Karimnagar
-
మంత్రిగా బండికి ఏడాది
● జూన్ 9న ప్రమాణస్వీకారం చేసిన సంజయ్ ● సంబరాలకు సిద్ధమవుతున్న కమలనాథులు ● ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేసిన ఎంపీ ఆఫీస్సాక్షిప్రతినిధి,కరీంనగర్: కేంద్ర సహాయమంత్రిగా బండి సంజయ్ ఏడాది పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా బీజేపీ నాయకులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాదికాలంలో బండి సంజయ్ చేసిన పనులు, చూపిన చొరవను వివరిస్తూ పార్టీ జిల్లా నాయకులు ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేశా రు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా బండి సంజయ్ విజయం సాధించారు. జూన్ 9న ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్లో కేంద్ర సహా యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిగా ఏడాది పూర్తికానుండడంతో అభిమానులు, పార్టీ నాయకులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. అభివృద్ధి పనులపై దృష్టి జాతీయ ఉపాధిహామీ పథకం కింద ప్రతీ మండలానికి రూ.2కోట్లు ఖర్చు చేసి ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో రోడ్లు నిర్మించారు. సగటున ఒక్కో గ్రామానికి రూ.5లక్షలు అంతర్గత రోడ్లకు వెచ్చించారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా కరీంనగర్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.33కోట్లకుపైగా ఖర్చు చేశారు. పెండింగ్లో ఉన్న కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు రూ.2వేల కోట్లతో మరో రెండు వారాల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. రైల్వేపై ప్రత్యేక శ్రద్ధ ఇటీవల కరీంనగర్ రైల్వేస్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటితోపాటు కరీంనగర్, జమ్మికుంట ఆర్వోబీ నిర్మాణంలో జాప్యమవుతున్న విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారులతో సమావేశమై వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆగస్టు నాటికి జమ్మికుంట ఆర్వోబీ పనులు పూర్తికాకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే. కరీంనగర్–తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణంలో ఇబ్బందులను అధిగమించేందుకు రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి.. పనుల వేగవంతం చేయించడంలో సఫలీకృతులయ్యారు. వారానికోసారి నడిచే కరీంనగర్–తిరుపతి రైలును వారానికి రెండుసార్లు నడిచేలా కృషి చేశారు. అదే రైలును ఇకపై వారానికి 4 సార్లు నడిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈమేరకు రైల్వేశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. మరిన్ని పనులివే.. ● సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు బండి సంజయ్ వినతికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. ● సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో నవోదయ స్కూళ్ల మంజూరులో చొరవచూపారు. ● వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను టూరిజం సర్క్యూట్గా మార్చాలన్న ప్రతిపాదలపై త్వరలోనే కేంద్రం ప్రకటన చేయనుంది. ● శాతవాహన వర్సిటీ పరిధిలో లా కళాశాల మంజూరుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ను కలిసి మంజూరు చేయించారు. ● అంబేడ్కర్ స్టేడియంలో సింథటిక్ పార్క్, స్పోర్ట్స్ రీక్రియేషన్ సౌకర్యాలు కల్పించాలన్న ప్రతిపాదనకు కేంద్ర క్రీడాశాఖ సుముఖత వ్యక్తం చేసింది. పెండింగ్లో ఉంటున్న కరీంనగర్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు బండి సంజయ్ కృషి మరువలేనిది. ● కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రూ.5కోట్ల సీఎస్సార్ నిధులను రాబట్టారు. వాటితో వేములవాడ, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యాధునిక వైద్య పరికరాలను అందించారు. ● ఈ ఏడాది 10వ తరగతి చదివే 6 వేల మంది బాలికలకు ప్రత్యేకంగా సైకిళ్లను అందించేందుకు ఆర్డర్ ఇచ్చారు. వీటిని త్వరలోనే విద్యార్థులకు అందజేయనున్నట్లు మంత్రి కార్యాలయం వెల్లడించింది. ● ఈ ఏడాది మార్చిలో థాయిలాండ్ లో సైబర్ కేఫ్ లో చిక్కుకున్న 540 మంది భారతీయులను సాక్షి కథనాలతో స్పందించిన బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకుని కాపాడారు. రెండు ప్రత్యేక విమానాల్లో వారిని ఇండియాకు తరలించారు. -
ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన
జగిత్యాలక్రైం: రోడ్డు ప్రమాదం కేసును మల్యాల సీఐ నీరుగార్చుతున్నారని, వాహనదారునికి వత్తాసు పలుకుతున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు మంగళవారం జగిత్యాల ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాలు.. మల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన అల్లెపు నరేశ్ ఏప్రిల్ 28న రాజారం వద్ద లారీ ఢీకొని మృతిచెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి లారీని స్టేషన్కు తరలించారు.లారీకి ఇన్సూరెన్స్ ఉందని, పరిహారం వస్తుందని మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. దీంతో చివరికి లారీని వదిలిపెట్టి ప్రస్తుతం లారీకి ఇన్సూరెన్స్ లేదని మల్యాల సీఐ కేసును నీరుగార్చుతున్నారని, తమను నిత్యం పోలీస్స్టేషన్కు రమ్మని రోజుకో కారణం చెబుతూ అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. దీంతో నరేశ్ తండ్రి అల్లెపు బాలయ్య, తల్లి శారదతో పాటు పలువురు బంధువులు ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. -
నేటి నుంచి పలు రైళ్లు రద్దు
రామగుండం: కాజీపేట–బల్హర్షా సెక్షన్లోని పలు రైల్వేస్టేషన్ల పరిధిలో ఇంటర్ లాకింగ్ సిస్టం పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు పలు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ డీఆర్యూసీసీ మాజీ ప్రతినిధి క్యాతం వెంకటరమణ తెలిపారు. రద్దయిన రైళ్లు ● రైలు నంబరు : 67771/67772 : సిర్పూర్ – కరీంనగర్ : ఈనెల 20వ తేదీ వరకు ● రైలు నంబరు : 67773/67774 : కరీంనగర్–బోధన్ : ఈనెల 20 వరకు ● రైలు నంబరు : 17003/17004 : కాజీపేట–సిర్పూర్ కాగజ్నగర్–బల్హర్షా : ఈనెల 20 వరకు ● రైలు నంబరు : 17035/17036 : కాజీపేట–బల్హర్షా : ఈనెల 20 వరకు ● రైలు నంబరు : 12757/12758 : సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ : ఈనెల 20 వరకు ● రైలు నంబరు : 12511 : గోరఖ్పూర్–రఫ్తిసాగర్ : ఈనెల 5, 6, 8, 12, 13, 15, 19 తేదీల్లో ● రైలు నంబరు : 12512 : రఫ్తిసాగర్–గోరఖ్పూర్ : 4, 8, 10, 11, 15, 17, 18 తేదీల్లో రద్దు ● రైలు నంబరు : 12521 : భరౌణీ–ఎర్నాకులం : ఈనెల 9వ తేదీన రద్దు ● రైలు నంబరు : 12522 : ఎర్నాకులం–భరౌణి : ఈనెల 6, 13వ తేదీల్లో రద్దు ● రైలు నంబరు : 12591 : గోరఖ్పూర్–యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలు ఈనెల 7, 14వ తేదీలలో రద్దు చేశారు. ● రైలు నంబరు : 12592 : యశ్వంత్పూర్–గోరఖ్పూర్ : ఈనెల 9, 16వ తేదీల్లో రద్దు -
కాలగర్భంలో రామగుండం బీ–థర్మల్
రామగుండం: పట్టణంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యంగల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ (ఆర్టీఎస్–బీ) కాలగర్భంలో కలిసి పోయి బుధవరాం నాటికి ఏడాది పూర్తవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే తొలివిద్యుత్ కేంద్రంగా పేరు గాంచిన ఆర్టీపీఎస్.. సుమారు ఆరు దశాబ్దాలపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగులు పంచింది. ఈక్రమంలోనే విద్యుత్ ఉత్పత్తి, పీఎల్ఎఫ్లో అనేక సరికొత్త రికార్డులు నెలకొల్పింది. స్థానికంగా బొగ్గు, నీరు, రవాణా వ్యవస్థకు అనువైన పరిస్థితులు ఉండడంతో రామగుండం ప్రాంతం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నిలయంగా మారింది. దీంతో దేశంలోనే ఆధునిక విద్యుత్ కేంద్రాలతో పోటీ పడుతూ, అతి తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి చేసిన ఘనత బి–థర్మల్ కేంద్రానికే దక్కింది. రూ.14.8 కోట్ల వ్యయంతో 1965 జూలై 19న విద్యుత్ కేంద్రం స్థాపనకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 10, 2007 నుంచి నిరాటకంగా 159 రోజులపాటు విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు సాధించింది. దానిని తిరగరాస్తూ 20 ఫిబ్రవరి 2017 తర్వాత ఒకరోజు ఎక్కువగా 160 రోజులు సాధించి రికార్డులు బద్ధలు కొట్టింది. 159 రోజుల్లో 92.64 పీఎల్ఎఫ్తో 221.74 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సైతం ఆధునిక విద్యుత్ కేంద్రాలతో పోటీపడుతూ ఉత్పత్తి, పీఎల్ఎఫ్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించింది. విద్యుత్ కేంద్రం మూతపడి నేటితో ఏడాది -
పోలీసులంటే గౌరవం ఉండాలి
హుజూరాబాద్: ప్రజలకు పోలీసులంటే గౌరవం ఉండాలే తప్ప భయం కాదని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఇన్చార్జి తిప్పారపు సంపత్ అన్నారు. ఇటీవల ఎస్సై భార్గవ్ దళిత యువకుడు మహేందర్ను తీవ్రంగా కొట్టిన వీడియోలను మీడియాకు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సై భార్గవ్ ప్రవర్తన ఒక నియంతలా ఉందన్నారు. దళితుడిని అసభ్య పదజాలతో దూషిస్తూ కొట్టడం ఏంటన్నారు. ఈ ఘటనపై పలుసార్లు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించని కానిస్టేబుళ్లు ఆకాష్ రెడ్డి, రవి కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సైక్లింగ్తో ఆరోగ్యవంతమైన సమాజంమల్లాపూర్(కోరుట్ల): రోజూ సైక్లింగ్ చేయడంతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, సైక్లింగ్ క్లబ్ ఫౌండర్ వాల్గొట్ కిషన్ అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి సైక్లింగ్తో మల్లాపూర్ మండలం మొగిలిపేటకు చేరుకుని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సైక్లింగ్తో షుగర్, రక్తపోటు, ఊబకాయాన్ని నివారించవచ్చన్నారు. ‘సైకిల్ తొక్కండి.. ఆరోగ్యంగా ఉండండి’ అనే నినాదంతో ప్రజలందరూ నిత్యం సైక్లింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో గోల్కోండ రమేశ్, ఏలేటి ప్రీతంరెడ్డి, గంధం రఘు తదితరులు పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
హుజూరాబాద్: హుజురాబాద్ మండలంలోని సింగాపూర్ గ్రామ శివారులో కరీంనగర్ – వరంగల్ రహదారిపై మంగళవారం ఆయిల్ ట్యాంకర్ ట్రాలీ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటో ట్రాలీ బోల్తాపడడంతో రోడ్డుపై సిలిండర్లు చెల్లాచెదురగా పడిపోయాయి. కాగా కొన్ని సిలిండర్ల నుంచి గ్యాస్ లీకై ంది. అయినా అవి పేలకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. కాగా ట్యాంకర్ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్రకు ప్రత్యేక బస్సుహుజూరాబాద్: అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్రకు హుజూరాబాద్ ఆర్టీసీ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం ఈ నెల 9 నుంచి ఉంటుదని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మంగళవారం తెలిపారు. ఈనెల 9న మధ్యాహ్నం 2గంటలకు స్థానిక బస్స్టేషన్ నుంచి బస్సు బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం, మరుసటి రోజు 10న రాత్రి వరకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. 11న అరుణాచల గిరి ప్రదక్షిణ అనంతరం తిరిగి సాయంత్రం 4 గంటలకు అరుణాచలంలో బయలుదేరి 12న హుజూరాబాద్కి బస్ చేరుకుంటుందని డీఎం రవీంద్రనాథ్ వివరించారు. సూపర్ లగ్జరీ బస్ చార్జి పెద్దలకు రూ.4,500, పిల్లలకు రూ.3,800 ఉంటుందని, అడ్వాన్స్ బుకింగ్ కోసం 99592 25924, 97048 33971, 92471 59535, 94414 04841 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కుడా ఉందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఏసీబీ వలలో ఇన్చార్జి తహసీల్దార్
● భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.15 వేల బేరం ● రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ ● ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తితో లంచం రాయికల్(జగిత్యాల): భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.15 వేల లంచం బేరం కుదుర్చుకుని రూ.10 వేల డబ్బులను రాయికల్ ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్, ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్ మధ్యవర్తితో తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీఎస్పీ విజయ్కుమార్ వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం సింగరావుపేట గ్రామానికి చెందిన గాజర్ల రవి తన 1.025 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం వారం క్రితం ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్ను సంప్రదించగా రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. మధ్యవర్తిగా ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్ సంప్రదింపులతో బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయమై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా పక్కా ప్రణాళికతో మంగళవారం తహసీల్ కార్యాలయంలో రూ.10 వేలు మధ్యవర్తి ముజాఫర్ ద్వారా ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్, ముజాఫర్ను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో ఇన్స్పెక్టర్లు తిరుపతి, కిరణ్రెడ్డి పాల్గొన్నారు. -
యోగా నేర్చుకున్నా
శిక్షణ శిబిరంలో నేను యోగా నేర్చుకున్నా. మంచి భోజనం, వసతితోపాటు దుస్తులు కూడా అందించారు. అన్నిసౌకర్యాలు కల్పించారు. అనేక డబ్బులు ఖర్చుపెట్టినా కూడా లభించని అవకాశం మాకు ఎన్టీపీసీ కల్పించింది. భవిష్యత్లో మంచిగా చదువుకుంటా. – కసీఫానాజ్, కమాన్పూర్ కంప్యూటర్ నేర్చుకుంటున్న వేసవి శిక్షణ శిబిరంలో నేను కంప్యూటర్ నేర్చుకున్న. నాకు డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎన్టీపీసీ వేసవి శిబిరం ఏర్పాటు చేసి ఇలా నెలరోజుల పాటు ఇస్తున్న శిక్షణలో నేను పూర్తిస్థాయిలో కంప్యూటర్ నేర్చుకుని ఉత్తమ సాంకేతిక విద్య పొందుతా. – ఐశ్వర్య, పవర్హౌస్కాలనీ, గోదావరిఖని బాలికలకు ఉపయోగం ఎన్టీపీసీ సామాజిక సేవా బాధ్యతా పథకం(సీఎస్సార్) సహకారంతో బాలికా సాధికారత మిషన్–2025 విజయవంతంగా పూర్తిచేశాం. 120 మంది బాలికలకు ప్రత్యేక ప్రణాళిక ప్రకారం శిక్షణ ఇస్తున్నాం. చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంతోపాటు ఆసక్తి ఉన్న అంశాలపై శిక్షణ అందిస్తున్నాం. – రాఖీ సామంత, అధ్యక్షురాలు, దీప్తి మహిళా సమితి, ఎన్టీపీసీ -
భూభారతితో సమస్యలు పరిష్కారం
కరీంనగర్రూరల్/కొత్తపల్లి: కొత్త రెవెన్యూచట్టం భూభారతి ద్వారా భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కరీంనగర్ మండలం దుర్శేడ్, కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను కలెక్టర్ పరిశీలించారు. అర్జీల వివరాలు రిజిష్టర్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న సైదాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు విజయవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. భూ సమస్యలకు శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, కరీంనగర్, కొత్తపల్లి తహసీల్దార్లు ఎన్.రాజేశ్, ఆర్.వెంకటలక్ష్మి, డెప్యూటీ తహసీల్దార్ వైశాలి, ఆర్ఐలు వాస్తవిక్గౌడ్, కనకరాజు, స్థానిక నాయకులు సుంకిశాల సంపత్రావు, తోట తిరుపతి, మంద రాజమల్లు, ఊరడి మల్లారెడ్డి, బుర్ర హరీశ్గౌడ్, గాజుల అంజయ్య, కె.వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. ఆర్జీల వివరాలు రిజిష్ట్టర్లో నమోదు చేయాలి కలెక్టర్ పమేలా సత్పతి -
జమ్మికుంటకు దోస్త్ హెల్ప్లైన్ సెంటర్
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు దోస్త్ హెల్ప్లైన్ సెంటర్ మంజూరు కావడంపై ప్రిన్సిపాల్ డా. రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్ జాయింట్ డైరెక్టర్లు డా.రాజేంద్రసింగ్, డా.బాలభాస్కర్కు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. డిగ్రీ అడ్మిషన్ల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేటప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తితే దోస్త్ హెల్ప్ లైన్ ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు. గతంలో దరఖాస్తుదారులకు సమస్యలు తలెత్తినప్పుడు కరీంనగర్, హనుమకొండ వెళ్లాల్సి ఉండేదని, ప్రస్తుతం దోస్త్ సెంటర్ మంజూరుతో ఈ ప్రాంత విద్యార్థులకు సౌకర్యాంగా ఉంటుందన్నారు. సమస్యల పరిష్కారం కోసం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల దోస్త్ కో ఆర్డినేటర్ ఎల్.రవీందర్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీకాంత్ను 94911 14511, 99494 94549, 98496 89956 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
చిట్టీల రాయుళ్లు!
శాతవాహన వర్సిటీలో భారీగా చూచిరాతలు ● డిగ్రీలో డిబార్ అవుతున్న వారిలో కరోనా టైంలో ‘పది’ పాసైన వారే ఎక్కువ ● మొదటి నుంచి ఆరో సెమిస్టర్ వరకు ఇదే తీరు ● పర్యవేక్షణ పెరగడంతో భారీగా పట్టుబడుతున్న విద్యార్థులు ● సోషల్ మీడియా వ్యసనం, చదవలేక పోవ డంతో అడ్డదారులు ● డిబార్ అయిన విద్యార్థికి మద్దతుగా ఉత్తరాది మంత్రి ఫోన్!సాక్షిప్రతినిధి,కరీంనగర్: కుదురుగా పది నిమిషాలు కూర్చుని పరీక్ష రాయలేరు. పరీక్ష మొదలవగానే.. జేబులో దాచిన మైక్రో జిరాక్స్లు తీయడం, కాపీ చేయడం.. ఇదీ.. శాతవాహన వర్సిటీలో డిగ్రీ విద్యార్థుల తీరు. వాస్తవానికి మునుపెన్నడూ లేని స్థాయిలో విద్యార్థులు చిట్టీలు కొడుతూ పట్టుబడి డిబార్ అవుతున్నారు. గతవారంలో ఒకేరోజు 35 మంది డిబార్ అవడం వర్సిటీ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం. వాస్తవానికి విద్యార్థులు ఇలా చిట్టీలు రాయడం ఆందోళన కలిగిస్తోంది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్న ఆశయంతో యూనివర్సిటీ అధికారులు ఈసారి సిబ్బందిని పెంచి ఆకస్మిక తనిఖీలు చేయిస్తుండటంతో భారీగా చిట్టీల రాయుళ్లు పట్టుబడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా విద్యార్థులు డిబార్ కావడంపై వర్సిటీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. జూన్ 2 వరకు వర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు రాస్తున్న 171 మంది డిబార్ అయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా సమయంలోని వారేనా? ఈ విషయంపై ఆరా తీసినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వాస్తవానికి ఇప్పుడు డిబార్ అవుతున్న విద్యార్థులంతా కరోనా విపత్తు సమయంలో 10వ తరగతి పాస్ అయినవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. 2020 మార్చిలో ఆకస్మికంగా కరోనా విపత్తు ప్రపంచాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు నిర్వహించలేకపోయింది. ఫలితంగా ఎలాంటి పరీక్షలు లేకుండా విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత 2021లోనూ పరీక్షలు లేకుండా పది పాసయ్యారు. 2022లో మాత్రం పది పరీక్షలు నిర్వహించినా.. గతంలో ఉన్న 11 పేపర్లను ఆరుకు కుదించి తేలిగ్గా ప్రశ్నలు ఇచ్చారు. 2023లో పది పరీక్షరాసిన పిల్లలు కాస్త నయంగానీ, 2020, 2021లో అసలు పరీక్షలు లేకుండా పాసైన విద్యార్థుల ప్రతిభాపాటవాలపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియా మరో కారణం 2020, 2021లో పది పాసైన వారి ప్రతిభాపాటవాలపై ఇప్పుడు ప్రొఫెసర్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. డిబార్ అవుతున్న వారిలో అధికంగా వారే ఉండటం, వారంతా సోషల్ మీడియా ప్రభావంతో కాపీయింగ్ పాల్పడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. సులువుగా పరీక్షలు పాసవడానికి అలవాటు పడినవారు, ఆ కోణంలో వెళ్తున్నారని అంటున్నారు. కాపీ కొడితే పట్టుబడ్డారంటూ సోషల్మీడియా రీల్స్ చూసి వీరు కూడా పాటించి దొరికిపోతున్నారని పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ ప్రొఫెసర్ తెలిపారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. డిబార్ అయిన విద్యార్థులంతా రాజకీయ నాయకులతో వారిని వదిలేయాలంటూ వర్సిటీ అధికారులపై ఒత్తిడి చేయిస్తున్నారు. వారిలో ఓ విద్యార్థిని వదిలేయాలంటూ ఉత్తరాదికి చెందిన ఓ పెద్ద మంత్రి ఏకంగా వర్సిటీకి ఫోన్ చేయడంతో విస్తుపోవడం అధికారుల వంతైంది.వారిలోనే డిబార్ సంఖ్య ఎక్కువ 2020లో పది పాసైనవారు ఇప్పుడు 6వ సెమిస్టర్, 2021లో పది పాసైనవారు 4వ సెమిస్టర్, 2022లో పది పాసైన వారు 2వ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నారు. ప్రతీ విద్యాసంవత్సరంలోనూ 1,3,5వ సెమిస్టర్లకు ఒకసారి, 2,4,6వ సెమిస్టర్లకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. 2023–24లో 1,3,5వ సెమిస్టర్లలో 26 మంది డిబార్ అయ్యారు. అదే 2023–24 విద్యా సంవత్సరంలో 2,4,6 సెమిస్టర్లలో 60 మంది డిబార్కు గురయ్యారు. 2024–25లో 1,3,5వ సెమిస్టర్లలో కేవలం 31 మంది డిబార్ కాగా, 2024–25 విద్యాసంవత్సరంలో 2,4,6 సెమిస్టర్లలో ఏకంగా 140 మంది డిబార్ అయ్యారంటే.. పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులో మే 28న ఒకేరోజు 34 మంది డిబార్కావడం గమనార్హం. అందులోనూ కరీంనగర్ నడిబొడ్డున తెలంగాణచౌక్ను ఆనుకుని ఉన్న కాలేజీ నుంచి ఏకంగా 13 మంది విద్యార్థులు ఉండటం విశేషం. ఇప్పుడు డిబార్ అయిన విద్యార్థుల్లో అధికంగా 2020, 2021లో పదో తరగతి పాసైన వారే అధికంగా ఉండటం గమనించదగ్గ అంశం. శాతవాహన యూనివర్సిటీ కింద సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, సిద్ధిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో మొత్తం 120 డిగ్రీ కాలేజీలు, 28 పీజీ, 23 బీఈడీ, 7 ఎంబీఏ, ఒక ఎంఈడీ, ఒక బీపీఈడీ, ఒక లా కాలేజీలు తదితరాలు ఉన్నాయి. ఇటీవల వర్సిటీకి అదనంగా లా, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా మంజూరయ్యాయి. ఇంతటి ప్రతిష్టాత్మక వర్సిటీలో ఇలాంటి విపరీత ధోరణి ఇదే తొలిసారి అని పలువురు వాపోతున్నారు. -
మూడు నెలల రేషన్.. ఇదేం పరేషాన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలల రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నాయి. కార్డుదారుల రాకతో రేషన్ దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. ఒక రేషన్కార్డుపై బియ్యం పంపిణీ చేసేందుకు మూడుసార్లు ఈ పాస్ యంత్రంపై వేలిముద్రలు నమోదు చేయాల్సి ఉంటోంది. ఇందుకోసం సుమారు అర్ధగంట వరకు సమయం పడుతోంది. దీంతో కార్డుదారులు చెప్పులు, సంచులను వరుస క్రమంలో పెడుతున్నారు. కరీంనగర్ నగరంలోని జ్యోతినగర్, గణేశ్నగర్, వావిలాలపల్లి తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. నగరంలోని ఓ రేషన్ దుకాణం ఎదుట సంచులు, బుట్టలు, చెప్పులు వరుసక్రమంలో పెట్టగా సాక్షి కెమెరాకు ఇలా చిక్కింది.– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
ఈ పాపం ఎవరిది?
● కొత్తపల్లిలో 476 పట్టాలు రద్దు ● ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో 20 ఎకరాల భూమి సర్కారు పరం ● 1995 నుంచి పలువురి చేతులు మారిన భూములు ● లోకాయుక్త ఆదేశాలతో 476లో 454 పట్టాలు రద్దు ● రద్దు కానున్న మిగిలిన 22 పట్టాలు ● రెవెన్యూ, స్టాంప్స్..రిజిస్ట్రేషన్స్ శాఖలమధ్య సమన్వయ లోపం ● న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించిన బాధితులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: కొత్తపల్లిలోని వివాదాస్పద 20 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వ వశమైంది. ప్రభుత్వం 476 పట్టాలు రద్దుచేసి మరీ భూమిని స్వాధీనం చేసుకోనుంది. మంగళవారం వరకు 454 పట్టాలను రద్దు చేసిన అధికారులు మరో 22 పట్టాలను కూడా అర్ధరాత్రి వరకు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. 476 మందిలో అంతా సామాన్యులు కావడం.. పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ము కావడంతో వారంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. సర్వే నెంబరు 175, 197, 198లలోని 20 ఎకరాల భూమిలో ప్లాట్లు కొన్న వారంతా ఇపుడు లబోదిబోమంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.వందల కోట్ల సొమ్ము వెచ్చించిన భూమికి అర్థం లేకుండా పోవడంతో కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలమధ్య సమన్వయలోపానికి సామాన్యులు మూల్యం చెల్లించే దుస్థితి రావడం దురదృష్టకరం. దీంతో ఒక్కతాటిపైకి వచ్చిన బాఽధితులు హైకోర్టు గడప తొక్కారు. వారి కేసును స్వీకరించిన న్యాయస్థానం పిటిషన్ను స్వీకరించడంతో బాధితుల్లో ఆశలు చిగురించాయి. సమన్వయలోపమే శాపం.. కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో 175, 197, 198 సర్వే నెంబర్లలో దాదాపు 20 ఎకరాల భూమిని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం గతంలో స్వాధీనం చేసుకుంది. 1995 సంవత్సరంలో వివాదం మొదలైనా.. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు లోక్సత్తా శ్రీనివాస్ లోకాయుక్తను ఆశ్రయించడంతో వివాదం బాగా ప్రాచుర్యం పొందింది. గతేడాది నవంబరులో లోకాయుక్త మూడు సర్వే నెంబర్లలోని ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కలెక్టర్ను ఆదేశించింది. దీంతో ఆర్డీవో మహేశ్వర్ గతవారం నుంచి వివాదాస్పద సర్వే నెంబర్లు 175, 197, 198లో నమోదైన పట్టాలను రద్దు చేసుకుంటూ వచ్చారు. తాజాగా ఈ 476 పట్టాలు రద్దు కావడంతో బాధితులు అంతా ఒక్క తాటిపైకి వచ్చారు. 1995 నుంచి వివాదం ఉన్నప్పుడు వీటిని బ్లాక్ లిస్టులు పెట్టని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలపై మండిపడుతున్నారు. ప్రభుత్వ విభాగాలు చేసిన తప్పుకు తామెందుకు బలవ్వాలని ప్రశ్నిస్తున్నారు. జీవితాంతం దాచుకున్న డబ్బుతో కొన్న ఇంటిజాగాలపై హక్కులేదనడంతో గుండెలు ఆగినంత పనవుతుందని వాపోతున్నారు. న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని ధీమాగా ఉన్నారు. న్యాయం కోసం హైకోర్టుకు.. కొత్తపల్లి పట్టణ పరిధిలోని 197, 198 సర్వేనెంబర్లలో గల భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు కలెక్టర్కు చూపించాం. న్యాయం చేయాలని విన్నవించినప్పటికీ విన్నపాన్ని పరిగణలోకి తీసుకోకుండా 476 డాక్యుమెంట్లు రద్దు చేశారు. ఇక్కడ న్యాయం జరగకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాం. సరైన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. – మ్యాక రాజగోపాల్రెడ్డి, బాధితుడు -
సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి
కొత్తపల్లి(కరీంనగర్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి వెంటకరమణ అన్నారు. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జరిగిన ఆశ డే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. సీవై– టీబీ టెస్ట్ మైకో బ్యాక్టీరియం టుబర్కులోసిస్ అంటిజెన్ ఆధారిత చర్మ పరీక్షలను ప్రారంభించారు. హాజరుపట్టిక, రికార్డులు, లేబర్ రూం, ఆపరేషన్ థియేటర్ను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్వో మాట్లాడుతూ... పీహెచ్సీలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. అంతకుముందు ఆసిఫ్నగర్ వెల్నెస్ సెంటర్ను సందర్శించారు. కార్యక్రమంలో ఎంసీహెచ్ పీవో సన జవేరియా, వైద్యాధికారులు డాక్టర్ వనజ, డాక్టర్ శ్రావిక, వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంకరీంనగర్: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో మొదటి దఫా ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ కె.అశోక్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డ్రాప్ట్స్మన్ సివిల్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రెస్ మేకింగ్, వెల్డర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, టెక్నిషియన్ స్మార్ట్ అగ్రికల్చర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. వెబ్సైట్ httpr://iti.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 21 లోగా రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కేవీ హౌసింగ్ బోర్డు, సాయికృష్ణ ఫీడర్ల పరిధిలోని హౌసింగ్బోర్డుకాలనీ, విట్స్ కళాశాల, సుభాష్ విగ్రహం, మారుతీనగర్, బొమ్మకల్ రోడ్, వాటర్ ట్యాంక్, ముకరంపుర, తెలంగాణచౌక్, భగత్నగర్, మున్సిపల్ కార్యాలయం, జెడ్పీ ఆఫీసు ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్గౌడ్, ఎం.లావణ్య తెలిపారు. కమాన్పూర్ ఎక్స్ప్రెస్ ఫీడర్ పరిధిలో.. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్ స్తంభాల మార్పు పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33/11 కేవీ శాతవాహన సబ్స్టేషన్ కమాన్పూర్ ఎక్స్ప్రెస్ ఫీడర్ పరిధిలోని చింతకుంట, కమాన్పూర్(పాక్షికం), గ్రానైట్ పరిశ్రమల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. ట్యాంకర్ల రేట్లపై ఇన్చార్జి కమిషనర్ సీరియస్కరీంనగర్ కార్పొరేషన్: ప్రైవేట్ ట్యాంకర్లకు సంబంధించి నగరపాలకసంస్థలో ఒక్కో ట్యాంకర్కు ఒక్కోరేటు వసూలు చేస్తుండడంపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘ఇంతకీ ఏ రేటు’ అనే శీర్షికన ఈ నెల 2వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను పిలిచి ట్యాంకర్ల వ్యవహారంపై ఆరా తీయడంతో పాటు, ప్రైవేట్ ట్యాంకర్లకు ఒకరికి రూ.200, మరొ కరు రూ.400 వసూలు చేయడమేమిటని ప్ర శ్నించినట్లు తెలిసింది. ట్యాంకర్ల రేట్లను వెంట నే సరిచేయాలని ఆదేశించినట్లు సమాచారం. -
ఎంపీసీ విద్యార్థుల కోసం అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సులు
● ఫార్మర్స్, స్పెషల్ కోటా సీట్ల భర్తీకి అగ్రి వర్శిటీ నోటిఫికేషన్ ● ఈనెల 27 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు గడువు జగిత్యాలఅగ్రికల్చర్: ఇంటర్లో ఎంపీసీ చదివి, తెలంగాణ ఎంసెట్–2025 రాసిన విద్యార్థులు బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (కమ్యూనిటీ సైన్స్)లో చేరేందుకు సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. వ్యవసాయ సంబంధిత ఇంజినీరింగ్ కోర్సులు చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశం ఉండడంతో ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తిచూపుతున్నారు. ఫార్మర్స్ కోటా, పేమెంట్ కోటాకు సంబంధించి.. ప్రస్తుతం ఫార్మర్స్, పేమెంట్ కోటాలకు సంబంధించి వ్యవసాయ వర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ ఎంసెట్ రాసిన విద్యార్థులు రెండు మార్గాలుగా అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యామండలి నిర్వహించే ఇంజినీరింగ్ ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా చేరవచ్చు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులు తమ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చు. అలాగే ఫార్మర్స్ కోటా, సెల్ఫ్ఫైనాన్స్(పే మెంట్) కోటా కింద వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా చేరవచ్చు. రెండు మార్గాల్లోను తెలంగాణ ఎంసెట్–2025లో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే సీట్లను భర్తీ చేస్తారు. రైతు కోటా కింద సీట్ల వివరాలు బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్) కళాశాల సంగారెడ్డి జిల్లా కందిలో ఉండగా, ఫార్మర్స్ కోటా కింద 20, పేమెంట్ కింద 9 సీట్లు భర్తీ చేస్తారు. అలాగే, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కళాశాల నిజమాబాద్ జిల్లా రుద్రూర్లో ఉండగా, ఫార్మర్స్ కోటా 10, పేమెంట్ కోటా కింద 5 సీట్లు భర్తీ చేస్తారు. బీఎస్సీ (కమ్యూనిటీ సైన్స్) కళాశాల హైదరాబాద్లోని సైఫాబాద్లో ఉండగా 37 (నాన్రూరల్, రూరల్), పేమెంట్ కోటా కింద 5 సీట్లు భర్తీ చేస్తారు. అలాగే మూడేళ్ల హోం సైన్స్ చదివినవారికి హోంసైన్స్ కోర్సుల్లో 10 శాతం రిజర్వ్ చేయబడ్డాయి. పేమెంట్ కోటా కింద సీటు పొందిన వారు, సెమిస్టర్కు రూ.62,500 చొప్పున 8 సెమిస్టర్లకు రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ కోటా సైతం ఎంసెట్ ర్యాంక్ ఆధారంగానే కేటాయిస్తారు. దరఖాస్తు గడువు.. దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు ఈనెల 27 చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఆన్లైన్లో పంపించేందుకు ఆఖరు తేదీ ఈనెల 28. జనరల్, బీసీ అభ్యర్థులు రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1,500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అడ్మిషన్ పొందే నాటికి వయస్సు 17–22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు, పీహెచ్ వారికి 27 ఏళ్ల వరకు ఉండవచ్చు. రెగ్యులర్ కోర్సుల ఫీజు రూ.49,560. ఫార్మర్స్ కోటా కింద దరఖాస్తు చేసేవారు 1 నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. అలాగే, ఒక ఎకరం తక్కువ కాకుండా వ్యవసాయ భూమి విద్యార్థి లేదా తల్లిదండ్రుల పేరిట ఉండాలి. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఏడాది రైతు కూలీల పిల్లలకు సైతం 15 శాతం రిజర్వేషన్ కల్పించారు. రైతు కూలీల ధ్రువీకరణ కోసం ఈజీఎస్ జాబ్ కార్డు ఉండాలి. బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోసం గ్రామీణ ప్రాంతాల్లో చదవని వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వ్యవసాయ వర్శిటీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. పీజేటీఏయూ.ఈడీయూ.ఇన్లో సంప్రదించవచ్చు. -
అమరుల త్యాగఫలమే తెలంగాణ
కరీంనగర్ కల్చరల్: తెలంగాణ విద్యార్థి, యువజనుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తెలంగాణ రచయితల వేదిక(తెరవే) రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు, కవి, గాయకుడు గాజోజు నాగభూషణం అన్నారు. తెరవే ఆధ్వర్యంలో నగరంలోని అమరవీరుల స్తూపం వద్ద సోమవారం జరిగిన అమరుల త్యాగాల కవితా గానం కార్యక్రమంలో గాజోజు నాగభూషణం మాట్లాడారు. అమరుల కుటుంబాలను గౌరవప్రదంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, పౌర సమాజంపై ఉందన్నారు. తెలంగాణ కవులు, రచయితలు పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు నివాళి అర్పించారు. అమరుల త్యాగాల కవితాగానం కార్యక్రమంలో తెరవే బాధ్యులు సీవీ కుమార్, డాక్టర్ విజయకుమార్, నడిమెట్ల రామయ్య, విలాసాగరం రవీందర్, నెరువట్ల చైతన్య, విజయశ్రీ, గుండు రమణయ్య, బుర్ర తిరుపతి, బొల్లం బాలకష్ణ, మర్రిపల్లి మహేందర్, జనగాని యుగంధర్, మహనీయ బేగ్, ఖాలీద్, ముఖేష్, రెడ్డి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
బావిలో మునిగి వ్యవసాయ కూలీ మృతి
ఎలిగేడు(పెద్దపల్లి): నర్సాపూర్ గ్రామానికి చెందిన కూలీ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో మునిగి మృతి చెందాడు. ఎస్సై సనత్కుమార్ కథనం ప్రకారం.. నర్సాపూర్ గ్రామానికి చెందిన కాంపెల్లి పోచయ్య(74) ఆదివారం సాయంత్రం తన మనుమడు సాయిగణేశ్కు ఈత నేర్పేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు పోచయ్య నీట మునిగి పోయాడు. సమాచారం ఆందుకున్న కుటుంబసభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలించగా అర్ధరాత్రి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతుని కొడుకు వేణుకుమార్ రెండేళ్ల క్రితం రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పుడు పెద్దదిక్కును కోల్పోయి ఆ కుటుంబం రోదిస్తోంది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. చికిత్స పొందుతూ వ్యక్తి..కరీంనగర్క్రైం: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. వావిలాలపల్లిలో ఉంటున్న జక్కం సాయిసందీప్కు 12 ఏళ్ల కిత్రం గుంటూరుకు చెందిన జక్కం గీతతో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. సాయిసందీప్ మొదట ఒక ప్రయివేట్ ఉద్యోగం చేశాడు. ఉద్యోగం మానేసి వ్యాపారం పెట్టడంతో నష్టాలపాలయ్యాడు. అప్పటి నుంచి మనోవేదనకు లోనవుతూ చనిపోతానంటూ పలుమార్లు తన భార్యతో అనేవాడు. గతంలో సాయిసందీప్కు అతడి కుటుంబ సభ్యులు మానసిక వైద్యం కూడా చేయించారు. గతనెల 31న గీత తన పుట్టింటికి వెళ్లడంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. తీవ్రంగా వాంతులు, విరేచనాలు కావడంతో తన కుటుంబ సభ్యులకు సమాచారమందించాడు. వెంటనే వారు ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా.. వారు పురుగుల మందు తాగినట్లు గుర్తించారు. అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్ అరెస్టుముస్తాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన డ్రైవర్ను అరెస్టు చేసినట్లు ఎస్సై గణేశ్ సోమవారం తెలిపారు. ముస్తాబాద్కు చెందిన కూర సిద్దిరాములు(54) ద్విచక్ర వాహనంపై వస్తుండగా, గూడూరు నుంచి డీసీఎం వ్యాన్తో వేగంగా ఆజాగ్రత్తగా నడిపిన ఆసిఫ్(24) ఢీకొట్టాడన్నారు. ఈ సంఘటనలో సిద్దిరాములు అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. సిద్దిరాములును ఢీకొట్టి పరారీ అయిన డ్రైవర్ కోసం గాలింపు చేపట్టామన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆసిఫ్గా గుర్తించి డీసీఎం వ్యాన్తో సహా అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. -
స్లాట్ బుకింగ్ షురూ..
