breaking news
Visakhapatnam District News
-
కంచిపీఠం పాఠశాల ప్రవేశాలకు విశేష స్పందన
సీతంపేట: భారతీయ సనాతన ధర్మాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడమే లక్ష్యంగా సేవలందిస్తున్న కంచి కామకోటి పీఠం సంప్రదాయ పాఠశాలల ప్రవేశాల ప్రక్రియకు విశేష స్పందన లభించింది. ఆదివారం స్థానిక శంకరమఠంలో నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల చీఫ్ కోఆర్డినేటర్ లక్ష్మి మాంధాత మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిని పెంపొందించడం, భావి తరాలకు అందించడం కోసం బ్రాహ్మణ బాలికలకు సంప్రదాయ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈ దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో నాలుగో తరగతి నుంచి డిగ్రీ వరకు సమగ్ర విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు. కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గానికే కాకుండా, అన్ని కులాల వారికి వారి వృత్తుల్లో నైపుణ్య శిక్షణతో పాటు విద్యావకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎంచుకున్న కేంద్రం, కోర్సు ఆధారంగా వివిధ ప్రాంతాల్లో విద్యార్థులకు సీట్లు కేటాయిస్తున్నామన్నారు. -
నల్ల చొక్కాలతో ఉక్కు నిర్వాసిత రైతుల ఉద్యమం
గాజువాక: విశాఖ స్టీల్ప్లాంట్ కోసం భూములిచ్చిన నిర్వాసితులు తమ హక్కుల సాధన కోసం తమిళనాడు ‘పెరియార్ ’ తరహాలో నల్లచొక్కాలు ధరించి నిరసన తెలపాలని రిటైర్డ్ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త జె.పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. ఆదివారం లంకా మైదానంలో ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగర్జన సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. వేల ఎకరాల భూములిచ్చిన రైతులు 35 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వాల్లో చలనం లేదని ఆయన విమర్శించారు. ధర్నాలు, రాస్తారోకోల కంటే వినూత్నంగా నల్లచొక్కాల ఉద్యమం ద్వారా పాలకులను నిలదీయాలని కోరారు. తమిళనాడులో సేలం స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్న స్ఫూర్తితో ఇక్కడి నిర్వాసితులు, కార్మికులు ఉద్యమించాలన్నారు. అమరావతి రైతులకు ఇచ్చిన తరహాలోనే స్టీల్ప్లాంట్ నిర్వాసితులకు ఎకరానికి 1250 గజాల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, నాయకులు వై.మహాదేవ్, పరంధామయ్య తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ డీఎస్పీ పూర్ణచంద్రరావు పిలుపు -
భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం
సింహాచలం : వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా తృప్తిగా దర్శనం చేసుకునేలా చూడడమే ప్రథమ ప్రాధాన్యత అని సింహాచలం దేవస్థానం నూతన ఈవో జె.వెంకటరావు తెలిపారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి బేడామండపంలో ప్రదక్షిణ చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాన్ని ఏఈవో తిరుమలేశ్వరరావు అందజేశారు. ఇన్ఛార్జ్ ఈవోగా పనిచేసిన ఎన్.సుజాత నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆలయ పవిత్రత, ఆస్తుల పరిరక్షణను రెండవ ప్రాధాన్యతగా తీసుకుంటానన్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయ ఆస్తులను కాపాడుతామని తెలిపారు. ఏప్రిల్ 20న జరిగే చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడం అత్యవసర ప్రాధాన్యతగా తీసుకుంటామని, రానున్న 50 రోజులు ఆ ఏర్పాట్లపైనే దృష్టి పెడతానన్నారు. దేవస్థానంలో లోపాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సింహాచలం దేవస్థానం ఈవోగా వెంకటరావు బాధ్యతల స్వీకరణ -
అలరించిన ‘శ్రీకృష్ణ లీలలు’
తగరపువలస: మండలంలోని గంభీరం ఐఐఎంవీ రోడ్డులో ఉన్న హరేకృష్ణ వైకుంఠంలో ఆదివారం ‘శ్రీకృష్ణ అర్పణం’ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శ్రీరాధా మదన్ మోహనుల మందిరంలో జరిగిన ఈ వేడుకలో చైతన్య డాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణ లీలలు’ నృత్య రూపకం భక్తులను అలరించింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న బుక్కపట్నం ఇందిర, లీలభాను, పూజిత, శాంతిప్రియ తదితర చిన్నారులను హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు నిష్కించన భక్తదాస ప్రత్యేకంగా అభినందించారు. -
సామాన్యులకు అత్యాధునిక వైద్య సేవలే లక్ష్యం
కొమ్మాది: వైద్య శాస్త్రంలో వస్తున్న నూతన ఒరవడితో కూడిన అంశాలను ఏకీకృతం చేసి, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాలెన్స్ ఫోరమ్ ప్రధాన లక్ష్యమని ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ప్రదీప్ ఉండవల్లి అన్నారు. రుషికొండలోని సాయిప్రియ రిసార్టులో మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరిలో కళ్లు తిరగడం, నడుస్తున్నప్పుడు తూలిపోవడం వంటి సమస్యలపై సదస్సులో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. చెవిలో బాహ్య, మధ్య, అంతర అనే మూడు విభాగాలు ఉంటాయని వివరించారు. సాధారణంగా కళ్లు తిరగడం వంటి సమస్యలు తలెత్తినప్పుడు 80 శాతం మంది అది కంటికి సంబంధించిన సమస్యగా భావిస్తారని, అయితే చెవిని మెదడుతో అనుసంధానించే నరం ద్వారా కూడా ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఐబీఎఫ్ కన్వీనర్లు డి. శ్రీనివాస్, సూరత్, అవినాష్, రమేష్, మాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
శిక్ష!
కక్ష..స్టీల్ప్లాంట్ బకాయిలతో డిస్కమ్కు దెబ్బఏడాది కాలంలో రూ.550 కోట్ల విద్యుత్ బిల్లులు బకాయిల చెల్లింపులో ప్లాంట్కు సహకరించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫలితంగా యూనిట్ సగటు వ్యయం–రాబడి మధ్య భారీ వ్యత్యాసం డిస్కమ్ పనితీరు సరిగా లేదంటూ తప్పుపట్టిన కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసే కుట్రలో బలవుతున్న ఈపీడీసీఎల్ పలుమార్లు నివేదించినా పట్టించుకోని ప్రభుత్వం ఉక్కుపైఈపీడీసీఎల్కు సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రుల హకై ్కన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా కేంద్రం కొనసాగిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు స్టీల్ ప్లాంట్ను ఆర్థికంగా దెబ్బతీస్తూ, మరోవైపు ఉద్యోగుల తగ్గింపుతో ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్లాంట్ నిలదొక్కుకునేలా సాయం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర నిర్ణయాలకు తానా–తందానా అంటూ వ్యవహరించడంతో విశాఖ స్టీల్ ప్లాంట్కు విద్యుత్ సరఫరా చేసే ఏపీఈపీడీసీఎల్పై భారం పడింది. ప్లాంట్ నుంచి వందల కోట్ల రూపాయల బకాయిలు మొండిబకాయిలుగా మారడంతో కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 13వ వార్షిక గ్రేడింగ్లో ఎప్పుడూ ‘ఏ’ గ్రేడ్లో ఉండే ఈపీడీసీఎల్ తొలిసారిగా ‘బీ’ గ్రేడ్కు పడిపోయింది. బకాయిల వసూలులో వెనుకబాటే కారణంగా యూనిట్ సగటు వ్యయం–రాబడి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడిందని కేంద్రం స్పష్టం చేయగా, ఇందులో ఈపీడీసీఎల్ తప్పేమీ లేకపోయినా శిక్ష మాత్రం అనుభవించాల్సి వచ్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెల్లింపులు జరుగుతాయా.. లేదా..? బిల్లు బకాయిల కోసం పలుమార్లు స్టీల్ ప్లాంట్తో, ప్రభుత్వంతో ఈపీడీసీఎల్ చర్చలు జరిపినా ఫలితం మాత్రం శూన్యంగానే మిగిలింది. డిస్కమ్ పనితీరు అద్భుతంగా ఉన్నా.. ప్లాంట్కు కనీసం విద్యుత్ బిల్లులు కట్టే స్తోమత లేకుండా చేసి, ఆ నెపాన్ని డిస్కమ్పై నెట్టి మొత్తానికి విశాఖ ఉక్కు ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పాలన సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్కుకు గనుల కేటాయింపు చేయకపోవడం, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకపోవడం ద్వారా ప్లాంట్ను ఎండగడుతున్న కేంద్ర తీరుపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం వెనుక మర్మం ప్రజలకు అర్థమవుతోందనే వ్యాఖ్యలు ఉన్నాయి. బకాయిల వల్ల ఏపీ ఈపీడీసీఎల్కు వార్షిక నష్టం రూ.7,155 కోట్లకు చేరుకున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కంటే కేంద్రంలోని పెద్దల మెప్పుకోసమే చంద్రబాబు ప్రభుత్వం తాపత్రయపడుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్లాంట్ నుంచి చెల్లింపులు జరుగుతాయా లేదా అన్న మీమాంశలో ఈపీడీసీఎల్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. సమగ్ర కారణాలు వివరించి గ్రేడ్ మార్పు కోసం మరోసారి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు ఈపీడీసీఎల్ అధికార వర్గాలు తెలిపాయి. మొత్తంగా ప్లాంట్పై ప్రభుత్వ వైఖరి ఈపీడీసీఎల్ ప్రతిష్టను దెబ్బతీసిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్లాంట్ బకాయిలే ప్రధాన కారణం..! విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఈపీడీసీఎల్కు రావాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్ విషయాన్ని పూర్తిగా విస్మరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటీకరణ కోసం కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వంతపాడుతూ విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసే పనిలోనే ప్రభుత్వం నిమగ్నమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ బకాయిలపై గతంలో స్టీల్ ప్లాంట్కు ఈపీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు వెనక్కి తీసుకోవాలని, బకాయిలపై దృష్టిసారిస్తామని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఈపీడీసీఎల్ అధికారులు మౌనం వహించారు. ఫలితంగా 2024 అక్టోబర్ నుంచి ఏడాది కాలంలోనే సుమారు రూ.550.40 కోట్ల మేర విద్యుత్ బిల్లులు బకాయిలుగా మారి డిస్కమ్ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశాయి. సహకారమెక్కడ చంద్రబాబూ..? స్టీల్ ప్లాంట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లుల చెల్లింపునకు ఎలాంటి సహకారం అందించకపోవడంతో ఈ భారం ఈపీడీసీఎల్ మెడకు చుట్టుకుంది. డిస్కమ్ పరిధిలో యూనిట్ సగటు వ్యయం–రాబడి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఒక యూనిట్ సగటు వ్యయం, సగటు రాబడి మధ్య వ్యత్యాసాన్ని విద్యుత్ శాఖ పరిభాషలో ఏసీఎస్–ఏఆర్ఆర్ గ్యాప్గా పేర్కొంటారు. ఇది 2023–24లో 0.36 శాతంతో అద్భుతంగా ఉండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ బకాయిల కారణంగా ఈ వ్యత్యాసం ప్లస్ నుంచి మైనస్లోకి వెళ్లిపోయింది. 2024–25లో –0.09 శాతానికి పడిపోయింది. ఈ కారణంగా ఈపీడీసీఎల్ గ్రేడ్ మార్కులను భారీగా కోల్పోయింది. ఏపీ ఈపీడీసీఎల్ కేంద్రం విడుదల చేసిన 13వ వార్షిక గ్రేడింగ్ నివేదికలో ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘బీ’ గ్రేడ్కు పడిపోయింది. గతంలో 65.12 మార్కులు సాధించిన డిస్కమ్, తాజాగా 50.46 మార్కులకు పరిమితమైంది. స్టీల్ ప్లాంట్ బకాయిలు సకాలంలో చెల్లించి ఉంటే ఈపీడీసీఎల్ 71.34 మార్కులు సాధించి ‘ఏ’ గ్రేడ్లోనే కొనసాగేది. -
ముగిసిన ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛత వేడుకలు
ఏయూక్యాంపస్ : జీవీఎంసీ, సులభ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్వహించిన ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛత అవగాహన కార్యక్రమాలు ఆదివారం ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్, సైక్లోథాన్తో ముగిశాయి. జీవీఎంసీ అదనపు కమిషనర్ పి. నల్లనయ్య ముఖ్య అతిథిగా పాల్గొని అందరితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యర్థాలను కాలువల్లో వేసి సముద్రాలను కలుషితం చేయవద్దని, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. సులభ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్, ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.పి. సింగ్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో.. ఔత్సాహికులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసి సైక్లోథాన్ నిర్వహించారు. అనంతరం 20 కిలోమీటర్ల సైక్లింగ్ పూర్తి చేసిన విజేతలకు, ఫిషర్మెన్ కమ్యూనిటీ ప్రతినిధులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. -
ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం
మహారాణిపేట: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి, విజయనగరం జిల్లా సంఘం అధ్యక్షుడు సీహెచ్ మురళి ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఎస్.సత్తిబాబు(సూపరింటెండెంట్, పీఐయూ డివిజన్), ప్రధాన కార్యదర్శిగా డి.వి.సీతారామరాజు, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎల్.పూర్ణయ్య ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా ఆర్వీ నాగరాజు, డి.వి.ఎస్ గౌరీపతిరావు, పి.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలుగా పి.రామకృష్ణ, ఎం.వి.హెచ్.ఆర్.స్వామి, వై.రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా సుధారాణి, డి.వి.రమణారాజు, ఎస్.రవికుమార్, బి.వి.ఎస్.ఫణికుమార్, కోశాధికారిగా బి.అర్చన, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా జి.గంగాధర్, ఎస్.త్రినాథ్, సీహెచ్ సింహాచలం, జి.ఎల్.నర్సింహారావులను ఎన్నుకున్నారు. సత్తిబా బు, సీతారామరాజు అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికవడం ఇది నాలుగోసారి. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు నారాయణరావు, విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సహాయ ఎన్నికల అధికారులుగా బి.హెచ్.వి.రమణబాబు, యు.కూర్మారావు వ్యవహరించారు. -
తీరాన వెండి వెన్నెల సోయగం.. అలలపై సీతాకోకచిలుకల నృత్యం
విశాలమైన నీలి సాగరం, నింగిలోని జాబిలిని ప్రేమగా హత్తుకున్న వేళ.. విశాఖ ఆర్కే బీచ్ ఒక అద్భుత వర్ణచిత్రంగా ఆవిష్కృతమైంది. వెండి వెన్నెల కెరటాలపై కురిసి, అలలన్నీ కాంతిపుంజాలై మెరిసిపోతుంటే ప్రకృతి ప్రేమికులు పరవశించిపోయారు. సముద్రంలో వేట సాగిస్తున్న మత్స్యకారుల తెప్పలు, ఆ వెన్నెల వెలుగుల్లో కెరటాలపై లయబద్ధంగా ఊగుతుంటే.. నీటిపై రంగురంగుల సీతాకోకచిలుకలు విహరిస్తున్నాయా అన్నట్లుగా భ్రమను కల్పించాయి. గాలి తరగలకు అనుగుణంగా, అలల ఊయలలో తేలియాడుతున్న ఆ నావల సోయగం సందర్శకుల మనసులను దోచుకుంది. ఆదివారం సాగరతీరంలో అలలపై సాగిన యాటింగ్ బోట్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిరు నావలను జాతీయ స్థాయి చాంపియన్షిప్ల సాధన కోసం ఉపయోగిస్తున్నట్లు సెయిలర్స్ తెలిపారు. అటు ప్రకృతి సౌందర్యం, ఇటు సాహస విన్యాసాల కలయికతో విశాఖ తీరం ఒక అపురూప కావ్యంలా మెరిసిపోయింది. – ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం సరదా కోసం చేసే పనులు ప్రాణాల మీదకు వస్తాయని తెలిసినా, యువతలో మార్పు రావడం లేదు. ఆదివారం సాగర తీరంలో ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు చేస్తూ సాగిన ఈ ప్రయాణం పర్యాటకులను విస్మయానికి గురిచేసింది. మూడు ద్విచక్ర వాహనాలపై యువతీ యువకులు ‘ట్రిపుల్ రైడింగ్’ చేస్తూ అత్యంత వేగంతో దూసుకుపోయారు. ఒక్కో బైకుపై ముగ్గురేసి చొప్పున కూర్చుని, మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ బీచ్ రోడ్డులో హల్చల్ చేశారు. చిత్రమేమిటంటే ఈ మూడు వాహనాలపై వెనుక కూర్చున్న వారు యువతులే కావడం గమనార్హం. హెల్మెట్ లేకపోగా, ముగ్గురు కూర్చుని అతి వేగంగా వెళ్లడం వల్ల ఏ మాత్రం అదుపు తప్పినా ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. ఇటువంటి విన్యాసాలపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సందర్శకులు కోరుతున్నారు. – ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నంరయ్.. రయ్.. రిస్క్ రోయ్..! -
కిలాడీ టెక్కీ.. పోలీసులకు చిక్కి..
అల్లిపురం: పగలు కంప్యూటర్ ముందు కూర్చు ని కోడింగ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజినీర్.. రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లకు కన్నం వేయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, 15 ఏళ్ల వయసులోనే దొంగతనాలు మొదలుపెట్టాడు. నేడు 60 నేరాల రికార్డున్న గజదొంగగా మారిన అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీని విశాఖ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కమిషనరేట్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఈ వివరాలను వెల్లడించారు. నిందితుడి నుంచి 699 గ్రాముల బంగారం, 3.8 కేజీల వెండి, నేరాలకు ఉపయోగించిన బీఎండబ్ల్యూ కారు, నంబర్ ప్లేట్ లేని స్కూటీ, ఐరన్ రాడ్, డ్రిల్లింగ్ మెషిన్, సుత్తి, స్క్రూడ్రైవర్, కట్టింగ్ ప్లయిర్, ఫేస్ మాస్కులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విశాఖ నగరంలో జరిగిన 26 దొంగతనం కేసుల్లో మొత్తం 108.494 తులాల బంగారం, 633.35 తులాల వెండి, నగదు రూ.40,500ను సన్నీ చోరీ చేసినట్లు సీపీ వెల్లడించారు. అసలేం జరిగిందంటే? గత ఏడాది అక్టోబర్ 10న గాజువాకలోని ఎన్టీఆర్ నగర్లో నివాసం ఉంటున్న కన్నా శివ రామకృష్ణ తన కుమార్తె డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం తన కుటుంబంతో అరుణాచలం వెళ్లారు. కాకినాడకు చెందిన సన్నీ వారి ఇంటి తాళాలు పగలగొట్టి 17 తులాల బంగారం, 30 తులాల వెండిని ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న గాజువాక క్రైం ఇన్స్పెక్టర్ కల్లూరి శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే గాజువాక, ఆరి లోవ, మల్కాపురం, పెందుర్తి, దువ్వాడ ప్రాంతాల్లో ఒకే తరహా దొంగతనాలు జరగడంతో పోలీసులు దీనిని సవాలుగా తీసుకున్నారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నగరంలోని మాధవస్వామి కల్యాణ మండపం సమీపంలోని పార్క్ స్ట్రీట్లో నివాసం ఉంటున్న సన్నీని శనివారం గాజువాకలోని మింది ఆర్చ్ రోడ్ వద్ద క్రైం ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇదీ సన్నీ నేర చరిత్ర నిందితుడు మహేష్ రెడ్డి పీజీ పూర్తి చేశాడు. హైదరాబాద్లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే చిన్నతనం నుంచే విలాసాలకు అలవాటు పడటంతో 15 ఏళ్లకే దొంగతనాలకు శ్రీకారం చుట్టాడు. పీఎంపాలెం పరిధిలో నాలుగు దొంగతనాలు చేసి తొలిసారి జువైనెల్ హోంకి వెళ్లాడు. అక్కడి నుంచి విడుదలైన తర్వాత కాకినాడ, సర్పవరం, రామచంద్రాపురం, రాజమండ్రి పరిసరాల్లో 32 దొంగతనాలు చేశాడు. ఈ క్రమంలో పట్టుబడి రాజమండ్రి జైలులో 14 నెలలు శిక్ష కూడా అనుభవించాడు. ఇలా మొత్తం 60కి పైగా దొంగతనాలు చేశాడు. అప్పుడప్పుడు విశాఖ వచ్చి దొంగతనాలు చేసి, మళ్లీ హైదరాబాద్ వెళ్లి విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. ఎట్టకేలకు అతన్ని విశాఖ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. -
దుమ్మురేపిన రైడర్లు
ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్విశాఖ స్పోర్ట్స్: జీవీఎంసీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా శనివారం రాత్రి నేషనల్ సూపర్ క్రాస్ చాంపియన్షిప్ ఉత్కంఠగా సాగింది. ఎంఆర్ఎఫ్ మోగ్రిప్–ఎఫ్ఎంఎస్సీఐ ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారిగా జరిగిన ఈ సీజన్ కై ్లమాక్స్ మోటార్ స్పోర్ట్స్ ప్రేమికులను మంత్రముగ్ధులను చేసింది. రాష్ట్ర క్రీడలు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ పోటీలను జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఇలాంటి జాతీయ స్థాయి సాహస క్రీడలు నిర్వహించడం నగర ప్రతిష్టను పెంచుతుందని, యువతకు ఇదొక మంచి స్ఫూర్తి అని పేర్కొన్నారు. హోరాహోరీగా సాగిన రేస్ ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వచ్చిన సుమారు 120 మంది రేసర్లు పాల్గొని 9 విభిన్న విభాగాల్లో(క్లాస్ల్లో) పోటీపడ్డారు. సాధారణ మోటోక్రాస్ మాదిరిగా కాకుండా, స్టేడియంలో ప్రత్యేకంగా రూపొందించిన సూపర్క్రాస్ ట్రాక్పై ఈ రేస్ సాగింది. టైట్ టర్న్లు, రిథమ్ సెక్షన్స్, ఎత్తైన టెక్నికల్ జంప్లతో కూడిన ఈ ట్రాక్పై రైడర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఫ్లడ్లైట్ల వెలుతురులో, దుమ్ము రేపుతూ బైకులు గాలిలో ఎగురుతూ చేసిన విన్యాసాలు క్రీడాభిమానులను ఉర్రూతలూగించాయి. గ్రాండ్ ఫినాలే విజేతలు సీజన్ పొడవునా పాయింట్లు సాధించి ఫైనల్స్కు చేరిన రైడర్లు ఇక్కడ తమ సత్తా చాటారు: ఎస్ఎక్స్1 ప్రీమియర్ కేటగిరీలో శ్లోక్, ప్రజ్వల్, ఇక్షన్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఎస్ఎక్స్2 విభాగంలో ర్యాన్, జాబీ, సుహైల్లు తమ బైకులతో మెరుపులు మెరిపించారు. ఇండియన్ ఎక్స్పర్ట్స్, జూనియర్ క్లాస్లో ఇమ్రాన్, జినేంద్ర, షిండే. చైతన్య వంటి రైడర్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఎస్ఎక్స్1 ఫారిన్ ఓపెన్ క్లాస్ రేస్లోనూ తీవ్ర పోటీ జరిగింది. నిర్వాహకులు ఈ పోటీలకు ఉచిత ప్రవేశం కల్పించడంతో విశాఖ వాసులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. ఇంజిన్ల మోత, అభిమానుల కేరింతల మధ్య పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ఆయన జ్ఞాన నిధి.. ఆస్తిక హేతువాది
సీతంపేట: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం(అరసం) జిల్లా శాఖ ఆధ్వర్యంలో.. విశాఖ పౌర గ్రంథాలయంలో సాహితీవేత్త, ఏయూ విశ్రాంత ఆచార్యుడు చందు సుబ్బారావు సంస్మరణ సభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్తలు చందు సుబ్బారావు చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన సాహితీ సేవలను కొనియాడారు. అరసం రాష్ట్ర నాయకుడు ఉప్పల అప్పలరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ సభకు యూపీఎస్సీ పూర్వ సభ్యుడు ఆచార్య కె.ఎస్.చలం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చందు సుబ్బారావుతో తనకు 50 ఏళ్ల పరిచయం ఉందని, ఆయన అటు సైన్స్కు, ఇటు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఆయన ఒక ఆస్తిక హేతువాది అని పేర్కొన్నారు. అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ చందు సుబ్బారావును జ్ఞాన నిధిగా అభివర్ణించారు. విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. తన పుస్తకాలన్నింటినీ సుబ్బారావు క్షుణ్ణంగా చదివి విశ్లేషించేవారని గుర్తు చేసుకున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య బాలమోహన్ దాస్ మాట్లాడుతూ.. సుబ్బారావు పద్య జ్ఞానాన్ని, ఆయన ధారణా శక్తిని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, జీఎస్ చలం, ఆచార్య వెలమల సిమ్మన్న, డాక్టర్ డి.వి.సూర్యారావు, ఆచార్య రాజేంద్రప్రసాద్, డాక్టర్ మాటూరు శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ తాడి ప్రకాష్ తదితర ప్రముఖులు పాల్గొని సుబ్బారావుకు నివాళులర్పించారు. చందు సుబ్బారావుకు సాహితీవేత్తల నివాళి -
ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ వేగవంతం
కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశం మహారాణిపేట: అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జేసీ జి.విద్యాధరితో కలసి డీఆర్వో సత్తిబాబు, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఆర్ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రమబద్ధీకరణ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ నెల 18లోగా పట్టాలు పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. మిగిలిన వాటిని మార్చి 31లోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీవో 388 పరిధిలో దరఖాస్తు చేసుకుని ఒక్క రూపాయి కూడా చెల్లించని దరఖాస్తులను రద్దు చేసి, ఆ దరఖాస్తుదారులను జీవో 30 కింద కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించాలన్నారు. గాజువాక ప్రాంతంలో జీవో 45 కింద ఆమోదం పొందిన దాదాపు 1,000 పట్టాలను సిద్ధం చేసి, ఈ నెల 18 నాటికి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. జీవో 296, 388 కింద ఉన్న కన్వేయన్స్ డీడ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, సుమారు 2,000 కన్వేయన్స్ డీడ్లను మార్చి నెలాఖరు కల్లా పూర్తి చేయాలని తెలిపారు. ఈ ప్రక్రియలో ఉన్న పెండింగ్ పనులను ఈ నెల చివరి నాటికి ప్రాథమికంగా ముగించాలని స్పష్టం చేశారు. జీవో 84, 27 ప్రకారం యూఎల్సీ భూములపై అధికారులతో సమీక్షించారు. అలాగే 22ఏ డీ–నోటిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్పై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. -
ఆకట్టుకుంటున్న నేషనల్ సిల్క్ ఎక్స్పో
అల్లిపురం: తెలుగు సంవత్సరాది ఉగాది, వివాహాల సీజన్ను పురస్కరించుకుని ‘నేషనల్ సిల్క్ ఎక్స్పో’ సంప్రదాయ వస్త్ర ప్రదర్శనను వాల్తేరు మెయిన్ రోడ్డులోని హోటల్ గ్రీన్ పార్క్లో నిర్వహిస్తున్నారు. శనివారం ప్రారంభమైన ఈ ఎక్స్పో ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత పట్టు చీరలు, డిజైనర్ వస్త్రాలు, బ్లౌజులు, కుర్తీలు, దుపట్టాలు, సల్వార్ మెటీరియల్ ఒకేచోట ప్రదర్శనలో ఉన్నాయి. పైథానీ, బెంగళూరు సిల్క్, కంజీవరం, బనారస్, చందేరి, మహేశ్వరి, జమ్దానీ, బలుచారి, బంధిని, భాగల్పూర్, కశ్మీర్ సిల్క్ తదితర ప్రసిద్ధ చేనేత ఉత్పత్తులు లభిస్తున్నాయి. దేశ నలుమూలల నుంచి వచ్చిన నేత కార్మికులు తమ ఉత్పత్తులను 50 శాతం వరకు తగ్గింపుతో విక్రయిస్తున్నారు. ఈ ప్రదర్శన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ప్రవేశం ఉచితం. అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులు స్వీకరిస్తారు. -
అరాచకం!
ప్రభుత్వ నీడలో ఏయూలో ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టాలంటూ ఒత్తిళ్లు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఆంధ్రా యూనివర్శిటీలో సంబరాల సందడి కంటే, బెదిరింపుల హడావుడే ఎక్కువగా వినిపించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒక పవిత్రమైన విద్యా వ్యవస్థలో నాన్–టీచింగ్ స్టాఫ్కు చెందిన ఓ వ్యక్తి రిజిస్ట్రార్ పేరుతో బెదిరింపులకు దిగిన ఘటన ఇప్పుడు ఏయూలో చర్చనీయాంశంగా మారింది. ప్రింటింగ్ ప్రెస్కు సంబంధించిన ఐటెమ్స్, స్టేషనరీని గత ప్రభుత్వ హయాంలో బయట విక్రయించారంటూ ఫిర్యాదు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు, ఖాళీ పేపర్లపై సంతకాలు చేసి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం మొత్తం ఏయూ రిజిస్ట్రార్ పేరుతోనే సాగుతున్నట్టు సమాచారం. ఖాళీ పత్రాలపై సంతకాలు చేయకపోతే పదోన్నతులు ఇవ్వమంటూ బెదిరింపులకు దిగినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఏయూ వాతావరణాన్ని కలవరపెట్టడమే కాకుండా, సిబ్బందిలో భయాందోళనలు సృష్టిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఏయూ సౌత్ క్యాంపస్లోని ఏయూ ప్రెస్ సిబ్బంది నేరుగా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయడంతో పాటు, గవర్నర్ పీఎస్, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి కూడా ఫిర్యాదు కాపీ పంపడం గమనార్హం. మూల్యాంకన సమయంలో అనధికార జోక్యం ఏయూలోని వాల్యూయేషన్ క్లస్టర్లో పరీక్షా పత్రాల మూల్యాంకనం జరుగుతున్న సమయంలోనే, ఈ నెల 4వ తేదీన బెదిరింపుల వ్యవహారం చోటుచేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన నాన్–టీచింగ్ స్టాఫ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి, గత ప్రభుత్వ హయాంలో ప్రింటింగ్ ప్రెస్లో అవకతవకలు జరిగాయని, స్టేషనరీని బయట విక్రయించారంటూ ఫిర్యాదు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ఖాళీ పత్రాలపై సంతకాలు చేస్తే మిగతా విషయాలు తామే రాసుకుంటామని చెప్పినట్టు ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రార్ పేరుతో బెదిరింపులు ఫిర్యాదు చేయకపోతే పదోన్నతులు ఉండవంటూ భయపెట్టినట్టు ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రిజిస్ట్రార్ పేరును ప్రస్తావించడమే అసలు వ్యవహారంలో కీలకంగా మారింది. దీనిపై రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయడంతో పాటు, అదే కాపీని ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, గవర్నర్ పీఎస్కు కూడా పంపారు. మొత్తంగా ఈ వ్యవహారం ఏయూ ప్రతిష్టను దెబ్బతీసి, ఓ ప్రైవేటు విద్యా సంస్థకు లబ్ధి చేకూర్చే కుట్రలో భాగమేనన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నాడు ఘనచరిత్ర గత ప్రభుత్వ హయాంలో దేశంలోనే అరుదైన గౌరవంగా ఏయూకు న్యాక్ ‘ఏ++’ గ్రేడ్ లభించింది. క్యూములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (సీజీపీఏ) 3.74గా నమోదై, ఈ స్థాయి స్కోరు సాధించిన దేశంలోని మూడు యూనివర్శిటీల్లో ఒకటిగా ఏయూ నిలిచింది. స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లు, చైర్ ప్రొఫెసర్ల నియామకం, 100 పేటెంట్లకు దరఖాస్తులు వంటి అనేక వినూత్న చర్యలు చేపట్టారు. ‘ఏ హబ్’ ద్వారా యువతకు ప్రోత్సాహం అందించడంతో సుమారు 150 స్టార్టప్స్ ఏర్పడ్డాయి. దూరవిద్యలో డిఫెన్స్ కోర్సులు ప్రవేశపెట్టి డిఫెన్స్ రంగంలో పనిచేసేవారికి ఉపయోగకరంగా మార్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యంశాల్లో మార్పులు తెచ్చారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ల విషయంలో కూడా ఏయూ కొత్త చరిత్రను లిఖించిందనే చెప్పవచ్చు. ఏయూను దెబ్బతీసే యత్నమా? ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఒక పద్ధతి ప్రకారం ఏయూను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిఫెన్స్ కోర్సులను దూరవిద్య నుంచి తొలగించడం, క్యాంపస్ ప్లేస్మెంట్లను తగ్గించడం, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసి ఏయూ నుంచి దూరం చేసే యత్నం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లు తగ్గిపోవడంతో ఇంజనీరింగ్ విద్యార్థులు ఇతర ప్రైవేటు కాలేజీల్లో జరిగే డ్రైవ్స్పై ఆధారపడాల్సి వస్తోంది. హాస్టళ్లలో అన్నం సరిగా పెట్టడం లేదంటూ విద్యార్థులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో ఏయూ ప్రగతిని ముందుకు తీసుకెళ్లే చర్యలు చేపట్టకుండా, ప్రింటింగ్ ప్రెస్లో సమావేశాలు పెట్టి తప్పుడు ఫిర్యాదులకు ఒత్తిడి తెస్తున్న ఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. లేవంటే ప్రమోషన్లు దక్కవంటూ హెచ్చరికలు వాల్యూయేషన్ సెంటర్లో అనధికారిక సమావేశాలు రిజిస్ట్రార్ పేరుతో నాన్–టీచింగ్ స్టాఫ్కు చెందిన రమణ అడ్డగోలు వ్యవహారం -
ఎంఎస్ఎంఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీ రతన్కుమార్ అల్లిపురం: ఎంఎస్ఎంఈ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిదని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ. రతన్కుమార్ అన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన ఎంఎస్ఎంఈ రుణ ప్రోత్సాహక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి సృష్టి, స్థానిక వ్యాపారాల అభివృద్ధిలో ఎంఎస్ఎంఈ రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఎంఎస్ఎంఈ వ్యాపారులకు ఆర్థిక సహకారం అందించడంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ ముందుంటుందన్నారు. సరైన మార్గదర్శకత్వం, అనుకూలమైన రుణ పథకాల ద్వారా వ్యాపారుల ఎదుగుదలకు బ్యాంక్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉన్నతాధికారులతో పాటు డి.వి.ఎస్.ఆర్. మూర్తి (అసిస్టెంట్ డైరెక్టర్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్), ఆదిశేషు (జనరల్ మేనేజర్, డీఐసీ) పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సబ్సిడీలు, వాటి అర్హత ప్రమాణాలు, ప్రయోజనాలపై అధికారులు వివరించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, డా. బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, పార్వతీపురం జిల్లాల పరిధిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల నుంచి పాల్గొన్న కస్టమర్లకు మొత్తం రూ.94.22 కోట్ల విలువైన ఎంఎస్ఎంఈ రుణ మంజూరు పత్రాలను అందజేశారు. -
ఐటీ హిల్స్కు మరో రెండు బస్సులు
మద్దిలపాలెం: ఐటీ ఉద్యోగుల కోసం మధురవాడ ఐటీ హిల్స్కు అదనంగా మరో రెండు ప్రత్యేక బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి శనివారం మద్దిలపాలెం డిపోలో ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న 8 బస్సులకు అదనంగా వీటిని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక బస్సు కొత్తవలస నుంచి, మరొకటి విజయనగరం నుంచి మధురవాడకు నడపనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు చేయనున్న 700 ఎలక్ట్రికల్ బస్సుల్లో, 100 బస్సులను విశాఖ జిల్లాకే కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీ్త్ర శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించడంలో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. సంక్రాంతి సీజన్లో అధిక ఆదాయాన్ని సాధించినందుకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే అర్హులైన కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లకు పదోన్నతి పత్రాలను మంత్రి పంపిణీ చేశారు.కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘శిఖర్ సే సాగర్ తక్’ స్ఫూర్తిదాయకం
ఏయూక్యాంపస్: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ, సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఎస్ఎస్ఓ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛత, అవగాహన కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. రెండు రోజుల కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం బీచ్ రోడ్లోని జోడుగుల్లపాలెం, కై లాసగిరి రోప్వే వద్ద 5, 10 కిలోమీటర్ల స్వచ్ఛత రన్, 3 కిలోమీటర్ల స్వచ్ఛత వాక్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్లో సైకత శిల్పాల తయారీ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం జీవీఎంసీ అదనపు కమిషనర్లు పి.నల్లనయ్య, డీవీ రమణమూర్తి, సులభ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్, మాజీ ఐఏఎస్ అధికారి పంకజ్ జైన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్.పి.సింగ్ తదితరులతో కలిసి ప్రజలతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్లు మాట్లాడుతూ హిమాలయాల నుంచి సముద్రాల వరకు పరిశుభ్రతపై సులభ్ ఇంటర్నేషనల్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాయన్నారు. సులభ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు నాలుగు దశలుగా నిర్వహిస్తామని, విశాఖలో మొదటి దశ విజయవంతంగా ప్రారంభమైందన్నారు. కార్యక్రమం ముగింపులో స్వచ్ఛత రన్, వాక్, సైకత శిల్పాలు, పెయింటింగ్ పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ.ఎన్.వి. నరేష్కుమార్, జోనల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. -
డబ్బులిస్తే పాస్?
