breaking news
Visakhapatnam District Latest News
-
చీటీల పేరుతో మోసం.. నలుగురి అరెస్ట్
గోపాలపట్నం: చీటీల పేరుతో సుమారు 50 మంది వద్ద డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడిన నలుగురిని గోపాలపట్నం పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను సీఐ ఎన్.వి.ప్రభాకర్ గురువారం వెల్లడించారు. గోపాలపట్నం ఇందిరానగర్కు చెందిన అంబళ్ల సత్యవతి, ఆమె కుటుంబ సభ్యులు బంగారు నాయుడు, తేజస్విని, నాగలక్ష్మి కలిసి చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరు సుమారు 50 మంది వద్ద చీటీల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. చీటీలు పూర్తయిన తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకుండా, బాధితులను బెదిరించి, మరో రెండు చీటీలు వేస్తేనే డబ్బులు ఇస్తామని వేధించేవారు. దీంతో కొద్ది నెలల కిందట బాధితులు పోలీసులను ఆశ్రయించగా, నిందితులు డబ్బులు ఇచ్చేస్తామని చెప్పడంతో బాధితులు కొంతకాలం వేచి చూశారు. అయితే సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితులు ఇటీవల నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చిని ఆశ్రయించారు. కొందరు ఆరు లక్షల రూపాయల వరకు చీటీలు వేశారని ఆయనకు తెలిపారు. డబ్బులు అడిగితే దాటవేయడం, బెదిరించడంతో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కాగా.. సీపీ ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు 22 మంది బాధితులు ఫిర్యాదు చేశారని, నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, బాధితుల వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడిస్తామన్నారు. -
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆరాధ్య
పరవాడ: భర్నికం శివారులోని బాపడుపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఒకటో తరగతి విద్యార్థిని ఆరాధ్య బెహ్ర .. తన అసాధారణ జ్ఞాపకశక్తితో అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఈ మేరకు పాఠశాల ఉపాధ్యాయుడు కొరుపోలు గంగాధరరావు తెలిపారు. యాదృచ్ఛికంగా ఇచ్చిన ఆంగ్ల అక్షరమాలలోని అక్షరాలను కేవలం 1 నిమిషం 30 సెకన్లలో సరైన క్రమంలో పేర్చడం ద్వారా ఆరాధ్య ఈ రికార్డును సాధించిందని ఆయన వివరించారు. ఎటువంటి సహాయం లేకుండా, కేవలం తన జ్ఞాపకశక్తిని ఉపయోగించి ఈ ఘనతను సాధించిందన్నారు. పాఠశాలలో జూలై 30న జరిగిన కార్యక్రమంలో ఆరాధ్య దీనిని ప్రదర్శించిందని.. ఆమె ప్రతిభను గుర్తించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరును నమోదు చేసినట్లు తెలిపారు. పాఠశాలలో గురువారం నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఎంఈవోలు ఎం.దివాకర్, జి. సాయిశైలజ విద్యార్థినితో పాటు ఉపాధ్యాయుడు గంగాధరరావును అభినందించారు. కార్యక్రమంలో సింహాద్రి ఎన్టీపీసీ సీఎస్సార్ విభాగం సీనియర్ మేనేజర్ కె.ప్రకాశరావు, శివం తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డుప్రమాద బాధితుల కోసం సహాయ కేంద్రం ఏర్పాటు
విశాఖ లీగల్ : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించే విధంగా విశాఖ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సహాయం కోసం టోల్ ఫ్రీ నంబరు 7995095793లో సంప్రదించవచ్చన్నారు. ప్రమాదాలకు గురైన బాధితులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన ఎఫ్ఐఆర్, పోస్ట్మార్టం నివేదిక, శవ పంచనామా నివేదిక, వైద్య ధృవీకరణ పత్రాలు, వాహన బీమా పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సు, ఇతర డాక్యుమెంట్లు, మెటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్(ఎంఏసిటి)లో నష్టపరిహారం కోసం కేసు వేయడానికి అవసరమైన సూచనలు, సలహాలు ఈ కేంద్రం నుంచి అందించడం జరుగుతుందన్నారు. ఇతర న్యాయపరమైన సేవల కోసం హెల్ప్లైన్ నంబరు 15100ను సంప్రదించవచ్చుని తెలిపారు. -
నగరంలో నకిలీ మద్యం
విశాఖ విద్య: నగరంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఓ వ్యక్తిని ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అధికారుల బృందం పట్టుకుంది. అతని వద్ద నుంచి 70 నకిలీ మద్యం సీసాలు, 1.5 లీటర్ల హోమియోపతిక్ స్పిరిట్, 225 వివిధ రకాల బ్రాండ్ల ఖాళీ మద్యం సీసాలు, ఏడు బ్రాండ్ల 76 లిక్కర్ ప్యాకేజ్ కవర్లు, 335 సీసా మూతలు, 99 లేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు టెంపరేచర్ డ్యూయల్ గన్ను స్వాధీన పరచుకున్నారు. నగరంలోని సీతంపేటకు చెందిన కట్టమూరి రామకృష్ణ నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నాడనే సమాచారంతో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ ఆదేశాలతో టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం నిఘా పెట్టి, పట్టుకున్నారు. రామకృష్ణ వద్ద నుంచి భారీగా నకిలీ మద్యంను స్వాధీనం చేసుకున్నారు. కేసు తదుపరి విచారణ కోసం మహారాణిపేట స్టేషన్కు అతన్ని అప్పగించినట్లు సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. ఈ దాడుల్లో ఈఎస్టీఎఫ్ సీఐ రవి కిరణ్, ఎస్ఐ ముసలి నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ సీఐపై రుబాబు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలో ఓ బార్ యజమాని ఏకంగా ఎక్సైజ్ సీఐపై రుబాబుకు దిగినట్టు తెలుస్తోంది. తన బారులో తనిఖీలు ఎలా చేస్తారంటూ ఏకంగా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా సదరు సీఐపై అరుపులు, కేకలతో విరుచుకుపడినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో అనధికారికంగా ఇతర దేశాల మద్యంతో పాటు డిఫెన్స్ మద్యం లభిస్తోంది. ఇటీవల ఎకై ్సజ్ అధికారుల తనిఖీల్లో కూడా మద్యం పట్టుబడింది. స్టీల్ప్లాంట్ సీజీఎం స్థాయి అధికారి ఇంట్లో పదుల సంఖ్యలో ఇతర రాష్ట్రాల మద్యం సీసాలు దొరికాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్శాఖ అధికారులు నగరంలోని బార్లు, మద్యం షాపుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలో ప్రధానమైన కూడలి వద్ద ఉన్న బారులో తనిఖీలకు వెళ్లిన ఎకై ్సజ్ సీఐపై సదరు బార్ యజమాని రుసరుసలాడటమే కాకుండా అరుపులు, కేకలతో నిలువరించే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో సదరు బారులో కొన్ని డిఫెన్స్ బాటిళ్లు కూడా అనధికారికంగా లభించినట్టు తెలుస్తోంది. దీనిపై ఎకై ్సజ్శాఖ ఉన్నతాధికారి ఒకరు రంగంలోకి దిగి సర్దుబాటు చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో భారీగానే నగదు చేతులు మారినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఎకై ్సజ్ సీఐతో ఆ బారు యజమాని వ్యవహరించిన తీరును.. సీసీ కెమెరాలను పరిశీలిస్తే బట్టబయలయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నా వద్దే తనిఖీలకు వస్తారా? వాస్తవానికి సదరు బారు యజమాని.. గతంలో వేరే వ్యాపారంలో అక్రమంగా భారీగా సంపాదించి లిక్కరు వ్యాపారంలోకి అడుగుపెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కొద్ది మందితో జతకట్టి ఏకంగా 10 బార్లు, 10 వైన్ షాపులను దక్కించుకున్నారు. అంతేకాకుండా ప్రీమియం షాపును కూడా అధికార పార్టీకి బాగా దగ్గరి వారి మంటూ చెప్పుకుంటున్న వారితో కలిసి నెలకొల్పారు. వీరితో జతకలిసిన తర్వాత మరింతగా రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది. అధికారపార్టీకి బాగా దగ్గరని ఇంటి పేరుతో సహా చెప్పుకునే వారితో కలిసి వ్యాపార భాగస్వామ్యం ఉండటంతోనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే బార్లలో తనిఖీలకు వెళ్లిన ఎకై ్సజ్ సీఐపై నోరుపారేసుకున్నట్టు తెలుస్తోంది. తన బారులోనే తనిఖీలు చేస్తారా? అంటూ రెచ్చిపోయినట్టు సమాచారం. అయితే, ఆయనకు చెందిన రెండు బారుల్లో కూడా కొన్ని ఇతర మద్యం బాటిళ్లు దొరికినట్టు తెలుస్తోంది. అయితే, ఎకై ్సజ్శాఖ ఉన్నతాధికారి ఒకరు రంగంలోకి దిగి సర్దుబాటు చేయడంతో పాటు తను కూడా చక్కబెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాధవధారలోని తన కార్యాలయానికి పిలుపించుకుని మరీ సర్దుబాటు చేసినట్టు విమర్శలున్నాయి. ఈ వ్యవహారంలో రూ.15 లక్షల మేర చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది. మరో షాపు రాకుండా...! వాస్తవానికి విశాఖ నగరంలో రెండు ప్రీమియం షాపుల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. అయితే, తాము ఏర్పాటు చేసిన తర్వాత సాధ్యమైనంత ఆలస్యంగా రెండో ప్రీమియం షాపు తెరిచేలా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అసలు షాపు ఏర్పాటుకు అనువైన స్థలం దొరకకుండా అడ్డుకునే ప్రయత్నం చేసి సఫలమయ్యారు. కాకినాడకు చెందిన వ్యక్తికి వచ్చిన షాపు ఏర్పాటు కాకుండా గత మూడు నెలలుగా అడ్డుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. చివరకు తనకు దక్కిన ప్రీమియం షాపులో రాయలసీమకు చెందిన అధికారపార్టీ సామాజికవర్గానికే చెందిన వారికి భాగస్వామ్యం ఇవ్వడంతో చివరకు ఎలాగోలా నెలకొల్పేందుకు అవకాశం లభించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ మరింత ఆలస్యం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. -
● పట్టుబడ్డ ఒడిశా బోటు ఇంజిన్లు మాయం ● అక్రమార్కుడితో చేతులు కలిపిన అధికారులు ● దొరికినవి 18.. లెక్క చూపింది మూడే.. ● జీఎస్టీ ఎగవేతతో ప్రభుత్వ ఖజానాకు గండి
సాక్షి, విశాఖపట్నం: వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేకూర్చడం కంటే.. తమ సొంత వాణిజ్యంపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తూ పట్టుబడితే చాలు.. సంబంధిత వాణిజ్య పన్నుల శాఖ డివిజన్ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంటోంది. ఇటీవల ఒడిశా నుంచి అనధికారికంగా తీసుకొచ్చిన బోటు ఇంజిన్ల వ్యవహారం కొందరు సిబ్బందికి కాసుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. రెండు వాహనాల్లో నిండుగా ఇంజిన్లు పట్టుబడగా.. కేవలం మూడు ఇంజిన్లు మాత్రమే దొరికినట్లు అధికారిక లెక్కల్లో చూపడం పలు అనుమానాలకు తావిస్తోంది. మిగిలిన వ్యవహారాన్ని అక్రమార్కులతో బేరసారాలు ఆడి చక్కదిద్దినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే.? ఒడిశా ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి మత్స్యజీవి కల్యాణ యోజన(ఎంఎంకేవై)’పథకంలో భాగంగా మత్స్యకారులకు కొత్త బోట్లు, ఇంజిన్లు, వలల కొనుగోలుకు రాయితీ అందిస్తోంది. సుమారు రూ.1.50 లక్షల విలువైన ఒక్కో బోటు ఇంజిన్ను రూ.84 వేల రాయితీతో కేవలం రూ.66 వేలకే ఇస్తోంది. బహిరంగ మార్కెట్లో ఈ ఇంజిన్ కొనాలంటే అదనంగా జీఎస్టీ భరించాల్సి ఉంటుంది. ఇదే అదనుగా భావించిన విశాఖకు చెందిన ఓ వ్యాపారి ఒడిశాలో మత్స్యకారులకు రాయితీపై అందిన బోట్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ఎలాంటి జీఎస్టీ చెల్లించకుండా వాటిని ఇక్కడకు తీసుకొస్తున్నాడు. గత ఆరు నెలలుగా నెలలుగా ఈ దందా గుట్టుగా సాగుతోంది. విశాఖపట్నంతో పాటు పూడిమడక, నక్కపల్లి, అచ్యుతాపురం తదితర ప్రాంతాల మత్స్యకారులకు వీటిని అమ్ముతున్నట్లు సమాచారం. వ్యాపారితో బేరసారాలు : పట్టుబడిన ఒక వాహనంలో ఇతర సామగ్రితో పాటు 3 ఇంజిన్లు ఉండగా, మరో వాహనంలో 15 ఇంజిన్లు ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న వ్యాపారి.. తన దుకాణం ఉన్న సర్కిల్ అధికారుల వద్దకు పరుగున వెళ్లాడు. అక్కడి నుంచి సిబ్బందితో కలిసి కమర్షియల్ ట్యాక్స్ డివిజనల్ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం. పట్టుకున్న సిబ్బందితో వ్యాపారి బేరసారాలు ఆడినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రెండు వాహనాలను వదిలిపెట్టేందుకు భారీగా ముడుపులు ముట్టజెప్పుతానని వ్యాపారి ఆఫర్ చేసినట్లు తెలిసింది. అయితే రెండు వాహనాలనూ వదిలేస్తే తమకు సమాచారం ఇచ్చిన వ్యాపారులకు అనుమానం వస్తుందని భావించిన సిబ్బంది.. కేవలం 3 ఇంజిన్లు ఉన్న వాహనాన్ని మాత్రమే పట్టుకున్నట్లు చూపిస్తామని చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో వాణిజ్య పన్నుల శాఖ ఇంటెలిజెన్స్ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేసినట్లు ఆరోపణలున్నాయి. అనంతరం ఈ కేసును గుట్టుచప్పుడు కాకుండా మూసివేశారు. కేవలం 3 ఇంజిన్లు మాత్రమే పట్టుబడ్డాయని, అందులో ఒకదానికి బిల్లు ఉందని, మిగిలిన రెండు ఇంజిన్లకు బిల్లులు లేకపోవడంతో జరిమానా విధించి వదిలేశామని ఇంటెలిజెన్స్ సిబ్బంది కేసును ముగించారు. ఎక్కువ ఇంజిన్లు ఉన్న వాహనాన్ని రాత్రికి రాత్రే ఆ వ్యాపారి తన దుకాణానికి తరలించుకుపోయినట్లు తెలిసింది. చిన్న గార్మెంట్ బేల్స్ పట్టుకుంటేనే హడావిడి చేసే అధికారులు.. బోటు ఇంజిన్లు పట్టుబడ్డా, విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. మొత్తంగా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన లక్షల రూపాయల జీఎస్టీని కొందరు అధికారులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పన్నుల శాఖలో సొంత వాణిజ్యంతోటి వ్యాపారుల సమాచారంతో.. పెద్ద సంఖ్యలో ఇంజిన్లు తెచ్చి తక్కువ ధరకు విక్రయిస్తున్న వ్యాపారి తీరుపై తోటి బోట్ ఇంజిన్ వ్యాపారులకు అనుమానం కలిగింది. పక్కా సమాచారం సేకరించి.. ఏ సమయంలో, ఎన్ని వాహనాల్లో ఇంజిన్లు వస్తున్నాయన్న వివరాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందించారు. దీంతో కమర్షియల్ ట్యాక్స్ సిబ్బంది వలపన్ని జూలై 31న ఆరిలోవ సమీపంలో రెండు వాహనాలను పట్టుకున్నారు. వాస్తవానికి ఒడిశా నుంచి మూడు వాహనాల్లో ఇంజిన్లు రాగా.. ఒక వాహనాన్ని ఆ వ్యాపారి శ్రీకాకుళంలోని తన దుకాణానికి ముందే తరలించేశాడు. మిగిలిన రెండు వాహనాలను విశాఖ వాణిజ్య పన్నుల శాఖ బృందం పట్టుకుంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. -
పాత ఫొటోతోనే బుకింగ్స్
యాత్రి నివాస్ను అధికారికంగా ఇంకా ప్రారంభించనప్పటికీ.. పర్యాటకులు బుక్ చేసుకోవడానికి ఆన్లైన్లో రూమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్లైన్లో ఏపీటీడీసీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం యాత్రి నివాస్పై అక్కసు చూపిస్తూనే ఉంది. గత ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దినందున ఆ పేరు దానికి వస్తుందనే ఉద్దేశంతో పనులను ఆలస్యం చేసింది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చినా.. పాత ఫొటోనే వెబ్సైట్లో ఉంచింది. ఈ ఫొటో చూసి పర్యాటకులు తమ పర్యటనను వాయిదా వేసుకునే అవకాశం ఉంది. పాత ఫొటో స్థానంలో కొత్తది ఉంచితే బుకింగ్స్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. -
ఓటు చోరీపై ప్రజలకు సమాధానం చెప్పాలి
ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసిన విదసం బీచ్రోడ్డు: ‘మా ఓటు భద్రం.. చోరీ కానివ్వకండి’.. ‘ఓటు చోరీపై ప్రజలకు సమాధానం చెప్పండి’, ‘బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ఆపండి’ అని విదసం నాయకులు డిమాండ్ చేశారు. విస్తృత దళిత సంఘాల (విదసం) ఐక్య వేదిక రాష్ట్ర సమితి కన్వీనర్ డా.బూసి వెంకట రావు ఆధ్వర్యంలో గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన భారత ఎన్నికల కమిషనర్ను ఉద్దేశించి మాట్లాడారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ప్రతి పౌరుడికి ఒకే ఓటు, ఒకే విలువ ఉండగా.. దేశంలో ఇటీవల జరుగుతున్న ఓట్ల చోరీపై ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. బీహార్లో ఎస్ఐఆర్, కర్ణాటకలోని మహాదేవపురలో జరిగిన ఓట్ల మాయాజాలంపై ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఎన్నికల సంఘం.. ప్రశ్నించిన వారినే నిందిస్తోందని ఆయన విమర్శించారు. బీహార్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించడానికే ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతున్నారని, ఇది ఎన్నికల సంఘానికి రాజ్యాంగం కల్పించిన స్వయం నిర్ణయాధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆరోపించారు. భారతీయ ఓటరు హక్కులను ఎస్ఐఆర్ పేరుతో కాలరాయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. బీజేపీ ఎన్నికల కమిషన్ను నియంత్రిస్తోందన్నారు. మహాదేవపుర ఎంపీ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో బయటపడ్డ వేలాది నకిలీ ఓటర్లపై సమగ్ర విచారణ జరిపి, ప్రజలకు సమాధానం చెప్పాలని ఎన్నికల సంఘానికి డిమాండ్ చేశారు. నిరసనలో పాల్గొన్న కార్యకర్తలు తమ ఓటరు కార్డులు చూపిస్తూ ‘ఎన్నికల సంఘమా, మా ఓటు భద్రం, చోరీ కానివొద్దు’అని నినాదాలు చేశారు. విదసం నేతలు సోడా దాసి సుధాకర్, గుడివాడ ప్రసాద్, బూల భాస్కరరావు, డి.నిర్మల, ఫ్రాన్సిస్, ఉత్తరాంధ్ర రాజ్యాంగ హక్కుల నేత బాగం గోపాల్, బనాస అధ్యక్షుడు టి.శ్రీరామ్ మూర్తి, పట్టా రామప్పారావు, తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక హంగులతో యాత్రి నివాస్
సాక్షి, విశాఖపట్నం: అందమైన విశాఖ జిల్లాకు మరిన్ని పర్యాటక హంగులు తీసుకొచ్చేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పుడు కొత్త ఫలాలను ఇస్తున్నాయి. దేశ విదేశీ పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా బీచ్రోడ్డులోని హరిత హోటల్ యాత్రి నివాస్ సుందరీకరణ పనులు పూర్తయి.. తాజాగా అందుబాటులోకి వచ్చాయి. ఈ హోటల్ స్టార్ హోటళ్లకు దీటుగా ఉన్నా.. కూటమి ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఏపీటీడీసీ వెబ్సైట్లో యాత్రి నివాస్ బుకింగ్స్ కోసం పాత ఫొటోనే కొనసాగిస్తోంది. పర్యాటకుల స్వర్గధామంగా విశాఖ విశాఖపట్నం ప్రకృతి సౌందర్యంతో పాటు అనేక పర్యాటక ఆకర్షణలను కలిగి ఉంది. ఇది దేశ, విదేశీ పర్యాటకులకు స్వర్గధామంగా మారింది. ఏటా విశాఖకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో యాత్రి నివాస్ భవనాన్ని ఆధునికీకరించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.12.5 కోట్లతో యాత్రి నివాస్ను తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టింది. అప్పుఘర్లోని బీచ్వ్యూలో ఉండే ఈ హరిత హోటల్లో మొత్తం 4 అంతస్తుల్లో 46 గదులు, రెస్టారెంట్ ఉన్నాయి. అయితే.. 25 ఏళ్ల కిందట నిర్మించిన భవనం కావడంతో గదుల్లో లీకేజీలు, కొన్ని చోట్ల పెచ్చులూడటం వంటి సమస్యలు తలెత్తాయి. భవిష్యత్తులో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనిని సుందరీకరించింది. 2023 డిసెంబర్లో పనులు ప్రారంభం కాగా.. 2024 ఎన్నికల సమయానికి దాదాపు 85 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. పలు పరిణామాల అనంతరం పనులు ప్రారంభమై.. రెండు నెలల కిందట పూర్తయ్యాయి. ఆధునికీకరించిన యాత్రి నివాస్లో 42 ఏసీ గదులు ఉన్నాయి. వీటిని ఏసీ సూట్, ఏసీ డీలక్స్, ఏసీ ఎగ్జిక్యూటివ్ రూమ్లుగా విభజించారు. ఇద్దరు పర్యాటకులకు డిమాండ్ను బట్టి ఏసీ సూట్ రూమ్ ధర రూ.3,750 నుంచి రూ.4,200 వరకు, ఏసీ డీలక్స్ రూమ్ రూ.4,625 నుంచి రూ.5,180 వరకు, ఏసీ ఎగ్జిక్యూటివ్ రూమ్ ధర రూ.3,125 నుంచి రూ.3,500 వరకు నిర్ణయించారు. వీటికి పన్నులు అదనంగా ఉంటాయి. గదులతో పాటు అత్యాధునిక వసతులతో రెస్టారెంట్, బార్, వెయిటింగ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్ మొదలైనవి అందుబాటులోకి వచ్చాయి. హరిత హోటల్లో ఎక్కువగా పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు ఉత్తర భారత్ నుంచి వచ్చే పర్యాటకులు బస చేస్తుంటారు. టూరిజం ప్యాకేజీలో వచ్చే వీరికి ఈ హోటల్ ముఖ్యమైన గమ్యస్థానం. అందుకే, అత్యాధునిక సౌకర్యాలతో పాటు ఆయా రాష్ట్రాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా కొత్త వంటకాలను అందించేలా రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. -
స్వాతంత్య్ర దినోత్సవానికి సర్వం సిద్ధం
విద్యుత్ కాంతులతో కలెక్టరేట్బీచ్రోడ్డు: పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం నిర్వహించనున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. వేడుకల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల లక్ష్యాలు, ఫలితాలను వివరిస్తూ 8 విభాగాల ఆధ్వర్యంలో స్టాళ్లు, ఏడు విభాగాల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించనున్నారు. పరేడ్ మైదానంలో పైలట్ వాహనానికి ట్రయల్ రన్ నిర్వహించి సిద్ధం చేశారు. గౌరవ వందనం సమర్పించడానికి, పరేడ్ నిర్వహించడానికి వీలుగా వివిధ రక్షణ బృందాల నుంచి మొత్తం 52 మందికి శిక్షణ ఇచ్చారు. ఎనిమిది పాఠశాలల విద్యార్థులు దేశభక్తిని చాటుతూ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద రూ. 214.99 కోట్ల నగదు ప్రోత్సాహకాలను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతిభ చూపిన 375 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేయనున్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగంలో నలుగురికి అవకాశం
విశాఖ సిటీ: వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగ కమిటీలో విశాఖ జిల్లా నుంచి ముగ్గురు చోటు కల్పించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలను చేపట్టినట్లు తెలిపింది. రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శులుగా చందక అప్పలస్వామి(భీమిలి), కంకల ఈశ్వరరావులను, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శులుగా జగ్గుపల్లి నరేష్ (భీమిలి), కోరాడ చంద్రమౌళి(పెందుర్తి)ని నియమించారు. -
కబ్జా కోరల్లో నగరంపాలెం చెరువు
మధురవాడ: ఒకవైపు నీటి కొరతతో నగరం అల్లాడుతుంటే.. మరోవైపు సహజ సిద్ధమైన జలవనరులను కాపాడాల్సిన అధికారుల నిర్లక్ష్యం కబ్జాదారులకు వరంగా మారుతోంది. మధురవాడలోని నగరంపాలెం చెరువును కొందరు బరితెగించి కబళిస్తున్నారు. సుమారు రూ.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా పూడ్చివేస్తున్నా.. జీవీఎంసీ, రెవెన్యూ యంత్రాంగాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ.. చెరువు ఉనికినే ప్రశ్నా ర్థకం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చినా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నగరంలో నీటి యుద్ధాలు సర్వసాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో సహజ జలవనరులైన చెరువులను పరిరక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ విశాఖలో స్వతంత్రనగర్, కొమ్మాది వంటి ప్రాంతాల్లో చెరువులు కనుమరుగై కాలనీలుగా మారిపోయిన చరిత్ర కళ్లముందే ఉంది. ఇప్పుడు ఆ జాబితాలోకి నగరంపాలెం చెరువు కూడా చేరబోతోంది. సగానికి పైగా ఆక్రమణ విశాఖ రూరల్ మండలం, మధురవాడ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 65/10లో 2.90 ఎకరాల విస్తీర్ణంలో నగరంపాలెం చెరువు ఉంది. రెవెన్యూ రికార్డుల్లో ట్యాంక్ పోరంబోకుగా నమోదైంది. అయితే ఇప్పటికే కబ్జాదారుల పుణ్యమా అని చెరువు సగానికి పైగా ఆక్రమణకు గురైంది. ప్రస్తుతం కేవలం 1.50 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. తాజాగా.. మిగిలిన భూమిలో నుంచి మరో అర ఎకరం భూమిని ‘సామాజిక అవసరాల’ పేరుతో కొందరు పూడ్చివేయడం ప్రారంభించారు. నిర్మాణాల కోసం ఇప్పటికే సరిహద్దులను మార్కింగ్ చేసి సున్నం వేశారు. ప్రైవేటు అవసరాలకు పెద్దపీట చెరువు భూమిలో ఇప్పటికే కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. అంతేకాకుండా ఓ ప్రైవేటు లేఅవుట్కు దారి కూడా ఈ చెరువు భూమి నుంచే ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని ప్రైవేటు ప్రయోజనాలకు అనుకూలంగా మార్చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇక చెరువుకు జీవనాధారమైన నీటి ప్రవాహ మార్గాలను(గెడ్డలను) సైతం కబ్జాదారులు వదల్లేదు. వర్షపు నీరు చెరువులోకి చేరే మార్గాలను, చెరువు నిండిన తర్వాత నీరు బయటకు ప్రవహించే మార్గాలను పూర్తిగా ఆక్రమించుకున్నారు. దీనివల్ల చెరువు సహజ సిద్ధమైన ఉనికిని కోల్పోయి, కేవలం నిలిచిన నీటి గుంతగా మారే ప్రమాదం ఏర్పడింది. ప్రకృతి ప్రేమికుల ఆవేదన మధురవాడలో ప్రభుత్వ భూములకు కొదవలేదు. అయినప్పటికీ కొందరి కళ్లు ఈ చెరువుపైనే పడటం దురదృష్టకరం. ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా జలవనరుగా ఉన్న భూమిని కొందరు స్వాహా చేస్తుంటే సంబంధిత జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ప్రకృతి, పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, చెరువును కబ్జాదారుల బారి నుంచి కాపాడి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
యాచకులు లేని నగరంగా విశాఖ
అల్లిపురం: యాచకులు లేని నగరంగా విశాఖను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పది నెలల కిందట నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తలపెట్టిన ‘జ్యోతిర్గమయ’ కార్యక్రమానికి ఒక రూపు వచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని యాచకులకు తగిన ఆశ్రయం కల్పించి, వారిని గౌరవప్రదమైన జీవితం వైపు నడిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీపీ తెలిపారు. గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడారు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటే చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణమని వివరించారు. రోడ్లపై భిక్షాటన చేసే నిరాశ్రయులను రోజూ చూసి బాధపడేవాడినని, ప్రతి మనిషి గౌరవంగా జీవించడానికి ప్రయత్నించాలన్నారు. కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ హుస్సేన్, హార్బర్ సీఐ సింహాద్రి నాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ తిరుపతిరావు, సీఐ చప్పా ప్రసాద్(వీఆర్), నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. గురువారం ఒక్క రోజే 243 మంది యాచకులను గుర్తించి, వారికి క్షవరం, స్నానం చేయించి, కొత్త దుస్తులు ఇచ్చి, టిఫిన్తో పాటు భోజనం కూడా అందించినట్లు తెలిపారు. 243 మందిలో 45 మంది బాగా ఉండటంతో వారి కుటుంబ సభ్యులను పిలిపించి, అప్పగించినట్లు వివరించారు. మానసిక స్థితి సరిగా లేని 9 మందిని ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రిలో చేర్పించామన్నారు. మిగిలిన 189 మందిని వివిధ పునరావాస కేంద్రాలకు పంపించినట్లు తెలిపారు. భవిష్యత్తులో వీరికి పనులు ఇప్పించడం, పని చేయలేని వారికి ఆశ్రయం కల్పిస్తామన్నారు. ట్రాన్స్జెండర్ల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నందున.. వారికి కూడా పని కల్పించడం లేదా ఆశ్రయం కల్పిస్తామన్నారు. జైలు నుంచి విడుదలైన వారికి కూడా జీవనాధారం కల్పించి గౌరవప్రదంగా బతకడానికి అవకాశం చూపిస్తామని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమం మొదటి అడుగు మాత్రమేనని.. నగరంలోని దాతలు ముందుకు వచ్చినట్లయితే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ సీపీ కృతజ్ఞతలు తెలిపారు. -
మాదకద్రవ్య రహిత విశాఖే లక్ష్యం
కలెక్టర్ హరేందిర ప్రసాద్ పిలుపు బీచ్రోడ్డు: విశాఖను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చుదిద్దుదామని, ఈ మహా యజ్ఞంలో అందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది చేత కలెక్టర్ నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ దేశానికై నా యువతే ప్రధాన శక్తి అన్నారు. దేశాభివృద్ధిలో వారి పాత్ర ముఖ్యమైనదని, మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో యువత పెద్ద సంఖ్యలో చేరాలి అనే సారాంశాన్ని చదివి వినిపించారు. అందరం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందామని ప్రతిజ్ఞ చేయించారు. డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కె.కవిత, ఈగల్ విభాగం సీఐ కల్యాణి, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ ప్రతినిధి ఉమారాజ్, ఎన్సీబీ అధికారులు, సీడ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వైజాగ్ పోర్టులో ప్రతిజ్ఞ సాక్షి, విశాఖపట్నం: మాదకద్రవ్య రహిత భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ)లో బుధవారం నిర్వహించారు. సాంబమూర్తి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మాదకద్రవ్య రహిత సమాజం నిర్మాణానికి కట్టుబడి ఉంటామని పోర్టు అధిపతులు, అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పోర్టు చైర్మన్ డా. ఎం అంగముత్తు మాట్లాడుతూ సీఈఎంఎస్, ఐఎంయూ విద్యా సంస్థల్లో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు. -
సిట్లో భూములుహాంఫట్!
అక్రమాల ‘కేడీ’..! సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై నిషేధాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం.. ‘సిట్’ నివేదికలోని భూములపై మాత్రం ఎడాపెడా నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రైవేటుపరం చేస్తోంది. ఇప్పటికే ఎండాడలో రూ.100 కోట్ల విలువైన 5.10 ఎకరాల భూమిపై నిషేధాన్ని ఎత్తివేసి ప్రైవేటు వ్యక్తుల పరం చేసిన కూటమి ప్రభుత్వం.. తాజాగా పరవాడలోని 6.26 ఎకరాలను సైతం ఓ ప్రైవేటు సంస్థ పరం చేసింది. ఈ భూమి విలువ రూ.70 కోట్లకు పైమాటే ఉంటుందని తెలుస్తోంది. ఇందుకోసం సిట్లో ఫలానా సర్వే నెంబర్లు లేవంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో అపెక్స్ కమిటీ మెమోను చూపించడం గమనార్హం. ఇందుకు అనుగుణంగా అనకాపల్లి జిల్లా కలెక్టరు 6.26 ఎకరాల భూమిపై నిషేధం ఎత్తివేస్తూ గత నెలలో ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా పరవాడలోని దేశపాత్రునిపాలెం పరిధిలోని 360–1, 360–2 సర్వే నెంబర్లలోని 6.26 ఎకరాల భూమి నేరుగా ప్రైవేటు సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ వ్యవహారంలో బీచ్ రోడ్లో ఉండే సు‘కుమారు’డు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. దీంతోపాటు కొమ్మాది, మధురవాడ, పరవాడలోని మరికొన్ని సర్వే నెంబర్లకు చెందిన భూములపై నిషేధం ఎత్తివేయించేందుకు సదరు వ్యక్తి భారీ స్థాయిలో డీల్స్ కుదుర్చుకున్నట్టు సమాచారం. ● నేరుగా ప్రైవేటు సంస్థకు భూ బదలాయింపు ● భూమి విలువ రూ.70 కోట్లు ● సిట్లో లేవని.. అందుకే నిషేధం ఎత్తివేశామంటూ మెలిక అపెక్స్ కమిటీ పేరుతో అక్రమాలు...! కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ నివేదికపై అపెక్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అపెక్స్ కమిటీ తమకు అనుకూలమైన సర్వే నెంబర్లను సిట్ నివేదిక నుంచి తప్పించేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశపాత్రునిపాలెంలోని 360–1, 360–2 సర్వే నెంబర్లకు చెందిన 6.26 ఎకరాల భూమిని సిట్ నివేదికను తప్పించినట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా 2025 ఫిబ్రవరి 14న అపెక్స్ కమిటీ అన్ని జిల్లాల కలెక్టర్లకు మెమో రూపంలో ఆదేశాలు జారీచేసింది. దీని ఆధారంగా అనకాపల్లి కలెక్టర్ పైరెండు సర్వే నెంబర్లలోని భూములపై నిషేధం ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు. అయితే సదరు మాజీ సైనికోద్యోగుల పేరు మీద కాకుండా.. నిబంధనలకు విరుద్ధంగా గతంలో విక్రయించిన ప్రైవేటు సంస్థ పేరు మీదనే ఉత్తర్వులు జారీచేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సు‘కుమార్’ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరవాడలో 6.26 ఎకరాలపై నిషేధం ఎత్తివేత సు‘కుమార’ంగా చక్రం తిప్పేశాడుదేశపాత్రునిపాలెంలోని 6.26 ఎకరాల భూమిపై నిషేధం ఎత్తివేసేలా చేసిన వ్యవహారంలో బీచ్ రోడ్లో ఉండే సు‘కుమార్’ చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కూడా ఆ భూమిని తిమ్మిని బమ్మిని చేసినందుకుగానూ ఆయాచితంగా లభించిందనే ప్రచారం ఉంది. సదరు వ్యక్తి ఓ సీనియర్ టీడీపీ ఎమ్మెల్యేకు బినామీగా వ్యవహరిస్తారనే ప్రచారం కూడా ఉంది. అతడి వద్ద మరో రూ.1,000 కోట్ల విలువ చేసే ఫైల్స్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే ద్వారా కీలక మంత్రికి.. తద్వారా చినబాబుకు దగ్గరగా ఉండి వ్యవహారాలు నడిపిస్తున్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్లోని భూములకు కూడా చక్రాలు వచ్చి ప్రైవేటువ్యక్తుల పరమవుతుండటం గమనార్హం -
ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు
సీతంపేట: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు తన బృందంతో కలిసి జిల్లాలోని అక్షయ ఐవీఎఫ్, నికిత హాస్పిటల్, రోషిణి ఫెర్టిలిటీ కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో అన్ని పత్రాలను, రిజిస్ట్రేషన్ రికార్డులను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంతమందికి సంతానోత్పత్తి చికిత్స చేశారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేదవారికి రుసుము తగ్గించి సేవలందించాలని ఆయా కేంద్రాల నిర్వాహకులకు, గైనకాలజిస్టులకు సూచించారు. ఎప్పటికప్పుడు నిజాయితీగా సమాచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయానికి అందజేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ధరల పట్టిక ప్రదర్శించాలని సూచించారు. పీసీ అండ్ పీఎన్డీటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫారం ఎఫ్ లను తనిఖీచేసి ఐఈసీ బోర్డులను నిర్దేశించిన ప్రదేశంలో ఉంచాలని, సమయానికి రెన్యువల్ చేసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆయన వెంట డాక్టర్ బి.ఉమావతి, డీపీఎంవో బి.నాగేశ్వరరావు ఉన్నారు. -
ఫేస్బుక్లో స్నేహం.. పెట్టుబడి మోసం
అల్లిపురం: ఫేస్బుక్లో పరిచయం పెంచుకుని పెట్టుబడి పేరుతో రిటైర్డ్ ప్రొఫెసర్ నుంచి రూ.49.72 లక్షలు దోచుకున్న రిలేషన్షిప్ మేనేజర్ సతీష్ కుమార్ను నగర సైబర్ క్రైం పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. డిజిటల్ మోసాలపై సైబర్ క్రైం పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంవీపీకాలనీ, సెక్టార్–6కి చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ ప్రొఫెసర్తో నిందితుడు సతీష్ కుమార్ ఫేస్బుక్లో స్నేహం చేసి పెట్టుబడి పెట్టాలంటూ ఆశ చూపా డు. తద్వారా అతని నుంచి దశలవారీగా రూ.49.72 లక్షలు కాజేశాడు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని సెక్టార్–16కి చెందిన సతీష్ కుమార్గా గుర్తించారు. నిందితుడు నోయిడా వరల్డ్ ట్రేడ్ టవర్లో రిలేషన్షిప్ మేనేజర్గా పని చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. విచారణలో భాగంగా సతీష్ కుమార్ తన ఐడీఎఫ్సీ బ్యాంక్ కరెంట్ అకౌంట్ను సైబర్ నేరగాళ్లకు ఇచ్చి భారీ మోసాలకు సహకరించినట్లు తేలింది. ఈ అకౌంట్ ద్వారా వారు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై 111(2), 319(2), 318(4) రెడ్/విత్ 61(2) బీఎన్ఎస్, 66–సీ, 66–డీ ఐటీఏ–2000–2008 సెక్షన్ల కింద కేసు(నం. 112/2025) నమోదు చేసి అరెస్ట్ చేశారు. రిటైర్డ్ ప్రొఫెసర్కు కుచ్చుటోపీ పెట్టిన మోసగాడు అరెస్ట్ -
చంద్రబాబును గద్దె దించడమే దళితుల లక్ష్యం
● దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా సీఎం, మంత్రుల వ్యాఖ్యలు ● ఎన్నికలు ఎప్పుడు జరిగినా ముఖ్యమంత్రి అయ్యేది జగనే.. ● వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్బాబువిశాఖ సిటీ: దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు నిద్రపోయేది లేదని.. అదే దళితుల లక్ష్యమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు తేల్చి చెప్పారు. మద్దిలపాలెంలోని జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జిల్లా ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని చంద్రబాబు, మీకెందుకురా రాజకీయాలు, మేము చేసుకుంటాం.. అని ఆ పార్టీ విప్ చింతమనేని ప్రభాకర్, మంత్రులు సైతం దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పుట్టుకను, చదువును అవమానించిన టీడీపీని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేయడం తథ్యమన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని పక్కనపెట్టి.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం జగన్ రూ.2.75 లక్షల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. దళితుల ఆత్మాభిమానం పెరగాలంటే జగన్ సీఎం కావాలని తేల్చి చెప్పారు. జైబీమ్–జై జగన్ నినాదం రాష్ట్రంలో మార్మోగిపోవాలని పిలుపునిచ్చారు. పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలు వైఎస్సార్ సీపీకి, పోలీసులకు మధ్య జరిగాయన్నారు. ● ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే దళితులకు రాజ్యాధికారం దక్కిందని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎంలు, మంత్రులతో పాటు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు, వారి ఆస్తుల ఆక్రమణలు, గ్రామ బహిష్కరణలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ● మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. అంబేడ్కర్ ఆశయ సాధన కు అనుగుణంగా దళితుల సంక్షేమం, అభివృద్ధి కో సం జగన్ కృషి చేశారన్నారు. గత ఎన్నికల్లో దళితులు వైఎస్సార్ సీపీకి అధికంగా ఓటేశారని గుర్తు చేశారు. ● ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ అణచివేతకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ అండగా నిలిచారని పేర్కొన్నారు. ప్రపంచంతో పో టీ పడేవిధంగా ఇంగ్లిష్ మీడియంతోపాటు సీబీఎస్ సీ సిలబస్ను ప్రవేశపెట్టిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని విమర్శించారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ దళితులపై కక్షపూరితంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. మోసానికి ప్యాంటు, షర్టు వేస్తే చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. దళితుల ఆత్మగౌరవ చిహ్నంగా విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు తన టీడీపీ గూండాలతో రాళ్లు వేయించారని ఆరోపించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు చిత్తశుద్ధి, సమానత్వ దృక్పథంతో దళిత వర్గాన్ని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన నాయకుడు జగన్ అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించి దళితులపై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఇంకా వెయ్యి రోజులు మాత్రమే అధికారంలో ఉంటారని, ఆ తర్వాత జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ జగన్ ఒక సింహం అని, సింహానికి పదవి, కిరీటం అవసరం లేదన్నారు. కార్యకర్తలకు చిన్న దెబ్బ తగిలినా 100 రెట్లు అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం జైళ్లను బాగు చేసుకోవాలని, ఏసీలు పెట్టుకోవాలని సూచించారు. తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు మాట్లాడుతూ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చింది జగన్ మాత్రమే అన్నారు. డిప్యూటీ సీఎం నుంచి కార్పొరేటర్ల వరకు అన్నింట్లోను దళితులకు భాగస్వామ్యం కల్పించారని తెలిపారు. గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు సంక్షేమం అందకపోగా వారిపై దాడులు జరుగుతుండడం దారుణమన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తేనే బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్కుమార్, సిహెచ్ వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, పార్టీ కార్యాలయం ఇన్చార్జ్ రవిరెడ్డి, రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ, పేర్ల విజయ్చంద్ర, పార్టీ నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, రవిరాజు, జహీర్ అహ్మద్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బోని శివరామకష్ణ, జిల్లా పరిశీలకుడు వీరంశెట్టి పూర్ణ చంద్రరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెయ్యి వెంకటరమణ, జోనల్ విభాగం అధ్యక్షుడు అల్లంపల్లి రాజాబాబు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు చెన్నా జానకిరామ్, మార్కట్ కమిటీ మాజీ చైర్మన్ ఆల్ఫాకృష్ణ, కార్పొరేటర్లు కె.వి.శశికళ, బళ్ల లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గండి భాగ్యవతి, ఐ.డి.బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు కోన వెంకట శంకర సన్యాసిరావు, ఎడ్ల సిద్ధార్ధ రాజు, ముంజేటి హనుమంతరావు నియోజకవర్గం అధ్యక్షులు మర్దపూడి పరదేశి, పూడి మల్లేశ్వరరావు, ఆకుల శ్యామ్కుమార్, దొండపర్తి లక్ష్మారావు, బంగారు భవా నీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
స్టీల్ మెల్ట్ షాప్–2లో 72 హీట్లతో కొత్త రికార్డు
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ మరో అద్భుతమైన ఘనతను సాధించింది. స్టీల్ మెల్ట్ షాప్– 2 (ఎస్ఎంఎస్–2) విభాగంలో మంగళవారం అత్యధికంగా 72 హీట్లను ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో 2021 జనవరి 30న సాధించిన 68 హీట్ల రికార్డును ఇది అధిగమించింది. ఈ రికార్డు సాధనలో భాగంగా మూడు షిఫ్టుల్లోనూ 24 చొప్పున మొత్తం 72 హీట్లు ఉత్పత్తి అయ్యాయి. దీంతో రెండు స్టీల్ మెల్ట్ షాపులలో కలిపి మొత్తం 133 హీట్లు ఉత్పత్తి అయ్యాయి. అంతేకాకుండా మూడు బ్లాస్ట్ ఫర్నేస్లలో కలిపి 19,037 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి కావడం విశేషం. ఈ రికార్డు సాధనలో కృషి చేసిన ఉద్యోగులను స్టీల్ప్లాంట్ ఉన్నతాధికారులు అభినందించారు. వినాయక చవితి ఉత్సవాలకు సింగిల్ విండో క్లియరెన్స్ సెల్ డాబాగార్డెన్స్: వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు జీవీఎంసీలో సింగిల్ విండో క్లియరెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ పేర్కొన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని నోడల్ అధికారులు ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేషకుమార్ 9848308823, సిటీప్లానర్ వి.మీనాకుమారి 8374966777, కార్యనిర్వాహక ఇంజనీర్ డి.శ్రీధర్ 8187898427, అగ్నిమాపక అధికారి బి.కృపావరం 9912448555, అలాగే జోనల్ స్థాయిలో జోనల్ కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, కార్యనిర్వాహక ఇంజనీర్లను సంప్రదించాలని తెలిపారు. -
ముందుకి.. వెనక్కి.!
