ఇలా నాలుగైదు కంపెనీలకు లబ్ధి చేకూరింది. వీరి నుంచే 70 శాతం కొనుగోళ్లు చేశారు. ఈ నేపథ్యంలో 2019–24 మధ్య కొత్తగా ఒక్క డిస్టిలరీ కూడా రాలేదు. పైగా మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఈ లెక్కన అవినీతికి తావెక్కడ? అంతా చంద్రబాబు అండ్ కో కట్టుకథే. -
వి వాంట్.. డిస్కౌంట్
సాక్షి, అమరావతి: డిస్కౌంట్.. కొద్దికాలంగా భారతీయులను అత్యంత ఎక్కువగా ఆకర్షించే పదం ఇది. గతంలో కంటే ఎక్కువగా వినియోగదారులు డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా పండుగ సీజన్లలో ఇచ్చే డిస్కౌంట్ల కోసం చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. దేశంలో 70 శాతానికి పైగా అమ్మకాలు డిస్కౌంట్ల వల్లే జరుగుతున్నాయి. దుస్తులు, ఎలక్ట్రానిక్, గృహోపకరణ వస్తువులను 50 శాతానికిపైగా డిస్కౌంట్ ఉన్నప్పుడే ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. ఇలా 2024 పండుగ సీజన్లలోనే రూ.4.25 లక్షల కోట్ల అమ్మకాలు జరిగినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. ముఖ్యంగా దీపావళి, దసరా పండుగుల సీజన్లలో కొనుగోళ్లు ఇంకా ఎక్కువగా ఉంటున్నాయని, ఆ సమయంలో వివిధ బ్రాండ్లు ఇచ్చే డిస్కౌంట్లు, చేసే ప్రమోషన్లు కొనుగోళ్లను బాగా ప్రభావితం చేస్తున్నాయని వెల్లడించింది. మొబైల్ షాపింగ్కి పెరుగుతున్న ఆదరణఆన్లైన్ షాపింగ్లోనూ మొబైల్ షాపింగ్ అంతకంతకు పెరుగుతోంది. ఈ–కామర్స్ అమ్మకాలు పెరగడంలో మొబైల్ షాపింగ్ ఎక్కువగా ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రిటైల్ అమ్మకాల్లో 50 శాతం మొబైల్ షాపింగ్ ద్వారానే జరుగుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ అమ్మకాల్లో ముందున్నాయి. ఇలాంటి సంస్థలు సోషల్ మీడియా ద్వారానే వినియోగదారులకు దగ్గరవుతున్నాయి. వారి అభిరుచులకు తగ్గట్టు వ్యూహాలు మార్చుకుంటూ అన్ని రకాల వస్తువుల అమ్మకాలను పెంచుకుంటున్నాయి.ఆన్లైన్ షాపింగ్కే ఓటు..గతంలో మాదిరిగా షాపులకు వెళ్లి కావాల్సినవి కొనుగోలు చేయడం కంటే ఇంట్లోనే కూర్చుని ఆఫర్లు ఉన్నప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది. డిస్కౌంట్తోపాటు డోర్ డెలివరీ అనేది కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తోందని తెలిపింది. ప్రజల అభిరుచి మేరకు వివిధ రకాల వస్తువులను అందించే ఆన్లైన్ స్టోర్లు, పోర్టల్స్ పెరిగిపోయాయి. రోజువారీ నిత్యావసర వస్తువుల నుంచి అత్యాధునిక సాంకేతికత వరకు అన్ని రకాల ఉత్పత్తులను సులభంగా కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తున్నాయి.ఈ–కామర్స్ ప్లాట్ఫామ్లు పెరగడం వెనుక పండుగ షాపింగ్ అత్యంత కీలకంగా ఉంటోంది. సెలవుల సీజన్లలో వివిధ కంపెనీలు తరచూ కొత్త వాటితోపాటు పాత స్టాకుపై గణనీయమైన తగ్గింపులను ఇస్తున్నాయి. క్యాష్ బ్యాక్ డీల్స్, బై వన్– గెట్ వన్, బై టు–గెట్ త్రీ వంటి ఆఫర్లతో అదనపు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఫ్లిప్కార్ట్లో ‘బిగ్ బిలియన్ డేస్’, మింత్రాలో ‘ఫ్లాష్ సేల్స్‘, అమెజాన్లో ‘గ్రేట్ ఫెస్టివ్ సేల్‘ వంటి పేర్లతో విస్తృతంగా అమ్మకాలు చేపడుతున్నాయి. ఇలాంటి సంస్థల మార్కెటింగ్ వ్యూహాలు అమ్మకాల పెరుగుదలకు బాగా దోహదం చేస్తున్నాయి. దేశంలోని సంస్కృతి, సంప్రదాదాలు, సెలవు రోజులు, ప్రజల మూడ్కు అనుగుణంగా భారతీయులకు దగ్గరవుతూ అమ్మకాలను ఈ సంస్థలు రోజురోజుకూ పెంచుకుంటున్నాయి. -
కొత్త కొలువులు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలూ హుష్!
అయ్యా.. బాబూ.. నిరుద్యోగ భృతి ఇవ్వండని యువత అడుగుతుంటే.. ఉద్యోగాలొస్తుంటే భృతి ఎందుకు అంటూ వితండవాదం చేస్తున్న కూటమి ప్రభుత్వం తనంతకు తానే తన నిర్వాకాన్ని చాటుకుంది. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను సైతం పీకేశామని అసెంబ్లీలో ఆర్థిక విధాన ప్రకటన పత్రం ద్వారా వెల్లడించింది. ఈ లెక్కన కూటమి నేతల ఉద్యోగాల మాటలన్నీ పచ్చి అబద్ధాలేనని స్పష్టమైంది. కనీవినీ ఎరుగని రీతిలో కన్సల్టెంట్ల పేరుతో మాత్రం 30 వేల మందికి వందల కోట్ల రూపాయలు ధారపోస్తోంది. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను సైతం పీకేసింది. ఈ విషయాన్ని ఇదే కూటమి సర్కారే బుధవారం అసెంబ్లీలో స్పష్టం చేసింది. గత నవంబర్లో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. గత ఏడాది మార్చి ఆఖరు నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 11,79,332 మంది ఉన్నారని ఆర్థిక విధాన పత్రంలో పేర్కొంది. అయితే తాజాగా బుధవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా ఇదే కూటమి సర్కారు ప్రకటించిన ఆర్థిక విధాన పత్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 9,79,649 మంది మాత్రమే ఉన్నారని తెలిపింది. అంటే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కన్నా కూటమి సర్కారు వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా 1,99,683 మంది తగ్గిపోయారని తేలింది. కూటమి సర్కారు వలంటీర్లతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా తొలగించేసింది. తద్వారా వారికి ఏటా ఖర్చయ్యే రూ.1500 కోట్లను మిగుల్చుకుంది. కొత్తగా సామాన్య నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, వృత్తిపరమైన సర్వీసుల పేరుతో సూట్లు వేసుకునే.. పలుకుబడిగల వారిని భారీ సంఖ్యలో కన్సల్టెంట్లుగా నియమించుకుంది. ఈ విషయం ఆర్థిక విధాన పత్రంలోనే స్పష్టమైంది. వృత్తిపరమైన సర్వీసుల పేరుతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 6,434 మంది ఉండగా వారికి ఏడాదికి వేతనాల కోసం రూ.177 కోట్లు చెల్లించేది. అయితే ఇప్పుడు కూటమి సర్కారులో వృత్తిపరమైన సర్వీసు పేరుతో ఏకంగా 30,246 మందిని కన్సల్టెంట్లుగా నియమించుకుంది. వారికి ఏడాదికి వేతనాల రూపంలో రూ.747 కోట్లు చెల్లిస్తున్నట్లు ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారే స్పష్టం చేసింది.మేనిఫెస్టోకు మంగళం!సూపర్ సిక్స్లో తొలి హామీగా నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగులు ఇస్తామని, లేదంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే అధికారంలోకి వచ్చాక అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఏకంగా ఉన్న ఉద్యోగాలను సైతం పీకేసింది. నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా, పలుకుబడి గల వారికి నెలకు లక్షల రూపాయల వేతనాలు ఇస్తూ కన్సల్టెంట్లుగా నియమించుకుంటోంది. సామాన్య నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే విషయం గురించి మాత్రం అసలు పట్టించుకోవడమే లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2,71,167 మంది వలంటీర్లు ఉండగా, వారికి వేతనాల కింద ఏటా రూ.1,500 కోట్లు చెల్లించిందని గత నవంబర్లో అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారు తెలిపింది. బుధవారం అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో వలంటీర్లను తొలగించేసింది. తమకు ఇష్టంలేని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనూ తొలగించేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 96,675 మంది ఉంటే వారికి ఏడాదికి వేతనాల రూపంలో రూ.2,604 కోట్లు చెల్లించిందని గత నవంబర్లో అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారు తెలిపింది. బుధవారం సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 94,420కి తగ్గిపోయినట్లు తెలిపింది. వారికి వేతనాల కింద ఏటా రూ.2,329 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నట్లు పేర్కొంది.ఉద్యోగాల కుదింపే లక్ష్యంగత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ మధ్య 13,321 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. వారి స్థానంలో ఒక్క పోస్టు కూడా కూటమి సర్కారు భర్తీ చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2,55,289 మంది ఉండగా, కూటమి ప్రభుత్వంలో వారి సంఖ్య 2,54,087కు తగ్గిపోయింది. అలాగే గత ప్రభుత్వంలో జిల్లా పరిషత్ ఉద్యోగులు 54,248 మంది ఉండగా, కూటమి సర్కారులో 53,122కు తగ్గిపోయింది.నాడు మండల పరిషత్ ఉద్యోగులు 73,916 మంది ఉండగా, కూటమి ప్రభుత్వంలో 72,747కు తగ్గిపోయింది. మున్సిపల్ ఉద్యోగులు 22,354 మంది ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 21,767కు తగ్గిపోయింది. పీటీడీ ఉద్యోగులు 47,904 మంది ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 46,646కు పడిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీఆర్ఏలు 19,406 ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 18,435కు తగ్గిపోయింది. దీన్నిబట్టి ఉద్యోగాలను తగ్గించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని స్పష్టమవుతోంది. -
నీళ్లో రామ చంద్రా..
సాక్షి నెటవర్క్ : రాష్ట్రంలో వేసవి కాలం ప్రారంభంలోనే మంచి నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. చాలా ప్రాంతాల్లో రక్షిత మంచి నీటి పథకాలు మొరాయిస్తున్నాయి. పలు ఊళ్లలో బోరు బావులు మరమ్మతులకు నోచుకోక పని చేయడం లేదు. మరికొన్ని పట్టణాల్లో కొన్ని కాలనీలకు మాత్రమే నీరు సరఫరా అవుతోంది. ట్యాంకర్లతో సరఫరా ప్రణాళికాబద్ధంగా జరగక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బిందెడు తాగు నీటి కోసం ప్రజలు శివారు ప్రాంతాల్లోని బావులు, వంకల వద్దకు కష్టాలకోర్చి వెళుతుండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.వేసవి ముంగిట తాగునీటి ఎద్దడికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేయక పోవడం వల్ల సమస్య మరింత జఠిలం కానుంది. తీవ్ర నీటి ఎద్దడి, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి, నీటి సరఫరాకు చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ఎక్కడికక్కడ ప్రజలు మండిపడుతున్నారు.సాక్షాత్తు సీఎం నియోజకవర్గంలోనే మంచి నీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ పలుచోట్ల నీటి కోసం ప్రజలు రోడ్డెక్కుతుండటం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చాటుతోంది. వంశధార చెంత.. గొంతు తడవక చింత శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదీ తీరాన ఉండే హిరమండలం మేజర్ పంచాయతీలో తాగునీటికి కటకట ఏర్పడింది. ఇటు కుళాయిల ద్వారా నీటి సరఫరా జరగక.. అటు ట్యాంకర్ల ద్వారా నీరు అందక మహిళలు శుక్రవారం రోడ్డెక్కారు. అలికాం–బత్తిలి ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది. ఇక్కడ ఎప్పుడో దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన పైపులైన్, మంచి నీటి పథకం సామర్థ్యం చాలడం లేదు. అటు సమగ్ర మంచినీటి పథకం, జలజీవన్ మిషన్ వంటి పథకాలు ఉన్నా ఏవీ అక్కరకు రావడం లేదు. ఏలూరులో రోడ్డెక్కిన మహిళలువేసవి ప్రారంభంలోనే ఏలూరు నగరంలో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. స్థానిక 29వ డివిజన్ కుమ్మరి రేవు ప్రాంతంలో తాగునీటి సమస్య తీర్చాలంటూ స్థానిక మహిళలు ఏలూరు కార్పొరేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ ఎ.భాను ప్రతాప్కు వినతి పత్రం అందజేశారు. కుమ్మరి రేవు ప్రాంతంలో దాదాపు వెయ్యి కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రస్తుతం రోజుకు ఒక ట్యాంకర్తో నీటిని సరఫరా చేస్తున్నారు. అవి కాస్తా ముందు ఉన్న వారికి అందుతున్నాయని, కాలనీ లోపల ఉండే వారికి దొరకడం లేదని స్థానికులు చెబుతున్నారు. డబ్బు పెట్టి నీళ్ల క్యాన్లు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటకు, స్నానానికి, దుస్తులు ఉతికేందుకు సైతం నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం తమకు పూర్తి స్థాయిలో తాగునీరు అందించాలని కోరుతున్నారు.పుట్టపర్తిలో దాహం దాహంప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం, శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం అయిన పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. రూ.వేల కోట్లు వెచ్చించి అనేక రాష్ట్రాలకు తాగునీరు అందించి జల దాతగా పేరు గాంచిన సత్యసాయి బాబా నడయాడిన పుట్టపర్తి ప్రాంతంలోనే తాగునీటి కష్టాలు నెలకొనడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని కొన్ని వార్డుల్లో నెల రోజుల నుంచి తాగునీటి సమస్య నెలకొంది. రెండో వార్డు పెద్ద బజారు వద్ద గురువారం అర్ధరాత్రి మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు తారకరామనగర్, 9వ వార్డు కర్ణాటక నాగేపల్లి, 2వ వార్డు పెద్ద బజార్, 6వ వార్డు చిత్రావతి గుట్ట, 12వ వార్డు ఎనుములపల్లి కాలనీల్లో సమస్య తీవ్రంగా ఉంది. రంజాన్, ఉగాది పండుగలను ఎలా జరుపుకోవాలని మహిళలు ప్రశ్నిస్తున్నారు. కాగా, వేసవి వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయాయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పట్టపర్తి మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సీఎం ఇలాకాలోనూ తాగునీటికి కటకటసీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ, గుడుపల్లె మండలంలో తాగునీటి కోసం జనం ఇబ్బందులు పడుతున్నారు. గుడుపల్లి మండలం మిట్టూరు గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ఇటీవల మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. గుడుపల్లె మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గుడుపల్లి మండలం కోటపల్లి గ్రామంలో మహిళలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని రెస్కో కార్యాలయం చుట్టుపక్కల ఉన్న ప్యాలెస్ ఎక్స్టెన్షన్లో తాగునీటి సమస్య తీర్చాలంటూ మున్సిపల్ కమిషనర్కు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇది సర్కారు నిర్లక్ష్యమేఅమలాపురం మున్సిపాలిటీ 30వ వార్డు పరిధిలోని రావులచెరువు ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. నీటి సమస్య పరిష్కరించాలని అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. అయినా ఈ సమస్యను అధికారులు పరిష్కరించలేదు. గత వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి మంత్రి పినిపే విశ్వరూప్ ముందుచూపుతో రూ.20 కోట్లతో సమగ్ర తాగునీటి పథకాన్ని తెచ్చారు. నిధులు కూడా మంజూరై పనులు మొదలయ్యాయి. గాంధీనగర్లో ట్యాంక్ నిర్మాణం పూర్తయింది. హౌసింగ్ బోర్డు కాలనీ, ఏవీఆర్ నగర్లో త్వరితగతిన ట్యాంకు నిర్మాణాలను పూర్తి చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీంతో రావులచెరువు, రాజోలు నియోజకవర్గం పరిధిలోని మలికిపురం మండలం తూర్పుపాలెం, గొల్లపాలెం, శంకరగుప్తం, ఆడవిపాలెం, మట్టపర్రు, రామరాజులంక, సఖినేటిపల్లి మండలం మోరి, కేశవదాసుపాలెం, ఉయ్యూరివారి మెరక, అప్పన రాముని లంక, రాజోలు మండలం పొన్నమండలోని శివారు ప్రాంతాలకు తాగు నీరు అందడం లేదు. బిందెడు నీటి కోసం పాట్లుబిందెడు నీటి కోసం చాలా పాట్లు పడుతున్నాం. రక్షిత మంచి నీటి పథకం ద్వారా తాగు నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. ట్యాంకర్ల ద్వారా సరఫరా అనేది ప్రధాన ప్రాంతాలకే పరిమితం అవుతోంది. దీంతో మాలాంటి వీధులకు నీరు అందడం లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. – బూర రాధ, హిరమండలం, శ్రీకాకుళంఇలాగైతే ఎలా?తాగు నీళ్లు రావడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మోటార్ రిపేరీ ఉందని బయటకు తీశారు. అలాగే వదిలేశారు. రేపు మాపు అంటూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వస్తే కానీ అధికారులు స్పందించడం లేదు. ఇలాగైతే ఎలా? ప్రభుత్వం వెంటనే పట్టించుకుని సమస్య పరిష్కరించాలి. – కేశమ్మ, పెద్ద బజార్, పుట్టపర్తిఎమ్మెల్యే స్పందించాలిపుట్టపర్తి మున్సిపాలిటీలో పలుచోట్ల తాగునీటి సమస్యలు ఉన్నాయి. అధికారులు, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల వేళ కాని వేళ నీళ్లు వదులుతున్నారు. కూలి పనులకు వెళ్లకుండా నీటి కోసం పడిగాపులు కాస్తున్నాం. ఉగాది, రంజాన్ పండుగలు దగ్గర పడుతున్నాయి. అధికారులు, ఎమ్మెల్యే సింధూరారెడ్డి స్పందించి నీటి సమస్య లేకుండా చూడాలి.– సత్యనారాయణ, పెద్ద బజార్ 2వ వార్డు, పుట్టపర్తి -
బాబు పెట్రో బాదుడు రూ.5,256 కోట్లు
సాక్షి, అమరావతి: ఒకవైపు సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టి అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు సర్కారు మరోవైపు వీలైనన్ని మార్గాల్లో జనం జేబులకు చిల్లు పెడుతోంది. ఎన్నికల వాగ్దానం ప్రకారం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేకూర్చాల్సింది పోయి పన్నుల బాదుడుతో నిలువు దోపిడీ చేస్తోంది. సంపద సృష్టించి పథకాలను అమలు చేస్తానంటూ నమ్మించిన ప్రభుత్వ పెద్దలు నడ్డి విరిగేలా రూ.వేల కోట్ల భారం వడ్డిస్తున్నారు.ఇప్పటికే విద్యుత్తు చార్జీలను పెంచి రూ.15 వేల కోట్లకుపైగా భారాన్ని జనం నెత్తిన మోపిన కూటమి సర్కారు పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామన్న హామీని నెరవేర్చకుండా తొమ్మిది నెలల్లో వాహనదారుల నుంచి ఏకంగా రూ.5,256 కోట్లకుపైగా వసూలు చేసింది. తద్వారా మరో ఎన్నికల హామీకి తిలోదకాలిచ్చింది. తాము అధికారంలోకి వస్తే పెట్రోలుపై లీటర్కు రూ.16 చొప్పున ధరలు తగ్గిస్తామని ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ నమ్మబలికారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ పెట్రోలు బంకులు, ఆటో డ్రైవర్లు వద్దకు వెళ్లి అధికారంలోకి రాగానే గ్రీన్ట్యాక్స్ రద్దుతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ హామీలిచ్చారు. ఇక 2021 నవంబర్లో పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.పెట్రోలుపై లీటర్కు రూ.16 వరకు ధర తగ్గించాలని నాడు చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంధన ధరలపై గగ్గోలు పెట్టిన ఆయన అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మరిచారు. ఇది చాలదన్నట్లు ప్రకృతి వైపరీత్యాల నిధి పేరిట అదనపు సెస్ విధించేందుకు ఫైళ్లను సిద్ధం చేయడం గమనార్హం.రూ.5,256 కోట్లు తిరిగి కట్టాల్సిందేప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోలుపై లీటర్కు రూ.16 చొప్పున ధర తగ్గించాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. దాన్ని అమలు చేయాలని ఇప్పుడు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. మన రాష్ట్రంలో రోజూ సుమారు 35.66 లక్షల లీటర్ల పెట్రోలు, 86.01 లక్షల లీటర్ల డీజిల్ అమ్ముడవుతున్నట్లు ఏపీ పెట్రో డీలర్స్ అసోసియేషన్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 270 రోజుల్లో ప్రజల నుంచి కనీసం రూ.5,256 కోట్లు ముక్కుపిండి వసూలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల హామీ అమలులో భాగంగా తక్షణం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించడంతోపాటు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు కూటమి నేతల హామీలను సామాజిక మాధ్యమాల్లో రీ పోస్ట్ చేస్తున్నారు. ‘‘వచ్చారు సరే.. తగ్గించరేం..?’’ అంటూ కూటమి సర్కారును నిలదీస్తున్నారు.సరిహద్దు జిల్లాల్లో బంకులు వెలవెలఇక్కడ ధరలు అధికంగా ఉండటంతో ఏపీ సరిహద్దు జిల్లాల్లో వాహనదారులంతా పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో తమిళనాడు, కర్నాటక సరిహద్దు జిల్లాల్లోని పెట్రోలు బంకుల యజమానాలు వ్యాపారాలు లేక లబోదిబోమంటున్నారు. తమిళనాడు కంటే మన రాష్ట్రంలో పెట్రోలు ధర లీటరుకు రూ.7.99 అధికంగా ఉండగా కర్నాటక కంటే రూ.5.89 ఎక్కువగా ఉంది. యానాం కంటే మన రాష్ట్రంలో పెట్రోలు లీటర్కు రూ.12.77 అధికంగా ఉంది. ఇవన్నీ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. » ‘కేంద్ర ప్రభుత్వంతోపాటు 12 రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాయి. మరి మీరెప్పుడు (నాటి సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి) తగ్గిస్తారు? ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే వరకు టీడీపీ పోరాటం ఆగదు. దీనిపై అన్ని పెట్రోల్ బంక్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.16 తగ్గించి తీరాలి..’– 2021 నవంబర్ 5న మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు డిమాండ్» ‘డీజిల్ రేటు ఎంత..? కర్నాటకలో కొట్టించుకుంటున్నావా..? ఆంధ్రాలో అంత తక్కువ రేటు ఎక్కడుందబ్బా అనుకుంటున్నా..! వచ్చేది మేమే.. తగ్గించేది మేమే..!! దోచుకోవడంలో ఈ ప్రభుత్వం ఎవరినీ మినహాయించడంలేదు. మా ప్రభుత్వం రాగానే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తాం. అడ్డగోలు చలానా విధానానికి స్వస్తి పలుకుతాం. ఆటో యూనియన్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని అందిస్తాం. ప్రమాదంలో చనిపోయిన వారికి చంద్రన్న బీమా ద్వారా రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకుంటాం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం..’– 2023 మార్చి 27న పుట్టపర్తి యువగళం పాదయాత్రలో నారా లోకేశ్కర్ణాటక వెళ్లొస్తున్నాం..పెట్రోల్, డీజిల్ ధరలపై గగ్గోలు పెట్టిన నారా లోకేష్ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఎందుకు తగ్గించడం లేదు? మేం కర్ణాటక వెళ్లి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అక్కడికి, ఇక్కడికి ధరలో చాలా వ్యత్యాసం ఉంది. – ఎస్ రామకృష్ణారెడ్డి, చిలమత్తూరు, కర్ణాటక సరిహద్దు మండలంరూ.6 తక్కువకే..ఏపీలో లీటర్ పెట్రోల్ సుమారు రూ.110 ఉంటే కర్ణాటకలో రూ.104 మాత్రమే ఉంది. ఏపీ కంటే కర్ణాటకలో రూ.6 తక్కువగా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలి. – ఇంతియాజ్ అహమ్మద్, బసవనపల్లి, అమరాపురం మండలంరాష్ట్రంలో రోజుకు సగటు విక్రయాలు..పెట్రోలు: 35,66,066.66 లీటర్లుడీజిల్: 86,01,966 లీటర్లురోజుకు పెట్రోల్, డీజిల్ కలిపి 121.67 లక్షల లీటర్లు270 రోజులకు 328.50 కోట్ల లీటర్ల వినియోగం.. ఆ లెక్కన లీటరుకు రూ.16 చొప్పున తగ్గించకుండా చంద్రబాబు ప్రజల ముక్కుపిండి వసూలు చేసిన మొత్తం రూ.5,256 కోట్లు -
‘ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం’
సాక్షి, తాడేపల్లి: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా? అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. శుక్రవారం ఆయన తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మొండితోక అరుణ్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు. దళిత సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనేక సందేహాలు కలుగుతున్నాయన్న ఆదిమూలపు.. ఈ అంశంపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.‘‘అసలు ఒక చట్టం చేయాలంటే దానికి అనుసరించాల్సిన విధి విధానాలు చంద్రబాబుకు తెలియదా? ఒక బిల్లును పకడ్బందీగా తయారు చేయాలి. దానిని సంబంధిత మంత్రి చేత సభలో ప్రవేశపెట్టాలి. దానిపైన సమగ్ర చర్చ జరగాలి. దానిలో మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఆమోదించి, తరువాత దానిని గవర్నర్కు పంపుతారు. దానిని గవర్నర్ ఆమోదిస్తారా లేక కేంద్రానికి పంపుతారా అనేది ఉంటుంది. ఇది ఒక చట్టం విషయంలో ఏ ప్రభుత్వం అయినా పాటించాల్సిన విధానం ఇది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ విధానాన్ని ఎక్కడా అనుసరించినట్లు కనిపించడం లేదు’’ అంటూ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు...గవర్నర్ ద్వారా తీసుకువచ్చే ఆర్డినెన్స్కు కేవలం కొన్ని నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. శాసనసభ సమావేశాలు లేని సమయంలో చట్టం చేయడం కుదరదు కాబట్టి ఆర్డినెన్స్ను తీసుకువస్తారు. బడ్జెట్ సమావేశాలు నెల రోజుల పాటు జరుగుతున్నా ఎందుకు ఈ సమావేశాలను వినియోగించుకోలేక పోయారు? అంటే దీని అర్థం ఇంకా రాజకీయం చేయాలన్న చంద్రబాబు ఉద్దేశం బయటపడినట్లే కదా?. ఆర్డినెన్స్ అనేది ఒక తాత్కాలిక వెసులుబాటు. అసెంబ్లీలో ఇంత పెద్ద అంశాన్ని ఆఖరిరోజు లఘు చర్చకు పెట్టడంపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో చిత్తశుద్ది లోపించినట్లు, స్పష్టత లేకుండా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఏరకంగా దళితులకు న్యాయం జరుగుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది...ప్రభుత్వం వేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను మార్చి 10న కేబినెట్లో పెట్టారు. ఈ రిపోర్ట్ ను ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అలా పెట్టి ఉంటే అందరూ దీనిపై చర్చించేవారు. ఏదైనా సందేహాలు ఉంటే దానిపై అందరూ కలిసి ఒక స్పష్టత వచ్చేలా చూసేవారు. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు కొన్ని విషయాలు మాట్లాడారు. ఆయన చెబుతున్నది ఏమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు. రోస్టర్ విధానం మీద చంద్రబాబు చేసిన ప్రకటనలు పూర్తి అయోమయానికి దారి తీసేలా ఉన్నాయి. ఉద్యోగసంఘాలు కూడా ఇలాంటి రోస్టర్ విధానాన్ని ఎప్పుడు చూడలేదని చెబుతున్నారు...రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుంటమని చెబుతున్నారు. అలాగే 2026 జనాభా లెక్కలు జరిగిన తరువాత మళ్ళీ మార్పులు ఉంటాయని చెబుతున్నారు. అంటే సమస్యను మళ్ళీ మొదటికి తీసుకువస్తున్నారనే అనుమానాలు కలిగిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్దితో కాకుండా మోసపూరితంగా వ్యవహరించడం, సమస్యను పరిష్కారం చేయడంకుండా దానిపైన మంటలు రేపడం, దానిపైన తన్నుకుంటూ ఉంటే రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం కనిపిస్తోంది. తెలంగాణలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. చట్టం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని పకడ్బందీగా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇలా ఎందుకు చేయలేదు?...ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వ సరైన పరిష్కారం చూపుతుందా? లేదా? లేక సమస్యను ఇలాగే ఉంచి వివాదాన్ని రాజకీయంగా రగిల్చి, ఎప్పటికీ ఆరని మంటలా చేసి, దానిలో చలి కాచుకోవాలని అనుకుంటోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వర్గీకరణ సమస్యను డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాలకు రావాల్సిన ఫలాలను రాకుండా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం రాష్ట్రప్రజలు అనుమానిస్తున్నట్లుగా రాజకీయంగా దీనిని వాడుకునేట్లుగానే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కూటమి పాలనలో మా చదువులు ముందుకు సాగనివ్వకుండా, మా ఆరోగ్యాలకు భద్రత లేకుండా, ఏదైనా భూమిని సాగుచేసుకుంటే కౌలురైతులుగా ఉన్న మా రైతులకు ఎలాంటి సహాయం లేకుండా ఇలా అన్ని రకాలుగా మాకు తీరని ద్రోహం చేస్తున్నారు...ఒకపక్క వర్గీకరణ సమస్యను అలాగే ఉంచి, మరోవైపు దళితుల అభ్యున్నతికి ఉపయోగపడే అన్ని పథకాలను అందకుండా చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం, పాఠశాలల్లో నాడు-నేడు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. ఉద్యోగాల కల్పన లేదు, చేయూత లేదు, రైతుభరోసా లేదు ఇలా గతంలో వైయస్ జగన్ గారు మా వర్గాలకు భరోసా కల్పించేందుకు అమలు చేసిన వెన్నుముక లాంటి పథకాలు, కార్యక్రమాలు లేనే లేవు. వర్గీకరణను అయోమయంలో నెట్టారు. 2026 జనాభా ప్రకారం జిల్లాను ఒక యూనిట్ అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఒక యూనిట్ అంటున్నారు. రాష్ట్రం ఒక యూనిట్ అంటే నష్టపోతాం. కోస్తా ప్రాంతంలో మాల సామాజికవర్గం, రాయలసీమ ప్రాంతంలో మాదిగ సామాజికవర్గం ఎక్కువగా ఉంది. స్టేట్ ఒక యూనిట్ తీసుకుంటే నష్టం జరుగుతుంది. న్యాయం జరగదు. జిల్లాను ఒక యూనిట్ గా చూడాలంటే 2026 జనాభా లెక్కలు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ అయోమయం ఎందుకు? ..ముందుగానే కూటమి ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు ఉన్నాయి. మనసా వాచా కర్మేణ అందరికీ న్యాయం జరగాలి. దళితుల్లో ఉపకులాలను విడగొట్టకుండా, దళితుల్లో ఐక్యతను పెంచడానికి, వారిని బలోపేతం చేయడానికి వైయస్ జగన్ గారి ప్రభుత్వం కృషి చేసిందో, సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ను ముందుకు తీసుకుపోవాలని మేం స్పష్టంగా ఆనాడే చెప్పాం. దానికీ ఈరోజుకూ కట్టుబడి ఉన్నాం. కానీ దీనికి విరుద్దంగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో వ్యవహరించింది. ఈ అంశంపై ఎల్లో మీడియా సమస్యను పక్కదోవ పట్టించేలా తప్పుడు రాతలు రాస్తోంది. ఈ అంశాన్ని అవకాశవాద, స్వార్థపూరిత రాజకీయాలకు వాడుకోకుండా, దీనిని పరిష్కారం లేని సమస్యగా మారుస్తే ప్రజలు తగిన విధంగా గుణపాఠం నేర్పుతారు.’’ అని ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. -
‘ఆన్లైన్ గేమింగ్ యాప్స్ను కేంద్రం వెంటనే బ్లాక్ చేయాలి’
ఆన్లైన్ గేమింగ్ యాప్స్ను కేంద్రం వెంటనే బ్లాక్ చేయాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి కోరారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రకటనలలో నటించి ఒక తీవ్రమైన తప్పు చేసారని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తన అభ్యంతరం తెలిపారు. బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహించారని పలువురిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ తో సహా 25 మందిపై కేసు నమోదు అయ్యిందన్నారు. పలువురు యాంకర్లతో పాటు సోషల్ మీడియా Influencerలపై రెడ్విత్, బీఎన్ఎస్ 3, 3(A), 4..ఐటీ యాక్ట్ 66D సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేతిరెడ్డి గుర్తు చేశారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అంశానికి సంబంధించి భారత దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ,కేరళ, కర్ణాటకలలో ఒక చట్టం చేయడం జరిగిందన్నారు. పలువురికి సామాజిక వ్యసనంగా మారిన ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్లను ఏపీలో బ్లాక్ చేసేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని గత ఏపీ ప్రభుత్వం కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా మంత్రిని కోరారన్నారు. ఈ మేరకు 2020లో అప్పటి సీఎం జగన్.. లేఖ రాశారన్నారు. దీనిపై సమగ్ర చట్టం పార్లమెంట్ లో చేయాలని, మిగతా అన్నీ రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ రద్దుకు కేంద్రాన్ని కోరాలని, అప్పుడే భారత్లో ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ను లేకుండా చేయగలమన్నారు . ఇప్పుడు తెలంగాణలో ఫైల్ చేసిన కేసులో సెలెబ్రిటీలు Influencerలపై ప్రస్తుతం పెట్టిన కేసులో బలం లేదన్నారు. వారి పాత్ర వలన డబ్బు ఎంత చలామణి అయ్యిందో తెలుస్తోందని , భారత దేశంలో ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ ప్రస్తుతం 30 శాతం పెరిగిందని, మహిళలు సైతం ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కు బానిసలు అవుతున్నారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వివిధ రాష్ట్రాలలో ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ పై ఉక్కుపాదం మోపడానికి ఒక టాస్క్ ఫోర్స్ ను నియమించడంతో పాటు కేంద్రం ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సైట్స్ ను బ్లాక్ చేయాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. "సెలబ్రిటీలు హోదాను కాపాడుకోవాలే కానీ ప్రజలకు నష్టం కలిగే వ్యవహారాలు చేయడం సిగ్గు చేటని, 'మా' అసోసియేషన్ వెంటనే స్పందించి తగిన చర్యలకు తీసుకోవాలని, యూట్యూబ్లో స్టార్స్ అయినంత మాత్రాన.. రియల్ లైఫ్లో స్టార్స్ కాదన్నది వారు గుర్తెరిగి నడుచుకోవాలని కేతిరెడ్డి హెచ్చరించారు. -
పోసానికి బెయిల్ మంజూరు
గుంటూరు: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ముంజూరు చేసింది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు.. బెయిల్ ను మంజూరు చేసింది. బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసిన కోర్టు.. ఈరోజు(శుక్రవారం) బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ప్రముఖ రచయిత,నటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా .. న్యాయస్థానం ఇవ్వాల్టికి వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు.. గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఆయన్ను మంగళవారం కస్టడీలోకి తీసుకున్న సీఐడీ పోలీసులు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.2 గంటల వరకు విచారించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్క్లాస్ ఫర్ ప్రొహిబిషన్/ఎక్సైజ్ కోర్డులో హాజరుపరిచారు. అక్కడ్నుంచి పోసానిని తిరిగి గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. ఈ కేసులో బుధవారం కోర్టులో విచారణ జరిగింది. శుక్రవారం తిరిగి విచారించిన కోర్టు.. పోసానికి బెయిల్ మంజూరు చేసింది.ఫిబ్రవరి 26వ తేదీ అరెస్టు.. ఆపై వేధింపులుకాగా, ఫిబ్రవరి 26వ తేదీని పోసానిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అనంతరం కూటమి సర్కార్ ఆదేశాలతో రోజుకో కేసు పెట్టి పోసానిని వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తూ తమ అహంకార పూరిత వైఖరిని ప్రదర్శిస్తోంది కూటమి ప్రభుత్వం. పోసానికి ఆరోగ్యం బాగోలేకపోయినా వరుస కేసులు పెట్టి మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకూ 19 కేసులు పెట్టింది కూటమి ప్రభుత్వం. -
‘సామాజిక’ సాహిత్యం
సాక్షి, అమరావతి: ‘వడగాడ్పు నా జీవితం.. వెన్నెల నా కవిత్వం’ అన్నారు గుర్రం జాషువా. ఆకలి కవిత్వం.. ఆలోచనే కవిత్వం.. కదిలించే ఘటనలు.. కవ్వించే ప్రతినలు.. కవితకు ప్రాతిపదికలు అంటూ కవిత్వం స్వరూపాన్ని వివరించారు శ్రీశ్రీ. రచనలతో సంస్కృతి, సంప్రదాయాల సంపదను, మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కవుల పాత్ర గొప్పది. వారు సాహిత్యానికి, తద్వారా సమాజ ఉన్నతికి చేస్తున్న కృషి వెలకట్టలేనిది. వారి కవిత్వానికి గుర్తింపునిస్తూ ఏటా మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి సామాజిక మాధ్యమాల ద్వారా సాహిత్యం కొత్తపుంతలు తొక్కుతోంది. పడిలేచిన కెరటం: కాలంతో పాటు సాహిత్యకారులకు ఆదరణ కరువైంది. కరోనా మహమ్మారి ఈ పరిస్థితిలో కాస్త మార్పు తెచి్చంది. సామాజిక మాధ్యమాల ద్వారా రచయితలకు తిరిగి పూర్వ వైభవం వస్తోంది. అక్షర జ్ఞాన ప్రదర్శనకు అనువైన వేదికలు కల్పించే సాహిత్య సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. సామాజిక వేదికల ద్వారా దేశ విదేశాలను ఏకం చేస్తూ సాహిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనుభవజు్ఞల నుంచి అప్పుడే అడుగులు వేస్తున్న వారికీ ఇక్కడ గుర్తింపు దక్కుతోంది. సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలనే ఇతివృత్తంగా కవితలు, కథల పోటీలు నిర్వహిస్తుంటే, గెలుపొందిన వారితో పాటు పాల్గొన్న వారికీ ప్రోత్సాహక బహుమతులు, పురస్కారాలు లభిస్తున్నాయి. దీంతో యువతరంలోనూ క్రమంగా సాహిత్య రచనా కాంక్ష పెరుగుతోంది. ఎన్నో మార్గాలు : అభ్యుదయ కవిత్వం, భావ కవిత్వం, కాల్పనిక కవిత్వం అంటూ ఎవరు ఏం రాసినా పూర్వం పత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురిస్తేగానీ ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటయ్యాయి. ప్రతిలిపి, పాకెట్ ఎఫ్ఎం, పాకెట్ నవల్ వంటి ఆన్లైన్ యాప్లో కథలు, కవితలు వినడం, చదడం వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.కవులు పెరిగారు సోషల్ మీడియా వేదికగా సాహిత్యానికి పెద్ద ప్లాట్ఫాం ఏర్పడింది. కరోనా తర్వాత ఆన్లైన్ వేదికలు రావడంతో ఎంతోమంది కవులు మారారు. కవులకు సరైన సాహిత్య మార్గ నిర్దేశకం అవసరం. అందుకే ప్రత్యేక వేదికలు కల్పిస్తున్నాం. – కత్తిమండ ప్రతాప్, రచయిత, శ్రీశ్రీ కళా వేదిక నిర్వాహకుడు సామాన్యులకు అర్థం అవుతోంది ఒకప్పుడు కవిత్వం రాసేవారిని వెతకాల్సి వచ్చేది. కరోనా తరువాత ప్రతి వంద మందిలో 10 మంది కవులు ఉంటున్నారు. ఏ కాలంలోనూ ఇంతమంది కవులు లేరు. – నిమ్మగడ్డ కార్తీక్, రచయిత, తపస్వి మనోహరం సాహిత్య వేదిక నిర్వాహకుడు -
మా అధికారాల్లోనే జోక్యం చేసుకుంటారా?
సాక్షి, అమరావతి : గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో బోగస్ ఓట్ల తొలగింపు అభ్యర్థనతో అసలైన ఓట్ల తొలగింపు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేయడం వెనుక ఉన్న నిజానిజాలను తేల్చే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించకుండానే సిట్ను ఏర్పాటు చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామంది. సిట్ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో ఇచ్చారని, ఇలా చేయడం తమ అధికార పరిధిలో జోక్యం చేసుకోవడమేనని కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ హైకోర్టుకు వివరించారు. ఈ వ్యవహారాన్ని తాము ఎంత మాత్రం తేలిగ్గా తీసుకునేది లేదన్నారు. తమ అధికార పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నా చూస్తూ ఊరుకుంటే.. రేపు ప్రతి రాష్ట్రం ఇలాగే వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష తీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులిచ్చి వివరణ కోరామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీరును అభిశంసించాలని ఆయన కోర్టును కోరారు. సిట్ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం మరో జీవో ఇచ్చిందని, ఆ జీవోలో ఉపయోగించిన భాష కూడా సరిగా లేదని తెలిపారు. బేషరతుగా జీవోను ఉపసంహరించుకోకుండా ఎన్నికల సంఘం చట్ట నిబంధనలకు లోబడి తాము చర్యలు తీసుకుంటామని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తమ పరిధిలో జోక్యం చేసుకుంటామన్న సందేశాన్ని ఇచ్చినట్లయిందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. సిట్ ఏర్పాటు జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంది. సిట్ ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి గురువారం ఉత్తర్వులిచ్చారు. మా అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుందిఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ, ఎన్నికల నిర్వహణ తదితరాలన్నీ తమ పరిధిలోని వ్యవహారాలని చెప్పారు. వీటిలో ఏవైనా పొరపాట్లు గానీ, లోటుపాట్లు గానీ ఉన్నా వాటిని సరిచేయాల్సింది కేంద్ర ఎన్నికల సంఘంగా తాము మాత్రమేనన్నారు. ఇందులో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. సిట్ ఏర్పాటు ద్వారా ప్రభుత్వం తమ అధికారాలను లాగేసుకుందని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై తాము ఆరోపణలను నమోదు చేసి, ఆయనకు ఖర్చులు విధించాలని కోర్టును కోరారు. ఇలా తాము కోరినట్లు కూడా రికార్డ్ చేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వం తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది అజయ్ వాదనలు వినిపిస్తూ.. సిట్ ఏర్పాటు జీవోను ఉపసంహరించుకుంటూ ఈ నెల 19న మరో జీవో ఇచ్చినట్టు కోర్టుకు వివరించారు. సిట్ ఏర్పాటుపై పిటిషన్ గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పర్చూరు నియోజకవర్గంలో బోగస్ ఓట్ల తొలగింపు అభ్యర్థనతో అసలైన ఓట్ల తొలగింపు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు (ఫాం 7) దాఖలయ్యాయంటూ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. దీంతో ఫాం 7 దాఖలుపై విచారణ నిమిత్తం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3న జీవో 448 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ బాపట్లకు చెందిన గుండపనేని కోటేశ్వరరావు, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ సుబ్బారెడ్డి విచారణ జరిపారు. -
వర్గీకరణపై ఐదు సిఫారసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల్లోని ఉపకులాల వర్గీకరణపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రంగరాజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఐదు కీలక సూచనలు చేసింది. గతేడాది నవంబర్ 15న నియమితులైన ఆయన అదే నెల 27న బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి 13 జిల్లాల్లో పర్యటించి ఈ నెల 10న ప్రభుత్వానికి నివేదిక సమర్పింపంచారు. నాలుగు నెలలపాటు అధ్యయనం చేసి 3,820 విజ్ఞాపనలు స్వీకరించిన కమిషన్ మొత్తం 360 పేజీల నివేదికలో ఐదు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలోని 59 ఎస్సీ ఉపకులాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించింది. వాటిలో గ్రూపు–ఏలో 2.25 శాతం జనాభా కలిగిన అత్యంత వెనుకబడిన 12 రెల్లి ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్ అందించాలని సిఫారసు చేసింది. గ్రూప్–బీలో 41.56 శాతం జనాభా కలిగిన వెనుకబడిన 18 మాదిగ ఉపకులాలకు 6.5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పేర్కొంది. గ్రూప్ సీలో 53.98 శాతం జనాభా కలిగి మిశ్రమ వెనుకబాటుతనంతో ఉన్న 29 మాల ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సిఫారసు చేసింది. రోస్టర్ విధానం ప్రకారం మొదట వంద పోస్టులు వస్తే 8 శాతం పోస్టులు మాల సామాజిక వర్గానికి వస్తాయి. మాదిగ సామాజిక వర్గానికి 6 శాతం, రెల్లి సామాజిక వర్గానికి ఒక శాతం వస్తాయి. ఈ మూడు కలిపితే 15 శాతమవుతుంది. అదే రోస్టర్ విధానంలో 200 పోస్టులు వస్తే మాల సామాజిక వర్గానికి 15, మాదిగ సామాజిక వర్గానికి 13, రెల్లి వర్గానికి రెండు వర్తిస్తాయి. తద్వారా రోస్టర్లో అందరికీ న్యాయం జరుగుతుంది. ఇవీ ఐదు కీలక సూచనలు..» ప్రస్తుతానికి రాష్ట్రం యూనిట్గా వర్గీకరణ అమలు చేయాలి. » 2026 జనాభా లెక్కల సేకరణ పూర్తి అయ్యాక ప్రభుత్వం జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేసుకోవచ్చు. » ఎస్సీ 59 ఉపకులాలను ఏ, బీ, సీగా మూడు కేటగిరీల్లో వర్గీకరణ. » 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ శాతం అమలు. » రోస్టర్ విధానాన్ని కూడా ఇదే రీతిలో అమలు చేయాలి.జనగణన తర్వాతే వర్గీకరణఅసెంబ్లీలో సీఎం చంద్రబాబుసాక్షి, అమరావతి: రాష్ట్రం యూనిట్గా 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 2026 జనగణన తర్వాతే జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాల్లో ఉప కులాల వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం నియమించిన రంగరాజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదికపై గురువారం స్వల్పకాలిక చర్చ అనంతరం ఆమోదిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. 1995లో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి సుదీర్ఘకాలం సాగిన వర్గీకరణ అంశం మళ్లీ తన హయాంలోనే పరిష్కారం కావడం సంతృప్తినిచి్చందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఎన్నికల్లో చెప్పినట్లే ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నాం. 30 ఏళ్ల నిరీక్షణను నిజం చేస్తూ నా చేతుల మీదుగా వర్గీకరణ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. అంటరానితనంపై అప్పట్లో జస్టిస్ పున్నయ్య కమిషన్ చేసిన 42 సిఫారసులు ఆమోదించి 25 జీవోలు, మెమోలు తీసుకొచ్చాం. పున్నయ్య కమిషన్ వేసి ఎస్సీ, ఎస్టీ చట్టం తెచ్చా. మాదిగ పేరు చెప్పుకొనేందుకు కూడా వెనుకాడిన రోజుల్లో మాదిగ దండోరాను స్థాపించి మందకృష్ణ పెద్ద ఉద్యమం చేశారు. వారి డిమాండ్లు సమంజసమని భావించి 1997 జూన్ 6న ఎస్సీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరిస్తూ ఉత్వర్వులు ఇచ్చాం. దీంతో మాదిగలు, ఉప కులాలకు 22 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా గతేడాది ఆగస్టులో జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచి్చంది. అంటరానితనాన్ని రూపుమాపేందుకు నాకు చాలా సమయం పట్టింది. పేదరికంలేని సమాజమే నా లక్ష్యం. ఉగాది నుంచి పీ 4 విధానం తెస్తాం’ అని చంద్రబాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే మంద కృష్ణ, చంద్రబాబు ఇద్దరే కారణమని డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉండే రెల్లి కులస్తుతులకు కూడా న్యాయం చేయాలన్నారు. బుడగ జంగాలనూ ఎస్సీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. -
హజ్ యాత్రికులకు కూటమి సర్కార్ ద్రోహం
రాష్ట్రం నుంచి హజ్కు వెళ్లే ముస్లింల సౌకర్యార్థం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టుదలతో సాధించిన ఎంబార్కేషన్ పాయింట్ను కూటమి ప్రభుత్వం రద్దు చేయించింది. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ రద్దుకు వీలుగా ఏకంగా ఏపీ హజ్ కమిటీతో లేఖ రాయించింది. దీంతో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అరూప్ బర్మన్ ఈ నెల 18న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్సింగ్కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. – సాక్షి, అమరావతి వైఎస్ జగన్ కృషితో సాకారం..భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ఆయా రాష్ట్రాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎంబార్కేషన్ పాయింట్కు కేంద్ర పౌర విమానయాన, విదేశీ వ్యవహారాలు, మైనార్టీ తదితర శాఖలు సమీక్షించి అనుమతి ఇస్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చే వరకు హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల నుంచి హాజీలు వెళ్లేవారు. ఈ పరిస్థితిని గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి.. విజయవాడ(గన్నవరం) విమానాశ్రయానికి ఎంబార్కేషన్ పాయింట్ కోసం అనుమతి సాధించింది. అలాగే ఇక్కడి నుంచి ప్రయాణించే వారిపై పడిన అదనపు చార్జీలను సైతం వైఎస్ జగన్ సర్కార్ భరించింది. ఈ విషయంలో విదేశీ వ్యవహారాల శాఖ, పౌర విమానయాన, కేంద్ర హజ్ కమిటీలతో వైఎస్సార్సీపీ ఎంపీలు అనేక పర్యాయాలు సంప్రదించారు. కేంద్రానికి అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో లేఖ కూడా రాసి ప్రతినిధి బృందాన్ని పంపించి మాట్లాడించారు. అయినా సానుకూల ఫలితం లేకపోవడంతో గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్లే హాజీలపై రూ.80 వేల చొప్పున పడుతున్న అదనపు చార్జీల భారాన్ని అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే భరించింది. వైఎస్సార్సీపీ హయాంలో గత రెండేళ్లలో ఏకంగా 2,495 మంది విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్కు వెళ్లారు. 1,813 మందికి చార్జీల భారం లేకుండా రూ.14.50 కోట్లకు పైగా అందించింది.ముస్లిం సమాజాన్ని మోసం చేశారు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముస్లింల ప్రయోజనాలను కాపాడటంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికే వక్ఫ్ సవరణ బిల్లు వంటి వాటిలో టీడీపీ డబుల్ గేమ్ ఆడింది. తాజాగా ఎంబార్కేషన్ పాయింట్ పోయేలా లేఖ ఇప్పించి.. ముస్లిం సమాజాన్ని మోసం చేసింది. ఇది ముమ్మాటికి ముస్లింలను అవమానపర్చడమే. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా స్పందించి ఎంబార్కేషన్ పాయింట్ను తిరిగి సాధించాలి. – షేక్ మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ కన్వినర్ ఇది చంద్రబాబు మార్క్ కుట్ర.. హజ్ యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ రద్దు కచ్చితంగా చంద్రబాబు మార్క్ కుట్ర. ఏపీకి చెందిన ఎంపీ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా.. ఎంబార్కేషన్ పాయింట్ రద్దు చేస్తుంటే ఏం చేస్తున్నారు? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్లు? రూ.లక్ష హామీని ఎగవేసేందుకే ఇలా కుట్ర చేశారా? – షేక్ నాగుల్ మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్ తీసుకువస్తే.. బాబు నాశనం చేశారు పొరుగు రాష్ట్రాల్లో ఏపీకి చెందిన హాజీలు అవస్థలు పడకూడదని అప్పటి సీఎం వైఎస్ జగన్.. పట్టుదలతో ఎంబార్కేషన్ పాయింట్ సాధించారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో విమాన టికెట్ ధరలు ఎక్కువగా ఉంటే ఆ భారాన్ని కూడా భరించారు. అలాంటి సౌలభ్యాన్ని చంద్రబాబు నాశనం చేశారు. – దస్తగిరి, ముస్లిం దూదేకుల జేఏసీ చైర్మన్ -
బాబు విజనరీ.. ఆదాయం ఆవిరి!