మహారాణిపేట: కేజీహెచ్ అనుబంధ ప్రభుత్వ నర్సింగ్ స్కూల్లో నిర్వహిస్తున్న జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ(జీఎన్ఎం) వార్షిక పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరీక్షల్లో భారీగా మాస్ కాపీయింగ్ జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో.. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ అధికారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముగ్గురు విద్యార్థినులు కాపీ కొడుతూ దొరికిపోవడంతో వారిని డిబార్ చేశారు. అయినప్పటికీ మాస్ కాపీయింగ్ ఆగలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీఎన్ఎం వార్షిక పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్లలో ఈ నెల 5 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 13వ తేదీ వరకు జరుగుతాయి. కేజీహెచ్లో జరుగుతున్న పరీక్షల్లో మొదటి, రెండో ఏడాది నుంచి 1,200, మూడో ఏడాది నుంచి 800 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. అయితే పరీక్షల నిర్వహణ తీరు, మాస్ కాపీయింగ్కు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏపీ నర్సింగ్ కౌన్సిల్ డైరెక్టర్ సునీత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థిలను గుర్తించి డిబార్ చేశారు. జీఎన్ఎం కోర్సు ప్రాధాన్యత : జీఎన్ఎం అనేది మూడున్నర ఏళ్ల డిప్లమో కోర్సు. ఇందులో మూడేళ్ల విద్యాభ్యాసం తర్వాత ఆరు నెలల పాటు తప్పనిసరి ఇంటర్న్షిప్ ఉంటుంది. ప్రసూతి సంరక్షణ, మానసిక ఆరోగ్య సంరక్షణ, పోస్ట్ ట్రామాటిక్ కేర్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి తక్షణ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అందుకే ఈ కోర్సు పూర్తి చేయడానికి కొంత మంది అడ్డదారులు తొక్కుతున్నారు. అధ్యాపకులపై ఆరోపణలు : ఈ పరీక్షల నిర్వహణలో కొంతమంది అధ్యాపకుల పాత్రపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థినులను ఉత్తీర్ణులు చేస్తామని నమ్మబలికి, కాపీయింగ్కు సహకరించేందుకు కొంతమంది సిబ్బంది పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పరీక్ష హాల్లోనే విద్యార్థులకు సహకరించడం, మొబైల్ ఫోన్లు లేదా చిట్టీల ద్వారా సమాచారాన్ని అందించడం వంటి అక్రమా లు జరుగుతున్నాయని స్థానికంగా చర్చ నడుస్తోంది. కాగా.. ఈ ఆరోపణలను ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ బి.మంగాదేవి ఖండించారు. పరీక్షలు పారదర్శకమైన వాతావరణంలో జరుగుతున్నాయని, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. మాస్ కాపీయింగ్ను అరికట్టేందుకు ప్రత్యేక స్క్వాడ్లను కూడా నియమించామని, ఎటువంటి అక్రమాలకు తావు లేదని స్పష్టం చేశారు. -
సింహాచలం దేవస్థానం ఈవోగా వెంకటరావు
సింహాచలం : సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జే.వెంకటరావు నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయశాఖ ఎక్స్ అఫీషియో ప్రభుత్వ కార్యదర్శి ఎం. హరిజవహర్లాల్ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కాకినాడ డీఆర్వోగా విధుల్లో ఉన్న వెంకటరావును ఏడాది కాలపరిమితితో డిప్యుటేషన్పై సింహాచలానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నూతన ఈవోగా నియమితులైన వెంకటరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గత బుధవారమే ప్రిన్సిపాల్ సెక్రటరీ నుంచి బదిలీ ఉత్తర్వులు రాగా, శుక్రవారంతో దేవదాయశాఖ ప్రక్రియ కూడా పూర్తయింది. జీవీఎంసీ అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ శుక్రవారం జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులతో సమీక్షించారు. పూర్ణామార్కెట్ సమీపాన వెలంపేట మురికివాడ ప్రాంతంలో నివసిస్తున్న 177 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి మంత్రి నారాయణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇళ్ల నిర్మాణంలో ఆర్థికపరమైన అంశాల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, టౌన్ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత ఇతర అధికారులతో సమీక్షించారు. పాత స్పెషల్ రైళ్లే కొత్తవిగా ప్రకటనతాటిచెట్లపాలెం : ప్రస్తుతం నడుస్తున్న పాత స్పెషల్ రైళ్లను హోలీ స్పెషల్స్గా రైల్వే అధికారులు తెలియజేస్తున్నారు. అంతేగానీ కొత్తగా హోలీ పండక్కి కొత్త రైళ్లేమీ వేయలేదు. ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో నడుస్తున్న సుమారు 62 స్పెషల్ రైళ్లు మార్చి నెలాఖరు వరకు హోలీ స్పెషల్స్ పేరుతో నడుపుతున్నారు. సంబల్పూర్–ఈరోడ్–సంబల్పూర్, విశాఖపట్నం–తిరుపతి–విశాఖపట్నం, విశాఖపట్నం–ఎస్ఎంవీబి బెంగళూరు–విశాఖపట్నం, విశాఖపట్నం–చర్లపల్లి–విశాఖపట్నం, విశాఖపట్నం–షాలిమర్–విశాఖపట్నం, పూరీ–పాట్నా–పూరీ, పూరీ–ఉధ్నా–పూరీ, భువనేశ్వర్–యశ్వంత్పూర్–భువనేశ్వర్, భువనేశ్వర్–ధన్బాద్–భువనేశ్వర్ రైళ్లు మార్చి వరకు నడుస్తాయి. -
దాడులకు భయపడం
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామలగాజువాక : తిరుమల లడ్డూ వివాదంలో తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు. శుక్రవారం గాజువాకలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ నివేదికలోనే స్పష్టమైందని, దీంతో ఏం చేయాలో పాలుపోక కూటమి నేతలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ చేసిన తప్పుడు ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి నేతల ఇళ్లపై పెట్రోలు బాంబులతో దాడులు చేయడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని దాడులు చేసినా తాము వెనకడుగు వేయబోమని, తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కోసం ప్రాణాలకు తెగించి పోరాడతామని శ్యామల స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులను ప్రశ్నించకుండా అడ్డుకోవాలనుకోవడం భ్రమ అని, 2029లో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గాజువాక మహిళా విభాగం అధ్యక్షురాలు పల్లా చినతల్లి, 68వ వార్డు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సండ్రాన నూకరాజు పాల్గొన్నారు. -
వికసిత భారత్ దిశగా అడుగులు వేయాలి
20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ లంక దినకర్ మహారాణిపేట: ‘వికసిత భారత్’ సంకల్పం, ‘స్వర్ణాంధ్ర–2047’ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలని 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ లంక దినకర్ కోరారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజులతో కలసి విద్య, వైద్యం, జలజీవన్ మిషన్, పీఎం.సూర్యఘర్ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖను వికసిత విశాఖ జిల్లాగా తీర్చిదిద్దడానికి అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజల ఆరోగ్యానికి స్వచ్ఛమైన నీరు అత్యంత అవసరమని, అందుకే జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, పథకంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. జిల్లాలో వైద్య, విద్య శాఖల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నందుకు అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రోత్ రేట్ పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రంజీ సమరంలో విశాఖ కుర్రాళ్ల జోరు
విశాఖ స్పోర్ట్స్ : కల్యాణ్ వేదికగా బెంగాల్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ నాకౌట్ పోరులో ఆంధ్ర జట్టు తొలి రోజే తన ఆధిపత్యాన్ని చాటుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినా, విశాఖ కుర్రాళ్లు పట్టుదలతో రాణించడంతో ఆంధ్ర గౌరవప్రదమైన స్థితికి చేరుకుంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ రికీ భుయ్ తన ఫామ్ను కొనసాగిస్తూ 83 పరుగులతో (8 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ముందుండి నడిపించాడు. లీగ్ దశలోనే పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న రికీ, ఈ కీలక మ్యాచ్లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ అర్ధ సెంచరీకి చేరువగా వచ్చి 47 పరుగుల వద్ద రెండో వికెట్గా వెనుదిరిగినప్పటికీ, జట్టుకు మంచి పునాది వేశాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డితో కలిసి రికీ భుయ్ ఐదో వికెట్కు ఏకంగా 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి బెంగాల్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 33 పరుగులు చేసిన నితీష్ కుమార్, ముకేశ్ బౌలింగ్లో అవుట్ కావడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర ఆరు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం శశికాంత్ ఏడు పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. గత రికార్డులను పరిశీలిస్తే బెంగాల్పై ఆంధ్ర జట్టుకే పైచేయి కనిపిస్తోంది. ఇప్పటివరకు తలపడిన ఐదు మ్యాచ్లలో ఆంధ్ర రెండుసార్లు విజయం సాధించగా, మిగిలిన మూడు మ్యాచ్లు డ్రా అయ్యాయి. బెంగాల్పై రికీ భుయ్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 175 పరుగులు కాగా, బౌలింగ్లో శశికాంత్ 55 పరుగులకే 5 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. బెంగాల్ పేసర్ షమీ బౌలింగ్ను ఎదుర్కొంటూ మిగిలిన రోజుల్లో ఆంధ్ర బ్యాటర్లు భారీ స్కోరు సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. భరత్నితీష్శశికాంత్రికీ,నితీష్ సెంచరీ భాగస్వామ్యం -
● ఒకే వైపు రెండు రైళ్లు!
సాధారణంగా రైల్వే ట్రాక్పై ఒక రైలు వస్తుంటేనే వాహనదారులు, ప్రయాణికులు ఎంతో జాగ్రత్తగా గమనిస్తుంటారు. అలాంటిది ఒకేచోట పక్కపక్క ట్రాక్లపై రెండు రైళ్లు ఒకేవైపు వెళ్తూ ఏకకాలంలో కనిపిస్తే ఆ ఉత్కంఠే వేరు. శుక్రవారం డుంబ్రిగుడ రైల్వే గేటు సమీపంలో ఇలాంటి అరుదైన దృశ్యమే స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తున్నాయేమోనని మొదట కొందరు ఆందోళన చెందినప్పటికీ.. తీరా చూస్తే అవి రెండూ రైల్వే విభాగానికి చెందిన ప్రత్యేక వాహనాలని అర్థమైంది. అందులో ఒకటి ట్రాక్ మరమ్మతులు చేసే యంత్రం కాగా, మరొకటి విద్యుత్ లైన్ల తనిఖీ కోసం వాడే రైలు. ఈ రెండు రైళ్లు పక్కపక్కనే ఉన్న పట్టాలపై ప్రయాణించడంతో ప్రయాణికులు ఆ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. అమ్మో రెండు రైళ్లా!.. అని కంగారు పడినవారు, అవి పని నిమిత్తం వెళ్తున్న వాహనాలని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. – డుంబ్రిగుడ -
ఐఎఫ్ఆర్ వేడుకలకు రెడీ
ఆర్.కె.బీచ్ అంతర్జాతీయ నౌకల ప్రదర్శన వేడుకలకు ముస్తాబవుతోంది. ఒకవైపు సముద్ర తీరంలో యుద్ధ నౌకల సందడి నెలకొనగా, మరోవైపు నగర సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఐఎఫ్ఆర్ ఏర్పాట్లలో భాగంగా బీచ్ రోడ్డులోని విద్యుత్ స్తంభాలకు రంగులు వేస్తూ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక వేడుకల కోసం అటు అధికారులు, ఇటు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
గాల్లో విన్యాసాలు
నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అల్లిపురం : నగరంలో శనివారం నిర్వహించనున్న ఎంఆర్ఎఫ్ మోగ్రిప్ ఎఫ్ఎంఎస్సీఐ నేషనల్ సూపర్ క్రాస్ చాంపియన్షిప్ రేసింగ్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నిబంధనలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గాజువాక , కంచరపాలెం మీదుగా కాన్వెంట్ జంక్షన్ వైపు వచ్చే వారు పోర్ట్ లోపల రోడ్డు పక్కన వాహనాలను పార్క్ చేసి, చిలకల జంక్షన్ మీదుగా నడుచుకుంటూ వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. పూర్ణా మార్కెట్ , టౌన్ కొత్త రోడ్ నుంచి వచ్చేవారు గోపాల్ ఆటో జంక్షన్ వద్ద ఉన్న జీవీఎంసీ సీవేజ్ వాటర్ ట్యాంక్ వద్ద తమ వాహనాలను పార్కింగ్ చేయాలి. అలాగే నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి డాల్ఫిన్, అద్వానీ మీదుగా కాన్వెంట్ జంక్షన్కు వచ్చే వారు కూడా పోర్ట్ లోపల కేటాయించిన స్థలంలోనే వాహనాలను నిలపాలి. కేవలం వీఐపీ, వీవీఐపీ పాసులు ఉన్న వారికి మాత్రమే మున్సిపల్ స్టేడియం లోపల వాహనాల పార్కింగ్కు అనుమతి ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు ప్రశాంతంగా సాగేందుకు ప్రజలందరూ ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
విశాఖ తల్లఢిల్లీ
మించిపోయిన వైజాగ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టుఏయూక్యాంపస్: పర్యాటక కేంద్రంగా వెలుగొందుతున్న విశాఖలో గాలి నాణ్యత రోజురోజుకూ దిగజారుతోంది. తాజా గణాంకాల ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో నమోదైన 195 ఏక్యూఐ కంటే ఎక్కువగా విశాఖలో 205 ఏక్యూఐ నమోదు కావడం నగరవాసులను ఉలిక్కిపడేలా చేస్తోంది. ముఖ్యంగా ఫిబ్రవరి 6వ తేదీ మధ్యాహ్నం నాటికి హైదరాబాద్, ఢిల్లీ వంటి మెట్రో నగరాలను సైతం వెనక్కి నెట్టి విశాఖ కాలుష్యంలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. గత జనవరి నెలలో మెజారిటీ రోజులు గాలి నాణ్యత అనారోగ్యకరమైన స్థాయిలోనే కొనసాగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి జరిపిన పరీక్షల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పోలీస్ బ్యారక్స్ వంటి ప్రాంతాల్లో ఏక్యూఐ ఏకంగా 305కు చేరుకుని ‘వెరీ పూర్’ విభాగంలోకి వెళ్లగా, మాధవధార వంటి నివాస ప్రాంతాల్లో కూడా కాలుష్యం పరిమితికి లోబడే ఏమీ లేదు. మింది, ఆటోనగర్, మల్కాపురం, సీతమ్మధార వంటి పారిశ్రామిక, రద్దీ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. గాలిలో పీఎం 2.5, పీఎం 10 కణాలు పెరిగిపోవడంతో పాటు కార్బన్ మోనాౖక్సైడ్, సల్ఫర్ డయాకై ్సడ్ వంటి విషవాయువులు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు, పెరుగుతున్న వాహన రద్దీ విశాఖలో గాలి విషతుల్యం కావడానికి ప్రధానంగా పోర్ట్ కార్యకలాపాలు, భారీ పరిశ్రమలు కారణమవుతున్నాయి. పోర్ట్ ప్రాంతంలో బొగ్గు, ఇతర లోహాల ఎగుమతి దిగుమతుల సమయంలో వెలువడే ధూళి గాలిని కలుషితం చేస్తోంది. దీనికి తోడు హెచ్పీసీఎల్, స్టీల్ ప్లాంట్, ఫార్మా రంగానికి చెందిన ఉద్గారాలు తోడవుతున్నాయి. నగరంలో నానాటికీ పెరుగుతున్న వాహనాల సంఖ్య, డీజిల్ యంత్రాల వినియోగం మరియు నిర్మాణ రంగం నుంచి వెలువడే దుమ్ము ధూళి వాతావరణాన్ని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. ఇవన్నీ కలిసి నగరాన్ని కాలుష్య కాసారంగా మారుస్తున్నాయి. నగర ప్రజలపై తీవ్ర ప్రభావం ప్రస్తుతం విశాఖలో గాలి నాణ్యత క్షీణత ఏ స్థాయిలో ఉందంటే, నగరంలో నివసించే ప్రతి వ్యక్తి రోజుకు సగటున మూడు సిగరెట్లు కాల్చినప్పుడు ఊపిరితిత్తులకు ఎంత నష్టం జరుగుతుందో, అంత నష్టానికి గురవుతున్నారు. అంటే నెలకు దాదాపు 81 సిగరెట్లు తాగినంత ప్రభావం ఆరోగ్యంపై పడుతోంది. దీనివల్ల ఆస్తమా, సైనస్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాస్కులు ధరించడం, అవసరమైతే ఎయిర్ ప్యూరిఫైర్లను వాడటం, రద్దీ సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండటం ప్రాణరక్షణకు అత్యవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ముగిసిన ఎన్ఎస్జీ విన్యాసాలు
మహారాణిపేట: తూర్పు నావికదళం, ఎన్ఎస్జీ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా జరిగిన ‘వ్యాయాస్’ విన్యాసాలు శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. పీఎం పాలెం సమీపంలోని కంబాలకొండ ఫారెస్ట్ వద్ద జరిగిన ముగింపు కార్యక్రమ వివరాలను గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ డాక్టర్ సుమిత్ గరుడ్ వెల్లడించారు. నక్సల్స్ కార్యకలాపాలను ఎదుర్కోవడం, అత్యవసర సమయాల్లో వివిధ విభాగాల మధ్య సమన్వయం లక్ష్యంగా ఈ శిక్షణ సాగింది. ఇందులో ఏపీ పోలీస్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలతో పాటు అటవీ, అగ్నిమాపక, వైద్య విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా ఎలా స్పందించాలో ఈ విన్యాసాలు చాటిచెప్పాయని కమాండర్ పేర్కొన్నారు. -
మరమ్మతుల బిల్లులు!
నామినేషన్ పద్ధతిలో అప్పగింత జీవీఎంసీ అధికారుల అవినీతి లీలలు సమావేశంలో ఆమోదం పొందకున్నా బిల్లుల చెల్లింపులా? చక్రం తిప్పుతున్న ఓ అధికారి, అనధికారిక పీఏ ఇద్దరిపై ఇప్పటికే ఏసీబీ ఆరాసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : మొబైల్ టాయిలెట్లు, బండరాళ్ల తొలగింపుతో పాటు ఆర్కే బీచ్ సాక్షిగా జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారుల అవినీతికి ఇది మరో సజీవ ఉదాహరణగా నిలుస్తోంది. వాస్తవానికి ఈ ఎకో బజార్ను ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వినియోగంలో లేకుండా మూసివేశారు. అయినప్పటికీ యోగా డే సందర్భంగా హఠాత్తుగా మరమ్మతుల పేరిట రూ.3.5 లక్షలు వెచ్చించారు. అంతేకాదు, ఈ పనులను నామినేషన్ పద్ధతిలో చేపట్టామని పేర్కొంటూ ఆమోదం కోసం స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రతిపాదనలు సమర్పించారు. దీనికి స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదముద్ర వేసింది. మూసివేసిన షాప్నకు మరమ్మతులు చేశామంటూ ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సమర్పించడం, స్టాండింగ్ కమిటీ కళ్లు మూసుకుని ఆమోదించడం జరిగిపోయాయి. ఇదిలా ఉండగా, యోగా డే సందర్భంగా కొత్తవాటిని కొనుగోలు చేసే ధరతో సమానంగా, కేవలం ఒకరోజు ఉపయోగానికి రూ.16,200 అద్దె చెల్లించి మొబైల్ టాయిలెట్ల ఏర్పాటును నామినేషన్ పద్ధతిలో అప్పగించిన వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే యోగా డే సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీలో పెద్ద పెద్ద బండరాళ్ల తొలగింపు పేరిట నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించి భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలూ ఉన్నాయి. తాజాగా అసలు ఎప్పుడూ తెరవని షాప్నకు మరోసారి రూ.3 లక్షలకు పైగా వ్యయంతో మరమ్మతులు చేపట్టినట్లు కొద్దిరోజుల క్రితం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రతిపాదనలు సమర్పించి ఆమోదింపచేసుకున్న విషయం గమనార్హం. వసూళ్ల వ్యవహారమే..! జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాల తీరుపై ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి. నామినేషన్ పద్ధతిలో చేపట్టిన పనులకు ఏకంగా 15 శాతం కమీషన్ జీవీఎంసీలోని ముఖ్య నేతలతో పాటు అనధికారిక పీఏకు అందితేనే ఆమోదం లభిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమావేశానికి ముందే వాటా అందకపోతే, సమావేశంలో ఆమోదించనట్టుగా చెప్పి, సమావేశం అనంతరం కాంట్రాక్టర్లు ముఖ్య నేతలు, అనధికారిక పీఏలను కలిసి ‘అమ్యామ్యాలు’ అందజేసిన తర్వాత రికార్డుల్లో మాత్రం ఆమోదించినట్లుగా నమోదు చేస్తున్నారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. దీనికి డిసెంబర్ 6న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశమే నిదర్శనమని వాదనలు వినిపిస్తున్నాయి. ఆ రోజు ఏకంగా 257 భారీ ప్రతిపాదనలతో సమావేశం జరిగింది. ఇందులో 2025 జూన్ 21న విశాఖలో ప్రధాని హాజరైన యోగా డే సందర్భంగా చేపట్టిన నామినేషన్ పనుల ఆమోదానికి ప్రతిపాదనలు తెచ్చారు. అంటే దాదాపు ఆరు నెలల తర్వాత, అదీ నామినేషన్ పద్ధతిలో అప్పగించిన పనులకు ఆమోదం కోరినట్టుగా తెలుస్తోంది. వీటిలో మొబైల్ టాయిలెట్ల అద్దె పేరిట రూ.1.6 కోట్ల చెల్లింపుల అంశం, ఆంధ్రా యూనివర్సిటీలో భారీ బండరాళ్ల తొలగింపునకు రూ.30 లక్షలకు పైగా వ్యయం చేసిన అంశాలు ఉన్నాయి. మొబైల్ టాయిలెట్ల అద్దె అసాధారణంగా ఎక్కువగా ఉండటంతో చెల్లింపులు చేయవద్దని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. అలాగే ఏయూ గ్రౌండ్లో తరచూ ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు జరుగుతుంటే భారీ బండరాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న ప్రశ్న తలెత్తడంతో విచారణకు ఆదేశించింది. అయితే, విచిత్రంగా ఒక సంస్థకు మినహా మిగతా కొన్ని కంపెనీలకు మొబైల్ టాయిలెట్ల అద్దె చెల్లింపుల కోసం రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సమావేశంలో లేని బండరాళ్లు తర్వాత ‘నడుచుకుంటూ వచ్చి’ బండరాళ్ల తొలగింపు చేశామంటూ బిల్లుల చెల్లింపులకు ఆమోదం లభించిందన్న సమాచారం సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో జీవీఎంసీలోని ఓ ముఖ్య నేత, ఒక అధికారి, అలాగే ఆ ముఖ్యనేత అనధికారిక పీఏ కీలకంగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారి, అనధికారిక పీఏలపై ఏసీబీ ఆరా! స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రావాలి? సీరియస్ అంశాలు వస్తే సదరు అధికారులు లేకుండా ఎలా చూసుకోవాలి? అనే విషయంలో జీవీఎంసీలోని ఓ అధికారి కీలకంగా చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలున్నాయి. తన ఆమోదం లేకుండా అజెండాలో ఏ అంశం చేరదంటూ, అజెండాలో చేర్చాలంటే సదరు అనధికారిక పీఏను కలవాలంటూ కాంట్రాక్టర్లను ఆదేశిస్తున్నట్టు తెలుస్తోంది. అజెండాలో చేర్చే అంశాలపై నిర్ణయం తీసుకునే ఈ అధికారి వద్ద ముందుగానే ‘దర్శనం’ చేసుకుంటే తప్ప కాంట్రాక్టర్ల ప్రతిపాదనలు అజెండాలో చేరడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యనేత, ఆయన అనధికారిక పీఏతో చేతులు కలిపిన సదరు అధికారిం ఆమోదం పొందని అంశాలను కూడా ఆమోదించినట్లుగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారాలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు ఏసీబీ అధికారులకు అందినట్టు సమాచారం. సదరు అధికారి, అనధికారిక పీఏ వ్యవహారాలపై ఏసీబీ అధికారులు కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలోని మూసివేసిన జీవీఎంసీ ఎకో బజార్ను చూశారా? గత ప్రభుత్వ హయాంలో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగానికి ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత బ్యాగులను ప్రోత్సహించేందుకు 2022 జూన్ 5న జీవీఎంసీ ఏర్పాటు చేసిన ఎకో బజార్ షాప్ ఇది. ఆర్కే బీచ్కు వెళ్లిన ప్రతీసారి ఈ షాప్ మూసివుండటం గమనించ వచ్చు. అయితే, ఈ మూసివున్న షాప్ మరమ్మతుల పేరిట జీవీఎంసీ అధికారులు ఏకంగా రూ.3.5 లక్షలు ఖర్చు చేశారు. అదీ యోగా డే సందర్భంగా! యోగా డేకు ఈ షాప్కు సంబంధం ఏమిటని మాత్రం జీవీఎంసీ అధికారులను అడగవద్దు. మూసివేసిన షాప్నకు మరమ్మతులేమిటని ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. -
సైక్లోథాన్ జాతీయ ఉద్యమంగా అవతరణ
సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ శరవణన్ మహారాణిపేట : సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వందేమాతరం సైక్లోథాన్–2026’ కార్యక్రమం దేశవ్యాప్తంగా జాతీయ భద్రత, తీరప్రాంత రక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించే శక్తివంతమైన ఉద్యమంగా మారిందని సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ శరవణన్ అన్నారు. ఈ కార్యక్రమం సీఐఎస్ఎఫ్ కుటుంబంలో నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పారు. ఈ నెల 28న ‘సురక్షిత తట–సమృద్ధ్ భారత్’ నినాదంతో సైక్లోథాన్ రెండో ఎడిషన్ ప్రారంభమైందని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ స్టేడియం నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని వివరించారు. చిన్న స్థాయిలో మొదలైన ఈ కార్యక్రమం నేడు ప్రజల భాగస్వామ్యంతో దేశభక్తిని పెంపొందించే జాతీయ ఉద్యమంగా రూపాంతరం చెందిందన్నారు. విశాఖలో ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పారు. ఇది కేవలం 6,600 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం మాత్రమే కాకుండా ప్రజలతో నేరుగా మమేకమై భద్రతపై అవగాహన కల్పించే యజ్ఞమని పేర్కొన్నారు. ఇప్పటివరకు సైక్లిస్టులు 2,400 కిలోమీటర్లు పూర్తి చేశారని తెలిపారు. ఈ ప్రయాణంలో సుమారు 6 లక్షల మందిని ప్రత్యక్షంగా కలుసుకుని, డిజిటల్ మాధ్యమాల ద్వారా మిలియన్ల మందితో సంభాషించామని చెప్పారు. ఈ పర్యటనలు భద్రత, సాంస్కృతిక వారసత్వం, జాతీయ అస్తిత్వం పరస్పర సంబంధాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు చేరుకున్న సైక్లిస్టులకు సీఐఎస్ఎఫ్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విశాఖ పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్మన్ రోషిణి అపరంజి, సీఐఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బినితా ఠాకూర్, సీఐఎస్ఎఫ్ డీఐజీలు రాఘవేంద్ర కుమార్, ఎన్.ప్రకాష్ రెడ్డి, ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీమతి రేఖా నంబియార్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వి.పి.ఎ.అరుణ్ ప్రసాద్, సీనియర్ కమాండెంట్ సతీష్ కుమార్ బాజ్పాయ్ పాల్గొన్నారు. దేశ భద్రతకు ప్రజలే ప్రథమ రక్షకులు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్తో భాగస్వామ్యం కావడానికి ప్రపంచం ఎదురు చూస్తోందని, ఇలాంటి సమయంలో మన దేశం ఎంత భద్రంగా ఉందో ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం ఆర్కే బీచ్లో నిర్వహించిన వందేమాతరం తీర సైక్లోథాన్–2026ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఒక సాధారణ సైక్లథాన్ మాత్రమే కాదని, దేశాన్ని మరింత సురక్షిత దిశగా నడిపించే ఉద్యమమని అభివర్ణించారు. దేశ రక్షణలో సామాన్యులను భాగస్వాములను చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన సీఐఎస్ఎఫ్ అభినందనీయమని స్పష్టం చేశారు. సుదీర్ఘ సైకిల్ యాత్ర చేసిన సైక్లిస్టులను ప్రత్యేకంగా అభినందిస్తూ మెడల్స్తో సత్కరించారు. -
యాత్రకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
ఆరిలోవ : బీఆర్టీఎస్ రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. కాకినాడకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన బంధువులు శ్రీకాకుళం జిల్లాలోని రాజులమ్మ యాత్రకు వెళ్తూ మార్గమధ్యలో సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో సింహాచలం నుంచి హనుమంతవాక మీదుగా ప్రయాణిస్తుండగా, బీఆర్టీఎస్ మధ్య లైన్లో మితిమీరిన వేగంతో వెళ్తున్న వీరి కారు ఎదురుగా వస్తున్న 68 నంబర్ సిటీ బస్సును బలంగా ఢీకొంది. ప్రమాదంలో కారు నడుపుతున్న బంగారు రాజేష్ (37) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం కూడా ధ్వంసమవడంతో డ్రైవర్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హెల్త్ సిటీ ఆస్పత్రికి, మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. కేవలం బస్సులు, వీఐపీ వాహనాలకు కేటాయించిన మధ్య లైన్లోకి కారు అతివేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేశారు. -
అక్రమ నిర్బంధాలపై ప్రజాపోరాటానిదే విజయం
డాబాగార్డెన్స్: అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్, ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టుల కోసం జరుగుతున్న బలవంతపు భూసేకరణను అడ్డుకున్నారన్న నెపంతో, సీపీఎం నేత అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ చెల్లదని తేలిపోయింది. అడ్వైజరీ కమిటీ సమీక్షలో ప్రభుత్వ ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని స్పష్టం కావడంతో 45 రోజుల జైలు శిక్ష అనంతరం శుక్రవారం ఆయన విడుదలయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎలాంటి నేరం చేయకపోయినా అప్పలరాజును అక్రమంగా నిర్బంధించి చంద్రబాబు ప్రభుత్వం తన నిరంకుశత్వాన్ని చాటుకుందని మండిపడ్డారు. పాత కేసులను సాకుగా చూపి ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూడటం దారుణమని, ప్రజల ఆగ్రహానికి తలొగ్గే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎద్దేవా చేశారు. మరోవైపు పర్యావరణాన్ని ధ్వంసం చేసే పరిశ్రమల కోసం ప్రభుత్వం పాకులాడుతోందని శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిర్వీర్యం చేస్తూ, మిట్టల్ వంటి ప్రైవేటు సంస్థల కోసం కూటమి ప్రభుత్వం ఢిల్లీ చుట్టూ తిరగడం సిగ్గుచేటన్నారు. తనపై మోపిన అక్రమ కేసుల రికార్డులను ప్రదర్శిస్తూ, న్యాయస్థానాలు కొట్టేసిన కేసులను కూడా పీడీ యాక్ట్లో చేర్చి తనను వేధించారని జైలు నుంచి విడుదలైన అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ బాధితుల పక్షాన తమ పోరాటం ఆగదని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ఈ సందర్భంగా సీపీఎం నేతలు స్పష్టం చేశారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
రక్షించిన బ్లూకోల్ట్ కానిస్టేబుల్ అగనంపూడి: కుటుంబ కలహాల నేపథ్యంలో రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన దంపతులను పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి రక్షించారు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన పంకజ్ దాస్ (27), మంజూ దాస్ (24) దంపతులు ఉపాధి నిమిత్తం విశాఖకు వలస వచ్చి అగనంపూడిలో నివాసముంటున్నారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన దంపతులు గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అగనంపూడి సాయినగర్ కాలనీ ఎదురుగా ఉన్న రైలు పట్టాలపైకి చేరుకుని ఆత్మహత్యకు సిద్ధమయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే ‘112’కు సమాచారం అందించారు. వెంటనే బ్లూకోల్ట్ కానిస్టేబుల్ వీవీఎస్ఎస్ సాయితేజ అత్యంత వేగంగా ఘటనా స్థలానికి చేరుకుని, పట్టాలపై ఉన్న దంపతులను పక్కకు లాగి ప్రాణాలు కాపాడారు. అనంతరం వారికి ప్రాథమిక కౌన్సెలింగ్ నిర్వహించి, జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. సమయానికి చేరుకుని ఇద్దరి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ సాయితేజను ఉన్నతాధికారులు, స్థానికులు అభినందించారు. -
మురుగు ‘నీరే’ ఆధారం
ఫిషింగ్ హార్బర్ సమీపంలోని జాలారిపేటలో కనిపిస్తున్న ఈ దృశ్యం చూస్తుంటే సామాన్యుడి ప్రాణాలకు విలువే లేదనిపిస్తోంది. తాగడానికి గుక్కెడు నీరు కావాలంటే కలుషితమైన మురుగు కాలువలోకి దిగాల్సిన దుస్థితి నెలకొంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒకవైపు నగరం సుందరీకరణ కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న పాలకులు, మరోవైపు ప్రాథమిక అవసరమైన తాగునీరు కూడా అందించలేకపోవడం దారుణం. మురికివాడల అభివృద్ధిని విస్మరించి, కేవలం ఆడంబరాలకే పరిమితమైన వ్యవస్థల తీరును ఈ చిత్రం ప్రశ్నిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్యులకు స్వచ్ఛమైన గాలి, నీరు అందని ద్రాక్షగా మారాయని ఈ దృశ్యం కళ్లకు కడుతోంది. – ఫొటో : సాక్షిఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
దళిత భూముల్లో పెట్రోల్ బంకా?
