breaking news
Visakhapatnam
-
ఆనంద గీతం
ఆనాటి ఆ స్నేహం..అల్లిపురం: ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం.. ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం.. ఈ నాడు ఆ హాయి లేదేల నేస్తం.. ఆ రోజులు మునుముందిక రావేమిరా.. అంటూ పోర్టు హైస్కూల్ 1983–84 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం సందడి చేశారు. నాలుగు దశాబ్దాల కిందట విడిపోయిన స్నేహితులంతా ఒక్కచోట చేరడంతో ఆరు పదుల వయసులోనూ వారంతా 15 ఏళ్ల పిల్లల్లా మారిపోయారు. ఉదయం 9 గంటల నుంచి నగరంలోని ఓ హోటల్ ప్రాంగణం పాత స్నేహితుల పలకరింపులతో కోలాహలంగా మారింది. ‘ఏమే రమణమ్మ.. నువ్వు అలానే ఉన్నావే.. ఏమీ మారిపోలేదు!’, ‘ఆ నువ్వు పార్వతివేనా.. గుర్తు పట్టలేకున్నానే.. ఎలా ఉన్నావు?’, ‘బాగున్నావా.. పిల్లలు ఎంతమంది.. ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉంటున్నారు?’, ‘ఆగండే మీ సోదేనా.. నన్నూ పట్టించుకుంటారా?’, ‘అవును.. నువ్వు పూర్ణిమవే కదా.. మీకు ఎవ్వరూ కనిపించడం లేదు?...’ ఇలా ఆ హాలంతా ఉత్సాహభరితమైన మాటలతో నిండిపోయింది. ఇంతలో ‘రండమ్మా రండి.. మీ కోసమే చూస్తున్నాం.. నేనేనండీ లింగం శ్రీనివాస్ని..’ అంటూ పాత మిత్రుల పలకరింపులతో ఆ ప్రాంతమంతా ఆత్మీయతలు, అనురాగాలతో పండగ వాతావరణాన్ని తలపించింది. స్నేహితులంతా కబుర్లలో మునిగిపోయిన సమయంలో.. ‘అక్కడ భారతదేశానికి ఉత్తరాన ఏమిటున్నాయి?’ అంటూ ఓ సుపరిచితమైన స్వరం వినిపించింది. వారంతా ఒక్కసారిగా అటు తిరిగి చూసి, ‘అరె.. మా సోషల్ టీచర్.. నమస్కారం మేడమ్’ అంటూ గౌరవంగా చుట్టుముట్టారు. పోర్టు హైస్కూల్ పూర్వ విద్యార్థులు సత్యనారాయణ, లింగం శ్రీనివాస్, మరికొంత మంది కలసి అప్పటి విద్యార్థుల చిరునామాలు, ఫోన్ నంబర్లు సేకరించి అందరినీ ఒక్కటిగా చేర్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అప్పటి తమకు ఓనమాలు నేర్పిన ఉపాధ్యాయులు విజయకుమారి, పద్మావతి, వసుంధరాదేవిలతో పాటు మహిళా స్నేహితులను ఘనంగా సత్కరించుకున్నారు. ఆటలు, పాటలతో మొదలైన ఈ కలయికలో అందరూ తమ ప్రస్తుత వృత్తి, కుటుంబ నేపథ్యాలను పరిచయం చేసుకున్నారు. ఒకరి ఫోన్ నంబర్లు మరొకరు పంచుకున్నారు. మధ్యాహ్నం సహపంక్తి భోజనాలు చేసి సాయంత్రం 4 గంటల వరకు ఉత్సాహంగా గడిపారు. స్నాక్స్, టీలు తీసుకుంటూ ఎన్నో అపురూపమైన జ్ఞాపకాలను మూటగట్టుకుని.. మళ్లీ కలుద్దామన్న ఆశతో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. మళ్లీ ఆ రోజులు గుర్తొచ్చాయి పదో తరగతి తర్వాత తలో దారి పట్టినా, మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా, ఈ ఆదివారం నాకు ఎన్నో మధుర స్మృతులను మిగిల్చింది. ప్రస్తుతం నేను జిల్లా కోర్టులో కాపీయింగ్ సెక్షన్ సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాను. – ఐ.రమణమ్మ, సూపరింటెండెంట్, కాపీయింగ్ సెక్షన్, జిల్లా కోర్టు -
● మురిసి
మహిళా దినోత్సవం.. ఆపై టీ20 వరల్డ్ కప్ సమరం.. ఈ ఆదివారం క్రీడాభిమానులకు, మహిళలకు అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది. ఉదయం నుంచి నగరవ్యాప్తంగా మహిళా శక్తిని కీర్తిస్తూ సత్కారాలతో సందడిగా గడిపిన విశాఖ.., సాయంత్రం కాగానే టీవీల ముందు నిశ్శబ్దంగా వేచిచూసింది. క్రీజులో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించి, బౌండరీల మోత మోగిస్తుంటే సాగర తీరం ఉప్పొంగింది. ఏకంగా 255 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి, ప్రత్యర్థిని కట్టడి చేసిన టీమిండియా చివరకు విశ్వవిజేతగా నిలిచింది. ఈ కప్పు విజయం కేవలం క్రీడా విజయం మాత్రమే కాదు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతీయ మహిళా లోకానికి మన క్రికెటర్లు అందించిన అపురూపమైన కానుకగా నిలిచింది. నగరంలో పలు చోట్ల బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని యువతరం మ్యాచ్ను వీక్షించింది. – ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
● మెరిషి
మద్దిలపాలెం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పాల్గొని మహిళా సాధికారతపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆనందపురం మండలం గిడిజాల వద్ద 50 ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యం 50 శాతానికి పెరగాలని ఆకాంక్షించారు. జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీసీసీ ఎండీ శోభిక, అంధ మహిళా క్రికెటర్ పి. కరుణ కుమారిని సత్కారించారు. ప్రత్యేక ఉప కలెక్టర్ శేషశైలజ, జిల్లా కోఆపరేటివ్ అధికారిణి ప్రవీణ, జూ క్యూరేటర్ మంగమ్మ, సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ ఉషారాణి, జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణి, ఐసీడీఎస్ పీడీ రామలక్ష్మి తదితర అధికారులతో పాటు ఆయా రంగాల్లో ప్రతిభ చూపిన 59 మంది మహిళా అధికారులకు, సిబ్బందికి అవార్డులు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యపద్మ, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను అతిథులు సందర్శించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ చందోలు, లతా మాధురి పాల్గొన్నారు. -
కలలో కూడా అనుకోలేదు
స్కూల్ డేస్లో విడిపోయిన మేం, మళ్లీ జీవితంలో ఇలా కలుసుకుంటామని అనుకోలేదు. పాత స్నేహితులను కలవడం మాటల్లో చెప్పలేని సంతోషాన్నిచ్చింది. ఈ ఆత్మీయ బంధం ఇలాగే కొనసాగాలని, మళ్లీ మళ్లీ కలవాలని కోరుకుంటున్నాను. – డి.పూర్ణిమ, విశాఖపట్నం రెక్కలు కట్టుకుని వాలిపోయాను నాటి నేస్తాలను కలుసుకునేందుకు సింగపూర్ నుంచి రెక్కలు కట్టుకుని వాలిపోయాను. 13 ఏళ్లుగా సింగపూర్లో యోగా టీచర్గా స్థిరపడినప్పటికీ, నా మనసంతా విశాఖలోని స్కూల్ జ్ఞాపకాల చుట్టూనే తిరుగుతుంటుంది. ఇవాళ నా స్నేహితులందరినీ ఒకేచోట చూసుకోవడం నా జీవితంలో మర్చిపోలేని రోజు. – ఎస్.విజయపార్వతి, యోగా టీచర్, సింగపూర్ -
ముందస్తు గుర్తింపుతోనే గ్లకోమాకు చెక్
ఏయూక్యాంపస్: ప్రపంచ గ్లకోమా వారోత్సవాలను పురస్కరించుకుని ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో ఆదివారం ఆర్.కె.బీచ్రోడ్డులో అవగాహన నడక నిర్వహించారు. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు సాగిన ఈ ర్యాలీలో గ్లకోమా నిపుణులు డాక్టర్ శివాని కొడాలి మాట్లాడారు. కంటిలో ఒత్తిడి పెరగడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యే గ్లకోమా అని వివరించారు. ఇది కంటిలోని ఆప్టిక్ నరాలను దెబ్బతీసి శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని హెచ్చరించారు. వ్యాధిని గుర్తించడంలో జాప్యం జరగడం వల్ల చాలా మంది చూపు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లు పెద్దవిగా ఉండటం, చూపు మసకబారడం, కళ్లు ఎర్రబడటం, నీళ్లు కారడం, వెలుతురును చూడలేక కళ్లు మూసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నేత్ర వైద్యులను సంప్రదించాలని సూచించారు. సరైన అవగాహన లేకపోవడం వల్లే గ్లకోమా ప్రమాదకరంగా మారుతోందని, ఇది లక్షలాది మందిలో కోలుకోలేని దృష్టి లోపానికి దారితీస్తోందని పేర్కొన్నారు. వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, నివారణ, సకాలంలో చికిత్స తీసుకోవడం అత్యంత కీలకమని చెప్పారు. మన దేశంలో సుమారు 12 మిలియన్ల మంది గ్లకోమాతో బాధపడుతున్నారని, 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ రోగుల సంఖ్య 76 మిలియన్ల నుంచి 111.8 మిలియన్లకు పెరుగుతుందని అంచనాలు చెపుతున్నాయని వివరించారు. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. -
జగన్ హయాంలోనే మహిళా సాధికారత
సాక్షి, విశాఖపట్నం: వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా పాలన సాగిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేకే రాజుతో పాటు సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్కుమార్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, మహిళా నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేటర్లను, నియోజకవర్గ, వార్డు స్థాయి మహిళా అధ్యక్షులను, సీనియర్ మహిళా నాయకులను ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళలకు నిర్వహించిన ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి సంక్షేమ పథకం నిధులు నేరుగా మహిళల ఖాతాల్లోనే జమ అయ్యాయని, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే దూరదృష్టితోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చా రన్నారు. రాజకీయంగానూ నామినేటెడ్ పదవుల్లో 50 శాతానికి పైగా మహిళలకే అవకాశం ఇచ్చి, చట్టసభలు, మంత్రి పదవుల్లో వారికి పెద్దపీట వేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో మహిళలను మోసం చేసిందని, మహిళలు ఆగ్రహిస్తే ఏ ప్రభుత్వమైనా కూలిపోక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వానికి మహిళలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవన్రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల కంటే అధికంగా మహిళలకు వైఎస్సార్సీపీ అవకాశాలు కల్పించిందన్నారు. తల్లికి వందనం, ఉచిత సిలిండర్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం అడ్డదారిలో అధికారంలోకి వచ్చి ఇప్పుడు మహిళలను వంచిస్తోందని విమర్శించారు. పేడాడ రమణికుమారి మాట్లాడుతూ.. దిశా చట్టం ద్వారా మహిళా భద్రతకు భరోసా కల్పించడంతో పాటు, ఇళ్ల పట్టాలను సైతం మహిళల పేరిటే అందించిన గొప్ప మనసు వైఎస్ జగన్మోహన్రెడ్డిదని కొనియాడారు. వేడుకల్లో మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, ఎస్ఈసీ సభ్యుడు సతీష్ వర్మ, కార్పొరేటర్లు శశికళ, సాడి పద్మారెడ్డి, మువ్వల లక్ష్మీ సురేష్, మహిళా నేతలు మంచా నాగమల్లేశ్వరి, శ్రీదేవి వర్మ, పిల్లా సుజాత, పల్లా చినతల్లి, జి.వి.రమణి, శిరీష, బంగారమ్మ, ప్రశాంతి పట్నాయక్, రజని, సూరాడ వెంకటలక్ష్మి, ఎస్.వి.లక్ష్మి, పార్వతీ, రాధా, భాను, ఎస్.వి లక్ష్మి, సాగరిక, జోషీల, దమయంతి, ఈశ్వరి, జియ్యాని సత్య, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. -
బావామరదళ్ల ఎమోషన్..‘బ్యాండ్మేళం’
డాబాగార్డెన్స్: నగరంలో ‘బ్యాండ్ మేళం’ చిత్ర బృందం సందడి చేసింది. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం చిత్ర యూనిట్ మీడియా మీట్ నిర్వహించింది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ బావ–మరదళ్ల ప్రేమకథకు కోన వెంకట్ ప్రొడక్షన్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్త సమర్పణలో నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ, విశాఖ తనకు రెండో స్వగ్రామం అని, తన కుమార్తెలు కావ్య, శ్రావ్య ఈ చిత్రంతో నిర్మాతలుగా పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. సంగీతాన్ని ప్రేమించే ‘యాదగిరి’ అనే యువకుడి పాత్రలో హీరో హర్ష రోషన్, కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో హీరోయిన్ శ్రీదేవి ప్రేక్షకులను అలరించనున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. వినోదానికి, ఎమోషన్లకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు సతీష్ జవ్వాది ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, కై ్లమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేశారు. -
సామాన్యుడిపై భారమా?
మద్దిలపాలెం: కేంద్రం పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.60, వాణిజ్య సిలిండర్ ధర రూ.114లను తక్షణమే రద్దు చేయాలని సీపీఎంజిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన చేపట్టారు. పిఠాపురం కాలనీలోని సీపీఎం కార్యాలయం నుంచి మద్దిలపాలెం జంక్షన్ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్పై యుద్ధానికి దిగడం వల్లే వంట గ్యాస్ ధరలు పెరిగాయన్నారు. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకేతాలివ్వడా న్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా ఆంక్షలు విధించడం కూడా ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమన్నారు. పార్టీ జిల్లా నేతలు ఆర్.కె.ఎస్.వి. కుమార్, వి.కృష్ణారావు, ఎం.సుబ్బారావు, వి.నరేంద్ర కుమార్, వెంకటరావు, అప్పలరాజు పాల్గొన్నారు. గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిరసన -
ఒమేగాలో ఘనంగా మహిళా దినోత్సవం
ఆరిలోవ: హెల్త్ సిటీలోని ఒమేగా ఆస్పత్రిలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆస్పత్రి మహిళా వైద్యులతో కలిసి ఎండీ డాక్టర్ బి.రవిశంకర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంఘ సేవకురాలు శేషుమాంబతో పాటు కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన వీర సైనికుల కుటుంబాలలో మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు సామాజిక, రాజకీయంగా, ఆర్థిక, విద్యా రంగాల్లో బాగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. మహిళలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం శేషమాంబ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో సీ్త్రలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. వాటిని సీ్త్రలు సమర్ధవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మహిళలు ఆర్యోగం కాపాడుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శుభకర్, డాక్టర్ నీలిమ పాల్గొన్నారు. -
నూతన ప్రాంగణంలోకి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్
డాబాగార్డెన్స్: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ విశాఖపట్నం ఏరియా కార్యాలయం నూతన ప్రాంగణంలో మారింది. ద్వారకానగర్ ఇస్నార్ ప్లాజా నుంచి తిక్కన రోడ్లో గల జీవన్ సమృద్ధి మొదటి అంతస్తులోకి మారిన ఈ కార్యాలయాన్ని సంస్థ సౌత్ ఈస్ట్రన్ రీజియన్ రీజనల్ మేనేజర్ పి.సూర్యనారాయణరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా రూ.530 కోట్ల లక్ష్యంతో ఈ శాఖ పనిచేస్తోందని తెలిపారు. దీనిని మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఏరియా మేనేజర్ వినయ్ వైభవ్ మాట్లాడుతూ వ్యాపార బృందాలు నగరంలో పర్యటించి ఇళ్ల వద్దకే సేవలు అందించేలా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎల్ఐసీ ఆఫ్ ఇండియా విశాఖ డివిజనల్ మేనేజర్ శారదప్రసాద్దాస్, మార్కెటింగ్ మేనేజర్ వి.దివాకరరావు, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ ఎం.దినేష్, విశాఖ క్లస్టర్ హెడ్ సి.అరుణ్, ఆపరేషన్స్ మేనేజర్ పి.హరినారాయణ పాల్గొన్నారు. -
గంభీరం రోడ్–1, 2
పాత జాతీయ రహదారి నుంచి కొత్త ఎన్హెచ్కు అనుసంధానించే ఈ రహదారి అత్యంత కీలకమైనది. రహదారితో 25 కి.మీ ప్రయాణం సగానికి పైగా తగ్గుతుంది. గంభీరం–1 రోడ్డును 1.46 కి.మీ పొడవుతో 60 అడుగుల(2 లైన్లు)తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 66 శాతం పనులు పూర్తయ్యాయి. దీన్ని ఈ ఏడాది ఏప్రిల్ 30కి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అలాగే గంభీరం రోడ్–2ను 2.18 కిలోమీటర్ల పొడవుతో 60/40 అడుగుల వెడల్పున నిర్మి స్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు 15 శాతం పూర్త య్యాయి. టీడీఆర్ సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. దీన్ని ఈ ఏడాది మే 31 నాటికి పూర్తి చేయనున్నారు. -
పకడ్బందీగా జనగణన–2027 నిర్వహణ
మహారాణిపేట: జనగణన–2027 జిల్లా స్థాయిలో పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన మొదటి దశ ‘గృహాల జాబితా – గృహ వసతుల గణన’కు సంబంధించిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన చేసుకోవాలన్నారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడానికి అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. బ్లాక్ల ఏర్పాటు, మ్యాపుల్లో గ్రామ సరిహద్దుల నిర్ణయం, జనాభా అంచనా విధానం వంటి అంశాలను అధికారులు సమగ్రంగా అర్థం చేసుకోవాలన్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ స్ఫూర్తితో పని చేసి జనగణన ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ విద్యాధరి, జిల్లా అటవీ అధికారి రవీంద్ర ధామ, జనగణన జేడీ దయాసాగర్, ఇన్చార్జి డీఆర్వో శేషశైలజ, సీపీవో శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. మాట్లాడుతున్న కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
రహదారులు.. పరుగులు
విశాఖ సిటీ: ఆంధప్రద్రేశ్ ఆర్థిక రాజధాని విశాఖ సరికొత్త సొబగులు అద్దుకుంటోంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విస్తరిస్తోంది. పర్యాటక, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో మెట్రో నగరాలకు ధీటుగా దూసుకుపోతున్న సిటీ ఆఫ్ డెస్టినీ.. కనెక్టివిటీని కూడా మెరుగుపర్చుకుంటోంది. విశాఖను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో గత వైఎస్సార్సీపీ హయాంలో రూపొందించిన బృహత్తర ప్రణాళికలు.. ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతూ, నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. మహా విశాఖ నగర శివారు ప్రాంతాలను జాతీయ రహదారులకు అనుసంధానిస్తూ.. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనులు వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయి. అభివృద్ధికి బాటలు.. ఏడు రహదారులు సుమారు రూ.174.64 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ఏడు రహదారులు.. శీఘ్రమైన, సులభమైన రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంతో పాటు నగరాభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్నాయి. చిప్పాడ రహదారి మినహా మిగిలిన ఆరు రోడ్ల పనులు ప్రారంభమయ్యాయి. దీనికి రోడ్డు డిజైన్ ప్లాన్లో మార్పులు చేయాల్సి ఉంది. గంభీరం రోడ్–1 పనులు 66 శాతం, బోయపాలెం రోడ్డు 60 శాతం, తాళ్లవలస–నేరేళ్లవలస రోడ్డు పనులు 51.57 శాతం, శివశక్తినగర్ రోడ్డు 46 శాతం, అడవివరం–శొంఠ్యాం రోడ్డు 31.75 శాతం, గంభీరం రోడ్డు–2 పనులు 15 శాతం మేర పూర్తయ్యాయి. ఈ ఏడాది మే నెలాఖరు నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వీఎంఆర్డీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు. భోగాపురం అందుబాటులోకి వచ్చేలోగా.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చేలోగా ఈ రహదారుల నిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇప్పటికే నాలుగు రోడ్ల నిర్మాణాలు 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. కొన్ని చోట్ల టీడీఆర్ ఇబ్బందులు ఉండడంతో వాటిపై దృష్టి పెట్టాం. త్వరలోనే అన్ని అడ్డంకులు తొలగి, నిర్ణీత సమయంలో రహదారులను అందుబాటులోకి తీసుకువస్తాం. – ఎన్.తేజ్భరత్, మెట్రోపాలిటన్ కమిషనర్శివశక్తినగర్ రోడ్ శివశక్తి నగర్ నుంచి హరిత ప్రాజెక్ట్ వరకు 1.67 కి.మీ మేర ఈ రోడ్డును 80/60/40 అడుగుల వేర్వేరు వెడల్పులతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ రహదారి పనులు ప్రస్తుతం 46 శాతం పురోగతిలో ఉన్నాయి. మూడు ప్రాతాల్లో భూసేకరణ సమస్యలు ఉన్నాయి. వీఎంఆర్డీఏ అధికారులు వాటిపై దృష్టి పెట్టారు. ఈ ఏడాది మే 15 నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
మహిళలు.. మల్టీ టాస్కర్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘నేను మహిళను కాబట్టి నాకు సహకారం లభించడం లేదని ఎప్పుడూ కారణంగా చూపకూడదు. మహిళలుగా మన కోసం మనం సమయం కేటాయించుకోవాలి. మన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా కూడా మన సొంతకాళ్ల మీద మనం నిలబడాలి. మహిళను కాబట్టి నాకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలనో, మహిళను కాబట్టి నాకు అవకాశాలు రావడం లేదనో ఎప్పుడూ చెప్పకూడదు. బీ స్ట్రాంగ్. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి’ అని విశాఖపట్నం పోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్పర్సన్ రోష్నీ అపరంజి పిలుపునిచ్చారు. విశాఖపట్నం పోర్టు చరిత్రలో మొదటిసారిగా మహిళా డిప్యూటీ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె 2011 అసోం–మేఘాలయ ఐఏఎస్ కేడర్కు చెందినవారు. ఇప్పటివరకు నిర్వర్తించిన బాధ్యతల్లో తాను మహిళను కాబట్టి ఈ పనిచేయలేనని ఎక్కడా సాకులు చెప్పలేదని ఆమె తెలిపారు. విద్యాభ్యాసం మొత్తం విశాఖలో సాగినా.. తనకు అసోం కేడర్లో ఐఏఎస్గా పోస్టింగ్ వచ్చినప్పుడు కుటుంబం మొత్తం భయపడిందని, తాను మాత్రం దానిని సవాలుగా తీసుకుని బాధ్యతలు నిర్వర్తించానని చెప్పుకొచ్చారు. విశాఖ పోర్టులో పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇస్తోందని, ఇక్కడ నేర్చుకునేందుకు ఎన్నో అవకాశాలున్నాయని ఆమె తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. విశాఖలో విద్యాభ్యాసం ‘నా విద్యాభ్యాసం మొత్తం విశాఖలోనే సాగింది. ఇక్కడే టింపనీ స్కూల్లో చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి పత్రికలు చదవడం అలవాటు. వివిధ రకాల మ్యాగజైన్లు కూడా ఇంటికి వచ్చేవి. నాన్న వాటిని చదివించేవారు. అదే నాలో ఐఏఎస్ కావాలనే కోరికకు పునాది వేసింది. మా నాన్న టీచర్. ఆయన సింగిల్ టీచర్గా పోర్టు ఆసుపత్రి పక్కనే పోర్టు పాఠశాలను ప్రారంభించారు. మా నాన్న హయాంలో ప్రారంభమైన పోర్టు స్కూల్కు చెందిన నేను, నేడు అదే విశాఖ పోర్టుకు డిప్యూటీ చైర్పర్సన్గా రావడం ఎంతో ఆనందంగా ఉంది. పోర్టు అనేది పూర్తిగా సాంకేతికతతో కూడిన వ్యవస్థ. ఇక్కడ నేర్చుకోవడానికి ఎంతో స్కోప్ ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. మహిళలు మల్టీ టాస్కర్లు. మహిళలు ఆఫీసులో సమర్థవంతంగా పనిచేస్తున్నారంటే, ఇంట్లో కూడా సమర్థవంతంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారని అర్థం చేసుకోవాలి. నా విధుల్లో నేను ఎప్పుడూ సాకులు వెతుక్కోలేదు. అల్లర్ల సమయంలోనూ అదరకుండా.! వైజాగ్లో పుట్టి పెరిగిన నాకు అసోం కేడర్లో పోస్టింగ్ దక్కింది. అందుకే మొదట్లో మా కుటుంబ సభ్యులు ఎంతో భయపడ్డారు. కానీ నేను దానిని సవాలుగా తీసుకున్నాను. అసోంలో మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చే సంప్రదాయం ఉంది. అయితే అక్కడ అప్పుడప్పుడు అల్లర్లు జరుగుతుంటాయి. ఏదో ఒక సమస్య మీద వందల సంఖ్యలో గుమిగూడి అల్లర్లకు పాల్పడేవారు. కలెక్టర్గా అక్కడ స్పాట్లో ఉండాల్సిన పరిస్థితి ఉండేది. వారితో చర్చిస్తున్న సందర్భంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. అటువంటి సమయంలో ప్రత్యే కంగా హెల్మెట్లు పెట్టుకుని, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుని మరీ అల్లర్లు జరిగే ప్రాంతంలో విధులు నిర్వర్తించాల్సి వచ్చేది. ఫీల్డ్లో ఉండి పనిచేయడం వల్ల విధుల పట్ల ఎంతో సంతృప్తి కలిగేది. ధేమాజీ జిల్లాలో ఇటువంటి సంఘటనలు ప్రధానంగా జరిగేవి. ఆ సందర్భంలో వారు రాళ్లు తీసుకుని దాడులకు దిగేవారు. వారితో చర్చిస్తూనే అల్లర్లను నియంత్రించాల్సి వచ్చేది. అసోంలో వరదలు సంభవించడం సాధారణం. అక్కడి మొత్తం భూభాగంలో వరదలకు గురయ్యే ప్రాంతం 40 శాతం వరకూ ఉంటుంది. ఏటా రెండు, మూడు సార్లు సంభవించే వరదల వల్ల ప్రజాజీవనం ఎంతో ఇబ్బందులకు గురయ్యేది. కరోనా సమయంలో బంగ్లాలోని కింది గదిలోనే నేను ఒంటరిగా ఉండేదానిని. ఆ సమయంలో కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చేది. బయట విధులు నిర్వర్తించి ఇంటికి వచ్చినప్పుడు, నా ద్వారా కుటుంబ సభ్యులకు కరోనా ఎక్కడ సోకుతుందోననే భయంతో ఒంటరిగా ఉండేదానిని. ఆ ఏకాంత సమయంలోనే పెయింటింగ్ నేర్చుకున్నాను. -
అడ్డంకులే ఆమెకు నిచ్చెనలు
ఆర్థిక పరిస్థితులు సహకరించక, అథ్లెటిక్స్కే స్వస్తి చెప్పాలనుకున్న ఒక సాధారణ అమ్మాయి.. నేడు ప్రపంచ అత్యున్నత క్రీడా వేదిక ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగితే.. అది ఒక సంచలనం. ఆ సంచలనాన్ని సుసాధ్యం చేసి చూపారు నగరానికి చెందిన పరుగుల రాణి జ్యోతి ఎర్రాజీ. హార్డిల్స్ రేసులో అడ్డంకులను దాటినట్టే, తన జీవితంలోని అడ్డంకులను అధిగమించి ఆమె గెలుపు తీరానికి చేరారు. తొలినాళ్లలో జ్యోతి సాధించిన జాతీయ రికార్డులు సాంకేతిక కారణాలతో నమోదు కాలేదు. అయినా ఆమె నిరుత్సాహపడలేదు. పట్టువదలని దీక్షతో శ్రమించి, తన సొంత రికార్డులను తానే మళ్లీ మళ్లీ తిరగరాస్తూ చరిత్ర సృష్టించారు. 100 మీటర్ల హార్డిల్స్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ, అంతర్జాతీయ స్థాయిలో వరుస పతకాలను కొల్లగొట్టారు. తద్వారా మెరుగైన ర్యాంకింగ్ను సాధించి, ప్రతి అథ్లెట్ కల అయిన ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ట్రాక్ పైన పరుగు తీసేటప్పుడు కేవలం కొన్ని సెకన్ల సమయాన్ని తగ్గించుకోవాలన్నా ఏళ్ల తరబడి కఠోర సాధన అవసరం. అలాంటిది, అడ్డంకులతో కూడిన హార్డిల్స్ రేసులో భారత్ నుంచి ‘ఫాస్టెస్ట్ వుమెన్ రన్నర్’గా నిలిచి జ్యోతి అబ్బురపరిచారు. భారతదేశం నుంచి అథ్లెటిక్స్లో ఒలింపిక్స్కు వెళ్లే అతికొద్ది మంది క్రీడాకారుల సరసన నిలిచి, విశాఖ ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. -
సమాజ అభివృద్ధిలో మహిళలు కీలకం
విశాఖలీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవా సదన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి కె.రాధారత్నం, ఒకటో అదనపు సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎండీవీఎన్ సింధూర, ఒకటో అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి వి.గంగాభవానీ తదితరులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు ఘనంగా సన్మానించారు. ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.వెంకటరమణ, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖపట్నం
క్రీడలు, సేవ, కళలు.. ఏ రంగమైనా ‘అతివ’లదే అగ్రస్థానం సముద్రమంత సహనం, ఉప్పొంగే కెరటమంత పట్టుదల.. ఈ రెండింటి అద్భుత కలయికే మన విశాఖ మహిళ. కటిక పేదరికాన్ని, అనారోగ్యాన్ని సైతం చిరునవ్వుతో జయించి.. అవరోధాలనే అవకాశాలుగా మలచుకుంటూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారీ విజయ విహంగాలు. విశాఖ వీధుల నుంచి ఒలింపిక్స్ ట్రాక్ వరకు, చదరంగం గడుల నుంచి స్కేటింగ్ రింక్ వరకు, సామాజిక సేవ నుంచి సంప్రదాయాల పరిరక్షణ వరకు.. ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. తాము గెలవడమే కాకుండా, వేలాది మంది మహిళల్లో ‘మేమూ సాధించగలం’ అనే ఆత్మవిశ్వాసాన్ని రగిలిస్తున్నారు. వీరు అధిగమించిన ఒక్కో హార్డిల్, వీరు గెలిచిన ఒక్కో స్వర్ణం వెనుక ఏళ్ల తరబడి కఠోర శ్రమ, కుటుంబాల మద్దతు, అంతకు మించిసంకల్పబలం ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. నడక నేర్పిన నగరం గర్వపడేలా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న విశాఖ మహిళామణుల అసమాన ప్రతిభకు, అలుపెరగని పోరాటానికి అక్షర నీరాజనం.. ఈ కథనం. విశాఖ ధీర వనిత– విశాఖ స్పోర్ట్స్/మల్కాపురంఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026 -
మూగ బంధం.. అంతులేని మమకారం
విశాఖపట్నం: కుటుంబ సభ్యులను కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం. అయితే, ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా మనకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించే మూగజీవాలు దూరమైనా ఆ వ్యధ అంతకంటే ఎక్కువే ఉంటుంది. విశ్వాసానికి మారుపేరైన శునకాలను కేవలం పెంపుడు జంతువుల్లా కాకుండా, ఇంట్లో బిడ్డల్లా సాకుతున్న ఎందరో విశాఖవాసులు.. ఆ మూగజీవాలపై తమకున్న అంతులేని ప్రేమను కొత్తగా చాటుకుంటున్నారు. సాధారణంగా మనుషులకు సమాధులు కట్టి వారి జ్ఞాపకాలను పదిలపరుచుకోవడం మనం చూస్తుంటాం. కానీ, అప్పుఘర్ పార్క్ సమీపంలో ఉన్న సాగరతీరానికి వెళితే.. హృదయాన్ని హత్తుకునే అరుదైన దృశ్యాలు కనిపిస్తాయి. అక్కడ ఇసుక తిన్నెల్లో పదుల సంఖ్యలో శునకాలకు నిర్మించిన సమాధులు దర్శనమిస్తాయి. ఇంటికి కాపలాగా ఉంటూ, యజమాని చుట్టూ తిరుగుతూ, ఎలాంటి స్వార్థం లేకుండా ఎనలేని ప్రేమను పంచేవి శునకాలు. కొన్ని నెలలో, సంవత్సరాలో తమతో గడిపి, సంతోషాన్ని పంచిన ఆ మూగజీవాలు మరణిస్తే యజమానులు తట్టుకోలేకపోతున్నారు. అవి తమనుంచి దూరమైన తరువాత, వాటికి గౌరవప్రదమైన రీతిలో ఆఖరి మజిలీ నిర్వహిస్తున్నారు. సముద్ర తీరంలో వాటి కోసం ప్రత్యేకంగా సమాధులను కట్టించి తమ శాశ్వతమైన ప్రేమకు రూపమిస్తున్నారు. ఒక్కో సమాధి నిర్మాణానికి సుమారు రూ. 20వేల నుంచి రూ. 25 వేల వరకు ఖర్చవుతోంది. అయినా సరే, తమ కుటుంబంలో ఒకరిగా మెలిగిన జీవులకు ఘనంగా తుది వీడ్కోలు పలకడానికి వారు ఏమాత్రం వెనకాడటం లేదు. సముద్రపు అలల సాక్షిగా వెలసిన ఈ స్మృతి చిహా్నలు.. వ్యక్తులకు, మూగజీవాలకు మధ్య ఉన్న స్వచ్ఛమైన అనుబంధానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్ విశాఖపట్నం -
ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డుల ప్రదానం
ఏయూ క్యాంపస్: సమాజంలోని వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి దేశాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రముఖులను గుర్తిస్తూ ఆసియా టుడే రీసెర్చ్–మీడియా ఆధ్వర్యంలో ‘ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్–2026’ కార్యక్రమం బీచ్రోడ్డులోని నోవాటెల్ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరై విజేతలకు అవార్డులు అందజేశారు. ఈ వేడుకలో కేంద్ర మంత్రి ఎస్.పి.సింగ్ భగేల్, ఎంపీ గొల్ల బాబూరావు తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా గవర్నర్మాట్లాడుతూ దక్షిణ భారతదేశం ప్రతిభకు పుట్టినిల్లని, వివిధ రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో రాణిస్తున్న ప్రతిభావంతులను గౌరవించడం దేశానికే గర్వకారణమన్నారు. -
9వ తేదీ నుంచి ‘అగ్నిపథ్ వాయు’ ర్యాలీ
మురళీనగర్: భారత వాయుసేనలో చేరాలనుకునే నిరుద్యోగ యువతకు ఒక అద్భుతమైన అవకాశం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ–2026కు సంబంధించిన ప్రకటన వెలువడిందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి.చాముండేశ్వరరావు తెలిపారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://agnipathvayu.cdac.inను సందర్శించవచ్చు. ముఖ్యమైన తేదీలివే.. : గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే ఈ ర్యాలీకి అభ్యర్థులు నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. దీని కోసం ముందస్తు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఈ నెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన మహిళా అభ్యర్థులకు, 12న ఆంధ్రప్రదేశ్కు చెందిన పురుష అభ్యర్థులకు, 15న తెలంగాణకు చెందిన పురుష అభ్యర్థులకు ర్యాలీ నిర్వహిస్తారు. నిర్దేశించిన తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు రిపోర్ట్ చేయాలి. మొదట 1.6 కిలోమీటర్ల పరుగు పోటీ ఉంటుంది. పరుగు పందెం, ఇతర భౌతిక, శారీరక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే తదుపరి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. అర్హతలివే.. : అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే అగ్నివీర్ వాయుసేనకు అర్హులు. 2005 జూలై 2 నుంచి 2009 జనవరి 2వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. కనీసం 152 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. ఏదైనా స్ట్రీమ్లో ఇంటర్మీడియట్(10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. లేదా మూడేళ్ల డిప్లమో ఇంజినీరింగ్/2 ఏళ్ల ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. మొత్తం మార్కుల్లో 50 శాతం, ఇంగ్లిలో 50 శాతం మార్కులు తప్పనిసరి.(49.99 శాతం వచ్చినా పరిగణించరు). కావాల్సిన పత్రాలివే.. : ఒరిజినల్ లేదా డిజీలాకర్ ద్వారా ధ్రువీకరించిన 10వ తరగతి, ఇంటర్/డిప్లమో సర్టిఫికెట్లు, నివాస ధ్రువీకరణ పత్రం, ఎన్సీసీ ఉన్నవారు సంబంధిత సర్టిఫికెట్, ఆధార్ కార్డు, యాక్టివ్ ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబరు, 10 పాస్పోర్టు సైజు కలర్ ఫొటోలు, ప్రతి సర్టిఫికెట్కు 6 సెట్ల జిరాక్స్ కాపీలు. -
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్కు 12 వినతులు
అల్లిపురం: జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్లో 12 వినతులు స్వీకరించినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ ఎ. ప్రభాకరరావు, సీపిలు, డీసీపీలు, ఏసీపిలు పాల్గొన్నారు. మధురవాడ జోన్కు 2, ఈస్ట్ జోన్కు 4, నార్త్ జోన్కు 1, వెస్ట్ జోన్కు 1, పెందుర్తి జోన్కు 3, గాజువాక జోన్కు 1 వినతులు అందినట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే టౌన్ ప్లానింగ్ ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ఓపెన్ ఫోరమ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అందిన వినతులపై అధికారులు వెంటనే స్పందించి నిర్ణీత సమయంలో పరిష్కారం చూపాలని ఆదేశించారు. అలాగే అడ్వర్టైజ్మెంట్ టాక్స్ వసూళ్లపై దృష్టి సారించాలని, ఎల్.ఆర్.ఎస్, బీపీఎస్ దరఖాస్తుల పరిశీలన చేసి మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. -
మీరూ కావచ్చు.. ‘రహ వీర్’
గోపాలపట్నం: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు చూసీచూడనట్లు వెళ్లిపోకుండా, బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు నిలపాలని, తద్వారా ప్రతి ఒక్కరూ ‘రహదారి వీరులు’గా మారాలని రవాణా శాఖ ఉప కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారని, ఆ సమయంలో వైద్యం అందిస్తే బాధితుల ప్రాణాలు దక్కే అవకాశాలు మెండుగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది కేవలం మన జిల్లాలోనే 1,110 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, అందులో 340 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలిస్తే ఇందులో చాలా మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉండేది. అయితే, పోలీసు కేసుల్లో ఇరుక్కుంటామేమో అన్న భయం, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న అనుమానాలతో చాలా మంది ప్రమాదాలను చూసినా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. భయం వద్దు.. ప్రభుత్వానిదే బాధ్యత ప్రజల్లో ఉన్న ఈ అపోహలను తొలగించి, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కీలక చర్యలు చేపట్టాయి. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడి ఆసుపత్రికి చేర్చే వారిని ‘గుడ్ సమరిటన్స్’(రహదారి వీరులు)గా గుర్తించి ప్రభుత్వం ప్రత్యేక పురస్కారాలు అందిస్తోంది. గతంలో ఈ ప్రోత్సాహకం రూ.5 వేలు ఉండగా, ఇప్పుడు దానిని ఏకంగా రూ.25 వేలకు పెంచారు. అంతేకాకుండా, సాయం చేసిన వారి వివరాలను పోలీసులు గానీ, ఆసుపత్రి సిబ్బంది గానీ బలవంతంగా అడగకూడదని చట్టం చెబుతోంది. బాధితుడిని మీరే కాపాడారని వైద్యులు లేదా పోలీసులు ధ్రువీకరిస్తే చాలు, ఈ పురస్కారానికి మీరు అర్హులవుతారు. రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు ఏ ఆసుపత్రికి వెళ్లినా, తక్షణమే వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఎలాంటి షరతులు, ముందస్తు చెల్లింపులు లేకుండా బాధితులకు రూ.1.50 లక్షల విలువైన వైద్యాన్ని ఆసుపత్రులు వెంటనే అందించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఆసుపత్రులకు చెల్లిస్తుంది. ఈ విధానం వల్ల ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా నిరుపేదలకు సైతం తక్షణ ప్రాణరక్షణ కలుగుతుంది. విస్తృత అవగాహన కార్యక్రమాలు క్షతగాత్రులను రక్షించడం, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యంపై రవాణా శాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. పోలీసులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ‘రహదారి వీరుల’ పురస్కారాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడంతో పాటు, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రతి ఒక్కరూ మారాలి. – ఆర్సీహెచ్ శ్రీనివాసరావు, డీటీసీ రోడ్డు ప్రమాద బాధితులను కాపాడుకుందాం క్షతగాత్రులను కాపాడే వారికి అండగా ప్రభుత్వం ప్రాణదాతలకు రూ.25 వేల నజరానా -
చికిత్సకు వెళ్లి.. ప్రాణాలతో పోరాటం
