breaking news
iran israel war
-
అలీ ఖమేనీ అంత్యక్రియల్లో కనిపించిన మిస్టరీ వ్యక్తి ఎవరు?
టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో నల్ల ముసుగు ధరించిన ఓ వ్యక్తి కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. ముందు వరుసలో నిలబడి ప్రార్థనల్లో పాల్గొన్న ఆ వ్యక్తిని చూసిన చాలామంది మొజ్తబా ఖమేనీ తొలిసారి బహిరంగంగా కనిపించారని ఊహించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వేగంగా వైరల్ కావడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే కొద్ది గంటల్లోనే అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ముసుగు వెనుక ఉన్న వ్యక్తి మొజ్తబా ఖమేనీ కాదని, అలీ ఖమేనీ పెద్ద మనవడు మొహమ్మద్ జవాద్ ఖమేనీ అని ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తీవ్ర గాయాలు కావడం వల్లే ఆయన ముఖాన్ని ముసుగుతో కప్పుకున్నట్టు సమాచారం. ఈ పరిణామం ఇరాన్ రాజకీయాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది.ఆ ముసుగు మనిషి ముందు వరుసలో నిలబడి అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆయన బేస్బాల్ టోపీ ధరించి, ముఖాన్ని నల్ల ముసుగుతో కప్పుకున్నారు. అయితే, ఆయన మొహమ్మద్ జవాద్ ఖమేనీ అని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించడంతో ఆయన ఎవరో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది.జవాద్ ఖమేనీకి ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆ దాడుల్లోనే అలీ ఖమేనీ మరణించారు. మొజ్తబా ఖమేనీ ముఖం కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్టు అమెరికా నిఘా నివేదికలు తెలిపాయి.మొహమ్మద్ జవాద్ ఖమేనీ ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పెద్ద మనవడు. అలీ ఖమేనీ పెద్ద కుమారుడు మొస్తఫా ఖమేనీ. మొస్తఫా కుమారుడే మొహమ్మద్ జవాద్ ఖమేనీ. మొస్తఫా ఖమేనీ సుమారు 1965లో జన్మించినట్టు అక్కడి మీడియా తెలిపింది. అలీ ఖమేనీ అంత్యక్రియలు గురువారం జరిగాయి. 6 రోజుల పాటు సాగిన కార్యక్రమంలో 43 మిలియన్ల మంది పాల్గొన్నట్టు ప్రభుత్వ మీడియా తెలిపింది. కాగా, మొజ్తబా ఖమేనీ శనివారం టెలిగ్రామ్లో లిఖితపూర్వక సందేశం విడుదల చేశారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని అందులో పేర్కొన్నారు. -
ప్రపంచానికి డేంజర్ బెల్.. ఇరాన్ సీక్రెట్ మిషన్ లీక్?
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ మౌనంగా మరో మిషన్ మొదలుపెట్టిందా? అంతర్జాతీయంగా ఈ ప్రశ్న ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఉపగ్రహ చిత్రాలు ఇరాన్లోని కీలక సైనిక, న్యూక్లియర్ సంబంధిత కేంద్రాల్లో మళ్లీ కదలికలు మొదలైనట్లు సూచిస్తున్నాయి. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనపై అనుమానాలు మరింత పెరిగాయి.మధ్యప్రాచ్యం ఇప్పటికే ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. అమెరికా ఇరాన్ స్థావరాలపై దాడులు చేయడం, ఆ తర్వాత హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసింది. ఈ సమయంలోనే ఇరాన్ తన దెబ్బతిన్న సదుపాయాలను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయని సమాచారం. కాగా, అత్యంత ఆసక్తిని రేపుతున్న ప్రాంతం ఇరాన్లోని పార్చిన్ మిలిటరీ కాంప్లెక్స్. పశ్చిమ దేశాల నిఘా సంస్థలు ఈ ప్రాంతాన్ని గతంలోనే న్యూక్లియర్ ఆయుధాల అభివృద్ధికి సంబంధించిన పరిశోధనలతో అనుసంధానం చేశాయి. తాజాగా అక్కడ భారీ స్థాయిలో కదలికలు కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు, నేలను సరిచేసే పనులు, నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్నట్లు సమాచారం.కేవలం పార్చిన్ మాత్రమే కాదు.. తబ్రీజ్, కెర్మాన్షా సమీపంలోని కొన్ని క్షిపణి స్థావరాలు, వైమానిక స్థావరాల్లో కూడా పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భూగర్భ సదుపాయాల వద్ద వాహనాల రాకపోకలు పెరగడం కూడా నిఘా వర్గాల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇరాన్లోని ప్రధాన అణు కేంద్రాలైన నతాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటివరకు పెద్దఎత్తున పునర్నిర్మాణ కార్యకలాపాలకు స్పష్టమైన ఆధారాలు బయటపడలేదని సమాచారం.CNN reports that newly released satellite imagery suggests #Iran may be rebuilding suspected #nuclear #facilities following recent U.S. strikes, raising fresh questions about the extent of the damage and Tehran's ongoing nuclear activities. pic.twitter.com/4YvsbIs97X— The Kabul Tribune (@TheKabultribun) July 11, 2026ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్ మధ్య గతంలో కుదిరిన అవగాహన ప్రకారం, ఇరాన్ తన పరమాణు కార్యక్రమాన్ని నియంత్రించాలని, ఆయుధాల తయారీ దిశగా వెళ్లకూడదనే నిబంధనలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఇలాంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే అనుమానాలు ఆ ఒప్పంద భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. మరోవైపు అమెరికా, పశ్చిమ దేశాల భద్రతా నిపుణులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. ఉపగ్రహ ఆధారాలు మరింత బలపడితే, ఇరాన్పై కొత్త ఆంక్షలు లేదా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు దౌత్య చర్చలు.. మరోవైపు రహస్య కదలికల అనుమానాలు.. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. -
తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను: ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల తర్వాత తొలి సందేశం విడుదల చేశారు. అల్ జజీరా కథనం ప్రకారం.. "నా తండ్రి రక్తం చిందేలా చేశారు.. నేను తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను. ఇది మా దేశం కోరిక కూడా" అని చెప్పారు.అంత్యక్రియలకు హాజరైన లక్షలాది మందికి మొజ్తబా ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రికి నివాళులు అర్పించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావడం శత్రువుకు గట్టి దెబ్బగా అని, అది చరిత్రాత్మక ఘట్టమని చెప్పారు.ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ తనను హత్య చేయాలని ప్రయత్నిస్తే ఆ దేశం పూర్తిగా నాశనం అవుతుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరాన్ వైపు 1,000 క్షిపణులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే వేలాది క్షిపణులను కూడా ప్రయోగిస్తామని పేర్కొన్నారు.ఇరాన్పై ట్రంప్నకు వైరం ఎప్పుడు మొదలైంది?ఈ వివాదం మూలాలు 2020 జనవరిలో ఉన్నాయి. అప్పట్లో ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇరాక్లోని బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ అత్యంత శక్తిమంతమైన సైనిక కమాండర్ ఖాసిం సోలేమానీ మరణించారు.ఆ సమయంలో సోలేమానీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. ఆ తర్వాత అమెరికా సంస్థలు, ట్రంప్ను, ఆయన మాజీ అధికారులను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేయవచ్చని పలుసార్లు ప్రకటించాయి. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. ట్రంప్ను ఇరాన్ చంపేసే ప్రయత్నాలు చేస్తుందన్న వాదనలు ఇప్పటికీ ఉన్నాయి. నిపుణులు ఏమంటున్నారు? టెహ్రాన్ అప్లైడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మోస్తఫా ఖోష్చెష్మ్ మీడియాతో మాట్లాడుతూ.. హోర్ముజ్ జలసంధి ఎప్పటి నుంచో ఇరాన్ నియంత్రణలోనే ఉందని, యుద్ధం తర్వాత దానిపై నియంత్రణ వదులుకోవడాన్ని ఇరాన్ ప్రజలు అంగీకరించరని చెప్పారు.యుద్ధం సమయంలో హార్మూజ్ జలసంధి మూసివేయడంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయని, అది ఇరాన్ చేతిలో అత్యంత శక్తిమంతమైన ఒత్తిడి సాధనంగా మారిందని చెప్పారు. దీనివల్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై దేశీయంగా ఒత్తిడి పెరిగిందని, సైనిక బలాన్ని ఉపయోగించినా హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవలేకపోయారని తెలిపారు. అమెరికాతో చర్చలు జరపడం వల్ల ఇరాన్కు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని, పైగా ఇంకా ఎక్కువ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. -
ఇరాన్ మాస్టర్ ప్లాన్ ట్రంప్ కు స్పాట్ పెట్టారుగా.....!
-
అమెరికా హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజ్ చేరుకున్నాయి. యుద్ధ విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ కూడా గట్టిగా స్పందించింది. అమెరికా ఎలాంటి సైనిక చర్యలకు దిగినా తగిన ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ కీలక నేతలు హెచ్చరించారు.ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చర్చల బృందానికి నేతృత్వం వహిస్తున్న మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై దాడి జరిగితే దానికి తగిన సమాధానం ఇస్తామని, ఒత్తిళ్లు, బెదిరింపులతో తమను వెనక్కి తగ్గించలేరని ఆయన హెచ్చరించారు. హార్మూజ్ జలసంధి తిరిగి సాధారణ స్థితికి రావాలంటే ఇరాన్ షరతులు, ఏర్పాట్లను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం తర్వాత కూడా వివాదాలు పూర్తిగా చల్లారలేదు. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఒప్పంద ఉల్లంఘనల ఆరోపణలు చేసుకుంటున్నాయి. అమెరికా వైపు నుంచి కొత్త హెచ్చరికలు రావడం, ఇరాన్ నుంచి ప్రతీకార చర్యల ప్రకటనలు రావడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి ఈ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ మార్గం ద్వారా భారీ స్థాయిలో చమురు రవాణా జరుగుతుండటంతో అక్కడి పరిస్థితులు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా హార్మూజ్లో స్వేచ్ఛాయుత నౌకా రవాణాకు హామీలు కోరుతుండగా, ఇరాన్ మాత్రం తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది.మరోవైపు దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు. ట్రంప్ చర్చలు కొనసాగించేందుకు ఇరాన్తో అంగీకారం కుదిరిందని చెబుతున్నప్పటికీ, కాల్పుల విరమణ ముగిసిందని కూడా స్పష్టం చేశారు. దీంతో ఒకవైపు చర్చలు, మరోవైపు సైనిక హెచ్చరికలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. తాజా పరిణామాలు కేవలం రెండు దేశాల మధ్య వివాదంగా కాకుండా, మధ్యప్రాచ్య భద్రత, ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అంశంగా మారాయి. -
ఖమేనీకి ఎదురుదెబ్బ.. అమెరికా షాక్ ట్రీట్మెంట్!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన తాజా దాడుల నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ టార్గెట్గా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖమేనీకి అనుబంధంగా పనిచేస్తున్నట్లు ఆరోపిస్తున్న ఆర్థిక నెట్వర్క్పై అమెరికా భారీ ఆంక్షలు విధించింది. ఈ చర్యలతో దుబాయ్కు చెందిన ప్రముఖ ఇరానీ వ్యాపారవేత్త, బ్యాంకర్ అలి అన్సారితో పాటు మొత్తం 14 మంది వ్యక్తులు, సంస్థలు అమెరికా ఆంక్షల జాబితాలో చేరాయి.కాగా, అలి అన్సారి ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు, బ్యాంకులు, పెట్టుబడి సంస్థల నెట్వర్క్ను నిర్వహిస్తున్నాడు. ఈ వ్యవస్థ ద్వారా ఇరాన్ ప్రభుత్వ నిధులను విదేశాలకు మళ్లించి, రియల్ ఎస్టేట్, హోటళ్లు, వాణిజ్య భవనాలు తదితర ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్లు అమెరికా ఆరోపించింది. ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం మొజ్తబా ఖమేనీకి అనుబంధంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు, అలాగే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నట్లు పేర్కొంది.తాజా ఆంక్షల పరిధిలో ఇరాన్కు చెందిన మూడు కరెన్సీ ఎక్స్చేంజ్ సంస్థలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్లో నమోదైన పలు ఫ్రంట్ కంపెనీలు కూడా ఉన్నాయి. షెల్ కంపెనీల ద్వారా ప్రతి ఏడాది బిలియన్ల డాలర్ల విలువైన లావాదేవీలు నిర్వహిస్తూ అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునేందుకు ఈ నెట్వర్క్ పనిచేస్తోందని అమెరికా ఆరోపించింది. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఇటీవల వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల తర్వాత ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.లావాదేవీలు కట్.. అయితే, ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచి, దాని ఆర్థిక వనరులను దెబ్బతీయడమే తాజా ఆంక్షల ప్రధాన ఉద్దేశమని అమెరికా స్పష్టం చేసింది. ఈ ఆంక్షల కారణంగా జాబితాలో ఉన్న వ్యక్తులు, సంస్థలకు అమెరికాలో ఉన్న ఆస్తులు స్తంభించి పోనున్నాయి. అమెరికా పౌరులు, సంస్థలు వారితో ఎలాంటి ఆర్థిక, వాణిజ్య లావాదేవీలు నిర్వహించడానికి అనుమతి ఉండదు. అలాగే ఇతర దేశాల బ్యాంకులు లేదా కంపెనీలు వీరితో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే ద్వితీయ స్థాయి ఆంక్షలను ఎదుర్కొనే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది.ఇదిలా ఉండగా.. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక, దౌత్య విభేదాల నేపథ్యంలో తాజా ఆంక్షలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, అమెరికా చేసిన ఆరోపణలను ఇరాన్ గతంలో పలుమార్లు ఖండించింది. తమపై విధిస్తున్న ఆంక్షలు రాజకీయ ఒత్తిడి కోసం చేస్తున్న చర్యలేనని, అవి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఇరాన్ వాదిస్తోంది. తాజా ఆంక్షలపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
ఫైటర్ జెట్ల పహారాలో ఖమేనీ పార్థివదేహం
టెహ్రాన్: ఇరాన్ మజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఘట్టం తుదిదశకు చేరుకుంది. మష్హాద్లోని ఇమామ్ రెజా పవిత్రక్షేత్రంలో పార్థివదేహం ఖననం చేయనున్నారు. ఈ సందర్భంగా ఖమేనీకి తుది వీడ్కోలు పలికేందుకు లక్షల సంఖ్యలో జనం మష్హాద్ బాట పట్టారు. ఇసుకేస్తే రాలనంత జనం రావడంతో ఆ నగర వీధులన్నీ జనసముద్రంగా మారాయి.ఈ రోజు ఉదయం ఇరాక్లోని నజాప్ విమానాశ్రయం నుంచి ఖమేనీ భౌతికకాయం ఉన్న విమానం మష్హాద్ నగరానికి బయిలుదేరింది. ఈ అంత్యక్రియల విమాన ప్రయాణానికి అత్యంత భారీ భద్రత,అధికారిక ప్రోటోకాల్ను కేటాయించారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్వయంగా ఆ విమానంలో ఖమేనీ భౌతికకాయంతో పాటు ప్రయాణించి ఎస్కార్ట్గా నిలిచారు.ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భౌతిక కాయం తరలిస్తున్న విమానానికి అత్యంత పటిష్ట భద్రత కల్పించారు. వాయుతలంలో ఆ విమానానికి ఇరు దేశాల వైమానికి దళాలు ఫైటర్ జెట్స్తో భద్రత కల్పించాయి. మష్హాద్ చేరుకున్న అనంతరం అక్కడి నుండి హెలికాప్టర్ల ద్వారా కర్బలాకు తరలించే సమయంలో కూడా భారీ సైనిక ఎస్కార్ట్ మధ్యే శవపేటికను తరలించారు.కాగా ఖమేనీ అంత్యక్రియల వేళ అమెరికా దాడులు తీవ్ర కలకలం రేపాయి. ఇరాన్ ఉత్తర ప్రాంతంలోని గొలిస్తాన్ ప్రావిన్సులో ఉన్న రైల్వే వంతెనపై దాడులు చేసింది. దీంతో టెహ్రాన్- మష్హాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.Iranian Fighter Jets escorted the plane carrying the caskets of Ayatollah Khamenei and his familyThis explains reports of the jet activity I was reading. https://t.co/7TxUPwnwD4 pic.twitter.com/gfTXLUwe21— Ryan Rozbiani (@RyanRozbiani) July 9, 2026 -
అంత్యక్రియల వేళ.. ఇరాన్కు గుండెకోత
టెహ్రాన్: ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం ముగింపు వేళ ఇరాన్ కీలక వీడియో విడుదల చేసింది. ఆయన నివాసంపై అమెరికా జరిపిన దాడికి సంబంధించిన చిత్రాలను తొలిసారిగా అధికారికంగా పంచుకుంది. ఇంతవరకూ కేవలం శాటిలైట్ చిత్రాలు మాత్రమే అందుబాటులో ఉండగా తొలిసారిగా అధికారికంగా వీడియోను విడుదల చేసింది.ఫిబ్రవరి 28 అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ దాడికి సంబంధించిన వీడియోను ఇరాన్ రిలీజ్ చేసింది. 35 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో దాడులలో భవనం పూర్తిగా శిథిలమైన చిత్రాలు క్షిపణుల దాడులు భవనం కుప్పకూలిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఖమేని అంత్యక్రియలు ముగింపువేళ ఈ చిత్రాలు ఇరానీయలను తీవ్రమైన బాధకు గురి చేస్తున్నాయి.కాగా ఈ దాడిలో ఖమేనీ ఆయన కుటుంబసభ్యులతో సహా 14 నెలల మనవరాలు 40 మంది అధికారులు సైతం మరణించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఈ భవనంపై ఏకకాలంలో 35 క్షిపణులను ప్రయోగించాయి. అయితే అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ రోజు (గురువారం) సాయంత్రం ఆయనను మషద్లో ఖననం చేయనున్నారు.కాగా ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న అమెరికా దాడులకు తెగబడింది. చైనా, రష్యా, ఇరాన్లకు భూమర్గం ద్వారా జరిగే వస్తురవాణాకు కీలకంగా భావించే ఆక్ తఖే ఖాన్ రైల్వేబ్రిడ్జిపై దాడులు చేసినట్లు అంతర్జాతీయ కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఆందోళన నెలకొంది.Iran released footage of leader Khamanei's residence after the US attack that martyred him and his family, including 14-month old Zahra pic.twitter.com/dpSEJWKeGP— COMBATE |🇵🇷 (@upholdreality) July 8, 2026 -
గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్..
దుబాయ్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల అనంతరం అమెరికా ఇరాన్పై మరోసారి భారీ వైమానిక దాడులు చేపట్టింది. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతమంతా హై అలర్ట్లోకి వెళ్లింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో పలుచోట్ల సైరన్లు మోగాయి.తాజా పరిణామాల నేపథ్యంలో బహ్రెయిన్, కువైట్ దేశాల్లో హెచ్చరిక సైరన్లు మోగించగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు సూచించాయి. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అలాగే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఒమాన్ దేశాలు కూడా తమ వైమానిక రక్షణ వ్యవస్థలను పూర్తి అప్రమత్త స్థితిలో ఉంచాయి.ఇదిలా ఉండగా అమెరికా దాడుల్లో ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని బందర్ అబ్బాస్, చాబహార్, జాస్క్, సిరిక్, అబూ మూసా దీవి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. ఆగ్నేయ ఇరాన్లోని ఇరాన్షహర్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఓ అగ్నిమాపక సిబ్బంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ (IRNA) వెల్లడించింది. ఈ ఘటనలో విమానాశ్రయ భవనాలు దెబ్బతిన్నాయి.BREAKING:🚨🇮🇷 🇺🇸Gulf states hosting United States military bases—namely the UAE, Kuwait, Qatar, and Bahrain—have been attacked by Iran because Trump violated a ceasefire during Khamenei's funeral procession. pic.twitter.com/0YsQb5XZAg— Mr. Hass 💛 (@Lassegaf_1) July 8, 2026ఇక, ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే విధుల్లో ఉన్న అగ్నిమాపక సిబ్బంది ఖాలెద్ ఖాదేరీ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇక అమల్లో లేదని ప్రకటించారు. ఇరాన్పై భీకర దాడులతో అమెరికా సైన్యం విరుచుకుపడుతోంది.WATCH 🔴Footage captures a massive U.S. strike hitting Iran’s Chabahar Port, Iran pic.twitter.com/zmYAro1P3u— Open Source Intel (@Osint613) July 8, 2026 -
ఇరాన్ హిట్ లిస్ట్లో నేనే నంబర్ వన్.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇరాన్ టార్గెట్ చేసిన హిట్ లిస్ట్లో (కిల్ లిస్ట్)లో మొదటి స్థానంలో ఉన్నానని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై దాడి చేసే ఇరాన్ ప్లాన్ చేసిందని చెప్పుకొచ్చారు. ఇరాన్ దాడి అవకాశం ఉన్నప్పటికీ అలాంటి బెదిరింపులకు భయపడబోనని స్పష్టం చేశారు.నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇటీవల ఇరాన్పై అమెరికా చేపట్టిన సైనిక దాడులను సమర్థించారు. ఇరాన్ దూకుడు చర్యలకు ప్రతిస్పందనగానే అమెరికా బలంగా వ్యవహరించిందని, దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ భద్రతకు ముప్పు ఏర్పడితే వెంటనే స్పందిస్తామని తెలిపారు.కాగా, 2020లో ఇరాన్ సైనిక అధికారి ఖాసిం సులేమానీ హత్య తర్వాత ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్కు చెందిన పలువురు నాయకులు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ట్రంప్పై హత్యాయత్నాలకు సంబంధించిన కుట్రలను అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా వెలుగులోకి తెచ్చాయి. అయితే తాను ఇరాన్ 'కిల్ లిస్ట్'లో మొదటి స్థానంలో ఉన్నానన్న ట్రంప్ వ్యాఖ్యకు సంబంధించి ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు.ఇక, ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను మరోసారి ప్రపంచ దృష్టికి తీసుకొచ్చాయి. ఈ పరిణామాలను ఐక్యరాజ్యసమితి, నాటో సభ్యదేశాలు, మధ్యప్రాచ్య దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ప్రాంతీయ భద్రత, చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యంపై ఈ ఉద్రిక్తతల ప్రభావం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
"ఖర్గ్ ద్వీపం స్వాధీనం చేసుకుంటాం"
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు డేంజర్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామన్నారు. ఖర్గ్ దీపాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అయితే ఇదివరకే ఇకపై ఇరాన్తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ తప్పులు చేస్తూనే ఉందని చర్చల పేరుతో ఇరాన్ తమ సమయాన్ని వృథా చేస్తోందని ఆ దేశంతో సీజ్ఫైర్ ముగిసిందని చెప్పారు. కాగా తాజాగా మరోసారి ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో ఏ జరగనుందా అనే ఆందోళన టెన్షన్ సర్వత్వా నెలకొంది. కాగా ఈ రోజు బుధవారం అంకారాలో జరిగిన నాటో సదస్సులో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ " ఇరానీయులు అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసగాళ్లు, చెడ్డ మనస్తత్వం ఉన్నవాళ్లు" అంటూ ట్రంప్ విమర్శించారు. గత రాత్రి ఇరాన్కు చెందిన చాలా ప్రమాదకరమైన వ్యక్తులపై అమెరికా దాడులు జరిపిందని చెప్పారు. హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు నౌకలపై దాడి జరిగిన తర్వాత ఈ దాడులు జరిగాయి. ఆ దాడిని ఇరాన్ సైన్యమే జరిపిందని అమెరికా ఆరోపించింది.కాగా ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. రేపు గురువారం ఆయన స్వస్థలం మషాద్ నగరంలో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ దాడి చేస్తామని ప్రకటించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాగా ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఇరానీయన్లు అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. అమెరికాకు మరణం, ఇరాన్కు మరణం అనే నినాదాలతో హోరెత్తించారు. -
మళ్లీ యుద్ధమా? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరలు భగ్గు!
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదిరిన ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ అవగాహనా ఒప్పందం (MoU) ముగిసిందని, ఇకపై ఎలాంటి చర్చలు ఉండవంటూ ప్రకటించారు. మరొకవైపు ఇరాన్ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో, టర్కీలోని అంకారాలో జరుగుతున్న నాటో (NATO) సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. తాము ఇరాన్కు చెందిన అత్యంత ప్రమాద కరమైన వ్యక్తులపై శక్తివంతమైన దాడులు చేశాం. వాళ్లు దుర్మార్గులు, మానసిక రోగులంటూ దుమ్మెత్తి పోశారు. అంతేకాదు ఇరాన్ను పూర్తిగా అణ్వాయుధ రహిత దేశంగా (Denuclearisation) మారుస్తామని ట్రంప్ హెచ్చరించారు.ఇదీ చదవండి: ఆమీర్ భార్య గౌరి బ్రైడల్ లుక్ : 'పఠానీ హార్' విశేషాలు తెలుసా?ఇది ఇలా ఉంటే ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇండియన్ స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్ సుమారు 1,506 పాయింట్లు, అంటే 1.93శాతం పతనమై, 76,673.86 వద్దకు చేరగా, నిఫ్టీ 50 కూడా 461 పాయింట్లు 1.89శాతం నష్టపోయి 23,937.65దిగువకు పడిపోయింది. ఫార్మా, మెటల్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు నష్టాల్లో నడిచాయి.చమురుపై ప్రభావంఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు మళ్లీ ఆకాశంవైపు చూస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒకేసారి 5 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 5.3 శాతం ఎగిసి 78.09 డాలర్ల స్థాయిని అధిగమించగా, డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ 5.4 శాతం పెరిగి 74.23 డాలర్ల వద్దకి చేరుకుంది.ఇదీ చదవండి: రెడ్ బెనారసీ డ్రెస్లో పార్టీ లుక్.. తొలిసారి ఇలా అన్షులా!స్పెయిన్పై ట్రంప్ ఆగ్రహం.. నాటోపై అసంతృప్తిఇరాన్పై సైనిక చర్యల కోసం అమెరికాకు తమ సైనిక స్థావరాలను, వైమానిక మార్గాన్ని ఉపయోగించు కోవడానికి స్పెయిన్ నిరాకరించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. స్పెయిన్ను నాటోలో ఒక దారుణ మైన భాగస్వామిగా అభివర్ణిస్తూ, ఆ దేశంతో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను నిలిపివేయాలని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ను ఆదేశించారు. ఉగ్రవాదానికి పెద్ద పీట వేసే ఇరాన్ విషయంలో నాటో కూటమి తమకు మద్దతుగా నిలబడటం లేదని, గ్రీన్లాండ్ విషయంలో కూడా నాటో ప్రవర్తన తనకు నచ్చలేదని ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: యువ క్రికెటర్ బలి : ఇంత ప్రమాదమా ఈ వ్యాధి? లక్షణాలేంటి? -
హార్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులకు కౌంటర్ గా అమెరికా దాడులు
-
ఇకపై ఇరాన్తో చర్చలు ఉండవు: ట్రంప్
ఇకపై ఇరాన్తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ తప్పులు చేస్తూనే ఉందని తెలిపారు. చర్చల పేరుతో ఇరాన్ తమ సమయాన్ని వృథా చేస్తోందని అన్నారు. ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసిందని చెప్పారు. దీంతో యుద్ధం మరింత భీకరంగా కొనసాగే ముప్పు ఉందని నిపుణులు భావిస్తున్నారు. బుధవారం అంకారాలో జరిగిన నాటో సదస్సులో విలేకరులతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరానీయులను "అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసగాళ్లు, చెడ్డ మనస్తత్వం ఉన్నవాళ్లు" అంటూ ట్రంప్ విమర్శించారు. గత రాత్రి ఇరాన్కు చెందిన చాలా ప్రమాదకరమైన వ్యక్తులపై అమెరికా దాడులు జరిపిందని చెప్పారు. హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు నౌకలపై దాడి జరిగిన తర్వాత ఈ దాడులు జరిగాయి. ఆ దాడిని ఇరాన్ సైన్యమే జరిపిందని అమెరికా ఆరోపించింది."వాళ్లు తమ సొంత ప్రజలకు హాని చేశారు. నిరసనల్లో పాల్గొన్న 54,000 మందిని చంపారు. గత రాత్రి ఇరాన్కు చెందిన చాలా ప్రమాదకరమైన వ్యక్తులపై మేము చాలా శక్తిమంతంగా దాడి చేశాం. వాళ్లలో ఏదో సమస్య ఉంది" ట్రంప్ అన్నారు.ఈ ఘర్షణ లక్ష్యం ఇదే..ఇరాన్ను "దుష్ట దేశం"గా పేర్కొన్న ట్రంప్.. ఈ ఘర్షణ లక్ష్యం ఇరాన్ అణు సామర్థ్యాన్ని లేకుండా చేయడమేనని, అమెరికా ఇరాన్ను "డి-న్యూక్" చేస్తుందని మరోసారి చెప్పారు."గత రాత్రి మేము ఇరాన్పై చాలా తీవ్రంగా దాడి చేశాం. మీరు దాడి చేసిన ప్రతిసారీ మేమూ దాడి చేస్తామని నేను వాళ్లకు చెప్పాను. వాళ్లు నీచంగా వ్యవహరిస్తారు. అందరి వెంట పడతారు. బహుశా నా వెంట కూడా పడవచ్చు. వాళ్లు మాకు నచ్చరు. నాకు వాళ్లు నచ్చరు. వాళ్లు దుష్టులు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని తొలగించడమే మా లక్ష్యం. మేము దాన్ని డి-న్యూక్ చేస్తాం" అని ట్రంప్ చెప్పారు. -
హార్ముజ్ లో హైటెన్షన్.. మళ్లీ మొదలైన యుద్ధం
-
హార్మూజ్పై ఇరాన్ షాకింగ్ కామెంట్స్.. స్ట్రాంగ్ వార్నింగ్
టెహ్రాన్: హార్మూజ్ జలసంధి అంటే ప్రాంతీయేతర శక్తులు సైనిక బలప్రదర్శన చేసే వేదిక కాదని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది హెచ్చరించారు. హార్మూజ్ జలసంధిపై బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై స్పందించిన ఘరీబాబాది.. సంక్షోభాలు సృష్టించే వారే వాటి పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు.ఘరీబాబాది ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. "హార్మూజ్ జలసంధి ప్రాంతీయేతర శక్తుల సైనిక బలప్రదర్శన వేదిక కాదు. హార్మూజ్ భద్రతకు హామీ ఇచ్చే బాధ్యతాయుత శక్తిగా ఇరాన్ ఈ జలమార్గంలో జరిగే ఏ సైనిక కదలికనైనా అత్యంత అప్రమత్తంగా గమనిస్తోంది. హార్మూజ్ భద్రత తీరప్రాంత దేశాల చేతుల్లోనే ఉంటుంది. సంక్షోభాలు సృష్టించే వారు తమ సాహసోపేత చర్యల పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది తీవ్రమైన హెచ్చరిక" అని పేర్కొన్నారు. బ్రిటన్, ఫ్రాన్స్ ఏమన్నాయి? ఒమాన్ తన సార్వభౌమ ప్రాదేశిక జలాల్లో నౌకల రాకపోకలు సురక్షితంగా సాగేందుకు బ్రిటన్, ఫ్రాన్స్తో కలిసి పని చేయడానికి అంగీకరించిందని కీర్ స్టార్మర్, ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. "హార్మూజ్ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలక సముద్ర మార్గం. అన్ని దేశాల నౌకలు ఈ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించే పరిస్థితిని పునరుద్ధరించడం ప్రపంచ ఆందోళనగా మారింది. తన సార్వభౌమ ప్రాదేశిక జలాల్లో నౌకల రాకపోకలు సురక్షితంగా సాగేందుకు బ్రిటన్, ఫ్రాన్స్తో కలిసి పనిచేయడానికి ఒమాన్ సుల్తానేట్ అంగీకరించింది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.అంతేగాక, "హార్మూజ్ జలసంధిలో నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణానికి మద్దతుగా సైనిక మిషన్ను మోహరించడానికి బ్రిటన్, ఫ్రాన్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రాంతీయ స్థిరత్వం, అన్ని దేశాల సార్వభౌమాధికారానికి గౌరవం, ప్రపంచ భద్రత, నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణం, అంతర్జాతీయ చట్టాన్ని పరిరక్షించేందుకు తమ భాగస్వామ్య దేశాలతో సన్నిహిత సహకారం కొనసాగించాలనే నిబద్ధతను బ్రిటన్, ఫ్రాన్స్ మరోసారి స్పష్టం చేశాయి" అని పేర్కొన్నారు.జూలై 2న బహ్రెయిన్లో జరిగిన అమెరికా నేతృత్వంలోని ప్రాంతీయ భద్రతా సదస్సును ఇరాన్ తీవ్రంగా విమర్శించింది. ఆ సైనిక సదస్సు చట్టబద్ధతను, ఆ ప్రాంతంలో అమెరికా కమాండ్ వ్యవస్థ అధికారాన్ని ఘరీబాబాది తిరస్కరించారు. "హార్మూజ్పై అధికారం సెంట్కామ్(అమెరికా సెంట్రల్ కమాండ్)ది కాదు, ఇరాన్దే" అని పేర్కొన్నారు. బహ్రెయిన్లో జరిగే సైనిక సదస్సు పర్షియన్ గల్ఫ్కు చట్టబద్ధ వ్యవస్థను, భద్రతను ఏర్పాటు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. تنگه هرمز میدان نمایش نظامی قدرتهای فرامنطقهای نیست. ایران بهعنوان قدرت مسئول و ضامن امنیت تنگه، نسبت به هر حرکت نظامی در این آبراه حساس هشدار میدهد. امنیت هرمز با دولتهای ساحلی است؛ بحرانسازان مسئول پیامدهای ماجراجویی خود خواهند بود؛ این هشدار جدی است. pic.twitter.com/v9n2GdHnb6— Gharibabadi (@Gharibabadi) July 4, 2026 -
ఇరాన్, అమెరికా.. చర్చల ముసుగులో హత్యా కుట్ర?
ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గుతున్నట్లుగా కనిపిస్తున్న తరుణంలో మరో సంచలన ఆరోపణ వెలుగులోకి వచ్చింది. శాంతి చర్చల నేపథ్యంలో ఇరాన్ ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ హత్యా కుట్రకు పూనుకోవచ్చని అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అమెరికా మధ్యప్రాచ్య దేశాల ద్వారా ఇరాన్కు రహస్య హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది.న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మరియు పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్లను లక్ష్యంగా చేసుకుని హత్యా ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేసినట్లు సమాచారం. వీరిద్దరూ శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నందున, వారిపై దాడి జరిగితే మొత్తం చర్చల ప్రక్రియ కుప్పకూలే ప్రమాదం ఉందని వాషింగ్టన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు నివేదిక పేర్కొంది.ఈ నేపథ్యంలో అమెరికా కొన్ని మధ్యప్రాచ్య దేశాల ద్వారా ఇరాన్కు గోప్యంగా హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో, యుద్ధ ప్రారంభ దశలో ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక, రాజకీయ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు అమెరికా వర్గాలు అంగీకరించినప్పటికీ, ప్రస్తుత శాంతి చర్చల దశలో అలాంటి చర్యలు పరిస్థితిని పూర్తిగా దెబ్బతీస్తాయని భావించినట్లు సమాచారం.అమెరికా ఇలా.. యుద్ధ ప్రారంభంలో ఇజ్రాయెల్ ఇరాన్ నాయకత్వాన్ని బలహీనపరచే లక్ష్యంతో దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ దాడుల్లో కొంతమంది ఉన్నతాధికారులు మరణించినట్లు కూడా కథనాలు చెబుతున్నాయి. అయితే, తర్వాతి దశలో చర్చల ప్రక్రియ ప్రారంభమైన తరువాత అమెరికా వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శాంతి చర్చలను కొనసాగించాల్సిన అవసరాన్ని అమెరికా అధికారులు ప్రాధాన్యంగా పేర్కొంటూ, హింసాత్మక చర్యలు జరిగితే మొత్తం ప్రక్రియ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించినట్లు సమాచారం.ఇదిలా ఉండగా, ఇరాన్ తరఫున అరాఘ్చీ, ఘాలిబాఫ్లు అమెరికా మరియు ప్రాంతీయ దేశాలతో జరుగుతున్న చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. జూన్లో అమెరికా–ఇరాన్ మధ్య ఒక ప్రాథమిక ఒప్పందం కుదిరినట్లు సమాచారం ఉంది. ఇది హార్మూజ్ జలసంధి ద్వారా రవాణా పునరుద్ధరణతో పాటు తదుపరి అణు చర్చలకు మార్గం సుగమం చేసేలా ఉన్నట్లు చెబుతున్నారు.అయితే ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ తిరిగి బలపడుతుందని, దాని మిసైల్ సామర్థ్యాలు మరియు ప్రాంతీయ ప్రభావం పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య కొనసాగుతున్న సంక్లిష్ట సమీకరణాలు, మధ్యప్రాచ్య శాంతి చర్చల భవిష్యత్తుపై కొత్త అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. -
అలీ ఖమేనీ అంత్యక్రియలకు కొడుకు మొజ్తబా ఖమేనీ గైర్హాజరు!
ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ బహిరంగంగా హాజరయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది. తీవ్ర భద్రతా ఆందోళనలే ఇందుకు కారణమని భారతదేశంలోని సుప్రీం లీడర్ ప్రతినిధి అయతొల్లా హకీమ్ ఎలాహీ తెలిపారు.ఓ ఇంటర్వ్యూలో అయతొల్లా హకీమ్ ఎలాహీ మాట్లాడుతూ.. అంత్యక్రియలకు ముందు ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. "గత వారం నేను ఇరాన్లో ఉన్నాను. మొజ్తబాను కలిసిన నా స్నేహితులతో మాట్లాడాను. ఆయన బయటకు రావాలని, ప్రజలను కలవాలని కోరుకుంటున్నారని వారు చెప్పారు. కానీ, భద్రతా సిబ్బంది అందుకు అనుమతించడం లేదు. అది చాలా ప్రమాదకరమని, ఆయనకు భద్రత కల్పించడం సాధ్యం కాదని వారు చెప్పారు. ఆయన బయటకు రారని నేను భావిస్తున్నాను" అని ఎలాహీ చెప్పారు.కాగా, ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది ప్రముఖులు అయతొల్లా అలీ ఖమేనీకి తుది వీడ్కోలు చెప్పేందుకు టెహ్రాన్కు చేరుకుంటున్నారు. ఇరాన్కు ఇజ్రాయెల్, అమెరికాతో జరిగిన ఘర్షణల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అంత్యక్రియలు జరుగుతున్నాయి.ఇరాన్లో పరిస్థితుల గురించి ఎలాహీ మాట్లాడుతూ.. సుప్రీం లీడర్ మరణించినప్పటి నుంచి దేశమంతా సంతాపంలో ఉందని, ఆయనకు మద్దతు ఇచ్చే వారు ఈ నష్టాన్ని భర్తీ చేయలేనిదిగా భావిస్తున్నారని చెప్పారు. "వారికి ఇది చాలా పెద్ద నష్టం. తమ ఆత్మను, ప్రాణాన్ని కోల్పోయినట్టుగా వారు భావిస్తున్నారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని వారు నమ్ముతున్నారు" అని చెప్పారు.ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు జులై 4న టెహ్రాన్లో ప్రారంభం కానున్నాయి. అనంతరం జులై 7న ఖోమ్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరగా జులై 9న ఆయన స్వస్థలం మష్హద్లో అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేస్తారు. అయితే, జులై 3న టెహ్రాన్లో జరిగే సంతాప కార్యక్రమానికి విదేశీ ప్రతినిధులు హాజరవుతారు. -
హార్ముజ్కు మళ్లీ వెళ్లం
హార్ముజ్ జలసంధి.. పశ్చిమాసియా సంఘర్షణలో అత్యంత ప్రభావితమైన ప్రాంతం. హార్ముజ్ గుండా ప్రయాణించడం అంటే నావికులు అసాధారణ ప్రమాదాలను ఎదుర్కోవడమే. యుద్ధంతో హార్ముజ్ జలసంధిలో నెలలపాటు చిక్కుకుపోయిన నావికులు ఎట్టకేలకు బయటకొచ్చారు. కానీ, మళ్లీ హార్ముజ్ పేరెత్తితేనే భయపడుతున్నారు. తాము మళ్లీ హార్ముజ్కు వెళ్లబోమని చెబుతున్నారు. పొట్టకూటికి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. వాణిజ్య నౌకాయానానికి నావికులను అందించే అతిపెద్ద దేశాల్లో భారత్ ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సముద్రయాన నిపుణులను పంపిస్తుంది. 2025లో ప్రపంచ వాణిజ్య నౌకా రవాణాలో 320,000 మందికి పైగా భారతీయ నావికులు పనిచేస్తున్నారు. ఫిబ్రవరిలో ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ తొలి దాడుల తర్వాత, ఇరాన్ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. దీంతో ఘర్షణ సమయంలో గల్ఫ్లో వాణిజ్య నౌకాయానం లక్ష్యంగా మారింది. జూన్లో, ఒమన్ తీరంలో ఒక నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. అలాగే, భారతీయులు అధిక సంఖ్యలో ఉన్న మరో రెండు నౌకలపైనా దాడులు జరిగాయి. దీంతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వేలాది మంది భారత నావికులు గల్ఫ్ను వదిలి వచ్చేశారు. వీరిలో, ఇరాన్ షిప్పింగ్ శాఖ సహాయంతో వెళ్లిన 3,600 మందికి పైగా ఉన్నారు. భారత నావికులున్న నౌకలపైనా దాడులు జరిగాయి. మరికొందరు తమ సహచరులు చనిపోవడాన్ని చూశారు.యుద్ధాన్ని ముగించడానికి మధ్యంతర ఒప్పందం కుదిరినప్పటికీ, దాడులు కొనసాగుతుండటం, ఇప్పటికీ హార్ముజ్ జలసంధి గుండా రాకపోకలు ఉద్రిక్తంగానే ఉండటంతో.. ఘర్షణ సమయంలో జలసంధిలో ఉండిపోయి బయటపడిన వారిలో చాలామంది ఆందోళన చెందుతూనే ఉన్నారు. దాడి తర్వాత తీవ్ర నిరాశ... ‘‘మార్షల్ దీవుల జెండా ఉన్న ఒక బల్క్ క్యారియర్ నౌకలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాన్ని స్వయంగా చూశాను. మార్చిలో, మా కంపెనీకి చెందిన ‘సేఫ్సీ విష్ణు’ అనే ముడి చమురు ట్యాంకర్పై దాడి జరిగింది. ఆ దాడిలో ఒక భారతీయ సిబ్బంది మరణించారు. కొన్ని వారాల తర్వాత, మా నౌకపైనా దాడి జరిగింది. తెల్లవారుజామున, నా షిఫ్టుకు సిద్ధమవుతుండగా దాడి జరిగింది. మాకేమీ కాలేదు. కానీ, దాడి తర్వాత మా సిబ్బంది మొత్తం తీవ్ర నిరాశలోకి జారిపోయారు. అది జీవితాన్ని మార్చే అనుభవం, ఊహించలేనంత భయంకరమైనది. ఆ దాడి నన్ను కూడా తీవ్రంగా కుదిపేసింది. నేను క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను. గల్ఫ్కు తిరిగి వెళ్లాలంటే భయంగా ఉంది. కానీ నేను పోషించాల్సిన కుటుంబం కూడా ఉంది కాబట్టి తప్పదు’’ అని గుజరాత్లోని చిన్న మత్స్యకార గ్రామానికి చెందిన 31 ఏళ్ల సీతారామ్ తండేల్ చెబుతున్నారు. పరిస్థితులు మెరుగుపడితేనే తిరిగి వెళ్తా.. ‘‘గల్ఫ్ నుంచి బయలుదేరడానికి సిద్ధమైన మార్షల్ దీవుల జెండా ఉన్న ఒక సరుకు రవాణా నౌకలో మార్చిలో చేరాను. మేం దాటడానికి చాలా ప్రయతి్నంచాం. దాడుల తీవ్రత ఎక్కువగా ఉంది. మా కంపెనీకి చెందిన మరో నౌకపై దాడి జరిగింది. ఘర్షణలు తగ్గినప్పుడు ‘ఈ ప్రయాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నా’మని ధృవీకరిస్తూ పత్రాలపై సంతకాలు చేయమని కోరారు. చివరికి, అర్ధరాత్రి వేళ ఆ ప్రమాదకర ప్రాంతం గుండా ప్రయాణించాం.’’ అని కేరళకు చెందిన 45 ఏళ్ల రతీసన్ కుట్టియన్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. పరిస్థితులు మెరుగుపడితేనే గల్ఫ్కు తిరిగి వెళ్తానంటున్నారు. నావికుడిగా ప్రయాణించాల్సిందే.. ‘‘ఒక సరుకు రవాణా నౌకలో హార్ముజ్ వైపు వెళ్తుండగా, మా ముందున్న నౌకపై దాడి జరిగింది. మా నౌక అబుదాబికి వెనుదిరిగింది. నేను యుద్ధ ప్రాంతంలో ఉన్నానని నా భార్యకు చెప్పలేదు. ఇప్పుడు విషయం తెలిసి ఇక ఎప్పుడూ గల్ఫ్ వెళ్లొద్దని చెబుతోంది. ఒక నావికుడిగా ప్రపంచమంతా ప్రయాణించాల్సిందేనని తెలుసు. కానీ.. తెలిసి తెలిసి ప్రాణాపాయ స్థితుల్లోకి వెళ్లలేం కదా’’ అంటున్నారు కేరళకు చెందిన 49 ఏళ్ల హరిదాస్. ఇక ఎప్పటికీ వెళ్లను.. ‘‘రెండు దశాబ్దాలకు పైగా సముద్ర ప్రయాణంలో గడిపాను. గల్ఫ్ నుంచి చైనా, సింగపూర్కు చమురును రవాణా చేస్తూ, అనేకసార్లు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాను. కానీ యుద్ధం నా దృక్పథాన్ని మార్చేసింది. మేం సింగపూర్కు బయలుదేరడానికి రెండు రోజుల ముందు యుద్ధం మొదలైంది. మా నౌకకు 10, 15 మీటర్ల దూరంలో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. కొన్ని క్షిపణులు మాకు అతి దగ్గరగా దూసుకెళ్లాయి. నౌకను కదలించవద్దని ఆదేశాలు రావడంతో, దాదాపు మూడు నెలల పాటు అక్కడే నిలిచిపోయాం. భయమేసినా ఏం చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాయి. కాల్పుల విరమణ తర్వాతే నౌక కదిలింది. మే 29న దుబాయ్ మీదుగా నౌక బయలుదేరింది. విధులు ముగించుకుని దిగిపోయాను. ఇక హార్ముజ్కు ఎప్పటికీ వెళ్లను. నా ప్రాణం కంటే డబ్బు ఎక్కువ కాదు’’ అంటున్నారు 42 ఏళ్ల నావికుడు హిరేన్కుమార్ ప్రవీణ్. -
ఇరాన్ పద్మవ్యూహం... అమెరికాకు అసలైన అగ్నిపరీక్ష!
దాడులు ప్రతి దాడులతో అట్టుడికిపోతున్న పశ్చిమాసియాలో.. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఓ కొలిక్కి రావాలంటే సైనిక చర్య తప్పేలా లేదా? అమెరికా ఒకవేళ సైనిక చర్యకు దిగితే.. ఏయే మార్గాలను ఎంచుకుంటుంది? ఇరాన్పై పూర్తిస్థాయి యుద్ధం అంటే.. అమెరికాకు భారీ నష్టమే కాకుండా.. ఊహించని రిస్క్ కూడా. అసలు ఇరాన్పై సైనిక చర్య అమెరికాకు సాధ్యం అవుతుందా? ప్రాణనష్టం లేకుండా యుద్ధాన్ని ముగించడం అమెరికాకు, దానికి మద్దతు ఇచ్చే ఇజ్రాయెల్కు సాధ్యమేనా?..ఇరాన్ ఓ కంచుకోట..!భౌగోళికంగా ఇరాన్ ఒక సహజమైన కోట లాంటిది. ఆ దేశం చుట్టూ ఎత్తైన పర్వతాలుంటే.. లోపల భయంకరమైన ఎడారులు, ఉప్పు నేలలు ఉన్నాయి. శత్రు సైన్యం ఇరాన్ లోపలి నగరాల వరకు వెళ్లడం దాదాపు అసాధ్యమే. అందుకే, అమెరికా మిలటరీ ప్లానర్స్ ఒక సరికొత్త వ్యూహాన్ని ఆలోచిస్తున్నారు. ఇరాన్ లోపలికి వెళ్లకుండా, కేవలం దాని దక్షిణ తీరప్రాంతాన్ని(Southern Coastline) టార్గెట్ చేయడం! ఎందుకంటే ఇక్కడే ఇరాన్ ఆర్థిక, సైనిక వనరులు ఉన్నాయి. కానీ మిలిటరీ నిపుణులు ఒక మాట అంటారు. ఇరాన్లో అడుగుపెట్టే మొదటి తొలి మైలు దూరాన్ని కిలోమీటర్లలో కొలవవచ్చు, కానీ తదుపరి 100 మైళ్లను సంవత్సరాలలో కొలవాల్సి ఉంటుందనేది దాని సారాంశం..! అందుకే.. ఇరాన్పై ఒత్తిడి పెంచడానికి అమెరికా ముందు కేవలం ఐదు ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే..1. ఖార్గ్ ఐలాండ్ (Kharg Island): ఈ ద్వీపం ఇరాన్కు చమురు విషయంలో గుండెకాయలాంటిది. భూతల దాడులకు దిగితే.. అమెరికా కన్నుపడే మొదటి ప్రాంతం ఇదే. ఇరాన్ దేశ మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో 90% నుంచి 95% ఇక్కడి నుంచే జరుగుతాయి. పర్షియన్ గల్ఫ్లో లోతు తక్కువగా ఉండటం వల్ల, ఇరాన్ తన మెయిన్ల్యాండ్ నుంచి పైప్లైన్ల ద్వారా చమురును ఈ దీవికి తెచ్చి, ఇక్కడ పెద్ద ట్యాంకర్లలో లోడ్ చేస్తుంది. అంటే, ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. దీన్ని ఆక్రమిస్తే ఇరాన్ మోకాళ్లపై పడుతుందని అమెరికా అనుకోవచ్చు. కానీ రిస్క్ ఏంటంటే.. ఇక్కడ దాడి జరిగితే గ్లోబల్ ఆయిల్ మార్కెట్ క్రాష్ అవుతుంది. అంతేకాదు, పక్కనే ఉన్న అరబ్ దేశాల ఆయిల్ ఫీల్డ్స్పై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. ఇది అంతర్జాతీయ సంక్షోభానికి దారితీస్తుంది.2. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ (Strait of Hormuz): ఇక అమెరికా ఎంచుకునేందుకు అవకాశమున్న రెండో మార్గం.. హార్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాకు ఇది అత్యంత కీలకమైన జలసంధి. అయితే దీన్ని కంట్రోల్ చేయడం అమెరికా అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే దీని చుట్టూ ఇరాన్ బలమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుంది. బందర్ అబ్బాస్ నగరం, ఖేష్మ్ ఐలాండ్లను దాటుకుని అమెరికా ఇక్కడ నిలబడటం చాలా కష్టం. ఇరాన్ దగ్గర వందలాది స్పీడ్ బోట్లు, మిస్సైల్ బ్యాటరీలు ఉన్నాయి. అవి అమెరికా నౌకాదళంపై నిరంతరం రాకెట్ల వర్షం కురిపించగలవు. ఇక్కడ ఆపరేషన్ మొదలైతే, అది పరిమితంగా కాకుండా.. ఒక సుదీర్ఘమైన ప్రపంచ ఆర్థిక యుద్ధంగా రూపాంతరం చెందే ప్రమాదం ఉంది.3. మూడు ద్వీపాలు.. ఫైబర్-ఆప్టిక్ డ్రోన్ల ముప్పు: ఇక అమెరికా వద్ద ఉండే మూడో ఆప్షన్.. గల్ఫ్లో ఉండే మూడు చిన్న ద్వీపాలు. అవి.. అబు మూసా, గ్రేటర్ టంబ్, లెస్సర్ టంబ్. అమెరికా సైన్యం వీటిని ఈజీగా ఆక్రమించి.. మిలిటరీ బేస్లు పెట్టొచ్చు. కానీ, అమెరికా సేనలకు అసలు నరకం ల్యాండింగ్ అయ్యాక మొదలవుతుంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది... అదే ఫైబర్-ఆప్టిక్ డ్రోన్. సాధారణ డ్రోన్లను అమెరికా తన టెక్నాలజీతో ‘జామ్’ చేయగలదు. కానీ ఈ ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లు రేడియో సిగ్నల్స్ మీద పనిచేయవు, వీటికి వెనుక 60 కిలోమీటర్ల పొడవైన వైర్ ఉంటుంది. వీటిని జామ్ చేయడం అసాధ్యం! ఇరాన్ కొండల చాటు నుండి ఈ డ్రోన్లను వందల సంఖ్యలో వదిలితే.. ఈ ద్వీపాల్లో ఉండే అమెరికా సైనికులు కేవలం ‘సిట్టింగ్ డక్స్’ అంటే.. సులభమైన టార్గెట్స్ లాగా మిగిలిపోతారు.4. చాబహార్ పోర్ట్ (Chabahar Port): భూతల దాడుల కోసం అమెరికా వద్ద ఉండే నాలుగో ఆప్షన్ చాబహార్ పోర్ట్. దీన్ని భారత్ కూడా అభివృద్ధి చేసింది. ఇరాన్ దగ్గరున్న ఏకైక ఓపెన్ ఓషన్ డీప్-వాటర్ పోర్ట్ ఇది. ఇది గల్ఫ్ దేశాలకు కొంచెం దూరంగా, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే.. ఇక్కడ ల్యాండ్ అవ్వడం అమెరికాకు ఈజీ. కానీ సమస్య ఏంటంటే.. ఇక్కడ అమెరికాకు ఎలాంటి లెవరేజ్ దొరకదు. ఇరాన్ ప్రధాన నగరాలకు, ఆయిల్ ఫీల్డ్స్కు చాబహార్ చాలా దూరంలో ఉంది. దీన్ని పట్టుకుని అమెరికా సాధించేది ఏమీ ఉండదు. ఇక్కడి నుంచి ఇరాన్ను లొంగదీసుకోవాలంటే, అమెరికా సైన్యం దేశం లోపలికి నడుచుకుంటూ వెళ్లాలి. అంటే మళ్లీ ఒక పెద్ద గ్రౌండ్ వార్లోకి దిగాల్సిందే.5. ఖుజెస్తాన్ (Khuzestan)-ప్రాక్సీల వ్యూహం: గ్రౌండ్ వార్కు అమెరికా సిద్ధమైతే.. ఆ దేశం ఎంచుకునే ఐదో ఆప్షన్ ఖుజెస్తాన్ మాత్రమే. అయితే.. ఇది అత్యంత ప్రమాదకరమైన రూట్. ఇది చమురు నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. కువైట్లోని అమెరికా బేస్ నుంచి ఇక్కడికి రావడం అమెరికాకు ఈజీ. ఒకప్పుడు సద్దాం హుస్సేన్ కూడా ఇరాన్పై దాడికి ఇదే రూట్ను వాడుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అమెరికా సైన్యం మాత్రం ఇరాక్లోని బస్రా మీదుగా రావాలి. అక్కడ ఇరాన్ మద్దతు ఉన్న 2 లక్షల మంది 'ప్రాక్సీ మిలిషియా' సైన్యం కాపు కాసి ఉంటుంది. అంటే, అమెరికా సైన్యం ఇరాన్ సరిహద్దును తాకక ముందే.. ఇరాక్లోనే ఒక భారీ అంతర్జాతీయ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ 5 ప్రాంతాలను చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇరాన్లోకి ఎంటర్ అవ్వడానికి అమెరికాకు దారులు ఉన్నాయి. కానీ, గెలవడానికి దారులు లేవు. వెస్ట్రన్ బోర్డర్లో ఉన్న కుర్దిష్ తిరుగుబాటుదారులను వాడుకోవాలని చూసినా.. అది ఇరాన్ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచి దేశాన్ని మరింత ఏకం చేస్తుంది. చివరగా చెప్పాలంటే.. యుద్ధంలో ఎవరు మొదట కొట్టారు? లేదా ఎంత గట్టిగా కొట్టారు? అనేది ముఖ్యం కాదు. చివరి వరకు తట్టుకుని ఎవరు నిలబడ్డారు? అనేదే ముఖ్యం.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు -
నాటోతో అమెరికాకు తల్లాక్?
ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్.. క్లుప్తంగా నాటో.. ఇప్పుడు నాటో-అమెరికా మధ్య ఇడుపు కాయితం.. అదే విడాకులు జరగనున్నాయా? నాటో నుంచి అమెరికా పూర్తిగా వైదొలిగిపోతుందా? అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ సైనిక అత్యవసర పరిస్థితి లేదా యుద్ధం వస్తే.. నాటో కూటమికి ఎలాంటి సైనిక సహాయం పంపాలనే నియమాలను ఆయన మార్చేశారు. దీని సారాంశం ఏమిటంటే.. నాటో దేశాలకు ఇకపై అమెరికా మద్దతు చాలా చాలా తక్కువగా ఉంటుంది.నాటోకు ఈ సపోర్ట్ ఉండదు..•విమాన వాహక నౌకలు (Carriers) ఉండవు•క్యారియర్ యుద్ధ విమానాలు ఉండవు•ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు (Precision munitions) ఉండవు•లాజిస్టికల్ సరఫరా (రవాణా సదుపాయాలు) ఉండదు•శాటిలైట్ మద్దతు కూడా చాలా పరిమితంగా ఉంటుంది.చైనాతో యుద్ధానికి సిద్ధం??అమెరికా అధికారిక ప్రకటన ప్రకారం.. చైనాతో ఏ క్షణంలోనైనా యుద్ధం రావచ్చనే ఉద్దేశంతో అమెరికా పనిచేయాలని హెగ్సెత్ భావిస్తున్నారు. అందుకే.. చైనాతో పోరాడటానికి అవసరమయ్యే ఏ సైనిక వనరులను కూడా ఇతర ప్రాంతాలకు తరలించకూడదని నిర్ణయించారు. ఇక అనధికారికంగా చూస్తే ఇరాన్ యుద్ధం తర్వాత, ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ యుద్ధాలు చేసే సామర్థ్యాన్ని అమెరికా కోల్పోయింది. అన్ని వనరులను కేవలం చైనా కోసమే కేటాయించాలని అమెరికా నిర్ణయించుకున్నప్పుడు, ఇక ప్రపంచంలో మరెక్కడా జోక్యం చేసుకోలేదు. ఇరాన్ యుద్ధాన్ని ట్రంప్ ప్రభుత్వం నడిపిన తీరు వల్ల, తూర్పు అర్ధగోళం నుంచి అమెరికా తన పట్టును కోల్పోతుందనేది నిర్వివాదాంశం..! రాజకీయంగా ట్రంప్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసింది. అదేంటంటే.. ఐరోపా (Europe) ఇక తనను తాను కాపాడుకోవాలే తప్ప.. అమెరికా సాయం ఉండదు.భవిష్యత్ ఏమిటి?అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో.. నాటో కూటమి పేపర్పై మాత్రమే మిగిలి ఉంటుంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే అమెరికా చేతులెత్తేస్తే, ఐరోపా దేశాల వద్ద లేని ప్రత్యేకమైన అమెరికన్ ఆయుధాలు రావని తేలిపోతే.. ఇక నాటో కూటమికి అర్థమే ఉండదు. దీంతో, నాటో కథ ముగిసినట్లే అవుతుంది!. 1949 నుండి నాటో ప్రణాళిక ఎలా ఉందంటే అమెరికా కొన్ని పెద్ద సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుంది, ఐరోపా దేశాలు వాటిని చేయవు. ఐరోపా దేశాలు ఎప్పుడూ అమెరికాపై ఆధారపడేలా చేయడం కోసమే యూఎస్ఏ అలా చేసింది. ఒకవేళ యుద్ధం వస్తే, వారి సైన్యాలన్నింటినీ అమెరికానే కమాండ్ చేయాలనేది దాని ఆలోచన. కానీ ఆ వ్యవస్థ ఇప్పుడు ముగిసిపోయింది. ఐరోపాలో అమెరికా తన సైనిక ప్రభావాన్ని కోల్పోయింది.ఐరోపాకు కింకర్తవ్యమ్..?ఇప్పుడు ఐరోపా దేశాలు తమను తాము రక్షించుకోవడానికి సిద్ధమవుతున్నందున, అమెరికాతో ఉన్న 'ఇంటర్ఆపరబిలిటీ' (Interoperability) అంటే.. కలిసి పనిచేసే సామర్థ్యం దెబ్బతింటుంది. అమెరికా ఆయుధ వ్యవస్థలు చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి, ఎక్కువ కాలం మన్నికగా ఉండటానికి డిజైన్ అయ్యాయి. కానీ ఐరోపా దేశాలు ఎదుర్కొనే యుద్ధాలు అలాంటివి కావు. ఒక యుద్ధంలో తమ సైన్యాన్ని నడిపించే అమెరికాతో కలిసి పనిచేయడం కోసమే ఐరోపా దేశాలు ఇంతకాలం అమెరికా ఆయుధాలను కొనుగోలు చేశాయి. కానీ అమెరికా సైన్యమే రానప్పుడు, ఇక ఆ ఆయుధాలను వాడటంలో ఎలాంటి అర్థం లేదు. ప్రస్తుత డ్రోన్ల యుగంలో.. అమెరికా తరహా ఆయుధ వ్యవస్థలను నిర్మించుకోవడానికి ఐరోపాకు 10 నుండి 15 ఏళ్ల సమయం లేదు. అంత వేగంగా వాటిని నిర్మించలేరు. కాబట్టి, వారు ఉక్రెయిన్ తరహా ఆయుధాలను తయారు చేసుకుంటారు. వీటికి బ్యాకప్గా బహుళ-దేశాల అణ్వాయుధ రక్షణను ఏర్పాటు చేసుకుంటారు.ఇది ఎలా సాగుతుందో కాలమే చెప్పాలి. సరిగ్గా ఒక సంవత్సరంలోనే ఐరోపా, అమెరికా సైన్యాలు కలిసి పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల వారు కలిసి పనిచేయాల్సి వచ్చినా, వేర్వేరు కమాండ్ స్ట్రక్చర్స్, వేర్వేరు వ్యూహాలతో పనిచేయాల్సి ఉంటుంది. వాషింగ్టన్ తీసుకున్న ఈ రాజకీయ నిర్ణయం వల్ల నాటో కూటమికి చరమగీతం పాడినట్లవ్వడమే కాకుండా.. ఐరోపా దేశాలు తీసుకునే ఆయుధ కొనుగోలు నిర్ణయాలు కూడా ఈ కూటమిని శాశ్వతంగా ముగించేలా చేస్తాయి. నాటో (NATO) ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది. కానీ ఇప్పుడు అమెరికా ఒక వ్యూహాత్మక విచ్ఛిన్నం (Strategic breakdown), సరికొత్త ప్రపంచ సమీకరణాల వైపు అడుగులు వేస్తోంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఐరోపా, అమెరికా ఒకే వైపు కాకుండా, రెండు వేర్వేరు ధ్రువాలుగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు. -
ఇక అమెరికాతో చర్చల్లేవు.. ఇరాన్ విదేశాంగ శాఖ
అమెరికా-ఇరాన్ చర్చలకు సంబంధించి ఇరాన్ మరోసారి సంచలన ప్రకటన చేసింది. ఇరుదేశాల మధ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఖండించారు. మంగళవారం ఖతార్ రాజధాని దోహాలో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరుగుతాయని ట్రంప్ చెప్పగా, తాము అమెరికా అధికారులతో చర్చలు జరపడానికి వెళ్లడం లేదని ఇరాన్ సోమవారం సాయంత్రం స్పష్టం చేసింది.ఈ చర్చల కోసం అధ్యక్షుడు ట్రంప్కు అత్యంత సన్నిహితులైన సలహాదారులు స్టీవ్ విట్కాఫ్ , ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ సాంకేతిక చర్చలతో పాటు జరిగే ఉన్నత స్థాయి సమావేశాలకోసం దోహాకు వెళ్లనున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ప్రకటనపై ఇరాన్ స్పందించింది.ఇరాన్ స్పష్టీకరణఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాదీ ఇరాన్ ప్రభుత్వ మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రతినిధి బృందం రాబోయే రెండు రోజులు దోహాలోనే ఉంటుందని, అయితే వారు అమెరికా అధికారులను కలవడానికి కాకుండా, ఖతార్ మధ్యవర్తుల ద్వారా అమెరికా తన కాల్పుల విరమణ ఒప్పంద బాధ్యతలను నెరవేర్చేలా చేయడానికి మాత్రమే వెళ్తున్నారని తెలిపారు. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు.ఇదీ చదవండి: హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులురూట్ ఫీజులపై ఒమన్తో చర్చలుహార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే ఓడల మార్గాల్లో మార్పులు, ఫీజుల వసూలు వంటి కొత్త నిబంధనలపై ఒమన్తో చర్చలు జరుపుతున్నట్లు ఘరీబాబాదీ పేర్కొన్నారు. ఒకవేళ ఒమన్ కలిసి రాకపోయినా, ఇరాన్ ఒంటరిగానే ముందుకు వెళ్తుందని హెచ్చరించారు. గత రెండు వారాలుగా ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి, గత గురువారం నుండి ఇరు దేశాల మధ్య జరుగుతున్న దాడులు పెద్ద ముప్పుగా మారాయి. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) లో ఇరు దేశాలు దాడులు కొనసాగిస్తున్నాయి. అటు ఇజ్రాయెల్ సైన్యం కూడా ఆదివారం దక్షిణ లెబనాన్లోని మూడు హిజ్బుల్లా స్థావరాలపై దాడులు చేసింది. అమెరికా మద్దతుతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ నుండి వెనక్కి తగ్గాల్సి ఉన్నప్పటికీ, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా గ్రూప్ ఈ ఒప్పందాన్ని తిరస్కరించడంతో అక్కడ కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: అపుడు లవర్ కోసం ఇస్లాంలోకి ఆయుష్ : ఇపుడు కొత్త ట్విస్ట్ -
ఇరాన్ ఫ్రీజింగ్ ఆస్తులు.. మసూద్ పెజెష్కియన్ కీలక ప్రకటన
టెహ్రాన్ : ఇరాన్ ప్రజలకు ఆదేశ అధ్యక్షుడు మసూజ్ పెజెష్కియన్ శుభవార్త చెప్పాడు. ఆ దేశానికి చెందిన ఆరు బిలియన్ డాలర్లను విడుదల చేయడానికి ఖతార్ అంగీకరించిందని పేర్కొన్నారు. త్వరలోనే ఆ డబ్బు విడుదల కానుందని పేర్కొన్నారు.అయితే అమెరికా మాత్రం స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులేవీ విడుదల చేసేది లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.గత కొంత కాలంగా ఇరాన్- అమెరికా చర్చలు సజావుగా సాగకపోవడానికి స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులు సైతం ఓ కారణం విదేశాల్లో ఫ్రీజ్ చేసిన తమ దేశ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ఇరాన్ పట్టుబట్టడం దానికి అమెరికా ససేమిరా అనడంతో చర్చల వ్యవహారం ఎంత మాత్రం ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడు సైతం నిధులు విడుదల చేసేది లేదన్నారు.అయితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ ఫెజెష్కియన్ మాత్రం దానికి విభిన్నంగా మాట్లాడారు “ ఇటీవలే రూపొందించిన ప్రణాళికల ప్రకారం, ఖతార్లోని మొత్తం 12 బిలియన్ డాలర్ల ఇరాన్ నిధులలో ఆరు బిలియన్ డాలర్లను వెంటనే విడుదల చేసి దేశానికి తిరిగి ఇవ్వనున్నారు, అంతే కాకుండా తదనంతరం అవసరమైన తదుపరి చర్యలు చేపడుతారు.” అని అన్నారు. అయితే ఈ యుద్ధ ఉద్రిక్తతల వేళ చర్చల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ 'నిస్సహాయతతో' చర్చల్లోకి ప్రవేశించిందని, 60 రోజుల చర్చల కాలంలో టెహ్రాన్కు ' పది సెంట్లు కూడా ' అందవని తేల్చి చెప్పారు. అదే విధంగా ఈ యుద్ధంలో ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం, వాయు, రక్షణ వ్యవస్థలు భారీ స్థాయిలో డ్యామేజ్ అయ్యాయని పేర్కొన్నారు. -
ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..
ఇరాన్, అమెరికా యుద్ధం.. రెండోరోజు అప్డేట్స్.. యూఎస్, గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక.. 👉అమెరికా దాడులపై స్పందించిన ఇరాన్. ఇంకా దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా దళాలు ఇరాన్ లక్ష్యాలపై వైమానిక దాడులు చేయగా, దానికి ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు మరియు మిత్రదేశాలపై ప్రతిదాడులు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ అధికార వర్గాలు అమెరికా చర్యలను “ఉద్రిక్తత పెంచే దాడులు”గా అభివర్ణించాయి.👉ఇరాన్ ప్రకటనలో గల్ఫ్ దేశాలకు కూడా స్పష్టమైన హెచ్చరిక ఇచ్చింది. అమెరికా తమ భూభాగాన్ని లేదా సైనిక స్థావరాలను ఉపయోగిస్తే, దాని ఫలితాలు “విపరీతంగా ఉంటాయి” అని హెచ్చరించింది.👉ఇరాన్ హెచ్చరికల ముఖ్యాంశం గల్ఫ్ దేశాలపై కూడా దృష్టి సారించింది. అమెరికా సైనిక చర్యలకు సహకరిస్తే, ఆ దేశాలు కూడా పరిణామాలు ఎదుర్కొంటాయని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి.గల్ప్లో సైరన్ల మోత.. 👉పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్పై వైమానిక దాడులు నిర్వహించింది. దక్షిణ ఇరాన్లోని సిరిక్ (Sirik), బందర్-ఎ-లెంగెహ్ (Bandar-e Lengeh), ఖెష్మ్ (Qeshm) ద్వీపం ప్రాంతాల్లో ఉన్న సైనిక లక్ష్యాలపై దాడులు జరిగినట్లు అమెరికా అధికారులు తెలిపారు.👉అమెరికా దాడులు పునరావృతం కాకుండా అడ్డుకునేందుకు హార్మూజ్ జలసంధి తమకు కీలక వ్యూహాత్మక ఒత్తిడి సాధనమని ఇరాన్ స్పష్టం చేసింది. జలసంధిపై తమ ప్రభావాన్ని వదులుకుంటే, అమెరికా మరోసారి దాడులు చేసేందుకు అవకాశం కల్పించినట్టే అవుతుందని టెహ్రాన్కు చెందిన అబ్బాస్ అస్లానీ తెలిపారు.👉అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం బలప్రయోగం ద్వారా హార్మూజ్ జలసంధిలో పరిస్థితులను మార్చాలని ప్రయత్నిస్తోందని, అయితే అలాంటి చర్యలు టెహ్రాన్కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు.👉ఇజ్రాయెల్–లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్-గ్వీర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం హెజ్బొల్లాకు మళ్లీ ఊపిరి పోసినట్టేనని, ఆ సంస్థను పూర్తిగా నిర్మూలించాల్సింది పోయి కాల్పుల విరమణతో అవకాశం కల్పించారని విమర్శించారు. లెబనాన్ సైన్యం హెబ్బొల్లాను నియంత్రించగలదన్న వాదన ప్రమాదకర భ్రమే అని ఆయన వ్యాఖ్యానించారు.👉అమెరికా–ఇరాన్ తాజా ఘర్షణలతో టెహ్రాన్ ప్రజల్లో మళ్లీ యుద్ధ భయాలు పెరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఎంత సున్నితంగా ఉందో ఈ పరిణామాలు చూపిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 👉అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను హెచ్చరిస్తూ, దాడులు కొనసాగితే సైనికంగా పూర్తిగా ముగిస్తాం అంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని, అందుకే ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా పేర్కొంది.U.S. Navy and Air Force fighter jets conducted strikes tonight on 10 Iranian military targets at multiple locations in and near the Strait of Hormuz for Iran's drone attack on M/T Kiku. pic.twitter.com/Z0TLZRqmF6— U.S. Central Command (@CENTCOM) June 28, 2026👉ఇదిలా ఉండగా, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లతో అమెరికా మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది. బహ్రెయిన్లో వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగగా, కువైట్ తన గగనతల రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసి శత్రు డ్రోన్లు, క్షిపణులను ఎదుర్కొంటున్నట్లు ప్రకటించింది.👉బహ్రెయిన్పై డ్రోన్ దాడి జరిగినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. బహ్రెయిన్లో అమెరికా నౌకాదళానికి చెందిన ఫిఫ్త్ ఫ్లీట్ స్థావరం ఉండటంతో ఈ ఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది. దేశ సార్వభౌమాధికారంపై దాడిగా దీనిని బహ్రెయిన్ ఖండించింది.👉ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద భద్రతా పరిస్థితి మరింత దిగజారింది. అక్కడ ప్రయాణించే వాణిజ్య నౌకలకు ముప్పు పెరగడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.👉ప్రస్తుతం ఇరు దేశాలు మరిన్ని సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇవ్వడంతో, మధ్యప్రాచ్యంలో పరిస్థితి గంట గంటకూ ఉద్రిక్తంగా మారుతోంది. అంతర్జాతీయ సమాజం మాత్రం సంయమనం పాటించాలని ఇరు దేశాలకు పిలుపునిస్తోంది.👉ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో కొన్ని అమెరికా మిత్రదేశాల గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు సమాచారం. అయితే కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పూర్తి నష్టం, ప్రాణనష్టం వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. -
మరోసారి మిసైళ్ల మోత.. ఇరాన్లోని కీలక స్థావరాలపై బాంబుల వర్షం
ఫ్లోరిడా: ఇరాన్పై అమెరికా మళ్లీ దాడులు చేసింది. ఆదివారం తెల్లవారుజామున మిసైళ్లతో విరుచుకుపడింది. ఎం/వి ఎవర్ లవ్లీ వాణిజ్య సరుకు రవాణా నౌకపై ఇరాన్ దాడికి ప్రతిగా శుక్రవారం అర్ధరాత్రి దాటాక అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత, కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించే అవకాశాన్ని ఇరాన్కు అమెరికా ఇచ్చింది. అయితే, ఇరాన్ దాన్ని లెక్క చేయకుండా డ్రోన్ను ప్రయోగించి ఎం/టి కికు నౌకను ఢీకొట్టింది. పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఆ ట్యాంకర్, 2 మిలియన్లకు పైగా బ్యారెళ్ల ముడి చమురుతో హార్మూజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ఓ ప్రకటనలో తెలిపింది.ఏయే ప్రాంతాల్లో దాడులు? వాణిజ్య నౌకలపై ఇరాన్ కొనసాగిస్తున్న దూకుడుకు నేరుగా ప్రతిగా సెంట్కామ్ దళాలు దాడులు చేపట్టాయి. అమెరికా సైనిక విమానాలు ఇరాన్ సైనిక నిఘా వ్యవస్థలు, సమాచార ప్రసార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్లేయర్ కెపాబిలటీస్ లక్ష్యంగా దాడులు చేశాయి. కాగా, హార్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని, అమెరికా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని సెంట్కామ్ తెలిపింది. https://t.co/9JgYDCZXuB— U.S. Central Command (@CENTCOM) June 27, 2026మా సహనం నశించింది: ఇరాన్ ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రాహీం అల్ఫిఖర్ ఎక్స్లో వరుస పోస్టులు చేశారు. "మీరు మా సార్వభౌమాధికారంపై దాడి చేశారు. ఇక పరిస్థితుల్ని మార్చే కార్యాచరణకు సిద్ధంగా ఉండండి. మీరు తప్పుగా అంచనా వేశారు. మా సహనం నశించింది. కాళరాత్రిని చూడడానికి సిద్ధంగా ఉండండి. మీరు అన్ని హద్దులు దాటారు. మా నిర్ణయం మాటలకే పరిమితం కాదు.. కొన్ని గంటల్లో మా శక్తిని చూపిస్తాయి" అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఇరాన్ సైన్యంలోని అత్యున్నత ఉమ్మడి యుద్ధ కమాండ్కు చెందిన అధికార ప్రతినిధి. మరోవైపు, బహ్రెయిన్ శనివారం ఇరాన్ తమ భూభాగంపై పలు డ్రోన్లు ప్రయోగించిందని ఆరోపించింది. ఈ దాడి తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిందని, శాంతిని కాపాడే ప్రయత్నాలకు ముప్పు తెచ్చిందని తెలిపింది.You miscalculated, and our patience has run out... so prepare for a long, endless night.— العميد إبراهيم ذو الفقاري (@Ibrahim_alFiqar) June 27, 2026 -
కొనసాగుతున్న ఇరాన్ దాడులు
మనామా: బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ శనివారం పలుసార్లు డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడి తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, పశ్చిమాసియాలో శాంతిని కాపాడే ప్రయత్నాలకు ముప్పు తెచ్చిందని బహ్రెయిన్ ఆరోపించింది.పశ్చిమాసియాలో ఇటీవల జరిగిన ఘర్షణలకు ముగింపు పలికే ఉద్దేశంతో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత.. అమెరికా-ఇరాన్ తొలిసారి పరస్పరం సైనిక దాడులు చేసుకున్న కొన్ని గంటలకే బహ్రెయిన్లో ఈ డ్రోన్ దాడి జరిగినట్టు సమాచారం.ఇరాన్కు చెందిన పలువురు డ్రోన్లు దాడి చేశాయని పేర్కొంటూ బహ్రెయిన్ విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన బహ్రెయిన్ సార్వభౌమాధికారంపై బహిరంగ ఉల్లంఘన అని పేర్కొంది. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడే ప్రయత్నాలను ఇరాన్ దెబ్బతీస్తోందని ఆరోపించింది.బహ్రెయిన్ చేసిన ఆరోపణలపై టెహ్రాన్ ఇప్పటి వరకూ బహిరంగంగా స్పందించలేదు. అయితే, ఇరాన్ ప్రభుత్వం మాత్రం అమెరికాపై కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. అమెరికా ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసిన తర్వాత, ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు జరిపిందని తెలిపింది.బహ్రెయిన్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత సాగుతున్న దౌత్య ప్రయత్నాలను భంగపరచాలనే ఉద్దేశంతోనే ఈ డ్రోన్ దాడి జరిగింది. తాజా పరిణామాలు ఉద్రిక్తతలు తీవ్రంగా పెరుగుతున్నాయని సూచిస్తున్నాయి.అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా జరిగిన కాల్పులు, కొనసాగుతున్న ఘర్షణల కారణంగా శాంతి ఒప్పంద ప్రయత్నాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రాంతీయ భద్రతపై మరో ఆందోళన తలెత్తింది. హార్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య చమురు నౌకను శనివారం ఓ క్షిపణి తాకినట్టు యునైటెడ్ కింగ్డమ్ సముద్ర వాణిజ్య కార్యకలాపాల సంస్థ తెలిపింది. -
వీడియోలతో అమెరికా కవ్వింపు.. గల్ప్ దేశాలపై ఇరాన్ పంజా
మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అమెరికా, ఇరాన్ మధ్య గత వారం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండగానే ఇరు దేశాలు పరస్పరం సైనిక చర్యలకు దిగడంతో ప్రాంతీయ భద్రతపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి, దానికి అమెరికా చేపట్టిన ప్రతీకార వైమానిక దాడులు, అనంతరం ఇరాన్ స్పందనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.సమాచారం ప్రకారం, హార్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న ఎవర్ లవ్లీ అనే వాణిజ్య నౌకపై ఇటీవల డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనకు ఇరాన్ మద్దతు ఉన్న బలగాలే కారణమని అమెరికా ఆరోపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఈ దాడి జరిగిందని పేర్కొంటూ, అమెరికా మరోసారి ఇరాన్ తీరప్రాంతంలోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ నిల్వ స్థావరాలు, రాడార్ వ్యవస్థలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కొన్ని కీలక సైనిక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి.అమెరికా దాడుల వీడియోలు విడుదల.. మరోవైపు.. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్పై నిర్వహించిన సైనిక దాడులకు సంబంధించిన వీడియోలను అధికారికంగా విడుదల చేసింది. ఈ వీడియోల్లో అమెరికా యుద్ధ నౌకల నుంచి క్షిపణులు ప్రయోగించడం, ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించడం, అనంతరం భారీ పేలుళ్లు సంభవించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ తీర ప్రాంతంలోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ నిల్వ స్థావరాలు, రాడార్ వ్యవస్థలు, ఇతర సైనిక మౌలిక సదుపాయాలపై ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించినట్లు CENTCOM తెలిపింది. ఈ వీడియోల్లో అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకల నుంచి వరుసగా క్షిపణులు దూసుకెళ్లడం, లక్ష్య ప్రాంతాలను తాకిన తర్వాత భారీ పేలుళ్లు చోటుచేసుకోవడం కనిపిస్తోంది. అంతర్జాతీయ సముద్ర మార్గాల భద్రతను కాపాడేందుకు, తమ బలగాల రక్షణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా పేర్కొంది.అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా దాడులు జరిపిందని ఆరోపించింది. అనంతరం, అమెరికా చర్యకు ప్రతిస్పందనగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, ఇతర అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ దాడుల వల్ల ఎంత మేర నష్టం జరిగిందనే విషయంపై అమెరికా ఇప్పటివరకు పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే తమ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది.ఈ పరిణామాలతో గత వారం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం హార్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతను కాపాడడం, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ జలసంధి గుండా రోజూ లక్షల బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతుంది. అందువల్ల అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు, ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. -
మళ్లీ తీవ్ర కలకలం.. ఇరాన్పై అమెరికా భీకరదాడులు
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలైంది. ఇరాన్కు చెందిన క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీరప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా బలగాలు దాడులు చేసి, వాటిని బూడిద చేశాయి. దీంతో ఇప్పటికే అమల్లో ఉన్న సున్నితమైన కాల్పుల విరమణ ఒప్పందానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, హార్మూజ్లో ఓ సరుకు రవాణా నౌకపై డ్రోన్ దాడి జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డ కొన్ని గంటలకే యూఎస్ సేనలు టెహ్రాన్పై దాడులు చేయడం గమనార్హం. రెండు రోజుల క్రితం ఒమన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై మిసైల్ దాడి జరిగినట్లు బ్రిటిష్ సైన్యం కూడా పేర్కొంది. అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం.. వాణిజ్య నౌకలపై ఇరాన్ బలగాలు అనవసరంగా దాడి చేశాయి. దానికి ప్రతిస్పందనగానే ఇరాన్పై అమెరికా దాడులు చేసింది.అమెరికా ఏమంది? క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీరప్రాంత రాడార్ కేంద్రాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ దాడులను డ్రోన్ దాడికి "బలమైన ప్రతిస్పందన"గా అభివర్ణించింది. ఇరాన్ ప్రమాదకర ప్రవర్తన వల్ల కీలక అంతర్జాతీయ వాణిజ్య మార్గంలో నౌకల రాకపోకల స్వేచ్ఛ దెబ్బతింటోందని పేర్కొంది. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం సహకారాన్ని కొనసాగిస్తుందని తెలిపింది. ఇరాన్ ఏమంది? ఈ దాడులకు అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా కారణమని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆరోపించింది. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ ఓడరేవు నగరం తహెరూయెహ్ పియర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఆ ప్రాంతంలో క్షిపణి తాకడంతోనే పేలుడు జరిగిందని తెలిపింది.అమెరికా-ఇరాన్ యుద్ధం ఫిబ్రవరి 28న మొదలైంది. యుద్ధానికి తుది పరిష్కారం దిశగా అమెరికా, ఇరాన్ చర్చలు జరుపుతున్న వేళ హార్మూజ్ జలసంధి తెరిచి ఉంచేలా జరుగుతున్న ప్రయత్నాలపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ఇరాన్ యుద్ధంలో బాంబులు పేలుతుంటే.. వీరిపై రూ.కోట్ల వర్షం
యుద్ధం అంటే ప్రాణనష్టం, ఆస్తినష్టం, దేశాల మధ్య ఉద్రిక్తత మాత్రమే అనుకుంటాం. కానీ ప్రతి యుద్ధం వెనుక మరో ఆర్థిక కోణం కూడా ఉంటుంది. ఒకవైపు ప్రజలు కష్టాలు పడుతుంటే, మరోవైపు కొన్ని రంగాలు మాత్రం భారీగా లాభపడతాయి. ఇరాన్-అమెరికా యుద్ధం కూడా అలాంటి పరిస్థితినే తీసుకొచ్చింది. ఈ యుద్ధం వల్ల అసలు ఎవరు ఎక్కువ లాభం పొందారు? ఎవరు నష్టపోయారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇరాన్-అమెరికా యుద్ధం కేవలం రణరంగానికే పరిమితం కాలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా భారీ ప్రభావం చూపింది. యుద్ధం తొలి నాలుగు రోజుల్లోనే అమెరికా నేతృత్వంలోని కూటమి 5,000కు పైగా ఆయుధాలు వినియోగించింది. మొత్తం యుద్ధ వ్యయం 35-40 బిలియన్ డాలర్ల వరకు చేరి ఉండొచ్చని అంచనా.యుద్ధం వల్ల లాభం పొందినవారుఆయుధాల తయారీ సంస్థలుటోమాహాక్ క్షిపణులు, పెట్రియట్ క్షిపణుల తయారీ కంపెనీలుద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) ఎగుమతి సంస్థలుముడి చమురు వ్యాపార సంస్థలుయుద్ధ పరిణామాలపై పందేలు కాసిన కొందరు పెట్టుబడిదారులుమరోవైపు రష్యా, చైనా దేశాలు కూడా భౌగోళిక రాజకీయాల పరంగా ప్రయోజనాలు పొందాయి. అయితే యుద్ధ భారం మాత్రం సాధారణ ప్రజలపై పడింది. ఇంధన ధరల పెరుగుదలతో పేద దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.ఇలా కాల్పుల మోతలో కాసుల వర్షం..! యుద్ధంలో టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను పెద్ద ఎత్తున ప్రయోగించారు. దీంతో వాటి తయారీ సంస్థలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక్కో టోమాహాక్ క్షిపణి ధర లక్షల డాలర్లలో ఉండటంతో ఆయుధ పరిశ్రమకు భారీ ఆదాయం లభించింది. పెరిగిన డిమాండ్ వల్ల తయారీ సమయం కూడా 2 నుంచి 3 సంవత్సరాల వరకు పెరిగింది.ఇరాన్ తక్కువ ధర కలిగిన షాహెద్ డ్రోన్లను వినియోగించగా, వాటిని కూల్చేందుకు అమెరికా అత్యంత ఖరీదైన పెట్రియట్ ఇంటర్సెప్టర్ క్షిపణులను ప్రయోగించింది. తక్కువ ఖర్చుతో దాడులు చేసిన ఇరాన్కు ఎదురుగా అమెరికా అత్యధిక వ్యయం చేయాల్సి వచ్చిన పరిస్థితి కనిపించింది.యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయుధ తయారీ సంస్థల అమ్మకాలు, ఆర్డర్లు, వాటాల విలువలు వేగంగా పెరిగాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీకి చెందిన ప్రముఖ రక్షణ సంస్థలు ఈ పరిణామాలతో భారీ లాభాలు పొందాయి.హార్మూజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ ద్రవీకృత సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితి అమెరికా గ్యాస్ ఎగుమతి సంస్థలకు అనుకూలంగా మారింది. ప్రపంచ మార్కెట్లో ధరలు పెరగడంతో అమెరికా నుంచి గ్యాస్ ఎగుమతి చేసే సంస్థలు భారీ ఆదాయాన్ని నమోదు చేశాయి.ముడి చమురు ధరలు కూడా యుద్ధ ప్రభావంతో ఒక్కసారిగా పెరిగాయి. దీంతో చమురు వ్యాపార సంస్థలు, వ్యాపారులు అధిక లాభాలు ఆర్జించారు. కొంతమంది సంస్థలకు యుద్ధం వల్ల కార్యకలాపాల్లో ఆటంకాలు ఎదురైనా, పెరిగిన ధరల కారణంగా గత ఎన్నో సంవత్సరాల్లో లేనంత లాభాలు నమోదయ్యాయి.యుద్ధం సమయంలో అమెరికా గల్ఫ్ దేశాలకు భారీ విలువైన ఆయుధాల విక్రయాలకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో రక్షణ వ్యయాన్ని మరింత పెంచే ప్రణాళికలూ ప్రకటించింది. ఈ వ్యయ భారం చివరకు అమెరికా పన్ను చెల్లింపుదారులపై పడే అవకాశం ఉంది.ఈ యుద్ధంలో మరో ఆసక్తికర అంశంగా ప్రిడిక్షన్ మార్కెట్. యుద్ధం, కాల్పుల విరమణ వంటి పరిణామాలపై ముందుగానే పందేలు కాసి కొందరు కోట్ల డాలర్ల లాభాలు పొందినట్లు పరిశోధనలో వెల్లడైంది. దీనిపై అమెరికా సెనెట్ దర్యాప్తునకు ఆదేశించింది.మొత్తంగా చూస్తే ఈ యుద్ధంలో అత్యధిక లాభం ఆయుధ తయారీ సంస్థలు, గ్యాస్ ఎగుమతిదారులు, చమురు వ్యాపారులు పొందారు. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాల ప్రజలు అధిక గ్యాస్ ధరల భారం భరించాల్సి వచ్చింది. తక్కువ ధర డ్రోన్లను అడ్డుకునేందుకు ఖరీదైన క్షిపణులు కొనుగోలు చేస్తున్న దేశాలపై కూడా తీవ్ర ఆర్థిక ఒత్తిడి పడింది. -
నాటో చీఫ్కు మెలోనీ స్ట్రాంగ్ వార్నింగ్..
రోమ్: నాటో చీఫ్ మార్క్ రుట్టే చేసిన వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్రంగా ఖండించారు. ఇరాన్పై అమెరికా చేపట్టిన సైనిక చర్యలో ఇటలీ కూడా భాగస్వామి అయిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని మండిపడ్డారు ఇరాన్పై జరిగిన యుద్ధంలో ఇటలీ ప్రత్యక్షంగా పాల్గొనలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితిని తప్పుగా ప్రతిబింబిస్తున్నాయని ఆమె హెచ్చరిస్తూ కౌంటరిచ్చారు.ఫ్రాన్స్–ఇటలీ ద్వైపాక్షిక సదస్సు అనంతరం మీడియాతో మాట్లాడిన మెలోనీ..‘నాటో ప్రధాన కార్యదర్శ మార్క్ రుట్టే చాలా ఉత్సాహంగా వివరణ ఇచ్చే క్రమంలో వేర్వేరు అంశాలను ఒకటిగా కలిపేశారు. ఇటలీ అనుమతించిన విమానాల స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మేం ఇరాన్పై జరిగిన సైనిక దాడుల్లో పాల్గొనలేద’ అని స్పష్టం చేశారు. అయితే, ఈ వివాదానికి కారణమైన వ్యాఖ్యలు ఇటీవల మార్క్ రుట్టే అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వచ్చాయి.అమెరికా ఇరాన్పై చేపట్టిన "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" సందర్భంగా యూరప్లోని అమెరికా స్థావరాల నుంచి వేలాది విమానాలు ఎగిరాయని, అందులో ఇటలీలోని అమెరికా సైనిక స్థావరాల నుంచి కూడా వందలాది విమానాలు బయలుదేరాయని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇటలీ ప్రత్యక్షంగా యుద్ధానికి సహకరించిందనే అభిప్రాయం ఏర్పడింది. అయితే ఇటలీ ప్రభుత్వం దీనిని వెంటనే ఖండించింది. తమ భూభాగంలోని అమెరికా సైనిక స్థావరాల నుంచి కేవలం సాంకేతిక, లాజిస్టిక్, నిర్వహణ సంబంధిత విమానాలకే అనుమతి ఇచ్చామని, యుద్ధ కార్యకలాపాలు, దాడులు లేదా ఆయుధ మద్దతుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇటలీ రాజ్యాంగం, అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలో మాత్రమే వ్యవహరించామని తెలిపింది.మరోవైపు.. ఈ వివాదంపై ఇటలీ విదేశాంగ మంత్రి అంటోనియో తజానీ కూడా స్పందిస్తూ.. రుట్టే వ్యాఖ్యలను అతిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. నాటో చీఫ్ ఉద్దేశం లాజిస్టిక్ సహకారం గురించేనని, ఇటలీ యుద్ధంలో పాల్గొన్నట్లు చెప్పడం సరైంది కాదని పేర్కొన్నారు. ఇక, ఈ వివాదం ఇటలీ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం అసలు నిజాలు చెప్పిందా? లేదా అనే అంశంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, మెలోనీ ప్రభుత్వం మాత్రం ఇరాన్ యుద్ధంలో ఇటలీకి ప్రత్యక్ష పాత్ర లేదనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. -
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం భారీ ఊరట
దేశంలోని బల్క్, కమర్షియల్ ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా వాణిజ్య గ్యాస్ సరఫరాపై విధించిన అన్ని రకాల తాత్కాలిక ఆంక్షలను కేంద్రం తక్షణమే ఎత్తివేసింది.ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ ఆసియా సంక్షోభానికి ముందు దేశంలో ఏ స్థాయిలో సరఫరా ఉండేదో, ఆ పాత నిబంధనలనే పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ ద్వారా స్పష్టం చేశారు. బల్క్ గ్యాస్ సరఫరా 50 శాతానికి పెంపు ప్యాక్డ్ సిలిండర్లతో పాటు, సంక్షోభం ప్రారంభమైన సమయంలో పూర్తిగా నిలిపివేసిన ‘బల్క్ ఎల్పీజీ’ సరఫరాపై కూడా కేంద్రం సడలింపులు ఇచ్చింది.పాత వినియోగంతో పోలిస్తే పరిశ్రమలకు 50 శాతం మేర బల్క్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని చమురు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, స్టీల్ వంటి భారీ ఇంధన ఆధారిత పరిశ్రమలకు గ్యాస్ కొరత తీరనుంది. -
ఇప్పుడు హార్మూజ్ పరిస్థితి ఏంటి? ఇంధన రవాణా కొనసాగుతోందా?
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్ల దృష్టి అంతా హార్మూజ్ జలసంధిపైనే నిలిచింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ సముద్ర మార్గం భవిష్యత్తుపై ఇటీవల అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం హార్మూజ్ జలసంధి పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి ఇంధన రవాణా కొనసాగుతోందా? ప్రపంచ మార్కెట్లకు ఊరటనిచ్చేలా అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ వివరాలు తెలిపారు. హార్మూజ్ జలసంధి మీదుగా చమురు రవాణా జరగడం భారత్కు కూడా చాలా ముఖ్యం. గత 24 గంటల్లో హార్మూజ్ జలసంధి నుంచి 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు బయటకు వెళ్లిందని క్రిస్ రైట్ తెలిపారు. హార్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా ఘర్షణలకు ముందు ఉన్న స్థాయికి ఎక్కువగా చేరుకుందని, నౌకాదళ రక్షణతో ట్యాంకర్ రాకపోకలు క్రమంగా పునరుద్ధరణ అవుతున్నాయని క్రిస్ రైట్ తెలిపారు.ఇరాన్-ఇజ్రాయెల్/అమెరికా ఉద్రిక్తతలు, ఘర్షణల కారణంగా హార్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా కొంతకాలం తగ్గిపోయింది. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడటంతో, యుద్ధానికి ముందు ఎంత మేరకు చమురు ట్యాంకర్లు ప్రయాణించేవో దాదాపు అదే స్థాయికి మళ్లీ చేరుతున్నాయని క్రిస్ రైట్ చెప్పారు. నౌకాదళ భద్రత ఉండటంతో ట్యాంకర్ రాకపోకలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని తెలిపారు.72 నౌకలు.. 20 మిలియన్ బ్యారెళ్ల చమురు న్యూయార్క్లో జరిగిన రాయిటర్స్ గ్లోబల్ ఎనర్జీ ఫోరంలో క్రిస్ రైట్ మాట్లాడుతూ.. గత 24 గంటల్లో సుమారు 72 నౌకల ద్వారా 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఈ జలమార్గం గుండా తరలించారని చెప్పారు. ఈ పరిమాణం ప్రపంచ రోజువారీ చమురు వినియోగంలో దాదాపు ఐదో వంతుకు సమానం. రైట్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ ముడి చమురు ఎగుమతులు ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతున్నాయి. హార్మూజ్ జలసంధిని మూసివేసే సామర్థ్యం ఇప్పుడు ఇరాన్కు లేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ బెదిరింపును చాలా కాలంగా టెహ్రాన్ అత్యంత కీలక వ్యూహాత్మక సాధనంగా భావిస్తూ వచ్చింది.“జలసంధిపై ఇరాన్ ఒకప్పుడు ఉన్న ప్రభావం క్రమంగా తగ్గుతోంది” అని రైట్ అన్నారు. ఘర్షణ సమయంలో ఆ దేశ సైనిక సామర్థ్యాలు చాలా బలహీనపడ్డాయని చెప్పారు. నౌకా రవాణా మెరుగుపడటంతో ప్రపంచ చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. సరఫరా అంతరాయాలపై భయాలు తగ్గడంతో బుధవారం ప్రామాణిక ముడి చమురు ఫ్యూచర్స్ ధర బ్యారెల్కు $3 కంటే ఎక్కువగా పడిపోయింది. ఫిబ్రవరిలో ఇరాన్ ఘర్షణ ప్రారంభానికి ముందు ఉన్న కనిష్ఠ స్థాయికి చేరింది.వెనిజులాలో చమురు ఉత్పత్తి పెరుగుతున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది ప్రారంభంలో మాజీ అధ్యక్షుడు నికోలాస్ మదురో తొలగింపు తర్వాత అమెరికా పరిపాలనలో ఆ దక్షిణ అమెరికా దేశం నుంచి ఎగుమతులు పెరిగాయని చెప్పారు.ప్రస్తుత స్థాయితో పోలిస్తే వెనిజులా చమురు ఉత్పత్తి రెట్టింపు అయ్యే అవకాశం ఉందని రైట్ తెలిపారు. 2029లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగిసేలోపు రోజుకు సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల స్థాయికి చేరవచ్చని చెప్పారు. -
నయా పైసా చెల్లించలేదు.. రెచ్చిపోయిన ట్రంప్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ పరిహారం కింద ఇరాన్కు ఇప్పటి వరకూ తామూ నయాపైసా కూడా చెల్లించలేదని తెలిపారు. అదేవిధంగా హర్ముజ్లో ఎలాంటి టోల్ విధించబోమని ఇరాన్ ఇదివరకే తమకు స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. ఒకవేళ ఇరాన్ ఇచ్చిన ఈ సమాచారం అబద్ధమని తేలితే, ఆ దేశంతో జరుగుతున్న శాంతి చర్చలను తక్షణమే నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు.అయితే, ఇరాన్లో ఆహార కొరత తీవ్రంగా ఉన్నందున, వారి నిధులను పూర్తిగా అమెరికా నియంత్రణలోనే ఉంచి కేవలం అమెరికా రైతులకు సంబంధించిన మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్స్ వంటి ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి మాత్రమే వాటిని వాడేలా అనుమతిస్తామని వెల్లడించారు.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వేగంగా తగ్గుతున్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్ బంకుల్లో ధరలను తగ్గించకుండా వినియోగదారులను దోచుకుంటున్నారనే ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై వెంటనే దర్యాప్తు చేయాలని అమెరికా న్యాయశాఖను కోరినట్లు పేర్కొన్నారు. కాగా ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య 60 రోజుల మధ్యంతర ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా మరోసారి కలకలం రేపుతున్నాయి.కాగా గత సోమవారం స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల మధ్య 60 రోజుల మధ్యంతర ఒప్పందం కుదిరింది. ఒప్పందం షరతుల్లో భాగంగా ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా ఆర్థిక శాఖ ప్రకటించింది. దీని ప్రకారం ఇరాన్ చమురు ఉత్పత్తి, సరఫరా, విక్రయాలకు ఇకపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. ఈ వెసులుబాటు ఆగస్ట్ 21వ తేదీ వరకు అమల్లో ఉంటుందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. -
ఇరాన్కు వెళ్లొద్దు.. భారత ప్రభుత్వం అడ్వైజరీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్కు సంబంధించిన ప్రయాణ హెచ్చరికలను భారత ప్రభుత్వం మరోసారి సవరించింది. ప్రస్తుతం ఇరాన్లో భద్రతా పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ, భారతీయులు అత్యవసరం కాని ప్రయాణాలను మానుకోవాలని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన తాజా ట్రావెల్ అడ్వైజరీలో ఇరాన్లో పరిస్థితులు గతంతో పోలిస్తే కొంత స్థిరపడుతున్నాయని పేర్కొంది. అయినప్పటికీ భద్రతా పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదని, ఎలాంటి ఆకస్మిక పరిణామాలనైనా తోసిపుచ్చలేమని హెచ్చరించింది. ఇరాన్లోని భద్రతా పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాం. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు అత్యవసర ప్రయాణాలు చేయవద్దు. అందువల్ల భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరిగిన ఘర్షణలు, వైమానిక దాడులు, క్షిపణి దాడులు పశ్చిమాసియా ప్రాంతాన్ని తీవ్ర ఉద్రిక్తతల్లోకి నెట్టాయి. ఈ పరిస్థితుల్లో జూన్ 8న భారత ప్రభుత్వం అత్యవసర సూచనలు జారీ చేస్తూ భారతీయులు ఇరాన్కు వెళ్లవద్దని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా దేశం విడిచి రావాలని సూచించింది. అయితే తాజా సమీక్షలో పరిస్థితులు కొంత మెరుగుపడినట్లు గుర్తించిన భారత రాయబార కార్యాలయం, గత హెచ్చరికలను పూర్తిగా ఎత్తివేయకుండా జాగ్రత్తతో కూడిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. Advisory issued by Indian Embassy in Tehran:Embassy of India, Tehran, has been closely monitoring the prevailing security situation in the Islamic Republic of Iran. In light of recent positive developments and the improvement in the overall situation, the Embassy wishes to… pic.twitter.com/XkBnyyw8Uq— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 24, 2026ఇరాన్లో ప్రస్తుతం నివసిస్తున్న భారతీయులు స్థానిక భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని, రాయబార కార్యాలయంతో నిరంతర సంబంధాలు కొనసాగించాలని కోరింది. అత్యవసర సహాయం కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. కాగా, ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు మరియు ఇతర పౌరుల భద్రతపై భారత ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతోందని అధికారులు తెలిపారు. పరిస్థితుల్లో ఏవైనా మార్పులు చోటుచేసుకుంటే వెంటనే కొత్త సూచనలు జారీ చేస్తామని వెల్లడించారు. -
ట్రంప్నకు భారీ షాక్ ఇచ్చిన అమెరికా సెనేట్
వాషింగ్టన్ డీసీ: ఇరాన్తో జరుగుతున్న ఘర్షణ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక బలగాలను వెనక్కి తీసుకురావాలని ఆదేశించే తీర్మానాన్ని అమెరికా సెనేట్ ఆమోదించింది. ప్రభుత్వ సైనిక అధికారాలపై రెండు ప్రధాన పార్టీలు కలిసి అభ్యంతరం చెప్పిన అరుదైన ఘటనగా ఇది నిలిచింది. అలాగే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనను కాంగ్రెస్ వ్యక్తం చేసింది. ఈ తీర్మానం 50-48 ఓట్లతో ఆమోదం పొందింది. రిపబ్లికన్ సెనేటర్లు రాండ్ పాల్, సూసన్ కాలిన్స్, లిసా మర్కోవ్స్కీ, బిల్ క్యాసిడీ డెమొక్రాట్లకు మద్దతుగా ఓటు వేశారు. డెమొక్రటిక్ సెనేటర్ జాన్ ఫెటర్మన్ ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇంతకుముందు ఇలాంటి యుద్ధ అధికారాల తీర్మానాలకు వ్యతిరేకంగా ఉన్న రిపబ్లికన్ సెనేటర్లు మిచ్ మెక్కానెల్, డేవ్ మెక్కార్మిక్ ఈ ఓటింగ్కు దూరంగా ఉండటం వల్ల ఈ తీర్మానం ఆమోదం పొందింది.కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇరాన్పై సైనిక చర్య చేపట్టే అధ్యక్షుడి అధికారాన్ని పరిమితం చేయాలని డెమొక్రట్లు చేస్తున్న ప్రయత్నాల మధ్య ఈ ఓటింగ్ జరిగింది. ఇటీవలి వారాల్లో కొందరు రిపబ్లికన్లు కూడా ఈ ప్రయత్నాలకు క్రమంగా మద్దతు పెంచారు. ఈ తీర్మానం ఇంతకుముందు అమెరికా ప్రతినిధుల సభలోనూ 215-208 ఓట్లతో ఆమోదం పొందింది. నలుగురు రిపబ్లికన్లు డెమొక్రట్లతో కలిసి అనుకూలంగా ఓటు వేశారు.ఆ ఓటింగ్ తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్లో చట్టసభ సభ్యులపై విమర్శలు చేశారు. వారిని "గ్రాండ్స్టాండర్స్" అని పేర్కొంటూ, వారి చర్యలను "దేశభక్తికి విరుద్ధం" అని అన్నారు. రెండు సభల్లోనూ ఈ తీర్మానం ఆమోదం పొందినా, ఇది ఉమ్మడి తీర్మానం మాత్రమే. అందువల్ల అధ్యక్షుడి సంతకం అవసరం లేదు. దీనికి చట్టబద్ధ అమలు పవర్ కూడా లేదు. సెనేట్ ఓటింగ్పై స్పందించిన శ్వేతసౌధ అధికారి ఈ తీర్మాన ప్రాధాన్యాన్ని తగ్గించి చూపించారు."ఉమ్మడి తీర్మానాలు అధ్యక్షుడి వద్దకు వెళ్లవు. వాటికి చట్టబద్ధ అమలు శక్తి లేదు" అని ఆ అధికారి తెలిపారు. ఈ తీర్మానం ఎక్కువగా ప్రతీకాత్మకమేనని, కొందరు రిపబ్లికన్ సెనేటర్లు గైర్హాజరు కావటం వల్లే ఇది ఆమోదం పొందిందని కూడా ఆయన అన్నారు.శ్వేతసౌధం ఏమంటోంది? ఈ తీర్మానం అధ్యక్షుడు అమెరికా సాయుధ బలగాలను ఇరాన్పై జరుగుతున్న శత్రుత్వ చర్యల నుంచి వెనక్కి తీసుకురావాలని ఆదేశిస్తోంది. అయితే, అమెరికా సైన్యాన్ని వెనక్కి తీసుకురావాల్సిన అవసరం లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. "ఏప్రిల్ 7న కాల్పుల విరమణతో శత్రుత్వ చర్యలు ముగిశాయి. అందువల్ల అమెరికా బలగాలను వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి లేదు" అని అక్కడి మీడియా తెలిపింది. ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకువచ్చిన డెమొక్రటిక్ సహాయకుడు ఈ అభిప్రాయాన్ని ఖండించారు. ఈ తీర్మానం అమల్లో ఉంటుందని, దీని ప్రభావంపై విభేదాలు వస్తే అది న్యాయపరమైన అంశంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు.ఈ ఏడాది ఆరంభం నుంచి ఇరాన్కు సంబంధించిన యుద్ధ అధికారాలపై సెనేట్ ఇప్పటికే 10 సార్లు ఓటింగ్ నిర్వహించింది. గత నెలలో సెనేట్ మద్దతు పొందిన మరో ప్రతిపాదన ముందుకు వెళ్లినా, తుది ఓటింగ్ ఇంకా జరగలేదు. ఆమోదానికి అవసరమైన మద్దతు సమకూర్చేందుకు డెమొక్రటిక్ చట్టసభ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.అమెరికా, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతున్నా, భవిష్యత్తులో ఇరాన్కు సంబంధించిన ఏ సైనిక చర్య జరిగినా కాంగ్రెస్ పర్యవేక్షణ ఉండాలని కొందరు డెమొక్రటిక్ సెనేటర్లు పట్టుబడుతున్నారు. ఈ తీర్మానం యుద్ధ అధికారాల సమతుల్యతపై అమెరికా కాంగ్రెస్, అధ్యక్షుడి మధ్య వాషింగ్టన్లో కొనసాగుతున్న చర్చకు ప్రతిబింబంగా నిలిచింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో అమెరికా సైనిక ప్రమేయంపై ఈ చర్చ సాగుతోంది. -
అణ్వాయుధాలపై కీలక నిర్ణయం.. జేడీ వాన్స్
జెనీవా: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. అణు కార్యక్రమంపై జరుగుతున్న చర్చల్లో భాగంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) నుండి పరిశీలకులను ఆహ్వానించడానికి ఇరాన్ అంగీకరించిందని తెలిపారు. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయని పేర్కొన్నారు.స్విట్జర్లాండ్లో బర్గెన్స్టాక్ రిసార్ట్ వేదికగా నిన్న అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగిన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ భేటీపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ " చర్చల్లో చాలా మంచి పురోగతి లభించింది. అంతకుముందు రోజు జరిగిన చర్చలు కూడా చాలా సానుకూలంగా సాగాయి. అణు తనిఖీల కోసం ఇన్స్పెక్టర్లను ఆహ్వానించడానికి ఇరాన్ అంగీకరించింది. అణు పరిశీలకులతో చర్చలు శుక్రవారం నుంచే ప్రారంభం అయ్యే అవకాశంఉంది. ఇరుపక్షాల సాంకేతిక బృందాలు తమ పనిని కొనసాగిస్తాయి " అని వాన్స్ అన్నారు.ప్రస్తుతం హర్ముజ్ జలసంధి తెరిచే ఉందని ఈ కీలకమైన రవాణా మార్గం నిరంతరం అందుబాటులో ఉండేలా చూసేందుకు చర్చల ప్రతినిధులు ఒకప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. హిజ్బుల్లా ఇజ్రాయెల్పై కాల్పులు ఆపాలని అమెరికా కోరుకుంటోందన్నారు. అదే విధంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించే లక్ష్యంతో లెబనాన్ కోసం ఒక ఘర్షణ నివారణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని వాన్స్ అన్నారు.ఇరాన్తో చర్చలు జరుగుతున్న సమయంలో అమెరికా,ఇజ్రాయెల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపిందని వాన్స్ అన్నారు. అలాగే, వాషింగ్టన్ ఈ ప్రాంతంలోని దేశాలపై ఎలాంటి ఒప్పందాన్ని రుద్దడం లేదని ఆయన నొక్కి చెప్పారు. ఒకవేళ దౌత్యం విఫలమైతే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇంకా చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయని వాన్స్ పరోక్షంగా ఇరాన్ను హెచ్చరించారు. -
అమెరికాకు భారీ షాక్.. ట్రంప్కు కోలుకోలేని దెబ్బ!
యుద్ధాలు కేవలం యుద్ధభూములకే పరిమితం కావు. అవి దేశాల ఆర్థిక వ్యవస్థలను, ప్రజల జీవన ప్రమాణాలను, అంతర్జాతీయ మార్కెట్లను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దీనికి తాజా ఉదాహరణ అమెరికా-ఇరాన్ ఘర్షణ. కేవలం కొన్ని వారాల పాటు సాగిన ఈ యుద్ధం అమెరికాకు ఇప్పటికే 132 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11 లక్షల కోట్లకు పైగా) ఆర్థిక భారం మోపినట్లు ప్రముఖ ఆర్థిక సంస్థ మూడీస్ అనలిస్టిక్స్ ‘Moody’s Analytics’ అంచనా వేసింది. అయితే ఇది కేవలం అమెరికా నష్టమే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ మిలీషియా గ్రూపులకు మద్దతు, ఇజ్రాయెల్ భద్రత వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. పరిస్థితి మరింత దిగజారడంతో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్కు చెందిన వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు ప్రారంభించాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణి దాడులు, ప్రాంతీయ సైనిక చర్యలతో స్పందించింది. యుద్ధం పూర్తిస్థాయి ప్రాంతీయ సంక్షోభంగా మారుతుందేమోనన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమైంది. ముఖ్యంగా చమురు సరఫరాకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం ప్రపంచ మార్కెట్లను వణికించింది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ..ప్రపంచ చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు హార్మూజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయవచ్చనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లకు పైగా చేరుకునే పరిస్థితి ఏర్పడింది. చమురు ధరలు పెరగడం అంటే కేవలం పెట్రోల్, డీజిల్ ఖరీదు పెరగడమే కాదు. విమాన ప్రయాణాలు, సరుకు రవాణా, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల ఖర్చులు, ఆహార ధరలు ఇలా ప్రతి రంగంపైనా ప్రభావం పడింది. అందుకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఒత్తిడిలోకి వెళ్లింది.అమెరికాపై ఎఫెక్ట్ ఎలా?Moody’s Analytics లెక్కల ప్రకారం యుద్ధం వల్ల అమెరికాలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. గ్యాలన్ పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో కుటుంబాల నెలవారీ ఖర్చులు పెరిగిపోయాయి. ట్రక్కింగ్, విమానయాన, తయారీ రంగాలపై అదనపు భారం పడింది. ఫలితంగా వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ఇలా ప్రతి అమెరికా కుటుంబం సగటున వందల డాలర్ల అదనపు ఖర్చును భరించాల్సి వచ్చినట్లు అంచనా. మరోవైపు ప్రభుత్వం సైనిక చర్యలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, నౌకాదళ మోహరింపు, మధ్యప్రాచ్యంలోని సైనిక స్థావరాల నిర్వహణ కోసం భారీ మొత్తాలను ఖర్చు చేసింది. మరోవైపు.. అమెరికా ఇప్పటికే 40 ట్రిలియన్ డాలర్లకు చేరువలో ఉన్న జాతీయ రుణంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో మరో భారీ సైనిక ఘర్షణ ఫెడరల్ బడ్జెట్పై అదనపు ఒత్తిడిని పెంచిందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, అమెరికాలో పెట్రోల్ ధరలు పెరగడం రాజకీయంగా కూడా పెద్ద అంశం. సాధారణంగా గ్యాస్ ధరలు పెరిగితే అధికార ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. అందుకే యుద్ధం ప్రభావం అమెరికా అంతర్గత రాజకీయాలపై కూడా పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.యుద్ధభూమిలోనే కాదు.. మార్కెట్లలో కూడా నష్టంఈ యుద్ధం ప్రభావం స్టాక్ మార్కెట్లపైనా పడింది. పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి వెనక్కి తగ్గడంతో ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకులు కనిపించాయి. బంగారం, డాలర్ వంటి సురక్షిత పెట్టుబడుల వైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపారు. యూరప్లో ఇప్పటికే మందగమనం ఎదుర్కొంటున్న పరిశ్రమలకు ఇంధన ఖర్చుల పెరుగుదల మరింత దెబ్బతీసింది. ఆసియా దేశాల్లో దిగుమతి ఖర్చులు పెరగడంతో ద్రవ్యోల్బణ ఒత్తిడి మళ్లీ పెరిగింది.భారత్పై ప్రభావం?భారత్ ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటి. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి భారత్కు ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. చమురు ధరలు పెరిగితే దిగుమతి బిల్లు పెరుగుతుంది. రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల పరిస్థితులు కొంత సద్దుమణగడంతో మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. అయినప్పటికీ జలసంధి ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగితే ప్రభావం భారత్పైనా గణనీయంగానే ఉండే అవకాశం ఉంది.యుద్ధం ముగిసినా..ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష ఘర్షణలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఆర్థిక ప్రభావం మాత్రం వెంటనే తగ్గే పరిస్థితి లేదు. చమురు సరఫరా గొలుసులు సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా కొన్ని నెలల పాటు కొనసాగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం ఈ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చి ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2 నుంచి 3.5 ట్రిలియన్ డాలర్ల వరకు నష్టం సంభవించే అవకాశం ఉండేదని అంచనా.కాగా, యుద్ధాలు గెలుపు-ఓటముల గురించి మాత్రమే కావు. వాటి అసలు ఖరీదు ఆర్థిక వ్యవస్థలు, సాధారణ ప్రజలు, ప్రపంచ మార్కెట్లు చెల్లిస్తాయి. అమెరికా-ఇరాన్ ఘర్షణ కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. యుద్ధం కొన్ని వారాల్లో ముగిసినా, దాని ఆర్థిక ప్రతిధ్వనులు మాత్రం నెలలు, సంవత్సరాల పాటు వినిపించే అవకాశముంది. మిసైళ్లు కొన్ని నిమిషాల్లో పేలిపోతాయి... కానీ వాటి ఆర్థిక ప్రభావం మాత్రం ఏళ్ల తరబడి దేశాలను వెంటాడుతుంది. అమెరికాకు 132 డాలర్ల బిలియన్ల బిల్లు, ప్రపంచానికి ట్రిలియన్ల డాలర్ల భయం మిగిల్చిన ఘర్షణగా ఈ యుద్ధం చరిత్రలో నిలిచిపోనుంది. -
హార్మూజ్పై ట్రంప్ కొత్త ఎత్తుగడ.. చమురు ప్రపంచానికి షాక్?