అగనంపూడి: గతంలో తమకు కేటాయించిన భూములను ఐవోసీ పెట్రోల్ బంక్కు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తూ అగనంపూడి ప్రాంతానికి చెందిన దళితులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గాజువాక మండలం, అగనంపూడి రెవెన్యూ సర్వే నంబర్ 56 పార్ట్ 1ఏలో గల 1.60 ఎకరాల స్థలాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఐఓసీ పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం కేటాయించింది. అయితే నాలుగు దశాబ్దాల క్రితమే ఈ భూములు తమకు డీ–ఫారం పట్టాల రూపంలో మంజూరయ్యాయని, ప్రస్తుతం న్యాయస్థానంలో స్టే ఆర్డర్ కూడా ఉందని బాధితులు వాదిస్తున్నారు. గతంలో పిలకవానిపాలెం, నక్కవానిపాలెం నిర్వాసితులకు ఈ భూములను ఇచ్చే ప్రయత్నం జరగగా, పట్టాదారులు కోర్టును ఆశ్రయించి యథాతథ స్థితి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. భూముల విలువ పెరగడంతో ప్రభుత్వం పాత పట్టాలను రద్దు చేసి, రెండేళ్ల క్రితం ఇక్కడ రైతు బజార్ ఏర్పాటుకు ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి, ఐవోసీకి స్థలాన్ని కేటాయించడంతో వివాదం మళ్లీ మొదలైంది. గురువారం ఉదయం ఐవోసీ సిబ్బంది సదరు స్థలంలో పనులు ప్రారంభించగా, పట్టాదారులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. దీంతో ఐవోసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. ఈ క్రమంలో 13 మంది మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అనంతరం పూచీకత్తుపై విడుదల చేశారు. తమ భూములను అక్రమంగా వేరే సంస్థలకు కట్టబెట్టడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జర్నలిస్టులకు అండగా ఉంటాం
మహారాణిపేట: వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్లు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. గురువారం ఏపీ ఎన్జీవో హోంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ సభ్యత్వ నమోదు, రెన్యువల్ ప్రక్రియకు అనూహ్య స్పందన లభించింది. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పి.నారాయణ్, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావులతో కలిసి గంట్ల శ్రీనుబాబు మీడియాతో మాట్లడారు. అక్రిడేషన్ కమిటీల్లో సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించడం శుభపరిణామమని, అలాగే పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాలు, పెన్షన్ల సమస్యలను ప్రభుత్వం దశలవారీగా పరిష్కరించాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు 400 మందికి పైగా సభ్యత్వం తీసుకున్నారని, ఫిబ్రవరి 9తో ఈ ప్రక్రియ ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు పి నగేష్ బాబు, బ్రాడ్ కాస్టింగ్ అధ్యక్షుడు ఈరోతి ఈశ్వరరావు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
బంగారు నగలు దొంగిలించిన కిలాడీ మహిళల అరెస్ట్
అల్లిపురం: శ్రీకాకుళం వెళ్లే క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలి నుంచి బంగారు ఆభరణాలు తస్కరించిన ఇద్దరు మహిళా దొంగలను ఫోర్త్ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బుధవారం జరిగిన ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను క్రైం డీసీపీ కె. లతా మాధురి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన వోల్లా జ్యోతి .. తన తల్లితో కలిసి శ్రీకాకుళం వెళ్లేందుకు ఈ నెల 3వ తేదీన రత్నాచల్ ఎక్స్ప్రెస్లో విశాఖ చేరుకున్నారు. రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆ ప్రయాణ సమయంలోనే గుర్తుతెలియని వ్యక్తులు జ్యోతి బ్యాగులోని బంగారు ఆభరణాలను దొంగిలించారు. మరుసటి రోజు నగలు కనిపించకపోవడంతో విషయాన్ని గమనించిన బాధితురాలు, తన భర్త ద్వారా ‘డయల్ 112’ కు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు, ఆటోలో తమతో పాటు ప్రయాణించి సంగం శరత్ థియేటర్ వద్ద దిగిపోయిన ఇద్దరు మహిళలపై అనుమానం వ్యక్తమైంది. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షణలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టగా, రైల్వే న్యూ కాలనీ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా కనిపిస్తూ తప్పించుకోబోతున్న ఇద్దరు మహిళలను వెంబడించి పట్టుకున్నారు. నిందితులు విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన మేకల గంగ, అనకాపల్లి జిల్లా కె. కోటపాడుకు చెందిన రావుల ఎల్లారమ్మలుగా గుర్తించారు. వారి నుంచి రూ.6 లక్షల విలువైన 280 గ్రాముల బంగారు ఆభరణాలను (రెండు నెక్లెస్లు, ఆరు గాజులు) స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్కు తరలించారు. కేవలం గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి సొత్తును రికవరీ చేసిన పోలీసు బృందాన్ని అధికారులు అభినందించారు. -
కంచి పీఠం సంప్రదాయ పాఠశాలల్లో ప్రవేశాలు
రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్కు ‘ఆంధ్రా’ సిద్ధం.. నేడు బెంగాల్తో ఢీ విశాఖ స్పోర్ట్స్ : దేశవాళీ టెస్ట్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న క్వార్టర్ ఫైనల్స్లో బెంగాల్ జట్టుతో ఆంధ్ర జట్టు తలపడనుంది. ఎలైట్ ‘ఎ’ గ్రూప్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో నాలుగింటిలో విజయం సాధించి, మరో మూడింటిని డ్రా చేసుకున్న ఆంధ్రా జట్టు.. అపజయమనేదే లేకుండా 31 పాయింట్లతో క్వార్టర్స్కు దూసుకెళ్లింది. ఇదే గ్రూప్లో జార్ఖండ్, విధర్భ కూడా 31 పాయింట్లతో నిలిచినప్పటికీ, మెరుగైన రన్ రేట్ కారణంగా ఆంధ్రా, జార్ఖండ్ జట్లు తదుపరి దశకు అర్హత సాధించాయి. కల్యాణ్ వేదికగా ఐదు రోజుల పాటు జరిగే ఈ పోరులో ఆంధ్రా జట్టు రికీ భుయ్ నాయకత్వంలో బరిలోకి దిగుతోంది. జట్టులో వికెట్ కీపర్గా భరత్, బ్యాటర్లుగా అశ్విన్ హెబ్బర్, షేక్ రషీద్, ఆల్రౌండర్గా సౌరబ్ కీలక పాత్ర పోషించనుండగా.. పృధ్వీరాజ్, సత్యనారాయణ, విజయ్ బౌలింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. గత సీజన్లో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న ఆంధ్రా జట్టు, ఈసారి లీగ్ దశలో వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉంది. -
ఐఎఫ్ఆర్ పనుల పర్యవేక్షణ
ఏయూక్యాంపస్: ఈ నెల 18, 19 తేదీల్లో విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న అంతర్జాతీయ యుద్ధ నౌకల విన్యాసాల నేపథ్యంలో, వీఎంఆర్డీఏ పరిధిలోని పర్యాటక ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. గురువారం వారు క్షేత్రస్థాయిలో పర్యటించి కుర్సుర సబ్ మైరెన్, సీహారియర్, హెలికాప్టర్ మ్యూజియం, టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియంలతో పాటు కై లాసగిరి, తెన్నేటి పార్కుల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో మరమ్మత్తులు, పచ్చదనం పెంపు పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ అంతర్జాతీయ వేడుకను విజయవంతం చేయాలని ఆదేశించారు. -
పరిశ్రమల్లో భద్రతపై కలెక్టర్ సమీక్ష
మహారాణిపేట: జిల్లా ఆఫ్–సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన క్రైసిస్ గ్రూప్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల్లో పాత యంత్రాలు, స్క్రాప్ను తొలగించి భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా ఈ నెల 17 నుంచి జరిగే ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ’ దృష్ట్యా పరిశ్రమలు అప్రమత్తంగా ఉండాలని, కాలుష్య నిబంధనలు ఉల్లంఘించకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సురేష్, పరిశ్రమల కేంద్రం జీఎం ఆదిశేషు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ఏపీటీయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా వాసుపల్లి
ఆరిలోవ: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ యూనియన్ (ఏపీటీయూ) నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. గురువారం అక్కయ్యపాలెంలో రాష్ట్ర అధ్యక్షుడు వై.దేవుడు అధ్యక్షతన జరిగిన అత్యవసర జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ను, రాష్ట్ర అధ్యక్షుడిగా వై.దేవుడును ఎన్నుకున్నారు. వీరితో పాటు 18 మంది కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్కుమార్ను యూనియన్ నేతలు ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా హరికృష్ణ, నాయకులు కె.జె కృపానందం, కె.బ్రహ్మారెడ్డి, కె.వెంకటేశ్వర్లు, గౌరీశంకర్ పాల్గొన్నారు. -
కేజీహెచ్లో డబ్బు జబ్బు
కట్టు కట్టాలన్నా వసూళ్లే.. ఆగని సిబ్బంది ఆగడాలు వైరల్ అవుతున్న వీడియోమహారాణిపేట: ఉత్తరాంధ్ర జిల్లాలకే కాక పొరుగు రాష్ట్రాల పేద ప్రజలకు సైతం ఆశాదీపంగా నిలిచిన కేజీహెచ్ ఇప్పుడు సమస్యల నిలయంగా మారింది. నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందాల్సిన ఈ మహోన్నత సంస్థలో అడుగడుగునా అవినీతి, అలసత్వం రాజ్యమేలుతున్నాయి. ఆస్పత్రిలో వైద్య సేవలు కుంటుపడడమే కాకుండా, క్షేత్రస్థాయిలో రోగులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఒక వీడియో కేజీహెచ్లో ఉన్న దయనీయ స్థితికి అద్దం పడుతోంది. కేజీహెచ్ క్యాజువాలిటీలో తన తల్లికి కట్టు కట్టడానికి, ఇంజెక్షన్ చేయడానికి సిబ్బంది డబ్బులు అడిగారని, తన వద్ద చిల్లిగవ్వ లేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని ఓ బాధిత కుమార్తె ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోను విడుదల చేసింది. ‘పైసలిస్తేనే సేవలు’ అన్నట్లుగా తయారైన అక్కడి సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రికి ప్రాణధార వంటి క్యాజువాలిటీ విభాగంలో ఓపీ టికెట్ దగ్గర నుంచి ప్రాథమిక చికిత్స వరకు ప్రతి దశలోనూ పేద రోగుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నాలుగో తరగతి సిబ్బంది ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి అత్యవసర స్థితిలో వచ్చే వారిని కూడా వదిలిపెట్టడం లేదని బాధితులు వాపోతున్నారు. ఆస్పత్రిలో సూపరింటెండెంట్తో పాటు భారీ సంఖ్యలో ఆర్ఎంవోలు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఇతర పరిపాలనా అధికారులు ఉన్నప్పటికీ, వార్డుల్లో పర్యవేక్షణ మచ్చుకై నా కనిపించడం లేదు. అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితమై, సంతకాలతోనే కాలక్షేపం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కేవలం ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు వేయించుకోవడం పైనే చూపిస్తున్న శ్రద్ధ, రోగుల సంరక్షణపై చూపడం లేదని స్పష్టమవుతోంది. రోగులకు నిరాశే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం ఉచితమని నమ్మి వచ్చే పేదలకు నిరాశే ఎదురవుతోంది. వైద్యులు ఉంటే మందులు ఉండవు, మందులు ఉంటే సిబ్బంది అందుబాటులో ఉండరు. పోనీ పరీక్షలు చేయించుకుందామంటే ఎక్స్రే, ఎంఆర్ఐ, స్కాన్ల కోసం రోజులు తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. బయట ప్రైవేటు ల్యాబ్లలో పరీక్షలు చేయించుకోవడానికి డబ్బులు లేక సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఉన్నతాధికారులు సైతం ఈ సమస్యలను పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో కేజీహెచ్ ప్రతిష్ట మసకబారుతోంది. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, కేజీహెచ్లో పేరుకుపోయిన ఈ అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు న్యాయం చేయాలని రోగులు వేడుకుంటున్నారు. -
గీతంకు భూ కేటాయింపులు నిలిపివేయాలి
మహారాణిపేట : చంద్రబాబు ప్రభుత్వం గీతం విశ్వవిద్యాలయానికి ప్రభుత్వ భూములను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే.కే.రాజు నేతృత్వంలో పార్టీ నేతలు గురువారం కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడిన కే.కే.రాజు ఎండాడ, రుషికొండ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూమిని ఒక గీతం యూనివర్సిటీకి బదలాయించే ప్రతిపాదనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. జీవీఎంసీ కమిషనర్ ద్వారా ఈ భూమి బదలాయింపు ప్రక్రియ మొదలైందని, జనవరి 30న జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి ప్రజాస్వామిక చర్చ లేకుండా, సభ్యుల ఆమోదం పొందకుండానే ఏకపక్షంగా దీనిని అజెండాలో చేర్చి ఆమోదించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. సదరు 54.79 ఎకరాల్లో గెడ్డ పోరంబోకు, ఇతర ప్రభుత్వ భూముల వివరాలను ప్రజలకు బహిర్గతం చేయాలని, ఈ కేటాయింపులకు సంబంధించిన పూర్తి ఫైల్ను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కలెక్టర్పై ఉందని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఈ బదలాయింపును వెంటనే నిలిపివేయాలని కోరారు. ఎమ్మెల్సీ డాక్టర్ కుంబా రవిబాబు మాట్లాడుతూ పేదలకు చెందిన అసైన్డ్ భూములు గీతం యాజమాన్యానికి ఎలా దక్కాయని ప్రశ్నించారు. పేదల భూములను ఆక్రమించి భవనాలు నిర్మించడం అన్యాయమని, ఆ భూములను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, ఎస్సీసీ సభ్యులు బాణాల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి పీవీ నారాయణ, కోరుకొండ వెంకటరత్న స్వాతి దాస్, పల్లా దుర్గారావు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉరుకూటి రామచంద్రరావు (చందు), పేడాడ రమణికుమారి, బర్కత్ అలీ, బొండా ఉమా మహేశ్వరరావు, బోని శివ రామకృష్ణ, జీలకర్ర నాగేంద్ర, కార్పొరేటర్లు దౌలపల్లి ఏడుకొండల రావు, సాడి పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకట రమణ, శశికల, పీవీ సురేష్, గుడివాడ సాయి అనూష లతీష్, వార్డు అధ్యక్షులు బొడ్డేటి గోవింద్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మువ్వల సురేష్, జిల్లా కార్యదర్శి ఉమ్మడి దాస్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
భూచి
రిజిస్ట్రేషన్ల విశాఖ సిటీ: సంపద సృష్టిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి సామాన్యులను నిలువునా ముంచుతోంది. ధరల పెంపు ఎత్తుగడలతో ప్రజలకు కుచ్చు టోపీ పెడుతోంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే విద్యుత్ చార్జీలు, భూముల ధరలు పెంచి నడ్డివిరిచింది. వరుసగా రెండో ఏడాది కూడా భూముల విలువ పెంపు పేరుతో క్రయ, విక్రయదారులను గందరగోళానికి గురిచేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి భూముల మార్కెట్ విలువను పెంచుతున్నట్లు ప్రభుత్వం లీకులు ఇచ్చింది. ఇందుకు అవసరమైన సవరణలకు కసరత్తు చేయాలని జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు జిల్లాలో ప్రధానంగా జీవీఎంసీ పరిధిలో 15 నుంచి 50 శాతం మేర ధరల పెంపునకు కసరత్తు చేపట్టారు. ఈనెల ఒకటో తేదీ నుంచి భారీగా భూములు విలువ పెరుగుతుందని ప్రకటించారు. దీంతో భూముల క్రయ విక్రయదారులు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు క్యూ కట్టారు. భూముల విలువ పెరగక ముందే అప్పులు చేసైనా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి పోటీ పడ్డారు. దీంతో జనవరి చివరి వారంలో జిల్లాలో ఉన్న 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడాయి. ప్రభుత్వం ‘డెడ్ లైన్’ రాజకీయం? ఈ నెల ఒకటో తేదీ నుంచి రేట్లు పెరుగుతాయన్న ప్రచారంతో జనవరి చివరి వారంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడాయి. పెరిగే భారం నుంచి తప్పించుకోవడానికి మధ్యతరగతి ప్రజలు అప్పులు చేసైనా సరే జనవరి 31వ తేదీలోపు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని పరుగులు తీశారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఒక్కసారిగా భారీ ఆదాయం సమకూరింది. కేవలం జనవరి నెలలోనే విశాఖ జిల్లాలో సుమారు రూ.113.79 కోట్ల ఆదాయం లభించినట్లు తెలుస్తోంది. ఇది గత ఏడాది జనవరితో పోలిస్తే 10.56 శాతం వృద్ధి నమోదైంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి విశాఖ జిల్లాలోని 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రూ.1,349.80 కోట్ల లక్ష్యం విధించగా, డిసెంబర్ నాటికే రూ.848.34 కోట్లు వసూలయ్యాయి. జనవరి నాటికి మరో రూ.వంద కోట్లకు పైగా ఖజానాకు చేరింది. ఒడిదుడుకుల్లో రియల్ ఎస్టేట్ రంగం విశాఖలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకుల్లో ఉంది. ఇలాంటి సమయంలో మార్కెట్ విలువను భారీగా పెంచితే అది సామాన్యుడి సొంతింటి కలను దూరం చేయడమే అవుతుంది. ఈ అంశం రాజకీయంగా నష్టం కలిగిస్తుందని భావించే ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా వాయిదా వేసి ఉండొచ్చని స్థిరాస్తి రంగ నిపుణులు చెబుతున్నారు. భూములు విలువ పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నా.. లీకులతో భూముల కొనుగోలుదారులు భయపడి ముందస్తు రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలను ఒత్తిడికి గురిచేసి ఆదాయం పిండుకోవడం వంటి చర్యలపై విశాఖ వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భూముల విలువ పెంపుపై సర్కారు హడావుడి ఈనెల ఒకటి నుంచి కొత్త ధరలు అంటూ లీకులు 25 నుంచి 50 శాతం వరకు పెరుగుతాయని లీకులు ఆ భయంతో జనవరిలో రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు జనాలు పరుగులు దీంతో జనవరి నెలలో రూ.113.79 కోట్ల ఆదాయం నెలాఖరు నాటికి పెంపు నిర్ణయం వాయిదా వేస్తున్న ప్రకటన ఆదాయం కోసం ప్రభుత్వం మైండ్ గేమ్? ప్రజల వ్యతిరేకతతో యూటర్న్? బురిడీ కొట్టించి.. జేబులు ఖాళీ చేసి..! తీరా గత నెల చివరిలో ధరల పెంపుపై చంద్రబాబు ప్రభుత్వం తూచ్ అంది. భూముల విలువ సవరణకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీనిని బట్టి చూస్తే, కేవలం ఆర్థిక సంవత్సరం ముగింపులో ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం ఆడిన ‘మైండ్ గేమ్’ అని ప్రజలు మండిపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పటికే కుదేలై, రియల్టర్లు దివాలా తీస్తున్న తరుణంలో, ఇలాంటి హడావుడి ప్రకటనలతో జనాన్ని బురిడీ కొట్టించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పెంపు నిర్ణయం వాయిదా వేయడం వెనుక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూముల ధరల పెంపుపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు పలువురు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రతిసారి ముందస్తు లీకులు ఇవ్వడం.. ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తే చివరి నిమిషంలో వాటిని వెనక్కు తీసుకోవడం పరిపాటిగా మారింది. -
14 నుంచి 21 వరకు చేపల వేట నిషేధం
ఎంవీపీకాలనీ : విశాఖ సాగర తీరంలో ఈ నెల 15వ తేదీ నుంచి 25 తేదీ వరకు జరగనున్న ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్), మిలాన్ నేపథ్యంలో చేపల వేట నిషేధిస్తున్నట్లు తూర్పు నావికాదళం, జిల్లా మత్స్యకారశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు 19వ వార్డు పెదజాలరిపేటలో గురువారం జిల్లా మత్స్యకార శాఖ, ఈస్ట్రన్ నేవల్ కమాండ్, మైరెన్ పోలీసు విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో మత్స్యకారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్స్యకారులు చేపల వేట విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యకార శాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణరావు మాట్లాడుతూ మిలాన్ నేపథ్యంలో భద్రతా చర్యలు దృష్ట్యా ఈనెల 14 నుంచి 21వ తేదీ వరకు చేపల వేటను నిషేధిస్తున్నట్లు తెలిపారు. కోస్టల్ సెక్యురిటీ, హైసైనిక్ కండిషన్, కమ్యూనికేషన్, కలర్ కోడ్, సేఫ్ ఫిషింగ్ యాక్టివిటీకి సంబంధించిన అంశాలపై మత్స్యకారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫిషరీస్ డవలప్మెంట్ ఆఫీసర్ ఎం.ఆర్.ఆశాజ్యోతి, నావికాదళాధికారులు, మైరెన్ పోలీసులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో విశ్రాంత ఎస్ఈ
మధురవాడ/ మహారాణి పేట: పంచాయతీరాజ్ శాఖలో సూపరింటెండెంట్ ఇంజినీర్గా పనిచేసి రిటైర్ అయిన సీహెచ్ శ్రీనివాసరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో గురువారం ఏకకాలంలో సోదాలు జరిగాయి. ముఖ్యంగా విశాఖలోని మధురవాడ ఎంవీవీ సిటీలో ఉన్న ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు విలువైన డాక్యుమెంట్లు, బ్యాంకు డిపాజిట్లు, బంగారం, ఇతర స్థిర, చర ఆస్తుల వివరాలను సేకరించారు.శ్రీనివాసరావు తన సర్వీసులో ఎక్కువ కాలం విశాఖలోనే ఈఈగా, ఎస్ఈగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో భారీగా కమీషన్లు తీసుకోవడం, ఎస్టిమేషన్లు పెంచడం, కాంట్రాక్టర్లను బెదిరించడం వంటి అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు ఏసీబీ దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా 2022 నుంచి 2024 వరకు ఈఈగా, అనంతరం ఇన్చార్జి ఎస్ఈగా పనిచేసి గత ఏడాది సెప్టెంబర్ 30న ఆయన పదవీ విరమణ పొందారు. పాడేరు ప్రాంతానికి చెందిన బిల్లుల చెల్లింపుల్లోనూ ఆయన కీలకంగా వ్యవహరించి భారీ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టు పనుల మంజూరు నుంచి బిల్లుల చెల్లింపు వరకు ప్రతి దశలోనూ పర్సంటేజీలు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా మూడు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, రెండు ఫ్లాట్లు, 18.57 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు. వీటితో పాటు రూ. 61.87 లక్షలు సుమారు రెండున్నర కిలోల బంగారం, 20 కిలోలకు పైగా వెండి, ఒక కారు, ద్విచక్రవాహనం, విలువైన గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఐదు బ్యాంక్ లాకర్ల తాళాలు లభించాయని, శుక్రవారం ఆ లాకర్లను తెరిచి పరిశీలిస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఒక ఉన్నత స్థాయి రిటైర్డ్ అధికారి ఇంట్లో ఈ స్థాయిలో సోదాలు జరగడం ప్రస్తుతం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
నూతన ఒప్పందాలతో సీ ఫుడ్ ఎగుమతులకు ప్రోత్సాహం
ఏయూ క్యాంపస్: అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)లతో భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు భారతీయ సముద్ర ఆహార(సీ ఫుడ్) ఎగుమతుల రంగంలో నూతన ఉత్తేజాన్ని నింపుతాయని సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏఐ) అధ్యక్షుడు జి.పవన్కుమార్ అన్నారు. బీచ్రోడ్డులోని ఓ హోటల్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూరోపియన్ యూనియన్(ఈయూ)తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) విజయవంతంగా ముగియడం, అమెరికాతో జరిగిన తాజా వాణిజ్య అవగాహన వల్ల భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల దిగుమతి సుంకాల్లో భారీ తగ్గింపు లభిస్తుందన్నారు. 2024–25లో సుమారు 2.78 బిలియన్ డాలర్ల ఎగుమతులతో భారత్ సీఫుడ్స్కు అతిపెద్ద మార్కెట్గా కొనసాగిన అమెరికా ఆగస్టు 2025 నుంచి విధించిన 50 శాతం టారిఫ్లతో ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. అమెరికాతో కుదిరిన తాజా ఒప్పందం వల్ల టారిఫ్లు 18 శాతానికి తగ్గాయన్నారు. ఈయూతో ఎఫ్టీఏ వల్ల ప్రపంచవ్యాప్త పోటీదారులతో సమానంగా భారతీయ ఎగుమతిదారులకు సమాన అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఆక్వాకల్చర్ మరియు సీఫుడ్ ఎగుమతులకు ఒక ప్రధాన కేంద్రంగా ఏపీ నిలుస్తోందన్నారు. ఈ రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మద్దతుగా నిలిచిన ప్రధాని మోదీ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ఏపీ అధ్యక్షుడు ఆనంద్కుమార్ మాట్లాడుతూ ఈ నిర్ణయాలు ఏపీలో ఆక్వా రైతులకు చాలా మేలు చేస్తాయన్నారు. ధరలు స్థిరంగా ఉంటూ, ఎగుమతులు పెరిగేందుకు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి దిలీప్ తదితరులు పాల్గొని మాట్లాడారు. -
అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న కాపు నేతలు
సాక్షి, విశాఖపట్నం: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా, ఆయన ఇంటిపై టీడీపీ గుండాలతో చంద్రబాబు దాడులు చేయించారని ఉమ్మడి విశాఖకు చెందిన కాపు నేతలు ఆక్షేపించారు. ఈ నెల 7న విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన కాపునేతలు పార్టీలకు అతీతంగా అంబటి కుటుంబాన్ని పరామర్శించను న్నారు. వందకు పైగా కార్ల ర్యాలీతో వెళ్లి, అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి, కుమార్తెలు మౌనిక, మనోజ్ఞలకు ధైర్యం చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కాపు నేతలు బుధవారం సమావేశమయ్యారు. కాపునేతలపై చంద్రబాబు కక్ష తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తేలడంతో గోరంట్లలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేసి వస్తున్న అంబటి.. గోరంట్లలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేశారనే దాడి చేయించారన్నారు. ఫ్లెక్సీని తొలగించాలని కోరితే టీడీపీ మూకలు నడిరోడ్డుపై బహిరంగంగా కర్రలు, రాడ్లతో దాడికి తెగబడినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆక్షేపించారు. గంటల తరబడి కొనసాగిన రౌడీ మూకల దాడిపై డీజీపీ, అదనపు డీజీపీలకు ఫిర్యాదు చేసేందుకు శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఫోన్లు చేసినా స్పందించలేదని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీని కలిసేందుకు మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత వెళితే ఎస్పీ ఇంటి గేటు బయటే నిలబెట్టారంటే ఏ స్థాయిలో పోలీసు వ్యవస్థ ఉందో అర్ధమవుతుందంటూ మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కాపు నేత వంగవీటి రంగాను హత్య చేయించారని, మళ్లీ చంద్రబాబు హయాంలోనే మరో కాపు ఉద్యమనేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభంను, ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారని గుర్తుచేశారు. కాపులను ఏదో విధంగా అడ్డుతొలగించుకోవాలన్నదే చంద్రబాబు తాపత్రయంగా కనిపిస్తోందని కాపునేతలు మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్య, కాపు నేతలు బాణాల శ్రీనివాసరావు, వీసం రామకృష్ణ, కోరుకొండ స్వాతి, పీవీ సురేష్, గుడివాడ అనూష, గుండపు నాగేశ్వరరావు, రామజోగి, రాయపూడి అనిల్కుమార్, గుడివాడ లతీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సింహాచలం దేవస్థానం ఈవోగా వెంకటరావు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో)గా రెవెన్యూశాఖకు చెందిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జె.వెంకటరావు నియమితులయ్యారు. కాకినాడలో డీఆర్వోగా పనిచేస్తున్న ఆయన్ని రెవెన్యూ నుంచి దేవదాయశాఖకు డిప్యూటేషన్పై బదిలీచేసి, ఏడాది కాలపరిమితికి సింహాచలం ఈవోగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హ్యాండ్లింగ్లో అదానీ గంగవరం పోర్టు కొత్త రికార్డు పెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టు మరో కొత్త రికార్డు నెలకొల్పింది. ఒకేసారి 3,400 టీఈయూలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఈ సందర్భంగా పోర్టు యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ ఎంఎస్సీ ట్రేసీ వీ ఒకేసారి నిర్వహించడం తమ సిబ్బంది పనితీరుకు నిదర్శనమన్నారు. ఈ మైలురాయిని సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమైందని చెప్పారు. అనంతరం సిబ్బందితో కలసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రేపు నగరానికి సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ మహారాణిపేట: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో చేపట్టిన ‘సీఐఎస్ఎఫ్ వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్–2026’ఈ నెల 6న ఆర్కే బీచ్కు చేరుకుంటుందని సంస్థ సీనియర్ కమాండెంట్(వీపీటీ) సతీష్కుమార్ బుధవారం తెలిపారు. ఈ సైకిల్ ర్యాలీకి ఘన స్వాగతం పలికేందుకు ఆర్కే బీచ్లో భారీ స్థాయిలో ప్రజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 7న కాకినాడకు సైకిల్ యాత్ర కొనసాగుతుందన్నారు. -
సమర భేరి
సాగర తీరానవిశాఖ సిటీ : భారత నావికాదళ చరిత్రలో మరో కీలక ఘట్టానికి విశాఖ వేదిక అవుతోంది. దశాబ్ద కాలం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు మెగా ఈవెంట్లకు ముస్తాబవుతోంది. ఈ నెల 15 నుంచి 25 వరకు తీరం అంతర్జాతీయ నౌకా బలగా లతో కిక్కిరిసిపోనుంది. ఈ నెలలో 18వ తేదీన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), 19న మిలాన్– 2026 విన్యాసాలతో పాటు 20న ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం(ఐఓఎన్ఎస్) సదస్సుకు అతిథ్యమిస్తోంది. ప్రపంచ దేశాల మధ్య మైత్రిని పెంపొందించడం, సముద్ర భద్రతలో పరస్పర సహకారాన్ని చాటుతూ ఈనెల 21 నుంచి 25 వరకు భారత నౌకాదళం నిర్వహించే ప్రతిష్టాత్మక ‘మిలాన్–2026 సీ ఫేజ్’ విన్యాసాలకు మెరుగులు దిద్దుకుంటోంది. దశాబ్ద కాలం తర్వాత ఐఎఫ్ఆర్ సముద్ర భద్రత, సహకారం, స్థిరత్వం, సమన్వయాన్ని పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా ఈ ఫ్లీట్ రివ్యూ ఉంటుంది. దేశ చరిత్రలోనే మొదటి సారిగా అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్షను 2016లో ఇక్కడే నిర్వహించారు. దాదాపు పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్ఆర్–2026కు సాగరతీరం రెండోసారి ఆతిథ్యమిస్తోంది. ఈనెల 15 నుంచి 20వ తేదీల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈసారి ఫ్లీట్ రివ్యూకు ’యునైటెడ్ త్రూ ఓషన్స్’ (సముద్రాల ద్వారా ఏకమవుదాం) అనే ప్రత్యేక థీమ్తో నిర్వహిస్తున్నారు. తీరప్రాంత భద్రత, బ్లూ ఎకానమీ, కొత్త సాంకేతికత అనే అంశాలపై ఫ్లీట్ రివ్యూలో చర్చించనున్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు సముద్ర గర్భంలో భారత రక్షణ శక్తి సామర్థ్యాలు ఆవిష్కృతం కానున్నాయి. రాష్ట్రపతి సమక్షంలో ‘ఫ్లీట్ రివ్యూ’ ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం ఈనెల 18న జరగనుంది. భారత రాష్ట్రపతి, త్రివిధ దళాల సర్వసైన్యాధ్యక్షురాలు ద్రౌపదీ ముర్ము విశాఖ తీరంలో జరిగే నౌకల కవాతుకు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆమె ప్రెసిడెన్షియల్ యాచ్లో నౌకాదళ విన్యాసాలను పరిశీలిస్తారు. భారత నౌకాదళానికి చెందిన సుమారు 90 యుద్ధ నౌకలు, 45 విమానాలతో పాటు సుమారు 20కి పైగా విదేశీ యుద్ధ నౌకలు సముద్రంలో బారులు తీరి రాష్ట్రపతికి వందనం సమర్పిస్తాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసాలు ఐఎఫ్ఆర్, మిలాన్ విన్యాసాలకు భారతదేశం తన స్వదేశీ రక్షణ పరిజ్ఞానాన్ని ఈ వేదికపై ప్రపంచానికి చాటి చెప్పనుంది. సముద్రం పైన యుద్ధ నౌకలు ఉంటే, ఆకాశంలో యుద్ధ విమానాలు గర్జించనున్నాయి. విమానవాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈ విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటు ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మోర్ముగావ్ వంటి శక్తివంతమైన డిస్ట్రాయర్లు, కల్వరి క్లాస్ సబ్ మైరెన్లు పాల్గొంటాయి. అలాగే అత్యాధునిక డిస్ట్రాయర్లు ఐఎన్ఎస్ విశాఖపట్నం, తారాగిరి సముద్ర గర్భం నుంచి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే యుద్ధ విన్యాసాలను భారత నేవీ ప్రదర్శించనుంది. గగనతలంలో నౌకాదళానికి చెందిన మిగ్–29కె ఫైటర్ జెట్లు, పి–8ఐ నిఘా విమానాలు, సముద్రపు గద్దలుగా పేరుపొందిన ఎంహెచ్–60ఆర్ రోమియో హెలికాప్టర్లు, సీ కింగ్, ధృవ్ హెలికాప్టర్లు ఆకాశంలో అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించనున్నాయి. విదేశీ వైమానిక దళాలకు చెందిన ఆధునిక విమానాలు కూడా ఈ ప్రదర్శనలో భాగం కానున్నాయి. 60కి పైగా దేశాల భాగస్వామ్యం ఐఎఫ్ఆర్, మిలాన్ కోసం భారత నౌకాదళం మొత్తం 137 దేశాలకు ఆహ్వానం పింపింది. ఇందులో ఇప్పటి వరకు 60కి పైగా దేశాలు భాగస్వామ్యం అవుతున్నట్లు ధృవీకరణ వచ్చింది. ఇందులో 4 వేల మంది విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నారు. అలాగే విదేశీ నౌకాదళాధిపతులు 25 నుంచి 30 మంది వరకు రానున్నారు. ఇందులో అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, ఇరాన్ వంటి దేశాల నుంచి 23కి పైగా యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచే వివిధ దేశాల నౌకలు విశాఖ తీరానికి చేరుకోవడం ప్రారంభమవుతుంది. పాల్గొనే దేశాలు, ప్రతినిధులు అంశం వివరాలు మొత్తం ఆహ్వానిత దేశాలు 137 భాగస్వామ్యాన్ని ధృవీకరించిన దేశాలు 60+ విదేశీ ప్రతినిధుల సంఖ్య సుమారు 4వేలు విదేశీ నౌకాదళాధిపతులు 25 నుంచి 30 మందివిశాఖ ముంగిట ప్రపంచ నౌకాదళాల కవాతు! ఈ నెలలో మిలాన్–2026, ఐఎఫ్ఆర్ సంబరం 60కి పైగా దేశాల నుంచి యుద్ధ నౌకల రాక 18న రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ఫ్లీట్ రివ్యూ’ 19న మిలాన్ ప్రారంభం, అదే రోజు సాయంత్రం సిటీ పరేడ్విన్యాసాల షెడ్యూల్ ఇలా.. ఈ నెల 15న నావల్ బేస్ వద్ద ‘మిలాన్ విలేజ్’ ప్రారంభమవుతంది. 21వ తేదీ వరకు భారతీయ హస్తకళలు, సంస్కృతి, సంప్రదాయాలు అద్దం పట్టే కార్యక్రమాలు, రుచికరమైన వంటకాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 18వ తేదీ ఉదయం అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ప్రారంభమవుతుంది. 19వ తేదీ ఉదయం మిలాన్–2026 రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఆరంభమవుతుంది. 19వ తేదీ సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్డులో అంతర్జాతీయ సిటీ పరేడ్ జరగనుంది. ఇందులో దేశ విదేశీ నౌకాదళాల కవాతు, ఎయిర్ పవర్ డెమో (వైమానిక ప్రదర్శన) ఉంటాయి. 19, 20 తేదీల్లో మిలాన్ విన్యాసాల్లో భాగంగా ’హార్బర్ ఫేజ్’లో అంతర్జాతీయ సెమినార్లు, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. 20న ఐవోఎన్ఎస్ సదస్సు జరగనుంది. ఇందులో హిందూ మహాసముద్ర దేశాల నౌకాదళాధిపతులు భేటీ అవుతారు. ఇందులో 25 సభ్యదేశాలు, 9 అబ్జర్వర్ దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. 21 నుంచి 25 వరకు ‘మిలాన్’ సీ ఫేజ్ విన్యాసాలు జరుగుతాయి.ప్రధాన ఆకర్షణగా ‘సిటీ పరేడ్’ ఈ నెల 19వ తేదీ సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్డులో నిర్వహించే ‘ఇంటర్నేషనల్ సిటీ పరేడ్’ విశాఖ ప్రజలకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వివిధ దేశాల నావికా దళాల కవాతుతో పాటు, భారత నేవీకి చెందిన ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు ఆకాశంలో అద్భుతమైన విన్యాసాలు ప్రదర్శిస్తాయి. అదే విధంగా ఈనెల 15 నుంచే నావల్ బేస్ వద్ద ‘మిలాన్ విలేజ్’ సందర్శకులకు అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ భారతీయ హస్తకళలు, సంప్రదాయ వంటకాలు, రక్షణ రంగ ప్రదర్శనలు ఉంటాయి. రక్షణ దళాల సమీకరణ (బలగాల వివరాలు) మొత్తం యుద్ధ నౌకలు 110కి పైగా (భారత్ + విదేశీ) భారత నౌకాదళ నౌకలు 90 వరకు విదేశీ యుద్ధ నౌకలు 23 నుంచి 25 విమానాలు హెలికాప్టర్లు 60కి పైగా ప్రధాన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, విక్రమాదిత్య -
ఐఎఫ్ఆర్, మిలాన్కు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట: అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష(ఐఎఫ్ఆర్)–2026, మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కార్యక్రమాల నిర్వహణకు అన్ని విభాగాలు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు నేవీ, పోలీస్, ఇతర విభాగాల అధికారులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో బుధవారం సమీక్ష జరిపారు. కోస్ట్ గార్డ్ డీఐజీ రాజేష్ మిట్టల్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీలు, ఆర్డీవోలు, ఇతర అధికారులతో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి, రక్షణ శాఖ మంత్రి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులతోపాటు, 2 నుంచి 3 లక్షల వరకు ప్రజలు రానున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక వసతుల కల్పన, వైద్య సేవలు అత్యంత సమర్థవంతంగా ఉండాలని ఆదేశించారు. 17న రాష్ట్రపతి రాక ఈ నెల 17న రాష్ట్రపతి రాకతో కార్యక్రమాలు మొదలవుతాయని, 18న నౌకాదళ ఫ్లీట్ రివ్యూ, 19న ఉదయం మిలాన్ ప్రారంభోత్సవం, సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్డులో అంతర్జాతీయ సిటీ పరేడ్ ఉంటుందన్నారు. వెద్యం, అగ్నిమాపక, తాగునీరు, మొబైల్ టాయిలెట్లు, పరిశుభ్రత చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. బస్సులను ఇటు జగదాంబ, అటు పార్క్ హోటల్ జంక్షన్ వరకు నడపాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటుచేయాలి: సీపీ ప్రజా భద్రత దష్ట్యా సీసీ కెమెరాలు, నైట్ విజన్ పరికరాలు, కంట్రోల్ రూమ్ ద్వారా లైవ్ మానిటరింగ్కు చర్యలు తీసుకోవాల్సి ఉందని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సూచించారు. నో–డ్రోన్, నో కై ట్ జోన్ అమలు చేస్తామన్నారు. పార్కింగ్ ప్రాంతాల్లో, ప్రముఖులు రాకపోకలు సాగించే ప్రధాన రహదారుల్లో లైటింగ్ సదుపాయం కల్పించాలన్నారు. సమావేశంలో ఇండియన్ నేవీ అధికారులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
దేవస్థానానికి ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వాల్సిందే..
