మద్దిలపాలెం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పాల్గొని మహిళా సాధికారతపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆనందపురం మండలం గిడిజాల వద్ద 50 ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యం 50 శాతానికి పెరగాలని ఆకాంక్షించారు. జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీసీసీ ఎండీ శోభిక, అంధ మహిళా క్రికెటర్ పి. కరుణ కుమారిని సత్కారించారు. ప్రత్యేక ఉప కలెక్టర్ శేషశైలజ, జిల్లా కోఆపరేటివ్ అధికారిణి ప్రవీణ, జూ క్యూరేటర్ మంగమ్మ, సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ ఉషారాణి, జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణి, ఐసీడీఎస్ పీడీ రామలక్ష్మి తదితర అధికారులతో పాటు ఆయా రంగాల్లో ప్రతిభ చూపిన 59 మంది మహిళా అధికారులకు, సిబ్బందికి అవార్డులు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యపద్మ, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను అతిథులు సందర్శించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ చందోలు, లతా మాధురి పాల్గొన్నారు.