కొమ్మాది/భీమునిపట్నం: విశాఖ తీరంలో సముద్రం వింతగా ప్రవర్తిస్తోంది. ఒకే తీర ప్రాంతంలోని రెండు సమీప ప్రదేశాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొనడం స్థానికులను, పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాగర్నగర్ వద్ద సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతూ ముందుకు చొచ్చుకువస్తుండగా.. భీమిలిలో వందల అడుగులు వెనక్కి వెళ్లిపోవడం ఆసక్తికరంగా మారింది. సాగర్నగర్ తీరంలో గత మూడు రోజులుగా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతూ ఇసుక తిన్నెల వైపు దూసుకొస్తున్నాయి. బుధవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో తీరానికి వచ్చిన పర్యాటకులు భయాందోళనలకు గురయ్యారు. దీనికి పూర్తి విరుద్ధంగా భీమునిపట్నం తీరంలో సముద్రం శాంతించి వెనక్కి తగ్గింది. సాధారణంగా ఆటుపోట్ల సమయంలో 20 నుంచి 30 అడుగులు వెనక్కి వెళ్లే సముద్రం, ఇప్పుడు ఏకంగా వంద అడుగులకు పైగా వెనక్కి వెళ్లింది. దీంతో భీమిలి తీరం విశాలంగా మారింది. సుమారు 30 ఏళ్ల కిందట ఉన్నంత విశాలమైన తీరం మళ్లీ కనిపించడంతో పర్యాటకులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వేళల్లో సందర్శకుల సంఖ్య పెరిగి తీరం సందడిగా మారుతోంది. -
స్వాతంత్య్ర దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు
బీచ్రోడ్డు: స్వాతంత్య్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం జరగనున్న వేడుకల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఆయన తుది సమీక్ష చేపట్టారు. ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకుని.. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. శకటాలు, స్టాళ్లు, సీటింగ్ ఏర్పాట్లలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. వర్షం వచ్చినా కార్యక్రమానికి అంతరాయం కలగకుండా వాటర్ప్రూఫ్ టెంట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. వేడుకలకు వచ్చే అతిథులకు, సాధారణ పౌరులకు సీటింగ్, తాగునీటి ఏర్పాట్లు చేయాలని జేసీ ఆదేశించారు. పైలట్ వాహనాన్ని ముందుగానే తనిఖీ చేసి, ట్రయల్ రన్ వేసి సిద్ధంగా ఉంచాలన్నారు. స్టేజీ డెకరేషన్, శానిటేషన్, సర్టిఫికెట్ల తయారీ, జ్ఞాపికల రూపకల్పన వంటి పనులను పూర్తి చేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని, పాటల నిడివి తగ్గించాలని జేసీ సూచించారు. సమావేశంలో డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కాగా.. రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ మేరకు రాష్ట్ర పరిపాలన విభాగం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. -
క్రీడాకారుడు చరణ్కు గవర్నర్ బంగ్లా నుంచి ఆహ్వానం
కూర్మన్నపాలెం: వాలీబాల్ క్రీడాకారుడు అట్టాడ చరణ్కు గవర్నర్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. వడ్లపూడిలోని కణితి కాలనీలో నివాసముంటున్న చరణ్కు శ్రీకాకుళం కలెక్టర్ ద్వారా రాజ్భవన్ నుంచి గవర్నర్ కార్యదర్శి లేఖ పంపించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న గవర్నర్ బంగ్లాలో జరిగే విందుకు హాజరు కావాలని ఆ లేఖలో పేర్కొన్నారు. చరణ్ తన మేనమామల వద్ద ఉంటూ.. విశాఖపట్నంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ వాలీబాల్ పోటీల్లో చరణ్ కాంస్య పతకం సాధించాడు. గవర్నర్ బంగ్లా నుంచి ఆహ్వానం రావడంతో చరణ్ను పలువురు అభినందించారు. -
అంతస్తుకో రేటు
అనుమతులు గోరంత.. అక్రమాలు అందనంతగాజువాక : నిబంధనలన్నీ పాటించి చిన్న భవనం నిర్మించుకుంటేనే భూతద్దంలో చూసి విరుచుకుపడిపోయే జీవీఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి షీలానగర్ దరి వెంకటేశ్వర కాలనీ 4ఎ లైన్లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనంపై అవ్యాజప్రేమ చూపించారు. నిబంధనలకు పాతరేసినా, భవన నిర్మాణంలో పాటించాల్సిన నియమాలను ఉల్లంఘించినా, జీవీఎంసీ నుంచి పొందిన అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినా చూసీ చూడనట్టు వదిలేశారు. అంతేకాదు అసంపూర్తిగా ఉన్న భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ను కూడా జారీ చేసేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సామాజిక కార్యకర్తలు టౌన్ప్లానింగ్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గాజువాక మండలం తుంగ్లాం సర్వే నంబర్ 102/2డి1ఎ 700 గజాల విస్తీర్ణంలో రెండు స్థలాలున్నాయి. అందులో ఒకటి 300 చదరపు గజాలు కాగా, మరొకటి 400 చదరపు గజాల స్థలం. ఈ రెండు స్థలాల్లో భవన నిర్మాణం కోసం సదరు బిల్డర్ రెండు వేర్వేరుగా అనుమతులు పొందాడు. 20 అడుగుల రహదారిని ఆనుకొని చేపట్టిన భవన నిర్మాణం ప్లాన్ ప్రకారమైతే ఒక స్థలంలో స్టిల్ట్+గ్రౌండ్+రెండు అంతస్తులు, మరో స్థలంలో స్టిల్ట్+గ్రౌండ్+మూడు అంతస్తులు నిర్మించుకోవాలి. సెట్బ్యాక్లను పూర్తిస్థాయిలో మినహాయించాల్సి ఉంది. అయితే, సెట్బ్యాక్లకు ఉంచాల్సిన స్థలంలో ఇంచి కూడా వదలకుండా నిర్మాణం జరిగిపోతోంది. రుణాలకు బ్యాంకులు ససేమిరా! ఈ భవనంలో ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకొనేవారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు అంగీకరించలేదని తెలుస్తోంది. ఇది ప్రణాళిక నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారన్న కోణంలో బ్యాంకులు విముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. రెరా, జీవీఎంసీ బిల్డింగ్ బైలా, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం బిల్డర్తోపాటు సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దాటవేత ధోరణిలో అధికారులు ఈ విషయంపై గాజువాక జోన్ టౌన్ప్లానింగ్ ఏసీపీ వెంకటరావును సంప్రదించడానికి ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఫోన్లో మాట్లాడటానికి ఇష్టపడలేదు. టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ వరప్రసాద్ను సంప్రదించగా ఆయన భిన్న విషయాలు చెప్పారు. సదరు భవన నిర్మాణం పూర్తయిందని ఒకసారి, నిబంధనల ప్రకారమే ఆక్యుపెన్సీ ఇచ్చామని మరోసారి, అక్కడ ఉల్లంఘనలు లేవని ఇంకోసారి చెప్పుకొచ్చారు. భవనం ఫొటోలు చూపించగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. ప్లాన్ ఒకలా, నిర్మాణం మరోలా.. ఉల్లంఘనలను పట్టించుకోని అధికారులు భవనం పూర్తి కాకుండానే ఆక్యుపెన్సీ జారీ టౌన్ప్లానింగ్ అధికారుల తీరుపై విస్మయం నిబంధనలు తెలియవా? బిల్డర్ ప్రాజెక్టు కోసం ఎటువంటి రెరా రిజిస్ట్రేషన్ లేకుండా 1020 చదరపు అడుగులు, 980 చదరపు అడుగులు, 1345 చదరపు అడుగులు, 1467 చదరపు అడుగుల చొప్పున ఫ్లాట్లను విక్రయానికి పెట్టాడు. ఇది రియల్ ఎస్టేట్ నియంత్రణ, అభివృద్ధి చట్టం (రెరా)ను ఉల్లంఘించడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. అలా విక్రయించడం గృహ కొనుగోలుదారులను మోసం చేయడమేనని చెబుతున్నారు. భవన నిర్మాణం ఒకపక్క సాగుతోంది. మరోపక్క టౌన్ప్లానింగ్ అధికారులు ఆక్యుపెన్సీ జారీ చేసేశారు. నిర్మాణం పూర్తయిన తరువాత అన్నీ సరిగ్గా ఉన్నప్పటికీ అనేక రకాలుగా అధికారులను సంతృప్తి చేస్తే తప్ప రాని ఆక్యుపెన్సీ అన్నీ ఉల్లంఘనలు.. నిర్మాణం కూడా పూర్తి కాని భవనానికి ఎలా ఇచ్చారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలుతోంది. నచ్చినట్లు నిర్మాణం ఈ రెండు భవనాలకు బిల్డర్ వ్యక్తిగత అనుమతులు తీసుకున్నాడు. ప్లాన్ ప్రకారం వ్యక్తిగత నివాస భవనాలు కాకుండా వాటిని బహుళ యూనిట్లుగా మార్చాడు. తొమ్మిది మీటర్ల కంటే తక్కువ రహదారి ఉన్న స్థలాల్లో నిర్మించే భవనాలకు వ్యక్తిగత నివాస భవనంగా మాత్రమే ప్లాన్ పొందే అవకాశం ఉంది. దీంతో వ్యక్తిగత నివాస భవనాలకు ప్లాన్ పొందిన బిల్డర్ రెండు భవనాలను చట్ట విరుద్ధంగా ఒకే బ్లాక్లో విలీనం చేశాడు. ప్లాన్కు విరుద్ధంగా స్టిల్ట్+గ్రౌండ్+మూడు అంతస్తుల నిర్మాణం చేపట్టాడు. అదనపు అంతస్తును, సెట్ బ్యాక్ల ఉల్లంఘనలను సమర్థించుకోవడానికి ఎటువంటి టీడీఆర్లు పొందలేదు. ఇంతవరకు బిల్డర్ కక్కుర్తి పడి ఉండొచ్చు అనుకున్నా భవన నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే టౌన్ప్లానింగ్ అధికారులు దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (15.07.2025న బీఏ నంబర్ 1086/1682/బి/జెడ్/వైటీఏ/2024) లు ఇచ్చేశారు. భవన నిర్మాణం పూర్తి కాకుండా, ఎలాంటి సౌకర్యాలు కల్పించకముందే ఉల్లంఘనల భవనాలకు టౌన్ప్లానింగ్ అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. -
400 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ
మద్దిలపాలెం: స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బుధవారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఏయూ పరిపాలన భవనం వద్ద నుంచి 400 అడుగుల జాతీయ పతాకంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏయూ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యువతను భాగస్వామ్యం చేస్తూ వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం ఈ ర్యాలీ సిరిపురం కూడలి, ఏయూ ఇన్ గేట్ మీదుగా మళ్లీ పరిపాలన భవనం వద్ద చేరుకోవడంతో ముగిసింది. రెక్టార్ ఆచార్య ఎన్.కిశోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయరావు, డీన్ కె.రమా సుధ, ఎస్.హరినాథ్, ఎన్.ఎం.యుగంధర్, డి.సింహాచలం, తదితరులు పాల్గొన్నారు. -
ఇదీ నేపథ్యం..!
పరవాడ మండలం దేశపాత్రునిపాలెం పరిధిలోని 360–1, 360–2, 360–3, 360–2 సర్వే నెంబర్లలో మొత్తం 13.25 ఎకరాల భూమిని నలుగురు మాజీ సైనికోద్యోగులకు (రమణమ్మ, ఎస్.వేణుగోపాల్ రెడ్డి, ఏఎస్ఆర్కే కుమార్, ఆర్.రామచంద్రరావు) కేటాయించారంటూ రికార్డుల్లో ఉంది. ఈ భూములను వారి నుంచి గతంలోనే కోరమాండల్ ఎస్టేట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కొనుగోలు చేసింది. అప్పట్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు భూ వివాదాలు నడుస్తున్నాయని.. భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ మంత్రి అయ్యన్న ఆరోపించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసి విచారణ కూడా నిర్వహించారు. దీంతో గతంలో జరిగిన భూలావాదేవీలపై నిషేధం విధించారు. ప్రధానంగా మాజీ సైనికోద్యోగులకు చెందిన భూములపై లావాదేవీలు జరగకుండా నిషేధం కొనసాగింది. ఈ నేపథ్యంలో దేశపాత్రునిపాలెం పరిధిలోని 13.25 ఎకరాల భూముల లావాదేవీలపై కూడా నిషేధం ఉంది. ఇప్పుడు హఠాత్తుగా సిట్లో 360–1, 360–2 సర్వే నెంబర్లు లేవని అపెక్స్ కమిటీ మెమోను చూపిస్తూ ప్రైవేటు సంస్థకు 6.26 ఎకరాల భూమిని కట్టబెట్టడం గమనార్హం. -
12 ఏళ్లుగా కళ్లు గప్పి.. ఎట్టకేలకు చిక్కి!
నవ వధువు హత్య కేసులో నిందితుడి అరెస్టు పెదగంట్యాడ: ఓ హత్య కేసులో 12 ఏళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని న్యూపోర్టు పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు తెలిపిన వివరాలివి. 2013లో మండలంలో ఒక వీధిలోని నాలుగో అంతస్తు పెంట్హౌస్లో నవ వధువు త్రివేణి తన భర్తతో కలిసి నివసించేది. పక్కనే ఉన్న మరో పెంట్హౌస్లో అద్దెకు ఉంటున్న నీలాపు లోకేష్ ఆమైపె కన్నేశాడు. ఇంట్లో త్రివేణి ఒంటరిగా ఉండటం గమనించి, ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. త్రివేణిపై లైంగికదాడికి ప్రయత్నించగా, ఆమె ప్రతిఘటించి వంటగదిలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో లోకేష్ ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహం పక్కన చున్నీని కాల్చివేసి, గ్యాస్ తెరిచి ఉంచాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న రెండున్నర తులాల బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. తర్వాత గాజువాకలోని ఒక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో ఆ బంగారు ఆభరణాలను కుదువ పెట్టి రూ.55వేలు తీసుకున్నాడు. ఆ డబ్బులో రూ.30వేలతో బైక్ కొనుగోలు చేయడానికి అడ్వాన్స్గా ఇచ్చాడు. మిగతా రూ.25 వేలును తన స్నేహితునికి ఇచ్చి, ఏమీ తెలియనట్టుగా ఇంటికి చేరుకున్నాడు. పోలీసులు పట్టుకున్నారిలా.. నవ వధువు హత్య కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పటికే గాజువాక పోలీస్ స్టేషన్లో లోకేష్పై మోటార్ బైక్ దొంగతనం కేసు నమోదై ఉంది. దీంతో పోలీసులు తమదైన శైలిలో అతన్ని విచారించగా.. త్రివేణిని తానే హత్య చేసినట్టు లోకేష్ అంగీకరించాడు. బెయిల్పై వచ్చి మళ్లీ.. వధువు హత్య కేసులో జైలుకెళ్లిన లోకేష్ తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేయాలని కోర్టు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో లోకేష్ను వెతికి పట్టుకోవాలని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి న్యూపోర్టు పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో అతను విజయవాడలో ఉన్నాడని సమాచారం అందడంతో.. ఏఎస్ఐ మురళి, కానిస్టేబుల్ సింహాద్రిని న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు అక్కడకు పంపించారు. 12 సంవత్సరాల నుంచి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు లోకేష్ను ఎట్టకేలకు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
జల ప్రవాహంలో బిక్కుబిక్కుమని..
దేవరాపల్లి: సుందర సరియా జలపాతం కొన్ని గంటలపాటు వారి వెన్నులో వణుకు పుట్టించింది. ఈ పర్యాటక ప్రాంతాన్ని చూద్దామని విశాఖ, గాజువాక, అనకాపల్లి ప్రాంతాల నుంచి వచ్చిన 32 మంది సందర్శకులు ప్రాణాలు అర చేత పెట్టుకొని బిక్కు బిక్కుమని గడిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల పరిధిలోని సరియా జలపాతం సందర్శనకు మంగళవారం ఉదయం వీరు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం రావడంతో జలపాతానికి ముందు ఉన్న గెడ్డ ఉప్పొంగి ఉధృతంగా ప్రవహించడంతో పర్యాటకులంతా అవతలి వైపు చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. దేవరాపల్లి, చీడికాడ ఎస్లు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులతో కలిసి సుమారు 3 గంటలపాటు శ్రమించారు. గెడ్డ ఉధృతి తగ్గిన తర్వాత రోప్ సహాయంతో ఒక్కొక్కరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రాత్రి 10 గంటల సమయంలో దేవరాపల్లి ప్రాంతానికి తీసుకువచ్చారు. స్థానికంగా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి పర్యాటకులకు భోజనం సదుపాయం కల్పించారు. సరియా వద్ద చిక్కుకున్న 32 మంది పర్యాటకులు రోప్ సహాయంతో రక్షించిన పోలీసు, ఫైర్ సిబ్బంది -
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లకు జాతీయ అవార్డులు
తాటిచెట్లపాలెం: ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్(ఏపీపీజేఏ), విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ–2025 పోటీల్లో ‘సాక్షి’ఫొటోగ్రాఫర్లు పలు విభాగాల్లో అవార్డులు సాధించారు. 186వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు జరిగాయి. స్పాట్ న్యూస్ విభాగంలో పీఎల్ మోహన్రావు, జనరల్ న్యూస్ విభాగంలో ఎండీ నవాజ్లు ఏపీపీజేఏ అచీవ్మెంట్ అవార్డులను గెలుచుకున్నారు. వీరిని పలువురు అభినందించారు. కాగా.. ఈ పోటీలకు కోల్కతా, ముంబయి, న్యూఢిల్లీ, ఇండోర్, కేరళ, గోవా, కర్నాటక, చైన్నె, గుజరాత్, తెలంగాణ తదితర ప్రాంతాలకు చెందిన 135 మంది ఫొటోగ్రాఫర్లు రెండు విభాగాల్లో సుమారు 550 ఫొటోలను పంపించారు. -
40 నిమిషాల్లో వాక్యూమ్ క్లీనర్ తయారీ
ఆరిలోవ: శ్రీ కృష్ణాపురంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్) కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మంగళవారం జరిగిన ఈ ఆన్లైన్ కార్యక్రమంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న 50 మంది విద్యార్థులు పది గ్రూపులుగా విడిపోయారు. కేవలం 40 నిమిషాల వ్యవధిలో వారు వాక్యూమ్ క్లీనర్ తయారీ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను గురుకుల ప్రిన్సిపాల్ రత్నవల్లి, జిల్లా సైన్స్ అధికారి రాజారావు పరిశీలించి, అభినందించారు. తక్కువ సమయంలో ఇంతటి క్లిష్టమైన ప్రాజెక్టును పూర్తి చేయడం అద్భుతమని పేర్కొన్నారు. ఇలాంటి ప్రాజెక్టుల్లో పాల్గొనడానికి విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అవసరమన్నారు. గురుకుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘సృష్టి’ అక్రమాల చిట్టా
మహారాణిపేట: పిల్లలు లేని దంపతుల ఆశలను సొమ్ము చేసుకుంటూ.. సరోగసీ, ఐవీఎఫ్ పేరుతో సృష్టి ఐవీఎఫ్ సెంటర్ పాల్పడిన అక్రమాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ దారుణమైన దోపిడీకి విశాఖపట్నం కేంద్రంగా నిలిచిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. రిజిస్ట్రేషన్ లేకున్నా.. : సృష్టి ఐవీఎఫ్ సెంటర్ విశాఖలోని తన కార్యకలాపాలను రిజిస్ట్రేషన్ లేకుండానే కొనసాగిస్తోంది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో 2018 నుంచి 2023 వరకు మాత్రమే ఈ సెంటర్ నిర్వహణకు రిజిస్ట్రేషన్ ఉంది. ఆ తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండానే జిల్లా పరిషత్ సమీపంలోని ఒక భవనంలో 5వ, 6వ అంతస్తుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సెంటర్ నిర్వహణకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని కొందరికి లంచాలు ఇచ్చి నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డాక్టర్ నమ్రత ఆధ్వర్యంలో మేనేజర్ కల్యా ణి ఈ దందాలో కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ నుంచి గర్భిణిని రప్పించి.. : పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. గత నెలలో విశాఖ సెంటర్లో మగబిడ్డ జన్మించినట్లు గుర్తించారు. ఢిల్లీకి చెందిన ఒక గర్భిణిని విమానంలో విశాఖకు తీసుకొచ్చి ఇక్కడ డెలివరీ చేయించి, ఆ బిడ్డను సరోగసీ ద్వారా పుట్టిందని వేరొక దంపతులను నమ్మించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డాక్టర్ నమ్రత గతంలోనూ ఇలాంటి కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడిందని, కొన్నేళ్ల కిందట రూ.30 లక్షలకు ఒక బిడ్డను కోల్కతాలోని దంపతులకు అమ్మకానికి పెట్టిందని పోలీసులు చెబుతున్నారు. మంట గలిసిన కేజీహెచ్ ప్రతిష్ట ఈ అక్రమాలతో కేజీహెచ్కు చెందిన వైద్యుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఒక అనస్థీషియా, ఒక గైనిక్, పిల్లల వైద్యుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఒకే బ్యాచ్లో చదువుకున్నారని సమాచారం. ఇప్పటికే పోలీసులు నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ అక్రమాల వెనక ఎంత మంది ఉన్నారనేది తెలుసుకోవడానికి పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తవ్వే కొద్దీ ఈ దందాలో కొత్త కోణాలు, కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయని సమాచారం. విశాఖ కేంద్రంగా అక్రమాలు -
సుంకాల ఉచ్చులో రొయ్య
కుదేలైన ఆక్వా రంగంమహారాణిపేట: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగానికి రాజసం తెచ్చిపెట్టి, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెట్టిన బంగారు రొయ్య.. నేడు అమెరికా వాణిజ్య విధానాల కారణంగా తన ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడింది. దేశ రొయ్యల ఉత్పత్తిలో అగ్రగామిగా.. ఆక్వా హబ్గా వెలుగొందుతున్న ఆంధ్రప్రదేశ్.. ముఖ్యంగా విశాఖ తీరం, మునుపెన్నడూ లేని సంక్షోభంలో చిక్కుకుంది. భారత ఉత్పత్తులపై అమెరికా 25 శాతం సుంకాన్ని విధించడంతో.. అంతర్జాతీయ మార్కెట్లో మన రొయ్యల పోటీ సామర్థ్యం దెబ్బతింది. ఫలితంగా ధరలు రికార్డు స్థాయిలో పతనం కావడం, ఎగుమతులు నిలిచిపోవడంతో లక్షలాది మంది ఆక్వా రైతులు, మత్స్యకారులు, పరిశ్రమ కార్మికుల భవిష్యత్తు అంధకారంలోకి జారుకుంది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోకపోతే, ఈ సంక్షోభం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన, దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపడం ఖాయం. కుప్పకూలిన ధరలు.. భారత రొయ్యల ఉత్పత్తులపై అమెరికా ఏకపక్షంగా 25 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించడమే ఈ సంక్షోభానికి మూల కారణం. ఇదే సమయంలో, ఈక్వెడార్ వంటి పోటీ దేశాలపై కేవలం 10 శాతం సుంకం విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో భారత రొయ్యలకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా ఎగుమతులు ఒక్కసారిగా నిలిచిపోయి, స్థానిక మార్కెట్లో ధరలు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. గతంలో 100 కౌంట్ రొయ్యల ధర రూ. 270 పలకగా, ఇప్పుడు అది రూ. 230కి పడిపోయింది. ఈ ధరల పతనంతో రైతులు టన్నుకు రూ. 50 వేల నుంచి రూ. 80 వేల వరకు నష్టపోతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు కూలిపోవడంతో, పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితిని ఆసరాగా చేసుకున్న స్థానిక వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి ఈ గండం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని రైతులు, మత్స్యకారులు, పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ‘కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమెరికాతో దౌత్య, వాణిజ్యపరమైన చర్చలు జరిపి, సుంకాలను తగ్గించేలా లేదా పూర్తిగా తొలగించేలా ఒత్తిడి తీసుకురావాలి. నష్టపోయిన రైతులకు తక్షణమే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలి. టన్నుకు కనీస మద్దతు ధర ప్రకటించడం లేదా నష్టపరిహారం అందించడం వంటి చర్యలు చేపట్టాలి. విద్యుత్, రొయ్యల మేత వంటి కీలకమైన వాటిపై సబ్సిడీలను పెంచి, సాగు వ్యయాన్ని తగ్గించాలి. అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించి.. యూరప్, ఇతర ఆసియా దేశాల్లో కొత్త మార్కెట్లను అన్వేషించడానికి ఎగుమతిదారులకు ప్రభుత్వం ప్రోత్సాహం, సహకారం అందించాలి.’ అని రైతులు కోరుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే.. రాబోయే సీజన్లో రొయ్యల సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరిశ్రమ భవిష్యత్తును మరింత ప్రమాదంలోకి నెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమపై ప్రభావం ఈ సంక్షోభం కేవలం రైతులకే పరిమితం కాలేదు. దీని ప్రభావం మొత్తం సరఫరా గొలుసు పై పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 100–150 ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు, ముఖ్యంగా విశాఖ పరిసర ప్రాంతాల్లోని 15 ఫ్యాక్టరీలు ఎగుమతి ఆర్డర్లు లేక ఉత్పత్తిని భారీగా తగ్గించాయి. దీని వల్ల వేలాది మంది కార్మికులు, ముఖ్యంగా మహిళలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. రొయ్యల మేత, మందుల సరఫరాదారులు, ప్యాకేజింగ్ పరిశ్రమలు, రవాణా రంగంపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. ఏడాదికి రూ. 25వేల కోట్ల విలువైన రొయ్యలను ఎగుమతి చేసే ఈ కీలక రంగం కుదేలవడం రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలిగిస్తోంది. తగ్గిన రొయ్యల ఎగుమతులు ఇప్పటికే పతనమైన ధరలు భరోసా ఇవ్వని కూటమి ప్రభుత్వం -
లోన్ యాప్లను నమ్మవద్దు
● పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ● నిందితుల నుంచి రూ.48 లక్షల రికవరీ ● బాధితులకు తిరిగి సొమ్ము అందజేత అల్లిపురం: సైబర్ మోసాలపై పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. చాలామంది ఇంకా సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నారని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. నగర ప్రజలు లోన్ యాప్లను నమ్మవద్దని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో మంగళవారం లోన్ యాప్ల బాధితులకు నిందితుల నుంచి రికవరీ చేసిన రూ.48 లక్షలను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లోన్ యాప్ కేసులో సీజ్ చేసిన క్రిప్టో కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి మార్చినట్లు చెప్పారు. ఈ మోసాల్లో బాధితులైన 295 మందిని గుర్తించామని, వారిలో దాదాపు వంద మంది ఎక్కువ మొత్తంలో డబ్బు నష్టపోయారని సీపీ వివరించారు. నిందితుల నుంచి రికవరీ చేసిన రూ.48 లక్షలను చట్టపరమైన ప్రక్రియల ద్వారా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇన్స్టెంట్ లోన్ యాప్ల నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతి లేని యాప్ల ద్వారా రుణాలు తీసుకుని సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవద్దని ఆయన సూచించారు. సైబర్ నేరగాళ్లు ఇచ్చే కమిషన్లకు ఆశపడి బ్యాంకు ఖాతాలు తెరిచి ఇవ్వడం, లేదా వాటిని సరఫరా చేయడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
రెండు బస్సుల ఢీ
ఐదుగురి విద్యార్థులకు గాయాలు పెందుర్తి: విశాఖ–విజయనగరం జిల్లాల సరిహద్దులోని కొత్తవలస మండలం తాడివానిపాలెం వద్ద సోమవారం ఆర్టీసీ బస్సు, ఒక కళాశాల బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థినులకు స్వల్ప గాయాలయ్యాయి. తమ పరిధి కాకపోయినప్పటికీ, పెందుర్తి పోలీసులు తక్షణమే స్పందించి గాయపడినవారికి సహాయం అందించారు. కొత్తవలస నుంచి ప్రయాణికులతో ఐటీ హిల్స్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఎల్.కోటలోని బెహరా కళాశాలకు చెందిన బస్సు తాడివానిపాలెం కూడలి వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కళాశాల బస్సులో ఉన్న ఐదుగురు విద్యార్థినులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పెందుర్తి సీఐ కేవీ సతీష్కుమార్ స్పందించి సి బ్బందిని ఘటనా స్థలానికి పంపించారు. గాయపడిన విద్యార్థినులను ఆటోలో గోపాలపట్నంలోని బెహరా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొత్తవలస పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్సీ విభాగం సమావేశాన్ని విజయవంతం చేయండి
మహారాణిపేట : మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఈనెల 13వ తేదీన జరగనున్న వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగం విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు పిలుపునిచ్చారు. సోమవారం మద్దిలపాలెంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబురావుతో కలిసి ఎస్సీ సెల్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్, నామినేట్ పదవుల్లో దళితులకు సముచిత స్థానం కల్పించారన్నారు. ఎస్సీ సెల్ విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగం నాయకులు పూర్ణచంద్రరావు, ఐడి బాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ రెయ్యి వెంకటరమణ, కార్పొరేటర్ శశికళ, ఎస్సీ సెల్ జోనల్ ఇన్చార్జి అల్లంపల్లి రాజబాబు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోని శివ రామకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరీ, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు బంగారు భవాని శంకర్, ఇతర నాయకులు లక్ష్మణ్ రావు, ఆకుల శ్యామ్, పూడి మల్లేశ్వరరావు, పరదేశి, జిల్లా ఎస్సీ విభాగం నాయకులు చలం, మురళి తదితరులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట : జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టరేట్లో సమీక్షించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేలా వేడుకలు నిర్వహించాలని, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టాలని చెప్పారు. పోలీస్ మైదానంలో నిర్వహించే వేడుకలకు జిల్లా ప్రజలు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులు, ఇతర ప్రముఖులు ఆహ్వానితులేనని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతిబింబించేలా శకటాల ప్రదర్శన నిర్వహించాలని, స్టాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివిధ పథకాల కింద లబ్ధిపొందిన ప్రజలకు నగదు పంపిణీకి సంబంధించి చర్యలు తీసుకోవాలని, జాబితా రూపొందించాలని సూచించారు. సమావేశంలో జేసీ కె.మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఈట్ రైట్ క్యాంపస్ ప్రారంభం
డాబాగార్డెన్స్: నగర ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు జీవీఎంసీ ఈట్రైట్ క్యాంపస్ ప్రారంభించి, వాటి అమలుకు 16 ప్రత్యేక ఎస్హెచ్ఈ టీమ్స్(శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్ఫోర్స్మెంట్) ఏర్పాటు చేయడం జరిగిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ తెలిపారు. నగరంలో హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలు, వీధి ఆహార విక్రయ కేంద్రాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, పలు ఆహార పదార్థాల్లో హనికర రసాయనాలు వినియోగించడం వల్ల కేన్సర్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వాటిని పూర్తిగా అరికట్టేందుకు ప్రతి జోన్కు రెండు ‘క్షీ’ టీమ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ టీమ్లో సహాయ వైద్యాధికారి, శానిటేషన్ సూపర్వైజర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, సచివాలయ శానిటరీ కార్యదర్శితో పాటు సచివాలయం మహిళా పోలీస్ ఒక బృందంగా ఉంటారని తెలిపారు. వీరు ప్రతిరోజూ కనీసం రెండు లేదా మూడు ఆహారం విక్రయించే కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తారన్నారు. ప్రస్తుతం జోన్కు 2 టీమ్లు ఉన్నాయని, అవసరమైతే 32 టీమ్లు ఏర్పాటు చేసి జోన్కు 4 చొప్పున కేటాయిస్తామన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
డాబాగార్డెన్స్: ఆ కుటుంబం ఆదివారం ఎంతో సంతోషంగా గడిపింది. మనుమడి అన్నప్రాసన వేడుకను సంబరంగా జరుపుకుంది. మరుసటి రోజు ఎంతో ఆనందంతో తిరిగి ఇంటికి ప్రయాణమైన ఆమెను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన సోమవారం సాయంత్రం ద్వారకా బస్టాండ్లో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట, పోతనాపల్లి గ్రామానికి చెందిన గేదెల ముత్యాలమ్మ (47), తన పెద్ద కుమార్తె కుమారుడి అన్నప్రాసన కోసం గాజువాకలో ఉన్న ఇంటికి వచ్చింది. ఆదివారం కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. సోమవారం తిరుగు ప్రయాణమై, ద్వారకా బస్టాండ్కు చేరుకుంది. సాయంత్రం 4.50 గంటల ప్రాంతంలో తన చిన్న కుమార్తెను బొబ్బిలి బస్సు ఎక్కించి, తాను ఎస్.కోట వెళ్లే బస్సు కోసం ప్లాట్ఫాం నంబర్ 25 వద్ద వేచి ఉంది. సరిగ్గా అదే సమయంలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే పల్లె వెలుగు బస్సు అతి వేగంగా ప్లాట్ఫాంపైకి దూసుకువచ్చింది. ఆ బస్సు ఢీకొనడంతో ముత్యాలమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన ఆ తల్లి, మనుమడిని చూసుకున్న సంతోషం మనసులో మెదులుతుండగానే, విధి ఆడిన వింత నాటకానికి బలైపోయింది. ముత్యాలమ్మ మృతితో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ముత్యాలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. బస్సు స్పీడ్గా వచ్చేసింది.. నేను అరకు వెళ్లాలి. బస్సు కోసం ఎస్.కోట ప్లాట్ఫాం వద్ద సమీపాన కూర్చున్నా... పదడుగుల దూరంలో ఆ మహిళ బ్యాగ్ పట్టుకుని నిల్చున్నారు. ఇంతలో ఆర్టీసీ బస్సు స్పీడ్గా ఆమెను ఢీకొని లోపలికి వచ్చేసింది. చూస్తుండుగానే ఆ మహిళ బస్సుకు అక్కడున్న స్తంభానికి మధ్యలో నలిగిపోయింది. ఇంకో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. – కమిడి గురు, అరకు, ప్రత్యక్ష సాక్షి ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సు ఢీకొని మహిళ మృతి మరొకరికి గాయాలుడ్రైవర్ నిర్లక్ష్యమే కారణం బస్టాండ్లోని ప్లాట్ఫాంపైకి బస్సు తీసుకొచ్చేటప్పుడు గంటకు 5 కిలోమీటర్ల వేగం మించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, వేగంగా వచ్చిన బస్సు ప్రమాదానికి కారణమైందని జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీ తర్వాత ఈ విషయం స్పష్టమైంది. దీనిపై డ్రైవర్ చంద్రరావును ప్రశ్నించగా, బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బస్టాండ్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. -
పోలీసు పీజీఆర్ఎస్కు 105 ఫిర్యాదులు
అల్లిపురం: పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 105 ఫిర్యాదులు వచ్చాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. కార్యక్రమంలో సబ్–డివిజన్ ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులలో ఎక్కువగా కుటుంబ కలహాలు, భూ వివాదాలు, మోసాలు, సివిల్ కేసులకు సంబంధించినవి ఉన్నాయని పేర్కొన్నారు. కమిషనర్ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. -
ఎంపీ, ఎమ్మెల్యేలకు పట్టని పీ4!
