ఇస్లామాబాద్: పాకిస్తాన్ పరిపాలనలోని కశ్మీర్ (PoK)లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ పాకిస్తాన్ సైన్యంపై సంచలన ఆరోపణలు చేశారు. కాశ్మీరీల చేతుల్లో తుపాకులు పెట్టింది పాకిస్తాన్ సైన్యమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రావలకోట్లో జరిగిన భారీ నిరసన సభలో అమన్ ఖాన్ మాట్లాడుతూ.. కాశ్మీరీల చేతుల్లో తుపాకులు పెట్టింది పాకిస్తాన్ సైన్యమే. ఇప్పుడు అదే సైన్యం మమ్మల్ని ఉగ్రవాదులని పిలుస్తోంది. ఇది ప్రజలను మోసం చేసే ప్రయత్నం. అంతేకాకుండా, ఎన్నో సంవత్సరాలుగా కాశ్మీర్ ప్రజలను తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం, ఇప్పుడు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తున్న వారిపైనే ఉగ్రవాదుల ముద్ర వేస్తోందని ఆయన ఆరోపించారు.
కాగా, పీవోకేలో గత కొన్ని వారాలుగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అధిక ధరలు, నిరుద్యోగం, విద్యుత్ ఛార్జీల పెంపు, పరిపాలనా వైఫల్యాలు, రాజకీయ హక్కుల కొరత వంటి అంశాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రావలకోట్ సహా పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది నిరసనకారులు పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ, తమ ప్రాంతానికి మరింత స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని ప్రసంగాల్లో పాకిస్తాన్ పరిపాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అయితే, పీవోకేలో కొనసాగుతున్న ఈ పరిణామాలు అక్కడి రాజకీయ పరిస్థితులు, ప్రజా అసంతృప్తిపై మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
భారత్ వైఖరి..
భారత్ ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) భారతదేశంలో అంతర్భాగమే అనే అధికారిక వైఖరిని కొనసాగిస్తోంది. మరోవైపు, పాకిస్తాన్ మాత్రం ఈ ప్రాంతంపై తన పరిపాలనా హక్కును సమర్థిస్తోంది. కాశ్మీర్ అంశంపై ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి.