సింహాచలం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి చెందిన పలు సంస్థలకు గతంలో ఇచ్చిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం స్థలాలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ స్థలాలు ఇవ్వాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని బుధవారం ఆయన దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా మాధవ్ స్థానిక విలేకర్లతో మాట్లాడారు. దేవుడి భూములు దేవుడికే చెందాలన్నారు. దేవుడి భూములు తీసుకుంటే ప్రత్యామ్నాయంగా భూములు ఇవ్వాల్సిందే అన్నారు. సింహాచలం దేవస్థానం భూములు తీసుకున్న ప్రభుత్వ రంగ సంస్థలకు బదులుగా ప్రభుత్వం దేవస్థానానికి స్థలాలు ఇవ్వాల్సిందే అన్నారు. దేవస్థానానికి చెందిన 9 వేల ఎకరాల భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. ఒకవేళ అన్యాక్రాంతం జరిగితే తిరిగి తెచ్చుకోవాలన్నారు. సింహగిరిపై భక్తుల సౌకర్యార్థం నిర్మించే అన్ని కట్టడాలు మాస్టర్ ప్లాన్ ప్రకారమే జరగాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగితే గడచిన చందనోత్సవం రోజు జరిగినటువంటి దుర్ఘటనలు పునరావృతం కావన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 54కోట్లతో ప్రసాద్స్కీమ్ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రసాద్ పథకం, స్వదేశీ దర్శనం పేరిట కేంద్ర ప్రభుత్వ నిధులతో పలు ఆలయాల అభివృద్ధి జరుగుతోందన్నారు. సింహాచలం దేవస్థానంతో ముడిపడి ఉన్న పంచగ్రామాల భూమస్య తొందరలోనే పరిష్కారమవుతుందన్నారు. -
ఆరోగ్యానికి అభాయం
మహారాణిపేట: వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు విశాఖ కేంద్ర బిందువుగా మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అమలులో జిల్లా దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు జిల్లాలో 9,11,697 మంది ఈ డిజిటల్ కార్డుల కోసం నమోదు చేసుకోగా, వారిలో 75.66 శాతం మంది ఈ–కేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేసుకున్నారు. ఏమిటీ ‘అభా’ గతంలో ఆసుపత్రికి వెళ్లాలంటే పాత రిపోర్టులు, స్కానింగ్ ఫిల్మ్స్, ప్రిస్కిప్షన్ల కట్టలు మోసుకెళ్లాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ‘అభా’విధానాన్ని తీసుకొచ్చింది. ఇది 14 అంకెలు ఉండే ఒక విశిష్టమైన ఐడీ. బ్యాంకు ఖాతాలో డబ్బులు దాచుకున్నట్లే, మన ఆరోగ్య సమాచారాన్ని ఇందులో డిజిటల్ రూపంలో భద్రపరచవచ్చు. దేశంలో ఏ ఆసుపత్రికి వెళ్లినా ఈ ఐడీ చెల్లుబాటవుతుంది. అందుబాటులో సేవలు నెట్వర్క్: కేజీహెచ్, విక్టోరియా, ఈఎన్టీ, టీబీ ఆసుపత్రులతో పాటు అన్ని పీహెచ్సీలు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈ విధానం అమలవుతోంది. సచివాలయాల్లో ఏఎన్ఎంల ద్వారా కూడా నమోదు చేస్తున్నారు.ఆధార్ కచ్చితంగా మొబైల్ నంబర్కు లింక్ అయి ఉండాలి. బీమా సౌకర్యం: ఈ కార్డు ఉన్నవారికి ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తించే అవకాశం ఉంటుంది. ఈ–కేవైసీ తప్పనిసరి: కార్డు నమోదు చేసుకున్న తర్వాత ఈ–కేవైసీ పూర్తి చేస్తేనే కార్డులు జారీ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఆధార్కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే ప్రక్రియ మరింత సులభమవుతుంది. అభా వల్ల ఎన్నో ప్రయోజనాలు ప్రతి ఒక్కరూ అభా యాప్లో నమోదు చేసుకోవడం ద్వారా వైద్య సేవలను సులభతరం చేసుకోవచ్చు. దీని వల్ల దేశంలో ఎక్కడైనా మన ఆరోగ్య రికార్డులను చూపించే వెసులుబాటు కలుగుతుంది. అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ బీమా ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. ఇప్పటికే ఈ నమోదు ప్రక్రియలో విశాఖ జిల్లా దేశంలోనే రెండో స్థానంలో నిలవడం గర్వకారణం. రోగులు ఓపీ కోసం ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా ఈ డిజిటల్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ కె.అప్పారావు, జిల్లా సమన్వయకర్త, ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ సులభమైన ఓపీ విధానం స్మార్ట్ఫోన్ ఉన్నవారు ప్లేస్టోర్ నుంచి అభా యాప్ను డౌన్లోడ్ చేసుకుని, ఆధార్ వివరాలతో నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆసుపత్రికి వెళ్లాక, అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే నేరుగా టోకెన్ నంబర్ వస్తుంది. దీనిని కౌంటర్లో చూపిస్తే ఓపీ చీటీ జారీ చేస్తారు. దీనివల్ల క్యూలో గంటల తరబడి నిలబడే శ్రమ తప్పుతుంది. -
మిత్ర దేశాల కలయిక.. మిలాన్–2026
ఈనెల 19న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ చేతుల మీదుగా ‘మిలాన్–2026’ విన్యాసాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ‘సౌభ్రాతృత్వం, సహకారం, సమన్వయం‘ అనే నినాదంతో ఈ విన్యాసాలు జరగనున్నాయి. దీనికి సుమారు 137 దేశాలను ఆహ్వానించారు. ఇప్పటివరకు 60కి పైగా దేశాలు తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించాయి. మిలాన్ విన్యాసాలు రెండు దళల్లో జరుగుతాయి. ఈ నెల 19, 20 తేదీల్లో ‘హార్బర్ ఫేజ్’లో భాగంగా అంతర్జాతీయ సెమినార్లు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. 21 నుంచి 25 వరకు ‘సీ ఫేజ్’ ప్రారంభమవుతుంది. ఈ దశలో సముద్ర తీరంలో వివిధ దేశాల నౌకలు ఉమ్మడిగా యుద్ధ విన్యాసాలు, కమ్యూనికేషన్ డ్రిల్స్ నిర్వహిస్తాయి. -
14 నుంచి 21 వరకు బోట్ల నిలుపుదల
మహారాణిపేట: ఇండియన్ నేవీ నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), మిలాన్ కార్యక్రమాల నేపథ్యంలో ఈ నెల 14 నుంచి 21 వరకు నేవీ నౌకలు, బోట్లు నిలిపే ప్రాంతాల్లో చేపల వేట, మత్స్యకార బోట్ల సంచారంపై నిషేధం అమల్లో ఉంటుందని మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు మూలపాలెం గ్రామంలో మత్స్యకారులకు బుధవారం అవగాహన కల్పించారు. ప్రపంచ ప్రసిద్ధ కార్యక్రమాల సమర్థ నిర్వహణకు మత్స్యకారులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా నేవీ సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. బీచ్లు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. మత్స్యశాఖ జేడీతోపాటు ఎఫ్డీవో మురళి, మైరెన్ పోలీసులు బీకేవీ ప్రసాద్, శ్రీనివాస్, నేవీ అధికారులు మధుసూదన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్ఆర్, మిలాన్ నేపథ్యంలో మత్స్యకారులకు విజ్ఞప్తి -
2 నెలల్లో ఉక్కు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ ఉద్యోగుల వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు రెండు నెలల్లో పరిష్కారిస్తామని స్టీల్ప్లాంట్ ఇన్చార్జ్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా అన్నారు. బుధవారం స్టీల్ప్లాంట్ ఎల్డీసీ ఆడిటోరియంలో కేంద్ర ఉక్కు కార్యదర్శి సందీప్ పాండ్రిక్ అధికారులు, కార్మికులతో జరిగిన ఇంటాక్ట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సెయిల్కు చెందిన ఇతర ప్లాంట్లతో పోలిస్తే విశాఖ స్టీల్ప్లాంట్ పనితీరు ప్రైవేటు ప్లాంట్ల స్థాయిలో ఉందన్నారు. ఉత్పత్తి వ్యయం టన్నుకు 7 వేల వరకు తగ్గించే కీలక విభాగాలను గుర్తించామన్నారు. వాటిపై ప్రధాన దృష్టి సారిస్తామన్నారు. ప్రతీ విభాగం వారీగా సామర్ధ్యం పెంచడం, ఖర్చులు తగ్గించడం ఎలా అన్నదానిపై యోచించాల్సి ఉందన్నారు. కేంద్ర ఉక్కు కార్యదర్శి సందీప్ పాండ్రిక్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ప్లాంట్కు తక్కువ అంచనాలతో వచ్చామని, ఊహించిన దాని కంటే మంచి ఫలితాలు ఇచ్చారని ప్రశంసించారు. విశాఖ ఉక్కు ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మంచి బ్రాండ్ విలువ ఉందన్నారు. వెళ్లిపోయిన కస్టమర్లను తిరిగి తీసుకు రావాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ఆర్థిక శాఖ, ఉక్కు మంత్రిత్వశాఖల్లో విశాఖ స్టీల్ప్లాంట్ పట్ల దృక్పథం మారిందన్నారు. స్టీల్ప్లాంట్ రుణాలపై వడ్డీ రేటు 14 శాతం నుంచి 8.9 శాతానికి తగ్గిందన్నారు. ఇంకో సంవత్సరం ఇదే ఉత్సాహంతో పని చేసి ప్లాంట్ను మరింత ప్రగతి పథంలోకి తీసుకు వెళ్లాలన్నారు. ఈ ఏడాది ఏప్రిల్కు పదోన్నతులు ఇస్తామన్నారు. 5, 10 ఏళ్ల తర్వాత సమస్యలు రాకుండా కొత్త మేనేజ్మెంట్ ట్రైనీల నియామకాలు చేపడతామన్నారు. అధికారులు, కార్మికులను జిందాల్ వంటి ప్రైవేటు స్టీల్ప్లాంట్ల విజిట్కు పంపుతామన్నారు. కార్యక్రమంలో ఉక్కు ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు. ఇన్చార్జ్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా -
గ్రేటర్ బడ్జెట్ రూ.4,047.12 కోట్లు
డాబాగార్డెన్స్: మహా విశాఖ నగర పాలక సంస్థ 2026–27 వార్షిక బడ్జెట్కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరిగింది. కూటమి సభ్యులు(తెలుగుదేశం, జనసేన, బీజేపీ), వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ సభ్యులు బడ్జెట్ను ఆమోదించడం గమనార్హం. ముందుగా బడ్జెట్కు సంబంధించి మేయర్ పీలా శ్రీనివాసరావు క్లుప్తంగా వివరించారు. అనంతరం ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి వివిధ విభాగాలకు సంబంధించి ఎంతెంత కేటాయించారో సవివరంగా తెలిపారు. బడ్జెట్ ఇలా..: ప్రారంభ నిల్వ రూ.365.96 కోట్లు. అన్ని పద్దుల కింద జమలు రూ.3,814.41 కోట్లు కాగా, మొత్తంగా రూ.4,180.37 కోట్లు ఆదాయంగా పేర్కొన్నారు. అన్ని పద్దుల కింద ఖర్చులు రూ.4,047.12 కోట్లుగా, ముగింపు నిల్వగా రూ.133.25 కోట్లుగా నిర్ణయించినట్టు చెప్పారు. 2025–26 సవరించిన బడ్జెట్ రూ.4,070.19 కోట్లుగా చూపారు. పన్నులు ఇలా.. : జీవీఎంసీ వసూలు చేస్తున్న ఇంటిపన్ను, ఖాళీ జాగా పన్ను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు చార్జీలు, పారిశ్రామిక సంస్థలు చెల్లించాల్సిన పన్నులు, సర్వీసు చార్జీలు, ప్రకటన చార్జీలు, సెల్టవర్స్ చార్జీలు తదితరాలు ఈ పద్దు కింద రూ.680 కోట్లుగా చూపారు. పన్నులు కాని ఇతర ఆదాయాలు : నీటి సరఫరా చార్జీలు, పట్టణ ప్రణాళికా విభాగం వసూళ్లు. షాపురూముల అద్దెలు, కల్యాణమండపాల అద్దెలు, లీజులు, బల్క్, సెమీబల్క్, ఇతర నీటి సరఫరా చార్జీలు, వ్యాపార సంస్థల లైసెన్స్ ఫీజులు తదితరవి రూ.869.55 కోట్లుగా చూపారు. ప్రభుత్వం నుంచి సంక్రమించే ఆదాయం : స్టాంప్ డ్యూటీపై సర్చార్జ్, వృత్తిపన్ను, తలసరి గ్రాంటు, మోటారు వాహనాల పన్ను, ఆస్తిపన్ను రాయితీ నష్టపరిహారాలు, మెజిస్టీరియల్ జరీమానాలు తదితరాలు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం రూ.200 కోట్లుగా చూపారు. ప్రభుత్వ గ్రాంట్లు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అర్బన్ ఛాలెంజ్ నిధుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ.162.50 కోట్లు, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం నిధులు రూ.35 కోట్లు, పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.10 కోట్లు, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.240 కోట్లు, అమృత్కు రూ.102 కోట్లు, అసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా రూ.58 కోట్లు వస్తాయని ఆశించారు. బ్యాంకులు/ఆర్థిక సంస్థలు/బాండ్లు ద్వారా రుణాలు: జోన్–2 మధురవాడ ప్రాంతంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అభివృద్ధికి, జీవీఎంసీకి అవసరమైన వాటా సొమ్మును 2026–27 ఏడాదికి రూ.457.50 కోట్లు బ్యాంకులు/ఆర్థిక సంస్థలు/బాండ్లు/ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొని నిధుల సమకూర్చుకునేందుకు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఆమోదించిన పాలకవర్గం -
పలుకు సరస్వతి
పేరు లక్ష్మి..అవధాన రంగంలో జయలక్ష్మి అద్భుత ప్రతిభ పుష్కర ప్రాయంలోనే ‘అష్టావధానం’ అక్షరం ఆమెకు ఆటవస్తువు.. సంస్కృతం ఆమెకు ప్రాణవాయువు.. పన్నెండేళ్ల చిరుప్రాయంలోనే ఉద్ధండ పండితులు సైతం విస్తుపోయేలా సంస్కృత అష్టావధానాలు చేస్తూ అసాధారణ ప్రతిభను చాటుతోంది నరసింహదేవర జయలక్ష్మి. మైథిలీనాథ్, కిరణ్మయి దంపతుల పుత్రికగా, కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి నామానుగ్రహంతో జన్మించిన ఈ బాలిక, నేడు సాహితీ లోకంలో ఒక సంచలనంగా మారింది. ప్రస్తుతం బెంగళూరులోని పూర్ణప్రమతి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న జయలక్ష్మి, అటు ఆధునిక విద్యలోనూ, ఇటు ప్రాచీన సంస్కృత సాహిత్యంలోనూ అద్వితీయమైన ప్రజ్ఞను కనబరుస్తోంది. గురువుల శిక్షణలో.. గురువుల శిక్షణలో రాటుదేలిన ప్రతిభ ప్రవచన రాజహంస, అభినవ వాల్మీకి వంటి బిరుదాంకితులు, సంస్కృతాంధ్రా అవధానాల్లో అగ్రగణ్యులైన దూళిపాళ మహాదేవమణి సుశిక్షణలో జయలక్ష్మి అవధానిగా రూపుదిద్దుకుంది. అలాగే మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, కవితాకళానిధి నరసింహదేవర ఉమామహేశ్వరశాస్త్రి వంటి దిగ్గజాల మార్గదర్శకత్వం ఈమె ప్రతిభా వికాసానికి బలమైన పునాదిగా నిలిచింది. కేవలం నాలుగేళ్ల వయసు నుండే శ్లోక రచన ప్రారంభించిన జయలక్ష్మి, ఏడేళ్లకే ‘శ్యమంతకోపాఖ్యానం’, తొమ్మిదేళ్లకే ‘పిబరే రామరసం’ పేరుతో సంక్షిప్త రామాయణాన్ని రచించి తన మేధాశక్తిని నిరూపించుకుంది. ఇప్పటివరకు సుమారు 800 శ్లోకాలతో పాటు, తన సొంత ముద్రతో 16 దేవతా కృతులను సృజించడం సామాన్యమైన విషయం కాదు. కాశీ నుంచి విశాఖ వరకు.. కాశీ నుంచి విశాఖ వరకు.. జయలక్ష్మి అవధాన ప్రయాణం అత్యంత పవిత్రంగా ప్రారంభమైంది. 2025 అక్టోబర్ 26న కాశీ విశ్వనాథుని సన్నిధిలో జగద్గురువుల ఆశీస్సులతో, సామవేదం షణ్ముఖ శర్మ వంటి మహామహుల సమక్షంలో తన తొలి సంస్కృత అవధానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. ఆ తర్వాత పల్లిపాలెంలో విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి సమక్షంలో రెండో అవధానం, ఈ ఏడాది జనవరిలో అనంతపురం శంకరమఠంలో శలాక రఘునాథశర్మ అధ్యక్షతన మూడో అవధానం పూర్తి చేసి పండితుల ప్రశంసలు పొందింది. కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమస్యాపూరణ పోటీలో ద్వితీయ స్థానం సాధించడం ఆమె ప్రతిభకు మరో నిదర్శనం. నాలుగో అవధానం మంగళవారం విశాఖ ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో పూర్తి చేసింది. పండితుల ప్రశంసలు తన గురువు దూళిపాళ మహాదేవమణి సంచాలకత్వంలో జయలక్ష్మి మంగళవారం తన నాలుగవ సంస్కృత అష్టావధానంతో పండితులను ఔరా అనిపించింది. ఈ అవధానంలో నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, న్యస్తాక్షరి, ఆశువు, ఘంటావధానం, అప్రస్తుత ప్రసంగం వంటి క్లిష్టమైన ఎనిమిది అంశాలను ఆమె అవలీలగా ఎదుర్కోంది. అపారమైన ధారణా శక్తి, అప్పటికప్పుడు పద్యాలను అల్లగలిగే సృజనాత్మకత కలిగిన జయలక్ష్మి, భావితరాలకు మన ప్రాచీన భాషా వైభవాన్ని చాటిచెప్పే స్ఫూర్తిప్రదాతగా నిలుస్తోంది. భగవద్గీత పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, చిన్న వయస్సులోనే ఇంతటి పాండిత్యాన్ని సంపాదించిన ఈ బాల మేధావి ప్రస్థానం సాహితీ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం. ఏకాగ్రత, అపార జ్ఞాపకశక్తి, భాషా పరిజ్ఞానం మేళవిస్తేనే సాధ్యమయ్యే ‘అష్టావధానం’ వంటి క్లిష్టమైన ప్రక్రియను చిరు ప్రాయంలోనే అవలీలగా చేస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది నరసింహదేవర జయలక్ష్మి. బెంగళూరులో ఏడో తరగతి చదువుతున్న ఈ చిచ్చరపిడుగు, ఇప్పటికే మూడుసార్లు సంస్కృత అవధానం నిర్వహించి శభాష్ అనిపించుకుంది. మంగళవారం సాయంత్రం విశాఖ ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో జరిగిన తన నాలుగవ సంస్కృత అష్టావధానంలో సాహితీ దిగ్గజాల మధ్య తన ప్రతిభను చాటింది. పృచ్ఛకులు విసిరిన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, పద్యాలను అప్పటికప్పుడు అల్లి, ధారణా శక్తితో వాటిని తిరిగి చెప్పిన తీరు చూసి సాహితీవేత్తలు విస్మయం చెందారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ఈ బాలిక వారధిలా నిలుస్తోందని పండితులు ప్రశంసల జల్లు కురిపించారు. – సీతంపేట -
బాల మేధావి అపూర్వ అష్టావధానం
అబ్బురపడ్డ సాహితీవేత్తలు సీతంపేట: విశాఖ సాహితి ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో జరిగిన నరసింహదేవర జయలక్ష్మి సంస్కృత అష్టావధానం సభికులను మంత్రముగ్ధులను చేసింది. బెంగళూరులో 7వ తరగతి చదువుతున్న ఈ బాలిక, మహాదేవ మణి శిష్యురాలిగా తన అద్భుత మేధాశక్తిని ప్రదర్శించింది. ఎనిమిది మంది పృచ్ఛకులు సంధించిన కఠినమైన సాహిత్య సవాళ్లు, నిషిద్ధాక్షరి, దత్తపది వంటి అంశాలను ఏకాగ్రతతో ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు అల్లి తన ధారణా శక్తితో అందరినీ నివ్వెరపరిచింది. శ్రీలలితాపీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతీ స్వామి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ సభకు ఆచార్య కోలవెన్ను మలయవాసిని అధ్యక్షత వహించగా, డాక్టర్ ధూళిపాళ మహదేవమణి సంచాలకులుగా వ్యవహరించారు. పీబీవీ శివప్రసాద్, డా.ధూళిపాళ అన్నపూర్ణ వంటి ప్రముఖులు పృచ్ఛకులుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో, చిన్న వయస్సులోనే సంస్కృత భాషపై జయలక్ష్మి కనబరిచిన పట్టును చూసి సెంచురియన్ వర్సిటీ వీసీ ఆచార్య జి.యస్.ఎన్.రాజు, విశ్రాంత ఐఏఎస్ వై.వి. అనురాధ తదితర ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. -
మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యం
సబ్బవరం: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో నూతనంగా ఎంపికై న 6 వేల మంది కానిస్టేబుల్ శిక్షణార్థులకు మాదకద్రవ్యాల నియంత్రణ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంతో రాష్ట్ర పోలీస్ శాఖ మంగళవారం ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జరిగిన ఈ ఒప్పందం ద్వారా, ప్రస్తుతం శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు మాదకద్రవ్యాల కేసుల నమోదు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణపై నిష్ణాతులైన న్యాయ నిపుణులచే శిక్షణ ఇప్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 పోలీస్ శిక్షణ కళాశాలలు, 5 బెటాలియన్లు మరియు 9 పోలీస్ శిక్షణ కేంద్రాలలో తొమ్మిది నెలల పాటు కొనసాగే ఈ శిక్షణలో భాగంగా, ఈ నెల 22వ తేదీ నుంచి ప్రత్యేక ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ తరగతుల ద్వారా ఎన్.డి.పి.ఎస్ చట్టంలోని మెళకువలు, క్షేత్రస్థాయిలో చట్టాన్ని అమలు చేసే విధానాలపై శిక్షణార్థులకు పట్టు సాధించేలా బోధించనున్నారు. ఈ శిక్షణ వల్ల రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసు యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ డి. రామచంద్రరాజు, డీఎస్ఎన్ఎల్యూ ఉపకులపతి ఆచార్య డి. సూర్యప్రకాశరావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఐజీపీ (ట్రైనింగ్) సత్య యేసు బాబు తదితర ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొని మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ఈ విద్యా–పోలీస్ భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పోలీస్ శాఖ – డీఎస్ఎన్ఎల్యూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం -
ఆకట్టుకుంటున్న ‘వసుంధర’ నగల మేళా
ఏయూక్యాంపస్: వివాహ శుభకార్యాలకు మరింత శోభను చేకూర్చేలా ‘వసుంధర’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆభరణాల ఎగ్జిబిషన్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్థానిక వెల్కమ్ గ్రాండ్ బే హోటల్లో మంగళవారం ప్రారంభమైన ఈ రెండు రోజుల బంగారు, వజ్రాల నగల ప్రదర్శనను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైవిధ్యమైన, నూతన డిజైన్లతో కూడిన ఈ ప్రదర్శన విశాఖ వాసులకు మంచి అవకాశమని కొనియాడారు. సంస్థ వ్యవస్థాపకురాలు వసుంధర కాసరనేని మాట్లాడుతూ.. విశాఖలో తమ ఆభరణాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన ప్రత్యేక కలెక్షన్ల గురించి సంస్థ ఉపాధ్యక్షురాలు, విశాఖ బ్రాంచ్ అధిపతి శ్రీదేవి తొట్టెంపూడి వివరించారు. వందలాది వినూత్న డిజైన్లు, మెరిసే వజ్రాల నగల కలెక్షన్ మగువులను మంత్రముగ్ధులను చేస్తోంది. తొలిరోజే పెద్ద సంఖ్యలో మహిళలు విచ్చేసి తమకు నచ్చిన ఆభరణాలను ఆసక్తిగా కొనుగోలు చేశారు. బుధవారం కూడా ఈ ప్రదర్శన కొనసాగనుంది. -
సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ–ఏక్సిస్ ఆవిష్కరణ
బీచ్రోడ్డు: సుజుకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఈ–ఏక్సిస్‘ను సిరిపురంలోని పద్మజ సుజుకి షోరూంలో సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, ఎంవీఐ బుచ్చిరాజు, వరుణ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ దేవ్, ఈడీ టి.వినోద్కుమార్లు గౌరవ అతిథులుగా హాజరై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యతను వివరించారు. సుజుకి ఈ–ఏక్సిస్ ఆధునిక సాంకేతికత, డిజైన్, ఫీచర్లతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. వాహనాన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 95 కి.మీ. ప్రయాణించవచ్చన్నారు. మూడేళ్లలోపు విక్రయించేవారి బై బ్యాక్ ఆఫర్ 80 శాతం అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పద్మజ సుజుకి జీఎం రఫీ, సుజుకి ఏరియా సేల్స్ మేనేజర్ సురేందర్, ఏరియా సర్వీస్ మేనేజర్ సాయి, పద్మజ సుజుకి సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు. -
ఐఎఫ్ఆర్, మిలాన్, ఐయాన్స్ నిర్వహణపై సమీక్ష
అల్లిపురం: నగరంలో ఈ నెల 14 నుంచి 25 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఐ.ఎఫ్.ఆర్, మిలాన్, ఐయాన్స్– కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమాల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ అంతర్జాతీయ సదస్సులకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు, విశిష్ట అతిథులు పెద్ద సంఖ్యలో రానున్న నేపథ్యంలో, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన వ్యూహాన్ని సిద్ధం చేశారు. ముఖ్యంగా విదేశీ ప్రతినిధుల రాకను పురస్కరించుకుని ఇమిగ్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయడం, వారు బస చేసే ప్రాంతాలు, కార్యక్రమ వేదికల వద్ద బందోబస్తు నిర్వహించడంపై కమిషనర్ సుదీర్ఘంగా చర్చించారు. వీఐపీల రాకపోకల కోసం కేటాయించిన రోడ్డు మార్గాలు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ప్రాంతాల గుర్తింపు, భద్రతా దృష్ట్యా నగరాన్ని ‘నో డ్రోన్ జోన్’గా ప్రకటించడం వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తూ, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కీలక సమావేశంలో నేవీ ఉన్నతాధికారులు, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ప్రతినిధులు, ఎయిర్పోర్టు, సీపోర్టు అధికారులు పాల్గొనగా.. వారితో పాటు రైల్వే, సీఐఎస్ఎఫ్, ఫిషరీస్, ఫైర్ సర్వీస్ విభాగాల అధికారులు కూడా హాజరయ్యారు. పోలీస్ శాఖ తరఫున డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు పాల్గొని క్షేత్రస్థాయిలో భద్రతా ప్రణాళికల అమలుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. -
తాబేళ్లను రక్షించిన ఇండియన్ నేవీ
విశాఖ సిటీ : సముద్ర సరిహద్దులను కాపాడటమే కాకుండా, సముద్ర గర్భంలోని మూగజీవాలను సంరక్షించడంలోనూ భారత నావికాదళం తమ దాతృత్వాన్ని చాటుకుంది. విశాఖ తీరంలో గస్తీ నిర్వహిస్తున్న ‘ఐఎన్ఎస్ తార్ముగ్లి’ యుద్ధ నౌక సిబ్బంది.. మృత్యువుతో పోరాడుతున్న రెండు అరుదైన తాబేళ్లను ప్రాణాలతో రక్షించారు. కోస్టల్ సెక్యూరిటీ పెట్రోలింగ్లో భాగంగా ఐఎన్ఎస్ తార్ముగ్లి సిబ్బంది సముద్రంపై గస్తీ నిర్వహిస్తుండగా నీటిపై తేలుతున్న పాత చేపల వలలో ఏదో కదలిక ఉండడాన్ని గమనించారు. నిశితంగా పరిశీలించగా, అంతర్జాతీయంగా అంతరించిపోతున్న జాబితాలో ఉన్న రెండు ‘ఆలివ్ రిడ్లే’ తాబేళ్లు ఆ వలలో చిక్కుకున్నట్లు గుర్తించారు. వెంటనే యుద్ధనౌకలోని నేవీ డైవర్లు సముద్రంలోకి దూకి ఆ వలను కోసి తాబేళ్లను విడిపించారు. గాయాలపాలైన ఆ తాబేళ్లకు ప్రాథమిక చికిత్స అందేలా చూసి, వాటిని సురక్షితంగా తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టారు. -
ఫిర్యాదులు
పచ్చనేతల తప్పుడు ప్రచారాలపై సాక్షి, విశాఖపట్నం: కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు లేదని సీబీఐ ఆధ్వర్యంలో సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తప్పుడు ఆరోపణలు చేసిన పాపం ఎక్కడ తమకు అంటుకుంటుందోనన్న భయం కూటమి నేతల్లో మొదలైంది. అసత్య ఆరోపణలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పలేక తప్పించుకునేందుకు విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు తెరతీసింది. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, ౖవైవీసుబ్బారెడ్డి, కరుణాకర్రెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తోంది. హిందూ ధర్మాన్ని, హిందువుల మనోభావాలను దెబ్బతిస్తూ అసత్య ఆరోపణలు చేస్తోంది. ఈ ఫ్లెక్సీలు పెట్టిన వారిపైనా, వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినిపై దాడులకు పాల్పడిన వారిపైనా చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్లలో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. ● గాజువాక నియోజకవర్గంలో సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి న్యూపోర్టు పోలీసుస్టేషన్లో సీఐ కామేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, వైవీ.సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిలపై దుష్ప్రచారం చేస్తున్న, సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్న కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదు చేయాలని కోరారు. కార్పొరేటర్లు గుడివాడ అనూష, మహ్మద్ ఇమ్రాన్, ఉరుకూటి చందుతో పాటు పార్టీ నేతలు మార్టుపూడి పరదేశి, కోమటి శ్రీనివాసరావు పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ● విశాఖ తూర్పు నియోజకవర్గంలో సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో ఎంవీపీ పోలీస్స్టేషన్ సీఐ ప్రసాదరావుకు వైఎస్సార్ సీపీ నాయకులు ఫిర్యాదును అందజేశారు. తిరుమల లడ్డూపై నిరాధార ఆరోపణలతో వైఎస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేయడమే కాకుండా తమ పార్టీ నేతల ఇళ్లపై దాడులకు తెగబడిన కూటమి నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, కార్పొరేటర్లు మువ్వల లక్ష్మి, మొల్లి లక్ష్మి, పల్లా దుర్గారావు, పార్టీ ముఖ్యనేతలు పేర్ల విజయచందర్, అల్లంపల్లి రాజుబాబుతోపాటు వైఎస్సార్సీసీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ● విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానికీరామ్ ఆధ్వర్యంలో వన్టౌన్ పోలీస్స్టేషన్లో సీఐ వరప్రసాద్కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నేతలు సనపల రవీంద్ర భరత్, ముజిఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 31వ వార్డు అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రామానంద్ ఆధ్వర్యంలో టూటౌన్ సీఐకి ఫిర్యాదు చేశారు. 27వ వార్డు సర్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఫోర్తు టౌన్ పోలీస్స్టేషన్ సీఐకి ఫిర్యాదు చేశారు. 29వ వార్డు అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో మహారాణిపేట పోలీస్ స్టేషన్ సీఐకి ఫిర్యాదు చేశారు. ● విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 56వ వార్డు కార్పొరేటర్ గుండాపు నాగేశ్వరరావు, బల్ల లక్ష్మణ్రావు, పీవీ సురేష్ మల్కాపురం సీఐ గొలగాని అప్పారావుకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు మళ్ల ధనలత, రేవల్ల సత్యనారాయణ, వై.రాజు, పిలకా రాము పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
ఫస్ట్ అండ్ లాస్ట్ బడ్జెట్!
మేయర్ కాలానికి మోగిన ముగింపు గంట నేడు 2026–27 జీవీఎంసీ బడ్జెట్ సమావేశం మరో నెలన్నరలో పాలకవర్గానికి తెర డాబాగార్డెన్స్ : జీవీఎంసీ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. నగర పాలకవర్గం కాలపరిమితి ముగియడానికి మరో నెలన్నర రోజులే గడువు ఉండటంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు నగర ప్రజల్లో భవిష్యత్తు పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెల 18వ తేదీతో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం అధికారికంగా ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో మేయర్ పీలా శ్రీనివాసరావు బుధవారం ప్రవేశపెట్టనున్న 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్, ఆయన పదవీ కాలంలో మొదటిది, చివరిది కావడం గమనార్హం. నిబంధనల ప్రకారం మార్చి 7వ తేదీ తర్వాత ఎటువంటి కౌన్సిల్ సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో, ఉన్న కొద్దిపాటి సమయంలోనే వీలైనన్ని స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించి పెండింగ్ పనులను చక్కబెట్టే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. మళ్లీ చంద్రకాలమేనా? నగర చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, మళ్లీ పాత రోజులే పునరావృతమవుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2012 ఫిబ్రవరి 27 నుంచి సుమారు ఎనిమిదేళ్ల పాటు జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించలేదు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, అధికారుల పాలనే సుదీర్ఘకాలం కొనసాగింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 2021లో గ్రేటర్ విశాఖకు ఎన్నికలు నిర్వహించగా, వైఎస్సార్ సీపీ ఘనవిజయం సాధించి పాలనా పగ్గాలు చేపట్టింది. ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, గతంలో లాగే మళ్లీ అధికారుల పాలన మొదలవుతుందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే.. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఇప్పట్లో ఎన్నికలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. పాలకవర్గ పదవీకాలం ముగియగానే సహజంగానే అధికారుల పాలన అమల్లోకి రానుంది. ఇదే తరుణంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. తన నియోజకవర్గ పరిధిలోని 64 పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేయాలని కోరుతూ ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు సాఫీగా రాకపోకలు సాగడానికి, భీమిలి పరిధిలో ప్రతిపాదించిన ఏడు కీలక మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణానికి ఈ విలీనం ఎంతో అవసరమని ఆయన వాదిస్తున్నా రు. ఒకవేళ ప్రభుత్వం ఈ విలీన ప్రక్రియను చేపడితే, అది పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండదు కాబట్టి, మరోసారి సుదీర్ఘకాలం పాటు నగర పాలన అధికారుల చేతుల్లోనే ఉండే అవకాశం ఉంది. విద్యారంగంపై నిర్లక్ష్యం గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విద్యకు మంచి ప్రాధాన్యతనిచ్చారు. బాల్యం పథకం కింద 3 నుంచి 7 ఏళ్లలోపు బాలలకు చిన్నబడి కార్యక్రమం కింద అంగన్వాడీ కేంద్రాలతో మున్సిపల్ పాఠశాలలను అనుసంధానం చేసి పౌష్టికాహారం, విద్య, క్రీడా సదుపాయాలు కల్పించేందుకు రూ.15 కోట్లు కేటాయిస్తే..ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విద్యకు కేవలం రూ.2.25 కోట్లు మాత్రమే కేటాయించారు. గత బడ్జెట్ అలా.. నేటి బడ్జెట్ ఇలా.. నగర ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబించే బడ్జెట్ గణాంకాల్లో కూడా భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ప్రారంభ నిల్వ రూ.482.26 కోట్లుగా ఉండగా, ప్రస్తుత 2026–27 బడ్జెట్లో అది రూ.365.96 కోట్లకు పడిపోయింది. అంటే ప్రారంభ నిల్వలోనే సుమారు రూ.116.3 కోట్ల మేర కోత పడింది. గతేడాది అన్ని పద్దుల కింద మొత్తం ఆదాయం రూ.4,761.87 కోట్లుగా చూపగా, ఈ ఏడాది అది రూ.4,180.37 కోట్లకు పరిమితమైంది. అంటే ఆదాయం పరంగా చూస్తే ఈ ఏడాది ఏకంగా రూ.370 కోట్లు తగ్గినట్లు స్పష్టమవుతోంది. ముగింపు నిల్వలో సైతం రూ.27 కోట్ల మేర తేడా ఉండటం గమనార్హం. -
ఎంఎస్ఎంఈలు, మౌలిక వసతులపై దృష్టి రాష్ట్రానికి అనుకూలం
బీచ్రోడ్డు: కేంద్ర బడ్జెట్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. నగరంలోని ఓ హోటల్లో మీడియాతో సోమవారం మాట్లాడిన ప్యాప్సీ మాజీ అధ్యక్షుడు కంకటాల మల్లికార్జునరావు మాట్లాడారు. బడ్జెట్లో ఆత్మనిర్భర్ ఇండియా ఫండ్కు ప్రతిపాదించిన రూ.4,000 కోట్లు చిన్న వ్యాపారాల మూలధన ప్రాప్తిని మెరుగుపరుస్తుందన్నారు. ఈ బడ్జెట్లో ఎలాంటి ఉచితాలు లేవని, ఇందుకు కేంద్రం వద్ద బడ్జెట్ సరిపడా లేకపోవడం కారణం కావొచ్చన్నారు. వీసీసీఐ అధ్యక్షుడు ఎం.సుదర్శన్ స్వామి మాట్లాడుతూ లాజిస్టిక్స్, పోర్టులు, తీర రవాణా, ఫ్రైట్ కారిడార్లపై దృష్టి రాష్ట్ర సముద్ర ఆధారిత సామర్థ్యాలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పి.శోభన్ ప్రకాష్ మాట్లాడుతూ మూలధన వ్యయాన్ని రూ.12.22 లక్షల కోట్లకు పెంచడం ఉపాధి, పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. భారత డేటా సెంటర్లను వినియోగించే ఏఐ, క్లౌడ్ సంస్థలకు 2047 వరకు పన్ను రాయితీలు ఇవ్వడం విశాఖను డిజిటల్ మౌలిక వసతుల ప్రధాన కేంద్రంగా నిలబెడుతుందని అభిప్రాయపడ్డారు. -
చావు అంచుల నుంచి క్షేమంగా..