కరీంనగర్క్రైం: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ పద్ధతి ప్రారంభమైంది. ప్రభుత్వం తొలుత కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయగా.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి అన్ని కార్యాలయాల్లో ప్రారంభించారు. తొలిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు బుక్ చేసుకున్న స్లాట్ల ప్రకారం సమయానికి వచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 14 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా తొలిరోజు 145 డాక్యుమెంట్లు స్లాట్బుకింగ్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. వాట్సాఫ్లో సందేహాల నివృత్తి ఆస్తుల క్రయవిక్రయదారులు స్టాంపులు, రిజిస్ట్రేషన్శాఖ వెబ్సైట్ ద్వారా నేరుగా సందేహాలు నివృత్తి చేసుకునేందుకు 8247623578 నంబర్ ఏర్పాటు చేశారు. ఈ నంబర్ వాట్సాప్ ద్వారా కావాల్సిన విషయాలు తెలుసుకోవచ్చు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లొకేషన్, స్లాట్బుకింగ్ ఖాళీల వివరాలు, అందుబాటులో ఉండే సమయం, డీడ్వారిగా రిజిస్ట్రేషన్ చార్జీలు, మార్కెట్ విలువలు వాట్సప్ మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. రోజుకు 48స్లాట్లు.. ఐదు వాకిన్ రిజిస్ట్రేషన్లు ప్రతిరోజు జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ద్వారా 48 రిజిస్ట్రేషన్లు చేయవచ్చు. అత్యవసర సమయాల్లో ఐదు వాకిన్ రిజిస్ట్రేషన్లు చేసేలా అవకాశం కల్పించారు. స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్లు ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు, వాకిన్ రిజిస్ట్రేషన్లు సాయంత్రం ఐదు గంటల నుంచి 5.30 గంటల వరకు జరిపేలా ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. ఒక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి 48 రిజిస్ట్రేషన్లు, వాకిన్ రిజిస్ట్రేషన్లు ఐదు అనుమతించారు. మరొక సబ్ రిజిస్ట్రార్కు పెద్దగా పని ఉండకపోవచ్చని, అదనంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ను వేరే చోటుకు సర్దుబాటు చేసే అవకాశాలున్నట్లు కార్యాలయవర్గాల్లో చర్చ జరుగుతోంది. నిరీక్షణకు తెర స్లాట్బుకింగ్ విధానంతో గంటల తరబడి నిరీక్షణకు తెరపడింది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ వచ్చే ముందు డాక్యుమెంట్లు వరుసలో పెట్టేవారు. కార్యాలయంలో ఉదయం 10.30 వరకే కొన్ని డాక్యుమెంట్లు ఉండేవి. అవన్నీ చెక్స్లిప్ నమోదు చేయడం, స్కానింగ్, సబ్రిజిస్ట్రార్ బయెమెట్రిక్, క్రయవిక్రయదారుల వేలిముద్రలు వేయడం పద్ధతిలో రిజిస్ట్రేషన్ కొనసాగేది. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న సందర్భాలు అనేకం. ఇప్పుడు ముందస్తుగానే ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకొని, ఆన్లైన్లో చెక్స్లిప్ నమోదు చేయడం, క్రయవిక్రయదారులకు చెందిన ఆస్తులు, హద్దుల వివరాలు పూర్తిగా చదువుకొని సరిగ్గా ఉన్న తర్వాతే స్లాట్ బుకింగ్ చేసుకునే విధంగా ఉండడంతో సులభంగా, పారదర్శకంగా ఉంటుంది. పాత పద్ధతి కన్నా.. కొత్త స్లాట్ బుకింగ్ విధానం సులభంగా, సౌకర్యవంతంగా ఉందని క్రయవిక్రయదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్శాఖలో ప్రారంభమైన నూతన విధానం తొలి రోజు ఉమ్మడి జిల్లాలో 145 రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తగ్గనున్న రద్దీ సమయం ఆదా అవుతుందంటున్న ప్రజలు సమయం వృథా కాదు కొత్తగా స్లాట్ విధానం సోమవారం నుంచి అమలు చేస్తున్నాం. నిర్ణీత సమయంలో ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకొని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే పది నిమిషాల్లో ప్రక్రియ పూర్తి చేసి పంపిస్తున్నాం. కొత్త విధానం ద్వారా క్రయవిక్రయదారులకు సమయం వృథా కాదు. – రవికుమార్, కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ స్లాట్ బుకింగ్ బాగుంది రిజిస్ట్రేషన్లలో స్లాట్ బుకింగ్ విధానం బాగుంది. మాకు సంబంధించిన ఒక ఆస్తికి చెందిన క్రయవిక్రయాలకు చెందిన విషయాలు ముందుగానే ఎంటర్ చేస్తే, కావాల్సిన సమయానికి స్లాట్ బుకింగ్ అవుతుంది. దాని ప్రకారం వెళ్తే పదినిమిషాల్లో ప్రక్రియ పూర్తి చేసి పంపిస్తున్నారు. – కాడే రమేశ్, కట్టరాంపూర్, కరీంనగర్ -
ఐఐటీ అడ్వాన్స్డ్లో అల్ఫోర్స్కు ర్యాంకులు
ఎస్ఆర్ విద్యార్థుల విజయకేతనం కరీంనగర్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థులు వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు. ఎస్.పవన్ 204వ ర్యాంక్, ఎం.కార్తీక్ 1,009, బానోవత్ సుమన్ 1,049, బుర్ర మాధవ్ 1,471, నీరటి శ్రీచరణ్జోష్ 1,321, గుగులోతు శేఖర్ 1,328, ముదిగంటి రుషిశ్వర్రెడ్డి 2,318, దొనకొండ సాయిచందన 3,218, దయ్యాల రాజ్కుమార్ 6,519వ ర్యాంకు సాధించి విద్యాసంస్థల ప్రతిభను మరింత పెంచారని విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి పేర్కొన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అహర్నిశల కృషి ఇంతటి ఘన విజయానికి తోడ్పడ్డాయని వివరించారు. అద్భుత ర్యాంకులు సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను, అధ్యాపక బృందానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ సంతోష్రెడ్డి, డీజీఎం, సీఈవో, జోనల్ ఇన్చార్జిలు, అకాడమిక్ డీన్స్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. ట్రినిటీ విద్యార్థుల విజయభేరికరీంనగర్: జేఈఈ–అడ్వాన్స్డ్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాలల విద్యార్థులు విజయభేరి మోగించారు. ఎ.రఘుపతి జాతీయస్థాయిలో 40వ ర్యాంకు, నిఖిత్నాయక్ 194, డి.మహేశ్ 225, రఘుపతి 226, బి.సిద్ధిక 1,107, సీహెచ్.ఐశ్వర్య 1,129, ఠాగూర్ 1,274, నవదీప్ 1,701, నిస్సీ జాస్పర్ 2,172, ఎ.అజయ్ 3,077, అక్షర 4,524 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి మాట్లాడుతూ, స్పష్టమైన ప్రణాళిక, మెరుగైన విద్యా బోధన, నిష్ణాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ఉత్తమ ర్యాంకులు సాధించామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, అందుకు అనుగుణంగా బోధనా పద్ధతులు అవలంబించిడం జరుగుతుందని, ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఎస్సెస్సీలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు తమ కాలేజీలో ఫీజు రాయితీ ఇస్తున్నామని వివరించారు. ఈఏడాది నుంచి ఐఐటీ–అడ్వాన్స్డ్ లాంగ్టర్మ్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రాబోయే నీట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ, ఉత్తమ ర్యాంకుల సాధన కేవలం ట్రినిటీ కళాశాలలకే సాధ్యమని, విద్యార్థుల కృషి, యాజమాన్యం భరోసా, అధ్యాపకుల శ్రద్ధ వల్లే ఈ ఫలితాలు అని తెలిపారు. క్యాంపస్ ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు సోమవారం ప్రకటించిన ఐఐటీ అడ్వాన్స్డ్–2025 ఫలితాల వివిధ కేటగిరీల జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి తెలిపారు. అజ్మీరా పురుషోత్త్తంనాయక్ 166వ ర్యాంకు సాధించగా.. పి.ఎన్.సాయిధృవ 557, ఎన్.అనిరుధ్సాయి 657, బి.ఆదిత్య 945, బి.విష్ణు 1,203, ఎం.అక్షిత 1,224, వి.హృషికేశ్ 1,329, ఆర్.గోవర్ధన్ 1,506, జె.వామిక 1,604, బి.చైశ్రవ్ రాజు 1,640, ఇ.శశిలాల్ 1,899, కె.విరేంద్రప్రసాద్ 2,120, డి.కార్తీక్రెడి్డ్ 2,150, ఎస్.విఘ్నేశ్ 2,293, డి.అభిరామ్ 2,349, ఎ.శశిప్రితమ్ 2,463, ఇ.అంకిత్సాయి 2,613, మహ్మద్ అబ్ధుల్ హక్ 2,766, డి.విశాల్ 2,917 ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని పెంచారని సంతోషం వ్యక్తం చేశారు. వెయ్యి లోపు నలుగురు, 2వేల లోపు 11 మంది, 3వేల లోపు 19 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. -
‘నలిమెల’కు కాళోజీ పురస్కారం
సిరిసిల్లకల్చరల్/కరీంనగర్కల్చరల్: ఉమ్మడి జిల్లాకు చెందిన బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్కు ప్రతిష్టాత్మక కాళోజీ పురస్కారం వరించింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ల జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. పద్నాలుగు భాషలపై పట్టు సాధించడంతో పాటు అనువాద రచయితగా లబ్ధప్రతిష్టుడైన నలిమెలకు స్మారక శిలలు అనువాద రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందించింది. నలిమెలను జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఎలగొండ రవి, బూర దేవానందం, మానేరు రచయితల సంఘం ప్రతినిధులు డాక్టర్ పత్తిపాక మోహన్, ఆడెపు లక్ష్మన్, జూకంటి జగన్నాథం, చిటికెన కిరణ్, టీవీ నారాయణ, సిరిసిల్ల సాహితీ సమితి ప్రతినిధులు డాక్టర్ జనపాల శంకరయ్య, వెంగల లక్ష్మణ్ తదితరులు అభినందనలు తెలిపారు. -
నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమం ప్రారంభం
కరీంనగర్ అర్బన్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించింది. సోమవారం రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్బాబు లాంఛనంగా ప్రారంభించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు పరిశోధనా కేంద్రాల్లో అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాన్ని సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 207 రెవెన్యూ గ్రామాల్లో ప్రతి గ్రామంలో ముగ్గురు రైతులకు వరి, పెసర విత్తనాలు అందించనున్నట్లు కరీంనగర్ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డా.జి.ఉపారాణి తెలిపారు. నాణ్యమైన విత్తనోత్పత్తిని గ్రామంలోనే ప్రోత్సహించేందుకు కార్యక్రమాన్ని చేపడుతున్నారని పేర్కొన్నారు. -
ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
కొత్తపల్లి: కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలోని ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అతడికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, ప్రాణాలను రక్షించారు. కొత్తపల్లి మండలం బావుపేటకు చెందిన నేరెళ్ల సన్నీ అలియాస్ దయాసాగర్ కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. ఇంట్లోని వస్తువులను చిందర వందర చేయడంతో పాటు కుటుంబసభ్యులపై దాడికి దిగాడు. గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కానిస్టేబుల్ విజయ్రావు డయల్ 100 ద్వారా సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్నాడు. వాటర్ ట్యాంక్ ఎక్కిన సన్నితో మాట్లాడుతూ కౌన్సెలింగ్ ఇచ్చాడు. సన్నీ షరతులకు అనుగుణంగా కుటుంబ సభ్యులను ఒప్పించి వాటర్ ట్యాంక్ దింపి అతని ప్రాణాలను రక్షించాడు. కానిస్టేబుల్ను కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, సీఐ నిరంజన్ రెడ్డి, కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ రాజీవ్ రహదారిపై ఆదివారం బైక్ను వెనుక నుంచి ఆటో ఢీ కొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. రామగుండం మల్యాలపల్లికి చెందిన రాజేశ్ తన సమీప బంధువైన శారదను ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధిలోని ఖాజిపల్లి గ్రామం నుంచి బైక్పై మల్యాలపల్లికి తీసుకెళ్తున్నాడు. ఈక్రమంలో మేడిపల్లి సెంటర్లో అదేమార్గంలో వేగంగా వచ్చిన ఆటో వెనుక నుంచి బైక్ను ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆటోలో గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికితీసుకెళ్లారు.కానిస్టేబుల్పై దాడికోనరావుపేట: మండలంలోని రామన్నపేటలో బోనాల ఉత్సవంలో బందోబస్తుకు వచ్చిన ఓ కానిస్టేబుల్పై దాడి జరిగింది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు జాతరలో గొడవ పడుతుండగా అక్కడే ఉన్న కానిస్టేబుల్ రవి వీడియో తీస్తుండడాన్ని గమనించిన ఓ యువకుడు ఆగ్రహించి కర్రను కానిస్టేబుల్పైకి విసిరాడు. కానిస్టేబుల్ తలకు గాయమై తీవ్ర రక్తస్రావం కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఆయిల్పాం తోటలో అగ్ని ప్రమాదం
ధర్మపురి: షార్ట్ సర్క్యూట్తో ఆయిల్పాం తోటలో మంటలంటుకొని సుమారు రూ.8 లక్షల విలువ గల వస్తువులు కాలిపోయిన ఘటన మండలంలోని కోస్నూర్పల్లెలో ఆదివారం సాయంత్రం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. కోస్నూర్పల్లె మాజీ సర్పంచ్ ఎన్నం లక్ష్మారెడ్డి 3 ఎకరాల్లో ఆయిల్పాం తోటను సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం తోటకు నీళ్లు పెట్టి ఇంటికి వెళ్లిన లక్ష్మారెడ్డి సాయంత్రం తోటలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకొని స్థానికులతో కలిసి మంటలు ఆర్పడానికి ఇబ్బందులుపడ్డారు. షార్ట్సర్క్యూట్తో డ్రిప్, పైపులైన్లు కొంతవరకు ఆయిల్పాం చెట్లు కాలిపోయాయని తెలిపాడు. -
భూహత్యలు.. తెగిపోతున్న బంధాలు
● ప్రాణాలు తీస్తున్నారు ● హద్దుల కోసం దాడులు ● బంధాలు మరిచిపోతున్న జనం ‘వేములవాడలో తనకు వారసత్వంగా రావాల్సిన భూమిని రిజిస్ట్రేషన్ చేయలేదని తండ్రిపై కొడుకు దాడి చేశాడు. ఇంట్లోకి దూరి ప్రాణాలు తీశాడు.’ ‘సిరిసిల్లలో ఇంటి పక్కన ఉన్న 3 ఫీట్ల స్థలం కోసం రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే యువకుడు క్షణికావేశంలో చిన్నాన్న కుటుంబంపై స్నేహితులతో కలిసి దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిన్నాన్న మూడేళ్ల కొడుకు ప్రాణాలు కోల్పోయాడు.’ ‘చందుర్తి మండలంలో భూవివాదంలో తన పెద్దమ్మనే కత్తితో తలపై నరికి చంపాడు ఓ యువకుడు. ఈ యువకుడు మైనర్గా ఉన్న వయసులోనూ ఒకరిని హత్య చేసి జైలుకు వెళ్లి వచ్చాడు.’సిరిసిల్లక్రైం: క్షణికావేశం.. కాంప్రమైజ్ కావాలనే ఆలోచన లేకపోవడంతో భూహత్యలు జరుగుతున్నాయి. గజం స్థలం కోసం నిండు ప్రాణాలు తీసుకుంటున్నారు. సొంత కుటుంబీకులు.. బంధువులు.. ఇంటి పక్కవారు.. ఇలా ఎవరిౖపైనెనా దాడి చేసేస్తున్నారు. ప్రాణాలు తీస్తున్నారు. బతకడం కోసం కొంత భూమి ఉండాలన్నది పాతకాలపు మాట. భూమి దక్కించుకునేందుకు ప్రాణాలు సైతం తీస్తామంటున్నారు కొందరు. వరుస హత్యలతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పంచాయితీలు.. సెటిల్మెంట్స్ భూమి పంచాయితీలు సాధారణంగా ఇరువర్గాల మధ్య పెద్దమనుషుల సమక్షంలో జరుగుతుంటాయి. పెద్దలు చెప్పిన తీర్పు ఒకరికి న్యాయంగా అనిపిస్తే.. మరొకరికి అన్యాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో గొడవలు జరుగుతున్నాయి. ఊరు పెద్దల మధ్య పంచాయితీలు తీరక.. ఠాణా మెట్లు ఎక్కుతున్నారు. అక్కడ కూడా పంచాయితీలు పరిష్కారం కాకపోవడంతో కోర్టుల చుట్టూ ఏళ్లకు ఏళ్లుగా తిరుగుతున్నారు. మరికొందరైతే ఎదుటి వ్యక్తి అడ్డు తొలగించుకునేందుకు ప్రాణాలు తీస్తున్నారు. నిబంధనలుఅతిక్రమిస్తే చర్యలు భూవివాదాలను కోర్టు పరిధిలో పరిష్కరించుకోవాలి. చట్టాలు అతిక్రమించి పంచాయితీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. నేరచరిత్ర కలిగి ఉండి భయభ్రాంతులకు గురిచేస్తే పీడీయాక్ట్ నమోదు చేస్తాం. సమస్యలు చట్ట పరిధిలో కోర్టును ఆశ్రయించి పరిష్కరించుకోవాలి. – మహేశ్ బీ గీతే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల -
క్రీడా కార్యక్రమాలకు వెళ్తూ అనంతలోకాలకు..
కరీంనగర్స్పోర్ట్స్: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ కడారి రవి(57) మృతి చెందారు. హైదరాబాద్లో 1991 సంవత్సరానికి చెందిన వ్యాయామ వృత్తివిద్య (జీసీపీఈ) కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం, సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్స్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్ పోటీలకు హాజరయ్యేందుకు కారులో బయల్దేరాడు. కొమురవెల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు అయ్యాయి. సిద్దిపేట ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. రవికి భార్య, కుమారుడు ఉన్నారు. రవి ప్రస్తుతం కరీంనగర్లో నివాసం ఉంటూ.. పెద్దపల్లి జెడ్పీహెచ్ఎస్ (బాలుర) స్కూల్లో పనిచేస్తున్నాడు. అథ్లెటిక్స్, అర్చరీ, రైఫిల్ షూటింగ్ తదితర క్రీడలకు కోచ్గా, అథ్లెటిక్ క్రీడా సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు రిసోర్స్ పర్సన్గా సేవలందించారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల డీవైఎస్వోలు శ్రీనివాస్గౌడ్, సురేశ్, రాందాస్, రవి, క్రీడా సంఘాల బాధ్యులు సంతాపం వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళనంలో సంతాప సభ హైదరాబాద్ దోమలగూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల(1991) పూర్వ విద్యార్థుల సమ్మేళనం దోమలగూడ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలలో ఆదివారం జరిగింది. సమ్మేళనానికి వెళ్తున్న కడారి రవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సమ్మేళనానికి హాజరైన 70మంది పైగా వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు. కొమురవెల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం ఫిజికల్ డైరెక్టర్ కడారి రవి మృతి -
నిర్ణయం హర్షణీయం
మున్సిపాలిటీల్లోని పట్టణాల్లో అవసరమైన మౌలిక వసతులను గుర్తించి ప్రజలను భాగస్వామ్యం చేసేలా 100 రోజుల కార్యాచరణ చేపట్టడం హర్షణీయం. పట్టణ పౌరులుగా, సామాజిక స్పృహ ఉన్న వారిబాధ్యత పెంచేలా అధికారులు కార్యాచరణ చేపట్టేలా ప్రోత్సహించాలి. –బొంకూరి అవినాష్, కమాన్రోడ్డు, పెద్దపల్లి పార్కులు ఏర్పాటు చేయాలి జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో మినీ ట్యాంక్బండ్ మినహా మరో పార్కులేదు. చిల్డ్రన్ పార్కు ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలి. స్వచ్ఛపెద్దపల్లిగా తీర్చిదిద్దడంలో పట్టణ ప్రజలు భాగస్వాములయ్యేలా అధికారులు ప్రోత్సహించాలి. – బొడ్డుపల్లి సురేశ్, తిలక్నగర్, పెద్దపల్లి పకడ్బందీగా కార్యాచరణ వందరోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేస్తాం. ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛత.. పరిశుభ్రత, హరితహారం లాంటివాటిలో ప్రజలను భాగస్వాములను చేస్తాం. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు, స్వశక్తి సంఘాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. – వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్, పెద్దపల్లి -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని గూడూరు స్టేజీ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై చిందం గణేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబాద్కు చెందిన కూర సిద్దిరాములు(56) నామాపూర్లోని ఓ రైస్మిల్లో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆదివారం విధులు ముగించుకొని బైక్పై ముస్తాబాద్కు తిరిగి వస్తుండగా గుర్తు తెలియని డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ సిద్దిరాములు అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ను ఢీకొట్టిన వాహనం వేగంగా కామారెడ్డి వైపు వెళ్లింది. సిద్దిరాములు మృతికి కారణమైన వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడికి భార్య లక్ష్మి, కూతురు సంగీత ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేశ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు..సుల్తానాబాద్ రూరల్(పెద్దపల్లి): కారు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన కనుకుల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తాళ్లపల్లి కొమురయ్య(85) తన ఇంటినుంచి బస్టాండ్కు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలో అతివేగంగా వెళ్తున్న కారు వెనుకనుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలతో రక్తస్రావం జరిగి వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వృద్ధుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని మృతదేహం లభ్యంకరీంనగర్క్రైం: కరీంనగర్ వన్టౌన్ పరిధిలోని ఓ లాడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వన్టౌన్ పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న లాడ్జి సమీపంలో సుమారు 55ఏళ్ల పైబడిన వ్యక్తి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు. వివరాలకు వన్టౌన్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు ఢీకొని నలుగురికి గాయాలు ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ గౌతమినగర్ ప్రధాన రహదారిపై ప్రగతినగర్లో ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈప్రమాదంలో సమతకారి నరసింహస్వామి, దుగ్గల అరుణ్కుమార్, బంగారి కవినిక్, సిలివేరి అక్షయ్కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేసుకొన్నారు. -
పట్టణ రూపురేఖలు మారుద్దాం
పెద్దపల్లిరూరల్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, స్వశక్తి సంఘాల మహిళలను భాగస్వాములను చేస్తూ ప్రధాన సమస్యల పరిష్కారం, కనీస మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వందరోజుల కార్యక్రమం సోమవారం ప్రారంభిస్తారు. ప్రతీనిత్యం శ్రీఒక చర్య.. ఒక మార్పుశ్రీ నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం కాలెండర్ రూపొందించింది. పట్టణ రూపురేఖలను మార్చేలా చర్యలు చేపట్టేందుకు అధికారయంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ప్రజలు తమవంతుగా పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వానాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. ఇంటిఆవరణతోపాటు వీధులను శుభ్రంగా ఉంచేలా ప్రజల్లో చైతన్యం తెస్తారు. రోడ్ల పక్కన పిచ్చిమొక్కలు, ముళ్లపొదల తొలగింపు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.ప్లాస్టిక్తో ముప్పుపై ప్రచారంప్లాస్టిక్ వస్తువుల వినియోగంతో కలిగే ముప్పుపై ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేసి ప్లాస్టిక్ను నియంత్రిస్తారు. ప్లాస్టిక్ కవర్లు, ఇతర చెత్తను డ్రైనేజీల్లో వేస్తే జరిమానా విధిస్తామనే సంకేతాలు ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువును తయారీ చేయడంపై అవగాహన కల్పిస్తారు.ఆదాయం పెంపే లక్ష్యంగా..మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆదాయం పెంచుకునే దిశగా అధికారులు ముందుకు సాగనున్నారు. పట్టణాల్లో వ్యాపారాలు సాగిస్తున్న వారిలో ట్రేడ్లైసెన్స్లు లేనివారిని గుర్తించి జారీచేసేలా కార్యాచరణ చేపడతారు. ఇతర రకాల పన్నుల రూపేణా మున్సిపల్కు ఆదాయం సమకూరే విషయమై దృష్టి సారిస్తారు. భువన్ సర్వే నిర్వహించి అనుమతి లేనిఇండ్లను గుర్తించి క్రమబద్ధీకరించుకునేలా ప్రోత్సహిస్తారు.కూడళ్ల అభివృద్ధి.. పార్కుల ఏర్పాటుమున్సిపల్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో ఉన్న అ వాంతరాలు తొలగించేలా ఇతరశాఖల అధికారు లు, స్థానికుల సహకారంతో అభివృద్ధి చేస్తారు. కూ డళ్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు చేపట్టాల్సిన చ ర్యల్లో అవసరమైన వారిని ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను అభివృద్ధి పనుల్లో భాగస్వాములు చే స్తారు. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా చిల్డ్రన్ పా ర్కుల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తిస్తారు.మహిళల ఆర్థికాభ్యున్నతికి..స్వశక్తి సంఘాల్లో సభ్యులకు అవసరమైన రుణాలను ఇప్పించి ఆర్థికంగా ఎదిగేలా చర్యలు తీసుకుంటారు. స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా లేనినిరుపేద మహిళలను గుర్తించి సంఘాలను ఏర్పాటు చేయిస్తారు. మహిళలు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో వ్యాపారం చేస్తూ ఆర్థికాభ్యున్నతి సాధించేలా సూచనలిస్తారు. అంతేకాకుండా పచ్చదనం.. పరిశుభ్రత అంశాలతోపాటు మరిన్ని అంశాలపై వందరోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తారు. -
స్వగ్రామానికి మృతదేహం
మల్యాల(చొప్పదండి): మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన పంజాల వాసుగౌడ్ (40) మృతదేహం ఆదివారం స్వగ్రామానికి చేరింది. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన వాసుగౌడ్ గత ఫిబ్రవరిలో అక్కడ ఆత్మహత్య చేసుకోగా, పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మార్చురీలో భద్రపరిచారు. రెండు నెలలు గడిచినా మృతుడి ఆచూకీ కోసం ఎవరూ రాకపోవడంతో పోలీసులు మృతుడి వేలిముద్రల ఆధారంగా తెలుసుకొని ఇండియన్ ఎంబసీకి సమాచారం అందజేశారు. ఈక్రమంలో వాసుగౌడ్ వివరాలను గల్ఫ్ కార్మికుల సంరక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నరసింహ, ఉపాధ్యక్షుడు శేఖర్గౌడ్ సేకరించి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
మల్లాపూర్(కోరుట్ల): మండలకేంద్రంలోని ఒడ్డెరకాలనీకి చెందిన దండుగుల శ్రీనివాస్(22) ఆదివారం వేకువజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. దండుగుల పోశేట్టి–బక్కవ్వ దంపతులకు శ్రీనివాస్ సంతానం. ఇతడి చిన్నతనంలోనే పోశేట్టితో బక్కవ్వ విడాకులు తీసుకుంది. శ్రీనివాస్ను పెంచి పెద్దచేసింది. కొంతకాలంగా బక్కవ్వ మానసికస్థితి సరిగా ఉండపోవడంతో పాటు ఇటీవల శ్రీనివాస్ హైదరాబాద్కి వెళ్లి అప్పు చేసి టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా సతమతమవుతున్నాడు. రెండురోజుల క్రితం మల్లాపూర్కు వచ్చిన శ్రీనివాస్ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి చిన్నతాత శివరాత్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్సై రాజునాయక్ తెలిపారు. -
ముస్తాబాద్లో కుళ్లిన మాంసం విక్రయం
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్లో కుళ్లిన మాంసం విక్రయాలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ముస్తాబాద్లోని మటన్ మార్కెట్ వద్ద బుర్ర శ్రీనివాస్ ఆదివారం మాంసం కొనుగోలుకు వెళ్లాడు. శ్రీనివాస్కు తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్న మాంసం విక్రయించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి ఫ్రిజ్ల్లో పెట్టిన మాంసాన్ని విక్రయిస్తున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. తలకాయ కొనుగోలు చేసిన తనకు దుర్వాసన వస్తున్న మాంసాన్ని విక్రయించారన్నారు. ముస్తాబాద్లో మాంసం విక్రయాలపై అధికారుల నిఘా లేకుండా పోయిందన్నారు. పశుసంవర్థకశాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే మాంసం విక్రయాలు చేస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా కుళ్లిపోయిన మాంసాన్ని ప్రజలకు అంటగడుతున్నారన్నారు. దీనిపై జిల్లా అఽధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకొని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. -
‘సంజయ్ మాటలు అర్థరహితం’
కరీంనగర్ కార్పొరేషన్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం రేవంత్పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆదివారం మాట్లాడు తూ యుద్ధంపై వాస్తవాలు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డిని దేశద్రోహి అనడమేమిటన్నారు. ఇందిరాగాంధీని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్లమెంటులో అన్ని బిల్లులకు మద్దతు తీసుకుని, బీఆర్ఎస్తో అవి నీతిలో భాగస్వాములై, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్కు ముడిపెట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఎండీ తాజ్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్రెడ్డి, కుర్ర పోచయ్య, మ్యాకల నర్సయ్య, ఎట్టం వేణు పాల్గొన్నారు. ‘బీజేపీతో పొత్తు పెట్టుకునే కర్మ బీఆర్ఎస్కు లేదు’ కరీంనగర్: కేంద్రమంత్రి బండి సంజయ్ బా ధ్యతరహితంగా మాట్లాడటం, బీఆర్ఎస్, కేసీ ఆర్ కుటుంబంపై అబద్ధాలు ప్రచారం చేయ డం మానుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామక్రిష్ణారావు హితవు పలికారు. ఆదివారం నగరంలో మాట్లాడుతూ.. బండి సంజయ్ బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కరీంనగర్ ఎంపీగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి గల్లీ లీడర్గా వ్యహరిస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ స్థాపించినప్పుడు హరీశ్రావు, కవిత, కేటీఆర్లు ఉన్నారని వారసత్వ రాజకీయాలు లేవని, వారంతా పునాది రాళ్లలాగా పనిచేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మునిగిపోయే నావ లాంటి బీజేపీలో తాము కలవబోమని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబంపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. నాయకులు పొన్నం అనిల్గౌడ్, చీటి రాజేందర్రావు, శ్రీనివా స్గౌడ్, భాస్కర్, రవి, సంపత్, శే ఖర్, చారి, షౌకత్అలీ, వసంతరావు పాల్గొన్నారు. జూనియర్ లెక్చరర్ల ఆందోళనకరీంనగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2023 మే 3న నియామకమైన సుమారు 3,200 మంది రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లు రెండో వార్షిక ఇంక్రిమెంట్ మంజూరుపై నెలకొన్న అస్పష్టతతో తీవ్ర ఆందోళనలో ఉన్నారని లెక్చరర్ల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి దేవేందర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం డీఐఈవో గంగాధర్కు వినతిపత్రం సమర్పించారు. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తయినప్పటికీ, రెండో ఇంక్రిమెంట్ను వేతన బిల్లుల్లో చేర్చకపోవడం వల్ల తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. రెండో ఇంక్రిమెంట్ ప్రక్రియను వేగవంతం చే యాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, ప్రధాన కార్యదర్శి హనుమాండ్ల శ్రీని వాస్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అత్తినేని శ్రీనివాస్, సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి దేవయ్య రాజేశ్వర్ రావు, పెద్దపల్లి జిల్లా నుండి నరహరి, మహిళా కార్యదర్శి అరుణ, కంకణాల శ్రీనివాస్, నరసింహం, శ్రీకాంత్ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరి ష్కరించాలని కోరుతూ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైకోర్టు ఆదేశాల కాపీని జత పరుస్తూ ప్రభుత్వానికి లేఖ పంపారు. రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల అభిమానుల చారి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్ర మంజుల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.బాబా య్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు పదివేల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామన్నారు. హైకోర్టు రూ.17వేల జీతం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిందని, అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
సన్నబియ్యం.. డీలర్ల పరేషాన్
కరీంనగర్రూరల్: కేంద్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు ఒకేసారి మూడునెలల బియ్యం పంపిణీ చేయాలనే నిర్ణయం డీలర్లకు పెద్ద సమస్యగా మారింది. ఈ పాస్ యంత్రాల్లో నెలకొన్న సాంకేతిక సమస్యతో బియ్యం పంపిణీ ఆలస్యం అవుతోంది. లబ్ధిదారులు గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రేషన్ డీలర్లు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ.. పరిష్కరించకపోవడంతో ఆదివారం జిల్లావ్యాప్తంగా బియ్యం పంపిణీ ప్రక్రియ గందరగోళంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వానాకాలంలో రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు ఇబ్బందులకు గురికావద్దనే ఉద్దేశంతో జూన్, జూలై, ఆగస్టు మాసాల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈపాస్ యంత్రాల్లో 3.2 కొత్త సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి లింక్చేశారు. ఆదివారం నుంచి డీలర్లు బియ్యం పంపిణీ ప్రారంభించారు. ఈపాస్ యంత్రాల్లో నెలకొన్న సాంకేతిక సమస్యతో డీలర్లు ఇబ్బందులకు గురయ్యారు. ఒక్కో లబ్ధిదారుడు మూడు నెలల బియ్యం పొందాలంటే ఈపాస్ మిషన్పై ఆరు పర్యాయాలు వేలిముద్ర వేయాల్సి వస్తోంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి అరగంట సమయం పడుతోందని డీలర్లు పేర్కొంటున్నారు. సర్వర్ స్లోగా ఉండటంతో ఈపాస్ యంత్రాల్లో లబ్ధిదారుల వివరాల నమోదులో జాప్యమేర్పడుతోంది. ఈపాస్ మెషిన్లలో నెలకొన్న సాంకేతిక సమస్యలను సివిల్సప్లై అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు కరీంనగర్ మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు తాటి పూర్ణచందర్రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి నెలకు 5కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం కిలో చొప్పున వేర్వేరుగా బియ్యం కోటాను లబ్ధిదారులకు మంజూరు చేస్తుండటంతో ఒక్కొక్కరు రెండు పర్యాయాలు వేలిముద్ర వేయాల్సి వస్తోందని సివిల్సప్లై అధికారులు తెలిపారు. ఈపాస్ యంత్రంలో సాంకేతిక సమస్య మూడు నెలలకు ఆరుసార్లు వేలిముద్ర ఒక్కో లబ్ధిదారుడికి అరగంట సమయం -
వైభవంగా మహాశక్తి ఆలయ వార్షికోత్సవం
కరీంనగర్ కల్చరల్: కరీంనగర్లోని మహాశక్తి ఆల య పంచాదశ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండిసంజయ్ కుమార్ పాల్గొన్నారు. హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ భారతిస్వామి ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ గణపతి, శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లకు పంచామతాభిషేకం చేశారు. స్వస్తి పుణ్య హవచనం, గణపతి పూజ, అఖండ దీపారాధన, సర్వతో భద్ర మండలం, లక్ష్మీ గణపతి హోమం, రుద్ర సహిత చండీహోమం, పూర్ణాహుతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. విద్యారణ్య భారతిస్వామి మాట్లాడుతూ సనాతన ధర్మమే శాశ్వతమైన ధర్మమని ఉపదేశించారు. నేటితరం తల్లిదండ్రులను గౌరవించాలని, ఆలయాలను సందర్శించాలని, ధర్మాన్ని సంరక్షించాలన్నారు. మాజీ మేయర్ వై.సునీల్రావు, మాజీ కార్పొరేటర్ బండ సుమ, భక్తులు పాల్గొన్నారు. -
సర్దుబాటు చర్యను విరమించుకోవాలి
కరీంనగర్: ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్దుబాటును వెంటనే విరమించుకోవాలని టీపీటీఎఫ్ జి ల్లా అధ్యక్షుడు జంకె రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సంఘ కార్యాలయంలో మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో ప్రాథమిక పాఠశాలలో 30మందికి ఒకరిని, 60మందికి ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తే ఎలా బోధిస్తారని ప్రశ్నించారు. అసంబద్ధమైన ఉత్తర్వును వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. కామన్ స్కూల్ విద్యా విధానా న్ని ప్రవేశపెట్టాలని, ఈ వేసవిలోనే ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు చేపట్టి విద్యా వ్యవస్థ బలోపేతం చేయడానికి ప్రభుత్వం తగువి ధంగా తోడ్పడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకుల వేల్పుల బాలయ్య, అర్కాల శ్రీనివాస్,కిషన్రావు, రామస్వామి, శ్రీధర్, ఆంజనేయరావు, శ్రీనివాస్, చంద్రశేఖర్, రాజమల్లు పాల్గొన్నారు. -
పోలీసులకు సేవా పతకాలు
కరీంనగర్క్రైం: తెలంగాణ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా ప్రభుత్వం విధుల్లో ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసులకు ఆదివారం సేవా పతకాలు ప్రకటించింది. కరీంనగర్ ఎస్బీ ఎస్సై ఎన్.శ్రీనివాస్, ట్రాఫిక్ ఏఎస్సైలు డి.శ్రీ నివాస్, సీహెచ్.రాజన్న, టూ టౌన్ ఏఎస్సై ఎన్.భాస్కరాచారి, కరీంనగర్ రూరల్ ఏఎస్సై సయ్యద్ అమ్జద్, చిగురుమామిడి ఏఎస్సై వి. తిరుపతి, వీణవంక ఏఎస్సై పి.రవి, సీఏఆర్ ఏఆర్ఎస్సై ఎండీ. అబ్దుల్ ఖుద్దూస్, కరీంనగర్ టూటౌన్ హెడ్కానిస్టేబుల్ వి.రాజయ్య, టా స్క్ఫోర్స్ హెడ్కానిస్టేబుల్ బి.విజయసాగర్, పీ టీసీ ఎస్సై ఎం.డీ.నసీమొద్దీన్లకు ఉత్తమసేవా పతకాలు ప్రకటించారు. పీసీఆర్ ఎస్సై జి.రామిరెడ్డి, ఆర్.రవీందర్, మొయిద్అలీ, ఎం.కంఠయ్య, కె.రామచంద్రారెడ్డి, ఎండీ.ఖదీర్, సీ హెచ్.శ్రీనివాస్, ఎం.డీ.ఇక్బాల్, ఏ.శంకరయ్య, ఎం.సుధాకర్, ఎం.యాదగిరి, ఎం.డీ.నజీమొద్దీన్, పి.లక్ష్మీనారాయణ, పి.రాజిరెడ్డి, ఎం.సత్తయ్య, ఎం.రాయిబోస్, పి.రాంప్రసాద్, ఎండీ.భాషు,ఎం.శ్రీనివాసాచారి,ఎం.డీ.కజ్రాపాషా,ఎ.రవీందర్, ఏ.రేణుకానందం, డి.మల్లేశం, వి.బాలరాజు, వి.మల్లారెడ్డి, కె.కరుణాకర్, పి.శ్రీనివాస్, ఎం.డీ.బగ్దాద్, బి.గౌరయ్య, ఆర్.మొగులయ్య, ఎన్.సంపత్, సయ్యద్ గయాజుద్దీన్, ఈ.వేణు, డి.రవీందర్, ఎం.స్వామిరావు, పీటీసీలో పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్, టీజీఎస్పీ విభాగంలో పి.రమేశ్, ఆర్.జాకబ్, సీఐడీ విభాగానికి చెందిన జె.నరేశ్, మండిలాల్కు ఉత్తమ సేవాపతకాల ప్రకటించారు. -
ఇంతకీ ఏ రేటు?
● వాటర్ ట్యాంకర్లలో గందరగోళం ● ప్రైవేట్ ట్యాంకర్కు అమలుకాని రూ.900 రుసుం ● ఇష్టారాజ్యంగా నీటి సరఫరాకరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలకసంస్థ పరిధిలో వాటర్ ట్యాంకర్ల వ్యవహారం గందరగోళంగా మారింది. ప్రైవేట్ ట్యాంకర్లలో ఒక్కోదానికి ఒక్కో రకమైన రుసుం వసూలు చేస్తుండడం వివాదాస్పదమవుతోంది. మున్సిపల్కు చెందిన ట్యాంకర్ల ట్రిప్పుల్లోనూ సరైన లెక్కలు ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. వ్యాపారపరంగా వినియోగించుకుంటున్నందున ప్రైవేట్ ట్యాంకర్లకు ఒక్కోదానికి రూ.900 వసూలు చేయాలనే బల్దియా నిర్ణయం ఇప్పటివరకు అమలుకు నోచుకోవడం లేదు. ట్యాంకర్ల ద్వారా సరఫరా వివిధ అవసరాలకు నిర్ణీత రుసుం తీసుకుని ట్యాంకర్లద్వారా నగరపాలకసంస్థ నీటిని సరఫరా చేస్తోంది. ఇందుకోసం మున్సిపల్ తరఫున హైలెవెల్, లోలెవెల్ జోన్ పరిధిల్లో సొంతంగా ఆరు ట్యాంకర్లు ఉన్నాయి. ఈ ట్యాంకర్ల ద్వారా నీళ్లు కావాలనుకునే వినియోగదారులు రూ.600 రుసుము నగరపాలకసంస్థ కార్యాలయంలో చెల్లిస్తే కోరిన చోటికి నీటిని సరఫరా చేస్తారు. ప్రైవేట్ ట్యాంకర్లు అయితే కార్యాలయంలో రూ.400 చెల్లించి తీసుకున్న రశీదును రిజర్వాయర్లలో చూపించి నీటిని నింపుకోవాల్సి ఉంటుంది. అమలు కాని రూ.900 ప్రైవేట్ ట్యాంకర్లు నగరపాలకసంస్థ నుంచి నీటిని కొనుగోలు చేసి, ఇతర అవసరాలకు అధిక ధరకు విక్రయిస్తాయి. ఇందుకోసం గతంలో ఒక్కో ట్యాంకర్కు రూ.200 మాత్రమే చెల్లించే వాళ్లు. ప్రైవేట్ ట్యాంకర్లు చేసేది వ్యాపారం కావడంతో, ఒక్కో ట్యాంకర్ (4 వేల లీటర్లు, 5 వేల లీటర్ల సామర్థ్యం)కు రూ.900 తీసుకోవాలని గతంలో నగరపాలకసంస్థ సమావేశం తీర్మాణం చేసింది. కాని వివిధ ఒ త్తిళ్ల ఫలితంగా ఇప్పటివరకు అది అమలుకు నోచుకోవడం లేదు. దీనిపై అధికారుల నుంచి స్పందన లేదు. ఒక్కో ట్యాంకర్ ఒక్కో రకంగా ప్రైవేట్ ట్యాంకర్ల వ్యవహారం గందరగోళంగా మారింది. ఒక్కో ట్యాంకర్కు ఒక్కో రకమైన రుసుం వసూలు చేస్తుండడం వివాదాస్పదమవుతోంది. రూ.900 అమలుకు నోచుకోకపోవడంతో, రూ.200 వసూలు చేసిన ట్యాంకర్కు ప్రస్తుతం రూ.400 తీసుకుంటున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రైవేట్ ట్యాంకర్లకు రూ.200 చొప్పున తీసుకుని రిజర్వాయర్లలో నీళ్లను అందిస్తున్నారు. మరి కొన్నింటికి రూ.400 వసూలు చేస్తున్నారు. మీటర్లు బిగిస్తేనే మున్సిపల్ ట్యాంకర్ల విషయంలోనూ అక్రమాలు చోటుచేసుకొంటున్నాయనే ఆరోపణలున్నాయి. రూ.600 చెల్లిస్తే ము న్సిపల్ ట్యాంకర్ను పంపించాల్సి ఉంటుంది. అది కూ డా భవన నిర్మాణాలు లాంటివాటికి వినియోగించరాదు. ఒక ట్యాంకర్ను బుక్ చేసుకుని ఎక్కువ ట్యాంకర్లను తిప్పుతున్నట్లు సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రైవేట్ ట్యాంకర్లు కూడా రశీదు లేకుండానే తిప్పుతున్నట్లు చెబుతున్నారు. ఇది లా ఉంటే మున్సి పల్, ప్రైవేట్ ట్యాంకర్ల అక్రమాలు అరికట్టాలంటే మీ టర్లు, జీపీఎస్ ట్రాకింగ్ను వినియోగించాల్సి ఉంది. రిజర్వాయర్లలో మీటర్లు పెట్టడం ద్వారా ఎన్ని ట్యాంకర్లకు ఎన్ని లీటర్ల నీళ్లు నింపారనే రికార్డు ఉంటుంది. మున్సి పల్ ట్యాంకర్లు ఎక్కడికి వెళుతున్నాయనేది కూడా వెల్లడవుతుంది. దీని ద్వారా అక్రమాలను అరికట్టే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
అమ్మకు భారమైతే.. ఊయల ఆదరిస్తుంది
కరీంనగర్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏటా పదుల సంఖ్యలో చిన్నారులను తల్లిదండ్రులు వదిలేస్తున్న ఘటనలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను పెంచలేని పరిస్థితుల్లో ఉంటే కరీంనగర్లోని శిశువిహార్కు అప్పగించాలని, పోషకాహారం, వసతి సమకూర్చి విద్యను నేర్పిస్తూ కన్నబిడ్డలా కాపాడుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. పెళ్లీడు వచ్చినవారికి పెళ్లి పెద్దగా ఉండి వివాహం సైతం జరిపిస్తామంటున్నారు. ఇటీవల ఓ అమ్మాయికి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి దగ్గరుండి పెళ్లి జరిపించడం విశేషం.వద్దనుకునే వారికి ఊయలరాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ గతంలో ఊయల పథకాన్ని తీసుకువచ్చింది. కరీంనగర్లోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో కలెక్టర్ పమేలా సత్పతి ఊయల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ పథకం గురించి మొదట్లో చాలా మందికి అవగాహన లేకపోగా, కలెక్టర్ విస్తృత ప్రచారం నిర్వహించేలా చొరవతీసుకున్నారు. తల్లిదండ్రులెవరైనా తమ బిడ్డలను పెంచలేని పరిస్థితుల్లో ఉంటే ఆయా జిల్లాల్లోని శిశు గృహాలను సంప్రదించవచ్చు. తల్లిదండ్రులతో అధికారులు మాట్లాడి చిన్నారులను వదులుకోవడానికి గల కారణాలు తెలుసుకుంటారు. అవసరమైతే కౌన్సెలింగ్ ఇస్తారు. అప్పటికీ వారిలో మార్పు రాకుంటే సంరక్షణ బాధ్యత తీసుకుంటారు. కొన్నినెలల తర్వాత మళ్లీ పిలిచి చిన్నారిని తీసుకుంటారా, లేదా అని ఆరా తీస్తారు. అప్పటికీ అంగీకరించకుంటే చిన్నారి పూర్తి సంరక్షణ బాధ్యతను శిశువిహార్ అధికారులు తీసుకుంటారు. తర్వాత దత్తతకు అర్హులైన పిల్లలుగా గుర్తిస్తారు. ఇలా ఏటా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శిశువిహార్కు పదుల సంఖ్యలో చిన్నారులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. శిశువిహార్లో ఉండి ఉన్నత చదువులు అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులను ఎవరైనా దత్తత తీసుకునేందుకు ముందుకొస్తే నిబంధనల ప్రకారం ఆర్థిక నేపథ్యం సహా అన్ని వివరాలు పరిశీలించి అప్పగిస్తున్నారు.దత్తత కోసం విదేశాల నుంచి..ఏటా పిల్లలను దత్తత తీసుకునేందుకు మన ప్రాంతానికి చెందిన వారే కాకుండా విదేశాల నుంచి దరఖాస్తు చేసుకుంటున్నారు. తెలంగాణకు చెందిన ప లువురు దంపతులు 77 మందిని, ఆ్రంధ్రప్రదేశ్లో నలుగురు, తమిళనాడు, కర్ణాటకలో ముగ్గురు చొ ప్పున, మహారాష్ట్రలో ఇద్దరు, ఒడిశా, న్యూ ఢిల్లీలో ఒక్కరు చొప్పున దత్తత తీసుకున్నారు. అలాగే ఇ టలీ దేశం వారు ముగ్గురిని, అమెరికా, సింగాపూర్ వారు ఒక్కరు చొప్పున దత్తత తీసుకోవడం విశేషం.2011 నుంచి 2025 వరకు..2011 నుంచి 2025 వరకు పలువురు దంపతులు 96 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. 2011లో ఏడుగురు, 2012లో ఒక్కరు, 2013లో 9 మంది, 2014లో ఇద్దరు, 2015లో 11 మంది, 2016లో ఏడుగురు, 2017లో ఒక్కరు, 2018లో ఐదుగురు, 2019లో ఐదుగురు, 2020లో ఏడుగురు, 2021లో ముగ్గురు, 2022లో 10 మంది, 2023లో 9 మంది, 2024లో 17 మంది, 2025లో ఇప్పటి వరకు ఇద్దరిని దత్తత తీసుకున్నారు.ఆన్లైన్లో దరఖాస్తులు ఇలా..పిల్లలు లేని దంపతులకు మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిశుగృహలో దత్తత కార్యక్రమం నిర్వహిస్తారు. సీఏఆర్ నిబంధనల ప్రకారం పాన్, ఆధార్, వయస్సు, వివాహ, ఆదాయ ధ్రువపత్రాలు, మెడికల్ సర్టిఫికెట్లు, దంపతుల ఫొటో, సింగిల్ పేరెంట్ అయితే విడాకుల డిక్రీ/మరణ ధ్రువపత్రం, ఇద్దరు వ్యక్తుల సిఫార్సు లేఖలు ఉన్న పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్æ చేయాలి. డాక్యుమెంట్లు అప్లోడ్ అయిన తర్వాత 3 సెట్ల కాపీలు, రూ.6వేలు డీడీని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలి. సీనియారిటీ, అర్హత ప్రకారం కోర్టు ఉత్తర్వులు, బర్త్ సర్టిఫికెట్తో పిల్లలను దత్తత ఇస్తారు.చట్టపరంగా దత్తత తీసుకోవాలిచట్టప్రకారం దత్తత తీసుకుంటే భవిష్యత్తులో సమస్యలు రావు. ఆసక్తి ఉన్న దంపతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. పుట్టిన శిశువు వద్దనుకునే తల్లిదండ్రులు మాతా శిశు కేంద్రంలో ఏర్పాటు చేసిన ఊయలలో వదిలి వెళ్లాలి. – సరస్వతి, జిల్లా సంక్షేమ అధికారి, కరీంనగర్ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండలంలోని గంగారం శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కూనారం గ్రామానికి చెందిన ఎండీ అక్రం(27) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలో మెకానిక్ పని చేస్తూ జీవనం సాగిస్తున్న అక్రం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా ఆటోట్రాలీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అక్రం అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్ పేర్కొన్నారు. మృతుడికి భార్య సమీరాబేగం, తల్లి దండ్రులు రేష్మ బేగం అక్బర్ పాషా ఉన్నారు. -
స్వచ్ఛనగరం కోసం 100 రోజులు
కరీంనగర్ కార్పొరేషన్: నివాసయోగ్యమైన, పర్యావరణ అనుకూల నగరంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వందరోజుల ప్రణాళికను చేపట్టింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు నగరంలో ఈ కార్యక్రమం అమల్లో ఉంటుంది. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దడంతో పాటు, విపత్తులను సైతం ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ప్రణాళికను రూపొందించి అమలు చేయనున్నట్లు నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ తెలిపారు. వందరోజుల పాటు కార్యక్రమాలు.. నగరవ్యాప్తంగా మురుగు నీటి కాలువలు, నాలాల్లో పూడికలు తీయడం, పారిశుద్ధ్యంపై ఇంటింటికి అవగాహన కల్పించడం, హోం కంపోస్టింగ్ తయారు చేయడం, ఇంటి వద్దనే చెత్తను వేరుచేయడం, కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్స్ తదితరాలు తనిఖీ చేస్తారు. రోడ్ల పక్కన పిచ్చి మొక్కలు తొలగించడం, డెంగీ, మలేరియా లాంటి విషజ్వరాల నివారణ చర్యలు, దోమల నియంత్రణ డ్రైవ్, డంపింగ్ యార్డు, పొడిచెత్త, తడిచెత్త ప్రాసెసింగ్ ప్లాంట్ల సందర్శన, బహిరంగ ప్రదేశాలను శుభ్రపరచడం, పాఠశాలలు, కళా శాలల్లో కంపోస్టింగ్ యూనిట్స్ ఏర్పాటు, మున్సి పల్ కార్మికులకు ఆరోగ్య శిబిరాల ఏర్పాటు చేస్తారు. స్వచ్ఛతపై అవగాహనను కల్పించేందుకు స్వఛ్ వాక్ ర్యాలీలు, స్వచ్ఛత, అవార్డులు, క్వీజ్ పెయింటింగ్, రంగోళి పోటీలు, కళా ప్రదర్శనలు, యానిమేషన్ ఫిల్మ్లు, షార్ట్ ఫిల్మ్లు ప్రదర్శిస్తారు. ఆస్తి పన్ను సవరణ, నల్లా కనెనెక్షన్ల ఆన్లైన్ నమోదు, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మేళ, స్ట్రీట్ఫుడ్ ఫెస్టివల్, వీధి విక్రయదారులతో గ్రూపులు ఏర్పాటు చేయడం, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీలు కల్పిస్తారు. ప్రస్తుతం ఉన్న వెండింగ్ జోన్లను సమీక్షించడంతో పాటు, పట్టణ పేద మహిళల గుర్తింపు సర్వే, స్వయం సహాయక సంఘాలు ఏర్పాటుచేస్తారు. లోతట్టు ప్రాంతాలు, గుంతలు నింపడంతో శిథిలభవనాలు తొలగిస్తారు. జంక్షన్లు, పిల్లల పార్క్ల అభివృద్ధి, వనమహోత్సవం, ఇంకుడుగుంతల ఏర్పాటు, వీధి కుక్కల సంతాన నియంత్రణ, నీటిక్లోరినేషన్ పరీక్ష లాంటి కార్యక్రమాలు చేపడుతారు. వలంటీర్లు, సిబ్బందికి శిక్షణ వందరోజుల కార్యక్రమంపై నగరపాలకసంస్థ సిబ్బంది, వలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పేయ్ తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు నోడల్ అధికారులను కూడా నియమిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వంద రోజుల ప్రణాళికపై సీడీఎంఏ దిశానిర్దేశం చేశామన్నారు. ‘ఒక చర్య ఒక మార్పు’ ‘ప్రజలే ముందు’ అనే నినాదాలతో ప్రజల భాగస్వామ్యంతో వందరోజుల ప్రణాళిక విజయవంతం చేస్తామన్నారు. వచ్చేనెల 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు అమలు -
పొగాకుతో గుండెకు ముప్పు
పాన్, గుట్కా, తంబాకు, సిగరెట్లలో నికోటిన్ వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి రక్తనాళాలను సంకుచితం చేస్తాయి. దీంతో రక్తప్రసరణ తగ్గి గుండైపె ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలంగా వీటిని వినియోగించే వారిలో గుండెపోటు, పక్షవాతం, హైపర్టెన్షన్ వంటి తీవ్రమైన కార్డియోవాస్కులర్ సమస్యలు వస్తాయి. పొగాకు వల్ల శరీరంలో శ్రీకోలెస్ట్రాల్శ్రీ స్థాయి పెరిగి, నాళాల్లో శ్రీబ్లాక్శ్రీ ఏర్పడుతుంది. ఇది గుండెకు రక్తసరఫరాను తగ్గించి ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, మితాహారం, వ్యాయామం పాటించడం ఎంతో అవసరం. – డాక్టర్ అనీశ్పబ్బ, కార్డియాలజిస్టు -
పొగాకు నిర్మూలిద్దాం
● విచ్చలవిడిగా తంబాకు, గుట్కా వినియోగం ● బహిరంగంగానే ధూమపానం ● పెరుగుతున్న సిగరేట్లు కాల్చే వారి సంఖ్య ● నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంకరీంనగర్టౌన్: యువత ఎంజాయ్ చేస్తున్నామనే భావనలో ప్రాణాంతక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. సిగరేట్ కాలినట్లే తమ ఆరోగ్యం కాలిపోతుందనే విషయం గమనించలేకపోతున్నారు. జిల్లాలో యుక్తవయస్సు వచ్చిన విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు సిగరేట్, బీడీ, తంబాకు, జర్ధా, గుట్కా వంటి మత్తు పొగాకు మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరదాగా మొదలు పెట్టి చివరకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పొగాకు ఉత్పత్తులపై నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వాటి వల్ల వివిధ రకాల రోగాలు వస్తాయని వైద్యులు చెబుతున్నా తినేవారిలో మార్పు రావడం లేదు. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కథనం.బహిరంగ ధూమపానం నేరం ధూమపానం నష్టాన్ని గుర్తించిన పాలకులు 2003లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరమని చట్టం తీసుకువచ్చారు. చట్ట ప్రకారం ప్రయాణ ప్రాంగణాలు, పార్కులు, రోడ్లపై, సినిమా థియేటర్లు, బహిరంగ ప్రదేశాల్లో పొగతాగితే చట్టరీత్యా చర్యలతో పాటు జరిమానా విధించాలి. కానీ, జిల్లాలో అలాంటి కేసులు నమోదు కావడం లేదు. సిగరేట్ తాగడం ఆరోగ్యానికి హానికరమని ప్యాకెట్లపై ముద్రించి వదిలేస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై మరింత కఠిన నియంత్రణలు విధించాలని, విద్యాసంస్థల పరిసరాల్లో గుట్కా, సిగరెట్ అమ్మకాలు పూర్తిగా నిషేధించాలని ఆరోగ్య కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. -
ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
కరీంనగర్ కార్పొరేషన్: తెలంగాణ ఆవిర్భావ వేడులు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ ఆదేశించారు. శుక్రవారం ఆవిర్భావ వేడుకల సన్నాహక సమావేశాన్ని నగరపాలకసంస్థ కార్యాలయంలోని తన చాంబర్లో నిర్వహించారు. నగరపాలకసంస్థ కార్యాలయంతో పాటు, కళాభారతికి లైటింగ్ వేయాలన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో పాటు నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో నగరంలో చేయాల్సిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపంతో పాటు, జయశంకర్ విగ్రహాన్ని, జంక్షన్ను పూలతో అలంకరించాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో నగరపాలకసంస్థ సహాయ కమిషనర్ వేణు మాధవ్, ఈఈ సంజీవ్ కుమార్, డీఈలు అయ్యూబ్ఖాన్, వెంకటేశ్వర్లు, ఏఈలు సతీశ్, గఫూర్ పాల్గొన్నారు.సమీక్షతో ఒరిగిందేమీ లేదుమానకొండూర్: జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమకుమార్రెడ్డి కరీంనగర్లో నిర్వహించిన సమీక్షతో జిల్లాకు ఒరిగింది ఏమీ లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు అన్నారు. మానకొండూర్లో శుక్రవారం మాట్లాడుతూ.. ప్రజాపాలనలో లక్షలాది దరఖాస్తులు వచ్చాయని, గ్రామసభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కాని ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసి, స్థానిక కాంగ్రెస్ నాయకులను ఇందిరమ్మ కమిటీల్లో సభ్యులుగా నామినేట్ చేసిందన్నారు. సిబిల్ స్కోర్ ద్వారా లబ్ధిదారులకు రుణాలకు ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. రాజీవ్ యువశక్తి కాదని కాంగ్రెస్ యువశక్తిగా మారిందన్నారు. రైతుబంధు ద్వారా ఎంతమంది రైతులకు ప్రయోజనం చేకూరిందో లెక్కలేదన్నారు. వ్యవసాయ విత్తనాలు, ఎరువుల లభ్యతపై స్పష్టత లేదన్నారు. సమరశీల పోరాటాలకు సిద్ధంకరీంనగర్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సీపీఐతో స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ ప్రజాసమస్యలపై ప్రజలపక్షాన సమరశీల పోరాటాలకు సిద్ధమయ్యామని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి వెంకటస్వామి పేర్కొన్నారు. కరీంనగర్ బద్ధం ఎల్లారెడ్డి భవన్లో శుక్రవారం జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్తో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో 16నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. బీజేపీని అడ్డుకోవాలంటే కమ్యూనిస్టులు రాజకీయ ప్రత్యామ్నాయం వైపు ఆలోచించాలన్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోనే ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. సీఎం, హోం మినిస్టర్ వాడాల్సిన హెలికాప్టర్ను మంత్రులందరూ వినియోగించుకుంటూ వృథా ఖర్చు చేస్తున్నారన్నారు. జిల్లాలో సీపీఐ పార్టీని నిర్మాణపరంగా విస్తరించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పొనగంటి కేదారి, అందె స్వామి, కసిరెడ్డి సురేందర్రెడ్డి, గూడెం లక్ష్మి, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, కిన్నెర మల్లవ్వ, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కంది రవీందర్రెడ్డి, అందె చిన్న స్వామి, బావండ్లపల్లి యుగంధర్, మచ్చ రమేశ్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తా సీపీఐ జిల్లా నూతన కార్యదర్శిగా పంజాల శ్రీనివాస్ శుక్రవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్లో బాధ్యతలు స్వీకరించారు. మాజీ కార్యదర్శి మర్రి వెంకటస్వామితో పాటు నాయకులు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, కార్యదర్శిగా తన ఎన్నికకు సహకరించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి పనిచేస్తానని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో బలము న్న చోట పోటీ చేసి పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేలా కృషి చేస్తానని వివరించారు. అలాగే కరీంనగర్లో ఏడాదిన్నర క్రితం కేటాయించిన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. -
అంజన్న హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపును శుక్రవారం ఆలయ అధికారి శ్రీకాంత్, పర్యవేక్షణాధికారి రాజమౌలి ఆధ్వర్యంలో చేపట్టారు. 24 రోజులకుగాను హుండీ ఆదాయం రూ.1,00,95,392 సమకూరిందని, 44 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు. భక్తులు హుండీలో వేసిన మిశ్రమ బంగారం, వెండికి సీలువేసి,తిరిగి హుండీలో వేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు రామకృష్ణ, స్థానాచార్యుడు కపీందర్, పర్యవేక్షకుడు సునీల్కుమార్, ఎన్.చంద్రశేఖర్, హరిహరనాథ్, ఆలయ సిబ్బంది, ఏఎస్సై శ్రీనివాస్, శ్రీలలిత సేవా ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. ఉరేసుకుని ఒకరి ఆత్మహత్యమల్యాల: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన బేతి కృష్ణ(38) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. వైద్య చికిత్స కోసం లక్షలు ఖర్చు చేసినా, వ్యాధి నయం కాకపోవడంతోపాటు జీవితంపై విరక్తి చెందిన తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి తల్లి సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. బావిలో పడి వృద్ధుడు మృతిసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): చొప్పదండి మండలం రుక్మాపూర్కు చెందిన లంక ముత్తయ్య(70) సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపిన వివరాలు.. ముత్తయ్యకు కొడుకు, కూతురు ఉండగా కూతురు నర్సయ్యపల్లిలో ఉంటోంది. అనారోగ్యంతోపాటు మతిస్థిమితం సరిగా లేని ముత్తయ్య నెలరోజుల క్రితం కూతురు ఇంటికి వచ్చాడు. ఈనెల 18న ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. ఈక్రమంలో అతడు ఇంటికి వెళ్లకపోవడంతో బంధువులు ఇళ్లలో, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం నర్సయ్యపల్లి శివారులోని వ్యవసాయ బావిలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కనబడడంతో ముత్తయ్యగా కుటుంబసభ్యులు నిర్ధారించారు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆవిర్భావ పండుగ అతిథులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జరిగే జాతీయ పతాక ఆవిష్కరణ పండుగకు జిల్లా కేంద్రాల్లో జరిగే ఉత్సవాలకు అతిథులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్లో జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, జగిత్యాలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, పెద్దపల్లికి రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, రాజన్న సిరిసిల్లకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్లు జెండా ఆవిష్కరించనున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
● డీఈవో శ్రీరామ్ మొండయ్యకరీంనగర్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నాణ్యమైన, గుణాత్మక విద్య లభిస్తుందని, పాఠశాలల బలోపేతానికి ఎస్జీటీయూ ఉపాధ్యాయ సంఘం ఆరు రోజుల పాటు బడిబాట ప్రచార రథాన్ని నిర్వహించడం అభినందనీయమని డీఈవో శ్రీరామ్ మొండయ్య అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల నమోదు కోసం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల ఉమ్మడి జిల్లా ప్రచార రథాన్ని డీఈవో శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. జూన్ 5 వరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలన్నారు. ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్రెడ్డి మాట్లాడుతూ, న్యాయపరంగా రావాల్సిన హక్కుల కోసం ఉద్యమిస్తామని, ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సెక్టోరియల్ ఆఫీసర్ అశోక్రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని, విద్యార్థులు తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో విజయేందర్రెడ్డి, మంజుల హరిప్రియ, రమణారెడ్డి, సత్యం, కిషన్, సుధాకర్రావు, గాయత్రి, రోహిణిదేవి, సాగర్, మాధవ్, రామన్, వెంకటేశ్, అరవింద్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
బావిలో పడిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి
మల్లాపూర్: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ట్రాక్టర్ పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలకేంద్రం శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మాట్ల చిన్నపెద్దులు(61)కు భార్య సత్తమ్మ, కుమార్తె ఉన్నారు. ఉపాధి నిమిత్తం గతంలో గల్ఫ్ వెళ్లి వచ్చి కుమార్తె వివాహం జరిపించాడు. ఎనిమిదేళ్లుగా స్వగ్రామంలోనే ఉంటూ ట్రాక్టర్ నడిపించుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన శనిగారపు రమేశ్కు చెందిన వ్యవసాయ భూమిలో చిన్నపెద్దులు ట్రాక్టర్తో దుక్కి దున్నుతున్నాడు. రివర్స్ వెళ్లే క్రమంలో ట్రాక్టర్ వ్యవసాయబావిలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. నీటమునిగి చిన్నపెద్దులు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతుడి భార్య సత్తెమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై రాజు తెలిపారు. -
సేవ.. స్వచ్ఛంద తోవ
● రాజన్న సేవలో మహిళలు ● ఆలయంలో వివిధ పనులకు స్వచ్ఛందంగా హాజరు ● గోశాలలోని గడ్డి ఆరబెట్టేందుకు తరలివచ్చిన అతివలు వేములవాడ: రాజరాజేశ్వరీ సేవా సమితి సభ్యులు రాజన్న సేవలో తరిస్తున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో వివిధ పనులకు స్వచ్ఛందంగా హాజరవుతున్నారు. హుండీ లెక్కింపు.. ఉత్సవాల సమయాల్లో ఆలయంలో వివిధ సేవల్లో రాజరాజేశ్వరీ సేవా సమితి సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన తిప్పాపూర్ గోశాలలోని గడ్డిని ఆరబెట్టేందుకు సైతం శుక్రవారం భారీగా మహిళలు స్వచ్ఛందంగా వచ్చారు. పశువులకు సేవా చేయడంలో ఉన్న సంతృప్తి వేరేదాంట్లో రాదని వారు పేర్కొంటున్నారు. దాదాపు 63 మంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చి కోడెలకు ఉపయోగపడే గడ్డిని ఆరబెట్టే పనుల్లో నిమగ్నమై.. ఆదర్శంగా నిలిచారు. -
పీసీసీలో మనోళ్లకు చోటు
● పీఏసీ కమిటీలో దుద్దిళ్ల, పొన్నం, ఆది ● కేబినెట్లో చోటు కోసం ఉమ్మడి నేతల ఆరాటంసాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన వివిధ పీసీసీ కమిటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రికి చోటు దక్కింది. పీసీసీ కమిటీల్లో కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్లను నియమించారు. కాగా.. ఇటీవల కొంతకాలంగా పార్టీ పెద్దల తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డికి సలహా కమిటీలో అవకాశం కల్పించారు. అదేవిధంగా డీలిమిటేషన్ కమిటీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలను సభ్యులుగా నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలవగా, అందులో నలుగురికి పీసీసీ కమిటీల్లో అవకాశం లభించింది. మంత్రి వర్గంలో ఆది.. మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు మరో బెర్తు ఖాయంగా కనిపిస్తోంది. కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నారు. మున్నూరుకాపు సామాజికవర్గం కోణంలో బెర్తు ఖాయమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. మాదిగ సామాజిక వర్గం తరఫున తమకూ చోటు కల్పించాలని మరో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు కోరుతున్నారు. మరోవైపు తనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఇటీవల రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరిన విషయం విధితమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటికే దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లు కేబినెట్లో ఉన్నారు. వీరికి తోడుగా మరో ఒక్క బెర్తు మాత్రమే ఖరారయ్యే అవకాశాలు ఉండటంతో ఈ ఒక్క మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. -
వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతం
కొత్తపల్లి(కరీంనగర్): టీపీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలో విద్యుత్ వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతమైందని ఎస్ఈ మేక రమేశ్బాబు అన్నారు. విద్యుత్ భవన్లోని ఎస్ఈ చాంబర్లో శుక్రవారం ఉద్యోగులు, సిబ్బందిని అభినందించారు. గత సంవత్సరం నవంబర్ నెల నుంచి వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకొని.. అందుకనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడంతో విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించామన్నారు. లోడ్ పెరిగే అవకాశమున్నచోట్ల రాచర్ల తిమ్మాపూర్, మొయినకుంట, జేపీనగర్, బోనాల, మల్లారం, రేణిగుంట ప్రాంతాల్లో 5 ఎంవీఏ, కరీంనగర్ టౌన్ బ్యాంక్ కాలనీలో 12.5 ఎంవీఏ కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లు నెలకొల్పామని, కరీంనగర్ టౌన్ ఉజ్వల పార్క్, వాటర్ వర్క్స్, ఎస్ఆర్ఆర్, నవపేట్, వీర్నపల్లి ప్రాంతాల్లో 5 ఎంవీఏ నుంచి 8 ఎంవీఏ, సప్తగిరికాలనీ సాయినగర్(ఖాజీపూర్–2)లో 8 ఎంవీఏ నుంచి 12.5 ఎంవీఏ, కోర్కల్, వట్టములలో 3.15 నుంచి 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం వరకు పెంచామని వివరించారు. కరీంనగర్ మున్సిపల్ టౌన్, కాజిపూర్(బాబుపేట్), చిగురుమామిడి, సిరిసిల్ల జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి లోడ్ సామర్థ్యం పెంచడంతో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నివారించగలిగామని చెప్పారు. ఇప్పటివరకు 325 కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతోపాటు 355 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచినట్లు పేర్కొన్నారు. కరీంనగర్ మున్సిపల్ టౌన్, కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో అల్గునూరు, చిగురుమామిడి, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర ప్రాంతాల్లో ఓవర్ లోడ్ తగ్గించామని, గత నవంబర్ నెల నుంచి నిరంతరాయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటూ వేసవికాల ముందస్తు కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేశామని తెలిపారు. -
‘బంటియా’ ఫర్నీచర్ షోరూం ప్రారంభం
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ఎదురుగా నూతనంగా ఏ ర్పాటు చేసిన బంటియా ఫర్నీచర్ షోరూంను శు క్రవారం బంటియా మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ బంటియాతో కలిసి సుడా చైర్మన్ కె.నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేందర్ బంటియా మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు పొందిన బంటియా ఫర్నీచర్స్ ఇప్పుడు కరీంనగర్లో తన అతిపెద్ద షోరూంను గ్రాండ్గా ప్రారంభించినట్లు తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి దిగుమతి చేసిన తాజా, నాణ్యమైన ఫర్నిచర్ ఉత్పత్తులను అందిస్తున్నామని అన్నారు. రూ.99,999కి పైగా కొనుగోలు చేసే కస్టమర్లకు హోండా యాక్టివా 6జీ ఉచితంగా ఇవ్వడంతో పాటు ప్రత్యేక బహుమతులు, డిసౌంట్లు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే విద్యుత్ ఆధారిత రీకై ్లనర్లు రూ.99,999లకు లభిస్తాయన్నారు. క్రేవింగ్ సోఫాలు రూ. 66,000 నుంచి ప్రారంభమవుతాయని, ప్యాకేజీలు, జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
శాతవాహనలో న్యాయ విద్య
కరీంనగర్క్రైం: లా చదవాలనే విద్యార్థులు కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ న్యాయ కళాశాల లేకపోవడంతో చాలా ఇబ్బందులుపడ్డారు. కాగా, ఇటీవల శాతవాహన యూనివర్సిటీకి న్యాయ కళాశాల మంజూరు కావడంతో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. బీసీఐ నుంచి గ్రీన్లిగ్నల్ దేశవ్యాప్తంగా ఎక్కడ లా కళాశాల ఏర్పాటు చేయాలన్నా స్థానిక ప్రభుత్వ అనుమతితో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) అనుమతి కీలకం. ఈనేపథ్యంలో శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలని 11 నవంబర్ 2024న వైస్ చాన్స్లర్ నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈక్రమంలో శాతవాహనలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం తరగతులు నిర్వహించేందుకు ఫిబ్రవరి 2025లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు జారీ చేసింది. దీంతో ఎల్ఎల్బీ తరగతులకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. న్యాయకళాశాల భవన నిర్మాణం, ఇతరత్రా అవసరాలకు సుమారు రూ.22 కోట్లు మంజూరయ్యాయి. భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలోని మొదటి అంతస్తులో తరగతులు నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల టీచింగ్, నాన్టీచింగ్ కోసం 35 పోస్టులు అవసరం ఉండడంతో వీటి కేటాయింపునకు కేబినెట్లో ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. కేబినెట్ సమావేశం కాగానే పోస్టుల భర్తీ జరుగుతుందని యూనివర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి. పట్టా చేతిలో ఉంటే పుట్టెడు మార్గాలు ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పట్టా చేతిలో ఉంటే ఉపాధికి పుట్టెడు మార్గాలుంటాయి. సొంతంగా ఎవరి మీద ఆధారపడకుండా లా ప్రాక్టిస్ చేసుకోవడంతో పాటు వివిధ కంపెనీలకు లీగల్ అడ్వైజర్లుగా ఉండడం, జిల్లా జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇవే కాకుండా ఇతర శాఖల్లో కూడా లా చదివిన వారిని వివిధ కమిషన్ మెంబర్లు, కమిటీ మెంబర్లుగా నియమితులయ్యే అవకాశాలున్నాయి. ఎల్ఎల్ఎం చేసిన వారు ఎల్ఎల్బీ తరగతులు చెప్పడంతోపాటు ఇతర అవకాశాలు ఉండడంతో చాలా మంది న్యాయవిద్యపై ఆసక్తి చూపిస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీ వ్యాప్తంగా లా కాలేజీలు రెండు మాత్రమే అవి కూడా ప్రైవేట్ కళాశాలలు మాత్రమే నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఎస్యూలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటు కావడంతో ఇక్కడి ప్రాంత విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందని విద్యార్థి సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. ఎల్ఎల్బీలో 120, ఎల్ఎల్ఎం 20 సీట్లు రూ.22కోట్లతో భవన నిర్మాణ, మౌలిక సదుపాయాలు త్వరలో 35 మంది టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఈ అకడమిక్ నుంచే తరగతులు ప్రారంభం కోర్సు సెక్షన్లు సీట్లు ఎల్ఎల్బీ 2 120 ఎల్ఎల్ఎం 1 20 ఈ సంవత్సరం నుంచే తరగతులు శాతవాహన యూనివర్సిటీకి న్యాయ కళాశాల మంజూరైంది. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి ఆర్ట్స్ కళాశాలలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభిస్తున్నాం. భవనాలు నిర్మించిన తర్వాత శాశ్వతంగా ప్రత్యేక వసతి సౌకర్యాలు ఉంటాయి. – ప్రొఫెసర్ ఉమేశ్కుమార్, శాతవాహన వీసీ -
అల్లిబిల్లి సోకులాడి సిట్టమ్మి
● ఇటు చదువు.. అటు పాటలు ● జానపదగేయాలతో రాణిస్తున్న కట్కూరి స్నేహ ● 40కి పైగా పాటలు రాసిపాడిన యువతి ‘దూసుకోను దువ్వెన తెమ్మంటది.. చూసుకోను అద్దం తెమ్మంటది.. కాటుక తెమ్మంటది.. కాళ్లకు పెట్టుమంటది.. అల్లిబిల్లి సోకులాడి సిట్టమ్మి..’ ‘బావో నా బంతి పూల దండ.. నిన్న చూస్తుంటే నా గుండెల గుదిబండ..’ అంటూ స్నేహ పాడితే యువత గుండెలు జారిపోతున్నాయి. ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ జానపద పాటను రాసి, పాడింది రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన కట్కూరి స్నేహ. చదువుకుంటూనే పాటలు రాస్తున్న యువజానపద గాయని గురించి తెలుసుకుందాం.. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన కట్కూరి స్నేహ కరీంనగర్లో ఎంఫార్మసీ చదువుతోంది. ఇప్పటి వరకు 40కి పైగా జానపద గేయాలు రాసి, పాడింది. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న పాటల్లో చాలా మటుకు స్నేహ రాసి, పాడినవే. హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో బాలల దినోత్సవం సందర్భంగా మండల స్థాయిలో నిర్వహించిన పాటల పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచింది. ఈ పోటీలు ఆమెను పాటలు పాడడం వైపు మళ్లించాయి. బీ ఫార్మసీ చదువుతుండగా తనకు పాటలు రాయాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 40కి పైగా పాటలు, రాసి పాడింది. శేఖర్ మాస్టర్ కావాలంటే ఇటీవల రాసి, పాడిన ‘అల్లిబిల్లి సోకులాడి సిట్టమ్మి..’ పాట మంచి పేరు తెచ్చిందని పేర్కొంది. చదువుకుంటూనే పాటలు రాస్తానని స్నేహ చెప్పింది. సినిమా పాటలు పాడాలనేది తన జీవిత ఆశయమని పేర్కొంది. -
రైతు వద్దకు శాస్త్రవేత్తలు
సైదాపూర్: వ్యవసాయ క్షేత్రాలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు వెళ్లి రైతులకు వారి అనుభవాలతోపాటు నూతన విధానాలను వివరిస్తూ సాగులో మెలకువలు నేర్పుతారని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అన్నారు. రైతు బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశం మేరకు ఈనెల 5 నుంచి గ్రామాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతుల వద్దకెళ్లి నూతన వ్యవసాయ పద్ధతులను వివరిస్తున్నారన్నారు. ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తున్న భారత్లో మరింత వ్యవసాయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ పథకాన్ని కరీంనగర్ జిల్లా సైదాపూర్లో గురువారం కోదండరెడ్డి ప్రారంభించారు. జమ్మికుంట కేవీకే శాస్త్రవేత్త వెంకటేశ్వర్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని 700 జిల్లాల్లో 2వేలకు పైగా శాస్త్రవేత్తల బృందాలు సుమారు 1.5కోట్ల రైతుల వద్దకు వెళ్లనున్నారన్నారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ఈనెల 29 నుంచి జూన్ 12 వరకు శాస్త్రవేత్తలు పర్యటిస్తారని అన్నారు. ఇప్పటికే తెలంగాణలో ముఖ్యమంత్రి ఆదేశం మేరకు నెల రోజులుగా శాస్త్రవేత్తల బృందాలు పర్యటిస్తున్నాయన్నారు. విత్తన తయారీకి తెలంగాణలో కరీంనగర్ గుండెకాయ లాంటిదని అన్నారు. త్వరలోనే ప్రతీ గ్రామంలో వ్యవసాయంపై అనుభవమున్న రైతును ఆదర్శ రైతుగా ఎంపిక చేసి గ్రామానికో భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొండా లక్ష్మణ్ వ్యవసాయ యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ రాజిరెడ్డి, కోరమాండల్ ప్రతినిధి సుబ్బారెడ్డి, ఇఫ్కో ప్రతినిధి బాలాజీ, జైపాల్రెడ్డి, శాస్త్రవేత్తలు షేక్యన్ మీరా, డా.కేశవులు, సాయిరెడ్డి, సుందరం, చటర్జీ, సైదాపూర్ ఏఎంసీ చైర్మన్ సుధాకర్, ఎల్ఎస్సీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఏవో వైదేహీ, రైతులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సైదాపూర్లో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ పథకం ప్రారంభం -
ఎన్నాళ్లు నకిలీ మకిలీ!
● టాస్క్ఫోర్స్ కమిటీల జాడేది? ● నకిలీ విత్తన దందాలో అక్రమార్కులు ● ఏటా రైతన్నకు శఠగోపం ● ప్రచారం లేదు.. తనిఖీల్లేవ్..నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలి. ఎంతటివారినైనా ఉపేక్షించొద్దు. టాస్క్ఫోర్స్ టీంలు సమన్వయంతో పనిచేసి కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట వేయాలి. – ఇటీవల సీఎం రేవంత్రెడ్డిగతంలో కరీంనగర్లో వెలుగుచూసిన నకిలీ బాగోతమిది. పోలీసులు భారీ ఎత్తున కల్తీ విత్తనాలను పట్టుకున్నారు. క్వింటాళ్లలో దొరకగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సాక్షాత్తు జిల్లాకేంద్రంలోనే నకిలీ దందా సాగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. వ్యవసాయ శాఖ డొల్లతనాన్ని చాటింది. -
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
కరీంనగర్టౌన్: జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు లింగ నిర్ధారణ చేస్తే పూర్వ, గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టం –1994 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వెంకటరమణ హెచ్చరించారు. డీఎంహెచ్వో చాంబర్లో గురువారం నిర్వహించిన జిల్లా సలహా కమిటీ సమావేశంలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై సమీక్షించారు.ఐదు స్కానింగ్ సెంటర్లకు నోటీసులు..లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని అతిక్రమించిన ఐదు స్కానింగ్ సెంటర్లకు ఈనెలలో నోటీసులు జారీచేసినట్లు డీఎంహెచ్వో తెలిపారు. అంతేకాదు.. జిల్లావ్యాప్తంగా స్కానింగ్ సెంటర్లు, మెటర్నిటీ హోంలు, ఫెర్టిలిటీ కేంద్రాల్లో తనిఖీలు చేస్తున్నామని అన్నారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. జిల్లాలోని 16 మండలాల్లో తనిఖీలు చేపడతామని, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, నిర్వాహకుల క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, లింగనిర్ధారణ చట్టం అమలవుతున్న తీరు, స్కానింగ్ మిషనరీల అనుమతులు పరిశీలిస్తున్నామని వివరించారు.ఎస్యూలో మొదటి దశలో 5,931 డిగ్రీ సీట్ల భర్తీకరీంనగర్క్రైం: శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని దోస్త్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 5,931 డిగ్రీ కోర్సుల సీట్ల భర్తీ జరిగింది. ఎస్యూ పరిధిలో మొత్తం 36,540 సీట్ల ఉండగా మొదటి దశలో 5,931 సీట్లు భర్తీ కాగా 30,609 సీట్లు ఖాళీగా మిగిలాయి. 13 ప్రభుత్వ కళాశాలల్లో 297 సీట్లు భర్తీకాగా, 3 ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలల్లో 2,047 సీట్లు భర్తీ అయ్యాయి. ఇదిలా ఉండగా 60 ప్రైవేట్ కళాశాలల్లో కలిపి 3,587 మంది విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరిగింది. మొదటిదశలో సీట్లు పొందిన వారు జూన్ 6వ తేదీలోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్లు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.జిల్లా సమాచారంమొత్తం స్కానింగ్ సెంటర్లు 195మూసివేసినవి 53నిర్వహిస్తున్నవి 142ఈనెలలో నోటీసులు ఇచ్చినవి 05 -
నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు
జగిత్యాలక్రైం: జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో గురువారం నేర సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల పురోగతి, తాజా నేరాల విశ్లేషణ, నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, రాత్రివేళల్లో గస్తీ బలోపేతం, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలపై సమీక్షించారు. బక్రీద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. గోవధ, గోవుల అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. గోదావరి పరీవాహక రైతులకు నకిలీ పత్తి విత్తనాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీంను ఏర్పాటు చేసి అమ్మకాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. అనంతరం హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు, విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందించారు. అదనపు ఎస్పీ భీంరావు, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, రంగారెడ్డి, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ప్రత్యేక నిఘా బక్రీద్కు ఏర్పాట్లు పూర్తి చేయాలి నేర సమీక్షలో ఎస్పీ అశోక్కుమార్ -
కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ల రద్దు
గంగాధర(చొప్పదండి): కొత్తపల్లిలోని సీలింగ్ భూముల్లో అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్ల రద్దు ప్రక్రియ గంగాధర సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ సమక్షంలో కొనసాగుతోంది. 476 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని అధికారుల విచారణలో తేలగా గురువారం సాయంత్రం వరకు దాదాపు 150 రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్తపల్లిలోని సర్వే నంబర్ 175,197,198లో 20 ఎకరాల భూమి 30 ఏళ్లుగా సీలింగ్లో ఉంది. సదరు భూమిలో ఎలాంటి క్రయవిక్రయాలు జరపరాదని కోర్టు ఆర్డర్ ఉండగా, అందులో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని లోక్సత్తా ఆధ్వర్యంలో పోరాటం మొదలైంది. సీలింగ్ భూముల్లో లావాదేవీలు జరపవద్దని నిషేధిత జాబితాలో చేర్చాలని 1997, 1998, 2006, 2011, 2016లో కలెక్టర్ కార్యాలయం నుంచి కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి నోటీసులు పంపినా.. 2016 వరకు 424 రిజిస్ట్రేషన్లు చేశారని, గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 52 రిజిస్ట్రేషన్లు జరిగాయని లోక్సత్తా ఆరోపించింది. అయినా ఎవరూ పట్టించుకోక పోవడంతో లోకాయుక్తను ఆశ్రయించారు. లోకాయుక్త ఆదేశాల మేరకు అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా రిజిస్ట్రార్కు పదిరోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. అక్కడి నుంచి గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆదేశాలు జారీ కావడంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో రద్దు ప్రక్రియ కొనసాగుతోంది.పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్నందున శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ రాంనగర్ ఫీడర్ పరిధిలోని పద్మనగర్, పారమిత హెరిటేజ్ స్కూల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. -
కస్తూర్బాలకు ‘ఇంటర్’ వెలుగులు
కరీంనగర్: కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో పేద, అనాథ బాలికలు చదువుతారు. ఇక్కడ పదో తరగతి వరకు చదివిన బాలికలు కొన్నిచోట్ల ఇంటర్మీడియెట్ లేకపోవడంతో విద్యకు దూరమవుతున్నారు. దీనిని గుర్తించిన విద్యాశాఖ 2025–26 సంవత్సరానికి జిల్లాలో మరో రెండుచోట్ల ఇంటర్కు అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు. కస్తూర్బాల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన బాలికలు ఇంటర్మీడియెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వసతి.. నాణ్యమైన విద్య కస్తూర్బా పాఠశాలల్లో ప్రత్యేకాధికారులు, బోధకులు తాత్కాలిక పద్ధతిన పనిచేస్తారు. ఈ విద్యాలయాల్లో వసతితో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ఇక్కడి విద్యార్థినులు 2024–25 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియెట్లో ఎనిమిది కేజీబీవీల్లో వందశాతం ఫలితాలు సాధించారు. ఇప్పటికే కస్తూర్బాల్లో ఇంటర్ అమలవుతుండగా మరో రెండుచోట్ల అవకాశం కల్పించారు. జిల్లాలోని 14 కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరం చిగురుమామిడి, తిమ్మాపూర్ కేజీబీవీల్లో రెండు కొత్త కోర్సులైన అకౌంట్స్, ట్యాక్సేషన్ను ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశాలు జరుగనున్నాయి. జూన్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒక్కో పాఠశాలకు 80 సీట్లు కేటాయిస్తారు. అనాథ, పేద బాలికలు వీటిలో చదువుకునే అవకాశం కల్పిస్తారు. కొత్త కోర్సులకు అవకాశం కస్తూర్బాల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్ డబ్ల్యూ కోర్సులు మాత్రమే అమలుచేసేవారు. వచ్చే ఏడాదినుంచి మరిన్ని కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎంఎల్టీ, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను కూడా కేజీబీవీల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. రానున్న విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులతో పాటు పాత కోర్సులకు అడ్మిషన్లు జరుగనున్నట్లు అధికారులు వెల్లడించారు. బాలికలు చదువుతో పాటు ఇతర రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తారు. పాఠశాల చదువుకు భిన్నంగా.. కస్తూర్బాల్లో పాఠశాలలకు భిన్నంగా చదువు కొనసాగనుంది. ఇక్కడ చదివేవారికి వసతి సహా మూడు పూటలా పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తారు. బాలికలకు ప్రత్యేకంగా ఉచిత దుస్తులు, కాస్మోటిక్ కిట్లు, దుప్పట్లు అందజేస్తారు. వేసవిలో కరాటే శిక్షణతో పాటు, ఆంగ్ల భాష నేర్చుకోవడం, బృంద చర్చలు, నృత్యాలు, చిత్రలేఖనం వంటి వాటిపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. బాలికలు సమాజంలో ఎలా ఉండాలి. జీవితంలో ఏదైనా సాధించవచ్చో, ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కొనేలా వారిని తీర్చిదిద్దుతారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఇప్పటికే ఎనిమిది కేజీబీవీల్లో కొనసాగుతున్న ఇంటర్మీడియెట్ కోర్సులు మరో రెండు కేజీబీవీలను అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులుత్వరలో అడ్మిషన్లు ఇప్పటికే జిల్లాలోని ఎనిమిది కస్తూర్బా పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్య అమలవుతోంది. తాజాగా మరో రెండు చిగురుమామిడి, తిమ్మాపూర్ కేజీబీవీలను పాఠశాలల్లో ఇంటర్ ప్రారంభించేందుకు అనుమతి వచ్చింది. రెండు కొత్త కోర్సులు అకౌంట్స్, ట్యాక్సేషన్లను ప్రవేశపెట్టింది. వీణవంక, సైదాపూర్, కొత్తపల్లి, గన్నేరువరం కేజీబీవీలు మినహా మిగతా వాటిల్లో ఇంటర్మీడియెట్కు అనుమతులు లభించాయి. జూన్లో తరగతులు ప్రారంభిస్తాం. త్వరలో అడ్మిషన్ల ప్రక్రియ చేపడతాం. –కృపారాణి, సెక్టోరియల్ అధికారి -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఇందిరమ్మ ఇళ్లను అర్హులకే కేటాయించాలని.. అనర్హులకు ఇస్తే అధికారులపై చర్యలు తప్పవని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, ధాన్యం కొనుగోలు వానాకాలం పంటలసాగు సన్నద్ధతపై కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఖరీఫ్ సీజన్లో ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రణాళికలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను భాగస్వామ్యం చేస్తాం.ఎస్సారెస్పీ సామర్థ్యం సిల్ట్ కారణంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం ఎస్సారెస్పీ రిజర్వాయర్ పూడికతీత, డీసిల్టేషన్ ఆధునిక పద్ధతుల్లో పూర్తిచేసి పూర్వపు సామర్థ్యం తీసుకొస్తాం. కడెం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో సిల్ట్ తొలగించేందుకు అత్యాధునిక పద్ధతులను వినియోగిస్తాం. కరీంనగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తా.. ఇందుకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహకారంతో ముందుకు వెళ్తా. సింగరేణి భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. బండ్ల వాగు ఎత్తిపోతల పథకాన్ని వారం రోజులలో ప్రారంభిస్తాం. పాలకుర్తి ఎత్తిపోతల పథకం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణ పనులకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.● రోళ్లవాగు ప్రాజెక్టు అటవీ అనుమతులు వచ్చేలా ఉన్నతాధికారులతో జగిత్యాల కలెక్టర్ నిరంతరం సంప్రదింపులు చేయాలని మంత్రి సూచించారు. నారాయణపురం రిజర్వాయర్, కొండగట్టు ఎత్తిపోతల పథకం, కలికోట సూరమ్మ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలుచేస్తుందన్నారు. కలెక్టర్లు మరోవారం కొనుగోలు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అవసరమైనమేర ధాన్యం రవాణా కోసం వాహనాలు సిద్ధం చేసుకోవాలని.. లారీల కొరత ఉంటే ట్రాక్టర్లు వాడాలన్నారు. దేశంలో మొదటిసారిగా తెలంగాణలోని 84 శాతం జనాభాకు ఉచితంగా ఆరుకిలోల సన్నబియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది విప్లవాత్మక పథకమని.. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకై క రాష్ట్రం మనదే అని తెలిపారు.ఇళ్ల స్థలాలపై ఆందోళన వద్దు..మీడియా మిత్రులకు ఎస్సారెస్పీ సమీపంలో అందుబాటులో ఉన్న భూములు పంపిణీకి ఉన్న సమస్యలు పరిష్కరించి త్వరలోనే ఇంటి పట్టాలు కేటాయిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. కరీంనగర్ మీడియా మిత్రులు ఇండ్ల పట్టాల పంపిణీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో చర్చించి త్వరలో పట్టాలు అందించే కార్యక్రమం చేపడుతామని పేర్కొన్నారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగిందన్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.51 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అకాల వర్షాలతో రైతుల నష్టపోకుండా అవసరమైన టార్ఫాలిన్ కవర్లు కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు. భూ భారతి చట్టంతో పట్టాదారులకు ఎటువంటి నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో రైస్ మిల్లులవద్ద తూకం పేరుతో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఎక్కడా ఇబ్బంది లేదన్నారు. మలకపేట, సూరమ్మ, మోతె నారాయణపూర్, గౌరవెల్లి, దేవాదుల వంటి ప్రాజెక్టుల పనులు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలోకి భూపాలపల్లి, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలు వస్తాయని.. ఆయా జిల్లా కలెక్టర్లను సైతం సమీక్ష సమావేశాలకు ఆహ్వానించాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, చింతకుంట విజయ రమణా రావు, డాక్టర్ సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝా, సత్య ప్రసాద్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ జె.అరుణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. -
నీటి సంపులో పడి చిన్నారి మృతి
మానకొండూర్: మండలంలోని నిజాయతీగూడెం గ్రామానికి చెందిన తుమ్మనపల్లి శ్రీహర్షిక(3) గురువారం ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. తుమ్మనపల్లి ప్రసాద్ కుమార్తె శ్రీహర్షిక ఇంటినుంచి ఆడుకుంటూ వెళ్లి కచ్చకాయల రామయ్య ఇంటి సమీపంలోని నీటి సంపులో ప్రమాదవశాత్తు పడిపోయింది. శబ్దం వినబడటంతో రామయ్య ఇంటి నుంచి బయటకు వచ్చి బాలికను చూసి కేకలు వేశాడు. కొందరు సంపులోకి బాలికను బయటకు తీయగా అప్పటికే మృతి చెందింది. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సంజీవ్ వివరించారు. ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య వీణవంక: మండల కేంద్రానికి చెందిన టేకు రాంచందర్(40) గురువారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల తెలిపిన వివరాలు.. రాంచందర్ కొంత కాలంగా నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా వ్యాధి నయం కాకపోవడంతో మానసిక ఒత్తిడికిలోనై జీవితంపై విరక్తితో ఇంట్లోని ప్యాన్కు ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ట్రైనీ ఎస్సై సాయికృష్ణ తెలిపారు. -
క్షణికావేశంలో తండ్రిని హత్య చేసిన కొడుకు
మేడిపల్లి: క్షణికావేశంలో కన్న కొడుకే తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మేడిపల్లి మండలకేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. కోరుట్ల సీఐ సురేశ్బాబు, మేడిపల్లి ఎస్సై సుప్రియ కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన అంగడి నర్సయ్య అలియస్ గంగారెడ్డి (56) తాగివచ్చి కొడుకు వెంకటేశ్తో ఘర్షణ పడ్డాడు. దీంతో క్షణికావేశంలో వెంకటేశ్ దగ్గరలో ఉన్న ఇనుప వస్తువుతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో గంగారెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం వెంకటేశ్ మేడిపల్లి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. నర్సయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు సంతానం. కొడుకు వెంకటేశ్ ఇటీవలే గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. వెంకటేశ్కు ఇంకా పెళ్లి కాలేదు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ, ఎస్త్సె వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఎల్ఎల్బీ 4వ సెమిస్టర్ విద్యార్థులకు ప్రత్యేక బ్యాక్లాగ్ అవకాశం కరీంనగర్క్రైం: శాతవాహన యూనివర్సిటీ పరి ధిలో ఎల్ఎల్బీ నాల్గో సెమిస్టర్ విద్యార్థులకు బ్యాక్లాగ్ పరీక్ష ప్రత్యేక రుసుముతో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ డి.సురేశ్కుమార్ తెలిపారు. జూన్ 3వ తేదిలోగా తమ కళాశాలల్లో ప్రతీ పేపర్కు రూ.1500 లు చెల్లించాలని పేర్కొన్నారు. కేంద్ర బృందం సందర్శన కరీంనగర్: కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆ ధ్వర్యంలోని మిషన్ శక్తి కేంద్ర బృందం గురువారం జిల్లాలో పర్యటించింది. పథకంలో భా గంగా జిల్లాలో ఏర్పాటు చేసిన మహిళా సాధి కారత కేంద్రం, సఖి వన్ స్టాప్ సెంటర్, శక్తి స దన్, సఖి నివాస్ విభాగాలను బృందం సభ్యులు, ఎన్ఐసీ సంయుక్త సంచాలకులు ఇహ జై న్, యంగ్ ప్రొఫెషనల్ రాహుల్ రానా, అంతరిక్ష భరద్వాజ్, మిషన్ శక్తి రాష్ట్ర విభాగం ఇన్చా ర్జి బ్లెస్సీ పరిశీలించారు. జిల్లాలో అమలవుతున్న పలు కార్యక్రమాల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో బృందం సభ్యులు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మిషన్ శక్తి అమలు తీరు ఆదర్శనీయమని అధికారులు, సిబ్బందిని అభినందించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను రానున్న రోజుల్లో మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలు తమ దృష్టికి తీసుకురావచ్చని, సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. మిషన్ శక్తి కార్యక్రమాలకు సంబంధించిన డాష్ బోర్డు, ప్రగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, మహిళా సాధికారిక కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ శ్రీలత, సఖి అడ్మిన్ లక్ష్మి, శక్తి సదన్ సూపరింటెండెంట్ రమాదేవి, డీసీపీవో పర్వీన్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్, పద్మపాని ఎన్జీవో నిర్వాహకులు సత్యనారాయణరెడ్డి, ప్రకృతి ఎన్జీవో నిర్వాహకులు జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ దరఖాస్తులకు వేళాయె..