వాషింగ్టన్: మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా చల్లారకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం 60 రోజుల తర్వాత శాశ్వత ఒప్పందంగా మారకపోతే, ప్రపంచ ఇంధన సరఫరాలకు ప్రాణాధారంగా భావించే హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్లే నౌకలపై అమెరికా టోల్లు (రుసుములు) విధించే అవకాశాన్ని ఆయన ప్రస్తావించారు.ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికలో చేసిన పోస్టులో.. ప్రస్తుతం అమలులో ఉన్న 60 రోజుల కాల్పుల విరమణ (Ceasefire) సమయంలో ఎలాంటి టోల్లు ఉండవని స్పష్టం చేశారు. అయితే చర్చలు విఫలమై తుది ఒప్పందం కుదరకపోతే, మధ్యప్రాచ్య దేశాలకు అమెరికా ‘Guardian Angel’గా అందించిన భద్రతా సేవలకు ప్రతిఫలంగా అమెరికానే టోల్లు విధించవచ్చని పేర్కొన్నారు. గతం, వర్తమానం, భవిష్యత్తులో అందించిన భద్రతా సేవల ఖర్చులకు ఇది పరిహారం అని ఆయన వ్యాఖ్యానించారు.There will be NO TOLLS in the Hormuz Strait for 60 days during the Cease Fire Period, and there will be NO TOLLS after the 60 day period has expired, unless they are imposed by and for the United States of America, should the deal not be completed, for services rendered as the… pic.twitter.com/f2DtGeiLUf— Commentary Donald J. Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) June 20, 2026ఇరాన్ వాదన.. అమెరికా ఖండనఇదిలా ఉండగా, తాజాగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య లెబనాన్లో కొనసాగుతున్న ఘర్షణలు కాల్పుల విరమణకు విరుద్ధమని ఆరోపించింది. అయితే, అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ వాదనను ఖండించింది. జలసంధి తెరిచే ఉందని, ఒక్కరోజులోనే 55 వాణిజ్య నౌకలు 17 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురుతో ప్రయాణించాయని వెల్లడించింది.స్విట్జర్లాండ్లో కీలక చర్చలుఈ వివాదాల మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం, ఇరాన్ మహ్మద్ బాకిర్ క్వాలిబాఫ్ నేతృత్వంలోని ప్రతినిధులతో స్విట్జర్లాండ్లో కీలక చర్చలు జరుపుతోంది. ఈ చర్చల్లో అణు కార్యక్రమం, హార్మూజ్ భవిష్యత్ నిర్వహణ, ప్రాంతీయ భద్రత వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?ట్రంప్ తాజా వ్యాఖ్యలు కేవలం రాజకీయ హెచ్చరికలు మాత్రమే కావు. హార్మూజ్పై టోల్లు లేదా కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తే ప్రపంచ చమురు ధరలు, రవాణా వ్యయాలు, ఇంధన మార్కెట్లు తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం శాంతి చర్చల ఫలితాలపైనే ప్రపంచ ఇంధన మార్కెట్ల దృష్టి కేంద్రీకృతమైంది. ఇప్పుడు అందరి దృష్టి స్విట్జర్లాండ్లో జరుగుతున్న అమెరికా-ఇరాన్ చర్చలపైనే ఉంది. -
ఇరాన్ సంచలన ప్రకటన.. 'హర్ముజ్ క్లోజ్'
టెహ్రాన్: ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హర్ముజ్ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా శాంతి ఒప్పందం నియమాలను ఉల్లంఘించిందని అందుకే హర్ముజ్ను మూసివేస్తున్నట్లు తెలిపింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో తిరిగి హర్ముజ్ను మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే హర్ముజ్ మూసివేత తమ ప్రతిస్పందనలో కేవలం ఒక అడుగు మాత్రమేనని టెహ్రాన్ స్పష్టం చేసింది. కాగా ఇటీవలే 2026, జూన్ 17న అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఈ చారిత్రాత్మక శాంతి ఒప్పందం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్లోని వర్సల్స్ ప్యాలెస్లో, అలాగే ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ టెహ్రాన్లో ఈ మైత్రి ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో గత నాలుగు నెలలుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడం, నిలిచిపోయిన హార్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకల కోసం తిరిగి తెరవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.ఒప్పంద నిబంధనలు ఈ 14 సూత్రాల ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య 60 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పొడిగించారు. ఈ సమయంలో ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా ఆంక్షల ఎత్తివేతపై తుది చర్చలు జరపాలని నిర్ణయించారు. అయితే, ఈ ఒప్పందం జరిగిన మూడు రోజులకే ఈ రోజు (జూన్20న), ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు కొనసాగిస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇరాన్ హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
గ్రీన్ సిగ్నల్ : హోర్ముజ్ గుండా నౌకలు అలా వెళ్లవచ్చు!
పశ్చిమాసియాలో నెలకొన్ని ఉద్రిక్తతల వల్ల ఇరాన్ హార్మూజ్ జలసంధిమూసివేతతోఅంతర్జాతీయ చమురు సంక్షోభం ఏర్పడింది. అయితే ఈ విషయంలో అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత, తాజాగా సముద్ర సమాచార సంస్థ జాయింట్ మారిటైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (JMIC) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ రవాణాకు కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (హోర్ముజ్ జలసంధి)లోని దక్షిణ మార్గం గుండా నౌకలు పగలap రాత్రి తమ ట్రాన్స్పాండర్ సిగ్నల్స్ (AIS) ఆన్ చేసుకుని ప్రయాణించవచ్చని తెలిపింది. అంతకు ముందు అమెరికా సైన్యం నౌకలు తమ ట్రాన్స్పాండర్లను ఆపివేసి, డార్క్గా కేవలం రాత్రి వేళల్లోనే ప్రయాణించాలని సూచించిన సంగతి తెలిసిందే. JMIC తాజా ప్రకటన ప్రకారం ఇక నౌకలు తమ రేడార్లు, రన్నింగ్ లైట్లు, VHF రేడియో కమ్యూనికేషన్లను సాధారణంగా వాడుకుంటూ ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. అలాగే ఈ మార్గంలో వెళ్లే నౌకలు అమెరికా నావికాదళ విభాగానికి (NCAGS) సమాచారం అందించడం తప్పనిసరి కాదు, కానీ సంప్రదిస్తే మంచిదని సూచించింది.ఇదీ చదవండి: చైనాకు కౌంటర్ : రూ. 1.5 లక్షల కోట్ల భారత్ సియాంగ్ ప్రాజెక్ట్భద్రతా హెచ్చరికలుఈ జలసంధిలో మైన్లు (Mines) ఉండే అవకాశం ఉందని, వాటిని తొలగించే ప్రక్రియలు జరుగుతున్నాయని, అందువల్ల నౌకలు జాగ్రత్తగా ఉండాలని JMIC హెచ్చరించింది. అయితే దక్షిణమార్గంలో మైన్లు లేవని అమెరికా నావికాదళం గతంలోనే ప్రకటించింది.కాగా ఫిబ్రవరి చివరిలో యుద్ధం ప్రారంభమైన తరువాత ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ, హోర్ముజ్ జలసంధిగుండా వెళ్లే నౌకలు తమ అనుమతి తీసుకోవాలని ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. ఇది భవిష్యత్తులో టోల్ వసూళ్లపై వివాదానికి దారి తీయ వచ్చనే ఆందోళన నెలకొంది. ఇదీ చదవండి: ఐదేళ్లు లివిన్, ఇపుడు రేప్ అంటే? కేసు కొట్టేసిన హైకోర్టు60 రోజుల వ్యవధిలో అవగాహన ఒప్పందంలోని వివాదాస్పద వివరాలను అమెరికా, ఇరాన్లు పరిష్కరించు కోగలవా అనే దానిపై కూడా సందేహాలు తలెత్తాయి. దీనికి తోడు తదుపరి చర్చల కోసం స్విట్జర్లాండ్లో జరగాల్సిన సమావేశం రద్దవ్వడం, వాషింగ్టన్ హెచ్చరికలను లెక్కచేయకుండా ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్పై దాడి చేయడం వంటి పరిణామాలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. హోర్ముజ్ ప్రాంతంలో భద్రతా ముప్పు స్థాయిని 'మితమైనది'గా JMIC ప్రస్తుతం అంచనా వేస్తోంది. ఒప్పందం కుదరడానికి ముందున్న 'గణనీయమైన' స్థాయితో పోలిస్తే ఇది మెరుగైనదే.ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరం -
అమెరికా లేకుంటే.. ఇజ్రాయెల్ పరిస్థితి ఇదేనా?
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్-ఇజ్రాయెల్ విభేదాలు, హెజ్బొల్లా-హమాస్ ముప్పుల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇరాన్తో అమెరికా అవగాహన ప్రయత్నాలను ఇజ్రాయెల్ విమర్శిస్తున్న వేళ.. ఇజ్రాయెల్కు మిగిలిన ఏకైక శక్తివంతమైన మిత్రదేశం అమెరికానే అని వాన్స్ వ్యాఖ్యానించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రశ్న మరోసారి చర్చనీయాంశంగా మారింది. అమెరికా మద్దతు లేకుండా ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోగలదా?. రక్షణ నిపుణులు, వ్యూహాత్మక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దీనికి సరళమైన సమాధానం లేదు. స్వల్పకాలిక యుద్ధాలు, పరిమిత దాడులను ఇజ్రాయెల్ స్వయంగా ఎదుర్కోగలిగినా, దీర్ఘకాలిక ప్రాంతీయ యుద్ధంలో అమెరికా సహకారం కీలకంగా మారుతుందని వారు చెబుతున్నారు.అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఒకటిఇజ్రాయెల్ భౌగోళికంగా చిన్న దేశమే అయినప్పటికీ, సైనిక పరంగా అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశంలో తప్పనిసరి సైనిక సేవా విధానం ఉండటంతో భారీ స్థాయిలో శిక్షణ పొందిన రిజర్వ్ బలగాలు అందుబాటులో ఉంటాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాల వద్ద అత్యాధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు, సైబర్ యుద్ధ సామర్థ్యాలు, అత్యున్నత నిఘా సాంకేతికత ఉన్నాయి. అలాగే మోసాద్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన భద్రతా సంస్థలుగా గుర్తింపు పొందాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రక్షణ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, సాధారణ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ తన సరిహద్దులను రక్షించుకోవడానికి అవసరమైన సామర్థ్యాన్ని పూర్తిగా కలిగి ఉంది.అమెరికా ఎందుకు ముఖ్యమైంది?ఇజ్రాయెల్ బలమైన దేశమే అయినప్పటికీ, అమెరికాతో దాని సంబంధం కేవలం మిత్రదేశ స్థాయిలో మాత్రమే లేదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థకు ప్రధాన ఆధారంగా మారింది. ప్రతీ సంవత్సరం అమెరికా ఇజ్రాయెల్కు బిలియన్ల డాలర్ల విలువైన సైనిక సహాయాన్ని అందిస్తోంది. ఇందులో ఆధునిక యుద్ధ విమానాలు, ఖచ్చిత లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ సాంకేతికత, గూఢచార సమాచార సహకారం ఉంటాయి. ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐరన్ డోమ్ వ్యవస్థ అభివృద్ధి, నిర్వహణలో అమెరికా ఆర్థిక సహకారం కీలక పాత్ర పోషించింది. గాజా, లెబనాన్ ప్రాంతాల నుంచి వచ్చే రాకెట్లను అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ ప్రధాన రక్షణ కవచంగా నిలుస్తోంది.ఇరాన్తో ప్రత్యక్ష యుద్ధం వస్తే..ఇటీవలి కాలంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీలు, ఇతర ప్రాంతీయ మిత్ర బలగాలు ఉండటం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. రక్షణ నిపుణుల అంచనా ప్రకారం, ఒకేసారి ఇరాన్, హెజ్బొల్లా, హమాస్ వంటి పలు వర్గాల నుంచి దాడులు జరిగితే ఇజ్రాయెల్పై భారీ ఒత్తిడి పడుతుంది. క్షిపణి నిరోధక వ్యవస్థల నిల్వలు వేగంగా ఖాళీ కావడం, ఆయుధాల వినియోగం పెరగడం, ఆర్థిక వ్యయం విపరీతంగా పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో అమెరికా నుంచి ఆయుధాలు, విడిభాగాలు, ఇంటర్సెప్టర్ క్షిపణులు, గూఢచార సమాచారం నిరంతరం అందడం ఇజ్రాయెల్కు కీలక బలంగా మారుతుంది.అయితే, అమెరికా నుంచి ఇజ్రాయెల్కు లభించే అతిపెద్ద మద్దతు కేవలం సైనిక సహాయం మాత్రమే కాదు. అంతర్జాతీయ వేదికలపై అమెరికా రాజకీయ అండ కూడా అత్యంత కీలకం. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో ఇజ్రాయెల్పై విమర్శలు లేదా చర్యలకు సంబంధించిన అనేక తీర్మానాలను అమెరికా గతంలో వీటో చేసింది. అమెరికా మద్దతు తగ్గితే ఇజ్రాయెల్పై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.వాన్స్ అసలు సందేశం ఇదేనా?జేడీ వాన్స్ వ్యాఖ్యలను కేవలం రక్షణ అంశంగా మాత్రమే కాకుండా రాజకీయ సంకేతంగా కూడా విశ్లేషిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, అవసరమైతే వాషింగ్టన్ తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుందని ట్రంప్ ప్రభుత్వ వర్గాలు పరోక్షంగా తెలియజేస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇరాన్ విషయంలో దౌత్యపరమైన పరిష్కారాలను అమెరికా ప్రాధాన్యంగా చూస్తున్న సమయంలో, ఇజ్రాయెల్ మరింత కఠిన వైఖరిని అవలంబిస్తే రెండు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు మరింత పెరిగే అవకాశముందని వారు చెబుతున్నారు.మొత్తానికి.. ఇజ్రాయెల్ స్వయంగా తనను తాను రక్షించుకునే శక్తి కలిగిన దేశమే. కానీ మధ్యప్రాచ్య స్థాయిలో దీర్ఘకాలిక, బహుముఖ యుద్ధం ఎదురైతే అమెరికా సహాయం దాని సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. అందుకే నిపుణులు చెబుతున్న మాట ఒక్కటే.. ఇజ్రాయెల్కు అమెరికా అవసరం మనుగడ కోసం కాదు.. ఆధిపత్యం కొనసాగించడానికి అని తెలుస్తోంది.ఇజ్రాయెల్ వద్ద సైన్యం..దాదాపు 1.7 లక్షల యాక్టివ్ సైనికులు4 లక్షలకుపైగా రిజర్వ్ దళాలువందల సంఖ్యలో ఆధునిక యుద్ధవిమానాలుఅధునాతన డ్రోన్లుసైబర్ యుద్ధ సామర్థ్యాలుప్రపంచంలోనే అత్యుత్తమ గూఢచారి వ్యవస్థల్లో ఒకటైన మోసాద్అణ్వాయుధ సామర్థ్యం (అధికారికంగా అంగీకరించకపోయినా)అమెరికా నుంచి వచ్చే సహాయంలో..అత్యాధునిక ఆయుధాలుF-35 యుద్ధవిమానాలుక్షిపణి నిరోధక వ్యవస్థల కోసం నిధులురాడార్, నిఘా సాంకేతికతవిడిభాగాలు, మందుగుండు సామగ్రి -
నెతన్యాహు.. కాస్త బుర్ర వాడండి: ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య మళ్లీ ముదురుతున్న ఘర్షణలను ఆపేందుకు తానే నేరుగా జోక్యం చేసుకున్నానని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ నాయకత్వానికి "Calm down and use your head" (శాంతించండి... కాస్త ఆలోచించండి) అని చెప్పి కాల్పుల విరమణకు ఒప్పించానని ట్రంప్ వెల్లడించారు.కాగా, ఇటీవల లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపగా, ప్రతిగా హెజ్బొల్లా కూడా రాకెట్ దాడులకు దిగింది. దీంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారి యుద్ధం ప్రాంతమంతా వ్యాపించే అవకాశాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగాయి. ఇరాన్ కూడా పరోక్షంగా సహకరించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. చివరకు శుక్రవారం సాయంత్రం నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు.అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుతో నేరుగా చర్చించినట్టు తెలిపారు. ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలకు దూరంగా ఉండాలని సూచించానని, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అమెరికా తీవ్ర దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పారు. కొన్నిసార్లు ఇజ్రాయెల్ నాయకత్వాన్ని "కాస్త సెన్స్తో వ్యవహరించేలా చేయాల్సి వస్తోంది" అంటూ వ్యాఖ్యానించారు.అంతకుముందు జూన్ ప్రారంభంలో కూడా ట్రంప్, నెతన్యాహూతో మాట్లాడి బీరూట్ వైపు సాగుతున్న ఇజ్రాయెల్ సైనిక చర్యలను నిలిపివేయించానని ప్రకటించారు. అదే సమయంలో మధ్యవర్తుల ద్వారా హెజ్బొల్లాతోనూ సంప్రదింపులు జరిగాయని, ఇరు పక్షాలు కాల్పులు తగ్గించేందుకు అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రకటించిన పలు ఒప్పందాలు కొద్ది రోజులకే విఫలమయ్యాయి. తాజా ఒప్పందం కూడా ప్రాంతీయ శాంతి చర్చలు, అమెరికా-ఇరాన్ చర్చల భవిష్యత్తుకు కీలకంగా మారింది -
అమెరికా దాడిపై నావికుడి భార్య కన్నీటి ఆవేదన
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల హర్ముజ్ జలసంధిలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై అమెరికా దాడులు జరిపింది. ఆ అటాక్లో ముగ్గురు భారతీయులు మరణించడం భారత్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు రేపింది. తాజాగా ఆ దాడిలో మరణించిన చీఫ్ మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేశ్ సతీమణి తీవ్ర ఆవేదనతో స్పందించారు. ఇప్పటి వరకూ ఈ అంశంలో కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.ఇటీవల హర్ముజ్ ఒమన్ తీరంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న 'ఎంటీ సెట్టెబెల్లో' చమురు ట్యాంకర్పై అమెరికా సైనిక దళాలు దాడులు జరిపాయి. ఈదాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించగా అందులో ఒకరు ఆంధ్రప్రదేశ్కు చెందిన పట్నాల సురేశ్ తెలుగువారున్నారు. ఇరాన్ రేవులపై అమెరికా విధించిన సముద్ర దిగ్బంధనాన్ని (Blockade) ఉల్లంఘించిందనే ఆరోపణలతో యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ అటాక్ చేసింది. అయితే ప్రమాదంలో చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్, డెక్ కాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా అనే ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.కాగా ఈ ఘటనపై మెరైన్ చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్ భార్య భార్గవి ఆవేదన వ్యక్తం చేశారు. "...ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయారు. భారతీయ సిబ్బంది ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఇప్పటివరకు ఎవరూ కనీసం దీనిపై సరైన స్పందన ఇవ్వలేదు. నేను నేరుగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని అడుగుతున్నాను. బాధిత కుటుంబాలకు ఎలాంటి సహాయం అందిస్తారు? అమెరికా ప్రభుత్వాన్ని కూడా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను... మా కుటుంబంలో నా భర్త ఒక్కరే సంపాదించేవారు. ఇక నా పిల్లలను నేను ఎలా పెంచాలి?..." అనే ఆవేదన వ్యక్తం చేశారు.కాగా ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్లోని అమెరికా అత్యున్నత దౌత్యవేత్త (ఛార్జ్ డి అఫైర్స్) జాసన్ మీక్స్కు రెండు సార్లు సమన్లు జారీ చేసింది. మరోవైపు ట్రంప్ సైతం ఈ ఘటనపై స్పందించారు. ఈ దాడులు చేసింది ఇరాన్ అని దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదని తెలిపారు. -
ఇజ్రాయెల్పై అమెరికా ఉపాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన తాజా శాంతి ఒప్పందంపై విమర్శలు చేస్తున్న ఇజ్రాయెల్ నేతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచిన ఏకైక ప్రపంచ నాయకుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే అని అన్నారు. ఇలాంటి సమయంలో ట్రంప్ తమ ప్రధాన సమస్య అని భావించే వారు వాస్తవ పరిస్థితిని గుర్తించాలని ఘాటు హెచ్చరిక చేశారు.వైట్హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వాన్స్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఒంటరిపడిందని, అమెరికా అందించిన దౌత్య, సైనిక సహకారాన్ని కొందరు ఇజ్రాయెల్ మంత్రులు గుర్తించడం లేదని విమర్శించారు. "Wake up and smell the reality" అంటూ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పనిచేసినప్పటికీ, ఏప్రిల్ 8న కుదిరిన తొలి కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యుద్ధాన్ని కొనసాగించాలని భావించగా, ట్రంప్ మాత్రం యుద్ధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి తాజాగా అమెరికా–ఇరాన్ ఒప్పందానికి తాము కట్టుబడి ఉండబోమని వ్యాఖ్యానించడం ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపైనే వాన్స్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఇక ట్రంప్ కూడా ఇటీవల నెతన్యాహుపై అసహనం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ఉనికికి అమెరికా మద్దతే ప్రధాన కారణమని పేర్కొన్డాను. అలాగే నెతన్యాహును "crazy" అని వ్యాఖ్యానించినట్లు అమెరికా మీడియా నివేదించింది.అయితే నెతన్యాహు స్పందిస్తూ, అమెరికాతో ఉన్న కీలక సంబంధాలను కొనసాగించడం తమకు ఎంతో ముఖ్యమని, యుద్ధ సమయంలో అమెరికా అందించిన సహకారాన్ని ఇజ్రాయెల్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. -
మళ్లీ దాడులకు సిద్ధమైన అమెరికా..! లాస్ట్ వార్నింగ్ వచ్చేసింది..
బ్రస్సెల్స్: అమెరికా-ఇరాన్ ఒప్పందంలోని హామీలను ఇరాన్ పాటించకపోతే మళ్లీ సైనిక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ గురువారం తెలిపారు. నాటో రక్షణ మంత్రుల సమావేశం అనంతరం బ్రస్సెల్స్లో ఆయన మీడియాతో మాట్లాడారు.ఒప్పందం అమలు, చర్చల సమయంలో ఇరాన్ నిబంధనలు పాటించకపోతే ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. "ఈ చర్చల గడువులో ఇరాన్ చెప్పినట్టు చేయకపోతే, మేము మళ్లీ చర్యలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంటామని అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇరాన్ నిబంధనలు పాటించకపోతే, అత్యంత కఠినమైన సముద్ర దిగ్బంధనాన్ని మళ్లీ అమలు చేసే సామర్థ్యం మాకు ఉంది" అని పీట్ హెగ్సెత్ అన్నారు.అమెరికా-ఇరాన్ మధ్య 3 నెలలకు పైగా సాగిన ఘర్షణలకు ముగింపు పలికే లక్ష్యంతో ఇటీవల ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఆ ఒప్పందంలో శత్రుత్వానికి ముగింపు, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఆంక్షల సడలింపు, ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృత స్థాయి ఒప్పందం కోసం 60 రోజుల చర్చల ప్రక్రియ ప్రారంభించడం వంటి అంశాలు ఉన్నాయి.ఇరాన్ బాధ్యతగా వ్యవహరిస్తేనే.. ఇరు పక్షాలు ఈ ఒప్పందాన్ని స్వాగతించినప్పటికీ ఒప్పందం ద్వారా లభించే ఆంక్షల సడలింపు, ఇతర ప్రయోజనాల వంటివి ఇరాన్ తన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చిన తర్వాతే అమల్లోకి వస్తాయని అమెరికా అధికారులు స్పష్టం చేస్తున్నారు.తాజా వ్యాఖ్యలతో, ఒప్పందం అమలు సమయంలో ఇరాన్ చర్యలను ట్రంప్ ప్రభుత్వం నిశితంగా పరిశీలించనున్నట్టు మరోసారి సంకేతాలు ఇచ్చింది. ఈ ఒప్పందాన్ని "పనితీరు ఆధారిత ఒప్పందం"గా పేర్కొంటున్నారు. ఇందులో ఆంక్షల సడలింపు, నిలిపివేసిన నిధుల విడుదల, ఇతర చర్యలు అన్నీ ఇరాన్ తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటాయి.అయితే ఇరాన్ నిధుల విడుదల, సముద్ర ఆంక్షల సడలింపు వంటి హామీలను ఏ క్రమంలో అమలు చేయాలనే విషయంలో రెండు పక్షాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. ఘర్షణల సమయంలో హార్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడటంతో ఇంధన మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించాయి. అనేక నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వచ్చింది.ఈ ఒప్పందంతో ఆ ప్రాంతంలో సముద్ర రాకపోకలు సాధారణ స్థితికి వస్తాయని వాషింగ్టన్ భావిస్తోంది. అదే సమయంలో ఇరాన్ ఒప్పంద నిబంధనలు పాటించకపోతే, సైనిక, ఆర్థిక ఒత్తిడిని మళ్లీ తీసుకురావచ్చని అమెరికా స్పష్టం చేసింది. -
ఆంక్షలతో అల్లాడిన జీవితాలు.. ఇరానీల మౌన వేదన
టెహ్రాన్ ‘విజయం’ అంటోంది.. కానీ ఇరాన్ ప్రజలు ‘ఉపశమనం’ అంటున్నారు. అమెరికాతో ఒప్పందాన్ని ప్రభుత్వం రాజకీయ గెలుపుగా చూపిస్తుండగా, సంక్షోభంలో కూరుకుపోయిన ప్రజలు మాత్రం తమ జీవితం మెరుగుపడుతుందా?.. ధరలు తగ్గుతాయా? ఉద్యోగాలు వస్తాయా? పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? అనే దానిపైనే దృష్టి పెట్టారు. ఆర్థిక కష్టాలు, యుద్ధ భయాలే ఈ ఒప్పందానికి అసలు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణ ప్రజలు మాత్రం దాన్ని తమ జీవితాల్లో కొంత వెలుగు నింపే అవకాశంగా చూస్తున్నారు.గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. దేశ ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులపై పరిమితులు విధించడంతో విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఫలితంగా ఇరానియన్ రియాల్ విలువ క్షీణించింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఒకప్పుడు మధ్యతరగతికి అందుబాటులో ఉన్న అనేక వస్తువులు ఇప్పుడు విలాసంగా మారిపోయాయి.టెహ్రాన్కు చెందిన 45 ఏళ్ల ఉపాధ్యాయుడు అలీ రెజా మాటల్లో చెప్పాలంటే.. మాకు రాజకీయ విజయాలు అవసరం లేదు. మార్కెట్కు వెళ్లినప్పుడు సరుకులు కొనగలిగితే అదే విజయం.. ఈ భావన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రజల దృష్టిలో అమెరికాతో ఒప్పందం అంటే అంతర్జాతీయ రాజకీయాల్లో గెలుపు కాదు.. కుటుంబ ఖర్చులు తగ్గే అవకాశం అని భావిస్తున్నారు.ఆంక్షల అసలు ప్రభావం ప్రజలపైనే.. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్లో కేవలం చమురు ఆదాయం మాత్రమే తగ్గలేదు. విదేశీ బ్యాంకింగ్ వ్యవస్థలతో సంబంధాలు దెబ్బతినడంతో మందులు, వైద్య పరికరాలు, పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకుల దిగుమతులు కూడా కష్టతరమయ్యాయి. క్యాన్సర్, అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు దొరకక చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.ఇరాన్ యువత పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. నిరుద్యోగం, తక్కువ వేతనాలు, విదేశాల్లో అవకాశాల కొరత కారణంగా వేలాది మంది యువకులు నిరాశలో ఉన్నారు. చాలా మంది ఉన్నత విద్య పూర్తిచేసినా సరైన ఉద్యోగాలు దొరకడం లేదు. ఆర్థిక ఆంక్షల కారణంగా విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడంతో పరిశ్రమలు కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. అందుకే అమెరికాతో ఒప్పందం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని యువత ఆశిస్తోంది.మహిళల ఆశలుఇటీవలి సంవత్సరాల్లో ఇరాన్లో మహిళల హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే సమాజంలో మరిన్ని సంస్కరణలు వస్తాయనే ఆశ కొంతమంది మహిళల్లో ఉంది. అయితే ఒప్పందం వల్ల రాజకీయ స్వేచ్ఛలు పెరుగుతాయా అనే విషయంలో మాత్రం సందేహాలు ఉన్నాయి. అలాగే ఇరాన్లో మహిళల విద్యా స్థాయి గణనీయంగా పెరిగినా, ఉద్యోగ అవకాశాలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే ప్రైవేట్ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయని, మహిళల ఉపాధి పెరుగుతుందని చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా యువతులు ఈ ఒప్పందాన్ని ఉపాధి, ఆర్థిక స్వావలంబన దిశగా ఒక అవకాశంగా చూస్తున్నారు. మరోవైపు, 2022లో జరిగిన Mahsa Amini protests తర్వాత మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛల అంశాలు ఇరాన్లో ప్రధాన చర్చగా మారాయి. ఆర్థికంగా ప్రపంచంతో సంబంధాలు పెరిగితే సమాజంలో మరింత తెరవెనుకత, సంస్కరణలకు అవకాశం ఏర్పడుతుందనే ఆశ కొందరు మహిళల్లో ఉంది. ప్రజల్లో ఆందోళన..మరో ముఖ్యమైన అంశం యుద్ధ భయం. గత కొంతకాలంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్తో పెరిగిన ఘర్షణలు ప్రజల్లో ఆందోళన పెంచాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత విస్తరిస్తే తమ జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చాలామంది భావిస్తున్నారు. అందుకే ఈ ఒప్పందం ద్వారా ఉద్రిక్తతలు తగ్గితే అదే తమకు పెద్ద ఊరట అని చెబుతున్నారు. అయితే ఆశలతో పాటు అనుమానాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందాలు కుదిరినా తరువాత అవి నిలవలేదు. అందుకే ‘ఈసారి నిజంగా మార్పు వస్తుందా?’ అనే సందేహం చాలా మందిలో కనిపిస్తోంది. ఒప్పందం కుదిరిందనే వార్త కంటే, దాని ఫలితాలు తమ జేబుల్లో కనిపిస్తాయా లేదా అన్నదే వారికి ముఖ్యం.రాజకీయంగా చూస్తే టెహ్రాన్ దీనిని విజయగాథగా చెప్పుకోవచ్చు. కానీ సాధారణ ఇరానీయులకు ఇది విజయోత్సవాల విషయం కాదు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు తగ్గడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం, యుద్ధ భయం తగ్గడం, పిల్లలకు మెరుగైన భవిష్యత్తు దొరకడం వారికి అసలైన విజయం అదే. అందుకే అమెరికాతో కుదిరిన ఈ ఒప్పందాన్ని ఇరాన్ ప్రజలు ‘గెలుపు’గా కాదు, ‘బతుకును నిలబెట్టే ఆశాకిరణం’గా చూస్తున్నారు. దీంతో, ఈ ఒప్పందం నిజంగా ఇరాన్ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తుందా? లేక రాజకీయ ప్రచారానికే పరిమితమవుతుందా? అన్నది రాబోయే నెలల్లో తేలనుంది. -
ఇక అణ్వాయుధాల జోలే లేదు.. నెతన్యాహు
టెల్ అవీవ్: ప్రస్తుతం పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీస్తున్నాయి. అమెరికా,ఇరాన్ల మధ్య డీల్ కుదరడంతో ఇరు దేశాలు యుద్ధానికి ముగింపు పలికాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమిన్ నెతన్యాహూ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగే ఉండే అవకాశం లేదన్నారు. అది ఈ రోజైనా..రేపైనా అని స్పష్టం చేశారు. శాంతి ఒప్పందంపై ప్రస్తుతం ఇజ్రాయెల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ఆ దేశ ప్రజలకు వివరణ ఇచ్చారు. ఇరాన్పై యుద్ధం విషయంలో తాను చేసింది సరైందేనని సమర్థిస్తూ మాట్లాడారు. "మనం ఏమి సాధించామని ప్రజలు నన్ను అడుగుతున్నారు? దానికి నేను సమాధానమిస్తాను - మనం ఏమి సాధించాం? మనపై ఉన్న తక్షణ వినాశన ముప్పును మనం తొలగించుకున్నాం. అన్నింటికన్నా ముఖ్యంగా, ఇజ్రాయెల్ రాజ్యాన్ని సంపూర్ణ వినాశనం ముప్పు నుండి కాపాడాం" అని అన్నారు. శత్రుదేశం ఇరాన్కు ఈ రోజే కాదు రేపు.. ఎప్పుడూ అణ్వాయుధాలు ఉండవు. అని నెతన్యాహు పేర్కొన్నారు.తాము ఇజ్రాయెల్ దేశం చుట్టూ పటిష్టమైన భద్రతా వలయాలను ఏర్పాటు చేశామని. గాజా, లెబనాన్ మరియు సిరియాలలో కూడా మేము ఇదే చేశామని అన్నారు. తాను ఒక నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నానని ఇజ్రాయెల్కు అవసరమైనంత కాలం తమ భూభాగాన్ని రక్షించుకోవడానికి అవసరమైనంత కాలం మేము ఈ భద్రతా మండలాల్లోనే ఉంటామని నెతన్యాహూ తేల్చి చెప్పారు.ట్రంప్తో విభేదాలుఅమెరికా అధ్యక్షుడు ట్రంప్తో గల విభేదాలపై స్పందించారు. కొన్నిసార్లు అధ్యక్షుడు ట్రంప్కు, నాకు మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలను వివేకంతో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అని అన్నారు.నెతన్యాహుపై విమర్శలుఇజ్రాయెల్లో నెతన్యాహు నాయకత్వాన్ని విమర్శిస్తూ విపక్ష నేత నఫ్తాలి బెన్నెట్ మాట్లాడారు. నెతన్యాహూ అధికారం అంతర్యుద్ధంతో ప్రారంభమై, అక్టోబర్ 7 నాటి మారణకాండతో కొనసాగి, ఇప్పుడు ఇరాన్పై చారిత్రాత్మక వైఫల్యంతో ముగుస్తోంది అని విమర్శించారు. ఈ వ్యతిరేకతల నేపథ్యంలో నెతన్యాహూ వివరణ ఇచ్చారు.ఎట్టకేలకు శాంతి ఒప్పందంకాగా గత మూడు నెలలుగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ఎట్టకేలకు ముగింపు లభించింది. హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో నెలకొన్న అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ముగింపు పలుకుతూ, యుద్ధజ్వాలలను ఆర్పేస్తూ అమెరికా, ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం సమష్టిగా ముందుకొచ్చాయి. పరస్పర షరతులకు సమ్మతి తెలుపుతూ జూన్ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు అటు అమెరికా, ఇటు ఇరాన్ ప్రకటించాయి. -
హర్మూజ్పై ట్రంప్ కీలక ప్రకటన
పశ్చిమాసియాలో గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో శాంతి ఒప్పందం పూర్తయ్యిందని, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి శుక్రవారం నుంచి పూర్తిగా తెరుచుకోనుందని వెల్లడించారు.సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్.. "ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో ఒప్పందం పూర్తయ్యింది. అందరికీ అభినందనలు. హర్మూజ్ జలసంధిని ఎలాంటి టోల్ లేకుండా తెరవడానికి అనుమతి ఇస్తున్నాను. అదే సమయంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని కూడా వెంటనే ఎత్తివేస్తున్నాను. ప్రపంచ దేశాల నౌకలు తమ ప్రయాణాలను ప్రారంభించవచ్చు. చమురు మళ్లీ స్వేచ్ఛగా ప్రవహించనివ్వండి" అని పేర్కొన్నారు.అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ మాత్రం జాగ్రత్తగా స్పందించింది. ప్రస్తుతం కుదిరింది కేవలం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) మాత్రమేనని, అసలు ఒప్పందంపై చర్చలు ఆ తర్వాత అమల్లోకి వచ్చే 60 రోజుల కాల్పుల విరమణ సమయంలో జరగనున్నాయని స్పష్టం చేసింది. అమెరికాపై తమకు ఇంకా అపనమ్మకం కొనసాగుతోందని మరోసారి పేర్కొంది.కాగా, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయోతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ముందు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 4న టెహ్రాన్లోని ఇమామ్ ఖమేనీ మొసల్లా ప్రార్థనా మందిరంలో వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం టెహ్రాన్, ఖోమ్ నగరాల్లో అంతిమయాత్రలు సాగనున్నాయి. చివరి అంత్యక్రియలు జూలై 9న మష్హద్లో నిర్వహించి, అదే రోజు ఇమామ్ రిజా పవిత్ర స్థలంలో ఖమేనీకి ఖననం చేయనున్నట్లు ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. -
నెతన్యాహుపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుపై చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికా–ఇరాన్ మధ్య నెలల తరబడి సాగిన రహస్య చర్చల ఫలితంగా కుదిరిన శాంతి ఒప్పందం చివరి దశలో ఉండగా, లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి.. మొత్తం ప్రక్రియను దాదాపు పట్టాలు తప్పించిందని ట్రంప్ ఆరోపించారు. నెతన్యాహు చాలా కఠినమైన వ్యక్తి అంటూ మండిపడ్డారు. ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని నెతన్యాహు దాదాపు చెడగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..‘నెతన్యాహూ చాలా కఠినమైన వ్యక్తి. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు చర్చల ప్రక్రియను మరింత క్లిష్టం చేశాయి’ అని వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇజ్రాయెల్కు బలమైన మద్దతుదారుడిగా గుర్తింపు పొందిన ట్రంప్ నేరుగా నెతన్యాహూను విమర్శించడం విశేషంగా మారింది.అయితే, ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినందుకు ఇజ్రాయెల్ తమకు ఎంతో కృతజ్ఞతతో ఉండాలని ట్రంప్ అన్నారు. ఒకవేళ ఇరాన్ చేతికి గనుక అణ్వాయుధం చిక్కి ఉంటే, రెండు గంటల్లో ఇజ్రాయెల్ భూమిమీద లేకుండా ఉండేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న సమయంలో బీరూట్పై ఇజ్రాయెల్ దాడి చేయడం పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. కాగా.. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పంద చర్చల్లో ఇజ్రాయెల్ ప్రత్యక్ష భాగస్వామిగా లేకపోవడం గమనార్హం. దీంతో ఒప్పందంలోని కొన్ని అంశాలను ఇజ్రాయెల్ అంగీకరించడం కష్టమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా-ఇరాన్ ఒప్పందంపై వార్తలు వెలువడిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. మరోవైపు ఇరాన్, హెజ్బొల్లా వంటి మిత్ర బలగాలపై కొనసాగుతున్న పోరాటాన్ని నిలిపివేయడానికి నెతన్యాహుపై అంతర్గత రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.అమెరికా–ఇజ్రాయెల్ మధ్య విభేదాలా?ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలపై కొత్త చర్చ మొదలైంది. ఇరాన్ అంశంలో ఇరు దేశాల తుది లక్ష్యం ఒకటే అయినప్పటికీ, దాన్ని సాధించే మార్గాల విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నట్లు కనిపిస్తోంది. దౌత్య చర్చలు, ఒప్పందాలు, ఆంక్షల సడలింపులతో సమస్య పరిష్కారం చేయాలని అమెరికా భావిస్తుండగా.. కఠిన భద్రతా చర్యలు, సైనిక ఒత్తిడి, ముందస్తు దాడుల ద్వారా ఇరాన్ను నియంత్రించాలని ఇజ్రాయెల్ అనుకుంటోంది. ఈ రెండు విధానాల మధ్య ఉన్న తేడాలు ఇప్పుడు బహిరంగంగా బయటపడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. -
యుద్ధానికి బ్రేక్.. అసలు ముప్పు పొంచి ఉందా?
గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాజా అవగాహన ఒప్పందం (Framework Agreement)తో యుద్ధ భయాలు కొంత మేర తగ్గాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్లు, మధ్యప్రాచ్య భద్రతపై నెలకొన్న అనిశ్చితికి ఇది ఉపశమనం కలిగించినప్పటికీ, సంక్షోభం పూర్తిగా ముగిసిందని చెప్పేందుకు ఇంకా సమయం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభమైన ఘర్షణలతో ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్పై అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయి. దీంతో ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ అధికారుల ప్రకారం, ఈ ముసాయిదా ఒప్పందంలో ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలకు సడలింపులు, విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన సుమారు 25 బిలియన్ డాలర్ల ఇరానియన్ ఆస్తుల విడుదల, కొత్త ఆంక్షలు విధించకుండా ఉండటం వంటి అంశాలు ఉన్నాయి. ప్రతిగా ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని, తన అణు కార్యక్రమ విస్తరణను తాత్కాలికంగా నిలిపివేస్తామని అంగీకరించినట్లు సమాచారం.డాలర్ బలహీనం.. అయితే అసలు సమస్య ఇక్కడే ఉందని నిపుణులు చెబుతున్నారు. అణు కార్యక్రమంపై అమెరికా, ఇరాన్ వేర్వేరు వ్యాఖ్యానాలు చేస్తుండటంతో ఒప్పందం అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందంలోని కొన్ని అంశాలపై ఇరాన్, అమెరికా అధికారులు భిన్న ప్రకటనలు చేయడం కూడా అనిశ్చితిని పెంచుతోంది. ముఖ్యంగా శుద్ది చేసిన యురేనియం నిల్వలు, ఆంక్షల ఎత్తివేత విధానం, ఆస్తుల విడుదల వంటి అంశాలు ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. ఈ ఒప్పందం వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు ధరలు నాలుగు శాతానికి పైగా పడిపోగా, ప్రపంచ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అదే సమయంలో డాలర్ బలహీనపడటంతో బంగారం ధరలు పెరిగాయి. యుద్ధ భయాలు తగ్గడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఒత్తిడి కొంత మేర తగ్గిందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.ముప్పు తప్పలేదు.. కాగా, ఒప్పందం కుదిరిందనే కారణంతో ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని చెప్పలేమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హార్మూజ్ జలసంధిని మూసివేసే సామర్థ్యం ఇరాన్ వద్ద ఇప్పటికీ ఉంది. అలాగే లెబనాన్, ఇజ్రాయెల్కు సంబంధించిన ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల కార్యకలాపాలు, అణు చర్చల భవిష్యత్తు వంటి అంశాలు మళ్లీ పరిస్థితిని సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం కుదిరింది కేవలం ఒక ప్రాథమిక అవగాహన మాత్రమే. తుది ఒప్పందం కోసం రాబోయే 60 రోజుల్లో మరిన్ని చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత, ప్రాంతీయ భద్రత వంటి అత్యంత కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.ఇజ్రాయెల్ అంశం.. ఇజ్రాయెల్ అంశం కూడా అత్యంత కీలకంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ చాలా కాలంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. తాజా ఒప్పందం ఇరాన్కు మరింత ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తుందని భావిస్తే, ఇజ్రాయెల్ నుంచి రాజకీయ, దౌత్య లేదా భద్రతాపరమైన ప్రతిస్పందనలు వచ్చే అవకాశముంది. ప్రస్తుతానికి యుద్ధ మేఘాలు కొంతవరకు చెదిరినప్పటికీ, మధ్యప్రాచ్య సంక్షోభానికి పూర్తిస్థాయి ముగింపు లభించిందని చెప్పడానికి ఇంకా సమయం ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు అమెరికా–ఇరాన్ తదుపరి అడుగుల వైపే ఆసక్తిగా ఎదురుచూస్తోంది.అలాగే, ప్రాంతీయ భద్రత కూడా మరో ప్రధాన సమస్యగా ఉంది. లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్ మరియు సిరియాలోని ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపుల కార్యకలాపాలు అమెరికా, దాని మిత్రదేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ గ్రూపుల చర్యలు భవిష్యత్తులో ఒప్పందంపై ప్రభావం చూపే అవకాశాన్ని నిపుణులు కొట్టిపారేయడం లేదు. -
ఇరాన్ శాంతి ఒప్పందంలో మరో ట్విస్ట్
టెహ్రాన్: అమెరికాతో శాంతి ఒప్పందంపై ఇరాన్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశంలోని అతివాదుల వర్గం చర్చలు అవసరం లేదంటూ ధర్నాలు చేపడుతున్నారు. ఆ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని అక్రమ చొరబాటుదారుడిగా అభివర్ణిస్తూ వాషింగ్టన్తో ఆయన రాజీ పడుతున్నారని ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు.ప్రస్తుతం ప్రపంచ దేశాలు దృష్టంతా ఇరాన్- అమెరికా చర్చలపైనే.. ఈ భేటీలో శాంతి ఒప్పందం కుదురుతుందా ఈ యుద్ధానికి శాశ్వతంగా తెరపడుతుందా అనే అంతా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్లోని అతివాద వర్గం మాత్రం చర్చలను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతిపాదిత ఒప్పందం వల్ల 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' పై టెహ్రాన్ నియంత్రణ, ప్రభావం తగ్గుతుందని వాదిస్తున్నారు.ఈ మేరకు ( శనివారం) ఆ దేశంలోని అతివాద గ్రూపులకు చెందిన మద్దతు దారులు రాజధాని టెహ్రాన్తో పాటు మషహాద్లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం వెలుపల భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అబ్బాస్ అరాగ్చీ నశించాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. విదేశాంగ మంత్రిత్వ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "గౌరవం లేని, రాజీపడే అరాగ్చీ నశించాలి, అరాగ్చీ, సిగ్గు తెచ్చుకో... లొంగిపోవడం ఆపు, దేశద్రోహి, చొరబాటుదారుడైన అరాగ్చీ నశించాలి" అంటూ తీవ్ర పదజాలంతో అరాగ్చీపై మండిపడ్డారు. ప్రస్తుతం జరిగే ఏ ఒప్పందం ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పూర్తి అంగీకారం లేకుండా జరగదని స్పష్టం చేశారు.అయితే ఈ నిరసనల నేపథ్యంలో అరాగ్చీ స్పందించారు. హర్ముజ్ అనేది ఇరాన్ యొక్క ప్రధాన రక్షణ ఆయుధాలలో ఒకటని ఆయన స్పష్టం చేశారు. ఈ రాబోయే ఒప్పందం వల్ల ఇరాన్ రేవులపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధం తొలగిపోతుందని పేర్కొన్నారు.కాగా అణు ఒప్పందం విషయంలోనూ ఇరాన్లోని అతివాదులు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. ఇరాన్ మరింత దూకుడుగా అణు విధానాన్ని అవలంబించాలని 'అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం' నుండి ఇరాన్ వైదొలగాలని, నేరుగా అణుబాంబు తయారీ వైపు అడుగులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు 🚨🇮🇷 Footage reportedly shows demonstrators on the streets of Iran turning on their own negotiators, chanting for revenge and demanding the talks be scrapped. One chant is aimed straight at the foreign minister: "Araghchi, have some shame, put the negotiations aside."… pic.twitter.com/GXOtPIg1ug— Mario Nawfal (@MarioNawfal) June 13, 2026 -
పశ్చిమాసియా యుద్ధంలో బిగ్ ట్విస్ట్..?
-
మా యురేనియం మా వద్దే.. దాచి పెట్టిన ఇరాన్
-
ట్రంప్నకు షాకిచ్చిన నెతన్యాహు
జెరూసలేం: అమెరికా–ఇరాన్ మధ్య అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలువరించకుండా కుదిరే ఏ ఒప్పందమైనా మధ్యప్రాచ్య భద్రతకు ముప్పుగా మారుతుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరించింది. అమెరికా దౌత్యపరమైన పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తుండగా, ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్పై కఠినమైన ఒత్తిడి కొనసాగించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా తీరుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇరాన్ డిమాండ్లకు ట్రంప్ తలొగ్గిందంటూ విమర్శలు చేస్తున్నారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమంపై పరిమితులు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తనిఖీలు, ఆర్థిక ఆంక్షల సడలింపు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్కు ఆర్థిక ఉపశమనం కల్పించే ఒప్పందం కుదిరితే, ఆ దేశం తన ప్రాంతీయ ప్రభావాన్ని మరింత విస్తరించుకునే అవకాశం ఉందని ఇజ్రాయెల్ భావిస్తోంది.ఇజ్రాయెల్ ఆందోళన..ఇజ్రాయెల్ భద్రతా వర్గాల అభిప్రాయం ప్రకారం.. ఆంక్షల సడలింపుతో ఇరాన్కు భారీగా విదేశీ మారకద్రవ్య నిల్వలు అందుబాటులోకి వస్తాయి. ఆ నిధులను ఇరాన్ తన సైనిక సామర్థ్యాలను పెంచుకోవడానికి, అలాగే ప్రాంతంలోని తన మిత్ర వర్గాలకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించవచ్చని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా లెబనాన్లోని హెజ్బొల్లా, గాజాలోని హమాస్, యెమెన్లోని అన్సర్ అల్లాహ్ వంటి ఇరాన్ అనుకూల శక్తులకు మరింత బలం చేకూరే ప్రమాదం ఉందని పేర్కొంటోంది. ఇదే సమయంలో ఇరాన్కు అమెరికా లొంగిపోయిదంటూ ఇజ్రాయెల్ తాజాగా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా తీరుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.చర్చలే ముఖ్యం.. ఇక అమెరికా మాత్రం దౌత్య చర్చల ద్వారానే ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించవచ్చని నమ్ముతోంది. యుద్ధం లేదా ప్రత్యక్ష ఘర్షణల కంటే చర్చల ద్వారా అణు విస్తరణను అడ్డుకోవడం అంతర్జాతీయ భద్రతకు మేలు చేస్తుందని అమెరికా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ అణు ఆయుధాల అభివృద్ధికి అవసరమైన స్థాయిలో యురేనియం శుద్ధి చేయకుండా నిరోధించడం, అంతర్జాతీయ తనిఖీలను పునరుద్ధరించడం చర్చల ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. అయితే ఇజ్రాయెల్ ఈ హామీలతో సంతృప్తి చెందడం లేదు. గతంలో కుదిరిన అణు ఒప్పందాల వల్ల ఇరాన్ అణు కార్యక్రమం పూర్తిగా ఆగలేదని, కేవలం ఆలస్యమైందే తప్ప మూల సమస్య పరిష్కారం కాలేదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. అందువల్ల ఇరాన్ అణు మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్వీర్యం చేసే కఠినమైన ఒప్పందం తప్ప మరో మార్గం లేదని భావిస్తోంది.ఇటీవలి నెలల్లో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. గాజా యుద్ధం, లెబనాన్ సరిహద్దు ఘర్షణలు, సిరియా మరియు ఇరాక్లో ఇరాన్ అనుకూల బలగాల కార్యకలాపాలు, ఎర్ర సముద్ర ప్రాంతంలో హౌతీల దాడులు వంటి పరిణామాలు ఇప్పటికే ప్రాంతీయ భద్రతా పరిస్థితిని సంక్లిష్టంగా మార్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా–ఇరాన్ ఒప్పందం కుదిరితే అది మొత్తం మధ్యప్రాచ్య శక్తి సమతుల్యతపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.అమెరికా లెక్కలు వేరుఅమెరికా మాత్రం పరిస్థితిని మరో కోణంలో చూస్తోంది. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే అనేక ఘర్షణలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్తో ప్రత్యక్ష సైనిక సంఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాషింగ్టన్ భావిస్తోంది. ముఖ్యంగా చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, సముద్ర రవాణాపై దాని ప్రభావం భారీగా ఉండవచ్చు. అందుకే దౌత్య చర్చల ద్వారా ఇరాన్ అణు కార్యక్రమాన్ని పర్యవేక్షించడం, పరిమితం చేయడం యుద్ధం కంటే మెరుగైన మార్గమని అమెరికా అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ తనిఖీల ద్వారా ఇరాన్ కార్యకలాపాలపై నిఘా కొనసాగించవచ్చని వారి అభిప్రాయం.ప్రాంతీయ రాజకీయాలపై ప్రభావంఈ ఒప్పందం కుదిరితే మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఏర్పడే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు కూడా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇరాన్ ఆర్థికంగా బలపడితే ప్రాంతీయ శక్తి సమతుల్యత మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, ఇజ్రాయెల్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసినట్లుగా, తన జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడిందని భావిస్తే అంతర్జాతీయ ఒప్పందాలకు అతీతంగా స్వతంత్ర చర్యలు తీసుకునే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని నిపుణులు పేర్కొంటున్నారు. -
హర్ముజ్పై ఇరాన్ కీలక ప్రకటన
టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంపై శాంతి చర్చల వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు ఇకపై ఉచితంగా ప్రయాణం ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరాన్, ఒమన్ మధ్య కీలక ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ అంశమై ఇరు దేశాలు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు.పశ్చిమాసియా యుద్ధంలో ప్రధానంగా చర్చంతే హర్ముజ్పైనే యుద్దం ప్రారంభంలోనే ఇరాన్ హర్ముజ్ని దిగ్భందించడంతో ప్రపంచ చమురు రవాణాకు ఆటంకం తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో అమెరికా ఈ జలసంధిని తెరవాలని ఎన్ని సార్లు కోరినా ఇరాన్ ససేమిరా అంది. తాజాగా శాంతి చర్చల ప్రస్థావన నేపథ్యంలో అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు.అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ" జలసంధి నిర్వహణ మునుపటిలా ఉండదు. ఇందులో అంతర్జాతీయ జలమార్గం ఏది లేదు. ఇది పూర్తిగా ఇరాన్, ఒమన్ సౌర్వభౌమాధికారం కిందకి వస్తుంది. ఈ జలసంధి గుండా పయణించే నౌకలకు అందించే సేవలు ఇకపై ఉచితంగా ఉండవు. ఇందులో నుంచి ప్రయాణించే నౌకలు ఖచ్చితంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది." అని అన్నారు.ఈ విషయమై ఒమన్తో చర్చలు పూర్తయ్యాయి. హర్ముజ్ జలసంధి భద్రత, నియంత్రణపై ఇరు దేశాలు త్వరలో సంయుక్త కార్యాచరణ ప్రకటిస్తాయి అని అన్నారు. కాగా ఇదివరకూ హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకలకు ఎటువంటి పన్ను ఉండేది కాదు. పశ్చిమాసియా యుద్దం నేపథ్యంలో ఇరుదేశాలు మునుపటి కార్యాచరణనను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
నిన్నటి మిత్రులు.. నేటి ప్రత్యర్థులా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కలిసి ఇరాన్పై యుద్ధాన్ని ప్రారంభించినప్పటికీ, ఇప్పుడు అదే యుద్ధం ముగింపుపై ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఒకే వ్యూహంతో ముందుకెళ్లిన ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం తమ తమ దేశీయ రాజకీయ అవసరాల కారణంగా వేర్వేరు దారుల్లో నడుస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.యుద్ధం ఎలా మొదలైంది?ఫిబ్రవరి 28, 2026న అమెరికా-ఇజ్రాయెల్ మద్దతుతో ఇరాన్పై భారీ సైనిక చర్య ప్రారంభమైంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం, ప్రాంతీయ భద్రతా ముప్పులను తగ్గించడం, టెహ్రాన్ ప్రభావాన్ని కట్టడి చేయడం ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించారు. ప్రారంభ దశలో ట్రంప్, నెతన్యాహు ఒకే వైఖరితో ముందుకు సాగారు.ఇప్పుడు ఎందుకు విభేదాలు?ప్రస్తుతం ట్రంప్ ప్రధానంగా యుద్ధాన్ని ముగించి ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) దాదాపు సిద్ధమైందని, త్వరలోనే సంతకాలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే, నెతన్యాహు మాత్రం ఇరాన్పై ఒత్తిడిని కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ అణు సామర్థ్యం, క్షిపణి కార్యక్రమం, హెజ్బొల్లా వంటి మిత్ర బలగాలపై మరింత కఠిన చర్యలు అవసరమని ఇజ్రాయెల్ వాదిస్తోంది.ట్రంప్ రాజకీయ లెక్కలునవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలు (Midterm Elections) ట్రంప్కు కీలకం. యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగడం, చమురు ధరల అస్థిరత, ప్రజల్లో యుద్ధ వ్యతిరేక భావన పెరగడం ఆయనకు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే యుద్ధాన్ని ముగించిన నాయకుడు అనే గుర్తింపుతో ఎన్నికల్లోకి వెళ్లాలని ట్రంప్ భావిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.నెతన్యాహు లక్ష్యం వేరుఇక నెతన్యాహు కూడా దేశీయ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్లో భద్రతా అంశం అత్యంత కీలకమైన రాజకీయ అంశం కావడంతో, ఇరాన్పై పూర్తి స్థాయి వ్యూహాత్మక ఆధిపత్యం సాధించకుండానే యుద్ధాన్ని ముగించడం ఆయనకు రాజకీయంగా ప్రమాదకరంగా మారవచ్చని భావిస్తున్నారు. అందువల్ల ఆయన మరింత కఠిన వైఖరిని అవలంబిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.బయటపడుతున్న ఉద్రిక్తతఇటీవల ట్రంప్ ఇరాన్పై ప్రణాళికాబద్ధమైన దాడులను రద్దు చేసి, చర్చలకు ప్రాధాన్యం ఇచ్చిన నిర్ణయం నెతన్యాహును ఆశ్చర్యానికి గురి చేసిందని వార్తలు వెలువడ్డాయి. ఆ నిర్ణయం గురించి ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాకుండా, ఇరాన్పై మరోసారి యుద్ధాన్ని ప్రారంభించవద్దని ట్రంప్ నెతన్యాహును హెచ్చరించినట్లు కూడా రాయిటర్స్ వెల్లడించింది. "మరింత జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఒంటరిగా మిగిలిపోతారు" అని ట్రంప్ హెచ్చరించినట్లు కథనాలు పేర్కొన్నాయి.శాంతి చర్చలపై విభేదాలుప్రస్తుతం అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇజ్రాయెల్ పాత్ర పరిమితంగా ఉండటం, ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా కొంత సడలింపు చూపుతుందనే అనుమానాలు నెతన్యాహు వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొత్తంగా ట్రంప్నకు యుద్ధం ముగింపు రాజకీయ లాభం అయితే, నెతన్యాహుకు ఇరాన్పై మరింత ఒత్తిడి కొనసాగించడం రాజకీయ అవసరంగా మారింది. ఈ విభిన్న లక్ష్యాలే ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల్లో కనిపిస్తున్న చీలికకు ప్రధాన కారణమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఇరాన్పై యుద్ధం.. ట్రంప్ను లైట్ తీసుకున్న నెతన్యాహు?