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ గురువారం వెల్లడించింది.సంపద పెంచేస్తానని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు... తీరా అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్త పాలనతో ఉన్న సంపదను సైతం ఆవిరి చేసేస్తున్నారు. కొత్తగా సంపద సృష్టించడం దేవుడెరుగు... గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని కూడా నిలబెట్టలేక పోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం కక్ష సాధింపులు, రెడ్బుక్ పాలనపైనే దృష్టి సారించి, సుపరిపాలనను గాలికొదిలేయడమేనని స్పష్టం అవుతోంది. భారీగా తగ్గిన రెవెన్యూ రాబడులు.. పన్నులు ⇒ ఎటువంటి ఆర్థిక సంక్షోభాలు లేనందున సాధారణంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులకన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు పెరగాలి. అందుకు పూర్తి విరుద్ధంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల కన్నా.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల్లో రూ.11,450కోట్ల మేర తగ్గుదల నమోదైంది. అంటే చంద్రబాబు పాలనలో సంపదలోనూ, వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ⇒ అమ్మకం పన్నుతోపాటు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ఆదాయం కూడా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు అమ్మకం పన్ను ఆదాయం రూ.1,068 కోట్లు తగ్గినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా రూ.721 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. భారీగా పెరిగిన అప్పులు... తగ్గిన కేంద్రం గ్రాంట్లు ⇒ 2024–25 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికంటే రాష్ట్ర అప్పులు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకే బడ్జెట్ పరిధిలోనే రూ.90,557 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.70 వేల కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల ఉండగానే అదనంగా రూ.20 వేల కోట్లు అప్పు చేశారు. ⇒ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో రూ.16,766 కోట్ల తగ్గుదల నమోదైంది. జగన్ పాలనలో కన్నా రూ.10వేల కోట్లు తక్కువగా మూలధన వ్యయం ⇒ అప్పు చేసిన నిధులను ఆస్తుల కల్పన కోసం మూలధన వ్యయంపై ఖర్చు పెట్టాలని ఇటీవలే చంద్రబాబు విలేకరుల సమావేశంలో నీతులు చెప్పారు. అయితే, ఆచరణలో మాత్రం మూలధన వ్యయంలో కోతలు విధించారు. ⇒ జగన్ సీఎంగా ఉండగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి మూలధన వ్యయం కింద రూ.23,251 కోట్లు ఖర్చు చేశారు. నీతులు చెబుతున్న చంద్రబాబు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు కేవలం రూ.13,303 కోట్లే మూలధన వ్యయం చేశారు. ⇒ ఈ ఏడాది బడ్జెట్ అంచనాలకు మించి ద్రవ్యలోటు, రెవెన్యూలోటు పెరిగిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా బడ్జెట్లో పేర్కొనగా.. అది ఫిబ్రవరి నాటికే ఏకంగా రూ.76,292 కోట్లకు చేరింది. ⇒ ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు రూ.68,763 కోట్లుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి నాటికే ద్రవ్యలోటు రూ.90,047 కోట్లకు చేరింది. ⇒ రెవెన్యూ రాబడులు తగ్గుతున్నా.. రాష్ట్ర వృద్ధి రేటు పెరిగిపోతోందంటూ సీఎం చెప్పడం.. కేవలం అప్పులు ఎక్కువగా చేయడానికేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
బతుకే ‘పరీక్ష’
మంత్రాలయం: బతుకుదెరువులో భాగంగా ఎంతో మంది పదవ తరగతి విద్యార్థులు పేదరికంతో పరీక్షలకు దూరమై చదువులకు వీడ్కోలు పలుకుతున్నారు. పనికోసం వలస (సుగ్గి) బాటలోనే విలువైన జీవితాలను పణంగా పెడుతున్నారు. తల్లిదండ్రులకు చదివించుకోవాలన్న ఆశ ఉన్నా, పేదరికం శాపంగా మారింది. పూట గడవని జీవులకు బతుకే ఓ పోరాటమైంది.జీవితమే ఓ పరీక్షగా మారింది. ఇదివరకెన్నడూ లేనంతగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు కావడం గమనార్హం. విద్యార్థులు చదువులకు దూరమవుతున్నా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. పేద కుటుంబాల విద్యార్థుల చదువులకు భరోసా ఇవ్వకుండా వేడుక చూస్తోంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఈ ఏడాది 32,130 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.అందులో మొదటి రోజు తెలుగు, ఉర్దూ, కన్నడ సబ్జెక్టు పరీక్షలకు 700 మంది గైర్హాజరయ్యారు. వీరిలో మంత్రాలయం నియోజకవర్గం వారు 79 మంది, ఆదోనివారు 37 మంది ఉన్నారు. కోసిగి మండలం చింతకుంటకు చెందిన చిన్నారి పరీక్షకు హాజరు కాలేదన్న విషయం ఓ పత్రికలో చదివి తెలుసుకున్న విద్యా శాఖ మంత్రి లోకేశ్.. సదరు చిన్నారిని గురువారం స్వగ్రామానికి పంపారు.రెండు సబ్జెక్టుల పరీక్షలు ముగిసిన తర్వాత ఆమెను ఇంటికి రప్పించారు. ఈ బాలిక మిగతా పరీక్షలకు హాజరైనా, మొదటి రెండు పరీక్షల్లో ఫెయిల్ కాకతప్పదు. ఇలాంటి విద్యార్థులు వందల సంఖ్యలో ఉన్నారు. మరి వారందరి పరిస్థితి ఏమిటన్నది మంత్రి లోకేశ్ సెలవివ్వాలి. పేపర్లో వస్తేనే స్పందించే బదులు తొలుతే అందరూ పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుని ఉంటే బావుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.రెండు సబ్జెక్టులకు దూరమైన చిన్నారి ⇒ ఈ విద్యార్థిని పేరు సన్నక్కి చిన్నారి. కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన మారయ్య, కమలమ్మ దంపతుల రెండవ కుమార్తె. కోసిగి బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదవుతోంది. గుంటూరు జిల్లా కేంద్రం సమీపంలో మిరప కోతలకు తల్లిదండ్రులతోపాటు జనవరిలో వెళ్లింది.చిన్నారి కుటుంబానికి సెంటు భూమి కూడా లేదు. కూలికి వెళితేనే నాలుగు మెతుకులు. ఈసారి కూలి పనులు లేకపోవడంతో మారయ్య ఇంటిల్లిపాది పని కోసం వలస పట్టారు. పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైనా చిన్నారిని మాత్రం పరీక్షలకు పంపలేదు. తోటి వారు వారించడంతో రెండు సబ్జెక్టుల పరీక్షలు అయిపోయాక తల్లి చిన్నారిని వెంటబెట్టుకుని ఊరు చేరుకుంది.వీరేంద్ర పరీక్షకు తండ్రి జబ్బు శాపం ⇒ ఈ ఫొటోలోని విద్యార్థి పేరు వీరేంద్ర. మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలోని చిన్నకడబూరు గ్రామానికి చెందిన భీమయ్య, ఉసేనమ్మ కుమారుడు. ప్రస్తుతం ఈ విద్యార్థి తండ్రికి జబ్బు చేసి స్వగ్రామంలోనే ఉండిపోగా.. తల్లితోపాటు వీరేంద్ర పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని గడితండా గ్రామంలో మిరప కోతలకు వెళాడు.పదవ తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్తానని వీరేంద్ర మొర పెట్టుకున్నా, అమ్మ ఒప్పుకోలేదు. నాన్న అనారోగ్యంగా ఉండటంతో ఇల్లు గడవడం కష్టంగా ఉందని, పైగా పోయిన సంవత్సరాల్లాగా అమ్మ ఒడి కూడా రాలేదని వీరేంద్రను వారించడంతో మనసు చంపుకొని పనికి వెళ్లాడు. రెండు నెలలుగా అక్కడే పనులు చేసుకుంటున్నారు.పూట గడవని మాకు పరీక్షలెందుకని?⇒ ఈ ఫొటోలోని భార్యాభర్తల పేర్లు సులువాయి నరసింహులు, నీలమ్మ. వీరిది కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలోని పల్లెపాడు గ్రామం. పచ్చ రంగు చొక్కా ధరించిన బాలుడు ఉరకుందు పదవ తరగతి, క్రీం కలర్ షర్టు ధరించిన బాలుడు వీరేంద్ర ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రెండు సబ్జెక్టులు పూర్తయ్యాయి.బతుకుదెరువు కోసం తల్లిదండ్రులతోపాటు ఉరుకుందు సుగ్గి (పని కోసం వలస)కి వెళ్లడంతో పరీక్షలకు హాజరు కాలేదు. పూట గడవని తమకు పరీక్షలు ఎందుకనుకున్నారేమో తల్లిదండ్రులు పిల్లలను సైతం తమ వెంట తీసుకొని ప్రకాశం జిల్లా పురిమెట్లలో మిరప కోతలకు వెళ్లారు. తల్లిదండ్రుల పేదరికం ఈ విద్యార్థికి శాపంగా మారడం విచారకరం. వీరికి ఎకరా భూమి ఉంది. వానొస్తేనే పొలంలో కాసింత పచ్చదనం కనిపిస్తుది. లేదంటే బీడుగా వదిలేసి సుగ్గి బాట పట్టాల్సిందే.తల్లికి వందనం లేనందునే..ఇలా ఒక్క పదవ తరగతి విద్యార్థులే కాదు.. ఇతర తరగతులు చదివే విద్యార్థుల్లో చాలా మంది వలస వెళ్లారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో దాదాపు 16 వేల మంది వరకు విద్యార్థులు వలస వెళ్లినట్లు అంచనా. గత ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం అమలుతో విద్యార్థులు వలస వెళ్లిన దాఖలాలు చాలా తక్కువ.ఈసారి మాత్రం తల్లిదండ్రులతోపాటు విద్యార్థులు అత్యధిక సంఖ్యలో తరలి వెళ్లడం గమనార్హం. తల్లికి వందనం పథకం అమలు చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని స్థానికులు వాపోతున్నారు. అంతేగాక సీజనల్ హాస్టళ్ల ఏర్పాటులోనూ కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం కూడా వలసలకు ఓ కారణం.నాగలక్ష్మికి పేదరికమే అడ్డు⇒ ఈ అమ్మాయి పేరు నాగలక్ష్మి. పెద్దకడబూరు మండల కేంద్రానికి చెందిన లింగమ్మ, భీమేష్ దంపతుల కుమార్తె. నాగలక్ష్మి తల్లితోపాటు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం కేంద్రం సమీపంలో మిరప కోతల్లో ఉండిపోయింది. మూడు నెలలుగా అక్కడ పొలం పనులకు వెళ్తోంది. ఈ బాలిక పెద్దకడబూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. పబ్లిక్ పరీక్ష రాసేందుకు సైతం హాజరు కాలేదు. సెంటు భూమి లేని నాగలక్ష్మి కుటుంబానికి కూలి పనులే శరణ్యం. గ్రామంలో పనులు ముగియడంతో తల్లితో కలిసి వలస వెళ్లడం గమనార్హం. -
రెడ్బుక్ తంత్రం.. సిట్ కుతంత్రం!
సాక్షి, అమరావతి : పోలీస్ స్టేషన్కు ఉండాల్సిన అర్హతలు ఉండవు.. ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందో చెప్పరు.. కానీ అది పోలీస్ స్టేషనే. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరో చెప్పరు కానీ అది పోలీస్ స్టేషనే. ఇదంతా ఏమనుకుంటున్నారు? ఇది రెడ్బుక్ రాజ్యాంగ కుట్రల కోసం చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా సిద్ధం చేసిన రాజ్యాంగేతర శక్తి. దీనిపేరు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్). వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట ప్రభుత్వం బరితెగిస్తోంది. అందుకోసమే ఏర్పాటు చేసిన సిట్ ద్వారా అరాచకాలకు తెగబడుతోంది. చట్టంలో పేర్కొన్న నిబంధనలను బేఖాతరు చేస్తూ.. ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతోనే సిట్ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రలోభపెట్టి, బెదిరించి, వేధించి మరీ అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసే కుట్ర దాగుంది. చట్ట విరుద్ధంగా సిట్ ఏర్పాటు సిట్ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోనే ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. కేవలం కక్ష సాధింపే లక్ష్యంగా సిట్ను ఏర్పాటు చేశారనేది జీవోనే స్పష్టం చేస్తోంది. చట్టంలో నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలను పూర్తిగా ఉల్లంఘించారని స్పష్టమవుతోంది. ఏదైనా వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసే సిట్ను ఓ పోలీస్ స్టేషన్గా పరిగణించాలి. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో సిట్ను ఓ పోలీస్ స్టేషన్గా గుర్తిస్తున్నట్టు పేర్కొంది. కానీ అసలు పోలీస్ స్టేషన్కు చట్ట ప్రకారం ఉండాల్సిన నిబంధనలను మాత్రం గాలికి వదిలేయడం గమనార్హం. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం.. ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించిన ఏదైనా పోస్టుగానీ, ప్రదేశంగానీ పోలీస్ స్టేషన్గా పరిగణిస్తారు’ అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ స్టేషన్ కోసం ప్రత్యేకంగా గుర్తించిన ఏదైనా ‘స్థానిక ప్రాంతం’ కూడా అయ్యుండాలని చట్టం స్పష్టం చేసింది. అంటే పోలీస్ స్టేషన్కు స్థానిక ప్రాంతం ఏదన్నది స్పష్టం చేయాలి. కానీ మద్యం విధానంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ‘స్థానిక ప్రాంతం’ ఏదన్నది పేర్కొన లేదు. స్థానిక ప్రాంతం అన్నది లేకుండా ఏదైనా పోస్టునుగానీ, ప్రదేశాన్నిగానీ పోలీస్ స్టేషన్గా గుర్తించడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్కు కచి్చతంగా స్టేషన్ హౌస్ అధికారిగానీ లేదా ఆఫీసర్ ఇన్చార్జ్ ఆ పోలీస్ స్టేషన్కు బాధ్యుడిగా ఉండాలి. మరి సిట్ను పోలీస్ స్టేషన్గా ప్రకటించిన ప్రభుత్వం అక్కడ ఇన్చార్జ్ ఎవరన్నది పేర్కొన లేదు. అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా సిట్ను ఏర్పాటు చేసినట్టేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఏర్పాటైన సిట్ ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందన్నది కూడా ప్రభుత్వం వెల్లడించ లేదు. ఫలితంగా బాధితులెవరైనా సిట్పై ఫిర్యాదు ఎవరికి చేయాలన్నది స్పష్టత లేదు. తద్వారా పోలీస్ స్టేషన్కు ఉండాల్సిన అర్హతలు ఏవీ సిట్కు లేవని తేల్చి చెబుతున్నారు. అబద్ధపు వాంగ్మూలాలుసిట్ అధికారులు ఈ కేసులో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతరులను వేధిస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తూ బలవంతంగా వాంగ్మూలాలు నమోదు చేయిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. అసలు అభియోగాలు ఏమిటన్నది చెప్పకుండానే వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయిస్తుండటమే ఇందుకు నిదర్శనం. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 2(క్యూ) ‘చేయకూడని పని ఏదైనా చేసినా, చేయాల్సిన పని చేయకుండా ఉన్నా అది నేరం’ అని నిర్వచించింది. అటువంటి నేరం చట్ట ప్రకారం శిక్షార్హం అని కూడా పేర్కొంది. మద్యం విధానంపై నమోదు చేసిన కేసులో పలువురు అధికారులు, ఇతరులను దర్యాప్తు పేరిట వేధిస్తున్న సిట్.. అసలు నేరం ఏమిటన్నది చెప్పకపోవడం గమనార్హం. ఎందుకంటే చేయకూడని పని చేసినా, చేయాల్సిన పని చేయకపోయినా ఆ ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యులు అవుతారు. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం.. ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే ప్రభుత్వ అధికారి సంబంధిత బాధ్యులకు తెలియజేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఏ పౌరుడైనా సరే తనకు ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకుగానీ, ఇతర దర్యాప్తు సంస్థల అధికారులకుగానీ తెలియజేయాలని బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 33 పేర్కొంటోంది. మరి ప్రభుత్వ అధికారులకు మరింత బాధ్యత ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కక్ష సాధింపు కోసమే బరితెగింపు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగానే నిబంధనలను ఉల్లంఘిస్తూ మరీ సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ పోలీస్ స్టేషన్కు ఓ స్థానిక ప్రాంతాన్ని గుర్తిస్తే.. సిట్ కార్యకలాపాలు అక్కడి నుంచే నిర్వహించాలి. సాక్షులు, నిందితులను ఎక్కడ అదుపులోకి తీసుకున్నా సరే ఆ పోలీస్స్టేషన్గా గుర్తించిన ఆ ప్రదేశానికి తీసుకెళ్లి విచారించాలి. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వం కుట్ర పూరితంగా కేసు నమోదు చేసింది కాబట్టి ప్రభుత్వ అధికారులు, పూర్వ అధికారులు, ఇతర సాక్షులుగా భావిస్తున్న వారిని దర్యాప్తు పేరుతో ఓ పరిధికి మించి వేధించడం సాధ్యం కాదు. అక్రమంగా నిర్బంధిస్తే బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా సిట్ను పోలీస్ స్టేషన్గా గుర్తించింది. తద్వారా సిట్ను ఓ అరాచక శక్తుల అడ్డాగా, ప్రభుత్వ అధికారిక వేధింపులకు కేంద్రంగా, పోలీసు దాదాగిరీ డెన్గా తీర్చిదిద్దింది. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న సిట్ అధికారులు దాంతో విచ్చలవిడిగా చెలరేగి పోతున్నారు. దర్యాప్తు పేరిట ఇప్పటికే పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, పూర్వ అధికారులు, డిస్టిలరీల ప్రతినిధులు, ఇతరులను దర్యాప్తు పేరిట తీవ్రంగా వేధించారు. వారిని గుర్తు తెలియని ప్రదేశాల్లో అక్రమంగా నిర్బంధించి శారీరకంగా మానసికంగా హింసించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరించారు. లేకపోతే వారిపైనా, వారి కుటుంబ సభ్యులపైనా అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తామని బెంబేలెత్తించారు. -
సాగుకు ‘నీటి’ గండం
సాక్షి, అమరావతి/నెట్వర్క్: నిర్దేశించుకున్న విస్తీర్ణం కంటే దాదాపు పది లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గింది..! దీనిప్రకారం ఉన్న పంటలకు తగినంతగా నీరందాలి..! కానీ, వంతుల వారీ నీరందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం కావడం రైతుల పాలిట శాపంగా మారింది. రబీలో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సాగునీటి కోసం వారు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. దీంతో విసుగుచెంది నిరసన బాట పట్టారు. రెండో పంటకు నీరివ్వడంలోనే కాదు.. విడుదల, నిర్వహణలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడుతున్నారు. కళ్లెదుటే ఎండిపోతున్న పంట చేలను చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. వరి దుబ్బులను చూపిస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బైక్లపై పంట చేలల్లో తిరుగుతూ గోడు వినండి మహాప్రభో అంటూ గగ్గోలు పెడుతున్నారు. పలుచోట్ల రాస్తారోకోలు, ధర్నాలకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్టు ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తుండడం అన్నదాతలను కుంగదీస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 46 లక్షల ఎకరాల్లోనే సాగు ప్రభుత్వం రబీలో 57.66 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించింది. మార్చి 19 నాటికి 55 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా.. 46 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. 19.87 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా, 16.50 లక్షల ఎకరాల్లోనే సాగైంది. మొత్తమ్మీద నిర్దేశిత లక్ష్యం కంటే దాదాపు పది లక్షల ఎకరాలు తక్కువ. మరోపక్క రెండో పంటకు సరిపడా నీరిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. పరిస్థితి చూస్తే శివారు ప్రాంతాలకు చేరలేనేలేదు. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలోనే కాక హంద్రీనీవా, వంశధార నదుల కింద కూడా రైతులు పాట్లు పడుతున్నారు. దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరందని పరిస్థితి నెలకొంది. –నవంబరు, డిసెంబరులో మైనస్ 2.3 మిల్లీ మీటర్ల వర్షపాతం, జనవరి, ఫిబ్రవరిలో 79.2 మిల్లీమీటర్లు, మార్చిలో ఇప్పటివరకు 98.3 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. కోనసీమ జిల్లాలనే కన్నీరు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఇందులో 95 శాతం పంట గోదావరి కాలువల కిందనే. 5వేలకు పైగా ఎకరాల్లోని పంటలు ఎండిపోతున్నాయి. రబీకి నీటి సరఫరా విషయంలో తొలి నుంచి అధికారులు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఖరీఫ్ వర్షాలతో చేలల్లో ముంపు దిగక రబీ నారుమడులు ఆలస్యమయ్యాయి. తూర్పు, మధ్య డెల్టాలోని కాలువలకు నీరు విడుదల చేస్తున్నామని చెబుతున్నప్పటికీ శివారుకు చేరడం లేదు. –అమలాపురం మండలం వన్నెచింతలపూడి, ఎ.వేమవరం, ఎ.వేమరప్పాడు, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి పర్రభూమి ప్రాంతం, కూనవరం, ముక్తేశ్వరం పంట కాలువ కింద లొల్ల, వాడపల్లి, ఆత్రేయపురం, అంబాజీపేట మండలం కె.పెదపూడి, మామిడికుదురు మండలం నిడిమిలంక గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. బొబ్బర్లంక–పల్లంకుర్రు ప్రధాన పంట కాలువ ద్వారా కుండలేశ్వరం వైరులాకు దిగువ, ఎగువ ప్రాంతాలకు వంతుల వారీగా ఇస్తున్నా శివారు ఆయకట్టు బీటలు వారింది. కె.గంగవరంలో యండగండి, కూళ్ల, కోటిపల్లి, యర్రపోతవరం పరిధిలో పరిస్థితి తీవ్రంగా ఉంది. తాళు తప్పలు అధికంగా వస్తాయని రైతులు వాపోతున్నారు. అదనపు భారం అయినప్పటికీ ఆయిల్ ఇంజన్లతో నీటిని తోడుతూ పొట్ట దశలోని వరి పంటను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామంలో సాగునీటి కోసం గురువారం రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు చేలల్లోనే వినూత్న నిరసనలు అయినాపురం–కూనవరం పంట కాలువ శివారు కూనవరం పరిధి గరువుపేట రైతులు పంట చేలో ద్విచక్ర వాహనాలు నడిపి నిరసన తెలిపారు. ఈనే దశలో ఉన్న సుమారు 350 ఎకరాల్లోని పంట దెబ్బతింటోందని వాపోయారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు శివారు దాసరివారిపేటలో ఎండిన చేలలో ఓ రైతు మోటారు సైకిల్ నడిపాడు. ఆత్మహత్యలే శరణ్యం.. తాళ్లరేవు మండల పరిధి పి.మల్లవరం శివారు రాంజీనగర్, మూలపొలం, గ్రాంటు తదితర గ్రామాల్లో 600 ఎకరాలకు సాగు నీరు పూర్తిగా అందడం లేదు. దీంతో ఆత్మహత్యలే శరణ్యమంటూ వరిదుబ్బులు, పురుగు మందు డబ్బాలు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కాట్రేనికోన మండలం రామాలయంపేట, గొల్లగరువు, లైనుపేట 150 ఎకరాలు, ఐ.పోలవరం మండలం కేశనకుర్రు, చాకిరేవు చెరువు, తిల్లకుప్ప, మొల్లి చెరువు, జి.మూలపొలం తదితర ప్రాంతాల్లో 300 ఎకరాలు బీడువారుతున్నాయి. పి.మల్లవరం పంచాయతీ మూలపొలం, రాంజీనగర్, గ్రాంటు గ్రామాల్లో వరిచేలకు సాగునీరు అందక బీటలు వారాయి. జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు ఎండిపోయిన వరి పంటను ప్రదర్శిస్తూ పెద్దఎత్తున ఆందోళన చేశారు. –కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు ఆయకట్టు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. బి.ప్రత్తిపాడు, భోగాపురం, రాపర్తి, రాయవరం తదితర గ్రామాల్లో చేలు బీటలు వారాయి. తాళ్లరేవు కరప, గొల్లప్రోలు, శంకవరం మండలాల్లో సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టు ఎండిపోయింది. వట్టిపోయిన కేసీ కెనాల్.. శ్రీశైలం నిండింది..రెండో పంటకు దండిగా నీరు అందుతుందని రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ కేసీ కాల్వ ఒట్టిపోయింది. ఫిబ్రవరి తొలి వారం నుంచి చేలకు నీరు చేరడం లేదు. కేసీ కెనాల్ రైతుల అగచాట్లు మామూలుగా లేవు. గొప్పాడు మండలం యాళ్లూరు వద్ద ముచ్చుమర్రి పంపుల ద్వారా 675 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నట్టు చెబుతున్నా చివరి ఆయకట్టుకు చేరడమే లేదు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్లో 18 వేల ఎకరాల్లో వరి, కంది, మొక్కజొన్న సాగవుతున్నాయి. కోత దశలో ఉన్న మొక్కజొన్నకు కనీసం రెండు తడులు అందించాలి. నీరివ్వకుంటే రూ.లక్షల్లో నష్టపోతామని రైతులు వాపోతున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కింద నీరు బంద్ కావడంతో కర్నూలు జిల్లా దేవనకొండ మండలం రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ కాల్వ కింద 42 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇవన్నీ కోత దశకు రాగా.. తడులందక రైతులు పాట్లు పడుతున్నారు. సాగర్ కిందా ఇదే దుస్థితి.. ఉమ్మడి గుంటూరు జిల్లాకు 9 రోజులు, ఉమ్మడి ప్రకాశంకు 6 రోజులు నీటిని విడుదల చేస్తున్నా చివరి ఆయకట్టుకు అందడం లేదు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు బ్రాంచి కెనాల్, మల్లాయపాలెం, కాకుమాను మేజర్ కాల్వ ద్వారా ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లోని శివారు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ ప్రాంతంలో రబీలో 36 వేల ఎకరాల్లో మిర్చి, పొగాకు, మినప, శనగ, మొక్కజొన్న వేయగా, ప్రస్తుతం మిర్చి, మొక్కజొన్నకు నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం సాగర్ జలాలను విడుదల చేయకపోవడం, చేసినా చివరి భూములకు నీరు చేరక పంటలు బెట్టకు వస్తున్నాయి. వ్యయ ప్రయాసల కోర్చి చెరువులు, కుంటల్లోని నీటితో ఆయిల్ ఇంజిన్ల ద్వారా పొలాలను తడుపుతున్నారు. మురుగు కాలువల్లో నీటిని తోడి పంటలను కాపాడుకోవల్సిన దుస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు. –శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బన్నువాడ గ్రామంలో రైతులు ట్యాంకర్లతో నీటిని తెచ్చుకొని తడులు అందిస్తున్నారు. వంశధార జలాశయం కింద నీరందని కొందరు పంటలపై ఆశలు వదులుకుంటున్నారు. –కృష్ణా డెల్టాలోని ఏలూరు జిల్లా పెడపాడు, దెందులూరు మండలాల్లో 48 వేల ఎకరాలను ఖాళీగా వదిలేశారు. దెందులూరుతో పాటు బీమడోలు మండల పరిధి పలు గ్రామాల్లో ప్రస్తుతం పొట్ట, ఈనిక దశలో ఉన్న వరి పంటకు నీరందని పరిస్థితి ఉంది. సుమారు 7 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆత్మహత్యలే శరణ్యం ఈ ఏడాది సూపర్–10 రకానికి సంబంధించి పది ఎకరాల మిరప సాగు చేశా. రూ.లక్ష దాక పెట్టుబడి అయింది. మరో రెండు విడతల కోతలు రావాల్సి ఉంది. మార్చి మొదటి వారం నుంచే పొన్నాపురం సబ్ చానల్కు నీటి విడుదల ఆపేశారు. భూములు తడులు లేక పగుళ్లిచ్చాయి. కేసీ కెనాల్ అధికారులను వేడుకుంటున్నా సాగు నీటి విడుదలకు ప్రయోజనం లేకపోయింది. దిగుబడులు రాకపోతే తీవ్రంగా నష్టపోతాం. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం. –చిన్న తిరుపతిరెడ్డి, మిటా్నల, నంద్యాల జిల్లా అధికారులు కన్నెత్తి చూడడం లేదు మాది ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెం. మూడెకరాలు కౌలుకు చేస్తున్న. దాళ్వాలో వరి వేశా. నీటికి ఢోకా లేదన్నారు. తీరా ఇప్పుడు చూస్తే చాలా ఇబ్బంది పడుతున్నా. మా గ్రామం వైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. ఇలాగైతే వ్యవసాయం ఎలా చేసేది? –వల్లూరి నాగేశ్వరరావు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలుషిత నీటిని తోడుకుంటున్నాంవరి చేలు బీటలు వారాయి. టేకి డ్రైన్లో నీటిని మోటార్లతో తోడుతున్నారు. అది ఉప్పగా ఉండడంతో పాటు కలుషితం కావడంతో పంట దిగుబడిపై ప్రభావం పడుతోంది. గతంలో మాదిరిగా తాతపూడి పంపింగ్ స్కీం ద్వారా నీరు సరఫరా చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. –దడాల బుజ్జిబాబు, పోలేకుర్రు, తాళ్లరేవు మండలం, కాకినాడ జిల్లా ఏం చేయాలో పాలుపోవడం లేదు4.5 ఎకరాల్లో మెనుగు పెసర వేశారు. నీరు లేక ఎండల తీవ్రతతో పంట ఎండిపోతోంది. 12 ఎకరాల్లోని జీడి పంటకూ నీరు పెట్టే పరిస్థితి లేదు. ఎండల తీవ్రతకు పువ్వు మాడిపోయింది. కనీస దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏం చేయాలో పాలుపోవడంలేదు. –కనపల శేఖర రావు, పాతయ్యవలస, శ్రీకాకుళం జిల్లా ఎండిపోతున్న మిర్చి పంట పల్నాడు జిల్లాలో వారబందీ అమలులో ఉన్నప్పటికీ నీరందక మిర్చి పంట ఎండిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొంపిచర్ల మండలం వీరవట్నం పరిసర గ్రామాల రైతులు సాగునీటి కోసం గురువారం ఆందోళన బాట పట్టారు. నాగార్జున సాగర్ సంతగుడిపాడు ఇరిగేషన్ సర్కిల్ డీఈ ఎస్.విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పుడు కూడా సాగుకు సరిపడా నీరు విడుదల చేసేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి కన్పించడం లేదని రైతుసంఘాల నేతలు ఆరోపించారు. రైతులు ఏయే పంటలు సాగు చేశారు, ఎన్ని రోజులు పాటు ఎంతమేర నీటి అవసరాలు ఉన్నాయనే వివరాలు అధికారుల దగ్గర లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. మిర్చి, మొక్కజొన్న, వరి, ఇతర కూరగాయ పంటలు దెబ్బతినకుండా ఏప్రిల్ 20 వరకు సాగు నీరు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున సాగర్ కింద ఆయకట్టు రైతులతో కలిసి ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. సాగు నీరు అడిగితే పోలీస్ స్టేషన్లో పెట్టారు రాస్తారోకో చేస్తున్న వీరంతా పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామానికి చెందిన సన్న, చిన్నకారు రైతులు. నీళ్లున్నాయన్న ఆశతో రెండో పంటగా చింతపల్లి నాగార్జున సాగర్ కాల్వ కింద 400 ఎకరాల్లో వరి వేశారు. ప్రస్తుతం పొట్ట దశకు రాగా.. మార్చి తొలి వారం నుంచి నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒక్కో రైతు రూ.లక్ష వరకు నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. సాగు నీటి విడుదలలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం రాస్తారోకో చేశారు. దీంతో రైతులను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. ‘‘నీళ్లు అడిగిన పాపానికి స్టేషన్కు తరలిస్తారా?’’ అంటూ రైతు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వాటిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?.. పుత్తా శివశంకర్రెడ్డి సవాల్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులపై పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం, మరోసారి అదే పని చేసి, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్రెడ్డి ఆక్షేపించారు. ఆ దిశలోనే మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో ఈ తొమ్మిది నెలల్లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 4 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉందంటూ ప్రగల్భాలు పలికారని దుయ్యబట్టారు. ఈ విషయంలో ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక, రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందులో అన్ని వివరాలు పొందుపర్చాలని పుత్తా శివశంకర్రెడ్డి కోరారు.ఆయన ఇంకా ఏమన్నారంటే..శ్వేతపత్రం విడుదల చేస్తారా?:కూటమి ప్రభుత్వ ఈ 9 నెలల పాలనలో రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి నారా లోకేష్ ఆర్భాటంగా చెప్పారు. దాదాపు నెల రోజుల క్రితం, గత నెల 24న గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రంలో అప్పటి వరకు రూ. 6.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయని చెప్పుకున్నారు. నెల కూడా గడవక ముందే, రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు.ఈ వ్యవధిలోనే రూ.50 వేల కోట్లు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి!. నిజానికి గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా రాష్ట్రంలో రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులపై మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీస్తే, సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. అలాగే ఉద్యోగాలు కల్పించామని చెప్పలేదని, అన్ని ఉద్యోగాలకు అవకాశం ఉందని చెప్పామని, పచ్చి అబద్ధం చెప్పారు. ప్రభుత్వానికి నిజంగా ఈ విషయంపై చిత్తశుద్ధి ఉంటే, వారు చెబుతున్నట్లుగా రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులపై పూర్తి వివరాలతో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎక్కడెక్కడ, ఎంతెంత పెట్టుబడులతో ఏయే పరిశ్రమలు ఏర్పాటయ్యాయి? వాటి ద్వారా ఎంత మందికి ఉపా«ధి లభించింది? అన్న పూర్తి వివరాలు ప్రకటించాలి.ఆ ధైర్యం మీకుందా?:గత మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే వాళ్లం. ఎందుకంటే అంత పారదర్శకంగా ఎక్కడా ఏ లోపం లేకుండా, అర్హతే ప్రామాణికంగా అన్నింటినీ అమలు చేశాం. ఇప్పుడు మీరు కూడా అలా, మీ పనులను, పథకాల అమలును.. ముఖ్యంగా రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల వివరాలను ఆయా ప్రాంతాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించగలరా? ఆ ధైర్యం మీకుందా?. నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి నెలకొంది. దాడులు, కమీషన్ల వేధింపులకు పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ. కూటమి ప్రభుత్వ వేధింపులతో జిందాల్ స్టీల్ ప్లాంట్ మహారాష్ట్రకు పారిపోయింది. మీడియాను అడ్డం పెట్టుకుని దావోస్ పర్యటనలో హడావుడి చేయడం తప్ప, మీరు సాధించిందేమీ లేదు. దావోస్ పర్యటనను పెయిడ్ హాలిడేగా వాడుకున్నారు.2018కి పూర్వమే ఆ యూనిట్:విజయవాడ సమీపంలోని ఏపీఐఐసీ కారిడార్లో 2018కి పూర్వమే అశోక్ లీలాండ్ యూనిట్ ప్రారంభం కాగా, ఆ తర్వాత కోవిడ్ కారణంగా డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి కూడా తగ్గింది. కానీ నిన్న (19వ తేదీ, బుధవారం) అక్కడ నారా లోకేష్ చేసిన అతి చూస్తే 2024లో తాము అధికారంలోకి వచ్చాకే, ఆ యూనిట్ ఏర్పాటైనంత బిల్డప్ ఇచ్చారు. ఆ యూనిట్కు తామే అనుమతి ఇచ్చినట్లు, దాన్ని తామే తెచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం. ఎప్పుడో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లో ఇప్పుడు 600 ఉద్యోగాలు రాబోతున్నట్టు ప్రచారం చేసుకోవడం మరీ విడ్డూరం.లోకేష్.. మంత్రిగా మీరు అశోక్ లీలాండ్ బస్పు ఎక్కడం కాదు.. ఎన్నికల్లో సూపర్సిక్స్ హామీల్లో మీరిచ్చిన మహిళలకు ఉచిత బస్సు హామీని అమలు చేసి టికెట్లు లేకుండా వారిని బస్సుల్లో తిప్పండి. తన శాఖ తప్ప, అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్న మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారు. గవర్నమెంట్ స్కూళ్లలో డ్రాపవుట్స్ పెరుగుతున్నా, విద్యాశాఖను సరిగ్గా నిర్వహించలేకపోతున్న లోకేష్, తనది కాని పరిశ్రమల శాఖలో వేలు పెట్టి హడావుడి చేశాడని పుత్తా శివశంకర్రెడ్డి ఆక్షేపించారు. -
లిక్కర్ స్కాం పేరుతో 'కూటమి' భారీ కుట్ర: మనోహర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులపై కక్షసాధింపులో భాగంగా లేని లిక్కర్ స్కాంను ఒక పథకం ప్రకారం సృష్టించిందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కాం పేరుతో కూటమి ప్రభుత్వమే ఒక భారీ కుట్రకు శ్రీకారం చుట్టి, వైఎస్సార్సీపీ నేతలను దానికి బాధ్యులుగా చూపించేందుకు దుర్మార్గమైన ప్రణాళికను అమలు చేస్తోందని మండిపడ్డారు. ఈ స్కాం పేరుతో జరుగుతున్న హంగామాను పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం ఎంత నిస్సిగ్గుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నం చేస్తోందో తెలుస్తుందన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని, సోషల్ మీడియా యాక్టివీస్ట్లను తప్పుడు కేసులు బనాయించి వేధించిన ప్రభుత్వం, తాజా మరో భారీ కుట్రకు తెరతీసింది. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో రూ.4వేల కోట్ల లిక్కర్స్కాం జరిగిందంటూ ఒక ప్రణాళిక ప్రకారం కూటమి ప్రభుత్వం ఈ కుట్రను అమలు చేస్తోంది. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. డెబ్బైశాతం బ్రాండ్లను ఎంపిక చేసిన నాలుగు కంపెనీలకే ఇచ్చారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని తగ్గించాయి. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. వీటిపై వైయస్ఆర్సీపీ ప్రభుత్వం 2023లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అధికారులపై వత్తిడి తెచ్చి ఆ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ను పక్కకు పెట్టేయించారు. ఈ కేసుల్లోంచి ఇప్పుడు బయటపడేందుకు వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మద్యం పాలసీపై ఎదురుకేసులు నమోదు చేయించేందుకు కూటమి ప్రభుత్వం తెగబడిందికూటమి పెద్దల డైరెక్షన్లోనే ఫిర్యాదువైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లిక్కర్ స్కాం పేరుతో కేసులు నమోదు చేసి కక్షసాధించేందుకు కూటమి పెద్దల డైరెక్షన్లోనే శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 9.9.2024న వై.వెంకటేశ్వర శ్రీనివాస్ అనే వ్యక్తి రిజిస్టర్ పోస్ట్ ద్వారా రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లేఖ రాశారు. ఈ వ్యక్తి తన లేఖలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ పాలసీలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని, ఢిల్లీ లిక్కర్ స్కాం కన్నా పెద్ద స్కాం జరిగిందని ఆరోపణలు చేశారు. ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు చేశారో, ఈ వ్యక్తికి ఉన్న విశ్వసనీతయ ఏమిటో కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు.ఈ లేఖను కోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్లో అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఆగమేఘాల మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఒక మెమోను జారీ చేశారు. తొమ్మిది రోజుల్లోనే ఈ మెమోను ఆధారం చేసుకుని బేవరేజెస్ కార్పోరేషన్ నుంచి వచ్చిన నివేదికలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని నిర్ధారిస్తూ, దీనిపై విచారణ జరపాలంటూ ముఖేష్ కుమార్ మీనా 20.9.2024న సీఐడీకి ఫిర్యాదు చేశారు.వెంటనే సీఐడీ అధికారులు దీనిపై 23.09.2024న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే దీనిలో ఎవరిని విచారించారు, ఏ అంశాలను పరిశీలించారు, ఎటువంటి ఫైళ్ళను తనిఖీ చేశారు అనే కనీస సమాచారం కూడా లేదు. అంతేకాకుండా ఈ ఎఫ్ఐఆర్ నెం.21/2024లోని కాలమ్ నెంబర్ 7లో ముద్దాయిలు అని ఉన్న చోట 'గుర్తు తెలియని వ్యక్తులు' అని కోట్ చేశారు. అలాగే మొత్తం రూ.4000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇంత మొత్తం ఎలా అవినీతి జరిగిందో దానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు.తెలుగుదేశం వీర విధేయులతో సిట్ ఏర్పాటుసాధారణంగా ఏదైనా భారీ అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత అంశాలపై ఆడిట్ రిపోర్ట్లను పరిశీలిస్తారు. విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారు. అటువంటివి ఏమీ లేకుండా ఒక సాధారణ వ్యక్తి లేఖ రాస్తే, దానిపై తొమ్మిది రోజుల్లో నివేదిక తెప్పించుకుని, తక్షణం సీఐడీకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదు చేయడం, రెండు రోజుల్లో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చూస్తేనే దీని వెనుక కూటమి ప్రభుత్వ పెద్దలు నడిపిస్తున్న నాటకం అర్థమవుతుంది. అంతేకాదు సీఐడీ ఏకంగా అయిదుగురు అధికారులతో ఈ కేసుపై విచారణకు సిట్ను ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి వీరవిధేయులుగా ఉన్న ఆఫీసర్లను ఏరికోరీ మరీ ఈ సిట్లో నియమించారు.సిట్ను నియమించే సందర్బంలో సుప్రీంకోర్టు సూచించిన ఏ మార్గదర్శకాలను కూడా పాటించలేదు. సిట్కు సంబంధించిన పోలీస్స్టేషన్ను పేర్కొనలేదు. అందులో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, స్టేట్మెంట్లు రికార్డు చేసే సమయంలో దానిని చిత్రీకరించాలన్న నిబంధనలను పట్టించుకోలేదు. బేవరేజెస్ కార్పోరేషన్కు సంబంధించిన ఫైళ్ల రూటింగ్ను పరిగణలోకి తీసుకోలేదు. కార్పోరేషన్ ఉద్యోగులను బెదిరించి, భయపట్టి సిట్ తాము రాసుకున్న స్టేట్మెంట్లపై సంతకాలు చేయించుకుంది. తాము చెప్పినట్లు కొందరి పేర్లు లిక్కర్ స్కాంలో ఉన్నాయని చెప్పకపోతే మీ ఉద్యోగాలు ఉండవు, ఈ కేసులో జైలుకు వెళ్ళాల్సి వస్తుందంటూ బెదిరించారు. సంతకాలు పెట్టిన ఉద్యోగులు తాము సాక్ష్యులమా, లేక ముద్దాయిలమా అని భయాందోళనలు చెందుతున్నారు. అలాగే డిస్టలరీ కంపెనీలను సిట్ అధికారులు బెదిరించి తమకు అనుకూలమైన స్టేట్మెంట్లపై సంతకాలు చేయించుకుంటున్నారు.ముందు బురదచల్లడం... తరువాత ముద్దాయిలుగా చూపడంలిక్కర్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ముద్దాయిల కాలమ్లో ఎవరి పేర్లు లేకపోయినప్పటికీ వైఎస్సార్సీపీ ఎంపీ మిధున్రెడ్డి పేరు ఉన్నట్లు ఎల్లో మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఎల్లో మీడియాలో దీనిపై బుదరచల్లేలా ప్రముఖంగా వార్తలు రాయించారు. దర్యాప్తునకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ, తాము ఎవరినైతే ఈ కేసులో ఇరికించాలని భావిస్తున్నారో వారిపై తప్పుడు కథనాలను రాయిస్తూ, ఆ తరువాత వారిని ముద్దాయిలుగా చూపే కుట్ర జరుగుతోంది.లిక్కర్ పాలసీ ప్రకారమే బేవరేజెస్ కార్పోరేషన్ పనిచేసింది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్తగా ఏ డిస్టలరీకి అనుమతులు ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో అనుమతులు పొందిన డిస్టలరీల నుంచే కొనుగోళ్ళు చేసింది. మద్యంను నియంత్రించేందుకు ఒక పారదర్శక విధానాన్ని అమలు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మద్యంపై అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులతో వేధింపులకు పాల్పడాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. -
ఎవరు దొంగలు? ఎవరు అలా వ్యవహరించారు?: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: తమ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి శాసనసభలో స్పీకర్ చేసిన కామెంట్స్పై వైఎస్సార్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజాస్వామ్యంలో దొంగలు అంటే ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కినోళ్లు. వేలంపాటలో ప్రజా ప్రతినిధులను, సభ్యులను కొనుక్కున్నవాళ్లు. వైస్రాయ్ హోటల్లో క్యాంప్లు నిర్వహించిన వాళ్లు. స్పీకర్ను అడ్డు పెట్టుకుని పార్టీ పక్షనేతను పోటు పొడిచిన వాళ్లు. జయప్రదంగా పార్టీని, పార్టీ నిధిని కైవసం చేసుకున్న వాళ్లు. ఈ విషయాన్ని స్పీకర్ గమనించాలి. అలాగే ఆయన ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.‘మేమేమీ గోడలు దూకి అర్ధరాత్రులు, అపరాత్రుల్లో అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టడం లేదు. మా నియోజకవర్గాల సమస్యలను ప్రశ్నల రూపంలో సభ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకు హాలు బయట, అందరి సమక్షంలో ఉండే రిజిస్టర్లో, అందరి ముందే సంతకం పెట్టాం తప్ప, అందుకోసం దొంగల్లా రాలేదు. ఎవరూ చూడకుండా సంతకం చేయలేదు. మేమేమీ దొంగలం కాదు, అలా వ్యవహరించడానికి!’.‘విపక్షంలో ఉన్నా, మా బాధ్యత మరవడం లేదు. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం కోసం, వాటిపై చర్చ జరిగేలా చూడడం కోసం ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం. కానీ, మాకు ఆ అవకాశం దక్కకూడదని మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా మీరు గుర్తించలేదు. తగినంత సభ్యులు లేకపోతే, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించవద్దని, ఎక్కడా లేకపోయినా, ఆ సాకు చూపి, మా పార్టీ వైయస్సార్సీపీని మీరు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేదు. అందుకే మా హక్కు కోసం కోర్టును ఆశ్రయించాం. న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం’.‘ఇంకా సభకు హాజరు కాకున్నా, ప్రజా సమస్యలు ప్రతి వేదిక మీద లేవనెత్తుతూనే ఉన్నాం. ప్రభుత్వ అక్రమాలు, అవినీతి చర్యలను ఎండగడుతూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. నిలదీస్తున్నాం. అలా ప్రజల పట్ల మా బాధ్యతను ఏనాడూ మర్చిపోలేదు. అందుకే దొంగల్లా కాకుండా, దొరల్లా బాహాటంగా సభ వద్దకు వస్తున్నాం. ప్రశ్నలు సంధిస్తున్నాం. నియమానుసారం అందరి ముందే రిజిస్టర్లో సంతకం చేస్తున్నాం’.‘నిజం చెప్పాలంటే, సభలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు చాలా మంది నోరెత్తడం లేదు. వారి నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించడం లేదు. అక్కడి ప్రజలను అస్సలు పట్టించుకోవడం లేదు. సభలో ఉండి కూడా అంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న వారి కంటే, మేము చాలా బాగా పని చేస్తున్నాం. వారు సభకు హాజరై, సభలో ఉన్నా, వారితో ప్రజలకు ఏ ప్రయోజనం లేదు. కానీ, మేము సభకు హాజరు కాకున్నా, మా నియోజకవర్గాలు, ప్రజా సమస్యలు ప్రశ్నల రూపంలో సభలో ప్రస్తావించి, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. దీన్ని కాదంటారా?’.‘బహుజన శాసనసభ్యులను దొంగలుగా సంబోధించడం హేయం. మరి గత అసెంబ్లీలో అప్పటి విపక్షనేత చంద్రబాబు రెండున్నర ఏళ్లు సభకు హాజరు కాలేదు. మమ్మల్ని దొంగలు అన్న మీరు, మీ పార్టీ అధినేత అయిన చంద్రబాబుని ఏమంటారు? సభకు హాజరు కాకున్నా, కనీసం రిజిస్టర్లో సంతకం కూడా చేయకున్నా, శాసనసభ్యుడిగా, విపక్షనేతగా, ఆ హోదాలో అంతకాలం పాటు, అన్నీ పొందిన మీ పార్టీ అధినేతను ఏమనాలి? మమ్మల్ని ఉద్దేశించి అన్న దాని కంటే ఇంకా ఎక్కువ పదం వాడతారా?’‘అయినా స్పీకర్ పదవిని మేము గౌరవిస్తాం. ఆయన ఎలా మాట్లాడినా, ఎన్ని విమర్శలు చేసినా సరే.. వాటన్నింటినీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం’.. అని వైఎస్సార్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. -
రోజూ ఆవు కథ చెబితే ఎలా?.. కూటమి సర్కార్పై బొత్స ఫైర్
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్కు నిధులు కేటాయించకుండా కూటమి సర్కార్ కాలక్షేపం చేస్తోందని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదంటూ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసన మండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని.. కానీ ప్రభుత్వం.. మార్షల్స్ను తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటికి పంపించేందుకు చూసిందని మండిపడ్డారు.‘‘ఓటేశారు.. మేం గెలిచాం...ఇక దోచుకుంటే సరిపోతుందనే భావనలో ప్రభుత్వం ఉంది. 15 రోజుల సభలో ప్రభుత్వ తీరును మేం ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మంచి చేస్తారని మేం ఆశిస్తున్నాం. ప్రజల ఆంకాంక్షకు తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం లేదు. వర్గీకరణ కోసం షెడ్యూల్ కులాలు పోరాడుతున్నాయి. వర్గీకరణ కోసం పోరాడిన వారిపై టీడీపీ కేసులు పెట్టింది. ఆ కేసులను ఎత్తేసిన ఘనత వైఎస్ జగన్ది. అన్ని కులాల వారికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అని బొత్స పేర్కొన్నారు.ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టుపై చర్చ లేకుండా ప్రకటన ఇచ్చారు. అసలు వర్గీకరణ ఎలా చేశారు? ఏ విధంగా చేశారో కనీస చర్చలేదు. ప్రభుత్వం అన్ని వర్గాలను కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. వైఎస్ జగన్ అన్ని కులాలను గౌరవించారు. పదవుల్లోనూ అందరికీ న్యాయం చేశారు. అంబేద్కర్ స్మృతివనం పెడితే ఈ ప్రభుత్వానికి కన్ను కుట్టింది. అట్టడుగు వర్గాల వారికి గౌరవం ఇవ్వడం ఈ ప్రభుత్వానికి నచ్చదు. అట్టడుగు వర్గాలపై ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ద్వేషం. ఈ ప్రభుత్వం తీరును మేం తప్పుపడుతున్నాం’’ అని బొత్స దుయ్యబట్టారు.గౌరవంగా అన్ని వర్గాలు జీవించేలా ప్రభుత్వం చొరవతీసుకోవాలి. అందరికీ మంచి చేయాలనే మేం కోరుతున్నాం. అధికార పార్టీ సభ్యులు రోజూ చెప్పిందే చెబుతున్నారు. రోజూ ఆవుకథ చెబితే ఎలా?. ఎన్నికల ముందు చేసిన ప్రచారాలు, హామీలు మర్చిపోయారా?. కూటమి మాదిరి మోసం దగా వైఎస్సార్సీపీకి అలవాటు లేదు. అదే అలవాటు వైఎస్సార్సీపీకి ఉంటే మేం కూడా 100 అబద్ధాలు చెప్పేవాళ్లం’’ అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. -
దావోస్ జస్ట్ ఒక వేదిక అంతే!: శాసన మండలిలో కూటమి ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ‘‘ఏపీకి పెట్టుబడులను వెల్లువలా తీసుకురాబోతున్నాం’’ ఈ ఏడాది జనవరిలో దావోస్కు వెళ్లడానికి ముందు కూటమి ప్రభుత్వం (Kutami Prabhutvam)చెప్పిన మాట. ‘‘పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతున్నాం.. సుమారు 15 కంపెనీల అధిపతులతో సమావేశమయ్యాం..’’ ఇది దావోస్ ఎకనామిక్ ఫోరస్ సదస్సు జరుగుతున్న టైంలో చెప్పిన మాట. ఇప్పుడేమో.. దావోస్ వెళ్లింది ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం కాదంటూ అసెంబ్లీ సాక్షిగా ఇంకో మాట చెప్పేసింది. కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు, నారా లోకేష్ అండ్ కో దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లారనేది తెలిసిందే. అయితే ఆ పర్యటనపై మండలి సాక్షి గా ఏపీ ప్రభుత్వం వింత భాష్యం చెప్పింది. దావోస్ పర్యటనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాధవరావు, రవీంద్రబాబు, కవురు శ్రీనివాస్లు ప్రశ్న సంధించారు. అయితే తమ ప్రభుత్వం అక్కడికి వెళ్లింది ఎంవోయూలు చేసుకోవడానికి కాదని సమాధానం కూటమి ఇచ్చింది. అది కేవలం అంతర్జాతీయ వేదిక మాత్రమే.. మేం అక్కడికి వెళ్లింది ఎలాంటి పెట్టుబడులు చేసుకోవడానికి కాదు’’ అని సమాధానం విడుదల చేసింది. -
27న ఉప సర్పంచ్ ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 214 గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న ఉప సర్పంచ్ పదవులకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వార్డు సభ్యుల ద్వారా జరిగే ఈ ఉప సర్పంచ్ల ఎన్నిక కోసం 27న ఉదయం 11 గంటలకు ఆయా పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. -
‘యువిక’.. భావి శాస్త్రవేత్తలకు వేదిక
వన్టౌన్(విజయవాడ పశ్చిమ): అంతరిక్ష పరిశోధనలపై మక్కువ ఉన్న విద్యార్థులను ప్రొత్సాహించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వారిని ప్రత్యేకంగా తమ ప్రాంగణాలకు ఆహ్వానించి నూతన ఆవిష్కరణలపై ఉత్సాహాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా యువిక (యుంగ్ సైంటిస్ట్)–2025 పేరిట ఉపగ్రహ ప్రయోగాలను తెలుసుకునేందుకు, శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. ఈ విధమైన అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఇస్రో పిలుపునిస్తుంది. అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో 100 ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పలు పరిశోధనలు చేపడుతోంది. ఈ విజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజెప్పేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. యువిక లక్ష్యాలు ఇవీ.. » భారత అంతరిక్ష పరిశోధనలను విద్యార్థులకు పరిచయం చేయడం» విద్యార్థులను స్పేస్ టెక్నాలజీ వైపు ప్రోత్సహించడం» అంతరిక్ష పరిశోధకులుగా వారిని సిద్ధం చేయడంఎవరు అర్హులంటే...ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థులు, ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఇస్రో ప్రాధాన్యతనిస్తోంది. ఎనిమిదో తరగతిలో సాధించిన మార్కుల్లో 50 శాతం, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొంటే వాటి ఆధారంగా 2–10%, ఆన్లైన్ క్విజ్ పోటీల్లో చూపించిన ప్రతిభకు 10% వెయిటేజీ ఇవ్వనుంది. ఎన్సీసీ, స్కౌట్, గైడ్స్ విభాగాల్లో ఉంటే 5%, పల్లె ప్రాంతాలకు చెందిన వారికి 15% ప్రాధాన్యం ఇవ్వనుంది. పరీక్ష ఎక్కడంటే...ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 7 కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్ (మేఘాలయ). దరఖాస్తు ఇలా చేసుకోవాలి..నాలుగు దశల్లో విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. మొదటగా ఈ–మెయిల్ ఐడీతో వివరాలు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్విజ్లో పాల్గొనాలి. క్విజ్ పూర్తి చేసిన 60 నిమిషాల తరువాత ‘యువికా’ పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి. మూడేళ్లలో వివిధ అంశాల్లో విద్యార్థి సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఏవైనా ఉంటే, వాటి జెరాక్స్ కాపీలపై విద్యార్థి సంతకం చేసి అప్లోడ్ చేయాలి. దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 23 వరకు అవకాశముంది. ఎంపిక జాబితాను 2 విడతల్లో ప్రకటించి అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు. యువికా శిక్షణకు ఎంపికైన వారికి శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు, బస, భోజన వసతితో పాటుగా అన్ని సౌకర్యాలను ఇస్రో కల్పిస్తుంది.కార్యక్రమం షెడ్యూల్ ఇలా..వచ్చిన దరఖాస్తులను ఏప్రిల్ 7నాటికి వడపోసి ఎంపికైన విద్యార్థుల జాబితాలను ఇస్రో విడుదల చేస్తుంది. మే నెల 18 నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తుంది. 19 నుంచి 30వ తేదీ వరకూ యువికా–25 కార్యక్రమం చేపడుతోంది. మే 31న ముగింపు కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తుంది. ఎంపికైన విద్యార్థులను మే లో 14 రోజులు ఇస్రోకు చెందిన స్పెస్ సెంటర్లకు తీసుకువెళ్తుంది. అక్కడి వింతలు, విశేషాలు, సప్తగహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తుంది. వారు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి వారికి విజ్ఞానాన్ని అందిస్తారు.విద్యార్థులకు మంచి అవకాశం విద్యార్థులకు ఇస్రో వంటి సంస్థను సందర్శించటం, ఆయా పరిశోధనలపై అవగాహన పెంచుకోవటానికి ఇది మంచి అవకాశం. భావి శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ఇస్రో చేపడుతోన్న యువికా కార్యక్రమాన్ని అర్హతగల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. సంబంధిత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు పిల్లలకు సహకరించాలి. జిల్లా పరిధిలో డీవీఈవోలు, ఎంఈవోలు ఈ విషయంపై వారి పరిధిలో యంత్రాంగాన్ని చైతన్యపర్చాలి. పెద్ద సంఖ్యలో విద్యార్థులతో దరఖాస్తు చేయించాలి. – యువీ సుబ్బారావు, డీఈవో, ఎన్టీఆర్ జిల్లాఅవగాహన కల్పిస్తున్నాం యువికాలో పాల్గొనేందుకు, దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నాం. గతంలో నిర్వహించిన అనేక సైన్స్ ఎగ్జిబిషన్లు, పోటీ పరీక్షల్లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు సత్తాచాటి జాతీయ స్థాయిలో వారి ప్రదర్శనలతో అబ్బురపర్చారు. ఇదేస్ఫూర్తితో పెద్ద సంఖ్యలో అర్హత గత విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం. – డాక్టర్ మైనం హుస్సేన్, జిల్లా సైన్స్ అధికారి -
42 ఏపీపీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కింది కోర్టుల్లో ఖాళీగా ఉన్న 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (ఏపీపీ) పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభించాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోస్టుల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టంచేసింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో మొదలు పెట్టాలని తేల్చి చెప్పింది. ఏపీపీ పోస్టులను పెంచినట్లే, మిగిలిన కేడర్ పోస్టుల సంఖ్యను కూడా పెంచాలని, దీనిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కింది కోర్టుల్లో పీపీలు, ఏపీపీలు, అసిస్టెంట్ సీనియర్ పీపీల పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతోందని, అందువల్ల పీపీల నియామకానికి చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన సీజే ధర్మాసనం... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు విజయానంద్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి తీసుకుంటున్న చర్యల గురించి విజయానంద్ను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుతం ఏపీపీల కేడర్ స్ట్రెంత్ 204గా ఉందని, దీనిని 209కి పెంచనున్నామని విజయానంద్ చెప్పారు. 42 ఖాళీలను డైరెక్టుగా భర్తీ చేస్తామని, ఇందుకు సంబంధించి ప్రక్రియను రెండు నెలల్లో ప్రారంభిస్తామని తెలిపారు. -
సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరమంటే ఎలా?: హైకోర్టు
సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయి? బీఎన్ఎస్ సెక్షన్–111 ప్రకారం ఆర్ధిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలుండే సైబర్ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయి? పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్ నేరంతో సమానంగా ఎలా చూడగలం? సోషల్ మీడియా పోస్టులను మెటీరియల్ బెనిఫిట్ (ద్రవ్య సంబంధిత ప్రయోజనం)గా భావించలేం. – పోలీసులను ఉద్దేశించి హైకోర్టు సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయని హైకోర్టు పోలీసులను బుధవారం ప్రశ్నించింది. భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్) సెక్షన్–111 ప్రకారం ఆర్ధిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలుండే సైబర్ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయని గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయో చెప్పాలంది. పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్ నేరంతో సమానంగా ఎలా చూడగలమో చెప్పాలంది. ప్రస్తుత కేసులో నిందితులు ఓ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, దీన్ని పర్సెప్షనల్ బెనిఫిట్ (అనుభూతి ద్వారా పొందే ప్రయోజనం)గా భావించగలమే తప్ప.. మెటీరియల్ బెనిఫిట్ (ద్రవ్య సంబంధిత ప్రయోజనం)గా భావించలేమంది. సోషల్ మీడియా పోస్టుల ద్వారా పిటిషనర్లు ఏ విధంగా ఆర్ధిక, వస్తు తదితర రూపేణ ప్రయోజనం పొందారో చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. వీటన్నింటిపైనా స్పష్టతనివ్వాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి పోలీసులు వేర్వేరుగా నమోదు చేసిన పలు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం మాజీ ఇన్చార్జి సజ్జల భార్గవ్రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే వ్యవహారంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ సిరిగిరెడ్డి అర్జున్రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను జస్టిస్ విజయ్ బుధవారం విచారించారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా పిటిషనర్లు వ్యవస్థీకృత నేరానికి పాల్పడ్డారన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయో చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 26కి వాయిదా వేశారు. -
ఆశలు ఎండ‘మామిడి’
సాక్షి, అమరావతి: చెట్టంతా పూత.. దీంతో ఈ ఏడాది ఇక చింత లేదనుకున్నారు..! పిందె పడడమే ఆలస్యం.. తమ పంట పండినట్లేనని భావించారు..! కానీ, పగబట్టినట్లుగా వాతావరణ మార్పులు.. కొత్త రకం పురుగులు కలిపి దాడి చేశాయి..! ఫలితంగా పూతతో పాటు రైతుల ఆశలూ నేలరాలుతున్నాయి. నాలుగు డబ్బులు మిగులుతాయని భావిస్తే.. ఎర్రటి ఎండల్లో నీటి జాడను భ్రమింపజేసే ఎండమావుల్లా మారింది వారి పరిస్థితి. ‘ఆంధ్రప్రదేశ్ మామిడి’ అంటే దేశ విదేశాల్లో గొప్ప పేరు..! అయితే, ప్రస్తుతం చిత్తూరు నుంచి నూజివీడు దాకా ఎటుచూసినా మామిడి రైతులో నిర్వేదమే కనిపిస్తోంది. బంగినపల్లి మొదలు రసాల వరకు పంటను చూస్తే బెంగ పట్టుకుంటోంది. వాస్తవానికి ఏటా డిసెంబరు, జనవరిలో మామిడి పూత వస్తుంది. ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరిలో మొదలైంది. అయితే, శ్రీకాకుళం మొదలు చిత్తూరు వరకు ఏ చెట్టు చూసినా పూత బ్రహ్మాడంగా కాసింది. దీంతో దిగుబడికి దిగులు ఉండదని రైతులు ఆశపడ్డారు. కానీ, పూత పిందె కట్టేలోగా వారి ఆశలు ఆవిరయ్యాయి. ఒక్కసారిగా వాతావరణ మార్పులకు తోడు ‘మాంగో లూఫర్’ అనే కొత్త రకం పురుగు, తెగుళ్లు విజృంభణతో కళ్లెదుటే పూత మాడిపోయి, పిందెలు రాలిపోతున్నాయి. ఇదంతా చూసి రైతులు దిగాలు పడుతున్నారు. దాదాపు 10 లక్షల ఎకరాల్లో.. రాష్ట్రంలో 9.97 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. సువర్ణ రేఖ, నీలం, తోతాపూరి, బంగినపల్లి ప్రధానంగా పండిస్తున్నారు. గత రెండేళ్లలో వరుసగా 49.85 లక్షల టన్నులు, 35.78 లక్షల టన్నులు దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది కనీసం 45 లక్షల టన్నుల దిగుబడిని అంచనా వేశారు. అయితే, పూత పట్టింది మొదలు తెగుళ్లు, వైరస్లు విజృంభించాయి. మరోపక్క ఉష్ణోగ్రతలు అనూహ్యంగా 3 నుంచి 5 డిగ్రీల మేర పెరిగిపోయాయి. అసలే పూత ఆలస్యంతో ఇబ్బంది పడుతుండగా, ఉష్ణోగ్రతల ప్రభావం ప్రూట్ సెట్టింగ్ను దెబ్బతీసింది. జనవరి, ఫిబ్రవరిలో 28–29 డిగ్రీల మేర ఉన్న ఉష్ణోగ్రత, ప్రస్తుతం 36–38 డిగ్రీలకు చేరడం మామిడి పంటపై ప్రభావం చూపుతోంది. ⇒ మరోవైపు రాత్రిపూట మంచు ప్రభావం తీవ్రంగా ఉంది. అనూహ్య వాతావరణ పరిస్థితులతో మగ, ద్విలింగ పుష్పాల నిష్పత్తి (రేషియో) మారిపోయి ఆశించిన స్థాయిలో పిందెలు ఏర్పడడం లేదు. ⇒ మిరపను ఆశిస్తున్న నల్ల తామర పురుగు.. రెండేళ్లుగా మామిడిపైనా దాడి చేస్తోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దీని దెబ్బకు మామిడి పూత చాలావరకు మాడిపోయింది. 40 శాతం పైగా పంట మీద నల్ల తామర పురుగు ఉ«ధృతి కనిపిస్తోంది.రాయలసీమలో లిచీ లూఫర్ పురుగు దాడి లిచీ పంటలో కనిపించే అరుదైన మ్యాంగో లూఫర్ (కొత్త రకం గొంగలి పురుగు) ఏపీలో తొలిసారి మామిడిపై వ్యాపిస్తోంది. రాయలసీమతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. లార్వా దశలోనే పువ్వులు, ఆకులను తినేసే, పిందెల్లోకి చొరబడే ఈ పురుగులు 20–30 శాతం తోటలను దెబ్బతీస్తున్నాయి. వీటికితోడు వాతావరణ పరిస్థితులను బట్టి మంగు, మసి, పండు ఈగ, పెంకు, తేనె మంచు పురుగు, కాండంతొలుచు, కొమ్మ తొలిచే, గూడు పురుగు వంటి ఇతర రసం పీల్చే పురుగుల ఉధృతి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఫలితంగా పూత మాడిపోతూ పిందెలు రాలిపోతున్నాయి. ⇒ సాధారణంగా హెక్టార్కు 10 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా, ఈ ఏడాది మూడు నుంచి నాలుగు టన్నులకు మించి వచ్చే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు. పురుగుమందుల ఖర్చు రెట్టింపు ⇒ విస్తృతంగా పురుగుమందుల వినియోగంతో రైతులకు పెట్టుబడులు తడిసి మోపెడు అవుతున్నాయి. గతంలో ఎకరాకు రూ.20 వేలు వ్యయం కాగా.. ప్రస్తుతం సగటున రూ.40–50 వేల మధ్య ఖర్చు చేస్తున్నారు.సస్యరక్షణ చర్యలు ఇలా...⇒ అజాడిరక్టివ్ 2 మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆ తరువాత బీటీ ఫార్ములేషన్ బాసిల్లస్ తురింజియోస్పిస్ వెరైటీ కుర్స్టాకి(డిపెల్) 1.5–2 మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ⇒ క్లోరోఫైరిఫాస్ 50శాతం ఈసీ ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో లేదా ఇమామోక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు ఒక లీటర్ నీటిలో లేదా నోవాల్యురాన్ 5.25 శాతం ప్లస్ ఇండోక్సా కార్బ్ 4.5 శాతం ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ⇒ పురుగుల ఉధృతిని నియంత్రించేందుకు ఎకరాకు 8 పండు ఈగ బుట్టలు పెట్టుకోవాలి. ⇒ 10 ఏళ్లు పైబడిన మామిడి తోటలకు రోజుకు ఒక చెట్టుకు కనీసం 100 లీటర్ల నీటిని అందించాలి. ⇒ పిందెలు ఎక్కువగా రాలిపోతుంటే నాఫ్తలిన్ అసిటిక్ యాసిడ్ (ప్లానోఫిక్స్) 100 ఎంఎల్ 500 లీటర్ల నీటిలో (50 చెట్లు) పిచికారీ చేయాలి. ⇒ నీటి వసతి లేని రైతులైతే పొటాíÙయం నైట్రేట్ 10 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ⇒ తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే డైనోటోప్యూరాన్ 0.25 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ⇒ నల్లతామర ఉధృతి ఎక్కువగా ఉంటే చెట్టుకొక బ్లూ కలర్ జిగురు అట్ట అమర్చుకోవాలి.ఏం చేయాలో పాలుపోవడం లేదునాకు 6 ఎకరాల మామిడి తోట ఉంది. పూత బాగా వచ్చినప్పటికీ ఎండల తీవ్రతతో పాటు నల్లతామర, కొత్త రకం పురుగుల ప్రభావంతో మాడిపోయింది. పిందెలను కాపాడడానికి పురుగుమందులు విపరీతంగా పిచికారీ చేయాల్సి వస్తోంది. ఎకరాకు రూ.40 వేల పైనే ఖర్చు అవుతోంది. ఇంకా పెట్టుబడి పెట్టాలంటే భయంగా ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పెట్టుబడీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గతంలోలా అధికారులు తోటలను పరిశీలించి సలహాలు ఇవ్వడం లేదు. నిరుడు ధర లేక మామిడిని తోటల్లోనే వదిలేశాం. ఈ ఏడాదైనా గట్టెక్కుదాం అనుకుంటే అసలు ఏంచేయాలో పాలుపోవడంలేదు. – ఆకేపాటి రంగారెడ్డి, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం తూర్పుపల్లిపెట్టుబడి కూడా వచ్చేలా లేదు 2.5 ఎకరాల్లో 12 ఏళ్ల వయస్సున్న 200 చెట్లు ఉన్నాయి. ఎండల ప్రభావం, బంక తెగులుతో పూత మొత్తం నేలవాలింది. ఒకటీ అరా పిందెలు వచ్చినా కొత్తరకం పురుగులతో రాలిపోతోంది. ఇప్పటికే పురుగు మందుల కోసం రూ.40–50 వేలు ఖర్చు చేశా. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చా. తీరా కాపు కొచ్చేసరికి తెగుళ్లు, ఎండలు మా కడుపు కొడుతున్నాయి. ఈసారి దిగుబడికి అవకాశం లేదు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. –కె.వెంకటసుబ్బయ్య, అనంతపల్లె, పుల్లంపేట మండలం, అన్నమయ్య జిల్లా70 శాతం పూత దెబ్బ.. నాకు సొంతంగా ఐదెకరాలుండగా, 15 ఎకరాల్లో తోటలు లీజుకు తీసుకున్నా. ప్రారంభంలో మంచి పూతే వచ్చింది. ఇటీవల కురుస్తున్న మంచుకు తోడు పగటి ఉష్ణోగ్రతల ప్రభావానికి పూర్తిగా మాడిపోయింది. తేనె మంచు, రసం పీల్చే పురుగుల ప్రభావంతో రాలిపోయింది. 60–70 శాతం పూత దెబ్బతిన్నది. మిగిలిన పూతలో అక్కడక్కడా పిందెలు కట్టినా నిలుస్తాయో లేదోనని అనుమానంగా ఉంది. ఈ ఏడాది లీజుతో పాటు పురుగుమందులకు రూ.8 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. అది కూడా వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. –దుంగ వెంకటరమణ, నీలకంఠాపురం, లక్కవరపుకోట మండలం, విజయనగరం జిల్లాఫ్రూట్ కవర్స్తో కొంత మేర రక్షణ కొత్త రకం గొంగలి పురుగు మ్యాంగో లూఫర్తో పాటు నల్లతామర ఉధృతి ఎక్కువగా ఉంది. పూత ఆలస్యమవడంతో పాటు పెరిగిన ఉష్ణోగ్రతల ప్రభావంతో ఫ్రూట్ సెట్టింగ్ జరగక పిందెకట్టడం తగ్గిపోయింది. ఈసారి దిగుబడులు తగ్గే అవకాశాలు కన్పింస్తున్నాయి. పురుగుల ఉధృతిని ఎదుర్కొనేందుకు సస్యరక్షణ చర్యలు పాటించాలి. పురుగు మందులను సిఫార్సుల మేరకే వాడాలి. పిందెలను కాపాడుకునేందుకు రైతులు ఫ్రూట్ కవర్స్ కట్టాలి. పిందె నిమ్మకాయ పరిమాణంలోకి వచ్చిన తర్వాత కవర్లు కడితే కాయల సైజుతో పాటు నాణ్యత కూడా పెరుగుతుంది. –డి.శ్రీనివాసరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త ఉద్యాన పరిశోధనా కేంద్రం, తిరుపతి -
పోసాని బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
సాక్షి,గుంటూరు: ప్రముఖ రచయిత,నటుడు పోసాని కృష్ణ మురళి (Posni Krishna Murali) బెయిల్ పిటిషన్పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసింది.గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా .. న్యాయస్థానం ఇవ్వాల్టికి వాయిదా వేసింది. ఈరోజు పోసాని బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. వాదనలు పూర్తి అయిన తర్వాత తీర్పును న్యాయస్థానం ఈనెల 21కి వాయిదా వేసింది. -
కూటమి ప్రభుత్వంపై నిరసన గళం.. అప్కాస్ ఉద్యోగుల ఆందోళన తీవ్రతరం
విజయవాడ: అప్కాస్ విధానం రద్దుకు వ్యతిరేకంగా ఉద్యోగులు విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఒకటో తేదీన జీతాలు తీసుకునే స్థితి నుంచి జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందంటూ ఆందోళన దిగారు. అప్కాస్ ను రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్కాస్ ఏర్పాటు చేసి వైఎస్ జగన్ మంచి చేశారని, దాన్ని రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కూటమి ప్రభుత్వాన్ని ఉద్యోగులు హోచ్చరించారు. అప్కాస్ ను యథావిధిగా కొనసాగించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నామున్సిపల్ కార్మికులు సమస్యలు మాత్రం తీరడం లేదు. అప్కాస్ రద్దు చేయడం దుర్మార్గం. గత ప్రభుత్వం కాలంలో చేసుకున్న ఒప్పందాలను నేటి ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరం చేయడం లేదు. సమ్మె చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదనే ఆలోచనకు ప్రభుత్వం తీసుకుని వెళ్తుంది. అప్కాస్ రద్దు చేస్తే మునిసిపల్ వర్కర్స్ ను ఎక్కడ తీసుకుని పెడతారు.ప్రవేట్ కాంట్రాక్టర్ల బందిఖానాలో వర్కర్స్ ను పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అప్కాస్ రద్దు కూటమి ప్రభుత్వంకి సరైనది కాదు. అప్కాస్ లో మొదటి తేదీనే జీతాలు పడుతున్నాయి.. కాంట్రాక్ట్ వ్యవస్ధ జీతాలు సమయంకి పడవు. అప్కాస్ రద్దు చేస్తే రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తాం. పిబ్రవరి చివరి వరకు జీతాల పెంపుకోసం చూస్తాం. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెకు దిగుతాం.మునిసిపల్ కార్మికులు సమ్మె చేస్తే స్వచ్చ సర్వేక్షణ్ ఏవిధంగా సాధ్యం అవుతుంది.. మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగితే దానికి బాధ్యత కూటమి ప్రభుత్వందే’ అని సిఐటియు నాయకులు కాశీనాధ్ స్పష్టం చేశారు. -
‘వైఎస్సార్’ను జనం గుండెల్లో నుంచి తొలగించలేరు
తాడేపల్లి : కూటమి ప్రభుత్వంలో విధ్వంసం తప్ప మరేమీ లేదని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే , పార్టీ అధికార ప్రతినిధి కోరముట్ల శ్రీనివాసులు. స్వయంగా చంద్రబాబు కుమారుడే లోకేష్ కవ్వింపు చర్యలకు దిగుతున్నాడని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కోరుమట్లు.. కోడుమూరులో నిన్న వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని, నాగార్జున యూనివర్శిటీ సహా అనేక ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. చివరికి విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారన్నారు. జనం రావటంతో ఆ ముష్కరులు పారిపోయారన్నారు.‘రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంస కారులు వైఎస్ఆర్ విగ్రహాలపై పడ్డారు. విగ్రహాలను తొలగించ గలరేమోగానీ జనం గుండెల్లో నుండి వైఎస్సార్ ని తొలగించలేరు. తన తెచ్చిన సంక్షేమ పథకాలతో వైఎస్సార్ దేవుడయ్యాడు. ఎవరు ఎలాంటి వారో ప్రజలకు అన్నీ తెలుసు. రాయలసీమకు వైఎస్సార్ ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు తెచ్చారు. వైఎస్ జగన్ నేరుగా ఎన్టీఆర్ పేరుతో జిల్లానే ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం వైఎస్సార్ పేరును తొలగిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. ఇప్పటికే 4 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ కట్ చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. కూటమి నేతలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదువిశాఖపట్నంలో స్టేడియం పేరు తొలగించటం దారుణం. ఇందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? , కూటమి నేతలు చేసిన పాపాలకు తగిన మూల్యం చెల్లుంచుకునే రోజు దగ్గర్లోనే ఉంది’ అని హెచ్చరించారు. -
మహిళలపై నేరాలు తగ్గాయనడం పచ్చి అబద్ధం: వరుదు కల్యాణి
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన చేపట్టాక మహిళలపై నేరాలు తగ్గాయని చట్టసభల సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి(Varudu Kalyani) ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు సంబంధించిన ప్రభుత్వం వెల్లడించిన లెక్కలను ఖండించిన ఆమె.. ఈ అంశంపై వివరంగా మాట్లాడారు. ‘‘మహిళల పై నేరాలు తగ్గాయని సభసాక్షిగా హోం మంత్రి అనిత(Home Minister Anita) అబద్ధాలు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం రోజుకి మహిళల పై 70 సంఘటనలు జరుగుతున్నాయి. ఈ పదినెలల్లో మహిళల పై నేరాలు దాడులు పెరిగాయి. అలాంటప్పుడు.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎందుకు ప్రయత్నించడం?. లెక్కలు క్లియర్గా ఉంటే మరి మోసం చేయడం ఎందుకు?.. అని నిలదీశారామె. .. జగన్ మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారు. దిశా యాప్ను తెచ్చారు. దిశా యాప్ పైన ఇదే మంత్రి గతంలో చాలా వెటకారంగా మాట్లాడారు. కానీ, ఇప్పుడు అదే దిశ యాప్ ను కాపీ కొట్టి శక్తి యాప్ అని తెచ్చారు. మహిళా దినోత్సనం రోజున శక్తి యాప్ ప్రారంభించారు. కేవలం పదిరోజుల్లోనే కోటి 49 లక్షల మంది శక్తి యాప్ ను డౌన్ లోడు చేసుకోవడం విడ్డూరంగా ఉంది... కృష్ణాజిల్లాలో 14 ఏళ్ల బాలిక పై సామూహిక అత్యాచారం జరిగింది. ఇంత దారుణాలు జరిగినా ప్రభుత్వంలో చలనం లేదు. మహిళల పై నేరాలు పెరగడానికి కారణం మద్యం,గంజాయి,డ్రగ్స్. సీఎం చంద్రబాబు నివాసముంటున్న జిల్లాలోనే డ్రగ్స్ దొరికాయి. గంజాయిని కంట్రోల్ చేయడానికి ఈగల్ తెచ్చామంటున్నారు సంతోషం. కానీ, జగన్ మోహన్ రెడ్డి గతంలో సెబ్ తెచ్చారు. సెబ్ డీజీపీ కంట్రోల్లో ఉండేది. సెబ్ను తీసేసి ఈగల్ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మహిళల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామంటున్నారు. కానీ, ప్రభుత్వం మాటలు కాకుండా చేతలతో చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.కేంద్రం వద్ద దిశ చట్టం(Disha Act) పెండింగ్ లో ఉంది. కేంద్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే కదా. మరి ఆ చట్టానికి ఆమోద ముద్ర వేయించొచ్చు కదా అని అనితను ఉద్దేశించి కల్యాణి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మభ్యపెట్టే మాటలు మానుకోవాలని కూటమి ప్రభుత్వానికి వరుదు కల్యాణి హితవు పలికారు.ఇదే అంశంపై మాట్లాడిన ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి.. మహిళలకు ఇంటా బయటా రక్షణ లేకుండా పోయిందని అన్నారు. పోలీస్ స్టేషన్లలోనే మహిళా పోలీసుల పై దాడులు జరుగుతున్నాయన్న ఆమె.. శక్తి యాప్ కూడా దిశా యాప్ మాదిరిగానే పనిచేస్తుందా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. -
APLC: మేమెందుకు క్షమాపణలు చెప్పాలి?
అమరావతి, సాక్షి: శాసనమండలిలో ఇవాళ మరోసారి మంత్రి నారా లోకేష్, ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ(Botsa Satyanaraya) మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగింది. విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కారణమని మంత్రి లోకేష్ ఆరోపించగా.. బొత్స ఆ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘‘ఏపీలో 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారనడం(Drop Outs) సరికాదు. మంత్రి నారాలోకేష్(Nara Lokesh)కు ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఏనాడూ 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు బదిలీ అయిన సందర్భమూ లేదు. .. సౌకర్యాలు లేవనడం కరెక్ట్ కాదు. కావాలంటే మండలి సభ్యులందరినీ తీసుకెళ్లి స్టడీ టూర్ పెట్టండి. 2014-19 మధ్య స్కూల్స్ ఎలా ఉన్నాయి...2019-24 మధ్య ఎలా ఉన్నాయో పెద్దలతో గ్రామసభలు పెట్టి చర్చిద్దాం. ఒక్కో ప్రభుత్వానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. కానీ, తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం(English Medium) కూడా ప్రోత్సహించాలన్నదే మా విధానం. .. ప్రాధమిక విద్యనుంచి టోఫెల్ విద్యను నేర్పించడం. ఇంగ్లీష్ మీడియంలో ఐబి విద్యను అందించడం. సెంట్రల్ సిలబస్ (సిబిఎస్) ను ప్రవేశపెట్టడం లాంటివి చేశాం. మొన్న 80% మంది విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాశారు. కిందిస్థాయి నుంచి కమ్యూనికేషన్ కోసం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ను అందుబాటులోకి తెచ్చాం. రేపు ఈ సబ్జెక్ట్ మీద చర్చించాలని మేం కోరాం. ఈ రోజు ఉద్యోగుల సమస్యల పై చర్చించాలని మేం వాయిదా తీర్మానం ఇచ్చాం. నేను తప్పు మాట్లాడితే రికార్డుల నుంచి నా మాటలను తొలగించండి. మేం క్షమాపణ చెప్పాలనడమేంటి... ఎందుకు మేము క్షమాపణ చెప్పాలి అని లోకేష్ వ్యాఖ్యలను ఉద్దేశించి బొత్స తీవ్రంగా ధ్వజమెత్తారు.అంతకుముందు.. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు , ఉద్యోగుల పెండింగ్ బకాయిలు ,ఐఆర్ ,డీఏ ,ఉద్యోగుల సమస్యలపై వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. అనంతరం.. ప్రశ్నోత్తరాలు జరిగాయి. -
మండలి చైర్మన్కు తీవ్ర అవమానం
సాక్షి, అమరావతి: శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజుకు తీవ్ర అవమానం జరిగింది. శాసన సభ, శాసన మండలి సభ్యులకు నిర్వ హిస్తున్న క్రీడల పోటీల సాక్షిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మోషేన్ రాజుపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపించింది. శాసన మండలి చైర్మన్గా ఆయనకు ప్రొటోకాల్లో అగ్ర ప్రాధా న్యం కల్పించాల్సి ఉండగా, ఆ విషయాన్ని ప్రభు త్వం విస్మరించింది.క్రీడా పోటీల ప్రాంగణంలో ఎక్కడా మండలి చైర్మన్ ఫొటో, పేరు కూడా లేకుండా అగౌరవ పరిచింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మండలి చైర్మన్ పేరు కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనతో ఎస్సీ నేతలపై అధికార టీడీపీ కూటమి నిరంకుశ, అప్రజాస్వామిక వైఖరి మరోసారి బయటపడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర అత్యున్నత సభను నడిపించే వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీస్తున్నారు. -
అంగన్వాడీ కేంద్రాలు ఒంటి పూట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించేలా ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలోని విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, మన రాష్ట్రంలోని విద్యాసంస్థలను ఈ నెల 15 నుంచి ఒంటిపూట నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో ఆరేళ్లలోపు చిన్నారులు ఉండే అంగన్వాడీ కేంద్రాలను రెండు పూటలా నిర్వహిస్తుండటంతో పిల్లల ఇబ్బందులపై ‘అంగన్వేడీ’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. మొదట ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం... ‘సాక్షి’ కథనంతో స్పందించి మంగళవారం నుంచే అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం నుంచి మే 31వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించేలా అన్ని జిల్లాల అధికారులు, అంగన్వాడీ టీచర్లకు వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపించారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు మే 1 నుంచి 15 వరకు, ఆయాలకు మే 16 నుంచి 31వ తేదీ వరకు 15 రోజులు చొప్పున సెలవులు ఇవ్వాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. -
నాకెవరూ స్క్రిప్ట్ ఇవ్వలేదు
సాక్షి, అమరావతి/నగరంపాలెం (గుంటూరు వెస్ట్) :ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురించి గతంలో చంద్రబాబు చేసిన విమర్శలనే తాను ప్రస్తావించానని సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సీఐడీ అధికారులకు స్పష్టంచేశారు. అయ్యప్ప భక్తుల గురించి, మోదీకి భార్యలేదని విమర్శిస్తూ చంద్రబాబు మాట్లాడిన ప్రసంగాల వీడియోలను చూసి నిర్థారించుకున్న తర్వాతే తాను మాట్లాడానని ఆయన తేల్చిచెప్పారు. అలాగే, చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్ గురించి తానెప్పుడూ అసభ్యకరంగా మాట్లాడలేదని.. వారి గురించి అసభ్యకరంగా మాట్లాడాలని తనతో ఎవరూ చెప్పలేదని కూడా ఆయన వెల్లడించారు. పోసాని గతంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంశాలపై సీఐడీ అక్రమ కేసు నమోదుచేసి ఆయన్ని అరెస్టుచేసిన విషయం తెలిసిందే.రిమాండ్లో ఉన్న ఆయన్ని సీఐడీ అధికారులు న్యాయస్థానం అనుమతితో మంగళవారం కస్టడీలోకి తీసుకుని విచారించారు. దాదాపు ముడు గంటలపాటు సాగిన ఈ విచారణలో పోసానికి మొత్తం 34 ప్రశ్నలు సంధించారు. వాటిన్నింటికీ ఆయన సూటిగా సమాధానాలు చెప్పారు.ముగిసిన సీఐడీ కస్టడీ: ఇదిలా ఉంటే.. పోసాని ఒకరోజు సీఐడీ కస్టడీ ముగిసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు.. గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఆయన్ను మంగళవారం కస్టడీలోకి తీసుకున్న సీఐడీ పోలీసులు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.2 గంటల వరకు విచారించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్క్లాస్ ఫర్ ప్రొహిబిషన్/ఎక్సైజ్ కోర్డులో హాజరుపరిచారు. అక్కడ్నుంచి పోసానిని తిరిగి గుంటూరు జిల్లా జైలుకి తరలించారు.విశ్వసనీయ సమాచారం మేరకు సీఐడీ అధికారులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు పోసాని చెప్పిన సమాధానాలివీ..సీఐడీ : ప్రెస్మీట్ నిర్వహించే ముందు ఎవర్నయినా కలిశారా? పోసాని : ఎవర్నీ కలవలేదు. సీఐడీ : సీఎం చంద్రబాబు అయ్యప్పస్వాములను అవహేళన చేశారంటూ మీరు విమర్శనాత్మకంగా మాట్లాడారు. ఎందుకలా మాట్లాడారు?పోసాని : అయ్యప్ప భక్తులు దీక్ష వహిస్తే మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయని చంద్రబాబు ఓసారి అన్నారు. అందుకు సంబంధించిన వీడియో చూశా. అందుకే అలా మాట్లాడాను. సీఐడీ : బీజేపీ అంటే హిందుత్వ పార్టీ, మతతత్వ పార్టీ అని చంద్రబాబు విమర్శించారని మీరు మాట్లాడారు.. దేని ఆధారంగా మాట్లాడారు? పోసాని : చంద్రబాబు ఓసారి మసీదులో మాట్లాడుతూ.. ఇకపై బీజేపీని మతతత్వ పార్టీ అని విమర్శిస్తూ ఆ పార్టీతో ఇక పొత్తు పెట్టుకోనని విమర్శించారు. కానీ, ఆయన మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. నేను అదే విషయాన్ని మాట్లాడాను.సీఐడీ : ప్రధాని మోదీకి భార్యలేదని చంద్రబాబు అన్నారని మీరు మాట్లాడారు. దేని ఆధారంగా అలా మాట్లాడారు? పోసాని : మోదీకి భార్యలేదని చంద్రబాబు విమర్శించడం నేను టీవీలో చూశాను. ఆ విషయాన్నే చెప్పాను. సీఐడీ : మోదీ ఎవరు? అమిత్ షా ఎవరు? వారిని నేను గెలిపించానని చంద్రబాబు విమర్శించారని మీరు చెప్పారు. దేని ఆధారంగా అలా మాట్లాడారు?పోసాని : చంద్రబాబు అలా మాట్లాడటం నేను టీవీలో చూశాను. అందుకే అలా మాట్లాడాను.సీఐడీ : తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో విమర్శనాత్మకంగా ఎందుకు మాట్లాడారు? మీతో ఎవరు మాట్లాడించారు? పోసాని : తిరుమల లడ్డూ ప్రసాదం గురించి నేను విమర్శించలేదు. నాతో ఎవరూ అలా మాట్లాడించలేదు. సీఐడీ : చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్ గురించి అసభ్యకరంగా ఎందుకు మాట్లాడారు? పోసాని : నేను చంద్రబాబు, లోకేశ్, పవన్ గురించి అసభ్యకరంగా ఎప్పుడూ మాట్లాడలేదు.సీఐడీ : మిమ్మల్ని ఇటీవల పోలీసులు విచారించినప్పుడు వైఎస్సార్సీపీలో ఎవరో చెబితేనే మాట్లాడినట్లు చెప్పారని పత్రికల్లో వార్తలొచ్చాయి కదా.. అలా మాట్లాడమని మీకెవరు చెప్పారు? పోసాని : నాతో ఎవరో మాట్లాడించినట్లు నేను పోలీసులకు చెప్పలేదు. పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవం. నాకెవరూ స్క్రిప్ట్ ఇవ్వరు. పత్రికల్లో, టీవీల్లో వచ్చే వార్తలను చూసి నేనే నోట్ చేసుకుని మాట్లాడతాను. -
ఇంత అవమానమా?
