
దాడులు, ప్రతిదాడులతో ఇజ్రాయెల్-ఇరాన్ల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. పలువురు ఇరాన్ సైనిక సారథులు, అణు స్థావరాలు, సైనిక స్థావరాలు, అణు శాస్త్రవేత్తలు, సైనిక ముఖ్యలను సమాధి చేసిన ఇజ్రాయెల్.. ప్రళయ భీకరంగా విరుచుకుపడుతోంది. మరోవైపు, సైన్యాధికారులను కోల్పోయి.. స్థావరాలను కోల్పోయి ఆయుధపరంగా, శాస్త్రవేత్తలను కోల్పోయి విజ్ఞానపరంగా ఎంతో నష్టాన్ని చవిచూసిన ఇరాన్ కూడా ప్రతికార దాడులకు దిగుతోంది. వందల కోద్దీ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సిటీమీదకు ఎక్కుపెడుతోంది.
ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన కుమారుడి వివాహ వేడుకను వాయిదా వేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. నెతన్యాహు కుమారుడు అవ్నర్ నెతన్యాహు, అమిత్ యార్దేనీకి త్వరలోనే విహహం జరగనుంది. ఈ మెగా వేడుకను నిర్వహించేందుకు నెతన్యాహు కుటుంబం రెడీ అయ్యింది.
అయితే, పశ్చిమాసియాలో చోటు చేసుకున్న యుద్ధ పరిస్థితుల మధ్య నెతన్యాహు తన కుమారుడి పెళ్లి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా, గాజాపై ఇజ్రాయెల్ దాడుల సమయంలో కూడా నెతన్యాహు కుమారుడి పెళ్లి అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. ఆయన ఇంట పెళ్లి వేడుకలు నిర్వహిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి.