breaking news
Visakhapatnam District Latest News
-
వాహనదారులకు చుక్కలు
విశాఖ సిటీ: విశాఖ వాసులను ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు ఇటీవల కాలంలో తలెత్తుతున్నాయి. నగరంలో ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం నిర్వహించినా ఆ ప్రభావం బీచ్ రోడ్డు, జాతీయ రహదారిపై పడుతోంది. కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోతున్నాయి. తాజాగా సీఐఐ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు మరోసారి నగరవాసుల సహనానికి పరీక్ష పెట్టింది. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మరోవైపు పారిశ్రామికవేత్తలు రాకపోకల సమయంలో ట్రాఫిక్ను ఎక్కడిక్కడ నిలిపివేశారు. దీంతో ఉదయం, సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆయా రహదారుల్లో సాధారణ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్తంభించిన ట్రాఫిక్: వీఐపీలు, పారిశ్రామికవేత్తలకు నగరంలో స్టార్హోటళ్లలో బస ఏర్పాట్లు చేశారు. వీరు ఉదయం హోటళ్ల నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానానికి వచ్చే సమయంలో ట్రాఫిక్ను నిలిపివేశారు. అలాగే సాయంత్రం కూడా సదస్సు ముగిసిన తర్వాత వీరు బస చేసిన హోటళ్లకు వెళ్లే సమయంలో కూడా సాధారణ వాహనాలను ఆ రహదారుల్లో అనుమతించలేదు. దీంతో ప్రజలు నరకం చూశారు. ప్రధానంగా బీచ్ రోడ్డులో బారికేడ్లు పెట్టి వాహనాలను నిలిపివేయడంతో అటువైపు ప్రయాణించే వాహనదారులు జాతీయ రహదారి వైపు మళ్లారు. దీంతో బీచ్ రోడ్డులోను, జాతీయ రహదారిపై ట్రాఫిక్ కష్టాలు తలెత్తాయి. జాతీయ రహదారి మద్దిలపాలెం నుంచి హనుమంత వాక జంక్షన్ వరకు ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. అలాగే బీచ్ రోడ్డులో నోవాటెల్ హోటల్ నుంచి రాడిసన్ బ్లూ మధ్య అనేక సార్లు వాహనాలను నిలిపివేశారు. ప్రధానంగా బీచ్ రోడ్డులో నివాసితులు ప్రత్యక్ష నరకం చూశారు. సాధారణంగా 30 నిమిషాలు పట్టే ప్రయాణం.. శుక్రవారం మాత్రం గంటన్నర, రెండు గంటలు పట్టింది. -
విశాఖను వ్యాపారానికి కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ఎంవీపీకాలనీ: విశాఖను వ్యాపార రంగానికి కేంద్రంగా నిలుపుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానికి సత్యప్రసాద్ పేర్కొన్నారు. నెరెడ్కో ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా నిర్వహిస్తున్న ‘నెరెడ్కో వైజాగ్ ప్రోపర్టీ ఫెస్ట్–2025’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో కలిసి ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటి ఆఫ్ డెస్టినీగా ప్రసిద్ధి చెందిన విశాఖను పెట్టుబడులకు డెస్టినీగా కూడా నిలుపుతామన్నారు. విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయన్న ఆయన రానున్న రోజుల్లో విశాఖ గేట్ వే ఆఫ్ బిజినెస్గా నిలుస్తుందన్నారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ విశాఖ అభివృద్ధిలో రాష్ట్ర వ్యాపారులంతా భాగస్వాములుగా నిలవాలన్నారు. విశాఖకు కమర్షియల్ ఎస్టాబ్లిస్మెంట్ అవసరమన్న ఆయన వాణిజ్య సముదాయాలు, వ్యాపార వర్గాల కార్యాలయాలు, స్టార్ హోటళ్లు మరిన్ని రావాల్సి ఉందన్నారు. నెరెడ్కో జాతీయ అధ్యక్షుడు హరిబాబు, రాష్ట్ర అధ్యక్షుడు చక్రధర్, విశాఖ అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ వ్యాపారాభివృద్ధికి నెరెడ్కో అందిస్తున్న సేవలను వివరించారు. విశాఖ పెట్టుబడులకు అనుకూలంగా నిలుస్తోందన్నారు. ఇలాంటి ప్రోపర్టీ షోల ద్వారా వ్యాపారాభివృద్ధికి చేస్తున్న కృషి వివరించారు. అనంతరం అతిథులు విశాఖలోని పలువురు వ్యాపార ప్రముఖులను సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గౌతు శిరీష, విష్ణుకుమార్రాజు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్, కమిషనర్ తేజ్ భరత్, నెరెడ్కో ప్రతినిధులు చోడే పట్టాభిరామ్, వెంకన్న చౌదరి, సుబ్బారావు పాల్గొన్నారు. -
అంతా డొల్లే..
పారిశ్రామికవేత్తలుగా విద్యార్థులతో మేనేజ్ప్లీనరీ సెషన్లలో యూనివర్సిటీల విద్యార్థులుసాక్షి, విశాఖపట్నం: ప్రచారం ప్రపంచాన్ని దాటేసింది. క్షేత్రస్థాయిలో మాత్రం డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపించింది. పారిశ్రామికవేత్తలు ఉండాల్సిన స్థానాల్లో విద్యార్థులను కూర్చోబెట్టి సెషన్లను ‘మేనేజ్’ చేసేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులే సెషన్లలో వక్తలుగా.. టీడీపీ నేతలే ఒప్పందాలు చేసుకున్న డెలిగేట్స్గా వ్యవహరించారు. ‘చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ..’ అన్నట్లుగా పాత ఒప్పందాలనే కొత్తగా చూపిస్తూ.. క్రెడిట్ చోరీలో సాటిలేని చంద్రబాబు సమర్పించిన భాగస్వామ్య సదస్సు సినిమా తొలిరోజు అట్టర్ఫ్లాప్ అయింది. ముఖ్యంగా, ప్రారంభోత్సవ ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. కుర్చీలు లేక వీఐపీల అవస్థలు ఉదయం 8.30 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించినా, 9.30 గంటల వరకు సభా ప్రాంగణం వెలవెలబోయింది. దీంతో అధికారులు ఆగమేఘాల మీద గీతం, ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులను ప్లీనరీ హాళ్లకు, ప్రధాన సభా ప్రాంగణానికి తరలించారు. పారిశ్రామికవేత్తల స్థానాల్లో విద్యార్థులే కనిపించడంతో, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముఖ్య అతిథులు సైతం ఆశ్చర్యపోయారు. కేవలం ప్రచార పటాటోపం తప్ప.. భాగస్వామ్య సదస్సు అంతా సినిమా షో అని కీలక వ్యక్తులకూ అర్థమైపోయింది. ఇంతలో సభ ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు చేదు అనుభవం ఎదురైంది. వారంతా అక్కడికి చేరుకునే సరికి కుర్చీలు దొరకలేదు. ఎక్కడ కూర్చోవాలో తెలీక కాసేపు నిలబడాల్సి వచ్చింది. ప్రపంచ స్థాయిలో ఏర్పాట్లు చేశామని చంద్రబాబు చెప్పిన మాటలకు.. అక్కడ పరిస్థితులకు ఎలాంటి సంబంధం లేకపోవడంతో వారు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. నేటితో ముగియనున్న సదస్సు భాగస్వామ్య సదస్సు శనివారం రాత్రితో ముగియనుంది. రెండో రోజు ఉదయం 9.30 నుంచి సాయంత్రం వరకు వివిధ ప్లీనరీ హాల్స్లో పలు సెషన్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 మధ్య ప్రధాన వేదిక ప్రాంగణం హాల్ నంబరు–7లో పరిశ్రమల శాఖ 27, పర్యాటక శాఖ 21, ఐటీ శాఖ 7, చేనేత–జౌళీ శాఖ 2 ఎంవోయూలను కుదుర్చుకోనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు వేడుకలు ప్రధాన వేదికై న ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్లీనరీ హాల్–5లో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు, సీఐఐ ఉపాధ్యక్షురాలు సుచిత్రా కె.యల్ల, సీఐఐ ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్మన్ ఆర్.దినేష్ తదితరులు హాజరుకానున్నారు. చంద్రబాబు మాట్లాడే సమయానికి ఖాళీగా దర్శనమిచ్చిన ప్రధాన సభా ప్రాంగణంమంత్రుల అనుచరులే సెషన్ల వక్తలు.! ఇక ప్లీనరీ సెషన్ల విషయంలోనూ ప్రచారానికే పరిమితమయ్యారు తప్ప, అవి క్షేత్రస్థాయిలో విజయవంతం కాలేదు. వివిధ సెషన్లలో నిపుణులకు బదులుగా, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలకు చెందిన పారిశ్రామిక నేపథ్యం ఉన్న అనుచరులే వక్తలుగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ సెషన్లలోనూ ప్రతినిధులెవరూ పాల్గొనకపోవడంతో, ఏయూ విద్యార్థులను హడావిడిగా తీసుకొచ్చి హాళ్లను నింపేశారు. మొత్తంగా తొలి రోజు సదస్సు ప్రచారంలో ఉన్నంత ఏమీ లేదనీ.. అంతా డొల్లేనని తేలిపోయింది. వేదికని కుదించేశారు చాలా సేపు ఓపికగా కూర్చున్న విద్యార్థులు సైతం సహనం కోల్పోయి, ప్లీనరీ సమయానికి వెనక్కి వెళ్లిపోయారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం మొదలయ్యే సమయానికి ప్రధాన వేదిక ప్రాంగణం దాదాపు ఖాళీగా దర్శనమిచ్చింది. ఈ పరిణామంతో మంత్రులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. చేసేదేమీ లేక, అధికారులు సభా ప్రాంగణాన్ని కుదించేశారు. అక్కడక్కడా కూర్చున్న వారిని ముందుకు పంపించి, ఖాళీలను కప్పిపుచ్చారు. వివిధ కార్పొరేట్ కంపెనీలకు చెందిన ఐటీ, టూరిజం, పరిశ్రమలు, ఆసుపత్రుల రంగాల ఉద్యోగులతో ప్రాంగణాన్ని నింపేందుకు యత్నించారు. అయినా వందల కుర్చీలు ఖాళీగా కనిపించడంతో, చివరికి ప్రధాన ప్రాంగణానికి పార్టిషన్ వేసి వేదికను కుదించేశారు. -
అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం : అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.పవన్కుమార్ తెలిపారు. విశాఖ–కొల్లాం(08539) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 18 నుంచి జనవరి 20వ తేదీ వరకు ప్రతీ మంగళవారం ఉదయం 8.20 గంటలకు విశాఖలో బయల్దేరి బుధవారం మధ్యాహ్నం 1.45 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. కొల్లాం–విశాఖపట్నం (08540) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 19 నుంచి జనవరి 21వ తేదీ వరకు ప్రతీ బుధవారం సాయంత్రం 5 గంటలకు కొల్లాంలో బయల్దేరి గురువారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పడి, జాలర్పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదునూర్, పాలక్కడ్, త్రిచ్చూర్, అలువ, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగన్నూర్, కాయంకులం స్టేషన్లలో ఆగుతాయి. -
రిజిస్ట్రేషన్ చేసుకోండి.. సదస్సుకు వెళ్లండి..!
సాక్షి, విశాఖపట్నం : ఎటు చూసినా ఖాళీ కుర్చీలతో భాగస్వామ్య సదస్సు వెలవెలబోతోంది. తొలిరోజు ఏయూ, గీతం విద్యార్థులను తీసుకొచ్చినా.. వారు గంటసేపు కూడా హాల్లో ఉండకపోవడంతో ప్రధాన వేదిక బోసిపోయింది. రెండో రోజూ అదే మాదిరిగా దర్శనమిస్తే.. పరువుపోతుందనీ దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటూ చంద్రబాబు, లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పారిశ్రామికవేత్తలను ఇప్పటికిప్పుడు తీసుకురావడం కష్టమని భావించిన అధికారులు.. విద్యార్థుల్నే నమ్ముకున్నారు. ఏయూ విద్యార్థులను తీసుకురావాలని నిర్ణయించారు. విద్యార్థులతో పాటు అధ్యాపకులు, ఇతర స్టాఫ్ ఎవరైనా సదస్సుకు వెళ్లాలని అనుకుంటే.. గురువారం రాత్రి 8 గంటల్లోగా పేర్లు హెచ్వోడీకి ఇవ్వాలంటూ ఏయూ విద్యార్థులు, అధ్యాపకుల సోషల్ మీడియా గ్రూపుల్లో మెసేజ్ చేశారు. ఎంతో ప్రచార ఆర్భాటం చేసిన సదస్సులో కుర్చీలు నింపేందుకు మనల్ని రమ్మని చెప్పడం సిగ్గు చేటుగా ఉందంటూ విద్యార్థులు చర్చించుకున్నారు. నేడు ప్రధాన వేదిక మొత్తం గీతం విద్యార్థులే.! భాగస్వామ్య సదస్సులో ప్రధాన వేదికగా చెప్పుకుంటున్న ఏపీ పెవిలియన్ హాల్–5 నిండే పరిస్థితులు కనిపించడం లేదు. ఓవైపు.. ఏయూ విద్యార్థులకు బంపర్ ఆఫర్ అంటూ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించినా.. ఆశించిన స్థాయిలో వస్తారో రారో అని భయం చంద్రబాబు ప్రభుత్వానికి పట్టుకుంది. అందుకే తమ బంధువుకి చెందిన గీతం వర్సిటీ విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదిక హాల్–5లోకి ప్రవేశం కల్పిస్తూ గీతంకి చెందిన వందల మంది విద్యార్థులకు యాక్సెస్ పాస్లు గురువారం రాత్రి పంపిణీ చేశారు. గీతం విద్యార్థులతో ప్రధాన వేదిక నింపేసి.. మిగిలిన సెషన్ల హాళ్లలో ఏయూ విద్యార్థులతో నింపేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు, అనేక దేశాల నుంచి వాణిజ్య ప్రతినిధులు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది పారిశ్రామికవేత్తలు విశాఖకు తరలివస్తున్నారంటూ ఊదరగొట్టిన చంద్రబాబు సర్కారు.. చివరికి విద్యార్థుల్నే డెలిగేట్స్గా చూపించి.. పబ్బం గడిపేసుకునేందుకు సిద్ధమవుతుండటం కొసమెరుపు. -
కంచరపాలెం పాలిటెక్నిక్తో రష్యన్ కాలేజీ ఎంవోయూ
మురళీనగర్: కంచరపాలెం పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆన్జాబ్ ట్రైనింగ్కు సంబంధించి రష్యాకు చెందిన పాలిటెక్నిక్ కాలేజీ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఇటీవల రష్యా ప్రతినిధులు పాలిటెక్నిక్ కాలేజీని రెండు సార్లు సందర్శించి ఇక్కడి సౌకర్యాలు, ఫ్యాకల్టీ, లేబొరేటరీ, బోధనాభ్యసనంలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. ఈ మేరకు విశాఖలో నిర్వహిస్తున్న సీఐఐ సదస్సులో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ జి.గణేష్కుమార్ సమక్షంలో రష్యాకు చెందిన పెర్వరల్స్కీ మెటలర్జికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆంతిపినా ఫెలిస్కోవ్నా, కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నకుమార్లు ఎంవోయూ పత్రాలు మార్చుకున్నారు. -
వైఎస్సార్సీపీ జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో చోటు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ జిల్లా అనుబంధ విభాగాల కమిటీలో పలువురిని నియమించారు. 9 కమిటీల్లో 27 మందికి చోటు కల్పించారు. అదేవిధంగా గాజువాక నియోజకవర్గంలోని ఐదు క్లస్టర్లకు అధ్యక్షులను, విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 6, 43, 53,54, 55వ వార్డులకు అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా స్థాయి నియామకాలు జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షుడిగా మేరుగ గణేష్, జిల్లా బీసీ సెల్ కమిటీ ఉపాధ్యక్షుడిగా దూడ ధనంకొండ, జిల్లా ఆర్టీఐ వింగ్ కమిటీ కార్యదర్శిగా కూరందాస్ సింహాచలం, జిల్లా వాణిజ్య విభాగం కమిటీ కార్యదర్శిగా సూరాడ పెంటారావు, జిల్లా గ్రీవెన్స్ సెల్ కమిటీ కార్యదర్శిగా తవ్వార్ క్షేత్రపాల్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా దూడపాటి రాజేశ్వరి, జిల్లా సోషల్ మీడియా వింగ్ ప్రధాన కార్యదర్శిగా గుడాల బాబూరావు, కార్యదర్శిగా దామోదర ఈశ్వరరావు, జిల్లా పబ్లిసిటీ వింగ్ కమిటీ కార్యదర్శిగా దుంప పోలిరెడ్డి, జిల్లా దివ్యాంగుల విభాగం కమిటీ కార్యదర్శిగా కొట్టిన నాగ భీమ కొండలరావును నియమించారు. జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నక్కన రాజ్కుమార్ యాదవ్, కార్యదర్శులుగా పల్లా శ్రీనివాస్, మీసాల ప్రదీప్ నియమితులయ్యారు. జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షులుగా చెరుకూరి రజిని, డాక్టర్ చప్పిడి వెంకట సత్య, కార్యదర్శిగా పేర్ర మాసేనమ్మను నియమించారు. జిల్లా లీగల్ సెల్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా సూరిశెట్టి అనిల్కుమార్, కార్యదర్శిగా ఆరిపాక రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్.గోపాలరావు, దువ్వాడ పూర్ణచంద్ర శేఖర్ నియమితులయ్యారు. జిల్లా వైఎస్సార్టీయూసీ కమిటీ కార్యదర్శులుగా కోరాడ శ్రీనివాసరావు, ఎస్.వి.వి.కమలనాయుడు, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కె.అర్జున్ను నియమించారు. జిల్లా వలంటీర్ వింగ్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా శరగడం వేణుగోపాల్ రెడ్డి, కార్యదర్శిగా బాలిరెడ్డి శ్రీనివాసరావు, ఇద్దరు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు నియమితులయ్యారు. -
బ్యాక్లాగ్లు
బ్యాక్డోర్లోవిశాఖ సిటీ: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. విద్యార్థులకు పురుగుల భోజనాలు, యూనివర్సిటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లు, డిస్పెన్సరీలో ఆక్సిజన్ పెట్టే వారు లేక విద్యార్థి మరణం వంటి ఘటనలు శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న ఏయూ ప్రతిష్టను దిగజార్చాయి. ఇప్పుడు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో అక్రమాల ఆరోపణలు ఏయూలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా 28 పోస్టులను భర్తీ చేయడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రక్రియలో భారీగా సొమ్ములు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా కూటమి ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖల మేరకే ఏయూ అధికారులు రహస్యంగా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేశారని వామపక్ష, విద్యార్థి సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మెరిట్ జాబితాను ఆన్లైన్లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నలు సంధిస్తున్నాయి. పోస్టుల భర్తీపై వివాదాలు ఏయూలో 33 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. 2018లో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించారు. కానీ ప్రక్రియ ముందుకు సాగలేదు. 2021లో సెక్యూరిటీ, హాస్టల్ సహాయకులు, మెస్ వర్కర్లు, తోటపని వంటి ఉద్యోగాలకు మరోసారి నోటిఫికేషన్ ఇచ్చారు. కనీస విద్యార్హత ఏడో తరగతి, పదో తరగతిగా నిర్ణయించారు. మెరిట్ ఆధారంగా నియామకాలు ఉంటాయని ప్రకటించారు. ఆ సమయంలో సుమారు 1000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో డిగ్రీ, పీజీలు చేసిన అభ్యర్థులు కూడా ఉండడం గమనార్హం. అయినప్పటికీ నోటిఫికేషన్ ప్రకారం ఏడో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు కావడంతో ఆ ప్రాతిపాదికన మెరిట్ జాబితాను సిద్ధం చేసి ఆన్లైన్లో పొందుపర్చారు. అయితే ఎంపికై న అభ్యర్థుల విద్యార్హతలు, మార్కుల జాబితాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఏడో తరగతి చదవినట్లు, ఎక్కువ మార్కులతో ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి నకిలీ మార్కుల జాబితాలను సృష్టించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా అప్పటి నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఆన్లైన్లో ఎంపిక జాబితా ఎక్కడ? ఏయూలో 33 బ్యాక్లాగ్ పోస్టులు ఉండగా.. అందులో 28 పోస్టులను ఏయూ అధికారులు రహస్యంగా భర్తీ చేశారు. ఈ నియామక ప్రక్రియ విషయం ఏయూలో చాలా మంది అధికారులకు కూడా తెలియకపోవడం గమనార్హం. పైగా నోటిఫికేషన్ నుంచి మెరిట్ జాబితా వరకు దేనినీ అధికారులు ఆన్లైన్లో పొందుపర్చలేదు. రహస్యంగా పోస్టులను ఎలా భర్తీ చేస్తారని గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఏయూ అధికారులను ప్రశ్నించినప్పటికీ.. ఎవరూ సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. అభ్యర్థుల మెరిట్ జాబితాను ఎందుకు ఆన్లైన్లో పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. చక్రం తిప్పిన కూటమి ప్రజాప్రతినిధి? ఏయూలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో జిల్లాకు చెందిన కూటమి ప్రజాప్రతినిధి చక్రం తిప్పారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నియామకాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగినట్లు ఎస్సీ, ఎస్టీ సంఘాలతో పాటు వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖలకు ఏయూ పాలకులు పెద్దపీట వేసినట్లు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏయూను పూర్తిగా రాజకీయ కేంద్రంగా మార్చేశారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ అధికారులు ఈ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియపై విచారణ చేపట్టాలని కోరుతున్నారు. అలాగే అభ్యర్థుల మెరిట్ జాబితాను బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఏయూలో రహస్యంగా 28 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ -
ప్రైవేటీకరణ చేస్తే పేదలకు వైద్యం దూరం
కోటి సంతకాల సేకరణకు విశేష స్పందనడాబాగార్డెన్స్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి నేతృత్వంలో గురువారం విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద ఈ కార్యక్రమం చేపట్టగా, విద్యార్థుల నుంచి విశేష స్పందన వచ్చింది. మాజీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్కుమార్, పార్టీ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, మహిళా విభాగం, అనుంబంధ సంఘాల ప్రతినిధులతో కలిసి ఆమె ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల అనుబంధ బోధన ఆసుపత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందదని, రోగనిర్ధారణ, ఇన్పేషెంట్, మందులకు చార్జీలు వసూలు చేస్తారన్నారు. అంతేకాకుండా రాష్ట్ర యువత పెద్ద సంఖ్యలో మెడికల్ సీట్లు కోల్పో తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే తైనాల మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. ఇప్పటికే 7 కాలేజీల నిర్మాణం పూర్తి కాగా, ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. పేడాడ రమణికుమారి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలను చిన్నచూపు చూస్తోందన్నారు. పీపీపీ పేరిట ప్రైవేటీకరణపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, నిర్మాణంలో ఉన్న కాలేజీలను పూర్తి చేసి ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందనే అక్కసుతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, కార్పొరేటర్లు శశికళ, బిపిన్కుమార్ జైన్, పార్టీ జిల్లాఅధికార ప్రతినిధి దొడ్డి రామానంద్, సనపల రవీంద్ర భరత్, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేటి నుంచి భాగస్వామ్య సదస్సు
సాక్షి, విశాఖపట్నం : భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) 30వ భాగస్వామ్య సదస్సు ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో శుక్ర, శనివారాల్లో జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ సదస్సును శుక్రవారం ఉదయం 8.30 గంటలకు భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్లీనరీ హాల్ ప్రధాన వేదికగా ఉండగా దానికి అనుబంధంగా వివిధ హాళ్లను ఏర్పాటు చేశారు. ఆయా హాళ్లలో వివిధ ప్లినరీ సెషన్లు జరగనున్నాయి. తొలిరోజు సదస్సులో గౌరవ అతిథిగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు కీలకోపన్యాసం చేయనున్నారు. సదస్సుకు రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. ఉదయం 10.30 నుంచి 11.45 వరకు జరిగే ఓపెనింగ్ ప్లీనరీ కార్యక్రమంలో వివిధ పరిశ్రమల ప్రతినిధులతో పాటు కేంద్రమంత్రి గోయల్, చంద్రబాబు పాల్గొంటారు. దీంతో పాటు రాత్రి 8 గంటల వరకూ వివిధ కాన్పరెన్స్ హాల్స్లో ప్లీనరీ సెషన్లు జరగనున్నాయి. ఈ సదస్సుకు ఇప్పటికే జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన దాదాపు రూ.50 కోట్ల ప్రజాధనంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా రాష్ట్ర ఖ్యాతిని చాటి చెప్పేవిధంగా.. దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబయి హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, విజయవాడ నగరాల్లోని ప్రధాన కూడళ్లు, విమానాశ్రయాల్లో పలు హోర్డింగులు, డిజిటల్ డిస్ప్లేలు ఏర్పాటు చేశారు. నగరమంతా సీఐఐ సదస్సుకు సంబంధించి పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటయ్యాయి. తొలిరోజు ఒప్పందాలు తొలి రోజున వివిధ పరిశ్రమలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఇప్పటికే గురువారం రాత్రి వరకూ పరిశ్రమల శాఖ 9 ఎంవోయూలు, ఐఅండ్ఐ 3, ఆహారశుద్ధి శాఖ 4, ఇంధన శాఖ 6, సీఆర్డీఏ 8 ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. తొలి రోజు సదస్సులో భాగంగా సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల మధ్యలో ప్రధాన వేదిక ప్రాంగణంలో హాల్ నంబరు 7లో పరిశ్రమల శాఖ 14, ఐఅండ్ ఐ 15,ఆహార శుద్ధి శాఖ 6, ఇంధన శాఖ 21 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు అధికారులు తెలిపారు. భద్రతా వలయంలో విశాఖ! భాగస్వామ్య సదస్సుకు దాదాపు 2,300 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా వలయం ఏర్పాటు చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో.. సదస్సుకు హాజరయ్యే ప్రతి వీఐపీ విమానాశ్రయంలో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వారి గమ్యస్థానాలకు చేరేంత వరకు పూర్తిస్థాయి రక్షణ కల్పించే బాధ్యత పోలీస్ శాఖ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో డీజీపీ గుప్తా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి అప్రమత్తత ప్రకటించారు. ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్స్ చుట్టుపక్కల సాధారణ ప్రజలను సైతం చెకింగ్ల పేరుతో వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే సభా వేదికకు వెలుపల ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో వివిధ వాహనాల పార్కింగ్కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. -
చిరువ్యాపారులపై ఆంక్షల తొలగింపు
విశాఖ సిటీ: నగరంలో సీఐఐ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు నేపథ్యంలో బీచ్ రోడ్డులో చిరువ్యాపారుల దుకాణాలు మూసివేయాలని జారీ చేసిన ఆంక్షలను ఎత్తివేశారు. ఏయూలో సదస్సు జరుగుతుండగా బీచ్ రోడ్డులో దుకాణాలు మూయించి చిరువ్యాపారుల పొట్ట కొట్టడం పట్ల ‘పేదలకు పస్తులు.. సమ్మిట్తో గొప్పలు’ కథనాన్ని సాక్షి ప్రచురించింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం, జీవీఎంసీ దిగొచ్చింది. బీచ్ రోడ్డులో ప్రధాన మార్గంలో కాకుండా సర్వీస్ రోడ్డులో యథావిధిగా వ్యాపారాలు చేసుకోవచ్చని జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులు చెప్పారు. దీంతో గురువారం రాత్రి నుంచి బీచ్ రోడ్డులో చిరు వ్యాపారాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. -
సమ్మిట్కు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు
అల్లిపురం: సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ భద్రతా ఏర్పాట్లను, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ను డీజీపీ హరీష్కుమార్ గుప్తా, నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి గురువారం పరిశీలించారు. సమ్మిట్కు సుమారు 2,300 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సదస్సు ప్రాంగణంతో పాటు, నగరంలో ముఖ్య ప్రాంతాలన్నీ డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాలు, బాడీ వార్న్ కెమెరాలు, ఇతర సాంకేతిక చర్యలతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరానికి విచ్చేయనున్న దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, ప్రముఖుల కోసం ఇప్పటికే పోలీసు అధికారులు సిబ్బందితో నిరంతర నిఘా ఏర్పాటు చేశారన్నారు. నగరంలోని అన్ని హోటళ్లు, లాడ్జిలు, రిసార్టులు, గెస్ట్ హౌస్ల్లో పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో ముఖ్యమైన ప్రాంతాలలో పికెట్స్, గార్డులను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. నగరంలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అస్త్రం యాప్ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. -
రుషికొండ బీచ్లో పారాగ్లైడింగ్ ప్రారంభం
కొమ్మాది: పర్యాటకులను మరింతగా ఆకర్షించే లక్ష్యంతో రుషికొండ బీచ్లో పారా గ్లైడింగ్ ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) చైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. గురువారం రుషికొండ బీచ్లో పారా గ్లైడింగ్ను ప్రారంభించి మాట్లాడారు. రుషికొండ బీచ్ను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటకులను అన్ని విధాలా ఆకట్టుకునేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన బీచ్లో కలియతిరిగారు. కార్తీక మాసం కావడంతో పర్యాటకుల రద్దీ అధికంగా ఉంటుందని, లైఫ్గార్డ్స్, మైరెన్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
పలు రైళ్లకు హైటెక్ సిటీలో హాల్ట్
తాటిచెట్లపాలెం: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌకార్యర్ధం పలు రైళ్లకు తాత్కాలికంగా దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్ డివిజన్ పరిధి హైటెక్ సిటీ స్టేషన్లో హాల్ట్ కల్పిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం పవన్కుమార్ తెలిపారు. ● లింగంపల్లి–విశాఖపట్నం(12806) జన్మభూమి ఎక్స్ప్రెస్ జనవరి 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉదయం 6.21 గంటలకు హైటెక్ సిటీ చేరుకొని, అక్కడ నుంచి 6.22 గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం–లింగంపల్లి(12805) జన్మభూమి ఎక్స్ప్రెస్ ఆయా తేదీల్లో రాత్రి 7.14 గంటలకు హైటెక్ సిటీ చేరుకొని, అక్కడ నుంచి రాత్రి 7.15 గంటలకు బయల్దేరుతుంది. ● విశాఖపట్నం–లోకమాన్య తిలక్ టెర్మినస్(18519)ఎల్టీటీ ఎక్స్ప్రెస్ జనవరి 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మధ్యాహ్నం 1.14 గంటలకు హైటెక్ సిటీ చేరుకొని, అక్కడ నుంచి 1.15 గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం(18520) ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రాత్రి 7.34 గంటలకు హైటెక్ సిటీ చేరుకొని, అక్కడ నుంచి 7.35 గంటలకు బయల్దేరుతుంది. -
సైలెంట్ కిల్లర్ షుగర్
మహారాణిపేట: విశాఖలో మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మనుషుల జీవన శైలిలో మార్పుల వల్ల ఈ వ్యాధి తీవ్రత అధికమవుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. విశాఖ జిల్లాతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి, అలాగే పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా రోగులు చికిత్స కోసం విశాఖ వస్తున్నారు. కేజీహెచ్తోపాటు ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో చక్కెర వ్యాధికి చికిత్స అందిస్తున్నారు. ఒక్క కేజీహెచ్ ఓపీకే ప్రతి రోజు 150 నుంచి 200 మంది వస్తుంటారు. ఇక్కడ ప్రతి రోజు మధుమేహం వ్యాధి సంబంధించిన ఓపీ ఉంటుంది. ప్రస్తుతం మధుమేహం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్లో అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారింది. దేశంలో కోట్లాది మంది మధుమేహంతో బాధపడుతుండగా, ఇంకా చాలామందికి ఈ వ్యాధి ఉన్న సంగతి కూడా తెలియకపోవడం ఆందోళన కలిగించే విషయం. దీని లక్షణాలు తీవ్రమైన సమస్యలు వచ్చే వరకు బయటపడవు కాబట్టి.. దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. నియంత్రణలో లేకపోతే మధుమేహం గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, చూపు తగ్గడం, నరాల బలహీనత వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. ఏటా నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం నిర్వహిస్తారు. మధుమేహ రోగులకు ప్రాణదాత అయిన ఇన్సులిన్ను కనుగొన్న శాస్త్రవేత్తల్లో ఒకరైన సర్ ఫ్రెడ్రిక్ బాంటింగ్ జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ‘జీవితంలోని ప్రతి దశలో మధుమేహ నియంత్రణ’అనే అంశంతో అవగాహన కల్పిస్తున్నారు. అవగాహనే నివారణకు తొలి మెట్టు మధుమేహం రకాల్లో టైప్–2 మధుమేహం అత్యంత సాధారణం. దీనిని జీవనశైలి మార్పులతోనే నివారించవచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు వంటి అధిక ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోవాలి. చక్కెర పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ స్నాక్స్కు దూరంగా ఉండాలి. రోజూ కనీసం 30 నిమిషాల వేగంగా నడక, సైక్లింగ్ లేదా ఏదైనా శారీరక వ్యాయామం చేయడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అధిక బరువు మధుమేహానికి ప్రధాన ప్రమాద కారకంగా వైద్యులు చెబుతున్నారు. ధూమపానం, మద్యం సేవించడం మధుమేహం ప్రమాదాన్ని పెంచుతాయి. కుటుంబం, సమాజం పాత్ర కీలకం మధుమేహాన్ని ముందుగానే గుర్తించడం ద్వారా నియంత్రణ సులభమవుతుంది. మందులు లేదా ఇన్సులిన్ను క్రమంగా తీసుకోవడం, రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడం, క్రమం తప్పకుండా వైద్యుడిని కలవడం ద్వారా ఆరోగ్యంగా, చురుకుగా ఉండవచ్చు. మధుమేహంతో బాధపడుతున్న వారికి కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, సమాజం అందించే మద్దతు ఎంతో అవసరం. పాఠశాలలు, కార్యాలయాలలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, అవగాహన కార్యక్రమాలు, స్క్రీనింగ్ డ్రైవ్లు కొనసాగించడం ద్వారా మధుమేహ నియంత్రణకు దోహదం చేయవచ్చు. అన్ని వయసులపైనా ప్రభావం మధుమేహం ఏ వయసు వారినైనా ప్రభావితం చేయవచ్చు. ప్రతి దశలోనూ ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. పిల్లల్లో.. తరచూ దాహం వేయడం, ఎక్కువగా మూత్రం పోవడం, కారణం లేకుండా బరువు తగ్గడం, అలసట, పాఠశాలలో ఏకాగ్రత తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించాలి. యవ్వనంలో.. జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్, మొబైల్తో ఎక్కువ సమయం గడపడం, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం వల్ల ప్రమాదం పెరుగుతోంది. యువతీ యువకుల్లో.. ఒత్తిడి, సక్రమంగా లేని పని గంటలు, కూర్చొని చేసే ఉద్యోగాలు, రాత్రిళ్లు జాగారం, రెగ్యులర్ మీల్స్ లేకపోవడం వంటివి ఇన్సులిన్పై ప్రభావం చూపి షుగర్ పెరిగేలా చేస్తాయి. గర్భకాలంలో.. గర్భధారణలో షుగర్ వల్ల తల్లి, శిశువు ఇద్దరికీ ప్రమాదం ఉంటుంది. తల్లికి భవిష్యత్తులో టైప్–2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే గర్భిణులు షుగర్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించాలి. వృద్ధుల్లో.. పెద్దవారిలో హృద్రోగం, కిడ్నీ, కళ్ల సమస్యలు త్వరగా వస్తాయి. షుగర్ ఒక్కసారిగా పడిపోవడం లేదా పెరగడం జరగవచ్చు. వీరికి పాద సంరక్షణ చాలా ముఖ్యం. నిర్లక్ష్యం వద్దు.. నియంత్రణ ముఖ్యం మధుమేహం పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. కేజీహెచ్కు వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాం. దేశంలో 12 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ ప్రాబల్యం పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉంది. చక్కెర వ్యాధి పట్ల నిర్లక్ష్యం వద్దు. తప్పనిసరిగా మందులు వాడడం, ఆహారపు అలవాట్లు నియంత్రణలో ఉండాలి. వ్యాయామం చేయడం ద్వారా చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. ఒత్తిడి వల్ల కూడా ఈ వ్యాధి సోకుతోంది. – డాక్టర్ కె.ఎ.వి.సుబ్రహ్మణ్యం, ఎండోక్రైనాలజీ విభాగాధిపతి, కేజీహెచ్ -
టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విజేత గుజరాత్
ఎంవీపీకాలనీ: 40వ ఆలిండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ క్రీడాపోటీలు 4వ రోజు హోరాహోరీగా సాగాయి. ఎంవీపీ కాలనీలోని ఎస్–3 స్పోర్ట్స్ ఏరీనా వేదికగా ఈ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆలిండియా పోటీల్లో దేశంలోని 14 తపాలా సర్కిళ్లకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందిన 129 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషులు, మహిళ విభాగంలో క్రీడాకారులు పోటీ జరుగుతుండగా 4వ రోజు పోటీలు వివిధ సర్కిళ్ల క్రీడాకారుల మధ్య ఉత్కంఠగా సాగాయి. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్స్లో గుజరాత్ జట్టు పశ్చిమ బెంగాల్ జట్టుపై (3–2) తేడాతో విజయం సాధించి విజేతగా నిలిచింది. దీంతో పాటు పురుషుల డబుల్స్ ఫైనల్లో పశ్చిమ బెంగాల్ జట్టు తెలంగాణ జట్టుపై (3–0) తేడాతో విజయం సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్ ఫైనల్స్లో పశ్చిమబెంగాల్ జట్టు ఆంధ్రప్రదేశ్ జట్టుపై (3–1) తేడాతో విజయం సాధించి విజేతగా నిలిచింది. 14వ తేదీన మరిన్ని జట్లు మధ్య ఫైనల్స్ నిర్వహించడంతో పాటు ముగింపు కార్యక్రమంలో మెడల్స్ అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో తపాలా శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
స్నేహం ముసుగులో మోసం
కిడ్నీ విక్రయ ఘటనలో మృతి చెందిన యువతికి నేడు అంత్యక్రియలు తగరపువలస: స్నేహం పేరుతో మోసగించి, బలవంతంగా కిడ్నీని విక్రయించిన కారణంగా మరణించిన సాడి యమున(29) భౌతిక కాయానికి శుక్రవారం ఆమె స్వగ్రామం వెల్లంకిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ బొడ్డపాలేనికి చెందిన యమునను.. నగరానికి చెందిన సూరిబాబు, పద్మ, సత్య అనే వ్యక్తులు పిక్నిక్ పేరుతో వంచించి, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెకు తీసుకువెళ్లారు. అక్కడ ఆమె కిడ్నీని విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ చర్యల కారణంగా తీవ్ర అనారోగ్యం పాలైన యమున చివరకు మృతి చెందింది. మరణించిన మూడు రోజుల అనంతరం గురువారం తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో యమున మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం మృతురాలి తల్లిదండ్రులు సూరమ్మ, నరసింహులు, తమ్ముడు నాగేంద్రతో పాటు వెల్లంకి ఎంపీటీసీ సభ్యుడు తోణంగి అప్పారావు రెడ్డి తదితరులు యమున మృతదేహాన్ని స్వగ్రామం వెల్లంకికి తీసుకొస్తున్నారు. శుక్రవారం ఉదయం వెల్లంకిలో ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. -
మాకు రంగులే ముఖ్యం!
నగరంలో అత్యంత రద్దీగా ఉండే గురుద్వార కూడలి సమీపంలోని ప్రధాన కాలువ వద్ద రోడ్డు ప్రమాదకరంగా మారింది. రహదారి భారీగా కుంగిపోయి, పగుళ్లు ఏర్పడటంతో ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంది. వాహనాల రాకపోకలకు ఆటంకం, ముప్పు తప్పదని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ.. జీవీఎంసీ అధికారులు రోడ్డు మరమ్మతులను పూర్తిగా విస్మరించారు. భాగస్వామ్య సదస్సు కోసం రోడ్డు భద్రతను పక్కన పెట్టి.. డివైడర్లకు రంగులు వేసి, నగరాన్ని అలంకరించడంపైనే దృష్టిసారించారు. జీవీఎంసీ తీరు ‘మాకు రంగులే ముఖ్యం.. రోడ్డు వాదు’ అన్నట్లుగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలి
పోర్ట్లో ముగిసిన నిఘా అవగాహన వారోత్సవాలు విశాఖ సిటీ: ఉద్యోగులు అంకితభావంతో పనిచేయడం ద్వారా పోర్టు, డీసీఐఎల్ సంస్థలు మరింత ఉన్నతస్థాయికి ఎదుగుతాయని పోర్ట్ చైర్పర్సన్ డాక్టర్ ఎం.అంగముత్తు పేర్కొన్నారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో నిఘా అవగాహన వారోత్సవాలు–2025 గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు చేపట్టిన చర్యలు రేపటి వ్యక్తి, సంస్థ భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. పోర్ట్ ముఖ్య నిఘా అధికారి టి.అరుణ్ ప్రసాద్ నిఘా అవగాహన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్, ఇతర పోటీల్లో విజేతలైన విద్యార్థులు, ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పోర్ట్ డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్ కుమార్ దూబే, సెక్రటరీ టి.వేణు గోపాల్, డీసీఐఎల్ ఎండీ, సీఈవో కెప్టెన్ ఎస్.దివాకర్(అడిషనల్ చార్జ్), ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అక్షయపాత్రను సందర్శించిన యువ పారిశ్రామికవేత్తలు
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరంలోని అక్షయపాత్ర వంటశాలను గురువారం జాగృతి యాత్ర పేరుతో సుమారు 580 మంది యువ పారిశ్రామిక వేత్తలు సందర్శించారు. ఈ నెల 8న ముంబైలో 18 బోగీలతో కూడిన ప్రత్యేక రైలులో బయలుదేరిన వీరు దేశంలో 12 మహానగరాలను సందర్శించి అక్కడ ప్రముఖ సంస్థల కార్యకలాపాల గురించి అధ్యయనం చేయనున్నారు. అందులో భాగంగా అక్షయపాత్ర వంటశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అక్షయపాత్ర హెడ్ విశ్వాస్, హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస వివరాలు తెలియజేశారు. ఆదునిక యంత్రాలతో ఒకేసారి వేలాది మందికి వంట చేసే విధానం గురించి వివరించారు. 24 ఏళ్లుగా దేశ వ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులకు 75 వంటశాలల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో మధ్యాహ్నం భోజనం అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జాగృతి యాత్ర ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశుతోష్ కుమార్, కో ఆర్డినేటర్ నిముష మాట్లాడుతూ శుక్రవారం నుంచి ఒడిశాలో యాత్ర సాగుతుందన్నారు. యువతీ యువకులు పారిశ్రామిక వేత్తలుగా తయారు కావడానికి అవసరమైన సహాయం ఈ యాత్రలో అందుతుందన్నారు. ఈ జాగృతి యాత్ర 15 ఏళ్ల నుంచి జరుగుతుండగా వరుసగా 10వ సారి అక్షయపాత్ర వంటశాలను సందర్శించిందన్నారు. ఈ సందర్భంగా యువ పారిశ్రామికవేత్తలు జట్ల వారీగా కిచెన్లోకి వెళ్లి ఆహార పదార్థాలు తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ జనరల్ మేనేజర్ అంబరీష దాస, వంటశాల ఆపరేషన్ మేనేజర్ కె.ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం
మునగపాక: తిమ్మరాజుపేటలోని డావెన్సీ అంతర్జాతీయ పాఠశాలలో గురువారం విషాదం చోటు చేసుకుంది. యలమంచిలి ధర్మవరం ప్రాంతానికి చెందిన ఒకటో తరగతి చదువుతున్న మోక్షిత్ సందీప్ (8) అనే విద్యార్థి స్కూల్లోని స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందాడు. ఇది పూర్తిగా పాఠ శాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మధ్యా హ్నం సందీప్ స్కూల్లోని స్విమ్మింగ్ పూల్కు వెళ్లాడు. తరగతులు అయ్యాక స్కూలు బస్సు ఎక్కిన అతని అన్నయ్య ప్రశాంత్(6వ తరగతి) కొంత దూరం వెళ్లాక తమ్ముడు సందీప్ రాలేదని గుర్తించాడు. కంగారు పడి వెంటనే ఆ విషయం చెప్పినా బస్సు డ్రైవర్ పట్టించుకోలేదు. ధర్మవరానికి బస్సును తీసుకువచ్చేశాడు. ఇంటికి వెళ్లిన ప్రశాంత్ తన తల్లితో తమ్ముడు సందీప్ బస్సులో రాలేదని చెప్పడంతో కంగారుపడ్డ శ్రీలత స్కూల్ యాజమాన్యానికి ఫోన్ చేశారు. ఎంతకూ స్పందించకపోవడంతో తన బంధువులతో కలిసి స్కూల్కు వచ్చి సందీప్ కోసం వెతకడం ప్రారంభించారు. స్కూల్ ఆవరణలోని స్విమ్మింగ్ పూల్లో విగతజీవిగా కనిపించాడు. యాజమాన్యంపై, స్విమ్మింగ్ శిక్షకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, బాధిత కుటుంబ సభ్యులు స్కూల్ ఎదుట పూడిమడక రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్గా జనసేన నేత జెర్రిపోతుల రమణాజీ వ్యవహరిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే యాజమాన్యం స్పందించకపోవడం, అందుబాటులో లేకపోవడంపై బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సందీప్ తండ్రి జనపరెడ్డి శ్రీనివాసరావు జమ్మూలో ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. చిన్నారులందరూ బాలల దినోత్సవానికి సిద్ధమవుతున్న వేళ జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది. -
సదస్సు ఏర్పాట్ల పరిశీలన
మహారాణిపేట: భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను పలువురు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఈ మేరకు ఏర్పాట్లపై కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఉప రాష్ట్రపతి సెక్యూరిటీ ఆఫీసర్ సింగ్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఇతర ఉన్నత అధికారులు వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో సమీక్ష చేశారు. ఉప రాష్ట్రపతి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. -
మేల్ ఫెర్టిలిటీపై చర్చించాం
డాబాగార్డెన్స్: విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన నూతన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’ఈ నెల 14న థియేటర్లలో విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా బుధవారం నగరంలో సినిమా యూనిట్ సందడి చేసింది. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ ఈ కథ ప్రస్తుత సమాజానికి అత్యవసరమైనదని అభిప్రాయపడ్డారు. ‘ఈ రోజుల్లో ఫెర్టిలిటీ సెంటర్లు విపరీతంగా పెరిగాయి. ఇన్ఫెర్టిలిటీ సమస్య అంటే సాధారణంగా అమ్మాయిలలోనే లోపం ఉందని, అందుకే మరో పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం ఉంటోంది. కానీ పురుషులలో ఉండే ఫెర్టిలిటీ సమస్యను మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో చూపించడం కొత్తగా అనిపించింది.’ అని అన్నారు. ఈ విషయం గురించి మాట్లాడటానికి చాలా మంది ఇబ్బంది పడతారని, ఇతరులు చిన్నచూపు చూస్తారేమో, నవ్వుతారేమో అని భయపడతారని చాందిని అన్నారు. అయితే ఇలాంటి సీరియస్ పాయింట్ చుట్టూ ఫన్, ఎంటర్టైన్మెంట్ను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించడం ద్వారా.. ఈ సమస్యపై అందరూ చర్చించుకునేలా ఒక ప్రయత్నం చేశామన్నారు. సినిమా విడుదలైన తర్వాత ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరో విక్రాంత్ మాట్లాడుతూ తాను సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, సినిమాలంటే మక్కువతో వచ్చానని తెలిపారు. గతంలో చేసిన ఒక చిత్రం అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, కొంత విరామం తీసుకుని నటనను మెరుగుపరుచుకున్నానని చెప్పారు. ఒక సున్నితమైన అంశాన్ని తీసుకుని, దానికి వినోదాన్ని జోడించిన చిత్రమిది అని తెలిపారు. మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి సంజీవ్రెడ్డి దర్శకత్వం వహించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్ర యూనిట్ -
వాహనమిత్ర డబ్బులు మాకెందుకు వేయలేదు?
గోపాలపట్నం: సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు వింత అనుభవం ఎదురైంది. చాలా మంది పార్టీ శ్రేణులు సార్ సార్ అంటూ పిలుస్తుండగా కొందరు ఆటో డ్రైవర్లు మాత్రం వాహనమిత్ర డబ్బులు మాకెందుకు వేయలేదంటూ నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ అనుకూలురికి, ఆ పార్టీల నేతలకు కావాల్సిన ఆటో డ్రైవర్లకే వాహనమిత్ర డబ్బులు జమచేశారని, అర్హత ఉన్నా తమకు ఎందుకు డబ్బులు వేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు మాత్రం సమాధానం చెప్పకుండా విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనం వైపు వెళ్లిపోయారు. దీంతో సదరు ఆటో డ్రైవర్లు నిరాశగా వెనుదిరిగారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడా పోటీలు
చిత్తూరు, పాడేరు ఐటీడీఏల సత్తా కొమ్మాది: జన జాతీయ గౌరవ దివస్–2025లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్(టీసీఆర్టీఎం) ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడా పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ఐటీడీఏల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల ముగింపు కార్యక్రమంలో టీసీఆర్టీఎం ఈడీ డా.రాణి మందా పాల్గొని, విజేతలకు ట్రోఫీలను అందజేశారు. కబడ్డీ(బాలురు, బాలికలు) పోటీల్లో చిత్తూరు ఐటీడీఏ, వాలీబాల్ (బాలురు) పార్వతీపురం ఐటీడీఏ, వాలీబాల్ (బాలికలు) సీతంపేట ఐటీడీఏ, జావెలిన్ త్రో (బాలురు, బాలికలు) పాడేరు ఐటీడీఏ, ఆర్చరీ (బాలురు)పాడేరు ఐటీడీఏ, ఆర్చరీ (బాలికలు) పోటీల్లో సీతంపేట ఐటీడీఏ విజేతలుగా నిలిచాయి. అలాగే సాంస్కృతిక పోటీల్లోనూ గిరిజన విద్యార్థులు తమ సృజనాత్మకతను చూపించారు. వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో సీతంపేట ఐటీడీఏ ప్రథమ బహుమతిని గెలుచుకుంది. గిరిజన చిత్రలేఖనం పోటీల్లో కేఆర్పురం ఐటీడీఏ ప్రతిభ కనబరిచి అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఈడీ డా. రాణి మందా మాట్లాడుతూ గిరిజన యువత క్రీడలు, విద్యతో పాటు సాంస్కృతిక అంశాలలోనూ ముందుండాలని ఆకాంక్షించారు. జన జాతీయ గౌరవ దివస్ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. -
రోడ్డు మధ్యలో ట్రాలర్ బోల్తా
గంటల తరబడి ట్రాఫిక్ జామ్ గాజువాక : షీలానగర్ జంక్షన్ జాతీయ రహదారి మధ్యలో ట్రాలర్ బోల్తా పడింది. దీంతో ఆ ట్రాలర్పై గల కంటైనర్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోయి జనం అవస్థలు పడ్డారు. అచ్యుతాపురం నుంచి విశాఖ పోర్టుకు కంటైనర్లను తీసుకెళ్తున్న ఒక ట్రాలర్ షీలానగర్ నుంచి పోర్టు రోడ్లోకి మలుపు తిరుగుతుండగా బోల్తా పడిపోయింది. దీంతో దానిపైగల కంటైనర్లు కిందపడిపోయి ట్రాఫిక్కు ఆటంకంగా మారాయి. బుధవారం తెల్లవారుజాము 5.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో హైవేపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఉదయం 7 గంటల సమయంలో హైవేపై ఒక్కసారిగా వాహనాలు పెరిగాయి. అదే సమయంలో ట్రాలర్ను తొలగించడానికి సంబంధిత కంపెనీ ప్రతినిధులను నాలుగు క్రేన్లను అక్కడికి తీసుకురావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అటువైపు షీలానగర్ నుంచి ఎయిర్ పోర్టువరకు, ఇటువైపు గాజువాక ఆటోనగర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఆ సమయంలో జాతీయ రహదారిపై వెళ్లాలనుకొనేవారు గంటల తరబడి అవస్థలను ఎదుర్కొన్నారు. చివరకు కంటైనర్లను తొలగించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
ఫైర్
పీపీపీపైచంద్రబాబు ప్రభుత్వంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం ప్రభుత్వ తీరుపై నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన సాక్షి, విశాఖపట్నం: పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలను.. చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేటీకరించాలని నిర్ణయించడంపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు, విద్యార్థులు, ప్రజలు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఏడు నియోజకవర్గాలు నిరసనలతో హోరెత్తాయి. ప్రభుత్వ జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది బైక్ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. ఈ నిరసనల్లో ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని.. చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఉత్తర నియోజకవర్గంలో బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ పార్టీ శ్రేణులు, ప్రజలు వెనక్కి తగ్గకుండా పాదయాత్రగా తమ నిరసనను కొనసాగించారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భీమిలి నియోజకవర్గంలో.. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు ఐదు కిలోమీటర్ల మేర భారీ బైక్ ర్యాలీ జరిగింది. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జెడ్పీ వైస్ చైర్మన్ సుంకరి గిరిబాబు, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర, ఎస్ఈసీ సభ్యులు పోతిన హనుమంతురావు, దాట్ల పెదబాబు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీ సభ్యులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. విశాఖ ఉత్తరలో.. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఉత్తర సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో గురుద్వారా జంక్షన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ర్యాలీ జరిగింది. పోలీసులు తొలుత బైక్ ర్యాలీని అడ్డుకోవడంతో, నేతలు, కార్యకర్తలు పాదయాత్రగా నిరసన కొనసాగించారు. ఎమ్మెల్సీ పి.రవీంద్ర బాబు, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబురావు, డిప్యూటీ మేయర్ సతీష్, ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాసరావు, ముఖ్య నేతలు రొంగలి జగన్నాథం, సతీష్ వర్మ, రవిరాజు, పేడాడ రమణికుమారి, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, స్టాండింగ్ కమిటీ మెంబర్ సాడి పద్మారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు రెయ్యి వెంకటరమణ, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణలో.. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ ఆధ్వర్యంలో ఏవీఎన్ కాలేజీ డౌన్ నుంచి చౌల్ట్రీ వరకు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 ర్యాలీ జరిగింది. చౌల్ట్రీ వద్ద తహసీల్దార్ కార్యాలయంలోని ఆర్ఐకు వినతిపత్రం అందజేశారు. సీఈసీ మెంబర్ కోలా గురువులు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు జాన్వెస్లీ, చెన్నా జానికీరామ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ తూర్పులో.. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మొల్లి అప్పారావు నేతృత్వంలో డెయిరీ ఫారం నుంచి రూరల్ తహసీల్దార్ కార్యాలయం వరకు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ర్యాలీ కొనసాగింది. తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో జూనియర్ అసిస్టెంట్కు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, రాష్ట్ర మత్స్యకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయచందర్, రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగం అధికార ప్రతినిధి అల్లంపల్లి రాజబాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జి.విక్టర్, రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి వానపల్లి ఈశ్వరరావు, రాష్ట్ర గ్రీవెన్స్ విభాగం ప్రధాన కార్యదర్శి సత్తి మందారెడ్డి, రాష్ట్ర బీసీ విభాగం ఉపాధ్యక్షుడు కె.రామన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. విశాఖ పశ్చిమలో.. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో గాజువాక డిపో నుంచి ములగాడ తహసీల్దార్ కార్యాలయం వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ర్యాలీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీధర్, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు. గాజువాకలో.. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్కుమార్, తిప్పల నాగిరెడ్డి తదితరులు హాజరయ్యారు. పెందుర్తి నియోజకవర్గంలో.. మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో సబ్బవరం జంక్షన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ర్యాలీ చేశారు. డీటీ అప్పారావుకు వినతిపత్రం సమర్పించారు. ముఖ్య నేతలు శరగడం చినఅప్పలనాయుడు, గండి రవి తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై భగ్గుమన్న విశాఖ -
తుది దశకు ఏర్పాట్లు
సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్కు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. సదస్సు కోసం జర్మన్ హ్యాంగర్లతో 8 హాళ్లు నిర్మించారు. దీనికి దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సుమారు 3 వేల మంది హాజరవుతున్నట్లు భావిస్తున్నారు. అలాగే భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేతుల మీదుగా 14వ తేదీన సదస్సును ప్రారంభించనున్నారు. అలాగే దీనికి రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు హాజరుకానున్నారు. ఈ సదస్సుకు పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. ఏయూ పరిసర ప్రాంతాలను నో డ్రోన్ జోన్గా ప్రకటించారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్తో పాటు వీఐపీలు పర్యటించే, బస చేసే హోటళ్ల వద్ద బాంబ్, డాగ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. -
ఉగ్రవాద దాడులు ఎదురైతే..?
అప్పన్న ఆలయంలో ఆక్టోపస్ మాక్డ్రిల్ సింహాచలం: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ఉగ్రవాద దాడులు ఎదురైతే వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆక్టోపస్ సిబ్బంది కళ్లకు కట్టినట్టు చూపించారు. స్వామి వారి ఆలయంలో మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ మెగా మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఉగ్రవాదులు ఆలయంలోకి చొరబడినట్టు సమాచారం అందగానే.. ఆక్టోపస్ అధికారులు వారిని మట్టుపెట్టేందుకు తుపాకీలు పట్టుకుని అనుసరించిన విధానాలు అబ్బురపరిచాయి. ఉగ్రవాదుల రూపంలో ఉన్న కొందరు ఆలయ పరిసరాల్లో మాటు వేయడం, వారిని మట్టుపెట్టేందుకు ఆక్టోపస్ సిబ్బంది గాలించిన వైనం ఆకట్టుకుంది. దేవస్థానం భద్రతా సిబ్బందితో పాటు గోపాలపట్నం పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక, ఆరోగ్య శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల ప్రతినిధులు ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. ఆక్టోపస్ డీఎస్పీ ఐ.తిరుపతయ్య, ఇన్స్పెక్టర్ శివాజీ నేతృత్వంలో ఈ మాక్ డ్రిల్ జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ తిరుపతయ్య మాట్లాడుతూ.. ఆలయాల్లో అత్యవసర పరిస్థితులు లేదా ఉగ్రవాద దాడులు జరిగితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలు, అన్ని శాఖల మధ్య సమన్వయం ఏర్పరచడమే ఈ మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. -
తెరుచుకున్న పటేల్ వంతెన
మల్కాపురం: పారిశ్రామిక ప్రాంత వాసుల 18 నెలల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. డాక్యార్డ్ వద్ద గల సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెనపై మంగళవారం అర్ధరాత్రి నుంచి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ప్రభుత్వ విప్ పి.గణబాబు ఈ ఒకవైపు మార్గాన్ని ప్రారంభించారు. ప్రస్తుతానికి కేవలం సింధియా వైపు నుంచి నగరానికి (వన్ వే) వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నిర్ణయంతో పారిశ్రామిక ప్రాంతం నుంచి నగరానికి వెళ్లే వాహనదారులు సుమారు 7 కిలోమీటర్ల అదనపు ప్రయాణ భారం నుంచి ఉపశమనం పొందారు. దీంతో పలువురు వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 18 నెలల అవస్థలు దాదాపు 50 ఏళ్లకు పైగా సేవలందించిన ఈ వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో.. 18 నెలల కిందట ఈ వంతెనపై నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో పారిశ్రామిక ప్రాంత వాసులు, భారీ వాహనాలు నగరానికి చేరుకోవడానికి వీడీఆర్ గోడౌన్స్, మారుతి సర్కిల్ చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. ఇది అదనంగా 7 కిలోమీటర్ల భారం కావడమే కాకుండా, ఆ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు, తరచూ ప్రమాదాలకు కారణమైంది. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడ్డారు. వాహదారుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో, అధికారులు, పాలకులు స్పందించి.. ఒకవైపు మార్గాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి వన్ వే మాత్రమే.. సింధియా నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెనపై నుంచి ప్రయాణించి నగరంలోకి ప్రవేశించవచ్చు. నగరం నుంచి పారిశ్రామిక ప్రాంతం వైపు వచ్చే వాహనాలకు ఇంకా పాత మార్గమే కొనసాగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన దిగువన, ఎస్ఆర్ ఇండస్ట్రీస్ వద్ద కాన్వెంట్ జంక్షన్ నుంచి ప్రధాన వంతెనను కలిపే పనులు ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి, నగరం నుంచి వచ్చే వాహనాలు తప్పనిసరిగా మారుతీ సర్కిల్ మీదుగా, వీడీఆర్ గోడౌన్స్ను దాటుకుని డాక్యార్డ్ వైపు రావాల్సి ఉంటుంది. లేదా మారుతీ సర్కిల్ నుంచి శ్రావణ్ షిప్పింగ్ మీదుగా ములగాడ గ్రామం గుండా ప్రయాణించాలి. వంతెనను రెండు వైపులా వినియోగంలోకి తీసుకురావడానికి మరో ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదీ వంతెన చరిత్ర విశాఖ పోర్టు అధికారులు 1973లో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెనను నిర్మించారు. అంతకుముందు (సుమారు 60 ఏళ్ల కిందట) పోర్టు నుంచి గాజువాక, మల్కాపురం, అనకాపల్లి వంటి ప్రాంతాలకు సరకులను ఎడ్ల బండ్లు, ఇతర వాహనాల ద్వారా తీసుకొచ్చేవారు. షిప్యార్డ్ డీడీ ఎస్ఆర్ వద్ద గల ఫెర్రీ మార్గం ఉండేది. ఈ మార్గం ద్వారా ఎడ్ల బండ్లు, ఇతర వాహనాలు, నగరానికి పనిమీద వెళ్లే వారు రాకపోకలు సాగించేవారు. అయితే పోర్టుకు కార్గో నౌకలు, యుద్ధ నౌకలు వచ్చే సమయాల్లో ఈ ఫెర్రీ ప్రయాణానికి తీవ్ర అంతరాయం కలిగేది. 1973కు ముందు గూడ్స్ రైలు, ఇతర వాహనాల కోసం ఒక పాత వంతెన ఉండేది. కానీ దానిపై గూడ్స్ రైలు వెళ్లేటప్పుడు వాహనాలను నిలిపివేయాల్సి రావడం ఇబ్బందిగా మారింది. ఈ అన్ని సమస్యలకు పరిష్కారంగా 1973లో సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెనను నిర్మించారు. దీంతో పాత వంతెన కేవలం గూడ్స్ రైలుకు పరిమితం కాగా పటేల్ వంతెన వాహనాల రాకపోకలకు ప్రధాన మార్గంగా మారింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన -
భాగస్వామ్య సదస్సుకు సర్వ సన్నద్ధం
విశాఖ సిటీ: సీఐఐ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సుకు విశాఖ సన్నద్ధమైంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో 14, 15 తేదీల్లో సమ్మిట్కు అధికార యంత్రాంగం చేస్తున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ‘పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్–ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్–2047’ థీమ్తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 100కి పైగా విదేశీ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. 30కి పైగా అవగాహన ఒప్పందాలు జరగనున్నట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వివిధ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వేదిక నుంచి వివరించనున్నారు. అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రధాన థీమ్ సెషన్లు నిర్వహించనున్నారు. వీటితో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నేడు సీఎం వరుస సమావేశాలు సీఎం చంద్రబాబు గురువారం నోవోటెల్ హోటల్లో పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ‘పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్–ఇండియా–యూరప్ కోఆపరేషన్ ఫర్ సస్టెయినబుల్ గ్రోత్’ అంశంపై జరిగే ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. గ్రీన్ షిఫ్ట్, సస్టయినబుల్ ఇన్నోవేషన్, యూరోపియన్ పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో భేటీ అవుతారు. ఎస్పీపీ పంప్స్ లిమిటెడ్, రెన్యూ పవర్, బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్, మురుగప్ప గ్రూప్, జూల్ గ్రూప్, హీరో ఫ్యూచర్ ఇంజినీర్స్ ప్రతినిధులతో సమావేశమై చర్చిస్తారు. సాయంత్రం ‘వైజాగ్ ఎకనమిక్ రీజియన్’ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ‘స్పెషల్ మీటింగ్ ఆఫ్ సీఐఐ నేషనల్ కౌన్సిల్’కు హాజరవుతారు. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా సదస్సు ప్రారంభం సదస్సును శుక్రవారం ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. యూసుఫ్ అలీ, బాబా కల్యాణి, కరణ్ అదానీలు విశిష్ట అతిథులుగా హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమం తర్వాత ‘టెక్నాలజీ, ట్రస్ట్, ట్రైడ్’ సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం జరిగే ‘ఏఐ ఫర్ వికసిత్ భారత్’ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆర్టిఫీషియల్ ఇంటిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఏ విధంగా దోహద పడుతుందో సీఎం తన ప్రసంగంలో వివరిస్తారు. సింగపూర్ నుంచి విజయవాడకు నేరుగా విమాన సర్వీసులు నడిపేలా రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ ప్రతినిధులతో ఒప్పందం చేసుకుంటుంది. సాయంత్రం రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహించే ‘రీఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్’లో సీఎం పాల్గొంటారు. సంజీవ్ గోయింకా గ్రూప్ వైస్ చైర్మన్తో సమావేశమై అనంతరం విశాఖలో లులూ నిర్మించే నూతన మాల్కు శంకుస్థాపన చేస్తారు. రాత్రికి వివిధ కంపెనీలు ప్రభుత్వ ప్రతినిధులు, ఆహ్వానితుల గౌరవార్ధం ఇచ్చే గాలా డిన్నర్లో పాల్గొంటారు. రెండో రోజు సదస్సులో.. సదస్సు రెండో రోజు శనివారం ఉదయం బ్లూమ్బెర్గ్ మీడియా ఇంటరాక్షన్లో సీఎం పాల్గొంటారు. తర్వాత రేమండ్, శ్రీసిటీ, ఇండోసోల్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే బహ్రెయిన్, న్యూజిలాండ్, కెనడా, జపాన్ ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం వరల్డ్ ఎకనమిక్ ఫోరానికి చెందిన ‘సెంటర్ ఫర్ ఫ్రంటయిర్ టెక్నాలజీస్’ను ప్రారంభిస్తారు. అనంతరం గూగుల్ సంస్థ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం ఎంవోయూల మార్పిడి కార్యక్రమం ఉంటుంది. సదస్సు చివరిగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడతారు. -
గ్రేటర్పై సమ్మిట్ పోటు
విశాఖ సిటీ: గ్రేటర్పై సమ్మిట్ పోటు పడింది. సీఐఐ భాగస్వామ్య సదస్సు పేరుతో జీవీఎంసీపై చంద్రబాబు ప్రభుత్వం రూ.కోట్ల భారం మోపింది. ప్రతిష్టాత్మకంగా పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నట్లు డప్పులు కొట్టుకుంటున్న సర్కార్.. నిర్వహణకు మాత్రం పైసా కూడా విదల్చకుండా చేతులు దులుపుకుంది. దీంతో అరకొర పనులతోనే హడావుడిగా ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఈ నెల 14, 15 తేదీల్లో 30వ సీఐఐ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనికి దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర వీఐపీలు ఇలా మొత్తంగా 3 వేల మంది హాజరవుతారని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో ఎప్పటిలాగే గత వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన ఒప్పందాలను కూడా తమ ఖాతాలో వేసుకొని రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ఊదరగొడుతోంది. ఈ సదస్సుకు విశాఖను సుందరంగా ముస్తాబు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసేసింది. సదస్సు నిర్వహణకు గాని, విశాఖ సుందరీకరణకు గానీ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా మంజూరు చేయకపోవడం గమనార్హం. జీవీఎంసీపై రూ.42 కోట్ల భారం ప్రభుత్వ ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు విశాఖ సుందరీకరణపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో జీవీఎంసీ ఖజానా నుంచే నిధులు వెచ్చిస్తున్నారు. నగరంలో కొత్త రోడ్లు కాకుండా ముందుగా గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఫుట్పాత్, డివైడర్లు, రైలింగ్ మరమ్మతులు చేశారు. అలాగే నగరానికి పుసుపు రంగు పులిమేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డివైడర్లు, ఫుట్పాత్లు, రైలింగ్లకు తెలుపు, నలుపు రంగులు వేశారు. ఇప్పుడు తెలుపు రంగు స్థానంలో పసుపు రంగులు వేశారు. నగరాన్ని పసుపుమయంగా మార్చేశారు. ఈ సుందరీకరణ పనులకు సంబంధించి జీవీఎంసీ ఖజానాపై రూ.42 కోట్ల భారం పడినట్లు తెలుస్తోంది. కొందరికే ఆహ్వానంపై అనుమానాలు భాగస్వామ్య సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరుగుతాయని బాకాలు ఊదుతున్న ప్రభుత్వం ఈ సదస్సుకు కొందరినే ఆహ్వానించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చంద్రబాబు ఇదే తరహాలో పెట్టుబడుల సదస్సు పేరుతో రూ.కోట్లు ఖర్చు చేసి ఈవెంట్లు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో రోడ్డు మీద వ్యాపారాలు చేసుకుంటున్న వారిని కూడా బడా పారిశ్రామికవేత్తలుగా చూపించారు. ఎవరూ కనిపెట్టలేరన్న భ్రమలో వారికి సూటు, బూటు వేసి స్టేజ్ ఎక్కించారు. ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఫొటోలకు పోజులిచ్చారు. వెంటనే ఆ ఒప్పందాలు చేసుకున్న నకిలీ పారిశ్రామికవేత్తల అసలు బండారం సోషల్ మీడియా ద్వారా బయటపడింది. దీంతో ఈసారి గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిగ్గజ పారిశ్రామికవేత్తలు మినహా.. మిగిలిన ఒప్పందాలపై గోప్యత పాటించే అవకాశాలు ఉన్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఊరు, పేరు లేని ఉర్సా కంపెనీకి భూములు అప్పనంగా కట్టబెట్టిన వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. ఈ పెట్టుబడుల సదస్సులో ఒప్పందాల పేరుతో చంద్రబాబు ప్రభుత్వ పెద్దలు, వారి అనుచరులకు కారుచౌకగా భూముల పందేరం జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు విమర్శలు సంధిస్తున్నారు. దీని కారణంగానే ఈ సదస్సుకు కేవలం టీడీపీ శ్రేణులు, వారి అనుచరులను మాత్రమే ఆహ్వానిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నారు. బీచ్ రోడ్డులో చేసిన ప్యాచ్ వర్క్లుసీఐఐ సదస్సు సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపుజీవీఎంసీ టెండర్ల విచిత్రం సీఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో జీవీఎంసీ చేపట్టిన పనులకు సంబంధించి టెండర్లలో విచిత్రం చోటుచేసుకుంది. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే సదస్సుకు ముందుగానే పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ జీవీఎంసీ అధికారులు విచిత్రంగా కొన్ని పనులకు సంబంధించి బుధవారం షార్ట్ టెండర్లను ఆహ్వానించడం విశేషం. ఏయూలో పార్కింగ్ కోసం భాస్కర్, న్యూటన్, సమతా హాస్టల్స్ వద్ద మైదానాలను లెవెలింగ్కు, మద్దిపాలెంలో ఏయూ ఎంట్రన్స్ ఆర్చ్ వద్ద ఫుట్పాత్ టైల్స్, కెర్బ్వాల్ మరమ్మతులు, ట్రాఫిక్ ఐల్యాండ్ మ్యూరల్ ఆర్ట్స్ పెయింటింగ్... ఇలా పనులకు షార్ట్ టెండర్లు పిలిచారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. 15 తేదీ సాయంత్రానికి సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ ముగుస్తుంది. అప్పుడు టెండర్లు ఖరారు చేసి సదస్సుకు సుందరీకరణ పనులు చేపడ్డమేంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. -
విశాఖ: భర్త శారీరకంగా దూరం పెట్టాడని..