సాక్షి, అమరావతి : రాజకీయాల నుంచి తనకు బలవంతంగా, అదీ.. అవమానకరంగా రిటైర్మెంట్ ఇవ్వడంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహంతో ఉన్నట్లు వెల్లడైంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా సేవలందిస్తున్న యనమల మరికొన్నాళ్లు ప్రజాప్రతినిధిగా కొనసాగాలని భావించారు. ఇటీవలే ఆయన తన రాజకీయ భవితవ్యం గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు అవకాశమిస్తే రాజ్యసభకు వెళతానని, లేకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పారు. అయితే, ఆయనకు ఎమ్మెల్సీ పదవినే రెన్యువల్ చేయలేదు. దీంతో చంద్రబాబు తనను అవమానించినట్లు యనమల భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు తనను వాడుకుని చివరి దశలో అవమానకర పరిస్థితుల్లో రాజకీయాల నుంచి నిష్క్రమించేలా చేశారని ఆయన బాధపడుతున్నట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. దీంతో శాసన మండలిలో తన సభ్యత్వానికి ఆఖరి రోజు అయిన మంగళవారం ఆయన సభకు గైర్హాజరయ్యారు. ఏడుగురు సభ్యుల పదవీకాలం మంగళవారంతో ముగియడంతో మండలిలో వారికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయాన్ని ఎజెండాలో పెట్టి వారికి ముందే సమాచారం ఇచ్చినా, యనమల మాత్రం వీడ్కోలు కార్యక్రమానికి రాకుండా నిరసన తెలిపినట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. అలాగే సీఎం, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంగళవారం గ్రూప్ ఫొటో కార్యక్రమం ఉందని ముందే చెప్పినా, యనమల దానికీ రాకపోవడం గమనార్హం. చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలతో గ్రూప్ ఫొటో దిగేందుకు ఆయన ఇష్టపడలేదని తెలుస్తోంది. ప్రాధాన్యత లేకుండా చేసి.. చంద్రబాబు కుమారుడు లోకేశ్ పార్టీలో సీనియర్ నాయకులందరికీ పొగ పెడుతున్న విషయం తెలిసిందే. ఆ జాబితాలో యనమల పేరునూ చాలారోజుల క్రితమే చేర్చారు. పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారు. 2019– 24 మధ్యలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు అప్పగించి, పని చేయించుకున్నప్పటికీ, గత ఏడాది తిరిగి అధికారంలోకి రాగా నే ఆయన్ని పక్కన పెట్టేశారు. ప్రభుత్వంలో, పార్టీలోనూ అస్సలు ప్రాధాన్యత లేకుండా చేశారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం కాకినాడ పోర్టు, సెజ్ వ్యవహారంలో ప్రభుత్వ తీరును తప్పు పడుతూ ఆయన ఏకంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. దీంతో చంద్రబాబు ఆయనపై సోషల్ మీడియాలో ఎదురు దాడి చేయించి మరింతగా అవమానించారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం ఇవ్వకపోవడమే కాకుండా పలు అవమానాలకు గురి చేసినట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి వీడ్కోలు కార్యక్రమానికి, గ్రూప్ ఫొటోకు రాలేదని చెబుతున్నారు. -
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. రాజకీయాలకు దూరంగా ఉండాలి
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయాలు జొప్పించకుండా, శాసన మండలిలో ఆయా వర్గాలకే ప్రాతినిధ్యాన్ని విడిచిపెట్టాలని మండలి చైర్మన్ మోషేన్రాజు అభిప్రాయపడ్డారు. పీడీఎఫ్ సభ్యుల పదవీ విరమణ వల్ల విద్యార్థులు, యువత, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల సమస్యలను ప్రస్తావించడంలో సభ మూగబోతుందేమోనని ఆయన పేర్కొన్నారు. మంగళవారం శాసన మండలిలో పదవీ విరమణ పొందుతున్న ఏడుగురు ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు, రఘువర్మ(పీడీఎఫ్), యనమల రామకృష్ణుడు, పి.అశోక్బాబు, డి.రామారావు, బీటీ నాయుడు(టీడీపీ)లకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థులను పోటీలో నిలపడంతో ఆయా వర్గాల ప్రాతినిధ్యాన్ని, వారి గొంతుకను అడ్డుకుంటున్నామా? అనే భావన కలుగుతోందన్నారు. పీడీఎఫ్ సభ్యులు లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు, రఘువర్మ సభలో బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రస్తావించేటప్పుడు సంతోషంగా ఉండేదన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల యనమల రామకృష్ణుడు తాను నమ్మిన పార్టీ అభివృద్ధికి ఎనలేని సేవలందించారని ప్రశంసించారు. బీటీ నాయుడు మరోసారి ఎన్నికవడం అభినందనీయమన్నారు. ఇకపై ఎమ్మెల్సీలు ఎవరైనా పదవీ విరమణ పొందితే సభా సంప్రదాయం ప్రకారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తామని చైర్మన్ ప్రకటించారు.సభలో యనమల ఉంటే బాగుండేది: బొత్ససభలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపైనే పోరాటం తప్ప సొంత అజెండాలు ఉండవని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా సభలో యనమల రామకృష్ణుడు కూడా ఉండి ఉంటే బాగుండేదని బొత్స అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అలాంటి సీనియర్ రాజకీయ నాయకుల మాటలు, అనుభవం సభ్యులకు అవసరమన్నారు. చైర్మన్ స్పందిస్తూ... తాను ఫోన్ చేసినప్పటి కీ అనారోగ్యం కారణంగా యనమల రాలేకపోతున్నట్టు చెప్పారన్నారు. బొత్స మాట్లాడుతూ యనమల ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, స్పీకర్గా, ఆర్థిక మంత్రిగా ఎంతో విలువైన సేవలు అందించారని కొనియాడారు. స్పీకర్గా యనమల తీసుకొచి్చన సంస్కరణలను ఇప్పటికీ కొనసాగిస్తున్నామని తెలిపారు. పీడీఎఫ్ సభ్యులు సమాజంలోని రుగ్మతలను సభలో ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ శాసన వ్యవస్థలో లైవ్ స్ట్రీమింగ్ అనేది యనమల స్పీకర్గా ఉన్నప్పుడు తీసుకొచి్చన సంస్కరణల్లో భాగంగా వచ్చిందన్నారు. -
పోలీస్ శాఖలో ‘గుప్తా’ధిపత్య పోరు
సాక్షి, అమరావతి: ఆయన తీరు సందేహాస్పదం... కాదు ఆయనే తీరే వివాదాస్పదం ఆయన మాట వినొద్దు... కాదుకాదు ఆయన మాట అసలే వినొద్దు నాకు సీఎంవో మద్దతు ఉంది.. కాదు కాదు సీఎంవో అండ నాకే..ఇదీ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్య పోరు తీరు. డీజీపీ హరీశ్కుమార్గుప్తా, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ మధుసూదన్రెడ్డి మధ్య విభేదాలు అనతికాలంలోనే పతాక స్థాయికి చేరాయి. ఓవైపు ప్రభుత్వ పెద్దల రెడ్బుక్ కుట్రలకు వత్తాసు పలుకుతూ మరోవైపు శాఖపై ఆధిపత్యం కోసం ఇద్దరూ ఎత్తులు పైఎత్తుల్లో మునిగితేలుతున్నారని పోలీస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో ఇతర సీనియర్ అధికారులు, జిల్లా అధికారులు తీవ్ర సంకట స్థితి ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభావం కీలక ఫైళ్ల పరిష్కారంపై పడుతోంది.డీజీపీ గుప్తాపై ఓ కన్నేసి ఉండమన్నారు‘డీజీపీ హరీశ్కుమార్ గుప్తాపై సీఎం చంద్రబాబుకు పూర్తి విశ్వాసం లేదు. అందుకే నన్ను కీలకమైన శాంతిభద్రతల విభాగం అదనపు డీజీగా నియమించారు’ అంటూ మధుసూదన్రెడ్డి కొందరు సీనియర్ అధికారుల వద్ద వ్యాఖ్యానించినట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు ఐజీగా ఉన్నప్పటి నుంచి డీజీపీ గుప్తా ట్రాక్ రికార్డు సక్రమంగా లేదన్నది కూడా ప్రభుత్వ పెద్దల ఉద్దేశమని ఆయన చెప్పినట్టు సమాచారం. ఆయనపై తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు రావడం, ప్రత్యేకంగా విచారణ నిర్వహించిన ఉదంతాలను కూడా పదేపదే ప్రస్తావిస్తున్నారు. డీజీపీ గుప్తా కదలికలు, వ్యవహార శైలిపై కన్నేసి ఉండాలని స్వయానా సీఎం చంద్రబాబు తనకు సూచించినట్లు మధుసూదన్రెడ్డి చెప్పుకోవడం ఆసక్తికరం. అయితే, తన గురించి మధుసూదన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు డీజీపీ గుప్తాకు తెలిశాయి. దాంతో ‘‘అదనపు డీజీ మధుసూదన్రెడ్డి వద్దకు ఫైళ్లు పంపాల్సిన అవసరం లేదు. అన్ని ఫైళ్లు నేరుగా నాకే పంపండి’’ అంటూ అధికారులను మౌఖికంగా ఆదేశించారని సమాచారం.అంతేకాక, మధుసూదన్రెడ్డి చాంబర్లోకి ఎవరెవరు వెళ్తున్నారు? ఆయన్ను ఎవరు కలుస్తున్నారనే ప్రతి అంశాన్ని డీజీపీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అనంతరం వారిని పిలిపించి మాట్లాడుతూ.. మీరు అదనపు డీజీని కలవాల్సిన అవసరం లేదని పరోక్షంగా స్పష్టం చేస్తున్నారు. జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు కూడా అదే విషయం సూచించినట్టు సమాచారం.ఈ పరిణామాలతో ఎవరితో మాట్లాడితే ఎవరికి కోపం వస్తుందో..? అసలు ఎవరికి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎక్కువ పరపతి ఉందో అన్నది అర్థం కాక పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు తికమక పడుతున్నారు. డీజీపీ.. ఓ చిరుద్యోగి.. ఓ వ్యాపారిడీజీపీ హరీశ్కూమర్ గుప్తా వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. రామకృష్ణ అనే ఓ కిందిస్థాయి ఉద్యోగి, తెనాలికి చెందిన వ్యాపారి శ్రీనివాస్ ద్వారా ప్రైవేటు వ్యవహారాలు సాగిస్తున్న విషయం శాఖలో బాగా వ్యాపించింది. దీనివెనుక మధుసూదన్రెడ్డి ప్రమేయం ఉందని డీజీపీ గుప్తా శిబిరం ఆరోపిస్తోంది. చిరుద్యోగి అయిన రామకృష్ణ ఏకంగా జిల్లాల్లోని పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తూ డీజీపీ చెప్పారంటూ పెద్ద పెద్ద డీల్స్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డీజీపీ సమ్మతి లేకుండా ఒక చిరుద్యోగి అంతటి సాహసం చేయరు కదా? అని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక హరీశ్కుమార్ గుప్తా గుంటూరు ఐజీగా ఉన్నప్పటి నుంచి శ్రీనివాస్ ఆయనకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు. సీఐల పోస్టింగ్లలో శ్రీనివాస్ భారీఎత్తున ముడుపుల వసూళ్లు సాగించినట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో దానిపై ఏకంగా విచారణ సంఘం గుంటూరులో ఓపెన్హౌస్ నిర్వహించడం గమనార్హం. హరీశ్గుప్తా విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ డీజీ అయ్యాక వ్యాపారి శ్రీనివాస్ మళ్లీ తెరపైకి వచ్చాడు. విజిలెన్స్ దాడుల పేరుతో రాష్ట్రంలో గ్రానైట్, హోల్సేల్, రియల్ ఎస్టేట్, పెట్రోల్ బంకుల యజమానులతో పాటు పలువురు బడా వ్యాపారులను బెదిరించారని చెబుతారు. గుప్తా డీజీపీ కాగానే శ్రీనివాస్ మరింత చెలరేగి రాష్ట్రవ్యాప్తంగా సెటిల్మెంట్లకు పాల్పడుతున్నాడు. డీజీపీ పదవీ కాలం ఆగస్టులో ముగియనుంది. ఆలోగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది ఈ ద్వయం లక్ష్యంగా ఉంది. అనంతరం డీజీపీకి పొడిగింపు లభిస్తే సరి.. లేదంటే అవకాశం కోల్పోతామన్నది వారి ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే రామకృష్ణ, వ్యాపారి శ్రీనివాస్లు డీజీపీ గుప్తా పేరుతో సాగిస్తున్న సెటిల్మెంట్లు పోలీస్ శాఖతో పాటు వ్యాపారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
దర్యాప్తు ముసుగులో దాదాగిరీ!
సాక్షి, అమరావతి: రెడ్బుక్ కుట్రలను అమలు చేయడమే లక్ష్యంగా సాగుతున్న టీడీపీ కూటమి సర్కారు పోలీసు గూండాగిరీకి తెగిస్తోంది! అందుకోసం సిద్ధం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) రాజ్యాంగేతర శక్తిగా మలుచుకుంది! గత ప్రభుత్వ హయాంలో అనుసరించిన మద్యం విధానాలపై అక్రమ కేసులతో బరితెగిస్తోంది. ఈ క్రమంలో సీఐడీ ద్వారా అక్రమ కేసుతో వేధించేందుకు పన్నిన పన్నాగం ఫలించకపోవడంతో ‘సిట్’ను తెరపైకి తెచ్చింది. ప్రలోభపెట్టో.. వేధించో.. హింసించో... తిమ్మిని బమ్మిని చేయాలని సిట్ను ఆదేశించింది. దర్యాప్తు పేరిట వేధింపులకు కుతంత్రం పన్నింది. సిట్ పోలీస్ స్టేషన్ ఎక్కడన్నది గుర్తించకుండా బరితెగించి సాగిస్తున్న ఈ కుట్ర ఇలా ఉంది..!సిట్ పోలీస్ స్టేషన్ ఎక్కడ..?నిబంధనల ప్రకారం సిట్ను ప్రత్యేక పోలీస్ స్టేషన్గా ప్రకటించి ఎక్కడి నుంచి పని చేస్తుందో అధికారికంగా నోటిఫై చేయాలి. అంటే సిట్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని గుర్తించాలి. కక్ష సాధింపే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసిన కూటమి సర్కారు సిట్ను ఏర్పాటు చేస్తూ ప్రత్యేక పోలీస్ స్టేషన్గా ప్రకటించింది. అయితే ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడ అన్నది నోటిఫై చేయలేదు. సిట్ పోలీస్ స్టేషన్ భౌతికంగా ఎక్కడ ఉందో వెల్లడించకపోవడం వెనుక పక్కా కుట్ర ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.దర్యాప్తు పేరుతో వేధింపుల కుట్ర...సిట్ పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని ఇప్పటివరకు గుర్తించకపోవడం వెనుక పక్కా కుట్ర ఉంది. పోలీస్ స్టేషన్ను అధికారికంగా గుర్తిస్తే అక్కడి నుంచే సిట్ విధులు నిర్వహించాలి. ఈ కేసులో నిందితులనుగానీ సాక్షులనుగానీ విచారించాలంటే నోటీసులు జారీ చేసి అక్కడకే పిలవాలి. ఆ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే విచారించాలి. సక్రమ కేసు అయితే ఈ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు. రెడ్బుక్ కుట్రలో భాగంగా నమోదు చేసిన అక్రమ కేసు కాబట్టే కూటమి ప్రభుత్వం బరి తెగిస్తోంది. ఈ కేసులో సాక్షులా? నిందితులా? ఇతరులా? అనేది స్పష్టం చేయకుండా పలువురిని ఇప్పటికే విచారణ పేరుతో వేధించింది. వారిని ఎక్కడ విచారించిందో రహస్యంగా ఉంచింది. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్, ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి తదితరులను రోజుల తరబడి గుర్తు తెలియని ప్రదేశాల్లో నిర్బంధించి దర్యాప్తు పేరిట వేధించింది. ఎక్కడికి తరలించారో వారి కుటుంబ సభ్యులకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. అదే రీతిలో మద్యం డిస్టిలరీల ప్రతినిధులను కూడా దర్యాప్తు పేరిట బెంబేలెత్తించారు. తాము చెప్పినట్లు చేయకుంటే వారి వ్యాపారాలను దెబ్బ తీస్తామని హడలెత్తించారు. వారిని ఏ ప్రాంతంలో విచారించారో స్పష్టత లేదు. సిట్ అధికారులతోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, ప్రైవేటు వ్యక్తులు ఈ కేసు దర్యాప్తు పేరిట పలువురిని తీవ్రంగా వేధించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరించారు. లేదంటే వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువులపై సైతం అక్రమ కేసులు బనాయించి వేధిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డిని అదే రీతిలో బెదిరించగా ఆయన సమీప బంధువులను కూడా తీవ్రంగా వేధించినట్లు సమాచారం. అజ్ఞాత ప్రదేశాల్లో ఈ వ్యవహారాలను సాగించారు. అదే పోలీస్ స్టేషన్ను గుర్తించి అధికారికంగా ప్రకటిస్తే నిందితులు, సాక్షులు, ఇతరులను అక్కడే విచారించాల్సి ఉంటుంది. అందుకే సిట్ పోలీస్ స్టేషన్ అన్నది ఎక్కడో ప్రకటించకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.సీసీ టీవీ కెమెరాలు లేవు... జనరల్ డైరీ లేదు..సిట్ దర్యాప్తు ప్రహసనంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్దేశించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడాన్ని ఇటీవల హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్న కేసు విచారణ సందర్భంగా పోలీసు శాఖపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వ తీరు మారలేదని సిట్ వ్యవహారం వెల్లడిస్తోంది. విచారణ పేరుతో ఎవరెవర్ని పిలుస్తున్నారు..? ఎంతసేపు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు..? ఏ సమయంలో వచ్చారు... తిరిగి ఎప్పుడు వెళ్లారు..? వారితో పాటు న్యాయవాదులు వచ్చారా..? ఇలా ఏ ఒక్క అంశం అధికారికంగా రికార్డు కావడం లేదు. ఇక ఈ కేసుకు సంబంధించి జనరల్ డైరీ (జీడీ) నమోదు చేయడం లేదు. తద్వారా దర్యాప్తు ప్రాథమిక ప్రమాణాలను సిట్ బేఖాతరు చేస్తోంది. దాంతో ఈ కేసు దర్యాప్తులో సిట్కు జవాబుదారీతనం లేకుండా పోయింది. దర్యాప్తు పేరుతో ఎంతమందిని వేధించినా...శారీరకంగా, మానసికంగా హింసించినా తమను ప్రశ్నించకుండా ఉండాలన్నదే సిట్ లక్ష్యం. ప్రభుత్వ పెద్దల రెడ్బుక్ కుట్రలను అమలు చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిట్ దర్యాప్తు ప్రమాణాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు, పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తోందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.డిస్టిలరీ ప్రతినిధికి చిత్రహింసలు..అక్రమ కేసులతో వేధిస్తున్న సిట్ అరాచకాలకు తెలంగాణకు చెందిన ఓ డిస్టిలరీ ప్రతినిధి జైపాల్రెడ్డికి ఎదురైన చేదు అనుభవమే నిదర్శనం. దర్యాప్తు పేరుతో జైపాల్రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన సిట్ అధికారులు ఆయన్ను తీవ్రస్థాయిలో హింసించినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని ప్రదేశానికి తరలించి మూడు రోజులపాటు తీవ్ర వేధింపులకు గురి చేశారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ ఇన్చార్జీగా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్బాబు ఆయనపై విరుచుకుపడినట్లు సమాచారం. జైపాల్రెడ్డిని తీవ్రంగా హింసించి బెంబేలెత్తించారు. అయినప్పటికీ తాను అవాస్తవాలను వాంగ్మూలంగా ఇవ్వబోనని ఆయన నిరాకరించడంతో సిట్ అధికారుల కుట్ర బెడిసికొట్టింది. ఇదే రీతిలో పలువురు సాక్షులు, డిస్టిలరీల ప్రతినిధులను సిట్ బృందం అక్రమ నిర్భందాలతో వేధిస్తూ అరాచకానికి తెగబడుతోంది. ఈ కుతంత్రాన్ని అమలు చేసేందుకే సిట్ పోలీస్ స్టేషన్ను అధికారికంగా గుర్తించకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. -
అవినీతి నిత్య ‘సత్యం’
సాక్షి, అమరావతి: దోచుకో.. పంచుకో.. తినుకో..! లక్ష్యంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అస్మదీయులకు కాంట్రాక్ట్లను కట్టబెట్టడం.. అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో కీలక శాఖకు చెందిన అమాత్యుడి అవినీతి నిత్య‘సత్యం’గా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్లపై కన్నేసిన ఆయన ముందే కొన్ని సంస్థలతో డీల్ కుదుర్చుకుని వాటికి పనులను కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా గర్భిణులు, బాలింతలను ఆస్పత్రులకు, ఇంటి వద్దకు తరలించే కాంట్రాక్ట్ను అస్మదీయుడికి కట్టబెట్టడానికి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సేవలు అందిస్తున్న సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగియడంతో ఏపీఎంఎస్ఐడీసీ కొత్తగా టెండర్లను ఆహ్వానించింది. మొత్తం ఐదు వందల వాహనాలతో.. మూడేళ్ల కాల పరిమితితో టెండర్లను పిలిచారు. కాంట్రాక్టు పరిమితి ముగిశాక మరో రెండేళ్లు పొడిగించుకునేలా వెసులుబాటు కల్పించారు. ఏడాదికి రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ ఈ సేవలకు ప్రభుత్వం వెచ్చించే అవకాశం ఉంది. ఈ లెక్కన ఐదేళ్లకు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ ఇది!!అస్మదీయుడికి కట్టబెట్టేలా పక్కా ప్రణాళికగతంలోనూ అత్యవసర వైద్య సేవల్లో అక్రమాలకు తెర తీయగా.. ఆ ఆశలపై ప్రభుత్వ పెద్దలు నీళ్లు చల్లడంతో.. ప్రత్యామ్నాయంగా తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలపై సదరు నేత దృష్టి సారించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు నిర్వహిస్తున్న సంస్థ నిర్వాహకులను పిలిచి బెంగళూరుకు చెందిన తన సన్నిహితుడి సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మార్చితో ప్రస్తుత కాంట్రాక్ట్ ముగుస్తున్న తరుణంలో ఇప్పుడు సబ్ కాంట్రాక్ట్ తీసుకుని ఏం చేస్తారని అధికారులు నివేదించడంతో.. ఆ ఆలోచనను విరమించుకున్నారు. కొత్త కాంట్రాక్ట్నే తమవారికి కట్టబెట్టేలా వ్యూహ రచన చేశారు. ఈ నేపథ్యంలో కొత్త టెండర్ నిబంధనలన్నీ అస్మదీయ సంస్థకు అనుగుణంగా రూపొందించేలా అమాత్యుడు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. సదరు సంస్థకు సేవల నిర్వహణలో అనుభవం లేకపోవడంతో కన్షార్షియంలో ప్రస్తుత సేవల నిర్వహణ సంస్థ అనుభవాన్ని వాడుకునేందుకు సిద్ధమమైనట్లు సమాచారం. ఓ సంస్థకు కట్టబెట్టాలని ముందే నిర్ణయించుకుని, ఒకే బిడ్ దాఖలైనా ఆమోదించే వెసులుబాటుతో అడ్డగోలుగా నిబంధనలు రూపొందించారు. సాధారణంగా ఒకే బిడ్ దాఖలైన సందర్భాల్లో బిడ్ను రద్దు చేసి ప్రభుత్వం మళ్లీ టెండర్లకు వెళుతుంది. గత ప్రభుత్వంలో ఇదే నిబంధనతో ఇవే టెండర్లను నిర్వహించారు. అయితే తాజా టెండర్లలో మాత్రం ఒకే బిడ్ వచ్చినా ఆమోదించే అవకాశాన్ని సృష్టించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ముందే ఓ సంస్థను నిర్ణయించుకుని పేరుకు టెండర్ల తంతు నిర్వహిస్తోందని స్పష్టమవుతోంది.కాంట్రాక్ట్ లేకుండానే..తిరుపతికి చెందిన జనరిక్ మందుల సరఫరా సంస్థతో డీల్ కుదుర్చుకుని ప్రభుత్వాస్పత్రులకు జన్ ఔషధి మందుల సరఫరా పేరిట అమాత్యుడు ఇప్పటికే అవినీతికి తెర తీశారు! తాను డీల్ కుదుర్చుకున్న సంస్థతోనే ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్లు ఎంవోయూ కుదుర్చుకుని మందులు కొనుగోలు చేసేలా వైద్య శాఖ అధికారులతో నిబంధనలు రూపొందించి ఉత్తర్వులు ఇప్పించారు. ప్రభుత్వ బోధనాస్పత్రులకు డీ సెంట్రలైజ్డ్ బడ్జెట్లో సరఫరా కాని వాటితో పాటు అత్యవసర మందులు, సర్జికల్స్ను ఏటా రూ.50 కోట్లకుపైగా వెచ్చించి స్థానికంగా కొనుగోలు చేస్తుంటారు. ఈ కొనుగోళ్ల వ్యవహారంలో టెండర్లు పిలవకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన ఒకే సంస్థకు మేలు జరిగేలా అమాత్యుడు చక్రం తిప్పారు. మంత్రి డీల్ చేసుకున్న సంస్థతో ఆస్పత్రుల సూపరింటెండెంట్లు రెండేళ్ల ప్రాతిపదికన ఎంవోయూ చేసుకునేలా గతేడాది ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా ఆస్పత్రుల్లో ఎంవోయూలు పూర్తి అయ్యాయి. ఈ లెక్కన రెండేళ్లలో రూ.100 కోట్లకుపైగా బిజినెస్ కల్పించడం ద్వారా కమీషన్ల రూపంలో రూ.కోట్లలో ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.‘‘అత్యవసర’’ ఆశలపై నీళ్లు..!టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైద్య శాఖలో అత్యవసర సేవల నిర్వహణపై కన్నేసిన సదరు అమాత్యుడు ప్రస్తుత సేవల నిర్వహణ సంస్థను టార్గెట్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన యాజమాన్యం అమాత్యుడిని శరణు కోరగా.. తాను చెప్పిన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఇందుకు సరేనన్న యాజమాన్యం అమాత్యుడు సిఫార్సు చేసిన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ క్రమంలో సబ్ కాంట్రాక్ట్ కోసం వైద్య శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ఈ దశలో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని.. సబ్ కాంట్రాక్ట్లు కుదరవని, తమ అస్మదీయుడికి అత్యవసర వైద్య సేవల కాంట్రాక్ట్ కట్టబెడతామని చెప్పడంతో చేసేదేమీ లేక అమాత్యుడు సైలెంట్ అయిపోయారు. -
‘చంద్రబాబు చీప్ పాలిట్రిక్స్ మానుకో’
సాక్షి,విశాఖ: సీఎం చంద్రబాబు చీఫ్ పాలిట్రిక్స్ మానుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హితువు పలికారు. రాష్ట్రంలో విశాఖ మున్సిల్ కార్పొరేషన్పై కూటమి కుట్ర రాజకీయాలు తెరతీసింది.ఈ తరుణంలో కూటమి కుట్రా రాజకీయాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు.. మరి వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన కార్పోరేటర్లు, నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోండి. పార్టీ మారమని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రలోభాలతో ముగ్గురు నలుగురు కార్పొరేటర్లను చేర్చుకోవాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రలోభాలను పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలి. చంద్రబాబు చీఫ్ పాలిట్రిక్స్ చేయడం మానుకోవాలి. వైఎస్ జగన్పై కార్పొరేటర్లకు విడదీయరాని అనుబంధం ఉంది. కార్పొరేటర్లకు సముచిత స్థానం పార్టీలో ఉంటుంది. మా కార్పొరేటర్లను బెదిరించాలని చూస్తే సహించేది లేదు. అధికారం శాశ్వతం కాదు. మళ్లీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. భవిష్యత్తులో అసలైన రాజకీయం వారికి చూపిస్తాం. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. మరి వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన కార్పోరేటర్లు, నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోండి’అని సూచించారు. -
ఏపీ డీజీపీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు
ఢిల్లీ: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై మూడు రోజుల్లోగా జవాబు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరపాలన్న వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై ఏపీ ఎన్నికల సంఘం స్పందించింది.ఏపీ డీజీపీ నుంచి వివరణ కోరింది. -
‘చంద్రబాబు ప్రపంచానికే తానే దిక్సూచీ అనడం పెద్ద జోక్’
సాక్షి,తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించిన విజన్-2047 ఒక బూటకమని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. చంద్రబాబు ప్రపంచానికే తానే దిక్సూజీ అనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడం, ప్రపంచంలోనే తాను ఒక విజనరీగా చెప్పుకునేందుకే ఈ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ల నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కొనుగోలుశక్తిని పెంచకుండా, రాష్ట్రంలో తన విజన్తో సంపదను సృష్టిస్తానంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...శాసనసభలో చంద్రబాబు అమెరికా నుంచి ఎరువు తెచ్చుకున్న స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్ గురించి మాట్లాడుతూ చేసిన ప్రకటనలు ప్రజలను మభ్యపెట్టేందుకే. చంద్రబాబు నాలుగుసార్లు సీఎంగా ఉండి మూడు విజన్ డాక్యుమెంట్లను ప్రకటించారు. విజన్-2020 అని ఒకసారి, విజన్-2029 అని మరోసారి, తాజాగా విజన్-2047 అని మూడోసారి తన స్వర్ణాంధ్ర లక్ష్యాలను ఆయన చాటుతూనే ఉన్నారు. నిజంగా ఒక లక్ష్యం ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన గతంలో ప్రకటించిన విజన్లలో ఎన్ని సాధించారు? ఎంతమంది ప్రజల జీవితాల్లో ప్రగతిని తీసుకువచ్చారు? రాష్ట్రాన్ని ఎంత ఉన్నత స్థాయికి తెచ్చారో చెప్పాలి. గత రెండు విజన్లలోనూ చంద్రబాబు చేసింది ఏమిటా అని చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడమే. ఇప్పుడు తాజా విజన్లో పీ4 ద్వారా ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రజల ఆస్తులను కూడా ప్రైవేటువ్యక్తులకు కట్టబెట్టనున్నారు. చివరికి నడిచే రోడ్లను కూడా ప్రైవేటు వారికి అప్పగించి, టోల్ ట్యాక్స్ ద్వారా ప్రజల జేబులు ఖాళీ చేయించబోతున్నారు.విద్య-వైద్యాన్ని నిర్లక్ష్యం చేసిన ఘనుడుచంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. తన ఘనమైన విజన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళే పేదల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించాడు. ఆయన హయాంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. విద్యారంగంలో ప్రైవేటీకరణను ప్రోత్సహించారు. ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీకి పూర్తిగా సహకరించారు. తాను సీఎం కాదు, సీఈఓను అని పిలిపించుకునేందుకే చంద్రబాబు ఇష్టపడ్డారు. అలాగే పనిచేశారు. చివరికి చంద్రబాబు వరల్డ్ బ్యాంక్ జీతగాడు అంటూ వామపక్షాలు ఆయనకు గొప్ప బిరుదును ఇచ్చాయి. ఎంఎస్ఎంఈ లకు బదులుగా కార్పోరేట్ సంస్థలు వస్తేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడుతుందని నమ్మిన నాయకుడు చంద్రబాబు. విజన్ 2020 తరువాత రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాల సంఖ్య దాదాపు 70 శాతం ఉన్నట్లు తేలింది. అంటే ఆయన విజన్ వల్ల ఎక్కడ సంపద పెరిగింది? ప్రజలు సంపన్నులు ఎందుకు కాలేకపోయారు? చంద్రబాబు విజన్ వల్ల పేదరికం పెరిగింది. హైటెక్ సిటీ, చుట్టుపక్కల భూములు ఏ విధంగా ఒక వర్గానికే ఉపయోగపడేలా చంద్రబాబు విధానాలు సహకరించాయంటూ రీసెర్చ్ స్కాలర్లు పుస్తకాలు రాశారు. చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఏమీ లేవు.వ్యవసాయం దండగ అనే భావంతోనే పాలనవ్యవసాయం దండగ అనే భావంతోనే చంద్రబాబు పాలన సాగించారు. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు రెండు కోట్ల మంది రైతులు వ్యవసాయానికి దూరమయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ అడ్డుకుంటుంటే చంద్రబాబు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన హయాంలో చెప్పుకునేందుకు ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ తీసుకురాలేదు. ఇప్పుడు బనకచర్ల తన ఆలోచనల నుంచే పుట్టిందంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గతంలో ఐటీని తానే ప్రమోట్ చేశానని, హైదరాబాద్ను ప్రపంచపటంలో నిలబెట్టానంటూ గొప్పలు చెప్పుకున్నారు. తాను లేకపోతే హైదరాబాద్కు ఐటీ వచ్చేదేకాదు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడారు. మరి ముంబై, బెంగుళూరు వంటి నగరాలు ఐటీలో మనకన్నా ముందుగానే అభివృద్ధి చెందాయన్న విషయాన్ని మాత్రం చంద్రబాబు మరిచిపోతుంటారు. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వల్ల దేశంలో ఎలక్ట్రానిక్ యుగం ప్రారంభమైందని, స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి గారి ఫీజురీయింబర్స్మెంట్ వంటి పథకాల వల్ల గ్రామాల్లోంచి కూడా సాంకేతిక విద్యను చదివిన ఐటీ నిపుణులు పుట్టుకు వచ్చారనే వాస్తవాలను చంద్రబాబు అంగీకరించరు. ఆఖరికి కరోనా వల్ల ఐటీ కంపెనీలు వర్క్ఫ్రం హోం అవకాశం ఇస్తే, దానికి కూడా తన సూచనల వల్లే ఈ విధానంను ఐటీ సంస్థలు పాటించాయని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు.పొలిటికల్ గవర్నెన్స్ చంద్రబాబు విజనా?పాత రాజకీయాలకు కాలం చెల్లింది, నేను కొత్త రాజకీయాలు తయారు చేస్తానంటూ విజన్ 2020లో ప్రకటించారు. అంటే జన్మభూమి కమిటీలను తీసుకురావడం, పొలిటికల్ గవర్నెన్స్ను తీసుకురావడమే ఆయన విజనా? స్థానిక సంస్థల్లో ఒక్క ప్రజాప్రతినిధి లేకపోయినా, ఫిరాయింపులతో పదవులను కాజేయడమే ఆయన గవర్నెన్స్ లక్ష్యమా? ప్లెయిన్ స్పీచ్ అనే పుస్తకంలో ప్రభుత్వం యంత్రాంగం అవినీతిలో మునిగిపోయింది, బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవన్నీ చంద్రబాబు మరిచిపోయారా? ఇప్పుడు విజన్ 2047 గురించి బాధ్యత లేకుండా మాట్లాడారు. తన తాజా విజన్లో ఈ దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి వెడుతుందని పేర్కొన్నారు. ఒక సీఎంగా ఏ రకంగా దేశ జీడీపీ గురించి మాట్లాడుతున్నారు? 2047 నాటికి ప్రతి ఇంటికి 18వేల డాలర్ల ఆదాయం ఉండాలని సూచిస్తున్నారు. అంటే 2047 వరకు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఏం అడగకూడదు. చంద్రబాబును ఆయన హామీల గురించి ప్రశ్నించకూడదు. స్వర్ణాంధ్ర విజన్ను విజయవంతం చేసే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలి, పారిశ్రామికవేత్తలను కూడా వారే తీసుకురావాలని చంద్రబాబు సూచిస్తున్నారు. అలాంటప్పుడు దావోస్కు సీఎంగా ఆయన ఒక్కడే ఎందుకు వెళ్ళడం? ఎమ్మెల్యేలను కూడా తీసుకువెళ్ళాలిగా? రాష్ట్రంలో 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను తీసుకువస్తాను, సంపదను సృష్టిస్తానని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా 13 శాతం వృద్ధిరేటు సాధించాలనే లక్ష్యంతో ఉన్నమని చెబితే, తాజాగా చంద్రబాబు 17 శాతం వృద్ధి రేటును సాధిస్తామని ఏ ప్రాతిపాదికన చెబుతున్నారు? ఇప్పటి వరకు అన్నింటిలోనూ లోటు కనిపిస్తోంది. ఇలా అంకెల గారడీతో ప్రజలను మభ్యపెడతారా? రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ళలో 3.7 శాతం వృద్ధిరేటు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో 7.23 శాతం వృద్దిరేటు తక్కువగా ఉంది. సేల్స్ టాక్స్లో 6.66 శాతం వృద్ధిరేటు తక్కువగా ఉంది. క్యాపిటల్ ఇన్వేస్ట్మెంట్ 50.53 శాతం తగ్గింది. సంపద పెరిగిందని ఎలా చెబుతున్నారు? ప్రపంచానికే చంద్రబాబు దిక్సూచీ అనడం పెద్ద జోక్ప్రపంచానికే తాను దిక్సూచీగా మారతానని విజన్ డాక్యుమెంట్లో ప్రకటించుకోవడం పెద్ద జోక్. గతంలో ఆయన హయాంలోనే 54 ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఆయన ఏపీ ఆయిల్ సీడ్స్ ను కూడా ప్రైవేటువారికి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, 1.30 లక్షల ఎకరాల ఆర్టీసీ భూములను, వైయస్ జగన్ హయాంలో నిర్మించిన పోర్ట్లను కూడా ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. అలాగే త్రిభాషా విధానంపైన మాట్లాడుతున్న చంద్రబాబు ప్రజలు కోరుతున్న అన్ని భాషలను ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళలోకి తీసుకురాలేకపోతున్నారు? -
బాబు వెన్నుపోటు.. యనమల స్ట్రాంగ్ రిటార్ట్!
విజయవాడ, సాక్షి: తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడి(Yanamala Rama Krishnudu) అసమ్మతి గురించి విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీల వీడ్కోలు సభకు రావాలంటూ ఆహ్వానం పంపినప్పటికీ.. ఆయన సీఎం చంద్రబాబు(CM Chandrababu)కి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే గైర్హాజరు అయ్యారని స్పష్టమైన సమాచారం. టీడీపీలో తనకు కొనసాగుతున్న అవమానమే ఇందుకు కారణమని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.తాజాగా.. ఏడుగురు ఎమ్మెల్సీలకు(Seven MLCs) మండలి వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని మండలిలో స్పష్టంగా మెన్షన్ చేశారు కూడా. అయితే తన చేత బలవంతంగా రాజకీయ విరమణ చేయిస్తున్న చంద్రబాబు చర్యలకు ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆ వీడ్కోలు మీటింగ్కు కావాలనే డుమ్మా కొట్టి.. టీడీపీలోనే గుసగుసలాడుకునేలా చేశారు.ఆరుసార్లు వరుస ఎమ్మెల్యే, రెండుసార్లు ఎమ్మెల్సీ, ఒకసారి స్పీకర్, పైగా మంత్రిగా కూడా. టీడీపీలో మొదటి నుంచి ఉన్న యనమలకు చంద్రబాబు ఈ మధ్యకాలంలో ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు. ఆయన కూతురు ఎమ్మెల్యే, బంధువులకు మంచి స్థానాలు దక్కినప్పటికీ.. తనకు ఒక్కసారిగా ప్రాధాన్యం తగ్గించడంపై యనమల రగిలిపోతున్నారు. పైగా గత ఐదేళ్లు మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగినా కూడా తనకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయినట్లు ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పైగా ఎమ్మెల్సీ(MLC)గా రెన్యువల్ అవకాశాలు ఉన్నా చంద్రబాబు ఆ పని చేయలేదు. కనీసం ఆయనకున్న రాజకీయానుభవాన్ని కూడా అధినేత పట్టించుకోవడం లేదని ఆయతన వర్గీయులు అంటున్నారు. పైగా తానే స్వచ్ఛందంగా రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నట్లు.. రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు.. టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించడాన్ని యనమల భరించలేకపోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లోనే ఇంకొంత కాలం కొనసాగి.. ఆపై రాజకీయాలకు గుడ్బై చెప్పాలని ఆయన భావించారని ఆయన వర్గీయులు అంటున్నారు. ఈలోపు చంద్రబాబు తన మార్క్ వెన్నుపోటు రాజకీయం యనమల మీదకూ ప్రయోగించారని ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలతో చివరకు.. చంద్రబాబుతో ఉమ్మడి ఫోటోకి కూడా ఇష్టపడని యనమల వీడ్కోలు మీటింగ్కు వెళ్లలేదు. మరోవైపు ‘ఫార్టీ ఇయర్స్ ఇన్ పాలిటిక్స్’ యనమల లేకుండా ఈ మీటింగ్ జరగడంపై టీడీపీలో ఇప్పుడు విస్తృత చర్చ నడుస్తోంది. -
మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ అభ్యంతరం
AP Assembly And Council Updates11:05 AMశాసనమండలికి స్వల్ప విరామంశాసనమండలి కేంద్రం నుంచి వచ్చే వ్యవసాయ పథకాల్లో కేంద్రం వాటా ఉందా లేదా అని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ సభ్యులువైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నకు వ్యంగ్యంగా సమాధానమిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడుమంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యల పై వైఎస్సార్సీపీ అభ్యంతరంశాసనమండలి విపక్ష నేత,బొత్స సత్యనారాయణవ్యవసాయానికి పేటెంట్ ఎవరిదో...వ్యవసాయం సుద్ధ దండగ అని ఎవరు చెప్పారో అందరికీ తెలుసువ్యవసాయానికి ఎవరు ఏం చేశారో చర్చించుకుమదామంటే మేం రెఢీసభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విమర్శలు చేయడం సరికాదుకేంద్రం ఇచ్చిన క్లస్టర్ల పై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం10:45AMపెన్షన్ల పై మండలిలో ప్రశ్నోత్తరాలువైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్జగన్ ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 53 లక్షల మందికి పెన్షన్ లు ఉన్నాయికూటమి అధికారంలోకి వచ్చే సమయానికి 65 లక్షలకు పెన్షన్లు పెరిగాయిఇప్పుడు పెన్షన్లు తొలగిస్తే ...ఎన్ని తొలగించారువైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్గత ప్రభుత్వ హయాంలో ఇబ్బడిముబ్బడిగా పెన్షన్లు మంజూరు చేసిందికూటమి అధికారంలోకి వచ్చాక 1.89 లక్షల మంది పెన్షన్లు తగ్గించారుబడ్జెట్ లో ఉన్న పెన్షన్లకి సరిపడా కేటాయింపులు చేయలేదు50 ఏళ్లకే ఇస్తామన్న పెన్షన్లు ఇస్తారా.. లేదా..పెన్షన్ల పరిశీలన అంటూ తగ్గిస్తూ వెళ్తున్నారుకూటమి నేతలు హామీ ఇచ్చిన విధంగా అర్హులకు పెన్షన్లు ఇవ్వాలివైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు..యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు..కొత్త ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఏ ప్రతిపాదన చేయలేదు. నిన్నటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలుఎస్సీల వర్గీకరణపై కమిషన్ నివేదికకు ఆమోదంరాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు వైఎస్సార్ జిల్లా.. వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్పురాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు వైఎస్సార్ జిల్లా.. వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్పు‘నిరుద్యోగ భృతి’.. ‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’పథకం అమలుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ప్రశ్న సభకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన మంత్రి ‘ఆ పథకాన్ని తమ శాఖ అమలు చేయడం లేదంటూ’ జవాబు ఎప్పటిలోగా అమలు చేస్తారన్నదానికి ‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’ పథకం ఎప్పటినుంచి అమలు అన్నదానిపైనా దాటవేత చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్కు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ⇒ ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు వద్ద బుడమేరు డైవర్షన్ రెగ్యులేటర్ మెకానికల్, ఎలక్ట్రికల్ పరికరాల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు, రూ.37.97 కోట్లతో బుడమేరు డైవర్షన్ చానల్ వరద నివారణ రక్షణ గోడల నిర్మాణానికి పరిపాలన ఆమోదం.⇒ గుంటూరు జిల్లాలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (వీవీఐటీయూ)ని బ్రౌన్ఫీల్డ్ కేటగిరీ కింద ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపనకు అనుమతించేందుకు చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.⇒ సీఆర్డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సమీక్ష, మంత్రుల బృందం సిఫార్సుల ఆమోదానికి సీఆర్డీఏ కమిషనర్ను అనుమతిస్తూ నిర్ణయం. రూ.22,607.11 కోట్ల విలువైన 22 పనులకు ఎల్ 1 బిడ్లను ఆమోదించడానికి ఏపీసీఆర్డీఏ కమిషనర్కు అధికారం. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హడ్కో, కేఎఫ్డబ్ల్యూ తదితర ఆర్ధిక ప్రాజెక్టులకు సంబంధించి రూ.15,095.02 కోట్ల విలువైన 37 పనుల ప్యాకేజీకి సంబంధించి బోర్డు నిర్ణయాన్ని అమలు చేసేందుకు సీఆర్డీఏ ఎండీకి అధికారం. -
గన్స్@ వాట్సాప్
సాక్షి, అమరావతి: భారత్లో వాట్సాప్ గ్రూపుల ద్వారా తుపాకుల అమ్మకాలు జరుగుతున్నట్టు ప్రముఖ సోషల్ మీడియా టూల్స్ పరిశోధక సంస్థ డిజిటల్ విట్నెస్ ల్యాబ్ వెల్లడించింది. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ సంస్థ పరిశోధనలో విస్మయకర విషయాలు వెలుగుచూశాయి. దేశంలోని భద్రతా చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ వాట్సాప్ గ్రూపుల్లోనే తుపాకుల విక్రయాలకు సంబంధించిన ప్రకటనలు పోస్టు చేస్తున్నారని తెలిపింది.గతంలో అక్రమ తుపాకులు కొనుగోలు చేయాలంటే ఉత్తరప్రదేశ్, బిహార్, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఆ రాష్ట్రాల్లో అక్రమ ఆయుధాల విక్రేతలను లేదా వారి ఏజెంట్లను రహస్యంగా కలిసి ఆయుధాలు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే... కేవలం వాట్సాప్ ద్వారానే తాము కోరుకున్న అక్రమ తుపాకులు కొనుగోలు చేస్తున్నారు. ఈ–కామర్స్ సంస్థల ద్వారా ఆ ఆయుధాలు డోర్ డెలివరీ అవుతున్నాయని డిజిటల్ విట్నెస్ ల్యాబ్ వెల్లడించింది. పరిశోధనలో వెల్లడైన అంశాలివీ...⇒ ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు కేంద్రంగా దేశవ్యాప్తంగా అక్రమ తుపాకుల వ్యాపారం జోరుగాసాగుతోంది. అక్రమ ఆయుధాల వ్యాపారులు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసి మరీ తుపాకులు అమ్ముతున్నారు. తమవద్ద ఉన్న తుపాకులు, వాటి ధరలు, ఇతర వివరాలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు.⇒ 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి మధ్య మన దేశంలో వాట్సాప్ చాటింగ్ ద్వారా అక్రమ తుపాకుల విక్రయాలకు సంబంధించిన 8 వేలకుపైగా ప్రకటనలు జారీ చేశారు. ⇒ ఏకంగా 234 వాట్సాప్ గ్రూపుల్లో అక్రమ తుపాకుల విక్రయాల వివరాలను పోస్టు చేశారు. ఆ వాట్సాప్ గ్రూపులన్నీ బహిరంగంగానే అందరికీ అందుబాటులో ఉండటం గమనార్హం. ఒక్కో వాట్సాప్ గ్రూపులో వందలాది మంది సభ్యులు ఉన్నారు. ⇒ మన దేశంలో 40 కోట్ల మందికి పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు. దాంతో వ్యాపార, పారిశ్రామిక సంస్థలు వాట్సాప్ను తమ వ్యాపార విస్తరణకు వేదికగా చేసుకుంటున్నాయి. అక్రమ ఆయుధాల వ్యాపారులు కూడా అదే రీతిలో వాట్సాప్ ద్వారానే తమ కార్యకలాపాలు సాగిస్తుండటం గమనార్హం. నిషేధం ఉన్నా పట్టించుకోని ‘మెటా’'సోషల్ మీడియా వేదికల ద్వారా ఆయుధాల వ్యాపారం భారత్లో నిషిద్ధం. కానీ.. ఈ విషయాన్ని మెటా సంస్థ పెద్దగా పట్టించుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. మెటా సంస్థే నిర్వహిస్తున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా అక్రమ ఆయుధాల అమ్మకాల ప్రకటనలు జారీ చేసిన ఓ ముఠాను 2023లో ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా మెటా సంస్థ సరైన నియంత్రణ చర్యలు చేపట్టలేదు. 2022–2024లో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో అక్రమ ఆయుధాల విక్రయాల ప్రకటనలను మెటా సంస్థ ఆమోదించడం అప్పట్లోనే తీవ్ర అలజడి సృష్టించింది. ప్రస్తుతం భారత్లోనూ మెటా సంస్థ నిర్వహిస్తున్న వాట్సాప్ ద్వారా పలు ముఠాలు అక్రమ ఆయుధాల ప్రకటనలు జారీ చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.బిజినెస్ ఖాతాల ద్వారానే..అక్రమ ఆయుధాల ప్రకటనలు జారీ చేస్తున్న ముఠాల వాట్సాప్ ప్రొఫైల్స్ను డిజిటల్ విట్నెస్ ల్యాబ్ విశ్లేషించింది. ఆ ముఠాలన్నీ బిజినెస్ ఖాతాల ద్వారానే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కస్టమర్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు ఆ ఖాతాలన్నీ అదనపు ఫీచర్లు కలిగి ఉన్నాయని కూడా గుర్తించింది. కోడ్ భాషలో అక్రమ ఆయుధాలను విక్రయిస్తున్నారని పేర్కొంది. 2022లో 1.04 లక్షల అక్రమ ఆయుధాల జప్తునేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం 2022లో దేశంలో 1.04 లక్షల అక్రమ ఆయుధాలను పోలీసులు జప్తు చేశారు. పోలీసుల దృష్టికి రాని అక్రమ ఆయుధాలు అంతకుమించి ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు. అంటే దేశంలో అక్రమ ఆయుధాల వ్యాపారం ఎంతగా విస్తరించిందన్నది ఈ ఉదంతం వెల్లడిస్తోంది. మరోవైపు వాట్సాప్ ద్వారా తుపాకుల విక్రయాలకు ప్రకటనలు జారీ చేస్తుండటం అక్రమ ఆయుధాల ముఠాల బరితెగింపునకు నిదర్శనం. -
అంగన్‘వేడి’
సాక్షి, అమరావతి: మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు ఉష్ణోగ్రతలను తాళలేక అల్లాడుతున్నారు. తక్షణమే అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణలో ఈ నెల 15 నుంచి మే 31వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ బడులను ఒంటిపూట నిర్వహిస్తున్నారు.మన రాష్ట్రంలో మాత్రం ఈ విషయమై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి వాటిని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట నిర్వహించే దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.తక్షణ నిర్ణయానికి పేరెంట్స్ డిమాండ్అంగన్వాడీ కేంద్రాలకు వెళుతున్న చిన్నారులు మండే ఎండల్లో సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉండాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం ఈ అవకాశం కల్పించలేదు. ప్రభుత్వ బడుల మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలను కూడా ఒంటిపూట నిర్వహించే విషయంలో ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.కాగా.. అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు సైతం ఇవ్వకుండా పిల్లలకు సేవలు కొనసాగించేలా ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు ఒంటిపూట నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇదే సమయంలో అంగన్వాడీ కేంద్రాలు మూతపడకుండా వర్కర్లకు, హెల్పర్లకు 15 రోజుల చొప్పున వేసవి సెలవులు ఇవ్వాలని భావిస్తోంది. మే 1 నుంచి 15 వరకు వర్కర్లకు, మే 16 నుంచి 31 వరకు హెల్పర్లకు సెలవులు ఇచ్చే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. -
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు మొదటి లాంగ్వేజ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్రామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6,27,277 మంది విద్యార్థులకు గాను 6,16,451 మంది(98.27 శాతం) హాజరయ్యారని పేర్కొన్నారు. 3,450 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా.. 1,545 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశాయని తెలిపారు. కర్నూలు జిల్లాలో కాపీయింగ్కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను డిబార్ చేసినట్లు వెల్లడించారు.కాంపోజిట్కు బదులు జనరల్ పేపర్ రాసిన విద్యార్థిని!తెనాలిఅర్బన్ : పదో తరగతి పరీక్షల్లో అపశృతి దొర్లింది. కాంపోజిట్ తెలుగు పరీక్ష రాయాల్సిన విద్యార్థిని జనరల్ తెలుగు పేపరు రాసింది. విద్యాశాఖ అధికారుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎంహెచ్ స్కూ ల్లో కే ధనశ్రీ ³దో తరగతి పరీక్షలు రాసేందుకు సోమవారం పాఠశాలకు వచ్చింది.ఆమె కాంపోజిట్ తెలుగు పరీక్ష రాయాల్సి ఉండగా.. ఇన్విజిలేటర్ పొరపాటున జనరల్ తెలుగు పేపరు ఇచ్చారు. విద్యార్థిని కూడా సకాలంలో గుర్తించకుండా పరీక్ష రాసేసింది. చివరి సమయంలో గుర్తించి.. విషయాన్ని ఇన్విజిలేటర్కు తెలియజేసింది. అప్పటికే సమయం మించిపోవడంతో చేసేది లేక ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేసి.. రాసిన పేపరును పరిగణనలోకి తీసుకునేలా చూస్తామని ఇన్విజిలేటర్ చెప్పారు. దీనిపై విచారణ జరిపిన డీఈవో సీవీ రేణుక.. ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేశారు. విద్యార్థికి ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని డీఈవో ప్రకటించారు. -
రాష్ట్రంలో మండే ఎండలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత అధికమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్రలోని 40 మండలాల్లో సోమవారం ఎండ తీవ్రత అధికంగా నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 12, అనకాపల్లిలో 11, విజయనగరంలో 10, శ్రీకాకుళం జిల్లాలో 7 మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.అలాగే రాష్ట్రంలోని మరో 78 మండలాలపై కూడా భానుడు తన ప్రతాపం చూపించాడు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, అనకాపల్లి జిల్లా నాతవరం, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1, కర్నూలు జిల్లా నన్నూర్లో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం కూడా ఉత్తరాంధ్రలో ఎండల తీవ్రత కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
ఎస్సీల వర్గీకరణపై కమిషన్ నివేదికకు ఆమోదం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణపై ఏర్పాటైన రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు కమిషన్ సిఫార్సుల అమలుకు పచ్చజెండా ఊపింది. వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ తాడిగడప మున్సిపాల్టీ పేరులో వైఎస్సార్ పేరును తొలగించి తాడిగడప మున్సిపాల్టీగా చట్ట సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.⇒ చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్కు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ⇒ ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు వద్ద బుడమేరు డైవర్షన్ రెగ్యులేటర్ మెకానికల్, ఎలక్ట్రికల్ పరికరాల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు, రూ.37.97 కోట్లతో బుడమేరు డైవర్షన్ చానల్ వరద నివారణ రక్షణ గోడల నిర్మాణానికి పరిపాలన ఆమోదం.⇒ గుంటూరు జిల్లాలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (వీవీఐటీయూ)ని బ్రౌన్ఫీల్డ్ కేటగిరీ కింద ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపనకు అనుమతించేందుకు చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.⇒ సీఆర్డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సమీక్ష, మంత్రుల బృందం సిఫార్సుల ఆమోదానికి సీఆర్డీఏ కమిషనర్ను అనుమతిస్తూ నిర్ణయం. రూ.22,607.11 కోట్ల విలువైన 22 పనులకు ఎల్ 1 బిడ్లను ఆమోదించడానికి ఏపీసీఆర్డీఏ కమిషనర్కు అధికారం. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హడ్కో, కేఎఫ్డబ్ల్యూ తదితర ఆర్ధిక ప్రాజెక్టులకు సంబంధించి రూ.15,095.02 కోట్ల విలువైన 37 పనుల ప్యాకేజీకి సంబంధించి బోర్డు నిర్ణయాన్ని అమలు చేసేందుకు సీఆర్డీఏ ఎండీకి అధికారం.⇒ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో రూ.390 కోట్ల విలువైన ఏపీ ట్రాన్స్కో 400 కేవీ డీసీ లైన్లు, పీజీసీఐఎల్ 400 కేవీ డీసీ లైన్ల రీ రూటింగ్, బ్యాలెన్స్ పనులకు, రూ.1082.44 కోట్ల విలువైన ఎన్ 10, ఎన్ 13, ఈ 1 జంక్షన్ వరకు యూజీ కేబుల్స్ ద్వారా 22కేవీ హెవీ లైన్ల రీ రూటింగ్ బ్యాలెన్స్ పనులను 8.99 శాతం ఎక్కువకు అప్పగించేందుకు ఆమోదం.⇒ అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 4,000 ఎండబ్ల్యూ పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోద ముద్ర.⇒ అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో 1,800 మెగావాట్ల ఆఫ్–స్ట్రీమ్ క్లోజ్డ్ లూప్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు మెస్సర్స్ ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు 864.87 ఎకరాల భూమిని కేటాయింపు. కొత్త పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, ఇతర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం ఎస్పీవీ ఏర్పాటుకు ఎన్హెచ్పీసీతో జేవీ ఒప్పందానికి ఆమోదం. ⇒ వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం దిగువపట్నం వద్ద ‘ఒబెరాయ్ విలాస్’ రిసార్ట్ అభివృద్ధికి మెస్సర్స్ ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్కు గతంలో కేటాయించిన 50 ఎకరాల భూమి, యాక్సెస్ రోడ్డు రీ ఎలైన్మెంట్కు ఆమోదం.⇒ కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గతేడాది వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో రూ.63.73 కోట్లతో నామినేషన్ పద్ధతిలో చేపట్టిన 517 పనుల పరిపాలనా అనుమతులకు ఆమోదం. -
నెలలోగా సమస్యలు పరిష్కరించాలి
సాక్షి, అమరావతి/గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): తమకు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా అమలు చేయడంతో పాటు కనీస వేతనాలు వర్తింప చేయాలని, అక్రమంగా తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. నెల రోజుల్లోగా తమ న్యాయ మైన డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.గ్రామ పంచాయతీ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.ఉమామహేశ్వరరావు మాట్లాడు తూ 1999లో జారీ చేసిన 551 జీవోలోని గుర్తింపు కార్డులు, కనీస వేతనం, పీఎఫ్, ఇఎస్ఐ వంటి సౌకర్యాలు 40 వేల మంది పంచాయతీ కార్మికులకు నేటికీ అందడం లేదన్నారు. కనీసం గుర్తింపు కార్డు లు కూడా లేవన్నారు. కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారే గానీ, ప్రతి నెలా జీతాలు చెల్లించకుండా పస్తులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు.ప్రస్తుతం 4 నుండి 45 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల కులు మారినప్పుడల్లా ఇష్టానుసారం పంచాయతీ కార్మికులను ఉద్యోగాల నుంచి అక్రమంగా తొలగిస్తుండటం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం తొలగించిన వారందరినీ వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ కార్మికుల గోడు వినకపోవడం బాధాకరమని ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నెల రోజుల్లోగా తమ సమస్యలు పరిష్కారం కావాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని, అవసరమైతే నిరవధిక సమ్మెలోకి వెళ్లడానికి కూడా సిద్ధమేనని కె.ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకట్రామయ్య మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల శ్రమను గుర్తించకుండా పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో, విజయవాడ వరదల్లో పంచాయతీ కార్మికులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనులు చేశారని గుర్తు చేశారు.సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ గుళ్లు, గోపురాలు తిరగడం తప్ప తన శాఖ పరిధి లోని పంచాయతీ కార్మికులు, ఇతర చిరుద్యోగుల గురించి పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.పంచాయతీ యూనియన్ రాష్ట్ర నాయకులు, వివిధ సంఘాల నేతలు జి.రామాంజనేయులు, కె.శివప్రసాద్, ఎం.పోలినాయుడు, వాకాటి రాము, ఆంజనేయులు, ఇంటి వెంకటేశ్వరరావు, కొమ్మినేని శ్రీనివాసరావు, సిహెచ్ సుబ్బారావు, రమాదేవి, ఎస్ సురేంద్ర, శారద, గౌరి, చింతల శ్రీనివాసరావు, నాగన్న, గోవిందప్ప, ధనలక్ష్మి, కె.సుబ్బరావమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వలంటీర్లు
సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఎన్నికల ముందు ఓట్ల కోసం హామీలిచ్చి.. తమను నమ్మించి వంచించారని వలంటీర్లు మండిపడ్డారు. వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, తొమ్మిది నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ.10 వేలకు గౌరవ వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ సత్తా ఏపాటిదో భవిష్యత్లో కూటమి నేతలకు తెలిసొచ్చేలా చేస్తామని హెచ్చరించారు. కూటమి సర్కారు తీరును నిరసిస్తూ సోమవారం వారు విజయవాడ అలంకార్ సెంటర్లో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వలంటీర్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా తప్పించుకోవడానికి, కూటమి ప్రభుత్వ పెద్దలు 2023 ఆగస్టు నుంచే రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ మనుగుడలో లేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు వరకు 2024 మే నెల వేతనాలను జూన్ ఒకటిన ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు.తాము అధికారంలోకి రాగానే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని గత మార్చిలో హామీ ఇవ్వడం నిజం కాదా.. అని ప్రశ్నించారు. 2023 ఆగస్టులో ఆ వ్యవస్థ అమలులో లేకపోతే, దానిపై 2024 మార్చిలో ఎలా హామీ ఇచ్చారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని 2.60 లక్షల మంది వలంటీర్ల కుటుంబాలను మానసికంగా, శారీరకంగా హింసిస్తుండటం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్ల వ్యవస్థను పక్కనపెట్టి, 2014–19 మధ్య ఉన్న జన్మభూమి కమిటీలను తిరిగి తీసుకొచ్చే యత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పుట్టని బిడ్డతో ఓట్లెలా వేయించుకున్నారు?వలంటీర్ల విషయంపై ప్రభుత్వ పెద్దలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడం అన్యాయం అని వలంటీర్ల సంఘం ప్రతినిధులు దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనం రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక కూడా ఇదే మాట చెప్పారని, ఆ తర్వాత నెల రోజులకే మాట మార్చి వలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని చెప్పడం దుర్మార్గమన్నారు. పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతామని వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అలాంటప్పుడు పుట్టని బిడ్డకు ఎలా మాయ మాటలు చెప్పారని, వారితో ఎలా ఓట్లు వేయించుకున్నారని నిలదీశారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలైన వలంటీర్లను తాము నెత్తిన పెట్టుకొని మోయాలా.. అని మంత్రి లోకేశ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న వారికి పార్టీలతో సంబంధం ఉండదని గుర్తు చేశారు. వలంటీర్లలో ఎక్కువ మంది ఆడపడుచులే ఉన్నందున, తాము వారికి అన్యాయం చేయమంటూ ఎన్నికల ముందు మాట్లాడిన పవన్కళ్యాణ్ ఇప్పుడు ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. తమకిచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలకు తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.సీఐటీయూ అనుబంధ ఏపీ గ్రామ, వార్డు వలంటీర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వలంటీర్లంతా సంఘటితమై సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేసే రోజు వస్తుందని హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరావు మాట్లాడుతూ మొన్నటి విజయవాడ వరదల్లోనూ వలంటీర్ల సేవలు వినియోగించుకున్న ప్రభుత్వం, ఇపుడు ఆ వ్యవస్థ లేదని మాట్లాడుతుండటం దుర్మార్గమన్నారు. ఈ ధర్నాకు వలంటీర్ల సంఘ ప్రతినిధులు పిజానీ, శ్యామలా ప్రసాద్ అధ్యక్షత వహించారు. -
నీకది.. నాకిది 'నాకింత.. నీకింత'!
