Visakhapatnam District News
-
చందనోత్సవం ఏర్పాట్ల పరిశీలన
సింహాచలం: ఏప్రిల్ 20న జరిగే శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేందిరప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశించారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవం ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఉచిత దర్శనం, రూ.300, రూ.1000, రూ.1500 మార్గాలను పరిశీలించి భక్తులకు తెలిసేవిధంగా సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు. ఉచిత దర్శనంలో వచ్చే భక్తులకు రెండు మార్గాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఈవో తెలిపారు. క్యూలైన్లలో మంచినీరు, వాష్రూమ్స్, ఎమెర్జన్సీ ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఉత్తర రాజగోపురం నుంచి అన్నదానం భవనానికి వెళ్లే మార్గాలను సీపీ పరిశీలించి భద్రతా పరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కొండపై బస్ కాంప్లెక్స్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు రద్దీని క్రమబద్ధీకరించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింహగింపై పార్కింగ్ ఏరియా తక్కువగా ఉండటంతో ప్రైవేటు వాహనాలను నియంత్రించాలని సూచించారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, దేవస్థానం ఈవో జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
వసుధైక కుటుంబానికి నిదర్శనం ఏయూ
మద్దిలపాలెం: ఐక్యత, వైవిధ్యమే మన బలం అని, వసుధైక కుటుంబానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నిదర్శనంగా నిలుస్తోందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీచ్రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్ వేదికగా గురువారం నిర్వహించిన అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక విభావరిని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏయూకు ఉన్న ప్రతిష్టకు నిదర్శనంగానే విదేశీ విద్యార్థులంతా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని కొనియాడారు. యువతరం శాంతి, సుస్థిరతకు పాటుపడాలని సూచించారు. ఏయూ అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో విద్యనందిస్తోందని ప్రశంసించారు. విభిన్న దేశాల సంస్కృతులను పంచుకుంటూ సామరస్య జీవనం సాగించాలని ఆమె పిలుపునిచ్చారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. వర్సిటీ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఇది ఒకటని తెలిపారు. కొద్ది రోజుల కిందట నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్కు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పాల్ డగ్లస్ మాట్లాడుతూ.. ఏయూలో ప్రస్తుతం 57 దేశాలకు చెందిన 1,150 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు ఆచార్య ఎన్.ఎం.యుగంధర్, ఆచార్య విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విదేశీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. ప్రత్యేక వస్త్రధారణలతో, ఆకట్టుకునే ఆహార్యంతో తమ దేశ సంస్కృతీ సంప్రదాయాలను, నృత్య రీతులను పరిచయం చేస్తూ వారు నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ -
ఏయూలో ఒంటెద్దు పోకడలు
విశాఖ సిటీ: శతాబ్ది ఉత్సవాల వేళ ఆంధ్ర విశ్వవిద్యాలయం విమర్శల పాలవుతోంది. పాలకుల ఏకపక్ష నిర్ణయాలతో వివాదం రాజుకుంటోంది. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీ.. పాలక మండలిని విస్మరించి చేస్తున్న ఆలోచనలు అసంతృప్తికి కారణమవుతున్నాయి. పాలకుల వ్యక్తిగత అజెండాలకు వేదికగా ఏయూను మారుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వరుస వివాదాలు ఏయూను చుట్టుముడుతున్న సమయంలో నిబంధనలు, సంప్రదాయాలను పట్టించుకోకుండా తీసుకున్న నిర్ణయాలు వర్సిటీలో అగ్గి రాజేస్తున్నాయి. తాజాగా ఏయూ పూర్వ విద్యార్థి, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ డాక్టర్ పూర్ణచంద్రరావు సగ్గుర్తికి డాక్టరేట్ అందించడం పెద్ద చర్చకు దారితీసింది. ఆయనకు డాక్టరేట్ ఇవ్వడాన్ని ఎవరూ తప్పుబట్టకపోయినా.. ఇచ్చే విధానంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఇటువంటి నిర్ణయాలను పాలక మండలి సమావేశంలో చర్చించి, సభ్యుల దృష్టికి తీసుకువెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ప్రస్తుత పాలకులు ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి, తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై పలువురు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పాలక మండలిని పక్కనపెట్టి నిర్ణయాలు ఏయూలో గత కొంతకాలంగా పాలక మండలి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. యూనివర్సిటీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా మండలి సభ్యుల దృష్టికి వెళ్లాలి. అక్కడ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, వర్సిటీ పాలకులు మాత్రం అధికారం తమ చేతుల్లో ఉందన్న నెపంతో సభ్యులను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడంపై స్వయంగా మండలి సభ్యుల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వ్యవస్థాగతమైన పద్ధతులను కాదని, వ్యక్తిగత నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వర్సిటీలో ఉండాల్సిన ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బతింటోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వివాదాల సుడిగుండంలో విద్యా నిలయం ఇప్పటికే ఆంధ్ర విశ్వవిద్యాలయం వరుస వివాదాలతో సతమతమవుతోంది. విద్యార్థులకు సౌకర్యాల లేమి, పాలనలో రాజకీయ జోక్యం వంటి అంశాలపై వరుసగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో పాలకులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, వివాదాస్పద నిర్ణయాలతో అగ్నికి ఆజ్యం పోస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. శతాబ్ది ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమయంలో, ఇలాంటి ఆరోపణలు రావడం వర్సిటీ పూర్వ విద్యార్థులను, విద్యావేత్తలను కలచివేస్తోంది. ఇప్పటికై నా పాలకులు తమ ఒంటెద్దు పోకడలను మానుకోవాలని, నిర్ణయాల ప్రక్రియలో పారదర్శకతను పాటించాలని సూచిస్తున్నారు. పాలక మండలి సభ్యులను సమన్వయం చేసుకుంటూ, నిబంధనల ప్రకారం ముందుకు సాగాలని హితవు పలుకుతున్నారు. -
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలతో నిఘా
నగరంలో 120 కొత్త కెమెరాలు ప్రారంభం అల్లిపురం: నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిమితుల్లో నేరపూరిత ప్రాంతాలు, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి, అక్కడ జెమినీ ఎడిబుల్స్–ఫ్యాట్స్ వారి సహకారంతో 120 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గురువారం నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో దాతలతో కలిసి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరంలోని వన్టౌన్, టూటౌన్, త్రీటౌన్, ఫోర్త్ టౌన్, మహారాణిపేట, కంచరపాలెం, ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరం జరిగిన తర్వాత నేరస్తులు తప్పించుకునేందుకు అవకాశం ఉన్న సుమారు 250 ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. అందులో మొదటి దశగా 44 ప్రాంతాల్లో 120 సీసీ కెమెరాలను సీఎస్సార్ నిధులతో ఏర్పాటు చేసినట్లు వెల్లించారు. నూనె బ్రాండ్ ‘ఫ్రీడ మ్’ తయారీదారులైన జెమినీ ఎడిబుల్స్–ఫ్యాట్స్ వారు ఈ కెమెరాల ఏర్పాటుకు సహకరించారని వివరించారు. ఈ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. తాను 2024 జూన్ 1వ తేదీన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నగరవ్యాప్తంగా మొత్తం 13,485 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సహకరించిన జెమినీ ఎడిబుల్స్ ప్రతినిధులను సీపీ సత్కరించారు. -
దారిపై రక్తపు చారలు
ఎచ్చెర్ల: జాతీయ రహదారి మళ్లీ రక్తం పూసుకుంది. వరుస పెట్టి జరుగుతున్న ఘటనలతో రోడ్డు మళ్లీ మరణ సంకేతాలను పంపించింది. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు కన్నుమూశారు. దైవ దర్శనం కోసం వచ్చి తిరిగి వెళ్తుండగా ఇలా మృత్యు కౌగిలిలో చిక్కుకున్నారు. అరిణాం అక్కివలస గ్రామం సమీపంలో బైక్ లారీని ఢీకొన్న ఘటనలో విశాఖపట్నం చెంగల్రావుపేటకు చెందిన తల్లీ కొడుకులు నాగమణి(55), సీహెచ్ నరేంద్ర కుమార్(32) మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జాలరిపేటకు చెందిన తల్లీకొడుకులు అరసవల్లి సూర్యనారాయణ మూర్తి దర్శనం కోసం బైక్పై వచ్చారు. స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా అరిణాం అక్కివలస వద్ద ఆగి ఉన్న లారీని వీరి బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న నరేంద్రతో పాటు వెనుక కూర్చున్ని తల్లి కిందకు పడిపోగా.. ఇద్దరూ ఘటనా స్థలంలోనూ ప్రాణాలు వదిలేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను రిమ్స్కు తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొల్లాగొడుతున్నారు
చింతలూరు కొండలనునిరుద్యోగులకు టోపీ నుంచి మైనింగ్ మాఫియా వరకు అక్రమాల ఘనుడుగుంటూరు నుంచి వచ్చి చక్రం తిప్పుతున్న టీడీపీ నేత అక్రమంగా రాత్రి సమయాల్లో గ్రానైట్ బ్లాక్ల తరలింపు మైనింగ్ విజిలెన్స్లో అక్రమాలు బట్టబయలు కొమ్ము కాస్తున్న స్థానిక మైనింగ్ అధికారులు అక్రమ మైనింగ్ జరగలేదంటూ తప్పుడు నివేదికలుచింతలూరులో చంద్రబాబు ప్రభుత్వం రాకతో జిల్లాలో అక్రమాల గ(ఘ)నులు చెలరేగిపోతున్నారు. టీడీపీ నేతలు ఆడింది ఆటగా.. పాడింది పాటగా అధికారులు తాళం వేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. గతంలో ఐటీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను రూ.100 కోట్ల మేర మోసం చేసిన కేసులో అరెస్టయిన టీడీపీ నేత అజయ్ కొల్లా తాజాగా జిల్లాలో మైనింగ్ డాన్గా అవతారమెత్తాడు. గ్రానైట్ బ్లాక్ల అక్రమ రవాణాతో రూ.కోట్లు కొల్లగొడుతున్నాడు. స్థానిక మైనింగ్ అధికారులు కొమ్ము కాస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అర్ధరాత్రి సమయంలో అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చింతలూరు నుంచి అక్రమంగా గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చి మరీ వ్యవహారం నడుపుతున్న సదరు టీడీపీ నేత ఆడిందే ఆట... పాడిందే పాటగా వ్యవహారం నడిపిస్తున్నారు. గతంలో ఐటీ కంపెనీ పెట్టి, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.100 కోట్ల మేర వసూలు చేసి అరెస్టయిన చరిత్ర కలిగిన సదరు నేత చంద్రబాబు, లోకేష్లతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు డీపీగా పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నట్టు విమర్శలున్నాయి. ఇప్పటివరకు అక్రమంగా భారీ గ్రానైట్ బ్లాక్లను అడ్డంగా తరలిస్తూ రూ.10 కోట్ల మేర ఆర్జించినట్టు తెలుస్తోంది. అక్రమ మైనింగ్ జరుపుతున్నారని, పర్మిట్లు లేకుండానే గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్నారంటూ దీనిపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు తమ తనిఖీల ద్వారా తేల్చారు. అయితే స్థానిక మైనింగ్ అధికారులు మాత్రం అంతా సవ్యంగానే ఉందంటూ అధికార టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు నివేదికలు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కూటమిలోని బీజేపీ నేతలు కూడా ఈ వ్యవహారంలో ఫిర్యాదు చేస్తుండడం గమనార్హం. మైనింగ్ పర్మిట్లు లేకుండానే...! వాస్తవానికి ఏదైనా క్వారీ మైనింగ్ జరపాలంటే పర్మిట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత మేర మైనింగ్ చేస్తున్నది? ఎంత మొత్తం గ్రానైట్ను తరలిస్తున్నారనే విషయాన్ని పేర్కొంటూ రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అధికార తెలుగుదేశం పార్టీ నేత పేరుతో ఎటువంటి మైనింగ్ పర్మిట్లు లేకుండానే సుమారు రూ. 10 కోట్ల విలువైన గ్రానైట్ బ్లాక్లను తరలించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బ్లాస్టింగులు చేపడుతూ గ్రామ ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా ఈ క్వారీ ఉన్న ప్రాంతానికి డీఆర్డీవో కూడా కూతవేటు దూరంలోనే ఉంది. రక్షణరంగ సంస్థకు సమీపంలో చేపడుతున్న ఈ బ్లాస్టింగులతో ఇబ్బందులు తప్పవనే ఆందోళన కూడా నెలకొంది. అర్ధరాత్రి సమయాల్లో వాహనాల సామర్థ్యానికి మించి మరీ అధిక లోడుతో భారీ గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్నారు. అయినప్పటికీ అటు పోలీసు, ఇటు రెవెన్యూ, మైనింగ్, రవాణా శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. భారీ లోడ్లతో ఈ విధంగా మొత్తం రూ. 10 కోట్ల విలువైన గ్రానైట్ బ్లాక్లను అక్రమంగా తరలించినట్టు మైనింగ్ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మైనింగ్ విజిలెన్స్ అధికారుల తనిఖీలో -
నామినేషన్ల ప్రక్రియ పూర్తి
విశాఖ లీగల్ : న్యాయవాదుల సంఘం వార్షిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులకు నాలుగేసి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ పూర్తయిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 28వ తేదీన ప్రకటిస్తారు. ఏప్రిల్ 10వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి ఎ.ప్రభాకర్రెడ్డి తెలిపారు. అభ్యర్థులందరూ ఎన్నికల నియమాలు పాటిస్తూ ప్రచారం కొనసాగించాలని కోరారు. -
బీజేపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరికలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీలో పలువురు బీజేపీ నాయకులు బుధవారం చేరారు. పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ తన కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ కలిదిండి బద్రీనాథ్, వార్డు మాజీ అధ్యక్షుడు సోమాదుల సురేష్, యువజన విభాగం నాయకుడు సూరాడ అనుదీప్కు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బద్రీనాథ్ మాట్లాడుతూ.. తన సొంత పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో వైఎస్సార్ టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా, వైఎస్సార్ టీయూసీ ఉత్తరాంధ్ర జోనల్ ప్రెసిడెంట్గా పనిచేశానని.. పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ సారథ్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
మహారాణిపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సూచించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో కలిసి బుధవారం కలెక్టరేట్లో జరిగిన రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశంలో ఆయన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్.సిహెచ్. శ్రీనివాసరావు గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది ప్రమాదాలు తగ్గినట్టు నివేదికలు సమర్పించారు. స్పీడ్ బ్రేకర్లపై పునఃపరిశీలన జిల్లాలో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల అవసరం, ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలపై జీవీఎంసీ, ఆర్టీసీ, పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా పునఃపరిశీలన చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరం లేని చోట వాటిని తొలగించాలని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనల అమల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు. జాతీయ రహదారులపై పాదచారుల క్రాసింగ్ల వద్ద తప్పనిసరిగా సూచిక బోర్డులు, వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా బ్లింకర్స్ ఏర్పాటు చేయాలని ఎన్హెచ్ఏఐ అధికారులకు ఆదేశించారు. హనుమంతవాక జంక్షన్ విస్తరణ హనుమంతవాక జంక్షన్ విస్తరణ, అండర్పాస్ నిర్మాణంపై సమీక్షించిన కలెక్టర్ జూ పార్క్ వైపు నుంచి వచ్చే మార్గంలో, అలాగే కై లాసగిరి నుంచి హైవేకు వెళ్లే దిశలో ఫ్రీ లెఫ్ట్లను విస్తరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో సహాయం చేసే వారికి నగదు ప్రోత్సాహకాలు అందించాలన్నారు. నగరంలో మౌలిక వసతుల మెరుగుదల జీవీఎంసీ పరిధిలో రోడ్డు విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, డివైడర్లు, ఇనుప గ్రిల్స్ ఏర్పాటు పనులను గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎయిర్పోర్టు నుంచి గాజువాక వైపు సర్వీస్ రోడ్డు విస్తరణపై సంబంధిత శాఖలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రోడ్ల మధ్యలో ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. షాపింగ్ కాంప్లెక్సుల్లో సెల్లార్ పార్కింగ్ను ప్రోత్సహించాలని, రోడ్లపై అనియంత్రిత పార్కింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు, జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. విశాఖ వ్యాలీ, పోర్టు రోడ్లలో నైట్ పెట్రోలింగ్ పెంచాలని, భవన వ్యర్థాల పారవేయడాన్ని నియంత్రించాలని చెప్పారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు అవసరమైతే కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. బైక్ రేసింగ్ల నియంత్రణపై సీపీ సూచనలు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్పీడ్ లేజర్ గన్లు అవసరమని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. రాత్రి వేళల్లో బైక్ రేసింగ్లను అరికట్టడంలో అవి కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల లైసెన్సుల రద్దుకు రవాణా శాఖ మరింత సహకారం అందించాలని కోరారు. సమావేశంలో డీసీపీ మణికంఠ చందోలు, ఆర్టీవో సూర్యప్రకాశ్, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, ఎంవీఐలు బుచ్చిరాజు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ -
ఉక్కు విశ్రాంత ఉద్యోగుల నిరసన గళం
ఉక్కునగరం: మెడికల్ ఇన్సూరెన్స్ పాత పద్ధతిలో అమలు చేయాలంటూ స్టీల్ప్లాంట్ రిటైర్డ్ ఉద్యోగులు బుధవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ ఏడాది మార్చి మొదటి వారంలో మెడికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్ కోసం జారీ చేసే సర్క్యులర్ను, నెలాఖరు అవుతున్నా జారీ చేయకపోవడంతో యాజమాన్య వర్గాలను సంప్రదించారు. అయితే, యాజమాన్యం ప్రీమియం చెల్లింపులో రిటైర్డ్ ఉద్యోగులపై భారం పెంచుతున్నట్టు తెలియడంతో యాజమాన్యం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ వద్ద ధర్నా చేశారు. ధర్నాలో రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాజమాన్యం వైఖరిని నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్లాంట్ కోసం శ్రమించి, వ్యాధుల బారిన పడ్డ ఉద్యోగుల ఇన్సూరెన్స్పై యాజమాన్యం వైఖరి సమంజనంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉక్కు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి.డి.ప్రసాద్, అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు మాటూరి శ్రీనివాసరావు, డి.ఆదినారాయణ, కె.ఎస్.ఎన్.రావు, మంత్రి రాజశేఖర్, పి.వి.రమణమూర్తి, జె.అయోధ్యరామ్, యు.రామస్వామి, ఎన్.రామారావు, నీరుకొండ రామచంద్రరావు, బొడ్డు పైడిరాజు, బూసి వెంకటరావు, కర్రి దాలినాయుడు, రామ్మోహన్కుమార్, దొమ్మేటి అప్పారావు, ఎన్.బాలభాస్కరరావు, డేవిడ్, మహాలక్ష్మినాయుడు, సన్యాసిరావు, పరంధామయ్య, కాండ్రేగుల శ్రీనివాసనాయుడు తదితరులు పాల్గొన్నారు. వినతిపత్రం అందజేసేందుకు అంగీకరించకపోవడంతో వినతిపత్రాన్ని గేటు బయట ఉన్న బారికేడ్లకు అతికించి తమ నిరసన తెలియజేశారు. మెడికల్ ఇన్సూరెన్స్ కోసం పోరాటంయాజమాన్యం కొత్త ప్రతిపాదనలు అనంతరం యాజమాన్యంతో జరిపిన చర్చల్లో యాజమాన్యం కొత్త ప్రతిపాదనలు చేసింది. ఇప్పటికే రిటైర్మెంట్ సభ్యులు 20,924 మందికి చేరుకున్నందున ప్రీమియం చెల్లింపు కంపెనీకి భారంగా ఉందన్నారు. కొత్త ప్రతిపాదన మేరకు 90 ఏళ్లు పైబడిన వారికి పాత పద్ధతిలో ప్రీమియం చెల్లిస్తామని, 80–90 ఏళ్లు మధ్య వారికి యాజమాన్యం 80 శాతం, సభ్యులు మిగిలిన 20 శాతం చెల్లించాలని, 70–80 ఏళ్లు మధ్య వారికి 70–30 శాతం, 60–70 మధ్య వారికి 60–40 శాతం చెల్లించాలని ప్రతిపాదించింది. దీనిని నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. పాత పద్ధతి కొనసాగించాలని, లేనిపక్షంలో జరగనున్న పరిణామాలకు యాజమాన్యం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. -
ఖజానా ఖాళీ
మహారాణిపేట: ఆర్థిక సంవత్సరం ముగింపు (మార్చి) అనగానే ట్రెజరీ(ఖజానా) కార్యాలయాలు బిల్లుల క్లియరెన్స్తో కిటకిటలాడుతుంటాయి. కానీ, ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, నిధుల కొరత కారణంగా ఖజానా కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఆదాయం గణనీయంగా తగ్గి, వ్యయాలు పెరిగిపోవడంతో.. కేవలం ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పింఛన్లు మినహా మిగతా అన్ని రకాల చెల్లింపులను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. సంపద సృష్టికర్త చంద్రబాబు హయాంలో ఇలా జరగడం గమనార్హం. ఆదాయం తగ్గి.. వ్యయాలు భారీగా పెరిగిపోతుండడమే ఇందుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు. అర్ధరాత్రుల వరకు పనిచేసే చోట.. స్తబ్ధత సాధారణంగా మార్చి చివరి వారంలో బడ్జెట్ నిధులు మురిగిపోకుండా చూసుకునేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు పెద్ద ఎత్తున బిల్లులు సమర్పిస్తుంటాయి. వీటిని పరిశీలించి సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయడానికి ట్రెజరీ సిబ్బంది అర్ధరాత్రి వరకు పనిచేసేవారు. కానీ ప్రస్తుతం అప్లోడ్ చేయడానికి ఫైళ్లు, క్లియర్ చేయడానికి నిధులు లేకపోవడంతో సిబ్బంది సైతం ఖాళీగా కూర్చునే పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టర్లు, ఇతర శాఖల అధికారుల రాక లేకపోవడంతో ట్రెజరీ ఆఫీసు పూర్తిగా బోసిపోయింది. నిలిచిపోయిన చెల్లింపులు ఇవే.. గత ఫిబ్రవరి నుంచే అన్ని రకాల బిల్లులను నిలిపివేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగే పనులకు సంబంధించిన బిల్లులు మినహా, రాష్ట్ర సర్కార్ పరిధిలోని చెల్లింపులన్నీ ఫ్రీజ్ అయ్యాయి. జిల్లాలోని 32 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కరెంటు, టెలిఫోన్, స్టేషనరీ తదితర రోజువారీ కార్యాలయ నిర్వహణ ఖర్చుల చెల్లింపులు బంద్ అయ్యాయి. దీంతో ఆయా శాఖలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇక జీతాలు అందుతున్నప్పటికీ.. ఉద్యోగులకు చెల్లించాల్సిన రవాణా, కరువు భత్యాలు, ఏళ్ల తరబడి దాచుకున్న జీపీఎఫ్ అడ్వాన్సులు, పదవీ విరమణ పొందిన వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సైతం పెండింగ్లోనే పడ్డాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల్లో పాల్గొన్న కాంట్రాక్టర్ల బిల్లులు మురిగిపోతున్నాయి. మళ్లీ బిల్లు పెడితే చర్యలే! నిధుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఒకసారి రిజెక్ట్ అయిన బిల్లులను అధికారులు పదేపదే ట్రెజరీకి పంపితే, సంబంధిత డ్రా యింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ల్ల(డీడీవో)పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో ఏ శాఖాధికారి కూడా బిల్లులు సమర్పించే సాహసం చేయడం లేదు. -
పర్యాటకుడి దారుణహత్య
● అరకులోయలో గొంతు కోసిన దుండగులు ● పాత పరిచయాలు, రిసార్ట్ సిబ్బందితో గొడవలే కారణమా? అరకులోయ టౌన్/ తెర్లాం (విజయనగరం): ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ మండలం, చినలబుడు పంచాయతీ పరిధిలోని హట్టగుడ సమీపంలోని ‘రూప రిసార్ట్స్’ ప్రధాన రహదారిపై పర్యాటకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఏం జరిగింది?విజయనగరం జిల్లా తెర్లాం మండలం, జన్నివలస గ్రామానికి చెందిన నాగళ్ల సురేష్ (25) రెండేళ్ల కిందట అరకులోని పద్మాపురం వద్ద ఉన్న ఉషోదయ రిసార్ట్స్లో పనిచేసేవాడు. ప్రస్తుతం అతను హైదరాబాద్లోని లలితా జ్యుయలరీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత వారం తన స్వగ్రామంలో జరిగిన ఆలయ ప్రారంభోత్సవానికి హాజరైన సురేష్ విజయనగరం వెళ్లివస్తానని ఇంటి వద్ద చెప్పి అరకులోయ వచ్చాడు. ఉషోదయ రిసార్ట్స్లో పనిచేస్తున్న ఓ యువతితో కలిసి అతను రూప రిసార్ట్స్లో గది అద్దెకు తీసుకున్నాడు. ఈ క్రమంలో లాడ్జిలో పనిచేస్తున్న కొంతమంది యువకులతో సురేష్కు వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. గొడవ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసిన సురేష్ను, రిసార్ట్స్ సమీపంలోని రహదారి వద్ద దుండగులు కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పాడేరు డీఎస్పీ అభిషేక్ వివరాలను సేకరించి విచారణ చేపట్టారు. ఈ కేసులో రిసార్ట్స్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. అరకులోయ ఎస్ఐ గోపాలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం వెళ్లి వస్తానని చెప్పి... విజయనగరం వెళ్లి వస్తానని చెప్పి మంగళవారం ఉదయం ఇంటి నుంచి మోటార్ సైకిల్పై బయలుదేరి వెళ్లిన వ్యక్తి అదే రోజు రాత్రి సమయంలో అరకులోయలో హత్యకు గురైయ్యాడన్న సమాచారం బుధవారం ఉదయం తెలుసుకున్న అతని భార్య, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. జన్నివలసకు చెందిన నాగళ్ల అప్పలనాయుడు, సూరమ్మలకు ముగ్గురు వివాహితులైన కుమారులు, ఒక అవివాహిత కుమార్తె ఉన్నారు. వారిలో సురేష్ మూడవ కుమారుడు. రెండేళ్ల కిందట సురేష్ అరకులోయ మండలం పద్మాపురంలోని ఉషోదయ రిసార్ట్స్లో పనిచేసేవాడు. హైదరాబాద్లోని లలిత జ్యూయలరీలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్ వెళ్లిపోయాడు. సురేష్కు ఏడాది కిందట అదే గ్రామానికి చెందిన తులసితో వివా హం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆలయ ప్రారంభానికి వచ్చి హత్యకు గురికావడంతో కన్నీరుపెడుతున్నారు. సురేష్ మృతితో జన్నివలస గ్రామంలోని యాదవ వీధిలో విషాదం అలముకుంది. -
డీసీఐ ఎండీగా కెప్టెన్ దివాకర్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, విశాఖపట్నం : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐఎల్) ఎండీ, సీఈవోగా కెప్టెన్ దివాకర్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్ల బోర్డు, రెమ్యునరేషన్ కమిటీ ఇటీవల సమావేశమై.. ఈ బాధ్యతలను దివాకర్కు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. డీసీఐ కార్పొరేట్ కార్యాలయంలో ఆయన బాధ్యతల్ని బుధవారం స్వీకరించారు. 1987లో డీసీఐలో డ్రెడ్జింగ్ కేడర్లో ఏఐడీసీ–వీ బ్యాచ్ కేడెట్గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ మాస్టర్ ఆఫ్ డ్రెడ్జర్గా నిలిచారు. ఏడేళ్ల పాటు మాస్టర్గా విధులు నిర్వర్తించారు. అత్యాధునిక డ్రెడ్జర్లకు నాయకత్వం వహిస్తూ అనేక డ్రెడ్జింగ్ ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తి చేశారు. డీసీఐలో ఉన్న ఒడిదొడుకుల్ని సరిచేస్తూ.. సంస్థను అగ్రపథాన నడిపించడమే ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. డీసీఐ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. -
పెన్షన్ మా హక్కు.. భిక్ష కాదు
మహారాణిపేట: పెన్షనర్ల హక్కులకు విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మార్చి 25న అమలులోకి తెచ్చిన పెన్షన్ వాలిడేషన్ చట్టం–2025ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ చట్టానికి వ్యతిరేకత తెలుపుతూ బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట పెన్షనర్లు బ్లాక్ డే పాటించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. పెన్షనర్ల ప్రయోజనాలను కాలరాసే ఈ చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.కూర్మారావు మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం ప్రభుత్వ సేవలో వెచ్చించిన ఉద్యోగికి పెన్షన్ పొందడం అనేది ఒక గౌరవప్రదమైన హక్కు అని, అది ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని అన్నారు. గతంలో డి.ఎస్.నకారా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్ఫూర్తిని ఈ చట్టం దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి రాసిన వినతిపత్రాన్ని ఇన్చార్జి డీఆర్వో శేష శైలజకు అందజేశారు. జిల్లా సంఘం అధ్యక్షుడు బి.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ఆర్.కృష్ణ కుమార్, కోఆర్డినేటర్లు ఎన్.రవికుమార్, ప్రమీల, మోహన కుమారి, ఉమా మోహన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట పీఆర్ విశ్రాంత ఉద్యోగుల నిరసన -
28 నుంచి అప్పన్న వార్షిక కల్యాణోత్సవాలు
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు ఈనెల 28 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి: ఉత్సవాల కార్యక్రమాలు ● ఈనెల 28న సాయంత్రం 6 గంటల నుంచి విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, ఉత్సవాంగీకారం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. ● 29న మధ్యాహ్నం 3 గంటలకు కొట్నాల ఉత్సవం, సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు ధ్వజారోహణం, 6:30 నుంచి 7:30 వరకు ఎదురుసన్నాహోత్సవం, రాత్రి 8.30 నుంచి 9.30 వరకు రథోత్సవం, రాత్రి 10.30 నుంచి వార్షిక కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకు మూలవిరాట్ దర్శనం ఉండదు. రాత్రి 8.30 నుంచి 10.30 వరకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. ● 30న సాయంత్రం 5 గంటలకు శేషవాహనంపై స్వామివారి తిరువీధి. ● 31న మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 వరకు పండిత సభ, సాయంత్రం 6 గంటలకు సర్వజన మనోరంజని వాహనంపై తిరువీధి. ● ఏప్రిల్ 1న సాయంత్రం 5 గంటలకు సూర్యప్రభ వాహనంపై తిరువీధి. ● ఏప్రిల్ 2న ఉదయం 6 గంటలకు పూర్ణాహుతి, 7 గంటలకు కొట్నాల ఉత్సవం, చూర్ణోత్సవం, వసంతోత్సవం, గంగధార వద్ద చక్రస్నానం. ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు. రాత్రి దొంగలదోపు ఉత్సవం. ● ఏప్రిల్ 3న ఉదయం 8 నుంచి 10.30 వరకు వినోదోత్సవం, 10.30 నుంచి 11.30 వరకు తిరువీధి ఉత్సవం, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం. దర్శనాల సమయాల్లో మార్పులు ● ఈనెల 28న సాయంత్రం 6 గంటల తర్వాత దర్శనం లేదు. ● 29 నుంచి ఏప్రిల్ 2 వరకు (మార్చి 29 మినహా) రాత్రి 7 గంటల తర్వాత దర్శనం ఉండదు. ● ఏప్రిల్ 3న సాయంత్రం 6 గంటల తర్వాత దర్శనం లేదు. సేవలు రద్దు: ఈనెల 28 నుంచి ఏప్రిల్ 4 వరకు సుప్రభాత సేవ, ఆరాధన సేవ టికెట్లు, 28 నుంచి ఏప్రిల్ 13 వరకు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఈనెల 29న కల్యాణోత్సవ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 4 వరకు రాజగోపురం సమీపంలోని కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు. కొండ దిగువ పుష్కరిణి సత్రం వద్ద ఈనెల 30 నుంచి ఏప్రిల్ 3 వరకు పౌరాణిక నాటకాలు, తోలుబొమ్మలాట ప్రదర్శనలు నిర్వహించనున్నారు. -
స్క్రాప్తో శిల్పాలు చెక్కండి
డాబాగార్డెన్స్: స్వచ్ఛ సర్వేక్షణ్ 2025–26లో భాగంగా జీవీఎంసీ ‘వేస్ట్ టు వండర్’పేరిట పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. బుధవారం తన చాంబర్లో అదనపు కమిషనర్ పి.నల్లనయ్య, కార్యదర్శి బి.వి.రమణలతో కలిసి ఆయన పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు. వెల్డింగ్ షాపులు, ఫ్యాబ్రిక్కేషన్ యూనిట్ల ప్రతినిధులు, మెటల్ ఆర్టిస్ట్లు, సృజనాత్మక కళాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. కళాఖండ తయారీలో 80 శాతం ఇనుప స్క్రాప్ లేదా ఆటో వేస్ట్ను ఉపయోగించాలి. శిల్పం 4 నుంచి 8 అడుగుల ఎత్తు ఉండాలి. ప్రతి జోన్లో ప్రథమ బహుమతి రూ.లక్ష, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.25 వేలు అందజేస్తారు. వీటితో పాటు 10 మందికి రూ.5 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి. మొత్తం అన్ని జోన్లలో కలిపి రూ.22.50 లక్షల నగదు బహుమతులు గెలుచుకోవచ్చు. ఆసక్తి గల వారు https:// pgi. billdesk. com/ pgidsk/ pgmerc/ gvmc/ GVMCDetails. jsp ద్వారా లేదా పోస్టర్లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేరు నమోదు చేసుకోవచ్చు. ఏప్రిల్ 10వ తేదీలోగా కళాఖండాలను అందజేయాలి. మరిన్ని వివరాలకు వార్డు పారిశుధ్య, పర్యావరణ కార్యదర్శులను సంప్రదించవచ్చు. విజేతల కళాఖండాలను నగరంలోని ప్రధాన కూడళ్లలో వారి పేర్లతోనే ప్రతిష్టిస్తామని కమిషనర్ ప్రకటించారు. -
సీనియర్ సివిల్ జడ్జికి స్వర్ణ పతకం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన 91, 92వ సంయుక్త స్నాతకోత్సవంలో డాక్టర్ సోనీ ద్వారంపూడి ‘పెరి నారాయణ మూర్తి మెమోరియల్ గోల్డ్ మెడల్’అందుకున్నారు. గవర్నర్ డాక్టర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆమె ఈ పతకాన్ని స్వీకరించారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ లా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.సీతా మాణిక్యం పర్యవేక్షణలో.. ‘ప్రాథమిక విద్యలో బోధనా మాధ్యమం– ఒక సామాజిక–చట్టపరమైన అధ్యయనం’అనే అంశంపై ఆమె పరిశోధన చేసి, పీహెచ్డీ పట్టాను పొందారు. డాక్టర్ సోనీ ద్వారంపూడి ప్రస్తుతం నగరంలో సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా న్యాయశాస్త్ర అధ్యాపక బృందం, తోటి విద్యార్థులు ఆమెను అభినందించారు. -
62 కేసుల్లో 54 మంది నిందితుల అరెస్ట్
విశాఖ సిటీ: నగరంలో నేరాల నియంత్రణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రతబాగ్చి పేర్కొన్నారు. బుధవారం పోలీస్ సమావేశ మందిరంలో రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఫిబ్రవరి నెలలో నగరంలో 62 చోరీ కేసులు నమోదవగా అన్నింటినీ ఛేదించినట్లు తెలిపారు. ఇందులో 54 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుంచి రూ.7,57,500 నగదు, 1.79 కేజీల బంగారం, 6.14 కేజీల వెండి, 9 బైక్లు, 3 ఆటోలు, ఒక వ్యాన్, 303 మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తంగా రూ.1,12,01,598 విలువైన సొత్తును రికవరీ చేశామన్నారు. నేర నియంత్రణలో భాగంగా జూలైలో నగరంలో 239 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేరాలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో రాత్రి, పగలు ప్రత్యేకంగా పెట్రోలింగ్ను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం బాధితులు పొగొట్టుకున్న సొత్తును సీపీ తన చేతుల మీదుగా వారికి అందజేశారు. సమావేశంలో డీసీపీ(కై మ్) లతామాధురి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వంట గ్యాస్ పక్కదారి పడితే ఊరుకోం..
