సాక్షి, సికింద్రాబాద్: మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమంలో భాగంగా భవిష్యవాణిలో స్వర్ణలత కీలక వ్యాఖ్యలు చేశారు. వర్షాలకు ప్రజలు కొట్టుకుపోతారు.. అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ప్రజల తీరుపై అమ్మవారు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. నా పాదాల కింద నలిపేస్తా అంటూ వ్యాఖ్యలు చేశారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం భక్తుల మధ్య ఘనంగా జరిగింది. భవిష్యవాణి వినేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మాతంగి స్వర్ణలత రంగంలోకి వచ్చి అమ్మవారి తరఫున భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ.. ప్రజల తీరుపై అమ్మవారు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఏ ప్రమాదాలు వచ్చినా నేను కాపాడుతున్నా.. కానీ మీరు నా మాట వినడం లేదు. వావివరుసలు లేకుండా ఘోరాలు జరుగుతున్నాయని, అలాంటి వారిని వదిలిపెట్టనని పేర్కొన్నారు. అలాంటి వారిని తన పాదాల కింద నలిపేస్తానని అన్నారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు, అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలకు ప్రజలు కొట్టుకుపోతారు.. అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించారు. ప్రజలు కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారని, వారి ప్రవర్తన తనకు సంతోషం కలిగించడం లేదని అన్నారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేస్తామని ఇచ్చిన మాటను కొందరు నిలబెట్టుకోలేదని స్వర్ణలత ప్రస్తావించారు. “మీ ప్రశ్నలకు నేనెందుకు సమాధానం చెప్పాలి.. నేను మిమ్మల్ని కాపాడుతున్నా.. మీరు నా మాట వినడం లేదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులు పిల్లలను విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. నన్ను కంట తడి పెట్టిస్తున్నారు. నన్ను గోరంతా కూడా సంతోష పరచలేదు. నా విగ్రహ ప్రతిష్ట చేస్తే కోరింది బంగారం అవుతుంది. ఆరు నెలలలో నా విగ్రహ ప్రతిష్ట చేయకుంటే.. నా పాదాల కింద నలిపేస్తా’ అని అన్నారు. దీంతో, ఏడాదిలో విగ్రహ ప్రతిష్ట చేస్తామని ఆలయ అర్చకులు తెలిపారు.