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యనేతల లాలూ‘ఛీ’ పర్వం బట్టబయలైంది! టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయక ముందే అస్మదీయ కాంట్రాక్టు సంస్థలతో బేరసారాలు జరిపి, అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి అంచనా వ్యయాలను పెంచేసేలా చక్రం తిప్పారు. ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థలు మాత్రమే బిడ్లు దాఖలు చేసేలా ఆ పనులకు అర్హతలను నిర్దేశించి టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయించారు. వాటిని అధిక ధరలకు కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టారు. ఏడీసీఎల్ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్) రూ.10,081.82 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 35 పనులను ముఖ్యనేత అత్యంత సన్నిహితులకు చెందిన ఆరు కాంట్రాక్టు సంస్థలకు పంచి పెట్టడమే అందుకు నిదర్శనం. 2014–19 మధ్య ముఖ్యనేత తరఫున కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకి పట్టుబడ్డ అధికారే నేడు రాజధాని నిర్మాణ టెండర్లలోనూ కాంట్రాక్టర్లతో బేరసారాలు సాగిస్తుండటం గమనార్హం. పనులు అప్పగించి కాంట్రాక్టర్లతో ఏడీసీఎల్ ఒప్పందం చేసుకోగానే అంచనా వ్యయంలో 10 శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుగా ఇప్పించేసి.. అందులో తిరిగి 8 శాతాన్ని ఆ అధికారి ద్వారా కమీషన్గా వసూలు చేసుకునే దిశగా ముఖ్యనేత వేగంగా అడుగులు వేస్తున్నారు. టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూరుస్తూ, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాలను తమ అక్రమాలకు అడ్డు వస్తున్నాయని రద్దు చేసిన చంద్రబాబు సర్కారు రాజధాని టెండర్లలో ఆకాశమే హద్దుగా అక్రమాలకు తెర తీసింది.రూ.31 వేల కోట్ల రుణ ఒప్పందాలు..రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు) ద్వారా రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్)నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా రూ.5 వేల కోట్లు వెరసి ఇప్పటికే రూ.31 వేల కోట్ల రుణం తీసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. ఈ రుణంతో రాజధాని ప్రాంతంలో ఏడీసీఎల్, సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ద్వారా నిర్మాణ పనులను చేపట్టింది. ఏడీసీఎల్ రూ.10,714.57 కోట్లకు.. సీఆర్డీఏ రూ.20,358.83 కోట్లకు కలిపి మొత్తంగా రూ.31,073.4 కోట్లతో ఇప్పటివరకూ రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచాయి. ఇందులో ఏడీసీఎల్ రూ.10,081.82 కోట్లతో పిలిచిన 35 పనుల టెండర్లను ఇటీవల ఖరారు చేశారు.ఇతరులు బిడ్ వేస్తే అనర్హత వేటే..ముఖ్యనేతలు ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థలు మినహా ఇతరులు ఎవరైనా బిడ్ వేస్తే అనర్హత వేటు వేయాలన్న ఉన్నత స్థాయి ఆదేశాలను ఏడీసీఎల్ అధికారులు నిక్కచ్చిగా అమలు చేశారు. తస్మదీయ సంస్థపై అనర్హత వేటు వేసి.. అస్మదీయ సంస్థకే పనులు కట్టబెట్టారు. రాజధాని ముంపు నివారణ పనుల్లో రెండో ప్యాకేజీ (నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వకం, కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం) పనులే అందుకు నిదర్శనం. ఆ పనులకు హెచ్ఈఎస్ ఇన్ఫ్రా సంస్థ బిడ్ దాఖలు చేయగా తస్మదీయ సంస్థ కావడంతో అనర్హత వేటు వేశారు. 3.98 శాతం అధిక ధరకు బిడ్ దాఖలు చేసిన ఎమ్వీఆర్ ఇన్ఫ్రా(మంత్రి నారా లోకేష్ తోడల్లుడు విశాఖ ఎంపీ ఎం.భరత్కు అత్యంత సన్నిహితుడైన ముప్పాన వెంకటరావుకు చెందిన సంస్థ)కు ఆ పనులను కట్టబెట్టారు. ఇక ఎన్–18 రహదారి (ప్యాకేజీ–5) నిర్మాణ టెండర్లలో బిడ్ దాఖలు చేసిన హజూర్ మల్టీ ప్రాజెక్టŠస్ సంస్థపై అనర్హత వేటు వేసి... వాటిని బీఎస్సార్ ఇన్ఫ్రా (సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావుకు చెందిన సంస్థ) 3.18 శాతం అధిక ధరలకు కట్టబెట్టారు.అన్ని పనులూ అధిక ధరలకే..ఏడీసీఎల్ 35 పనులకు పిలిచిన టెండర్లలో ముఖ్యనేతలు ఎంపిక చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్(ఈనాడు కిరణ్ సోదరుడి వియ్యంకుడు రాయల రఘుకు చెందిన సంస్థ), బీఎస్సార్.. ఎన్సీసీ (ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడైన ఏవీ రంగారాజు ఎండీగా ఉన్న సంస్థ).. బీఎస్పీసీఎల్ (సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు చెందిన సంస్థ), మేఘా, ఎమ్వీఆర్ ఇన్ఫ్రా సంస్థలు దాఖలు చేసిన బిడ్లు మాత్రమే అర్హత సాధించాయి. ఆర్వీఆర్ ప్రాజెక్స్కు రూ.2,539.72 కోట్ల విలువైన 8 పనులు.. బీఎస్సార్ ఇన్ఫ్రాకు రూ.2,170.81 కోట్ల వ్యయంతో కూడిన 9 పనులు, ఎన్సీసీకి రూ.2,645.96 కోట్లు విలువైన 8 పనులు, బీఎస్సీసీఎల్కు రూ.748.75 కోట్లు వ్యయంతో చేపట్టిన 4 పనులు, మేఘాకు రూ.1,182.54 కోట్లు విలువైన 4 పనులు, ఎమ్వీఆర్ ఇన్ఫ్రాకు రూ.794.04 కోట్లు విలువ చేసే రెండు పనులను కట్టబెట్టారు.లాలూ‘ఛీ’కి ఇదిగో తార్కాణం..⇒ రాజధాని ముంపు నివారణ పనుల్లో ఒకటో ప్యాకేజీ (కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 23.6 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 16.75 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం) పనులకు రూ.462.25 కోట్లతో ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లలో 3.98 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఎమ్వీఆర్ ఇన్ఫ్రా ఎల్–1గా నిలిస్తే... 4.35 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఎన్సీసీ ఎల్–2గా, 4.69 శాతం అధిక ధరలకు కోట్ చేసిన మేఘా ఎల్–3లుగా నిలిచాయి. ⇒ రాజధాని ముంపు నివారణ రెండో ప్యాకేజీ పనులకు రూ.303.73 కోట్ల వ్యయంతో ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 3.84 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఎమ్వీఆర్ ఎల్–1గా నిలిస్తే... 4.40 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఎన్సీసీ ఎల్–2గా, 4.76 శాతం అధిక ధరకు కోట్ చేసిన మేఘా ఎల్–3గా నిలిచాయి. ⇒ ఈ రెండు ప్యాకేజీల టెండర్లలో దాఖలైన బిడ్లను గమనిస్తే కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యనేతలు లాలూఛీ పడినట్లు స్పష్టమవుతోంది. ఇవే కాదు మిగతా 33 ప్యాకేజీల పనుల్లోనూ ఇదే కథ.అంచనాల్లోనే వంచన...⇒ రాజధాని ముంపు నివారణ పనుల అంచనాల్లోనే వంచనకు తెర తీశారు. అమరావతి ప్రాంతం నల్లరేగడి భూమితో కూడుకున్నది. పెద్దగా రాళ్లు, రప్పలు ఉండవు. పొక్లెయిన్లు లాంటి యంత్రాలతో సులువుగా కాలువ తవ్వవచ్చు. పైగా ఇవేమీ కొత్తగా తవ్వే కాలువలు కాదు. ఒకటో ప్యాకేజీలో కొండవీటి వాగు, పాల వాగులను విస్తరించాలి. కొత్తగా 7.843 కి.మీ పొడవున మాత్రమే కాలువ తవ్వాలి. ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టి తవ్వేందుకు ప్రస్తుతం గరిష్టంగా రూ.100 చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 8 నుంచి 9 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కి.మీ. పొడవున కాలువ తవ్వకం పనుల అంచనా వ్యయం రూ.4.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు మించదని, పది నుంచి 11 వేల క్యూసెక్కుల కాలువ తవ్వకం పనులకు కి.మీ.కి రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు (జీఎస్టీ, సీనరేజీ, ఎన్ఏసీ లాంటి పన్నులతో కలిపి) మించదని జలవనరుల శాఖలో పలు ప్రాజెక్టుల్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఓ అధికారి స్పష్టం చేశారు. ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మించడానికి అంచనా వ్యయం జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ లాంటి పన్నులు కలిపినా రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లకు మించదని రిజర్వాయర్ల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న మరో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఒకరు వెల్లడించారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే ఒకటో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం రూ.301.75 కోట్లకు మించదు. కానీ.. ఈ ప్యాకేజీ కాంట్రాక్ట్ విలువను రూ.522.79 కోట్లుగా ఏడీసీఎల్ఎల్ నిర్దేశించింది. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.221.04 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. మొత్తమ్మీద రాజధాని ముంపు ముప్పు నివారించడానికి చేపట్టిన మూడు ప్యాకేజీల పనుల్లో అంచనా వ్యయాన్ని రూ.702.33 కోట్లు పెంచేసినట్టుగా కాంట్రాక్టు వర్గాలే లెక్కలు వేస్తున్నాయి.మిగిలిపోయిన రోడ్డు పనులకు..దేశంలో ఒక కి.మీ. పొడవున ఆరు లేన్.. ఒక్కో వరుస 50 మీటర్ల వెడల్పుతో జాతీయ రహదారిని సగటున రూ.20 కోట్లతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్మిస్తోంది. అది కూడా అన్ని రకాల పన్నులు జీఎస్టీ, నాక్ (నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ), సీనరేజీతో కలిపి. కానీ.. రాజధాని అమరావతిలో ఆరు లేన్.. ఒక్కో వరుస 50 మీటర్ల వెడల్పుతో చేపట్టిన ప్రధాన రహదారుల పనుల్లో మిగిలిపోయిన వాటికి కి.మీ.కి గరిష్టంగా రూ.53.88 కోట్లు.. కనిష్టంగా రూ.24.88 కోట్లను కాంట్రాక్టు విలువగా ఏడీసీఎల్ ఖరారు చేసింది. వాటికి అదనంగా జీఎస్టీ, నాక్, సీనరేజీ పన్నులను రీయింబర్స్ చేస్తామని చేయడం గమనార్హం. -
ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం కాదని, వాటిపై విచారణ జరిపిస్తే ఆ నివేదికతో సభలో చర్చించాలే తప్ప.. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరాధార ఆరోపణలతో ప్రతిపక్షంపై బురదజల్లేందుకు ప్రభుత్వం సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ చర్చించాలని ప్రభుత్వం అనుకొంటే 2014 నుంచి ఇప్పటివరకు చర్చించాలని మరోసారి స్పష్టం చేశారు.సోమవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత గురువారం వాయిదా వేసిన ‘2019–24 మధ్య జరిగిన కుంభ కోణాలపై’ లఘు చర్చలో ప్రభుత్వ సమాధానానికి చైర్మన్ మోషేన్ రాజు అనుమతించారు. దీనిపై ప్రతిపక్ష నేత అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఒక పక్కన విచారణకు ఆదేశించామంటూనే, సభలో ఎలా మాట్లాడుతుందని ప్రశ్నించారు. ఇదే లఘు చర్చపై మంత్రి సమాధానానికి గత వారం అవకాశం ఇచ్చారని, 2014 నుంచి చర్చిద్దామని తాము అప్పుడే చెప్పామని అన్నారు. ప్రతిపక్షంపై బురద జల్లేందుకే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.పైగా విచారణ అని చెప్పి దాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరో 6 నుంచి 10 నెలల్లో విచారణ నివేదికలు తీసుకొచ్చి సభలో చర్చించాలని చెప్పారు. 2014–19 మధ్య జరిగిన కుంభకోణాల మీద కేసుల దర్యాప్తు పూర్తయిందని, నివేదికలూ వచ్చాయని, వాటి మీదా చర్చ జరగాలని స్పష్టంచేశారు. అయినప్పటికీ మంత్రి సమాధానం ఇవ్వాలనుకొంటే.. ఇలాంటి ఏకపక్ష చర్చలో మేము పాల్గొనలేమని స్పష్టం చేశారు. సభ నుంచి వెళ్లిపోతున్నాం అంటూ వాకౌట్ చేశారు. తెలుగుదేశం పార్టీ పాలనలో పలు కుంభకోణాలు జరిగాయని, వాటిపై కేసులు నమోదయ్యాయని, దర్యాప్తు కూడా పూర్తయిందని తెలిపారు. వాటిపై మాత్రం చర్చకు ప్రభుత్వం అంగీకరించడం లేదని బొత్స మీడియా పాయింట్ వద్ద విమర్శించారు. ఇది కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరి కాదా అని నిలదీశారు. చీఫ్ విప్పై చైర్మన్ ఆగ్రహం ప్రతిపక్ష నేత మాట్లాడుతున్న సమయంలో చీఫ్ విప్ అనురాధ సమాధానం చెబుతానంటూ లేచి నిల్చోగా చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి ఉండగా మీరు క్లారిఫికేషన్ ఎలా ఇస్తారని, మీకు సంబంధం లేదు కూర్చోవాలని చెప్పారు. ఇలాంటి సంప్రదాయాలు తీసుకొచ్చి మంత్రులు సభను తప్పుదోవ పట్టించొద్దని హితవుపలికారు. మార్షల్స్తో సభ్యులను సభలోకి తీసుకురండి! ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోవడంపై మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో కుంభకోణాలపై చర్చకు బీఏసీలో ప్రతిపక్షం ఆమోదించిందని, కానీ సభలో 2014–19 ప్రభుత్వ పాలనపై ఆరోపణలు చేసి వాకౌట్ చేసిందని అన్నారు. చర్చకు సిద్ధంగా ఉంటే రమ్మనండని అన్నారు. గతంలో మార్షల్స్ను పెట్టుకుని సభను అవమానించారని, ఇప్పుడు మార్షల్స్కు చెప్పి బయట ఉన్న సభ్యులను లోపలికి తీసుకురావాలని అన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ, అటవీ భూములను కబ్జా చేశారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. లఘు చర్చపై ప్రభుత్వం తరఫున సమాధానమిస్తూ.. సుమారు 1.70లక్షల ఎకరాల్లో భూములు అన్యాక్రాంతం అయినట్టు గుర్తించామన్నారు. వీటిపై సీఐడీ విచారణ చేస్తున్నట్టు చెప్పారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై మండలిలో నిలదీత
సాక్షి, అమరావతి: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం శాసనమండలి సమావేశంలో ఫీజు రీయింబర్స్మెంట్పై వైఎస్సార్ïÜపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్న చర్చకు రాగా.. పెద్దఎత్తున ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.ప్రభుత్వ వైఖరి కారణంగా పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్సులు పూర్తయినప్పటికీ ఫీజులు చెల్లించలేదనే కారణంతో ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులకు సర్టీఫికెట్లు కూడా ఇవ్వడం లేదని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని దునుమాడారు.వెంటనే పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి బదులిస్తూ.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.3,169 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్టు వెల్లడించారు. బకాయిల చెల్లింపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఆ హామీ అమలు చేయడం లేదు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. యూజీ కోర్సుల్లో ఆరు త్రైమాసికాలకు సంబంధించి రూ.4,200 కోట్ల చొప్పున ప్రభుత్వం ఫీజులు బకాయి పడిందన్నారు. గత ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి షెడ్యూల్ ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. యూజీ, పీజీ కోర్సులకు 2018–19లో చంద్రబాబు ప్రభుత్వం రూ.1,880 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పెట్టిందన్నారు.ఈ మొత్తాన్ని 2020లో ఒకేసారి వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. మరో ఎమ్మెల్సీ టి.కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ రాక 13 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారన్నారు. బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని నిలదీశారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం 2014–19 మాదిరిగా ఫీజు రీయింబర్స్మెంట్కు సీలింగ్ పెడుతుందా, వంద శాతం రీయింబర్స్మెంట్ చేస్తుందా అని వివరణ కోరారు.పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ.3,196 కోట్లు బకాయిలు పెట్టడంతో క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్లేస్మెంట్స్ వచ్చినా కొన్ని కళాశాలల యాజమాన్యాలు సర్టీఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. జీవో 77 ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పాలని కోరారు. మంత్రి డోలా మాట్లాడుతూ.. ప్రైవేట్ కళాశాలల్లో పీజీ చదివే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామన్నారు. ఇందుకు సంబంధించిన జీవో 77 రద్దుపై సమాధానం దాటవేశారు. ఒకే చట్ట పరిధిలోకి విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఒకే చట్టం పరిధిలోకి తీసుకుని వస్తామని మానవ వనరులు, విద్యా శాఖ మంత్రి లోకేశ్ శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. అమరావతిలో డీప్టెక్ వర్సిటీ, విశాఖలో ఐఎస్బీ ఏఐ వర్సిటీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. -
వలంటీర్లు అప్పుడెలా గుర్తొచ్చారు?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థే లేదని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. అదే వాస్తవమైతే విజయవాడ వరద బాధితులకు సహాయ, సహకారాలు అందించేందుకు వలంటీర్లు కావాలని అధికారిక ఉత్తర్వులిచ్చి.. వలంటీర్ల సేవలు ఏవిధంగా వినియోగించుకున్నారు’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వేతనాలు రూ.10 వేలకు పెంచుతామని నమ్మించి, 2.56 లక్షల మందిని కూటమి ప్రభుత్వం దగా చేసిందని మండిపడ్డారు.వలంటీర్లకు గౌరవ వేతనాల పెంపు అంశంపై వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్న సోమవారం మండలిలో చర్చకు వచ్చింది. సంబంధిత మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వలంటీర్లు ఎవరూ లేరని, ఈ నేపథ్యంలో వేతనాల పెంపు అంశమే ఉత్పన్నం కాదన్నారు. మంత్రి సమాధానంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వరదల్లో వారిని ఎలా వినియోగించుకున్నారు?వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేశ్యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వలంటీర్లే లేకపోతే విజయవాడ వరదల్లో వారి సేవలను ప్రభుత్వం ఎందుకు వినియోగించుకుందని నిలదీశారు. వరదల సమయంలో ప్రభుత్వం జారీ చేసిన మెమో నంబర్, తేదీలతో సహా సభలో చదివి వినిపించారు. వరద సహాయ చర్యల్లో పాల్గొనకపోతే వలంటీర్లపై మీద చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం హెచ్చరించిందని గుర్తు చేశారు. వలంటీర్లతో అవసరం తీరాక ఆ వ్యవస్థే లేదని చెప్పడం సమంజసం కాదన్నారు.‘గత ప్రభుత్వంలో వలంటీర్లకు ఇచ్చిన రూ.5 వేలు సరిపోదు.. మేం వస్తే రూ.10 వేలు చెల్లిస్తాం’ అని టీడీపీ నాయకులు ప్రచారం చేశారన్నారు. పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వీరికి నెలకు రూ.10 వేలకు వేతనం పెంచుతామని ప్రస్తుత సీఎం, మంత్రులు హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సేవాభావంతో ముందుకు వచ్చి ప్రజల మన్ననలు పొందిన వలంటీర్లను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ప్రభుత్వం తలచుకుంటే వలంటీర్లను రెన్యూవల్ చేయడం పెద్ద సమస్య కాదన్నారు. వలంటీర్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి డోలా మాట్లాడుతూ.. వలంటీర్ వ్యవస్థ మనుగడలో ఉందనే భ్రమలో తాము విజయవాడ వరదల్లో వారి సేవలు వినియోగించుకోవడానికి ఉత్తర్వులు ఇచ్చామన్నారు. మనుగడలో లేని వారిని ఎలా కొనసాగించాలని ప్రశ్నించారు. నిమ్మల ముసిముసి నవ్వులు‘మా ప్రభుత్వం వస్తేనే వలంటీర్ల వేతనాలు రూ.10 వేలకు పెంచుతాం. వేతనం పెరిగిన వెంటనే నాకు పూతరేకులు, స్వీట్ బాక్స్, జున్ను ఇవ్వాలి’ అని వలంటీర్లకు చెబుతూ ఎన్నికల ముందు ప్రస్తుత మంత్రి ఒకరు ప్రచారం చేశారని రమేశ్యాదవ్ గుర్తు చేశారు. వేతనాలు పెంచితే మంత్రికి పూతరేకులు, జున్ను ఇద్దామని వలంటీర్లు అందరూ రెడీగా ఉన్నారన్నారు. దీంతో వెంటనే సభలోని వారంతా మంత్రి నిమ్మల రామానాయుడు వైపు చూశారు. ఈ క్రమంలో ఆయన పేపర్లో ఏదో చదువుతున్నట్టు తల దించుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. -
శాసనమండలి.. ఫీజు రియింబర్స్మెంట్, వలంటీర్లపై వైఎస్సార్సీపీ ప్రశ్నలు
ఏపీ శాసన మండలి సమావేశాలు.. అప్డేట్స్.. శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలు..వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చవలంటీర్లు ఎవ్వరూ లేరు, రెన్యూవల్ చెయ్యలేదని చెప్పిన మంత్రి బాల వీరంజనేయ స్వామివాలంటీర్ల తొలగింపుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆగ్రహంఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్..వాలంటీర్ల వేతనాన్ని 10వేలకి పెంచుతామని హామీ ఇచ్చారుఈ ప్రభుత్వం 2,56,000 మంది వాలంటీర్లను తొలగించిందివలంటీర్ వ్యవస్థనే లేదని చెప్తున్నారు2024 సెప్టెంబర్లో వరదలు వచ్చినప్పుడు ఎలా డ్యూటీ చేయించారునవంబర్ 2024 వరకు వాళ్లకి ఐడీలు ఎలా కొనసాగించారువాలంటీర్లకు 10 వేలు చేస్తామని మోసం చేశారు.ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్2023 ఆగస్టు నుండి వలంటీర్లు వ్యవస్థ లేదని దారుణంగా మాట్లాడుతున్నారువ్యవస్థ లేకపోతే 2024లో మేనిఫెస్టోలో ఎలా పెట్టారు?.2024 ఏప్రిల్ లో ఎన్నికల్లో ఊరూరా తిరిగి వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారుజీతం పెంచగానే చించినాడా పుతారేకులు ఇవ్వండి అని మంత్రి ప్రచారం చేశారు2,60,000 వేల మందిని తొలగించడం అన్యాయంవాళ్ళు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారుఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్..వలంటీర్లు లేకపోతే ఎందుకు విపత్తు శాఖ ఆదేశాలు ఇచ్చిందిలేని వారిని ఎలా వరదల్లో వినియోగించారు?.ఫీజు రియింబర్స్మెంట్పై వైఎస్సార్సీపీ సభ్యుల నిలదీత..రూ.3,169 కోట్లు ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్టు వెల్లడించిన మంత్రి బాల వీరంజనేయ స్వామిఫీజు ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు పెట్టడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహంఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నలు.4200 కోట్ల బకాయిలు ఉన్నాయి.2000 కోట్ల వసతి దీవెన బకాయిలు ఉన్నాయి.పీజీ విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్ ఇస్తామన్నారుఇప్పటి వరకూ ఇవ్వలేదు.వసతి దీవెన మొదలు పెట్టిందే వైఎస్ జగన్.ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..వైఎస్ జగన్ గతంలో తల్లుల ఖాతాల్లో ఫీజులు వేశారుకాలేజీ యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు తల్లిదండ్రులకు కల్పించారుగతంలో చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన 1778 కోట్ల బకాయిలను వైఎస్ జగన్ చెల్లించారుఇప్పుడు ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోవడం అన్యాయంవిద్యార్థుల భవిష్యత్ కోసం మానవతా దృక్పథంతో ప్రభుత్వం చెల్లించాలిమొత్తం ఫీజు రియింబర్స్మెంట్ చేస్తారా?హాజరు సీలింగ్ ఏమైనా పెడతారా?.ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కామెంట్స్..వైఎస్సార్ పేద పిల్లల కోసం ఫీజు రియింబర్స్మెంట్ తెచ్చారుఉన్నత చదువులు పేద పిల్లలకు అందించారుఇప్పుడు ఫీజులు బకాయిలు పెట్టేసారువిద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి -
మనో వైకల్యమే మహా విషాదం
ఎటుచూసినా పోటీ ప్రపంచం.. పిల్లలు ఇప్పట్నుంచే చదువులో అత్యుత్తమంగా లేకుంటే భవిష్యత్లో వెనుకబడిపోతారనే అనవసర ఆందోళన.. మార్కులు సాధించే యంత్రాలుగా చూస్తూ వారిపై తీవ్ర ఒత్తిడి.. తాము సాధించలేని లక్ష్యాలు, తాము నెరవేర్చుకోలేని ఆశలను వారసులు తీర్చాల్సిందే అనే పంతం.. మరోవైపు దీనికి ఆజ్యం పోసేలా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల ధోరణి.. వెరసి పిల్లల యోగక్షేమాలు, ఆటపాటలు, మానసిక ఉల్లాసం గురించి పట్టించుకోకుండా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్న తల్లిదండ్రులు చివరకు బిడ్డల ప్రాణాలను తీసేందుకు సైతం వెనుకాడడం లేదు. తాజాగా కాకినాడలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరు.. ఏడేళ్లు, ఆరేళ్ల వయసున్న తన ఇద్దరి కుమారులను పోటీ ప్రపంచంలో రాణించలేరనే కారణంతో నిర్దాక్షిణ్యంగా చంపేయడమే కాక తాను కూడా ప్రాణాలు తీసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ధోరణి మార్చకోకుంటే మున్ముందు ఇలాంటి ఘటనలు మరిన్ని చూడాల్సి వస్తుందేమోనని విద్యావేత్తలు, మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి తీరు మారాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. సాక్షి, స్పెషల్ డెస్క్ : తల్లిదండ్రుల్లో విపరీత పోకడలకు కారణం.. ప్రైమరీ స్కూల్ స్థాయి నుంచే పోటీ వాతావరణం నెలకొనడం. ఆడుతూ పాడుతూ ఆహ్లాద వాతావరణంలో చదువుకోవాల్సిన వయసులో పిల్లలు సహచరులతో పోటీ పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో పిల్లల విజయం తమదిగా, సమాజంలో తమకు గుర్తింపుగా భావిస్తున్న తల్లిదండ్రులు ప్రతికూల ఫలితం వస్తే తట్టుకోలేక ఆ కోపాన్ని పిల్లలపై చూపుతున్నారు. పిల్లలు ఏదైనా అంశంలో వెనుకబడితే, ఆశించినంత రాణించకపోతే తల్లిదండ్రులు తమ ప్రకోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ బిడ్డల భుజం తట్టి భరోసా ఇవ్వాల్సింది పోయి భయపెడుతున్నారు. మార్కులు తక్కువ వస్తే పరిష్కారం చూపకుండా నలుగురి ముందు తిట్టడం, కొట్టడం చేస్తున్నారు. దీంతో పిల్లల్లో ఆత్మన్యూనత పెరుగుతోంది. సమస్యలను తల్లిదండ్రులకు చెప్పుకోలేక కుంగిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు విపరీత ధోరణులతో ప్రవర్తిస్తున్నారు.లాభపడుతున్న కార్పొరేట్ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లు ఐదో తరగతి నుంచే ఐఐటీ, నీట్ ఫౌండేషన్ అంటూ తల్లిదండ్రులకు వల వేస్తున్నాయి. వీటిలో చేర్చితే తమ పిల్లలు ఐఐటీల్లో, ఎయిమ్స్ల్లో అడుగు పెట్టడం ఖాయమనే ఆలోచనతో ఏ మాత్రం వెనక్కుతగ్గకుండా.. రూ.లక్షల్లో ఫీజులు కడుతున్నారు. ఫలితాలు ఏ మాత్రం తేడా వచి్చనా.. తమ కోపతాపాలకు పిల్లలను గురి చేస్తున్నారు. పలుచన అవుతామనే ఆందోళనతో.. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఇలా ప్రవర్తించడానికి.. సమాజంలో తమ పేరు, ప్రఖ్యాతులు పోతాయని లేదా కొలీగ్స్, ఇతరుల ముందు పలుచన అవుతామనే ఆందోళనే కారణమని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. పిల్లలు తమ ఆస్తి అని, వారిపై అన్ని హక్కులు, అధికారాలు తమకు ఉన్నాయని భావిస్తున్నారు. తమ కలలను నెరవేర్చడానికే పిల్లలు ఉన్నారనే ప్రమాదకర భావన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఏ మాత్రం ప్రతికూలంగా మారినా ఎంతటి తీవ్ర చర్యకైనా వెనుకాడట్లేదు. ఇలాంటి పరిస్థితి రాకుండా తల్లిదండ్రులకు ముందు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెల్యూజనల్ డిజార్డర్స్ మానసిక రుగ్మత అంటే పిచ్చి ఒక్కటే అనుకుంటున్నారని, అదొక్కటే కాదని, రకరకాల ఆలోచనా విధానాలని నిపుణులు చెబుతున్నారు. వీటినే డెల్యూజనల్ డిజార్డర్స్ (భ్రాంతి రుగ్మత) అంటారని వివరిస్తున్నారు. వ్యక్తిలో అంతులేని నిరాశ, భాగస్వామి పట్ల అనుమానం, ఆరి్థక, సామాజిక ఒత్తిళ్లు, ఏదో వైపరీత్యం జరగబోతుందన్న ఊహ, ప్రమాదంపై భయం, మితిమీరిన, తప్పుదారి పట్టిన ప్రేమలు, తీవ్ర మానసిక రుగ్మతలు వంటివి దుర్ఘటనలకు దారితీస్తున్నాయని అంటున్నారు. తమ వల్ల ఏదీ కావడం లేదని, దేనికీ పనికిరామేమోనని, సమాజం తమను చెడుగా ఊహించుకుంటోందేమోనన్న ఆలోచనలు ఎక్కువైనవారు చివరకు తమ పిల్లలను చంపేసి, తామూ చనిపోవాలన్న నిర్ణయానికి వస్తున్నారని పేర్కొంటున్నారు. ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు శ్రేయోభిలాషులు, హితులు, సన్నిహితుల వద్ద చర్చించినా ఫలితం దొరుకుతుందని వైద్యులు చెబుతున్నారు. వారు పెరిగిన పరిస్థితులు కూడా ఓ కారణం పేరెంట్స్ ప్రతికూల వాతావరణంలో పెరిగితే.. అదే రీతిలో పిల్లలతో వ్యవహరించే ప్రమాదం ఉంది. కాకినాడ ఘటనపై పెద్దఎత్తున చర్చ జరగాలి. పిల్లల తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇవ్వాలి. పోటీ ప్రపంచంలో పరీక్షలు, ఫలితాలు అనివార్యంగా మారిన మాట వాస్తవం. కానీ, వీటితోనే పిల్లల భవిష్యత్తు అని భావించకూడదు. పిల్లల్లోని నైపుణ్యాలను గుర్తించి, వాటిలో రాణించేందుకు ప్రోత్సహిస్తే ఫలితాలు ఉంటాయి. –ఆర్.సి.రెడ్డి, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్తల్లిదండ్రుల్లో మార్పు రావాలితల్లిదండ్రులు విపరీత పోకడలకు ప్రస్తుత పరీక్షల విధానం కూడా ఓ కారణం. దీనికి పరిష్కారంగా.. వినూత్నంగా జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. సీబీఎస్ఈ కూడా రెండుసార్లు వార్షిక పరీక్షల విధానాన్ని ప్రతిపాదిస్తోంది. తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాలి. సృజనాత్మకత, శక్తియుక్తుల ఆధారంగా చదివేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే వారి భవితకు ప్రమాదం ఏర్పడుతుంది. –సీతామూర్తి, ప్రిన్సిపాల్, సిల్వర్ ఓక్స్ స్కూల్, హైదరాబాద్తీవ్ర మానసిక సమస్య కన్నబిడ్డలను చంపేయడం ఓ తీవ్రమైన మానసిక సమస్య. ఈ తరహా సమస్యలతో బాధపడేవారిని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. అందులో ప్రధానమైనది చిన్న పిల్లల చర్యలపై తీవ్రంగా స్పందిస్తుండడం. ఇటువంటి వారికి పిల్లలను దూరంగా ఉంచాలి. మానసిక వైద్యుడికి చూపించాలి. – డాక్టర్ వి.వరప్రసాద్, మానసిక వ్యాధుల నిపుణుడు, జీజీహెచ్, కాకినాడగుడ్ పేరెంటింగ్ ముఖ్యం పేరెంటింగ్ అంటే పిల్లలను కఠిన నిబంధనలతో పెంచడం కాదు. వారి ఇష్టాయిష్టాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా పెంచడమే గుడ్ పేరెంటింగ్. పిల్లల గురించి విపరీతంగా ఊహించుకోవడం, మంచి ఉద్యోగం పొందడం లేదా పరీక్షలో నెగ్గడమే అచీవ్మెంట్గా భావిస్తున్నారు. అందువల్లే సమస్యలొస్తున్నాయి. –డాక్టర్ వీరేందర్, ప్రముఖ సైకాలజిస్ట్ -
AP: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు (3.15 గంటలు) పరీక్ష ఉంటుంది. చివరి పరీక్షను రంజాన్ సెలవు ఆధారంగా ఈ నెల 31 లేదా ఏప్రిల్ ఒకటో తేదీన నిర్వహిస్తారు. 2024–25 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 6,19,275 మంది రెగ్యులర్, 30,609 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో ఇంగ్లిష్ మీడియంలో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది, ఉర్దూలో 2,471 మంది, హిందీలో 16 మంది, కన్నడలో 623 మంది, తమిళంలో 194 మంది, ఒడియాలో 838 మంది పరీక్షలు రాసేందుకు ఎన్రోల్ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. వాటిలో 163 సమస్యాత్మక సెంటర్లుగా గుర్తించి సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. హాల్టికెట్ చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్ష సెంటర్ల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుందని పదో తరగతి పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీచేసింది. ఇన్విజిలేటర్లతోపాటు సెంటర్లలో విధులు నిర్వర్తించే పోలీసులు, ఏఎన్ఎంలతో సహా ఎవరూ ఫోన్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకూడదని స్పష్టంచేసింది. ఈ పరీక్షల పర్యవేక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 156 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ను నియమించింది. జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్తోపాటు రాష్ట్రస్థాయిలో ఎస్ఎస్సీ డైరెక్టరేట్లోను ప్రత్యేక కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుంది. పరీక్షలపై ఫిర్యాదుల కోసం 0866–2974540 నంబర్ను కేటాయించారు. ఓపెన్ టెన్త్ పరీక్షలు కూడా నేటి నుంచే.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదో తరగతి (ఓపెన్ టెన్త్) పరీక్షలు కూడా సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. రెగ్యులర్ పరీక్షలు జరిగే తేదీలు, సమయాల్లోనే ఈ పరీక్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఓపెన్ టెన్త్ పరీక్షలు ఈ నెల 28వ తేదీతో ముగియనున్నాయి. ఈ పరీక్షలకు 30,334 మంది హాజరుకానున్నారు. వీరికోసం 471 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
బట్టమేక.. కష్టాల కేక
పొడవైన తెల్లటి మెడ.. దాని చుట్టూ తెలుపు–నలుపు ఈకల హారం.. బంగారు/గోధుమ వర్ణపు వీపు.. తలపై నల్లని టోపీతో ఇట్టే ఆకర్షించే రూపం బట్టమేక పక్షుల సొంతం. విమానం మాదిరిగా నేలపై పరుగులు తీసి గాల్లోకి లేచి.. స్థిమితంగా.. లయబద్ధంగా విశాలమైన రెక్కలు కదిలిస్తూ గగన విహారం చేయడం వీటి ప్రత్యేకత.సాక్షి, అమరావతి: అరుదైన బట్టమేక పక్షులు (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) మన దేశంలో అంతరించిపోయే స్థితికి చేరాయి. కొన్నేళ్లుగా చాలాచోట్ల వీటి జాడ కనిపించడం లేదు. 2008లో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 300 బట్టమేక పక్షులు ఉండగా.. ప్రస్తుతం వాటిసంఖ్య దేశవ్యాప్తంగా 150కి పడిపోయినట్టు తేలింది. వాటిలోనూ ఎక్కువ పక్షులు రాజస్థాన్లోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20కిపైగా బట్టమేక పక్షి జాతులు ఉండగా.. మన దేశంలో 4 జాతులున్నాయి. వాటిలో మన రాష్ట్రంలో కనిపించేవి ఇంకా అరుదైన జాతి పక్షులు.మీటరు పొడవు.. 15 కిలోలకు పైగా బరువుబట్టమేక పక్షుల్లో అత్యంత బలిష్టమైనవి మన ప్రాంతంలోనే ఉండేవి. ఈ పక్షి మీటరు పొడవు, 15 నుండి 20 కిలోల బరువు, పొడవాటి మెడ కలిగి ఉంటుంది. వీటిసంతతి చాలా అరుదుగా వృద్ధి చెందుతూ కేవలం ఏడాదికి ఒక గుడ్డు మాత్రమే పెట్టి దట్టమైన పొదల్లో 27 రోజులపాటు పొదుగుతుంది. దీని జీవిత చక్రం సుమారు 12 ఏళ్లు. ఒక్కో ఆడ పక్షి జీవిత కాలంలో కేవలం ఐదారు గుడ్లు మాత్రమే పెడతాయి. ఏవి దొరికినా తిని కడుపు నింపుకోవడం వీటి ప్రత్యేకత. ధాన్యం గింజలు, పంటల కోత తర్వాత మిగిలిన మోళ్లు, వేళ్లు, పొలాల్లోని మిడతలు, పురుగులు, జెర్రులు, బల్లులు, తొండలు వంటివి వీటి ఆహారం. ఎగిరే పక్షుల్లో రెండవ అతి భారీ పక్షులుగా గుర్తింపు పొందినా.. నివాసానికి అనుకూల వాతావరణం లేక అంతరించిపోతున్నాయి.సంరక్షణ చర్యలున్నా.. ప్రయోజనం సున్నామన దేశంలో కనిపించే అత్యంత అరుదైన బట్టమేక పక్షి జాతుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం కలగడం లేదు. వీటికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాల్లోనూ వాటి జాడ అరుదుగా మాత్రమే కనిపిస్తోంది. గత ఏడాది కర్ణాటకలోని బళ్లారి సమీపాన సిరిగుప్పలో రెండు, మహారాష్ట్ర లోని బీదర్లో ఒకటి కనిపించినట్టు అటవీ శాఖ నిర్ధారించింది. ఆ తర్వాత వీటి జాడ ఎక్కడా కానరాలేదు. మన రాష్ట్రంలోనూ వీటి కోసం నంద్యాల జిల్లా నందికొట్కూరు సమీపంలోని రోళ్లపాడులో 600 హెక్టార్లలో బట్టమేక పక్షుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా అక్కడ కూడా ఈ పక్షులు కనిపించడంలేదు. వేటగాళ్ల ఉచ్చులకు బలైపోవడం, ఆవాసాలు తగ్గిపోవడం, ఎగిరే సమయంలో గాలి మరలు, విద్యుత్ లైన్లకు తగిలి మృత్యువాత పడటం, వాహనాల రణగొణ ధ్వనులే ఇవి అంతరించిపోవడానికి ప్రధాన కారణాలని వన్యప్రాణుల నిపుణులు చెబుతున్నారు.గడ్డి భూములు తగ్గిపోవడంతో..|పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో గడ్డి భూముల పాత్ర కీలకం. బట్టమేకల పక్షుల ఉనికి పర్యావరణానికి మేలు చేసే గడ్డి భూములపైనే ఆధారపడి ఉంది. విశాలమైన గడ్డి మైదానాలే వాటి ఆవాసాలు. అందుకే బట్ట మేక పక్షులను గడ్డి భూముల జీవనాడిగా చెబుతారు. ఈ భూములు పశువులకు మేత అందించడంతోపాటు పశువులపై ఆధారపడి జీవించే జాతుల మనుగడకు ప్రధానమైనవి. వాతావరణంలో ప్రాణవాయువును పెంచేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. తద్వారా పర్యావరణం, జీవ వైవిధ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి. ఆయా ప్రాంతాల్లో నీటి ప్రవాహానాన్ని గడ్డి భూములు క్రమబద్ధీకరిస్తాయి. అలాంటి గడ్డి భూములు తగ్గిపోతుండడం బట్టమేక పక్షులు అంతరించిపోతుండటానికి ప్రధాన కారణమైంది. మన దేశంలో 2005 నుంచి 35 శాతం మేర గడ్డి భూములు తగ్గిపోయినట్టు అంచనా. వ్యవసాయ విస్తరణ, పశువుల మేత ఎక్కువవడం, భూముల నిర్వహణ సరిగా లేకపోవడంతో జీవ వైవిధ్యం కోల్పోయి గడ్డి భూములు క్షీణిస్తున్నాయి. గతంలోని గడ్డి భూములు ప్రస్తుతం బంజరు భూములుగా మారిపోయాయి. ఫలితంగా ఆవాసాలు లేక బట్టమేక పక్షులు అంతరించిపోతున్నాయి.కృత్రిమ గర్భధారణపైనే ఆశలుబట్టమేక పక్షుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ పక్షులను మళ్లీ పునరుద్ధరించే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటికోసం సురక్షితమైన గడ్డి మైదానాలను సృష్టించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది. కృత్రిమ గర్భధారణ ద్వారా బట్టమేక పక్షి పిల్లలను పుట్టించి.. గడ్డి భూముల్లో వదలాలని నిపుణులు సూచిస్తున్నారు. రెండేళ్ల క్రితం రాజస్థాన్లోని జైసల్మేర్లోని జాతీయ పరిరక్షణ పెంపక కేంద్రం (నేషనల్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్) కృత్రిమ గర్భధారణ ద్వారా బట్టమేక పక్షుల్ని పునరుద్ధరించింది. వాటిని గడ్డి మైదానాల్లో వదిలి సంరక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఎంతమేరకు సఫలీకృతం అవుతాయో వేచి చూడాలి. -
బంగారం పంట పండింది
పెట్టుబడి దాదాపు రూ.3 వేలు. చేతికి వస్తున్నది మాత్రం రూ.8,600 పైమాటే. మీరు చదువుతున్నది అక్షరాలా నిజం. సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) 2016–17 సిరీస్–4 కొనుగోలు చేసిన పెట్టుబడిదారులకు ఇప్పుడు ‘బంగారం’పంట పండింది. ఈ నెల 17నాటికి ఎనిమిదేళ్ల గడువు ముగిసే సావరిన్ గోల్డ్ బాండ్లకు ఒక్కో గ్రాముకు రిడెమ్షన్ (ఉపసంహరణ) ధర రూ.8,624గా నిర్ణయించినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ఒక్కో గ్రాముకు రూ.2,943 చొప్పున ఎస్జీబీ సిరీస్–4ను 2017 మార్చి 17న జారీ చేశారు. అంటే ఇన్వెస్టర్లు 193 శాతం లాభం అందుకుంటున్నారన్న మాట. దీనికి వడ్డీ అదనం. – సాక్షి, స్పెషల్ డెస్క్మొత్తం 146 టన్నులు..సావరిన్ గోల్డ్ బాండ్ పథకం 2015 నవంబర్లో ప్రారంభం అయ్యింది. ఈ పథకంలో భాగంగా మొత్తం 67 విడతలుగా 146.96 టన్నుల గోల్డ్ బాండ్స్ జారీ అయ్యాయి. వీటి విలువ రూ.72,274 కోట్లు. 2023–24లో ఇన్వెస్టర్లు రూ.27,031 కోట్ల విలువైన 44.34 టన్నుల గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేశారు. 2017–2020 మధ్య జారీ అయిన ఎస్జీబీలకు ముందస్తు ఉపసంహరణను 2024 జూలై నుంచి ఆర్బీఐ ప్రకటించింది. ప్రభుత్వం 2024 జూలై నుంచి∙ఆరు విడతల ఎస్జీబీ మొత్తాలను తిరిగి చెల్లించింది. 61 విడతలు మిగిలి ఉన్నాయి. తుది చెల్లింపు 2032 ఫిబ్రవరిలో జరగనుంది.సిరీస్ల వారీగా ఇలా.. గ్రాముకు రూ.3,119 ధరతో 2016 ఆగస్ట్ 5న జారీ చేసిన ఎస్జీబీ 2016–17 సిరీస్–1 గత ఏడాది 2024 ఆగస్ట్ తొలి వారంలో రూ.6,938 చొప్పున రిడీమ్ అయ్యాయి. గ్రాముకు రూ.3,150 చొప్పున 2016 సెప్టెంబర్ 30న జారీ అయిన 2016–17 సిరీస్–2 గత ఏడాది సెప్టెంబర్ 30న రూ.7,517 ధరతో ఉపసంహరించారు. రూ.3,007 ధరతో 2016 నవంబర్ 17న జారీ అయిన 2016–17 మూడవ సిరీస్ రూ.7,788 చొప్పున 2024 నవంబర్ 16న రిడీమ్ అయ్యాయి. ఇక గ్రాముకు రూ.2,943 ధరతో జారీ చేసిన నాలుగో విడత సావరిన్ గోల్డ్ బాండ్స్ ఒక్కో గ్రాముకు రూ.8,624 చొప్పున రిడెమ్షన్ కానుంది. భారంగా మారిన బాండ్లు ఎస్జీబీ పథకం కథ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. భారత్లో పెరుగుతున్న బంగారం దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఆశించిన ప్రయోజనం అటుంచితే పెరుగుతున్న బంగారం ధరలతో ఖజానాపై ఊహించని ఆర్థిక భారం పడింది. దీంతో ప్రభుత్వం చివరకు ఈ పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. గోల్డ్ బాండ్స్లో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.85,000 కోట్లను తాకనుందని 2024 జూలై మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ విలువ 2019–20తో పోలిస్తే దాదాపు తొమ్మిది రెట్లు అదనం. 2016–17 సిరీస్–1 ఉపసంహరణతో ఇన్వెస్టర్లు 122 శాతం ప్రీమియం అందుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర తొలిసారిగా 3,000 డాలర్లు దాటిన సంగతి తెలిసిందే. బంగారం పరుగుతో ప్రభుత్వంపై ‘పసిడి బాండ్ల’భారం తీవ్రమైంది. రిడెమ్షన్ ధర నిర్ణయం ఇలా.. 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియన్ బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ ప్రకటించిన ధరల ప్రకారం.. రిడెమ్షన్ తేదీ నుంచి గడిచిన మూడు పని దినాల్లో సగటు బంగారం ధరను ఎస్జీబీ తుది ఉపసంహరణ ధరగా నిర్ణయిస్తారు. ఇదీ పథకం.. » కనీస పెట్టుబడి 1 గ్రాము. » ఈ బాండ్లు దేశంలో బంగారం ధరతో ముడిపడి ఉంటాయి. » వీటికి 8 సంవత్సరాల కాలపరిమితిని పెట్టారు. » 5 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. » ఇన్వెస్టర్లకు తమ పెట్టుబడిపై సంవత్సరానికి » 2.5% వడ్డీ కూడా అదనంగా పొందవచ్చు. » వడ్డీపై పన్ను విధించబడుతుంది. కానీ మూలధన లాభాల పన్ను లేదు.ఏమిటీ ఎస్జీబీలు..? ఇవి భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన ప్రభుత్వ సెక్యూరిటీలు. నిజమైన (భౌతిక) బంగారానికి ఇవి ప్రత్యామ్నాయ రూపం. పెట్టుబడిదారులు భౌతికంగా బంగారం కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా దానిపై పెట్టుబడి పెట్టడానికి ఈ బాండ్లు వీలు కల్పించాయి. పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. బాండ్ల గడువు ముగిసిన తర్వాత పెట్టుబడిదారులకు నగదు రూపంలోనే తిరిగి చెల్లిస్తారు.బంగారం దిగుమతులను నిరుత్సాహపరచడం ద్వారా విదేశీ మారకం నిల్వలను కాపాడుకోవచ్చన్న భావనతో కేంద్రం ఈ బాండ్ల జారీని ప్రారంభించింది. -
అమరావతిలో 58 అడుగుల అమరజీవి విగ్రహం
సాక్షి, అమరావతి: ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుతో రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వచ్చే జయంతి నాటికి ఈ విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అమరావతిలోనే మెమోరియల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అమరజీవి స్వగ్రామం పడమటిపల్లిలోని ఆయన నివాసాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతామని, గ్రామంలో ఆధునిక వసతులతో ఆరోగ్య కేంద్రం, హైసూ్కల్ భవనాన్ని నిర్మిస్తామన్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు బకింగ్ హామ్ కెనాల్పై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సీఎం పాల్గొని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిన రాష్ట్రాన్ని 2047 నాటికి నంబర్వన్గా మార్చాలని పనిచేస్తున్నట్టు సీఎం తెలిపారు. నేటితో పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకల్లోకి అడుగుపెట్టడంతో వచ్చే ఏడాది మార్చి 16 వరకు ప్రతి నెలా ఒకటి చొప్పున 12 రకాల కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. రానున్న ఐదేళ్లలో పేదరిక నిర్మూలనకు, ప్రతివ్యక్తి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఉగాది నుంచి పీ4 విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. -
Andhra Pradesh: సర్కారు బడికి తాళం!