● ఈనెల 31 నుంచి ఆన్లైన్లో స్వీకరణ కరీంనగర్: రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)పరిధిలోని బాసర ట్రిపుల్ ఐటీలో 2025–26 విద్యా సంవత్సరం (1,500 మంది) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అనుసరించి రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్లను భర్తీ చేస్తారు. ఫీజుల వివరాలు రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి రూ.36 వేల ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్కు అ ర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లే దు. ప్రవేశ సమయంలో ఆరోగ్యబీమా, ఇతరాలకు సంబందించి రూ.3,500 ఇ తరులకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 3,000 చెల్లించాలి. క్యాషన్ (దీనిని తిరి గి ఇస్తారు) డిపాజిట్ కింద ఏ కేటగిరి అభ్యర్థులైనా రూ.2,000 చెల్లించాలి. ఇ తర రాష్ట్రాలు, గల్ఫ్ దేశాల్లో పని చేసే వారి పిల్లలు ఏడాదికి రూ.1.36 లక్షలు, ఎన్ఆర్ఐ విద్యార్థులు రూ.3 లక్షలు ట్యూషన్ ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ–సేవ, మీ–సేవ, టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ. 500, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.450, వేరే రాష్ట్రం వారు రూ.1,500 చెల్లించాలి. ప్రవేశాల షెడ్యూల్, అర్హతలు ఈనెల 31 నుంచి జూన్ 21 వరకు దరఖాస్తుల స్వీకరణ, వికలాంగులు, సైనికోద్యోగుల పిల్లలు, ఎన్సీసీ, స్పోర్ట్స్, గ్లోబల్ కేటగిరీకి చెందిన వారికి 25 వరకు అవకాశం. జూలై 4న ఎంపిక జాబితా విడుదల, 7న తొలి విడత కౌన్సెలింగ్. విద్యార్థులు ప్రథమ ప్రయత్నంలో 2025–ఎస్సెస్సీ తత్సమాన పరీక్షలో రెగ్యులర్గా ఉత్తీర్ణులై ఉండాలి. 31–12–2024 నాటికి 18 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు. పదో తరగతిలో మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి జీపీఏకు 0.4 డిప్రెవేషన్ స్కోర్ను అదనంగా కలుపుతారు. బాసర ట్రిపుల్ఐటీలో 85శాతం సీట్లను స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీ–ఏ 7, బీసీ–బీ 10, బీసీ–సీ 1, బీసీ–డీ 7, బీసీ–ఇలకు 4 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 3 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2, ఎన్సీసీ విద్యార్థులకు 1 , స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం సీట్లను భర్తీ చేస్తారు. 33.33 శాతం సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కాకుండా వేరే రాష్ట్రాల వారికి, అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వారి పిల్లలకు అదనపు సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలతో పాటు, రెండు జతల యూనిఫాం, షూలు, ల్యాప్టాప్లు, ఇతర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు. -
సంఘం స్థలం స్వాహాకు యత్నం?
వేములవాడ: పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ స్థలం విషయంలో వివాదం ఏర్పడి పంచాయితీ ఎస్పీ వద్దకు చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సుమారు 1800 సభ్యుల సంకల్పంతో 2011లో సర్వే నం.977లో 968 గజాల స్థలం కొనుగోలు చేశారు. సంఘం అధ్యక్షుడు, కార్యవర్గం పేరుపై ఉండాల్సిన భూమిని 12 మంది ప్రముఖులు ఓ ట్రస్టుగా ఏర్పడి తమ పేరుతో రిజిస్త్రేషన్ చేయించుకోవడంతో వివాదం చెలరేగింది. సంఘ సభ్యుల హితాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్లో సేవా కార్యక్రమాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొన్న ఈ స్థలంలో 12 మంది ప్రముఖులు తామే యజమానులమని గత డిసెంబర్లో తమ పేతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వెలుగు చూసింది. దీంతో సంఘ సభ్యులంతా తీవ్ర ఆగ్రహానికి లోనై ఇది కేవలం ఆస్తిపై మాత్రమే కాదు మన ఆర్యవైశ్యుల ఆత్మగౌరవంపై దాడి అంటూ పట్టణానికి చెందిన 1800 మంది సభ్యుల నమ్మకాన్ని, ఆశలను తాకట్టు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ అంశంతో ఆర్యవైశ్య ప్రముఖులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అక్రమ రిజిస్ట్రేషన్దారులు కాంప్రమైజ్ అవుతామనీ, తమపై ఉన్న రిజిస్ట్రేషన్ రద్దు చేసుకుని తిరిగి సంఘానికి చేస్తామని చెప్పినట్లు తెలిసింది. ఈ వివాదం బుధవారం వేములవాడలో సామాజికంగా కీలకమైన అంశంగా మారింది. వైశ్య సంఘం న్యాయబద్ధంగా తమ హక్కులను తిరిగి పొందుతుందా? లేక ఈ ప్రయత్నం వ్యర్థమవుతుందా? అన్న చర్చ కొనసాగింది. వేములవాడలో ఆర్య వైశ్య సంఘ భూవివాదం ఎస్పీ వద్దకు చేరిన పంచాయితీ -
సీపీఐని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లండి
కరీంనగర్: జిల్లాలో సీపీఐకి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా మహాసభలు రెండోరోజు కొనసాగాయి. నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కిన్నెర మల్లవ్వ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మూడేళ్లలో జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సీపీఐకి జిల్లాలో ఘనమైన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ దశాదిశా నిర్దేశించేలా క్రియాశీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఆర్ఎన్ఎన్ శక్తుల విజృంభన కొనసాగిస్తూ బీజేపీ ప్రమాదకరంగా మారిందన్నారు. రాష్ట్రంలో పెన్షన్, రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మఇళ్లు పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, మర్రి వెంకటస్వామి, పొనగంటి కేదారి, బోయిని అశోక్, కొయ్యడ సృజన్కుమార్, అందె స్వామి, బత్తుల బాబు, గూడెం లక్ష్మి పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి -
విత్తన రాయితీకి రాంరాం
● కేవలం జీలుగ, పచ్చిరొట్ట పంపిణీ ● ఇతర పంటలు, కూరగాయల విత్తనాల్లేవిక ● రైతులపై పెను భారంకరీంనగర్ అర్బన్: సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ప్రభుత్వం మరోవైపు పలు రకాల విత్తనాలపై రాయితీ ఎత్తేసింది. కేవలం పచ్చిరొట్ట విత్తనాలను 50శాతం రాయితీపై అందించాలని జిల్లా వ్యవసాయశాఖను ఆదేశించింది. విత్తనాలు జిల్లాకు చేరగా రాయితీపై అందిస్తున్నారు. పిల్లిపెసరకు కూడ రాయితీ ఇవ్వగా జిల్లాకు అలాట్మెంట్ ఇవ్వలేదు. జీలుగ, జను ము విత్తనాలను మాత్రమే రాయితీపై ఇస్తున్నా రు. మొత్తంగా 97,200 క్వింటాళ్ల విత్తనాలను జిల్లాకు కేటాయించారని జిల్లా వ్యవసాయ అఽధికారి భాగ్యలక్ష్మి వివరించారు. జిల్లాలోని 18 ఆగ్రోస్ సేవా కేంద్రాలతో పాటు 31 డీసీఎంఎస్ కేంద్రాలు, 24 ప్రాథమిక సహకార సంఘాల ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇతర విత్తనాల రాయితీకి స్వస్తి జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో సుమారు 3.36 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ అధికారుల అంచనా. వరి, పత్తి, కందులు, పెసర, మినుము, జొన్న వంటి పంటలు ఎక్కువగా సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మొక్కజొన్న, కందులు, అపరాలు, తృణధాన్యాలను కూడా ప్రోత్సహించనున్నారు. ప్రధాన పంటల్లో వరి లో అన్ని రకాలు, పెసర, కంది, మి నుము విత్తనాలకు రాయితీ ఇవ్వలేదు. వరి దొడ్డు రకాలు 30కేజీల బస్తా ఎంటీయూ 1010 రూ.900, కేఎన్ఎం 118 రూ.900 ఉండగా మూ డేళ్ల క్రితం రూ.450కే రాయితీపై అందించారు. అటకెక్కిన ఆర్కేవీవై ఉద్యానశాఖ ద్వారా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) పథకం కింద రాయితీపై కూరగాయల విత్తనాల పంపిణీ చేసేవారు. గత ఏడేళ్లుగా ఊసే లేకపోవడంతో కూరగాయలు సాగు చేసే రైతుల సంఖ్య ఏటేటా తగ్గుతోంది. జిల్లాలో కరీంనగర్ రూరల్, తిమ్మాపూర్, రామడుగు, మానకొండూరు, శంకరపట్నం, హుజూ రాబాద్, జమ్మికుంట తదితర ప్రాంతాల్లో 10వేల ఎకరాల్లో కూరగాయలు సాగయ్యేవి. 2015–16 వరకు చాలా మంది సన్న, చిన్నకారు రైతులు రాయితీపై అందించే కూరగాయల విత్తనాలను తీసుకునేవారు. రాయితీకి స్వస్తి పలకడంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గొర్ల కొట్టంగా అంగన్వాడీ కేంద్రం
చిగురుమామిడి: ప్రభుత్వ సొమ్ము పరుల పాలవుతోంది. చిన్నారులు చదువుకోవాల్సిన భవనాల్లో జీవాలు సేదతీరుతున్నాయి. నిధులు లేక భవనాల నిర్మాణాలు మధ్యలో నిలిచిపోగా.. పశువుల పాకలుగా.. గొర్ల కొట్టాలుగా మారుతున్నాయి. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలోని అంగన్వాడీ నూతనభవనం గొర్రెల కొట్టంగా మారింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల భవనం ఆవరణలో కొన్నేళ్లుగా అంగన్వాడీ కేంద్రం నడుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అంగన్వాడీ కేంద్రానికి నూతన భవనం మంజూరైంది. నిధుల కొరతతో పనులు మధ్యలో నిలిచిపోయాయి. ఖాళీగా ఉన్న భవనంలో గ్రామానికి చెందిన కొందరు గొర్రెల మందలు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు చదువుకునేందుకు ఉపయోగపడే భవనాన్ని గొర్ల కొట్టంగా మార్చారు. కొన్ని నెలలుగా ఇదే తంతు సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని గ్రామస్తుల తెలిపారు. ఈ విషయమై ఐసీడీఎస్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. -
పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి
● సీపీ గౌస్ ఆలం చొప్పదండి: పశువుల అక్రమ రవాణా నివారణకు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సూచించారు. మండలంలోని ఆర్నకొండలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును బుధవారం రాత్రి తనిఖీ చేశారు. పశువుల అక్రమ రవాణా నివారణకు ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో ప్రతీ గూడ్స్ వాహనాన్ని తనిఖీ చేయాలని తెలిపారు. పశవుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. ఆయన వెంట రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సైలు మామిడాల సురేందర్, మనీషా పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు కరీంనగర్స్పోర్ట్స్: మంచిర్యాల జిల్లాకేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారు. యూత్ విభాగంలో ఎస్ఎల్ వరప్రసాద్, జూనియర్ విభాగంలో సుకుమార్ బంగారు పతకాలు, జి.సాకేత్ రజతం, సబ్ జూనియర్ విభాగంలో జి.హరిహర, జి.హరిణిశ్రీ కాంస్య పతకాలు సాధించినట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి కొత్తకొండ సంపత్ కుమార్ తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులను బుధవారం జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్గౌడ్ అభినందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ బాధ్యులు మోసం అంజయ్య, జి.సత్యనారాయణ పాల్గొన్నారు. మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలి కరీంనగర్రూరల్: మహిళలు రుతుస్రావసమయంలో సరైన పౌష్టికాహారం తీసుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ సూచించారు. కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్లోని ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న మహిళాకార్మికులకు బుధవారం ఆరోగ్య పరీక్షలు చేశారు. అంతర్జాతీయ రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ రుతుస్రావ సమయంలో మహిళలు కనీసం రోజుకు నాలుగైదు గంటలకోసారి శానిటరీ ప్యాడ్లు మార్చుకోవాలని, బలమైన ఆహారం తీసుకోవాలన్నారు. మాత్రలను వేసుకోవడంతో హార్మోన్ల సమతుల్యత లోపిస్తుందని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. అనంతరం శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. కార్మికుల పిల్లలకు వ్యాక్సినేషన్ చేశారు. యూనిసెఫ్, హోప్ ఫర్ లైఫ్ పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఐవో డాక్టర్ సాజిదా, పీవో ఎంసీహెచ్వో సనా జువేరియా, చామనపల్లి పీహెచ్సీ డాక్టర్ ఫిరోజ్, యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్స్వామి పాల్గొన్నారు. బహుజన సామాజిక తెలంగాణే లక్ష్యం కరీంనగర్: బహుజన సామాజిక తెలంగాణే టీఆర్ఎస్(డీ) లక్ష్యమని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ పేర్కొన్నా రు. నగరంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు జయపాల్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిగుర్ల రాజు ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ నిర్మాణం జరుగుతోందని, 119 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలకు ఇన్చార్జీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీగా చిగుర్ల రాజు, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జీగా పోలే శ్రీనివా సును ప్రకటించారు. ఆదిలాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల అధ్యక్షులు గంగాధర్, గుంటుక సంపత్, వాసంపల్లి ఆనంద్బాబు, పెద్దపల్లి ఎస్సీసెల్ అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు. -
డీఈవో వ్యాఖ్యలు..ఆరని మంటలు!
● మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన కరీంనగర్వాసి ● చర్యలు తీసుకోవాలని మరిన్ని ఫిర్యాదులు ● క్రమంగా వెలుగులోకి జనార్దన్రావు వ్యవహారాలు ● ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్లుగా కరీంనగర్లో విధులు ● కలెక్టర్ కార్యాలయం తీరుపైనా విమర్శలు సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్రావు వ్యవహారం మరింత ముదిరింది. ‘భర్తలకు వంట రాకపోతే.. భార్యలు లేచిపోతారు.. తాను రెండు సంసారాలు ఈదుతున్నాను’ అంటూ తలతిక్క వ్యాఖ్యలతో శిక్షణ శిబిరాల్లో టీచర్లను బెంబేలెత్తించిన డీఈవో జనార్దన్రావుపై విమర్శలు, ఆరోపణలు ఆగడం లేదు. ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ.. కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం రాత్రి ఆదేశాలిచ్చినా.. టీచర్లు శాంతించడం లేదు. ఆయన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడుతుండగా.. సామాజిక ఉద్యమకారుడు షాబుద్దీన్ మహిళా కమిషన్కు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. డెమొక్రాటిక్ టీచర్ ఫెడరేషన్ (డీటీఎఫ్) నాయకులు జనార్దన్రావుపై హైదరాబాద్లో విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) కూడా అతనిపై చర్యలకు డిమాండ్ చేసింది. బుధవారం కూడా సోషల్ మీడియాలో, మెయిన్స్ట్రీమ్ మీడియాలో విషయం ప్రాధాన్యం సంతరించుకోవడంపై చర్చ నడుస్తోంది. డీఈవో జనార్దన్ సిరిసిల్లకు కూడా డీఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో కామారెడ్డి డీఈవో ఎస్. రాజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ డైట్ ప్రిన్సిపాల్ మొండయ్య నూతన డీఈవోగా బుధవారం అదనపు బాధ్యతలు చేపట్టారు. దండిగా పెద్దల దన్ను.. జనార్దన్రావుకు ప్రభుత్వ పెద్దల నుంచి దండిగా సహకారాలు ఉన్నాయని సమాచారం. కరోనా నుంచి డీఈవోగా కొనసాగుతున్న ఈయనపై ఎన్ని విమర్శలు వచ్చినా చర్యలు తీసుకోవడంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ● జిల్లాలో టీచర్లకు అకారణంగా, అత్యధికంగా మె మోలు ఇచ్చిన డీఈవో అన్న ఆరోపణలు ఉన్నాయి. యూనియన్ నాయకులకు ఇంక్రిమెంట్లలో కోత విధించారన్న విమర్శలు తెలిసిందే. ● వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలో పనిచేసిన ప్రతీ ఉన్నతాధికారి ఎన్నికల నియమావళి ప్రకారం.. బదిలీపై వెళ్లారు. కానీ, ఈయనను కదపలేదు. ● హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, అనంతరం అసెంబ్లీ, పార్లమెంట్, ఇటీవల టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అయినా ఇతని బదిలీ జరగకపోవడం అతని పలుకుబడికి నిదర్శనం. ● ఇవన్నీ తెలిసీ.. కలెక్టర్ కార్యాలయం కూడా ఆయన బదిలీ విషయంలో అలసత్వం వహించి విమర్శలను మూటగట్టుకుంది. ● 317 జీవో సమయంలోనూ పలువురు టీచర్లు ప్రొడ్యూస్ చేసిన మెడికల్ సర్టిఫికెట్ల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ● హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయలో అప్పటి సీఎం సభను విజయవంతం చేయాలని ఆదేశాలివ్వడం, రూటు బాధ్యతలను టీచర్లకు అప్పగించడం తీవ్ర దుమారం రేపింది. ● ఇప్పుడూ తన స్వయంకృతాపరాధంతో వేటు పడిందే.. ఆయన్ను ఇక్కడ నుంచి ఎవరూ కదపలేకపోవడం గమనార్హం. -
ఇంటి అనుమతి కోసం నిలదీత
కరీంనగర్ కార్పొరేషన్: ‘మమ్మల్ని ఎన్ని రోజులు తిప్పుకుంటవ్. కావాలనే ఇబ్బంది పెడుతున్నవ్. మా ఇంటికి పర్మిషన్ ఎందుకు ఇస్తలెవ్. మాకు మాత్రమే వేరే రూల్స్ ఉంటయా’.. అంటూ ఓ మహిళ బల్దియా టీపీఎస్ సంధ్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబేడ్కర్నగర్కు చెందిన సంబోజి గంగాభవాణి తన 60గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి గతంలో దరఖాస్తు చేసుకుంది. బుధవారం బల్దియా కార్యాలయానికి వచ్చి ఇంటికి అనుమతి ఇవ్వకుండా తిప్పుకుంటున్నారంటూ, టీపీఎస్తో వాగ్వాదానికి దిగింది. ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వరాదంటూ ఫిర్యాదు ఉండడంతోనే, తాను సంబంధిత ధ్రువపత్రాలు అడిగానని టీపీఎస్ సంధ్య బదులిచ్చారు. కమిషనర్ చాహత్బాజ్పేయ్ ఆదేశాలతో పత్రాలు పరిశీలించిన పట్టణ ప్రణాళికాధికారి వేణు, మరిన్ని లింక్ డాక్యుమెంట్లు కావాలని సూచించడంతో వివాదం సద్దుమణిగింది. -
ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి
రామగిరి(మంథని): భర్త అనారోగ్యం.. ఆర్థికలేమి.. ముగ్గురు పిల్లలు పోషణ.. కూలీ పనులతో కుటుంబాన్ని నెట్టుకు రావడం ఆ గృహిణికి తలకుమించిన భారంగా మారింది. దాతలు సాయం చేస్తే భర్తకు మంచి వైద్యచికిత్స అందిస్తామని, పిల్లల పోషణ చూసుకుంటానని అంటోంది ఆ గృహిణి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన దుబ్బాక కుమార్ – విజయ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం కిరణ్, మహేందర్, చెర్రీ ఉన్నారు. అనారోగ్యానికి గురైన కుమార్.. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. అయినా నయం కాలేదు. తనకున్న స్థోమత వరకు ఖర్చుచేశాడు. చేతిలో ఉన్న సొమ్మంతా ఖర్చు కావడంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లడానికి చిల్లిగవ్వకూడా లేకుండాపోయింది. కనీసం ప్రయాణానికి కూడా డబ్బులు లేని దీనస్థితిలో ఆ కుటుంబం ఉంది. విజయ కూలీ పనులకు వెళ్లి అంతోఇంతో సంపాదిస్తున్నా కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదు. దాతలు ముందుకు వచ్చి తన భర్తను కాపాడాలని విజయ కోరుతోంది. రెండు కిడ్నీలు పనిచేయక యువకుడి నరకయాతన -
రైతుల కష్టం వరదపాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్, వెంకటాపూర్ గ్రామాల్లో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అధికారుల నిర్లక్ష్యం మూలంగా వరదపాలైంది. అకాల వర్షాలు దండికొట్టడంతో 45రోజులుగా తూకం వేయకుండా కేంద్రాల్లోనే ఉన్న ధాన్యం వర్షానికి తడిసి మొలకెత్తింది. దీంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. ఐకేపీ అధికారులు, నిర్వహకుల నిర్లక్ష్యం వల్ల మాయిచ్చర్ వచ్చి 45 అయినప్పటికీ రైతులు కేంద్రాలకు తెచ్చిన వడ్లను తూకం వేయలేదు. కేంద్రాల్లో హమాలీలు లేక, నిర్వహకులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. తడిసి మొలకెత్తిన ధాన్యం -
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
సిరిసిల్ల: జిల్లాలో యాసంగి(రబీ) సీజన్లో రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా బుధవారం తెలిపారు. 242 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 37,223 మంది రైతుల వద్ద రూ.578 కోట్ల విలువైన 2,49,372మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. వీటిలో 2,16,258 మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలు ఆన్లైన్ చేశామని, 34,479 మంది రైతుల బ్యాంకు ఖాతాలో రూ.447 కోట్లు జమ అయ్యాయని వివరించారు. మిగతా రైతులకు త్వరలో డబ్బులు జమ అవుతాయని ప్రకటించారు. జిల్లాలో ధాన్యం సేకరణ తుది దశకు వచ్చిందని, ఇప్పటికే 133 కొనుగోలు కేంద్రాలను మూసివేశామన్నారు. ఇంకా 109 కేంద్రాల్లో కొద్దిగా ధాన్యం ఉందన్నారు. జిల్లాలో చివరి గింజ వరకు దాన్యం సేకరిస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం సైతం సేకరిస్తామని రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. మూడేళ్లలో ధాన్యం సేకరణ తీరిదీ జిల్లాలో రబీ(యాసంగి) సీజన్లో మూడేళ్ల ధాన్యం సేకరణ తీరును కలెక్టర్ గణాంకాలతో వెల్లడించారు. 2022–2023లో మే 28వ తేదీ నాటికి 1,64,044 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, అదే 2023–2024 రబీ సీజన్లో ఇదే రోజు నాటికి 2,49,514 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది మే 28వ తేదీ నాటికి 2,49,372 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని అన్నారు. జిల్లాలో కొనుగోళ్లు పూర్తి అయ్యేనాటికి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు నమోదు అవుతాయని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పటికే 2,49,372 మెట్రిక్ టన్నుల సేకరణ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
కోర్టు ఆవరణలో ఆటో దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లా కోర్టు ఆవరణలో పార్కింగ్ చేసిన ఆటోను దొంగిలించిన నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని గౌతమినగర్కు చెందిన జిలకర ప్రసాద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం బుట్టపూర్కు చెందిన మగ్గిడి కృష్ణ ఈనెల 26న జగిత్యాల కోర్టు ఆవరణలో ఆటోను పార్కింగ్ చేశాడు. దానిని ప్రసాద్ చాకచక్యంగా దొంగిలించాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఈనెల 27న పట్టణ ఎస్సై గీత జిల్లాకేంద్రంలోని గాంధీనగర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ప్రసాద్ ఆటోలో వస్తూ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిన ఉంచి ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుడిని బుధవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై గీత, కానిస్టేబుళ్లు జీవన్, అనిల్, వంశీ పాల్గొన్నారు. ఉద్యమకారులను ఆదుకోవాలి పెద్దపల్లిరూరల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి అన్నివిధాలా ఆదుకోవాలని ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఐలయ్య కోరారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద బుధవారం ఉద్యమకారులతో కలిసి నివాళి అర్పించారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత తమకు ప్రాధాన్యత దక్కుతుందని ఆశపడితే అప్పటి సీఎం ఉద్యమకారులను విస్మరించారని విమర్శించారు. కేవలం తమ కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమకు మేలు కలిగేలా చూడాలని కోరారు. ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సారయ్య, నల్ల మనోహర్రెడ్డి, రాజేశం, జ్యోతి, చంద్రకళ, సురేందర్రెడ్డి, భాస్కర్, సదాశివ, రాజిరెడ్డి, రాజు, కృష్ణ, సదయ్య తదితరులు ఉన్నారు. ఫాజుల్నగర్ ప్రాంతంలో పులి ఆనవాళ్లువేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని ఫాజుల్నగర్ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈవిషయంపై వేములవాడ ఎఫ్ఆర్వో కలీలొద్దీన్ను వివరణ కోరగా వేములవాడ, కొడిమ్యాల, చందుర్తి ఫారెస్ట్ ప్రాంతంలో పులి తిరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజుకు పులి 35 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, అది ఫారెస్టు ప్రాంతంలో అనుకూలమైన ప్రాంతానికి వెళ్తుందని తెలిపారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
రాయికల్: మండలంలోని అల్లీపూర్కు చెందిన సిరిపురం శ్రీహరి (47) అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సుధీర్రావు కథనం ప్రకారం.. శ్రీహరి బీడీ ప్యాకర్గా పనిచేస్తున్నాడు. కుటుంబపోషణకు కొంత అప్పు చేశాడు. ఇటీవలే కూతురు పెళ్లి చేశాడు. మొత్తం రూ.8లక్షల వరకు అప్పు ఉందని, దానిని ఎలా తీర్చలోనని నిత్యం మనస్తాపం చెందుతున్నాడు. జీవితంపై విరక్తిచెంది ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. శ్రీహరి భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పరారైన ఖైదీ కోసం లుక్ ఆఫ్ నోటీస్జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కోర్టు నుంచి మంగళవారం సాయంత్రం పరారైన జున్ను ప్రసాద్ కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ప్రసాద్ను పట్టుకునేందుకు పోలీసు శాఖ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ ఆరు బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడు విదేశాలకు పారిపోకుండా బుధవారం ఉదయమే దేశంలోని అన్ని ఎయిర్పోర్టులకు లుక్ ఆఫ్ నోటీసు జారీ చేశారు. సిరిసిల్లలో కోవిడ్ పాజిటివ్ కేసులు?● ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్ధారించని వైద్యులు సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జ్వరంతో బాధపడుతున్న ఓ దంపతులు బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వెళ్లారు. కోవిడ్ పరీక్షలు చేయడం లేదని ల్యాబ్ నిర్వాహకులు వెనక్కి పంపించినట్లు సమాచారం. సదరు దంపతులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. నోరు రుచి, ముక్కు వాసన పోవడంతో మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ దంపతులు కోవిడ్గా అనుమానించి ప్రభుత్వ ఆస్పత్రికి రాగా.. పరీక్షలు చేయకపోవడం గమనార్హం. -
దళిత యువకుడిని చితకబాదిన పోలీసులు
సైదాపూర్: డ్రంకెన్డ్రైవ్లో సహకరించడం లేదని ఓ దళిత యువకుడిని 20 రోజుల క్రితం చితకబాదిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. జరిగిన ఘటనపై దళిత సంఘాలు వివిధ రూపాల్లో బాధితుడికి న్యాయం చేయాలని ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బాధితుడు కరీంనగర్ సీపీ, మానవ హక్కుల కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశాడు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిషన్ కోరినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. సైదాపూర్లో ట్రైనీ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న అగస్త్య భార్గవ్గౌడ్ తోటి సిబ్బందితో కలిసి మండలంలోని లస్మన్నపల్లి శివారులో డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల మహేందర్ మొలంగూర్ నుంచి సైదాపూర్ వస్తున్నాడు. పోలీసులు ఆపారు. టెస్టు చేసి చలాను వేసిన తర్వాత అతడి వివరాలు రాసుకున్నారు. ఇంతలో మహేందర్కు ఇంటి వద్ద నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్న బాధితున్ని సహకరించడం లేదని ఫోన్ తీసుకొని ఎస్ఐ అగస్త్య భార్గవ్గౌడ్తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడే చితకబాదారు. చెవి కర్ణభేరి దెబ్బతిని చెవి నుంచి రక్తం కారుతున్నా వదల్లేదని, తర్వాత పోలీస్ స్టేషన్కు పిలిచి తనతో క్షమాపణ పత్రం రాయించుకున్నారని మహేందర్ కమిషన్లకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనపై విచారించాలని కరీంనగర్ సీపీ హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ను ఆదేశించారు. బాధితుడి వాగ్మూలం తీసుకున్న మర్నాడే ఏసీపీ శ్రీనివాస్ బదిలీ కావడంతో పోలీసుల విచారణలో జాప్యం జరుగుతోందని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. హెచ్ఆర్సీ, నేషనల్ ఎస్సీ కమిషన్ మాత్రం అడిషనల్ డీజీపీ, కరీంనగర్ సీపీకి విచారణ నివేదికను 20 రోజుల్లో అందజేయాలని నోటీసులు జారీ చేసింది. తాను పీజీ బీఈడీ చేసి, నిరుద్యోగిగా కూల్డ్రింకులు సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, అకారణంగా చితకబాదడంతో అవమానంతో మానసికంగా భరించలేకపోతున్నాని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మహేందర్ అప్పటికే వేరే సంఘటనలో ఇతరులతో తగాదా పడి దెబ్బలు తిని వస్తున్నాడని, డ్రంకెన్డ్రైవ్ టెస్టులో సహకరించకుండా పోలీసులలో దుర్భాషలాడారని, అందుకు క్షమాపణ పత్రం రాసి ఇచ్చాడని పోలీసులు పేర్కొంటున్నారు. వాస్తవాలు ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది. దెబ్బతిన్న బాధితుడి చెవి కర్ణభేరి హెచ్ఆర్సీ, నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు విచారించి నివేదిక ఇవ్వాలని అడిషనల్ డీజీపీ, సీపీకి నోటీసులు -
హ్యాకర్ల చేతికి ఓదెల ఆధార్ కేంద్రం
పెద్దపల్లిరూరల్: ఆన్మోసాలు ఆగడంలేదు. సైబర్ నేరగాళ్లు, ఆన్లైన్ మోసగాళ్లు రోజుకో రూట్ మార్చుతూ ప్రజలకు ఎరవేస్తున్నారు. తాజాగా ఓదెల మండల కేంద్రంలోని మీసేవ ఆపరేటర్ తన ఆధార్ కేంద్రానికి సంబంధించి అప్డేట్ చేస్తామంటూ సైబర్ మోసగాళ్లు (సెల్ నంబరు 07427069687) నుంచి చేసిన ఫోన్కాల్కు స్పందించడంతో ఆధార్ సెంటర్ను హ్యాక్ చేశారు. కొద్ది నిమిషాల్లోనే ఆ ఐడీ ద్వారా నాలుగు ఆధార్కార్డులు డౌన్లోడ్ చేసినట్లు ఆపరేటర్కు సమాచారం రావడంతో అవాక్కయ్యాడు. ఆ వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. స్పందించిన అధికారులు యూఐడీఏఐ అధికారులను అప్రమత్తం చేశారు. వారు ఆధార్సెంటర్ హ్యాకర్ల చేతికి చిక్కినట్లు నిర్ధారించారు. ఇలాంటి ఘటన ఇదివరకు నాగర్కర్నూల్ జిల్లాలోనూ జరిగినట్లు సమాచారం. జిల్లాలోని పలు ఆధార్కేంద్రాల నిర్వాహకులకు సైతం ఇలాంటి ఫోన్కాల్స్ వచ్చినట్లు ఆపరేటర్లు తెలిపారు. కొంతకాలంగా ఓదెల మీసేవ కేంద్రంలో గల ఆధార్ సెంటర్ ద్వారా సేవలు నిలిపి వేశారు. కొద్ది రోజుల క్రితమే అధికారులు అనుమతినివ్వడంతో సేవలు పునరుద్ధరించారు. ఈ క్రమంలో హ్యాకర్ల నుంచి ఫోన్కాల్ రావడంతో ఆధార్ కేంద్రం అనుమతులిచ్చే కార్యాలయ అధికారుల నుంచే ఫోన్కాల్ వచ్చిందని భావించి ఎనీడెస్క్ను హ్యాకర్లకు అప్పగించి మోసపోయినట్లు తెలిసింది. పీఈసీ కిట్లను అప్పగించొద్దు.. ఆధార్ కేంద్రాలను నిర్వహించే ఆపరేటర్లు అనధికారిక అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్కాల్స్కు స్పందించొద్దని యూఐడీఏఐ అధికారులు బుధవారం రాష్ట్రంలోని ఆధార్ ఆపరేటర్లకు దిశానిర్దేశం చేశారు. ఆధార్కేంద్ర నిర్వాహకులు తమ సెంటర్లలో వినియోగించే కంప్యూటర్ నుంచి ఎనీడెస్క్, లేదా ఇతర రిమోట్యాక్సెస్ ఇచ్చి మోసపోతున్నారని, ఇది ఆధార్ డేటా భద్రతకు ముప్పు తెస్తుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎనీడెస్క్, టీంవ్యూయర్ ఇతర రిమోట్ యాక్సెస్ సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని సూచించారు. యూఐడీఏఐ భద్రతా విధానాలకు అనుగుణంగా అవసరం లేని రిమోట్ యాక్సెస్ టూల్స్ని అన్ఇన్స్టాల్ చేయాలన్నారు. అపరిచితుల ఫోన్కాల్స్కు స్పందించొద్దు యూఐడీఏఐ కార్యాలయ అధికారుల ఆదేశం -
సింగరేణి స్టేడియానికి ఆధునిక హంగులు
● రూ.2కోట్లు ప్రకటించిన సీఎండీ బలరామ్ ● ప్రత్యేక సంస్థతో ప్రతిపాదనల రూపకల్పన ● త్వరలో తుదిరూపం వచ్చే అవకాశం ● సింథటిక్ ట్రాక్తోపాటు స్టేడియం విస్తరణకు చర్యలు ● కొన్ని సంగరేణి క్వార్టర్లను కూడా తొలగించే అవకాశంగోదావరిఖని: క్రీడాకారులకు అనుగుణంగా సింగరేణి స్టేడియాన్ని ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని యాజమాన్యం నిర్ణయించింది. సింథటిక్ వాకింగ్ట్రాక్తో పాటు క్రికెట్ ప్లే గ్రౌండ్, వాలీబాల్ కోర్టు, ట్రాక్ విస్తరణ కోసం మైదాన్ని విస్తరించాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం సీఎండీ బలరాం ఇటీవల రూ.2కోట్లు ప్రకటించారు. దీంతో రాబోయే తరానికి ఉపయోగపడేలా సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం స్టేడియంలోని కట్టడాలు, రాబోయే రోజుల్లో విస్తరిస్తే ఎలా మార్చాల్సి ఉంటుందనే అంశంపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు స్పోర్ట్స్ అథారిటీ కంపెనీ ప్రతినిధులు మంగళవారం స్టేడియాన్ని పరిశీలించారు. సింథటిక్ ట్రాక్పైనే దృష్టి.. ప్రధానంగా సింథటిక్ వాకింగ్ ట్రాక్పై యాజమాన్యం దృష్టి సారించింది. 400 మీటర్ల వాకింగ్ ట్రాక్ లేదా 800మీటర్ల వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మైదానం చుట్టూ సింథటిక్ వాకింగ్ట్రాక్, మధ్యలో క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్వార్టర్ల తొలగింపుపై ఆలోచన జవహర్లాల్ నెహ్రూ స్టేడియం విస్తరణలో భాగంగా మైదానాన్ని ఆనుకుని ఉన్న సీఈఆర్క్లబ్ ఎదుట గల సింగరేణి క్వార్టర్లను తొలగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే స్టేడియం వెనకాల ఉన్న కొన్ని క్వార్టర్లను కూడా తొలగించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి స్పోర్ట్స్ అథారిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అభివృద్ధి కోసం రూ.2కోట్లు కేటాయిస్తారు. ఈప్రాంత క్రీడాకారులతోపాటు సింగరేణి ఉద్యోగులకు అనుకూలంగా స్టేడియంలో అన్నిఏర్పాట్లు చేస్తాం. సింథటిక్ వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎమ్మెల్యే సూచనల మేరకు ఈప్రాంత క్రీడాకారుల కోసం స్టేడియం విస్తరణ పనులు శరవేగంగా సాగుతాయి. – లలిత్కుమార్, ఆర్జీ–1 జీఎం -
ఇందిరమ్మ ఇళ్ల కోసం నిరసన
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025జమ్మికుంట: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అర్హులకు మొండిచేయి చూపారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇళ్ల ఎంపికలో ఇందిరమ్మ కమిటీ, కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా జాబిత తయారు చేశారని బుధవారం జమ్మికుంట– ఉప్పల్ రోడ్డుపై బైఠాయించారు. జాబితాలో వచ్చిన పేర్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల బంధువులు, దగ్గరివారికి ఇచ్చుకున్నారని పంచాయతీ కార్యదర్శి అంజిరెడ్డితో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్య తిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సై శేఖర్రెడ్డి ఆందోళనకారులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం రెండోవిడతకు దరఖాస్తు చేసుకోవాలని, ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని ఆందోళన విరమింపజేశారు.న్యూస్రీల్ -
లక్ష్మీపూర్లో మున్నాభాయ్ ఎంబీబీఎస్!