విశాఖపట్నం జిల్లా: వివాహమై ఏడాది కాకముందే దేశంశెట్టి విజయ శ్యామల (25) అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణానగర్లో చోటు చేసుకుంది. శారీరకంగానే కాదు.. మానసికంగానూ భర్త పెట్టిన వేధింపులే ఈ బలవన్మరణానికి కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గోపాలపట్నం సీఐ సన్యాసి నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పుతూరు గ్రామానికి చెందిన విజయ శ్యామలకు 2024 డిసెంబర్ 6న చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన దేవాడ దిలీప్ శివకుమార్తో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ. 5 లక్షల కట్నం, ఎకరా భూమి, రూ. 1.60 లక్షల విలువైన ద్విచక్ర వాహనం, 8 తులాల బంగారం, ఆడపడుచు కట్నం రూ.లక్ష, సారె ఇచ్చామని శ్యామల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఎన్ఎస్టీఎల్లో ఆర్కిటెక్చర్ డిజైనర్గా పనిచేస్తున్న శ్యామల ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చింది. భర్త దిలీప్ శివకుమార్ తరచుగా ఆమెకు దూరంగా ఉంటూ, ఇతరులతో పోల్చుతూ ద్వేషిస్తూ మానసికంగా వేధించేవాడని తెలుస్తోంది. ఆదివారం రాత్రి 11 గంటల తరువాత ఆమె ఉరి వేసుకుంది. అదే సమయంలో ఇంటికి వచ్చిన దిలీప్ శివకుమార్ తలుపు కొట్టినా తీయకపోవడంతో విరగ్గొట్టి వెళ్లి చూడగా, శ్యామల ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకి దించి, తన అన్నావదినలకు సమాచారం అందించాడు. వారు వచ్చిన తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన జరిగిన విధానంపై ఆరా తీశారు. సోమవారం ఉదయం ఏసీపీ పృధ్వీతేజ ఘటనా స్థలికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడారు. సూసైడ్ నోట్లో పేర్కొన్న అంశాలను బట్టి, భర్త తనను పూర్తిగా దూరం పెట్టడం, అర్ధరాత్రి ఇంటికి రావడం, శారీరకంగా, మానసికంగా దూరం పెడుతున్న కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అల్లుడే చంపేశాడు మృతురాలి తల్లిదండ్రులు దేశంశెట్టి రోజారమణి మాట్లాడుతూ తమ కుమార్తెను అల్లుడే చంపేశాడని ఆరోపించారు. తమ కూతురు చనిపోయిన తర్వాత తమకు సమాచారం ఇవ్వకుండా, అన్నావదినలకు సమాచారమందించడం, వారు వచ్చిన తరువాత పోలీసులకు చెప్పడం ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. ఎకరా భూమి గురించి పలుమార్లు అల్లుడు ఫోన్ చేసి అడిగేవాడని తల్లి రోజారమణి ఆరోపించారు. తమ కూతురిని వారే పొట్టన పెట్టుకున్నారని, వారికి తగిన శిక్ష వేయాలని రోదించారు. ఎయిర్పోర్ట్ సీఐ శంకరనారాయణ, ఎస్ఐ అప్పలనాయుడు ఘటనకు గల కారణాలను ఆరా తీశారు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. తల్లి రోజారమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెలుగు భాష రక్షణకు ‘టిట్టిభ సత్యాగ్రహం’
బీచ్రోడ్డు: తెలుగుభాష రక్షణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వంతో అమీతుమీ తెల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి ప్రకటించారు. తెలుగు భాషా రక్షణ కోసం విశాఖ మహానగరంలో కవులు, కళాకారులు, భాషాభిమానులు చేపట్టిన నిరసనలో భాగంగా, తెలుగు దండు ఆధ్వర్యంలో సోమవారం జీవీఎంసీ గాంధీ పార్కులో ‘టిట్టిభ సత్యాగ్రహం’కు శ్రీకారం చుట్టామన్నారు. తొలుత గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం తెలుగు భాషా సూర్యుడు సీపీ బ్రౌన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉపవాస దీక్షకు సంకల్పం చెప్పుకున్న పరవస్తు సూరి మాట్లాడుతూ తెలుగు తల్లి మన దేశవాళీ పాలకుల చేతుల్లో దగా పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష, సంస్కృతి ఈ జాతి సొత్తు అని, దానిని భావితరాలకు అందించడం మన బాధ్యత అని, దీనిపై రాజకీయుల పెత్తనం ఏంటని ప్రశ్నించారు. ఈ నిరవధిక నిరాహార నిరసన దీక్షను ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. నిరసనలో పాల్గొన్న పలువురు వక్తలు తమకు రాజకీయాలతో సంబంధం లేదని, ప్రభుత్వంతో పేచీ లేదని, కేవలం పాలకులతోనే పంచాయతీ అని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు కనీసం ‘అధికార భాషా సంఘం’ కూడా ఏర్పాటు చేయకపోవడం వారి మాతృభాషాభిమానానికి నిదర్శనమన్నారు. దీక్షా కార్యక్రమంలో తిరుపతి రాజమన్నార్, ఆచార్య ప్రసాద్, అడపా రామకృష్ణ, ఆచార్య సూరప్పడు, ప్రజాకవి దేవిశ్రీ, ఎర్రం నాయుడు, నరహరిశెట్టీ శ్రీధర్, చేబియ్యం మోహన్, హేమా, పంతుల లలిత, మువ్వల రాంబాబు, కానాల భారతి, కోరుకొండ రంగారావు, ఇమంది ఈశ్వరరావు, సీతాదేవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
‘చిరంజీవ’ సూపర్ హిట్ అవడం ఆనందంగా ఉంది
బీచ్రోడ్డు: లవర్ బాయ్ రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం ‘చిరంజీవ’ ఓటీటీలో సూపర్ హిట్ అయిన సందర్భంగా నగరంలో చిత్ర యూనిట్ విజయయోత్సవ కార్యక్రమం నిర్వహించింది. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ... ఆహాతో తనకు మంచి అనుబంధం ఉందని, గతంలో ‘ఒరేయ్ బుజ్జిగా’ కూడా ఆహాలోనే స్ట్రీమింగ్ అయిందని గుర్తు చేసుకున్నారు. నవంబర్ 7న విడుదలైన ‘చిరంజీవ’ చిత్రాన్ని ఆహాలో సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలని కోరారు. దర్శకుడు అభి మా అందరికంటే ఎక్కువ కష్టపడ్డాడని, ఈ విజయాన్ని దక్కించుకోవడానికి అతను అర్హుడని ప్రశంసించారు. దర్శకుడు అభినయ కృష్ణ మాట్లాడుతూ... ఇండస్ట్రీలో 23 ఏళ్ల ప్రయాణంలో దర్శకుడిగా తన కృషికి ఆహా టీమ్ (శ్రావణి), నిర్మాతలు రాహుల్, సుహాసిని ఎంతగానో సహకరించారని తెలిపారు. ‘జబర్దస్త్’ స్కిట్స్ మాదిరిగానే, ఈ సినిమాలో కూడా హీరోకు ఏజ్ మీటర్ అనే కొత్త కాన్సెప్ట్ను పెట్టి ప్రయత్నించానని, ఈ ప్రయత్నం అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
స్ఫూర్తి నింపేందుకు పోటీలు
కొమ్మాది: ‘జన జాతీయ గౌరవ దివస్ – 2025’లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్ (టీసీఆర్టీఎం) ఆధ్వర్యంలో గీతం కళాశాల ప్రాంగణంలో సోమవారం గిరిజన క్రీడా పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. టీసీఆర్టీఎం ఈడీ డా. రాణి మందా జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ జెండాను ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. గిరిజన యువతలో క్రీడా స్ఫూర్తి, ఐక్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఈ క్రీడలు దోహదపడతాయని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని సీతంపేట, పార్వతీపురం, పాడేరు, ఆర్సీ వరం, కేఆర్ పురం, చిత్తూరు, శ్రీశైలం, నెల్లూరు ఐటీడీఏల నుంచి గిరిజన విద్యార్థులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు కబడ్డీ, వాలీబాల్, విలువిద్య వంటి పోటీల్లో పాల్గొన్నారు. రంగురంగుల కవాతు, క్రీడా జ్యోతులు, గిరిజన నృత్య ప్రదర్శనలు, జానపద సంగీతం, హస్తకళల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్రీడా సంబరాలు రెండు రోజులు జరుగుతాయని, ముగింపు రోజున విజేతలకు బహుమతులు అందిస్తామని ఈడీ తెలిపారు. ఎమ్మెల్యే గంటా గైర్హాజరుపై అసహనం క్రీడా పోటీలను స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించాల్సి ఉంది. ఆయన రాక కోసం మూడు గంటల పాటు అధికారులు, విద్యార్థులు, కళాకారులు ఎండలో నిరీక్షించారు. క్రీడా పోటీలు జరుగుతున్న సమీప ప్రాంతం నుంచే ఆయన వెళ్లిపోవడంతో అధికారులు, హాజరైన వారంతా అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గైర్హాజరు కారణంగా గంటల తరబడి ఎండలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్సాహంగా ప్రారంభమైన గిరిజన క్రీడా పోటీలు -
రెవెన్యూ క్రీడల్లో విశాఖకు ద్వితీయ స్థానం
మహారాణిపేట: అనంతపురం ఆర్డీటీ మైదానంలో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక పోటీలు – 2025లో విశాఖ జిల్లా జట్టు ఓవరాల్ చాంపియన్షిప్లో ద్వితీయ స్థానం సాధించింది. ఈ క్రీడా పోటీలలో జిల్లా రెవెన్యూ సిబ్బంది తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. పురుషుల విభాగంలో... జూనియర్ అసిస్టెంట్ రవివర్మ 100 మీటర్ల పందెంలో ప్రథమ స్థానం కై వసం చేసుకు న్నారు. బ్యాడ్మింటన్ డబుల్స్లో టి. ఉదయ్, ఎస్. రోహిత్ జట్టుతో పాటు సింగిల్స్ విభాగంలో కూడా విశాఖ జట్టు ప్రథమ స్థానాలు దక్కించుకుంది. మహిళల విభాగంలో... షాట్పుట్లో ఇ. ప్రసన్న ప్రథమ స్థానం సాధించారు. బ్యాడ్మింటన్ డబుల్స్, చెస్, టగ్ ఆఫ్ వార్ విభాగాల్లో మహిళా జట్లు ద్వితీయ స్థానాలను సాధించాయి. కలెక్టరేట్ ఆఫీస్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ అధికారులు సహా వివిధ హోదాల్లోని సిబ్బంది సమష్టి కృషి, క్రీడాస్ఫూర్తి ఫలితంగానే విశాఖ జట్టుకు రెండో స్థానం దక్కిందని రెవెన్యూ అసోసియేషన్ నాయకులు తెలిపారు. -
ఉత్సాహంగా ఆలిండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ పోటీలు
ఎంవీపీకాలనీ : 40వ ఆలిండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ క్రీడాపోటీలు సోమవారం విశాఖ వేదికగా ప్రారంభమయ్యాయి. ఎంవీపీ కాలనీలోని ఎస్3 స్పోర్ట్స్ ఏరీనాలో జరుగుతున్న ఈ పోటీలసు ఏపీ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ పీపీ శ్రీదేవి, అర్జున అవార్డ్ గ్రహిత నీలంశెట్టి లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల మధ్య క్రీడాస్ఫూర్తికి చిహ్నాంగా ఈ పోటీలు నిలవాలని ఆకాంక్షించారు. క్రీడాకారుల క్రమశిక్షణ, కృషి దేశానికి గర్వకారణంగా నిలుస్తాయన్నారు. తొలుత ఆయా తపాలా సర్కిల్స్కు చెందిన వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోటీలను పురస్కరించుకొని పలు పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. విశాఖ పోస్ట్ మాస్టర్ జనరల్ వీఎస్ జయశంకర్ మాట్లాడుతూ ఈ ఆలిండియా పోటీల్లో దేశంలోని 14 తపాలా సర్కిళ్లకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందిన 129 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. తొలిరోజు పోటీలో భాగంగా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ సర్కిళ్లకు చెందిన పురుషుల జట్లు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సర్కిళ్లకు చెందిన మహిళ జట్లు పోటీ పడ్డాయి. ఈ నెల 14వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయి. కార్యక్రమంలో తపాలా శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ఏపీ టెబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
బ్యాంక్ అభివృద్ధిలో ‘ఆఫీసర్స్ అసోసియేషన్’ పాత్ర కీలకం
కొమ్మాది: కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ 20వ త్రైవార్షిక జాతీయ మహాసభలు సోమవారం ఘనంగా ముగిశాయి. రాడిసన్ బ్లూ హోటల్లో మూడు రోజులుగా జరుగుతున్న ఈ సభలను ఉద్దేశించి కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కె.సత్యనారాయణ మాట్లాడుతూ బ్యాంక్ అభివృద్ధిలో బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. తెలుగు యువకుడైన కె.రవికుమార్ నాయకత్వంలో దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్ అధికారులందరూ ఏకధాటిపై నడిచి అందిస్తున్న బ్యాంకింగ్ సేవలు దేశ ప్రగతికి ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు. అనంతరం సత్యనారాయణరాజు జీవితంలో ఎదిగిన క్రమాన్ని అసోసియేషన్ పొందుపరిచిన ది మాస్టర్ స్టిచ్ అనే పుస్తకాన్ని ఆయన మాతృమూర్తి రామసీత చేతుల మీదుగా ఆవిష్కరించారు. జనరల్ సెక్రెటరీ కె.రవికుమార్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్ అధికారుల ఐకమత్యమే బలమని.. దానికి నిదర్శనమే దేశంలో అతి పెద్ద ట్రేడ్ యూనియన్గా నిలవడమన్నారు. కెనరా బ్యాంక్ ఈ మూడు సంవత్సరాల్లో రూ.7 లక్షల కోట్ల బిజినెస్ పెంచగలిగిందని దానికి బ్యాంక్ అధికారుల కృషే కారణమన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు విస్తృత చర్చల్లో పాల్గొని బ్యాంకు అధికారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించి వంద తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారన్నారు. ఏఐ టెక్నాలజీ వల్ల వచ్చే మార్పులకు సిద్ధం కావాలన్నారు. ముగిసిన కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ 20వ త్రైవార్షిక జాతీయ మహాసభలు -
ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
తాటిచెట్లపాలెం: అనుకున్న ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. ద్వారకా పోలీసుల వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా, కొర్లం గ్రామానికి చెందిన సంపత్, ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో భాగంగా విశాఖలోని మధురానగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఉద్యోగం లభించకపోవడం ఒకవైపు, దీనికి తోడు ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి లోన్పై తీసుకున్న ద్విచక్ర వాహనం ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ వాహనాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ పరిణామాలతో మనస్తాపానికి గురైన సంపత్ సోమవారం తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నా చావుకు ఎవరూ కారణం కారు, అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాను.. అని సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించినట్లు ద్వారకా పోలీసులు తెలిపారు. -
జనవరిలో అంతర్జాతీయ నాట్య సమ్మేళనం
మద్దిలపాలెం: వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 4వ తేదీ వరకు అంతర్జాతీయ నాట్య సమ్మేళనం–2026ను కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించనున్నట్లు విశాఖ నృత్య కళాకారుల సమాఖ్య అధ్యక్షులు కన్నం వి. రమణారావు తెలిపారు. నటరాజ్ మ్యూజిక్–డాన్స్ అకాడమీ, ద డ్యాన్స్ ఇండియా మ్యాగజైన్ సంయుక్త సౌజన్యంతో జరిగే ఈ ఉత్సవానికి చైర్మన్గా ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు కళారత్న కేవీ సత్యనారాయణ వ్యవహరించనున్నారు. ఈ సమ్మేళనంలో దేశ విదేశాలకు చెందిన ప్రఖ్యాత కళాకారుల ప్రదర్శనలు, యువ ప్రతిభను ప్రోత్సహించడానికి జాతీయ స్థాయి నాట్య పోటీలు, క్విజ్ పోటీలు ఉంటాయి. ముఖ్యంగా 2,000 మంది నాట్య కళాకారులతో మహా బృంద నాట్యం ప్రదర్శనకు సన్నాహాలు చేస్తున్నట్లు రమణారావు తెలిపారు. -
ప్రముఖ న్యాయవాది చీమలపాటి శ్రీరామ మూర్తి అస్తమయం
విశాఖ లీగల్ : ప్రముఖ సీనియర్ న్యాయవాది చీమలపాటి శ్రీరామ మూర్తి (94) ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. కొద్ది రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన గత 70 ఏళ్లుగా విశాఖలో న్యాయవాదిగా కొనసాగారు. ఆయన కుటుంబం న్యాయరంగంలోనే కొనసాగుతోంది. పెద్ద కుమారుడు జస్టిస్ రవి చీమలపాటి రాష్ట్ర హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. రెండో కుమారుడు చీమలపాటి శేఖర్ విశాఖలో సీనియర్ న్యాయవాదిగా, కుమార్తె కూడా న్యాయవాదిగా పనిచేస్తున్నారు.న్యాయస్థానంలో మెళకువలు, కోర్టు సిబ్బందితో మెలగాల్సిన తీరుపై జూనియర్ న్యాయవాదులకు ఆయన నిరంతరం మార్గనిర్దేశం చేసేవారు. శ్రీరామ మూర్తి మృతిపై విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, బార్ కౌన్సిల్ సభ్యులు సహా పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
బిల్లులు చెల్లించండి మహాప్రభో..
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ పరిధిలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులు అందక తలలు పట్టుకుంటున్నారు. అప్పులు చేసి మరీ పనులు పూర్తి చేసిన చిన్న కాంట్రాక్టర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల కోసం జీవీఎంసీ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం లేకపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధి పోర్టర్ను ఏర్పాటు చేసింది. దీని వల్ల కాంట్రాక్టర్లకు పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. పాత బిల్లులు అందులో అప్లోడ్ కావడం లేదు. గత 13 నెలలుగా సుమారు రూ.400 కోట్లు బకాయిలున్నాయి. ఫలితంగా కాంట్రాక్టర్లందరూ బిల్లుల కోసం రోడ్డెక్కారు. ‘జీవీఎంసీ తమకు సహకరించడం లేదు.. బిల్లులు చెల్లించడం లేదు.. ఆర్థికంగా ఇబ్బందులు పడతున్నాం.. విషయాన్ని పలుమార్లు మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి మొరపెట్టుకున్నాం.. ప్రభుత్వ పెద్దల వద్ద వాపోయాం. అయినా ఇంత వరకు పెండింగ్ బిల్లులు చెల్లించలేదు. ఇప్పటి వరకు అప్పులు చేసి పనులు చేపట్టాం. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే బయటపడగలం’ అని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆరు నెలలకే బిల్లులు వచ్చేవని.. చంద్రబాబు ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మమ్మల్ని నట్టేట ముంచుతోందని లబోదిబోమంటున్నారు. రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు జీవీఎంసీ పరిధిలోని కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన రూ.400 కోట్ల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు రోడ్డెక్కారు. తక్షణం పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ గత శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వేదికగా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. 13 నెలలుగా బిల్లులు నిలిచిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరేళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్టీఎఫ్, జీజీఎంపీ బిల్లులు వెంటనే చెల్లించాలని, ఈఎండీ, ఎఫ్ఎస్, ఏఎస్ఈల కింద కాంట్రాక్టర్లకు చెల్లించే డిపాజిట్లు రెండేళ్ల కాల వ్యవధి పూర్తయిన వెంటనే తమకు అందేలా సాఫ్ట్వేర్ రూపొందించాలని కోరారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ పేమెంట్లు పద్ధతి ప్రకారం జరిపించాలని, జీవీఎంసీ బడ్జెట్లో నిధులున్న పనులకు మాత్రమే టెండర్లు పిలవాలని, ప్రభుత్వం నిర్వహిస్తున్న నిధి పోర్టల్ నుంచి జీవీఎంసీకి మినహాయింపు ఇవ్వాలని, జీవీఎంసీ అకౌంట్స్ అధికారులు చెల్లింపులు జరిపిన జాబితాను పోర్టల్లో పొందపరచాలని డిమాండ్ చేశారు. -
భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులు ఆకర్షిస్తాం
ఎంవీపీకాలనీ: సీఐఐ భాగస్వామ్య సమ్మిట్ ద్వారా 410 ఎంవోయూలు, రూ. 9.8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్లమెంట్ సభ్యుడు శ్రీభరత్ తెలిపారు. సోమవారం లాసన్స్ బే కాలనీలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సమ్మిట్ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని, మెజారిటీ ప్రాజెక్టుల గ్రౌండింగ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. నవంబర్ 12న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆర్కే బీచ్, గాజువాకల్లో యూనిటీ మార్చ్లు నిర్వహిస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు. -
సీఐఐ సమ్మిట్కు భారీ భద్రత
మహారాణిపేట: ఈ నెల 14, 15 తేదీలలో నగరంలో జరగనున్న అంతర్జాతీయ స్థాయి సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై విశాఖ రేంజ్ డీఐజీ, ఇన్చార్జ్ సీపీ గోపినాథ్ జెట్టి సోమవారం పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. నగర ప్రవేశ మార్గాల వద్ద వాహనాల తనిఖీలను ముమ్మరం చేయాలని, అనకాపల్లి, విజయనగరం జిల్లాల నుంచి నగరంలోకి వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలని డీఐజీ స్పష్టం చేశారు. అసాంఘిక వ్యక్తులు, అనధికారిక లేదా ప్రమాదకరమైన వస్తువులు సమ్మిట్ వేదికలకు చేరకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ప్రతినిధులు బస చేసే అన్ని ప్రదేశాలలో సమగ్ర భద్రత, కీలక ప్రదేశాలలో యాంటీ–సబోటేజ్ తనిఖీలు చేపట్టాలని సూచించారు. సమ్మిట్ ప్రవేశ, నిష్క్రమణలను నియంత్రించడానికి యాక్సెస్ కంట్రోల్ చర్యలు అమలు చేయాలని, అండర్గ్రౌండ్ పార్కింగ్ ప్రాంతాలను తనిఖీ చేసి, ప్రమాద నివారణ చర్యగా ఎలాంటి సీఎన్జీ లేదా ఎలక్ట్రిక్ వాహనాలను అక్కడ అనుమతించకూడదని ఆదేశించారు. సదస్సుకు వచ్చే ప్రతినిధులను విమానాశ్రయం నుంచి వసతి ప్రదేశాలకు, సమావేశ వేదికలకు సురక్షితంగా ప్రయాణించేలా చూడాలన్నారు. ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ వారికి అవసరమైన భద్రతా స్థాయిని తెలుసుకోవాలని, కార్యక్రమ భద్రతను పర్యవేక్షించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసు నిఘా ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం పాటించాలని తెలిపారు. నగరమంతా బహిరంగ పెట్రోలింగ్, నిఘా పటిష్టంగా ఏర్పాటు చేయాలని, సమ్మిట్ జరిగే జోన్లలో ఏరియా డామినేషన్ కోసం ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులపై గట్టి నిఘా ఉంచి, సీఐఐ సమ్మిట్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా, సురక్షితంగా జరిగేలా చూడాలని గోపీనాథ్ జెట్టి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీలు మణికంఠ చందోలు, మేరీ ప్రశాంతి సహా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖ రేంజ్ డీఐజీ, ఇన్చార్జ్ సీపీ గోపీనాథ్ జెట్టి -
సొసైటీ సొమ్ముతో జల్సా
సాక్షి, విశాఖపట్నం : నమ్మకంతో దాచుకున్న సొమ్మును భద్రంగా ఉంచాల్సిన వాళ్లే భక్షకులుగా మారుతున్నారు. ఈపీడీసీఎల్ విద్యుత్ ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీలో సభ్యులకు తెలియకుండా ఒక్కొక్కరి పేరిట రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు కాజేశారనే ఆరోపణలు ఇటీవల వినిపించాయి. ఇప్పుడు మరో పిడుగు లాంటి వార్త సభ్యులను ఆందోళన పరుస్తోంది. విశాఖ సర్కిల్ పరిధి సొసైటీలోని మూడు బ్రాంచిల్లో కొందరు డైరెక్టర్లు దర్జాగా సభ్యుల సొమ్ముకు కుచ్చుటోపీ పెడుతూ జల్సాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మూడు బ్రాంచ్ల్లో.. ఈపీడీసీఎల్ విశాఖపట్నం సర్కిల్ పరిధిలో విద్యుత్ ఉద్యోగుల కో–ఆపరేటివ్ సొసైటీకి సంబంధించి విశాఖ సర్కిల్, గాజువాక, సింహాచలం బ్రాంచ్లున్నాయి. ఒక్కో బ్రాంచ్ సొసైటీకి అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు ఉద్యోగుల సంఖ్యను బట్టి 7 నుంచి 9 మంది డైరెక్టర్లు ఉంటారు. ఈ సొసైటీలో ఈపీడీసీఎల్ సర్కిళ్లతో పాటు చింతపల్లి, సీలేరులోని జెన్ కో ఉద్యోగులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఇందులో డైరెక్టర్లు కొందరు సొసైటీ సభ్యుల సొమ్మును విలాసాలకు వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. విహారయాత్రలకీ ఆ సొమ్మేనా.! ఆయా సొసైటీల్లో ఉన్న కొందరు డైరెక్టర్లు ఏటా వివిధ ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా విహార యాత్రలకు వెళ్తున్నారు. థాయ్లాండ్, దుబాయ్, మలేసియా.. ఇలా ఏటా వేర్వేరు ప్రాంతాల్లో స్పెషల్ టూర్లు పేరుతో చక్కర్లు కొడుతున్నారు. అయితే ఈ టూర్లకీ సొసైటీ సొమ్ము వాడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. ముఖ్యంగా సింహాచలం బ్రాంచ్లో నలుగురు డైరెక్టర్లు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం విహార యాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఖర్చులను కూడా సొసైటీ ఖర్చుల్లో వివిధ పేర్లు మార్చి చూపించేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా సభ్యులు దీనిపై నిలదీస్తే చాలు.. వారి ఖాతాలపైనా, డివిడెంట్లపైనా ప్రతాపం చూపిస్తుంటారని విమర్శలొస్తున్నాయి. పైగా కొందరు డైరెక్టర్లు ఈపీడీసీఎల్ యూనియన్లలో కీలకంగా ఉన్నారు. దీంతో డైరెక్టర్లు ఏంచేసినా మౌనంగా భరిస్తున్నామని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సరిగా ఆడిట్ నిర్వహిస్తే కొందరు డైరెక్టర్ల బండారాలు బయటపడతాయంటున్నారు. బహుమతుల పేరుతో స్వాహా! సొసైటీలో ఉన్న సభ్యులకు ఏటా ఒకసారి బహుమతుల పేరుతో చిన్న ఉత్సవంలా నిర్వహిస్తుంటారు. ఇందులోనూ డైరెక్టర్లు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం దసరాకు డెవిడెంట్ ఫండ్తో ఇస్తుంటారు. ట్రావెలింగ్ బ్యాగ్లు, మిక్సీలు, కుక్కర్లు అందజేస్తుంటారు. వీటిని కూడా కొందరికే ఇచ్చి.. మిగిలిన సొమ్మును స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. సొసైటీలో సుమారు 800 మంది సభ్యులుంటే.. 600 మందికి మాత్రమే అందజేసి.. మిగిలినవి తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ ఉద్యోగుల కో–ఆపరేటివ్ సొసైటీలో కొందరు డైరెక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సొసైటీ సభ్యుల పేరుతో రుణాలు తీసుకొని ఓ మాజీ డైరెక్టర్ జేబులు నింపేసుకోగా.. మరికొందరు డైరెక్టర్లు సొసైటీ సొమ్ముతో జల్సాలు చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా సభ్యులకు బహుమతులిచ్చే నెపంతోనూ సొమ్ములు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. -
సినర్జీస్ కార్మికుల ఆకలి ఘోష
బీచ్రోడ్డు: దువ్వాడ వీఎస్ఈజెడ్లో ఉన్న సినర్జీస్ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 600 మంది కార్మికులకు యాజమాన్యం ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ కార్మికులు తమ కుటుంబాలతో కలిసి సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. బకాయిపడ్డ జీతాలను వెంటనే చెల్లించాలని, బోనస్ ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా జమ చేయాలని, అలాగే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు యాజమాన్యం మొండివైఖరిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్ మాట్లాడుతూ కార్మికులు 20 ఏళ్ల నుంచి సినర్జీ సంస్థలో పనిచేస్తున్నారని, వారికి చట్టపరంగా రావలసిన హక్కుల్ని యాజమాన్యం అమలు చేయడం లేదని విమర్శించారు. కార్మికుల నుంచి పీఎఫ్, ఈఎస్ఐ వసూలు చేస్తున్నప్పటికీ, యాజమాన్యం తమ వాటాను చెల్లించడం లేదని ఆరోపించారు. అంతేకాక తొమ్మిదేళ్లగా బోనస్ కూడా చెల్లించలేదన్నారు. జీతాలు చెల్లిస్తామని జాయింట్ కమిషనర్ అంగీకరించి కూడా న్యాయం జరగలేదన్నారు. జీతాలు అడిగితే ‘చెల్లించలేం, మీకు నచ్చింది చేసుకోండి’ అని యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోందని కుమార్ పేర్కొన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకున్నా యాజమాన్యం జీతాలు చెల్లించలేదన్నారు. ముఖ్యమంత్రి నగరంలో పారిశ్రామిక సమ్మిట్ పేరుతో కొత్త పరిశ్రమలు, వేల ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారని, ఆరు నెలల నుంచి జీతాలు లేక రోడ్డుమీద ఉన్న కార్మికులకు ముందు న్యాయం చేయాలని ఆయన కోరారు. తక్షణమే అధికారులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు దాస్, రాంబాబు, లోకేష్ రాజు, ఐద్వా నాయకులు లక్ష్మీ, కామేశ్వరి సంఘీభావం పాల్గొన్నారు. కొనసాగుతున్న దీక్షలు అగనంపూడి : దువ్వాడ వీఎస్ఈజెడ్ ఆవరణలోని సినర్జీస్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ సంస్థ కార్మికులు తమకు బకాయి పడిన జీతాలు చెల్లించాలని కోరుతూ సోమవారం సంస్థ గేటు వద్ద సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ నిరసనలో యూనియన్ నాయకులు శ్రీనివాస్, దాస్, వెంకటరావు, రమణ పాల్గొన్నారు. -
రెండు నెలల క్రితమే నిర్ణయించాం..
● మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై నిరసన ర్యాలీ మోంథా తుపాను కారణంగా వాయిదా వేశాం..సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసన ర్యాలీ చేయాలని రెండు నెలల క్రితం వైఎస్సార్ సీపీ అధిష్టానం నిర్ణయించిందని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. మద్దిలపాలంలో గల పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నెలలో జరగాల్సిన ఈ నిరసన ర్యాలీని మోంథా తుపాను కారణంగా ఈనెల 12వ తేదీకి వాయిదా వేసిందని పేర్కొన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో సీఐఐ సమ్మిట్ నిర్వహించడం ఇష్టం లేకనే వైఎస్సార్ సీపీ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు ఎంపీ భరత్ అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరుగుతుందన్నట్లు.. వైఎస్సార్ సీపీ హయాంలో ఏమి జరగనట్లు ఆయన మాటలున్నాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంటే.. ఆ పెట్టుబడులను చంద్రబాబు ప్రభుత్వం హయాంలో వచ్చినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆదాని డేటా సెంటర్, పోర్టుల నిర్మాణం వంటివి కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వచ్చినట్లే చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ 17 నెలల పాలనలో చంద్రబాబు సర్కార్ విశాఖలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా.. రుషికొండ ప్యాలెస్ను వైఎస్ జగన్మోహన్రెడ్డి అనవసరంగా నిర్మించారంటూ అవగాహనరాహిత్యంలో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. రుషికొండలో భవనాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతం కాదని.. అవి ప్రభుత్వానివేనని మరిచిపోయి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ నెల 12న నిర్వహించే నిరసన ర్యాలీ ఆగదని పేర్కొన్నారు. -
భాగస్వామ్య సదస్సుకు పక్కా ఏర్పాట్లు
మహారాణిపేట: ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లన్నీ బుధవారం సాయంత్రం నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడు తూ ఉపరాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు పాల్గొననున్న ఈ సదస్సు కోసం పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రి 12వ తేదీ రాత్రికి చేరుకుంటారని, 13న సీఐఐ, అధికారులతో సమావేశం అవుతారని తెలిపారు. సదస్సు కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని, డెలిగేట్ కిట్లను రిజిస్ట్రేషన్ సమయంలోనే అందించాలని సూచించారు. స్పాట్ రిజిస్ట్రేషన్ ఉండదని స్పష్టం చేశారు. వీఐపీ పార్కింగ్, నిరంతర విద్యుత్, ఇంటర్నెట్ వసతి, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అతిథులకు సాంస్కృతిక ప్రదర్శనలతో స్వాగతం పలకాలని ఆదేశించారు. 12వ తేదీ సాయంత్రం నాటికి అన్ని విభాగాల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసి, డ్రై రన్ నిర్వహించుకోవాలని సూచించారు. రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషన్ కేతన్ గార్గ్, డీసీపీలు మణికంఠ చందోలు, మేరీ ప్రశాంతి, డిప్యూటీ కలెక్టర్లు సత్తిబాబు, లతామాధురి, వెంకటరత్నం, వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, సీఐఐ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
భగవద్గీతతో జీవిత సమస్యలకు పరిష్కారం
మురళీనగర్: ప్రతి రోజూ భగవద్గీత పఠనం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. ఎన్జీజీవోస్ కాలనీలోని వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అనుగ్రహ భాషణం చేశారు. చిన్న పిల్లలు భగవద్గీత చదివితే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు. జ్యోతిష్యం, ఆగమ శాస్త్రాలను తప్పక గౌరవించాలని సూచించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి వారి ఆకలి తీర్చడం వల్ల పుణ్యం కలుగుతుందని పిలుపునిచ్చారు. మనసును నిగ్రహంగా ఉంచుకోవడానికి విగ్రహారాధన చేయాలని తెలిపారు. ముందుగా ఆలయ అర్చకులు, ఈవో బి.ప్రసాద్ స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామీజీ వైభవుడిని దర్శించుకుని పూజలు చేసి, అంతరాలయంలో కాసేపు ధ్యానం చేశారు. బీజేపీ నేత శ్యామలాదీపిక, అర్చకులు శేషాచార్యులు, వాసుదేవాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన
పీఎం పాలెం : వారాంతపు వినోద కార్యక్రమాల్లో భాగంగా శిల్పారామం (జాతర)లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను ఆద్యంతం అలరించింది. నగరంలోని నృత్య కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వినాయక స్తుతి గీతానికి కూచిపూడి నృత్యంతో ప్రారంభించి... శ్లోకాంజలి, నటరాజ స్తోత్రం, కృష్ణా పాట, అర్ధ నారీశ్వర, కనక దుర్గమ్మ నృత్యాంశాలను అద్భుతంగా ప్రదర్శించారు. కళాకారులు దేవిజ్ఞ, బాశివకా, రాధ, రాధిక, శిరీష, ధ్రుతి, సహస్ర, శిరీష సౌమ్య తదితర కళాకారులు పాల్గొనగా పి.రమ్య నృత్య దర్శకత్వ వహించారు. స్థానిక పరిపాలన అధికారి రమేష్ రెడ్డి పర్యవేక్షించారు. -
177కే ఆంధ్ర ఆలౌట్
107 పరుగుల ఆధిక్యంలో తమిళనాడు విశాఖ స్పోర్ట్స్: దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో భాగంగా వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఎలైట్–ఏ గ్రూప్ మ్యాచ్లో తమిళనాడు జట్టు ఆంధ్రపై తొలి ఇన్నింగ్స్లో స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి మ్యాచ్పై పట్టు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో 182 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆదివారం ఓవర్ నైట్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 20 పరుగులతో ఆటను ప్రారంభించిన ఆంధ్ర జట్టు.. తమిళనాడు బౌలర్ల ధాటికి త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. ఆంధ్ర బ్యాటర్లు భరత్ (12), విజయ్ (3), కెప్టెన్ రికీ భుయ్ (4), కరణ్ షిండే (9), అశ్విన్ హెబ్బర్ (13), రాజు (1) పెవిలియన్కు క్యూ కట్టడంతో జట్టు స్కోరు 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రషీద్ (87 నాటౌట్) ఒక్కడే అద్భుత పోరాటం కనబరిచాడు. సౌరభ్ (30) తో కలిసి కాసేపు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డా, మిగిలిన బ్యాటర్లు పృథ్వీ (డకౌట్), సాయితేజ (2) సహకారం అందించకపోవడంతో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 177 పరుగులకే ఆలౌటైంది. దీంతో తమిళనాడు జట్టుకు తొలి ఇన్నింగ్స్లో 5 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ఆల్రౌండర్ సందీప్ 4 వికెట్లు, త్రిలోక్, సోను, సాయి కిశోర్ తలో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. ఓపెనర్ నారాయణ్ (డకౌట్) నిరాశపరిచినా, మరో ఓపెనర్ విమల్ (20) కొంత సేపు ఆడాడు. బాలసుబ్రమణ్యం (51) అర్ధ సెంచరీతో రాణించి రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం ప్రదోష్ (26), కెప్టెన్ సాయికిశోర్(0 ) క్రీజులో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో పృథ్వీ, రాజు చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆట మరో రెండు రోజులు మిగిలి ఉంది. -
మరో ఐదు రోజుల్లో భాగస్వామ్య సదస్సు ఇవీ జీవీఎంసీ రహదారుల సొగసు
మరో ఐదు రోజుల్లో భాగస్వామ్య సదస్సు జరగనున్న నేపథ్యంలో, ఏర్పాట్లు ‘ఆహా.. ఓహో’ అన్నట్టు ప్రచారం పీక్స్కి చేరుకుంది. అయితే జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్దే రోడ్ల దుస్థితి అధికారులను వెక్కిరిస్తున్నట్లుగా ఉంది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతంలోనే రోడ్లు అత్యంత ప్రమాదకరంగా మారినా, ఉన్నతాధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు. రామ్నగర్ ప్రాంతంలో యూజీడీ పనుల కోసం రెండు నెలల క్రితం రోడ్లను తవ్విన కాంట్రాక్టర్, పనులు పూర్తయినా రోడ్లను మాత్రం తిరిగి మరమ్మతులు చేయలేదు. కేవలం పిక్క వేసి వదిలేశారు. దీని ఫలితంగా నెల రోజులుగా రామ్నగర్ రోడ్లపై ప్రయాణిస్తున్న వాహన చోదకులకు ఇది ప్రమాదకరంగా మారింది. పిక్క వేసి వదిలివేయడం వలన, రోడ్డుపై వాహనాలు జారిపడిపోతున్నాయి. దీని వలన ద్విచక్ర వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. నగరంలో అతి ముఖ్యమైన భాగస్వామ్య సదస్సుకు అతిథులు వస్తున్న తరుణంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఈ పరిస్థితి ఉండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రామ్నగర్ ప్రాంతంలోని రహదారులను మెరుగుపరచాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. - బీచ్రోడ్డు -
వింత షరతులు