జెరూసేలం: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహాల మధ్య తీవ్రమైన వ్యత్యాసాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాల గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ముందే సమాచారం లేకపోవడం, ఆయనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో అమెరికాకు ఉన్న తిరుగులేని శక్తి పరిమితులను బహిర్గతం చేస్తున్నాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇటీవల ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా నెతన్యాహుతో మాట్లాడారు. ఇరాన్తో తాము జరుపుతున్న అణు చర్చలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ప్రతీకార దాడులకు వెళ్లవద్దని ఆయన ఇజ్రాయెల్ను కోరారు. అయితే, ఈ విజ్ఞప్తిని లైట్ తీసుకుంది. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్లోని వ్యూహాత్మక సైనిక స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలనే ట్రంప్ ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఈ పరిణామాలపై అమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీ తీవ్రంగా స్పందించారు. ఇది అమెరికా అగ్రరాజ్య హోదాకు, దాని శక్తికి అవమానకరం. దాడి చేయవద్దని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా నెతన్యాహును కోరినప్పటికీ, ఇజ్రాయెల్ వెనుకాడకుండా దాడికి తెగబడింది. ఇది పశ్చిమాసియాలో అమెరికా ప్రభావం ఎంతలా తగ్గిపోయిందో స్పష్టం చేస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో ఇరాన్తో త్వరలోనే ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం లేదా మంగళవారంలోగా సంతకాలు జరుగుతాయి అని కూడా ఆయన ప్రకటించారు. ఇరాన్ను ఉద్దేశించి మాట్లాడుతూ..‘మీరు క్షిపణులు ప్రయోగించారు. ఇక చాలు. ఇప్పుడు చర్చలకి రండి’ అని పిలుపునిచ్చారు. కానీ, ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడులు ఈ చర్చల ప్రక్రియను మరింత సంక్లిష్టం చేశాయి.మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దృక్పథం పూర్తిగా భిన్నంగా ఉంది.ఇరాన్ అణు ప్రణాళికలు,క్షిపణి సామర్థ్యాల విస్తరణ, ప్రాంతీయ ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ ఇస్తున్న మద్దతు..వీటన్నింటినీ ఇజ్రాయెల్ తన దేశ అస్తిత్వానికే ముప్పుగా భావిస్తోంది. అమెరికా కుదుర్చుకునే తాత్కాలిక దౌత్య ఒప్పందాలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపలేవని నెతన్యాహు నమ్ముతున్నారు.ఈ పరిణామాలు సాంప్రదాయ మిత్రదేశాలైన అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలలో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తనను తాను ఒక ‘ప్రపంచ శాంతి దూత’గా నిరూపించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన ఇమేజ్కు భంగం కలిగిస్తోంది. ఒకవేళ ఇరాన్తో అమెరికా ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఇజ్రాయెల్ దానిని అంగీకరించేలా లేదనే అభిప్రాయం అంతర్జాతీయ సమాజంలో బలంగా వ్యక్తమవుతోంది. -
ఇరాన్ కోసం మెట్టు దిగిన ట్రంప్.. భారీ ఆఫర్!
అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న అణు చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించిన తాజా శాంతి ఒప్పంద ముసాయిదాలో, ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల అంశంపై కొంత సడలింపు చూపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదని, పూర్తి వివరాలు రెండో దశ చర్చల్లో ఖరారు కావాల్సి ఉందని సమాచారం.ఇరాన్ అణు కార్యక్రమం చాలా కాలంగా అమెరికా, పాశ్చాత్య దేశాలకు ఆందోళన కలిగిస్తున్న అంశం. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి చేసిన యురేనియాన్ని దేశం వెలుపలికి తరలించాలని, లేదా పూర్తిగా నిర్వీర్యం చేయాలని డిమాండ్ చేసింది. అయితే తాజా చర్చల్లో ఇరాన్ తన అణు ఆయుధ కార్యక్రమాన్ని కొనసాగించబోమని హామీ ఇవ్వడం, అలాగే అణు నిల్వల భవిష్యత్పై ప్రత్యేక చర్చలకు అంగీకరించడం వల్ల చర్చల్లో పురోగతి కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక, ట్రంప్ గతంలో పలుమార్లు ఇరాన్ యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని, వాటిని ఇరాన్ వద్ద ఉంచబోమని ప్రకటించారు. కానీ తాజా అవగాహన ఒప్పందంలో యురేనియం నిల్వల నిర్వహణపై మరింత సౌలభ్యవంతమైన విధానం అవలంబిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ ఈ అంశంపై అమెరికా, ఇరాన్ వర్గాల నుంచి పరస్పర విరుద్ధ ప్రకటనలు వస్తుండటంతో తుది నిర్ణయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఐరాస ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో ఈ యురేనియం నిల్వలపై సంతకాల కార్యక్రమం జెనీవాలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జేడీ వాన్స్ పర్యటనకు అవసరమైన పరికరాలతో నాలుగు సీ-17 విమానాలు ఐరాపాకు ప్రయాణం అయ్యాయి.ఇదిలా ఉండగా, ఇరాన్ మాత్రం తమ శుద్ధి చేసిన యురేనియం దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని, దాన్ని విదేశాలకు తరలించే ఒప్పందం ఇప్పటివరకు కుదరలేదని స్పష్టం చేసింది. ఇరాన్ అధికారులు యురేనియం నిల్వలపై తుది నిర్ణయం భవిష్యత్ అణు చర్చల్లోనే తీసుకుంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటించిన శాంతి ప్రణాళిక అమల్లోకి వస్తే, హార్మూజ్ జలసంధి పునఃప్రారంభం, ఆంక్షల సడలింపు, అణు చర్చల కొనసాగింపు వంటి కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే యురేనియం నిల్వల భవితవ్యమే ఈ ఒప్పంద విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశంగా మారింది. -
ఒమన్ తీరంలో నౌకపై దాడి.. సురేష్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో వైజాగ్కు చెందిన మెరైన్ ఇంజినీర్ సురేశ్ పట్నాల మృతిచెందడం అత్యంత విషాదకరమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సురేశ్ పట్నాల ఉండటం మరింత కలచివేసిందని అన్నారు. ఒక మెరైన్ ఇంజినీర్ ఇలా అకాల మరణం చెందడం దురదృష్టకరమన్నారు. సురేష్ను కోల్పోయిన కుటుంబం ఎదుర్కొంటున్న వేదన మాటల్లో చెప్పలేనిదన్నారు.మృతుడు సురేశ్ పట్నాల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు వారికి ఇవ్వాలని కోరారు. సురేశ్ పట్నాల ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.ఒమన్ తీరంలో నౌకపై దాడివైజాగ్కు చెందిన మెరైన్ ఇంజినీర్ పత్నాల సురేష్ (44) విధులు నిర్వహించిన నౌకపై ఒమన్ తీరంలో అమెరికా సైన్యం మిసైళ్లతో దాడి జరిపింది. ఈ దాడిలో ఆయనతో పాటు మరో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జూన్ 10న హర్మూజ్ జలసంధిలోని ఒమన్ తీరంలో ‘ఎంటీ సెట్టెబెల్లో’ అనే ఆయిల్ ట్యాంకర్పై మిసైల్ దాడి సమయంలో జరిగింది. ఈ నౌక ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటూ నిబంధనల్ని ఉల్లంఘించే ప్రయత్నం చేసిందని అమెరికా సైన్యం ఆరోపించింది.ఎంటీ సెట్టెబెల్లో నౌకపై అమెరికా సైన్యం జరిపిన మిసైల్ దాడిలో సురేష్తో పాటు హిమాచల్ ప్రదేశ్ నివాసి ఆదిత్య శర్మ (23) ఉన్నారు. మూడవ బాధితుడు ఎవరనే పూర్తి వివరాలు వెలువడలేదు. సదరు బాధితుడు భారతీయుడేనని అధికారులు ధృవీకరించారు -
ట్రంప్ వార్నింగ్పై ఇరాన్ స్ట్రాంగ్ రియాక్షన్.. ఆయన భరించలేని..
టెహ్రాన్: ఇరాన్పై మరింత తీవ్రంగా దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికపై ఇరాన్ పార్లమెంట్లోని జాతీయ భద్రతా కమిటీ ఛైర్మన్ ఇబ్రహీం అజీజీ స్పందించారు. ట్రంప్నకు మరింత శక్తిమంతమైన, మరింత బాధాకరమైన ప్రతిస్పందన ఎదురవుతుందని అజీజీ వార్నింగ్ ఇచ్చారు."ట్రంప్నకు సరైన అవకాశాలు లేవు కాబట్టి అతని చర్యలను ముందుగానే ఊహించవచ్చు. ట్రంప్ దాదాపు ఎలాంటి విజయాలు సాధించలేదు. అమెరికా ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు ఏమీ అందని విధంగా ఆయన భారీ మూల్యం చెల్లించాడు. ఏదైనా తప్పుడు అంచనాతో అడుగు వేస్తే గతం కంటే మరింత బాధాకరమైన ప్రతిస్పందన వస్తుంది. ట్రంప్ హెచ్చరికలు భ్రమలు మాత్రమే. ఇరాన్ నుంచి వచ్చే ఏ ప్రతిస్పందనైనా ట్రంప్నకు భరించలేని పరిణామాలు తెచ్చిపెట్టవచ్చని ఆయనకు తెలుసు" అని ఆయన చెప్పారు. కాగా, యూఎస్ హెచ్చరికలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయం అంతర్జాతీయంగా నెలకొంది. -
గల్ప్ దేశాలకు కొత్త టెన్షన్
ప్రపంచానికి హెచ్చరిక.. ఇరాన్, అమెరికా మధ్య భీకర యుద్ధం మళ్లీ ప్రారంభం.. -
ప్రపంచ దేశాలకు షాకిచ్చిన ఇరాన్
ప్రపంచదేశాలకు ఇరాన్ మరోసారి పెద్ద షాక్ ఇచ్చింది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తాజా వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించింది. ఇకపై చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు, వాణిజ్య నౌకలు సహా ఏ దేశానికి చెందిన ఓడకూ హర్ముజ్ మార్గంలో ప్రయాణానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ఇరాన్ హెచ్చరికలు ఇంతటితో ఆగలేదు.నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే క్షిపణులు, నౌకాదళ బలగాలతో లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తామని ఇరాన్ సైనికాధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇటు అంతర్జాతీయంగానూ తీవ్ర ఆందోళన నెలకొంది.హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గం. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో తరలించే చమురు, సహజ వాయువులో దాదాపు 20 శాతం ఈ జలసంధి ద్వారానే గమ్యస్థానాలకు చేరుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల ఇంధన ఎగుమతులకు ఇదే ప్రధాన మార్గం. అందుకే హర్ముజ్ మూసివేత ప్రపంచ ఇంధన మార్కెట్లకు భారీ షాక్గా మారింది.ఇరాన్ ప్రకటన వెలువడగానే అంతర్జాతీయ చమురు మార్కెట్లు కుదేలయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా బ్యారెల్కు రెండు డాలర్లకుపైగా పెరిగాయి. సరఫరా సంక్షోభం మరింత తీవ్రమైతే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇంధన విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.మరోవైపు, అమెరికా మాత్రం పరిస్థితి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని చెబుతోంది. కొన్ని వాణిజ్య నౌకలు ఇప్పటికీ ప్రాంతంలో ప్రయాణిస్తున్నాయని, తమ యుద్ధనౌకలపై ఎలాంటి దాడులు జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే ఇరాన్ హెచ్చరికలతో అనేక నౌకా సంస్థలు ఇప్పటికే తమ ప్రయాణాలను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.ఈ పరిణామాలతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదలతో పాటు రవాణా వ్యయాలు, ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం మళ్లీ తలెత్తే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా–ఇరాన్ ఘర్షణ మరింత ముదిరితే హర్ముజ్ జలసంధి అంశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపే కీలక సంక్షోభంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
ఇరాన్పై అమెరికా భీకర దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. చర్చల ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ ఇరాన్పై అమెరికా భీకర దాడులకు దిగింది. దీంతో కాల్పుల విరమణ నామమాత్రంగానే మిగిలి.. పరిస్థితి మళ్లీ యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. ఇక హర్ముజ్ జలసంధి నుంచి గల్ఫ్ దేశాల వరకు యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటంతో ప్రపంచం ఉత్కంఠగా పరిణామాలను గమనిస్తోంది.అమెరికా బలగాలు తాజాగా దక్షిణ ఇరాన్లోని పలు కీలక స్థావరాలపై వరుసగా రెండో రోజు భారీ వైమానిక దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధికి సమీపంలోని వ్యూహాత్మక ప్రాంతాలు, రాడార్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, సైనిక మౌలిక సదుపాయాలే ప్రధాన లక్ష్యాలుగా చేసుకున్నాయి. ఈ దాడుల్ని అమెరికా స్వీయ రక్షణ దాడులుగా అభివర్ణించడం గమనార్హం. తాజా దాడుల్లో హర్మోజ్గాన్ ప్రావిన్స్లోని సిరిక్, మినాబ్, ఖేష్మ్ (Qeshm) దీవి, జాస్క్ పోర్టు పరిసర ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. బందర్ అబ్బాస్ సమీపంలో కూడా వైమానిక హెచ్చరిక వ్యవస్థలు చురుగ్గా పనిచేసినట్లు ఇరానియన్ మీడియా వెల్లడించింది. పలు రాడార్ కేంద్రాలు, వైమానిక రక్షణ స్థావరాలు లక్ష్యంగా దాడులు జరిగినట్లు సమాచారం.అంతేకాకుండా ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా భావించే అసలుయె ప్రాంతంలోని ప్రముఖ పెట్రోకెమికల్ ప్లాంట్పై కూడా అమెరికా దాడులు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇంధన, పెట్రోకెమికల్ రంగాలపై ఆధారపడిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.ఇదే సమయంలో రాజధాని టెహ్రాన్ పశ్చిమ ప్రాంతాల్లో ఎయిర్ సైరన్లు మోగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భద్రతా బలగాలు అప్రమత్తమై కీలక ప్రాంతాల్లో పహారా పెంచాయి. దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు.సంచలన వ్యాఖ్యలుఅమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలు ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి. "ఇరాన్ చర్చలకు ముందుకు రాకపోతే ఇక బాంబులతోనే మాట్లాడాల్సి వస్తుంది" అంటూ ఆయన చేసిన హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా దాడులు ఇరాన్ సామర్థ్యాలను దెబ్బతీసేలా, తమ సైనిక కార్యకలాపాలకు అనుకూల పరిస్థితులు సృష్టించేలా కొనసాగుతాయని హెగ్సెత్ స్పష్టం చేశారు. ఇరాన్ స్పందనఅమెరికా చర్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తప్పుడు నెపాలతో దాడులకు పాల్పడుతోందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఆరోపించారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కూడా ఈ దాడులను ఖండిస్తూ తగిన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా, అమెరికా దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ తదితర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు సమాచారం. అయితే ఆ దేశాలు చాలా వరకు వాటిని అడ్డుకున్నట్లు ప్రకటించాయి. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతమంతా హైఅలర్ట్లోకి వెళ్లింది. తాజా పరిణామాలు చూస్తే అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కేవలం పరిమిత ప్రతీకార దాడుల దశ దాటి.. మరింత విస్తృత ఘర్షణ వైపు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి భద్రత, చమురు సరఫరాలు, గల్ఫ్ దేశాల స్థిరత్వంపై ఈ సంక్షోభం ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
మూల్యం చెల్లించుకోవాల్సిందే : ఇరాన్కు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఇరాన్పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమతో ఒప్పందానికి రాకుండా, గ్రేట్ డీల్ను మిస్ చేసుకుంది అంటూ ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందంటూ హెచ్చరించారు. ఇరాన్తో చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని పదే పదే ప్రకటించే ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైన్యం పూర్తిగా ఓడిపోయింది, అన్నీ ఉత్తమాటలే, చేతలేమీ లేవు అంటూ తన ‘ట్రూత్ సోషల్’ (Truth Social) ప్లాట్ఫామ్లో ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ సైనిక సామర్థ్యం దారుణంగా క్షీణించిందని, మంచి ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాన్ని ఇరాన్ నాయకత్వం చేజేతులా వృధా చేసుకుందన్నారు. ఇరాన్ సైన్యం పూర్తిగా అతలాకుతలమైంది. అసలు నౌకాదళం, వాయుసేన వంటి చాలా విభాగాలు ఉనికిలోనే లేవు, పూర్తి ఓటమి పాలయ్యారంటూ అని ట్రంప్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. అంతేకాదు అంతా మాటలే.. చేతల్లో ఏమీ లేదు. మిడిల్ ఈస్ట్ పెత్తందారు కథ ముగిసింది!!! అంటూ ఇరాన్పై ధ్వజమెత్తారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన గడువును ప్రస్తావిస్తూ చర్చలను తెగనీయకుండా సాగదీశారని ఇరాన్ నేతలను విమర్శించారు. ఎంతో మేలు చేకూర్చే ఒప్పందంపై చర్చలకు చాలా సమయం తీసుకున్నారు,ఇప్పుడు దానికి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!!!" అని ఆయన హెచ్చరించారు. > ఇదీ చదవండి: భర్తను అలా చూసి కారు బోనెట్పైకి భార్య చివరికి.. వైరల్ వీడియోఇరాన్ లక్ష్యాలపై అమెరికా ఇటీవల జరిపిన దాడుల నేపథ్యంలో వాషింగ్టన్తో చర్చల భవిష్యత్తుపై తాము పునఃసమీక్షిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయ్ స్పందిస్తూ.. అమెరికా పరస్పర విరుద్ధమైన వైఖరిని అవలంబిస్తూ, కాల్పుల విరమణ అవగాహనలను పదేపదే ఉల్లంఘిస్తూ దౌత్య ప్రక్రియను దెబ్బతీస్తోందని ఆరోపించారు.అయితే మధ్యప్రాచ్యంలో పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నప్పటికీ, గత కొన్ని వారాలుగా చర్చలు ఒక కొలిక్కి వస్తున్నాయని ఆయన పలుమార్లు పేర్కొన్నారు. ఇరాన్తో గ్రీట్ డీల్కి చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ పదేపదే చెబుతూ వస్తున్నప్పటికీ, దీన్ని ఇరాన్ ఖండిస్తూ వస్తోంది. సైనిక దాడులు కొనసాగుతున్నంత కాలం దౌత్యం విజయవంతం కాలేదని స్పష్టం చేస్తూ మొదటినుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తకాగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో అమెరికాకు చెందిన 'అపాచీ' దాడి హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేసిందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, నిఘా కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. ఈ తాజా ఘర్షణల తర్వాతే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. జోర్డాన్, బహ్రెయిన్లలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేసింది. ఇది మధ్యప్రాచ్యంలో మరింత పెద్ద ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందేమోనన్న ఆందోళనలను పెంచింది.ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్ -
రెండు వారాల్లో కీలక ప్రకటన: ట్రంప్
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడిు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు.అమెరికా హెలికాప్టర్ అపాచీపై దాడి చేసింది ఇరాన్ అని ఆరోపించారు. ఈ ఘటనపై ఎట్టిపరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతామని ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం మరోసారి తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు చేసింది. అమెరికా స్థావరాలపై మొత్తం 21పైగా దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు, నిఘా రాడార్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా గతంలో జరిపిందని దానికి ప్రతిచర్యగా ఈ అటాక్ చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.అయితే డొనాల్ట్ ట్రంప్ సైతం ఈ దాడులపై గుర్రుగా ఉన్నారు. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ను కూల్చివేసింది. ఇరాన్ అని దానికి ఎట్టిపరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతామన్నారు. యుద్ధంలో అమెరికా తన అధిపత్యాన్ని కొనసాగిస్తోందని మరో రెండు వారాల్లో ఇరాన్పై సంపూర్ణ విజయం ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆ ప్రకటనతో చమురు ధరలు సైతం దిగొస్తాయని ప్రకటించారు.అయితే ఈ వ్యాఖ్యలపై ఇరాన్ సైతం ఘూటుగానే బదులిచ్చింది. ఎలాంటి దాడి జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రతిదాడి తీవ్రంగా జరుగుతుందని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమిన్ నెతన్యాహు సైతం ఇరాన్పై దాడులు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. "అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి మూల్యాలు చెల్లించాల్సి వచ్చినా.. ఆ పరిస్థితికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన కేబినెట్ వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధం మరోసారి తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. -
మేమే గెలిచాం.. యుద్ధం ముగింపుకు రాయబారాలు
-
భారతీయ నౌకపై దాడి.. 24 మంది నావికులు..!
టెహ్రాన్: హర్ముజ్లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ రోజు (సోమవారం) ఒమన్ తీర సమీపంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై దాడి జరిగింది. దీంతో భారత వాయుసేన తక్షణమే స్పందించి అందులోని నావికులను రక్షించింది. దీంతో పెనుప్రమాదం తప్పింది.ఒమన్ తీర సమీపంలో 'ఎంటి మారివెక్స్'అనే ఆయిల్ సరఫరా చేస్తున్న నౌకలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో నౌకలో 24మంది నావికులు ఉన్నారు. దీంతో హుటాహుటీన స్పందించిన నావిక దళం వారందరినీ హెలికాప్టర్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రస్తుతం వారందరూ క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఈ దాడి ఎవరూ చేశారని సమాచారం ఇంకా తెలియలేదు. కాగా ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తకరంగా మారాయి. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్ఫరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్తో సహా పలు ప్రాంతాలలో భారీగా పేలుళ్లు సంభవించాయి. ట్రంప్ మాటలు లెక్కచేయకుండా ఇజ్రాయెల్ ఇరాన్పై విరుచుకపడింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్, సిరియా దేశాలు గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.Helicopter rescue operation underway for 24 Indian seafarers after vessel Marivex was struck off the coast of OmanFootage from the scene show the crew being lifted from the damaged vessel after fighting for survival at sea pic.twitter.com/crlSDYaU6y— RT (@RT_com) June 8, 2026 -
మళ్లీ ఉద్రిక్తతలు.. ఆ దేశం విడిచి వెళ్లండి: భారత్
టెల్ అవీవ్: పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్న నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు సోమవారం హెచ్చరికలు జారీ చేశాయి. భారతీయులు ఇరాన్కు ప్రయాణించవద్దని, ప్రస్తుతం అక్కడ ఉన్నవారు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా వెంటనే దేశం విడిచి వెళ్లాలని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాయం సూచించింది.గత 24 గంటల్లో పలు నగరాల్లో సైనిక చర్యలు, వ్యూహాత్మక కేంద్రాలపై వైమానిక దాడులు, భారీ క్షిపణి దాడులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. “ఆ ప్రాంతంలో తాజా పరిణామాల దృష్ట్యా, ఇరాన్కు ప్రయాణించవద్దన్న మా గత సూచనను మరోసారి తెలుపుతున్నాం. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల ద్వారా వెంటనే బయటకు రావాలి” అని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.ఇక ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం 100వ రోజుకు చేరుకున్న వేళ, సోమవారం రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో ఇప్పటికే సున్నితంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం తీవ్ర ప్రమాదంలో పడింది. ప్రాంతీయ స్థాయిలో మళ్లీ పూర్తి స్థాయి యుద్ధం చెలరేగే భయం నెలకొంది.ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ బలగాలు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్కు చెందిన నౌకల రాకపోకలను నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి. ఎర్ర సముద్రం ప్రపంచ వాణిజ్య రవాణాకు అత్యంత కీలక సముద్ర మార్గం. తాజా సైనిక చర్యల్లో ఇరాన్లోని ఒక పెట్రోకెమికల్ సముదాయంపై దాడి జరగగా, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ మాత్రం రెండు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతీకార చర్యలు చేపట్టవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ను కోరిన కొద్ది గంటలకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఇజ్రాయెల్ బీరూట్ దక్షిణ శివార్లపై వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి. దానికి ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేపట్టింది. అనంతరం సోమవారం ఇరు పక్షాలు మళ్లీ పరస్పర దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.ఇజ్రాయెల్లోనూ.. టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో చేసిన పోస్టులో.. భారతీయులు ఇజ్రాయెల్ అధికారులు, హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసే భద్రతా సూచనలను కచ్చితంగా పాటించాలని సూచించింది.“ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్లోని భారతీయులు అన్ని వేళలా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇజ్రాయెల్ అధికారులు, హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసే భద్రతా మార్గదర్శకాలు, సూచనలను కచ్చితంగా అనుసరించాలి” అని తెలిపింది.అధికారిక మార్గాల ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని, హోమ్ ఫ్రంట్ కమాండ్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న భద్రతా సూచనలను పరిశీలించాలని రాయబార కార్యాలయం సూచించింది.భారతీయులు తమ నివాసాలు, కార్యాలయాల సమీపంలోని ఆశ్రయ కేంద్రాల గురించి తెలుసుకుని, వాటికి దగ్గరగా ఉండాలని తెలిపింది. తమ నివాసం లేదా ఉద్యోగ ప్రాంతం వద్ద ఉన్న ఆశ్రయ ప్రదేశాల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించింది.తదుపరి సమాచారం వచ్చే వరకు ఇజ్రాయెల్లో అనవసర ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించింది. స్థానిక వార్తలు, అధికారిక ప్రకటనలు, అత్యవసర హెచ్చరికలను నిరంతరం గమనించాలని భారతీయులకు సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో భారత రాయబార కార్యాలయాన్ని 24 గంటల సహాయ కేంద్రం ద్వారా సంప్రదించాలని తెలిపింది. -
ఇరాన్ కు వెళ్లొద్దు.. ఇండియన్స్ కు భారత్ మెసేజ్
-
స్టాక్ మార్కెట్ క్రాష్.. వణికిపోతున్న సూచీలు!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో కదులుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తత మళ్లీ పెరగడంతో భారత ప్రామాణిక సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ పడిపోయాయి. వార్తల ప్రకారం, ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణులను ప్రయోగించింది. ఇది అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఆశలపై నీరు పోసింది. ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ 188.20 పాయింట్లు లేదా 0.81 శాతం క్షీణించి 23,178.50 వద్ద, సెన్సెక్స్ 610 పాయింట్లు లేదా 10.82 శాతం క్షీణించి 73,632.85 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.51 శాతం, 1.52 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ మెటల్ ఎక్కువగా క్షీణించగా, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ మంచి పనితీరు కనబరుస్తున్నాయి. -
ఇరాన్ ఆస్తులపై అమెరికా షాకింగ్ నిర్ణయం..?
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్ ను రెచ్చగొడుతున్నారు. విదేశాల్లో ఫ్రీజైన ఇరాన్ ఆస్తులను గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి సాయంగా అందించే యోచన చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే అసలే అమెరికా ఆంక్షలతో మండిపడుతున్న ఇరాన్ ఈ వ్యవహారంతో చర్చలకు పూర్తిగా ఫులిస్టాప్ పెట్టే అవకాశం ఉంది.పశ్చిమాసియా యుద్ధం తాలూకా విధ్వంసం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్ ప్రతీకారంతో హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో చమురు సంక్షోభం తలెత్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కారణంతో ప్రపంచ దేశాలు ట్రంప్పై మండిపడ్డాయి. పరిస్థితి తీవ్ర స్థాయికి చేరడంతో అమెరికా కొంత తగ్గి ఇరాన్తో చర్చల ఒప్పందం కోసం యత్నించింది. అయితే అమెరికా షరతులకు ఇరాన్ ససేమిరా అనడంతో రాజీ కుదరలేదు. అయితే ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం పాటించడంతో పరిస్థితులు కొంతమేర ప్రశాంతంగా ఉన్నాయి. ఇదంతా తెలిసిన కథేఅయితే మరోసారి అమెరికా ఇరాన్ను రెచ్చగొట్టే యత్నం చేస్తుంది. ఇరాన్ డిమాండ్లలో ప్రధానమైనవి ఫ్రీజ్ చేసిన తమ దేశ ఆస్తులను వెంటనే విడుదల చేసి యుద్ధ నష్టానికి తగిన పరిహారం అందించడం. అయితే అమెరికా మాత్రం ప్రస్తుతం ఆ డబ్బులను గల్ఫ్ దేశాల్లో జరిగిన నష్టానికి పరిహారంగా అందించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాపై ప్రతీకారంతో ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడి చేయడంతో అక్కడి మౌళిక స్థావరాలు చాలా వరకూ దెబ్బతిన్నాయి. దీంతో ఆదేశాలు ట్రంప్పై గుర్రుగా ఉన్నాయి. దీంతో వాటిని శాంతపరిచేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ ఆస్తులు విదేశాల్లో ఎందుకు ?ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు,సహజ వాయువు ఉత్పత్ చేసే దేశాలలో ఒకటి. అది ఇతర దేశాలకు చమురును విక్రయించినప్పుడు, ఆయా దేశాలు ఇరాన్కు చెల్లించాల్సిన కోట్లాది డాలర్ల డబ్బు అంతర్జాతీయ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. దీంతో అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ సొమ్మును అమెరికా లీగల్గా బ్లాక్ చేసింది. ఇవే కాకుండా ఆంక్షలు రాకముందు విదేశాలలో ఇరాన్ ప్రభుత్వం కొనుగోలు చేసిన భవనాలు, భూములు లేదా ఇతర కంపెనీలలో పెట్టిన పెట్టుబడులు.బంగారు నిల్వలను సైతం అమెరికా బ్లాక్ చేసింది.ఎంత డబ్బు ఫ్రీజ్ అయ్యింది.?ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 బిలియన్ డాలర్ల నుండి 123 బిలియన్ డాలర్లు సుమారుగా రూ. 8.3 లక్షల కోట్ల నుండి రూ. 10.2 లక్షల కోట్ల డబ్బు ఫ్రీజైనట్లు విశ్లేషకుల అంచనా అయితే, ఇందులో నేరుగా అమెరికా నియంత్రణలో నేరుగా అమెరికా నియంత్రణలో దాదాపు 24 బిలియన్ డాలర్లు ఉంది. ఆడబ్బుని వెంటనే చెల్చించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.మిగతా కరెన్సీ దక్షిణ కొరియా, జపాన్, యూరప్, మరియు కొన్ని గల్ఫ్ దేశాల బ్యాంకుల్లో ఉన్నాయి. ఇరాన్ ఆయా దేశాలకు చమురు అమ్మగా వచ్చిన డబ్బు అది. కానీ అమెరికా విధించిన బ్యాంకింగ్ ఆంక్షల భయం వల్ల ఆ దేశాలు ఇరాన్కు ఆ డబ్బు ఇవ్వకుండా తమ వద్దే నిలిపివేశాయి. అయితే ప్రస్తుతం ఆ డబ్బులను గల్ఫ్ దేశాల పునర్నర్మాణం కోసం వాడాలని అమెరికా భావిస్తోంది. ఇదే జరిగితే ఇక యుద్ధం తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉంది. -
పాక్ గాలితీసిన భారత మాజీ ఆర్మీచీఫ్
కోల్కతా: భారత రిటైర్డ్ ఆర్మీ చీఫ్ ఎం.ఎం నరవణే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్- అమెరికా మధ్య పాక్ మధ్యవర్తిత్వం ఒట్టిమాటే అన్నారు. పాక్ చేసేది మధ్యవర్తిత్వం కాదని కేవలం కొరియర్ సర్వీస్ మాత్రమేనన్నారు. కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.భారత మాజీ సైన్యాధిపతి నరవణే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన రాసిన "ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ" పుస్తకం విడుదల కాకముందే దేశంలో ప్రకంపనలు సృష్టించింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకంలోని పలు అంశాలను ప్రస్థావించడంతో లోక్సభలో పెద్ద దుమారం చేలరేగింది. కాగా తాజాగా నరవణే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై మాట్లాడారు.నరవణే మాట్లాడుతూ" ఇటీవల ఇస్లామాబాద్లో జరిగిన చర్చలలో పాక్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు చెబుతోంది. కానీ అది కేవలం కొరియర్ సర్వీస్ మాత్రమే, జాతీయ భద్రత ఎప్పుడూ ఆర్థిక భద్రతపైనే ముడిపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థే అన్నింటిని నడిపిస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి ఒడిదొడుకులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.ప్రపంచ వాణిజ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రయత్నాలు ఎల్లప్పుడూ స్వయం సమృద్ధిపైనే ఉండాలి" అని అన్నారు.ఇటీవల పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగాయి. కాగా ఇవి ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందం పాటిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధంతో హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో చమురు రవాణాకు ఆటంకం తలెత్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. -
హార్ముజ్ జలసంధిలో యుద్ధం.. పెట్రోల్, డీజిల్ దొరకటం కష్టమేనా?
-
ఈ ఒక్క కారణంతో భయంకర ఆపరేషన్, దాడులు ఆగిపోయి..
ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వను చాలా లోతైన, బలమైన, రక్షణతో కూడిన ప్రదేశంలో భద్రపరచి ఉంచారా? ప్రస్తుతం దాన్ని బయటకు తీసుకురావడం లేదా వినియోగించడం సులభం కాదా? ఆ నిల్వ తక్షణ ప్రమాదం సృష్టించే స్థితిలో లేదని ట్రంప్ అంటున్నారు. అందువల్ల దాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా వెంటనే సైనిక చర్య చేపట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ ఒక్క కారణంతో ఎంత పెద్ద యుద్ధం ఆగిందో తెలుసా?పశ్చిమాసియా ఘర్షణ మళ్లీ తెరపైకి వచ్చిన వేళ వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య సున్నితమైన దౌత్య చర్చలు కొనసాగుతున్న సమయంలో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పలు వివరాలు తెలిపారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వెలికితీసేందుకు అమెరికా సైన్యాన్ని ఇరాన్లోకి పంపే సైనిక ప్రణాళికను పరిశీలించినప్పటికీ చివరకు తిరస్కరించినట్టు ట్రంప్ తెలిపారు.ట్రంప్ తెలిపిన వివరాలు ప్రకారం.. సరిహద్దులు దాటి చేపట్టాల్సిన ఆ ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమని తేలింది. భారీ స్థాయి సైనిక సమీకరణ అవసరమయ్యేది. ఆ క్లిష్టమైన మిషన్ పూర్తి కావాలంటే కనీసం 2 వారాలు పట్టేదని, భారీ స్థాయిలో సైనిక సామగ్రిని ఇరాన్ భూభాగంలోకి తరలించాల్సి వచ్చేదని చెప్పారు. సున్నితమైన అణు పదార్థాన్ని "న్యూక్లియర్ డస్ట్"గా పేర్కొన్న ట్రంప్.. ఆ నిల్వను స్వాధీనం చేసుకునే పలు మార్గాలను పెంటగాన్ అధికారులు పూర్తిగా పరిశీలించారని తెలిపారు.యురేనియం సమాధిలో పాతిపెట్టినట్టే.. సైనిక ప్రణాళికను నిలిపివేసినా అలాంటి చర్య చేపట్టే శక్తి వాషింగ్టన్కు ఇప్పటికీ ఉందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. "మేము ఇప్పుడే దాన్ని తీసుకోగలం" అని ట్రంప్ అన్నారు. "మనం అనుకుంటే వాళ్లు మమ్మల్ని అడ్డుకోలేరని నేను భావిస్తున్నాను. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. అది సమాధిలో పాతిపెట్టినట్టే ఉంది" అని చెప్పారు. ఆ పదార్థం ప్రస్తుతం సురక్షితంగానే ఉందని, తక్షణ జోక్యం అవసరం లేదని పేర్కొన్నారు. శుద్ఙచేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలంటే టెహ్రాన్తో అధికారిక దౌత్య ఒప్పందం అవసరం లేదని కూడా చెప్పారు.అమెరికా అధ్యక్షుడు, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో ముఖాముఖి భేటీపై ఆసక్తి లేదని తెలిపారు. అయితే, వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య దౌత్యం ఖరారైతే, అలాంటి ఉన్నత స్థాయి సమావేశం జరగవచ్చని అంగీకరించారు. "అది జరిగితే... నేను గౌరవప్రదంగానే వ్యవహరిస్తాను" అని ట్రంప్ చెప్పారు.మొజ్తబా ఖమేనీ, తన తండ్రి హత్య అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని చేపట్టారు. ఆయన తండ్రి అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడిలో మరణించారు. ఖమేనీ కుటుంబ సభ్యులపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కచ్చితమైన దాడులు చేసినప్పటికీ, మొజ్తబా ఖమేనీ సరైన వైఖరి ప్రదర్శిస్తారని తాను ఆశిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. "మేము అతని తండ్రి, అతని భార్య, అతని కుమారుడిని చంపాము. కాబట్టి నేనంటే ఆయను ఇష్టం ఉండకపోవచ్చు. కానీ కొన్ని వర్గాల్లో కాయనకు చాలా మంచి పేరు ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇలాంటి కఠిన వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ.. అక్సియోస్ ప్రచురించిన కథనం ప్రకారం, అమెరికా సీనియర్ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ గురువారం టెన్నెసీలోని ఓక్ రిడ్జ్కు వెళ్లి, ఇరాన్తో జరగబోయే అణు చర్చల్లో కీలక పాత్ర పోషించనున్న సాంకేతిక నిపుణులతో సమావేశమయ్యారు.వైట్ హౌస్, యుద్ధ చర్యలు నిలిపివేయడం, సమగ్ర అణు చర్చలు ప్రారంభించడం లక్ష్యంగా టెహ్రాన్తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే చర్చలకు సంబంధించిన సమాచారం తెలిసిన అమెరికా అధికారులు, ప్రాంతీయ మధ్యవర్తులు తెలిపినట్టు, ప్రతిపాదిత ఒప్పందంలోని కీలక అంశాలపై రెండు ప్రభుత్వాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి.ఈ అత్యంత కీలక చర్చలు తుది దశలో ఉన్నట్టు సమాచారం వచ్చినా, స్పష్టమైన పురోగతి సాధించే అవకాశం ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఓ అమెరికా అధికారి, ఓక్ రిడ్జ్కు ఉన్నత స్థాయి ప్రతినిధుల పర్యటన ఒప్పందం ఖరారవుతుందనే హామీ కాదని, అయితే చర్చలు తీవ్రమైన దశలోకి ప్రవేశించాయని సూచించే స్పష్టమైన సంకేతమని చెప్పారు.అయితే ఈ విభేదాలు ఇప్పటికీ దౌత్య ప్రక్రియకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఇరాన్ శుద్ఙచేసిన యురేనియాన్ని సాఫ్ట్ చేసే ప్రక్రియ పూర్తి చేయాలంటూ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా 60 రోజుల గడువు కోరుతోంది. ఇరాన్ మాత్రం 90 రోజుల గడువుపై పట్టుదలగా ఉంది.ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు ఒకరు మీడియాతో మాట్లాడుతూ, నిలిపివేసిన యూఎస్డీ 24 బిలియన్ ఆస్తుల విషయంలో దౌత్య చర్చలు ప్రతిష్ఠంభనలో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు నిర్ణయం ట్రంప్ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. -
పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడు
పశ్చిమాసియాలో ఉద్రికత్తల మధ్య కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ చేసిన దాడిలో ఒక భారతీయుడు మరణించిన వైనం విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన మంజూర్ అహ్మద్ (55) దాదాపు 30 ఏళ్లుగా కువైట్లో టైలర్గా పని చేస్తున్నారు. మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.జూన్ 8న రత్లాం జిల్లాలో జరగాల్సిన మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు మంజూర్ ఇంటికి తిరిగి రావాలనుకున్నాడు. బుధవారం ఉదయం 7:30 గంటలకు ముంబైకి విమానంలో వచ్చి, అక్కడి నుండి రైలులో తన సొంత ఊరైన ఉజ్జయినికి వెళ్లాలని అనుకున్నారు. విమానం ఎక్కడానికి ఒక రోజు ముందు, తన కుమారుడు అనస్ అహ్మద్తో మాట్లాడి, రైల్వే స్టేషన్ నుండి తనను తీసుకువెళ్లడానికి రమ్మని చెప్పారు. గత ఏడాది అక్టోబర్ తర్వాత భారత్కు తిరిగి వస్తున్న అతనికి ఎంతో సంతోషంగా పూలమాలలతో స్వాగతం చెప్పేందుకు సిద్ధమవు తుండగా, ఈ విషాద వార్త వారి చెవిని పడిందని అహ్మద్ కుమారుడు అనస్, తండ్రితో జరిగిన ఆ చివరి ఫోన్ సంభాషణను గుర్తు చేసుకున్నారు. నాగదా రైల్లో వస్తానని చెప్పారు.. రిసీవ్ చేసుకోడానికి రమ్మన్నారు.. కానీ అది చివరి కాల్ అవుతుందని అనుకోలేదని కంటతడిపెట్టారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. శుక్రవారం ఆయన మృతదేహాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయానికి తరలించారు, ఆ తర్వాత బంధువులు అంత్యక్రియల కోసం రోడ్డు మార్గంలో ఉజ్జయినికి తీసుకువెళ్లారు.మరోవైపు భారత్ ఈ దాడిని ఖండించింది. దాడులను నిలిపివేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) పిలుపునిచ్చింది.ఆ ప్రాంతంలోని భారతీయ రాయబార కార్యాలయాలు , కేంద్రాలు అప్రమత్తంగా ఉన్నాయని, అక్కడి భారతీయ సమాజానికి చురుకుగా మద్దతునిస్తూనే ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్పై దాడి చేసి, 86 ఏళ్ల సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని హతమార్చడంతో మధ్యప్రాచ్య యుద్ధం చెలరేగింది. దీనికి ప్రతిస్పందనగా, టెహ్రాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులపై దాడులు ప్రారంభించింది. మార్చిలో కువైట్లోని ఒక విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ జరిపిన దాడుల్లో ఒకరు , అదే నెలలో యూఏఈ రాజధాని అబుదాబిలో క్షిపణిని అడ్డగించడం వల్ల వెలువడిన శకలాల కింద పడి మరికొరు ఇలా ఈ దాడుల్లో ఇప్పటివరకు 10 మంది భారతీయులు మృతి చెందారు. -
ఆయతుల్లా ఖమేనీ చివరి క్షణాల్లో ఏం జరిగింది..?
టెహ్రాన్: ఆయతుల్లా ఆలీ ఖమేనీ మృతి ప్రపంచాన్ని ఎంత దిగ్భ్రాంతికి గురిచేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఆయన మృతిచెందడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ దాడికి ముందు ఖమేనీ గడిపిన క్షణాల గురించి ఆ దేశ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తొలిసారిగా బహిరంగంగా పంచుకున్నారు.ఇరాన్- అమెరికా యుద్ధం మెుదలయి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. అయినా ఈ యుద్ధం ముగింపు అంశంలో ఎటువంటి స్పష్టత లేదు. ఇన్ని రోజుల ఈ యుద్ధంలో అత్యంత భయానక అంశం ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడి చేసి చంపడం.. ఆయన మృతితో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. అయితే ఆ సందర్భంలో ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీ దాడి చేసిన ప్రాంతంలోనే ఉన్నానని తెలిపారు.ఈ రోజు (శుక్రవారం) అబ్బాస్ అరాగ్చీ పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. "ఇరాన్పై దాడులు ప్రారంభం అయ్యాక.. సుప్రీం లీడర్ని సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని కోరాం. దానికి ఆయన నిరాకరించారు. ఇరాన్ ప్రజలందరికీ సురక్షితమైన ప్రదేశానికి ప్రవేశం లభించేంత వరకు తాను ఎటువంటి ఆశ్రయానికి గానీ, సురక్షిత ప్రాంతానికి గానీ వెళ్ళనన్నారు... నా ప్రజలకు ఏది జరిగినా, అది నాకు కూడా జరుగుతుంది ," అని ఖమేనీ అన్నట్లు అరాఘ్చి తెలిపారు.సుప్రీం లీడర్పై దాడి జరిగిన సమయంలో తాను ఆ ప్రాంతంలోనే ఉన్నానని ఆ దాడిలో ఆయనకు ఏమయిందా అని కలవర పడ్డానని తెలిపారు. అయితే దాడులకు ఇరాన్ ఇచ్చిన ప్రతీకారం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఎంతో కలవరపాటుకు గురిచేసిందన్నారు. అదే విధంగా ఇరాన్ పొరుగు దేశాల్లో అమెరికా స్థావరాలు లేకపోయి ఉంటే వాటిపై దాడులు జరిగేవి కావన్నారు. పస్తుతం సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సర్వాధికారాలు కలిగి ఉన్నారని కొత్త సుప్రీం లీడర్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతన్నామన్నారు. అతని ఆదేశాలను యుథాతధంగా అమలు చేస్తున్నామన్నామన్నారు. ఆయుతుల్లా ఖమేనీకి ఏలాంటి గౌరవం దక్కేదో ఇతనికీ అదే విధమైన గౌరవం దక్కుతుందన్నారు. -
పాకిస్తాన్కు కొత్త టెన్షన్.. బాంబు పేల్చిన ఇజ్రాయెల్
ఇరాన్–అమెరికా మధ్య కొనసాగుతున్న శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశం పాత్రను ఇజ్రాయెల్ బహిరంగంగా ప్రశ్నిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి."ఇజ్రాయెల్ దృష్టిలో పాకిస్థాన్ విశ్వసనీయ మధ్యవర్తి కాదు. మధ్యవర్తిత్వం చేసే దేశం అన్ని పక్షాల విశ్వాసాన్ని పొందాలి. పాకిస్థాన్ విషయంలో అలాంటి పరిస్థితి లేదు" అంటూ రూవెన్ అజర్ స్పష్టం చేశారు. ఇరాన్కు సంబంధించిన సున్నితమైన అంశాల్లో పాకిస్థాన్ పాత్రపై తమకు సందేహాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.అమెరికా లేదా ఇతర దేశాలు తమ వ్యూహాత్మక అవసరాల కోసం పాకిస్థాన్ను సంప్రదించవచ్చని, అయితే అది ఇజ్రాయెల్ అభిప్రాయాన్ని మార్చదని అజర్ వ్యాఖ్యానించారు. తమకు ప్రధానంగా ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిరోధం, అలాగే ఇరాన్ ప్రభావాన్ని నియంత్రించడమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.పాకిస్థాన్పై ఎందుకు అనుమానాలు?ఇజ్రాయెల్ అభిప్రాయం ప్రకారం మధ్యవర్తిగా వ్యవహరించే దేశం తటస్థ వైఖరిని కలిగి ఉండాలి. అయితే పాకిస్థాన్కు ఇప్పటికీ ఇజ్రాయెల్తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు. అంతేకాకుండా, గతంలో ఇజ్రాయెల్ విధానాలపై ఇస్లామాబాద్ చేసిన విమర్శలు కూడా ఆ దేశ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అజర్ సూచించారు. ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న పరోక్ష చర్చల్లో పాకిస్థాన్ పాత్ర పెరిగిందనే వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఇస్లామాబాద్ దౌత్య సామర్థ్యంపై మరోసారి చర్చ మొదలైంది.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ..ఇరాన్ అణు కార్యక్రమం, పశ్చిమాసియాలో పెరుగుతున్న భద్రతా సవాళ్లు, ప్రాంతీయ మిలిటెంట్ సంస్థల కార్యకలాపాలు ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ప్రధాన చర్చాంశాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా, యూరోపియన్ దేశాలు, గల్ఫ్ దేశాలు ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటి సమయంలో పాకిస్థాన్ను మధ్యవర్తిగా అంగీకరించలేమన్న ఇజ్రాయెల్ వ్యాఖ్యలు కొత్త దౌత్య చర్చలకు తెరతీశాయి.భారత్పై ప్రశంసలుఇదే సందర్భంగా భారత్ పాత్రను కూడా రూవెన్ అజర్ ప్రశంసించారు. పశ్చిమాసియాలో స్థిరత్వం తీసుకురావడంలో భారత్కు కీలక పాత్ర ఉందని, ప్రాంతీయ శాంతి ప్రయత్నాల్లో న్యూఢిల్లీ ప్రభావం గణనీయంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. భారత్తో ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.78 ఏళ్లుగా దూరంగానే పాక్–ఇజ్రాయెల్పాకిస్థాన్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ఎప్పటినుంచో సంక్లిష్టంగానే ఉన్నాయి. 1947లో పాకిస్థాన్, 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ఇస్లామాబాద్ ఆ దేశాన్ని అధికారికంగా గుర్తించలేదు. పాలస్తీనా ప్రజల హక్కులకు మద్దతుగా నిలుస్తూ, స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడే వరకు ఇజ్రాయెల్ను గుర్తించబోమనే వైఖరిని కొనసాగిస్తోంది. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు జిన్నా కూడా పాలస్తీనా అంశంలో అరబ్ దేశాలకు మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి ఆ విధానం పాకిస్థాన్ విదేశాంగ విధానంలో కీలక భాగంగా కొనసాగుతోంది. అధికారిక సంబంధాలు లేకపోయినా, గతంలో రెండు దేశాల మధ్య పరోక్ష స్థాయిలో సంప్రదింపులు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ, ఇప్పటికీ రెండు దేశాల మధ్య రాయబార కార్యాలయాలు లేవు. దౌత్య సంబంధాలు కూడా నెలకొనలేదు.ఇక రూవెన్ అజర్ తాజా వ్యాఖ్యలతో పాకిస్థాన్ మధ్యవర్తిత్వ సామర్థ్యం, ఇరాన్ అంశంలో దాని పాత్ర, అలాగే మధ్యప్రాచ్య దౌత్య సమీకరణాలపై కొత్త చర్చ ప్రారంభమైంది. పాకిస్థాన్ నుంచి అధికారిక స్పందన కోసం అంతర్జాతీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. -
ఇరాన్ భారీ షాక్.. కువైట్లో హైఅలర్ట్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజ్ చేరుకున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ దాడులు చేసింది. కాగా, ఇరాన్ దాడితో కువైట్లో హైఅలర్ట్ ప్రకటించారు. దాడిలో విమానాశ్రయ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. కాగా, అమెరికా-ఇరాన్ సీజ్ఫైర్ తర్వాత ఇదే అతిపెద్ద దాడి కావడం గమనార్హం. ఇక, ఇరాన్ దాడుల కారణంగా కొన్ని గంటల పాటు విమానాశ్రయాన్ని మూసివేశారు. అనంతరం 4వ టెర్మినల్లో కార్యకలాపాలు ప్రారంభించినట్టు అధికారులు చెప్పారు. అయితే, బహ్రెయిన్ లక్ష్యంగా వచ్చిన మూడు క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు వెంటనే అడ్డుకుని కూల్చివేశామని పేర్కొన్నారు. ఇక, ఈ దాడులతో దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లను మోగాయి. దాడులు నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ యాక్టివేట్ అయ్యాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు లేదా బంకర్లలోకి తరలివెళ్లాలని బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కువైట్ తీసుకున్న చర్యలుదాడుల నేపథ్యంలో వైమానిక రక్షణ వ్యవస్థలను కువైట్ ప్రభుత్వం పూర్తిగా యాక్టివేట్ చేసింది. ప్రజలకు భద్రతా సూచనలు జారీ చేసింది. అనుమానాస్పద వస్తువులకు దగ్గరగా వెళ్లవద్దని హెచ్చరించింది. కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచింది. ప్రస్తుతం కువైట్ అంతటా హైఅలర్ట్ కొనసాగుతోంది. మరిన్ని దాడులు జరిగే అవకాశంపై భద్రతా సంస్థలు నిఘా కొనసాగిస్తున్నాయి. వైమానిక రక్షణ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి.اللحظات الأولى للاعتداء الإيراني الغاشم من قبل المسيرات الذي تعرض له مبنى الركاب T1 في مطار الكويت الدولي بتاريخ 3 يونيو 2026 وتسبب بخسائر بالأرواح وإصابات بشرية بليغة وأضرار مادية جسيمةThe first moments following the brutal Iranian drone attack on Terminal 1 (T1) at Kuwait… pic.twitter.com/eTzQoVXB4K— الطيران المدني (@Kuwait_DGCA) June 3, 2026భారతీయులకు ప్రమాదమా?ప్రస్తుతం కువైట్లో లక్షలాది భారతీయులు పనిచేస్తున్నారు. భారత ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. సాధారణ ప్రజలపై ప్రత్యేక దాడులు జరిగినట్లు సమాచారం లేదు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నందున అధికారిక సూచనలను పాటించడం అవసరం. కొన్ని విమాన సర్వీసులు తాత్కాలికంగా ప్రభావితమయ్యాయి. మరోవైపు.. ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయుడు మరణించినట్లు కువైట్లోని భారత రాయబార కార్యాలయం బుధవారం ధ్రువీకరించింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే, మృతుని కుటుంబంతో రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. బాధిత కుటుంబానికి, అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాధ్యమైనంత మేరకు అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు కువైట్ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటున్నట్లు పేర్కొంది.ఇదిలా ఉండగా.. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇరాన్ ప్రయోగించిన రెండు క్షిపణులను మార్గమధ్యంలోనే కూల్చివేసినట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. కాగా, ఈ ఘటనపై కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడిలో విమానాశ్రయ కార్మికులు, ప్రయాణికులతో సహా కనీసం 63 మంది గాయపడ్డారని తెలిపింది.NEW: Video shows full extent of the damage to Terminal 1 at Kuwait International Airport caused by the brutal Iranian drone and missile attacks that struck the facility earlier today.One person was killed and more than 60 injured in Iranian drone strikes on the airport, local… pic.twitter.com/S8UjuZLRis— Breaking Aviation News & Videos (@aviationbrk) June 3, 2026 -
ఖమేనీ అంత్యక్రియలు ఫిక్స్..? కదిలిరానున్న ఇరాన్
టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీ మరణించి దాదాపు మూడు నెలలు గడుస్తోంది. యుద్ధం ప్రారంభమైన రోజే ఆయన మరణించినప్పటికీ పలు భద్రతా కారణాలతో ఆయన అంత్యక్రియలను ఇరాన్ వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ అంత్యక్రియల వివరాలను బహిర్గతం చేసింది. ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను మూడు రోజుల పాటు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్లోని పలు ప్రధాన నగరాల్లో భారీ ఊరేగింపులు జరుపుతామంది.ఇరాన్ ప్రకటనలో.. "ఊరేగింపులు రాజధాని టెహ్రాన్తో పాటు, అక్కడి పవిత్ర నగరాలైన కోమ్, మషాద్ లలో జరుగుతాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంతాప సభలు జరుగుతాయి. ఇక చివరగా ఖమేనీ పార్థివ దేహాన్ని మషాద్ నగరంలో ఖననం చేస్తాం" అని తెలిపింది.అయితే ఈ అంత్యక్రియల తేదీలను మాత్రం ఇరాన్ స్పష్టంగా ప్రకటించలేదు. జూన్ మధ్యలో (ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం నెల ప్రారంభంలో) ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఖచ్చితమైన తేదీలను మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.అయితే టెహ్రాన్ నగరంలోనే ఈ వీడ్కోలు కార్యక్రమం దాదాపు 24 గంటల పాటు నిరంతరాయంగా సాగనున్నట్లు. తెలుస్తోంది. అంత్యక్రియల ఉత్సవాలకు సుమారు 2 కోట్ల (20 మిలియన్ల) మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని ఇరాన్ అంచనా వేస్తోంది. -
నేను లేకుంటే నువ్వు జైల్లోనే.. నెతన్యాహుకు.. ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానిపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. లెబనాన్లోని హెజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండడంతో ఫోన్లో ఆయనను తీవ్ర పదజాలంతో "అసలు నువ్వు ఏం చేస్తున్నావ్" హెచ్చరించినట్లు ఆక్సియోస్ కథనం ప్రచురించింది. అమెరికా, ఇరాన్ల మధ్య ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరే దశకు వచ్చింది. అయితే, ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు పెంచడంతో.. "ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే అమెరికాతో చర్చలు నిలిపివేస్తాం" అని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ట్రంప్ నెతన్యాహూతో మాట్లాడి కాల్పులు విరమించాలని కోరారు. అయితే దీనికి తొలుత అంగీకరించిన ఇజ్రాయెల్ తిరిగి లెబనాన్పై కాల్పులు జరపింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నెతన్యాహూకు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డట్లు సమాచారం.అమెరికా అధికారుల సమాచారం ప్రకారం.. ట్రంప్ చాలా కోపంగా నెతన్యాహును ఉద్దేశించి ఫోన్లో ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది" అసలు నువ్వు ఏం చేస్తున్నావు. నీకు పిచ్చి పట్టింది నేను గనుక లేకపోతే నువ్వు ఈపాటికి జైల్లో ఉండేవాడివి. నేను నిన్ను కాపాడుతుంటే నువ్వు ఇలా చేస్తున్నావు.ఈ దాడుల వల్ల ప్రపంచంలో నిన్నూ, ఇజ్రాయెల్ను అందరూ అసహ్యించుకుంటున్నారు" అని నెతన్యాహుని తీవ్ర పదజాలంతో మందలించినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.అనంతరం ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్లో.. నెతన్యాహుతో మాట్లాడి బీరూట్పై పెద్ద ఎత్తున జరపాలనుకున్న దాడిని విరమించుకునేలా చేశానని, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి తగ్గిందని ప్రకటించారు. ఇందుకు నెతన్యాహుకు ధన్యవాదాలు కూడా తెలిపారు.అయితే, నెతన్యాహు కార్యాలయం మాత్రం తాము పూర్తిగా వెనక్కి తగ్గినట్లు ఒప్పుకోలేదు. "హెజ్బుల్లా గనుక మా నగరాలపై దాడులు ఆపకపోతే.. మేము బీరూట్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి తీరుతాం. ఈ విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు" అని నెతన్యాహు స్పష్టం చేశారు. -
ఖమేనీ విషయంలో కీలక ప్రకటన
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశాధినేత ఖమేనీ ప్రాణాలతోనే ఉన్నారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన దేశ వ్యవహారాల్లో మళ్లీ చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు.ఇరాన్ సుప్రీం లీడర్ విషయంలో ఆరోగ్యం విషయంలో తీవ్ర సందిగ్ధత నడుస్తోంది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని కోమాలో ఉన్నారని ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కీలక వాఖ్యలు చేశారు. ప్రస్తుతం యూఎస్ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ముందు మాట్లాడుతూ మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం దేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ వ్యవహారాల్లో మరింత చురుగ్గా నిమగ్నమవుతున్నారని తెలిపారు. ఆ మేరకై ఆయనకు కొన్ని సంకేతాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. అదే దాడిలో ఆయన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. తండ్రి మరణం, కొడుకు గాయపడటంతో ఇరాన్ నాయకత్వంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవగా, వాటన్నింటికీ తెరదించుతూ మొజ్తాబా ఖమేనీ క్షేమంగా ఉన్నారని అమెరికా ఇప్పుడు స్పష్టం చేసింది. -
ఇక కాల్పులుండవు.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, హిజ్బుల్ కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు. ఈ విషయమై ఇజ్రాయెల్ అధ్యక్షునితో చర్చలు జరపామని దానికి నెతన్యాహూ అంగీకరించినట్లు పేర్కొన్నారు.లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా ఆపారు. బీరూట్ దక్షిణ శివార్లపై దాడులు చేయాలని, హిజ్బుల్లాకు వ్యతిరేకంగా సైనిక చర్యలను మరింత ఉధృతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఇరుపక్షాలతో మాట్లాడి తాత్కాలికంగా కాల్పుల విరమణ జరిగేలా ఒప్పందం చేశారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ "ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో నేను చాలా ఫలప్రదమైన ఫోన్ సంభాషణ జరిపాను. బీరూట్కు ఎటువంటి సైనిక బలగాలు వెళ్లవు. హిజ్బుల్లాతో కాల్ మాట్లాడాను. అన్ని రకాల కాల్పులను నిలిపివేయడానికి వారు అంగీకరించారు — ఇజ్రాయెల్ వారిపై దాడి చేయదు, వారు ఇజ్రాయెల్పై దాడి చేయరు"" అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్లో రాశారు.లెబనాన్ రాజధాని వైపు వెళ్తున్న ఇజ్రాయెల్ బలగాలను తన ఆదేశాలతో వెనుకకి తిరిగినట్లు పేర్కొన్నారు. మధ్యవర్తుల ద్వారా జరిగిన చర్చల ఆధారంగా.. హిజ్బుల్లా కూడా కాల్పులు జరపకుండా ఉండేందుకు అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు.అయితే శాంతి చర్చల ఒప్పందంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకూ చర్చలు ప్రస్థావనే లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి డీల్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. -
ఇరాన్ కీలక నిర్ణయం.. కథ మళ్లీ మెుదటికే?
