సహర్సా: బిహార్లోని సహర్సా జిల్లా సిమ్రి బక్తియార్పూర్ రైల్వే స్టేషన్లో సోమవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. సమస్తిపూర్ నుంచి సహర్సా వెళ్తున్న ప్యాసింజర్ రైలు (నెం. 63344) ఇంజిన్తో పాటు దాని పక్కనే ఉన్న ఒక బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సంభవించిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.
#WATCH | Saharsa, Bihar: A fire broke out in the engine of a rail and an adjoining coach of passenger train No. 63344 (Samastipur–Saharsa) at Simri Bakhtiyarpur railway station in Bihar's Saharsa district around 3 AM. Passengers were evacuated safely, and no casualties have been… pic.twitter.com/NxMpJlIbie
— ANI (@ANI) August 3, 2026
సమాచారం అందుకున్న వెంటనే సహర్సా ఫైర్ స్టేషన్ నుంచి అగ్నిమాపక సిబ్బంది రెండు వాటర్, ఫోమ్ ట్యాకర్లతో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ కుమార్ వెల్లడించారు. రైలు ఇంజిన్ అకస్మాత్తుగా మంటలకు గురికావడానికి కారణం ఏమిటనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.
అర్ధరాత్రి వేళ రైలులో మంటలు చెలరేగడంతో తాము తీవ్ర భయాందోళనలకు గురయ్యామని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. రైలు నిలిచిపోవడంతో స్టేషన్లో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, గత మే నెలలో కూడా బీహార్లోని మధుబని రైల్వే స్టేషన్లో జయనగర్-ఉధ్నా అంత్యోదయ ఎక్స్ప్రెస్ ఖాళీ బోగీలలో ఇలాంటి ఘటనే జరిగింది. ప్లాట్ఫామ్ నంబర్ 3పై షంటింగ్ ఆపరేషన్లు జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగడంతో ఒక బోగీ పూర్తిగా దగ్ధమైంది.
ఇది కూడా చదవండి: ‘రేపటి గాలి రేపు వీస్తుంది’.. జపనీస్ రహస్యం!