● బంగారు కుటుంబాల దత్తతకు ముందుకు రాని వైనం ● మార్గదర్శకుల ఎంపిక తుది గడువు ఈ నెల 19 ● ప్రభుత్వ తీరుతో తలలు పట్టుకుంటున్న అధికారులు , ప్రజాప్రతినిధులు మహారాణిపేట: రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలనలో భాగంగా అమలుకు ప్రతిపాదించిన పబ్లిక్(ప్రభుత్వ), ప్రైవేట్, పీపుల్(ప్రజల) పార్టనర్షిప్(పీ4) కార్యక్రమం నత్తనడకగా సాగుతోంది. మార్గదర్శకుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీస ఆసక్తి చూపట్లేదు. విశాఖ జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రధాన ప్రజాప్రతినిధులు చాలా వరకు స్థితిమంతులే. రూ.కోట్ల ఆస్తులకు పడగలెత్తిన వీరు బంగారు కుటుంబాల దత్తతకు ఎందుకనో చొరవ చూపట్లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి సమావేశాలు నిర్వహించి మరీ పీ4 అమలుపై చర్చించారు. అయినా ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కి అన్నట్టుగానే కార్యక్రమ అమలు తీరు కనిపిస్తోంది. సమీక్షలతోనే సరి..! : జిల్లాలో 73,452 బంగారు కుటుంబాలను గుర్తించారు. వీరిని దత్తత తీసుకుని ఆర్థికంగా చేయూతనివ్వాలన్న లక్ష్యంతో కూటమి సర్కార్ నడుస్తోంది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిరప్రసాద్ పీ4 అమలు కోసం సమీక్షల మీద సమీక్షలు నిర్వహించి మరీ అధికారులకు సూచనలిస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఈ నెల 19 నాటికి అవసరమైన మార్గదర్శకులను ఎంపిక చేయాలని అధికారులకు లక్ష్య నిర్దేశం చేశారు. దాతలను వెతికి పట్టుకోవడానికి జిల్లా యంత్రాంగం జిల్లా, మండల అధికారులకు సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేస్తోంది. అయితే ఇవేవీ అనుకున్నంత గొప్పగా సాగట్లేదన్నది నిర్వివాదాంశం. ప్రజా ప్రతినిధుల్లో నిర్లిప్తత పీ4 ద్వారా అట్టడుగున ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవాలన్న సీఎం పిలుపుపై ప్రజాప్రతినిధుల్లో పెద్దగా ఆసక్తి కనిపించట్లేదు. జిల్లాలో స్థితిమంతులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గంలో బాగా వెనుకబడిన గ్రామాన్ని, లేదా కొన్ని కుటుంబాలనైనా దత్తత తీసుకోవచ్చు. కనీసం వీరు చెప్తే ముందుకొచ్చే వాళ్లు ఆయా నియోజకవర్గాల్లో పదులు, వందల సంఖ్యలో ఉంటారు. ఎందుకనో ఒకరిద్దరు మినహా ఎవరూ దీనిపై స్పందించట్లేదు. ఆర్థిక, సామాజిక స్థితిగతుల ఆధారంగా పరిశీలిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో రాష్ట్రంలో విశాఖ జిల్లా ముందంజలో ఉండాలి. ఇక్కడి పాలకుల్లో స్పందన కరువవడంతో అధికారుల రెక్కల కష్టంపైనే పీ4 అమలు ఆధారపడి ఉంది. సంస్థల అనాసక్తి : జిల్లా పరిధిలోని పారిశ్రామిక సంస్థలు, యాజమాన్యాలు ఇప్పటికే సీఎస్సార్ నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అవి కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకే నిధులు కేటాయిస్తున్నాయి. సంపన్నులు కూడా తమ పరిధిలో చేతనైనంత సాయం చేస్తున్నారు. మళ్లీ కొత్తగా పీ4లో భాగస్వామ్యంతో పనేంటని వీరు పెదవి విరుస్తున్నారు. పేదల కోసం సంక్షేమ పథకాలు నూరు శాతం అమలు చేస్తే ఇలాంటి పథకాల అవసరమే ఉండదని చెప్తున్నారు. మరోవైపు పేదల్ని పెద్దల చెప్పుచేతల్లో పెట్టడమే ఈ పథకం ఉద్దేశమని పలువురు ఆక్షేపిస్తున్నారు. వారం రోజులే గడువు నాలుగంచెల ప్రక్రియ ద్వారా జిల్లాలో 73,452 బంగారు కుటుంబాలను గుర్తించారు. వీరిలో కూడా కొందరు అనర్హులున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ బంగారు కుటుంబాలను ఆదుకునే మార్గదర్శకుల ఎంపిక మాత్రం ఇంకా పూర్తి కాలేదు. సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ప్రవాసాంధ్రుల్లో కనీసం 12 వేల మందిని గుర్తించాల్సి ఉంది. ఈ నెల 19 నాటికి వీరి ఎంపిక పూర్తి కావాలి. ఇప్పటి వరకు ఎంత మంది ముందుకొచ్చారో కూడా తెలియని పరిస్థితి. -
ప్రైవేటు దాహం
మిట్టల్పై మోహం● రాయితీల కోసం దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న మిట్టల్ స్టీల్స్ ● రాయితీలు ఇవ్వకపోతే ప్లాంట్ మూసివేస్తామంటూ హెచ్చరికలు ● ఇక్కడా అదే తరహా బెదిరింపులుంటాయని విమర్శలు ● ఇప్పటికే మిట్టల్ ప్లాంట్కు రూ.28 వేల కోట్ల ప్రోత్సాహకాలిచ్చిన కూటమి ● స్టీల్ప్లాంట్కు తక్షణమే రూ.30 వేల కోట్ల సాయం కోరుతున్న ప్రజాసంఘాలు విశాఖ ఉక్కును ఉద్ధరిస్తామంటూనే.. ప్రైవేటు జపం చేస్తున్న కూటమి సర్కారు మిట్టల్ బెదిరింపులు మామూలుగా ఉండవు మిట్టల్ సంస్థ ప్లాంట్ ఏర్పాటు చేశాక ప్రభుత్వాన్నే బెదిరించే స్థాయికి చేరుకుంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. దక్షిణాఫ్రికాలో ఇదే మిట్టల్ సంస్థ అక్కడి ప్రభుత్వాన్ని బెదిరిస్తోంది. ఇప్పుడిస్తున్న రాయితీలు సరిపోవడం లేదనీ.. తాము కోరినంత రాయితీ, ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. లేదంటే ప్లాంట్ మూసేస్తామంటూ హెచ్చరిస్తోంది. దీంతో భయాందోళనలకు గురైన దక్షిణాఫ్రికా ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో 92 మిలియన్ డాలర్ల భారీ రాయితీలు కల్పించేందుకు అంగీకారం తెలిపింది. మిట్టల్ని పెంచి పోషిస్తే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంపైనా ఇలాంటి బెదిరింపులు తప్పవని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా.. కూటమి ఎంపీల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టీల్ప్లాంట్ను కాపాడేందుకు ఒక్కసారి కూడా కూటమి ఎంపీలు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ వద్దకు వెళ్లలేదు. కానీ.. మిట్టల్ స్టీల్ప్లాంట్కు సకల సదుపాయాలు కల్పించాలని కోరేందుకు మాత్రం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, విశాఖ ఎంపీ భరత్ నేతృత్వంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వద్ద సాగిలపడ్డారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని ఏ ఒక్కరోజూ కోరని కూటమి ఎంపీలు మిట్టల్ ప్లాంట్కు మాత్రం సొంత ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని మోకరిల్లుతున్నారు. విశాఖ ఉక్కుపై కూటమి ఎంపీలు, ప్రభుత్వ తీరుచూసి విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమను ఉద్ధరిస్తామంటూ ఊదరగొడుతున్న చంద్రబాబు సర్కారు.. ఆ సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రానికి పరోక్షంగా సహకరిస్తోంది. స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్ర ప్రభుత్వం తెగేసి చెబుతుండగా.. మరోవైపు ప్లాంట్కు కొద్ది దూరంలోనే మిట్టల్ స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పరిశ్రమను నిలబెట్టేందుకు రూపాయి కూడా విదల్చని చంద్రబాబు.. మిట్టల్ స్టీల్స్పై వ్యామోహంతో ఏకంగా రూ.28 వేల కోట్ల ప్రోత్సాహకాలు అందించడం విస్మయానికి గురి చేస్తోంది. మొదట్లో కొద్దోగొప్పో రాయితీలు అడిగి ఆ తర్వాత ప్రభుత్వం నెత్తినెక్కి కూర్చుంటుంది మిట్టల్ సంస్థ. దక్షిణాఫ్రికాలో ప్లాంట్ ఏర్పాటు చేసి ఇప్పుడు గొంతెమ్మ కోర్కెలు మిట్టల్ సంస్థ కోరుతోంది. భవిష్యత్తులో ఏపీ పరిస్థితి కూడా ఇలా మారకముందే మేల్కొనాలని ప్రజాసంఘాలు సూచిస్తున్నాయి. స్టీల్ప్లాంట్కు పునరుజ్జీవనంపై దృష్టి సారించకుండా మిట్టల్కు మోకరిల్లడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నాడు ప్రగల్భాలు పలికి.. ఎన్నికల ముందువరకూ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికిన టీడీపీ, జనసేన నేతలు కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత విశాఖ ఉక్కును ముక్కలు చేసేందుకు ఏం చెయ్యాలో అన్నీ చేస్తోంది. ఓ వైపు కేంద్ర గనుల శాఖ మంత్రిత్వ శాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి తీరతామని మరోసారి కుండబద్దలుగొట్టింది. అయినా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం ప్లాంట్ మూసివేసేందుకు పూర్తిగా సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగానే విశాఖ ఉక్కుకు కొద్ది దూరంలో అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తోంది. ప్రజలు, ఉద్యోగుల ఆందోళనలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నిరసనలను ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు, పవన్కళ్యాణ్ అండ్ కో మిట్టల్కు మోకరిల్లుతున్నారు. స్టేజ్–1లో మిట్టల్ పరిశ్రమ ఏర్పాటుకు ఏకంగా రూ.28 వేల కోట్ల ప్రోత్సాహకాలు అందించిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆ సంస్థకు కావల్సిన సమస్త సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిట్టల్పై ఎందుకంత మోజు? మిట్టల్ స్టీల్ప్లాంట్ కోసం ఇప్పటికే వేల ఎకరాల భూముల్ని ధారాదత్తం చేసి.. ప్రజల జీవనోపాధి, జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దశాబ్దాల చరిత్ర గల విశాఖ ఉక్కుని పరిరక్షించాలన్న ధ్యాస రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సొంత గనులు కేటాయించాలని పదేపదే కోరినా పట్టించుకోని ఎంపీలు.. ఇప్పుడు మిట్టల్కు సొంత గనులు కేటాయించాలని కోరడం దుర్మార్గం. ప్రభుత్వ తీరు చూస్తే విశాఖ స్టీల్ప్లాంట్ని పూర్తిగా బలహీనపరచడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. మిట్టల్ సంస్థపై చంద్రబాబు ప్రభుత్వం ఎందుకంత మోజు చూపిస్తోందో అర్థం కావడం లేదు. ఎంపీలు ప్రైవేటుకు ఊడిగం చేయడం హేయమైన చర్య. ఇప్పటికై నా కళ్లు తెరిచి స్టీల్ప్లాంట్కు రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం తీసుకొచ్చి ఆంధ్రుల హక్కుని బతికించాలి. – ఈఏఎస్ శర్మ, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏదీ?
● విచ్చల విడిగా మద్యం అమ్మకాలు ● వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి మహారాణిపేట: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, ఓ పక్క మహిళలు భయాందోళనలో ఉంటే మరో పక్క మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆందోళన వ్యక్తం చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎక్కడ చూసినా బెల్టు షాపులు దర్శనం ఇస్తున్నాయని, వీటి వల్ల మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. డబ్బులు తీసుకొని మద్యం షాపుల దగ్గర పర్మిట్ రూమ్లు పెడుతున్నారని, మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుందని ఆక్షేపించారు. మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా బస్ ఫ్రీ అన్నారని, ప్రీమియం బస్సుల్లో మాత్రం మహిళలకు ఫ్రీ లేదని తెలిపారు. ఉచిత బస్సులు కేవలం 30 కిమీ దూరం మాత్రమే తిరుగుతాయని, తిరుపతి వెళ్లాలంటే మహిళలు ఎలా వెళ్లాలని, కండిషన్న్స్ అప్లై అనేలా ఫ్రీ బస్ పథకం కనపడుతోందని ఆక్షేపించారు. పథకాల కోసం వైఎస్సార్సీపీ నిలదీయడం వల్లే హామీలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గరుడ, అమరావతి, ఇంద్ర, సూపర్ లక్జరీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు చెప్పిందొకటి.. ఇప్పుడు మాట్లాడుతుంది ఇంకొకటి అని అన్నారు. మహిళలను ఇంతలా మోసం చేస్తారా..? అని ప్రశ్నించారు. సమావేశంలో కార్పొరేటర్లు శశికళ, పద్మారెడ్డి, పార్టీ మహిళా నేతలు శ్రీదేవివర్మ, కల్పన, జ్యోతి, పార్వతి, ధనలక్ష్మి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో కై లాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి
ఆరిలోవ: కై లాసగిరిపై నిర్మాణంలో ఉన్న గ్లాస్ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న ట్లు వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ తెలిపారు. సోమవారం వారు ఇక్కడ నిర్మాణంలో ఉన్న గ్లాస్ బ్రిడ్జిని పరిశీలించారు. పనులు ఎంతవరకు జరిగాయో ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసియాలోనే పొడవైన ఈ గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం కైలాసగిరిపై ఏర్పాటు చేయనున్న త్రిశూల్ ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో వీఎంఆర్డీఏ ప్రధాన ఇంజనీరు వినయ్కుమార్, పర్యవేక్షక ఇంజనీర్లు భవానీశంకర్, మధుసూదనరావు, కార్యనిర్వాహక ఇంజనీర్లు రామరాజు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు 313 వినతులు
మహారాణిపేట: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు ప్రజల నుంచి 313 వినతులు అందాయి. వీటిలో అత్యధికంగా రెవెన్యూ విభాగానికి 130, జీవీఎంసీకి 82, పోలీసు విభాగానికి 15, ఇతర విభాగాలకు 86 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులను వెంటనే ఆన్లైన్లో పరిశీలించి, నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పదేపదే వచ్చే ఫిర్యాదులను లోతుగా విచారించాలని, అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. కాల్ సెంటర్ ఫీడ్బ్యాక్ను మెరుగుపరచాలని, ఫిర్యాదుదారుడితో సంబంధిత అధికారి తప్పనిసరిగా మాట్లాడాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేసీ కె. మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్, , ఏడీసీ వర్మ పాల్గొన్నారు. -
‘తల్లి’కి వందనం ‘పాట్లు’
● కలెక్టరేట్కు క్యూ కట్టిన తల్లులు ● సచివాలయం, కలెక్టరేట్ చుట్టు ప్రదక్షిణలుమహారాణిపేట: హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు అర్హుల సంఖ్యను తగ్గించేందుకు కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చిందంటూ తల్లుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘తల్లికి వందనం’ పథకం కోసం తల్లులు పడుతున్న అష్టకష్టాలకు కలెక్టరేట్ వేదికగా సోమవారం మరోసారి సాక్ష్యంగా నిలిచింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు క్యూ కట్టిన తల్లులు, తమకు పథకం డబ్బులు ఎందుకు రాలేదో తెలియక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం ఇస్తాం అని ఎన్నికల ముందు చెప్పిన నాయకులు, ఇప్పుడు ‘ఇంట్లో ఒకరికి ఉచిత సీటు వస్తే ఇంకొకరికి కట్’ అంటూ సరికొత్త నిబంధనలను తీసుకొచ్చారని తల్లులు మండిపడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉచిత సీట్లు పొందినవారికి కూడా ‘అమ్మఒడి’ ఇచ్చిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం అర్హుల సంఖ్య తగ్గించేందుకే ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ కొత్త నిబంధనల వల్ల ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా ‘తల్లికి వందనం’ కట్ అవుతోందన్న విషయం చాలామంది తల్లులకు తెలియక గగ్గోలు పెడుతున్నారు. ఉదాహరణకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీటు లభించినా, విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటినా ఈ పథకం వర్తించకుండా చేస్తున్నారు. ఇంతేకాకుండా ఉచిత సీటు రానివారికి కూడా ‘మీకు ఉచిత సీటు వచ్చింది’ అని ఆన్లైన్లో చూపించి పథకాన్ని నిలిపివేస్తున్నారని తల్లులు కలెక్టర్ ముందు తమ ఆవేదనను వెళ్లగక్కారు. తల్లుల నుంచి భారీగా ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఈ ఫిర్యాదులను డీఈవో ప్రేమ్కుమార్, సమగ్ర శిక్షా అధికారులకు అందజేశారు. ఈ ఫిర్యాదుల పరిష్కారం కోసం డీఈవో కార్యాలయ సిబ్బంది, అధికారులు కలెక్టరేట్లోనే ల్యాప్టాప్లు పెట్టుకొని నిమగ్నమయ్యారు. ఒకవైపు తాము అన్ని విధాలుగా అర్హులమని, అయినా డబ్బులు రాలేదని తల్లులు ఆవేదన చెందుతుంటే, మరోవైపు ప్రభుత్వం కొత్త నిబంధనల పేరుతో సంక్షేమ పథకాలను కుదిస్తోందన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. ‘తల్లికి వందనం’ పథకంపై కొత్త నిబంధనలతో కూటమి సర్కారు తల్లుల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులే సమాధానం చెప్పాలి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటున్నారు. ‘తల్లికి వందనం’ రాలేదు. పదే పదే సచివాలయం చుట్టు తిరుగుతున్నా...కలెక్టర్ కార్యాలయానికి ఇప్పటికి మూడో సారి వచ్చా...నా సమస్య పరిష్కారం కాలేదు. ఎవర్ని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. అర్హుత ఉండీ కూడా తల్లికి వందనం డబ్బులు ఎందుకు ఇవ్వలేదో అధికారులు సమాధానం చెప్పాలి. – ఎన్.భాగ్యలక్ష్మి, పాపయ్యరాజుపాలెం, పెందుర్తి మండలం -
వారియర్స్పై రాయల్స్ విజయం
విశాఖ స్పోర్ట్స్ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీ20లో భాగంగా సోమవారం జరిగిన తొలిమ్యాచ్లో తుంగభద్ర వారియర్స్పై అమరావతి రాయల్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. కెప్టెన్ మహీప్ కుమార్(28), ప్రశాంత్(59), ఆనంద్(32), శశికాంత్(36) బ్యాటింగ్లో రాణించారు. కార్తీక్, మల్లికార్జున రెండేసి వికెట్లు తీయగా అయ్యప్ప, వినయ్ చెరో వికెట్ తీశారు. రాయల్స్ కెప్టెన్ హనుమవిహారీ(9) తక్కువ స్కోర్కే వెనుదిరగ్గా.. రాహుల్(61) సందీప్ (33), ప్రసాద్ (42 నాటౌట్), పాండురంగ(39 నాటౌట్) రాణించారు. శశికాంత్ రెండు వికెట్లు తీయగా స్టీఫెన్, తోషిత్, సౌరబ్ ఒక్కో వికెట్ తీశారు. కింగ్స్ను గెలిపించిన తపస్వి మరో మ్యాచ్లో సింహాద్రి వైజాగ్ లయన్స్పై కాకినాడ కింగ్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సింహాద్రి వైజాగ్ లయన్స్ ఏడు వికెట్లకు 207 పరుగులు చేసింది. కెప్టెన్ రికీబుయ్ (85), సందీప్(60), అభిషేక్(29) వీరారెడ్డి(22) రాణించారు. ఆంజనేయులు మూడు వికెట్లు, సుదర్శన్, ప్రమోద్ చెరో వికెట్ తీశారు. ప్రతిగా కింగ్స్ ఐదు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి విజయం సాధించింది. తపస్వి (94), రాహుల్ (43), సూర్య (36), లేఖజ్(22 నాటౌట్) రాణించారు. రంజిత్ రెండు, అజయ్, విజయ్, సాయితేజ ఒకో వికెట్ తీయగలిగారు. -
సచివాలయ హెల్త్ సెక్రటరీల ధర్నా
మహారాణిపేట: తమకు పబ్లిక్ హాలిడేస్ వర్తింపజేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సచివాలయ హెల్త్ సెక్రటరీల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏపీ యునైటెడ్ గ్రామ, వార్డ్ హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ పిలుపు మేరకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీలు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు సమర్పించారు. ఈ ఆందోళనకు అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలు పి. మణి, జనరల్ సెక్రటరీ ఎస్. సుభాషిణి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను తరచూ డీఎంహెచ్వో దుర్భాషలాడుతున్నారని, అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్లో చేపట్టిన బదిలీలను యథాతథంగా కొనసాగించాలని, తక్షణమే గ్రేడ్ 2 ప్రమోషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా తమకు ఇతర డిపార్ట్మెంట్ పనులు అప్పగించవద్దని, పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. తమ సర్వీస్ రికార్డులను భద్రపరచడానికి ఒక అధికారిని కేటాయించాలని, పనివేళలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చాలని వారు విజ్ఞప్తి చేశారు. తమను పూర్తిగా వైద్య, ఆరోగ్య శాఖలో విలీనం చేయాలని వారు కోరారు. -
తొలగించిన విశాఖ డెయిరీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
బీచ్రోడ్డు: విశాఖ డెయిరీలో తొలగించిన 305 మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడు తూ డైయిరీ కార్మికులు కొన్ని దశాబ్దాలుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ, తమ విధి నిర్వహణలో ఎంతో అనుభవాన్ని సంపాదించారన్నారు. అటువంటి వారికి వేతనాలు పెంచడం, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సదుపాయాలను కల్పించాల్సిన యాజమాన్యం, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, వారిని తొలగించడం చట్ట విరుద్ధమన్నారు. అంతేకాకుండా అనుభవం ఉన్న కార్మికులను తొలగించి, కొత్తవారిని నియమించుకోవడం మరింత దుర్మార్గమన్నారు. అన్యాయంగా సస్పెండ్ చేసిన నలుగురు పర్మినెంట్ యూనియన్ నాయకులను కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, విశాఖ డెయిరీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం. రాంబాబు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ నాయకురాలు మణి, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు, జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కే. సత్యనారాయణ పాల్గొన్నారు. -
స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి
ఉక్కునగరం : స్టీల్ప్లాంట్ స్టీల్ మెల్ట్ షాప్–1లో సోమవారం జరిగిన ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికుడు దుర్మరణం చెందాడు. విభాగంలో కాంట్రాక్ట్ పనులు చేస్తున్న కె.ఆర్.ఎల్ ఇంజనీరింగ్లో సురేష్ సింగ్ (26) అన్స్కిల్డ్ కార్మికునిగా విధులు నిర్వహిస్తున్నాడు. విభాగంలో ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా టిపి బేలో ఉన్న టండిష్లో స్లాగ్ మెటీరియల్ పోస్తారు. అక్కడ స్లాగ్ మెటీరియల్ స్లాబ్గా తయారవుతుంది. ఈ ప్రక్రియలో ఆ స్లాబ్కు ఇరువైపులా హుక్లు ఏర్పాటు చేస్తారు. అక్కడ తయారైన స్లాబ్ను డంపర్లో లోడు చేస్తుండగా హుక్ జారీ అక్కడ విధులు నిర్వహిస్తున్న సురేష్ సింగ్పై పడింది. తీవ్ర గాయాలతో సురేష్సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దీనిపై సీఐటీయూ నాయకులు కెఆర్ఎల్ యాజమాన్యంతో చర్చించగా నిబంధనల మేరకు వచ్చే వాటితో పాటు రెండు లక్షలు పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉపాధి, దహన ఖర్చులు చెల్లించడానికి అంగీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. స్టీల్ప్లాంట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గోవుల్ని అక్రమంగా తరలిస్తున్న లారీ ఢీకొని వ్యక్తి మృతి
● రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయిన మూగజీవాలు ● విశాఖలో ఘటన ఆరిలోవ: అక్రమంగా పశువుల్ని తరలిస్తున్న లారీ ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓల్డ్ డైరీ ఫారం వద్ద జాతీయ రహదారిపై బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, లారీలో ఉన్న ఆవులు, దూడలు గాయపడ్డాయి. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రాంతంలోని సంతలో కొనుగోలు చేసిన 18 ఆవులు, దూడలను ఓ వ్యక్తి లారీలో కిక్కిరిసినట్లు ఎక్కించి విశాఖ వన్టౌన్ ప్రాంతానికి ఆదివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్నాడు. హైవేపై విమ్స్ వైపు నుంచి విశాలాక్షినగర్ స్టేట్ బ్యాంక్ వైపు రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అర్ధరాత్రి ఆ లారీ ఢీకొట్టి బోల్తాపడింది. వ్యక్తి తలకు తీవ్రగాయాలై, రక్తస్రావంతో రోడ్డుపై ప్రాణాలతో కొట్టుమిట్టాడాడు. లారీలో ఆవులు, దూడలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడి సొమ్మసిల్లిపోయాయి. కొన్నింటికి గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళుతున్న వాహనచోదకులు పోలీసులకు సమాచారమివ్వడంతో ఆరిలోవ పోలీసులు ఘటనాస్థలికి వచ్చి కొనఊపిరితో ఉన్న వ్యక్తిని కేజీహెచ్కు తరలించారు. ఆస్పత్రికి తీసుకువెళ్లేసరికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు అక్కడి వైద్యులు చెప్పారు. లారీతోపాటు, పశువుల్ని, డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా ఓ కేసు, అక్రమంగా గోవుల తరలింపుపై మరో కేసు నమోదు చేసినట్లు ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. -
దుఃఖంలోనూ ఆదర్శం.. తల్లి నేత్రాలు దానం
కంచరపాలెం: పుట్టెడు దుఃఖంలోనూ మానవత్వాన్ని చాటుకున్న ఘటన జీవీఎంసీ 47వ వార్డు, కంచరపాలెం, ఇందిరానగర్–5లో జరిగింది. తమ తల్లి మరణంతో తీవ్ర శోకంలో ఉన్నప్పటికీ ఆమె కళ్లను దానం చేసి ఆ కుటుంబం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. గండిబోయిన ఈశ్వరమ్మ (75) ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కేజీహెచ్లో మృతి చెందారు. తల్లి మరణంతో ఆ కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. అయితే ఈశ్వరమ్మ భర్త అప్పారావు, కుమారులు అప్పలరాజు, సూర్యచంద్రరావు, కుమార్తె లక్ష్మి ఆమె కళ్లను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. వారి ఆదర్శ ఆలోచనతో మోషిని ఐ బ్యాంక్కు నేత్రదానం చేశారు. ఎల్వీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ టెక్నీషియన్ అజయ్ సహకారంతో కంటి రెటీనాను తొలగించి తరలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక వ్యక్తి దానం చేసే కళ్లతో నలుగురికి కూడా చూపునివ్వవచ్చని కంటి వైద్య నిపుణులు వివరించారు. -
ఆరోగ్యం గుల్ల
నాణ్యత కల్ల బయట ఫుడ్ తింటే అంతే.. బీచ్రోడ్డు : నేటి ఆధునిక ప్రపంచంలో యువత ఆహార అలవాట్లు శరవేగంగా మారుతున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడంతో ఇంట్లో వంటకు సమయం దొరకడం లేదు. దీంతో చాలామంది బయటి ఆహారంపై, ముఖ్యంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీలపై ఆధారపడుతున్నారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతవరకు సురక్షితం అన్న ప్రశ్న ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైన అంశాలు ఈ ఆందోళనలకు బలం చేకూర్చుతున్నాయి. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులతో సహా తనిఖీ చేసిన 85శాతం చోట్ల కల్తీ, నాసిరకమైన, అపరిశుభ్రమైన ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన పదార్థాలు, గడువు తీరిన ఆహార ఉత్పత్తులు, హానికరమైన రంగులు, రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు బయటపడింది. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఈ రకమైన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక జీవనశైలి సౌకర్యాలను అందిస్తున్నప్పటికీ, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో ఈ తనిఖీలు మరోసారి రుజువు చేశాయి. ప్రజలు తమ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలని, బయటి ఆహారాన్ని తగ్గించి, ఇంట్లో తయారుచేసుకున్న పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బేకరీల్లోనూ అదే పరిస్థితి బేకరీలలోనూ ఇదే పరిస్థితి. చాలా దుకాణాల్లో గడువు ముగిసిన పదార్థాలు, హానికరమైన రసాయనాలు, రంగులు వాడుతున్నట్లు గుర్తించారు. కొన్నిచోట్ల రెండు, మూడేళ్ల క్రితం గడువు తీరిన వస్తువులను కూడా విక్రయిస్తున్నట్లు తేలింది. రామ్నగర్లోని బేకరీ డెన్, తగరపువలసలోని దేవీ స్వీట్స్, ఎస్ఎస్ఎన్ బేకరీలలో గడువు తీరిన ఆహారం విక్రయిస్తున్నారు. దయారం స్వీట్స్లో ఫంగస్ పట్టిన బాదంపప్పును అధికారులు గుర్తించారు. 175 కిలోల పాడైన ఆహారం స్వాధీనం ఈ దాడుల్లో మొత్తం 175 కేజీల పాడైపోయిన ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హోటళ్లు, బేకరీలలో గుర్తించిన 81 రకాల ఆహార పదార్థాల నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపారు. 17 హోటళ్లు, 16 స్వీట్, బేకరీ షాపులపై కేసులు నమోదు చేసి, 20 దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. ప్రజలు బయట ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్స్లో పరిస్థితి దారుణం ఒక్క రోజు తనిఖీల్లో 175 కేజీల నిల్వ ఆహారం గుర్తింపు 85 శాతం హోటల్స్లో కల్తీ ఆహారం విక్రయం ఆహార భద్రత, ప్రమాణాల శాఖ దాడుల్లో గుర్తింపు హోటళ్లలో కల్తీ ఆహారం 20 బృందాలుగా ఏర్పడిన అధికారులు ఒక రోజు 40 హోటళ్లను తనిఖీ చేయగా, వాటిలో 85 శాతం చోట్ల నాసిరకం ఆహారం, అపరిశుభ్రత వెలుగులోకి వచ్చాయి. రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్, మటన్, కుళ్లిపోయిన గుడ్లు, దుర్వాసన వస్తున్న నూడుల్స్ వంటి పదార్థాలను వంటలకు ఉపయోగిస్తున్నట్లు కనుగొన్నారు. కేవలం ఒక్క రోజులోనే 125 కేజీల పాడైపోయిన ఆహారాన్ని గుర్తించి పారవేశారు. ముఖ్యంగా ఇసుకతోటలోని మాయ, ముంతాజ్ హోటళ్లు, జగదాంబ జంక్షన్లోని ఆల్ఫా హోటళ్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు లభించాయి. చికెన్, మటన్ గ్రేవీలు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. -
నిర్ణీత సమయంలో అర్జీలు పరిష్కరించాలి
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి మొత్తం 113 వినతులు వచ్చాయని తెలిపారు. వీటిలో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 67 ఫిర్యాదులు అందగా, మిగిలినవి ఇతర విభాగాలకు వచ్చాయని వివరించారు. జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్కు 4 ఫిర్యాదులు, రెవెన్యూ విభాగానికి 8, ప్రజా ఆరోగ్యానికి 7, ఇంజినీరింగ్ విభాగానికి 22, యూసీడీ విభాగానికి 5 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిశీలించి, సంబంధిత అధికారులతో సంప్రదించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. వచ్చిన అర్జీలపై అధికారులు అదే రోజు స్పందించి కార్యాచరణ చేపట్టాలని అధికారులను, జోనల్ కమిషనర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రధాన ఇంజినీర్ పల్లంరాజు, అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 14న నేషనల్ డాగ్ షో
మర్రిపాలెం: సెప్టెంబర్ 14న నేషనల్ డాగ్ షో నిర్వహిస్తున్నట్లు విశాఖ కెన్నెల్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణ తెలిపారు. ఆర్ అండ్ బీ సమీపంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఆదివారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా సహకారంతో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంవీపీ గాదిరాజు ప్యాలెస్లో ఈ డాగ్ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఊటీ, కొడైకెనాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కోల్కతా, జార్ఖండ్, చత్తీస్గఢ్ వంటి ప్రాంతాల నుంచి 50 జాతులకు చెందిన 300 కుక్కలు ఈ షోలో పాల్గొంటాయని వివరించారు. కార్యక్రమంలో నారాయణరెడ్డి, రాజేశ్వరరావు, సీరట్ల శ్రీనివాస్, సూర్యప్రకాష్ రెడ్డి, కృష్ణప్రసాద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
కనకమహాలక్ష్మి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్ర కల్పవల్లి కనకమహాలక్ష్మి అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వారికి అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేదాశీర్వచనం చేసి, అమ్మవారి ప్రసాదం అందజేశారు. బీసీ వెల్ఫేర్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో శోభారాణి, ఏఈవో రాజేంద్రకుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
ఎత్తివేస్తాం!