వైజాగ్ మాల్యా బ్యాంకులపైనా బెదిరింపుల అస్త్రాలు..! బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలే కాదు... కొంత మంది వ్యక్తుల దగ్గరా చేబదులుగా డబ్బులు తీసుకొని వారికి కూడా రిక్త హస్తాలు చూపించి డబ్బులు ఎగ్గొట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 20 సార్లకు పైగా డిఫాల్టర్గా బ్యాంకుల చుట్టూ తిరిగాడు మన వైజాగ్ మాల్యా. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. ఫైనాన్స్ సంస్థల్ని బెదిరించి.. అప్పులు మాఫీ చేసుకునేందుకు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఇటీవల డిఫాల్టర్గా మారారంటూ.. జప్తుకు ముందు ఇచ్చే నోటీసులు సదరు ఎమ్మెల్యే మాల్యాకు కొన్ని బ్యాంకులు ఇచ్చాయి. వెంటనే బ్యాంకు ప్రతినిధుల్ని తన కార్యాలయానికి రప్పించుకొని.. వారిపైనా బెదిరింపుల అస్త్రాలు సంధించినట్లు తెలుస్తోంది. బహిరంగ నోటీసులు బహిర్గతం చెయ్యొద్దంటూ బ్యాంకులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ప్రధాన పత్రికల్లో నోటీసులు ప్రచురిస్తే.. తన ఇమేజీ డ్యామేజీ అవుతుందని, చిన్న చిన్న పత్రికల్లో నోటీసులిచ్చి వదిలెయ్యాలని చెప్పినట్లుగా బ్యాంకింగ్ వర్గాలు వాపోతున్నాయి. నోటీసులు ప్రచురించబోమని, డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని కోరుతున్న బ్యాంకులపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. దీంతో బ్యాంకు స్థానిక అధికారులు.. సదరు వైజాగ్ మాల్యా ఎమ్మెల్యే పేరు చెబితేనే భయపడిపోతున్నారు. ఈ నోటీసుల వ్యవహారం తమకు సంబంధం లేదని, రీజినల్ కార్యాలయం నుంచే పరిష్కరించుకోవాలంటూ కొన్ని బ్యాంకుల అధికారులు హెడ్ ఆఫీస్కు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. మొత్తంగా రుణాలు ఎగ్గొట్టడమే ప్రధాన లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన సదరు ఎమ్మెల్యే తన అప్పుల పరంపరని కొనసాగిస్తూ రుణాలిచ్చిన సంస్థలకే కన్నం వేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైజాగ్ అంతా కోడై కూస్తోంది. మీకు మాల్యా తెలుసు కదా.. బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని ఎగ్గొట్టేసి విదేశాలకు చెక్కేశాడు. అలాంటి మాల్యానే.. మన వైజాగ్లోనూ ఉన్నాడు. ఈ మాల్యా మాత్రం పారిపోలేదు. అపరిచితుడిలా భిన్న పార్శ్వాలు ప్రదర్శిస్తున్నాడు. కానీ..మన వైజాగ్ మాల్యాలో మాత్రం రెండు కోణాలున్నాయి... ఎన్నికల ముందు.. అప్పులు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించి.. కోర్టుల నుంచి మొట్టికాయలు తిని.. తిన్నదంతా కక్కిన ఘనుడు. ఇప్పుడు.. అధికారాన్ని అడ్డంపెట్టుకొని అప్పులిచ్చిన బ్యాంకుల్నే బెదిరిస్తున్నకై ంకర్యుడు. సాక్షి, విశాఖపట్నం : ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పు తీసుకోవడం.. డబ్బు తిరిగి చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడం.. రుణాలు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించడం.. చివరికి కోర్టు నుంచి నోటీసులొస్తే.. మరో చోట అప్పోసప్పో చేసి ఆ రుణం తీర్చడం.. మళ్లీ.. నోటీసులు.. మళ్లీ కోర్టు చుట్టూ ప్రదక్షిణలు.. ఇది ఓ కూటమి ఎమ్మెల్యేకు హాబీగా మారిపోయింది. దాదాపు విశాఖలో ఉన్న సింహభాగం ఫైనాన్స్ కంపెనీల దగ్గర సదరు ఎమ్మెల్యే.. ఓ డిఫాల్టర్ అనే ముద్ర పడిపోయింది. కేవలం అప్పుల విషయంలోనే కాదు.. రాజకీయాల్లోనూ డిఫాల్టర్ అనే ముద్ర వేసుకుంటూ.. ఈవీఎంల గాలిలో గెలిచిన మాల్యా.. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని అడ్డగోలు వ్యవహారాలకు ఆద్యుడిగా మారుతున్నారు. ఆది నుంచీ అవే మోసాలు..! ఏ బ్యాంకు కనిపించినా.. ఏ ఫైనాన్స్ కంపెనీ కనిపిస్తే.. వారి దగ్గరికి వెళ్లడం.. అప్పులు చెయ్యడం.. ఆనక దాన్ని చెల్లించకుండా తిరగడమే సదరు ఎమ్మెల్యే ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు. చిట్ఫండ్ కంపెనీల్లో డబ్బులు పాడుకొని వాటిని ఎగ్గొట్టేందుకు యత్నించగా కోర్టు మొట్టికాయలు వెయ్యడంతో వాటిని చెల్లించారు. చిట్ఫండ్ సంస్థలకు ఎగనామం పెట్టిన వైజాగ్ మాల్యా... 2015 నుంచి వరుసగా దొరికిన ఫైనాన్స్ సంస్థ దగ్గర దొరికినంత రుణాల్ని తీసుకున్నారు. ప్రతి ఫైనాన్స్ సంస్థ దగ్గర కోట్ల రూపాయల రుణాలు తీసుకొని వాటికి శఠగోపం పెట్టేశారు. చివరికి కోర్టులని ఆశ్రయించిన కొన్ని సంస్థలు.. ఈయన దగ్గర నుంచి వసూలు చేసుకున్నాయి. మరికొన్నింటికి డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉండటంతో.. ఆస్తుల్ని జప్తు చేసుకున్నాయి. వైజాగ్ పోర్టులో కింగ్ అవుతా..! షిప్పింగ్ కంపెనీని నడుపుతున్న కూటమి ఎమ్మెల్యే దాన్ని కొనసాగించేందుకే పలు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల వద్ద నుంచి రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు అధికారం అడ్డం పెట్టుకొని అటు బ్యాంకుల్ని.. ఇటు పోర్టుని శాసించాలని యత్నిస్తున్నారు. వైజాగ్ పోర్టులో షిప్పింగ్ కాంట్రాక్టులు పొందేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. షిప్పింగ్ కాంట్రాక్టులు తన సంస్థకే ఇవ్వాలనీ.. లేదంటే.. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చెప్పి.. బదిలీ చేస్తానంటూ కొందరు పోర్టు అధికారులతో వాగ్వాదం పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. పోర్టులో తానే కింగ్ అవుతానంటూ విర్రవీగుతున్నారని సమాచారం. అప్పులిచ్చిన బ్యాంకుల్ని బెదిరిస్తున్న కూటమి ఎమ్మెల్యే పోర్టులో కాంట్రాక్టుల కోసం బ్యాంకుల్లో రుణాలు నిర్ణీత సమయాల్లో చెల్లించకపోవడంతో డిఫాల్టర్గా ఎమ్మెల్యే బహిరంగ నోటీసులు బహిర్గతం చెయ్యొద్దంటూ బ్యాంకులకు హుకుం ప్రధాన పత్రికల్లో నోటీసులు ప్రచురించొద్దంటూ ఆదేశాలు రుణం చెల్లించే సమయం చెప్పకుండా బ్యాంకులపై పెత్తనం చేస్తున్న ఎమ్మెల్యే మాల్యా -
‘బాల్యం’ ఉపాధ్యాయులకు ముగిసిన శిక్షణ
సీతంపేట: బాల్యం కేంద్రాలకు వచ్చే పిల్లలను ఉజ్వల భవిష్యత్తుకు సోపానాలుగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం అన్నారు. అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్ కాలనీలోని జీవీఎంసీ ప్రైమరీ పాఠశాలలో జీవీఎంసీ బాల్యం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు, సూపర్వైజర్లకు రెండు రోజుల పాటు జరిగిన అవగాహన సదస్సు ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీతారాం మాట్లాడుతూ పిల్లలకు ఎంతో ఉపయుక్తంగా ఉండాలన్న సంకల్పంతో పెద్ద బాలశిక్షలోని 8 పర్వాలను ప్రామాణికంగా తీసుకుని పుస్తకాన్ని రూపొందించడం హర్షణీయమన్నారు. దీనిపై రెండు రోజుల పాటు ఉపాధ్యాయులకు, సూపర్వైజర్లకు అవగాహన సదస్సు నిర్వహించడం చాలా ఉపయుక్తమని, దీనివల్ల ఉపాధ్యాయులకు సబ్జెక్టుపై మరింత అవగాహన పెంచినవారమవుతామని తెలిపారు. ఈ సదస్సుకు హాజరైన ఉపాధ్యాయులకు సీతారాం, బాల్యం ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆవుపాటి మోహన్కుమార్, తెలుగు పండిట్ హైమావతి చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
గాజువాక : షీలానగర్ జంక్షన్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణంపాలయ్యాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లిపురంలోని మిర్చి వీధికి చెందిన కరుమంచి చిన్న సూర్య ప్రకాష్ (44) హిందూజా పవర్ప్లాంట్లో పని చేస్తున్నాడు. విధులు ముగించుకొని ఇంటికి బయల్దేరిన అతడు షీలానగర్ జంక్షన్వద్ద పోర్టు రోడ్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో గాజువాక నుంచి ఎయిర్ పోర్టువైపు వెళ్తున్న లారీ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడి తలపైకి లారీ ఎక్కిపోవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ అక్కడ్నుంచి లారీతో సహా వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అక్కడే విధుల్లో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ స్థానికులతో కలిసి లారీని పట్టుకొన్నారు. అయితే డ్రైవర్ మాత్రం పోలీసుల బారినుంచి తప్పించుకున్నాడు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసును గాజువాక ట్రాఫిక్ సీఐ హుస్సేన్ దర్యాప్తు చేస్తున్నారు. -
భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పనుల్లో వేగం పెంచాలి
మహారాణిపేట: ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్తో కలిసి ఆదివారం ఈ పనులను పరిశీలించిన ఆయన, వివిధ విభాగాల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమయం చాలా తక్కువగా ఉన్నందున, అధికారులు సమన్వయం వహించుకుని, నిర్ణీత సమయం కంటే ముందుగానే పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రధాన వేదిక, స్వాగత ద్వారాలు, అతిథుల రాక, పార్కింగ్ వసతి వంటి అంశాలపై ఆయన సూక్ష్మ స్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా చేయాల్సిన పనులపై ఆయన అధికారులను అప్రమత్తం చేసి, ఎక్కడా గ్యాప్ రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అలాగే జీవీఎంసీ సీఈకి పలు అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై, మార్పులు చేర్పులపై ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో ఆయనతోపాటు జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, డీసీపీ మణికంఠ చందోలు, జీవీఎంసీ సీఈ సత్యనారాయణరాజు, సీఎంవో డాక్టర్ నరేష్ కుమార్, సీఐఐ ప్రతినిధి మౌళి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సందడిగా వన భోజనాలు
ఆరిలోవ: పవిత్ర కార్తీక మాసం మూడవ ఆదివారం నగరంలోని పర్యాటక కేంద్రాలు జనసంద్రంగా మారాయి. కై లాసగిరి, ఇందిరా గాంధీ జూ పార్క్, ముడసర్లోవ వంటి ప్రాంతాలు వేలాది మంది సందర్శకులతో కోలాహలంగా కనిపించాయి. అయితే కంబాలకొండ మాత్రం వెలవెలబోయింది. కార్తీక మాసం కావడంతో, కుటుంబ సమేతంగా వనభోజనాలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో జూ పార్కుకు తరలివచ్చారు. పచ్చని చెట్ల నీడన భోజనాలు చేస్తూ, వన్యప్రాణులను చూస్తూ ఆనందంగా గడిపారు. అడవి దున్నలు, పులులు, ఏనుగులు, కోతులు వంటి జంతువులు ఎన్క్లోజర్లో హుషారుగా తిరుగుతూ సందర్శకులను ఆకట్టుకున్నాయి. లవ్బర్డ్స్, ఆఫ్రికన్ పేరెట్స్, నెమళ్ల జోన్ల వద్ద పక్షుల కిలకిలరావాలు పిల్లలను, పెద్దలను అలరించాయి. ఆదివారం ఒక్కరోజే 7,865 మంది జూ పార్కును సందర్శించారు. వీరి ద్వారా రికార్డు స్థాయిలో రూ. 6,07,640 ఆదాయం లభించినట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. అయితే ఈ పార్కుకు సమీపంలోనే ఉన్న కంబాలకొండ ఎకో టూరిజం పార్కు మాత్రం సందర్శకులు లేక వెలవెలబోయింది. కార్తీక మాసం వనభోజనాలకు పేరొందిన ఈ ప్రాంతంలో ఈ వారం ఆ సందడి కనిపించలేదు. కేవలం 500 మంది సందర్శకులు మాత్రమే పార్కుకు వచ్చారని సిబ్బంది తెలిపారు. వారి ద్వారా కేవలం రూ. 42,000 ఆదాయం లభించిందన్నారు. అటవీశాఖ అధికారులు కంబాలకొండ అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం, సందర్శకులను ఆకట్టుకునే వినోద కార్యక్రమాలు, సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడమే ఈ నిరాదరణకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కై లాసగిరి కిటకిట కై లాసగిరికి వేలాది మంది ప్రజలు కుటుంబాలతో తరలివచ్చి వనభోజనాలు చేశారు. కార్లు, ఆటోలు వంటి వాహనాల సంఖ్య ఎక్కువ కావడంతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పిల్లలు ఆట పరికరాల వద్ద, పెద్దలు కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ వంటి ఆటలు ఆడుతూ సరదాగా గడిపారు. వ్యూ పాయింట్, శివ పార్వతుల విగ్రహాల వద్ద ఎక్కువ మంది ఫొటోలు తీసుకున్నారు. ఆటలాడుతున్న పిల్లలు -
ఇద్దరు బాలురను కాపాడిన లైఫ్గార్డ్స్
భీమునిపట్నం: భీమిలి తీరంలో మైరెన్ పోలీసులు, లైఫ్గార్డులు అప్రమత్తంగా వ్యవహరించి ఇద్దరు బాలురను రక్షించారు. పద్మనాభం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కర్రి జశ్వంత్, కర్రి అజయ్ కుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం భీమిలి బీచ్కు వచ్చారు. వీరు సరదాగా సముద్రంలో స్నానానికి దిగగా.. ఒక్కసారిగా అలల ఉధృతికి లోపలికి కొట్టుకుపోయారు. ఇది గమనించిన మైరెన్ పోలీసులు, లైఫ్గార్డులు వెంటనే స్పందించారు. వేగంగా నీటిలోకి వెళ్లి ఆ బాలురిద్దరినీ క్షేమంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. మైరెన్ సీఐ శ్రీనివాసరావు ఆ బాలురను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అలల ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రమాదకరమైన తీర ప్రాంతాల్లో ఎవరూ స్నానాలకు దిగవద్దని, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నేడు పీజీఆర్ఎస్ రద్దు మహారాణిపేట: కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ వినతుల స్వీకరణ కార్యక్రమం ఈ వారం రద్దు అయినట్టు కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉన్నందున 10వ తేదీన జరగాల్సిన పీజీఆర్ఎస్ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చేవారం 17వ తేదిన యథావిధిగా పీజీఆర్ఎస్ ఉంటుందని కలెక్టర్ ప్రకటనలో స్పష్టం చేశారు. జీవీఎంసీలో కూడా.. డాబాగార్డెన్స్: జీవీఎంసీలో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేస్తున్నట్టు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. పోలీసు కమిషనరేట్లో.. అల్లిపురం: సోమవారం నగర పోలీస్ కమిషనరేట్లో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. -
‘రెట్రో’ రచ్చ.. పిక్నిక్ కేక
ఏయూ క్యాంపస్: నిత్యం కుటుంబ బాధ్యతలు, ఆఫీస్ పనుల ఒత్తిడితో గడిపే నగర మహిళలు... ఒక్కరోజు ఆ పనులన్నింటికీ బ్రేక్ ఇచ్చి, పూర్తి ఉత్సాహంతో ఆనందంగా గడిపారు. బీచ్రోడ్డులోని వీఎంఆర్డీఏ పార్కు వేదికగా ఆదివారం జరిగిన లేడీస్ పిక్నిక్లో నగరంలోని వివిధ రంగాలకు చెందిన మహిళలు, యువతులు ఒక్కచోట చేరి సందడి చేశారు. రెట్రో థీమ్తో నిర్వహించిన ఈ పిక్నిక్లో.. పాత తరం నటీమణులను గుర్తుచేస్తూ మహిళలు ధరించిన వస్త్రధారణ, ఆ హావభావాలతో నిర్వహించిన ర్యాంప్ వాక్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఆనాటి ఫ్యాషన్కు నేటి తరం హంగులు అద్ది, మహిళలు చేసిన ఫ్యాషన్ వాక్ ఆహూతులను కట్టిపడేసింది. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వింటేజ్ రోల్స్ రాయిస్ కారు వద్ద ఫొటోలు దిగేందుకు మహిళలు ఉత్సాహం చూపించారు. బెల్లీ డ్యాన్స్ ప్రదర్శన, ప్రత్యేకమైన సెల్ఫీ బూత్ వంటివి కార్యక్రమానికే హైలెట్గా నిలిచాయి. మహిళలందరూ కలిసికట్టుగా ఆటపాటలతో అల్లరి చేస్తూ, తమ దైనందిన జీవితంలోని ఒత్తిడిని మరిచిపోయారు. ఈ సందడి నడుమ.. ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెట్ క్రీడాకారుల విజయాన్ని గుర్తు చేసుకుని, వారిని అభినందించడం విశేషం. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి నిర్వాహకుడు వీరూ మామ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విందు, వినోదాలతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా ముగిసింది. -
చిన్నారికి టీకా.. నూరేళ్ల జీవితానికి భరోసా
మహారాణిపేట: పిల్లలు వ్యాధుల బారిన పడకుండా ఎదిగితేనే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుంది. పూర్వం పురిట్లోనే ప్రాణాలు వదలడం, మాతాశిశు మరణాలు ఉండేవి. చిన్నారి ఎదిగే క్రమంలో అంతుచిక్కని రోగాల బారిన పడి మృత్యువాత పడేవారు. వైద్య విజ్ఞానం అప్పట్లో అంతగా అభివృద్ధి చెందకపోవడంతో కుటుంబాల్లో జననాల సంఖ్య పెంచుకునే వారు. ప్రస్తుతం వైద్య రంగంలో పెను మార్పులు వచ్చాయి. శాస్త్ర, పరిశోధనలు అనేక రోగాల నివారణకు అద్భుత ఔషధాలను తెచ్చాయి. పుట్టిన క్షణం మొదలు పిల్లలకు 16 ఏళ్లు వచ్చే వరకు ఆరోగ్య శాఖ వేస్తున్న టీకాలతో ఆరోగ్యవంతంగా ఎదిగి వారంతా రేపటి పౌరులుగా మారుతున్నారు. అపోహలు వీడదాం.. ఆరోగ్యాన్ని కాపాడుదాం వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే టీకాలు వేయించుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ వివిధ వయసులో టీకాలు కచ్చితంగా వేయించుకోవాలి. అప్పుడే రోగనిరోధక శక్తి పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ టీకాలపై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. టీకాలు వేయించడం ద్వారా జ్వరాలు రావడం, బలహీనపడతారని అపోహలతో వాటికి దూరంగా ఉంటున్నారు. టీకాలపై అవగాహన కల్పించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 10న అంతర్జాతీయ టీకాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ‘అందరికీ రోగ నిరోధకత మానవులకు సాధ్యమే’అనే థీమ్తో ముందుకెళ్తున్నారు. ఆరోగ్య వ్యవస్థకు బలమైన కవచం టీకాలు మన ఆరోగ్య వ్యవస్థకు బలమైన కవచం లాంటివి. స్మాల్ ఫాక్స్, పోలియో వంటి వ్యాధులను నిర్మూలించిన టీకాలు.. కోట్లాది ప్రాణాలను రక్షించాయి. టీకాలు అందరికీ చేరినప్పుడే సమగ్ర రోగనిరోధకత సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రొగ్రామ్ కింద ఏటా లక్షలాది శిశువులకు, గర్భిణులకు ఉచిత టీకాలను అందిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఆరోగ్య కార్యక్రమంగా నిలుస్తోంది. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం, నర్సులు అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ప్రతి బుధవారం, శనివారాల్లో వ్యాక్సిన్ పుట్టిన బిడ్డ నుంచి 16 ఏళ్ల వయసు వరకు పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు 12 రకాల వ్యాక్సిన్లు వేస్తున్నారు. ప్రతి బుధవారం, శనివారాల్లో ఆస్పత్రులు, పంచాయతీ కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాల వద్ద సిబ్బంది అందుబాటులో ఉంటూ టీకాలు వేస్తున్నారు. గర్భిణులు, బాలింతలు అశ్రద్ధ చేయకుండా క్రమం తప్పకుండా టీకాలు వేయించుకుని వ్యాధుల నుంచి రక్షణ పొందాలని డాక్టర్ బి.లూసీ సూచించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న టీకాలు ప్రస్తుతం జిల్లాలో పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్ బి.లూసీ తెలిపారు. డీపీటీ, ఎఫ్ఐపీవీ, ఓపీవీ, హెపటైటిస్ బి, ఎంఆర్, బీసీజీ, పీసీవీ, టీడీ, రోటవైరస్ వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. యూనివర్సిల్ ఇమ్యూనైజేషన్ ప్రొగ్రామ్లో భాగంగా వీటిని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. -
ఒకే రోజు ఐదు క్షేత్రాల దర్శనం
పంచారామ దర్శినికి బయలుదేరిన ఆర్టీసీ బస్సులు డాబాగార్డెన్స్: పవిత్ర కార్తీకమాసంలో ఒకే రోజున పంచారామాలు దర్శనం చేసేందుకు వీలుగా ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సులు ఆదివారం ద్వారకా బస్టేషన్ నుంచి బయలుదేరాయి. జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు, ద్వారకా బస్టేషన్ డిపో మేనేజర్, సూపర్వైజర్ ఈ బస్సులను దగ్గరుండి పంపించారు. ఈ సందర్భంగా ప్రజా రవాణా అధికారి మాట్లాడుతూ పంచారామ దర్శినికి వెళ్లే భక్తుల కోసం ఈ నెల 15, 16 తేదీల్లో కూడా బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఒకే రోజులో అమరావతి(అమరేశ్వరస్వామి), భీమవరం(సోమేశ్వరస్వామి), పాలకొల్లు(క్షీర రామలింగేశ్వరస్వామి), ద్రాక్షారామం(భీమేశ్వరస్వామి), సామర్లకోట(కుమార రామలింగేశ్వరస్వామి)లో దర్శనాలు చేసుకునేందుకు వీలుగా యాత్ర సాగుతుందన్నారు. ప్రయాణ చార్జీలను సూపర్ లగ్జరీకి రూ.2,150గా, అల్ట్రా డీలక్స్కు రూ.2,100గా నిర్ణయించారు. www.apsrtconline.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకోవచ్చని, అలాగే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం భక్తులు 99592 25602 నంబర్లో సంప్రదించవచ్చు. ఇదే నంబరులో శబరిమల యాత్రకు సంబంధించిన టూర్లు, ఆన్లైన్ రిజర్వేషన్ల గురించి కూడా తెలుసుకోవచ్చని ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు వివరించారు. -
త్వరితగతిన రోడ్ల పనులు
మహారాణిపేట: నగరంలో చేపడుతున్న రోడ్ల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కాన్వెంట్ జంక్షన్ నుంచి పోర్టు డాక్ ఏరియా వరకు చేపడుతున్న రోడ్డు పనులను జీవీఎంసీ, ఎన్హెచ్ విభాగాల అధికారులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. పార్టనర్షిప్ సమ్మిట్ నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. ఆయనతోపాటు జీవీఎంసీ సీఈ సత్యనారాయణ రాజు, ఎస్ఈ, జాతీయ రహదారుల విభాగం అధికారులు ఉన్నారు. -
పోర్టుకు వాస్తు పోటు?
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు అథారిటీని వాస్తు దోషం పట్టిపీడిస్తోందంట! ఇటీవల పోర్టులో నెలకొన్న పరిస్థితులతో ఉద్యోగుల్లో ఆందోళన చెందుతున్నారు. పోర్టు మెయిన్ ఎంట్రన్స్ను మార్చడం వల్లే ఈ దోషం చుట్టుకుందని, దీనికి శాంతి పూజలు చేయాలేమోనని మదనపడిపోతున్నారు. ఇటీవల వరుసగా చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సెక్రటరీ బదిలీ కావడం ఇందుకు కారణంగా చూపిస్తున్నారు. మరోసారి వాస్తు పోటు తగిలిందనే చర్చ ఇప్పుడు పోర్టు వర్గాల్లో జోరుగా సాగుతోంది. గేటు మార్పు.. వరుస బదిలీలు విశాఖపట్నం పోర్టు అడ్మిన్ బిల్డింగ్కు తూర్పు వైపు, ఈశాన్యంలో ఇన్ అండ్ అవుట్ గేట్లు పక్కపక్కనే ఉన్నాయి. అయితే చైర్మన్గా డా.అంగముత్తు బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆధునికీకరణలో భాగంగా గతంలో మూసేసిన ఆగ్నేయం గేటును అభివృద్ధి చేసి, నెల కిందట ఇన్గేట్గా ప్రారంభించారు. అధికారులు, ఉద్యోగులు ఇకపై ఇటునుంచే లోపలికి రావాలని ఆదేశించారు. ఈ గేటు ప్రారంభించిన నెల రోజుల్లోనే చైర్మన్ డా.అంగముత్తు బదిలీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది సర్వసాధారణ బదిలీయే కదా అని కొట్టిపారేయలేమని, దీనికి వాస్తు దోషమే కారణమని పోర్టు ఉద్యోగులు గట్టిగా నమ్ముతున్నారు. అందుకు వారు మూడు ప్రధాన కారణాలను ఉదహరిస్తున్నారు. పోర్టు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సాధారణంగా కనీసం 3 నుంచి 5 ఏళ్ల పాటు కొనసాగుతారు. డా.అంగముత్తు బాధ్యతలు చేపట్టి రెండేళ్లే అయ్యింది. మొదట్లో ఆయన ముంబయి పోర్టుకు బదిలీ కోరినా.. కేంద్రం తిరస్కరించింది. దీంతో ఆయన ఇక బదిలీ కాదని ఫిక్స్ అయ్యారు. అలాంటిది.. ఈ కొత్త గేటు తెరిచిన కొద్ది రోజులకే ఆయనకు ముంబయి బదిలీ కావడం ఉద్యోగులను ఆశ్చర్యపరుస్తోంది. డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే పదవీకాలం మరో రెండు నెలలు మాత్రమే ఉంది. ఆయన పదవీ పొడిగింపు కోసం చేసిన అభ్యర్థనకు కేంద్రం సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. కానీ, హఠాత్తుగా ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు రావడం, కొత్త డిప్యూటీ చైర్మన్ను నియమించడం చకచకా జరిగిపోయాయి. ఇది కూడా వాస్తు దోషం ప్రభావమేనని ఉద్యోగులు అంటున్నారు. ముచ్చటగా మూడోది.. సెక్రటరీ వేణుగోపాల్ కూడా బదిలీ అయ్యారు. తొలుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బదిలీ అయినా, వైజాగ్ పోర్టులోనే డిప్యూటీ చైర్మన్గా ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. కానీ పారాదీప్ పోర్టుకు డిప్యూటీ చైర్మన్గా బదిలీ అయ్యారు. ఇలా ముగ్గురు ప్రధాన అధికారులు ఒకే సమయంలో బదిలీ కావడం వెనుక వాస్తు దోషమే ఉందని పోర్టు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇది తొలిసారి కాదని, గతంలోనూ ఆగ్నేయం వైపు గేటు మార్చినప్పుడు పోర్టులో తీవ్ర ఒడిదొడుకులు ఏర్పడ్డాయని గుర్తుచేస్తున్నారు. గతంలో ఇన్గేట్ను ఆగ్నేయానికి మార్చారు. అప్పుడు ఇన్చార్జ్ చైర్మన్గా ఉన్న సింగ్పై సీబీఐ దాడులు జరిగాయి. ఇది గేటు మార్పు వల్లే జరిగిందని అప్పట్లో ఉద్యోగులు భావించారు. ఆ తర్వాత చైర్మన్గా వచ్చిన అజయ్ కల్లాం ఉద్యోగుల విన్నపం మేరకు ఆ గేటును మూసివేయించారు. అయితే, ఆ తర్వాతి చైర్మన్ కృష్ణబాబు మళ్లీ దక్షిణం వైపు ఉన్న మరో ద్వారం తెరిచారు. అలా తెరిచిన రెండు నెలలకే ఆయన బదిలీ కావడం, ఆ స్థానంలో వచ్చిన ఇన్చార్జి చైర్మన్ రింకేష్ రాయ్పై అవినీతి ఆరోపణలు రావడం, ఆయనకు కూడా బదిలీ కావడం వంటివి చకచకా జరిగిపోయాయి. అనంతరం వచ్చిన రామ్మోహన్రావు ఈశాన్యం గేటునే యథాతథంగా కొనసాగించగా, అప్పటి నుంచి పోర్టులో ఎలాంటి ఇబ్బందులు లేవని ఉద్యోగులు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు ఆగ్నేయం గేటు తెరవడం వల్లే ఉన్నతాధికారులంతా ఒకేసారి బదిలీ అయ్యారని ఉద్యోగులు అంటున్నారు. మరోసారి వాస్తు దోషం చుట్టుకుందని, వెంటనే ఆ గేటును మూసివేసి శాంతి పూజలు చేస్తే తప్ప ఈ దోషం పోదనే వార్తలు పోర్టు వర్గాల్లో చక్కర్లు కొడుతుండటం కొసమెరుపు. 123 బదిలీలంటున్న ఉద్యోగులు -
సుస్థిరమైన, బాధ్యతాయుతమైన నిర్వహణపై చర్చ
ఐఐఎంవీలో ముగిసిన సదస్సు తగరపువలస: గంభీరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎంవీ) పదేళ్ల సంబరాల్లో భాగంగా రెండు రోజుల పాటు నిర్వహించిన సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్, కేస్ కాన్ఫరెన్స్ ఆన్ రెస్పాన్సిబుల్ ఇన్నోవేషన్స్ అండ్ సస్టైనబిలిటి ప్రాక్టీసెస్–2025 సదస్సు శనివారం ముగిసింది. అకడమిక్ నిపుణులు, పరిశ్రమల నాయకులు, ఆలోచనా నేతలు సస్టైనబిలిటి, బాధ్యతాయుతమైన నిర్వహణ విధానాలపై చర్చించారు. స్థిరమైన వ్యాపార వ్యవస్థలను ప్రోత్సహించే ఆర్థిక దృష్టి కోణాలపై చర్చించారు. భారతదేశంలో సస్టైనబిలిటి పాలసీ ఫ్రేమ్వర్క్ మార్పుల గురించి ప్రసంగించారు. బోర్డు స్థాయిలో సరఫరా, లింకేజీ వ్యాపారాల్లో సస్టైనబిలిటీని ఏకీకృతం చేసే ఉత్తమ పద్ధతుల గురించి పంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పునరావృతిని వివరించారు. దేశవ్యాప్తంగా ఈ సదస్సుకు అకడమిక్లు, విద్యార్థులు, ప్రొఫెషనల్స్ వందకు పైగా సమర్పణల్లో కేవలం 24 కేసులు మాత్రమే ఎంపికయ్యాయి. ఇవి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కు అనుగుణంగా రూపొందించినవి కావడం విశేషం. ఈ సందర్భంగా కేస్ కంపెడియం పుస్తకంలోని ముఖ్యాంశాలను సారాంశంగా తీసుకున్నారు. ఐఐఎంవీ రీసెర్చ్ ప్రొఫెసర్ అమిత్ శంకర్ లాభం, ప్రజలు, గ్రహం ఈ మూడింటిని సస్టైనబిలిటి మూడు స్తంభాలుగా ప్రస్తావించారు. టైమ్ప్రో బిజినెస్ హెడ్ శ్రీధర్ నాగరాజాచార్ మాట్లాడుతూ పరిశ్రమ, విద్యా భాగప్వామ్యం సస్టైనబుల్ వృద్ధిలో కీలకమన్నారు. సదస్సులో ప్రొఫెసర్ ఎస్.డి సుమోద్, వివిధ రంగాల నిపుణులు కౌశిక్రెడ్డి(ఎస్బీఐ), బెండపూడి విశ్వనాఽథ్(టర్నింగ్ పాయింట్ మేనేజ్మెంట్ సొల్యూషన్ వ్యవస్థాపకుడు), రవికిరణ్ శివాలా(సన్ ఫార్మా), బి.శ్రీరామ్మూర్తి(భాగవతుల చారిటబుల్ ట్రస్ట్) పాల్గొన్నారు. -
హడలెత్తించిన కొండ చిలువ
గోపాలపట్నం: జీవీఎంసీ 92వ వార్డు బంటా కాలనీలో ఓ భారీ కొండ చిలువ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. వాటర్ ట్యాంక్ సమీపంలో శనివారం కనిపించిన ఈ పామును చూసి ఆందోళనకు గురైన కాలనీ వాసులు, వెంటనే స్నేక్ క్యాచర్ మణికంఠకు సమాచారం అందించారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని.. తన నైపుణ్యంతో సుమారు 12 అడుగుల కొండ చిలువ ను చాకచక్యంగా పట్టుకున్నారు. దానిని తిరిగి కొండ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు. ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ మణికంఠ మాట్లాడుతూ ఎక్కడైనా పాములు కనిపిస్తే.. 63009 36547 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ప్రజారోగ్యంపై ఎందుకంత నిర్లక్ష్యం..?
మహారాణిపేట: పేద ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం లెక్కలేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలకు సంబంధించి ‘వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్’ను శనివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గత 40 రోజులుగా శాంతియుత కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉధృతంగా జరుగుతుందన్నారు. ఈనెల 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కేజీహెచ్లో రోగులు అవస్థలు ఈనెల 6వ తేదీన కేజీహెచ్లో 12 గంటలకు పైగా కరెంటు లేకపోవడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడ్డారన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతే కేజీహెచ్ అధికారులు కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురుగా ఉన్న కలెక్టరేట్లోని అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్కుమార్, తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, నియోజకవర్గ పరిశీలకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, జిల్లా, నియోజకవర్గ, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
ఎందుకీ రిస్క్?
బిడ్డతో కదులుతున్న రైలెక్కిన దంపతులు అగనంపూడి: కదులుతున్న రైలు ఎక్కవద్దు.. ప్రమాదం.. అని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ గట్టిగా వారిస్తున్నా ఆ దంపతులు వినలేదు. చంకలో బిడ్డతోనే ప్రాణాలకు తెగించి కదులుతున్న రైలు ఎక్కేశారు. వివరాల్లోకి వెళితే.. దువ్వాడ రైల్వేస్టేషన్లోని నాలుగో నంబర్ ప్లాట్ఫాంపైకి శనివారం ఉదయం 11.05 గంటలకు కొయంబత్తూర్ నుంచి ధన్బాద్ వెళ్లే ప్రత్యేక రైలు వచ్చింది. కొద్దిసేపు ఆగిన అనంతరం రైలు తిరిగి కదిలి.. వేగం అందుకుంటోంది. సరిగ్గా అదే సమయానికి ఓ దంపతులు తమ బిడ్డ, లగేజీతో ఆయాసపడుతూ ప్లాట్ఫాంపైకి పరుగెత్తుకొచ్చారు. రైలు కదిలిపోతుండటంతో.. అక్కడే పర్యవేక్షిస్తున్న ఆర్పీఎఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బుడు మూరు వెంకటరమణ వారిని గమనించారు. రైలు ఎక్కవద్దు.. ప్రమాదం అని గట్టిగా హెచ్చరించారు. కానీ ఇన్స్పెక్టర్ మాటలను పెడచెవిన పెట్టిన ఆ దంపతులు సాహసానికి ఒడిగట్టారు. భర్త ముందుగా చంకలో బిడ్డతో, వీపుపై బ్యాగుతో కదులుతున్న రైలు ఎక్కేశాడు. అది చూసిన అతని భార్య కూడా చేసేది లేక.. వేగం పెంచిన రైలునే ఎక్కేసింది. అయితే ఈ హడావుడిలో వారు తమ లగేజీని ప్లాట్ఫాంపైనే వదిలేశారు. ఇది గమనించిన ఇన్స్పెక్టర్ వెంకటరమణ.. వారు అప్పటికే రైలు ఎక్కేయడంతో, మానవత్వంతో స్పందించారు. లగేజీని తర్వాత బోగీలోని మెట్ల దగ్గర ఉన్న ప్రయాణికులకు అందించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. ‘కదులుతున్న రైలు ఎక్కడం నేరం. అంతకుమించి ప్రాణాలకే ముప్పు. దంపతులు మరో మార్గం లేక ఎక్కేయడంతో మానవత్వంతో లగేజీ అందించాను. కానీ ప్రయాణికులు దయచేసి ఇలాంటి రిస్క్లు చేయవద్దు. ప్రాణాలు పోతే తిరిగిరావు. కాస్త ముందే స్టేషన్కు చేరుకోవాలి.’అని హెచ్చరించారు. -
రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు 24 మంది ఎంపిక
భీమునిపట్నం: రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేశారు. భీమిలి సమీపంలోని కీర్తిన్పేటలో ఉన్న సన్ స్కూల్ ప్రాంగణంలో శనివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది. 14 నుంచి 17 సంవత్సరాల వయసు గల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 120 మంది బాలబాలికలు ఈ ఎంపికల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రకాల యోగాసనాలను ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఎంఈవో శివరాణి ప్రారంభించగా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధులు టి.నాగేశ్వరరావు, సిహెచ్.వెంకటరావు మాట్లాడారు. అద్భుతమైన ప్రతిభను కనబరిచిన 24 మంది విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు వెల్లడించారు. వీరు ఈ నెల 23, 24 తేదీల్లో బాపట్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యే విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.20 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందిస్తామని సన్ స్కూల్ కరస్పాండెంట్ కైతపల్లి శ్రీనివాసరావు ప్రకటించారు. కార్యక్రమంలో యోగా ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. -
50 శాతం రాయితీతో మహిళల దుస్తుల విక్రయాలు
డాబాగార్డెన్స్: వివాహ వేడుకలు దృష్టిలో పెట్టుకుని నేషనల్ సిల్క్ ఎక్స్పో ప్రత్యేకంగా మహిళల కోసం 50 శాతం రాయితీతో విస్తృత శ్రేణి వస్త్రాలు, ఉపకరణాలు అందజేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. గ్రీన్పార్క్ హోటల్ వేదికగా ఈ నెల 11 వరకు ఎక్స్పో నిర్వహించనున్నట్టు చెప్పారు. ఎక్స్పోలో మహారాష్ట్ర పైథాన్ సిల్క్ చీరలు, కర్ణాటక బెంగుళూరు సిల్క్, సాఫ్ట్ సిల్క్, కాషిదా సిల్క్ చీరలు, మధ్యప్రదేశ్ నుంచి ప్రసిద్ధి చెందిన చందేరి, మహేశ్వరి సిల్క్ చీరలు, పశ్చిమ బెంగాల్ నుంచి బలూచారి, జమదాని, టాంగైల్, ఢకాయ్ సిల్క్ వస్త్రాలు, లినెన్ కాంతా వర్క్ స్టిచ్ చీరలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేరెన్నికగన్న వస్త్రాలు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. అంతేగాక దుప్పట్లు, వివిధ డిజైన్స్ సల్వార్ మెటీరియల్స్, నమూనాలు, బీహార్ టస్సార్, మట్కా, భాగల్పూర్ సిల్క్, గుజరాత్ సాంప్రదాయ బంధిని, కచ్ ఎంబ్రాయిడరీ, పటోలా, తమిళనాడు కంజీవరం పట్టు చీరలతో పాటు జమ్ము తావి నుంచి వచ్చిన ఎంబ్రాయిడరీ సిల్క్, తావీ సిల్క్ చీరలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతి రోజు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని, ప్రవేశం ఉచితమని చెప్పారు. -
తొలి రోజు ఆంధ్రాదే పైచేయి
విశాఖ స్పోర్ట్స్: దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ ఎలైట్ ఏ గ్రూప్లో భాగంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆంధ్ర, తమిళనాడు జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్ శనివారం ప్రారంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు జట్టు 74.3 ఓవర్లలో 182 పరుగులకే తొలి ఇన్నింగ్స్ను ముగించింది. తమిళనాడు తొలి ఇన్నింగ్స్ ఆరంభం అత్యంత పేలవంగా సాగింది. ఓపెనర్లు విమల్(10), నారా యణ్ (19)ను 29 పరుగులకే కోల్పోయింది. ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం(4), ప్రదోష్ రంజన్ (8)తో పాటు సిద్ధార్థ్ డకౌట్గా వెనుతిరగడంతో.. జట్టు కేవలం 46 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో సోను (26)తో కలిసి బాబా ఇంద్రజిత్ (19) ఇన్నింగ్స్ను 81 పరుగుల వరకు చేర్చగలిగారు. కెప్టెన్ సాయికిశోర్ (8) సైతం తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరడంతో.. టీ విరామ సమయానికి తమిళనాడు కేవలం 103 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. అయితే, చివరి వికెట్కు విద్యుత్ (40), సందీప్ (29 నాటౌట్) కలిసి ఏకంగా 79 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడం విశేషం. ఇది తమిళనాడు ఇన్నింగ్స్లో అత్యధిక భాగస్వామ్యం. వీరి పోరాటంతో తమిళనాడు జట్టు 182 పరుగుల స్కోర్ను సాధించగలిగింది. ఆంధ్ర బౌలర్లలో పృథ్వీరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, సౌరభ్ రెండు వికెట్లు, సాయితేజ, రాజు, అశ్విన్ తలో వికెట్ దక్కించుకున్నారు. చివరి వికెట్ ను తీసేందుకు రషీద్తో సైతం బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. ప్రతిగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్ అభిషేక్ (3) వికెట్ను కోల్పోయి 20 పరుగులు చేసింది. క్రీజ్లో భరత్ (12), విజయ్(1) ఉన్నారు. -
కార్పెంటర్ అనుమానాస్పద మృతి
తగరపువలస: ఆనందపురం మండలం లొడగలవానిపాలెం పంచాయతీ నేలతేరుకు చెందిన కార్పెంటర్ కడియం కనకరాజు (52) గురువారం సాయంత్రం ఆనందపురం పంచాయతీ పరిధిలోని ఓ కోళ్ల ఫారం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామంలోని కె. శ్రీను అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంలో షెడ్ల నిర్మాణం కోసం కనకరాజు ఉదయం నుంచి అక్కడే పని చేస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం చేసి ఇంటికి కూడా వెళ్లి వచ్చిన కనకరాజు.. సాయంత్రం 6.30 గంటల సమయంలో మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు అజయ్ తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని తల్లి రమణమ్మకు చెప్పాడు. రమణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కనకరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కనకరాజుకు తరచుగా మద్యం సేవించే అలవాటు ఉంది. అలాగే ఆయన డయాబెటిస్, బీపీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇది సహజ మరణమా, లేక ప్రమాదం జరిగిందా అన్నది పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయనున్నట్టు ఎస్ఐ సంతోష్ తెలిపారు. కనకరాజుకు దేవి అనే కుమార్తె కూడా ఉంది. -
యువతను ఆకర్షించేలా కొత్త ‘హ్యుందాయ్ వెన్యూ’
సీతంపేట: ప్రముఖ ఆటోమొబైల్ డీలర్ శ్రీ జయలక్ష్మి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్(లక్ష్మీ హ్యుందాయ్) ఖాతాదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త మోడల్ కార్లు ఆల్–న్యూ హ్యుందాయ్ వెన్యూ, వెన్యూ ఎన్ లైన్ మార్కెట్లోకి విడుదలయ్యాయి. రామాటాకీస్ సమీపంలోని హ్యుందాయ్ షోరూంలో షిఫ్ట్వేవ్ టెక్నాలజీస్ సీఈవో, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ శరత్ నల్ల చేతులమీదుగా శుక్ర వారం నూతన వాహనాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హ్యుందాయ్ క్లస్టర్ హెడ్ మిసోమనాథ్ లాల్ మాట్లాడుతూ అధునాతన సాంకేతిక, భద్రతా ప్రమాణాలతో అద్భుతమైన ఈ రెండు కొత్త మోడల్ కార్లను వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలిపారు. ఆల్–న్యూ హ్యుందాయ్ వెన్యూ మోడల్ రోడ్డుపై పెద్ద ఎస్యూవీ అనుభూతినిస్తుందని, ఇది మునుపటి వెన్యూ మోడల్ కంటే 48 ఎంఎం ఎత్తుగా, 20 ఎంఎం వీల్బేస్ ఎక్కువగా ఉంటుందన్నారు. ఇందులో 65 కంటే ఎక్కువ అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయని వివరించారు. వెన్యూ ఎన్ లైన్లో పెర్ఫార్మెన్స్ కంట్రోల్ బటన్లతో కూడిన స్టీరింగ్ వీల్, వింగ్ రకం స్పాయిలర్, ట్విన్ టిప్ ఎగ్జాస్ట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఈ కారుకు మరింత స్పోర్ట్స్ లుక్ను ఇస్తాయని పేర్కొన్నారు. ఆల్–న్యూ హ్యుందాయ్ వెన్యూ ప్రారంభ ధరలు రూ.7,89,900(ఎక్స్ షోరూం) నుంచి మొదలవుతాయని వివరించారు. కార్యక్రమంలో జీఎం అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ జి.కిశోర్కుమార్, షోరూం సిబ్బంది పాల్గొన్నారు. -
పేదల ఆరోగ్యం అంటే లెక్కలేదా..