టెహ్రాన్: ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో శాంతి చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని వాటిని ఆపే వరకూ ఎట్టి పరిస్థితుల్లో చర్చలు లేవని తేల్చి చెప్పింది. ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ ఈ కథనాలను ప్రచురితం చేసింది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న నానుడి ఇప్పుడు ఇరాన్- అమెరికా యుద్దంలో సరిగ్గా సరిపోతుంది. శాంతి చర్చలు ప్రారంభమై దాదాపుగా రెండు నెలలు గడుస్తోన్నా చర్చలలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఓసారేమో అమెరికా మెుండి చేయడం.. మరోసారేమో ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం ఇదే పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా మరోసారి శాంతి చర్చలను వాయిదా వేస్తోన్నట్లు ఇరాన్ ప్రకటించింది.గాజా,లెబనాన్లలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని, అలాగే లెబనీస్ భూభాగం నుండి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాలపై తమ డిమాండ్లు, తమ మిత్రదేశాల డిమాండ్లు నెరవేరే వరకు చర్చలు పునఃప్రారంభం కావని తెలిపింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆగిపోయే వరకు మధ్యవర్తుల ద్వారా అమెరికాతో చర్చలు జరగవని టెహ్రాన్ స్పష్టం చేసింది.కాగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ లెబనాన్లోని 900 ఏళ్ల పురాతన బ్యూఫోర్ట్ కోటను, దాని చుట్టుపక్కల కొండలను ఇజ్రాయెల్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గత 26 ఏళ్లలో లెబనాన్లోకి ఇజ్రాయెల్ చొరబడటం ఇదే అతిపెద్దది. కాగా లెబనాన్పై ఇప్పటివరకూ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 3,433 మంది ప్రాణాలు కోల్పోయారు. -
ఇరాన్పై మళ్లీ భీకర దాడులు? ప్రపంచాన్ని వణికిస్తున్న అంచనా!
టెహ్రాన్: ఇరాన్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని చూస్తుంటే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతికూలత కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్పై సైనిక దాడులు మళ్లీ ప్రారంభించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని చెబుతున్నారు. అదే సమయంలో, ట్రంప్ ఇరాన్పై మరింత కఠిన వైఖరి అవలంబిస్తూ కొత్త షరతులు పెడుతున్నట్టు పలు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. చర్చలు విఫలమైతే మరింత తీవ్రమైన దాడులు జరిగే అవకాశం ఉంటుందని కూడా ట్రంప్ హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఇరాన్-అమెరికా యుద్ధం మళ్లీ పూర్తి స్థాయిలో, మరింత భీకరంగా ప్రారంభమయ్యే ప్రమాదం ఉందని యూఎస్ సైన్యానికి చెందిన కల్నల్ (రిటైర్డ్), రచయిత, రక్షణ వ్యవహారాల విశ్లేషకుడు డగ్లస్ అబోట్ మాక్గ్రెగర్ తెలిపారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాక్గ్రెగర్ మాట్లాడుతూ.. ‘‘అమెరికన్లలో ట్రంప్కి మద్దతు ఇచ్చే వాళ్లు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు ప్రజాదరణ ఓట్లలో మూడో వంతు ఉన్నా, ఇప్పుడు అంతకంటే చాలా తక్కువగా ఉంది. అది సుమారు 20 శాతం స్థాయికి పడిపోయి ఉండొచ్చు.ప్రస్తుతం చాలా మంది అమెరికన్లు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో (ఇరాన్, గల్ఫ్ దేశాలు, చమురు రవాణా మార్గాలు) జరుగుతున్న ఘర్షణలు, సైనిక చర్యలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే వాటి ప్రభావం ఇంకా వారి రోజువారీ జీవితంలో నేరుగా కనిపించడం లేదు. కానీ, అమెరికా చర్యల వల్ల చమురు సరఫరా దెబ్బతింటే, పెట్రోలు ధరలు పెరిగితే, ఇంధన కొరత వస్తే, ఆర్థిక సమస్యలు తలెత్తితే వాటి ప్రభావం అమెరికా ప్రజల జీవితాలపై నేరుగా పడుతుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఇప్పటివరకు ఆసక్తి చూపని అమెరికన్లు కూడా "పర్షియన్ గల్ఫ్లో ఏమి జరుగుతోంది?" అని గమనించడం ప్రారంభిస్తారు.చమురు, సహజ వాయు రంగాలకు చెందిన ప్రముఖులు స్పష్టంగా చెప్పారు.. ఎక్సాన్ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అయినా, ఇతర చమురు, ఆర్థిక విశ్లేషకులు అయినా ఒకే విషయం చెబుతున్నారు. మరో 3 నుంచి 8 వారాల్లో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు పూర్తిగా ఖాళీ అవుతాయని, అమెరికా తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరిస్తున్నారు.ఉదాహరణకు, కాలిఫోర్నియా పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే చమురు దిగుమతులపై చాలా ఆధారపడుతుందనే విషయాన్ని ఎవరూ అధ్యక్షుడు ట్రంప్కు చెప్పలేదు. ఇప్పుడు ఆ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ అకస్మాత్తుగా యుద్ధం లేదా సైనిక చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించినా, సాధారణ అమెరికన్లలో ఎక్కువ మంది దానిని వ్యతిరేకించరు. అధిక శాతం మంది అమెరికన్లు దానిని బలహీనతగా చూడరు. యుద్ధం ముగిస్తే స్వాగతిస్తారు’’ అని తెలిపారు.ఇజ్రాయెల్ ఊరుకోదు ఒకవేళ యుద్ధం ఆగితే అమెరికా స్వాగతించినా, ఇజ్రాయెల్ అలా చేయదని డగ్లస్ అబోట్ మాక్గ్రెగర్ తెలిపారు. ‘‘అమెరికాలోని ఇజ్రాయెల్ అనుకూల వర్గాలు, భారీ సంపద కలిగిన వ్యక్తులు అధ్యక్షుడికి, ‘మీరు ఇలా చేస్తే మేము ఇక మీకు మద్దతు ఇవ్వము. మాకు రక్షణ లేకపోతే, మీపై రాజకీయ దాడులు మొదలవుతాయి. కాపిటల్ హిల్లో మీ ప్రత్యర్థులు మీపై విరుచుకుపడతారు. ప్రస్తుతం వారికి, మీకు మధ్య నిలబడి ఉన్నది మేమే. మేము మీకు మద్దతు ఇస్తున్నాం. మాధ్యమాలపై మా ప్రభావం ఉంది. ఆర్థిక వ్యవస్థపై మా ప్రభావం ఉంది. రాజకీయ శక్తి కావాలనుకునేవారికి ఇవి అత్యంత ప్రభావవంతమైన అంశాలు. కాబట్టి మీరు ఏమి చేస్తారు?’ అని వారు అడుగుతారు.ప్రస్తుతం నెతన్యాహూతో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడి, మనం చేయగలిగేది ఇదేననిని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. నెతన్యాహూను ఒప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ నెతన్యాహూ లెక్కలు ట్రంప్ లెక్కలకు పూర్తిగా భిన్నం. ట్రంప్నకు యుద్ధ తీవ్రతను తగ్గించడం లేదా ముగించడం రాజకీయంగా ప్రయోజనకరంగా అనిపించవచ్చు. కానీ, నెతన్యాహూ మాత్రం ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం, విదేశాంగ విధానం, మధ్యప్రాచ్య వ్యవహారాలపై ఇజ్రాయెల్కు గణనీయమైన ప్రభావం ఉందని భావిస్తున్నారు. అందువల్ల, యుద్ధం ఆగిపోతే లేదా ఉద్రిక్తతలు తగ్గిపోతే ఆ ప్రభావం తగ్గే అవకాశం ఉంది. అందుకే ఇంత ప్రభావం ఉన్న సమయంలో నెతన్యాహూ ఎందుకు వెనక్కి తగ్గుతారు? నెతన్యాహూ కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ లేదా పరిమిత సైనిక చర్యతో సంతృప్తి చెందరు. ఇరాన్ సైనిక, రాజకీయ శక్తిని తీవ్రంగా బలహీనపరచే వరకు ఒత్తిడి కొనసాగించాలని నెతన్యాహూ కోరుకుంటున్నారు. అంతేకాక, ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు లేదా సంస్థలకు కూడా ఒక బలమైన హెచ్చరిక పంపాలనుకుంటున్నారు.ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిలబడితే లేదా దాని భద్రతకు ముప్పుగా మారితే, తీవ్రమైన సైనిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే హెచ్చరికను అందరికీ ఇవ్వాలని నెతన్యాహూ కోరుకుంటున్నారు’’ అని తెలిపారు. -
ఆగని యుద్ధం.. ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం?!
వాషింగ్టన్ : పశ్చిమాసియాలో శాంతి ఒప్పందాల ప్రయత్నాలు విఫలమవడంతో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన షరతుల నేపథ్యంలో ఈ సంక్షోభం మరింత సుదీర్ఘంగా సాగేలా కనిపిస్తోంది. కీలకమైన హర్మూజ్ జలసంధి మూసివేత భయాలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాము ఎలాంటి అణు ఆయుధాలను తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి తన కోడలు లారా ట్రంప్ నిర్వహించిన ‘ఫాక్స్ న్యూస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘నాకు కావలసిన ఒకే ఒక్క గ్యారెంటీ, ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయకూడదు. అందుకు వారు అంగీకరించారు, ఇది చాలా ఆసక్తికరమైన విషయం’ అని పేర్కొన్నారు.మరోవైపు, న్యూయార్క్ టైమ్స్, యాక్సియోస్ మీడియా సంస్థల కథనాల ప్రకారం.. శాంతి ఒప్పందం పేరిట ట్రంప్ ఇరాన్కు అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త ప్రతిపాదనలను పంపారు. అయితే ఈ కొత్త షరతుల కారణంగా పశ్చిమాసియాలో అధికారికంగా యుద్ధం ముగింపు, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి పట్టే మరింత సమయం పట్టే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ ముగింపు ఒప్పందంలో భాగంగా ‘లేబనాన్’ను కూడా చేర్చాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లేబనాన్లోకి 30 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి దాడులను తీవ్రం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ డిమాండ్ తెరపైకి తెచ్చింది. దీంతో పాటు వ్యాపార పరంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఓడలపై ఇరాన్ ఎలాంటి పన్నులు వసూలు చేయకూడదని ట్రంప్ ప్రతిపాదించగా, అలాంటి నిబంధన ఏదీ ఒప్పందంలో లేదని ఇరాన్ మీడియా సంస్థ ‘ఫార్స్’ కొట్టిపారేసింది. అంతేకాకుండా, సదరు జలసంధిపై తమ పూర్తి సార్వభౌమాధికారాన్ని చాటే బిల్లును ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే ఆమోదించబోతోందని స్పష్టం చేసింది.తమ అణు కార్యక్రమంపై అమెరికాతో కీలక చర్చలు ప్రారంభించడానికి ముందే, గతంలో అమెరికా స్తంభింపజేసిన తమ 12 బిలియన్ డాలర్ల ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అదే సమయంలో, ఇరాన్ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను నాశనం చేస్తామంటూ ట్రంప్ మునుపు చేసిన వ్యాఖ్యలను ఇరాన్ అధికారిక వర్గాలు తోసిపుచ్చాయి. ట్రంప్ వాదనలపై టెహ్రాన్ (ఇరాన్) మొదటి నుంచి సందేహాలు వ్యక్తంచేస్తుండటంతో, కీలక ప్రాధాన్యతల విషయంలో ఇరు పక్షాల మధ్య ఇంకా చాలా వ్యత్యాసాలు కొనసాగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. -
అమెరికా-ఇరాన్ శాంతిచర్చలకు బ్రేక్?.. టెహ్రాన్లో భారీ నిరసనలు
టెహ్రాన్: ఇరాన్, అమెరికాల మధ్య ప్రస్తుతం శాంతిచర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాలకు పలు విషయాలలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఒప్పందం ఇంకా తుది దశకు చేరుకోలేదు. అయితే ఇరాన్లోని ఓ అంతర్గత గ్రూపు ఈ చర్చలు జరగకుండా అడ్డుకోవాలని యత్నిస్తున్నట్లు అక్కడి కథనాలు పేర్కొన్నాయి. దీర్ఘకాలికంగా సాగుతున్న ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరుదేశాల మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరే సూచనలు కనిపిస్తున్న తరుణంలో, ఇరాన్ అంతర్గతంగా తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. అమెరికాతో ఎలాంటి రాజీని ఇష్టపడని ఇరాన్లోని ఒక బలమైన మితవాద వర్గం ఈ ఒప్పందాన్ని ఎలాగైనా చెడగొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.పార్లమెంట్ సభ్యులు, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులతో కూడిన ఈ కరడుగట్టిన మితవాద బృందం దేశంలో అమెరికాతో చర్చలు జరపవద్దంటూ వీధులలోకి వచ్చి నిరసనలు తెలపడం, మీడియాల చర్చలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి.గత శుక్రవారం రోజు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో మితవాద శక్తులు భారీ ప్రదర్శన నిర్వహించాయి. వీధుల్లో జెండాలు పట్టుకుని, అమెరికా, ఇజ్రాయెల్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఖమేనీని చంపిన వారికి బుద్ధి చెప్పాల్సిందేనని నినాదాలు ఇచ్చాయి. అంతేకాకుండా ప్రస్తుత సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీపై ఈ బృందం విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ మాత్రం చర్చల బృందానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరపాల్సిందేనని బృందానికి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది -
హర్ముజ్లో భారత నౌకల ప్రయాణం .. సీక్రెట్ స్ట్రాటజీ ఇదే..!
ఢిల్లీ: హర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చమురు సరఫరాకు ఆటంకం తలెత్తి పలు దేశాల్లో లాక్డౌన్లు సైతం విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంత సంక్షోభం సమయంలోనూ భారత నౌకలు మాత్రం నిరాటంకంగా హర్ముజ్లో రాకపోకలు సాగించాయి. దీనికి భారత అనుసరించిన వ్యూహాన్ని తాజాగా అధికారులు వెల్లడించారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఫిబ్రవరి 28న ఇరాన్ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హర్ముజ్ని మూసివేసింది. రుపక్షాల మధ్య ఏప్రిల్ 9న కాల్పుల విరమణ జరిగినప్పటికీ, ఈ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు మరియు దిగ్బంధం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనిలో ప్రయాణించడానికి గ్లోబల్ షిప్పింగ్ కంపెనీలు సైతం భయపడుతుంటే, భారతీయ నౌకలు మాత్రం సురక్షితంగా ప్రయాణిస్తూ దేశానికి అవసరమైన ఇంధన సరఫరాను అందిస్తున్నాయి. ఈ దౌత్య సీక్రెట్ను తాజాగా ఓడరేవుల మంత్రిత్వ శాఖ షిప్పింగ్ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ వెల్లడించారు.ఈ హర్ముజ్లో భారత్ నౌకల ప్రయాణానికి ప్రధాన కారణం భారత విదేశాంగ శాఖ ఇరాన్తో అనునిత్యం దౌత్య చర్చలు జరపడేమన్నారు. అదే విధంగా ఏ నౌకలు ముందుగా ప్రయాణించాలనే ప్రాధాన్యతలను అనునిత్యం పర్యవేక్షించడం. దేశ ప్రయోజనాలకు అత్యవసరమైన చమురు, గ్యాస్, ఎరువుల నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా అనునిత్యం ప్రణాళికలు వేస్తూ నౌకలు రవాణా జరిపేలా ప్రణాళికలు రచించామన్నారు. ప్రస్తుతం హర్ముజ్లో 13 భారత జెండా కలిగిన నౌకలు ఉన్నాయని అధికారులు తెలిపారు.కాగా యుద్ధ ప్రారంభమైన నాటి నుంచి హర్ముజ్లో అత్యధిక నౌకలను నడుపుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. ఇటీవలే శివాలిక్, నందాదేవి, జగ్ లాడ్కి, పైన్ గ్యాస్, జగ్ వసంత్, బిడబ్ల్యూ టైర్, బిడబ్ల్యూ ఎల్మ్, గ్రీన్ సాన్వి వంటి నౌకలు ఈ జలసంధిని విజయవంతంగా దాటాయి. ప్రపంచ చమురు, సహజ వాయువు అవసరాలలో 20 శాతం ఈ ఇరుకైన హార్ముజ్ జలసంధి గుండానే సాగుతుంది. ఈ మార్గంలో రవాణా మందగించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరిగి ఆసియా దేశాలపై ఆర్థిక భారం పడుతున్న తరుణంలో, భారత్ తన వ్యూహాత్మక చతురతతో ఇంధన భద్రతను కాపాడుకుంటోంది. -
బ్లాకేడ్ ఎత్తేస్తున్నా.. మీ భార్యలకు హాయ్ చెప్పండి.. ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా అనే అంశంపై తాను త్వరలోనే ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై తాను వైట్హౌస్లోని ‘సిట్యుయేషన్ రూమ్’లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానని తన సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు.ఇరాన్- అమెరికా చర్చలు ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తోన్నా అందులో ఎటువంటి పురోగతి ఉండడం లేదు. పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. అనంతరం అమెరికా పలుమార్లు చర్చలకు ప్రయత్నించగా ఎటువంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి కీలక ప్రకటన చేశారు.ఈ విషయమై తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ " ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా అనే అంశంపై నేను ఇప్పుడు తుది నిర్ణయం తీసుకోబోతున్నాను. ఈ విషయమై ప్రస్తుతం వైట్ హౌస్ 'సిట్యుయేషన్ రూమ్' (టాప్-సెక్యూరిటీ బంకర్) లో సమావేశం కాబోతున్నాను. మా అద్భుతమైన, మునుపెన్నడూ లేని నౌకాదళ దిగ్బంధం కారణంగా జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలు ఇక 'ఇంటికి వెళ్లే' ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ అభిమాన అధ్యక్షుడి తరపున మీ భార్యలకు, భర్తలకు, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు నా తరపున హలో చెప్పండి" అని పోస్ట్ చేశారు.ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయకూడదని, హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని ఆయన స్పష్టం చేశారు. హార్ముజ్లో అమర్చిన ల్యాండ్మైన్లను ఇరాన్ తక్షణమే తొలగిస్తుందని పేర్కొన్నారు. . ఇరాన్ వద్ద భూగర్భంలో దాగి ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వలను అమెరికా బయటకు తీస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ లతో కలిసి సమన్వయంతో ఆ నిల్వలను వెలికితీసి, పూర్తిగా ధ్వంసం చేస్తామని వెల్లడించారు. కాగా ప్రస్తుతం జరిగిన చర్చలు కేవలం అంతగా ప్రాధాన్యత లేని కొన్ని చిన్నపాటి అంశాలపైనే జరిగాయని ట్రంప్ పేర్కొన్నారు. -
సౌదీ కొత్త వ్యూహం.. ప్రపంచానికే బిగ్ అలర్ట్
పశ్చిమాసియాలో ఇప్పుడు యుద్ధం అంటే కేవలం క్షిపణులు, ఫైటర్ జెట్లు కాదు.. “డ్రోన్ వార్” అనేది కొత్త భయంగా మారింది. ముఖ్యంగా ఇరాన్ ఉపయోగిస్తున్న “షాహెద్” కామికాజే డ్రోన్లు ప్రపంచ రక్షణ వ్యవస్థలకే సవాల్గా మారాయి. ఇప్పుడు అదే మోడల్ను సౌదీ అరేబియా కూడా అనుసరించే ప్రయత్నంలో ఉందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.ఇరాన్ తయారు చేసిన షాహెద్-136 డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి. కానీ వీటి దాడి ప్రభావం మాత్రం భారీగా ఉంటుంది. చాలా తక్కువ ఎత్తులో నెమ్మదిగా ప్రయాణించే ఈ డ్రోన్లు రాడార్లకు చిక్కకుండా టార్గెట్పై నేరుగా దూసుకెళ్తాయి. ఒకేసారి వందల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించడం వల్ల అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కూడా ఓవర్లోడ్ అవుతున్నాయి. ఇదే ఇప్పుడు ఇరాన్ ప్రధాన యుద్ధ వ్యూహంగా మారింది.ఇటీవల అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో గల్ఫ్ దేశాలపై వరుసగా డ్రోన్, క్షిపణి దాడులు జరిగాయి. సౌదీ చమురు క్షేత్రాలు, రియాద్ సమీప ప్రాంతాలు, ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్, అరాంకో ఆయిల్ ఫెసిలిటీలపై దాడుల ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. అనేక డ్రోన్లు, క్షిపణులను సౌదీ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసినప్పటికీ ఈ దాడులు రియాద్ను తీవ్రంగా ఆందోళనకు గురిచేశాయి.ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా కొత్త వ్యూహంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రియాద్ సమీపంలో భారీ డ్రోన్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసి, ఇరాన్ షాహెద్ తరహా లాంగ్ రేంజ్ అటాక్ డ్రోన్ల తయారీకి సన్నాహాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమెరికా–సౌదీ డిఫెన్స్ కంపెనీలు కలిసి ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఇది కేవలం రక్షణ చర్య మాత్రమే కాదని నిపుణులు అంటున్నారు. ఇరాన్ “స్వార్మ్ డ్రోన్ స్ట్రాటజీ” ప్రపంచ యుద్ధ విధానాన్నే మార్చేసిందని వారు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో వేల డ్రోన్లు ప్రయోగించి శత్రువు రక్షణ వ్యవస్థను చేధించడం, ఆర్థిక నష్టం కలిగించడం, చమురు ఉత్పత్తిని దెబ్బతీయడం.. ఇదే కొత్త యుద్ధ ఫార్ములాగా మారుతోంది. ఇప్పుడు అదే పద్ధతిని సౌదీ కూడా అధ్యయనం చేస్తోందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.ఇక, ఇప్పటివరకు పూర్తిగా రక్షణాత్మక వైఖరిలో కనిపించిన సౌదీ.. ఇప్పుడు ప్రతీకార దాడుల దిశగా కూడా అడుగులు వేస్తోందని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇరాన్ డ్రోన్, క్షిపణి లాంచ్ సైట్లపై సౌదీ సీక్రెట్గా వైమానిక దాడులు నిర్వహించిందని అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇది మధ్యప్రాచ్య రాజకీయాల్లో పెద్ద వ్యూహాత్మక మార్పుగా భావిస్తున్నారు. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతం మొత్తం “డ్రోన్ కోల్డ్వార్” దిశగా వెళ్తోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. భారీ యుద్ధ విమానాల కంటే ఇప్పుడు చౌకైన డ్రోన్లే ఎక్కువ ప్రమాదకరంగా మారుతున్నాయని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఇరాన్ ప్రత్యేకతగా భావించిన డ్రోన్ వార్ఫేర్.. ఇప్పుడు సౌదీతో పాటు ఇతర దేశాలు కూడా అనుసరించే స్థాయికి చేరుకోవడం ప్రపంచ భద్రతా సమీకరణాల్లో పెద్ద మార్పుగా కనిపిస్తోంది.డ్రోన్ స్వార్మ్ అంటే ఏమిటి?ఒకేసారి డజన్ల నుంచి వందల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించడంరాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను గందరగోళానికి గురిచేయడంఒకటి కాదు.. వరుస దాడులతో శత్రువును అలసటకు గురిచేయడంతక్కువ ఖర్చుతో భారీ నష్టం కలిగించే కొత్త యుద్ధ వ్యూహంసౌదీకి అసలు భయం ఏంటి?చమురు క్షేత్రాలపై దాడులు జరిగితే ప్రపంచ ఆయిల్ మార్కెట్ దెబ్బతింటుందిఅరాంకో వంటి కంపెనీలకు భారీ నష్టం వచ్చే ప్రమాదంగల్ఫ్ ప్రాంత భద్రతపై ప్రపంచ పెట్టుబడిదారుల్లో భయం పెరుగుతుందిసౌదీ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశంఅమెరికా ఎందుకు అలర్ట్?గల్ఫ్లో అమెరికా మిలిటరీ బేస్లు ఉన్నాయిఇరాన్ డ్రోన్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోందిఅమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లకే సవాల్గా మారుతోందిగల్ఫ్లో యుద్ధం పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం -
హర్ముజ్ ఒప్పందం ఖరారు..? కొట్టిపడేసిన వైట్హౌస్
టెహ్రాన్: ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం అంశంలో చర్చలు జరుగుతున్నాయి. అణు ఒప్పందంపై ఇరాన్ వెనక్కి తగ్గిందని దాదాపు చర్చలు సఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై జరిగిన జరిగిన ఒప్పందంలోని అంశాలను ఇరాన్ మీడియా కథనాలు బహిర్గతం చేశాయి.ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ సమాచారం ప్రకారం... నెలరోజుల్లో హర్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణాను యుద్ధానికి ముందున్న సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరాన్ అంగీకరించిందని తెలిపింది. అయితే దానికి ఇరాన్పై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి, ఆ ప్రాంతం నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి అమెరికా అంగీకరించిందని పేర్కొంది.అయితే ఈ జలసంధిని గుండా వెళ్లే ఓడలను తనిఖీ చేసే హక్కు, షిప్పింగ్ లేన్లను నిర్వహించే హక్కు, సర్వీస్ ఫీజులను వసూలు చేసే హక్కు ఇరాన్ దగ్గరే ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా ఏ దేశానికి చెందిన సైనిక నౌకలకు ఈ ప్రత్యేక నిబంధనలు వర్తించవని పేర్కొంది. ఈ ప్రాథమిక ఒప్పందం కుదిరిన అనంతరం ఇరు దేశాలు 60 రోజుల పాటు తదుపరి చర్చలు జరుపుతాయని ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తుది తీర్మాణాన్ని ఆమెదింప జేస్తారని పేర్కొంది.అయితే ఇరాన్ మీడియా చేసిన ఈ ప్రకటనలను అమెరికా పూర్తిగా కొట్టిపారేసింది. ఈ మేరకు వైట్హౌస్ తన అధికారిక వైట్హౌస్ ఎక్స్ ఖాతాలో "ఇరాన్ నియంత్రణలోని మీడియా విడుదల చేసిన ఈ నివేదికలో ఎలాంటి నిజం లేదు. ఆ అవగాహనా ఒప్పందం పూర్తిగా కల్పితం. ఇరాన్ ప్రభుత్వ మీడియా చెప్తున్న విషయాలను ఎవరూ నమ్మకండి. వాస్తవాలు ముఖ్యం అని పేర్కొందిదిగొచ్చిన ధరలుహర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశం ఉందనే వార్తలు రాగానే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 90 డాలర్ల కంటే కిందకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో హర్ముజ్ పునఃప్రారంభంపై ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచిచూడాలి. -
ఇరాన్ లో ఇంటర్నెట్ చిచ్చు
-
గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ మెజ్తబా ఖమేనీ.. ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా సైనిక స్థావరాలు గల్ఫ్ దేశాల్లో ఇకపై సురక్షితంగా ఉండవు. ఇజ్రాయెల్ను ఖచ్చితంగా కూకటివేళ్లతో పెకిలించాలి.. అది జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, వాషింగ్టన్ రోజురోజుకూ తన పూర్వ వైభవానికి దూరమవుతోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తాజాగా తన టెలిగ్రామ్ ఛానెల్లో సందేశం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఖమేనీ..‘పశ్చిమాసియా ప్రాంతంలో తన దుశ్చర్యలకు, సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇకపై అమెరికాకు సురక్షితమైన ఆశ్రయం ఉండదు. కాలం వెనక్కి తిరగదు. ఈ ప్రాంతంలోని దేశాలు, భూములు ఇకపై అమెరికా స్థావరాలకు రక్షణ కవచాలుగా పనిచేయవు. అమెరికా తన పూర్వ వైభవానికి దూరమవుతోంది.ఇదే సమయంలో అమెరికా దళాలు దక్షిణ ఇరాన్లో దాడులు జరిపాయి. దక్షిణ ఇరాన్లో అమెరికా తాజాగా జరిపిన సైనిక దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. ఈ దాడులు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలేనని టెహ్రాన్ పేర్కొంది. అమెరికా ఈ ప్రాంతంలో అల్లర్లు సృష్టిస్తోందని ఇరాన్ ఆరోపించింది. సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖతర్ వంటి దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇవి ఇరాన్ ప్రతీకారానికి గురయ్యే అవకాశం ఉందని ఇరాన్ సంకేతం ఇచ్చింది. కాగా, బహ్రెయిన్, కువైట్, ఇరాక్, యూఏఈ, ఖతార్ లాంటి దేశాలతో కలిపి ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన చిన్న, పెద్ద మిలటరీ క్యాంపులు 19 వరకు ఉన్నాయి.మరోవైపు, ఖమేనీ.. హజ్ యాత్రకు వచ్చిన వారంతా కలిసికట్టుగా ఉండాలని కోరారు. పాలస్తీనా, అల్-అక్సా మసీదుకు విముక్తి కలగాలని, ముస్లింల కష్టాలు తీరాలని, ప్రపంచాన్ని శాసిస్తున్న శక్తులపై విజయం సాధించాలని అందరూ ప్రార్థన చేయండి అని వ్యాఖ్యానించారు. ఈ పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలోని ముస్లిం దేశాలన్నింటికీ ఒకే రకమైన బలం, ప్రయోజనాలు ఉన్నాయని, అవే భవిష్యత్తులో ప్రపంచంలో ఒక కొత్త మార్పును తెస్తాయని తెలిపారు.ఇరాన్ సైనిక సామర్థ్యాలుబాలిస్టిక్ క్షిపణులు: ఇరాన్ వద్ద 2,000 కి.మీ. వరకు దాడి చేయగల క్షిపణులు ఉన్నాయి. ఇవి గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను చేరగలవు.డ్రోన్లు: ఇరాన్ డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా అభివృద్ధి చేసింది. ఇవి గల్ఫ్లోని ఆయిల్ ఫీల్డ్స్, నౌకలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవచ్చు.నౌకాదళం: స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్లో ఇరాన్ చిన్న నౌకలు, మైన్స్, టార్పెడోలు ఉపయోగించి అమెరికా నౌకాదళాన్ని ఇబ్బంది పెట్టగలదు.ప్రాక్సీ గ్రూపులు: హిజ్బుల్లా, హౌతీలు వంటి మిత్ర గ్రూపుల ద్వారా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో పరోక్ష దాడులు చేయగలదు.గల్ఫ్లో అమెరికా స్థావరాలుఖతార్: అల్ ఉడెయిడ్ ఎయిర్ బేస్ – అమెరికా యొక్క అతిపెద్ద ఎయిర్ బేస్, 10,000 పైగా సైనికులు.బహ్రెయిన్: నేవల్ సపోర్ట్ యాక్టివిటీ – అమెరికా నౌకాదళం 5వ ఫ్లీట్ ప్రధాన కేంద్రం.సౌదీ అరేబియా: ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ – మధ్యప్రాచ్యంలో కీలకమైన ఎయిర్ ఆపరేషన్ల కేంద్రం.యుఏఈ: అల్ ధాఫ్రా ఎయిర్ బేస్ – అమెరికా F-35, డ్రోన్ ఆపరేషన్లకు ప్రధాన కేంద్రం.ఇరాన్ హెచ్చరికల ప్రభావం..ప్రాంతీయ స్థిరత్వం: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా జరిగే చమురు రవాణా తీవ్రంగా దెబ్బతింటుంది.అమెరికా వ్యూహం: అమెరికా తన స్థావరాల భద్రతను పునఃపరిశీలించాల్సి వస్తుంది.గల్ఫ్ దేశాలు: అమెరికా రక్షణపై ఆధారపడుతున్న ఈ దేశాలు, ఇరాన్ దాడుల భయంతో కొత్త దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.ప్రపంచ మార్కెట్లు: భారత్, యూరప్, ఆసియా దేశాలు గల్ఫ్ చమురుపై ఆధారపడుతున్నందున, ఏవైనా అంతరాయాలు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. -
నాటోకు అమెరికా భారీ ఝలక్..
ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ భయానక యుద్ధ పరిస్థితులు.. -
యుద్ధం: విషాదంతో పాటు విషం..
యుద్ధం విషాదాన్నే కాదు.. విషాన్ని మిగులుస్తుంది. ప్రాణనష్టంతో మొదలై ప్రజలను నిరాశ్రయులను చేయడంతోపాటు మొత్తంగా పరిసరాల విధ్వంసానికి దారి తీస్తుంది. కానీ ఈ క్రమంలో తరచూ విస్మరించే మరో పరిణామం యుద్ధం మిగిల్చే కాలుష్యం. పై నష్టాలన్నీ యుద్ధం జరుగుతుండగా, జరిగిన వెంటనే తెలిస్తే.. కాలుష్యం ప్రభావం మాత్రం సంఘర్షణ ముగిసిన తర్వాత కూడా చాలా కాలం కొనసాగుతుంది. కొన్నిసార్లు దశాబ్దాలు పట్టొచ్చు. యుద్ధంలో తీవ్ర ప్రమాదాకానికి గురయ్యేవి మండే ఇంధనాలు, ప్రమాదకరమైన రసాయనాలుండే ఇంధన వ్యవస్థలు. దాడులు చమురు డిపోలు, రిఫైనరీలు, పైప్లైన్లలో మంటలను రాజేస్తాయి. ఈ మంటల వల్ల విష వాయువులు, క్యాన్సర్ కారక కణాలు, అవశేషాలు విడుదలై, చుట్టుపక్కల భూమి, నీరు సంవత్సరాల తరబడి కలుషితమవుతుంది. ఇరాన్ యుద్ధం విషయంలో ఇదే జరిగింది. ఇరాన్, గల్ఫ్లో ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన బాంబు దాడులు ఇప్పటికే తీవ్ర నష్టాన్ని కలిగించాయి. మండుతున్న ఇంధన ట్యాంకులు విషపూరిత కణాలను గాలిలోకి పంపుతుండగా, వాటి శిథిలాలు, ప్రవాహాలు, చమురు అవశేషాలు గల్ఫ్ అంతటా తీరప్రాంత జలాలను, సముద్ర జీవావరణ వ్యవస్థలను భయపెడుతున్నాయి. ఈ కాలుష్య దాడి ప్రస్తుతం ఇక్కడికే పరిమితమైనా, తర్వాతి కాలంలో వ్యాప్తి విస్తృతంగా ఉంటుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందనే విషయాన్ని కూడా అంచనా వేయలేం. పారిశ్రామిక అగ్నిప్రమాదాలు..టెహ్రాన్ సమీపంలోని పలు చమురు డిపోలపై జరిగిన దాడులు, దాదాపు కోటి జనాభా ఉన్న పట్టణ ప్రాంతంపై దట్టమైన నల్లటి పొగను వ్యాపింపజేశాయి. చమురు మండటం వల్ల వెలువడే దట్టమైన పొగను ఇప్పుడు ఇరాన్లో చిన్నపిల్లలతో సహా ప్రజలు నేరుగా పీలుస్తున్నారు. ఈ పొగలో బెంజీన్, ఫార్మాల్డిహైడ్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు, ఇతర సూక్ష్మ కణ పదార్థాలు ఉంటాయి. ఇవి శ్వాసకోశంలోకి లోతుగా చొచ్చుకుపోయి, శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులను తీవ్రతరం చేస్తాయి. ఇది ఎక్కువకాలంపాటు కొనసాగితే ఈ ప్రభావాలు దీర్ఘకాలం ఉంటాయి. క్యాన్సర్ల ప్రమాదం పెరగడంతో పాటు, కొన్ని నాడీ సంబంధిత రుగ్మతలు వస్తాయి. ఇరాన్లో వాయు నాణ్యత ఇప్పటికే ప్రధాన పర్యావరణ సమస్యల్లో ఒకటిగా ఉంది. ఇక ఈ పారిశ్రామిక మంటలు లక్షలాది మంది ప్రజలు వాయు కాలుష్యం బారిన పడటానికి కారణమవుతాయి. నేల కాలుష్యం, విషపూరిత శిధిలాలు మందుగుండు సామగ్రి, సైనిక శిధిలాల పేలుడు దీర్ఘకాలిక నేల కాలుష్యానికి దారితీస్తుంది. బాంబు దాడికి గురైన ప్రాంతాల్లో సీసం, కాడ్మియం, నికెల్ లేదా క్రోమియం వంటి భారీ లోహాలు పేరుకుపోతున్నాయి. ఈ కాలుష్య కారకాలు నేలల్లో నిలిచిపోయి క్రమంగా ఆహార గొలుసులలోకి ప్రవేశిస్తాయి. కాలుష్యానికి మరో ప్రధాన కారణం ఆస్బెస్టాస్, పారిశ్రామిక రసాయనాలు, పేలని ఆయుధాల అవశేషాల శిథిలాలు, పట్టణ విధ్వంసం. సంఘర్షణానంతర కాలంలో ఈ పదార్థాల నిర్వహణ ప్రధాన పర్యావరణ సవాళ్లలో ఒకటిగా ఉంటుంది. ఉక్రెయిన్లో, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రాంతాలపై జరిగిన బాంబు దాడుల వల్ల అనేక కాలుష్య కారకాలు పర్యావరణంలోకి వ్యాపించాయి. గాజా స్ట్రిప్లో, భవనాలు, మౌలిక సదుపాయాల భారీ విధ్వంసం వల్ల లక్షలాది టన్నుల శిథిలాలు పేరుకుపోయాయి. ఇవి కాలుష్య నిర్మూలన, పునరి్నర్మాణ కార్యకలాపాలను క్లిష్టతరం చేస్తాయి. ధ్వంసమైన నగరాలను పునర్నిర్మించడం వాతావరణంపై అదనపు భారం పడుతుంది.మరింత నీటి సంక్షోభంయుద్ధం నీటి భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆనకట్టలు, కీలకమైన మౌలిక నీటి సదుపాయాలను ధ్వంసం చేసి జనాభాను నియంత్రించడానికి ప్రత్యర్థి దేశాలు చేస్తున్న ప్రయత్నాలు సంక్షోభాలకు దారితీస్తున్నాయి. కరువులు, వ్యవసాయంలో అధిక వినియోగం, వివాదాస్పద నీటి నిర్వహణ విధానాలతో ఇప్పటికే ఇరాన్ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. యుద్ధం వల్ల ఏర్పడే కాలుష్యం నీటి నాణ్యతను దీర్ఘకాలికంగా ప్రభావితం చేయనుంది. పేలుళ్లు, అగి్నప్రమాదాల కారణంగా హైడ్రోకార్బన్లు పట్టణ మురుగునీటి వ్యవస్థలలోకి, కొన్ని జలమార్గాల్లోకి ప్రవహించి, నేలలను, భూగర్భ జలాలను కలుíÙతం చేశాయి. ఇక విద్యుత్ గ్రిడ్లు, శుద్ధి కర్మాగారాలపై బాంబు దాడులు చేయడం వల్ల కీలకమైన నీటి శుద్ధి ప్రక్రియ నిలిచిపోతుంది. శుద్ధి చేయని నీటిని తాగడం వల్ల ప్రజలు తక్షణమే వ్యాధుల బారిన పడుతున్నారు. 1980లలో జరిగిన ఇరాన్–ఇరాక్ యుద్ధ సమయంలో గల్ఫ్లో సముద్రం పాలైన చమురు, ఆ ప్రాంతంలోని హాక్స్బిల్ సముద్ర తాబేళ్లు అంతరించడానికి, అక్కడి గ్రీన్ తాబేళ్ల వినాశనానికి కారణమైంది.అంతరించనున్న అడవులుసంఘర్షణ అటవీ నిర్మూలనకు దారి తీస్తుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి, ఇంధన కొరత ఏర్పడినప్పుడు, బొగ్గు, వంటచెరుకు వైపు మొగ్గు చూపాల్సి వస్తుంది. ఫలితంగా అడవులు అంతరించపోతాయి. ప్రత్యామ్నాయ ఇంధనాలు కనుమరుగైన చోట అడవుల నరికివేత పెరుగుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సూడాన్. 2023లో ఇక్కడ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఖార్టూమ్, ఇతర పట్టణ ప్రాంతాల్లో చెట్ల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు2022లో ప్రపంచవ్యాప్త గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల్లో సుమారు 5.5 శాతానికి సైనిక దళాలదే. ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం పెరిగేకొద్దీ, దాని వల్ల ఏర్పడే కర్బన్ ఉద్గారాలు కూడా పెరుగుతున్నాయి. 26 దేశాలు ఏడాది పొడవునా విడుదల చేసే ఉద్గారాల కంటే గాజా సంఘర్షణలో మొదటి 120 రోజుల్లోనే ఎక్కువ ఉద్గారాలు వెలువడ్డాయని ఒక పరిశోధనలో తేలింది. ఇరాన్ యుద్ధంలో జలాంతర్గామి కార్యకలాపాలు, సుదూర బాంబర్ దాడులు, క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వీటివల్ల వెలువడే ఉద్గారాల భారం చాలా ఎక్కువ. గల్ఫ్ యుద్ధంలోనూఈ ప్రాంతం గతంలోనూ యుద్ధ కాలుష్యాన్ని చూసింది. 1991 గల్ఫ్ యుద్ధ సమయంలో, ఇరాకీ దళాలు 600 కంటే ఎక్కువ కువైట్ చమురు బావులకు నిప్పంటించాయి. నెలల తరబడి, దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. దీంతో గల్ఫ్ అంతటా వాయు కాలుష్యం, నేల, భూగర్భ జలాల కాలుష్యం విస్తృతమైంది. అది అనేక అనారోగ్య సమస్యలకూ కారణమైంది. ఇందుకుగాను ఐక్యరాజ్యసమితి పరిహార కమిషన్కు నష్టపరిహారంగా ఇరాక్ 50 బిలియన్ డాలర్లకు పైగా చెల్లించింది.ఉక్రెయిన్లోనూమరో భయంకరమైన తాజా ఉదాహరణ ఉక్రెయిన్. యుద్ధం ఒక విషపూరిత వాతావరణాన్ని సృష్టించింది. ఇక్కడ ఇంధన డిపోలు, పారిశ్రామిక ప్రాంతాలు, రసాయన గిడ్డంగులు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు దేశంలోని చాలా ప్రాంతాల్లో గాలి, నదులు, వ్యవసాయ భూములను కలుషితం చేశాయి. చమురు కేంద్రాల్లో మంటలు, అటవీ నిర్మూలన, దెబ్బతిన్న పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడిన కాలుష్యం నీటి వ్యవస్థల పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించింది. -
ఒకవైపు చర్చలు మరో వైపు దాడులు
-
ఇరాన్ కీలక నిర్ణయం.. ఆ సేవలు పునరుద్ధరణ
టెహ్రాన్: ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడు నెలలు (87 రోజులు) పాటు కొనసాగిన తీవ్రమైన ఇంటర్నెట్ బ్లాకౌట్ (సేవల నిలిపివేత)ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అంతర్జాతీయ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.గత ఐదు నెలలుగా ఇరాన్ తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని చవిచూస్తోంది. ఫిబ్రవరి 28 న అమెరికా దాడుల ప్రారంభకానికి ముందు సైతం ఆ దేశంలో తీవ్రంగా అంతర్గత సంక్షోభం తలెత్తింది. ఖమేనీ పాలనకు నిరసనగా ఆ దేశ యువత పెద్దఎత్తున రోడ్లెక్కారు. దీంతో ఆ దేశంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ జనవరి 8న ఇరాన్ తొలిసారిగా ఆదేశాలు జారీ చేసింది. మధ్యలొ కొద్దిగా వెసులుబాటు ఇచ్చినప్పటికీ దాదాపుగా నాలుగు నెలల అనంతరం తొలిసారిగా ఆ సేవలనను పునరుద్దరించాలని నిర్ణయం తీసుకుంది.ఇరాన్ సైబర్ స్పేస్ స్టీరింగ్ అండ్ ఆర్గనైజింగ్ హెడ్క్వార్టర్స్ ఉన్నత స్థాయి సమావేశంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో ఇంటర్నెట్ పునరుద్ధరణకు అనుకూలంగా 9 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు వచ్చాయి. అనంతరం ఈ వివరాలను ఇరాన్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ అధికారులు మీడియాకు తెలియజేశారు.ఇంటర్నెట్ బ్లాకౌట్ కారణాలుదేశంలో ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల కారణంగా జనవరి 8న తొలిసారిగా ఇంటర్నెట్ ఆంక్షలు విధించారు. అనంతరం జనవరి 23న ఈ ఆంక్షలను కొద్దిగా సడలించినప్పటికీ, ఫిబ్రవరి 28న అమెరికా ,జ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు.ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థ 'నెట్బ్లాక్స్' ప్రకారం.. సాధారణంగా 90% నుండి 100% ఉండే ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఈ బ్లాకౌట్ సమయంలో కేవలం 1% నుండి 2% శాతానికి పడిపోయింది. ఆధునిక ఇంటర్నెట్ చరిత్రలోనే ఇది అత్యంత సుదీర్ఘమైన, తీవ్రమైన బ్లాకౌట్ అని నెట్బ్లాక్స్ పేర్కొంది. ఇంటర్నెట్ నిలిచిపోవడంతో సైనిక ఉద్రిక్తతల సమయంలో ప్రజలు తమ కుటుంబ సభ్యులను సంప్రదించడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. స్వతంత్ర సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కూడా కోల్పోయారు.నిరుద్యోగంయుద్ధం, నిరసనలు మరియు ఇంటర్నెట్ ఆంక్షల కారణంగా దేశంలో దాదాపు 10 లక్షల (1 మిలియన్) మందికి పైగా ఉపాధి కోల్పోయినట్లు 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' నివేదించింది. సోషల్ మీడియా ప్రకటనలపై ఆధారపడిన చిన్న వ్యాపారాలు, ఫ్రీలాన్సర్లు, టెక్ స్టార్టప్లు మరియు సాఫ్ట్వేర్ డెవలపర్ల ప్రాజెక్టులు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొంది. -
ప్రపంచానికి శుభవార్త.. త్వరలో హర్ముజ్ పునఃప్రారంభం..?
ప్రస్తుతం దోహాలో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ ప్రపంచానికి ఒక శుభవార్త అందింది. ఒకవేళ చర్చలు సఫలమైతే వచ్చే 30 రోజుల్లో హర్ముజ్ జలసంధి పునఃప్రారంభం అయ్యే అవకాశమున్నట్లు అంతర్జాతీయ కథనాలు ప్రచురించాయి. ఇదే జరిగితే హర్ముజ్లో ప్రపంచ దేశాల నౌకలు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రయాణం కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం జరుగుతున్నట్లు సమచారం.అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంతో ప్రపంచం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లడానికి ప్రధాన కారణం హర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్భందించడం. దీంతో చమురు సరఫరాకు ఆటంకం తలెత్తి సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం దోహలో జరుగుతున్న చర్చలు సఫలమైతే 30 రోజుల్లో హర్ముజ్ తెరిచేలా అమెరికా ప్రణాళికలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది.హర్ముజ్లో ఇరాన్ సముద్రపు మైన్లను అమర్చిన నేపథ్యంలో వాటిని ఒప్పందం కుదిరిన వెంటనే తక్షణమే అమెరికా వాటిని తొలిగించే ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్ని దేశాలకు చెందిన నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా, సురక్షితంగా ఇక్కడ ప్రయణించడానికి మార్గం సుగమం అవుతుంది. అదే విధంగా జలసంధి గుండా వెళ్లే నౌకల నుండి ఇరాన్ వసూలు చేస్తున్న రవాణా రుసుములను పూర్తిగా రద్దు చేస్తుందని పత్రికా కథనాలు పేర్కొన్నాయి.అయితే ఇటీవల ఇరాన్ సైతం కొంతమేర తగ్గింది. అంతర్జాతీయ అణు నిబంధనలకు తాము కట్టుబడి ఉంటామని ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు సఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.కాగా ప్రస్తుత చర్చల్లో పాల్గొనడానికి ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చీ ఖతార్ చేరుకున్నారు. ఈ పరిణామాలతో ఇరుదేశాల మధ్య త్వరలో ఒప్పందం కుదురుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే ఇంతకాలం ప్రపంచం ఎదుర్కొన్న చమురు సంక్షోభానికి ముగింపు లభించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. -
అమెరికా-ఇరాన్ చర్చల వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: దోహాలో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘యుద్ధం ఎవరూ కోరుకోవడం లేదు..కానీ ఈ ఒప్పందం కుదరకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది’అని ఆయన హెచ్చరించారు.2026 మే 22న దోహాలో అమెరికా-ఇరాన్ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలు మరింత ముందుకు సాగేందుకు ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చీ ఖతార్ చేరుకున్నారు. ఈ పరిణామాలతో ఇరుదేశాల మధ్య త్వరలో ఒప్పందం కుదురుతుందనే అంచనాలు నెలకొన్నాయి.ట్రంప్ గత శనివారం సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్, ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిమ్ మునీర్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా II, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో చర్చలు జరిపినట్లు తెలిపారు.ఈ చర్చల్లో ట్రంప్, అబ్రహాం ఒప్పందాలపై అన్ని దేశాలు ఒకేసారి సంతకం చేయాలని సూచించారు. ఇప్పటికే యూఏఈ, బహ్రెయిన్ సభ్యులుగా ఉన్నాయని, మిగతా దేశాలు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకటి లేదా రెండు దేశాలు సంతకం చేయకపోయినా అది అంగీకారయోగ్యమే కానీ ఎక్కువ దేశాలు ఈ ఒప్పందంలో భాగం కావాలని ఆయన స్పష్టం చేశారు. President Donald Trump posts on Truth Social- "Negotiations with the Islamic Republic of Iran are proceeding nicely! It will only be a Great Deal for all or, no Deal at all to the Battlefront and shooting, but bigger and stronger than ever before, and nobody wants that! During my… pic.twitter.com/D1IhQaGjim— ANI (@ANI) May 25, 2026 -
అప్పటివరకు ఇంతే..: మరో బాంబ్ పేల్చిన ట్రంప్
వాషింగ్టన్ డీసీ: పశ్చిమాసియా సంక్షోభానికి పూర్తి పరిష్కారం దిశగా ఇరాన్తో ఒప్పందం చేసుకునే విషయంలో అమెరికా తొందరపడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం చెప్పారు. ఇరు పక్షాల మధ్య అధికారిక ఒప్పందం కుదిరి, ధ్రువీకరణ పూర్తై, సంతకాలు అయ్యే వరకు ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన “దిగ్బంధం” పూర్తి స్థాయిలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో కుదిరిన ఇరాన్ అణు ఒప్పందాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. అది “మన దేశం చేసిన అత్యంత చెత్త ఒప్పందాల్లో ఒకటి” అని వ్యాఖ్యానించారు. బరాక్ ఒబామాపై విమర్శలు చేస్తూ, ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యం పెంచుకునే దారిని ఆ ఒప్పందం తెరిచిందని ఆరోపించారు.‘‘మన దేశం చేసిన అత్యంత చెత్త ఒప్పందాల్లో ఒకటి ఇరాన్ అణు ఒప్పందం. దీనిని బరాక్ హుస్సేన్ ఒబామా, ఆయన అడ్మినిస్ట్రేటివ్లోని అనుభవం లేని వారు ముందుకు తీసుకువచ్చి అమల్లోకి తెచ్చారు. అది ఇరాన్ అణ్వాయుధం తయారు చేసే దిశగా నేరుగా తీసుకెళ్లింది. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్తో జరుపుతున్న చర్చలు అలా కాదు. అసలు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.చర్చలు క్రమబద్ధంగా, నిర్మాణాత్మకంగా సాగుతున్నాయి. టైమ్ మన వైపు ఉండడంతో ఒప్పందం త్వరగా ముగించాలనే తొందరపడొద్దని నా ప్రతినిధులకు చెప్పాను. ఒప్పందం పూర్తిగా ఖరారై, ధ్రువీకరణ పొంది, సంతకం అయ్యే వరకు దిగ్బంధం పూర్తిగా కొనసాగుతుంది. ఇరు పక్షాలు సమయం తీసుకుని సరిగ్గా చేయాలి. ఎలాంటి తప్పులు జరగకూడదు.ఇరాన్ అణ్వాయుధం లేదా అణు బాంబు తయారు చేయకూడదు, పొందకూడదు అన్న విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు సహకారం అందించిన పశ్చిమాసియా దేశాలన్నింటికీ నా ధన్యవాదాలు. వారు చరిత్రాత్మక అబ్రహాం ఒప్పందాల్లో చేరడం వల్ల ఈ సహకారం ఇంకా బలపడుతుంది. ఎవరికి తెలుసు.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కూడా అందులో చేరాలని అనుకోవచ్చు’’ అని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. -
ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్ : ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ‘మాకు అణ్వాయుధాలు అవసరం లేదు. అణ్వాయుధాల విషయంలో ప్రపంచానికి భరోసా ఇస్తున్నాం. ప్రపంచ అణు నిబంధనలకు కట్టుబడి ఉంటాం’అని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అధికారిక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం..నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ తన యురేనియం నిల్వలను ఒప్పందం ప్రకారం అమెరికాకు ఇవ్వడానికి సిద్ధమైంది.భారత్లోని వారణాసిలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ మాట్లాడుతూ.. ‘అణ్వాయుధాలు ఇస్లాంలో హరామ్ (నిషిద్ధం). ముప్పై ఏళ్ల క్రితమే ఇరాన్ వాటిని వద్దని ప్రకటించింది. సుప్రీం లీడర్ ఇచ్చిన ఫత్వా ప్రకారం అవి మతపరంగా నిషిద్ధం’ అని స్పష్టం చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను ‘న్యూక్లియర్ డస్ట్’ అని పేర్కొంటూ, ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించడం తమ ప్రధాన లక్ష్యం అని పునరుద్ఘాటించారు. ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా ఇరాన్ నాయకులతో సమావేశమై, పశ్చిమ ఆసియాలో శాంతి ప్రయత్నాలపై చర్చించారు. అమెరికా,ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హర్మూజ్ జలసంధి పునఃప్రారంభంపై చర్చలు కొనసాగుతున్నాయి. -
ఇరాన్ సరెండర్.. యురేనియంపై ట్రంప్ విజయం!