మహారాణిపేట: గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై సివిల్ సప్లయిస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 21 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 6ఎ కేసులు నమోదు చేశారు. జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి ఆదేశాల మేరకు డీఎస్వో వి.భాస్కరరావు ఆధ్వర్యంలో బర్మా క్యాంప్, కప్పరాడ, కంచరపాలెం ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలుచోట్ల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఈ దాడుల్లో వ్యాపారుల నుంచి 21 సిలిండర్లు స్వాధీనం చేసుకుని, సంబంధితులపై కేసులు నమోదు చేసినట్టు డీఎస్వో భాస్కరరావు తెలిపారు. గృహ అవసరాలకు కేటాయించిన గ్యాస్ను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని ఆయన హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నగరంలోని హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలపై తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. ఈ దాడుల్లో ఎఎస్వో శ్రీహరి, చెకింగ్ ఇన్స్పెక్టర్లు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు. హెల్ప్లైన్ నంబర్లు వంట గ్యాస్ దుర్వినియోగంపై ఫిర్యాదుల కోసం ప్రజలు ఈ కింది హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించవచ్చు. హెచ్పీసీఎల్(హెచ్పీ) 18002333555 బీపీసీఎల్ (భారత్) 1800224344 ఐవోసీఎల్(ఇండియన్) 18002333555 కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 0891–2590102 -
సాగరతీరంలో సినీతారలు
కొమ్మాది: భీమిలి సాగరతీరంలో బుధవారం సినీ తారలు సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం నగరంలో జరుగుతోంది. ఇందులో భాగంగా భీమిలి బీచ్లోని ఒక రిసార్ట్తో పాటు మంగమారిపేట, తొట్లకొండ సమీపంలోని తీర ప్రాంతాల్లో ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్, నటుడు అజయ్ ఘోష్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్ కోసం కాజల్ వచ్చారనే విషయం తెలుసుకున్న స్థానికులు, అభిమానులు, పర్యాటకులు ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అజయ్ ఘోష్ -
అప్పన్న దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజుపై సస్పెన్షన్ ఎత్తివేత
శ్రీకాళహస్తి దేవస్థానం ఈఈగా శ్రీనివాసరాజు నియామకం సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి.జి.శ్రీనివాసరాజుపై ఉన్న సస్పెన్షన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఎం.హరిజవహర్లాల్ బుధవారం జీవో నెంబరు 459 జారీ చేశారు. గత ఏడాది ఏప్రిల్ 30న చందనోత్సవం రోజు నాసిరకంగా నిర్మించిన గోడ కూలిపోవడంతో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. దానికి బాధ్యులుగా చేస్తూ దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజుతో పాటు దేవస్థానానికి చెందిన ఇన్చార్జి డిప్యూటీ ఈఈ, ఏఈ, ప్రసాద్ పథకం పనులు చేస్తున్న టూరిజంశాఖ ఈఈ, డీఈ, ఏఈలను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పటినుంచి సుమారు ఏడాదిపాటు నుంచి విచారణ నడుస్తోంది. సస్పెన్షన్ జరిగి ఏడాది సమీపిస్తుండటంతో శ్రీనివాసరాజు హైకోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు శ్రీనివాసరాజుపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. అంతేకాకుడా శ్రీకాళహస్తి దేవస్థానం ఈఈగా శ్రీనివాసరాజును నియమించింది. -
స్నాతకోత్సవం.. ప్రతిభకు పట్టం
వైభవంగా ఏయూ 91, 92వ కాన్వొకేషన్లు విద్య అనేది కొత్త ప్రయాణానికి ఆరంభం: గవర్నర్ అబ్దుల్ నజీర్స్నాతకోత్సవంలో పట్టాలు స్వీకరించి ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు మద్దిలపాలెం: కళ్లలో భవిష్యత్తుపై కోటి ఆశలు.. చేతుల్లో ఎంతో శ్రమించి సాధించిన విద్యా పట్టాలు.. వెరసి ఆ విద్యార్థుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. నిరంతర శ్రమకు దక్కిన పతకాలు, పీహెచ్డీ డిగ్రీలను సగర్వంగా చేతబూని.. తమ విజయానికి బాటలు వేసిన కుటుంబ సభ్యులతో కలిసి కెమెరాలకు చిరునవ్వులు చిందిస్తూ వారు మురిసిపోయారు. శతాబ్ది ఉత్సవాలతో వందేళ్ల వైభవాన్ని చాటుకుంటున్న ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బుధవారం ఎటు చూసినా ఈ పండగ వాతావరణమే కనిపించింది. బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా.. విద్యార్థుల ఉత్సాహం, కోలాహలం నడుమ 91, 92వ సంయుక్త స్నాతకోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, ఏయూ చాన్సలర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. వందేళ్ల వైభవానికి, నిరుపమాన ప్రగతికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రత్యేక నిదర్శనమని ఆయన కొనియాడారు. శతాబ్దకాలంగా ఏయూ విద్యా, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో సాధించిన ప్రగతి దేశానికే గర్వకారణమన్నారు. సర్ సి.ఆర్.రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సి.వి.రామన్, సి.ఆర్.రావు వంటి మహనీయుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. డిగ్రీ సాధన అనేది విద్యా జీవితానికి ముగింపు కాదని, అదొక కొత్త ప్రయాణానికి ఆరంభమని విద్యార్థులకు సూచించారు. క్యాంపస్లో రాజకీయాలకు దూరంగా ఉండి, విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. సగ్గుర్తి, పతంజలి శాస్త్రిలకు డాక్టరేట్లు ప్రదానం వేడుకల్లో భాగంగా ఏయూ పూర్వ విద్యార్థి, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ డాక్టర్ పూర్ణచంద్రరావు సగ్గుర్తికి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తల్లావజ్జల పతంజలి శాస్త్రికి గవర్నర్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. జియో, సివిల్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ప్రొఫెసర్ పి.జగదీశ్వరరావు, ప్రొఫెసర్ సి.ఎన్.వి.సత్యనారాయణ రెడ్డిలకు బెస్ట్ రీసెర్చ్ అవార్డులు అందజేశారు. వివిధ విభాగాల నుంచి మొత్తం 17 మంది రీసెర్చ్ మెడల్స్ అందుకోగా.. 13 మంది రీసెర్చ్ ప్రైజ్లు, ఏడుగురు ఎం.ఫిల్ డిగ్రీలు, 441 మంది పీహెచ్డీ పట్టాలు తీసుకున్నారు. అలాగే 174 మందికి యూజీ పీజీ మెడల్స్, 437 మందికి యూజీ పీజీ ప్రైజులు ప్రదానం చేశారు. విశాఖతో.. ఏయూతో ఆత్మీయ అనుబంధం గౌరవ డాక్టరేట్ స్వీకరించిన అనంతరం బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ డాక్టర్ పూర్ణ చంద్రరావు సగ్గుర్తి ప్రసంగించారు. తన స్వస్థలమైన విశాఖపట్నంలో ఈ గౌరవం అందుకోవడం గర్వంగా ఉందన్నారు. తన కుటుంబంలో ఎనిమిది మంది ఏయూ నుంచే పట్టభద్రులయ్యారని గుర్తుచేసుకున్నారు. తన మావయ్య ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు 1984–87 మధ్య విశ్వవిద్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వేగంగా ఎదుగుతోందని, రాబోయే రోజుల్లో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల్లో భారత్ 7.5 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామి సంస్థగా నిలుస్తోందని, ఆస్తుల పరంగా అమెరికాలో రెండో స్థానంలో ఉండటంతో పాటు మార్కెట్ విలువ పరంగా కూడా ప్రముఖ స్థానాన్ని సంపాదించిందన్నారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనలో ముందంజ ఆంధ్ర విశ్వవిద్యాలయం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీ) సాధనలో గర్వించదగ్గ స్థాయికి చేరుకోవాలని ఏయూ ఉపకులపతి జి.పి.రాజశేఖర్ ఆకాంక్షించారు. రెండో శతాబ్దంలోకి అడుగుపెడుతున్న ఏయూ.. విజ్ఞానం, ఆవిష్కరణలతో పాటు సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వం, చాన్సలర్, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, ఏయూ పూర్వ వీసీలు, ఇతర యూనివర్సిటీల వీసీలు, ఏయూ రెక్టార్, రిజిస్ట్రార్, ఆచార్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి ఎక్కడ? ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరించింది. మొత్తం బాధ్యత అంతా విశ్వవిద్యాలయం పైనే వదిలేసి చేతులు దులిపేసుకుంది. దీంతో విశ్వవిద్యాలయం అధికారులు ఎవరికి నచ్చిన రీతిలో వారు జోక్యం చేసుకోవడంతో కార్యక్రమం అంతా అస్తవ్యస్తంగా తయారైంది. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు పేలవంగా సాగింది. పైగా.. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న స్నాతకోత్సవానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డుమ్మా కొట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బీచ్రోడ్డుతో పాటు కన్వెన్షన్ హాల్ చుట్టూ లోకేష్ ఫ్లెక్సీలతో నింపేశారు. కానీ మంత్రి మాత్రం కనిపించలేదు. కేవలం లోకేష్ మాత్రమే కాదు.. నగరంలోని ప్రముఖులు, విద్యావేత్తలు, టీడీపీ ఎమ్మెల్యేలెవ్వరూ ఈ కార్యక్రమానికి రాలేదు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ ప్రసంగంలో దొర్లిన తప్పు.! ఏర్పాట్ల విషయంలోనే కాదు, ఏకంగా చాన్సలర్ హోదాలో ఉన్న గవర్నర్ ప్రసంగ ప్రతిని సిద్ధం చేయడంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గవర్నర్ డాక్టర్ ఎస్.అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో ప్రస్తుత రెక్టార్ పేరుకు బదులు, మాజీ రెక్టార్ పేరును చదవడంతో అంతా విస్మయానికి గురయ్యారు. వేదికపైనే ప్రస్తుత రెక్టార్ ప్రొఫెసర్ కింగ్ ఉన్నప్పటికీ, గవర్నర్ తన ప్రసంగంలో గతంలో పనిచేసిన కిషోర్ బాబు పేరును ప్రస్తావించడం అధికారుల అలసత్వానికి నిదర్శనంగా నిలిచింది. ఒక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయ వేడుకలో ఇటువంటి తప్పిదాలు దొర్లడంపై మేధావి వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. -
ఎలా పనిచేస్తుందంటే?
ఇందులో ఫిజికల్, బయోలాజికల్, కెమికల్ రియాక్టివ్ ఇంటర్ఫేస్లతో కూడిన 25 నుంచి 100 వరకు సక్కర్స్(పీల్చే గొట్టాలు) ఉంటాయి. ఇవి గాలిలోని ధూళి కణాలను, హానికర రసాయన వాయువులను సమర్థవంతంగా పీల్చుకుని గాలిలోంచి తొలగిస్తాయి. గాలి స్వచ్ఛీకరణను క్షణాల వ్యవధిలోనే పూర్తి చేసి బయటకు విడుదల చేస్తుంటాయి. ఇందులో ఉండే మోడ్స్ ప్రకారం ఎంత విస్తీర్ణం మేర గాలి నాణ్యతను పెంచాలనేది సెట్ చేసుకోవచ్చు. ఈ యంత్రం ద్వారా ప్రస్తుతం దాదాపు 200 చదరపు మీటర్ల వరకూ గాలిని స్వచ్ఛీకరించవచ్చు. -
ఓపెన్ హార్ట్ సర్జరీలకు ఆధునిక పరికరాలు
మహారాణిపేట: కేజీహెచ్ గుండె శస్త్రచికిత్స విభాగంలోని కొత్త పరికరాలు చేరాయి. కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో అత్యాధునిక హార్ట్ లంగ్ మెషీన్, హీమోథెర్మ్(టెంపరేచర్ కంట్రోల్ యూనిట్) పరికరాలను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. సుమారు రూ.2కోట్ల విలువైన ఈ పరికరాలను ఐసీఐసీఐ ఫౌండేషన్ తమ సీఎస్సార్ నిధులతో కేజీహెచ్కు విరాళంగా అందించింది. ఈ నూతన పరికరాలతో కేజీహెచ్లో క్లిష్టమైన ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్సలను మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం కలుగుతుందని జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వి.ఎస్.ఎం.సంధ్యాదేవి, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మణీత, తదితరులు పాల్గొన్నారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ నుంచి శివ కుమార్ చిట్టిపోలు, శ్రీవర్ధన్ బొబేపల్లి, పక్కి వెంకట సాయి శంకర్, ఎం. రాజనీకాంత్ రెడ్డి, సురేంద్ర పురోహిత్ తదితరులు హాజరయ్యారు. సమకూర్చిన ఐసీఐసీఐ ఫౌండేషన్ -
● కేఎఫ్‘సీ’ బకెట్
ఆర్కే బీచ్లో సరికొత్త అందం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. బీచ్రోడ్లో నగరంలోని 14వ కేఎఫ్సీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేఎఫ్సీ బకెట్ సైకత శిల్పం సందర్శకులను కట్టిపడేస్తోంది. ప్రముఖ సైకత శిల్పి అకునూరు బాలాజీ వరప్రసాద్ దాదాపు 48 గంటలపాటు శ్రమించి, 7 టన్నులకు పైగా సముద్రపు ఇసుకతో ఈ కళాఖండాన్ని ఆవిష్కరించారు. ఇసుకలోంచి ఉద్భవించినట్లుగా ఉన్న ఈ బకెట్ వద్ద పర్యాటకులు ఉత్సాహంగా ఫొటోలు, రీల్స్ తీసుకుంటూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కేవలం సైకత శిల్పమే కాకుండా.. విశాఖ నేపథ్యానికి తగ్గట్లుగా కొత్త రెస్టారెంట్ను నౌక శైలిలో తీర్చిదిద్దడం మరో ఆకర్షణ. ఆకట్టుకునే వెదురు ముఖద్వారంతో, ఒకేసారి 70 మంది కూర్చుని సముద్రపు అందాలను వీక్షిస్తూ భోజనం చేసేలా ఈ సరికొత్త కేఎఫ్సీ పర్యాటకులకు విందుతో పాటు కనువిందును కూడా పంచుతోంది. – ఏయూ క్యాంపస్ -
దివ్యాంగ క్రీడాకారులకు ఏసీఏ దన్ను
సబ్బవరం: సౌత్ జోన్ డెఫ్ క్రికెట్ చాంపియన్షిప్–2026 గుల్లేపల్లిలోని అవెన్యూ స్పోర్ట్స్ అరేనా క్రికెట్ మైదానంలో మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. దక్షిణ జోన్ రాష్ట్రాల నుంచి నాలుగు జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) సహకారంతో డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పోటీలను నిర్వహిస్తోంది. డ్రీమ్ షెల్టర్ చైర్మన్ రవిశంకర్, ఆర్ఆర్ రిసార్ట్స్ చైర్మన్ రతన్ రాజ్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ సురవరపు రామన్ సుబ్బారావు, సెక్రటరీ యడ్లపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఏసీఏ ఇలాంటి టోర్నీలకు ఎల్లప్పుడూ తమ మద్దతు ఇస్తోందని తెలిపారు. మాజీ భారత దివ్యాంగ క్రికెట్ క్రీడాకారుడు ఉత్పల్, అడ్వైజర్ రమణ తదితరులు పాల్గొన్నారు. ఉత్కంఠ పోరులో తెలంగాణదే విజయం తొలి మ్యాచ్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన తెలంగాణ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ జట్టు 19.5 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం 125 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన తెలంగాణ జట్టు 19.4 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్లో తెలంగాణ బ్యాటర్ టి.హరికృష్ణ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. అట్టహాసంగా ప్రారంభమైన సౌత్ జోన్ టోర్నీ -
తిరుమలనగర్కు వరల్డ్ వాటర్ డైజస్ట్ అవార్డు
కూర్మన్నపాలెం: జీవీఎంసీ 87వ వార్డులోని తిరుమలనగర్కు ప్రతిష్టాత్మక ‘వరల్డ్ వాటర్ డైజస్ట్’అవార్డు లభించింది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ చేతుల మీదుగా కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. జల సంరక్షణకు విశేష కృషి చేస్తున్న కాలనీల్లో ఒకటిగా తిరుమలనగర్ను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. కాలనీలో ఇంకుడు గుంతల ఏర్పాటు, తాగునీరు వృథా కాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను గుర్తించిన కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు పరమానంద, విశ్వేశ్వరరావు కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజభూషణ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
ఏయూ స్నాతకోత్సవానికి సర్వం సిద్ధం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం 91వ, 92వ సంయుక్త స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ ఇప్పటికే పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పూలతో అలంకరించిన వేదిక, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ప్రాంగణం, శ్రద్ధగా అమర్చిన సీటింగ్.. ఇవి అన్నీ కలిపి విద్యార్థులకు మరపురాని అనుభూతిని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పట్టాలు అందుకునే విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం విశేషం. వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరుకానుండటం కార్యక్రమానికి మరింత గౌరవాన్ని తెస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొననున్నారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్, ఏయూ పూర్వ విద్యార్థి డాక్టర్ పూర్ణచంద్రరావు సగ్గుర్తి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ. ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుండటం విశేషం. అదేవిధంగా సాహిత్య రంగంలో విశిష్ట సేవలందించిన తల్లావజ్ఝల పతంజలి శాస్త్రికి కూడా గౌరవ డాక్టరేట్ అందజేయనున్నారు. ఇద్దరు ఆచార్యులకు బెస్ట్ రీసెర్చ్ అవార్డులు, పీహెచ్డీ విద్యార్థులకు 17 రీసెర్చ్ మెడల్స్, 13 రీసెర్చ్ ప్రైజ్లు అందజేస్తారు. మొత్తం 441 మంది పీహెచ్డీ డిగ్రీలు, 7 మంది ఎం.ఫిల్ డిగ్రీలు అందుకుంటారు. యూజీ, పీజీ స్థాయిలో 174 మెడల్స్, 437 ప్రైజ్లు కూడా విద్యార్థుల ప్రతిభకు గుర్తింపుగా అందించనున్నారు. -
