breaking news
Visakhapatnam
-
● ముప్పుటంచున సాగర తీరం
ఏయూక్యాంపస్: విశాఖ సముద్ర తీరం అలల తాకిడికి నానాటికి కుచించుకుపోతోంది. ముఖ్యంగా ఆర్.కె.బీచ్లోని విక్టరీ ఎట్ సీ ఎదురుగా ఉన్న ప్రాంతం తీవ్రమైన కోతకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అలల ఉధృతి కారణంగా తీరంలోని ఇసుక సముద్రంలోకి కొట్టుకుపోతుండటంతో, అక్కడి పచ్చదనం క్రమంగా కనుమరుగవుతోంది. గతంలో తీర రక్షణ కోసం, సౌందర్యం కోసం నాటిన కొబ్బరి చెట్లు ఇప్పటికే అలల తాకిడికి నేలకొరిగి సముద్రంలో కలిసిపోయాయి. తాజాగా, వాటి వెనుక రక్షణగా నాటిన మరికొన్ని మొక్కలు కూడా సముద్రంలో కలిసే ప్రమాదం ఏర్పడింది. మొక్కలను, తీరాన్ని రక్షించడానికి గతంలో రాళ్లతో నిర్మించిన గేబియన్ స్ట్రక్చర్ కూడా అలల ధాటికి దెబ్బతింది. ప్రస్తుతం ఆ రాళ్లు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఇవి అలల వేగాన్ని అడ్డుకోవడంలో విఫలమవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పర్యాటకులు సముద్ర తీరంలో కాలు మోపడం కూడా కష్టసాధ్యంగా మారే ప్రమాదం ఉంది. అధికారులు తక్షణం స్పందించి, నిపుణుల సూచనలతో తీరం కోతకు అడ్డుకట్ట వేసేలా శాశ్వత పరిష్కార మార్గాలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శాశ్వత పరిష్కారం ఎక్కడ? -
రూ.16,200
● మొబైల్ టాయిలెట్ల మాయాజాలంరూ.6,900ఒకే కంపెనీకి అప్పగింతఈ ఫొటోలో కనిపిస్తోంది కేకేవీఎస్ ఆగ్రోటెక్ అనే సంస్థ ఇండియా మార్ట్ వెబ్సైట్లో ఒక రోజు పోర్టబుల్ టాయిలెట్ అద్దె రూ.2 వేలుగా పేర్కొన్న దృశ్యం. కర్నూలులో అద్దె విశాఖలో అద్దెచినబాబు సిఫారసుతో..! అధికార తెలుగుదేశం పార్టీ నేతకు చెందిన సంస్థ కావడంతో పాటు చినబాబు నుంచి వచ్చిన సిఫారసుతోనే దోచిపెట్టే వ్యవహారం ఈ రేంజ్లో సాగుతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇండియా మార్ట్లో ఒక మొబైల్ టాయిలెట్ కొనుగోలు ధర రూ.18 వేలుగా ఉంది. అంటే విశాఖలో ఒక రోజు అద్దెగా చెల్లించిన మొత్తం కంటే కేవలం రూ.1,800లే ఎక్కువ. అంటే ఒక రోజుకే దాదాపుగా కొనుగోలు ధరను సదరు సంస్థకు చెల్లించినట్టు అర్థమవుతోంది. నేరుగా చినబాబు నుంచి సిఫారసు ఉండటంతో అధికారులు, స్థానిక నేతలూ కిక్కురుమనడం లేదని సమాచారం. -
యోగా డే నాడు మొబైల్ టాయిలెట్ల మొత్తం అద్దె రూ.1.60 కోట్లు టెండర్లు లేకుండానే నామినేషన్ పద్ధతిలో అప్పగింత ప్రధాని కర్నూలు పర్యటనలోనూ అదే తీరు రాష్ట్రంలో ఎక్కడ పర్యటనలు జరిగినా ఒకే కాంట్రాక్టరుకు అప్పగింత పనులన్నీ గుంటూరుకు చెందిన టీడీపీ నేతకే...
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : యోగా డే మాటున చంద్రబాబు సర్కారు దోపిడీకి ప్రణాళిక రచించింది. అనుంగుడైన కాంట్రాక్టరుకు మొబైల్ టాయిలెట్ల అద్దె రూపేణా అడ్డంగా దోచిపెట్టేందుకు స్కెచ్ వేసింది. పైగా ఆ కాంట్రాక్టరు గుంటూరుకు చెందిన టీడీపీ నేతే కావడం గమనార్హం. ఇండియా మార్ట్లో కేవలం రూ.2 వేలకే మొబైల్ టాయిలెట్ను అద్దెకు సరఫరా చేస్తామని కేకేవీఎస్ ఆగ్రోటెక్ కంపెనీ ప్రకటిస్తుంటే.. కేకేవీఎస్ గ్రీన్ వెంచర్స్ నుంచి జీవీఎంసీ ఏకంగా రూ.16,200 అద్దె చెల్లించేందుకు పనులను అప్పగించడం యోగా డే మరుగున దోపిడీ బాగోతాన్ని బహిర్గతం చేసింది. మరీ విచిత్రమేమంటే కేకేవీఎస్ ఆగ్రోటెక్, కేకేవీఎస్ గ్రీన్ వెంచర్స్ కంపెనీలు రెండూ ఒకేటే కావడం. గత అక్టోబరు 16న కర్నూలులో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమం సందర్భంగా కూడా ఒక్కో టాయిలెట్కు అద్దె రూ.6,900 చొప్పున చెల్లించారు. ఇవే కాదు రాష్ట్రంలో ఎక్కడ ప్రధాని పర్యటన జరిగినా.. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనలకై నా... యోగా డే... ఇలా ఏ కార్యక్రమమైనా మొబైల్ టాయిలెట్ల సరఫరా కాంట్రాక్టు మాత్రం గుంటూరుకు చెందిన టీడీపీ నేతకే దక్కుతున్నాయి. ఒకవేళ టెండరులో వేరే సంస్థ పనులు దక్కించుకున్నా.. ఉన్నతాధికారుల ఒత్తిడితో పనులు చేసేది మాత్రం సదరు టీడీపీకి చెందిన సంస్థే అని తెలుస్తోంది. దీంతో కార్యక్రమాన్ని బట్టి ఒక్కోసారి ఒక్కో ధరను ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు సంస్థ వసూలు చేస్తోంది. గత ఏడాది జూన్ 21న యోగా డే పేరుతో విశాఖలో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా ఒక్కో మొబైల్ టాయిలెట్కు పెట్టిన ఖర్చు చూస్తే ఏకంగా కొత్త టాయిలెట్ కొనడమే కాదు.. మరో రూ.4 వేలు వెచ్చిస్తే ఏకంగా శాశ్వతంగా టాయిలెట్లను నిర్మించవచ్చననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు కంపెనీల పేర్లతో మాయాజాలం ఒక్క యోగా డే పేరుతో నామినేషన్ పద్ధతిలో జీవీఎంసీ మొబైల్ టాయిలెట్ల అద్దె పేరుతో చెల్లించేందుకు సిద్ధమైన మొత్తం అక్షరాలా రూ.1.60 కోట్లు. ఇదే కాకుండా కర్నూలులో అక్టోబరులో జరిగిన ప్రధాని పర్యటన సందర్భంగా కూడా రూ.41.52 లక్షల మేర చెల్లింపులు చేశారు. గుంటూరుకు చెందిన కేకేవీఎస్ గ్రీన్ వెంచర్స్ సంస్థకే ప్రధానంగా ఈ మొబైల్ టాయిలెట్ల సరఫరా పనులన్నీ దక్కుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఒకే సంస్థ పేరుతో కాకుండా ప్రెస్టేజ్ కన్స్ట్రక్షన్స్, వై.మోహన్, కోనసీమ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ పేరుతో పనులు దక్కినప్పటికీ.. మొబైల్ టాయిలెట్లను సరఫరా చేస్తోంది మాత్రం కేకేవీఎస్ గ్రీన్ వెంచర్స్ సంస్థ అనే విమర్శలున్నాయి. ఈ సంస్థ యజమాని గుంటూరుకు చెందిన టీడీపీ నేత కావడమే ఈ అదనపు చెల్లింపులకు ప్రధాన కారణమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రెండు కార్యక్రమాలు.. రూ.2 కోట్లు..! యోగా డే పేరుతో జరిగిన యోగా విన్యాసాలకు మించి మొబైల్ టాయిలెట్ల ఏర్పాటులో చేసిన విన్యాసాలు రక్తి కట్టించినట్టు అర్థమవుతోంది. వీఐపీ టాయిలెట్ల పేరుతో రూ.16,200, బయో టాయిలెట్ల పేరుతో రూ.16 వేలు.. సాధారణ టాయిలెట్ల పేరుతో రూ.11,957 ఇలా యోగా డే సందర్భంగా అద్దె చెల్లించేందుకు జీవీఎంసీ ప్రజారోగ్యశాఖ అధికారులు సిద్ధమయ్యారు. అది కూడా ఎటువంటి టెండర్ లేకుండానే నామినేషన్పై పనులను అప్పగించడం గమనార్హం. కార్యక్రమం నిర్వహించిన 6 నెలల తర్వాత తీరిగ్గా అనుమతి కోసం స్టాండింగ్ కమిటీ ముందు ఉంచారు. ఈ విధంగా మొత్తం రూ.1.62 కోట్ల మేర కేవలం మొబైల్ టాయిలెట్ల అద్దె బిల్లు అవుతుండగా... కర్నూలులో అక్టోబరులో జరిగిన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన వాటిలోనూ ఇదే తంతు జరిగింది. అయితే, ఇక్కడ టెండర్లను పిలిచి... 880 టాయిలెట్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఒక దానికి రూ.4,500, మరో దానికి రూ.6,900 చొప్పున మొత్తం రూ.41.52 లక్షల మేర కేవలం అద్దె రూపంలో చెల్లించింది. అంటే కేవలం ఈ రెండు కార్యక్రమాలకే మొబైల్ టాయిలెట్లకే రూ.2 కోట్లకుపైగా వెచ్చించడం విస్తుగొలుపుతోంది. -
చైనీస్ మాంజాపై పూర్తి నిషేధం
విశాఖ సిటీ : ప్రాణాంతకంగా మారుతున్న చైనీస్ మాంజాపై నిషేధం ఉన్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి సందర్భంగా పిల్లలు కేవలం సంప్రదాయ కాటన్ దారంతో మాత్రమే గాలిపటాలు ఎగురవేసేలా తల్లిదండ్రులు చూడాలని సూచించారు. ఈ సింథటిక్ దారం ద్విచక్ర వాహనదారుల మెడకు తగిలి ప్రాణాంతక గాయాలు అవుతున్నాయని, గాలిపటాలు ఎగురవేసే క్రమంలో పిల్లల వేళ్లు తెగుతున్నాయని, పక్షులు, వన్యప్రాణులు ఈ దారంలో చిక్కుకుని మరణిస్తున్నాయని తెలిపారు. ఈ దారం విద్యుత్ తీగలకు తగిలితే విద్యుత్ షాక్, అగ్నిప్రమాదాలు, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందన్నారు. చైనీస్ మాంజా అమ్మకాలు, నిల్వ, రవాణా, వాడకంపై ప్రత్యేక నిఘా, ఆకస్మిక తనిఖీలు జరుగుతాయన్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం దీనిపై పూర్తి నిషేధం ఉందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చైనీస్ మాంజా అక్రమ విక్రయాలు, నిల్వల కోసం సమాచారం తెలిస్తే డయల్ 112కు గాని, సీపీ వ్యక్తిగత నెంబర్ 7995095799కు లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. -
అల్లరి చేశాడని తల పగలకొట్టారు
ఆరిలోవ: తరగతి గదిలో ఓ విద్యార్థి అల్లరి చేస్తున్నాడన్న నెపంతో ఓ ఉపాధ్యాయురాలు.. చేతిలో ఉన్న ఫ్లాంక్తో తలపై కొట్టారు. దీంతో విద్యార్థి తలపై గాయమైంది. ఆరిలోవ ప్రాంతంలోని సీతాంజలి ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తల్లి, స్థానికులు తెలిపిన వివరాలివి. పెదగదిలికి చెందిన జోష్ అనే విద్యార్థి పాత ఆరిలోవలోని సీతాంజలి స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం తరగతిలో పిల్లలు అల్లరి చేస్తున్నారని మందలించే క్రమంలో గణిత ఉపాధ్యాయురాలు జోష్ను ఫ్లాంక్తో తలపై కొట్టడంతో గాయమైంది. సాయంత్రం స్టడీ అవర్లో ఉండకుండా తొందరగా ఇంటికి వెళ్లిన బాలుడి తల నుంచి రక్తం కారడాన్ని గమనించిన తల్లి.. వెంటనే పాఠశాలకు వెళ్లి నిలదీశారు. అయితే.. ‘అది చిన్న దెబ్బే.. అంత గాబరా పడాల్సిన పనిలేదు’ అంటూ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి పంపించేసిందని ఆమె తెలిపారు. రక్తం కారుతున్నా పాఠశాల యాజమాన్యం సరైన వైద్యం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల సూచన మేరకు బాలుడిని విమ్స్కు తరలించి ఎమ్మెల్సీ చేయించారు. చికిత్స పొందుతుండగానే బాలుడు వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి తీవ్రత అర్థమైంది. వేలల్లో ఫీజులు కట్టి పిల్లలను బడికి పంపిస్తుంటే.. ఇలా కొట్టి చంపేస్తారా? అంటూ విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్పై వేటు..యాజమాన్యం సేఫ్.. ఘటనపై ఫిర్యాదులు రావడంతో డీఈవో ఎన్.ప్రేమకుమార్ ఆదేశాల మేరకు ఎంఈవో రవీంద్రబాబు మంగళవారం పాఠశాలను సందర్శించి విచారణ జరిపారు. విద్యార్థిని కొట్టిన గణిత ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని యాజమాన్యాన్ని సున్నితంగా మందలించి వదిలేశారు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. కేవలం టీచర్ను బలిచేసి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన యాజమాన్యాన్ని అధికారులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాలల హక్కుల సంఘాలు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రైవేట్ స్కూల్లో దారుణం -
వణికిస్తున్న శీతల గాలులు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్న మంచు, చలి ప్రభావం కొనసాగుతోంది. మన్యం వాసులు చలి తీవ్రతకు వణికిపోతున్నారు. మంగళవారం ముంచంగిపుట్టులో 8.0 డిగ్రీలు, పెదబయలులో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధి జి.మాడుగులలో 9.7, హుకుంపేటలో 11.1 డిగ్రీలు, పాడేరులో 11.5 డిగ్రీలు, అరకువ్యాలీలో 12.0 డిగ్రీలు, చింతపల్లిలో 13.5 డిగ్రీలు, అనంతగిరిలో 13.9 డిగ్రీలు, కొయ్యూరులో 14.1 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. ●పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధి మారేడుమిల్లిలో 11.3 డిగ్రీలు, వై.రామవరంలో 11.7 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 14.7డిగ్రీలు, అడ్డతీగలలో 15.8 డిగ్రీలు, రంపచోడవరంలో 16.4 డిగ్రీలు, చింతూరు డివిజన్చింతూరులో 15.2 డిగ్రీలు, ఎటపాకలో 16.5 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి శీతల గాలులు ప్రభావం ఎక్కువగా ఉంటోందని స్థానికులు తెలిపారు. ఉదయం 9 గంటలు దాటే వరకు భానుడు కనిపించడం లేదు. మంచు తెరలు రహదారులను కమ్మేయడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
ఫార్మా అండ్ ల్యాబ్ ఎక్స్పో ప్రారంభంపరవాడ: ఫార్మా రంగంలో వస్తున్న వినూత్న మార్పులు, అధునాతన సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని జేఎన్పీసీ ఫార్మా మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జెట్టి సుబ్బారావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన వైజాగ్ ఫార్మా అండ్ ల్యాబ్ ఎక్స్పోను ఉద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంగళవారం ఫార్మాసిటీ క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశవిదేశాల్లో తయారైన అధునాతన ఫార్మా పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల యాజమాన్యాలు ఈ కొత్త సాంకేతికతను తమ పరిశ్రమల్లో వినియోగించి అభివృద్ధి సాధించాలని సూచించారు. పరవాడతో పాటు అచ్యుతాపురం, నక్కపల్లి, పైడిభీమవరం, పూసపాటిరేగ ప్రాంతాల్లోని పరిశ్రమలకు, అక్కడ పనిచేస్తున్న సుమారు 60 వేల మంది ఉద్యోగులకు, ఫార్మసీ, కెమికల్ విభాగాల విద్యార్థులకు ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోలో మొదటి రోజు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్పై అవగాహన కల్పించారు. రెండో రోజు బాయిలర్ డిపార్ట్మెంట్పై, మూడో రోజు పర్యావరణం అంశాలపై సంబంధిత అధికారులు అవగాహన కల్పిస్తారని వివరించారు. ఎగ్జిబిషన్లో 150 సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎన్.సూర్యప్రకాశరావు, ఎం.ఎ.ఎస్.ఎం అధ్యక్షుడు ఎం.శివరామప్రసాద్, డ్రగ్ కంట్రోల్ ఏడీ ఎస్.విజయకుమార్, జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారి ఎన్.కల్యాణి, ఏఎస్ఆర్ జిల్లా అధికారి కె. ఇందిరాభారతి తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు
తాటిచెట్లపాలెం: పండగ వేళ విశాఖపట్నం–చర్లపల్లి–విశాఖపట్నం మధ్య స్పెషల్ రైలు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజనల్ అధికారులు తెలిపారు. విశాఖ–చర్లపల్లి(08513) స్పెషల్ ఈ నెల 18 రాత్రి 11 గంటలకు విశాఖలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. చర్లపల్లి–విశాఖపట్నం(08514) స్పెషల్ ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ స్పెషల్ దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజవాయడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. -
కేజీహెచ్లో ప్రపంచ బ్యాంక్ బృందం పర్యటన
మహారాణిపేట: ప్రపంచ బ్యాంక్కు చెందిన ఉన్నత స్థాయి సాంకేతిక బృందం మంగళవారం కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కళాశాలను సందర్శించింది. రాష్ట్రంలో ఆరోగ్య సేవల నాణ్యత పెంపులో భాగంగా.. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు డాక్టర్ మొహిర్జోన్ అహ్మదోవ్, డాక్టర్ కేరీ గార్డనర్, గణేష్ మరిముత్తులతో కూడిన బృందం ఆసుపత్రిని సందర్శించింది. వీరికి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ మెడిసిన్, ప్రసూ తి విభాగాల అధ్యాపకులు ఆసుపత్రి పనితీరును వారికి వివరించారు. బృందం సభ్యులు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, డయాగ్నోస్టిక్ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యం, పరీక్షల నిర్వహణ తీరుపై ఆరా తీశారు. అనంతరం బృందం లేబర్ కాంప్లెక్స్ను సందర్శించి, అక్కడి వసతులను పరిశీలించింది. ప్రసవ సమయంలో అందిస్తున్న సేవలు, లేబర్ రూమ్ నిర్వహణపై విభాగపు వైద్యులతో సుదీర్ఘంగా చర్చించారు. కేజీహెచ్ అత్యవసర వైద్య విభాగాధిపతి వి.ఎస్.ఎన్.మూర్తి, డాక్టర్ ఎన్.నవీన్, డాక్టర్ కిరణ్కుమార్, గైనిక్ విభాగాధిపతి జి.సౌమిని, ప్రొఫెసర్ పి.జయంతి, అసోసియేట్ ప్రొఫెసర్ పి.సుధా పద్మశ్రీ, డిప్యూటీ సూపరింటెండెంట్లు డి.రాధాకృష్ణన్, డాక్టర్ వాసవీ లత, డాక్టర్ ఎం.చంద్రశేఖరం నాయుడు పాల్గొన్నారు. -
యోగానంద నారసింహుడిగా అప్పన్న
సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న రాపత్తు ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు మంగళవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి యోగానంద నారసింహుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని యోగానంద నారసింహుడిగా ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల సమేతంగా స్వామిని ఒక పల్లకీలో, ఆళ్వారులను వేరొక పల్లకీలో అధిష్టింపజేశారు. సాయంత్రం ఆలయ మాడవీధిలో స్వామికి వైభవంగా తిరువీధి నిర్వహించారు. ఈ తిరువీధిలో భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
ఇద్దరు దొంగల అరెస్ట్ మల్కాపురం: గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. గాజువాక క్రైం పోలీసులు తెలిపిన వివరాలివి. తామర హరిబాబు, బండారి భరత్ తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడి నగదు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను అపహరిస్తున్నారు. దీనిపై ఈ నెల 2వ తేదీన వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జీవీఎంసీ 59వ వార్డు పరిధిలోని కొత్త నక్కవానిపాలెం, గాజువాక పరిధిలోని అజీమాబాద్తో పాటు మరో రెండు ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలు ఒకే తీరుగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నిందితులు ఈ నెల 5వ తేదీ సాయంత్రం గాజువాక మసీద్ సెంటర్ వద్ద సంచరిస్తున్నారన్న సమాచారంతో క్రైమ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగతనాలకు పాల్పడింది తామేనని వారు అంగీకరించారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును క్రైమ్ సీఐ హరికృష్ణ మీడియాకు చూపించారు. మంగళవారం నిందితులను రిమాండ్కు తరలించారు. -
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఈ 18 నెలల కాలంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, భూకబ్జాలు, ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. మంగళవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా మహిళా విభాగం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరుదు కల్యాణి మాట్లాడుతూ.. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ మహిళా విభాగం కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళలకు జరిగిన మేలును వివరిస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వ మోసాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు సర్కార్ను నిలదీస్తూ, ప్రజల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు. కూటమి నేతల అఘాయిత్యాలకు బలవుతున్న బాధితులకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అండగా నిలిచి భరోసా కల్పించాలన్నారు. జోన్–1 మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, పేడాడ రమణికుమారి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు, స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతానికి పైగా అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు. మళ్లీ మహిళలకు ఆ ప్రాధాన్యత దక్కాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే దిశగా ప్రతి మహిళా కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. సమావేశంలో మహిళా కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, వార్డు స్థాయి మహిళా నేతలు, అనుబంధ విభాగాల సభ్యులు పాల్గొన్నారు. -
విద్యే వజ్రాయుధం
మధురవాడ/కొమ్మాది: విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, గురుకులాల్లో గురువారం ఉదయం అందించే ఉప్మా స్థానంలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలిస్తామని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సి.హెచ్.విజయప్రతాపరెడ్డి వెల్లడించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మధురవాడ, మారికవలస, ఎండాడ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ డిపోలు, జిల్లా పరిషత్ హైస్కూల్, గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు. భోజన నాణ్యత, వంటల తీరు, రకుల నిల్వలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. గురువారం ఉదయం పెట్టే ఉప్మా తినలేకపోతున్నామని మారికవలస గురుకుల విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఆయన.. ఉప్మా బదులుగా విద్యార్థులకు ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టే యోచనలో ఉన్నట్లు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. విద్య వజ్రాయుధం లాంటిదని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే కాకుండా నైపుణ్యాలు పెంచుకుంటే ప్రైవేట్ రంగంలోనూ అపార అవకాశాలు ఉంటాయన్నారు. విద్యార్థులు అవినీతి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చైర్మన్కు చిన్నారుల గ్రీటింగ్స్ ఎండాడ పాఠశాల సందర్శనలో విద్యార్థులు చైర్మన్కు ఘన స్వాగతం పలికారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఫుడ్ ఈజ్ గాడ్ అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డులను ఆయనకు అందజేశారు. వాటిని ఆయన సంతోషంగా స్వీకరించారు. ఫుడ్ కమిషన్ సభ్యుడు సూర్యకిరణ్, డీసీఎస్వో వి.భాస్కరరావు, సివిల్ సప్లై మేనేజర్ ఎం.శ్రీలత, డీఈవో ఎన్.ప్రేమకుమార్, ఐసీడీఎస్ పీడీ కేవీ రామలక్ష్మి, ఫుడ్ సేఫ్టీ అధికారి కల్యాణ్ చక్రవర్తి, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ డిప్యూటీ కంట్రోలర్ కె.టి.రవికుమార్, సోషల్ వెల్ఫేర్ డీడీ రామారావు, మధ్యాహ్న భోజనం పథకం కో–ఆర్డినేటర్ మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. మెనూ పాటించాల్సిందే.. పాఠశాలల్లో కచ్చితంగా మెనూ ప్రకారమే ఆహారం అందించాలని, పౌష్టికాహార సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఉపేక్షించేది లేదని ఫుడ్ కమిషన్ చైర్మన్ హెచ్చరించారు. ఎండాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, పిల్లలు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. అలాగే రేషన్ డిపోల ద్వారా లబ్ధిదారులకు బియ్యం, పంచదార సక్రమంగా అందుతున్నాయా అని ఆరా తీశారు. సివిల్ సప్లై, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం, సోషల్ వెల్ఫేర్ వంటి విభాగాలు తమ కమిషన్ పరిధిలోకి వస్తాయని, ఎటువంటి సమస్యలున్నా తమను సంప్రదించవచ్చని తెలిపారు. -
వీఐపీలకు ఇక ప్రత్యేక సమయం
సింహాచలం: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు వందశాతం సంతృప్తికరమైన సేవలు అందించడమే లక్ష్యమని, ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని రాష్ట్ర దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ తెలిపారు. మంగళవారం ఆయన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని, ‘ప్రసాద్’ పథకం పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా, ప్రోటోకాల్ వీఐపీల దర్శనాలకు ప్రత్యేక సమయాలు కేటాయిస్తామని, ఆ సమయంలోనే వారు రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సింహాచలం, విజయవాడ ఆలయాల్లో పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవెల్ పార్కింగ్ భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సింహగిరి రెండో ఘాట్ రోడ్డును(పాత అడవివరం వైపు నుంచి) కొండపై వరకు పొడిగించే ప్రతిపాదనలు చేశామన్నారు. సింహాచలంలో ప్రసాద్ పథకం పనులు నెల రోజుల్లో పూర్తవుతాయని, మెట్ల మార్గం పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. కొండ దిగువన వరాహ పుష్కరిణి వద్ద తలనీలాల కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రసాదాల నాణ్యత, పరిమాణం, పారిశుధ్యంపై ఎస్వోపీలను అమలు చేస్తున్నామని, అన్నప్రసాదం నాణ్యత పరిశీలనకు ఇద్దరు అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 22 ఆర్జేసీ, డీసీ హోదా కలిగిన ఆలయాల ఈవోలతో ఎస్వోపీలు అమలుపై ప్రతి రెండు వారాలకోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎన్ఎంఆర్ల పర్మినెంట్ విషయంలో నిషేధం ఉందని, కొన్ని చోట్ల కోర్టు ఉత్తర్వుల మేరకు ఇవ్వడం జరుగుతోందన్నారు. పులిహోరలో నత్త వచ్చిందన్న ఆరోపణపై విచారణ జరుగుతోందని, తప్పులు జరిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలని భక్తులను కోరారు. ఆ భక్తుడిపై చర్యలు తీసుకునే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. శ్రీనివాసనగర్లో కొత్తగా నిర్మించిన కల్యాణ మండపాలను నెలలోపు అందుబాటులోకి తేవాలని, భద్రత కోసం మెటల్ డిటెక్టర్లు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. భైరవవాక ఆలయ రహదారి నిర్మాణంపై అటవీశాఖతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట దేవస్థానం ఇన్చార్జి ఈవో సుజాత, ఈఈ రమణ, ఏఈవోలు ఉన్నారు. 06విఎస్సి95–320092,06విఎస్సి95ఎ–320092: వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి బృందంతో కేజీహెచ్ సూపరిండెంటెంట్ వాణి, వైద్యులు -
ఆకట్టుకున్న సప్త స్వరాలాపన
మద్దిలపాలెం: కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సంగీత కళాభారతి జలజాక్షి హాజరయ్యారు. మొదటి రోజు కార్యక్రమంలో డాక్టర్ గౌరీ, రామ్మోహన్రావులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కంకటాల మల్లిక్ దంపతుల చేతుల మీదుగా వీరికి రూ.10 వేల నగదు పురస్కారం, నూతన వస్త్రాలను అందజేశారు. ముఖ్యఅతిథి జలజాక్షి చేతుల మీదుగా ‘సంగీత కళాభారతి’ బిరుదును, జ్ఞాపికను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ.. తాము ఇప్పటివరకు ఎన్నో పురస్కారాలు పొందినప్పటికీ, ఇంత ఘనంగా సన్మానం జరగడం ఇదే మొదటిసారి అని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం డాక్టర్ మాధురి దేవి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ప్రదర్శించిన సంగీత గాత్ర రూపకం అలరించింది. 4 వీణలు, 20 మంది గాత్ర కళాకారులు కలిసి సద్గురు శ్రీ త్యాగరాజ సప్త స్వరాలాపన చేసి సభికులకు శ్రావ్యానందాన్ని పంచారు. వీఎండీఏ కార్యవర్గ సభ్యులు ఎం.ఎస్.ఎన్.రాజు, డాక్టర్ రాంబాబు, పైడా కృష్ణప్రసాద్, పంతుల రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ప్రారంభమైన త్యాగరాజ ఆరాధనోత్సవాలు -
సంక్రాంతికి 1,007 ప్రత్యేక బస్సులు
డాబాగార్డెన్స్: సంక్రాంతిని పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ విశాఖ నుంచి భారీగా ప్రత్యేక సర్వీసులను నడపనుంది. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు విశాఖలోని వివిధ డిపోల నుంచి మొత్తం 1,007 ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. విశాఖపట్నం, సింహాచలం, మద్దిలపాలెం, మధురవాడ, గాజువాక, విశాఖ స్టీల్, వాల్తేర్ డిపోల నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళానికి అత్యధికంగా 238, విజయవాడకు 215 సర్వీసులను కేటాయించారు. మిగిలిన వాటిలో పార్వతీపురానికి 101, రాజమండ్రికి 86, పలాసకు 85, పాలకొండకు 65, విజయనగరానికి 58, ఇచ్ఛాపురానికి 48, రాజాంనకు 34, సాలూరుకు 28, కాకినాడకు 18, బొబ్బిలికి 10, అమలాపురానికి 10, భీమవరానికి 5, నర్సీపట్నానికి 4, పాడేరుకు 2 చొప్పున బస్సులు నడపనున్నట్లు అప్పలనాయుడు వెల్లడించారు. -
కోతి దాడిలో ఇద్దరు విద్యార్థినులకు గాయాలు
రావికమతం: మండల కేంద్రం రావికమతంలో కోతుల దాడులతో విద్యార్థులు వణికిపోతున్నారు. గత నెలలో ఒకసారి హాస్టల్ విద్యార్థులపై, మరో సారి ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థులపై కోతులు దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం నవోదయ విద్యార్థినులపై కోతి దాడి చేయడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. మంగళవారం గెంజి వారి రామాలయా నికి సమీపంలో నవోదయ పాఠశాలలోకి కోతి ప్రవేశించి ఇద్దరు విద్యార్థినులపై దాడి చేసింది. ఈ దాడిలో రావికమతంకు చెందిన ఎస్.లోహిత, గు మ్మాళ్లపాడుకు చెందిన బుర్రకాయుల లీనా గాయపడ్టారు. వారిని పాఠశాల సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా చూడాలని నవోదయ స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ పట్నాయక్ కోరారు. -
రైతు సజీవ దహనం
రావికమతం: మండలంలోని కవగుంటలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదంలో ఓ గిరిజన రైతు సజీవదహనమయ్యాడు. స్థానిక ఎస్ఐ రఘువర్మ, స్థానికులు తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కల్యాణం దొర(65) వ్యవసాయంతో పాటు నాటు వైద్యం చేస్తుంటాడు. ఇతని భార్య గతంలో మృతి చెందగా, ముగ్గురు కుమారులకు వివాహాలు జరిగాయి. వారంతా వేర్వేరుగా ఉంటున్నారు.భార్య మృతి చెందినప్పటి నుంచి పాకలో ఉంటూ నాటు వైధ్యం చేస్తున్నాడు. రోజూ రాత్రి పెద్ద కుమారుడు ఇంటిలో భోజనం చేశాక పాక దగ్గరకు వెళ్లి నిద్రిస్తుంటాడు. సోమవారం రాత్రి కూడా పాకలోనే నిద్రించాడు. మంగళవారం తెల్లవారుజామున స్నానం కోసమని నీళ్లు మరగ బెడుతుండగా మంటలు చెలరేగి క్షణాల్లో పాక దగ్ధమైంది. కాళ్ల నొప్పులతో బాధపడుతున్న కల్యాణం దొర బయటకురాలేక మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. స్థానికులు వెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో దొర పాకలో లేడని వారు భావించారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాత పరిశీలించగా దొర మృతదేహం కనిపించిందని స్థానికులు తెలిపారు. అందిన సమాచారం మేరకు స్థానిక అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదు పు చేశారు. ఎస్ఐ రఘువర్మ సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరిలించారు. మృతుడి కుమారుడు రొబ్బా బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రఘువర్మ తెలిపారు. పాకలో వేడినీరు కాస్తుండగా ప్రమాదం -
‘భోగాపురం ఎయిర్పోర్టులోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ’
సాక్షి, విశాఖపట్నం: భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో పూర్తి క్రెడిట్ జగన్ది కాగా, నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు, కూటమి నేతలు ఆ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆక్షేపించారు. ఎయిర్పోర్టుకు భూసేకరణ మొదలు అనుమతులు, ఒప్పందాలు, ఆ తర్వాత పనుల్లోనూ ఎక్కువ శాతం నాడే పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్పోర్టుపై నాడు ఎంతో చొరవ చూపిన జగన్గారు, అందుకోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారని, విశాఖ నుంచి ఎయిర్పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక కూడా సిద్ధం చేశారని వెల్లడించారు.ఇప్పుడు ఆ రహదారి నిర్మాణంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్న ఆయన, భోగాపురం ఎయిర్పోర్టుకు ప్రయాణికులు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు సమాధానం చెప్పాలని కోరారు. ఆ మెయిన్ కనెక్టివిటీ రోడ్డుపై ఇప్పటివరకు డీపీఆర్ సిద్ధం కాలేదని, రోడ్ అలైన్మెంట్కూ ఇంకా ఆమోదం రాలేదని, అయినా పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని విశాఖలో మీడియాతో మాట్లాడిన కేకే రాజు దుయ్యబట్టారు. ప్రెస్మీట్లో ఆయన ఏం మాట్లాడారంటే..:తప్పుదోవ పట్టిస్తున్న కూటమి నేతలు:ఉత్తరాంధ్ర ప్రజలను గత కొంతకాలంగా కూటమి నేతలు అబద్ధాలు, అసత్యాలతో తప్పుదోవ పట్టిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ట్రయల్ రన్ జరిగిన సందర్భంగా, దీనంతటికీ తామే కారణమని చంద్రబాబు, లోకేష్ తదితరులు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు శంకుస్థాపన చేసిన సమయంలో కేవలం 377 ఎకరాల భూసేకరణ మాత్రమే జరిగింది, అంతటితో గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం సాధ్యమే కాదు.జగన్ వల్లనే భోగాపురం ఎయిర్పోర్ట్:2019లో జగన్ సీఎం కాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై స్పష్టమైన విజన్తో ముందుకు వెళ్లారు. 2020లో ఎయిర్పోర్టు నిర్మాణ ఒప్పందాలు, 2021లో భూసేకరణ ప్రారంభం, 2022లో ఎన్వోసీలు, 2023 జనవరిలో భూసేకరణ పూర్తి చేసి, అదే ఏడాది మే 3న పనులు ప్రారంభించారు. 2026 జూన్ నాటికి విమానాశ్రయం పూర్తవుతుందని అప్పుడే టైమ్ ఫ్రేమ్ ఇచ్చారు. పనుల్లో జీఎంఆర్ సంస్థ కూడా ఎక్కడా అలక్ష్యం చూపలేదు. మరోవైపు జగన్ చొరవతో వైజాగ్ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పుతో రోడ్డు సహా, అద్భుతమైన మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఆ రోడ్డు గురించి పట్టించుకోలేదు.ఎయిర్పోర్టుకు రోడ్ కనెక్టివిటి ఏదీ?:ఏమీ చేయకపోయినా అన్నీ తామే చేశామని చెప్పుకుంటూ, భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంలో క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, నిజానికి నాటి మాస్టర్ ప్లాన్ ప్రకారం విశాఖ నుంచి ఎయిర్పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పుతో మెయిన్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. దీంతో విశాఖ సిటీ నుంచి ఎయిర్పోర్టుకు పక్కా రోడ్ కనెక్టివిటీ లేకుండా పోయింది. మరి దీనికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు ఏం సమాధానం చెబుతారు?.ఇప్పుడు విశాఖ, భోగాపురం మధ్య ఒక్క రోడ్డు మాత్రమే ఉండగా, ఆనందపురం జంక్షన్లో తీవ్ర ట్రాఫిక్తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 70 మీటర్ల వెడల్పు రోడ్డుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్, డీపీఆర్, అలైన్మెంట్ ఇప్పటివరకు సిద్ధం కాలేదు. అనుమతులూ తీసుకోలేదు. అయినా కూటమి నేతలు పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని కెకె రాజు దుయ్యబట్టారు. -
జల వివాదంలో ఏపీ వాదనలు వీక్గా ఉన్నాయ్
విశాఖ : ఏపీ-తెలంగాణ రాష్ట్రాల జలవివాదంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రావాల్సిన వాటాలో నష్టం జరుగుతుందని మాధవ్ స్పష్టం చేశార. మన నీటి వాటా.. మన హక్కు అని.. నీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చేయాలన్నారు. తెలంగాణ సమర్థవంతంగా వాదన వినిపిస్తుందని, ఏపీ ప్రభుత్వం కూడా బలమైన వాదన వినిపించాలన్నారు. చాలా మంది నిపుణులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వారి సలహాలు తీసుకోవాలన్నారు. మన నీటి సమస్యను సరైన రీతిలో వివరించాలి.. వాదన వినిపించాలని ఆయన సూచించారు. -
‘ఏపీలో కార్మిక వత్యిరేక చట్టాలు ఎక్కువ’
విశాఖ : తమ భవిష్య కార్యాచరణ అంతా పోరాలాలేని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నరసింగరావు స్పష్టం చేశారు. తమ భవిష్యత్ అంతా పోరాటమేనన్నారు. ఈ సందర్భంగా ఏపీలో కార్మిక వ్యతిరేక చట్టాలు ఎక్కువగా ఉన్నాయని, అక్కడే ఎక్కువ పోరాటాలు చేయాలని నిర్ణయించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలను ఎండగడతామన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశ వ్యాప్త సమ్మె ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలన్నారు. సీఐటీయూ మహా సభలను జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సీఐటీయూ18వ అఖిల భారత మహాసభలు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో జరిగాయి. ఈ మహాసభలు 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించబడ్డాయి. దేశవ్యాప్తంగా సుమారు 1,300 ప్రతినిధులు హాజరయ్యారు.కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు, మరియు వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు. జాతీయ భద్రత, ప్రజా సమస్యలు, కార్మిక హక్కులు వంటి అంశాలపై చర్చలు జరిగాయి. కార్మిక ఉద్యమాల అనుభవాలు పంచుకున్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు. చివరి రోజైన ర్యాలీతో పాటు ప్రజా సభ నిర్వహించారు. -
ఇది బాబు ఫ్రీ బస్సండీ.. ఆగదండి
విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఆ ప్రయాణం గమ్యం చేరుతుందా అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేలా కనిపిస్తున్నాయి. బస్సు ఎక్కితే సీట్ల కోసం తగాదాలు, దిగితే తోపులాటలే కనిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో చూస్తుంటే, అసలు బస్సు ఎక్కడం కూడా మహిళలకు ఒక ‘గగన యాత్ర’లా మారిందనిపిస్తోంది. సంక్రాంతి పండగ హడావుడి మొదలైంది.జగదాంబ సెంటర్ నుంచి పూర్ణామార్కెట్ వరకు ఇసుక వేస్తే రాలనంత జనసంచారం. షాపింగ్లు, పనుల కోసం దూరప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు సంచులతో నిలబడి ఉన్నా ఆ సమయంలో వచ్చిన ఆర్టీసీ బస్సు కనీసం అపలేదు. దీనిని బట్టి చూస్తే చంద్రబాబు కల్పించింది ఫ్రీ బస్సు ప్రయాణం ఎలా ఉందో ఆర్థమవుతోందని విమర్శలు వెల్లువెత్తాయి. -
● ఇది బాబు ఫ్రీ బస్సండీ..ఆగదండి
చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఆ ప్రయాణం గమ్యం చేరుతుందా అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేలా కనిపిస్తున్నాయి. బస్సు ఎక్కితే సీట్ల కోసం తగాదాలు, దిగితే తోపులాటలే కనిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో చూస్తుంటే, అసలు బస్సు ఎక్కడం కూడా మహిళలకు ఒక ‘గగన యాత్ర’లా మారిందనిపిస్తోంది. సంక్రాంతి పండగ హడావుడి మొదలైంది. జగదాంబ సెంటర్ నుంచి పూర్ణామార్కెట్ వరకు ఇసుక వేస్తే రాలనంత జనసంచారం. షాపింగ్లు, పనుల కోసం దూరప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు సంచులతో నిలబడి ఉన్నా ఆ సమయంలో వచ్చిన ఆర్టీసీ బస్సు కనీసం అపలేదు. దీనిని బట్టి చూస్తే చంద్రబాబు కల్పించిన ఫ్రీ బస్సు ప్రయాణం ఎలా ఉందో ఆర్థమవుతోందని విమర్శలు వెల్లువెత్తాయి. – జగదాంబ -
అప్పన్నను దర్శించుకున్న మహిళా క్రికెటర్లు, రిఫరీలు
సింహాచలం: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని సోమవారం పలువురు క్రికెటర్లు, బీసీసీఐ ప్రతినిధులు దర్శించుకున్నారు. క్రికెటర్లు వి. కృతిక, నియతి లోకూర్ సహా బీసీసీఐ రిఫరీలు, అధికారులు శివశుక్లా, చేతన్ శర్మ, సుబ్రత దాస్, అభిషేక్ తోమర్, రాకేష్ కుమార్ తదితరులు స్వామివారిని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో వీరి పేరిట అర్చకులు స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం అందజేశారు. -
రికార్డుల్లో ‘పరిష్కారం’.. క్షేత్రస్థాయిలో ప్రహసనం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల తీరుపై అర్జీదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద ఫైల్స్ పెండింగ్లో ఉండకూడదనే ఉద్దేశంతో, క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కాకపోయినా పరిష్కారమైనట్లు అధికారులు మొక్కుబడిగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్జీదారుల సంతకాలు లేకపోయినా, నేరుగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమస్య పరిష్కారమైందంటూ తప్పుడు సమాచారం పంపిస్తున్నారని పలువురు సోమవారం మీడియా దృష్టికి తీసుకువచ్చారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి ప్రజల నుంచి మొత్తం 108 వినతులు స్వీకరించారు. వీటిలో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగానికి 42 ఫిర్యాదులు అందగా, ఇంజినీరింగ్ సెక్షన్కు 28, అడ్మినిస్ట్రేషన్ విభాగానికి 17, రెవెన్యూ విభాగానికి 12, ప్రజారోగ్య విభాగానికి 7 ఫిర్యాదులు అందాయి. మొక్కల విభాగం, యూసీడీ విభాగాలకు ఒక్కో విన్నపం వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ, ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణ రాజు, ఇన్చార్జ్ ప్రధాన వైద్యాధికారి అప్పలనాయుడు, ప్రధాన సిటీ ప్లానర్ ప్రభాకరరావు, డీసీఆర్ శ్రీనివాసరావు, ఇన్చార్జ్ డీడీహెచ్ వాసు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు 207 వినతులు
మహారాణిపేట: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో 207 వినతులను కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్తో పాటు పీజీఆర్ఎస్ నోడల్ అధికారి శేష శైలజ, జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణిలు స్వీకరించారు. వినతుల్లో అత్యధికంగా జీవీఎంసీకి సంబంధించి 90 ఉండగా, పోలీస్ విభాగానికి చెందినవి 21, ఇతర శాఖలకు సంబంధించినవి 96 ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమంలో అన్ని విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్కు వినతి ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉత్తర శాసనసభ్యుడు పి.విష్ణుకుమార్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు నేతృత్వంలో సోమవారం విశాఖ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు నేటి నుంచి ‘జనతా వారధి’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉంటూ, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అత్తిలి శంకరరావు, ఎ.కేశవకాంత్, అధికార ప్రతినిధి కె.సుహాసిని ఆనంద్, కె.ఎన్.పిచక్రవర్తి, శ్రీరంగం ధనేశ్వరరావు, పురుషోత్తం, శ్రీనివాసరావు, ఎం.సురేష్బాబు,ఆర్.విజయ చంద్రుడు, ఎం.ప్రకాష్, పి.వి.కృష్ణారావు, నాదేళ్ల జ్యోతి పాల్గొన్నారు. అర్జీల వివరాలు నమోదు చేస్తున్న కలెక్టరేట్ సిబ్బంది -
చదువులో రాణిస్తేనే మంచి భవిష్యత్తు
ఆరిలోవ : చదువులో రాణిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మ్న్ ప్రతాప్రెడ్డి తెలిపారు. శ్రీకృష్ణాపురంలో గల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఇక్కడ గురుకుల ఆవరణ, తరగతి గదులను పరిశీలించారు. పిల్లలతో నేరుగా మాట్లాడి సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా, రుచికరంగా వండుతున్నారా, బోధన బాగా జరుగుతుందా? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను విద్యార్థులు పేర్లు రాయకుండా పేపర్పై రాసి ఇవ్వాలని సూచించారు. అనంతరం ఆయన నేరుగా గురుకులంలో వంట గదికి వెళ్లి పరిశీలించారు. పిల్లలు పేపర్లుపై రాసిన సమస్యలను చదివి అక్కడ వంట సిబ్బందికి వినిపించారు. నీరు ఎక్కువగా కలిపిన పప్పు పెడుతున్నారని, వంకాయ కూర వండినప్పుడు రుచిగా ఉండదని, వంట చేసే ఉమ అక్క తమను తరుచూ తిడుతుందని విద్యార్థులు రాశారు. దీంతో విద్యార్థులను తిడుతున్న వంట మనిషి ఉమను మార్చేయాలని గురుకులాల జిల్లా సమన్వయాధికారి గ్రేస్ను ఆదేశించారు. విద్యార్థుల కోసం రుచిగా వంటలు చేసి మంచి భోజనం పెట్టాలని సూచించారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు వేసిన పెయింటింగ్స్ను పరిశీలించారు. అక్కడ పదో తరగతి విద్యార్థి వేసిన ఓ పెయింటింగ్ పరిశీలించి అభినందించారు. ఈ సందర్శనలో డీఈవో ఎన్.ప్రేమకుమార్, గురుకులాల సమన్వయాధికారి గ్రేస్, గురుకులం ప్రిన్సిపాల్ పూతిరెడ్డి మురళి, అధ్యాపకులు పాల్గొన్నారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్రెడ్డి -
నిబంధనలకు పాతర.. స్టాండర్డ్స్ లేని కౌన్సిల్
డాబాగార్డెన్స్: జీవీఎంసీ అక్రమాలకు అడ్డాగా మారింది. నిబంధనలను తుంగలో తొక్కి తమ అనుయాయులకు పదవులు కట్టబెట్టడంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వెనుకడుగు వేయడం లేదు. తప్పు అని తెలిసినా అధికార మదంతో వరుసగా పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. దీనికి నిదర్శనమే నిబంధనలను నీళ్లొదిలి ఒక కార్పొరేటర్ భర్తకు జీవీఎంసీలో కీలక పదవి కట్టబెట్టడం. అక్కడితో ఆగకుండా కట్టుకున్న భార్యను, కన్న కొడుకును వదిలేసిన వ్యక్తిని సైతం జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించడం విశేషం. ఈ అక్రమ నియామకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే, తాము డబ్బులు పెట్టి పదవులను కొనుక్కున్నామని బహిరంగంగానే సమాధానం చెబుతుండటం గమనార్హం. అర్హత, నీతి నియమాలను పక్కన పెట్టి సాగుతున్న ఈ అక్రమ పదవుల పంపకంపై నగర ప్రజలు , పౌర సమాజం తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తోంది. భార్యని..కన్నకొడుకుని వదిలేసిన వ్యక్తికా? ఈ నియామకాల్లో మరో విస్తుపోయే అంశం ఏమిటంటే, నైతిక విలువలను కూడా విస్మరించడం. 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న తన భార్య విమలను, దివ్యాంగుడైన కుమారుడిని పదేళ్ల క్రితమే వదిలేసిన కారి గోవిందరాజును స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం మేయర్ చాంబర్కు వెళ్లిన విమలు తన ఆవేదనను వెలిబుచ్చింది. అయితే పీజీఆర్ఎస్లో ఫిర్యాదు తీసుకుంటానని..అక్కడ వేచి ఉండమని మేయర్ బదులిచ్చారని, అయితే తన ఫిర్యాదు తీసుకోవడానికి అక్కడ సిబ్బంది చెప్పడంతో మీడియాను ఆశ్రయించారు. కట్టుకున్న భార్యను, కన్న కొడుకును పట్టించుకోని వ్యక్తి ప్రజా ప్రతినిధిగా ఎలా పనిచేస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ పదవిని తాను డబ్బులు పెట్టి కొనుక్కున్నానని తన భర్తే స్వయంగా చెప్పినట్లు ఆమె మీడియా ముందు వెల్లడించడం జీవీఎంసీలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అద్దం పడుతోంది. ముమ్మాటికీ కోర్టు ధిక్కారణే : సీనియర్ న్యాయవాది సత్యనారాయణ ఈ మొత్తం వ్యవహారంపై సీనియర్ న్యాయవాది పాకా సత్యనారాయణ స్పందిస్తూ.. ఇది స్పష్టంగా కోర్టు ధిక్కరణే అవుతుందని పేర్కొన్నారు. రోస్టర్ పాయింట్లు పాటించకుండా, అఫిడవిట్కు విరుద్ధంగా తమకు నచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. జీవీఎంసీ అధికారుల తీరుపై త్వరలోనే కంటెప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నియామకాలను రద్దు చేయాలని బాధితులు, న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనల తూచ్ మున్సిపల్ నిబంధనల ప్రకారం కార్పొరేటర్ల కుటుంబ సభ్యులను స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా నియమించడానికి ఎటువంటి అవకాశం లేదు. 15వ వార్డు కార్పొరేటర్ భర్తకే ఆ పదవి లభించేలా చక్రం తిప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి నియామకాలు గతంలో చెల్లకుండా పోయిన ఉదాహరణలు ఉన్నప్పటికీ, జీవీఎంసీలో మాత్రం అవే తప్పులను పునరావృతం చేస్తున్నారు. మరోవైపు, నగర పరిధిని 10 జోన్లకు విస్తరించినప్పటికీ, పాత పద్ధతిలోనే కేవలం 8 మంది సభ్యులను ఎంపిక చేయడం గమనార్హం. ఈ ఎంపిక ప్రక్రియలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పాటించలేదని, మైనార్టీలకు కనీస ప్రాతినిధ్యం కల్పించలేదని ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ మద్దతుదారులకు సైతం మొండిచేయి చూపడంతో ఆ వర్గం వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేస్తా
మహారాణిపేట: జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం యంత్రాంగం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ‘రెవెన్యూ క్లినిక్’కు ఆర్జీదారులు పోటెత్తారు. సాధారణంగా జరిగే పీజీఆర్ఎస్ కంటే ఈ క్లినిక్కే జనాలు ఎక్కువగా తరలిరావడంతో కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. గత వారం 72 వినతులు రాగా, ఈ సోమవారం ఆ సంఖ్య గణనీయంగా పెరిగి 137కు చేరింది. దీంతో బాధితుల నమోదు కోసం అధికారులు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో తహసీల్దార్ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కారం కాకపోవడం, ఆన్లైన్ మ్యుటేషన్లు, 1బి పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో రెవెన్యూ అధికారులు కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తుండటంతో బాధితులు జిల్లా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సమస్య పరిష్కారం కాకపోయినా ఫోన్లకు పరిష్కృతమైందనే సందేశాలు రావడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు వంటి అంశాల్లో నివేదికలు స్పష్టంగా ఉండాలని, బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఫైళ్లను వెనక్కి పంపడం లేదా అమరావతిలోని సీసీఎల్ఏ కార్యాలయానికి పంపడం సరికాదని స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో దళారులు, రాజకీయ నాయకుల ప్రమేయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, సామాన్య ప్రజల పట్ల సహృదయంతో స్పందించి నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. డాక్యుమెంట్లు లేవనే నెపంతో డిజిటల్ అసిస్టెంట్లు అర్జీలను తిరస్కరించవద్దని, కనీసం సర్వే నంబర్ ఉన్నా దరఖాస్తును స్వీకరించి విచారణ చేపట్టాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సిబ్బందిపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం జేసీ మయూర్ అశోక్ ఆధ్వర్యంలో కొనసాగిన రెవెన్యూ క్లినిక్లో విశాఖ, భీమిలి ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, అన్ని మండలాల తహసీల్లార్లు కలెక్టరేట్ వీసీ హాలులో ప్రజల నుంచి రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు స్వీకరించారు. అక్కడికక్కడే ఫిర్యాదు తాలూక వివరాలపై విచారించారు. వాటి పరిస్థితిని తెలియజేస్తూ పరిష్కారం కోసం చేపట్టబోయే చర్యలను వివరించారు. జేసీ దగ్గరుండి రెవెన్యూ క్లినిక్ను పర్యవేక్షించారు. ఆక్రమణదారుల నుంచి రక్షణ కల్పించాలి నేను 1993లో గంభీరం, బోయిపాలెం ప్రాంతాల్లో 164 గజాల చొప్పున నాలుగు స్థలాలను కొనుగోలు చేశాను. అన్ని చట్టబద్ధమైన పత్రాలు ఉన్నప్పటికీ, కొద్ది నెలలుగా స్థానికులు నన్ను స్థలంలోకి రానివ్వకుండా అడ్డుకుంటూ ఆక్రమించుకున్నారు. గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. అధికారులు స్పందించి, సర్వే నంబర్ల ప్రకారం నా స్థలాన్ని అప్పగించి, రక్షణ కల్పించాలి. – ఎన్.స్వర్ణలత, మధురవాడ -
బౌల్ ఏరియాతో సంకట స్థితి
గాలి, నీరు, నేల కాలుష్య కోరల్లో చిక్కుకొని నగరానికి సవాల్ విసురుతున్నాయి. ఓవైపు సుందర తీరం.. మూడు వైపులా కొండలు.. మధ్యలో సుమారు 265 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న విశాఖకు వరంగా భావించేవారు. కానీ.. అదే ఇప్పుడు కొంప ముంచే కాలుష్యానికి కారణంగా మారుతోంది. ఈ విధంగా ఉండటాన్ని బౌల్ ఏరియాగా పిలుస్తుంటారు. ఈ బౌల్ ఏరియాలోకి కాలుష్యం విస్తరిస్తే బయటకు వెళ్లే మార్గముండదని పర్యావరణవేత్తల అభిప్రాయం. ఏడాదికి 9 నెలల పాటు నైరుతి దిశగా నగరం వైపు గాలులు వీస్తుంటాయి. ఈ దిక్కున భారీ పరిశ్రమలు ఉండడంతో ఏడాదికి 8 నెలలపాటు అంటే మార్చి నుంచి అక్టోబర్ వరకు అవి వెలువరించే వాయు, ధూళి కాలుష్యాలు గాలివాటంతో నగరాన్ని తాకుతున్నాయి. సుమారు 300 నుంచి 500 మీటర్ల ఎత్తుగా ఉండే ఈ కొండలు ఈ కాలుష్య వాయువులకు అడ్డుగా నిలబడి, వెనక్కు నెట్టి వేస్తున్నాయి. నగరంలోనే అవి తిష్ట వేసుకొనేటట్లు చేస్తున్నాయి. శీతాకాలంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తక్కువ ఉష్ణోగ్రతలు, మంచు కారణంగా కాలుష్యభరిత వాయువులు, హానికర ధూళి పదార్థాలు వాతావరణంలో పైకి పోలేక భూమి పైనే కేంద్రీకృతం అవుతున్నాయి. సాధారణంగా భూమి మీద వేడి గాలులు, ఆ పైన చల్ల గాలులు ఉంటాయి. ఇవి శీతాకాలంలో తారుమారు అవుతూ ఉంటాయి. దీంతో హానికర ధూళి పదార్థాలు ఉపరితల వాతావరణంలోకి వెళ్లడం లేదు. -
కోడిపందాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడులు
ఎంవీపీకాలనీ: నగర శివార్లలోని కోడిపందాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు విస్తృత దాడులు చేపట్టారు. రెండు రోజులుగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిర్వహిస్తున్న ఈ తనిఖీల్లో భాగంగా.. సోమవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎంవీపీ కాలనీలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని తుంగ్లాంలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో దాడులు చేయగా 12 మంది పట్టుబడ్డారు. వారి నుంచి కోడిపుంజులతో పాటు రూ. 15,200 స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండాల కాలనీలో నిర్వహించిన దాడుల్లో 14 మంది పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి మూడు కోడిపుంజులు, రూ. 10,500 స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. -
నేటి నుంచి త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవాలు
మద్దిలపాలెం: కళాభారతి వేదికగా త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఏడు రోజుల పాటు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. వేడుకలను పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు ప్రారంభించనుండగా, డాక్టర్ గౌరీ రామ్మోహన్ రావుకు ‘సంగీత కళాభారతి’ బిరుదును ప్రదానం చేయనున్నారు. ఈ నెల 12వ తేదీ వరకు జరిగే ఈ సంగీత యజ్ఞంలో దేశవిదేశాల నుంచి తరలివచ్చే వెయ్యికి పైగా కళాకారులు 429 కచేరీలను ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా 7వ తేదీన త్యాగరాజ స్వామి వర్ధంతి సందర్భంగా నిర్వహించే పల్లకి సేవ, పంచరత్న కృతుల బృంద గానం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు సాగే ఈ ఉత్సవాలు 12న ఆంజనేయ స్వామి ఉత్సవం, మంగళహారతితో ముగుస్తాయని ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ జి.ఆర్.కె. ప్రసాద్ తెలిపారు. -
ఏడు దేశాల నిపుణులకు క్యాన్సర్ చికిత్సలో శిక్షణ
అగనంపూడి : అగనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రిలో సోమవారం ‘బిమ్స్టెక్’ దేశాల సమష్టి కృషితో క్యాన్సర్ కేర్పై ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో చేసిన ప్రకటన మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ అంతర్జాతీయ స్థాయి శిక్షణను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి డైరెక్టర్ ఉమేష్ మహంత్శెట్టి మాట్లాడుతూ.. భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్ దేశాలకు చెందిన 35 మంది వైద్య నిపుణులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారని తెలిపారు. క్యాన్సర్ నివారణ, ఆధునిక చికిత్సా పద్ధతులపై అన్వేషణలతో పాటు ఏడు దేశాల మధ్య మెరుగైన వైద్య నెట్వర్క్ను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మెడ్టెక్ జోన్ సీఈవో జితేంద్రశర్మ, ఉక్కు డైరెక్టర్ ఏ.కె.బాగ్చి మాట్లాడుతూ.. నాణ్యమైన, సమగ్రమైన వైద్య సేవలను తక్కువ ఖర్చుతో బాధితులకు అందించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి పొరుగు రాష్ట్రాల రోగులకు కూడా ఇక్కడ విశేష సేవలు అందుతున్నాయని గుర్తుచేశారు. ఈ అంతర్జాతీయ శిక్షణలో భాగంగా ఆంకో పాథాలజీ, ఆంకో నర్సింగ్, ప్యాలియేటివ్ మెడిసిన్, ప్రివెంటివ్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ వంటి విభాగాల్లో నాలుగు వారాల పాటు ఇంటెన్సివ్ ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. -
నిద్రలేచిన ఏపీపీసీబీ, రవాణా శాఖ!
ఇన్నాళ్లూ అవే పరిశ్రమలు, అదే కాలుష్యం వెదజల్లుతున్నా.. కనీస తనిఖీలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరిస్థితుల చేయి దాటిన తర్వాత ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ), జిల్లా రవాణా శాఖ అధికారులు నిద్రలేచారు. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం కమిటీలు వేయడంతో హడావుడి మొదలు పెట్టారు. గత డిసెంబర్ 21 నుంచి పరిశ్రమల్లో తనిఖీలు మొదలుపెట్టారు. నిబంధనలు పాటించని ఏడు పరిశ్రమలను గుర్తించి రూ.10 కోట్ల జరిమానాలు విధించారు. ఇన్నాళ్లూ ఈ పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే ఏపీపీసీబీ మొద్దు నిద్ర వ్యవహరించిందా? అనే విమర్శలొస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి బాటలోనే జిల్లా రవాణాశాఖ అధికారులు నడిచారు. ఇప్పుడు చలానాలు వేయడం మొదలెట్టారు. డిసెంబర్ 21 నుంచి ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ పేరుతో తనిఖీలు మొదలుపెట్టి.. 32 వాహనాలపై ఓవర్ లోడింగ్, 69 వాహనాలపై పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని, టార్పాలిన్ లేకుండా.. దుమ్ము ధూళి లోడింగ్తో వెళ్తున్న 58 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.17.54 లక్షల జరిమానా విధించారు. జీవీఎంసీ అధికారులు కూడా కాలుష్య నియంత్రణ కోసం జూలు విదిల్చామని చెప్పేందుకు 10 ఎన్ఫోర్స్మెంట్ బృందాల్ని ఏర్పాటు చేశారు. ఇంతవరకూ ఈ బృందాలు ఏం చేశాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారింది. -
ఆందోళనకరంగా సూచీలు
గత నెల రోజులుగా విశాఖలో గాలి నాణ్యత సూచీలు(ఏక్యూఐ) ఆందోళనకరంగా ఉన్నాయి. చలికాలంలో కమ్ముకుంటున్న కాలుష్య మేఘాలు ఊపిరి సలపనివ్వకుండా చేస్తున్నాయి. గత వారం రోజులుగా ఢిల్లీలో మాదిరిగా ఏక్యూఐ 326 దాటుతోంది. పలు సందర్భాల్లో 329 కూడా నమోదై ఆందోళన కలిగించింది. ముఖ్యంగా రాత్రి సమయాల్లోనే కాలుష్య ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎయిర్క్వాలిటీ ఇండెక్స్ 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తిగా, 101 నుంచి 200 అయితే మోడరేట్గా, అంతకు మించి 201 నుంచి 300 అయితే పూర్, 301 నుంచి 400 వరకు అయితే వెరీ పూర్, 401 నుంచి 500 అయితే తీవ్ర ఆందోళనకర పరిస్థితిగా పేర్కొంటారు. విశాఖలో మాత్రం ప్రతి గంటకు గాలి నాణ్యత సూచీ పెరుగుతోంది. సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఏక్యూఐ 290 దాటి అర్ధరాత్రికి 329కి చేరుకుంటోంది. గాలి కాలుష్య రేణువులు క్యూబిక్ మీటరుకు 60 మైక్రో గ్రాములు మించితే ప్రమాదం. పార్టికులేట్ మేటర్(పీఎం) 10 రేణువులు ప్రమాదకర స్థాయిలో 436 చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కానీ పీఎం 2.5 రేణువులు రాత్రి వేళల్లో 386గా నమోదవుతోంది. -
పార్కింగ్ ఫీజులు నియంత్రించండి
డాబాగార్డెన్స్: నగరంలోని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లు, సినిమా థియేటర్లు, వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 44ను కఠినంగా అమలు చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, న్యాయవాది కొండా రాజీవ్గాంధీ కోరారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఆయన కమిషనర్ కేతాన్గార్గ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కింగ్ ఫీజుల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను బహిరంగంగా ఉల్లంఘిస్తూ ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జీవో 44 ప్రకారం.. మొదటి 30 నిమిషాలు పార్కింగ్ పూర్తిగా ఉచితమని, షాపింగ్ బిల్లు లేదా సినిమా టికెట్ చూపిస్తే మొదటి గంట వరకు ఉచితంగా ఉండాలని గుర్తు చేశారు. గంట దాటిన తర్వాత కూడా బిల్లు మొత్తం పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువగా ఉంటే ఉచిత పార్కింగ్ కల్పించాలనే నిబంధనలు ఉన్నాయని, కానీ చాలా చోట్ల వీటిని పాటించడం లేదని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేసినా, సమస్య పరిష్కారం కాకుండానే పరిష్కరించినట్లు నమోదు చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలకు నోటీసులు జారీ చేయాలని, పార్కింగ్ ప్రాంతాల్లో నిబంధనలకు సంబంధించిన సైన్ బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల హక్కులను పరిరక్షించాలని రాజీవ్గాంధీ విజ్ఞప్తి చేశారు. -
రాత్రి పూట విషవాయువులు వెదజల్లుతున్నాయి
భూ ఉపరితలం నుంచి పైకెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కానీ ఇప్పుడు పెరుగుతున్నాయి. దీన్నే ఇన్వర్షన్ లేయర్ అంటారు. ఇది ఒక లిడ్లా మారిపోయింది. పరిశ్రమలు రాత్రి వేళల్లో రసాయన వాయువులు వెదజల్లుతుంటాయి. ఇన్వర్షన్ లేయర్ వల్ల ఈ వాయువులు పైకెళ్లే పరిస్థితులు కనిపించక.. కాలుష్యం పెరుగుతోంది. ఇది చాలా ప్రమాదకరం. ఈ వాయువుల కారణంగా క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. కార్సినోజెనిక్ వాయువులతో పాటు గతంతో పోలిస్తే.. ధూళి కణాలు పెరగడం ఆందోళన కలిగించే అంశంగా పరిగణించవచ్చు. చెట్లు పెంచడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. – ప్రొ.భానుకుమార్, పర్యావరణ నిపుణుడు -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
విశాఖ సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన సత్వరమే పరిష్కరించాలని మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం వీఎంఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో 13 ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. నిర్ణీత వ్యవధిలో న్యాయపరంగా చిక్కులు లేనివాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పారు. వచ్చిన ఫిర్యాదుల్లో ప్రణాళిక విభాగానికి చెందినవి 6, పరిపాలన విభాగానివి 4, ఇంజనీరింగ్కు 3 ఉన్నాయి. -
పోర్ట్లో పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ
విశాఖ సిటీ : విశాఖ పోర్ట్ అథారిటీని పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుల బృందం సోమవారం సందర్శించింది. ఈ సభ్యులకు పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి వివిధ విభాగాల అధిపతులతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం ఈ బృందం పోర్ట్లో పర్యటించారు. పోర్ట్ సమగ్ర కార్యకలాపాలు, చేపడు తున్న వివిధ వ్యూహాత్మక కార్యక్రమాలను డిప్యూ టీ చైర్పర్సన్ వివరించారు. పోర్ట్ మౌలిక సదుపాయాలు, సరుకు నిర్వహణ సామర్థ్యం, ఆధునీకరణ, యాంత్రీకరణ కార్యక్రమాలు, కవర్డ్ నిల్వ సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, పరిశ్రమల అవసరాల కోసం మురుగునీటి శుద్ధి కేంద్రం ద్వారా నీటి పునర్వినియోగం వంటి అంశాలపై కమిటీకి అవగాహన కల్పించారు. అదే విధంగా విశాఖ పోర్ట్ ద్వారా దిగుమతి–ఎగుమతి కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఉన్న పెట్టు బడి అవకాశాలు, సాధ్యమైన మార్గాలను తెలియ జేశారు. పోర్ట్లో జరుగుతున్న కార్యకలాపాలపై పార్లమెంటరీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. -
సమగ్ర ప్రణాళికతో వీఈఆర్ అభివృద్ధి
మహారాణిపేట : సమగ్ర ప్రణాళికతో వీఈఆర్ (విశాఖ ఎకనామిక్ రీజియన్) అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వీఈఆర్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, భూ సేకరణ ప్రక్రియ, మాస్టర్ ప్లాన్ అమలుపై విస్తృతంగా చర్చించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్భరత్ ఆయా శాఖల పరిధిలో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, అర్బన్ డెవలప్మెంట్, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతులు వంటి రంగాల్లో విశాఖ రీజియన్ సమగ్ర అభివృద్ధి చెందాలని కలెక్టర్ పేర్కొన్నారు. విశాఖను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. వీఈఆర్ అభివృద్ధికి అవసరమైన భూ సేకరణను వివాదాలు లేకుండా చేపట్టాలని సూచించారు. వీఈఆర్ పరిధిలో రోడ్లు, రైల్వే మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్ వంటి రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. స్టీల్ సిటీ, ఇండస్ట్రియల్ సిటీ, ఫార్మా సిటీ, టూరిజం వంటి రంగాల్లో వీఈఆర్కు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాలను మిగిలిన ప్రాంతాలతో అనుసంధానం చేయడం, రహదారుల విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రిసార్టులు, హోటళ్ల ఆక్యుపెన్సీ పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. బీచ్ ఫ్రంట్లు, వరల్డ్ క్లాస్ థీమ్ పార్క్, వాటర్ స్పోర్ట్స్ హబ్లతో విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేయాలన్నారు. కై లాసగిరి మాస్టర్ ప్లాన్ కింద మెగా రీ డిజైన్ పనులకు త్వరలో శ్రీకారం చుట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేలోగా మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేయాలన్నారు. ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, మెట్రో, ఏపీఐఐసీ, పరిశ్రమలు, టూరిజం, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు, తహసీశీల్దార్లు సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
పొగమంచుతో విమాన రాకపోకలకు అంతరాయం
గన్నవరం: ప్రతికూల వాతావరణ పరిస్ధితుల కారణంగా సోమవారం గన్నవరం విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. న్యూఢిల్లీ విమానాన్ని దారి మళ్లించగా, మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. గన్నవరం విమానాశ్రయ ప్రాంతాన్ని తెల్లవారుజాము నుంచి పొగమంచు దుప్పటిలా కప్పేసింది. దీంతో న్యూఢిల్లీ నుంచి ఉదయం 8.15 గంటలకు ఇక్కడకు వచ్చిన ఎయిరిండియా విమానం రన్వేపై విజిబులిటీ లేకపోవడంతో సుమారు అరగంట పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. అయినప్పటికి ల్యాండింగ్కు పరిస్థితులు అనుకూలించకపోవడంతో విమానాన్ని హైదరాబాద్కు మళ్లించారు. ఈ విమానం తిరిగి 11 గంటలకు ఇక్కడికి చేరుకుంది. పొగమంచు కారణంగా హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై విమాన సర్వీస్లు ఆలస్యంగా నడిచాయి. -
గీత కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి
ఆరిలోవ: గీత కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. విశాఖ అర్బన్ గీత కులాల ఆహ్వానం కమిటీ ప్రతినిధులు అప్పారి గిరిబాబు, సింహాచలం బోర్డు మాజీ సభ్యుడు సంపంగి శ్రీను ఆధ్వర్యంలో ముడసర్లోవ పార్కులో ఆదివారం ఘనంగా నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమారు 30 వేల మందికి పైగా తరలివచ్చిన గీత కులాల సంఘ నాయకులు, ప్రతినిధులుతో వేదిక కళకళలాడింది. పెద్ద ఎత్తున హాజరై తమ సంఖ్యా బలాన్ని చాటుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 25 శాతం మంది గీత కులాల వారు ఉన్నారని, గీత కులస్తుల ఐక్యత కోసం, హక్కులు సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కులాల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. ఈ వన సమారాధన వేదిక గీత కులాల వారి భవిష్యత్తు, అభివృద్ధికి దిశ, నిర్దేశం అవుతుందని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ గీత కులస్తులు సామాజిక, రాజకీయ రంగాలలో ముందుండే విధంగా ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు. శాసనమండలి మాజీ డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రమాదవశాత్తూ తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందిన గీత కార్మికులకు గతంలో రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చేవారని దానిని పునరుద్ధరించాలని కోరారు. వనసమారాధనలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్.అనంత కుమారి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేష్బాబు, గణబాబు, మేయర్ పీలా శ్రీనివాస్, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొని గీత కులాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, కార్పొరేటర్ అప్పారి శ్రీ విద్య, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూరి మధు, యాత సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు అంగటి రాము, రేఖలకృష్ణ గౌడ్, కొప్పిశెట్టి కనక శేఖర్, కట్టా మల్లేశ్వరావు, పినగాడి సర్పంచ్ కేసుబోయిన త్రినాథ్, బొమ్మిడి రమణ, దొడ్డి కన్నారావు, గుత్తుల వెంకటేశ్వరరావు, గీత కులాల పెద్దలు పాల్గొన్నారు. -
సింహాద్రి ఎన్టీపీసీ కొత్త బాస్ ‘అయస్కాంత జెనా’
పరవాడ: సింహాద్రి ఎన్టీపీసీ బిజినెస్ యూనిట్ నూతన హెడ్ ఆఫ్ ప్రాజెక్ట్గా అయస్కాంత జెనా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ 14 నెలల పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా పనిచేసిన సమీర్ శర్మ ఢిల్లీలోని ఐటీ విభాగానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సికింద్రాబాద్ ఈఎన్జీజీ ప్లానింగ్ సీజీఎంగా పనిచేస్తున్న జెనా ఇక్కడకు బదిలీపై వచ్చారు. నూతన హెచ్వోపీగా బాధ్యతలు చేపట్టిన జెనాకు ప్లాంట్ అధికారులు ఘనస్వాగతం పలికారు. 1990లో ఎన్టీపీసీలో చేరిన ఆయనకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, టాస్క్ ఫోర్స్ కార్యకలాపాల్లో అపార అనుభవం ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింహాద్రి ఎన్టీపీసీలో నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ, ప్రాజెక్టును ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. -
‘త్రివిక్రముడి’గా అప్పన్న
సింహాచలం: సింహగిరిపై వైభవంగా జరుగుతున్న రాపత్తు ఉత్స వాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ‘త్రివిక్రముడి’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తి అయిన గోవిందరాజస్వామిని త్రివిక్రమ అవతారంలో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామివారు పలకీలో అధిష్టించి భక్తులను అనుగ్రహించారు. మరో పల్లకిలో ఆళ్వారులను ఉంచి ఆలయ మాడవీధిలో విశేషంగా తిరువీధి సేవ నిర్వహించారు. సాయంత్రం జరిగిన ఈ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకుడు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా రెడ్డి కుటుంబాల ఆత్మీయ కలయిక
ఎంవీపీకాలనీ: శివాజీపార్కులో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రెడ్డి కుటుంబాల ఆత్మీయ కలయిక ఉత్సాహంగా జరిగింది. ఈ వేడుకకు వైఎస్ రవీంద్రనాథ్రెడ్డి, మారిటైం బోర్డ్ మాజీ చైర్మన్ కాయల వెంకటరెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సమష్టి కృషితోనే రెడ్ల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఏటా ఇలాంటి వేడుకలు నిర్వహించి కుటుంబాల మధ్య బంధాన్ని పెంచాలని, మహిళలు, చిన్నారుల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. సంఘం అధ్యక్షుడు గొరుసు మహేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్తి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విశాఖలో రెడ్లకు కనీసం ఒక్క ఎమ్మెల్యే టికెట్ అయినా కేటాయించాలని కోరారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చిన ప్రతిసారీ రెడ్డి కులస్తులను గెలిపించుకున్న చరిత్ర ఉందన్నారు. జీవీఎంసీ తొలి మేయర్, ఎమ్మెల్యే ఎన్ఎస్ఆర్ రెడ్డి, సూర్యరెడ్డి, నేదురుమల్లి జనార్దన్రెడ్డి, సుబ్బరామిరెడ్డి, తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తిరెడ్డి వంటి ఎందరో రెడ్లు విశాఖలో ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచారని గుర్తుచేశారు. ఇదే తరహాలో ఇప్పుడు కూడా టికెట్లు కేటాయిస్తే వారిని గెలిపించుకునే బాధ్యత ఇక్కడి రెడ్డి సంఘాలు తీసుకుంటాయని స్పష్టం చేశారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గంట గంటకు పట్టు చీర, ప్రశ్నలకు దంపతులిద్దరూ ఒకే సమాధానం చెప్పడం, కుర్చీల కింద టోకెన్స్ గేమ్లో సిల్వర్ కాయిన్స్ గెలుచుకోవడం వంటి పోటీలు ఉత్సాహాన్ని నింపాయి. -
అప్పన్న సేవలో రైల్వే పార్లమెంటరీ కమిటీ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారిని ఆదివారం రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. ఈ బృందంలో ఎంపీలు భరత్భాయ్ మనుభాయ్ సుతారియా, డాక్టర్ కె.లక్ష్మణ్, నరహరి అమీన్, ఖాజిన్ ముర్మ, భలభద్ర మజ్హి, దామోదర్ అగర్వాల్, సుభాశిష్ కుంటియా, కౌశలేంద్రకుమార్, సుదామ ప్రసాద్, ఉమ్మెదరామ్ బెనివాల్ తదితరులు ఉన్నారు. ముందుగా వీరంతా ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం అంతరాలయంలో అర్చకులు వీరి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీర్వచనం అందించారు. దర్శనానంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం కమిటీ సభ్యులకు స్వామి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రాలను దేవస్థానం ఇన్చార్జి ఈవో సుజాత అందజేశారు. -
విశాఖ తీరాన ఎగసిన కార్మిక కెరటం
జగదాంబ: రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన కార్మిక లోకంతో విశాఖ నగరం జనసంద్రమైంది. సీఐటీయూ అఖిల భారత మహాసభల సందర్భంగా నిర్వహించిన భారీ ప్రదర్శనతో నగరం ఎరుపెక్కిపోయింది. జగదాంబ సెంటర్ నుంచి ఇందిరా మున్సిపల్ స్టేడియం వరకు జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది కార్మికులు పాల్గొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తారు. కార్మిక చట్టాలను అమలు చేయాలి.. లేబర్ కోడ్లను రద్దు చేయాలి అంటూ చేసిన నినాదాలతో విశాఖ వీధులు హోరెత్తాయి. జీవీఎంసీ 39వ వార్డులోని ఇందిరా మున్సిపల్ క్రికెట్ స్టేడియంలో సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ కె. హేమలత అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య నాయకులు తపన్ సేన్, కరీం, గఫూర్, నర్సింగరావు, సాయిబాలు ప్రసంగిస్తూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. 2019లో పరాజయం పాలై, 2024లో మారతానంటూ ప్రజల కాళ్లు పట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మళ్లీ పాత పద్ధతులనే అవలంబిస్తున్నాడని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో చేతులు కలిపి కార్మికులను ఉక్కుపాదంతో తొక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 50 లక్షల మంది కార్మికులకు చట్టబద్ధమైన వేతన సవరణ జరగడం లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు, పెన్షన్, పీఎఫ్ సౌకర్యాలు లేకపోవడం శోచనీయమ న్నారు. దేశాన్ని అమ్మడమే పనిగా పెట్టుకున్న మోదీకి చంద్రబాబు మద్దతు తెలపడం కార్మికులకు చేస్తున్న అన్యాయమని, కార్మిక మంత్రులు కేవలం దిష్టిబొమ్మల్లా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. అంగన్వాడీల సమస్యలు తీరుస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోని ఎమ్మెల్యేలను, ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించిన నారా లోకేష్ను నాయకులు ప్రశ్నించారు. అలాగే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన శాఖలోని నామమాత్రపు వేతనాలతో పనిచేస్తున్న కార్మికుల కష్టాలను ఎందుకు చూడటం లేదని నిలదీశారు. మార్పు కోసం పనిచేయాల్సిన పవన్ కల్యాణ్, సనాతన ధర్మం పేరిట కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కనీస వేతన చట్టం–2026ను వెంటనే అమలు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని సభ తీర్మానించింది. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించడం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. 2025 విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, అసంఘటిత కార్మికులకు ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12న జరగబోయే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. -