నాలుగు నెలల చీకటి వీడింది.. గంగ పుత్రుల కన్నీళ్లు తుడిచింది. బంగ్లాదేశ్ చెర నుంచి విముక్తులై, చావు అంచుల్లో నుంచి ప్రాణాలతో తిరిగి వచ్చిన మత్స్యకారులు సోమవారం ఉదయం తమ సొంత గడ్డపై అడుగుపెట్టారు. ఆత్మీయుల ఆలింగనాలతో ఫిషింగ్ హార్బర్ కన్నీటి సంద్రమైంది. – బీచ్రోడ్డు ఇంజిన్ వైఫల్యంతో అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లి, బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు చిక్కిన 9 మంది మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా ఇళ్లకు చేరారు. గత ఏడాది అక్టోబర్ 14న వేటకు వెళ్లిన వీరు అక్టోబర్ 22న అరెస్ట్ అయ్యి బాగర్హాట్ జైలులో నాలుగు నెలల పాటు మగ్గారు. కేంద్ర ప్రభుత్వం, మత్స్యకార సంఘాల చొరవతో జైలు నుంచి విముక్తి పొంది, సోమవారం ఉదయం ప్రత్యేక షిప్లో విశాఖ ఫిషింగ్ హార్బర్కు చేరుకున్నారు. మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు, మైరెన్ పోలీసులు వీరికి స్వాగతం పలికి, కలెక్టర్ ఆదేశాల మేరకు నిత్యావసరాలు అందజేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చావు అంచుల్లో నుంచి తిరిగి వచ్చామంటూ మత్స్యకారులు కన్నీటి పర్యంతమయ్యారు. కీలకపాత్ర పోషించిన జానకిరామ్ 9 మంది మత్స్యకారుల విడుదలలో వైఎస్సార్ సీపీ నాయకులు, బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ కీలక పాత్ర పోషించారు. స్వయంగా బంగ్లాదేశ్ వెళ్లిన ఆయన, అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపి మత్స్యకారుల విముక్తికి కృషి చేశారు. జైల్లో ఉన్న సమయంలో బాధితులతో వీడియో కాల్స్ మాట్లాడించి, వారి కుటుంబాల్లో ధైర్యం నింపారు. భావోద్వేగలతో నిండిన హార్బర్ బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన తొమ్మిది మంది మత్స్యకారులు విశాఖ తీరానికి చేరుకోవడంతో హార్బర్లో భావోద్వేగ దృశ్యాలు నెలకొన్నాయి. అసలు తిరిగి వస్తామో లేదో అన్న భయం నుంచి విముక్తి పొంది.. తమ కుటుంబ సభ్యులను చూడగానే మత్స్యకారులు ఆనంద భాష్పాలతో వారిని ఆలింగనం చేసుకున్నారు. ప్రాణాలతో తిరిగి వచ్చిన తమ వారిని చూసి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. విడుదలైన మత్య్సకారులు వీరే.. విశాఖ జిల్లాకు చెందిన మారుపల్లి చిన్న అప్పన్న, మారుపల్లి ప్రవీణ్ ,నక్క రమణ, మారుపల్లి రమేష్, విజయనగరం జిల్లాకు చెందిన వాసుపల్లి సీతయ్య, మైలపల్లి అప్పన్న , సురపటి రాము, మారుపల్లి చిన్న అప్పన్న, సూరడ అప్పలకొండ.ప్రాణాలతో వస్తారనుకోలేదు నా భర్త సంపాదన మీదే ఇద్దరు పిల్లలు, ఇల్లు గడవాలి. ఆయన బంగ్లా జైలులో ఉన్నారని తెలియగానే ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. అసలు తిరిగి వస్తారో లేదో తెలియక, ఈ నాలుగు నెలలు తిండి కూడా సహించలేదు. మత్స్యకార నాయకులు మమ్మల్ని ఆదుకున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించింది, వచ్చిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నాం. ఆయన క్షేమంగా తిరిగి రావడం మాకు పునర్జన్మ లాంటిది. –మరుపల్లి జ్యోతి, మత్యకారుడు చిన్న అప్పన్న భార్య బిడ్డ ముఖం చూశాక.. కష్టమంతా మర్చిపోయా భార్య గర్భిణిగా ఉన్నప్పుడు ఆసుపత్రి ఖర్చుల కోసం వేటకు వెళ్లా. బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన సమయంలోనే బాబు పుట్టాడని తెలిసింది. వాడిని ఎప్పుడు చూస్తానా అని క్షణమొక యుగంలా గడిపాను. నెల రోజుల బాబును ఇవాళ చేతుల్లోకి తీసుకోగానే ఆ జైలు కష్టాలు, భయాలన్నీ మర్చిపోయాను. మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చిన వారందరికీ రుణపడి ఉంటాను. –సూరాడ అప్పలకొండ, మత్స్యకారుడు -
రూ. 4,180 కోట్ల అంచనాతో జీవీఎంసీ వార్షిక బడ్జెట్
రేపు ప్రవేశపెట్టనున్న మేయర్ బడ్జెట్ ప్రొఫైల్డాబాగార్డెన్స్: జీవీఎంసీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను మేయర్ పీలా శ్రీనివాసరావు బుధవారం కౌన్సిల్ హాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఐదేళ్ల పాలనలో మొదటి నాలుగేళ్లు వైఎస్సార్ సీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్ హోదాలో బడ్జెట్ను ఆమోదింపజేయగా, ప్రస్తుత పాలకవర్గంలో మేయర్ పీలా శ్రీనివాసరావుకు ఇది చివరి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశంగా నిలిచింది. బుధవారం నిర్వహించనున్న ఈ బడ్జెట్ సమావేశానికి సంబంధించి గత నెల 12నే జీవీఎంసీ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో మేయర్, స్థాయీ సంఘం చైర్మన్ సమక్షంలో ప్రాథమిక చర్చలు జరిగాయి. ఆ సమావేశంలో వివిధ విభాగాల వారీగా కేటాయింపులు, జమలు, ఖర్చులపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించి, కొన్ని మార్పులు చేర్పులతో ముసాయిదాకు ఆమోదం తెలిపారు. బడ్జెట్ అంచనాలు ఇలా.. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనాలను పరిశీలిస్తే, ప్రారంభపు నిల్వ రూ.365.96 కోట్లుగా ఉండగా, అన్ని పద్దుల కింద వచ్చే జమలు రూ.3814.41 కోట్లుగా లెక్కించారు. వెరసి మొత్తం ఆదాయం రూ.4180.37 కోట్లు కాగా, వివిధ అభివృద్ధి పనులు మరియు నిర్వహణ కోసం రూ.4047.12 కోట్లను ఖర్చుగా ప్రతిపాదించారు. చివరగా రూ.133.25 కోట్లను ముగింపు నిల్వగా నిర్ణయించారు. శాఖల వారీగా చూస్తే సాధారణ పరిపాలన విభాగంలో రూ.1232.60 కోట్ల జమలు, రూ.375.82 కోట్ల ఖర్చులు ఉండగా, అత్యధికంగా ఇంజనీరింగ్ విభాగంలో రూ.1018.18 కోట్ల ఖర్చులను ప్రతిపాదించారు. లైటింగ్ విభాగం కోసం రూ.129.19 కోట్లు, ప్రాజెక్టుల కోసం రూ.67.35 కోట్లు, టౌన్ ప్లానింగ్ కోసం రూ.23.98 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రజారోగ్యం విభాగానికి రూ.455.94 కోట్లు, నీటి సరఫరా విభాగానికి రూ.260.08 కోట్లు కేటాయించగా, విద్య, పార్కుల అభివృద్ధికి కూడా తగిన ప్రాధాన్యతనిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల విషయానికి వస్తే అమృత్ పథకం కింద రూ.388 కోట్లు, ఆర్థిక సంఘం నిధుల నుండి రూ.215 కోట్లు, అర్బన్ చాలెంజింగ్ ఫండ్ ద్వారా రూ.650 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు డిపాజిట్లు, అడ్వాన్సుల కింద రూ.340.82 కోట్ల వ్యయాన్ని బడ్జెట్ అంచనాల్లో పొందుపరిచారు. రూ.1018.18 కోట్లుఇంజినీరింగ్ విభాగం రూ.650 కోట్లు అర్బన్ చాలెంజింగ్ ఫండ్ ప్రజారోగ్యం విభాగానికి రూ.455.94 కోట్లునీటి సరఫరా విభాగానికి రూ.260.08 కోట్లు రూ.129.19 కోట్లులైటింగ్ విభాగం కోసం టౌన్ ప్లానింగ్ కోసం రూ.23.98 కోట్లు అన్ని పద్దుల కింద జమలు రూ.3814.41 కోట్లు ముగింపు నిల్వ రూ.133.25 కోట్లు -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం
కొమ్మాది: జీవీఎంసీ 8వ వార్డు ఎండాడలో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) బ్రాంచ్ను బ్యాంక్ జోనల్ మేనేజర్ వందన పాండే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువలో ఉండేందుకు అన్ని చోట్ల బ్రాంచ్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇది తమ 69వ బ్రాంచ్ అన్నారు. ప్రతి బ్రాంచ్లో రిటైల్, అగ్రి సంబంధిత అన్ని బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రానున్న 132వ వ్యవస్థాపన దినోత్సవం నాటికి డిజిటల్ లెండింగ్లో రూ.లక్ష కోట్ల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంక్ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
సాంస్కృతిక పోటీల్లో దివ్యాంగుల ప్రతిభ
ఆరిలోవ: సమగ్ర శిక్ష, జిల్లా సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో తోటగరువు వద్ద ఎర్నిమాంబ కల్యాణ మండపంలో సోమవారం ప్రత్యేక అవసరాల(దివ్యాంగ) పిల్లలకు సాంస్కృతిక, కళా, హస్తకళ ప్రదర్శన పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 11 భవిత కేంద్రాల నుంచి సుమారు 60 మంది పిల్లలు పాల్గొన్నారు. వివిధ వేషధారణలో పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఈవో ఎన్.ప్రేమకుమార్ ప్రతిభ కనబరిచిన పిల్లల్ని అభినందించి, బహుమతులు అందించారు. అనంతరం అయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఇలాంటి పోటీలు ఇక్కడ నిర్వహించడం ఇదే తొలిసారన్నారు. ఈ పోటీల్లో విభాగాలవారీగా 17 మందికి ప్రథమ, 11 మందికి ద్వితీయ, 10 మందికి తృతీయ బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ జె.చంద్రశేఖర్, ఏయూ ప్రొఫెసర్ ఎం.పుష్పరాజ్యం, ప్రియదర్శిని వికలాంగుల సంస్థ ప్రిన్సిపాల్ పి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కుట్రలు బట్టబయలయ్యేసరికి అబద ్ధపు ఫ్లెక్సీలు
సాక్షి, విశాఖపట్నం: తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన కుట్రలు సీబీఐ చార్జీషీట్తో విఫలమయ్యాయని, అందుకే దిక్కుతోచక వైఎస్సార్సీపీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో అక్కయ్యపాలెం కూడలిలో గుర్తుతెలియని వ్యక్తులు వై.ఎస్. జగన్మోహన్నెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల ఫొటోలతో అబద్ధపు ఆరోపణలున్న భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చిచెప్పిన నేపధ్యంలో, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కూటమి మద్దతుదారులు విశాఖలో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇలా తప్పుడు ప్రచారం చేయడం తీవ్రమైన నేరమన్నారు. ఈ ఘటనపై కేకే రాజు ఫోర్త్ టౌన్ సీఐ ఉమాకాంత్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మాట నిలబెట్టుకున్నాం
మా మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తామని వారి కుటుంబాలకు మాట ఇచ్చాం, ఆ మాట నిలబెట్టుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. బంగ్లాదేశ్ అధికారులతో మాట్లాడి, జైలులో ఉన్న మనవారికి ధైర్యం చెప్పడమే కాకుండా.. వారి విడుదల కోసం నాలుగు నెలల పాటు నిరంతరం శ్రమించాం. ఈ మానవతా ప్రయత్నంలో సహకరించిన భారత హైకమిషన్ (ఢాకా), ఖుల్నా అసిస్టెంట్ హైకమిషన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. అందరి సమన్వయంతోనే ఈ విజయం సాధ్యమైంది. –వాసుపల్లి జానకి రామ్ -
జోన్.. జటిలం
సాక్షి, విశాఖపట్నం: పార్లమెంట్లో విత్తమంత్రి బడ్జెట్ ప్రసంగం.. వైజాగ్ వాసుల్ని నిరుత్సాహంలోకి నెట్టేస్తే.. సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో.. రైల్వే మంత్రి మరింత నిస్పృహలోకి నెట్టేశారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న జోన్ కార్యకలాపాలు ప్రారంభించే అంశం కాస్తా జటిలంగా ఉందని, దీని కోసం ఫాస్ట్ట్రాక్ పద్ధతిలో పనిచేస్తున్నామంటూ అశ్వినీ వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలతో.. నీలినీడలు మళ్లీ కమ్ముకున్నాయి. ఇప్పట్లో గెజిట్ విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదన్నది స్పష్టమవుతోంది. మరోవైపు వాల్తేరు డివిజన్కు బడ్జెట్ కేటాయింపుల్లోనూ మొండిచెయ్యి చూపించారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటన వచ్చి ఆరేళ్లు గడిచినా కార్యకలాపాలకు మరికొంత సమయం వేచి చూడాల్సిందేనని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది. ఓవైపు.. జోన్ ప్రధాన కార్యాలయం పనులు జరుగుతుండగా.. మరోవైపు తాత్కాలిక కార్యాలయం సిద్ధమైనా.. గెజిట్ విడుదలకు మాత్రం ఇంకా దక్షిణ కోస్తా రైల్వే జోన్ నోచుకోలేదు. గతేడాది దసరాకు గెజిట్ వస్తుందని ఊరించారు. తర్వాత దీపావళి.. క్రిస్మస్.. సంక్రాంతి.. ఇలా పండగలు వస్తూ వెళ్తున్నా.. కార్యకలాపాలు మాత్రం మొదలవ్వకపోవడం చూస్తే... ఈ వ్యవహారం జటిలంగా మారుతోందని అర్థమవుతోంది. తాజాగా.. రైల్వే మంత్రి చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూర్చాయి. ‘దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ జఠిలమైన వ్యవహారం. జోన్కోసం ఫాస్ట్ట్రాక్ పద్ధతిలో పనిచేస్తున్నాం. కంట్రోల్ కమాండ్ టైమ్టేబుల్, సిబ్బంది సహా మొత్తం మార్చాల్సి ఉంది. ఈ మార్పిడి ప్రక్రియ సజావుగా జరిగేలా పనిచేస్తున్నాం..’ అంటూ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడటం చూస్తే.. జోన్ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదని రైల్వే వర్గాలు పెదవి విరుస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ జోన్కు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు గాని, ఇతర ప్రకటనలు కానీ చెయ్యకపోవడం చూస్తే.. వైజాగ్లో జోన్ అధికారులు తమ విధుల్ని నిర్వర్తించేందుకు అవసరమైన గెజిట్ విడుదలయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. చురుగ్గా జోన్ పనులు : డీఆర్ఎం లలిత్ బోరా విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులు చురుగ్గా సాగుతున్నాయని వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోరా తెలిపారు. సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే బడ్జెట్లో కేటాయింపుల వివరాల్ని వెల్లడించారు. 2009–14 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో వార్షిక సగటు బడ్జెట్ కేవలం రూ.886 కోట్లు ఉండగా, 2026–27 నాటికి రూ.10,134 కోట్లకు చేరడం శుభపరిణామమన్నారు. దశాబ్ద కాలంలో రైల్వే బడ్జెట్ దాదాపు 11 రెట్లు బడ్జెట్ పెరిగిందనీ.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రూ.92,649 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాన్నారు. ‘అమృత్భారత్ స్టేషన్ పథకం’ కింద 73 స్టేషన్ల ఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో 8 జతల వందే భారత్, 8 జతల అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. త్వరలోనే డివిజన్ వారీగా కేటాయింపుల వివరాల్ని రైల్వే బోర్డు ప్రకటిస్తుందని డీఆర్ఎం లలిత్ బోరా స్పష్టం చేశారు. -
గడువులోగా అర్జీలకు పరిష్కారం చూపాల్సిందే
బీచ్రోడ్డు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ హెచ్చరించారు. కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో పాల్గొని అర్జీలు రీ–ఓపెన్ అయ్యే పరిస్థితి రావద్దని స్పష్టం చేశారు. రెవెన్యూ క్లినిక్లకు వచ్చే భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో జాప్యం సహించబోమని పేర్కొన్నారు. ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగేలా రెవెన్యూ క్లినిక్లను అర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వినతులకు సరైన సమాధానం ఇవ్వకుండా పదేపదే రీ–ఓపెన్కు కారణమవుతున్న పద్మనాభం వ్యవసాయ శాఖ ఏవోకు నోటీసు ఇచ్చి, 48 గంటల్లోగా వివరణ తీసుకుని తనకు నివేదించాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విద్యాధరి, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ సత్యవేణిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు 444 వినతులు సమర్పించారు. వాటిలో రెవెన్యూకి సంబంధించి 154, జీవీఎంసీకి చెందినవి 105, పోలీసు 10, ఇతర శాఖలకు సంబంధించినవి 175 వినతులు ఉన్నాయి. ఐఎఫ్ఆర్ కు సన్నద్దంగా ఉండండి ఇటీవల జరిగిన విశాఖ ఉత్సవ్ నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేసి, విజయవంతం చేశారని ప్రశంసించారు. ఇదే తీరున మరి కొన్ని రోజుల్లో జరగనున్న ఐఎఫ్ఆర్ను కూడా విజయవంతం చేయాలని సూచించారు. ‘స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు శాఖ’ పోస్టర్ ఆవిష్కరణ స్వర్ణాంధ్ర మన సంకల్పం(విజన్–2047) లక్ష్యంతో ఇటీవల పేరు మార్చిన గ్రామ సచివాలయాలకు సంబంధించిన పోస్టర్ను సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. స్వర్ణ గ్రామం– స్వర్ణ వార్డు పేరిట రూపొందించిన ఈ పోస్టర్ను గ్రామవార్డు సచివాలయ కో–ఆర్డినేటర్ ఉషారాణి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, జేసీ, ఇతర అధికారులు ఆవిష్కరించారు. జర్నలిస్టులకు వారం రోజుల్లో ఆరోగ్య పరీక్షలు విశాఖ జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు వారం రోజుల్లో ఆరోగ్య పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి(ఎన్ఏజే), ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు కలెక్టర్ను పీజీఆర్ఎస్లో కలిసి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టుల బస్ పాస్ల గడువు ముగిసిన నేపథ్యంలో కొత్త అక్రిడిటేషన్లు జారీ అయ్యే వరకు మరో నెల రోజుల పాటు పాసుల్ని రెన్యువల్ చేయాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ. ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావు బ్రాడ్కాస్ట్ కార్యదర్శి కింతాడ మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చక్రి, సంజీవ్, రాజశేఖర్, జి.జగన్ తదితరులున్నారు పోలీస్ పీజీఆర్ఎస్కు 102 ఫిర్యాదులు విశాఖ సిటీ: పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులపై దృష్టి పెట్టి చట్టపరంగా వాటిని పరిష్కరించాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు 102 ఫిర్యాదులు వచ్చాయి. సీపీ స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జీవీఎంసీ జోన్–3 ఏసీపీపై చర్యలు తీసుకోవాలి నా సొంత స్థలంలో ఉన్న షాపును ఓ ప్రైవేట్ వ్యక్తితో చేతులు కలిపి జీవీఎంసీ జోన్–3 ఏసీపీ గత ఏడాది జూన్ 2న ఫుట్పాత్ ఆక్రమణ పేరిట తొలగించారు. నా షాప్ పక్కన చాలా షాపులున్నా.. కేవలం రాజకీయ ఒత్తిడితో నా షాపును మాత్రమే తొలగించారు. గత 30 ఏళ్లుగా కరెంట్ బిల్లు, టాక్స్లు కడుతున్నాను. వేరే వ్యక్తులు అక్కడ ఫుట్పాత్ను ఆక్రమించి మటన్ షాపులు నిర్వహిస్తున్నారు. వాటికి ఏసీపీ సహకరిస్తున్నారు. తక్షణమే ఏసీపీపై విచారణ జరిపి, నాకు న్యాయం చేయాలి. – ఎం.శ్యామ్కుమార్, చినవాల్తేరు -
ఎన్నికల హామీల మేరకు బడ్జెట్ కేటాయింపులు ఉండాలి
బీచ్రోడ్డు: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం రద్దయిన ఎస్సీల సంక్షేమ పథకాల పునరుద్ధరణకు, 50 ఏళ్లకే పింఛన్, డీబీటీ, ఇతర పద్దుల్లో ఎస్సీల వాటా నిధులకు రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ సబ్ ప్లాన్ కింద కనీసం రూ.40 వేల కోట్లు కేటాయించాలని విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండు చేశారు. బడ్జెట్ కేటాయింపులపై సబ్ ప్లాన్ వాటాదారులైన ఎస్సీ, ఎస్టీలతో సంప్రదించాలన్నారు. విదసం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద జరిగిన సోమవారం ధర్నాలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలకు అనుగుణంగా రద్దయిన 20 పథకాల పునరుద్ధరణకు, ఇతర కేటాయింపులకు అదనపు నిధులు ప్రకటించాలన్నారు. గతేడాది పేర్కొన్న రూ.20 వేల కోట్ల నిధుల్ని కూటమి ప్రభుత్వం డీబీటీ పథకాలకు కేటాయించేసిందని ఆక్షేపించారు. పౌర హక్కుల నేత తుంపాల శ్రీరామమూర్తి మాట్లాడుతూ గతేడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలిస్తామని జీవో ఇచ్చి, ఇప్పుడు వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఇస్తామనడం పచ్చి మోసమని మండిపడ్డారు. డి.నిర్మల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విదసం విశాఖ జిల్లా నాయకులు గుడాల ఈశ్వరరావు, కొత్తపల్లి వెంకటరమణ, బాగం గోపాల్, బి.ఉమామహేశ్వరి, రాజేంద్రప్రసాద్, జేవీ భాస్కరరావు, సబ్బవరపు శ్రీనివాసరావు, గుడివాడ భాస్కరరావు, బాణాస రామ్ ప్రభు, తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో సచివాలయ ఉద్యోగి
రూ.16వేలు లంచం తీసుకొంటుండగా పట్టివేత గాజువాక: జీవీఎంసీ 74వ వార్డు నెహ్రూనగర్ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఇంటి పన్ను మార్పు కోసం వచ్చిన ఒక వ్యక్తి నుంచి అడ్మిన్ సెక్రటరీ గణేష్ రూ.16వేలు లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం రాత్రి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వార్డులోని పైడిమాంబ కాలనీకి చెందిన పల్లా సత్తిబాబు ప్రభుత్వ భూమిలో ఒక షెడ్డు నిర్మించుకొని జీవీఎంసీకి ఆస్తి పన్ను, నీటి కొళాయి పన్ను చెల్లిస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వం ఆ షెడ్డుకు సత్తిబాబు భార్య పేరుమీద పట్టా మంజూరు చేసింది. దీంతో తన షెడ్డుకు గల ఆస్తి పన్నును తన భార్య పేరుమీద మార్చాల్సిందిగా సత్తిబాబు దరఖాస్తు చేసుకున్నాడు. పని చేయాల్సిన నెహ్రూనగర్ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ గణేష్ రూ.25వేలు లంచం డిమాండ్ చేయగా..ఇటీవల రూ.9 వేలు చెల్లించాడు. మిలిగిన రూ.16 వేలు డిమాండ్ చేయడంతో సత్తిబాబు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు మిగిలిన సొమ్ము ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ హర్షిత నేతృత్వంలో రెడ్హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. ఏసీబీ అధికారులు నిందితుడి నివాసం, ఆఫీసు ప్రాంగణంలో ఈ సోదాలను కొనసాగించారు. దీనికి సంబంధించి రాత్రి 12 గంటలకు కూడా విచారణ కొనసాగింది. నిందితుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నగరంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. -
అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలి: ఎస్ఎఫ్ఐ
జిల్లాలో కళాశాలలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆయా సమయాల్లో అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు కలెక్టర్ను కోరారు. విద్యార్థులకు ఉచిత లేదా రాయితీ బస్ పాసులు అందించాలన్నారు. విద్యార్థుల విద్యా హక్కును కాపాడేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని లేకుంటే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.అజయ్, డి.వెంకటరమణతో పాటు కమిటీ సభ్యులు నరేష్, భరత్, ప్రగతి, ధనుష్, పలు కళాశాలల విద్యార్థులు ఉన్నారు. -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 129 వినతులు
58 అర్జీలతో పట్టణ ప్రణాళికా విభాగం టాప్! ఙడాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు 129 వినతులు అందాయి. వీటిలో అత్యధికంగా 58 ఫిర్యాదులు పట్టణ ప్రణాళికా విభాగానివే కావడం విశేషం. పీజీఆర్ఎస్ను అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ సంయుక్తంగా నిర్వహించారు. అందిన వినతుల్లో జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 9, రెవెన్యూ 14, ప్రజారోగ్య విభాగం 8, ఇంజినీరింగ్ సెక్షన్ 33, హార్టికల్చర్ 4, యూసీడీకి 3 అందాయి. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్కుమార్, ప్రధాన సిటీ ప్లానర్ ప్రభాకరరావు, డీసీఆర్ శ్రీనివాసరావు, ఏడీహెచ్ వాసు, స్పోర్ట్స్ డైరెక్టర్ అప్పలరాజు, పర్యవేక్షక ఇంజినీర్లు, డీసీపీలు, ఏసీపీలు, కార్యనిర్వాహక ఇంజినీర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి
ఉక్కునగరం: విధులకు వెళ్తున్న స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుడు మార్గమధ్యలో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. స్టీల్ప్లాంట్ పోలీసులు అందించిన వివరాలివి.. వడ్లపూడి అప్పికొండ ఆర్హెచ్ కాలనీకి చెందిన జి.సంజీవరావు(41) స్టీల్ప్లాంట్ టీపీపీ విభాగంలో స్కిల్డ్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. సోమవారం యథావిధిగా బైక్పై విధులకు బయల్దేరాడు. సీఐఎస్ఎఫ్ యూనిట్ కాంప్లెక్స్ కూడలి వద్ద స్పీడ్ బ్రేకర్ దాటే క్రమంలో ముందున్న బైక్ను ఢీకొట్టాడు. దీంతో కింద పడి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ఉద్యోగులు అతన్ని వెంటనే కారులో ఉక్కు జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. స్టీల్ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్
తాటిచెట్లపాలెం: తిరుమల లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారం చేస్తూ విశాఖలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆధ్వర్యంలో ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నాయకులు, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో రూ. 5 వేల కోట్ల భూములను గీతం సంస్థకు కట్టబెట్టడంపై తాము చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకే టిడిపి ఈ కుట్రలకు పాల్పడుతోందని, సనాతన ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నాయకులు ఈ విష ప్రచారంపై ఎందుకు మౌనంగా ఉన్నారని వారు ప్రశ్నించారు. లడ్డూ ఆరోపణలు రాజకీయ కుట్రే : కేకే రాజు తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని సీబీఐ చార్జీషీట్, సిట్ నివేదికలతో స్పష్టమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జంతువుల కొవ్వు కలిసిందంటూ భక్తుల విశ్వాసాలతో ఆడుకోవడం దారుణమన్నారు. తమ అబద్ధాలు బయటపడటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైఎస్సార్ సీపీ నేతల ఇళ్లపై దాడులు చేయిస్తూ, ప్రశ్నించే గొంతుకలను కేసులతో నొక్కేస్తున్నారని మండిపడ్డారు. భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్లు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో అక్రమంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి : ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న విధ్వంసం చూస్తుంటే మనం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణమన్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఆయనను అంతం చేసే కుట్రలా కనిపిస్తోందని ఆరోపించారు. లడ్డూ వివాదంలో పన్నిన కుట్రలు బయటపడటం, గీతం సంస్థకు భూముల కేటాయింపు వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. అధికార పార్టీ నేతలే స్వయంగా దాడుల్లో పాల్గొంటూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నందున, గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఎస్ఈసీ సభ్యులు రొంగలి జగన్నాథం, రాష్ట్ర సంయక్త కార్యదర్శి కిరణ్రాజు, తాడి జగన్నాథ్రెడ్డి, పల్లా దుర్గారావు రాష్ట్ర అనుబంధ విభాగాల కార్యనిర్వాహక అధ్యక్షులు జీవీ రవిరాజు, మాజీ చైర్మన్లు అల్లంపల్లి రాజబాబు, ఆల్ఫా కృష్ణ, జోనల్ అనుబంధ అధ్యక్షులు పీవీ సురేష్, ఎం.సునీల్కుమార్, సేనాపతి అప్పారావు, జిల్లా అనుబంధ అధ్యక్షులు బర్కత్ ఆలీ, బోని శివరామకృష్ణ, రాయపురెడ్డి అనిల్కుమార్, కర్రి రామారెడ్డి, పీలా ప్రేమ్కిరణ్ జగదీష్, దేవరకొండ మార్కండేయులు, బొండా ఉమామహేశ్వర్రావు, కార్పొరేటర్లు అల్లు శంకర్రావు, సాడి పద్మారెడ్డి, రెయ్యి వెంకటరమణ, కేవీఎన్ శశికళ, వార్డు అధ్యక్షుల చొల్లంగి నాగేశ్వర్రావు, భీశెట్టి విలియం ప్రసాద్, జక్కంపూడి సత్యనారాయణ, పైడిరమణ, బి.గోవింద్రాజు, డొప్ప శ్రీను, లాలం వేణు, గొపాలస్వామి, మెట్ట దమయంతి, యర్రంశెట్టి శ్రీనివాస్, గొడేసి శ్రీనివాసరెడ్డి, బొడ్డ గొవింద్, పార్టీ నాయకులు విక్టర్, రామన్నపాత్రుడు, దుళ్ల రామకృష్ణరెడ్డి, బొట్టా రాజు, పద్మశేఖర్, సుశీల, గంగామహేష్, గాలిప్రసాద్, బొడ్డేటి కిరణ్, మువ్వలసంతోష్, లక్ష్మణరావు, షేక్ బాబ్జీ, బంగారు భవాని శంకర్, తదితరులు పాల్గొన్నారు. కుట్రలు బట్టబయలయ్యేసరికి అబద్ధపు ఫ్లెక్సీలు -
ఏప్రిల్ నాటికి పేదల గృహాలకు సోలార్ వెలుగులు
కొమ్మాది: రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ద్వారా విద్యుత్ లబ్ధి చేకూరుతుందని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వితేజ్ అన్నారు. సోమవారం సాగర్నగర్లో నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం సూర్యఘర్–ముఫ్త్ బిజిలీ యోజన’ కింద పేద కుటుంబాలకు సౌర విద్యుత్ అందించడంలో ఏపీ ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 328 మెగావాట్ల సామర్థ్యంతో 94 వేల కనెక్షన్లు ఉండగా, కేవలం ఈపీడీసీఎల్ పరిధిలోనే 142 మెగావాట్ల సామర్థ్యంతో 44,452 ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. క్లస్టర్ విధానంలో 41 సంస్థలకు టెండర్లు కేటాయించామని, ప్రతిరోజూ 250 కొత్త కనెక్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును ఏప్రిల్ 2026 నాటికి మెజారిటీ భాగం, మే నాటికి పూర్తిస్థాయిలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పృథ్వితేజ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంఎన్ఆర్ఈ డైరెక్టర్ ఆదిత్య ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు బైకులు ఢీకొని యువకుడి మృతి
సబ్బవరం: మండలంలోని అనకాపల్లి–నారపాడు ప్రధాన రహదారిపై అమ్ములపాలెం చర్చి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్ రెహ్మాన్ (27) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారపాడు శివారు బలిజపాలెంకు చెందిన రెహ్మాన్ సబ్బవరంలోని ఒక చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. పని నిమిత్తం సబ్బవరం వెళ్లి తిరిగి వస్తుండగా, ఎదురుగా వస్తున్న గోర్లి శ్రీనివాసరావు ద్విచక్రవాహనం రెహ్మాన్ బైకును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన రెహ్మాన్ మరణించగా, శ్రీనివాసరావుకు స్వల్ప గాయాలయ్యాయి. సీఐ జి. రామచంద్రరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య షకీనా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆరిలోవ: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణాపురం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుబ్బల మహేష్ (37) మృతి చెందాడు. అమలాపురానికి చెందిన మహేష్ తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై బీఆర్టీఎస్ రోడ్డులో వెళ్తుండగా, డివైడర్పై ఉన్న పూల మొక్కల కొమ్మలు తలకు తగలడంతో బైక్ అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో తల కు తీవ్ర గాయమై మహేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వెనుక కూర్చున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఆరిలోవ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డీఎస్పీగా లోచన్కుమార్ ఎంపిక
అల్లిపురం: గ్రూప్–1 ఫలితాల్లో జీవీఎంసీ 34వ వార్డు భూపేష్నగర్ ప్రాంతానికి చెందిన చెల్లుబోయిన లోచన్కుమార్ సత్తా చాటాడు. డీఎస్పీగా ఎంపికయ్యాడు. అతని తండ్రి రవిశంకర్ శ్రీనివాస్ నేవల్ డాక్యార్డులో ఉద్యోగి కాగా తల్లి సత్యవతి గృహిణి. లోచన్కుమార్ ప్రాథమిక విద్యాభ్యాసం నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో, ఇంటర్ గాయత్రి కాలేజీలో, డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీలో కొనసాగించాడు. 2024లో ఆర్ఎస్ఐగా సెలక్ట్ అయ్యాడు. జాబ్ చేస్తూనే గ్రూప్–1కి ప్రిపేర్ అయిన లోచన్కుమార్ గ్రూప్–1లో డీఎస్పీగా ఎంపికయ్యాడు. ఈ మేరకు అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రుల కోరిక మేరకు కష్టపడి చదివి డీఎస్పీగా ఎంపికయ్యాయనని లోచన్కుమార్ స్పష్టం చేశారు. -
ప్రజలకు సంతృప్తిగా సేవలందించాలి
కలెక్టర్ హరేందిర ప్రసాద్ బీచ్రోడ్డు: జిల్లా ప్రజలు సంతృప్తి చెందే విధంగా అధికార యంత్రాంగం పనిచేయాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా, జోనల్, మండల అధికారులతో పాజిటివ్ పబ్లిక్, పర్సెప్షన్, కుటుంబ సర్వే, ఎలక్టర్స్ మ్యాపింగ్ తదితర అంశాలపై కలెక్టర్ వెబ్ ఎక్స్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలపై ఐవీఆర్ఎఫ్, క్యూఆర్ కోడ్ పద్ధతిలో అభిప్రాయాలను సేకరిస్తున్నందున అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ వైద్యులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. రోగులకు ఉచితంగా మందులు అందించాలని కోరారు. లంచం అడిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సులు సమయానికి నడిచేలా, ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. జీవీఎంసీ పరిధిలో గ్రామ పంచాయతీల్లో తాగునీరు, పారిశుధ్యం, అన్న క్యాంటీన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అక్రమంగా మత్తు మందులు అమ్మేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి సరఫరా చేసేవారికి శిక్ష తప్పదన్నారు. రెవెన్యూలో డిజిటల్ అసిస్టెంట్లు దరఖాస్తులు తీసుకునేటప్పుడు వీఆర్వో సంతకం ఉంటేనే తీసుకుంటామని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, సర్వే నెంబర్తో దరఖాస్తు ఇస్తే రిజిస్టర్ చేయాలన్నారు. ఐఎఫ్ఆర్–2026, మిలాన్ అంతర్జాతీయ నౌకాదళ కార్యక్రమాల నిర్వహణను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ హరేందిర ప్రసాద్ జ్ఞానాపురం నుంచి నేవీ హెడ్క్వార్టర్స్ వరకు కొనసాగుతున్న రహదారి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈనెల 15వ తేదీలోగా పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, టూరిజం, విద్యుత్, ఫైర్, రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సమష్టి సహకారంతో విశాఖ ఉత్సవ్ విజయం
ఏయూక్యాంపస్: అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమష్టి సహకారంతో ఎనిమిది రోజుల పాటు సాగిన విశాఖ ఉత్సవ్–2026 శనివారం సాయంత్రం ఆర్కే బీచ్లో ఘనంగా ముగిసింది. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ.. నగరవ్యాప్తంగా వివిధ వేదికల్లో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా పోటీలు ప్రజలను విశేషంగా అలరించాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు జరిగాయని, భవిష్యత్తులో మరిన్ని మెరుగైన ఏర్పాట్లతో ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. ఆర్కే బీచ్తో పాటు భీమిలిలోనూ పడవ పోటీలు, బీచ్ స్పోర్ట్స్, రంగోలి వంటి కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వివిధ పోటీల విజేతలకు, సహకరించిన అధికారులకు కలెక్టర్ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ముగింపు వేడుకల్లో భాగంగా ప్రముఖ నాట్యాచార్యులు బాల కొంటలరావు పర్యవేక్షణలో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు, సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, గాయని మాళవికల సంగీత విభావరి సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి. కార్యక్రమంలో సమాచార కమిషనర్ పి.ఎస్. నాయుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
విశాఖలో పుణే, వెల్లింగ్టన్ డిఫెన్స్ స్టాఫ్ కాలేజీ విద్యార్థులు
సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణలో తూర్పు నౌకాదళం కీలకంగా వ్యవహరిస్తోందని ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్ అన్నారు. తమిళనాడు వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ 81వ స్టాఫ్ కోర్సుకి చెందిన 225 మంది విద్యార్థి అధికారులు, పుణే డీఎస్ఎస్సీకి చెందిన 90 మంది అధికారులు పారిశ్రామిక ప్రదర్శన పర్యటనలో భాగంగా విశాఖలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ను సందర్శించారు. పర్యటనలో భాగంగా అధికారులు ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్ను కలిసి.. నౌకాదళ కార్యకలాపాలపై కమాండ్ ప్లాన్స్ ఆఫీసర్ ఇచ్చిన ప్రజెంటేషన్లో పాల్గొన్నారు. అనంతరం ‘ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలు–భారత నౌకాదళ వ్యూహం’ అనే అంశంపై చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (ఆపరేషన్స్) నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విశాఖలోని ఈస్టర్న్ ఫ్లీట్ యుద్ధ నౌకలు, సబ్–మైరెన్లను క్షేత్రస్థాయిలో సందర్శించి, దేశ సముద్ర రక్షణ సామర్థ్యాలు, నౌకాదళం నిర్వహిస్తున్న బాధ్యతలను పరిశీలించారు. -
ప్రజా సమస్యలపై పోరాటం చేద్దాం..