మహారాణిపేట : కేజీహెచ్లో 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ మండిపడ్డారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ టెక్నాలజీకి నేనే ఆద్యుడని.. వీధిలైట్లు వెలగకపోయినా తనకు తెలిసిపోతుందని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. కేజీహెచ్లో 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిల్చిపోతే తెలియలేదా? మీ టెక్నాలజీ ఎక్కడికి పోయింది? అని ఎద్దేవా చేశారు. ఉదయం 12 గంటలకు విద్యుత్ సరఫరా నిల్చిపోతే కలెక్టర్ సహా ఒక్క ఉన్నతాధికారి కూడా పర్యవేక్షించకపోవడం దారుణమన్నారు. రాజేంద్రప్రసాద్ వార్డు, భావనగర్ వార్డులో ఉన్న రోగులు, చిన్నపిల్లల విభాగంలో చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడ్డారన్నారు. అతిపెద్ద ఆసుపత్రిలో లక్ష రూపాయలు ఖర్చు చేసి జనరేటర్లు ఏర్పాటు చేయలేని దయనీయ స్థితిలో ఉందా? ఈ ప్రభుత్వమని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖర్చుతో హెలికాప్టర్లలో చక్కెర్లు కొట్టే సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ పేద రోగుల కోసం జనరేటర్లు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. పేదల ఆరోగ్యం అంటే లెక్క లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దేవి మృతి కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దేవి అనే ఓ మహిళ చనిపోగా పెద్ద సంఖ్యలో రోగులు విద్యుత్ అంతరాయంతో నరకయాతన అనుభవించారని రాజీవ్ అన్నారు. ఇంత మంది పేద రోగులను ఇబ్బందులు పాల్జేసిన కూటమి ప్రభుత్వానికి వారి ఉసురు తగలక మానదన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో సమూల మార్పులు తీసుకువస్తే... చంద్రబాబు పాలనలో పేదలకు కనీస వైద్యం కూడా అందించలేని స్థాయికి దిగజార్చారని ఆక్షేపించారు. తాగునీరివ్వలేని అసమర్థ పాలన కురుపాంలోని గురుకుల పాఠశాల విద్యార్థినులకు తాగునీరు సరిగా అందించకపోవడంతోనే పెద్ద సంఖ్యలో బాలికలు కామెర్ల బారిన పడ్డారన్నారు. ఈ రాష్ట్రంలో ఆరోగ్యశాఖ అనారోగ్య శాఖగా మారిపోయింది. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ నోరిప్పితే పచ్చి అబద్దాలు చెబుతూ అసత్యకుమార్గా మారిపోయారు. కాశీబుగ్గలో భక్తులు చనిపోతే అది ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకున్న కూటమి ప్రభుత్వం.. ఇవాళ కేజీహెచ్ ఎవరి ఆధీనంలో ఉందో సమాధానం చెప్పాలన్నారు. ముమ్మూటికీ ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అన్నారు. చంద్రబాబుది టార్చ్ లైట్ పాలన.. వైఎస్ జగన్ది ప్రపంచం మెచ్చిన టార్చ్ బేరర్ పాలన అన్నది ప్రజలందరికీ తెలుసు అన్నారు. -
రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొన్న బైక్
కూర్మన్నపాలెం: అగనంపూడి ముఖ్య కూడలి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి. గాజువాక పైడిమాంబకాలనీకి చెందిన వల్లూరి శ్రీనివాసరావు భార్య రమణమ్మ(48) అగనంపూడిలో పాలబూత్ నిర్వహిస్తోంది. అందువల్ల అగనంపూడిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, అక్కడ కూడా నివాసం ఉంటు న్నా రు. రమణమ్మ తన వ్యక్తిగత పని నిమిత్తం శుక్రవారం సాయంత్రం కూర్మన్నపాలెం వెళ్లి తిరిగి వస్తున్నారు. సాయంత్రం వేళ అగనంపూడి జంక్షన్లో ఆటో దిగి రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో అనకాపల్లి జిల్లా మునగపాక మండలం చూచుకొండకు చెందిన సారిక నాగరాజు(48) తన కుమారుడు జవహర్తో కలిసి బైక్పై గాజువాక వైపు వస్తున్నారు. ఈ క్రమంలో జంక్షన్ వద్ద ఆమెను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రమణమ్మ తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారు. బైక్పై నుంచి కిందపడిన తండ్రీకొడుకులు నాగరాజు, జవహర్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా నాగరాజు మార్గమధ్యంలో మృతి చెందారు. జవహర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జవహర్ వికలాంగుడని పోలీసులు తెలిపారు. ఇద్దరి మృతి, ఒకరికి గాయాలు -
నేటి నుంచి రంజీ సమరం
విశాఖ స్పోర్ట్స్: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్–ఏ లో భాగంగా ఆంధ్ర జట్టు సొంత గడ్డపై తమిళనాడుతో తలపడనుంది. నగరంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో శనివారం నుంచి ఈ నాలుగు రోజుల మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆట ప్రారంభమై, రెండు సెషన్ల అనంతరం సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఎలైట్ గ్రూప్–ఏలో 8 జట్లు పోటీ పడుతుండగా, ఇప్పటికే అన్ని జట్లు మూడేసి మ్యాచ్లు ఆడాయి. ఆంధ్ర జట్టు 9 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్లో ఒడిశాపై ఇన్నింగ్స్ విజయంతో ఆంధ్ర ఉత్సాహంగా బరిలోకి దిగుతుండగా, తమిళనాడు జట్టు 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం 15 పాయింట్లతో జార్ఖండ్ అగ్రస్థానంలో ఉండగా, 13 పాయింట్లతో విదర్భ రెండో స్థానంలో ఉంది. ఆంధ్ర జట్టు నాకౌట్ దశకు చేరుకోవాలంటే పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవాల్సి ఉంటుంది. రాబోయే మ్యాచ్ల్లో ఆంధ్ర.. తమ కంటే పైన ఉన్న జార్ఖండ్, విదర్భ జట్లతోనే ఆడాల్సి ఉండటం గమనార్హం. రాణిస్తున్న భరత్ : ప్రస్తుత సీజన్లో ఆంధ్ర జట్టుకు విశాఖకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విశాఖకు చెందిన రికీ బుయ్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, ఆశిష్ స్టాండ్–బైగా ఉన్నాడు. కె.ఎస్.భరత్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. యూపీతో జరిగిన మ్యాచ్లో 142 పరుగులు, ఒడిశాపై 93 పరుగులు చేశాడు. వికెట్ కీపింగ్లోనూ రాణిస్తూ ఒడిశాతో మ్యాచ్లో ఐదు క్యాచ్లు పట్టాడు. అయితే రికీ బుయ్ బ్యాటింగ్లో విఫలమవుతున్నాడు. ఒడిశాపై డకౌట్ కాగా, బరోడాపై 7, యూపీపై 2 పరుగులే చేశాడు. యూపీపై మాత్రం రెండు వికెట్లు తీశాడు. శశికాంత్ ఒడిశాపై 46 పరుగులతో పాటు ఒక వికెట్ తీశాడు. బరోడా, యూపీలపై కూడా తలో వికెట్ సాధించాడు. షేక్ రషీద్ టాపార్డర్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒడిశాపై 140 సాధించి అజేయంగా నిలిచాడు. యూపీపై 136 పరుగులు చేశాడు. ఓపెనర్ అభిషేక్ మూడు ఇన్నింగ్స్లలో 127 పరుగులు చేశాడు. త్రిపురాన విజయ్ రెండు మ్యాచ్ల్లో 9 వికెట్లు, సాయితేజ 8 వికెట్లు పడగొట్టారు. ఈ రంజీ మ్యాచ్ను వీక్షించే అభిమానుల కోసం ఏసీఏ ఉచిత ప్రవేశం కల్పిస్తోంది. గేట్ నంబర్ 15 నుంచి ప్రవేశించి, ఎం స్టాండ్లో కూర్చుని మ్యాచ్ను వీక్షించవచ్చు. కోచ్ స్టీవ్తో రికీబుయ్, తమిళనాడు కెప్టెన్ జగదీషన్తో ఆంధ్ర క్రికెటర్ -
చోరీ కేసులో 100 గ్రాముల సొత్తు స్వాధీనం
నిందితుడు మాజీ జవాన్తాటిచెట్లపాలెం: ద్వారకా క్రైం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని గతంలోనే అరెస్టు చేయగా, అతను తాకట్టు పెట్టిన చోరీ సొత్తును తాజాగా హైదరాబాద్లో స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ద్వారకా పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ క్రైం ఇన్చార్జి అన్నెపు నరసింహమూర్తి ఈ వివరాలు వెల్లడించారు. సీతమ్మధార ఏఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్న గుంటూరు విక్రమాదిత్య వర్మ తన కుటుంబంతో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం జూలై 17న పశ్చిమగోదావరి జిల్లాలోని కొనితివాడకు వెళ్లారు. జూలై 20న తిరిగి వచ్చేసరికి వారి ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి ఉండడం గమనించారు. బెడ్రూంలోని బీరువాలో ఉంచిన సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించబడిన ట్లు గుర్తించి వెంటనే ద్వారకా క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ద్వారకా క్రైం పోలీస్స్టేషన్ సీఐ వి. చక్రధరరావు పర్యవేక్షణలో ఎస్ఐ ఎస్.రాజు, సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు, మాజీ జవాన్ బసవ కిరణ్కుమార్ దొంగతనం చేసినట్టు గుర్తించి, ఆగస్టు 5న ద్వారకానగర్ ఎస్వీటీ జంక్షన్ వద్ద అతన్ని అరెస్టు చేశారు. అతనిది శ్రీకా కుళం జిల్లా కాగా.. జ్ఞానాపురంలో నివాసం ఉంటున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత చోరీ సొత్తు గురించి పోలీసులు విచారించినా.. ఫలితం లేకపోయింది. నిరంతర విచారణ ఫలితంగా సుమారు 3 నెలల తర్వాత నిందితుడు చోరీ సొత్తును హైదరాబాద్లో తాకట్టు పెట్టినట్లు ఒప్పుకున్నాడు. ఈ సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లి, 100 గ్రాముల బంగారు ఆభరణాల ను గురువారం స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపా రు. చోరీ సొత్తును రికవరీ చేసిన ద్వారకా సబ్ డివిజన్ సిబ్బందిని సీపీ, డీసీపీ క్రైమ్ అభినందించారు. -
పట్టాలు తప్పిన యశ్వంత్పూర్
బోగీ నుంచి క్షతగాత్రులను బయటకు తీస్తున్న సిబ్బందిగోపాలపట్నం: సింహాచలం రైల్వే స్టేషన్ పరిసరాలు శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. యశ్వంత్పూర్–సంబల్పూర్ ఎక్స్ప్రెస్కు చెందిన బోగీలు పట్టాలు తప్పి, చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు, గాయపడిన వారి హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల్లోనే.. ఆ ప్రాంతమంతా అంబులెన్స్ సైరన్లు, అప్రమత్తం చేసే హెచ్చరికలతో మార్మోగిపోయింది. రక్తమోడుతున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు, వారికి అత్యవసర వైద్యం అందించేందుకు ప్రత్యేక శిబిరాలు వెలిశాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రైల్వే మెకానికల్, ఆర్పీఎఫ్, మెడికల్ బృందాలు సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాయి. ఇదంతా చూసి నిజమైన ప్రమాదం జరిగిందని భయకంపితులైన ప్రజలు.. కాసేపటికి అసలు విషయం తెలిసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. సహాయక చర్యలు పర్యవేక్షించిన డీఆర్ఎం అవును.. రైల్వే అధికారులు ఏటా నిర్వహించే మాక్డ్రిల్లో భాగంగానే ఈ ప్రమాదాన్ని సృష్టించారు. ప్రమాదాలు జరిగినప్పుడు వివిధ విభాగాలు ఎంత వేగంగా సమన్వయం చేసుకుని స్పందిస్తాయో పరీక్షించేందుకు జరిగిన ఈ కసరత్తు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఈ మాక్ డ్రిల్ను వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం లలిత్ బొహ్రా స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాల సమయంలో మన లోటుపాట్లు తెలుసుకుని, మరింత మెరుగైన సేవలు అందించేందుకు మాక్డ్రిల్స్ నిర్వహిస్తుంటామని తెలిపారు. ఈ డ్రిల్లో అండర్ వాటర్ కటింగ్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నదులు, బ్రిడ్జి లపై ప్రమాదాలు జరిగి బోగీలు నీటిలో పడిపోయినప్పుడు, ప్రయాణికులను కాపాడేందుకు నీటి లోపల కూడా మెటల్ బోగీలను ఎలా సురక్షితంగా కత్తిరించవచ్చో సిబ్బంది చూపించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ ఉత్కంఠభరిత ఆపరేషన్ సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగింది. మాక్డ్రిల్లో గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు, పలు విభాగాల రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
● స్ఫూర్తి గేయం..
కృష్ణా కళాశాలలో..వందేమాతరం జాతీయ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మధురవాడలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. చంద్రంపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానం వేలాది మంది విద్యార్థుల దేశభక్తి గేయాలాపనతో మార్మోగింది. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒకేసారి 2,607 మంది విద్యార్థులు వందేమాతరం ఆలపించారు. దేశభక్తిని, జాతీయ సమైక్యతను ఈ కార్యక్రమం చాటి చెప్పింది. అలాగే ఏయూ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్, తోటగరువు హైస్కూల్, విశాఖ రే ంజ్ పోలీస్ కార్యాలయంతో పాటు అన్ని పాఠశాలలు, కార్యాలయాల్లో విద్యార్థులు, అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా జాతీయ గేయాన్ని ఆలపించారు. విశాఖ రేంజ్ పోలీస్ కార్యాలయంలో జాతీయ గేయాన్ని ఆలపిస్తున్న డీఐజీ గోపీనాథ్ జెట్టి, సిబ్బందిచంద్రంపాలెం హైస్కూల్లో..తోటగరువు జెడ్పీ హైస్కూల్లో.. -
మహిళలను కాపాడిన లైఫ్గార్డులు
ఏయూక్యాంపస్ : ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు మహిళలను లైఫ్గార్డులు రక్షించారు. గురువారం ఉదయం గోకుల్పార్క్ వద్ద మహారాణిపేటకు చెందిన కీర్తి ఉషారాణి, అంకంరాజు సునీత సముద్రంలో పూజా సామగ్రి కలపడానికి వచ్చారు. కెరటాల తీవ్రతకు వారు సముద్రంలోకి కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ వెంటనే స్పందించారు. లైఫ్గార్డులు ఆనంద్, రాజులకు సమాచారం అందించి వారి సహాయంతో సముద్రంలోకి వెళ్లిపోతున్న మహిళలను రక్షించి ఒడ్డుకు చేర్చారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో కౌన్సెలింగ్ ఇచ్చి వారిని బంధువులకు అప్పగించినట్లు పోర్ట్ సిఎస్పిఎస్ ఎస్ఐ బి.కె.వి.ప్రసాద్ తెలిపారు. -
గ్రామీణ నేపథ్యంలో ‘రోలుగుంట సూరి’
చిత్ర దర్శకుడు అనిల్ సబ్బవరం: గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన రోలుగుంట సూరి చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని చిత్ర దర్శకుడు అనిల్ పళ్ల తెలిపారు. సబ్బవరంలోని సీతారామ కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14న 100 థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతందని, ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయాలన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకొన్న ఈ సినిమాలో హీరోగా నాగార్జున పళ్ల, హీరోయిన్లుగా ఆద్యారెడ్డి, భావన నటించినట్లు తెలిపారు. విలన్ పాత్రలో బ్రహ్మానంద రెడ్డి చక్కని ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. హీరో నాగార్జున మాట్లాడుతూ.. ఈ చిత్రంతో తాను హీరోగా పరిచయమవుతున్నట్లు తెలిపారు. కాగా.. ఈ చిత్ర దర్శకుడిది సబ్బవరం మండలం చినగొల్లలపాలెం. దీంతో ఇదే ప్రాంతానికి చెందిన పళ్ల తాతారావు, మల్లునాయుడులేనికి చెందిన ఆరిపాక ప్రసాద్, కె.సంతోష్ కుమార్, పళ్ల సత్యనారాయణ, రోమాల చంద్రశేఖర్ తదితరులకు ఈ చిత్రంలో అవకాశం కల్పించారు. -
ఎంవీవీ గ్రీన్ఫీల్డ్ గేటెడ్ భవన్లో అగ్నిప్రమాదం
కొమ్మాది: జీవీఎంసీ 8వ వార్డు ఎండాడలో గల ఎంవీవీ గ్రీన్ ఫీల్డ్ గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సెకండ్ ఫ్లోర్ బ్లాక్–ఎ, ఫ్లాట్ నెంబర్ 1201లో సుమారు రాత్రి 9 గంటల సమయంలో పొగ వ్యాపించి, మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఇంటి యజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇదిలా ఉండగా పొగ దట్టంగా వ్యాపించడంతో ఇక్కడ నివాసితులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. మహిళలు, పిల్లలు ముఖ్యంగా వృద్ధులు మెట్ల మార్గంలో కిందికి దిగలేక అగచాట్లు పడ్డారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో లిఫ్ట్ కూడా పనిచేయలేదు. అందరూ మెట్ల మార్గం ద్వారా పరుగు తీశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ఇంటి యజమాని తెలిపారు. పది ఫ్లోర్లు ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో వందలాది కుటుంబాల నివసిస్తున్నాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేయడంతో ఇతర ఫ్లాట్లకు ఎటువంటి సమస్య లేకుండాపోయింది. -
స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై చంద్రబాబుది నటన
డాబాగార్డెన్స్ : ఎంతో మంది ప్రాణతాగ్యంతో ఏర్పాటైన విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెతక వైఖరితో నటన సాగిస్తున్నాడని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మండిపడ్డారు. డిసెంబర్ 31లోగా కేంద్రాన్ని ఒప్పించి విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించేలా చూడాలని, లేకుంటే ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గురువారం వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గారా సూర్యారావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం చంద్రబాబు వెంటనే కేంద్రంతో మాట్లాడి స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. గూగుల్ సంస్థకు భూముల ధారాదత్తం చేయడమే గాక.. 22 వేల కోట్ల సబ్సిడీ ఇవ్వడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఓ వైపు మోంథా తుపాన్ కారణంగా పంటలు నష్టపోయి రైతులు విలవిలలాడుతుంటే.. రూ.5 వేలు ఇచ్చి చంద్రబాబు లండన్ వెళ్లిపోయారని? దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు సర్వనాశనం అవుతున్నాయన్నారు. పత్రికా స్వేచ్ఛ లేదని చెప్పారు. ఎస్సీల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ను మూసేశారని, ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఆపేశారని తెలిపారు. ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పించకుండా రోడ్డున పడేసిందన్నారు. -
సర్టిఫికెట్ కోర్సుల విద్యార్థులకు పరీక్షలు
మురళీనగర్ : ఉమ్మడి విశాఖ జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్, ఇతర కాలేజీల్లో సర్టిఫికెట్ కోర్సుల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు వార్షిక పరీక్షలు కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రారంభమయ్యాయి. ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఫ్యాషన్ డిజైన్, ఫైర్ సేఫ్టీకి సంబంధించి కోర్సులో శిక్షణ తీసుకున్న 2024–25 బ్యాచ్ విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 8వ తేదీన పరీక్షలు ముగుస్తాయి. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నకుమార్, స్టూడెంట్స్ అఫైర్స్ కోఆర్డినేటర్ ఎస్.వి.రమణ గురువారం పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఇన్విజిలేటర్లకు పలు సూచనలు చేశారు. -
రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురై వ్యక్తి మృతి
తగరపువలస : స్థానిక ఆంధ్రా బాప్టిస్ట్ చర్చ్ ఎదురుగా గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన జంపా అచ్యుతరావు(32) అక్కడికక్కడే మృతి చెందాడు. అచ్యుతరావు రోడ్డు దాటుతుండగా అంబేడ్కర్ కూడలి నుంచి బంగామెట్ట వైపు చిట్టివలస శారదా పబ్లిక్ స్కూల్ బస్సు వెళ్తుంది. డివైడర్ పైనుంచి వెళ్తున్న అతడు బస్సు వెళ్తున్న రోడ్డుపై పడిపోగా.. వెనుక టైరు, డివైడర్ మధ్య రాపిడికి గురై తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చిట్టివలసలో నివసిస్తూ స్థానికంగా దేవీ స్వీట్స్ కార్ఖానాలో పనిచేస్తున్నాడు. ఎస్ఐలు భరత్కుమార్ రాజు, బి.తిరుపతిరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెయిన్రోడ్డులో సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. -
కొత్తగా ఎన్ని పింఛన్లు ఇచ్చారు?
మహారాణిపేట: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. పింఛన్ల పునఃపరిశీలన పేరుతో దివ్యాంగులను తరచూ వేధించడం, గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపులో జాప్యం, గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు చెల్లించకపోవడం తదితర అంశాలపై జెడ్పీటీసీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపులు ఎప్పుడు? గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి, నిర్మాణం పూర్తి చేసిన ఇళ్ల లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని ఆనందపురం జెడ్పీటీసీ సభ్యుడు కోరాడ వెంకటరావు అన్నారు. వేములవలసలో నిర్మించిన ఇళ్లకు బిల్లులు ఇవ్వలేదని ఆయన ప్రస్తావించారు. అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు డి.గంగరాజు సైతం గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపుపై ప్రశ్నించారు. ఇళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ బిల్లులు ఇవ్వడం లేదని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని పేర్కొన్నారు. దివ్యాంగులను వేధించడం తగదు దివ్యాంగుల పింఛన్ల కోసం తరచూ విచారణలు నిర్వహించి, ఆసుపత్రుల చుట్టూ తిప్పడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గొలుగొండ జెడ్పీటీసీ సభ్యుడు గిరిబాబు ప్రస్తావించారు. దీనిపై చైర్పర్సన్ జె.సుభద్ర జోక్యం చేసుకుంటూ.. దివ్యాంగులను వేధించడం సరికాదన్నారు. కొత్తగా ఎన్ని పింఛన్లు ఇచ్చారో, వితంతు పింఛన్ల మంజూరులో జాప్యం ఎందుకవుతోందని అధికారులను ప్రశ్నించారు. గ్యాస్ రాయితీ డబ్బులు జమ కావడం లేదు గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు రెండు నెలలు దాటినా ఇంకా ఖాతాల్లో జమ కాలేదని కె.కోటపాడు జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడు వేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి ఈకేవైసీ పూర్తి చేయకపోవడం, బ్యాంకు ఖాతాలు ఆధార్తో అనుసంధానం కాకపోవడం కారణమని ఏఎస్వో కల్యాణి వివరణ ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ‘తల్లికి వందనం’పథకంలో డబ్బులు అందరికీ వేయడం లేదని, వేసిన మొత్తంలో కోత విధిస్తున్నారని ఈర్లె అనురాధ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తి మొత్తం ఇచ్చారని, ఇప్పుడు సగం ఇవ్వడం వల్ల పేద కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యం కాపాడండి పాడేరు, అరకు ప్రాంతాల్లోని ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యంతో మరణిస్తున్నారని, పరిశుభ్రమైన నీరు ఇవ్వడం లేదని అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు గంగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకుని, గిరిజన విద్యార్థుల ఆరోగ్యం కాపాడాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి సరిగా లేదని, వర్షాల వల్ల గుంతలు పెరిగి ప్రయాణం కష్టంగా మారిందని గొలుగొండ జెడ్పీటీసీ సభ్యుడు గిరిబాబు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అరకు, పాడేరుపై వివక్ష అరకు, పాడేరు నియోజకవర్గాలపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ఇక్కడ మండల స్టాక్ పాయింట్లను జీసీసీ నుంచి రెవెన్యూకు అప్పగించడం వంటి అదనపు పద్ధతులు పెట్టారని, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉండడం వలనే ఈ వివక్ష చూపుతున్నారని జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర విమర్శించారు. ఆశ పోస్టులను రద్దు చేయండి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆశ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని, అనర్హులకు పోస్టులు ఇచ్చారని అరకు, అనంతగిరి జెడ్పీటీసీ సభ్యులు రోషిణి, గంగరాజు ఆరోపించారు. ఈ పోస్టులను తక్షణం రద్దు చేసి, మళ్లీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డీఎంహెచ్వో పాత్రపై విచారణ చేయాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఈర్లె అనురాధ తెలిపారు. పలు అంశాలపై సభ్యుల ఆందోళన -
రోడ్లపైనే వదిలేస్తున్నారు!
రోడ్ల మీద ఇష్టానుసారంగా పార్కింగ్ చేయకుండా చూడాల్సిన పోలీసులే.. తమకు పట్టుబడిన వాహనాలను రోడ్ల పక్కన వదిలేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న బైక్, కార్లు, ఇతర వాహనాలను పోలీస్స్టేషన్లు, జంక్షన్ల రహదారులకు ఇరువైపులా నెలల తరబడి ఉంచేస్తున్నారు. దీంతో ఆ వాహనాలు పాడైపోవడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అక్కయ్యపాలెం హైవేపై ఫ్రీ లెఫ్ట్ రహదారిలో ప్రమాదానికి గురైన కారును రోడ్డు పక్కన వదిలేశారు. ఫోర్త్ పోలీస్స్టేషన్ ముందు, వెనుక కూడా ఇదే దుస్థితి. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నంపోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కనే వాహనాలు -
బెల్టుషాప్ నిర్వాహకుడిపై కత్తితో దాడి
పోలీసుల అదుపులో నిందితులు గాజువాక : నాతయ్యపాలెంలోని తన ఇంట్లో బెల్టుషాప్ నిర్వహిస్తున్న ఒక వ్యక్తిపై నలుగురు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. అతడి నుంచి మద్యం బాటిళ్లు, కొద్దిపాటి నగదును లాక్కెళ్లిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బెల్టుషాప్ నిర్వాహకుడు కేజీహెచ్లో చిక్సిత పొందుతున్నాడు. గాజువాక క్రైం పోలీసుల కథనం ప్రకారం.. దొడ్డి వెంకటరావు అనే వ్యక్తి నాతయ్యపాలెం బస్ స్టాప్ వెనుక తన ఇంట్లోనే మద్యం విక్రయిన్నాడు. అక్కడికి సమీపంలో గల రైల్వేట్రాక్ రెల్లి కాలనీకి చెందిన నలుగురు వ్యక్తులు బెల్టుషాప్ నిర్వాహకుడి వద్దకు గురువారం తెల్లవారుజామున వచ్చి మద్యం కావాలని అడిగారు. మద్యం కోసం డబ్బులు అడగ్గా, అరువు పెడతామని వారు బదులిచ్చారు. అరువు కుదరదని బెల్టుషాప్ నిర్వాహకుడు చెప్పడంతో వాగ్వాదం మొదలైంది. దీంతో అక్కడే ఉన్న ఒక మద్యం బాటిల్ను పగులగొట్టి ఆ బాటిల్తో పొడిచేస్తామని తొలుత బెదిరించారు. ఈ వాగ్వాదం ఘర్షణగా మారడంతో నిందితులు తమ వెంట తెచ్చిన రెండు కత్తులతో వెంకటరావు తలపైన, ఒంటిపైన పొడిచి గాయపరిచారు. బెల్టుషాపు నిర్వాహకుడి వద్ద ఉన్న రెండు మద్యం బాటిళ్లను, రూ.280 నగదును తీసుకొని అక్కడ్నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన వెంకటరావును కుటుంబ సభ్యులు హుటాహుటిన కేజీహెచ్కు తరలించారు. సమాచారం అందుకున్న క్రైం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రాథమిక విచారణ అనంతరం ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు క్రైం సీఐ శ్రీనివాసరావు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితులపై దోపిడీ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. -
ఏయూలో తత్కాల్ విధానం రద్దు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 28 బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ తెలిపారు. కారుణ్య నియామకాల కింద 40 మంది విశ్వవిద్యాలయ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించినట్లు ప్రకటించారు. ఏయూ సెనేట్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. విద్యార్థుల సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన తత్కాల్ విధానాన్ని రద్దు చేసి, ఇకపై సాధారణ రుసుముతోనే వేగంగా సర్టిఫికెట్లు జారీ చేసే విధానాన్ని అమలు చేస్తామన్నారు. పాత స్పెషల్ ఎగ్జామినేషన్ స్థానంలో రెండు కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఒకే సబ్జెక్ట్లో తప్పిన విద్యార్థుల కోసం ఇనిస్టెంట్ పరీక్ష, దశాబ్ద కాలంగా పరీక్షలు రాయడానికి వేచి చూస్తున్న అభ్యర్థుల కోసం స్పెషల్ డ్రైవ్ పరీక్షకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. విద్యార్థులలో నైపుణ్యాలను పెంచడమే లక్ష్యంగా కెరీర్ ప్లానింగ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు వీసీ వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా 350 కంప్యూటర్లను త్వరలో కొనుగోలు చేస్తామన్నారు. విద్యార్థుల కోసం స్టూడెంట్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామన్నారు. సీ4ఐ4 ల్యాబ్, ఎలిమెంట్ భవనంలో ఫుడ్ టెస్టింగ్ లేబొరేటరీని త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. పూర్వోదయ పథకంలో హాస్టల్ భవనాల నిర్మాణం కోసం రూ.170 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఏయూ వైద్యశాలలో నూతనంగా వైద్యులు, కన్సల్టెంట్ వైద్యులు, ఫార్మసిస్ట్లు, నర్సింగ్ సిబ్బందిని నియమిస్తామని, అదనపు పరికరాలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. అలాగే బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నివారించేందుకు క్యాంపస్లో సెక్యూరిటీని మరింత పటిష్టం చేయనున్నామన్నారు. సౌత్ క్యాంపస్లో కొన్ని ద్వారాలను మూసివేస్తామన్నారు. పూర్వ విద్యార్థుల అనుసంధానం(ఆలుమ్ని ఎంగేజ్మెంట్) కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు వీసీ తెలిపారు. ఈ నెల 11న పాడేరులో ‘ఏయూ గ్రామీణ అనుసంధానం’కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్సీసీ ఆధ్వర్యంలో 1,500 క్యాడెట్లతో ఈ నెల 23న బీచ్రోడ్డు కన్వెన్షన్ సెంటర్లో భారీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఏయూ రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన ఆరోగ్యంలో సంప్రదాయ వైద్యం కీలకం
కొమ్మాది: ‘ఆంధ్రప్రదేశ్ గిరిజన సంప్రదాయ వైద్యం – వైద్య పద్ధతులు’అనే అంశంపై రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ భవన్(టీసీఆర్టీఎం)లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న వర్క్షాపు గురువారంతో ముగిసింది. బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీసీఆర్టీఎం ఈడీ డా. రాణి మందా మాట్లాడారు. సంప్రదాయ వైద్య పరిజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు ఇలాంటి వర్క్షాప్లు ఉపయోగపడతాయన్నారు. గిరిజన సమాజ ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో సంప్రదాయ వైద్య పాత్రను ఆమె గుర్తు చేశారు. ఈ సందర్భంగా క్యాన్సర్ చికిత్సలో విశేష సేవలందించిన డా. వైద్య నారాయణ మూర్తిని స్మరించుకున్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అనీల్ కుమార్, నాగరాజు చిక్కాల తదితరులు పాల్గొన్నారు. -
ఆదాయం లెక్కల్లో తేడాలు
రెండో రోజూ కొనసాగిన ఏసీబీ దాడులు మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.22 లక్షల డెఫిసీట్మహారాణిపేట/మధురవాడ/పెదగంట్యాడ: జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెండో రోజు గురువారం కూడా విస్తృతంగా సోదాలు కొనసాగించారు. మహారాణిపేట, పెదగంట్యాడ, మధురవాడల్లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో జరిగిన ఈ తనిఖీల్లో రిజిస్ట్రేషన్ ఉల్లంఘనలు, అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా నిలిచిపోయిన కీలక డాక్యుమెంట్లను అధికారులు గుర్తించారు. ● మధురవాడలో ఏసీబీ ఇన్స్పెక్టర్ మహేశ్వరరావుతోపాటు మరో ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సుమారు 13 మంది సిబ్బంది రెండు రోజు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 60 వరకు రిజిస్ట్రేషన్లు పూర్తయిన డాక్యుమెంట్లు కక్షిదారులకు ఇవ్వకుండా ఉంచినట్లు అధికారులు గుర్తించారు. 296 జీవో కింద పేదలకు ఇచ్చిన పట్టాల రిజిస్ట్రేషన్కు సంబంధించిన సుమారు 200 డాక్యుమెంట్లు కార్యాలయంలో నిలిచిపోయి ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లన్నింటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ చక్రపాణితోపాటు ఇతర కక్షిదారులను విచారించారు. కార్యాలయంతో సంబంధం లేని నలుగురు వ్యక్తులను బుధవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోగా.. వారు డాక్యుమెంట్ రైటర్లేనని తేలింది. అయితే వీరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రెండో రోజు సోదాల సందర్భంగా ఉదయం 11.30 గంటల వరకు కార్యాలయ ప్రధాన ద్వారం తాళానికి సీల్ వేయడం చర్చనీయాంశమైంది. అలాగే 10 మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. లెక్కల్లో చూపిన ఆదాయం కంటే రూ.22 లక్షలు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ● సూపర్ బజార్ ఆవరణలోని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. రిజిస్ట్రేషన్కు సంబంధించిన పత్రాలు, రికార్డులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరిగిన ఉల్లంఘనలు, పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ దరఖాస్తులు, నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ అమ్మకాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ● పెదగంట్యాడలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం రాత్రి 11 గంటల వరకు కొనసాగిన సోదాలు.. గురువారం ఉదయం 9 గంటలకు మళ్లీ ప్రారంభమయ్యాయి. రాత్రి 9 గంటల వరకు సాగిన తనిఖీల్లో అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన దస్తావేజులను తనిఖీ చేశారు. అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఇందుకు సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. -
రేపటి నుంచి వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్
బీచ్రోడ్డు: లిట్ లాంటర్న్ కల్చర్ అండ్ లిటరేచర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ 2025 బీచ్రోడ్డులోని హవామహల్ వేదికగా నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్లు సోనాల సర్దా, సంధ్యా గోడే, ప్రియ తెలిపారు. సిరిపురంలోని ఒక హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఫెస్ట్లో 20 మంది ప్రముఖ స్టోరీ టెల్లర్స్ పాల్గొంటారన్నారు. ప్రతి రోజూ సుమారు 50 సెషన్లు ఉంటాయని తెలిపారు. 4 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉన్న విద్యార్థుల కోసం ఎక్కువ సెషన్లు నిర్వహిస్తామని, తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఆనందించే సెషన్లు కూడా ఉంటాయన్నారు. ఫెస్ట్ పోస్టర్ను కంకటాల మల్లికార్జునరావు ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా చిన్నారుల కోసం ఈ ఫెస్ట్ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇప్పటికే 2 వేల విద్యార్థులు తమ పేర్లును నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. వేదిక వద్ద కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చని వివరించారు. -
చీకట్లు
కేజీహెచ్లోఅధికారుల నిర్లక్ష్యం.. రోగులకు శాపంవిద్యుత్ లేక బయట వేచి ఉన్న రోగులుకరెంట్ లేక ఇబ్బందులు పడుతున్న బాలింత, చంటి బిడ్డకు ఫైల్తో గాలి విసురుతున్న మహిళమహారాణిపేట : ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య సంజీవని కేజీహెచ్లో గురువారం రాత్రి చీకట్లు కమ్ముకున్నాయి. ఎటుచూసినా అంధకారం అలముకుంది. పలు వార్డుల్లో రోగులు, సిబ్బంది చీకట్లోనే మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా ఈ దుస్థితి దాపురించింది. యూజీ కేబుల్ కట్ అయ్యి.. సరఫరా నిలిచిపోయినా కేజీహెచ్ అధికారులు రాత్రి వరకు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించా రు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకుండా వదిలేశారు. ఏమైందంటే? గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మార్చురీ సమీపంలో ఓ భవన నిర్మాణ పనులు చేపట్టారు. అక్కడ భూగర్భ కేబుల్ ఉందనే హెచ్చరికలు ఉన్నా.. కాంట్రాక్టర్ పట్టించుకోలేదు. నిర్మాణ పనులు చేస్తున్న వారినీ హెచ్చరించలేదు. ఫలితంగా యూజీ కేబుల్ విద్యుత్ వైర్లు కట్ అయ్యాయి. ఈ కేబుల్ తెగిపోవడంతో సబ్ స్టేషన్కు వెళ్లే లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు వార్డులకు విద్యుత్ సరఫరా నిలి చిపోయింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి వరకు స్పందన లేదు ! మధ్యాహ్నం సరఫరా నిలిచిపోయినా అధికారులు సత్వరమే స్పందించకపోవడంతో అర్ధరాత్రి వరకూ అవస్థలు పడాల్సి వచ్చింది. సాయంత్రం సమయంలో ఈపీడీసీఎల్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పునరుద్ధరణ పనులు చేపట్టడం ప్రారంభించారు. సాధారణంగా యూజీ కేబుల్ వెళ్లిన మార్గంలో ఏవైనా తవ్వకాలతో కూడిన పనులు జరిగినప్పుడు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. కానీ కేజీహెచ్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా రోగుల ఆరోగ్య భద్రతను గాలికొదిలేశారు. జనరేటర్లు పనిచేయడం లేదు.. కేజీహెచ్లో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు విద్యుత్ సరఫరా కోసం భారీ సామర్థ్యం ఉన్న జనరేటర్లున్నాయి. కానీ గత కొద్ది నెలలుగా ఈ జనరేటర్లు పనిచేయడం లేదు. ఇటీవల మోంథా తుపాను సందర్భంగా ఉన్నతాధికారులు తనిఖీలు చేసిన సమయంలో జనరేటర్లను త్వరితగతిన సరిచేయాలని ఆదేశించారు. అయినా సదరు జనరేటర్ కాంట్రాక్టర్పై కనీస చర్యలు తీసుకోలేదు సరికదా.. వాటిని బాగుచేయమని కూడా కేజీహెచ్ అధికారులు ఆదేశించకపోవడం గమనార్హం. ఆ రోజే ప్రభుత్వం మేల్కొని జనరేటర్లను బాగుచేసి ఉంటే.. ఈ రోజున ఈ దుస్థితి వచ్చేది కాదని కేజీహెచ్ వర్గాలు చెబుతున్నాయి. జనరేటర్ల పనితీరుపై ఆరోపణలు వస్తున్నా.. ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కారణంగానే యూజీ కేబుల్ కట్ అయి.. సరఫరా నిలిచిపోయినా ప్రత్యామ్నాయం చూడలేకపోయారు. కనీసం అద్దైకె నా జనరేటర్ తెచ్చి రోగులకు ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఆలోచన రాకపోవడం విడ్డూరం. అర్ధరాత్రి వరకూ కేజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర నాయుడు, ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ శ్యామ్ బాబు పర్యవేక్షణలో మరమ్మతులు చేపట్టారు. -
సభ్యుల సొమ్ము గోవిందా!
