న్యూఢిల్లీ: నేపాల్లో ఇటీవల జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో బిహార్లోని మధుబనీ జిల్లా వద్ద భారత్-నేపాల్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోషి ప్రావిన్స్లోని సున్సారీ జిల్లాలో గత వారాంతంలో రెండు మత వర్గాల వేడుకల సందర్భంగా లౌడ్స్పీకర్ల వినియోగంపై వివాదం చెలరేగి ఘర్షణలకు దారితీసింది.
ఈ ఘటన తర్వాత నేపాల్లోని పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడి అధికారులు కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు అమలు చేస్తూ అదనపు భద్రతా బలగాలను మోహరించారు.
జులై 26న జరిగిన ఘర్షణలు, పోలీసుల కాల్పుల్లో దాదాపు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. భారత్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న మధేశ్ ప్రావిన్స్లోని సప్తరీ జిల్లా కొన్ని ప్రాంతాల్లో జూలై 31న నేపాల్ అధికారులు నిరవధిక కర్ఫ్యూ విధించారు.
ముందుజాగ్రత్త చర్యగా బిహార్లోని మధుబనీ జిల్లా పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు భద్రతను మరింత పెంచారు. ప్రధాన రహదారులు, ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల తనిఖీలు, గాలింపు చర్యలు చేపడుతున్నారు. సరిహద్దు పోలీస్ స్టేషన్ల వద్ద అదనపు బలగాలను కూడా మోహరించారు.
ప్రజలు పుకార్లను నమ్మవద్దని, అధికారుల ఆదేశాలను పాటించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.