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ లాగా నకిలీ వైద్యుడి లీలలు బుధవారం వెలుగు చూశాయి. గ్రామంలో వంగరి గోవర్దన్ అనే వ్యక్తి ఒక ఇంటిని అద్ధెకు తీసుకుని మెడికల్ ప్రాక్టీషనర్ పేరుతో క్లినిక్ను ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా తన కొడుకు పేరుతో ఎంబీబీఎస్ లెటర్ హెడ్తో వైద్యం ప్రారంభించాడు. పేషంట్లకు ఇంజక్షన్లు, సైలెన్లు పెట్టడం, ఎంబీబీఎస్ లెటర్ హెడ్పై మందులు వ్రాయడం మొదలెట్టాడు. వస్తున్న కాసులు సరిపోవడం లేదని అనుకున్నాడో ఎమో తెలియదు కానీ ఏకంగా మహిళలకు సంతానం కలిగిస్తానంటూ కొత్త వైద్యం ప్రారంభించాడు. సాధారణంగా గైనకాలజీ డాక్టర్లు మహిళలకు సంతానోత్పత్తి కొరకు హెచ్సీజీ ఇంజక్షన్లను అన్ని వైద్య పరీక్షల అనంతరం అవసమైతేనే ఇస్తుంటారు. ప్రథమ చికిత్సలకు పరిమితం కావాల్సిన మెడికల్ ప్రాక్టీషనర్లు ఏకంగా అర్హతగల డాక్టర్ల మాదిరిగా చికిత్సలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. నకిలీ వైద్యుడి వైద్యంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజితను ‘సాక్షి’ వివరణ కోరగా వారం రోజుల క్రితమే అతడికి నోటీసులు ఇచ్చామని, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొడుకు పేరుతో తండ్రి వైద్యం అద్దె ఇంటిలోనే పేషంట్లకు సైలెన్లు, ఇంజక్షన్లు ఇస్తున్న వైనం -
పెదనాన్నా.. ఇంటికి రా
కోరుట్ల: ‘పెదనాన్నా ఇంటికి రా... ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఎన్కౌంటర్లు జరుగుతున్నయ్.. నువ్వెట్లున్నవో అని మాకు భయమేస్తోంది. సమసమాజం కోసం అడవులకు వెళ్లావు. ఇక చాలు.. ఇంటికి వచ్చేయ్’.. అని మావోయిస్టు అగ్రనేత, నంబాల కేశవరావు స్థానాన్ని భర్తీచేస్తారని భావిస్తున్న కోరుట్ల వాసి తిప్పిరి తిరుపతి తమ్ముడు గంగాధర్ కూతురు సుమ లేఖ రాసింది. బీటెక్ చదువుతున్న సుమ తన మనోభావాలను లేఖ ద్వారా బయటపెట్టింది. నేను పుట్టక ముందే.. ‘పెదనాన్నా.. నేను పుట్టకముందే సమసమాజ స్థాపన కోసం అడవుల బాట పట్టావు. నీ ప్రస్తావన వచి్చన ప్రతీసారి ఒకింత గర్వంగా ఉంటున్నా.. ఎంతో బాధగా ఉంటోంది. మీ ధైర్యం..ఆలోచన..పట్టుదల నన్ను ఎంతో ఆలోచింపజేస్తాయి. మిమ్మల్ని కలవాలని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు నాకు ఆ అవకాశం దక్కలేదు. మీ గురించి పత్రికల్లో వచ్చే వార్తలు చదివితే మీరు ఎంత గొప్పవారో అని గర్వంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఘటనలు నన్ను కలవరపెడుతున్నాయి. మీకేం అవుతుందోనని మేం బెదిరిపోతున్నాం. మీరు ఇప్పటికే గెలిచారు. ఇప్పుడు పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి.. మీకు కుటుంబం ఉంది. దయచేసి వారిని మరవద్దు.. మీ కోసం వేచిచూస్తున్నాం. ఇక చాలు.. వచ్చేయండి పెదనాన్నా’అని అభ్యర్థించింది. కగార్ ఆపరేషన్ ఎవరిపై అన్న విషయం అర్థం కావడం లేదని పేర్కొంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి మనదేశంలో అమాయక పౌరులను చంపుతున్న వారిపై తీసుకుంటున్న చర్యలకన్నా.. మావోయిస్టులపై ఎక్కువ ఆపరేషన్లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేసింది. మావోయిస్టులను దారుణంగా చంపి సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకుంటారా..? అని లేఖలో సుమ పోలీసులను నిలదీసింది. -
ట్రాక్టర్ కింద పడి కౌలురైతు మృతి
ఇల్లంతకుంట(మానకొండూర్): ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తతో అతని పక్కనే కూర్చున్న కౌలు రైతు టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటలో విషాదం నింపింది. ఎస్సై శ్రీకాంత్గౌడ్ తెలిపిన వివరాలు. నర్సక్కపేటకు చెందిన చీకోటి నర్సయ్య(65) మండలంలోని వంతడుపుల గ్రామంలో నాలుగెకరాలను కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట వేశాడు. మంగళవారం మొక్కజొన్న కంకులను ట్రాక్టర్లో వేసుకొని సమీప పౌల్ట్రీఫామ్ వద్ద ఆరబోస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్లో నుంచి మొక్కజొన్న కంకులను దించి తిరిగి వెళ్తుండగా డ్రైవర్ పక్కనే కూర్చున్న నర్సయ్య ఎగిరి టైర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. అతివేగంగా ట్రాక్టర్ నడిపిన బిహార్కు చెందిన డ్రైవర్ సురేందర్పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని కూతురు కామభాగ్య ఫిర్యాదు చేసింది.బావిలో పడి విద్యార్థిని..మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కెల్లెడ గ్రామపరిధిలోని కందులపల్లెలో ప్రమాదవశాత్తు చేదబావిలో పడి వి ద్యార్థిని మృతి చెందింది. సీఐ సంజీవ్ వివరాల ప్రకా రం.. కందులపల్లెకు చెందిన కందుల స్వప్న, ముత్తయ్య దంపతులకు కొడుకు రాజు, కూతురు అశ్విత(20) ఉన్నారు. అశ్విత ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. మంగళవారం ఉద యం తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. ఇంటివద్ద అశ్విత చేదబావిలో నీరు తోడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది. రాజు గేదెలకు నీళ్లుపెట్టి కాళ్లు కడుక్కునేందుకు బావి వద్దకు రాగా.. అశ్విత బావిలో పడిఉండడాన్ని గమనించాడు. స్థానికుల సాయంతో బయటకు తీయగా.. అప్పటికే చనిపోయింది. తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ మేరకు పోలీసులు పంచనామా నిర్వహించారు.రోడ్డు ప్రమాదంలో జడ్జి తల్లికి గాయాలుజగిత్యాలక్రైం: జగిత్యాలలోని గాంధీనగర్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాంపెల్లి కోర్టు జడ్జి సుస్మిత తల్లి వడ్లూరి దేవమ్మ గాయపడింది. దేవమ్మను గాంధీనగర్ ప్రాంతానికి చెందిన బొల్లారపు హర్షవర్ధన్ ద్విచక్రవాహనంతో ఢీకొట్టగా.. తీవ్రంగా గాయపడింది. దేవమ్మది జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లి గ్రామం. గాంధీనగర్లోని తన సోదరి వద్దకు వెళ్లింది. తిరిగి తక్కళ్లపల్లి వెళ్లేందుకు రోడ్డు పక్కన ఉండగా.. హర్షవర్ధన్ ద్విచక్రవాహనంపై వస్తూ ఢీకొట్టాడు. స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సుస్మిత సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు హర్షవర్ధన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మన్మథరావు తెలిపారు.రోడ్డు ప్రమాదంలో దంపతులకు..సారంగాపూర్: బీర్పూర్ మండలం ఇందిరానగర్ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ధర్మపురి మండలం నక్కలపేటకు చెందిన భూక్య భారతి, ఆమె భర్త భూక్య తిరుపతి ఇద్దరు ద్విచక్రవాహనంపై బీర్పూర్ మండలం రంగసాగర్లోని భారతి తల్లిగారింటికి వచ్చారు. తిరిగి వెళ్తుండగా ఇందిరానగర్ వద్ద వీరి వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో భారతి తీవ్రంగా, తిరుపతి స్వల్పంగా గాయపడ్డారు. వారిని జగిత్యాల ఆస్పత్రికి.. అక్కడి నుంచి కరీంనగర్ తరలించారు. -
భూసారం తెలుసుకోవడం తప్పనిసరి
● భూసార పరీక్షతో సుస్థిర వ్యవసాయం సాధ్యం ● రామగిరిఖిల్లాలో ఉచితంగా భూసార పరీక్షలు రామగిరి(మంథని): నైరుతి రుతుపవనాల ప్రవేశం తర్వాత రైతులు వ్యవసాయానికి సిద్ధమవుతున్నారు. అంతకంటే ముందే నేలలో మట్టి పరీక్షలు చేయించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. భూసార పరీక్షలకు ఇదేసరైన సమయమంటున్నారు. పొలాల్లోని మట్టి నమునాలను సేకరించి పరీక్షలు చేయించుకుంటే భూసారం తెలియడంతో పాటు ఆ నేలల్లో ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎంతమేర ఎరువులను వినియోగించాలనే విషయాలు రైతులు తెలుసుకోవచ్చు. రైతులు పంట పండించేందుకు మూడు పెట్టుబడులు అవసరం. అవి భూమి, విత్తనం, నీరు. వీటన్నింటికన్నా నేల ముఖ్యమైన పెట్టుబడి. అందుకే భూమిగుణగణాలు తెలిస్తే ఎలాంటి పంటలు పండుతాయో అవగాహన వస్తుంది. అందుకోసం మట్టి పరీక్షలు చేయించాలి. తద్వారా పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలో తెలియడంతో ఖర్చు తగ్గించుకోవచ్చు. చాలామంది రైతులు మట్టిపరీక్షలు జరిపించకుండా ఎరువులు అధిక మోతాదులో వేస్తున్నారు. దీనివల్ల పెట్టుబడి వ్యయం పెరగడంతోపాటు పంటల్లో పురుగుల ఉధృతి కూడా ఎక్కువవుతుంది. పొలాల్లో ఎరువుల మోతాదు తెలుసుకునేందుకు కచ్చితంగా మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్ష కేంద్రాలకు పంపించాలి. దీనికోసం సాగుభూమి నుంచి మట్టిని ఇలా సేకరించాలి. మట్టి నమూనా సేకరించ కూడని ప్రదేశాలు ● పొలం వరాలు, చెట్టు నీడ, బోరుబావులు, నీరు పొసేచోటు, బండరాళ్లు ఉన్న చోటు, మందులు కలుపుకునే చోటు. మట్టి నమూనా సేకరించే విధానం ● భూసార పరీక్ష ఫలితాలు సేకరించే మట్టి నమూనాలపై ఆధారపడి ఉంటాయి. కనుక మట్టి నమూనాలను ఒక ఎకరం విస్తీర్ణంలో ఒకచోటు నుంచే కాకుండా 10 నుంచి 15 ప్రదేశాల్లో తీయాలి. ● ఎంపిక చేసిన పొలంలో జిగ్జాగ్(ఎగుడు దిగుడు) పద్ధతిలో 10 నుంచి 15 చోట్ల గుర్తులు పెట్టాలి. ● గుర్తులు పెట్టిన చోట చెత్తాచెదారం తొలిగించి శుభ్రపరచాలి. శుభ్రపర్చిన చోట గుంతలు తీయాలి. ● ఆ గుంతల్లో ఒక అంగుళం(2.5 సెం.మీ.) మట్టిని సేకరించాలి. ● పొలంలో 10 నుంచి 15 చోట్ల సేకరించిన మట్టిని ఒకకుప్పగా పోసి బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలిపిన మట్టిని గుండ్రంగా చేసి నాలుగు భాగాలుగా విభజించాలి. పైరెండు భాగాలను(ఏ, సీ)లుగా, కింది రెండు భాగాలను(బీ,డీ) భాగాలుగా గుర్తించాలి. వీటిలో రెండు ఎదురెదురుగా ఉన్న భాగాలను (బీ,డీ) కలిపి మిగిలిన రెండు భాగాలను(ఏ, సీ) తొలిగించాలి. ఇప్పుడు మిగిలిన (బీ,డీ) భాగాలను బాగా కలిపి మళ్లీ గుండ్రంగా చేసుకోవాలి. ఈ విధంగా గుండ్రంగా చేసుకున్న మట్టిని మళ్లీ ముందుగా విభజించినట్లుగా నాలుగు భాగాలుగా చేసి ఎదురెరుగా ఉన్న భాగాలను(ఏ,సీ) కలిపి మిగిలిన రెండు భాగాలను(బీ,డీ)లను తొలిగించాలి. ఈ విధంగా 10–15 చోట్ల నుంచి సేకరించిన మట్టిని అర్ధకిలో మట్టి నమూనా వచ్చే వరకు చేసుకోవాలి. తర్వాత ఈ నమూనాను నీడలో ఆరబెట్టి పరిశుభ్రమైన, గుడ్డసంచిలో నింపి సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఇవ్వాలి. ఉచితంగా భూసార పరీక్షలు రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహిస్తున్నాం. కార్డులు కూడా ఉచితంగా ఇస్తాం. భూసారాన్ని బట్టి ఏ పంటకు ఎలాంటి ఎరువులు వాడాలో కూడా రైతులకు సూచిస్తున్నాం. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ పిల్లి కిరణ్, మృత్తిక శాస్త్రవేత్త, కేవీకే, రామగిరి ఖిల్లా -
ప్రాణం పోస్తున్న ఎమర్జెన్సీ వైద్యులు
● మెడికవర్లో వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే కరీంనగర్టౌన్: కరీంనగర్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కలిగిన ఏకై క ఆసుపత్రి మెడికవర్లో అందించే సేవలతో ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నాయని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే సందర్భంగా మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలువురు వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ఎమర్జెన్సీ విభాగం ఎంతో కీలకంగా మారిందన్నారు. ఆసుపత్రిలో ఎమర్జెన్సీతో పాటు క్రిటికల్ కేర్ టీం బ్యాక్ బోన్గా పనిచేస్తుందన్నారు. కేక్ కట్ చేసి, ఎమర్జెన్సీ వైద్యులను సన్మానించారు. మెడికవర్ సెంటర్హెడ్ గుర్రం కిరణ్, వైద్యులు సత్యనారాయణ, రుత్విక్, మహేష్, జగదీప్, దిలీప్, రవికిరణ్,, వినయ్, ఉపేందర్రెడ్డి, నాగరాజు, లోకేశ్, పల్లవి, విష్ణు, రవి, మల్లారెడ్డి పాల్గొన్నారు. -
కర్బూజ రైతు నష్టాలపాలు
● అకాల వర్షాలతో ఆగం ● రూ.లక్షలు వస్తాయనుకుంటే.. ఖర్చులు కూడా రాలేదంటున్న వైనం ● పురుగు పట్టి పనికి రాకుండా పోయిన కాయలు జగిత్యాలఅగ్రికల్చర్: కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను అతులాకుతలం చేశాయి. ముఖ్యంగా వేసవిలో కర్బూజ, తర్బూజ వంటి ఉ ద్యాన పంటలను సాగు చేసిన రైతులను కోలుకోకుండా చేశాయి. జిల్లాలో యువ రైతులు వినూత్నంగా సాగు చేసిన కర్బూజ(పుచ్చకాయ) పంటను మరో వారం రోజుల్లో మార్కెట్కు తీసుకెళ్లే తరుణంలో కురిసిన వర్షాలు దెబ్బతీశాయి. ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 100 ఎకరాల్లో సాగు.. జిల్లాలో వేసవిలో చల్లదనాన్నిచ్చే కర్బూజ, తర్బూజ, జన్నత్ వంటి పండ్ల తోటలను దాదాపు 100 ఎకరాలకు పైగా సాగు చేశారు. రెండు, మూడేళ్లుగా యువ రైతులు సాగు చేస్తూ.. నేరుగా మార్కెటింగ్ చేస్తూ మంచి అదాయాన్ని పొందుతున్నారు. సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన బండారి వెంకటేశ్, మల్లాపూర్ మండలం సిర్పూర్కు చెందిన నరేశ్, రాయికల్ మండలం అలూరుకు చెందిన మెక్కొండ రాంరెడ్డి, రాజు, మల్లారెడ్డి, ధర్మారంకు చెందిన రాజు, రాజిరెడ్డి అనే యువ రైతులు 25 ఎకరాల వరకు సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. తమ పంటను జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో నేరుగా విక్రయిస్తుండడంతోపాటు హైదరాబాద్లోని పలు కార్పొరేట్ సంస్థలతో కూడా ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్లో వర్షాలు కురవడం, రాష్ట్రమంతా చల్లదనంగా ఉండటంతో కాయలు తెంపేందుకు వేచి చూస్తున్న తరుణంలో ఒక వర్షం తర్వాత మరో వర్షం కురవడంతో పంట పూర్తిగా ధ్వంసమైంది. విత్తన ఖర్చే రూ.35 వేలు కర్బూజ(వాటర్ మిలన్), తర్బూజ(మస్క్మిలన్), జన్నత్(సూపర్ మార్కెట్ వైరెటీ) పండ్ల తోటలను సాగు చేశారు. మార్కెట్లో ఎప్పుడు ఏ ధర ఉంటుందో తెలియదు కాబట్టి.. సగటున ధర గిట్టుబాటయ్యేందుకు ప్రతి పంటను మూడు దఫాలుగా సాగు చేశారు. ఫిబ్రవరి నెలలో సాగు చేసిన పంట.. మండు వేసవిలో మే నెలలో చేతికందుతున్న తరుణంలోనే పూర్తిగా దెబ్బతింది. వీటికి సంబంధించిన 50 గ్రాముల విత్తనాలకే దాదాపు రూ.1,600 నుంచి 1,800 వరకు ధర ఉంటుంది. ఎకరాకు దాదాపు రూ.35వేలు ఖర్చు పెట్టి హైదరాబాద్, బెంగళూర్ నుంచి విత్తనాలు తెప్పించారు. పంట పూర్తిగా నాశనం.. రైతులు సాగు చేసిన కర్బూజ కాయలు అమ్మకానికి వచ్చాయి. కాయలు తెంపే సమయంలోనే భారీ వర్షాలతో భూమిలో నీళ్లు ఆగాయి. వేరు వ్యవస్థ దెబ్బతిని కర్బూజ మొక్కలు వాడిపోయాయి. దీనికితోడు పూత రాలిపోయింది. అప్పటికే కాచిన కాయ లు కుచించుకుపోయాయి. పక్వానికి వచ్చిన కాయ ల్లో పురుగు చేరింది. దీనికితోడు రాళ్ల వానతో కాయ లు ఎక్కడికక్కడే పగిలిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కో ఎకరానికి రూ.3లక్షల నుంచి 4లక్షలు వస్తాయనుకుంటే.. కనీసం విత్తనాలకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని కన్నీళ్లపర్యంతమవుతున్నారు. అకాల వర్షాలతో కర్బూజ వంటి కొత్త పంటలు పెట్టాలంటేనే రైతులు భయపడే పరిస్థితి నెలకొంది. -
పిడుగుపాటు.. గొర్రెలకాపరి మృతి
ఇల్లంతకుంట(మానకొండూర్): రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గొల్లపల్లిలో మంగళవారం పిడుగుపాటుకు గొర్రెలకాపరి మృతిచెందాడు. గ్రామానికి చెందిన దాసరి లక్ష్మణ్(21) గొర్రెలను మేత కోసం రేపాక శివారుకు తీసుకెళ్లాడు. మంగళవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఆ సమయంలోనే చెట్టు కింద ఉన్న లక్ష్మణ్ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించాడు. అతనికి కొంతదూరంలో ఉన్న మరో కాపరి రాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎస్సై శ్రీకాంత్గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.తల్లీబిడ్డలకు గాయాలుమల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. తాటిపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన జేరుపోతుల సుమలత ఇంటి సమీపంలో భారీ శబ్దంతో పిడుగుపడడంతో విద్యుత్ మీటరు కాలిపోయింది. ఇంటి లోపల గోడల పెచ్చులు ఊడిపోయాయి. విద్యుత్ పైపులు కాలిపోయి, స్విచ్బోర్డు పగిలిపోయింది. ఇంట్లో ఉన్న సుమలత చేతిపై మెరుపులు పడడంతో గాయాలయ్యాయి. ఆమె కూతురు ఆరాధ్య, కుమారుడు ఫ్రాన్సిస్ స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వారిని 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పిడుగుపాటు శబ్దానికి సుమలతకు వినికిడి లోపం తలెత్తింది. మల్యాల ఎస్సై నరేశ్కుమార్, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.కాసారంలో గేదె మృతి..గంగాధర: మండలంలోని కాసారం గ్రామంలో పిడుగుపాటుకు పాడిగేదె మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. పెద్దిపల్లి తిరుపతి గేదెను పొలం వద్ద కట్టి వేయగా మంగళవారం సాయంత్రం పిడుగుపడి మృతి చెందింది. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచు వేముల దామోదర్ కోరాడు.నేలవాలిన వృక్షంగన్నేరువరం: మండలకేంద్రంలోని చావిడి వద్ద భారీ వృక్షం మంగళవారం వీచిన గాలివానకు నేలవాలింది. ఆయుర్వేదిక్ ఆసుపత్రి, వాటర్ ప్లాంట్ సమీపంలోని వృక్షం నేలవాలడంతో పెను ప్రమాదం తప్పింది. పక్కనే గ్రామానికి చెందిన అరిగెల వరవ్వ, రామవ్వ నివాస గృహాలు ఉన్నాయి, చెట్టు కింద పడుతున్న సమయంలో భయాందోళనకు గురై ఇంట్లో నుంచి భయటకు పరుగులు తీశారు. ఇళ్ల మధ్య పడటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఏళ్లనాటి వృక్షం నేలవాలిందని గ్రామస్తులు తెలిపారు. కాగా మండలంలో గంట పాటు భారీ వర్షం కురిసింది. -
ప్రపంచ ఆర్చరీ పోటీలకు చికిత
కరీంనగర్స్పోర్ట్స్: ప్రపంచ ఆర్చరీ క్రీడాకారిణి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్కు చెందిన తానిపర్తి చికిత జూన్లో సింగపూర్లో, ఆగస్టులో కెనడాలో జరగబోయే ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొనే భారత మహిళల కంపౌండ్ క్రీడాకారుల జట్టులో చోటు సంపాదించింది. మహిళల కంపౌండ్ విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్లో 71వ స్థానంలో కొనసాగుతోంది. ఏషియా కప్స్టేజ్ 2 పోటీలు సింగపూర్లో జూన్ 14 నుంచి 21 వరకు, వరల్డ్ యూత్ చాంపియన్ షిప్ పోటీలు ఆగస్టు 16 నుంచి 25వరకు కెనడాలోని విన్నిపెగ్లో జరుగనున్నాయి. పూణెలో జరిగిన ఇండియన్ టీంసెలక్షన్ ట్రయల్స్లో చికిత అద్భుతంగా రాణించి చోటు దక్కించుకుంది. ఏషియా, వరల్డ్ యూత్ చాంపియన్ షిప్ పోటీలకు తానిపర్తి చికిత ఎంపికకావడంపై ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్రెడ్డి, కోశాధికారి నాగిరెడ్డి సిద్దారెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్రెడ్డి, మహ్మద్ కరీం, పెద్దపల్లి డీవైఎస్వో సురేశ్, బేస్బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఉమ్మడి జిల్లా అర్చరీ సంఘం కార్యదర్శి కొమురాజు శ్రీనివాస్, కొమురాజు కృష్ణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
రిమాండ్ ఖైదీ పరార్
● గాలిస్తున్న పోలీసులు జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న క్రమంలో రిమాండ్ ఖైదీ పోలీసుల కన్నుగప్పి పరారైన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లింగాపూర్కు చెందిన జున్ను ప్రసాద్ నిరుద్యోగులను గల్ఫ్ పంపిస్తానని, డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. దీంతో బాధితులు పెగడపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈనెల 17న కేసు నమోదు చేసి జున్ను ప్రసాద్ను జగిత్యాల జైలుకు తరలించారు. అతడిపై కొడిమ్యాల పోలీస్స్టేషన్లో కూడా గల్ఫ్ మోసంపై కేసు నమోదైంది. దీంతో కొడిమ్యాల పోలీసులు పీటీ వారెంట్ ద్వారా ప్రసాద్ను జైలు నుంచి తీసుకొచ్చి.. జగిత్యాల కోర్టులో మంగళవారం సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. తిరిగి రిమాండ్కు తరలిస్తున్న క్రమంలో పోలీసుల కన్నుగప్పి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరి పట్టివేతమెట్పల్లి: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్నట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. పట్టణ శివారులో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా..అబ్దుల్ సోహైల్, ఓ మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంపై అక్కడకు వచ్చారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని తనిఖీ చేయగా.. వారి వద్ద 120 గ్రాముల గంజాయి దొరికింది. వారిపై కేసు నమోదు చేసి బైక్, రెండు సెల్ఫోన్లు సీజ్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
కొత్త పింఛన్దారులకు 3.0 పింఛన్
జ్యోతినగర్(రామగుండం): ప్రయాస్ పథకాల కింత కొత్త పింఛన్దారులకు 3.0 పింఛన్ చెల్లింపు ఉత్తర్వులు విడుదలయ్యాయని ఈపీఎఫ్వో కరీంనగర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి నరేశ్, నోడల్ అధికారి పరశురాం తెలిపారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో మంగళవారం నిధి పే నిక్కత్ 2.0లో భాగంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ, భవిష్యనిధి ద్వారా కార్మికులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కార్మికులు తమ వివరాలను ఈపీఎఫ్ సేవల వెబ్సైట్లో తెలుసుకోవచ్చని అన్నారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, ప్రయాస్ పథకం, వాటాదారులకు అవగాహన కల్పించారు. ఫీఎఫ్ సమస్యలు పరిష్కరించాలి ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు పీఎఫ్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఈమేరకు ఈఫీఎఫ్వో ఎన్ఫోర్స్మెంట్ అధికారి నరేశ్, నోడల్ అధికారి పరశురాంకు వినతిపత్రం అందించారు. పుట్టిన తేదీల్లో పొరపాట్లు, కాంట్రాక్టర్లు ఫీఎఫ్ జమచేయకపోవడం, యజమాని మారినప్పుడు, ప్రస్తుత నంబరుపై కాకుండా పాత నంబర్పై డబ్బులు జమచేయడం, 58 ఏళ్లవయసు పూర్తిచేసిన కార్మికులకు పింఛన్ రాకపోవడం, మాన్యువల్ పద్ధతిలోని పీఎఫ్ డబ్బులు ప్రస్తుత ిపీఎఫ్ నంబర్లోకి జమకాకపోవడం తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. సర్వీస్ సర్టిఫికెట్లలో ఇంటిపేరు పూర్తిగా లేకపోవడంతో నిధులు ట్రాన్సఫర్ కావడం లేదన్నారు. ఈ సమస్యలపై కరీంనగర్ భవిష్యనిధి కార్యాలయానికి వెళ్లే కార్మికులకు సిబ్బంది సహకరించకుండా, ఇబ్బందులకు గురిచేసే విధానం మానుకోవాలని హెచ్చరించారు. ఐన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్, సీఐటీయూ నాయకులు నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, ఐఎఫ్టీయూ నాయకులు చిలుక శంకర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ ఈపీఎఫ్వో ఎన్ఫోర్స్మెంట్ అధికారి నరేశ్ -
మహిళ హత్య కేసులో తల్లి, కొడుకు అరెస్టు
చందుర్తి(వేములవాడ): భూవివాదంలో మహిళను హత్య చేసిన రౌడీషీటర్, హత్యకు ప్రోత్సహించిన తల్లిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. చందుర్తి ఠాణాలో మంగళవారం నింది తులిద్దరిని సీఐ, ఎస్సైలు అరెస్ట్ చూపారు. చందుర్తికి చెందిన బొల్లు మల్లవ్వకు రౌడీషీటర్ బొల్లు మనోజ్ తల్లి మోహినవ్వకు కొద్దికాలంగా భూవివాదం ఉంది. ఈ వివాదాన్ని దృష్టిలో పెట్టుకున్న రౌడీషీటర్ మల్లవ్వను అడ్డు తొలగించేందుకు సోమవారం పెద్దమ్మ గుడి సమీపంలో కాపుకాసి కత్తితో దాడిచేసి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపాయాడు. ఈ హత్యకు ప్రోత్సహించిన బొల్లు మోహినవ్వ ఉరప్ మల్లవ్వ, రౌడీషీటర్ మనోజ్అను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. హత్యకు వినియోగించిన కత్తిని, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య, సిబ్బంది ఉన్నారు. పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా జిల్లాలోని పాతనేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. చందుర్తికి చెందిన బొల్లు మనోజ్పై 2023లో హత్యకేసుతోపాటు పలు దొంగతనాల కేసులు ఉన్నాయని, అయినా మార్పు రాకపోవడంతో 2024లో రౌడీషీటర్ తెరిచినట్లు తెలిపారు. రౌడీషీటర్లలో మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. హత్యకు వినియోగించిన కత్తి, సెల్ఫోన్ స్వాధీనం -
నేరాలు నియంత్రించాలి
తిమ్మాపూర్: నేరాలు నియంత్రణ దిశగా కృషి చేయాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. మంగళవారం తిమ్మాపూర్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టంను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. సీసీసీ ఫిర్యాద్చులు త్వరితగతి న పరిష్కరించాలని సూచించారు. పోలీస్స్టేషన్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. రికార్డుల నిర్వహణ, కేసు వివరాలు నమోదు చేయాలని, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను రికార్డుల్లో నమోదు చేసి, వేలం వే యడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రిసెప్షన్, కోర్టుడ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, పెట్రోలింగ్ విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రౌడీ, హిస్టరీ షీటర్లపై నిఘా ఏర్పా టు చేయాలని, గంజాయి, ఇసుక, పీడీఎస్ బి య్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, తిమ్మాపూర్ సీఐ జి.సదన్కుమార్, ఎస్సైలు, శిక్షణ ఎస్సైలు పాల్గొన్నారు. ● సీపీ గౌస్ఆలం -
వందేళ్ల చరిత్ర గల పార్టీ సీపీఐ
కరీంనగర్: దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సీపీఐ ఒక్కటేనని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నా రు. సీపీఐ కరీంనగర్ జిల్లా 23వ మహాసభలు నగరంలోని మధుగార్డెన్లో మంగళవారం ప్రా రంభమయ్యాయి. పార్టీ పతాకాన్ని సీనియర్ నా యకుడు వేముల వెంకట్రాజం ఆవిష్కరించారు. అమరవీరుల స్మారకస్తూపం చిహ్నా న్ని శ్రీరా ముల రామచంద్రం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజౖ రెన కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టుల ను దూరం చేసుకుని అధికారా న్ని పోగొట్టుకున్నామనే బాధలో బీఆర్ఎస్ ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సీపీఐ ఎంత కృషి చేసిందో ప్రజలకు తెలుసన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మికులందరూ నాలుగు లేబర్కోడ్లను వ్యతిరేకిస్తూ పోరా టం చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్కుమార్, బోయిని అశోక్, అందెస్వామి, టేకుమల్ల సమ్మయ్య, సురేందర్రెడ్డి పాల్గొన్నారు. కమ్యూనిస్టులకు దూరమై బీఆర్ఎస్ అధికారాన్ని పోగొట్టుకుంది సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు -
సిల్ట్ తొలగింపు పనులు వేగవంతం చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని డ్రైనేజీల్లో చేపట్టిన సిల్ట్ తొలగింపు పనులు వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ ఆదేశించారు. మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. మంకమ్మతోట టూటౌన్ పోలీసుస్టేషన్ పక్కనున్న నాలాలో సిల్ట్ తొలగింపు పనులను తనిఖీ చేశారు. నగరవ్యాప్తంగా డ్రైనేజీల్లో పేరుకుపోయిన సిల్ట్ను తొలగించడం జరుగుతుందని తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కొద్ది రోజుల క్రితమే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, సిల్ట్ తొలగింపు పనులు ప్రారంభించామన్నారు. వర్షాలు ప్రారంభం కావడానికి ముందగానే సిల్టు తొలగింపు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. డ్రైనేజీల నుంచి తీసిన సిల్ట్ను దూర ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందరికీ ఆరోగ్య పరీక్షలు కరీంనగర్టౌన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిర్వహించే ఆరోగ్య మహిళా కార్యక్రమంలో మహిళలందరికీ వైద్యపరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు. మంగళవారం కట్టరాంపూర్ ఆరోగ్యకేంద్రం, పద్మనగర్ బస్తీ దవాఖానాను సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ షుగర్, అధిక రక్తపోటు నిర్ధారణ అయిన వారందరికీ ప్రభుత్వ ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఉచితంగా మందులు అందించాలన్నారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై చర్చించారు. మే 28న అంతర్జాతీయ రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. డాక్టర్లు సనజవేరియా, నవ్య, రాజకుమార్ పాల్గొన్నారు. ‘ఇవేం చిల్లర రాజకీయాలు’ మానకొండూర్: రాష్ట్రంలోని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల క్యాంపు కార్యాలయాల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టుకున్నారా అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు ప్రశ్నించారు. ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమ క్యాంపు కార్యాలయాల్లో సీఎం రేవంత్రెడ్డి ఫొటో పెట్టుకున్నారా అని, కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో ఎందుకు సీఎం రేవంత్రెడ్డి ఫొటో పెట్టుకోవాలని మండిపడ్డారు. మానకొండూర్లో మంగళవారం మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఫొటోను కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో పెట్టాలని కాంగ్రెస్ నాయకుల దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్రమంత్రి బండి సంజయ్కుమార్ స్పందించాలన్నారు. కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి దిగిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కాంగ్రెస్ వర్కర్లుగా పనిచేయవద్దని సూచించారు. మాజీ జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్గౌడ్, నాయకులు ఎరుకల శ్రీనివాస్గౌడ్, రామంచ గోపాల్రెడ్డి, శాతరాజు యాదగిరి, సాయవేని రాజు, గుర్రం కిరణ్గౌడ్, పిండి సందీప్, నెల్లి శంకర్ పాల్గొన్నారు. కార్మిక సమాఖ్య జిల్లా మహిళా విభాగం సప్తగిరికాలనీ(కరీంనగర్): తెలంగాణ కార్మిక సమాఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహిళా విభాగాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా నేరెళ్ల సౌమ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా మోదుపల్లి సౌందర్య, గంగాధర మండల ఇన్చార్జిగా కోలేపాక అంజమ్మ, జగిత్యాల జిల్లా ఇన్చార్జిగా శనిగరపు కాంతమ్మను ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ.. సమాఖ్య కార్మిక సంఘం మహిళా విభాగానికి ఎన్నికవడం మరింత బాధ్యతను పెంచిందన్నారు. నూతన కార్యవర్గాన్ని పలువురు ఘనంగా సత్కరించారు. -
మీకు సిబిల్ ఉందా?