జీవీఎంసీ ఇక 120 వార్డులు
డాబాగార్డెన్స్: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్ విశాఖపట్నం(జీవీఎంసీ) వార్డుల సంఖ్య ఇకపై 120కి చేరనుంది. జీవీఎంసీగా అవతరించిన తొలినాళ్లలో 72 వార్డులు ఉండగా, గత ప్రభుత్వ హయాంలో ఆ సంఖ్య 98కి చేరింది. తాజాగా జనాభా ప్రాతిపదికన వార్డుల సంఖ్యను 120కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో 65ను జారీ చేసింది. పరిపాలన సౌలభ్యం కోసం జీవీఎంసీ ఇప్పటికే జోన్ల సంఖ్యను 8 నుంచి 10కి పెంచిన సంగతి తెలిసిందే. మధురవాడ నుంచి అనకాపల్లి వరకు విస్తరించిన మహా నగరంలో ప్రతి ప్రాంతానికి సమాన ప్రాధాన్యం దక్కేలా ఈ విభజన జరిగింది. కొత్తగా ఏర్పడనున్న 22 వార్డులను కూడా ఈ 10 జోన్ల పరిధిలోనే శాసీ్త్రయంగా సర్దుబాటు చేయనున్నారు. తద్వారా జోనల్ కార్యాలయాల ద్వారా ప్రజలకు మున్సిపల్ సేవలు మరింత వేగంగా అందనున్నాయి. మారనున్న వార్డుల సరిహద్దులు వార్డుల సంఖ్య పెరుగుతుండటంతో నగరంలోని దాదాపు అన్ని డివిజన్ల సరిహద్దులు మారబోతున్నాయి. ముఖ్యంగా అత్యధిక ఓటర్లు, విస్తీర్ణం ఉన్న పెద్ద వార్డులను విభజించి కొత్తవి ఏర్పాటు చేస్తారు. దీని వల్ల ప్రతి కార్పొరేటర్ పరిధిలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా భౌగోళికంగా సమీపంలో ఉన్న ప్రాంతాలను ఒకే వార్డు కిందకు తెచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు త్వరలోనే వార్డుల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించనున్నారు. జనాభా సాంద్రత, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కొత్త వార్డుల సరిహద్దులను ఖరారు చేస్తారు. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తర్వాతే తుది నోటిఫికేషన్ వెలువడుతుంది. రాబోయే ఎన్నికల నాటికి విశాఖ నగరం 120 వార్డులతో సరికొత్త రాజకీయ స్వరూపాన్ని సంతరించుకోనుంది. జనాభా ప్రాతిపదికన పెంపు గత దశాబ్ద కాలంలో విశాఖ మహానగరం అనూహ్యంగా అభివృద్ధి సాధించింది. భీమిలి, అనకాపల్లి వంటి మున్సిపాలిటీలు జీవీఎంసీలో విలీనం కావడంతో నగర రూపురేఖలు మారిపోయాయి. పారిశ్రామికాభివృద్ధి, వలసల కారణంగా ప్రస్తుతం నగర జనాభా సుమారు 26 లక్షలకు చేరినట్టు అంచనా. ప్రభుత్వ తాజా గెజిట్ నిబంధనల ప్రకారం.. 15 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో తప్పనిసరిగా 120 వార్డులు ఉండాలి. ఈ నిబంధనల మేరకే విశాఖలో అదనంగా మరో 22 వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. -
సామాన్య భక్తులకే పెద్దపీట
మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామిమహారాణిపేట: సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని, ఆ దిశగా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. ఏప్రిల్ 20న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. టికెట్ల జారీ ప్రక్రియలోనూ, ఇతర ఏర్పాట్లలోనూ ఎలాంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏప్రిల్ 17 నాటికి అన్ని పనులను పూర్తి చేయాలన్నారు. పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం : కలెక్టర్గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ వివరించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉచిత దర్శనంతో పాటు రూ.300, రూ.1,000, రూ.1,500 టికెట్ల వారికి విడివిడిగా క్యూలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చందనోత్సవం రోజున తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవతో పూజలు మొదలవుతాయని, 3 గంటలకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త తొలి దర్శనం చేసుకుంటారని తెలి పారు. 4 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. భక్తుల రవాణా కోసం 50 ఆర్టీసీ బస్సులతో పాటు, ప్రత్యేక టికెట్లు కొన్న వారికి మరో 30 మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గందరగోళం లేకుండా టికెట్ల జారీ ఉండాలి దర్శన టికెట్ల జారీలో గందరగోళం లేకుండా చూడాలని పలువురు ఎమ్మెల్యేలు సూచించారు. భద్రతా పరంగా విరివిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని, క్రేన్లు, పొక్లెయిన్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు(వర్చువల్ విధానంలో), జేసీ విద్యాధరి, ఈవో జె.వెంకటరావు, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ చందోలు, విశాఖ ఆర్డీవో సుధాసాగర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
413 వాహనాల అప్పగింత
అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతలు, క్రైం, ట్రాఫిక్ విభాగాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను వాహన యజమానులకు తిరిగి ఇచ్చే కార్యక్రమం మంగళవారం చేపట్టారు. నగర పోలీస్ కమిషనరేట్ పోలీస్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సంబంధిత యజమానులకు వాహనాలను అప్పగించారు. వివిధ కేసుల్లో, వివిధ సందర్భాలలో సీజ్ చేసిన వాహనాలను వాటి యజమానులు కోర్టుల ద్వారా రిలీజ్ చేసుకోలేకపోతున్నందున అవి పాడైపోతున్నాయన్నారు. ఆ వాహనాలను తిరిగి అందజేయాలని ఉద్దేశంతో ఇప్పటివరకు నాలుగుసార్లు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 5వ సారి చేపట్టిన ఈ కార్యక్రమంలో 413 వాహనాలు అందజేసినట్లు తెలిపారు. మొత్తంగా 5 విడతల్లో 1582 మందికి వాహనాలు అందజేసినట్లు పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీలోకి బద్రీనాథ్ !
మల్కాపురం: జీవీఎంసీ 60వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ మాజీ జిల్లా అధ్యక్షుడు కలిదిండి బద్రీనాథ్ మళ్లీ వైఎస్సార్ సీపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆయన తండ్రి దివంగత కలిదిండి సీతారామరాజు ట్రేడ్ యూనియన్ నాయకుడిగా, షిప్యార్డ్ గుర్తింపు యూనియన్ నాయకుడిగా అందించిన సేవలు జిల్లా వాసులకు సుపరిచితం. తండ్రి అడుగుజాడల్లో వైఎస్సార్ సీపీలోకి వచ్చిన బద్రీనాథ్.. పారిశ్రామిక ప్రాంత పరిధిలో పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ట్రేడ్ యూనియన్ ద్వారా కార్మిక సమస్యలను జిల్లా స్థాయిలో బలంగా వినిపించారు. అయితే, ఇటీవల ఆయన బీజేపీలో చేరారు. ఇప్పుడు తన అనుచరులతో కలిసి మళ్లీ వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు బద్రీనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ సూచనలతో పార్టీకి పూర్వ మాదిరిగా తన సేవలను అందిస్తానని స్పష్టం చేశారు. ఏ రోజున పార్టీలో చేరేది మరో రెండు రోజుల్లో వెల్లడిస్తానని బద్రీనాథ్ పేర్కొన్నారు. -
ఇక ఆగాలి!
ఆ గాలి..వాయు కాలుష్య నియంత్రణకు వినూత్న పరికరం గాలి కాలుష్యం ఉన్న చోట అమర్చితే వడపోత ఏక్యూఐ లెవల్స్ను తగ్గిస్తున్న ఎయిర్ పొల్యూషన్ మిటిగేటింగ్ యంత్రం సౌర, పవన శక్తితో నడిచేలా తయారు చేసిన ‘నిటెమ్’సంస్థ జైలు రోడ్డులో అమర్చిన ఎయిర్ పొల్యూషన్ మిటిగేటింగ్ మెషీన్ సాక్షి, విశాఖపట్నం: పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ కారణంగా గాలి నాణ్యత క్షీణిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో ఊపిరి తీసుకోవడమే ఒక సవాలుగా మారుతోంది. ఇటీవల కాలంలో విశాఖ నగరంలో గాలి కాలుష్యం గణనీయంగా పెరిగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. చాలా మంది ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైర్స్ వాడుతూ కొంత ఉపశమనం పొందుతున్నారు. మరి బయటకు వస్తే.. స్వచ్ఛమైన గాలి ఎక్కడ ఉంటుంది? ఈ ప్రశ్నను సవాల్గా తీసుకుని విజయవాడకు చెందిన , ఓ జేఎన్టీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ సరికొత్త ప్యూరిఫైర్ను తయారు చేశారు. నిషాంత్ ఇన్నోవేటివ్ మాన్యుఫ్యాక్చర్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అండ్ టెక్నాలజీ(నిటెమ్) సంస్థ పేరుతో నగర వీధుల్లో గాలిని శుద్ధి చేసే ఈ పరికరం టెస్టింగ్ను విశాఖలో నిర్వహించారు. గాలిలోని విష వాయువులను, కాలుష్య కారకాలను పీల్చేసి స్వచ్ఛమైన గాలిని అందించే ‘ఎయిర్ పొల్యూషన్ మిటిగేటింగ్ మెషీన్’ను నిటెమ్ సంస్థ చైర్మన్ డా.కేఎం లక్ష్మణరావు రూపొందించారు. జేఎన్టీయూ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయిన లక్ష్మణరావు, మెట్రో నగరాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన చేశారు. ఇందులో భాగంగా తయారు చేసిందే ఈ యంత్రం. నిటెమ్ రూపొందించిన ఈ పరికరాన్ని భవనాల పైనా, ప్రధాన కూడళ్లలో అమర్చడం ద్వారా 250–300 ఉన్న ఏక్యూఐను వంద లోపునకు తీసుకురావచ్చు. ఈ పరికరం కేవలం గాలిని శుద్ధి చేయడమే కాకుండా, వాతావరణ సమతుల్యతను కాపాడటంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. గ్రీన్ టెక్నాలజీతో.. సౌర, పవన శక్తులతో పనిచేసే గ్రీన్ టెక్నాలజీని వినియోగించి పర్యావరణహితంగా ఈ యంత్రాన్ని రూపొందించారు. ఈ ఎయిర్ పొల్యూషన్ మిటిగేటింగ్ మెషీన్ అందులో అమర్చిన బ్యాటరీల ద్వారా పని చేస్తుంది. దీనికి అవసరమైన విద్యుత్ను సోలార్ ప్యానెల్స్, చిన్నపాటి విండ్ టర్బైన్ల ద్వారా ఉత్పత్తి చేసుకోవడం దీని ప్రత్యేకత. రన్వేల నుంచి డ్రైనేజీ వరకు.. వీధుల్లోనూ, పరిశ్రమల్లోనే కాకుండా ఎయిర్పోర్టు రన్వేల దగ్గర నుంచి వీధుల్లో ఉన్న డ్రైనేజీల పక్కన కూడా ఈ యంత్రాన్ని వినియోగించవచ్చు. పొగమంచు కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతుంటుంది. ఈ విజిబిలిటీ సమస్యను కూడా ఈ మెషీన్ పరిష్కరిస్తుంది. పరిశ్రమలు, ప్లాస్టిక్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే రసాయన వాయువులు, కాలుష్యాన్ని ఇది నియంత్రిస్తుంది. ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో గాలిని శుద్ధి చేసేందుకు ఇది ఎంతగానో ఉపయుక్తమవుతుంది. అంతేకాదు, అగ్ని ప్రమాదాల సమయంలో పొగను పీల్చేయడానికి, డ్రైనేజీ మ్యాన్హోల్స్ నుంచి వెలువడే వివిధ రకాల విషవాయువులను తొలగించేందుకు ఇది దోహదపడుతుంది. విశాఖలో టెస్టింగ్ విజయవంతం ఎయిర్ పొల్యూషన్ మిటిగేటింగ్ యంత్రాన్ని టెస్టింగ్ కోసం నగరానికి తీసుకొచ్చారు. జైలు రోడ్డు సమీపంలో మంగళవారం ఉదయం దీనిని అమర్చారు. 200 చదరపు మీటర్ల విస్తీర్ణం వరకూ గాలిని వడబోసేలా మోడ్ను సెట్ చేశారు. యంత్రం ప్రారంభించే సమయంలో ఆ ప్రాంతంలో ఏక్యూఐ లెవల్స్ 180 వరకూ ఉండగా, ప్రారంభించిన కొద్ది సేపటికే అది 80–90 మధ్యకు తగ్గుముఖం పట్టింది. దీంతో యంత్రం విజయవంతంగా పనిచేసినట్లు ధ్రువీకరించారు. ప్రగతి.. పర్యావరణానికి శాపం కాకూడదు మన పారిశ్రామిక ప్రగతి అడుగులు పర్యావరణానికి శాపం కాకూడదు. అత్యాధునిక సాంకేతికతతో కాలుష్యాన్ని మూలాల్లోనే తుడిచిపెట్టి రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడమే మా లక్ష్యం. అందుకే ఈ ఎయిర్ పొల్యూషన్ మిటిగేటింగ్ యంత్రాన్ని తయారు చేశాం. దాదాపు రెండేళ్ల పాటు దీనిపై శ్రమించాం. ఈ యంత్రం కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, గాలి కాలుష్యంతో పోరాడుతున్న ప్రతి నగరానికి ఒక రక్షణ కవచంగా మారుతుందని భావిస్తున్నాను. – డా. కేఎం లక్ష్మణరావు, నిటెమ్ సంస్థ చైర్మన్ -
గ్యాస్ సెగ.. బ్లాక్ మార్కెట్ దగా!
ఎంవీపీకాలనీ: నిత్యం పొయ్యి వెలగాలంటే గ్యాస్ సిలిండర్ ఉండాల్సిందే. కానీ, ప్రస్తుతం విశాఖ నగరంలో గ్యాస్ సిలిండర్ పొందడం సామాన్యుడికి గగనమైపోతోంది. అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావంతో దిగుమతులు మందగించి కొరత ఏర్పడటాన్ని కొందరు దళారులు ‘కాసుల వర్షం’గా మార్చుకుంటున్నారు. అరకొరగా వస్తున్న స్టాక్ను సామాన్యులకు చేరకుండా పక్కదారి పట్టిస్తూ బ్లాక్ మార్కెట్కు తెరలేపుతున్నారు. ధర రూ. 923.. దందా రూ. 3,000 ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ. 923 ఉండగా, బ్లాక్ మార్కెట్లో అది ఏకంగా రూ. 2,500 నుంచి రూ. 3,000 వరకు పలుకుతోంది. గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ల వద్ద పనిచేసే సిబ్బంది, డెలివరీ బాయ్స్ కొందరు దళారులతో చేతులు కలిపి బుకింగ్ అయిన సిలిండర్లను అక్రమంగా విక్రయిస్తున్నారు. డెలివరీ సిబ్బంది ఒక సిలిండర్ను రూ. 2,000కు దళారులకు అమ్ముతుండగా, వారు అవసరాన్ని బట్టి హోటళ్లు, రెస్టారెంట్లు, అత్యవసరమున్న వినియోగదారులకు రూ. 3,000 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిమ్మకు నీరెత్తిన విజిలెన్స్ ? బ్లాక్ మార్కెట్ను అరికట్టాల్సిన విజిలెన్స్, సివిల్ సప్లై విభాగాలు ప్రస్తుతం పూర్తిగా నిద్రావస్థలో ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అడపాదడపా దాడులు చేసిన ఈ విభాగాలు, ప్రస్తుతం ఇంత పెద్ద ఎత్తున దందా జరుగుతున్నా కనీసం కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దళారుల కదలికలపై అవగాహన ఉన్నప్పటికీ, అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న ’మర్మం’ ఏమిటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. పెరగనున్న ఇబ్బందులు కమర్షియల్ సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకడంతో, హోటల్ యజమానులు డొమెస్టిక్ (ఇంటి) సిలిండర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు దక్కాల్సిన కోటాను గండి కొడుతోంది. అర్హులైన లబ్ధిదారులకు నెలల తరబడి వేచి చూసినా సిలిండర్ దొరకని పరిస్థితి నెలకొంది. నిఘా పెంచాలి జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి, విజిలెన్స్, సివిల్ సప్లయ్ విభాగాలకు కఠిన ఆదేశాలు జారీ చేయాలి. గ్యాస్ గోడౌన్ల వద్ద నిఘా పెంచి, అక్రమ విక్రయాలకు పాల్పడే ఏజెన్సీలు, దళారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. -
అప్పన్న సన్నిధిలో బైకర్ చిత్ర బృందం
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం సినీ హీరో శర్వానంద్, హీరోయిన్ మాళవిక నాయర్ దర్శించుకున్నారు. తాము నటించిన బైకర్ సినిమా విజయవంతం కావాలని స్వామికి పూజలు నిర్వహించారు. ఆలయంలోని కప్పస్తంభానికి మొక్కుకున్నారు. అంతరాలయంలో వీరి పేరిట అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు అందజేశారు. కప్పస్తంభానికి మొక్కుకుంటున్న హీరో శర్వానంద్, హీరోయిన్ మాళవిక నాయర్ -
ఆకట్టుకునేలా ‘యోగాంధ్ర మెమోరియల్’
ఏయూక్యాంపస్: ప్రజల ఆరోగ్యానికి ప్రతీకగా, యోగాకు విశిష్ట గుర్తింపుగా యోగాంధ్ర మెమోరియల్ నిలుస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బీచ్ రోడ్లోని యోగా విలేజ్ వద్ద నూతనంగా నిర్మించిన యోగాంధ్ర మెమోరియల్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ప్రధానమంత్రి సందర్శించిన ఈ ప్రాంతానికి గుర్తుగా, ఆరోగ్య ప్రాధాన్యతను చాటిచెప్పేలా ఈ యోగా చిహ్నాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాగా.. జీవీఎంసీ ఆధ్వర్యంలో యోగా విలేజ్ సమీపంలో సుమారు రూ.69.55 లక్షల అంచనా వ్యయంతో ఈ మెమోరియల్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పింక్ శాండ్స్టోన్తో మెమోరియల్ నిర్మాణంతో పాటు ఆకట్టుకునేలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పద్మనాభం ప్రాంతానికి చెందిన ఓ యోగా క్రీడాకారిణి ప్రదర్శించిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జీవీఎంసీ ఏడీసీలు రమణ మూర్తి, సత్యవేణి పాల్గొన్నారు. -
గుజరాత్లో తక్కువ ధర.. మన దగ్గర ఎందుకు ఎక్కువ?