మహారాణిపేట: కాలు విరిగిందని ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆరేళ్ల బాలుడు ఇప్పుడు ప్రాణాపాయస్థితిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఘటన కలకలం రేపుతోంది. కేజీహెచ్లో జరిగిన ఈ ఘటనపై బాలుడి కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యాన్ని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ద్వారకానగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ వద్ద వాచ్మన్గా పనిచేస్తున్న వానపల్లి విజయకుమార్ కుటుంబంతో అక్కడే నివసిస్తున్నాడు. ఈ నెల 3వ తేదీన హోలీ సందర్భంగా ఇంటి సమీపంలో ఆడుకుంటున్న అతని కుమారుడు వానపల్లి అక్షయ్కుమార్ (6) ఖాళీ ప్రదేశంలో ఉన్న గోతిలో పడిపోవడంతో కుడికాలు విరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడిని కేజీహెచ్కు తరలించి ఆర్థోపెడిక్ విభాగంలోని ఎస్–5 వార్డులో చేర్పించారు. వైద్యులు ఈ నెల 5న ఉదయం బాలుడికి శస్త్రచికిత్స నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆపరేషన్ పూర్తయింది. కొద్దిసేపటికే బాలుడు మెలకువ రావడంతో పాటు ఫిట్స్ రావడం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసింది. తర్వాత తలనొప్పి ఉందని బాలుడు చెప్పినట్లు వారు తెలిపారు. కొద్దిసేపటికే బాలుడు స్పృహ కోల్పోవడంతో వైద్యులు వెంటనే సీఎస్ఆర్ బ్లాక్కు తరలించి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రుల ఆవేదన : తమ కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శస్త్రచికిత్స సమయంలో ఇచ్చిన మత్తుమందు ప్రభావం ఎక్కువ కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘‘కాలు విరిగిందని ఆస్పత్రికి తీసుకొచ్చాంం ఇప్పుడు మా బిడ్డ ప్రాణాలతో పోరాడుతున్నాడు. మా కుమారుడిని ప్రాణాలతో మాకు అప్పగించాలి’’ అంటూ అక్షయ్కుమార్ తండ్రి విజయకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు : వైద్య సేవల్లో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే శుక్రవారం సీఎస్ఆర్ బ్లాక్ ఎదుట బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులను సముదాయించడంతో ఆందోళన విరమించారు. ప్రస్తుతం బాలుడు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
సంక్షోభం
ఆగిన సబ్సిడీ.. తగ్గిన మత్స్య సంపద ● రెండు నెలల ముందే నిలిచిన వేట! ● హార్బర్కు పరిమితమైన 85 శాతం బోట్లు ● పని చేయని ఆయిల్ కార్డులు, పెరుగుతున్న అప్పులు మత్స్యకారుల బతుకుల్లోమహారాణిపేట: సముద్రాన్నే నమ్ముకున్న మత్స్యకారుల బతుకులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం నుంచి అందని ప్రోత్సాహం.. ఆకాశాన్నంటుతున్న డీజిల్ ధరలు, మరోవైపు ఆశించిన మేర చిక్కని మత్స్య సంపద గంగపుత్రులను నష్టాల కడలిలోకి నెడుతున్నాయి. వీటికి తోడు ప్రభుత్వ ఆయిల్ సబ్సిడీ కార్డులు కూడా పనిచేయకపోవడంతో వేట గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఏటా ఏప్రిల్ 15 నుంచి వేట నిషేధం అమల్లోకి వస్తుంది. అయితే పెరుగుతున్న ఆర్థిక భారంతో మత్స్యకారులు రెండు నెలల ముందే తమ మరబోట్లను తీరానికే పరిమితం చేస్తున్నారు. గంగపుత్రుల ఆశలు ఆడియాసలు మత్స్య సంపద పునరుత్పత్తి కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ప్రభుత్వం వేటను నిషేధిస్తుంది. ఆ తర్వాత వేట లాభసాటిగా ఉంటుందని మత్స్యకారులు ఆశిస్తారు. కానీ ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించకపోవడంతో మత్స్యకారుల ఆశలు అడియాసలయ్యాయి. అనుకున్న స్థాయిలో వేట సాగకపోవడంతో ఫిషింగ్ హార్బర్లో దాదాపు 85 శాతం బోట్లు నిలిచిపోయాయి. కాగా.. 15 రోజుల పాటు సముద్రంలో వేట కోసం వెళ్లే ఒక మరబోటుకు దాదాపు రూ. 3.50 లక్షల వరకు ఖర్చవుతోంది. వారం రోజుల వేటకై తే రూ. 2 లక్షల వరకు వ్యయం అవుతోంది. ఇంత పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టి వెళ్తున్నా, వలలకు తగిన స్థాయిలో చేపలు, రొయ్యలు చిక్కడం లేదు. మత్స్య సంపద తగ్గడానికి వాతావరణ మార్పులు, తరచుగా వస్తున్న తుపానులు, వాయుగుండాలు, పరిశ్రమల వ్యర్థాల వల్ల సముద్రం కాలుష్యమవుతుండటం ప్రధాన కారణాలని మత్స్యకారులు వాపోతున్నారు. అలాగే రింగు వలల వాడకం వల్ల కూడా మత్స్య సంపద క్షీణిస్తోందని చెబుతున్నారు. దీంతో తెచ్చిన అప్పులు తీరక బోటు యజమానులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పనిచేయని ఆయిల్ సబ్సిడీ కార్డులు మత్స్యకారులను ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏటీఎం తరహాలో ఆయిల్ సబ్సిడీ కార్డులను పంపిణీ చేసింది. దీని ద్వారా మరబోటుకు నెలకు 3,000 లీటర్లు, మోటారు బోటుకు 300 లీటర్ల డీజిల్ను సబ్సిడీపై అందించేవారు. లీటరుకు రూ.9 చొప్పున రాయితీ లభించడంతో ఒక్కో బోటు యజమానికి నెలకు రూ. 27,000 వరకు ఆదా అయ్యేది. అయితే, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఈ కార్డులు పనిచేయడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పెరిగిన డీజిల్ భారం నేరుగా వారిపై పడుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలి చేపలు, రొయ్యల లభ్యత పడిపోయింది. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు. అందుకే సీజన్ ముగియక ముందే బోట్లను నిలిపివేశాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిలిచిపోయిన ఆయిల్ సబ్సిడీ కార్డులను పునరుద్ధరించి మత్స్యకారులను ఆదుకోవాలి. – వాసుపల్లి జానకీరామ్, మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర మరపడవల సంఘం 2,491మత్స్యకార గ్రామాలుఫిష్ ల్యాండింగ్ కేంద్రాలుఆధారపడిన జనాభా సుమారు 80 వేల మంది 15 30 -
జిల్లా కోర్టు వైద్య కేంద్రంలో ఆధునిక పరికరాలు
విశాఖ లీగల్ : జిల్లా కోర్టులో విశాఖ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య కేంద్రంలో ఆధునిక పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు వివరించారు. శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని పదో అదనపు జిల్లా కోర్టు వద్ద వైద్య కేంద్రంలో ఈసీజీ యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణ వైద్య సహాయం అందించడానికి ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్తులో వైద్య కేంద్రాన్ని విస్తృతపరిచి మరిన్ని సేవలను అందిస్తామన్నారు. ఈ కేంద్రాన్ని న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా వినియోగించుకోవాలని సంఘం కార్యదర్శి లాలం పార్వతీనాయుడు అన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సమాజ ప్రగతికి మహిళలే చోదక శక్తి
మహారాణిపేట: మహిళా సాధికారత కేవలం మాటలకే పరిమితం కాకుండా కార్యరూపం దాల్చినప్పుడే దానికి నిజమైన సార్థకత చేకూరుతుందని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుతూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్లోని మహిళా అధికారులు, సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిపాలనా వ్యవహారాల్లో మహిళా అధికారులు, సిబ్బంది చురుకై న పాత్ర పోషిస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కీలకంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా, పీవీ సింధు వంటి ప్రముఖులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి మహిళా తన లక్ష్యాలను సాధించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణకు, జట్టు భావనను పెంపొందించడానికి దోహదపడతాయని తెలిపారు. ఈ పోటీల్లో ప్రదర్శించిన ఉత్సాహాన్ని వృత్తి జీవితంలోనూ కొనసాగించాలని సూచించారు. ఈ పోటీల్లో జేసీతో పాటు డిప్యూటీ కలెక్టర్లు శేషశైలజ, అనిత, రామలక్ష్మి, మాధవి, కలెక్టరేట్ ఏవో బీవీ రాణి, ఇతర విభాగాల మహిళా సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం ఆద్యంతం కోలాహలంగా, ఆనందోత్సవాల మధ్య సాగింది. పోటీల్లో విజేతలకు ఈ నెల 8న బహుమతులు ప్రదానం చేయనున్నారు. నారీ.. భేరీ! : విధుల్లోని ఒత్తిడిని పక్కనపెట్టి, ఉత్సాహంతో పోటీ పడుతున్న కలెక్టరేట్ ఉద్యోగినులు. గెలుపు ఎవరిదైనా, ఈ ఐక్యతదే అసలైన విజయం.! -
‘ఉత్తర’ నేతలకు కీలక బాధ్యతలు
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకులుగా నియామకం మహారాణిపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన ముగ్గురు నేతలను వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులుగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉత్తర నియోజకవర్గానికి చెందిన బాణాల శ్రీనివాస్ను అరకు నియోజకవర్గ పరిశీలకుడిగా, పేడాడ రమణికుమారిని విజయనగరం జిల్లా చీపురుపల్లికి, రొంగలి జగన్నాథంను బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకుడిగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. -
ఒకే రోజు రూ. 2 కోట్ల పన్ను వసూలు
మధురవాడ జెడ్సీ అయ్యప్పనాయుడు మధురవాడ: జీవీఎంసీ నిర్వహిస్తున్న ప్రత్యేక పన్నుల వసూలు డ్రైవ్లో భాగంగా శుక్రవారం ఒక్క రోజే రూ. 2 కోట్లు వసూలైనట్లు మధురవాడ జోనల్ కమిషనర్ అయ్యప్పనాయుడు తెలిపారు. జోన్ పరిధిలోని 5, 6, 7, 8 వార్డుల్లో కొన్ని రోజులుగా ఎనిమిది బృందాలు ఈ వసూళ్ల ప్రక్రియను చేపడుతున్నాయి. మొండి బకాయిలు ఉన్న వారి ఆస్తులను సీజ్ చేయడం, కుళాయి కనెక్షన్లు కట్ చేయడం, నోటీసులు జారీ చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ డ్రైవ్లో భాగంగా ఐటీ సెజ్లోని ఐలా కంపెనీ నుంచి రూ.1.10 కోట్లు, అవ్యాన్ డీలర్స్ నుంచి రూ. 65.10 లక్షలు పన్నుల రూపంలో వసూలు చేశారు. ఈ ఆస్తి పన్ను చెక్కులను జెడ్సీ అయ్యప్పనాయుడు, అసిస్టెంట్ కమిషనర్ అచ్చంనాయుడు, ఆర్ఐ సుభాన్ తదితరులు కలిసి డీసీఆర్ ఎస్.శ్రీనివాస్కు అందజేశారు. -
ప్రేక్షకుల ఆదరణే మా విజయం
‘రాయుడు గారి తాలూకా’ హీరో శ్రీనివాస్ డాబాగార్డెన్స్: తెలుగు చిత్ర పరిశ్రమలో కథాబలం ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ‘రాయుడు గారి తాలూకా’తో మరోసారి నిరూపితమైందని హీరో శ్రీనివాస్ ఉలిశెట్టి అన్నారు. ఆయన హీరోగా సత్య ఈషా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. నగరంలోని వేంకటేశ్వర థియేటర్లో సినిమా నటీనటులు, ప్రేక్షకులతో కలిసి ఆయన సినిమాను వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘మా కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది. సినిమా చూసి బయటకు వస్తున్న ప్రేక్షకుల కళ్లలో కనిపిస్తున్న ఆనందమే మా విజయం’అని పేర్కొన్నారు. నగేష్ గౌరేష్ అందించిన నేపథ్య సంగీతం సస్పెన్స్ సన్నివేశాలను ఎలివేట్ చేసిందని, గౌతమ్ విజువల్స్ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయని తెలిపారు. ఈ చిత్రంలో పలాస రామారావు, అమ్మరాజు, రమణారెడ్డి, రవిశెట్టి, పైడిరాజు, నాగరాజు, శ్రీహరి, సుమన్, కిట్టయ్య, ఆర్కే నాయుడు, ఫణిస్వామి, సృజన తదితరులు వివిధ పాత్రల్లో నటించారు. -
బొలెరో–ఆటో ఢీ..మహిళా రైతు మృతి
సబ్బవరం: కుటుంబానికి అండగా నిలుస్తూ, కూరగాయలు అమ్ముకునేందుకు బయలుదేరిన ఒక మహిళా రైతు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన సబ్బవరం మండలంలో శుక్రవారం చోటుచేసుకోగా.. సంతపాలెంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి.. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం సంతపాలెం గ్రామానికి చెందిన మహిళా రైతు నంబారు ఈశ్వరమ్మ(38) శుక్రవారం తన సోదరుడు సన్నిబాబు నడుపుతున్న ఆటోలో కూరగాయలు తీసుకుని సబ్బవరం మండలంలోని చిన్నయ్యపాలెం బజార్కు బయలుదేరారు. గుల్లేపల్లి మీదుగా అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులోకి ప్రవేశించారు. అదే సమయంలో రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే బ్రిడ్జి వద్ద పెందుర్తి వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఒక బొలెరో వాహనం ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది. అందులో ఉన్న ఈశ్వరమ్మ రెండు కాళ్లకు తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. ఆటో నడుపుతున్న సన్నిబాబు కూడా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. క్షతగాత్రులను కేజీహెచ్కు తరలించగా, చికిత్స పొందుతూ ఈశ్వరమ్మ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సన్నిబాబు చికిత్స పొందుతున్నాడు. ఈశ్వరమ్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి భర్త అప్పారావు ఫిర్యాదు మేరకు సీఐ జి.రామచంద్రరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం పూట దట్టంగా కురిసిన పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈశ్వరమ్మకు వివాహమైన కుమార్తె, ఇంటర్, 6వ తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. కూరగాయలు అమ్ముకునేందుకు వెళ్తూ అనంతలోకాలకు.. -
ఏఐతో సరికొత్త ఆవిష్కరణలకు సిద్ధం కావాలి
బీచ్ రోడ్ : విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని జిల్లా ఉప విద్యాశాఖాధికారి జె.సోమేశ్వరరావు సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్కుమార్ ఆదేశాల మేరకు ఈస్ట్పాయింట్ కాలనీలోని కేడీపీఎం హైస్కూల్లో శుక్రవారం జిల్లా స్థాయి విజ్ఞాన వారోత్సవాలు–2026 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 11 మండల స్థాయి పోటీల్లో గెలుపొందిన 165 మంది విద్యార్థులు, గైడ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈవో మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి, అభిరుచిని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఇటువంటి పోటీలు దోహదం చేస్తాయని చెప్పారు. జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజారావు, జ్యూరీ సభ్యులు డా. నాగేశ్వరరావు, డా. రాజేశ్వరరావు భవిష్యత్తులో సైన్స్ రంగంలో ఉన్న అవకాశాలపై విద్యార్థులకు వివరించారు. ప్రధానోపాధ్యాయులు సుమతి భాయి మాట్లాడుతూ విద్యార్థుల అంతర్గత ప్రతిభను వెలికితీయడానికి పోటీతత్వం అవసరమని అన్నారు. ఈ విజ్ఞాన వారోత్సవాల్లో వక్తృత్వం, సెమినార్, పోస్టర్ ప్రజెంటేషన్, క్విజ్ పోటీలను నిర్వహించారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు, గైడ్ ఉపాధ్యాయులకు సోమేశ్వరరావు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. -
నకిలీ ఫేస్బుక్ ఖాతా.. వివాహితకు అసభ్య మెసేజ్లు..
విశాఖపట్నం జిల్లా: నకిలీ ఫేస్బుక్ ఖాతాతో ఓ వివాహితకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని నగర సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ వివాహితకు ఒక వ్యక్తి నకిలీ ఫేస్బుక్ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అనంతరం ఆమె ఖాతాలోని ఫొటోలను డౌన్లోడ్ చేసి మారి్ఫంగ్ చేశాడు. ఆ ఫొటోలను ఆమెకు పంపిస్తూ, తనతో చాటింగ్ చేయకపోతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. అసభ్య పదజాలంతో మెసేజ్లు చేస్తూ తీవ్ర వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని కొబ్బరితోటకు చెందిన గరుబిల్లి భాస్కరరావుగా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అపరిచిత వ్యక్తుల నుంచి సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తే అంగీకరించవద్దని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. -
కట్నం రక్కసికి వివాహిత బలి
విశాఖపట్నం జిల్లా: వరకట్న దాహానికి మరో వివాహిత బలైంది. అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. న్యూపోర్టు పోలీసుల కథనం ప్రకారం.. గంగవరం గ్రామానికి చెందిన ఎరిపిల్లి నాగమణి కుమార్తె రమాదేవిక అలియాస్ ప్రత్యూష (23) ప్రస్తుతం బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ప్రత్యూషకు అదే ప్రాంతానికి చెందిన మాద ధనరాజుతో 2022 ఫిబ్రవరిలో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.3లక్షల కట్నం ఇస్తామని ఒప్పందం కుదుర్చుకోగా, అప్పట్లో రూ.1.50లక్షలు చెల్లించారు. మిగిలిన సొమ్ము కోసం భర్తతో పాటు అత్తమామలు కూడా ప్రతి రోజూ ఆమెను వేధిస్తుండేవారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ప్రత్యూష, ఈ నెల 3న ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను గాజువాకలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం ప్రత్యూష మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. తన కుమార్తె మృతికి అత్తమామల వేధింపులే కారణమని తల్లి నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీపీ చిట్టిబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చందనోత్సవంలో స్వచ్ఛంద సేవలు అభినందనీయం
సింహాచలం : ఏటా జరిగే చందనోత్సవంలో స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. ఏప్రిల్ 20న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు సేవలందించే స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో గురువారం దేవస్థానం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఆహార పదార్థాలు, పానీయాలు, బిస్కెట్లు, పళ్లు తదితరాలను అందిస్తూ స్వచ్ఛంద సంస్థలు విశేష సేవ చేస్తున్నాయని కొనియాడారు. ఈ ఏడాది కూడా వారి సేవలను సమన్వయంతో వినియోగించుకుంటామని తెలిపారు. అలాగే ఈనెల 29న జరగనున్న వార్షిక కల్యాణోత్సవం, ఏప్రిల్ 20న జరిగే చందనోత్సవ ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈవో సూచించారు. సమావేశంలో పోలీస్, జీవీఎంసీ, ఫైర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జూకు కొత్త నేస్తాలు
ఆసియాటిక్ సింహంబీచ్రోడ్డు: ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలలో కొత్త జంతువులు సందడి చేయనున్నాయి. విశాఖ జూ, గౌహతిలోని అసోం స్టేట్ జూ కమ్ బొటానికల్ గార్డెన్ మధ్య జంతు మార్పిడి కార్యక్రమం గురువారం విజయవంతంగా జరిగింది. ఇందులో భాగంగా హిమాలయన్ బ్లాక్ బేర్, బ్లాక్ పాంథర్, చిరుతపులి, ఆసియాటిక్ సింహం, ఏషియన్ పామ్ సివెట్లను గౌహతి నుంచి విశాఖకు తీసుకువచ్చారు. బదులుగా విశాఖ జూ నుంచి రింగ్ టెయిల్డ్ లీమూర్, స్టంప్ టెయిల్డ్ మకాక్, జంగిల్ క్యాట్, గ్రీన్ ఇగ్వానా, స్ట్రైప్డ్ హైనా జంతువులను అసోం స్టేట్ జూకు పంపించారు. సుమారు 40 ఏళ్ల తర్వాత విశాఖ జూలో మెలనిస్టిక్ చిరుత(బ్లాక్ పాంథర్) సందడి చేయనుంది. నలుపు రంగు, శక్తివంతమైన ఆకృతితో ఉండే బ్లాక్ పాంథర్ వన్యప్రాణి ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటూ జూకే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రస్తుతం ఈ కొత్త జంతువులన్నింటినీ జూ నిబంధనల ప్రకారం క్వారంటైన్లో ఉంచారు. ఆ గడువు పూర్తయిన తర్వాత వాటిని ప్రత్యేక ఎన్క్లోజర్లలోకి మార్చి సందర్శకుల వీక్షణకు అనుమతించనున్నారు. -
షికారీ బ్రేక్
సముద్ర సర్వేకుపాత నౌకలతోనే ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా పోరాటం విశాఖ కేంద్రంగా 50 ఏళ్లుగా సేవలందిస్తున్న సర్వే నౌకలు మత్స్యషికారీ డీ–కమిషనింగ్ పెండింగ్, మత్స్యదర్శినిపైనే ఆధారం రూ.5 కోట్ల మరమ్మతుల తర్వాత కూడా పరిమిత సామర్థ్యం కొత్త నౌక మంజూరు మాటలు కాగితాలకే పరిమితం మత్స్యషికారీ నౌక సాక్షి, విశాఖపట్నం: నీలి విప్లవానికి బాటలు వేయాల్సిన ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ) విశాఖపట్నం విభాగం ప్రస్తుతం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. సముద్ర గర్భంలోని మత్స్య సంపదను అంచనా వేయడంలో కీలకమైన రెండు ప్రధాన సర్వే నౌకలు కాలపరిమితి దాటిపోయాయి. అందులో ఒకటి పూర్తిగా నిలిచిపోవడంతో సముద్ర అన్వేషణ దాదాపు ఒకే నౌకపై ఆధారపడాల్సి వస్తోంది. ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ సంస్థను ఆధునికీకరించడంలో పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం కొత్త నౌక మంజూరు చేస్తామని ప్రకటించిన కేంద్ర మత్స్యశాఖ ఇప్పటివరకు ఆ దిశగా స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. తీరానికే పరిమితమైన ‘మత్స్యషికారీ’ ఎఫ్ఎస్ఐ విశాఖ పరిధిలోని మరో నౌక ‘మత్స్యషికారీ’. 1979లో డెన్మార్క్లో నిర్మితమైన ఈ ట్రాలర్ కమ్ పర్స్ సీనర్ గత మూడు సంవత్సరాలుగా సముద్రంలోకి వెళ్లలేదు. ప్రస్తుతం రేవులోనే నిలిపివేశారు. దీనికి మరమ్మతులు చేయాలంటే రూ.5 నుంచి 10 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. అంత ఖర్చు చేసినా పూర్తిస్థాయి పనితీరు హామీ ఇవ్వలేమని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘డీ–కమిషనింగ్’ చేయాలని విశాఖ విభాగం ముంబై ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదనలు పంపింది. ఫైళ్లు కేంద్ర మంత్రిత్వ శాఖకు వెళ్లినప్పటికీ, ఇప్పటివరకు తుది నిర్ణయం వెలువడలేదు. ఫలితంగా ఈ నౌక రేవులోనే తుప్పు పడుతోంది. కొత్త నౌక.. మాటలకే పరిమితం ప్రస్తుత నౌకలు కాలపరిమితి దాటాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం విశాఖ యూనిట్కు కొత్త సర్వే నౌకను కేటాయిస్తామని ప్రకటించింది. అత్యాధునిక సోనార్ వ్యవస్థలు, శాటిలైట్ ట్రాకింగ్, లోతైన సముద్రంలో మత్స్య నిల్వలను గుర్తించే ఆధునిక సాంకేతికతతో నౌక అందుబాటులోకి వస్తుందని ఆశించారు. అయితే ఆ ప్రకటనలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కొనుగోలు ప్రక్రియలో స్పష్టమైన పురోగతి లేకపోవడంతో ఎఫ్ఎస్ఐ సముద్ర అన్వేషణలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పరిశోధనలపై ప్రభావం సముద్రంలో ఏ ప్రాంతాల్లో చేపల సంతతి అధికంగా ఉంది? ఏ కాలంలో ఏ రకమైన చేపలు ఎక్కువగా లభిస్తాయి? వాతావరణ మార్పుల ప్రభావం ఎంతవరకు ఉంది? వంటి కీలక అంశాలపై ఎఫ్ఎస్ఐ సర్వేలు నిర్వహిస్తుంది. ఆధునిక నౌకలు లేకపోవడంతో శాసీ్త్రయ సమాచార సేకరణలో జాప్యం ఏర్పడుతోంది. ప్రస్తుతం మత్స్యదర్శినిపైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది. ఇతర దేశాల ఆధునిక సర్వే నౌకలతో పోలిస్తే సమాచారం సేకరణ సామర్థ్యం పరిమితంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. నౌకల కొరత కారణంగా సిబ్బంది, విద్యార్థులకు క్షేత్రస్థాయి శిక్షణ అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. వ్యూహాత్మకంగా కీలకమైన విశాఖపట్నం కేంద్రాన్ని బలోపేతం చేయాలంటే పాత నౌకలను డీ–కమిషన్ చేసి, తక్షణమే కొత్త సర్వే నౌకలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని మత్స్యకారులు కోరుతున్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన దేశవ్యాప్త పనితీరుపై ఎఫ్ఎస్ఐ సమీక్ష సమావేశం చైన్నెలో జరగనుంది. ఈ సమావేశంలో కొత్త నౌకల అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
కనీస వేతనాల సవరణపై విస్తృత చర్చ
సీతంపేట: షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్కు సంబంధించి కనీస వేతనాల సవరణపై రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ పి.శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో యాజమాన్యాలు, కార్మిక సంఘాల ప్రతినిధులతో నగరంలోని ఓ హోటల్లో గురువారం సమావేశం జరిగింది. కనీస వేతనాల సవరణకు సంబంధించి యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్స్, జీతభత్యాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో.. కార్మికుల జీవనానికి సరిపడా కనీస వేతనాలు నిర్ధారించాల్సిన అవసరం ఉందని కార్మిక సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. విధి నిర్వహణలో కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన సందర్భాల్లో చెల్లించాల్సిన నష్టపరిహారం మొత్తాలు చిన్న పరిశ్రమలు భరించలేని స్థాయిలో ఉన్నాయని యాజమాన్యాలు పేర్కొన్నాయి. దీనిపై కార్మిక సంఘాల ప్రతినిధులు స్పందిస్తూ.. పరిశ్రమల్లో ప్రమాదాలు నివారించడానికి, చట్టాల అమలును సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్లకు స్వేచ్ఛగా, విస్తృతంగా తనిఖీలు నిర్వహించే అవకాశం కల్పించాలని కోరారు. పరిశ్రమల్లోని లోపాలను గుర్తించి సరిదిద్దే చర్యలు తీసుకుంటే ప్రమాదాలను అరికట్టవచ్చని సూచించారు. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు, ప్రతిపాదనలను సలహా మండలి సభ్యులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ పి.శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. జాయింట్ లేబర్ కమిషనర్ ఎం.రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్, దాల్ మిల్స్ అసోసియేషన్, గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్, జేఎన్పీసీ మర్చెంట్స్ అసోసియేషన్, ఫార్మా అసోసియేషన్ ప్రతినిధులతో పాటు.. ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మరమ్మతుల తర్వాత కూడా అనుమానాలే..
ఎఫ్ఎస్ఐ విశాఖ విభాగంలో ఉన్న రెండు ప్రధాన నౌకల్లో ‘మత్స్యదర్శిని’ ఒకటి. 1978లో హాలండ్లో నిర్మించిన ఈ కాంబినేషన్ ట్రాలర్ నౌక దాదాపు 50 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. 2024 ఆగస్టులో సాంకేతిక లోపాలతో నిలిచిపోయిన ఈ నౌకకు డాక్యార్డులో దీర్ఘకాలిక మరమ్మతులు నిర్వహించారు. దాదాపు రూ.5 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేసి, 2025 అక్టోబర్ 31న ట్రయల్ ఫిషింగ్ సర్వేకు పంపించారు. ప్రస్తుతం ఇది సేవలందిస్తున్నప్పటికీ, అర్ధశతాబ్దం నాటి ఇంజిన్లు, పాత సాంకేతిక వ్యవస్థలతో దీర్ఘకాలికంగా సమర్థవంతంగా పనిచేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోతైన సముద్ర అన్వేషణకు ఈ నౌక సామర్థ్యం పరిమితమేనని నిపుణులు పేర్కొంటున్నారు. మత్స్యదర్శిని నౌక -
అరోబిందో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
ఏయూలో రూ.10 కోట్లతో ఆధునిక ప్రయోగశాల మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగంలో అరోబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను గురువారం ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్థులకు ప్రాయోగిక శిక్షణ అందించేందుకు సుమారు రూ.10 కోట్ల వ్యయంతో హెచ్పీఎల్సీ, జీసీ, డీఎస్సీ వంటి ఆధునిక ఫార్మా పరికరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని వీసీ పేర్కొన్నారు. అరోబిందో ఫార్మా ఫౌండేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ యు.ఎన్.బి.రాజు మాట్లాడుతూ ఔషధ తయారీ రంగంలో క్వాలిటీ కంట్రోల్ విభాగం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు మాట్లాడుతూ శిక్షణ సిబ్బంది, పరికరాల నిర్వహణ బాధ్యతలను అరోబిందో ఫార్మానే చేపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగాధిపతి ఆచార్య బి.వి.వి. శైలజతో పాటు పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కేంద్రంలో అందించే ప్రాక్టికల్ శిక్షణ వల్ల ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్థులకు ఫార్మా కంపెనీల్లో, ముఖ్యంగా క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని నిర్వాహకులు తెలిపారు. -
చంద్రబాబు పతనం మొదలైంది
పెదగంట్యాడ: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు పతనం ప్రారంభమైంది. రాష్ట్రంలో పాలన అదుపు తప్పింది. అక్రమ కేసులు బనాయించి నాయకులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం దారుణం’ అని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గురువారం విశాఖ వచ్చిన ఆయన, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తనపై కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి, 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కలిసి తనపై దాడి చేయించారని మండిపడ్డారు. ‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఏకధాటిగా ఏడు గంటల పాటు నా ఇంటిపై దాడి చేయించారు. పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోకపోవడం శోచనీయం. నాపై భౌతిక దాడికి దిగడమే కాకుండా.. నా కుటుంబ సభ్యులను భయ పెట్టి, నా కార్యాలయం, కార్లు, ఆస్తులను ధ్వంసం చేశారు. గుంటూరు పట్టణం నడిబొడ్డున జరిగిన ఈ దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ స్వయంగా పర్యవేక్షించారు.’ అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం అండదండలు ఉండబట్టే ఈ దాడులను ఎవరూ ఆపలేదన్నారు. నేతలకు, కాపు సామాజికవర్గానికి ధన్యవాదాలు తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన సమయంలో తనకు అండగా నిలిచిన ఉత్తరాంధ్ర నేతలకు అంబటి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్యలతో పాటు కాపు సంఘాల నాయకులు తన కుటుంబానికి ధైర్యం చెప్పారన్నారు. తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలుపుతూ.. అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. రెడ్ బుక్ను లెక్కచేయను ‘అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా నేను కానీ, నా కార్యకర్తలు కానీ భయపడే ప్రసక్తే లేదు. లోకేష్ రెడ్ బుక్ను నా కుక్క కూడా లెక్కచేయదు. ఇదే స్టాండ్ మీద మేము నిలబడతాం. కేసులు, జైళ్లకు భయపడం’ అని అంబటి స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదని, చంద్రబాబు, లోకేష్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. రాష్ట్ర ప్రజలను, పరిపాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్య, కాపు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
కీలక రెవెన్యూ పోస్టులు ఖాళీ
మహారాణిపేట: విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం జిల్లాలో కీలకమైన రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను నియమించడంలో మాత్రం జాప్యం చేస్తోంది. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో), విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) వంటి కీలక పోస్టులు దాదాపు 165 రోజులుగా ఖాళీగానే ఉండటంతో రెవెన్యూ పరిపాలన ఇన్చార్జిల ఆధారంగానే కొనసాగుతోంది. గత ఏడాది అక్టోబర్ 21న అప్పటి డీఆర్వో బి.హెచ్.భవానీ శంకర్, ఆర్డీఓ పి.శ్రీలేఖలను ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి నుంచి వారి స్థానాల్లో కొత్త అధికారులను నియమించకపోవడం గమనార్హం. దీంతో కీలక రెవెన్యూ వ్యవహారాలు ఇన్చార్జి అధికారుల ద్వారానే సాగుతున్నాయి. ఇప్పటివరకు ఇన్చార్జి డీఆర్వోగా పనిచేసిన జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) సత్తిబాబు గురువారం రిలీవ్ అయ్యారు. ఆయన విజయనగరం డీఆర్వోగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కలెక్టరేట్లోని కెఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శేష శైలజను ఇన్చార్జి డీఆర్వోగా నియమించారు. అలాగే విశాఖ ఆర్డీవోగా హెచ్పీసీఎల్ భూసేకరణ అధికారి, డిప్యూటీ కలెక్టర్ సుధాసాగర్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. డీఆర్వో–ఆర్డీవోల మధ్య అవినీతి ఆరోపణల వివాదం నేపథ్యంలో ప్రభుత్వం వారిని బదిలీ చేసినప్పటికీ, అనంతరం కొత్త నియామకాలు జరగకపోవడం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో భూములు, భూసేకరణ, పరిపాలన వంటి కీలక వ్యవహారాలను చూసే ప్రధాన పోస్టులు దీర్ఘకాలంగా ఖాళీగా ఉండటం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొంటున్నారు. కీలక బాధ్యతలున్న ఈ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని, లేదంటే రెవెన్యూ పరిపాలనలో ఆలస్యం, అనిశ్చితి మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా వర్గాలు అంటున్నాయి. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
అల్లిపురం: తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పెందుర్తి క్రైం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ. 13 లక్షల విలువైన 160 గ్రాముల బంగారు ఆభరణాలు, 700 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ లతా మాధురి, ఇన్చార్జి క్రైం ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి ఈ వివరాలు వెల్లడించారు. ● గత ఏడాది డిసెంబర్ 3న వేపగుంట, వరలక్ష్మీనగర్కు చెందిన పారిపూడి వెంకటేశ్వరరావు తన తోడల్లుడు గణేష్ మరణించాడని తెలిసి, సాయంత్రం 7 గంటలకు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణరాయపురం వెళ్లారు. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి వచ్చి చూడగా, ఇంటి తూర్పు వైపు తలుపు తాళం విరగొట్టి ఉంది. లోపలికి వెళ్లి పరిశీలించగా, బీరువా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. అందులోని సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు, 400 గ్రాముల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పెందుర్తి క్రైం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ● నాయుడుతోటలోని అప్పలనరసయ్య కాలనీకి చెందిన సూరెడ్డి శ్రీనివాస్ గత ఏడాది సెప్టెంబర్ 24న తన ఇంటికి తాళం వేసి, స్వగ్రామమైన కె.కోటపాడు మండలం, పొడుగుపాలెం వెళ్లారు. మరుసటి రోజు సాయంత్రం ఆయన తిరిగి వచ్చి చూడగా, ఇంటి ప్రధాన ద్వారం తాళం విరగొట్టి ఉండటాన్ని గమనించారు. బెడ్రూమ్లోని బీరువా తాళాలు కూడా పగులగొట్టి ఉన్నాయి. అందులో ఉన్న సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ● వేపగుంట, వరలక్ష్మీనగర్ నివాసి పప్పు ధర్మేంద్ర తన భార్య ప్రసవం నిమిత్తం ఈ ఏడాది జనవరి 13న ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లారు. ఆమె డిశ్చార్జ్ అయిన తర్వాత, వారు నేరుగా ఆరిలోవలోని అత్తగారింటికి వెళ్లారు. ఈ నెల 20వ తేదీ రాత్రి 11 గంటలకు ధర్మేంద్ర తిరిగి తన ఇంటికి వచ్చి చూడగా, ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి పరిశీలించగా, బెడ్రూమ్లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువాలోని సుమారు ఐదు తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో పాటు సన్షైడ్పై ఉన్న ఇత్తడి పాత్ర చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు, క్రైం డీసీపీ లతా మాధురి, ఇన్చార్జి క్రైం ఏసీపీ నరసింహమూర్తి పర్యవేక్షణలో వెస్ట్ సబ్ డివిజన్ క్రైం ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, ఎస్ఐ డి.సూరిబాబు బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ మూడు కేసుల్లో నిందితుడు చీడికాడ మండలం మంచాల గ్రామానికి చెందిన ఆది ప్రసాద్ అలియాస్ శ్రీనుగా గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సింహాచలం కొనేరు దరి గాంధీవీధిలో నివాసం ఉంటున్న నిందితుడి నుంచి మొత్తం రూ.13 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. -
ఫ్రీహోల్డ్కు ఫుల్ స్టాప్?
● పరిశీలన పరిహాసంమహారాణిపేట : గత ప్రభుత్వ హయాంలో పేద రైతుల భూములకు లభించిన ’ఫ్రీ హోల్డ్’ (యాజమాన్య హక్కులు) భాగ్యంపై ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. ముఖ్యంగా విశాఖ జిల్లా పరిధిలోని వందలాది ఎకరాల భూములకు సంబంధించి విచారణల పేరుతో కాలయాపన చేస్తూ, రైతులను గందరగోళంలోకి నెట్టివేస్తోంది. గత ప్రభుత్వం 2002 కంటే ముందు మంజూరు చేసిన డి.పట్టా భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీహోల్డ్ భూములపై ఆరోపణలు చేస్తూ విచారణ ఆదేశించింది. అనంతరం అన్ని ప్రక్రియలను నిలిపివేసి, దాదాపు 20 నెలలుగా ‘పరిశీలన’ పేరుతో నిర్ణయం వాయిదా వేస్తోంది. అక్రమాలు లేవు– డిప్యూటీ కలెక్టర్ల కమిటీ నివేదిక ఈ భూములపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎన్నికల ముందు ఆరోపణలు చేశారు. పేదల భూముల్లో అక్రమాలు జరిగాయని ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీహోల్డ్ ప్రక్రియను నిలిపివేసి, డిప్యూటీ కలెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా స్వయంగా భూములను పరిశీలించారు. అయితే ఫ్రీహోల్డ్ ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగలేదని డిప్యూటీ కలెక్టర్ల కమిటీ తేల్చినట్టు సమాచారం. గ్రామాల వారీగా పరిశీలన చేసిన కమిటీకి ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని తెలుస్తోంది. భూముల రికార్డులు, యజమానులతో ప్రత్యక్షంగా మాట్లాడి నివేదిక సిద్ధం చేసిన కమిటీ, ఇదే విషయాన్ని జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది. విచారణకు వెళ్లిన అధికారులకు ముందుగా అందిన సమాచారం కంటే, గ్రామాల్లో ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి భిన్నంగా కనిపించిందని వర్గాలు చెబుతున్నాయి. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. రైతుల్లో గందరగోళం ప్రస్తుతం ఫ్రీహోల్డ్ భూములపై రిజిస్ట్రేషన్లు చేయవద్దని రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తహసీల్దార్లతో మళ్లీ పరిశీలనలు చేయించినప్పటికీ, చట్టబద్ధతపై తుది నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసైన్డ్దారుడు మరణిస్తే వారసులు మ్యూటేషన్ కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. భూమి ఉన్నా హక్కుల స్పష్టత లేక రైతులు ఆందోళనలో ఉన్నారు. అవసరానికి భూమిని అమ్ముకోలేక, అటు యాజమాన్య హక్కులు అనుభవించలేక రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. పూర్తి హక్కులు కల్పించాలి అధికారులు అంతా సక్రమమేనని నివేదికలు ఇచ్చినా, ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఈ ఫైళ్లను పక్కన పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా కాలయాపన స్వస్తి చెప్పి, పేద రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించాలని బాధితులు కోరుతున్నారు. జిల్లాలో 609 ఎకరాలకు ఫ్రీహోల్డ్ సంబంధిత జీవో ప్రకారం జిల్లాలో మొత్తం 609 ఎకరాలకు ఫ్రీహోల్డ్ మంజూరు చేశారు. వాటిలో 190 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. మండలం భూమి విస్తీర్ణం (ఎకరాలు) ఆనందపురం 407.77 ఎకరాలు పద్మనాభం 129.60 ఎకరాలు పెందుర్తి 20.04 ఎకరాలు భీమిలి 52.51 ఎకరాలు పేదల భూముల విషయంలో కూటమి సర్కారు తాత్సారం గత ప్రభుత్వ హయాంలో ‘ఫ్రీ హోల్డ్’ సక్రమమే అని తేల్చిన కమిటీలు ఇప్పటికీ యాజమాన్య హక్కులు కల్పనపై తేల్చని చంద్రబాబు ప్రభుత్వం పరిశీలన పేరుతో 20 నెలలుగా సాగదీత -
తీర్థయాత్రలకు వెళ్తే.. ఇల్లు గుల్ల చేశారు!
అల్లిపురం: తీర్థయాత్రలకు వెళ్లిన వారి ఇంటికి కన్నం వేసి, విలువైన బంగారం, వెండి వస్తువులను అపహరించిన ఓ మహిళ సహా ముగ్గురు నిందితులను పీఎం పాలెం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.8 లక్షల విలువైన 29 తులాల బంగారు, 101 తులాల వెండి ఆభరణాలను రికవరీ చేశారు. గురువారం క్రైం డీసీపీ లతామాధురి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొమ్మాది జంక్షన్, వివేకానంద కాలనీ, అయ్యప్పనగర్కు చెందిన రిటైర్డ్ విద్యుత్ లైన్మన్ బొడ్డేటి అప్పలరాజు ఫిబ్రవరి 2న తన కుటుంబ సభ్యులతో కలిసి రామేశ్వరం తీర్థయాత్రకు వెళ్లారు. యాత్ర ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే సరికి, ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.8 లక్షల విలువైన 29 తులాల బంగారు, 101 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు క్రైం సీఐ బి.ప్రకాష్, ఎస్ సూర్యప్రకాష్ రావు తమ సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా బాధితులు, ఇరుగుపొరుగు వారి కాల్ డేటాను విశ్లేషించారు. ఈ క్రమంలో బాధితుడితో పరిచయం ఉన్న పెనుగుర్తి శ్రీదేవి కాల్ డేటా అనుమానాస్పదంగా ఉండటంతో ఆమైపె దృష్టి సారించారు. ఆమె తరచుగా ఫోన్ నంబర్లు మారుస్తూ.. దొంగతనానికి ముందు, ఆ తర్వాత కోడూరు ప్రసాద్బాబు అనే వ్యక్తితో పలుమార్లు మాట్లాడినట్లు గుర్తించారు. చోరీ జరిగినప్పటి నుంచి ప్రసాద్ బాబు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు తేలింది. దీంతో శ్రీదేవి, ప్రసాద్ల గురించి ఆరా తీయగా వారు పరారీలో ఉన్నట్లు స్పష్టమైంది. వారి కదలికలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ బృందాల సమాచారం మేరకు నిందితులు ఈ నెల 3న ఎంవీవీ సిటీ నుంచి పనోరమ రోడ్డు మధ్యలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గురువారం ఉదయం పనోరమ హిల్స్ రోడ్డులో వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీకి గురైన సొత్తు మొత్తాన్ని రికవరీ చేసి, నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. కాల్ డేటా విశ్లేషణతో పట్టుబడిన నిందితులు -
8న యువతులకు ఆటల పోటీలు
ఏయూక్యాంపస్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలికలు, యువతులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ గొర్లి మహేశ్వరరావు తెలిపారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. కొమ్మాది నవోదయ విద్యాలయ క్రీడా ప్రాంగణంలో ఆదివారం 8 గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు. అండర్–13, అండర్–18, 18 ఏళ్లు పైబడిన వారికి 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పోటీలు నిర్వహిస్తామన్నారు. యువతలో ఉత్సాహాన్ని నింపేందుకు ఫన్ గేమ్స్ కూడా ఉంటాయన్నారు. మహిళలను, యువతులను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అస్మిత అనే పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ఖేలో ఇండియా పథకం మహిళా సాధికారతకు గొప్ప వేదికగా నిలిచిందన్నారు. -
14 కిలోల గంజాయి పట్టివేత
ఆనందపురం: పాలవలస పంచాయతీ దుక్కవానిపాలెం టోల్ ప్లాజా వద్ద గురువారం 14 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ శివ, ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు తమ సిబ్బందితో కలిసి టోల్ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆనందపురం నుంచి పెందుర్తి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా.. ఒక్కొక్కటి రెండు కిలోల బరువున్న ఏడు ప్యాకెట్లలో మొత్తం 14 కిలోల గంజాయి లభ్యమైంది. గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను మహారాష్ట్రలోని థానే జిల్లా బడ్లపూర్కు చెందిన సునీల్ నాగేష్ బండారి, ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన అనిశాంత్ బెహరాలుగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
అంతర్జాతీయ వేదికపై ఏయూ పూర్వ విద్యార్థి ప్రతిభ
మద్దిలపాలెం: ప్రపంచంలో ప్రతిష్టాత్మక, పురాతన వైద్య సంస్థల్లో ఒకటైన ‘రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్(ఆర్ఎస్ఎం)’తమ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫాంలో ‘వాయిసెస్ ఆఫ్ ఆర్ఎస్ఎం’సిరీస్లో భాగంగా ఏయూ పూర్వ విద్యార్థి, ఆర్ఎస్ఎం ఫెలో డాక్టర్ దేవా హెచ్.పురాణాన్ని ప్రత్యేకంగా పరిచయం చేసింది. లండన్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఆర్ఎస్ఎం.. వైద్య విద్య, బహుళ విభాగాల సహకారం, 70కి పైగా వైద్య విభాగాల్లో ఆరోగ్య సంరక్షణ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోంది. క్లినికల్ ట్రైనింగ్, ఆవిష్కరణలు, పరస్పర సహకారంతో కూడిన ఈ సంస్థ.. తన వృత్తిపరమైన అభివృద్ధి, నాయకత్వ ప్రయాణంలో ఎలాంటి కీలక పాత్ర పోషించిందో డాక్టర్ పురాణం పంచుకున్న అభిప్రాయాలను ఆర్ఎస్ఎం ఈ సందర్భంగా హైలెట్ చేసింది. లైఫ్ సైన్సెస్, రెగ్యులేటరీ స్ట్రాటజీ, హెల్త్కేర్ లీడర్షిప్లో అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్ పురాణంనకు విశేష అనుభవం ఉంది. -
కట్నం రక్కసికి వివాహిత బలి
పెదగంట్యాడ: వరకట్న దాహానికి మరో వివాహిత బలైంది. అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. న్యూపోర్టు పోలీసుల కథనం ప్రకారం.. గంగవరం గ్రామానికి చెందిన ఎరిపిల్లి నాగమణి కుమార్తె రమాదేవిక అలియాస్ ప్రత్యూష (23) ప్రస్తుతం బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ప్రత్యూషకు అదే ప్రాంతానికి చెందిన మాద ధనరాజుతో 2022 ఫిబ్రవరిలో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.3లక్షల కట్నం ఇస్తామని ఒప్పందం కుదుర్చుకోగా, అప్పట్లో రూ.1.50లక్షలు చెల్లించారు. మిగిలిన సొమ్ము కోసం భర్తతో పాటు అత్తమామలు కూడా ప్రతి రోజూ ఆమెను వేధిస్తుండేవారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ప్రత్యూష, ఈ నెల 3న ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను గాజువాకలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం ప్రత్యూష మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. తన కుమార్తె మృతికి అత్తమామల వేధింపులే కారణమని తల్లి నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీపీ చిట్టిబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పర్యాటక ప్రాజెక్టుల అనుమతులు వేగవంతం
వీఎంఆర్డీఏ కమిషనర్ ఆదేశం విశాఖ సిటీ: పర్యాటక ప్రదేశాల్లో నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను సత్వరమే మంజూరు చేసి, పెట్టుబడిదారులు పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్భరత్ అధికారులను ఆదేశించారు. గురువారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో ఎయిర్పోర్ట్, యూసీడీ, జీవీఎంసీ, ఏపీఈపీడీసీఎల్, అటవీ తదితర శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. గతేడాది విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న 43 పర్యాటక ఒప్పందాల అమలు తీరుపై ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన అనుమతులను నేవీ, ఎయిర్పోర్ట్ అథారిటీ, జీవీఎంసీ వంటి సంస్థలు సకాలంలో మంజూరు చేయాలని కమిషనర్ సూచించారు. ఏవైనా అడ్డంకులు ఎదురైతే శాఖల మధ్య సమన్వయంతో వాటిని అధిగమించి ముందుకు సాగాలన్నారు. సమావేశంలో సీఏవో హరిప్రసాద్, జిల్లా పర్యాటక శాఖాధికారి మాధవి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎర్రబుక్లు, పిచ్చిబుక్లు మమ్మల్ని ఏమీ చేయలేవు: అంబటి
సాక్షి, విశాఖపట్నం: తన ఇంటిపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మానిటర్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలీసుల సాక్షిగా తన ఇంటిపై దాడి జరిగిందన్నారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. భగవంతుడి దయ వల్ల తనను చంపలేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కాపు నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. విశాఖలోని కరణం ధర్మశ్రీ నివాసంలో విశాఖ కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఇటీవల పరిణామాలపై కాపు నేతలు చర్చించారు. అలాగే, కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు, అరెస్ట్లపై కాపు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేతలు పాల్గొన్నారు.అనంతరం, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీకి చెందిన వారు నా ఇంటిపైకి వచ్చారు.. కులం పేరుతో దూషించారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు?. గుంటూరు నడి బొడ్డున నా ఇంటిపై దాడి చేశారు. నా ఇంటిపై దాడిని టీవీ చానెల్స్ లైవ్ ఇస్తున్నా ప్రభుత్వం తెలియనట్టుగా ఉంది. భగవంతుడి దయ వల్ల నన్ను చంపలేదు. రెడ్బుక్ను మా కుక్క లెక్కచేయదంటే లోకేష్కు కోపం వచ్చిందేమో.నేను సెంటర్ జైల్లో ఉన్నప్పుడు నా మీద ఎంతో ప్రేమ అభిమానం చూపించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు తరలి వచ్చారు. నా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నాపై దాడి చేసి అక్రమంగా జైలుకు పంపారు. నన్ను 18 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు. నాపై జరిగిన దాడి ఒక కులంపై మరొక కులం చేసిన దాడిగా భావించాలి. చరిత్రలో ఎన్నడు ఎప్పుడు జరగని దాడి నాపై జరిగింది. టీడీపీ గుండాలకు అలుపు వచ్చే వరకు దాడి చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 12 గంటలకు దాడి జరిగింది. చంద్రబాబు పతనం ప్రారంభమైంది. నాపై చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాను. ఎర్రబుక్కులు, పిచ్చిబుక్కులు మమ్మల్ని ఏమీ చేయలేవు.కులాలను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు. టీడీపీ గూండాలు వంగవీటి రంగాను దారుణంగా చంపారు. పోలీసులు సహకారంతో రంగాను హత్య చేశారు. అదేవిధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని నాపై దాడి చేశారు. కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీ కోసం ముద్రగడ ఉద్యమం చేశారు. కాపుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడను జైల్లో పెట్టారు, చంపాలని చూశారు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు కాబట్టి కాపులు మా వైపు ఉన్నారనుకుంటే అది మీ భ్రమ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యం
మహారాణిపేట: జిల్లాలో విద్యుత్ రంగ అభివృద్ధి పనులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ఎంపీ ఎం.శ్రీభరత్ బుధవారం సమీక్షించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో జరిగిన జిల్లా విద్యుత్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ముందుగా జిల్లాలో అమలు చేస్తున్న పథకాలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ వివరించి, 11 మండలాల ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు. వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్–ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అలాగే పీఎం కుసుమ్ పథకం ఉద్దేశాలను ప్రచారం చేస్తూ, వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ వ్యవస్థలను ప్రోత్సహించాలని సూచించారు. భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు, ఈహెచ్టీ సబ్స్టేషన్లు, 33/11 కేవీ సబ్స్టేషన్ల పనుల పురోగతిని సమీక్షించిన ఎంపీ.. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్డీఎస్ఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, విద్యుత్ నష్టాల తగ్గింపు, స్మార్ట్ మీటరింగ్, మౌలిక సదుపాయాల బలోపేతంపై దృష్టి సారించాలని సూచించారు. డిస్కం ఎస్ఈ శ్యాంబాబు, ట్రాన్స్కో ఎస్ఈ శివరామ కృష్ణ, ఈఈలు ధర్మరాజు, శ్రీనివాసరావు, వీకే నాయుడు, సింహాచలం నాయుడు, డీఈఈ సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ శ్రీ భరత్ -
12వ పీఆర్సీ కమిషన్ తక్షణం వేయాలి
మహారాణిపేట: రాష్ట్రంలో 12వ పీఆర్సీ కమిషన్ నియామకంతో పాటు, మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని జిల్లా జేఏసీ నూతన చైర్మన్, ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన జేఏసీ నూతన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బకాయిల విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న నాలుగు విడతల డీఏలను మంజూరు చేయాలని, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల హక్కుల సాధన కోసం భవిష్యత్తులో సంఘటితంగా పోరాడాలని జేఏసీ కో–చైర్మన్ ఎం.రవికుమార్ పిలుపునిచ్చారు. జిల్లా జేఏసీ నూతన కార్యవర్గం ఎన్నిక ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల సంఘాలతో కూడిన జిల్లా జేఏసీ కార్యవర్గాన్ని ఈ సందర్భంగా పునర్ వ్యవస్థీకరించారు. నూతన చైర్మన్గా కె.ఈశ్వరరావును ఎన్నుకున్నారు. కో–చైర్మన్లుగా ఎ.కె.శివాజీ, ఈ.పైడిరాజు, ఎం.రవికుమార్, వైస్ చైర్మన్లుగా కరుణకుమార్, జి.శ్రీను, టి.భవాని, డి.డి.ప్రసాదరావు, బి.హరినాధరావు, కార్యదర్శిగా ఎం.శ్రీను (పీఆర్టీయూ), కోశాధికారిగా పి.అప్పలరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏవీఎస్ఎస్వీ సుబ్రహ్మణ్యం, జాయింట్ కార్యదర్శులుగా పి.వి.కిరణ్, కె.ఆనందకుమార్, బి.వెంకటరావు, కె.జగదీష్కుమార్, జి.రవికుమార్, పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. -
పదింతల గందరగోళం
ఆరిలోవ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ తీరు ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షలు ఈ నెల 16న ప్రారంభం కానున్నాయి. పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేషన్, నిర్వహణ బాధ్యతలను విద్యాశాఖ పర్యవేక్షిస్తుంది. అయితే, ఈసారి ఇన్విజిలేటర్ల నియామక ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందంటూ ఉపాధ్యాయ వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది. మారిన నియామక ప్రక్రియ గత విద్యా సంవత్సరం వరకు జిల్లా విద్యాశాఖ అధికారులే పరీక్షల నిర్వహణ బాధ్యతలను చూసేవారు. కానీ, ఈ ఏడాది రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ నేరుగా ఈ ప్రక్రియను చేపట్టింది. ఈ మార్పు ఉపాధ్యాయులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన ఉపాధ్యాయులకు వరస నిర్ణయాలు నిరాశ కలిగిస్తున్నాయి. ఇప్పటికే పెండింగ్లో ఉన్న డీఏలు, ఇతర సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు పరీక్షల నిర్వహణలోనూ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వారు మండిపడుతున్నారు. నేరుగా ఉత్తర్వులు కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కార్యాలయం నుంచే ఇన్విజిలేటర్లతో పాటు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ల ఎంపిక జరిగింది. వారికి నేరుగా ఆర్డర్ కాపీలు పంపడంతో జిల్లా అధికారులకు సైతం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో ప్రతి హైస్కూల్, యూపీ స్కూల్ నుంచి ఒకరు లేదా ఇద్దరిని ఎంపిక చేసేవారు. అవసరమైతే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను కూడా తీసుకునేవారు. దీని వల్ల పాఠశాలల్లో మిగిలిన ఉపాధ్యాయులతో తరగతులు సజావుగా సాగేవి. కానీ, ప్రస్తుతం ఒకే పాఠశాల నుంచి ఐదారుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. కొన్ని పాఠశాలల నుంచి అసలు ఎవరినీ తీసుకోలేదు. దీని వల్ల ఐదారుగురు ఉపాధ్యాయులు పరీక్ష విధులకు వెళ్లే పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు బోధన పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 133 కేంద్రాలు ఈ ఏడాది జిల్లాలో 30,633 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం 133 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక సీఎస్, ఒక డీవోతో పాటు సుమారు 1,850 మంది సిబ్బందిని కేటాయించారు. నిబంధనల ప్రకారం 60 ఏళ్ల లోపు వారిని నియమించాల్సి ఉండగా, 58 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారినే ఎక్కువగా ఎంపిక చేయడం గమనార్హం. పాత పద్ధతిలోనే నియామకాలు జరిపి ఉంటే పాఠశాలల నిర్వహణకు ఇబ్బంది ఉండేది కాదని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. -
బెస్ట్ ఫిజిక్ చాంపియన్ మను కృష్ణ
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా జరుగుతున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ చాంపియన్షిప్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ పోటీల్లో కన్నూరు యూనివర్సిటీకి చెందిన ఎన్.మను కృష్ణ చాంపియన్ ఆఫ్ ది చాంపియన్గా నిలిచారు. ఏయూ మాజీ ఉపకులపతి, సెంచూరియన్ యూనివర్సిటీ చాన్సలర్ ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు, ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ సంయుక్తంగా మను కృష్ణకు ట్రోఫీని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు మాట్లాడుతూ.. క్రీడల్లో పాల్గొనడం, సానుకూల దృక్పథం కలిగి ఉండటం ఎంతో ప్రధానమని పేర్కొన్నారు. ఏయూ వీసీ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ క్రీడా వేడుకను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఏయూ క్రీడా సంచాలకుడు ఆచార్య ఎన్. విజయ్ మోహన్ మాట్లాడుతూ.. శతాబ్ది ఉత్సవాల వేళ ఈ పోటీల నిర్వహణకు సహకరించిన ఏఐయూకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. విశ్వవిద్యాలయాలకు అందించే ఆల్రౌండ్ చాంపియన్షిప్ విభాగం ప్రథమ స్థానంలో సంయుక్తంగా మంగళూరు విశ్వవిద్యాలయం, కన్నూరు యూనివర్సిటీలు నిలిచాయి. తేజ్ బహదూర్ సింగ్ యూనివర్సిటీ ద్వితీయ స్థానం, సావిత్రీబాయి ఫూలే విశ్వవిద్యాలయం తృతీయ స్థానం సాధించాయి. విజేతలకు అతిథులు ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో ఏఐయూ అబ్జర్వర్ డాక్టర్ కౌకబ్ అజీమ్, ఏయూ క్రీడా విభాగాధిపతి ఆచార్య ఎ.పల్లవి, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు, విశ్రాంత బాడీబిల్డింగ్ కోచ్ డాక్టర్ ఆర్.వి.ఎన్. రత్నాకర్, బాడీబిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కె.గురునాథరావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ ఆపన్నహస్తం
సాక్షి, విశాఖపట్నం: బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఏడేళ్ల పాపకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆపన్నహస్తం అందించారు. రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్ను 39వ వార్డుకు చెందిన ఎండీ హఫీజ్ కలిసి తన పాప దయనీయ స్థితిని విన్నవించారు. దీంతో చలించిపోయిన వైఎస్ జగన్ తక్షణమే పాప చికిత్స నిమిత్తం వైఎస్సార్సీపీ నుంచి రూ.2 లక్షల సాయం అందజేశారు. -
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
వైఎస్ జగన్ విశాఖ పర్యటన అప్డేట్స్.. 👉విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుటుంబసభ్యులను వైఎస్ జగన్ కలిశారు. విశాఖ రాణాప్రతాప్ నగర్లోని ఆయన నివాసంలో ఇటీవల వివాహం జరిగిన వాసుపల్లి గణేష్ రెండో కుమారుడు వాసుపల్లి సాకేత్, శ్రావణిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు.అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుఅరకు వ్యాలీ తుంగల్గూడ గ్రామంలోని రాధాక్రిష్ణ ఆలయంలో వివాహా వేడుకవివాహ వేడుకలో నూతన వధూవరులు అశ్వని, చాణక్యలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన వైఎస్ జగన్ వైఎస్ జగన్కు స్వాగతం అరకు చేరుకున్న వైఎస్ జగన్అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరు కానున్న వైఎస్ జగన్.గిరిజన సాంప్రదాయ దింసా నృత్యంతో వైఎస్ జగన్కు స్వాగతం పలకనున్న మహిళలు..👉విశాఖ బయలుదేరిన వైఎస్ జగన్. 👉వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ వేడుకకు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్కు హాజరవుతారు.👉గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం, విశాఖ నుంచి హెలికాప్టర్లో అరకు వ్యాలీ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తంగులగూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయం వద్దకు వెళ్తారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ రిసెప్షన్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.👉మధ్యాహ్నం అరకు నుంచి హెలికాప్టర్లో తిరిగి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన మర్రిపాలెం రాణా ప్రతాప్నగర్కు చేరుకుని అక్కడ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చిన్న కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై ఆశీస్సులు అందజేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్పోర్టు నుంచి విమానంలో బయలుదేరుతారు. -
ఈడ్చుకెళ్లడమేనా..?
సాధికారత అంటేబీచ్రోడ్డు: ఒకవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటూ ప్రగల్భాలు.. మరోవైపు హక్కుల కో సం పోరాడుతున్న మహిళా లోకంపై పోలీసుల బూట్ల చప్పుళ్లు.. అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై ప్రభుత్వం ప్రయోగించిన నిర్బంధకాండపై విశాఖ నగరం అట్టుడికిపోయింది. విజయవాడలో అంగన్వాడీల అరెస్టును నిరసిస్తూ జీవీఎంసీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ చేపట్టిన వేలాది మంది కార్యకర్తలు, లలితా జ్యువెలర్స్ జంక్షన్ వద్ద రాస్తారోకోతో హోరెత్తించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండుటెండలోనే రోడ్డుపై బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు ఇచ్చి మోసం చేశారు: ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్వి కుమార్, అంగన్వాడీ యూనియన్ నాయకులు ఎల్.దేవి, కె.వెంకటలక్ష్మి, ఉప ప్రధాన కార్యదర్శి బందా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు సమ్మె నిర్వహించినప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని, గ్రాట్యుటీ అమలు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం దారుణమని వారు మండిపడ్డారు. తెల్లవారుజామునే మహిళల అరెస్ట్లుమార్చి 22న ‘చలో విజయవాడ’ పిలుపుతో శాంతియుత ధర్నా చేపట్టగా చర్చలకు పిలుస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. తెల్లవారుజామున 4.30 గంటలకు పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి మహిళలను ఈడ్చుకెళ్లి వాహనాల్లో కుక్కేశారని అన్నారు. అరెస్టు చేసిన వారిని సుమారు 100 కి.మీ దూరంలోని ఏలూరు, చిలకలూరిపేట, జంగారెడ్డిగూడెం, పిడుగురాళ్ల, గుంటూరు, మంగళగిరి తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారని తెలిపారు. ప్రాథమిక అవసరాలకు కూడా అనుమతి ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. మహిళా సాధికారత మాటల్లోనేనా? ఒకవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారతపై ప్రకటనలు చేస్తూ, మరోవైపు మహిళలపై ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడటం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని, అంగనవాడీ యూనియన్తో చర్చలు ప్రారంభించాలని, గతంలో ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గురజాడ విగ్రహం వద్ద మానవహారం సుమారు రెండు గంటల పాటు పోలీసులతో వాదోపవాదాలు జరిగిన అనంతరం విజయవాడలో అరెస్టు చేసిన వారిని విడుదల చేసినట్లు సమాచారం అందడంతో ఇక్కడి ఆందోళనను విరమించారు. అనంతరం గురజాడ అప్పారావు విగ్రహం వద్ద భారీ మానవహారం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ ఇచ్చే భవిష్యత్ కార్యాచరణ పిలుపును విజయవంతం చేయాలని నాయకులు కోరారు. వందలాది అంగన్వాడీ కార్యకర్తలు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రంగు రంగ వై భవంగా..
హోలీ సందర్భంగా విశాఖ సాగర తీరం రంగుల లోకమైంది. నగరం రంగుల హరివిల్లును తలపించింది. మంగళవారం ఉదయం నుంచే బీచ్ రోడ్డులోని కోకో ఎరీనా పరిసరాలు యువత కేరింతలతో మార్మోగాయి. చిన్నారులు, పెద్దలు, స్నేహితులతో కలిసి పరస్పరం రంగులు పూసుకుంటూసందడి చేశారు. కేవలం రంగులే కాదు.. ఆత్మీయ అనుబంధాలను కూడా పంచుకుంటూ హ్యాపీ హోలీ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగుల ఆట అనంతరం సముద్ర స్నానాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. బుధవారం కూడా నగరంలో హోలీ సంబరాలు కొనసాగనున్నాయి. ప్రధాన హోటళ్లు, ఎంజీఎం పార్కులో రెయిన్ డ్యాన్స్లు, డీజే హంగామాతో భారీ ఈవెంట్లు జరగనున్నాయి. – ఏయూ క్యాంపస్ -
నేడు మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన
అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి ఇళ్లలో వివాహ వేడుకలకు హాజరు సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ వేడుకకు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్కు హాజరవుతారు. ఈ మేరకు పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పర్యటన వివరాలిలా.. ● ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ● ఉదయం 10.50 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ● ఉదయం 11.40 గంటలకు విశాఖ నుంచి హెలికాప్టర్లో అరకు వ్యాలీ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తంగులగూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయం వద్దకు వెళ్తారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ రిసెప్షన్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ● మధ్యాహ్నం 1.10 గంటలకు అరకు నుంచి హెలికాప్టర్లో తిరిగి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ● మధ్యాహ్నం 1.30 గంటలకు రోడ్డు మార్గాన మర్రిపాలెం రాణా ప్రతాప్నగర్కు చేరుకుంటారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ చిన్న కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై ఆశీస్సులు అందజేస్తారు. ● మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్పోర్టు నుంచి విమానంలో బయలుదేరుతారు. -
అప్పన్నకు పెళ్లి కుదిరిందోయ్..
సింహాచలం: సింహగిరిపై వెలసిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారికి పెళ్లిసందడి మొదలైంది. సింహగిరి నుంచి కొండదిగువకు విచ్చేసి తన సోదరి అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారు వద్దకు వెళ్లి తనకు పిల్లనివ్వమని స్వామివారు ప్రార్థించారు. తొలుత నిరాకరించిన అమ్మవారు, స్వామివారి వైభవం, భక్తజనసందోహం చూసి ఆశ్చర్యపడి చివరకు అంగీకరించారు. దీంతో ఈ నెల 19న ఉగాది రోజు పెళ్లిరాట ఉత్సవం, అలాగే 29న చైత్ర శుద్ధ ఏకాదశి నాడు వార్షిక కల్యాణోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాల్గుణ పౌర్ణమి డోలోత్సవం వైభవం పాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి డోలోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఆనవాయితీగా అడవివరం గ్రామంలోని కొండదిగువ పుష్కరిణి కల్యాణమండపంలోని ఉద్యానవన మండపంలో ఈ ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈసారి చంద్రగ్రహణం కారణంగా వేకువజామునే డోలోత్సవం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గడిచిన యాభై ఏళ్లలో ఇంత తెల్లవారుజామున డోలోత్సవం జరగలేదని దేవస్థానం వైదికులు తెలిపారు. పల్లకీ ఊరేగింపు.. భక్తుల పరవశం ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని శ్రీదేవి, భూదేవి సమేతంగా విశేషంగా అలంకరించి సింహగిరి నుంచి పల్లకీలో తెల్లవారుజామున 4 గంటలకు కొండదిగువకు తీసుకొచ్చారు. దేవస్థానం ఈవో జె.వెంకటరావు దంపతులు, అధికారులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద హారతుల మధ్య స్వామివారిని ఆహ్వానించారు. అనంతరం పుష్కరిణి సత్రం వద్ద ఉద్యానవన మండపంలో ఏర్పాటు చేసిన డోలిపై వేంచేపచేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, చూర్ణోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. అర్చకులు సమర్పించిన వసంతాలను భక్తులపై చల్లగా, స్వామికి పెళ్లికుదిరిన ఆనందంలో భక్తులు ఒకరిపై ఒకరు వసంతాలు జల్లుకుని ఆనంద డోలికల్లో మునిగిపోయారు. అనంతరం పానకం ప్రసాదంగా అందించారు. గ్రామ తిరువీధి మహోత్సవం : అడవివరంలో తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. పెళ్లికొడుకు అలంకరణలో ఇంటిముందుకు విచ్చేసిన స్వామివారికి గ్రామస్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిని తిరిగి సింహగిరికి చేర్చారు. దేవ స్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేదపండితులు, పారాయణదారులు ఈ ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
గ్రహణం పట్టింది.. రోకలి నిలబడింది
తగరపువలస: ఇది ఒక వైజ్ఞానిక అద్భుతమో లేక తరాల నాటి నమ్మకమో తెలీదు కానీ.. నేటికీ పల్లెల్లో గ్రహణ గడియలను లెక్కగట్టడానికి రోకలిని ఉపయోగిస్తున్నారు. సూర్య, చంద్ర గ్రహణాల సమయాల్లో గ్రామీణులు అనుసరించే ‘రోకలి సూత్రం’భీమిలి ప్రాంతంలో మరోసారి చర్చనీయాంశమైంది. జీవీఎంసీ భీమిలి జోన్ వలందపేటలో మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా మహిళలు ఈ పద్ధతిని ప్రదర్శించారు. ఒక కంచు గిన్నెలో పాలు పోసి, అందులో రోకలిని నిలబెట్టి పూజలు చేశారు. గ్రహణం పట్టినంత సేపు ఆ రోకలి ఆధారం లేకుండా నిటారుగా నిలబడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. సుమారు మూడు గంటల పాటు అలాగే ఉన్న రోకలి, గ్రహణం వీడగానే దానంతట అదే పక్కకు వాలిపోయింది. దీన్ని బట్టే గ్రహణ పట్టు విడుపులను తాము గుర్తిస్తామని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. -
గ్రహణ ం వేళ.. గిరిపై నిశ్శబ్దం
సింహాచలం/మహారాణిపేట: చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సింహాచలం పుణ్యక్షేత్రంతో పాటు నగరంలోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. గ్రహణ సమయంలో దర్శనాలు నిలిపివేయడంతో ఆలయాల ప్రాంగణాలు, పరిసరాలు భక్తులు లేక నిర్మానుష్యంగా మారాయి. గ్రహణం ముగిసిన అనంతరం ఆలయాల్లో సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి యథావిధిగా భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కలగనుంది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి కొలువై ఉన్న సింహగిరి రోజంతా భక్తులు లేక వెలవెలబోయింది. ఉదయం 8 గంటలకే ఆలయ భోగమండపం, రాజగోపురం తలుపులను అర్చకులు మూసివేశారు. దీంతో మాడ వీధి, దర్శన క్యూలు, ఘాట్ రోడ్డు, అన్నదాన భవనం తదితర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. రాత్రి 7 గంటల తర్వాత ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ, రాత్రి ఆరాధన, పవళింపు సేవ నిర్వహించారు. బుధవారం ఉదయం 6.30 గంటల నుంచి భక్తులకు దర్శనాలకు అనుమతించనున్నారు. శ్రీ సంపత్ వినాయగర్ ఆలయాన్ని ఉదయం 11 గంటలకు మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనం లభిస్తుందని ఆలయ ఈవో డి.వి.వి.ప్రసాదరావు తెలిపారు. బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో ఉదయం స్వర్ణపుష్పార్చన, పంచామృతాభిషేకం తదితర నిత్య పూజల అనంతరం ఆలయాన్ని మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత సంప్రోక్షణ చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు. రుషికొండలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేశారు. బుధవారం సంప్రోక్షణ తర్వాత యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు. మూసివేసిన సంపత్ వినాయగర్ ఆలయం, అప్పన్న ఆలయ భోగమండపం వద్ద తలుపులు మూస్తున్న అర్చకులు -
పోర్టులో లోవోల్టేజ్ షోర్ పవర్ సిస్టమ్ సౌకర్యం
సాక్షి, విశాఖపట్నం : నౌకల నుంచి వెలువడే ఉద్గారాలతో పాటు.. పోర్టు నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకు వంద శాతం చర్యలు తీసుకుంటున్నామని విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ డా. అంగముత్తు తెలిపారు. పోర్టులోని ఈక్యూ–1 బెర్త్ వద్ద రూ.5.4 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 1000 కేవీఏ సామర్థ్యం గల లోవోల్టేజ్ షోర్ పవర్ సిస్టమ్ సౌకర్యాన్ని మంగళవారం ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన రోమాస్ ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేశామని తెలిపారు. ‘హరిత్ సాగర్’ కార్యక్రమంలో భాగంగా పర్యావరణహిత పోర్టు కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు వీపీఏ నిరంతరం శ్రమిస్తోందన్నారు. ఇది పోర్టులో ప్రత్యామ్నాయ మారీటైమ్ పవర్(ఏఎంపీ) కార్యక్రమం దశలవారీ అమలులో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరాంజితో పాటు వీపీఏ అధికారులు, విభాగాధిపతులు పాల్గొన్నారు. -
బీచ్రోడ్డులో ప్రైవేటు బస్సు దగ్ధం
కొమ్మాది: రుషికొండ బీచ్రోడ్డులో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఓంకార్ టూర్స్ అండ్ ట్రావెల్స్కు చెందిన ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని గవర్నర్ బంగ్లా ప్రాంతం నుంచి భీమిలిలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు వెళ్లేందుకు ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరింది. బస్సు పెదరుషికొండ జంక్షన్కు చేరుకోగానే, ఇంజన్ భాగం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడాన్ని డ్రైవర్ రాజేష్ గమనించాడు. వెంటనే అప్రమత్తమైన ఆయన బస్సును రోడ్డు పక్కకు నిలిపి కిందకు దిగిపోయాడు. చూస్తుండగానే మంటలు భారీ స్థాయిలో వ్యాపించి బస్సు మొత్తం అంటుకుంది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రధాన కూడలి సమీపంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. పీఎంపాలెం సీఐ బాలకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని, అటుగా వాహనాలేవీ వెళ్లకుండా స్టాపర్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను మళ్లించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం -
చేయి తడవనిదే.. పని జరగదు