ఇప్పటి రాజకీయ ధోరణులకు సరిపోను
సీతంపేట: వైజాగ్ బ్రాహ్మిణ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ‘కాఫీ విత్ ఉండవల్లి అరుణ్ కుమార్’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని తన రాజకీయ ప్రస్థానం, అనుభవాలు, సమకాలీన అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పన్నెండేళ్లుగా తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఉండవల్లి స్పష్టం చేశారు. మారుతున్న ఇప్పటి రాజకీయ ధోరణులకు తాను సరిపోనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఆధ్యాత్మిక అంశాలపై స్పందిస్తూ.. ‘హిందుత్వం అనేది కేవలం మతం కాదు, అది ఒక సనాతన ధర్మం. అది ఎప్పటికీ నిత్యనూతనంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. మానవ జీవితంలో ఎదురయ్యే అన్ని ప్రశ్నలకు భగవద్గీతలో సమాధానాలు లభిస్తాయని ఆయన తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన రాజకీయ చాతుర్యం దేశానికి దిశానిర్దేశం చేసిందన్నారు. అలాగే మాజీ ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ సేవలను కొనియాడుతూ, ఢిల్లీలో ఆయన అందరికీ అందుబాటులో ఉండేవారని, కులమతాలకు అతీతంగా ఎంతోమందికి రాజకీయ భిక్ష ప్రసాదించారని గుర్తుచేసుకున్నారు. బ్రాహ్మణులు రాజకీయంగా రాణించాలంటే తమ నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కార్యక్రమంలో ద్రోణంరాజు శ్రీవాత్సవ, టీఎస్ఆర్ ప్రసాద్, చెరువు రామకోటయ్య, వేదుల హనుమంతరావు, కాళీ నరసింహం, కావూరి చరణ్ కుమార్, శ్రీరంగం దివాకర్, శంకర్ నీలు, నండూరి సుబ్రహ్మణ్యం, కేశప్రగడ నరసింహమూర్తి, టీఎస్కే అరుణ్ కుమార్, రాచకొండ దశరథ రామయ్య తదితర బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు. -
ఉద్యమించిన ఉక్కు నిర్వాసిత నిరుద్యోగులు
పెదగంట్యాడ: విశాఖ స్టీల్ప్లాంట్ కోసం సర్వం కోల్పోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉక్కు నిర్వాసిత నిరుద్యోగులు ఆదివారం ఉద్యమించారు. పాత గాజువాక నుంచి కొత్త గాజువాక వరకు నిరసనగా భిక్షాటన చేయడానికి పూనుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం, యాజమాన్యానికి తమ ఆవేదనను తెలియజేయాలని భావించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. భిక్షాటన ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో, వారంతా కుటుంబ సభ్యులతో సహా పాత గాజువాకలోని లంకా మైదానంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాసిత సంఘం నాయకులు మాట్లాడుతూ.. నిర్వాసిత నిరుద్యోగులకు స్టీల్ప్లాంట్ మిగులు భూముల్లో ఎకరం చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు వన్టైమ్ సెటిల్మెంట్ చేయాలని, లేని పక్షంలో జీవనభృతి కింద నెలకు రూ.25 వేలు చొప్పున చెల్లించాలని కోరారు. వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉన్న తమను స్టీల్ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మబలికి భూములు తీసుకున్నారని, నాటి నుంచి నేటి వరకూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో 64 గ్రామాలకు చెందిన నిర్వాసితులు, నాయకులు పితాని భాస్కరరావు, ఉమ్మిడి అప్పారావు, పల్లా కార్తీక్, గళ్లా రామకృష్ణ, కోన రమణ, పేర్ల జగన్, నడిగట్ల ప్రసాద్, మంత్రి గోపీ, అంగాల దేముడు తదితరులు పాల్గొన్నారు. -
9 నుంచి మహా సంక్రాంతి సంబరాలు
మద్దిలపాలెం: ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో మహా సంక్రాంతి సంబరాలు–2026కు సంబంధించిన రాట మహోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పూజలు చేసి, వేడుకల వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 13, 14, 15 తేదీల్లో ప్రధాన వేడుకలు జరుగుతాయని, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతారని వివరించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ‘ఇంటింటా స్వదేశీ – ప్రతి ఇంటా స్వదేశీ’అనే నినాదంతో పాటు వందేమాతర గీతం 150 ఏళ్ల ఉత్సవాలు, దేశ సమైక్యతలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, మాజీ ప్రధాని వాజ్పేయి శతజయంతి విశిష్టతను చాటిచెప్పేలా ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు జీవీఎల్ వెల్లడించారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎం.ఎం.ఎన్. పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలి
కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు: బొత్స సత్యనారాయణబీచ్రోడ్డు: వైఎస్సార్సీపీ పురోగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం సిరిపురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో అరకు నియోజకవర్గ నాయకులు బొత్సను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలతో పాటు పార్టీకి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న తీరుపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని బొత్స వారికి సూచించారు. పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని, పార్టీ కోసం కష్టపడేవారికి తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. బొత్సను కలిసిన వారిలో జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జిన్ని నరసింహమూర్తి, అరకు వ్యాలీ ఎంపీటీసీ దురియ ఆనంద్ కుమారి, సీనియర్ నాయకులు భూర్జ హస్తిన కుమార్, గొల్లోరి గోపాల్ రావు, మజ్జి గురు, బోయి మోహన్ రావు, శెట్టి సోమేష్, కొర్రా బాబురావు, కొర్రా సాలమన్, భీమన్న, రామారావు తదితరులు ఉన్నారు. -
భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత జగన్దే
డాబాగార్డెన్స్: ఇతరులు చేసిన అభివృద్ధి పనులను తన ఖాతాలో వేసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధహస్తుడని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్వెస్లీ విమర్శించారు. గతంలో సెల్ఫోన్ కనిపెట్టింది తానేనని, గూగుల్ను విశాఖకు తెచ్చింది తానేనని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలోనూ అదే క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఒక ప్రకటనలో ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో సింహభాగం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలోనే జరిగిందని జాన్వెస్లీ గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం రూ.900 కోట్లతో 2,751 ఎకరాల భూసేకరణను పూర్తి చేసిందని, రైతులకు ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు పరిహారం అందించిందన్నారు. డి–పట్టా భూములకు సైతం జిరాయితీ భూములతో సమానంగా పరిహారం చెల్లించి రైతులకు న్యాయం చేశారని తెలిపారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వదిలేసిన 117 ఎకరాల భూ సేకరణను కూడా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే పూర్తి చేసిందన్నారు. నిర్వాసితులైన 376 కుటుంబాలకు రూ.80 కోట్లతో టౌన్షిప్ స్థాయి సౌకర్యాలతో కాలనీని ఏర్పాటు చేశారని, ఒక్కో కుటుంబానికి 5 సెంట్ల స్థలంతో పాటు రూ.8.70 లక్షల పరిహారం అందించారని చెప్పారు. అన్ని అనుమతులతో 2023 మే 3న భూమిపూజ నిర్వహించి, 3.8 కి.మీ రన్వే, రక్షణ గోడ నిర్మాణం, 6 లైన్ల అప్రోచ్ రోడ్డు పనులను వేగవంతం చేశారని వెల్లడించారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు కేవలం ఓట్ల కోసం అనుమతులు లేకుండానే కొబ్బరికాయ కొట్టి ప్రాజెక్టును గాలికి వదిలేశారని జాన్వెస్లీ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రస్తుత ట్రయల్ రన్ ఆ కృషి ఫలితమేనని స్పష్టం చేశారు. ఇప్పటికై నా చంద్రబాబు ఇతరుల కష్టాన్ని తనదిగా చెప్పుకునే నైజాన్ని మానుకోవాలని హితవు పలికారు. -
అప్పుల బాధ తాళలేక కాంట్రాక్టర్ ఆత్మహత్య
గాజువాక: అప్పుల బాధ తాళలేక ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక శ్రీనగర్ ప్రాంతానికి చెందిన ముదునూరు మోహన్రాజు(39) కాంట్రాక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన చేసిన కొన్ని పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో రాకపోవడం, దానికి తోడు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన మోహన్రాజు.. గాజువాకలోని ఓ లాడ్జిలో గది తీసుకున్నారు. శనివారం లాడ్జిలో దిగిన ఆయన, ఆదివారం ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. మోహన్రాజు గదిలో ఉరివేసుకుని మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నృత్య సాగర సోయగం
మద్దిలపాలెం: భారతీయ సంప్రదాయ నృత్యాలన్నీ ఒకే వేదికపై ఏకమై..‘థక్ ధిమి తయ్యాకు తాక ధిమి’ తాళాల మధ్య వందలాది మంది కళాకారులు నర్తిస్తూ నృత్య సాగర సోయగాన్ని ఆవిష్కరించారు. సాక్షాత్తు వైశాఖేశ్వరునికి నృత్య నీరాజనం పలికిన ఈ మహా బృంద నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. నటరాజ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఎంజీఎం పార్క్ వేదికగా జరిగిన ‘ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డ్యాన్స్ – 2026’ ముగింపు వేడుకలు కనులపండువగా సాగా యి. సుమారు 750 మంది కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్య రీతుల్లో ఏకకాలంలో నర్తిస్తూ నటరాజుకు, పార్వతీదేవికి అర్పించిన నృత్య నివేదన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకను వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, దాడి ఇన్స్టిట్యూట్స్ అధినేత దాడి రత్నాకర్, ఇన్కం ట్యాక్స్ కమిషనర్ బి. సత్యనారాయణ రాజు మాట్లాడుతూ భారతీయ సంప్రదాయ కళలకు అంతర్జాతీయ వేదికగా విశాఖ నిలవడం గర్వకారణమన్నారు. పదర్శనల్లో భాగంగా నటరాజ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు సమర్పించిన మహిషాసుర మర్దిని నృత్య రూపకం అందరినీ ఆకట్టుకుంది. పద్మభూషణ్ వెంపటి చిన సత్యం నృత్య పరికల్పనలోని కూచిపూడి ‘నాట్యాంబ్రహ్మాంజలి’, కేవీ సత్యనారాయణ రూపొందించిన ‘వినాయక స్తుతి’ ప్రేక్షకులను అలరించాయి. భరతనాట్య విభాగంలో మైసూర్కు చెందిన డా. వసుంధర దొరస్వామి దర్శకత్వంలోని ప్రదర్శనలు, ఆంధ్రనాట్య సృష్టికర్త కళాకృష్ణ పరికల్పనలోని అంశాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సందర్భంగా కళాక్షేత్రంలో విశేష సేవలందించిన డా. వసుంధర దొరస్వామిని ఐటీడీసీ జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమ రథసారథి విక్రమ్ గౌడ్ పర్యవేక్షణలో ఈ నాట్య విలాసం దిగ్విజయంగా ముగిసింది. హరేకృష్ణ మూమెంట్కు చెందిన నిష్కించిన భక్తదాస, కార్పొరేటర్ ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు.750 మంది కూచిపూడి, భరతనాట్య విన్యాసం -
వార్డు, బూత్ కమిటీలను త్వరగా నియమించండి
అల్లిపురం: వచ్చే 2029 అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు శ్రేణులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. అన్ని వార్డుల్లోనూ కమిటీల నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదివారం ఆయన నియోజకవర్గంలోని 30, 32, 33, 34, 36, 37, 38, 39, 41వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా పార్టీ శ్రేణులకు స్వీట్లు పంపిణీ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయా వార్డుల్లో బూత్ అధ్యక్షులు, వార్డ్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల కమిటీల ఏర్పాటు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. బూత్, వార్డు స్థాయిల్లోని ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, ఆయా పదవులకు సంబంధించిన ఆశావహుల బయోడేటాలను త్వరగా అందజేయాలని నాయకులకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట పద్మావతి, కోడిగుడ్ల పూర్ణిమ, పార్టీ జిల్లా కార్యదర్శి గనగళ్ల రామరాజు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సనపల రవీంద్ర భారత్, పార్టీ ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు వడ్డాది దిలీప్, జిల్లా కార్యదర్శి బొడ్డు ఆనంద్, నాయకుడు పచ్చిపల్లి రాము, రాష్ట్ర నాయకులు లింగం శ్రీను, రాష్ట్ర అనుబంధ సంఘాల కార్యదర్శులు సాగర్, భాను, వార్డు అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్, ముత్తబత్తుల రమేష్, మహమ్మద్ షాకిల్, గురజారపు రవి, చేపల నూకరాజు, ముజీబ్ ఖాన్, జిల్లా అనుబంధ సంఘాల ఉపాధ్యక్షులు కోన శంకర్, గుంటూ ఆనంద్, దూడ అప్పారావు, దక్షిణ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఆకుల శ్యామ్, బాబ్జి, సూర్య, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
ఫైళ్లపై ‘డిస్కస్’ మంత్రం.. పరిష్కారానికి ఏళ్ల కాలం
మహారాణిపేట: జిల్లాలో భూ సమస్యల పరిష్కారం గగనమవుతోంది. తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు రెవెన్యూ వ్యవస్థ మొత్తం మొద్దునిద్ర పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడు తన భూమి హక్కుల కోసం దరఖాస్తు చేసుకుంటే, పరిష్కారం కంటే కొర్రీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన దస్త్రాలను ఉన్నతాధికారులు కనీసం పరిశీలించకుండా ‘డిస్కస్’ అని రాసి పక్కన పెట్టడం లేదా బాధ్యత నుంచి తప్పించుకోవడానికి సీసీఎల్ఏ కార్యాలయానికి పంపడం పరిపాటిగా మారింది. ఫలితంగా ఒక్కో దస్త్రం పరిష్కారానికి నెలలు, ఏళ్లు పడుతోంది. జిల్లాలో డీఆర్వో, ఆర్డీవో వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉండటం ఈ జాప్యానికి మరో ప్రధాన కారణమవుతోంది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న వినతుల్లో అత్యధిక భాగం రెవెన్యూ శాఖకు చెందినవే ఉంటున్నాయి. తాజా సమావేశంలో వచ్చిన 413 వినతుల్లో 148 కేవలం రెవెన్యూ సమస్యలే కావడం గమనార్హం. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు స్వయంగా తహసీల్దార్లకు ఫోన్ చేసి ఆదేశిస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు. ముఖ్యంగా 11 తహసీల్దార్ కార్యాలయాల నుంచి వస్తున్న ఫిర్యాదులకు అంతులేకుండా పోతోంది. అర్జీదారులు ప్రతి వారం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, అధికారులు సెలవులో ఉన్నారని లేదా బిజీగా ఉన్నారని సాకులు చెబుతూ వెనక్కి పంపుతున్నారు. సాకులు చెబుతూ..: భూ దస్త్రాలను తాకడానికి అధికారులు భయపడటం జిల్లాలో వింత పరిస్థితిని సృష్టిస్తోంది. ఏ చిన్న సంతకం చేసినా ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళనతో ఫైళ్లను పెండింగ్లో పెడుతున్నారు. పాత రికార్డులు లేవని సాకులు చెప్పడం, ఆన్లైన్ ప్రక్రియలో కావాలని జాప్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాగులో ఉన్న భూములను సైతం ఆన్లైన్ చేయకపోవడంతో రైతు భరోసా వంటి పథకాలు అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా అనుభవిస్తున్న భూములను అకస్మాత్తుగా ప్రభుత్వ భూముల జాబితాలోకి చేర్చడం, జీరో ఖాతాలకు మళ్లించడం వంటి చర్యలు భూస్వాములను బజారున పడేస్తున్నాయి. రాజకీయ కోణం వివాదాల్లేని జీరాయితీ భూములను కూడా రెవెన్యూ రికార్డుల్లో వివాదాల్లోకి నెట్టడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి వివాదంలో పడిన భూమిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడం సామాన్యుడికి తలకు మించిన భారమవుతోంది. జిల్లాలో సర్వే నంబర్ల సబ్–డివిజన్ ప్రక్రియ సక్రమంగా జరిగితే సగం సమస్యలు తీరుతాయని తెలిసినా, ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఫలితంగా వేలాది మంది ఇళ్లు కట్టుకున్నా రిజిస్ట్రేషన్లు లేక, ఆస్తులపై హక్కులు పొందే మార్గం లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. -
ఆంక్షల కంచె..
అక్షర ధామంలోవీసీని కలవాలన్నా గండమే..ఏయూ గేట్లకు నో ఎంట్రీ బోర్డులుమద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మునుపెన్నడూ లేని విధంగా కఠిన నిబంధనలు, ఆంక్షలు అమల్లోకి రావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వవిద్యాలయ పాలనా యంత్రాంగం అనుసరిస్తున్న తీరు నియంతృత్వ ధోరణిని తలపిస్తోందని విద్యార్థి లోకం మండిపడుతోంది. ముఖ్యంగా వర్సిటీ పెద్ద దిక్కులైన వీసీ, రిజిస్ట్రార్లను కలిసేందుకు కూడా వీల్లేదంటూ జారీ చేసిన తాజా సర్క్యులర్ వర్సిటీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. విద్యార్థులు సంక్రాంతి సెలవుల్లో ఉన్న సమయాన్ని చూసి ఇటువంటి కఠిన నిర్ణయాలు అమలు చేయడంపై సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. ఆంక్షలపై వాగ్వాదం ప్రస్తుతం ఏయూలో ఇతరుల ప్రవేశాన్ని పూర్తిగా నిరోధిస్తూ ‘నో ఎంట్రీ’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగర నడిబొడ్డున ఉన్న ఈ సువిశాల ప్రాంగణంలో ఇప్పటివరకు ఉన్న రాకపోకల వెసులుబాటును రద్దు చేస్తూ ప్రధాన ద్వారాలను మూసివేశారు. ఆఖరికి కలెక్టర్ బంగ్లాకు వెళ్లే మార్గాన్ని కూడా పరిమితం చేస్తూ నిబంధనలు విధించడం గమనార్హం. కేవలం సౌత్ క్యాంపస్ ఇన్–గేట్, బీచ్ రోడ్డు అవుట్–గేట్ ద్వారా మాత్రమే రాకపోకలు సాగించాలని వీసీ ఆదేశించడంతో వర్సిటీలో కలకలం రేగుతోంది. కేవలం ఐడీ కార్డులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తుండటంతో, కార్డులు మర్చిపోయిన సిబ్బంది, విద్యార్థులు సెక్యూరిటీ గార్డులతో వాగ్వివాదానికి దిగాల్సి వస్తోంది. అనుబంధ కళాశాలల విద్యార్థుల పడిగాపులు ఈ నిబంధనల వల్ల ఏయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు విస్తరించి ఉన్న అనుబంధ సంస్థల విద్యార్థులు తమ సర్టిఫికెట్లు, ఓడీల కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంటారు. అయితే గేటు వద్దే వారిని అడ్డుకుంటుండటంతో ఉన్నత విద్య అభ్యసించిన వారు కూడా పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు, తమను కలవడానికి వచ్చే వారికి వీసీ, రిజిస్ట్రార్లు గ్రీవెన్స్ సెల్ మార్గాన్ని సూచించడం విడ్డూరంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. పాలనాధిపతులు విద్యార్థులకు అందుబాటులో ఉండకపోతే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నియంత పాలన.. వీసీని, రిజిస్ట్రార్లను ఎవరూ నేరుగా కలిసేందుకు వీలులేదని, సమస్యలుంటే గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసుకోవాలని నిబంధనలు పెట్టారు. ప్రతి ఒక్కరూ పాలనాధిపతులను కలవడం వలన వర్సిటీలో పాలనకు అంతరాయం కలుగుతుందని వీసీ జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొనడం విడ్డూరంగా ఉందంటూ వర్సిటీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. నియంతృత్వ నిబంధనలతో ఏయూను నిర్బంధించడంపై పలు విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఏయూ వీసీ, రిజిస్ట్రార్ను కలవడానికి ఆంక్షలు పెట్టడమేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శతాబ్ది వేళ...అప్రతిష్ట శతాబ్ది ఉత్సవాల వేళ ఏయూ ప్రతిష్టను పెంచాల్సింది పోయి, ఇలాంటి వింత పోకడలతో ఆభాసుపాలు చేస్తున్నారని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పాలనాపరమైన ఆంక్షలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు బోధనారంగం గాడితప్పుతోంది. 14 విభాగాల్లో రెగ్యులర్ ప్రొఫెసర్లు లేక, గెస్ట్ లెక్చరర్లతో కాలం వెల్లదీస్తున్నారు. నాణ్యమైన విద్య అందక విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల వైపు చూస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సింది పోయి, కేవలం ఆంక్షలతో విశ్వవిద్యాలయాన్ని బందీ చేయడమేంటని విద్యావేత్తలు నిలదీస్తున్నారు. ఏయూలో రాకపోకల సంక్షోభం కఠిన నిబంధనలపై కలకలం.. విద్యార్థుల ఆందోళన -
ఏపీ అభివృద్ధిలో భోగాపురం ఒక మైలురాయి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ కావడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. విమానాశ్రయం ఏర్పాటు కోసం వైఎస్సార్సీపీ హయాంలోనే అనుమతులు సాధించడం, ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయిందని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒకమైలురాయి. #VisionVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడింది. ఈ ఎయిర్పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన GMR గ్రూప్కు నా హృదయపూర్వక అభినందనలు. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం.ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది. ఆ రోజు మేం చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది. అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన శ్రీ నితిన్ గడ్కరీ గారి కృషి, సహకారం నాకు ఎంతో గుర్తుంది’ అని పోస్టు చేశారు.As the first flight prepares to land in Vizag, Andhra Pradesh accelerates on its growth runway, marking a significant milestone for #VisionVizag.Congratulations to the GMR Group for their exceptional efforts. During our tenure expedited permissions, timely approvals and land…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 4, 2026 -
బ్రిడ్జి కోర్సు శిక్షణకు దరఖాస్తులు
కంచరపాలెం: పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ) పూర్తి చేసిన అభ్యర్థులు నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశాఖ ప్రభుత్వ పాత ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. సోలమన్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సోమవారంలోగా తమ దరఖాస్తులను కళాశాలలో అందజేయాలని కోరారు. ఐటీఐలో 60 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ప్రవేశాలకు అర్హులని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు పదో తరగతి, ఐటీఐ మార్కుల జాబితా, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటోలను జత చేయాల్సి ఉంటుందని వివరించారు. అర్హత పొందిన అభ్యర్థులకు సోమవారం నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు బ్రిడ్జి కోర్సులో శిక్షణ ఇస్తామని, ఇతర వివరాల కోసం ట్రైనింగ్ ఆఫీసర్ కె. నాగశ్రీని సంప్రదించాలని సూచించారు. -
స్టూడెంట్ వార్
రెండు కాలేజీల మధ్య ‘ప్రాంక్’ యుద్ధం! మధురవాడ: కేవలం ఒక ‘ప్రాంక్ కాల్’ రెండు కళాశాలల విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టింది. ఈ వివాదం కాస్తా ముదిరి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ కొట్లాటలో ఓ విద్యార్థి కంటికి తీవ్ర గాయమవగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అసలేం జరిగిందంటే..? మిథిలాపురి వుడా కాలనీలోని ఆకాశ్ కళాశాల, పీఎంపాలెం క్రికెట్ స్టేడియం సమీపంలోని సాంకేతిక పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల మధ్య శనివారం సాయంత్రం ఓ ప్రాంక్ కాల్ విషయంలో గొడవ మొదలైంది. ఇది కాస్తా ముదిరి ఇరు కళాశాలల విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. మధురవాడ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ సమీపంలోని ఒక నిర్జన ప్రదేశాన్ని వేదికగా చేసుకుని పరస్పరం దాడులకు దిగారు. విద్యార్థులు మృగాల్లా కొట్టుకుంటున్న తీరు చూసి స్థానికులు సైతం వారిని విడిపించే సాహసం చేయలేకపోయారు. ఆ ప్రాంతమంతా కాసేపు రణరంగంలా మారింది. తీవ్ర గాయంతో ఆస్పత్రిలో విద్యార్థి ఈ ఘర్షణలో చంద్రంపాలెం ప్రాంతానికి చెందిన ఆకాశ్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కంటికి తీవ్ర గాయమైంది. దీంతో తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు వెంటనే అతనిని మధురవాడలోని కంటి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నగరంలోని మరో ప్రముఖ కంటి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. క్రమశిక్షణపై మేధావుల ఆందోళన కళాశాల యాజమాన్యాలు కేవలం లక్షలాది రూపాయల ఫీజుల వసూలుపైనే దృష్టి పెడుతున్నాయని, విద్యార్థుల క్రమశిక్షణను గాలికి వదిలేస్తున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. పేరున్న సంస్థల్లోనే ఇలాంటి దాడులు, ఆత్మహత్యలు, విద్యార్థులు పారిపోవడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు, యంత్రాంగం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కార్పొరేట్ పాలసీతో కార్మిక వర్గానికి తీవ్ర నష్టం
ఏయూక్యాంపస్: కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ల అనుకూల విధానాలతో కార్మికులు, రైతులు ఇతర వర్గాలపై ఆర్థికదాడి పెరుగుతూ... విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాటాలు ఉధృతం చేసేందుకు సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలో చర్చించినట్లు సీఐటీయూ అఖిల భారత కార్యవర్గ సభ్యుడు సిహెచ్.నర్సింగరావు, రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఏయూ కన్వెన్షన్ హాల్ మహాసభల ప్రాంగణంలో సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి కుమార్తో కలిసి నర్సింగరావు విలేకరులతో మాట్లాడుతూ కార్మికుల సమస్యలు, ప్రత్యామ్నాయ విధానంపై చర్చించారని తెలిపారు. దేశంలో ప్రైవేట్ పేరుతో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను సామాన్యులకు లేకుండా చేసే విధానంపై సీఐటీయూ పోరాడుతుందని, ఇదే అజెండాతో రాబోయే కాలంలో ప్రతి రంగానికి సంబంధించిన ‘చార్టర్ ఆఫ్ డిమాండ్స్’ తయారు చేస్తున్నామన్నారు. కేరళలో పేపర్ మిల్లును ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కార్మికవర్గంపై భారం పడకుండా కేరళ ప్రభుత్వమే నిర్వహిస్తుందని తెలిపారు. రేపు భారీ ర్యాలీ, బహిరంగ సభ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఎల్ఐసీ కార్యాలయం వద్ద గల అంబేడ్కర్ విగ్రహం నుంచి డాబాగార్డెన్స్, జగదాంబ మీదుగా ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వరకూ భారీ కార్మిక ప్రదర్శన ఉంటుందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి కుమార్ తెలిపారు. ర్యాలీ అనంతరం మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ జరుగుతుందన్నారు. సీఐటీయూ అఖిల భారత కార్యవర్గ సభ్యుడు సీహెచ్ నర్సింగరావు -
తాళపత్రాలకు నవ వైభవం
అక్షర సేద్యంలో ‘క్షీర సాగర్’ మథనం సవాళ్లను అధిగమించి సాధించిన అమృతం క్షీర సాగరాన్ని మథిస్తే అమృతం లభించినట్లుగానే, తన మనసును మథించిన క్షీర సాగర్.. తాటాకుపై అక్షరాలను లిఖించే విధానాన్ని నేటి కాలానికి అనుగుణంగా మార్చారు. పూర్వం తాటాకుపై ఘంటంతో రాసేవారు. ఆ విద్య తెలిసిన వారు ఇప్పుడు కరువవడంతో, ఆయన ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించారు. ఢిల్లీలో జరిగిన ప్రింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక లేజర్ మిషన్ను చూసిన ఆయనకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. నేమ్ బోర్డుల తయారీకి వాడే ఆ యంత్రాన్ని తాటాకుపై అక్షరాల ముద్రణకు వీలుగా మార్పులు చేశారు. ఎన్నో ప్రయోగాల తర్వాత అత్యంత స్పష్టంగా అక్షరాలను ముద్రించడంలో విజయం సాధించారు. ప్రాచీనతకు ఆధునికత మేళవించి.... విజయనగరం జిల్లా ఎల్.కోట పరిసరాల నుంచి సేకరించిన తాటాకులను శుభ్రం చేసి, నిర్ణీత కొలతల్లో కత్తిరిస్తారు. వాటిపై లేజర్ సాయంతో ఆధ్యాత్మిక స్తోత్రాలు, శ్లోకాలు, దేవతా రూపాలను ముద్రిస్తారు. ఈ తాళపత్రాలు ఏళ్ల తరబడి పాడవకుండా పసుపు, ప్రత్యేకమైన కోటింగ్ వేస్తారు. వీటిని చూడగానే పాతకాలపు జ్ఞాపకాలు గుర్తుకు రావడమే కాకుండా, చదవడానికి ఎంతో సులువుగా ఉంటున్నాయి. హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం, గాయత్రి మంత్రం వంటి వాటిని తాళపత్రాల రూపంలో సిద్ధం చేసి అపురూప బహుమతులుగా అందిస్తున్నారు. నాటి ప్రధాని చేతుల మీదుగా అవార్డు... ప్రధాని చేతుల మీదుగా ‘శ్రమ శ్రీ’ క్షీర సాగర్ ప్రతిభ కేవలం ఈ కళకే పరిమితం కాలేదు. గతంలో నేవల్ డాక్యార్డ్లో పనిచేసిన ఆయన.. వృత్తి పట్ల చూపిన అంకితభావానికి 2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పాయ్ చేతుల మీదుగా ‘శ్రమ శ్రీ’ అవార్డును అందుకున్నారు. అలాగే నావికాదళ అధికారుల నుంచి అనేక ప్రశంసలు పొందారు. సాహస యాత్రలు, ట్రెక్కింగ్, సైక్లింగ్ వంటి అభిరుచులతో పాటు అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. తాటాకుపై ఆహ్వాన పత్రిక మార్పు తన ఇంటి నుంచే మొదలవ్వాలని భావించిన సాగర్, తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రాలను తాటాకుపైనే ముద్రించి అతిథులను ఆశ్చర్యపరిచారు. పెళ్లికి వచ్చిన వారికి మొక్కలను బహుమతిగా ఇచ్చి ప్రకృతిపై తనకు న్న ప్రేమను చాటుకున్నారు. చివరికి తన పదవీ విరమణ రోజున కూడా 500 పండ్ల మొక్కలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణలో తనవంతు పాత్ర పోషించారు. కనుమరుగవుతున్న తాళపత్ర కళను నేటి తరానికి చేరువ చేస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ ఆయన సాగిస్తున్న ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. నేటి డిజిటల్ యుగంలో అక్షరం కాగితంపై నుంచి తెరపైకి మారిపోయింది. పుస్తకం కంటే స్మార్ట్ఫోనే ప్రాణప్రదంగా మారిన ఈ కాలంలో మన పూర్వీకుల అపార జ్ఞాన నిధులైన తాళపత్రాల (తాటాకు గ్రంథాలు) గురించి నేటి తరానికి అసలు అవగాహనే లేదు. అపారమైన వారసత్వ సంపదగా విరాజిల్లిన ఈ తాళపత్ర కళ కనుమరుగవుతున్న తరుణంలో, దానికి ఆధునిక సొబగులు అద్ది పునర్జీవం పోస్తున్నారు నగరానికి చెందిన కేశవరాజు క్షీర సాగర్. ప్రకృతిపై మమకారం, సంస్కృతిపై గౌరవం ఆయనను ఈ వినూత్న మార్గంలో నడిపించాయి. –ఏయూక్యాంపస్ తాటాకుపై లిఖించిన గోవింద నామాలు నేటి తరానికి తెలియజేయాలని.. శతాబ్దాలుగా మన దేశంలో ఉన్న తాళపత్రాలు నేటి తరానికి తెలియజేయాలనే ప్రయత్నించా. మన సంస్కృతి, ప్రకృతితో ముడిపడిన మన జీవన విధానం నేటి యువతకు పరిచయం చేస్తున్నా.. భవిష్యత్తులో అనేక గ్రంథాలను తాళపత్రాలపై ముద్రించాలనే ఆలోచన ఉంది. మరుగున పడిపోతున్న కళను సంరక్షించడం, ఆధునికతను దానికి జోడించే చిన్న ప్రయత్నం చేస్తున్నా. ఎంతో ఓపికతో సమయం తీసుకుని వీటిని సిద్ధం చేయాల్సి ఉంటుంది. మా కుటుంబలో జరిగే అన్ని శుభకార్యాలకు తాటాకుతో చేసిన ఆహ్వానాలు అందిస్తున్నాం. వీటిని తీసుకున్నవారు కూడా ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకుంటున్నారు. –కె. క్షీర సాగర్, అక్కయ్యపాలెం -
రైలు కింద పడి మాజీ సైనికుడు ఆత్మహత్య
అగనంపూడి: ఆర్థిక ఇబ్బందులు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. దేశ సరిహద్దులో సేవలందించి, ఉక్కు కర్మాగారంలోనూ పనిచేసి విశ్రాంతి పొందుతున్న ఒక మాజీ సైనికుడు అప్పుల బాధ తాళలేక కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన శనివారం మధ్యాహ్నం దువ్వాడ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. పెదగంట్యాడ మండలం బీసీ రోడ్డు సూర్య ఎన్క్లేవ్లో నివాసముంటున్న నీలాపు వెంకటరమణ (66) అలియాస్ సైనికుడు, గతంలో ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ పొందారు. అనంతరం విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగిగా చేరి అక్కడ కూడా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఆయన బీసీ రోడ్డులో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ను నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం యథావిధిగా స్టోర్ను తెరిచిన ఆయన, మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దువ్వాడ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఒకటో నంబరు ప్లాట్ఫామ్పైకి హౌరా నుంచి బెంగళూరు వెళ్తున్న యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ వస్తున్న సమయంలో వెంకటరమణ ఒక్కసారిగా పట్టాలపై పడుకున్నాడు. రైలు ఆయన మీదుగా వెళ్లడంతో తల, మొండెం వేరై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ లక్ష్మి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అప్పుల బాధ తట్టుకోలేకనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
69 పోక్సో కేసుల్లో శిక్షలు
అల్లిపురం: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 2024, జూన్ 12వ తేదీ నుంచి ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో 69 పోక్సో కేసులలో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయని నగర శాంతిభద్రతల డీసీపీ–2 డి.మేరీ ప్రశాంతి వెల్లడించారు. శనివారం సాయంత్రం నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ వివరాలను సుదీర్ఘంగా వివరించారు. నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత భాగ్చి మార్గదర్శకత్వంలో అనేక కేసులను అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా గుర్తించి, వేగవంతమైన దర్యాప్తు నిర్వహించి సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేయడం వల్లే ఈ స్థాయిలో శిక్షలు పడడం సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటి వరకు తీర్పు వెలువడిన కేసులలో ఒకరికి మరణ శిక్ష, ఇద్దరికి మరణించే వరకూ జీవిత ఖైదు, పది మందికి జీవిత ఖైదు పడగా, మరో 15 కేసుల్లో ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రెండింటిలో ఇరవై ఐదు ఏళ్లు, మరో రెండు కేసుల్లో పది ఏళ్లు, మూడు కేసుల్లో ఏడేళ్ల పాటు కఠిన కారాగార శిక్షలు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పునిచ్చాయని వివరించారు. వీటిలో ప్రధానంగా ఐదు కేసులలో అత్యంత తక్కువ కాలంలోనే న్యాయ ప్రక్రియ ముగిసిందని డీసీపీ తెలిపారు. 2024 సెప్టంబర్ 24న నమోదైన ఒక కేసులో, కన్న తండ్రే తన ఇద్దరు మైనర్ బాలికలపై లైంగికదాడికి పాల్పడగా, కేవలం 10 నెలల వ్యవధిలో అంటే 2025 ఆగస్టు 21న విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3 వేలు జరిమానా విధించడంతో పాటు బాధితురాళ్లకు చెరో మూడు లక్షల రూపాయల నష్టపరిహారం అందజేయాలని ఆదేశించింది. అదేవిధంగా 2025 జనవరి 21న నమోదైన మరో కేసులో 8 నెలల వ్యవధిలోనే సెప్టంబర్ 12న శిక్ష పడగా, శారీరక, మానసిక దివ్యాంగురాలైన మైనర్పై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ బాధితురాలికి రూ.4 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. ఏప్రిల్ 16న నమోదైన మరో దారుణ ఘటనలో, కన్న తండ్రే తన నాలుగేళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడగా, ఐదు నెలల కాలంలోనే సెప్టంబర్ 29న కోర్టు సంచలన తీర్పునిస్తూ నిందితుడికి మరణం వరకూ కఠిన కారాగార జీవిత ఖైదుతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించి, ప్రభుత్వం బాధితురాలికి ఐదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని పేర్కొంది. మార్చి 26న జరిగిన మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో 9 నెలల వ్యవధిలో డిసెంబర్ 30న తీర్పు రాగా, నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష , రూ.20 వేలు జరిమానా విధించి, ఆ మొత్తాన్ని బాధితురాలికి అందజేయాలని కోర్టు తెలిపింది. జూన్ 7న నమోదైన మరొక కేసులో కేవలం ఆరు నెలల వ్యవధిలో అంటే ఈ ఏడాది జనవరి 2న తీర్పు వెలువడగా, మైనర్ బాలికపై లైంగిక దాడికి సహకరించిన ఒక మహిళతో సహా ఇద్దరు నిందితులకు చెరో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25 వేలు జరిమానా విధిస్తూ బాధితురాలికి రూ.40 వేలు నష్టపరిహారం చెల్లించాలని విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు ఆదేశించింది. నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో వేగవంతమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా కఠిన చర్యలు తీసుకుంటామని మేరీ ప్రశాంతి స్పష్టం చేశారు. నగర పౌరులు ఎటువంటి నేరాలకు పాల్పడకుండా తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకోకుండా సన్మార్గంలో నడుస్తూ నగరానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా పోలీసులు ఆకాంక్షించారు. -
రికార్డులు కొట్టినా.. జీతాల్లో కోతలే..