ఏపీ ఈపీడీసీఎల్ కో–ఆపరేటివ్ సొసైటీలో రూ.20 కోట్ల మోసం? సభ్యులకు తెలియకుండా ఒక్కొక్కరి పేరుతో రూ.15 లక్షల వరకు రుణాలు వీటన్నింటినీ ఓ మాజీ డైరెక్టర్ స్వాహా చేసినట్లుగా ఆరోపణలు సాక్షి, విశాఖపట్నం: వచ్చిన జీతంలో కొంత మొత్తం దాచుకుంటే భవిష్యత్లో ఉపయోగపడుతుందని ఉద్యోగులు భావించారు. కానీ, తాము దాచుకున్న సొమ్ములు సొసైటీ డైరెక్టర్లకు ఉపయోగపడుతున్నాయని ఆలస్యంగా తెలుసుకున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ ఉద్యోగుల కో–ఆపరేటివ్ సొసైటీలో కొందరు డైరెక్టర్లు తమ చేతివాటం ప్రదర్శించారు. సొసైటీ సభ్యుల పేరుతో రుణాలు తీసుకుని, తమ జేబులు నింపేసుకున్నారు. సభ్యులకు తెలీకుండా ఒక్కొక్కరి పేరిట రూ.15 లక్షల వరకు కాజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ సర్కిల్ పరిధి సొసైటీలోని మాజీ డైరెక్టరే ఈ స్వాహా పర్వానికి మూలకారకుడనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఆడిట్కు ఫిర్యాదు చేసినా.. మేనేజ్ చేసుకుంటూ దర్జాగా సభ్యుల సొమ్ముకు కుచ్చుటోపీ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈపీడీసీఎల్లో ఉద్యోగులంతా కలిసి ఓ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. విశాఖపట్నం సర్కిల్ పరిధిలో మూడు విద్యుత్ ఉద్యోగుల కో–ఆపరేటివ్ సొసైటీ బ్రాంచ్లు ఉన్నాయి. అవి విశాఖపట్నం సర్కిల్, గాజువాక, గోపాలపట్నం. ఒక్కో బ్రాంచ్ సొసైటీకి అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు ఉద్యోగుల సంఖ్యను బట్టి 7 నుంచి 9 మంది డైరెక్టర్లు ఉంటారు. ఈ బ్రాంచ్లలో గాజువాక శాఖ అతి పెద్దది. ఇందులో ఈపీడీసీఎల్తో పాటు చింతపల్లి, సీలేరులోని జెన్కో ఉద్యోగులు కూడా సభ్యులుగా ఉన్నారు. అయితే, గత నాలుగేళ్లుగా విశాఖపట్నం ఈపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలో ఉన్న సొసైటీ బ్రాంచ్ ఆఫీస్ నుంచి సభ్యుల సొమ్ములు స్వాహా అవుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బ్రాంచ్లో గతంలో డైరెక్టర్గా వ్యవహరించిన ఓ వ్యక్తి ఉద్యోగుల సొమ్ముని గుట్టుగా స్వాహా చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కో సభ్యుడి పేరుతో రూ.15 లక్షలకు పైగానే.! ఈపీడీసీఎల్లో సీనియర్ అసిస్టెంట్ హోదాలో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి గతంలో సొసైటీలో ఒక డైరెక్టర్గా వ్యవహరించారు. ఆ సమయంలోనే సభ్యుల పేరుతో సొమ్ములు గోవిందా.. గోవిందా అంటూ ఆరగించేసినట్లు తెలుస్తోంది. సొసైటీలో ఉన్న ఒక్కో సభ్యుడి పేరుతో సదరు డైరెక్టర్ రూ.15 లక్షలకు పైగా రుణాలు తీసుకొని, సొంతంగా వాడుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 30 మందికి పైగా సభ్యులు ఈ డైరెక్టర్ బాధితులుగా మారినట్లు సమాచారం. రుణాలు తీసుకొని ఎంచక్కా.. డైరెక్టర్ పోస్టు నుంచి తప్పుకుని ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నారు. అయితే.. ఇటీవల కొంత మంది సభ్యులు తమ డివిడెంట్లు, షేర్ క్యాపిటల్ ఫండ్స్, ఇతరత్రా ఆదా చేసిన డబ్బులు గురించి ఆరా తీస్తున్న సమయంలో అప్పటి డైరెక్టర్ బండారం ఒక్కొక్కటిగా బయటపడినట్లు సమాచారం. ఈ విషయంపై సొసైటీ అధ్యక్ష కార్యదర్శులకు కొందరు బాధిత సభ్యులు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఆర్థిక మోసం బయటకు రాకుండా గోప్యంగా ఉంచాలనీ, ఎలాగైనా కొల్లగొట్టిన సొమ్ములు తిరిగి చెల్లించేందుకు ప్రయత్నిస్తామంటూ వారు హామీ ఇచ్చారు. సభ్యులు మాత్రం.. తమకు నమ్మకం లేదనీ, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. గతంలో ఉద్యోగాల పేరుతో మోసం సొసైటీ సభ్యుల పేరుతో రుణాలు తీసుకొని సొంత ఖాతాకు మళ్లించుకున్న సదరు మాజీ డైరెక్టర్పై గతంలోనూ అనేక ఆరోపణలున్నాయి. ఈపీడీసీఎల్ పరిధిలో ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తానంటూ పదుల సంఖ్యలో నిరుద్యోగులను మోసం చేశారు. దాదాపు రూ.5 కోట్ల వరకు వసూళ్లు చేసిన డైరెక్టర్పై అప్పట్లో కేసులు నమోదవ్వడంతో.. విధుల నుంచి కూడా సస్పెండ్ చేశారు. అయినా తన వక్రబుద్ధిని వదులుకోలేకపోతున్న ఆయన.. సొంత డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల సొమ్మునూ వదల్లేదు. ఇలాంటి వ్యక్తికి అప్పట్లో డైరెక్టర్ పదవిని ఎందుకు కట్టబెట్టామా అంటూ సొసైటీ సభ్యులు ఇప్పుడు బాధపడుతున్నారని విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. సొసైటీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. -
రోగుల హాహాకారాలు
విద్యుత్ సరఫరా లేకపోవడంతో పలు వార్డుల్లో రోగులు హాహాకారాలు పెట్టారు. గైనిక్ వార్డులో బాలింతలు, డెలివరీ కోసం లేబర్ రూమ్లో ఉన్న గర్భిణులు, పిల్లల వార్డులో బరువు, నెలతక్కువతో పుట్టిన పిల్లలు, వివిధ సమస్యలతో ఉన్న చిన్నారులు, వెంటిలేటర్ మీద ఉన్న రోగులు, ఎమర్జన్సీ వార్డుల్లో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. పిల్లల పరిస్థితి చూసిన తల్లులు.. రోగుల పరిస్థితి చూసిన వారి బంధువులు అల్లాడిపోయారు. ప్లాస్టిక్ సర్జరీ వార్డుల్లో గాయపడిన రోగులు, ఆక్సిజన్ పెట్టుకున్న రోగులు విద్యుత్ లేకపోవడంతో ఇక్కట్లకు గురయ్యారు. పిల్లలు, గైనిక్, భావనగర్, రాజేంద్రప్రసాద్ తదితర వార్డుల్లో ఫ్యాన్లు నిలిచిపోవడంతో రోగుల బంధువులు విసనకర్రలను ఆశ్రయించారు. నర్సులు రోగులకు కొవ్వొత్తుల వెలుగులోనే వైద్య సేవలు అందించారు. -
మనస్తాపంతో బాలుడి ఆత్మహత్య
పీఎంపాలెం: తల్లి మందలించిందని మనస్తాపం చెందిన ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వివరాలను పీఎంపాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి. జీవీఎంసీ 7వ వార్డులోని చంద్రంపాలేనికి చెందిన జి.మోజేస్ (16) 10వ తరగతి ఫెయిలయ్యాడు. స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు. దీంతో అతని తల్లి మంగళవారం రాత్రి బాలుడిని మందలించింది. చెడు తిరుగుళ్లు వద్దని, మంచి మార్గంలో ఉండాలని సూచించింది. దీనిని అవమానంగా భావించిన మోజేస్.. తీవ్ర మనస్తాపంతో తమ ఇంటి డాబాపై గల షెడ్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. మృతుడి తండ్రి గేదెల వెంకటరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
జాతీయ బాక్సింగ్ పోటీల్లో విశాఖ విద్యార్థులకు పతకాలు
సాక్షి, అమరావతి : అరుణాచల్ప్రదేశ్లో బుధవారం జరిగిన 69వ జాతీయ స్థాయి అండర్–17 బాలుర, బాలికల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు బాక్సర్లు 3 కాంస్య పతకాలను సాధించారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెం ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థి కొలుసు సాయి లోహిత్, ద్వారకానగర్లోని బీవీకే జూనియర్ కాలేజీ విద్యార్థి వేగి రాహుల్, వాల్తేరు కేంద్రీయ విద్యాలయానికి చెందిన బోస ఈశ్వర్ చరణ్ రెడ్డి ఈ ఘనత సాధించారన్నారు. ఈ సందర్భంగా విజేతలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు క్రీడాకారులను అభినందించారు. -
● పుష్కరిణీ నమోస్తుతే..
సింహాచలం: కార్తీక పౌర్ణమి సాయంసంధ్య.. పవిత్ర వరాహ పుష్కరిణి.. వేలాది దీపాల కాంతులతో, భక్తజన సంద్రంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శుభ ఘడియలలో.. పవిత్ర జలరాశికి పుణ్యనదీ హారతి(గంగా హారతి) సమర్పించే అపురూప ఘట్టానికి బుధవారం సింహగిరి క్షేత్రం సాక్ష్యంగా నిలిచింది. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన కొండదిగువ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి వెంకన్న ఉత్సవమూర్తులను శేషతల్పంపై ఆశీనులను చేశారు. మంగళ వాయిద్యాల నడుమ తిరువీధిగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ సిద్ధం చేసిన దివ్య వేదికపై స్వామి కొలువుదీరగా, ఆ ప్రాంతం భక్తుల నామస్మరణతో మార్మోగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం స్వామికి ద్వయ, నక్షత్ర, కుంభ హారతులను సమర్పించగా, ఆ కర్పూర కాంతుల్లో స్వామి దివ్య రూపం మరింత దేదీప్యమానంగా ప్రకాశించింది. అనంతరం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, ఇతర అర్చక బృందం.. పుష్కరిణి గట్టుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికల నుంచి పుష్కరిణీ నమోస్తుతే.. అంటూ వరాహ పుష్కరిణికి దివ్య నీరాజనం సమర్పించారు. ఆ హారతి వెలుగులు పవిత్ర జలంలో ప్రతిబింబిస్తుండగా, ఆ దృశ్యాన్ని కనులారా వీక్షించిన భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. అదే సమయంలో.. పుష్కరిణి గట్టున వందలాది మంది మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. కోలాటాలు, భరత నాట్య ప్రదర్శనలు, హరినామ సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు ‘స్మార్ట్ అగ్రికల్చర్’ ఎంపిక
ఆరిలోవ: డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం సంయుక్త ఆధ్వర్యంలో దక్షిణ భారత సైన్స్ డ్రామా పోటీల్లో భాగంగా జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని 15 ఉన్నత పాఠశాలల నుంచి 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారు బృందాలుగా ఏర్పడి, నాటికలను ప్రదర్శించారు. డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో ‘స్మార్ట్ అగ్రికల్చర్’ అనే అంశంపై నాటిక ప్రదర్శించిన పెందుర్తి మండలం, శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బృందం విజేతగా నిలిచింది. ఈ నెల 7న గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ నాటికను ఎంపిక చేసినట్లు డీఈవో ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. రైతులు ఆధునికీకరణ పద్ధతుల్లో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించడం ఇతివృత్తంగా ఈ నాటిక సాగిందన్నారు. ఈ బృందానికి మరింతగా శిక్షణ ఇచ్చి, రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచేలా కృషి చేయాలని గైడ్ టీచర్ సీతాలక్ష్మికి సూచించారు. ఈ పోటీల్లో ఉమెన్ ఇన్ సైన్స్, డిజిటల్ ఇండియా–ఎంపవరింగ్ లైవ్స్, హైజీన్ ఫర్ ఆల్, గ్రీన్ టెక్నాలజీ వంటి అంశాలపై విద్యార్థులు నాటికలు ప్రదర్శించారు. జిల్లా సైన్స్ అధికారి రాజారావు, జ్యూరీ సభ్యులు భౌతిక శాస్త్ర అధ్యాపకుడు బి.నాగేశ్వరరావు, నవరస ఆర్ట్స్ ఫౌండర్ పి.వి.రమణమూర్తి, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉత్సాహంగా జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు -
అవకాశాలను సద్వినియోగం చేసుకోండి
కొమ్మాది: ప్రభుత్వం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విద్యార్థులకు సూచించారు. రుషికొండలోని బి.ఆర్.అంబేడ్కర్ స్టడీ సర్కిల్ భవన్ను బుధవారం ఆయన సందర్శించి, గ్రంథాలయం, కంప్యూటర్ గదులు, సెమినార్ హాళ్లను తనిఖీ చేశారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి.. ఏకాగ్రత పెంపొందించుకొని, ప్రతీ క్షణాన్ని వినియోగించుకోవాలన్నారు. వినతిపత్రం అందజేత ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం ఆర్భాటంగా జీవో విడుదల చేసి ఏడు నెలలు గడుస్తున్నా ఏ ఒక్కరికీ రుణం మంజూరు కాలేదని, వెంటనే రుణాలు విడుదల చేయాలని విదసం (విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డా.బూసి వెంకటరావు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి వినతి పత్రం అందజేశారు. పెను ముప్పుతో జరిగే అసహజ మరణాలకు ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారంలో వివక్ష ఉందని అందులో పేర్కొన్నారు. -
విశాఖను ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ఇన్చార్జి మంత్రి డోలా మహారాణిపేట: విశాఖపట్నం వేదికగా ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికం కానుందని, ఈ మహా కార్యాన్ని దిగ్విజయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవిరళ కృషి చేస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి, ఇతర క్యాబినెట్ మంత్రులు పలు దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించారని గుర్తు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. సుమారు 40పైగా దేశాల నుంచి వందల సంఖ్యలో అతిథులు, వివిధ కంపెనీల ప్రతినిధులు సదస్సుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు. తద్వారా 7.5 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటికే 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియలను పూర్తి చేశామని చెప్పారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు, రాజకీయ, అధికార ప్రముఖుల సమక్షంలో 410 ఒప్పందాలు జరుగుతాయని, రూ.2.7 లక్షల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా జరుగుతాయని మంత్రి వివరించారు. విశాఖపట్నాన్ని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏయూలో జరుగుతున్న ఏర్పాట్లు, వేదికలు, ఇతర అంశాలను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మంత్రికి మ్యాప్ సహాయంతో వివరించారు. ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాసరావు, సీఐఐ ప్రతినిధి మాళి తదితరులు పాల్గొన్నారు. -
సీఎస్సార్ నిధులతో కొత్త డయాలసిస్ యూనిట్లు
కేజీహెచ్లో ప్రారంభించిన జిల్లా ఇన్చార్జి మంత్రి మహారాణిపేట: ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగానే వైద్య సేవలను డిజిటల్ విధానంలో ప్రజలకు చేరువ చేస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సీఎస్సార్ కింద ఎన్టీపీసీ సమకూర్చిన రూ.2 కోట్ల ఆర్థిక సహాయంతో కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగంలో ఆధునికీకరించిన హీమో డయాలసిస్ యూనిట్ను బుధవారం ఆయన పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో కుప్పంలో సంజీవని పేరుతో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని, దశల వారీగా రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ వైద్య సేవలను చేరువ చేస్తామని చెప్పారు. కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగంలో ఇప్పటికే 13 సబ్ యూనిట్లతో సేవలు అందుతున్నాయని, అదనంగా ఎన్టీపీసీ సాయంతో మరో 10 కొత్త డయాలసిస్ సబ్ యూనిట్లను సిద్ధం చేసినట్లు చెప్పారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, ఏఎంసీ పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ డాక్టర్ రవిరాజు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్ సంధ్యాదేవి, కేజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ బీవీ రమణ, నెఫ్రాలజీ విభాగం ఇన్చార్జి హెచ్వోడీ డాక్టర్ రత్నప్రభ, కార్పొరేటర్ కొడూరు అప్పలరత్నం, ఎన్టీపీసీ ప్రతినిధులు పాత్రో, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
బైక్ ఢీకొని వృద్ధుడి మృతి
ఆరిలోవ: బీఆర్టీఎస్లో పైనాపిల్కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న సమయంలో ఆయన్ని ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఆరిలోవ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.. నగరంలోని సీతంపేటకు చెందిన ఆలేటి సూర్యనారాయణ(65) బుధవారం సాయంత్రం పైనాపిల్కాలనీ వద్ద జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో బంధువులను కలవడానికి వచ్చారు. తిరిగి సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటికి చేరుకోవడానికి బయలుదేరారు. ఈ క్రమంలో పైనాపిల్కాలనీ బస్టాప్ వద్దకు చేతికర్ర సహాయంతో నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో అడవివరం నుంచి హనుమంతవాక వైపు ముగ్గురితో వెళ్తున్న ద్విచక్రవాహనం అతన్ని ఢీకొంది. ఈ ఘటనలో సూర్యనారాయణ కిందపడటంతో తలకు తీవ్రగాయమైంది. అధిక రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు విడిచారు. బైక్ నడిపిన వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఆరిలోవ ట్రాఫిక్, లా అండ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. గాయాలైన ద్విచక్రవాహనచోదకులను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య ఈశ్వరమ్మ, బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు. సూర్యనారాయణ జగదాంబ జంక్షన్లో చిరు వ్యాపారి. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎస్ఐ రాందాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సత్యదేవునికి భక్త నీరాజనం
పెద్ద ఎత్తున పౌర్ణమి పూజలు, వ్రతాలుడాబాగార్డెన్స్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఇసుకకొండ(బాబాజీకొండ)పై వెలసిన రమా సహిత సత్యనారాయణస్వామి ఆలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయం కిక్కిరిసింది. ధ్వజస్తంభం వద్ద మహిళలు దీపారాధన చేశారు. వేకువ జామున 2 గంటలకు ధ్వజస్తంభ పూజ నిర్వహించారు. వేకువజాము 2.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు స్వామి దర్శనం కల్పించారు. రూ.1,116 చెల్లించిన భక్తులతో అనివెట్టి మండపంలో ఉదయం 7 గంటలకు, 10.30 గంటలకు ప్రత్యేక వ్రతాలు చేయించారు. ఉదయం 4 గంటలకు, 6 గంటలకు, 9 గంటలకు సామూహిక వ్రతాలు జరిగాయి. భక్తుల తాకిడి దృష్ట్యా ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు అవకాశం కల్పించలేదని ఈవో రాజగోపాల్రెడ్డి తెలిపారు.భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. పూర్ణామార్కెట్ దరి దయారామ స్వీట్ షాప్ పక్క నుంచి ఆలయానికి ఏర్పాటు చేసిన ఘాట్ రోడ్డును భక్తులు సద్వినియోగం చేసుకున్నారు. -
17 నుంచి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే
మహారాణిపేట: జిల్లాలో ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు కుష్టు వ్యాధిని గుర్తించే కార్యక్రమం(ఎల్సీడీసీ) పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం. ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కుష్టు వ్యాధి సర్వేకు సంబంధించి కలెక్టర్ చాంబర్లో బుధవారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశ కార్యకర్తలు, పురుష వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పూర్తిస్థాయి సర్వే నిర్వహించాలని సూచించారు. ఎవరికై నా తమ శరీరంపై స్పర్శ లేని మచ్చలు ఉన్నట్లయితే ఇంటికి వచ్చే వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. ప్రాథమిక స్థాయిలోనే మచ్చలను గుర్తిస్తే అంగ వైకల్యం రాకుండా, ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. జిల్లా కుష్టు, క్షయ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రమేష్, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, సాంఘిక సంక్షేమ ఉప సంచాలకులు రామారావు, నోడల్ అధికారి డాక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
‘సహకారం’ పక్కదారి
విశాఖ సిటీ: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)కి అవినీతి మరకలు అంటుకున్నాయి. నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఇటీవల జరిగిన పదోన్నతుల వ్యవహారం బ్యాంకులో మంట పుట్టిస్తోంది. ఈ ప్రక్రియలో రూ. కోటి వరకు మామూళ్లు వసూలు చేశారన్న వార్తలు దుమారం రేపుతున్నాయి. బ్యాంకులో అవినీతి, అక్రమాలపై ఆప్కాబ్కు ఫిర్యాదులు అందుతున్నాయి. డీసీసీబీ నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్పైనే అదే పార్టీకి చెందిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది. పదోన్నతులపై దుమారం గత నెలలో డీజీఎం నుంచి అసిస్టెంట్ మేనేజర్ వరకు పదోన్నతులు నిర్వహించారు. దీని కోసం పోస్టును బట్టి రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కూడా పాటించలేదని బ్యాంకు ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ బంధువు ఈ వసూళ్లలో కీలక పాత్ర పోషించినట్లు జనసేనకు చెందిన నేతలే ఫిర్యాదులు చేస్తుండడం గమనార్హం. నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాంకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు చేస్తుండడం విశేషం. రూ.30 లక్షలు దుర్వినియోగం? గతంలో ఈ బ్యాంకుకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పర్సనల్ ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఆ సమయంలో ఖర్చు రూ.3 వేలు మాత్రమే. నాలుగు నెలల క్రితం నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.30 లక్షలకు పైగా బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. కారు, దాని డీజిల్ పేరుతో రూ.లక్షలు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్యాంప్ ఆఫీస్లో ఫర్నీచర్ పేరుతో రూ.3 లక్షలు, రూ.1.8 లక్షలతో యాపిల్ డెస్క్టాప్, రూ.80 వేలతో కొత్త ల్యాప్టాప్ బలవంతంగా బ్యాంకు నిధుల నుంచి కొనిపించినట్లు సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. కేవలం లబ్ధిదారులు లంచాల వాటా ఇవ్వని కారణంగా డీసీసీబీ విశాఖ బ్రాంచ్లో ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ పథకాన్ని (పీఎంఈజీఎస్ )అమలు చేయడాన్ని నిలిపివేసినట్లు సమాచారం. అలాగే స్టార్ హోటల్స్ నుంచి భోజనం పార్సిల్స్ను రప్పిస్తూ బిల్లులు బ్యాంకుకు పెడుతున్నట్లు చెవులు కొరుక్కుంటున్నారు. బ్యాంకు పరిధిలోని సహకార సంఘాలు అన్నింటి నుంచి నెలకు రూ.లక్ష మామూలు ఇవ్వాలని ఒత్తిడి తీసుకువస్తుండడంతో పాటు తమ బినామీలకు రూ.కోట్లలో రుణాలు మంజూరు చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ఆ పార్టీ నేతలే ఫిర్యాదులు చేస్తున్నారు. రుణం పునరుద్ధరించాలంటే ఒక శాతం కమీషన్ తక్కువ వ్యవధి రుణాలను(షార్ట్ టర్మ్ లోన్స్) తిరిగి పునరుద్ధరించే క్రమంలో రుణం మొత్తంలో ఒక శాతం కమీషన్గా తీసి పక్కన పెట్టాలని హుకుం జారీ చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆప్కాబ్ ఎండీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. బ్యాంకులో అవినీతి ఆరోపణలు, పదోన్నతుల్లో మూమూళ్ల వసూళ్లు, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్, సీబీసీఐడీలతో దర్యాప్తు జరిపించి అక్రమంగా వసూలు చేసిన నిధులను తిరిగి బ్యాంకుకు రికవరీ చేయాలని కోరారు. -
పారిశ్రామికవేత్త?
మీలో ఎవరుచోటా నేతలు, కార్యకర్తలకు టీడీపీ బంపర్ ఆఫర్ పార్టనర్షిప్ సమ్మిట్లో ఒప్పందాల కోసం ఏర్పాట్లురండి బాబు.. రండి.. ఆలోచించిన ఆశాభంగం.. మంచితరుణం మించిన దొరకదు.. ఫైల్ పట్టుకుంటే.. పండగే.. ఒప్పందం కుదుర్చుకోండి.. భూములను దోచుకోండి.! కండువా పక్కన పెట్టు.. కొత్త పరిశ్రమ పెడుతున్నట్లు నటించు..! ఉన్న పరిశ్రమ చూపించి.. కొత్త రాయితీలు కొట్టెయ్యొచ్చు..! ఈ ఆఫర్ కేవలం రెండు రోజుల మాత్రమే.. అది కూడా ఈ నెల 14, 15 తేదీల్లోనే.! మీరు పచ్చనేత అయితే చాలు.. అర్హత పొందినట్లేనంటూ టీడీపీ నేతలు.. కొత్త సీసాలో పాత సారా పోసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరేళ్ల క్రితం చేసిన హడావుడికి మరోసారి శ్రీకారం చుడుతున్నారు. టీడీపీ నేతలకు ఇస్తున్న సరికొత్త బంపర్ ఆఫర్ ఏంటంటే..? సాక్షి, విశాఖపట్నం: గత టీడీపీ ప్రభుత్వం 2016, 2018లో సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించింది. ఈ రెండు సదస్సుల్లోనూ లక్షల కోట్ల రూపాయిలు పెట్టుబడులు వచ్చేశాయంటూ ఊదరగొట్టారు. భారీ పరిశ్రమలు, వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి.. ఎంవోయూలు చేసుకున్నారంటూ ఒప్పందపత్రాలు మార్చుకుంటూ పత్రికల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. తీరా చూస్తే.. లెక్కల్లోనే లక్షల కోట్లు మిగిలాయి.. ఫొటోలకే ఎంవోయూలు పరిమితమయ్యాయి. తర్వాత ఆరా తీస్తే.. టీడీపీ ప్రభుత్వం అసలు బండారం బట్టబయలైంది. సదస్సులకు అనుకున్నంత స్పందన రాకపోవడంతో.. స్థానికంగా ఉన్న వారితో పాటు.. వివిధ రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలకు సూటు, బూటు వేసి.. పారిశ్రామికవేత్తలుగా చిత్రీకరించారు. వారు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో వందల కోట్ల రూపాయిల పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వచ్చినట్లుగా ప్రకటించేసి.. అడ్డంగా దొరికిపోయారు. చింత చచ్చినా.. పులుపు చావదన్నట్లుగా.. అబద్దాల పునాదులపై ప్రచారపటాటోపాలు నిర్వహిస్తూ.. ప్రజల సాక్షిగా అబాసుపాలవుతున్నా.. టీడీపీ మాత్రం తన వక్ర బుద్ధి వీడలేకపోతోంది. త్వరలో జరగబోయే సదస్సుకు కూడా ఇదే తరహాలో డమ్మీ పారిశ్రామికవేత్తల కోసం జాబితా తయారు చేస్తోంది. పరిశ్రమ ఉంటే చాలు.. పనైపోద్ది.! ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఉన్న టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలకు అధిష్టానం టాస్క్ అప్పగించింది. తమ పరిధిలో పార్టీకి చెందిన పారిశ్రామికవేత్తలు ఎవరెవరు ఉన్నారనే జాబితాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చోటా నేతలు, కార్యకర్తల్లో ఎవరైనా రెస్టారెంట్స్, హోటల్స్, బ్రిక్స్, టైల్స్ ఇలా.. చిన్న కుటీర పరిశ్రమలు నడుపుతున్నా.. వారితో పార్టనర్ షిప్సమ్మిట్లో కొత్తగా ఒప్పందాలు చేసుకునేలా ఏర్పాట్లు నడుపుతున్నట్లు సమాచారం. ఆశించిన మేర పారిశ్రామికవేత్తలు రాకపోతే.. ఎంవోయూల సంఖ్య అధికంగా చూపించుకునేందుకు టీడీపీ తహతహలాడుతోంది. అయితే.. 2018లో ఎంవోయూలు చేసుకున్న వారికి మాత్రం ఇందులో మినహాయింపునిస్తున్నారు. మళ్లీ వారినే పిలిపిస్తే.. పరువు పోతుందన్న భయంతో కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. స్టేజ్ పైకి పిలిచేంత పరిశ్రమ సామర్థ్యం ఉన్నవారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం చెప్పడంతో.. ఆ తరహా పరిశ్రమలున్న వారి వివరాలు తయారుచేస్తున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. భారీ ఏర్పాట్లు చేస్తున్న సదస్సుకు జనం రాకపోతే.. నవ్వులపాలవుతామన్న భయంతో మరోసారి అదే దొడ్డిదారిలో వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. భూ పందేరం కోసం టీడీపీ నేతల కొత్త ఎత్తుగడ సమ్మిట్ పేరుతో ఇదో యవ్వారం నడుస్తుండగా.. సందట్లో సడేమియాలా.. ఒప్పందాల పేరుతో భూ పందేరాలకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. భాగస్వామ్య సదస్సులో ఎంవోయూల పేరుతో ప్రాజెక్టులకు భూ కేటాయింపులు చేసి.. వాటిని అధికారికంగా కొట్టేసేందుకు కూడా కూటమి నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ పరిధిలో ఉన్న టూరిజం భూముల్లో పర్యాటక ప్రాజెక్టులు, ఏపీఐఐసీ భూముల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లుగా సదస్సులో ఎంవోయూలు మార్చుకుంటూ.. తమ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు కూటమి నేతలు తమ అనుచరగణంతో ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 241.92 ఎకరాల టూరిజం భూములను పర్యాటక ప్రాజెక్టులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా వందలాది ఎకరాలున్న ఏపీఐఐసీ భూములను వివిధ పరిశ్రమలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామనీ.. మంచి ప్రాజెక్టులతో వస్తే భూ కేటాయింపులు రాయితీలతో ఇస్తామంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. ఇదే పేరుతో మొత్తం భూములను అధికార పార్టీ నేతలు కొల్లగొట్టేందుకు సమ్మిట్ పేరుతో స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా భాగస్వామ్య సదస్సు పేరుతో భారీ దోపిడీకి కూటమి ప్రభుత్వం తెరతీయబోతోందనే ఆరోపణలు కోడై కూస్తున్నాయి. -
స్కూల్ గేమ్స్ అండర్–19 క్రికెట్ విజేత విశాఖ
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ స్కూల్ గేమ్స్ అండర్–19 బాలుర క్రికెట్ టోర్నీ చాంపియన్గా విశాఖపట్నం నిలిచింది. ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరులో ఆతిధ్య శ్రీకాకుళం జట్టును సూపర్ ఓవర్లో ఓడించి జయకేతనం ఎగురవేసింది. మూడో స్థానం కోసం జరిగిన మరో కీలక మ్యాచ్లో చిత్తూరును పశ్చిమ గోదావరి జట్టు ఓడించింది. శ్రీకాకుళంలో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 బాలుర చాంపియన్షిప్ పోటీలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన ముగింపు, బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమలో జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు విజేతలకు బహుమతులు అందజేశారు. ఫైనల్ సాగిందిలా.. స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో బుధవారం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల మధ్య ఫైనల్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విశాఖ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. 75 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కి దిగిన శ్రీకాకుళం జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేయడంతో స్కోర్ సమమైంది. ఫలితం తేల్చేందుకు మ్యాచ్ అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం జిల్లా జట్టు 7 పరుగులు చేసింది. 8 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేసిన విశాఖపట్నం జట్టు మూడు బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించింది. ఏపీ రాష్ట్ర స్థాయి స్కూల్గేమ్స్ అండర్–19 బాలికల చాంపియన్షిప్–2025–26 పోటీలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
ముమ్మరంగా రికార్డుల తనిఖీ మహారాణిపేట/మధురవాడ/పెదగంట్యాడ: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అవినీతి నిరోధక శాఖ దాడుల్లో భాగంగా.. నగరంలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. మహారాణిపేట, మధురవాడ, పెదగంట్యాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరిగాయి. ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. రికార్డుల పరిశీలన : సూపర్బజార్ ఆవరణలోని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రికార్డులను ముమ్మరంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్కు సంబంధించిన పత్రాలు, రిజిస్ట్రేషన్లలో ఉల్లంఘనలు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ల అమ్మకాల వివరాలను, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మధురవాడలో.. మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ మహేశ్వరరావు ఆధ్వర్యంలోని బృందం విస్తృత తనిఖీలు చేపట్టింది. ఇక్కడ సబ్ రిజిస్టర్ చక్రపాణి, ఇతర సిబ్బందిని వేర్వేరుగా విచారించారు. ఈ సందర్భంగా కార్యాలయంతో ఎటువంటి సంబంధం లేని నలుగురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారిని తదుపరి విచారణ కోసం విశాఖ కార్యాలయానికి తరలించారు. అయితే, అధికారులు ఈ వివరాలను గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏసీబీ సోదాల కారణంగా, రిజిస్ట్రేషన్ల కోసం ముందుగానే స్లాట్లు బుక్ చేసుకున్న వారితో సహా, వివిధ పనుల నిమిత్తం వచ్చిన కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పనులు కాకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. డాక్యుమెంట్ రైటర్లు పరార్ పెదగంట్యాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రవేశించిన ఏసీబీ అధికారులు, వెంటనే కార్యాలయంలో ఉన్న కక్షిదారులను బయటకు పంపించి, అన్ని డోర్లను మూసివేశారు. సిబ్బంది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వారిని ఒక గదిలో ఉంచి తనిఖీలు చేశారు. సబ్ రిజిస్టార్ రోహన్ కుమార్ కంచరాన చాంబర్తో పాటు, టేబుళ్లు, డెస్క్లను తెరిచి రికార్డులను, కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్లను పరిశీలించారు. ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి అడుగుపెట్టగానే, కార్యాలయం వెలుపల ఉన్న డాక్యుమెంట్ రైటర్లు తమ కార్యాలయాల షటర్లను దించేసి, తాళాలు వేసి అక్కడి నుంచి పరారయ్యారు. మూడు కార్యాలయాల్లోనూ ఏకకాలంలో జరిగిన ఈ దాడులు తీవ్ర కలకలం రేపాయి. పూర్తి స్థాయి తనిఖీల అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
జనగణనకు సిద్ధం కండి
రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ నివాస్ భీమునిపట్నం: జనగణన–2027కు సంబంధించిన ముందస్తు సన్నాహక కార్యక్రమాలు(ప్రీ టెస్ట్) ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం భీమిలిలో ఇళ్ల గణన కార్యక్రమంపై రాష్ట్ర జనగణన డైరెక్టర్ జె. నివాస్ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం జరిగింది. భీమిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయం, జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి ఆధ్వర్యంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నివాస్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఇళ్ల గణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 4 కేంద్రాల్లో ఈ ప్రీ–టెస్ట్ జరుగుతుండగా, అందులో విశాఖ జిల్లా ఒకటని పేర్కొన్నారు. భీమిలి జోన్ పరిధిలోని 2, 3 వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 4 నుంచి 6 వరకు మూడు రోజుల పాటు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఉంటుందన్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా తయారీ, ఇళ్లలో నివసించే వారి వివరాలు, గణన నిర్వహించాల్సిన విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్యక్రమ ప్రాముఖ్యంపై ఈ శిక్షణలో వివరిస్తున్నట్లు చెప్పారు. ప్రజల సౌకర్యార్థం ఈ నెల 1 నుంచి 7 వరకు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో ఉంటుందని, ప్రజలు స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ నెల 10 నుంచి 30 వరకు ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ఇళ్ల గణన నిర్వహిస్తారని తెలిపారు. ఇంటికి వచ్చే సిబ్బందికి ప్రజలు పూర్తి సమాచారం అందించి, గణనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సెన్సస్ డిప్యూటీ డైరెక్టర్ దయాసాగర్, భీమిలి జోనల్ కమిషనర్ అయ్యప్పనాయుడు పాల్గొన్నారు. -
21 నుంచి మార్గశిర మాసోత్సవాలు
మహారాణిపేట: ఈ నెల 21 నుంచి డిసెంబర్ 19 వరకు కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరిగే మార్గశిర మాసోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో పలు అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. ఆయా రోజుల్లో ట్రాఫిక్ మళ్లింపు, బారికేడ్లు, సరిపడా క్యూలైన్లు, మంచినీటి సదుపాయం, వైద్య శిబిరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆ సమయంలోనే దర్శనాలు.. మార్గశిర మాసోత్సవాల్లో నాలుగు గురువారాలు నవంబర్ 27, డిసెంబర్ 04, 11, 18వ తేదీల్లో వస్తున్నట్లు ఈవో కె.శోభారాణి వెల్లడించారు. ఈ దినాల్లో బుధవారం తెల్లవారుజాము 2.30 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. వీఐపీలకు ఉదయం 6 నుంచి 8 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు స్లాట్స్ కేటాయించినట్లు వెల్లడించారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్వీ రమణ, ఏఈవో రాజేంద్ర, పోలీసు అధికారులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్వయం అభిషేకాలపై పునరాలోచించాలి ఆలయానికి వచ్చే భక్తులు స్వయంగా పాలు, పసుపు కుంకుమలు, పుష్పాలతో అమ్మవారికి అభిషేకాలు చేయడంపై వైదిక కమిటీ పునరాలోచన చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పూజా సామగ్రిని భక్తుల నుంచి పూజారులు/వలంటీర్లు తీసుకుని అమ్మవారికి సమర్పించేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై పోలీసు అధికారులు కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈవో శోభారాణి స్పందిస్తూ... వైదిక కమిటీ దృష్టిలో పెట్టి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. క్యూలైన్లలో చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. వీఐపీ, వీవీఐపీల దర్శనాలు నిర్ణీత వేళల్లోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం ఉత్సవాల పోస్టర్ను కలెక్టర్, ఇతర అధికారుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. -
జైలును సందర్శించిన డీఐజీ రవికిరణ్
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారాన్ని కోస్తాంధ్ర డీఐజీ ఎంఆర్ రవికిరణ్ మంగళవారం సందర్శించారు. ఇక్కడ జైల్ సూపరింటెండెంట్ ఎం.మహేష్బాబు, అధికారులతో కలసి జైల్లో ఖైదీలు ఉండే బేరక్లు, వంటశాల, ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా? వైద్య సేవలు సక్రమంగా అందు తున్నాయా? అని ఆరా తీశారు. ఖైదీలతో వారి బంధువులు మాట్లాడడానికి ఏర్పాటు చేసిన ములాఖత్ గదిని పరిశీలించారు. అనంతరం జైల్ రికార్డులు పరిశీలించి, సిబ్బంది పనితీరుపై ఆరా తీశా రు. ఖైదీల్లో మంచి మార్పు తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు. జైల్ అభివృద్ధి, విధి నిర్వహణలో సిబ్బందికి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జైల్లో డ్రగ్ డి–అడిక్షన్ సెంటర్లో తాత్కాలిక పోస్టుల కోసం జరిగిన ఇంటర్వ్యూలను పర్యవేక్షించారు. -
బీచ్రోడ్డులో డబుల్ డెక్కర్ ఓపెన్ టాప్ బస్
సాక్షి, విశాఖపట్నం: సాగర తీరంలో మరో డబుల్ డెక్కర్ బస్ చక్కర్లు కొట్టనుంది. ఇప్పటికే రెండు హిప్ హాప్ బస్సులు తీరంలో తిరుగుతుండగా... ఇప్పుడు మూడో బస్సును పర్యాటక శాఖ సిద్ధం చేసింది. మొదటి రెండు బస్సులతో పోలిస్తే ఇది ప్రత్యేకం. ఎందుకంటే ఇది ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నిధులతో ఏపీటీడీసీ ఈ బస్సును సిద్ధం చేసింది. త్వరలోనే జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పర్యాటకుల కోసం ఈ సరికొత్త ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సును ప్రారంభిస్తామని ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ జీవీబీ జగదీష్ తెలిపారు. -
పదోన్నతుల ‘సహకారం’
విశాఖ సిటీ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పదోన్నతుల వ్యవహారం అగ్గిరాజేస్తోంది. ఈ ప్రక్రియలో రూ.కోటి వరకు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంకులో కీలక వ్యక్తి సన్నిహితుడే మామూళ్ల తతంగాన్ని నడిపించారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. పదోన్నతులకు ఒక్కొక్కరి నుంచి పోస్టును బట్టి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు వరకు వసూలు చేసినట్లు సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)కి ప్రధాన కార్యాలయం కాకుండా మరో 33 బ్రాంచ్లు ఉన్నాయి. వీటిలో ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఒక డీజీఎం, నాలుగు ఏజీఎం, నాలుగు చీఫ్ మేనేజర్, ఆరు మేనేజర్, 12 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించాలని భావించారు. ఇందుకోసం బ్యాంక్ పర్సన్ ఇన్చార్జి, సీఈవో, ఆప్కాబ్ నుంచి జనరల్ మేనేజర్, ఆప్కాబ్ నామినేట్ చేసిన సబ్జెక్ట్ నిపుణుడు ఒకరు ఉన్నారు. ఈ బోర్డు ఆధ్వర్యంలో గత నెల 23, 24 తేదీల్లో ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు ఈ పదోన్నతులకు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో డీజీఎం పోస్టుకు ఒకరు, నాలుగు ఏజీఎం పోస్టులకు నలుగురు, నాలుగు చీఫ్ మేనేజర్ పోస్టులకు 18 మంది, ఆరు మేనేజర్ పోస్టులకు 20, 12 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 60 మంది పాల్గొన్నారు. ఉద్యోగి సర్వీస్కు 80, పనితీరుకు 10, ఇంటర్వ్యూలో మరో 10 మార్కులు కలిపి మొత్తంగా 100 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సర్వీసు మార్కులను పక్కనపెడితే, పనితీరుకు ఉద్యోగి పై అధికారి 10 మార్కులు, ఇంటర్వ్యూలో 10 మార్కులు దక్కించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే మతలబులు జరిగినట్లు ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. 20 మార్కుల్లోనే మతలబు 20 మార్కులు బోర్డు చేతుల్లో ఉండడంతో ఇక్కడే బేరసారాలు జరిగినట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. అడిగిన మొత్తం ఇవ్వని పక్షంలో పదోన్నతికి అవకాశం లేదని పలువురికి తెగేసి చెప్పారన్న వాదనలు ఉన్నాయి. పోస్టును బట్టి రూ.3 నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం బ్యాంకులో కీలక వ్యక్తి సన్నిహితుడు రంగంలోకి దిగి తెరవెనుక తతంగాన్ని నడిపారన్న టాక్ ఉంది. చీఫ్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు భారీగా డిమాండ్ ఉండడంతో వాటి కోసం పలువురు అడిగిన మొత్తాన్ని సమర్పించుకున్నట్లు చర్చ జరుగుతోంది. వారికే పదోన్నతులు కల్పిస్తూ గత నెల 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై పలువురు ఉద్యోగులు ఆప్కాబ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మెరిట్, రోస్టర్ ప్రకారమే పదోన్నతులు చేపట్టినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. -
జైల్లో తాత్కాలిక ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారం డ్రగ్ డి–అడిక్షన్ సెంటర్లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు ముగిశాయి. ఇటీవల ఇక్కడ ప్రాజెక్టు కోఆర్డినేటర్, ఆకౌంటెంట్ కం క్లర్క్, మనస్తత్వవేత్త/కౌన్సెలర్, సామాజిక కార్యకర్త, నర్సు(పురుష), వార్డ్ బాయ్, పీర్ ఎడ్యుకేటర్ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. 93 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సోమ, మంగళవారాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు జైల్ పర్యవేక్షణాధికారి ఎం.మహేష్బాబు తెలిపారు. ఎంపిక జాబితా త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈ నియామకాలకు జైల్ కోస్తాంధ్రా డీఐజీ ఎం.ఆర్.రవికిరణ్ చైర్మన్గా ప్రత్యేక కమిటీని నియమించినట్లు పేర్కొన్నారు. ఆయన పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు జరిగాయన్నారు. ఇంట ర్వ్యూలో కమిటీ చైర్మన్తో పాటు సభ్యులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్ పర్యవేక్షణాధికారి ఎస్.రాహుల్, విశాఖ కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎం.మహేష్బాబు, విశాఖ ప్రభుత్వ మానసిక వైద్యశాల పర్యవేక్షణాధికారి డాక్టర్ కె.వి.రామిరెడ్డి, ఏఎంసీ ప్రొఫెసర్ డాక్టర్ జి.వాసవి లత, జిల్లా సబ్జైల్ అధికారి జి.వెంకటరమణ పాల్గొన్నారు. -
విశాఖలో భూప్రకంపనలు
ఆరిలోవ/డాబాగార్డెన్స్/మధురవాడ/మల్కాపురం/తగరపువలస/మురళీనగర్: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వేకువజాము 4.20 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. దీన్ని నిద్రలో ఉన్నవారు గుర్తించలేకపోయినా.. ఇళ్లలో సామాన్లు కిందపడిన వారు అకస్మాత్తుగా నిద్రలేచి, భయాందోళన చెందారు. ఆరిలోవ కాలనీ, టీఐసీ పాయింట్, బాలాజీనగర్, రవీంద్రనగర్, ఆదర్శనగర్, విశాలాక్షినగర్, హనుమంతవాక, మధురవాడ పరిధి శివశక్తినగర్, శారదానగర్, సాయిరాం కాలనీ, వికలాంగుల కాలనీ పరిసర కొండవాలు ప్రాంతాలు, తగరపువలస, భీమిలి, ఆనందపురం, మురళీనగర్, మాధవధార, విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధి మహారాణిపేట, డాబాగార్డెన్స్, ఓల్డ్సిటీ, బీచ్రోడ్డు, అల్లిపురం, జ్ఞానాపురం, మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో గుర్తించగలిగే స్థాయిలో ఈ భూ ప్రకంపనలున్నట్లు అక్కడి ప్రజలు తెలిపారు. కార్తీకమాసం పూజలు, వాకింగ్, పాలప్యాకెట్ల కోసం అప్పటికే నిద్రలేచిన ప్రజలు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో మంచాలు, కబ్ బోర్డుల నుంచి వస్తువులు దొర్లిపడ్డ చోట మరింత ఆందోళన చెందారు. తమ వారిని నిద్రలేపి మరీ కొందరు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 3 నుంచి 10 సెకన్ల పాటు ఆయా ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ప్రజలు చెప్తున్నారు ఇద్దరు మహిళలకు గాయాలు భూ ప్రకంపనల సమయంలో జీవీఎంసీ రెండోవార్డు సంతపేటలో నందిక రమణ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గేటు రోడ్డుపై పడిపోవడంతో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. నగరంలో పలు ప్రాంతాల్లో కంపించిన భూమి -
సమన్వయంతో భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు
మహారాణిపేట : ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు అధికారులంతా సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీసీపీలు మేరీ ప్రశాంతి, లతామాధురి ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. ఇప్పటివరకు ఆయా శాఖల పరిధిలో జరిగిన పనులు, తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు. 9వ తేదీలోగా పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్కు అవకాశం లేదని తెలిపారు. ముఖ్యమంత్రితోపాటు, గవర్నర్, ఉప రాష్ట్రపతి కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యే అవకాశం ఉందని, అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. అన్ని రకాల సంస్కృతులను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి ప్రముఖులు విచ్చేస్తున్న క్రమంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉందని, దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం, సీఐఐ నుంచి సహకారం కావాలని పేర్కొన్నారు. అన్ని ప్రధాన కూడళ్లు, వేదికల వద్ద సీసీ టీవీ కెమెరాలు పెట్టాలని, డ్రోన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఫొటోతో కూడిన ఐడీ కార్డును ధరించాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే అతిథులు, ఇతర అధికారుల వివరాలను 10వ తేదీలోగా అందజేయాలని సీఐఐ ప్రతినిధులను కోరారు. భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పరిశీలన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పరిశీలించారు. మంగళవారం ఉదయం జేసీ కె.మయూర్ అశోక్తో కలిసి వేదిక వద్దకు వెళ్లిన ఆయన అక్కడ పరిస్థితులను గమనించారు. ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించి తగిన సూచనలు చేశారు. గ్రౌండ్ లెవెలింగ్, జంగిల్ క్లియరెన్స్, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, పార్కింగ్, ప్రవేశ ద్వారాలు, సుందరీకరణ, డ్రెయిన్ల నిర్వహణ తదితర ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
కన్ను!