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాతో చర్చలు జరుపుతున్న విస్తృత శాంతి ఒప్పందంలో భాగంగా తన వద్ద ఉన్న శుద్ది చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించినట్టు సమాచారం. ఈ మేరకు ఇద్దరు అమెరికా అధికారులు 'ది న్యూయార్క్ టైమ్స్'కు తెలిపారు.ఈ నేపథ్యంలో ఇరాన్ యురేనియం నిల్వల నిర్మూలన పద్దతిపై త్వరలో చర్చలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ విషయంలో ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోతే చర్చలు విఫలమయ్యే అవకాశం కూడా ఉంది. కాగా, ఇరాన్ వద్ద 60 శాతం శుద్ది చేసిన దాదాపు 400 కిలోల యురేనియం ఉంటుందని అమెరికా అంచనా వేస్తోంది. అయితే, ప్రతిపాదిత ఒప్పందం వివరాలను ట్రంప్ వెల్లడించనప్పటికీ, దాదాపు ఆయుధ స్థాయి యురేనియం నిల్వలను వదులుకోవడానికి టెహ్రాన్ సూత్రప్రాయంగా అంగీకరించిందని అమెరికా అధికారులు చెబుతున్నారు.🇺🇸🇮🇷 NYT: U.S. officials said Iran has reportedly agreed to give up its stockpile of highly enriched uranium as part of the proposed agreement announced by U.S. President Donald Trump. Officials said details on how the uranium would be removed or downgraded would be discussed… pic.twitter.com/BoNOksRsG4— Global Surveillance (@Globalsurv) May 24, 2026అయితే, ఈ దశలో ఈ అవగాహన ఇంకా విస్తృతంగానే ఉందని, యురేనియంను ఇవ్వడంపై కచ్చితమైన విధానంపై ఇంకా చర్చలు జరగాల్సి ఉందని ఆ అధికారులు తెలిపారు. విస్తృత ఒప్పందం అధికారికంగా కుదిరిన తర్వాత, తదుపరి అణు చర్చల దశలో ఇరాన్ ఈ పదార్థాన్ని ఎలా బదిలీ చేస్తుంది, పలుచన చేస్తుంది లేదా ఇతరత్రా తటస్థీకరిస్తుంది అనే దానిపై వివరణాత్మక చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ యురేనియం నిల్వలను దేశం నుండి బయటకు పంపవద్దని ఆదేశించారని ఇరాన్ వర్గాలు ఇటీవల పేర్కొన్న తర్వాత ఈ పరిణామం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.ఇక, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ప్రకారం.. ఇరాన్ ప్రస్తుతం 60 శాతం శుద్ధి చేయబడిన దాదాపు 400 కిలోగ్రాముల యురేనియంను కలిగి ఉంది, ఇది ఆయుధ-స్థాయికి దగ్గరగా ఉంది. ఈ నిల్వలను మరింత శుద్ధి చేసి బహుళ అణు బాంబులకు కావలసిన పదార్థాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అధికారులు పదేపదే వాదిస్తున్నారు. కాగా, ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. అలాగే, మధ్యప్రాచ్యంలో చమురు మార్కెట్లు, వాణిజ్య మార్గాలు స్థిరపడే అవకాశం ఉంది.ఆస్తుల విడుదల: యుద్దం కారణంగా ఇరాన్పై అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగా, బిలియన్ల డాలర్ల విలువైన ఆస్తులు విదేశీ బ్యాంకుల్లో ఫ్రీజ్ అయ్యాయి. యురేనియం ఒప్పందం కుదిరితే ఆంక్షలు తొలగిపోయే అవకాశం ఉంది.ఆస్తుల విడుదల: యురేనియం నిల్వను వదులుకోవడానికి అంగీకరించిన ప్రతిఫలంగా, అమెరికా ఈ ఆస్తులను విడదీయడానికి సిద్ధమవుతోంది.ప్రభావం: ఆర్థికంగా ఇరాన్కు ఊపిరి పీల్చే అవకాశం లభిస్తుంది.ప్రాంతీయ స్థిరత్వం: ఆర్థిక ఒత్తిడి తగ్గడం వల్ల ఇరాన్ చర్చల్లో మరింత సహకరించే అవకాశం ఉంది.JUST IN: 🇵🇰🇮🇷 Pakistan official says Iran has agreed to hand over enriched uranium under the Trump-announced deal. pic.twitter.com/OK78Aus5qj— Whale Insider (@WhaleInsider) May 24, 2026ఇదిలా ఉండగా.. ఇరాన్ మాత్రం ఇంకా జాగ్రత్తగానే వ్యవహరిస్తోంది. అమెరికా మరోసారి సైనిక దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ సమయంలో తమ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని తెలిపారు. మళ్లీ దాడులు జరిగితే ప్రారంభ దశ కంటే మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. -
ఇరాన్ గగనతలం మూసివేత.. ఏం జరగనుంది?
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర దశకు చేరుకున్నాయి. ఇరాన్తో శాంతి చర్చలు కొనసాగుతూనే మరోసారి సైనిక దాడులకు అమెరికా రెడీ అవుతున్నట్టు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై తాజా దాడుల అవకాశాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఏ క్షణంలోనైనా మెరుపు దాడులు జరిగే అవకాశముంది.ఈ నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. టెహ్రాన్పై అమెరికా మరోసారి దాడులకు సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. భద్రతా కారణాలతో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.JUST IN: IRAN AIRSPACE COMPLETELY EMPTY!!As per CBS, the US is prepping for possible strikes on Iran.📹FlightRadar24 pic.twitter.com/pDZ6AObtRL— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) May 23, 2026సీబీఎస్ న్యూస్ కథనం ప్రకారం, ఇరాన్పై సంభావ్య దాడుల నేపథ్యంలో అమెరికా సైన్యం, ఇంటెలిజెన్స్ విభాగాలకు చెందిన పలువురు అధికారులు తమ మెమోరియల్ డే వీకెండ్ సెలవులను రద్దు చేసుకున్నారు. మొదట న్యూజెర్సీలోని తన గోల్ఫ్ క్లబ్లో వీకెండ్ గడపాలని భావించిన ట్రంప్ కూడా తన ప్రణాళిక మార్చుకుని వైట్ హౌస్కు తిరిగి వెళ్లినట్లు సమాచారం. చర్చలు చివరి నిమిషంలో ఫలించకపోతే ఇరాన్పై కొత్త దాడులకు ట్రంప్ సీరియస్గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల మధ్య ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. "ఇరాన్ ఒప్పందం చేసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంది. కానీ వాళ్లు అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని మేము ఎప్పటికీ అనుమతించం. అందుకే మేము కఠిన చర్యలు తీసుకున్నాం" అని ట్రంప్ అన్నారు.ఇదే సమయంలో చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రంగంలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ప్రస్తుతం టెహ్రాన్లో ఉన్నారు. శనివారం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ జనరల్ అహ్మద్ వాహిదీతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఖతార్ ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో భాగస్వామ్యమవుతున్నారు. అయితే చర్చలు చాలా క్లిష్టంగా సాగుతున్నాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజూ డ్రాఫ్ట్లు మారుతున్నా పెద్దగా పురోగతి కనిపించడం లేదని పేర్కొంటున్నారు. -
అమెరికాకు కొత్త టెన్షన్.. ఇరాన్పై కీలక ఇంటెలిజెన్స్ నివేదిక
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడితో తీవ్ర ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. యుద్ధం కోసం అధునాతన టెక్నాలజీ ఉన్న బాంబు, క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించారు. దీంతో, ఇరువైపులా భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్ క్షీణించిన తన సైనిక సామర్థ్యాలను అంచనా వేసిన దాని కంటే చాలా వేగంగా పునర్నిర్మించుకుంటోంది. దీనికి సంబంధించిన ఓ నివేదిక ఇప్పుడు అమెరికాను టెన్షన్ పెడుతోంది.అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని అంచనా వేసిన దాని కంటే వేగంగా నిర్మించుకుంటోంది. ప్రస్తుతం ఇరాన్ డ్రోన్ సామర్థ్యాలలో 50 శాతం ఇంకా మిగిలి ఉన్నాయి. యుద్ధ సమయంలో కోల్పోయిన ఆయుధాలను ఇరాన్ చాలా వేగంగా పునర్నిర్మించుకుంటోంది. నెల రోజుల క్రితం పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఏప్రిల్ 8న ఇరాన్ తన డ్రోన్ల ఉత్పత్తిని కూడా పునఃప్రారంభించింది. అయితే, అమెరికాతో కొనసాగుతున్న ఈ సంఘర్షణలో డ్రోన్లే ఇరాన్ యొక్క ప్రధాన ఆయుధం.యుద్ధం సంఘర్షణలో దెబ్బతిన్న క్షిపణి స్థానాలు, ప్రయోగ పరికరాలు, మరియు కీలక ఆయుధ వ్యవస్థల ఉత్పత్తి శ్రేణులను మరమ్మత్తు చేయడం, వాటి స్థానంలో కొత్త వాటిని ఇరాన్ ఏర్పాటుచేస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్ కోల్పోయిన సైనిక బలాన్ని పునరుద్ధరించుకుంటోందని నివేదిక పేర్కొంది. దీని అర్థం, ఒకవేళ యుద్ధం తిరిగి ప్రారంభమైతే ఇరాన్ ప్రాంతీయ మిత్రదేశాలకు మరోసారి ముప్పుగా మారగలదు. ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్ల దాడి పరిధిలోనే ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క క్షిపణి ఉత్పత్తి సామర్థ్యం తీవ్రంగా క్షీణించడంతో, టెహ్రాన్ ప్రత్యామ్నాయంగా డ్రోన్ యుద్ధం వైపు ఎక్కువగా మొగ్గు చూపవచ్చు. ఈ ముప్పును ప్రాంతీయ మిత్రదేశాలు ప్రత్యేక ఆందోళనతో చూస్తున్నాయి.గతేడాది ఇజ్రాయెల్తో చేసిన 12 రోజుల యుద్ధం కంటే ప్రస్తుతం జరుగుతోన్న యుద్ధంలోనే గల్ఫ్ ప్రాంతంపై ఇరాన్ ఎక్కువగా క్షిపణులను ప్రయోగించింది. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ విడుదల చేసిన గణాంకాల్లో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 మధ్య గల్ఫ్ దేశాలపైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల సంఖ్య 550 దాటినట్లు తెలిసింది. తమపై జరిగిన క్షిపణి దాడులను, డ్రోన్ దాడులను ఒమన్ వెల్లడించలేదు. ఇదే సమయంలో వాషింగ్టన్, ఇజ్రాయెల్లు ఇరాన్పై వేలాది బాంబులను వేశాయి.ఇరాన్ దగ్గర ఉన్న అత్యంత కీలకమైన ఆయుధాలు బాలిస్టిక్ క్షిపణులు. ఇవి ఎక్కువ ఎత్తుకు చేరుకుని, అక్కడ నుంచి లక్ష్యాలను వెంబడించగలవు. శత్రువుకు తీవ్ర నష్టాన్ని కలిగించడానికి అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా ఈ బాలిస్టిక్ క్షిపణులను తెహ్రాన్ పరిగణిస్తోంది. తమ వైమానిక దళానికి ప్రత్యామ్నాయంగా దీన్ని చూస్తోంది. క్రూయిజ్, హైపర్సోనిక్ క్షిపణులు తక్కువ ఎత్తులో వెళ్తాయి. తమ లక్ష్యాలను చేరుకునేందుకు వీటికి ఎయిర్ పవర్ ఇంజిన్లు (జెట్ లేదా ప్రొపెల్లర్) సాయం అవసరం.ఫౌండేషన్ ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ డెమొక్రసీస్ ప్రకారం..ఇరాన్ వద్దనున్న స్వల్ప శ్రేణి క్షిపణుల రేంజ్ 300 కిలోమీటర్ల నుంచి వెయ్యి కిలోమీటర్లు.ఈ క్షిపణులు గల్ఫ్ దేశాలు సహా పలు ఇతర సరిహద్దు దేశాలపై ప్రయోగించగలిగే సామర్థ్యంతో ఉన్నాయి.మధ్యస్థ శ్రేణి క్షిపణులు వెయ్యి కిలోమీటర్ల నుంచి రెండు వేల కిలోమీటర్ల వరకు ప్రయోగించదగినవి. ఇవి ఇజ్రాయెల్ వరకు చేరుకోగలవు.డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొన్న వివరాల ప్రకారం ఇరాన్ వద్దనున్న 8 బాలిస్టిక్ క్షిపణుల రేంజ్..షహాబ్ 1... 300 కిలోమీటర్లుఫతే 110... 300 నుంచి 500 కిలోమీటర్లుషహాబ్ 2... 500 కిలోమీటర్లుజుల్ఫిఖార్... 700 కిలోమీటర్లుఖియామ్ 1... 750 కిలోమీటర్లుషహాబ్ 3... 2000 కిలోమీటర్లుమరోవైపు.. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు దీర్ఘకాలంలో ఇరాన్ సైన్యాన్ని ఎంతగా దెబ్బతీశాయనే విషయాన్ని కూడా అమెరికా నిఘా వర్గాల అంచనాలు వేస్తున్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. క్షిపణుల తయారీకి ఉపయోగించే విడిభాగాలను చైనా ఇరాన్కు సహాయం చేస్తోంది. అయితే అమెరికా దిగ్బంధనం కారణంగా ఆ సహాయం పరిమితం చేయబడింది. అలాగే, రష్యా నుంచి కూడా ఇరాన్ సాయం అందుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలా ఉండగా.. ఇరాన్తో యుద్ధంలో ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచే క్రమంలో అమెరికా భారీగా తన క్షిపణి నిల్వలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దాని అమ్ములపొదిలోని సగం ఎయిర్డిఫెన్స్ క్షిపణులు ఖాళీ అయినట్లు సమాచారం. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. యుద్ధ సమయంలో ఇరాన్పై అమెరికా 200కు పైగా థాడ్ క్షిపణులను ప్రయోగించింది. వీటితో పాటు మధ్యధరా సముద్రంలో మోహరించిన యుద్ధనౌకల నుంచి 100కు పైగా స్టాండర్డ్ మిసైల్-3, స్టాండర్డ్ మిసైల్-6లను వినియోగించింది. దీంతో పెంటగాన్ వద్ద ఉన్న ఇంటర్సెప్టర్ నిల్వలు సగానికి పడిపోయాయి.అమెరికా వద్ద ఇంకా సుమారు 200 థాడ్ ఇంటర్సెప్టర్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇంత భారీస్థాయిలో క్షిపణులు వినియోగించడంపై రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది అమెరికా- ఇజ్రాయెల్ సైనిక సమన్వయలోపాన్ని ఎత్తిచూపుతోందన్నారు. ఇక, యుద్ధంలో ఇజ్రాయెల్ 100 కంటే తక్కువ యారో ఇంటర్సెప్టర్లు, 90 డేవిడ్ స్లింగ్లను వాడింది. వీటిలో కొన్ని ఇరాన్కు మద్దతుగా ఉన్న యెమెన్, లెబనాన్ల నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగించింది. మొత్తం మీద ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం అమెరికాకు కొత్త టెన్షన్ను తెచ్చిపెట్టింది. -
తీసుకుంటాం, తుడిచేస్తాం
వాషింగ్టన్ డీసీ: ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య శాంతియుత వాతావరణం నెలకొంది. ఇరుదేశాలు కాల్పుల విరమణ ప్రకటించడంతో ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగాయి. పరిస్థితులు కొద్దిగా కుదుట పడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద భారీగా శుద్ధిచేసిన యురేనియం నిల్వలున్నాయని వాటిని ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకొని తీరుతామన్నారు.ఇరాన్పై అమెరికా దాడులు ప్రారంభించడానికి ప్రధాన కారణం టెహ్రాన్ అణుబాంబు తయారు చేస్తోందనే ఆరోపణ. ఆ దేశానికి గనుక అణ్వాయుధాలు అందితే అది అత్యంత ప్రమాదమని అమెరికా దాడులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్కు చెందిన అణ్వాయుధ తయారీ కేంద్రాలపై అమెరికా పలుమార్లు దాడులు చేసింది. కాగా ట్రంప్ తాజాగా మరోసారి అణుబాంబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎట్టిపరిస్థితుల్లో అమెరికా స్వాధీనం చేసుకొని తీరుతుందని ప్రకటించారు.ట్రంప్ మాట్లాడుతూ.. "మాకు అది అవసరం లేదు. కానీ మేము అది పొందుతాం. మాకు అది కావాలి. దానిని మేము పొందిన తర్వాత పూర్తిగా వినాశనం చేస్తాం. కానీ ప్రస్తుతం అది మాకు కావాలి" అని ట్రంప్ అన్నారు.ఇరాన్లోని యురేనియం నిల్వలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ వద్ద దాదాపు 900 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియం ఉందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా గతేడాది జరిపిన దాడుల్లో ఆ నిల్వలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ట్రంప్ వాదిస్తున్నారు.మోజ్తాబా కీలక ప్రకటనఅయితే ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో ఇరాన్ సైతం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఇరాన్లోని యురేనియం నిల్వలను ఎట్టి పరిస్థితుల్లో వేరే దేశాలకు ఎగుమతి చేయకూడదని ఆదేశాలిచ్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
అది దేశం దాటివెళ్తే మన సంగతి అంతే: ఇరాన్
టెహ్రాన్: ఇరాన్, అమెరికా మధ్య దౌత్య చర్చలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శుద్ధిచేసిన యురేనియం నిల్వలు దేశం బయటకు వెళ్లకూడదని ఆదేశించినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్ వదులుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కీలక డిమాండ్ను ఇరాన్ మొదటి నుంచి నిరాకరిస్తోంది.అణ్వాయుధ తయారీలో కీలక భాగమైన శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పూర్తిగా ఇస్లామిక్ రిపబ్లిక్ నుంచి బయటకు తరలిస్తామని ట్రంప్ గతంలో ఇజ్రాయెల్కు హామీ ఇచ్చారని ఇజ్రాయెల్ అధికారులు రాయిటర్స్కు తెలిపారు.ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కఠిన వైఖరిని కొనసాగిస్తున్నారు. శుద్ధి చేసిన యురేనియాన్ని పూర్తిగా ఇరాన్ అధీనంలో లేకుండా చేసేవరకు, ప్రాంతీయ ప్రాక్సీ మిలీషియాలకు టెహ్రాన్ ఆర్థిక, సామగ్రి సహాయం పూర్తిగా ఆపే వరకు వెనక్కి తగ్గబోమన్నారు. అలాగే, ఆ దేశ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసే వరకు యుద్ధ విరమణపై ఆలోచించబోమని ఆయన స్పష్టం చేశారు.అయితే ఈ వైఖరికి టెహ్రాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అత్యంత సున్నితమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా పేరు వెల్లడించకుండా మీడియాతో మాట్లాడారు ఇరాన్ వర్గాలకు చెందిన ఓ ప్రతినిధి. “సుప్రీం లీడర్ ఆదేశం స్పష్టంగా ఉంది. శుద్ధిచేసిన యురేనియం నిల్వలు దేశం బయటకు వెళ్లకూడదన్నారు” అని తెలిపారు.అదే వర్గాలు మరో విషయం వెల్లడించాయి. ఈ పదార్థాన్ని విదేశాలకు పంపితే తమ దేశ భద్రత తీవ్రంగా బలహీనపడుతుందని, భవిష్యత్తులో వాషింగ్టన్, టెల్ అవీవ్ నుంచి సైనిక దాడులను ఎదుర్కోలేదని చెప్పాయి. ఇరాన్ అగ్ర పరిపాలనా, సైనిక వర్గాలు ఈ విధంగానే భావిస్తున్నాయి. ఇరాన్ రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం కీలక ప్రభుత్వ విధానాలపై తుది అధికారం సుప్రీం లీడర్ చేతుల్లోనే ఉంటుందని రాయిటర్స్ తెలిపింది.అమెరికా దాడులు చేయనుందా? ఇరాన్ సీనియర్ వర్గాల సమాచారం ప్రకారం.. టెహ్రాన్ రాజకీయ వ్యవస్థలో తీవ్ర అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం యుద్ధ తీవ్రత పూర్తిగా తగ్గినట్టుగా చూపడం అమెరికా వ్యూహాత్మక మోసమని, తప్పుడు రీతిలో భద్రతాభావం కలిగించి మళ్లీ వైమానిక దాడులు ప్రారంభించాలన్న యత్నమని చాలామంది భావిస్తున్నారు.ఈ భయాలకు బలం చేకూర్చుతూ ఇరాన్ ప్రధాన శాంతి చర్చల ప్రతినిధి బాక్వెర్ తాజాగా మాట్లాడుతూ.. “శత్రువు బహిరంగ, రహస్య కదలికలు చూస్తే అమెరికా సైన్యం కొత్త దాడుల సన్నాహాల్లో ఉందని స్పష్టమవుతోంది” అన్నారు.ఇదిలా ఉండగా, సమగ్ర శాంతి ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయకపోతే ఆ దేశంపై మరోసారి సైనిక దాడులు ప్రారంభించేందుకు అమెరికా పూర్తిగా సిద్ధంగా ఉందని ట్రంప్ బుధవారం ప్రకటించారు. అయితే సరైన సమాధానాలు రావడానికి కొన్ని రోజుల గడువు ఇస్తామన్న సంకేతం ఇచ్చారు. -
హార్మూజ్పై పట్టుకు ఇరాన్ ప్లాన్.. అథారిటీ ఏర్పాటు
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధిపై తన నియంత్రణను మరింత బలోపేతం చేస్తూ దీవుల వద్ద చెక్పాయింట్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నౌకలపై రుసుములు విధిస్తోంది. జలసంధిలో ఇరాన్ సరికొత్తగా పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ ఏర్పాటు చేసింది. కొత్త “Hormuz Safe” ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఇరాన్ ఆర్థిక లాభాలు పొందుతోంది. దీని వల్ల ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతు ప్రభావితం అవుతోంది.హార్మూజ్ జలసంధిపై తన నియంత్రణను బలపరచడానికి ఇరాన్ కొత్త సంస్థను ఏర్పాటు చేసింది. జలసంధి నిర్వహణ బాధ్యతలను పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ (Persian Gulf Strait Authority) అనే ఈ సంస్థను అప్పగించింది. ఇందులో భాగంగా చెక్పాయింట్లు అమలు చేస్తోంది. నౌకలపై ట్రాన్సిట్ అనుమతులు జారీ చేసి, రుసుములు వసూలు చేస్తోంది. ముఖ్యంగా టోల్ ఫీజులు వసూలు చేయడం, నౌకల కార్గో వివరాలు, జెండా, గమ్యం వంటి సమాచారం సేకరించడం వంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని నౌకలకు రెండు మిలియన్ డాలర్ల వరకు టోల్ ఫీజులు విధిస్తున్నారు. దీని ద్వారా ఇరాన్ $10 బిలియన్ ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, ఇరాన్ ఈ సంస్థ ద్వారా హార్మూజ్ జలసంధిపై తన భౌగోళిక ప్రభావాన్ని పెంచుకోవడం, ఆర్థిక లాభం పొందడం, అమెరికా ఆంక్షలను తప్పించుకోవాలని ప్లాన్ చేసింది.ఇదే ఉదాహరణ.. కాగా, Agios Fanourios-I అనే ట్యాంకర్ ఇరాక్ క్రూడ్ ఆయిల్తో వియత్నాం వైపు బయలుదేరింది. కానీ ఏప్రిల్ చివరి నుండి దుబాయ్ తీరంలో నిలిపివేయబడింది. మే 10న ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మాత్రమే హార్మూజ్ గుండా ప్రయాణం కొనసాగింది. సాధారణంగా 5 గంటల్లో పూర్తయ్యే ప్రయాణం, ఇరాన్ జోక్యం వల్ల 2 రోజులు పట్టింది. మరోవైపు.. ఈ జలమార్గం గుండా కేవలం కొద్ది సంఖ్యలో నౌకలు మాత్రమే ప్రయాణించాయి. అమెరికాకు చెందిన సిన్మాక్స్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ విశ్లేషణ ప్రకారం.. ఏప్రిల్ 18 నుండి మే 6 మధ్య 60 కంటే తక్కువ నౌకలు మాత్రమే ఈ జలసంధి గుండా ప్రయాణించగలిగాయి. యుద్ధానికి ముందు, సాధారణంగా ఒక రోజులో సుమారు 120 నుండి 140 నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించేవి, వాటిలో దాదాపు సగం చమురు ట్యాంకర్లే ఉన్నాయి.ప్రభావంప్రపంచ చమురు సరఫరా: హార్మూజ్ గుండా 20% గ్లోబల్ ఆయిల్ వెళ్తుంది.మార్కెట్ కలకలం: ఆలస్యం, రుసుములు, అనిశ్చితి కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయి.ప్రాంతీయ ఉద్రిక్తతలు: గల్ఫ్ దేశాలు, అమెరికా, యూరప్ దేశాలు ఇరాన్ చర్యలను వ్యతిరేకిస్తున్నాయి.ప్రపంచ ప్రతిస్పందన: UK, France వంటి దేశాలు 40 దేశాల సమావేశం ఏర్పాటు చేసి, యూరోపియన్ ఎస్కార్ట్ ప్లాన్పై చర్చిస్తున్నాయి. -
సరైనా సమాధానం కోసం ఎదురుచూస్తున్న: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయని, ఇరాన్ నుంచి తమకు 100 శాతం సానుకూల సమాధానాలు కావాలన్నారు. ఇరాన్తో యుద్ధమా? లేక శాంతి ఒప్పందమా? అనే విషయం తేలడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉందని బాంబు పేల్చారు. ఇరాన్ సరిగా స్పందించని పక్షంలో తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ నుండి దిగిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ..‘ఇరాన్, అమెరికా మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. మాకు సరైన సమాధానాలు రాకపోతే, పరిస్థితి చాలా వేగంగా చేయిదాటిపోతుంది. ఒకవేళ ఇరాన్ నుంచి సరైన సమాధానం రాకపోతే దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇరాన్ నుంచి మాకు 100 శాతం సానుకూల సమాధానాలు కావాలి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే ఎంతో సమయం, శక్తి, మరికొందరి ప్రాణాలు కాపాడినట్లు అవుతుంది. ప్రస్తుతం చర్చల్లో పాల్గొంటున్న ఇరాన్ ప్రతినిధులు, గతంలో ఉన్నవారి కంటే చాలా వివేకవంతంగా కనిపిస్తున్నారు. ఇరుపక్షాలకు మేలు జరిగేలా వారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. అయితే, దౌత్యపరమైన ఈ చర్చల సమయం చాలా తక్కువగా ఉంది. ఏదైనా కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది’ అని అన్నారు.ఇదే సమయంలో ఇరాన్కు మాత్రం అణ్వాయుధాన్ని సాధించే అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ చర్చల తర్వాత ఒక ఒప్పందమైనా జరుగుతుందా? లేదా తాము కొన్ని కఠినమైన చర్యలైనా తీసుకోవాల్సి ఉంటుందా? అని వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది చనిపోవడం కంటే, తక్కువ నష్టంతో ఈ సమస్య ముగిసిపోవాలన్నదే తన కోరికని, అయితే తాము ఏ దారిలో వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు జారీ చేశారు.ఒప్పందం కుదరకపోతే భారీ దాడి..అంతకుముందు.. ఇరాన్పై అమెరికా ప్రణాళికాబద్ధ సైనిక దాడిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ట్రంప్ ఇటీవల వెల్లడించారు. గల్ఫ్ దేశాల విజ్ఞప్తితోనే దాడిని వాయిదా వేసినట్లు తెలిపారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో ఇరాన్తో ప్రస్తుతం కీలక చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని గల్ఫ్ దేశాల నాయకులు సూచించారని తెలిపారు. అందుకే ప్రణాళికాబద్ధ దాడిని నిలిపివేశామని పేర్కొన్నారు. అయితే ఒప్పందం కుదరకపోతే ఎప్పుడైనా పూర్తి స్థాయి భారీ దాడికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. అలాగే ఇరాన్కు అణ్వాయుధాలు ఉండకూడదు అన్నది అమెరికా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. -
చమురు తెచ్చిన తంటా
-
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్లో నెగ్గిన బిల్లు
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్తో యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన తీర్మానం 50-47 ఓట్లతో నెగ్గింది. దీంతో ఇరాన్తో యుద్ధం విషయంలో కాంగ్రెస్ ట్రంప్పై పై చేయి సాధించింది. అయితే ఇది చట్టంగా మారడానికి ఇంకా అనేక దశలు దాటాల్సి ఉంది.ఇరాన్తో యుద్ధం ట్రంప్ పాలిట శాపంగా మారింది. ఈ తొందరపాటు నిర్ణయంతో ఇంటా, బయిటా ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. టెహ్రాన్పై దాడితో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తి అనేక దేశాలు ట్రంప్ను విమర్శిస్తుండగా.. మరోవైపు స్వంత దేశంలోనూ యుద్ధానికి వ్యతిరేకంగా తీర్మాణం ప్రవేశపెట్టారు.ఇరాన్పై యుద్ధం ఆపే ప్రతిపాదనను వర్జీనియా డెమెక్రట్స్ సెనేటర్ టిమ్ కెయిన్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మాణానికి అనుకూలంగా 50 ఓట్లు రాగా వ్యతిరేకంగా 47 ఓట్లు వచ్చాయి. అయితే ఈ ఓటింగ్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు సైతం ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడం విశేషం. మరో ముగ్గురు సభ్యులు ఓటింగ్లో పాల్గొనలేదు. దీంతో ట్రంప్కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణం అమెరికన్ కాంగ్రెస్లో నెగ్గింది.అయితే ఇది కేవలం ప్రారంభదశ మాత్రమే ఇది పూర్తిస్థాయిలో అమలులోకి రావాలంటే సెనేట్లో ఓటింగ్ జరగాలి అనంతరం రిపబ్లికన్ల అధిక్యం ఉన్న ప్రతినిధుల సభలోనూ నెగ్గాలి అయినప్పటికీ అధ్యక్షుడు తన విచక్షణ అధికారాలను ఉపయోగించి వీటో చేసి దీనిని ఆపవచ్చు. ఒకవేళ వీటోని ఆపాలని అమెరికా కాంగ్రెస్ అనుకుంటే సెనెట్, ప్రతినిధుల సభ రెండింటిలోనూ 2/3 వంతు మెజార్టీతో నెగ్గాల్సి ఉంటుంది. అప్పుడు ఇరాన్పై యుద్ధాన్ని నియంత్రించేలా చట్టం చేయవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యంలా కనిపిస్తోంది.అమెరికా చట్టం ఏం చెబుతుంది.అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు కాంగ్రెస్ ఆమోదం లేకుండా కేవలం 60 రోజులు మాత్రమే సైనిక చర్యలను ప్రారంభించగలరు. ఆ తర్వాత, ఆయన యుద్ధాన్ని ముగించడమో, కాంగ్రెస్ అనుమతి కోరడమో, లేదా దళాల సురక్షిత ఉపసంహరణను నిర్ధారించడానికి అదనంగా 30 రోజులు అభ్యర్థించడమో చేయాలి. అయితే ప్రస్తుతం సీజ్ ఫైర్ నడుస్తోన్న నేపథ్యంలో ట్రంప్ ఈ చట్టం ఇరాన్ యుద్ధానికి వర్తించదని పేర్కొన్నారు. ఏదైమైనా ట్రంప్కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణం అమెరికా కాంగ్రెస్లో నెగ్గడం ప్రతిపక్షాలు అతిపెద్ద విజయంగా భావిస్తున్నాయి. -
మళ్లీ యుద్ధం: ఇప్పుడు ట్రంప్ ముందున్న 2 మార్గాలివే..
ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? ఇది అమెరికా బలహీనతా? లేక దౌత్య చర్చల దిశగా అడుగా? ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? దాడులు చేస్తామని చెప్పిన ట్రంప్ మరోసారి యూ-టర్న్ ఎందుకు తీసుకున్నారు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి కొన్ని గంటల్లోనే భిన్న సంకేతాలు వచ్చాయి. మొదట ఇరాన్పై దాడి చేస్తామని చెప్పారు. తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ విజ్ఞప్తి చేయడంతో జరగాల్సిన దాడిని వాయిదా వేశారు. దీనిపై పలువురు విశ్లేషకులు వివరించిన అంశాలను చూద్దాం.. ట్రంప్ ముందున్న మార్గాలు రెండు మాత్రమే. ఒకటి ఇరాన్కు రాయితీలు (ఆంక్షల ఎత్తివేత వంటి వెసులుబాట్లు) ఇవ్వడం. అంటే యుద్ధంలో ఓడిపోయామని చెప్పకనే చెప్పడం. గతంలో వియత్నాం, అఫ్గానిస్తాన్ యుద్ధాల్లో కూడా ఇటువంటిదే జరిగింది. కానీ, ఓటమిని అంగీకరించడం అమెరికాకు కష్టమే. మరో మార్గం మళ్లీ దాడులు మొదలుపెట్టడం. అమెరికాలోని నియోకాన్ (కఠిన విదేశాంగ విధానాన్ని సమర్థించే రాజకీయ వర్గం) వర్గాలు, ఇజ్రాయెల్ మరింత ఒత్తిడి పెడితే ఇరాన్ వెనక్కి తగ్గుతుందని భావిస్తున్నాయి. కానీ అది అంత సులువు కాదు.ట్రంప్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇలాంటి మార్పులు పలుసార్లు చేశారు. ఫిబ్రవరి 28న 48 గంటల్లో ఇరాన్ ప్రజా మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ప్రకటించారు. తర్వాత గడువు పెంచారు. అనంతరం మళ్లీ పెంచారు. ఈ సారి మాత్రం పాకిస్థాన్ వల్ల కాదు.. యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియా విజ్ఞప్తి కారణంగా ట్రంప్ నిర్ణయం వాయిదా పడింది.ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే మొత్తం పరిస్థితిని చూడాలి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం మొదలుపెట్టాయి. అప్పట్లో ట్రంప్ లక్ష్యాల్లో ఇరాన్ పాలనా మార్పు, క్షిపణి సామర్థ్యాల నిర్మూలన కూడా ఉన్నాయి. కానీ దాడుల తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ ఏ లక్ష్యాన్నీ సాధించలేకపోయాయి.అంతేకాదు, ఇరాన్ హార్మూజ్ ప్రాంతంపై ఆధిపత్యం సాధించింది. దీంతో ఇప్పటికే ఉన్న సమస్యలకు మరో పెద్ద సమస్య చేరింది. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ తర్వాత ట్రంప్ ఒప్పందం కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఏప్రిల్ 11న ఇస్లామాబాద్లో నేరుగా చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడే అక్కడికి వెళ్లారు.మార్చి 6న ట్రంప్ “ఇరాన్ నుంచి షరతుల్లేని లొంగుబాటు తప్ప మరేదీ అంగీకరించను” అన్నారు. అదే ట్రంప్ తర్వాత ఉపాధ్యక్షుడిని ఇస్లామాబాద్ పంపించారు. ఎందుకంటే “ఉపాధ్యక్షుడితోనే మాట్లాడతాం” అని ఇరాన్ స్పష్టం చేసింది.కాల్పుల విరమణ ప్రకటనలో హార్మూజ్ ప్రాంతాన్ని తెరవాలని అమెరికా డిమాండ్ చేసింది. కానీ, ఆ ప్రాంతం ఇప్పటికీ మూసే ఉంది. అయినా కాల్పుల విరమణ కొనసాగుతోంది. కారణం ట్రంప్ మళ్లీ ప్రత్యక్ష యుద్ధంలోకి వెళ్లాలని అనుకోవడం లేదు. ఏప్రిల్ 8 నుంచి ట్రంప్ దౌత్య చర్చల ద్వారా ఒప్పందం సాధించాలని చూస్తున్నారు. కానీ ఇరాన్ అమెరికా కోరుతున్న షరతులకు ఒప్పుకోవడం లేదు. దీంతో చర్చలు స్థంభించాయి.ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడాలియుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత కూడా ట్రంప్నకు ఉంటుంది. అయితే, యుద్ధం మొదలైనప్పుడు బ్యారెల్ చమురు ధర 75 నుంచి 77 డాలర్ల మధ్య ఉండేది. ఇప్పుడు 115 డాలర్ల వరకు చేరింది. భారత్లో ఇప్పటికే పెట్రోల్ ధరలు రెండుసార్లు పెరిగాయి. ఇంకా పెరుగుతాయి. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు అందరూ పొదుపు పాటించాలని చెబుతోంది. రూపాయి విలువ పడిపోతోంది. కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతోంది. కరెంట్ అకౌంట్ లోటు అంటే విదేశీ లావాదేవీల్లో దేశ ఖర్చులు ఆదాయాల కంటే ఎక్కువ కావడం.ఈ యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యులు అని విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ మళ్లీ యుద్ధం మొదలుపెడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇన్ని చిక్కులు ట్రంప్ను చుట్టుముట్టాయి. అమెరికా 40 రోజుల దాడులతో ఫలితం సాధించలేకపోయింది. మళ్లీ దాడులు చేస్తే మరింత తీవ్రతరంగా వైమానిక దాడులు చేయాల్సి వస్తుంది.అలా జరిగితే ఇరాన్ కూడా యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్ ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని అమెరికా, గల్ఫ్ దేశాలు ఎదుర్కోగలవా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి ముందుంది. -
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్..ట్రంప్ ఫస్ట్ చాయిస్ ఈయనేనట!
వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై ఆకస్మిక దాడి, అప్పటి సుప్రీం నాయకుడు అలీ ఖమేనీని హతమార్చిన తరువాత టెహ్రాన్లో పాలన మార్పు అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అజెండాలో ఒక కీలక భాగంగా ఉంది. ఆ దాడుల తొలినాళ్లలో, ఇరాన్ తదుపరి నాయకుడు ఇస్లామిక్ రిపబ్లిక్ నుంచే రావాలని ట్రంప్ పదేపదే మాట్లాడుతూ వచ్చారు. దీనికి సంబంధించి ట్రంప్ వ్యూహం తాజాగా తెరపైకి వచ్చింది.ఇరాన్ టాప్ లీడర్ కోసం ట్రంప్ మనసులోని ప్రత్యేకమైన, అత్యంత ఆశ్చర్యకరమైన వ్యక్తి మరెవ్వరో కాదు ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్. కొత్త ఇరాన్ ప్రభుత్వానికి నాయకుడిగా ట్రంప్ ఎంచుకున్న అహ్మదీనెజాద్ కఠినమైన, ఇజ్రాయెల్ వ్యతిరేక, అమెరికా వ్యతిరేక అభిప్రాయాలకు పేరుగాంచిన వ్యక్తి కావడం గమనార్హం.ఈ విషయంపై సమాచారం అందుకున్న అమెరికా అధికారులను ఉటంకిస్తూ, మంగళవారం 'ది న్యూయార్క్ టైమ్స్' నివేదిక ప్రకారం... ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ను దేశానికి కొత్త నాయకుడిగా తిరిగి నియమించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ మరియు అమెరికా 'ఆపరేషన్ రోరింగ్ లయన్' ,'ఎపిక్ ఫ్యూరీ' ఆపరేషన్లను చేపట్టాయి. ఇరాన్కు నాయకత్వం వహించి, "ఇరాన్ రాజకీయ, సామాజిక , సైనిక పరిస్థితిని" నిర్వహించగల సమర్ధుడిగా అమెరికన్లు అహ్మదీనెజాద్ను భావిస్తున్నారని ఆయన సహచరుడు ఒకరు మీడియాకు తెలిపారు.ఈ సాహసోపేతమైన ప్రణాళికను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో గాయపడిన అహ్మదీనెజాద్ను ఈ ప్రతిపాదన కోసం సంప్రదించారని, అయితే ఆ తర్వాత ఈ ప్లాన్ బెడిసికొట్టిందని నివేదిక సూచించింది. 2005 నుండి 2013 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆయనను ఒక హాలోకాస్ట్ నిరాకరిణిగా,అణుబాంబు పిచ్చివాడిగా, అప్పటికే విసిగిపోయి ఉన్న దేశంపై ఇస్లామిక్ విప్లవ భావజాలాన్ని బలవంతంగా రుద్దిన వ్యక్తిగా చాలామంది భావిస్తారు. అలాగే అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మతతత్వ ఫాసిజానికి చిహ్నంగా కనిపించడమే కాదు, ఒకానొక సమయంలో ఆయన "ఇజ్రాయెల్ను ప్రపంచ పటంలోనే లేకుండా తుడిచేయాలి" అని కూడా పిలుపు నిచ్చారు.గత దశాబ్ద కాలంగా ఆయన ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకిగా మారిపోవడంతో ఇరాన్ గార్డియన్ కౌన్సిల్ ఆయనను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అధికారికంగా నిషేధించింది. అంతేకాదు ఆయన ఇస్లామిక్ ప్రభుత్వం నిఘాలో కూడా ఉన్నారు.'ది అట్లాంటిక్' నివేదిక ప్రకారం, యుద్ధం ప్రారంభం కావడానికి చాలా కాలం ముందే, ఇరాన్ ప్రభుత్వం అహ్మదీనెజాద్ ఇంటి వద్ద బాడీగార్డులను కాపలా పెట్టింది. పేరుకు ప్రముఖ పౌరుడి రక్షణ కోసమే అయినా, అసలు ఉద్దేశం ఆయనపై నిఘా ఉంచడమే. అయినప్పటికీ, ఇరాన్లో ఆయనకు ఇంకా ఆదరణ ఉంది, అందుకే అక్కడి ప్రభుత్వం ఆయన పట్ల అప్రమత్తంగా ఉంటుంది.యుద్ధం మొదటి రోజున అహ్మదీనెజాద్ ఇంటిపై జరిగిన ఇజ్రాయెల్ దాడి ఉద్దేశం ఆయనను గృహ నిర్బంధం నుండి విడిపించడమే. ఆయన ఆ దాడి నుండి ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఈ క్షిపణి దాడి తర్వాత పాలనా మార్పు ప్రణాళికపై ఆయన విరక్తి చెందారని అమెరికా అధికారులు మరియు అతని సహచరుడు ఒకరు తెలిపారు. అప్పటి నుండి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనే వివరాలు తెలియవు. టెహ్రాన్లో నాయకత్వ మార్పు విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని ఆయన సొంత సహాయకులే కొందరు విశ్వసించడం లేదని తెలుస్తోంది.ఇదీ చదవండి: రోమ్లో ‘మెలోడీ’ రీయూనియన్ : మోదీ, మెలోనీ ఫోటోలు, లైక్ల సునామీవైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ ఈ విషయంపై స్పందిస్తూ... "మొదటి నుండి, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ (Operation Epic Fury) పై ప్రెసిడెంట్ ట్రంప్ తన లక్ష్యాలను స్పష్టంగా వెల్లడించారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయడం, వాటి ఉత్పత్తి కేంద్రాలను కూల్చివేయడం, వారి నౌకాదళాన్ని ముంచేయడం మరియు వారి ప్రాక్సీలను బలహీనపరచడం. అమెరికా సైన్యం తన లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా అధిగమించింది, ఇప్పుడు మా చర్చల ప్రతినిధులు ఇరాన్ అణుసామర్థ్యాలను శాశ్వతంగా నాశనం చేసే ఒప్పందం కోసం కృషి చేస్తున్నారు" అని తెలిపారు. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.అహ్మదీనెజాద్ ఎందుకు ?వెనిజులా నాయకుడు నికోలస్ మదురోను బంధించడంలో ట్రంప్ విజయం సాధించారు. ఇదే నమూనాను ఇరాన్లో కూడా పునరావృతం చేయవచ్చని ట్రంప్ భావించినట్లు తెలుస్తోంది. అలాగే మదురోను తొలగించిన తర్వాత వెనిజులాలో అధికారం చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్ లాంటి వ్యక్తిగా అమెరికా అహ్మదీనెజాద్ను చూసి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ -
సముద్రంలో కొత్త యుద్ధం..! అమెరికా నౌకలపై 'సూసైడ్ డాల్ఫిన్లు'
-
ట్రంప్, నెతన్యాహులను హతమారిస్తే రూ. 480 కోట్లు : ఇరాన్
Iran War అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను హతమార్చిన వారికి 58 మిలియన్ డాలర్ల (సుమారు 50 మిలియన్ యూరోలు, రూ. 480 కోట్ల ) బహుమతి (బౌంటీ) ప్రకటించే దిశగా ఇరాన్ పార్లమెంట్ ఒక బిల్లును సిద్ధం చేస్తోందని 'ఇరాన్ వైర్', 'ది టెలిగ్రాఫ్ యూకే' నివేదికల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఇరాన్ పార్లమెంట్కు చెందిన 'నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ పాలసీ కమిటీ' చైర్మన్ ఇబ్రహీం అజీజీ ఈ బిల్లును సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి "కౌంటర్-యాక్షన్ బై ది మిలిటరీ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆఫ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్" అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. .ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ చైర్మన్ ఇబ్రహీం అజీజీ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిగిన వైమానిక దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఇతనితోపాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా హతమయ్యారు. ప్రస్తుత సుప్రీం లీడర్ తీవ్ర గాయాలు పాలుకావడానికి కూడా ఈ దాడులే కారణమని అంచనా. ఈ దాడులకు ప్రతీకారంగా ట్రంప్, నెతన్యాహులను హతమార్చడానికి రివార్డులను ప్రతిపాదించే ఈ బిల్లుపై ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే ఓటింగ్ నిర్వహించనుంది. ఖమేనీ హత్యలో పాత్ర ఉన్నందుకు గాను ట్రంప్, నెతన్యాహు, మరియు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్లను లక్ష్యంగా చేసుకుని ఈ "ప్రతీకార చర్య" తీసుకోవాలని అజీజీ పేర్కొన్నట్లు ఇరాన్ వైర్ తెలిపింది. జాతీయ భద్రతా కమిషన్ లోని మరొక సభ్యుడు మహమూద్ నబవియాన్ కూడా, ట్రంప్, నెతన్యాహులను "నరకానికి పంపే" ఎవరికైనా బహుమతులు ఇచ్చే బిల్లుపై తమ పార్లమెంట్ త్వరలోనే ఓటు వేస్తుందని ప్రకటించారు. మసాఫ్ (Masaf) మీడియా : 'కిల్ ట్రంప్' ప్రచారం ,సైబర్ గ్రూప్ ప్రకటనఇరాన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ 'మాసఫ్' కొన్ని రోజుల క్రితమే ఒక ప్రకటన చేస్తూ, ఇస్లామిక్ ప్రభుత్వం "కిల్ ట్రంప్" అనే ప్రచారం కోసం 50 మిలియన్ల డాలర్ల ఆర్థిక వనరులను సమకూర్చుకుందని పేర్కొంది.హండాలా (Handala) హ్యాకింగ్ గ్రూప్: అంతకుముందు, ఇరాన్ ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ వార్ఫేర్ గ్రూప్ "హండాలా" కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా న్యాయ శాఖ తమ గ్రూప్ సభ్యుల సమాచారం కోసం 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించినందుకు ప్రతిస్పందనగా... "అణచివేత, అవినీతికి ప్రధాన సూత్రధారులు" అయిన ట్రంప్ మరియు నెతన్యాహులను అంతమొందించడానికి తాము ఈ వనరులను కేటాయించామని హండాలా క్లెయిమ్ చేసింది. ఈ ఇద్దరు దేశాధినేతలపై "ప్రత్యక్ష చర్య" తీసుకునే ఏ వ్యక్తికైనా లేదా సమూహానికైనా ఈ డబ్బు చెల్లిస్తామని ఆ హ్యాకింగ్ గ్రూప్ పేర్కొంది. ఇరాన్ ప్రతిపాదించిన ఈ బౌంటీ (రివార్డు) చట్టం, గతంలో వారు చేసిన మతపరమైన ఫత్వాలు లేదా ప్రచారాల కంటే చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు.గతంలో ఇరాన్ కేవలం మతపరమైన ఫత్వాలు లేదా ప్రచారాల ద్వారా మాత్రమే ఇలాంటి హెచ్చరికలు చేసేది. కానీ ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లో చట్టబద్ధంగా బౌంటీ బిల్లును తీసుకురావాలని చూడటం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందాన్ని తీవ్ర ముప్పులోకి నెడుతుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: వింటేజ్ లుక్ : ఇషా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్అమెరికా హెచ్చరిక: గతంలో ట్రంప్ మాట్లాడుతూ.. తనను చంపడానికి ఇరాన్ ప్రయత్నిస్తే, ఆ దేశాన్ని "భూమ్మీద లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేస్తాం" (Wipe them off the face of the Earth) అని తీవ్రంగా హెచ్చరించారు.శాంతి చర్చల్లో సందిగ్ధత: ఇరాన్ తాజాగా అమెరికాకు ఒక కొత్త శాంతి ప్రతిపాదనను పంపినప్పటికీ, అది పాత ప్రతిపాదనల కంటే పెద్దగా మెరుగ్గా ఏమీ లేదని వాషింగ్టన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని మరియు ఇరాన్ సానుకూలంగా స్పందించాల్సిన ఒత్తిడి వారిపైనే ఉందని అమెరికా అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: వివాదంలో యాసిడ్ దాడి బాధితురాలు : అసలు ఏమైంది? -
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. సౌదీకి తోడుగా పాక్ సైన్యం భారీ మోహరింపు
ఇస్లామాబాద్:పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ ఏ క్షణమైనా మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా మిత్రదేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ సౌదీ అరేబియాకు 8 వేల మంది సైనిక బలగాలను పంపింది. సైనికులతో పాటు ఫైటర్ జెట్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా పంపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించింది. అయితే, ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఇరాన్తో సాంస్కృతిక, భౌగోళిక సంబంధాలు ఉన్నప్పటికీ, పాకిస్థాన్ సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది.ఒప్పందం ప్రకారం, ఇరాన్ దాడులు చేస్తే తిప్పికొట్టేలా సైన్యం, యుద్ధ విమానాలను సౌదీకి పంపినట్లు భద్రతా అధికారులు ధృవీకరించారు. గతేడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. వాటిలో ప్రత్యర్థి దేశాల దాడుల సమయంలో ఒకరికొకరు అండగా నిలబడాలని నిబంధనలు ఉన్నాయి. పాకిస్థాన్-సౌదీ రక్షణ ఒప్పందం పూర్తి వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ, ఒకరిపై దాడి జరిగితే మరొకరు రక్షణకు రావాల్సి ఉంటుందని ప్రకటించారు. రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఈ ఒప్పందం సౌదీ అరేబియాను పాకిస్థాన్ అణు కవచం కింద ఉంచుతుందని సూచించారు.సమాచారం ప్రకారం, పాకిస్థాన్ ఏప్రిల్ ప్రారంభంలో 16 జేఎఫ్-17 యుద్ధ విమానాలు, రెండు డ్రోన్ స్క్వాడ్రన్లు, హెచ్క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సౌదీకి పంపింది. ఈ మోహరింపులో 8,000 సైనికులు ఉన్నారు. అవసరమైతే మరిన్ని సైనికులను పంపుతామని పాకిస్థాన్ హామీ ఇచ్చింది.ఘర్షణ సమయంలో పంపిన సైనికులు, వైమానిక దళ సిబ్బంది ప్రధానంగా సలహా, శిక్షణ పాత్ర పోషిస్తారని అధికారులు తెలిపారు. ఒప్పందం ప్రకారం గరిష్టంగా 80,000 పాకిస్థాన్ సైనికులను సౌదీకి పంపే అవకాశం ఉంది. అదనంగా యుద్ధ నౌకలు పంపే అంశం కూడా ఒప్పందంలో ఉంది.ఈ మోహరింపు ప్రతీకాత్మకంగా కాకుండా, యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, వేలాది సైనికులతో కూడిన పెద్ద స్థాయి చర్య అని వర్గాలు పేర్కొన్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, సౌదీ ఇరాన్పై గోప్య దాడులు జరిపింది. పాకిస్థాన్ గతంలో కూడా సౌదీకి సైనిక శిక్షణ, సలహా అందించింది. మరోవైపు, సౌదీ పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్థిక సహాయం అందించింది. -
ఇజ్రాయెల్కు పదులకొద్దీ విమానాల్లో మందుగుండు సామగ్రి
టెల్ అవీవ్: జర్మనీలోని స్థావరాల నుంచి అమెరికాకు చెందిన పదుల కొద్దీ కార్గో విమానాలు మందుగుండు సామగ్రితో సోమవారం ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో దిగినట్లు అల్ జజీరా వార్తా సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 13 సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది.ఇరాన్పై మరోసారి దాడులు ప్రారంభించే ఉద్దేశంతోనే వాషింగ్టన్ చర్యలు కొనసాగుతున్నాయన్న అనుమానాలు పెరిగాయి. దీంతో పశ్చిమాసియా ఘర్షణ మరింత ఉద్ధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా చర్యలు ఇరాన్పై యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే సన్నాహాల్లో భాగమని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.యురేనియం నిల్వలు, ఆంక్షల సడలింపు, యుద్ధ నష్టపరిహారం అంశాలపై చర్చలు నిలిచిపోయిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. “ఇరాన్ ముందున్న సమయం వేగంగా ముగుస్తోంది. వారు వెంటనే కదలాలి. లేకపోతే వారి దగ్గర ఏమీ మిగలదు. సమయం అత్యంత కీలకం” అని ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు.చర్చలు పునఃప్రారంభించేందుకు అమెరికా విధించిన ప్రధాన షరతులను ఇరాన్ మీడియా బయటపెట్టిన కొన్ని గంటలకే ట్రంప్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. 400 కిలోల శుద్ధి చేసిన యురేనియాన్ని అప్పగించాలని, ఒక అణు కేంద్రాన్ని మాత్రమే కొనసాగించాలని, యుద్ధ నష్టపరిహారం డిమాండ్ను వదులుకోవాలని అమెరికా కోరింది.దీనికి ప్రతిగా టెహ్రాన్ కూడా చర్చలపై 5 షరతులు పెట్టింది. పశ్చిమాసియాలో, ముఖ్యంగా లెబనాన్లో సైనిక చర్యలు ముగియాలని, ఇరాన్పై ఆంక్షలు తొలగించాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా తెలిపింది.అదనంగా యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలని, హార్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఈ వ్యూహాత్మక మార్గంలో నౌకల రాకపోకలపై ఇరాన్ నియంత్రణ కఠినతరం చేసింది. మరోవైపు ఇరాన్ పోర్టులు, సముద్ర వాణిజ్యంపై అమెరికా విస్తృత నౌకాదళ దిగ్బంధంతో ఒత్తిడి పెంచింది. -
పశ్చిమాసియా యుద్ధం.. ఇరాన్కు అమెరికా ఐదు షరతులు
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ అణు చర్చలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరాన్కు అమెరికా ఐదు కీలక షరతులను విధించింది. వాటిలో ప్రధానంగా 400 కిలోల యురేనియం అమెరికాకు అప్పగించాలి. ఇరాన్లో ఒక్క అణు కేంద్రం మాత్రమే కొనసాగాలి. గత ఆంక్షల వల్ల కలిగిన నష్టాలకు ఎటువంటి పరిహారం ఇవ్వబోం. విదేశాల్లో స్తంభించిన ఇరాన్ ఆస్తుల్లో 25 శాతం కూడా విడుదల చేయదు. అలాగే వివిధ యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగింపుపై చర్చలు జరగాలి అని స్పష్టం చేసింది.ఈ డిమాండ్లపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బదులుగా, ఇరాన్ తన షరతులను ప్రకటించింది. లెబనాన్ సహా అన్ని యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగించాలి. అన్ని ఆంక్షలను తొలగించాలి. విదేశాల్లో స్తంభించిన నిధులను విడుదల చేయాలి. యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలి. అలాగే హర్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి అని తెలిపింది.ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయెల్లు శాంతి పేరుతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. సంక్షోభాన్ని సృష్టించి, దాన్ని శాంతి పేరుతో మరింత పెంచడం అమెరికా-ఇజ్రాయెల్ల పాత పద్ధతి అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. తమ ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించకపోతే ఆ దేశ చెల్లింపు దారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్ను తీవ్రంగా కుదిపేశాయి. ప్రతిగా, ఇరాన్ హర్మూజ్ జలసంధి మార్గాలను అడ్డుకోవడంతో ప్రపంచ ఇంధన సరఫరా దెబ్బతింది. ఏప్రిల్ 8న పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరినా, శాశ్వత శాంతి ఒప్పందం సాధ్యం కాలేదు. ఇరాన్ సైన్యం అమెరికా మరోసారి దాడి చేస్తే మరింత తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని పునరుద్ఘాటించింది. -
ఈ టైమ్ తుపాన్ ముందు ఉన్న ప్రశాంతత.. ఇక విధ్వంసమే..?