మహారాణిపేట: రెవెన్యూ శాఖ అవినీతి ఆరోపణల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రధానంగా తహసీల్దార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారుతున్నాయి. ప్రజా సేవే పరమావధిగా పనిచేయాల్సిన ఉద్యోగులు అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇక్కడ ఏ పని జరగాలన్నా.. ముడుపులు ముట్టజెప్పుకోవాల్సిందేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దళారుల అండ లేకుండా అధికారుల్ని కలిస్తే పని జరిగే ప్రసక్తే లేదన్న ఆక్షేపణలున్నాయి. ఇక్కడిది షరా‘మామూళ్లే’! భూమి హక్కు పత్రం కావాలన్నా, చిన్న చిన్న తప్పుల సవరణ జరగాలన్నా, పలు ధ్రువీకరణ పత్రాలు కావాలన్నా.. తహసీల్దార్ కార్యాలయంలో ముడుపులు తప్పనిసరి. అందినకాడికి దండుకోవడం రెవెన్యూ సిబ్బందికి క్యాష్తో పెట్టిన విద్యగా మారిందన్న ఆరోపణలున్నాయి. ముడుపులు ముట్టనిదే ఓ ఫైల్నూ వారు ముట్టుకోరంటే అతిశయోక్తి కాదు. నెలలు, ఏళ్ల తరబడి ఫైల్ పెండింగ్లో ఉన్నా.. అడిగే దిక్కుండదు. ఫైల్ నడిపేందుకు గడువు తేదీ అంటూ ఏదీ లేకపోవడంతో సిబ్బంది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఏసీబీ అధికారులు దాడులు చేసి అడపాదడపా పట్టుకుంటున్నా.. రెవెన్యూ సిబ్బందిలో మార్పు మాత్రం రాని పరిస్థితి. కూటమి నేతలే దళారీలు రెవెన్యూశాఖలో వీఆర్వో నుంచి తహసీల్దార్ వరకు వారిని సంతోష పెట్టనిదే ఫైళ్లకు మోక్షం దక్కదని అందరికీ తెలిసిందే. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీలకు చెందిన చోటామోటా నాయకులే పైరవీలు చేసే దళారుల అవతారమెత్తారు. కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు, సర్వే, సబ్ డివిజన్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, మ్యూటేషన్ ఇలా ఏ పని చేయాలన్నా.. వీరి ద్వారానే. పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్, భూసర్వే, ఆన్లైన్ వన్ బి, భూమి వివరాలు నమోదు, ధ్రువపత్రాల జారీ, ఇసుక రవాణా తదితర వ్యవహరాల్లో వీరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. నగర పరిధిలోని తహసీల్దార్ కార్యాలయాలన్నింటిలోనే ఇదే తంతు. కొన్ని కీలక తహాసీల్దార్ కార్యాలయాల్లో పోస్టింగుల కోసం కూటమి నాయకులకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పుకుని మరీ కొలువుదీరారు. అందుకే ఆ మొత్తానికి పదింతలు దండుకునే పనిలో పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలునా.. ఫోకల్ పోస్టుల్లోనే ఇటీవల కొంత మంది తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్వోలపై చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారులు కూడా దృష్టి పెట్టి.. ఆరోపణలున్న సిబ్బందిని బదిలీ చేశారు. అయితే వారికి ఫోకల్ పోస్టులివ్వడం విశేషం. అవినీతి ఆరోపణలున్న వారిని సాధారణంగా నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేస్తారు. ఇక్కడ కూడా పైరవీలు, ముడుపులకు తలొగ్గి ఫోకల్ పోస్టులే కేటాయించారన్న ఆక్షేపణలున్నాయి. వసూళ్లలో కొత్త దారులు రెవెన్యూశాఖలో అవినీతి కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు బల్ల కింద చేతివాటం ప్రదర్శించే వారు. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా అవినీతి నడుస్తోంది. ఫోన్ పే, గూగుల్ పే తదితర మార్గాల్లో తమ బినామీల నెంబర్లకు డబ్బులు పంపించుకుంటున్నారు. ఇటీవల కొంత మంది రైతులు మీ వీఆర్వోలు డబ్బులిస్తే తప్ప పనిచేయట్లేదని సంబంధిత తహసీల్దార్లకు చెప్పారు. అయితే వారు మాత్రం చాలా ధీమాగా.. వాళ్లచేత పనిచేయించుకోవాల్సింది మీరేనని, మేమేం చేయగలమని చెప్పడంతో అవాక్కవడం రైతుల వంతయింది. అడంగల్, 1బీ, మ్యుటేషన్, 22ఏ జాబితా నుంచి తొలగింపు తదితరాలకు భారీగా ముడుపులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి వ్యవహారం ముదిరడం వల్లే రూరల్ తహసీల్దార్ హత్య ఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే..! ఈ వ్యవహారాలన్నీ జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినా తెలియనట్లుగా వ్యవహరిస్తుండటం కొసమెరుపు. వారసత్వ భూమిపై హక్కు మార్పునకు.. భీమిలి నియోజకవర్గం, పద్మనాభం మండలం రేవిడి గ్రామానికి చెందిన కర్రి శ్రీనివాసరావు(పేరు మార్చాం) తండ్రి మరణించాడు. వంశ పారంపర్యంగా వస్తున్న భూమిని తన పేరిట మార్చుకునేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నాడు. ఇది జరిగి చాలా రోజులైనా పురోగతి లేదు. తహసీల్దార్ కార్యాలయంలో అర్జీదారు సంప్రదించగా.. ఆర్ఐను కలవాలని సూచించారు. ఆయనతో మాట్లాడినా ఇప్పటి వరకు తండ్రి పేరిట ఉన్న భూమిని శ్రీనివాసరావు పేరిట మాత్రం మారలేదు. యూఎల్సీ కోసం తిప్పలు సీతమ్మధార కేఆర్ఎం కాలనీలో కాండ్రేగులు సీతారత్నం(పేరు మార్చాం)కు 30 సెంట్ల భూమి యూఎల్సీలో ఉంది. యూఎల్సీ సర్టిఫికెట్ తీసుకుంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. దీంతో కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. అది సీతమ్మధార కార్యాలయానికి చేరుకుంది. దాన్ని పరిశీలించి సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది. అర్జీదారు సర్వేయర్ను కలిశారు. రెండు, మూడుసార్లు తిరిగిన తర్వాత స్థలం చూడాలన్నారు. ఆ తర్వాత కూడా సర్టిఫికెట్ ఇచ్చేందుకు రోజుల తరబడి తిప్పుతున్నారు. -
స్వయంకృషితోనే సక్సెస్
మద్దిలపాలెం: సమాజానికి సేవ చేయాలన్న ఉన్నతమైన ఆశయం.. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సడలని ఆత్మవిశ్వాసం.. వెరసి ఆమెను విజయతీరాలకు చేర్చాయి. ఎలాంటి కోచింగ్ లేకుండా, ఒకవైపు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే, కేవలం ఆన్లైన్ వనరుల సాయంతో తొలి ప్రయత్నంలోనే గ్రూప్–2 సాధించి డిప్యూటీ ఎంపీడీవోగా ఎంపికై ంది పాండ్రంకి భవాని. ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భవాని స్ఫూర్తిదాయక ప్రయాణం ఆమె మాటల్లోనే... చిరుద్యోగి కుటుంబం నుంచి.. మా స్వస్థలం విజయనగరం జిల్లా జయతి గ్రామం. మాది ఒక చిన్న రైతు కుటుంబం. మా చదువుల కోసం మా తల్లిదండ్రులు విశాఖపట్నం వలస వచ్చారు. మా నాన్న పాండ్రంకి చిన్న అప్పల నాయుడు నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నారు. అమ్మ భారతి గృహిణి. వచ్చే అరకొర ఆదాయంతోనే ఎన్నో కష్టాలకోర్చి నాతో పాటు తమ్ముడిని మంచి చదువులు చదివించారు. చదువులో ఎప్పుడూ ముందే.. ఒకటి నుంచి పదో తరగతి వరకు నగరంలోని శ్రీ శారద విద్యా నిలయంలో చదివాను. 2016లో 10వ తరగతిలో 10/10 పాయింట్లు సాధించాను. ఇంటర్లో 1000కి 990 మార్కులు తెచ్చుకుని, ఎంసెట్ ద్వారా ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్(కంప్యూటర్ సైన్స్) సీటు సాధించాను. 2022లో 89 శాతం మార్కులతో బీటెక్ పూర్తి చేశాను. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయి. సమయపాలనే నా ఆయుధం ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేదాన్ని. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, సివిల్స్ లక్ష్యాన్ని పక్కన పెట్టలేదు. గైడెన్స్ ఇచ్చేవారు లేకపోవడంతో ఆన్లైన్ వనరులనే గురువుగా మలచుకున్నాను. ఉదయం 8 గంటలకే లైబ్రరీకి వెళ్లి, అక్కడే ఆన్లైన్లో సాఫ్ట్వేర్ విధులు నిర్వర్తిస్తూనే మిగిలిన సమయంలో చదువుకునేదాన్ని. ఇంటికి వచ్చాక రాత్రి 12 గంటల వరకు ప్రిపరేషన్ సాగేది. కొన్నిసార్లు నిద్ర కూడా పట్టేది కాదు. ఆ సమయాన్ని కూడా చదువుకే కేటాయించేదాన్ని. తొలి ప్రయత్నంలోనే గ్రూప్–2 విజయం సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న సమయంలోనే గ్రూప్–2 నోటిఫికేషన్ వచ్చింది. పక్కా ప్రణాళికతో చదివాను. 2026 జనవరిలో విడుదలైన ఫలితాల్లో.. ఎలాంటి కోచింగ్ లేకుండా తొలి ప్రయత్నంలోనే డిప్యూటీ ఎంపీడీవో పోస్టు సాధించాను. మా కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మొదటి వ్యక్తిని నేనే కావడం, మా అమ్మానాన్నల కళ్లలో ఆనందం చూడటం నాకెంతో తృప్తినిచ్చింది. లక్ష్యం ఐఏఎస్.. ప్రజలకు సేవ చేసి, నా వల్ల కనీసం ఒక కుటుంబానికై నా మేలు జరగాలన్నదే నా ఆకాంక్ష. 2024లో సివిల్స్ తొలి ప్రయత్నంలో విఫలమైనా నిరాశపడలేదు. ప్రస్తుతం సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాను. ఎలాగైనా సివిల్స్లో ర్యాంకు సాధించి ఐఏఎస్ కావాలన్నదే నా తుది లక్ష్యం. కుటుంబ బాధ్యత.. సివిల్స్ కల.. చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉండేది. ఒక రోజు పత్రికలో సివిల్స్ విజేతల గురించి చదివినప్పుడు నాలోనూ ఐఏఎస్ కావాలన్న ఆశయం ఏర్పడింది. బీటెక్ చదువుతున్నప్పుడు టాపర్స్ గురించి, వాళ్లు చదివిన విధానం, చదివే పుస్తకాల గురించి ఆన్లైన్లో చూస్తూ నాకంటూ ఒక ప్రణాళికను తయారు చేసుకోవాలనే ఆలోచన ఉండేది. కానీ, మా ఇల్లు నాన్న ఒక్కరి సంపాదన మీదే నడుస్తుండటంతో ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. కోచింగ్ తీసుకునే స్థోమత లేకపోవడంతో, కుటుంబానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో 2023లో కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చేరాను. -
క్రీడలతోనే మానసిక ఉల్లాసం
ఉత్సాహంగా ఏపీఈపీడీసీఎల్ అంతర డివిజన్ల క్రీడాపోటీలు విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగుల అంతర డివిజన్ల క్రీడా పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రైల్వే స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను సంస్థ సీఎండీ ఇమంది పృథ్వీతేజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. ఉద్యోగులు తరచూ క్రీడల్లో పాల్గొనడం వల్ల విధుల్లో మరింత చురుకుదనం వస్తుందని పేర్కొన్నారు. క్రీడలు కేవలం వినోదం కోసమే కాకుండా, ఉద్యోగుల్లో క్రమశిక్షణను, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. అనంతరం ఆయన బ్యాడ్మింటన్ ఆడి ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపారు. సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ టి.వి.సూర్యప్రకాష్ మాట్లాడుతూ.. క్రీడలు ఉద్యోగుల మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. కాగా.. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని డివిజన్ల నుంచి విద్యుత్ ఉద్యోగులు, క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పురుషుల విభాగంలో కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చదరంగం, క్యారమ్స్, మహిళల విభాగంలో తాడులాగుట, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చదరంగం, క్యారమ్స్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ తదితర పోటీలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
చదువుల కోవెల్లో బాహుబలులు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, మంగళవారం బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్(పురుషుల) చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. అర్జున అవార్డు గ్రహీత నీలంశెట్టి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ స్థాయి క్రీడా ఉత్సవానికి ఏయూ వేదిక కావడం సంతోషదాయకమని, క్రీడాకారులు పతకాలతో పాటు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆకాంక్షించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైవిధ్యమైన క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడాకారుల కఠోర సాధన, క్రమశిక్షణ అభినందనీయమని పేర్కొన్నారు. క్రీడలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఒక చాంపియన్తో సమానమన్నారు. ఏఐయూ అబ్జర్వర్ డాక్టర్ కౌకబ్ అజీమ్ మాట్లాడుతూ.. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని విజేతలుగా ఎదగాలని సూచించారు. ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య ఎన్. విజయమోహన్ మాట్లాడుతూ.. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 115 విశ్వవిద్యాలయాల నుంచి 509 మంది క్రీడాకారులు, 155 మంది కోచ్లు, మేనేజర్లు పాల్గొన్నట్లు తెలిపారు. మొత్తం ఎనిమిది విభాగాలలో పతకాలను అందించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా అతిథులను సత్కరించి, మిస్టర్ ఆల్ ఇండియా ట్రోఫీని ఆవిష్కరించారు. బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.గురునాథరావు, విశాఖ బిల్డర్స్ అసోసియేషన్ చీఫ్ పేట్రన్ కె.వేణుగోపాల్, ఏయూ విశ్రాంత బాడీబిల్డింగ్ కోచ్ డాక్టర్ ఆర్.వి.ఎన్ రత్నాకర్, ఏయూ రెక్టార్ ఆచార్య పి.కింగ్, ప్రిన్సిపాల్స్ ఆచార్య కె.సీతామాణిక్యం, ఎం.వి.ఆర్.రాజు, పద్మశ్రీ, ప్రొఫెసర్ జాలాది రవి, క్రీడా విభాగాధిపతి ఆచార్య ఎ.పల్లవి తదితరులు పాల్గొన్నారు. ఏయూలో ప్రారంభమైన ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలు -
గ్రహణ వేళ మంత్రజపం
ఏయూ క్యాంపస్: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం నగరవాసులు భారీ సంఖ్యలో సముద్ర తీరానికి తరలివచ్చారు. గ్రహణానికి ముందు చేసే పట్టు స్నానం, గ్రహణానంతరం ఆచరించే విడుపు స్నానం కోసం భక్తులు సాగర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. గ్రహణ సమయంలో చేసే మంత్ర జపం అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుందనే నమ్మకంతో, అనేకమంది భక్తులు సముద్ర తీరంలోనే కూర్చుని తమ ఇష్ట దైవాల నామస్మరణ, జపాలు చేస్తూ కనిపించారు. గ్రహణ దోష నివారణ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రహణ ప్రభావం ఉన్న నక్షత్రాల వారు బుధవారం ఉదయం ఆలయాల్లో ప్రత్యేక శాంతి పూజలు, అభిషేకాలు నిర్వహించుకోనున్నారు. విశాఖ తీరంలో పూజలు -
ఐఎన్ఎస్ విక్రాంత్ అరుదైన రికార్డు
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ మరో చరిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. సముద్ర గర్భంలో నిరంతర కార్యకలాపాలు సాగిస్తూ, అత్యంత క్లిష్టమైన 1,000వ ‘అరెస్టెడ్ ల్యాండింగ్’ని విజయవంతంగా పూర్తి చేసి తన యుద్ధ సన్నద్ధతను చాటుకుంది. తెల్లవారుజామున విమానాల ల్యాండింగ్ ప్రయోగం మొదలుకొని, అర్ధరాత్రి వేళ రికవరీల వరకు విక్రాంత్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మిగ్–29తో పాటు ఇతర యుద్ధ విమానాలు ఇప్పటివరకూ 1,000 సార్లు విజయవంతమైన సురక్షితమైన ల్యాండింగ్లు పూర్తి చేసుకున్నాయి. ఇటీవల విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్–2026లో పాల్గొని ఈ విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అనంతరం..విశాఖ నుంచి పశ్చిమ నౌకాదళ ప్రధాన కేంద్రం ముంబైకి తిరుగు పయనమైంది. ఈ నేపథ్యంలోనే 1,000 ల్యాండింగ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా..వెస్ట్రన్ ఫ్లీట్ ఫ్లాగ్ కమాండింగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ వివేక్ దహియా టీమ్ విక్రాంత్ను, ఎంబార్క్డ్ స్క్వాడ్రన్ని అభినందించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో ఈ విజయం సందర్భంగా సిబ్బంది సంబరాలు నిర్వహించారు. -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 103 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 103 వినతులు అందాయి. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్.ఎస్. వర్మలతో కలిసి బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు. అందిన వినతుల్లో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగానికి 51, ఇంజినీరింగ్ సెక్షన్కు 19, రెవెన్యూ విభాగానికి 16 వచ్చాయి. వీటితో పాటు ప్రజారోగ్యం, అడ్మినిస్ట్రేషన్, యూసీడీ విభాగాలకు సంబంధించి ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలపై అధికారులు తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి. నల్లనయ్య, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
● ఓహో ఓహో పావురమా.. వయ్యారాలు చూడుమా
ఓహో ఓహో పావురమా.. వయ్యారి పావురమా.. మావారి అందాలు నీవైన తెలుపుమా..’ అంటూ ఆనాటి సినీ కవులు పావురాన్ని రాయబారిగా పంపితే, నేడు పెద వాల్తేరు వాసులు ఆ కపోతాల సందడిని చూసి పరవశించిపోయారు. సాగర తీరపు గాలిలో స్వేచ్ఛగా విహరించే ఈ పక్షులు, పెద వాల్తేరు కూడలిని తమ ఆవాసంగా మార్చుకున్నాయి. ఇక్కడి విద్యుత్ వైర్లు వాటికి ఊయలలైతే, స్థానికులు ప్రేమతో చల్లే గింజలు పక్షులకు పంచభక్ష్య పరమాన్నాలవుతున్నాయి. కాంక్రీట్ వనంగా మారుతున్న నగరంలో వందలాది పావురాలు ఒక్కచోట చేరి చేస్తున్న సందడి చూస్తుంటే.. ఒక అద్భుతమైన పక్షుల లోకం ఇక్కడికి దిగివచ్చిందా అన్నట్లుగా ఉంది. ఈ దృశ్యం అటుగా వెళ్లే బాటసారులను సైతం ఆపి, కాసేపు ఆ పావురాల వయ్యారాలను తిలకించేలా చేస్తోంది. –ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
జీవీఎంసీ డ్రైవర్ల సమ్మె
డాబాగార్డెన్స్: వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ అనుబంధ జీవీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం డ్రైవర్లు సమ్మెకు దిగారు. వాహనాల బీమా, ఫిట్నెస్ గడువు ముగిసినా అధికారులు స్పందించకపోవడంతో ఈ ఆందోళన చేపట్టినట్లు యూనియన్ అధ్యక్షుడు పడాల రమణ తెలిపారు. ఇటీవల గాజువాక జోన్లో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఆ ఘటనకు అవుట్సోర్సింగ్ డ్రైవర్ సతీష్ను బాధ్యుడిని చేస్తూ డీఈ సునీల్, వెహికల్ ఇన్చార్జ్ సాయిబాబా వేధించడాన్ని ఆయన తప్పుబట్టారు. సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అన్ని జోన్ల డ్రైవర్లు విధులను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో అదనపు కమిషనర్ నల్లనయ్య, సీఎంవోహెచ్ డాక్టర్ నరేష్ కుమార్ యూనియన్ నేతలతో చర్చలు జరిపారు. ఉన్నతాధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే చర్చలు సానుకూలంగా సాగకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ నేతలు పడాల రమణ, కె.సత్యనారాయణ తదితరులు హెచ్చరించారు. అధికారుల తీరుపై ఏఐటీయూసీ ఆగ్రహం -
ఒడిశా యువకుడి ఆత్మహత్య
కూర్మన్నపాలెం: జీవీఎంసీ 88వ వార్డు పరిధిలోని మంగళపాలెం టిడ్కో గృహ సముదాయంలో సోమవారం ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని ఒడిశా రాష్ట్రం కందమాల్ జిల్లా నారాయణపురకు చెందిన అభినాష్ ప్రధాన్ (21)గా పోలీసులు గుర్తించారు. అభినాష్ ప్రధాన్ తన స్నేహితులతో కలిసి వారం రోజుల క్రితమే ప్లంబింగ్ పనుల కోసం మంగళపాలెం వచ్చాడు. ఆదివారం పనికి సెలవు కావడంతో ఆయన సమీపంలోని టిడ్కో ఇళ్ల వైపు వెళ్లాడు. ఆ సమయంలో పైపుల శబ్దం రావడంతో స్థానికులు ‘దొంగలు.. దొంగలు’ అంటూ కేకలు వేశారు. దీంతో భయాందోళనకు గురైన అభినాష్, అందరిలోనూ దొంగగా ముద్ర పడతాననే అవమాన భారంతో అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం ఖాళీగా ఉన్న ఒక టిడ్కో ఇంట్లోకి వెళ్లి సీలింగ్ హుక్కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా కార్మికుల సేవలు అపురూపం
మహారాణిపేట: వ్యర్థాలు ఏరుతూ మన పరిసరాలను శుభ్రపరిచే మహిళా కార్మికుల సేవలు అమూల్యమైనవని కలెక్టర్ హరేందిరప్రసాద్ కొనియాడారు. సోమవారం దళిత బహుజన్ రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో చెత్త ఏరుకునే మహిళా కార్మికుల గౌరవార్థం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ 48 మంది మహిళా కార్మికులకు అల్యూమినియం వంటపాత్రలు, చీపుర్లు, ప్లాస్టిక్ సామగ్రి అందజేశారు. కలెక్టరేట్ ఆవరణలోని రెవెన్యూ గెస్టు హౌస్లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చెత్త ఏరుకునే మహిళల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. దళిత బహుజన్ రీసోర్స్ సెంటర్ సేవలను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ అనిల్ కుమార్, సభ్యులు నిఖిల, అజయ్, గురునాథ్, ధనలక్ష్మి, వివిధ కాలనీల కమ్యూనిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు బస్సు దగ్ధం
పెదగంట్యాడ: పెదగంట్యాడ మండలంలోని వుడా కాలనీ డబుల్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి నిలిపి ఉంచిన ఓ ప్రైవేటు బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. న్యూపోర్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైత్ర ఎంటర్ప్రైజెస్కు చెందిన బస్సు ఐటీ పార్కు ఉద్యోగుల రవాణా కోసం అద్దెకు నడుస్తోంది. యథావిధిగా శనివారం సాయంత్రం అపోలో ఫార్మసీ సమీపంలో బస్సును పార్కింగ్ చేయగా.. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో పెదగంట్యాడ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే బస్సు సగానికి పైగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బస్సు యజమాని బొడ్డేపల్లి శ్రీనివాస్ కుమార్ ఫిర్యాదు మేరకు న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఆరిలోవ: నగరంలోని బీఆర్టీఎస్ మార్గంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఆరిలోవ ట్రాఫిక్ ఎస్.ఐ ధర్మేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఎంవీపీ కాలనీ ఉషోదయ జంక్షన్కు చెందిన ఆర్. సాయికిరణ్ (23) తన ద్విచక్ర వాహనంపై అడవివరం నుంచి హనుమంతవాక వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం సాయికిరణ్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయికిరణ్ తలకు తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించి, ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వీఎంఆర్డీఏ ఆర్థిక పరిపుష్టికి చర్యలు
విశాఖ సిటీ: వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలోని స్థలాలను వేలం ద్వారా విక్రయించి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలని చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ అధికారులకు సూచించారు. సోమవారం మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్తో కలిసి ఆయన డివిజన్ల వారీగా పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించాలని, పనుల పూర్తిలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి టీడీఆర్లు పంపిణీ చేసేలా జీవీఎంసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో సీఈ వినయ్కుమార్, కార్యదర్శి మురళీకృష్ణ, ఎస్ఈలు భవానీశంకర్, మధుసూదనరావు, కార్యనిర్వహక ఇంజినీర్లు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
డయల్ యువర్ ఈపీడీసీఎల్ సీఎండీకి 43 ఫిర్యాదులు
విశాఖ సిటీ : విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహించిన ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి 43 ఫిర్యాదులు వచ్చాయి. సోమవారం సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి వినియోగదారుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రధానంగా విద్యుత్ సరఫరాకు సంబంధించి లో–వోల్టేజ్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, రూఫ్ టాప్ సోలార్, విద్యుత్ లైన్ల మార్పు, విద్యుత్ బిల్లులు, విద్యుత్ స్తంభాల మధ్య వైర్లు వేలాడుతుండడం, సిబ్బంది కొరత, తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబరు 9493681912కు చాట్ చేయడం ద్వారా కూడా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని సీఎండీ సూచించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎం పాల్గొన్నారు. -
సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందే ప్రతి వినతిని అధికారులు సత్వరంగా పరిశీలించి, నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శాఖాధిపతి తన శాఖకు సంబంధించిన వినతులపై వ్యక్తిగత పర్యవేక్షణ ఉంచాలని, ఫిర్యాదుదారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి సమస్య తీవ్రతను తెలుసుకోవాలని సూచించారు. ముఖ్యంగా భూ వివాదాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఉపాధి వంటి అంశాలపై వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 285 వినతులు అందాయి. సాధారణ పీజీఆర్ఎస్కు వచ్చిన 224 వినతులలో జీవీఎంసీకి సంబంధించి 88, పోలీస్ శాఖకు 19, ఇతర శాఖలకు 117 ఉన్నాయి. రెవెన్యూ క్లినిక్ ద్వారా మరో 61 దరఖాస్తులు అందాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇన్చార్జి డీఆర్వో సత్తిబాబు, ఏడీసీ సత్యవేణి, విశాఖ, భీమిలి ఆర్డీవోలు, ఇతర మండల తహశీల్దార్లు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఆలిండియా బాడీ బిల్డింగ్ పోటీలు
మద్దిలపాలెం: బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పురుషుల బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ పోటీలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సోమవారం ప్లాటినమ్ జూబ్లీ బిల్డింగ్లో జరిగిన కోచ్లు, మేనేజర్ల సమావేశంలో ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య ఎన్. విజయమోహన్ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా 115 విశ్వవిద్యాలయాల నుంచి సుమారు 520 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. 60 కేజీల నుంచి 90 ప్లస్ కేజీల వరకు వివిధ విభాగాల్లో ఈ శరీర సౌష్టవ పోటీలు జరగనున్నాయి. క్రమశిక్షణతో క్రీడల్లో రాణించాలని, విజేతలకు ఈ నెల 4వ తేదీన మెడల్స్, ఛాంపియన్షిప్ ట్రోఫీలను అందజేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐబీబీఎఫ్ ప్రతినిధులు డాక్టర్ రత్నాకర్, కె. గురునాథరావు, వివిధ వర్సిటీల మేనేజర్లు పాల్గొన్నారు. -
పరుగుతో పరోపకారం
మహారాణిపేట: భారతీయ–ఆస్ట్రేలియన్ ఎండ్యూరెన్స్ అథ్లెట్ ఓం సతీజా చేపట్టిన ప్రతిష్టాత్మక ‘వన్ ఇండియా రన్’ సోమవారం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన పరుగు లక్ష్యాలను వివరించారు. యువతలో స్ఫూర్తి నింపడం, సామాజిక సేవపై అవగాహన కల్పించడమే ధ్యేయంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుమారు 5,000 కిలోమీటర్ల మేర ఈ పరుగు సాగుతోందని ఆయన తెలిపారు. భారతదేశ తూర్పు తీరం వెంబడి సుదీర్ఘ పరుగు చేపట్టిన తొలి వ్యక్తిగా నిలవడమే కాకుండా ‘ఉదయాన్ ఫౌండేషన్’ కోసం రూ. 60 లక్షల నిధులు సేకరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఓం సతీజా పేర్కొన్నారు. ఈ నిధులను అట్టడుగు వర్గాలకు చెందిన వారు, కుష్టు వ్యాధి ప్రభావిత కుటుంబాల పిల్లల విద్యావసరాల కోసం వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 32 రోజుల్లో 1,520 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించానని, ప్రతిరోజూ సుమారు 50 కిలోమీటర్ల మేర పరుగెడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ. 20 లక్షల మేర నిధులు సమకూరాయని, ఈ పరుగు ద్వారా ఆరోగ్యం, సామాజిక బాధ్యతపై ప్రజల్లో చైతన్యం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
నయనానందకరం
అనంతుని రథోత్సవం..పద్మనాభం: అనంత పద్మనాభ స్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన సోమవారం రాత్రి పద్మనాభ క్షేత్రం భక్తి సముద్రమైంది. స్వామివారి రథోత్సవం అత్యంత వైభవోపేతంగా, కనుల పండువగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజన వాహిని మధ్య అనంత పద్మనాభుడు రథారూఢుడై భక్తులకు దర్శనమిచ్చారు. శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు రథోత్సవానికి ముందు ఆలయ ప్రాంగణంలో వైదిక సదస్యం, విశేష హోమం, గ్రామ బలిహరణం వంటి కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం కుంతీ మాధవ స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన భారీ రథంపై స్వామివారిని అధిష్టింపజేశారు. వడివడిగా కదిలిన రథం : గాలిగోపురం వద్ద రథానికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవం ప్రారంభమైంది. అరిష్టాలు తొలగి, ఉత్సవం నిర్విఘ్నంగా సాగాలని రథం ముందు సంప్రదాయబద్ధంగా కుంభం (అన్నం) పోశారు. భక్తుల జయజయధ్వానాలు, ’గోవిందా.. గోవిందా’ అన్న నామస్మరణలతో రాజవీధులు మార్మోగాయి. భక్తులు భారీ తాళ్లను పట్టుకుని భక్తిశ్రద్ధలతో లాగడంతో అనంత పద్మనాభుని రథ చక్రాలు వడివడిగా ముందుకు కదిలాయి. భక్తుల వెల్లువ : ఈ వేడుకను వీక్షించేందుకు పద్మనాభం పరిసర ప్రాంతాల నుండే కాకుండా విశాఖపట్నం, విజయనగరం, సింహాచలం ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి నీరాజనాలు అర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. ఈవో పి.ఎల్.ఎన్. రాజు పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది, పోలీసులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. గోవింద నామస్మరణతో మార్మోగిన పద్మనాభం -
చేతికంది ఎన్నాళ్లయిందో...!
మహారాణిపేట: జిల్లాలో పేద ప్రజలకు అందే ప్రజా పంపిణీ వ్యవస్థ సరుకులపై చంద్రబాబు ప్రభుత్వం కత్తెర కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో రేషన్ డిపోల ద్వారా అనేక రకాల నిత్యావసరాలు అందిస్తామని హామీలు గుప్పించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచినా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. 22 నెలల కాలంలో కేవలం రెండుసార్లు మాత్రమే కందిపప్పు అందించి, ప్రస్తుతం దానికి పూర్తిస్థాయిలో స్వస్తి పలికారు. ఫలితంగా నిరుపేదలు పప్పు అన్నానికి నోచుకోని దైన్యం నెలకొంది. ప్రస్తుతం కేవలం బియ్యం, పంచదారతోనే సరిపెడుతూ ప్రభుత్వం కాలం వెల్లదీస్తోంది తప్ప, హామీ ఇచ్చిన విధంగా కందిపప్పు, రాగిపిండి, వంటనూనె వంటి సరుకుల ఊసే ఎత్తడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి కార్డుదారుడికి కిలో కందిపప్పు క్రమం తప్పకుండా సరఫరా అయ్యేది. డీలర్లకు 69 రూపాయలకు ఇచ్చి, కార్డుదారులకు 70 రూపాయలకు పంపిణీ చేసే ఈ విధానం వల్ల సామాన్యులకు ఎంతో మేలు జరిగేది. మార్కెట్లో కందిపప్పు ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, రేషన్ షాపులపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మందికి ఇప్పుడు ఆ సదుపాయం లేకపోవడంతో మార్కెట్లో భారీ ధరలకు కొనుగోలు చేయలేక సతమతమవుతున్నారు. విశాఖ అర్బన్ డీఎస్వో పరిధిలోని మధురవాడ, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి వంటి ప్రాంతాలతో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న 5,17,619 తెలుపు కార్డుదారులు ఈ విధానం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. రాగిపిండిరాదు..గోధుమ పిండి అంతంత మాత్రమే.. మరోవైపు రాగిపిండి సరఫరా కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ప్రస్తుతం అందిస్తున్న అరకొర గోధుమ పిండి పంపిణీలోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ ప్రాంతాల ప్రజలకు మాత్రమే గోధుమ పిండిని పరిమితం చేసి, గ్రామీణ ప్రాంత కార్డుదారులకు మొండిచేయి చూపడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. 625 చౌకధరల డిపోలు, ఒక జిల్లా సప్లయి అధికారి ఆధ్వర్యంలో భారీ యంత్రాంగం పనిచేస్తున్నప్పటికీ, నిత్యావసరాల పంపిణీలో పారదర్శకత లోపించిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తన ఎన్నికల హామీలను నెరవేర్చి, తక్షణమే అన్ని రకాల సరుకులను రేషన్ దుకాణాల ద్వారా అందజేయాలని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
నడిచే గ్రంథాలయం సిమ్మన్న
మద్దిలపాలెం: లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత, ప్రముఖ గ్రంథకర్త ఆచార్య వెలమల సిమ్మన్న సన్మాన సభ ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో అట్టహాసంగా జరిగింది. బహుభాషా కోవిదుడిగా, శతాధిక గ్రంథకర్తగా పేరుగాంచిన సిమ్మన్న అనితర సాధ్యమైన ప్రతిభావంతులని పలువురు వక్తలు కొనియాడారు. తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్ర అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, మేధావులు పాల్గొని సిమ్మన్న దంపతులను గజమాలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జాలాది రవి మాట్లాడుతూ సిమ్మన్న సాహిత్య సేవ అనిర్వచనీయమని, ఆయన రాసిన పుస్తకాలు నేడు పరిశోధక విద్యార్థులకు దిక్సూచిలా మారి అత్యధిక ఫెలోషిప్లు సాధించేందుకు దోహదపడుతున్నాయని ప్రశంసించారు. సభాధ్యక్షుడు జర్ర అప్పారావు మాట్లాడుతూ వందకు పైగా గ్రంథాలను రచించడం సామాన్య విషయం కాదని, అది ఆయన ప్రజ్ఞాపాటవాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆచార్య ధనరాజ్ సిమ్మన్నను ‘నడిచే గ్రంథాలయం’గా అభివర్ణించగా, ఆచార్య బెన్నీ ఆయన కఠోర శ్రమను, సాహిత్య త్యాగాన్ని కొనియాడారు. పరిశోధన స్థాయి నుంచే ఆయన అందరితో సోదర భావంతో మెలిగేవారని ఆచార్య గజ్జా యోహాను బాబు గుర్తుచేసుకోగా, తమకు సిమ్మన్న..ఒక మార్గదర్శి అని ఆచార్య ప్రేమానందం తెలిపారు. పరిశోధక విద్యార్థి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. ఆచార్య సిమ్మన్న క్రమశిక్షణ, ఆయన సహధర్మచారిణి కృషి వల్లే ఈ అద్భుత సాహితీ ప్రయాణం సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు సాల్మన్ బెన్నీ, నల్లా సత్యనారాయణ, అరుణ్ కుమార్, తెలుగు దండు అధ్యక్షులు పరవస్తు ఫణిశయన సూరితో పాటు పలువురు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు నీరాజనాలు అర్పించారు. -
రియల్
తీరంలోవేటపర్యావరణ కంటే.. ప్రాఫిట్ ముఖ్యం వీటిని పరిశీలిస్తే ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కంటే ప్రాఫిట్కే పెద్దపీట వేస్తోందని స్పష్టమవుతోంది. ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటే.. నగరంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. తీరంలో ఇసుక దిబ్బలు, ఖాళీ ప్రదేశాలు సహజ సిద్ధమైన బఫర్ జోన్లుగా పనిచేసి ఉప్పెనలు, తుపాన్ల తీవ్రతను తగ్గిస్తాయి. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో వాణిజ్య విస్తరణకు తెరతీస్తే.. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలకు విశాఖను బలి చేయడమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం విశాఖ విధ్వంసాన్ని మాత్రమే కోరుకుంటోంది తప్ప.. అభివృద్ధిని కాదంటూ పర్యావరణవేత్తలు, కూటమి పార్టీల ప్రతినిధులే సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘమైన తీరప్రాంతంపై చంద్రబాబు ప్రభుత్వం పగబట్టింది. అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు అభివృద్ధి పేరుతో తీరాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతోంది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) నిబంధనలను సడలించడం, జోన్లు మార్చడం వంటి చర్యలతో తీరప్రాంత సమతుల్యతను దెబ్బతీస్తోంది. పర్యాటక ముసుగులో న్యాయస్థానాల హెచ్చరికల్ని కూడా బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. కావాల్సిన వారికి ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అడ్డదారులు తొక్కుతోంది. గతంలో పర్యావరణవేత్తలు, ప్రజలు పోరాడి కాపాడుకున్న తీరప్రాంతాలను ఇప్పుడు కమర్షియల్ హబ్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. నగరంలోని సాగరతీర ప్రాంతాల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రభుత్వం ఎంతటి మొండివైఖరితో ఉందో అర్థమవుతోంది. తన వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్ల కోసం పర్యావరణ అనుమతులను సైతం వేగవంతం చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యంతరాలను పక్కనపెట్టి అడ్జస్ట్మెంట్లతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. భీమిలి తీరంలో సీఆర్జెడ్ మాయాజాలం విశాఖ–భీమిలి తీరప్రాంతంలో సీఆర్జెడ్ జోన్ల మార్పిడి (రీక్లాసిఫికేషన్)పై చంద్రబాబు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం.. సీఆర్జెడ్–3 కేటగిరీలో ఉన్న ప్రాంతాలు తక్కువ నిర్మాణాలు కలిగి, ప్రకృతి సిద్ధంగా ఉంటాయి. సముద్రమట్టం నుంచి 200 మీటర్ల వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. ఇక్కడి ఇసుకదిబ్బలు, చిత్తడినేలలు వంటివి అలల తాకిడిని, తుపాన్లను అడ్డుకునే సహజ రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. సీఆర్జెడ్–2 కేటగిరీలో సముద్రతీరానికి అత్యంత సమీపంలో భారీ కాంక్రీట్ కట్టడాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకోవచ్చు. విశాఖ–భీమిలి బీచ్ వెంబడి సీఆర్జెడ్–3 పరిధిలో 500 ఎకరాలకుపైగా భూములున్నాయి. వీటిలో భారీ కాంక్రీట్ నిర్మాణాలకు వీలులేదు. ఇప్పుడు ఈ భూముల్ని సీఆర్జెడ్–2 పరిధిలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ భూముల్లో మెజారిటీ వాటా ప్రభుత్వ నేతలదే కావడంతో.. మార్పిడి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విశాఖని గ్లోబల్ సిటీగా మారుస్తామనే సాకుతో తీరప్రాంత మాస్టర్ప్లాన్పై సమీక్షలు మొదలుపెట్టారు. 2024 అక్టోబర్–డిసెంబర్ మధ్య మాస్టర్ప్లాన్ సవరణల పేరుతో అంతర్గత కసరత్తు జరిగింది. ఆ సమయంలోనే సీఆర్జెడ్–3లోని భూముల్ని సీఆర్జెడ్–2 కిందకు చేర్చి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా మార్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపించి మార్పులు చేసెయ్యాలని ప్రభుత్వం ఆరాటపడిపోతోంది. పర్యావరణ నిబంధనలు అభివృద్ధికి అడ్డంకి అన్న మంత్రి దుర్గేష్ నిబంధనల్ని పాటిస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు అభివృద్ధికి అవే అడ్డంకి అనటం ఆందోళన కలిగిస్తోంది. పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభలో మాట్లాడుతూ పర్యావరణ నిబంధనలు అభివృద్ధికి అడ్డంకి అంటూ వ్యాఖ్యానించారు. ఇక విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కూడా అసెంబ్లీలో నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధి కోసం కాకుండా.. బీచ్రోడ్డుని సీఆర్జెడ్–2లోకి తీసుకురావాలని కోరారు. ఇక్కడ సీఆర్జెడ్ నిబంధనల కారణంగా 9 మీటర్లపైన నిర్మాణాలు చేపట్టలేకపోతున్నామనీ.. వీటిని సడలించాలంటూ మాట్లాడటంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం కేవలం విశాఖ విధ్వంసాన్ని మాత్రమే కోరుకుంటోంది తప్ప.. అభివృద్ధిని కాదంటూ పర్యావరణ వేత్తలు, కూటమి పార్టీ ప్రతినిధులే సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. సీఆర్జెడ్ నిబంధనల మాయాజాలం విశాఖ సాగర రక్షణ కవచానికి తూట్లుఆత్మహత్యా సదృశ్యమే.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ముప్పు పొంచి ఉన్న తరుణంలో ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఓవైపు గ్రేట్ గ్రీన్వాల్ వంటి కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు పర్యాటకశాఖ దానికి విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయం. కేవలం రూ.4,098 కోట్ల పెట్టుబడులు, 2,800 హోటల్ గదులు వంటి తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం, శాశ్వత పర్యావరణ రక్షణ కవచాలైన సీఆర్జెడ్–3 నిబంధనలను సడలించి తీరాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చాలని చూడటం ఆత్మహత్యా సదృశ్యమే. ఇప్పటికే జీవీఎంసీ, ఏపీపీసీబీ పర్యవేక్షణ లోపంతో సముద్రజలాలు కలుషితమవుతున్నాయి. ఇప్పుడు అదనపు కట్టడాలకు అనుమతినిస్తే విశాఖ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అభివృద్ధి అంటే ప్రకృతిని ధ్వంసం చేయడంకాదు, భావితరాలకు సురక్షితమైన తీరాన్ని అందించడమే. ప్రభుత్వం సీఆర్జెడ్ పునర్వర్గీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి. – బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన ప్రతినిధి, పర్యావరణవేత్త తుపాన్లు, ఉప్పెన్ల ముప్పు పెరుగుతుంది విశాఖపట్నం తీరప్రాంతంలో సీఆర్జెడ్–3 నిబంధనలను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుండటం గర్హనీయం. కేవలం పర్యాటక అభివృద్ధి, వాణిజ్య విస్తరణ పేరుతో చేస్తున్న ఈ మార్పువల్ల సాగరతీరంలోని ఇసుక దిబ్బలు, చిత్తడి నేలలు వంటి సహజ రక్షణ కవచాలు ధ్వంసమైపోతాయి. భవిష్యత్తులో తుపాన్లు, ఉప్పెన్ల ముప్పు పెరుగుతుంది. ప్రభుత్వం తాత్కాలిక లాభాల కోసం మత్స్యకారుల జీవనోపాధిని పణంగా పెడుతోంది. ఇప్పటికే కాలుష్యంతో అల్లాడుతున్న విశాఖకు ఇది మరో పెద్దదెబ్బ. చట్టబద్ధమైన పర్యావరణ రక్షణలను అడ్డంకులుగా చూడటం బాధ్యతారాహిత్యం. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాల్సిందే. – వై.రాజేష్, వీఎస్ కృష్ణ, మానవహక్కుల ఫోరం ప్రతినిధులు -