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికలకు ముందు ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు అనంతరం అన్నింటిని విస్మరించి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. శనివారం మద్దిలపాలెంలో గల పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రచార విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు జి.వి.రవిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర ప్రచార విభాగం సమావేశానికి కేకే రాజు, రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ హాజరయ్యారు. తొలుత బి.ఆర్.అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ చంద్రబాబు అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును ప్రజలకు వివరిస్తూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలపై చేసే పోరాటంలో వైఎస్సార్ సీపీ ప్రచార విభాగమే ముందుండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ఉన్న ప్రచార విభాగం అధ్యక్షులు, కార్యవర్గం అందరూ తమ స్థాయిలో ఉన్న ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీయాలని, వాటిపై పోరాటం చేయాలన్నారు. తమ దగ్గర ఉన్న స్మార్ట్ మొబైల్నే ఆయుధంగా చేసుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రచార విభాగం జిల్లా అధ్యక్షులు కాయ భీమసేన(శ్రీకాకుళం), వలిరెడ్డి శ్రీనివాస నాయుడు(విజయనగరం), గిరి రఘు(పార్వతీపురం మన్యం జిల్లా), ధోని బాపూజీ (అల్లూరి సీతారామరాజు), పిల్లా శ్రీను(అనకాపల్లి), రాష్ట్ర ప్రచార విభాగం కమిటీ ఉపాధ్యక్షులు రావూరి వెంకటేశ్వరరావు, కాకూ ఉమావల్లి యాదవ్, ప్రధాన కార్యదర్శి బెతపూడి రాజేంద్ర కుమార్, కార్యదర్శులు బంకుపల్లి లోకనాథం శర్మ, పొడిపిరెడ్డి అరుణ, అహరోన్ పాల్, వామిశెట్టి పవన్ కుమారి, వట్టికూటి కృష్ణవేణి, మహంతి కృష్ణమోహన్, సురేష్, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర క్రిస్టియన్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ, ఎస్ఈసీ సభ్యుడు సతీష్వర్మ పాల్గొన్నారు. -
12న జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె
అల్లిపురం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని జీవీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు పడాల రమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్లు నల్లనయ్య, సత్యవతిలకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, మున్సిపల్ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను వీడాలని డిమాండ్ చేశారు. సమ్మెలో జీవీఎంసీ రెగ్యులర్, అవుట్సోర్సింగ్ , కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె. సత్యనారాయణ, వాసు, శివ, ప్రసాద్, కోటి తదితరులు పాల్గొన్నారు. -
మేయర్కు విలువలే కాదు.. జ్ఞానం కూడా లేదు
డాబాగార్డెన్స్: నగర ప్రథమ పౌరుడిగా హుందాగా ఉండాల్సిన మేయర్ పీలా శ్రీనివాసరావు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆరోపించారు. విచ్చలవిడి అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిన మేయర్కు సభా మర్యాదలు గానీ, కనీస జ్ఞానం గానీ లేవని వారు మండిపడ్డారు. శనివారం జీవీఎంసీలోని ఫ్లోర్ లీడర్ చాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు కార్పొరేటర్లతో కలిసి ఆయన మాట్లాడారు. అక్రమంగా భూబదలాయింపు ప్రయత్నం గీతం సంస్థ ఆక్రమించిన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ సంస్థ చైర్మన్, ఎంపీ శ్రీభరత్కు కట్టబెట్టేందుకే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని 15వ అంశాన్ని చేర్చారని వారు విమర్శించారు. నిరుపేదలకు సెంట్ భూమి ఇవ్వాలంటే వంద నిబంధనలు పెట్టే ప్రభుత్వం, వేల కోట్ల విలువైన ప్రజా ఆస్తిని బడాబాబులకు ఎలా అప్పగిస్తుందని ప్రశ్నించారు. ఈ అంశాన్ని అజెండా నుంచి తొలగించాలని ముందుగానే వినతిపత్రం ఇచ్చినా మేయర్ ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమన్నారు. సభలో రౌడీయిజం సమావేశం ప్రారంభానికి ముందే సీసీ కెమెరాలు ఆపేసి, మీడియాను అనుమతించకుండా గూండాల తరహాలో వ్యవహరించారని కట్టమూరి సతీష్, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆరోపించారు. అక్రమ తీర్మానాన్ని వైఎస్సార్సీపీతో పాటు వామపక్ష కార్పొరేటర్లు అడ్డుకుంటే, కూటమి కార్పొరేటర్లు దౌర్జన్యంగా దాడులకు దిగారని వాపోయారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులను సభలోకి రప్పించి కౌన్సిల్ గౌరవాన్ని మంటగలిపారని, విశాఖ చరిత్రలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ లేదని గుర్తుచేశారు. తమ హయాంలో మేయర్ హుందాగా ఉండేవారని, విభజన జరిగిన తీరులోనే నేడు కౌన్సిల్ నిర్వహించారని వారు ధ్వజమెత్తారు. అందరికీ వాటాలు ఉన్నాయా? ఎంపీ శ్రీభరత్ ప్రయోజనాల కోసం మేయర్తో పాటు ఎమ్మెల్యేలు, కూటమి నేతలు తహతహలాడుతున్నారని, ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా వాటా ఉందేమో అందుకే ఆయన స్పందించడం లేదేమో అని సందేహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే ఆ భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచాలని హితవు పలికారు. ఈ భూ దోపిడీపై వైఎస్ జగన్ మొహన్ రెడ్డి సూచనలతో పెద్దల సహకారంతో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బొత్సపై వ్యాఖ్యలు హాస్యాస్పదం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సభకు వచ్చే అర్హత లేదనడం మేయర్ అజ్ఞానానికి నిదర్శనమని కట్టమూరి సతీష్, బాణాల శ్రీనివాసరావు విమర్శించారు. ఎమ్మెల్సీగా, ఇక్కడ ఓటు హక్కు ఉన్న వ్యక్తిగా ఆయనకు పూర్తి హక్కు ఉందని, కమిషనర్ ఆదేశాల మేరకే నేరుగా ఆయనకు అజెండా కాపీ పంపి ఆహ్వానించడం జరిగిందని గుర్తుచేశారు. బొత్స కాలిగోటికి కూడా సరిపోని మేయర్ ఆయనపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు చెన్నా జానకీరామ్, రెయ్యి వెంకటరమణ, బిపిన్ కుమార్ జైన్, కఠారి అనీల్ కుమార్, పీవీ సురేష్, గుండపు నాగేశ్వరరావు, కోరుకొండ స్వాతీదాస్, పల్లా అప్పలకొండ, సాడి పద్మారెడ్డి, అనూష, తోట పద్మావతి, కేవీఎన్ శశికళ, మొల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆటలొద్దు
భక్తుల మనోభావాలతో● 49వ వార్డు ఎన్జీఓస్ కాలనీలోని శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం విషప్రచారాన్ని తిప్పికొడుతూ కొబ్బరికాయలు కొట్టారు. రాజకీయ స్వలాభం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ● విశాఖ తూర్పు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో సీతమ్మధారలో త్రిమూర్తిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పారావు మాట్లాడుతూ భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవద్దని, ఇప్పుడైనా దుష్ప్రచారాలు మానుకోవాలన్నారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్లు తమ తప్పు అంగీకరించి భక్తులకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి డిమాండ్ చేశారు. ● భీమిలి సమీపంలోని కీతిన్ పేటలోని ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి ఆలయంలో నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం బయట నిరసన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ మోహన్రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రలు ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన అసత్య ఆరోపణల వల్ల కలిగిన అపచారాన్ని తొలగించేందుకు వైఎస్సార్ సీపీ జిల్లా వ్యాప్తంగా ‘పాప ప్రక్షాళన పూజల’కు శ్రీకారం చుట్టింది. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని సీబీఐ విచారణలో తేలిన నేపథ్యంలో.. స్వామివారికి జరిగిన మహాపచారానికి ఆధ్యాత్మి కంగానే సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీబీఐ నివేదిక వెలువడిన తర్వాత కూడా చంద్రబాబు అండ్ కో నిజాలను అంగీకరించకుండా భక్తులను మభ్యపెడుతున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం దైవత్వాన్ని మంటగలిపిన కూటమి నేతలకు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఈ శాంతి పూజలు నిర్వహించారు. –సాక్షి, విశాఖపట్నం● గాజువాక నియోజకవర్గంలో సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి ఆధ్వర్యంలో బీహెచ్బీవీ ప్రసన్న వేంకటేశ్వరరావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవన్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ అయిందంటూ చంద్రబాబు, పవన్కల్యాణ్ చేసిన కుట్రలకు ఆ భగవంతుడే సమాధానం చెప్పాడని, అవన్నీ పటాపంచలు అయినా, ఇంకా నిస్సిగ్గుగా అబద్దాలతో బుకాయిస్తున్నారని మండిపడ్డారు. ● పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆధ్వర్యంలో పెందుర్తిలో వేంకటాద్రి కొండ మీద వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదీప్ రాజ్ మాట్లాడుతూ తిరుమల లడ్డుపై అసత్య ప్రచారాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ● విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో 59వ వార్డులో గల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు తిరుపతి లడ్డూలను పంపిణీ చేశారు. మళ్ల మాట్లాడుతూ ఈ పూజల ద్వారా కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారు చంద్రబాబు, పవన్ కల్యాణ్కు సద్బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. హిందువులకు చంద్రబాబు, పవన్ బహిరంగ క్షమాపణ చెప్పాలిహామీలు అమలు చేయలేక తప్పుడు ప్రచారాలు చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలంటూ పూజలు -
కేజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు
బీచ్రోడ్డు: గత నెలలో కేజీహెచ్లో ప్రసవం కోసం చేరిన తనకు వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించి, వేధించిన ఇద్దరు వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను బాధితురాలు పట్నాల ఉమాదేవి కోరారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయనను శుక్రవారం కలిసిన ఆమె, తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. గోపాలపట్నానికి చెందిన ఉమాదేవి తన ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. ప్రసవం కోసం కేజీహెచ్కు వెళ్లిన సమయంలో అక్కడి వైద్యులు, సిబ్బంది తనతో పాటు తన కుటుంబ సభ్యుల పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించారు. గర్భంతో ఉన్న సమయంలో ప్రతి నెల క్రమం తప్పకుండా స్కానింగ్లు, వైద్య పరీక్షలు చేయించుకున్నామని, అప్పటివరకు శిశువు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సమస్యలు లేవని ఆమె పేర్కొన్నారు. అయితే ప్రసవం పూర్తయిన తర్వాత తన శిశువు మరణించినట్లు వైద్యులు చెప్పారని, ఇది ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిప్యూటీ సీఎంను వేడుకున్నారు. బాధితురాలి ఆవేదనపై సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్, ఈ వ్యవహారంపై విచారణ జరిపించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
ఆచార్య చందు సుబ్బారావుకు ఘన వీడ్కోలు
ఎంవీపీకాలనీ: అభ్యుదయ రచయిత, అరసం క్రియాశీలక సభ్యుడు ఆచార్య చందు సుబ్బారావుకు సాహితీ లోకం ఘన వీడ్కోలు పలికింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం మరణించిన విషయం తెలిసిందే. ఎంవీపీ కాలనీ సెక్టార్–11లోని శ్మశానవాటికలో శుక్రవారం ఉదయం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. తొలుతా ఎంవీపీ కాలనీ సెక్టార్–8లోని నివాసంలో సాహిత్య ప్రముఖులు, కుటుంబ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం(అరసం), విశాఖ రచయితల సంఘం నాయకులు చందు సుబ్బారావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తన రచనల ద్వారా సమాజాన్ని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. సుబ్బారావు కుమారుడు దిలీప్ చందు, కుమార్తె చందు కవితలకు, కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆచార్య కేఎస్ చలం తదితర సాహితీ ప్రియులు ఆయన పాడేమోసి సగర్వంగా సాగనంపారు. కార్యక్రమంలో అరసం రాష్ట్ర కార్యదర్శి ఉప్పల అప్పలరాజు, విశాఖ రచయితల సంఘం అధ్యక్షుడు అడపా రామకృష్ణ, సీపీఐ నాయకుడు చలసాని రాఘవేంద్రరావు, అవంతి శ్రీనివాసరావు, ఆచార్య వెలమల సిమ్మన్న, బీవీ అప్పారావు, డీవీ సూర్యారావు, సమతా సాహితీ అధ్యక్షుడు మాటూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలి
సీతంపేట: పెన్షనర్ల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారిన ‘పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ – 2025’ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక చైర్మన్ ఎ. అజా శర్మ డిమాండ్ చేశారు. శుక్రవారం ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో ‘ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్స్’ ఆధ్వర్యంలో పెన్షనర్ల సమస్యలపై ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా అజా శర్మ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్లో 8వ వేతన సంఘం చైర్మన్, సభ్యులను నియమించి, నివేదికకు 18 నెలల గడువు ఇచ్చిందని తెలిపారు. అయితే ఈ సంఘం ‘టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్’లో నేషనల్ కౌన్సిల్ జేసీఎం ఇచ్చిన కీలక సూచనలను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. ఉద్యోగుల వాటా లేని పెన్షన్ విధానం వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని నివేదికలో పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. కొత్తగా వచ్చిన పెన్షన్ వాలిడేషన్ చట్టం ద్వారా పెన్షనర్లను పదవీ విరమణ తేదీ ఆధారంగా పాత, కొత్త అని విభజించడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వి. వరప్రసాద్ మాట్లాడుతూ.. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల పెన్షన్ రివిజన్ను 2017 నుంచి అమలు చేయాలని, అలాగే 8వ వేతన సంఘం టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో వీరి అంశాలను చేర్చాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం న్యాయపోరాటంతో పాటు దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సదస్సు హెచ్చరించింది. సమావేశంలో ఎన్. రామారావు, ఎన్. నాగేశ్వరరావు, ఎఫ్సీపీఏ చైర్మన్ కొణతాల రామాంజ నేయులు, కన్వీనర్ ఎం. చంద్రశేఖరరావు, కోశాధికారి పి. బాపూజీతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన పలువురు ట్రేడ్ యూనియన్ నాయకులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
గోల్డ్ ఫైనాన్స్ సంస్థ మోసం
తగరపువలస: ఇంటి అవసరాల కోసం మూడున్నరేళ్ల క్రితం ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్లో బంగారం కుదవపెట్టిన ఒక ఖాతాదారునికి సదరు సంస్థ చుక్కలు చూపిస్తున్న వైనం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. జీవీఎంసీ భీమిలి జోన్ పరిధిలోని సంగివలసకు చెందిన కె.ఎం.ఎం. రెడ్డి, తన బంధువు విజయ్ వద్ద నుంచి తీసుకున్న 149 గ్రాముల బంగారు చైన్ను 2022 జూన్లో ఐఐఎఫ్ఎల్లో కుదవపెట్టి రూ. 5 లక్షల రుణం తీసుకున్నారు. అయితే సదరు సంస్థలో పనిచేసే సిబ్బంది సుమారు 20 మంది ఖాతాదారుల బంగారాన్ని తస్కరించి, మరో ప్రైవేట్ బ్యాంకులో రీ–ప్లెడ్జ్ చేసిన ఉదంతం గతేడాది బయటపడింది. ఆ సమయంలో ఆందోళన చేసిన పలువురు ఖాతాదారులకు ఆభరణాలు రికవరీ చేసినప్పటికీ, రెడ్డికి సంబంధించిన చైన్ మాత్రం దొరకలేదు. వారసత్వంగా వచ్చిన ఆ ఆభరణం కోసం బాధితుడు గత ఏడాది కాలంగా సంస్థ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. నెల రోజుల క్రితం బాధితులు సంస్థను నిలదీయగా, పోగొట్టుకున్న ఆభరణానికి సమానమైన బంగారు బిస్కెట్ ఇస్తామని సిబ్బంది నమ్మబలికారు. తీరా శుక్రవారం గడువు ముగిసిన తర్వాత కార్యాలయానికి వెళ్లిన బాధితులకు సంస్థ సిబ్బంది పొంతన లేని సమాధానం ఇచ్చి నిర్ఘాంతపరిచారు. ప్రస్తుతం ఉన్న బంగారం ధరకు కాకుండా, మూడున్నరేళ్ల క్రితం కుదవపెట్టిన నాటి ధర ప్రకారమే నగదు చెల్లిస్తామని చెప్పడంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పటితో పోలిస్తే బంగారం ధర ఇప్పుడు భారీగా పెరిగిందని, తమకు సొమ్ము కాదు ఆభరణం..లేదా అంతే విలువైన బంగారం ఇవ్వాలని వారు భీష్మించుక కూర్చున్నారు. విషయం తెలుసుకున్న భీమిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీయగా, సంస్థ ప్రతినిధులు బాధితులతో మాట్లాడి పంపించి వేశారు. సాధారణంగా ఏడాదిలోపు నగలు విడిపించుకోకపోతే వేలం వేసే సంస్థలు, తమ నగలు పోగొట్టి మూడేళ్లుగా వేధింపులకు గురిచేయడంపై బాధితులు వాపోతున్నారు. తక్షణమే తమ ఆభరణం రికవరీ చేయకపోతే సంస్థ కార్యాలయం ముందు భారీ ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. 149 గ్రాముల బంగారు చైన్ మాయం -
అంజనికుమార్కు ఆత్మీయ వీడ్కోలు
ఆరిలోవ: ఆంధ్రప్రదేశ్ జైళ్లు , సంస్కరణల సేవల శాఖ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఉన్నతాధికారులు ఆయనను ఘనంగా సత్కరించారు. జైళ్ల శాఖలో ఆయన ప్రవేశపెట్టిన వినూత్న సంస్కరణలు, ఖైదీల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి చేపట్టిన పునరావాస కార్యక్రమాలు, ఆయన అందించిన విశేష సేవలను ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేకంగా కొనియాడారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ జనరల్ ఐ. శ్రీనివాస రావు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఎం.ఆర్. రవి కిరణ్, ఎం. వర ప్రసాద్తో పాటు ఇతర విభాగాల సిబ్బంది పాల్గొని అంజనీ కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు. -
అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్పై అధికారుల ఉక్కుపాదం
బీచ్రోడ్డు: నగరంలోని పూర్ణ మార్కెట్ ప్రాంతంలో నాణ్యత లేని, అనధికారిక గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న మూడు దుకాణాలపై జిల్లా సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించి వాటిని సీజ్ చేశారు. ఎటువంటి లైసెన్సులు లేకుండా, డెలివరీ బాయ్స్ నుంచి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సేకరించి, వాటిలోని ఎల్పీజీని ప్రమాదకర రీతిలో రెగ్యులేటర్లు, పైపుల సహాయంతో నాణ్యత లేని స్థానిక చిన్న సిలిండర్లలోకి నింపి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న లవ్లీ గ్యాస్ స్టవ్ రిపేర్స్, వైజాగ్ ట్రెండ్స్ మెన్స్ వేర్ క్లాత్ స్టోర్స్, ఇక్బాల్ ఫ్యాన్సీ స్టోర్స్లలో తనిఖీలు చేపట్టి భారీగా గ్యాస్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో భాగంగా 11 డొమెస్టిక్ సిలిండర్లు, 98 నాణ్యత లేని లోకల్ గ్యాస్ సిలిండర్లు, అలాగే బీపీసీఎల్ , హెచ్పీసీఎల్ సంస్థలకు చెందిన 5 కేజీల నాన్–డొమెస్టిక్ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, అత్యంత ప్రమాదకరంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న సదరు యజమానులపై నిత్యావసర వస్తువుల చట్టం 1955, సెక్షన్ 6–ఏ కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బిమ్స్టెక్ దేశాల మధ్య పరస్పర అవగాహన -
సాగులో లక్ష్మీకటాక్షం
పద్మనాభం: రసాయన ఎరువుల వాడకం పెరిగిపోతున్న ఈ రోజుల్లో, పద్మనాభం మండలం కోరాడ గ్రామానికి చెందిన మజ్జి లక్ష్మి అనే మహిళా రైతు ప్రకృతి సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇంటర్ వరకు చదువుకున్న ఆమె, తనకున్న అరెకరంతో పాటు మరో అరెకరం కౌలుకు తీసుకుని మొత్తం ఎకరం విస్తీర్ణంలో 2015 నుంచి పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఏటీఎం పద్ధతితో నిరంతర ఆదాయం లక్ష్మి ‘ఎనీ టైం మనీ’ సాగు పద్ధతిని పాటిస్తున్నారు. 20 సెంట్ల విస్తీర్ణంలో సుమారు 20 రకాల కూరగాయలను పండిస్తున్నారు. ఇందులో ముల్లంగి వంటి దుంప జాతులు, బీర, ఆనప వంటి తీగ జాతులు, తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలతో పాటు మిరప, టమాటాలను సాగు చేస్తున్నారు. మరో మూడు ‘ఏ’ గ్రేడ్ మోడల్స్లో అరటి, బొప్పాయి, క్యాబేజీ వంటి ప్రధాన పంటలతో పాటు 20 రకాల అంతర పంటలను పండిస్తూ ఏడాది పొడవునా ఆదాయం పొందుతున్నారు. రసాయనాలకు స్వస్తి సాగులో రసాయనాలకు స్వస్తి పలికి ఆవు పేడ, మూత్రం, బెల్లం, శనగపిండితో తయారు చేసిన ఘన, ద్రవ జీవామృతాలను మాత్రమే ఆమె వాడుతున్నారు. ఈ పద్ధతి వల్ల ఖర్చులు తగ్గి, ఏడాదికి రూ. 2 లక్షల వరకు నికర ఆదాయం లభిస్తోంది. ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టులో పని చేస్తున్న ఆమె భర్త అప్పలనాయుడు ప్రోత్సాహం ఆమెకు తోడైంది. మొలకల నుంచే మార్కెటింగ్ ఆమె పండించిన పంటలకు విశేషమైన ఆదరణ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన ఆర్గానిక్ మేళాలో కేవలం ఐదు రోజుల్లోనే రూ. 55 వేల విలువైన కూరగాయలు విక్రయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం వినియోగదారులు నేరుగా ఆమె పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఎండాడ, విజయనగరంలోని కనపాకలో ఆమె క్రమం తప్పకుండా విక్రయాలు సాగిస్తున్నారు. విజయాలు – అవార్డులు ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఆమె తన ఇద్దరు కుమార్తెలను బీఎస్సీ చదివించి, వివాహాలు కూడా జరిపించారు. ఆమె కృషిని గుర్తిస్తూ 2019లో విశాఖలో డీఆర్డీఏ అవార్డు, 2025 సెప్టెంబర్లో గుంటూరులో ఏరువాక ఫౌండేషన్ వారు పురస్కారాలను అందజేశారు. నేటితరం రైతులకు మజ్జి లక్ష్మి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఇదేనా సభకిచ్చే గౌరవం
డాబాగార్డెన్స్: సుమారు 25 లక్షల మంది విశాఖ నగర ప్రజలు జీవీఎంసీ కౌన్సిల్పై పెట్టుకున్న నమ్మకం శుక్రవారం జరిగిన సమావేశంతో చెల్లాచెదురైంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాల్సిన కౌన్సిల్, అక్రమాలు, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాల్సిన పాలనా వ్యవస్థ రాజకీయ ధోరణుల్లో మునిగిపోయి ప్రజల ఆవేదనను అణచివేసింది. సమస్యల పరిష్కారానికి కాదు, విశ్వాస భంగానికి వేదికగా మారిన ఈ సమావేశం ‘‘ఇదేనా జీవీఎంసీ తీరూ?’’ అన్న ప్రశ్నను నగరమంతా ప్రతిధ్వనింపజేస్తోంది. ఇదిలా ఉండగా కౌన్సిల్ హాలే ప్రజాస్వామ్యానికి అవమానంగా మారింది. కూటమి కార్పొరేటర్లు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లపై చేసిన దౌర్జన్యం పాలనా విలువలను మట్టుబెట్టింది. మాటలతో కాకుండా చేతులతో మాట్లాడిన ఈ తీరుపై నగర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇది కౌన్సిల్ సమావేశమా? లేక రాజకీయ గూండాగిరీ ప్రదర్శనమా? అంటూ మండిపడుతున్నారు. -
బ్లాక్ డే
కౌన్సిల్లోప్రజాస్వామ్యం ఖూనీ.. అక్రమాలకు తలవంచిన టీడీపీ, జనసేన, బీజేపీ హోరెత్తిన వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ సభ్యుల ఆందోళన జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో రగడ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడికి దిగిన అధికారపక్ష కార్పొరేటర్లు రౌడీలా వ్యవహరించిన మేయర్ డాబాగార్డెన్స్: జీవీఎంసీ చరిత్రలో శుక్రవారం చీకటి రోజుగా మిగిలిపోయింది. ప్రజాస్వామ్య విలువలకు నిలయంగా ఉండాల్సిన కౌన్సిల్ హాల్, అధికార పార్టీ అహంకారానికి, నిబంధనల ఉల్లంఘనకు వేదికై ంది. చంద్రబాబు సర్కార్ అండతో అక్రమాలకే జై కొడుతూ, సభా మర్యాదలను పాతరేశారు. హుందాగా వ్యవహరించాల్సిన మేయర్, తన బాధ్యతను మరిచి ప్రతిపక్ష కార్పొరేటర్లపై గూండా తరహాలో విరుచుకుపడటం పరాకాష్టకు చేరింది. కార్పొరేషన్ చట్టం ప్రకారం సభలోకి పోలీసులకు ప్రవేశం లేదనే కనీస నిబంధనను తుంగలో తొక్కారు. మార్షల్స్ నిర్వహించాల్సిన బాధ్యతను పోలీసులకు అప్పగించి, మీడియాను సైతం రానీయకుండా అడ్డుకోవడం వెనుక ఉన్న కుట్రలేంటో స్పష్టమవుతోంది. ఇక జీవీఎంసీ కమిషనర్ అయితే నిష్పక్షపాతంగా ఉండాల్సింది పోయి, కేవలం సెక్రటరీ పాత్రకే పరిమితమై అధికార పక్షానికి వత్తాసు పలకడం విచారకరం. కౌన్సిల్లో ఏదైనా అంశం వస్తే దానిపై చర్చ జరగడం, సభ్యుల అభిప్రాయాలు తీసుకోవడం ఆనవాయితీ. కానీ మేయర్ తీరు ఒకటో తరగతి పిల్లాడి కంటే హీనంగా సాగింది. 1 నుంచి 5 వరకు అజెండా అంశాలను చకచకా చదువుకుంటూ, ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనంతట తానే ‘ఓకే.. ఓకే..’ అంటూ ముగించేశారు. చివరకు అత్యంత వివాదాస్పదమైన ‘గీతం భూముల’ అంశాన్ని కూడా ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించుకుని సభ నుంచి పలాయనం చిత్తగించారు. ఈ దారుణమైన తీరును తీవ్రంగా ఖండిస్తూ ఘెరావ్ చేసినప్పటికీ, అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు మాత్రం మేయర్ ఏకపక్ష నిర్ణయాలకే జై కొట్టడం గమనార్హం. నగర ప్రయోజనాలను గాలికొదిలేసి, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం సభా వేదికను వాడుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇది కౌన్సిల్ సమావేశం కాదు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ‘చీకటి అధ్యాయం’ అని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అసలేం జరిగిందంటే? విశాఖ ఎంపీ శ్రీభరత్కు చెందిన గీతం కబ్జా చేసిన రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించేందు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అజెండా అంశంగా చేర్చారు. ఈ భూదోపిడీపై వైఎస్సార్ సీసీ, సీపీఎం, సీపీఐ పోరుబాట పట్టాయి. కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు ఆందోళనకు దిగాయి. శుక్రవారం 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా.. ఉదయం 9 గంటలకే మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీకి చేరుకున్నారు. ఆ తర్వాత కొద్ది సమయానికే టీడీపీ, జనసేన కార్పొరేటర్లు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్.. మేయర్ చాంబర్లోకి వచ్చారు. వారంతా రహస్య సమావేశం జరిపారు. సమావేశానికి 20 నిమిషాల ముందుగానే మాజీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, జీవీఎంసీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావుతో పాటు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లందరూ కౌన్సిల్ హాల్లోకి ప్రవేశించారు. 11.20 గంటలకు మేయర్ తన సైన్యం (టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు)తో సభలోకి ప్రవేశించారు. ఇటీవల మరణించిన జీవీఎంసీ ఎస్ఈ గోవిందరావుకు నివాళులర్పించారు. అనంతరం నేరుగా అజెండా అంశాల్లోకి వెళ్లేందుకు మేయర్ సిద్ధమయ్యారు. మేమిచ్చిన వినతిపై స్పందనేది? అజెండా అంశాల్లోకి వెళ్లేందుకు మేయర్ సిద్ధమైన సమయంలో తామిచ్చిన వినతికి మేయర్, కమిషనర్ స్పందన కావాలంటూ వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ కార్పొరేటర్లు పట్టుబట్టారు. మేయర్ పోడియం వద్ద బైఠాయించారు. అజెండాలో 15వ అంశం తొలగిస్తే, మిగిలిన అంశాలు చర్చిద్దామంటూ పట్టుబట్టారు. ఈ సందర్భంలోనే మీడియాను అనుమతించాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. గీతం భూ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. గీతం భూముల వ్యవహారంపై కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది. అంతా పక్కా స్కెచ్.. ఎంపీ శ్రీభరత్ తను వేసిన ప్రణాళికతో మేయర్, కూటమి కార్పొరేటర్లతో వాగ్వాదానికి దిగేలా చేశారు. విపక్షాలు ఎంత ఆందోళన చేపట్టినా.. ఆ అంశం ఎలాగైనా ఆమోదించాలన్న సూచనలతో అధికార మదంతో రెచ్చిపోయారు. విపక్షాలు మరింత ఆందోళనకు దిగడంతో నిబంధనలకు విరుద్ధంగా పోలీసులను సభలోకి దింపారు. అధికార యంత్రాంగంతో చెలరేగిపోయారు. అసలు బాగోతం ఇదీ... ఎంపీ శ్రీభరత్ అక్రమించుకున్న భూములను జీవీఎంసీ ద్వారా బదలాయించుకునేందుకు ఏడాదిగా స్కెచ్ గీశారు. రూరల్ తహసీల్దార్ పాల్ కిరణ్ ద్వారా తాజాగా జీవీఎంసీకి ప్రతిపాదనలు పంపారు. ఈ విషయంపై విపక్షాలు వారం రోజులుగా ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ ధర్నాలు, నిరసనలు చేపట్టాయి. ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్ల సహకారంతో ఎంపీ శ్రీభరత్ అక్రమాలకు పాల్పడిన భూకబ్జా అంశాన్ని ఆమోదింపజేసుకున్నారు. మీడియాపై చిన్నచూపు గీతం ఆక్రమించిన రూ.5 వేల కోట్ల భూమిని అప్పనంగా ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం తహతహలాడుతూ.. సభలో జరిగే సన్నివేశాలు ప్రజలకు తెలిసిపోతాయని ముందు నుంచి పక్కా ప్లాన్తో మీడియాకు ప్రవేశం కల్పించలేదు. తమను అనుమతించాలంటూ మీడియా ప్రతినిధులు మేయర్ను కోరేందుకు ప్రయత్నించే సమయంలో.. వెలగపూడి తన మార్క్ రౌడీయిజాన్ని ప్రదర్శించారు. మీడియాను అనుమతించాలంటూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, పత్రికా స్వేచ్ఛను హరిస్తారా..అంటూ మండిపడ్డారు. వామపక్షాల ఆందోళన ప్రజల ఆస్తులను రక్షించాల్సిన ప్రజాప్రతినిధులు భక్షిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని, తక్షణమే గీతం అక్రమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కొత్తపల్లి లోకనాథం, జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు, జిల్లా సమితి కార్యదర్శి ఎస్కే రహ్మన్ డిమాండ్ చేశారు. ఎంపీ శ్రీభరత్ కబ్జా చేసిన భూమి క్రమబద్ధీకరణకు కౌన్సిల్లో అజెండా అంశం పెట్టడాన్ని నిరసిస్తూ సీపీఎం, సీపీఐ నేతలు జీవీఎంసీ ప్రధాన ద్వారం వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కూటమి కార్పొరేటర్ల దౌర్జన్యంగీతం ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని అజెండా నుంచి తొలగించాలంటూ విపక్ష కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు నల్ల కండువాలు ధరించి మేయర్ పోడియం వద్ద బైఠాయించారు. తక్షణమే ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలంటూ నినదిస్తూ పోడియాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు దౌర్జన్యానికి దిగారు. డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, కార్పొరేటర్లు బిపిన్కుమార్ జైన్, బళ్ల లక్ష్మణరావు, రెయ్యి వెంకటరమణ, కోరుకొండ స్వాతిదాస్, చెన్నా జానకీరామ్కు గాయపడ్డారు. స్థాయీ సంఘం సభ్యురాలు సాడి పద్మారెడ్డి వెనక్కి తూలి పడ్డారు. పోలీసులు అతి.. పోలీసులు అతిగా వ్యవహరించారు. ఉదయం 9 గంటలకే పోలీసులు జీవీఎంసీ వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. జీవీఎంసీలోకి ఎవర్ని వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. మీడియా పాస్ ఉన్నప్పటికీ మీడియాను అనుమతించలేదు. పోలీసులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు సభలోకి చొరబడ్డారు. -
కొత్తగా 52 బార్ లైసెన్స్లకు నోటిఫికేషన్
అల్లిపురం: నగరంలో కొత్తగా 52 బార్ లైసెన్స్ల మంజూరు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ అధికారి ఆర్. ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కొత్త లైసెన్సులు 2026 ఫిబ్రవరి 5 నుంచి 2028 ఆగస్టు 31 వరకు అమలులో ఉంటాయని, పారదర్శకత కోసం లాటరీ పద్ధతిలో వీటిని కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు https://oc. hpfsproject.com, ఆఫ్లైన్ లేదా హైబ్రిడ్ విధానాల్లో ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియ సిరిపురంలోని వీఎంఆర్డీఏ ఉద్యోగ భవన్, ఈ–బ్లాక్లో గల ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు. దరఖాస్తుల ఎంపిక ప్రక్రియ ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కలెక్టర్ సమక్షంలో సిరిపురం జంక్షన్లోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరేనాలో లాటరీ ద్వారా నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో పాల్గొనే అభ్యర్థులు ప్రతి బార్కు రూ. 5 లక్షల దరఖాస్తు రుసుము (నాన్–రిఫండబుల్), రూ. 10 వేల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక బార్కు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ నిర్వహిస్తారని, లేనిపక్షంలో ఆ నంబరుపై ప్రక్రియ జరగదని అధికారి స్పష్టం చేశారు. లైసెన్సు పొందిన వారు అదే రోజు మొదటి వాయిదాగా రూ. 12.50 లక్షల రిటైల్ ఎకై ్సజ్ పన్ను చెల్లించడంతో పాటు, నెల రోజుల్లోగా అదే మొత్తానికి బ్యాంక్ గ్యారంటీని సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం లైసెన్స్ కాలానికి సంబంధించి 2025–26 ఏడాదికి రూ. 56.26 లక్షలు, 2026–27కు రూ. 82.50 లక్షలు, 2027–28కు రూ. 90.75 లక్షలు పన్నుగా నిర్ణయించారు. వార్షిక పన్నును ఆరు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించామని, ఇతర పూర్తి వివరాల కోసం జిల్లా గెజిట్ను చూడవచ్చని లేదా 0891–2550241 నంబరును సంప్రదించాలని ఆయన కోరారు. -
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగ కమిటీల్లో పలువురికి చోటు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీలో రాష్ట, జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురుకు చోటు కల్పించారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్గా సేనాపతి అప్పారావు (విశాఖ నార్త్), రాష్ట్ర మహళా విభాగం కార్యదర్శిగా తోనంగి రమణమ్మ (విశాఖ పశ్చిమ), రాష్ట్ర అంగన్వాడీ వింగ్ కార్యదర్శిగా గొలగాని లక్ష్మి (విశాఖ తూర్పు)ను నియమించారు. జిల్లా అనుబంధ విభాగాల వింగ్.. వైఎస్సార్ సీపీ జిల్లా అనుబంధ విభాగం క్రిష్టియన్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్గా నడిగట్టు రాజశేఖర్, జిల్లా యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా పల్లా శ్రీనివాస్, జిల్లా యూత్ వింగ్ కార్యదర్శిగా నక్కన రాజ్ కమల్ యాదవ్, జిల్లా ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా శివనారాయణ కోరుబుల్లి, జిల్లా బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా చొక్కాకుల అర్జున్, జిల్లా బీసీ సెల్ కార్యదర్శిగా అనసూరి రమేష్బాబు, జిల్లా వలంటీర్ విభాగం ప్రధాన కార్యదర్శిగా రవికృపానంద, జిల్లా వలంటీర్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా బెల్లాన గణేష్, జిల్లా మైనారిటీ సెల్ కార్యదర్శిగా మహమ్మద్ ఖాజా, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా కాకర వీరస్వామి, జిల్లా సోషల్ మీడియా వింగ్ కార్యదర్శులుగా పక్కల నిర్మల ఆనంద్, జిల్లా సోషల్ మీడియా వింగ్ కార్యదర్శిగా ప్రేమ్కుమార్, జిల్లా మున్సిపల్ వింగ్ కార్యదర్శిగా ఎ. ఆనంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘గిరగిర గింగిరానివే...
విశాఖ ఉత్సవ్లో హోరెత్తించిన గాయకుడు రామ్ మిరియాల ఏయూక్యాంపస్: విశాఖ ఉత్సవ్లో భాగంగా ఆర్కే బీచ్ వేదికగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ నేపథ్య గాయకుడు రామ్ మిరియాల తన గాత్రంతో హోరెత్తించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో రామ్ మిరియాల తనదైన శైలిలో గిరగిర గింగిరానివే, చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే వంటి హిట్ గీతాలను ఆలపిస్తూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. వేణువుపై మధుర స్వరాలను పలికిస్తూనే, మరోవైపు బంగారు కోడిపెట్ట, డీజే టిల్లు, భీమ్లా నాయక్ చిత్రాలలోని మాస్ సాంగ్స్తో సభికులను ఉర్రూతలూగించారు. కేవలం ఆధునిక గీతాలే కాకుండా, పాత తరం రెట్రో పాటలను కూడా అలవోకగా పాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతకుముందు ప్రముఖ వెంట్రిలాక్విస్ట్ బొట్టా నాగేశ్వరరావు ప్రదర్శించిన కార్యక్రమం చిన్నారులను, పెద్దలను విశేషంగా అలరించింది. బొమ్మలతో ఆయన పలికించిన సంభాషణలు నవ్వులు పూయించాయి. సముద్ర తీరంలో సంగీత, కళా ప్రదర్శనల మేళవింపుతో విశాఖ ఉత్సవ్ వైభవంగా సాగింది. -
సభా సంప్రదాయాలు మంటగలిసిన రోజు
విశాఖ పౌరులకు నిజంగా ఇది చీకటి రోజు. నాలుగేళ్ల మేయర్గా తన హయాంలోనే గాక, గతంలో ఈ విధంగా రచ్చ చేయడం విశాఖ ప్రజలు చూడలేదు. ఇంతటి దౌర్జన్యానికి చంద్రబాబు సర్కార్ ఒడిగట్టింది. అధికార కార్పొరేటర్లు సభా గౌరవాన్ని అగౌరవపరిచారు. పోలీసులను మేయర్ పోడియం వద్దకు పంపడం ఇదే తొలిసారి. – గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మేయర్ భయానక వాతావరణం సృష్టించారు.. జీవీఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కౌన్సిల్ సమావేశంలో భయానక వాతావరణం సృష్టించారు. సభా మర్యాదలు మంటగలిపారు. దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అక్రమాలకు అడ్డాగా నిలిచారు. అడిగిన వారిపై విరుచుకుపడ్టారు. ఇదేనా కౌన్సిల్ నిర్వహించే తీరు. సీసీ కెమెరాలు కూడా ఆపేశారు. మీడియాను కూడా అనుమతించలేదు. – కట్టుమూరి సతీష్, డిప్యూటీ మేయర్, జీవీఎంసీ మేయర్ నాపై దౌర్జన్యానికి దిగారు.. హుందాగా వ్యవహరించాల్సిన మేయర్ స్థాయిని మరచి దిగజారి మరీ నాపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ప్రజాస్వామ్యంలో అక్రమాలకు ఎవరైనా పాల్పడితే నిలదీయడం తప్పా? సభ్యుల ముందు తనను అగౌరవ పరిచారు. ఒక విధంగా చెప్పాలంటే గూండాగిరి ప్రదర్శించినట్టే. – బాణాల శ్రీనివాసరావు, ఫ్లోర్ లీడర్, వైఎస్సార్ సీపీ, జీవీఎంసీ కిందకు తోసేశారు.. అక్రమాలకు అడ్డాగా నిలిచిన కూటమి మేయర్ పోడియం వద్ద ఆందోళనకు దిగితే దౌర్జన్యంగా తనపై కూటమి కార్పొరేటర్లు విరుచుకుపడ్డారు. నన్ను కిందకు తోసేశారు. మోచేతి నుంచి రక్తం కారుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. – అల్లు శంకరరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, వైఎస్సార్ సీపీ, జీవీఎంసీ గాంధీ వర్ధంతి రోజునే ఇలా.. గాంధీ మహాత్ముని పేరు పెట్టుకుని (గాంధీ విశ్వవిద్యాలయం), ఆయన వర్ధంతి రోజునే విశాఖ ఎంపీ శ్రీభరత్ ఇలా పాల్పడడం దారుణం. సభలో అడ్డగోలుగా రౌడీయిజం చేశారు. రెడ్బుక్ రాజ్యాంగానికి ఇదే నిదర్శనం. తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. – రెయ్యి వెంకటరమణ, కార్పొరేటర్, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరీ ఇంత దౌర్జన్యమా? కౌన్సిల్ హాల్లో కూటమి కార్పొరేటర్లు వ్యవహరించిన తీరు గర్హనీయం. గత నాలుగేళ్లలో తానెప్పుడూ ఇలాంటి కౌన్సిల్ సమావేశాన్ని చూడలేదు. అధికార మదంతో కూటమి కార్పొరేటర్లు రెచ్చిపోయారు. మహిళ అని చూడకుండా తోసుకుంటూ వచ్చారు. – కోరుకొండ స్వాతిదాస్, కార్పొరేటర్, వైఎస్సార్ సీపీ దారుణంగా వ్యవహరించారు.. అన్యాయం జరుగుతుంటే నిలదీయడమే తప్పా. పోడియం వద్ద నిరసన తెలిపితే మరీ దారుణంగా వ్యవహరించారు. కూటమి కార్పొరేటర్ల దౌర్జన్యానికి నా కాలుకి తీవ్రంగా దెబ్బ తగిలింది. – బళ్ల లక్ష్మణరావు, కార్పొరేటర్, వైఎస్సార్ సీపీ -
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై డిప్యూటీ సీఎం సమీక్ష
బీచ్రోడ్డు: ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, పంచాయతీరాజ్ శాఖను అత్యంత ప్రభావవంతమైన విభాగంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. పల్లెపండగ, అడవితల్లి బాట, జల్ జీవన్ మిషన్ వంటి పథకాల ప్రగతిపై ఆరా తీసిన ఆయన, గత ఏడాది నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయకపోవడానికి గల కారణాలపై అధికారుల నుంచి వివరణ కోరారు. తనకు చప్పట్లు, పొగడ్తలు అవసరం లేదని, క్షేత్రస్థాయిలో పని మాత్రమే కావాలని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. నిధుల దుర్వినియోగాన్ని, విధుల్లో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, కలెక్టర్ హరేందిర ప్రసాద్, ఉపాధి హామీ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ పాల్గొన్నారు. -
నేటి నుంచి ఎన్ఏడీ ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
అల్లిపురం: ఎన్ఏడీ ఫ్లైఓవర్కు ఆనుకొని అదనపు బ్రిడ్జి పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారుల సౌకర్యార్థం ఆ ప్రాంతంలో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆంక్షల ప్రకారం విశాఖ నగరం నుంచి విమానాశ్రయం వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలు తప్పనిసరిగా ఫ్లైఓవర్ పైనుంచే ప్రయాణించాలని, కింద నుంచి ఎటువంటి వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. అదేవిధంగా గోపాలపట్నం, మర్రిపాలెం వైపు నుంచి ఎయిర్పోర్ట్ వైపు వెళ్లే వాహనాలు కూడా ఫ్లైఓవర్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి గోపాలపట్నం, మర్రిపాలెం, విశాఖ నగరం వైపు వచ్చే వాహనాలన్నీ కూడా ఫ్లైఓవర్ పైనుంచే రావాలని, కింద మార్గంలో ప్రవేశం ఉండదని వివరించారు. గోపాలపట్నం, మర్రిపాలెం మధ్య రాకపోకలు సాగించే మోటార్ సైకిళ్లు, ఆటోలు, కార్ల వంటి తేలికపాటి వాహనాలను మాత్రం ఫ్లైఓవర్ కింద నుంచి అనుమతిస్తామని, అయితే ఈ మార్గంలో ప్రయాణించే లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలు మాత్రం కచ్చితంగా ఫ్లైఓవర్ మీదుగానే వెళ్లాలని నిర్దేశించారు. నిర్మాణ పనుల దృష్ట్యా విధించిన ఈ మార్పులను గమనించి ద్విచక్ర వాహనాల నుండి భారీ వాహనాల వరకు అన్ని రకాల వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు. -
గాంధీజీ పేరు పెట్టుకుని భూ కబ్జాలా!
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ భూ దోపిడీపై వైఎస్సార్ సీపీ ఆందోళన కొనసాగించింది. కూటమి ప్రభుత్వం విశాఖ ఎంపీ శ్రీభరత్కు చెందిన గీతం యూనివర్సిటీకి రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కట్టబెడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అజెండాగా పెట్టి తీర్మానం చేసి రెగ్యులైజేషన్ చేసే కుట్రపై వైఎస్సార్ సీపీ మూడు రోజుల పాటు నిరసన చేపట్టాలని నిర్ణయించగా తొలి రోజు బుధవారం జీవీఎంసీ కమిషనర్, మేయర్కు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. రెండో రోజు గురువారం వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో పార్టీ నేతలు భూదోపిడీకు గురైన ప్రభుత్వ భూముల పరిశీలనకు రుషికొండ గీతం కాలేజి వద్దకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు అడ్డగించారు. దీంతో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంబా రవిబాబు, సమన్వయకర్తలు మజ్జి శ్రీనివాసరావు, కరణం ధర్మశ్రీ, అన్నంరెడ్డి అదీప్రాజు, మొల్లి అప్పారావు, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకట్రావ్తో పాటు పార్టీ ముఖ్య నాయకులు గీతం యూనివర్సిటీ ఎదుట బైఠాయించారు.గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి కలెక్టర్ ఈ కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకున్న ఫొటోలు చూపిస్తూ నిరసన తెలిపారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గీతం కాలేజీ భూదోపిడీని వైఎస్సార్ సీపీ అడ్డుకుంటుందని వైఎస్సార్ సీపీ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు వరుసగా కేకే రాజు, గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు దోచుకునే వేల కోట్ల భూ దోపిడీకి అడ్డుకునేందుకు వెళ్తే పోలీసులతో అడ్డుకుంటారా..? అని మండిపడ్డారు. గాంధీజీ పేరు పెట్టుకుని గీతం చేసిన ఈ భూకబ్జాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, స్థానిక బీజేపీ నేతలు నోరువిప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేస్తున్న భూ దోపిడీపై ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కె.సతీష్, మాజీ మేయర్ హరి వెంకట కుమారి, మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, సీఈసీ సభ్యులు కోలా గురువులు, ఎస్ఈసీ సభ్యులు రొంగలి జగన్నాథం, డాక్టర్ జహీర్ అహ్మద్, ఉరుకూటి అప్పారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర కార్యదర్ళులు గండి రవికుమార్, శరగడం చినఅప్పలనాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్ళులు పీవీ నారాయణ, కిరణ్ రాజు, చెన్నా దాస్, కోరుకొండ స్వాతి, పల్లా దుర్గారావు, రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పేర్ల విజయ్ చంద్ర, పోతిన శ్రీనివాస్, పిల్లా నూకరాజు, రాష్ట్ర పార్టీ అనుబంధ కార్యనిర్వాహక అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవాస్తవ, చెన్నా జానకిరామ్, జి.వి.రవిరాజు, జోనల్, జిల్లా పార్టీ అనుబంధం విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.నేడు వైఎస్సార్ సీపీ నిరసన దీక్షసాక్షి, విశాఖపట్నం: గీతం భూ కబ్జాపై శుక్రవారం జీవీఎంసీ ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు తరలిరావాలని పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎంపీ గొల్ల బాబూరావు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్కుమార్, మళ్ల విజయప్రసాద్, మొల్లి అప్పారావు, దేవన్రెడ్డి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంబా రవిబాబు, పండుల రవీంద్రబాబు, పార్టీ ముఖ్యనాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. -
గీతం భూబాగోతం.. కౌన్సిల్ తలవంచుతుందా?