చిట్కెలో నిషేధం● రంగంలోకి చిట్స్ వ్యాపారి ● 22–ఏ జాబితాలోని భూములపై కన్ను ● హైదరాబాద్ కేంద్రంగా వ్యవహారం ● ఇప్పటికే 6 ఎకరాలకుపైగా భూములపై నిషేధం ఎత్తివేత ● ఆయన చేతిలో మరో 15 భూదస్త్రాలుసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అత్యంత విలువైన భూములున్న విశాఖ కేంద్రంగా అధికార పార్టీకి చెందిన నేతలు గద్దల్లా వాలుతున్నారు. ఇప్పటికే ఎండాడలోని విలువైన 5.10 ఎకరాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయించుకున్న అధికార పార్టీ నేతలు.. ఇతర భూములపైనా కన్నేసినట్టు తెలుస్తోంది. ఎలాంటి భూములనైనా నిషేధం ఎత్తివేయించి.. విక్రయించుకునేందుకువీలుగా చేస్తామంటూ బేరసారాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో విశాఖలో ఏకంగా కోటి రూపాయల మోడల్ చిట్ను ప్రారంభించి ఒక వెలుగు వెలిగిన చిట్ కంపెనీకి చెందిన సోదరుడే ఇప్పుడు ఈ భూవ్యవహారాలను చక్కబెట్టేందుకు రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. చిట్ వ్యాపారి మరణించిన తరువాత హైదరాబాద్కు వెళ్లిన ఆ వ్యాపారి సోదరుడు అక్కడ నుంచే వ్యవహారాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు విశాఖలోని పాత నగరంలో ఒక ప్రముఖ హోటల్లో తిష్టవేసినట్లు భోగట్టా. ఇందులో భాగంగా ఇప్పటికే మాజీ సైనికులకు చెందిన ఆరు ఎకరాలకుపైగా భూములపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయించి 22–ఏ జాబితా నుంచి తొలగించేలా ఆదేశాలు తెచ్చినట్టు సమాచారం. అయితే, ఈ చిట్ వ్యాపారి వెనుక ఉండి వ్యవహారాలు నడిపిస్తున్న పెద్దలు ఎవరనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సచివాలయం వైపు తొంగి చూడొద్దు! మరోవైపు ఇప్పటికే ఎండాడ భూమి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ పెద్దలు మరిన్ని భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కార్యక్రమం మాత్రం యథావిధిగా నడిపిస్తున్నారు. అయితే, దక్షిణ నియోజకవర్గానికి చెందిన నేతపై మాత్రం కూటమి ఎమ్మెల్యేలు లోలోన రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలోని తన పేషీ వైపు మాత్రం కొద్ది రోజులు రావద్దంటూ ఒక అమాత్యుడు సదరు దక్షిణ నియోజకవర్గ నేతకు సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సదరు నేత కాసింత జోరు తగ్గించినట్టు తెలుస్తోంది. మరోవైపు చిట్ వ్యాపారి తాజాగా దూకుడు పెంచడం చర్చనీయాంశమవుతోంది. అమాత్యుడితో సంబంధం లేకుండా నేరుగా వ్యవహారాలు చక్కబెడుతున్నారు. అయితే, ఈ చిట్ వ్యాపారి వెనుక ఉండి వ్యవహారాలు నడుపుతున్న ప్రభుత్వ పెద్దలు ఎవరనేది మాత్రం తేలాల్సి ఉంది. సిట్ జాబితాలోని భూములపైనా కన్ను వాస్తవానికి విశాఖ నగరంలోని పలు విలువైన భూముల్లో అక్రమాలు జరుగుతున్నాయని 2014–19లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే అప్పటి మంత్రి అయ్యన్న ఆరోపణలు గుప్పించారు. ప్రధానంగా గంటా లక్ష్యంగా ఆయన పలు ఆరోపణలు చేశారు. ఫలితంగా విశాఖ భూ వ్యవహారాలపై తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. ఆ సిట్ తన నివేదికను కూడా 2017లో సమర్పించింది. ఈ నివేదికపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రధానంగా తమ పార్టీకి చెందిన నేతలతో పాటు మద్దతిచ్చే సామాజికవర్గాలకు చెందిన వ్యక్తులు, సంస్థలు ఇందులో ఉండటమే కారణమనే విమర్శలున్నాయి. ప్రధానంగా ఫలానా భూములపై అనేక ఆరోపణలు ఉన్నాయని.. ఈ భూముల జోలికి వెళ్లవద్దనడంతో పాటు ఆ భూములకు నిరంభ్యంతర పత్రాలు (ఎన్వోసీ) కూడా జారీ చేయవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అటువంటి భూములకు కూడా ఎన్వోసీలు ఇప్పిస్తామంటూ ఇప్పుడు సదరు చిట్ వ్యాపారి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ విధంగా ఇప్పటికే సిట్ పరిధిలోకి 6 ఎకరాలకుపైగా భూమికి ఎన్వోసీ తెచ్చినట్టు కూడా సమాచారం. అంతేకాకుండా అత్యంత విలువైన ప్రాంతాల్లోని 15 కీలకమైన భూదస్త్రాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. వీటన్నింటికి ఎన్వోసీలు ఇప్పించి.. ప్రభుత్వ భూముల జాబితా నుంచి తొలగించేలా చేస్తానని కూడా చెబుతుండటం గమనార్హం. ఇప్పటికే ఎండాడ భూమి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ పెద్దలు ఏ మాత్రమూ తగ్గేదేలే అంటూ ముందుకెళుతుండటం గమనార్హం. -
సింహగిరిపై రూ.3 కోట్లతో శాశ్వత షెడ్
నిర్మాణానికి విరాళం అందించిన డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న శాశ్వత షెడ్కు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం శంకుస్థాపన చేశారు. విజయవాడకు చెందిన దాత డాక్టర్ బొప్పన ఝాన్సీలక్ష్మీబాయి(శ్రీ వైభవి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్) ఈ నిర్మాణానికి విరాళం అందించారు. ఆలయ ఉత్తర రాజగోపురం ఎదుట 30 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో నిర్మించే ఈ టెన్సిల్ మెంబ్రేన్ షెడ్.. భక్తులను ఎండ, వానల నుంచి రక్షించడంతో పాటు వారికి విశ్రాంతి స్థలంగా ఉపయోగపడుతుందని గంటా అన్నారు. ఉత్సవాల సమయంలో తాత్కాలిక షెడ్ లతో భక్తులు పడుతున్న ఇబ్బందులకు ఈ నిర్మాణంతో తెర పడుతుందన్నారు. ఈ సందర్భంగా దాతను అభినందించారు. సింహాచలం దేవస్థానానికి త్వర లోనే పాలకమండలిని ఏర్పాటు చేస్తామని గంటా వెల్లడించారు. తిరుమల తరహాలో సింహగిరిపై కూడా దాతల సహకారంతో కాటేజీలు నిర్మించి, వసతి సౌకర్యాలు మెరుగుపరచాలని ముఖ్యమంత్రిని కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. కొండపై జీఆర్టీ జ్యూయలర్స్ ఏర్పాటు చేసిన శంఖుచక్ర నామాల పక్కనే ఆ సంస్థ పేరును ప్రదర్శించడంపై గంటా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భగవంతుడి నామాల వద్ద కంపెనీ పేరు కనిపించడం సరికాదన్నారు. ఆ పేరును వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో మొత్తం నిర్మాణాన్ని తీసివేసి కొత్తగా నామాలను ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు జీఆర్టీ పేరుకు ఉన్న విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో వి.త్రినాథరావు, దాత బంధువులు, కార్పొరేటర్ పి.వి.నరసింహం పాల్గొన్నారు. -
● భారీగా పింఛన్ల ఏరివేతకేనా? ● ప్రత్యేకంగా సదరం క్యాంపుల నిర్వహణ ● మరోసారి దివ్యాంగులకు వైద్య పరీక్షలు ● చిన్న తేడా ఉన్నా పింఛన్ తొలగించాలని ఆదేశాలు
మొత్తం దివ్యాంగులు 21,306 ఆర్థోపెడిక్ 12,238 అంధులు 2,373 ఈఎన్టీ 2,287 మానసిక 4,408 రీ వెరిఫికేషన్ జరిగినవి 16,187 రీ వెరిఫికేషన్ చేయాల్సినవి 5,119 పింఛన్ల నిలుపుదల అంచనా 5-12 శాతం మహారాణిపేట: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక సదరం సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్ ప్రక్రియతో దివ్యాంగుల్లో అలజడి నెలకొంది. ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటం ఆడుతోందన్న భయాందోళన మొదలయింది. రీ వెరిఫికేషన్లో సర్టిఫికెట్ రద్దు చేస్తే, వైకల్య శాతం తగ్గిస్తే.. లాంటి ఆలోచనలు వారిని మరింత ఆదోళనకు గురిచేస్తున్నారు. రీ వెరిఫికేషన్కు రాని వారికి తాజాగా పింఛన్ కోత పడింది. ఆరు నెలల నుంచి ఈ ప్రక్రియ సాగుతోంది. అనారోగ్యం, ఇతర కారణాలతో రీ వెరిఫికేషన్కు రాలేని వారి పింఛన్లకు ఆ తర్వాతి నెల్లో కోత విధిస్తున్నారు. మొన్న మంచాన పట్టిన వారిని, నిన్న మానసిక వికలాంగులను వదల్లేదు. ఇప్పుడు అంధుల బతుకుల్ని మరింత అంధకారంలోకి నెట్టేందుకు సిద్ధమయ్యారు. రెండో విడత ఏరివేత వివిధ కేటగిరీల్లో రూ.6 వేలు నుంచి రూ.15 వేలు పింఛన్ పొందుతున్న దివ్యాంగుల ఏరివేత కార్యక్రమానికి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. జిల్లాలో వీరు 21,306 మంది ఉండగా ఇప్పటి వరకు 16,187 మంది రీ వెరిఫికేషన్ పూర్తయింది. ఇంకా 5,119 మందికి రీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. వీరిలో కొంత మంది వివిధ కారాణాల వల్ల రీ వెరిఫికేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో పింఛన్ నిలుపుదల చేశారు. ఎంత మందికి నిలుపుదల జరిగిందన్న విషయాన్ని అధికార యంత్రాంగం గోప్యంగా ఉంచింది. కూటమి సర్కార్ ప్రగల్భాలు ఎన్నికలకు ముందు దివ్యాంగుల పింఛన్ పెంపుపై ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం ఇపుడు లబ్ధిదారుల తగ్గింపు కుట్రకు తెరతీసింది. పింఛన్ల భారాన్ని తగ్గించుకునేందుకు తెలివిగా రీవెరిఫికేషన్ బాట పట్టింది. పరిశీలన చేయించుకోని వారికి తర్వాతి నెల నుంచే పింఛన్ కట్ చేస్తున్నారు. ఇప్పటికే సామాజిక పింఛన్లు తీసుకునే వారి మీద ర్యాండమ్ సర్వే చేసిన సంగతి తెలిసిందే. నెలకు రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.8 వేలు, 6 వేలు పింఛను తీసుకున్న మంచానికే పరిమితమైన దివ్యాంగులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వీరికి పరీక్షల నిమిత్తం సంబంధిత ఆస్పత్రులకు రప్పిస్తున్నారు. ఇతర ప్రాంతాల వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నారు. దీంతో ఏ సాకు పేరిట తమ జీవనాధారమైన పింఛన్కు కోత పెడతారోనని దివ్యాంగుల్లో ఆందోళన నెలకొంది. -
పలుమార్లు ఆగిన గుండె.. ఎక్మోతో నిలిచిన ప్రాణం
● విశాఖలో ఎక్మోతో సీపీఆర్ చేసిన కిమ్స్ ఐకాన్ వైద్య బృందంమహారాణిపేట: గుండె ఉన్నట్టుండి ఆగిపోతే.. అమ్మో ఆ ఊహే భయానకం. కానీ, విశాఖలో ఒక వ్యక్తికి పలు మార్లు గుండె ఆగింది. సమయానికి సరైన ఆస్పత్రిలో ఉండడంతో వైద్యులు ఎక్మో సీపీఆర్ చేసి మరీ అతడి ప్రాణాలు కాపాడారు. నగరంలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యులు సంయుక్తంగా చేసిన కృషితో అతడి ప్రాణం నిలిచింది. రోగి కోలుకోవడంతో ఆదివారం మీడియాకు ముందుకు తీసుకొచ్చి, చికిత్స వివరాలు వెల్లడించారు. నగరంలోని అగనంపూడి ప్రాంతానికి చెందిన లక్ష్మణకుమార్ పాండా(31) ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగి. అక్కడ ఆయన ప్రమాదవశాత్తు ఐసోబ్యుటైల్ నైట్రేట్ అనే విషపూరిత వాయువును పీల్చేశారు. ఫలితంగా శరీరంలోని భాగాలకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి.. శరీరమంతా నీలిరంగులోకి మారిపోయింది. వెంటనే అతడిని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్ట్ అయింది. సీపీఆర్ చేస్తున్నా కూడా పదే పదే గుండె ఆగిపోసాగింది. దీంతో ఆస్పత్రికి చెందిన ఎక్మో నిపుణుడు డాక్టర్ ఎం.రవికృష్ణ ఆధ్వర్యంలో వైద్యులు సాయి మణికందన్, రవి కన్నా కలిసి అతడికి ఎక్మో సాయంతో సీపీఆర్ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ఏపీలో ఇంతవరకూ ఎవరికీ చేయలేదు. అయితే రోగికి క్షణక్షణం దిగజారుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇలా చేయాలని తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిచ్చింది. మూడు రోజుల పాటు ఎక్మో మీద ఉంచిన తర్వాత అతడు క్రమంగా కోలుకున్నాడు. మళ్లీ లేచి తిరుగుతాననుకోలేదు : ‘‘ఆరోజు ఏం జరిగిందో తెలిసేలోపే స్పృహ తప్పింది. మావాళ్లు నన్ను వెంటనే కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తీసుకొచ్చి, ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. తర్వాత నా గుండె పదే పదే ఆగిపోయిందట. నేను అసలు లేచి మళ్లీ మనుషుల మధ్య మామూలుగా తిరుగుతానని అనుకోలేదు. డాక్టర్లు నా ప్రాణాలు నిలబెట్టారని తెలిసింది. వారికి, సిబ్బందికి, యాజమాన్యానికి కృతజ్ఞతలు’’అని లక్ష్మణకుమార్ పాండా చెప్పారు. -
నిత్య విద్యార్థి.. డిగ్రీల దాహార్తి
● 73 ఏళ్ల వయసులోనూ మెడిసిన్లో పీజీ ● రిటైరయ్యాక నాలుగు పీజీ కోర్సుల పూర్తి ● చిత్రలేఖనంలోనూ అందెవేసిన చేయి ● ఆదర్శంగా నిలుస్తున్న డా.జువ్వల నాగేశ్వరరావు గాజువాక: ఆయనొక వైద్యుడు. 30 ఏళ్లపాటు వైద్యాధికారిగా పని చేసి రిటైరయ్యారు. ఇంత సీనియారిటీ ఉన్న ఆయన ఎక్కడికెళ్లినా మంచి జీతంతో అవకాశం ఇస్తారు. సొంతంగా క్లినిక్ తెరిచినా.. బాగా సంపాదించుకోవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. 73 ఏళ్ల వయస్సులోనూ విద్యార్థిగా మారారు. రోజూ తరగతులకు వెళ్తున్నారు. రిటైరయ్యాక నాలుగు పీజీ కోర్సులు పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం మెడిసిన్లో పీజీ చేస్తున్నారు. అగనంపూడి ప్రభుత్వాస్పత్రిలో డీఆర్పీ కోసం వచ్చిన ఆయన్ని ‘సాక్షి’పలకరించగా ఆసక్తికరమైన తన జీవితానుభవాలను, అభిరుచులను పంచుకున్నారు. నిత్య విద్యార్థిగా.. డాక్టర్ జువ్వల నాగేశ్వరరావు జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారిగా 2010 జూన్లో రిటైరయ్యారు. అందరిలాగే పెన్షన్ తీసుకుని శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపేయాలని అనుకోలేదు. ఇంకా ఉన్నత చదువులు చదవాలని నిర్ణయించుకున్నారు. అప్పట్నుంచి నిత్య విద్యార్థిగా మారారు. నిర్ణయం తీసుకోవడమే అదనుగా ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ సైకాలజీ పూర్తి చేశారు. అనంతరం ఎంఏ ఫిలాసఫీ, తరువాత ఎంఏ పాలిటిక్స్, ఆ తర్వాత ఏయూలోనే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో మూడేళ్ల ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆంధ్రా మెడికల్ కళాశాలలో డాక్టరేట్ ఇన్ మెడిసిన్(ఎండీ) చదువుతున్నారు. ప్రస్తుతం అగనంపూడి ప్రభుత్వాస్పత్రిలో డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రొగ్రామ్(డీఆర్పీ) చేస్తున్నారు. మెడికల్ కళాశాలల్లో అధ్యాపకుడిగా.. రిటైరైన అనంతరం డాక్టర్ జువ్వల వివిధ ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు అధ్యాపకుడిగా బాధ్యతలు నిర్వహించారు. తొలుత మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మిమ్స్)లోని కమ్యూనిటీ మెడిసిన్లో ఫ్యాకల్టీగా పని చేశారు. అనంతరం గాయత్రి వైద్య కళాశాలలో ఆర్ఎంవోగా, కమ్యూనిటీ మెడిసిన్లో ఫ్యాకల్టీగా బాధ్యతలు నిర్వహించారు. ఉద్యోగంతో పూర్తిస్థాయిలో సంతృప్తి చెందని ఆయన ఇంకా చదువుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం పీజీ ఫైనలియర్ కొనసాగిస్తున్నారు. చిత్రలేఖనంలోనూ దిట్ట అధికారిగా, వైద్యునిగా అందిస్తున్న సేవలతోపాటు డాక్టర్ జువ్వల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీల్లోనూను ముందుంటారు. వివిధ రకాల బొమ్మలు వేసి, వాటిని ప్రముఖులకు బహూకరించడం చేస్తుంటారు. కేజీహెచ్, డాల్ఫిన్ నోస్, ఓరచూపులు, లవ్బర్డ్స్, పలువురు దేశ నాయకులు, సామాజికవేత్తల ఫొటోలు ఆయన కుంచె నుంచి జాలువారాయి. వీటితోపాటు మిత్రులు కలిసినప్పుడు పద్యాలు పాడటం, పాటలు ఆలపించడం ఆయనకున్న మరో విశిష్టత. ఉద్యోగానికే రిటైర్మెంట్ రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికే. వయస్సుకు కాదు. రిటైరైనప్పటికీ నేను నా క్లినిక్ ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ చదుకోవాలనే కోరిక బలంగా ఉండటంతో క్లినిక్ను మూసివేశాను. తుది శ్వాస వరకు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఆ క్రమంలో చదువును కూడా కొనసాగిస్తూ ఉండాలన్నది నా ధ్యేయం. – డాక్టర్ జువ్వల నాగేశ్వరరావువైద్యాధికారిగా 30 ఏళ్లు డాక్టర్ జువ్వల 30 ఏళ్లపాటు ప్రభుత్వ వైద్యాధికారిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రా మెడికల్ కళాశాలలో 1971–78 ఎంబీబీఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ఆ తర్వాత కోల్కతాలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్లో డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్(డీపీహెచ్) పూర్తిచేసి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(వీఎంసీ)లో వైద్యాధికారిగా కెరీర్ ప్రారంభించారు. వీఎంసీ డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్గా 1981లో ఉద్యోగంలో చేరిన ఆయన ప్రజారోగ్యంలో ఎనలేని సేవలందించారు. యూకే ఫండింగ్తో వీఎంసీలో మురికివాడల అభివృద్ధి ప్రాజెక్టుకు ట్రైనింగ్ అండ్ ఇవాల్యుయేషన్ ఆఫీసర్గా పనిచేశారు. 1990లో యూకే, ఫ్రాన్స్లో పర్యటించారు. అక్కడ అధ్యయనం ద్వారా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఐదు వేల మందికి ఒక హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేసేలా కృషి చేశారు. ఫలితంగా కార్పొరేషన్ అధికారులు విశాఖలో 48 హెల్త్ సెంటర్లను ప్రారంభించి 36 మంది వైద్యాధికారులను నియమించారు. వీఎంసీ కాస్తా జీవీఎంసీగా మారాక ఆయన జోన్–2, 4, 5లలో సహాయ ప్రజారోగ్యాధికారిగా పనిచేశారు. చివరికి జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్గా పని చేసి రిటైరయ్యారు. -
సముద్రంలో మునిగి ఎలక్ట్రీషియన్ మృతి
భీమునిపట్నం: భీమిలి తీరంలో స్నానానికి దిగిన ఓ ఎలక్ట్రీషియన్ మరణించాడు. తీరానికి సమీపంలోని గొల్లలపాలేనికి చెందిన సరగడ అప్పలరెడ్డి(44) ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు, ఇతనికి భార్య అరుణకుమారి, కూతురు హేమశ్రీ(16), కొడుకు మోజెస్(10) ఉన్నారు. ఆదివారం కుటుంబ సభ్యులు, స్నే హితులతో కలిసి లైట్హౌస్ సమీపంలో స్నానానికి దిగారు. పెద్ద కెరటం వచ్చి అప్పలరెడ్డిని లాక్కుపోయింది. గమనించిన తీరంలో ఉన్న ఫొటోగ్రాఫర్లు అతన్ని రక్షించి, కొన ఊపిరితో ఉన్న అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కింగ్స్పై సన్షైనర్స్ ఘన విజయం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) నాలుగో సీజన్లో విజయవాడ సన్షైనర్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో కాకినాడ కింగ్స్పై 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో విజయవాడ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయగా, కాకినాడకు రెండో ఓటమి. నగరంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో టాస్ ఓడి తొలుత విజయవాడ బ్యాటింగ్కు దిగింది. టాప్ ఆర్డర్ విఫలమైనా, చివరిలో జహీర్ (57 నాటౌట్), తేజ (46 నాటౌట్) అద్భుత బ్యాటింగ్తో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసింది. కాకినాడ బౌలర్లలో స్పిన్నర్ ఆంజనేయులు మూడు వికెట్లు తీశాడు. అనంతరం 196 పరుగుల లక్ష్యఛేదనలో కాకినాడ కింగ్స్కు ఓపెనర్లు అర్జున్ (48), కెప్టెన్ భరత్ (34) తొలి వికెట్కు 84 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం అందించారు. వారు ఔటైన తర్వాత కాకినాడ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. రవికిరణ్(31) మినహా మిగతా వారు విఫలం కావడంతో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 171 పరుగులకు ఆలౌట్ అయింది. విజయవాడ బౌలర్లు పృథ్వీ, టి.భరత్ చెరో మూడు వికెట్లతో కాకినాడ పతనాన్ని శాసించారు. అదరగొట్టిన కెప్టెన్ హేమంత్ ఏపీఎల్లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్లో భీమవరం బుల్స్ జట్టు రాయలసీమ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భీమవరం బుల్స్, రాయలసీమ రాయల్స్ను కట్టడి చేసింది. రాయల్స్ కెప్టెన్ రషీద్ (56) అర్ధశతకంతో రాణించినప్పటికీ.. ఆ జట్టు చివర్లో అనూహ్యంగా కుప్పకూలింది. కేవలం 17 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లను కోల్పోయి, మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 139 పరుగులకు ఆలౌటైంది. బుల్స్ బౌలర్లలో సత్యనారాయణ మూడు వికెట్లు తీయగా, హరిశంకర్, మునీష్, హేమంత్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 140 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భీమవరం బుల్స్ కెప్టెన్ హేమంత్ అద్భుత ఇన్నింగ్స్తో సునాయాసంగా గెలిచింది. హేమంత్ 65 పరుగులు (3 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనికి వంశీకృష్ణ (27 నాటౌట్), సూర్యతేజ (23 నాటౌట్) చక్కటి సహకారం అందించడంతో బుల్స్ జట్టు 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. -
యువత వ్యసనాలకు బానిసలు కావొద్దు
ఏయూ క్యాంపస్: యువతరం మత్తుపదార్థాలకు బానిసలు కారాదని, ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలంటూ బీచ్రోడ్డులో రెడ్ రన్ నిర్వహించారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యూత్ డే వేడుకల్లో భాగంగా బాల బాలికలకు పరుగు పోటీలు నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జగదీశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఆరోగ్యకరమైన జీవనం అలవాటు చేసుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు, వ్యసనాలకు బానిసలైతే జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ రమేష్, జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రన్లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. బాల బాలికలకు వేర్వేరుగా ప్రథమ స్థానంలో నిలచిన వారికి రూ.10 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ.7 వేలు నగదు బహుమతులను అందించారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వారు విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. -
కంబోడియాలో చిక్కుకున్న ఆంధ్రుల్ని కాపాడండి
డాబాగార్డెన్స్: కంబోడియాలో చిక్కుకున్న ఆంధ్రా కార్మికులను కాపాడాలని సీఎం చంద్రబాబును విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. వీరిని మోసగించిన ఏజెంట్ బొంగు మురళీరెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ జంక్షన్ సమీపంలోని సిటు కార్యాలయంలో జేఏసీ ప్రతినిధులు ఆదివారం మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన ఏజెంట్ మురళీరెడ్డి డేటా ప్రాసెసింగ్ జాబ్ల పేరిట మాయమాటలు చెప్పి ఏడుగురి నుంచి చెరో రూ.1.70 లక్షలు తీసుకుని కంబోడియా పంపించారని పేర్కొన్నారు. అక్కడ వారికి ఆ ఉద్యోగాలు ఇవ్వకపోగా, కంబోడియా ఏజెంట్లకు అప్పజెప్పి ఒక్కొక్కరితో మరో మూడు వేల డాలర్లు కట్టించుకున్నారని తెలిపారు. అక్కడి నుంచి వారిని చైనీస్ సైబర్ మోసగాళ్లకు అప్పజెప్పి, వారిచే చట్ట వ్యతిరేక పనులు చేయించడానికి బలవంతం పెట్టారన్నారు. అందుకు అంగీకరించకపోవడంతో చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలిపారు. వీరిలో విశాఖకు చెందిన వారు ఒకరు, శ్రీకాకుళానికి చెందిన నలుగురు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఇద్దరు కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. తక్షణమే సంబంధిత మంత్రులు, అధికారులు స్పందించి, వారిని కాపాడి, రాష్ట్రానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జేఏసీ ప్రతినిధులు సీఎఫ్టీయూఐ జాతీయ అధ్యక్షుడు ఎన్.కనకారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎస్వీ అచ్యుతరావు, సిటు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్కేఎస్వీ కుమార్, కుమార మంగళం, పి.మణి, కొండయ్య పాల్గొన్నారు. -
2 వేల కిలోల వెండితో వినాయకుడు
చవితి ఉత్సవాలకు యూత్ ఐకాన్ అసోసియేషన్ సన్నద్ధం డాబాగార్డెన్స్: విశాఖ మహానగరంలో యూత్ ఐకాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 వేల కిలోల వెండితో వినాయకమూర్తిని ఏర్పాటు చేయనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధి శీరపు కనకరాజు తెలిపారు. ఈ మేరకు నగరంలోని వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వినాయక ఉత్సవాల వివరాలు వెల్లడించారు. ఏటా మాదిరే ఈ ఏడాది కూడా వినాయక చవితి మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది బీచ్రోడ్డు విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వెనుకనున్న ఏపీఐఐసీ గ్రౌండ్లో ఈ నెల 27 నుంచి 21 రోజుల పాటు చవితి ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. 14 ఎకరాల గ్రౌండ్లో 6 ఎకరాల్లో పార్కింగ్, 2 ఎకరాల్లో ఫ్లవర్ షోతో, దేశంలోనే తొలిసారిగా 2 వేల కిలోల వెండి విగ్రహాన్ని వినూత్న రీతిన విశాఖలో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. గర్భిణులు, వికలాంగులు, వృద్ధులకు ఉచిత దర్శనం కల్పిస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయ నమూనా సెట్ వేయనున్నామన్నారు. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులు పొందినట్లు పేర్కొన్నారు. స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే భక్తులు ఠీఠీఠీ. డౌఠ్టజిజీఛిౌుఽ. జ్చుఽ్ఛట. ఛిౌఝల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు ఎస్.లక్ష్మణ్, ఎస్.లీలాధర్, బేరి మన్మధరావు, కె.భరత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగిన అప్పన్న ఆభరణాల తనిఖీ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారికి చెందిన ఆభరణాల తనిఖీ ఆదివారం రెండో రోజు కూడా కొనసాగింది. దేవాదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ ఈ తనిఖీలను నిర్వహించింది. సింహగిరిపై ఉన్న ఆలయ మ్యూజియంలోని స్వామివారి బంగారు, వెండి ఆభరణాలను, ఇతర వస్తువులను కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. రిజిస్టర్లలో ఉన్న వివరాలకు అనుగుణంగా వస్తువులు సరిగ్గా ఉన్నాయో లేదో ఈ బృందం నిర్ధారించింది. ఈ తనిఖీల్లో విజయనగరం డిప్యూటీ కమిషనర్ కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్, దేవాదాయ శాఖ జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి పల్లంరాజు, అంతర్వేది దేవస్థానం ఈవో ఎం.కె.టి.ఎన్. ప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ఈవో ఇ.వి.సుబ్బారావు, రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ కార్యాలయ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. వారికి దేవస్థానం ఈవో వి.త్రినాథరావు, డిప్యూటీ ఈవో రాధ, ఏఈవో రమణమూర్తి అవసరమైన వివరాలను అందజేశారు. -
అన్నదాతకు కొర్రీలు
● జిల్లాలో 6,499 మంది రైతులకు ఎగనామం ● వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 25,072 మందికి రైతు భరోసా సాయం ● కూటమి ప్రభుత్వంలో కేవలం 18,573 మందికే సుఖీభవ నిధులు మహారాణిపేట: పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్న రైతులపై కూటమి సర్కార్ కత్తికట్టింది. పలు నిబంధనలతో అన్నదాత సుఖీభవ పథకంలో అన్నదాతల సంఖ్యపై కోతలు విధించింది. కొర్రీల మీద కొర్రీలు వేస్తూ అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నికల ముందు ఈ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలోనే హామీని తుంగలోకి తొక్కేశారు. గత ఏడాది ఈ పథకాన్ని అమలు చేయకుండా ఎగ్గొట్టిన కూటమి సర్కార్ ఈ ఏడాది విడుదల చేసిన లబ్ధిదారుల జాబితాలో వేల సంఖ్యలో అర్హులైన రైతుల పేర్లు కనపించడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 25,072 మందికి రైతు భరోసా నిధులు జమ చేశారు. కూటమి సర్కార్ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 2025–26 ఆర్థిక సంవత్సరంలో 18,573 మంది రైతులను అర్హులుగా ఎంపిక చేసింది. అంటే 6,499 మంది రైతులను అన్నదాత సుఖీభవ పథకానికి దూరం చేసింది. వెబ్ల్యాండ్ సాకుతో.. వెబ్ల్యాండ్లో పేర్లు ఉన్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ ఇస్తామని ప్రకటించడంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారు. గతంలో ఎప్పుడు ఎక్కడ లేని నిబంధనలను కూటమి సర్కార్ అమలు చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కౌలు రైతు, కుటుంబంలో ఒక్క లబ్ధిదారుడు ఎంపిక, పది సెంట్లు లోపు భూమి ఉన్నవారు తొలగింపు, ఆధార్, ఈకేవైసీ, బ్యాంకు ఖాతాలకు అనుసంధానం కాలేదని పలువురు రైతులను తొలగించడం వంటి చర్యలు అధికారులు చేపట్టారు. అనంతరం ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. వీటిపై అవగాహన లేక వేలాది మంది రైతులు వేలి ముద్ర వేయలేదు. ఇటువంటి నిబంధనల వల్ల జిల్లాలో 6,499 మంది రైతులను జాబితా నుంచి తొలగించారు. సర్కార్, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది రైతులు అన్నదాత సుఖీభవకు దూరమయ్యారు. అప్పులు పాలు అవుతున్న కర్షకులు పెట్టుబడి సాయం సకాలంలో అందకపోవడంతో రైతులు అప్పులుపాలయ్యారు. ఈ సీజన్లో పంటలు వేయడానికి పెట్టుబడి సహాయం కోసం రైతులు ఎదురు చూశారు. పెట్టుబడి సాయం అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కువ శాతం రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేపట్టారు. గత ఏడాది నుంచి వ్యవసాయ భారంగా మారడంతో రైతులు సాగుకు దూరమవుతున్నారు. గత వైఎస్సార్ సీపీ సర్కార్ ఖరీఫ్ సీజన్లో సకాలంలో రైతు భరోసా అందించి రైతులను ఆదుకుంది. -
వీఎంఆర్డీఏ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం
కొమ్మాది: జాతీయ రహదారి ఎండాడను ఆనుకుని రూ.9.50 కోట్ల వీఎంఆర్డీఏ నిధులతో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ ఆధునిక హంగులతో వెయ్యి సిట్టింగ్ సామర్థ్యంతో మధ్యతరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా కన్వెన్షన్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అనంతరం భీమిలి నియోజకవర్గంలో సుమారు రూ.21 కోట్ల నిధులతో చేపట్టబోయే పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సమర్థ న్యాయవాదులు అవసరం
సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రాయ్ విశాఖ లీగల్: న్యాయ వ్యవస్థ బలోపేతం కావడానికి సమర్థవంతమైన న్యాయవాదులు అవసరమని గుజరాత్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ అన్నారు. జిల్లా కోర్టు నూతన భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఆదివారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దివంగత న్యాయవాది ఎం.సత్యనారాయణ చిత్రపటాన్ని జస్టిస్ రాయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యనారాయణ బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించారని గుర్తుచేసుకున్నారు. ఆయన కేసులు వివరించే తీరు, ప్రవర్తన నేటి యువ న్యాయవాదులకు ఆదర్శం కావాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు మాట్లాడుతూ దిగువ స్థాయి నుంచి ఎదిగి, ఎందరో న్యాయవాదులకు సత్యనారాయణ మార్గదర్శకంగా నిలిచారన్నారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె. శ్రీనివాస్ మాట్లాడుతూ కోర్టుల్లో సత్యనారాయణ వ్యవహరించిన తీరు తమకు ఎంతో నేర్పిందని చెప్పారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, సభ్యు డు పి.నర్సింగరావు, న్యాయవాదుల సంఘం కార్యదర్శి ఎల్.పి.నాయుడు, పైలా సన్నీబా బు, నమ్మి సన్యాసిరావు, సత్యనారాయణ కుమారు డు, న్యాయవాది అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
● భారత్ మాతా కీ జై
● ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టిన థింసా నృత్యాలు● అదిగదిగో.. అద్దాల అడ్వెంచర్! కై లాసగిరిపై వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్కై గ్లాస్ బ్రిడ్జ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గతవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు పనులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. త్వరలోనే ఈ అడ్వెంచర్ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. గిరిజన ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ వారోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం వద్ద గిరిజన విద్యార్థులు థింసా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. కొంత మంది విద్యార్థులు సంప్రదాయ గిరిజన దుస్తులు ఽ దరించి, లయబద్ధంగా థింసా నృత్యంతో అలరించారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని, వాటి విశిష్టతను చాటి చెప్పారు. ● ఆకట్టుకున్న పాట్ పెయింటింగ్ కొమ్మాది: సాగర్నగర్ ఇస్కాన్ మందిరంలో ఆదివారం జరిగిన పాట్ పెయింటింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ నెల 16న శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహించారు. పోటీల్లో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ఏయూ–జేఎంఎం పరస్పర సహకార ఒప్పందం
మద్దిలపాలెం: ఏయూ–జపాన్ ఆటోమేటిక్ మెషీన్ కో లిమిటెడ్(జేఎంఎం) మధ్య పరస్పర సహకారానికి రోడ్ మ్యాప్ రూపొందించేందుకు ఏయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్లో శుక్రవారం సమావేశం జరిగింది. సమావేశంలో వైరింగ్ హార్నెస్, అధునాతన కనెక్టర్ తయారీ సాంకేతికతలు, అల్ట్రాసోనిక్ మెటల్ వెల్డింగ్ జాయింట్ల కోసం నాన్–డిస్ట్రక్టివ్ టెస్టింగ్ పద్ధతులు, మెషిన్ టూల్ డిజైన్ తయారీలో ఏఐ అప్లికేషన్లు అనే అంశాలపై చర్చించారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ ఏయూ ఆవిష్కరణలు, అప్లైడ్ రీసెర్చ్, పరిశ్రమ భాగస్వామ్యాలకు అనుగుణంగా జరిగిన ఒప్పందం మేరకు ఈ సమావేశం నిర్వహించామన్నారు. జేఎఎం ప్రతినిధులు పాల్గొని తమ ఆలోచనలను పంచుకున్నారు. అకడమిక్ అఫైర్స్ డీన్ ఆచార్య కె. శ్రీనివాసరావు, డీన్ ఔట్రీచ్ ఆచార్య కె.రమాసుధ, పలువురు డీన్లు, అధికారులు పాల్గొన్నారు. -
జన విజ్ఞాన వేదికకు ఆధారం సైన్స్, రాజ్యాంగం
సీతంపేట: సైన్సు, రాజ్యాంగం ఆధారంగా జనవిజ్ఞాన వేదిక పనిచేస్తుందని సంస్థ జాతీయ అధ్యక్షుడు వి.బ్రహ్మారెడ్డి అన్నారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో శుక్రవారం జరిగిన భావతరంగం వైజాగ్–2025 కార్యక్రమంలో దేశానికి కావలసిన న్యాయం, ఐక్యత అంశంపై ఆయన ప్రసంగించారు. జన విజ్ఞాన వేదిక ద్వారా సైన్స్ను వివిధ కళారూపాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. దేవుడు, కులం, మతం లేని సమాజం కోసం జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందన్నారు. నాగార్జున యూనివర్సిటీ పూర్వ వీసీ ఆచార్య వి.బాలమోహన్దాస్ ‘గాంధేయ వాదం రాజకీయ ప్రాముఖ్యత’పై మాట్లాడుతూ మహాత్మాగాంధీ భావాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. గాంధీజీ పాటించిన 18 గుణాలను వివరించారు. ఓపీఏసీ ఫౌండర్ దండి ప్రియాంక, లా యూనివర్సిటీ మాజీ వీసీ సత్యనారాయణ, నన్నయ యూనివర్సిటీ మాజీ వీసీ జార్జ్ విక్టర్, కృష్ణాజి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి పృథ్వీరాజ్, జిల్లా అధ్యక్షుడు విజయ్చందర్ పాల్గొన్నారు. -
గంజాయి స్మగ్లర్ల ఆస్తులు కూడా జప్తు చేస్తాం
ఆరిలోవ: పోలీసులకు పట్టబడిన గంజాయి స్మగ్లర్ల ఆస్తులను కూడా జప్తు చేస్తామని ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్(ఈగల్) క్లబ్ చీఫ్, ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని ఆయన అధ్యక్షతన ఈగల్ క్లబ్ శుక్రవారం సందర్శించింది. కారాగారం సూపరింటెండెంట్ ఎం.మహేష్బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్లు ఎన్.సాయిప్రవీణ్, సీహెచ్ సూర్యనారాయణ, జైలర్లు, ఈగల్ బృందంతో కలసి గంజాయి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో మాట్లాడి ఎన్డీపీఎస్ చట్టంపై అవగాహన కల్పించారు. ఏయే కేసుల్లో జైలుకు వచ్చారు, ఏ పరిస్థితిలో ఎన్డీపీఎస్ కేసుల్లో ఇరుకున్నారు, తదితర వాటి గురించి ఆరా తీశారు. అనంతరం జైల్ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. రెండుసార్లు కంటే ఎక్కువ గంజాయి కేసులు నమోదైతే అలాంటివారిపై సస్పెక్టడ్ షీట్ తెరుస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 3,700 మందిపై సస్పెక్టడ్ షీట్ నమోదు చేసినట్లు తెలిపారు. అల్లూరి జిల్లాలో డ్రోన్ల ద్వారా గంజాయి సాగును గుర్తించి నాశనం చేశామన్నారు. ఒడిశా నుంచి దిగుమతి అవుతున్న గంజాయిని సరఫరా చేస్తూ రాష్ట్రంలో పోలీసులకు పలువురు పట్టుబడుతున్నట్లు తెలిపా రు. దానివల్ల రాష్ట్రంలో గంజాయి కేసుల్లో పట్టుబడినవారి సంఖ్య పెరుగుతోందన్నారు. విశాఖ కేంద్ర కారాగారంలో 1,800 మంది ఖైదీలు ఉంటే వారిలో 1,008 మంది గంజాయి కేసుల్లో వచ్చినవారేనని వెల్లడించారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిపై ఈగల్ క్లబ్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫోన్ చేసి, సమాచారం అందించవచ్చని సూచించారు. -
సకల సౌభాగ్యదాయినీ నమోస్తుతే
● వాడవాడలా వరలక్ష్మీ వ్రతాలు ● సామూహిక వ్రతాలతో కిక్కిరిసిన ఆలయాలు డాబాగార్డెన్స్: సకల సౌభాగ్యాలు ప్రసాదించే శ్రావణలక్ష్మి నామస్మరణతో నగరం మార్మోగింది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే పవిత్ర శుక్రవారం కావడంతో వరలక్ష్మి వ్రతాన్ని ప్రజలు తమ ఇంట భక్తిశ్రద్ధలతో ఆచరించారు. ప్రతి ఇల్లూ ఓ దేవాలయంగా మారింది. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వర్ణాలంకరణలో కనకమహాలక్ష్మి నగరంలోని బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారు స్వర్ణాభరణాలంకరణలో ధగధగ మెరిసిపోతూ భక్తులకు దర్శనమిచ్చింది. దేవస్థానంలో వరలక్ష్మీ వ్రత పూజలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి, వేద మంత్రాలు, నాదస్వర వాయిద్యాల మధ్య ఉదయం 8.10 గంటలకు శ్రావణలక్ష్మి పూజలు ప్రారంభించారు. విశిష్ట శ్రావణలక్ష్మీ పూజలో 85 మంది ఉభయదాతలు నేరుగా పాల్గొన్నారు. పోస్టు ద్వారా వివరాలు పంపి డబ్బు చెల్లించిన 225 కుటుంబాల పేరిట అర్చన చేసి, వారికి కుంకుమ, ప్రసాదం పంపారు. అమ్మవారిని పలువురు ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శ్రావణ మాసంలో జరిగే పూజలో పాల్గొనదలచే భక్తులు 0891–2711725, 2568645 నంబర్లలో పేర్లు నమోదు చేసుకోవాలని ఆలయ ఈవో కె.శోభారాణి తెలిపారు. లక్ష్మీదేవి వెండి ప్రతిమలు బహూకరణ: ఉదయం 8 గంటలకు మొదటి బ్యాచ్, 9.30కు రెండవ బ్యాచ్ పూజలో పాల్గొన్న మహిళల్లో డ్రా తీసి ఆలయ మాజీ చైర్మన్ వంకాయల సన్యాసిరాజు(తాతాజీ) ఆలయ ఈవో, ఏఈవో చేతుల మీదుగా లక్ష్మీదేవి వెండి ప్రతిమలు బహూకరించారు. ఆలయ పర్యవేక్షకుడు టి.తిరుపతిరావు, వేదపండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చదివింపులు
చినబాబుకురూ.12 కోట్లఇప్పటికే చెల్లించిన రియల్టర్లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ పేరుతో రంగ ప్రవేశం ఎండాడలో ఇప్పటికే పలు ప్రాజెక్టులు చేపట్టిన ఓ సంస్థ దసపల్లా భూముల వ్యవహారంలోని మరో రియల్టర్కు అప్పగింత విచారణ చేయాలని అన్ని పక్షాల నుంచి డిమాండ్ కమిటీ కష్టమంటూ కలెక్టర్ నివేదికతోనే స్పీకర్ను బుజ్జగించే యత్నం?సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నిషేధిత జాబితా నుంచి తొలగించిన ఎండాడలోని 5.10 ఎకరాల భూ వ్యవహారంలో చినబాబుకు ఇప్పటికే రూ.12 కోట్ల చదివింపులు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ చెల్లింపుల వ్యవహారాన్ని మొత్తం దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నేత చూసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ చెల్లింపులు పూర్తయిన తర్వాత ఎండాడలోని సర్వే నంబరు 14–1 లోని 5.10 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టు సమాచారం. ఈ భూమిని అభివృద్ధి చేసేందుకు ఇద్దరు రియల్ ఎస్టేట్ సంస్థలు రంగప్రవేశం చేశాయి. ఇప్పటికే ఎండాడలో పలు ప్రాజెక్టులు చేపట్టిన సంస్థ ఒకటి కాగా.. చినబాబు సామాజికవర్గానికే చెంది, దసపల్లా భూముల వ్యవహారాల్లో ఉన్న మరో సంస్థ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ స్థలంలో 14 ఫ్లోర్ల వరకూ నిర్మించే అవకాశం ఉందని.. తక్కువలో తక్కువగా చదరపు అడుగుకు ప్రారంభంలోనే రూ.6 వేల వరకూ ధర పలికే అవకాశం ఉందని సదరు రియల్టర్లు లెక్కలు వేసినట్టు కూడా తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటికే హైదరాబాద్కు చెందిన ఒక సంస్థ పేరు మీద కొంత భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఆ సంస్థ నుంచి విశాఖకు చెందిన ఈ ఇద్దరు రియల్టర్ల చేతికి రానుందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే అనధికారికంగా ఒప్పందం జరిగినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ భూమి వ్యవహారంలో విచారణ చేయాలంటూ ప్రతిపక్షంతో పాటు స్వపక్షం నుంచి కూడా స్పష్టమైన డిమాండ్లు వస్తున్నాయి. కమిటీ వేసి విచారణ చేయాలంటూ స్వయంగా స్పీకర్ కోరినప్పటికీ కుదరదని కలెక్టర్ నివేదికతోనే సరిపుచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మొత్తంగా నేరుగా చినబాబు పాత్ర ఉండటంతో విచారణ జరిపేందుకు ప్రభుత్వం వెనకాడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరిన్ని భూములపై నిషేధం ఎత్తివేత..! వాస్తవానికి ఎండాడలోని 14–1 సర్వే నంబరుకు చెందిన 5.10 ఎకరాల భూమికి చెందిన రికార్డుల్లో రెవెన్యూ అధికారులనూ తికమక పెట్టే వ్యవహారాలు నడిచాయనే విమర్శలున్నాయి. ఫలానా పేరు మీద ఈ భూమి ఉందని...అయినప్పటికీ ఇది ప్రభుత్వ భూమి కావున రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ స్వయంగా గతంలో కలెక్టర్ రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించారు. తీరా నిషేధిత జాబితా నుంచి తొలగించే సమయానికి ప్రైవేటుపరం చేస్తూ నిర్ణయాలు వెలువడ్డాయి. వాస్తవానికి 14–1 సర్వే నంబరులోని భూమి చెట్టిపల్లి సీతారామయ్య పేరు మీద నమోదై ఉంది. అయితే తాజాగా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం ఈ భూమి మాజీ సైనిక అధికారికి చెందినదని, చెట్టిపల్లి సీతారామయ్య పేరు కేవలం ఫారం–3లో మాత్రమే ఉందని పేర్కొన్నారు. అయితే ఇందుకు భిన్నంగా అసలు వ్యక్తి సాగులోనే లేరంటూ వై.బాలిరెడ్డికి చెందినదంటూ ఆయన పేరు మీద బదలాయించాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పై నుంచి ఆదేశాలు వచ్చేందుకు కీలకంగా వ్యవహరించిన విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన నేత ప్రధానంగా చక్రం తిప్పినట్టు సమాచారం. చినబాబు అండతో రెచ్చిపోయారనే విమర్శలున్నాయి. ఎన్నికలకు ముందు చినబాబుకు నేరుగా తమ సామాజిక వర్గానికి చెందిన నేతల ద్వారా హైదరాబాద్లో భారీగా ఎలక్షన్ ఫండ్ సమకూర్చడంతో ఈ నేతకు సదరు చిన్నబాబు వద్ద పలుకుబడి ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. స్థానిక నేతలు, ఎమ్మెల్యేలతో ఏ మాత్రం సంబంధం లేకుండా వ్యవహారాలు నడుపుతుండటంతో సదరు దక్షిణ నియోజకవర్గ నేతపై ఆ పార్టీలోని ఇతర నేతలందరూ రుసరుసలాడుతున్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఇంకా ఏమైనా ఫైల్స్ ఉంటే తన వద్దకు తీసుకురావాలంటూ సదరు దక్షిణ నియోజకవర్గ నేత కోరుతున్నట్టు తెలుస్తోంది. అంటే త్వరలో మరిన్ని ప్రభుత్వ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించనున్నారన్నమాట. కమిటీ కష్టం... కలెక్టర్ నివేదికతోనే సరి...! వాస్తవానికి ఎండాడ భూమి వ్యవహారంలో సొంత పార్టీ నేతల నుంచే విచారణ జరపాలనే డిమాండ్ వస్తోంది. ఇప్పటికే ఈ భూమి వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలెక్టర్కు లేఖ రాశారు. న్యాయవిచారణ జరగాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. మరోవైపు నివేదిక సమర్పించాలంటూ రెవెన్యూ మంత్రికి స్పీకర్ లేఖ ద్వారా ఆదేశించారు. ఇక మండలిలోని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సైతం ఈ వ్యవహారంలో లోతుగా విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలంటూ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. మాజీ సైనికులకు చెందిన భూముల విషయంలో సీనియర్ అధికారులు, రాజకీయ నేతల ప్రమేయం ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండ్ గ్రాబింగ్ వ్యవహారాల్లో అటు అధికారులు, ఇటు రాజకీయ నేతల మధ్య ఏర్పడుతున్న అనైతిక సంబంధాలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. జనసేన కార్పొరేటర్ సైతం విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇలా అన్ని పార్టీల నేతలు ఎండాడ భూమి విషయంలో అటు అధికారులు, ఇటు రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న అభిప్రాయాన్ని బలంగానే వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం నామమాత్ర స్పందన రాకపోవడం గమనార్హం. అంతేకాకుండా కమిటీ వేయాలని రెవెన్యూ మంత్రికి రాసిన లేఖలో స్పీకర్ కోరగా.. కమిటీ వేయాలంటే ముఖ్యమంత్రి అనుమతి కావాలని తేల్చిచెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేవలం కలెక్టర్ ఇచ్చిన నివేదికనే స్పీకర్కు.. రెవెన్యూ మంత్రి ఇవ్వనున్నట్టు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. స్వయంగా సొంత పార్టీకే చెందిన స్పీకర్ కోరినప్పటికీ ప్రభుత్వం పెద్దగా సీరియస్గా తీసుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఈ వ్యవహారంలో చినబాబు పాత్ర ఉండటం వల్లే ప్రభుత్వం నుంచి స్పందన లేదన్న అభిప్రాయం అందరిలోనూ బలపడుతోంది. -
‘మయామీ ఆఫ్ ది ఈస్ట్’గా విశాఖ
● థీమ్ నగరాల అభివృద్ధికి వీఎంఆర్డీఏ ప్రణాళికలు ● భీమిలి, శొంఠ్యాంతో పాటు మరో రెండు చోట్ల ప్రదేశాల గుర్తింపు ● పీపీపీ విధానంలో అభివృద్ధికి సన్నాహాలు విశాఖ సిటీ: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో వినూత్న ప్రాజెక్టుల రూపకల్పనకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు విశాఖను ‘బే సిటీ’గా ‘మయామీ ఆఫ్ ది ఈస్ట్’గా అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇందుకోసం థీమ్ నగరాల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చి ఆర్థిక ప్రోత్సహం అందించే దిశగా ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో ప్రత్యేకంగా థీమ్ బేస్డ్ టౌన్షిప్ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు ప్రాంతాలను గుర్తించగా.. మరో ప్రదేశాల గుర్తింపు తుది దశలో ఉంది. పబ్లిక్, ప్రైవేట్, పార్ట్నర్షిప్(పీపీపీ) విధానంలో ఈ ప్రాజెక్టులను చేపట్టాలన్న ఆలోచనలో ఉంది. నీతి ఆయోగ్ సిఫార్సులతో విశాఖ ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగేందుకు అవసరమైన అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రధానంగా తీర ప్రాంతం అదనపు ఆకర్షణగా నీతి ఆయోగ్ గుర్తించింది. దీంతో విశాఖను ఫ్లోరిడాలోని మయామీ నగరాన్ని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఫార్సులు చేసింది. దీని ప్రకారం వీఎంఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి పట్టణ క్లస్టర్ను ఒక ప్రత్యేక థీమ్ ఆధారంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఐటీ–ఇన్నోవేషన్, హెల్త్–వెల్నెస్, నాలెడ్జ్–ఎడ్యుకేషన్, టూరిజం–కల్చర్, లాజిస్టిక్స్–ట్రేడ్, వంటి రంగాలు ఆధారంగా వీటిని అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ప్రత్యేకంగా థీమ్ బేస్డ్ టౌన్షిప్లు విశాఖలో మూడు థీమ్ బేస్డ్ టౌన్షిప్ల నిర్మాణంపై వీఎంఆర్డీఏ అధికారులు దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రాంతాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే భీమిలి మండలం కొత్తవలస, ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామాలను గుర్తించారు. మరో రెండు ప్రదేశాల గుర్తింపు తుది దశలో ఉంది. వీటి ద్వారా నిర్దేశిత రంగాల్లో పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. వీటిని పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దేశ, విదేశాలకు చెందిన నగర ప్రణాళిక నిపుణులు, ఆర్కిటెక్ట్లు, ఇతర రంగాల నిపుణులతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్లు తెలిపారు. -
దేశభక్తిని చాటిచెప్పేలా ‘హర్ ఘర్ తిరంగా’
మహారాణిపేట: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం శుక్రవారం నుంచి ఆగస్టు 15 వరకు జిల్లాలో జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని, దేశభక్తిని పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం నుంచి 13 వరకు ‘తిరంగా యాత్ర’, ‘తిరంగా సెల్ఫీలు’, ‘తిరంగా ట్రిబ్యూట్’, ‘తిరంగా మేళా’ కార్యక్రమాలు జరుగుతాయి. ఆగస్టు 12న ఉదయం 7 గంటలకు బీచ్ రోడ్డులోని కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో ప్రజలందరూ పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అలాగే పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు దేశభక్తి గేయాలు, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను జీవీఎంసీ పరిధిలో యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్, గ్రామీణ ప్రాంతాల్లో జెడ్పీ సీఈఓ చూసుకుంటారని కలెక్టర్ వివరించారు. అందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
మరణించి మరో ఇద్దరికి వెలుగునిచ్చి..