20 రోజులపాటు మహిళా దినోత్సవ కార్యక్రమాలు
మహారాణిపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు 20 రోజుల పాటు మహిళలు, బాలికల సాధికారతకు సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో మహిళా దినోత్సవం నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మహిళల హక్కుల పరిరక్షణ, ఆర్థిక సాధికారత, ఆరోగ్య అవగాహన, సైబర్ భద్రత, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు, న్యాయ సహాయం, గృహ హింస నివారణ వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మహిళల సాధికారతకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, విద్యాసంస్థలు, యువజన సంఘాలు, ప్రజలు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేసీ జి.విద్యాధరి, డీఆర్వో సత్తిబాబు, జిల్లా సీ్త్రశిశు సంక్షేమ అధికారిణి కె.వి.రామలక్ష్మి పాల్గొన్నారు. -
కుమారుడు చేతుల మీదుగా సత్కారం
ఉప్పొంగిన మాతృహృదయం భీమునిపట్నం: భీమిలిలో ఆదివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం ఒక అరుదైన, ఆత్మీ య సంఘటనకు వేదికై ంది. ప్రస్తుత సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుండటంతో, ఇది వారికి ఆఖరి సమావేశం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భీమిలి ఎంపీపీ దంతులూరి వాసురాజు మండలంలోని సర్పంచ్లందరినీ ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో అమనాం సర్పంచ్గా ఉన్న తన తల్లి దంతులూరి ఉమాదేవిని, ఎంపీపీ హోదాలో ఉన్న ఆమె కుమారుడు వాసురాజు శాలువాతో సత్కరించి గౌరవించారు. కుమారుడు ఉన్నత పదవిలో ఉండి, తనను సత్కరించడం పట్ల తల్లి ఉమాదేవి భావోద్వేగానికి గురయ్యారు. -
డార్క్ కామెడీతో ‘సంప్రదాయని సుద్దిని సుద్దపూసని’
డాబాగార్డెన్స్: శివాజీ, లయ జంటగా నటించిన నూతన చిత్రం ‘సంప్రదాయని సుద్దిని సుద్దపూసని’ ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఆదివారం నగరంలో జరిగిన ప్రెస్ మీట్లో చిత్ర విశేషాలను యూనిట్ పంచుకుంది. ఈ సందర్భంగా హీరో శివాజీ మాట్లాడుతూ.. ‘ఇది అద్భుతమైన డార్క్ కామెడీ చిత్రం. మా హిట్ పెయిర్ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుంది. సినిమా ఆఖరి 45 నిమిషాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. రోహన్ అద్భుతంగా నటించాడు. కుటుంబం కోసం సినిమాలు చేస్తూనే, ప్రజల కోసం పోరాడుతాను. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలి. మహిళల వస్త్రధారణపై గతంలో నేను చేసిన వ్యాఖ్యలు కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.’అని తెలిపారు. హీరోయిన్ లయ మాట్లాడుతూ.. ‘మా తాతగారి ఊరు విశాఖ కావడంతో ఇక్కడితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఈ సినిమాలో నా పాత్ర పేరు ఉత్తర. భర్తపై చూపించే అతి ప్రేమ తెచ్చిపెట్టే చిక్కుల చుట్టూ ఈ కథ వినోదాత్మకంగా సాగుతుంది. అన్ని వర్గాల వారు ఎంజాయ్ చేసే చిత్రమిది.’అని తెలిపారు. -
చందనోత్సవం ఏర్పాట్లలో జాప్యం వద్దు
సింహాచలం: సింహగిరిపై ఏప్రిల్ 20న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. ఆదివారం ఆయన ఇంజినీరింగ్ అధికారులతో కలిసి సింహగిరిపై సాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం క్యూలు, మంచినీటి వసతి, బారికేడ్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ నెల చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనుల వేగంతో పాటు నాణ్యత విషయంలోనూ రాజీ పడకూడదని, ఎక్కడైనా అలసత్వం కనిపిస్తే సహించేది లేదని ఈవో హెచ్చరించారు. ఈఈలు రామకృష్ణ, రాంబాబు, డీఈ హరి, ఏఈ రవిరాజు తదితరులు పాల్గొన్నారు. -
సాగరకన్య నౌకలో పాముల కలకలం
సింథియా: మరమ్మతుల నిమిత్తం విశాఖ హిందూస్థాన్ షిప్యార్డ్కు వచ్చిన ‘సాగరకన్య’ పరిశోధనా నౌకలో వరుసగా పాములు బయటపడుతుండటంతో కార్మికులు భయాందోళనలకు గురవుతున్నారు. కొద్దిరోజుల కిందట నాగుపాము కనిపించగా, తాజాగా ఆదివారం భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. స్నేక్ క్యాచర్ నాగరాజు చాకచక్యంగా ఆ కొండచిలువను పట్టుకున్నారు. అండమాన్ సమీపంలో మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన సమయంలోనే పాములు నౌకలోకి చేరి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంజిన్ గదిలో మరిన్ని పాములు ఉండే అవకాశం ఉందన్న హెచ్చరికలతో కార్మికులు నౌకలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. సముద్రశాస్త్ర అధ్యయనాల్లో అత్యంత కీలకమైన ఈ నౌక పనులు పాముల బెడద కారణంగా నెమ్మదిస్తుండటంతో షిప్యార్డ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పరామర్శ
మహారాణిపేట: వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పరామర్శించారు. ఆదివారం గుంటూరులోని అంబటి నివాసంలో కేకే రాజుతో పాటు సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్రెడ్డి, ఉత్తరాంధ్ర యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్ ఆయనను కలిశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ఉద్దేశంతోనే అంబటి రాంబాబును అక్రమంగా జైలుకు పంపించారని విమర్శించారు. అంతేకాకుండా, ఆయన ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేసి కుటుంబ సభ్యులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. ఇటువంటి రాజకీయ వేధింపులకు వైఎస్సార్ సీపీ ఏమాత్రం వెరవబోదని, ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. -
క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం
ఏయూక్యాంపస్ : అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా బీచ్రోడ్డులో క్యాన్సర్ అవగాహన వాక్ నిర్వహించారు. ‘50 ఏళ్లుగా స్వస్థత – క్యాన్సర్ రహిత రేప టి దిశగా’ అనే నినాదంతో కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు ఈ ర్యాలీ సాగింది. సుమారు 100 మంది రేడియేషన్ ఆంకాలజిస్టులు, మెడికల్ ఫిజిసిస్టులు, రేడియేషన్ టెక్నాలజిస్టులు ఇందులో పాల్గొని, రేడియేషన్ థెరపీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ బి.రవి శంకర్ మాట్లాడుతూ.. క్యాన్సర్ను సకాలంలో గుర్తించడంపై అవగాహన పెంచడం తమ ఉద్దేశమని తెలిపారు. ఏఆర్వోఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సేనాపతి మాట్లాడుతూ.. దేశంలో ఆంకాలజీ ప్రమాణాలను మెరుగుపరచడంలో సంస్థ అందిస్తున్న 50 ఏళ్ల సేవలను గుర్తుచేసుకున్నారు. ఏపీ అధ్యక్షుడు ఎన్.సుజాత, కార్యదర్శి పీబీ ఆనంద రావు, సదస్సు కార్యదర్శి వి.దివ్య సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
తీరంలో హోరెత్తిన సైకిల్ ర్యాలీ
విశాఖ స్పోర్ట్స్: సాగరతీరంలో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 63వ ఎడిషన్ ఆదివారం ఉత్సాహభరితంగా సాగింది. ఆరోగ్యం, సామరస్యం, జాతీయ స్ఫూర్తి మేళవించి పిల్లల తల్లిదండ్రులతో పాటు సీనియర్ సిటిజన్లు కూడా పెడలింగ్ చేయడంతో ర్యాలీ సందడిగా మారింది. మూడు రోజుల పాటు జరిగే ఫిట్ ఇండియా కార్నివాల్–2026కు భారత క్రీడాప్రాధికార సంస్థ విశాఖను వేదికగా చేసుకుంది. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఫిట్నెస్ వర్క్షాప్లు, సరదా పోటీలు, ప్రదర్శనలు, సామూహిక భాగస్వామ్య కార్యకలాపాలు జరగనున్నాయి. తొలి రోజు సైకిల్ ర్యాలీ ఆర్కే బీచ్లోని కాళీమాత అలయం వద్ద ప్రారంభమై వీఎంఆర్డీఏ పార్కు దరి వైఎస్సార్ విగ్రహం చెంత టర్న్ తీసుకుని తిరిగి ప్రారంభ స్థలికి చేరడంతో 5 కి.మీ. ర్యాలీ ముగిసింది. ఏపీ క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు, ప్రభుత్వ విప్ గణబాబు, భారత క్రీడాప్రాధికార సంస్థ సీనియర్ అధికారులు, సాయ్ సెంటర్ బెంగళూర్ ప్రాంతీయ సంచాలకుడు విష్ణు సుధాకరన్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒలింపియన్ జిన్సన్ జాన్సన్ ఆకర్షణగా నిలిచారు. జుంబా వార్మప్తో పాటు, రోప్ స్కిప్పింగ్, కుడో మార్షల్ ఆర్ట్స్, ఫ్లాగాఫ్తో సైక్లిస్ట్ల ప్రవాహం సుందర తీరాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చింది. డాక్టర్ ఫర్హా, సైక్లిస్ట్ చందన జయరామ్, కమ్యూనిటీ నాయకులను సత్కరించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ, భారత క్రీడా ప్రాధికార సంస్థ, సైక్లింగ్ సమాఖ్య భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. -
వైభవంగా అనంతుని తెప్పోత్సవం
పద్మనాభం: అనంత పద్మనాభ స్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం రాత్రి స్వామి తెప్పోత్సవం కనులపండువగా జరిగింది. కుంతీ మాధవ స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి ఉత్సవ విగ్రహాలను పద్మనాభం జంక్షన్కు సమీపంలో(విజయనగరం–శొంఠ్యాం ఆర్అండ్బీ రోడ్డు పక్కన) ఉన్న అనంత పద్మనాభ స్వామి పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఇక్కడ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. తదుపరి కొత్తగా తయారు చేసిన హంస వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి ఉత్సవ విగ్రహాలను వేంచేపు చేశారు. అనంతరం తెప్పోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఉభయ దేవేరులతో కలిసి అనంత పద్మనాభ స్వామి హంస వాహనంపై మూడుసార్లు పుష్కరిణిలో జలవిహారం చేశారు. భక్తుల గోవింద నామస్మరణల మధ్య స్థానిక జాలర్లు తెప్పను తాళ్లతో లాగగా ఈ ఉత్సవం కనులవిందుగా సాగింది. తెప్పోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులతో పుష్కరిణి గట్టు కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో ఎంపీపీ కంటుబోతు రాంబాబు, ఎమ్మెల్యే గంటా తనయుడు రవితేజ, భక్త బృందం సభ్యులు తాలాడ పద్మనాభం, కాళ్ల నగేష్ కుమార్, కశిరెడ్డి దామోదరరావు, కృష్ణాపురం ఎంపీటీసీ సభ్యురాలు కంటుబోతు లక్ష్మి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తెప్పోత్సవాన్ని కనులారా వీక్షించారు. -
ఇసుక తోడేళ్లు
తీరంలో తగరపువలస: భీమిలి మండలం అన్నవరం తీరప్రాంతం నుంచి అక్రమ వ్యాపారులు విలువైన నల్ల ఇసుకను తెలంగాణ, తదితర పక్క రాష్ట్రాలకు యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. ఈ ఇసుక మాఫియాకు భీమిలి ప్రాంతానికి చెందిన కొందరు టీడీపీ, జనసేన నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. చీకటి పడితే చాలు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు తీరంలో వాలిపోతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ, ప్రతిపాదిత దశలో ఉన్న ఒబెరాయ్, మై ఫెయిర్ హోటళ్ల వైపు.. మెట్టల మీదుగా రాకపోకలకు వీలుగా అక్రమార్కులు మార్గాలను సైతం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి అన్నవరం హయగ్రీవ రిసార్ట్స్, మాన్సాస్ కొబ్బరితోటల్లో నిలిపి, భారీ లారీల్లో లోడ్ చేసి ఎప్పటికప్పుడు గుట్టుచప్పుడు కాకుండా పంపించేస్తున్నారు. గ్రామస్తుల్లో భయాందోళన తీరం నుంచి తరలించుకుపోతున్న ఇసుక రవాణా కారణంగా.. తుపాను సమయంలో తమ గ్రామాలు ముంపునకు గురవుతాయని అన్నవరంతో పాటు భోగాపురం మండలం తూడెం పంచాయతీ వాసులు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ ఇసుక రవాణా వెనుక బలమైన మాఫియా ఉండటంతో.. వారిని అడ్డుకోవాలన్నా, కనీసం నోరు మెదపాలన్నా ఈ ప్రాంత మత్స్యకారులు, యాదవ సామాజిక వర్గాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. 24 టైర్లు కలిగిన భారీ లారీ ఇసుక అన్నవరం వద్దే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు చేతులు మారుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం ఈ ప్రాంతం నుంచి ఇసుక తరలిపోతున్నట్లు తెలిసినా రెండు మండలాల రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం గమనార్హం. అధికారుల నిర్లక్ష్యం, స్థానికుల అమాయకత్వం కారణంగా మిగిలిన తీరప్రాంతాలతో పోలిస్తే అన్నవరం, ఎర్రయ్యపాలెం, పైలపేట, గొల్లపేట, తూడెం, బసవపాలెం, దిబ్బడపాలెం తదితర తీరాల్లో సముద్రపు అలలు, వాటిని ఆనుకుని ఉన్న ఇసుక తిన్నెల మధ్య స్పష్టమైన అగాధం ఏర్పడుతోంది. దీంతో వేల ఏళ్లుగా ఈ ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడిన ఇసుక మేటలు(స్టాలగ్మైట్లు) తమ ఆకారాన్ని కోల్పోతున్నాయి. నల్ల ఇసుకను ఎందుకు వినియోగిస్తారంటే... సాధారణ ఇసుక కంటే భిన్నమైన లక్షణాలు, పది రెట్లు అధిక ధర కలిగి ఉండే ఈ నల్ల ఇసుకకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఇందులో ఉండే ఖనిజాల వల్ల నేలకు పోషణ లభిస్తుంది. తేమను నిలిపి, విత్తనాల మొలక శాతాన్ని, నేల నాణ్యతను పెంచడానికి తోటపనుల్లో దీనిని వాడతారు. ముఖ్యంగా నల్ల పసుపు సాగులో దీని వినియోగం ఎక్కువ. కాంక్రీట్ మిశ్రమాలతో తయారయ్యే నిర్మాణాలు, ఇటుకలు, వంతెనలు, రోడ్ల తయారీలో వినియోగిస్తారు. ఆక్వేరియంలు, ల్యాండ్ స్కేపింగ్ అలంకరణలో నల్ల ఇసుకను ఉపయోగిస్తారు. ఇనుము తయారీ పరిశ్రమల్లో దీనిని విరివిగా వాడతారు. ఇందులో ఇనుము, అల్యూమినియం, టైటానియం వంటి ఖనిజాలు ఉండటంతో సాండ్బ్లాస్టింగ్ ప్రక్రియ ద్వారా ఆ ఖనిజాలను వెలికితీయడానికి ఉపయోగిస్తారు. సిలికాన్ చిప్స్, అద్దాల తయారీలోనూ ఈ రేణువులను వినియోగిస్తారు. వేడి చేసిన నల్ల ఇసుకను కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నివారణకు ‘వేడి ఇసుక ప్యాక్’ గా ఉపయోగిస్తారు. -
● కాన్వాస్పై ప్రకృతి సోయగాలు
జూలో ఉత్సాహంగా చిత్ర లేఖన పోటీలుఆరిలోవ: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరాగాంధీ జూ పార్కులో ఆదివారం నిర్వహించిన చిత్రలేఖన పోటీలు ఉత్సాహంగా సాగాయి. జూ బయోస్కోప్ ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో ఒకటో తరగతి నుంచి పీజీ చదువుతున్న విద్యార్థులు పలు విభాగాల్లో పాల్గొన్నారు. రంగుల కుంచెలతో ప్రకృతి అందాలకు, తమ ఆలోచనలకు కాన్వాస్పై ప్రాణం పోశారు. ‘ఔషధ, సుగంధ మొక్కలు–ఆరోగ్యం, వారసత్వం–జీవనోపాధి పరిరక్షణ’ అనే ప్రధానాంశంతో ఈ పోటీలను నిర్వహించినట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల చిత్రాలను న్యాయనిర్ణేతలు ఎంపిక చేస్తారని, ఈ నెల 3న విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. -
టీసీఎల్ విజేత టాలీవుడ్ సెలబ్రిటీ ఎలెవన్
విశాఖస్పోర్ట్స్: నగరంలో నిర్వహించిన తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్(టీసీఎల్) ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో టాలీవుడ్ సెలబ్రిటీ ఎలెవన్ ఘనవిజయం సాధించి ట్రోఫీని కై వసం చేసుకుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ క్రీడా సంబరాల్లో అటు వెండితెర తారలు, ఇటు బుల్లితెర సెలబ్రిటీలు జట్లుగా విడిపోయి తలపడ్డారు. తరుణ్, శ్రీకాంత్ వంటి అగ్ర నటులు అభిమానులను ఆహ్వానించడం, ప్రవేశం ఉచితం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. ఉత్కంఠగా ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగిన టైటిల్ పోరులో టాస్ గెలిచిన ఎన్ఎం స్పేసెస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు దినేష్ (52), పవన్ (52) అర్ధ సెంచరీలతో రాణించి, రెండో వికెట్కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టాలీవుడ్ బౌలర్లలో వినయ్, తమన్, సాంబా, దేవా తలో వికెట్ తీశారు. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టాలీవుడ్ సెలబ్రిటీ ఎలెవన్ ఓపెనర్లు సుధీర్ బాబు (35), నిఖిల్ (21) ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. మధ్యలో అశ్విన్ (44) బౌండరీలతో విరుచుకుపడగా, ఓంకార్ (23) సింగిల్స్తో స్కోరు బోర్డును పరిగెత్తించాడు. చివరి 4 ఓవర్లలో 40 పరుగులు చేయాల్సిన దశలో సాంబా (30), వినయ్ (6) నిలకడగా ఆడి మరో 4 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రత్యర్థి బౌలర్లలో శరత్, కల్కి రెండేసి వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. తొలుత జరిగిన మ్యాచ్లో పోలీస్ వారియర్స్ 18 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేయగా, ఎన్ఎం స్పేసెస్ జట్టు 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భరత్ (58), కిరీటి (48) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగారు. 10 ఓవర్ల పాటు జరిగిన మరో మ్యాచ్లో టీవీ కింగ్స్ 3 వికెట్లకు 140 పరుగులు చేసింది. అభిషేక్ (74) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీవీ టైగర్స్ 8 వికెట్ల నష్టానికి 98 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. బౌలింగ్లో నరేష్ 4 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశాడు. విజేతలకు నిర్వాహకులు ట్రోఫీని అందజేశారు. తారల సందడితో వైఎస్సార్ స్టేడియం కోలాహలంగా మారింది. -
పిచ్చుకల సంరక్షణ మన బాధ్యత
తాటిచెట్లపాలెం: మన ఇంటి పిచ్చుకలను మనమే కాపాడుకుందాం అని ఏసీపీ రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. 20 రోజుల పాటు సాగే పిచ్చుకల పరిరక్షణ ప్రచారాన్ని ఆదివారం ఉదయం ఆయన రైల్వేస్టేషన్ రోడ్లోని 150 ఏళ్ల మర్రిచెట్టు వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా పిచ్చుకల గూళ్లు, నీటి పాత్రలు, ధాన్యం కంకులు పంపిణీ చేయడంతో పాటు చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరి పంటను ఆశించే నల్లి నివారణకు ఎంతో ఉపయోగపడే పిచ్చుకలను రైతులు తమ ఇళ్లకు ఆహ్వానించేవారని తెలిపారు. అంతరించిపోతున్న ఈ పక్షి జాతిని రక్షించేందుకు జేవీ రత్నం నేతృత్వంలోని ‘గ్రీన్ౖక్లైమేట్’ బృందం విశేష కృషి చేస్తోందని కొనియాడారు. జేవీ రత్నం మాట్లాడుతూ.. 50 ఏళ్ల కిందట వరికి వచ్చిన నల్లి నివారణకు రసాయన క్రిమిసంహారకాలు పిచికారీ చేయడంతో ఆశించిన ఫలితం దక్కలేదని, పైగా పిచ్చుకలు అంతరించిపోవడం మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఫా ట్రస్ట్ సీఈవో డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ.. మానవాళికి మేలు చేసే పిచ్చుకలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. వాటికి అవసరమైన ఆహారం, నీరు, గూడు అందుబాటులో ఉంచాలని సూచించారు. వనమాలి, సీటీజీ గ్రూపుల ప్రతినిధి సరిత, మ్యాంగో మ్యాన్ అప్పాజీ, యాక్షన్ ఎయిడ్, కర్ణాటక ప్రాజెక్ట్స్ సంస్థల ప్రతినిధులు, అనకాపల్లి హెచ్ఆర్డీఐ నుంచి కృష్ణకుమారి, గ్రీన్ కై ్లమేట్ వలంటీర్ జె.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొబ్బరితోట, భూపేష్నగర్ వాసులకు ఉచితంగా పిచ్చుకల గూళ్లు, నీటి పాత్రలు, ధాన్యం కంకులు పంపిణీ చేశారు. -
ఆయేషా మీరా కేసులో దర్యాప్తు సంస్థల వైఫల్యం
బీచ్రోడ్డు: ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో ఆధారాలను నిర్వీర్యం చేసిన దర్యాప్తు సంస్థలు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. లక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మార్చి 8న ‘అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం’ సందర్భంగా రూపొందించిన ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎం. లక్ష్మి మాట్లాడుతూ.. రాజ్యాంగం ముందు అందరూ సమానమేనని చెబుతున్నా ఆయేషా మీరా , నటి ప్రత్యూష వంటి కేసుల్లో దర్యాప్తు సంస్థలు అధికారానికి, డబ్బుకు లొంగిపోయాయని దుయ్యబట్టారు. ఆధారాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లా కమిషన్లు, గత తీర్పులు చెబుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హత్య జరిగిన 12 ఏళ్ల తర్వాత సమాధి తవ్వి, ఆధారాలు దొరకలేదనే సాకుతో హైకోర్టు కేసును మూసివేయడం సరికాదన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎస్. వెంకటలక్ష్మి మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఉదయం 10 గంటలకు నగరంలోని ఎల్ఐసీ అంబేడ్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ వరకు భారీ ర్యాలీ, అనంతరం సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే మార్చి 7న పెందుర్తి అంబేడ్కర్ కాలనీలో సభ ఉంటుందని పేర్కొన్నారు. శ్రామిక మహిళల ఉపాధిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి డి. రోహిణి దేవి, కార్యవర్గ సభ్యులు జయ, నాగమణి, బాలనాగమ్మ తదితరులు పాల్గొన్నారు. విచారణ సంస్థలపై చర్యలు తీసుకోవాలి -
సింహగిరిపై పెళ్లి సందడి
సింహాచలం : సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి వార్షిక కల్యాణోత్సవానికి నాందిగా జరిగే ‘డోలోత్సవం’ మంగళవారం అత్యంత వైభవంగా జరగనుంది. ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారు పెళ్లి కుమారుడిగా ముస్తాబై, కొండ దిగువన ఉన్న తన సోదరి అడవివరం పైడితల్లి అమ్మవారిని పిల్లను అడిగే ఈ వేడుకను స్థానికులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ ఏడాది చంద్రగ్రహణం కారణంగా ఉత్సవ సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు దేవస్థానం ఈవో జె. వెంకటరావు తెలిపారు. గ్రహణం వేళ.. తెల్లవారుజామునే వేడుకలు సాధారణంగా పగలు జరిగే ఈ ఉత్సవం, చంద్రగ్రహణం కారణంగా మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభం కానుంది. స్వామివారి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను పల్లకిలో ఉంచి మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు తీసుకొస్తారు. తొలుత పైడితల్లి అమ్మవారి ఆలయానికి చేరుకుని, అక్కడి నుంచి పుష్కరిణి సత్రం వద్ద ఉన్న ఉద్యానవన మండపానికి స్వామిని వేంచేపు చేస్తారు. అక్కడ వసంతోత్సవం, చూర్ణోత్సవం, డోలోత్సవ వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి అడవివరం గ్రామంలో తిరువీధి ఉత్సవం జరుగుతుంది. ఉదయం 8 గంటలకల్లా స్వామివారు తిరిగి కొండపైకి చేరుకున్నాక ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. తరతరాల సంప్రదాయం ఈ డోలోత్సవం వెనుక ఒక మనోహరమైన గాథ ఉంది. సింహగిరి నాథుడికి సోదరి సమానురాలైన పైడితల్లి అమ్మవారి కుమార్తెనే స్వామి పెళ్లి చేసుకున్నారని భక్తుల విశ్వాసం. ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జరిగే కల్యాణానికి ముందు, ఫాల్గుణ పౌర్ణమి నాడు స్వామివారు స్వయంగా దిగి వచ్చి పిల్లను అడగడం ఇక్కడి సంప్రదాయం. తొలుత అమ్మవారు నిరాకరించడం, ఆపై స్వామివారి వైభవాన్ని చూసి అంగీకరించడం వంటి ఘట్టాలను స్మరిస్తూ భక్తులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ వసంతోత్సవం జరుపుకుంటారు. ఈ వేడుక అనంతరం ఉగాది నాడు పెళ్లిరాట వేయడంతో కల్యాణ పనులు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఈ డోలోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తారని భావిస్తున్న అధికారులు, ఉద్యానవన మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. -
బదిలీ టెన్షన్
దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సిబ్బంది తరలింపు షురూ.. సీనియారిటీ పోతుందనే ఆందోళనలో ఉద్యోగులు డివిజన్ల మార్పులతో 2,000 మందిపై ప్రభావంకొత్త జోన్.. సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్న తరుణంలో.. ఉద్యోగుల విభజన ప్రక్రియ సెగలా మారుతోంది. దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ల నుంచి ఉద్యోగుల బదిలీలను విశాఖ రైల్వే జోన్కు ప్రారంభించినా.. సీనియారిటీ కోల్పోతామనే ఆందోళన కొత్త చిచ్చు రేపుతోంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్కు 259 అకౌంట్ పోస్టులు, 699 ఇతర విభాగాల పోస్టులను హెచ్ఆర్ఎంఎస్ ద్వారా బదిలీ చేసే ప్రక్రియను పూర్తి చేశారు. అయితే.. బదిలీ అవుతున్న పోస్టుల్లో పని చేస్తున్న సిబ్బంది, తమ సీనియారిటీతో పాటు సర్వీసుకు బ్రేక్ వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. గతేడాది డిసెంబర్లో రైల్వే బోర్డు నాన్–గెజిటెడ్ ఉద్యోగుల కోసం ఒక సర్క్యులర్ జారీ చేసింది. కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా జోన్తో పాటు రాయగడ డివిజన్లో పనిచేసేందుకు ఎవరికి ఎక్కడ ఆసక్తి ఉందో ఆప్షన్లు ఎంచుకోవాలని సూచించింది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఉన్న విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు.. విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్లో చేరబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ను రెండుగా విభజించి.. కొంత భాగాన్ని విశాఖపట్నం డివిజన్గా, మిగిలిన భాగాన్ని రాయగడ డివిజన్లో చేర్చారు. కొత్త జోన్ హెడ్క్వార్టర్స్లో పోస్టింగులతో పాటు రాయగడ డివిజన్లో పనిచేసేందుకు ఆప్షన్లు ఎంచుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశారు. విశాఖ జోన్, రాయగడ డివిజన్ కోసం వివిధ డివిజన్లు, ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లలో విధులు నిర్వర్తిస్తున్న నాన్–గెజిటెడ్ ఉద్యోగులను కేడర్ వారీగా విభజించి కేటాయింపులు జరిపారు. డివిజన్ల హద్దుల మార్పే అసలు సమస్యా? కొత్త జోన్ ఏర్పాటుతో పలు రైల్వే సెక్షన్లు ఒక డివిజన్ నుంచి మరో డివిజన్కు మారబోతున్నాయి. గుంతకల్లు డివిజన్ పరిధిలోని 108 కి.మీ. పొడవున్న రాయచూర్–వాడి సెక్షన్ ఇకపై సికింద్రాబాద్ డివిజన్ కిందకు రానుంది. గుంటూరు డివిజన్ పరిధిలోని 142 కి.మీ. ఉన్న విష్ణుపురం–జానపాడు సెక్షన్ కూడా సికింద్రాబాద్ డివిజన్కు బదిలీ కానుంది. సికింద్రాబాద్ డివిజన్లోని 46 కి.మీ. ఉన్న కొండపల్లి–మోటుమర్రి సెక్షన్ ఇప్పుడు విజయవాడ డివిజన్ పరిధిలోకి వెళ్లనుంది. ఈ మార్పుల వల్ల దాదాపు 2,000 మంది సిబ్బంది ప్రభావితం కానున్నారు. వీరికి నచ్చిన రైల్వే జోన్ను ఎంచుకునే అవకాశం కల్పించాలని అధికారులు ఇప్పటికే ప్రతిపాదించినా.. సరిహద్దుల మార్పులతో తమ సీనియారిటీకి ఇబ్బందులొస్తాయన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. రివర్స్ ఆప్షన్ కోసం ఉద్యోగుల పట్టు సూపర్వైజరీ కేడర్కు చెందిన ఎస్ఎస్ఈ, పీ.వే, టీఆర్డీ వంటి హోదాల్లో ఉన్న సుమారు 2,512 మంది సిబ్బంది భవిష్యత్తుపై ప్రస్తుతం స్పష్టత కరువైంది. ప్రధాన కార్యాలయం నియంత్రణలో ఉండే ఈ కేడర్ల ఉద్యోగులు, కొత్త జోన్కు వెళ్తే తమ సీనియారిటీ దెబ్బతింటుందని భయపడుతున్నారు. అలాగే నిర్మాణ విభాగంలో పని చేస్తున్న వారి పేర్లను ఎన్వోసీ జాబితాలో చేర్చకపోవడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బదిలీ అవుతున్న పోస్టుల్లో పని చేస్తున్న సిబ్బంది తమ సీనియారిటీ, సర్వీసు ప్రయోజనాల దృష్ట్యా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జోన్ ప్రధాన కార్యాలయం పరిధిలో పని చేస్తున్న దాదాపు 279 మంది సిబ్బంది, తమను తిరిగి దక్షిణ మధ్య రైల్వే జోన్లోనే కొనసాగించాలని ‘రివర్స్ ఆప్షన్’కోరుతున్నారు. వీరంతా ప్రస్తుతం కొత్త జోన్ పరిధిలోని డివిజన్ల కింద ఉన్నట్లు చూపిస్తున్నప్పటికీ, పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం పాత జోన్లోనే ఉండేలా అవకాశం కల్పించాలని కార్మిక సంఘాలు రైల్వే బోర్డును డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించి, ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులు సైతం రైల్వే బోర్డుకు లేఖలు రాశారు. ఈ సమస్యలను పరిష్కరించి, ఉద్యోగులకు స్పష్టమైన హామీ వస్తే తప్ప.. సిబ్బంది విభజన ప్రక్రియ ముందుకు వెళ్లే అవకాశం లేదని జోనల్ వర్గాలు చెబుతున్నాయి. -
మహిళలను గౌరవిద్దాం...భద్రత కల్పిద్దాం
పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఏయూక్యాంపస్: మహిళలను గౌరవిద్దాం.. వారికి భద్రత, భరోసాను కల్పిద్దామని విశాఖ పోలీసులు నినదించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సన్నాహకాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం బీచ్రోడ్డులో పోలీసు సిబ్బంది ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. పెద్దసంఖ్యలో మహిళా పోలీసులు ప్లకార్డులు చేబూని వైఎంసీఏ నుంచి పోలీస్ మెస్ వరకు ఈ అవగాహన యాత్రను చేపట్టారు. ఆడపిల్లలను వేధించడం, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం వంటి అంశాలపై జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికావద్దని ఈ సందర్భంగా వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహిళల రక్షణ కోసం ‘శక్తి యాప్’ ఒక కవచంలా నిలుస్తుందని వివరించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. మహిళలు ఏవైనా సమస్యల్లో ఉన్నప్పుడు వెంటనే ‘శక్తి యాప్’ను వినియోగించాలని, వారికి తక్షణ సాయం అందించేందుకు తమ సిబ్బంది 24 గంటలూ సిద్ధంగా ఉన్నారని భరోసా ఇచ్చారు. మహిళలపై హింస, ఈవ్ టీజింగ్, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలను గౌరవించడం, వారికి రక్షణ కల్పించడం ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీపీలు లతా మాధురి, మేరీ ప్రశాంతి, ఏసీపీ అన్నెపు నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఇంజిన్ లేని నౌక ఇండియాకు తిరిగొస్తోంది
సింథియా (విశాఖ): భారత నావికాదళానికి చెందిన ‘ఐఎన్ఎస్వీ కౌండిన్య’ నౌక తన తొలి విదేశీ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుని తిరిగి వస్తున్న సందర్భంగా సోమవారం రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ ముంబై హార్బర్లో అధికారికంగా స్వాగతం పలకనున్నారు. ఒమన్ సుల్తానేట్కు వెళ్లి అరేబియా సముద్రం మీదుగా సాగిన ఈ చారిత్రాత్మక ప్రయాణం భారతదేశపు పురాతన సముద్ర వారసత్వాన్ని చాటిచెప్పడమే కాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్–ఒమన్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ సంబంధాలను పునరుద్ఘాటిస్తోంది.ఐఎన్ఎస్వీ కౌండిన్య ఒక ప్రత్యేకమైన నౌక. ఇది పురాతన భారతీయ నౌకానిర్మాణ పద్ధతులను అనుసరించి ఎలాంటి ఇంజిన్ లేకుండా.. చెక్క పలకలను కొబ్బరితాడుతో చేతితో కుట్టి, సహజ రెసిన్లతో సీల్ చేసి నిరి్మంచారు. శతాబ్దాల నాటి భారతీయ సముద్ర నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే ఈ నౌక మన సంస్కృతిని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. భారతీయ జ్ఞాన వ్యవస్థలను కాపాడుకోవడంలో దేశానికి ఉన్న నిబద్ధతకు ఈ నౌక నిర్మాణమే నిదర్శనం. 5వ శతాబ్దపు అజంతా గుహల్లోని చిత్రపటాల ఆధారంగా భారత నావికాదళ పర్యవేక్షణలో సంప్రదాయ కళాకారుల నైపుణ్యం, ఆధునిక ఇంజినీరింగ్ ప్రమాణాలతో దీనిని రూపొందించారు.గత ఏడాది డిసెంబర్ 29న పోర్బందర్ నుంచి బయలుదేరిన ఈ నౌక ప్రాచీన నావికులు ప్రయాణించిన మార్గాల్లోనే వెళ్లి ఈ ఏడాది జనవరి 14న ఒమన్లోని పోర్ట్ సుల్తాన్ ఖబూస్కు చేరుకుంది. అక్కడ ఒమన్ ప్రముఖులు, ప్రవాస భారతీయుల సమక్షంలో ఈ నౌకకు ఘనస్వాగతం లభించింది. ఈ యాత్ర ద్వారా భారత్–ఒమన్ సంబంధాలు బలోపేతం అవడమే కాకుండా, ఒకప్పుడు అరేబియా సముద్రం మీదుగా జరిగిన సుగంధ ద్రవ్యాలు, వ్రస్తాల వాణిజ్య వైభవాన్ని, ఉమ్మడి సముద్రయాన సంప్రదాయాలను ఈ నౌక మరోసారి గుర్తు చేసింది. -
విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మిం కుల దుర్మరణం
పద్మనాభం (భీమిలి): విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఇసకలపాలెంలో ఆదివారం విద్యుదాఘాతానికి ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం గొండయ్యపాలేనికి చెందిన తాపీ మేస్త్రీ కంటుబోతు శ్రీను (34), ఇసకలపాలేనికి చెందిన మరో మేస్త్రీ కాళ్ల సూరీడు (60), ఆయన కుమారుడు సూరిబాబు ఇసకపాలెంలో రేకుల షెడ్డు నిర్మిం స్తున్నారు. కొలతలు తీసుకుంటున్న సమయంలో, అక్కడే అడ్డుగా ఉన్న ఒక పొడవైన ఇనుప పోల్ను పక్కకు జరిపేందుకు యత్నించారు.ఈక్రమంలో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల నుంచి ఇనుప పోల్కు విద్యుత్ ప్రసరించడంతో శ్రీను, సూరీడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. సూరిబాబు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సూరిబాబును 108లో విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించా రు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని మరణంతో వారి కుటుంబం రోడ్డున పడింది. సూరీడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సూరీడు మరణం, సూరిబాబుకు గాయాలు కావడంతో ఆ కుటుంబ సభ్యులూ కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెలబ్రిటీ క్రికెట్ ధమాకా
విశాఖ స్పోర్ట్స్: వైఎస్సార్ స్టేడియంలో శనివారం టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (టీసీసీఎల్) ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజు జరిగిన లీగ్ మ్యాచ్ల్లో ఎన్ఎం స్పేసెస్, పోలీస్ వారియర్స్ జట్లు ఘనవిజయాలు సాధించాయి. తొలి మ్యాచ్లో ఎన్ఎం స్పేసెస్ జట్టు 69 పరుగుల తేడాతో టీవీ టైగర్స్పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎన్ఎం స్పేసెస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. రామ్ పాటిల్ (90) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీవీ టైగర్స్ 154 పరుగులకే కుప్పకూలింది. రెండో మ్యాచ్లో పోలీస్ వారియర్స్ 7 వికెట్ల తేడాతో టీవీ కింగ్స్ను ఓడించింది. టీవీ కింగ్స్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని పోలీస్ వారియర్స్ సులభంగా ఛేదించింది. త్రినాథ్ (92 నాటౌట్), అరుణ్ (56) అద్భుత భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుతురులో ప్రారంభమైన మూడో మ్యాచ్లో పొలిటికల్ టీమ్తో టాలీవుడ్ క్రికెట్ ఎలెవెన్ తలపడింది. అఖిల్ నాయకత్వంలోని టీసీఏ జట్టులో శ్రీకాంత్, సుధీర్ బాబు, తమన్ తదితరులు ఉన్నారు. మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ ఆదివారంతో ముగియనుంది. ఉత్సాహంగా సాగిన టీసీసీఎల్ ట్రోఫీని ఆవిష్కరిస్తున్న బుల్లితెర నటులుమైదానంలో బుల్లి తెర నటులు -
ముకుంద జ్యూవెలరీ 10వ బ్రాంచ్ ప్రారంభం
మహారాణిపేట: బంగారం ప్రియులకు విశిష్ట సేవలు అందిస్తున్న ‘ముకుంద జ్యూవెలరీ’ షోరూమ్ను ఘనంగా ప్రారంభించారు. శనివారం సిరిపురం జంక్షన్లోని సంపత్ వినాయక టెంపుల్ రోడ్డులో ఉన్న ఎంవీఆర్ బిల్డింగ్ మూడో అంతస్తులో ముకుంద జ్యూవెలరీ 10వ బ్రాంచ్ను సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి, సీఈవో నికితారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మాట్లాడుతూ తమ స్టోర్లో అద్భుతమైన కలెక్షన్లు, ప్రత్యేకమైన డిజైన్లను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. డైమండ్, బంగారం, వెండి ఆభరణాల విభిన్న శ్రేణులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు కృష్ణ, నాని, రమ, బృంద తదితరులు పాల్గొన్నారు. -
గోరంత చిత్రంతో కొండంత ఘనత
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో సిద్ధేశ్వరం కుర్రాడు పెదగంట్యాడ: కళకు హద్దులు లేవని, పట్టుదల ఉంటే అరచేతిలో అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించాడు సిద్ధేశ్వరానికి చెందిన ద్వారపూడి సాయి. కేవలం 1.2 సెంటీమీటర్ల పరిమాణంలో భారత దిగ్గజం రతన్ టాటా చిత్రాన్ని గీసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరును లిఖించుకున్నాడు. వృత్తిరీత్యా కార్పెంటర్ అ యిన ఈశ్వరరావు చిన్న కుమారుడు సాయికి చిన్నప్పటి నుంచే చిత్రకళపై మక్కువ. తన ప్రతిభకు పదును పెడుతూ, కేవలం 6 నిమిషాల వ్యవధిలో, 1.5 సెం.మీ పొడవు, 1.2 సెం.మీ వెడల్పు ఉన్న అతి చిన్న కాగితంపై పెన్సిల్తో రతన్ టాటా ముఖచిత్రాన్ని అత్యంత స్పష్టంగా గీశాడు. సాయి ప్రతిభను గుర్తిస్తూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది. -
ఆనందం.. ఆత్మీయత.. ఆవేదన
విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన అజెండా చర్చ రాత్రి 8 గంటల వరకు సాగింది. ఈ సమావేశంలో మొత్తం 37 అజెండా అంశాలతో పాటు మరో 30 టేబుల్ అంశాలకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. ఆటలొద్దు.. టూర్కే వెళ్దాం చివరి కౌన్సిల్లో మహిళా కార్పొరేటర్లు పార్టీలకతీతంగా ఏకమయ్యారు. ఐదేళ్లుగా సభలో ప్రజాసమస్యలపై గొంతెత్తిన వీరంతా ఆఖరి రోజున చిరునవ్వులు చిందిస్తూ ఆప్యాయతలు పంచుకున్నారు. ముగింపు సందర్భంగా మూడు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహిద్దామన్న మేయర్ ప్రతిపాదనను వారు తిరస్కరించారు. తమకు ఆటలు వద్దని, అందరినీ టూర్కు తీసుకెళ్లాలని పట్టుబడుతూ మేయర్ పోడియంను చుట్టుముట్టారు. జీరో అవర్ జరుగుతున్నా.. వినకుండా కమిషనర్ కేతన్గార్గ్కు వినతిపత్రం అందజేశారు. ఉన్నత చదువులు చదివిన అధికారుల ముందు, పెద్దల ముందు కూర్చుని మాట్లాడే స్థాయికి తాము చేరడానికి తమ భర్తల సహకారం మరువలేనిదని బీజేపీ కార్పొరేటర్ గంకల కవిత గుర్తు చేయగా.. మిగిలిన మహిళా సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు పలుకుతూ తమ భర్తలకు, ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. -
పారిశ్రామిక ప్రాంతాల్లో సమగ్ర మౌలిక వసతులు
మహారాణిపేట: జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో సమగ్ర మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆటోనగర్, మధురవాడ ఇండస్ట్రియల్ ఏరియా, ఐటీ పార్కుల్లో పనిచేస్తున్న కార్మికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్ స్టాప్లను సమర్థంగా నిర్వహించి, ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని సూచించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో ఆయన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. గత అజెండా అంశాలపై తీసుకున్న చర్యలను జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వి.ఆదిశేషు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వాహనాల రద్దీ నియంత్రణకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని సూచించారు. గాజువాక–ఆటోనగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులను వేగవంతం చేసి, జూన్ తొలి వారంలోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రోడ్లు–భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తాగునీటి సమస్యను ఐలా చైర్మన్ ప్రస్తావించగా, తక్షణ చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు. పీఎంఈజీపీ కింద మరిన్ని ప్రాజెక్టులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీఎం విశ్వకర్మ యోజన అమలులో పురోగతిని సమీక్షిస్తూ అర్హులైన లబ్ధిదారులకు విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా నానో పార్క్, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు విషయంలో చురుగ్గా వ్యవహరించి, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించాలని అన్నారు. జిల్లా అభివృద్ధికి కీలకమైన ఇండస్ట్రియల్ పార్క్ విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి పనులను సమయపాలనతో పూర్తి చేసి పరిశ్రమలకు అనుకూల పరిస్థితులు కల్పించేందుకు జిల్లా పరిపాలన కట్టుబడి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సింహాచలం, ఐలా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశాలు -
మా గౌరవం నిలపండి
పదవీ కాలం ము గిసినా మా గుర్తింపు తగ్గించొద్దు. వార్డులోని సమస్యలు, అభివృద్ధి పనులపై చేసే విజ్ఞప్తులకు రూల్ పొజిషన్ ప్రకారం ప్రాధాన్యమిచ్చి పనులు చేసి పెట్టాలి. ప్రజా సమస్యలపై వచ్చినప్పుడు మాకు ప్రాధాన్యమివ్వండి. వార్డుల్లోని పెండింగ్ పనులు పూర్తి చేయాలి. తద్వారా మా గౌరవం నిలపాలి. –బాణాల శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలి పాలిటెక్నిక్ కళాశాల ప్రహరీని ఆనుకుని ఉన్న భూమిని ఓ వ్యక్తి ఆక్రమిస్తున్నాడు. అలాగే అనధికార నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై అధికారులు దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలి. మా గొంతు వినిపించేందుకు ఇదే చివరి అవకాశం. –అల్లు శంకరరావు, వైఎస్సార్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఐదేళ్లకు మైక్ దొరికింది ఐదేళ్లుగా అడుగుతున్నా.. ఈ చివరి సమావేశంలోనే నాకు మాట్లాడే అవకాశం దక్కింది. గాజువాక డంపింగ్ యార్డ్ సమస్య, గంగవరం పోర్టు ప్రాపర్టీ ట్యాక్స్ పెంపు తదితర అంశాలపై కౌన్సిల్ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలి. –డాక్టర్ బొడ్డు గంగారావు, సీపీఎం ఫ్లోర్ లీడర్ -
● ముగిసిన జీవీఎంసీ ఆఖరి సర్వసభ్య సమావేశం ● మిగిలిన పనులైనాపూర్తి చేయాలని సభ్యుల విజ్ఞప్తి ● టూర్కు తీసుకెళ్లాలని పట్టుబట్టిన మహిళా కార్పొరేటర్లు
చివరి సమావేశం కావడంతో కౌన్సిల్ హాల్లో క్రమశిక్షణ కంటే ఆత్మీయ పలకరింపులకే ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశానికి మేయర్ పీలా శ్రీనివాసరావు కాస్త ఆలస్యంగా రావడంతో 11.30 గంటలకు సభ మొదలైంది. ఈలోపు సభ్యులంతా పిచ్చాపాటి కబుర్లు, సెల్ఫీలతో సందడి చేశారు. సభకు హాజరైన ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సైతం సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ ఫొటోలు దిగారు. సుదీర్ఘంగా జీరో అవర్.. సమావేశం ప్రారంభమైన వెంటనే మేయర్ జీరో అవర్ను ప్రకటించారు. సభ్యులకు తమ వార్డుల సమస్యలు చెప్పుకునేందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో ఉదయం 11.30కి మొదలైన జీరో అవర్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. భోజన -
కొండకు ‘మృత్యు’ గండం
అగనంపూడి: జీవీఎంసీ 88వ వార్డు పరిధిలోని మంగళపాలెం ఇప్పుడు మందుపాతరల మీద నిలబడింది. నిబంధనల ప్రకారం జనవాసాల మధ్య బ్లాస్టింగ్లు నిషిద్ధమైనా, ‘ఏఏ మినరల్స్’ అనే మైనింగ్ ఏజెన్సీకి అవేవీ పట్టడం లేదు. సర్వే నంబర్ 141లోని కొండను పిండి చేస్తూ, కోట్ల రూపాయల విలువైన సహజ సంపదను కొల్లగొడుతూ, వేలాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతోంది. అధికారుల కళ్లు గప్పి కాదు.. వారి కళ్ల ముందే, వారి అండదండలతోనే ఈ విధ్వంసం జరుగుతుండటం గమనార్హం. అర్ధరాత్రి బాంబుల మోత సంధ్యానగర్, గంగవరం, మంగళపాలెం, టిడ్కో గృహసముదాయం వంటి కాలనీల్లో సుమారు 25 వేల మంది నివసిస్తున్నారు. ఈ ప్రాంతాలను ఆనుకుని ఉన్న కొండపై బహిరంగంగా బాంబులు పేలుస్తుండటంతో స్థానికులు నిత్యం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. బ్లాస్టింగ్ల ధాటికి భూమి కంపిస్తూ, పక్కనే ఉన్న టిడ్కో ఇళ్లు, జేఎన్ఎన్యుఆర్ఎం భవనాలు బీటలు వారుతున్నాయి. కేవలం ఇళ్లే కాకుండా, కొండపై ఉన్న పురాతన ఆలయాల గోపురం, శిఖరాలు కూడా పేలుళ్ల తీవ్రతకు దెబ్బతిన్నాయి. ఏ క్షణాన ఏ రాయి వచ్చి తమ నెత్తిన పడుతుందో, ఏ ఇల్లు కూలిపోతుందోనని పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు వణికిపోతున్నారు. గాలిలో కలిసిన ధూళి వల్ల శ్వాసకోశ వ్యాధులు చుట్టుముడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఫిర్యాదు చేసినా మైనింగ్ అధికారులు పట్టించుకోకపోగా, ఏజెన్సీకి వత్తాసు పలుకుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భూకంపం అనుకుని వీధుల్లోకి పరుగులు రెండు రోజుల క్రితం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఒక్కసారిగా సంభవించిన భారీ పేలుళ్లతో సంధ్యానగర్, గంగవరం, టిడ్కో కాలనీవాసులు భూకంపం వచ్చిందన్న భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తీరా అది క్వారీలో జరిగిన బ్లాస్టింగ్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఆ భయం మాత్రం వా రిని వెంటాడుతూనే ఉంది. 30 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి బాంబులు అ మ ర్చి పేలుస్తుండటంతో భూమి కంపిస్తోందని స్థానికులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ పర్వం నాణ్యమైన గ్రావెల్, మెటల్ లభిస్తుండటంతో వందల కొద్దీ లారీల ద్వారా ఈ సంపదను అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. అనుమతి పత్రాలు చూపించమంటే నిర్వాహకులు బెదిరింపులకు దిగుతున్నారని కాలనీవాసులు మండిపడుతు న్నారు. నిద్రపోతున్న యంత్రాంగం ఒకవైపు ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ గురించి గొప్పలు చెబుతుంటే, మరోవైపు జీవీఎంసీ పరిధిలోనే కొండలు కనుమరుగైపోతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా సాగుతున్న ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంలో జిల్లా యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికై నా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ ప్రత్యేక చొరవ చూపి ఈ దందా ఆపాలని, మంగళపాలెం ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించి, నిబంధనలు ఉల్లంఘించిన ఏఏ మినరల్స్ వంటి సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మైనింగ్ ఏజెన్సీ ఆగడాలు ఆపకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, ప్రాణాలకు తెగించి అయినా క్వారీ తవ్వకాలను అడ్డుకుంటామని సంధ్యానగర్ వాసులు స్పష్టం చేస్తున్నారు. క్వారీ తవ్వకాలను నిషేధించాలి అనుమతులు ఉన్నాయని మైనింగ్ ఏజెన్సీ బుకాయిస్తోంది. అసలు అనుమతులు ఉంటే ఎందుకు సంబంధిత పత్రాలను చూపించడం లేదు. అనధికారిక తవ్వకాలకు అధికారులు వత్తాసు పలకడం వల్లే ఈ బాంబు పేలుళ్లు, బరితెగింపులు. పక్కనే నివాసాలు ఉన్నాయనే ఆలోచన లేకుండా ఒకేమారు పెద్ద ఎత్తున బాంబులు పేల్చుతూ భయకింపితుల్ని చేస్తున్నారు. అధికారులు స్పందించి క్వారీ తవ్వకాలు నిలిపివేయాలి. –డీవీఆర్ఎస్ రంగరాజు, కాలనీవాసి అధికారుల కనుసన్నల్లోనే... క్వారీ తవ్వకాలకు కార్యాలయం ఏర్పాటు చేసి మరీ తవ్వకాలు చేపడుతున్నారు. అధికారులు వత్తాసు, ఏజెన్సీ నిర్వాహకుల పలుకుబడి కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. బాంబు పేలుళ్లతో పిల్లలు, వృద్ధులు భయాందోళన చెంందుతున్నారు. రాత్రివేళల్లో బాంబుల మోతతోపాటు భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. బాంబుల శబ్ధానికి ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయి. చుట్టూ కాలనీలు ఉండగా మైనింగ్కు అనుమతులెలా ఇచ్చారో అర్థం కావడం లేదు. –డీవీ పార్వతి, స్థానికురాలు -
మాజీ మంత్రి జోగి రమేష్కు పరామర్శ
మహారాణిపేట: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత జోగి రమేష్ను ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి పరామర్శించారు. శనివారం పెడనలోని జోగి రమేష్ స్వగృహానికి వెళ్లిన నేతలు.. ఆయనతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇటీవల జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు పెట్రోలు బాంబులతో చేసిన దాడిని, విధ్వంసాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా దాడి జరిగిన ప్రదేశాన్ని చూపించి, ఆనాటి ఘటనను జోగి రమేష్ వారికి వివరించారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ.. బీసీ నాయకుడు, మాజీ మంత్రిపై పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలతో దాడి చేయించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. దీన్ని రాష్ట్రంలోని బీసీలందరిపై జరిగిన దాడిగానే భావించాలన్నారు. పక్కా ప్రణాళికతోనే జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జోనల్ ఇన్చార్జి అంబటి శైలేష్, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు జీలకర్ర నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ రైల్వే గుండెకోత
● ఆ రెండింటినీ రాయగడకే అప్పగించేసిన రైల్వే బోర్డు ● కాపాడుకోవడంలో చంద్రబాబు సర్కారు విఫలం ● తుది హద్దులు ఖరారు చేసిన కేంద్రం ● విశాఖ డివిజన్ పరిధి 401.68 కిలోమీటర్లు ● రాయగడ డివిజన్ పరిధి 704.75 కిలోమీటర్లుగా నిర్థారించిన బోర్డు సాక్షి, విశాఖపట్నం: అనుకున్నదంతా అయిపోయింది.. చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం ముందు మరోసారి మోకరిల్లి.. విశాఖ రైల్వే డివిజన్ ఆదాయ వనరులను రైల్వే బోర్డుకు తాకట్టు పెట్టేసింది. దశాబ్దాల కలగా ఉన్న విశాఖ రైల్వే డివిజన్ నెరవేరే రోజులు సమీపిస్తున్నాయన్న ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. శతాబ్దాల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ విచ్ఛిన్నమైపోయింది. విశాఖ డివిజన్కు రావాల్సిన ఆదాయాన్నంతా ఒడిశా తీసుకెళ్లిపోతోంది. అరకు, కేకేలైన్ మొత్తాన్ని రాయగడ డివిజన్ పరిధిలో విలీనం చేసేస్తూ రైల్వే బోర్డు తాజాగా తుది ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పర్యాటక ప్రాంతమంతా రాయగడకే.. కొత్తగా ప్రతిపాదించిన విశాఖపట్నం డివిజన్, రాయగడ డివిజన్ల మధ్య కిలోమీటర్ల వారీగా విభజనను అధికారులు ఖరారు చేశారు. అయితే.. ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి అత్యంత కీలకమైన అరకు ప్రాంతం విశాఖ డివిజన్ పరిధి నుంచి రాయగడ పరిధిలోకి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత విభజన లెక్కల ప్రకారం.. సరకు రవాణా పరంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే కేకే (కొత్తవలస–కిరండూల్) లైన్ మొత్తం.. రాయగడ డివిజన్ పరిధిలోకి వెళ్లిపోయింది. కేకే లైన్లో కొత్తవలస యార్డు మినహాయించి.. పర్యాటక ప్రాంతాలైన బొర్రాగుహలు, అరకు, కిరండూల్ వరకు ఉన్న సుదీర్ఘ మార్గం అంతా రాయగడ డివిజన్ కిందికే వెళ్లింది. దీనివల్ల విశాఖపట్నం తన ఆదాయ వనరులలో ప్రధానమైన పర్యాటక, కార్గో రైల్వే మార్గాన్ని కోల్పోయింది. చంద్రబాబు కూటమి ఎంపీల వైఫల్యం వల్లే విశాఖ డివిజన్ నష్టపోయింది. విశాఖ డివిజన్ ప్రయోజనాల కోసం ఏనాడూ టీడీపీ, జనసేన ఎంపీలు లోక్సభలో గళమెత్తిన పాపాన పోలేదు. కేకేలైన్ చేజారింది.. అరకు వెళ్లిపోయింది..కొత్త జోన్కు వాల్తేరే కీలకం.. కానీ.! తూర్పు కోస్తా రైల్వే జోన్కు 1106.435 కిమీ విస్తీర్ణం, 2859.376 కి.మీ. ట్రాక్లైన్తో ఉన్న వాల్తేరు డివిజన్ బంగారు బాతుగుడ్డు లాంటిది. ఆదాయాన్ని తెచ్చిపెట్టే అతిపెద్ద డివిజన్ వాల్తేరు. ఏటా దాదాపు 3 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ. 17 వేల కోట్లు కాగా, ఇందులో రూ.10 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. దేశంలోనే సుమారు 300 డీజిల్ ఇంజన్లతో అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజిన్లతో భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ ఇది. ఇందులో సింహభాగం ఆదాయం ఐరన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. వాల్తేరు డివిజన్ పరిధిలో ఏటా సరకు రవాణా ద్వారా వచ్చే ఆదాయమంతా.. ఇప్పుడు రాయగడ డివిజన్కు సొంతమవుతుంది. దీనివల్ల కొత్తగా ఏర్పడే విశాఖ డివిజన్ ఆదాయం రూ.3 వేల కోట్లు కూడా దాటే అవకాశం లేదు. -
ఇంటింటికీ సౌర విద్యుత్
కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశంమహారాణిపేట: జిల్లాలో పీఎం సూర్యఘర్– ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని యుద్ధ ప్రతిపాదికన అమలు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే మూడు నెలలను ప్రత్యేక కార్యాచరణ దశగా ప్రకటించి, ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్డీఏ, యూసీడీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల సభ్యులందరూ ఈ పథకం కింద సౌర యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఒక్కో యూనిట్కు సుమారు రూ.2.10 లక్షల ఖర్చు కాగా, కేంద్ర ప్రభుత్వం రూ.80 వేల వరకు రాయితీ ఇస్తుందన్నారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా పొందే సౌకర్యం ఉందని తెలిపారు. సౌర విద్యుత్తో కరెంటు బిల్లులు గణనీయంగా తగ్గుతాయని, పర్యావరణ పరిరక్షణతో పాటు లబ్ధిదారులకు దీర్ఘకాలిక ఆర్థిక లాభం చేకూరుతుందన్నారు. ఇప్పటికే యూనిట్లు ఏర్పాటు చేసుకున్న వారి అనుభవాలను వీడియోల ద్వారా ప్రచారం చేసి, ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో నమ్మకం పెంచాలని కలెక్టర్ సూచించారు. జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్యాంబాబు, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, డీపీవో శ్రీనివాసరావు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. -
అధికారులకు ధన్యవాదాలు
మా కొండవాలు ప్రాంతాల్లో అనేక సమస్యలున్నా.. అధికారులు అభివృద్ధికి ఎంతగానో సహకరించారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలి. – గంకల కవిత, బీజేపీ ఫ్లోర్ లీడర్ నగరాభివృద్ధిలో భాగస్వామ్యం ఎంతో చరిత్ర కలిగిన విశాఖ నగరపాలక సంస్థ, ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న క్రమంలో మేం కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. గాజువాక ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందింది. – ఏజే స్టాలిన్, సీపీఐ ఫ్లోర్ లీడర్ -
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
12 ఏళ్ల తర్వాత జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించి నాకు అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుకు, ప్రజలకు కృతజ్ఞతలు. వార్డులో శ్మశానవాటిక అభివృద్ధితో పాటు మిగిలిన పనులు పూర్తి చేయాలి. –సాడి పద్మారెడ్డి, స్థాయీ సంఘం సభ్యురాలు సదుపాయాలు కల్పించండి వార్డులో శ్మశాన వాటిక పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. ఫెయిర్ ఫీల్డ్ మేరియట్ హోటల్ నుంచి సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు తొలగించిన అంబేడ్కర్ కాలనీ గృహ టీడీఆర్ సమస్యను కమిషనర్ చొరవ తీసుకుని పరిష్కరించాలి. –రెయ్యి వెంకటరమణ, 51వ వార్డు కార్పొరేటర్, వైఎస్సార్ సీపీ -
కేకేలైన్ చేజారింది.. అరకు వెళ్లిపోయింది
సాక్షి, విశాఖపట్నం: అనుకున్నదంతా అయిపోయింది.. చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం ముందు మరోసారి మోకరిల్లి.. విశాఖ రైల్వే డివిజన్ ఆదాయ వనరులను రైల్వే బోర్డుకు తాకట్టు పెట్టేసింది. దశాబ్దాల కలగా ఉన్న విశాఖ రైల్వే డివిజన్ నెరవేరే రోజులు సమీపిస్తున్నాయన్న ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. శతాబ్దాల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ విచ్ఛిన్నమైపోయింది. విశాఖ డివిజన్కు రావాల్సిన ఆదాయాన్నంతా ఒడిశా తీసుకెళ్లిపోతోంది. అరకు, కేకేలైన్ మొత్తాన్ని రాయగడ డివిజన్ పరిధిలో విలీనం చేసేస్తూ రైల్వే బోర్డు తాజాగా తుది ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పర్యాటక ప్రాంతమంతా రాయగడకే కొత్తగా ప్రతిపాదించిన విశాఖపట్నం డివిజన్, రాయగడ డివిజన్ల మధ్య కిలోమీటర్ల వారీగా విభజనను అధికారులు ఖరారు చేశారు. అయితే.. ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి అత్యంత కీలకమైన అరకు ప్రాంతం విశాఖ డివిజన్ పరిధి నుంచి రాయగడ పరిధిలోకి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత విభజన లెక్కల ప్రకారం.. సరకు రవాణా పరంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే కేకే (కొత్తవలస–కిరండూల్) లైన్ మొత్తం.. రాయగడ డివిజన్ పరిధిలోకి వెళ్లిపోయింది. కేకే లైన్లో కొత్తవలస యార్డు మినహాయించి.. పర్యాటక ప్రాంతాలైన బొర్రాగుహలు, అరకు, కిరండూల్ వరకు ఉన్న సుదీర్ఘ మార్గం అంతా రాయగడ డివిజన్ కిందికే వెళ్లింది. దీనివల్ల విశాఖపట్నం తన ఆదాయ వనరులలో ప్రధానమైన పర్యాటక, కార్గో రైల్వే మార్గాన్ని కోల్పోయింది. చంద్రబాబు కూటమి ఎంపీల వైఫల్యం వల్లే విశాఖ డివిజన్ నష్టపోయింది. విశాఖ డివిజన్ ప్రయోజనాల కోసం ఏనాడూ టీడీపీ, జనసేన ఎంపీలు లోక్సభలో గళమెత్తిన పాపాన పోలేదు. కొత్త జోన్కు వాల్తేరే కీలకం.. కానీ.! తూర్పు కోస్తా రైల్వే జోన్కు 1106.435 కిమీ విస్తీర్ణం, 2859.376 కి.మీ. ట్రాక్లైన్తో ఉన్న వాల్తేరు డివిజన్ బంగారు బాతుగుడ్డు లాంటిది. ఆదాయాన్ని తెచి్చపెట్టే అతిపెద్ద డివిజన్ వాల్తేరు. ఏటా దాదాపు 3 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ. 17 వేల కోట్లు కాగా, ఇందులో రూ.10 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. దేశంలోనే సుమారు 300 డీజిల్ ఇంజన్లతో అతిపెద్ద లోకోషేడ్, 160 ఇంజిన్లతో భారీ ఎలక్ట్రికల్ లోకోషేడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ ఇది. ఇందులో సింహభాగం ఆదాయం ఐరన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. వాల్తేరు డివిజన్ పరిధిలో ఏటా సరకు రవాణా ద్వారా వచ్చే ఆదాయమంతా.. ఇప్పుడు రాయగడ డివిజన్కు సొంతమవుతుంది. దీనివల్ల కొత్తగా ఏర్పడే విశాఖ డివిజన్ ఆదాయం రూ.3 వేల కోట్లు కూడా దాటే అవకాశం లేదు. కొత్తగా రానున్న విశాఖపట్నం రైల్వే డివిజన్ స్వరూపం ఇదీ.. డివిజన్ పరిధి: 401.68 కిలోమీటర్లు ట్రాక్ మొత్తం : 1317.501 కిలోమీటర్లు » విశాఖపట్నం నుంచి దువ్వాడ వరకూ ఉన్న యార్డులతో కలిపి ప్రధాన సెక్షన్ » విజయనగరం, గజపతినగరం, చీపురుపల్లి మీదుగా పలాస వరకూ ఉన్న మార్గం » నౌపడ–గుణుపూర్ నేరోగేజ్ లైన్లోని కొంత భాగం.. బొబ్బిలి, పార్వతీపురం స్టేషన్లు రాయగడ డివిజన్ పరిధిఇలా.. డివిజన్ పరిధి : 704.755 కిలోమీటర్లు ట్రాక్ మొత్తం : 1541.875 కిలోమీటర్లు రాయగడ డివిజన్లోకి వెళ్లిన కేకేలైన్ మొత్తం పరిధి : 445 కిలోమీటర్లు -
45 కేసుల్లో 76 మంది అరెస్ట్
అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరికి సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 45 దొంగతనం కేసులను ఛేదించి, 76 మందిని అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. నిందితుల నుంచి మొత్తం రూ.1,02,79,845 విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. శుక్రవారం నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ ఈ వివరాలను వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సొత్తులో రూ. 39,79,845 విలువైన 378.02 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.08 కేజీల వెండి వస్తువులు ఉన్నాయని తెలిపారు. రూ.21,37,200 నగదుతో పాటు ద్విచక్ర వాహనాలు, రూ. 63 లక్షల విలువైన 423 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. డిటెక్ట్ చేసిన 45 కేసుల్లో.. 2 దోపిడీ కేసులు, 4 పగటి పూట ఇళ్ల తాళాలు పగులగొట్టిన కేసులు, 5 రాత్రి పూట ఇళ్ల దొంగతనాలు, 4 చైన్ స్నాచింగ్లు, 2 మోటార్ సైకిల్ దొంగతనాలు, 3 వైర్ల దొంగతనం, ఒక పిక్ పాకెటింగ్, 24 సాధారణ దొంగతనం కేసులు ఉన్నాయని సీపీ వివరించారు. నేరాల నియంత్రణలో భాగంగా జనవరిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 364 సమావేశాలు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. అనంతరం రికవరీ చేసిన వస్తువులను బాధితులకు సీపీ అందజేశారు. సమావేశంలో క్రైం విభాగపు డీసీపీ, ఏడీసీపీ, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. 24 గంటల్లో చోరీ కేసు ఛేదన ● పాత నేరస్తుడు వెంకటేష్ అరెస్ట్ కూర్మన్నపాలెం పరిధిలో జరిగిన దొంగతనం కేసును దువ్వాడ పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేశారు. కూర్మన్నపాలెంలోని గ్లోరియా విద్యా కేంద్రం వెనుక నివసిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ సుగన్ చంద్ర గుప్తా తన భార్యతో కలిసి ఈ నెల 15న కాశీ యాత్రకు వెళ్లారు. తిరిగి 24వ తేదీన వచ్చేసరికి, ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటం గమనించారు. అల్మారాలోని సుమారు 300 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి నాణేలు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సౌత్ క్రైం ఇన్స్పెక్టర్ కల్లూరి శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు.. సాంకేతిక ఆధారాల సాయంతో పాత నేరస్తుడు గాజువాక సుందరయ్య కాలనీకి చెందిన మల్లారెడ్డి వెంకటేష్ను గుర్తించాయి. గురువారం సాయంత్రం అగనంపూడి, మణప్పురం ఫైనాన్స్ పక్క రోడ్లో అతడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 270 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు గాజువాక పరిధిలో దొంగిలించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వెంకటేష్పై ఇప్పటికే 40కి పైగా కేసులు ఉన్నాయి. ఈ నెల 17నే బెయిల్ మీద బయటకు వచ్చిన అతను, వ్యసనాలకు బానిసై మళ్లీ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చోరీ సొత్తులో ఒక నెక్లెస్, ఒక నల్లపూసల గొలుసును జైల్లో పరిచయమైన మధురవాడకు చెందిన చుక్క ఎర్నీ రాజుకు ఇచ్చి, వాటిని తాకట్టు/అమ్మి పెట్టి డబ్బులు తీసుకురమ్మని చెప్పాడు. అతన్ని కూడా పట్టుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అత్యంత వేగంగా కేసును ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. రూ.1.02 కోట్ల సొత్తు రికవరీ -
ఐఐఎంవీలో సమారంభ్ 10.0 ప్రారంభం
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరంలోని ఐఐఎం విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరగనున్న 10వ వార్షిక సాంస్కృతిక ఉత్సవం ‘సమారంభ్ 10.0’శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ‘మిలీనియం డ్రీమ్ల్యాండ్’ థీమ్తో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక పోటీలు, సంగీత విభావరి క్యాంపస్లో సందడి నింపాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా అచీవర్స్ అవార్డులను ప్రదానం చేశారు. విద్యా రంగంలో ఆర్యాకి పాఠక్, క్రీడల్లో మహేంద్ర పటేల్, ఆల్రౌండ్ ఎక్స్లెన్స్లో ఇయోన్స్ చెరియన్లు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. విజేతలకు ఒక్కొక్కరికి రూ.31,000 చొప్పున నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో ఐఐఎంవీ స్టూడెంట్ అఫైర్స్ మేనేజర్ రాయప్రోలు రాము, రీసెర్చ్ డీన్ అమిత్ శంకర్, బ్యాంక్ ఆఫ్ బరోడా డిప్యూటీ రీజనల్ హెడ్ సతీష్, వేములవలస బ్రాంచ్ మేనేజర్ సంపత్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ తేజ, క్రెడిట్ కార్డు డివిజన్ ప్రతినిధి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలు శనివారం ముగియనున్నాయి. -
కమనీయం...అనంతుని కల్యాణం
పద్మనాభం: పద్మనాభంలోని కుంతీమాధవ స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి అనంత పద్మనాభ స్వామి కల్యాణం కనుల పండువగా జరిగింది. ముందుగా ధ్వజారోహణ చేసి, స్వామివారిని ఆంజనేయ వాహనంపై, అమ్మవార్లను హంస, గజ వాహనాలపై రాజవీధుల్లో ఊరేగించి ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, నాదస్వరాల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి కల్యాణాన్ని వైభవంగా జరిపారు. ఈవో పీఎల్ఎన్ రాజు పర్యవేక్షణలో జరిగిన ఈ కల్యాణాన్ని ఎంపీపీ కంటుబోతు రాంబాబు, వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు, పద్మనాభం సర్పంచ్ తాలాడ పాప, పద్మనాభం దంపతులు, కృష్ణాపురం ఎంపీటీసీ సభ్యురాలు కంటుబోతు లక్ష్మి, ఎర్నాయుడు దంపతులు, పద్మనాభం పీఏసీఎస్ అధ్యక్షుడు మొకర అప్పలనాయుడు, భక్త బృందం సభ్యులు బుగత సత్యనారాయణ, అముజూరి అప్పారావు, బోని సన్యాసినాయుడు, మొకర సన్నిబాబు, తాలాడ పైడిరాజు, బుగత రాముతో పాటు అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అనంత పద్మనాభ స్వామి కల్యాణాన్ని కనులారా వీక్షికంచారు. -
ఏయూలో అరాచక శక్తులను అరికట్టండి
కలెక్టరేట్ ఎదుట వామపక్షాల ధర్నా మహారాణిపేట: ఆంధ్రా యూనివర్సిటీలో మత వైషమ్యాలు సృష్టించి, విద్యార్థులపై దాడులకు పాల్పడిన ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ శక్తులను తక్షణమే అరెస్టు చేయాలని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించి, ఏయూలోని విద్యార్థి, కార్మిక, దళిత సంఘాల జెండాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ధర్నాను ఉద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. రెహ్మన్, సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ) కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు, ప్రజాపోరు కార్యదర్శి మహిత మాట్లాడారు. విద్యపై ఏకాగ్రత వహించాల్సిన విశ్వవిద్యాలయంలో మత విద్వేషాలు రగిల్చి, విద్యార్థినిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులతో నీచమైన ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఏయూ ఎప్పుడూ మత సామరస్యానికి, విద్యా వికాసానికి నిలయమని, అటువంటి చోట అరాచకాలు సృష్టించడం దారుణమని ధ్వజమెత్తారు. అధికార గర్వంతో చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్న దుండగులపై పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని వారు ప్రశ్నించారు. రాజ్యాంగం, చట్టాలు వీరికి వర్తించవా? చంద్రబాబు ప్రభుత్వం వీరికి మినహాయింపు ఇచ్చిందా? అని నిలదీశారు. నిందితులను అరెస్టు చేయకపోతే ప్రభుత్వం అరాచకాలను ప్రోత్సహిస్తుందనే భావన ప్రజల్లో కలుగుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని, ఏయూలో ప్రశాంత వాతావరణాన్ని పునరుద్ధరించాలని నేతలు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో సీపీఎం నాయకులు బి.గంగారావు, ఆర్.కె.ఎస్.వి.కుమార్, పి.మణి, వి.కృష్ణారావు, పి.పైడిరాజు, బి.రమణి, క్షేత్రపాల్, వనజ, చంద్రశేఖర్; సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ) నాయకులు నిర్మల, వెంకటలక్ష్మి తదితరులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఊబిలో పడి యువకుడి మృతి
గాజువాక : చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లిన ఒక యువకుడు ప్రమాదవశాత్తు ఊబిలో దిగి దుర్మరణంపాలయ్యాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక హైస్కూల్ రోడ్ ప్రాంతానికి చెందిన బండ అప్పన్న బాబు (35) ప్రతిరోజూ నాతయ్యపాలెంలోని కృష్ణమహంతి చెరువుకు వచ్చి చేపలు పడుతుంటాడు. శుక్రవారం కూడా ఎప్పటిలాగే చెరువుకు వచ్చిన అప్పన్నబాబు చేపలు పడుతున్న క్రమంలో కాలుజారి చెరువులో పడిపోయాడు. ఆ ప్రాంతంలో ఊబి ఉండటంతో ఊపిరి ఆడక మృతి చెందినట్టు స్థానికులు పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక వివరాలను సేకరించిన అనంతరం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
త్వరలో ఏపీ జైళ్ల శాఖలో కొత్త చట్టం: ఐజీ శ్రీనివాసరావు
ఆరిలోవ : ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో 1894 నాటి పాత చట్టం స్థానంలో త్వరలో కొత్త చట్టం అమలులోకి రానుందని జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన ఆయన ఏపీ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ బిల్లు–2026ను ఇప్పటికే అసెంబ్లీలో ప్రవేశపెట్టామని, గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే ఇది చట్టరూపం దాల్చుతుందని వెల్లడించారు. ఈ కొత్త చట్టం ద్వారా జైళ్ల ఆధునీకరణ, ఖైదీల సంక్షేమం, మానవీయ సంస్కరణలకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. అలాగే రాష్ట్రంలోని వివిధ జైళ్ల అభివృద్ధికి రూ.102 కోట్లు కేటాయించామని, అందులో మొదటి విడతగా విడుదలైన రూ.53 కోట్లతో కొత్త బ్యారక్లు, సిసి కెమెరాలు, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. జైళ్ల పరిపాలనలో పటిష్ట నాయకత్వం, నైతిక విలువలు అత్యవసరమని పేర్కొన్నారు. ‘కారాగార పరిపాలనా నాయకత్వం’పై అధికారులకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభ నిర్వహణ, పరిపాలనలో సంస్కరణల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో లా కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రుచా మిశ్రికోట్కర్, జైలు సూపరింటెండెంట్ ఎం.మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి విశాఖలో సెలబ్రిటీ క్రికెట్ జోష్
విశాఖ స్పోర్ట్స్/గోపాలపట్నం : నగరంలోని వైఎస్సార్ స్టేడియంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు సెలబ్రిటీ టీ20 క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. టాలీవుడ్ హీరోలు శ్రీకాంత్, తరుణ్ నేతృత్వంలోని జట్లతో పాటు ఎమ్మెల్యేలు, పోలీస్, కార్పొరేట్ విభాగాలకు చెందిన మొత్తం ఏడు జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. సుమారు 110 మంది సినీ, టీవీ ఆర్టిస్టులు ఈ పోటీల కోసం ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. క్రీడల్లో రాణిస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి తోడ్పాటునందించే సామాజిక లక్ష్యంతో ఈ మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు నటుడు శ్రీకాంత్ తెలిపారు. శనివారం ఉదయం 9.30 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుండగా, మార్చి 1వ తేదీ రాత్రి టైటిల్ పోరు జరగనుంది. -
పింఛన్లకు చంద్ర గ్రహణం
మహారాణిపేట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా, కొత్త పింఛన్ల మంజూరు ఊసెత్తకపోవడంపై నిరుపేదల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఎన్నికల వేళ 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని, దివ్యాంగులకు అండగా ఉంటామని ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో ఏటా రెండుసార్లు (జనవరి, జూలై) అర్హులను గుర్తించి పింఛన్లు మంజూరు చేసేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు ఒక్క కొత్త పింఛన్ కూడా ఇచ్చిన దాఖలాలు లేకపోవడంతో వేలాది మంది అర్హులు ఆశగా సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సోషల్ మీడియాలో కొత్త పింఛన్ల దరఖాస్తులపై తప్పుడు సమాచారం వైరల్ అవుతుండగా, సచివాలయాల్లో మాత్రం ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వ కుట్రపై ఆందోళనలు మరోవైపు ఉన్న పింఛన్లను సైతం ఏదో ఒక సాకుతో తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దివ్యాంగుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఖజానాపై భారాన్ని తగ్గించుకునేందుకు లబ్ధిదారుల సంఖ్యలో కోత విధించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే దివ్యాంగులకు మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, ఆ పరీక్షలకు హాజరుకాని వారి పింఛన్లను నిలిపివేస్తున్నారు. జిల్లాలో సుమారు 1,579 మంది దివ్యాంగుల పింఛన్లకు ఎసరు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మంచం మీద ఉండే నిస్సహాయులకు సైతం నోటీసులు ఇచ్చి ఆసుపత్రుల చుట్టూ తిప్పడంపై వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. 50 ఏళ్లకే పింఛన్ ప్రశ్నార్థకం సూపర్–6 హామీల్లో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించినా, నేటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. సచివాలయాల్లో విచారిస్తే ‘ఆప్షన్ రాలేదు’ అనే సమాధానమే వినిపిస్తోంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వేలాది ఫైళ్లు కార్యాలయాల్లో దుమ్ము పడుతున్నాయి. జిల్లాలో పింఛన్ల సంఖ్య నెలకు వందల సంఖ్యలో తగ్గుతూ వస్తుండటం గమనార్హం. ఇప్పటివరకు మొత్తం 2,107 పింఛన్లు తగ్గిపోయాయి. మార్చి ఒకటో తేదీ నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ, కొత్త వారిని చేర్చుకోకుండా పాత వారిని తొలగించడమే లక్ష్యంగా పాలన సాగుతోందని జనం మండిపడుతున్నారు. కొత్తవి ఇవ్వరు.. ఉన్నవి ఉంచరు ప్రస్తుతం జిల్లాలో 1,58,557 మంది పింఛనుదారులు పింఛన్దారులకు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంసంవత్సరం నెల మొత్తం తొలగించిన పింఛన్లు పింఛన్లు 2026 ఫిబ్రవరి 1,58,557 388 2026 జనవరి 1,58,945 441 2025 డిసెంబర్ 1,59,386 250 2025 అక్టోబర్ 1,59,950 250 2025 సెప్టెంబర్ 1,60,200 245 2025 ఆగస్టు 1,60,445 333 2025 జులై 1,60,778 200 మొత్తం తగ్గిన పింఛన్లు 2,107 -
రోజులేనా..!