డాబాగార్డెన్స్: విశాఖ మహా నగరంలో మరో భారీ భూకుంభకోణానికి చంద్రబాబు ప్రభుత్వం తెరలేపింది. స్వయానా విశాఖ ఎంపీ శ్రీభరత్కు చెందిన గీతం విద్యాసంస్థల ఆక్రమణలో ఉన్న వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను చట్టబద్ధం చేసేందుకు పావులు కదుపుతోంది. ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో గీతం యూనివర్సిటీ ఆక్రమణలో ఉన్న రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల భూములను క్రమబద్ధీకరించాలనే ప్రతిపాదనను శుక్రవారం జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశ అజెండాలో 15వ అంశంగా చేర్చడంపై వైఎస్సార్సీపీ, సీపీఎం భగ్గుమంటున్నాయి. ప్రజా ఆస్తులను దోచిపెట్టేందుకు జీవీఎంసీని అడ్డాగా మార్చుకున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ భూముల బదలాయింపు అంశాన్ని అడ్డుకుంటామని విపక్ష కార్పొరేటర్లు ఇప్పటికే హెచ్చరించారు. అలాగే జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజాసంఘాలు, మేధావులు, ఉద్యమకారులతో కలిసి గీతం భూదోపిడీని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నారు.జీవో 571కి తూట్లుప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన ఎంపీనే, తన అధికార బలంతో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ భూముల కేటాయింపు, క్రమబద్ధీకరణ ప్రయత్నాలు జీవో నెం. 571కి, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఈ వివాదాస్పద అంశాన్ని వెంటనే అజెండా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, సీపీఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ గంగారావు తదితరులు కార్పొరేటర్లతో కలిసి మేయర్ పీలా శ్రీనివాసరావుకు, అదనపు కమిషనర్లకు వినతి పత్రాలు అందజేశారు. అలాగే వైఎస్సార్సీపీ, సీపీఎం నేతలు ఎండాడ, రుషికొండ ప్రాంతాల్లోని వివాదాస్పద స్థలాలను స్వయంగా పరిశీలించారు. ఇంతటి భారీ కుంభకోణానికి కౌన్సిల్ వేదిక కావడం సిగ్గుచేటని, కూటమిలోని బీజేపీ, జనసేన నేతలు దీనిపై నోరు మెదపకపోవడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. అజెండా నుంచి ఈ అంశాన్ని తొలగించకపోతే కౌన్సిల్ సమావేశంలోనే గట్టిగా నిలదీసేందుకు సిద్ధమని వైఎస్సార్ సీపీ ప్రకటించింది.గీతం ’కబ్జా’ భూముల చిట్టా ఇదే..గీతం విశ్వవిద్యాలయం, ఆసుపత్రి యాజమాన్యం ఆక్రమణలో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూముల వివరాలివి.. ఎండాడ గ్రామ సర్వే నంబర్ 15/1 నుంచి 15/5 వరకు 24.51 ఎకరాలు, 16/4లో 1.95 ఎకరాలు, 17/27లో 1.01 ఎకరాలు, 17/30లో 1.09 ఎకరాలు, 18/2లో 1.03 ఎకరాలు, 20/5లో 5.60 ఎకరాలు, 20/10లో 1.50 ఎకరాలు, 20/12లో 0.10 ఎకరాలు, 191/1లో 0.48 ఎకరాలు, 191/2లో 0.86ఎకరాలు, 191/9లో 0.70 ఎకరాలు కలిపి మొత్తం 42 ఎకరాల 39 సెంట్లు. రుషికొండ గ్రామ సర్వే నంబర్ 37/2లో 4.29 ఎకరాలు, 38/1బిలో 7.27 ఎకరాలు, 53/4లో 0.03 ఎకరాలు, 55/3లో 0.35 ఎకరాలు, 61/5లో 0.40 ఎకరాలు, 61/5లో 0.06 ఎకరాలు.. కలిపి మొత్తం విస్తీర్ణం 2 ఎకరాల 40 సెంట్లు. ఈ రెండు గ్రామాల్లో కలిపి ఎంపీ శ్రీభరత్ కుటుంబం ఆధీనంలోని గీతం సంస్థల చేతిలో ఉన్న మొత్తం ప్రభుత్వ భూమి 54.79 ఎకరాలు.మా హయాంలో ఇలాంటి అక్రమాలు జరగలేదునేను మేయర్గా ఉన్న నాలుగేళ్లలో ఎప్పుడూ ఇలాంటి అక్రమాలకు పాల్పడలేదు. ప్రభుత్వానికి కొమ్ముకాయలేదు. చంద్రబాబు ప్రభుత్వం కౌన్సిల్ను గౌరవించి, అజెండాలోని 15వ అంశాన్ని తొలగించి సభా మర్యాదలు కాపాడాలి. ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీ శ్రీభరత్ ఇలాంటి కబ్జాలకు పాల్పడటం తగదు. దీనిపై బీజేపీ, జనసేన కార్పొరేటర్లు స్పందించాలి.–గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మేయర్కౌన్సిల్ను కబ్జాలకు వత్తాసుగా మార్చొద్దుభూ కబ్జాలకు వత్తాసు పలికే వేదికగా జీవీఎంసీ కౌన్సిల్ను మార్చవద్దు. గీతం ఆక్రమణలను చట్టబద్ధం చేసే అజెండాలోని 15వ అంశాన్ని వెంటనే తొలగించాలి. ఇది జీవో 571 ఉల్లంఘన కిందకు వస్తుంది.– కె.సతీష్, డిప్యూటీ మేయర్ -
నేడు ఎన్ఐవో కార్యాలయం ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: జాతీయ సముద్ర అధ్యయన సంస్థ(ఎన్ఐవో).. దాదాపు 50 సంవత్సరాల తర్వాత సొంత భవనంలో అడుగు పెడుతోంది. విశాఖలో ఉన్న ఎన్ఐవో ప్రాంతీయ కార్యాలయ భవనం కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డా.జితేంద్రసింగ్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. రుషికొండ బే పార్క్ సమీపంలో 3.25 ఎకరాల్లో సుమారు రూ.30 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. తూర్పు తీరంలో సముద్ర తీరంలో ఉన్న ఏకై క అధ్యయన సంస్థ ఇదే కావడం విశేషం. విశాఖలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(ఎన్ఐవో) ప్రాంతీయ కార్యాలయం 1976లో ప్రారంభమైనా.. 50 సంవత్సరాలుగా అద్దె భవనంలోనే కొనసాగింది. రుషికొండలో నిర్మించిన ఈ భవన ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రితో పాటు శాసీ్త్రయ, పారిశ్రామిక పరిశోధన మండలి(సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్ డా. కలైసెల్వి హాజరవుతున్నారని విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయ సైంటిస్ట్ ఇన్చార్జి డా.వీవీఎస్ఎస్ శర్మ తెలిపారు. ఇక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల సముద్ర, తీరప్రాంత సమస్యల పరిష్కారానికి కూడా ఎన్ఐవో కృషి చేస్తుందన్నారు. సముద్ర నీటిమట్టం పెరుగుదల, కాలుష్యం హెచ్చుతగ్గులు, అంతర్భాగంలో జరిగే మార్పులు అన్నీ ఇక్కడ నుంచే అధ్యయనం చేస్తామనీ.. మరో నెలరోజుల్లో కార్యాలయాన్ని రుషికొండకు తరలించనున్నట్లు తెలిపారు. -
విశాఖ ఏఆర్సీలో 68 జంతువులు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో 2000లో రాష్ట్ర అటవీ శాఖ అధికారులు జాతీయ రహదారి పక్కన సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. 2001లో ఇది ప్రారంభమైంది. ఇక్కడకు తీసుకొచ్చిన 34 పెద్ద పులులు, 34 సింహాల కోసం ప్రత్యేకంగా ఇనుప కేజ్లు, నైట్ క్రాల్స్, అవి స్వేచ్ఛగా తిరగడానికి విశాలమైన ఎన్క్లోజర్లు నిర్మించారు. వాటికి సకాలంలో ఆహారం, వైద్యం అందించడానికి వెటర్నరీ ఆసుపత్రి, ఒక వైద్యుడు, సహాయకులు, జంతు సంరక్షకులను నియమించారు. అవి యుక్త వయసులో ఉన్నప్పుడు వాటి గాండ్రింపులు, గర్జనలతో ఏఆర్సీ ప్రాంతం హోరెత్తేది. జాతీయ రహదారిపై వెళ్లే వారికి సైతం ఆ గర్జనలు వినిపించేవి. ఇప్పుడు అవన్నీ మరణించడంతో అక్కడ నిశబ్దం ఆవహించింది. సహజంగా అడవుల్లో పులులు, సింహాల సగటు జీవిత కాలం 15 నుంచి 16 ఏళ్లు కాగా, ఇక్కడ సంరక్షణలో అవి 20 నుంచి 25 ఏళ్లకు పైగా జీవించడం విశేషం. అర్జున్ (26), కొనాల్ (26) అనే మగ సింహాలు, మాధురి (25), సుధ (23), రాణి (23) అనే ఆడ సింహాలు ఎక్కువ కాలం జీవించాయి. వీటితో పాటు సీత (24) అనే ఆడ పులి, వినయ్ (21) అనే మగ పులి కూడా ఇక్కడ సుదీర్ఘ కాలం జీవించాయి. వృద్ధాప్యం కారణంగా అవయవాలు పనిచేయకపోవడం, పక్షవాతం వంటి వ్యాధులతో ఇవి మృతి చెందాయి. మంచి పోషకాహారం, వైద్యం అందించడం వల్లే అవి ఎక్కువ కాలం జీవించాయని అధికారులు తెలిపారు. -
ఏఆర్సీ ఖాళీ
ఆరిలోవ: దశాబ్దాల పాటు సింహాల గర్జనలు, పులుల గాండ్రింపులతో దద్దరిల్లిన ఆరిలోవ జంతు పునరావాస కేంద్రం(ఏఆర్సీ) ఇప్పుడు నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఒకప్పుడు 34 పెద్ద పులులు, 34 సింహాలు కలిపి మొత్తం 68 వన్య మృగాలతో కళకళలాడిన ఈ కేంద్రం నేడు వెలవెలబోతోంది. కాలక్రమంలో వృద్ధాప్య సమస్యలతో ఒక్కో జంతువు మృత్యువాత పడగా, చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన ‘బిగో’అనే ఆడ సింహం కూడా ఈ నెల 7న కన్నుమూసింది. దీంతో ఏఆర్సీ పూర్తిగా ఖాళీ అయ్యింది. 2000లో కేంద్రం ఏర్పాటు అటవీశాఖ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జూ పార్కు సమీపంలో, జాతీయ రహదారిని ఆనుకొని 2000లో జంతు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో సర్కస్ కంపెనీలు గ్రామాలు, పట్టణాలకు వచ్చి ప్రజలకు వినోదాన్ని పంచేవి. ఆయా కంపెనీలు పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, కోతులు, కుక్కల చేత బలవంతంగా విన్యాసాలు చేయించేవి. ఈ క్రమంలో మూగజీవాలు సర్కస్ యాజమాన్యాల చేతిలో హింసకు గురవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో సర్కస్లలో జంతువులతో విన్యాసాలు చేయించడాన్ని తప్పుబడుతూ, వాటితో ఆటలాడించకూడదని 2000లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలోని వివిధ సర్కస్ కంపెనీల నుంచి జంతువులను స్వాధీనం చేసుకుంది. వాటి సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా విశాఖపట్నం, తిరుపతి, మైసూరు, ముంబయి, చైన్నెలలో ప్రత్యేకంగా ఐదు జంతు పునరావాస కేంద్రాల(యానిమల్ రెస్క్యూ సెంటర్–ఏఆర్సీ)ను నిర్మించింది. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా ప్రాంతాల్లోని జూలాజికల్ పార్కులకు అప్పగించింది. ప్రసిద్ధ సర్కస్ కంపెనీలైన ఫేమస్, జెమిని, అజంతా తదితరాల నుంచి స్వాధీనం చేసుకున్న పులులు, సింహాలను ఈ ఐదు ఏఆర్సీలకు తరలించింది. అప్పటి నుంచి వాటికి ఆహారం, వైద్యం అందించి సంరక్షించారు. ప్రత్యామ్నాయంగా వినియోగిస్తాం ఈనెల 7న బిగో(24) అనే ఆడ సింహం మృతి చెందడంతో ఏఆర్సీలో జంతువులేవీ లేవు. ఈ విషయాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులు, సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా(సీజెడ్ఏఐ) దృష్టికి తీసుకెళ్లాం. ఉన్నతాధికారుల అనుమతితో ఈ స్థలాన్ని జూ పార్కు అవసరాలకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తాం. గత 25 ఏళ్లుగా ఇక్కడి సిబ్బంది, వైద్యులు జంతువులకు అత్యుత్తమ సేవలు అందించారు. – జి.మంగమ్మ, క్యూరేటర్, ఇందిరాగాంధీ జూ పార్కు బోనులో సింహం, పులి(ఫైల్) -
గీతం భూముల క్రమబద్ధీకరణ అక్రమం
అల్లిపురం: గీతం విశ్వవిద్యాలయం ఆక్రమించిన 54.79 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘యూరోపియన్ యూనియన్తో కేంద్రం కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల దేశీయ వ్యవసాయం, ఉక్కు, ఫార్మా రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఈ ఒప్పందం గొప్పదని మోదీ బాకాలు ఊదుతున్నా.. కార్లు, వైన్ ధరలు తగ్గడం వల్ల సామాన్యులకు ఒరిగేదేమీ లేదు. ఈ ఒప్పందం వల్ల భారత్కు యూరోపియన్ యూనియన్ ఎగుమతులు 107 శాతానికి పెరుగుతాయి. కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు చేపట్టే సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. మోదీ హయాంలో డాలర్తో రూపాయి విలువ రూ.60 నుంచి రూ.91.64కు పడిపోయింది.’అని అన్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని రాజకీయం చేయకుండా, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జె.వి.సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. పేదలు సెంటు స్థలం ఆక్రమిస్తే ఇళ్లు కూల్చివేసే ప్రభుత్వం, గీతం సంస్థ ఆక్రమించిన 54 ఎకరాలను మాత్రం క్రమబద్ధీకరించడానికి పూనుకోవడం అన్యాయమన్నారు. సమావేశంలో పార్టీ నేతలు ఎ.విమల, ఎం.పైడిరాజు, ఎస్.కె.రహిమాన్, ఎన్.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పెందుర్తి: పెందుర్తి మండలం రాంపురం సమీపంలోని సాధూమఠం వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. వివరాలివి.. అనకాపల్లి కొత్తురుకు చెందిన పిలకా లక్ష్మినరసింహమూర్తి, అతడి భార్య కొసకంచి కల్యాణిలక్ష్మి(43) కలిసి అనంతగిరిలో ఉన్న మూర్తి తల్లిదండ్రుల వద్దకు వెళుతున్నారు. ఈ క్రమంలో సాధూమఠం వద్దకు వచ్చేసరికి స్పీడ్ బ్రేకర్పైకి బైక్ సడన్గా వెళ్లడంతో వెనుక కూర్చున్న కల్యాణి రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అపస్మారకస్థితికి వెళ్లిపోయింది. వెంటనే స్పందించిన భర్త మూర్తి ఆటోలో ఆమెను పెందుర్తి సీహెచ్సికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెందుర్తి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పడవల పోటీల విజేతలకు నిరాశ
భీమునిపట్నం: విశాఖ ఉత్సవ్లో భాగంగా గురువారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన పడవలు, తెప్పల పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. తొలుత మధ్యాహ్నం చేపలుప్పాడ తీరం నుంచి భీమిలి తీరానికి(6 కిలోమీటర్ల దూరం) మోటారు పడవల పోటీలను నిర్వహించారు. మొత్తం 15 మోటారు పడవలు పాల్గొనగా, ఈ పోటీలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీల్లో భీమిలి ఎగువపేటకు చెందిన సీరం లక్ష్మణ టీం ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన సీరం గణేష్ టీం ద్వితీయ, రాజేష్ టీం తృతీయ స్థానాల్లో నిలిచాయి. అలాగే నాగమయ్యపాలెం నుంచి భీమిలి తీరం వరకు(4 కిలోమీటర్ల దూరం) జరిగిన తెప్పల పోటీల్లో 15 తెప్పలు పాల్గొన్నాయి. ఇందులో భీమిలి బోయివీధికి చెందిన కాసరపు చినపైడిరాజు, కాసరపు ధనరాజు, కాసరపు పేరరాజు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు, మండల అధికారి ఈశ్వరరాజు పాల్గొన్నారు. కాగా.. పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచినవారికి రూ. 25 వేలు, ద్వితీయ స్థానానికి రూ.15 వేలు, తృతీయ స్థానానికి రూ.10 వేలు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. పోటీలు ముగిసిన వెంటనే భీమిలి తీరంలోనే బహుమతులు అందిస్తామని తెలిపి, అక్కడ వేదికను కూడా ఏర్పాటు చేశారు. అయితే, పోటీలు ముగిసిన తర్వాత బహుమతులను ఇప్పుడు కాకుండా, ఈ నెల 31న ఆర్కే బీచ్లో జరిగే ముగింపు వేడుకల్లో అందిస్తామని ప్రకటించారు. దీంతో గెలుపొందిన మత్స్యకారులు, ఉత్సాహంగా వేదిక వద్దకు చేరుకున్న స్థానికులు నిరాశతో వెనుదిరిగారు. -
చందు సుబ్బారావు హేతుబద్ధమైన విమర్శకుడు
సీతంపేట: అభ్యుదయ రచయితల సంఘం(అరసం) విశాఖ శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య చందు సుబ్బారావు మృతి పట్ల అరసం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. విశాఖ అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల అప్పలరాజు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చందన చర్చిత, కవికి విమర్శకుడు శత్రువు కాడు, అరసంతో అర్ధ శతాబ్ది వంటి గొప్ప రచనలు చేసిన వ్యక్తి చందు సుబ్బారావు అని, ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. ఉపాధ్యక్షుడు ఎస్.హనుమంతరావు, ప్రతినిధులు పి.శ్యామసుందర్, బసు పోతన కూడా ఆచార్య సుబ్బారావు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. అనేక గొప్ప కథలు, నవలలు రాసిన రచయితను, వేలకొద్దీ ప్రసంగాలు చేసిన గొప్ప అభ్యుదయవాదిని కోల్పోవడం సాహితీ రంగానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. అలాగే, ఆచార్య చందు సుబ్బారావు హేతుబద్ధమైన విమర్శకుడని, అభ్యుదయ మానవతావాది అని ప్రముఖ సాహితీ విమర్శకుడు డాక్టర్ డి.వి.సూర్యారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మృతి తెలుగు సాహితీ లోకానికి తీరని లోటన్నారు. -
చూసొద్దామా.. ఫ్లవర్ షో
డాబాగార్డెన్స్: విశాఖ ఉత్సవ్లో భాగంగా వైఎస్సార్ సెంట్రల్ పార్క్లో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ కమిషనర్ ఎన్.తేజ్భరత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వీఎంఆర్డీఏ ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసిన ఈ పుష్ప ప్రదర్శన ఎంతో నయనానందకరంగా ఉందని, నగర వాసులకు ఇది కనువిందు చేస్తుందని ప్రశంసించారు. మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ మాట్లాడుతూ.. ఈ ఫ్లవర్ షో మూడు రోజుల పాటు కొనసాగుతుందని, నగర ప్రజల కోసం ప్రవేశం ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు. వీఎంఆర్డీఏ కార్యదర్శి మురళీకృష్ణ, చీఫ్ ఇంజినీర్ వినయ్కుమార్, చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్పా, ప్రధాన గణాంకాధికారి హరిప్రసాద్, ఇన్చార్జి డీఎఫ్వో వరుణ్కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
తుక్కు.. తళుక్కు
తాటిచెట్లపాలెం: సృజనాత్మకతకు హద్దులు లేవని, సంకల్పం ఉంటే పనికిరాని వస్తువులతోనూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే కళాఖండాలను సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు నగరానికి చెందిన రైల్వే టెక్నీషియన్ కె.కళ్యాణ్ చక్రవర్తి. ఈస్ట్కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్లోని డీజిల్ లోకో షెడ్లో మెకానికల్ విభాగంలో గ్రేడ్–1 టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్న ఆయన, తన వృత్తిలోని యాంత్రిక జీవనానికి కళాత్మకతను జోడించి సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు. సాధారణంగా రైల్వే షెడ్లలో తుక్కు కింద పక్కన పడేసిన నట్లు, బోల్టులు, బేరింగ్లు, స్ప్రింగ్లు, పాత ఇంజిన్ భాగాలు ఆయన కంటికి మాత్రం అపురూపమైన ఆకృతులుగా కనిపిస్తాయి. తన ఆలోచనలకు పదును పెట్టి, ఆ లోహ వ్యర్థాలను ఒకదానితో ఒకటి వెల్డింగ్ చేస్తూ ప్రాణం పోస్తున్న కళాఖండాలు నేడు విశాఖ నగరానికే గర్వకారణంగా నిలుస్తున్నాయి. 55కి పైగా అద్భుత శిల్పాలు 1997లో రైల్వేలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన కళ్యాణ్ చక్రవర్తి, తనలోని చిత్రకారుడిని నిరంతరం సజీవంగా ఉంచుకున్నారు. సీనియర్ అధికారుల ప్రోత్సాహం తోడవ్వడంతో ఆయన ఊహలకు మరింత పదును పెరిగింది. ఆయన సృష్టించిన 12 అడుగుల భారీ గిటార్ మొదలుకొని, ‘మేకిన్ ఇండియా’, సింహం లోగో, గ్లోబ్, డైనోసార్, రోబోట్, సంగీత విద్వాంసుల ఆకృతులు వంటి సుమారు 55కి పైగా అద్భుత శిల్పాలు విశాఖ రైల్వే స్టేషన్, భువనేశ్వర్ ఈస్ట్కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం, డీజిల్ లోకో షెడ్ వంటి ప్రాంతాల్లో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. కేవలం ఇనుప ముక్కలతో ఇంతటి సౌందర్యాన్ని ఎలా సృష్టించగలిగారు అని చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఇటీవల మహాత్మా గాంధీ నూలు వడుకుతున్న చారిత్రాత్మక దృశ్యాన్ని లోహ వ్యర్థాలతో ఆవిష్కరించే బృహత్తర కార్యాన్ని ఆయన తలకెత్తుకున్నారు. విద్యార్థులకు తర్ఫీదునిస్తూ... కళ్యాణ్ చక్రవర్తి గొప్పతనం కేవలం శిల్పాలు చెక్కడంలోనే లేదు, తన విద్యను తర్వాత తరానికి అందించాలనే తపన మరువలేనిది. గత రెండు దశాబ్దాలుగా ప్రతి వారాంతం, వేసవి సెలవుల్లో వేలాది మంది చిన్నారులకు ఉచితంగా డ్రాయింగ్ నేర్పిస్తూ వారిలో కళాభిరుచిని పెంచుతున్నారు. తన సృజనాత్మకతకు గాను ఇప్పటికే రైల్వే శాఖ నుంచి అత్యున్నతమైన జీఎం అవార్డుతో పాటు సీఎంఈ, సీఎన్పీ వంటి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. వ్యర్థాలను వనరులుగా మార్చడమే కాకుండా, సమాజానికి కళ ద్వారా సందేశాన్ని అందిస్తున్న కళ్యాణ్ చక్రవర్తి నిజమైన ‘సృజన యోధుడు’. ఆయన ప్రయాణం నేటి తరం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. -
వైఎస్ జగన్తో వాసుపల్లి భేటీ
కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానండాబాగార్డెన్స్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ పార్టీ విశాఖ దక్షిణ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో తన కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ను కలిసి.. తన రెండో కుమారుడు గోవింద సాకేత్ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే పట్టువస్త్రాలు, సింహాచలం లక్ష్మీనృసింహ స్వామి వారి పంచలోహ విగ్రహాన్ని వైఎస్ జగన్కు బహూకరించారు. జగన్ను కలిసిన వారిలో వాసుపల్లి దంపతులతో పాటు, పెద్ద కుమారుడు సూర్య, కోడలు రాశి, చిన కుమారుడు గోవింద సాకేత్ ఉన్నారు. -
481 మంది అక్రిడిటేషన్ల జారీకి కమిటీ ఆమోదం
విశాఖ సిటీ: జిల్లాలోని అర్హులైన 481 మంది జర్నలిస్టులకు తొలి విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం తెలిపింది. కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధ్యక్షతన కలెక్టరేట్లో గురువారం కమిటీ సమావేశం జరిగింది. ముందుగా కన్వీనర్, సమాచార శాఖ ఉప సంచాలకుడు కె.సదారావు అజెండా అంశాలను కమిటీకి వివరించారు. సమావేశంలో 512 ప్రతిపాదించగా.. 481కి కమిటీ ఆమోదం తెలిపింది. వివిధ కారణాలతో 31 దరఖాస్తులు పెండింగ్లో పెట్టింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో పి.సత్తిబాబు, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, డీఎంహెచ్వో పి.జగదీశ్వరరావు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మోహన లక్ష్మీ, రైల్వే పీఆర్వో జయరాం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు అండగా ఉంటాం
విశాఖ సిటీ: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తా మని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ తెలిపారు. ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండో రోజు గురువారం కూడా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఏపీఎన్జీవో హోంలో జరిగింది. పలువురు జర్నలిస్టులకు నూతన, రెన్యూవల్ సభ్యత్వ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతేడాది తమ యూనియన్లో 600 మంది సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో కూడా నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన ప్రధానమైన 11 డిమాండ్ల సాధనకు తమ రాష్ట్ర కార్యవర్గం ద్వారా కృషి చేస్తున్నామన్నారు. ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాస రావు, ఏపీబీజేఏ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్, స్మాల్ పేపర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బొబ్బర ప్రసాద్, సంయుక్త కార్యదర్శి రాజశేఖర్, వై.రవికుమార్, రాజేష్ పాల్గొన్నారు. -
‘ఓపీ’క నశిస్తోంది
మహారాణిపేట: కేజీహెచ్ అవుట్ పేషెంట్ (ఓపీ) విభాగంలో బుధవారం రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్(అభా) యాప్ సర్వర్ మొరాయించడంతో ఓపీ టికెట్ల జారీ ప్రక్రియ నిలిచిపోయి, రోగులకు చుక్కలు కనిపించాయి. సాధారణంగా కేజీహెచ్లో రోజుకు 1,200 నుంచి 1,300 వరకు ఓపీ టికెట్లు జారీ అవుతుంటాయి. అయితే సంక్రాంతి పండగ సెలవుల అనంతరం బుధవారం ఆసుపత్రికి రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఒక్కరోజే సుమారు 2,700 మంది ఓపీ సేవలకు రాగా, 120 మందికి ఇన్–పేషెంట్(కేస్ షీట్లు) జారీ చేశారు. రద్దీకి తగ్గట్టుగా సర్వర్లు సహకరించకపోవడం, తరచూ ‘అభా’ యాప్ డౌన్ కావడంతో టికెట్ల జారీలో తీవ్ర జాప్యం జరిగింది. కంప్యూటర్ల ద్వారా టికెట్లు జారీ చేయాల్సి ఉండగా.. సర్వర్ పనిచేయకపోవడంతో సిబ్బంది కూడా ఏమీ చేయలేక ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. దీంతో గంటల తరబడి క్యూల్లో నిలబడలేక రోగులు, వారి బంధువులు అవస్థలు పడ్డారు. ఆరు కౌంటర్ల వద్ద రద్దీ పోటెత్తడంతో వారిని నియంత్రించడం సెక్యూరిటీ సిబ్బందికి కూడా కష్టతరంగా మారింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ‘అభా’ యాప్తో అవస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కేజీహెచ్లో అభా యాప్ ద్వారానే ఓపీ టికెట్లు జారీ చేస్తున్నారు. ఇందులో రోగి పేరు, వయసు, చిరునామా, వెళ్లే విభాగం వంటి వివరాలు నమోదవుతాయి. అయితే, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, ఉన్న వారికి యాప్ డౌన్లోడ్ చేయడం రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సిబ్బంది సహాయం చేసినప్పటికీ సర్వర్ సమస్యల వల్ల ఒక్కో టికెట్ జారీకి ఎక్కువ సమయం పడుతోంది. సాంకేతిక సమస్యలను పరిష్కరించి త్వరితగతిన వైద్య సేవలు అందేలా చూడాలని రోగులు కోరుతున్నారు. -
గీతం కబ్జాచేసిన భూముల క్రమబద్ధీకరణ అడ్డుకోండి..
మేయర్, ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లకు సీపీఎం విజ్ఞప్తి డాబాగార్డెన్స్: గీతం యూనివర్సిటీ యాజమాన్యం, విశాఖ ఎంపీ శ్రీభరత్ కబ్జా చేసిన 54.79 ఎకరాల భూమిని జీవీఎంసీ కౌన్సిల్ ద్వారా క్రమబద్ధీకరించడం కోసం చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకోవాలని మేయర్ పీలా శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లను సీపీఎం విజ్ఞప్తి చేసింది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జీవీఎంసీ సీపీఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి.గంగారావు నాయకత్వంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్కేఎస్వీ కుమార్, వి.కృష్ణారావు ఇతర నాయకులతో కలిసి మేయర్, ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్లీడర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ ఎంపీ శ్రీభరత్ ప్రజల ఆస్తులు రక్షించాల్సింది పోయి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాజేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీనికి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకంగా 15వ అజెండాగా పెట్టి క్రమబద్ధీకరణకు ఆమోదం పొందేందుకు చంద్రబాబు సర్కార్ పన్నాగాలు పన్నడాన్ని విమర్శించారు. 30న జరిగే కౌన్సిల్ సమావేశంలో గీతం కబ్జా చేసిన భూములపై నిలదీస్తామని పేర్కొన్నారు. -
పాత బిల్లులు ఇప్పుడెందుకు?
అసంపూర్తి వివరాలపై అధికారులను నిలదీసిన మేయర్ డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజాధనం వినియోగం విషయంలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు సూచించారు. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్థాయీ సంఘం సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సమావేశంలో చర్చకు వచ్చే అంశాలపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. స్థాయీ సంఘం సమావేశానికి హాజరయ్యేటప్పుడు, ఆయా పనులకు సంబంధించిన పూర్తి వివరాలు, నివేదికలతో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆరు నెలలు, ఏడాది కిందట జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను ఇప్పుడు అజెండాలో చేర్చడం, సరైన వివరాలు లేకపోవడంపై ఆయన అధికారులను ప్రశ్నించారు. ఏ పనులు ఎక్కడ జరుగుతున్నాయి? ఏ బిల్లులు పెడుతున్నారు అనే అంశాలపై స్పష్టత ఉండాలని, లేని పక్షంలో పాలనలో ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. వివరాలు అసంపూర్తిగా ఉన్న కారణంగా 12 అంశాలను వాయిదా వేశారు. సమావేశంలో మొత్తం 172 అంశాలు(159 సాధారణ, 13 టేబుల్ అజెండా) చర్చకు రాగా, మెజారిటీ అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి సుమారు రూ. 29.18 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపారు. పారిశుధ్య కార్మికులు, సిబ్బంది జీతభత్యాలు, ఉద్యోగుల సర్వీసు అంశాలు, రెవెన్యూ విభాగానికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించారు. సిబ్బంది జీతాలకు సంబంధించిన ఫైళ్లను ఇకపై నిర్ణీత సమయానికే అందజేయాలని మేయర్ ఆదేశించారు. ఎస్ఈ గోవిందరావుకు ఘన నివాళి ఇటీవల అకాల మరణం చెందిన జీవీఎంసీ పర్యవేక్షక ఇంజినీర్ జి.గోవిందరావు, భీమిలి జోన్ 2వ వార్డు కార్పొరేటర్ గాడు చిన్నకుమారి లక్ష్మీ భర్త గాడు అప్పలనాయుడు మృతి పట్ల స్థాయీ సంఘం మౌనం పాటించి సంతాపం తెలిపింది. విధి నిర్వహణలో ఉద్యోగులు ఒత్తిడికి గురికాకూడదని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మేయర్, సభ్యులు సూచించారు. గోవిందరావు రూపంలో ఒక మంచి అధికారిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. సమావేశంలో సభ్యులు సేనాపతి వసంత, మొల్లి హేమలత, సాడి పద్మారెడ్డి, ఇతర సభ్యులు, ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పుష్ప శోభ
నేటి నుంచి సెంట్రల్ పార్క్లో ఫ్లవర్ షోమహారాణిపేట: విశాఖ ఉత్సవ్లో భాగంగా నగర వాసులకు కనువిందు చేసేందుకు పుష్ప ప్రదర్శన–2026 సిద్ధమైంది. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ ప్రదర్శనను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్భరత్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని సెంట్రల్ పార్క్ వేదికగా ఈ పుష్ప ప్రదర్శన జరగనుండగా, అటు అనకాపల్లి ఉత్సవ్లో భాగంగా అనకాపల్లి బెల్లం మార్కెట్ వద్ద కూడా ప్రత్యేకంగా ఫ్లవర్ షోను ఏర్పాటు చేశారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో జరిగే ఈ ప్రదర్శనలో స్థానిక రకాలతో పాటు దేశ, విదేశీ జాతుల పూలను ఉంచనున్నారు. దీని కోసం బెంగళూరు, కోల్కతా, కడియం నర్సరీల నుంచి వివిధ రకాల హైబ్రిడ్ పూలను రప్పించారు. డచ్ రోజ్, కార్నేషన్, ఏషియాటిక్ లిల్లీ, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్, జెర్బరా, ఆస్ట్రోమెరియా, ఆంథోరియమ్స్, గ్లాడియోలా, ట్యూబ్ రోజ్, జిప్సీ వంటి పూలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. కేవలం పూల ప్రదర్శనే కాకుండా, సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచేలా నిర్వాహకులు పలు ఆకర్షణలను జోడించారు. -
అదానీ గంగవరం పోర్టుకు సేఫ్టీ ఎక్స్లెన్స్ అవార్డు
పెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టుకు సేఫ్టీ ఎక్స్లెన్స్ అవార్డు లభించింది. ఎన్విరో ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోవాలో నిర్వహించిన 2వ వార్షిక గ్రీన్ ఎన్విరో సమ్మిట్, ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అదానీ గంగవరం పోర్టుకు ఈ అవార్డు లభించింది. పోర్టు యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ సముద్రయాన రంగంలో విశేష సేవలందిస్తున్నందుకు ఈ అవార్డు లభించిందన్నారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సమగ్ర భద్రతా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. -
ఆకట్టుకున్న జైళ్లశాఖ ఉత్పత్తుల స్టాళ్లు
ఆరిలోవ: జైళ్ల శాఖ తొమ్మిదో జాతీయ సదస్సు బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. భారత ప్రభుత్వ హోం శాఖకు చెందిన పోలీస్ పరిశోధన, అభివృద్ధి బ్యూరో(బీపీఆర్ అండ్ డీ) ఆధ్వర్యంలో సాయిప్రియ రిసార్ట్స్లో జరిగిన సదస్సులో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కేంద్ర కారాగారాల్లో ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ, ఒడిశా, రాజస్తాన్, గుజరాత్, అస్సాం తదితర రాష్ట్రాల జైళ్లలో తయారైన దుస్తులు, చెప్పులు, నూలు బ్యాగులు, బుట్టలు, చెక్క వస్తువులు, మేటీలు, దుప్పట్లు, నూనెలు, రకరకాల పిండిలు, బేకరీ పదార్థాలు తదితర ఉత్పత్తులు ఆకర్షణగా నిలిచాయి. ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల జైళ్ల శాఖ డీజీలు, ఐజీలు, డీఐజీలతో పాటు కేంద్ర కారాగారాల పర్యవేక్షణాధికారులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల జైళ్లలో కస్టడీలో ఉన్న బలహీన వర్గాల అవసరాలను తీర్చడం, సమగ్రమైన, సురక్షితమైన, ప్రభావవంతమైన సంరక్షణ ఎలా అందించాలి అనే అంశంపై చర్చించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ మాట్లాడుతూ దేశంలో జైళ్ల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా అదనపు జైళ్లు, బేరక్లు నిర్మాణాలు, సంక్షేమం తదితర వాటి కోసం రూ.950 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఖైదీలలో పరివర్తనం కలిగే విధంగా అధికారులు చొరవచూపాలన్నారు. అనంతరం జైళ్ల శాఖ అధికారులు తమ రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న సంక్షేమం, పాలన విధానం, అక్కడ జైళ్ల అభివృద్ధి, ఉద్యోగుల నియామకాల గురించి వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమంలో బీపీఆర్డీ డీజీ అలోక్ రంజన్, ఏపీ డీజీ అంజనికుమార్, ఐజీ ఇండ్ల శ్రీనివాసరావు, డీఐజీ రవిశంకర్, ఉత్తర ప్రదేశ్ డీజీ పి.సి మీనా, వివిధ రాష్ట్రాల డీజీలు, ఐజీలు, డీఐజీలు, కేంద్ర కారాగారాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
దూబే మెరిసినా..మ్యాచ్ కివీస్దే!