వాషింగ్టన్ డీసీ: ఇరాన్- అమెరికా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్కు ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ఈ సారి శాంతి ఒప్పందంపై సంతకం చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడు నడుస్తున్న కాలం తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతతగా పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్రూత్ ఖాతాలో ఒక ఏఐ జనరేటెడ్ పిక్తో వార్నింగ్ ఇచ్చారు.ఇటీవలే చైనా పర్యటన ముగించుకొని వచ్చారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ చాలా బాగుందని ఆయన చాలా గొప్ప మనిషని కొనియాడారు. తైవాన్ విషయంలోనే అమెరికా మద్దతు ఉండదని చెప్పకనే చెప్పారు. అయితే గత కొద్దిరోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య సీజ్ఫైర్ నడుస్తోన్న నేపథ్యంలో మరోసారి ఇరాన్పై విరుచుకుపడుతూ మాట్లాడారు.ట్రంప్ మాట్లాడుతూ "ఒకవేళ ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించకుండా, హర్ముజ్ జలసంధి విషయంలో తన దూకుడు వైఖరిని కొనసాగిస్తే, చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నడుస్తున్న శాంతికాలం తుపానుకు ముందు ప్రశాంతతగా గుర్తుంచుకోవాలి" అని అన్నారు. అయితే ఇరాన్పై తిరిగి వైమానిక దాడులను ప్రారంభించడానికి పెంటగాన్ పలు సైనిక ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసిందని ట్రంప్ నిర్ణయం కోసమే వేచి చూస్తున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి.మరోవైపు ఇరాన్ సైతం వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అమెరికా దాడులు చేస్తే ఎదుర్కోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఏ దాడికైనా గట్టిగా ప్రతిస్పందిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఇదివరకే తేల్చిచెప్పారు. మధ్యప్రాచ్య సంఘర్షణ ప్రపంచ క్రమాన్ని పునర్నిర్మిస్తోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ కూడా పేర్కొన్నారు.కాగా హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు "టోల్ టాక్స్" స్థానంలో "సర్వీస్ ఛార్జ్"ను ప్రవేశపెట్టి, అక్కడ ఒక కొత్త నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇరాన్ ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. -
ఇంధన సంక్షోభం.. ప్రభుత్వం బ్లాక్ అవుట్ ప్రకటన
పశ్చిమాసియాలో ఇరాన్తో అమెరికా యుద్ధం కారణంగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. యుద్ధం, దాడుల ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గమైన హార్మూజ్ జలసంధి మూతపడింది. దీంతో, ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం పీక్ స్టేజ్కు చేరుకుంది. పరిస్థితి ఎంతకు దిగజారిదంటే.. ఇంధన సంక్షోభంతో క్యూబా ప్రభుత్వం అక్కడ బ్లాక్ అవుట్ విధించింది. రోజుకు 20 నుంచి 22 గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. అయితే, క్యూబా పరిస్థితికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక కారణమే.. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా చాలా వరకు దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇరాన్ హార్మూజ్ మూసివేతతో ప్రస్తుత పరిస్థితి నుంచి బయట పడేందుకు పలు దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని దేశాలు ఇంధన కోటాను విధిస్తున్నాయి. అలాగే, శ్రీలంక, పాకిస్థాన్ వంటి దేశాల్లో వారానికి ఒక వాహనానికి కేవలం 5 లీటర్ల పెట్రోల్ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. ఇక, పలు దేశాల్లో లాక్ డౌన్ తరహా ఆంక్షలు విధించాయి.అయితే తాజాగా ఇంధన సంక్షోభం కారణంగా క్యూబా పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. అమెరికా విధించిన ఆర్థిక దిగ్బంధనం కారణంగా ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు.. క్యూబాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోయాయి. దేశం మొత్తం అంధకారంలోకి మునిగిపోయింది. సంక్షోభం కారణంగా చేసేదేమీ లేక క్యూబా ప్రభుత్వం అక్కడ బ్లాక్ అవుట్ విధించింది. దీంతో, క్యూబా రాజధాని హవానాలో రోజుకు 20 నుంచి 22 గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కోతల కారణంగా ఆస్పత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఇంధన ప్రభావం పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతింది.Cuba has completely run out of diesel and fuel oil, the country's energy and mines minister said, as the capital Havana faces its worst rolling blackouts in decades amid a US blockade that has strangled the island of fuel. pic.twitter.com/jzzrwQyQRZ— #𝕎𝕒𝕣 ℍ𝕠𝕣𝕚𝕫𝕠𝕟 (@WarHorizon) May 14, 2026మరోవైపు.. ట్రంప్ బెదిరింపుల కారణంగా క్యూబాకు చమురు సరఫరా చేసే వెనిజులా, మెక్సికో దేశాల సరఫరాను నిలిపివేశాయి. క్యూబాకు ఇంధనం పంపే దేశాలపై భారీ సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించడమే ఇందుకు కారణం. మరోవైపు క్యూబాలో ప్రస్తుతం భారీ విద్యుత్ సంక్షోభం నెలకొంది. ఇదే విషయంపై క్యూబా ఇంధన మంత్రి విసింటే డి లా ఓ లెవీ మాట్లాడుతూ.. దేశంలో గ్యాస్ నిల్వలు చాలా పరిమితంగా ఉన్నాయని, పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని పేర్కొన్నారు. ఏ దేశం ఇంధనం అమ్మేందుకు ముందుకు వచ్చినా కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.కారణాలు..అమెరికా ఆంక్షలు: 2026 జనవరిలో ట్రంప్ ప్రభుత్వం క్యూబాకు ఇంధనం సరఫరా చేసే దేశాలపై టారిఫ్లు, ఆర్థిక శిక్షలు విధిస్తామని హెచ్చరించింది.జలసంధి బ్లాకేడ్: అమెరికా–ఇరాన్ యుద్ధం కారణంగా గ్లోబల్ ఆయిల్ ధరలు పెరిగి, రవాణా ఖర్చులు కూడా పెరిగాయి.సరఫరా తగ్గుదల: మెక్సికో, వెనిజులా వంటి ప్రధాన సరఫరాదారులు ఇంధనం పంపడం ఆపేశారు.రష్యా సహాయం: డిసెంబర్ నుంచి ఇప్పటివరకు క్యూబాకు ఒకే ఒక్క పెద్ద రష్యన్ ఆయిల్ ట్యాంకర్ (Anatoly Kolodkin) మాత్రమే ఇంధనం అందించింది.ప్రత్యామ్నాయాలుదేశీయ ఉత్పత్తి: క్యూబా ప్రస్తుతం దేశీయ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది.సౌర శక్తి: గత రెండు సంవత్సరాల్లో 1,300 మెగావాట్ల సౌర శక్తి ఏర్పాటు చేశారు. కానీ గ్రిడ్ అస్థిరత కారణంగా దీని సామర్థ్యం తగ్గింది.అంతర్జాతీయ చర్చలు: క్యూబా ఇంధనం అమ్మడానికి సిద్ధంగా ఉన్న ఏ దేశం నుండైనా కొనుగోలు చేస్తామని ప్రకటించింది. Cuba Runs Out of Diesel and Fuel Oil as Trump's Oil Blockade Causes Severe Humanitarian Crisis and Nationwide Blackouts pic.twitter.com/rUTz6rYJ5P— The Matrix is Glitching (@TMisGlitching) May 14, 2026ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా క్యూబా మాత్రమే కాదు, ప్రస్తుతం ఇంధన సంక్షోభం అనేక దేశాలను ప్రభావితం చేస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాలో 40% తగ్గుదల వచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్, ఇటలీ, జర్మనీ, బంగ్లాదేశ్ వంటి దేశాలు హార్మూజ్ జలసంధి మూసివేత మరియు మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి.పాకిస్తాన్పెట్రోల్ ధరలు రూ. 414.78 లీటరుకు, డీజిల్ ధరలు రూ. 414.58 లీటరుకు చేరాయి. పాకిస్తాన్ దేశ చరిత్రలోనే ఇది అత్యధికం.ప్రభుత్వం వారానికి ఒకసారి ధరలు సవరించాల్సి వస్తోంది.మధ్యతరగతి, రైతులు, రవాణా రంగం తీవ్రంగా ప్రభావితమయ్యాయి.ఇటలీదేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి.ప్రభుత్వం ఎక్సైజ్ పన్నులు తగ్గించడం ద్వారా వినియోగదారులపై ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది.జర్మనీవిమానయాన రంగం ప్రపంచ యుద్ధం-II తర్వాత అత్యంత తీవ్రమైన జెట్ ఇంధన కొరతను ఎదుర్కొంటోంది.ఇంధన ధరలు $85–90/bbl నుండి $150–200/bbl వరకు పెరిగాయి.అనేక విమానాలు రద్దు చేయబడ్డాయి.విమాన సర్వీస్ రద్దులు, విమానయాన రంగం సంక్షోభం.బంగ్లాదేశ్ఇంధన కొరతతో విశ్వవిద్యాలయాలు మూసివేయబడ్డాయి.ప్రభుత్వ ప్రయాణాలు పరిమితం చేయబడ్డాయి.వాహనాలకు ఇంధన సరఫరా పరిమితులు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రోత్సాహం.ఈజిప్ట్..ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రోజు రిమోట్ వర్క్ తప్పనిసరి.వాణిజ్య, పబ్లిక్ లైటింగ్ పరిమితులు.విద్యుత్, ఇంధన పొదుపు చర్యలు ప్రభుత్వ ప్రయాణాలు, లైటింగ్ పరిమితులు. -
ఇరాన్ యుద్ధంతో భగ్గుమంటున్న ముడిచమురు
(రమణమూర్తి మంథా): ఇరాన్ యుద్ధం తాత్కాలికంగా ఆగినా.. హార్మూజ్ జలసంధిలో మొదలైన చమురు సరఫరా సంక్షోభం ఇంకా మండుతూనే ఉంది. ఫలితం... అంతర్జాతీయంగా ముడి చమురు ధర బీభత్సంగా పెరుగుతోంది. బ్యారెల్ ధర 100 డాలర్లు దాటేసింది. ఈ ప్రభావం పెట్రోలు బంకులతో ఆగిపోదు. ప్రతి ఇంట్లోకీ చొరబడుతుంది. వాహనాలు లేనివారిక్కూడా కష్టాలు తప్పవు. ఎందుకంటే మనకు అవసరమైన ముడి చమురులో 85–90 శాతం దిగుమతుల ద్వారా వస్తున్నదే. ధర పెరగటం వల్ల దిగుమతుల బిల్లు పెరిగి.. మన డాలర్ల నిల్వలు తరిగిపోతున్నాయి.దీంతో డాలర్ విలువ మరింత పెరుగుతూ రూపాయి పతనమవుతోంది. ఇదో వలయం. దీనిలో చిక్కి విలవిల్లాడుతున్న దేశాన్ని కాస్త గాడిన పెట్టడానికి బంగారం కొన్నాళ్లు కొనవద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వర్క్ఫ్రమ్ హోమ్ చేయాలని ప్రధాని మోదీ సూచించారు. తనవంతుగా బంగారం కొనుగోళ్లను తగ్గించడానికి దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచేశారు. పెట్రో ధరలూ పెరగవచ్చన్న సంకేతాలున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ముడిచమురు సామాన్యుల జీవితంలో ఎలాంటి మార్పులు తేబోతున్నదో వివరించేదే ఈ ప్రత్యేక కథనం..అన్నింటిపై ప్రభాaవం..సామాన్యుడికి మొదట కనిపించేది పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటమే!. నిజానికి సంక్షోభం మొదలయ్యాక ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ భారాన్ని తామే మోస్తున్నాయి తప్ప జనంపై మోపలేదు. చమురు కంపెనీలు రోజుకు సుమారు రూ.1,000 కోట్ల నష్టాన్ని భరిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పూరీ చెప్పకనే చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అదే జరిగితే..అన్నిరకాల ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి..⇒ బైక్పై, కార్లపై ఆఫీసుకెళ్లేవారికి నెల ఖర్చు పెరుగుతుంది⇒ ఆటో, క్యాబ్ చార్జీలు పెరుగుతాయి⇒ బస్సు చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంటుందికూరగాయలు, నిత్యావసరాలు కూడా...డీజిల్ ధర పెరిగితే రైతు ఖర్చు పెరుగుతుంది. ఎందుకంటే.. ట్రాక్టర్లు డీజిల్పైనే నడుస్తాయి. బోర్లు, నీటి పంపులు ఇంధనంపై ఆధారపడతాయి. ఎరువుల తయారీ ఖర్చు పెరుగుతుంది. రవాణా ఖర్చు భారీగా పెరుగుతుంది. దీంతో కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతాయి. పాల ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రకటించాయి. రవాణా ఖర్చు పెరగటమనేది ప్రతి వస్తువు ధరనూ ప్రభావితం చేస్తుంది. ఎల్పీజీ, హోటల్ బిల్లులు కూడా పెరుగుతాయిదేశానికి అవసరమైన ఎల్పీజీలో అత్యధిక భాగం దిగుమతుల ద్వారా వస్తున్నదే. సరఫరా ఇబ్బందుల వల్ల అంతర్జాతీయ గ్యాస్ ధరలు పెరిగాయి. దీంతో ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధరలను కేంద్రం ఏకంగా 30 శాతానికి పైగా పెంచేసింది. ఇళ్లలో వాడే సాధారణ సిలిండర్లు ఇప్పటికీ ఏజెన్సీల నుంచి సకాలంలో సరఫరా కావటం లేదు. ఈ గ్యాస్ ఇబ్బందులతో.. ఇప్పటికే చాలా టిఫిన్ సెంటర్లతో సహా రెస్టారెంట్లు, హోటళ్లు ధరలను పెంచేశాయి. ఇళ్లలో వండి సరఫరా చేసే హోమ్ కిచెన్లు కూడా మెనూను తగ్గించేయడంతో పాటు ధరలను స్వల్పంగా పెంచి ఈ ఇబ్బందిని తట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. విమాన టికెట్ల ధరలూ నింగిలోకి..విమానాల్లో వాడే జెట్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కూడా క్రూడ్ ఆయిల్ నుంచే వస్తుంది. కాబట్టి విమాన కంపెనీలు తమపై పడ్డ భారాన్ని అంతిమంగా ప్రయాణికుడిపైనే వేస్తాయి. ఫలితంగా ట్రావెల్ ప్యాకేజీలు ఖరీదవుతాయి. టూరిజం రంగంపై ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం వల్ల హోటల్ పరిశ్రమ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలుంటాయి. కొన్ని ఎయిర్లైన్స్ ఇప్పటికే తాము విమానాలు నడిపే రూట్లను తగ్గించేశాయి. ధరలనూ పెంచవచ్చన్న సంకేతాలిస్తున్నాయి. రూపాయి విలువ పడిపోతుందికేంద్ర ప్రభుత్వం చమురును డాలర్లలో కొంటుంది. క్రూడ్ ధర పెరిగితే ఎక్కువ డాలర్లు అవసరం అవుతాయి. అప్పుడు ఉన్న డాలర్లను (ఫారెక్స్ నిల్వలు) వెచ్చించటంతో పాటు కొత్త డాలర్లు కొనాల్సి ఉంటుంది. డాలర్ను కొంటూ ఉంటే దాని విలువ పెరిగిపోతూ.. మనం వెచ్చించే రూపాయి విలువ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు రూపాయి కనిష్ట స్థాయిలకు చేరటానికి ఇదే కారణం.ఈఎంఐలు పెరగొచ్చు!ముడిచమురు వల్ల అన్ని ధరలూ పెరిగితే... ద్రవ్యోల్బణం పెరిగినట్లే. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు దాన్ని నియంత్రించడానికి రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించకుండా జాగ్రత్తపడుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లు పెంచితే తదనుగుణంగా హోమ్ లోన్ ఈఎంఐలు పెరిగే అవకాశం ఉంటుంది. పైపెచ్చు వ్యాపార రుణాలు ఖరీదవుతాయి. వినియోగం మందగిస్తుంది. ఇది మళ్లీ ఆర్థిక మందగమనానికి దారితీస్తుంది. స్టాక్ మార్కెట్ షేక్చమురు ధరల కారణంగా సామాన్యులకు మాదిరిగానే కంపెనీలకూ ఖర్చులు పెరుగుతాయి. దీంతో లాభాలు తగ్గుతాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ సరిగ్గా లాభాలుండవేమోనన్న భయాలతో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటారు. దీంతో షేర్లు పతనమవుతాయి. ఈ ఏడాది ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవటం తెలిసిందే. నోట్: పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా ఉండటం, వాహనాల రద్దీ వంటి కారణాల వల్ల ఆయా రాష్ట్రాల్లో పెట్రోలు లేదా డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంది. బిహార్ దేశంలోనే అత్యంత తక్కువగా పెట్రోలు (3 లీటర్లు), డీజిల్(6 లీటర్లు) వినియోగిస్తోంది. కంపెనీలకు తిప్పలు చమురు ధరలు పెరిగితే ఎక్కువగా పెయింట్స్, సిమెంట్, కెమికల్స్, ఎయిర్లైన్స్, లాజిస్టిక్స్ రంగాలు దెబ్బతింటాయి. అయితే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీలు, కొన్ని ఎగుమతి సంస్థలు లాభపడే అవకాశం ఉంది. కాకపోతే ఇలా లాభపడే సంస్థలతో పోలిస్తే ఇబ్బందిపడే సంస్థలే ఎక్కువ. ప్రభుత్వానికి ఇబ్బందులు..చమురు ధరలు పెరిగితే ప్రభుత్వానికి ఆప్షన్లు చాలా తక్కువ ఉంటాయి. అయితే ధరలు పెంచాలి..లేదంటే పన్నులు తగ్గించాలి. ఈ రెండూ కాదంటే చమురు కంపెనీల నష్టాల్ని తానే భరించాలి. ఈ మూడింట్లో ఏది చేసినా కష్టమే. ధరలు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత పెరగవచ్చు. పన్నులు తగ్గించినా, కంపెనీల నష్టాలను తాను భరించినా తన ఆర్థిక పరిస్థితి దెబ్బతినవచ్చు.ఉపశమనం కలిగిస్తున్న అంశాలివే...⇒ ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి ద్వారా సరఫరా ఆగిపోయింది. దీంతో భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇది కొంత ఉపశమనం ఇస్తోంది.⇒ మన దేశం ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనింగ్ దేశాల్లో ఒకటి. అందుకే సరఫరా నిర్వహణలో కొంత వెసులుబాటు ఉంది.⇒ ప్రస్తుతానికి మన దేశానికున్న ఫారెక్స్ నిల్వలు రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి.సామాన్యులు చేయాల్సిందేంటి?⇒ అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవాలి⇒ కుటుంబ బడ్జెట్ను ముందే ప్లాన్ చేసుకోవాలి⇒ ఈఎంఐల విషయంలో జాగ్రత్తగా ఉండాలి⇒ సిప్లు, బంగారం, డిఫెన్సివ్ పెట్టుబడులపై దృష్టి పెట్టాలి⇒ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు నియంత్రించుకోవాలి -
మోదీ పిలుపుతో.. హర్ష్ గోయెంకా కీలక సూచనలు!
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో.. పొదుపు, ఖర్చుల విషయంపై నరేంద్ర మోదీ కీలక విషయాలు వెల్లడించారు. దీనిపై ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా స్పందించారు.ఖర్చులను, ప్రయాణాలను తగ్గించుకోవాలని, వర్క్-ఫ్రమ్-హోమ్ను ప్రోత్సహించాలని, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వైపు పరివర్తనను వేగవంతం చేయాలని హర్ష్ గోయెంకా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక నోట్ ద్వారా వెల్లడించారు.విదేశీ ప్రయాణాలను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయాలని, దేశీయ విమాన ప్రయాణాలను కూడా తగ్గించాలని సూచించారు. అంతే కాకుండా.. ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లి సమావేశాలు నిర్వహించదానికి బదులు, ఆన్లైన్ సమావేశాలను నిర్వహించాలని కోరారు. దీంతో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని అన్నారు.We in RPG have responded to our PM’s call with austerity and responsible resource allocations. I hope other corporates will follow suit. pic.twitter.com/Bhv0RVUFjq— Harsh Goenka (@hvgoenka) May 14, 2026ఉద్యోగుల పని విధానంలో కూడా మార్పులు సూచించారు. ఇంటి నుంచే పని చేయగల ఉద్యోగులను ''వర్క్ ఫ్రమ్ హోమ్'' విధానంలో పనిచేయాలని ప్రోత్సహించారు. కరోనా సమయంలో ఈ విధానం విజయవంతంగా అమలైనందున, ఇప్పుడు కూడా అది ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుందని వెల్లడించారు.పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ.. సంస్థకు సంబంధించిన భవిష్యత్ వాహనాలన్నీ ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించారు. దీని ద్వారా ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుంది. అలాగే ఉద్యోగులు కార్పూలింగ్ లేదా ప్రజా రవాణాను ఉపయోగించాలని సూచించారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా -
మీ ఇంట్లో ఉన్న బంగారానికి వడ్డీ.. మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్?
న్యూఢిల్లీ: పసిడి ప్రియులకు కేంద్రం శుభవార్త. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా త్వరలో కేంద్రం కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీని అందుబాటులోకి తేనుంది. తద్వారా ఇంట్లో ఉన్న బంగారంతో వడ్డీ వచ్చేలా ప్రతిపాదించనుంది. వినియోగదారులు వారి వద్ద ఉన్న కనీసం 10 గ్రాముల బంగారం ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రేటు సుమారు 2శాతం నుంచి 2.5శాతం వరకు పొందవచ్చు. భారతీయుల వద్ద సుమారు 30,000 టన్నుల బంగారం నిల్వగా ఉందని అంచనా. దీన్ని వెలికితీసేందుకు ప్రధాని మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. రూపాయి విలువను బలోపేతం చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.మోదీ ప్రభుత్వం తీసుకురానున్న ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో డిపాజిట్ చేసిన బంగారంపై వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది. సుమారు 2,000 టన్నుల బంగారం డిపాజిట్ అయితే, మూడేళ్ల వరకు దిగుమతుల అవసరం ఉండదని అంచనా. గోల్డ్ పాలసీలో కీలక మార్పులకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. ఈ కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది. -
గల్ప్ దేశాల సీక్రెట్ ఆపరేషన్.. ప్లాన్ బీ?
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఆందోళకరంగా మారుతున్నాయి. తాజాగా గల్ఫ్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ మద్య రహస్య దాడుల అంశం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. కువైట్ దీవిని ఆక్రమించేందుకు ఇరాన్ యత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీక్రెట్ దాడులు, ప్రతిదాడుల కారణంగా ఆందోళన నెలకొంది. గల్ప్ దేశాలు ఇలా రహస్య దాడులు చేయడంతో ప్రపంచమే షాకైంది.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు సమయంలో ఇరాన్.. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసి భయంకర దాడులు చేసింది. దీంతో, గల్ప్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. యుద్ధ పరిస్థితుల కారణంగా ఇరాన్పై గల్ప్ దేశాలు ప్రతి దాడులు చేశాయి. అయితే, ఇదంతా రహ్యసంగా జరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ దాడులకు సౌదీ అరేబియా కూడా ప్రతీకార దాడులు చేసినట్లు బయటకొచ్చింది. మార్చి నెలాఖరులో సౌదీ వైమానిక దళం ఈ రహస్య దాడులకు పాల్పడినట్లు తాజాగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే వేటిని లక్ష్యంగా ఈ దాడులు జరిగాయనే దానిపై స్పష్టత లేదు. దీనిపై సౌదీ గానీ.. ఇరాన్ గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. యూఏఈ కూడా ఇరాన్పై రహస్య దాడులకు పాల్పడినట్లు వార్తలు వెలువడ్డాయి.ఇదిలా ఉండగా.. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ చేసిన ప్రకటన గల్ఫ్ దేశాల్లో ఆందోళనలను మరింత పెంచింది. తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడి, బుబియాన్ ద్వీపాన్ని ఆక్రమించేందుకు ఇరాన్ ప్రయత్నించిందని ఆరోపించింది. కానీ, ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. కాగా, కువైట్లోని బుబియాన్ అతిపెద్ద ద్వీపం . ఇందులో ఓడరేవులు, విద్యుత్ కేంద్రాలు, సబ్స్టేషన్లతో సహా ప్రధాన పౌర, సైనిక స్థావరాలు ఉన్నాయి. ఈ నెల ఆరంభంలో చేపల పడవల్లో సముద్ర మార్గం ద్వారా ప్రయాణించి దీనిలోకి చొరబడేందుకు ఇరాన్లోని ఐఆర్జీసీ నేవీకి చెందిన ఆరుగురు సిబ్బంది ప్రయత్నించారని కువైట్ ప్రభుత్వం పేర్కొంది. వారు తమ భూభాగంలో దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించారని ఆరోపించింది. అయితే ఈ చొరబాటును తమ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని వెల్లడించింది.🇸🇦🇮🇷Reuters Exclusive: SAUDI ARABIA secretly launched strikes against IRAN in retaliation for attacksSaudi Arabia carried out multiple airstrikes on Iran in late March in retaliation for missile and drone attacks against the Kingdom, according to Reuters, citing Western and… pic.twitter.com/kVpUuAcgcQ— Global Surveillance (@Globalsurv) May 12, 2026ప్రధాన పరిణామాలు..యూఏఈ దాడులు:ఏప్రిల్ 2026లో ఇరాన్లోని లావాన్ దీవి చమురు శుద్ధి కేంద్రంపై దాడి.ఈ దాడి వల్ల పెద్ద అగ్ని ప్రమాదం జరిగి, శుద్ధి కేంద్రం తాత్కాలికంగా నిలిచిపోయింది.ఇరాన్ ప్రతీకారంగా యూఏఈ, కువైట్పై 2,800 క్షిపణులు, డ్రోన్ల దాడులు చేసింది.సౌదీ దాడులు:మార్చి చివరలో సౌదీ వైమానిక దళం ఇరాన్పై "tit-for-tat" దాడులు చేసింది.లక్ష్యాలు స్పష్టంగా వెల్లడించకపోయినా, ఇరాన్పై ప్రతీకార చర్యగా ఈ దాడులు జరిగాయి.అనంతరం రియాద్–తెహ్రాన్ మధ్య దౌత్య చర్చలు జరిగి, ఉద్రిక్తతలు తగ్గించేందుకు అవగాహన కుదిరింది.చైనా పాత్ర.. ఇదిలా ఉండగా.. చైనా గల్ఫ్ దేశాలకు నేరుగా సైనిక అండ ఇవ్వలేదు. కానీ ఇరాన్ యుద్ధంలో దౌత్యపరమైన మధ్యవర్తిత్వం, ఆర్థిక సహకారం, సాంకేతిక మద్దతు ద్వారా పరోక్షంగా ప్రభావం చూపుతోంది. చమురు సరఫరా భద్రత, హార్మూజ్ జలసంధి స్థిరత్వం చైనాకు ప్రధాన ప్రాధాన్యం. చైనా పాత్రను మూడు కోణాల్లో చూడవచ్చు. ఇరాన్కు సాంకేతిక సహాయం, గల్ఫ్ దేశాలతో ఆర్థిక ఒప్పందాలు, అమెరికా–చైనా పోటీ ప్రభావం.BREAKING: According to reports, the UAE has launched heavy airstrikes on Iran following Iran’s blockade of the Strait of Hormuz, escalating tensions across West Asia.The Strait of Hormuz remains one of the world’s most critical oil shipping routes, and the latest developments… pic.twitter.com/cHani8lAU8— Diplomat Times (@diplomattimes) May 13, 20261. ఇరాన్కు సాంకేతిక సహాయంచైనా ఇరాన్కు రాడార్ వ్యవస్థలు, నావిగేషన్ టెక్నాలజీ, మరియు మిసైల్ భాగాలు వంటి ద్వంద్వ వినియోగ సాంకేతికతను అందించింది.ఈ సహాయం ఇరాన్ రక్షణ సామర్థ్యాన్ని పెంచి, అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందించే శక్తిని ఇచ్చింది.అమెరికా దీనిపై ఆంక్షలు విధించి, చైనా కంపెనీలను లక్ష్యంగా చేసుకుంది.చైనా ఇరాన్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, చమురు దిగుమతుల్లో కీలకం.2. గల్ఫ్ దేశాలతో ఆర్థిక ఒప్పందాలుUAE, సౌదీ అరేబియాతో చైనా మౌలిక వసతులు, ఎనర్జీ ప్రాజెక్టులు, మరియు డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది.2023లో చైనా మధ్యవర్తిత్వంతో సౌదీ–ఇరాన్ మధ్య సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి.యుద్ధ సమయంలో కూడా చైనా గల్ఫ్ దేశాలతో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూ, “శాంతి అవసరం” అని మాత్రమే పేర్కొంది.3. అమెరికా–చైనా పోటీ ప్రభావంఅమెరికా గల్ఫ్ ప్రాంతంలో సైనిక ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తుండగా, చైనా ఆర్థిక భాగస్వామిగా ఎదుగుతోంది.గల్ఫ్ దేశాలు అమెరికాపై ఆధారపడటం ప్రమాదకరమని భావించి, చైనాతో సంబంధాలను బలోపేతం చేస్తున్నాయి.ఇది భారతదేశానికి కూడా వ్యూహాత్మకంగా కీలకం, ఎందుకంటే అమెరికా–చైనా పోటీ మధ్య ప్రాచ్యంలో భౌగోళిక సమీకరణాన్ని మార్చుతోంది.భారత్కు ప్రాధాన్యంఎనర్జీ భద్రత: చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.వాణిజ్య మార్గాలు: హార్మూజ్ జలసంధి స్థిరత్వం భారత వాణిజ్యానికి కీలకం.విదేశాంగ వ్యూహం: అమెరికా–చైనా పోటీ, గల్ఫ్ దేశాల మారుతున్న సంబంధాలు భారత విదేశాంగ విధానంపై ప్రభావం చూపుతాయి.ప్రభావం..అమెరికా–చైనా పోటీ: గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం, అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించగా, చైనా “ప్రత్యామ్నాయ భాగస్వామి”గా నిలబడే అవకాశం పెరిగింది.గల్ఫ్ దేశాల వ్యూహం: అమెరికా ఆధారపడటం ప్రమాదకరమని భావించి, గల్ఫ్ దేశాలు చైనాతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. -
కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ.. ఆంక్షలు రాబోతున్నాయా?
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం ఎగదోసిన చమురుసంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారతీయులు సైతం తమ వంతు బాధ్యతగా పొదుపు మంత్రం పఠించాలని గత రెండ్రోజుల్లో ఇటు తెలంగాణలో, అటు గుజరాత్లో ప్రధాని మోదీ హితబోధ చేశారు. మోదీ ‘పొదుపు’ ప్రసంగాల వేళ బుధవారం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీకానున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చనే వార్తలు ఇప్పుడు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెట్రో ధరల పెంపుతో పాటు మరికొన్ని పొదుపు చర్యలపై ప్రధాని బుధవారం ప్రకటన చేసే అవకాశముంది. రెండ్రోజులుగా ప్రధాని పొదుపు మంత్రం ఉపదేశిస్తుండటంతో విపక్షాల నుంచి వెల్లువెత్తిన విమర్శలపై ప్రభుత్వం తరఫున ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) మంగళవారం దీటుగా స్పందించింది. చమురు సంక్షోభం దెబ్బకు డజన్ల కొద్దీ దేశాలు అనుసరిస్తున్న పొదుపు చర్యలనే ప్రధాని సూచించారని సోదాహరణంగా వివరించింది. అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ(ఐఈఏ) ఇటీవల ఇచ్చిన నివేదికలను బహిర్గతంచేసింది. దీనిప్రకారం 40 దేశాలు ఇంధన వినియోగం, ప్రజల వాహనాల అతి వాడకం, ఇతర రాకపోకలపై ఆంక్షలు విధించాయి. మూడు దేశాలు తమ ప్రజలకు ఎల్పీజీ వాడకం తగ్గించుకోవాలని, సిలిండర్ను సగం వరకే నింపుకోవాలని సూచించాయి. ఎలక్ట్రిక్ లేదా పీఎన్జీకి మారాలని హితబోధ చేశాయి. 18 దేశాలు ప్రజల రవాణాపై పరిమిత ఆంక్షలు విధించాయి. ఇంటి నుంచి పని(వర్క్ ఫ్రం హోం)చేయాలని 13 దేశాలు సూచించాయి. ఇల్లు, ఆఫీసుల్లో తక్కువ లైట్లు ఆన్చేయాలని, ఏసీలను 25 డిగ్రీసెల్సియస్ కంటే తక్కువ పాయింట్లకు పెట్టుకోవద్దని పలు దేశాలు ప్రజలకు సూచించాయి. స్కూళ్లు, కాలేజీలు మూసేసి విద్యార్థులకు కేవలం ఆన్లైన్లోనే పాఠాలు బోధించాలని, తద్వారా విద్యార్థులు, సిబ్బంది, టీచర్ల ప్రయాణాలకు ఇంధనం ఆదా అవుతుందని పలు దేశాలు సూచించాయి.పలు దేశాల్లో పొదుపు చర్యలు ఇలా..ఇంధన వినియోగంపై సూచనలుపెట్రో ఉత్పత్తుల వినియోగం తగ్గాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బంది కార్యాలయాలకు రాకుండా ఆపాలని పలు దేశాలు నిర్ణయించాయి. అందుకోసం పాకిస్తాన్ వారంలో నాలుగు రోజులు వర్క్ ఫ్రమ్ హోంను ప్రవేశపెట్టింది. మొత్తం సిబ్బందిలో సగం మంది ఇంటి నుంచే పనిచేయాలని సూచించింది. ఇండోనేసియాలో శుక్రవారాలు ఇంటి నుంచే పనిచేయాలి. కాంబోడియా, లావో, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం, పెరూ, ఈజిప్ట్ సైతం ఇలాంటి చర్యలే చేపట్టాయి.ఏసీ కూలింగ్పై పరిమితులుప్రైవేట్ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో ఏసీలను 25 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ పాయింట్ పెట్టొద్దని బంగ్లాదేశ్ కరాకండీగా చెప్పేసింది. సింగపూర్(25), కాంబోడియా (24–25), మలేసియా(25), శ్రీలంక(26), థాయిలాండ్(26) అదే బాటలో పయనించాయి. జోర్డాన్ ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వాడకంపై నిషేధం విధించింది.విద్యాసంస్థల నిర్వహణపై..బంగ్లాదేశ్లో అన్ని విశ్వవిద్యాలయాలనూ మూసేశారు. శ్రీలంకలో బుధవారం సెలవులు అమలుచేస్తున్నారు. పాకిస్తాన్లో స్కూళ్లు, కాలేజీల్లో 100 శాతం ఆన్లైన్ విధానం అమలుచేస్తున్నారు.విద్యుత్ వాడకం తగ్గింపు..5స్టార్ రేటింగ్ వంటి అత్యంత తక్కువ విద్యుత్తో పనిచేసే ఉపకరణాలనే వాడాలని పలు దేశాలు సూచిస్తున్నాయి. వంట, స్నానం కోసం గ్యాస్తో నడిచే బాయిలర్లకు బదులు సోలార్తో పనిచేసే వ్యవస్థలను వాడాలని నెదర్లాండ్స్ ప్రజలకు సూచించింది. థాయిలాండ్లో తక్కువ అంతస్తులున్న ఆఫీసుల్లో లిఫ్ట్లను ఆపేసి మెట్లు ఎక్కాలని సూచిస్తున్నారు. వీధి దీపాల విద్యుత్ కోతలను పెంచారు. ఎల్పీజీ ఆధారిత గీజర్లకు బదులు సోలార్ గీజర్లు వాడాలని బ్రిటన్ సూచించింది. రవాణాపై ఆంక్షలు..దక్షిణకొరియాలో వాహనాలను సరి, బేసి సంఖ్య ఆధారంగా వేర్వేరు రోజుల్లో అనుమతిస్తున్నారు. శ్రీలంకలో ఆరోజుకు క్యూఆర్ కోడ్ స్కాన్ అయిన వాహనమే రోడ్డు మీదకు రావాల్సి ఉంటుంది. రోజు విడిచి రోజు వాహనం రోడ్డు మీదకు తేవాలని మయన్మార్ సూచించింది. బయోడీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలనే రోడ్లపైకి అనుమతిస్తామని ఇండోనేసియా తెలిపింది. సోలార్ వ్యవస్థల వినియోగం..సోలార్ వ్యవస్థలను ఇళ్లు, కార్యాలయాలపై బిగించుకోవాలని, ఎల్ఈడీ లైట్లను వాడాలని బ్రిటన్, నెదర్లాండ్స్ సూచించాయి. సోలార్ ఎనర్జీ బిగించుకుంటే ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తామని స్పెయిన్ ప్రకటించింది. పొదుపు చర్యలు..ఎల్పీజీ సిలిండర్లను సగమే నింపి ఇస్తామని నేపాల్, మాల్దీవుల ప్రభుత్వాలు స్పష్టంచేశాయి. పాకిస్తాన్ రాత్రి 8 గంటల తర్వాత మార్కెట్ సముదాయాలకు కరెంట్ను కట్ చేస్తోంది. రాత్రి 10 గంటల తర్వాత ఆహారం, తినుబండారాల దుకాణాలకు విద్యుత్ సరఫరాను నిలిపేస్తోంది. భారీ ప్రకటనలు ఉండే హోర్డింగ్, బిల్బోర్డ్లకు రాత్రిళ్లు ఈజిప్ట్, శ్రీలంక కరెంట్ను నిలిపేస్తున్నాయి. -
ఇంధన నిల్వలున్నాయి, కానీ.. : పెట్రోలియం మంత్రి కీలక సంకేతాలు
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇంధన కొరత లేదంటూనే పెంపు సంకేతాలిచ్చారు. మే 12ననిర్వహించిన 'CII వార్షిక బిజినెస్ సమ్మిట్-2026'లో దేశంలోని ఇంధన నిల్వలు, ధరల పెరుగుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇంధన కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. అయితేనాలుగేళ్లుగా ఇంధన పెంచలేదు, ధరలు పెరగబోవని చెప్పడం లేదంటూ మెలిక పెట్టడం చర్చకు దారి తీసింది.అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత వంట గ్యాస్, పెట్రోవాత తప్పదనే వివిధ అంచాలన మధ్య దేశంలో ఎక్కడా ఇంధన కొరత లేదని స్పష్టం చేస్తూ, ప్రభుత్వం LPG ఉత్పత్తిని గతంలో ఉన్న సుమారు 35,000 టన్నుల నుండి 54,000 టన్నులకు పెంచిందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. పెరిగే అవకాశం లేకపోలేదంటూ సంకేతాలు ఇచ్చారు. మరోవైపు ఇటీవలే ముగిసిన రాష్ట్ర ఎన్నికల కారణంగా ప్రభుత్వం ధరల సవరణను వాయిదా వేసిందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు.నాలుగేళ్లుగా పెంచలేదుపెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు ,ప్రపంచ మార్కెట్ అస్థిరత ఉన్నప్పటికీ, గత నాలుగేళ్లుగా రిటైల్ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయని మంత్రి స్పష్టంగా పేర్కొన్నారు. ప్రపంచంలో అలా చేయని ఏకైక దేశం మనదే అని కూడా ప్రకటించారు. ధరలు 50 నుండి 60 శాతం వరకు పెరిగిన అనేక దేశాల మాదిరిగా కాకుండా, భారతదేశం పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. అయినా పెరగవని తాను చెప్పడంలేదంటూ బాంబు పేల్చారు. దీనికి తోడు ఇటీవల ప్రధాని మోదీ డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలని, పొదుపుగా వాడాలని సూచించడం ప్రమాద హెచ్చరికగా అందరూ భావిస్తున్నారు.రాష్ట్ర ఎన్నికల కారణంగానే ధరల పెంపును వాయిదా వేస్తున్నారనే వాదనను ఆయన తోసిపుచ్చారు. ధరల నిర్ణయానికి, ఎన్నికలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.మన దగ్గర 60 రోజులకు సరిపడా ముడి చమురు, 60 రోజులకు సరిపడా LNG, 45 రోజులకు సరిపడా LPG నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందనే సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) రోజుకు రూ. 1,000 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయని, వినియోగదారులపై భారం పడకుండా ఉండటానికి కంపెనీలు ఈ నష్టాన్ని భరిస్తున్నాయని తెలిపారు. గతేడాది ఆర్జించిన లాభాలన్నీ ప్రస్తుత పరిస్థితుల వల్ల తుడిచిపెట్టుకుపోతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?సముద్ర మంథన్ స్కీమ్ ద్వారా దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి వెల్లడించారు. చమురు అన్వేషణ మరియు ఉత్పత్తి కోసం నిధుల కేటాయింపుపై ఆర్థిక శాఖతో చర్చలు తుది దశలో ఉన్నాయన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 90 రోజులకు సరిపడా నిల్వలను కలిగి ఉండాలని, ఆ దిశగా అదనపు స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుతున్నామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి : అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్,స్పెషల్ ఏంటంటే?కాగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మూడో నెలకు చేరుకుంది. శాంతి ప్రయత్నాల్లో భాగంగా ఇరాన్ ఇచ్చిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 10న తిరస్కరించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై పడనుందనే ఆందోళన నెలకొంది. ఇదీ చదవండి: ‘ప్రధాని విమానాన్ని అమ్మేయండి’ -
‘ప్రధాని విమానాన్ని అమ్మేయండి’
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిపై ఆధ్యాత్మిక గురువు, జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ఘాటుగా స్పందించారు. పొదుపు చర్యలు అధికారంలో ఉన్నవారితోనే ప్రారంభం కావాలని హితవు పలికారు.ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలో తన 'గోవిష్ట్ యాత్ర' సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రజలను ఖర్చులు తగ్గించుకోవాలని కోరేముందు, ప్రభుత్వమే ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికన్ డాలర్ విలువ రూ. 100కు చేరువవుతోందన్నారు. పెట్రోల్ డీజిల్ పొదుపుగా వాడాలి, వర్క్ ఫ్రం హోం, బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ చెప్పిన పొదుపు మంత్రపై ఆయన గట్టి చురక లేశారు.ముందు రూ. 8,000 కోట్ల విమానాన్ని అమ్మండిధర్మం అనేది ఇంటి నుండే మొదలవ్వాలి (Austerity begins at home)" అన్న అవిముక్తేశ్వరానంద ముందు రూ. 8,000 కోట్ల విలువైన విమానాన్ని అమ్మేసి, తక్కువ ఇంధనం ఖర్చయ్యే విమానాలను వాడాలని బీజేపీ ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు ఆవుల సంఖ్య తగ్గి పోతోందంటూ యూపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్లో గోవధను అరికట్టడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. కేరళ (8%), పశ్చిమ బెంగాల్ (15%), జార్ఖండ్ (24%) వంటి రాష్ట్రాల్లో ఆవుల జనాభా పెరగగా, ఉత్తరప్రదేశ్లో మాత్రం గణనీయంగా తగ్గిపోయిందని ప్రభుత్వ గణాంకాలను ఉటంకించారు. గోవధకు పాల్పడే వారి నుంచి డబ్బులు తీసుకుంటూ కొందరు నాయకులురాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని ఓటర్లు నమ్మకూడదని పిలుపునిచ్చారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజు కంటే సన్యాసి పదవి చాలా ఉన్నతమైనదని, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ద్వారా తన ఉన్నత స్థానం నుండి కిందకు దిగజారారని అన్నారు. ప్రస్తుతం ఆయన ఒక సీఎం మాత్రమే, సన్యాసి(పీఠాధిపతి) కాదంటూ విమర్శించారు. అలాగే యూపీ ప్రభుత్వ గోశాలల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. నాయకులు ,రాజకీయ పార్టీలు గోవధను అరికట్టడంలో విఫలమయ్యారు. అందుకే, తాము గోవులను ప్రేమించే ఓటర్లను సంప్రదించి,వారిలో అవగాహన కల్పిస్తున్నా మన్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, గోవుల సంరక్షణ, వాటి గౌరవాన్ని పునరుద్ధరించడంపై ఓటర్లలో అవగాహన కల్పించడమే తన యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని శంకరాచార్యులు తెలిపారు.ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?కాగా ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్దం, హర్మోజ్ జలసంధి మూసివేత సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని, ఆ ఏడాదిందా బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్ వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్వామి అవిముక్తేశ్వరానంద ఘాటుగా స్పందించడం గమనార్హం. ఇదీ చదవండి : అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్,స్పెషల్ ఏంటంటే? -
కాల్పుల విరమణ గాల్లో దీపం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇరాన్తో కొనసాగుతున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని బలవంతంగా కొనసాగిస్తున్నామని, అది గాల్లో దీపంలా తయారైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘కాల్పుల విరమణ సమర్థంగా అమలుకావట్లేదు. కాల్పుల విరమణ అనేది అత్యంత బలహీనంగా ఉంది. ఒక రకంగా అది ఐసీయూలో వెంటిలేటర్ మీద ప్రాణాధార వ్యవస్థ మీద నడుస్తోంది. అది ముగిసిపోయే అవకాశాలే చాలా ఎక్కువ’’అంటూ యుద్ధం ఏ క్షణంలోనైనా మొదలుకావొచ్చని ట్రంప్ పరోక్ష సంకేతాలిచ్చారు. ఇరాన్ పంపిన ప్రతిపాదనలను వెనువెంటనే తిరస్కరించానని ట్రంప్ వెల్లడించారు. ‘స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేని ఇరాన్ నాయకత్వం మధ్యవర్తుల ద్వారా కొన్ని చెత్త ప్రతిపాదనలను తాజాగా నా ముందుకు తెచ్చింది. అందుకే వాటిని పూర్తిగా చదవకుండానే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించా. అవి నాకు అస్సలు నచ్చలేదు. ఆ ప్రతిపాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు’’అని అన్నారు. ఇరాన్ నాయకత్వ ఆలోచనా ధోరణిపై ట్రంప్ మాట్లాడారు. ‘‘ప్రతిపాదనలు ఇచ్చిపుచ్చుకోవడం, మా మిత్రదేశాలపై క్షిపణులు, డ్రోన్ల దాడులతో నేను ఇబ్బంది పడతానని, ఏం చేయాలో తోచక పిచ్చెక్కుతుందని ఇరాన్ భావిస్తోంది. నాపై ఒత్తిడి ఉంటుందని అనుకుంటున్నారు. వాస్తవానికి మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. మేం విజయం సాధించబోతున్నాం. నా దగ్గర అద్భుతమైన ప్రణాళిక ఉంది. సైనికపరంగా ఇరాన్ను ఎప్పుడో ఓడించాం. వాళ్ల దగ్గర పరిమితస్థాయిలోనే సైనిక సంపత్తిఉంది. అదికూడా ఈ కాల్పుల విరమణ కాలంలో సమకూర్చుకున్నదే. ఈపాటి ఇరాన్ బలాన్ని మేం ఒక్కరోజులో సర్వనాశనం చేయగలం. అందుకు నా దగ్గర చక్కటి ప్లాన్ ఉంది. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సాధించబోదు. వాస్తవానికి ఇరానియన్లు చాలా ప్రమాదకరం. ఎప్పుడు ఎలాంటి విపరీత ఆలోచనలు చేస్తారో ఎవరికీ తెలీదు’’అని అన్నారు. -
పెట్రోల్, గ్యాస్ కొరత వచ్చేసిందా? మోదీ వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ముడి చమురు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇంధనం ఆదా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది.పశ్చిమాసియాలో పరిస్థితులపై సోమవారం ఢిల్లీలో ప్రభుత్వ అధికారులు మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని చెప్పారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణ ప్రభావం మనపై పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భయంతో అధికంగా కొనుగోలు చేయొద్దు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (మార్కెటింగ్, ఆయిల్ రిఫైనరీ) శర్మ మాట్లాడుతూ.. దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపారు. భారత్కు వచ్చే ఇంధన దిగుమతుల్లో దాదాపు 90 శాతం గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తున్నాయని, అయినా అంతరాయాన్ని తగ్గించే చర్యలు వేగంగా చేపట్టామని చెప్పారు.దేశంలో అన్ని రకాల ఇంధన సరఫరాలు తగినంత ఉన్నాయని, భయంతో అధికంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని శర్మ తెలిపారు. ప్రపంచ అనిశ్చితి సమయంలో దేశంపై ఆర్థిక భారం తగ్గించడం, ఇంధన పొదుపు లక్ష్యంతోనే ప్రధానమంత్రి వాటిపై ఆదివారం ఆ పిలుపును ఇచ్చారని చెప్పారు. సరఫరాలపై ప్రభావం అత్యల్పంగా ఉండేలా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.ఇంధన పొదుపు లక్ష్యంతోనే..అవసరంలేని ప్రయాణాలు తగ్గించి ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన సందేశాన్ని, సరఫరా కొరతకు ప్రతిస్పందనగా కాకుండా ఇంధన పొదుపు దృష్టితో చూడాలని అధికారులు తెలిపారు. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతున్న సమయంలో బాధ్యతాయుతంగా ఇంధనం వినియోగించాలనే ఉద్దేశంతో ఈ పిలుపు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.అనేక దేశాల నుంచి దిగుమతులువిదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇంధన సంరక్షణ, సరఫరా చర్యల్లో భాగంగా భారత్ అనేక దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి భారత్ పర్యటనపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. బ్రిక్స్ దేశాలు, భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు భారత్కు వచ్చే అవకాశం ఉందని, ప్రణాళికలు ఖరారైన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.పశ్చిమాసియా పరిస్థితులపై భారత్ వైఖరిని కూడా ఆయన మరోసారి వెల్లడించారు. మొదటి నుంచే శాంతి, చర్చలకు భారత్ మద్దతు ఇస్తోందని తెలిపారు. భారత నౌకలు సురక్షితంగా తిరుగు ప్రయాణం చేస్తున్నాయని పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారి ఒపేష్ శర్మ తెలిపారు. భారత జెండా ఉన్న 10 నౌకలు ఇప్పటివరకు అదనపు రుసుములు చెల్లించకుండా హార్మూజ్ జలసంధి దాటి సురక్షితంగా బయటకు వచ్చాయని చెప్పారు. ఇంకా 13 భారత జెండా నౌకలు ఆ ప్రాంతంలోనే ఉన్నాయని, వాటిని సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. నౌక సిబ్బంది సంక్షేమం, వారి అవసరాలను కూడా ప్రతిరోజూ పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, పెట్రో ధరల పెంపుపై మాత్రం కేంద్ర సర్కారు క్లారిటీ ఇవ్వలేదు. -
వాహన, వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్షాక్?
సాక్షి,న్యూఢిల్లీ: వంటగ్యాస్, పెట్రోల్,డీజిల్ వినియోగదారులకు బిగ్షాక్ తగలనుంది. వచ్చే వారంలో కేంద్రం లీటర్ పెట్రోల్కు రూ.2 నుంచి రూ.4వరకు.. వంట గ్యాస్ సిలిండర్పై రూ.40 నుంచి రూ.50వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇరాన్-అమెరికా యుద్ధంలో ఆయిల్ కంపెనీలకు లక్ష కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అయితే, పెట్రోల్,డీజిల్ ధరలు పెంచకపోతే ఆ భారం భరించలేమని కంపెనీలు చెబుతున్నాయి. ఒక్కసారిగా రేట్లు పెంచితే ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని కేంద్రం ఆందోళనలో ఉంది.ఈ క్రమంలో దశలవారీగా పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. హర్మూజ్ను మూసివేయడంతో భారత్కు ముడిచమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో కంపెనీలు రష్యా,పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి ఎక్కువ రేట్లకు ముడిచమురును కొనుగోలు చేస్తున్నాయి. -
రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ , కార్ పూలింగ్ను ఉపయోగించాలని కోరడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు , దేశీయంగా ఇంధనాన్ని పొదుపు చేయాలని ప్రధాని మోదీ కోరారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్లో ఇంధన ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని పౌరులకు చేసిన విజ్ఞప్తి చేశారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCలు) మధ్య చర్చలు కొనసాగుతున్నందున, ప్రపంచ ముడి చమురు పోకడలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్లు, ఇంధన ధరలను సమతుల్యం చేయడంలో ప్రభుత్వ వైఖరి ఉండబోతోంది అంటున్నారు విశ్లేషకులు.ఇదీ చదవండి: బిగ్ బాస్ మనీషా రాణి డ్రీమ్ హౌస్ : ధర తెలిస్తే ఫిదానేఅమెరికా-ఇరాన్ ప్రతిష్టంభన మధ్య ముడి చమురు ధరలు పెరగడంతో, చాలాకాలంగా వాయిదా పడుతున్న ఇంధన ధరల పెంపునకు ఇక నాంది పలకవచ్చని అంచనా. ముఖ్యంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, వినియోగదారులపై భారం పడకుండా చమురు సంస్థలు తక్కువ ధరకే ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు రోజుకు సుమారు రూ. 1,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.ఈ త్రైమాసికంలో రూ. 2 లక్షల కోట్ల వరకు వసూళ్లలో లోటు ఉంటుందని, సుమారు రూ. 1 లక్ష కోట్ల నష్టాలు నమోదవుతాయని అంచనా వేయడంతో OMC (చమురు కంపెనీ)లపై ఒత్తిడి పెరుగుతోందని, పౌరులకు మోదీ విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల తర్వాత మే 10న పెట్రోలియం మరియు సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఒక లింక్డ్ఇన్ పోస్ట్లో రాశారు.ప్రతిరోజూ రిటైల్ స్టేషన్లకు వచ్చే 6 కోట్ల మందికి పైగా వినియోగదారులకు భారం పడకుండా చూసుకోగలిగామన్నారు.. అంతేకాకుండా, మోదీ ప్రభుత్వం రిటైల్ ఇంధనంపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం వల్ల ఒక నెలలో రూ. 14,000 కోట్ల ఆదాయ నష్టాలను చవిచూసిందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఫిబ్రవరిలో 69.01 డాలర్లుగా ఉన్న రిఫైనరీలు చమురును దిగుమతి చేసుకునే సగటు ధర, మే నెలలో 104.68 డాలర్లకు పెరిగిందని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ డేటా వెల్లడించింది. చమురు సంస్థలు ఈ త్రైమాసికంలో సుమారు రూ. 2 లక్షల కోట్ల మేర అండర్-రికవరీలను (నష్టాలను) ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న ధరలతో చమురు విక్రయాలు ఆర్థికంగా భారమని, కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం తప్పనిసరి అని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం దాదాపు 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు (స్ట్రాటజిక్ మరియు కమర్షియల్) ఉన్నాయి. డిమాండ్ను తగ్గించడం ద్వారా ఈ సంక్షోభాన్ని అధిగమించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడనుఫిబ్రవరిలో బ్యారెల్ ముడి చమురు ధర 69.01 డాలర్లు ఉండగా, మే నెల నాటికి అది 104.68 డాలర్లకు చేరుకుంది. యుద్ధ ఉద్రిక్తతల సమయంలో ఇది ఒకానొక దశలో 120 డాలర్లస్థాయిని కూడా దాటేసింది. ముఖ్యంగా ఫిబ్రవరి 28 నుండి హోర్ముజ్ జలసంధి మూతపడటంతో చమురు దిగుమతులు భారత్కు సవాలుగా మారిపోయింది. -
భారత్కు ఇరాన్ మంత్రి..! ఇంధన కొరత వేళ మనకెన్ని లాభాలంటే?