స్టీల్ప్లాంట్లో రికార్డు ఉత్పత్తి సాధించినా దక్కని పూర్తి వేతనంఉక్కునగరం : ఉత్పత్తి ఆధారిత వేతనాలు ఎంత కాలం అంటూ స్టీల్ప్లాంట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్లో అత్యధిక ఉత్పత్తితో అనేక రికార్డులు నమోదు చేసినా పూర్తి జీతం ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2024 సెప్టెంబర్ నుంచి యాజమాన్యం ఉద్యోగుల జీతాలపై కోతలు మొదలు పెట్టింది. తద్వారా గత ఏడాది సెప్టెంబర్ నాటికి 355 శాతం జీతం పెండింగ్లో పెట్టింది. గత ఏడాదిలో అక్టోబర్, నవంబర్ నెలలో మాత్రమే నూరు శాతం చెల్లించింది. ఇక నుంచి నూరు శాతం జీతం వస్తుందని ఉద్యోగులు ఊపిరి పీల్చుకునే క్రమంలో యాజమాన్యం మరో రకంగా దాడికి పాల్పడింది. ఇకపై ఆయా విభాగాల ఉత్పత్తి ఆధారంగా మాత్రమే జీతాలు చెల్లిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు షాక్కు గురయ్యారు. కార్మిక సంఘాలు తమ నిరసన తెలిపినప్పటికి యాజమాన్యం వెనుకంజ వేయలేదు. దీంతో కార్మిక సంఘాలు యాజమాన్యం తీరుపై రీజనల్ లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఆయన కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆ ఉత్తర్వులు ఉపసంహరించాలని, వెంటనే ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలని ఆదేశించారు. అయినప్పటికి యాజమాన్యం నుంచి ఎటువంటి సానుకూల నిర్ణయం కనిపించకపోవడం పట్ల కార్మిక వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు నెలలు ఉత్పత్తి ఆధారంగా పర్సంటేజి జీతాలు చెల్లించడం వల్ల ఉద్యోగుల పెండింగ్ జీతాలు 380 శాతానికి చేరుకున్నాయి. డీపీఈ చెప్పినా పట్టదా.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన వేతనాలు, అలవెన్సులు, సదుపాయాలపై డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ (డీపీఈ) ఆదేశాల మేరకు జరుగుతుంటాయి. గతంలో డీపీఈ ఆదేశాల మేరకే స్టీల్ప్లాంట్ క్వార్టర్ల విద్యుత్ చార్జీలను యాజమాన్యం పెంచింది. ఉత్పత్తి ఆధారిత జీతాలపై ఉక్కు యాజమాన్యం ఇచ్చిన ఆదేశాలపై ఉక్కు అధికారుల సంఘం (సీ) డీపీఈకు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన డీపీఈ ఆ ఉత్తర్వు లపై తమకు వివరణ ఇవ్వాలని కోరినప్పటికి ఉ క్కు యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు సంస్థలో పనిచేసే ఉద్యోగుల జీతాలు లాభనష్టాలు, ఉత్పత్తితో సంబంధం ఉండదని కార్మిక చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఉత్పత్తి ఆధారంగా ఇచ్చేది ఇన్సెంటివ్, రివార్డులు మాత్రమే అనేది సర్వజనీనం. అయితే కార్మిక చట్టాలు, కార్మిక సంక్షేమంపై ఎటువంటి నమ్మకం లేని స్టీల్ప్లాంట్ యాజమాన్యం నిర్ణయాన్ని రీజనల్ లేబర్ కమిషనర్ వ్యతిరేకించినప్పటికి డిసెంబర్ నెల జీతాన్ని కూడా ఉత్పత్తి ఆధారంగా చెల్లించడం గమనార్హం. డిసెంబర్లో ఉత్పత్తి రికార్డులు డిసెంబర్ నెలలో బ్లాస్ట్ఫర్నేస్, స్టీల్ మెల్ట్ షాప్లు ఉత్పత్తిలో పలు రికార్డులు సాధించాయి. బ్లాస్ట్ఫర్నేస్లు మూడు అత్యధికంగా హాట్ మెటల్ ఉత్పత్తి చేయగా, స్టీల్ మెల్ట్ షాప్లు అత్యధికంగా 136 హీట్లు ఉత్పత్తి చేసి గత రికార్డులను అధిగమించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ నెలలో ఆ రెండు విభాగాల్లో అత్యధిక ఉత్పత్తి జరిగినప్పటికి యాజమాన్యం కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. ఉత్పత్తి ఆధారిత వేతనాలతో ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం 380 శాతానికి చేరిన పెండింగ్ జీతాలు డీపీఈ, లేబర్ కమిషనర్ ఆదేశాలు తుంగలోకి... -
పేదలకు మొండిచేయి.. పెద్దలకు రెడ్ కార్పెట్
మధురవాడ: ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ భూముల్లోని నివాసాల క్రమబద్ధీకరణ ప్రక్రియ విశాఖ రూరల్ మండలంలో వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా పీఎంపాలెం ఆర్హెచ్ కాలనీలో జరుగుతున్న సర్వే ప్రక్రియ పక్కదోవ పడుతోందని, ఇది కేవలం ధనికులకు, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే కొమ్ముకాస్తోందని స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాస్టర్ ప్లాన్ రోడ్డుకు ప్రతిపాదించిన స్థలం కావడంతో క్రమబద్ధీకరణ సాధ్యం కాదని అధికారులు గతంలో చెప్పడంతో సామాన్య పేదలెవరూ దరఖాస్తులు చేసుకోలేదు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా పాలక పక్షం అండదండలు ఉన్నవారు, ఆర్థిక స్థోమత కలిగిన వారి నివాసాల కోసం రహస్యంగా సిఫార్సులు అందడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం గ్రేడ్–2 వీఆర్వో వి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 20 మంది ఆర్థిక స్థోమత ఉన్న వారి నివాసాలకు మాత్రమే సర్వే నిర్వహించారు. దీనిని గమనించిన స్థానిక పేద ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. తమకు అవకాశం లేదని చెప్పి, ఇప్పుడు కొందరికే ఎలా సర్వే చేస్తారని రెవెన్యూ సిబ్బందిని నిలదీయగా, వారు సమాధానం చెప్పలేక నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఏర్పడింది. సచివాలయ సిబ్బంది పక్షపాత ధోరణి వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, సామాన్యులకు సమాచారం అందించకుండా కేవలం తమకు కావలసిన వారి చేతనే దరఖాస్తులు చేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. సచివాలయం తీరుపై అనుమానాలు.. ప్రస్తుతం సచివాలయంలో డీపీవో లేకపోవడం, ఇన్చార్జ్ డీపీవో సెలవులో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని వీఆర్వో, ఇతర సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి, పీఎంపాలెం ఆర్హెచ్ కాలనీలో జరుగుతున్న అక్రమ సర్వేపై విచారణ జరిపి, అర్హులైన పేదలందరికీ సమన్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
టెండర్లకు ముసుగు.. కొటేషన్లతో దోపిడీ
మహారాణిపేట: కేజీహెచ్లో కంప్యూటర్ల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఈ నెల 15 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘ఈ–ఫైల్’ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించిన నేపథ్యంలో కేజీహెచ్ యంత్రాంగం హడావుడిగా చేపట్టిన కంప్యూటర్ల కొనుగోలులో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇద్దరు సహాయ స్థాయి ఉద్యోగులు చక్రం తిప్పి, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు పిలవకుండానే కేవలం కొటేషన్ల ఆధారంగా ఈ కొనుగోళ్లు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో వాస్తవ ధర కంటే రెట్టింపు ధర చెల్లించి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడమే కాకుండా, స్వయంగా కలెక్టర్నే తప్పుదోవ పట్టించారన్న విమర్శలు వినపడుతున్నాయి. బయటపడిన బండారం ఈ–ఆఫీస్ నిర్వహణ కోసం పరిపాలనా విభాగానికి అవసరమైన సుమారు 53 కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర సామగ్రిని మార్కెట్ ధర కంటే అత్యధిక ధరలకు అంటే ఒక్కొక్క సెట్ను రూ. 60 వేల నుంచి రూ. 90 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేసినట్లు ఆస్పత్రి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంత భారీ సొమ్ము వెచ్చించినా, తీరా ఆ కంప్యూటర్లను అమర్చాక ‘ఈ–ఫైల్’ సాఫ్ట్వేర్ వాటిలో సక్రమంగా పనిచేయకపోవడంతో అధికారుల బండారం బయటపడింది. నాణ్యత లేని వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇప్పుడు ఈ–ఆఫీస్ అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వైఫల్యంపై ప్రస్తుతం కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కాలేజీ వర్గాల్లో వేడివేడిగా చర్చ సాగుతోంది. చక్రం తిప్పిన ఇద్దరు ఉద్యోగులు ధరల పెంపు, నాసిరకం కంప్యూటర్ల సరఫరా, ఫైళ్లపై సంతకాలు చేయించడం వంటి వ్యవహారాల వెనుక ఉన్న ఆ ఇద్దరు ఉద్యోగుల పాత్రపై సహచర సిబ్బంది మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు ప్రశ్నించినప్పుడు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ తప్పు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. లక్షలాది రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం కావడమే కాకుండా, అత్యవసరమైన ఈ–ఆఫీస్ సేవలకు ఆటంకం కలిగించిన ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. -
మహిళా విద్యకు మార్గదర్శకురాలు సావిత్రిబాయి పూలే
మహారాణిపేట: మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా, సమాజ సంస్కర్తగా చిరస్థాయిగా నిలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే అని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కొనియాడారు. శనివారం వైఎస్సార్ సీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, డిప్యూటీ మేయర్ కె.సతీష్తో కలిసి కేకే రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలికల విద్యే సమాజ అభివృద్ధికి పునాది అనే భావనను ఆచరణలో చూపిన గొప్ప సంస్కర్తగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. కుల, మత, లింగ భేదాలను త్రోసిపుచ్చి సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం నేటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యుడు జహీర్ అహ్మద్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు పేడాడ రమణి కుమారి, సునీల్ మెత్త, బోని శివరామకృష్ణ , శ్రీదేవి వర్మ, నీలి రవి, మారుతి ప్రసాద్, పీలా ప్రేమకుమార్, దిలీప్, సేనాపతి అప్పారావు, మార్కేండేయులు, అలంపల్లి రాజబాబు, కార్పొరేటర్ బిపిఎన్ కుమార్ జైన్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
వాల్తేరు చుట్టూరాజకీయం!
● జోన్ అభివృద్ధికే గండం● శ్రీకాకుళం జిల్లా మొత్తం కొత్త జోన్లో ఉంచాలంటూ ప్రతిపాదనలు ● ఇచ్ఛాపురం సెక్షన్ని ఇవ్వబోమంటున్న ఈస్ట్కోస్ట్ జోన్ ● తేలే వరకూ గెజిట్ ఇవ్వొద్దంటూ రైల్వే బోర్డుకు కేంద్ర మంత్రి విజ్ఞప్తి ● ఆదాయం వచ్చే కేకే లైన్ వైజాగ్కు ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ తనూజ వినతిగెజిట్కు మోకాలడ్డుతున్న కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుసాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డివిజన్లో చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కుంపటి రగుల్చుతోంది. శతాబ్దాల చరిత్ర ఉన్న డివిజన్ని కొనసాగించాలంటూ వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంటే.. టీడీపీ ఎంపీలు మాత్రం కాలగర్భంలో కలిపేసేందుకు కుట్రపన్నుతున్నారు. పంచభక్ష్య పరమాన్నాలు పక్క రాష్ట్రానికి అప్పగించి.. ప్రసాదం చేతులో పెడుతుంటే ఆహా ఓహో అంటూ గొప్పలు చెప్పుకుంటున్న నేతలు.. తమకు రైల్వేకు అందే ఆదాయ మార్గం వద్దు.. రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమంటూ గెజిట్ రాకుండా అడ్డుపడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇచ్ఛాపురం వరకూ విశాఖ డివిజన్లో ఉంచాలంటూ ఎంపీ రామ్మోహన్రావు పట్టుబడుతుంటే.. ఈస్ట్కోస్ట్ రైల్వే జోన్ అధికారులు దాన్ని వదులుకోవడానికి సిద్ధపడట్లేదు. మరోవైపు డివిజన్కు, జోన్కు ఆదాయం తీసుకొచ్చే కేకే లైన్ని రాయగడలో కాకుండా విశాఖలో కొనసాగించాలంటూ అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి పట్టుబడుతున్నారు. రామ్మోహన్ రాజకీయ మనుగడ కోసం.. దక్షిణ కోస్తా జోన్లో కీలక ఆదాయ మార్గమైన కేకే లైన్ వాల్తేరు డివిజన్లో ఉండాలని ఉత్తరాంధ్రవాసులు కోరుతున్నారు. దీంతో పాటు పలాస– ఇచ్ఛాపురం సెక్షన్ కూడా ఇక్కడే ఉండాలని అడుగుతున్నారు. కానీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రం ఈ విషయంలో కేవలం శ్రీకాకుళం ఎంపీగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తన భవిష్యత్తు రాజకీయ మనుగడ కోసం కేవలం పలాస– ఇచ్ఛాపురం సెక్షన్ని మాత్రమే పట్టుకొని వేలాడుతున్నారు. ఇచ్ఛాపురం వరకు దక్షిణ కోస్తా జోన్లో ఉంచాలంటూ పదే పదే కోరుతున్నారు. అది తేలే వరకూ గెజిట్ ఇవ్వొద్దని కోరినట్లు తెలుస్తోంది. అయితే దీన్ని ఈస్ట్కోస్ట్ రైల్వే జోన్ మాత్రం అంగీకరించడం లేదు. ఇచ్ఛాపురం సెక్షన్ వరకూ ఇవ్వాలంటే రాయగడ–నౌపడ లూప్ సెక్షన్ తమకు ఇవ్వాలంటూ షరతు విధించింది. పలు దఫాల చర్చలు విఫలమవుతూనే ఉన్నా.. రామ్మోహన్ మాత్రం తన రాజకీయ భవిష్యత్తు కోసమే తప్ప.. జోన్ అభివృద్ధి కోసం కాంక్షించకపోవడం గర్హనీయమంటూ పలువురు దుయ్యపడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికగా ఉన్న జోన్ ఏర్పడుతున్నప్పుడు.. ఈ ప్రాంతం అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పోరాడాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలే తప్ప.. రాజకీయ స్వలాభం కోసం ఆలోచించకూడదు. ఇచ్ఛాపురం సెక్షన్ కూడా విశాఖ డివిజన్లో ఉండాల్సిందే. అదేవిధంగా ఆదాయం తీసుకొచ్చే కేకేలైన్ మొత్తం ఇక్కడే ఉంటే.. భవిష్యత్తులో జోన్ మరింత ముందుకు వెళ్తుందన్న విషయం టీడీపీ ఎంపీలు గుర్తుపెట్టుకోవాలి. అక్టోబర్ 2న రావాల్సిన గెజిట్.. పరిశీలనల్లో లేని విజ్ఞప్తుల వల్ల ఆగిపోయింది. ఇది బాధాకరం. కేకే లైన్ కోసం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కలిసి పదే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. త్వరగా జోన్కు సంబంధించిన గెజిట్ విడుదల చెయ్యాలని కోరుతున్నాం. – గుమ్మ తనూజరాణి, అరకు ఎంపీ అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాల్తేరు డివిజన్ తూర్పు కోస్తా రైల్వే జోన్కు వరంలాంటిది. ఏటా దాదాపు 3 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ.17 వేల కోట్లు కాగా, ఇందులో రూ.10 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. దేశంలోనే సుమారు 300 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ఇందులో సింహభాగం ఆదాయం ఐరెన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. వాల్తేరు డివిజన్ పరిధిలో ఏటా సరకు రవాణా ద్వారా వచ్చే ఆదాయమంతా.. ఇప్పుడు రాయగడ డివిజన్కు సొంతమవుతుంది. జోన్ అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా కేకే లైన్ వాల్తేరు పరిధిలో అంటే త్వరలో ఏర్పడే విశాఖ డివిజన్లో ఉండాల్సిందేనని వైఎస్సార్సీపీ ప్రతినిధులు, డివిజన్ అధికారులు చెబుతున్నారు. కేకే లైన్ లేకపోతే.. విశాఖ డివిజన్ ఆదాయం రూ.3 వేల కోట్లు కూడా దాటే అవకాశం లేదు. దీంతో కొత్త జోన్ అభివృద్ధి సక్రమంగా జరిగే సూచనలు లేవని ఆందోళన చెందుతున్నారు. దీనిని కూడా రాజకీయం కోసం చంద్రబాబు ప్రభుత్వం వాడుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత వైఎస్ జగన్దే’
విశాఖ: భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత కచ్చితంగా మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని మరోసారి స్పష్టం చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను వైఎస్ జగన్ నెరవేర్చారన్నారు. భోగాపుర ఎయిర్పోర్ట్ కోసం భూ సమీకరణ, భూ వివాదాలను పరిష్కరించింది వైఎస్ జగనేనని, భూసేకరణ బాధితుల పరిహారం కోసం రూ. 1100 కోట్లు కేటాయించారన్నారు. 2023, మే 3వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్కు వైఎస్ జగన్ శంకస్థాపన చేశారని, 2025 డిసెంబర్ నెలాఖరుకు మొదటి ఫ్లైట్ ల్యాండ్ చేయాలనే టార్గెట్ను జీఎంఆర్కు అప్పగించారన్నారు.వైఎస్ జగన్ టార్గెట్ లో భాగంగానే రేపు తొలి ఫ్లైట్ ల్యాండ్ అవుతుందన్నారు. 2019 ఫిబ్రవరి 14 న ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కోసం ఎన్నికలకు ముందు చంద్రబాబు హడావుడిగా శంకుస్థాపన చేశారని, 2700 ఎకరాలకు గాను 250 ఎకరాలను కూడా చంద్రబాబు సేకరించలేదన్నారు. వైఎస్ జగన్ కృషిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కూర్మన్నపాలెం : దువ్వాడ రైల్వేస్టేషన్ రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. దువ్వాడ పోలీసులు అందించిన వివరాలు.. అగనంపూడి డొంకాడ కాలనీకి చెందిన గుర్రం రాము (25) ఫార్మా కంపెనీలోను, ఆయన భార్య మైత్రి దువ్వాడలోని ఒక షాపులో పనిచేస్తుంది. శుక్రవారం రాత్రి ఆమెను తీసుకురావడానికి రాము స్కూటీపై ఇంటి నుంచి బయలుదేరాడు. దువ్వాడ రైల్వేస్టేషన్కు సమీపంలోని కోళ్లఫారమ్ వద్ద ఎదురుగా వస్తున్న వ్యాన్ అతని స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో రాము అక్కడికక్కడే మృతి చెందాడు. రాముకు ఏడాది క్రితమే వివాహమైంది. ఆయన మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంగళం
మన ఆటలకు ఇంటర్ వాళ్లకు మరో రూల్! త్రోబాల్ పోటీలు ఆడుతున్న క్రీడాకారులు అగనంపూడి: గ్రామీణ స్థాయి నుంచి విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్, టెన్నీకాయిట్, క్యారమ్స్, బాల్బ్యాడ్మింటన్, క్రికెట్, వంటి క్రీడలు ఆడేందుకు ఎంతో మక్కువ చూపిస్తారు. అయితే వీటిలో చాలా క్రీడలకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్జీఎఫ్ఐ)లో మంగళం పాడేసింది. మన రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించే త్రోబాల్, టెన్నీకాయిట్, బాల్బ్యాడ్మింటన్, క్యారమ్స్ వంటి క్రీడలను ఎస్జీఎఫ్ఐ జాబితా నుంచి తొలగించింది. గత విద్యా సంవత్సరంలో బాల్బ్యాడ్మింటన్ను పక్కనపెట్టగా, ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన మూడు క్రీడలకు మంగళం పాడారు. దీంతో ఈ ఏడాది జరిగిన రాష్ట్రస్థాయి(ఎస్జీఎఫ్ఏపీ) పోటీల్లోనూ ఈ ఆటలకు చోటు లేకుండా పోయింది. మనకు తెలియని ఆటలకు పెద్దపీట మన రాష్ట్ర విద్యార్థులకు పట్టున్న క్రీడలను పక్కనపెట్టిన ఎస్జీఎఫ్ఐ.. మనకు ఏమాత్రం సంబంధం లేని, కనీస అవగాహన కూడా లేని థంగ్–టా, సపక్ తర్కా, గటకా, కేలరీపాయట్టు, కుర్షు, మల్లఖాంబ్, మోడరన్ పాంథ్లూన్, స్క్వాష్, వాటర్పోలో, వుషూ వంటి క్రీ డలను చేర్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 69వ స్కూల్ గేమ్స్లో వీటిని నిర్వహించినా, మన పిల్లల కు ఎంతో ఇష్టమైన ఆటలను మాత్రం విస్మరించారు. మన రాష్ట్ర అధికారులు జాతీ య స్థాయిలో గట్టిగా నిలదీయకపోవడం వల్లే విద్యార్థులు నష్టపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎం సర్టిఫికెట్ చెల్లదట క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థుల వయసు ధ్రువీకరణ విషయంలో ఎస్జీఎఫ్ఐ కొత్త నిబంధనలు గందరగోళం సృష్టిస్తున్నాయి. గెజిటెడ్ అధికారి అయిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్కూల్ రికార్డుల ప్రకారం జారీ చేసే పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రానికి విలువ లేకుండా పోయింది. కేవలం ఆధార్ కార్డులోని తేదీనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. వాస్తవానికి ఆధార్ అనేది చిరునామా గుర్తింపు కోసమేనని ప్రభుత్వాలు చెబుతున్నా, క్రీడా సమాఖ్యలు మాత్రం వయసు నిర్ధారణకు దానినే కొలమానంగా తీసుకోవడం విడ్డూరం. ఈ నిబంధన వల్ల చాలా మంది అర్హులైన క్రీడాకారులు అనర్హులుగా మిగిలిపోతున్నారు. చిన్నచూపు తగదు ఎస్జీఎఫ్ఐ ప్రకటించిన షెడ్యూల్లో త్రోబాల్, టెన్నీకాయిట్, బాల్బాడ్మింటన్, క్యారమ్స్ లేకపోవడంతో వందలాది మంది విద్యార్థులు నిరాశకు గురయ్యారు. మన రాష్ట్ర విద్యార్థులు ఎక్కువగా మొగ్గుచూపే ఈ ఆటలను జాబితా నుంచి తొలగించడం సరికాదు. కనీసం ఈ ఏడాది అయినా ఈ నాలుగు క్రీడలను తిరిగి జాబితాలో చేర్చేలా రాష్ట్ర ఎస్జీఎఫ్ చొరవ తీసుకోవాలి. – గెంజి కనకారావు, జిల్లా కార్యదర్శి, టెన్నీకాయిట్ అసోసియేషన్, అనకాపల్లి ఉపాధినిచ్చే క్రీడలను తొలగించడం అన్యాయం గతంలో బాల్ బ్యాడ్మింటన్లో జాతీయ స్థాయిలో రాణించిన ఎంతోమంది క్రీడాకారులు రైల్వే, పోలీస్ వంటి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందారు. క్రీడా కోటాలో ఉపాధి కల్పించే ఇలాంటి విశిష్టమైన క్రీడను రెండేళ్ల నుంచి జాతీయ జాబితా నుంచి తొలగించడం వల్ల విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోంది. వచ్చే ఏడాదైనా ఈ క్రీడలను ఎస్జీఎఫ్ఐ జాబితాలో చేర్చాలని రాష్ట్ర కార్యదర్శికి విజ్ఞప్తి చేశాం. – చిరికి వెంకటరావు, అధ్యక్షుడు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఇంటర్ విద్యార్థులకు రెడ్కార్పెట్ పాఠశాల విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్య ఎంపిక ప్రక్రియలోనూ వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. పాఠశాల విద్యార్థి జిల్లా స్థాయికి రావాలంటే మండల, డివిజన్ స్థాయి పోటీల్లో నెగ్గాల్సి ఉంటుంది. కానీ, అండర్–17 విభాగంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు నేరుగా ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే వెసులుబాటు కల్పించారు. ఇది పాఠశాల విద్యార్థులకు తీరని అన్యాయం చేయడమేనని వ్యాయామ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. జనన ధ్రువీకరణ పత్రంతో మరిన్ని చిక్కులు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థులు తప్పనిసరిగా మున్సిపాలిటీ లేదా పంచాయతీ జారీ చేసిన పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలని, అది కూడా ఆధార్తో సరిపోలాలని నిబంధన పెట్టారు. 15 ఏళ్ల కిందట గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది జనన నమోదు చేసుకోలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా సర్టిఫికెట్ తేవాలంటే సాధ్యం కాక, వచ్చిన అవకాశాలను విద్యార్థులు వదులుకోవాల్సి వస్తోంది. -
హాస్టళ్లు, రేషన్ డిపోల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ తనిఖీలు
అచ్యుతాపురం రూరల్/ఎస్.రాయవరం : జిల్లాలోని పలు మండలాల్లో హాస్టళ్లు, రేషన్ డిపోల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ చిట్టా విజయ్ ప్రతాప్రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అచ్యుతాపురం మండలంలో మోసయ్యపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో తనిఖీ చేసి, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వెదురువాడ అంగన్వాడీ కేంద్రం, చోడపల్లి, అచ్యుతాపురం రేషన్ డిపోలు, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్, మోసయ్యపేట, ట్రైబల్ హాస్టల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో దేవరాయల్ తదితరులు పాల్గొన్నారు. ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెంలో పాఠశాలలో తనిఖీలు నిర్వహించి, సదుపాయాలపై ఆరా తీశారు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం, రేషన్ డిపోలను తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో కొన్ని సరకులు వివరాలు సక్రమంగా లేకపోవడంతో సూపర్వైజర్ని నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
ట్రూ అప్
అండ్ డౌన్ దోపిడీ కోసం..ట్రూ అప్ పేరుతో రూ.7,790.16 కోట్లు గుంజేందుకు ప్లాన్ ఏపీఈఆర్సీ పరిశీలన అనంతరం తేల్చిన లెక్కలు ● ట్రూఅప్ చార్జీలుగా వసూలు చేయాల్సింది – 0 ● ఇతర ఖర్చులు (బిల్లు బకాయిలు, రుణాలు, డిస్కౌంట్స్) రూ.3,887.28 కోట్లు ● క్యారియింగ్ కాస్ట్ రూ.2,113.24 కోట్లు ● రిటైల్ సప్లయ్ టారిఫ్ వ్యయంపై ట్రాన్స్మిషన్ లిమిటేషన్ రూ.6.49 కోట్లు ● మొత్తం ట్రూఅప్ నుంచి తొలగించాల్సిన ఖర్చులు రూ.6,007.01 కోట్లు ● 4వ కంట్రోల్ పీరియడ్లో వసూలు చేయాల్సిన ట్రూఅప్ చార్జీలు రూ.1,783.15 కోట్లు ● ప్రభుత్వమే భరించాలని చెప్పిన ట్రూ అప్ చార్జీలు రూ.1,783.15 కోట్లుసాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కమ్ల ద్వారా ప్రజల నుంచి భారీగా వసూళ్ల పర్వానికి చంద్రబాబు ప్రభుత్వం వేసిన పాచిక పారలేదు. ట్రూ అప్ చార్జీల పేరుతో వినియోగదారుల నెత్తిన రూ.వేల కోట్లు వడ్డించేందుకు చేసిన ప్రయత్నాలకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) బ్రేక్ వేసింది. ముఖ్యంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ వ్యవస్థ (ఏపీఈపీడీసీఎల్) కాకిలెక్కలతో జనం జేబులకు చిల్లు పెట్టాలని చూసింది. గడిచిన ఐదేళ్లకు సంబంధించిన ఖర్చుల సర్దుబాటు(ట్రూఅప్) పేరుతో వినియోగదారుల నుంచి ఏకంగా రూ.7,790.16 కోట్లు పిండుకోవాలని భావించింది. అయితే ఏపీఈఆర్సీ రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు లెక్కల బండారాన్ని బయటపెట్టింది. డిస్కమ్ల అడ్డగోలు ఖర్చులను ట్రూ అప్ పేరుతో జనంపై ఎలా రుద్దుతారని, ఇందులో రూ.6,007.01 కోట్లు అర్హతలేనివంటూ స్పష్టం చేసింది. మిగిలిన డబ్బులు కూడా ప్రభుత్వమే డిస్కమ్లకు చెల్లించాలని తెగేసి చెప్పింది. అంతా లోపభూయిష్ట లెక్కలు ఏపీఈపీడీసీఎల్ చూపిన లెక్కల్లో వసూలు కాని బాకీలు, ఇతర నిర్వహణ ఖర్చుల కింద చూపిన మొత్తమే రూ.వేల కోట్లలో ఉంది. కేవలం ఇతర ఖర్చులు, వడ్డీల పేరుతో చూపిన రూ.3,887 కోట్లను ఏపీఈఆర్సీ నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది. దీన్ని బట్టి సంస్థలో ఆర్థిక క్రమశిక్షణ ఈపీడీసీఎల్లో ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సంస్థ అసమర్థత, నిర్వహణ లోపాలకు అయిన ఖర్చుల్ని ‘ట్రూ–అప్’ పేరుతో జనం జేబులోంచి లాగేయాలని అనుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా అంచనాలకు, వాస్తవాలకు మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. కానీ ఈపీడీసీఎల్ విషయంలో ట్రూఅప్ పేరుతో అడిగిన రూ.7,790 కోట్లకు.. ఏపీఈఆర్సీ ఆమోదించిన రూ.1,783 కోట్లకు మధ్య ఏకంగా రూ. 6,007.01 కోట్ల వ్యత్యాసం ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో అనర్హమైన ఖర్చులను ట్రూ అప్ పేరుతో ఎందుకు క్లెయిమ్ చేసుకోవాలని ఈపీడీసీఎల్ భావించిందనే దానిపై ఈఆర్సీ మొట్టికాయలు వేసింది. అందులో అర్హత లేని ఖర్చులు రూ.6,007.01 కోట్లుగా గుర్తించిన ఏపీఈఆర్సీ మిగిలిన రూ.1,783.15 కోట్లు ప్రభుత్వమే చెల్లించాలని ఆదేశం ఇంతకీ ఈ తప్పుడు లెక్కల బాధ్యులెవరు? ఈపీడీసీఎల్ చూపించిన గణాంకాలు నాలుగో కంట్రోల్ పీరియడ్(సీపీ)లో ట్రూ అప్ చార్జీలు రూ.5,684.58 కోట్లు క్యారియింగ్ కాస్ట్ రూ.2113.24 కోట్లు మొత్తం రూ.7,797.82 కోట్లు గతంలో ఈఆర్సీ ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా సర్దుబాటు చేసినవి రూ.7.65 కోట్లు మొత్తంగా ట్రూఅప్ పేరుతో ప్రజల నుంచి వసూలు చేయాలనుకున్నది రూ.7,790.16 కోట్లు వాతలు కప్పిపుచ్చుకునేందుకు కొత్తనాటకం! ట్రూ అప్ పేరుతో జనం నెత్తిన భారం మోపాలని అనుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ వాతలు పెట్టింది. రూ.6,007.01 కోట్లు అర్హతలేనివని తేల్చడంతోపాటు రూ.1,783.15 కోట్లు కూడా ప్రభుత్వమే భరించాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రూ అప్ పేరుతో ఏకంగా రూ.7,790 కోట్లను ప్రజల నుంచి వసూలు చేసి సంపద సృష్టించామని చెప్పాలనుకున్నా కుదరకపోవడంతో ఈ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం కొత్త ఎత్తుగడ మొదలు పెట్టింది. ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం మొత్తం భరిస్తోందంటూ హడావుడి చేస్తోంది. దీనిపై మంత్రులు కూడా గొప్పలు చెప్పడం హాస్యాస్పదంగా మారింది. ఏపీఈఆర్సీ ఆమోదించిన రూ.1,783 కోట్ల ట్రూ అప్ చార్జీలను ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ డబ్బులు తామే చెల్లిస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా.. ఆ చెల్లించేది కూడా పరోక్షంగా ప్రజల పన్నుల డబ్బు నుంచే కదా అని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. -
కమ్యూనిస్ట్ భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్లాలి
ఏయూ క్యాంపస్: కమ్యూనిస్ట్, సోషలిస్టు భావజాలాన్ని విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రముఖ తమిళ యువ దర్శకుడు, రచయిత రాజు మురుగన్ ఉద్ఘాటించారు. సీఐటీయూ జాతీయ మహాసభల సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వారం రోజులుగా జరుగుతున్న ‘శ్రామిక ఉత్సవ్’ శుక్రవారం రాత్రి ముగిసింది. ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. వర్గ పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కళలకు ఎల్లలు లేవన్నారు. వీధి నాటిక వైతాళికుడు సఫ్దర్ హష్మీని భౌతికంగా అంతమొందించినా.. ఆయన వీధి నాటిక సహా ఇతర కళారూపాలేవీ కనుమరుగు కాలేదని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తున్న సీఐటీయూను ఈ సందర్భంగా అభినందించారు. పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో ఇక్కడ ఎన్నో ఉద్యమాలు జరిగిన విషయం తనకు తెలుసన్నారు. సభ ప్రారంభానికి ముందు సఫ్దర్ హష్మీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రాజు మురుగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. మరొక అతిథి, యువ దర్శకుడు అట్టాడ సృజన్ మాట్లాడుతూ.. జీవన శైలిలో కమ్యూనిస్ట్ పద్ధతులను అలవాటు చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. నేటి కాలంలో సాధారణ జీవనం సైతం ఓ పోరాటంగా మారిందన్నారు. సినిమా అత్యంత శక్తిమంతమైన మీడియా అని, పార్వతీపురం కుట్ర కేసు కథాంశంగా సినిమా తీయాలన్నది తన ఆకాంక్ష అని వెల్లడించారు. సభకు అధ్యక్షత వహించిన సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ‘ఆహార్యం, ఆరోగ్యం, విద్య, ఉపాధి హక్కులకై ఉద్యమిద్దాం’ అనే ఇతివృత్తంతో శుక్రవారం కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్, శ్రామిక ఉత్సవ్ కన్వీనర్ రమాప్రభ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ముజఫర్ అహ్మద్ స్వాగతం పలికారు. ఏడు రోజుల పాటు నిర్వహించిన వివిధ ఎగ్జిబిషన్ల కన్వీనర్లను ఈ సందర్భంగా అభినందించారు. చివరగా సీఐటీయూ నాయకుడు కుమారమంగళం వందన సమర్పణ చేశారు. -
ఏలేరు కాలువలో పడి వ్యక్తి మృతి
ఉక్కునగరం : స్టీల్ప్లాంట్కు నీరు సరఫరా చేసే ఏలేరు కాలువలో శుక్రవారం ఉదయం అగనంపూడికు చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు. స్టీల్ప్లాంట్ పోలీసులు అందించిన వివరాలివి.. అగనంపూడికు చెందిన మామిడి పైడిరాజు (55) తాపీ పనులు చేస్తూ కొడుకు, కోడలు వద్ద ఉంటున్నాడు. ఉదయం ఏలేరు కాలువ వద్ద కాలకృత్యాల కోసం వెళ్లిన పైడిరాజు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతకసాగారు. ఈలోగా కాలువలో మృతదేహం బయటపడటంతో స్టీల్ప్లాంట్ పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. సమాచారం తెలిసి పైడిరాజు కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని గుర్తు పట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత కేజీహెచ్కు తరలించారు. ఏఎస్ఐ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వణికిస్తున్న శీతల గాలులు
బీచ్రోడ్డు: గత కొద్దిరోజులుగా విశాఖలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒకవైపు ఉష్ణోగ్రతలు పడిపోవడం, మరోవైపు వీస్తున్న శీతల గాలులతో జనం వణికిపోతున్నారు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఉదయం వేళ దట్టమైన మంచు కురుస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. ఈ మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఛాతీ, ముక్కు సంబంధిత సమస్యలైన ఆస్తమా, సైనసైటిస్, అలర్జీలు, టాన్సిలైటిస్ వంటి వాటితో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెదవాల్తేరులోని ఛాతీ ఆసుపత్రి, ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రితో పాటు విమ్స్కు వచ్చే బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సమస్యకు కారణాలివే.. శీతాకాలంలో వ్యాప్తి చెందే కొన్ని రకాల వైరస్ల వల్ల ఆస్తమా కేసులు పెరుగుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. చల్లని గాలి కారణంగా శ్వాసనాళాలు కుచించుకుపోయి, గాలి రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంది. ఇది ఆయాసానికి, తద్వారా ఆస్తమాకు దారితీస్తుంది. సాధారణ జలుబు, దగ్గుతో మొదలై రాత్రి వేళల్లో ఇది తీవ్రరూపం దాల్చుతుంది. కొంతమందిలో ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుందని వైద్యులు తెలిపారు. చల్లని గాలుల వల్ల ముక్కు కండరాలు గట్టిపడటం, దుమ్ము, పుప్పొడి, వాయు కాలుష్యం, పెంపుడు జంతువుల నుంచి వచ్చే అలర్జీలు సైనసైటిస్, టాన్సిలైటిస్ సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయి. చిన్నారులపై తీవ్ర ప్రభావం పెద్దవారితో పోలిస్తే చిన్నారుల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆస్తమా లక్షణాలతో పల్మనాలజిస్టులు, పిల్లల వైద్యుల వద్దకు రోజుకు సగటున 10 నుంచి 20 మంది వరకు వస్తున్నారు. గత రెండు వారాలుగా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధాన లక్షణాలు పెద్దల్లో ఊపిరి ఆడకపోవడం, విపరీతమైన ఆయాసం, చిన్నారుల్లో పిల్లి కూతలు రావడం, డొక్కలు ఎగరేయడం, దగ్గు, జ్వరం. ఏడాది లోపు పిల్లల్లో శరీరం నీలంగా మారిపోవడం, సైనస్, టాన్సిల్స్ బాధితుల్లో ఊపిరి అందకపోవడం, గొంతు నొప్పి, ఎడతెగని జలుబు. రెట్టింపైన బాధితుల సంఖ్య సాధారణ రోజులతో పోల్చుకుంటే డిసెంబర్లో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య రెట్టింపయ్యింది. ప్రస్తుతం అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ విభాగాలు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఛాతీ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ల సంఖ్య 90 నుంచి ఏకంగా 170కి పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత రెండేళ్లతో పోల్చితే ప్రస్తుతం కేసుల నమోదు అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. -
విశాఖ ఉక్కు.. భారతీయుల హక్కు
మెడకు ఉరితాళ్లతో ఐద్వా వినూత్న నిరసన బీచ్రోడ్డు: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను తక్షణం విరమించుకోవాలని, ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉన్న స్టీల్ ప్లాంట్ దీక్ష శిబిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. మోదీ ప్రభుత్వ విధానాలు స్టీల్ ప్లాంట్ కార్మికులు, ప్రభుత్వ రంగ పరిశ్రమల మెడకు ఉరితాళ్లుగా మారాయని నినదించారు. ఈ మేరకు మహిళలు తమ మెడలకు ఉరితాళ్లను తగిలించుకొని నిరసన తెలిపారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వేతన బకాయిలను తక్షణం చెల్లించాలని, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఆల్ ఇండియా కార్యదర్శి సింధు, కేరళ మాజీ కార్మిక శాఖ మంత్రి మెర్సీ కుట్టియమ్మ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ప్లాంట్పై కూటమి నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మహిళలు, కార్మికులు ఐదేళ్లుగా చేస్తున్న పోరాట ఫలితంగానే స్టీల్ ప్లాంట్ను ఇంతవరకు కాపాడుకోగలిగామన్నారు. ‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు’ మాత్రమే కాదని, అది ‘భారతీయుల హక్కు’అని స్పష్టం చేశారు. ప్రైవేటీకరించిన ఎయిర్ ఇండియా వంటి సంస్థల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నామని, దేశ రక్షణకు, సంపదకు కీలకమైన ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటుపరం చేస్తే దేశ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ పరిరక్షణ కోసం ఐదేళ్లుగా పోరాడటం, అందులో మహిళలు పెద్ద ఎత్తున భాగస్వాములవడం చాలా గొప్ప విషయమని, దేశవ్యాప్తంగా శ్రామిక మహిళలకు ఈ పోరాటాలు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని, కార్మికులకు తీవ్ర నష్టాన్ని కలిగించే లేబర్ కోడ్స్ను తక్షణం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాధవి, వై.సత్యవతి, జిల్లా నాయకులు బి.పద్మ తదితరులు పాల్గొన్నారు. -
సురక్షిత విశాఖే లక్ష్యం
బీచ్రోడ్డు: ‘సురక్షిత తీరం–సురక్షిత విశాఖ’లో భాగంగా నగరాన్ని ప్రజలకు, పర్యాటకులకు అత్యంత భద్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు నగర పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆర్.కె.బీచ్ వద్ద అత్యాధునిక రిమోట్ కంట్రోల్డ్ లైఫ్ బాయ్ల పనితీరును నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. సముద్రంలో ప్రమాదవశాత్తు మునిగిపోయే వారిని రక్షించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భీమిలి నుంచి అప్పికొండ వరకు ఉన్న తీరప్రాంతాన్ని పరిశీలించి 16 ప్రమాదకర పాయింట్లను గుర్తించామన్నారు. గతంలో ఈ ప్రాంతాల్లో సముద్ర స్నానాలకు వెళ్లి పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఆయా 16 పాయింట్ల వద్ద ఈ రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్లను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు హెచ్చరిక బోర్డులు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, పోలీస్ సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో నియమిస్తామన్నారు. పర్యాటకులు ప్రమాదకర లోతుల్లోకి వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని, ఒకవేళ ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే తక్షణం ఈ లైఫ్ బాయ్లను పంపించి రక్షిస్తామని వివరించారు. విశాఖ తీరాన్ని అత్యంత సురక్షిత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడమే నూతన సంవత్సరంలో తమ ప్రథమ లక్ష్యమని సీపీ పేర్కొన్నారు. డీసీపీ–1 మణికంఠ చెందోలు, ఏడీసీపీ(ఏఆర్), ఈస్ట్ ఏసీపీ, ఇతర పోలీస్ అధికారులు, లైఫ్ బాయ్ సంస్థ ప్రతినిధులు, లైఫ్ గార్డులు పాల్గొన్నారు. సీపీ శంఖబ్రత బాగ్చి -
మొబైల్ టాయిలెట్ల బిల్లుల రచ్చ
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం అధికారుల నిర్లక్ష్య వైఖరిపై వేదికగా మారింది. శుక్రవారం ప్రధాన కార్యాలయంలో మేయర్, స్థాయీ సంఘ చైర్మన్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి పలువురు కీలక అధికారులు డుమ్మా కొట్టడంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థాయీ సంఘమంటే అధికారులకు చులకనగా మారిందని, కనీస సమాచారం లేకుండా గైర్హాజరవ్వడం సరికాదని మండిపడ్డారు. సీఎంహెచ్వో ఎక్కడ? గతేడాది యోగా డే సందర్భంగా ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్ల నిర్వహణకు రూ.1.62 కోట్లు చెల్లించాలన్న ప్రతిపాదన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలని గత సమావేశంలోనే సీఎంహెచ్వో డాక్టర్ నరేష్కుమార్ను సభ్యులు ఆదేశించారు. నెల రోజులు గడుస్తున్నా వివరణ ఇవ్వకపోగా, సదరు అధికారి శుక్రవారం జరిగిన సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో వివరణ లేకుండా పాత అంశాలనే అజెండాలో ఎలా చేర్చుతారని సభ్యులు ప్రశ్నించారు. వివరణ ఇవ్వాల్సిన అధికారే లేనప్పుడు చర్చ ఎలా సాధ్యమని సభ్యులు పట్టుబట్టడంతో, సీఎంహెచ్వో పరిధిలోని సుమారు 25 అంశాలను మేయర్ వాయిదా వేశారు. మరో అంశంపై చర్చ సందర్భంగా.. సంబంధిత అధికారి తనకు బదులుగా సమాధానం చెప్పలేని ఒక మహిళా ఉద్యోగిని పంపడంపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. స్థాయీ సంఘాన్ని ఎగతాళి చేస్తున్నారా అని ప్రశ్నించారు. కమిషనర్తో మీటింగ్లో ఉన్నానంటూ సదరు అధికారి చెప్పడం, సమావేశం చివర్లో రావడాన్ని తప్పుబట్టారు. శిలాఫలకాలపై పేర్లు ఉండాల్సిందే.. నియోజకవర్గాల వారీగా జోనల్ కార్యాలయాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే శిలాఫలకాలపై కేవలం ఆ వార్డు కార్పొరేటర్ పేరు మాత్రమే కాకుండా, జోన్ పరిధిలోని కార్పొరేటర్లందరి పేర్లు ఉండాలని సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మేయర్.. పాతవి తొలగించి కొత్త శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మొత్తం 139 అంశాలు (87 ప్రధాన, 52 టేబుల్ అజెండా) చర్చకు రాగా, 30 అంశాలను వాయిదా వేసి మిగిలిన వాటికి ఆమోదం తెలిపారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి రూ.26.46 కోట్ల పనులకు పచ్చజెండా ఊపారు. పారిశుధ్య సిబ్బంది, ఇతర జీవీఎంసీ సిబ్బందికి జీతాలు సకాలంలో ఇవ్వాలని చైర్మన్ సూచించారు. వార్డులో వీధి దీపాల సమస్య ఉందని సభ్యురాలు సాడి పద్మారెడ్డి మేయర్ దృష్టికి తీసుకెళ్లగా.. 24 గంటల్లో ఆ వీధిలో లైట్లు వెలిగేలా చూడాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. రాత్రివేళ బీచ్రోడ్డులో పాటు నగరంలోని ప్రధాన జంక్షన్లలో పారిశుధ్య నిర్వహణ లోపాలను సరిచేసి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సభ్యులు సేనాపతి వసంత, మొల్లి హేమలత, ముత్యాలు, గంకల కవిత, రాపర్తి త్రివేణి వరప్రసాదరావు, దాడి వెంకటేశ్వరరావు, గేదెల లావణ్య, మాదంశెట్టి చిన్నతల్లి, కొణతాల నీలిమ తదితరులు పాల్గొన్నారు. -
కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది
శీతల గాలులు, వాతావరణ మార్పుల వల్ల వైరస్లు వేగంగా వ్యాప్తి చెంది శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. గత రెండేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది, ముఖ్యంగా డిసెంబర్లో రోగుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. మందుల కొరత లేకుండా స్టాక్ సిద్ధం చేశాం. దగ్గు, ఆయాసం మూడు రోజులకు మించి ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ సునీల్ కుమార్, సూపరింటెండెంట్, ఛాతీ ఆసుపత్రి -
న్యూఇయర్ వేడుకల్లో వ్యక్తి హత్య
గోపాలపట్నం: మద్యం మత్తులో జరిగిన గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి హత్యకు గురైన ఘటన ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని విమాన్నగర్లో చోటుచేసుకుంది. గొడవలో కర్రతో తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినోద్ నగర్కు చెందిన దారపు రమణ, తార బాలరాజు, మైలుపిల్లి దిలీప్ కుమార్(40) నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించేందుకు విమాన్నగర్ రైల్వే ట్రాక్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ రైల్వే పనుల కోసం వేసిన రేకుల షెడ్లలో నివాసం ఉంటున్న కూలీలు న్యూ ఇయర్ సందర్భంగా డ్యాన్సులు వేస్తుండగా, వీరు కూడా వారితో కలిసి చిందులేశారు. కొద్దిసేపటి తర్వాత దారపు రమణ, తార బాలరాజు అక్కడి నుంచి వెళ్లిపోగా, దిలీప్కుమార్ మాత్రం అక్కడే ఉండి మద్యం సేవించాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నవారితో దిలీప్కు గొడవ జరిగింది. దీంతో రైల్వే కూలీల్లో ఒకరు కర్రతో దిలీప్ తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయమైంది. ఎంతసేపటికీ దిలీప్ రాకపోవడంతో అతని స్నేహితులు రమణ, బాలరాజు వెనక్కి వచ్చి చూడగా.. అతను రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే వారు అతన్ని చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి దిలీప్ మృతి చెందాడు. మృతుడి భార్య చంద్రిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దిలీప్కు భార్య, కుమార్తె పునర్విక, తల్లి సావిత్రి ఉన్నారు. ప్రస్తుతం అతని భార్య గర్భవతి కావడం అందరినీ కలచివేస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, మృతికి కారకులైన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మద్యం మత్తులో ఘటన -
పరుగులే..