మళ్లీ పాతడాబాగార్డెన్స్: జీవీంఎసీ ప్రస్తుత పాలకవర్గ ప్రస్థానం ముగింపు దశకు చేరుకుంది. 2021లో మొదలైన ఈ ఐదేళ్ల ప్రయాణంలో శనివారం నిర్వహించనున్న సర్వసభ్య సమావేశం అత్యంత కీలకం కానుంది. ప్రస్తుత మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఈ చిట్టచివరి సమావేశం జరగనుంది. ఈ భేటీలో నగరాభివృద్ధికి సంబంధించి 37 ప్రధాన అజెండా అంశాలపై చర్చించి సభ్యులు ఆమోదం తెలపనున్నారు. ముఖ్యంగా వీధి దీపాల నిర్వహణ, వివిధ సర్వీసు అంశాలు మరియు పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులకు ఈ సమావేశంలో మోక్షం లభించనుంది. ఇద్దరు మేయర్లు... ఎన్నో రాజకీయ మలుపులు ఈ ఐదేళ్ల కాల పరిమితిలో విశాఖ నగర పాలన ఎన్నో రాజకీయ పరిణామాలకు వేదికై ంది. 2021 ఏప్రిల్ నుంచి సుమారు నాలుగేళ్ల పాటు వైఎస్సార్ సీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్ హోదాలో కౌన్సిల్ సమావేశాలను నడిపించారు. ఆమె హయాంలో జియ్యాని శ్రీధర్, కట్టుమూరి సతీష్ డిప్యూటీ మేయర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే రాజకీయ సమీకరణల మార్పుతో గతేడాది ఏప్రిల్ 28న పీలా శ్రీనివాసరావు మేయర్గా, దళ్లి గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్గా పగ్గాలు చేపట్టారు. కట్టుమూరి సతీష్ మాత్రం ఐదేళ్ల పాటు డిప్యూటీ మేయర్గా తన పదవిలో కొనసాగడం గమనార్హం. వచ్చే నెల 18తో ఈ పాలకవర్గ గడువు అధికారికంగా ముగియనుంది. పంచాయతీల విలీనం.. ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత ప్రస్తుత పరిస్థితుల్లో జీవీఎంసీకి తక్షణమే ఎన్నికలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. భీమిలి నియోజకవర్గ పరిధిలోని 64 పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ ఈ విలీన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైతే, వార్డుల పునర్విభజన, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా, మార్చి 7వ తేదీ తర్వాత కౌన్సిల్ సమావేశాలకు అవకాశం లేకపోవడంతో, నగరం మరోసారి సుదీర్ఘ కాలం పాటు అధికారుల చేతుల్లోనే ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మేయర్ల చారిత్రక నేపథ్యం విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఎందరో ప్రముఖులు మేయర్లుగా సేవలు అందించారు. 1981లో బీజేపీకి చెందిన ఎన్.ఎస్.ఎన్ రెడ్డి తొలి మేయర్గా బాధ్యతలు చేపట్టగా, ఆ తర్వాత డి.వి. సుబ్బారావు (టీడీపీ), సబ్బం హరి (కాంగ్రెస్) వంటి నేతలు పనిచేశారు. విశాఖకు తొలి మహిళా మేయర్గా రాజాన రమణి ఐదేళ్ల పాటు రికార్డు సృష్టించారు. గ్రేటర్ విశాఖగా ఆవిర్భవించిన తర్వాత పులుసు జనార్దనరావు మేయర్గా సేవలందించగా, సుదీర్ఘ విరామం తర్వాత 2021లో గొలగాని హరి వెంకటకుమారి మేయర్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పీలా శ్రీనివాసరావు ఈ ఐదేళ్ల కాలక్రమానికి ముగింపు పలకబోతున్నారు. ఎన్నికల సందిగ్ధంలో గ్రేటర్ విశాఖ జీవీఎంసీ ‘చివరి’ అంకం: ఐదేళ్ల ప్రస్థానానికి నేడే ముగింపు పలకనున్న కౌన్సిల్ 37 అంశాలతో అజెండా మేయర్ కాలానికి మోగిన ముగింపు గంటమళ్లీ అధికారుల పాలన? విశాఖలో ఉత్కంఠ ప్రస్తుత పాలకవర్గ గడువు ముగియడానికి మరో పక్షం రోజులు మాత్రమే సమయం ఉండటంతో, నగరం మళ్లీ అధికారుల పాలనలోకి వెళ్తుందా అనే చర్చ జోరందుకుంది. గత చరిత్రను పరిశీలిస్తే..2012 నుంచి 2021 వరకు సుమారు ఎనిమిదేళ్ల పాటు ఎన్నికలు జరగక అధికారులే పాలన సాగించారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో సుదీర్ఘ కాలం పాటు ప్రత్యేకాధికారుల పరిపాలన కొనసాగింది. 2021లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడంతో మళ్లీ ప్రజాప్రతినిధుల పాలన అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండటం, పాలకవర్గ గడువు ముగిసిపోతుండటంతో మళ్లీ పాత రోజులు పునరావృతమవుతాయేమోనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
కుప్పకూలుతున్న కళాప్రపూర్ణ ప్రతిష్ట
గోరుచుట్టుపై రోకలిపోటు‘ అన్నట్లుగా.. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రవిశ్వవిద్యాలయానికి, తాజా వివాదాలు తీరని శాపంగా మారాయి. ‘చెట్టు ముదిరితే గాలికి తట్టుకుంటుంది కానీ, లోపల పుచ్చు పడితే కుప్పకూలుతుంది‘ అన్నట్లుగా.. బయటకి శతాబ్ది ఉత్సవాల హంగులు కనిపిస్తున్నా, లోపల రగులుతున్న వరుస పోరాటాలు వర్సిటీ పునాదులను కదిలిస్తున్నాయి. విశాఖ సిటీ: వందేళ్ల ఘన చరిత్ర.. వేలమంది మేధావులను తీర్చిదిద్దిన ఆంధ్ర విశ్వవిద్యాలయం నేడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఈ ప్రాంగణం.. ఇప్పుడు నిరసనల హోరుతో, నినాదాల జోరుతో కుదేలవుతోంది. ఎటు చూసినా గొడవలు, ఎక్కడ చూసినా ఆందోళనలతో ఏయూ ప్రాంగణం రణరంగాన్ని తలపిస్తోంది. వర్సిటీలో జరుగుతున్న వరుస పరిణామాలు విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. పురుగుల భోజనం ఘటన ఒకసారి, ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేక విద్యార్థి మృతి మరోసారి, ఫీజులు చెల్లించలేదని మెస్లకు తాళాలు వేయడం ఇంకోసారి.. ఇలా వివాదాలు వరుసగా చెలరేగుతున్నాయి. ఇటీవల ఎస్ఎఫ్ఐ–ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య ఆధిపత్య పోరు, తాజాగా వేతనాల కోసం గెస్ట్ ఫ్యాకల్టీల నిరసనలు.. ఇవన్నీ కలిసి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాన్ని కలవరపెడుతున్నాయి. ఒక సమస్య పరిష్కారం కాకముందే మరొకటి తెరపైకి రావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఏయూలో చల్లారని మంటలు గత కొద్దిరోజులుగా ఏయూలో ప్రశాంతత కనబడడం లేదు. విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ మధ్య ప్రారంభమైన ఘర్షణలు ఇంకా పూర్తిగా చల్లారలేదు. నాలుగు రోజుల పాటు పోటాపోటీ ఆందోళనలతో అట్టుడికిన పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతల మధ్య తాత్కాలిక బోధనా సిబ్బంది (టీటీఏలు) కూడా నిరసన బాట పట్టారు. ఒక సమస్యకు పరిష్కారం లభించకముందే మరో ఉద్యమం మొదలవ్వడం వర్సిటీ పరిపాలనా వైఫల్యాన్ని సూచిస్తోంది. పరిపాలన భవనం ఎదుట నిత్యం ఆందోళనలు జరుగుతున్నా, వాటిని సమర్థంగా అదుపు చేసే చర్యలు కనిపించడం లేదు. ఏయూలో సుమారు 247 మంది గెస్ట్ ఫ్యాకల్టీలు పనిచేస్తున్నారు. నోటిఫికేషన్ ప్రకారం బోధించే సబ్జెక్టును, బోధనా గంటలను ఆధారంగా తీసుకుని గౌరవ వేతనం చెల్లించేలా ఒప్పందంతో నియమించబడ్డారు. అయితే, పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో గంటల వారీ చెల్లింపులకంటే నెలవారీ స్థిర జీతం, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారమే వేతనాలు ఇస్తున్నామని చెబుతున్నా, గౌరవప్రదమైన జీవనానికి సరిపడే జీతం కావాలని గెస్ట్ ఫ్యాకల్టీలు పట్టుదలగా నిలుస్తున్నారు. గత 12 రోజులుగా పరిపాలన భవనం ఎదుట ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, స్పష్టమైన పరిష్కారం కనిపించడం లేదు.భద్రత లోపం..పరిపాలన భవనం ముందు వరుస నిరసనలు జరగడం ఆందోళన కలిగించే విషయం. తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకారులు పలుమార్లు భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతమవుతున్నప్పటికీ, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పరిపాలన భవనానికి ఎదురుగానే వర్సిటీ సెక్యూరిటీ కార్యాలయం ఉన్నప్పటికీ, నిరసనకారులను అడ్డుకునే చర్యలు ప్రభావవంతంగా కనిపించడం లేదు. భద్రతా సిబ్బంది, పోలీసులు ఉన్నా, ఆందోళనల సమయంలో పరిస్థితి అదుపులోకి రావడం లేదు. గతంలో ఏర్పాటు చేసిన భారీ ఇనుప రక్షణ కంచెను రాజకీయ కారణాలతో తొలగించడంతో, అప్పటి నుంచి పరిపాలన భవనం ఆందోళనలకు కేంద్రబిందువుగా మారింది.శతాబ్ది ఉత్సవాల వేళ.. ప్రతిష్ట గాలిలో..! త్వరలోనే ఏయూలో రెండు ముఖ్య ఘట్టాలు జరగనున్నాయి. మార్చిలో స్నాతకోత్సవం, ఏప్రిల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘శతాబ్ది ఉత్సవాలు’ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వందేళ్ల పండుగను ఘనంగా జరపాల్సిన ఈ సమయంలో విశ్వవిద్యాలయం వరుస వివాదాలతో వార్తల్లో నిలవడం బాధాకరం. విదేశాల నుంచి వచ్చే అతిథుల సమక్షంలో ఈ వివాదాలు సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థుల చదువులు అంతరాయానికి గురవుతూ, సిబ్బంది నిరసనలు కొనసాగుతూ, పరిపాలనా నిర్లక్ష్యం కనిపిస్తే ఏయూ భవిష్యత్తుపై ప్రశ్నార్థక పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని విద్యావర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వందేళ్ల వారసత్వాన్ని కాపాడాల్సిన ఈ కీలక సమయంలో, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించి ప్రశాంత వాతావరణం నెలకొల్పడం వర్సిటీ అధికారుల ముందున్న అతిపెద్ద సవాలుగా మారింది. -
సముద్రంలో శత్రువులను వేటాడే 'హంటర్'
తక్కువ లోతు ఉండే తీర ప్రాంతాల్లో కూడా కాపు కాచి.. అత్యాధునిక సోనార్ వ్యవస్థలతో శత్రుదేశాల నౌకలు, జలాంతర్గాముల కదలికలను నిరంతరం పసిగట్టడంతో పాటు ఏకంగా 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం ఛేదించగల యద్ధ నౌక ‘డాల్ఫిన్ హంటర్’... ఐఎన్ఎస్ అంజాదీప్ భారత నావికాదళంలో భాగమయ్యింది. విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళంలో సేవలందించే ఈ యాంటీ సబ్మెరైన్వార్ ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ను కోల్కతాకు చెందిన జీఆర్ఎస్ఈ, ఎల్అండ్ టీ సంస్థలు నిర్మించాయి. దీనికి కర్ణాటక కార్వార్ తీరంలో ఉన్న అంజాదీప్ ద్వీపం పేరు పెట్టారు. ఈ హంటర్ గరిష్టంగా 25 నాట్స్ వేగంతో దూసుకెళ్తుంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా నిర్మించిన ఈ నౌకను శుక్రవారం చెన్నై పోర్టులో భారత నావికా దళాధిపతి దినేష్ కె. త్రిపాఠి ఆధ్వర్యంలో జాతికి అంకితం చేశారు. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నంఅత్యాధునిక సోనార్ వ్యవస్థ.. అంజాదీప్ హైస్పీడ్ వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా గంటకు 46.3 కిలోమీటర్లు (25 నాట్స్) వేగంతో కదులుతుంది. ఇందులో ఏర్పాటు చేసిన అత్యాధునిక సోనార్ వ్యవస్థతో తీరప్రాంతాల్లో శత్రువుకు చెందిన నౌకలు, జలాంతర్గాములను వెంటనే గుర్తించడంతో పాటు వాటి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. 77 మీటర్ల పొడవు, 10.5 మీటర్ల వెడల్పు, 1,400 టన్నుల బరువు ఉండే అర్నాలా శ్రేణికి చెందిన ఈ యుద్ధ నౌక.. సముద్రంలో శత్రువు కంటపడకుండా సంచరిస్తుంది. ప్రధానంగా తీర ప్రాంతాల్లో శత్రు జలాంతర్గాములను (సబ్మరైన్లు) గుర్తించి, ఎదుర్కొనేందుకు దీనిని రూపొందించారు. ఇది సముద్రంలో దాగి ఉన్న శత్రు సబ్మెరైన్లను గుర్తించి నిర్వీర్యం చేయగలదు. అందుకే దీనిని ‘డాల్ఫిన్ హంటర్’ అని పిలుస్తారు. ఏకంగా 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం వేగంగా విచి్ఛన్నం చేసే సామర్థ్యం దీని సొంతం. తక్కువ బరువు ఉన్న టార్పెడోలతో పాటు యాంటీ సబ్మెరైన్ రాకెట్లను దీని ద్వారా ప్రయోగించే వీలుంది.శత్రువు దృష్టిలో పడకుండా లక్ష్యాన్ని ఛేదించడం దీని ప్రత్యేకత. 7 మంది నేవీ అధికారులతో పాటు 50 మంది సెయిలర్స్ ఇందులో ప్రయాణించే వీలుంది. ఇప్పటికే భారత నావికాదళంలో ఉన్న ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్లకు ఐఎన్ఎన్ అంజాదీప్ తోడవడంతో సముద్రతీర ప్రాంతం మరింత శత్రు దుర్భేద్యంగా తయారుకానుంది. -
‘సెల్లార్లలో వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు’
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలోని పలు జోన్లలో ఆపరేషన్ లంగ్స్ 3.0లో భాగంగా బుధ, గురువారాల్లో మొత్తం 11 ఆక్రమణలను తొలగించినట్లు మున్సిపల్ ముఖ్య పట్టణ ప్రణాళికాధికారి(సీసీపీ) ప్రభాకరరావు తెలిపారు. నగరంలోని సెల్లార్లు, స్టిల్ట్ ఫ్లోర్లలో పార్కింగ్కు కేటాయించిన స్థలాలను ఇతర అవసరాలకు వాడుతున్న వారిపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 8వ వార్డు పరిధిలోని మిథిలాపురి కాలనీ వద్ద ఒక ఆక్రమణ, 14వ వార్డు సీతమ్మధార వద్ద ఒక గోడౌన్, 43వ వార్డు దొండపర్తి వద్ద మరో ఆక్రమణను తొలగించారు. 90వ వార్డు ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఉన్న ఆక్రమణ, 15వ వార్డు ఇసుకతోట కృష్ణమందిర్ ఎదురుగా ఒకటి, 13వ వార్డు దారపాలెం వద్ద మరొక ఆక్రమణ, 67వ వార్డు మెయిన్ రోడ్డులోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వద్ద, సౌందర్య వద్ద రోడ్డుపై నిల్వ ఉంచిన స్టోరేజ్ మెటీరియల్ను తొలగించారు. 82వ వార్డు ఏపీఎన్ఆర్ కాంప్లెక్స్, ఎమ్మార్వో కార్యాలయ రోడ్డు వద్ద ఒక షాపును, పూడిమడక రోడ్డులో రెండు ఆక్రమణలను తొలగించినట్లు సీసీపీ ప్రభాకరరావు తెలిపారు. ఆక్రమణదారులు వెంటనే తమ షాపులను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నూనెంతో భారం
మహారాణిపేట: నిత్యం ఏదో ఒక కూరతో కడుపు నింపుకుందామనుకునే సగటు జీవికి వంటనూనె ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి వరకు కాస్త భారంగా ఉన్న ధరలు, ఇప్పుడు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను అదుపు చేస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. ఏడాది కాలంలోనే నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో బతుకు బండిని లాగడం భారంగా మారింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విధించిన 12 శాతం పన్ను పోటుకు తోడు, వ్యాపారుల స్వయంకృత మాయాజాలం తోడవడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. సామాన్యుల గోడు పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహిస్తుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల కృత్రిమ కొరత ధరల పెరుగుదల వెనుక కేవలం పన్నులే కాకుండా, వ్యాపారుల అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. కొందరు బడా వ్యాపారులు సరుకులను బ్లాక్ చేసి మార్కెట్లో డిమాండ్ను సృష్టించి, ఇష్టానుసారంగా ధరలను పెంచి ప్రజలను దోచుకుంటున్నారు. గత నెలలో కిలో రూ. 90 నుంచి రూ. 160 మధ్య ఉన్న నూనె ధరలు, ప్రస్తుతం రకాన్ని బట్టి రూ. 115 నుంచి రూ. 210 వరకు పలుకుతున్నాయి. పామాయిల్ దగ్గర నుంచి వేరుశెనగ నూనె వరకు ప్రతి లీటరుపై రూ. 20 నుంచి రూ. 60 వరకు పెరగడం సామాన్యుడిని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ధరల పెరుగుదలే కాకుండా, కొన్ని కంపెనీలు పరిమాణంలోనూ మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. లీటర్ ప్యాకెట్ అని నమ్మి కొనే వినియోగదారుడికి కేవలం 800 లేదా 850 గ్రాముల నూనెను మాత్రమే ఇచ్చి నిలువునా వంచిస్తున్నాయి. నిమ్మకు నీరెత్తనట్టు అధికార యంత్రాంగం ఈ దోపిడీని అరికట్టాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ధరల నియంత్రణ కమిటీ సమావేశాలు కేవలం ఫొటోలకే పరిమితమవుతున్నాయి తప్ప, క్షేత్రస్థాయిలో తనిఖీలు, దాడులు కరువయ్యాయి. పండగలు వస్తే చాలు నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేస్తూ కృత్రిమ కొరత సృష్టించే ముఠాలపై చర్యలు తీసుకునే నాథుడే లేడు. బహిరంగ మార్కెట్లో ఎవరికి నచ్చిన ధరలకు వారు విక్రయిస్తున్నా పర్యవేక్షణ శూన్యం. రబీ పంట చేతికి వచ్చే వరకు ఈ ధరల సెగ తప్పదని వ్యాపార వర్గాలు చెబుతుండటంతో, సామాన్యుడి వంటింట్లో నూనె వేయకుండానే మంటలు రేగుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని అక్రమ నిల్వదారులపై ఉక్కుపాదం మోపి, ధరలను అదుపులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ధరల సెగతో బతుకు భారమైంది బహిరంగ మార్కెట్లో వంటనూనెల ధరలు చూస్తుంటే భయం వేస్తోంది. గతంలో తక్కువ ధరలకే దొరికేవి, కానీ ఇప్పుడు ఆమాంతం పెరిగిపోయాయి. నా భర్త కూలీ పనుల మీద వచ్చే ఆదాయంతో నలుగురు సభ్యులున్న మా కుటుంబాన్ని నెట్టుకురావడం చాలా కష్టమవుతోంది. నెలకు కనీసం రెండు కిలోల నూనె అవసరమవుతుంది, కానీ ఈ భారంతో వాడకం తగ్గించక తప్పడం లేదు. మాలాంటి పేద కుటుంబాలకు నూనెతో పాటు నిత్యావసరాలు కొనడం తలకు మించిన భారంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను తగ్గించి మమ్మల్ని ఆదుకోవాలి. – అవ్వా దేవి, చాకలివీధి, 27వ వార్డు, జీవీఎంసీ -
ఏయూలో వైజ్ఞానిక, క్రీడా సంబరాలు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు, జాతీయ సైన్స్ డే పురస్కరించుకుని వర్సిటీలో వైజ్ఞానిక, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ తెలిపారు. గురువారం అకడమిక్ సెనేట్ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఈ నెల 27, 28 తేదీలలో ‘శాసీ్త్రయ పరిశోధనల్లో పురోగతి’ అనే అంశంపై జాతీయ స్థాయి సింపోజియం జరగనుంది. ఈ సదస్సుకు ఐఐటీ మద్రాస్, ఐఐటీ గౌహతి, ఐఐఎస్సీ బెంగళూరు వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి 9 మంది నిపుణులు హాజరవుతున్నారు. వీరిలో నలుగురు భట్నాగర్ అవార్డు గ్రహీతలు ఉండటం విశేషం. 27న బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమయ్యే ఈ సదస్సులో నిపుణుల ప్రసంగాలు, లఘుచిత్ర ప్రదర్శనలు ఉంటాయి. 28న 3 వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి, సర్ సి.వి.రామన్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. మార్చి 2 నుంచి ‘బెస్ట్ ఫిజిక్’ పోటీలు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మార్చి 2 నుంచి 4 వరకు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్(పురుషుల) పోటీలను ఏయూ నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 120 విశ్వవిద్యాలయాల నుంచి సుమారు 500 మంది బాడీ బిల్డర్లు ఈ పోటీలో తమ ప్రతిభను చాటనున్నారు. మార్చి 5న రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన అరబిందో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించనున్నారు. విదేశీ విద్యార్థుల ఫెస్టివల్ ఏయూలో చదువుతున్న 55 దేశాలకు చెందిన 1,100 మంది విద్యార్థులతో ప్రత్యేకంగా ఫుడ్ ఫెస్టివల్, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నారు. విదేశీ విద్యార్థులు తమ దేశ సంస్కృతిని, ఆహార రుచులను ఇక్కడ పరిచయం చేస్తారు. అలాగే అనుబంధ కళాశాలల విద్యార్థుల కోసం సమ్మర్ ఇంటర్న్షిప్లు, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘అన్వేషణ ’ప్రోగ్రామ్, పూర్వ వీసీలతో ప్రత్యేక ప్యానెల్ డిస్కషన్ వంటి వినూత్న కార్యక్రమాలకు నిర్వహిస్తున్నట్లు వీసీ తెలిపారు. శతాబ్ది ఉత్సవాలను వారం రోజులు నిర్వహించే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేశామని, త్వరలో ఆ వివరాలు తెలియజేస్తామని వివరించారు. సమావేశంలో రెక్టర్ ఆచార్య పి.కింగ్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు, క్రీడా విభాగం సంచాలకుడు ఆచార్య ఎన్.విజయ్ మోహన్, అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పాల్ డగ్లస్, ఆచార్య సంధ్య దీపిక, ఆచార్య శైలజ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి జాతీయ సింపోజియం -
ఏఎంసీకి వృద్ధురాలి పార్థివదేహం అప్పగింత
అల్లిపురం: ఏయూటీడీ–టీఎస్ఆర్ కాంప్లెక్స్ నిరాశ్రయుల వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న గౌరమ్మ (80) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఆమె మృతదేహాన్ని ఆంధ్ర మెడికల్ కాలేజీ అనాటమీ విభాగం విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఏయూటీడీ కార్యదర్శి ప్రగడ వాసు కళాశాల అధికారులకు అప్పగించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది మార్చిలో రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఏయూటీడీ సిబ్బంది గౌరమ్మను రక్షించి, జీవీఎంసీ టీఎస్ఆర్ కాంప్లెక్స్ మహిళా షెల్టర్ హోమ్కు తీసుకొచ్చారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఇటీవల కేజీహెచ్లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆమె అక్కడే మరణించారు. ఆమెకు బంధువులెవరూ లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. అనంతరం ఆంధ్ర మెడికల్ కాలేజీ వైద్యులకు సమాచారం అందించి, టూ టౌన్ కానిస్టేబుల్ కన్నారావు పర్యవేక్షణలో ప్రగడ వాసు సమక్షంలో మృతదేహాన్ని అనాటమీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాధారమణికి అందజేశారు. వైద్య విద్యార్థుల కోసం దేహాన్ని అందజేయడంలో సహకరించినందుకు టూ టౌన్ పోలీసులు, ఏయూటీడీ సిబ్బందికి ప్రొఫెసర్ ధన్యవాదాలు తెలిపారు. -
కేజీహెచ్లో నర్సులే వైద్యులు
హౌస్ సర్జన్ల కొరతతో కీలక నిర్ణయం మహారాణిపేట: కేజీహెచ్లో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన 250 మంది హౌస్ సర్జన్ల శిక్షణ గడువు ఇటీవల ముగిసింది. అయితే, కొత్త బ్యాచ్ విధుల్లో చేరడానికి కనీసం మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు ఆసుపత్రిలో రోగులకు ఇబ్బంది కలగకుండా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి సుమారు 400 మంది నర్సులు పీజీ వైద్యులకు సహాయకారిగా, దాదాపు హౌస్ సర్జన్ల స్థాయిలో విధుల్లో పాల్గొననున్నారు. గురువారం కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి పలు నర్సింగ్ కళాశాలల యాజమాన్యాలు, ఆసుపత్రి నర్సులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వార్డుల్లో పీజీ వైద్యులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడానికి నర్సులు సుముఖత వ్యక్తం చేశారు. రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నర్సుల విధులను మూడు షిఫ్టులుగా విభజించినట్లు డాక్టర్ వాణి తెలిపారు. ఉదయం వేళల్లో 50 శాతం మంది, మధ్యాహ్నం 25 శాతం మంది, రాత్రి వేళల్లో మిగిలిన 25 శాతం మంది చొప్పున నర్సుల సేవలను వినియోగించుకోనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. -
కుప్పకూలుతున్న కళాప్రపూర్ణ ప్రతిష్ట
గోరుచుట్టుపై రోకలిపోటు‘ అన్నట్లుగా.. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయానికి, తాజా వివాదాలు తీరని శాపంగా మారాయి. ‘చెట్టు ముదిరితే గాలికి తట్టుకుంటుంది కానీ, లోపల పుచ్చు పడితే కుప్పకూలుతుంది‘ అన్నట్లుగా.. బయటకి శతాబ్ది ఉత్సవాల హంగులు కనిపిస్తున్నా, లోపల రగులుతున్న వరుస పోరాటాలు వర్సిటీ పునాదులను కదిలిస్తున్నాయి.విశాఖ సిటీ: వందేళ్ల ఘన చరిత్ర.. వేలమంది మేధావులను తీర్చిదిద్దిన ఆంధ్ర విశ్వవిద్యాలయం నేడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఈ ప్రాంగణం.. ఇప్పుడు నిరసనల హోరుతో, నినాదాల జోరుతో కుదేలవుతోంది. ఎటు చూసినా గొడవలు, ఎక్కడ చూసినా ఆందోళనలతో ఏయూ ప్రాంగణం రణరంగాన్ని తలపిస్తోంది. వర్సిటీలో జరుగుతున్న వరుస పరిణామాలు విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. పురుగుల భోజనం ఘటన ఒకసారి, ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేక విద్యార్థి మృతి మరోసారి, ఫీజులు చెల్లించలేదని మెస్లకు తాళాలు వేయడం ఇంకోసారి.. ఇలా వివాదాలు వరుసగా చెలరేగుతున్నాయి. ఇటీవల ఎస్ఎఫ్ఐ–ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య ఆధిపత్య పోరు, తాజాగా వేతనాల కోసం గెస్ట్ ఫ్యాకల్టీల నిరసనలు.. ఇవన్నీ కలిసి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాన్ని కలవరపెడుతున్నాయి. ఒక సమస్య పరిష్కారం కాకముందే మరొకటి తెరపైకి రావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.ఏయూలో చల్లారని మంటలుగత కొద్దిరోజులుగా ఏయూలో ప్రశాంతత కనబడడం లేదు. విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ మధ్య ప్రారంభమైన ఘర్షణలు ఇంకా పూర్తిగా చల్లారలేదు. నాలుగు రోజుల పాటు పోటాపోటీ ఆందోళనలతో అట్టుడికిన పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతల మధ్య తాత్కాలిక బోధనా సిబ్బంది (టీటీఏలు) కూడా నిరసన బాట పట్టారు. ఒక సమస్యకు పరిష్కారం లభించకముందే మరో ఉద్యమం మొదలవ్వడం వర్సిటీ పరిపాలనా వైఫల్యాన్ని సూచిస్తోంది. పరిపాలన భవనం ఎదుట నిత్యం ఆందోళనలు జరుగుతున్నా, వాటిని సమర్థంగా అదుపు చేసే చర్యలు కనిపించడం లేదు. ఏయూలో సుమారు 247 మంది గెస్ట్ ఫ్యాకల్టీలు పనిచేస్తున్నారు. నోటిఫికేషన్ ప్రకారం బోధించే సబ్జెక్టును, బోధనా గంటలను ఆధారంగా తీసుకుని గౌరవ వేతనం చెల్లించేలా ఒప్పందంతో నియమించబడ్డారు. అయితే, పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో గంటల వారీ చెల్లింపులకంటే నెలవారీ స్థిర జీతం, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారమే వేతనాలు ఇస్తున్నామని చెబుతున్నా, గౌరవప్రదమైన జీవనానికి సరిపడే జీతం కావాలని గెస్ట్ ఫ్యాకల్టీలు పట్టుదలగా నిలుస్తున్నారు. గత 12 రోజులుగా పరిపాలన భవనం ఎదుట ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, స్పష్టమైన పరిష్కారం కనిపించడం లేదు.పద్మనాభం: చారిత్రక కుంతీ మాధవ స్వామి ఆలయంలో అనంత పద్మనాభ స్వామి వారం రోజుల కల్యాణోత్సవాలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పుట్టబంగారం సేకరించి అంకురార్పణ నిర్వహించారు. ముందుగా చక్ర పెరుమాళ్లను పల్లకీలో ఊరేగింపుగా పాత సంత ప్రాంతానికి తీసుకువచ్చారు. అక్కడ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం అనంతరం భూమాతకు ప్రత్యేక పూజలు చేశారు. సేకరించిన పవిత్ర మృత్తికను ఆలయానికి తరలించి, 12 పాలికల్లో నవధాన్యాలను నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ కంటుబోతు రాంబాబు, సర్పంచ్ తాలాడ పాప దంపతులు, కాళ్ల నగేష్ కుమార్, రామసింగు సన్యాసిరావు, కంటుబోతు ఎర్నాయుడు, తాలాడ పైడిరాజు పాల్గొన్నారు.భద్రత లోపం..పరిపాలన భవనం ముందు వరుస నిరసనలు జరగడం ఆందోళన కలిగించే విషయం. తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకారులు పలుమార్లు భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతమవుతున్నప్పటికీ, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పరిపాలన భవనానికి ఎదురుగానే వర్సిటీ సెక్యూరిటీ కార్యాలయం ఉన్నప్పటికీ, నిరసనకారులను అడ్డుకునే చర్యలు ప్రభావవంతంగా కనిపించడం లేదు. భద్రతా సిబ్బంది, పోలీసులు ఉన్నా, ఆందోళనల సమయంలో పరిస్థితి అదుపులోకి రావడం లేదు. గతంలో ఏర్పాటు చేసిన భారీ ఇనుప రక్షణ కంచెను రాజకీయ కారణాలతో తొలగించడంతో, అప్పటి నుంచి పరిపాలన భవనం ఆందోళనలకు కేంద్రబిందువుగా మారింది.శతాబ్ది ఉత్సవాల వేళ.. ప్రతిష్ట గాలిలో..!త్వరలోనే ఏయూలో రెండు ముఖ్య ఘట్టాలు జరగనున్నాయి. మార్చిలో స్నాతకోత్సవం, ఏప్రిల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘శతాబ్ది ఉత్సవాలు’ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వందేళ్ల పండుగను ఘనంగా జరపాల్సిన ఈ సమయంలో విశ్వవిద్యాలయం వరుస వివాదాలతో వార్తల్లో నిలవడం బాధాకరం. విదేశాల నుంచి వచ్చే అతిథుల సమక్షంలో ఈ వివాదాలు సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థుల చదువులు అంతరాయానికి గురవుతూ, సిబ్బంది నిరసనలు కొనసాగుతూ, పరిపాలనా నిర్లక్ష్యం కనిపిస్తే ఏయూ భవిష్యత్తుపై ప్రశ్నార్థక పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని విద్యావర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వందేళ్ల వారసత్వాన్ని కాపాడాల్సిన ఈ కీలక సమయంలో, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించి ప్రశాంత వాతావరణం నెలకొల్పడం వర్సిటీ అధికారుల ముందున్న అతిపెద్ద సవాలుగా మారింది. -
సాగర తీరాన సప్తపది
విజయవాడకు చెందిన రమేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. విశాఖకు చెందిన అంజలి హైదరాబాద్లో ఆర్కిటెక్ట్. వారిద్దరూ తమ వివాహం కేవలం ఒక ఫంక్షన్ హాల్కే పరిమితం కాకుండా కుటుంబ సభ్యులందరితో కలిసి మూడు రోజులపాటు పండుగలా చేసుకోవాలని విశాఖపట్నం తీరాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికగా ఎంచుకున్నారు.సాక్షి, సెంట్రల్ డెస్క్: ఒకప్పుడు ఆకాశమంత పందిరి.. పెళ్లికి నెల రోజుల ముందు నుంచే హడావుడి. పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లి కుమారుడి ఇళ్లల్లో ఉరుకులు పరుగులు కనిపించేవి. ఇప్పుడు పెళ్లిళ్ల ట్రెండ్ మారింది. డెస్టినేషన్ వెడ్డింగ్స్కు ఆదరణ పెరుగుతోంది. సెలబ్రిటీలు చేసుకుంటున్నట్టుగా బాలి, మాల్దీవులు, రాజస్థాన్, కశ్మీర్ వంటి ప్రాంతాలకు వెళ్లడం లేదు. మన మధ్యే.. మన రాష్ట్రంలోనే ప్రకృతి అందాల మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవడం నయా ట్రెండ్గా మారింది. సంప్రదాయబద్ధంగా.. ఆహ్లాదకర వాతావరణంలో వివాహాలు జరిపిస్తున్నారు. వధూవరుల తరఫు సమీప బంధువులతో పాటు అత్యంత ఆత్మీయుల సమక్షంలో పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. వివాహానికి ముందు బ్యూటీ సెషన్లు, స్థానిక సంస్కృతిని తెలుసుకునే వర్క్షాప్లు వంటి వినూత్న కార్యక్రమాలు 2026లో ట్రెండ్గా ఉన్నాయి. సంపన్నులు, మధ్యతరగతి వారు సైతం డెస్టినేషన్ వెడ్డింగ్స్కే జై కొడుతున్నారు. వధువు తరఫున 40–50 మంది.. వరుడి తరఫున మరో 40–50 మందితో ప్రశాంతంగా పెళ్లి వేడుకను ముగిస్తున్నారు. ఆ తరువాత సొంతూళ్లలో బంధుమిత్రుల కోసం రిసెప్షన్లు ఏర్పాటు చేస్తున్నారు.చుట్టూ ప్రకృతి అందాలు.. సెలయేటి సవ్వళ్లు.. పక్షుల కిలకిలా రావాల మధ్య అడుగులో అడుగేస్తూ.. వధూవరుల ‘సప్తపది’ తంతు ఆహా.. అన్నట్టు ఉంటోంది. మొదటి రోజు: పెళ్లి సందడి రుషికొండ సమీపంలోని విలాసవంతమైన రిసార్ట్లో బంధువులందరికీ స్వాగతం పలికారు. సాయంత్రం సముద్రపు గాలుల మధ్య జరిగిన ’మెహందీ’ వేడుక కన్నుల పండువగా సాగింది. రెండవ రోజు: పసుపు సంబరం ఉదయాన్నే బీచ్ ఎదురుగా ఉన్న తోటలో ’హల్దీ’ వేడుక జరిగింది. పసుపు రంగు బట్టల్లో అతిథులందరూ ఒకరిపై ఒకరు పూల రెక్కలు, పసుపునీళ్లు చల్లుకుంటూ సందడి చేశారు. సాయంత్రం ‘సంగీత్’ వేడుకలో సముద్రపు అలల హోరు మధ్య డీజే పాటలకు అంజలి, రమేష్ కుటుంబ సభ్యులు నృత్యాలతో హోరెత్తించారు. మూడవ రోజు: కల్యాణ ఘట్టం తెల్లవారుజామున సముద్రపు ఒడ్డున మంటపం పచ్చని మామిడి ఆకులు, మల్లెపూల అలంకరణలతో దివ్యంగా ఉంది. బాలభానుడి కిరణాలు సముద్రాన్ని తాకుతున్న వేళ.. వేద మంత్రాల సాక్షిగా రమేష్ అంజలి మెడలో మూడుముళ్లు వేశాడు. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహం ఆధునిక డెస్టినేషన్ వెడ్డింగ్ శైలిలో అతిథులకు మర్చిపోలేని అనుభూతినిచి్చంది. ఇలా వీరేకాదు అత్యధికులు ఈ తరహా వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారు. పర్యావరణ హితంగానూ.. ప్లాస్టిక్ రహిత అలంకరణలతో స్థానిక కళాకారులు, స్థానిక వంటకాలకు స్థానం కల్పిస్తూ పర్యావరణానికి హాని కలగకుండా వివాహాలు చేసుకోవడం కూడా కొత్త బాధ్యతాయుతమైన ట్రెండ్గా మారింది. 2026 నాటికి భారతదేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ మార్కెట్ విలువల 18 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా.. 2033 నాటికి 55 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.ఏపీలోనూ ఆదరణ మన రాష్ట్రంలోనూ డెస్టినేషన్ వెడ్డింగ్స్ పెరిగాయి. విశాలమైన తీర ప్రాంతాలు, కొండకోనల నడుమ రిసార్ట్లు ఇందుకు వేదిక అవుతున్నాయి. బెంగళూరు వంటి ప్రాంతాలకు చెందిన వారు సైతం విశాఖపట్నం, భీమిలి, చీరాల, బాపట్ల వంటి తీరాలతోపాటు దిండి, కోనసీమలోని రిసార్ట్స్, కొండ ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను వివాహ వేదికలుగా మార్చుకుంటున్నారు.దోహదం చేస్తున్న అంశాలివీ » జెన్ జెడ్ అభిరుచులకు డెస్టినేషన్ వివాహాలు అద్దం పడుతున్నాయి. » విహార యాత్రలా మాత్రమే కాకుండా.. వధూవరుల కుటుంబాల మధ్య అనుబంధాలను మరింతగా పెనవేస్తాయని జెన్ జెడ్ భావిస్తోంది. » డెస్టినేషన్ వెడ్డింగ్స్తో ఏర్పాట్ల కోసం పడే శ్రమ, ఖర్చులను కూడా పరిమితం చేయడంతో పాటు ఆహ్లాదకర వాతావరణంలో వివాహాలు జరిపించి మధురానుభూతి పొందుతున్నారు. » సముద్ర తీరాలు, చారిత్రక కట్టడాలు, కొండ ప్రాంతాల వంటి ప్రకృతి అందాల నడుమ పెళ్లి చేసుకోవడం వల్ల జీవితాంతం గుర్తుండిపోయే సినిమాటిక్ ఫొటోలు, వీడియోలు లభిస్తున్నాయి. » ఆదాయం పెరగడంతో చాలామంది డెస్టినేషన్ వెడ్డింగ్ను సామాజిక హోదాకు గుర్తింపుగా భావిస్తున్నారు.మధురానుభూతి గతంలో పెళ్లి అంటే ఎంతో హడావుడి ఉండేది. ఏర్పాట్ల కోసం కుటుంబ సభ్యులంతా హైరానా పడాల్సి వచ్చేది. అందుకే మా అబ్బాయి అమర్ శంకర్ వివాహం విశాఖలోని రిసార్ట్స్లో ప్లాన్ చేశాం. ఆత్మీయుల సమక్షంలో చేసిన పెళ్లి మధురానుభూతి ఇచ్చింది. వచ్చిన బంధువులంతా మినీ ట్రిప్లా ఎంజాయ్ చేశారు. మేము కూడా అతిథుల మాదిరిగా సరదాగా గడిపాం. – యు.ఉషాదేవి, విజయనగరంబడ్జెట్ ఫ్రెండ్లీగానే.. డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగానే చేసుకోవచ్చు. వధూవరుల అభిరుచి మేరకు అన్ని రకాల ఏర్పాట్లు ఎక్కడైనా సరే మేం చేస్తాం. స్టేజి ఎంపికపైనే ఖర్చు ఆధారపడి ఉంటుంది. ఆర్కెస్ట్రా వంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా సమకూరుస్తున్నాం. – టి.రవళి, తలశిల వెడ్డింగ్ ప్లానర్స్, విజయవాడఅతిథుల్లా వస్తే చాలు వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా అతిథుల్లా వస్తే చాలు. వివాహానికి సంబంధించిన అన్ని వస్తువులతో పాటు, నచ్చిన మెనూ, డెకరేషన్, ఫొటో, వీడియో గ్రఫీ, ఘట్టానికి తగ్గట్టు స్టేజి ఏర్పాట్లు చేస్తాం. ప్రస్తుతం అందరూ వివాహాన్ని గ్రాండ్గా చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. వారి అభిరుచికి తగ్గట్టు సరీ్వసు అందిస్తున్నాం. – అభి, అభి ఈవెంట్స్ అండ్ ఫుడ్ కేటరర్స్, రాజమండ్రి -
ఏయూలో మతవిద్వేషాలు వద్దు
