తాబేళ్లను రక్షించిన ఇండియన్ నేవీ
విశాఖ సిటీ : సముద్ర సరిహద్దులను కాపాడటమే కాకుండా, సముద్ర గర్భంలోని మూగజీవాలను సంరక్షించడంలోనూ భారత నావికాదళం తమ దాతృత్వాన్ని చాటుకుంది. విశాఖ తీరంలో గస్తీ నిర్వహిస్తున్న ‘ఐఎన్ఎస్ తార్ముగ్లి’ యుద్ధ నౌక సిబ్బంది.. మృత్యువుతో పోరాడుతున్న రెండు అరుదైన తాబేళ్లను ప్రాణాలతో రక్షించారు. కోస్టల్ సెక్యూరిటీ పెట్రోలింగ్లో భాగంగా ఐఎన్ఎస్ తార్ముగ్లి సిబ్బంది సముద్రంపై గస్తీ నిర్వహిస్తుండగా నీటిపై తేలుతున్న పాత చేపల వలలో ఏదో కదలిక ఉండడాన్ని గమనించారు. నిశితంగా పరిశీలించగా, అంతర్జాతీయంగా అంతరించిపోతున్న జాబితాలో ఉన్న రెండు ‘ఆలివ్ రిడ్లే’ తాబేళ్లు ఆ వలలో చిక్కుకున్నట్లు గుర్తించారు. వెంటనే యుద్ధనౌకలోని నేవీ డైవర్లు సముద్రంలోకి దూకి ఆ వలను కోసి తాబేళ్లను విడిపించారు. గాయాలపాలైన ఆ తాబేళ్లకు ప్రాథమిక చికిత్స అందేలా చూసి, వాటిని సురక్షితంగా తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టారు.