పట్టించుకోకపోయినా విశాఖ విమానాశ్రయంలో ప్రయాణికులుసాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమైన విశాఖపట్నం ఎయిర్పోర్టు.. ప్రయాణికుల రాకపోకల్లో ఏటా గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. 2024తో పోలిస్తే, 2025లో ప్రయాణికుల రాకపోకల్లో 9శాతం వృద్ధిని సాధించింది. అంతకుముందు 2022–23తో పోల్చితే 2023–24లో ఏకంగా 22 శాతం వృద్ధి నమోదైంది. అయితే, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు అలసత్వం, ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కారణంగా వృద్ధి రేటులో కొంత తగ్గుదల కనిపించింది. విశాఖకు రావల్సిన అంతర్జాతీయ సర్వీసులు విజయవాడ, ఇతర రాష్ట్రాలకు తరలిపోయినా.. ఎయిర్పోర్టు అధికారులు, ఎయిర్ట్రావెల్స్ అసోసియేషన్ సమన్వయంతో విమానాశ్రయాన్ని ముందుకు నడిపించి మంచి ఫలితాలు సాధించారు. 2025లో గణనీయమైన ప్రగతి 2025లో విశాఖ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీ, మౌలిక వసతులు, భద్రత, సామాజిక బాధ్యత(సీఎస్సార్) వంటి రంగాల్లో మంచి ఫలితాలను రాబట్టింది. ప్రయాణికుల రద్దీలో 9 శాతం వృద్ధి నమోదైంది. నెలకు సగటున 2 లక్షల మంది వైజాగ్ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించడం విశేషం. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు.. ఇండిగో సంక్షోభ సమస్యను వెంటనే పరిష్కరించి ఉంటే.. ప్రయాణికుల రాకపోకల వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉండేది. ఆ సమయంలో నాలుగైదు రోజుల పాటు పదుల సంఖ్యలో సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు ఎయిర్పోర్టు ఘనతలివీ.. ● 2025లో సుమారు 27.55 లక్షల మంది ప్రయాణించారు. 2024లో ఈ సంఖ్య 25.21 లక్షలు ● 2025 జనవరి, నవంబర్లో రద్దీ గరిష్టంగా 2.7 లక్షలకు చేరింది. ● ప్రయాణికుల కోసం ఆధునిక బేబీ కేర్ గదులు, ప్రముఖ బ్రాండ్లకు చెందిన రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేశారు. ● కస్టమర్ సంతప్తి సర్వే (సీఎస్ఐ)లో 4.92/5 స్కోరు సాధించింది. ఈ స్కోరుతో జాతీయ స్థాయిలో 9వ స్థానంలో ఎయిర్పోర్టు నిలవడంగమనార్హం. అంతర్జాతీయ సర్వీసులపై రాజకీయ నిర్లక్ష్యం? అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అన్ని అర్హతలున్నా.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వైజాగ్ ఎయిర్పోర్టుకు శాపంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. 2025 మొదట్లో దుబాయ్ విమానం వైజాగ్ రాకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకొని విజయవాడకు తరలించేసింది. తర్వాత.. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు నిర్లక్ష్యంతో వియత్నాం విమాన సర్వీసు హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయింది. డొమెస్టిక్ సర్వీసుల విషయంలోనూ అదే నిర్లిప్తంగా ఎయిర్పోర్టు వర్గాలు వ్యవహరించారు. ఆకాశా ఎయిర్లైన్స్ వైజాగ్ నుంచి సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నా, కేంద్ర మంత్రి చొరవ లేకపోవడంతో సందిగ్ధంలో పడింది. చివరకు జూన్లో అబుదాబీకి వారానికి నాలుగు రోజుల సర్వీసు ప్రారంభమైంది. చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే సింగపూర్, అబుదాబీలతో పాటు దుబాయ్, వియత్నాం సర్వీసులు కూడా నడిచేవి. ఇప్పటికై నా కేంద్ర మంత్రి, ఎయిర్పోర్టు అధికారులు స్పందించి సర్వీసుల పెంపుపై దృష్టి సారించాలని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ కోరుతోంది. 2025లో విశాఖ ఎయిర్పోర్ట్ జోరు రాజకీయ సవాళ్ల నడుమ 9 శాతం వృద్ధి విశాఖ నుంచి 27 లక్షల మంది ప్రయాణం కార్గోలోనూ రికార్డులు కార్గోలోనూ పురోగతి వైజాగ్ ఎయిర్పోర్టు కార్గో టెర్మినల్లో నవంబర్ 14న సరకు రవాణా పునఃప్రారంభమైంది. సాధారణ రోజుల్లో పౌర విమానాల్లోనూ డొమెస్టిక్ కార్గో రవాణా జరిగింది. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు మొత్తం 4,902.876 మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ జరిగింది. ఇందులో ఎగుమతులు 1955.369 మెట్రిక్ టన్నులు కాగా, దిగుమతులు 2947.507 మెట్రిక్ టన్నులుగా నమోదయ్యాయి. మార్చిలో అత్యధికంగా 593.195 మెట్రిక్ టన్నుల సరకు రవాణా జరిగింది. ప్రతి నెలా సగటున 340 మెట్రిక్ టన్నులకు పైగా సరకు హ్యాండ్లింగ్ జరిగింది. -
మైనింగ్ పిడుగు?
గిరిజన పల్లైపెకొండపై పచ్చని తోటలు, కింద వరి సాగుతో కళకళలాడుతున్న ఇచ్ఛాపురం గిరిజన పల్లెతగరపువలస: ఆనందపురం మండలం కుసులవాడ పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామమైన ఇచ్ఛాపురంలో మైనింగ్ ముప్పు ముంచుకొస్తోంది. ఇక్కడి సర్వే నంబర్ 37పీలో మైనింగ్ తవ్వకాల కోసం తెరచాటుగా అనుమతుల ప్రక్రియ చకాచకా సాగిపోతోంది. నీళ్లకుండీలు–విజయనగరం రహదారిలో బాకూరుపాలెం గ్రామానికి రెండు కిలోమీటర్లు దూరంలో.. పచ్చని కొండల మధ్య కాలుష్యానికి ఆమడ దూరంగా ఉన్న ఈ గ్రామంలో 60 గిరిజన కుటుంబాలకు చెందిన 300 మంది నివసిస్తున్నారు. కనీస వసతులు, సరైన రహదారి కూడా లేని ఈ గ్రామంలోని సహజ వనరుల దోపిడీకి రంగం సిద్ధమవుతోంది. గ్రామంలో 80 ఎకరాల వరకు జిరాయితీ భూములు కాగా, 600 ఎకరాల మేర ప్రభుత్వ భూములు ఉన్నాయి. జగ్గమ్మ గెడ్డ కాలువ ఏడాది పొడవునా ప్రవహిస్తుండటంతో, ఒక పంట చేతికొచ్చిన వెంటనే మరో పంట వేయడం ఇక్కడి రైతులకు ఆనవాయితీ. వరితో పాటు వేరుశనగ, పెండలం, కొండవాలులో నీలగిరి, మామిడి, జీడి, అరటి, మునగ తోటలను వీరు సాగు చేస్తుంటారు. అయితే, అమాయకులైన గిరిజనులను గుప్పిట్లో పెట్టుకున్న కొందరు బడా వ్యాపారులు.. వారి పేరుతోనే ఈ కొండపై తోటలు సాగు చేయిస్తూ, వచ్చే లాభాల్లో 80 శాతం తాము తీసుకుని, మిగిలిన 20 శాతం మాత్రమే గిరిజనులకు ఇస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. అంతా రహస్యమేనా.? కుసులవాడ గ్రామ పంచాయతీలో ప్రతీదీ రహస్యంగానే జరుగుతోంది. ఇక్కడి ప్రజలకు కనీస సమాచారం లేకుండానే మైనింగ్ అనుమతులు తెచ్చుకోవడం, పశు మాంసం వ్యర్థాలు పూడ్చడం వంటివి చేస్తున్నారు. పంచాయతీలో 4,500 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు ఉన్నా, వాటిని పరిశ్రమల కోసం లేదా ప్రజావసరాల కోసం వినియోగించడం లేదు. – షిణగం దామోదరరావు, వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు, ఆనందపురం దత్తత గ్రామంలో గిరిజనులకు కష్టాలు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మా పంచాయతీని దత్తత తీసుకున్నప్పుడు రోడ్లు, వీధిదీపాలు, తాగునీరు వంటి వసతులు కల్పిస్తారని ఆశపడ్డాం. కానీ ఇప్పుడు మైనింగ్ పేరుతో భయపెడుతున్నారు. ఇదే జరిగితే ఇక్కడి 60 కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుంది. – వరపుల అర్జున్, మాజీ సర్పంచ్, కుసులవాడ గట్టిగా ప్రతిఘటిస్తాం మా తాతల కాలం నుంచి తోటలు సాగు చేసుకుంటూ ఎన్ని కష్టాలు ఎదురైనా జీవిస్తున్నాం. ఇప్పుడు కొండల తవ్వకాలు జరిగితే తోటలు నాశనమై, పంటలు పండక, పశువులకు మేత దొరకక మట్టిపాలవుతాం. మా ప్రాణం పోయినా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకాలను అడ్డుకుంటాం. – వరపుల ఎర్రయ్య, గిరిజన రైతు ఆనందపురం మండలం, కుసులవాడ పంచాయతీ పరిధిలోని ఇచ్ఛాపురం గిరిజన గ్రామానికి ముప్పు పొంచి ఉంది. పచ్చని కొండల మధ్య ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న గిరిజనుల బతుకుల్లో మైనింగ్ చిచ్చు రగల్చబోతోంది. స్థానిక ఎమ్మెల్యే దత్తత తీసుకున్న కుసులవాడ పంచాయతీలోని ఈ గ్రామంలో అభివృద్ధి మాట అటుంచి.. రహస్యంగా మైనింగ్ అనుమతులు పొందుతూ.. గిరిజనుల జీవనాధారమైన కొండలను పిండి చేసేందుకు బడా బాబులు సిద్ధమవుతున్నారు. దీంతో గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దత్తత పంచాయతీలో దగా! భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2024 ఎన్నికల సమయంలో కుసులవాడ పంచాయతీని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గెలిచిన తర్వాత కూడా ఇదే మాట చెప్పారు. దీంతో తమ పంచాయతీ అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశపడ్డ గిరిజనులకు నిరాశే మిగిలింది. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. మైనింగ్, పశు మాంసం వ్యర్థాలను పూడ్చడం వంటి చర్యలతో గ్రామాన్ని కాలుష్య కాసారంగా మారుస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. నాగ్పూర్కు చెందిన మెస్సర్స్ అగ్నిసుముఖ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇచ్ఛాపురంలో ఐదేళ్ల పాటు క్వార్జైట్ రాయి తవ్వకానికి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 15 హెక్టార్లలో తవ్వకాలు జరపడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు గిరిజనులు, వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో మైనింగ్కు అనుమతులు కోరితే ప్రజాభిప్రాయ సేకరణ అవసరమవుతుందని, దాన్ని తప్పించుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. మొదటి దశలో 4.990 హెక్టార్ల కోసం అనుమతులు తీసుకుని, విడతల వారీగా మైనింగ్ చేపట్టేందుకు పావులు కదుపుతున్నారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా మైనింగ్ జరిగితే పంటలు, తోటలు నాశనమై, బతుకుదెరువు కోసం వలసలు పోవడం తప్ప మరో మార్గం ఉండదని గిరిజనులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయంపై కుసులవాడ వీఆర్వో కృష్ణ నరసింహులును సంప్రదించగా.. గిరిజనులు మైనింగ్ను వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు. -
అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దాం
మహారాణిపేట: కలెక్టరేట్లో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్.. కలెక్టరేట్ సిబ్బందితో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2026 జిల్లాకు అన్ని రంగాల్లో పురోగతి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేయాలని సూచించారు. బాధ్యతాయుత పాలన, పారదర్శకత, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో ప్రత్యేక ఉప కలెక్టర్లు, వివిధ విభాగాల జిల్లాస్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలను ముగించారు. ● నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కలెక్టర్ను పలువురు ఉన్నతాధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు, అలాగే సంజీవని నిధికి చెక్కులను అందజేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో జేసీ మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పలు సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు ఉన్నారు. -
కలుషిత నీటికి చెక్
ప్రారంభించిన జీవీఎంసీ కమిషనర్ డాబాగార్డెన్స్: ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా రాష్ట్రంలోనే తొలిసారిగా నగరంలో మొబైల్ నీటి పరీక్ష ప్రయోగశాలను ప్రారంభించినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. వాటర్ సప్లై కంపెనీ(విస్కో) రూ.40 లక్షల సీఎస్సార్ నిధులతో ఈ మొబైల్ ల్యాబ్ను సమకూర్చింది. ప్రజలకు నిరంతరాయంగా సేవలందించేందుకు గానూ డీఎంహెచ్వో, జీవీఎంసీ తాగునీటి విభాగానికి దీని నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఈ వాహనాన్ని జీవీఎంసీ ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణరాజుతో కలిసి కమిషనర్ తన బంగ్లా వద్ద గురువారం ప్రారంభించారు. అనంతరం వాహనంలోని నీటి నాణ్యత పరీక్ష పరికరాలను, ప్రయోగశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగర ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యంగా మొబైల్ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ వాహనంలో శిక్షణ పొందిన ప్రొఫెషనల్ కెమిస్టులు అందుబాటులో ఉంటారని, వీరు అత్యాధునిక పరికరాల ద్వారా నీటి నాణ్యతను శాసీ్త్రయంగా విశ్లేషిస్తారని వివరించారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు ఈ వాహనం వెళ్తుందని, ప్రజలు తాము తాగే నీరు ఎంత వరకు సురక్షితమో అక్కడికక్కడే తెలుసుకోవచ్చని అన్నారు. సుమారు రూ.40 లక్షల వ్యయంతో తయారుచేసిన ఈ వాహనంలో స్పెక్ట్రోఫొటోమీటర్, టర్బిడిటీ మీటర్, డిజిటల్ టైట్రేటర్ వంటి 7 రకాల అధునాతన పరికరాలు ఉన్నాయని తెలిపారు. జీవీఎంసీ వాటర్ సప్లై విభాగం ఆధ్వర్యంలో ఈ వాహనం ప్రతి వార్డులో పర్యటించేలా ఒక ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. జీవీఎంసీ పర్యవేక్షక ఇంజినీర్లు పల్లంరాజు, ఏడుకొండలు, కార్యనిర్వాహక ఇంజినీర్లు మురళీకృష్ణ, శ్రీనివాస్, ఇతర జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా 9 మందికి గాయాలు
కొమ్మాది : ఎండాడ జాతీయ రహదారి నుంచి రుషికొండ వెళ్లే రహదారిలో డివైడర్ను ఢీకొని ఓ ఆటో బోల్తా పడింది. పీఎం పాలెం ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఆర్ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. గురువారం సాయంత్రం మధురవాడ ప్రాంతానికి చెందిన 9 మంది కుటుంబ సభ్యులు ఆటోలో రుషికొండ బీచ్కు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 9 మందికి స్వల్పగాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న పలువురు ప్రయాణికులు వారిని గమనించి సహాయక చర్యలు చేపట్టారు. ఆ సమయంలో రోడ్డులో వాహనాలు ఏమి లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అదే విధంగా గురువారం తెల్లవారుజామున భీమిలి నుంచి విశాఖ వైపుగా వెళ్తున్న ఓ కారు అతి వేగంగా వచ్చి అదుపు తప్పి తిమ్మాపురం సమీపంలో డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డివైడర్ మధ్యలో ఉన్న గ్రిల్స్ ధ్వంసం కాగా డివైడర్ మధ్యలో ఉన్న చెట్టు వాలిపోయింది. కారులో ఉన్న వారికి గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో న్యూ ఇయర్ సంబరాలు
మహారాణిపేట: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో కేక్ కోసి సంబరాలు జరుపుకొన్నారు. అనంతరం కేకే రాజును విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఎస్ఈసీ సభ్యులు బాణాల శ్రీనివాసరావు, రొంగలి జగన్నాథం, పార్టీ నాయకులు గొలగాని శ్రీనివాసరావు, పల్లా చిన్నతల్లి, నడింపల్లి కృష్ణంరాజు, కార్పొరేటర్లు కటారి అనిల్ రాజు, అల్లు శంకరరావు, పి.వి.సురేష్, గుండప్ప నాగేశ్వరరావు, బల్ల లక్ష్మణ్, బర్కత్ అలీ కలిశారు. వీరితో పాటు వార్డు అధ్యక్షులు, పార్టీ పరిశీలకులు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు కేకే రాజుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. -
విశాఖ రేంజ్ ఐజీగా గోపీనాథ్ బాధ్యతల స్వీకరణ
విశాఖ సిటీ: విశాఖ రేంజ్ డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్న గోపీనాథ్ జట్టి పదోన్నతి పొందారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ)గా గురువారం ఆయన రేంజ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయంలోని ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఆయన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేంజ్ పరిధిలోని ఎస్పీలు తుహిన్ సిన్హా (అనకాపల్లి), అమిత్ బర్దర్ (అల్లూరి), కె.వి.మహేశ్వర్రెడ్డి (శ్రీకాకుళం), ఎస్.వి.మాధవరెడ్డి (మన్యం), ఎ.ఆర్.దామోదర్ (విజయనగరం) ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కలను అందించి పదోన్నతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికారుల సమక్షంలో ఐజీ కేక్ కట్ చేశారు. నూతన సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా ఐజీ ఆకాంక్షించారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. వేడుకల్లో రేంజ్ పరిధిలోని డీఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు, కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
సరదాలు.. సంతోషాలు
మిన్నంటిన 2026 స్వాగత సంబరాలు జనసంద్రమైన బీచ్రోడ్ ఆలయాలకు పోటెత్తిన జనంఏయూక్యాంపస్: నగరంలో నూతన సంవత్సరోత్సాహం ఉప్పొంగింది. 2025 జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, కోటి ఆశలతో 2026కు నగరవాసులు ఘనంగా స్వాగతం పలికారు. సాగర తీరం మొదలుకొని.. ఆలయాల వరకు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే కనిపించింది. అటు వినోదం, ఇటు దైవచింతన, మరోవైపు పర్యావరణ స్పృహతో వైజాగ్ వాసులు కొత్త ఏడాదిని సరికొత్తగా ఆరంభించారు. బీచ్రోడ్లో జనజాతర ఆర్.కె.బీచ్ గురువారం సందర్శకులతో కిటకిటలాడింది. సాగరతీరం సంతోషాల సంగమంగా మారింది. చిన్నారుల కేరింతలు, యువత కేకలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి అలల సాక్షిగా సెల్ఫీలు దిగుతూ యువత సందడి చేసింది. చిన్నారులు, యువత ఉల్లాసంగా గడుపుతూ, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నగర వాసుల నవ్వులు, ఆనందాల మధ్య కొత్త ఏడాది జోష్ స్పష్టంగా కనిపించింది. వినోదంతో పాటు భక్తికి కూడా నగరవాసులు పెద్దపీట వేశారు. 2026లో తమ లక్ష్యాలు నెరవేరాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ గురువారం ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తారు. సంపత్ వినాయగర్ ఆలయం, సింహాచలం, కనకమహాలక్ష్మి తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలతో కళకళలాడాయి. క్రిస్టియన్లు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఫాదర్, బిషప్లు శాంతి సందేశాన్ని అందించగా, కేక్లు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. యువత ‘హరిత’ స్వాగతం కేవలం సంబరాలకే పరిమితం కాకుండా.. నగర యువత తమ సామాజిక బాధ్యతను కూడా చాటుకుంది. గ్రీన్ ఇయర్గా మార్చుకోవాలనే సంకల్పంతో పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టింది. బీచ్రోడ్డులో వైజాగ్ వలంటీర్స్ ఆధ్వర్యంలో యువత పర్యాటలకు, నగరవాసులకు మొక్కలు పంపిణీ చేసింది. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మొక్కలు నాటడం ద్వారానే పర్యావరణాన్ని రక్షించుకోగలమని సందేశాన్నిచ్చారు. నగరవాసులు కూడా అంతే ఉత్సాహంతో మొక్కలను స్వీకరించి, వాటిని సంరక్షిస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా ఆనందోత్సాహాల మధ్య, ఆశావహ దృక్పథంతో 2026లోకి నగర ప్రజలు అడుగుపెట్టారు. -
న్యూ ఇయర్ కిక్కు..!
విశాఖ సిటీ: విశాఖలో మందుబాబులు విశ్వరూపం చూపించారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో తెగ తాగేశారు. మూడు రోజుల్లో రూ.20 కోట్ల మేర మద్యాన్ని గుటకేసేశారు. 2025కు వీడ్కోలు పలుకుతూ కొందరు.. 2026కు స్వాగతం పలుకుతూ మరికొందరు సంబరాలు చేసుకుంటే.. మందుబాబులు మాత్రం తాగడమే ఉద్యమంలా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒక రోజు ముందు నుంచే న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైపోయారు. దీంతో విశాఖలో కొత్త సంవత్సరం కళంతా వైన్షాపులు, బార్ల వద్దే కనిపించింది. దీంతో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. ఒక్క రోజే రూ.9.5 కోట్లు తాగేశారు.. మందుబాబులు 30వ తేదీ నుంచే తమ ఉద్యమానికి సిద్ధమైపోయారు. అందుకు తగ్గట్లుగానే వైన్షాప్, బార్ల నిర్వాహకులు భారీగా స్టాకును విడిపించి గొడౌన్లను నింపేసుకున్నారు. ఈ మద్యం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని రాబట్టుకోవాలని ముందుగానే నిర్ణయించింది. ఇందుకోసం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతించింది. దీంతో అర్ధరాత్రి సమయాల్లో కూడా వైన్షాపులు, బార్లు మందుబాబులతో కళకళలాడుతూ కనిపించాయి. 30వ తేదీ మధ్యాహ్నం నుంచే మద్యం దుకాణాల వద్ద హడావుడి మొదలైంది. 31వ తేదీకి రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగిన్నట్లు తెలుస్తోంది. గతేడాది 31, 1 తేదీల్లో మొత్తంగా రూ.12 కోట్లు మద్యం అమ్మకాలు జరగగా.. ఈసారి 31వ తేదీ ఒక్కరోజే రూ.9.5 కోట్ల మేర మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. 30, 31, 1వ తేదీల్లో మొత్తంగా రూ.20 కోట్ల మేర మద్యాన్ని తాగేశారు. మందుబాబుల హల్చల్.. నూతన సంవత్సరం వేళ నగరంలో మందుబాబులు తప్పతాగి చిందులేశారు. బహిరంగంగానే మద్యం సేవించారు. తాగిన మత్తులో రోడ్లపై బైక్లతో చక్కర్లు కొట్టారు. ఒకవైపు పోలీసుల నిఘా ఉన్నప్పటికీ ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. దీంతో పోలీసులు బహిరంగంగా మద్యం తాగిన 99 మందిపైన, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన 257 మందిపైన కేసులు పెట్టారు. -
మళ్లీ చర్చకు వాయిదా అంశాలు
డాబాగార్డెన్స్: తీవ్ర విమర్శలు, అవినీతి ఆరోపణల కారణంగా గతంలో వాయిదా పడిన అంశాలనే మళ్లీ ఆమోదం కోసం స్థాయీ సంఘ సమావేశం అజెండాలో చేర్చిన తీరు జీవీఎంసీలో చర్చనీయాంశమైంది. గత ఏడాది యోగా డే సందర్భంగా ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్ల బిల్లుల చెల్లింపు వ్యవహారం ఇందులో ప్రధానంగా ఉంది. శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్, స్థాయీ సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ఈ అంశం మరోసారి చర్చకు రానున్నాయి. మళ్లీ తెరపైకి యోగా డే బిల్లులు గత ఏడాది జూన్ 21న నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. అయితే, ఈ కార్యక్రమం ముగిసిన ఆరు నెలల తర్వాత, గత డిసెంబర్ 6న జరిగిన సమావేశంలో దాదాపు రూ.1.62 కోట్ల బిల్లుల చెల్లింపునకు అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పెట్టారు. ఒక్కో పోర్టబుల్ వీఐపీ టాయిలెట్ యూనిట్కు రోజుకు రూ.16,200 చొప్పున అద్దె నిర్ణయించడంపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో ‘మొబైల్ టాయిలెట్ మస్కా’ పేరిట కథనం కూడా ప్రచురితమైంది. గత సమావేశంలో ఈ అంశంపై స్థాయీ సంఘం సభ్యులు సాడి పద్మారెడ్డి, రాపర్తి త్రివేణి వరప్రసాదరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని వారు పట్టుబట్టడంతో మేయర్ ఆ అంశాన్ని వాయిదా వేశారు. అయితే.. ఆ విచారణ ఏమైందో, నివేదిక ఏమొచ్చిందో తెలియకుండానే.. శుక్రవారం జరిగే సమావేశంలో అవే బిల్లులను ఆమోదం కోసం అజెండాలో చేర్చడం గమనార్హం. 87 అంశాలతో సమావేశం శుక్రవారం సమావేశంలో మొత్తం 87 అంశాలు సభ్యుల ఆమోదానికి రానున్నాయి. వీటిలో అభివృద్ధి పనులు, రెవెన్యూ, సర్వీస్ అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరిలో ఆర్.కె.బీచ్ వేదికగా జరగనున్న అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష (ఐఎఫ్ఆర్)–2026 కోసం దాదాపు రూ.2.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జీవీఎంసీ 29వ వార్డు పరిధిలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు రూ.36.36 లక్షలతో బ్లాక్ టాప్ రోడ్లు, ఎన్టీఆర్ విగ్రహం నుంచి కోస్టల్ బ్యాటరీ తూర్పు వైపు రూ.35.30 లక్షలతో బీటీ రోడ్డు పునరుద్ధరణ, 32వ వార్డు అల్లిపురం రోడ్డు ఉత్తరం వైపు బీటీ రోడ్డుకు రూ.36.40 లక్షలు, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఫుట్పాత్లు, సెంట్రల్ డివైడర్ మరమ్మతులు, పెయింటింగ్కు రూ.25.80 లక్షలు, పోలీస్ బ్యారెక్స్ జంక్షన్ నుంచి చౌల్ట్రీ జంక్షన్ వరకు రూ.35.40 లక్షలతో బీటీ రోడ్డు, 37వ వార్డు బీచ్రోడ్డు భారత్ పెట్రోలియం బంక్ నుంచి నేవల్ క్యాంటీన్ వరకు రూ.33.50 లక్షలతో రోడ్డు పనులు, నేవల్ క్యాంటీన్ కొత్త జాలరిపేట జంక్షన్ వద్ద దెబ్బతిన్న కల్వర్టు పునర్నిర్మాణానికి రూ.27.25 లక్షలు తదితర పనులకు పరిపాలనా పరమైన ఆమోదం కోసం కమిటీ ముందుంచనున్నారు. -
ఎస్ఎంఎస్–2లో రికార్డు హీట్ల ఉత్పత్తి
ఉక్కునగరం : స్టీల్ మెల్ట్షాప్–2లో మంగళవారం ఎక్కువ హీట్లు ఉత్పత్తి చేశారు. ఉదయం ఏ షిఫ్ట్లో 20 హీట్లు, బీ షిఫ్ట్లో 26 హీట్లు, సీ షిఫ్ట్లో 30 హీట్లు వెరసి మూడు షిఫ్ట్ల్లో మొత్తం 76 హీట్లుతో గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక హీట్లు సాధించి రికార్డు ఉత్పత్తి సాధించారు. ఇంతకు ముందు 2025 ఆగస్టు 12న అత్యధికంగా 72 హీట్లు సాధించగా డిసెంబర్ 24న 73 హీట్లు సాధించి ఆ రికార్డును అధిగమించింది. ఇప్పుడు 76 హీట్లతో ఆ రికార్డును తిరగరాశారు. ఈ సందర్భంగా విభాగం ఉద్యోగులను విభాగాధిపతి, అధికారులు అభినందించారు. -
వీధి దీపాలపై స్పెషల్ ఫోకస్
డాబాగార్డెన్స్: జీవీఎంసీ అభివృద్ధిలో నగర పౌరుల సహకారం ఎనలేనిదని మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో ప్రధాన సమస్యగా ఉన్న వీధి దీపాల మరమ్మతులకు 50 రోజుల ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, రాబోయే ఆరేడు నెలల్లో నగరాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని వారు స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ వెండింగ్ జోన్స్కి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పారదర్శక పాలన కోసం నగరాన్ని 10 జోన్లుగా విస్తరించామని, ఇప్పటివరకు 102 జంక్షన్లను ఆధునికీకరించామని వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో రెవెన్యూ వసూలైందని తెలిపారు. 2025–26 ఏడాదికి గాను రూ.657.39 కోట్ల అంచనాలతో 1,667 అభివృద్ధి పనులను చేపట్టామని, ఇందులో ఇప్పటికే రూ.82.75 కోట్లతో 486 పనులు పూర్తి చేశామని వెల్లడించారు. విశాఖను ప్లాస్టిక్ రహిత, పర్యావరణహిత సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులు, అధికారులకు, సహకరిస్తున్న ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
రెట్టింపు ఉత్సాహంతో పని చేద్దాం
సాక్షి, విశాఖపట్నం: నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో సుభిక్షంగా జీవించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆకాంక్షించారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజలందరిపై భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సేవలో నిబద్ధతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తూ, కార్యకర్తలంతా ఐక్యంగా ఉండి పార్టీ ఆశయాలను కింద స్థాయి వరకూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అందరి సహకారంతో పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దుదామని కేకే రాజు పేర్కొన్నారు. -
నయా జోష్
ఏయూ క్యాంపస్: కాలం ఆగదు.. జ్ఞాపకాలు చెరిగిపోవు. 2025 నేర్పిన పాఠాలను, మిగిల్చిన తీపి గుర్తులను పదిలపరుచుకుంటూ.. విశాఖ నగరం 2026కి జై కొట్టింది. సమయం లేదు మిత్రమా.. అంటూ సాగర తీరపు అలల సాక్షిగా నగరవాసులు కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. గడిచిన కాలాన్ని వెనక్కి నెడుతూ, కొత్త ఆశలతో, రెట్టించిన ఉత్సాహంతో విశాఖ వాసులు నూతన అధ్యాయాన్ని ఆరంభించారు. కాగా.. బుధవారం సాయంత్రం నుంచే నగరం కొత్త రంగులు అద్దుకుంది. ఎటు చూసినా పండగ వాతావరణమే కనిపించింది. బేకరీలు, స్వీట్ షాపులు, బొకే సెంటర్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఇక న్యూ ఇయర్ అంటేనే యూత్ జోష్.. నగరంలోని క్లబ్లు, బార్లలో సందడి తారస్థాయికి చేరింది. డీజే సౌండ్లు, లేజర్ లైట్ల వెలుగుల్లో యువత స్టెప్పులేస్తూ 2026కి రిచ్గా వెల్కమ్ చెప్పారు. స్టార్ హోటళ్లు, ఈవెంట్ వెన్యూలు అన్లిమిటెడ్ ఫుడ్, డ్రింక్స్తో దద్దరిల్లాయి. రూ.10 వేల నుంచి 20 వేల వరకు టికెట్లు ఉన్నా.. వెనకాడకుండా కపుల్స్, ఫ్యామిలీస్ క్యూ కట్టారు. మరోవైపు లిక్కర్ సేల్స్ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. వైజాగ్ స్పెషల్ అట్రాక్షన్ బీచ్ రోడ్ జనసంద్రంగా మారింది. కేక్ కటింగ్స్, పరస్పర శుభాకాంక్షలతో సముద్ర తీరం హోరెత్తింది. సాగర తీరపు గాలుల్లో కొత్త సంవత్సర ఉత్సాహం ఉప్పొంగింది. కొత్త ఏడాదిలో అంతా శుభం జరగాలని కోరుకుంటూ గురువారం నగరవాసులు ఆలయాలను సందర్శించుకోనున్నారు. సింహాచలం, సంపత్ వినాయక, కనకమహాలక్ష్మి ఆలయాల్లో ప్రత్యేక పూజలకు అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. వీఎంఆర్డీఏ పార్కులో.. -
ఈ ఏడాది మనకు కీలకం
నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అల్లిపురం: నగరంలోని ఆర్మ్డ్ రిజర్వ్(ఏఆర్) పోలీస్ మైదానాన్ని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి బుధవారం ఉదయం సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన పోలీస్ కవాతును పరిశీలించారు. ప్రత్యేక వాహనంపై మైదానమంతా కలియతిరుగుతూ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మైదానంలో డాగ్ స్క్వాడ్ పనితీరు, సిబ్బంది చేసిన లాఠీ డ్రిల్, ఆర్మ్ డ్రిల్, బ్యాండ్ ప్రదర్శన, వెపన్ స్ట్రిప్పింగ్ అండ్ అసెంబ్లింగ్ (ఆయుధాలను విడదీయడం, అమర్చడం) విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం దర్బార్ నిర్వహించి సిబ్బంది నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. 2026లో నగరంలో మరిన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమాలు జరగనున్నాయని, వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. సిబ్బందికి ఏ సమస్య వచ్చినా, ఎటువంటి సలహాలు ఉన్నా నేరుగా తన మొబైల్ నంబరు 79950 95799కు సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. చివరగా సిబ్బంది అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
ఆదాయార్జనలో వాల్తేరు 5వ స్థానం
సాక్షి, విశాఖపట్నం: భారతీయ రైల్వేలో వాల్తేర్ డివిజన్ తనదైన ముద్ర వేస్తూ 2025 ఏడాదిని ఘనంగా ముగించిందని డీఆర్ఎం లలిత్ బొహ్రా వెల్లడించారు. ఈ ఏడాది డివిజన్ సాధించిన విజయాల వివరాల్ని డీఆర్ఎం బుధవారం వెల్లడించారు. ప్రయాణికుల సేవలు, మౌలిక సదుపాయాల కల్పన, భద్రత, ఆదాయార్జనలో సరికొత్త మైలురాళ్లను అధిగమించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా అత్యధిక ఆదా యంతో పాటు సరకు రవాణా విషయంలోనూ వాల్తేరు డివిజన్ ఐదో స్థానంలో నిలిచిందని వివరించారు. ప్రయాణికుల భద్రత కోసం ఎల్హెచ్బీ రేక్ల్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇంకా డీఆర్ఎం చెప్పిన వివరాలివీ.. వాల్తేర్ డివిజన్ ఈ ఏడాది సరుకు రవాణాలో సరికొత్త రికార్డులు సృష్టించింది. కేవలం 230 రోజుల్లోనే 50 మిలియన్ టన్నుల లోడింగ్ పూర్తి చేయగా, నవంబర్ నాటికే 73.5 మిలియన్ టన్నుల సరకు హ్యాండ్లింగ్తో రికార్డు సృష్టించి దేశంలోని డివిజన్లలో ఐదో స్థానంలో నిలిచింది. అదేవిధంగా మొత్తం రూ.9,030 కోట్ల ఆదాయా న్ని ఆర్జించి.. దేశంలో 5వ ర్యాంక్ సాధించాం. ప్రయాణికుల రాకపోకల్లో 10 శాతం వృద్ధి నమోదు: ప్రయాణికుల రాకపోకల్లోనూ 10 శాతం వృద్ధి నమోదు చేసింది. మొత్తం 30.58 మిలియన్ మంది ప్రయాణికులు డివిజన్ నుంచి రాకపోకలు సాగించారు. విశాఖపట్నం–సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 2025 జనవరి 11 నుంచి 16 నుంచి 20 కోచ్లకు పెంచారు. ప్రయాణ డిమాండ్ను బట్టి మొత్తం 506 ప్రత్యేక రైళ్లతో పాటు 1,803 రైళ్లను పీక్ సీజన్లలో నడిపాం. రిజర్వేషన్ లేని ప్రయాణికులకు మద్దతుగా జనరల్ కోచ్లను చేర్చాం. ఆన్బోర్డ్ సేవలను మెరుగుపరచడానికి ఓబీహెచ్ఎస్ సిబ్బందికి కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహించాం. మార్చి 2025 నాటికి కీలక విభాగాలను రెట్టింపు చేయడంతో పాటు 360 కిలో మీటర్లకు పైగా డబుల్ లైన్లను ప్రారంభించడం వంటి ప్రధాన రైలు–మౌలిక సదుపాయాల పనులు వేగంగా అభివృద్ధి చెందాయి. రూ.1,200 కోట్లకు పైగా విలువైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించామని తెలిపారు. -
బొకేలు, స్వీట్లు వద్దు.. విరాళాలివ్వండి
మహారాణిపేట: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే వారు బొకేలు, స్వీట్లు, కేకులు తీసుకురావొద్దని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. వాటికి వెచ్చించే మొత్తాన్ని పేదలకు, అనారోగ్య బాధితులకు అండగా నిలిచే ‘సంజీవని నిధి’(జిల్లా సహాయ నిధి)కి విరాళంగా ఇవ్వాలని కోరారు. బుధవారం ఆయన జిల్లా ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. 2026లో ప్రజలందరికీ మంచి జరగాలని, వారి లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంతో.. 2026 సంవత్సరం జిల్లా అభివృద్ధిని మలుపు తిప్పబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి, అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలన్నారు. కాగా.. గురువారం ఉదయం 9.30 గంటల నుంచి కలెక్టర్ తన కార్యాలయంలో అందుబాటులో ఉంటారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. -
చెరువును పూడ్చేస్తున్నారు
పరవాడ: మండలంలోని నాయుడుపాలెం ఽశివారు రాముడుగారి గ్రామంలోని రాముడుగారి చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థాలను డంప్ చేస్తున్నారు. దీంతో చెరువు గర్భం పూడికలతో నిండిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లోని పనికిరాని చెట్లను తొలగించి ట్రాక్టర్లపై తీసుకొచ్చి చెరువులో వేస్తున్నారు. పాత ఇళ్లను తొలగిస్తున్న క్రమంలో వాటి డెబ్రిస్ను చెరువులో వేస్తుండటంతో రాన్రానూ చెరువు పూడుకుపో తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వ్యవసాయ పంటలకు సమృద్ధిగా నీరందడం కష్టంగా మారిందని చెప్తున్నారు. రాము డుగారి చెరువును కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
వెంకన్న అలంకారంలో దర్శనమిచ్చిన అప్పన్న
సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న రాపత్తు ఉత్సవాల్లో భాగంగా రెండవరోజు బుధవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వేంకటేశ్వరుడి అలంకారంలో దర్శనమిచ్చాడు. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేంకటేశ్వరస్వామిగా అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిలో వేంజేపచేశారు. ఆళ్వారులను మరొక పల్లకిలో అధిష్టింపజేశారు. సింహగిరి మాడ వీధుల్లో ఘనంగా తిరువీధి నిర్వహించారు. తిరువీధిలో భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు తదితరులు ఈ కార్యక్రమం నిర్వహించారు. -
నాట్యరంగంలో నాకో పేజీ ఉండాలి
చదువుతో పాటు సంప్రదాయ నృత్యంపై నాకు, నా తల్లిదండ్రులకు ఎంతో మక్కువ. ఈ క్రమంలో శ్రీనిర్మల నృత్య నికేతన్లో మా గురువు విజయజ్యోతి వద్ద తర్ఫీదు పొందుతున్నాను. నాలుగేళ్ల కాలంలోనే కూచిపూడి నృత్యంలో దేశంలోని పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల వద్ద ప్రత్యేక రోజుల్లో ప్రదర్శనలు ఇచ్చాను. జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ నెల 3న కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కోటి దీపోత్సవంలో ప్రదర్శన ఇవ్వడానికి మా గురువు, బృందంతో వెళుతున్నాను. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలన్నదే నా ఆశయం. – శార్వాణిదేవి, ఏయూ ఎంఏ(డ్యాన్స్) విద్యార్థిని, పెందుర్తి -
సౌత్ జోన్ క్రీడా పోటీల్లో సన్రిడ్జ్ విద్యార్థుల ప్రతిభ
సబ్బవరం: హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన సౌత్ జోన్ క్రీడా పోటీల్లో స్థానిక సన్రిడ్జ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్యార్థులు పాల్గొని తమ సత్తా చాటారు. స్కూల్ ఆవరణలో బుధవారం నిర్వహించిన అభినందన సభలో సీఐ జి.రామచంద్రరావు పాల్గొని పలు క్రీడల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులను వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్తో కలిసి అభినందించారు. జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో సబ్బవరం సర్పంచ్ దెడ్డం ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు యడ్ల నాయుడు, సిరపరపు వాసు తదితరులు పాల్గొన్నారు. -
చదువుతో పాటు క్రికెటర్గా రాణిస్తా
మా నాన్న గుప్తా హోంగార్డు. నేను తొలి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాను. మార్కుల విషయంలో రాజీ పడను. అదే సమయంలో నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నాలోని ఆసక్తిని గమనించిన మా పీడీ వర్మ సార్ మా కోసం పాఠశాలలో ఏకంగా క్రికెట్ పిచ్నే తయారు చేయించారు. ఆయన శిక్షణలో ప్రస్తుతం జిల్లాస్థాయి జట్టుకు ఎంపికై టోర్నీల్లో పాల్గొంటున్నాను. రానున్న రోజుల్లో మరింత రాణించి జాతీయ జట్టుకు ఆడాలన్నదే నా కల. – కళ్లూరి మురళీహర్ష, జిల్లాస్థాయి అండర్–14 క్రికెటర్, జెడ్పీ హైస్కూల్, గొరపల్లి -
వేంకటాద్రిపై విశేష పూజలు
పెందుర్తి: ‘అందరకును నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భవనపాలకా! లోనికి విడువుము. జెండాతో ఒప్పుచున్న తోరణములతో శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలకా! మణులచే సుందరమైన తలుపుల గడియను తెరువుము. గోప బాలికలమగు మాకు మాయావియు, మణివర్ణుడగు శ్రీకృష్ణపరమాత్మ ధ్వనిచేయు పఱ అను వాద్యమును ఇచ్చెదనని నిన్ననే మాట ఇచ్చారు. మేము వేరొక ప్రయోజనమును కాంక్షించి వచ్చినవారము కాదు. పరిశుద్ధభావముతో వచ్చాం. స్వామీ! ముందుగనే నీవు కాదనకు. దగ్గరగా ప్రేమతో ఒకదానినొకటి చేరి బిగువుతో నిలిచియున్న తలుపులను నీవే తెరచి మమ్మల్ని లోనికి పోనీయవలెను.. అని గోపికలు భవన పాలకుని, ద్వారపాలకుని అర్థించిరి’అంటూ గోదాదేవి సన్నిధిలో 16వ పాశుర సారాంశాన్ని వినిపించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా 16 రోజు బుధవారం విశేష పూజలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకుడు మహర్తి రామానుజాచార్యులు ఆధ్వర్యంలో స్వామిని మేల్కొలిపి హారతి ఇచ్చారు. సేవాకాలం, శాత్తుమురై, తిరుప్పావై పారాయణం శాస్త్రోక్తంగా జరిపారు. తీర్థ గోష్టి, ప్రసాద వితరణ జరిగింది. ఈవో నీలిమ ఏర్పాట్లు పర్యవేక్షించారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని గురువారం స్వామి నవనీతాలంకరణ(వెన్నతో అలంకారం)లో దర్శనమిస్తారు. -
నవనవోన్మేషంగా...