దేవాలయ భూములపైప్రేమ సమాజానికి గతంలో దాతలు ఇచ్చిన భూములు రుషికొండలో 47.33 ఎకరాలు కూటమివిలువైన సింహాచలం భూములు ప్రైవేటు కంపెనీల పరం నగర శివారు భూములను దేవస్థానానికి ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రేమ సమాజం భూములనూ కాజేసేందుకు యత్నాలు టూరిజం ప్రాజెక్టుల పేరిట కొట్టేసేందుకు కుట్ర ఏసీఏకు 10 ఎకరాలు ఇవ్వాలంటూ కూటమి నేతల కుయుక్తులు సింహాచలం దేవస్థానానికి చెందిన భూములు అడవివరంలో 150 ఎకరాలు మధురవాడలో 107 ఎకరాలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఇప్పటివరకు ప్రైవేటు, ప్రభుత్వ భూములపై కన్నేసి కాజేస్తున్న కూటమి ప్రభుత్వం, నేతలు.. ఇప్పుడు దేవస్థానం భూములపై పడ్డారు. సింహాచలంతోపాటు ప్రేమ సమాజానికి చెందిన విలువైన భూములను ప్రాజెక్టుల పేరిట చేజిక్కించుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. సింహాచలం దేవస్థానానికి మధురవాడ, అడవివరంలో ఉన్న విలువైన భూములను తీసుకుని.. నగరానికి వెలుపల కాలుష్య ప్రభావిత భూములను దేవస్థానానికి అప్పగించేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా సింహాచలం దేవస్థానానికి చెందిన భూముల విలువను తక్కువగా లెక్కగట్టి.. అందుకు బదులుగా నగరానికి దూరంగా ఇచ్చే భూముల విలువను మాత్రం అధికంగా లెక్కకట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా చేస్తారంట...? వాస్తవానికి సింహాచలం దేవస్థానానికి మధురవాడలో 107 ఎకరాలు, అడవివరంలో 150 ఎకరాల భూమి ఉంది. ఇందులో మధురవాడలోని 107 ఎకరాల భూమిని గూగుల్ సంస్థకు, అడవివరంలోని 150 ఎకరాల భూమిని ఒక ప్రైవేటు హోటల్కు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు బదులుగా ఎక్కడో దూరంగా గాజువాక వద్ద ఉన్న భూములను ప్రత్యామ్నాయంగా ఇచ్చేందుకు ఇప్పటికే రెవెన్యూ వ్యవహారాలు ప్రారంభమయ్యాయి. ● మరోవైపు సేవా సంస్థ అయిన ప్రేమ సమాజానికి చెందిన భూములను కూడా వివిధ టూరిజం ప్రాజెక్టుల పేరిట చేజిక్కించుకునేందుకు కూటమి ఎమ్మెల్యేలు ప్రయత్నాలు షురూ చేశారు. అలాగే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కు 10 ఎకరాలు కావాలంటూ కూటమి నేతలు లేఖలతో అమరావతిలో కలియతిరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా దేవస్థానం భూములను లీజుకు ఇవ్వొచ్చంటూ తాజాగా ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల నేపథ్యంలో కూటమి నేతలు తమ ప్రయత్నాలను షురూ చేశారు. ప్రేమ సమాజం భూములపై ఎప్పటి నుంచో గురి..! ప్రేమ సమాజానికి దాతలు ఇచ్చిన 47.33 ఎకరాల భూమి రుషికొండలో ఉంది. ఇందులో 33 ఎకరాలకుపైగా గతంలోనే టీడీపీ నేతలు లీజుకు తీసుకున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రేమ సమాజం భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకించింది. ఇందుకు అనుగుణంగా సదరు ప్రైవేటు వ్యక్తికి అప్పగించిన భూముల లీజును రద్దు చేయడంతోపాటు ప్రేమ సమాజం భూములను సంస్థకే అప్పగించింది. నగరాల్లో ఉండే దేవస్థానాలకు చెందిన భూములను దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం అక్టోబరు 31న ఆదేశాలు జారీచేసింది. ఇందుకు అనుగుణంగా మరోసారి విలువైన ప్రేమ సమాజం భూములను రిసార్టు, టూరిజం పేరుతో చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఏసీఏకు 10 ఎకరాలు కావాలంటూ కూటమికే చెందిన మరో ఎమ్మెల్యే ఒక వినతిపత్రాన్ని కూడా ప్రభుత్వానికి సమర్పించినట్టు సమాచారం. మొత్తంగా రుషికొండలోని విలువైన భూములను చేజిక్కించుకునేందుకు పలు ప్రతిపాదనలతో కూటమి నేతలు కుయుక్తులు పన్నుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టూరిజం, గూగుల్ పేరుతో..! ఒకవైపు ప్రేమ సమాజం భూములను కూటమి నేతలు ప్రైవేటు వ్యక్తుల పేరుతో, టూరిజం ప్రాజెక్టుల పేరుతో చేజిక్కించుకునేందుకు యత్నిస్తుండగా.. సింహాచలానికి చెందిన అడవివరంలోని భూములను టూరిజం ప్రాజెక్టు పేరుతో ఓ హోటల్కు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. సింహాచలం దేవస్థానానికి చెందిన అడవివరంలోని 150 ఎకరాల భూమిని ఒక ప్రైవేటు హోటల్కు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. దీనికి ప్రతిగా దూరంగా ఉన్న భూములను దేవస్థానానికి అప్పగించేందుకు ఫైల్స్ సిద్ధమవుతున్నాయి. మధురవాడలో విలువైన 107 ఎకరాల భూమిని గూగుల్ సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు డేటా సెంటర్ పేరుతో తర్లువాడలోని పేద దళిత భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. వీటికి తోడు దేవస్థానం భూములను కూడా అప్పగించేందుకు సిద్ధమవుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
పెదగంట్యాడ: మండలంలోని పాత గంగవరం తీరంలో ఈ నెల 2న గల్లంతైన యువకుడి మృతదేహం అప్పికొండ తీరంలో మంగళవారం లభ్యమైంది. ఈ సంఘటనకు సంబంధించి న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు తెలిపిన వివరాలివి. ఒడిశాకు చెందిన బ్రహ్మానందం, తిరుపతి సాహు, భోళాశంకర్ సాహు, పెదగంట్యాడ మండలం సీతానగరానికి చెందిన రట్టి రూపక్ సాయి(22) గంగవరం పోర్టులో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ నెల 2న సాయంత్రం 5 గంటల సమయంలో పాత గంగవరం తీరానికి వెళ్లారు. అక్కడ మాధవస్వామి ఆలయం సమీపంలోని బీచ్ వ్యూ పాయింట్ రాళ్లపై ఎక్కి తీరంలోని అందాలను ఆస్వాదిస్తుండగా రూపక్సాయి అదుపుతప్పి సముద్రంలో పడిపోయాడు. మిగిలిన వారు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీనిపై సమాచారం అందుకున్న న్యూపోర్టు పోలీసులు రెండు రోజులుగా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ల సాయంతో జల్లెడ పట్టారు. మంగళవారం మధ్యాహ్నం అప్పికొండ తీరం సమీపంలో యువకుని మృతదేహాన్ని గుర్తించారు. పోస్టు మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. సీఐ కామేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
డాబాగార్డెన్స్: రోజూ యూనిఫాంతో తరగతులకు హాజరయ్యే విద్యార్థినులు సీతాకోక చిలుకల్ని మరిపించారు. చదువులోనే కాదు.. ఆటపాటల్లోనూ అందెవేసిన చేయంటూ ఉత్సాహానికే ఊపుతెచ్చారు. నగరంలోని సౌత్ జైల్ రోడ్డులో ఉన్న విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలు ఆద్యంతం ఉత్సాహాన్ని నింపాయి. నూతన బ్యాచ్ విద్యార్థులను స్వాగతిస్తూ సీనియర్ విద్యార్థులు నిర్వహించిన ఈ వేడుక ఆనందంగా సాగింది. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ మజ్జి భారతి పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మంజుల కళాశాల ప్రగతి, చరిత్రను వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఫ్రెషర్స్ను స్వాగతించడానికి సీనియర్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఉల్లాసభరితంగా సాగాయి. -
రైల్వే భవనాలను పునరుద్ధరించండి
మహారాణిపేట: బ్రిటిష్ కాలం నాటి రైల్వే భవనాలను అమృత్ భారత్ పథకం ద్వారా పునరుద్ధరించుకునే అవకాశం ఉందని, స్థానిక ఎంపీలను సమన్వయం చేసుకుంటూ వాల్తేర్ డివిజన్లో పనులు వేగవంతం చేయాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖలోని నోవోటెల్ హోటల్లో మంగళవారం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులు, రైల్వే అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇటీవల చేపట్టిన పనుల పురోగతి, పార్లమెంట్ సభ్యులు ఇదివరకే చెప్పిన సమస్యలు, వాటి ప్రస్తుత స్థితి గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ విశాఖపట్నం రైల్వే స్టేషన్ను ఐకానిక్ స్టేషన్గా తీర్చిదిద్దాలని.. ఇప్పటికే రూ.492.69 కోట్ల కేటాయింపులు జరిగినట్లు గుర్తు చేశారు. అతి త్వరలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయనగరం రైల్వే స్టేషన్పై కూడా కనెక్టివిటీ రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం నుంచి తిరుపతికి రైలు వేయాలి శ్రీకాకుళం నుంచి చర్లపల్లికి, శ్రీకాకుళం నుంచి తిరుపతికి నూతన ట్రైన్ సర్వీసుల ఆవశ్యకత ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. అరకు రైలుకు మరిన్ని కోచ్లను అనుసంధానం చేయాలని సూచించారు. ప్రస్తుత సందర్భాల్లో శబరిమల లాంటి ప్రాంతాలకు అధికంగా ప్రత్యేక రైళ్లను నడపాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులపై అసంతృప్తి అమృత్ భారత్ స్టేషన్ల్లో అభివృద్ధి పనుల ఆలస్యం పట్ల రామ్మోహన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని సూచించారు. సబ్ వేల నిర్మాణంలో నాణ్యతపై పలు ఆరోపణలు వస్తున్నట్టు పేర్కొన్నారు. నీటి నిల్వలు ఉండిపోవడం, పై నుంచి వాటర్ లీకేజీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తాం: గొల్ల బాబూరావు, తనూజారాణి సీనియర్ సిటిజన్లకు, స్పోర్ట్స్ పర్సన్లకు టికెట్ చార్జీలు తగ్గింపు కోసం ఇప్పటికే అనేక వినతులు అందాయని, ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్తానని రాజ్యసభ సభ్యుడు గొల్లబాబూరావు హామీ ఇచ్చారు. తన పార్లమెంట్ పరిధిలో పలు సమస్యలను అరకు ఎంపీ తనూజరాణి ప్రస్తావించారు. అరకుకు మరిన్ని రైళ్లు నడపాలని, ప్రస్తుతం అరకుకు ఉన్న రైళ్లకు కోచ్లు అదనంగా ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, రైల్వే అధికారులు సప్తగిరి శంకర్ ఉలక, మహేష్ కశ్యప్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యోగాల పేరిట దంపతులకు టోకరా
గాజువాక : ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువ దంపతులను కొంతమంది మోసం చేశారు. వారి నుంచి రూ.91 లక్షలు వసూలు చేసి అదృశ్యమయ్యారు. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు గాజువాక పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చట్టివానిపాలెం రోడ్లో నివాసముంటున్న సింగనం అలేఖ్య డయాలసిస్లో డిప్లొమా చేసి ప్రస్తుతం నర్సింగ్ చదువుతోంది. ఆమె భర్త వినాయకరావు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్నాడు. ఈ దంపతులకు మంచి ఉద్యోగం కావాలన్న ఆలోచన ఉంది. మల్కాపురం ప్రాంతానికి చెందిన వారి బంధువులు మచ్చ సజిని (గృహిణి), మచ్చ వెంకట నారాయణ (ట్రాన్స్పోర్టు సూపర్వైజర్) దంపతులు విశాఖ స్టీల్ప్లాంట్లో పర్మినెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. తాను స్టీల్ప్లాంట్లో కాంట్రాక్టరుగా పనిచేస్తున్నానని, తనకు మంచి పరిచయాలు ఉన్నాయని నారాయణ చెప్పాడు. ఒక్కో వ్యక్తికి రూ.50 లక్షల చొప్పున ఇస్తే ఏడాది కాలంలో ఉద్యోగం వస్తుందని, ఉద్యోగం వచ్చేవరకు డబ్బు చాలా భద్రంగా ఉంటుందని, అంతవరకు వడ్డీ కూడా ఇస్తామని పేర్కొన్నారు. అనంతరం వారికి పెదగంట్యాడకు చెందిన సీరపు షణ్ముఖ ఆదిత్యకుమార్(విద్యార్థి), సీరపు రామ్ ప్రసాద్ (జొమాటో డెలివరీ బాయ్), సీరపు అనిత (గృహిణి)లను పరిచయం చేశారు. వారిని నమ్మిన అలేఖ్య దంపతులు తమ వద్ద ఉన్న డబ్బుతోపాటు తమ బంధువుల వద్ద అప్పుచేసిన డబ్బుతో కలిపి రూ.91,36,500ను వారికి ఇచ్చారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఆగస్టు మధ్యకాలంలో ఈ డబ్బును నిందితులకు అందజేశారు, అందులో సజినికి రూ.19.80 లక్షలు, నారాయణకు రూ.6.02 లక్షలు, షణ్ముఖకు రూ.15.02 లక్షలు, రామ్ ప్రసాద్కు రూ.6,43,500, అనితకు రూ.6.96 లక్షలను నగదు, ఫోన్పే, బ్యాంక్ ట్రాన్స్ఫర్, సీడీఎం మెషీన్ డిపాజిట్ ద్వారా చెల్లించారు. డబ్బులు తీసుకున్న నిందితులు తొలుత బాధితులతో బాగానే మాట్లాడేవారు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో వారు ఒత్తిడి చేస్తుండటంతో ఏవో సాకులు చెప్పి వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు 2024 ఆగస్టులో మరోసారి రూ.30 వేలు తీసుకున్న తర్వాత అందరూ తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసి అదృశ్యమయ్యారు. దీంతో తాము మోసపోయామని భావించిన అలేఖ్య దంపతులు గాజువాక పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకున్నారు. సీఐ ఎ.పార్థసారధి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు ఈ ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో సజిని పెదగంట్యాడలో రెండు ఇళ్లను, నారాయణ ఐదు లారీ ట్రాలర్లు కొనుగోలు చేసినట్టు, మిగిలినవారు ఆస్తులు కొనడంలో సహాయం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇంకా ఈ కేసులో ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని సీఐ పార్థసారధి ఈ సందర్భంగా తెలిపారు. తాము మోసం చేసినట్టు అరెస్టయిన నిందితులు ఒప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు. -
కూటమి పాలనలో.. వినికిడి సమస్య!
శస్త్రచికిత్స కోసం నిరీక్షిస్తున్న చిన్నారులు హేమవర్షిత్, టి.కన్నారావు మహారాణిపేట: వినికిడి సమస్య ఉన్న రోగుల పాలిట గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వరంగా మారిన కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను కూటమి ప్రభుత్వం మూలకు చేర్చింది. నాలుగు మాసాలుగా ఈ పరికరాల సరఫరా లేకపోవడంతో ఈఎన్టీ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక బాధిత చిన్నారులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ కొందరు అర్హత కొల్పొయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఘనం ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రంగా ఉన్న చెవి, ముక్కు, గొంతు(ఈఎన్టీ) ప్రభుత్వ ఇక్కడ ఆస్పత్రికి ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా రోగులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. 30–50 వరకు ఓపీ ఉంటుంది. ఇక్కడ డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో అనేక శస్త్ర చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలో చేశారు. ఒక్కో రోగి కోసం రూ.10 లక్షలు ఖర్చయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలూ నిర్వహించారు. బాధిత చిన్నారులు పైసా ఖర్చు లేకుండానే వినికిడి సామర్థ్యం పొందారు. ఇప్పుడిదంతా గతం. నాలుగు నెలలుగా నిరీక్షణ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అన్ని రకాల శస్త్ర చికిత్సలకు అంతరాయం కలుగుతోంది. నాలుగు నెలలుగా వినికిడి సమస్యతో బాధపడే చిన్నారులకు నిర్వహించే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు నిలిచిపోయాయి. ఈ పరికరాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రావడం, వాటిని అమర్చేందుకు వైద్యులు శస్త్ర చికిత్సలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ పరికరాల కొనుగోలుకు అనుమతులు రాకపోవడంతో చికిత్సలు నిలిపేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 9 మంది చిన్నారులు ఈ శస్త్ర చికిత్సల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. చిన్నతనంలోనే చికిత్స చేయాలి పుట్టుకతోనే చెవిటి, మూగతో బాధపడుతున్న చిన్నారులకు ఆత్యాధునిక శస్త్ర చికిత్స విధానం ఇప్పుడు ఈఎన్టీ ఆస్పత్రిలో చేస్తున్నారు. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చిన్నతనంలో చేయాలి. మూడేళ్ల లోపు చిన్నారులకు ఈ శస్త్ర చికిత్స చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నాలుగేళ్లు దాటాక కొందరు, ఐదేళ్ల తర్వాత మరికొందరు గుర్తించగలుతున్నారు. చిన్నారులకు వివిధ రకాల పరీక్షలు చేసి, వారు శస్త్రచికిత్సకు అర్హులు అని నిర్ధారించేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఈలోగా వయస్సు ఐదేళ్లు దాటిపోతే ఒక్కోసారి ఈ చికిత్స విజయవంతం కాదని వైద్యులు చెప్తున్నారు. దీంతో చాలా మంది చిన్నారుల వయస్సు దాటి పోతోందని, దీనిపై ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసి త్వరగా అనుమతులు ఇవ్వాలని తల్లిదండ్రులు, వైద్యులు కోరుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పలు పథకాల పట్ల కూటమి ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోంది. పేద ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే ఆరోగ్యశ్రీతో ఇన్నాళ్లూ ఆటాడుకుంది. అంతకు ముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు సమ్మె బాట పడితే తప్ప, వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు పుట్టుక నుంచే వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను నిలిపేసి.. తమకు ప్రజల ఆకాంక్షలేవీ కనబడవు.. వినబడవని నిరూపించుకుంటోంది. -
కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం
మధురవాడ: నగరంలో చోటుచేసుక్ను సమతా కాలేజీ విద్యార్థి ఆత్మహత్య సంఘటన మరువక ముందే మధురవాడలో ఓ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం కారణంగా విద్యార్థి అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం గారే నందిగాం ప్రాంతానికి చెందిన పోతిన సుమంత్(17)మారికవలస భగీరథ క్యాంపస్ చైత్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఉదయం తండ్రితో ఫోన్లో మాట్లాడిన సుమంత్ను సాయంత్రం చూడ్డానికి వచ్చిన తండ్రికి.. మీ కుమారుడు కనిపించట్లేదంటూ.. యాజమాన్యం చెప్పిన వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. వెంటనే విద్యార్థి బంధువులు పీఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. ఇదిలా ఉండగా కాలేజీ సమీంలోని మెట్రోమాల్ గోడపై దాగిఉన్న సుమంత్ను గుర్తించి, బంధువులు కాపాడి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే.. కళాశాలలో ఉండాల్సిన విద్యార్థి బయటకు రాగలిగాడని, కాలేజీకి వెళ్లే వరకూ తమకు ఆ విషయం చెప్పకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి మిస్సింగ్ను గమనించని శ్రీచైతన్య యాజమాన్యం -
10 నుంచి పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నీ
విశాఖ స్పోర్ట్స్: విశాఖ వేదికగా జరగనున్న 40వ అఖిల భారత అంతర సర్కిళ్ల పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నీ లోగో, టీజర్ను విశాఖ ప్రాంతీయ పోస్ట్మాస్టర్ జనరల్ వి.ఎస్.జయశంకర్ విడుదల చేశారు. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు ఎంవీపీ కాలనీలోని ఎస్–3 స్పోర్ట్స్ ఎరీనాలో ఈ పోటీలు జరగనున్నాయి. దేశంలోని 14 పోస్టల్ సర్కిళ్లకు చెందిన 121 మంది మెన్, వుమెన్తో పాటు వెటరన్స్ పోటీల్లో పాల్గొనున్నారు. మెన్, వుమెన్కు సింగిల్స్తో పాటు డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ పోటీలు నిర్వహించనుండగా వెటరన్స్ కోసం ప్రత్యేక కేటగిరిలో పోటీలు జరగనున్నాయి. గతేడాది గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జరిగిన పోటీల్లో పశ్చిమ బెంగాల్ జట్లు ఓవరాల్ చాంపియన్షిప్ను సొంతం చేసుకున్నాయి. సోమవారం విశాఖలోని పోస్టల్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ సూపరింటెండెంట్ ఎన్.వి.ఎస్.ఎస్.రాజు, డిప్యూటీ సూపరింటెండెంట్ కోమల్కుమార్, ఆసిస్టెంట్ డైరెక్టర్ కెవిడి సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టణ ప్రణాళికా విభాగానికి అత్యధిక వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికే ఫిర్యాదులు అందాయి. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తితో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు.137 వినతులు రాగా వీటిలో పట్టణ ప్రణాళికా విభాగానికి 58 వినతులు రావడం విశేషం. అలాగే జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 7, రెవెన్యూ సెక్షన్కు 13, ప్రజారోగ్య విభాగానికి 8, ఇంజినీరింగ్ విభాగానికి 26, మొక్కల విభాగానికి 7, యూసీడీ విభాగానికి 18 ఫిర్యాదులు వచ్చాయి. అందిన ఫిర్యాదులు పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సంబందిత అధికారులను మేయర్ ఆదేశించారు. కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, ఫైనాన్సర్ అడ్వైజర్ మల్లికాంబ, సీసీపీ ప్రభాకరరావు, పర్యవేక్షక ఇంజినీర్లు కె.శ్రీనివాసరావు, సంపత్కుమార్, ఏడుకొండలు, డీసీఆర్ శ్రీనివాసరావు, కార్యనిర్వాహక ఇంజినీర్లు, ఇతర అఽధికారులు పాల్గొన్నారు. -
సేవతోనే మానవ జన్మసార్థకం
కొమ్మాది: సేవతోనే మనిషి జన్మకు సార్థకత చేకూరుతుందని.. అలాంటిది ఎన్నో సేవలు చేసిన లయన్స్ ఇంటర్నేషనల్ సేవలు ఎంతో గొప్పవని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. సోమవారం సాగర్నగర్లో గల రాడిసన్బ్లూలో లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఫోర్బ్స్ వి సర్వ్ ఇండియా సీజన్–2 పశ్చిమ, దక్షిణ జోన్ల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 550 మంది కాళ్లు లేని వారికి కృత్రిమ కాళ్లను లయన్స్ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సామాజిక సేవలో లయన్స్ ఇంటర్నేషనల్ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. శక్తికి మించిన సేవలు అందిస్తుందని కొనియాడారు. లయన్స్ క్లబ్కు కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. తాను మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి నని, ఆర్ఎస్ఎస్లో చేరి ఈ దేశానికి మంచి జరుగుతుందనే నమ్మకంతో రాజకీయంలోకి వచ్చానని తెలిపారు. అనంతరం విద్య, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారిత, పర్యావరణం, హెల్త్కేర్ రంగాలకు చెందిన విజేతలకు అవార్డులను ఆయన ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సుభాష్బాబు, విఘ్నేష్ విజయ్రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రమట్టి దిబ్బల విస్తీర్ణంపై సర్వే
భీమునిపట్నం : బీచ్రోడ్డులోని ఎర్రమట్టి దిబ్బల విస్తీర్ణం ఎంతవరకు ఉందన్న దానిపై సోమవారం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారితో కలిసి ఆర్డీవో సంగీత్ మాథూర్ పర్యవేక్షణలో అధికారులు సర్వే నిర్వహించారు. ఈ ప్రాంతంలో మొత్తం 1,400 ఎకరాల మేరకు ఎర్రమట్టి దిబ్బలు విస్తీర్ణం ఉండగా ఇప్పుడు ఏవిధంగా ఉన్నాయి.. వాటి సరిహద్దులను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. ఈ సర్వే ద్వారా పూర్తి స్థాయిలో ఎర్రమట్టిదిబ్బల సరిహద్దులు గుర్తించడం వల్ల.. ఇకపై వీటిని కూల్చివేత జరగకుండా అధికారులు తగిన చర్యలను తీసుకోవడానికి వీలవుతుంది. ఇందులో తహసీల్దారు రామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
దారికి రాని ‘రెవెన్యూ’
మహారాణిపేట: ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ శాఖకు సంబంధించిన వినతులే అధికంగా వస్తున్నా, వాటి పరిష్కారం ఆలస్యం అవుతుండటంపై కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిర్యాదులు తగ్గకపోవడం, ఆర్జీదారులు మళ్లీ మళ్లీ వస్తుండటంతో, కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు తహసీల్దార్లకు ఫోన్ చేసి ప్రశ్నిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 413 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 148 ఉండడం గమనార్హం. జీవీఎంసీకి 126, పోలీసు శాఖకు 32, ఇతర విభాగాలకు 107 వినతులు వచ్చాయి. సమస్యల పరిష్కారంలో భాగంగా, ఫిర్యాదుదారులతో సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారులే నేరుగా మాట్లాడాలని, దిగువ స్థాయి సిబ్బంది మాట్లాడటానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. తూతూమంత్రంగా కాకుండా, ప్రతీ ఫిర్యాదుదారుతో అధికారులు తప్పకుండా మాట్లాడాల్సిందేనని ఆయన ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో నాణ్యతపై విచారణ జరపాలి జీవీఎంసీ పరిధిలోని 53వ వార్డులో జరుగుతున్న రోడ్లు, కాలువలు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనుల్లో తీవ్రమైన నాణ్యత లోపం ఉంది. దీనికి కొంత మంది అధికారుల నిర్లక్ష్యమే కారణం. ఈ విషయంపై ఆగస్టు 4, 11 తేదీల్లో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశా..ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. దీనివల్ల పీజీఆర్ఎస్పై ప్రజలకు నమ్మకం పోతోంది. నాణ్యత లోపంపై కలెక్టర్ చొరవ తీసుకొని విచారణ జరిపించాలి. –షేక్ బాబ్జీ, ఉత్తర నియోజకవర్గ సమాచార హక్కు చట్టం అధ్యక్షుడు నా ఇల్లు కబ్జా చేయాలని చూస్తున్నారు మధురవాడ శివశక్తి నగర్లో 30 ఏళ్లుగా ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న నా ఇంటిని కబ్జా చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇంటిని కూల్చివేసి, ఇసుక వేసి బయటకు రానివ్వకుండా చేస్తున్నారు. ఒంటరిగా ఉంటున్నందున భయంతో బతుకుతున్నాను. ఈ విషయంలో గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. వైఎస్సార్సిపి ఇంటెలెక్చువల్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు దేవరకొండ మార్కెండేయులు చొరవతో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ స్పందించి, న్యాయం చేయాలి. –షేక్ మదీనా బీబీ, శివశక్తి నగర్, మధురవాడ -
గూగుల్ డేటాకు భూ కేటాయింపులు రద్దు చేయాలి
మహారాణిపేట: గూగుల్ డేటా సెంటర్కు 480 ఎకరాల భూమి కేటాయింపును సీపీఐ వ్యతిరేకించింది. ఈ మేరకు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ సోమవారం కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో పర్యావరణం దెబ్బతిని, నీరు, విద్యుత్ కొరత ఏర్పడుతుందని, అందువల్ల ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన కోరారు. గతంలో ఖాళీగా ఉన్న 400 ఎకరాలను ఈ సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే పెదగంట్యాడ ఏరియాలో ఏర్పాటు చేయనున్న అదాని అంబుజా సిమెంట్ గ్రేడింగ్ ఫ్యాక్టరీ ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తాయని, ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణలో దీనిని అడ్డుకున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీపీఐ గాజువాక నియోజకవర్గం కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ ,పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.మన్మథరావు, ఆర్ శ్రీనివాసరావు, ఎండి బేగం, ఎన్. నాగభూషణరావు. వనజాక్షి తదితరులు పాల్గొన్నారు. -
పైసా విదిల్చలే..!