మద్దిలపాలెం: ఆంధ్రా యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ సంఘాల కార్యకలాపాలను తక్షణమే అరికట్టాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. వర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే జోక్యం చేసుకుని క్యాంపస్లో లౌకిక విలువలు, మత సామరస్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఏయూలో చోటుచేసుకున్న దాడులు, అనైతిక చర్యలను ఖండిస్తూ ఈ నెల 27న కలెక్టరేట్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వామపక్షాలు ప్రకటించాయి. వర్సిటీలో నెలకొన్న పరిస్థితులపై బుధవారం పిఠాపురం కాలనీలోని సీపీఎం కార్యాలయంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం, తదితర వామపక్ష పార్టీల జిల్లా నేతలు మాట్లాడుతూ.. ఏయూలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రపూరితంగా మత వైషమ్యాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. వర్సిటీకి సంబంధం లేని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బయట నుంచి క్యాంపస్లోకి ప్రవేశించి విద్యార్థులు, ఆచార్యులు, సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలో సెక్షన్ 30ని ఉల్లంఘించి విద్యార్థి, దళిత, కార్మిక సంఘాల జెండాలను ధ్వంసం చేయడం వారి అమానవీయ, విధ్వంసక చర్యలకు అద్దం పడుతోందన్నారు. పోలీసులు, వీసీ తీరుపై మండిపాటు దాడులకు పాల్పడిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పట్ల పోలీసులు, ఏయూ వీసీ ఉదాసీనంగా వ్యవహరించడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. పరోక్షంగా ఆర్ఎస్ఎస్ను ప్రోత్సహించేలా వారి తీరు ఉందని ఆరోపించారు. ఈ వివాదానికి రాజకీయ రంగు పులిమి కమ్యూనిస్టులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్, ఆర్ఎస్ఎస్ నేతలు బురదజల్లుతున్నారని విమర్శించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని, అలాగే కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారికి క్యాంపస్లోకి ప్రవేశం లేకుండా యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.రెహ్మాన్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) నాయకురాలు కె.నిర్మల, సీపీఐఎంఎల్ (ప్రజాపోరు) జిల్లా కార్యదర్శి డి.దేవదత్, ఎస్యూసీఐ జిల్లా కార్యదర్శి ఎస్.గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. 27న కలెక్టరేట్ వద్ద వామపక్షాల నిరసన -
అనంతుని పెళ్లి సందడి
నేటి నుంచి కల్యాణోత్సవాలకు అంకురార్పణ మాధవుని ఇంట పద్మనాభం : ఆధ్యాత్మిక వైభవానికి ప్రసిద్ధి చెందిన పద్మనాభం క్షేత్రంలో పెళ్లి సందడి నెలకొంది. దేశంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాలు కేవలం రెండుచోట్లే ఉన్నాయి. ఒకటి కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం కాగా, మరొకటి ఆంధ్రప్రదేశ్లోని పద్మనాభం గ్రామ గిరిపై వెలసిన ఈ ప్రాచీన క్షేత్రం. ఈ ఆలయానికి అనుబంధంగా గిరి దిగువన ఉన్న శ్రీ కుంతీ మాధవ స్వామి ఆలయంలో గురువారం నుంచి అనంతుని కల్యాణోత్సవాలు జరగనున్నాయి. అంకురార్పణతో ఆరంభం ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు అనంత పద్మనాభ స్వామి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ 23న గాలి గోపురం వద్ద పెళ్లి రాట వేశారు. 26వ తేదీ రాత్రి పుట్టబంగారంతో కల్యాణోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. చక్రపెరుమాళ్లను పల్లకీలో ఊరేగింపుగా పాతసంత స్థలానికి తీసుకెళ్లి విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం భూమాతకు ప్రత్యేక పూజలు చేసి, తీసుకొచ్చిన పవిత్ర మట్టిని 12 పాళికల్లో నింపి నవధాన్యాలు వేసే కార్యక్రమం నిర్వహిస్తారు. 27న కల్యాణ మహోత్సవం ప్రధాన ఘట్టమైన అనంత పద్మనాభ స్వామి కల్యాణం 27వ తేదీ రాత్రి వైభవంగా జరుగుతుంది. ఆలయం వద్ద ధ్వజపటం ఎగురవేసి, అనంత పద్మనాభ స్వామిని ఆంజనేయస్వామి వాహనంపై, శ్రీదేవి–భూదేవులను హంసవాహనంపై, గోదాదేవిని గజవాహనంపై రాజవీధిలోకి తీసుకువచ్చి ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహిస్తారు. పెళ్లికొడుకు తరఫువారు, పెళ్లికూతురు తరఫువారిని కట్న కానుకల గురించి అడిగే హాస్య గట్టాలు భక్తులను అలరిస్తాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, నాదస్వరాల నడుమ ప్రత్యేకంగా రూపొందించిన కల్యాణ వేదికపై స్వామివారి కల్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. 28న గ్రామబలిహరణం, గ్రామోత్సవం జరుగుతాయి. తెప్పోత్సవం– దివ్య విహారం వచ్చే నెల 1వ తేదీ రాత్రి తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవ విగ్రహాలను హంసవాహనంపై తీసుకువచ్చి పుష్కరిణి గట్టు వద్ద విశేష పూజలు నిర్వహించి, అనంతరం పుష్కరిణిలో ఉభయదేవీరులతో స్వామివారు విహరిస్తారు. నీటిమీద తేలియాడే తెప్పపై స్వామివారి దర్శనం భక్తులకు అపూర్వానుభూతిని కలిగిస్తుంది. డోలోత్సవం, పుష్పయాగంతో ముగింపు 3వ తేదీ ఉదయం స్వామివారు డోలా మండపానికి చేరుకుని ఉయ్యాల సేవను అనుగ్రహిస్తారు. 4వ తేదీ రాత్రి పుష్పయాగంతో కల్యాణోత్సవాలు మహోత్సాహంగా ముగుస్తాయి. ఉత్సవాల ఏర్పాట్లు కల్యాణానికి నూతన వస్త్రాలు సిద్ధం చేశారు. ఆలయం ముందు భారీ తాటాకుల పందిరి వేశారు. తెప్పోత్సవం కోసం పుష్కరిణిని నీటితో నింపుతూ కొత్త తెప్పను తయారు చేశారు. రథోత్సవంలో రథం వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన కర్రదుంగలను సిద్ధం చేశారు. 2న రథోత్సవం 2వ తేదీ రాత్రి రథోత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది. వైదిక సైదస్యం, విశేష హోమం, మంగళాశాసనం నిర్వహిస్తారు. రాత్రి 11 గంటలకు గాలి గోపురం వద్ద నుంచి రథోత్సవం ప్రారంభమవుతుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రథం ముందు అన్నంతో కుంభం పోయడం ప్రత్యేక సంప్రదాయం. కృష్ణాపురానికి చెందిన మొకర, సుంకర, గాడు, కనకల అర్చకునిపాలేనికి చెందిన తాలాడ, ఇసకలపాలేనికి చెందిన కనకల వారి కుటుంబ సభ్యులతో పాటు అశేష భక్త జనులు రథాన్ని లాగుతారు. స్వామివారి రథచక్రాలు ముందుకు సాగుతుండగా భక్తి పారవశ్యంలో మునుగుతేలుతారు.4వ తేదీన పుష్పయాగంతో ఉత్సవాల ముగింపు -
అనుమానమే ప్రాణం తీసింది
ఆరిలోవ: ఆరిలోవ పరిధిలో మంగళవారం జరిగిన గృహిణి హత్య క్షణికావేశంలో జరిగినదేనని ద్వారకా ఏసీపీ ఎ.నరసింహమూర్తి తెలిపారు. బాలాజీనగర్ సాయిబాబా ఆలయం సమీపంలో బి.దేముడు తన భార్య దుర్గ (33)ను మంగళవారం హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బుధవారం ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వెల్లడించారు. దేముడు, దుర్గలది మేనరికం వివాహం. దేముడు తన మేనత్త కుమార్తె అయిన దుర్గను పెళ్లి చేసుకోగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ సిరిపురం వద్ద గల ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. అయితే, దుర్గ తరచూ ఎవరితోనో ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడుతోందన్న కారణంతో దేముడు ఆమైపె అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కూడా గొడవ జరగడంతో, దేముడు క్షణికావేశంలో దుర్గ మెడకు చున్నీతో గొంతు నులిమి హత్య చేశాడు. హత్య జరిగిన అనంతరం స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకోవడంతో భయపడిన దేముడు, ఇంట్లోని ఫ్రిజ్ వెనుక దాక్కున్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోగా, తన భార్యను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అనుమానం, క్షణికావేశం వల్లే ఈ ఘోరం జరిగిందని ఏసీపీ తెలిపారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలని, అనుమానాలకు తావివ్వకూడదని ఆయన హితవు పలికారు. సమావేశంలో సీఐ హెచ్.మల్లేశ్వరరావు, ఎస్ఐలు కృష్ణ, వరహాలునాయుడు పాల్గొన్నారు.ఏసీపీ నరసింహమూర్తి -
పేదల ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం
కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ మహారాణిపేట: జిల్లాలో పేదల గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గృహ నిర్మాణ శాఖ ప్రగతిపై నియోజకవర్గాలు, లేఅవుట్ల వారీగా ఆయన సమీక్ష నిర్వహించారు. రాబోయే 3 నుంచి 4 నెలల కాలం గృహ నిర్మాణాలకు అత్యంత అనుకూలమైన సమయమని, ఈ లోపు పెండింగ్లో ఉన్న పనులన్నీ ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణ పనుల్లో వెనుకబడి ఉన్న లేఅవుట్లలో పనులు వేగవంతం చేసేందుకు అదనంగా కూలీలను నియమించుకోవాలని ఆదేశించారు. గృహ నిర్మాణ లక్ష్యాలను సాధించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రగతి తక్కువగా ఉన్న అధికారులకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని హౌసింగ్ పీడీ సత్తిబాబును ఆదేశించారు. గృహాల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో భీమిలి ఆర్డీవో సంగీత్ మాధూర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, జోనల్ కమిషనర్లు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
అతివేగం.. మృత్యుపాశం
సబ్బవరం: సబ్బవరం–ఆరిపాక రోడ్డులో గాలిభీమవరం సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం రాయపుర అగ్రహారాన్ని శోకసంద్రంలో ముంచేసింది. తవ్వవానిపాలెంలో జరుగుతున్న తీర్థమహోత్సవాలకు ఆనందంగా బయలుదేరిన ముగ్గురు యువకుల ప్రయాణం క్షణాల్లోనే విషాదయాత్రగా మారింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందడంతో అతని కుటుంబం బోరున విలపిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. రాయపుర అగ్రహారానికి చెందిన సింగంపల్లి సాయి(23), పల్ల కనకరాజు, నంబారు సందీప్ ద్విచక్రవాహనంపై సబ్బవరం వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ నడుపుతున్న సింగంపల్లి సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న పల్ల కనకరాజు, నంబారు సందీప్ తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న సీఐ జి.రామచంద్రరావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా, క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. కనకరాజు తలకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఢీకొన్న తీవ్రతకు రెండు వాహనాలు దూరంగా ఎగిరిపడ్డాయి. ద్విచక్రవాహనం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఆటో సైతం తీవ్రంగా దెబ్బతిని రోడ్డు పక్కన ఒరిగిపోయింది. మితిమీరిన వేగమే కారణమా? మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుల వేగం, నిర్లక్ష్యం మూడు కుటుంబాల జీవితాలను తారుమారు చేశాయని గ్రామస్తులు వాపోతున్నారు. సాయి తండ్రి గోవిందరావు కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటినుంచి కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న సాయి.. ఇలా ఆకస్మిక మరణం చెందడంతో ఆ కుటుంబం కన్నీటిపర్యంతమైంది. కొడుకు మరణవార్త విన్న తల్లి ఆర్తనాదాలు గ్రామస్తులు కదిలించాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు యువకులు త్వరగా కోలుకోవాలని గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు. మృతుడి సోదరుడు సింగంపల్లి నరేంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర బుధవారం సాయంత్రం ఆరిపాక జంక్షన్ నుంచి గ్రామంలోని శ్మశానవాటిక వరకూ నిర్వహించిన సాయి అంతిమయాత్రలో వందలాదిగా యువకులు, స్నేహితులు, గ్రామస్తులు పాల్గొని అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్ తదితరులు అంతిమయాత్రలో పాల్గొని సాయి మృతదేహానికి నివాళులర్పించారు. -
మళ్లీ కలుద్దాం!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సముద్ర తీరాన రెండు వారాలపాటు సాగిన నౌకల సందడి ముగిసింది. అంతర్జాతీయ సముద్ర శక్తుల సమాగమంగా నిలిచిన ఐఎఫ్ఆర్–2026, మిలాన్–2026, అయాన్స్ నేవీ చీఫ్స్ కాంక్లేవ్ విజయవంతంగా పూర్తయ్యాయి. యుద్ధ నౌకల హోరాహోరీ విన్యాసాలు, విదేశీ ప్రతినిధుల రాకపోకలు, సాంస్కృతిక వేడుకలతో కళకళలాడిన తీరనగరం ఇప్పుడు ఆత్మీయ వీడ్కోలతో నిండిపోయింది. ‘మళ్లీ 2028లో కలుద్దాం’ అంటూ మిత్ర దేశాలు విశాఖకు బైబై చెబుతున్నాయి. అంతర్జాతీయ వేదికపై నౌకాదళ శక్తి ఈ నెల 15 నుంచి బుధవారం వరకు జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ–2026, మిలాన్–2026, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం (అయాన్స్), నేవీ చీఫ్స్ కాంక్లేవ్లకు విశాఖ ఆతిథ్యమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల ప్రతినిధులు, యుద్ధ నౌకలు పాల్గొన్న ఈ విన్యాసాలు భారత నౌకాదళ దౌత్య వ్యూహాన్ని చాటిచెప్పాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంతో పాటు హిందూ మహాసముద్రంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా సమాచార మార్పిడి, ఉమ్మడి రక్షణ వ్యూహాలపై దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ముఖ్యంగా సముద్రపు దొంగల నిరోధం, విపత్తు నిర్వహణపై ప్రయోగాత్మక ప్రదర్శనలు భక్తులను, అతిథులను ఆకట్టుకున్నాయి. 2028లోనూ విశాఖే వేదిక? మిలాన్–2026 విజయవంతంగా ముగియడంతో, 2028లో జరగనున్న తదుపరి మిలాన్ విన్యాసాలకు కూడా విశాఖపట్నమే వేదిక అయ్యే అవకాశాలు ఉన్నట్లు నౌకాదళ వర్గాలు తెలిపాయి. సముద్ర తీర భౌగోళిక అనుకూలత, సమృద్ధమైన మౌలిక వసతులు ఈ నిర్ణయానికి బలంగా నిలుస్తున్నాయి. విశాఖ ఆతిథ్యానికి ప్రశంసలు విన్యాసాలు ముగియడంతో జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలకు చెందిన నౌకలు ఇప్పటికే బయలుదేరాయి. రష్యా, వియత్నాం మరియు ఇతర ఆగ్నేయాసియా దేశాల నౌకలు నేడు, రేపు పయనమయ్యే అవకాశం ఉంది. విదేశీ ప్రతినిధులు స్వదేశాలకు తిరుగు ప్రయాణం అవుతున్న వేళ, భారత నౌకాదళం వారికి ఆత్మీయ వీడ్కోలు పలికింది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విదేశీ అతిథులను మంత్రముగ్ధులను చేశాయి. మూడు అంతర్జాతీయ కార్యక్రమాలను ఏకకాలంలో విజయవంతంగా నిర్వహించి ‘సిటీ ఆఫ్ డెస్టినీ’గా పేరుగాంచిన విశాఖపట్నం మరోసారి తన ప్రతిష్టను చాటుకుంది. ఈ ప్రయాణం అద్భుతం భారత్తో ప్రయాణం అద్భుత అనుభవాన్ని ఇచ్చింది. విశాఖ అందించిన ఆతిథ్యం ఊహించని రీతిలో ఉంది. రక్షణ రంగంలో ముఖ్యంగా నౌకాదళ రంగంలో సాంకేతికత మార్పిడిలో, సముద్ర భద్రతలో భారత్ చూపిస్తున్న చొరవ ప్రశంసనీయం. క్వాడ్ దేశాల మధ్య బంధాన్ని బలపరచడంలో ఇలాంటి విన్యాసాలు కీలక పాత్ర పోషిస్తాయి. – వైస్ అడ్మిరల్ కునిమి యశుహిరో, జపాన్ మారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మిత్రదేశాల మధ్య శాశ్వత బంధాలకు ప్రతీక సాహసం, సహకారం, సమన్వయం అనే థీమ్తో నిర్వహించిన మిలాన్ విజయవంతమైంది. హిందూ మహాసముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యం, భద్రతపై అయాన్స్ వేదికగా ఫలప్రదమైన చర్చలు జరిగాయి. సురక్షితమైన వ్యవస్థల్ని శాశ్వతంగా ఏర్పాటు చేసేందుకు నౌకాదళాల భాగస్వామ్య నిబద్ధతకు నిదర్శనంగా విశాఖ నిలిచింది. – రియర్ అడ్మిరల్ అలోక్ ఆనంద, ఈఎన్సీ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్సముద్ర స్నేహానికి ఘన వీడ్కోలు -
ప్రపంచ వేదికపై విశాఖ ఘనత
జీవీఎంసీకి మిలియన్ డాలర్ల అంతర్జాతీయ గ్రాంట్ డాబాగార్డెన్స్: వాతావరణ మార్పులను దీటుగా ఎదుర్కొనేందుకు జీవీఎంసీ చేపట్టిన చర్యలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక ‘బ్లూమ్బర్గ్ ఫిలాంత్రోపీస్’ నిర్వహించిన 2025–2026 మేయర్స్ చాలెంజ్లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికై న 24 నగరాల్లో విశాఖపట్నం ఒకటిగా నిలిచింది. ఈ విజయంతో నగరానికి మిలియన్ అమెరికన్ డాలర్ల గ్లోబల్ గ్రాంట్తో పాటు సాంకేతిక, కార్యాచరణ సహాయం అందనుందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ..‘వి–పుల్’ ప్రాజెక్టు ఒక మోడల్గా నిలిచిందన్నారు. వరదలు, తుపానులు, తీవ్ర ఉష్ణ తరంగాల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రజల భాగస్వామ్యంతో విశాఖ నగరం వినూత్న పరిష్కారాలను ఆవిష్కరించిందని చెప్పారు. ‘విజాగ్–ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్ (వి–పుల్)’ పేరిట అమలవుతున్న ఈ కార్యక్రమం.. ప్రజాకేంద్రీకృత విధానం, వాతావరణ ప్రతిఘటన సామర్థ్యం, హైపర్–లోకల్ కమ్యూనిటీ భాగస్వామ్యంపై ప్రధానంగా దృష్టి సారిస్తోందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 630కి పైగా దరఖాస్తుల్లో విశాఖపట్నం ప్రత్యేక ప్రతిభ కనబరిచి ఈ విజయాన్ని సాధించిందని కమిషనర్ పేర్కొన్నారు. ‘ప్రారంభ దశలో టాప్–50 ఫైనలిస్టులలో స్థానం సంపాదించిన జీవీఎంసీకి 50,000 అమెరికన్ డాలర్ల సీడ్ ఫండింగ్, సాంకేతిక సహాయం లభించింది. ఆ సహాయంతో స్థానిక స్థాయిలో పైలట్ ప్రాజెక్టును అమలు చేశాం. ఈ పైలట్ దశలో వార్డు స్థాయి కమ్యూనిటీ సమావేశాలు నిర్వహించి, హైపర్–లోకల్ సెన్సింగ్ వ్యవస్థలు, డేటా ఆధారిత నిర్ణయ సాధనాలను పరీక్షించాం’ అని ఆయన వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతో వాతావరణ ప్రతిఘటన, విపత్తు సంసిద్ధత చర్యలను అమలు చేయడంతో పాటు పౌరులు, మున్సిపల్ విభాగాల మధ్య సమర్థవంతమైన ఫీడ్బ్యాక్ వ్యవస్థను నెలకొల్పామని కమిషనర్ తెలిపారు. నగర పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తూ తీసుకున్న ఈ వినూత్న చర్యలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం గర్వకారణమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
మేయర్ ఇంట మోకరిల్లిన జీవీఎంసీ
‘ఈవెంట్ మేనేజర్’ అవతారమెత్తిన యంత్రాంగం నగర సేవలు పక్కనపెట్టి.. పీలా కుమారుడి పెళ్లిలో హడావుడిపెందుర్తి : నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగంం మేయర్ వ్యక్తిగత కార్యక్రమంలో తలమునకలైన ఘటన వివాదాస్పదమైంది. ప్రజాసేవకు కట్టుబడి ఉండాల్సిన సంస్థ, ప్రజాధనంతో మేయర్ పీలా శ్రీనివాసరావు ఇంట పెళ్లికి ‘బ్యాండ్ బాజా’ కొట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీలా కుమారుడి వివాహం సందర్భంగా పెందుర్తిలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద గత పక్షం రోజులుగా జీవీఎంసీ సిబ్బంది విస్తృతంగా పనిచేసినట్లు సమాచారం. పెళ్లి రోజున సాయంత్రం కురిసిన వర్షంతో అలంకరణలు చెదిరిపోవడంతో, వాటిని సరిచేయడానికి జీవీఎంసీ యంత్రాంగం మరింతగా రంగంలోకి దిగింది. నగరంలో వివిధ పనులకు వినియోగించే జేసీబీలు, ఇతర వాహనాలు వేదిక వద్దకు తరలించి మరమ్మతులు, శుభ్రపరిచే పనులు చేపట్టినట్లు తెలిసింది. ఈ పనులను జీవీఎంసీ ఉన్నతాధికారులే స్వయంగా పర్యవేక్షించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు ఒక ప్రైవేట్ కుటుంబ కార్యక్రమంలో నిమగ్నమవడం పట్ల విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రజల సొమ్ముతో నడిచే సంస్థ వనరులను వ్యక్తిగత వేడుకలకు వినియోగించడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నలు నగర ప్రజల్లో చర్చకు దారి తీస్తున్నాయి. నగరంలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్న వేళం ప్రజాసేవకు వినియోగించాల్సిన యంత్రాలు, సిబ్బంది ఒక వ్యక్తిగత వేడుకకు మళ్లించడంపై ప్రతిపక్షాలు, పౌరసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాధన వినియోగంపై పారదర్శకత, బాధ్యత అవసరమని కోరుతున్నాయి. -
ఎసరు!
దేవుని భూమికిసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఒకవైపు అధికార పార్టీ నేతలు ప్రైవేటు భూమిని కూడా వివాదాలు రేపి తమ సొంతం చేసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తుండగా.. మరోవైపు దేవదాయ శాఖ భూములపైనే కన్నేయడం కలకలం రేపుతోంది. దేవదాయ శాఖకు చెందిన భూమిని ’ఇనాం’ భూమిగా చూపుతూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్ట ప్రకారం దేవదాయ కమిషనర్ పరిధిలోని అంశాల్లో కలెక్టర్ జోక్యం చేసుకోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. రికార్డుల్లో స్పష్టంగా దేవదాయ భూమి అని ఉన్నా, నిషేధిత జాబితా (22–ఏ)లో ఉన్న స్థలానికి కొత్త రికార్డులు ఎలా సృష్టించారో తేలాల్సి ఉంది. ఈ భూ దందా వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు అధికారుల పనితీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కమిషనర్ను కాదని కలెక్టర్ పేరుతో..? సాధారణంగా దేవదాయశాఖకు చెందిన భూముల జాబితాను దేవదాయశాఖ కమిషనర్ అధికారికంగా ప్రకటిస్తారు. ఆయా జిల్లాల వారీగా ఆ జాబితాను కలెక్టర్లకు పంపించి, సంబంధిత సర్వే నంబర్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చుతారు. తద్వారా ఆ భూములపై ఎలాంటి క్రయవిక్రయాలు జరగకుండా రక్షణ కల్పిస్తారు. అయితే అనకాపల్లిలోని సర్వే నంబరు 1539/5లో ఉన్న 2.49 ఎకరాల భూమి విషయంలో ఈ విధానానికి భిన్నంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రికార్డుల ప్రకారం ఇది దేవాదయశాఖ భూమి. అందుకే 22ఏ–1(సి) నిషేధిత జాబితాలో చేర్చారు. ఒకవేళ భూమి దేవదాయశాఖకు చెందదని తేలితే, ఆ సర్వే నంబరును 22ఏ జాబితా నుంచి తొలగించే అధికారం కేవలం దేవదాయశాఖ కమిషనర్కే ఉంటుంది. జిల్లా కలెక్టర్కు ఆ అధికారం లేదు. అయినప్పటికీ, ఈ భూమిని ఇనాం భూమిగా పేర్కొంటూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో కమిషనర్ అధికారాలను ఎప్పుడు, ఎలా కలెక్టరుకు బదలాయించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వారసత్వ హక్కు పేరుతో చక్రం వాస్తవానికి అనకాపల్లిలోని సర్వే నెంబరు 1539/5లో 2.49 ఎకరాల భూమిని కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి దూరి కామమ్మ అనే మహిళ 2005లో దత్తత ఇచ్చారు. ఇందులో 1.38 ఎకరాలను ఎన్టీఆర్ మార్కెట్ కోసం తీసుకున్నారు. మిగిలిన 1.11 ఎకరాల భూమి దేవదాయశాఖ ఆధీనంలో ఉంది. అయితే రికార్డుల్లో మాత్రం మొత్తం భూమి దేవదాయశాఖకు చెందినదిగానే ఉంది. 2016 నుంచి కూడా దేవదాయశాఖకు చెందిన భూమిగానే రికార్డుల్లో ఉంది. అంటే ఎన్టీఆర్ మార్కెట్ కోసం తీసుకున్న భూమికీ అధికార బదిలీ ప్రక్రియ జరగలేదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం భూమి 22ఏ–1(సి) నిషేధిత జాబితాలోనే ఉంది. అయితే, ఈ భూమి తనకు వారసత్వంగా వచ్చిందని పేర్కొంటూ కాండ్రేగుల చినతల్లి అనే మహిళ దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా కలెక్టర్ ఈ సర్వే నెంబరులోని భూమి ఇనాం భూమిగా పేర్కొంటూ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అధికారపార్టీకి చెందిన నేతల ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమ భూమిని కాపాడాలంటూ ఇప్పుడు కన్యాకాపరమేశ్వరి దేవస్థాన సభ్యులు వేడుకుంటున్నారు. ‘‘దేవుడి దానంపై దోపిడీ చేస్తే దైవశాపం తప్పదు’’ అనే సామెత గుర్తుకొచ్చేలా అనకాపల్లిలో దేవదాయశాఖ భూమిపై జరుగుతున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. రికార్డుల్లో స్పష్టంగా 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న దేవాలయ భూమిని ఇనాం భూమిగా మలిచే ప్రయత్నం, దేవదాయ శాఖ కమిషనర్ అధికారాలను పక్కనబెట్టి కలెక్టర్ స్థాయిలో ఉత్తర్వులు వెలువడటం వెనుక కనిపించని శక్తులు పనిచేశాయా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. వ్యవస్థను మేనేజ్ చేసి, రికార్డులను సృష్టించి, సాక్షాత్తూ దేవుడి ఆస్తులకే ఎసరు పెడుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు పెను సంచలనం రేపుతోంది. నిజానిజాలు దేవుడికెరుక? దేవదాయశాఖ భూమి అని రికార్డుల్లో ఉన్న స్థలాన్ని ఇనాం భూమిగా ఎలా పేర్కొన్నారు? కమిషనర్ అధికారాలను పక్కనబెట్టి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడానికి కారణమెంటి? ఇందులో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. నిషేధిత జాబితా భూములపై అధికార పార్టీ నేతల కన్ను కమిషనర్ను కాదని.. కలెక్టర్ ద్వారా పావులు కదిపిన వైనం సొంత భూమిని కాపాడుకోలేక బాధితులుగా మారిన దేవదాయ అధికారులుఅధికారులే బాధితులుగా పీజీఆర్ఎస్కు.. సాధారణంగా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్కు ఫిర్యాదు చేస్తారు. కానీ, అనకాపల్లి జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సాక్షాత్తూ దేవదాయ శాఖ అధికారులే బాధితులుగా మారి.. తమ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తున్నారంటూ రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. సర్వే నంబరు 1539/5లోని భూమి దేవదాయశాఖకు చెందినదని, అక్కడ తమ ఆధీనాన్ని సూచిస్తూ బోర్డు కూడా ఏర్పాటు చేసినట్లు వారు ఆధారాలు చూపుతున్నారు. అయినప్పటికీ రికార్డుల మార్పుల ద్వారా కలెక్టరును తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తున్నారు. -
జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
అణువణువూ పోలీసుల తనిఖీలు అల్లిపురం: జిల్లా కోర్టుకు బుధవారం ఉదయం బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి, అలాగే జిల్లా కోర్టుకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం కోర్టు ప్రాంగణంలో ముమ్మర తనిఖీలు చేపట్టింది. టూటౌన్ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు జిల్లా కోర్టుకు చేరుకుని.. కోర్టు ఆవరణ, వాహనాల పార్కింగ్ ఏరియా, కొత్త కోర్టు భవన సముదాయం, వివిధ కోర్టు హాళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో ఇది ఫేక్ కాల్ నిర్ధారించుకుని పోలీసులు, న్యాయవాదులు, కక్షిదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా టూటౌన్ సీఐ వి.వి.సి.ఎం.ఎర్రంనాయుడు మాట్లాడుతూ సీపీ ఆదేశాల మేరకు కోర్టులో ప్రతి చోటా స్క్వాడ్తో తనిఖీలు చేపట్టామని తెలిపారు. గతంలో కూడా కోర్టుకు ఇలాంటి నకిలీ బెదిరింపు కాల్స్ వచ్చాయని గుర్తుచేశారు. -
గ్రీన్బెల్ట్లో వ్యాపార సముదాయమా?
డాబాగార్డెన్స్: బీచ్రోడ్డులో సీఆర్జెడ్ నిబంధనలంటూ.. మద్దిలపాలెంలో హైకోర్టు ఉత్తర్వులంటూ.. నిబంధనలు, ఆదేశాల పేరుతో చిరు వ్యాపారుల పొట్టకొడుతున్న జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్.. ఇప్పుడు ఏకంగా గ్రీన్జోన్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార సముదాయం ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతుండటం గమనార్హం. నిబంధనలు కేవలం చిరువ్యాపారులకే తప్ప, కార్పొరేటర్ అయిన తనకు వర్తించవన్నట్లు ఆయన వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. గతంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ షాపింగ్ మాల్కు గ్రీన్జోన్ మీదుగా ప్రవేశ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటేనే అభ్యంతరం తెలిపి ఆ నిర్మాణాలను ఆపేసింది జీవీఎంసీ. ఇప్పుడు ఆ కార్పొరేటర్ గ్రీన్ బెల్ట్లో వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించగా, ఈ నెల 28న జరగనున్న చివరి సర్వసభ్య సమావేశం అజెండాలో 36వ అంశంగా చేర్చడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. తూర్పు జోన్ పరిధిలోని 22వ వార్డులో, జాతీయ రహదారి వెంబడి ఉన్న పీతలవానిపాలెం గ్రీన్బెల్ట్ ప్రాంతంలో స్మార్ట్ వీధి వ్యాపార మార్కెట్ను నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఈ నెల 28న జరగనున్న జీవీఎంసీ చివరి సర్వసభ్య సమావేశ అజెండాలో ఈ అంశాన్ని పొందుపరిచారు. ఇందుకుగాను రూ.1,94,60,000 అంచనా వ్యయంతో ప్రతిపాదిత స్థలంలో కంటైనర్ బేస్డ్ ప్లాట్ఫారం నిర్మాణం, కర్బ్ వాల్స్, పాదచారుల మార్గాలు, మరుగుదొడ్లు, నీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాల కల్పన వంటి అంశాలను అజెండాలో చేర్చారు. నిబంధనల పేరుతో వందలాది చిరువ్యాపారుల ఉపాధిని దెబ్బతీసిన కార్పొరేటర్.. ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా గ్రీన్జోన్లో వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులకు ఒక న్యాయం, ప్రజా ప్రతినిధులకు మరో న్యాయమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 28న చివరి కౌన్సిల్ సమావేశం జీవీఎంసీ ఐదేళ్ల పాలనా కాలంలో నాలుగేళ్ల పాటు వైఎస్సార్ సీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్ హోదాలో కౌన్సిల్ సమావేశాలను నిర్వహించారు. ప్రస్తుత పాలకవర్గంలో మేయర్ పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జీవీఎంసీ చివరి సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 28న నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మొత్తం 37 అజెండాలను చేర్చారు. వీటిలో పలు సర్వీస్ అంశాలు, వీధి దీపాల నిర్వహణ, అభివృద్ధి పనులపై సభ్యులు చర్చించనున్నారు. -
మసకబారుతున్న ఏయూ ప్రతిష్ట
మహారాణిపేట: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్సిటీ పరువు దిగజారిపోతోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగం నాయకులు ద్రోణంరాజు శ్రీవత్సవ్, ఉరుకూటి చందు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు చంద్రబాబు ప్రభుత్వం, ఏయూ వీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో, కావాలనే వర్సిటీ ప్రతిష్టను దిగజార్చేలా కూటమి పాలకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జోనల్ అధ్యక్షుడు శ్రీవత్సవ్ ఆరోపించారు. గత 20 నెలలుగా క్యాంపస్లో ఏదో ఒక సమస్య సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల క్యాంపస్లో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలను గుర్తుచేశారు. విద్యార్థుల మధ్య చిన్న చిన్న వివాదాలను నాలుగు గోడల మధ్య పరిష్కరించాల్సిన యాజమాన్యం, వీసీ.. చోద్యం చూస్తూ కూర్చున్నారని విమర్శించారు. వివాదం ముదిరిన తర్వాత స్వయంగా పోలీస్ కమిషనర్ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేయాల్సి రావడం వర్సిటీ చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా గీతం కాలేజీకి 54.9 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టేందుకు సిద్ధపడటమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి, ఏయూ ప్రతిష్టను కాపాడేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉత్తరాంధ్ర జోనల్ ప్రెసిడెంట్ అంబటి శైలేష్, జిల్లా విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
నాటి ప్రణాళికలే.. నేటి ప్రగతికి బాటలు
విశాఖ సిటీ: ఒక నగరం ప్రపంచస్థాయి మెట్రోపాలిటన్గా ఎదగాలంటే కేవలం ఆకాశహర్మ్యాలు ఉంటే సరిపోదు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు ఉండాలి. సరిగ్గా ఇదే దూరదృష్టితో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే కీలక ప్రాజెక్టులకు పునాదులు వేయగా, అవే ఇప్పుడు ప్రగతికి దిక్సూచిగా మారాయి. అందులో ప్రధానమైన ‘వైజాగ్ కోస్టల్ హైవే’ ప్రాజెక్టు ఇప్పుడు పట్టాలెక్కడానికి సిద్ధమవుతోంది. విశాఖ ఓడరేవు నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఆరు వరుసల ఎక్స్ప్రెస్కు అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు కేవలం ట్రాఫిక్ సమస్యలను తీర్చడమే కాకుండా, పర్యాటక, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపిరి పోయనుంది. సుమారు 55 కిలోమీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో తీరం వెంబడి సాగే ఈ రహదారి అభివృద్ధికి త్వరలోనే అంకురార్పణ జరగనుంది. పట్టాలెక్కనున్న ప్రాజెక్టు ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అమలు దశలోకి అడుగుపెడుతోంది. హార్బర్ నుంచి కైలాసగిరి వరకు ఉన్న 30 మీటర్ల రహదారిని 40 మీటర్లకు, అక్కడి నుంచి భోగాపురం వరకు 60 మీటర్లకు విస్తరించనున్నారు. రుషికొండ సమీపంలో ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సముద్ర అందాలకు ఆటంకం కలగకుండా, భూసేకరణ సమస్యలు తలెత్తకుండా దీనిని రూపకల్పన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికి దీనిపై దృష్టి సారించింది. గతంలో ఉన్న ప్లాన్కు చిన్న పాటి సాంకేతిక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా ఎలివేటెడ్ కారిడార్ పొడవును పెంచడం, భీమిలిలో నేరేళ్లవలస కొద్దిగా ముందగానే రహదారిని మళ్లిస్తూ డిజైన్లను మార్పు చేసింది. ఈ మార్పుతో ఇంకా కొంత మేర భూ సేకరణ చేపట్టాల్సి వస్తోంది. భీమిలి నుంచి భోగాపురం వరకూ 19.66 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్ట్ కారిడార్ను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం సుమారు 350 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. ఈ కోస్టల్ కారిడార్ ప్రాజెక్టు భూసేకరణకు రూ.4,315 కోట్లు, నిర్మాణాలకు రూ.1,974 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టును రెండు లేదా మూడు రీచ్లుగా విభజించి పనులు చేపట్టనున్నారు. వైజాగ్ కోస్టల్ హైవే కేవలం ఒక రోడ్డు ప్రాజెక్ట్ మాత్రమే కాదని, ఇది విశాఖను గ్లోబల్ సిటీగా మార్చే క్రమంలో ఒక కీలక అడుగుగా పారిశ్రామికవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఐటీ రంగానికి నిలయమైన రుషికొండ, పర్యాటక ప్రాంతమైన భీమిలి, అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం.. ఈ మూడింటిని కలిపే ఈ రహదారి ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తుందని భావిస్తున్నారు. నాడు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపకల్పనవిశాఖను గ్లోబల్ హబ్గా మార్చాలనే సంకల్పంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కోస్టల్ కారిడార్కు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఈ ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళికలో చేర్చింది. విశాఖ నగరం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ‘సిక్స్ లేన్’ డిజైన్లను ఖరారు చేసింది. భారీ వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ విషయంలో గత ప్రభుత్వం సాహసోపేత అడుగులు వేసింది. వీఎంఆర్డీఏ ద్వారా సుమారు 55 కిలోమీటర్ల మేర సాగే ఈ కారిడార్ కోసం ల్యాండ్ పూలింగ్ పద్ధతిని అనుసరించి రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకుంది. క్షేత్రస్థాయిలో అడ్డంకులను తొలగించి ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించడమే కాకుండా, పారదర్శకమైన రీతిలో మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయించింది. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపి, రూ. 6,289 కోట్ల వ్యయం అయ్యే ఈ రహదారిని జాతీయ రహదారిగా గుర్తింపజేయడంలో సఫలీకృతమైంది.