రాష్ట్రంలో సర్కారు బడికి తాళం పడుతోంది. గ్రామాల్లో 60 మంది కంటే తక్కువ విద్యార్థులున్న స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం కావడంతో వేలాదిగా పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. మిగిలిన వాటి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ఇకపై విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి చదవాలంటే 5 కి.మీ. వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానుంది. భారీగా స్కూళ్ల సంఖ్యను తగ్గించేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం మండల విద్యాధికారుల ద్వారా ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తోంది. పాఠశాలల కమిటీలను ఒప్పించాల్సిన బాధ్యత టీచర్లపైనే మోపింది. లేదంటే ఎంఈవోలు ప్రత్యక్షంగా కలెక్టర్లకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటికే గత ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలను నీరుగార్చి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన కూటమి సర్కారు నిర్వాకాలకు ఇది పరాకాష్టగా నిలుస్తోంది. పేదింటి తలరాతలను మార్చే శక్తి చదువులకు మాత్రమే ఉందని దృఢంగా విశ్వసించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఐదేళ్లూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏకంగా రూ.72 వేల కోట్లకుపైగా వెచ్చించి ఉత్తమ ఫలితాలను రాబట్టారు. దీంతో మన స్కూళ్ల ప్రతిభ ఐరాస వరకు వినిపించింది. అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, బైజూస్ కంటెంట్తో పిల్లలకు ట్యాబ్లు, డిజిటల్ తరగతులతో ఏ ఒక్కరూ ఊహించని రీతిలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. నాడు– నేడు ద్వారా కార్పొరేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దటంతోపాటు ఇంగ్లీషు మీడియం చదువులు, సీబీఎస్ఈ నుంచి టోఫెల్, ఐబీ దాకా సర్కారు స్కూళ్ల ప్రయాణం మొదలైంది. ఇప్పుడు వీటన్నిటినీ నీరుగార్చిన టీడీపీ కూటమి సర్కారు స్కూళ్ల మూసివేత దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థులకు పిడుగుపాటులా పరిణమించాయి. సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై అక్కసుతో విద్యా సంస్కరణలను నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు తొలి టార్గెట్గా ప్రభుత్వ విద్యారంగాన్ని ఎంచుకుంది! గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల విలీనమే లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేస్తోంది. ప్రాథమికోన్నత పాఠశాలలను పూర్తిగా ఎత్తివేయడంతో పాటు పల్లెల్లో ప్రాథమిక పాఠశాలల మూసివేత దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 5 కి.మీ పరిధిలోని స్కూళ్లను మాత్రమే విలీనం చేస్తామని చెప్పిన సర్కారు తరువాత ఎంఈవోల ద్వారా మౌఖికంగా 7 కి.మీ. పరిధికి పెంచి ఒత్తిడి పెంచుతోంది. అంటే ఆ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఇక చదువుకునేందుకు దూరంలోని మోడల్ ప్రైమరీ స్కూల్కి వెళ్లాల్సిందే! లేదంటే ప్రైవేట్ స్కూళ్లే దిక్కు!! మోడల్ స్కూల్ అంటే ఏదో కొత్తది నిర్మిస్తున్నారనుకుంటే పొరబడినట్లే! మోడల్ ముసుగులో స్కూళ్లను భారీగా ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసింది. 32 వేలకు పైగా పాఠశాలలపై తీవ్ర ప్రభావంఉపాధ్యాయ సమావేశాల్లో ఇచ్చిన హామీకి భిన్నంగా స్కూళ్ల విలీనానికి రంగం సిద్ధం చేసి మోడల్ స్కూళ్ల పేరుతో ఉన్న పాఠశాలల ప్రాణం తీసేస్తున్నారని టీచర్లు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మోడల్ ప్రైమరీ పాఠశాలకు మ్యాపింగ్ చేయాలంటూ ఎంఈవోలపై ఒత్తిడి తెస్తున్నారు. విలీనానికి అంగీకరించాల్సిందేని ఒత్తిడి పెంచుతున్నారు. ఈమేరకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల నుంచి అంగీకార పత్రాలను తెప్పించాల్సిన బాధ్యత టీచర్లు, ఎంఈవోలకు కేటాయించారు. అలా చేయని వారు కలెక్టర్ ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించారు. విలీనమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతుండటంతో రాష్ట్రంలో వేలాదిగా స్కూళ్లు మూతపడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 1 – 5 తరగతులు కొనసాగుతున్న 32,596 ప్రాథమిక పాఠశాలల్లో కేవలం 17 శాతం స్కూళ్లల్లోనే 60 మందికి మించి ఎన్రోల్మెంట్ ఉంది. మిగిలిన 83 శాతం స్కూళ్లల్లో విద్యార్థులు 60 మంది కంటే తక్కువ ఉన్నారు. అంటే ఈ 83 శాతం స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులపై విలీనం ప్రభావం పడనున్నట్లు స్పష్టమవుతోంది. విద్యార్థుల ఎన్రోల్మెంట్ లేదనే సాకుతో 2014–19 మధ్య 1,785 స్కూళ్లను రద్దు చేసిన టీడీపీ సర్కారు.. తాజాగా అస్తవ్యస్థ విధానాలతో పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేస్తోంది. దీంతో గ్రామాల్లో వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం నెలకొంది. ఒక్కో పంచాయతీలో సుమారు మూడు నుంచి నాలుగు ప్రాథమిక పాఠశాలలున్నాయి. పట్టణాల్లో పరిధిని బట్టి 30 వరకు స్కూళ్లున్నాయి. ఏ పాఠశాలలోనైనా 60 కంటే తక్కువ మంది ఉంటే ఐదు కి.మీ దూరంలోని స్కూళ్లకు వెళ్లి చదువుకోవాల్సిందే. 60 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే ఆ పంచాయతీలో ఉన్న స్కూల్కి మోడల్ స్కూల్గా నామకరణం చేసి అక్కడకు తరలిస్తారు. మోడల్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 100కి చేరుకోకుంటే పరిధిని ఏడు కి.మీ.కి పెంచి అమలు చేయాలని అనధికారికంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. విలీనాన్ని గ్రామస్తులతో పాటు తల్లిదండ్రుల కమిటీలు వ్యతిరేకిస్తుండడంతో ఒప్పించే బాధ్యతను టీచర్లకు అప్పగించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో పాఠశాలలను విలీనం చేయవద్దంటూ నిరసన తెలుపుతున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు (ఫైల్) విలీన ఒత్తిడితో టీచర్ల బెంబేలు ఈ నిర్ణయంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. స్కూళ్ల కమిటీలను ఒప్పించలేక అటు ఉన్నతాధికారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ప్రతి పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీతో ‘ఎస్’ అని ఆమోదం తెలుపుతూ తీర్మానం ఇవ్వాలని కలెక్టర్లు ఆదేశిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోడల్ స్కూళ్లను కొత్తగా ఏర్పాటు చేస్తామంటే ఉపాధ్యాయులు వ్యతిరేకించడం లేదు. ఒక పాఠశాలను కేంద్రంగా చేసి చుట్టూ ఉన్న పాఠశాలలను విలీనం చేయడం, ఎంపిక చేసిన పాఠశాలలో తరగతులు కలపటాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. పైగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యతను ఆదే ఉపాధ్యాయులకు అప్పగించడం, కాదన్న వారిని ఉన్నతాధికారుల బెదిరించటాన్ని తట్టుకోలేక పోతున్నామని వాపోతున్నారు. గతంలో ప్రతి పాఠశాలను మనబడి నాడు–నేడు పథకం కింద రూ.లక్షలు ఖర్చు చేసి అన్ని సదుపాయాలు కల్పిస్తే ఇప్పుడు వాటిని వినియోగించుకోకుండా విలీనం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం పెట్టిన ఖర్చు వృథా అవుతుందని, ఈ ప్రక్రియ మొత్తం ప్రైవేట్ స్కూళ్లను ప్రోత్సహించేందుకేనని మండిపడుతున్నారు. -
పార్టీ కమిటీలను వెంటనే పూర్తి చేయాలి: సజ్జల
తాడేపల్లి: ప్రతీ నియోజకవర్గంలోనూ వైఎస్సార్సీపీ కమిటీలు వెంటనే పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, రీజనల్ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, ఇతర ముఖ్యనేతలు టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కమిటీల విషయంలో ఎటువంటి జాప్యం జరగకూడదని సజ్జల ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో కమిటీల ఏర్పాటు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం జనరల్ సెక్రటరీలు, రీజనల్ కో ఆర్డినేటర్లు, కేంద్ర కార్యాలయం నుంచి ఇంచార్జులు అందరూ అందుబాటులో ఉంటారన్నారు. కమిటీల విషయంలో జాప్యం జరగడానికి వీల్లేదని ఇప్పటికీ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేసిన సంగతిని సజ్జల ఈ సందర్భంగా గుర్తు చేశారు. కమిటీల ఏర్పాటుపై సీరియస్ గా దృష్టిపెట్టాలని, జిల్లా అధ్యక్షులు వెంటనే వీటిపై స్పందించాలని సజ్జల సూచించారు.ప్రజా పాలనను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, పార్టీకి సంబంధించి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం సమిష్టిగా పనిచేసి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేశారని సజ్జల అభినందించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారన్నారు. -
పొట్టి శ్రీరాములు జయంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: పొట్టి శ్రీరాములు జయంతి ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. ‘‘ఆంధ్రులు ఉన్నంత కాలం శ్రీ పొట్టి శ్రీరాములు గారు చిరస్మరణీయులు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసిన ఆయన దృఢసంకల్పం, త్యాగనిరతి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. నేడు శ్రీ పొట్టి శ్రీరాములుగారి జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఆంధ్రులు ఉన్నంత కాలం శ్రీ పొట్టి శ్రీరాములు గారు చిరస్మరణీయులు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసిన ఆయన దృఢసంకల్పం, త్యాగనిరతి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. నేడు శ్రీ పొట్టి శ్రీరాములుగారి జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు. pic.twitter.com/Af7J8ai5MN— YS Jagan Mohan Reddy (@ysjagan) March 16, 2025 -
ఉపాధి కూలీలకు డబ్బులివ్వని సర్కారు
సాక్షి, అమరావతి: గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలకు 70 రోజులుగా వేతనాల చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ ఏడాది జనవరి 9 తర్వాత పనులు చేసిన కూలీలకు ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు. 65 రోజులపాటు చేసిన పనులకు సంబంధించి దాదాపు రూ.664 కోట్లను కూలీలకు చెల్లించాల్సి ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరకని రోజుల్లో పేదలు ఉపాధి హామీ పనులపైనే ఆధారపడుతుంటారు. వ్యవసాయ పనులు పూర్తిగా తగ్గిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల నుంచి 6 లక్షల మంది పేదలు ప్రస్తుతం ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నారు. 74 లక్షల మందికి ఈ పనులే ఆధారం ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 57.87 లక్షల కుటుంబాలకు చెందిన 97.35 లక్షల మంది ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఏటా 46 నుంచి 47 లక్షల కుటుంబాలు వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి హామీ పథకం పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 46.51 లక్షల కుటుంబాలకు చెందిన 74 లక్షల మంది ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. వీరిలో 60 శాతానికి పైగా మహిళలే. దీనిని బట్టి గ్రామీణ ప్రాంతాల్లో సగం కుటుంబాలు ఉపాధి హామీ పథకంపైనే ఆధారపడుతున్నాయి. ఎందరికో జీవనోపాధి కలి్పస్తున్న ఈ పథకం అమలులో కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందో అర్థమవుతోందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఉద్యోగులకూ వేతనాలు కరువే..?15వ తేదీ ముగిసినా 5వేల మందికి అందని జీతాలుసాక్షి, అమరావతి: నెలలో సగం రోజులు గడిచిపోయినా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదు. ఉపాధి హామీ పథకం నిర్వహణ కోసం మండల స్థాయిలో కంప్యూటర్ సెంటర్లు(ఎంసీసీ) నుంచి మొదలై జిల్లా స్థాయిలో డ్వామా కార్యాలయాలు, రాష్ట్ర స్థాయిలోని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో ఫిక్సిడ్ టెన్యూర్ ఎంప్లాయీస్(ఎఫ్టీఈ) కేటగిరీలో కలిపి ఐదు వేల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తుంటారు.ఎంసీసీల్లో పని చేసే ఎఫ్టీఈ కేటగిరీ ఉద్యోగుల్లో టెక్నికల్ అసిస్టెంట్ల(టీఏ) నుంచి రాష్ట్ర స్థాయి కార్యాలయంలో పనిచేసే వివిధ స్థాయి ఎఫ్టీఈ ఉద్యోగుల వరకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన వేతనాలను మార్చి 15వ తేదీ సాయంత్రం వరకు చెల్లించలేదు. ఆయా ఉద్యోగులకు చాలా తక్కువ మొత్తంలో వేతనాలు ఉన్నాయని, వాటిని సక్రమంగా చెల్లించకపోతే ఎలా జీవించాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. పెండింగ్ వేతనాలు ఇవ్వాలి..నాలుగు వారాలు పని చేశాం. రోజూ ఆటోలో బాడిగ రూ.20 ఇచ్చి వెళ్లాం. మేం చేసిన పనికి రావాల్సిన కూలి కోసం రోజూ మేట్లను అడుగుతున్నాం. పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి. – పసుపులేటి బ్రహ్మయ్య, ఉపాధి కూలీ, చాగంటివారిపాలెం, పల్నాడు జిల్లారూపాయి కూడా ఇవ్వడం లేదు రోజూ ఉపాధి పనికి వస్తున్నాం. ఐదారు వారాల నుంచి ఒక్క రూపాయి కూడా అందడం లేదు. పనిచేస్తున్న దగ్గర కనీసం నీడ సదుపాయం కూడా లేదు. సకాలంలో వేతనాలు అందజేసి, పని దగ్గర మౌలిక వసతులు కల్పించాలి. – జి.విజయలక్ష్మి, ఉపాధి కూలీ, శ్యామసుందరపురం, టెక్కలి, శ్రీకాకుళం జిల్లాపైసా ఇవ్వలేదు ఉపాధి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గతంలో వారానికి ఓసారి డబ్బు పడేది. ఇప్పుడు రెండు నెలలుగా కూలీ డబ్బులు ఇవ్వలేదు. కుటుంబం గడవడం కష్టంగా ఉంది. పిల్లల్ని ఎలా పోషించాలో తెలియడం లేదు. – కుమార్, ఉపాధి కూలీ, చిట్టమూరు, తిరుపతి జిల్లా -
ఆర్బీకేల ఆక్రమణ
సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలో పౌరులకు సేవలందించిన సచివాలయాలను నీరుగార్చడంతో పాటు వలంటీర్ల వ్యవస్థకు ఉద్వాసన పలికిన టీడీపీ కూటమి సర్కారు... డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల భవనాలను (రైతు సేవా కేంద్రాలు) సైతం ఆక్రమిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విత్తు నుంచి విక్రయం వరకు అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచి పల్లె దాటాల్సిన అవసరం లేకుండా భరోసా కల్పించిన ఆర్బీకేలను దర్జాగా కబ్జా చేస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒత్తిడితో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఉండి, కాళ్ల, ఆకివీడు ఆర్బీకేలను ఇప్పటికే పోలీస్స్టేషన్లుగా మార్చేశారు. ఇదే రీతిలో మిగిలిన జిల్లాల్లోనూ కూటమి నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసిన సీఎం చంద్రబాబు.. వాటి ఉనికే లేకుండా చేయాలనే కుట్రతో ఆ భవనాలను వివిధ శాఖలకు కేటాయిస్తుండటంపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.జగన్ ముద్ర చెరిపేయడమే లక్ష్యం..!సచివాలయాలు.. వలంటీర్లు... ఆర్బీకేల పేరు చెబితే చాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తుకొస్తారు! ప్రజల ముంగిటే పౌరసేవలు అందించాలన్న సంకల్పంతో ప్రతి రెండువేల జనాభాకు ఓ సచివాలయం.. వాటికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఒకేసారి 10,778 ఆర్బీకేలను నెలకొల్పి వాటి ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు సేవలందించేందుకు పట్టభద్రులైన 15,667 మంది వ్యవసాయ, ఉద్యాన, పట్టు, మత్స్య, వెటర్నరీ సçహాయకులను నియమించారు. రైతులకు ఎనలేని సేవలందిస్తున్న వీటిని నిర్వీర్యం చేయడం ద్వారా వైఎస్ జగన్ ముద్రను చెరిపేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది. రైతన్న ఇక ఎటు వెళ్లాలి..?గతంలో రైతన్నలు గ్రామ చావిడి, కూడలి లేదా కాలువ గట్లపై కూర్చొని కష్టసుఖాలు చెప్పుకునే వారు. ఆర్బీకేల ఏర్పాటుతో అన్నదాతలు వాటిని తమ సొంత ఇంటి మాదిరిగా భావించారు. తమ కోసం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థను ఎంతో ఆదరించారు. రైతన్నలు ఉదయం పొలానికి వెళ్లే ముందు.. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు ఆర్బీకేలో అడుగు పెట్టడం ఆనవాయితీగా మారింది. విత్తనాలు, ఎరువులు, ఈ–క్రాప్, రైతు భరోసా, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ.. ఇలా ప్రతి ఒక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నిశ్చింతగా పొలం పనుల్లో నిమగ్నమయ్యేవారు. వివిధ రకాల వ్యవసాయ సంబంధిత మేగజైన్స్తోపాటు స్మార్ట్ టీవీ ద్వారా పంటల సాగులో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు అందేవి. డిజిటల్ కియోస్క్ల ద్వారా తమకు కావాల్సిన ఉత్పాదకాలను బుక్ చేసుకుని వాతావరణ, మార్కెట్ ధరల సమాచారాన్ని తెలుసుకునేవారు. అన్నదాతలకు గ్రామాల్లో సేవలందించేందుకు రూ.2,260 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో 10,252 ఆర్బీకేల నూతన భవన నిర్మాణాలను కూడా గత ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే రూ.1,165 కోట్ల వ్యయంతో 4,865 భవనాలు పూర్తయి కొన్ని చోట్ల ఆర్బీకేల కార్యకలాపాలు కొనసాగుతుండగా, మరికొన్ని భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 5,387 భవనాల్లో నిర్మాణాలు దాదాపు 80 – 90 శాతం పూర్తి అయ్యాయి. కొద్దిపాటి నిధులిస్తే చాలు పూర్తయ్యే దశలో ఉండగా కూటమి ప్రభుత్వం రావడంతో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
సీమ హక్కులు 'కృష్ణా'ర్పణం
రాయలసీమకు హక్కుగా కేటాయించిన కృష్ణా జలాలను వాడుకునే విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేతకానితనంతో చోద్యం చూస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ యథేచ్ఛగా అనుమతి లేకుండా నీటిని తరలించుకుపోతున్నా, ఇంకా అదనంగా దండుకోవడానికి ప్రాజెక్టులు నిర్మిస్తున్నా... ఏమాత్రం అడ్డు చెప్పక పోవడం విస్తుగొలుపుతోంది. మాకు కేటాయించిన నీటిని మేము తీసుకెళ్లే ప్రయత్నం చేయడం ఎలా తప్పవుతుందని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఎదుట గట్టిగా నోరు విప్పి వాదించలేదు. ఎవరి మేలు కోసం.. ఎందుకీ ఈ బేలతనం? ‘సీమ’పై కోపమా? లేక వైఎస్ జగన్కు పేరొస్తుందని కుళ్లా..?సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీరు.. చెన్నై తాగు నీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం భవితవ్యం కూటమి సర్కారు తీరుతో ప్రశ్నార్థకంగా మారింది. పది నెలలుగా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మన రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామని వాదించలేకపోయింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 798 అడుగులు ఉన్నప్పటి నుంచే పొరుగు రాష్ట్రం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని తరలిస్తున్నా, 800 అడుగుల నుంచే ప్రాజెక్టులకు నీటిని తీసుకుంటున్నా.. కొత్తగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తున్నా అడ్డుచెప్పలేక పోతోంది. 880 అడుగులకు నీళ్లొచ్చినప్పుడు మాత్రమే మనం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా గరిష్టంగా హక్కుగా దక్కిన 44 వేల క్యూసెక్కులు తరలించాలంటే ఎన్ని రోజులు ఆగాలని, ఆ మేరకు వరద ఎన్ని రోజులు ఉంటుందని.. ఇలాగైతే ఆ మేరకు నీటిని తరలించడం ఎలా సాధ్యమని గట్టిగా వాదించలేదు. కోటా మేరకు నీటిని వాడుకునేలా గత వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని నోరు విప్పి చెప్పలేదు. పర్యావరణ అనుమతులు వచ్చేలోగా తాగునీటి పనులు కొనసాగించడంలో ఏమాత్రం తప్పులేదని కూడా వాదించలేదు. ఫలితంగా ఈ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం.. చేసిన పనులను తొలగించి, యథాస్థితికి తేవాలని గత నెల 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ) ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తుపై ఆ రోజు ఈఏసీ 25వ సమావేశంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ చర్చించింది. ఆ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం పైన పేర్కొన్న విధంగా సమర్థవంతంగా వాదనలు వినిపించక పోవడం వల్లే రాయలసీమ ఎత్తిపోతలకు శరాఘాతంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాలను తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులను కొనసాగిస్తూ.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను హరిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2014–19 మధ్య నాటి చంద్రబాబు సర్కార్ రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయ, ఓటుకు నోటు కేసుతో వ్యక్తిగత ప్రయోజనాలు పొందేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన తరహాలోనే ఇప్పుడూ వ్యవహరిస్తోందంటూ రైతులు మండిపడుతున్నారు. తాగునీటి పనులకూ బ్రేక్చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగుగంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదన పంపారు. రాయలసీమ ఎత్తిపోతలలో తాగు నీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పనులను ఏమాత్రం పట్టించుకోలేదు. పది నెలలుగా తీవ్ర నిర్లక్ష్యం చేయడం ద్వారా రాయలసీమకు తీరని ద్రోహం చేసింది. ఇదే సమయంలో ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించలేదు. దీంతో రాయలసీమ ఎత్తిపోతల తొలి దశ పనులకు బ్రేక్ పడినట్లయింది. ‘బనకచర్ల’ ప్రాజెక్టుపైనా డ్రామాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బనకచర్ల ప్రాజెక్టుపైనా నాటకాలాడుతున్నారని స్పష్టమవుతోంది. పోలవరం నీళ్లు బనకచర్లకు తీసుకెళ్తామని, సముద్రంలోకి పోయే వృథా నీటిని సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దని ఓవైపు చెబుతూనే.. మరోవైపు తన శిష్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ద్వారా అభ్యంతరాలు లేవనెత్తేలా కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలే ఇందుకు నిదర్శనం. కేవలం ప్రచారం కోసం మాత్రమే చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఉపయోగించుకుంటున్నారని ఇట్టే అర్థమవుతోంది. నిర్విఘ్నంగా పాలమూరు– రంగారెడ్డి పనులు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలు తరలించేలా రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు–రంగారెడ్డి, రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను రూ.6,190 కోట్ల వ్యయంతో 2015 జూన్10న తెలంగాణ సర్కార్ చేపట్టింది. మన రాష్ట్ర హక్కులకు విఘాతం కలిగించే ఈ ప్రాజెక్టులపై అప్పటి చంద్రబాబు సర్కార్ అభ్యంతరం చెప్పలేదు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన జలాలు దక్కవని.. ఏపీకి చెందిన రైతులు 2021లో ఎన్జీటీ (చెన్నె బెంచ్)ని ఆశ్రయించారు. ఈ కేసులో రైతులతో నాటి వైఎస్సార్సీపీ సర్కార్ జత కలిసింది. ఆ రెండు ఎత్తిపోతలకు నీటి కేటాయింపులే లేవని.. వాటి వల్ల శ్రీశైలం, సాగర్పై ఆధారపడ్డ ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టా కూడా నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతుందని వాదించింది. దీంతో ఏకీభవించిన ఎన్జీటీ తక్షణమే పనులు నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్ను ఆదేశిస్తూ 2021 అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పనులు చేస్తుండటంతో 2022 డిసెంబర్ 22న తెలంగాణ సర్కార్కు రూ.920.85 కోట్ల జరిమానా సైతం విధించింది. అయినప్పటికీ వాటిని తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా పనులు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. హక్కులను కాపాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల⇒ ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగు గంగకు 29, గాలేరు–నగరికి 38.. మొత్తంగా 101 టీఎంసీలు సరఫరా చేయాలి.⇒ రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకు శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జునసాగర్ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం తమ భూభాగంలో ఉందని తెలంగాణ సర్కార్ దాన్ని తన అధీనంలోకి తీసుకున్నా.. ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం నాటి చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా కృష్ణా బోర్డు కేటాయింపులు చేయకున్నా, దిగువన నీటి అవసరాలు లేకున్నా తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం జలాశయంలో 798 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తూ వస్తోంది. 800 అడుగుల నుంచే నీటిని తరలించేలా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది.⇒ తెలంగాణ సర్కార్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా 2015లో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాటి చంద్రబాబు సర్కార్ అడ్డుకోలేదు. ఇలా తెలంగాణ సర్కార్ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాడుకోలేని దుస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగు నీటికి సైతం తల్లడిల్లాల్సిన దయనీయ పరిస్థితి.⇒ తడారిన గొంతులను తడిపేందుకు.. హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం.⇒ ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర్షతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్లో తెలంగాణ ప్రాంతంలోని రైతులతో టీడీపీ నేతలు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది. -
ఈనాడు ఆస్తుల జప్తు
సాక్షి, అమరావతి: అందరికీ నిత్యం ఉదయాన్నే నీతులు చెప్పే ఈనాడు (ఉషోదయ ఎంటర్ప్రైజెస్) దౌర్జన్యం కొనసాగుతోంది. తమ పత్రిక ద్వారా జనాలకు నీతులు మాత్రమే చెబుతామని, వాటిని తాము మాత్రం ఆచరించమని ఈనాడు మరోమారు నిరూపించింది. గతంలో విశాఖపట్నం ఈనాడు కార్యాలయం స్థలం విషయంలో దాని యజమాని ఆదిత్య వర్మను ముప్పుతిప్పలు పెట్టిన ఈనాడు యాజమాన్యం, ఇప్పుడు విజయవాడలో ఉన్న కార్యాలయ స్థలం విషయంలో కూడా దాని యజమాని ముసునూరు అప్పారావును సైతం అలాగే ముప్పుతిప్పలు పెడుతోంది. ఈనాడు పత్రిక కోసం తీసుకున్న స్థలం లీజు గడువు ముగిసినా.. దాన్ని అప్పారావుకు అప్పగించకుండా చుక్కలు చూపిస్తోంది. చివరకు అప్పారావు కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి తెచ్చింది. అక్కడ కూడా అప్పారావుకు అడుగడుగునా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేసింది. కోర్టుకెళ్లి అప్పారావు విజయం సాధించినా.. న్యాయస్థానం ఆదేశాలను సైతం ఈనాడు బేఖాతరు చేసింది. దీంతో కోర్టు ఈనాడు తీరును తీవ్రంగా ఆక్షేపించింది. స్థల యజమానిని వేధించడానికే ఆ స్థలాన్ని ఖాళీ చేయడం లేదని కూడా ఘాటుగా వ్యాఖ్యానించింది. కాగా.. బాధితుడు అప్పారావుకు రూ.5.20 కోట్లను 6 శాతం వార్షిక వడ్డీతో పరిహారం చెల్లించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం ఈనాడు యాజమాన్యం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈనాడు ఆస్తుల జప్తునకు న్యాయస్థానం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. విజయవాడ గ్రామీణ మండలం గూడవల్లిలో ఉన్న ఈనాడు ఆస్తులను బదలాయించడం, తాకట్టు పెట్టడం, అమ్మడం, బహుమతిగా ఇవ్వడం చేయరాదని ఈనాడు యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ ఆస్తులను ఎవరూ కొనడం, బహుమతిగా తీసుకోవడం చేయరాదంది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈనాడు సీఎండీ కిరణ్ను ఆదేశించింది. అసలు కథ ఏమిటంటే.. ఈనాడు యజమాని రామోజీరావు 1975లో విజయవాడ పటమటలంకలో ముసునూరి అప్పారావుకు చెందిన 92 సెంట్ల స్థలాన్ని 33 ఏళ్లపాటు లీజుకు తీసుకున్నారు. నెలకు రూ.725 అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ పక్కనే అప్పారావు సమీప బంధువైన వల్లూరు వెంకటేశ్వరరావుకు చెందిన ఎకరా 47 సెంట్ల భూమిని కూడా రామోజీరావు లీజుకు తీసుకున్నారు. లీజు గడువు 30.04.2008న ముగిసింది. దీంతో మరో 33 ఏళ్ల పాటు లీజు పొడిగించాలని స్థల యజమాని అప్పారావును రామోజీరావు కోరారు. రామోజీ సంగతి బాగా తెలిసిన అప్పారావు లీజు పొడిగింపునకు నిరాకరించారు. 6 నెలల్లో స్థలాన్ని ఖాళీ చేసి ఇవ్వాలని రామోజీరావుకు తేల్చిచెప్పారు. 6 నెలల గడువు 2008 అక్టోబర్తో ముగిసింది. అయినా రామోజీరావు ఆ స్థలాన్ని ఖాళీ చేయలేదు. ఇదే సమయంలో మరో 33 ఏళ్లపాటు లీజు పొడిగించేలా అప్పారావును ఆదేశించాలంటూ విజయవాడ జిల్లా కోర్టులో రామోజీరావు సూట్ దాఖలు చేశారు. దానిని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు 2013లో కొట్టేసింది. అప్పారావుకు చెందిన స్థలంపై ఈనాడుకు ఎలాంటి హక్కు లేదని తేల్చిoది. అంతేకాక ఈనాడు ఆ స్థలంలో ఉండటం అక్రమమేనని స్పష్టం చేసింది. దీనిపై ఈనాడు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్ను సైతం కోర్టు కొట్టేసింది. సీనియర్ సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని స్పష్టం చేసింది. అప్పారావును వేధించడానికి ఈ అప్పీల్ను ఆయుధంగా ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని జిల్లా కోర్టు 2017లో తీర్పునిచ్చింది. పరిహారంగా రూ.5.20 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించినా..2015లో ముసునూరి అప్పారావు తన స్థలం నుంచి ఈనాడును ఖాళీ చేయించాలని కోరుతూ విజయవాడ కోర్టులో సూట్ దా3ఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అప్పారావుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దాదాపు 60 పేజీల తీర్పు వెలువరించింది. 2012–15 వరకు అప్పారావుకు రూ.5.20 కోట్లను 6శాతం వార్షిక వడ్డీతో పరిహారంగా చెల్లించాలని ఈనాడు యాజమాన్యాన్ని ఆదేశించింది. మిగిలిన కాలానికి పరిహారం కోసం పిటిషన్ దాఖలు చేసుకునే వెసులుబాటును అప్పారావుకు ఇస్తూ 2024 అక్టోబర్ 3న తీర్పునిచ్చింది. అయితే.. ఈ తీర్పును ఈనాడు బేఖాతరు చేసింది. దీంతో తీర్పు అమలుకు అప్పారావు కింది కోర్టులో ఈపీ దాఖలు చేశారు. విజయవాడ గ్రామీణ మండలం గూడవల్లిలో ఉన్న ఈనాడు కార్యాలయాన్ని జప్తు చేయాలని అందులో కోరారు. దానిపై విచారణ జరిపిన కోర్టు తాము ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.5.20 కోట్ల పరిహారం చెల్లించడంలో ఈనాడు విఫలమైందని తేల్చింది. ఇందుకు గాను ఈనాడు ఆస్తుల జప్తునకు ఆదేశిస్తున్నట్టు ఈ నెల 7న ఉత్తర్వులు జారీ చేసింది. ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ఎండీ కిరణ్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. గతంలో ఆదిత్య వర్మను వేధించిన ఈనాడు రామోజీరావు ఈనాడు పత్రిక కోసం విశాఖపట్నం సీతమ్మధారలో మంతెన ఆదిత్య వర్మకు చెందిన 2.7 ఎకరాల భూమిని 1974లో 33 ఏళ్ల గడువుతో లీజుకు తీసుకున్నారు. నెలకు రూ.2,500 అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే వర్మ నుంచి లీజుకు తీసుకున్న భూమిని రామోజీరావు సొంత భూమిగా చూపుకుని ప్రభుత్వం నుంచి పరిహారం పొందారు. రామోజీరావు లీజుకు తీసుకున్న 2.7 ఎకరాల భూమిలో ప్రభుత్వం రోడ్డు వెడల్పు నిమిత్తం 618 గజాల భూమిని తీసుకుంది. ఇందుకు గాను సీతమ్మధారలో 872 గజాల స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవానికి ఈ స్థలం ఆదిత్య వర్మకు చెందాలి. కానీ.. రామోజీరావు మోసపూరితంగా ఆ భూమిని తన కుమారుడి పేరిట రిజిస్టర్ చేయించారు. ఇందుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆదిత్యవర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, రామోజీ పలుకుబడి ముందు పోలీసులు ఏం చేయలేకపోయారు. దీంతో వర్మ న్యాయపోరాటం చేపట్టారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలకు దిగగా.. ఆ భూమికి సంబంధించి 2007లో 33 ఏళ్ల లీజు ముగిసింది. అయినా రామోజీ ఆ స్థలాన్ని ఖాళీ చేయలేదు. లీజును మరో 33 ఏళ్ల పాటు పొడిగించాలని కోరారు. రామోజీ దుర్బుద్ధి తెలిసిన వర్మ అందుకు అంగీకరించలేదు. దీంతో తనది కాని స్థలం విషయంలో రామోజీరావు కోర్టును ఆశ్రయించారు. వర్మ కూడా రామోజీరావును దీటుగా ఎదుర్కొన్నారు. చివరకు వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఎక్కడా పప్పులు ఉడకకపోవడంతో రామోజీరావు చివరకు వర్మ స్థలాన్ని ఖాళీ చేశారు. వర్మకు చెల్లించాల్సిన పరిహారాన్ని కూడా పూర్తిగా చెల్లించకుండా కొంత చెల్లించి రామోజీ రాజీ చేసుకున్నారు. -
సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పేపర్లో తప్పిదం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ పరీక్షలో ఒక ప్రశ్న తప్పుగా వచ్చింది. ప్రశ్నాపత్రంలోని సెక్షన్–బీలో నాలుగు మార్కులకు ఇచ్చిన 14వ ప్రశ్నలో ‘ఏ సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ వాటర్ ఈజ్ లేబుల్డ్ యాజ్ 100 పర్సంట్ (డబ్ల్యూ/వీ)’గా వచ్చింది. ఉదయం 9గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, 10.30 గంటలకు ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి అందిన సమాచారంతో ఈ ప్రశ్నలో ఉన్న ‘డబ్ల్యూ/వీ’కి బదులుగా డబ్ల్యూ/డబ్ల్యూగా మార్చుకుని జవాబులు రాయాలని విద్యార్థులకు ఇన్విజిలేటర్లు సూచించారు. ముద్రణ లోపం కారణంగా తప్పిదం జరిగిందని, అందుకే ప్రశ్నను మార్పు చేసుకుని జవాబు రాయాలని పేర్కొన్నారు. అయితే, అప్పటికే గంటన్నర సమయం గడిచిపోవడంతోపాటు ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నకు యథావిధిగా చాలామంది విద్యార్థులు జవాబు రాశారు. దానిని మళ్లీ మార్పుచేసి జవాబు రాయాల్సి రావడంతో సమయం సరిపోక ఇబ్బందిపడినట్లు విద్యార్థులు తెలిపారు. కాగా, ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ‘డబ్ల్యూ/వీ’ అనే పదం సరైనదేనని, అనవసరంగా దీనిని మార్పుచేసి విద్యార్థులను అయోమయానికి గురిచేశారని కెమిస్ట్రీ సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. కొన్ని కార్పొరేట్ కళాశాలలు తమ విద్యార్థులకు ఇచ్చిన స్టడీ మెటీరియల్లో డబ్ల్యూ/డబ్ల్యూ అని ఉందని, వారికి లబ్ధి చేకూర్చేందుకు ప్రశ్నను సవరించారని ఆరోపిస్తున్నారు.ఇంటర్ పరీక్షా కేంద్రంలో మాస్కాపీయింగ్!సోషల్ మీడియాలో వీడియో వైరల్చాగలమర్రి: నంద్యాల జిల్లా చాగలమర్రిలోని ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాగలమర్రిలోని శ్రీ వాసవి జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఐదు కాలేజీలకు చెందిన విద్యార్థులు గత 15 రోజులుగా పరీక్షలు రాస్తున్నారు. ఇటీవల ఒక కాలేజీకి చెందిన విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడుతుండగా, శ్రీ వాసవి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీడియో తీసినట్లు తెలిసింది. ఆ వీడియోను తమ కాలేజీ కరస్పాండెంట్కు ఆయన పంపినట్లు సమాచారం. దీంతో వాసవి కాలేజీ కరస్పాండెంట్ ఆ వీడియోను మాస్కాపీయింగ్కు పాల్పడుతున్న విద్యార్థుల కాలేజీ కరస్పాండెంట్కు పంపించి.. ‘మీ పిల్లలు ఎలా మాస్కాపీయింగ్కు పాల్పడుతున్నారో.. చూడండి..’ అని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆ వీడియా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, కరస్పాండెంట్ల వాట్సాప్, ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లోకి చేరినట్లు సమాచారం. ఈ వీడియోను ఒక కాలేజీ కరస్పాండెంట్ కొద్దిరోజుల కిందట ఆర్ఐవోకు పంపినట్లు తెలిసింది. వెంటనే ఆర్ఐవో సునీత స్పందించి ముగ్గురు అధికారులను తనిఖీల కోసం పంపించగా, వారికి ముడుపులు ముట్టచెప్పి అసలు వ్యవహారాన్ని గోప్యంగా ఉంచినట్లు సమాచారం. అయినా, ఆర్ఐవో ఆదేశాల మేరకు గత ఐదారు రోజుల నుంచి ఈ పరీక్ష కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేయడం గమనార్హం. మాస్కాపీయింగ్ జరగలేదు: ప్రిన్సిపాల్ ఓబులేసు తమ కాలేజీ గుర్తింపు రెన్యూవల్కు గడువు పూర్తికావడంతో అఫిలియేషన్ కొనసాగించేందుకు పరిశీలించడానికి ఆర్ఐవో సునీతతోపాటు త్రిసభ్య కమిటీ సభ్యులు వచ్చారని శ్రీ వాసవి కాలేజీ ప్రిన్సిపాల్ ఓబులేసు తెలిపారు. తమ కళాశాల పరీక్ష కేంద్రంలో ఎలాంటి మాస్కాపీయింగ్ జరగలేదని ఆయన చెప్పారు. -