పార్టనర్షిప్ సమ్మిట్కు నిధుల వేట ప్రభుత్వం నుంచి పైసా రాకపోవడంతో తలలు పట్టుకుంటున్న అధికారులుసాక్షి, విశాఖపట్నం : ప్రజాధనాన్ని దుర్వినియోగం చెయ్యడం.. భారీ కార్యక్రమాన్ని నిర్వహించి.. రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని బాకాలు ఊదడం.. తర్వాత చూస్తే.. ఏ ఒక్క ప్రాజెక్టూ క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం.. తెలుగుదేశం అధికారంలో ఉన్న ప్రతిసారీ జరిగే తంతే ఇది. పావలా కోడికి.. రూపాయి మసాలా అన్నట్లుగా.. భారీ ఏర్పాట్లతో ప్రచారార్భాటం కోసం.. జిల్లాలో ఉన్న ప్రభుత్వ నిధులన్నింటినీ ఊడ్చే కార్యక్రమాలు మళ్లీ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. మొన్న జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసమే అన్ని ప్రభుత్వ విభాగాలూ.. తమ ఖజానానికి ఖాళీ చేసెయ్యగా.. ఇప్పుడు మరోసారి నిధులు మీరు పెట్టండి.. మేం చూసుకుంటామంటూ ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 17 నెలల్లోనే రూ.100 కోట్లకు పైగా ఖర్చు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అండ్ కో తమ ప్రచారం కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వినియోగిస్తుండటంతో జిల్లా ఖజానా రోజురోజుకీ ఖాళీ అయిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లోనే జిల్లాకు చెందిన రూ.100 కోట్లకు పైగా ప్రజాధనాన్ని తమ ప్రచార యావ కోసం ఖర్చు పెట్టించింది. దీంతో జిల్లాలో జరగాల్సిన అభివృద్ధి పనులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు మరోసారి పార్టనర్షిప్ సమ్మిట్ పేరుతో ప్రచార బాకాలు ఊదరగొట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే పనులు ప్రారంభించాలంటూ అధికారులకు ఆదేశాలివ్వడం.. ప్రతి రెండు మూడు రోజులకోసారి సమీక్షలు నిర్వహించి.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించడమే తప్ప.. దీనికి ఎంత ఖర్చు అవుతుంది..? నిధులు ఉన్నాయా లేవా.? నిధులు మంజూరు చేయాలా అనే విషయాలపై మాత్రం కూటమి సర్కార్ కనీసం మాట్లాడటం లేదు. దీంతో ఇదెక్కడి ప్రచార బాధరా భగవంతుడా అంటూ ఉన్నతాధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. రూ.100 కోట్ల వరకు బకాయిలు ఈ నెల 14,15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉండగా.. ఆ ఊసే తేవడం లేదు. గతంలో జరిగిన వివిధ కార్యక్రమాలకు సంబంధించి రూ.100 కోట్ల వరకు ప్రభుత్వం వద్ద బకాయిలుండగా.. ఈ సమ్మిట్ విశాఖ జిల్లాకు గుదిబండగా మారుతోందని.. అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రతి కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించడం.. తర్వాత నిధులిచ్చేందుకు నిరాకరించడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయింది. తలో చెయ్యి వేయాల్సిందే..! ఇటీవల మంత్రులు, ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగంతో పార్టనర్షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. నిధుల విషయం జిల్లా ఉన్నతాధికారులు ప్రస్తావించగా.. నిధుల గురించి ప్రస్తావన తీసుకురావద్దన్నట్లుగా తెలుస్తోంది. ఉన్న నిధుల్ని ఖర్చు చేసి ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆదేశించినట్లు సమాచారం. రెవెన్యూ విభాగంలో నిధులతో పాటు ఇతర విభాగాల్లో ఉన్న నిధులను కూడా వాడుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీవీఎంసీ రూ.40 కోట్ల వరకూ ఖర్చు చేస్తుండగా.. వీఎంఆర్డీఏ, కమర్షియల్ ట్యాక్స్, టూరిజం, పౌరసరఫరాలు, పరిశ్రమల శాఖలతో పాటు.. ఇతర విభాగాల నుంచి కూడా నిధులు ఈ ఏర్పాట్ల కోసం అనధికారికంగా ఖర్చు చేయాలంటూ హుకుం జారీ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. అయితే.. పర్యాటక శాఖ తమ ఖజానాలో రూ.లక్ష కూడా లేవని చెప్పడంతో సంబంధిత మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ముఖ్యమైన పరిశ్రమలు, సంస్థల నుంచి నిధులు సమీకరించాలంటూ పరిశ్రమలు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు సలహాలిచ్చారని సమాచారం. -
18 చోరీల కేసుల్లో నిందితుడి అరెస్టు
గాజువాక : ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని గాజువాక క్రైం పోలీసులు సోమ వారం అరెస్టు చేశారు. అతడి నుంచి 500 గ్రాముల వెండి వస్తువులు, నేరానికి ఉపయోగించిన రెండు ఐరన్ రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాకలోని కై లాసనగర్లో నివాసముంటున్న రాంబుద్ధి వేణు గాజువాక హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గతనెల 24న ఒడిశాలో ఒక వివాహం నిమిత్తం కుటుంబంతో సహా వెళ్లారు. అయితే, వారి ఇంటి తాళాలు విరగ్గొట్టి ఉన్నాయని పక్కింటివారు 26వ తేదీన ఆయనకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. 27వ తేదీన తిరిగి వచ్చిన ఆయన ఇంటి మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి ఉండటం గుర్తించాడు. ఇంటి లోపల బీరువా, లాకరు తెరిచి ఉండగా..అందులోని 500 గ్రాముల వెండి వస్తువులు కనిపించడంలేదని గాజువాక క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు క్రైం డీసీపీ లతా మాధురి ఆధ్వర్యంలో సీఐ కె.శ్రీనివాసరావు,ఎస్ఐ రుక్మంగధరరావు కేసు దర్యాప్తు ప్రారంభించారు. పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన గణేష్ అలియాస్ బొండాలోడు ఈ దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించి సోమవారం రిమాండ్కు తరలించారు. కాగా, నిందితుడిపై గాజువాక, దువ్వాడ, న్యూపోర్టు, మల్కాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే 18 కేసులున్నట్టు క్రైం సీఐ తెలిపారు. -
డ్రగ్స్ కేసులో ముగ్గురు విద్యార్థుల అరెస్ట్
విశాఖ సిటీ : విశాఖలో టాస్క్ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ పట్టుకుని, ముగ్గురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 48 ఎల్ఎస్డీ బ్లాట్స్ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీసీపీ (లా అండ్ ఆర్డర్) మేరీప్రశాంతి ఈ కేసు వివరాలు తెలిపారు. ఆమె తెలిపిన మేరకు.. మద్దిలపాలెం చైతన్యనగర్లో నివాసముంటున్న పులగం కొండారెడ్డి ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతడికి అనకాపల్లిలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మురాడ గీత్చరణ్, శ్రీకాకుళం జిల్లా బాలాజీ టెంపుల్ ప్రాంతానికి చెందిన తంగి హర్షవర్ధన్నాయుడు స్నేహితులు. వీరు ముగ్గురు మద్యం, మత్తు పదార్థాలకు అలవాటుపడ్డారు. బెంగళూరులోని హర్షవర్ధన్నాయుడి స్నేహితుడు సంథన్ నుంచి ఎల్ఎస్డీ బ్లాట్స్ను తీసుకురావాలని గీత్చరణ్కి సూచించిన కొండారెడ్డి ఇటునుంచి విమానం, అటునుంచి రైలు టికెట్లు సమకూర్చాడు. గీత్చరణ్ అక్టోబర్ 31న విశాఖ నుంచి విమానంలో బెంగళూరు వెళ్లాడు. ఈ నెల 1వ తేదీన కొండారెడ్డి తన స్నేహితుడు డొంక గణేష్ ఫోన్పే ద్వారా సంథన్కు రూ.25 వేలు పంపించాడు. ఈ డబ్బుతో సంథన్ 50 ఎల్ఎస్డీ బ్లాట్స్ను కొనుగోలు చేసి, వాటిలో 48 బ్లాట్స్ను గీత్చరణ్కు ఇచ్చాడు. ఆ బ్లాట్స్తో అదేరోజు బెంగళూరు నుంచి రైలులో బయలుదేరిన గీత్చరణ్ ఆదివారం విశాఖ చేరుకున్నాడు. ఈ డ్రగ్స్ రవాణా గురించి సమాచారం అందటంతో టాస్క్ఫోర్స్, ఈగల్ పోలీసులు రైల్వేస్టేషన్ వద్ద నిఘా పెట్టారు. కొండారెడ్డి.. హర్షవర్ధన్నాయుడుతో కలిసి గీత్చరణ్ వద్దకు వెళ్లి ఎల్ఎస్డీ బ్లాట్స్ను తీసుకుంటున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 48 ఎల్ఎస్డీ బ్లాట్స్తో పాటు మూడు మొబైల్స్, ఓలా ఎలక్ట్రిక్ స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఎల్ఎస్డీ బ్లాట్స్ ఇచ్చిన సంథన్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఎవరెవరిపాత్ర ఉందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. -
వేర్వేరు సంఘటనల్లో 14 కేజీల గంజాయి స్వాధీనం
తాటిచెట్లపాలెం: గవర్నమెంట్ రైల్వే పోలీసులు, రైల్వే భద్రతా దళం సంయుక్తంగా రైల్వే స్టేషన్లో నిర్వహించిన తనిఖీలలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ఆర్పీఎఫ్ ఎస్ఐలు మమత, అనిల్కుమార్ సిబ్బందితో కలిసి ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన వికాస్, ఒడిశాకు చెందిన జగన్ మాఝీల లగేజీలలో నాలుగు కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గవర్నమెంట్ రైల్వే పోలీసులకు అప్పగించినట్లు ఆర్పీఎఫ్ సిబ్బంది తెలిపారు. మరో ఘటనలో విశాఖ రైల్వే స్టేషన్లో జీఆర్పీ ఇన్స్పెక్టర్ సీహెచ్ ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో జీఆర్పీ ఎస్సై కేటీఆర్ లక్ష్మి, ఆర్పీఎఫ్ ఎస్సై ఓ మిసీ్త్రలు తమ సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో పశ్చిమ బెంగాల్కు చెందిన రకుల్ ఎస్కే, ఒడిశాకు చెందిన కార్తీక్ కిల్లో..విశాఖ మీదుగా కేరళకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వీరి నుంచి 10కిలోల గంజాయి స్వాధీనం చేసుకొన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్టు జీఆర్పీ పోలీసులు తెలిపారు. -
పుట్టినరోజు వేడుకకు వెళ్తూ..
యలమంచిలి రూరల్: మితిమీరిన వేగం, ఆపై లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో రాంగ్రూట్లోకి వచ్చిన మినీ వ్యాన్ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరో 16 మంది గాయపడ్డారు. ఈ సంఘటన యలమంచిలి సమీపంలో కొక్కిరాపల్లి ప్రేమ సమాజం దగ్గర 16వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 10.20 గంటలకు చోటు చేసుకుంది. బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి ఆనందంగా వెళ్తున్న ఓ కుటుంబానికి ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గాజువాకలోని శ్రీహరిపురానికి చెందిన 8 మంది (ఏపీ 39 జీఎక్స్ 3891) మినీ వ్యాన్(టాటా మేజిక్)లో కాకినాడ జిల్లా పిఠాపురంలో బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడుకకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో యలమంచిలి మండలం కొక్కిరాపల్లి హైవే కూడలి వద్ద ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో మినీవ్యాన్ను ఎడమ పక్కగా రాంగ్రూట్లోకి డ్రైవర్ నడిపాడు. దాంతో అక్కడే రోడ్డు పక్క ఆగి ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో పెద్ద శబ్దం రావడం, ఆటో, మినీ వ్యాన్లో ప్రయాణికులు కేకలు వేయడంతో ఒక్కసారిగా ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. మినీ వ్యాన్ ముందుభాగం నుజ్జయింది. ఆటో రోడ్డు పక్కగా బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణికులంతా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా అనకాపల్లి నుంచి తుని వైపు ప్రయాణించే వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. హైవే నిర్వహణ సంస్థ సిబ్బంది అక్కడకు చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్తో పక్కకు తొలగించారు. మితిమీరిన వేగం వల్లే ప్రమాదంగా నిర్ధారణ ప్రమాదం జరిగిన వెంటనే యలమంచిలి సీఐ ధనుంజయరావు, యలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర స్పందించి క్షతగాత్రులను హుటాహుటిన హైవే అంబులెన్సులు, ఇతర వాహనాల్లో ఆస్పత్రులకు తరలించారు. యలమంచిలి సీహెచ్సీ వైద్యాధికారి నిహారిక, వైద్య సిబ్బంది క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించి మెరుగైన చికిత్స అవసరమైన వారిని అంబులెన్సుల్లో అనకాపల్లి, విశాఖ ఆస్పత్రులకు రిఫర్ చేశారు. మినీ వ్యాన్(టాటా మేజిక్) డ్రైవర్ మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన గొంది పెంటయ్య, బాదంపూడి లక్ష్మి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి ప్రమాద సమయంలో ఆటోలో పది మంది, మినీ వ్యాన్లో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఆటోలో ఉన్న కశింకోట మండలం తీడ గ్రాామానికి చెందిన గొంది పెంటయ్య(56), నర్సీపట్నంలో ధర్మిరెడ్డి వీధికి చెందిన బాదంపూడి లక్ష్మి(65) చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందారు. -
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి
మహారాణిపేట: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించి, సమాజ సేవకు అంకితం కావాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆకాంక్షించారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో సోమవారం వైద్య విద్యార్థుల ‘ఫ్రెషర్స్ డే’ ఉల్లాసంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఫ్రెషర్స్ డే విద్యార్థులకు కొత్త విద్యా ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. వైద్య విద్యార్థులు బాధ్యత, సేవ, సమగ్రతతో కూడిన విలువలను పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవాలన్నారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎస్ఎం సంధ్యాదేవి మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో కరుణ, క్రమశిక్షణ, విద్యా నైపుణ్యం విలువలను తప్పక నిలబెట్టుకోవాలని కోరారు. ఈ వేడుక సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రముఖులను ఘనంగా సన్మానించారు. అలాగే అధ్యాపకులకు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. ప్రత్యేకంగా 25వ బ్యాచ్కు చెందిన 250 మంది కొత్త విద్యార్థులకు స్వాగతం పలికే విధంగా ప్రత్యేక బహుమతులు అందజేశారు. చివరగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి, ఏఎంసీ వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి. మన్మథరరావు, డాక్టర్ వి. రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ ఎ. కృష్ణవేణి, సాంస్కృతిక ఉపాధ్యక్షురాలు డాక్టర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
వందేభారత్ రైళ్ల గందరగోళం
తాటిచెట్లపాలెం: వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ఆలస్యం, గందరగోళం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. వేగంగా, సౌకర్యవంతంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆశించే ప్రయాణికులు ప్రస్తుతం రైళ్ల ఆలస్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నుంచి సోమవారం ఉదయం బయల్దేరాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ తీవ్ర ఆలస్యంగా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత బయల్దేరింది. అదే సమయంలో సికింద్రాబాద్ నుంచి వచ్చి, సికింద్రాబాద్కు తిరిగి వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ కూడా స్టేషన్కు చేరుకోవడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. రెండు వందేభారత్ ఎక్స్ప్రెస్లు ఒకేసారి ప్లాట్ఫాం నంబర్ 1 , 8 లపై ఉండడం వల్ల, ఉదయం బయల్దేరవలసిన రైలు ఏది, మధ్యాహ్నం బయల్దేరవలసిన రైలు ఏదో తెలియక ప్రయాణికులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. ఆలస్యం గురించి సమాచారం ఉన్నప్పటికీ, రెండు రైళ్లు దాదాపు ఒకే సమయంలో బయల్దేరడంతో ప్రయాణికులు తికమకపడ్డారు. కొందరు ప్రయాణికులు ఉదయం వెళ్లాల్సిన రైలుకు బదులుగా మధ్యాహ్నం వెళ్లాల్సిన రైలు ఎక్కారు. తర్వాత పొరపాటు తెలుసుకుని పరుగు పరుగున 8వ నంబర్ ప్లాట్ఫాంకు చేరుకుని, రీ–షెడ్యూల్ చేసిన ఉదయం బయల్దేరవలసిన రైలు ఎక్కవలసి వచ్చింది. ముఖ్యంగా విశాఖ–సికింద్రాబాద్–విశాఖపట్నం (20833/20834) వందేభారత్ ఎక్స్ప్రెస్ తరచుగా ఆలస్యంగా నడవడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను నివారించడానికి, రైల్వే అధికారులు జోక్యం చేసుకుని, అవసరమైతే ఒక రోజు రైలును రద్దు చేసి అయినా సరే, మిగిలిన రోజులలో సరైన సమయానికి రైలు బయల్దేరేలా చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
గంజాయి వ్యాపారాన్ని ఉగ్రవాదంగా భావిస్తాం
మధురవాడ: గంజాయి వ్యాపారాన్ని ఉగ్రవాదంగా భావిస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. విశాఖ సమీపంలోని కాపులుప్పాడ జీవీఎంసీ డంపింగ్ యార్డులో సుమారు రూ 5.21 కోట్లు విలువచేసే పదివేల కిలోల గంజాయి, 19 లీటర్ల హాసిస్ ఆయిల్ను దహనం చేసే కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. గంజాయిని అరికట్టడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. గంజాయి కేసుల్లో అరెస్టయినవారి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నామని తెలిపారు. సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. గంజాయి కేసుల్లో 1,435 మందిని అరెస్ట్ చేశామని అందులో విశాఖకు చెందివారు 712 మంది కాగా 332 మంది పలు జిల్లాలకు చెందిన వారున్నారు. మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందినవారని తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు ఎనిమిది చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 14వేల వరకు సీపీ కెమెరాలను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయిపై 1972 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈగల్ ఐజీ రవికృష్ణ, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు. -
ప్రజాభిప్రాయంతో కూటమికి కనువిప్పు
సీతంపేట: కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మండిపడ్డారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ కార్పొరేటర్ మువ్వల పోలారావు ఆధ్వర్యంలో జీవీఎంసీ 25వ వార్డు గురుద్వారా కూడలి సమీపంలో ‘రచ్చబండ– కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం జరిగింది. కె.కె.రాజు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, యువత, మేధావుల నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నాయ కులు ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక ప్రజల ఆస్తులను, రాష్ట్ర సంపదను పప్పుబెల్లంలా చంద్రబాబు వెనుక ఉన్న కొంత మంది వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య విద్యను పేద మధ్య తరగతి ప్రజలకు చేరువ చేసేలా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలలకు అన్ని రకాల ఫైనాన్షియల్, అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు తెచ్చారని గుర్తు చేశారు. ప్రతి మెడికల్ కళాశాలలో 500 పడకల ఆసుపత్రిని నిర్మించి పేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి తెచ్చేలా కృషి చేశారన్నారు. పేద పిల్లలను వైద్య విద్యకు, ప్రజలను ఉచిత వైద్యానికి దూరం చేసేలా కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రజల అభిప్రాయాలను కోటి సంతకాల రూపంలో సేకరించి గవర్నర్కు నివేదిస్తామన్నారు. ప్రజాభిప్రాయంతోనైనా కూటమి నాయకులకు కనువిప్పు కావాలన్నారు. విశాఖ జిల్లాలో కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తోందని, యువత, మేధావులు స్వచ్ఛందంగా సంతకాలు చేసి కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకతను వెల్లడిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు మువ్వల సంతోష్ భోగవిల్లి గోవింద్, సానబోయిన సురేష్ సారిపిల్లి సంతోష్ నూకరాజు, గుదే రాజు, శ్రవణ్, అప్పలరాజు, సూరిబాబు, బొమ్మాళి రవి, బోర గోవింద్, అశోక్, జోరీగల గణేష్, బడే శ్రీను, అలమండ శంకర్, దిమిలి శ్రీను, బొట్టా నాగు, బొట్టా పైడిబాబు, నమ్మి మహేష్, బొట్టా శ్రీను, పరశురామ్, వీరమ్మ, ఉమ, ఉద్మ, సంధ్య కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. భక్తుల మృత్యువాత ప్రభుత్వ వైఫల్యమే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని కె.కె. రాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. అడిగితే ప్రైవేట్ ఆలయం అని తప్పించుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరుగుతుందో ప్రభుత్వానికి తెలియదా, వ్యవస్థలపై పట్టులేదా అని ప్రశ్నించారు. సనాతన ధర్మం, హైందవ ధర్మం అంటూ మాట్లాడే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు ప్రజల భద్రత విషయంలో చిత్తశుద్ధి ఏమైందని ప్రశ్నించారు. శ్రీకాకుళం ఘటనలో చనిపోయిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. -
డ్రెడ్జింగ్ కార్పొరేషన్కు కేంద్రం ఊరట
సాక్షి, విశాఖపట్నం: వరుసగా మూడేళ్లు లాభాల బాటపట్టిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐఎల్).. గతేడాది నుంచి నష్టాల బారినపడింది. దీంతోపాటు షేర్ ముఖ విలువ కూడా తగ్గుముఖం పట్టింది. వరుసగా నష్టాలు వాటిల్లడంతో ఉద్యోగులు, అధికారుల్లో కలవరం మొదలైంది. నష్టాల ఊబిలో కూరుకుపోతూ 100 శాతం జీతాల చెల్లింపులపైనా భారం పడుతుండటంతో ఓ దశలో ఈక్విటీలకు వెళ్లిపోవాలని సంస్థ భావించింది. అయితే అప్పట్లో విశాఖపట్నం పోర్టు రూ.400 కోట్లు ఇచ్చి ఆదుకుంది. ఇప్పుడు డీసీఐ బాధ్యతను భుజానికెత్తుకోవాలంటూ కన్సార్టియం పోర్టులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సంస్థలో మౌలిక సదుపాయాలు, ఫ్లీట్ ఆధునికీకరణ, సామర్థ్య పెంపునకు అవసరమైన రూ.4 వేల కోట్లు ఇవ్వాలంటూ కేంద్రం స్పష్టం చేయడంతో.. డ్రెడ్జింగ్ కార్పొరేషన్కు ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఏడేళ్ల క్రితం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ను ప్రైవేట్పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసినప్పుడు.. ఉద్యోగులంతా సంఘటితమై పోరాటం సాగించారు. వీరి పోరుకు మద్దతుగా విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) నిలిచింది. మరో మూడు పోర్టులతో కలిసి డీసీఐ బాధ్యతను తన భుజస్కందాలకెత్తుకుంది. డీసీఐకు కన్సార్టియంగా విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) 19.47 శాతం, జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్ 18 శాతం, పారాదీప్ పోర్టు ట్రస్ట్ 18 శాతం, దీన్దయాళ్ పోర్టు ట్రస్ట్ 18 శాతం వాటాలతో డీసీఐకి బాసటగా నిలిచాయి. దీంతో ప్రైవేటీకరణ నిర్ణయం ఆగిపోయింది. ఆ తర్వాత లాభాల బాటలో పయనించింది. మూడేళ్ల క్రితం ఎండీ,సీఈవో నియమాకంలో అవకతవకలు జరిగిన విషయం వెలుగులోకి రావడం.. విజిలెన్స్ విచారణ నిర్వహించి ఎండీని తొలగించడం, తర్వాత ఆయన స్థానంలో వచ్చిన కొత్త ఎండీ పదవీకాలం ముగియడం చకచకా జరిగిపోయింది. ఇక అక్కడ నుంచి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ పతనం మొదలైంది. కొత్త ఎండీ, సీఈవోని ఇంతవరకూ నియమించకుండా తాత్కాలిక బాధ్యతలు ఎండీలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. సరైన నాయకత్వం లేకపోవడం వల్లే.. డీసీఐ అప్పటి నుంచి వరుసగా నష్టాల బాట పడుతోంది. దీంతో.. సంస్థ ఆర్థిక భారం లోతుల్లో కూరుకుపోయింది. మరో ‘భారీ’ డ్రెడ్జర్ కోసం..! ఇటీవలే 12,000 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద డ్రెడ్జర్ షిప్ని డీసీఐ కమిషనింగ్ చేసింది. బీగల్ సిరీస్ డ్రెడ్జర్గా ‘గోదావరి’ షిప్.. డ్రెడ్జింగ్ రంగంలో సరికొత్త చరిత్రని లిఖించింది. అంతర్జాతీయ డిజైన్, సాంకేతిక భాగస్వాములతో కలిసి కొచ్చిన్ షిప్యార్డులో అధునాతన ఆటోమేషన్ సిస్టమ్స్, అత్యంత సమర్థవంతమైన డ్రెడ్జింగ్ మెకానిజంలతో దీన్ని రూపొందించారు. ప్రస్తుతం డీసీఐ దేశ వ్యాప్తంగా సుమారు 120 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ పనిలో 60 మిలియన్ క్యూబిక్ మీటర్లను నిర్వహిస్తోంది. ‘డ్రెడ్జ్ గోదావరి’ చేరికతో ఈ సామర్థ్యం 80 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగింది. అయితే ప్రపంచ డ్రెడ్జింగ్సంస్థలతో పోటీ పడాలంటే సామర్థ్యం మరింత మెరుగుపడాలనే ఉద్దేశంతో మరో భారీ డ్రెడ్జర్ కోసం డీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాబోయే కొన్ని నెలల్లో మరో 12000 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జర్ షిప్ కోసం ఆర్డర్ ఇచ్చేందుకు సన్నద్దమవుతోంది. అంతే కాకుండా.. ఒక కట్టర్ సక్షన్ డ్రెడ్జర్, ఒక వాటర్ ఇంజెక్షన్ డ్రెడ్జర్, మరో టీఎస్హెచ్డీ, డ్రాఫ్ట్ డ్రెడ్జింగ్కు, లోతట్టు జలమార్గాలు, కాలువలు మొదలైన వాటిలో డ్రెడ్జింగ్ కోసం విభిన్న సామర్థ్యాలు కలిగిన ఆరు బీవర్స్ డ్రెడ్జర్లను కూడా కొనుగోలు చేయాలని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ యోచిస్తోంది. స్థిరమైన కార్యకలాపాల కొనసాగించేందుకు డిజిటల్, ఆటోమేషన్, గ్రీన్ డ్రెడ్జింగ్ టెక్నాలజీలను అందిపుచ్చుకొని ప్రపంచ డ్రెడ్జింగ్ సంస్థలతో పోటీ పడేందుకు డీసీఐ అడుగులు వేస్తోంది. కన్సార్టియంలే ఆదుకోవాలి.! డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐ) ఆధునికీకరణకు 4 ప్రధాన పోర్టుల కన్సార్టియం ద్వారా రూ.4,000 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆధునీకరణకు కేటాయించిన నిధులతో అధునాతన డ్రెడ్జర్ల కొనుగోలు, సాంకేతిక అప్గ్రేడేషన్, స్థిరమైన పద్ధతుల ద్వారా డ్రెడ్జింగ్ సామర్థ్యం పెంపొందించుకోవడం, ప్రపంచ డ్రెడ్జింగ్ సంస్థలతో పోటీ పడేలా కొత్త పద్ధతులు ఆకళింపు చేసుకోవడం.. ఇలా అన్ని విభాగాల్లోననూ డీసీఐని అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు వినియోగించుకోవాలని కేంద్రం సూచించింది. అదేవిధంగా.. డ్రెడ్జింగ్ మౌలిక సదుపాయాలు బలోపేతం చేసుకోవడం, ఫ్లీట్ ఆధునికీకరణపైనా దృష్టిసారించాలని స్పష్టం చేసింది. -
ఏపీటీయూ గౌరవాధ్యక్షుడిగా ఎంపీ గొల్ల బాబూరావు
సీతంపేట: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ యూనియన్(ఏపీటీయూ) రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఏపీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వై.దేముడు ఆధ్వర్యంలో ఆదివారం అక్కయ్యపాలెంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ని యూనియన్ కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. విద్యారంగం, సమాజం, ఉపాధ్యాయ సమస్యలపై పరిపూర్ణమైన అవగాహన ఉన్న గొల్ల బాబూరావు యూనియన్ గౌరవాధ్యక్షుడిగా నాయకత్వం వహించేందుకు అంగీకారం తెలపడం పట్ల కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్ర నాయకులు , జి.దత్తాత్రేయ శర్మ, కె.బ్రహ్మారెడ్డి, కె.జె.కృపానందం, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల ఐడీ కార్డులతో స్టీల్ప్లాంట్లోకి చొరబాటు
90 కిలోల ఇత్తడి, స్క్రాప్తో ఇద్దరు దొంగలు పట్టివేత ఉక్కునగరం: స్టీల్ప్లాంట్లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆ ఇద్దరు దొంగలు ఉద్యోగుల గుర్తింపు కార్డులతో లోపలికి ప్రవేశించడం గమనార్హం. సీఐఎస్ఎఫ్ సిబ్బంది అందించిన వివరాల ప్రకారం.. పెదగంట్యాడకు చెందిన తారకేశ్వరరావు, గోపి సాహూ అనే వ్యక్తులు ప్లాంట్లోని వివిధ విభాగాల నుంచి సుమారు 50 కిలోల ఇత్తడి వస్తువులు, 40 కిలోల ఇనుప స్క్రాప్ దొంగిలించి, బీసీ గేటు సమీపంలోని టవర్–3 వద్ద బయటకు విసిరేశారు. వారు దొంగలిస్తున్న పనిని అటుగా గస్తీ కాస్తున్న సీఐఎస్ఎఫ్ క్రైం బృందం గుర్తించింది. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఛేజింగ్ జరిగింది. ఎట్టకేలకు వారిని పట్టుకుని దొంగిలించిన సాత్తును స్వాధీనం చేసుకున్నారు. వారిని సోదా చేయగా.. వారి వద్ద నుంచి ఆర్ఎంహెచ్పీ, ఎస్ఎంఎస్–2 విభాగాలకు చెందిన ఉద్యోగుల అసలు గుర్తింపు కార్డులు బయటపడటంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరినీ స్టీల్ ప్లాంట్ క్రైం పోలీసులకు అప్పగించారు. క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సిగ్గుంటే కూటమి నుంచి బీజేపీ, జనసేన బయటకు రావాలి
సాక్షి, విశాఖపట్నం : సింహాచలం అప్పన్న దేవాలయ భూములను ప్రభుత్వం అప్పనంగా విదేశీ సంస్థలకు కట్టబెట్టేందుకు అడ్డగోలు వ్యవహారాలు నడిపిస్తోందని హిందూ సంఘాల నాయకుడు తురగా శ్రీరామ్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వ భూ పందేరంపై ఆయన ఆదివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ దీనికి వత్తాసు పలుకుతూ సింహాద్రి అప్పన్న స్వామికి పంగనామాలు పెడుతోందని విమర్శించారు. విలువైన సింహాచలం భూముల్ని తక్కువ ధరకు చూపిస్తూ కాకిలెక్కలతో ప్రజల్ని మోసం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అదానీ, గూగుల్ కోసం రూ.9000 కోట్ల విలువైన సింహాచలం దేవస్థాన భూములను కట్టబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతి హిందువూ వ్యతిరేకిస్తున్నాడన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని భూముల్ని ఇష్టారాజ్యంగా దోచేయాలని చూస్తుంటే కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇంత అన్యాయంగా దేవుడి భూములను కట్టబెడుతున్నప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. నిజంగా హిందుత్వంపై బీజేపీకి, జనసేనకు చిత్తశుద్ధి ఉంటే.. కూటమి నుంచి రెండు పార్టీలూ వెంటనే బయటకు రావాలని శ్రీరామ్ డిమాండ్ చేశారు. -
నేవీ ప్రాజెక్ట్స్ డీజీగా వైస్ అడ్మిరల్ శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ
సింధియా: నేవీ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జనరల్గా వైస్ అడ్మిరల్ కె.శ్రీనివాస్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 1990 జనవరి 1న భారత నావికాదళంలో ప్రవేశించిన ఆయన కోరుకొండ సైనిక్ స్కూల్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. 35 ఏళ్లకుపైగా భారత నావికాదళంలో విస్తృత సేవలందించిన ఆయన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్లోనూ పనిచేశారు. రష్యాలోని సెవెరోడ్విన్స్య్లో యుద్ధనౌక తయారీకి సూపరింటెండెంట్గా కూడా వ్యవహరించారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య నౌక మరమ్మతులను పర్యవేక్షించే బాధ్యత చూశారు. న్యూఢిల్లీలోని నేవల్ హెడ్ క్వార్టర్స్లో ప్రీమియర్ కమాండ్గా బాధ్యతలు స్వీకరించే ముందు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్గా, ఫ్లీట్ మెయింటెనెన్స్ ప్రిన్సిపాల్ డైరెక్టర్గా కూడా పని చేశారు. -
అవినీతి రహిత సమాజం కోసం కృషి చేద్దాం
సీతంపేట: విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ కార్యాలయం, రీజినల్ కార్యాలయం, విశాఖపట్నం సిబ్బంది ఆధ్వర్యంలో ద్వారకానగర్లో ఆదివారం విజిథాన్(వాక్థాన్) జరిగింది. జోనల్ హెడ్ శాలిని మెనన్, రీజినల్ హెడ్ జె.సింహాచలం, జోనల్ విజిలెన్స్ ఆఫీసర్ ఐ.వి.కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన వాక్థాన్లో పెద్ద సంఖ్యలో బ్యాంకు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ హెడ్ శాలిని మెనన్ మాట్లాడుతూ సిబ్బందితో పాటు ప్రజల్లో నిజాయతీ, పారదర్శకత, నైతిక విలువల పట్ల అవగాహన కల్పించడం ఈ విజిథాన్ ప్రధాన ఉద్దేశమన్నారు. వృత్తిపరమైన జీవితంలోనే కాకుండా.. వ్యక్తిగత జీవితంలో కూడా నిజాయతీ చాలా ముఖ్యమన్నారు. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. -
సింహగిరిపై ఘనంగా చిలుకు ద్వాదశి
స్వామి సేవలో ఆడారి వంశీయులు సింహాచలం: సింహగిరిపై ఆదివారం చిలుకు ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి) ఉత్సవం వైభవంగా జరిగింది. అనకాపల్లికి చెందిన ఆడారి నూకయ్య వంశీయులు తరలివచ్చి, తమ చేతుల మీదుగా శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి ఈ ఉత్సవాన్ని జరిపించారు. ఏటా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఆలయంలో చిలుకు ద్వాదశి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశాన్ని తరతరాలుగా అనకాపల్లిలోని గవర సామాజికవర్గానికి చెందిన ఆడారి నూకయ్య వంశీయులకు దేవస్థానం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ఆడారి నూకయ్య వంశీయులు కుటుంబ సమేతంగా వచ్చి చిలుకు ద్వాదశి ఉత్సవానికి సంబంధించిన పూజా ద్రవ్యాలన్నింటినీ తీసుకొచ్చారు. సాయంత్రం ఆలయ ఆస్థాన మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలతో పాటు శయన పెరుమాళ్లు, ఆళ్వార్లకు విశేషంగా పూల అలంకరణ చేసి మండపంలో అధిష్టింపజేశారు. అనంతరం విష్వ క్సేన పూజ, పుణ్యాహవాచనం, షోడశోపచార పూజ లు నిర్వహించారు. స్వామి చెంతన నువ్వులు, బెల్లం, పాలను రోట్లో వేసి చెరకు గెడలతో శాస్త్రోక్తంగా దంచారు. తయారైన చిమ్మిడిని స్వామికి నైవేద్యంగా ఆరగింపు చేశారు. తదుపరి శయన పెరుమాళ్లకు బేడా తిరువీధిని కనులపండువగా నిర్వహించారు. మంగళాశాసనాన్ని విశేషంగా అందించారు. భక్తులకు చిమ్మిడి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు పవన్కుమార్ తదితరులు పూజలు నిర్వహించారు. -
స్టీల్ప్లాంట్లో ‘ఫ్లాగ్ ఆఫ్ ప్రైడ్’ ప్రారంభం
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగుల్లో పోటీతత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఆదివారం నుంచి ‘ఫ్లాగ్ ఆఫ్ ప్రైడ్’ అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఉత్పత్తి విభాగాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విధానంలో భాగంగా ప్లాంట్లోని ఈడీ (వర్క్స్) బిల్డింగ్ ముందు తొమ్మిది జెండా స్తంభాలను ఏర్పాటు చేశారు. వీటిపై ప్రధాన విభాగాలుగా పరిగణించే ఆర్ఎంహెచ్పీ, కోక్ ఓవెన్స్, సింటర్ ప్లాంట్, బ్లాస్ట్ ఫర్నేస్, స్టీల్ మెల్ట్ షాప్–1, స్టీల్ మెల్ట్ షాప్–2, సీఆర్ఎంపీ, మిల్స్, ధర్మల్ పవర్ ప్లాంట్ పేరిట తొమ్మిది రంగుల పతాకాలను అమర్చారు. ప్రతీ రోజు యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకున్న విభాగం పతాకం ఎత్తులో ఎగురుతుంది. లక్ష్య శాతం ఆధారంగా ఆ పతాకం ఎత్తు స్థాయిని నిర్ణయిస్తారు. అంటే లక్ష్యాన్ని ఎంత శాతం చేరుకుంటే, పతాకం అంత ఎత్తులో ఎగురుతుంది. శనివారం ఆయా విభాగాలు సాధించిన ఉత్పత్తి సాధన ఆధారంగా ఆదివారం తొలి రోజు పతాకాలను ఏర్పాటు చేశారు. యాజమాన్యం తీసుకున్న ఈ కొత్త నిర్ణయంపై ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఉద్యోగులు ఈ కొత్త పద్ధతి వల్ల విభాగాల మధ్య పోటీ కంటే, అనవసరమైన పరస్పర విమర్శలు పెరిగి, అది మొదటికే మోసం తీసుకువస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వాల్తేర్ సెమిట్రీలో ఆత్మల పండగ
డాబాగార్డెన్స్: పరిశుద్ధ ఆత్మల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని వాల్తేర్ సెమిట్రీలో ఆదివారం ఆల్ సోల్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చనిపోయిన వారి కుటుంబాలు, బంధువులు తమ సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. సమాధులను శుభ్రపరిచి, పువ్వులతో అలంకరించి, కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా వారు సమాధుల ఎదుట నిలబడి ‘డైస్ ఐరే’ అనే లాటిన్ పాటను పాడుతూ, చనిపోయిన వారిని స్మరించుకుంటూ, వారి ఆత్మలు క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. రోమన్ క్యాథలిక్ సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా నవంబర్ 2న ఈ సకల ఆత్మల దినాన్ని పాటిస్తారని, దీనినే సమాధుల పండగ అని కూడా అంటారని విశాఖ ఆర్చ్ బిషప్ ఉడుముల బాలశౌరి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మృతుల సంస్కరణ కార్యక్రమంలో వేలాది మంది కథోలిక్ క్రైస్తవులు పాల్గొని, తమ బంధువుల జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారని ఆయన చెప్పారు. -
గాయపడిన శ్వేతనాగుకు శస్త్ర చికిత్స
ప్రాణాలు కాపాడిన వైద్యుడు సింధియా: తీవ్రంగా గాయపడిన అరుదైన, సుమారు ఆరు అడుగుల శ్వేతనాగుకు శస్త్ర చికిత్స చేసి దాని ప్రాణాలను పశువైద్యుడు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. సింధియా ప్రాంతంలో ఉన్న నేవీ క్యాంటీన్లో అరుదైన శ్వేతనాగు కనిపించడంతో అక్కడి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించడంతో.. ఆయన అక్కడికి వచ్చి పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే, పాము పడగ భాగంలో తీవ్రంగా గాయపడి ఉండటాన్ని నాగరాజు గమనించారు. వెంటనే ఆ పామును 40వ వార్డు పరిధి హిందూస్థాన్ షిప్యార్డ్ కాలనీలోని గాంధీగ్రామ్ పశువుల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి పశువైద్యాధికారి డాక్టర్ సిహెచ్ సునీల్ కుమార్ పామును పరీక్షించి, మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేశారు. గాయానికి మొత్తం ఎనిమిది కుట్లు వేశారు. పాము తలపై ఏదైనా వాహనం ఎక్కి ఉండవచ్చని డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. గాయం పూర్తిగా తగ్గిన తర్వాత పామును సురక్షితంగా అడవిలో విడిచిపెడతామని నాగరాజు వివరించారు. గాయాలపాలైన శ్వేతనాగుకు శస్త్రచికిత్స చేస్తున్న పశువైధ్యాధికారి సునీల్కుమార్ -
యువ దంపతుల ఆత్మహత్య
తాటిచెట్లపాలెం: నగరంలోని అక్కయ్యపాలెంలో యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫోర్త్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భార్య అనిత, తల్లితో కలిసి సూరిశెట్టి వాసు అక్కయ్యపాలెం, దాలిరాజు సూపర్మార్కెట్ సమీపంలో ఉంటున్నారు. ఏడాది క్రితం వీరికి పెళ్లయింది. ప్రస్తుతం అనిత ఏడో నెల గర్భిణి. ఏం జరిగిందో తెలీదుగానీ ఆదివారం వీరిద్దరూ విగతజీవులయ్యారు. వాసు ఫ్యాన్ హుక్కు ఉరేసుకుని చనిపోగా, అనిత మంచం మీద చనిపోయి ఉంది. ఉదయం వాసు తల్లి ఫంక్షన్ నిమిత్తం బయటకెళ్లి సాయంత్రం తిరిగొచ్చింది. తలుపు ఎంతసేపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి, కిటీకిలో నుంచి చూసి నిర్ఘాంతపోయింది. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ మరణించి కనిపించడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. స్థానికంగా వాసు, అనితల ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. మరోవైపు.. అనిత గర్భంలో ఉన్న బిడ్డను బతికించేందకు పోలీసులు మృతురాలిని ఆస్పత్రికి తరలించారు. ఫోర్త్టౌన్ సీఐ ఉమాకాంత్ వివరాలు సేకరిస్తున్నారు.


