40 ఏళ్లు దాటగానే అరుగుతున్న కీళ్లు
నడక లేక ఇతర అవయవాలకూ ముప్పు
అందుబాటులో అత్యాధునిక, రోబోటిక్ శస్త్ర చికిత్సలు
సర్జరీలకు జంకుతున్న బాధితులు
నడక లేక..
కారణాలేమిటి?
ఒకప్పుడు మోకాళ్ల అరుగుదల అనేది 60 ఏళ్లు దాటిన
వృద్ధుల్లో మాత్రమే కనిపించే సమస్యగా భావించేవారు. అయితే నేడు పరిస్థితి మారిపోయింది. జీవనశైలి మార్పులు, పాస్ట్ ఫుడ్ అంటూ తినే తిండి, మినరల్ వాటర్ పేరుతో తాగే నీరు సైతం కెమికల్మయం కావడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలతో 40 ఏళ్లు దాటిన మధ్య వయసు వారిలోనే మోకాళ్ల అరుగుదల సమస్య వేగంగా పెరుగుతోంది. కుటుంబ బాధ్యతలు మోసే వయసులోనే మోకాళ్ల నొప్పితో నడవలేని స్థితికి చేరుకోవడం అనేక మందికి శారీరకంగా, ఆర్థికంగా భారమవుతోంది.
మోకాళ్ల నొప్పిని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే దీనివల్ల నడక తగ్గిపోతుంది. నడక లేకపోతే శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగదు. మెదడు చురుకుదనం తగ్గి గుండె పనితీరుపై ప్రభావితమవుతుంది. కదల్లేనివారు నీటిని కూడా తక్కువగా తీసుకోవడంతో కిడ్నీ సమస్యల బారినపడుతున్నారు.
మోకాళ్ల సమస్యలకు ప్రస్తుతం అనేక ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ దశలో మందులు, ఫిజియోథెరపీ, ఇంజెక్షన్లు వంటి చికిత్సలతో నొప్పిని నియంత్రించొచ్చు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సను వైద్యులు సూచిస్తారు.
ఇటీవల కాలంలో రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ విధానంలో శస్త్ర చికిత్స అత్యంత కచ్చితత్వంతో జరుగుతుంది. రక్తస్రావం తక్కువగా ఉండడం, నొప్పి తక్కువగా ఉండడం, త్వరగా కోలుకునే అవకాశముండడం ఈ సర్జరీల ప్రత్యేకతగా వైద్యులు చెబుతున్నారు.
కరీంనగర్:
ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో వందల సంఖ్యలో బాధితులు మోకాళ్ల నొప్పులతో ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదిస్తున్నారు. జిల్లాలో దాదాపు 150 మంది ఆర్థోపెడిక్ సర్జన్లు సేవలందిస్తుండగా.. ఒక్కో వైద్యుడి వద్ద రోజుకు సగటున 40–50 మంది మోకాళ్ల నొప్పి, ఎముకల అరుగుదల, జాయింట్ సమస్యలతో చికిత్స పొందుతున్నారు.
మోకాళ్ల అరుగుదలకు పలు కారణాలున్నాయి. ముఖ్యంగా జీవన శైలిలో వచ్చిన మార్పులే ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు.
● ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు. వ్యాయామం లేకపోవడం.
● ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం. ఊబకాయం.
● సూర్యరశ్మి లోపంతో విటమిన్–డి కొరత. కాల్షియం లోపం.
● రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు.
● ఉద్యోగరీత్యా ఎక్కువ మంది రోజంతా ఏసీ గదుల్లోనే ఉండిపోతున్నారు. సూర్యరశ్మి శరీరానికి తక్కువగా అందడంతో విటమిన్–డి లోపం ఏర్పడి ఎముకల బలం తగ్గుతోంది. అదే సమయంలో వయస్సు పెరిగేకొద్దీ శరీరంలో కాల్షియం స్థాయి తగ్గిపోవడం కూడా మోకాళ్ల అరుగుదలకు దారి తీస్తోంది.