● కొత్త సంవత్సరం.. కోటి ఆశలతో ● కేరింతలే కాదు.. కెరీర్పై ఆలోచనకూ ఓ అడుగు ● వివిధ అంశాల్లో యువత మనోగతం పెందుర్తి: సరికొత్త ఆశలతో.. ఆలోచనలతో కొత్త ఏడాది మన ముందుకు వచ్చేసింది. కొద్ది గంటల క్రితం కాలగమనంలో కలిసిన పాత సంవత్సరంలో జరిగిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని.. కలిసొచ్చిన విషయాలను కొనసాగిస్తూ. వాటికి కొత్త ఆలోచనలను జోడించి ముందుకు సాగాల్సిన సమయం వచ్చేసింది. కేరింతలే కాదు.. కెరీర్ కూడా ముఖ్యమని గ్రహించిన యువత ఆ దిశగా.. చదువుతో పాటు వివిధ అంశాల్లో తమ ఆలోచనలకు పదును పెడుతూ వాటిని ఆచరణలో పెట్టేందుకు సంసిద్ధులవుతున్నారు. వారి క్రొంగొత్త ఆలోచనల మనోగతాన్ని ఇలా ఆవిష్కరించారు. -
బాల భీముడు
అనకాపల్లి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట ముత్యాలమ్మ కాలనీకి చెందిన కోసురు రూపవతి అనే మహిళ సాధారణ కాన్పులో బాలభీముడికి జన్మనిచ్చింది. 4.8 కిలోల బరువుతో మగబిడ్డ పుట్టాడు. రూపవతికి నెలలు నిండడంతో కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి ఆస్పత్రిలో జాయిన్ చేశారు. కాన్పు కష్టంగా ఉందని భావించి ఆపరేషన్కు ఏర్పాట్లు చేశారు. అయితే బుధవారం తెల్లవారుజామున సాధారణ కాన్పు జరిగింది. రూపవతికి 8వ నెలలో నిర్వహించిన అల్ట్రాసౌండ్ స్కానింగ్లో శిశువు బరువు 3 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. 9 నెలలు నిండిన అనంతరం శిశువు బరువు మరింత పెరిగినందున సిజేరియన్ తప్పదేమోనని అనుకున్నారు. వుడ్స్ కార్క్ స్క్రూ (మ్యాన్అవర్) విధానంలోని మెళుకువలను పాటించి, సహజ ప్రసవం చేయగా తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు, వైద్యురాలు సౌజన్య మాట్లాడుతూ ప్రసవ సమయంలో తల్లీబిడ్డలకు రిస్క్ ఎదురయ్యే ప్రమాదం ఉందని ముందుగానే గమనించి తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. -
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ‘ఆర్యభట్ట’ విద్యార్థులు
సబ్బవరం: విశాఖపట్నం జిల్లా స్థాయి పాలిటెక్నిక్ కళాశాలల గేమ్స్, స్పోర్ట్స్ మీట్లో స్థానిక ఆర్యభట్ట పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వాలీబాల్ బాలుర విభాగంలో విన్నర్స్గా, బాలికల విభాగంలో రన్నర్స్గా, ఖోఖో, బ్యాడ్మింటన్లో తృతీయ స్థానం, 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.సుధీర్బాబు బుధవారం మీడియాకు తెలిపారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను కళాశాల చైర్మన్ మహందత్ నాయుడు అభినందిస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీ ప్రవీణ్, వైస్ ప్రిన్సిపాల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదకరంగా పెదముషిడివాడ వంతెన
పరవాడ: లంకెపాలెం–సబ్బవరం రహదారిలో పెదముషిడివాడ వద్ద ఏర్పాటు చేసిన వంతెన మరమ్మతులతో మూల్గుతోంది. ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనకు కనీస మరమ్మతులు చేపట్టని కారణంగా ప్రమాద స్థాయికి చేరింది. వంతెనకు ఇరువైపులా నిర్మించిన రక్షణ గోడలు కూలిపోతున్నాయి. వంతెనపై నిత్యం వందల సంఖ్యలో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్న క్రమంలో వంతెన అడుగు భాగంలో పగుళ్లు ఏర్పడ్డాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెనకు ఇరువైపులా నిర్మించిన రక్షణ గోడలు కూడా శిథిలావస్థకు చేరాయి. వాహనాలు ఢీ కొట్టడడం వల్ల రక్షణ గోడలు విరిగిపోయి ప్రయాణికుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. వంతెన రోడ్డు గోతులమయం కావడంతో వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. ప్రమాదకరంగా మారిన వంతెనకు మరమ్మతులు చేపట్టడానికి రోడ్లు భవనాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
సినిమా రంగంలో అడుగు పెడతా
నేను డిప్లొమా మూడో ఏడాది చదువుతున్నాను. మా నాన్న ఆటో డ్రైవర్. నాకు తొలి నుంచీ సినిమాల మీద ఆసక్తి. ఈ క్రమంలో లేబర్.. సమాజంలో వారు పడుతున్న ఇబ్బందులపై నాలుగు నిమిషాల నిడివితో మా కళాశాల ఆవరణలోనే షార్ట్ ఫిల్మ్ తీశాను. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న శ్రామిక్ ఉత్సవ్లో దాన్ని ప్రదర్శించారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. నా దగ్గర షార్ట్ఫిల్మ్ తీయడానికి సెల్ఫోన్ లేదని తెలుసుకుని మా ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ సర్ కొత్త ఫోన్ కొనిచ్చి ప్రోత్సహించారు. రానున్న రోజుల్లో మరిన్ని షార్ట్ఫిల్మ్లు తీసి సినిమా రంగంలోకి అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నా. – అఫ్జల్ బాబా,షార్ట్ ఫిల్మ్ మేకర్, పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి -
నీరు శుద్ధి చేయాలంటే.. భయం భయం
పరవాడ: వాడచీపురుపల్లిలో సింహాద్రి ఎన్టీపీసీ ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి ట్యాంకుకు నిర్మించిన మెట్ల మార్గం, రక్షణ గోడలు శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది అందోళన చెందుతున్నారు. ట్యాంకుపైకి వెళ్లడానికి ఏర్పాటు చేసిన మెట్ల మార్గం ఎక్కడికక్కడ విరిగిపోయింది. దీంతో బ్లీచింగ్ చేసే సిబ్బంది ట్యాంకుపైకి వెళ్లడానికి భయపడుతున్నారు. ట్యాంకుపైన, చుట్టూ ఏర్పాటు చేసిన సిమెంటు రక్షణ గోడలు కూడా విరిగి కింద పడుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి మరమ్మతులతో మూల్గుతున్న రక్షిత మంచినీటి పథకానికి రిపేర్లు చేపట్టాలని ప్రజలు, సిబ్బంది కోరుతున్నారు. -
లేబర్ కోడ్లతో బానిసత్వంలోకి కార్మికవర్గం
● ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెలో పాల్గొనండి ● ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ పిలుపు సీతంపేట: కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల అమలుతో భారతీయ కార్మిక వర్గం బ్రిటిష్ కాలం నాటి బానిసలుగా మారే ప్రమాదం ఉందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల చట్టబద్ధ హక్కుల రక్షణ కోసం ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ‘లేబర్ కోడ్లు– భారతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రభావం’అనే అంశంపై బుధవారం ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటంలో అగ్రభాగాన నిలిచిన భారతీయ కార్మిక వర్గం, దేశానికి స్వాతంత్య్రం రాకముందే 8 గంటల పనిదినం, యూనియన్ పెట్టుకునే హక్కు, వేతన చట్టం, బోనస్ చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం వంటివి పోరాడి సాధించుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటన్నింటినీ రద్దు చేసి, లేబర్ కోడ్ల రూపంలోకి మార్చి కార్మికులను కార్పొరేట్లకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. కొత్త వేతన కోడ్ ద్వారా గతంలో ఉన్న వేతన బోర్డులకు కాలం చెల్లినట్టేనని, జీతాలు ఎగ్గొట్టే యజమానులను నిలదీసే అధికారం లేబర్ కమిషనర్కు లేకుండా చేశారని ఆమె మండిపడ్డారు. సోషల్ సెక్యూరిటీ కోడ్ వల్ల కార్మికులు సాధించుకున్న సంక్షేమ బోర్డులు రద్దయ్యాయని, 40 శాతం కార్మిక వర్గాన్ని ఈఎస్ఐ, పీఎఫ్ పథకాలకు దూరం చేశారని వివరించారు. సమ్మె చేయాలంటే 50 శాతం మంది ఆమోదం ఉండాలని, 60 రోజుల ముందే నోటీసు ఇవ్వాలని నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. దేశ సంపదను సృష్టించిన విశాఖ స్టీల్ ప్లాంట్, విమానయానం, బొగ్గు, చమురు, విద్యుత్ వంటి కీలక రంగాలన్నింటినీ అదానీ వంటి కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దీని వల్ల దేశం మళ్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన నాటి పరిస్థితుల్లోకి, కార్మికులు బానిసత్వంలోకి నెట్టివేయబడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జె. అచ్యుతరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్మిక సంఘం నాయకులు బి.సి.హెచ్. మసేన్, డి.ఆదినారాయణ, పడాల రమణ, మన్మథరావు, బూసి వెంకటరావు, కె.సత్యాంజనేయ, వామన మూర్తి, చంద్రశేఖర్, కాశిరెడ్డి సత్యనారాయణ, పడాల గోవింద్, షేక్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు. -
ఆసక్తిగా ఎన్టీపీసీలో మాక్ డ్రిల్
పరవాడ: అత్యవసర పరిస్థితుల్లో భద్రతా దళాల స్పందన సామర్థ్యాలను పరీక్షించడంలో భాగంగా సింహాద్రి ఎన్టీపీసీలో బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు సంస్థ ప్రాంగణంలో బాంబు ముప్పును ఎదుర్కొనే సన్నద్ధతపై ఈ మాక్ డ్రిల్ జరిపినట్లు అధికారులు తెలిపారు. సంస్థ ఈడీ సమీర్శర్మ, సీఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ రాజ్కుమార్, పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు నేతృత్వంలో జిల్లా బాంబు డిస్పోజల్ టీం, డాగ్ స్క్వాడ్ తనిఖీల్లో పాల్గొన్నాయి. పరవాడ పోలీస్ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ బలగాలు, ఎన్టీపీసీ భద్రతా విభాగం పాల్గొని, మాక్ డ్రిల్ను విజయవంతం చేశారు. భద్రతా బృందాలు నమూనా బాంబును గుర్తించి చాకచక్యంగా నిర్వీర్యం చేశాయి. అత్యంత క్రమశిక్షణతో సాగిన ఈ మాక్డ్రిల్ పూర్తిస్థాయిలో విజయవంతమైందని, పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉన్నారని సీఐ మల్లికార్జునరావు పేర్కొన్నారు. -
అగ్నిమాపక వాహనం, రోడ్ స్వీపింగ్ యంత్రం ప్రారంభం
విశాఖ సిటీ : విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అగ్నిమాపక కేంద్రంలో నూతనంగా సమకూర్చుకున్న రోడ్ స్వీపింగ్ యంత్రం, మల్టీపర్పస్ ఫైర్ టెండర్ను బుధవారం పోర్ట్ డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరాంజి కొరాటి ప్రారంభించారు. రూ.3.85 కోట్ల వ్యయంతో సమకూర్చుకున్న మల్టీపర్పస్ ఫైర్ టెండర్లో 6 కిలోలీటర్ల నీటి ట్యాంక్, 200 లీటర్ల ఫోమ్ కంపౌండ్, 100 కిలోల డ్రై కెమికల్ పౌడర్ (డీసీపీ), 45 కిలోల కార్బన్ డయాకై ్స డ్తో పాటు అత్యవసర పరిస్థితుల కోసం అవసరమైన ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. అలాగే రోడ్ స్వీపింగ్ మెషిన్ను పోర్ట్ పరిధిలోని అంతర్గత రహదారులపై ఏర్పడే దుమ్ము, చెత్త, స్పిల్లేజ్ను శుభ్రం చేయడానికి వినియోగించనున్నారు. రూ.4.69 కోట్ల వ్యయంతో ఈ యంత్రాన్ని కొనుగోలు చేశారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ యంత్రం గంటకు 20 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో అన్ని దిశల్లో శుభ్రపరిచే సామర్థ్యం కలిగి ఉంది. పోర్ట్ పరిసర ప్రాంతంలో దుమ్ము, కాలుష్య నియంత్రణకు ఇది మరింత దోహదపడనుంది. కార్యక్రమంలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ టి.అరుణ్ ప్రసాద్, పోర్ట్ విభాగాధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
దేశ రక్షణ కోసం మరో స్వాతంత్య్ర పోరాటం అవసరం
సినీ దర్శకుడు, నటుడు, రచయిత బాబ్జీ ఏయూక్యాంపస్ : దేశాన్ని కాపాడుకోవడానికి మరో స్వాతంత్య్ర సమరం సాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, రచయిత బాబ్జీ పేర్కొన్నారు. ‘సిటూ’ జాతీయ మహాసభలు సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవ్ ఐదో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖ ఉక్కు సహా.. దేశంలోని అన్ని వనరులనూ ఇద్దరు గుజరాతీలు అమ్మకానికి పెట్టగా.. ఇద్దరు గుజరాతీలు కొనుక్కుంటున్నారుని అన్నారు. దేశ రక్షణకు పిలుపు ఇస్తే భగత్ సింగ్లా ఉరికంబం ఎక్కడానికై నా తాను సిద్ధమేనని.. తాను ప్రజానాట్యమండలి బిడ్డనని.. ఎర్ర సినిమా తీయాలనే.. సినీ రంగాన్ని ప్రక్షాళన చేయడానికే సినీ రంగంలోకి వెళ్లానని తెలిపారు. అత్యంత శక్తిమంతమైన మాధ్యమం సినిమా రంగాన్ని కూడా ప్రజాసంఘంగా గుర్తించాలని ఆకాక్షించారు. ప్రత్యేక అతిథి ప్రొఫెసర్ కె.ఎస్.చలం మాట్లాడుతూ అదానీ, అంబానీలు దేశీయ పెట్టుబడిదారులు మాత్రమే కాదని, వారు అంతర్జాతీయ పెట్టుబడిదారులని వివరించారు. కార్మిక ధర్మనీతి–2025 చట్టం మనుధర్మ ప్రాతిపదికన చేసినట్లు పాలకవర్గమే ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. సమస్యలపై పోరాటాలు మరింత క్రియాశీలకంగా సాగాలని ఆకాంక్షించారు. సిటూ రాష్ట్ర నాయకురాలు సుబ్బరావమ్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ అభివృద్ధి సంక్షేమం, అచ్ఛేదిన్ అంటుంటాయంటూ.. సంపద అతి కొద్ది మంది వద్దే ఉండటమేనా అచ్ఛేదిన్ అని ప్రశ్నించారు. అంగన్వాడీ, ఆశ సిబ్బందిని కార్మికులుగా గుర్తించాలని అంతర్జాతీయ కార్మిక సంఘం సిఫార్సులనూ పట్టించుకోని ప్రభుత్వ తీరును ఖండించారు. తొలుత సిటు రాష్ట్ర నాయకులు కె.అజయ్కుమార్ స్వాగతం పలికారు. సభలో శ్రామిక ఉత్సవ్ కన్వీనర్ రమాప్రభ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
పద్మనాభం: మండలంలోని విజయానందరం జంక్షన్లో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా జామి మండలం కొత్త భీమసింగ్కు చెందిన పాండ్రంగి వెంకటేష్ (34) విజయనగరం వై జంక్షన్లో పాన్ షాపు, పార్లర్ షాపు నిర్వహిస్తున్నాడు. షాపుల నుంచి పని ముగించుకుని మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన కొత్త భీమసింగ్ వస్తుండగా మార్గంమధ్యలో విజయానందపురం జంక్షన్లో ఎస్టీ కాలనీ సమీపంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో వెంకటేష్కు కుడి చేయి విరిగిపోయింది. ముక్కులో నుంచి రక్తం వచ్చింది. స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్సు సంఘటన స్థలానికి చేరుకునేటప్పటికే వెంకటేష్ మృతి చెందాడు. మృతుడికి భార్య సత్యలత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సత్యలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
నిరంతర కృషితోనే లక్ష్య సాధన
మురళీనగర్ : విద్యార్థులు తమలోని సామర్థ్యాలను తెలుసుకుని నిర్దేశించుకున్న రంగంలో రాణించేందుకు నిరంతరం పనిచేయాలని జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ రవికిరణ్ ఈదర అన్నారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్లో నిర్వహిస్తున్న 28వ ప్రాంతీయ స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు పోటీల ముగింపు సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలోనూ అనేక సామర్థ్యాలు దాగి ఉంటాయని.. వాటిని గుర్తించి నచ్చిన రంగాన్ని ఎంచుకోవాలన్నారు. స్వీయ అభ్యాసం వ్యక్తిగత అభివృద్ధికి కీలకమని తెలిపారు. ఆలోచించడం, ప్రశ్నించడం ద్వారా జ్ఞానం మరింత విస్తరిస్తుందన్నారు. గెలుపు–ఓటములతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి క్రీడల్లో చురుకుగా పాల్గొని క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు జి.వి.రామచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ గేమ్స్ కన్నా ఇండోర్, అవుట్డోర్ క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె.వి.రమణ అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో అనకాపల్లి, భీమిలి, పాడేరు, చోడవరం పాలిటెక్నికల్ ప్రిన్సిపాల్స్ శ్రీనివాసరావు, మురళీకష్ణ, హరిబాబు, గోవింద నాయుడు, విభాగాధిపతులు పాల్గొన్నారు. చాంపియన్లు వీరే.. : వ్యక్తిగత అథ్లెటిక్స్ చాంపియన్షిప్ (బాలురు), వ్యక్తిగత అథ్లెటిక్స్ చాంపియన్షిప్ (బాలికలు), ఆల్ రౌండ్ స్పోర్ట్స్ చాంపియన్షిప్ (బాలురు), ఆల్ రౌండ్ గేమ్స్ చాంపియన్షిప్ (బాలురు), ఓవరాల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చాంపియన్షిప్ (బాలురు)గా గిడిజాల సాయిగణపతి పాలిటెక్నిక్ విద్యార్థులు నిలిచారు. బాలికల విభాగంలో ఆల్ రౌండ్ స్పోర్ట్స్ చాంపియన్షిప్, ఆల్ రౌండ్ గేమ్స్ చాంపియన్షిప్ (బాలికలు), ఓవరాల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చాంపియన్షిప్లను భీమునిపట్నం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ బాలికలు గెలుచుకున్నారు. వీరికి జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ రవికిరణ్ ఈదర చేతుల మీదుగా ట్రోఫీలు అందించారు. -
నవ వసంతం.. యువత సంకల్పం
కాలగమనంలో మరో ఏడాది కరిగిపోయింది. ఎన్నో ఆశలతో మొదలైన 2025.. మరెన్నో తీపి జ్ఞాపకాలను, అనుభవాలను మిగిల్చి చరిత్ర పుటల్లో చేరిపోయింది. గడిచిన ఏడాది నేర్పిన పాఠాలను పునాదిగా చేసుకుని, 2026కి యువత ఘనంగా స్వాగతం పలికింది. నూతన సంవత్సరంలో తమ కలలను సాకారం చేసుకునేందుకు అవసరమైన ప్రణాళికలను ఇప్పుడే రచించుకుంది. ప్రధానంగా విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తామని గాజువాకకు చెందిన పలువురు విద్యార్థులు ‘సాక్షి’తో తమ మనోగతాన్ని పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. – గాజువాక సాంకేతిక నైపుణ్యాలే లక్ష్యం ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే నిరంతర అభ్యాసం చాలా ముఖ్యం. అందుకే ఈ ఏడాది ఆన్లైన్ కోర్సులు, ప్రాజెక్టుల ద్వారా నా కంప్యూటర్ సైన్స్ నైపుణ్యాలను పెంచుకుంటాను. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన సాంకేతికతపై పట్టు సాధించి, వాటిని ప్రాక్టికల్గా వినియోగించే స్థాయికి ఎదుగుతాను. భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకునేలా నా కెరీర్ను మలుచుకుంటాను. – ఎం. తులసి, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, చైతన్య మహిళా పీజీ కళాశాల సమయపాలనతోనే విజయం గడిచిన కాలం తిరిగి రాదు.. అందుకే కొత్త సంవత్సరంలో ప్రతి నిమిషాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటాను. వ్యక్తిగత జీవితానికి, చదువుకు మధ్య సమతుల్యత పాటిస్తూ, మరింత బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఎదుగుతాను. నాకున్న జ్ఞానాన్ని సమాజ హితం కోసం వినియోగిస్తాను. ఎటువంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొని, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడానికి కట్టుబడి ఉంటాను. – ఇ. గాయత్రి, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంవీఆర్ డిగ్రీ, పీజీ కళాశాల చదువుకే నా తొలి ప్రాధాన్యం ఈ ఏడాది సోషల్ మీడియా, ఫోను వినియోగాన్ని తగ్గించి, కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంపై దృష్టి సారిస్తాను. దీనివల్ల ఏకాగ్రత పెరగడమే కాకుండా, ప్రాజెక్టులను సులభంగా పూర్తి చేయగలుగుతాను. అనవసరమైన ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలను దరిచేరనీయకుండా.. మంచి వ్యక్తిత్వంతో భవిష్యత్తును నిర్మించుకోవాలని సంకల్పించాను. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువులో రాణిస్తాను. – జి.స్వాతి, ఎం.కాం, చైతన్య మహిళా పీజీ కళాశాల సవాళ్లను అవకాశాలుగా భావిస్తాను చదువు పూర్తి చేసుకుని వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న తరుణంలో.. ఎదురయ్యే ప్రతి సవాలును ఒక అవకాశంగా మలుచుకుంటాను. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలకు, బయట ప్రపంచానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేలా నా నైపుణ్యాలను వృద్ధి చేసుకుంటాను. పరిశోధన, సమాజ సేవకు కట్టుబడి ఉండటంతో పాటు.. తోటివారికి స్ఫూర్తినిచ్చే నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటాను. – బి.మేఘనా సాయి, ఎమ్మెస్సీ అనలైటికల్ కెమిస్ట్రీ, ఎంవీఆర్ డిగ్రీ, పీజీ కళాశాల పరిశోధనపై దృష్టి పెడతా.. నూతన సంవత్సరంలో నా విద్యాభ్యాసానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, పరిశోధనా రంగంలో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. కేవలం చదువే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా సమయం కేటాయిస్తాను. నైతిక విలువలతో కూడిన జీవనాన్ని సాగిస్తూ, దేశాభివృద్ధికి ఉపయోగపడే వృత్తిలో స్థిరపడాలన్నదే నా ఆశయం. సమయపాలన పాటిస్తూ లక్ష్యం దిశగా సాగుతాను. – జె.సత్యనారాయణ, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, టీఎస్సార్, టీబీకే డిగ్రీ, పీజీ కళాశాల కుటుంబానికి అండగా నిలబడతా.. ఈ ఏడాదితో నా పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తవుతుంది. పట్టా చేతికి రాగానే మంచి ఉద్యోగం సాధించి, నా కుటుంబానికి అండగా నిలవాలన్నదే నా ప్రధాన లక్ష్యం. గతేడాది జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని, కెరీర్లో అభివృద్ధి వైపు అడుగులు వేస్తాను. ఎంతటి సమస్యనైనా చిరునవ్వుతో, ధైర్యంగా ఎదుర్కొనేలా నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను. వీలైనంత వరకు నలుగురికీ సాయపడతాను. అలాగే ఈ ఏడాది కొత్త ప్రదేశాలను సందర్శించాలని అనుకుంటున్నాను. – టి.శిరీష, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, టీఎస్సార్, టీబీకే డిగ్రీ, పీజీ కళాశాల -
విశాఖపై నెత్తుటి మరకలు
విశాఖ నగరానికి నెత్తుటి మరకలు అంటుకుంటున్నాయి. వరుస హత్యలు, నెత్తురోడుతున్న రహదారులతో నగరం ఉలిక్కిపడుతోంది. పోలీస్ శాఖ చేపట్టిన చర్యలతో మొత్తంగా నేరాల రేటు తగ్గిందని గణాంకాలు చెబుతున్నప్పటికీ.. మనిషి ప్రాణాలు తీసే కిరాతక నేరాలు పెరగడం భయాందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా 2024తో పోలిస్తే 2025లో హత్యల సంఖ్య గణనీయంగా పెరగడం, రహదారులపై మరణ మృదంగం ఆగకపోవడం నగర ప్రజలను కలవరపెడుతోంది. గత ఏడాది 24గా ఉన్న హత్యలు ఈ ఏడాది 35కు చేరడం, రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 349 మంది బలవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నగరంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పోలీసులు భరోసా ఇస్తున్నా.. పెరుగుతున్న ఈ ఘోరాలు చూస్తుంటే ‘విశాఖ సేఫేనా?’అనే ప్రశ్న ప్రజల మదిలో మెదులుతోంది. - అల్లిపురం విశాఖను సురక్షిత నివాస ప్రదేశంగా మార్చడానికి పోలీస్ శాఖ చేపట్టిన సమర్థవంతమైన చర్యలతో నగరంలో నేరాలు 12.71 శాతం మేర తగ్గుముఖం పట్టాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2025లో పోలీసులు సాధించిన ప్రగతి, ఛేదించిన కేసుల వివరాలను సీపీ వెల్లడించారు. 2024లో 5,921 కేసులు నమోదు కాగా.. 2025లో 5,168 కేసులు నమోదయ్యాయని వివరించారు. 2026లో మరింత సమర్థవంతమైన పోలీసింగ్తో, అత్యాధునిక సాంకేతికతను జోడించి ‘ప్రశాంత విశాఖే’లక్ష్యంగా ముందుకు వెళతామని సీపీ స్పష్టం చేశారు. తొలిసారిగా ‘బడ్స్’యాక్ట్ అమలు అనధికార డిపాజిట్ పథకాల నిషేధ(బడ్స్) చట్టం–2019ను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విశాఖలో అమలు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ చట్టం కింద 26 కేసులు నమోదు చేశామన్నారు. ఈ ఏడాది మొత్తం 653 ఆర్థిక నేరాలు నమోదైనట్లు వెల్లడించారు. తగ్గిన దొంగతనాలు 2024లో 1,149 చోరీ కేసులు నమోదు కాగా, 2025లో 1,126 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జరిగిన దొంగతనాల్లో మొత్తం రూ.7.82 కోట్ల సొత్తు చోరీకి గురవగా, అందులో రూ.4.90 కోట్ల విలువైన ఆస్తులను పోలీసులు రికవరీ చేశారు. 2025లో ఇంటి దొంగతనాలు, సెల్ఫోన్ దొంగతనాల నేరాల్లో 6 కేజీల బంగారం(విలువ రూ.5.25 కోట్లు), 16.1 కేజీల వెండి, రూ.67లక్షల నగదు, 186 మోటార్ సైకిళ్లు, 9 ఆటోలు, 2 లారీలు, 1 బస్సు, 5 కార్లు, 15 ల్యాప్టాప్లు, 139 మొబైల్ ఫోన్లు, రూ.6.33 కోట్ల విలువైన 4,222 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. మొత్తం రూ.10.56 కోట్ల విలువైన ఆస్తిని 757 మంది బాధితులకు అందజేశారు. మహిళల భద్రత ప్రాధాన్యంవిజిబుల్ పోలీసింగ్, నేర ప్రభావిత ప్రదేశాల జియో మ్యాపింగ్, మహిళా పోలీసుల పర్యవేక్షణ, కుటుంబ తగాదాలకు సంబంధించి కౌన్సెలింగ్ వంటి చర్యలతో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయని సీపీ తెలిపారు. 2024లో 1,216 కేసులు నమోదు కాగా, 2025లో 951 కేసులు (21.79 శాతం తగ్గుదల) నమోదయ్యాయి. పిల్లలపై నేరాలు కూడా 42.74 శాతం వరకు తగ్గినట్లు సీపీ వెల్లడించారు. 2024లో 131 కేసులు రాగా, 2025లో 75 నమోదయ్యాయి. డ్రోన్లతో నిఘా నేత్రం నగర భద్రత, మత్తు పదార్థాల నియంత్రణ కోసం 22 స్టేషన్ల పరిధిలో 15 డ్రోన్ల ద్వారా 2,833 చోట్ల రెక్కీ నిర్వహించారు. పండగలు, ర్యాలీలు, వీఐపీ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణలో డ్రోన్లను వినియోగించి 453 కేసులు నమోదు చేశారు. సైబర్ నేరాల్లో భారీ రికవరీ సైబర్ కేసులు తగ్గాయని కమిషనర్ తెలిపారు. 2024లో 374 సైబర్ నేరాలు నమోదు కాగా, 2025లో 286 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది 205 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.14.64 కోట్లు రికవరీ చేశారు(గతేడాది ఇది రూ.3.89 కోట్లు మాత్రమే). లోన్ యాప్ల ద్వారా మోసపోయిన 126 మంది బాధితులకు రూ.56 లక్షలు తిరిగి ఇప్పించారు. ముఖ్యమైన కేసుల్లో ట్రయల్స్ వేగంగా జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు చేపట్టారు. 2025లో 4,706 కేసులను కోర్టులు పరిష్కరించాయి. ఒక పోక్సో కేసులో 146 రోజుల్లోను, మరో కేసులో 234 రోజుల్లో తీర్పు వెలువడటం గమనార్హం. ప్రజల సహకారంతో సురక్షిత విశాఖ విశాఖకు టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు వస్తుండటం, భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కానుండటంతో ప్రముఖుల తాకిడి పెరిగిందని సీపీ తెలిపారు. ప్రైవేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రజల సహకారంతో విశాఖను సురక్షిత నివాస ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని చెప్పారు. సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కలవరపెడుతున్న హత్యలు నగరంలో 2024లో 24 మంది హత్యకు గురవగా, ఈ ఏడాది 35 హత్యలు జరిగాయి. మద్యం మత్తు, అక్రమ సంబంధాలు, క్షణికావేశమే హత్యలకు ప్రధాన కారణాలు. ద్వేషపూరిత నరహత్యలు 12, వరకట్న హత్యలు 3, మహిళల హత్యలు 7 జరిగాయి. మిగిలిన హత్యలకు ఆర్థిక వివాదాలు, ప్రేమ వ్యవహారాలు, చిన్నపాటి తగాదాలు కారణమయ్యాయి. ట్రాఫిక్ కఠినం.. అయినా ఆగని మరణాలు రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చినా, మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 2024లో 1,132 ప్రమాదాలు జరగ్గా, 2025లో 1,086 ప్రమాదాలు సంభవించాయి. అయితే మృతుల సంఖ్య 347 (2024) నుంచి 349కి (2025) చేరింది. స్పీడ్ లేజర్ గన్ వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణ, బైక్ రేసర్లపై కేసులు వంటి చర్యలతో ప్రమాదాలు అదుపులోకి వచ్చాయి. వచ్చే ఏప్రిల్ నాటికి ప్రైవేట్ సంస్థల సహకారంతో ట్రాఫిక్ ఉల్లంఘనులకు ఆటోమేటిక్గా ఫైన్లు వేసే ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. -
సాగర గర్భంలో 'స్వదేశీ' సింహం
సాక్షి, విశాఖపట్నం : దేశ రక్షణ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, హిందూ మహాసముద్ర జలాల్లో ఆధిపత్యం చెలాయించే దిశగా భారత నౌకాదళం సరికొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే వరుస క్షిపణి ప్రయోగాలతో దూసుకెళ్తోన్న నౌకాదళం తాజాగా మరో అడుగు ముందుకేసింది. శత్రు దేశాల గుండెల్లో గుబులు రేపేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నాలుగో ‘బాహుబలి’ బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి (ఎస్ – 4 స్టార్) సిద్ధమవుతోంది. విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మితమవుతున్న 7 వేల టన్నుల బరువున్న ఈ జంబో సబ్మెరైన్ రెండు రోజుల క్రితం సీ ట్రయల్స్ కోసం సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. 40 ఏళ్ల క్రితం ప్రారంభమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్స్ (ఏటీవీ) ప్రాజెక్టులో ఈ సబ్మెరైన్ ఒక కీలక మైలురాయిగా మారనుంది. 2027 జనవరిలో నౌకాదళ అమ్ముల పొదిలోకి.. » అరిహంత్ క్లాస్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ శ్రేణిలో ఇదే చివరిది. అందుకే గత మూడు జలాంతర్గాముల కంటే భిన్నంగా భారీగా తయారు చేస్తున్నారు. » భారత నౌకాదళంలో ప్రస్తుతం షిప్ సబ్మెర్సిబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్(ఎస్ఎస్బీఎన్)లు నాలుగున్నాయి. ఇందులో ఇప్పటికే రెండు సబ్మెరైన్లు నౌకాదళంలో సేవలందిస్తున్నాయి. » మూడో సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిథామన్ సీ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. 2026 చివర్లో సేవలందించేందుకు సిద్ధమవుతోంది. » ఈ సబ్మెరైన్ల నిర్మాణం కోసం 1984లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెస్సెల్ (ఏటీవీ) ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. » గతంలో నిర్మించిన 3 సబ్మెరైన్లలో 60 నుంచి 75 శాతం స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించగా, ఈ ఎస్–4 స్టార్ జలాంతర్గామిని 80 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. » తొలివిడత సీ ట్రయల్స్ పరీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయని... మరో మూడు విడతల్లో పూర్తి చేసిన తర్వాత 2027 జనవరిలో విధుల్లో చేరనుందని నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. అరిహంత్ క్లాస్లో అదరగొట్టే సబ్మెరైన్ » మొదటి ఎస్ఎస్బీఎన్ అయిన అరిహంత్ క్లాస్ సబ్మెరైన్ నిర్మాణం 1998లో మొదలైంది. » అదే సంవత్సరం పోఖ్రాన్లో అణ్వాయుధాలను భారత్ పరీక్షించింది. » అరిహంత్ 2016 నుంచి సేవల్లో చురుగ్గా ఉంది. » రెండో సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిఘాత్ను 2024 ఆగస్టు 29న జాతికి అంకితం చేశారు. » అరిథామన్ 2026లో నౌకాదళంలో చేరనుంది. » వీటన్నింటికంటే భిన్నంగా శత్రు దేశాలకు భయం పుట్టించేలా భారీగా ఎస్–4 స్టార్ సబ్మెరైన్ తయారు చేశారు. » మొదటి మూడు సబ్మెరైన్లు 110 మీటర్ల పొడవు, 6 వేల టన్నుల బరువుతో తయారు చేశారు. ఇవి 16 కే, 15 ఎస్ఎల్బీఎంలని లేదా కే–4 బాలిస్టిక్ మిసైల్స్ని నాలుగింటిని మాత్రమే తీసుకెళ్లగలవు. కొత్తగా తయారు చేసిన ఎస్–4 స్టార్ సబ్మెరైన్ మాత్రం 120 మీటర్ల పొడవు, 7 వేల టన్నుల బరువుతో నిర్మితమైంది. ఇది ఏకంగా 8 కే–4 బాలిస్టిక్ మిసైల్స్ని తీసుకెళ్లే సామర్థ్యంతో డిజైన్ని విస్తరించారు.ఎస్ – 5 క్లాస్కు తొలి మెట్టుగా » అరిహంత్ క్లాస్ తర్వాత భారీ సబ్మెరైన్లు నిర్మించేందుకు భారత నౌకాదళం ప్రణాళికలు రూపొందించింది. » ఎస్–5 ప్రాజెక్టుగా 5 జలాంతర్గాములు తయారు చేయనున్నారు. » దీనికి ఎస్ – 4 స్టార్ సబ్మెరైన్ నిర్మాణం తొలి మెట్టుగా భావిస్తున్నారు. » ఎందుకంటే రాబోయే జలాంతర్గాముల్ని రెట్టింపు బరువుతో అంటే ఏకంగా 13,500 టన్నుల భారీ సామర్థ్యంతో నిర్మించాలని భావిస్తున్నారు. » 2030 నాటికి ఎస్ – 5 ప్రాజెక్టులో తొలి సబ్మెరైన్ సేవలు అందించనుందని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. » మొత్తానికి విశాఖ తీరం వేదికగా జరుగుతున్న ఈ పరిణామాలు, హిందూ మహాసముద్రంలో చైనా వంటి దేశాల కదలికలకు చెక్ పెట్టే దిశగా భారత్ వేస్తున్న బలమైన అడుగులుగా రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
సింహాచల పుణ్యక్షేత్రంలో అపచారం.. అధికారుల ఓవరాక్షన్!
