పాట్నా: బీహార్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్నట్లు నితీష్ కుమార్ అధికారికంగా ప్రకటన చేశారు. తాను రాజ్యసభకు వెళ్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి బీహార్ ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ మొదలైంది.
అయితే, బీహార్లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న కారణంగా బీజేపీ నుంచి ముఖ్యమంత్రి స్థానం దక్కించుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో ఇద్దరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టవచ్చని తెలుస్తోంది. అలాగే, నిత్యానంద రాయ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కాగా, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక, సామ్రాట్ చౌదరి బీహార్ రాజకీయాల్లో అంతర్భాగంగా ఉన్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పటి నుండి ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వరకు బీజేపీ నాయకుడిగా కీలక పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా రెండవసారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సీఎం రేసు కోసం నిత్యానంద్ రాయ్ కూడా పోటీలో ఉన్నారు. రాయ్ ప్రస్తుతం హోంమంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్రంలో పని చేయడానికి ముందు, రాయ్ బీహార్కు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాయ్ హాజీపూర్ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2015లో రాయ్ పార్లమెంటరీ టికెట్ గెలుచుకుని ఉజియార్పూర్ నుండి ఎంపీగా పనిచేశారు. మరోవైపు.. నితీష్ కుమారుడు నిశాంత్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
నితీష్ కీలక వ్యాఖ్యలు..
అంతకుముందు సీఎం నితీష్ కుమార్ ట్విట్టర వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘గత రెండు దశాబ్దాలకు పైగా మీరు నాపై ఉంచిన విశ్వాసం, మద్దతు నిరంతరం కొనసాగుతోంది. అదే బలంతో మేము బీహార్ రాష్ట్రానికి, మీ అందరికీ సంపూర్ణ నిబద్ధతతో సేవ చేయగలిగాం. మీ విశ్వాసం, మద్దతు వల్లే బీహార్ ఈరోజు అభివృద్ధి మరియు గౌరవానికి కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఇందుకు నేను గతంలో కూడా మీ అందరికీ పలుమార్లు కృతజ్ఞతలు తెలిపాను. నా పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచే ఒక కోరిక నా మనసులో ఉంది.
బీహార్ శాసన మండలి (విధాన మండల) రెండు సభలతో పాటు, పార్లమెంట్లోని రెండు సభల సభ్యుడిగా కూడా ఉండాలని ఆశించాను. ఆ క్రమంలో ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా మారాలని కోరుకుంటున్నాను. మీతో నా ఈ అనుబంధం భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుందని నేను పూర్తి నిజాయితీతో హామీ ఇస్తున్నాను. మీ అందరితో కలిసి అభివృద్ధి చెందిన బిహార్ నిర్మాణం అనే సంకల్పం అలాగే కొనసాగుతుంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి నా పూర్తి సహకారం మరియు మార్గదర్శనం ఉంటుంది’ అని ఆయన అధికారిక ప్రకటన చేశారు.