మహారాణిపేట: ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం రాష్ట్రంలోని మత్స్యకారులపై తీవ్రంగా ఉందని, డీజిల్ కొరత కారణంగా 10 రోజులుగా వేట సాగక మత్స్యకారులు ఆకలితో అలమటిస్తున్నారని ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విశాఖ ఫిషింగ్ హార్బర్లోని గంగమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్య పరిశ్రమ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శించారు. డీజిల్ సమస్యను పరిష్కరించాలని తాము కలెక్టర్ను కోరినా, ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఎటువంటి సహకారం అందలేదని మండిపడ్డారు. మరికొన్ని రోజుల్లో వేట నిషేధ కాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో, సబ్సిడీ డీజిల్ సకాలంలో అందకపోతే మత్స్యకారుల పరిస్థితి దారుణంగా తయారవుతుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మత్స్య పరిశ్రమను ఇండస్ట్రియల్ సెక్టార్లో చేర్చడం వల్ల లీటర్ డీజిల్పై అదనంగా రూ.24 భారం పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను గుజరాత్ ప్రభుత్వం ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లి పాత ధరలకే డీజిల్ పొందుతోందని, అక్కడ లీటర్ రూ.79కే లభిస్తోందని తెలిపారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మత్స్యకారుల సమస్యలను పట్టించుకోవడంలో చొరవ చూపకపోవడం వల్ల వేలాది బోట్లు హార్బర్కే పరిమితమయ్యాయని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో 28 ఎకరాల స్థలాన్ని సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అనే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడాన్ని జానకీరామ్ తీవ్రంగా ఖండించారు. స్థానిక మత్స్యకారుల నుంచి ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా హార్బర్లను ప్రైవేటీకరించడం సమంజసం కాదన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం -
కొత్త జోష్
ఆశావహుల్లోఉమ్మడి విశాఖలో కొత్తగా 6–7 అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం సీట్ల సంఖ్య 21 నుంచి 22కు పెరిగే అవకాశం ● పునర్విభజనతో మారనున్న ఉమ్మడి విశాఖ జిల్లా ముఖచిత్రం ● పెరగనున్న మహిళా ప్రాతినిధ్యం ● ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని సీట్లు ● 2029 సమరానికి ఇప్పుడే మొదలైన లెక్కలుసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రాజకీయ ముఖచిత్రం త్వరలోనే పూర్తిగా మారిపోనుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 15 నియోజకవర్గాల సంఖ్య 21 నుంచి 22కు చేరుకోనుంది. అంటే కొత్తగా 6 నుంచి 7 అసెంబ్లీ స్థానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పరిణామాలు స్థానిక రాజకీయ ఆశావహుల్లో కొత్త జోష్ నింపుతున్నాయి. ఇప్పటివరకు అవకాశం కోసం ఎదురు చూసిన నాయకులకు ఇది గోల్డెన్ ఛాన్స్గా మారగా, కొత్త తరం నేతలకు రాజకీయ ప్రవేశానికి మార్గం సుగమమవుతోంది. అసెంబ్లీలో ‘అధ్యక్షా’ అంటూ తమ గళాన్ని వినిపించాలన్న కలలు కనే వారికి ఈ పునర్విభజన ప్రక్రియ కొత్త ఆశలు, అవకాశాలు తెరచి పెడుతోంది. ఓట్ల సంఖ్యను బట్టి విభజన పునర్విభజన ప్రక్రియ 2011 జనాభా లెక్కల ఆధారంగా సాగనున్నా.. ప్రధానంగా ఓటర్ల సంఖ్యే కీలక ప్రమాణంగా మారనుంది. ఒక నియోజకవర్గంలో సుమారు 1.6 లక్షల ఓటర్ల పరిమితి ఉండేలా రూపకల్పన జరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం 3 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాలు రెండుగా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ తూర్పు, ఉత్తర నియోజకవర్గాలు కూడా ఇదే బాటలో నడవొచ్చు. ఈ నియోజకవర్గాల్లో కూడా 2029 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య 3 లక్షలకు దాటే అవకాశం ఉంది. అలాగే నగరంలో కొత్తగా ‘విశాఖ సెంట్రల్’ నియోజకవర్గం ఏర్పడే సూచనలు బలంగా ఉన్నాయి. తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ నియోజకవర్గాల నుంచి కొన్ని వార్డులు కలిపి దీనిని రూపొందించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త సమీకరణలు పాయకరావుపేటలో అధిక ఓటర్ల సంఖ్య కారణంగా అది రెండు నియోజకవర్గాలుగా విడిపోయే అవకాశం ఉంది. యలమంచిలి, అనకాపల్లి పరిధిలో కొత్తగా ‘అనకాపల్లి రూరల్’ నియోజకవర్గం కూడా తెరపైకి రావొచ్చు. అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మార్పులు తప్పవు. నర్సీపట్నంలోని కొన్ని గ్రామాలు కలిపి... పాడేరు, అరకు నియోజకవర్గాలను పునర్విభజించి.. కొత్తగా ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక గతంలో ఉన్న పరవాడ, చింతపల్లి నియోజకవర్గాలు మళ్లీ తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ మ్యాప్ కూడా మారే చాన్స్ అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిమితి మారి.. కొత్తగా ఏర్పడే అసెంబ్లీ సీట్లతో రీడిజైన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పార్వతీపురం మన్యం ప్రాంతంలో కొత్త పార్లమెంట్ నియోజకవర్గం కూడా రావచ్చనే చర్చ నడుస్తోంది. మహిళలకు 7 సీట్లు ఖాయం 2029 ఎన్నికల నుంచి అమలుకానున్న 33 శాతం మహిళా రిజర్వేషన్ విశాఖ రాజకీయాల్లో గేమ్చేంజర్గా మారనుంది. ఉమ్మడి విశాఖలో పునర్విభజన తర్వాత ఉండే 21–22 సీట్లలో కనీసం 7 సీట్లు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళా నాయకులకు ఇది ఒక సువర్ణావకాశం. దీంతో అసెంబ్లీలో విశాఖ నుంచి మహిళా వాణి బలంగా వినిపించనుంది. ఎస్సీ, ఎస్టీలకు మరింత ప్రాధాన్యం జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు కూడా ప్రాతినిధ్యం పెరగనుంది. ప్రస్తుతం ఉన్న ఒక ఎస్సీ (పాయకరావుపేట), రెండు ఎస్టీ (అరకు, పాడేరు) స్థానాలకు అదనంగా.. మరో ఎస్సీ, మరో ఎస్టీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ద్వితీయ శ్రేణి నేతల జోరు సీట్ల సంఖ్య పెరుగుతుండటంతో ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అధ్యక్షా.. అని పిలిపించుకోవాలని తపించే రాజకీయ నేతలకు కేంద్రం నిర్ణయం ఒక వరంగా మారింది. నియోజకవర్గాల హద్దులు మారనుండటంతో ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకునేందుకు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. -
ఎట్టకేలకు స్పాందించారు
గోపాలపట్నం: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఎలైట్ స్పా సెంటర్ను ఎట్టకేలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. ఎన్ఏడీ జంక్షన్ విల్లా కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న ఎలైట్ వెల్నెస్ అండ్ స్పా సెంటర్పై ఆరు నెలల కిందట టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి విటులను, మహిళలను పట్టుకున్నారు. ఆ తర్వాత దీన్ని సీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ, అధికారుల మధ్య సమన్వయ లోపంతో నిర్లక్ష్యంగా వదిలేశారు. అయితే, రెండు నెలల తర్వాత మారు తాళాలతో తిరిగి స్పాను తెరిచి వ్యాపారం చేస్తుండటాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. మరమ్మతులు చేసేందుకే తాళాలు తీశామంటూ నిర్వాహకులు వారిని నమ్మబలికారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. సాక్షిలో ‘స్పా..ందించండి’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళవారం ఆ స్పా సెంటర్ను సీజ్ చేశారు. ఎస్ఐ ప్రసాద్, ఆర్.కోమలి, తదితరులు పాల్గొన్నారు. అలాగే జ్యోతినగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ఇంటిని కూడా పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. గతేడాది డిసెంబర్లో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. తాజాగా స్పందించిన అధికారులు ఆ ఇంటికి కూడా మంగళవారం సీల్ వేశారు.ఎలైట్ స్పా సెంటర్ సీజ్ -
తలనీలాల ద్వారా రూ.15.55 కోట్ల ఆదాయం
సింహగిరిపై తలనీలాల వేలం నిర్వహణ సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి తలనీలాల వేలం ద్వారా భారీ ఆదాయం సమకూరింది. 2026–27 సంవత్సరానికి గాను రూ.15 కోట్లు 55 లక్షల 50 వేలు వచ్చింది. దేవస్థానంలో ఏడాది కాలపరిమితికి గాను తలనీలాల ద్వారా ఇంతపెద్ద మొత్తంలో రావడం ఇదే ప్రథమం. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు రెండేళ్ల కాలపరిమితికి తలనీలాలను సేకరించే హక్కులను కేటాయించేందుకు మంగళవారం దేవస్థానం ఈవో జె.వెంకటరావు ఆధ్వర్యంలో బహిరంగ వేలం, సీల్డ్ టెండర్ ప్రక్రియ నిర్వహించారు. తమిళనాడుకు చెందిన ‘దురై ఎంటర్ప్రైజెస్’ సంస్థ షీల్డ్ టెండర్ ద్వారా ఈ హక్కును దక్కించుకుంది. ఈ ఒప్పందం 2026 ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు (రెండేళ్ల పాటు) అమల్లో ఉంటుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో తలనీలాల ఆదాయం రూ.10.13 కోట్లుగా ఉండగా, ఈసారి అది దాదాపు 50 శాతం పైగా పెరగడం విశేషం. కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో రాధ, ఏఈవోలు రమణమూర్తి, రమేష్బాబు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
నెలాఖరుకు ఓటర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి చేయాలి
మహారాణిపేట: ఈ నెలాఖరుకు జిల్లాలోని ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి జన గణన–2027 ప్రక్రియ మొదలవుతుందని, ఈ లోగా ఓటర్ల జాబితాలకు సంబంధించిన పనులను పూర్తి చేసుకోవాలని చెప్పారు. సంబంధిత శాఖల అధికారులు కింది స్థాయి అధికారులతో, సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకొని ప్రక్రయను వేగవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో లంచావతారం
సీతంపేట: అతనో ప్రభుత్వ సేవకుడు.. ప్రజలకు అండగా ఉండాల్సిన స్థానంలో ఉన్నాడు. కానీ కళ్లు మూసుకుపోయి కక్కుర్తితో ’చేయి’ చాచాడు. ఐదు సచివాలయాలు కొలువై ఉన్న ఆ ప్రాంగణంలో, వందలాది మంది కళ్లెదుటే ఏమాత్రం భయం లేకుండా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతడే జీవీఎంసీ 26వ వార్డు పరిధి అక్కయ్యపాలెం జగ్గారావు బ్రిడ్జి సమీపంలోని లలితానగర్ సచివాలయం (125) వార్డు ఎడ్యుకేషన్ కమ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పైలా రాజేష్. అసలేం జరిగిందంటే? లలితానగర్కు చెందిన ద్వారాపురెడ్డి గంగరాజ్యం తన కుమారుడు గణేష్ పేరుపై ఉన్న స్థిరాస్తిని సెటిల్మెంట్ డీడ్ రూపంలో నమోదు చేయించేందుకు లలితానగర్ (125) సచివాలయంలో సంప్రదించింది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పైలా రాజేష్ మొదట రూ.90 వేల లంచం డిమాండ్ చేయగా, చివరికి రూ.80 వేల వద్ద ఒప్పందం కుదిరింది. అయితే లంచం ఇవ్వడానికి ఇష్టపడని గణేష్ నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి మార్గదర్శకత్వంలో ప్రణాళిక రచించి.. సోమవారం మధ్యాహ్నం కార్యాలయంలోనే రాజేష్కు నగదు అందజేసే సమయంలో అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ‘దర్జాగా’ టేబుల్పై డబ్బులు ఈ ఘటనలో మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. రాజేష్ ఎలాంటి భయం లేకుండా తీసుకున్న లంచాన్ని టేబుల్పై బహిరంగంగా ఉంచి, దానిపై బ్యాగ్ పెట్టడం. అక్కడే ఐదు సచివాలయాలు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, ప్రజలు ఉండగా కూడా ఇలా నిర్లక్ష్యంగా లంచం తీసుకోవడం చూసి ఏసీబీ అధికారులు సైతం విస్తుపోయారు. ప్రజల్లో ఆగ్రహం ఇంత బహిరంగంగా అవినీతి జరుగుతుండటం ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ‘‘ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదు, వ్యవస్థలోని లోపాలకు నిదర్శనం’’ అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి చర్యలు పట్టుబడిన పైలా రాజేష్ను ఆరిలోవ పోలీస్ స్టేషన్కు తరలించి, మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీలు రమణమూర్తి, హర్షిత, సీఐలు శ్రీనివాస్, వెంకటరావు పాల్గొన్నారు. అవినీతిపై ఫిర్యాదు ఇలా? ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే, ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. -
మరణంలోనూ నలుగురికి పునర్జన్మ
బీచ్రోడ్డు : పెను విషాదంలోనూ ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం నలుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగి ధర్మాల మాధవరావు (57) అవయవాలను దానం చేసి, ఆయన కుటుంబ సభ్యులు స్ఫూర్తిగా నిలిచారు. ఈనెల 20న గాజువాక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాధవరావు తలకు తీవ్ర గాయమైంది. నగరంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జీవన్ దాన్ ప్రతినిధుల అవగాహనతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. దీంతో ఆయన శరీరం నుంచి లివర్, కిడ్నీ, రెండు కళ్లను సేకరించి, ప్రోటోకాల్ ప్రకారం సీనియారిటీ లిస్టులో ఉన్న బాధితులకు కేటాయించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అవయవ దాతలకు గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలన్న ప్రభుత్వ జీవో ప్రకారం.. మాధవరావు పార్థివ దేహానికి పోలీస్ బ్యాండ్తో ఘనంగా నివాళులర్పించారు. సీపీ శంఖబ్రత బాగ్చి, జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె. రాంబాబు స్వయంగా విచ్చేసి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చిన మాధవరావు కుటుంబాన్ని అభినందించారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని, దాతలకు ప్రభుత్వ గౌరవం దక్కడం శుభపరిణామమని పేర్కొన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన మాధవరావు అవయవాల దానం -
వడదెబ్బ నివారణకు చర్యలు వేగవంతం
మహారాణిపేట: జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వడదెబ్బ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వడదెబ్బపై అవగాహన పోస్టర్ను ఆవిష్కరించి సమీక్ష నిర్వహించారు. ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి, చల్లని తాగునీటి సదుపాయాలు, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్, మందులు సిద్ధంగా ఉంచాలని, కార్మికులకు మధ్యాహ్న విశ్రాంతి కల్పించాలని తెలిపారు. ప్రజలు ఎండలో తిరగడం తగ్గించి తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. -
న్యాయవాదుల సంఘం ఎన్నికల సందడి
మొదలైన నామినేషన్ల పర్వంవిశాఖ లీగల్ : నగర న్యాయవాదుల సంఘం ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. ఎన్నికల అధికారి ఏ. ప్రభాకర్ రెడ్డికి పలువురు అభ్యర్థులు సోమవారం తమ నామినేషన్లను దాఖ లు చేశారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది శిష్ష్లా శ్రీనివాసమూర్తి (వాసు) అధ్యక్ష పదవికి తొలి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా తాను పోటీ చేస్తున్నానని, తోటి న్యాయవాదులందరూ సహకరించాలని కోరారు. శ్రీనివాసమూర్తితో పాటు కార్యదర్శి పదవికి ఒమ్మి వెంకట సుధాకర్, మహిళా ప్రతినిధిగా పీలా మహాలక్ష్మి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కోర్టు ఆవరణలో ఎన్నికల సందడి నెలకొంది. -
కొంతకాలం ఓపిక పట్టండి..