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సింహాచల దేవస్థానం పులిహోర ప్రసాదంలో నత్త కనిపించిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రసాదంలో నత్త కనిపించిన విషయాన్ని భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో, ఈ వీడియో వైరల్గా మారింది. దీంతో, దేవస్థానం అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం.. దేవస్థానం అధికారులపై చర్యలు తీసుకోకుండా భక్తులపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ప్రసాదంపై నత్త వచ్చిందని చెప్పిన భక్తులపైనే తిరిగి పోలీసులు కేసు నమోదు చేశారు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో దేవస్థానం అధికారులు ఫిర్యాదు చేయడంతో భక్తులపై పోలీసులు కేసు పెట్టారు. భక్తులపై BNS 298, 353 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, ప్రసాదం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోకుండగా.. విచారణ చేపట్టకుండా.. భక్తులపై కేసు పెట్టడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పన్న పులిహోర ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని.. దాని విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండడం దారుణమని మండిపడ్డారు.🚨 #SaveSimhachalamFromTDPసింహాచలం ఆలయంలోని ప్రసాదంలో నత్తహిందూ దేవాలయాల్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం. దాంతో ఆలయాల్లో వరుసగా అపచారాలు, భక్తులు పవిత్రంగా భావించే ప్రసాదాల్లో కీటకాల అవశేషాలుఇదేనా @ncbn ఆలయాల ప్రక్షాళన అంటే?#SaveDevoteesFromTDP#APisNotinSafeHands… pic.twitter.com/1Hm7YhOK7O— YSR Congress Party (@YSRCParty) December 30, 2025ఇక, దేవాలయాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పదేపదే దారుణాలు చోటుచేసుకుంటున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఏప్రిల్ 30న జరిగిన చందనోత్సవంలో నాసిరకంగా నిర్మించిన గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారని.. జూలైలో భారీ షెడ్ కూలిపోయిందని.. ఇప్పుడు ప్రసాదంలో నత్త కనిపించిందని.. వీటన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య తీరే కారణమని మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆకట్టుకునేలా ప్రత్యేక ఈవెంట్లు
న్యూ ఇయర్ వేడుకలకు మరింత కిక్ ఇచ్చేలా నగరంలో ఈవెంట్లు జరగనున్నాయి. స్టార్ హోటళ్ల నుంచి పబ్ల వరకు అన్నింట్లోను కస్టమర్లను ఆకర్షించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో 14 చోట్ల ఈ ఈవెంట్ల నిర్వహణకు దరఖాస్తులు వచ్చాయి. కళ్లు మిరుమిట్లు గొలిపే లైటింగ్ మధ్య లైవ్ మ్యూజిక్లు, డీజీలు, ప్రత్యేక డ్యాన్స్లతో అందరినీ ఉర్రూతలూగించనున్నారు. ఒకవైపు కేరింతలు కొట్టించే మ్యూజిక్ను ఎంజాయ్ చేస్తూ.. మద్యంతో పాటు దేశీయ, విదేశీ రుచులను అస్వాదించే అవకాశాన్ని కల్పించనున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు సైతం సిద్ధం చేశాయి. కొన్ని హోటల్స్లో రోరింగ్ ట్వంటీస్, జంగిల్ పార్టీ, కార్మివాల్ బాష్, ఫెస్టివల్ కలర్స్, డీజే సన్నీ, టోబో వుడ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు మధ్యాహ్నం స్పెషల్ లంచ్ నుంచి మొదలుకొని రాత్రికి ఈవ్ డిన్నర్, గాలా డిన్నర్, కౌంట్డౌన్ డిన్నర్, న్యూ ఇయర్ బ్రంచ్లతో ప్రత్యేక రుచులను అందించనున్నారు. అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్, లిక్కర్, ఫుడ్ అందించే ఈ ఈవెంట్లలో ప్రవేశానికి రూ.8 వేల నుంచి రూ.18 వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు. -
హోటళ్లు హౌస్ఫుల్
వారం రోజుల ముందే హోటళ్లకు న్యూ ఇయర్ జోష్ వచ్చేసింది. దేశ, విదేశాల నుంచి లక్షల మంది పర్యాటకులు విశాఖలో సందడి చేస్తున్నారు. నగరంలో పర్యాటక ప్రాంతాలతో పాటు ఏజెన్సీ కూడా పర్యాటకులో నిండిపోయింది. దీంతో విశాఖలో హోటళ్లు హౌస్ఫుల్గా మారాయి. నగరంలో 24 స్టార్ హోటళ్లు, 200 వరకు సాధారణ హోటళ్లు, రిసార్టులు, గెస్ట్ హౌస్లు, ఉన్నాయి. సుమారుగా 5 వేల రూమ్స్ ఉండగా.. ప్రస్తుతం ఎక్కడా రూమ్ దొరకని పరిస్థితి నెలకొంది. డిమాండ్ విపరీతంగా పెరగడంతో రూమ్స్ ధరలు మూడు, నాలుగింతలు పెంచేశారు. నొవోటెల్ హోటల్లో రూ.7 వేలు ఉండే రూమ్ ప్రస్తుతం రూ.25 వేలు, రూ.30 వేలుగా ఉంది. సాధారణ హోటళ్లలో రూ.1,500 దొరికే రూమ్స్ ప్రస్తుతం రూ.3, రూ.4 వేలు ఛార్జ్ చేస్తున్నారు. అయినప్పటికీ దొరికే పరిస్థితి లేదు. -
నెత్తుటి మరకలు
ట్రాఫిక్ కఠినం.. అయినా ఆగని మరణాలు రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చినా, మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 2024లో 1,132 ప్రమాదాలు జరగ్గా, 2025లో 1,086 ప్రమాదాలు సంభవించాయి. అయితే మృతుల సంఖ్య 347 (2024) నుంచి 349కి (2025) చేరింది. స్పీడ్ లేజర్ గన్ వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణ, బైక్ రేసర్లపై కేసులు వంటి చర్యలతో ప్రమాదాలు అదుపులోకి వచ్చాయి. వచ్చే ఏప్రిల్ నాటికి ప్రైవేట్ సంస్థల సహకారంతో ట్రాఫిక్ ఉల్లంఘనులకు ఆటోమేటిక్గా ఫైన్లు వేసే ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. విశాఖపై విశాఖను సురక్షిత నివాస ప్రదేశంగా మార్చడానికి పోలీస్ శాఖ చేపట్టిన సమర్థవంతమైన చర్యలతో నగరంలో నేరాలు 12.71 శాతం మేర తగ్గుముఖం పట్టాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2025లో పోలీసులు సాధించిన ప్రగతి, ఛేదించిన కేసుల వివరాలను సీపీ వెల్లడించారు. 2024లో 5,921 కేసులు నమోదు కాగా.. 2025లో 5,168 కేసులు నమోదయ్యాయని వివరించారు. 2026లో మరింత సమర్థవంతమైన పోలీసింగ్తో, అత్యాధునిక సాంకేతికతను జోడించి ‘ప్రశాంత విశాఖే’లక్ష్యంగా ముందుకు వెళతామని సీపీ స్పష్టం చేశారు. తొలిసారిగా ‘బడ్స్’యాక్ట్ అమలు అనధికార డిపాజిట్ పథకాల నిషేధ(బడ్స్) చట్టం–2019ను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విశాఖలో అమలు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ చట్టం కింద 26 కేసులు నమోదు చేశామన్నారు. ఈ ఏడాది మొత్తం 653 ఆర్థిక నేరాలు నమోదైనట్లు వెల్లడించారు. తగ్గిన దొంగతనాలు 2024లో 1,149 చోరీ కేసులు నమోదు కాగా, 2025లో 1,126 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జరిగిన దొంగతనాల్లో మొత్తం రూ.7.82 కోట్ల సొత్తు చోరీకి గురవగా, అందులో రూ.4.90 కోట్ల విలువైన ఆస్తులను పోలీసులు రికవరీ చేశారు. 2025లో ఇంటి దొంగతనాలు, సెల్ఫోన్ దొంగతనాల నేరాల్లో 6 కేజీల బంగారం(విలువ రూ.5.25 కోట్లు), 16.1 కేజీల వెండి, రూ.67లక్షల నగదు, 186 మోటార్ సైకిళ్లు, 9 ఆటోలు, 2 లారీలు, 1 బస్సు, 5 కార్లు, 15 ల్యాప్టాప్లు, 139 మొబైల్ ఫోన్లు, రూ.6.33 కోట్ల విలువైన 4,222 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. మొత్తం రూ.10.56 కోట్ల విలువైన ఆస్తిని 757 మంది బాధితులకు అందజేశారు. మహిళల భద్రత ప్రాధాన్యం విజిబుల్ పోలీసింగ్, నేర ప్రభావిత ప్రదేశాల జియో మ్యాపింగ్, మహిళా పోలీసుల పర్యవేక్షణ, కుటుంబ తగాదాలకు సంబంధించి కౌన్సెలింగ్ వంటి చర్యలతో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయని సీపీ తెలిపారు. 2024లో 1,216 కేసులు నమోదు కాగా, 2025లో 951 కేసులు (21.79 శాతం తగ్గుదల) నమోదయ్యాయి. పిల్లలపై నేరాలు కూడా 42.74 శాతం వరకు తగ్గినట్లు సీపీ వెల్లడించారు. 2024లో 131 కేసులు రాగా, 2025లో 75 నమోదయ్యాయి. డ్రోన్లతో నిఘా నేత్రం నగర భద్రత, మత్తు పదార్థాల నియంత్రణ కోసం 22 స్టేషన్ల పరిధిలో 15 డ్రోన్ల ద్వారా 2,833 చోట్ల రెక్కీ నిర్వహించారు. పండగలు, ర్యాలీలు, వీఐపీ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణలో డ్రోన్లను వినియోగించి 453 కేసులు నమోదు చేశారు. సైబర్ నేరాల్లో భారీ రికవరీ సైబర్ కేసులు తగ్గాయని కమిషనర్ తెలిపారు. 2024లో 374 సైబర్ నేరాలు నమోదు కాగా, 2025లో 286 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది 205 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.14.64 కోట్లు రికవరీ చేశారు(గతేడాది ఇది రూ.3.89 కోట్లు మాత్రమే). లోన్ యాప్ల ద్వారా మోసపోయిన 126 మంది బాధితులకు రూ.56 లక్షలు తిరిగి ఇప్పించారు. ముఖ్యమైన కేసుల్లో ట్రయల్స్ వేగంగా జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు చేపట్టారు. 2025లో 4,706 కేసులను కోర్టులు పరిష్కరించాయి. ఒక పోక్సో కేసులో 146 రోజుల్లోను, మరో కేసులో 234 రోజుల్లో తీర్పు వెలువడటం గమనార్హం. ప్రజల సహకారంతో సురక్షిత విశాఖ విశాఖకు టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు వస్తుండటం, భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కానుండటంతో ప్రముఖుల తాకిడి పెరిగిందని సీపీ తెలిపారు. ప్రైవేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రజల సహకారంతో విశాఖను సురక్షిత నివాస ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని చెప్పారు. సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ నగరానికి నెత్తుటి మరకలు అంటుకుంటున్నాయి. వరుస హత్యలు, నెత్తురోడుతున్న రహదారులతో నగరం ఉలిక్కిపడుతోంది. పోలీస్ శాఖ చేపట్టిన చర్యలతో మొత్తంగా నేరాల రేటు తగ్గిందని గణాంకాలు చెబుతున్నప్పటికీ.. మనిషి ప్రాణాలు తీసే కిరాతక నేరాలు పెరగడం భయాందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా 2024తో పోలిస్తే 2025లో హత్యల సంఖ్య గణనీయంగా పెరగడం, రహదారులపై మరణ మృదంగం ఆగకపోవడం నగర ప్రజలను కలవరపెడుతోంది. గత ఏడాది 24గా ఉన్న హత్యలు ఈ ఏడాది 35కు చేరడం, రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 349 మంది బలవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నగరంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పోలీసులు భరోసా ఇస్తున్నా.. పెరుగుతున్న ఈ ఘోరాలు చూస్తుంటే ‘విశాఖ సేఫేనా?’అనే ప్రశ్న ప్రజల మదిలో మెదులుతోంది. – అల్లిపురం కలవరపెడుతున్న హత్యలు నగరంలో 2024లో 24 మంది హత్యకు గురవగా, ఈ ఏడాది 35 హత్యలు జరిగాయి. మద్యం మత్తు, అక్రమ సంబంధాలు, క్షణికావేశమే హత్యలకు ప్రధాన కారణాలు. ద్వేషపూరిత నరహత్యలు 12, వరకట్న హత్యలు 3, మహిళల హత్యలు 7 జరిగాయి. మిగిలిన హత్యలకు ఆర్థిక వివాదాలు, ప్రేమ వ్యవహారాలు, చిన్నపాటి తగాదాలు కారణమయ్యాయి. బార్లకు ఒంటి గంట వరకు పర్మిషన్ -
కదం తొక్కిన ఎర్ర దండు
బీచ్రోడ్డులో సిటూ ‘రెడ్ షర్ట్’ర్యాలీ ఏయూ క్యాంపస్: సీఐటీయూ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం ఉదయం రెడ్ షర్ట్ వలంటీర్లు భారీ కవాతు నిర్వహించారు. ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం నుంచి మహాసభలు జరిగే ఏయూ కన్వెన్షన్ హాల్ ప్రాంగణం వరకు ఈ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ కవాతులో వలంటీర్లు సిటూ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయండి, లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు, ప్రభుత్వ రంగాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, సోషలిజం అజేయం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కులమత రహిత సమాజం కోసం, కార్మిక–కర్షక ఐక్యత వర్ధిల్లాలని, ప్రజా పోరాటాలు సాగాలని నినదిస్తూ ఈ ఎర్రదండు కవాతును నిర్వహించింది. కవాతులో సిటూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి కుమార్, రాష్ట్ర కోశాధికారి కె.ఆర్.కె.మూర్తి, నేతలు కె.లోకనాథం, కె.ఎం శ్రీనివాస్, పి.మణి, ఐద్వా ఆల్ ఇండియా నాయకురాలు డి.రమాదేవి, జిల్లా, జోన్ నాయకులు పాల్గొన్నారు. -
థ్రిల్
చిల్● పర్యాటకులతో కిటకిటలాడుతున్న మహానగరం ● స్టార్ హోటల్స్, పబ్, రిసార్ట్స్లో ప్రత్యేక ఈవెంట్లు ● గ్రీటింగ్, గిఫ్ట్, బొకే, బేకరీ, స్వీట్, షాపుల వద్ద రద్దీ విశాఖకు నూతన సంవత్సర శోభ వచ్చేసింది. రెండు రోజుల ముందే సాగరతీరంలో సందడి మొదలైంది. దేశ, విదేశాల పర్యటకులతో బీచ్ రోడ్డు కిటకిటలాడుతోంది. న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని తాకేలా హోటళ్లు, రిసార్టులు, పబ్ల నిర్వాహకులు ఈవెంట్ల నిర్వహణకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 31వ తేదీన డీజే, డ్యాన్స్, ఇతర ప్రత్యేక కార్యక్రమాలతో అదరగొట్టే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. యువతతో పాటు ఫ్యామిలీలు సైతం ఎంజాయ్ చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే నగరంలో గ్రీటింగ్, గిఫ్ట్, బొకే, బేకరీ, స్వీట్, షాపులు కూడా రద్దీగా మారాయి. దీంతో ఎక్కడ చూసినా న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. – విశాఖ సిటీ -
దివ్య దర్శనం.. జన్మ ధన్యం
సింహాచలం: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఉత్తరద్వార దర్శనం కనులపండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడై శేషతల్పంపై కొలువుదీరిన స్వామి వారు, ఉత్తర రాజగోపురం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఏడాదిలో ఒక్క రోజు, అది కూడా కేవలం కొన్ని గంటలు మాత్రమే లభించే ఈ అరుదైన దర్శన భాగ్యాన్ని పొంది భక్తులు పులకించిపోయారు. విశేష వైదిక కార్యక్రమాలు పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచే వైదికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని సుప్రభాతసేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు. ఉత్సవమూర్తి అయిన గోవిందరాజ స్వామిని వైకుంఠవాసుడిగా, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను మేలిముసుగులో ఉంచి శేషతల్పంపై అధిష్టింపజేసి ఆలయ బేడా మండపంలో తిరువీధి నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం.. తొలుత ఆలయ ఉత్తరద్వారం వద్ద స్వామిని ఉంచి, మేలిముసుగు తొలగించారు. సంప్రదాయం ప్రకారం పూసపాటి వంశీయులకు తొలి దర్శనాన్ని కల్పించారు. అనంతరం స్వామిని ఉత్తర రాజగోపురంలో ఏర్పాటుచేసిన వేదికపైకి చేర్చారు. ఉదయం 5.10 గంటల నుంచి 11.15 గంటల వరకు భక్తులకు దర్శనాన్ని అందజేశారు. ఆ తర్వాత సింహగిరి మాడవీధిలో స్వామి వారి తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు సాతులూరి నరసింహాచార్యులు తదితరులు పూజల్లో పాల్గొన్నారు. దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ప్రముఖుల దర్శనాలు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఉత్తరద్వార దర్శనాన్ని పలువురు ప్రముఖులు చేసుకున్నారు. దేవస్థానం దివంగత అనువంశిక ధర్మకర్త ఆనందగజపతిరాజు సతీమణి సుధాగజపతిరాజు, కుమార్తె ఊర్మిళ గజపతిరాజు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, పశ్చిమబెంగాల్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ మంథా, సేల్స్ ట్యాక్స్ ట్రిబ్యునల్ న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్, అనకాపల్లి మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తదితరులు స్వామిని దర్శించుకున్నారు. -
బార్లకు ఒంటి గంట వరకు పర్మిషన్
బీచ్రోడ్డు: జిల్లాలో ఈ ఏడాది మద్యం అమ్మకాలు పెరిగినప్పటికీ.. ఆదాయం మాత్రం తగ్గిందని జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి ఆర్. ప్రసాద్ తెలిపారు. మంగళవారం జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదిక, రెవెన్యూ క్రైమ్ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది మద్యం విక్రయాల ద్వారా రూ.1940.37 కోట్ల ఆదాయం లభించిందని, 2024తో పోలిస్తే ఇది 1.74 శాతం తక్కువని ఆయన వివరించారు. ఈ ఏడాది 23.32 లక్షల కేసుల మద్యం, 17.23 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే మద్యం అమ్మకాల్లో 11 శాతం, బీరు అమ్మకాల్లో 44.8 శాతం వృద్ధి కనిపించిందని తెలిపారు. అలాగే వివిధ నేరాల్లో పట్టుబడిన 14 వాహనాలను జప్తు చేయడం ద్వారా రూ.2.43 లక్షలు, బైన్డ్ ఓవర్ ఉల్లంఘనల ద్వారా రూ.2.14 లక్షలు, లోక్ అదాలత్ కేసుల పరిష్కారం ద్వారా రూ.30.18 లక్షలు వసూలు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 150 మద్యం షాపులు, 75 బార్లు, 18 స్టార్ హోటళ్లు, 7 క్లబ్బులు, 8 మైక్రో బ్రేవరీలు, 2 ప్రీమియం స్టోర్లు, 19 డిఫెన్స్ క్యాంటీన్లు నిర్వహణలో ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా 2025 సంవత్సరానికి లైసెన్సు ఫీజుల రూపంలో రూ.204 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. పర్మిట్ రూమ్స్ ద్వారా రూ.8.77 కోట్లు, వన్ డే ఈవెంట్ పర్మిట్ల ద్వారా రూ.14.82 లక్షల ఆదాయం సమకూరినట్లు చెప్పారు. ఈ ఏడాది మొత్తం 442 అనధికార మద్యం అమ్మకపు(బెల్ట్ షాప్) కేసులు నమోదు చేసి, 443 మందిని అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి 883.76 లీటర్ల మద్యం, 65.65 లీటర్ల బీరు, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సుంకం చెల్లించని మద్యం (ఎన్డీపీఎల్) తరలిస్తున్న 67 కేసుల్లో 60 మందిని అరెస్టు చేసి.. 680 లీటర్ల మద్యం, 24.3 లీటర్ల బీరు, 6 వాహనాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. 8 గంజాయి కేసుల్లో 15 మందిని అరెస్టు చేసి, 67.23 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వేడుకలకు సమయం పెంపు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధ, గురువారాల్లో మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు.. బార్లు, స్టార్ హోటళ్లు, టూరిజం బార్లు, ప్రత్యేక అనుమతి పొందిన ఈవెంట్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు నిర్వహించుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రసాద్ తెలిపారు. వేడుకల కోసం ఇప్పటివరకు 14 మంది వన్ డే ఈవెంట్ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, పోలీసు శాఖ సమన్వయంతో అనుమతులు ఇస్తామని చెప్పారు. వేడుకల్లో అనుమతి లేని విదేశీ మద్యం గానీ, ఇతర రాష్ట్రాల మద్యం గానీ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్ అధికారి హెచ్చరించారు. -
వైభవం.. ఉత్తర ద్వార దర్శనం
మురళీనగర్: కప్పరాడ ఎన్జీజీవోస్ కాలనీలోని వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి వేడుకలు కనులపండువగా జరిగాయి. ఉదయాస్తమాన సేవాకాలంలో భాగంగా స్వామికి ఉదయం 3 గంటల నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత వైభవ వేంకటేశ్వరస్వామి వారి తిరువీధి ఉత్సవం జరిపారు. ఉత్సవ విగ్రహాలను ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైకి తీసుకొచ్చి, ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 6 గంటలకు ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వజ్రకవచధారులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో మహిళల కోలాటాలు, బాలికల శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ ఈవో బండారు ప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పి.గణబాబు, విష్ణుకుమార్ రాజు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, కంకటాల మల్లిక్, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, విశాఖపట్నం పార్లమెంటరీ టీడీపీ ఇన్చార్జి పట్టాభి, తదితరులు స్వామిని దర్శించుకున్నారు. శ్రీదేవి, భూదేవి సమేత వైభవ వేంకటేశ్వరస్వామి, స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు -
జెడ్పీలో ‘ప్రోటోకాల్’ రగడ
మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం వాడీవేడిగా సాగింది. జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరు కావడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకపోవడంపై జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ (విశాఖ), విజయకృష్ణన్(అనకాపల్లి), దినేష్ కుమార్ (ఏఎస్ఆర్), సీఈవో నారాయణమూర్తి హాజరయ్యారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరణ బడ్జెట్ను, 2026–27 సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్ను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రోటోకాల్ ఉల్లంఘనపై సభ్యుల ఫైర్ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండల స్థాయిలో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు స్థానిక జెడ్పీటీసీలు, ఎంపీపీలను అధికారులు ఆహ్వానించడం లేదని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎంపీపీ సూరిబాబు, జడ్పీటీసీలు ఈర్లె అనురాధ, సన్యాసిరాజు, నాగమణి, ఉమాదేవి, కర్రి సత్యం తదితరులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ప్రోటోకాల్ పక్కాగా అమలయ్యేదని, ఇప్పుడు తమను గౌరవించడం లేదని ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా కొత్తూరులో వీఎంఆర్డీఏ చేపట్టిన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను విస్మరించారని ఎంపీపీ సూరిబాబు మండిపడ్డారు. దీనిపై అధికారులను నిలదీసినా సరైన సమాధానం రావడం లేదన్నారు. ప్రోటోకాల్ పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ ఆదేశించగా, ఎంపీడీవోలకు నోటీసులు జారీ చేస్తామని సీఈవో నారాయణమూర్తి ప్రకటించారు. యలమంచిలిని అనకాపల్లిలోనే ఉంచాలి యలమంచిలి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేసిన అడ్డురోడ్డు రెవెన్యూ డివిజన్లో విలీనం చేయడాన్ని సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. మునగపాక జెడ్పీటీసీ సభ్యుడు పెంటకోట సోము సత్యనారాయణ ఈ అంశాన్ని లేవనెత్తుతూ, అడ్డురోడ్డు ప్రజలకు దూరభారమవుతుందని, అనకాపల్లి డివిజన్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చైర్పర్సన్కు వినతిపత్రం అందజేశారు. అప్పలరాజుపై పీడీ యాక్ట్ ఎత్తివేయాలి నక్కపల్లి, రాజాయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాడుతున్న మత్స్యకారులకు మద్దతు తెలిపిన సీపీఎం నేత ఎం.అప్పలరాజుపై పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని సభ్యులు తీవ్రంగా ఖండించారు. అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు డి.గంగరాజు, వైఎస్సార్ సీపీ సభ్యులు గోసల కుశలమ్మ, పైలా సన్యాసిరాజు, సోము సత్యనారాయణ, లాలం రాంబాబు తదితరులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడే వారిపై గంజాయి స్మగ్లర్ల తరహాలో పీడీ యాక్ట్ ప్రయోగించడం దారుణమన్నారు. తక్షణమే కేసు ఎత్తివేసి ఆయన్ని విడుదల చేయాలన్నారు. రోడ్లు, పింఛన్లపై గగ్గోలు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిపై సభ్యులు గళమెత్తారు. వడ్డాది, చోడవరం, నర్సీపట్నం, గొలుగొండ తదితర ప్రాంతాల్లో ప్రయాణం నరకప్రాయంగా మారిందని, గుంతలమయమైన రోడ్లను ఎప్పుడు బాగుచేస్తారని మాడుగుల ఎంపీపీ రాజారామ్, జెడ్పీటీసీ సభ్యురాలు అనురాధ అధికారులను నిలదీశారు. అలాగే, పింఛన్ల ఏరివేత పేరుతో అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు అన్యాయం చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. కాలుష్యంపై ఆందోళన పరవాడ, అచ్యుతాపురం పారిశ్రామిక వాడల్లో కాలుష్యం కోరలు చాస్తోందని జెడ్పీటీసీ సభ్యుడు పైలా సన్యాసిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవర్లోడ్ లారీల వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నా, ప్రమాదాలు జరుగుతున్నా రవాణా, పోలీసు శాఖలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. లంకెలపాలెం జంక్షన్లో కాలుష్యం తీవ్రస్థాయికి చేరిందన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఈవో కె.రాజ్కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
తాళ్లతో కట్టేసి.. నగలు దోచేసి!
అల్లిపురం: ఇంటి యజమానురాలిని తాళ్లతో కట్టేసి.. 10 తులాల బంగారు ఆభరణాలు, 8 తులాల వెండి వస్తువులను దోచుకుపోయిన కేసులో తల్లీకూతుళ్లు సహా మొత్తం నలుగురు నిందితులను ఆరిలోవ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ కె.లతామాధురి ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ రాత్రి 9.50 గంటల సమయంలో ధారపాలెం, బంగారుతల్లి లే–అవుట్లో నివసిస్తున్న మొండు వసంత తన ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. ఆమె లోపల గడియ పెట్టుకుని పడుకోగా, రాత్రి 10 గంటల సమయంలో కాళ్ల వద్ద ఎవరో సంచరిస్తున్నట్లు అలికిడి అయింది. వెంటనే ఆమె లేచేందుకు ప్రయత్నించగా.. ఒక వ్యక్తి ఆమె కాళ్లను గట్టిగా పట్టుకుని తాడుతో కట్టేశాడు. ఆమె అరవకుండా నోటిని అక్కడే ఉన్న లంగాతో కట్టేశారు. అనంతరం ఆమె మెడలోని 5 తులాల బంగారు పలక సరలు, నెమలి బిల్ల గల రెండు పేటల గొలుసు, చేతులకు ఉన్న 4 తులాల బంగారు గాజులు, లాకెట్తో కూడిన మరో గొలుసు, తులం బరువుగల రెండు ఉంగరాలు, 8 తులాల వెండి ఆభరణాలను బలవంతంగా తీసుకున్నారు. అనంతరం నిందితులు బయటకు వెళ్లి, తలుపులకు బయటి నుంచి గడియపెట్టి పారిపోయారు. తర్వాత బాధితురాలు అతికష్టం మీద కట్లు విప్పుకుని ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సెల్ఫోన్ టవర్ లోకేషన్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దాదాపు వెయ్యి సెల్ఫోన్ల డేటాను విశ్లేషించి నిందితులను గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా రామాయణపురానికి చెందిన నెల్లి నిర్మల కుమారి, ఆమె కుమార్తె నెల్లి లిఖిత, అంబేడ్కర్ కోనసీమ జిల్లా సోంపల్లి (ఇందిరాకాలనీ)కి చెందిన భూపతి అభిరామ్, బి.సావరానికి చెందిన నల్లి మణిరత్నంలను అదుపులోకి తీసుకున్నారు. బంధువుల పరిచయంతో.. : ప్రధాన నిందితురాలు నెల్లి నిర్మల కుమారి.. బంగారుతల్లి లే–అవుట్లో నివాసం ఉంటున్న తన పెదనాన్న కుమారుడు దుర్గాప్రసాద్ ఇంటికి తరచూ వచ్చి వెళ్తుండేది. ఆ సమయంలో దుర్గాప్రసాద్ ఇంటి యజమానురాలైన వసంత మెడలో ఎక్కువ బంగారు ఆభరణాలు ఉండటం గమనించింది. తనకు ఉన్న అప్పులు తీర్చుకోవడానికి ఆమెను దోచుకోవాలని పథకం వేసింది. భీమవరంలో క్యాంటీన్ నడుపుతున్న నిర్మల కుమారి.. తన కుమార్తె లిఖితకు, క్యాంటీన్లో పనిచేస్తున్న అభిరామ్, మణిరత్నంలకు డబ్బు ఆశ చూపించి విశాఖ తీసుకువచ్చింది. 13న దొంగతనం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మరుసటి రోజు బాధితురాలికి ‘సెండాఫ్’ చెప్పే నెపంతో నిర్మల కుమారి, లిఖిత ఆమెను బయటకు పిలిచారు. ఆ సమయంలోనే అభిరామ్, మణిరత్నం ఇంట్లోకి దూరి దాక్కున్నారు. రాత్రి బాధితురాలు తలుపులు వేసు కుని నిద్రపోయాక, ఆమెను బంధించి చోరీకి పాల్పడ్డారు. -
మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్లో అత్యాధునిక టోమోథెరపీ సేవలు
ఎంవీపీకాలనీ: క్యాన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ హాస్పటల్ ఎండీ డాక్టర్ వున్నా మురళీకృష్ణతో కలిసి ఈ సేవలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించే విధంగా ఏపీలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతిక అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా మెరుగైన వైద్యసేవలు క్యాన్సర్ రోగులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. ఎండీ మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.32 కోట్లు విలువైన ఈ యూనిట్ కొనుగోలుతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్ దేశంలో లెవల్ 3 కేటగిరీ హాస్పటల్స్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్ ట్యూమర్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు హాస్పటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
క్లిక్.. ఆర్డర్
ఫంక్షన్కి వెళ్లాలి.. శారీకి మ్యాచింగ్ ఇమిటేషన్ జ్యువెలరీ లేదు.. ఏం పర్లేదు.. వెంటనే ఆర్డర్ పెట్టేయ్! కొత్త హ్యాండ్ బ్యాగ్ కొనాలి.. ఆన్లైన్లో చూసేద్దాం.. జిమ్కు వెళ్లే సమయం లేదు.. ఇంట్లోనే ఫిట్నెస్ పెంచుకోవాలి.. ఇంకేం.. వెంటనే డంబెల్స్, బార్బెల్స్, వెయిట్ ప్లేట్స్ బుక్ చేసేద్దాం.. ఇది, అది అనే తేడా లేదు.. ఏదైనా సరే.. క్లిక్ కొట్టి ఆర్డర్ పెట్టేయడమే! పది నిమిషాల్లోనే వస్తువు ఇంటి ముందు వాలిపోతుంది. ప్రస్తుతం వైజాగ్లో ఎక్కడ చూసినా.. క్లిక్ ఆర్డర్.. ఇదే ట్రెండ్ నడుస్తోంది. వంద రూపాయల పర్స్ నుంచి.. లక్ష రూపాయల గోల్డ్ కాయిన్ వరకూ.. ఏం కావాలన్నా.. ఆన్లైన్ షాపింగ్ ఉంది కదా.. అనేదే అందరి ధీమా..!సాక్షి, విశాఖపట్నం: ఒకప్పుడు చాక్లెట్ కావాలంటే వీధి చివర ఉన్న షాప్కి వెళ్లేవాళ్లం. పెరుగు కావాలంటే డెయిరీకి, స్వీట్ల కోసం మిఠాయి దుకాణానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు క్విక్ కామర్స్ పుణ్యమా అని, ఆర్డర్ పెట్టిన పది నిమిషాల్లోనే మనకు కావల్సిన వస్తువు ఇంటికి వచ్చేస్తోంది. అందుకే ఆన్లైన్ ఆర్డర్లకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. విశాఖ నగరంలోనూ క్విక్ డెలివరీ యాప్స్కు ఆదరణ భారీగా పెరిగిందని ప్రముఖ డెలివరీ సంస్థ ఇన్స్టామార్ట్ సర్వేలో వెల్లడైంది. 2025లో వైజాగ్ వాసులు ఫాస్టెస్ట్ డెలివరీ యాప్స్లో ఎక్కువగా ఏం ఆర్డర్ చేశారో తెలుసా.? బ్యాగ్స్, వ్యాలెట్స్..! రూ.5.84 లక్షల షాపింగ్.. ఐఫోన్లలో టాప్ క్విక్ కామర్స్లో అత్యంత ఖరీదైన ఫోన్లు కూడా ఆర్డర్ చేస్తుండటం విశేషం. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో ప్రీమియం కొనుగోళ్లలో దేశంలోనే వైజాగ్ నగరం అగ్రస్థానంలో నిలిచింది. 2025లో నగరానికి చెందిన ఒక వినియోగదారుడు రూ.లక్ష విలువైన 24 క్యారట్ల బంగారు నాణేన్ని కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఓ వ్యక్తి ఇన్స్టామార్ట్లో ఏకంగా రూ.5.84 లక్షల విలువైన షాపింగ్ చేశారు.2025లో ఒకే వ్యక్తి చేసిన అత్యధిక షాపింగ్ ఇదే కావడం విశేషం. మరికొంతమంది రూ.3.50 లక్షల మార్కును దాటారు. వైజాగ్ ప్రజలు ఆన్లైన్లో చేసే ప్రతి 10 ఆర్డర్లలో 7 వరకు పెరుగు ప్యాకెట్లే ఉంటున్నాయి. తర్వాత స్థానంలో ఐస్క్రీమ్లు, స్వీట్లు ఉన్నాయి. ఏడాది కాలంలో వీటి ఆర్డర్లలో 112 శాతం వృద్ధి కనిపించిందని సర్వేలో వెల్లడించింది. సెకనుకు 4 పాల ప్యాకెట్లు దేశవ్యాప్తంగా చూస్తే.. సగటున సెకనుకు 4 పాల ప్యాకెట్లను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుండటం గమనార్హం. ఈ గణాంకాలను బట్టి క్విక్ కామర్స్ యాప్స్ నగర జీవనాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్థానిక ఉత్పత్తుల నుంచి ప్రీమియం వస్తువుల వరకూ విస్తృత శ్రేణిలో అందించేందుకు ఈ–కామర్స్ ప్లాట్ఫామ్స్ పోటీపడుతున్నాయి. విశాఖ వాసులు ఇల్లు కదలకుండానే తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేస్తూ.. ‘స్మార్ట్’గా మార్ట్ని ఇంటికి రప్పించుకుంటున్నారు.నిమిషాల్లో డెలివరీ ఉరుకుల పరుగుల జీవన విధానంలో అంతా ఇప్పుడు వేలికొనల పైనే నడుస్తోంది. నచ్చింది తినాలన్నా, కొనాలన్నా ఒక్క క్లిక్తో ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఆర్డర్ పెడితే 10 నుంచి 15 రోజుల సమయం వేచి చూసే రోజులు పోయాయి. ఇప్పుడంతా ఇన్స్టంట్ జమానా. 15 నిమిషాల్లో డెలివరీ చేస్తామని ఒకరు, 10 నిమిషాల్లోనే తెస్తామని మరొకరు.. పోటీ పడి మరీ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. పైగా షాపుల్లో దొరకని ఆఫర్లతో వస్తువులు ఇంటికి చేరుస్తుండటంతో, శ్రమ తగ్గిందని నగరవాసులు క్విక్ కామర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు.ఏం ఆర్డర్ చేస్తున్నారంటే?ఇన్స్టామార్ట్ క్విక్ కామర్స్ యాప్.. 2025లో విశాఖ నగరవాసులు కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి పలు ఆసక్తికర మైన గణాంకాలను వెల్లడించింది.» ఈ ఏడాది వైజాగ్ వాసులు కిరాణా సరుకుల కంటే కిరాణేతర సామగ్రిపైనే ఎక్కువగా దృష్టి సారించారు.» నగలు, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ వంటి వస్తువుల కొనుగోళ్లు వృద్ధి శాతం 249» గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హ్యాండ్ బ్యాగులు, వాలెట్ల కొనుగోళ్లు పెరిగిన శాతం 434» ఎల్రక్టానిక్స్ ఉపకరణాలు శాతం 161» పిల్లల ఆటవస్తువుల కొనుగోళ్లు పెరిగిన శాతం 166» క్రీడలు, ఫిట్నెస్ పరికరాల ఆర్డర్లు నమోదయిన శాతం 374» స్నాక్స్, చక్కెర, వాటర్ బాటిల్స్, పాల ఉత్పత్తులు, గృహోపకరణాల కొనుగోళ్లు వృద్ధి చెందిన శాతం 100 -
ఆ ఘటన ఎలా జరిగింది!