న్యూఢిల్లీ: ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ మే 14-15 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం, భౌగోళిక-రాజకీయ ప్రాధాన్యం పెరిగిన సమయంలో ఆయన పర్యటన జరుగుతుంది. బ్రిక్స్ వేదికలో భారత్-ఇరాన్ మధ్య పెరుగుతున్న అనుబంధానికి దీన్ని సంకేతంగా భావిస్తున్నారు.ఇరాన్ 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలతో కలిసి బ్రిక్స్లో చేరింది. ఇరాన్ న్యాయ, అంతర్జాతీయ వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాదీ కూడా ఈ వారం జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే అవకాశమున్నట్లు ఇరానియన్ వర్గాలను ఉటంకిస్తూ గతంలో కథనాలు వచ్చాయి. భారత్ ఈ ఏడాది జనవరి 1న అధికారికంగా బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. బ్రెజిల్ నుంచి ఈ బాధ్యతలు భారత్ తీసుకుంది. 2012, 2016, 2021 తర్వాత భారత్ బ్రిక్స్కు నాలుగోసారి అధ్యక్షత వహిస్తోంది.రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ కూడా బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారని రష్యా విదేశాంగ శాఖ ఏప్రిల్ 29న తెలిపింది. మే 14-15 తేదీల్లో లావ్రోవ్ భారత్లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ ఎక్స్లో వెల్లడించింది. టాస్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ప్రస్తుత అంతర్జాతీయ అంశాలు, ప్రపంచ పాలన బలోపేతం వంటి అవకాశాలపై చర్చలకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జఖరోవా తెలిపారు.“మే 14-15 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే పూర్తి స్థాయి బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ హాజరవుతారు” అని ఆమె చెప్పారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం, ప్రస్తుత అంతర్జాతీయ అంశాలు, ప్రపంచ పాలన బలోపేత అవకాశాలపై చర్చలకు కీలక వేదికగా నిలుస్తుందని టాస్, జఖరోవాను ఉటంకిస్తూ తెలిపింది.ముఖ్యంగా ప్రపంచ మెజారిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది. “ఈ ఏడాది సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సు సన్నాహకాలలో వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతంపై ప్రత్యేక దృష్టి ఉంటుంది” అని ఆమె అన్నారు.ఇదిలా ఉండగా, బ్రిక్స్ మధ్యప్రాచ్యం-ఉత్తర ఆఫ్రికా ఉప విదేశాంగ మంత్రులు, ప్రత్యేక ప్రతినిధుల సమావేశం ఏప్రిల్ 23-24 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. బ్రిక్స్లో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచ, ప్రాంతీయ ప్రాధాన్య అంశాలు, రాజకీయ-ఆర్థిక పాలన అంశాలపై సంప్రదింపులు, సహకారానికి ఇది కీలక వేదికగా ఉంది. 2026 బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్ “బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ” అనే అంశాన్ని మార్గదర్శకంగా తీసుకుంది. 2025లో రియో డీ జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రస్తావించిన ప్రజాకేంద్ర, మానవతా ప్రథమ విధానాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.భారత్కు ఇది ఎందుకు కీలకం?ఈ ఏడాది బ్రిక్స్ అధ్యక్ష దేశంగా ఉన్న భారత్.. సభ్య దేశాల భిన్న అభిప్రాయాల మధ్య సమతుల్యత పాటించే అవకాశం ఉంది. సున్నితమైన భౌగోళిక-రాజకీయ అంశాలపై విభేదాలు తలెత్తకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా అంశాలపై సభ్య దేశాల మధ్య గతంలో ఏకాభిప్రాయం కుదరని సందర్భాలు ఉన్నాయి. ఇరాన్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా గల్ఫ్ భాగస్వామ్య దేశాలతో కూడా భారత్కు బలమైన సంబంధాలు ఉన్నాయి. దీంతో బ్రిక్స్లో ఏకాభిప్రాయం సాధించడం దౌత్యపరంగా సున్నిత అంశంగా మారింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబీ పర్యటనకు వెళ్లే అవకాశముంది. హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరా అంతరాయాలపై చర్చలు కొనసాగుతున్న సమయంలో అరాఘ్చీ పర్యటన సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఇరాన్, భారత్ నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్తో కూడా ఇరాన్ పలుమార్లు చర్చలు జరిపింది. గల్ఫ్ ఉద్రిక్తతల్లో ఏ సైనిక కూటమికీ మద్దతుగా నిలవకుండా భారత్ దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది. ప్రాంతీయ స్థిరత్వం, ఇంధన సరఫరా భద్రతపై భారత్ ప్రధాన దృష్టి పెట్టింది. -
అమెరికా ప్రతిపాదనలపై చర్చకు ఓకే
దుబాయ్/ఇస్లామాబాద్: అమెరికా అందజేసిన 14 సూత్రాల ప్రతిపాదనపై చర్చలకు ఇరాన్ సిద్ధమైంది. ఇందుకోసం పాకిస్తాన్కు ప్రతినిధులను పంపించేందుకు అంగీకరించింది. ఈ మేరకు మధ్యవర్తిగా ఉన్న పాక్కు సమాచారం పంపినట్లు ఇరాన్ అధికార వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు సహా అన్ని యుద్ధాలను నిలిపివేయాలని, నౌకాయానం భద్రతకు భరోసా ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ముందుగా వీటిపైనే చర్చలు జరగాలని స్పష్టం చేసింది. ఇవి కార్యరూపం దాల్చాకే హార్మూజ్ను తిరిగి తెరవడం, అణుకార్యక్రమాన్ని వదలుకోవడంపై వంటి వాటిపై చర్చలు జరపాలని ప్రభుత్వం పేర్కొందని ఇరాన్ టీవీ తెలిపింది. ఈ షరతులపై అమెరికా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఇరాన్–అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఆటంకాలు కొనసాగుతున్నాయి. తాజాగా గుర్తు తెలియని ప్రాంతం నుంచి దూసుకొచ్చిన డ్రోన్ల దాడులతో ఖతార్ తీరంలోని ఓ సరుకు నౌకకు నిప్పంటుకోగా, కొన్ని డ్రోన్లు కువైట్ గగనతలంలోకి చొరబడ్డాయి. ఆదివారం ఉదయం అబుధాబి నుంచి వస్తున్న వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి ఫలితంగా చెలరేగిన మంటలను వెంటనే ఆర్పేశామని ఖతార్ తెలిపింది. ఆదివారం వేకువజామున తమ గగనతలంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని డ్రోన్లను మధ్యలోనే పేల్చివేసినట్లు కువైట్ వెల్లడించింది. దాడులపై ఖతార్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన ఏమాత్రం ఆమోదయోగ్యం కాని ఉద్రిక్తత అంటూ వ్యాఖ్యానించింది. తాము గుర్తు తెలియని డ్రోన్లను కూల్చివేసినట్లు యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. ఇవి ఇరాన్ ప్రయోగించినవేనంటూ ఆరోపించింది. గత వారం హార్ముజ్ జలసంధిలో లంగరు వేసి ఉన్న తమ నౌకపై వెంటవెంటనే రెండు డ్రోన్దాడులు జరిగినట్లు దక్షిణ కొరియా నౌక ఆదివారం తెలిపింది. దాడితో పేలుడు, మంటలు చెలరేగాయని వెల్లడించింది. -
ట్రంప్ దాడికి.. ఇరాన్ మాస్టర్ ప్లాన్.. రష్యా సాయంతో..?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధం సీజ్ఫైర్ ఒప్పందంతో నడుస్తోంది.అయితే ఈ యుద్ధంలో అమెరికా మెుదటి నుంచి రష్యా ఇరాన్కు సహకారం అందించిందనే అమెరికా వాదిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఆరోపణల్ని బలపరుస్తూ 'ది ఎకనామిస్ట్' నివేదిక ప్రచురించింది. అమెరికా ఇరాన్ యుద్దంలో డొనాల్డ్ ట్రంప్ తొలుత నుంచి రష్యాపై గుర్రుగా ఉన్నారు. మాస్కో రహస్య సమాచారం ఆధారంగానే ఇరాన్ తమ స్థావరాలపై దాడులు చేస్తోందన్నారు. ఇరాన్ సాంకేతికతను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినా పక్కా ప్రణాళికతో అమెరికా స్థావరాలను ఎలా టార్గెట్ చేయగలుగుతుందని దీనిలో కచ్చితంగా మాస్కో హస్తం ఉందని ఆరోపించారు. ది ఎకనామిస్ట్ నివేదిక ఈ నివేదిక ప్రకారం, "వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం ఇరాన్కు దాదాపు 5,000 షార్ట్-రేంజ్ ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లను సరఫరా చేయడానికి రహస్య ప్రణాళిక రూపొందించింది. వీటితో పాటు శాటిలైట్ ద్వారా నడిచే లాంగ్-రేంజ్ డ్రోన్లను కూడా అందించాలని రష్యా భావించింది.ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లురేడియో సిగ్నల్స్కు బదులుగా సన్నని వైర్ల ద్వారా నియంత్రించబడతాయి. దీనివల్ల శత్రువులు వీటిని 'జామ్' చేయడం (సిగ్నల్స్ కట్ చేయడం) సాధ్యం కాదు. ఇవి 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగలవు". అని నివేదిక ప్రచురించింది.రష్యా తన లాంగ్-రేంజ్ డ్రోన్లలో ఎలాన్ మాస్క్కు చెందిన 'స్టార్లింక్' టెర్మినల్స్ను ఉపయోగించే.. ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలను దాటవేసింది. ఇప్పుడు అదే సాంకేతికతను మధ్యప్రాచ్యంలో ఇరాన్ దళాలకు మళ్లించాలని రష్యా చూస్తోంది.కేవలం ఆయుధాలు ఇవ్వడమే కాకుండా, వాటిని ఎలా వాడాలో శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా రష్యా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కథనం ప్రచురితమైంది. దీని కోసం రష్యాలోని విశ్వవిద్యాలయాలలో చదువుకుంటున్న సుమారు 10,000 మంది ఇరాన్ విద్యార్థుల నుండి ఆపరేటర్లను ఎంపిక చేయాలని రష్యా నిఘా సంస్థ భావించిందని తెలిపింది. అలాగే రష్యన్ భాష మాట్లాడగలిగే తజిక్ ప్రజలను మరియు సిరియాలోని అలవైట్ మైనారిటీలను కూడా ఈ పనుల కోసం వినియోగించుకోవాలని ప్రణాళికలో ఉంది.ట్రంప్ వ్యూహానికి కౌంటర్గాఇటీవల ట్రంప్ ఇరాన్లోని ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటారని ప్రచారం జరిగింది. అంతే కాకుండా అమెరికా సైన్యం నేరుగా ఇరాన్పై దాడి చేస్తుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికాను ఎదుర్కొనేలా ఈ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్లు ప్రధానంగా ఇరాన్ తీర ప్రాంతంలోని ద్వీపాల వద్దే మోహరించేలా ప్రణాళికలు రచించారు. ఒకవేళ ఇరాన్పై అమెరికా పదాతి దళాలతో దాడికి ఆదేశిస్తే అమెరికాను ఎదుర్కొవడానికి ఈ డ్రోన్లు కీలకంగా మారతాయని నివేదిక పేర్కొంది. -
ఇరాన్కు సపోర్టు.. ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
మాస్కో: ఉక్రెయిన్తో రష్యా యుద్ధం, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ముగింపు దశకు వస్తోందని శుభవార్త చెప్పారు. విక్టరీ డే పరేడ్ అనంతరం పుతిన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మాస్కో ఒక సంప్రదింపుల దశకు సిద్ధమవుతోందని అనడానికి ఇది ఆయన ఇచ్చిన అత్యంత బలమైన సంకేతం.రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా భయంకరమైన పోరాటం సాగింది. ఈ క్రమంలో అమెరికా మద్దతుతో రష్యా, ఉక్రెయిన్ మూడు రోజుల కాల్పుల విరమణను ప్రారంభించాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి జరిగిన అతిపెద్ద ఖైదీల మార్పిడిలో భాగంగా చెరొక దేశం 1,000 మంది ఖైదీలను మార్చుకోవడానికి అంగీకరించిన తరుణంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ప్రకటన వెలువడిన సమయం వెంటనే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. క్రెమ్లిన్ సంవత్సరాలుగా సైనిక దృఢత్వాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది, కానీ రష్యా నాయకుడి తాజా వ్యాఖ్యలు తెరవెనుక పెరుగుతున్న దౌత్యపరమైన కదలికలను సూచించాయి.మరోవైపు.. పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్-అమెరికా మధ్య వివాదం చాలా క్లిష్టంగా మారింది. అయితే, ఇరాన్ అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. రష్యాకు ఇరాన్తో పాటు పర్షియన్ గల్ఫ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది మాకు కూడా సవాలుగా మారింది. ఇరు పక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాం. ఈ ఘర్షణ త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నా. దీన్ని కొనసాగించాలనే ఆసక్తి ఎవరికీ లేదని నేను భావిస్తున్నా. అయితే సమస్య పరిష్కారానికి ఇంకా రాజీ అవకాశాలు ఉన్నాయి' అని అభిప్రాయపడ్డారు. -
త్వరలోనే అందుబాటులోకి హార్మూజ్
టెహ్రాన్: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి త్వరలోనే తెరుచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అమెరికా, ఇరాన్లు మధ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లు సమాచారం. హార్ముజ్ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే పూర్తిస్థాయి ఒప్పందం కుదిరేందుకు ఆస్కారం ఉంది. దాంతో జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుంది. అక్కడ చిక్కుకుపోయిన చమురు నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తారు. అమెరికా, ఇరాన్ల మధ్య ఫిబ్రవరి 28న దాడులు, ప్రతిదాడులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత హార్మూజ్ను ఇరాన్ మూసివేసింది. కొన్ని దేశాల నౌకలకు మాత్రమే అనుమతి ఇస్తోంది. అనంతరం అమెరికా కూడా జలసంధిలో ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది. హార్మూజ్ మూసివేతతో చమురు రవాణా స్తంభించిపోయింది. చమురు, ఎల్పీజీ ధరలు పెరిగిపోయాయ. ప్రధానంగా ఆసియా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హార్మూజ్లో ఇరాన్ ఆంక్షల వల్ల చిక్కుకుపోయిన నౌకలను విడిపించేందుకు అమెరికా సైన్యం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను ప్రారంభించింది. కానీ, ఇరాన్తో చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి లభించడంతో ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను నిలిపివేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇరాన్తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఒప్పందానికి రాకపోతే ఇరాన్పై మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని ఆయన స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో రెండు నెలలుగా కొనసాగుతున్న సంక్షోభానికి త్వరలోనే తెరపడవచ్చన్న సంకేతాలు రావడం గురువారం అంతర్జాతీయ మార్కెట్లను ఉత్తేజపరిచింది. స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య ఒప్పందం అతి త్వరలోనే కుదురుతుందని భావిస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తాహీర్ అంద్రాబీ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం వాటికన్ సిటీలో పోప్ లియో–14తో సమావేశయ్యారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతిని సాధించడానికి సాగుతున్న ప్రయత్నాల గురించి చర్చించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పోప్ లియో–14పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా, వాటికన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మార్కో రూబియో ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అలాగే వాటికన్ విదేశాంగ మంత్రి కార్డినల్ పెట్రో పారోలిన్తోనూ రూబియో భేటీ అయ్యారు. పశ్చిమాసియా పరిణామాలపై చర్చించారు. -
ఇరాన్ ఒప్పుకుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఎట్టకేలకు ఇరాన్.. ట్రంప్ డిమాండ్కు తలొగ్గినట్టు ఆయన వెల్లడించారు. అణు శుద్ది నిలిపివేతకు ఇరాన్ అంగీకరించినట్టు ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. దీంతో, ఇరు దేశాల మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకునే అవకాశముంది.ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కీలక అడుగు పడింది. అధ్యక్షుడు ట్రంప్ తాజాగా వైట్హౌస్ వేదికగా మాట్లాడుతూ..‘ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటం మంచిది కాదు. ఇరాన్ అణ్వాయుధాలతో ప్రపంచ దేశాలకు ముప్పు. న్యూక్లియర్ వెపన్స్ ఉండటం ఇరాన్కు కూడా మంచిది కాదు. మా డిమాండ్కు ఇరాన్ అంగీకరించింది. అణు శుద్ది నిలిపివేతకు ఇరాన్ ఓకే చెప్పింది. ఇరాన్ అంగీకారంతో చర్చలు తుది దశకు చేరుకునట్టే’ అని వ్యాఖ్యలు చేశారు. 🚨 DONALD TRUMP CONFIRMS IRAN HAS AGREED TO NO NUCLEAR WEAPONSThis is HUGE! 🇺🇸"Iran cannot have a nuclear weapon, and they won't. And they've agreed to that, among other things, yes!" 🔥 pic.twitter.com/3kgf8pkBeS— Eric Daugherty (@EricLDaugh) May 6, 2026ట్రంప్ వార్నింగ్.. ఇదిలా ఉండగా.. అంతకుముందే ఇరాన్ను ట్రంప్ మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించకపోతే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఈసారి దాడుల తీవ్రత మునుపెన్నడూ చూడని రీతిలో, అత్యంత భయంకరంగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి ఇరాన్ అంగీకరిస్తేనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగుస్తుందని తెలిపారు. హార్మూజ్లో అత్యంత కీలకమైన దిగ్బంధనం తొలగిపోతుందన్న ట్రంప్, ఇరాన్ తమ దారిలోకి వస్తే జలసంధి మార్గం అందరికీ తెరుచుకుంటుందని చెప్పారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరిస్తుందని వ్యాఖ్యనించారు.ఇరాన్ కొత్త ప్లాన్.. మరోవైపు, హార్మూజ్ జలసంధి గుండా నౌకాయానాన్ని నియంత్రించడానికి ఇరాన్ కొత్త వ్యవస్థను ప్రారంభించింది. "సావరిన్ గవర్నెన్స్ సిస్టమ్" పేరుతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ జలమార్గం నుంచి ప్రయాణించాలనుకునే అన్ని నౌకలు ఇరాన్ అధికారుల నుంచి ఇ-మెయిల్ ద్వారా తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలి. ఫిబ్రవరి 28న ఇరాన్ భూభాగంపై జరిగిన దాడుల తర్వాత ఇజ్రాయెల్, అమెరికాలతో సంబంధం ఉన్న నౌకలను సురక్షితంగా వెళ్లనిచ్చేది లేదని ఇరాన్ కఠిన వైఖరిని అవలంబిస్తోంది. దీనిని మరింత చట్టబద్ధం చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఒక ముసాయిదాను కూడా పరిశీలిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను నిషేధించడంతో పాటు, శత్రువులు కాని ఇతర దేశాల నౌకల ప్రయాణానికి 'టోల్ సిస్టమ్' తీసుకురావాలని భావిస్తోంది. -
కామికేజ్ డాల్ఫిన్లతో దాడులకు టెహ్రాన్ ప్లాన్..?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. ఇరు దేశాలు సీజ్ఫైర్ అమలు చేస్తున్న యుద్దం విషయంలో మాత్రం స్పష్టత రావట్లేదు. అయితే ఇటీవల ఓ కొత్త విషయం పలువురిని ఇబ్బందులకు గురి చేసింది. అమెరికాపై దాడులకు ఇరాన్ కామికేజ్ డాల్ఫిన్లను ఉపయోగించే అవకాశం ఉందని కథనాల వచ్చాయి. కాగా దీనిపై తాజాగా అమెరికా రక్షణ మంత్రి పీట్స్ హెగ్సెత్ స్పందించారు.ప్రస్తుతం హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్- అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడంతో ఏం చేయాలో గుండా రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా సైతం ఇరాన్ నౌకశ్రయాలను బ్లాకేడ్ చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల వాల్స్ట్రీట్ జనరల్లో ప్రచురితమైన కథనం ఇప్పుడు హాట్ టాఫిక్గా మారింది.ఈ విషయమై అమెరికా రక్షణ శాఖ మంత్రిని సంప్రదించగా ఈ విధంగా మాట్లాడారు. "ఇరాన్ తన కార్యకలాపాల కోసం 'కామికేజ్ డాల్ఫిన్లను వాడడం పూర్తిగా అవాస్తవం ఇరాన్ వద్ద అటువంటి డాల్ఫిన్ ఆపరేషన్లు ఏవీ లేవని తాను ఖచ్చితంగా చెప్పగలను. అయితే అమెరికా వద్ద అవి ఉన్నాయా అనే ప్రశ్నకు మాత్రం నేను అవును లేదా కాదు అని సమాధానం చెప్పను" అని అన్నారు.ఇరాన్ వద్ద కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయాఇరాన్ వద్ద ప్రస్తుతం కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. అయితే 2000 సంవత్సరంలో ఇరాన్ రష్యా నుండి కొన్ని శిక్షణ పొందిన డాల్ఫిన్లను కొనుగోలు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. కాని అవి ఇప్పుడు చాలా వృద్ధాప్యంలో ఉంటాయని, కాబట్టి వాటిని ప్రస్తుత యుద్ధ అవసరాలకు వాడటం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా అమెరికా మాత్రం గత కొన్ని దశాబ్దాలుగా డాల్ఫిన్లకు శిక్షణ ఇస్తోంది. 'యుఎస్ మెరైన్ మమ్మల్ ప్రోగ్రామ్' ద్వారా వీటిని మైన్లను గుర్తించడానికి, సముద్రంలో వస్తువులను వెతకడానికి ఉపయోగిస్తారు.అమెరికా శిక్షణ ఇచ్చే డాల్ఫిన్లు మైన్లను గుర్తించడానికే పరిమితమని అవి బాంబులతో పాటు పేలిపోయే 'కామికేజ్' రకం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.డాల్ఫిన్ల ప్రత్యేకతసైనిక అవసరాల కోసం డాల్ఫిన్లను వాడటం కొత్తేమీ కాదు. రష్యా కూడా తన ఓడరేవుల రక్షణ కోసం వీటిని వాడుతుంటుంది. సైన్స్ ప్రకారం, డాల్ఫిన్ల వద్ద ఉన్న సోనార్ వ్యవస్థ అత్యంత అధునాతనమైనది. ఎంత చీకటిగా ఉన్నా లేదా బురద నీటిలోనైనా ఇవి నీటి అడుగున ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించగలవు. మానవ నిర్మిత డ్రోన్ల కంటే ఇవే వేగంగా మైన్లను పసిగట్టగలవని అమెరికా నేవీ వెబ్సైట్ పేర్కొంది.కామికేజ్ అనే పేరుసాధారణంగా, ఆత్మహత్యాయుద్ధానికి పాల్పడే వారిని (ముఖ్యంగా జపాన్ విమాన పైలట్లు) 'కామికేజ్' అని పిలుస్తారు. డాల్పిన్ల విషయానికి వస్తే, వాటి శరీరానికి పేలుడు పదార్థాలను అమర్చి, శత్రువుల నౌకలను లేదా సబ్మెరైన్లను ఢీకొట్టి పేల్చేలా శిక్షణ ఇవ్వడాన్నే "కామికేజ్ డాల్పిన్లు" అంటారు.అయితే, అధికారికంగా ఏ దేశం కూడా తాము ఇలాంటి "ఆత్మహత్య" దళాలను వాడుతున్నామని ఒప్పుకోలేదు. కానీ, అమెరికా మరియు రష్యా వంటి దేశాలు "మెరైన్ మామల్ ప్రోగ్రామ్స్" ద్వారా ప్రస్తుతం డాల్పిన్లకు సైనిక శిక్షణ ఇస్తున్నాయి. -
కాల్పుల విరమణ ఎత్తివేత..! మళ్లీ ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం
-
భారత్ వృద్ధికి యుద్ధం బ్రేక్
పశ్చిమాసియా ఘర్షణలతో నౌకల రవాణాకు అటంకాలు, ఇంధన ధరల పెరుగుదల భారత జీడీపీ వృద్ధికి జోరుకు అవరోధాలు కలి్పంచొచ్చని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 6.5 శాతంలోపునకు తగ్గిపోవచ్చని సీఐఐ ప్రెసిడెంట్ రాజీవ్ మెమానీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన ఇంధన సంక్షోభం ఎక్కువ కాలం పాటు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వృద్ధితోపాటు భారత్ వృద్ధికీ అతిపెద్ద రిస్క్గా పేర్కొన్నారు. ఒకవేళ సకాలంలో పరిష్కారమైతే అప్పుడు వృద్ధి పుంజుకుంటుందన్నారు. అప్పుడు 6.5–7 శాతం మధ్య వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఒకవేళ దీర్ఘకాలం పాటు కొనసాగితే అది 6.5 శాతం కంటే తక్కువగా ఉండొచ్చన్నారు.పశ్చిమాసియా సంక్షోభం పరిష్కారమయ్యేంత వరకు జీడీపీపై, వడ్డీ రేట్లపై ఒక నిర్ణయాత్మక అభిప్రాయానికి రాలేమన్నారు. చమురు ధరలు అధిక స్థాయిల్లో (100 డాలర్లకు పైన) ఉంటే, అది వృద్ధిపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందన్నారు. కాకపోతే గత 10–12 ఏళ్లలో ఏవో కొన్ని సందర్భాలను మినహాయిస్తే దాదాపు చమురు ధరలు కనిష్టాల్లోనే ఉన్నాయంటూ.. అది దేశ వృద్ధికి సాయపడినట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.6 శాతంగా ఉంటుందన్నది ప్రభుత్వం అంచనా. వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చు..వడ్డీ రేట్లు సమీప కాలంలో కిందకు దిగొచ్చే పరిస్థితుల్లేవని రాజీవ్ మెమానీ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలకు మద్దతుగా లక్ష్యిత చర్యలను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ముఖ్యంగా రుణసాయం విషయంలో సమస్యలున్నట్టు చెప్పారు. వ్యాపార సులభతర నిర్వహణ, చిన్న తప్పులను నేరాలుగా చూడకపోవడం, న్యాయ సంస్కరణల విషయంలో వేగవంతమైన చర్యలు అవసరమన్నారు. ఈ దిశగా గత 12–18 నెలల్లో పభుత్వం చేసిన కృషిని అభినందించారు. వివాదాల సంఖ్యను సాధ్యమైనంత తగ్గించాలని, పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు అవసరమని మెమానీ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వానికి సీఐఐ సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. వృద్ధి 6.3 శాతమే: ఏడీబీపశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 0.6 శాతం తగ్గి 6.3 శాతానికి పరిమితం కావొచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ముఖ్య ఆర్థికవేత్త ఆల్బర్ట్ పార్క్ అంచనా వేశారు. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పుంజుకుంటుందన్నారు. 2025–26లో భారత్ జీడీపీ బలంగా 6.9 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, 2027–28లో 7.3 శాతానికి పుంజుకుంటుందని.. 2026–27లో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని ఏడీబీ ఏప్రిల్లో అంచనాలు ప్రకటించడం గమనార్హం. ఇక ద్రవ్యోల్బణం ఏప్రిల్ అంచనా కంటే 2.4 శాతం పెరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతానికి చేరుకోవచ్చని పార్క్ తెలిపారు. చమురు, గ్యాస్ కోసం దిగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడి ఉన్నట్టు గుర్తు చేశారు.ఎల్నినో ప్రభావంఎల్నినో ప్రభావంపై మాట్లాడుతూ.. భారత్లో సాగుపై ప్రభావం పడినప్పుడల్లా ధరల పరమైన సమస్యలు ఉంటాయన్నారు. ప్రపంచంలో బియ్యం ఎగుమతుల్లో పెద్ద వాటా కలిగి ఉన్నందున, భారత్లో సాగుకు ఇబ్బందులు ఏర్పడితే ప్రపంచ దేశాలపైనా దాని ప్రభావం ఉంటుందన్నారు. ఎరువుల ధరలు పెరిగిపోవడం వల్ల రైతులు తక్కువగా వినియోగిస్తారని.. దీంతో దిగుమతి తగ్గి ఆ తర్వాత ఆహార లభ్యత తగ్గుతుందన్నారు. ధరలపై దీని ప్రభావం కచి్చతంగా ఉంటుందన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వేగంగా మళ్లడం, ఇతర ఇంధన వనరుల దిగుతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం అవసరమన్నారు. అయితే భారత్లో ఎన్నో సంస్కరణలు కొనసాగుతున్నాయంటూ, వృద్ధి అవకాశాలు దీర్ఘకాలానికి ఇప్పటికీ ఆశావహంగానే ఉన్నట్టు పార్క్ చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) మెరుగుపడతాయని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు సాయపడతాయన్నారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్ నిలిపేస్తున్నాం: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్లోని హార్మూజ్ జలసంధికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో దౌత్యపరమైన ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తున్నందున జలసంధి గుండా నౌకల రాకపోకలను నిర్ధారించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్ను అమెరికా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. అయితే, ఇరాన్పై ఉన్న బ్లాకేడ్ (నౌకాశ్రయాల నిర్బంధం) మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సోషల్ మీడియా ట్రుత్ వేదికగా..‘ఇరాన్తో చర్చల్లో గొప్ప పురోగతి కనిపిస్తోంది. అందుకే హార్మూజ్లో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. పాకిస్తాన్, ఇతర దేశాల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ ఆపరేషన్ను నిలిపివేయడానికి మేం పరస్పరం అంగీకరించాం. ఇరాన్ ప్రతినిధులతో చర్చలు సంపూర్ణ, తుది ఒప్పందం దిశగా వెళ్తున్నాయి. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశముంది. అయితే, సముద్ర కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ ఇరాన్పై ఒత్తిడి కొనసాగుతుంది. ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఇరాన్పై అమెరికా సాగిస్తున్న పోరాటం సైనిక విజయమే. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశముందని పేర్కొన్నారు.President Trump posts on TruthSocial: Based on the request of Pakistan and other Countries, the tremendous Military Success that we have had during the Campaign against the Country of Iran and, additionally, the fact that Great Progress has been made toward a Complete and Final… pic.twitter.com/BF6mZ4AtCc— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) May 6, 2026కాగా, ఈ చర్యల ద్వారా అమెరికా ఒకవైపు సైనిక ఒత్తిడి కొనసాగిస్తూ, మరోవైపు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తోంది. హార్మూజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గం. ముఖ్యంగా చమురు రవాణాలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.కీలక పరిణామాలు.. ఇక, ఇరాన్తో అమెరికా చర్చలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య సందేశాల మార్పిడి జరుగుతోంది. అయితే అమెరికా ప్రతిపాదనలపై ఇరాన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అణు కార్యక్రమం కూడా ఈ చర్చల్లో కీలక అంశంగా మారింది. ఇరాన్ అణ్వాయుధాల దిశగా కదులుతోందని అమెరికా ఆరోపిస్తుండగా, ఇరాన్ మాత్రం తన కార్యక్రమం శాంతియుతమని చెబుతోంది. మొత్తానికి ప్రస్తుతం పరిస్థితి చూస్తే హార్మూజ్లో ఉద్రిక్తతలు తగ్గకపోయినా, చర్చల ద్వారా పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్కు ఇచ్చిన తాత్కాలిక విరామం ఆ దిశలో కీలక మలుపుగా మారే అవకాశముంది. -
భారత్ పేరుతో అమెరికా కొత్తనాటకం
అమెరికా అవకాశ వాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ దేశానికి అవసరం ఉంటే ఉగ్రవాద నాయకులను కూడా ప్రపంచ శాంతి దూతలను చేస్తోంది. అదే వారితో పనైపోతే ఈడ్చితంతుంది. ఇది ఆ దేశం యెుక్క నైజం.. తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశారు.ఇరాన్తో యుద్ధం ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తేలా చేసిన యుఎస్ఏ ఇప్పుడు.. అంతర్జాతీయ సరఫరా గొలుసులను, ముఖ్యంగా భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల వంట అవసరాలకు కీలకమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) రవాణాను రక్షించడం కోసం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను ప్రారంభించినట్లు తెలిపింది. తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి మానవతా సాయం పేరుతో కొత్తనాటకానికి తెర తీసింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఈ విషయమై మాట్లాడుతూ.. హర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలకు దారి చూపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన "ప్రాజెక్ట్ ఫ్రీడమ్" ప్రణాళిక ఒక "మానవతా ప్రయత్నం" అంతర్జాతీయ సరఫరా గొలుసులను, ముఖ్యంగా భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల వంట అవసరాలకు కీలకమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) రవాణాను రక్షించడమే దీని లక్ష్యం అని ఆయన అన్నారు.గత నెలలో జరిగిన ప్రపంచ బ్యాంకు సదస్సులో పేద మరియు అత్యంత బలహీనమైన దేశాలు తన వద్దకు వచ్చి, హర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య రవాణాను పునరుద్ధరించాలని అమెరికాను కోరాయని అందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. "ఇది ఒక మానవతా ప్రయత్నం. ఇందులో కేవలం ఇంధనం మాత్రమే కాదు, ఎరువులు, ఆహార రవాణా మరియు భారతదేశంలోని బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు వంట కోసం ఉపయోగించే LPG కూడా ఉన్నాయి," అని ఆయన అన్నారు.చైనాపై ఆరోపణలుకాగా ఈ నేపథ్యంలోనే బెన్సెంట్ చైనాను విమర్శించారు."ఇరాన్కు చైనా ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద ప్రోత్సాహక దేశం. చైనా వారి ఇంధనంలో 90 శాతాన్ని కొనుగోలు చేస్తూ, ఆ ఉగ్రవాద దేశానికి నిధులు సమకూరుస్తోంది," అని ఆయన ఆరోపించారు. వచ్చే వారం ట్రంప్ మరియు జిన్పింగ్ల భేటీ జరగనున్న నేపథ్యంలో, ఈ విషయంలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఆయన కోరారు.ఇరాన్ దగ్గర సత్తా లేదుయుద్ధంలో ఇరాన్ తన పోరాట పటిమను కోల్పోయిందని, అమెరికా దళాలకు వ్యతిరేకంగా ఇరాన్ చేస్తున్న ప్రకటనలన్నీ కేవలం 'ప్రచారమే అన్నారు. ఇరాన్ నాయకత్వం దేశవ్యాప్తంగా బంకర్లలో దాక్కుంది, అసలేం జరుగుతుందో వారికి తెలియడం లేదని .ఇరాన్ నౌకాదళం ఇప్పుడు ఒక నౌకాదళంలా లేదు, అది కేవలం "సముద్రపు దొంగల ముఠా"గా మారిందన్నారు. వారు అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను అడ్డుకోవాలని చూస్తున్నారని అమెరికా దాన్ని అడ్డుకుంటుందని తెలిపారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. సైనికులకు జీతాలు అందకపోతే వారు పోరాడలేరని ఆయన వ్యాఖ్యానించారు. -
అమెరికా KC-135 స్ట్రాటోట్యాంకర్ అదృశ్యం
వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధంలో అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైనిక విమానాలకు గాలిలో ఇంధన కేంద్రంగా పనిచేసే బోయింగ్ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ విమానం ఆచూకీ గల్లంతయ్యింది.ఫ్లైట్రాడార్24 డేటా ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన ఈ విమానం ఖతార్ మీదుగా ప్రయాణిస్తుండగా సంకేతాలు నిలిచిపోయాయి. అదృశ్యానికి ముందు ‘7700’ అనే అత్యవసర సంకేతాన్ని జారీ చేసింది.విమానాన్ని పర్షియన్ గల్ఫ్ మీదుగా కొనసాగుతున్న సైనిక చర్యలకు మద్దతుగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ల్యాండింగ్కు ముందు కొంతసేపు గాలిలో వృత్తాకారంలో తిరిగినట్లు ట్రాకింగ్ డేటా తెలిపింది. అత్యవసర పరిస్థితికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై ఇరాన్ మీడియా సంస్థ ఫార్స్ వార్తా సంస్థ ఈ ఘటనపై నివేదిక ఇచ్చింది. అయితే, అమెరికా విమానం అదృశ్యానికి ఇరాన్ ప్రమేయం ఉందని ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఇరాన్-అమెరికా యుద్ధం తీవ్రస్థాయికి?.. సంచలన వ్యాఖ్యలు
ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ ప్రతిపాదన తనకు నచ్చలేదని యుద్దం ముగించే అవకాశాలు లేవని అన్నారు. తాజాగా దీనికి ఇరాన్ అధికారి ఘాటుగా స్పందించారు. ఇరాన్- అమెరికా మధ్య మరోసారి యుద్ధం తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉందన్నారు.ఆ దేశ మిలిటరీ కేంద్ర కమాండ్లోని సీనియర్ అధికారి మొహమ్మద్ జాఫర్ అసాదీ మాట్లాడుతూ "ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య మరోసారి ఘర్షణ జరిగే అవకాశం ఉంది." అని అన్నారు. యు.ఎస్ అధికారుల తాజా చర్యలు మరియు ప్రకటనలు కేవలం "వారు సృష్టించిన గందరగోళం నుండి బయటపడటానికి మాత్రమేనని ఆయన తెలిపారు. యు.ఎస్ అధికారుల చర్యలు మరియు ప్రకటనలు ప్రాథమికంగా మీడియా ఆధారితమైనవి. చమురు ధరలు పడిపోకుండా నిరోధించడం ఒకటైతే, వారు సృష్టించిన గందరగోళం నుండి తమను తాము రక్షించుకోవడం రెండవది" అని ఆయన అన్నారు. అమెరికా ఏదైనా ఉద్రిక్తతలకు పాల్పడితే ఇరాన్ సాయుధ బలగాలు తిప్పికొట్టడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికన్లు చేసే ఏ కొత్త సాహసాలకైనా, మూర్ఖత్వాలకైనా సాయుధ బలగాలు పూర్తిగా ఎదుర్కొంటాయి అని పేర్కొన్నారు అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇది వరకే ఇరాన్ న్యాయవ్యవస్థ అధిపతి దీనిపై స్పందించారు.తమ దేశం "చర్చల నుండి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని కానీ కానీ శాంతి పేరుతో నిబంధనలను రుద్దడం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమన్నారు. కాగా ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ నడుస్తోంది. ఇరు దేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. అయితే అణుఒప్పందం విషయంలో ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఇరాన్పై యుద్ధం ముగిసింది.. కాంగ్రెస్ అనుమతి అక్కర్లేదు
వాషింగ్టన్: ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది కాబట్టి యుద్ధం ముగిసినట్లేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్కు తెలియజేశారు. యుద్ధానికి చట్టపరమైన ఆమోదం కోసం తాను గడువును పాటించాల్సిన అవసరం లేదని వాదించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఫిబ్రవరి 28న ఆరంభమైన దాడులు ఏప్రిల్ 7 నుంచి ఆగిపోయాయని గుర్తుచేశారు. 1973 నాటి వార్ పవర్స్ చట్టం ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు మరో దేశంపై సైనిక చర్య ప్రారంభించినప్పుడు దాని గురించి చట్టసభ సభ్యులకు తెలియజేసిన 60 రోజుల్లోపు కాంగ్రెస్ ఆమోదం పొందాలి. లేకపోతే యుద్ధాన్ని విరమించుకోవాల్సి ఉంటుంది. ట్రంప్ శుక్రవారం కాంగ్రెస్ సభ్యులకు లేఖ రాశారు. కాల్పుల విరమణ నేపథ్యంలో యుద్ధం ఆగిపోయింది కాబట్టి వార్ పవర్స్ చట్టం ప్రకారం తాను నడుచుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇరాన్పై యుద్ధం గురించి కాంగ్రెస్ సభ్యులకు అధికారికంగా తెలియజేసిన తర్వాత సరిగ్గా 60వ రోజున ట్రంప్ ఈ లేఖ రాయడం గమనార్హం. 60 రోజుల డెడ్లైన్ శుక్రవారమే ముగిసింది. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ దీర్ఘకాల శాంతి ఒప్పందంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఇరుదేశాల మధ్య చర్చల ప్రక్రియలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రధానంగా అణ్వస్త్ర ప్రయోగాల విషయంలో అమెరికా విధించిన షరతులను ఇరాన్ అంగీకరించడం లేదు. వారికి లేని అనుమతి నాకెందుకు? ఇరాన్తో యుద్ధం కొనసాగించడానికి తనకు కాంగ్రెస్ అనుమతి అవసరం లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. గతంలో అమెరికా కమాండర్–ఇన్–చీఫ్లు అలాంటి అనుమతి ఏనాడూ తీసుకోలేదని స్పష్టంచేశారు. యుద్ధం చేసే విషయంలో అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేసే కాంగ్రెస్ అధికారాన్ని మాజీ అధ్యక్షులు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా భావించారని తెలిపారు. ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఇరాన్పై దాడులు కొనసాగించడానికి కాంగ్రెస్ నుంచి అనుమతి తీసుకుంటారా? అని ప్రశ్నించగా, మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ను పరిగణనలోకి తీ సుకోకుండా యుద్ధాలు చేశారని పేర్కొన్నారు. ఇంతకుముందు ఎవరూ అనుమతి అడగలేదని వెల్లడించారు. వారికి లేని అనుమతి తనకెందుక ని ట్రంప్ పరోక్షంగా అసహనం వ్యక్తంచేశారు. ఇరాన్ నుంచి తిరిగొస్తూ క్యూబాను స్వాదీనం చేసుకుంటాం చమత్కరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చమత్కరించారు. ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేటప్పుడు అమెరికా నౌకాదళం క్యూబాతో తలపడుతుందని అన్నారు. క్యూబాను స్వాధీనం చేసుసుకొనే ఆలోచన ఉందంటూ తన మనసులోని మాటను పరోక్షంగా వ్యక్తీకరించారు. క్యూబాకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. ట్రంప్ శుక్రవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘ఇరాన్ నుండి తిరిగి వస్తున్నప్పుడు, మా పెద్ద విమాన వాహక నౌకల్లో ఒకటైన, బహుశా ప్రపంచంలోనే అతిపెద్దదైన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ను క్యూబా తీరానికి సుమారు 100 గజాల దూరంలో నిలిపినప్పుడు క్యూబా ప్రజలు ఎదురొస్తారు. మీకు ధన్యవాదాలు, మేము లొంగిపోతున్నాం అని చెబుతారు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. క్యూబాపై అమెరికా ఎప్పటినుంచో కన్నేసింది. అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. తనకు కావాల్సింది సాధించుకోవడానికి క్యూబాపై సైనిక చర్య తీసుకోవచ్చని ట్రంప్ పదేపదే బెదిరిస్తూ వస్తున్నారు. హార్మూజ్లో ఇరాన్కు చెల్లింపులు చేస్తే ఆంక్షలు విధిస్తాం దుబాయ్: హార్మూజ్ జలసంధిలో ప్రయాణించడానికి ఇరాన్కు చెల్లింపులు చేస్తే ఆంక్షలు విధిస్తామని షిప్పింగ్ కంపెనీలను అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు యూఎస్ ఆఫీసు ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేసింది. హార్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. జలసంధిలో ఇరాన్ ఓడరేవులను అమెరికా సైన్యం దిగ్బంధించింది. మరోవైపు విదేశీ నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది. తమ తీరానికి దగ్గరగా ఉన్న మార్గాల్లో కొన్ని నౌకలకు మాత్రం అనుమతి ఇస్తోంది. అందుకు వాటి నుంచి రుసుము వసూలు చేస్తోన్న సంగతి తెలిసిందే. -
హార్మూజ్ను దాటుకుని వస్తున్న భారత నౌక
బెంగళూరు: హార్మూజ్ జలసంధి వద్ద ఇతర దేశాల నౌకలకు అనుమతి నిరాకరిస్తూ భారత నౌకలకు మాత్రం అనుమతి ఇచ్చామని ఇండియాలోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ అన్నారు. దీనిబట్టే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో తెలుస్తోందని తెలిపారు. మార్షల్ ఐలాండ్స్ జెండా ఉన్న ఎల్పీజీ క్యారియర్ ఎంఠీ సర్వ్ శక్తి భారత సరుకు తీసుకుని మే 2న హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. మే 13న విశాఖపట్నానికి చేరే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 46,313 మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ తీసుకెళ్తున్న ఈ నౌకలో 20 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 18 మంది భారతీయులు ఉన్నారు. బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇలాహీ మాట్లాడుతూ.. భారత్-ఇరాన్ మధ్య శతాబ్దాల చరిత్ర, సంస్కృతి ఆధారంగా బంధం నిలిచిందని తెలిపారు. వివిధ రంగాల్లో దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. “భారత్ ఒక గొప్ప దేశం. మేము భారత ప్రజలను గౌరవిస్తాము. మాకు ఇరాన్తో 5,000 సంవత్సరాల సంబంధం, స్నేహం ఉంది. విద్య, తత్వశాస్త్రం, సంస్కృతి, నాగరికత, ఆర్థిక రంగాల ద్వారా ఇరాన్ భారత్తో అనుసంధానమై ఉంది. ఇరానీయులు భారతీయులను చాలా ఇష్టపడతారు. మన సంస్కృతి కూడా ఒకటే. మన ప్రవర్తన ఒకటే. మన ముఖాలు, ఆకృతులు కూడా ఒకటే” అని అన్నారు.“భారత్-ఇరాన్ మధ్య సంబంధం, స్నేహం చాలా బలంగా, లోతుగా ఉంది. ప్రస్తుతం భారత్తో మా సంబంధం, సహకారం చాలా బాగుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్తో మూడుసార్లు చర్చించారు. భారత్ విదేశాంగ మంత్రి కూడా ఇరాన్ విదేశాంగ మంత్రితో అనేక సార్లు చర్చలు జరిపారు. అనేక దేశాలకు అనుమతి లభించని సమయంలో ఇరాన్ భారత నౌకలు హార్మూజ్ జలసంధిని దాటేందుకు అనుమతించింది” అని ఆయన తెలిపారు.గత శతాబ్దాల్లో అనేకమంది ఇరానీయులు భారత్లో స్థిరపడ్డారని, ఇది సామాజిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలపరిచిందని చెప్పారు. భవిష్యత్ సంబంధాలపై ఆశాభావం వ్యక్తం చేస్తూ.. సత్సంబంధాలు మరింత బలపడతాయని అన్నారు. ఇరాన్ నాయకత్వం భారత్తో సన్నిహిత సంబంధాలను ప్రోత్సహించిందని, ద్వైపాక్షిక సహకారంలో అడ్డంకులను తొలగించేందుకు మద్దతు ఇచ్చిందని తెలిపారు.ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ.. దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ గతంలో పలుసార్లు భారత్తో బలమైన సంబంధాలను ప్రోత్సహించారని, అడ్డంకులు ఉండకూడదని అన్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సుప్రీం లీడర్ అయతొల్లా సయ్యద్ మొజ్తబా ఖమేనీ కూడా భారత్ను ఇష్టపడతారని, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, స్నేహపూర్వక సంబంధాలను మరింత బలపరచాలని భావిస్తున్నారని తెలిపారు. -
మేము సముద్రపు దొంగలమేమో .. ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. తాజాగా ఆయన అటువంటి వ్యాఖ్యలే చేశారు. "మేము సముద్రపు దొంగల లాంటి వాళ్లం" అని అమెరికాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల స్వాధీనం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో జరిగిన ఒక ర్యాలీ ట్రంప్ మాట్లాడారు. అందులో " మేము ... నౌకపైకి దూకి, దాన్ని మా ఆధీనంలోకి తీసుకున్నాము. సరుకును స్వాధీనం చేసుకున్నాం, చమురును తీసుకున్నాం. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం." అన్నారు. ట్రంప్ ఇలా వ్యాఖ్యానించిన తర్వాత ఆ సభలో ప్రజలు కేరింతలు కొడుతూ ఈలలు వేశారు. ఇటీవల ఇరాన్కు చెందిన నౌకలను అమెరికా దిగ్భందనం చేసింది ఈ నేపథ్యంలో ట్రంప్ ఇలా మాట్లాడారు.అయితే ఇరాన్ ఓడరేవుల వద్ద అమెరికా నౌకాదళం దిగ్బంధనం కొనసాగుతుంది. అమెరికా దళాలు 'మేజిస్టిక్ ఎక్స్' ఇరాన్-ఫ్లాగ్ కలిగిన 'టూస్కా' వంటి కార్గో నౌకలను స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై ఇరాన్ సైతం ఘాటుగానే స్పందించింది. "అంతర్జాతీయ జలాల్లో సాయుధ దోపిడీ" అని పేర్కొంటూ, వాషింగ్టన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, ఈ చర్య వాస్తవంగా సముద్రపు దొంగతనాన్ని సమర్థించడమేనని అన్నారు. దీనిని ఆయన "అంతర్జాతీయ జలాల్లో సముద్రపు దొంగతనం మరియు సాయుధ దోపిడీని ప్రత్యక్షంగా చట్టబద్ధం చేయడమే" అని అభివర్ణించారు. తాజాగా ట్రంప్ సైతం ఈ వ్యాఖ్యలకు కౌంటర్ తాము సముద్రపు దొంగలమేనన్నారు.అయితే కొద్దిసేపటి క్రితం ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ చర్యలు తనను సంతృప్తి పరచలేదని యుద్దాన్ని ముగించే ప్రసక్తే లేదన్నారు. -
ఒకప్పుడు బాంబులు మోత.. ఇప్పుడు మాత్రం..?
ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తోంది. దీంతో కాల్పుల మోతకు తాత్కాలిక తెర పడింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపుగా రెండునెలలలుగా కాల్పుల మోతతో దద్దరిల్లిపోయిన టెహ్రాన్ నగరం ఇప్పుడు ఏలా ఉందో ఆ యువతి వీడియో చూపించింది. ఈ వీడియో నెటిజన్స్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, మరియు అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో'ఎస్టెల్' అనే వినియోగదారు షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్గా మారింది. "ఏ డే ఇన్ టెహ్రాన్ డ్యూరింగ్ సీజ్ఫైర్" (టెహ్రాన్లో కాల్పుల విరమణ వేళ ఒక రోజు) పేరుతో ఉన్న ఈ వీడియో, టెహ్రాన్లోని సాధారణ ,ప్రశాంతమైన జీవనశైలిని ప్రపంచానికి చూపిస్తోంది. గతంలో క్షిపణులు నగరాన్ని తాకిన భయానక దృశ్యాలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉండటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.టెహ్రాన్ మెుత్తం కలియతిరుగుతూ...రాజధాని నగర వీధుల గుండా ప్రయాణిస్తూ ఎస్టెల్ తన కారులో ప్రధాన రహదారుల గుండా ప్రయాణిస్తూ నగరాన్ని చూపించారు. ఫుట్పాత్ మీద ఉన్న ఒక చిన్న విక్రేత వద్ద క్యాట్ ప్లషీని కొనడం, ఒక ఫుడ్ కోర్టులోకి వెళ్లి లంచ్ ఆర్డర్ చేయడం, ఇరానియన్ బిస్కెట్లు కొనడం వంటి దృశ్యాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఆమె ఒక స్టాల్లో కొరియన్ ఫుడ్ కూడా రుచి చూసింది.అదే విధంగదా సాయంత్రం సమయంలో, ఆమె ఒక విలాసవంతమైన హోటల్లోని లాంజ్కు వెళ్ళింది. అక్కడ ప్రజలు యుద్ధ భయం లేకుండా ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు.వైరల్గా వీడియోఅయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్ల వైరల్గా మారింది. నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, మీడియాలో చూపే దానికి, అక్కడ జరుగుతున్న దానికి చాలా తేడా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజల ఆతిథ్యాన్ని, నగర అందాలను ప్రశంసిస్తూ, యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటున్నారు. కాగా ప్రస్తుతం యుద్ధం విషయంలో నీలినీడలు కమ్ముకున్నాయి. యుద్ధం ముగింపుకు ఇరాన్ చేసిన కొత్త ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు.దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Estelle W (@estelleeats__) -
నో డీల్..నో క్లారిటీ : మా దళాలు సిద్ధం : ఇరాన్ సంచలన ప్రకటన
ఏప్రిల్ 7 నుంచి అమెరికా బలగాలు, ఇరాన్ మధ్య కాల్పులు జరగలేదని కాంగ్రెస్ నేతలకు శుక్రవారం(మే 1) రాసిన లేఖలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు ముగిసిందంటూ కాంగ్రెస్కు సమాచారం ఇచ్చి 60 రోజులు పూర్తయిన నేపథ్యంలో ట్రంప్ ఈ లేఖ రాశారు. అంతేకాదు యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం ఇప్పుడు తనకు లేదని పేర్కొన్నారు. అయితే దీనికి స్పందనగా ఇరాన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అమెరికా ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, దీనివల్ల ఇరు దేశాల మధ్య ఘర్షణలు మళ్లీ చెలరేగే అవకాశం ఉందని, తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించింది.ఖతం అల్-అన్బియాసెంట్రల్ హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్దార్ మహమ్మద్ జాఫర్ అసాదీ శనివారం మాట్లాడుతూ, వాషింగ్టన్ దౌత్యపరమైన అవగాహనలకు కట్టుబడి ఉండటం లేదని విమర్శించారు. అమెరికా అధికారుల చర్యలు, ప్రకటనలు ప్రధానంగా మీడియా ప్రేరేపితమైనవని విమర్శించారు. కేవలం చమురు ధరలు తగ్గకుండా చూడటానికి ,వారు సృష్టించిన గందరగోళం నుండి బయటపడటానికి మాత్రమే వారు ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏవైనా పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇరాన్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: షాకింగ్ : పక్కా ప్లాన్తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!భారీ నష్టంసిఎన్ఎన్ (CNN) పరిశోధనాత్మక నివేదిక ప్రకారం, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడుల వల్ల భారీ నష్టం వాటిల్లింది. కువైట్లోని క్యాంప్ బ్యూరింగ్ ప్రాంతంలోని అతిపెద్ద అమెరికా స్థావరాలలో ఒకటైన ఇక్కడ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దీనిలోని ప్రధాన భాగాలు ప్రస్తుతం పనిచేయడం లేదు.ఇదీ చదవండి: నటి ఎగ్ ఫ్రీజింగ్ ఇంజెక్షన్స్: రెండు రోజులు నరకంఎనిమిది దేశాల్లోని కనీసం 16 అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. పశ్చిమ ఆసియాలోని మెజారిటీ అమెరికా సైనిక స్థావరాలు ఈ దాడుల వల్ల ప్రభావితమయ్యాయని, కొన్ని చోట్ల సౌకర్యాలు పూర్తిగా ఉపయోగించలేని స్థితికి చేరుకున్నాయని నివేదిక పేర్కొంది.ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావంమరోవైపు, అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి.పారిశ్రామిక మార్గాల్లో అమెరికా కఠిన చర్యల వల్ల ఇరాన్ చమురు ఎగుమతులకు ఆటంకం కలిగింది. దీనివల్ల ఇరాన్ దాదాపు 4.8 బిలియన్ డాలర్ల చమురు ఆదాయాన్ని కోల్పోయిందని పెంటగాన్ అంచనా వేసినట్లు యాక్సియోస్ (Axios) నివేదించింది. కాగా అమెరికా, ఇరాన్ మధ్య దీర్ఘకాలిక ఒప్పందమేదీ ఇంతవరకూ కుదుర్చుకోలేదు. పాకిస్తాన్ ద్వారా తెహ్రాన్ కొత్త సందేశం పంపించిందని ఇరాన్ మీడియా చెబుతోంది. మరోవైపు మధ్యవర్తుల ద్వారా అమెరికాకు పంపిన ఒక అధికారిక ప్రతిపాదనలో కొత్త కాలపరిమితిని స్పష్టంగా పేర్కొన్నారని ఆ అధికారి తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రకారం, ఇజ్రాయెల్ మరియు అమెరికా మళ్లీ దాడి చేయవన్న హామీతో యుద్ధం ముగుస్తుంది. ఇరాన్ జలసంధిని తెరుస్తుంది ,అమెరికా ఇరాన్పై తన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది. -
ఇరాన్ నన్ను ఇరిటేట్ చేస్తోంది.. ట్రంప్
ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతిపాదనలతో తాను సంతృప్తిగా లేనని ప్రస్తుతానికి యుద్దం ముగించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. అయితే ఇరాన్ మాత్రం తమతో యుద్దం ముగింపుకై సంప్రదింపులు జరుపుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.ఇరాన్- అమెరికా యుద్ధం ప్రారంభమై దాదాపు 60 రోజులు గడుస్తోంది అయినప్పటీకీ చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. ఇరు దేశాలు చర్చల విషయంలో తగ్గడం లేదు. అమెరికా ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడం కుదరదు అనడం ఇరాన్ దానికి ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పడంతో చర్చలు సాగడం లేదు. అయితే తాజాగా ట్రంప్ ఈ విషయంలో మరోసారి స్పందించారు.ట్రంప్ మాట్లాడుతూ "వారు ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ నేను దానికి సిద్ధంగా లేను; నాకు దానితో తృప్తి లేదు, కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. వారు పురోగతి సాధించారు, కానీ వారు ఎప్పటికైనా గమ్యాన్ని చేరుకుంటారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. వారి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఇరాన్లో వారు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండటంలో తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు," అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.కాగా ఇరాన్తో యుద్ధం ప్రారంభమైననాటి నుంచి చట్టపరమైన అనుమతి కోరడానికి ట్రంప్ ప్రభుత్వానికి ఈ రోజు ( శనివారం)చివరి గడువు అయితే, ప్రస్తుత కాల్పుల విరమణ సమయంలో యుద్ధం ముగిసిపోయినందున దానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ కాంగ్రెస్కు తెలిపినట్లు సమాచారం. -
చైనా, రష్యా, కొరియాతో తలపడాల్సి వస్తే.. అమెరికా పరిస్థితి
-
ఐరన్ డోమ్ మాత్రమే కాదు.. ‘ఐరన్ బీమ్ లేజర్ సిస్టమ్’ సైతం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కు ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ వ్యవస్థను పంపిందన్న విషయం ఇటీవలే బయటకు వచ్చింది. అయితే, ఇరాన్తో ఘర్షణ సమయంలో కేవలం ఐరన్ డోమ్ను మాత్రమే కాదు.. ఇజ్రాయెల్ తన ఐరన్ బీమ్ లేజర్ ఆధారిత గగనతల రక్షణ వ్యవస్థ వెర్షన్ను కూడా పంపిందని తాజాగా ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులు, డ్రోన్ల భారీ దాడి నుంచి యూఏఈని కాపాడడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ చర్య తీసుకుంది. ఇజ్రాయెల్, యూఏఈ మధ్య రక్షణ సహకారం ఎంతగా పెరిగిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ.ఇజ్రాయెల్తో స్నేహ బంధం ఉంటే ఇలాంటి అధునాతన రక్షణ వ్యవస్థల సాయం, సాంకేతిక మద్దతు లభిస్తుందని ప్రాంతీయ అధికారి ఒకరు అన్నారు. ఇజ్రాయెల్ “స్పెక్ట్రో” అనే అధునాతన పర్యవేక్షణ వ్యవస్థను కూడా యూఏఈకు పంపింది. ఇది 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే డ్రోన్లను గుర్తించడంలో సాయపడుతోంది. యూఏఈకు ఇజ్రాయెల్ పంపిన దాడి, రక్షణ వ్యవస్థలు ఎక్కువగా ప్రోటోటైప్స్ కాగా, ఇవి ఇంకా ఇజ్రాయెల్ ఆయుధ వ్యవస్థల్లో పూర్తిగా సమన్వయం కాలేదు.ఐరన్ బీమ్ లేజర్ వ్యవస్థ అంటే?ఐరన్ బీమ్ లేజర్ రక్షణ వ్యవస్థ వెర్షన్ తక్కువ దూర రాకెట్లు, డ్రోన్లను ఆవిరి చేసి నాశనం చేస్తుంది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా ప్రయోగించిన ప్రాజెక్టైళ్లపై ఇజ్రాయెల్ మొదట దీనిని వినియోగించింది. ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థతో పాటు కొంతమంది ఇజ్రాయెల్ సైనిక సిబ్బందిని కూడా యూఏఈకు పంపించారు.ఇరాన్ ఇటీవల యూఏఈపై భారీగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఆయుధ వ్యవస్థలతో పాటు ఇజ్రాయెల్ స్పై సమాచారం కూడా పంచుకుంది. ఇరాన్లో తక్కువ దూర క్షిపణుల ప్రయోగ సన్నాహాలపై ముందస్తు సమాచారం ఇచ్చింది.యూఏఈ అనేక స్థాయుల గగనతల రక్షణ వ్యవస్థలను వినియోగించింది. ఇరాన్ నుంచి ఎదురైన దాడులను వాటి ద్వారా ఎదుర్కొంది. ఇజ్రాయెల్ అభివృద్ధి దశలో ఉన్న లేదా ఇంకా రాడార్ నెట్వర్క్తో పూర్తిగా సమకాలీకరించని ఆయుధాలను కూడా యూఏఈకు పంపింది. గతంలో అబ్రహాం ఒప్పందాల ద్వారా యూఏఈ సహా నాలుగు అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ సత్సంబంధాలు ఏర్పడ్డాయి.