కరీంనగర్ కార్పొరేషన్: రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికకు సిబిల్ స్కోర్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్)ను ముడిపెట్టడం కలకలం రేపుతోంది. ఓ వైపు మంత్రులు యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ ప్రామాణికం కాదని చెబుతున్నా, అధికారులు మాత్రం సిబిల్ స్కోర్ లెక్కలు తీస్తున్నారు. కరీంనగర్ నగరపాలకసంస్థ పరిధిలో 16,595 మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగా, చాలా మందికి సిబిల్ స్కోర్ అడ్డంకిగా మారుతోంది. 16,595 దరఖాస్తులు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో భాగంగా సబ్సిడీతో కూడిన రుణ మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. నగరపాలకసంస్థ పరిధిలో 16,595మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈడబ్ల్యూసీకి చెందినవారు పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వారందరి సర్టిఫికెట్ల పరిశీలన సైతం నగరపాలకసంస్థ కార్యాలయ ఆవరణలోని కళాభారతిలో ఇటీవల పూర్తి చేశారు. లబ్ధిదారుల ఎంపిక నేపథ్యంలో సిబిల్ స్కోర్ను పరిగణలోకి తీసుకోవాలనే అధికారుల నిర్ణయంతో దరఖాస్తుల్లో ఆందోళన మొదలైంది. దరఖాస్తుదారుల్లో గుబులు రాజీవ్ యువవికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో సిబిల్ స్కోర్ ప్రామాణికంగా తీసుకోనుండడం దరఖాస్తుదారుల్లో గుబులు రేపుతోంది. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు నాలుగు కేటగిరీలవారిగా యూనిట్లను నిర్ణయించగా, సబ్సిడీ 70శాతం నుంచి 100 శాతం వరకు ఉంది. దీంతో చాలా మంది నిరుపేద, మధ్యతరగతి నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి సిబిల్ స్కోర్ ముడిపెట్టడంతో చాలా మంది అర్హుల జాబితాలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బ్యాంక్ రుణాలు, చెల్లింపులు, లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆరితేరిన వారికి సిబిల్ స్కోర్ గురించి అవగాహన అధికంగా ఉంటుంది. గతంలో రుణాలు తీసుకొని ఆలస్యంగా చెల్లించినా సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటుంది. గతంలో లేని విధంగా ప్రభుత్వ పథకానికి సిబిల్స్కోర్ను ప్రామాణికంగా తీసుకోవడంపై దరఖాస్తుదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే దరఖాస్తుదారుల జాబితాను ఆయా బ్యాంక్ల బ్రాంచ్లకు పంపించిన బల్దియా అధికారులు, బ్యాంక్ల నుంచి సిబిల్ స్కోర్ తెప్పించుకొంటున్నారు. ఇప్పటికే మెజార్టీ దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ నగరపాలకసంస్థకు చేరింది. వందశాతం వచ్చాక జాబితాను ప్రదర్శించే అవకాశం ఉంది. కమిటీ నిర్ణయమే ఫైనల్ రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక కోసం ఉన్నతస్థాయిలో కమిటీ ఏర్పాటైంది. కలెక్టర్ ప్రత్యేకాధికారిగా ఉండే ఈ కమిటీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగరపాలకసంస్థ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, బ్యాంక్ అధికారి, ఆయా దరఖాస్తుల కేటగిరీ వారిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అధికారులు సభ్యులుగా ఉండనున్నట్లు సమాచారం. సిబిల్ స్కోర్ ఆధారంగా, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితర కేటగిరీల వారిని ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రెండు, మూడు రోజుల్లో నగరంలో లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఏదేమైనా తమ అర్హతను సిబిల్ స్కోర్ దెబ్బతీసే అవకాశం ఉండడంతో దరఖాస్తుదారులుఆందోళన చెందుతున్నారు. సిబిల్ స్కోర్పై పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ఈబీసీఎస్టీ సిబిల్ స్కోర్ ఉంటేనే రాజీవ్ యువ వికాస పథకానికి అర్హత ఈ నిబంధనతో అనర్హులు భారీగా పెరిగే అవకాశం బల్దియా అధికారుల తీరుతో దరఖాస్తుదారుల్లో గుబులుక్రిస్టియన్ మైనార్టీ674దివ్యాంగులు714758,376బీసీ3,346బల్దియాలో యువవికాసానికి వచ్చిన దరఖాస్తులు 16,595మైనార్టీ 376ఎస్సీ3,277యూనిట్ సబ్సిడీ రూ.50,000 100 శాతం రూ.50,001 నుంచి రూ.లక్ష వరకు 90 శాతం రూ.1,00,001 నుంచి రూ.2లక్షల వరకు 80 శాతం రూ.2,00,001 నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం -
వరద వచ్చినా సిద్ధం
● ముందస్తు రుతుపవనాలతో ఇరిగేషన్శాఖ అప్రమత్తం ● ఎల్లంపల్లి, మిడ్మానేరు, ఎల్లంపల్లి గేట్ల నిర్వహణ షురూ ● టెండర్లు పిలిచిన అధికారులు ● ఎల్ఎండీలో మొదలైన పనులు, ఎంఎండీ, ఎల్లంపల్లివి జూన్లో ● వరదకు ముందే అప్రమత్తంగా ఉండేలా చర్యలుసాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలో తొలకరి పలకరిస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా ఈసారి అసాధారణరీతిలో దాదాపు రెండువారాల ముందే వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నీటిపారుదలశాఖ వానా కాలానికి ముందస్తుగానే గేట్ల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. రుతుపవనాలు ముందుగా రావడంతో ఈ పనులల్లో వేగం పెంచింది. ఇప్పటికే లోయర్ మానేరు డ్యాం అధికారులు గేట్ల నిర్వహణ పనులు చేపట్టారు. ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు టెండర్లు ఖరారవగా.. సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు ప్రాజెక్టు గేట్ల నిర్వహణ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ల కాలంలో గేట్ల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా ఏం చేస్తారు? సాధారణంగా ఏటా వర్షాకాలానికి ముందే.. నీటిపారుదలశాఖ అధికారులు గేట్ల నిర్వహణకు పూనుకుంటారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల ప్రకారం ప్రతీ డ్యాం వద్ద వర్షాకాలానికి ముందు (ప్రీ మాన్సూన్), వర్షాకాలానికి తరువాత (పోస్ట్ మాన్సూన్) గేట్ల లూబ్రికేషన్ ప్రక్రియను చేపడతారు. వరద సమయంలో గేట్లు సులువుగా పైకి లేచేందుకు లూబ్రికేషన్ దోహదపడుతుంది. ఇందులో భాగంగా వాల్వ్ గేర్బాక్స్లకు కూడా గ్రీస్ పూయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు వీలుగా జనరేటర్ల పనితీరును సమీక్షిస్తారు. వీటిని ప్రతీ ఐదు రోజులకు ఒకసారి దాదాపు 5 నిమిషాలపాటు అనివార్యంగా పనిచేయిస్తారు. ఇలాంటి భారీ జనరేట్లు ప్రతీ ప్రాజెక్టు వద్ద రెండు వరకు ఉంటాయి. వీటితోపాటు లిఫ్ట్లు, మెకానిక్ టూల్స్, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులను కూడా నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ఎల్ఎండీ అధికారులు రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు టెండరు పిలవగా.. ప్రస్తుతం పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇక పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లికి సంబంధించి రూ.38లక్షలకు టెండరు ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా మిడ్మానేరుకు సంబంధించి దాదాపు రూ.26 లక్షలతో తాజాగా టెండరు పిలిచారు. ఈ రెండు ప్రాజెక్టుల పనులు జూన్లో మొదలు కానున్నాయి.ప్రాజెక్టు సామర్థ్యం గేట్లు ఎల్ఎండీ 24 టీఎంసీ 20ఎంఎండీ 27.5 టీఎంసీ 25ఎల్లంపల్లి 20 టీఎంసీ 62సాధారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు ఉన్న సమయంలో ప్రాజెక్టుల్లో నీరు చెప్పుకోదగ్గస్థాయిలో ఉండేది. వీటికి వర్షాలు తోడైనపుడు ప్రాజెక్టులు వేగంగా నిండి గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యేది. దాదాపుగా ఏడాదిన్నరగా ఎత్తిపోతలు నిలిచిపోయిన దరిమిలా మునపటి తరహాలో ప్రాజెక్టులలో నీటిమట్టాలు లేవనే చెప్పాలి. ఒకవేళ భారీగా కుండపోత వర్షాలు కురిసి, ఎగువనున్న మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వరదలు వస్తేనే మన ప్రాజెక్టులు నిండి, గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నీటిపారుదల శాఖ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వరద అవకాశాలు అంతంతే.. -
Kannaram 120 ఏళ్ల కన్నారం.. ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
విద్యానగర్(కరీంనగర్): నాటి అలిపిరాల నుంచి నేటి కరీంనగర్ వరకు శాతవాహనుల నుంచి కాకతీయల వరకు ఎందరో ఏలిన గడ్డ ఇది. ఎలగందుల కేంద్రంగా నిజాంల పాలన, ఉగ్గుపాలతో ఉద్యమాలను రంగరించిన వీరమాతలు, ఉరకలేత్తే చైతన్య సమరయోధుల గర్జన, చాళక్యుల కాలం నుంచి జిల్లా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ప్రత్యేకస్థానాన్ని నిలుపుకుంది. ఎలగందల్ జిల్లా అవల్ తాలుకుదార్ గోవింద్ నాయక్ కరీంనగర్లో 1918లో క్లాక్ టవర్ నిర్మించారు. 1935లో నిజాంపాలన రజతోత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న నిజాం ప్రభువులకు స్వాగతం పలికేందుకు షేక్ఖాన్ స్వాగత ద్వారంగా కమాన్ నిర్మించారు. చదవండి: గంగి గోవు పాలు...గడ్డిపోచ..ఏది ఘనమైనది?!1905కు ముందే పోలీస్స్టేషన్ ఏర్పాటు కాగా.. ప్రస్తుతం కరీంనగర్ రూరల్స్టేషన్గా కొనసాగుతోంది. 1920లో మానేరు నదిపై రాతి వంతెన నిర్మాణం జరిగింది. 1958లో ఆర్టీసీ బస్సులు మొదలయ్యాయి. 1956లో వేంకటేశ్వర ఆలయం దగ్గర తొలివాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగింది. 1956లో ప్రస్తుత మల్టీఫ్లెక్స్స్థానంలో పాతబస్స్టేషన్ ఉండేది. 1960 తర్వాత గాంధీ సెంటీనరీ మ్యూజియం, 1956 ఎస్సారార్, 1969లో సైన్సివింగ్ కాలేజీ, 1967లో జిల్లా ప్రధానాస్పత్రి, జిల్లా కోర్టు భవనాలు, 1973లో మహిళా డిగ్రీ కళాశాల, 1980లో కలెక్టరేట్, అంబేద్కర్ స్టేడియం, 1980లో ప్రస్తుత బస్టాండ్ నిర్మించారు. 1980 తర్వాత పురపాలక సంఘ భవనం, కళాభారతి నిర్మించారు. 1982లో ఎల్ఎండీ నిర్మాణం పూర్తయింది. 1994లో మానేరునదిపై కొత్త వంతెన నిర్మించారు. 2001లో ఉజ్వల పార్కు, 2004లో జింకల పార్కు నిర్మించారు.ఇదీ చదవండి: స్కూల్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు : అపూర్వ సహోదరులుపాత నగర స్వరూపంపాత పట్టణ ప్రాంతాలైన పాత జిర్రాబాయి పరిసరాలు, పాత బజార్, అహ్మద్పురా, బంజరుదొడ్డి, ఫతేపూరా, కుమ్మరి కాపువాడలు, మేదరివాడ, షా సాహెబ్ మొçహీల్లా, పద్మశాలి, బ్రహ్మణ వీధులు, బోయ, దోభీవాడ, సిక్కువాడ, ప్రకాశం గంజ్, పెద్ద గడియారం, అస్లాం మజీద్ రోడ్, జాఫ్రీరోడ్, తిలక్రోడ్ వాడలున్నాయి. ప్రస్తుత ఆంధ్రా బ్యాంక్ ప్రాంతం అజ్మత్పురా, గుర్రాలపై స్వారీ చేస్తూ విధులు నిర్వహించిన పోలీస్ జమేదార్లు నివసించే ప్రాంతం సవరన్ మొహాల్లాగా ఏర్పడింది. డాక్ బంగ్లా వెనుక ప్రాంతం ముకరంపురగా, మిషన్ హాస్పిటల్ ఎదుట క్రిస్టియన్కాలనీ, దాని వెనక కురుమవీధి ఏర్పడ్డాయి.మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ వరకు..1952లో 45వేల జనాభాతో కరీంనగర్ మూడోగ్రేడ్తో 24 వార్డులతో మున్సిపాలిటీగా ఏర్పడింది. తొలి మున్సిపల్ చైర్మన్గా ఖాజాబషీరుదీ్దన్ ఉండగా ఆయన హయాంలోనే గ్రేడ్–2 మున్సిపాలిటీగా మారింది. 1981–85 పాలకవర్గం కాలంలో గ్రేడ్–1, 1987లో కరీంనగర్ పరిధిలోని రాంపూర్, రాంనగర్ పంచాయతీలు మున్సిపాలిటీలో కలిశాయి. 2005లో నగరపాలక సంస్థంగా అవతరించి, 66 డివిజన్లతో కొనసాగుతోంది. మొదటి మేయర్గా దేశివేని శంకర్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ప్రత్యేక పాలన సాగుతోంది. కరీంనగర్ ప్రస్తుతం అభివృద్ధి పథకంలో కొనసాగుతోంది. స్మార్ట్ సిటీగా నయాలుక్ సంతరించుకుంటోంది. శాతవాహన యునివర్సిటీ, రైల్వేస్టేషన్, కేబుల్బ్రిడ్జి, ఐటీ టవర్, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు ఏర్పడ్డాయి. -
అమ్మా.. లేమ్మా.. ఇంటికెళ్దాం..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంతో ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో విషాదం అలుముకుంది. కళ్ల ముందే కన్న తల్లి ప్రాణాలు పోతుంటే లోకం పోకడ తెలియని చిన్నారుల ఆర్తనాదాలు అందరినీ కదిలించాయి. తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించడం.. తండ్రి బతుకుదెరువు రీత్యా గల్ఫ్లో ఉండడంతో చిన్నారులు అనాథలయ్యారు. రాజన్నపేటకు చెందిన చొట్టి కీర్తన, మహేందర్ దంపతులకు ఇద్దరు కుమారులు అన్వేశ్(6), శివాన్‡్ష(3) ఉన్నారు. మహేందర్ ప్రస్తుతం గల్ఫ్లో ఉండగా.. కీర్తన తన ఇద్దరు కుమారులతో కలిసి పుట్టింటికి బయలుదేరింది. మాచారెడ్డిలో బస్సు దిగి తన తండ్రికి ఫోన్ చేసి తమను తీసుకుపోవడానికి ద్విచక్ర వాహనంపై రమ్మంది. మాచారెడ్డికి వచి్చన తండ్రి కూతురు కీర్తనతోపాటు ఇద్దరు మనుమళ్లను వాహనంపై ఎక్కించుకొని స్వగ్రామమైన లచ్చపేటకు వెళ్తుండగా.. లచ్చపేట మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కీర్తన తీవ్ర గాయాలకు గురై మరణించింది. ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన తాతతోపాటు ఇద్దరు చిన్నారులు గాయాలకు గురయ్యారు. అమ్మా.. లేమ్మా.. గాయపడ్డ చిన్నారులు తల్లి వద్దకు వెళ్లి అమ్మా.. లేమ్మా.. అంటూ తట్టి లేపడం అక్కడున్న వారందరినీ కదిలించింది. వారి రోదనలు కట్టతడి పెట్టించాయి. కీర్తన మృతదేహాన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు గల్ఫ్లో ఉన్న మహేందర్కు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి రాజన్నపేట మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ముక్క శంకర్ వెళ్లి క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పశువులకు నీటి గోస
● రహదారిపై రైతు దంపతుల నిరసన గన్నేరువరం: వ్యవసాయ బావికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పశువులకు తాగునీటి గోస ఏర్పడిందని, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్లోని ప్రధాన రహదారిపై రైతు దంపతులు సోమవారం పశువులతో నిరసన చేపట్టారు. గ్రామానికి చెందిన కొర్వి పోశయ్య– సుశీల దంపతులకు వ్యవసాయంతో పాటు పాడి పశువుల పెంపకం చేపట్టారు. ఇటీవల ఓ కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలతో వెళ్తున్న లారీ ఈ ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్ వైర్లకు తగలడంతో వైర్లు తెగిపోయాయి. ఇక్కడి విద్యుత్ స్తంభం నుంచి పోశయ్య బావికి సరఫరా నిలిచిపోయింది. 15రోజులుగా విద్యుత్ పునరుద్ధరణను సంబంధిత అధికారులు మరిచారని ఆ రైతు దంపతులు ఆరోపించారు. -
కరీంనగర్లో దరఖాస్తు.. మహబూబ్నగర్లో మంజూరు
● అధికారుల తప్పిదంతో రేషన్ కార్డు లబ్ధిదారుడికి తిప్పలు మహబూబ్నగర్ రూరల్: రేషన్ కార్డు కోసం కరీంనగర్ జిల్లాలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడికి మహబూబ్నగర్ జిల్లాలో మంజూరైంది. అధికారుల తప్పిదం కారణంగా అక్కడ జారీ చేయాల్సిన కార్డు ఇక్కడ రావడంతో లబ్ధిదారుడికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మతోటకు చెందిన మాడిశెట్టి లక్ష్మణ్ కొత్త రేషన్ కార్డు కోసం తన ఆధార్ కార్డుతో స్థానికంగా దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన కార్డు జారీకి సంబంధించిన ప్రక్రియ నిర్వహించిన సంబంధిత శాఖ సిబ్బంది, అధికారులు కార్డు కోసం కరీంనగర్కు బదులుగా మహబూబ్నగర్ అని కంప్యూటర్లో పొందుపరిచారు. దీంతో ఆయనకు మహబూబ్నగర్లోని 1425022 రేషన్ షాపును కేటాయించారు. తనకు పొరపాటున జారీ చేసిన కార్డును రద్దు చేసి కొత్తది తాను నివాసముంటున్న ప్రాంతంలో ఇవ్వాలని కరీంనగర్ జిల్లా అధికారులకు విన్నవించుకోగా.. మహబూబ్నగర్ జిల్లాలో జారీ చేసిన కార్డు రద్దు చేస్తేనే నూతనంగా కరీంనగర్ జిల్లాలో కార్డు జారీ చేస్తామని తిరకాసు పెట్టారు. అధికారులు చేసిన తప్పిదానికి తనను బలి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కార్డు రద్దు చేస్తాం కరీంనగర్ తహసీల్ కార్యాలయంలో నమోదు మేరకు రేషన్ కార్డు మహబూబ్నగర్లో జారీ అయ్యిందని మహబూబ్నగర్ జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ తెలిపారు. అక్కడి అధికారుల పొరపాటు కారణంగా ఇక్కడ జారీ అయిన కార్డును రద్దు చేసి లబ్ధిదారుడికి అసౌకర్యం కలగకుండా చూస్తామని పేర్కొన్నారు. -
రామగుండం సీపీ పేరిట ఫేక్ ఫేస్బుక్ ఖాతా
గోదావరిఖని: రామగుండం పోలీస్కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేరు, ఫొటోతో సైబర్నేరగాళ్లు ఫేక్ ఫేస్బుక్ సృష్టించారు. ఫ్రెండ్ రిక్వెస్ట్లను అనుమతించి డబ్బులు పంపించాలని అడిగారు. అంతేకాదు.. అధికారి ఫ్రెండ్స్, బంధువులు, ఆర్మీ ఆఫీసర్ బదిలీ అయ్యారని, దీంతో ఇంటిసామగ్రి తక్కువ ధరకు విక్రయిస్తున్నామని అకౌంట్లో పోస్టు చేశారు. పోలీసు అధికారి పుట్టినరోజు సందర్భంగా బహుమతులు పంపించేలా చాట్చేసి నమ్మించారు. స్పందించిన రామగుండం పోలీస్ కమిషనర్.. పోలీస్ అధికారి ప్రొఫైల్ ఫొటో చూసి అధికారే చాట్ చేస్తున్నారని, ఇది నమ్మి మోసపోవద్దని, ఎవరూ అకౌంట్కు డబ్బులు పంపించరాదన్నారు. పదోన్నతులు, బదిలీలు వేసవి సెలవుల్లో చేపట్టాలి ● టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమార్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను వంచిస్తోందని, వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని, బదిలీలు, పదోన్నతులు వేసవి సెలవుల్లో చేపట్టాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్కుమార్ డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేటలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. కొన్నేళ్లుగా వివిధ అత్యవసర పనుల కోసం జీపీఎఫ్ లోన్, పార్ట్ ఫైనల్ బిల్లులు చెల్లించక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యోగుల 4 డీఏలు పెండింగ్లో ఉన్నాయని, ఎన్నికల ముందు సీఎం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే చెల్లించాలని అన్నారు. పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే తెప్పించి పీఆర్సీ ప్రకటించాలన్నారు. ఐదేళ్లకు ప్రకటించాల్సిన పీఆర్సీని ఏడు సంవత్సరాలైనా ప్రకించకుండా కాలయాపన చేయడం అన్యాయమని అన్నారు. జిల్లా అధ్యక్షుడు దుమాల రామనాథ్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని పాఠశాలల్లో నియామకమైన పారిశుధ్య కార్మికులకు చెల్లించాల్సిన ఐదు నెలల జీతం ఇవ్వాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు డబ్బెడ హన్మండ్లు, మందాటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర బాధ్యులు సూర భాస్కర్, బొజ్జ కృష్ణ, మండల అధ్యక్షులు కదిరే శ్రీనివాస్, భాస్కర్ పాల్గొన్నారు. -
దారి తొలగించి కుల బహిష్కరణ
● శుభ, అశుభ కార్యక్రమాలకు దూరం ● రక్షణ కల్పించాలని ప్రజావాణిలో వేడుకోలు కరీంనగర్ అర్బన్: నాగరిక సమాజంలో అనాగరిక చర్య ఇది. కుల పెద్దలు పెద్దరికం పేరిట దాష్టీకం ప్రదర్శించగా బాధిత కుటుంబం కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో గోడు వెళ్లబోసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్కు చెందిన శేరి చంద్రయ్య వ్యవసాయం, పశు పోషణతోపాటు కులవృత్తి అయిన చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయ భూమికి వెళ్లేందుకు తాతలకాలం నుంచి దారి ఉండగా తమ సామాజికవర్గానికి చెందిన నలుగురు జేసీబీతో కందకంలా మార్చేశారని వాపోయాడు. చేపలు పట్టేందుకు వెళ్తే కులం లేదని నిరాకరించారని, కులం నుంచి బహిష్కరించినట్లు పేపర్ రాశారని రోదించారు. గ్రామంలో జరిగే శుభ, అశుభ కార్యక్రమాల సమాచారం ఇవ్వవద్దని చెప్పగా ఎవరూ తమతో మాట్లాడటం లేదని వివరించారు. మావోయిస్టు అధినేతను చంపితే నక్సలిజం పోతదా.. ● మూలాలను గుర్తించి పరిష్కరించకుండా హత్య చేయడం అప్రజాస్వామికం ● సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి కరీంనగర్: మావోయిస్టు పార్టీ అగ్రనేత సెంట్రల్ కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావును తుద ముట్టించడం ద్వారా బీజేపీ ప్రభుత్వం నక్సలిజం పోతుందని భ్రమ పడడం దురదృష్టకరమని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక వీరుడు మరణిస్తే వేల మంది పుట్టుకొస్తారన్నారు. నక్సలిజం మూలాలను చర్చించి పరిష్కరించకుండా ఎన్కౌంటర్ పేరుతో హత్యలు చేయడం సరికాదని అన్నారు. ఈనెల 27, 28ల్లో కరీంనగర్ నగరంలోని మధు గార్డెన్లో జరిగే సీపీఐ జిల్లా 23వ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, రాష్ట కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ హాజరవుతున్నారన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్రెడ్డి, కొయ్యడ సృజన్కుమార్, బోయిని అశోక్, టేకుమల్ల సమ్మయ్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, కిన్నెర మల్లమ్మ, కటికరెడ్డి బుచ్చన్నయాదవ్, బ్రాహ్మణపల్లి యుగేందర్, బోనగిరి మహేందర్, మచ్చ రమేశ్, కంది రవీందర్రెడ్డి తదితరులున్నారు. -
ప్రపంచస్థాయి ప్రయోగశాలగా పని చేయాలి
● యువత నైపుణ్యత ఆధారంగా పరిశ్రమలు ● రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ● గ్రామీణ ప్రొటో టైపింగ్, ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభంమంథని: పల్లెవాసుల్లో దాగిఉన్న నైపుణ్యానికి దోహదపడేలా మంథనిలో తొలిసారి ఏర్పాటు చేసిన గ్రామీణప్రొటో టైపింగ్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రపంచస్థాయి ప్రయోగశాలగా పని చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆకాంక్షించారు. స్థానిక ఆర్టీసీ బస్సు డిపో ఎదుట డ్రీమ్ స్టార్ట్ రైస్ ఇన్నోవేషన్ నెట్వర్క్లో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామీణ ప్రొటో టైపింగ్–ఇన్నోవేషన్ సెంటర్ను కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి సోమవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో శ్రీధర్బాబు మాట్లాడుతూ, టీ వర్క్స్ వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు సాంకేతికతపరంగా వారిలోని నైపుణ్యం వెలికి తీయడానికి సెంటర్ ఉయోగపడుతుందన్నారు. హైదరాబాద్లో పనిచేసే టీ వర్క్స్ బృందం నుంచి ముగ్గురు శిక్షకులను ఇక్కడ నియమిస్తామని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రొటో టైపింగ్ – ఇన్నోవేషన్ సెంటర్ను పరిశీలించేలా చూడాలని కలెక్టర్కు మంత్రి సూచించారు. రైతు సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తామని అన్నారు. మంథనిలో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకొవచ్చామని, విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని చూపించి భవిష్యత్లో అనేక కంపెనీలను తీసుకొవస్తామని మంత్రి తెలిపారు. రోజూవారి సమస్యలను సాంకేతికతను వినియోగించి మార్పులు చేస్తే పరిష్కారం అవుతాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. టీ వర్క్స్ డైరెక్టర్ జోగేందర్, ఆర్డీవో సురేశ్, నాయకులు శశిభూషణ్ కాచే, కొత్త శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 3వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ రైతులు, గృహావసరాలు, పరిశ్రమలకు ఇబ్బంది రావొద్దనే లక్ష్యంతో ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చి 3 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. గుంజపడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రూ.2.90 కోట్లతో పీఏం కుసుమ్ కార్యక్రమం కింద చేపట్టనున్న సోలార్ ప్రాజెక్టు మంజూరు పత్రాలను మంథనిలో కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ రవీందర్రావు, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పంపిణీ చేశారు. మంథనితోపాటు అప్పన్నపేట, కాల్వశ్రీరాంపూర్, ధర్మారం, చొప్పదండిలో సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం కరీంనగర్ సహకార బ్యాంకు నుంచి రూ.3 కోట్ల రుణం మంజూరు చేశారన్నారు. కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణ, జిల్లా సహకార అధికారి శ్రీమాల, సిరిసిల్ల గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణగౌడ్, ఆర్టీఐ సభ్యుడు సురేశ్, సంఘం కార్యదర్శి అశోక్కుమార్ తదితరులు ఉన్నారు. -
లచ్చపేటలో ప్రమాదం.. రాజన్నపేటలో విషాదం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంతో ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో విషాదం అలుముకుంది. కళ్ల ముందే కన్న తల్లి ప్రాణాలు పోతుంటే లోకం పోకడ తెలియని చిన్నారుల ఆర్తనాదాలు అందరినీ కదిలించాయి. తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించడం.. తండ్రి బతుకుదెరువు రీత్యా గల్ఫ్లో ఉండడంతో చిన్నారులు అనాథలయ్యారు. రాజన్నపేటకు చెందిన చొట్టి కీర్తన, మహేందర్ దంపతులకు ఇద్దరు కుమారులు అన్వేశ్(6), శివాన్ష్(3) ఉన్నారు. మహేందర్ ప్రస్తుతం గల్ఫ్లో ఉండగా.. కీర్తన తన ఇద్దరు కుమారులతో కలిసి పుట్టింటికి బయలుదేరింది. మాచారెడ్డిలో బస్సు దిగి తన తండ్రికి ఫోన్ చేసి తమను తీసుకుపోవడానికి ద్విచక్ర వాహనంపై రమ్మంది. మాచారెడ్డికి వచ్చిన తండ్రి కూతురు కీర్తనతోపాటు ఇద్దరు మనుమళ్లను వాహనంపై ఎక్కించుకొని స్వగ్రామమైన లచ్చపేటకు వెళ్తుండగా.. లచ్చపేట మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కీర్తన తీవ్ర గాయాలకు గురై మరణించింది. ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన తాతతోపాటు ఇద్దరు చిన్నారులు గాయాలకు గురయ్యారు. అమ్మా.. లేమ్మా.. గాయపడ్డ చిన్నారులు తల్లి వద్దకు వెళ్లి అమ్మా.. లేమ్మా.. అంటూ తట్టి లేపడం అక్కడున్న వారందరినీ కదిలించింది. వారి రోదనలు కట్టతడి పెట్టించాయి. కీర్తన మృతదేహాన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు గల్ఫ్లో ఉన్న మహేందర్కు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి రాజన్నపేట మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ముక్క శంకర్ వెళ్లి క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి ఇద్దరు చిన్నారులకు గాయాలు గల్ఫ్లో తండ్రి -
మహిళ దారుణ హత్య
కేసు పెట్టారని కక్ష..చందుర్తి(వేములవాడ): భూవివాదం ఓ మహిళ హత్యకు దారి తీసింది. కేసు పెట్టిందని కక్ష పెంచుకున్న ఓ యువకుడు మహిళను నడి రోడ్డుపై కడతేర్చాడు. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తిలో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. చందుర్తి మండల కేంద్రానికి బొల్లు మల్లవ్వ(57), ఆమె మరిది మధ్య నాలుగేళ్లుగా భూమి విషయంలో వివాదం ఉంది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య భూమి పంచాయితీ నడుస్తోంది. పంచాయితీ పరిష్కారం కాకపోవడంతో మల్లవ్వ ఇరువై రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై అంజయ్య ఇరు కుటుంబాలను స్టేషన్కు పిలిపించి పంచాయితీ పెద్దల మధ్య పరిష్కరించుకోవాలని సూచించారు. ఈక్రమంలో మల్లవ్వ సోమవారం సాయంత్రం గ్రామ శివారులోని పశువుల కొట్టం వద్దకు వెళ్లి వస్తుండగా.. పెద్దమ్మ గుడి వద్ద కాపు కాసిన తన మరిది కొడుకు బొల్లు మనోజ్ వేట కొడవలితో దాడి చేశాడు. మల్లవ్వ మెడపై కత్తితో దాడి చేసి చంపి.. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య పరిశీలించారు. అయితే హత్యకు పాల్పడ్డ బొల్లు మనోజ్ గతంలో ఓ వ్యక్తిని చంపాడు. ఆ సమయంలో మైనర్ కావడంతో జువైనల్ జైలుకు వెళ్లి వచ్చాడు. మృతురాలి బంధువులు రోడ్డుపై బైఠాయించారు. వారు మాట్లాడుతూ నిందితునికి పోలీసులు కొమ్ముకాస్తున్నారంటూ ఆరోపించారు. మృతురాలికి భర్త రాజయ్య, కుమారుడు రాజు, కూతురు ఉన్నారు. కుమారుడు రాజు జీవనోపాధి కోసం గల్ప్ వెళ్లాడు. చందుర్తిలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు ఆందోళనకు దిగిన మృతురాలి బంధువులు -
రోజుకు ఉమ్మడి జిల్లా నుంచి 50 నుంచి 60 వేల ఆర్డర్లు ● రూ.కోట్లలో వ్యాపారం
షాపింగ్.. ఒకప్పుడు ఒకరిద్దరిని తోడుగా తీసుకొని వెళ్లి.. నచ్చింది చూసి.. ధర ఆరా తీసి.. బేరం చేసి తెచ్చుకునేవాళ్లం. నేడు అంతా మారిపోయింది. ఏది కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో గుమ్మంలోకి వచ్చి చేరుతోంది. జీవితం ఉరుకుల..పరుగులమయం కావడంతో ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ ఆప్షన్గా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి రోజుకు సుమారు 50 నుంచి 60 వేల ఆర్డర్లు వెళ్తుండగా, కోట్లలో వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. ఈ ఆన్లైన్ షాపింగ్ డెలివరీబాయ్స్కు ఉపాధినిస్తుండగా.. ప్రజలకు ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టే శ్రమ లేకుండా పోతోంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం.. బీపీ.. గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. జీవితమే టైమ్ మెషిన్లా మారిన నేటి కాలంలో ఆన్లైన్ షాపింగ్.. పరిణామాలపై స్పెషల్ స్టోరీ..– వివరాలు 8లోu -
సిబిల్ స్కోర్ వివరాలు అందించాలి
కరీంనగర్ కార్పొరేషన్: రాజీవ్ యువవికాసం దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ వివరాలు బ్యాంక్లు వెంటనే అందించాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ ఆదేశించారు. సోమవారం నగరపాలకసంస్థలో బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారుల బ్యాంకు బ్రాంచ్ల వివరాల ప్రకారం ఇప్పటికే సిబిల్ స్కోర్ కోసం దరఖాస్తులు పంపించామన్నారు. సిబిల్ స్కోర్ వెరిఫికేషన్ పూర్తిచేసిన బ్యాంకులు, సంబంధిత సిబిల్ స్కోర్ వివరాలను తిరిగి తమకు అప్పగించాలన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం బ్యాంకులకు లేదన్నారు. ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేస్తుందని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు, మెప్మా పీడీ వేణుమాధవ్రెడ్డి, టీఎంసీ మానస పాల్గొన్నారు. జూన్ 10 నుంచి అమ్మకాలు ప్రారంభించాలి నగరంలోని పద్మనగర్ సమీకృత మార్కెట్లో వ్యాపారులు జూన్ 10వ తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభించాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ అదేశించారు. సమీకృత మార్కెట్లో లీజు ఒప్పందంపై షాప్లు పొందిన వ్యాపారులతో సోమవారం నగరపాలకసంస్థ కార్యాలయ ఆవరణలోని కళాభారతిలో సమావేశమయ్యారు. మార్కెట్లో షాప్లు పొందిన వ్యాపారులు తమ వ్యాపారాన్ని ప్రారంభించాలన్నారు. నగరపాలక సంస్థ నిబంధనల ప్రకారం ముందుగా ఒప్పందం చేసుకోవాలని సూచించారు. నేటి నుంచి సీపీఐ జిల్లా మహాసభలుకరీంనగర్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జిల్లా మహాసభలు ఈనెల 27, 28వ తేదీల్లో కరీంనగర్లోని మధుగార్డెన్లో జరగనున్నాయి. జిల్లాలో పార్టీకి గత వైభవం తీసుకొచ్చేందుకు సీపీఐ నేతలు ఆరాటపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 300 గ్రామాల్లో 149 గ్రామశాఖలు, 16 మండలాల సభలు నిర్వహించుకుని పార్టీలోకి కొత్త జవసత్వాలను నింపేందుకు నాయకత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. మొదటి రోజు భవిష్యత్ నిర్మాణంపై జిల్లా కార్యదర్శి నివేదికను ప్రవేశపెడతారు. 2వ రోజున పార్టీ కౌన్సిల్, కార్యవర్గం, కార్యదర్శి ఎన్నిక జరగనుంది. ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంభశివరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్తో పాటు రాష్ట్ర నాయకులు, తదితరులు హాజరుకానున్నారు. కనీస వేతన చట్ట సవరణ చేయాలికరీంనగర్టౌన్: తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ లోపు కనీస వేతన చట్ట సవరణ చేయాలని, లేనిపక్షంలో కార్మికులతో కలిసి చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తామని బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పప్పుల సురేశ్ తెలిపారు. సోమవారం కరీంనగర్లోని బీఎంఎస్ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ ఈ నెల 25న హైదరాబాద్లో జరిగిన బీఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కార్మికుల సంక్షేమం కోసం కొన్ని తీర్మానాలు ఆమోదించడం జరిగిందన్నారు. ముఖ్యంగా 18ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కనీస వేతన చట్ట సవరణ చేయాలని, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్ఐఎస్ సెంటర్లో మందుల కొరత లేకుండా చూడాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలనే అంశాలపై తీర్మానం చేసినట్టు వివరించారు. జిల్లా అధ్యక్షుడు పసుల శ్రవణ్, కార్యదర్శి తొర్తి శ్రీనివాస్, నాయకులు కర్ణకంటి సత్యం, మొగిలిపాలెం తిరుపతి, రేణికుంట శంకర్ పాల్గొన్నారు. శాతవాహనకు 35 లెక్చరర్ పోస్టులు మంజూరుకరీంనగర్టౌన్: శాతవాహన యూనివర్సిటీలో కాంట్రాక్టు పద్ధతిన 35 లెక్చరర్ పోస్టులకు ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్ స్ట్రీమ్ పద్ధతిన 10 పోస్టులు... ఇందులో ఎకనమిక్స్ (2), కామర్స్ (2), బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (2), ఆర్గానిక్ కెమిస్ట్రీ (2), ఫిజికల్ కెమిస్ట్రీ (2), సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిన 25 పోస్టులు... ఇందులో తెలుగు (4), ఇంగ్లిష్ (4), కామర్స్ (3), బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (2), ఎఫ్ఎస్టీ (4), బాటనీ (3), మ్యాథమెటిక్స్ (2), కంప్యూటర్ సైన్స్ (3) పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. -
జీపీవో ప్రక్రియ ముమ్మరం
● జూన్ 2లోగా నియమాకానికి చర్యలు ● పరీక్ష మూల్యాంకన బాధ్యత రెవెన్యూకేకరీంనగర్ అర్బన్: గ్రామ పాలన అధికారుల నియామక ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గతంలో గ్రామస్థాయిలో వీఆర్వో, వీఆర్ఏ ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం మారడంతో ధరణిని తొలగించి భూ భారతిని తీసుకురాగా గ్రామంలో పాలన అధికారి ఉండాలని నిర్ణయించింది. ఆసక్తి గల వీఆర్వో, వీఆర్ఏల నుంచి దరఖాస్తులు స్వీకరించగా రెండ్రోజుల క్రితం పరీక్ష నిర్వహించారు. జూన్ 2లోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మూల్యాంకన బాధ్యత రెవెన్యూదే జీపీవో పరీక్షల మూల్యాంకన బాధ్యత రెవెన్యూశాఖ నిర్వహించనుంది. పరీక్షకు 205మంది దరఖాస్తు చేసుకున్నారు. 79మంది వీఆర్వోలు దరఖాస్తు చేయగా అందులో 8 తిరస్కరించారు. 126 మంది వీఆర్ఏలు దరఖాస్తు చేయగా ఆరు తిరస్కరించారు. సస్పెన్షన్ అయినవారు, కోర్టు కేసులు, ఏసీబీ కేసులున్నవారిని తిరస్కరించారు. పలువురు తహసీల్దార్లతో కమిటీని ఏర్పాటు చేసి మూల్యంకనం చేయనున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 మార్కులు, ఇతరులకు 35 మార్కులు వస్తేనే పాస్గా పరిగణించనుండగా.. జీపీవోగా నియామకం కానున్నారు. క్షేత్రస్థాయి సమస్యలకు వారధి గతంలో ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉండే వీఆర్వోల దృష్టికి తీసుకెళ్లేవారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని రెవెన్యూ అధికారులకు వివరించి పరిష్కారమయ్యేలా చేసేవారు. సదరు పరిస్థితి లేకపోవడంతో గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు పేరుకుపోయాయి. పరిస్థితిని గమనించిన ప్రభుత్వం తిరిగి ఊరికో గ్రామ పాలనాధికారి(జీపీవో)ని ని యమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే పూర్వం వీఆర్వో విధులు నిర్వహించి వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న 191 మంది వీఆర్వోలు పని చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశా రు. ఈ క్రమంలో 172 మంది పరీక్ష రాయగా అర్హులను జీపీవోలుగా నియమించనున్నారు. మరో 33మంది అవసరం జిల్లాలో 318 పంచాయతీలున్నాయి. ఇందులో 205 రెవెన్యూ గ్రామాలుగా ఉండగా పరీక్ష రాసినవారిని తీసుకున్నా 172మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కూడ పాస్ మార్కులు వచ్చినవారినే తీసుకోను న్నారు. మరో 33 మంది అవసరం కాగా తొలి విడతలో నియమించే వారికే ఇతర గ్రామాల అదనపు బాధ్యతలైనా అప్పగించాలి. లేదంటే ఇతర ప్రభు త్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న వారిని నియమించాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.జిల్లాలో మొత్తం గ్రామాలు: 318 రెవెన్యూ గ్రామాలు: 205 రెవెన్యూ డివిజన్లు: 02 మండలాలు: 16 సాగు విస్తీర్ణం: 3,46,063ఎకరాలు -
లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ
● నేటి నుంచే శిక్షణ.. సామగ్రి అందజేత ● 300 మందికి శిక్షణకు ఏర్పాట్లు పూర్తి ● తొలి విడతలో 280 మంది ఎంపికకరీంనగర్ అర్బన్: లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం శిక్షణ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. భూభారతి చట్టం అమలులో భాగంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా లైసెన్స్డ్ సర్వేయర్ల నియామక ప్రక్రియపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. జిల్లా కేంద్రంలోనే 50 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుండగా తొలివిడత 280మందిని ఎంపిక చేస్తూ సోమవారం భూ కొలతలశాఖ జాబితా విడుదల చేసింది. వారికి అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ శిక్షణ సామగ్రిని అందజేశారు. మలివిడతలో మిగిలిన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. భూవివాదాల శాశ్వత పరిష్కారానికి రిజిస్ట్రేషన్ల సమయంలో భూనక్షా(పటం) సమర్పించాలనే నిబంధన విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ నెల 17వరకు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. జిల్లావ్యాప్తంగా 300మంది దరఖాస్తు చేసుకున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన తొలుత హైదరాబాద్ గచ్చిబౌలిలోని తెలంగాణ సర్వే ట్రైనింగ్ అకాడమీలో రెండు నెలల పాటు శిక్షణ ఉంటుందని సమాచారముండగా అభ్యర్థులను నిరుత్సాహానికి గురిచేసింది. తాజాగా నోటిఫికేషన్లో ప్రస్తావించినట్లుగా జిల్లా కేంద్రంలోనే శిక్షణకు ఏర్పాట్లు చేస్తుండటంతో హర్షం వ్యక్తమవుతోంది. సోమవారం లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ అభ్యర్థులకు సంబంధించి సర్వే లాండ్ రికార్డ్స్ సీనియర్ అసిస్టెంట్లు సర్దార్ హర్మిందర్సింగ్, జగదీశ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. నేటినుంచి బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో 150మందికి, జెడ్పీ కార్యాలయంలో మరో 150మందికి శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేశామని అదనపు కలెక్టర్ వివరించారు. -
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
కరీంనగర్టౌన్: మొదటి కాన్పులకు పీహెచ్సీలకు వచ్చే గర్భిణులను సాధారణ డెలివరీలకు ప్రోత్సహించాలని డీఎంహెచ్వో వెంకటరమణ సూచించారు. సోమవారం డీఎంహెచ్వో కార్యాలయంలో పీహెచ్సీల సూపర్వైజర్లతో సమీక్షించారు. సిజేరియన్తో ఉత్పన్నమయ్యే అనారోగ్య సమస్యలను తెలియజేయాలన్నారు. 30ఏళ్ల పైబడి ఉన్నవారికి అధిక రక్తపోటు, షుగర్ పరీక్షలు చేయాలన్నారు. తీవ్ర పోషకాహార లోపం, బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి పోషకాహార పునరావాస కేంద్రానికి పంపించాలన్నారు. కౌమారదశ పిల్లలకు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలని పీవోడీటీ డాక్టర్ ఉమాశ్రీరెడ్డి సూచించారు. మే 28న అంతర్జాతీయ రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఐవో సాజిదా, సనా జవేరియా, శైలేంద్ర, విమల, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
సిరిసిల్లలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్!
సాక్షి, సిరిసిల్ల: సిరిసిల్లలో బీఆర్ఎస్ నేత నిరసనల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం, తోపులాట ాకారణంగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అనంతరం, పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.వివరాల ప్రకారం.. సిరిసిల్లలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంపై బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ నిరసన తెలుపుతున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కార్యక్రమంలో కేటీఆర్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో సిరిసిల్లలోని ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించారు. ప్రోటోకాల్ పాటించాలని అడిగితే క్యాంపు కార్యాలయంపైకి దాడికి వస్తారా అంటూ బీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోగా పోలీసులు చేసిన లాఠీచార్జీ చేసి ఇరుపక్షాలను చెదరగొట్టారు. పోలీసుల లాఠీచార్జిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జంగం చక్రపాణితోపాటు పలువురు నాయకులు గాయపడ్డారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏక పక్షంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ క్యాంపు కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించీ రాస్తారోకో చేశారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులతో పాటు కాంగ్రెస్ నేతలను తంగలపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. -
ప్రియుడు మాటలను నమ్మి తాళి కట్టిన భర్తకు..