పెందుర్తి: అనారోగ్యంతో మరణించిన ఇంటి పెద్ద నేత్రాలు దానం చేసి మానవత్వం చాటుకుంది ఓ కుటుంబం. చింతలగ్రహారం గవరపాలేనికి చెందిన కాళ్ల కన్నారావు(65) ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఈ నేపథ్యంలో స్థానిక సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి దాడి శ్రీనివాస్ మృతుని కుటుంబ సభ్యులను సంప్రదించి, నేత్రదానంపై అవగాహన కలిగించారు. దీంతో కన్నారావు భార్య లక్ష్మి, కుమారుడు ముత్యాలనాయుడు, కుమార్తె లక్ష్మి అంగీకారం తెలిపారు. దీంతో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి సారథ్యంలోని మొహిసిన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు కన్నారావు నేత్రాలను సేకరించి ఆస్పత్రికి తరలించారు. పుట్టెడు దుఃఖంలోనూ కన్నారావు కుటుంబ సభ్యుల మానవత్వాన్ని స్థానికులు ప్రశంసించారు. -
‘సౌభాగ్యం’ కిట్లు పంపిణీ
కొమ్మాది: రుషికొండలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం (తితిదే)లో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే), హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ‘సౌభాగ్యం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీవారి దర్శనానికి వచ్చిన ముత్తైదువులకు పసుపు కొమ్ములు, కుంకుమ, గాజులు, కంకణాలు అందజేశారు. ముందుగా, సౌభాగ్య కిట్లను శ్రీవారి ఆలయం చుట్టూ మంగళవాయిద్యాల నడుమ ప్రదర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు, సూపరింటెండెంట్ వెంకటరమణ, హిందూ ధర్మ ప్రచార సిబ్బంది, జిల్లా ధార్మిక ప్రచార కమిటీ సభ్యులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. -
విశాఖలో ఆటీన్ రాణులు
● భర్త ఫిర్యాదుతో వెలుగులోకి మహిళల ‘చతుర్ముఖ పారాయణం’ ● పేకాడ డెన్లు నిర్వహిస్తున్న పలువురు అతివలు ● కుటుంబాన్ని పట్టించుకోకుండా మూడు ముక్కలాట ● సీపీకి ఫిర్యాదు చేసిన ఓ భర్త ● వెలుగులోకి వచ్చిన మహిళల జూద క్రీడ ● ఆరుగురు మహిళల అరెస్ట్.. రూ.22 వేలు స్వాధీనంవిశాఖ సిటీ: విశాఖ ఆటీన్ రాణులు పెరిగిపోతున్నారు. చతుర్ముఖ పారాయణంలో మునిగితేలుతున్నారు. పలువురు మహిళలు ఏకంగా పేకాట డెన్లు సైతం నిర్వహిస్తున్నారు. కుటుంబాలను సైతం పట్టించుకోకుండా మూడు ముక్కలాటలో నిమగ్నమైపోతున్నారు. తన భార్య పేకాట మత్తు లో పడి తమను పట్టించుకోవడం లేదని ఒక భర్త నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది. మహిళామణుల జూద క్రీడ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇళ్ల్లే పేకాట డెన్లు జూద క్రీడ అంటే టక్కున గుర్తొచ్చేది మగ మహరాజులే. ఇప్పటి వరకు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన వారంతా మగవారే. కానీ ఇపుడు కాలం మారిపోయింది. అన్నింట్లోను సమానమే అన్నట్లు ముక్కలాటలోను జోరుమీద ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక గ్యాంగ్ను సిద్ధం చేసుకుంటున్నారు. జూద క్రీడకు ఎక్కడకు వెళ్లకుండానే ఇళ్లనే పేకాట డెన్లుగా మార్చేసుకుంటున్నారు. భర్తలను, పిల్లలను సైతం పట్టించుకోకుండా ముక్కలు విసిరే పనిలో బిజీగా ఉంటున్నారు. దీన్నే కొందరు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఇళ్లలో పేకాట నిర్వహణకు కమీషన్ సైతం తీసుకుంటున్నారు. కొన్ని అపార్టుమెంట్లలో జోరుగా పేకాట నిర్వహిస్తున్నారు. ఆరుగురి అరెస్ట్ సీపీ ఆదేశాలతో పోలీసులు ఆ ఇంటిపై దాడులు చేశారు. లోపల పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 వేలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కొందరు కొన్నేళ్లుగా వివిధ ప్రాంతాల్లో నిత్యం పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పనిలో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఇటువంటి వారిపై పోలీసులు నిఘా పెట్టారు. వీరు ఎక్కడెక్కడ పేకాట నిర్వహిస్తున్నరన్న విషయంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. భార్య పేకాటపై భర్త ఫిర్యాదు ఇప్పటి వరకు సీరియల్స్, సినిమాలు, ఫోన్లలో పడి భర్తలు, పిల్లలను పట్టించుకోని ఆడవారు ఉన్నట్లు వింటూ వస్తున్నాం. కానీ పేకాటలో పడి పిల్లలను, తనను పట్టించుకోవడం లేదన్న విషయం ఒక భర్త ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కయ్యపాలెం లలితానగర్ ప్రాంతంలో ఒక ఇల్లు పేకాట డెన్గా మారింది. ఆ ఇంటి గృహిణే ఈ జూద క్రీడకు లీడర్గా వ్యవహిరస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి ఆ ఇంట్లో నిత్యం మూడు ముక్కలాట ఆడిస్తోంది. భర్తను, పిల్లలను సైతం పట్టించుకోకుండా ఆటోలోనే మునిగితేలుతోంది. భర్త ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో విసుగెత్తిపోయిన భర్త ఇటీవల ఫోర్త్ టౌన్ సీఐ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. అతను పట్టించుకోకపోవడంతో నేరుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేశారు. తన భార్య పేకాట కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు తన గోడును విన్నవించుకున్నాడు. పేకాట డెన్గా మారిపోయిన తమ ఇంటిని మార్చాలని కోరారు. దీనికి స్పందించిన సీపీ విచారణ అనంతరం సీఐని బదిలీ చేశారు. -
● ఏపీఎల్ ఆరంభం అదుర్స్
మైదానంలో మిథాలీరాజ్, విక్టరీ వెంకటేష్విశాఖ స్పోర్ట్స్: వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుగులో ఏపీఎల్ నాలుగో సీజన్ అట్టహాసంగా శుక్రవారం ప్రారంభమైంది. అయితే రెండో జట్లు బ్యాటింగ్కు దిగకముందే భారీ వర్షంతో మ్యాచ్ నిలిచింది. ఆరంభ మ్యాచ్లో కాకినాడ కింగ్స్పై టాస్ గెలిచి అమరావతి రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఐదు వికెట్లు కోల్పోయి 229 పరుగులు భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ భరత్కు రాహుల్ తోడై స్కోర్ను పరుగులెత్తించారు. సెంచరీకి చేరువ(96, 5 ఫోర్లు, 9 సిక్సర్లు)లో రాహుల్ ఔటవగా, భరత్(93, 6 ఫోర్లు, 7 సిక్సర్లు) కూడా సెంచరీని చేజార్చుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ను 14 ఓవర్లలో 173 పరుగులు లక్ష్యంగా నిర్దేశించారు. అమరావతి రాయల్స్ బ్యాటర్లు రాణించడంతో 13.2 ఓవర్లలోనే 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించి, విజయకేతనం ఎగురవేశారు. భరత్, రాహుల్ సెంచరీల మిస్ వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదింపు 13.2 ఓవర్లలో అమరావతి రాయల్స్ లక్ష్య ఛేదన -
12 జిల్లాలతో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం
ఆర్ఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి డిమాండ్ ఎంవీపీ కాలనీ: కేంద్ర ప్రభుత్వం 2029 నాటికి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని రాయలసీమ రాష్ట్ర సమితి(ఆర్ఆర్ఎస్) అధ్యక్షుడు డాక్టర్ కుంచం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా లేదా కేంద్ర పాలితప్రాంతంగా ప్రకటించాలన్నారు. 1953లో రాష్ట్రం విడిపోయినప్పుటు కర్నూల్ను రాజధానిగా ఏర్పాటు చేశారని, అనంతరం హైదరాబాద్కు రాజధానిని మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. 1937 శ్రీభాగ్ ఒప్పందంతో రాయలసీమకు అన్యాయం జరిగిందన్నారు. ఈ ఒప్పందం జరిగి ఎనిమిది దశాబ్థాలవుతున్నా ఒప్పందంలోని ఒక్క అంశం కూడా నెరవేరలేదన్నారు. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని సవరించి 12 జిల్లాలతో కూడిన రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్లమెంట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి ఇటీవల లేఖ రాసినట్లు పేర్కొన్నారు. రాయలసీమ, కోస్తా జిల్లాలకు సమాన సంఖ్యలో శాసనసభ స్థానాల కేటాయింపు, నీటి వనరుల పంపిణీపైనా దృష్టిసారించాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు వెల్లడించారు. -
24 గంటల మంచినీటి సరఫరా పనులు సత్వరం పూర్తి
డాబాగార్డెన్స్: నగరంలో జరుగుతున్న 24 గంటల మంచినీటి సరఫరా ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి ప్రజలకు నీటి సరఫరా ప్రారంభించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, మంచినీటి విభాగం పర్యవేక్షక ఇంజినీర్ కేవీఎన్ రవిని ఆదేశించారు. శుక్రవారం ఆయన మాధవధారలోని విశాఖపట్నం నార్త్–వెస్ట్ సెక్టార్లోని ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో అమలవుతోంది. ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పనులను కాంట్రాక్టర్ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలోని మాధవధార, మురళీనగర్, మర్రిపాలెం ప్రాంతాల్లో 24 గంటల నీటి సరఫరా ప్రారంభమైందని కమిషనర్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటివరకు 5,000 మంచినీటి కనెక్షన్లు అందించామని, నీటి వినియోగానికి అనుగుణంగా బిల్లులు సిద్ధం చేయాలని సూచించారు. బిల్లులను ఈఆర్పీ మాడ్యూల్లో నమోదు చేసేందుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారుల అవగాహన కోసం ముందుగా నమూనా బిల్లులు జారీ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఈఈలు ఏడుకొండలు, మురళీకృష్ణ, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ సతీష్,ఏఈలు రాజ్కుమార్, సుమన్, ఎన్సీసీ డీజీఎం రంగారావు పాల్గొన్నారు. -
క్రీడలతో స్నేహ సంబంధాలు బలోపేతం
విశాఖ లీగల్ : క్రీడలు మనుషుల మధ్య పోటీతత్వాన్ని పెంచి మంచి ఫలితాలు అందిస్తాయని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ అన్నారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా క్రీడా సాంస్కృతిక వేడుకలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతర కార్యశీలురని, వారికి ఆటవిడుపుగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం చాలా అవసరమన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య మంచి వాతావరణాన్ని కలిగించడానికి ఈ వేడుకలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు సిరిపురపు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈత పోటీల్లో జాతీయ స్విమ్మర్ న్యాయవాదుల సంఘం క్రీడా సాంస్కృతిక సంఘం కార్యదర్శి బాలాజీ, సంఘం సీనియర్ సభ్యుడు ఆడారి అప్పారావు, భారీ సంఖ్యలో న్యాయవాదులు న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
7 జట్లు.. 25 మ్యాచ్లు
● నేటి నుంచి ఏపీఎల్ సీజన్ ప్రారంభం ● కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్ మధ్య తొలి మ్యాచ్విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) నాలుగో సీజన్కు వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం సిద్ధమైంది. శుక్రవారం ప్రారంభం కానున్న టీ20 లీగ్లో ఈసారి ఏడు ఫ్రాంచైజీ జట్లు ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. మొత్తంగా 25 మ్యాచ్లు నిర్వహించనుండగా టైటిల్ పోరు ఈనెల 23న జరగనుంది. రోజుకు రెండు మ్యాచ్లు చొప్పున జరగనుండగా అభిమానులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు ఏపీఎల్ నిర్వాహక కమిటీ చైర్మన్ వీఎస్కే రంగారావు తెలిపారు. సినీనటుడు వెంకటేష్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రారంభ వేడుకలో సినీనటి ప్రజ్ఞాజైస్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ ప్రదర్శన ఇవ్వనుండగా డ్రోన్, లేజర్షో అలరించనున్నాయి. ప్రారంభ వేడుకకు కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు హాజరై కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్ మధ్య మ్యాచ్ను టాస్ వేసి ప్రారంభించనున్నారు. ఈ మ్యాచ్లను సోనీ స్పోర్ట్స్ లైవ్ అందించనుంది. -
భూ సేకరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు
● 2026 నాటికి పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధి ● వివిధ సమీక్ష సమావేశాల్లో కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: జిల్లాలో మెట్రో రైల్, రైల్వే లైన్ విస్తరణ, గ్యాస్ పైప్లైన్, మాస్టర్ప్లాన్ రోడ్ల అభివృద్ధి, కన్వెయన్స్ డీడ్ పట్టాలు పొందిన లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ తదితర అంశాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, రెవెన్యూ అధికారులతో వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులకు భూ సేకరణతోపాటు, పరిహారం కూడా త్వరగా అందించాలన్నారు. పెందుర్తి, సింహాచలం నార్త్ స్టేషన్ మధ్య నిర్మించాల్సిన ఫ్లైఓవర్ నిర్మాణం, దువ్వాడ సింహాచలం లైన్ల మధ్య చేపట్టాల్సిన అభివృద్ధి పనుల భూ సేకరణపై చర్చించారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్–1లో భాగంగా మూడు కారిడార్లలో చేపట్టనున్న పనులకు సంబంధించి ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఇంకా మిగిలి ఉన్న ఐవోసీ గ్యాస్ పైప్లైన్ల ఏర్పాటుకు జీవీఎంసీ, వీఎంఆర్డీఏతో అధికారులు సహకరించి పెండింగ్ అనుమతులు త్వరగా మంజూరు చేయాలన్నారు. ● వీఎంఆర్డీఏ పరిధిలో చేపట్టాల్సిన 25 మాస్టర్ ప్లాన్ రోడ్లపై సమీక్షించారు. భూ సేకరణ, టెండర్లు, టీడీఆర్ల జారీని పారదర్శకంగా నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ రెండో వారం నుంచి పనులు ప్రారంభించి, 2026 జూన్/జూలై నాటికి రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా చూడాలన్నారు. ● వివిధ మార్గాల్లో కన్వెయన్స్ డీడ్ పట్టాలు పొందిన లబ్ధిదారులకు వేగంగా రిజిస్ట్రేషన్లు చేయాలని జోనల్, మండల స్థాయి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రోజుకు 30 రిజిస్ట్రేషన్లు చేయాలనే లక్ష్యం పెట్టుకుని, రెండు నెలల్లో పూర్తి చేయాలన్నారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.30, 45ల ద్వారా నిర్వహిస్తున్న భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియతోపాటు వీటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జీవో నెం.296 ప్రకారం పట్టాలు పొందిన లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ల గురించి ఆరా తీశారు. సమావేశాల్లో వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్, డీఆర్వో భవానీ శంకర్, ఆర్డీవోలు సంగీత మాధూర్, శ్రీలేఖ, భూ సేకరణ అధికారులు, తహసీల్దార్లు, ఐవోసీఎల్, మెట్రో రైల్, రైల్వే, జీవీఎంసీ, ల్యాండ్ సెక్షన్, యూఎల్సీ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
19న ఫొటో జర్నలిస్టుల ఎగ్జిబిషన్
మహారాణిపేట: వైజాగ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19, 20 తేదీల్లో నిర్వహించే ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను గురువారం వైజాగ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు వై. రామకృష్ణ, కార్యదర్శి ఎం.డి. నవాజ్, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబుతో కలిసి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆవిష్కరించారు. 186వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వైజాగ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ మ్యూజియంలో 19, 20 తేదీల్లో ఎగ్జిబిషన్ జరుగుతుందని అసోసియేషన్ సభ్యులు కమిషనర్కు తెలిపి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఫొటో ఎగ్జిబిషన్కు సందర్శకులు, విద్యార్థులు హాజరవుతారు కనుక సందేశాత్మకంగా, ఆకర్షణీయంగా ఉండే ఫొటోలు ప్రదర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫొటో జర్నలిస్టులు పి.ఎల్.మోహన్రావు, పెద్దిరాజు, శరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
11 నుంచి సీజీఆర్ఎఫ్ క్యాంపు కోర్టులు
సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ సత్యనారాయణసాక్షి, విశాఖపట్నం: ఏపీఈపీడీసీఎల్ శ్రీకాకుళం, అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పాడేరు సర్కిళ్ల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 11 నుంచి క్యాంపు కోర్టులు నిర్వహించనున్నట్లు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) చైర్మన్ విశ్రాంతి జడ్జి బి.సత్యనారాయణ వెల్లడించారు. ఈ నెల 11న పలాస డివిజన్ కాశీబుగ్గ సెక్షన్, 13న నర్సీపట్నం డివిజన్ కోటవురట్ల సెక్షన్, 21న అమలాపురం డివిజన్ మలికిపురం సెక్షన్, 22న భీమవరం డివిజన్ ఉండి సెక్షన్, 29న రంపచోడవరం డివిజన్లోని రాజవొమ్మంగి సెక్షన్ కార్యాలయాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే క్యాంపు కోర్టులో వినియోగదారులు పాల్గొనవచ్చని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, బిల్లుల సమస్యలు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం, పేరుమార్పిడి, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి తదితర విద్యుత్ సంబంధిత సమస్యలపై వినియోగదారులు ఫిర్యాదులను నేరుగా సీజీఆర్ఎఫ్ కమిటీకి తెలియజేయవచ్చన్నారు. అదేవిధంగా విశాఖపట్నం సీతమ్మధారలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉన్న సీజీఆర్ఎఫ్ కార్యాలయానికి కూడా నేరుగా గానీ, లిఖిత పూర్వకంగాగానీ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వినియోగదారులు విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 ను సంప్రదించవచ్చని సూచించారు. ఈ సదస్సుల్లో చైర్పర్సన్ బి.సత్యనారాయణతో పాటు సీజీఆర్ఎఫ్ కమిటీ సభ్యులు ఎస్.రాజబాబు, ఎస్.సుబ్బారావు, ఎన్.మురళీకృష్ణ పాల్గొననున్నారు. -
రాజ్యాంగం ప్రజలందరినీ ఐక్యం చేస్తుంది
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోడ రఘురామ్ మద్దిలపాలెం: రాజ్యాంగం దేశ ప్రజలందరినీ ఐక్యం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ(భోపాల్) మాజీ డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురామ్ తెలిపారు. ఏయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయ కళాశాలలో గురువారం జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఎండోమెంట్ లెక్చర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చట్టం, సామాజిక క్రమం రాజ్యాంగ దృక్పథం అనే అంశంపై ఉపన్యసించారు. విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు విభిన్న అంశాలపై అవగాహన అందించేందుకు ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయన్నారు. ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ శతాబ్ది సంవత్సరంలో ఉన్న ఏయూ ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను నిర్వహించేలా క్యాలెండర్ను విడుదల చేసిందన్నారు. లా కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం న్యాయ కళాశాల ప్రత్యేకతలను, ఎండోమెంట్ లెక్చర్ వివరాలు వివరించారు. ముందుగా న్యాయ కళాశాల వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతిని పురస్కరించుకొని న్యాయ కళాశాలలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. విశ్రాంత ఆచార్యులు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చవితి నవరాత్రులకు పోలీస్ ఆంక్షలు
అల్లిపురం: రాబోయే వినాయక చవితి నవరాత్రులకు పలు ఆంక్షలు, బందోబస్తు ఏర్పాటుకు నగర పోలీసులు సిద్ధమయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నవరాత్రుల కమిటీలు పెరిగే అవకాశం ఉందని భావించి, పోలీస్ శాఖ కార్యాచరణ వివరించేందుకు సీపీ శంఖబ్రత బాగ్చి ఉత్సవ నిర్వహణ కమిటీలతో గురువారం సమావేశమయ్యారు. సీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని చవితి నవరాత్రుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మండపాల ఏర్పాటు, నిమజ్జనం, పోలీస్, ఇతర శాఖల అనుమతులు తదితర అంశాలపై చర్చించారు. నగర పరిధిలో చవితి నవరాత్రులు నిర్వహిస్తున్న కమిటీలు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మండపాల్లో సీసీటీవీ ఫుటేజ్ 24/7 రికార్డ్ చేసి పర్యవేక్షించాలన్నారు. సోషల్ మీడియా పుకార్లను నమ్మి, ఫార్వర్డ్ చేయొద్దన్నారు. అలాంటి సమాచారం ఉంటే పోలీసులకు వాట్సప్ 7995095799, 100, 112 నంబర్లకు తెలియజేయవచ్చన్నారు. బలవంతంగా డొనేషన్ల వసూలు, లక్కీ డిప్స్, లాటరీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. నవరాత్రులతోపాటు నిమజ్జనం సమయంలో పాటించాల్సిన నిబంధనలను వివరించారు. -
మార్కెట్లకు శ్రావణ శోభ
జగదాంబ: శ్రావణమాసం మూడో శుక్రవారం వరలక్ష్మీ వత్రం సందర్భంగా నగరం శ్రావణ శోభను సంతరించుకుంది. నగరంలో పూర్ణామార్కెట్, రైతు బజార్లు కిక్కిరిసిపోయాయి. కంచరపాలెం, గోపాలపట్నం, పెందుర్తి, అక్కయ్యపాలెం, మధురవాడ, సీతమ్మధార తదితర ప్రధాన కూడళ్లలో వెలసిన దుకాణాల వద్దకు గురువారం అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో కిటకిటలాడాయి. ఇదే అదనుగా పువ్వులు, పండ్లు, ఇతర పూజా సామగ్రి ధరలకు రెక్కలొచ్చాయి. 100 గ్రాముల పువ్వులు రూ.100–150 మధ్య అమ్మకాలు అమ్మకాలు జరిపారు. అరటిపండ్లు డజను రూ.100కు చేరింది. కొబ్బరికాయలు పరిమాణంలో కాస్త మధ్యస్తంగా ఉన్నవి ఒక్కోటి రూ.50 ధర పలికింది. ఇక పండ్ల ధరల గురించి చెప్పాల్సిన పనిలేదు. కిలో దానిమ్మ రూ.300, యాపిల్ రూ.250, ద్రాక్ష రూ.200, సీతాఫలాలు ఒక్కొక్కటి రూ.40–50 మధ్య విక్రయించారు. పత్రులు, గాజుల దుకాణాలు ఎక్కడికక్కడ వెలిశాయి. ప్రధాన మార్కెట్ల వద్ద జనం కిక్కిరిసి పోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. పూర్ణామార్కెట్ వద్ద బారికేడ్లతో రహదారిని డైవర్ట్ చేయాల్సి వచ్చింది. -
పాఠశాల మూసివేత చర్యలపై ఆందోళన
కంచరపాలెం: జీవీఎంసీ 56వ వార్డు ఆర్పీపేట స్కూల్ కాంప్లెక్స్ పరిధి కంచరపాలెం ప్రాథమిక పాఠశాల మూసివేతకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని తల్లిదండ్రులు, విద్యార్థులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది వరకు 260 మంది విద్యార్ధులు, 10 మంది టీచర్లుండేవారని, ఇటీవల బదిలీల్లో ఆరుగురు వెళ్లిపోవడంతో కేవలం నలుగురు టీచర్లతో నెట్టుకొస్తున్నారని ఆక్షేపించారు. ఇప్పుడున్న 206 మంది విద్యార్థులకు రెండు నెలలుగా పూర్తి స్థాయిలో తరగతులు జరగట్లేదన్నారు. విలీనం సాకుతో పాఠశాలను మూసేయడానికి విద్యాశాఖ చేస్తున్న ప్రయత్నాలను తల్లిదండ్రులు ధర్నాలు, రాస్తారోకో, నిరసనలతో అడ్డుకుంటున్నా అధికారుల్లో మాత్రం ఎలాంటి దిద్దుబాటు చర్యలు కానరావట్లేదని ఆక్షేపిస్తున్నారు. ఈ నెల 11 నుంచి ఫార్మేటివ్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీచర్ల కొరతపై వార్డు మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ, పాఠశాల కమిటీ చైర్మన్ నాగమణి నేతృత్వంలో గురువారం తల్లిదండ్రులు పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో నిరసన తెలుపుతున్న తల్లిదండ్రులను బయటకు పంపడంతో.. వారు తమ పిల్లల్ని తీసుకుని పాఠశాల ప్రధాన ద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో కంచరపాలెం సబ్ ఇన్స్పెక్టర్ సమీర్, కానిస్టేబుల్ రాంబాబు పాఠశాలకు చేరుకుని విద్యార్థులను పాఠశాల లోపలికి పంపారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం రాజ్యలక్ష్మి సమక్షంలో ఉప విద్యాశాఖాధికారి సోమేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడారు. పాఠశాలకు డిప్యుటేషన్పై టీచర్లను పంపాలన్న డిమాండ్ నేపథ్యంలో ఒకరిని నియమించడంతో తల్లిదండ్రులు శాంతించారు. ఈ సందర్బంగా బొట్టా ఈశ్వరమ్మ మాట్లాడుతూ ప్రజా వేదికలో కలెక్టర్కు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. ఈ స్కూల్ను తరలించినా, మూసేయడానికి ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. డీఎస్సీ ఫలితాలను ప్రకటించి, కొత్త ఉపాధ్యాయులను స్కూల్కు కేటాయించి, పాఠశాలకు పూర్వవైభవం తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐ కమిటీ సభ్యులు హెచ్చరించారు. -
కూటమి పాలనలో బీసీలపై దౌర్జన్యాలు
డాభాగార్డెన్స్: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లిన బీసీ నేత, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముపై టీడీపీ గూండాల దాడిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర భరత్ ఆధ్వర్యంలో జరిగిన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు పాల్గొన్నారు. గ్రీన్పార్కు హోటల్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కూటమి సర్కార్ ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి బీసీలపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు మాట్లాడుతూ.. ఒక శాసనమండలి సభ్యుడికి పోలీసులు కనీస భద్రత కల్పించలేని స్థితిలో ఉంటే.. అసలు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా.? నియంత పాలనలో ఉన్నామా.? అనే సందేహం కలుగుతోందన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచే సత్తా లేకపోవడంతో.. రౌడీయిజంతో ఎన్నికలో గెలవాలని చూస్తున్నారని ఆక్షేపించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ, ముఖ్యనేతలు డాక్టర్ జహీర్ అహ్మద్, కార్పొరేటర్లు పీవీ సురేష్, బిపిన్కుమార్ జైన్, పల్లా దుర్గారావు, బోని శివరామకృష్ణ, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, అల్లంపల్లి రాజుబాబు, మారుతిప్రసాద్, ఎం.రమేష్, కనకరెడ్డి, పీతల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడిని ఖండించిన వైఎస్సార్ సీపీ నేతలు -
ఫ్రీ బస్ అమలుకు సర్వం సిద్ధం
● పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో, ఆర్డినరీ బస్సుల్లో ఉచితం ● మీడియాతో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మహారాణిపేట: ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో సీ్త్ర శక్తి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, చైర్మన్ కొనకళ్ల నారాయణ, జోనల్ చైర్మన్ దొన్నుదొర తెలిపారు. ద్వారకా బస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికై నా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్టినరీ, మెట్రో బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆధార్, ఓటర్ ఐడీ, ఇతర గుర్తింపు కార్డులు తప్పనిసరిగా చూపాలని పేర్కొన్నారు. త్వరలో మరో 1050 కొత్త బస్సులు రానున్నాయని, ఏటా డీజిల్ బస్సుల స్థానంలో కొత్త ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆర్టీసీ చైర్మన్ నారాయణ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ప్రారంభిస్తున్న ఈ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు అదనపు బస్సులు, సిబ్బందిని సమకూర్చినట్లు పేర్కొన్నారు. తొలి రోజుల్లో ఎదురయ్యే సమస్యల్ని పరిగణనలోకి తీసుకుని దిద్దుబాటు చేసుకుంటామన్నారు. జోనల్ చైర్మన్ దొన్ను దొర మాట్లాడుతూ రాష్ట్రంలో బస్సు ప్రయాణికుల మొత్తం సంఖ్యలో 76 శాతం మంది మహిళలకు ఈ పథకం ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సమావేశంలో జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) ఎ.అప్పలరాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఇంజినీరింగ్) టి.చెంగలరెడ్డి, విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మరణించీ.. జీవిద్దాం!
● అవయవదానంతో ప్రాణదానం ● పదేళ్లలో నగరంలో 162 మంది అవయవదానం ● నాలుగేళ్లుగా పెరుగుతున్న అవగాహన ● ఈ నెల 7 నుంచి 13 వరకు ప్రపంచ అవయవదాన అవగాహన వారోత్సవాలు అవయవ దానం చేయాలంటే.. అవయవ దానానికి సమ్మతించిన వారు లిఖిత పూర్వక హామీనిస్తూ ఆస్పత్రులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే జీవన్దాన్ సంస్థలో పేర్లు నమోదు చేసుకోవాలి. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మరణానంతరం అవయవ దానానికి సమ్మతించాల్సింది కుటుంబ సభ్యులే. మొత్తం శరీరాన్ని వైద్య పరీక్షల కోసం దానం చెయ్యడానికి అంగీకరిస్తే మరణానంతరం ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ముందే ఓ వ్యక్తిని నియమించుకోవాలి. బీచ్రోడ్డు: భౌతిక శరీరానికి ప్రాణం ఉన్నంత వరకే విలువ. ఇది ఒకప్పటి మాట. శవాన్ని పార్థివ దేహంగా చెప్పుకునేలా, మరణించాక.. మరో శరీరంలో బతికేందుకు ఉన్న ఏకై క అవకాశం అవయవదానం. సామాన్యులు సైతం అవయవదానంతో ఎందరికో పునర్జీవితమిచ్చి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ప్రపంచ అవయవ దాన వారోత్సవాల సందర్భంగా ఈ ప్రత్యేక కథనం. ఎనిమిది మంది బతుకుల్లో వెలుగు మెదడు పనిచేయకుండా ఆగిపోయిన స్థితిని బ్రెయిన్ డెడ్గా పేర్కొంటారు. అలాంటి వ్యక్తి ఎక్కువ రోజులు బతకడం అసాధ్యం. ఇలా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి 110 వరకు అవయవాలను సేకరించవచ్చు. ప్రస్తుతం మన వద్ద ఉన్న సాంకేతికత ఆధారంగా 8 అవయవాల్ని మాత్రమే తీసుకుంటున్నారు. గుండె, కాలేయం, కిడ్నీలు(2), చిన్నపేగు, ఊపిరితిత్తులు(2), పాంక్రియాస్ను బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి తీసుకోవచ్చు. కార్నియా, గుండె కవాటాలు, చర్మం, ఎముక కణజాలం, రక్తనాళాలను మాత్రం సహజ మరణం పొందిన వారి నుంచే ఎక్కువగా స్వీకరిస్తారు. సమయం చాలా తక్కువ.. దాత శరీరం నుంచి తీసిన అవయవాలను అవసరమైన వ్యక్తులకు అమర్చేందుకు ఉండేది కేవలం గంటల సమయమే. అందుకే గ్రీన్ చానల్ ద్వారా వీటిని తరలిస్తారు. గుండె, ఊపిరితిత్తులను బయటకు తీశాక 4 గంటలే వ్యవధి ఉంటుంది. కిడ్నీలకై తే 30 గంటలు, లివర్, పాంక్రియాస్ను 12 గంటల్లోపు మరొకరిలో అమర్చాలి. అందరిలోనూ అన్ని సమయాల్లో ఇదే సమయం ఉంటుందని చెప్పలేం. కొన్ని సందర్భాల్లో ఇంత కంటే తక్కువ సమయంలోనే ఆ అవయవాలను అమర్చాలి. లేకుంటే దాన్ని అమర్చాక సదరు వ్యక్తి రోగ నిరోధక వ్యవస్థ దాన్ని తిరస్కరిస్తూ అవయవంపై దాడి చేస్తుంటుంది. అందుకే దాన్ని బ్లాక్ చేసేందుకు మందులిస్తారు. కొన్నిసార్లు ఈ మందులు జీవిత కాలం వాడాల్సి రావొచ్చు. అవగాహన పెరగాలి మన దేశంలో మూఢ నమ్మకాల కారణంగా అవయవాలు దానం చేసేందుకు చాలా మంది ముందుకురాని పరిస్థితి. ఒక్క మన రాష్ట్రంలోనే జీవన్ దాన్ ద్వారా ఆధికారికంగా అవయవాల కోసం 5 వేల మంది ఎదురు చూస్తున్నారు. ప్రజల్లో అవయవదానం పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా ఏటా ఆగష్టు 7 నుంచి 13 వరకు ప్రపంచ అవయదాన అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. దీంతో నాలుగేళ్లలో బ్రెయిన్ డెడ్ కేసులు గణనీయంగా పెరిగి, అవయవ దానానికి కుటుంబ సభ్యులు ఆమోదం తెలుపుతున్నారు. అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంచనాలతో అంతిమ వీడ్కోలు పలుకుతుంది. దహనసంస్కారాల కోసం రూ.10 వేలు తక్షణ సాయం అందిస్తుంది. ప్రశంసా ప్రతం అందించి, కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరిస్తుంది. బతికున్నప్పుడే చేసే అవయవ దానాలు ఒక మనిషి తన జీవనానికి పెద్దగా ప్రభావం లేకుండా కూడా కొన్ని అవయవాలను దానం చేయొచ్చు. కిడ్నీల్లో ఒకటి, ఊపిరితిత్తులు, కాలేయం, పాంక్రియాస్, పేగు నుంచి కొంత భాగాన్ని నిక్షేపంగా దానం చేయొచ్చు. కొంత భాగం దానం తర్వాత కూడా కణాల వృద్ధి జరిగి, కణజాలం నిర్మితమయ్యే అవకాశం ఉన్న ఏకై క అవయవం కాలేయం. రక్తం, రక్తంలో ప్లేట్లెట్స్, మూల కణాలు కూడా దానంగా ఇవ్వదగినవే..! విశాఖలో అవయవ దాతలు (2015 నుంచి 2025 జూన్ వరకు) ఆస్పత్రి పేరు దాతలు కిమ్స్ ఐకాన్ 60 కేర్(రామ్నగర్) 35 అపోలో(హెల్త్ సిటీ) 28 మెడికవర్ 16 సెవెన్ హిల్స్ 6 క్వీన్స్ ఎన్ఆర్ఐ 5 పినాకిల్ 5 విమ్స్ 3 అపోలో(రామ్నగర్) 2 ఓమ్ని 1 కేర్ హెల్త్ సిటీ 1 ప్రభుత్వ ఆసుపత్రులపై దృష్టి బ్రెయిన్ డెడ్ కేసులు ఉన్నప్పటికీ అవయవాల సేకరణకు కొన్ని ఆస్పత్రులు ఆసక్తి చూపట్లేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో బ్రెయిన్ డెడ్ కేసులు ప్రకటించట్లేదు. ఈ ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవాలు సేకరించేలా చర్యలు తీసుకుంటున్నాం.ఇప్పటికే కేజీహెచ్లో జీవన్దాన్ కోసం బృందాలను సిద్ధం చేశాం. ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రతి అస్పత్రిలో సైన్ బోర్డులు, హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయనున్నాం. – డాక్టర్ కె.రాంబాబు, జీవన్దాన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ -
ఉలిక్కిపడిన విశాఖ
వెల్డింగ్ దుకాణంలో పేలిన సిలిండర్● కంపించిన పాతనగరం ● రెండు కిలోమీటర్ల మేర పేలుడు శబ్దం ● ముగ్గురి మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు ● 9 అడుగుల ఎత్తయిన గోడ దాటి పడిన మృతుల శరీర భాగాలు ● షాపు వెనుక 150 అడుగుల దూరంలో ఉన్న ఇళ్లపై పేలుడు ప్రభావం ● ఓ ఇంట్లో సీలింగ్ పడి చిన్నారికి గాయంపని దొరికింది.. హ్యాపీ అన్నాడు.. ప్రమీలా పని దొరికింది. ఇంత కాలం ఖాళీగానే ఉన్నా. ఇక మనకు పర్వాలేదు. హ్యాపీ అంటూ వెళ్లిన తన భర్త, పేలుడు ఘటనలో గాయపడి చికిత్స పొందుతూ మరణించడంతో చింతకాయల ముత్యాలు భార్య ప్రమీల కేజీహెచ్ మార్చురీ వద్ద వెక్కివెక్కి గుండెలవిసేలా రోదించింది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. అర్ధంతరంగా వదిలి వెళ్లిపోయావు నాయనా.. పిల్లల్ని ఎవరు చూస్తారంటూ ప్రమీల తల్లి(ముత్యాలు అత్త) వేదన అంతా ఇంతా కాదు. పోస్టుమార్టం కోసం మార్చురీకి తీసుకెళ్తుండగా ముత్యాలు మృతదేహాన్ని చూసి ప్రమీల సొమ్మసిల్లిపోయింది. వీరు ఇద్దరు పిల్లలతో బుక్కావీధిలో ఉంటున్నారు. అనాథలయ్యాం.. లోలోర 365 వర్క్షాప్ను 6 నెలల కిందట అప్పు చేసి రూ.3 లక్షలకు గణేష్ తీసుకున్నాడు. అంత వరకు టౌన్కొత్తరోడ్డు సమీపాన ఓ దుకాణంలో పనిచేశాడు. సొంతంగా దుకాణం పెట్టుకోవడంతో పాటు పలువురికి ఉపాధి కల్పించాడు. ఆరు నెలల్లోనే భగవంతుడు తమ నుంచి దూరం చేశాడంటూ గణేష్ భార్య సుధ రోదించిన తీరు అక్కడున్నవారిని కలచివేసింది. సున్నపువీధిలో ఉంటున్న వీరికి టెన్త్ చదువుతున్న లక్ష్మీసంపత్, 8వ తరగతి చదువుతున్న వర్షిత్శ్రీ ఉన్నాడు. ఒంటరైన శ్రీను భార్య ఇదే వర్క్షాప్లో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన శ్రీను కూడా మృతి చెందాడు. ఆరేళ్ల కిందట బతుకుతెరువు కోసం విశాఖ వచ్చిన శ్రీను బుక్కావీధిలోనే అద్దెకు ఉంటూ వర్క్షాప్లో పనిచేస్తున్నాడు. శ్రీను మరణంతో భార్య ఒంటరయింది. ● ఘటనలో తీవ్రంగా గాయపడి కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఇప్పిలి రంగారావు(53) బుక్కావీధి, ఫిషింగ్ హార్బర్ రోడ్డులో స్క్రాప్ దుకాణం నడుపుతున్నాడు. తెలకలవీధి, చెంగల్రావుపేటలో నివాసం ఉంటున్నాడు. రంగారావు పెద్ద కుమారుడు జై నగరంలోని పోర్టు ట్రస్ట్కు సమీపాన ఓ స్క్రాప్ దుకాణం నడుపుతుండగా, రెండో కుమారుడు నవీన్ పారిస్లో బీబీఏ చదువుతున్నాడు. మూడో కుమారుడు గౌరీశంకర్ సీమెన్. భార్య భారతి గృహిణి. రంగారావు పరిస్థితి క్రిటికల్గానే ఉందని వైద్యులు తెలిపారు. ● లోలోర 365 వర్క్షాప్ యజమాని గణేష్ వద్ద పని చేస్తున్న యర్రా ఎల్లాజీకి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఎల్లాజీ భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులతో మధురవాడలో ఉంటున్నాడు. పెద్దకుమారుడు గణేష్ పౌండ్రీలో పనిచేస్తుండగా, చిన్నోడు హరికృష్ణ ఏసీ మెకానిక్. అరగంట దాటి ఉంటే.. రోజూ సాయంత్రం 5 గంటల సమయంలో లోలోర 365 వర్క్షాప్(గణేష్ దుకాణం) వద్దకు పరిసర దుకాణాల నుంచి పదుల సంఖ్యలో చేరుకుంటారు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకునే వారు. దుర్ఘటన అరగంట ముందుగా జరగడంతో చాలా మంది ప్రాణాలు దక్కినట్లేనని స్థానికులు ‘సాక్షి’కి తెలిపారు. భూమి అదిరింది.. సాయంత్రం 4.30 సమయంలో ఇంటి పనులు చేసుకుంటున్నాం. ఒక్కసారిగా పెద్ద సౌండ్ వచ్చింది. భూకంపం మాదిరి భూమి అదిరింది. పై ఫ్లోర్లో ఉన్న నేను భయంతో కిందికి వచ్చేశాను. పక్కనే నల్లటి పొగ కనిపించింది. ఇంతలో వెల్డింగ్ షాపు నుంచి పొగలు కమ్ముకున్నాయి. పెద్దపెద్ద అరుపులు, ఆర్తనాదాలు వినిపించాయి. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పిన తర్వాతే గ్యాస్ సిలిండర్ పేలినట్లు తెలిసింది. – స్థానికురాలు విశాఖ సిటీ/డాబాగార్డెన్స్ : విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ విస్ఫోటనంతో పాత నగరం భూకంపం వచ్చినట్లు అదిరింది. గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఫిషింగ్ హార్బర్ రోడ్డులో ఒక వెల్డింగ్ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరి వ్యక్తుల శరీర భాగాలు 9 అడుగుల ఎత్తయిన గోడపై నుంచి ఎగిరి అవతల పడ్డాయి. పేలుడు కారణంగా సంభవించిన మంటల్లో చిక్కుకున్న నలుగురు తీవ్రంగా కాలిపోయారు. దీంతో వన్టౌన్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండు కిలోమీటర్ల మేర ప్రజలను ఈ పేలుడు శబ్దం భయాందోళనకు గురిచేసింది. చెల్లాచెదురైన శరీర భాగాలు సున్నపువీధి ప్రాంతానికి చెందిన చల్లా గణేష్(44) వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆరు నెలల క్రితమే బుక్కా వీధిలో ఫిషింగ్ హార్బర్ రోడ్డులో వెల్డింగ్ దుకాణాన్ని తెరిచాడు. ఒడిశాకు చెందిన శ్రీను హెల్పర్గా పనిచేస్తున్నాడు. గురువారం హెల్పర్ శ్రీను(29)తో పాటు మరో ఇద్దరు వర్కర్లు ఎర్ర ఎల్లాజీ(45), సన్యాసిరావు(46)లను పనికి పెట్టుకున్నాడు. వీరు ఎప్పటిలాగే వెల్డింగ్, గ్యాస్ కటింగ్ పనులు చేస్తుండగా సాయంత్రం 4.30 గంటలకు సిలిండర్ పేలిపోయింది. అక్కడే ఉన్న యజమాని గణేష్, హెల్పర్ శ్రీనుల మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. వెల్డింగ్ షాపు నామరూపాలు లేకుండా తునాతునకలైంది. పేలుడు ధాటికి మంటలు వ్యాపించాయి. అక్కడే పనిచేస్తున్న వర్కర్లు ఎర్ర ఎల్లాజీ, సన్యాసిరావుతో పాటు పక్కన ఉన్న స్క్రాప్ దుకాణంలో పనిచేస్తున్న చింతకాయల ముత్యాలు(27), ఇప్పిలి రంగారావు(53) ఆ మంటలకు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో క్షతగాత్రుల తరలింపు భారీ ప్రమాదం జరిగినప్పటికీ ఘటనా స్థలానికి 108 అంబులెన్సులు రాకపోవడం గమనార్హం. కేవలం మృతదేహాల తరలింపు కోసం మాత్రమే అంబులెన్సును తీసుకొచ్చారు. నలుగురు క్షతగాత్రులను ఆటోలో తరలించడంపై స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంటల్లో 90 శాతానికి పైగా కాలిన శరీరంతో బాధను తట్టుకోలేక.. ఆర్తనాదాలు పెడుతూ ఆటో ఎక్కడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఇద్దరి పరిస్థితి విషమం ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఎర్ర ఎల్లాజీ(45), సన్యాసిరావు(46), చింతకాయల ముత్యాలు(27), ఇప్పిలి రంగారావు(53)లను చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. వీరిలో చింతకాయల ముత్యాలు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించాడు. ఎల్లాజీ 95 శాతం, రంగారావు 75 శాతం మేర కాలిపోయారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 18 శాతం కాలిన గాయాలైన సన్యాసిరావును చికిత్స కోసం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. కంపించిన ఇళ్లు.. చిన్నారిపై పడిన సీలింగ్ ఒక్కసారిగా భారీ శబ్ధంతో భూమి అదరడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో సుమారు 200 మీటర్ల వరకు ఉన్న ఇళ్లు కంపించాయి. వెల్డింగ్ దుకాణానికి 150 అడుగుల దూరంలో ఉన్న ఒక ఇంట్లో సీలింగ్ కూలింది. ఆ ఇంట్లో గాయత్రీ అనే చిన్నారి(11)పై ఆ పెచ్చులు పడ్డాయి. దీంతో ఆమె తలకు గాయమైంది. మరికొన్ని ఇళ్లు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి అధికారులు ఘటనా స్థలాన్ని కలెక్టర్ హరేందిర ప్రసాద్, సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ మయూర్ అశోక్, ఎమ్మెల్యే వంశీకష్ణ శ్రీనివాస్ సందర్శించారు. అక్కడ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు క్షతగాత్రులకు అందిస్తున్న వైద్యం గురించి వివరించారు. మృతులు చల్లా గణేష్(44), శ్రీను (29), చింతకాయల ముత్యాలు(27) క్షతగాత్రులు ఎర్ర ఎల్లాజి(45), టి.సన్యాసిరావు(46), ఇప్పిలి రంగారావు(53) తీవ్రంగా కలచివేసింది: బొత్స గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేసి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై కేకే రాజు దిగ్భ్రాంతి గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంపై వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ సిలిండర్ పేలింది? ఘటనా స్థలంలో ఆక్సిజన్ సిలిండర్లతో పాటు డొమెస్టిక్ సిలిండర్ కూడా ఉంది. వీటిలో ఏ సిలిండర్ ప్రమాదానికి కారణమైందన్న విషయం తేలాల్సి ఉంది. సాధారణంగా డొమెస్టిక్ సిలిండర్ పేలితే అది ముక్కలైపోతుంది. కానీ అక్కడ ఉన్న సిలిండర్ బాగానే ఉంది. అలాగే ఆక్సిజన్ సిలిండర్లు మూడు ఉండగా.. ఒకదానికి మాత్రం పైన వాల్వ్ పడిపోయి ఉంది. సాధారణ సిలిండర్ కంటే ఆక్సిజన్ సిలిండర్ పేలుడు కారణంగానే భారీగా విస్ఫోటనం సంభవిస్తుంది. చదరపు ఇంచ్కు 2 వేల పౌండ్ల ఒత్తిడితో సంభవించే ఈ పేలుడుకు భారీ నష్టం వాటిల్లుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్ పేలితే మాత్రం 5 మీటర్ల పరిధిలో ఉన్న వారికి మృత్యు ప్రమాదం ఉంటుందని, గరిష్టంగా 32 మీటర్ల దూరంలో ఉన్న వారికి గాయాలయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీని ప్రకారం ఈ ఘటనలో ఆక్సిజన్ సిలిండర్ పేలిందా? లేదా గ్యాస్ సిలిండర్ ప్రమాదానికి కారణమైందన్నది విచారణ చేయాల్సి ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
● వంతెన రక్షణ గోడను ఢీకొన్న కంటైనర్ ● 30 అడుగుల ఎత్తు నుంచి పడి డ్రైవర్ దుర్మరణం పెందుర్తి : ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారి–16(బైపాస్) పెందుర్తి సమీపంలోని సరిపల్లి వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. వివరాలివి.. జాతీయ రహదారిపై సబ్బవరం వైపు నుంచి ఆనందపురం వైపు వెళుతున్న కంటైనర్ సరిపల్లి వద్దకు వచ్చేసరికి అదుపు తప్పింది. ఈ క్రమంలో వంతెన రక్షణ గోడ వద్ద ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొంది. దీంతో కంటైనర్ డోర్ తెరుచుకోవడంతో డ్రైవర్ రాకేష్కుమార్(40) దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి విచారణ చేపట్టారు. రాకేష్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతునిది ఉత్తరప్రదేశ్ రోషన్నగర్. అతని బంధువులకు సమాచారం అందించారు. సీఐ కె.వి సతీష్కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్టాండింగ్ షాక్!