విశాఖ స్పోర్ట్స్: పీఎంపాలెంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం బుధవారం క్రికెట్ అభిమానులతో పోటెత్తింది. భారత్–న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో టీమిండియాకు ఓటమి ఎదురైనప్పటికీ.. ఫోర్లు, సిక్సర్ల వర్షంతో క్రీడాభిమానులకు మాత్రం కావాల్సినంత వినోదం దక్కింది. ఇరుజట్లు కలిపి ఏకంగా 56 బంతుల్ని బౌండరీకి తరలించగా.. అందులో 22 సిక్సర్లే ఉండటం విశేషం. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటల నుంచే అభిమానులు స్టేడియం వద్ద బారులు తీరారు. ముఖానికి త్రివర్ణ పతాక రంగులు, చేతిలో జాతీయ జెండాలు, ఒంటిపై టీమిండియా జెర్సీలతో అభిమానులు సందడి చేశారు. ఇండియా.. ఇండియా.. అన్న నినాదాలతో స్టేడియం పరిసరాలు మార్మోగిపోయాయి. గ్యాలరీలన్నీ నీలి రంగు జెర్సీలతో నిండిపోయి, స్టేడియం మొత్తం మరో నీలి సముద్రాన్ని తలపించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్.. వైజాగ్ బ్యాటింగ్ పిచ్ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. వైజాగ్ వేదికగా జరిగిన ఐదు టీ–20 మ్యాచ్ల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. టిమ్ సీఫెర్ట్ కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని, విశాఖ వేదికగా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు. రింకూ సింగ్.. నాలుగు అద్భుతమైన క్యాచ్లు అందుకొని ఆకట్టుకున్నాడు. బౌలింగ్లో ఎప్పుడూ పొదుపుగా ఉండే బుమ్రాకు కూడా ఈ మ్యాచ్ కలిసిరాలేదు. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే తడబడింది. అయితే శివమ్ దూబే క్రీజులోకి రాగానే మ్యాచ్ స్వరూపం మారింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన దూబే 7 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో 65 పరుగులు చేసి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ముఖ్యంగా కివీస్ బౌలర్ సోధీ వేసిన 12వ ఓవర్లో దూబే శివమెత్తాడు. ఆ ఒక్క ఓవర్లోనే 5 బంతులను బౌండరీకి తరలించగా.. అందులో మూడు సిక్సర్లు ఉన్నాయి. ఆ సమయంలో స్టేడి యం మొత్తం దూబే నామస్మరణతో మార్మోగింది. రింకూ సింగ్, సంజూ శాంసన్ మినహా మిగిలిన వారు విఫలం కావడం, కీలక సమయంలో దూబే రనౌట్ కావడంతో భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటికే సిరీస్ను భారత్ కై వసం చేసుకోవడంతో, ఈ ఓటమి సిరీస్ ఫలితంపై ప్రభావం చూపలేదు. భారత్ గెలిచి ఉంటే ఆనందం రెట్టింపయ్యేదని అభిమానులు అభిప్రాయపడినప్పటికీ, బౌండరీల మోతతో తమకు కావాల్సిన అసలైన వినోదం దక్కిందని వైజాగ్ వాసులు సంతృప్తి వ్యక్తం చేశారు. శివమెత్తిన దూబేభారీ లక్ష్య ఛేదనలో తడబడ్డ టీమిండియా బౌండరీల మోతమోగించిన బ్యాటర్లు -
‘గీతా’ గానానికి విశాఖ ఫిదా
ఏయూక్యాంపస్: విశాఖ ఉత్సవ్లో భాగంగా ఆర్.కె.బీచ్, గోకుల్ పార్క్ వేదికలుగా బుధవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నగరవాసులను విశేషంగా అలరించాయి. ప్రధాన వేదికపై సినీ గాయని గీతామాధురి తన గానంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ‘మహానుభావుడవేరా.. నువ్వే నా మహానుభావుడవేరా’అంటూ ప్రదర్శనను ప్రారంభించిన ఆమె, తన పాటల ప్రవాహంతో యువతలో జోష్ నింపారు. మనసున మనసై.., తోడొకరుండిన అదే భాగ్యము.. వంటి మలయ మారుతాలతో పాటు, చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు వంటి హుషారైన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇక జామురాతిరి.. జాబిలమ్మ వంటి జోలపాటలు, మగాళ్లు ఒట్టి మాయగాళ్లు వంటి సరదా గీతాలతో ఆమె చేసిన సందడి విశాఖ వాసులను కట్టిపడేసింది. ఇదే వేదికపై కళాకారుడు సురేష్ ప్రదర్శించిన రెండు ప్రత్యేక ప్రదర్శనలు ఆలోచింపజేశాయి. సాధనతో ఏదైనా సాధ్యమే అనే ఇతివృత్తంతో సాగిన ఈ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోవైపు గోకుల్ పార్క్ వేదికపై స్థానిక, ఇతర రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన విన్యాసాలు ఆహూతులను ఆశ్చర్యపరిచాయి. వై.కె.రాజు మిమిక్రీ నవ్వులు పూయించగా, శ్రీకృష్ణ లీల బృంద నృత్యం భక్తిభావాన్ని పంచింది. తెలంగాణ, బంగ్లా, నేపాలీ జానపద నృత్యాలతో పాటు అస్సామీ ఫోక్ సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాక్సాఫోన్ వాయిద్యం, కళ్లకు గంతలు కట్టుకుని చేసిన నృత్యం, జగ్లింగ్, మ్యాజిక్ షోలు పిల్లలు, పెద్దలను ఎంతగానో అలరించాయి. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు -
మళ్లీ బాదుడే బాదుడు
ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు విశాఖ సిటీ: సంపద సృష్టి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచేందుకు సిద్ధమవుతోంది. మరోసారి భారీగా రిజిస్ట్రేషన్ చార్జీల వడ్డనకు పూనుకుంది. దీంతో భూముల క్రయ విక్రయదారులకు గట్టి షాక్ తగలనుంది. ఇప్పటికే సామాన్యుడికి సొంతింటి కల భారంగా మారింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల మార్కెట్ విలువలను సవరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో రిజిస్ట్రేషన్ అధికారులు భూముల మార్కెట్ విలువల సవరణపై కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కంటే ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాది తిరగకుండానే మరో వాత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను నింపుకునేందుకు విశాఖనే ఆదాయ వనరుగా ఎంచుకుంది. దీంతో ఏటా జిల్లావాసులపై అధిక భారాన్ని మోపుతూ భూముల విలువలను అమాంతం పెంచేస్తోంది. గతేడాది ఇదే సమయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భూముల విలువలను సవరించింది. ఆనందపురంలో కొన్ని గ్రామాల్లో అశాసీ్త్రయంగా 131 శాతం మేర పెంచింది. ఆ భారం నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే, తాజాగా మరోసారి 25 నుంచి 50 శాతం మేర విలువల సవరణకు సిద్ధమవ్వడం ప్రభుత్వ ధనదాహానికి నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ లాంటి నగరాల్లో గజం భూమి ధర సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకోగా, ఇప్పుడు ప్రభుత్వ మార్కెట్ విలువల పెంపుతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు తడిసి మోపెడు కానున్నాయి. గతేడాదే గరిష్ట స్థాయిలో భూముల విలువలను పెంచేశారు. తాజాగా అర్బన్ పరిధిలోనే విలువ సవరణ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. విశాఖ జిల్లాలో మూడు మండలాలు మినహా మిగిలిన ప్రాంతం అంతా జీవీఎంసీ పరిధిలోనే ఉంది. దీని ప్రకారం పెందుర్తి నుంచి భీమిలి వరకు భూముల విలువ గణనీయంగా పెరగనుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ధరల పెరుగుదల రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని, ఆదాయం పెంపు నెపంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికాారంలోకి వచ్చిన రెండేళ్లలో రెండోసారి పెంచడానికి సిద్ధమైపోయింది. చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య కూడా ఇదే తరహాలో ప్రజలను బాదేసింది. ఆ సమయంలో నాలుగు సార్లు భూముల విలువ సవరణ చేసింది. ఆ తర్వాత 2019–2024 మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో కేవలం రెండు సార్లు మాత్రమే ధరలు పెంచారు. కోవిడ్ కష్టకాలంలో రాష్ట్ర ఖజానాకు రూపాయి ఆదాయం రాని సమయంలో కూడా రిజిస్ట్రేషన్ ధరలు పెంచలేదు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆదాయం కోసం రెండోసారి ప్రజల నడ్డి విరవాలని చూస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఒక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలే కాకుండా, భూమి కొనుగోలు వ్యయం భారీగా పెరగనుంది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు స్థలాలను, ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసే శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో స్థిరాస్తి రంగం ప్రతీ ఏటా భూముల విలువ సవరణ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడుతోంది. ఇప్పటికే జిల్లాలో స్థిరాస్తి రంగం అంపశయ్యపై ఉంది. భూములు, ఇళ్లు, ఫ్లాట్ల క్రయ, విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి భూముల విలువ పెంచడమంటే సామాన్యుడికి సొంతింటి కలను దూరం చేయడమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు భూమి మార్కెట్ విలువ పెరగడం, మరోవైపు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో వినియోగదారుడిపై రెట్టింపు భారం పడుతుంది. ఇది అంతిమంగా రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనానికి దారితీస్తుందని స్థిరాస్తి వ్యాపారులు వాపోతున్నారు. -
మద్యం మత్తే ప్రాణం తీసిందా?
రోడ్డు ప్రమాదంలో వాడచీపురుపల్లి యువకుడి మృతి పరవాడ: వాడచీపురుపల్లి–పరవాడ రహదారిలో ఎన్టీపీసీ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వాడచీపురుపల్లికి చెందిన వడ్లపూడి మణికంఠ(22) మృతి చెందాడు. పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపిన వివరాలివి. మణికంఠ మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై దేశపాత్రునిపాలెంలోని స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎన్టీపీసీ సమీపంలోకి రాగానే వాహనం అదుపు తప్పి, రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమవ్వడంతో మణికంఠ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. -
మందుకు బానిసైన వ్యక్తికి ఆలయ పీఠమా?
బీచ్రోడ్డు: పదేళ్లుగా భార్య, బిడ్డను పట్టించుకోకుండా అన్యాయం చేసిన వ్యక్తికి పవిత్రమైన దేవస్థానంలో పదవి ఎలా ఇస్తారని బాధితురాలు మద్ది వసుంధర రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం పెదవాల్తేరు కరకచెట్టు పోలమాంబ ఆలయం ధర్మకర్తల మండలి చైర్మన్గా మద్ది శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారాన్ని నిరసిస్తూ ఆమె ఆలయం వద్ద ఆందోళన చేపట్టారు. 2015లో పెద్దల సమక్షంలో తనకు శ్రీనివాసరావుతో వివాహం జరిగిందని ఆమె తెలిపారు. ఏడాదికే ఒక పాప పుట్టిందని, ఆ తర్వాత నుంచి అతను మందుకు బానిసై, వ్యభిచార గృహాల్లో తిరుగుతూ తనను మానసికంగా, శారీరకంగా వేధించేవాడని ఆరోపించారు. దీనిపై అనేకసార్లు పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్లామని, ఎప్పటికై నా మనసు మార్చుకొని తిరిగి మమ్మల్ని చూసుకుంటాడని ఎంతో ఆశతో ఎదురుచూశామన్నారు. గడిచిన పదేళ్లలో తనను గానీ, పాపను గానీ కనీసం పట్టించుకోలేదని, తమ పోషణకు ఎలాంటి ఆర్థిక సహకారం అందించకుండా వదిలేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మందుకు బానిసై, అనైతిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తిని పవిత్రమైన ఆలయంలో ధర్మకర్తగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఇటువంటి వ్యక్తి పదవిలో ఉంటే, ఆలయానికి వచ్చే భక్తులను ఎటువంటి దృష్టితో చూస్తారో, వారి పట్ల ఎలా ప్రవర్తిస్తారో అర్థం చేసుకోవాలన్నారు. ఇలాంటి నీచుడిని తక్షణమే ఆ పవిత్రమైన పదవి నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు మద్ది శ్రీనివాసరావును ధర్మకర్తల మండలి నుంచి తొలగించాలని కోరుతూ ఈవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కుటుంబంతో కలిసి నిరసన చేస్తున్న ఆమెకు పోలీసులు నచ్చజెప్పి స్టేషన్కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. కేసు నమోదులో జాప్యం నిరసన తెలిపిన ఆమెకు న్యాయం చేస్తామని చెప్పి స్టేషన్కు తీసుకెళ్లిన మూడో పట్టణ పోలీసులు, కేసు నమోదు చేయకుండా జాప్యం చేశారు. నిరసన సమయంలో మూడో పట్టణ స్టేషన్లో కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పిన పోలీసులు.. తీరా స్టేషన్కు వెళ్లాక మాట మార్చేశారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. భీమిలి స్టేషన్కు వెళ్లాలని, రేపు రావాలని, కేసు నమోదుకు సమయం పడుతుందని.. ఇలా రకరకాలుగా మాటలు మారుస్తూ స్టేషన్లోనే ఉంచుతున్నారని వాపోయారు. మహిళలను సాయంత్రం 6 గంటల తరువాత స్టేషన్లో ఉంచకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ, తన కుమార్తెకు న్యాయం చేయకుండా అలా స్టేషన్లో కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. -
సభను గౌరవించండి.. భూకబ్జాలకు వత్తాసుగా మార్చకండి
డాబాగార్డెన్స్: భూకబ్జాలకు వత్తాసుగా జీవీఎంసీ కౌన్సిల్ను మార్చొద్దని.. సభను గౌరవించి గీతం భూకబ్జా అంశాన్ని ఈ నెల 30న నిర్వహించనున్న కౌన్సిల్ సమావేశ అజెండా నుంచి తొలగించాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, పలువురు కార్పొరేటర్లు బుధవారం మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ అదనపు కమిషనర్లు ఎస్ఎస్ వర్మ, డీవీ రమణమూర్తి, నల్లనయ్య, పీఎం సత్యవేణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీతం విశ్వవిద్యాలయానికి ఎండాడ, రుషికొండ గ్రామాల్లోని 54.79 ఎకరాల ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు అనుమతి ఇవ్వాలని ఈ నెల 30న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో 15వ అంశంగా చేర్చారని.. ఆ భూములు గీతం ద్వారా అక్రమంగా ఆక్రమించబడ్డాయని, కాబట్టి ఆ భూములు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చే వరకు అజెండాలో చేర్చొద్దంటూ వినతిలో పేర్కొన్నారు. అక్రమ ఆక్రమణకు వ్యతిరేకంగా తగిన చట్టపర చర్యలు తీసుకోవాలని, భూములు తిరిగి పొందాలన్నారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి జీవో 571 ఉల్లంఘిస్తోందని, కాబట్టి అజెండా అంశంగా ఉంచకూడదని కోరారు. రూ.5 వేల కోట్ల విలువైన భూమిని ఎంపీ శ్రీభరత్ కుటుంబానికి చాలా తక్కువ ధరకు విక్రయించడం బీఎస్ఓ–15, భూ కేటాయింపు విధానం వంటివి రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తుందని, ప్రజా ప్రయోజనం కంటే వ్యక్తిగత ప్రయోజనం కోసం జరుగుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉమ్మడి స్వాతిదాస్, పల్లా దుర్గా, కార్పొరేటర్లు అల్లు శంకరరావు, దౌలపల్లి ఏడుకొండలరావు, అక్కరమాణి రోహిణి, కటారి అనిల్కుమార్, మొల్లి లక్ష్మి, నక్కెల లక్ష్మి, పీవీ సురేష్, సాడి పద్మారెడ్డి, గుండాపు నాగేశ్వరరావు, తోట పద్మావతి, కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్, వావిలపల్లి ప్రసాద్, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెయ్యి వెంకటరమణ, బర్కత్ ఆలీ, కేవీఎన్ శశికళ, బల్లా లక్ష్మణ్, మహ్మద్ ఇమ్రాన్, గుడివాడ సాయి అనూష లతీష్, ఉరుకూటి రామచంద్రరావు, కో ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, ఎండీ షరీఫ్, వార్డు అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్, భూపతిరాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఎఫ్ఏపీసీసీఐ ఎక్స్లెన్స్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
బీచ్రోడ్డు: ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ఏపీసీసీఐ) 2025–26 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి ఎక్స్లెన్స్ అవార్డుల కోసం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. బుధవారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో అవార్డుల కమిటీ చైర్మన్ కంకటాల మల్లికార్జునరావు ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తల ప్రతిభను, ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించడమే ఈ అవార్డుల లక్ష్యమని ఆయన తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు, స్టార్టప్లు, మహిళా పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, విద్యాసంస్థలు అవార్డుకు అర్హులని, వ్యవసాయం, ఆక్వా, ఎగుమతులు, ఉత్తమ మహిళా వ్యాపారవేత్త, సీఎస్ఆర్, గ్రీన్ ఎనర్జీ, గ్రామీణ వ్యాపారం, ఉద్యోగుల సంక్షేమం తదితర విభాగాల్లో అవార్డులు అందజేస్తామన్నారు. ఆసక్తి గలవారు www.fapcci.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసి 2026 ఫిబ్రవరి 25 లోపు సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 93914 22821కు సంప్రదించాలని, అందిన దరఖాస్తులను రిటైర్డ్ జడ్జిలతో కూడిన స్వతంత్ర జ్యూరీ పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుందన్నారు. సమావేశంలో ఎఫ్ఏపీసీసీఐ అధ్యక్షుడు ఎ.సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు కిశోర్ కుమార్, వ్యవస్థాపక అధ్యక్షుడు సి.వి.అచ్యుతరావు, అవార్డుల కమిటీ సహాధ్యక్షుడు సి.వి. ప్రద్యుమ్న పాల్గొన్నారు. -
ప్రతిభకు పట్టాభిషేకం
జిల్లాలో 498 మందికి ప్రతిభా పురస్కారాలుమహారాణిపేట: జిల్లాలో ఉత్తమ సేవలందించిన 498 మంది అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ప్రతిభా పురస్కారాలు అందజేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, జీవీఎంసీ అదనపు కమిషనర్లు రమణమూర్తి, వర్మ సహా పలువురు ఉన్నతాధికారులు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన 35 మంది జిల్లా స్థాయి అధికారులతో పాటు, కింది స్థాయి సిబ్బందికి కూడా ఈ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. -
పోక్సో కేసులో 12 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
అల్లిపురం: పోక్సో కేసులో 12 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని టూటౌన్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి, సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బలరాంపూర్ జిల్లాకు చెందిన మొహమ్మద్ శాల్మన్ ఖాన్ను 2014లో పోక్సో కేసులో అరెస్ట్ చేయగా, అప్పట్లో కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్పై బయటకు వచ్చినప్పటి నుంచి అతను కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో, నిందితుడిపై ఎన్బీడబ్ల్యూ , ప్రొక్లమేషన్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు టూటౌన్ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు నేతృత్వంలోని ప్రత్యేక బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడి ఆచూకీని ఉత్తరప్రదేశ్లో కనుగొంది. అక్కడికి వెళ్లిన స్పెషల్ టీమ్ నిందితుడిని అదుపులోకి తీసుకుని, ట్రాన్సిట్ వారెంట్పై విశాఖకు తీసుకురాగా..కోర్టు రిమాండ్ విధించింది. సుదీర్ఘ కాలంగా పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏఎస్ఐ ఏవీ సాయిరామ్, కానిస్టేబుల్ వి. రవికిరణ్, పర్యవేక్షించిన అధికారులను పోలీస్ కమిషనర్ అభినందించారు. -
కలెక్టర్ బంగ్లాలో హై–టీ వేడుకలు
మహారాణిపేట: 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ తన అధికారిక నివాసంలో సోమవారం సాయంత్రం ‘హై–టీ’ వేడుకను నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, స్థానిక ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, పి. విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు చైర్మన్ సీతంరాజు సుధాకర్, పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావు, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, కోస్ట్ గార్డ్ డీఐజీ రమేష్ మిట్టల్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోషిణి అపరంజి, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ చందోలు, లతా మాధురి, నేవీ అధికారులు పాల్గొన్నారు. వివిధ నృత్య అకాడమీలకు చెందిన చిన్నారులు ప్రదర్శించిన దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను విశేషంగా అలరించాయి. అనంతరం ఈ వేడుకల విజయవంతానికి సహకరించిన అధికారులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలుపుతూ, కళాకారులను జ్ఞాపికలతో సత్కరించారు. -
పోర్ట్లో రూ.1500 కోట్ల అభివృద్ధి పనులు
సీతంపేట: పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని అక్కయ్యపాలెం పోర్ట్ స్టేడియంలో నిర్వహించారు. చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు జాతీయ జెండాను ఆవిష్కరించి, సీఐఎస్ఎఫ్ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సముద్ర వాణిజ్య రంగంలో విశాఖ పోర్ట్ అగ్రగామిగా ఎదుగుతోందని, ముఖ్యంగా పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్ ప్రాజెక్టులు, హరిత శక్తి వినియోగం వంటి అంశాల్లో వినూత్న కార్యక్రమాలతో తన ప్రత్యేకతను చాటుకుంటోందని ప్రశంసించారు. సరుకు రవాణా కార్యకలాపాల్లో కొంత భాగాన్ని శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టుకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని, దుగ్గరాజపట్నంలో నౌకా నిర్మాణ కార్యక్రమంలో కూడా పోర్ట్ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోందని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో 82 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను నిర్వహించామని, ప్రస్తుత సంవత్సరంలో 90 ఎంఎంటీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, రానున్న ఏడాదిలో 100 ఎంఎంటీ మైలురాయిని చేరుకుంటామని దీమా వ్యక్తం చేశారు. 2025–26 సంవత్సరానికి గాను సుమారు రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, విశేష ఫలితాలు సాధించిన స్టేక్హోల్డర్లకు చైర్పర్సన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, అవార్డులను అందజేశారు. గౌరవ వందనం స్వీకరిస్తున్న పోర్ట్ చైర్మన్ అంగముత్తు -
షిప్యార్డుల్లో 11 డ్రెడ్జర్ల నిర్మాణం
సాక్షి, విశాఖపట్నం : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తమ వంతు బాధ్యతగా 11 ఎకో ఫ్రెండ్లీ డ్రెడ్జర్లను భారతీయ షిప్యార్డుల్లో నిర్మిస్తున్నట్లు డీసీఐ ఎండీ కెప్టెన్ దివాకర్ వెల్లడించారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి 12,000 క్యూబిక్ మీటర్ల బీగల్ సిరీస్ డ్రెడ్జర్ అయిన డ్రెడ్జ్ గోదావరిని త్వరలో డీసీఐలో చేర్చనున్నట్లు ప్రకటించారు. ఇదే తరగతికి చెందిన మరో రెండు డ్రెడ్జర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. ప్రస్తుతం భారతదేశ డ్రెడ్జింగ్ అవసరాలలో 55 శాతం కంటే ఎక్కువగా నిర్వహిస్తున్న డీసీఐ.. ఫ్లీట్ ఆధునీకరణ, నైపుణ్యాభివృద్ధి, స్థిరమైన సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు తెలిపారు. సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్.. డీసీఐకి రూ.150 కోట్ల ఎన్బీఎఫ్సీ టర్మ్ లోనను అందించడంతో సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సంస్థలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులను సత్కరించారు. ఉద్యోగులకు నిర్వహించిన వ్యాస రచన, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో డీసీఐ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో డీసీఐ ఎండీ కెప్టెన్ దివాకర్ -
నగర ప్రగతే లక్ష్యం
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ డాబాగార్డెన్స్: నగర ప్రగతే లక్ష్యంగా జీవీఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేస్తున్నారని కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 192 మంది అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు భీశెట్టి వసంతలక్ష్మి, కందుల నాగరాజు, మాదంశెట్టి చిన్నతల్లి, మహ్మద్ సాధిక్, బిపిన్కుమార్ జైన్, జీవీఎంసీ అదనపు కమిషనర్లు సత్యవేణి, ఎస్ఎస్ వర్మ, డీవీ రమణమూర్తి, పి.నల్లనయ్య, ప్రధాన ఇంజినీరు పీవీ సత్యనారాయణరాజు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, నివాసిత సంక్షేమ సంఘాలు, పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రగతి పథంలో వాల్తేర్ డివిజన్
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ పరిధిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రైల్వే ఫుట్బాల్ గ్రౌండ్లో డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రాష్ట్రీయ సలామీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్తేర్ డివిజన్ 13 శాతం వృద్ధితో 66.7 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసి, రూ. 8212 కోట్ల ఆదాయాన్ని సాధించిందని తెలిపారు. 21 కి.మీ. డబ్లింగ్, 36 కి.మీ. మూడవ లైన్ పనులు పూర్తి చేశామని, 175 లోకోలకు ‘కవచ్’ సిస్టమ్ అమర్చినట్లు వెల్లడించారు. విశాఖ స్టేషన్కు ‘ప్లాటినం గ్రీన్ సర్టిఫికేట్’ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే జోనల్ కార్యాలయంలో జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతను వివరించారు. ఈ వేడుకల్లో రైల్వే అధికారులు, సిబ్బంది, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
విద్యుత్ రంగంలో ఏపీఈపీడీసీఎల్ అగ్రగామి
తాటిచెట్లపాలెం: ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 74 లక్షల మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తూ, పంపిణీ నష్టాలను 5.88 శాతానికి తగ్గించి దేశంలోనే మేటి సంస్థగా నిలిచామన్నారు. ‘పీఎం సూర్యఘర్’ పథకం కింద 43,340 మందికి రూఫ్టాప్ సోలార్ ప్లాంట్లు అమర్చి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. వినియోగదారుల సేవల కోసం విశాఖలో ‘సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్’ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 80 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో డైరెక్టర్లు టీవీ సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సంస్థ చీఫ్ విజిలెన్స్ అఫీసర్ కేవీ రామకృష్ణప్రసాద్, సీజీఎంలు సుమన్ కళ్యాణి, వి.విజయలలిత, బి.అశోక్ కుమార్, ఎల్.మహేంద్రనాధ్, ఎల్. దైవప్రసాద్, ఎస్ విజయప్రతాప్, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. సీఎండీ పృథ్వీతేజ్ -
హక్కులతో పాటు బాధ్యతలను గుర్తెరగాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి చెన్నంశెట్టి రాజు విశాఖ లీగల్ : జిల్లా కోర్టు ఆవరణలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు హక్కులతో పాటు బాధ్యతలను గుర్తెరిగినప్పుడే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి లభిస్తుందని పేర్కొన్నారు.న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె. శ్రీనివాస్, కార్యదర్శి ఎల్. పార్వతీ కుమార్ , రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్. కృష్ణమోహన్, కె. రామ జోగేశ్వరరావు, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
త్రివర్ణం
సగర్వం..జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్న కలెక్టర్ హరేందిర ప్రసాద్, చిత్రంలో సీపీ బాగ్చి, జేసీ విద్యాధరి మహారాణిపేట : పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం నిర్వహించిన 77వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాంతత్య్ర సమరయోధులు, పద్మ అవార్డుల విజేతలు, రాజకీయ ప్రముఖులు, న్యాయ, పరిపాలనా అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం కాగా.. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ముందుగా పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో కలిసి కలెక్టర్ ఓపెన్ టాప్ వాహనంపై మైదానాన్ని సందర్శించారు. అనంతరం పరేడ్ కమాండర్ సారథ్యంలో మార్చ్ ఫాస్ట్ మొదలు కాగా పోలీస్ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు కవాతు నిర్వహించారు. శాంతికి చిహ్నం, జాతి సమైక్యతను చాటి చెబుతూ కలెక్టర్, పోలీసు అధికారులు జాతీయ జెండా రంగులతో కూడిన బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రగతి విశేషాలను వివరిస్తూ కలెక్టర్ అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. అభివృద్ధి పథంలో విశాఖ విశాఖ జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అన్నారు. రబీ సీజన్లో ఇంత వరకు 740 హెకార్టులో వివిధ పంటలు సాగు చేస్తున్నారని, రైతు సేవ కేంద్రాల ద్వారా ఈ రబీ సీజన్లో 83 క్వింటాళ్లు విత్తనాలు 673 మంది రైతులకు సరఫరా చేశామన్నారు. ఈ ఏడాది 450 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులను మంజూరు చేసి, 90 మంది కౌలు రైతులకు రూ.57 లక్షలు రుణంగా అందించామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 25,500 కుటుంబాల్లో 34,700 మంది వేతనదారులకు 13 లక్షల పనిదినాలు కల్పించడం ద్వారా రూ.36 కోట్ల వేతనాలను నేరుగా ఖాతాల్లో చెల్లించామన్నారు. జిల్లాలో 12,175 ఎంఎస్ఎంఈ పరిశ్రమల ద్వారా రూ.33.4 కోట్ల పెట్టుబడితో స్థాపించిన పరిశ్రమల్లో 15,920 మంది ఉపాధి కల్పించామన్నారు. సంక్షేమ పథకాలను, ప్రయోజనాలను వివరిస్తూ డీఆర్డీఏ, జీవీఎంసీ–యూసీడీ, సమగ్ర శిక్షా, పశుసంవర్థక శాఖ, వ్యవసాయ, ఉద్యాన శాఖలు, ఏపీఎంఐపీ, డ్వామా, మత్స్యశాఖ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. స్టాళ్లను సందర్శించిన కలెక్టర్ వివిధ సంక్షేమ పథకాల కింద 13,113 మందికి రూ.809.15 కోట్ల నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. వేడుకల్లో ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యే విష్టుకుమార్ రాజు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ విద్యాధరి, జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబు, న్యాయ, పోలీసు, రెవెన్యూ అధికారులు, రాజకీయ ప్రతినిధులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన రిప్లబిక్ దినోత్సవ కార్యక్రమంలో వి.అముల్య, చిత్ర హాసిని, యు.లాస్య అస్వస్థతకు గురయ్యారు. గౌరవ వందనం స్వీకరిస్తున్నకలెక్టర్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి -
ఘనంగా గణతంత్ర దినోత్సవం
విశాఖ చేరుకున్న భారత్ – కివీస్ జట్లు● పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ హరేందిర ప్రసాద్ ● ఉత్తమ అవార్డులు అందుకున్న 498 మంది ఉద్యోగులు ద్వైపాక్షిక్ష టీ20 సిరీస్లో భాగంగా మ్యాచ్ ఆడేందుకు భారత్తో పాటు న్యూజిలాండ్ జట్లు సోమవారం విశాఖ చేరుకున్నాయి. జీవీఎంసీ శకటానికి ప్రథమ బహుమతి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతిబింబించేలా జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలోని ప్రగతిని తెలియజేస్తూ ఎనిమిది శకటాల ప్రదర్శన నిర్వహించారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ విశాఖ లక్ష్యాలను తెలుపుతూ జీవీఎంసీ తయారు చేసిన శకటం ప్రథమ స్థానంలో నిలిచింది. నైపుణ్య విలువలతో విద్యార్థి సమగ్రాభివృద్ధి అనే అంశంపై సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ ప్రదర్శించిన శకటం ద్వితీయ స్థానం సొంతం చేసుకోగా, మహిళా సాధికారతను ప్రతిబింబిస్తూ మహిళా, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ రూపొందించిన శకటం తృతీయ స్థానంలో నిలిచింది. సివిల్ సప్లయిస్ విభాగం రూపొందించిన శకటం ప్రోత్సాహక బహుమతి గెలుచుకుంది. కలెక్టర్ చేతుల మీదుగా ఆయా విభాగాల అధికారులు బహుమతులు అందుకున్నారు. -
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఆద్యంతం దేశభక్తిని, దేశ సమగ్రతను చాటి చెప్పాయి. నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే జయహో జానకి అనే గేయ నృత్య ప్రదర్శనతో ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆసాంతం అలరింపజేశాయి. సంఘటనం ఒక యజ్ఞం అంటూ మేఘాద్రి గెడ్డ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం విద్యార్థులు, ఏ దేశమేగినా అంటూ మధురువాడ సన్ స్కూల్ విద్యార్థులు, జయ భారత జనని అంటూ తగరపువలస కేథరిన్ పాఠశాల విద్యార్థులు, ఖూబ్ నహీ ఫర్ జష్న్ యే భారత్ అంటూ విశాఖ వ్యాలీ పాఠశాల విద్యార్థులు, నెత్తురు మరిగితే ఎత్తర జెండా అంటూ పద్మనాభం కేజీబీవీ విద్యార్థులు, దేశ రంగీలా పేరుతో సేక్రడ్ హార్ట్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, యే వతస్, వతస్ అంటూ పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేశారు. జిల్లాలోని 8 పాఠశాలలకు చెందిన 440 మంది సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఏ దేశమేగినా..జైహింద్అలరించిన సాంస్కృతిక ప్రదర్శనమేరా భారత్ మహాన్పాడవోయి భారతీయుడా...జయ భారత జననీ.. -
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. సోమవారం మద్దిలపాలెంలో గల పార్టీ కార్యాలయంలో జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడు పీలా ప్రేమ్కిరణ్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅఽతిథిగా హాజరైన కేకే రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న రాచరిక పాలనకు వ్యతిరేకంగా మనమంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి లోబడి ప్రజాపాలన అందించారని గుర్తుచేశారు. వెనుకబడిన కులాల కోసం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలోనే ఎవరూ తీసుకోలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంబా రవిబాబు, సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, సీఈసీ సభ్యులు కోలా గురువులు, ఎస్ఈసీ సభ్యులు రొంగలి జగన్నాథం, జహీర్ అహ్మద్, సతీష్ వర్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట పార్టీ సంయుక్త కార్యదర్శులు పీవీ నారాయణ, కిరణ్ రాజు, తాడి జగ్గన్నాథరెడ్డి, నాగ మల్లేశ్వరి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుడు పేర్ల విజయ్ చంద్ర, రాష్ట్ర అనుబంధ విభాగాల కార్యనిర్వాహక అధ్యక్షులు జి.వి.రవిరాజు, ద్రోణంరాజు శ్రీ వత్సవ, రాష్ట్ర, జోనల్, జిల్లా అనుబంధ అధ్యక్షులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘పట్టాలు’ తప్పిన ఏయూ
విశాఖ సిటీ : ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిస్థితులు తీసికట్టుగా మారుతున్నాయి. శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న యూనివర్సిటీ పాలన గతి తప్పుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా వేల సంఖ్యలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న వర్సిటీ.. పట్టాలు అందజేయడంలో మాత్రం విఫలమవుతుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గత మూడేళ్లుగా ఏయూ స్నాతకోత్సవం నిర్వహించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ పట్టాలను అందుకోవడానికి ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి రావడం శోచనీయం. పాలకుల నిర్లక్ష్యం? సాధారణంగా ఏటా జరగాల్సిన స్నాతకోత్సవం వరుసగా మూడేళ్ల నుంచి వాయిదా పడుతూనే ఉంది. చిన్న చిన్న విశ్వవిద్యాలయాలు సైతం ఏటా క్రమం తప్పకుండా కాన్వొకేషన్ నిర్వహించుకుంటున్నాయి. విద్యార్థులకు పట్టాలు అందజేస్తున్నాయి. శత వసంతాలు పూర్తి చేసుకున్న ఆంధ్రా యూనివర్సిటీ మాత్రం ఈ విషయంలో వెనుకబడటం గమనార్హం. గత వైఎస్సార్సీపీ హయాంలో కోవిడ్ కారణంగా మూడేళ్లు పట్టాల పండుగ జరగలేదు. దీంతో 2023లో 87 నుంచి 90 బ్యాచ్ల వరకు స్నాతకోత్సవాన్ని నిర్వహించి విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఆ తర్వాత 2024లో ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండు విద్యా సంవత్సరాలు పట్టాల ప్రదానోత్సవాన్ని నిర్వహించలేదు. గతేడాది డిసెంబర్ 30న 90, 91వ సంయుక్త స్నాతకోత్సవాలను నిర్వహిస్తామని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ, ఆ ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే అనివార్య కారణాలంటూ దానిని వాయిదా వేయడం విద్యార్థులను నిరాశకు గురిచేసింది. పాలనా వైఫల్యం.. విద్యార్థులకు ఆర్థిక భారం వందేళ్ల చరిత్ర కలిగిన ఏయూ వంటి ప్రతిష్టాత్మక సంస్థ.. స్నాతకోత్సవాల నిర్వహణలో విఫలమవుతుండడంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదాలు వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది వర్సిటీ అడ్మినిస్ట్రేషన్, రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ సమన్వయ లోపాన్ని బయటపెడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టాల పండుగను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుండడంతో విద్యార్థులు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు. విదేశాల్లో ఉంటున్న పీహెచ్డీ స్కాలర్లు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న పట్టభద్రులు స్నాతకోత్సవం కోసం విమాన టికెట్లు, హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నారు. చివరి నిమిషంలో వాయిదా పడటంతో టికెట్లకు వెచ్చించిన డబ్బును నష్టపోయారు. కొందరు విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, ఈ జాప్యం తమ కెరీర్పై కూడా ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టభద్రుల ఆవేదన పట్టా చేతికి వస్తేనే తమ విద్యాభ్యాసానికి ఒక పరిపూర్ణత లభిస్తుందని విద్యార్థులు భావిస్తారు. స్నాతకోత్సవం జరగకపోవడం వల్ల వారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో పట్టా తీసుకోవాలనే విద్యార్థుల కల కలగానే మిగిలిపోతోంది. యూనివర్సిటీ పాలకులు ఇప్పటికై నా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థులు కోరుతున్నారు. తక్షణమే స్నాతకోత్సవ తేదీని ప్రకటించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పాలనాపరమైన కారణాలు చూపుతూ కాలయాపన చేయడం వల్ల వర్సిటీ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, వేలమంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతోందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ఏయూ యంత్రాంగం మొద్దునిద్ర వీడి, త్వరగా వేడుకలు నిర్వహించి పట్టభద్రుల ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని పట్టుబడుతున్నారు. -
సోషల్ మీడియాలో అప్పన్న మూలవిరాట్ వీడియో హల్చల్
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి మూలవిరాట్ వీడియో ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద నుంచి స్వామివారి మూలవిరాట్ని చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. ఆలయంలోకి మొబైల్లు అనుమతి లేదు. అయినా మూలవిరాట్ చిత్రీకరణ చోటుచేసుకోవడం పట్ల భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా సిబ్బంది, ఉద్యోగుల నిఘా లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీలాద్రిగుమ్మం వద్ద నుంచి కనిపిస్తున్న అప్పన్న మూలవిరాట్ -
ప్రేమ, స్నేహం, సేవతోనే సమాజ హితం
సీపీ శంఖబ్రత బాగ్చి ఏయూక్యాంపస్: శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం బీచ్రోడ్డులో సత్యసాయి రన్–రైడ్(సైక్లింగ్)–2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐక్యత, ఫిట్ ఇండియా స్ఫూర్తి లక్ష్యంగా సత్య సాయి సేవా సంస్థలు చేపట్టిన ఈ ర్యాలీని కాళీమాత ఆలయం వద్ద నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి, సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.లక్ష్మణరావులు జెండా ఊపి ప్రారంభించారు. 3 కి.మీ, 5 కి.మీల విభాగాల్లో జరిగిన ఈ రన్, సైక్లింగ్లో వేలాది మంది నగర వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజల్లో ప్రేమ, స్నేహం, సేవా భావాలను పెంపొందించుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సీపీ, రాష్ట్ర అధ్యక్షుడు సత్య సాయి యూనివర్సల్ టార్చ్ ఆఫ్ పీస్(శాంతిజ్యోతి)ను చేతబూని ర్యాలీలో నడిచారు. 2025 నవంబర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించిన ఈ జ్యోతి.. 140 దేశాల్లో శాంతి, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేస్తోందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముందు ప్రముఖ ఫిట్నెస్ కోచ్ పద్మిని రాజు జుంబా డ్యాన్స్తో, సత్య సాయి విద్యావిహార్ విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాల వాద్య బృంద ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సత్య సాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు పి.ఆర్.ఎస్.ఎన్.నాయుడు, శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, భారీ సంఖ్యలో యువత, సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.