ఉక్కునగరం: కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వచ్చారు.. స్టీల్ప్లాంట్ను చూశారు.. సమస్యలు విన్నారు.. అన్నింటికీ ఓపిక పట్టాలని చెప్పి వెళ్లిపోయారు. ఇదీ సోమవారం కేంద్ర మంత్రుల పర్యటన స్థూల సారాంశం. నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్ శంకుస్థాపనకు వచ్చిన మంత్రులు శనివారం రాత్రి స్టీల్ప్లాంట్లో బస చేశారు. ఉన్నత యాజమాన్యంతో సమీక్ష నిర్వహించారు. వారి పర్యటనతో తమ పెండింగ్ జీతాలు, ప్రతీ నెలా పూర్తి జీతం, ఆర్థిక ప్రయోజనాల పునరుద్ధరణ జరుగుతుందని ఉద్యోగులు ఆశపడ్డారు. అయితే వారు ఎటువంటి హామీ ఇవ్వకుండా కొంత కాలం ఓపిక పట్టండి అంటూ చెప్పి ఉద్యోగులను నిరాశలో ముంచెత్తారు. కార్మిక సంఘాల నాయకులతో సమావేశం పర్యటనలో భాగంగా మధ్యాహ్నం మంత్రులు కార్మిక సంఘాలు, ఉక్కు అధికారుల సంఘం (సీ), ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ప్రతీ నెలా పూర్తి జీతాలు చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికుల ఆధార్ బ్లాక్ తొలగించాలని, ప్లాంట్ పూర్తి స్థాయిలో నడపడానికి ఆరవ బ్యాటరీ నిర్మించాలని, సింటర్ ప్లాంట్ సామర్థ్యం పెంచాలని, మరో రోలింగ్ మిల్ నిర్మించాలని నాయకులు కోరారు. దీనిపై కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ గత ఏడాదిలో ఉక్కు ఉద్యోగులు చేసిన కృషి అభినందనీయమని, ఊహించిన దాని కన్నా అధికంగా ఉత్పత్తి సామర్థ్యం చూపారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్లతో రెండో ప్యాకేజీ ఇచ్చే అంశం ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలో ఉందన్నారు. కొద్దికాలం ఓపిక పడితే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. సమావేశంలో అఖిపక్ష నాయకులు జె.అయోధ్యరామ్, పి.వి.రమణమూర్తి, కె.ఎస్.ఎన్.రావు, యు.రామస్వామి, కొమ్ము ప్రసాద్, డొక్క నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అసోసియేషన్లతో సమావేశం స్టీల్ప్లాంట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అసోసియేషన్ల నాయకులతో జరిగిన సమావేశంలో నాయకులు దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ సమస్యలను వివరించారు. పదోన్నతుల సమస్య పరిష్కరించాలని, కాంట్రాక్ట్ పనుల నుంచి తొలగించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బయ్యే మల్లయ్య, ఓబీసీ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వినతి మెడికల్ ఇన్సూరెన్స్ ఉత్తర్వుల జారీ జాప్యం గురించి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వివరించారు. నెలాఖరవుతున్నా విడుల చేయకపోవడం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు ఆరోగ్య ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారని అసోసియేషన అధ్యక్షుడు మాటూరి శ్రీనివాసరావు తెలిపారు. -
జగన్ దార్శనికతకు ఇనార్బిట్ మాల్ సాక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికతకు ’ఇనార్బిట్ మాల్’ ఒక సజీవ సాక్ష్యమని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు కొనియాడారు. సోమవారం సాలగ్రామపురంలో జరిగిన మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న కృషిని, ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని ఆయన ఎండగట్టారు. జగనన్న తెచ్చిన ’గేమ్ ఛేంజర్’ నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదల, ముందుచూపు వల్లే ఈరోజు విశాఖలో ఇంతటి భారీ మాల్ సాకారమైందని కేకేరాజు తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా పెట్టుబడిదారులకు ఆయన కల్పించిన భరోసా వల్లే రహేజా గ్రూప్ వంటి దిగ్గజాలు ముందుకు వచ్చాయన్నారు. 2023 ఆగస్టు 1న గత ప్రభుత్వ హయాంలో సుమారు 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.600 కోట్ల భారీ వ్యయంతో ఈ మాల్కు పునాది పడిందని గుర్తు చేశారు. ఈ మాల్ ద్వారా ప్రత్యక్షంగా సుమారు మూడు వేల మందికి, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఇది విశాఖ ఆర్థిక వ్యవస్థకే ఒక ’గేమ్ ఛేంజర్’ అని అభివర్ణించారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఐటీ టవర్, భారీ ఉపాధి మాల్ ప్రాంగణంలోనే సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్ కూడా రానుందని, ఇది విశాఖను ఐటీ హబ్గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ మాల్ ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించడం వైఎస్ జగన్మోహన్రెడ్డి కల అని చెప్పారు. రూ.600 కోట్ల ప్రాథమిక పెట్టుబడితో మొదలైన ఈ ప్రాజెక్ట్, రెండో విడతతో మరో రూ.300 కోట్లతో కలిపి విశాఖ ఆర్థిక రంగానికి పెద్ద ఊతాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. క్రెడిట్ కోసం పాకులాట వద్దు మొక్క నాటిన వారు ఒకరైతే.. కాయలు కోసి క్రెడిట్ కొట్టాలని చంద్రబాబు నాయుడు తంటాలు పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు అసలు రూపకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరికీ తెలుసన్నారు. అభివృద్ధికి చిరునామా విశాఖ కేవలం ఇనార్బిట్ మాల్ మాత్రమే కాకుండా, అదానీ డేటా సెంటర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు భూమి పూజ చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనని కేకే రాజు గుర్తు చేశారు. చిన్న తరహా పరిశ్రమలు, టూరిజం, వినోద రంగాలకు ఈ మాల్ కొత్త ఊపిరి పోస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పారదర్శకతే మా బలం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ప్రాజెక్టును తీసుకువచ్చినా అందులో అవినీతికి తావు లేకుండా, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా పనిచేశారని తెలిపారు. అదానీ డేటా సెంటర్ నుంచి ఇనార్బిట్ మాల్ వరకు ఆయన దార్శనికతకు ఇవన్నీ నిదర్శనాలని కేకే రాజు స్పష్టం చేశారు. కూటమి నాయకులు ఇప్పటికై నా వక్రబుద్ధి మానుకొని, ఈ ఉపాధి అవకాశాలను పారదర్శకంగా యువతకు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
గాజువాక : పాతగాజువాక సమీపంలోని చినగంట్యాడ జంక్షన్ వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30 ఏళ్ల మహిళ మృతి చెందింది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరమాండల్ గేటు ప్రాంతానికి చెందిన ఎం.స్వాతి (30) తన తల్లి నాగమణితో కలిసి ద్విచక్ర వాహనంపై చినగంట్యాడ వచ్చారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో చినగంట్యాడ జంక్షన్ వద్ద వెనుక నుంచి వచ్చిన ఒక భారీ ట్రాలర్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వాతి బైక్ పై నుంచి కింద పడిపోవడంతో ట్రాలర్ చక్రాలు ఆమైపె నుంచి వెళ్లాయి. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై గాజువాక సీఐ షేక్ హుస్సేన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకు మోసం
మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రకటించిన ‘జాబ్ క్యాలెండర్’ నిరుద్యోగులను మోసం చేయడమేనని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి రామచంద్రరావు మండిపడ్డారు. సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రంలో లక్షలాది ఖాళీలు ఉండగా, కేవలం 10,060 పోస్టులను అక్టోబర్ వరకు విడతల వారీగా భర్తీ చేస్తామనడం యువతను తప్పుదోవ పట్టించడమేనన్నారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 3,000 ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, ప్రతి నిరుద్యోగికి ప్రభుత్వం లక్షకు పైగా బాకీ ఉందన్నారు. గత జగన్ ప్రభుత్వంలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా, సచివాలయ, వలంటీర్ వ్యవస్థల ద్వారా ఉపాధి కల్పించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 1.72 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనకల ఈశ్వర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుజ్జు దీరజ్ కుమార్, ఉత్తర నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మువ్వల సంతోష్ కుమార్, దక్షిణ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు తాడి రవితేజ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి చంద్రమౌళి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి రామచంద్రరావు -
‘మలబార్’లో శృతిహాసన్ మెరుపులు
బీచ్రోడ్: నగరంలోని వీఐపీ రోడ్డులో ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతనంగా ఏర్పాటు చేసిన భారీ షోరూంను సోమవారం సినీ నటి శృతి హాసన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శృతి హాసన్ మాట్లాడుతూ దేశంలో నాణ్యమైన, నమ్మకమైన బంగారు, వజ్రాభరణాలకు మలబార్ సంస్థ పెట్టింది పేరన్నారు. విశాఖ వంటి కీలక మార్కెట్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, సంప్రదాయ, ఆధునిక డిజైన్ల కలయికతో ఈ అతిపెద్ద షోరూంను అందుబాటులోకి తీసుకురావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. సంస్థ ఇండియా ఆపరేషన్స్ హెడ్ ఆషీర్ మాట్లాడుతూ.. విశాఖ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక కలెక్షన్లను ప్రదర్శిస్తున్నామన్నారు. ప్రస్తుతం షోరూంలో ‘బిగ్ బ్రిలియంట్ సేల్’ నడుస్తోందని, ఇందులో భాగంగా బంగారం, అన్కట్ రత్నాల ఆభరణాల తరుగుపై 40శాతం, వజ్రాల విలువపై 30శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు. పాత బంగారం మార్పిడిపై ఎటువంటి తరుగు లేకుండా గరిష్ట విలువను అందిస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో మలబార్ ప్రతినిధులు సిరాజ్, రాకేష్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో నాణ్యమైన ఉపాధి కీలకం
మద్దిలపాలెం: దేశాభివృద్ధిలో నాణ్యమైన ఉపాధి కల్పన కీలకమని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు, ఐడీఎస్–ఏపీ చైర్మన్ ఆచార్య ఎస్. మహేంద్ర దేవ్ అన్నారు. ఆచార్య రొక్కం రాధాకృష్ణ నాలుగవ స్మారక ఉపన్యాస కార్యక్రమం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ముఖ్య అతిథిగా హాజరైన మహేంద్ర దేవ్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి విలువ ఆధారిత చర్యలు తోడవాలని, ఎగుమతులు పెరిగితేనే జీడీపీ వృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మానవ మూలధనం, సాంకేతికత, యువత నైపుణ్యాలు, మహిళల భాగస్వామ్యం దేశ ప్రగతికి దోహదపడతాయని ఆయన వివరించారు. మరో వక్త, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విశ్రాంత ఆచార్యులు దువ్వూరు నరసింహారెడ్డి ‘భారత వ్యవసాయ స్థితి– సవాళ్లు’ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. భూగర్భ జలాల మితిమీరిన వినియోగం, సాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, పర్యావరణహిత వ్యవసాయం ద్వారానే రైతులకు సరైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోని ఒడిదుడుకులను అధిగమించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఐడీఎస్–ఏపీ సంచాలకులు ఆచార్య ఎస్. గాలబ్ సంస్థ పరిశోధనల గురించి వివరించగా, యూపీఎస్సీ పూర్వ చైర్మన్ ఆచార్య ఎస్.ఆర్. హషీం అధ్యక్షోపన్యాసం చేశారు. చివరగా అతిథులను ఘనంగా సత్కరించారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు మహేంద్ర దేవ్ -
నార్త్జోన్, సెంట్రల్జోన్ జట్ల విజయం
విశాఖ స్పోర్ట్స్ : నగరంలో ప్రారంభమైన ఆల్ ఇండియా జోనల్ ఫిజికల్లీ డిసేబుల్డ్ క్రికెట్ టోర్నీలో నార్త్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు విజయాలతో ఖాతా తెరిచాయి. సోమవారం ఏసీఏ ఆపరేషన్స్ జీఎం ఎం.ఎస్. కుమార్ ఈ పోటీలను ప్రారంభించారు. తొలి మ్యాచ్లో నార్త్ జోన్ 186 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో సౌత్ జోన్ 168 పరుగులకే పరిమితమైంది. మరో మ్యాచ్లో సెంట్రల్ జోన్ 252 పరుగుల భారీ స్కోరు సాధించగా (కేధార్నాథ్ 96), వెస్ట్ జోన్ కేవలం 95 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్టేడియం మేనేజర్ జె.కె.ఎం. రాజు, మాజీ కెప్టెన్ గురుదాస్ రౌత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
చందనోత్సవానికి పక్కాగా వైద్య ఏర్పాట్లు
మహారాణిపేట: వచ్చే నెల 20న జరగనున్న సింహాచలం చందనోత్సవానికి పటిష్టమైన వైద్య ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. సోమవారం ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవం కోసం మూడు షిఫ్టుల్లో 304 మంది సిబ్బందిని డిప్యుటేషన్పై నియమిస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం 90 అంబులెన్సులు, కొండపై 6 పడకల తాత్కాలిక ఆసుపత్రులు, 24 గంటల కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటాయన్నారు. అత్యవసర సేవల కోసం అపోలో, కేజీహెచ్, విక్టోరియా ఆస్పత్రులను రెఫరల్ ఆస్పత్రులుగా గుర్తించామన్నారు. ఈ ఏర్పాట్లకు ప్రైవేటు ఆస్పత్రులు సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో నోడల్ అధికారి డాక్టర్ ఉమావతి, ఎన్టీఆర్ వైద్యసేవ కో–ఆర్డినేటర్ డాక్టర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు
మహారాణిపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆయా శాఖలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా డీఎంహెచ్వో, అటవీ శాఖలు, పద్మనాభం తహసీల్దార్ పరిధిలో ఉన్న పెండింగ్ అంశాలను తక్షణమే క్లియర్ చేయాలని సూచించారు. మున్సిపల్ విభాగం, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని, 21 రోజుల గడువు దాటినా స్పందించని ఆనందపురం మండల సర్వేయర్కు నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చార్జ్ మెమోలు ఇవ్వడానికి వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో వచ్చిన 253 అర్జీలను జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇతర ఉన్నతాధికారులు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 91, జీవీఎంసీకి 96, పోలీస్ శాఖకు 13 వినతులు రాగా, మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి. అధికారులు నేరుగా అర్జీదారులతో మాట్లాడి సమస్యలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో శేషశైలజ, ఏడీసీ సత్యవేణి , ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. డీనోటిఫైడ్ తెగలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార కులాల వారికి తక్షణమే డీనోటిఫైడ్ తెగల కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని బీజేపీ నాయకుడు పొలిమేర శ్రీనివాసరావు కోరారు. సోమవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ను కలిసి ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాటా డుతూ.. సంచార జాతులకు ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మూల వెంకటరా వు, దాడి పురుషోత్తం, తిప్పనబోయిన కోటీశ్వర రావు, కంటుభక్త సునీత తదితరులు పాల్గొన్నారు. -
వంట గది ఖాళీ.. రోడ్డెక్కిన సిలిండర్ల ర్యాలీ
నగర శివారు గ్రామాల్లో వంట గ్యాస్ కోసం సామాన్యుడి పాట్లు వర్ణనాతీతంగా మారాయి. గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రం కావడంతో వినియోగదారులు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. సోమవారం ఉదయం విశాఖ నుంచి భీమిలి వెళ్లే ప్రధాన రహదారిపై ఖాళీ సిలిండర్లు బారులు తీరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వంట గదిలో పనులన్నీ పక్కన పెట్టి, గృహిణులు, కూలీలు గ్యాస్ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక గంటల తరబడి రహదారిపైనే నిరీక్షిస్తున్నారు. చేతిలో పని వదిలేసి, పొయ్యి వెలిగించుకోవడానికి సిలిండర్లు పట్టుకుని రోడ్ల వెంట పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడింది. శివారు ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం కావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ కొరతను తీర్చాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 96 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 96 వినతులు అందాయి. కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్లు ఎస్.ఎస్. వర్మ, డీవీ రమణమూర్తి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అందిన వినతుల్లో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 60 ఫిర్యాదులు రాగా, ఇంజినీరింగ్ విభాగానికి 14, రెవెన్యూ విభాగానికి 13, ప్రజారోగ్య శాఖకు 5, అడ్మినిస్ట్రేషన్ విభాగానికి 3, ఉద్యానవన విభాగానికి ఒకటి చొప్పున ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో జీవీఎంసీ జాయింట్ డైరెక్టర్ విజయభారతి, ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్, సీసీపీ ప్రభాకరరావు, అకౌంట్స్ ఎగ్జామినర్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు, ఏడీహెచ్ వాసుకి, స్పోర్ట్స్ డైరెక్టర్ ఈఏ రాజు, ఆర్ఎఫ్వో కృపావరం పాల్గొన్నారు. -
