బయో సిమిలర్స్పై ఫార్మా దిగ్గజాల ఫోకస్
అమెరికా జనరిక్స్పై ఆధారపడడాన్ని తగ్గిస్తున్న సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, లుపిన్
బ్రెజిల్, ఆఫ్రికా, చైనా మార్కెట్లలోకి విస్తరణ
దేశీ ఫార్మా రంగానికి కొత్త ఊపు
భారత ఔషధ పరిశ్రమలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు తక్కువ ధరల జనరిక్ మందులతో ప్రపంచమార్కెట్లో ఆధిపత్యం చాటిన భారత ఫార్మా కంపెనీలు ఇప్పుడు అధిక విలువ కలిగిన స్పెషాలిటీ డ్రగ్స్, బయోసిమిలర్స్, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స మందులు, ఇతర బ్రాండెడ్ వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నాయి. అమెరికా జనరిక్స్ మార్కెట్లో ధరల పోటీ, మార్జిన్ల తగ్గుదలతో కంపెనీలు వ్యూహాలను మార్చుకుంటున్నాయి.
దేశంలోనే అతి పెద్ద ఫార్మా సంస్థలైన సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యా»ొరేటరీస్, సిప్లా, లుపిన్ కంపెనీ ప్రతినిధుల వ్యాఖ్యలు ఫార్మా రంగంలో వస్తున్న ఈ మార్పును తెలియజేస్తున్నాయి. సంప్రదాయ జనరిక్స్ బదులుగా లాభాలు అందించే ప్రత్యేక ఉత్పత్తులు, కొత్త మార్కెట్లు, వినూత్న చికిత్సలపై కంపెనీలు దృష్టి పెట్టాయి. ఈ మార్పులో సన్ ఫార్మా ఇతర కంపెనీలకన్నా ముందంజలో ఉంది.
కంపెనీ గ్లోబల్ ఇన్నొవేటివ్ మెడిసిన్స్ వ్యాపారం 2025–26 ఆర్ధిక సంవత్సరంలో 1.4 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. ప్రస్తుతం మొత్తం ఆదాయంలో 22 శాతానికిపైగా స్పెషాలిటీ మందుల నుంచి వస్తోంది. రుమేనియా, బ్రెజిల్, చైనా మార్కెట్లలో ఇలుమ్యా వంటి వినూత్న ఔషధాలు మంచి వృద్ధిని నమోదు చేస్తున్నాయని కంపెనీ తెలిపింది. డాక్టర్ రెడ్డీస్ కూడా బయోసిమిలర్స్, స్పెషాలిటీ డ్రగ్స్, ఇంకా అనేక విభిన్న ఉత్పత్తులపై దృష్టి సారిస్తోంది. ఉత్పత్తి సంబంధిత సవాళ్లు ఉన్నప్పటికీ 2025–26లో కంపెనీ చరిత్రలోనే అత్యధిక వార్షిక ఆదాయాన్ని రెడ్డీస్ నమోదు చేసింది.
ప్రాథమిక వ్యాపారం రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ సీఎఫ్ఓ ఎం.వి. నరసింహం తెలిపారు. మరోవైపు సిప్లా తన ఆఫ్రికా వ్యాపారం, శ్వాసకోశ చికిత్సలు, బ్రాండెడ్ ప్రి్రస్కిప్షన్ ఔషధాల ద్వారా బలమైన వృద్ధిని సాధిస్తోంది. కంపెనీ ఎమర్జింగ్ మార్కెట్లు, యూరప్ వ్యాపారం 400 మిలియన్ డాలర్లకు పైగా నమోదు చేసింది. బయోసిమిలర్స్ను భవిష్యత్తులో భారీ అవకాశాలున్న విభాగంగా కంపెనీ భావిస్తోంది. లుపిన్ కూడా అమెరికా వెలుపల మార్కెట్లు, బ్రెజిల్ వంటి దేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కంపెనీ బ్రెజిల్ వ్యాపారం స్థానిక కరెన్సీలో 113 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ప్రస్తుతం 60కి పైగా ఇంజెక్టబుల్స్, శ్వాసకోశ ఉత్పత్తుల అభివృద్ధి పనులు కొనసాగుతుండగా వచ్చే ఏడాదిలోగా అమెరికా మార్కెట్లో తొలి బయో సిమిలర్ ఉత్పత్తులను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫార్మాలో మార్పులు ఇలా కొనసాగుతుండగా దేశీయ ఔషధ మార్కెట్ కూడా బలపడుతోంది.
ఈక్విరస్ సెక్యూరిటీస్ విశ్లేషణ ప్రకారం 2026 మే నాటికి భారత ఫార్మా మార్కెట్ 10.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇందులో 3.2 శాతం నేరుగా జరిగిన అమ్మకాల నుంచే రావడం గమనార్హం. ఇది నిజమైన వినియోగ డిమాండ్ను సూచిస్తోందని ఈక్విరస్ తెలిపింది. భారత ఫార్మారంగం జనరిక్స్ తయారీ కేంద్రం అనే గుర్తింపును దాటి పరిశోధన ఆధారిత అధిక విలువ కలిగిన ప్రపంచస్థాయి ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా ఎదిగే దిశగా ప్రయాణంప్రారంభించింది. వచ్చే రోజుల్లో స్పెషాలిటీ డ్రగ్స్, బయోసిమిలర్స్, కొత్త మార్కెట్లే భారత ఫార్మా వృద్ధికి ప్రధాన ఇంధనంగా మారనున్నాయి.
స్పెషాలిటీ మందులు అంటే?
సాధారణ జ్వరం, దగ్గు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు మందులు అన్ని మెడికల్ షాపుల్లో సులభంగా లభిస్తాయి. వీటి తయారీ కూడా సులభం, అలా కాకుండా క్యాన్సర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మలి్టపుల్ స్లెరోసిస్, సోరియాసిస్, హెపటైటిస్, హెచ్ఐవీ వంటి క్లిష్టమైన దీర్ఘకాలిక వ్యాధుల కోసం తయారుచేసే అత్యాధునిక అధిక ధర ఔషధాలు. వీటి తయారీ, పరిశోధనకి చాలా ఖర్చు అవుతుంది. ఇవి ప్రత్యేక ఆసుపత్రులు, ఫార్మసీల ద్వారానే లభిస్తాయి. సాధారణ మందులతో పోలిస్తే ధరలు ఎక్కువ. చాలావరకు ఇంజెక్షన్, ఇన్ఫ్యూషన్ రూపంలో ఇస్తారు. వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఈ మందుల అమ్మకాలపై లాభాల మార్జిన్ ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వేగంగా పెరుగుతోంది. జనరిక్స్ మార్కెట్లో పోటీ పెరగడంతో ఫార్మా కంపెనీలకు స్పెషాలిటీ డ్రగ్స్ ప్రత్యామ్నాయ ఆదాయ వనరులుగా మారుతున్నాయి. పేటెంట్ ఆధారిత ఉత్పత్తులు కావడంతో పోటీ కూడా తక్కువగా ఉంటుంది.
– సాక్షి, బిజినెస్డెస్క్


