త్వరలో ఏపీ జైళ్ల శాఖలో కొత్త చట్టం: ఐజీ శ్రీనివాసరావు
ఆరిలోవ : ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో 1894 నాటి పాత చట్టం స్థానంలో త్వరలో కొత్త చట్టం అమలులోకి రానుందని జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన ఆయన ఏపీ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ బిల్లు–2026ను ఇప్పటికే అసెంబ్లీలో ప్రవేశపెట్టామని, గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే ఇది చట్టరూపం దాల్చుతుందని వెల్లడించారు. ఈ కొత్త చట్టం ద్వారా జైళ్ల ఆధునీకరణ, ఖైదీల సంక్షేమం, మానవీయ సంస్కరణలకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. అలాగే రాష్ట్రంలోని వివిధ జైళ్ల అభివృద్ధికి రూ.102 కోట్లు కేటాయించామని, అందులో మొదటి విడతగా విడుదలైన రూ.53 కోట్లతో కొత్త బ్యారక్లు, సిసి కెమెరాలు, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. జైళ్ల పరిపాలనలో పటిష్ట నాయకత్వం, నైతిక విలువలు అత్యవసరమని పేర్కొన్నారు. ‘కారాగార పరిపాలనా నాయకత్వం’పై అధికారులకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభ నిర్వహణ, పరిపాలనలో సంస్కరణల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో లా కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రుచా మిశ్రికోట్కర్, జైలు సూపరింటెండెంట్ ఎం.మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.