యలమంచిలి రూరల్: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన ఘటనపై రైల్వే శాఖ అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఝార్ఖండ్లోని టాటానగర్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వెళ్తున్న రైలు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత యలమంచిలి రైల్వేస్టేషన్కు చేరుకునేసరికి అగ్నిప్రమాదానికి గురైన విషయం విదితమే. ఘటనపై యలమంచిలి రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ ఆకుల సురేష్కుమార్ ఫిర్యాదు మేరకు తుని రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి కాకినాడ ప్రభుత్వ రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు ఘటనకు గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ప్రమాదం సంభవించిన బోగీల్లో బీడీ కాల్చిన వ్యక్తితో పాటు కోచ్ల్లో బెడ్ రోల్స్ అందించే వారినీ అదుపులోకి తీసుకుని విచారించారు. అగ్ని ప్రమాదానికి గురైన రెండు బోగీలను సోమవారం అర్ధరాత్రి విజయవాడకు తరలించారు. అగ్నికీలలు వ్యాపించి దగ్ధమైన బోగీలను రైల్వే ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ బృందాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించాయి. ఘటనపై బుధ, గురువారాల్లో దక్షిణ మధ్య రైల్వే సర్కిల్ సేఫ్టీ కమిషనర్ మాధవి విజయవాడలో విచారణ జరపనున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలిసిన వారు సికింద్రాబాద్ సరోజినీదేవి రోడ్డులో రైల్ నిలయం ఎదురుగా ఉన్న రైల్వే సేఫ్టీ కమిషనర్ అడ్రస్కు రాతపూర్వకంగా పంపించవచ్చని దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో ఎ.శ్రీధర్ ప్రకటనలో పేర్కొన్నారు. -
సింహాచల అప్పన్న ఆలయంలో అపచారం.. పులిహోర ప్రసాదంలో నత్త
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో సోమవారం మహాపచారం చోటుచేసుకుంది. పరమ పవిత్రంగా భావించే పులిహోర ప్రసాదంలో నత్త కనిపించడంతో భక్తులు షాక్కు గురయ్యారు. దీనిపై దేవస్థానం సిబ్బంది సరిగ్గా స్పందించకపోవడంతో.. ఇద్దరు భక్తులు తమ ఆవేదనను తెలియజేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. ‘దర్శనం అనంతరం మేము పులిహోర ప్రసాదం ప్యాకెట్ తీసుకున్నాం. పులిహోర తింటున్నప్పుడు అందులో నత్త వచ్చింది. కౌంటర్ వద్దకు వెళ్లి ప్రశ్నిస్తే.. వారు సరిగ్గా సమాధానమివ్వకుండా ఆ ప్యాకెట్ని తీసేసుకున్నారు. ఇంకో ప్యాకెట్ ఇచ్చేసి వెళ్లిపొమ్మన్నారు’ అంటూ ఇద్దరు భక్తులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వంపై భక్తులు, నెటిజన్లు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పన్న పులిహోర ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని.. దాని విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండడం దారుణమని మండిపడ్డారు. దేవాలయాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పదేపదే దారుణాలు చోటుచేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఏప్రిల్ 30న జరిగిన చందనోత్సవంలో నాసిరకంగా నిరి్మంచిన గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారని.. జూలైలో భారీ షెడ్ కూలిపోయిందని.. ఇప్పుడు ప్రసాదంలో నత్త కనిపించిందని.. వీటన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య తీరే కారణమని మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, నత్త విషయాన్ని భక్తులు తమ దృష్టికి తేలేదని ప్రసాదాల విభాగం ఏఈవో రమణమూర్తి చెప్పారు. వారు సోషల్ మీడియాలో పోస్టు చేసుకున్నారని, ప్రసాదాల విక్రయశాల సిబ్బంది ద్వారా తనకు విషయం తెలిసిందన్నారు. ఈ ఘటనపై దేవస్థానం ఇన్చార్జ్ ఈవో సుజాతను దేవదాయ శాఖ కమిషనర్ వివరణ కోరినట్లు తెలిసింది. -
సింటర్ ప్లాంట్లో ఫ్లక్స్ కన్వేయర్ ప్రారంభం
ఉక్కునగరం : స్టీల్ప్లాంట్ సింటర్ ప్లాంట్ విభాగం ఉత్పాదక అభివృద్ధిలో ముందడుగు పడింది. విభాగం సొంత వనరులతో ఏర్పాటు చేసిన 25 ఎంటీఆర్ఎస్ ఫ్లక్స్ కన్వేయర్ను సోమవారం స్టీల్ప్లాంట్ సీజీఎం (వర్క్స్) రంజన్ మహంతి ప్రారంభించారు. ఈ నూతన కన్వేయర్ వల్ల 1,500 టన్నుల వరకు అదనపు లైమ్ను మాన్యువల్గా లోడింగ్ చేయవచ్చన్నారు. తద్వారా సింటర్ ప్లాంట్కు లైమ్ స్టోన్ కొరత చాలా వరకు తగ్గుతుందన్నారు. తమకు అందుబాటులో ఉన్న వనరులతో కన్వేయర్ను తయారు చేసిన విభాగం అధికారులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో సీజీఎం (మెయింటెనెన్స్) ప్రవీణ్కుమార్, జీఎం (స్టీల్, మిల్స్, ప్లానింగ్) ఇన్చార్జ్ పి.ఎస్.రావు, సింటర్ ప్లాంట్ జీఎం ఇన్చార్జ్ జి.ఎస్.రావు, సింటర్ ప్లాంట్ జీఎం ఆచార్యులు పాల్గొన్నారు. -
చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, భద్రతకు పటిష్ట చర్యలు
కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: జిల్లాలో బాలల సంక్షేమం, రక్షణ , భద్రతను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిరప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ కమిటీల సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల ప్రభావం నుంచి పిల్లలను రక్షించాలని, డ్రాప్ఔట్లను తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని స్పష్టం చేశారు. బాలల సంరక్షణ గృహాల్లో మెరుగైన వసతులు, పౌష్టికాహారం అందించాలని ఆదేశిస్తూ, సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు.బాల, బాలిక సంరక్షణ గృహాలను పక్కాగా నిర్వహించాలని, వసతులు కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు సూచించారు. పిల్లలకు ఆరోగ్యకర ఆహారం అందించాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో సేవలందించాలని చెప్పారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేవీ రామలక్ష్మి శాఖాపరమైన అంశాలను వివరించారు. సమావేశాశంలో మహిళా శిశు సంక్షేమ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖ, జువైనెల్ వెల్ఫేర్ విభాగం అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, చైల్డ్ కేర్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, సీడీపీవోలు, సూపర్వైజర్లు, చైల్డ్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సముద్ర భద్రత, నిఘా, సమాచార మార్పిడిలో ఉమ్మడి సమన్వయం
నగరంలో నేవీ, కోస్ట్గార్డ్ కీలక సమావేశం సింథియా : తూర్పు నావికాదళం, తీరప్రాంత రక్షణ దళం మధ్య 13వ ‘కామ్నవ్గార్డ్’ సమావేశం సోమవారం నగరంలో ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశానికి తూర్పు నావికాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్, కోస్ట్గార్డ్ అదనపు డైరెక్టర్ జనరల్ డోనీ మైఖేల్ సహ అధ్యక్షత వహించారు. సముద్ర భద్రత, నిఘా, సమాచార మార్పిడిలో ఉమ్మడి సమన్వయాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఇరు విభాగాల సీనియర్ అధికారులు కీలక చర్చలు జరిపారు. సముద్ర తీర రక్షణను బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యూహాలు, పరస్పర సహకారంపై ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. -
మిస్ ఎర్త్ ఇండియాగా ముస్కాన్
ఏయూక్యాంపస్: నగరానికి చెందిన ముస్కాన్ నయ్యర్ ప్రతిష్టాత్మక ‘మిస్ ఎర్త్ ఇండియా–2025’ కిరీటాన్ని కై వసం చేసుకున్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన గ్రాండ్ ఫినాలేలో బ్రెజిల్, స్పెయిన్, వెనిజులా వంటి దేశాల నుంచి వచ్చిన కఠిన పోటీని తట్టుకుని ఆమె ఈ విజేతగా నిలిచారు. చివరి దశలో ఎనిమిది మందితో తలపడిన ముస్కాన్, తన ప్రతిభతో విజయాన్ని అందుకున్నారు. గతంలో మిస్ ఫ్యాషన్ ఐకాన్, మిస్ వైజాగ్ రన్నరప్, మిస్ క్వీన్ ఆంధ్రప్రదేశ్ వంటి టైటిళ్లను గెలుచుకున్న ముస్కాన్, తన పాఠశాల స్థాయిలోనే మిస్ టింపనీగా గుర్తింపు పొందారు. కోల్కతాలో బీబీఏ చదువుతున్న సమయంలోనే ఫ్యాషన్ బృందానికి నాయకత్వం వహించిన ఆమె, ప్రస్తుతం మోడలింగ్ రంగంలో రాణిస్తూ విశాఖ ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. -
భిన్నత్వంలో ఏకత్వంపై కార్పొరేట్ దాడి
ఏయూక్యాంపస్ : భారతదేశ ప్రత్యేకత అయిన భిన్నత్వంలో ఏకత్వంపై ప్రస్తుతం కార్పొరేట్ శక్తులు దాడి చేస్తున్నాయని ప్రముఖ ప్రజాకవి, సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆవేదన వ్యక్తం చేశారు. బీచ్ రోడ్డులో జరుగుతున్న సీఐటీయూ అఖిల భారత మహాసభల్లో భాగంగా సోమవారం నిర్వహించిన ‘శ్రామికోత్సవ’ వేదికపై ఆయన మాట్లాడారు. తాను సినీ కవిగా కంటే ముందే భవన నిర్మాణ కూలీగా పనిచేశానని, తన పెన్నులో సిరా కాదు.. శ్రామికుల రక్తం, చెమట ఉంటాయని పేర్కొన్నారు. శ్రీశ్రీ తర్వాత కార్మిక, కర్షక జనం కోసం అత్యధిక పాటలు రాసింది తానేనని ఆయన సగర్వంగా చెప్పారు. ‘విశాఖ ఉక్కును అమ్మేదెవడు.. కొనేదెవడు’ వంటి పాటలు రాసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ప్రాణం ఉన్నంతవరకు ప్రజా గళం వినిపిస్తూనే ఉంటానన్నారు. బిడ్డకు తల్లి పాలు పట్టడానికి బదులు కల్లు పట్టే దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల సమస్యలు, స్వాతంత్య్రం తర్వాత కూడా నెలకొన్న దౌర్భాగ్య స్థితిగతులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ పాటలు, కవితలతో సభికుల్లో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి తపన్ సేన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగ రావు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, శ్రామిక ఉత్సవ్ కన్వీనర్ కె.రమాప్రభ, సీతాలక్ష్మి, దర్శకులు యాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పలు గీతాలు, నృత్యాలతో కళాకారులు అలరించారు. -
రైల్వే అభివృద్ధి పనుల వేగవంతానికి జీఎం ఆదేశం
తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ సోమవారం విస్తృతంగా పర్యటించి, పలు రైల్వే యూనిట్లు, అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. డీఆర్ఎం లలిత్ బోహ్రాతో కలిసి ముడసర్లోవలో నిర్మాణంలో ఉన్న దక్షిణ కోస్తా రైల్వే నూతన జోనల్ కార్యాలయ భవన పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డీజిల్ లోకోషెడ్ను సందర్శించి, ఎలక్ట్రికల్ లోకోల నిర్వహణపై జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. వడ్లపూడి వర్క్షాప్లోని సదుపాయాలను, విశాఖ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ పనుల ప్రగతిని సమీక్షించారు. ప్రయాణికుల సౌకర్యాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం అరణ్య క్యాంపింగ్ ఏరియాలో జరిగిన 4వ రాష్ట్ర స్థాయి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ర్యాలీ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, క్యాంప్ ఫైర్ను ప్రారంభించారు. అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచిన స్కౌట్స్ బృందాలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. -
మాఫియా
నగరంలో మిక్స్డ్ సాల్వెంట్ మహారాణిపేట: నగర శివారు ప్రాంతాల్లో అనధికార మిక్స్డ్ సాల్వెంట్ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించాల్సిన రసాయనాలను వాహనాలకు వాడే ఇంధనంగా మార్చి విక్రయిస్తున్నా, అడ్డుకోవాల్సిన ప్రభుత్వ శాఖలు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, భీమిలి వంటి శివారు ప్రాంతాల్లో ఈ అక్రమ వ్యాపారం అడ్డుఅదుపూ లేకుండా విస్తరించింది. హైదరాబాద్, చైన్నె కేంద్రంగా పనిచేసే కొన్ని ముఠాలు వివిధ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు ఈ మిక్స్డ్ సాల్వెంట్ను కొనుగోలు చేస్తున్నాయి. దానికి మరికొన్ని రసాయనాలు కలిపి ‘ఇండస్ట్రియల్ డీజిల్’ అనే ముసుగులో విక్రయిస్తున్నాయి. సాధారణ డీజిల్ ధర కంటే తక్కువగా లభిస్తుండటంతో వాహనదారులు కూడా దీనివల్ల కలిగే ప్రమాదాలను ముందే ఊహించినప్పటికీ, ఆర్థిక లాభం కోసం వీటిని పిలిపించుకుని మరీ ట్యాంకుల్లో నింపుకుంటున్నారు. ఫార్మా, కెమికల్, పాలిమర్ వంటి పరిశ్రమల్లో రసాయనాల విభజన కోసం మాత్రమే వాడాల్సిన ఈ సాల్వెంట్ను వాహనాలకు వాడటం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. అంతేకాకుండా ఇలాంటి కల్తీ ఇంధనం వల్ల వాహనాల ఇంజన్ భాగాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవహారం వెనుక భారీ నెట్వర్క్ ఈ వ్యవహారం వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం మిక్స్డ్ సాల్వెంట్ అమ్మకాలు జరపాలంటే కలెక్టర్ అనుమతి తప్పనిసరి. ఏటా అవసరమైన కోటా కోసం పౌరసరఫరాల శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ ఫైలు జాయింట్ కలెక్టర్ ద్వారా కలెక్టర్కు చేరి, తుది అనుమతి లభించిన తర్వాతే క్రయవిక్రయాలు జరగాలి. విశాఖలో మాత్రం ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కారు. ఆనందపురం శివారులో నిరంతరం ఒక ట్యాంకర్ను సిద్ధంగా ఉంచి, అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు అక్రమంగా సరఫరా చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే.. ఇంత జరుగుతున్నా విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ, పోలీస్, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ‘మామూళ్ల’ మత్తు ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. కేవలం మొక్కుబడి చర్యగా ఇటీవల పెందుర్తిలో విజిలెన్స్ అధికారులు ఒక ట్యాంకర్ను పట్టుకుని, 26,277 లీటర్ల సాల్వెంట్ను సీజ్ చేసి సివిల్ సప్లైస్ ద్వారా 6–ఏ కేసు నమోదు చేశారు. అయితే ఇది కేవలం కంటితుడుపు చర్యేనని, అసలు దారిమళ్లింపుదారులు మాత్రం స్వేచ్ఛగా వ్యాపారాన్ని మూడు ట్యాంకర్లు, ఆరు డ్రమ్ముల చందంగా కొనసాగిస్తు న్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నా, చమురు సంస్థలు సైతం మౌనం దాల్చడం వెనుక ఉన్న మర్మమేమిటో అధికారులకే తెలియాలి. ఇండస్ట్రియల్ డీజిల్ తయారీ -
భూ సమస్యల పరిష్కారానికే ‘రెవెన్యూ క్లినిక్’
మహారాణిపేట: సుదీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించడమే లక్ష్యంగా ‘రెవెన్యూ క్లినిక్’లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ వెల్లడించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)తో పాటు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రభుత్వ లక్ష్యాలను అర్థం చేసుకుని అధికారులు పని చేయాలని, ఈ క్లినిక్ల ద్వారా దీర్ఘకాలిక సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను అక్కడికక్కడే ఆన్లైన్లో పరిశీలించి సమాధానం చెప్పడం వల్ల వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ క్లినిక్ల పనితీరును ఇకపై ప్రతి వారం జేసీతో కలిసి తానే స్వయంగా పర్యవేక్షిస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ఇబ్బంది పడకుండా దరఖాస్తులు నింపేందుకు సహాయకులను నియమించడమే కాకుండా, ఫిర్యాదుదారులు అధికారుల ఎదుట కూర్చుని ప్రశాంతంగా సమస్యలు వివరించుకునేలా కుర్చీలు, ఇతర వసతులు కల్పించారు. సోమవారం జరిగిన ఈ సదస్సులో సాధారణ పీజీఆర్ఎస్కు 262 వినతులు రాగా, రెవెన్యూ క్లినిక్కు 72 ఫిర్యాదులు అందాయి. వీటిలో ప్రధానంగా ప్రభుత్వ, జిరాయితీ భూముల ఆక్రమణలు, అసైన్మెంట్ అంశాలు, జీవో 296 ప్రకారం భూముల క్రమబద్ధీకరణ, 22–ఏ జాబితా నుంచి తొలగింపు వంటి సమస్యలు ఉన్నాయి. ఆర్డీవోలు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి బాధితుల వినతులను స్వీకరించారు. పెన్షన్ల కోసం ఎక్కువ మంది దివ్యాంగులు తరలివచ్చారు. -
విశాఖ – అరకు మధ్య రైళ్లు
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం–అరకు– విశాఖపట్నం మధ్య స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం పవన్కుమార్ తెలిపారు. విశాఖపట్నం–అరకు(08525) స్పెషల్ రైలు ప్రతీ రోజు విశాఖపట్నంలో ఉదయం 8.40 గంటలకు బయల్దేరి అదేరోజు ఉదయం 12.30 గంటలకు అరకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అరకు–విశాఖపట్నం (08526) స్పెషల్ రైలు అరకులో ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు నడుస్తాయి. ఈ రైళ్లు ఇరువైపులా సింహాచలం, కొత్తవలస, శృంగవరపుకోట, బొర్రాగుహలు, స్టేషన్ల్లో ఆగుతాయి. ● విశాఖపట్నం–షాలిమర్(08507) స్పెషల్ రైలు ప్రతీ మంగళవారం విశాఖలో ఉదయం 11.20 గంటలకు బయల్దేరి మరుసటిరోజు(బుధవారం) తెల్లవారు 3 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు ఫిబ్రవరి 24వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగుప్రయాణంలో షాలిమర్– విశాఖపట్నం (08508) స్పెషల్ ప్రతీ బుధవారం షాలిమర్లో తెల్లవారు 5గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.50గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు ఫిబ్రవరి 25వ తేదీ వరకు నడుస్తాయి. -
క్రీడలతో మానసిక ఆరోగ్యం
మురళీనగర్: క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం చేకూరుతుందని ఎంపీ ఎం. శ్రీభరత్ పేర్కొన్నారు. సోమవారం విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్లో 28వ ప్రాంతీయ స్థాయి అంతర పాలిటెక్నిక్ క్రీడలు, ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని 24 పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 816 మంది క్రీడాకారులు పాల్గొంటున్న ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలేజీ ప్రాంగణంలోని నిరుపయోగంగా ఉన్న బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన ఎంపీ, తుప్పలను తొలగించి వసతులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ పులిపాటి కింగ్, గండి బాబ్జీ, జోనల్ కమిషనర్ రాము, అర్జున అవార్డు గ్రహీత సీరా జయరాం తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై కళావేదికను నిర్మించిన పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. -
ట్రక్ క్లీనర్ను రక్షించిన సీఐఎస్ఎఫ్ ఫైర్ సిబ్బంది
ఉక్కునగరం: పిట్లో ప్రమాదవశాత్తు పడి కొట్టుకుంటున్న ట్రక్ క్లీనర్ను సీఐఎస్ఎఫ్ ఫైర్ సిబ్బంది సకాలంలో రక్షించారు. వివరాలివి.. కర్నూల్కు చెందిన ట్రక్ డ్రైవర్ కృష్ణారెడ్డి, క్లీనర్ తలారి కౌలుట్ల స్టీల్ప్లాంట్కు ట్రక్లో సిలికాన్ మెగ్నీషియాన్ని తీసుకొచ్చారు. ప్లాంట్లోని ఫెర్రో స్టోర్కు చేరుకుని మెటీరియల్ అన్లోడింగ్కు ట్రక్ పెట్టారు. అక్కడ నుంచి తప్పిపోయిన కౌలుట్ల ఎల్ఎంఎం విభాగం సమీపంలోని ఆయిల్ పిట్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఏం జరిగిందో తెలీదు కాని కొద్దిసేపటికి 20 అడుగుల లోతులో ఉన్న ఆయిల్ పిట్ నుంచి అరుపులు వినిపించాయి. అటుగా వెళ్లున్న ఉద్యోగులు వెంటనే సీఐఎస్ఎఫ్ ఫైర్ విభాగానికి సమాచారం అందించారు. వారు మొదట తాడుతో ప్రయత్నించారు. అది జారి పోతుండటంతో ఎట్టకేలకు అగ్నిమాపక నిచ్చెన ద్వారా బయటకు తీశారు. అతని కోసం అప్పటికే ప్రయత్నిస్తున్న డ్రైవర్ కృష్ణారెడ్డి అక్కడకు చేరుకుని కౌలుట్ల మానసిక స్థితి బాలేదని చెప్పారు. వెంటనే అతన్ని సీఐఎస్ఎఫ్ వాహనంలో బీసీ గేటు బయటకు తరలించారు. ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షించిన ఫైర్ సిబ్బందిని ఉద్యోగులు అభినందించారు. -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 100 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు మొత్తం 100 వినతులు అందాయి. కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్.ఎస్. వర్మతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అందిన ఫిర్యాదులను అదే రోజు పరిశీలించి, నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. వీటిలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్కు 43 ఫిర్యాదులు అందగా.. ఇంజినీరింగ్–18, అడ్మినిస్ట్రేషన్–14, రెవెన్యూ–11, ప్రజారోగ్యం–6, యూసీడీ–5, హార్టికల్చర్ విభాగానికి 3 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణరాజు, సీసీపీ ప్రభాకరరావు, ఎంహెచ్వో నరేష్ కుమార్ పాల్గొన్నారు. -
జీవీఎంసీలో 10 జోన్ల పాలన
ఎందెందు చూసినా.. అవే వైఫల్యాలు న్యూ ఈయర్ వేడుకలకు అనుమతులు తప్పనిసరి● ఈ ఏడాదీ చంద్రబాబు పాలనలో విశాఖ అభివృద్ధి శూన్యం ● వైఎస్సార్సీపీ హయాంలో నిర్మాణాల్నే తమ గొప్పలుగా డప్పులు ● భాగస్వామ్య సదస్సులో రూ.లక్షల కోట్ల ఒప్పందాల పేరుతో బురిడీ ● సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను హిట్ వికెట్గా అవుట్ చేసిన సర్కారు ● పదే పదే ఆర్థిక రాజధాని పేరుతో అబద్ధాలే తప్ప.. అభివృద్ధి లేదు ● ఇప్పుడు విశాఖ రీజియన్ డెవలప్మెంట్ పేరుతో పీపీటీ మాయాజాలం నాడు వైభవం.. 2019 డిసెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటన చేసిన తర్వాత.. నగరం దశ దిశలా పరుగులు తీసింది. గత విశాఖ వేరు.. 2019–24 మధ్యలో అభివృద్ధి చెందిన విశాఖ వేరు అన్న రీతిగా జంక్షన్లు, పర్యాటక ప్రాంతాలు, నగరదారుల రూపురేఖలు మారిపోయాయి. 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. మళ్లీ పాత విశాఖవైపుగా తీసుకెళ్తోంది. 2025 అంతా విశాఖను అభివృద్ధి చేసేశామంటూ మాయమాటలు చెబుతూ.. నగర వైభవాన్ని బంగాళాఖాతంలో ముంచేసిందని విమర్శలొస్తున్నాయి. 2025లో ఏ ఒక్క వర్గాన్నీ సంతోషంగా ఉంచిన రోజు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని అన్ని వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అన్నదాతల తిప్పలు ఈ ఏడాది అన్నదాతలు అష్టకష్టాలు పడ్డారు. విత్తనాలు దొరక్క, సరైన సమయంలో వర్షాలు కురవక.. ఖరీఫ్ తొలిసీజన్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానా పాట్లు పడి.. విత్తులు దొరికిన తర్వాత.. చేను కాపాడుకోవడానికి ఎరువుల కోసం యుద్ధాలే చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నెల రోజుల పాటు కష్టపడి ఎరువులు సంపాదిస్తే.. మోంథా తుపాను వచ్చి.. మొత్తం పంటని నాశనం చేసేసింది. జిల్లాలో 26 గ్రామాల పరిధిలో 415 మంది రైతులకు చెందిన 286.88 ఎకరాలు పంటలు తుపాను ముంపునకు గురైతే.. పరిహారం పూర్తిస్థాయిలో ఇవ్వని దుస్థితిలో ఉంది. 2025.. విశాఖను ఆర్థిక రాజధాని చేస్తానంటూ చంద్రబాబు చెప్పిన అబద్ధాలకు సాక్ష్యంగా మారింది. భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులంటూ.. చంద్రబాబు ప్రభుత్వ అంకెల గారడీ పోటీల్లో 2016, 2017, 2018ని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు పరుగులు తీయగా ప్రేక్షకపాత్ర పోషించింది. గత ప్రభుత్వం మొదలెట్టిన ప్రాజెక్టులు పూర్తయితే, వాటిని ప్రారంభించి తమ ఖాతాలో వేసుకున్న క్రెడిట్ చోరీకి ప్రధాన సాక్షిగా నిలిచింది. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను హిట్ వికెట్గా అవుట్ చేయగా.. అంపైర్ అవతారమెత్తింది. ఇలా.. చంద్రబాబు సర్కారు తిమ్మిని బమ్మిని చేసి పవర్పాయింట్ ప్రజెంటేషన్లతో అరచేతిలో వైకుంఠాన్ని చూపించి 2025 సంవత్సరాన్ని గంగార్పణం చేసేసింది. ఈ ప్రభుత్వం 2025లో ఏం చేసిందని వెనక్కి తిరిగి చూసుకుంటే గ్రాఫిక్స్ మాయాజాలమే తప్ప.. ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదన్నది స్పష్టమవుతోంది. – సాక్షి, విశాఖపట్నం పర్యాటక మాయలేనా.? పర్యాటక రాజధానిగా విశాఖను మారుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పటివరకు ఒక్క కొత్త ప్రాజెక్టు పనులు కూడా మొదలు పెట్టలేదు. కై లాసగిరిపై ఇటీవల గ్లాస్ బ్రిడ్జ్ ప్రాజెక్టు తమ ఘనతేనంటూ నిస్సిగ్గుగా బాకాలు ఊదుకుంటోంది. కానీ.. ఈ ప్రాజెక్టుకు 2024 జనవరిలోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సూచనల మేరకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (ఎల్వోఈ) ఇచ్చారు. వీఎంఆర్డీఏ ఆవరణలో ది డెక్ భవనం పనులు కూడా గత ప్రభుత్వ హయాంలో 80 శాతం వరకూ పూర్తయ్యాయి. ఒక్క ప్రాజెక్టు తీసుకురాకపోగా.. యాత్రీనివాస్, ఇతర పర్యాటక స్థలాలు, భవనాలు ప్రైవేటుకు ధారాదత్తం చేసేసింది. సింహాచలం: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఉత్తర రాజగోపురంలో మంగళవారం ఉదయం 5.30 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వైకుంఠనారాయణుడిగా శ్రీదేవి, భూదేవి సమేతుడై దర్శనమివ్వనున్నాడు. సుమారు 50 వేల మంది భక్తులు ఈసారి స్వామి దర్శనానికి వస్తారని అంచనా వేశారు. ఉచిత దర్శనం క్యూతోపాటు రూ.100, రూ..300 దర్శన క్యూలు, రూ.500 ప్రత్యేక దర్శన క్యూ, ప్రోటోకాల్ వీఐపీల క్యూలు ఏర్పాటు చేశారు. ఉత్తరరాజగోపురం ఎదురుగా భక్తులు క్యూల్లో నడుస్తూనే 15 నిమిషాలపాటు స్వామిని దర్శించుకునే ఏర్పాటు చేశారు. అలాగే ఉత్తరద్వారం దర్శనం కాగానే నేరుగా ఆలయంలోకి వెళ్లి నీలాద్రిగుమ్మం నుంచి మూలవిరాట్ దర్శనం చేసుకునేలా క్యూలు రూపొందించారు. ఆలయ రాజగోపురం, ఉత్తర రాజగోపురం, ఆలయ ప్రాంగణాలకు విద్యుద్దీపకాంతులు చేకూర్చారు. భారీ ఎత్తున పుష్పాలంకరణ చేశారు. ఉదయం 4 గంటల నుంచి సింహగిరికి ఆర్టీసీ, దేవస్థానం బస్సులు ప్రారంభమవుతాయి. సుమారు లక్ష లడ్డూల ప్రసాదాన్ని విక్రయానికి సిద్ధం చేశారు. సింహగిరిపైన, కొండదిగువ కలిపి మొత్తం ఆరుచోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 190 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు విధులు నిర్వర్తిస్తారని గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్.నాయుడు తెలిపారు. నేటి నుంచి రాత్రి 7 గంటల వరకే దర్శనాలు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు మంగళవారం నుంచి జనవరి 9వ తేదీ వరకు రాత్రి 7 గంటల వరకు మాత్రమే లభిస్తాయని అధికారులు తెలిపారు. ఆలయంలో జరిగే రాపత్తు ఉత్సవాల సందర్భంగా ఈ మార్పు చేసినట్టు పేర్కొన్నారు. రూ.కోట్లు ఖర్చు చేసినా వెలవెలబోయిన పార్టనర్ షిప్ సమ్మిట్ పీ4 పేరుతో పేదలకు మోసం.! పీ–4 విధానంతో సమాజంలో అట్టడుగున్న ఉన్న పేద కుటుంబాల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి.. బంగారు కుటుంబాలుగా మార్చుతామంటూ బీరాలు పలుకుతున్న కూటమి ప్రభుత్వం.. ఏడాది గడిచినా మొండిచెయ్యి చూపిస్తోంది. 2025 ఉగాది నాటికి ఆ కుటుంబాల్లో వెలుగులు నింపుతామంటూ చంద్రబాబు బాకాలు కొట్టారు. 2026లో వస్తున్నా ఆ ఛాయలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. జిల్లాలో 70 వేల బంగారు కుటుంబాలను గుర్తించారు. ఈ కుటుంబాల్ని దత్తత తీసుకునే మార్గదర్శులు దొరక్క.. ప్రభుత్వం ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో.. ఇప్పటివరకూ 10 శాతం కుటుంబాలకు మాత్రమే మార్గదర్శులు దొరికారంటే బాబు పాలన ఎలా ఉందో స్పష్టమవుతోంది. పర్యావరణాన్ని ‘గాలి’ కొదిలేసింది.! చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాయు కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలి కాలుష్య నియంత్రణకు రూ.39.6 కోట్లు ఖర్చు చేసి.. పర్యావరణానికి పెద్దపీట వేసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రజల ఆరోగ్యంపై శీతకన్నేశారు. దీంతో దేశంలోనే రెండో స్థానానికి వాయు కాలుష్య స్థాయిలు ఎగబాకాయంటే.. ఇక్కడ పీల్చే గాలి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. 2019 డిసెంబర్లో పీఎం10 స్థాయిలు 108 ఉండగా.. 2021 నాటికి 90కి చేరుకుంది. 2025 డిసెంబర్లో మాత్రం ఇది 3 రెట్లకు పైగా పెరిగి 308కి చేరుకుందంటే.. చంద్రబాబు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో తెలుస్తోంది. సింహాచలం చరిత్రలో తొలిసారిగా ఘోరం.! చరిత్ర కలిగిన సింహాద్రి అప్పన్న దేవాలయంలో 2025 ఓ విషాద మరకగా మారిపోయింది. ఏటా నిర్వహించే సింహాద్రి అప్పన్న నిజరూపదర్శన భాగ్యం చందనోత్సవం ఏర్పాట్లలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఏప్రిల్ 30న దర్శనం మొదలైన కాసేపటికే గోడ కూలి.. ఏడుగురు భక్తులు కొండపైనే మృత్యుఒడికి చేరుకున్నారు. ప్రతి అంశంలోనూ మోసమే.! తమకు నచ్చిన కంపెనీలకు విశాఖలో భూములను ఽకారు చౌకగా కట్టబెట్టేసింది. అనేక నగరాల్లో లూలూ సంస్థ సొంత భూములు కొనుగోలు చేసి కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తే.. విశాఖలో మాత్రం రూ.వేల కోట్లు విలువ చేసే భూముల్ని ఎకరం 99 పైసలకే ఆ సంస్థకు కట్టబెట్టింది. ఇదే తీరులో ఊరు పేరు లేని ఉర్సా వంటి సంస్థలకు కూడా భూ పందేరాలు చేసేసింది. గత ప్రభుత్వం పక్కగా మెట్రో డీపీఆర్ని తయారు చేస్తే కేంద్రం ఆమోదముద్ర వేసే సమయానికి ఆపించేసి.. మార్పులు చేస్తామంటూ మోసం చేసింది. ఇప్పుడు డీపీఆర్ ఆమోదం లేకుండా టెండర్లు పిలిచి.. ఇదిగో మెట్రో అంటూ హడావుడి చేసి.. టెండర్లను కూడా వాయిదా వేస్తూ వస్తోంది. ఎన్నికల ముందు స్టీల్ప్లాంట్ని కాపాడే బాధ్యత తనదంటూ చెప్పిన చంద్రబాబు.. ఇటీవల ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రశ్నించిన ఉద్యోగులపై విరుచుకుపడ్డారు. మీరేం పనిచేస్తున్నారు అంటూ వీరంగమాడారు. 2025లోనే ప్రైవేటీకరణకు వడివడిగా అడుగులు పడ్డాయంటే.. బాబు మోసం ఎలా ఉందో అర్థమవుతోంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ పేరుతో విశాఖవేదికగా 2016, 2017, 2018లో సదస్సులు నిర్వహించారు. ఒక్కో ఏడాది రూ.5 లక్షల కోట్లు, రూ.2 లక్షల కోట్లు, రూ.7 లక్షల కోట్లు అంటూ ఊదరగొట్టారు. అందులో ఒక్క శాతం కూడా కార్యరూపం దాల్చలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చాక.. చంద్రబాబు మరోసారి అంకెల గారడీ చేశారు. 2025లో నిర్వహించిన సమ్మిట్లో ఏకంగా రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ మాయ చేశారు. ఇందులో సగానికి పైగా పెట్టుబడులు 2023లో వైఎస్సార్సీపీ హయాంలో 2023లో నిర్వహించిన జీఐఎస్ సమ్మిట్లో వచ్చినవే కావడం కొసమెరుపు. విశాఖ రీజియన్ డెవలప్మెంట్ పేరుతో వందల పేజీల పవర్పాయింట్ ప్రజెంటేషన్తో గ్రాఫిక్ మాయాజాలంతో మరోసారి మభ్యపెట్టారు. ఇలా.. ‘ఇందుగలడందులేడు.. ఎందెందు వెతికినా.. అందందే.. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు కనబడును’ అన్నట్లుగా 2025లో చంద్రబాబు పాలన పాలిపోయింది. దర్శన వివరాలు ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు ఉత్తరద్వార దర్శనాలు ముగిసినా.. మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు మూలవిరాట్ దర్శనాలు ఉంటాయి. -
విశాఖ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం
ఏయూక్యాంపస్: నగరంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రాబల్యం అధికంగా ఉందని, కార్మిక శక్తి ఈ నగరానికి వెన్నెముక అని వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ పేర్కొన్నారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్ మైదానంలో జరుగుతున్న సీఐటీయూ ‘శ్రామిక ఉత్సవ్’ రెండో రోజు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1970లో ప్రారంభమైన సీఐటీయూ కార్మిక హక్కుల సాధనలో ఎన్నో విజయాలు సాధించిందని కొనియాడారు. కార్మిక సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ఎల్లప్పుడూ సానుకూలంగా స్పందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. విశాఖను పారిశ్రామికంగానే కాకుండా ఐటీ, పర్యాటక రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపేందుకు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నట్లు కమిషనర్ వెల్లడించారు. తర్లువాడలో గూగుల్ కార్యకలాపాలు, కాపులుప్పాడ, మధురవాడల్లో ఐటీ హబ్ల విస్తరణతో పాటు నగరాన్ని ‘అడ్వెంచర్ హబ్’గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నగరంలోని 50 మురికివాడలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. కార్మికుల సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధికి లేబర్ సంస్కరణలు ఎంతగానో తోడ్పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ప్రాంగణంలోని పుస్తక ప్రదర్శనను సందర్శించి, సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన కళాకారులను అభినందించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అద్యక్షుడు వి.కృష్ణయ్య, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి, జిల్లా కన్వీనర్ మణి, శ్రామికత ఉత్సవ్ కన్వీనర్ రమాప్రభ, అల్లూరి హాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి నరసింహ రాజు తదితరులు పాల్గొన్నారు. -
విగతజీవులుగా సముద్ర జీవరాశులు
కొమ్మాది: భీమిలి బీచ్ రోడ్డు మంగమారిపేట తీరంలో ఆదివారం విషాదకర దృశ్యం చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో సముద్ర జీవరాశులు విగతజీవులుగా మారి అలల తాకిడికి తీరానికి కొట్టుకువచ్చాయి. వీటిలో ప్రధానంగా కటిల్ఫిష్లతో పాటు తాబేళ్లు, ముళ్లకప్ప చేపల కళేబరాలు బీచ్ అంతటా పడి ఉండటం స్థానికులను కలచివేసింది. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, సముద్ర జలాల్లో పెరుగుతున్న కాలుష్యం, మత్స్యకారుల బోట్లు బలంగా తగిలినప్పుడు ఇలాంటి మరణాలు సంభవిస్తాయని తీరప్రాంత మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. కటిల్ ఫిష్, ముళ్లకప్ప చేప