మేయర్పై వ్యతిరేకత.. కూటమి పార్టీలో లుకలుకలు హైకోర్టు కేసు నేపథ్యంలో వేటు భయం భారీగా జరిగిన క్రాస్ ఓటింగ్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/డాబాగార్డెన్స్ : కూటమి పార్టీల్లో రోజురోజుకీ పెరుగుతున్న లుకలుకలు.. మేయర్ వ్యవహారశైలి పట్ల సొంత పార్టీ కార్పొరేటర్లల్లో వ్యతిరేకత.. పార్టీ మారిన కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు... వెరసి జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి సాడి పద్మారెడ్డి ఏకంగా 50 ఓట్లతో విజయం సాధించారు. మొత్తం 10 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలో చేరిన కార్పొరేటర్లతో పాటు కూటమిలోని మరికొందరు కార్పొరేటర్లు కూడా క్రాస్ ఓటింగ్కు దిగడంతో కూటమికి షాక్ తగిలింది. గత స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మొత్తం 10 స్థానాల్లో విజయం సాధించిన కూటమికి ఈ దఫా జరిగిన ఎన్నికల్లో ఓ స్థానంలో ఓటమి తప్పలేదు. వాస్తవానికి సాధారణ ఎన్నికల తర్వాత కూటమి పార్టీల్లోకి పలువురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు జంప్ అయ్యారు. ఇక వైఎస్సార్ సీపీకి నికరంగా 32 మంది కార్పొరేటర్లు మిగిలారు. స్థాయీ సంఘం ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున బరిలో ఉన్న 10 మంది అభ్యర్థులకు 32 కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి కూటమి పాలన పట్ల కార్పొరేటర్లలో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోంది. కనీస గౌరవమేదీ..! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవీఎంసీపై కన్నేశారు. గత ఏడాది జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో రిసార్టు రాజకీయాలు నడిపి.. ప్రతి ఒక్కరికీ ఒక్కో రకం పెన్సిల్ ఇచ్చి మరీ ఓటింగ్ జరిపారు. వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లకు పలు ఆశలు చూపి తమ పార్టీలో చేర్చుకున్నారు. అయితే పార్టీ మారే వరకూ ఎంతో గౌరవంగా పలకరించి.. స్టాండింగ్ కమిటీతో పాటు మేయర్ ఎన్నికల అనంతరం కనీసం పట్టించుకోవడం మానేశారంటూ పలువురు కార్పొరేటర్లు వాపోతున్నారు. తమకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఇక పార్టీ మారిన కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిపై సమాధానం చెప్పాలంటూ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఎక్కడ తమపై వేటు పడుతుందోనన్న ఆందోళనతో పార్టీ మారిన కార్పొరేటర్లు కొందరు వైఎస్సార్ సీపీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. కూటమి పార్టీల్లో పెరిగిన అంతరం! స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీల మధ్య లుకలుకలు బయటపడ్డాయి. ఈ ఎన్నికల్లో జనసేనకు కనీసం 2 స్థానాలైనా ఇవ్వాలని కోరగా ఒక్క స్థానం కూడా ఇవ్వలేదు. పోటీలో నిలిచిన కార్పొరేటర్ సాధిక్ను చివరిలో తప్పించారు. ఈ నేపథ్యంలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఏకంగా ఓటింగ్కు దూరంగా ఉన్నారు. సీపీఎం కార్పొరేటర్ కూడా ఓటింగ్కు దూరంగా ఉంది. మరోవైపు టీడీపీ కూటమిలోని జనసేన, బీజేపీలను కలుపుకుని వెళ్లడం లేదన్న విమర్శలున్నాయి. కూటమిలోని లుకలుకలు కూడా ఈ ఫలితాలకు కారణమైనట్టు తెలుస్తోంది. అలాగే గత స్టాండింగ్ కమిటీ పేరుతో జరిపిన వసూళ్లలో జీవీఎంసీలో కీలక నేత పాత్రపైనా ఆరోపణలున్నాయి. స్టాండింగ్ కమిటీ పేరుతో నామినేషన్ పనుల్లో 10 శాతం వాటా అడిగి మరీ వసూలు చేయడంపై కాంట్రాక్టర్లల్లో వ్యతిరేకత ఉంది. వసూలు చేసిన మొత్తం కూడా కీలక నేతకు చేరిన తర్వాత పంపకాలు జరపడం... అదీ నామమాత్రంగా ఉండటం పట్ల కూడా గుర్రుగా ఉన్నారు. మొత్తంగా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితం కూటమి పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనంగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మేయర్పై గుర్రు ప్రధానంగా మేయర్ పీఠం ఎక్కిన తర్వాత పీలా శ్రీనివాస్ వ్యవహరిస్తున్న తీరు పట్ల సొంత పార్టీ కార్పొరేటర్లలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కనీస గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న తీరుతో పాటు వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏవీ జరగకపోవడం.. కేవలం ఆయన చుట్టూనే వ్యవహారాలన్నీ నడిపేందుకు ప్రయత్నించడంతో కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. కౌన్సిల్, స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో చర్చ లేకుండా ఇష్టానుసారంగా ముందుకెళ్లారనే ఆగ్రహంతోనూ ఉన్నారు. మరోవైపు మేయర్కు, కూటమి పార్టీలోని ఎమ్మెల్యేల మధ్య సఖ్యత కూడా సరిగా ఉండడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. వారికి కనీస సమాచారం ఇవ్వకుండా వెళుతున్నారనే విమర్శలున్నాయి. మరోవైపు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీతో నేరుగా కయ్యానికి దిగడంతో వారి మధ్య మరింత దూరం పెరిగింది. మేయర్ ఎన్నిక వరకూ తమతో ఎంతో సఖ్యతగా ఉంటూ.. అన్న అన్న అని నక్కవినయం చూపించి తీరా గెలిచిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రధానంగా అందరిలోనూ వ్యతిరేకత నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
డాబాగార్డెన్స్: స్థాయీ సంఘం ఎన్నికలో కొణతాల నీలిమకు అత్యధికంగా 58 ఓట్లు రాగా, గంకల కవితకు 57, దాడి వెంకట రామేశ్వరరావుకు 57, మొల్లి హేమలతకు 57, సేనాపతి వసంతకు 54, గేదెల లావణ్యకు 53, మాదంశెట్టి చిన్నతల్లికి 52, రాపర్తి త్రివేణి వరప్రసాదరావుకు 52, మొల్లి ముత్యాలు 51, సాడి పద్మావతి(పద్మారెడ్డి)కి 50 ఓట్లు పోలయ్యాయి. వైఎస్సార్ సీపీకి లెక్కకు మించి.. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లకు లెక్కకు మించి ఓట్లు పోలయ్యాయి. వైఎస్సార్ సీపీకి 32 మంది కార్పొరేటర్ల బలమే ఉన్నప్పటికీ.. కూటమి పార్టీలకు చెందిన పలువురు కార్పొరేటర్లు ఓట్లు వేశారు. సాడి పద్మారెడ్డికి 50, నెక్కల లక్ష్మికి 39, పల్లా అప్పలకొండకు 38, మహ్మద్ ఇమ్రాన్కు 38, కోడిగుడ్ల పూర్ణిమకు 38, రెయ్యి వెంకటరమణకు 37, గుండాపు నాగేశ్వరరావుకు 35, ఉరుకూటి రామచంద్రరావుకు 35, కేవీఎన్ శశికళకు 34, బిపిన్ కుమార్ జైన్కు 33 ఓట్లు పోలయ్యాయి. -
స్థల వివాదంలో కొట్లాట.. ఐదుగురికి గాయాలు
కూర్మన్నపాలెం: స్థల వివాదం కొట్లాటకు దారి తీయడంతో ఐదుగురు గాయపడ్డారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు.. పెదగంట్యాడ మండలం అప్పికొండలో రౌడీషీటర్ గరికిన గంగరాజు, ఆయన సోదరి చోడిపల్లి బంగారమ్మల మధ్య చాలా రోజుల నుంచి భూవివాదం ఉంది. దీనిపై ఇరువర్గాల వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వివాదం నడుస్తుండగానే గంగరాజు సదరు స్థలాన్ని చదును చేసేందుకు పనులు ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న బంగారమ్మ.. భర్త వెంకటరావుతో కలిసి అక్కడికి వెళ్లి పనులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈలోగా గంగరాజు భార్య, కుమారుడు అక్కడకు చేరుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో గంగరాజు తలకు తీవ్ర గాయాలు కావడంతో కుట్లు పడ్డాయి. గంగరాజు సోదరి బంగారమ్మకు కూడా తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరితోపాటు గంగరాజు భార్య, కొడుకు కోటేశ్వరరావు, బావ వెంకటరావు కూడా గాయపడ్డారు. గంగరాజు కుటుంబసభ్యులు అగనంపూడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయన సోదరి, బావ కిమ్స్ ఐకాన్ ఆస్పపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. ఇరు వర్గాలపై కేసు నమోదుచేసి, నిందితులు గంగరాజుతోపాటు భార్య బంగారమ్మ, కొడుకు కోటేశ్వరరావు, కూతురు భానులను రిమాండ్కు తరలించినట్లు సీఐ కె.మల్లేశ్వరరావు తెలిపారు. -
సింహగిరి నుంచి దాసుడు తిరుగు పయనం
సింహాచలం: ఒడిశాకి చెందిన లక్ష్మీకాంత్నాయక్దాస్ బుధవారం సింహగిరిపై నుంచి తిరుగుపయనమయ్యారు. ఒడిశాలోని పట్టుపురానికి చెందిన దాసుల కుటుంబం తరతరాలుగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి విశేష సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత తరానికి చెందిన లక్ష్మీకాంత్నాయక్దాస్ ఈ ఏడాది మే నెలలో సింహగిరికి వచ్చారు. సింహగిరిపై ఉన్న దాసుల ఆశ్రమంలో సుమారు మూడు నెలలపాటు ఉండి స్వామికి విశేష సేవలందించారు. నిత్యకల్యాణం, గరుడసేవ, ఊంజల్సేవ, కోలా సేవ, లక్ష తులసి పూజ తదితర సేవలను జరిపించారు. తిరిగి బుధవారం మధ్యాహ్నం సింహగిరి నుంచి తిరుగు పయనమయ్యారు. ఈవో కార్యాలయం వద్ద దేవస్థానం అధికారులు ఆయన్ని సత్కరించారు. -
కూటమిపై వ్యతిరేకతకు స్థాయీ ఫలితాలే నిదర్శనం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నిక ఫలితాలే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. జీవీఎంసీ వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీ కార్పొరేటర్లు వైఎస్సార్సీపీకి ఓటు వేశారంటే.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతోందన్నారు. ఈ ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలు డబ్బు, క్యాంపు రాజకీయం చేశాయన్నారు. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన కార్పొరేటర్లకు తమ బలమైన 32 కంటే అధికంగా ఓట్లు వచ్చాయన్నారు. 50 ఓట్లతో ఒక సీటు గెలిచామన్నారు. కూటమి కార్పొరేటర్లు కూడా తమకు ఓటు వేయడం విశేషమన్నారు. కూటమి నేతలు భయభ్రాంతులకు గురి చేసినా ఎంతో ధైర్యంతో పోటీలో నిలిచిన వారికి అభినందనలు తెలిపారు. అయితే గెలిచిన స్థానాన్ని ప్రకటించడానికి కూడా ఇబ్బంది పెట్టారని వాపోయారు. తమ వెన్నంటే ఉండి సహాయ సహకారాలు అందించిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు, నియోజకవర్గ సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, వాసుపల్లి గణేష్కుమార్, మళ్ల విజయప్రసాద్, మజ్జి శ్రీనివాసరావు, తిప్పల దేవన్రెడ్డి, మలసాల భరత్, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జీవీఎంసీ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
సైన్స్ ఫెయిర్లో చక్కటి ప్రాజెక్టులు ఆవిష్కరించాలి
ఆరిలోవ: జిల్లాల్లో నిర్వహించనున్న సైన్స్ ఫెయిర్ కోసం ఇన్స్పైర్ మనక్–2025 పోస్టర్ను బుధవారం కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ డీఈవో ఎన్.ప్రేమకుమార్, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ జె.చంద్రశేఖర్, జిల్లా సైన్స్ ఆఫీసర్ పి.రాజారావు, రిసోర్స్ పెర్సన్లు చంద్రాజీ, జానకిరాంతో కలసి ఆవిష్కరించారు. ఆరు నుంచి 12వ తర గతి వరకు చదువుతున్న విద్యార్థులు ఇన్స్పైర్ మనక్ సైన్స్ఫెయిర్లో పాల్గొని మంచి ప్రాజెక్టులు తయారు చేసే విధంగా సిద్ధం చేయాలని విద్యా శాఖాధికారులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరగనున్న ఇన్స్పెయిర్ మనక్ సైన్స్ ఫెయిర్కు జిల్లా నుంచి అత్యధికంగా నామినేషన్లు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి సోమేశ్వరరావు, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది దేముడుబాబు, అప్పలనాయుడు పాల్గొన్నారు. -
సింహాచలం రైల్వే స్టేషన్లో ప్రీపెయిడ్ ఆటో ట్యాక్సీ స్టాండ్
గోపాలపట్నం: ప్రయాణికుల భద్రత కోసం ప్రీపెయిడ్ ఆటో ట్యాక్సీ స్టాండ్ను ప్రారంభిస్తున్నట్లు రైల్వే డీఆర్ఎం లలిత్ బోహ్రా, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సింహాచలం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రిపెయిడ్ ఆటో ట్యాక్సీ స్టాండ్ను బుధవారం ప్రారంభించి, మాట్లాడారు. ఇక్కడి రైల్వే స్టేషన్లో 22 రైళ్లు ఆగుతున్నాయని, వాటిలో దిగే ప్రయాణికులు నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లేటపుడు భద్రత పరంగా భయపడనక్కర్లేకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఆటో ధరలు ఉంటాయన్నారు. డీఆర్ఎం మాట్లాడుతూ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తయితే ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. ఇక్కడ ఈ స్టాండ్ ఏర్పాటుకు సహకరించిన దాతలకు గోపాలపట్నం సీఐ ఎన్వీ ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రయాణికులకు టోకెన్ అందించి ఆటోలో ఎక్కించి, జెండా ఊపి ఆటో ట్యాక్సీ సేవల్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మేరీ ప్రశాంతి, ఏడీసీపీ ప్రవీణ్కుమార్, ఏసీపీ ఏబీ పృథ్వీతేజ, ట్రాఫిక్ సీఐలు సురేష్కుమార్, దాశరథి, ఎస్ఐలు, తదితరులు పాల్గొన్నారు. -
మరింత మెరుగ్గా పౌరసరఫరాల సేవలు
మహారాణిపేట: పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో ఆయన వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రేషన్ సరుకులను 15 రోజుల పాటు పంపిణీ చేయాలన్నారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెలా 26–30 తేదీల మధ్య ఇళ్ల వద్దకే సరుకులను అందించాలని ఆదేశించారు. దీపం పథకంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించి, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ప్రజల నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 25న స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి శ్రీకారం చుడతామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో స్థానికంగా పండే ధాన్యాన్ని వినియోగించేందుకు ప్రణాళికలు పంపించాలని జేసీలను మంత్రి ఆదేశించారు. ఫ్లెక్సీలు, క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయాలి రేషన్ దుకాణాల వద్ద పూర్తి వివరాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని మంత్రి మనోహర్ ఆదేశించారు. డీలర్లు ఏజెన్సీల ద్వారా వచ్చే కమిషన్ మాత్రమే తీసుకోవాలని, ప్రజల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. అలాగే డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించాలన్నారు. వలసదారుల వివరాలను సేకరించి, వారికి అనుగుణంగా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని సూచించారు. సన్న బియ్యం వచ్చే వరకు పాఠశాలలు, ఎండీయూ వాహనాల వద్ద ఉన్న పాత బియ్యాన్ని ఉపయోగించరాదని స్పష్టం చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ వివిధ అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. జేసీ కె. మయూర్ అశోక్, జీసీసీ ఎండీ కల్పనా కుమారి, అనకాపల్లి జేసీ ఎం. జాహ్నవి, విజయనగరం జేసీ సేతుమాధవన్, శ్రీకాకుళం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, విశాఖ డీఎస్వో భాస్కరరావు, ఇతర జిల్లాల డీఎస్వోలు, డీఎంలు, లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు, బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ -
మొత్తం 241.92 ఎకరాలు
విశాఖలో టూరిజం ప్రాజెక్టుల పేరుతో కన్నేసిన మొత్తం భూమి 176.15 ఎకరాలుఅల్లూరి జిల్లాలో 43.10 ఎకరాలు అనకాపల్లి జిల్లాలో 22.67 ఎకరాలు 64 ప్రాజెక్టులు రూ.8806 కోట్లు..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ‘రిక్రియేషన్ టూరిజం’కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జీఐఎస్–2023లో సింగపూర్, టర్కీ, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి వచ్చిన సంస్థలతో రూ.8,806 కోట్ల విలువైన 64 పర్యాటక ప్రాజెక్టులకు ఎంవోయూలు కుదిరాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో 18,205 మందికి ప్రత్యక్షంగా, మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలిగేవి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంస్థలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చుట్టూ తిరిగినా ఎలాంటి స్పందనా రాలేదు. భూమి కేటాయిస్తే వెంటనే పనులు ప్రారంభిస్తామని కోరినా, భూ కేటాయింపులు ఇప్పట్లో ఉండవంటూ అధికారులు వారిని వెనక్కి పంపించారు. దీనివల్ల పర్యాటక ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. -
మరణించి.. ఇద్దరికి కంటి వెలుగై..
పెందుర్తి: ఓ పెద్దాయన మరణించి ఇద్దరికి కంటి చూపును అందించారు. వివరాలివి.. ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామానికి చెందిన గవర పోలిపిల్లి(65) గుండెపోటుతో మంగళవారం ఉదయం మరణించారు. కుమారులు ఇద్దరూ ఉద్యోగ రీత్యా దూరంగా ఉండడంతో పోలిపిల్లి మృతదేహాన్ని భద్రపరిచేందుకు ఫీజర్ బాక్స్ కోసం పెందుర్తికి చెందిన సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి దాడి శ్రీనివాస్ను మృతుని కుమారుడు సంప్రదించారు. ఈ క్రమంలో నేత్రదానం కోసం శ్రీనివాస్ ప్రతిపాదించగా కుమారులు అంగీకారం తెలిపారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ మొహిషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు మృతుడి నేత్రాలను సేకరించి ఐ బ్యాంక్కు తరలించారు. ఆరోగ్య సమస్యలు లేకపోతే మరణించిన ఏ వయసు వారి నేత్రాలైనా కనీసం ఇద్దరికి చూపును అందిస్తాయని ఈ సందర్భంగా సాయి ట్రస్ట్ ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు. -
అప్పన్న లడ్డూ నాణ్యత పెంపుపై ట్రయల్ రన్
● త్వరలో 400 గ్రాముల కల్యాణ లడ్డూ విక్రయాలు ● ఈవో వి.త్రినాథరావు వెల్లడి సింహాచలం: రాష్ట్రవ్యాప్తంగా లడ్డూ ప్రసాదం అందించే ప్రధాన దేవాలయాల్లో లడ్డూ నాణ్యత మరింతగా పెంపొందించేందుకు, ఒకే విధమైన నాణ్యత ఉండేలా అన్ని దేవాలయాల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తెలిపారు. సింహగిరిపై ప్రసాదాల తయారీశాలలో ఈవో స్వీయ పర్యవేక్షణలో లడ్డూ తయారీని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఈవో మాట్లాడుతూ రాష్ట్రంలో లడ్డూ ప్రసాదం అందించే ప్రధాన దేవాలయాల్లో విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఉన్న దిట్టాన్ని(ముడిసరకుల కొలత) ఇప్పటి వరకు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక దిట్టానికి పది కిలోల శెనగపిండి, 20 కిలోల పంచదార, 6 కిలోల నెయ్యి, 750 గ్రాముల జీడిపప్పు, కిస్మిస్ 500 గ్రాములు, యాలకులు 75 గ్రాములు,జాజికాయ,పచ్చకర్పూరం 15 గ్రాములు చొప్పున వినియోగిస్తున్నామన్నారు. ఒక దిట్టానికి 80 గ్రాముల లడ్డూలు 510 వస్తాయన్నారు. ఈ తరుణంలో నాణ్యతను మరింతగా పెంచేందుకు ఇంకా ఏమైనా అదనంగా ముడిసరుకులు అవసరమా.. అన్న విషయంపై దేవదాయశాఖ కమిషన్ ఆదేశాలతో ప్రతీ దేవాలయంలో ట్రయల్రన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సింహాచలంలో ప్రధానంగా మూడు దిట్టాలతో లడ్డూ లను తయారుచేసి పరిశీలించినట్లు పేర్కొన్నారు. తొలి దిట్టంతో లడ్డూ పాకం తీసేసరికి 9.330 కిలోల నెయ్యి అవసరమైందని, నాలుగైదు పాకాలు తయారయ్యాక నెయ్యి వినియోగం తగ్గుతూ ఉంటుందన్నారు. దీంతో ఒక దిట్టం లడ్డూల తయారీకి 6 కిలోల నెయ్యి సరిపోతుందా? లేక అదనంగా అవసరమవుతుందా? అన్న విషయంపై కమిషనర్కి నివేదిక పంపించనున్నట్లు తెలిపారు. ప్రధాన దేవాలయాల్లో రిపోర్టులన్నీ పరిశీలించిన తర్వాత కమిషనర్ ఒక నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. సింహాచలం దేవస్థానంలో ఇప్పటి వరకు 400 గ్రాముల కల్యాణ లడ్డూను కేవలం నిత్యకల్యాణంలో పాల్గొనే భక్తులకే అందిస్తున్నామని, త్వరలో భక్తుల సౌకర్యార్థం కౌంటర్లలో కూడా విక్రయాలు జరుపుతామన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఏఈవో వీబీవీ రమణమూర్తి, సూపరింటెండెంట్ పాలూరి నరసింగరావు పాల్గొన్నారు. -
నేడు స్టాండింగ్ కమిటీ ఎన్నిక
● 10 మందిని ఎన్నుకోనున్న కార్పొరేటర్లు ● బరిలో వైఎస్సార్ సీపీ, టీడీపీ డాబాగార్డెన్స్: మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. కౌన్సిల్ హాల్లో ఉదయం 10 గంటలకు మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో స్టాండింగ్ కమిటీలోని 10 స్థానాల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పది మంది, తెలుగుదేశం పార్టీ నుంచి పది మంది కార్పొరేటర్లు పోటీ పడుతున్నారు. ఇదిలావుండగా జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికలో సీపీఎం పాల్గొనడం లేదని సీపీఎం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు పేర్కొన్నారు. అలాగే 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కూడా ఓటింగ్లో పాల్గోవడం లేదని స్పష్టం చేశారు. ఓటింగ్ ప్రక్రియ ఇలా.. స్థాయీ సంఘం ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే జరుగుతాయి, కానీ ప్రాధాన్యత ఓట్లు ఉండవు. ఒక్కో కార్పొరేటర్కు 10 ఓట్లు ఉంటాయి. కార్పొరేటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటే మొత్తం 95 ఓట్లు పోలవుతాయి. ఒకే బ్యాలెట్ పేపర్పై వైఎస్సార్ సీపీ, టీడీపీకి చెందిన 20 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయి.కార్పొరేటర్లు తమకు నచ్చిన 10 మంది అభ్యర్థుల పేర్ల ముందు టిక్ చేసి ఓటు వేయాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థికి ఒక ఓటు చొప్పున గరిష్టంగా 10 మందికి 10 ఓట్లు వేయవచ్చు. ఎవరైనా 11 ఓట్లు వేస్తే ఆ ఓటు చెల్లనిదిగా పరిగణిస్తారు. ఒక అభ్యర్థికి 48 ఓట్లు వస్తే విజేతగా ప్రకటిస్తారు. పోటీలో ఉన్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నిక్కల లక్ష్మి (20వ వార్డు), సాడి పద్మారెడ్డి (24వ వార్డు),పల్లా అప్పలకొండ (28వ వార్డు),బిపిన్ కుమార్ జైన్ (31వ వార్డు), గుండపు నాగేశ్వరరావు (40వ వార్డు), కోడిగుడ్ల పూర్ణిమ (41వ వార్డు), రెయ్యి వెంకటరమణ (51వ వార్డు), కేవీఎన్ శశికళ (55వ వార్డు), మహ్మద్ ఇమ్రాన్ (66వ వార్డు), ఉరుకూటి రామచంద్రరావు (70వ వార్డు) టీడీపీ నుంచి.. మొల్లి హేమలత (5వ వార్డు), సేనాపతి వసంత (96వ వార్డు), రాపర్తి త్రివేణి వరప్రసాదరావు (92వ వార్డు),దాడి వెంకట రామేశ్వ రరావు (88వ వార్డు), రౌతు శ్రీనివాస్ (78వ వార్డు), మొల్లి ముత్యాలు (87వ వార్డు), మాదంశెట్టి చిన్నతల్లి (83వ వార్డు), కొణతాల నీలిమ (79వ వార్డు), గేదెల లావణ్య (17వ వార్డు), గంకల కవిత (47వ వార్డు) -
● జీఐఎస్–2023లో పదుల సంఖ్యలో పర్యాటక ఒప్పందాలు ● జిల్లా పరిధిలో అడ్వెంచర్, హోటల్స్, వాటర్స్పోర్ట్స్ సంస్థలతో ఎంవోయూలు ● స్థలాలు చూపిస్తే పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కించేందుకు సిద్ధం ● అయినా పట్టించుకోకుండా కొత్త సంస్థలు రావాలంటూ పిలుపు ● ఉమ్మడ
సాక్షి, విశాఖపట్నం : టూరిజం కేంద్రంగా విశాఖ.. గత ప్రభుత్వ హయాంలో కొత్త ప్రాజెక్టులతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అనేక ప్రయత్నాలు జరిగాయి. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా, విశాఖను ప్రపంచ పర్యాటక పటంలో నిలిపేందుకు భారీ ప్రాజెక్టులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా, జీఐఎస్–2023లో విదేశీ సంస్థలకు రాయితీలు ఇస్తూ, పీపీపీ (ప్రైవేట్–పబ్లిక్ పార్టనర్షిప్) విధానంలో రూ. 8,806 కోట్ల విలువైన పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. అయితే ప్రాజెక్టులు ప్రారంభమయ్యే సమయంలో ప్రభుత్వం మారడంతో, కూటమి ప్రభుత్వం ఈ పర్యాటక ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు. గతంలో కుదిరిన ఒప్పందాలపై కనీసం ఒక్కసారైనా సమీక్ష నిర్వహించలేదు. ఎంవోయూలు చేసుకున్న సంస్థలు భూమి కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని అడుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదు. దీనికి తోడు, కొత్తగా ప్రాజెక్టులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా టూరిజం అధికారులు ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రూ.కోట్లు విలువ చేసే స్థలాలపై కూటమి కన్ను గత ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పక్కన పెడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో వచ్చిన ప్రాజెక్టులను విస్మరించి, తమ అనుచరులకు పర్యాటక ప్రాజెక్టుల పేరుతో భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ కో వ్యూహరచన చేసింది. దీనిలో భాగంగానే ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని పర్యాటక భూముల్లో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తమ నియోజకవర్గాల పరిధిలోని విలువైన పర్యాటక భూములను అనుచరులకు కట్టబెట్టడానికి కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. దీనికి జిల్లా పర్యాటక శాఖ అధికారులు కూడా సహకరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించకుండా.. ఉన్న భూములను కూటమి నాయకులకు ధారాదత్తం చేయడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కూటమి నాయకుల ఆదేశాల ప్రకారం, వారే చెప్పిన వారికి భూ కేటాయింపులు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. -
కోస్తాంధ్ర తీర ప్రాంత రక్షణకు చర్యలు
ఆరిలోవ : రాష్ట్రంలో కోస్తాంధ్ర తీర ప్రాంత రక్షణకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పి.మల్లికార్జునరావు తెలిపారు. రెండు రోజులపాటు విశాఖ ఫారెస్ట్ సర్కిల్ సందర్శనలో భాగంగా మంగళవారం ఆయన ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు, కంబాలకొండ ఎకో టూరిజం పార్క్ను సందర్శించారు. అనంతరం జూ సమావేశ మందిరంలో అటవీశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. విశాఖ రీజియన్లో అడవుల సంరక్షణ, వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా తీర ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా కోస్తాంధ్ర 12 జిల్లాల్లో ఉన్న 974 కి.మీ తీర ప్రాంతంలో సుమారు 600 కి.మీల్లో పలచబడిన పచ్చదనాన్ని పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ తీర ప్రాంతమంతటా 2 లక్షల తాటి విత్తనాలు నాటనున్నామన్నారు. వాటితోపాటు ఖర్జూరం, ఈత తదితర మొక్కలు కూడా నాటించే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 344 కి.మీ తీర ప్రాంతం ఉందని, ఇక్కడి వాతావరణం ఆధారంగా ఎలాంటి మొక్కలు నాటా లో అధ్యయనం చేస్తున్నామన్నారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో అడవుల నుంచి వచ్చి రైతుల పంటలను నాశనం చేస్తున్న ఏనుగుల నుంచి రక్షించడానికి రెండు కుంకి ఏనుగులను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏటికొప్పాక బొమ్మల తయారీ కోసం వినియోగించే అంకుడు తదితర కలపను అటవీశాఖ నుంచి సరఫరా చేసే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో విశాఖ రీజియన్ సీఎఫ్ మైథీన్, జూ క్యూరేటర్ జి.మంగమ్మ, డీఎఫ్వోలు, సబ్ డీఎఫ్వోలు పాల్గొన్నారు. -
రికార్డుల్లో చంపేశారు..
తగరపువలస : భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీకి చెందిన మహిళా ఆదర్శ రైతు మామిడి సూరమ్మ ఏడాదిగా అన్నదాత సుఖీభవ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసింది. ప్రభుత్వం ఈనెల 2వ తేదీన ఈ పథకం ద్వారా రూ.5 వేలు చొప్పున నిధులను రైతులకు జమ చేయగా ఆమెకు మాత్రం రాలేదు. దీంతో ఆమె రైతు సేవా కేంద్రానికి వెళ్లి సిబ్బందిని అడిగింది. వారు తనిఖీ చేసి సూరమ్మ చనిపోవడం వల్ల రిజెక్ట్ చేసినట్లు తెలిపారు. తాను బతికి ఉండగానే చంపేస్తారా? అని ఆమె సిబ్బందిని నిలదీయగా పొరపాటున అలా జరిగిందని తిరిగి అప్లోడ్ చేసి పథకం డబ్బులు అందేలా చూస్తామని చెప్పి పంపించేశారు. సైన్స్ ఉపాధ్యాయులకు నేటి నుంచి శిక్షణ తరగతులు ఆరిలోవ: జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులకు బుధ,గురువారాల్లో ‘ఇన్స్పైర్ మనక్–2025’ శిక్షణ తరగతులు డివిజన్ల వారీగా నిర్వహించనున్నట్లు డీఈవో ఎన్.ప్రేమ్కుమార్ మంగళవారం పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు డీఈవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు జరగనున్నాయి. బుధవారం ఆనందపురం, పద్మనాభం, భీమిలి, చినగదిలి, సీతమ్మధార మండలాల పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులకు, గురువారం గాజువాక, పెదగంట్యాడ, గోపాలపట్నం, ములగాడ, మహారాణిపేట మండలాల సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహిస్తామన్నారు. -
అనైతిక రాజకీయాలకు కూటమి తెర ?