ఇనార్బిట్ మాల్ను సందర్శించిన పోర్టు చైర్మన్
తాటిచెట్లపాలెం: నగరంలోని సాలగ్రామపురంలో నిర్మించిన ‘ఇనార్బిట్ మాల్’ సోమవారం గ్రాండ్ ఓపెనింగ్కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు ఆదివారం ఉన్నతాధికారులతో కలిసి మాల్ ను సందర్శించారు. ప్రారంభోత్సవం నేపథ్యంలో జరుగుతున్న తుది దశ ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో, అత్యంత ఆధునిక హంగులతో రూపొందిన ఈ మాల్ నగరానికి సరికొత్త ల్యాండ్మార్క్గా నిలవనుంది. పోర్ట్ స్థలంలో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుండటంతో సందర్శకులకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్, డైనింగ్, వినోద అను భూతి కలగనుంది. చైర్మన్ పర్యటనలో పోర్ట్, మాల్ ప్రతినిధులు పాల్గొని ఏర్పాట్ల గురించి వివరించారు. -
ఆరోగ్యశ్రీకి గండం
బకాయిల చిక్కుముడి..మహారాణిపేట: నిరుపేదల ప్రాణ సంజీవనిగా వెలుగొందుతున్న ‘ఆరోగ్యశ్రీ’ పథకానికి చంద్రబాబు సర్కార్ ఉరి బిగిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు దశాబ్దాలుగా పేద రోగులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా అందుతున్న ఆధునిక వైద్య సేవలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. పెరిగిన వ్యాధుల సంఖ్య.. ఇప్పుడు కోత? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. దివంగత వైఎస్సార్ 1059 వ్యాధులతో ప్రారంభించిన ఈ పథకాన్ని, జగన్ ఏకంగా 3257 వ్యాధులకు విస్తరించారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ఖరీదైన చికిత్సలను కూడా చేర్చి పేదలకు అండగా నిలిచారు. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఈ పథకానికి తూట్లు పొడిచేలా ‘యూనివర్సల్ హెల్త్ స్కీమ్’ పేరుతో కొత్త పాలసీని తీసుకురావడానికి సిద్ధమవుతోందన్న ప్రచారం సాగుతోంది. వచ్చే నెల నుంచి కొత్త పాలసీ? ఏప్రిల్ నుంచి కొత్త హెల్త్ పాలసీని అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచిందని వైద్య ఆరోగ్య శాఖలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పాత బకాయిలు చెల్లించకుండా మొండి చేయి చూపడం, కొత్త పథకం పేరుతో ఎన్టీఆర్ వైద్యసేవను నీరుగార్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదల సంజీవనిగా ఉన్న ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. కొత్త పాలసీకి ప్రభుత్వం సిద్ధం నెట్వర్క్ ఆస్పత్రులకు పేరుకుపోయిన బకాయిలు ఆరోగ్యశ్రీ నిర్వీర్యానికి చంద్రబాబు సర్కార్ కుట్రజిల్లాలో మొక్కుబడి సేవలు జిల్లాలో మొత్తం 108 నెట్వర్క్ ఆస్పత్రులు (66 ప్రైవేటు, 19 ప్రభుత్వ, 23 డెంటల్) ఉండగా, బకాయిల రాకతో ఇక్కడ సేవలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఫలితంగా పేద ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వర్కింగ్ జర్నలిస్టులు వైద్యం కోసం అల్లాడుతున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి నిధుల విడుదల నిలిచిపోవడంతో పర్యవేక్షణ కూడా లోపించిందని, దీనివల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. -
జిహ్వకో రుచి.. దేశానికో శైలి
సాగర తీరాన ‘ప్రపంచ’ విందు ఏయూలో 40 దేశాల రుచుల హంగామామద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల వేళ బీచ్ రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్ ప్రపంచ వంటకాలకు వేదికై ంది. అంతర్జాతీయ విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘ఫీస్ట్ ఫెస్ట్’ నగరవాసులకు సరికొత్త అనుభూతిని అందించింది. 40 దేశాలకు చెందిన విదేశీ విద్యార్థులు 38 స్టాళ్లలో తమ దేశ ప్రత్యేక వంటకాలను సిద్ధం చేయగా, ఏయూ ఫుడ్ సైన్స్ విభాగం విద్యార్థులు మరో 18 స్టాళ్లలో భారతీయ స్వదేశీ రుచులను ప్రదర్శించారు. కార్యక్రమాన్ని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ కెప్టెన్ ఎస్. దివాకర్, ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్తో కలిసి ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఇథియోపియా సంప్రదాయ కాఫీ, ఆఫ్గన్ ‘కాబూలి పలావ్’, జోర్డాన్ షవర్మ, నేపాల్ మోమోస్ వంటి వంటకాలు ఆహార ప్రియులను విశేషంగా ఆకర్షించాయి. వీటితో పాటు కొమరూన్ ఇగుసి సూప్, కాంబోడియా చేపల వంటకాలు, భూటాన్ శాకాహార రుచులు విదేశీ సంస్కృతిని ప్రతిబింబించాయి. ‘థింక్ గ్లోబల్.. యాక్ట్ లోకల్’ అనే నినాదంతో విభిన్న దేశాల ఆహారపు అలవాట్లను ఒకే చోట చేర్చడం అభినందనీయమని కెప్టెన్ దివాకర్ కొనియాడారు. ఏయూ వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ సంప్రదాయ వస్త్రధారణలో వంటకాలను వడ్డించడం ద్వారా తమ దేశ వారసత్వాన్ని పరిచయం చేశారని తెలిపారు. ఈ నెల 26న విదేశీ విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవం కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమాన్ని అంతర్జాతీయ విద్యార్థుల విభాగం డీన్ ఆచార్య ఎస్.పాల్ డగ్లస్, అసోసియేట్ డీన్లు ఆచార్య యుగంధర్, ఆచార్య విజయశాంతి, ఆచార్య విజయమోహన్ సమన్వయంతో సమర్ధవంతంగా నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, పాలక మండలి సభ్యులు, ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. ఫీస్ట్ఫెస్ట్లో పాల్గొన్న ఏయూ వీసీ -
డ్రగ్స్ రహిత సమాజం కోసం పోరాడుదాం
భగత్సింగ్కు సీఐటీయూ ఆధ్వర్యంలో నివాళులు ఏయూక్యాంపస్: దేశ స్వాతంత్య్రం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ల ఆశయాలను నిరంతరం కొనసాగిస్తామని సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ అన్నారు. భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం బీచ్రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్, మత్తు పదార్థాల మాఫియాకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ పెరుగుతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్ మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసులో అధికార పార్టీకి చెందిన ఎంపీ ప్రమేయం ఉండటం ఆశ్చర్యకరమని, ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఈ మాఫి యా సాగుతోందని ఆరోపించారు. నెల్లూరు యువజన సంఘం కార్యకర్త పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడుకోవాలని, కార్మిక హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని నేతలు పిలుపునిచ్చారు. అనంతరం ‘యుద్ధం వద్దు–శాంతి కావాలి’, ‘అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. మద్దిలపాలెం జోన్ కార్యదర్శి పి.వెంకట్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీ యూ నేతలు కుమార్ మంగళం, ఎం.సుబ్బారావు, కె.చంద్రశేఖర్, వి.కృష్ణరావు, పీతల అప్పారావు, అనపర్తి అప్పారావు, సింహాచలం, కుమారి, మణికుమార్, తులసీరామ్, మోహన్ రావు, రమాప్రభ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాద వృత్తి పూలబాట కాదు
విశాఖ లీగల్ : సమాజంలో న్యాయవాద వృత్తి అత్యంత కీలకమైందని, అయితే ఇది పూలబాట కాదని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం జిల్లా కోర్టు ఆవరణలో విశాఖ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక ఉత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలో రాణించాలంటే నిరంతర శ్రమ, అంకితభావం తప్ప వేరే మార్గం లేదని, అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే విజయం సొంతమవుతుందని పేర్కొన్నారు. మరో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి మాట్లాడుతూ.. నిరంతర అధ్యయనం ద్వారానే వృత్తిలో ఎదగడం సాధ్యమని తెలిపారు. నిత్యం కేసులతో బిజీగా ఉండే న్యాయమూర్తులు, న్యాయవాదులకు ఇటువంటి క్రీడా కార్యక్రమాలు మంచి ఆటవిడుపును ఇస్తాయని, మానసిక ఉల్లాసానికి ఇవి ఎంతో అవసరమని చెప్పారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు న్యాయమూర్తులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి లాలం పార్వతి నాయుడు, క్రీడా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ -
విశాఖలో ‘రాకాస’ సందడి
డాబాగార్డెన్స్: నిహారిక కొణిదెల నిర్మాతగా, సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ‘రాకాస’ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఆదివారం నగరంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక మాట్లాడుతూ ‘కమిటీ కుర్రాళ్లు’ వంటి భారీ విజయం తర్వాత తమ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై వస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం ఇదని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ బీచ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడికి షిఫ్ట్ అయిపోవాలని కూడా అనుకుంటానని ఆమె చమత్కరించారు. చిత్రంలో కామెడీ చాలా సహజంగా ఉంటుందని, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి వంటి సీనియర్ల రాకతో సినిమా స్థాయి పెరిగిందని పేర్కొన్నారు. హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ ఇది హర్రర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన ఫాంటసీ కామెడీ చిత్రమని, విఠలాచార్య సినిమాల తరహాలో ఒక చందమామ కథను విన్న అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. హీరోయిన్ నయన్ సారిక సినిమా ప్రమోషన్స్ విశాఖ నుంచి ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేయగా, గెటప్ శ్రీను చిత్రంలోని ఫాంటసీ కామెడీ బాగా పండిందని వివరించారు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఈ క్యూట్ లవ్స్టోరీని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్వెల్లడించింది. -
అన్నమయ్య పదకవితా వైభవం
మద్దిలపాలెం : తొలి తెలుగు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 523వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం కళాభారతి ఆడిటోరియంలో అన్నమయ్య కీర్తనల గాన సభ ఘనంగా జరిగింది. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ అన్నమాచార్య కీర్తన కళాకారులు ‘చైతన్య బ్రదర్స్’(కృష్ణమాచార్య, వెంకటేశ్వర శర్మ) తమ 23 మంది శిష్యులతో కలిసి అన్నమయ్య కీర్తలను ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఈ సంగీత విభావరికి డాక్టర్ మావుడూరి సత్యనారాయణ శర్మ (వయోలిన్), ఏడుకొండలు (మృదంగం), రాజు (తబలా) వాద్య సహకారం అందించారు. అంతకుముందు, కళాభారతి, త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ రాజు, కార్యదర్శి డాక్టర్ గుమ్ములూరి రాంబాబు, కోశాధికారి పైడా కృష్ణప్రసాద్, వంతుల నరసింగరావు, చైతన్య సోదరులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నమయ్య సంకీర్తనల విశిష్టతను చాటిచెప్పేలా సాగిన ఈ వేడుక నగర సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. -
విశాఖ స్టీల్ప్లాంట్ భూములు అదానీకి కేటాయిస్తే ప్రతిఘటన
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం మద్దిలపాలెం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్టు ట్రస్టులను దెబ్బతీసి అదానీకి అప్పగించాలని చూస్తున్నా యని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం విమర్శించారు. ఆదివారం ఏచూరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్కు చెందిన 1167 ఎకరాల భూమిని అదానీ హస్తగతం చేసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గంగవరం పోర్టును అదానీకి విక్రయించిన ప్రభుత్వం, ఇప్పుడు ప్లాంట్ భూములను కూడా ఆయనకే కట్టబెట్టాలని చూడటం అన్యాయమన్నారు. అదానీ డేటా సెంటర్ భూములే ఇంకా వినియోగంలోకి రాకముందే, పార్టనర్షిప్ పేరుతో గూగుల్ డేటా సెంటర్ భూములను కూడా అదానీ పొందేలా ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. నక్కపల్లిలోని ప్రైవేటు మిట్టల్ స్టీల్కు సొంత గనులు కేటాయిస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం నిరాకరించడం విచారకరమన్నారు. ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 7.5 మిలియన్ టన్నులకు పెంచేందుకు రూ.10 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్కేఎస్వీ కుమార్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాటం ఏప్రిల్ 2 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కార్మిక సంఘాల జెఎసితో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం నేతలు డాక్టర్ బి. గంగారావు, వి. కృష్ణారావు పాల్గొన్నారు. -
27 ఏళ్ల తర్వాత ఇంటికి...
కన్నకొడుకును చూసి కన్నీరుమున్నీరైన తండ్రి అల్లిపురం: ఇరవై ఏడు ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఇంటికి చేరుకుంటే ఆ కుటుంబంలో కలిగే ఆనందం వర్ణనాతీతం. అలాంటి మధుర అనుభూతిని ఏయూటీడీ సంస్థ ప్రతినిధులు ఆ కుటుంబానికి కల్పించారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం, కలహండి జిల్లా, బర్గాన్ గ్రామానికి చెందిన మహేందర్ చత్రియ గతంలో మానసిక అనారోగ్యానికి గురై ఇల్లు వదిలి వచ్చేశాడు. 2024 నవంబర్లో విశాఖ రైల్వే స్టేషన్లో దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న అతడిని ఏయూటీడీ సిబ్బంది గుర్తించి చేరదీశారు. ఐదు నెలలుగా ‘శ్రద్ధా’మందులతో వైద్య సేవలందించారు. చికిత్స అనంతరం మహేందర్ కోలుకోవడంతో, సంస్థ ప్రతినిధులు అతడిని నేరుగా సొంతూరికి తీసుకువెళ్లారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత గ్రామానికి చేరుకోవడంతో అక్కడి పరిసరాలన్నీ గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ఎనిమిదేళ్ల క్రితమే మహేందర్ తల్లి మరణించగా, తండ్రి రాకేశ్ కుమార్ చత్రియ మాత్రం కొడుకు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. చనిపోయాడనుకున్న కొడుకు కళ్లముందు నిలబడటంతో ఆ వృద్ధ తండ్రి భావోద్వేగానికి లోనయ్యాడు. ‘ఇక నేను నిశ్చింతగా కన్నుమూస్తాను’అంటూ ఆయన అన్న మాటలు గ్రామస్తులందరినీ కదిలించాయి. మహేందర్ను అతని తండ్రికి, సోదరులకు క్షేమంగా అప్పగించినట్లు ఏయూటీడీ కార్యదర్శి ప్రగడ వాసు తెలిపారు. -
విద్యార్థి ప్రగతికి వర్సిటీయే మూల కేంద్రం
మద్దిలపాలెం: విద్యార్థి ప్రగతికి విశ్వవిద్యాలయమే ప్రధాన కేంద్రంగా నిలుస్తుందని ఐఐటీ ఢిల్లీ మాజీ సంచాలకుడు ఆచార్య వి.ఎస్.రాజు అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ‘జియోటెక్నికల్ సొల్యూషన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ ప్రాబ్లమేటిక్ గ్రౌండ్’అనే అంశంపై రెండు రోజుల వర్క్షాప్ ఆదివారం ప్రారంభమైంది. ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం, ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ (ఐజీఎస్) విశాఖ ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను చదువుకున్న ఏయూలో పొందిన జ్ఞానమే నేడు తనను ఈ స్థాయిలో నిలిపిందని గుర్తుచేసుకున్నారు. ఉన్నత స్థానాలకు చేరుకున్న పూర్వ విద్యార్థులు తమ జ్ఞానాన్ని, మేధస్సును, అనుభవాన్ని తాము చదువుకున్న విశ్వవిద్యాలయ వికాసానికి అందించి, మాతృ సంస్థకు రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో నిర్మాణ రంగంలో అనేక సాంకేతిక మార్పులు వస్తున్నాయన్నారు. సదస్సు కన్వీనర్ ఆచార్య సి.ఎన్.వి.సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక స్వభావం కలిగిన నేలల్లో చేపట్టే నిర్మాణాలపై నిపుణుల సూచనలు పొందేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. సదస్సు సమన్వయకర్త ఆచార్య పి.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ.. దేశ బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.12 లక్షల కోట్లు కేటాయించడం, ఈ రంగం విస్తరణ వేగాన్ని ప్రస్ఫుటం చేస్తోందన్నారు. ఐజీఎస్ అధ్యక్షుడు డాక్టర్ అనీల్ జోసఫ్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏయూతో కలిసి మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఐజీఎస్ కార్యదర్శి ఎ.పి. సింగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిపుణులు ప్రత్యక్ష ఉదాహరణలతో సాంకేతిక అంశాలను వివరించారు. -
గ్యాస్ కష్టాలు.. ఇంకెన్నాళ్లు?