పుట్టెడు దుఃఖంలో ఉన్న పేదలపై భారం
సాక్షి, అమరావతి: ఓవైపు అయినవారిని కోల్పోయి పుట్టెడు దుఃఖం.. మరోవైపు వారి మృతదేహాల తరలింపు భారం.. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల దోపిడీ..! ప్రమాదాలకు గురై, అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించినవారి మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు బంధువులు ఎదుర్కొంటున్న కష్టం ఇది. ప్రైవేట్ ఆసుపత్రులలో సొంత డబ్బుతో చికిత్స చేయించుకునే స్థోమత లేకనే ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న పేద, మధ్య తరగతికి ఇబ్బందులు పరిపాటిగా మారాయి. మందులు, వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు మృతదేహాలను తరలించే వాహనాల కొరత కూడా అధికంగా ఉంటోంది. ప్రైవేటు అంబులెన్స్ వారు చెప్పిందే ధర..! వారు అడిగినంత ఇవ్వకపోయినా, మరో వాహనంలో తరలింపునకు ప్రయతి్నంచినా అడ్డుకుని గొడవకు సైతం దిగుతున్నారు. వీరితో ఆసుపత్రుల్లోని కొందరు సిబ్బంది సైతం చేతులు కలిపి.. వార్డుల్లో ఎవరైనా మృతి చెందితే సమాచారం చేరవేస్తున్నారు. అంబులెన్స్ నిర్వాహకులు నేరుగా వార్డుల్లోకి వెళ్లి మరీ బాధిత కుటుంబ సభ్యులతో బేరాలకు దిగుతున్నారు. జిల్లాల పరిధిలో అయితే 50 కిలోమీటర్ల వరకు అంబులెన్స్ అద్దె, డ్రైవర్ బేటా/బత్తా, డీజిల్కు రూ.5 వేల నుంచి రూ.7 వేల మేర వసూలు చేస్తున్నారు. 50 నుంచి 100 కి.మీ.కు రూ.10 వేలపైన, వంద కి.మీ. పైగా ఉన్న దూరానికి రూ.15 వేల నుంచి రూ.20 వేలు అంతకంటే ఎక్కువ కూడా ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. సగం మంది సొంత ఖర్చుతోనే.. పెద్ద ఆసుపత్రుల్లో నమోదైన మరణాల్లో మృతదేహాలను ఉచితంగా స్వస్థలాలకు చేరవేసే మహాప్రస్థానం వాహనాలకు తీవ్ర కొరత ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్ల 54 వాహనాలు ఉండగా సగం మృతదేహాలను మాత్రమే ప్రభుత్వం ఉచితంగా తరలిస్తోంది. మిగిలిన సగంవాటికి ప్రైవేట్ అంబులెన్స్లను ఆశ్రయించక తప్పడం లేదు. గత ఏడాది ఏప్రిల్–ఆగస్టు మధ్య 17 చోట్ల 25,094 మరణాలు నమోదవగా, 13 వేల కేసుల్లోనే మహాప్రస్థానం వాహనాల్లో మృతదేహాలను తరలించారు. నంద్యాల, విజయనగరం, మచిలీపట్నంలో కేవలం ఒక్కటి చొప్పునే వాహనాలు ఉన్నాయి. వైఎస్సార్, ఏలూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, నెల్లూరుల్లో రెండేసి వాహనాలే ఉన్నాయి. అప్పటికే ఇవి మృతదేహాల తరలింపునకు వెళ్తే తిరిగి వచ్చేదాక ఎదురుచూడాల్సి ఉంటోంది. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, కాకినాడ వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో రోజువారీ మరణాలకు, అందుబాటులో ఉన్న వాహనాలకు పొంతన లేదు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్యే మృతదేహాలను తరలించాలనే నిబంధనలున్నాయి. రాత్రివేళ చనిపోతే.. మృతదేహాలను మార్చురీల్లో భద్రపరిచి, మరుసటి ఉదయం తరలించాల్సి వస్తోంది. అప్పటికి మృతుల సంఖ్య పెరిగి వాహనాలకు తీవ్ర డిమాండ్ నెలకొంటోంది. ప్రకటనలతో కాలక్షేపం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వ ఆసుపత్రులకు మహాప్రస్థానం వాహనాలు సమకూరుస్తున్నామంటూ పలుసార్లు మంత్రి సత్యకుమార్ ప్రకటనలు చేశారు. డిసెంబరులో 53 వాహనాలకు సీఎం ఆమోదం తెలిపారని వెల్లడించారు. కానీ, అంబులెన్స్లు అందుబాటులోకివచ్చిన దాఖలాలు లేవు. కాగా, ప్రభుత్వం సమకూరుస్తామని చెబుతున్న వాహనాలు ప్రస్తుత అవసరాలకు సరిపోవని, ఇంకా పెంచాలని ఆస్పత్రుల సూపరింటెండెంట్లు కోరుతున్నారు. -
‘బాలినేని ఆస్తులు ఎక్కడ పోగొట్టుకున్నారో అందరికీ తెలుసు’
సాక్షి, తాడేపల్లి: పిఠాపురం జయకేతనం సభలో పవన్ ఏం మాట్లాడారో ఆయనకే తెలియలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. జనసేన పార్టీకి దిశదశ లేదని.. పవన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ జనసేన స్థాపించారని.. పవన్ ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాదు.. కుటుంబం కోసమే పోరాటం చేస్తారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘కాపు సామాజికవర్గంపై చంద్రబాబు అనేక దుశ్చర్యలు చేశారు. జనసేన నిర్వహణను చూసేది చంద్రబాబే. జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబు మనుషులే. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమైంది?. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పిఠాపురంలో పవన్ ఎందుకు మాట్లాడలేదు?. గతంలో బీజేపీ నేతలపై పవన్ అనేక విమర్శలు చేశారు. పవన్ ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నాడు. రాష్ట్రంలో జనసేన నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని.. పవన్ ఆయన అన్నకు ఎమ్మెల్యే సీటు ఇప్పించుకున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తి బాలినేని..బాలినేని శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఇస్తూ.. బాలినేని శ్రీనివాస్రెడ్డి చరిత్ర ఏంటి?. అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తి బాలినేని.. ఆయన ఆస్తులు ఎక్కడ పోగొట్టుకున్నారో అందరికీ తెలుసు. జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచిన బాలశౌరి కూడా ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అసెంబ్లీకి రావటానికి 16 ఏళ్లు పట్టింది. అదికూడా అన్ని పార్టీలు కలిస్తేనే ఆ అవకాశం వచ్చింది. వైఎస్ జగన్ ఢిల్లీని ఢీకొట్టి, పోరాటం చేసి పదేళ్లకే సీఎం అయ్యారు’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘టీడీపీ కోసం పుట్టిన పార్టీ జనసేన. చంద్రబాబును కాపులు నమ్మరు. కాబట్టి జనసేన పార్టీని పవన్ చేత ఏర్పాటు చేయించారు. జనసేనను నడిపేదంతా చంద్రబాబే. రెండు పార్టీల మద్దతుతో పవన్కు 21 సీట్లు వచ్చాయి. వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. జనసేనలో ఉన్నవారంతా చంద్రబాబు మనుషులు, వైఎస్సార్సీపీ బహిష్కరించిన వారే..రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేయబోతున్నారో చెప్ప లేదు. ఎర్రకండువా నుండి కాషాయ రంగు వేసుకునే వరకు పవన్ వచ్చారు. అసలు ఎప్పుడు ఏ వేషం వేస్తారో జనానికి అర్థం కావటం లేదు. ఏ వ్యూహం, సిద్దాంతం లేకుండా మారిపోతున్న వ్యక్తి పవన్. జనసేన నేతలంతా ఇసుక, మద్యం దోపిడీలో మునిగి పోయారు. బియ్యం, విజిలెన్స్, దాడులు, డబ్బులు.. ఇదే పనిలో ఒక మంత్రి ఉన్నారు. ఇంత దోపిడీ చేస్తుంటే పవన్ ఏం చేస్తున్నారు?అధికారం, సినిమా గ్లామర్ ఉన్నందున జనం వస్తారు. అంతమాత్రానికే ఏదేదో ఊహించుకోవద్దు. పవన్ సీఎం అయ్యే అవకాశం లేదని కాపులకు సినిమా క్లయిమాక్స్ లో తెలుస్తుంది. నాగబాబుకు కొత్తగా ఎమ్మెల్సీ వచ్చేసరికి ఏవేవో కలలు కంటున్నారు. ఎన్నికలలో అవసరం తీరాక వర్మను తరిమేశారు. వర్మకి కనీసం మర్యాద అయినా ఇవ్వండి. పిఠాపురాన్ని మీ అడ్డా అనుకోవద్దు. ఉత్తరాది అహంకారం అంటూ అవకాశం వాద రాజకీయాలు చేయటం పవన్కే చెల్లింది’’ అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. -
యువత మార్కెట్ సోషల్ మీడియా
కొత్త బట్టలు కొనాలన్నా... లేటెస్ట్ గాడ్జెట్ కావాలన్నా... టీవీలు, ఫ్రిడ్జ్లు వంటి గృహోపకరణాలు తీసుకోవాలనుకున్నా.. ఇంటీరియర్ డిజైనింగ్.. ఆటోమొబైల్స్.. ఆభరణాలు.. ఇలా మార్కెట్లోకి వచ్చిన కొత్త ట్రెండ్స్ తెలుసుకునేందుకు సోషల్ మీడియా వేదికలను ఆశ్రయిస్తున్నామని యువత ముక్తకంఠంతో చెబుతోంది.హాలిడే ట్రిప్స్ను ప్లాన్ చేసేందుకు సైతం సోషల్ మీడియాలోనే అన్వేషిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వస్తు వినియోగ మార్కెట్ను సోషల్ మీడియా శాసిస్తోంది. అంతర్జాతీయ మార్కెటింగ్ కన్సల్టెన్సీ స్ప్రౌట్ సోషల్ ఇండెక్స్ తాజా నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. – సాక్షి, అమరావతి1 కొత్త ఫ్యాషన్లు, మార్కెట్ ఆవిష్కరణల గురించి తెలుసుకునేందుకు యువత ఆధారపడే వాటిలో సోషల్ మీడియా స్థానం90 శాతం కొత్త ఫ్యాషన్లు, మార్కెట్ ఆవిష్కరణల గురించి తెలుసుకునే విషయంలో సోషల్ మీడియానునమ్మేవారు81 శాతం సోషల్ మీడియా ప్రభావంతో తక్షణం స్పందించి వస్తువులు కొనుగోలు చేస్తున్నవారు » కొత్త ఫ్యాషన్లు, మార్కెట్ ఆవిష్కరణలను గురించి తెలుసుకునేందుకు యువత ఆధారపడేవాటిలో సోషల్ మీడియా మొదటి స్థానంలో ఉంది. ఏకంగా 90శాతం మంది యువత సోషల్ మీడియాను విశ్వసిస్తున్నారు. » స్నేహితులు, కుటుంబ సభ్యులను సంప్రదించడం అనేది రెండో స్థానంలో ఉంది. 68శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు. » టీవీ చానళ్లు మూడో స్థానంలో ఉన్నాయి. 60శాతం మంది యువత టీవీ చానళ్లలో ప్రకటనలను పరిశీలిస్తున్నారు. » నాలుగో స్థానంలో డిజిటల్ మీడియా ఉంది. 54శాతం మంది డిజిటల్ మీడియా ద్వారా మార్కెటింగ్ ట్రెండ్స్ తెలుసుకుంటున్నారు.» పాడ్ కాస్ట్ ప్రసారాలను 35శాతం మంది విశ్వసిస్తున్నారు. » 23శాతం మంది పత్రికలను ఆశ్రయిస్తున్నారు. » సోషల్ మీడియా ప్రభావంతో తక్షణం స్పందించి నచ్చినవి కొనుగోలు చేస్తున్నామని ఏకంగా 81శాతం మంది చెప్పారు.» కనీసం నెలకు ఒకసారి అయినా సోషల్ మీడి యా తమ కొనుగోలు అభిరుచులను నిర్దేశిస్తోందని 28శాతం మంది తెలిపారు.» ఇక ఏదైనా బ్రాండ్ గురించి సోషల్ మీడియాలో లేకపోతే తాము ప్రత్యామ్నాయ బ్రాండ్ల పట్ల మొగ్గుచూపుతున్నట్లు 78శాతంమంది వెల్లడించారు. » సోషల్ మీడియా ద్వారా వస్తువుల కొనుగోలుకు పలు కారణాలను కూడా యూజర్లు వెల్లడించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రదర్శించే వివిధ కంపెనీల ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారులకు అందించే సేవల పట్ల సంతృప్తి కారణంగా వస్తువులు కొనుగోలు చేస్తున్నామని 63శాతం మంది తెలిపారు. -
ఉర్దూ అకాడమీలో అలజడి
సాక్షి, అమరావతి: ఏపీ ఉర్దూ అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారంలో విస్తుపోయే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రూ.కోట్లాది నిధుల అవకతవకల వ్యవహారం ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని ఇంటి దొంగల్లో కలవరం తీవ్రమైంది. ‘‘ఉర్దూ అకాడమీలో అంతులేని అక్రమాలు’’ శీర్షికన ‘‘సాక్షి’’ ప్రచురించిన కథనంతో అకాడమీలో అలజడి మొదలైంది. తాజాగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్తో కొందరు అకాడమీ ఉద్యోగులు టీడీపీకి చెందిన మైనార్టీ నాయకుడి మధ్యవర్తిత్వంలో మంత్రాంగం సాగించడం చర్చనీయాంశమైంది.త్వరలో విచారణ గత టీడీపీ హయాం(2016–17)లో రూ.3.15 కోట్లు తెలంగాణ ఉర్దూ అకాడమీకి అప్పుగా ఇచ్చినట్టు ఏపీ ఉర్దూ అకాడమీ ఆడిట్ రిపోర్టులో లెక్కలు చూపించారు. దీనిపై ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగుల్మీరా తెలంగాణ ఉర్దూ అకాడమీని సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా తాము ఏపీ నుంచి ఎలాంటి అప్పు తీసుకోలేదని తేల్చిచెప్పింది. దీంతో చర్యలు తీసుకోవాలని నాగుల్మీరా లోకాయుక్తను ఆశ్రయించారు. ఫిర్యాదును క్షుణ్నంగా పరిశీలించి విచారణకు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త రిజిస్ట్రార్ గతేడాది నవంబర్ 26న ఏపీ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శికి నోటీసు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం జనవరి 6న విచారణ కమిషన్ను నియమించింది. రూ.3.15 కోట్ల గోల్మాల్పై రహస్యంగా విచారణ చేసి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తాను ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో ఉన్నందున.. విచారణ పూర్తికి మరికొంత గడువు కావాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో విచారణ ప్రారంభించే అకాశం ఉంది.దూకుడు తగ్గేలా చూడండి..మరోవైపు 2018–19 మధ్య టీడీపీ హయాంలో దాదాపు రూ.4 కోట్లు ఉర్దూ అకాడమీ నిధులను 67 మంది వ్యక్తిగత ఖాతాలకు మళ్లించిన వ్యవహారంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2021లో సీఐడీ కేసు నమోదు చేసి.. నలుగురిని అరెస్టు చేసింది. ఐపీసీ సెక్షన్ 420, 409 రెడ్ విత్ 120(బి) కేసులో ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలీ (ప్రస్తుతం రిటైర్డ్), సూపరింటెండెంట్ జాఫర్ (ప్రస్తుతం తెలంగాణ ఉర్దూ అకాడమీలో పనిచేస్తున్నారు)లను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ అనంతరం బెయిల్పై వచ్చారు. తాజాగా ఏపీకి చెందిన ఉర్దూ అకాడమీ ఉద్యోగితో పాటు బయటి వ్యక్తిని సీఐడీ అరెస్టు చేసింది. మరో 11 మందిని సీఐడీ అరెస్టు చేస్తుందనే లీకులు ఇవ్వడంతో వారంతా టీడీపీ మైనార్టీ నేత మధ్యవర్తిత్వంతో ప్రభుత్వ పెద్దల శరణు కోరుతున్నారు. ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని కలవరపడుతున్నారు. సీఐడీ దూకుడుకు కళ్లెం వేసి తమను కాపాడాలని మంత్రిని కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా, గత టీడీపీ హయాంలో ఉర్దూ అకాడమీని హద్దులేని అక్రమాలకు అడ్డాగా మార్చేశారని, రూ.30కోట్ల నిధులు ఎవరెవరు కొల్లగొట్టారో తేల్సాలని ముస్లిం సమాజం కోరుతోంది. -
ఉత్తరాంధ్ర జలాలు ఉత్తి మాటే
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగు నీటితోపాటు 1,200 గ్రామాల్లో 30 లక్షల మంది దాహార్తిని తీర్చే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి గ్రహణం పట్టింది. తొమ్మిది నెలలుగా తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ఈ పథకం పనులకు 2024–25 బడ్జెట్లో రూ.79.97 కోట్లు కేటాయించినా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పోలవరం ఎడమ కాలువలో 162.409 కి.మీ నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున 63.2 టీఎంసీల గోదావరి జలాలను తరలించి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 2009 జనవరి 2న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అంకురార్పణ చేశారు. ఈ పథకాన్ని వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో అప్పట్లో టెండర్లు కూడా పిలిచారు. కానీ.. వైఎస్సార్ హఠాన్మరణంతో ఆ పథకం పనులు ముందుకు సాగలేదు. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. 2019 ఎన్నికలకు ముందు ఈ పథకం తొలి దశ పనులను రూ.2020.20 కోట్లతో చేపట్టి, 4.85 శాతం అధిక ధరకు కాంట్రాక్టర్లకు అప్పగించింది. కానీ.. తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 2022లో నాటి సీఎం వైఎస్ జగన్ రూ.17,411 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు. తొలి దశలో పోలవరం ఎడమ కాలువలో 162.40 కి.మీ నుంచి 23 కి.మీల పొడవున కాలువ తవ్వకం, రెండు ఎత్తిపోతలు, పెదపూడి రిజర్వాయర్ నిర్మాణం, ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీ పనులను రూ.954.09 కోట్లతో, రెండో దశలో పాపయ్యపాలెం ఎత్తిపోతల, 121.62 కి.మీల పొడవున ప్రధాన కాలువ, ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీ పనులను రూ.5,134 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పగించారు. వీటికి అనుబంధంగా నిర్మించాల్సిన భూదేవి, వీరనారాయణపురం, తాడిపూడి రిజర్వాయర్ల నిర్మాణాన్ని దశల వారీగా చేపట్టాలని నిర్ణయించారు. తొలి దశ, రెండో దశ పనులు చేపట్టడానికి అవసరమైన డిజైన్లు అన్నింటినీ 2023 నాటికే ప్రభుత్వం ఆమోదించింది. దాంతో కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. తొలి దశ పనులు చేపట్టేందుకు 3,822 ఎకరాలు, రెండో దశ పనులు చేపట్టేందుకు 12,214.36 ఎకరాల సేకరణ ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. ఆ తర్వాత ఎక్కడి పనులు అక్కడే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు నిలిచిపోయాయి. 2025 జూన్ నాటికే ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలిస్తామని అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లా పర్యటనలో ప్రకటించారు. 2024–25 బడ్జెట్లో ఈ పథకానికి రూ.63.02 కోట్లు తొలుత కేటాయించారు. ఆ తర్వాత సవరించిన బడ్జెట్లో ఆ పథకానికి రూ.79.97 కోట్లు కేటాయించారు. కానీ.. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. తొమ్మిది నెలలుగా తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 2025–26 బడ్జెట్లో ఆ పథకానికి రూ.605.75 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో ఒక్క పైసా కూడా ఖర్చు చేయని నేపథ్యంలో.. ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన నిధులను ఖర్చు చేస్తారా.. లేదా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్రకు గోదావరి జలాభిషేకం ఇలా.. » వెనుకబడిన ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి, సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో పోలవరం ఎడమ కాలువను 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో 2004లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. 162.409 కి.మీ నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున అనకాపల్లి జిల్లా పాపయ్యపాలెం వరకు 23 కి.మీల పొడవున తవ్వే కాలువ ద్వారా తరలిస్తారు. ఈ కాలువలో 4.5 కి.మీ నుంచి మరో లింక్ కెనాల్ తవ్వి జామద్దులగూడెం నుంచి కొత్తగా 3.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పెదపూడి రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తారు. » పాపయ్యపాలెం నుంచి 45 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి, 106 కి.మీల పొడవున విజయనగరం జిల్లా గాదిగెడ్డ రిజర్వాయర్ వరకు తవ్వే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువ ద్వారా తరలిస్తారు. ఈ కాలువలో 14 కి.మీ నుంచి తవ్వే లింక్ కెనాల్ ద్వారా నీటిని మళ్లించి.. కొత్తగా 6.2 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచే భూదేవి రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తారు. » ప్రధాన కాలువలో 49.50 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి, వీఎన్ (వీరనారాయణ) పురం వద్ద ఎత్తిపోతల ద్వారా కొత్తగా 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే వీఎన్ పురం రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తారు. » ప్రధాన కాలువలో 73 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి.. తాడిపూడి ఎత్తిపోతల ద్వారా కొత్తగా 3.80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే తాడిపూడి రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తారు. » ప్రధాన కాలువలో 102 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి.. కొండగండరేడు నుంచి 60 కి.మీల పొడవున తవ్వే కాలువలోకి నీటిని ఎత్తిపోస్తారు. ఈ కాలువ నుంచి బీఎన్ వలస బ్రాంచ్ కెనాల్, జి.మర్రివలస లిఫ్ట్ కెనాల్, బూర్జువలస లిఫ్ట్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీళ్లందిస్తారు. మొత్తంమీద ఈ పథకం ద్వారా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 3.21 లక్షలు, విజయనగరం జిల్లాలో 3.94 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 85 వేల ఎకరాలకు నీళ్లందిస్తారు. -
అవును.. వాళ్లు యువతులను మావోల్లో చేర్పిస్తున్నారు
సాక్షి, అమరావతి: యువతులకు బ్రెయిన్వాష్ చేసి వారిని నిషేధిత మావోయిస్టు పార్టీలో చేర్పిస్తున్న వ్యవహారంలో నిందితులుగా ఉన్న డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్పలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన కేసులో బెయిల్ కోసం వారు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు కొట్టేసింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ కింది కోర్టు గతంలో జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పిటిషనర్లు యువతులకు బ్రెయిన్వాష్ చేసి మావోయిస్టు పార్టీలో చేర్పిస్తున్నారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.నా కుమార్తెను బలవంతంగా చేర్చారు..డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్ప మరికొందరు కలిసి మావోయిస్టు పార్టీలోకి యువతులను చేర్పించేందుకు చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) పేరుతో ఓ సంఘం ఏర్పాటుచేశారు. సామాజిక సేవ నెపంతో యువతులను చేరదీసి, వారు మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యేలా చేసి, ఆ తరువాత మావోయిస్టుల్లో చేర్పిస్తున్నారు. ఇదే రీతిలో విశాఖపట్నం, పెద్దబయలుకు చెందిన రాధా అనే యువతిని 2017లో మావోయిస్టుల్లో చేర్పించారు.2021లో రాధా తల్లి తన కుమార్తెను బలవంతంగా మావోయిస్టుల్లో చేర్పించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇదిలాఉంటే.. ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాలంటూ డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్ప విశాఖపట్నంలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు వారి బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ 2024 మే 29న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలుచేస్తూ వారిరువురూ హైకోర్టులో క్రిమినల్ అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ సురేష్రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.మావోయిస్టు కార్యకలాపాల్లో క్రియాశీలకంగా..పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ. సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. 2017లో రాధాను తీసుకెళ్లారంటూ ఆమె తల్లి 2021లో పోలీసులకు ఫిర్యాదు చేశారని.. కానీ, అప్పటికే ఆమె నాలుగేళ్లపాటు మౌనంగా ఉన్నారన్నారు. ఎన్ఐఏ తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని తేల్చిచెప్పారు. ఇందుకు సంబంధించి ఎన్ఐఏ పలు కీలక ఆధారాలు సేకరించిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఎన్ఐఏ సేకరించిన ఆధారాలను, అది దాఖలు చేసిన చార్జిషీట్ను పరిశీలించింది. పిటిషనర్లకు బెయిల్ నిరాకరిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పులో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. పిటిషనర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తెలిపింది. -
ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవులకు పేర్లు ఇవ్వడం లేదు
సాక్షి, అమరావతి: నామినేటెడ్ పదవుల కోసం ఇప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల నుంచి పేర్లను ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్యేలు ఆలస్యం చేయడం వల్లే పోస్టులు భర్తీ చేయలేకపోయామని తెలిపారు. నామినేటెడ్ పదవుల కోసం పార్టీ కోసం కష్టపడిన నేతల వివరాలను వీలైనంత త్వరగా పంపించాలని సూచించారు. ఆయన శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్ల నియామకానికి 60 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. మంత్రులు జిల్లాలకు వెళ్లే సమయంలో జిల్లా కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి గ్రామంలో అమలు చేసేందుకు ఎమ్మెల్యేలు, నేతలు చొరవ తీసుకోవాలని చెప్పారు. -
పెరుగుతున్న ఎండల తీవ్రత
సాక్షి, అమరావతి: వేసవి తొలి రోజుల్లోనే రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకి ఎండల తీవ్రత పెరుగుతోంది. గురువారం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉంటోంది. నిన్నటి వరకు రెండు, మూడు చోట్ల మాత్రమే 40 డిగ్రీలు దాటిన ఎండ.. గురువారం చాలా మండలాల్లో 40 డిగ్రీలు దాటిపోయింది. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లి జిల్లా నాతవరం, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయిపాలెంలో 42.1 డిగ్రీలు నమోదైంది. ఇవి సాధారణంకంటే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, పార్వతీపురం మన్యం, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఉష్ణోగ్రతలు ఏప్రిల్ రెండో వారానికల్లా మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గాలిలో తేమ శాతం ఎక్కువగానే ఉండడం వల్ల ఉక్కపోత ఉండడంలేదు. అయితే ఎలినినో పరిస్థితుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో మున్ముందు ఎండ, వడగాలుల తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
సర్కారు మోసం.. మిర్చి రైతు హాహా‘కారం’
సాక్షి, అమరావతి/నెట్వర్క్: మిరప రైతుల నెత్తిన టీడీపీ కూటమి ప్రభుత్వం కుచ్చుటోపి పెట్టింది. మద్దతు ధర పేరిట ఊరించి ఊహల పల్లకిలో ఊరేగించి నిలుపునా ముంచేసింది. మద్దతు, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసానికితోడు రైతుల ఖాతాకు జమ చేస్తామని కొంతకాలం, బోనస్ ఇచ్చే ఆలోచన చేస్తున్నామంటూ మరికొంత కాలం నాన్చింది. ఇప్పుడు మార్కెట్లో ధరలు ఎగబాకిపోతున్నందున ఇక మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తేల్చి చెబుతోంది. మరి నష్టానికి అమ్ముకుంటున్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దల నోరు పెగలడం లేదు. బోనస్ విషయంలో చేతులెత్తేశారు. తేజ రకం తప్ప మిగిలిన రకాలన్నీ నేటికీ మద్దతు ధర కంటే తక్కువగానే పలుకుతున్నాయి. అయినా సరే ధరలు ఎగబాకిపోతున్నాయంటూ అసెంబ్లీ సాక్షిగా మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడుతూ అబద్ధాలు వల్లె వేస్తున్నారు. విదేశాలకు ఎగుమతుల ఆర్డర్లు తగ్గడంతో పంట మార్కెట్కు వచ్చే సమయంలోనే ధరల పతనం మొదలైంది. మరో వైపు ధరలు మరింత తగ్గుతాయన్న ఆలోచనతో మసాలా కంపెనీలు కూడా కొనుగోలు నిలిపివేశాయి. ఇదే విషయమై ఓ వైపు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం హెచ్చరికలు చేసినా, మార్కెటింగ్ శాఖ ముందుగానే గుర్తించించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రంగంలోకి దిగి మిర్చి యార్డుకు వెళ్లి మిరప రైతులకు బాసటగా నిలవడంతో కూటమి పెద్దలు నానా హంగామా చేశారు. చేతిలో ఉన్న మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆదుకోవల్సింది పోయి కేంద్రానికి లేఖలు రాశామని, సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో భేటీ అయ్యారని.. మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం దిగివచ్చేసిందంటూ ఊదరగొట్టారు. కేంద్రంపై భారం మోపి.. చేతులెత్తేశారు దిగుబడుల్లో కనీసం 30 శాతం (3 లక్షల టన్నులపైన) పంట సేకరిస్తే రూ.3,480 కోట్లు ఖర్చవుతుందని.. ఆ భారం కేంద్రమే భరించేలా ఒప్పిస్తామంటూ తొలుత రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలికింది. ఆ తర్వాత మార్కెట్ ధర, మద్దతు ధర మధ్య వ్యత్యాసంలో 50 శాతం (మిగతా 50 శాతం కేంద్రం) భరించేలా ఫిబ్రవరి మూడో వారంలో ఎకరాకు 5 క్వింటాళ్ల చొప్పున 25 శాతం (2.9 లక్షల టన్నులు) పంటకు రూ.846.15 కోట్లు, 50 శాతం (5.83 లక్షల టన్నులు) పంట కొనుగోలుకు రూ.1,692.31 కోట్లు, 75 శాతానికి (8.75 లక్షల టన్నులు) రూ.2,538.46 కోట్లు ఖర్చవుతుందని అధికారులు రెండోసారి ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనలు కేంద్రానికి పంపి చేతులు దులిపేసుకున్నారు. రూ.11,781 చొప్పున కేంద్రం కొంటుందంటూ కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని గొప్పగా ప్రకటించారు. అన్నీ తెలిసి దొంగ నాటకాలు సీఎం చంద్రబాబు మిర్చి రైతులు, ఎగుమతిదారులు, వ్యాపారులతో గత నెల 21న ఏర్పాటు చేసిన సమావేశంలో తమకు శుభవార్త చెబుతారని రైతులు ఎంతగానో ఆశగా ఎదురు చూశారు. 25 శాతానికి మించి కేంద్రం కొనుగోలు చేసే పరిస్థితులు కన్పించడం లేదంటూ తేల్చి చెప్పేశారు. వాస్తవానికి మద్దతు ధర పెంచాలన్నా, 25 శాతానికి మించి కొనుగోలు చేయాలన్నా, కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయాల్సిందే. నాటి భేటీలో వారం పది రోజుల్లో మరోసారి భేటీ అయ్యి తాము నిర్దేశించిన మద్దతు ధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఆలోచిద్దామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన చేసి మూడు వారాలు దాటినా మళ్లీ ఆ ఊసెత్తడం లేదు. ధరలు పెరిగిపోయాయంటూ అబద్ధాలు మద్దతు–మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం చెల్లిస్తామంటూ హంగామా చేశారు. ఆ మేరకు యార్డులో మిర్చి విక్రయించిన రైతుల వివరాలను సేకరించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోంది. పైగా ఈ హడావుడి తర్వాత మార్కెట్లో ధరలు పెరిగిపోతున్నాయంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా పోటీపడి స్టేట్మెంట్లు ఇస్తూ సమస్యను నీరుగార్చేస్తున్నారు. వాస్తవానికి గురువారం మిర్చి యార్డులో తేజ రకానికి మాత్రమే గరిష్టంగా రూ.14 వేలు, కనిష్టంగా రూ.5,500 పలికింది. తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు ఎంతో కొంత బోనస్ ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నారు.ఈయన పేరు కన్నెబోయిన బాలసాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వాదంపల్లి స్వగ్రామం. తనకున్న మూడెకరాల్లో తేజ రకం మిర్చి సాగు చేశారు. ఎకరాకు రూ.1.75 లక్షలు ఖర్చయ్యింది. గతేడాది ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఈ ఏడాది తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో 15 క్వింటాళ్ల లోపే వచ్చింది. సగానికి పైగా తాలు. గత సీజన్లో క్వింటా రూ.23వేల నుంచి రూ.27 వేల మధ్య పలికిన తేజ రకం కాయలు నేడు రూ.11వేల నుంచి రూ.12 వేల మధ్య పలుకుతున్నాయి. తాలు రకానికి గత సీజన్లో క్వింటాకు రూ.17 వేలు ధర వస్తే ఈ ఏడాది రూ.5 వేలు కూడా దక్కలేదు. ‘గత నెల మొదటి వారంలో 40 బస్తాలు గుంటూరు యార్డుకు తీసుకొస్తే క్వింటాకు రూ.15 వేలు ధర వస్తే నేడు 50 బస్తాలు తెస్తే క్వింటా రూ.11 వేలు ఇస్తామంటున్నారు. ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర రూ.11,781గా ప్రకటించిన తర్వాత ధరలు మరింత పతనమయ్యాయి. రైతులను పట్టించుకునే నాథుడే లేడు. మిర్చి పంట అమ్ముకోవాలంటే భయం వేస్తోంది. ఇళ్ల వద్ద కూలీలతోపాటు ఎరువులు, మందుల షాపుల వారు కాచుకుని కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. క్వింటాకు రూ.20 వేలు ధర పలికితే పెట్టుబడి వస్తుంది. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం’ అని బాలసాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాగు, దిగుబడి లెక్కలివి.. రాష్ట్రంలో 2023–24 సీజన్లో 6 లక్షల ఎకరాలకు పైగా మిరప సాగైంది. 14.50 లక్షల టన్నులకుపైగా దిగుబడులొచ్చాయి. అలాంటిది 2024–25లో వరుస వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్వాకంతో కేవలం 3.95 లక్షల ఎకరాల్లో మాత్రమే మిరప సాగైంది. దిగుబడి 11 లక్షల టన్నులొస్తాయని అంచనా వేయగా, క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కన్పించడం లేదు. మరోపక్క గుంటూరు మార్కెట్ యార్డుకు ఈ ఏడాది 4.76 లక్షల టన్నులు మిరప వస్తుందని అంచనా వేయగా, జనవరిలో 61 వేల టన్నులు, ఫిబ్రవరిలో 1.10 లక్షల టన్నులు రాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 1.09 లక్షల టన్నులొచ్చాయి. ఈ నెలలో మరో లక్ష టన్నులు, ఏప్రిల్లో 65 వేల టన్నులు, మేలో 30 వేల టన్నులు మార్కెట్కు వస్తాయని అంచనా. ఈ దుస్థితి ఏనాడు లేదు దశాబ్దాలుగా మిర్చి పంటను పండిస్తున్నా. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. కాయలు కోత కోద్దామంటే కూలీలు వచ్చే పరిస్థితి లేదు. గత సీజన్లో కిలో ఎండు మిర్చి తీతకు రూ.10 ఇస్తే, ఈ ఏడాది రూ.25 ఉంది. గతేడాది తేజ రకం మిర్చి క్వింటా రూ.20 వేలకు పైగా అమ్మితే ఈ ఏడాది రూ.10 వేలకు మించి కొనడం లేదు. విచిత్రంగా మిర్చి ధర తగ్గి కూలీల ధర పెరగటం దారుణం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.11,781 దేనికీ సరిపోదు. – దొండపాటి అంజయ్య, అడిగొప్పుల, పల్నాడు జిల్లాఅప్పులే మిగిలాయి3 ఎకరాల్లో మిరపసాగుకు ఎకరాకు రూ.75 వేలకుపైగా పెట్టుబడి పెట్టా. వైరస్ సోకి ఎకరాకు 8 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. మార్కెట్లో ధర లేదు. చివరికి క్వింటా రూ.9 వేలకు అమ్ముకున్నా. కనీస పెట్టుబడి కూడా మిగల్లేదు. అప్పులు మాత్రమే మిగిలిపోయాయి. – అహ్మద్, కమాన్దొడ్డి, కొసిగి మండలం, కర్నూలు జిల్లా -
ఇల్లు వద్దు.. అప్పు అసలే వద్దు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పాలనలో పురోభివృద్ధిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు.. గత ఏడాది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తిరోగమనంలో ఉన్నట్లు వ్యక్తిగత గృహ రుణాలు తేటతెల్లం చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలు, చర్యల కారణంగా వ్యక్తిగత గృహ రుణాలు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా గృహ రుణాల్లో 14 శాతం వృద్ధి నమోదైతే.. మన రాష్ట్రంలో మాత్రం క్షీణించినట్లు ఎన్హెచ్బీ 2024 నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల (ఏప్రిల్–సెప్టెంబర్) కాలంలో వివిధ బ్యాంకులు విడుదల చేసిన వ్యక్తిగత గృహ రుణాల విలువ రూ. 15,831 కోట్లకు పడిపోయింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో బ్యాంకులు విడుదల చేసిన రుణాల మొత్తం రూ.16,033 కోట్లు. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రుణాల విలువ రూ.202కోట్లు తక్కువ. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మంజూరైన గృహ రుణాల విలువ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 14శాతం పెరిగి రూ.33.53 లక్షల కోట్లకు చేరింది. సెప్టెంబర్ 2024 నాటికి రాష్ట్రంలో ఔట్స్టాండింగ్ రుణాల విలువ రూ.4,10,416 కోట్లుగా ఉన్నట్లు ఎన్హెచ్బీ నివేదికలో పేర్కొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించాయనడానికి బ్యాంకుల రుణ మంజూరు తగ్గడం, జీఎస్టీ వసూళ్లు క్షీణించడం నిదర్శనమని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. -
‘హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?’
తాడేపల్లి : కాశీనాయన జ్యోతి క్షేత్రం పరమ పవిత్రమైనదని, మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా భక్తులు వచ్చే ప్రాంతమని అలాంటి క్షేత్రం మీద అటవీ శాఖ అధికారులు దాడులు చేయడం వెనుక ఏపీ ప్రభుత్వం హస్తం ఉందని వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేయడం నిజంగా దారుణమన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మల్లాడి విష్ణు మాట్లాడుతూ.. కాశీనాయనక్షేత్రం మీద జరిగిన దాడి.. హైందవ ధర్మం మీద జరిగిన దాడిగా పేర్కొన్నారు. ‘ పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీ శాఖ ఈ దారుణానికి పాల్పడింది* అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ఇది హిందూ ధర్మం మీద జరిగిన దాడిరాష్ట్రంలో హైందవ ధర్మాన్ని కాపాడతాననే పవన్ కళ్యాణ్.. మరి ఈ విషయంలో మిన్నుకుండి పోవడానికి కారణం ఏమిటి?, పవన్ కళ్యాణ్ కి తెలిసే ఇది జరిగింది. కూటమి నేతల అనుమతితోనే ఈ కూల్చివేతలు జరిగాయి. హిందూ ధర్మం మీద జరిగిన దాడిగా భావించే వైఎస్సార్సీపీ స్పందించింది. ఆ ప్రాంతాన్ని సందర్శించింది. ఎన్నో సేవా కార్యక్రమాలను కాశినాయన చేశారు. వందేళ్ల పాటు జీవించి అందరికీ ఆధ్యాత్మికతను బోధించారు. అలాంటి కాశీనాయన క్షేత్రం మీద అటవీ శాఖ దాడులు, కూల్చివేతలు జరిగాయి. వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగాక మళ్ళీ నిర్మాణాలు చేస్తామంటూ హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తోంది..?హిందూ ధర్మం మీద జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?, తిరుమల లడ్డూ విషయంలో జనాన్ని తప్పదారి పట్టించారు. భక్తులు క్యూలో చనిపోతే క్షమించమని ప్రాధేయపడ్డారు. అసలు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే హిందూ భక్తులు ఎందుకు క్షమించాలి? , ముందు జాగ్రత్తగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదు?, వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆ 13 హెక్టార్లను మినహాయించాలని కేంద్రానికి లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ ఏమైపోయావ్..?ఈ ప్రభుత్వం ఆ రికార్డులను కూడా పరిశీలించదా?, చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. విజయవాడలో ఆలయాలు కూల్చారు. తిరుపతి లో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చారు. సతావర్తి సత్రం భూముల కుంభకోణం చేశారు. పుష్కరాల్లో జనం చనిపోయారు. ఇలా అనేక సంఘటనలు చంద్రబాబు హయాంలోనే జరిగాయి. సంబంధం లేకపోయినా తిరుపతి విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణ చెప్పారు?, ఇప్పుడు కాశినాయన క్షేత్రం వద్ద కూల్చివేతలు చేస్తే ఆయన ఎందుకు పట్టించుకోలేదు?, లోకేష్ క్షమాపణలు చెప్పడం ఎందుకు?, మా హయాంలో ఏం జరిగినా వెంటనే స్పందించాం. అంతర్వేదిలో రధం తగులపడితే నూతన టెక్నాలజీతో కొత్త రధాన్ని నిర్మించాం. చంద్రబాబు హయాంలోనే హిందూ ఆలయాలపై నిర్లక్ష్యం జరుగుతోంది’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. అటవీ ప్రాంతం పేరుతో ఆధ్యాత్మికతపై దాడి! -
‘సకల శాఖ మంత్రి నారా లోకేష్’: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో విద్యా శాఖను భ్రష్టు పట్టిస్తున్నారని, లోకేష్ సకల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో చంద్రబాబు రాజకీయ జీవితంలో ప్రభుత్వ విద్యపై సాఫ్ట్ కార్నర్తో ఆలోచించారా? అంటూ ధ్వజమెత్తారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని.. పుస్తకాలపై వైఎస్ జగన్ బొమ్మలు ఉన్నాయని ఓర్వలేకపోయారంటూ దుయ్యబట్టారు.‘‘ప్రభుత్వ పథకాలపై చంద్రబాబు బొమ్మలు లోకేశ్కు కానరాలేదా?. కూటమి పాలనలో పాఠశాల విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యారంగం ప్రోత్సాహకంలో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పాత్ర లేదు. వైఎస్సార్సీపీ హయాంలో హయ్యర్ ఎడ్యుకేషన్ను క్వాలిటీతో అందించాం. కూటమి పాలనలో వర్శిటీ వైస్ ఛాన్సలర్లను భయపెట్టి రిజైన్ చేయించారు. ఇదేనా విద్యా వ్యవస్థను నడిపించే తీరు’’ అంటూ మేరుగ నాగార్జున ప్రశ్నించారు.‘‘విద్యాశాఖ మంత్రిగా లోకేష్ విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు తెచ్చారా?. మేము తెచ్చిన సంస్కరణలను తొలగించడం తప్ప ఇంకేమీ చేయలేదు. అంబేద్కర్ ఆశయాలను చంద్రబాబు ప్రభుత్వం నీరు గార్చింది. జగన్ తెచ్చిన మార్పులను చూసి ఇతర రాష్ట్రాలే మెచ్చుకున్నాయి. కానీ అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబు ప్రభుత్వ స్కూళ్లను బాగు చేశారా?. ఇంగ్లీషు మీడియం, టెక్నాలజీ అభివృద్ధి, పిల్లలకు యూనిఫాం, షూస్ కూడా ఎందుకు ఇవ్వలేక పోయారు?..పిల్లల పుస్తకాలు, రేషన్ సరుకులు, కుట్టు మిషన్లు, సైకిళ్లు, శ్మశానాలతో పాటు అప్పడాలు మీద కూడా చంద్రబాబు ఫోటోలు వేశారు. యూనివర్సిటీలో క్వాలిటీ చదువులు చెప్పించాం. అలాంటి యూనివర్సిటీలోని 17 మంది వైస్ ఛైర్మన్లను బెదిరించి రాజీనామాలు చేయించారు. 9 నెలలపాటు వీసీలు లేకుండానే యూనివర్సిటీలను నడిపిన నీచ చరిత్ర ఈ ప్రభుత్వానిది. టీడీపీ నేతల పుట్టినరోజులు, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించిన నీచ చరిత్ర చంద్రబాబుది. చివరికి క్లాసు రూముల్లో పార్టీ సభ్యత్వాలను నమోదు చేసిన నీచ చరిత్ర టీడీపీది. మీ అవసరాలకు యూనివర్సిటీలను వాడుకున్నారేగానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ మంచి ఐనా చేశారా?. ఇప్పటికైనా జగన్ తెచ్చిన సంస్కరణలను అమలు చేయాలి. పేద విద్యార్థులకు నాణ్యమైన చదువులు చెప్పించాలి’’ అని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. -
అగ్నివీర్ నియామకాలకు నమోదు ప్రక్రియ ప్రారంభం
సాక్షి, అమరావతి: ఆర్మీ విభాగంలో అగ్నివీర్ సిబ్బంది నియామకానికి 2025–26కు నమోదు ప్రక్రియ చేపట్టినట్టు గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ డైరెక్టర్ కల్నల్ పునీత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈఈ)ను మొదటిసారి తెలుగుతో సహా 13 భాషల్లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అన్ని కేటగిరీల ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్నవారు, ప్రతిభావంతులైన క్రీడాకారులు, అగ్నివీర్ టెక్నికల్ కేటగిరీలో ఐటీఐ/డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులకు అదనపు మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపారు. గుంటూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెలూ్లరు, అనంతపురం, వైఎస్సార్, ప్రకారం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులతో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ కార్యాలయ సహాయకులు/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ వృత్తి నిపుణుల పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు ఏప్రిల్ 10లోగా www.joinindianarmy. nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
24న హెల్త్ వర్సిటీ అసిస్టెంట్ లైబ్రేరియన్ పరీక్ష
సాక్షి, అమరావతి: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఈనెల 24, 25 తేదీల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. 24న ఉదయం 9.30 నుంచి 12 గంటలకు వరకు పేపర్–2, 25న ఉదయం పేపర్–1 ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు 17 నుంచి https://psc.ap.gov.in నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 25న అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పరీక్ష ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈనెల 25న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్టు కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆరోజు ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 ఉంటుంది. అభ్యర్థులు 18 నుంచి ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
గంటా కొడుకు.. ‘అధికార’ దర్జా
మధురవాడ: అధికారంలోకి వచ్చిందే పెత్తనం చెలాయించడానికన్నట్లు టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ప్రజా ప్రతినిధి కాకపోయినా తండ్రి హోదాను అడ్డుపెట్టుకుని భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ రెచ్చిపోయారు.గురువారం సాయంత్రం మధురవాడ చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఆయన హెచ్ఎం కుర్చీలో కూర్చుని లా అండ్ ఆర్డర్పై సమీక్ష నిర్వహించారు. హైస్కూల్ ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ, జీవీఎంసీ జోనల్ కమిషనర్, పీఎం పాలెం లా అండ్ ఆర్డర్ పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం వారంతా ఇది కూటమి మహిమ అంటూ గుసగుసలుపోయారు. -
ఆ గంటే.. కీలకమంట
శ్రీకాకుళం క్రైమ్ : గోల్డెన్ అవర్.. ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు సంభవించేటప్పుడు మాత్రమే ఈ పదం వినుంటారు. ప్రమాదాలు సంభవించిన గంటలోపే క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చడం దీని ఉద్దేశం. ఇదే తరహాలో సైబర్ మోసాలకు గురయ్యే బాధితులు సైతం నేరం జరిగిన గంటలోగా ఫిర్యా దు చేయగలిగితే.. మన ఖాతాలో పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టుకునే వీలుంటుంది. బాధితులు చేయాల్సిందల్లా గోల్డెన్ అవర్లో సైబర్సెల్కు ఫిర్యాదు చేయడమే. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇచ్చిన నివేదిక ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు ఐదువేలలోపు సైబర్ నేరాలకు సంబంధించి ఫిర్యాదులు వెళ్లాయి. తాము మోసానికి గురవుతున్న నిమిషాల్లోనే ఎన్సీఆర్బీకి, 1930 సైబర్ సెల్ నంబర్కు డయల్ చేసి ఫిర్యాదు ఇవ్వడం వలన సుమారు రూ. 4.09 కోట్ల వరకు సేవ్ అయినట్లు ఈ నివేదికలు చెబుతున్నాయి. జిల్లాలో తొలిసారిగా ఐదు సైబర్ కేసులకు సంబంధించి రూ. 10.13 లక్షలు బాధితులకు అందించిన ట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఇటీవల వెల్లడించారు. ఫిర్యాదు చేయాలిలా.. » మనం మోసపోయిన క్షణానే1930 నంబర్కు కాల్ చేయాలి. » లేదంటే https://cybercrime.gov.in/ అనే పోర్టల్ను క్లిక్ చేయాలి. హోమ్పేజీలోకి వెళ్లి ఫైల్ ఎ కంప్లైంట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని నియమాలు షరతులు చూపిస్తుంది. వాటిని చదివి యాక్సెప్ట్ చేసి రిపోర్ట్ అదర్ సైబర్ క్రైమ్ బటన్పై క్లిక్ చేయాలి. » తర్వాత సిటిజన్ లాగిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పేరు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ వివరాలు ఎంటర్ చేస్తే రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. » ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ను బాక్స్లో ఫిల్ చేసి సబి్మట్ బటన్ నొక్కాలి. తర్వాత పేజీలోకి తీసుకెళ్తుంది. అసలు ప్రక్రియ మొదలయ్యేది ఇక్కడే. » ఈ పేజీలో ఒక ఫారం కనిపిస్తుంది.. దానిలో మనకు జరిగిన సైబర్ మోసం గురించి రాయాలి. కాకపోతే నాలుగు సెక్షన్లుగా విభజించి ఉంటుంది. సాధారణ సమాచారం (విక్టిమ్ ఇన్ఫర్మేషన్), సైబర్ నేరానికి సంబంధించి సమాచారం (సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్), ప్రివ్యూ అనే సెక్షన్లు ఉంటాయి. » ప్రతి సెక్షన్లో అడిగిన వివరాలను సమర్పిస్తూ.. ప్రక్రియను పూర్తిచేయాలి. మూడు సెక్షన్లు పూర్తయ్యాక ప్రివ్యూను వెరిఫై చేయాలి. అన్ని వివ రాలు సరిగా ఉన్నాయమని భావిస్తే సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత ఘటన ఎలా జరిగిందనేది వివరాలు నమోదుచేయాలి. నేరానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు (అకౌంట్ ట్రాన్సాక్షన్ తదితర) ఫైల్స్ వంటి ఆధారాలు, సాక్ష్యాలు అందులో పొందుపర్చాలి. వివరాలు సేవ్ చేసి నేరగాళ్ల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే ఫిల్ చేయాలి. » అంతా వెరిఫై చేసుకున్నాక సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. కంప్లైంట్ ఐడీతో పాటు ఇతర వివరాలతో కూడిన ఈ–మెయిల్ వస్తుంది. తర్వాత అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తారు. » ఫిర్యాదు చేయడం ఆలస్యమైతే దుండగుడు డబ్బును వేర్వేరు ఖాతాల్లో మళ్లించేస్తాడు. లేదంటే క్రిప్టో కరెన్సీగా మార్చుకునే ప్రమాదముంది. క్షణాల్లో ఫిర్యాదు చేయండి.. సైబర్ మోసానికి గురయ్యేవారు వెంటనే గుర్తించాలి. క్షణాల్లో ఫిర్యాదు చేస్తే మన డబ్బులు వెనక్కి వచ్చే అవకాశాలెక్కువ. లేదంటే ఎక్కడ ఉంటారో.. వారి ఖాతాలు ఏ రాష్ట్రానికి చెందినవి.. ఇవన్నీ కనుక్కోవడం పెద్ద ప్రాసెస్. 1930కు గానీ, ఎన్సీఆర్బీకి గానీ ఫిర్యాదు చే సి బ్యాంకు వాళ్లను, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ను సంప్రదించాలి. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ -
బాల్య వివాహాల భారతం
కట్టడి సరే.. ఏటా మరింత పెరుగుదల ఆధునిక సమాజంగా చెప్పుకుంటున్నప్పటికీ, దేశంలో బాల్య వివాహాల పూర్తి స్థాయి కట్టడి జరగడంలేదు. పైగా ఏడాదికేడాది ఈ సంఖ్య పెరుగుతుండడం మరో ఆసక్తికర అంశం. అధికారికంగానే లెక్కలు వందల్లో ఉన్నాయంటే, అనధికారికంగా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రాజ్యసభలో తాజాగా కేంద్ర స్త్రీ, శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను వెల్లడించింది. – సాక్షి, అమరావతిమంత్రిత్వశాఖ పేర్కొన్నఅంశాల్లో ముఖ్యమైనవిబాల్య వివాహాలు అరికట్టేందుకు, వీటితో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా బాల్య వివాహాల నిషేధ చట్టంలోని సెక్షన్లో సవరణలు తీసుకుని రావడం జరిగింది. ఈ సవరణతో రాష్ట్ర ప్రభుత్వాలకు బాల్య వివాహాల నిషేధం అమలు వ్యవహారాల అధికారులను నియమించుకునే అధికారాన్ని కల్పించారు. బాల్య వివాహాలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులపై విచారణ జరిపి చర్యలు తీసుకునే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దని, అటువంటి వారికి సహకరించడం వంటి చర్యలు చేయవద్దని స్థానిక నివాసితులకు తెలియజేయడంతో పాటు బాల్య వివాహాల వల్ల ఉత్పన్నమయ్యే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించడం, బాల్య వివాహాల సమస్యపై సమాజాన్ని చైతన్యవంతం చేయడం అధికారుల విధులు. ఈ అధికారులందరూ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రత్యక్ష నియంత్రణలో పనిచేస్తారు. బాల్య వివాహాలను నిరుత్సాహపరచడంతో పాటు లింగ సమానత్వం కోసం బేటీ బచావోృ బేటీ పఢావో పథకాన్ని ‘మిషన్ శక్తి’ పేరుతో కేంద్ర అమలు చేస్తోంది. బాల్య వివాహాల నిరోధించేందుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. -
సెకీ ఒప్పందం రద్దు కుదరదు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న సెకీ ఒప్పందాన్ని రద్దు చేయడం కుదరదని, గ్రీన్ ఎనర్జీతోపాటు అణు విద్యుత్ ఉత్పత్తిపై కూడా దృష్టి సారిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శాసనసభలో ప్రకటించారు. ఒప్పందాలపై సంతకాలు పెట్టాక వెనక్కి తీసుకుంటే ఫెనాల్టిలు కట్టడంతోపాటు విశ్వసనీయత పోతుందని, అందువల్ల వాటిని కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొందని శాసనసభ సాక్షిగా చెప్పుకొచ్చారు.గత ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ రూ.2.49కే యూనిట్ విద్యుత్ ఇస్తామని సెకీ ముందుకు రావడంతోనే అప్పట్లో ఈ ఒప్పందం జరిగిందని, పైగా విద్యుత్ సరఫరా చార్జీలు లేకపోవడం కలిసొచ్చే అంశమని ఎంతో మంది నిపుణులు.. ఎంతగా చెప్పినా వినిపించుకోని కూటమి ప్రభుత్వం కొద్ది నెలలుగా విషం చిమ్మిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదో పెద్ద తప్పు చేసినట్లు ఎల్లో మీడియాలో పుంఖాను పుంఖాలుగా తప్పుడు కథనాలు రాయించి దుష్ప్రచారం చేశారు.తుదకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఈ ఒప్పందం సబబే అని స్పష్టంచేసింది. ఈ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నట్లు మొన్నటి సామాజిక ఆర్థిక సర్వేలోనూ ప్రభుత్వం ప్రకటించింది. ఇక తప్పని పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు సైతం గురువారం విద్యుత్ రంగంపై సభలో జరిగిన చర్చలో ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టాం విద్యుత్ రంగాన్ని తొమ్మిది నెలల్లోనే గాడిన పెట్టామని, విద్యుత్ కొనుగోలు ధరను తగ్గించడం ద్వారా రానున్న కాలంలో విద్యుత్ ధరలను పెంచకూడదన్నది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. ‘క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకటించాక రూ.5.19 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకున్నాం.తద్వారా రాష్ట్రంలో 3.66 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. రాబోయే ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడమే ప్రభుత్వ లక్ష్యం. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పాం. ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.5.16 నుంచి రూ.4.80కి తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వంలో తొమ్మిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల భారం మోపారు. సోలార్ విద్యుత్ వాడక పోవడంతో రూ.9 వేల కోట్లు నష్టపోయాం’ అని తెలిపారు. ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి రాబోయే రోజుల్లో విమానాలు, ఓడలు కూడా గ్రీన్ ఎనర్జీతో నడిచేలా రాబోతున్నాయని సీఎం అన్నారు. 500 గిగా వాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని, అందులో మనం 160 గిగావాట్లు టార్గెట్గా పెట్టుకున్నామని తెలిపారు. పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజీలీ యోజన్ కింద ప్రతి ఇంట్లో కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సూర్య ఘర్ కింద 2 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి రాయితీ అందిస్తామన్నారు. బీసీలకు కేంద్రం రూ.60 వేలు సబ్సిడీ ఇస్తుంటే, దానికి అదనంగా మరో రూ.20 వేల సబ్సిడీ కలిపి మొత్తంగా రూ.80 వేలు ఇస్తామని చెప్పారు. ఒక్కో నియోజకవర్గానికి 10 వేల ఇండ్లపై సోలార్ రూఫ్టాప్ల ఏర్పాటుపై ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని సూచించారు. -
వెరిఫికేషన్ పేరిట లక్షలాది పింఛన్ల తొలగింపు
సాక్షి, అమరావతి : పది నెలల కూటమి పాలనలో కొత్తగా ఒక్క సామాజిక భద్రతా పింఛన్ కూడా మంజూరు చేయకపోగా, ఏకంగా లక్షల మంది ఫించన్లను తొలగించారని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. అభాగ్యులకు పింఛన్లు తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేసింది. సామాజిక భద్రతా పింఛన్లపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్న గురువారం మండలిలో చర్చకు వచ్చిoది. ఈ సందర్భంగా సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 2024 జూన్ నాటికి రాష్ట్రంలో 65,18,496 మంది పింఛన్ లబ్దిదారులుండగా, ఈ ఏడాది ఫిబ్రవరికి ఆ సంఖ్య 63,59,907కు తగ్గిందని.. గత ఏడాది జూన్ నుంచి 14,967 పింఛన్లు మాత్రమే తొలగించామన్నారు. మంత్రి సమాధానం పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏకంగా 1.58 లక్షల పింఛన్లు తగ్గడం కళ్లెదుటే కనిపిస్తుంటే కేవలం 14 వేలే తొలగించామని మంత్రి చెప్పడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. వెరిఫికేషన్ పేరిట ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్న వారి పింఛన్లు తొలగించడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ వారికి ఎలాంటి మేలు చేయొద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెబుతుండటంతో ఇష్టానుసారం పింఛన్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. మరో ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మాట్లాడుతూ.. కూటమికి ఓటు వేయలేదన్న కక్షతో గ్రామాల్లో పింఛన్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చామన్నారు. 2019 నాటికి 53,85,776 పింఛన్ లబి్ధదారులు ఉంటే, 2024 నాటికి 65,18,496కు పెరిగినట్టు వివరించారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ మాట్లాడుతూ.. గతంలో పింఛన్ అర్హతకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఉండేదని, ఇప్పుడు దాన్ని 13–స్టెప్ వెరిఫికేషన్గా మార్చారన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి జోక్యం చేసుకుంటూ 13–స్టెప్ వెరిఫికేషన్ లేదన్నారు. దీంతో పింఛన్ వెరిఫికేషన్ కోసం ప్రభుత్వం రూపొందించిన 13 అంశాలను మొండితోక అరుణ్కుమార్ సభలో చదివి వినిపించారు. సదరం సరి్టఫికెట్కు 15 రోజుల గడువు పెట్టారని, అయితే స్లాట్ దొరకడానికే నెలలు పడుతోందన్నారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి మంజూరు చేస్తారని అడిగారు. కార్యాచరణ రూపొందిస్తున్నామని, త్వరలో దరఖాస్తుల స్వీకరిస్తామని మంత్రి కొండపల్లి తెలిపారు. ‘ఆడ బిడ్డ నిధి’ అంతేనా? ‘ఆడ బిడ్డ నిధి’ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, టి.కల్పలత ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ పథకం అమలుపై నిర్దిష్ట కాల పరిమితిపై స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో వారు మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు తమ ప్రభుత్వం రాగానే నెలకు రూ.1500 ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఒక ఇంట్లో ఎంత మంది మహిళలలుంటే అంతమందికీ వర్తింపజేస్తామని ప్రచారం చేశారన్నారు. పది నెలలైనా పథకం ఊసే లేదని, కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని, ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని నిలదీశారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ స్పందిస్తూ మరికొంత సమయం పడుతుందంటూ సమాధానం దాటవేశారు. -
మాది స్కీమ్.. మీది స్కామ్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెడితే, వాటిని స్కాములుగా చిత్రీకరించేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోందని శాసన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు మండిపడ్డారు. స్కాములన్నీ చేసింది టీడీపీ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. ధైర్యం ఉంటే 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై వేసిన సిట్ నివేదికలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గురువారం శాసనన మండలిలో ‘2019–24 మధ్య జరిగిన కుంభకోణాలు’పై లఘు చర్చ జరిగింది. టీడీపీ సభ్యురాలు అనురాధ చర్చను ప్రారంభిస్తూ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో విపక్ష సభ్యులు అడ్డుపడి.. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే విచారణ చేసి, మాట్లాడాలని అనడంతో ఆమె నీళ్లు నమిలారు. విశాఖలో విజయసాయిరెడ్డి బినామీ పేర్లతో భూములు కొన్నారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూములను ఆక్రమించారంటూ ఆమె విమర్శలకు దిగారు. సభలో లేని వ్యక్తుల పేర్లు ఎలా ప్రస్తావిస్తారంటూ వైఎస్సార్సీపీ సభ్యులు అరుణ్కుమార్, రమేష్యాదవ్ మండిపడ్డారు. అవి ఆక్రమించిన భూమలు కాదని స్థానిక కలెక్టర్లు నివేదిక కూడా ఇచ్చారని స్పష్టం చేశారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది.. వైఎస్సార్సీపీ సభ్యుడు కుంభా రవిబాబు మాట్లాడుతూ.. కుంభకోణాలపై టీడీపీ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని అన్నారు. ఆనాడు ఓటుకు కోట్లు కుంభకోణంలో చిక్కుకుని రాత్రికి రాత్రే సర్దుకుని విజయవాడకు వచ్చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అప్పటి నుంచి ఏపీలో స్కాములపర్వం మొదలెట్టి, రాష్ట్రాన్ని అవినీతిలో నంబర్ 1గా నిలబెట్టారని మండిపడ్డారు. రాజధాని పేరుతో అంతర్జాతీయ స్థాయిలో రియల్ ఎస్టేట్ స్కామ్ చేశారని దుయ్యబట్టారు. నైపుణ్యాభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దోచేసిన కేసులో చంద్రబాబును న్యాయస్థానం జైల్లో పెట్టిందన్నారు. విచారణకు సహకరించకుండా ఆయన పీఏను దేశాలు దాటించేశారని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రకటనకంటే ముందే టీడీపీ నాయకులు బినామీ పేర్లతో దళితులు, నిరుపేదల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారన్నారు.హెరిటేజ్ పేరిట కూడా 14 ఎకరాలు కొన్నారన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీనే చెప్పారని అన్నారు. రూ.150 కోట్లు కూడా ఖర్చవ్వని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలకు రూ.1,115 కోట్లు వెచ్చి0చారంటే ఎంత అవినీతి జరిగిందో స్పష్టమవుతోందని అన్నారు. 23 సీట్లకు ఎందుకు పడిపోయింది? రాజధానిలో అవినీతికి పాల్పడకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు ఎందుకు పడిపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ప్రశ్ని0చారు. పోర్టులు, స్కిల్ కాలేజీలు, వర్సిటీల నిర్మాణం, భారీగా కంపెనీలను తేవడం స్కాములు ఎలా అవుతాయని అన్నారు. 2019–24 మధ్య కుంభకోణాలపై చర్చకు నోటిసిస్తే పాతవన్నీ తోడటం సరికాదంటూ మంత్రి అచ్చెన్నాయుడు అడ్డుపడ్డారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్చిట్ ఇచ్చేసినట్టు చెప్పుకొచ్చారు. దీనిపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. అధికారపక్ష సభ్యులు పేపర్ల కథనాలు చూపించి కుంభకోణాలు అంటున్నారని, ఒక్క దానిపైనైనా రుజువులు చూపారా అని నిలదీశారు. విశాఖ భూములపై సిట్ నివేదిక బయటపెట్టండిటీడీపీ ప్రభుత్వం 2016లో విశాఖ భూములపై వేసిన సిట్ నివేదికను బయట పెట్టాలని బొత్స డిమాండ్ చేశారు. అందులోని వ్యక్తులు ఎవరైనా రాజకీయాలకు అతీతంగా శిక్షించాలని అన్నారు. అందులో విలువైన దసపల్లా భూములున్నాయని, ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని అధికారపక్షాన్ని నిలదీశారు. గత ప్రభుత్వాధినేత భూ బకాసురుడిగా మారి అనుయాయులతో కలిపి దోపిడీ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అనడంతో బొత్స తీవ్రంగా స్పందించారు. ఇలాంటి దుష్ట సంప్రదాయాన్ని ప్రదర్శిస్తున్న సభలో ఉండలేం అంటూ వాకౌట్ చేశారు. ఆధారాల్లేకుండా బురదజల్లుడా? మండలిలో ఇవాళ జరిగిన ప్రశ్నోత్తరాల్లోగానీ, స్వల్పకాలిక చర్చలోగానీ ప్రభుత్వం నుంచి నిర్దిష్ట సమాధానాలు రాలేదని బొత్స చెప్పారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ మీద, తమ నాయకుడి మీద ఆధారాల్లేకుండా ఆరోపణలు చేసినందునే సభ నుంచి వాకౌట్ చేశామన్నారు. మేము భారత్లో అడుగుపెట్టిన తర్వాత బీహార్లో వ్యాపారం చేయాలంటే దుర్భర పరిస్థితులు ఉంటాయని వినిపించింది. అన్ని విమానాశ్రయాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నంబర్ 1 అని చూశాం. కానీ, ఐదేళ్లలో మాకు బీహార్ చక్కటి ప్రణాళిక, సుపరిపాలనతో దూసుకెళ్తుండగా, ఏపీ పూర్తి అయోమయంగా, అవగాహన లేకుండా ఉంది. ఏపీలో అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా మాకు వచ్చిన రాజధాని డిజైన్ ప్రతిపాదనలను విరమించుకుని బయటకు వెళ్లిపోయాం.. –జపాన్ ఆర్కిటెక్చర్ సంస్థ సీఈవో వారి మేగజైన్లో ఏప్రిల్ 2017 సంచికలో రాసిన వ్యాసంలో చెప్పిన ఈ వివరాలను మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుడు కుంభా రవిబాబు ప్రస్తావించారు. -
మెరిట్ కం రోస్టర్ పద్ధతిలోనే టీచర్ల సీనియారిటీ జాబితా
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి అన్ని జిల్లాల్లో సీనియారిటీ లిస్టులు మెరిట్ కం రోస్టర్ పద్ధతిలోనే తయారు చేస్తారని విద్యా శాఖ అధికారులు స్పష్టంచేశారు. ఈ జాబితాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే తెలియజేయాలని చెప్పారు. గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో విద్యా శాఖ డైరెక్టర్ విజయరామరాజు గురువారం సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై సంఘాలు వెలిబుచ్చిన సందేహాలకు వివరణ ఇచ్చారు. ప్రతి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్మాస్టర్ ప్రమోషన్కు అర్హత గల అందరు ఎస్ఏల సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారని తెలిపారు. డీఈవో పూల్ పండిట్ల ప్రమోషన్ విషయమై కోర్టు కేసు ఆధారంగా ముందుకెళ్తామని తెలిపారు. పేరెంట్ కమిటీల నిర్ణయం మేరకే మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతానికి హైసూ్కల్ ప్లస్లను కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు. ఎయిడెడ్ నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్లో విలీనమైన వారికి విలీనం అయ్యేటప్పుడు ఉత్తర్వుల్లో ఉన్న నిబంధనల మేరకే సర్వీస్ వెయిటేజీ ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తరగతులు ప్రైవేటు కళాశాలల మాదిరిగానే ఏప్రిల్ నెలలోనే ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలకు, ఇంటర్ కళాశాలలకు ఒకే తరహా సెలవులు ఉండేలా చూస్తామన్నారు. -
పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులపై ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే స్థాపించేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆమోదం తెలిపిన, ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిని నిత్యం పరిశీలించాలన్నారు. గురువారం సచివాలయంలో పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. అధ్యక్షత వహించిన సీఎం చంద్రబాబు గత ఎస్ఐపీబీ సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు, వాటి పురోగతిపై సమీక్ష జరిపారు. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం వంటి రంగాల్లో మొత్తం 10 సంస్థలు రూ.1,21,659 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకురాగా సమావేశం ఆమోదం తెలిపింది. తద్వారా 80,104 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని అధికారులు తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎఈ పార్క్ చొప్పున మొత్తం 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. తొలివిడతగా జిల్లాకు ఒకటి చొప్పున 26 జిల్లాల్లో తక్షణం 26 ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన రతన్టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను నెల రోజుల్లో 5 సెంటర్లు నెలకొల్పాలని కోరారు. ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టుల వివరాలివీ1. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్: నాయుడుపేటలో రూ.1,742 కోట్ల పెట్టుబడులు, 2 వేల ఉద్యోగాలు.2. దాల్మియా సిమెంట్స్: వైఎస్సార్ జిల్లాలో రూ.2,883 కోట్ల పెట్టుబడులు, 354 ఉద్యోగాలు.3. లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్: విశాఖపట్నంలో రూ.1,500 కోట్ల పెట్టుబడులు.4. సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్: శ్రీసిటీలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు, 50 వేల ఉద్యోగాలు.5. ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.58,469 కోట్ల పెట్టుబడులు, 13,050 ఉద్యోగాలు. 6. బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.1,175 కోట్లు, 1,500 ఉద్యోగాలు. 7. ఏపీ ఎన్జీఈఎల్ హరిత్ అమ్రిత్ లిమిటెడ్: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రూ.22 వేల కోట్ల పెట్టుబడులు, 8,300 ఉద్యోగాలు.8. ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: అన్నమయ్య, కడప జిల్లాలు, రూ.8,240 కోట్లు, 4 వేల ఉద్యోగాలు.9. మేఫెయిర్ బీచ్ రిసార్ట్స్, కన్వెన్షన్: రూ.400 కోట్ల పెట్టుబడులు, 750 ఉద్యోగాలు.10. ఒబేరాయ్ విలాస్ రిసార్ట్: రూ.250 కోట్ల పెట్టుబడులు, 150 ఉద్యోగాలు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా: వైఎస్ జగన్
సాక్షి అమరావతి, సాక్షి ప్రతినిధి, గుంటూరు: టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, మద్దతుదారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం పల్నాడు జిల్లాలో గ్రామ బహిష్కరణకు గురైన దళిత, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన దాదాపు 400 కుటుంబాలకు చెందిన బాధితులు వైఎస్ జగన్ను గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కలుసుకున్నారు. మాచవరం మండలం పిన్నెల్లి, తురకపాలెం, మాదినపాడు, చెన్నాయపాలెం, కొత్తగణేశునిపాడు గ్రామాలకు చెందిన వారంతా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ను కలిశారు. టీడీపీ నేతలు ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్సీపీ సానుభూతి పరులపై, ఇళ్లపై దాడులకు తెగబడి అక్రమ కేసులు బనాయించి పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని తెలిపారు. ఈ అకృత్యాలను భరించలేక గ్రామాలు విడిచి ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. స్వగ్రామాలకు దూరంగా గడుపుతుండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే కారణంతో తమను ఊరి నుంచి బహిష్కరించారని, గ్రామంలోకి వస్తే చంపేస్తామని టీడీపీ కూటమి నేతలు బెదిరిస్తున్నారని పిన్నెల్లి గ్రామానికి చెందిన బాధిత కుటుంబాల సభ్యులు వైఎస్ జగన్ ఎదుట వాపోయారు. ‘అధైర్యపడొద్దు.. మీకు అన్ని విధాలా అండగా ఉంటాం..’ అని వారికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచి వారికి పూర్తి న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. కాగా, వచ్చే రెండు నెలల్లో ‘చలో పిన్నెల్లి’ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. గ్రామ బహిష్కరణపై న్యాయపరంగా కూడా హైకోర్టులో పోరాడుతోంది.గురజాల నియోజకవర్గ నాయకులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ దహన సంస్కారాలకూ నోచుకోని దుస్థితిటీడీపీ శ్రేణుల దురాగతాలతో గ్రామం విడిచి వెళ్లి వేరే ప్రాంతంలో ఉంటున్నాం. మా కుటుంబ సభ్యుడు మృతి చెందినా స్వగ్రామానికి వెళ్లే పరిస్థితి లేక మేం తలదాచుకుంటున్న ప్రాంతంలోనే దహన సంస్కారాలు పూర్తి చేశాం. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట పడేదెప్పుడో తెలియడం లేదు. మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నా. – అమరావతి హసన్ (బుజ్జి), పిన్నెల్లి, వైఎస్సార్సీపీ నాయకుడుమహిళలపైనా దాడులు..ఎన్నికల ఫలితాలు వెలువడ్డ వెంటనే టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ సానుభూతి పరుల నివాసాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డాయి. ఇంట్లో ఉన్న మహిళలను సైతం దౌర్జన్యంగా లాక్కొచ్చి దాడి చేశారు. టీడీపీ శ్రేణుల అఘాయిత్యాలతో ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయాం. బంధువుల నివాసాల్లో కుటుంబ సభ్యులతో తలదాచుకుంటున్నాం. మాకు రక్షణ కల్పించండి.– రత్తయ్య, కొత్తగణేశునిపాడు, వైఎస్సార్సీపీ నాయకుడుఆర్థికంగా నష్టపోయాం టీడీపీ శ్రేణుల అఘాయిత్యాలతో కుటుంబంతో సహా గ్రామాన్ని విడిచి వేరే ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. మా పొలాలు సాగు చేసుకోలేక నష్టపోతున్నాం. మాకు న్యాయం చేయాలి. – పిక్కిలి కొండలు, పిన్నెల్లి గ్రామం, వైఎస్సార్సీపీ నాయకుడు -
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతోందని, తక్షణం జోక్యం చేసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం కోరింది. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై గురువారం గవర్నర్ను కలిసి వినతిపత్రం సమర్పించింది. అనంతరం రాజ్భవన్ బయట పలువురు మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఇటీవల గంగాధర నెల్లూరులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అన్ని పనులు టీడీపీ వారికే చేయాలని, వైఎస్సార్సీపీ వారికి పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లేనని చేసిన తీవ్ర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా సమ దృష్టితో పాలన అందిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు, దానికి విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణం చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరినట్లు చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమాన్ని అందుకునే లబ్ధిదారులకు పార్టీలు, వర్గాలు ఉండవని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలతో అర్హతను బట్టి పథకాలను వర్తింపజేస్తారని, చంద్రబాబు మాత్రం ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని, కొందరిపట్ల వివక్ష చూపించాలంటూ చేసిన వ్యాఖ్యలు దారుణమని బొత్స మండిపడ్డారు. ఇలా ఏ నాయకుడూ మాట్లాడలేదు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చంద్రబాబులా మాట్లాడలేదని బొత్స తప్పుబట్టారు. ఏ రాజకీయ పార్టీ అయినా వారి సిద్ధాంతాలు, విధానాల ప్రకారం పనిచేస్తుందని, రాష్ట్రంలోని మొత్తం ప్రజలకు మేలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటారని పేర్కొన్నారు. ఏ పార్టీ కూడా వ్యక్తిగత ఎజెండాతో పనిచేయదని, కానీ, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు దానికి భిన్నంగా చేసిన వ్యాఖ్యలు, ఆయన అనుసరిస్తున్న విధానాలపై తక్షణం స్పందించాలని గవర్నర్ను కోరామని తెలిపారు. సామాన్యుల అవసరాలపైనా రాజకీయమా? సామాన్యుల అవసరాలకు కూడా రాజకీయ రంగు పులమడం దారుణమని బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఒత్తిడి తెస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి సర్కారు మెడలు వంచి ప్రజలకు ప్రయోజనాలు కలిగించేలా వ్యవహరిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. జర్నలిస్టులనూ వదలరా? రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్లు, చివరికి జర్నలిస్టుల పైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గవర్నర్ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు బి.విరూపాక్షి, తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ మంత్రులు విడదల రజిని, వెలంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, కారుమూరు వెంకట నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు తదితరులు ఉన్నారు. -
‘కూటమి’ కుట్రలు.. గవర్నర్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం రాజ్భవన్లో కలిసి వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతున్న నేపథ్యంలో తక్షణం గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరింది. అనంతరం రాజ్భవన్ బయట పలువురు మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.ఇటీవల గంగాధర నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అన్ని పనులు తెలుగుదేశం వారికే చేయాలి.. వైఎస్సార్సీపీ వారికి ఏ పనీ చేయకూడదు.. అలా చేస్తే పాముకు పాలుపోసినట్లేనంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ సమదృష్టితో పాలనను అందిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబు, దానికి విరుద్దంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణం గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజాస్వామిక స్పూర్తికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో సంక్షేమాన్ని అందుకునే లబ్దిదారులకు పార్టీలు, వర్గాలు ఉండవని అన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలతో అర్హతను బట్టి పథకాలను వర్తింపచేస్తారని, కానీ చంద్రబాబు మాత్రం ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని, కొందరి పట్ల వివక్ష చూపించాలంటూ చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చంద్రబాబులా మాట్లాడలేదన్నారు.రాష్ట్రంలోని ఏ రాజకీయపార్టీ అయినా వారి సిద్ధాంతాలు, విధానాల ప్రకారం పనిచేస్తుందని, రాష్ట్రంలోని మొత్తం ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలన్నదే వారి లక్ష్యంగా పెట్టుకుంటారని అన్నారు. ఏ పార్టీ అయినా వ్యక్తిగత ఏజెండాతో పనిచేయవని, కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు దానికి భిన్నంగా చేసిన వ్యాఖ్యలు, ఆయన అనుసరిస్తున్న విధానాలపై తక్షణం స్పందించాలని గవర్నర్ను కోరామని తెలిపారు. సామాన్యుల అవసరాలకు కూడా రాజకీయ పార్టీ రంగు పులమడం దారుణమన్నారు.ప్రతిపక్ష పార్టీగా ప్రజల ప్రయోజనాల కోసమే వైఎస్సార్సీపీ.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ మెడలు వంచి ప్రజలకు ప్రయోజనాలు కలిగించేలా వ్యవహరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివీస్ట్లు, చివరికి జర్నలిస్ట్లపైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని బొత్స సత్యనారాయణ తెలిపారు. గవర్నర్ను కలిసిన వారిలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, విడదల రజనీ, కారుమూరు వెంకట నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు వున్నారు. -
బహిష్కరణకు గురైన కుటుంబాలకు అండగా వైఎస్ జగన్
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసే మంచి ఏమీ లేకపోయినా కక్ష సాధింపు చర్యలు మాత్రం తీవ్రతరమవుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే పల్నాడు జిల్లా పిన్నెళ్లి గ్రామంలోని 400 కుటుంబాలపై బహిష్కరణ వేటు వేసింది. బహిష్కరణకు గురైన వారంతా ఎస్సీ, బీసీ, మైనార్టీలే. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. బహిష్కరణకు గురైన పిన్నెళ్లి గ్రామంలోని కుటుంబాలకు అండగా నిలిచారు వైఎస్ జగన్ఈ క్రమంలోనే అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. గ్రామంలోకి వస్తే తమను చంపుతామని బెదిరిస్తున్నారని వారు వైఎస్ జగన్కు విన్నవించుకున్నారు. వీరికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా ‘చలో పిన్నెళ్లి’ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ‘ సిద్ధమైంది. రెండు నెలల్లో చలో పిన్నెళ్లి’ కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్సీపీ‘ నిర్ణయించింది. వైఎస్ జగన్ను కలిసిన వారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి సహా పిన్నెల్లి, తురకపాలెం, మాదెనపాడు, చెన్నాయపాలెం గ్రామస్తులున్నారు. -
ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. తనపై బాపట్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పోసాని పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. BNS 35(3) సెక్షన్ను ఫాలో కావాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.కాగా, పోసానిని సీఐడీ పోలీసులు నిన్న (బుధవారం) రాత్రి( గుంటూరులో ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు. ఈ సందర్భంగా పోసాని అనారోగ్య సమస్యల గురించి విన్నవించుకున్నారు. బెయిల్ రాకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులకు సంబంధించి తనకు ఎటువంటి పాపం తెలియదని, తానేం చేయలేదని న్యాయమూర్తి ఎదుట బోరున విలపించారు.నిజం మాట్లాడినందుకు తన మీద కక్ష కట్టి ఇలాంటి అన్యాయమైన కేసులు పెట్టారని విన్నవించారు. తల్లి మీద, పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నానని తనకే పాపమూ తెలియదని న్యాయమూర్తిని వేడుకొన్నారు. బెయిల్ ఇవ్వాలని కోరారు. వయసు మీదపడడంతో కూర్చోలేక పోతున్నానని చెప్పుకొచ్చారు. పోలీసులు ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదని, ఇప్పటికే కొన్ని వందల మైళ్లు ప్రయాణం చేయించారని, ఎందుకు నన్ను తిప్పుతున్నారో అర్థం కావడం లేదని, ఇలా చేస్తే తాను ఎక్కువ రోజులు బతకనని మొరపెట్టుకున్నారు.టీడీపీలోకి రమ్మంటే రానందుకు లోకేశ్ తనను వేధిస్తున్నారని, నంది అవార్డుల ప్రకటనలో పక్షపాతాన్ని ఎత్తిచూపడంతో కక్ష కట్టారని తెలిపారు. అన్నీ నిజాలే చెబుతున్నానని నార్కో ఎనాలసిస్ టెస్టుకూ సిద్ధమన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు కడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. -
విపక్ష సభ్యులను కించపరచడమే కూటమి నేతల పనా?: బొత్స
సాక్షి, అమరావతి: శాసనమండలిలో ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు రావడం లేదని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసనమండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. మంత్రులు చెప్పిందే చెప్తుతున్నారని.. కూటమి ప్రభుత్వానికి నిర్ధిష్టమైన ఆలోచన లేదని దుయ్యబట్టారు. 2019-24 మధ్య స్కామ్లు జరిగితే ఎంక్వైరీ వేసుకోమని చెప్పాం. మేం 2014 నుంచి మాట్లాడాలని అడిగాం. సభలో అభ్యంతరకరమైన భాష మాట్లాడుతున్నారు’’ అని బొత్స ధ్వజమెత్తారు.‘‘వైజాగ్ భూముల సిట్ రిపోర్ట్ బయటపెట్టమని కోరాం. విపక్ష సభ్యులను కించపరచడమే పనిగా పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వానికి నిర్ధిష్టమైన విధానం లేదు. డిజిటల్ కరెన్సీ అనేది మ్యాండేట్ కాదు. ఇప్పుడు జరుగుతున్న లిక్కర్ సేల్స్ డిజిటల్ కరెన్సీలోనే నడుస్తున్నాయా? సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదు. ప్రత్యేకించి వైఎస్ జగన్ పేరు ప్రస్తావించడంపై మేం అభ్యంతరం తెలిపాం. మా మీద, మా నాయకుల మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారు’’ అని బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. -
వైఎస్సార్సీపీ టార్గెట్గా పెన్షన్ల తొలగింపు
అసెంబ్లీ సమావేశాలు.. అప్డేట్స్.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల కామెంట్స్..వైఎస్సార్సీపీ రమేష్ యాదవ్ కామెంట్స్..పెన్షన్ల గురించి ప్రశ్నోత్తరాలలో చర్చించాం..జూన్ 2024 నాటికి 65 లక్షల 18 పైచిలుకు పెన్షన్లు ఇచ్చారు..63,57,907 నేడు ఇస్తున్నాం అని చెప్పారు..14967 పింఛన్లు తొలగించామని మంత్రులు చెప్పారు..దాదాపు లక్ష 60వేల పెన్షన్లు తొలగొస్తే.. కేవలం 14వేలే తొలగించారని, మిగిలిన వాళ్ళు చనిపోయారని చెప్పారు.9 నెలల కాలంలో లక్ష 60వేల మంది చనిపోయారా?దీనిపై సమాధానం లేదు..వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి పెన్షన్లను తొలగించారు.2019 నాటికి 53లక్షల పెన్షన్లు ఉంటే వైఎస్ జగన్ వాటిని 65 లక్షలకి పెంచారు.జగన్ హయాంలో ఇంటి వద్దకే పింఛన్ ఇచ్చాడు..గతంలో MRO కార్యాలయం వద్దకి వెళ్లి తెచ్చుకొనే పరిస్థితి ఉండేది..అవ్వ తాతలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది..కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ కూడా కొత్తగా ఇవ్వలేదు..ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు వైఎస్సార్సీపీ వాళ్ళకు పని చేయొద్దని చెప్పడం సరైనది కాదు..కులం, మతం, పార్టీ చూడకుండా అర్హులకు వైఎస్ జగన్ పెన్షన్ ఇచ్చారు.ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..ఆడబిడ్డ నిధి పరిశీలనలో ఉంది అని మంత్రి చెప్పారు.. ఇది దాట వేట ధోరణి..ఎప్పటి నుండి అమలు చేస్తారు, ఎన్ని వేల కోట్లు అవసరమో పరిశీలన చేసారా? సబ్ కమిటీ వేశారా?అంటే సమయం కావాలని చెప్పడం మహిళలను వంచించడమే..చేయూత పేరు ఎత్తే అర్హత కూటమి నేతలకు లేదు..సున్నా వడ్డీ రుణాలు కూడా కూటమి ఎగ్గొటింది.2019 వరకు కూటమి ఎగొట్టిన బకాయిలు జగన్ మహిళల ఖాతాల్లో వేశారు..ఆడబిడ్డ నిధి గురించి మ్యానిఫెస్టోలోనే కాదు.. మహానాడులో కూడా చెప్పాడు..సంవత్సరానికి 18వేలు ఇస్తామని మాట ఇచ్చి.. నిట్ట నిలువునా మోసం చేశారు..బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు..అసత్యాలతో కాలం గడుపుతున్నారు..ఆడబిడ్డ నిధికి 32400 కోట్లు సంవత్సరానికి అవసరం..చేయూత ద్వారా జగన్ మహిళలకు సహాయం చేశారు.ఆడబిడ్డ నిధి ఎప్పటి నుండి ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి..సమయం కావాలని అనడం అంటే మహిళల్ని మోసం చేయడమే..ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కామెంట్స్..లక్ష 60వేల పెన్షన్లు అకారణంగా తొలగించారు..కుల వృత్తిపై ఆధారపడిన వారికి కూడా పెన్షన్లను తొలగించారు..డప్పు కళాకారులు, చేతివృతుల వారికి సర్టిఫికెట్స్ కావాలని 13 రకాల నియమ నిబంధనలు పెట్టి పెన్షన్లను తొలగించారు.గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లను పెంచుతామని చెప్పారు.. పెంచాలి..తీసేసిన పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాంఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కామెంట్స్..ఆరోగ్యశ్రీకి బకాయిలు వెయ్యి కోట్లు ఉన్నాయని మంత్రి చెప్పారు..మొత్తం బకాయిలు 4వేల కోట్లు పైనే ఉన్నాయి..ఏప్రిల్ ఒకటి నుండి మళ్ళీ సమ్మెకు వెళ్తున్నాయి..80 శాతం ఆసుపత్రులు చిన్న ఆసుపత్రులే..చిన్న ఆసుపత్రులపై పెద్ద మొత్తంలో ఫైన్స్ వేసి ఇబ్బందులు పెడుతున్నారు..9 నెలల నుండి ఆసుపత్రుల్లో బకాయిలు ఉన్నాయి..మంత్రి చెప్పిన విధంగా పరిస్థితులు లేవు.. మంత్రిపై మండలి చైర్మన్ ఫైర్..జగనన్న కాలనీల్లో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ ఆరోపణలుఅనవసర ఆరోపణలు చేయడంపై వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరంశాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కామెంట్స్..అక్రమాలు జరిగితే ఎంక్వైరీ వేయండిప్రభుత్వం మీదే కదా..వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం సరికాదు. మంత్రి కొలుసు పార్ధసారధిపై మండలి ఛైర్మన్ ఫైర్మండలి ఛైర్మన్ మోషేన్ రాజు కామెంట్స్..ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భీమవరం లే అవుట్లో కాంట్రాక్టర్ డబ్బులు వసూలు చేస్తున్నాడని నాకు ఫిర్యాదులొచ్చాయినేనే స్వయంగా కలెక్టర్కు ఫిర్యాదు చేశాశాసనమండలి చైర్మన్ హోదాలో నేనిచ్చిన ఫిర్యాదుకే దిక్కులేదుఆ జిల్లా కలెక్టర్ కనీసం ఇంతవరకూ స్పందించలేదునేను ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు కానీ ఇప్పుడు విచారణ చేస్తామని చెప్పడం సరికాదుశాసనమండలి..మహిళలకు ఆడబిడ్డ నిధిపై ప్రభుత్వం మోసంమండలి సాక్షిగా బట్టబయలైన ప్రభుత్వం నిర్వాకంఆడబిడ్డ నిధి ఎప్పుడిస్తారో చెప్పని మంత్రి కొండపల్లి శ్రీనివాస్పరిశీలనలో ఉందంటూ సమాధానం దాటేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్మంత్రి సమాధానంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండిపాటువైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, సాయికల్పలతఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలిచ్చారుప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆడబిడ్డ నిధి అమలు చేస్తామన్నారుమా అంచనా కోటి 60 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారుఎప్పట్నుంచి మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తారో సమాధానం చెప్పాలిగత బడ్జెట్, ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయించలేదు👉ఏపీలో కూటమి ప్రభుత్వంలో రకరకాల కారణాలతో పెన్షన్లను తొలగించడం దారుణమన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు. పేదలకు ఇచ్చే పెన్షన్లను భూతద్దం పెట్టి వెతికి తొలగించడమేంటని ప్రశ్నించారు. కూటమి పార్టీలకు ఓటు వేయలేదనే కారణంతోనే పెన్షన్లు తగ్గిస్తున్నారని చెప్పుకొచ్చారు.👉ఏపీ శాసనమండలి సమావేశం ప్రారంభమైంది. ఈరోజు సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పెన్షన్ల తొలగింపుపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు.👉మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కామెంట్స్.. 2024 జూన్ నాటికి 65 లక్షల 18,496 సామాజిక పెన్షన్లు ఉన్నాయి.ప్రస్తుతం 63 లక్షల 59వేల 907 సామాజిక పెన్షన్ లబ్దిదారులు ఉన్నారు14,965 పెన్షన్లు తొలగించాం.👉వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్..రెండు లక్షల పెన్షన్లు తొలగించారురకరకాల కారణాలు చెప్పి దివ్యాంగుల పెన్షన్లు తొలగించడం అన్యాయంపేదలకు ఇచ్చే పెన్షన్లను భూతద్దం పెట్టి వెతికి తొలగించడం దారుణంవివిధ రూపాల్లో లక్షలు.. కోట్లు దోచేస్తున్న వాళ్లను వదిలేసి పేదలపై పడటం బాధాకరం 👉వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్..రెండు లక్షల పెన్షన్లు తొలగించి రికార్డుల్లో 14,965 మాత్రమే తొలగించామని చెబుతున్నారుఓటు వేయలేదనే కారణంతోనే పెన్షన్లు తగ్గిస్తున్నారు 👉వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..ఏ ప్రాతిపదికన పెన్షన్ల తొలగిస్తున్నారో చెప్పాలిగతంలో ఆరు అంశాలపై పెన్షన్లను వెరిఫై చేసేవారుప్రస్తుత ప్రభుత్వం 13 అంశాలను పరిగణలోకి తీసుకుని వెరిఫై చేస్తున్నారుపెన్షన్ల తొలగింపులో దివ్యాంగులకు 15 రోజుల్లో సదరన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటున్నారు సదరన్ వెరిఫికేషన్ స్లాట్ దొరకడానికే నెల రోజుల సమయం పడుతుందిఏ ప్రాతిపదికన డప్పు కళాకారుల పెన్షన్లు తొలగించారో చెప్పాలిచిరునామా మారితే పెన్షన్ తొలగించేస్తున్నారుపెన్షన్లు తొలగింపులో మానవీయకోణంలో ఆలోచన చేయాలి👉వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలిచ్చారుప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆడబిడ్డ నిధి అమలు చేస్తామన్నారుమా అంచనా కోటి 60 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారుఎప్పటి నుంచి మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తారో సమాధానం చెప్పాలి -
పవన్, లోకేశ్ క్షమాపణ రాజకీయాలపై ఆసక్తికర చర్చ
సాక్షి, అమరావతి : కాశినాయన ఆశ్రమానికి చెందిన అన్నదాన సత్రాలను అటవీ శాఖ అధికారులు కూల్చివేయడంపై మంత్రి లోకేశ్ ఎక్స్లో పోస్టు చేసిన ట్వీట్ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి లోకేశ్ మధ్య నడుస్తున్న అధిపత్య పోరుకు నిదర్శనమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అటవీ శాఖ అధికారులు అన్నదాన సత్రాలను కూల్చివేయడాన్ని తప్పుబట్టిన లోకేశ్ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నట్టు ట్వీట్లో పేర్కొన్నారు. గతంలో తిరుపతిలో టీటీడీ టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను పవన్కళ్యాణ్ తప్పుబట్టారు. ప్రభుత్వం తరఫున క్షమాపణ చెబుతున్నట్టు అప్పట్లో పవన్ ప్రకటించారు. ఇప్పుడు పవన్కళ్యాణ్ మంత్రిత్వ శాఖ పరిధిలో కూల్చివేతలను లోకేశ్ తప్పుబట్టడం, ప్రభుత్వం తరఫున క్షమాపణ చెబుతున్నట్టు ట్వీట్ చేయడం ద్వారా పవన్కు టిట్ ఫర్ టాట్గా సమాధానమిచ్చారనే చర్చ నడుస్తోంది. అప్పట్లో టీటీడీ చైర్మన్ రేసులో పవన్ సోదరుడు నాగబాబు కూడా ఉన్నారనే వార్తలు రాగా.. లోకేశ్ ఏరికోరి బీఆర్ నాయుడిని చైర్మన్గా ఎంపిక చేయించారని.. దీనిపై పవన్కళ్యాణ్ అసంతృప్తికి లోనయ్యారన్న చర్చ అప్పట్లో సాగింది. ఈ నేపథ్యంలోనే తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ సైతం క్షమాపణ చెప్పాలంటూ పవన్ అప్పట్లో డిమాండ్ చేశారు. తాజాగా ఇప్పుడు పవన్ పర్యవేక్షణలోని అటవీ శాఖ అధికారులు కాశినాయన అన్నదాన సత్రాలను కూల్చివేయడాన్ని అందివచ్చిన అవకాశంగా మలుచుకున్న లోకేశ్ ఈ ఘటనపై ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని, సొంత నిధులతో ఆ సత్రాలను నిర్మిస్తానని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పట్లో టీటీడీ వ్యవహరంలో పవన్కళ్యాణ్ వ్యహరించిన తీరుకు ప్రతిగా ఇప్పుడు లోకేశ్ గట్టిగా చురకలు వేసినట్టయ్యింని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కూటమిలో నెలకొన్న లుకలుకలకు ఇదో ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.