● స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ప్రలోభాలు ● 27 మంది ఫిరాయింపు కార్పొరేటర్లకు నిబంధనలకు విరుద్ధంగా ఓటు హక్కు ● ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న అధికారులు, కూటమి నేతలు ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సాక్షి, విశాఖపట్నం: జీవిఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక నేపథ్యంలో కూటమి నేతలు అనైతిక రాజకీయాలకు తెర లేపుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. మంగళవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీలో గెలిచిన 27 మంది కార్పొరేటర్లు నిబంధనలకు విరుద్ధంగా ఫిరాయింపునకు పాల్పడ్డారని, వారికి స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికే విరుద్ధంగా ఓటు హక్కు కల్పిస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాకుండా బుధవారం జరగనున్న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేయడమే కాకుండా ఓటుకు నోటు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ఓటమి భయంతో అనైతిక పద్ధతిలో విజయం సాధించేందుకు క్యాంపు రాజకీయాలకు, ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కూటమి నేతలు, అధికారులు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని, ఫిరాయింపుదారులకు ఓటు హక్కు తొలగించి స్టాండింగ్ కమిటీ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతో కార్పొరేటర్లను ఒక ప్రైవేట్ రిసార్ట్కు తరలించారన్నారు. -
ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
బీచ్రోడ్డు : రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఆటో కార్మికులకు ఆదాయం తగ్గుతూ ఆర్థికంగా ఇబ్బంది పడతారని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల నాయకులతో చర్చించి న్యాయం చేయాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేశా రు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికే ఆటో కార్మికులు జీవో నెంబర్ 21 వచ్చిన దగ్గర నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు వాహన మిత్ర పథకం ద్వా రా రూ.15 వేలు ఇవ్వాలని, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, పెట్రోల్ డీజిల్ ఆటో కార్మికులకు సబ్సిడీ ధరలకు ఇవ్వాలని, ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకువచ్చి ఓలా, ఉబర్, రాపిడో వారి నుంచి కాపాడాల డిమాండ్ చేశారు. వీటిపై ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 11వ తేదీన ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆటో స్టాండ్ల అధ్యక్షులు గణేష్, కోశాధికారి రాము, ఆలీ, రమణ, గాజువాక ఆటో కార్యదర్శి రమణ పాల్గొన్నారు. -
పారా అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటాలి
మహారాణిపేట : పోలీస్ బ్యారక్స్ గ్రౌండ్లో ఈనెల 9న ప్రారంభం కానున్న రాష్ట్ర స్థాయి 6వ జూనియర్, సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి జూనియర్, సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి వి.రామస్వామి, విశాఖపట్నం జిల్లా గౌరవ అధ్యక్షురాలు శీతల్ మదన్, గుంటూరు జిల్లా సెక్రటరీ వై.శ్రీనివాస్ గౌడ్, పారా స్పోర్ట్స్ సభ్యులు పాల్గొన్నారు. -
13న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు
మద్దిలపాలెం : ఏయూలో ఎంబీఏ, ఎంసీఏ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య డి.ఎ.నాయుడు పేర్కొన్నారు. ఎంబీఏ పుల్ టైమ్ కోర్సులకు ఏడాదికి రూ.1.5 లక్షలు, ఎంసీఏ కోర్సుకు రూ.1.25 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఐసెట్–2025లో ర్యాంకులకు అనుగుణంగా ప్రవేశాలను కల్పించనున్నామన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 11వ తేదీలోగా దరఖాస్తులను అందజేయాలని సూచించారు. కౌన్సెలింగ్ ఈనెల 13వ తేదీన జరుగుతుందని ప్రకటించారు. -
12 గంటల్లో 10 రోబోటిక్ శస్త్ర చికిత్సలు
ఆరిలోవ: హెల్త్సిటీ కేర్ ఆస్పత్రిలో 12 గంటల్లో 10 రోబోటిక్ టోటల్ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా జరిపినట్లు మోకాలి మార్పిడి సర్జన్ డాక్టర్ రవిచంద్ర తెలిపారు. ఇది ఒక కీలక ఘట్టమన్నారు. అత్యాధునిక వెలిస్ రోబోటిక్ సిస్టమ్ సహాయంతో ఆర్థోపెడిక్ వైద్య బృందం తన ఆధ్వర్యంలో ఈ శస్త్ర చికిత్సలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఒకే రోజు, ఒకే సర్జన్ ద్వారా ఇన్ని శస్త్ర చికిత్సలు జరపడం రాష్ట్రంలోనే ఇది తొలిసారిని తెలిపారు. డాక్టర్ రఘు యలపర్తి, డాక్టర్ రాజనాయుడు, డాక్టర్ అజయ్ శస్త్ర చికిత్స ప్రక్రియకు దోహదపడ్డారన్నారు. కేర్లో వైద్య బృందం నైపుణ్యం వల్ల ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ వైద్య బృందాన్ని కేర్ సీవోవో మయూఖ్ చౌదరి అభినందించారు. -
ఈతకు వెళ్లిన వ్యక్తి మృతి
కూర్మన్నపాలెం: సరదాగా ఈతకు వెళ్లిన అనకాపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కర్రి నాగేశ్వరరావు (29) అనే యువకుడు మృతి చెందాడు. మంగళవారం ఉదయం అతని మృతదేహం తిక్కవానిపాలెం సముద్రతీరంలో లభ్యమైంది. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగేశ్వరరావు ఈ నెల 3న ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిక్కవానిపాలెం బీచ్లో ఈత కోసం సముద్రంలో దిగాడు. అయితే ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. ఆ రోజు రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం తిక్కవానిపాలెం బీచ్లో మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అది నాగేశ్వరరావుగా గుర్తించారు. మృతుడి సోదరుడు నూక అప్పారావు ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగేశ్వరరావు మైలాన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య సంధ్య, తల్లి నూకరత్నం ఉన్నారు. ఐదేళ్ల క్రితం అతనికి వివాహమైందని బంధువులు తెలిపారు. -
మూర్తియాదవ్ బ్లాక్ మెయిలర్
● జనసేన కార్పొరేటర్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ● ఎండాడలో 5.10 ఎకరాల భూమికి తనకు సంబంధం లేదు ● ఆరోపణలపై విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.. ● వీఎంఆర్డీఏ మాజీ చైర్మన్ చంద్రమౌళి సాక్షి, విశాఖపట్నం : జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఒక బ్లాక్ మెయిలర్ అని వీఎంఆర్డీఏ మాజీ చైర్మన్ సనపల చంద్రమౌళి మండిపడ్డారు. ఎండాడలో సర్వే నెంబర్ 14/1లో 5.10 ఎకరాల భూమిని పోర్జరీ పత్రాలతో తాను కాజేశానంటూ ఆరోపణలు పచ్చి అబద్ధమని, ఆ భూమికి తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని.. లేదంటే మూర్తియాదవ్పై పరువు నష్టం దావా వేయడానికి కూడా వెనుకాడనని హెచ్చరించారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. మంగళవారం మద్దిలపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సైనిక ఉద్యోగి వై.బాలిరెడ్డికి జీవో నెంబర్ 743/1963 ప్రకారం ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ పథకం ద్వారా 1971లో డి.ఆర్. నెంబర్ 5/1381 ద్వారా అసైన్డ్ డీ పట్టా (మాజీ సైనిక ఉద్యోగి కోటా) ఇచ్చారన్నారు. తదుపరి ప్రభుత్వం జీవో నెంబర్ 1117/1993 ద్వారా అసైన్డ్మెంట్ చేసిన పదేళ్ల తర్వాత ఎటువంటి ఎన్వోసీ లేకుండా సేల్ చేయవచ్చని స్పష్టం చేసిందన్నారు. ఆ భూమికి 2022 మే 4వ తేదీన సీసీఎల్ఏ 350/ 2022 ప్రకారం ఎక్స్ సర్వీస్మెన్ సేల్స్ పర్మిషన్లో కొన్ని గైడ్లైన్స్ ప్రకారం కలెక్టర్ ఎన్వోసీ ఇచ్చారన్నారు. దానిలో భాగంగా ఎక్స్ సర్వీస్మెన్ అయిన వై.బాలిరెడ్డి భార్య ఆనందమ్మ, ఆయన కుమారుడు జోజిరెడ్డి వీలునామా ద్వారా సంక్రమించిన ఆస్తికి కలెక్టర్ ఎన్వోసీ కోరడం జరిగిందన్నారు. సంబంధిత రెవెన్యూ డాక్యుమెంట్లను పరిశీలించి విచారణ చేపట్టి ఆనందమ్మకు డీ–పట్టా అలాట్ చేయవచ్చా? లేదా అనేది క్లారిఫికేషన్ వచ్చిన తరువాత ఓపినియన్ కోసం గవర్నమెంట్ ప్లేడర్కి పంపించడం జరిగిందన్నారు. ఎన్వోసీ వచ్చిన తర్వాత వీలునామా ప్రకారం 376 సెంట్లు జోజిరెడ్డి డెవలప్మెంట్ చేసుకోవడానికి హైదరాబాద్కు చెందిన వారికి ఇవ్వడం జరిగిందన్నారు. ఆ భూమికి తనకు ఎటువంటి సంబంధం లేదని.. కాదని ఆధారాలు చూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఎప్పుడూ ఎవరొకరిపై తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ బ్లాక్మెయిల్ చేసే మూర్తియాదవ్ లాంటి వ్యక్తులు రాజకీయాలు పనికిరారన్నారు. -
జగదాంబ రాంబాబు కన్నుమూత
డాబాగార్డెన్స్: జగదాంబ థియేటర్ అధినేత వేగి రాంబాబు మంగళవారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా జగదాంబ థియేటర్కు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఇటీవల ఉత్తమ సింగిల్ స్క్రీన్ ఆఫ్ ఇండియా – 2025 అవార్డు కూడా జగదాంబ థియేటర్ గెలుచుకుంది. జగదాంబ థియేటర్ విశేషాలు 1970లో చైన్నెకి చెందిన ప్రసిద్ధ నిర్మాణ నిపుణుడు కేఎన్ శ్రీనివాసన్ పర్యవేక్షణలో 4,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. 70 ఎంఎం ప్రదర్శన వ్యవస్థను కనిపెట్టిన ఏవో టాడ్ సూచనల మేరకు ఈ థియేటర్ను నిర్మించారు. ఇందులోని వలయాకారపు ర్యాంప్ అప్పట్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. 1200 సీటింగ్ సామర్థ్యంతో ఉన్న ఈ థియేటర్ను 1970 అక్టోబర్ 25న అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జేవీ నర్సింగరావు ప్రారంభించారు. తొలి చిత్రంగా ‘వేర్ ఈగిల్స్ డేర్’ అనే ఆంగ్ల సినిమా ప్రదర్శించారు. జగదాంబ థియేటర్ ప్రాంగణంలోనే శారదా, రమాదేవి థియేటర్లను నిర్మించారు. ఇది విశాఖలోనే తొలి మల్టీప్లెక్స్గా గుర్తింపు పొందింది. వైజాగ్లో ల్యాండ్ మార్క్స్ అంటే బీచ్, కై లాసగిరితో పాటు జగదాంబ సెంటర్కూగా గుర్తుకువస్తుంది. -
పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి
బీచ్రోడ్డు: పెట్టుబడిదారులు వ్యక్తిగత శ్రద్ధతోపాటు, సెబీలో నమోదైన మధ్యవర్తుల ద్వారా మాత్రమే వ్యాపారం చేయాలని సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.రామ్మోహన్రావు సూచించారు. సిరిపురంలోని చిల్డ్రన్స్ ఎరీనాలో మెగా రిసా పేరిట పెట్టుబడిదారుల అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. స్మార్ట్ పెట్టుబడి–సురక్షితమైన భవిష్యత్తు వైపు అనే అంశంతో సాగిన సదస్సును కలెక్టర్ హరేందిరప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత, పెట్టుబడిదారుల రక్షణ పట్ల సెబీ నిబద్ధతను వివరించారు. స్కామర్లు, మోసగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. సెబీ చీఫ్ జనరల్ మేనేజర్ దీప్తి అగర్వాల్, డీసీపీ కృష్ణకాంత్ పటేల్ పాల్గొన్నారు. డ్వాక్రా ఆర్పీలే పెట్టుబడిదారులు! సదస్సులో 800 మందికి పైగా పెట్టుబడిదారులు పాల్గొన్నారని, అందులో 70 శాతం మహిళలే అని గొప్పలు చెప్పారు. నిజానికి వారిలో అత్యధికులు పెట్టుబడిదారులు కాదు. డ్వాక్రా ఆర్పీలను మహిళా పెట్టుబడిదారులుగ సదస్సులో కూర్చొబెట్టారు. పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు లేకపోవటంతో జీవీఎంసీ అధికారులు ఆర్పీలను సదస్సుకు తరలించారు. విషయం బయటకు తెలియటంతో సదస్సులోని ఆర్పీలు చాలా మంది బయటకు పరుగులు తీశారు. సెబీ ఈడీ రామ్మోహన్రావు -
స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తక్షణమే ఆపాలి
● సర్దుబాటు, ట్రూఅప్, ఇంధనపు చార్జీలను ఉపసంహరించుకోవాలి ● ఏపీఈపీడీసీఎల్ ఎదుట ప్రజా సంఘాల ధ ర్నాతాటిచెట్లపాలెం: విద్యుత్ గృహ వినియోగదారులకు నష్టదాయకమైన విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే నిలిపివేయాలని, ప్రజలపై మోపిన ట్రూ–అప్ చార్జీలు, ఇంధనపు చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని విశాఖ కార్మిక, మహిళా, యువజన, విద్యార్థి ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మంగళవారం సీతమ్మధారలోని ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం ముందు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ, ఐద్వా, ఎన్ఐఎఫ్డబ్ల్యూ, పీఓడబ్ల్యూ, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, కేవీపీఎస్ వంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బి.పద్మ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎస్ అచ్యుతరావుల అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు కె. లోకనాథం మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ కంపెనీలను అదానీ వంటి బహుళజాతి సంస్థలకు కట్టబెడుతుంటే, రాష్ట్రంలో కూటమి నేతలు దానికి సహకరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల సంపదను లూటీ చేయడమే కాకుండా, వారిపై విద్యుత్ భారాలు మోపడం సరికాదని హెచ్చరించారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు భారీగా విద్యుత్ చార్జీలు పెంచినప్పుడు ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టారని, చలో హైదరాబాద్ నిర్వహించినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ముగ్గురిని పొట్టన పెట్టుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు మరో విద్యుత్ పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రెహమాన్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేవీఎస్వీ కుమార్, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు ఎం. వేంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే బద్దలు కొట్టాలని చెప్పారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దొంగచాటుగా మీటర్లు ఎందుకు బిగిస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం. జగ్గునాయుడు, పీఓడబ్ల్యూ లక్ష్మీ, ఏఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి దేవ, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యు.ఎస్.ఎన్. రాజు, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి వై. సత్యవతి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా నాయకురాలు వనజాక్షి, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వై. రాజు, ఏఐవైఎఫ్ నాయకుడు అచ్యుతరావు, 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి. గంగారావు, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
55 ఏళ్ల తర్వాత అదే జోష్
ఆనందాన్ని పంచిన పూర్వ విద్యార్థుల కలయిక డాబాగార్డెన్స్: హిందుస్థాన్ షిప్యార్డ్ గాంధీగ్రామ్ హైస్కూల్ 1970–71 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయికను సోమవారం ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది విద్యార్థులు కలుసుకున్నారు. 55 ఏళ్ల తర్వాత దేశ విదేశాల్లో ఉన్న పాత మిత్రులంతా ఒకచోట చేరి చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవీ రాజశేఖర్ , మళ్ల అన్నపూర్ణ, కర్రి పద్మారావు, పీబీకే ఆనంద్, చైతన్య దళాయి, కె.వేంకటేశ్వరరావు, నండూరి వేంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
రైతు భరోసా కేంద్రాలపై కూటమి కక్ష
● యూరియా సైతం పంపిణీ చేయలేని వైనం ● కూటమి ప్రభుత్వ హయాంలో 250 మంది అన్నదాతల ఆత్మహత్య ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రంమహారాణిపేట: రైతును రాజుగా చూడాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో జగన్మోహన్రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి భరోసాగా నిలిచారని, విత్తనం వేసిన దగ్గర నుంచి పంటకు మద్దతు ధర వచ్చేవరకు రైతన్నలకు జగన్ సర్కారు ధైర్యమిచ్చేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. రైతులకు యూరియా కొరత, ఇతర సమస్యలపై పార్టీ నాయకులు కలెక్టర్ హరేందిర ప్రసాద్కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కే.కే.రాజు మాట్లాడుతూ గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా సరఫరా డిమాండ్కు తగ్గట్లుగా లేదని, చంద్రబాబు నాయుడు రైతులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని అన్నారు. నిన్న జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైతులకు భరోసా ఉండదని చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శాసన మండలి సభ్యురాలు వరుదు కల్యాణి మాట్లాడుతూ, జగన్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదని, ఇప్పుడు అది లేకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు కేవలం రూ.5 వేలు మాత్రమే జమ చేసిందని, వారి సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోని రైతు భరోసా అమలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు మళ్ల విజయ ప్రసాద్, మొల్లి అప్పారావు, జిల్లా పరిషత్ వైస్చైర్మన్ సుంకరి గిరిబాబు , డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ , పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవి రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు పేర్ల విజయ చందర్, జహీర్ అహ్మద్, గొలగాని శ్రీనివాస్, అల్లంపల్లి రాజబాబు, రాంబాబు, బంకు సత్యం, మువ్వల సురేష్, అంబటి నాగ శైలేష్, పేడాడ రమణికుమారి, సనపల రవీంద్ర భరత్, బోని శివ రామకృష్ణ, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, కర్రి రామిరెడ్డి, వంకాయల మారుతీప్రసాద్, నీలి రవి, శశికళ , బిపిన్ కుమార్ జైన్, పల్లా దుర్గారావు, డాక్టర్ మంచా నాగ మల్లేశ్వరి, మక్సూద్ అహ్మద్ , ఇ.సత్యనారాయణ, కంచుమూర్తి పద్మ శేఖర్, శ్రీదేవి వర్మ , బోరవిజయ లక్ష్మి , రామకృష్ణారెడ్డి, అప్పన్న , శిరీష్ , మజ్జి జ్యోతి, మధుసూదన్ రెడ్డి, రామభక్త నాయుడు, సత్యవతి, పార్వతి పాల్గొన్నారు. -
భూకంపం!
కూటమి నేతల్లోసొంత పార్టీ నేతలే విమర్శనాస్త్రాలు ఎండాడ భూమిపై ఇప్పటికే విచారణ కోరిన గంటా రెవెన్యూ మంత్రికి లేఖ రాసిన స్పీకరు అయ్యన్నపాత్రుడు అదే పనిగా ప్రశ్నలు సంధిస్తున్న జనసేన కార్పొరేటర్ కనీసం స్పందించని ప్రభుత్వం చినబాబు హస్తం ఉండటమే కారణమని గుసగుసలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కూటమి పార్టీల మధ్య మాటల ‘భూ’కంపం మొదలైంది. ఎండాడలోని 5 ఎకరాల విషయంలో విచారణ జరగాల్సిందేనని మొన్నటికి మొన్న గంటా శ్రీనివాసరావు లేఖ రాయగా.. తాజాగా ఏకంగా స్పీకరు అయ్యన్నపాత్రుడు లేఖాస్త్రం సంధించారు. మరోవైపు అన్ని వ్యవహారాల్లోనూ తానుండాల్సిందేనని రీతిలో తలదూర్చే జనసేన కార్పొరేటర్ కూడా ఈ వ్యవహారంలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఎండాడలోని 5.10 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగించేలా కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వెనువెంటనే ఆ భూమి అభివృద్ధి పేరిట రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాయి. మరోవైపు సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదురవుతున్నప్పటికీ ఈ వ్యవహారంపై ఇప్పటివరకు అధికారికంగా ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం. ఈ భూ వ్యవహారంలో ‘దక్షిణ’ నేతతో పాటు చినబాబు పాత్ర ఉండటంతో విచారణ జరగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నేతలే..! సాధారణంగా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడం సహజం. ఎండాడ భూమి విషయంలో మాత్రం విచిత్రంగా కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన నేత వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు సంధిస్తున్నారు. నిజంగా ఈ వ్యవహారంలో వైఎస్సార్ సీపీ నేతలు ఉంటే విచారణ జరిపేందుకు ఎందుకు ముందుకు వెళ్లడం లేదన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే పాత్ర ఉందంటూ కేవలం విమర్శలు రావడంతోనే నేరుగా కలెక్టరుకు గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు. ఈ లేఖ రాసి సుమారు నెల రోజులు కావస్తోంది. మరోవైపు ఇందులో తన పాత్ర లేదని, విచారణ జరపాలంటూ స్పీకరు అయ్యన్నపాత్రుడు తాజాగా నేరుగా రెవెన్యూ మంత్రికే లేఖ సంధించారు. దీనిపై ప్రభుత్వం నుంచి కనీస స్పందన రావడం లేదు. విచిత్రంగా ఇందులో ప్రతిపక్ష పార్టీ పాత్ర ఉందంటూ పసలేని ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తం వ్యవహారాన్ని నడిపింది తమ వారేనని.. ప్రధాన పాత్ర అంతా చిన్నబాబుదేనని తెలిసినప్పటికీ వైఎస్సార్ సీపీ మీద ఎక్కుపెట్టి.. పరోక్షంగా చిన్నబాబునే లక్ష్యంగా చేసుకున్నారనే వాదన కూడా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుతుంది. అయితే, ఈ విషయంలో నిజంగా విచారణ జరిపితే.. రికార్డుల ట్యాంపరింగ్తో పాటు వ్యవహారం నడిపి నగదు, ఎకరన్నర పొలాన్ని కొట్టేసిన దక్షిణ నియోజకవర్గ నేతతో పాటు చిన్నబాబు పాత్ర కూడా బయటకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ భూ దందా నేపథ్యం..! ఎండాడలోని సర్వే నెంబరు 14–1లోని 5.10 ఎకరాల భూమికి చెందిన రికార్డుల్లో రెవెన్యూ అధికారులనూ తికమకపెట్టే వ్యవహారాలు తెరవెనుక నడిచాయి. రికార్డుల్లో ఒక పేరు.. ఆదేశాల్లో మరో పేరు.. అంతిమంగా ప్రభుత్వ భూమిని కాస్తా ప్రైవేటుపరం చేస్తూ నిర్ణయాలు వెలువడ్డాయి. 14–1 సర్వే నెంబరులోని భూమి చెట్టిపల్లి సీతారామయ్య పేరు మీద నమోదై ఉంది. అయితే, విచిత్రంగా తాజాగా కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వుల్లో మాత్రం ఈ భూమి మాజీ సైనిక అధికారికి చెందినదని.. చెట్టిపల్లి సీతారామయ్య పేరు కేవలం ఫారం–3లో మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఇందుకు భిన్నంగా అసలు వ్యక్తి సాగులోనే లేరంటూ వై.బాలిరెడ్డికి చెందినదంటూ ఆయన పేరు మీద బదలాయించాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ భూమికి సంబంధించిన ఫైలు గత కొద్దికాలంగా కలెక్టరేట్లో చక్కర్లు కొట్టినట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా కింది స్థాయి నుంచి రికార్డులను సృష్టించారనే విమర్శలున్నాయి. అడంగల్తో పాటు గతంలో స్వయంగా కలెక్టర్ సంతకంతో ఎండాడలోని సర్వే నెంబరు 14–1కు చెందిన 5.10 ఎకరాల భూమి పట్టాదారు చెట్టిపల్లి సీతారామయ్య పేరు మీద ఉందని.. ఇది ప్రభుత్వ భూమి కావడంతో రిజిస్ట్రేషన్ చేయవద్దని పేర్కొంటూ జిల్లా రిజిస్ట్రార్కు పంపారు. ఇక అడంగల్ కూడా ఈయన పేరు మీదనే ఉంది. అయినప్పటికీ సీతారామయ్య పేరు కేవలం ఫారం–3లో మాత్రమే ఉందని, దీనిని తొలగించాలని కూడా కలెక్టర్ తాజాగా జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పై నుంచి ఆదేశాలు వచ్చేందుకు కీలకంగా వ్యవహరించిన విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన నేత ‘సీతయ్య’ లెవెల్లో చక్రం తిప్పినట్టు సమాచారం. ఇందుకోసం ఆయన భారీగా నగదుతో పాటు ఎకరన్నర పొలం కూడా లబ్ధిపొందినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంకా ఏమైనా ఫైల్స్ ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వ్యవహారం నడిపిద్దామంటూ డీల్స్కు దిగుతున్నట్టు కూడా సమాచారం. -
రక్షకులు కాదు.. గో భక్షకులు
హైవేపై రవాణా చేసేవారే టార్గెట్.. అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో వాహనాల్లో పశువుల రవాణా నిర్భయంగా సాగుతోంది. ఈ రవాణాదారులనే లక్ష్యంగా చేసుకొని ట్రస్టు ముసుగులో పశువులను రక్షిస్తామని స్వాధీనం చేసుకుంటున్నారు. అదే తప్పు దర్జాగా వీరు కూడా చేస్తున్నారు. ఒక్కో వాహనంలో 20 నుంచి 40 వరకు పశువులను తాళ్లతో బంధించి అతి క్రూరంగా వాహనాల్లో తరలిస్తున్నట్లు సమాచారం. రాత్రి వేల పెద్ద ఎత్తున అక్రమంగా పశువుల రవాణా జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గో సంరక్షకులుగా బిల్డప్ ఇస్తారు.. అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుంటారు. పోలీసులకు అప్పగించి ఆ ఆవులను అధికారికంగానే చారిటబుల్ ట్రస్ట్ గోశాలకు తరలిస్తారు. ట్రస్ట్ ముసుగులో పశువులను ఇక్కడ నుంచి వ్యాన్లలో హైదరాబాద్కు తరలించి పశువధ చేసే వ్యాపారులకు విక్రయిస్తారు. కొందరు టీడీపీ నాయకులు ట్రస్టుగా ఏర్పడి చేస్తున్న దారుణమిది. దీనిపై ఎస్.రాయవరానికి చెందిన సోమిరెడ్డి వెంకట అప్పలసత్యసన్యాసి నూకరాజు లోకాయుక్తకు, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాలకు ఫిర్యాదు చేశారు. సాక్షి, అనకాపల్లి: దొంగలకు దొంగ.. ఘరానా దొంగ.. ఇలా ఎన్ని పేర్లతోనైనా వీరిని పిలుచుకోవచ్చు. రక్షణ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు అధికారుల కళ్లుగప్పి అక్రమార్జనకు తెరలేపారు. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు గ్రామంలో వీరు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఏపీ యానిమల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా అక్రమ మార్గంలో రికగ్నిషన్ సర్టిఫికెట్ పొంది గోశాలను నడుపుతున్నారు. జాతీయ రహదారిలో గోవులను అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని వాటిని పోలీసులు అప్పగించి ఆ ఆవులను చారిటబుల్ ట్రస్ట్కు తరలించుకుంటారు. అంతేకాకుండా ఏజెన్సీలోని పాడేరు, అరకు ప్రాంతాల్లో తక్కువ ధరకే గోవులను కొనుగోలు చేసుకుని ఇక్కడకు తీసుకొస్తారు. రక్షణ చారిటబుల్ ట్రస్ట్ ముసుగులో హైదరాబాద్లో పశువధ చేసే వ్యాపారుల ‘కొట్టాయి’కి వ్యాన్లలో ఆవులను తరలిస్తున్నారు. ఎస్.రాయవరం మండలంలో పెనుగొల్లు, సోముదేవుపల్లి, గోకులపాడు, ధర్మవరం అగ్రహారం తదితర గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి టీడీపీకి చెందిన నాయకుల అండదండలతో పెనుగొల్లు గ్రామంలో డోర్ నెం.2–8/2 అడ్రస్తో ‘రక్షణ చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటు చేశారు. పశు రవాణా నిబంధనలేంటి.. పాడి పశువులు, ఆవులు, దూడలు, ఎద్దులను వధించడంపై మన దేశంలో నిషేధం విధించినప్పటికీ యథేచ్ఛగా వధశాలలకు పశువులను తరలించడం నిత్యకృత్యంగా మారింది. వీటి తరలింపునకు ప్రత్యేక నిబంధనలున్నాయి. మూగజీవాలను రవాణా చేసే వాహనాలకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ పత్రాలతోపాటు జీవాలను తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు కలిగి ఉండాలి. పశువుల రవాణా సమయంలో మూగజీవాలకు సరిపడా గాలి, మేత, నీరు అందుబాటులో ఉండేటట్టు ఏర్పాట్లు చేయాలి. పెద్ద వాహనాల్లో పశువులను తరలించేటప్పుడు ఒక పశువు కోసం రెండు స్క్వేర్ మీటర్ల వంతున విడివిడిగా అరలను తయారుచేసి అందులో పశువులను తరలించవలసి ఉంటుంది. గూడ్స్ వాహనాల్లో పశువులను తరలించినా, పరిమితికి మంచి మూగజీవాలను తరలించినా భారీ జరిమానాతో పాటు తరలించే వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. రక్షణ చారిటబుల్ ట్రస్ట్ పేరిట పశువుల అక్రమ రవాణా ఇక్కడ నుంచి వ్యాన్లలో హైదరాబాద్ ‘కొట్టాయి’కి తరలింపు విజయవాడలో ఉన్న యానిమల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా గుర్తింపు పత్రం ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు గ్రామంలో చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు వారాంతపు సంతలను ఆదాయ వనరులుగా మార్చుకుంటున్న అక్రమార్కులు ఈ ఏడాది 10 వాహనాల్లో తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన వైనంక్రిమినల్ కేసులు నమోదు చేయాలి పవిత్రంగా భావించే గోవులను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్వచ్ఛంద సంస్థ ముసుగులో వివిధ స్టేషన్లలో పోలీసులు పట్టుకున్న ఆవులు, ఏజెన్సీ ప్రాతం నుంచి వచ్చిన ఆవులు, పశువులు, తమ సంస్థ షెడ్కు పెద్ద సైజు వ్యానుల్లో తరలిస్తుంటారు. అక్కడ నుండి చిన్న సైజు వాహనాల్లో అనకాపల్లి బోర్డర్ తుని వరకు ట్రస్టు పేరుతో పంపిస్తారు. అక్కడ నుంచి వేరే వ్యక్తులు హైదరాబాద్కు తరలిస్తుంటారు. కొన్ని ఆవులు తిండి లేక, అనారోగ్యంతో, తరలింపు సమయంలో గాయాల పాలై మృతి చెందుతున్నాయి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటీవలే పోలీసులు 10 మందికి పైగా పశువుల అక్రమ రవాణా చేసే వారిని పట్టుకుని వారిపై కేసులు నమోదు చేశారు. ఆ ఆవులను ఈ సంస్థకే తరలించారు. – సోమిరెడ్డి వెంకట అప్పలసత్యసన్యాసి నూకరాజు, ఎస్.రాయవరం -
ఇది ఆరంభం మాత్రమే..
మర్రిపాలెం : అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో నో ఫోన్ నో వర్క్ విధానాన్ని పాటిస్తామని.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. ప్రభుత్వం తీరు మారకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు హెచ్చరించారు. ఆర్అండ్బీ జంక్షన్ సమీపంలోని ఐసీడీఎస్ కార్యాలయం ముందు సోమవారం సెల్ఫోన్లు రోడ్డుపై ఉంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారుల సౌకర్యార్థం ఆఫ్లైన్లో మాత్రమే సేవలు అందిస్తామన్నారు. పోషణ ట్రాకర్, బాల సంజీవని యాప్లతో పనిభారం పెరగడంతో పాటు అదనంగా ఆరోగ్య శాఖకు చెందిన ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం ద్వారా ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు చేయాల్సిన గర్భిణులు, బాలింతల నమోదు ప్రక్రియ సైతం తమకే అప్పగించడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆన్లైన్ విధానంతో సర్వర్ పనిచేయకపోవడం ఒక ఎత్తయితే మరో పక్క సెల్ఫోన్లు మొరాయించడంతో లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రాల చుట్టూ తిరుగుతూ తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వాపోయారు. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోజుల వ్యవధిలో పనిభారం తగ్గించి వేతనాలు పెంచుతామని హామీలు ఇచ్చి, ఇప్పుడు అంగన్వాడీలను పూర్తిగా పక్కకు పెట్టేశారన్నారు. అనంతరం అర్బన్ సీడీపీవో నీలిమకు తమ సెల్ ఫోన్లు అప్పగించే ప్రయత్నం చేయగా.. ఫోన్లు ఇలా ఇవ్వడం వల్ల డేటా పోయే ప్రమాదముందని ఆమె సర్దిచెప్పారు. దీంతో ఆమెకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ గౌరవ అధ్యక్షురాలు మణి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ నాయకులు ఎం.వెంకటలక్ష్మి, శ్యామలాదేవి, కృపారాణి, నూకరత్నం, అన్నపూర్ణ పాల్గొన్నారు. ఆన్లైన్ సేవలు బహిష్కరించిన అంగన్వాడీలు సెల్ ఫోన్లతో ఐసీడీఎస్ కార్యాలయం ముందు రోడ్డుపై నిరసన -
ఆ జీవో విద్యార్థుల గొంతు నొక్కేందుకే..!
● విద్యాశాఖ ఉత్తర్వులు వెనక్కితీసుకోవాలి ● ఉత్తర్వుల కాపీని దహనం చేసిన ఎస్ఎఫ్ఐబీచ్రోడ్డు: పాఠశాలల్లో విద్యార్థుల స్వేచ్ఛను, ప్రజాస్వామిక హక్కులను హరించే విధంగా ఉన్న విద్యాశాఖ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉత్తర్వుల ప్రతులను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎల్.జె. నాయుడు మాట్లాడుతూ పాఠశాల విద్యా కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులు విద్యార్థులు తమ సమస్యలను బయటకు తెలియజేసే అవకాశాన్ని లేకుండా చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ఉత్తర్వులు ప్రజాస్వామ్య విరుద్ధమని, విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నమేనని ఆయన అన్నారు. ఈ ఉత్తర్వుల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లే విద్యార్థి సంఘాలకు అనుమతి లభించదని, దీనివల్ల విద్యార్థుల సమస్యలు బయటకు రాకుండా పోతాయన్నారు. మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు జరిపేవారని, ఇప్పుడు అటువంటి అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. ఒకవైపు రాజకీయాలకు తావివ్వొద్దని చెబుతూ, మరోవైపు పీటీఎం (పేరెంట్స్–టీచర్స్ మీటింగ్) పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఉత్తర్వులు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని, అరాచకాలను అడ్డుకునే అవకాశాన్ని లేకుండా చేస్తాయని ఎస్ఎఫ్ఐ నాయకులు అభిప్రాయపడ్డారు. దీంతో ప్రైవేటు పాఠశాలల దోపిడీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ అప్రజాస్వామిక ఉత్తర్వులను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐ హెచ్చరించింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జి. అజయ్, ఉపాధ్యక్షుడు ఎం. కౌశిక్, ఎం. నరేష్, టి.మౌనిక, ఎం. కుసుమాంజలి, నాయకులు పి.ప్రగతి, ఎం.కావ్య, సీహెచ్. సూర్య, జి.సంజయ్, బి.భరత్ పాల్గొన్నారు. -
త్వరితగతిన మార్గదర్శుల మ్యాపింగ్
మహారాణిపేట : పీ–4 మార్గదర్శుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని.. ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమమని.. దానికి తగిన విధంగానే చర్యలు తీసుకోవాలని.. ఎవరిపైనా ఒత్తిడి లేదని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలకు మార్గదర్శులను మ్యాపింగ్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర–2047 ప్రణాళికకు అనుగుణంగా నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు ఆయా శాఖల అధికారులంతా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. ఆయా శాఖల పరిధిలో నిర్వహించిన కార్యక్రమాలు, సాధించిన ఫలితాల నివేదికలను పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్ పాల్గొన్నారు. -
నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా పిల్లల దత్తత
మహారాణిపేట : కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం పిల్లల దత్తత ప్రక్రియను నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాన్ కార్డు, ఆదాయ, వయస్సు, నివాస, వివాహ, ఆరోగ్యఽ ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత పోస్టరును సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో ఆయన ఆవిష్కరించారు. దత్తత తీసుకోవాలనుకునే వారు అదనపు సమాచారం కోసం దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని, ఐసీడీఎస్ పీడీ, ఇతర అధికారులను, జిల్లా బాలల పరిరక్షణ అధికారిని సంప్రదించవచ్చన్నారు. ఠీఠీఠీ.ఛ్చిట్చ.ఠీఛిఛీ.జౌఠి.జీ ుఽ వెబ్సైట్లోను వివరాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జేసీ కె.మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్, ఐసీడీఎస్ పీడీ రామలక్ష్మి పాల్గొన్నారు. -
ఐదుసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు
విశాఖ ఉక్కు కర్మాగారం (స్టీల్ ప్లాంట్) భూ సర్వేలో నాకు చెందిన 30 సెంట్ల భూమిని కాపాడాలి. గతంలో ఐదుసార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశా. నా భూమిని సర్వే చేసిన ఆర్ఐ అప్పారావు, సర్వేయర్ హరీష్ ఇబ్బందులు పెడుతున్నారు. పెదగంట్యాడ మండలం సర్వే నంబర్ 71/1/బి/3లో ఉన్న 30 సెంట్ల భూమి నా తాతాముత్తాల నుంచి వారసత్వంగా వచ్చింది. స్టీల్ ప్లాంట్ కోసం కొంత భూమిని తీసుకున్న తర్వాత మిగిలిన భూమిని సబ్–డివిజన్ చేసి ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఈ భూమిలో బడ్డీ కొట్టు, ఇల్లు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నా..అయితే స్టీల్ ప్లాంట్ అధికారులు తమను ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు. గతంలో భూములు కోల్పోయినప్పటికీ, ఈనాటికీ ఉద్యోగం, పరిహారం గానీ అందలేదు. సమస్యను వెంటనే పరిష్కరించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – కొల్లి రవణమ్మ, పెదగంట్యాడ -
అధికారుల నిర్లక్ష్యం వల్లే అర్జీల రిపీట్
● తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు ● అధికారులపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ ● పీజీఆర్ఎస్కు 304 వినతులుమహారాణిపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)పై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదులను సరిగా పరిష్కరించడం లేదని, అందుకే చాలా కేసులు మళ్లీ రీ–ఓపెన్ అవుతున్నాయని ఆయన మందలించారు. సంబంధిత అధికారులు తగిన శ్రద్ధ చూపకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్లతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 304 వినతుల్లో రెవెన్యూకు సంబంధించి 80, జీవీఎంసీ 66, పోలీస్ శాఖకు 22, ఇతర సమస్యలకు 136 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులకు ఫోన్ చేసి సమస్యను తెలుసుకోవాలన్నారు. అవసరమైతే క్షేత్రస్థాయి పరిశీలన చేసి నాణ్యమైన పరిష్కారం చూపాలని, పరిష్కరించిన ఫిర్యాదులకు తగిన విధంగా ఎండార్స్మెంట్ వేయాలన్నారు. కాల్ సెంటర్ పనితీరును మెరుగుపడాలని సూచించారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేసి ప్రజా సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముస్లింల సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం ఈద్గా, కబరిస్తాన్ (ముస్లిం శ్మశానవాటికలు) మంజూరు చేయాలని కోరుతూ అనేక సార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు చేశా..అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. అలాగే వక్ఫ్ బోర్డు భూములపై రీసర్వే చేయాలని, మైనారిటీల ప్రధాన సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించాలని కోరినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తమ వినతులను తక్షణమే పరిష్కరించాలి. – షేక్ బాబ్జి, వైఎస్సార్ సీపీ జిల్లా సమాచార హక్కు చట్టం అధ్యక్షుడు. -
జీవీఎంసీ పీజీఆర్ఎస్లో ‘టౌన్ప్లానింగ్’పై ఫిర్యాదులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 99 ఫిర్యాదులు అందాయి. ఇందులో పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన ఫిర్యాదులే అత్యధికంగా 54 ఉన్నాయి. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి ఫిర్యాదులను స్వీకరించారు. అందిన ఇతర ఫిర్యాదుల్లో రెవెన్యూకు 10, ఇంజినీరింగ్కు 18, ప్రజారోగ్య విభాగానికి 5, యూసీడీ విభాగానికి 6 ఫిర్యాదులు ఉన్నాయి. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మేయర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను వివరించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు వేసిన చోట వీధి లైట్లు ఏర్పాటు చేయాలని జోన్–2 పరిధిలోని ప్రజలు కోరారు. అలాగే మధురవాడలో బరియల్ గ్రౌండ్ పనులను రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయాయని ఆ ప్రాంతవాసులు మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించి పనులు ప్రారంభించాలని వారు కోరారు. -
అక్రమ మైనింగ్పై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు
పద్మనాభం: కృష్ణాపురం గ్రామంలోని సర్వే నంబర్ 74/1లో అక్రమంగా మైనింగ్ చేస్తున్న మొకర నాగరాజు, మొకర గౌరినాయుడులపై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన టి. రమేష్, బి. అప్పలనాయుడు సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ లక్ష్మీ భవాని అండదండలతో వీరు అక్రమంగా బ్లాస్టింగ్ చేసి నల్లరాయిని తరలిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రోజుకు ఐదు నుంచి ఎనిమిది లారీల నల్లరాయిని అక్రమంగా తరలిస్తున్నారని, 20 నుంచి 30 అడుగుల లోతు వరకు తవ్వడం వల్ల జంతువులకు, వాటిని మేపే వారికి ప్రాణాలకు ప్రమాదం ఉందని ఫిర్యాదుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
కదంతొక్కిన జర్నలిస్టులు
మహారాణిపేట: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాకు చెందిన జర్నలిస్టులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. సుమారు 14 డిమాండ్లతో జర్నలిస్టులు నినాదాలు చేసి, అనంతరం కలెక్టర్ హరేందిర ప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఈ నెల 6న జరగబోయే మంత్రివర్గ సమావేశంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తీర్మానాలు ఆమోదించాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, బీమా సదుపాయం, పింఛన్లు జారీ చేయడం అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించకపోతే, ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులకు విశాఖలో జర్నలిస్టుల సమస్యలను వివరించామని శ్రీనుబాబు తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోతుమహంతి నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఏసీ బస్సుల్లో ప్రయాణించే సదుపాయం, ప్రమాద బీమా పథకం అమలు చేయాలని, సమాచార శాఖ అన్ని విధాలా సహకరించాలని కోరారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి, రైల్వే పాసులు జారీ చేయాలని, అక్రిడిటేషన్ కమిటీలలో జర్నలిస్టుల సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, జర్నలిస్టుల కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని జర్నలిస్టుల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎ. సాంబశివరావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పీఎస్ ప్రసాద్, బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు ఈరోతి ఈశ్వరరావు, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎస్. జగన్మోహన్, జర్నలిస్టులు పాల్గొన్నారు. -
పేదల భూములపై సర్కారు కన్ను
మహారాణిపేట: పేదల భూములపై కూటమి సర్కార్ కన్నుపడింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా పేదల భూములను సేకరించడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లోని అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములను సేకరించనున్నారు. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 1941 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సేకరించిన ఈ భూములను వీఎంఆర్డీఏకు అప్పగించి, వాటిని విక్రయించడం ద్వారా నిధులు సమీకరించాలని యోచిస్తోంది. ఇలా వచ్చిన నిధులను ప్రబుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. ఈ నిధులతో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో పంపిణీ చేసిన అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవడంపై దృష్టి సారించింది. అసైన్డ్ పట్టా ఉంటే ఎకరానికి 900 గజాలు, ఆక్రమణదారుడైతే ఎకరానికి 450 గజాల స్థలం డెవలప్మెంటు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. ల్యాండ్ పూలింగ్ కోసం 2016లో చేసిన చట్టం ప్రకారం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పర్యవేక్షణలో ఆర్డీవోలు భూసమీకరణ చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఈ భూముల సేకరణ కోసం సోమవారం నోటిఫికేషన్ ఇచ్చామని, ఈ భూసేకరణ అంతా పారదర్శకంగా చేస్తామని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. సోమవారం మీడియాతో జేసీ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అంతా భూ సేకరణ జరుగుందన్నారు. రికార్ుడ్స ట్యాంపరింగ్ జరగకుండా చూస్తామని, రికార్డులను బట్టి ఆక్రమణదారులను గుర్తిస్తామన్నారు. విశాఖ జిల్లాలో.. ఆనందపురంలో గిడిజాలలో258 సర్వే నంబర్లో 309.18 ఎకరాలు ఆనందపురంలో గోరింట్ల సర్వే నంబర్ 108లో 198.31 ఎకరాలు ఆనందపురంలో శోంఠ్యంలో 347/పీ సర్వే నంబర్లో 251.55 ఎకరాలు ఆనందపురంలో బీ.డీ.పాలెంలో సర్వే నంబర్ 1లో 122.53 ఎకరాలు పద్మనాభంలో కొవ్వాడ 237 సర్వే నంబర్లో 250.52 ఎకరాలు భూములమ్మి..నిధుల సేకరణ ప్రభుత్వ ఆదేశాలతో భారీగా ల్యాండ్ పూలింగ్కు సిద్ధమైన అధికారులు అసైన్డ్ భూములు, ఆక్రమణల్లో ఉన్న భూముల సేకరణకు కసరత్తు విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో 1,941 ఎకరాల సేకరణే లక్ష్యం నోటిఫికేషన్ జారీ చేసిన జాయింట్ కలెక్టర్ ఈ భూములను వీఎంఆర్డీఏకు అప్పగించేందుకు చర్యలు భూములను విక్రయించి నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వ ఆలోచన సేకరించే భూముల వివరాలు విజయనగరంలో డెంకాడలో సర్వే నంబర్లు 241, 242, 243ల్లో 20.41 ఎకరాలు భోగాపురం మండలంలో రావాడ సర్వే నంబర్ 64/1లో 5 ఎకరాలు అనకాపల్లి జిల్లాలో .. సబ్బవరం మండలం అంతకాపల్లిలో 175.42 ఎకరాలు బాటజంగాలపాలెంలో 141.01 ఎకరాలు ఏ.సిరసపల్లిలో 371.75 ఎకరాలు నాళ్ల రేగుడిపాలెంలో 27.37 ఎకరాలు పైడివాడ అగ్రహరంలో 28.14 ఎకరాలు అనకాపల్లి మండలంలో తగరంపూడిలో 40 ఎకరాలుమొత్తం 1941 ఎకరాల 19 సెంట్లు భూమి సేకరిస్తున్నారు -
సుజికీ ఎరీనా షోరూం ప్రారంభం
మురళీనగర్: దేశంలోనే నంబర్ వన్గా వెలుగొందుతున్న మారుతీ డీలర్ వరుణ్ మోటార్స్ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన నూతన మారుతీ సుజుకీ ఎరీనా షోరూమ్ను మురళీనగర్లో సోమవారం ప్రారంభించారు. వరుణ్ గ్రూపు చైర్మన్ ప్రభుకిషోర్ ఈ కార్ల షోరూమ్ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ విశాలమైన ప్రాంగణం, అధునాతన సౌకర్యాలు, అనుభవజ్ఞులైన సిబ్బందితో అత్యత్తమమైన సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో వరుణ్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ దేవ్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష హనుమార, మారుతి సుజికి ఏరియా మేనేజర్ నరైన్ సింగ్ విర్క్, టెరిటరీ సేల్స్ మేనేజర్ కపిల్ గుప్తా, వరుణ్ మారుతి జీవీఎస్ఎన్ నవీన్ రాజు, ప్రసాదరాజు, నవీన్, మారుతి సిబ్బంది పాల్గొన్నారు. -
అరకు ఇక రాయగడకే!
