చర్చలేకుండా డైవర్షన్‌ | Chandrababu accused of adulterating ghee for heritage | Sakshi
Sakshi News home page

చర్చలేకుండా డైవర్షన్‌

Mar 6 2026 4:45 AM | Updated on Mar 6 2026 4:45 AM

Chandrababu accused of adulterating ghee for heritage

పక్కదారి పట్టించి.. గందరగోళం సృష్టించి.. మండలిలో మమ..

గొడవల మధ్యే ఆనం హడావిడి స్టేట్‌మెంట్‌

ఇందాపూర్‌ – హెరిటేజ్‌ బంధం బయటపడుతుందనే భయం

హెరిటేజ్‌ కోసమే చంద్రబాబు కల్తీ నెయ్యి ఆరోపణలు 

వ్యాపార ప్రయోజనాల కోసం లడ్డూపై దుష్ప్రచారం

ఆధారాలతో నిలదీస్తే సమాధానం చెప్పలేక బెంబేలు

టీటీడీ చైర్మన్‌ కళంకిత వ్యవహారంపైనా నోరుమెదపని అధికారపక్షం 

సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంపై అధికారపక్షం అసలు చర్చే జరగనివ్వలేదు. శాసనమండలిలో గురువారం కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు పదేపదే అడ్డుతగులుతూ చర్చను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తన కుటుంబ సంస్థ హెరిటేజ్‌ వ్యాపార ప్రయోజనాల కోసం కల్తీ నెయ్యి పేరుతో అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, దానిపై చర్చిద్దామంటే సభ నుంచి ఆ పార్టీ సభ్యులు పారిపోతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మె­ల్సీలు ఆరోపించారు.  

అశ్లీల వీడియోల్లో ఉన్నది తానేనని బీఆర్‌ నాయుడు అంగీకరించిన తర్వాత కూడా ఆయన్ను టీటీడీ చైర్మన్‌ పదవి నుంచి తప్పించడానికి చంద్రబాబు ఎందుకు భయపడిపోతు­న్నారని ప్రశ్నించారు. హెరిటేజ్‌ అనుబంధ ఇందాపూర్‌ డెయిరీకి టీటీడీ నెయ్యి కాంట్రాక్టు కోసమే కల్తీ నాటకాన్ని తెరపైకి తెచ్చారని బయటపడడంతో అధికారపక్షం ఇరుకున పడిపోయింది. గురువారం తిరుమల లడ్డూపై దేవదాయ శాఖ మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి సిద్ధమవుతుండగా అడ్డుపడి అచ్చెన్నాయుడు లేచి సమస్యను పక్కదారిపట్టించేందుకు ప్రయత్నించారు. 

దాంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ పోడియంలోకి దూసుకు వచ్చారు. ఈ నిరసన కార్యక్రమం మధ్యనే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్టేట్‌మెంట్‌ను చదివేసి మమ అని­పించారు. వైఎస్సార్‌సీపీ సభ్యుల నిరసనతో సభను చైర్మన్‌ అయిదు నిమిషాలు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే విధమైన పరిస్థితి కొనసాగడంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు.

చర్చకు దూరంగా పలాయనం..
కల్తీ ఆరోపణలపై చర్చిద్దామంటే అధికారపక్షం పూర్తిగా పలాయనం చిత్తగించింది. దానిపై చర్చ జరగనీయకుండా రకరకాల వాదనలతో సమస్యను డైవర్ట్‌ చేయడానికి ఆపసోపాలు పడుతోంది.  హెరిటేజ్‌ వ్యాపార ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు కల్తీ నెయ్యి ఆరోపణలు చేశారని ఆధారాలతో సహా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యులు మండలిలో నిరూపించారు. ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కి టీటీడీ నిధులు దోచిపెట్టడానికి చేసిన ప్రయత్నాలను వివరించారు. 

గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీటీడీకి కిలో రూ.278కే నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్‌ డెయిరీ ఇప్పుడు ఏకంగా కిలో రూ.658 చొప్పున సరఫరా చేయడానికి కాంట్రాక్టు దక్కించుకుందని వారు పేర్కొన్నారు. ఇందాపూర్‌ డెయిరీ.. హెరిటేజ్‌ అనుబంధ సంస్థేనని ఒకసారి, కాదు.. అక్కడ హెరిటేజ్‌ ఉత్పత్తులు మాత్రమే తయారవుతాయని మరోసారి.. హెరిటేజ్‌ వెబ్‌సైట్‌ను మార్చడమే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ సభ్యులు వివరించారు. 

హెరిటేజ్‌ ఆధ్వర్యంలో ఏఆర్, ఇందాపూర్, సంగం, ప్రీమియర్‌ ఆగ్రో, భోలేబాబా డెయిరీలతో ఏర్పడిన డెయిరీ సిండికేట్‌ గుట్టును బయటపెట్టడంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది.  ప్రభుత్వం చర్చలో పాల్గొనకపోవడమంటే హెరిటేజ్‌ అవినీతిని అంగీకరించినట్లేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యులు పేర్కొన్నారు. కల్తీ జరగలేదని సీబీఐ సిట్‌ చార్జిషీట్‌లో పేర్కొనడాన్ని బట్టి రాజకీయ స్వార్థం కోసమే తిరుమల శ్రీవారిని చంద్రబాబు రాజకీయాల్లోకి లాగారని ప్రజలు అర్ధంచేసుకున్నారని వారు వివరించారు. 

సమాధానం చెప్పలేకే డైవర్షన్‌..
రాజకీయ లబ్ధి, హెరిటేజ్‌ వ్యాపార ప్రయోజనాల కోసం చంద్రబాబు ఘోరమైన కుట్రచేశారని తేలిపోయింది. దానిపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోతోంది. ఏఆర్‌ డెయిరీ పేరుతో వచ్చిన నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపితే దాన్ని వైష్ణవి డెయిరీ పేరుతో తిరిగి రప్పించి లడ్డూ తయారీకి ఎలా వాడారని అడిగితే దానికి దేవదాయ శాఖ మంత్రి నుంచి సమాధానం లేదు. టీటీడీ బ్లాక్‌ లిస్టులో పెట్టిన ఇందాపూర్‌ డెయిరీపై సస్పెన్షన్‌ ఎత్తివేసింది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. భోలేబాబా డెయిరీకి టెక్నికల్‌ క్లియరెన్స్‌ ఇచ్చింది కూడా చంద్రబాబే. వీటిలో దేనికీ సమాధానం చెప్పలేక కూటమి సభ్యులు వేరే అంశాలను లేవనెత్తి సభను డైవర్ట్‌ చేశారు.

టీటీడీ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలి..
టీటీడీ పవిత్రతను దెబ్బతీసిన బీఆర్‌ నాయుడు చైర్మన్‌ పదవికి అనర్హుడు. అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. ‘ఆ వీడియోలో తప్పేముందని.. ఆమె కుటుంబంతో 30 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ఆ వీడియోలు, చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌కు బాధిత మహిళ రాసిన లేఖలపై పూర్తిస్థాయి విచారణ జరపాలి. ఈ విషయంలో చంద్రబాబు, పవన్‌ ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరం. పవన్‌ నిజంగా హిందువైతే బీఆర్‌ నాయుడిని ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలి.’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement