వాషింగ్టన్: దక్షిణ అమెరికాలో వేళ్లూనుకున్న మాదకద్రవ్యాల ముఠాలు, ఉగ్రవాద నెట్వర్క్లను అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈక్వెడార్ ప్రభుత్వంతో చేతులు కలిపి ఆ దేశ భూభాగంపై 'నార్కో-టెర్రరిస్టుల'ను ఏరివేసేందుకు అమెరికా సైన్యం వ్యూహాత్మక కార్యకలాపాలను ప్రారంభించింది. మార్చి 3వ తేదీన ఉమ్మడి బలగాలు ఈ ఆపరేషన్ను మొదలుపెట్టినట్లు అమెరికా సదరన్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది.
లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో విస్తరిస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హింసను అరికట్టేందుకు భాగస్వామ్య దేశాల నిబద్ధతకు ఈ చర్య ఒక నిదర్శనమని సదరన్ కమాండ్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ డోనోవన్ అన్నారు. ఈ ఆపరేషన్కు సంబంధించి హెలికాప్టర్లు గగనతలానికి ఎగురుతున్న దృశ్యాలను, నిఘా నీడలో ఉన్న ఉగ్రవాద స్థావరాల వీడియోలను అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది.
రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి డ్రగ్ కార్టెల్స్ను 'విదేశీ ఉగ్రవాద సంస్థలు'గా పరిగణిస్తున్న ట్రంప్ యంత్రాంగం, ప్రస్తుతం తన సైనిక వ్యూహానికి మరింత పదును పెట్టింది. తాజా ఆపరేషన్లో భాగంగా అమెరికా దళాలు నేరుగా యుద్ధరంగంలోకి దిగకుండా, ఈక్వెడార్ సైన్యానికి అవసరమైన నిఘా సమాచారాన్ని, అత్యాధునిక లాజిస్టిక్స్ సదుపాయాలను అందిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ముఠాలపై రాజీలేని పోరాటం చేస్తామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఉద్ఘాటించారు. అయితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం డ్రగ్ ట్రాఫికింగ్ అనేది నేరమే తప్ప యుద్ధం కాదని, అమెరికా చేపడుతున్న వైమానిక దాడులు చట్టవిరుద్ధమైన హత్యల కిందకు వస్తాయని కొందరు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరేబియన్, పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో జరిగిన 44 వైమానిక దాడుల్లో సుమారు 150 మంది మరణించగా, వారిలో కొందరు సాధారణ కార్మికులు కూడా ఉన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.
2020 కరోనా మహమ్మారి తర్వాత ఈక్వెడార్లో నేరాల రేటు గణనీయంగా పెరగడం, నిరుద్యోగం, భౌగోళిక పరిస్థితుల వల్ల ఆ దేశం డ్రగ్ రవాణాకు అడ్డాగా మారడంతో నోబోవా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే మార్చి 1 నుండి కొలంబియా దిగుమతులపై 50 శాతం టారిఫ్ విధిస్తూ ఈక్వెడార్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గతంలో వెనిజులా భూభాగంపై దాడులు చేసి, అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న తరహాలోనే, ఇప్పుడు ఈక్వెడార్ వేదికగా డ్రగ్ మాఫియాపై మరో యుద్ధాన్ని అమెరికా ప్రకటించింది. అక్రమ గనుల తవ్వకం, డ్రగ్స్ మాఫియాను తుదముట్టించేందుకు ఇది ఒక ప్రయత్నమని ఈక్వెడార్ అధ్యక్షుడు తెలిపారు.


