న్యూఢిల్లీ : పశ్చిమ ఆసియాలో ముదురుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ మేఘాలు ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్తాన్ను సైతం చుట్టుముట్టేలా కనిపిస్తున్నాయి. ఇరాన్కు చెందిన ఆత్మాహుతి డ్రోన్ సౌదీ అరేబియాపై దాడి చేసిన దరిమిలా పాకిస్తాన్ ఈ యుద్ధంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2025 సెప్టెంబరులో సౌదీ అరేబియా, పాకిస్తాన్ల మధ్య కుదిరిన ‘స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్’ (SMDA) ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల్లో ఏ ఒక్కరిపై దాడి జరిగినా, అది ఇద్దరిపై జరిగిన దాడిగానే పరిగణించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇరాన్ గనుక సౌదీపై దాడులను ఉధృతం చేస్తే, ఆ దేశ రక్షణ కోసం పాకిస్తాన్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది.
ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్ తన వైఖరిని స్పష్టం చేస్తూ, ఇరాన్కు పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది. తమ మధ్య ఉన్న రక్షణ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకుని, సౌదీ అరేబియాపై దాడులు చేయవద్దని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇరాన్ విదేశాంగ మంత్రిని హెచ్చరించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ బహిరంగంగానే తన రక్షణ ఒప్పందాన్ని ప్రస్తావించింది. అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్, సంపన్న దేశమైన సౌదీకి అణు రక్షణ కల్పించేలా ఈ ఒప్పందం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ అణు వ్యాప్తి నిరోధక ఒప్పందాలకు (ఎన్పీటీ) ఇది విరుద్ధమని ఐక్యరాజ్యసమితి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
2025లో ఇజ్రాయెల్.. దోహా, ఖతార్లపై వైమానిక దాడులు చేసిన సమయం నుండి గల్ఫ్ దేశాల్లో అభద్రతా భావం పెరిగింది. అమెరికా తమను కాపాడుతుందన్న నమ్మకం సన్నగిల్లడంతోనే సౌదీ అరేబియా ప్రత్యామ్నాయంగా పాకిస్తాన్తో ఈ రక్షణ ఒప్పందం చేసుకుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి పాకిస్తాన్ తన బలగాలను యుద్ధ భూమికి పంపకపోయినప్పటికీ, సౌదీకి మద్దతుగా దౌత్యపరమైన, వ్యూహాత్మకమైన బలాన్ని చేకూర్చడం ఖాయమనే విధంగా కనిపిస్తోంది.