ఆదాయాన్నిచ్చే కొరాపుట్ మార్గం కూడా రాయగడ పరిధిలోకి.. అరకు కోసం వినతులిచ్చినాపట్టించుకోని కేంద్ర ప్రభుత్వంవాల్తేరు నుంచి కొత్త డివిజన్లో చేర్చిన రైల్వే బోర్డు సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా ఊటీ అరకు ఇప్పుడు రాయగడ పరమైపోయింది. వాల్తేరు రైల్వే డివిజన్లో భాగంగా ఉన్న అరకు.. జోన్ విభజన తర్వాత కొత్త డివిజన్లో చేరుతోంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా వాల్తేరు డివిజన్ నుంచి మేజర్ భాగాలను విడదీసి రాయగడ డివిజన్లో కొంత, విశాఖ డివిజన్లో మరికొంత భాగాన్ని విలీనం చేయాలన్న తుది డీపీఆర్కూ బోర్డు ఆమోద ముద్ర వేసేసింది. ఇక గెజిట్ వచ్చేస్తే.. చారిత్రక వాల్తేరు కనుమరుగుకు.. అరకు ప్రాంతం రాయగడకు ఇక అధికారికంగా రాజముద్ర పడిపోయినట్లే. ఆదాయాన్నిచ్చే అరకు, కొరాపుట్ మార్గాలను విశాఖ డివిజన్లో ఉంచాలన్న వినతులను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రకు రిక్తహస్తాలు చూపించింది. వాల్తేరు డివిజన్ను విడదీసేసి.. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2019 ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాల్తేరు డివిజన్ విభజన తథ్యం అన్నట్లుగా రైల్వే బోర్డు ముందుగానే సంకేతాలిచ్చింది. ఇందులో భాగంగా వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ రాయగడ డివిజన్కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇటీవలే వైజాగ్ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు ప్రధాని శంకు స్థాపన చేశారు. ఇటీవలే మార్పులు చేసిన డీపీఆర్ని కూడా బోర్డు ఆమోదించేసింది. వాల్తేరును కొనసాగించాలని ఒత్తిడి తీసుకొచ్చినా దాన్ని పెడచెవిన పెట్టేసింది. విశాఖపట్నం కేంద్రంగా కొత్త డివిజన్కు డీపీఆర్లో స్పష్టం చేసింది. 410 చ.కి.మీ మేర విశాఖ డివిజన్ సరిహద్దుల విషయంలో బోర్డు కఠినంగా వ్యవహరించింది. గుణుపూర్–తేరుబలి కొత్త లైన్ పూర్తయ్యే వరకు గుణుపూర్– పర్లాఖిముండి సెక్షన్ సహా, నౌపడ–గుణుపూర్ లైన్ని కొత్తగా ఏర్పాటవుతున్న విశాఖ డివిజన్లో ఉంచాలని ప్రతిపాదించారు. కానీ దీన్ని బోర్డు అంగీకరించలేదు. సుమారు 410 చ.కి.మీ మేర విశాఖపట్నం డివిజన్గా ఏర్పాటు కానుంది. వాల్తేరులోని మిగిలిన భాగమైన కొత్తవలస నుంచి కిరండూల్, కూనేరు–తెరువలి జంక్షన్, సింగాపూర్ రోడ్ నుంచి కొరాపుట్ జంక్షన్, పర్లాఖిముండి నుంచి గుణుపూర్ వరకూ దాదాపు 680 కి.మీ మేర రాయగడ డివిజన్ పరిధిలోకి రాబోతోంది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ విశాఖపట్నం జోన్ నుంచి రాయగడలోకి వెళ్లిపోయింది. పార్వతీపురం సమీపంలోని కూనేరు కూడా రాయగడ డివిజన్కే ఇచ్చేశారు. కొత్తవలస నుంచి పలాస వరకు విశాఖపట్నం డివిజన్లో ఉంచారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఆంధ్రప్రదేశ్కు చెందిన స్టేషన్లన్నీ తూర్పు కోస్తా జోన్లోని ఖుర్దా డివిజన్లో ఉన్నాయి. అరకు, కోరాపుట్ లైన్ విశాఖ డివిజన్కు ఇవ్వాలని ఎన్ని ప్రతిపాదనలు పంపించినా కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసేసింది. గెజిట్ వచ్చేలోపైనా కూటమి కళ్లు తెరిస్తేనే..! తూర్పు కోస్తా రైల్వే జోన్కు ఆదాయాన్ని తెచ్చిపెట్టే అతిపెద్ద డివిజన్ వాల్తేరు. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ.15 వేల కోట్లు కాగా, ఇందులో రూ.8 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టికెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్ (రూ.12–14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ఇందులో సింహభాగం ఆదాయం ఐరెన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. ఇదంతా రాయగడ డివిజన్కు సొంతమవుతుంది. వాల్తేరుకు రావాల్సిన ఆదాయం దాదాపు సింహభాగం కోల్పోయినట్లే అవుతుంది. జోన్కు సంబంధించి ఇంకా గెజిట్ విడుదల కాలేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం, ఎంపీలు పట్టుబట్టి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తే విశాఖ డివిజన్కు మంచి జరిగే అవకాశం ఉంది. కానీ.. కూటమి నేతలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. -
వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీల చించివేత
మల్కాపురం: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కూటమి సర్కార్ తీరును ఎండగడుతూ బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ పేరిట 45వ వార్డు ఏకేసీ కాలనీకి వెళ్లే మార్గంలో అన్ని అనుమతులతో వార్డు కార్పొరేటర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి చింపివేశారు. ఆదివారం ఉదయం చూసేసరికి ఫ్లెక్సీ చిరిగి ఉండటంతో కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదేమాదిరిగా రెండు సార్లు ఫ్లెక్సీలను చింపేశారని గుర్తు చేశారు. దీనిపై గతంలో సీఐకు ఫిర్యాదు చేశానని, ఆయన స్పందించి ఫ్లెక్సీ చింపిన వారిని గుర్తించి, హెచ్చరించారని పేర్కొన్నారు. మళ్లీ ఇపుడు అదే జరిగిందన్నారు. కారకులైన వారిని గుర్తించి, చర్యలు తీసుకోవాలని కోరారు. చిరిగిన ఫ్లెక్సీలు -
వృద్ధురాలిని రక్షించినమైరెన్ పోలీసులు
కొమ్మాది: సాగర్నగర్ బీచ్లో ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధురాలిని మైరెన్ పోలీసులు కాపాడారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గొరల కళావతి ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో సముద్రంలోకి దిగుతుండగా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న మైరెన్ కానిస్టేబుల్ వెంకట గణేష్ గమనించారు. వెంటనే లైఫ్గార్డ్ బుజ్జి సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా బాధను తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆ వృద్ధురాలు పోలీసులకు తెలిపింది. అనంతరం ఆమె వివరాలు సేకరించి ఆరిలోవ పోలీస్ స్టేషన్ బీచ్ మొబైల్ సిబ్బందికి అప్పగించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి వృద్ధురాలి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ వెంకట గణేష్ను, లైఫ్గార్డ్ బుజ్జిని మైరెన్ సీఐ శ్రీనివాసరావు అభినందించారు. -
చందన స్వరూపునికి సంపెంగ సుగంధం
● సింహగిరి సంపెంగల విశిష్టతే వేరు... ● ఏటా జూలై, ఆగస్టు నెలల్లో విరివిగా సింహగిరి సంపెంగలు సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సంపెంగ పుష్పాలంటే ఎంతో ప్రీతి. భక్తసులభుడైన ఆయనకు ఎన్ని రకాల పుష్పాలతో పూజచేసినా...సంపెంగ పుష్పాలతో చేసిన పూజసాటి రాదంటారు. సంపెంగపూలతో పూజ చేస్తే ఆయన ఎంతగానో పరవశించిపోతాడు. సాక్షాత్తూ ఆయన వెలసిన సింహాచలం క్షేత్రంలోనే సంపెంగపూలు కూడా విరివిగా లభిస్తుంటాయి. ఎన్నిచోట్ల సంపెంగలు లభించినా సింహగిరిపైన లభించే సంపెంగకి ఎంతో విశిష్టత ఉందని అభివర్ణిస్తుంటారు. సింహాచలం కొండపైన, కొండ దిగువన ఉన్న పూలతోటలో, దేవస్థానానికి చెందిన శ్రీకృష్ణాపురం గోశాలలో సంపెంగ చెట్లు ఉన్నాయి. ముఖ్యంగా తెలుపు, పసుపు రంగుల సంపెంగ పూల చెట్లు కనువిందు చేస్తుంటాయి. ఈ పుష్పాల నుంచి వెలువడే సువాసనలు ఎంత దూరంలో ఉన్నా ఆకట్టుకుంటాయి. చందన స్వరూపుడైన సింహాచలేశుడు ఏడాది పొడవునా చందనం పరిమళాలను ఆస్వాదిస్తాడు. ఆ చందనం పరిమళాలకు సమానంగా సంపెంగ పరిమళాలను మాత్రమే స్వామి ఆస్వాదిస్తుంటాడని భక్తులు పేర్కొంటారు. సంపెంగ పూలతో స్వామికి ఉన్న బంధం విడదీయరానిదిగా చెబుతారు. శ్రీకాంత కృష్ణమాచార్యులు–సంపెంగ బంధం తొలి తెలుగు వాగ్గేయకారుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీకాంత కృష్ణమాచార్యులు (కృష్ణమయ్య), తిరుమల అన్నమాచార్యుల వలె సింహాచలంలో విశేష కీర్తి ప్రతిష్టలు పొందారు. సింహాచలేశుడిపై ఆయన చాతుర్లక్ష వచన సంకీర్తనలు రచించారని, ఆయన కీర్తిస్తుంటే స్వయంగా స్వామి నృత్యం చేసేవాడని చెబుతారు. కృష్ణమయ్య ప్రతిభను గుర్తించిన ఓరుగల్లు సామ్రాజ్యాధినేత ప్రతాప రుద్రుడు కృష్ణమయ్య దంపతులను తన రాజ్యానికి ఆహ్వానించాడు. అక్కడ రాజమర్యాదలు అందుకున్నప్పటికీ, కృష్ణమయ్య భార్యకు సంతృప్తి కలగలేదు. సింహాచలంలో స్వామిని సంపెంగ పూలతో కొలిచేదానినని, తనకు సంపెంగ పూలు తప్ప మరేమీ వద్దని ఆమె చక్రవర్తిని కోరింది. దీంతో ప్రతాపరుద్రుడు రాజభటులను సింహాచలం పంపి సంపెంగ పుష్పాలను తెప్పించాడని దివంగత నాటక రచయిత విరియాల లక్ష్మీపతి తన నాటకంలో అభివర్ణించారు. సంపెంగల సంరక్షణ, వినియోగం సంపెంగ పుష్పాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి కొన్ని పద్ధతులున్నాయి. గాజు సీసాలో పువ్వులు వేసి, మంచి నీటితో నింపి, గాలి చొరబడకుండా సీల్ చేస్తే చాలా ఏళ్లు తాజాగా ఉంటాయని చెబుతారు. వీటిని ఇంట్లో అలంకారంగా కూడా ఉపయోగిస్తారు. సంపెంగ పుష్పాలు ముఖ్యంగా జూలై, ఆగస్టు నెలల్లో పెద్ద మొత్తంలో లభిస్తాయి. వర్షాలు ఎక్కువగా పడితే పువ్వుల పరిమాణం కూడా పెద్దదిగా ఉంటుందని అంటారు. సింహగిరికి వచ్చే భక్తులు స్వామికి సంపెంగ పుష్పాలు సమర్పించి, ప్రసాదంగా వాటిని తీసుకునేందుకు పోటీ పడతారు. స్వామికి సమర్పించిన తర్వాత ఆ పుష్పాలను తమ శిరస్సుల్లో ధరించడానికి ఆసక్తి చూపుతారు. ఒడిశా భక్తుడు లక్ష్మీకాంత్ నాయక్ దాస్ సేవలు ఏటా మూడు నెలల పాటు సింహగిరిపై ఉండి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సేవలందించే ఒడిశాకు చెందిన లక్ష్మీకాంత్ నాయక్ దాస్, ఆ కాలంలో స్వామికి పెద్ద మొత్తంలో సంపెంగ పుష్పాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన వస్తున్నారంటే సంపెంగలు వెంట తీసుకొస్తున్నారని నానుడి ఉంది. సంపెంగ వ్యాపారం, స్వర్ణ పుష్పార్చన సింహగిరిపై చిరు వ్యాపారులు సంపెంగ పుష్పాలను విడిగా, దండల రూపంలో విక్రయిస్తుంటారు. డిమాండ్ ఉన్న రోజుల్లో డజను పువ్వులు అరవై రూపాయల వరకు కూడా అమ్ముడవుతాయి. ఒక దాత సింహగిరిపై లభించిన 108 సంపెంగ పుష్పాలను అమెరికా తీసుకెళ్లి బంగారంలో ముంచి స్వర్ణ సంపెంగ పుష్పాలుగా మార్చి, సుమారు ఇరవై ఏళ్ల క్రితం సింహాచలేశుడికి కానుకగా సమర్పించారు. ఆ పుష్పాలతోనే 2019 వరకు స్వామికి ప్రతి గురువారం, ఆదివారం రోజుల్లో స్వర్ణపుష్పార్చన జరిగేది. ఆ తర్వాత కొత్తగా దాతల సహకారంతో మరిన్ని స్వర్ణపుష్పాలను అందుబాటులోకి తెచ్చారు. అంతరించిపోతున్న సంపెంగలు ఒకప్పుడు సింహగిరి కొండల్లో వేలాదిగా సంపెంగ చెట్లు ఉండేవని, రానురాను అవి అంతరించిపోతున్నాయని పలువురు చెబుతున్నారు. దేవస్థానం అధికారులు సంపెంగ చెట్ల పెంపకాన్ని ఎక్కువగా చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు. -
వివాహ వేడుకకు వెళ్తూ.. మృత్యు ఒడికి..
● రైలు ఢీకొని మహిళ మృతి ● యలమంచిలి రైల్వేస్టేషన్లో ఘటనయలమంచిలి రూరల్: వివాహ వేడుకకు వస్తూ రైల్వే ట్రాక్ దాటుతున్న మహిళను గుర్తు తెలియని రైలు బండి ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో యలమంచిలి రైల్వేస్టేషన్ ఒకటో నెంబరు ప్లాట్ఫాం సమీ పంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కిరెడ్డిపాలెం తుంగ్లాం ప్రాంతానికి చెందిన కొల్లి రమణమ్మ(55), మరో ముగ్గురు బంధువులతో కలిసి యలమంచిలి రాంనగర్లో జరుగుతున్న ఓ వివాహానికి హాజరుకావడానికి ఆదివారం రాత్రి వచ్చారు. ఆటోలో యలమంచిలి రైల్వేస్టేషన్ వరకు వచ్చి రాంనగర్లో జరుగుతున్న వివాహ వేదిక చిరునామా సరిగ్గా తెలియకపోవడంతో తికమక పడ్డారు. చివరకు బంధువులకు ఫోన్ చేయగా రైల్వేస్టేషన్ చివర రైలు పట్టాలు దాటితే సులభంగా వివాహ వేదిక వద్దకు చేరుకోవచ్చని చెప్పారు. దీంతో మృతురాలితో పాటు ఇద్దరు మహిళలు, మనుమరాలు రైల్వే ట్రాక్ దాటుతుండగా అదే ట్రాక్పై అనకాపల్లి నుంచి తుని వైపు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు వేగంగా వస్తోంది. వారిలో ఇద్దరు రైలుపట్టాలు దాటే సరికి రైలు వస్తున్న సంగతిని చెప్పి మిగిలిన ఇద్దరినీ రావద్దని అరిచారు. ఇద్దరిలో ఒక మహిళ రైలు పట్టాల అవతల ఉండిపోగా, కొల్లి రమణమ్మ దాటే ప్రయత్నం చేసింది. అదే సమయంలో కాలి చెప్పు జారిపోవడంతో ఆమెను రైలు ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో రమణమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రెప్పపాటులో ముగ్గురు మహిళలు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆనందంగా వివాహ వేడుకకు వచ్చిన రమణమ్మను రైలుబండి రూపంలో తమ కళ్ల ముందే మృత్యువు కబళించడంతో బంధువులు ఘటనా స్థలం వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపై డ్యూటీలో ఉన్న స్టేషన్ సిబ్బంది తుని రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మహిళ మృతి చెందిన రైల్వే ట్రాక్పై రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. -
కేజీహెచ్కు అనారోగ్యం
● వైద్యం కోసం వస్తే.. రోగులకు వ్యథలే.. ● అధికారుల మధ్య ఆధిపత్య పోరు ● ఓ పరిపాలనాధికారి పనితీరుపై విమర్శలు ● అవినీతి, వర్గ విభేదాలు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు మహారాణిపేట: ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) సమస్యల వలయంలో చిక్కుకుంది. ఉత్తరాంధ్ర నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్గఢ్, అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. అయితే పెరిగిన రోగుల తాకిడికి అనుగుణంగా వైద్య సేవలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాలనా వైఫల్యం, పర్యవేక్షణ లోపం కారణంగా ఆసుపత్రిలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఆసుపత్రిలో 1,187 పడకలు ఉండగా, సోమవారం నుంచి శనివారం వరకు రోజూ 1,500 నుంచి 2,200 మంది ఓపీ టికెట్లు తీసుకుంటున్నారు. వీరిలో 300 నుంచి 600 మంది వరకు ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. పెరుగుతున్న రోగుల సంఖ్యకు తగ్గట్టుగా వార్డులు, పడకల సంఖ్యను పెంచాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు శూన్యం. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా యాజమాన్యం విఫలమవుతోంది. కొన్ని చోట్ల రోగులు కుక్కలతో కలిసి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. నిర్లక్ష్యానికి కేరాఫ్గా క్యాజువాలిటీ ఆసుపత్రికి గుండెకాయ లాంటి క్యాజువాలిటీ విభాగం నిర్లక్ష్యానికి నిలయంగా మారింది. రోడ్డు ప్రమాద బాధితులు, అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనవారు ఇక్కడికి వస్తే, వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. క్షతగాత్రులు, రోగులను లోపలికి తీసుకెళ్లడానికి స్ట్రెచర్, వీల్ చైర్ కోసం కూడా బంధువులే వెతుక్కోవాల్సిన దయనీయ పరిస్థితి ఉంది. దీంతో క్షతగాత్రులు రక్తం కారుతూ.. బాధను ఓర్చుకుంటూ ఆటోల్లో, అంబులెన్స్ల్లో అప్పటి వరకు ఉండాల్సిన పరిస్థితి ఉంది. సిబ్బంది నిర్లక్ష్యం, విసుగు ప్రదర్శిస్తుండటంతో అత్యంత విలువైన ‘గోల్డెన్ అవర్’ వృథా అయి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. ఒకవేళ రోగి మరణిస్తే, మృతదేహాన్ని గంటల తరబడి అక్కడే స్ట్రెచర్పై వదిలేస్తున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. దుర్గంధభరితంగా వార్డులు పారిశుధ్య పర్యవేక్షణ పూర్తిగా లోపించడంతో ఆసుపత్రిలోని అనేక వార్డులు కంపుకొడుతున్నాయి. రాజేంద్రప్రసాద్ వార్డు, భావనగర్ వార్డు, గైనిక్ వార్డు, పిల్లల వార్డు, ఆర్థోపెడిక్ వార్డుల్లో మరుగుదొడ్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. ఎవరైనా పర్యవేక్షణ చేస్తారంటే శుభ్రం చేస్తారు. లేదంటే పట్టించుకోరు. దీంతో అపరిశుభ్ర వాతావరణంలోనే రోగులు, వారి బంధువులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఆధిపత్య పోరు.. అవినీతి ఆరోపణలు ఆసుపత్రిలో అధికారుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఆసుపత్రిని పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్ తన చాంబర్ నుంచి బయటకు రావడం గగనంలా మారింది. విభాగాల పర్యవేక్షణ బాధ్యతలను కూడా ఎవరికీ అప్పగించలేదు. అడ్మినిస్ట్రేటర్గా వచ్చిన ఓ అధికారి పనితీరు మీద విమర్శలు వస్తున్నాయి. పరిపాలనను పట్టించుకోకుండా ఆస్పత్రిలో ఒక వర్గాన్ని చేతిలో పెట్టుకుని వివాదాలకు ఆజ్యం పోస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి, వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు ఉండటంతో పాలన గాడి తప్పింది. తరచూ విద్యుత్ అంతరాయాలు, పనిచేయని ఏసీలు, ఆపరేషన్ థియేటర్ల నిర్వహణ లోపాలు, పారిశుధ్య సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారు. ఆస్పత్రికి ‘నేనే బాస్’అంటే ‘నేనే బాస్’అనే ధోరణిలో అధికారుల మధ్య నెలకొన్న పోరుతో ఇక్కడ వైద్య సేవలు, పరిపాలన అస్తవ్యస్తంగా మారాయి. వైద్యం కోసం గంటల తరబడి నిరీక్షణ కష్టపడి ఓపీ టికెట్టు సంపాదించి సంబంధిత విభాగానికి వెళ్తే.. వైద్యుడిని సంప్రదించడానికి గంటకు పైగా సమయం పడుతోంది. క్యాజువాలిటీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ప్రసూతి, చిన్నపిల్లల వార్డు, క్రిటికల్ కేర్ విభాగం.. ఇలా ప్రతి విభాగంలోనూ వందలాది మంది రోగులు బారులుదీరి ఉంటారు. రోగులకు వైద్యం బాగానే అందిస్తున్నా.. డాక్టర్ వద్దకు చేరుకోవడానికే చాలా సమయం పడుతోంది. ఇటీవల 43 మంది వైద్యులు, 26 మంది స్టాఫ్ నర్సులు బదిలీ అయ్యారు. కొత్త నియామకాలు జరగకపోవడంతో వైద్యులు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. పలు విభాగాల్లో విభాగాధిపతులు(హెచ్వోడీ) అందుబాటులో లేకపోవడంతో అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో, కొన్ని చోట్ల పీజీ విద్యార్థులతో ఓపీలు నడుస్తున్నాయి. కొందరు వైద్యులు సమయానికి రాకపోవడంతో రోగులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. -
లయన్స్ క్లబ్ 316ఏ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
బీచ్రోడ్డు: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా 316ఎ నూతన కార్యవర్గం ఆదివారం సిరిపురం బాలల ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేసింది. జిల్లా గవర్నర్ డి. సూర్యప్రకాష్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో, లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సుభాష్ బాబు, పూర్వ డైరెక్టర్ విజయ్ కుమార్ నూతన సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గాట్ ఏరియా లీడర్లు, ఆర్.సి., జెడ్.సి., టీమ్ లీడర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. కార్యక్రమానికి పాస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు సుబ్బరాజు, బి. తిరుపతిరాజు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ పి. చంద్రశేఖర్, కో–కన్వీనర్లు వి. కోటేశ్వరరావు, ఎన్.వి.ఎస్.ఎస్. ప్రసాదనాయుడు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ ట్రస్టీ ఎస్. ఉదయశంకర్ మరియు ఇతర లయన్స్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఫిరాయింపు కార్పొరేటర్లపై వేటు వేయాల్సిందే..
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించిన కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాల్సిందేనని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు డిమాండ్ చేశారు. ఫిరాయింపు కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో వేసిన పిటిషన్పై సోమవారం తీర్పు వెలువడనుంది. కాగా.. ఈ నెల 6న జరగనున్న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికపై ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ల తో కె.కె.రాజు సమావేశమయ్యారు. స్టాండింగ్ కమిటీలో పోటీ చేసే కార్పొరేటర్లకు ఎన్నికలో గెలుపునకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పార్టీ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లు వేరొక పార్టీలోకి ఫిరాయిస్తే అది ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించినట్లవుతుందన్నారు. ‘మా పార్టీ నుంచి ఫిరాయించిన 27 మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు అంశం హైకోర్టులో పెండింగ్లో ఉంది. తీర్పు వెలువడితే వారి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారనుంది. ఇలా ఫిరాయింపుదారులపై వేటు పడితేనే భవిష్యత్తులో ఎవరూ ఫిరాయించరు. ఒకవేళ ఫిరాయింపులకు పాల్పడాలనుకుంటే రాజీనామా చేసి, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి వెళ్లాలి.’ అని అన్నారు. డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఫిరాయింపు కార్పొరేటర్ల ఓటు హక్కును రద్దు చేయాలి వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించిన కార్పొరేటర్లపై అనర్హత వేటు నిర్ణయం హైకోర్టులో పెండింగ్లో ఉండగా.. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని డిప్యూటీ మేయర్ కె.సతీష్, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాస్ ప్రశ్నించారు. తక్షణమే ఆ కార్పొరేటర్ల ఓటు హక్కును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించినప్పుడు ఆ పదవిని రద్దు చేసే అధికారం చట్టబద్ధంగా ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీలోకి ఫిరాయించిన 27 మంది కార్పొరేటర్ల అనర్హత అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఆ 27 మంది ఫిరాయింపు కార్పొరేటర్లకు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఇప్పటికే నోటీసులు కూడా పంపించారని గుర్తు చేశారు. న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉండగా వారికి ఓటు హక్కు కల్పించడం నిబంధనలకు విరుద్ధమని, ఒకవేళ ఎన్నిక నిర్వహించినా అది చెల్లదని హెచ్చరించారు. అప్రజాస్వామికంగా మేయర్ ఎన్నిక పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లతో అప్రజాస్వామికంగా కొత్త మేయర్ను ఎన్నుకున్నారని వారు ఆరోపించారు. కొత్త మేయర్ బాధ్యతలు స్వీకరించి వంద రోజులు కాకముందే ఆయన పనితీరు, అక్రమాలపై నగర ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. గత మేయర్ పాలనే బాగుందని నగర ప్రజలు భావిస్తున్నారన్నారు. సమావేశంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల బరిలో ఉన్న కార్పొరేటర్లు రెయ్యి వెంకట రమణ, సాడి పద్మారెడ్డి, మహమ్మద్ ఇమ్రాన్, ఉరుకూటి రామచంద్రరావు, నక్కిల లక్ష్మి, కె.వి.శశికళ, కోడిగుడ్ల పూర్ణిమ, పల్లా అప్పలకొండ, బిపిన్ కుమార్ జైన్, గుండాపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు -
తల్లిపాలే బిడ్డకు ఆరోగ్య రక్ష
మహారాణిపేట: ఆంధ్ర మెడికల్ కళాశాల, కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్) పీడియాట్రిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద తల్లిపాల అవగాహన ర్యాలీని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి మాట్లాడుతూ బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలకు మించిన ఔషధం లేదన్నారు. మహిళలు పనిచేసే ప్రదేశాలలో బిడ్డకు తల్లిపాలు సులభంగా అందించేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. కేజీహెచ్లో ఇప్పటికే బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్లు అందుబాటులో ఉన్నాయని, వీటి స్ఫూర్తితో మిగతా పని ప్రదేశాలు, పబ్లిక్ ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తే మరింత ఉపయోగకరమని సూచించారు. సీఎస్ఆర్ఎంవో డాక్టర్ శ్రీహరి తల్లి పాలు ప్రాముఖ్యతను వివరించారు. కేజీహెచ్ పిల్లల విభాగాధిపతి డాక్టర్ బి.ఎస్.చక్రవర్తి మాట్లాడుతూ రెండేళ్ల వరకు పరిపూరక ఆహారంతో పాటు తల్లిపాలు కొనసాగించాలన్నారు. ఇది శిశువును అనేక రోగాల నుంచి కాపాడడంతోపాటు, మేధస్సు వృద్ధి, మాతా శిశు బంధానికి దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి రామలక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సందీప్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రమణ మల్లి, సింధూర, రమ్య, తాతం నాయుడు, గిరిదొరలు హాజరయ్యారు. ర్యాలీలో 200 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్గ్రాడ్యుయేట్లు, 100 మందికి పైగా అంగన్వాడీ, ఆశా, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ తల్లిపాల అవగాహన వారోత్సవ ర్యాలీలో వైద్యులు -
ముగ్గురు పర్యాటకులనుకాపాడిన లైఫ్గార్డ్స్
కొమ్మాది: రుషికొండ బీచ్లో ఇద్దరు పర్యాటకులు సముద్రంలో కొట్టుకుపోతుండగా, అప్రమత్తమైన లైఫ్గార్డ్స్ వారి ప్రాణాలను కాపాడారు. జార్ఖండ్కు చెందిన 14 మంది పర్యాటకులు ఆదివారం సాయంత్రం రుషికొండ బీచ్కు చేరుకున్నారు. సరదాగా గడిపి స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగగా, అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో వారిలో అంకుర్ కుమార్, గౌతమ్ సాహు కొట్టుకుపోయారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న లైఫ్గార్డ్స్ ఎస్. నూకరాజు, ఎం. అమ్మోరు, చందు, సతీష్, గురుమూర్తి, రాజ్కుమార్ వీరిని గమనించి సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మైరెన్ పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. పర్యాటకుల ప్రాణాలను కాపాడిన లైఫ్గార్డ్స్ను మైరెన్ సీఐ శ్రీనివాసరావు అభినందించారు. అదేవిధంగా రుషికొండ బీచ్లో స్నానం చేస్తుండగా విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన కోరాడ నిఖిల్ కుమార్ కూడా కెరటాల ఉధృతికి కొట్టుకుపోతుండగా, అక్కడే ఉన్న లైఫ్గార్డ్స్ అతన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. -
అద్దె గర్భం.. అడ్డగోలు దందా
మహారాణిపేట: సంతానం కోసం పరితపించే దంపతుల ఆశను ఆసరాగా చేసుకుని నగరంలోని కొన్ని ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాలు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నాయన్న ఆరోపణలు నిజమవుతున్నా యి. సృష్టి ఐవీఎఫ్ సెంటర్లో అక్రమాలు వెలుగుచూసిన నేపథ్యంలో డీఎంహెచ్వో పి.జగదీశ్వరరావు ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన నాలుగు ప్రత్యేక బృందాల తనిఖీల్లో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలో మొత్తం 53 సంతాన సాఫల్య కేంద్రాలు (44 ఐవీఎఫ్, 9 సరోగసీ) ఉన్నాయి. వివాహమై ఏళ్లు గడిచినా మాతృత్వానికి నోచుకోలేదన్న బాధతో ఉన్న మహిళలే ఈ కేంద్రాల లక్ష్యం. పిల్లలు లేరన్న బాధ నుంచి దూరం చేయడం కోసం ఈ సెంటర్లు అక్రమా లకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంహెచ్వో ఆధ్వర్యంలో డాక్టర్ ఉమావతి, డాక్టర్ సమత, డాక్టర్ లూసీ వంటి అధికారులతో కూడిన నాలుగు బృందాలు ఈ సెంటర్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఈ తనిఖీలు పూర్తికానున్నాయి. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు ● పిల్లల కోసం వచ్చే దంపతుల నుంచి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు నగదు రూపంలో వసూ లు చేస్తున్నారు. ఈ భారీ మొత్తాలకు ఎలాంటి రశీదు లు ఇవ్వకపోవడం, అకౌంట్లలో నమోదు చేయకపోవడం వంటి ఆర్థిక అవకతవకలను గుర్తించారు. ● సెంటర్కు వచ్చే దంపతులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిచోటా సీసీ కెమెరాలు, ప్రత్యేక సిబ్బందిని నియమించి.. ఒక రోగి వివరాలు మరో రోగికి తెలియకుండా అత్యంత రహస్యం పాటిస్తున్నారు. దీని వల్ల ఒకరి నుంచి ఎంత వసూలు చేస్తున్నారో మరొకరికి తెలిసే అవకాశం లేకుండా పోతోంది. ● నూరు శాతం గ్యారెంటీ, లేదంటే డబ్బులు వాపస్ వంటి మోసపూరిత ప్రకటనలతో పిల్లలు లేరన్న తీవ్రమైన మానసిక వేదనలో ఉన్న తల్లిదండ్రులను ఆకర్షించి, వారి బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. సరోగసీ, ఐవీఎఫ్ పేర్లతో ఈ కేంద్రాలు సాగిస్తున్న నిలువు దోపిడీపై పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఈ తనిఖీలు పూర్తయితే ఇంకెన్ని అక్రమాలు బయటపడతాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.దోపిడీ కేంద్రాలుగా ఐవీఎస్, సరోగసీ కేంద్రాలు -
విశాఖ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటాలి
మురళీనగర్: విశాఖ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. మురళీనగర్లోని వనితా వాకర్స్ భవనంలో ‘వావ్’సంస్థ ఆదివారం ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2025లో పతక విజేతల అభినందన సభ ఏర్పాటు చేసింది. మలేసియా, శ్రీలంకలో జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్షిప్–2025లో ‘వావ్’ అథ్లెట్లు ఎం.రామారావు, కె.బి.వి.ఎం.కృష్ణ ప్రసాద్, కె.పూర్ణిమ, కె.మత్స్యకొండ స్వర్ణ, కాంస్య, రజత పతకాలను సాధించారు. వీరికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను సీపీ అందజేసి అభినందించారు. గౌరవ డాక్టరేట్ పొందిన ’వావ్’ చీఫ్ ప్యాట్రన్, సామాజిక కార్యకర్త డాక్టర్ కమల్ బైద్ను పోలీస్ కమిషనర్ సత్కరించారు. కొత్త ట్రస్టీలు సుబోధ్ కుమార్, కపిల్ అగర్వాల్, వావ్ అధ్యక్షుడు డా.మంగ వరప్రసాద్, కార్యదర్శి సుధాకర్, కోశాధికారి ఎం.రామారావు, కోఆర్డినేటర్ సి.హెచ్. శ్రీనివాసరాజు, పీఆర్వో వంశీ చింతలపాటి, వాకర్స్ డిస్ట్రిక్ట్–101 గవర్నర్ కె. ద్వారకానాథ్, వైశాఖీ స్పోర్ట్స్ పార్క్ కార్యదర్శి పి.ఎస్.ఎన్. రాజు, వనితా వాకర్స్ అధ్యక్షురాలు పి. ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. సీపీ శంఖబ్రత బాగ్చి -
అడ్డగోలు జీవోలు.. అణచివేతకు కుట్రలు!
● ఏడాదిలోనే కూటమి ప్రభుత్వానికి భయం మొదలైంది ● పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలను నిషేధిస్తూ ఇచ్చిన జీవో ప్రజాస్వామ్య విరుద్ధం ● జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగిన ఏఐఎస్ఎఫ్ బీచ్రోడ్డు: కూటమి ప్రభుత్వానికి ఏడాది కాలంలోనే భయం మొదలైందని అందుకు నిదర్శనమే పాఠశాలల్లో విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించిందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు పి.శేఖర్ అన్నారు. ఆదివారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ పాఠశాలల్లోకి ప్రవేశం లేదని జీవో విడుదల చేయడాన్ని ఖండించారు. విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, న్యాయమైన సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పాఠశాలల్లోకి అనుమతించకపోవడం కూటమి నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా జీవోలు ఇస్తూ అణచివేతకు కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏఐఎస్ఎఫ్ నాయకులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టినా విద్యార్థులకు అండగా ఉంటామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం తక్షణమే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి హేమానంద్, జిల్లా ఉపాధ్యక్షులు జెట్టి అభిషేక్, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. -
న్యాయ శాస్త్ర నిఘంటువు.. వడ్లమాని
విశాఖ లీగల్: విశాఖలో న్యాయవాదిగా 65 ఏళ్లకు పైగా సేవలు అందించిన ప్రముఖ న్యాయవాది వడ్లమాని శ్రీరామ్మూర్తికి ఘన నివాళిగా ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించేందుకు విశాఖ న్యాయవాదుల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమం సోమవారం సాయంత్రం 4 గంటలకు సంఘం నూతన భవనంలో జరగనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మద్ది నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్ తెలిపారు. 1916లో ఉమ్మడి విశాఖ జిల్లా శ్రీరాంపురంలో జన్మించిన శ్రీరామ్మూర్తి.. విజయనగరం మహారాజా కళాశాలలో బీఏ పూర్తి చేశారు. అప్పట్లో అత్యధిక మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినందుకు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఉపకులపతి ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా 3.5 తులాల బంగారు పతకాన్ని అందుకున్నారు. అనంతరం మద్రాసు న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలోనూ ప్రథమ స్థానంలో పట్టా పొందారు. 1940లో న్యాయకోవిదుడు మద్ది పట్టాభి రామిరెడ్డి వద్ద జూనియర్గా చేరారు. విశాఖలోనే ఉంటూ 2005 వరకు వేలాది కేసులను వాదించారు. న్యాయ శాస్త్రానికి నిఘంటువుగా నిలిచి.. న్యాయ ప్రక్రియకు సంబంధించిన ఎన్నో అంశాలను తన వాదనల ద్వారా వినిపించేవారు. ఆ రోజుల్లో శ్రీరామ్మూర్తి వాదనలు వినడానికి న్యాయమూర్తులతో పాటు ఇతర న్యాయవాదులు ఎంతో ఆసక్తి చూపేవారని, కోర్టు హాల్ మొత్తం కిటకిటలాడేదని ఆయన కుమారుడు అన్నయ్య శాస్త్రి గుర్తు చేసుకున్నారు. శ్రీరామ్ముర్తి అనేక ప్రభుత్వ శాఖలకు న్యాయ సలహాదారుడిగా పనిచేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి కూడా న్యాయవాదులు, న్యాయమూర్తులు ఆయన సలహాలు, సూచనల కోసం వచ్చేవారు. ఆయన వాదించిన కేసుల్లో ఆంగ్లంలో ఎటువంటి క్లిష్టమైన పదాలు వాడకుండా సరళమైన భాషను ఉపయోగించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని సీనియర్ న్యాయవాదులు వ్యాఖ్యానించారు. అలా ఆయన ఎందరో న్యాయవాదులకు మార్గదర్శిగా నిలిచారు. చిత్రపట కార్యక్రమానికి విజయవంతం చేయాలని కార్యదర్శి ఎల్.పి.నాయుడు కోరారు. నేడు విశాఖ న్యాయవాదుల సంఘంలో వడ్లమాని చిత్రపట ఆవిష్కరణ