జ్యోతినగర్(కరీంనగర్): ఇరువురు ప్రేమించుకున్నారు. ఆపై యువతి మరొకరిని వివాహమాడింది. అయినా వాళ్ల ప్రేమ బంధం కొనసాగింది. ఈ క్రమంలో ఆమెకు ఒక పాప జన్మించింది. ప్రియుడు చెప్పిన మాటలను నమ్మి తాళి కట్టిన భర్తకు విడాకులిచ్చింది. ఈ తర్వాత ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో చేసేదేం లేక ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించి నిరసన చేపట్టింది. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామగుండం కార్పొరేషన్ ఐదో డివిజన్ నర్రాశాలపల్లెకు చెందిన మహిళ(26) ఆరు సంవత్సరాలుగా సమీప బంధువైన వ్యక్తితో ప్రే మాయణం కొనసాగింది. ఈ క్రమంలో మహిళ కుటుంబ సభ్యులు ఆమెకు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో మూడు సంవత్సరాల క్రితం వివాహం చేశా రు. అయినా మహిళ ప్రేమించిన వ్యక్తితో సంబంధం కొనసాగింది. మూడు నెలల క్రితం ప్రియుడితో కలిసి మంచిర్యాల జిల్లాలోని ఓ ప్రాంతంలో గది అద్దెకు తీసుకొని ఉన్నారు. కుటుంబ సభ్యులు మహిళ అదృశ్యం కేసు సైతం నమోదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి సదరు మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకుంటానని మహిళ తెలిపింది. కుటుంబ సభ్యులు కుల పెద్దలతో పంచాయితీలు నిర్వహించారు. భర్తతో విడాకులు తీసుకుంటే వివాహం చేసుకుంటానని ప్రియుడి మాటలు నమ్మి విడాకులు సైతం చేసుకుంది. విడాకులు పొందినా ప్రి యుడు పెండ్లికి నిరాకరించడంతో.. చేసేదేం లేక ప్రి యుడి ఇంటి ఎదుట నిరసన చేపట్టింది. దీంతో ప్రి యు డి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. పోలీసుల జోక్యంతో.. ఎస్సై మానస ఘటనా స్థలానికి చేరుకొని మహిళతో మాట్లాడారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో.. ఎనీ్టపీసీ పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. -
చలాన్లు వేస్తున్నారు
జమ్మికుంటలో పార్కింగ్ స్థలాలు లేవు. పనుల నిమిత్తం పట్టణానికి వస్తే రోడ్డుపై వాహనం పెట్టాల్సి వస్తోంది. పోలీసులు ట్రాఫిక్ నిబంధనల కింద చలాన్లు వేస్తున్నారు. ఫైన్ కట్టలేని పరిస్థితి ఉంది. పట్టణంలో పార్కింగ్ సమస్య తీర్చాల్సిన అవసరం ఉంది. – గాదె గుణసాగర్, జమ్మికుంట ట్రాఫిక్పై దృష్టి సారిస్తాం జమ్మికుంట పట్టణంలో రాకపోకలకు అంతరాయం లేకుండా, ట్రాఫిక్ సమస్యలను పరిగణంలోకి తీసుకుంటాం. ఈ విషయమై ఇతరశాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ నియంత్రణపై సయుక్త పరిశీలన చేసి సమస్యను పరిష్కరిస్తాం. – రామకృష్ణ, సీఐ, జమ్మికుంట టౌన్ ఆక్రమణలు తొలగిస్తాం జమ్మికుంట పట్టణంలో రో డ్డుకు ఇరువైపుల నిబంధనలు పాటించని అక్రమణల ను తొలిగిస్తాం. బ్రిడ్జి కింద వ్యాపారుల అక్రమణలపై చర్యలు తీసుకుంటాం. నిజ మైన ఉపాధి కోసం చూస్తున్న చిరువ్యాపారులకు ప్రత్యామ్నాయ వసతి కల్పించేందుకు ప్ర యత్నిస్తాం. – ఎండీ అయాజ్, మున్సిపల్ కమిషనర్, జమ్మికుంట -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
తిమ్మాపూర్: రామకృష్ణకాలనీ శివారులో లోయర్ మానేరు జలాశయం పరిధిలోని ఎస్సారెస్పీ స్థలంలో జరుగుతున్న తవ్వకాలు అనుమానాలకు తావిస్తున్నాయి. తాపాల గుట్ట సమీపంలో కొంతకాలంగా జేసీబీతో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆదివారం ఒక మత్స్యకారుడు ఈ తవ్వకాలను గమనించి స్థానికులకు సమాచారమందించాడు. స్థానికులు అక్కడున్న వారిని ప్రశ్నించగా.. గుట్ట సమీపంలో మట్టి పోయడానికి తవ్వుతున్నామని సమాధానమిచ్చారు. అయితే మట్టి కోసం తవ్వకాలైతే సమానంగా తీయకుండా లోతుగా ఎందుకు తవ్వారని గ్రామస్తులు నిలదీశారు. దీంతో సమాధానం చెప్పకుండానే జేసీబీతోపాటు అక్కడి వ్యక్తులు వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. విచారణ చేయాలి అనుమానాస్పద తవ్వకాలపై పోలీసులు విచారణ చేయాలని రామకృష్ణకాలనీ గ్రామస్తులు కోరుతున్నారు. గుప్త నిధుల కోసం జరుగుతున్న ఈ కార్యకలాపాలు చట్టవిరుద్ధమని, దీనిపై అధికారులు తక్ష ణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భక్తుడికి సెల్ఫోన్ అందజేత ధర్మపురి: దైవ దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు దేవాలయంలో తన సెల్ఫోన్ పోగొట్టుకోగా సెక్యూరిటీ సిబ్బందికి దొరికింది. ఈవో చేతుల మీదుగా బాధితుడికి అందజేశారు. జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ గ్రామానికి చెందిన తొగుట లక్ష్మినారాయణ ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మినృసింహస్వామి దర్శనం కోసం వచ్చారు. దర్శన సమయ ంలో జేబులో ఉన్న సెల్ఫోన్ పోగొట్టుకోగా.. సె క్యూరిటీ గార్డు బీరయ్యకు దొరికింది. ఈవో శ్రీనివాస్కు అప్పజెప్పగా.. భక్తుడికి అందజేశారు. సెల్ వి లువ రూ.12వేలుంటుందని కృతజ్ఞతలు తెలిపారు. -
‘కల్వల’ కలవరం
● రెండేళ్లుగా మరమ్మతుకు నోచుకోని ప్రాజెక్టు ● అటకెక్కిన మినీ ఎల్ఎండీ ప్రతిపాదన ● ఏడారిని తలపిస్తున్న ప్రాజెక్టు ● వానాకాలం సాగుపై సందిగ్ధంవీణవంక: వీణవంక– శంకరపట్నం మండలాల పరిధిలోని ఆయకట్టు ప్రాంత రైతులకు వరప్రదాయినిగా మారిన కల్వల ప్రాజెక్టు చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తోంది. రెండేళ్లక్రితం కురిసిన వర్షాలతో ప్రాజెక్టుకు గండి పడింది. నీరు దిగువకు పోతుండటంతో రైతులే చందాలేసుకుని కరకట్ట పోశారు. ఓ మోస్తరు వర్షం కురిస్తే కరకట్ట తెగిపోయే ప్రమాదం నెలకొంది. ఈ విషయమై రెండేళ్లుగా శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట మండలాలకు చెందిన రైతులు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. 55 ఏళ్ల చరిత్రకు గండి కల్వల ప్రాజెక్టు శంకరపట్నం మండలం పరిధిలో ఉన్నా.. వీణవంక, జమ్మికుంట మండలాల్లో పంటల సాగుకు కీలకం. 1950లో నిర్మించారు. 1970లో ప్రాజెక్టుగా రూపకల్పన చేయగా 55ఏళ్లుగా పూటిక తీయలేదు. ప్రాజెక్టు పరిధిలో 1200 ఎకరాల ఆయకట్టు ఉంది. గత ప్రభుత్వం మినీ ఎల్ఎండీగా మారుస్తామని ప్రకటించినా.. కార్యరూపం దాల్చలేదు. కనీస మరమ్మతులు కూడా చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. ప్రతీసారి వరద వచ్చినప్పుడు రైతులే తాత్కాలిక కరకట్ట నిర్మించాల్సి వస్తోందని, ఈసారి చుక్కనీరు లేదని వాపోతున్నారు. వానాకాలం సాగుపై సందిగ్ధం మే 25న రోహిణి కార్తె ప్రవేశించనుండటంతో రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. మే 25నుంచి జూన్ 10వరకు నారుమడులు చదును చేస్తుంటారు. ఇప్పటి వరకు కల్వల చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడం, మినీ ఎల్ఎండీ ప్రతిపాదన అటకెక్కడంతో వానాకాలం సాగుపై సందిగ్ధం నెలకొంది. కల్వల దిగువన ఐదు చెక్డ్యాంలున్నాయి. ప్రాజెక్టు ఎండిపోవడంతో చెక్డ్యాంల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.ఈసారి సాగు కష్టమే రెండేళ్ల క్రితం వర్షాలకు కల్వల ప్రాజెక్టు తెగిపోయింది. అప్పటి నుంచి మరమ్మతుకు నోచుకోవడం లేదు. రైతులందరం కలిసి రెండుసార్లు తాత్కాలిక కట్ట పోసినం. ఇసుక బస్తాలు అడ్డుగా వేసినా.. వరద వస్తే తెగిపోతుంది. శాశ్వత పరిష్కారం చూపాలని ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిశాం. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈసారి సాగు కష్టమే. – అమృత ప్రభాకర్, రైతు, వీణవంక -
సర్వే పైసలు రాలె
● సుమారు రూ.కోటికి పైగా బకాయిలు ● ఏడు నెలలుగా ఎదురుచూపులుకరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, రాజకీయ సమగ్రకుటుంబ సర్వేకు సంబంధించిన చెల్లింపుల కోసం ఎన్యుమరేటర్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. నగరపాలకసంస్థ పరిధిలో సర్వే చేసిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, ఫారాల ను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన కంప్యూటర్ ఆపరేటర్లకు గౌరవ వేతనం ఇప్పటివరకు అందలేదు. గతేడాది నవంబర్లో చేపట్టిన సర్వే డిసెంబర్ వరకు కొనసాగగా, అదే నెలలో ఆన్లైన్ చేశారు. రావాల్సిన వేతనాలను ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయడం లేదు. నగరపరిధిలో.. గతేడాది నవంబర్లో కుల, సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య తదితర అంశాలతో సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టారు. నగరపాలకసంస్థలోని 60 డివిజన్లతో పాటు, అప్పటి బొమ్మకల్ గ్రామపంచాయతీ పరిధిలోని పలు కాలనీల్లోనూ సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టారు. నగరపాలకసంస్థ దశలవారిగా 760 మంది ఎన్యుమరేటర్లను, 73మంది సూపర్వైజర్లను నియమించింది. నగరపాలకసంస్థకు చెందిన వార్డు అధికారులు, బిల్కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఆర్పీలు తదితరులతో పాటు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, మెప్మా ఉద్యోగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలు,ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులను ఎన్యుమరేటర్లుగా నియమించి ఇంటింటి సర్వే చేయించారు. పదిమంది ఎన్యుమరేటర్ల బృందానికి ఒక సూపర్వైజర్ను టీం లీడర్గా నియమించి, సర్వేను నిర్వహించారు. వీరితో పాటు నగర పాలకసంస్థకు చెందిన కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఆన్లైన్లో అప్లోడ్ సర్వే పూర్తి కావడంతోనే కుటుంబాల నుంచి సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్ చేసే ప్రక్రియను చేపట్టారు. ఇందుకోసం నగరపాలకసంస్థ కార్యాలయంలోని రెండు అంతస్థులతో పాటు, కలెక్టరేట్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, విట్స్కాలేజ్, శాతావాహన యూనివర్సిటీ తదితర సంస్థల్లో కంప్యూటర్ ఆపరేటర్లతో ఒక్కో కుటుంబానికి చెందిన దాదాపు 56 అంశాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. దాదాపు 1200 మందికి పైగా కంప్యూటర్ ఆపరేటర్ల సేవలు వినియోగించుకున్నారు. డబ్బుల కోసం ఎదురుచూపు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు సుమారు రూ.కోటికి పైగా వేతనాలు రావాల్సి ఉంది. ఏడు నెలలు గడిచినా ఆ డబ్బులు మాత్రం రావడం లేదు. ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నందుకు ఎన్యుమరేటర్లకు రూ.10 వేల చొప్పున, సూపర్వైజర్లకు రూ.12,500 చొప్పున, కంప్యూటర్ ఆపరేటర్లకు అప్లోడ్ చేసిన ఒక్కో ఫారంకు రూ.30 చొప్పున చెల్లిస్తామని అప్పట్లో చెప్పారు. ఒక్క ఎన్యుమరేటర్లకే సుమారు రూ.76 లక్షలు చెల్లించాల్సి ఉంది. నగరంలో సర్వే చేపట్టిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు సంబంధించిన డబ్బుల కోసం సీపీఓ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించామని, ఫైనాన్స్ క్లియరెన్స్ రాగానే డబ్బులు చెల్లిస్తామని నగరపాలకసంస్థ అధికారులు చెబుతున్నారు.నగరపాలకసంస్థలో డివిజన్లు: 60సర్వే చేసిన కుటుంబాలు: 89,617 ఎన్యుమరేటర్లు: 760సూపర్వైజర్లు: 73కంప్యూటర్ ఆపరేటర్లు: 1,200 -
ఉత్సాహంగా క్రీడా పోటీలు
చదరంగం కరీంనగర్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక విశ్వనాథ్ చెస్ అకాడమీలో అండర్ –17 బాలబాలికలకు చెస్ పోటీలు నిర్వహించారు. కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల నుంచి సుమారు 30 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులను త్వరలో హైదరాబాద్లో జరిగే రాష్ట్ర పోటీలకు ఎంపిక చేశారు. బాలుర విభాగంలో చిటుమల్ల కశ్యప్, బాలసంకుల అమన్రామ్, అమిరిశెట్టి నిశ్రిత్, వేముల అభిరామ్, స్టాండ్ బై క్రీడాకారుడిగా ఈగ శివచైతన్య ఎంపికయ్యారు. బాలికల విభాగంలో పి.పరిణిత, కె.సాధన, టి.మోక్ష, బి.యషశ్రీ, స్టాండ్ బైగా ఎస్.శ్రీహర్షి ఎంపికై నట్లు చదరంగ సమాఖ్య బాధ్యులు, టోర్నీ కన్వీనర్ అంతగిరి రాజేంద్రప్రసాద్ తెలిపారు. పోటీల నిర్వహణలో రాచకొండ సత్యనారాయణగౌడ్, విశ్వనాథ్ చెస్ అకాడమీ డైరెక్టర్, ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్ ఎ.విశ్వనాథ్ ప్రసాద్, సీహెచ్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ● ఆసక్తికరంగా చెస్, హ్యాండ్ పోటీలు ● ఉత్కంఠభరితంగా క్రికెట్..కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ వేదికగా ఆదివారం ఉమ్మడి జిల్లా స్థాయిలో పలు క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. అలాగే నూతన కార్యవర్గాలను ఎన్నుకున్నారు. క్రికెట్, హ్యాండ్బాల్, చెస్ క్రీడల్లో పోటీలను నిర్వహించి ఉమ్మడి కరీంనగర్ జట్లను ఎంపిక చేయగా, మార్షల్ ఆర్ట్స్ కుంగ్ఫూ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
కూలిన ఇళ్లు.. తప్పిన ప్రమాదం
ధర్మపురి: మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పెంకుటిల్లులు కూలిపోయాయి. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నేరెల్ల గ్రామంలో ఓరుగంటి లక్ష్మి ఆశయ్య, మంత్రి భూమక్కకు చెందిన పెంకుటిల్లులు ఆదివారం కూలిపోయాయి. ఇళ్లలో ఉన్నవారు పనులకు వెళ్లడంతో ఇంటి పైకప్పులు కూలిపోయాయి. విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ నాయకులు జాజాల రమేశ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రెడ్డవేని సత్యం పరిశీలించారు. విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ దృష్టికి తీసుకెళ్లి సాయమందేలా చూడాలని కోరారు. నేరెల్లలో కూలిన ఇల్లు -
జీపీవో పరీక్ష కేంద్రం తనిఖీ
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ సప్తగిరికాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామ పాలన అధికారుల(జీపీవో) నియామక పరీక్షను కలెక్టర్ పమేలా సత్పతి ఆదివారం తనిఖీ చేశారు. గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జీపీవో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వీఆర్వో, వీఆర్ఏలకు రాత పరీక్ష నిర్వహించారు. 189 మంది దరఖాస్తు చేసుకోగా 172మంది పరీక్షకు హాజరయ్యారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్, డీఆర్వో పవన్ కుమార్, ఆర్డీవో మహేశ్వర్, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డి నేటర్ రాంబాబు, డీవైఎస్ఓ శ్రీనివాస్, ఏవో సుధాకర్ పర్యవేక్షించారు. విద్యావ్యాప్తిని ఉద్యమంగా సాగిద్దాంకరీంనగర్కల్చరల్: రాష్ట్రంలో విద్యావ్యాప్తిని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని టీజీఈజేఏసీ చైర్మన్, టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. జిల్లాకేంద్రంలో రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ నిర్వహించిన ఉద్యమ అధ్యయన తరగతులను ప్రారంభించి మాట్లాడారు. సమాజంలోని అన్నిరకాల సమస్యలకు ప్రధా న ఆటంకం విద్యావంతుల కొరతేనని, గుణా త్మకమైన విద్యను సాధించినప్పుడే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందన్నారు. ఏపీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు సుబ్బారెడ్డి మా ట్లాడుతూ ప్రజా సమస్యలపై జరిగే ఉద్యమాల్లో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధా న కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, సంఘం చీఫ్ ప్యాట్రాన్ లక్కిరెడ్డి సంజీవరెడ్డి, రాష్ట్ర కన్వీనర్, విష్ణు మూర్తి, ఎస్.ప్రభాకర్ రావు, ఖాజా మంజూర్ అలీ, అశోక్రావు, కాసు మహేందర్రాజు, సలీం, సురేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలిచిగురుమామిడి: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం సరికాదని, సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తితో విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం చిగురుమామిడిలో మండల సహాయకార్యదర్శి బూడిద సదాశివ అధ్యక్షతన మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొ ట్టాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. సీపీఐ జిల్లా 23వ మహాసభలు ఈనెల 27,28 తేదీల్లో మధుగార్డెన్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందెస్వామి, బోయిని అశోక్, నాగెల్లి లక్ష్మారెడ్డి, చిన్నస్వామి పాల్గొన్నారు. తెలంగాణ పల్లె గొంతుక అన్నవరం దేవేందర్కరీంనగర్కల్చరల్: స్వచ్ఛమైన పల్లె కవిగా జీవించడం కవి అన్నవరం దేవేందర్ ప్రత్యేకత అని కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడు ప్రసేన్ అన్నారు. కరీంనగర్ ఫిలింభవన్లో ఆదివారం కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ‘కవి సంధి’ కార్యక్రమంలో దేవేందర్ సాహిత్య కృషిని ప్రశంసించారు. ఇంటి భాషలో కవిత్వాన్ని, వచనాన్ని సమర్థవంతంగా సృజిస్తూ తెలంగాణ మట్టికవిగా ద శాబ్దాల క్రితమే గుర్తింపు పొందాడన్నారు. కవిగా, కాలమిస్టుగా, ఫ్రీ లాన్స్ జర్నలిస్టుగా దేవేందర్ బహుముఖ కృషిని గుర్తించి కేంద్ర సాహిత్య అకాడమీ ఆయన సాహిత్యంపై ‘కవి సంధి’ కార్యక్రమాన్ని కరీంనగర్లో నిర్వహిస్తోందన్నారు. నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం, నగునూరి శేఖర్, బొద్దుల లక్ష్మయ్య, బీవీఎన్స్వామి, నాగభూషణం పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం మృతిచెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలో భద్రపర్చినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. అతడి ఆచూకీ తెలిసిన వారు పట్టణ పోలీసులను సంప్రదించాలని సూచించారు. యువకుడి బలవన్మరణం గంభీరావుపేట(సిరిసిల్ల): ఉన్నత విద్య అభ్యసించినా ఉద్యోగం రావడం లేదనే బెంగతో ఆదివారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రానికి చెందిన గుడికాడి సంపత్(23) అనే యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పొలం దగ్గర ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈసెట్లో మొదటి ర్యాంక్ రామగిరి: తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఈసెట్ పరీక్ష ఫలితాల్లో బుధవారంపేట(రామయ్యపల్లి) గ్రామానికి చెందిన కుర్మ అక్షయ మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించి సత్తా చాటింది. మొత్తం 200 మార్కులకు గాను 124 మార్కులు సాధించింది. మైనింగ్ విభాగంలో మొదటి ర్యాంక్తోపాటు ఓవరల్గా 129వ ర్యాంక్ సాధించింది. పేద కుటుంబంలో జన్మించిన అక్షయ తల్లితండ్రులు లావణ్య, అనిల్కుమార్. లావణ్య వ్యవసాయ కూలి. తండ్రి తాపీమేసీ్త్రగా పని చేస్తున్నాడు. అక్షయ పదోతరగతి రాఘవపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదివింది. మైనింగ్ డిప్లోమా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అభ్యసించింది. రేపు అథ్లెటిక్ జట్ల ఎంపిక పోటీలు కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 27న కరీంనగర్లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో సబ్ జూనియర్ బాలబాలికల అథ్లెటిక్ జట్ల ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, కడారి రవి తెలిపారు. అండర్ 8, 10, 12 సంవత్సరాల బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాస్థాయిలో రాణించిన క్రీడాకారులను త్వరలో సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటలకు క్రీడా పాఠశాలలో రిపోర్ట్ చేయాలని సూచించారు. సన్న బియ్యం పట్టివేత మంథని: మంథనిలోని ఓ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డులో వాహనం నుంచి సబ్సిడీ సన్న బియ్యం దింపుతుండగా.. పౌర సరఫరాల శాఖ, పోలీసులు దాడి చేసి 29క్వింటాళ్ల 20కిలోల బియ్యం పట్టుకున్నారు. అధికారులను చూసి వాహన డ్రైవర్ పారిపోయాడని, బియ్యంతో ఉన్న బండిని పోలీస్ స్టేషన్ తరలిస్తుండగా నల్లవెల్లి సది అనే వ్యక్తి అధికారులపై దుర్భాషలాడి అడ్డుపడినట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. అతడితోపాటు వాహన యజమాని ఆరే సంజీవ్, డ్రైవర్ రమేశ్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.1.78లక్షలుంటుందన్నారు. -
ఘనంగా మహా లింగార్చన
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం మహాలింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రుద్ర నమకం, మాన్య సూక్తం, లక్ష్మీసూక్తం, పురుష సూక్తం తదితర పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, సీనియర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఒక్కరోజు ఆదాయం రూ 3.70లక్షలు శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే వివిధ రకాల సేవల ద్వారా రూ.3,70,801 ఆదాయం సమకూరింది. -
పార్కింగ్ పరేషాన్
జమ్మికుంట: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే వాణిజ్య, వ్యాపార ప్రాంతంగా జమ్మికుంట పట్టణం అ భివృద్ధి చెందుతోంది. రోడ్డు, రైలుమార్గం ఉండడంతో నిత్యం వేలాదిమంది ఇతర ప్రాంతాల వారు వచ్చిపోతుంటారు. పట్టణం విస్తరిస్తుండడంతో పా టు జనాభా, వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఫలి తంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ప్రధానంగా ఆర్వోబీ ప్రాంతంలో ఈ సమస్య తీవ్రంగా ఉంటోంది. నిబంధనల ప్రకారం.. ఆర్వోబీ కింది ప్రాంతా న్ని వాహనాల పార్కింగ్ కోసం కేటాయించారు. అ యితే కొందరు పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించుకుని, వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో వాహనదారులు రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. ఫలితంగా రోడ్డు ఇరుకుగా మారి ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. తీవ్ర ట్రాఫిక్ సమస్య జమ్మికుంట పట్టణం నడిబొడ్డున ఆర్వోబీ నిర్మించారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడొద్దనే ఉద్దేశంతో బ్రిడ్జి కింది ప్రాంతాన్ని వాహనాల పార్కింగ్కు కేటాయించారు. కానీ కొందరు వ్యాపారులు ఆ ప్రాంతాన్ని ఆక్రమించారు. ఎలాంటి అనుమతి లేకుండా సామగ్రి పెడుతున్నారు. షెడ్లు వేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. కొందరు బ్రిడ్జి కింది ప్రాంతాన్ని ఆక్రమించుకుని, చిరువ్యాపారులకు అద్దెకు ఇస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. పట్టణానికి పనుల నిమిత్తం వచ్చేవాహనదారులు రోడ్డుపైనే వాహనాలు నిలుపుతున్నారు. మున్సిపల్, పోలీస్ అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో సమస్య జఠిలమవుతోంది. అనుమతి లేకుండా నిర్మించిన షెడ్లతో మున్సిపల్కు రూపాయి ఆదాయం రాకపోగా.. ట్రాఫిక్ సమస్యపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణకు గురైన స్థలాలపై చర్యలు తీసుకొని, పట్టణంలో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని జమ్మికుంట వాసులు కోరుతున్నారు. జమ్మికుంటలో ట్రాఫిక్ కష్టాలు రోడ్డు, ఆర్వోబీని ఆక్రమించిన వ్యాపారులు చిరు వ్యాపారాలకు నిలయంగా పార్కింగ్ స్థలం విస్తరణ మార్కింగ్, ఆక్రమణపై చర్యలు శున్యం -
వెల్గటూర్లో పిచ్చి కుక్క వీరంగం
వెల్గటూర్: మండలకేంద్రంలో ఆదివారం ఓ పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. గంట వ్యవధిలో ముగ్గురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిందం వర్షిత్ (21 నెలలు) కంటిపై దాడి చేసింది. అలాగే ఇంటి ముందు పనులు చేసుకుంటున్న మరో ఇద్దరు మహిళలపై దాడికి పాల్పడింది. గతంలో కోటిలింగాలలో మంచికట్ల మణితేజ (ఆరేళ్ల) ఇంటిముందు ఆడుకుంటుండగా కుక్క విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాలుడికి రేబిస్ వ్యాధి సోకింది. చెర్లపల్లిలో సంకటి మల్లయ్యకు చెందిన 20 గొర్రె పిల్లలపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. జగదేవుపేటలో నాలుగు గేదెలను చంపేశాయి. ఇలా నెల వ్యవధిలోనే సుమారు 40 పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
భూ భారతి.. అర్జీల పురోగతి
● పైలట్ ప్రాజెక్టు మండలం సైదాపూర్లో 1,798 దరఖాస్తులు ● రెండు బృందాలుగా పరిశీలన ● పరిష్కరిస్తున్న అధికారులుకరీంనగర్ అర్బన్: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలకు విముక్తి కలగనుంది. కార్యాలయాల చుట్టూ దస్త్రాలతో తిరగడం నిరాశగా వెనుదిరగడం ఇన్నా ళ్లు జరిగిన ఉదంతాలు కాగా.. తాజాగా భూ భారతి సదస్సులు పరిష్కారానికి వేదికవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతిని తెరపైకి తీసుకురాగా.. పెండింగ్ సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించింది. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్గా సైదాపూర్ మండలాన్ని ఎంపిక చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ నెల 5నుంచి 20వరకు దరఖాస్తులను స్వీకరించగా రెండు బృందాలుగా సదస్సులు నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండగా దస్త్రాల పరిశీలన వేగవంతంగా సాగుతోంది. గతంలో లేని విధంగా చట్టంలో వివిధ మాడ్యూళ్లలో భూ సమస్యల పరిష్కారానికి నూతనంగా కొన్ని అవకాశాలు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. 1,798 దరఖాస్తులు సైదాపూర్ మండలవ్యాప్తంగా 1,798 దరఖాస్తులు అందాయి. సాదాబైనామాతో భూమి హక్కుల కో సం, పాసుపుస్తకాల్లో తప్పులు, పాత పాసుపుస్తకం నుంచి కొత్తదాంట్లో భూమి నమోదుకాలేదని, విస్తీ ర్ణం, భూమి స్వభావం, హక్కు రకం తదితర అంశాల్లో సమస్యలున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ భూ ములు, అసైన్డ్ భూముల హక్కుల నమోదుకు అర్జీ లు అందాయి. పెండింగ్ మ్యుటేషన్, డీఎస్ పెండింగ్, భూ విస్తీర్ణంలో తేడాలు సరిచేయడం, నిషేధి త జాబితా నుంచి తొలగించడం, ఇనామ్– ఓఆర్సీ జారీ చేయడం, వారసత్వ భూ మార్పిడి, భూ సేకరణకు అర్జీలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. వీటిని రెవెన్యూ అధికారులు క్రోడీకరించి మాడ్యూళ్ల వారీగా విడదీశారు. దరఖాస్తుల పరిశీలనకు క్షేత్రస్థాయిలో ప్రణాళిక రూపొందించారు. -
అల్ఫోర్స్ చైర్మన్కు ‘రఘునాథం’ అవార్డు
కొత్తపల్లి: రాష్ట్ర విద్యారంగంలో 35 ఏళ్లుగా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నందుకు గాను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా.వి.నరేందర్రెడ్డికి వై.రఘునాథం ఎక్స్లెన్సీ అవార్డును అందుకున్నారు. కరీంనగర్ శివారులోని ఓ ప్రైవేటు వేడుక మందిరంలో ఆదివారం వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక వేడుకలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, ఫౌండేషన్ చైర్మన్ వెంకట్ ఆయనకు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర విద్యారంగానికి మార్గదర్శకంగా నిలుస్తూ.. ఎంతోమంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తూ.. అల్ఫోర్స్ విద్యాసంస్థల ద్వారా అత్యుత్తమ విద్యనందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర విద్యారంగాల్లో సమూలమైన మార్పులు తెస్తున్నందుకు గాను అవార్డు ప్రదానం చేసినట్లు తెలిపారు. డా.వీఎన్ఆర్ మాట్లాడుతూ.. ఈ అవార్డు బాధ్యత పెంచిందని, సిబ్బంది, తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. -
కార్లు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ శివారులో ఆదివారం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్లో వేములవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వేములవాడ పట్టణం నుంచి నిజామాబాద్ జిల్లాకు టీఎస్07హెచ్క్యూ5935 నంబర్ కారులో వెళ్తున్న రాకేశ్.. చందుర్తి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ప్రాంతంలో కథలాపూర్ మండల కేంద్రానికి నుంచి వేములవాడ వైపు వెళ్తున్న టీఎస్21ఎల్6908 నంబర్ కారును ఢీకొట్టాడు. రాకేశ్, ప్రసాద్కు తీవ్ర గాయాలు కాగా.. మరో ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎస్సై అంజయ్య సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్లో వేములవాడ ఆసుపత్రికి తరలించారు. -
కవిత పార్టీ పెట్టడం ఊహాగానాలే
● ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ● పలు అభివృద్ధి పనులు ప్రారంభంకరీంనగర్కల్చరల్: బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ పెట్టడం ఊహాజనితమేనని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కొట్టిపారేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ఆరెపల్లిలో ఆదివారం శ్మశానవాటికలో అభివృద్ధి పనులు, కల్వర్టు నిర్మాణానికి నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ తుల రాజేశ్వరి– బాలయ్యతో కలిసి భూమి పూజ చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రజా స్వామ్యబద్ధమైన పార్టీఅని, ప్రతీ ఒక్కరు తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చునని అ న్నారు. కవిత బహిరంగ లేక రాయడం కాకుండా కేసీఆర్కు వ్యక్తిగతంగా విషయాలు చెప్పి ఉంటే బాగుండేదని, కేటీఆర్ వ్యాఖ్యలకు తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. కవిత కొత్తపార్టీ పెట్టడం అనేది ఊహాగానాలే అని కొట్టిపడేశారు. కేసీఆర్ తమకు నాయకుడని, ఆయన బాటలో ప్రతి కార్యకర్త నడుచుకుంటారన్నారు. ఎన్నారైల ఆధ్వర్యంలో జూన్ 2న అమెరికాలో తెలంగాణ ఆవి ర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు తాను హాజరుకానున్నట్లు తెలిపారు. ఆరెపల్లి డివిజన్వాసులు శ్మశానవాటిక లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, శ్మశాన వాటిక నిర్మాణానికి 15వ ఫైనాన్స్ నిధుల నుంచి సుమారు రూ. 49.50 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఆరెపల్లి నుంచి రాణిపూర్ నగునూరు దుర్గామాత ఆలయానికి వెళ్లేదారిలో రూ. 12లక్షలు వెచ్చించి కల్వర్టు నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. నాయకులు జంగిలి సాగర్, జంగిలి ఐలేందర్ యాదవ్, దిండిగాల మహేశ్, పిల్లి మహేశ్ గౌడ్ పాల్గొన్నారు. -
తిరుపతి ఎట్లున్నడో?.. తిరుపతి ఎట్లున్నడో?..
కోరుట్ల(కరీంనగర్): మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ నేపథ్యంలో సెంట్రల్ మిలిషియా కమిషన్ మెంబర్..మావోల కీలక దాడుల్లో వ్యూహకర్త.. మావోయిస్టు పార్టీలో సెకండ్ క్యాడర్లో ఉన్న కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి ఉరఫ్ దేవ్జీ ఎట్లున్నడో.. అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న క్రమంలో ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టులు మృతి చెందుతున్న విషయం తెల్సిందే. అయితే ఎన్కౌంటర్లో తిప్పిరి తిరుపతి ఎక్కడన్నా ఉన్నాడోనని స్థానికులు కలవరపడుతున్నారు. ఆర్ఎస్యూ నేపథ్యమే..కోరుట్లలోని అంబేడ్కర్నగర్కు చెందిన తిరుపతి 1983లో డిగ్రీ చదువుతున్న క్రమంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో ఏబీవీపీ, ఆర్ఎస్యూ విద్యార్థి సంఘాల మధ్య గొడవలు సాధారణంగా జరుగుతున్న క్రమంలో పోలీసు కేసులు నమోదు అయ్యాయి. 1983 చివరలో తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. దళ సభ్యుడి స్థాయి నుంచి కమాండర్గా పనిచేసి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్గా, మిలిషియా దాడుల్లో వ్యూహకర్తగా సెకండ్ క్యాడర్ హోదాలో పనిచేస్తున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో తిప్పిరి తిరుపతిని దేవ్జీగా పిలుచుకుంటారు. మిలి షియా దాడులు జరిపి నిమిషాల్లో అక్కడి నుంచి తప్పించుకోవడం తిరుపతికి వెన్నతో పెట్టిన విద్యగా చెబుతారు. తిరుపతి సమీపంలోని అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడి ఘటనలో నంబాల కేశవరావుతో పాటు తిప్పిరి తిరుపతి పాత్ర ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 2010లో దంతెవాడ సమీపంలో సెంట్రల్ రిజర్వ్ జవాన్లపై దాడి జరిపి 74 మంది మృతి చెందిన ఘటనకు సారథ్యం వహించింది ఇతడేనని పోలీసు వర్గాలు చెబుతాయి. ఆయన తలకు ఎన్ఐఏ రూ. కోటి రివార్డు ప్రకటించినట్లు సమాచారం.ఎక్కడున్నడో ఏమో? ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్లో కీలకంగా వ్యవహరించడంతోపాటు మిలటరీ శిక్షణ కేంద్రం నిర్వహణలోనూ తిరుపతి పాలుపంచుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తి రుపతి తన స్థావరాలు మార్చుకుంటున్నట్లు పో లీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల కొంత మంది మా వోయిస్టు కీలక నేతలు పశ్చిమ బెంగాల్ సరి హద్దు ప్రాంతాల్లోకి వెళ్లి షెల్టర్ తీసుకుంటున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ భావిస్తోంది.వీరిలో తిప్పిరి తిరుపతి కూడా ఉంటాడన్న ప్రచా రం జరుగుతోంది. ఈ మూడు నెలల వ్యవధిలో వందలాది మంది మావోయిస్టులు మృతి చెందుతున్న క్రమంలో తిరుపతి ప్రస్తావన రావడం గమనార్హం. ఇటీవల మెట్పల్లి డీఎస్పీ అ డ్డూరి రాములు కోరుట్లలోని తిరుపతి ఇంటికి వె ళ్లి అజ్ఞాతంలో ఉన్న అతడిని లొంగిపోయేలా చూ డాలని ఆయన బంధువులను కోరడం గమనార్హం -
పలకరించిన తొలకరి.. జాగ్రత్తే అన్నదాత విధి
● జిల్లా అంతటా వర్షాలు ● జాగ్రత్తలు తీసుకోకుంటే నష్టాలే మరి ● రసీదులు భద్రపర్చండికరీంనగర్ అర్బన్: తొలకరి ఈ సారి ముందుగానే పలకరించింది. చిరుజల్లులతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, కంది, పెసలు, అంతర పంటల సాగుకు చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ వ్యవసాయ డివిజన్లలో విత్తనాల కొనుగోలు షురువైంది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దళారులు మార్కెట్లోకి నకిలీ విత్తనాలు తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిషేఽధించిన బీజీ–3 విత్తనాలను బీజీ–2 పేరుతో విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం రాయితీపై వరి, పత్తి, కంది తదితర విత్తనాలను సరఫరా చేస్తోంది. అరకొర అందడంతో కొంతమంది వ్యాపారులు పలు గ్రామాల్లో కమీషన్ ఎరగా చూపి నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. మహారాష్ట్ర, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి తెచ్చి అన్నదాతను నిండా ముంచుతున్నారు. ఈ నేపథ్యంలో విత్తనాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని, లైసెన్స్డ్ వ్యాపారుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దోపిడీకి దళారుల సిద్ధం జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగవనుండగా ప్రధానంగా వరి తరువాత పత్తి సాగుచేయనున్నారు. సేద్యానికి సిద్ధమైన రైతన్నకు నకిలీ విత్తనాలు ముప్పు పొంచి ఉంది. అన్నదాత అవసరాలు, అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు మాయగాళ్లు నకిలీ, కల్తీ విత్తనాలు అంటగట్టి రైతులను నిండా ముంచి జేబులు నింపుకునేందుకు సిద్ధపడుతున్నారు. రైతులపై కొత్త కొత్త ప్రయోగాలు చేసేందుకు పలు విత్తన కంపెనీలు సైతం రంగంలోకి దిగాయి. బీజీ–3 విత్తనాలను బీజీ–2 పేరుతో విక్రయించి సొమ్ము చేసుకునే దందాకు కొందరు వ్యాపారులు తెరలేపుతున్నారు. కేంద్రం నిషేధించిన బీజీ–3 విత్తనాలను కొందరు అక్రమార్కులు ఇప్పటికే గ్రామాలకు తరలించినట్లు తెలుస్తోంది. విత్తనాలు కొనుగోలు చేయడమే తప్ప వాటి స్థితిగతులను గమనించకపోవడంతో రైతన్నలు ఏటా నష్టాలబారిన పడుతున్నారు. పురుగు మందుల విషయంలో.. ● వ్యవసాయ శాఖ సూచించిన పురుగు మందులను అవసరమైన మేరకు మాత్రమే కొనుగోలు చేయాలి. ● లేబుల్ లేని మందుసీసా, డబ్బా, ప్యాకెట్లను కొనరాదు. ప్రకటించిన మందు పేరు, రూపం, మందుశాతం, పరిమాణం, జాగ్రత్తలు, విరుగుడు మందులు, బ్యాచ్ నంబర్లు, వాడాల్సిన గడువు, తయారుచేసిన సంస్థ పేరు, రిజిస్ట్రేషన్ విషయాలను పరిశీలించాలి. ● తప్పనిసరిగా అన్ని వివరాలతో బిల్లును పొందాలి. ● సీళ్లు సరిగా లేని మందులను కొనరాదు. లైసెన్సు లేని డీలర్లు, సస్యరక్షణ మందులను విక్రయిస్తుంటే సమీప వ్యవసాయ అధికారులకు తెలియజేయాలి. ఎరువుల కొనుగోలులో.. ● ఎరువుల కొనుగోలుకు సరైన బిల్లు పొందడంతో పాటు డీలర్ బుక్కులో రైతు సంతకం చేయాలి. ● మిషన్ కుట్టు ఉన్న ఎరువు సంచులను మాత్రమే కొనుగోలు చేయాలి. చేతికుట్టయితే వాటిపై సీసంతో వేసిన సీల్ ఉందో లేదో చూడాలి. ● బస్తాపై ప్రామాణిక పోషకాలు, ఉత్పత్తిదారుని వివరాలు ఉండాలి. ● ఎరువుల విషయంలో అనుమానం వస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. అనుమానం ఉన్న ఎరువుల నమూనాలను రూ.10 డీడీ జత చేసి పరీక్షలకు పంపించాలి.ఈ సూచనలు పాటించండి ముందస్తుగా విత్తనాలు మొలకెత్తే శాతాన్ని ప్యాకెట్పై చూసుకుని కొనుగోలు చేసి పంట పొలాల్లో విత్తుకోవాలి. పంటను విత్తిన తరువాత తప్పనిసరిగా విత్తన ప్యాకెట్లను, రసీదులను భద్రపరచుకోవాలి. సరిగా సీల్ చేసి ధ్రువీకరణ పత్రం ఉన్న బస్తాల్లోని విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. బస్తాపై రకం, పేరు, లాట్నంబర్, గడువు తేదీ పేర్కొనేలా డీలర్ సంతకం తీసుకోవాలి. తన సంతకం కూడా బిల్లుపై ఉండేలా చూసుకోవాలి. కొనుగోలు బిల్లుపై నంబర్, విత్తన రకం, గడువు తేది పేర్కొనేలా డీలర్ సంతకం తీసుకోవాలి. తన సంతకం కూడా బిల్లుపై ఉండేలా చూసుకోవాలి. ప్రయివేటు సంస్థల ప్రచారాలకు ఆకర్షితులు కాకపోవడమే కాకుండా వ్యవసాయ శాఖ అధికారి, శాస్త్రవేత్తలు సూచించిన విత్తనాలు మాత్రమే కొనుగోలు చేస్తే ప్రయోజనకరం. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ధ్రువీకరించిన విత్తనాల కొనుగోలు సమయంలో బస్తాపై నీలివర్ణం ట్యాగు ఉందో లేదో గమనించాలి. హైబ్రిడ్ విత్తనం కొనుగోలు చేసేటప్పుడు విత్తన సంచి పైనున్న పసుపు రంగు ట్యాగ్, దానిపై విత్తనం భౌతిక స్వచ్ఛత, మొలకెత్తే శాతం, జన్యునాణ్యత వంటి వివరాలు పరిశీలించాలి. -
ప్రత్యేకం!
పాలన..పనితీరు..ఉత్తీర్ణత పెంచుతూ.. ఉపాధి కల్పిస్తూ..ఒక్కో కలెక్టర్ది.. ఒక్కో ప్రత్యేకతపాలనలో తమదైన ముద్ర వేస్తున్న ఐఏఎస్లు ప్రజల్లో మమేకమవుతూ.. ముందుకెళ్తున్న జిల్లా బాస్లుచదువు ఒక్కటే సమాజాన్ని ఉన్నత స్థితికి తీ సుకెళ్తుందని గుర్తించిన జగిత్యాల కలెక్టర్గా స త్యప్రసాద్ 2024 జూన్ 16న బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జిల్లాపై తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లాగా ఏర్పడిన అనంతరం హ్యాట్రిక్గా నిలిచింది. అనంతరం కరోనాతో అట్టడుగు స్థానానికి వెళ్లింది. రాష్ట్రస్థాయిలో మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో విద్యార్థులతో ముఖాముఖీ, ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేయడంతో పాటు, ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. దీంతో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో నాల్గో స్థానంలో జగిత్యాల మళ్లీ నిలిచింది. ఎస్సీ స్టడీ సర్కిల్లో 200 మందికి ఉచితంగా కోచింగ్ ఇప్పించగా 60 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆరుగురు గ్రూప్–1 జాబ్లు సాధించారు. అవసరమైన పిల్లలకు ఉచితంగా ల్యాప్టాప్స్ అందజేశారు. కొండగట్టు జయంతోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఎండ, వాన లెక్కచేయకుండా స్వామివారి సన్నిధిలో ఉంటూ రాత్రంతా భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేస్తూ పాలనలో తనదైన మార్క్ చూపెడుతున్నారు. -
ఆయిల్ పాంతో అధిక లాభాలు
● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ అర్బన్: ఆయిల్ పాంసాగుతో అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆయిల్ పాంసాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్లు ఆయిల్పాం తోటను కాపాడితే 30 ఏళ్ల పాటు ఆదాయం నిరంతరంగా వస్తుందని వివరించారు. ఆయిల్ పాంసాగుతో భూసారం పెంపుతో పాటు పర్యావరణానికి అనుకూలమని వివరించారు. జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, రైతులు పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయం అభినందనీయం విద్యానగర్(కరీంనగర్): సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం అభినందనీయమని రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్ అన్నారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు గ్రహీత బొప్పు శ్రీహరి తన వ్యవసాయ క్షేత్రంలో పండించి, మాగపెట్టిన మామిడి పండ్లను శనివారం ఆర్డీవోకు అందజేశారు. ఈ సందర్భంగా సేంద్రియ సాగు చేస్తున్న శ్రీహరిని, ఆయన తనయులను ఆర్డీవో అభినందించారు. రసాయన ఎరువుల వాడకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఆరోగ్య సంరక్షణకు దోహదపడే సేంద్రియ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించి, సాగు వైపు దృష్టి సారించేలా కృషి చేయాలని సూచించారు. ఉగ్రవాదుల గుండెల్లో ప్రళయ గర్జన● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి చొప్పదండి: ఆపరేషన్ సిందూర్ భారత సైన్యం ధైర్యానికి, అంకిత భావానికి నిదర్శమని, ఇది విరామం కాదని, ఉగ్రవాదుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ప్రళయ గర్జన అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అభివర్ణించారు. భారత సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని, వారికి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నామని ప్రకటించారు. పట్టణంలో బీజేపీ నాయకులు శనివారం రాత్రి ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతో కలిసి ఆయన యాత్రకు హాజరయ్యారు. కార్యక్రమంలో నాయకులు చేపూరి సత్యనారాయణ, బత్తుల లక్ష్మినారాయణ, సింగిరెడ్డి కృష్ణారెడ్డి, తోట కోటేశ్, బైరగోని కిట్టుగౌడ్, వైద రామానుజం, దూలం కళ్యాణ్, చిల్ల శ్రావణ్, మొగిలి మహేశ్, మంచికట్ల మల్లేశ్, బత్తిని ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల పాత్ర కీలకం● జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు కొత్తపల్లి(కరీంనగర్): విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని డీఈవో సీహెచ్వీఎస్ జనార్ధన్ రావు అన్నారు. కొత్తపల్లి అల్ఫోర్స్ ఇటెక్నో స్కూల్లో నిర్వహిస్తున్న రెండోదశ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల కెపాసిటీ బిల్డింగ్ ప్రొగ్రాం ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. కార్యక్రమానికి డీఈవో హాజరై మాట్లాడారు. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకమని, అంతటి గౌరవం కలిగిన ఉపాధ్యాయులు నూతన విద్యవిధానంపై దృష్టి సారిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో ప్రత్యేక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..మార్పులకనుగుణంగా ఉపాధ్యాయులు బోధించాలన్నారు. అనంతరం డీఈవో అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులను సత్కరించారు. కోర్స్ సమన్వయకర్త అశోక్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హడలెత్తిస్తూ.. ఆదర్శంగా నిలుస్తూ..
పెద్దపల్లి కలెక్టర్గా కోయ శ్రీహర్ష 2024 జూన్ 16న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి అధికారులతో రివ్యూలు నిర్వహిస్తూనే, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పాలనను పరుగులు పెట్టించారు. స్కూళ్లు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, కార్పొరేషన్, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శిస్తూ, స్థానిక సిబ్బంది సూచనలు స్వీకరిస్తూనే అధికారులుగా వారేం చేయాలో దిశానిర్దేశం చేస్తున్నారు. విధులకు డుమ్మాకొట్టిన వారు, అలసత్వం వహించేవారు, అవినీతికి పాల్పడే అధికారులను సుమారు ఆరుగురిని సస్పెండ్ చేశారు. ముఖ్యంగా జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీలతో గాడినపెట్టారు. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో తన సతీమణి విజయకు ప్రతి నెలా పరీక్షలు చేయిస్తూ, డెలివరీ చేయించి ఆదర్శంగా నిలిచారు. తద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలను ప్రజలందరూ ఉచితంగా వినియోగించుకోవాలనే బలమైన సందేశాన్ని ఇచ్చారు. వృద్ధాప్య దశలో ఉన్న ఓ తండ్రిని పట్టించుకోని కొడుక్కి కలెక్టర్ ఝలక్ ఇచ్చారు. కొడుకు పేరిట తండ్రి చేసిన ఆస్తి గిఫ్ట్ డీడ్ను తిరిగి తండ్రి పేరుపైకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. తాజాగా తబిత ఆశ్రమంలో మానస అనే అనాథ యువతికి పెళ్లిపెద్దగా వ్యవహరించి, అధికారులను సమన్వయం చేస్తూ అంగరంగా వైభవంగా వివాహం జరిపించడం ద్వారా జిల్లావాసుల మన్ననలు పొందారు. -
అమ్మకు ఆరోగ్యం.. పిల్లలకు చదువు..
కలెక్టర్లు సాధారణంగా సమీక్ష సమావేశాలు నిర్వహించడం, పైళ్లు క్లియర్ చే యడం, విజిట్స్, ఇతర కార్యకలాపాలతో బిజీగా గడుపుతారు. కానీ.. కరీంనగర్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన పమేలా సత్పతి మాత్రం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాకుండా, చిన్నారుల మానసిక వికాసం కోసం ‘ఏ టూ జెడ్ నాణ్యమైన రైమ్’ పేరిట రైమ్ రాసి పిల్లల కోసం పాడారు. ప్రతీ అక్షరం ప్రాముఖ్యతను తెలిపేలా.. ఏ ఫర్ ఆక్టివ్, బీ ఫర్ బ్రైట్.. అంటు జెడ్ వరకూ అన్ని అక్షరాలను ఉపయోగించి రైమ్ విడుదల చేశారు. అలాగే ‘శుక్రవారం సభ’ పేరుతో మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పోషణలోపం గల చిన్నారులు, రక్తహీనత ఉన్న మహిళల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకున్నారు. ఉచిత పరీక్షల ద్వారా మహిళలకు ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా భరోసా ఇస్తూ చేపట్టిన కార్యక్రమం అద్భుత ఫలితాలను సాధించింది. అలాగే జిల్లాలో ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికుల కుటుంబాల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించి సుమారు 500 మంది వలసకార్మికుల పిల్లలకు బోధన అందించి తనదైన తల్లి పాలనతో ఆకట్టుకుంటున్నారు. -
పారిశుధ్యంపై పారాహుషార్!
● వ్యాధుల నియంత్రణకు ఎప్పటికప్పుడు చర్యలు ● వారంలో రెండు రోజులు డ్రై డేకరీంనగర్రూరల్: వానాకాలంలో గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను చేపట్టారు. ముందస్తు పారిశుధ్య పనులు చేపట్టడం ద్వారా వ్యాధులను దూరం చేయొచ్చనే ఉద్దేశంతో ఈనెల 22 నుంచి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారంలో రెండు రోజులు డ్రైడేలు పాటించాలని పంచాయతీ కార్యదర్శులకు డీపీవో జగదీశ్వర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక పారిశుధ్య పనులు... జిల్లాలోని మొత్తం 318 గ్రామపంచాయతీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో కలుషిత తాగునీటితో అతిసార ,కలరా, టైపాయిడ్, మలేరియా, మెదడువాపు, డెంగీ, చికెన్గున్యా తదితర వ్యాధులు ప్రబలే అవకాశముండటంతో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లల్లోని ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. మురికికాలువలను ఎప్పటికపుడు శుభ్రం చేయడంతోపాటు నీళ్లు నిల్వ ఉండాకుండా చర్యలు చేపట్టాలి. నివాస గృహాలు, రోడ్ల పక్కన ఉన్న చెత్తాచెదారాన్ని సేకరించి ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలించాలి. మరికి కాలువలు, గుంతల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. దోమల నియంత్రణకు ఆయిల్బాల్స్ వేయాలి. వారానికి రెండు పర్యాయాలు ఫాగింగ్ చేయాలి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీళ్లు తొలగించాలి. తాగునీటి పైపులైన్ల లీకేజీలకు ఎప్పటికపుడు మరమ్మతు చేయించాలి. చేతిపంపులు, పబ్లిక్నల్లాల వద్ద నీళ్లు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి. గ్రామస్తులకు అవగాహన... వానాకాలంలో వచ్చే వ్యాధులపై వైద్యసిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలి. గ్రామ, మండల స్థాయిలో వ్యాధినియంత్రణ చర్యలపై సమావేశాలను నిర్వహించాలి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలి. ఇండ్లల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి బ్లీచింగ్ ఫౌడర్ చల్లుకోవాలని సూచించాలి. కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగాలని, దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలి. ఇంట్లోకి దోమలు రాకుండా జాలీలను ఏర్పాటు చేసుకోవాలి. -
సౌరశక్తి.. అనాసక్తి
సాక్షి, పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి ఉమ్మడి జిల్లాలో స్పందన అంతంత మాత్రమే ఉంది. సౌరశక్తి ద్వారా విద్యుదుత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహించి, గృహాలు, ఆఫీస్లు, ఇతరత్రా సంస్థలు, అర్హులందరికీ రాయితీ కల్పిస్తున్నారు. అయినా ఆయా వర్గాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. దీనిపై సంబంధిత సంస్థల నుంచి కొరవడిన ప్రచారంతో ప్రజల్లో సరైన అవగాహన ఉండడం లేదు. అణు, థర్మల్ విద్యుదుత్పత్తితో పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. దీనిని నియంత్రించడంతోపాటు భవిష్యత్ డిమాండ్ నేపథ్యంలో సౌర విద్యుత్కు ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. గృహ వినియోగదారులకు అవసరమయ్యే విద్యుత్ను వారి ఇంటిపై సౌర ఫలకలు(సోలార్ ప్యానళ్లు) ఏర్పాటు చేసుకుని ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు వచ్చింది. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుంటే దీర్ఘకాలికంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఫలితం కానరావడం లేదు. 465 దరఖాస్తులకు.. ఉమ్మడి జిల్లాలో ఏప్రిల్ 30వ తేదీ నాటికి 589.4 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసేందుకు 465 దరఖాస్తులు రాగా, అందులో కేవలం 131మంది మాత్రమే డబ్బులు చెల్లించారు. వీరిలో 109 మంది 134.7 మెగావాట్ల రూఫ్టాప్ సోలార్ యూనిట్లను ఇళ్లపై ఏర్పాటు చేశారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాక ‘రోజుకు ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది?, ఎంత వినియోగం ఉంటుంది?, గ్రిడ్కు ఎంత వెళుతుంది?’ అనే సమాచారాన్ని ‘నెట్మీటర్’ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా మరమ్మతులు వస్తే కంపెనీ ప్రతినిధులు వచ్చి చేస్తారు. కేవలం గృహ అవసరాలకు మాత్రమే సోలార్ ప్లాంట్లు మంజూరు చేస్తారు. టీఎస్ రెడ్కో వీటిని ఏర్పాటు చేస్తుంది. రూ.కోటి నజరానా పీఎం సూర్యఘర్, ముఫ్త్, పీఎం కుసుమ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రాయితీ ద్వారా సోలార్ ప్యానెళ్లను అమర్చుకునేలా ఆయా గ్రామాల్లోని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రతీ జిల్లాలో 5వేల కంటే ఎక్కువ జనాభా కలిగిన గ్రామాలను ప్రాథమికంగా ఎంపిక చేసి, ఆయా గ్రామాల్లో ఎక్కువ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా పోటీని ప్రారంభించి ఆరునెలలు కొనసాగిస్తోంది. అత్యధికంగా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునే గ్రామాన్ని జిల్లాస్థాయి కమిటీ ‘మోడల్ సోలార్ విలేజ్గా’ గుర్తిస్తుంది. ఆయా గ్రామానికి రూ.కోటి ప్రోత్సాహం అందించనుంది, ఇందులో భాగంగా పెద్దపల్లిలో 21, జగిత్యాలలో 23 గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో గ్రామాల ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో సౌరశక్తి యూనిట్ల దరఖాస్తులు జిల్లా దరఖాస్తులు ఈఎండీ కెపాసిటీ (మెగావాట్లలో) జగిత్యాల 117 31 33.7 కరీంనగర్ 178 56 52.2 పెద్దపల్లి 90 13 16.8 సిరిసిల్ల 80 31 32 మొత్తం 465 131 134.7 సూర్యఘర్ పథకంపై జిల్లావాసుల్లో నిరాసక్తత రాయితీ వర్తిస్తున్నా పట్టించుకోని వైనం ఉమ్మడి జిల్లాలో 465 దరఖాస్తులకు డబ్బు చెల్లించింది 131 మందే అపోహలు వద్దు సోలార్ పవర్తో విద్యుత్ బిల్లు భారీగా తగ్గుతుంది. తొలుత పెట్టుబడి ఎక్కువగా అనిపించినా.. భవిష్యత్లో ఊహించని ప్రయోజనం చేకూరుతుంది. సోలార్ రూఫ్టాప్ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదు. – అజేయ్, డీఎం, రెడ్కో -
వర్షాకాలం అప్రమత్తం
కొత్తపల్లి(కరీంనగర్): రానుంది వర్షాకా లం. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సొంతంగా రిపేర్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ అధి కారులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో జరిగే ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు వివరించారు. ● తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదు. ప్రమాదకరంగా ఉన్నటువంటి తీగలను గమనించిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయండి. ● ఇళ్లలో బట్టలు ఆరవేసే జీఐ దండెము/వైర్లతో విద్యుత్తీగల్లో ఇన్సూలేషన్ సరిగ్గా లేకపోవడంతో విద్యుత్ సరఫరా జరిగి షాక్కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ దండెములు ఉపయోగించాలి. ● ఇంటి ముందు రేకులకు కూడా విద్యుత్ సరఫరా జరిగే ప్రమాదం ఉంది. స్తంభం నుంచి విద్యుత్ సరఫరా అయ్యే వైర్లను ఎట్టి పరిస్థితుల్లో దండెంలకు, రేకులకు తగలకుండా జాగ్రత్తపడాలి. ● పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. ఒక వేళ కరెంట్ తీగలు కిందపడి ఉంటే పశువులు వాటిని తాకకుండా అప్రమత్తంగా ఉండాలి. ● ఇంటి వైరింగ్కు సరైన ఎర్తింగ్ చేయించాలి. నా ణ్యమైన ప్లగ్గులు, సెల్ఫోన్ చార్జర్లను ఉపయోగించాలి. ● సెల్ఫోన్ చార్జింగ్ పెట్టి తడిచేతులతో తాకి మా ట్లాడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందునా చార్జింగ్ ఆఫ్ చేసి మాట్లాడాలి. ● పొరపాటున కరెంట్షాక్కు గురైతే దగ్గరలోని వ్యక్తులు రక్షించాలనే ఆతృతలో అతన్ని ముట్టుకో వద్దు. షాక్కు గురైన వ్యక్తిని వేరు చేయడానికి వి ద్యుత్ ప్రవహించని కర్ర, ప్లాస్టిక్ వస్తువులను వాడాలి. ● వ్యవసాయబావుల వద్ద నాణ్యతలేని పంపుసెట్లను వాడొద్దు. కరెంటు మోటార్లు, ఫుట్ వాల్వులు, సర్వీసు వైర్లకు ఇన్సులేషన్ విద్యుత్ ప్రసారం జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని ఏమరపాటున తాకవద్దు. వ్యవసాయ పంపుసెట్లు, స్టార్టర్లను విధిగా ఎర్తింగ్ చేయించుకోవాలి. ● రైతులు, వినియోగదారులు సొంతంగా కరెంట్ పనులు చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాన్స్ఫార్మర్పై ఫ్యూజులు వేయడం వంటి పనులు రైతులు చేయొద్దు. విద్యుత్ సిబ్బందికి చెప్పి చేయించుకోవాలి. ● పొలాల చుట్టూ వేసే విద్యుత్ కంచెలతో రైతులకు ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున రైతులు అప్రమతంగా ఉండాలి. ● విద్యుత్కంచె ఏర్పాటు చేయడం చట్టరీత్య నేరం. ● గ్రామీణులు విద్యుత్ సిబ్బంది లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ఇన్స్పెక్టర్, సబ్ ఇంజినీర్, సెక్షన్ ఆఫీసర్ను సంప్రదించాలి. వైర్లు తెగితే 1912కు కాల్ చేయాలి సొంతంగా మరమ్మతు పనులు చేయొద్ద కరీంనగర్ ఎస్ఈ రమేశ్బాబు -
భక్తిశ్రద్ధలతో రేవతినక్షత్రోత్సం
● రాజన్నను దర్శించుకున్న 70 వేల మంది ● రూ.65 లక్షల ఆదాయం ● రాజన్న సేవలో సినీనటులు వేములవాడ: రేవతీ నక్షత్రోత్సవం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో శనివారం స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతపద్మనాభస్వామికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం చేశారు. 70వేల మంది భక్తులు దర్శించుకోగా, రూ.65 లక్షల ఆదాయం సమకూరింది. కరీంనగర్ ఏసీపీ వెంకటస్వామి దంపతులు రాజన్నను దర్శించుకున్నారు. శనిత్రయోదశిని పురస్కరించుకుని అనుబంధ ఆలయం భీమన్నగుడిలో నవగ్రహాలకు పూజలు నిర్వహించారు. రాజన్నను సినీనటులు బాలాదిత్య(చంటి), కౌశిక్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
పాలకుర్తి(రామగుండం): పుట్నూర్ గ్రామంలో టాటామ్యాజిక్ ఆటో ఢీకొని శ్రీరాముల మల్లయ్య(60) మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారం మండలం రామయ్యపల్లికి చెందిన టాటామ్యాజిక్ వాహనం బసంత్నగర్ వైపు వస్తుండగా మార్గమధ్యంలో పుట్నూర్ గ్రామశివారులోని గాంధీనగర్ వద్ద రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న మల్లయ్యను వెనుకనుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో మల్లయ్య తలకు తీవ్రగాయాలు కాగా వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోని సుల్తానాబాద్లో మల్లయ్య మృతిచెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు బసంత్నగర్ పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎల్లారెడ్డిపేటలో గుర్తుతెలియని మహిళ..ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని వెంకటాపూర్ శివారులో రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని మహిళను స్కూటీ బలంగా ఢీకొట్టడంతో మృతిచెందింది. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాలు. వెంకటాపూర్లోని సిరిసిల్ల –కామారెడ్డి రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని మహిళను ఎల్లారెడ్డిపేట నుంచి సిరిసిల్లకు వెళ్లున్న స్కూటీ శుక్రవారం రాత్రి ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ మహిళను అదే గ్రామానికి చెందిన వాటర్పంపు మెకానిక్ మల్లాపురం వెంకటేశ్, అతని స్నేహితుడు మేకల మల్ల య్య సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఈ సంఘటనపై వెంకటేశ్, మల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. బైక్ ఢీకొని వృద్ధుడి మృతిసిరిసిల్లక్రైం: సిరిసిల్ల మున్సి పల్ పరిధిలోని పెద్దూర్లో రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్న సంఘటనలో నర్ర బుచ్చయ్య(60) అనే వృద్ధుడు మృతిచెందాడు. స్థాని కులు తెలిపిన వివరాలు. బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి అతివేగంగా వెళ్తూ ఎక్సెల్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఎక్సెల్పై ప్రయాణిస్తున్న వృద్ధుడు బుచ్చయ్య తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తీసుకెళ్లగా మృతిచెందాడు. మృతికి కారణమైన పీసీ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపినట్లు స్థానికులు తెలిపారు. -
ఉగ్రవాదాన్ని అంతమొందించాలి
కరీంనగర్: దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించి, మతసామరస్యాన్ని కాపాడాలని, ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సుగుణాకర్రావు భవన్లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వారోత్సలు నిర్వహించార. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి, అనంతర పరిణామాలు అంశంపై సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి అధ్యక్షతన సెమినార్ జరిగింది. వీరయ్య మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడి దిగ్భ్రాంతికి గురిచేసిందని, అయితే, ఒక మతానికి వ్యతిరేకంగా మోదీ పరివారం సోషల్ మీడియాలో ప్రచారం చేసిందని, ఇది దేశ ఐక్యతను దెబ్బతీస్తుందన్నారు. కశ్మీర్ ముస్లింలే పర్యాటకులను కాపాడారని, రైల్వే, ఎయిర్పోర్టులకు ఉచితంగా పర్యాటకులను చేరవేశారన్నారు. అదే కార్పొరేట్ శక్తులు ఎయిర్లైన్స్లో రూ.6 వేలు ఉన్న టిక్కెట్కు రూ.60వేలకు పెంచారన్నారు. ఈ ఉగ్రదాడిలో ఒకముస్లిం హార్స్ రైడర్ చనిపోయారన్నారు. తామంతా ఒకటిగా ఉన్నామని అక్కడి ముస్లింలు నినదించిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు. యుద్ధంతో ఉగ్రవాదాన్ని అణచివేసిన ఉదంతాలు ప్రపంచంలోనే లేవన్నారు. కాల్పుల విరమణ తర్వాత ట్రంప్ వైఖరిపై మోదీ నోరు మెదపలేదన్నారు. ఉగ్రవాదుల అంతు తేల్చామని ఒకవైపు ప్రధాని చెబుతున్నారని, నేటికీ ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకోలేదని ఎద్దేవా చేశారు. కాల్పుల విరమణ అనంతరం అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఉగ్రదాడి అనంతర పరిణామాలపై పార్లమెంట్లో ఎందుకు చర్చించలేదన్నారు. మావోయిస్టులు చర్చలకు వస్తామని ప్రకటించినా.. కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్లకు పాల్పడడం శోచనీయమన్నారు. అడవిలో ఉన్నవారు ప్రజల కోసం పోరాడుతున్నారు తప్ప వ్యక్తిగత హింస చేయడం లేదన్నారు. నాయకులు వర్ణ వెంకటరెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, బీమా సాహెబ్, సుంకర సంపత్, ఎడ్ల రమేశ్, జి.రాజేశం, కోనేటి నాగమణి, తిప్పారపు సురేశ్, జి.తిరుపతి నాయక్, కొంపెల్లి అరవింద్, రాజమల్లు, నరసింహారెడ్డి, రామ్మోహన్, శ్రీధర్, మాతంగి శంకర్, పుల్లెల మల్లయ్య, విద్యాసాగర్, వామన్రావు, వెంకటేశ్వర్లు, బోడ మోహన్ నాయక్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య -
ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి
గోదావరిఖని: ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గదర్శి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక భాస్కర్రావుభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్ట్ నేతలను ఎన్కౌంటర్ పేరిట చంపుతూ పైచాచిక ఆనందం పొందుతోందన్నారు. మావోయిస్ట్ పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరుపుతామని ఆయుధాలను పక్కన పెట్టి కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా.. నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం హేయమైన చర్య అన్నారు. ఇప్పటికై నా ఆపరేషన్ కగార్ను నిలిపివేసి శాంతిచర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం.. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆపరేషన్ కగార్ను చేపట్టిందని ధ్వజమెత్తారు. సీపీఐ జాతీయ మహాసభలు సెప్టెంబర్లో చండీగఢ్లో, తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆగస్టులో మేడ్చల్ జిల్లాలో జరుగన్నాయని తెలిపారు. ఈలోగా పట్టణ, మండల, జిల్లా మహాసభలు పూర్తి చేయాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు శంకరన్న, తాండ్ర సదానందం, గోసిక మోహన్, గోవర్ధన్, కె.కనకరాజ్, తాళ్లపెల్లి మల్లయ్య, కొడం స్వామి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్రెడ్డి -
మచ్చలేని నాయకుడిపై నిందలా?
పెద్దపల్లిరూరల్: మచ్చలేని నాయకుడిగా, నీతి, నిజాయతీతో రాష్ట్రాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుపై చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ కుటుంబం నిందలు వేయడం మానుకోవాలని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం హితువు పలికారు. స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సరస్వతీ పుష్కరాల ప్రచారంలో ఫ్లెక్సీపై ఎంపీ వంశీకృష్ణ ఫొటో ఏర్పాటు చేయలేదని శ్రీధర్బాబుపై అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. 30 ఏళ్ల యువకుడికి ఎంపీ టికెట్ ఇప్పించి గెలిపించిన నాయకు డిని ఎలా విమర్శిస్తారని మండిపడ్డా రు. వివేక్ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి చెడ్డు పేరు తెచ్చేలా ప్రవర్తించవద్దని, ఇప్పటికై నా కుల రాజకీయాలు మానుకోవాలని హితువు పలికారు. వివేక్ పార్టీలు మారడంలో దిట్ట అని, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును ఎక్కడ కలిశావో తనకు తెలుసుని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఇష్టం ఉంటే పార్టీ కోసం పనిచేయాలని, లేకుంటే తనకు నచ్చిన పార్టీలోకి వెళ్లాలని సూచించారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. నాయకులు మల్యాల తిరుపతి, మంథని సత్యం, కర్ణ కృష్ణ, తోకల మల్లేశ్, ఇరుగురాల మహేందర్, బూడిద శంకర్, అక్కపాక సంపత్, సాట్ల అమరజ్యోతి, పులిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశపూర్వకంగానే మంత్రి శ్రీధర్బాబుపై అక్కసు ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం -
వానాకాలం.. ‘సాగు’డెట్లా
● రేపటి నుంచే రోహిణి కార్తె ● పూర్తవని రుణమాఫీ.. ● ఖరారు కాని రుణ ప్రణాళిక ● అన్నదాతకు నలుదిక్కులా సమస్యలేకరీంనగర్ అర్బన్: సకాలంలో పంటలు వేస్తేనే ప్రయోజనమన్నది శాస్త్రవేత్తల మాట. ఈ నెల 25న రోహిణి కార్తెలోకి ప్రవేశమవనుండగా తదనుగుణంగా సిద్ధమవ్వాలనుకునే రైతన్నకు నిర్వేదమే మిగులుతోంది. ప్రభుత్వం కోట్లకు కోట్లు రైతు ప్రయోజనార్థం కేటాయిస్తుంటే సంబంధిత అధికారుల నిర్లక్ష్యం గుదిబండలా మారింది. ఎప్పటికప్పుడు అన్నదాతలకు అండగా నిలిచి నిధుల కోసం ప్రతిపాదించాల్సి ఉండగా నిర్లక్ష్యం చేయడం విడ్డూరం. భూగర్బజలాలు పెరగడం.. చెరువుల్లో నీరుండటంతో ఈ సారైనా రోహిణిలో నార్లు పోసుకోవాలనుకునేవారికి చేతిలో నగదు లేక ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో వానకాల సీజన్లో 3.43లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయన్నది వ్యవసాయ శాఖ అంచనా. ఖరారు కాని రుణ ప్రణాళిక సకాలంలో రుణాలివ్వాల్సిన బ్యాంకర్లు ప్రతిఏటా కొర్రీలతో వేధిస్తుండగా ఈ సారి ఇంకా రుణ ప్రణాళికే ఖరారు కాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇక రుణమాఫీ ఇంకా పరిపూర్ణం కాకపోవడం ఇంకా లబ్ధిదారుల సేకరణలో బ్యాంకర్లు తలమునకలవడం విశేషం. గత అయిదేళ్లలో ఎప్పుడు కూడ లక్ష్యం మేర రుణాలిచ్చిన దాఖలాలే లేవు. మంత్రుల సమీక్షలో రుణాలిస్తామని తలలూపడం తప్పా ఆచరణలో అదే నిర్లక్ష్యం. ప్రభుత్వం రూ.2లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించగా వడ్డీ కలిపి 2లక్షలు దాటిన రైతులకు ఇంకా మాఫీ చేయలేదు. ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకున్న బ్యాంకర్లు రుణాలిచ్చేందుకు దాటవేత ధోరణిని అనుసరిస్తున్నారు. అవసరం కొండంత.. ఆసరా గోరంత ఏటా అరకొర విత్తనాలు మాత్రమే సరఫరా అవుతుండగా ప్రధానంగా అవసరమైన వరి విత్తనాలను ఆశించినస్థాయిలో ఇవ్వడం లేదు. వేరుఽశనగ, కందులు, శనగ, మినుములు, పెసలు ఇతర విత్తనాలు ఆన్లైన్ ద్వారా పంపిణీ చేయాల్సి ఉండగా ఇంకా విత్తనాలే రాకపోవడం ఆందోళనకర పరిణామం. ఏటా పంపిణీ చేసే విత్తనాలు క్షేత్రస్థాయి డిమాండ్కు ఏ మాత్రం సరిపోవడం లేదు. పరిఽశోధన స్థానాలు గానీ విత్తనాభివృద్ధి సంస్థలు విత్తనాల నిల్వలపై ప్రచారం లేకపోవడం శోచనీయం. రైతు భరోసా ఏదీ.. పంట డబ్బులేవీ అన్నదాతకు ఆర్థిక భరోసాగా ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తుండగా ఇంకా అతీగతి లేదు. వానకాలం సీజన్కు గానూ ఎకరాకు రూ.6వేలు ఇస్తుండగా సదరు ప్రక్రియ మొదలు కాలే. కరీంనగర్ జిల్లాలో గత సంవత్సరం వానా కాలం రైతు భరోసా రైతు ఖాతాకు చేరకపోగా యాసంగిలోనూ అదే పరిస్థితి. యాసంగిలో కేవలం 4ఎకరాలలోపు రైతులకు మాత్రమే జమ కాగా మిగతా రైతులు ఇంకా పడిగాపులు కాస్తున్నారు. సీజన్కు రూ.171కోట్లు జమ కావాల్సి ఉండగా కాలయాపనే. చిన్న, సన్నకారు రైతులకే రైతు భరోసా జమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పంట కొనుగోలు చేసిన 48గంటల్లోనే నగదు ఖాతాకు చేరుతుందని ప్రభుత్వం ప్రకటించగా క్షేత్రస్థాయిలో మాత్రం విరుద్ధ పరిస్థితి. పక్షం రోజులు దాటినా డబ్బులు పడటం లేదని రైతులు వాపోతున్నారు. ఽజిల్లాలో రూ.40కోట్ల వరకు రైతుల ఖాతాకు చేరాల్సి ఉంది. పెద్ద రైతులకు లేనట్టేనా ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతుబంధు పథకం పెద్ద రైతులకు లేనట్టేనని స్పష్టమవుతోంది. 2018 వానకాలం సీజన్లో రైతు బంధు పథకం ప్రారంభం కాగా వానకాలం, యాసంగి రెండు సీజన్లు పెద్ద రైతులకు రైతు బంధు సాయం అందింది. 2019 నుంచి అంటే రెండు సీజన్లు డబ్బులు రాలేదు. 2019 వానకాలం సీజన్లో 1,61,653 మంది రైతులకు గానూ రూ.171.65కోట్లు చేరాల్సి ఉండగా 1,47,592 మందికి రూ.150కోట్లు విడుదల చేశారు. ఈ లెక్కన రూ.21కోట్లు పెద్దరైతుల ఖాతాకు చేరలేదు. అలాగే యాసంగిలో 1,14,102మందికి రూ.100.48కోట్లు మాత్రమే రైతుల ఖాతాకు జమయ్యాయి. ఇక 2024 వానకాలం డబ్బులు ఎవరికి పడకపోగా యాసంగికి సంబంధించి 4ఎకరాల వరకే నగదు జమైంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పరిస్థితి అంతే. ఏడాదికి మూడు విడతలుగా రూ.2వేల చొప్పున జమ చేస్తుండగా రైతుల సంఖ్య తగ్గుతోంది. మొదటి విడతలో 1.02లక్షల మంది ఉన్న రైతుల సంఖ్య మూడో విడతలో 95,100కు చేరగా తాజాగా 69,173 మందికి సాయమందింది. -
‘సింగరేణి’ రద్దుతో ఇబ్బందులు
● కాగజ్నగర్ – భద్రాచలంరోడ్డు మధ్య ఒకేరైలు ● 29 వరకు ఇరువైపులా రాకపోకలు బంద్ ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు రామగుండం: సిర్పూర్ కాగజ్నగర్ నుంచి భద్రాచలం రోడ్డు మధ్య సింగరేణి ప్యాసింజర్(రైలు నంబరు 17033/17034)రాకపోకలు సాగిస్తోంది. కాగజ్నగర్ – భద్రాచలంరోడ్ మధ్య సుమారు 315 కి.మీ. దూరం ఉంటుంది. మధ్యాహ్నం 12.45 గంటలకు రామగుండంలో బయలుదేరి రాత్రి 8.20 గంటలకు భద్రాచలం రోడ్డు స్టేషన్కు చేరుకుంది. ప్రయాణ చార్జీ ఒక్కొక్కరికి రూ.150 మాత్రమే. దీంతో సాధారణ ప్రయాణికులు ఇందులో ప్రయాణించేందుకే మొగ్గుచూపుతారు. ఈ రైలు రద్దయినా, ప్రయాణికులు మిస్ అయినా.. రోడ్డుమార్గం తప్ప మరోదారిలేదు. ఇలా వెళ్తే ఒక్కో వ్యక్తికి కనీసం రూ.800 వరకు ప్రయాణ చార్జీ అవుతోంది. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, వరంగల్, కేసముద్రం, డోర్నకల్.. ఇలా కోల్బెల్ట్ ప్రాంతాల మీదుగా భద్రాచలంరోడ్డుకు ప్రయాణం సాగిస్తోంది. అందుకే దీనికి సింగరేణి అని నామకరణం చేశారు. ఈ రైలులో అత్యధికంగా సింగరేణి కార్మిక కుటుంబాలు ప్రయాణిస్తుంటాయి. 29 వరకు ఇరువైపుల రద్దు.. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో నాన్ ఇంటర్ లాకింగ్, రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఇరువైపులా సింగరేణి రైలును రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మార్గంలో ఎక్కడ ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టినా అధికారులు సింగరేణి ప్యాసింజర్ రైలును రద్దు చేయడం సర్వసాధారణంగా మారిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రైల్వేశాఖ నిర్ణయంపై సింగరేణి కార్మికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. -
ఆగ్రహించిన అన్నదాత
● ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై నిరసన ● జగిత్యాల, రాయికల్లో రోడ్డెక్కిన రైతులు ● మెట్పల్లిలో ప్యాక్స్ చైర్మన్ను నిలదీసిన వైనంజగిత్యాలరూరల్/మెట్పల్లిరూరల్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లాలోని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట, మెట్పల్లి, రాయికల్ మండలం శ్రీరాంనగర్, సింగరావుపేటలో రైతులు శుక్రవారం రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన రైతులు జగిత్యాల – ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొనుగోలు కేంద్రాల్లో 40 రోజులుగా ధాన్యం పోసి నిరీక్షించినా కొనుగోలు చేయడం లేదని ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ లత, రూరల్ ఎస్సై సదాకర్ రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని తూకం వేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అదేవిధంగా మెట్పల్లి మండలం బండలింగాపూర్ పీఏసీఎస్ కేంద్రంలో ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని సీఈవో శేఖర్ను రైతులు నిలదీశారు. వర్షానికి ధాన్యం నష్టపోయాయని, వెంటనే కొనుగోళ్లు చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కొద్దిసేపు కేంద్రంలో గందరగోళం ఏర్పడగా సమాచారం అందుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ కాంతయ్య సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. కొనుగోళ్లలో జాప్యానికి గల కారణాలపై ఆరా తీశారు. మరోవైపు.. రాయికల్ మండలం శ్రీరాంనగర్, సింగరావుపేట గ్రామాల్లో అకాల వర్షాలతో ధాన్యం తడిసిందని రైతులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న జెడ్పీ మాజీచైర్పర్సన్ దావ వసంత అక్కడకు చేరుకున్నారు. తడిసిన ధాన్యం పరిశీలించారు. రైతులతో కలిసి అక్కడే బైఠాయించారు. రైతులు ఎంతోకష్టపడి పండించిన ధాన్యం చేతికందే దశలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొనుగోళ్లలో జాప్యం జరగడం, అకాల వర్షాలతో తడవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, నాయకులు చాంద్, రాజేశ్వర్రెడ్డి, జలపతిరెడ్డి, గంగారెడ్డి, రాజమౌళి, చంద్రయ్య, శ్రీను, రవి, మల్లారెడ్డి, నరేశ్, లక్ష్మణ్, రైతులు పాల్గొన్నారు. -
కిడ్నీ సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు
● యశోద ఆసుపత్రి నెఫ్రాలజిస్టు అరుణ్కుమార్కరీంనగర్టౌన్: సైలెంట్ కిల్లర్గా మారుతున్న కిడ్నీ సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల డయాలసిస్ వరకు వేళ్లే ప్రమాదం ఉంటుందని సోమాజిగూడ యశోద హాస్పిటల్ నెఫ్రాలజిస్టు డాక్టర్ అరుణ్కుమార్ పొన్న తెలిపారు. కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్లో శుక్రవారం మాట్లాడుతూ.. సిరిసిల్లకు చెందిన రాధ అనే మహిళ నొప్పులకు సంబంధించిన పేయిన్కిల్లర్ ఇంజక్షన్ వేసుకోగా రెండు రోజుల తర్వాత జ్వరం వాంతులు ఎక్కువై యశోద ఆసుపత్రికి వచ్చిందన్నారు. వెంటనే పరీక్షలు నిర్వహించగా కిడ్నీ సీరం క్రియాటిన్ 6.0 ఉన్నట్లు తేలిందన్నారు. మరో రెండు రోజుల్లోనే క్రియాటిన్ 10.0కు చేరడంతో మూత్ర పిండాలు పనిచేయడం మానేశాయన్నారు. అయినప్పటికీ డయాలసిస్కు వెళ్లకుండా రోగ నిర్ధారణపై దృష్టిపెట్టి ఒక కిడ్నీ బయాప్సీ నిర్వహించినట్లు తెలిపారు. పేయిన్కిల్లర్ ఇంజక్షన్ కారణంగా అలర్జీ వచ్చినట్లు గుర్తించామన్నారు. దీనికి తగిన విధంగా చికిత్స అందించడంతో పూర్తిగా కోలుకుందన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. సంవత్సరానికి ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పేయిన్ కిల్లర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మూత్ర పిండాల సమస్య ఉంటే తొందరగా డయాగ్నొస్టిక్ చేయడం వల్ల డయాలసిస్ సమస్య నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. -
ఎస్జీఎఫ్ బిల్లులు రూ.అరకోటి
● 2017 నుంచి అందక ఇబ్బందులు ● అప్పు చేసి క్రీడాపోటీలు నిర్వహించామంటున్న కార్యదర్శులు ● సర్కారు స్పందించాలని వేడుకోలుకరీంనగర్స్పోర్ట్స్: విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు పాఠశాల, కళాశాలస్థాయిల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏటా నిర్వహిస్తున్నారు. మండల, జోన్, జిల్లా, ఉమ్మడి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిల్లో ఎస్జీఎఫ్ టోర్నీలు నిర్వహిస్తారు. ఫెడరేషన్ను ఏటా నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. క్రీడా టోర్నీల బిల్లులు రూ.అరకోటికి పైగా 2017నుంచి పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, 17, 19 విభాగానికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో 2017నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలు జరుగుతున్నాయి. నేటి వరకు పోటీల నిర్వహణ బిల్లులు, తెలంగాణ జట్లను జాతీయ పోటీలకు పంపించిన బిల్లులు ఉమ్మడి జిల్లా కళాశాలలకు సంబంధించినవి రూ.30లక్షలు, పాఠశాలలకు సంబంధించి రూ.28లక్షలు పెండింగ్లో ఉన్నా యి. బిల్లుల మంజూరు కోసం టోర్నీకి సంబంధించిన సమగ్ర వివరాలు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు (ఎస్జీఎఫ్ విభాగం) పంపిస్తున్నారు. నిధులు మంజూరు కాకపోతుండడంతో ఎస్జీఎఫ్ కార్యదర్శులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేశామని ఆవేదన చెందుతున్నారు.అప్పు తెచ్చి పోటీలు రెండేళ్లపాటు పెద్దపల్లి జిల్లాకు పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించా. ఇప్పుడు బదిలీపై కరీంనగర్కు వచ్చా. పెద్దపల్లిలో పలుక్రీడల్లో ఏడు రాష్ట్రస్థాయి పోటీలు అప్పు తెచ్చి నిర్వహించా. క్రీడాకారులను జాతీయపోటీలకు పంపించాను. రావాల్సిన డబ్బుల కోసం ఎదురుచూస్తున్నాను. – అంతటి శంకరయ్య, పెద్దపల్లి జిల్లా ఎస్జీఎఫ్ మాజీ కార్యదర్శిబకాయిలు చెల్లించాలి ఎస్జీఎఫ్ కళాశాల విభాగంలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలు నిర్వహించాను. 2017నుంచి పోటీలకు సంబంధించిన బకాయిలు విడుదల కాలేదు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పోటీలు నిర్వహించి, జిల్లా, రాష్ట్ర పేరును నిలిపాం. ఇప్పటికై న బకాయిలను విడుదల చేయాలి. – జి.మధుజాన్సన్, ఉమ్మడి జిల్లా కళాశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి -
ఇటుకబట్టీ కార్మికుల స్థితిగతులపై జడ్జి ఆరా
కరీంనగర్క్రైం/కొత్తపల్లి: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి కే.వెంకటేశ్ బృందం శుక్రవారం చింతకుంట గ్రామంలోని ఇటుకబట్టీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులకు అందుతున్న జీతభత్యాలతో పాటు వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బట్టీల వద్ద తనిఖీలు నిర్వహించటంతోపాటు, సౌకర్యాల గురించి ఆరా తీశారు. కార్మికుల హక్కులు కాపాడాలని బట్టీల యాజమాన్యాలకు సూచించారు. కార్మికులకు ఎలాంటి చట్టపరమైన సమస్యలున్నా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించి, న్యాయసాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రఫీ, లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్ పాల్గొన్నారు. భారతదేశ శక్తి ప్రపంచానికి తెలిసింది జమ్మికుంట: అపరేషన్ సిందూర్తో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సత్తా భారత్కు ఉందని, మన దేశశక్తి ప్రపంచానికి తెలిసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. జమ్మికుంట పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గాంధీచౌక్ నుంచి అంబేద్కర్చౌక్ వరకు అపరేషన్ సిందూర్కు మద్దతుగా బీజేపీ నాయకులు జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మన దేశ సైనికులు ఉగ్రవాదులను అంతమొందించడమే కాకుండా, వారి స్థావరాలను ధ్వంసం చేశారన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రావు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అకుల రాజేందర్, సీనియర్ నాయకులు జీడి మల్లేశ్, ఇల్లందకుంట, వీణవంక, హుజూరాబాద్ మండలాల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, నరేశ్, తూర్పాటి రాజు, మాజీ జెడ్పీటీసీ శ్రీరామ్శ్యామ్, మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు 226 మంది గైర్హాజరు కరీంనగర్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ పేపర్–1పరీక్షకు 226 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో వి.గంగాధర్ తెలిపారు. జనరల్ విభాగంలో 1,922మందికి 211మంది గైర్హాజరు కాగా, 1,711 మంది పరీక్ష రాశారని తెలిపారు. ఒకేషనల్ విభాగంలో 178మందికి 15మంది గైర్హాజరు కాగా 163మంది పరీక్ష రాశారని తెలిపారు. మొత్తంగా 2,100మందికి 226మంది గైర్హాజరు కాగా 1,874 మంది పరీక్ష రాశారని డీఐఈవో పేర్కొన్నారు. -
చొక్కారావు సన్నిహితుడు ‘నరెడ్ల’
● అతడిని ఎప్పటికీ మరువలేను ● శ్రీనివాస్ విగ్రహావిష్కరణలో మంత్రి పొన్నం ప్రభాకర్విద్యానగర్(కరీంనగర్): తన రాజకీయ గురువు స్వర్గీయ జువ్వాడి చొక్కారావును, అతడికి అత్యంత సన్నిహితుడు నరెడ్ల శ్రీనివాస్ను ఎప్పటికీ మరువలేనని బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆవరణలో ఏర్పాటు చేసిన సామాజిక, లోక్సత్తా ఉద్యమ నాయకుడు నరెడ్ల శ్రీనివాస్ విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వినియోగదారుల మండలి, సమాచార హక్కుదారుడిగా పోరాటాలు చేసి, బాధితులకు న్యాయం చేకూర్చిన వ్యక్తి శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ ఫిలిం సొసైటీలో కీలక సభ్యుడిగా ప్రయోజనాత్మకమైన చిత్రాలను ప్రదర్శించడం ద్వారా ప్రజలను చైతన్య పరిచారన్నారు. ఫిలింసొసైటీకి అనువుగా ఉండే స్థల సేకరణకు కలెక్టర్ అనుకూలంగా ఉన్నారని, స్థల సేకరణ పూర్తయిన తరువాత భవన నిర్మాణానికి నిధులు ఇప్పించే బాధ్యత తనదే అన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, గురుకుల పాఠశాలల జాయింట్ సెక్రటరీ జీవీ.శ్యాంప్రసాద్లాల్, కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, వరాల మహేశ్, ప్రకాశ్ హోల్లా, రామచంద్రారెడ్డి, ముజఫర్, అన్నవరం దేవేందర్, రఘురాం పాల్గొన్నారు.కవిత లేఖపై కేసీఆర్ స్పందించాలికరీంనగర్ కార్పొరేషన్: బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత రాసిన లేఖపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు స్పందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని తాము మొదటి నుంచి చేస్తున్న ఆరో పణలకు కవిత లేఖలో రాసిన అంశాలు నిజమని తేల్చాయన్నారు. కరీంనగర్లో శుక్రవారం మాట్లాడుతూ కవిత రాసిన లేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్రావు ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు. సాక్షాత్తు బీఆర్ఎస్ అధ్యక్షుడి కూతురే పార్టీ అధినేత కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్నారని తెలిపారు. కేసీఆర్ ప్రతిపాదన మేరకే బండి సంజయ్ని తప్పించి కిషన్రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టినట్లు ప్రచారంలో ఉందన్నారు. కవిత కాంగ్రెస్తో టచ్లో ఉన్నారనేది అపోహ మాత్రమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ను బాంబులతో పేల్చేశారని, కాంగ్రెస్లో అంతర్గత కలహాలని, నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్రెడ్డి పేరుందని కవిత లేఖ నుంచి డైవర్షన్ చేసేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నాడన్నారు. కాళేశ్వరం బాంబులు కాదని, కవిత పేల్చిన బాంబుల గురించి కేటీఆర్ మాట్లాడాలని పొన్నం చమత్కరించారు. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీకి లా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల తీసుకువచ్చామని ఆయన తెలిపారు. డంప్యార్డ్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. -
ప్రాథమిక విద్య భవితకు పునాది
కరీంనగర్/కొత్తపల్లి/కరీంనగర్అర్బన్/చొప్పదండి: ప్రాథమిక విద్య దేశ భవిష్యత్తుకు పునాది అని, ఉపాధ్యాయులందరూ అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ స్కూల్లో జరుగుతున్న గంగాధర మండల ప్రాథమిక ఉపాధ్యాయుల ఐదురోజుల వృత్యంతర శిక్షణను శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు బోధించి, పిల్లల సంఖ్యను పెంచాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లా ప్రాథమిక పాఠశాలల్లో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టాలని, దానికి సహకరించాలని కోరారు. ప్రాథమికస్థాయి శిక్షణ మాడ్యూల్ను ఆవిష్కరించారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో స్కూల్ అసిస్టెంట్లకు జరుగుతున్న శిక్షణ తరగతులను డీఈవో జనార్దన్రావు సందర్శించారు. వృత్యంతర శిక్షణను ప్రతి ఉపాధ్యాయుడు పొందాల్సిన అవసరం ఉందని, అప్పుడే నైపుణ్యాలను మెరుగుదల పరుచుకొని అభ్యసన ఫలితాలను పొందవచ్చునన్నారు. ఈ శిక్షణలో జిల్లాలోని అన్ని సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్లు 861 మంది పాల్గొన్నట్లు తెలిపారు. కోఆర్డినేటర్లు కె.అశోక్రెడ్డి, ఇ.ఆంజనేయులు, మిల్కూరి శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి చాడ జయపాల్ రెడ్డి, గాజుల రవీందర్, గంగాధర ఎంఈవో ఏనుగు ప్రభాకర్రావు పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఫర్టిలైజర్ వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తే కఠి న చర్యలు తప్పవని కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని గాంధీరోడ్డులోని పలు ఎరువుల దుకాణాలు, గోదాములను తనిఖీ చేశా రు. రికార్డులు పరిశీలించి విత్తనాల నిల్వ, అమ్మకా ల వివరాలు తెలుసుకున్నారు.ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయించాలని డీలర్కు సూచించారు. అన్ని ఎరువులు, విత్తనాలను గరిష్ట చిల్లర ధర ప్రకారమే విక్రయించాలని ఆదేశించారు. అవసరాన్ని బట్టి ఎరువులు నిల్వ చేసుకోవాలన్నారు. ఏడీఏ కె.రణధీర్ కుమార్, కరీంనగర్ అర్బన్ ఏవో ఎం.హరిత ఉన్నారు. హెల్త్ స్క్రీనింగ్ పూర్తి చేయాలి 13ఏళ్లు పైబడిన మహిళలకు వందశాతం హెల్త్ స్క్రీనింగ్ పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ పమేలా సత్ప తి సూచించారు. పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్ విభాగం, లేబరేటరీ, లేబర్ రూమ్, ఫార్మసీ స్టోర్ను తనిఖీ చేశారు. బాలింతలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో సాజిదా, వైద్యాధికారి శ్రీకీర్తన పాల్గొన్నారు.● కలెక్టర్ పమేలా సత్పతి -
భయాందోళన వద్దు
● జెన్–1 ప్రాణాంతక వేరియంట్ కాదు ● సాధారణ ఫ్లూ, జలుబు లక్షణాలతో ఉంటుంది ● లక్షణాలున్నవారు ఐసోలేట్ అయితే సరిపోతుంది ● వైరస్ వ్యాప్తిచెందినా ఎదుర్కొనేందుకు సిద్ధం ● ‘సాక్షి’ ఫోన్ఇన్లో డీఎంహెచ్వో వెంకటరమణకరీంనగర్టౌన్: దేశంలో కరోనా కేసులు నమోదవుతు న్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మన రాష్ట్రంలోనూ ఒక కేసు నమోదైనట్లు తెలుస్తుండగా.. జెఎన్–1 వైరస్ భయం ప్రజలను వణికిస్తోంది. ఆందోళన అవసరం లేదని వైద్యాధికారులు సూచిస్తున్నప్పటికీ ప్రజలు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చిన్న జ్వరానికే భయపడుతున్నారు. వారి ఆందోళనలను తొలగించేందుకు జిల్లా వైద్యాధికారి వెంకటరమణతో శుక్రవారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. పలువురు అడిగిన ప్రశ్నలకు డీఎంహెచ్వో సమాధానం ఇచ్చారు.కొత్త వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయి? – శంకర్, వావిలాలపల్లి, కరీంనగర్డీఎంహెచ్వో: పాత వైరస్ ప్రాణాంతకంగా ఉండేది. 2019 కరోనా వేరియంట్కు, ఇప్పటి జెఎన్–1కు చాలా తేడా ఉంది. ప్రస్తుతం వచ్చే సాధారణ ఫ్లూ, జలుబు, దగ్గు, డయేరియా, కళ్ల మంటలు వంటి లక్షణాలు ఉంటున్నాయి. పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన పనిలేదని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. కరీంనగర్లో పరిస్థితి ఎలా ఉంది? – వెంకటేశ్వర్లు, కాపువాడ, కరీంనగర్డీఎంహెచ్వో: తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదైందని తెలుస్తోంది. ఒక వేళ కేసులు పెరిగినా ప్రమాదకర పరిస్థితులు ఉండవని స్పష్టం చేశారు. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, పిల్లలు, బీపీ, షుగర్, గుండెజబ్బులు ఉన్న వాళ్లు లక్షణాలు కనిపిస్తే ఐసోలేట్ అయి చికిత్స తీసుకోవాలి. కేసులు పెరిగితే ఎలాంటి చర్యలు చేపడతారు? – ఆంజనేయులు, కొత్తపల్లి డీఎంహెచ్వో: ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో బెడ్స్, ఆక్సిజన్, వైద్యులు, మందులు సిద్ధంగా ఉన్నాయి. ఏడాదికోసారి మాక్డ్రిల్ నిర్వహిస్తున్నాం. అన్ని ఆరోగ్యకేంద్రాల వైద్యులు, సిబ్బందిని అలర్ట్ చేశాం. గత అనుభవంతో వైద్యులు చికిత్స పద్ధతులు కూడా తెలుసుకున్నారు. లక్షణాలు ఉంటే ఆరోగ్యకేంద్రాలను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. తగ్గని జ్వరం, శ్వాస సమస్యలుంటే ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో అడ్మిట్ అయితే మెరుగైన చికిత్స అందిస్తాం. కరోనా పేషెంట్కు ఎలాంటి చికిత్స అందిస్తారు? – మల్లేశం, రాంనగర్, కరీంనగర్డీఎంహెచ్వో: ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ కరోనా కేసులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా ఫారిన్ ట్రావెల్ నుంచి వచ్చిన వారుంటే వెంటనే పరీక్షలు చేసుకోవాలి. గతంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ప్రస్తుతం వచ్చే వేరియంట్తో పెద్దగా ప్రమాదం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక వైద్యం అందించేందుకు సన్నద్ధంగా ఉన్నాం. వైరస్ సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సత్యనారాయణ, చొప్పదండి డీఎంహెచ్వో: కరోనా వైరస్ సోకితే ఆసపత్రికి వెళ్లి వైద్యం తీసుకోవాలి. ఇంటికి వచ్చిన వెంటనే ఐసోలేట్ కావాలి. సాధారణ జలుబు, జ్వరం వచ్చినా ఐసోలేట్ కావడం మంచిది. మాస్కు ధరించడం, శానిటైజర్ వాడడం అలవాటుగా చేసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటూ చికిత్స పొందితే మూడు నాలుగు రోజుల్లోనే నయమవుతుంది. ప్రజలకు ఎలా అవగాహన కల్పిస్తున్నారు? – రాంచంద్రం, మానకొండూర్ డీఎంహెచ్వో: సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు గ్రామాల్లో, పట్టణాల్లో అవగాహన కల్పిస్తున్నాం. దోమలు పెరగకుండా మంగళవారం, శుక్రవారం డ్రైడేలు నిర్వహించాలని సూచిస్తున్నాం. పరిశుభ్రమైన వాతావరణం ఇంటి పరిసరాల్లో ఉండే విధంగా చూసుకోవాలి. దోమల నివారణ జరిగితే సగం వ్యాధులు దూరమవుతాయి. కరోనా సమయంలో మామూలు జ్వరానికి కూడా భయపడే ప్రమాదం ఉంది. కాబట్టి జ్వరాల నియంత్రణకు త్వరలో ఇంటింటి సర్వే చేపడతాం. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా వస్తుందా? – జయచందర్, హుజూరాబాద్ డీఎంహెచ్వో: 2019 కోవిడ్ వేరియంట్ కోసం అప్పుడు వ్యాక్సిన్ తయారు చేయడంతో ప్రజలందరూ తీసుకున్నారు. ఒక వేరియంట్కు తయారుచేసిన వ్యాక్సిన్ మరో వేరియంట్కు పనిచేయడం కష్టం. ప్రస్తుతం జెఎన్–1 వేరియంట్ ఎలాంటి ఇబ్బంది పెడుతుందనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలో అన్ని వేరియంట్లకు ఒకే రకమైన వ్యాక్సిన్ రూపొందించేందుకు పరిశోధనలు జరుగుతున్న తెలిసింది. వైరస్ వ్యాప్తి గురించి ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ ఉన్నాయా? – రాజేందర్, తిమ్మాపూర్ డీఎంహెచ్వో: మహరాష్ట్ర, కేరళ, తమిళనాడులో కరోనా కేసులు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మా త్రం ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. వైరస్ కూడా అంత ప్రమాదకరం కాదని తెలియడంతో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వలేదు. డబ్ల్యూహెచ్వో కూడా ఆందోళన అవసరం లేదనే సూచిస్తోంది. అయినా డీహెచ్ ఆదేశాల మేరకు వైరస్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.