తగరపువలస: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం భీమిలి ప్రాంతంలోని వంటిళ్లలో ‘గ్యాస్ ట్రబుల్స్’సృష్టిస్తోంది. తెల్లవారితే చాలు వినియోగదారులంతా వంట గ్యాస్ గురించే చర్చించుకుంటున్నారు. ఇక డెలివరీ బాయ్స్ పెరిగిన బుకింగ్స్ ఒత్తిడిని తట్టుకోలేక సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు. పరిస్థితిని గమనించిన ఏజెన్సీలు, ఒక ఏరియా డెలివరీ బాయ్స్ను మరో ప్రాంతానికి పంపిస్తున్నాయి. దీంతో డెలివరీ పాయింట్ల వద్ద వినియోగదారులు ఉదయం నుంచే సిలిండర్ల కోసం నిరీక్షిస్తున్నారు. డెలివరీ బాయ్స్ జాడ లేకపోవడంతో నేరుగా భీమిలిలోని గ్యాస్ ఏజెన్సీలు, గోదాముల వద్దకే వెళ్తున్నారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్కు నెల రోజుల వ్యవధి ఉండటంతో, తక్కువగా వాడే వారు ఒక్కో సిలిండర్ను రూ.200 అదనంగా వసూలు చేస్తూ బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఏజెన్సీల వద్ద తగినంత నిల్వలు ఉన్నప్పటికీ.. యుద్ధ భయం, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం వల్ల బుకింగ్స్ అసాధారణంగా పెరిగాయని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. చిట్టివలస జ్యూట్మిల్లు లేబర్ వెల్ఫేర్ సెంటర్ వద్ద క్యూ కట్టిన వినియోగదారులు -
సేవకులకు విశ్వగురు అవార్డులు
డాబాగార్డెన్స్ : సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు సేవలు అందిస్తూ దేశ ప్రగతికి సోపానాలుగా నిలవాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. ఆదివారం ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్స్’ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నిష్ణాతులకు ‘విశ్వగురు’ అవార్డులను ఘనంగా ప్రదానం చేశారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీ మాట్లాడుతూ సేవ చేసే గుణం ఉన్నవారే సమాజంలో శాశ్వత కీర్తిని పొందుతారన్నారు. ముక్కుతో బొమ్మలు వేసే అరుదైన ప్రతిభ కలిగిన సంస్థ సీఈవో సత్యవోలు రాంబాబును ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. కస్టమ్స్ అధికారి రవిశంకర్ మలిశెట్టి, సినీ నటుడు రాజీవ్ కనకాల, తుమ్మిడి బ్రదర్స్ అధినేత తుమ్మిడి రామ్ కుమార్ మాట్లాడుతూ.. అవార్డు గ్రహీతల సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. సంస్థ వ్యవస్థాపక సీఈవో డాక్టర్ సత్యవోలు రాంబాబు మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా క్షేత్రస్థాయిలో నిజమైన సేవకులను గుర్తించి గౌరవిస్తున్నామని, గతంలో తమ అవార్డులు అందుకున్న వారు పద్మ పురస్కారాలకు సైతం ఎంపిక కావడం సంతోషకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, డాక్టర్ కిషోర్ కుమార్ సహా పలువురు కవులు, కళాకారులు, ఉన్నతాధికారులు పురస్కారాలు అందుకున్నారు. -
తీరంలో చందమామ
కొమ్మాది: దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చిత్రీకరణ మూడవ రోజు ఉత్సాహంగా సాగింది. ఇందులో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం ఆర్కే బీచ్, హవామహల్, ఫిషింగ్ హార్బర్ ప్రాంతాల్లో కిడ్నాప్కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. కాజల్ అగర్వాల్ను చూసేందుకు అభిమానులు, పర్యాటకులు భారీగా తరలిరావడంతో ఆమె వారికి అభివాదం చేశారు. కాజల్తో పాటు అజయ్ ఘోష్ షూటింగ్లో పాల్గొన్నారు. మరో వారం రోజుల పాటు బీచ్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ కొనసాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. -
రైల్వే స్థలంలో దుకాణాల తొలగింపు
డాబాగార్డెన్స్: ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం వెనుక భాగంలో ఫుట్పాత్పై ఉన్న పలు దుకాణాలను ఆదివారం రైల్వే అధికారులు తొలగించారు. రైల్వే క్వార్టర్స్ ప్రహరీకి ఆనుకొని ఉన్న స్థలంలో గత కొన్నేళ్లుగా గిఫ్ట్ షాపులు, పకోడీ బండ్లు, పండ్ల దుకాణాలు వెలిశాయి. వీటిని తొలగించాలని రైల్వే అధికారులు ఎనిమిదేళ్ల కిందటే దుకాణదారులకు నోటీసులు అందజేశారు. దీనిపై దుకాణదారులు కోర్టును ఆశ్రయించినప్పటికీ, వారికి దిగువ కోర్టులోనూ, అటు హైకోర్టులోనూ చుక్కెదురైంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు రైల్వే పోలీసులు ఆదివారం భారీ బందోబస్తు మధ్య అక్కడ ఉన్న దుకాణాలన్నింటినీ తొలగించారు. తమ జీవనోపాధి కోల్పోయామని ఈ సందర్భంగా దుకాణదారులు లబోదిబోమన్నారు. -
గ్లోబల్ డెస్టినేషన్గా ఉత్తరాంధ్ర
సీఐఐ– స్వర్ణాంధ్ర కాన్ఫరెన్స్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మహారాణిపేట: భోగాపురం ఎయిర్పోర్ట్, మూలపేట పోర్ట్, మిట్టల్ స్టీల్ ప్లాంట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం నోవాటెల్ హోటల్లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్’ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడికి రెండు గంటల ప్రయాణ దూరంలో ఒక విమానాశ్రయం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కొత్త నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి 50 రోజులకు ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభించేలా తన శాఖ కార్యాచరణ సిద్ధం చేసిందని, భవిష్యత్తు అవసరాల కోసం 1700 విమానాలు రానున్న 16 ఏళ్లలో భారత్కు చేరనున్నాయని వెల్లడించారు. ప్రపంచాన్ని శాసిస్తున్న డ్రోన్ విప్లవంలో ఏపీ ‘డ్రోన్ సిటీ’గా అవతరిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనే విమానాల అసెంబ్లింగ్ లైన్ను ఏర్పాటు చేసేందుకు ఎంబ్రయర్ సంస్థతో చర్చిస్తున్నామని, స్థానిక ఉత్పత్తి ద్వారానే పెరుగుతున్న డిమాండ్ను చేరుకోగలమని వివరించారు. అనంతరం సీఐఐ ప్రతినిధులు కేంద్రమంత్రిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సీఐఐ ఆంధ్రప్రదేశ్ సీఈవో మురళి కృష్ణ, గ్రీన్ కో గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కోలి, ముత్తూట్ ఫిన్ కార్ప్ చైర్మన్ థామస్ జాన్, సీఐఐ వైస్ ఛైర్మన్ నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. -
పేరు వింటే వణుకు
ఆదివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2026● కొనసాగుతున్న కూటమి నేతల ‘అరాచక’ పర్వం ● ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్ విగ్రహాలపై దాడులు ● వైఎస్సార్ లాన్, వ్యూ పాయింట్ వద్ద ధ్వంసరచన ● తాజాగా గుడివాడ గురునాథరావు విగ్రహంపై దాడి ● తీవ్రంగా స్పందించిన వైఎస్సార్సీపీ ● 48 గంటల్లో దోషులను శిక్షించాలని డిమాండ్ ఉమ్మడి విశాఖ జిల్లాలో విగ్రహాలపై జరుగుతున్న వరుస దాడులు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో ఉన్న విగ్రహాలు, స్థలాలు లక్ష్యంగా మారడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. వైఎస్సార్ పేరు వినగానే కూటమి నేతల్లో అసహనం వ్యక్తమవుతోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజల గుండెల్లో చెరిగిపోని ఆ మహానేత జ్ఞాపకాలను ఇలా చెరిపేయాలని ప్రయత్నించడం దురుద్దేశపూరితమని ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు ఈ ఆందోళనలకు బలం చేకూరుస్తున్నాయి. ఫిల్మ్నగర్ క్లబ్లో అధికారికంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ లాన్ బోర్డును తొలగించడం మొదలుకుని, జీవీఎంసీ తీర్మానంతో ఏర్పాటైన వైఎస్సార్ వ్యూ పాయింట్ వద్ద పేరు చెరిపే ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. అక్కడితో ఆగకుండా, పెందుర్తి వద్ద రోడ్డు విస్తరణ పేరుతో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించే యత్నం జరిగింది. స్థానిక నేతల ప్రతిఘటనతో ఆ ప్రయత్నం విఫలమైంది. తాజాగా అనకాపల్లి మండలం తగరంపూడిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు విగ్రహంపై దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటనతో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. పోలీసుల మౌనాన్ని ఆసరాగా చేసుకుని సాగుతున్న ఈ రాక్షసకాండపై వైఎస్సార్సీపీ గర్జించింది. 48 గంటల్లో నిందితులను పట్టుకోకుంటే జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తామని ‘అల్టిమేటం’ జారీ చేసింది. అధికార గర్వం అరాచక పర్వం గురునాథరావు విగ్రహంపై దాడి కూల్చివేతలే లక్ష్యంగా..పదవి కోసం పైశాచికం అభివృద్ధిని చూసి అసూయఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ వికృత క్రీడ పరాకాష్టకు చేరింది. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానేత స్మృతులను తుడిచిపెట్టాలనే సంకుచిత బుద్ధితో కూటమి నేతలు బరితెగిస్తున్నారు. వైఎస్సార్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతున్న పచ్చ దండు.. అభివృద్ధిని విస్మరించి, విగ్రహాల విధ్వంసమే ధ్యేయంగా అరాచక పర్వాన్ని కొనసాగిస్తోంది. వైఎస్సార్ వ్యూ పాయింట్, లాన్ల నుంచి మొదలైన ఈ ‘అల్పబుద్ధి’ రాజకీయం.. ఇప్పుడు దివంగత నేత గుడివాడ గురునాథరావు విగ్రహంపై దాడి వరకు వెళ్లింది. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం పెందుర్తిలో రోడ్ల వెడల్పు సాకుతో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించేందుకు తెగబడగా, వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాయి. గతంలో అనకాపల్లి జాతీయ రహదారి కొత్తూరు వద్ద చీకటి మాటున వైఎస్సార్ విగ్రహంపై దాడి చేశారు. తాజాగా అనకాపల్లి మండలం తగరంపూడిలో మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేయడం వైఎస్సార్సీపీ నేతలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అభివృద్ధి చేయలేక, ప్రజల మద్దతు పొందలేక ఇలాంటి నీచమైన దాడులకు పాల్పడుతున్నారని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. మంత్రి పదవి దక్కలేదన్న కసితోనో, అధినేత దృష్టిలో పడాలన్న తాపత్రయంతోనో గానీ.. గంటా అనుచరులు ఫిల్మ్నగర్ క్లబ్లో సాగించిన రభస అంతా ఇంతా కాదు. క్లబ్ కమిటీ అధికారిక తీర్మానం మేరకు ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్ లాన్’ బోర్డును బలవంతంగా పీకేసి తమ ఉన్మాదాన్ని చాటుకున్నారు. నియమ నిబంధనలను తుంగలో తొక్కి, దౌర్జన్యంతో భయాన్ని సృష్టించే ప్రయత్నం చేయడం కూటమి నేతల ‘కుటిల’ సంస్కృతికి నిదర్శనం. విశాఖ జిల్లాలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచే అరాచక శక్తులు జడలు విప్పాయి. ప్రశాంతతకు మారుపేరైన సాగర తీరాన్ని రాజకీయ కక్షలకు వేదికగా మార్చేశారు. ప్రజలకు మేలు చేసే పనులు చేతకాక, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక.. చివరకు మహనీయుల విగ్రహాలపై పడి ఏడవడం వీరి సంకుచిత మనస్తత్వానికి అద్దం పడుతోంది. గత ప్రభుత్వ హయాంలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ‘వైఎస్సార్ వ్యూ పాయింట్’ ఇప్పుడు జనంతో కిటకిటలాడుతోంది. జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదంతో నామకరణం చేసిన ఈ ప్రాంతంపై పచ్చ నేతలు కన్నేశారు. అధికారికంగా మార్చే దమ్ము లేక, రాత్రికి రాత్రే పేరును తొలగించేందుకు విఫలయత్నం చేశారు. ప్రజలు ఆదరిస్తున్న ప్రదేశంపై ఇలాంటి ‘అల్పబుద్ధి’ రాజకీయం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. -
విలువలకు నిలువుటద్దం పద్మనాభరెడ్డి
ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ అల్లిపురం: న్యాయవాద వృత్తిలో విలువలకు, నిబద్ధతకు నిలువుటద్దం దివంగత సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి అని ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ కొనియాడారు. వర్ధమాన న్యాయవాదులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని వృత్తిలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. శనివారం జిల్లా కోర్టు సముదాయంలోని బార్ అసోసియేషన్ హాల్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ విశాఖ జిల్లా, సిటీ కమిటీల ఆధ్వర్యంలో పద్మనాభరెడ్డి స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పద్మనాభరెడ్డి గారు ఒక ధ్రువతారలా వెలిగారని, ఆయన వాదనా పటిమ, చట్టంపై ఆయనకున్న పట్టు అనన్య సామాన్యమని గుర్తుచేశారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవి చీమలపాటి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగేష్ భీమపాక ప్రసంగిస్తూ.. పద్మనాభరెడ్డి గారు కేవలం గొప్ప న్యాయవాదే కాకుండా, ఎంతోమందికి మార్గదర్శకుడిగా నిలిచారని ప్రశంసించారు. రిటైర్డ్ జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ (పద్మనాభరెడ్డి కుమారుడు) తన తండ్రి జ్ఞాపకాలను పంచుకున్నారు. విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ లాలం పార్వతినాయుడు, ఐఏఎల్ నేషనల్ జనరల్ సెక్రటరీ చలసాని అజయ్కుమార్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ప్రసంగించారు. కార్యక్రమంలో ఐఏఎల్ నాయకులు వి.చంద్రశేఖరరెడ్డి, కె.ఎస్.సురేష్ కుమార్, ఎం.ఎస్.ఎం.భగవతీ, డి.మంజులత, ఎ.వి.లెనిన్, జహారా, అజయ్కుమార్, పీర్ల నూకరాజు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
కాకానినగర్ జంక్షన్లో లారీ బీభత్సం
ఆటో నుజ్జునుజ్జు..ముగ్గురికి తీవ్ర గాయాలుగోపాలపట్నం: నగరంలోని కాకానినగర్ జంక్షన్లో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఎయిర్పోర్టు పోలీసుల కథనం ప్రకారం.. ఉదయం 7.45 గంటల సమయంలో ఎన్ఏడీ నుంచి గాజువాక వైపు వెళ్తున్న ఓ లారీ, సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆటోను, మరో లారీని ఢీకొట్టింది. ఈ ధాటికి ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తాటిచెట్లపాలేనికి చెందిన పెంటకోట మోహన విష్ణుప్రియ పాదం చితికిపోగా, కరాసాకు చెందిన ఆటో డ్రైవర్ మైలపల్లి ఢిల్లీరావు కాలు విరిగింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ గణేష్ రామ్ గోపాల్ (ఛత్తీస్గఢ్) కూడా క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో అతని రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎయిర్పోర్టు, కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కొందరు భావిస్తుండగా.. బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే డ్రైవర్ లారీని ఆపలేకపోయాడని మరికొందరు చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి, ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఆటో డ్రైవర్ ఢిల్లీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సీహెచ్ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రెడ్కార్పెట్ బిగ్గెస్ట్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఎంవీపీకాలనీ: గాదిరాజు ప్యాలెస్ వేదికగా ‘రెడ్కార్పెట్ బిగ్గెస్ట్ జ్యువెలరీ ఎగ్జిబిషన్’ శనివారం ప్రారంభమైంది. పలువురు నగర మహిళా పారిశ్రామికవేత్తలు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆర్.కె. నాయుడు, శైలజా రామ్ మాట్లాడుతూ విశాఖలో ఇది అతిపెద్ద గోల్డ్ , డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్గా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో బంగారం, వజ్రాలతో పాటు పోల్కి, జేమ్స్ వంటి ఆభరణాలకు సంబంధించి 30కి పైగా స్టాల్స్ను ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు. తొలిరోజే ఈ ఎగ్జిబిషన్కు నగర ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. సోమవారం వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. -
‘కూటమి’ వైఫల్యాలను ఎండగట్టాలి
మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వినియోగించడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. శనివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు బొండా ఉమామహేశ్వరరావు, జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు మెరుగ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను విస్మరించి, రాజకీయ స్వార్థం కోసం వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారానికి దిగుతోందని మండిపడ్డారు. జగన్కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని, ఆయన పర్యటనలకు వస్తున్న స్పందనే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సోషల్ మీడియా కేవలం పోస్టింగ్ల వేదిక మాత్రమే కాదని, ప్రజల్లో చైతన్యం నింపే శక్తివంతమైన ఆయుధమని కేకే రాజు అభివర్ణించారు. 2019 ఎన్నికల్లో పార్టీ విజయానికి సోషల్ మీడియా కీలక భూమిక పోషించిందని గుర్తు చేస్తూ.. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను, అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ఐటీ, సోషల్ మీడియా విభాగాలపై ఉందన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రపై ప్రభుత్వం చూపుతున్న వివక్షను, విశాఖలో జరుగుతున్న భూ అక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేస్తూ, చంద్రబాబుకు ప్రభుతవ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గర్భాపు అనిల్ శర్మ, గోపి రాజు వంక, బెవర జగదీశ్వరరావు, జి. పెంటరెడ్డి, గొర్లి నవీన్, గీతారెడ్డి, టి.అశోక్, నాగిరెడ్డి పోలిశెట్టి, బొడ్డేటి వేణు గోపాల్, బెవర మహేష్, దండ గణేష్, తంథాటి సంపత కుమార్, ఉమ్మిడి బాల మురళి, జిల్లా, నియోజకవర్గ, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వేసవి సవాళ్లకు వాల్తేర్ డివిజన్ సిద్ధం
తాటిచెట్లపాలెం: ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో, రైల్వే ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కోసం వాల్తేర్ డివిజన్ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై శనివారం డీఆర్ఎం కార్యాలయంలో డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్బోహ్రా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వాల్తేర్ డివిజన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, దువ్వాడ, రాయగడ, కోరాపుట్, జగదల్పూర్ వంటి చోట్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రధాన స్టేషన్లలో ప్రయాణికులకు నిరంతరం తాగునీరు అందుబాటులో ఉంచాలి. ఇందుకోసం ప్రత్యేక మంచినీటి బూత్లను ఏర్పాటు చేయాలన్నారు. సివిల్ డిఫెన్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ప్రయాణికులకు నీటి సరఫరా సజావుగా సాగేలా చూడాలన్నారు. రైల్వే స్టేషన్లలోని మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్స్లో 24 గంటల పాటు నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైళ్ల రాకపోకల వివరాలను ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు చేరవేయాలని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్పీఎఫ్, జీఆర్పీ, రైల్వే కమర్షియల్ సిబ్బంది సమన్వయంతో అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం రైల్వే స్టేషన్ ఆవరణలో ఆపద వేళల్లో ప్రయాణికులను ఎలా రక్షించాలో వివరిస్తూ రైల్వే సిబ్బంది మాక్డ్రిల్ నిర్వహించారు. -
నటి కాజల్ అగర్వాల్ సందడి
కొమ్మాది: ఆర్కె బీచ్ సమీపంలోని హవా మహల్ వద్ద శనివారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శనివారం జరిగిన షూటింగ్లో కాజల్ అగర్వాల్తో పాటు ప్రముఖ నటులు అజయ్ ఘోష్, అజయ్లపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. తమ అభిమాన నటిని చూ సేందుకు స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో హవా మహల్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. -
సచివాలయ కమిటీల డేటాబేస్ సిద్ధం చేయండి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజుమహారాణిపేట: జిల్లాలోని అన్ని వార్డుల్లో సచివాలయ కమిటీల నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు అధ్యక్షతన నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, వ్యవస్థీకరణ, డిజిటల్ పరిపాలనపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, వార్డు, సచివాలయ స్థాయిల్లో పార్టీ కమిటీలను సమగ్రంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి కమిటీ సభ్యుడి వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసి, ఒక సమగ్ర డేటాబేస్ను రూపొందించాలని ఆదేశించారు. దీని నిర్వహణపై నాయకులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. పూర్తి చేసిన కమిటీల వివరాలను నిర్ణీత కాలవ్యవధిలోగా జిల్లా పార్టీ కార్యాలయానికి సమర్పించాలి. ఆ వివరాలను సమగ్ర నివేదిక రూపంలో కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపేలా టైమ్లైన్ను ఖరారు చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గ పరిశీలకులు పసుపులేటి బాలరాజు, కె.భాగ్యలక్ష్మి, పేడాడ రమణి కుమారి, డాక్టర్ జహీర్ అహ్మద్, చింతకాయల సన్యాసిపాత్రుడు, వీసం రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. -
గ్యాస్ ఏజెన్సీల్లో జేసీ ఆకస్మిక తనిఖీ
మహారాణిపేట : నగరంలోని గ్యాస్ ఏజెన్సీలను జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహారాణిపేట పరిధిలోని రఘురామ్ గ్యాస్ ఏజెన్సీ, ఎం.అప్లాండ్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలతో పాటు వాటి గోదాములను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రఘురామ్ గ్యాస్ ఏజెన్సీకి వచ్చిన వినియోగదారులతో జేసీ మాట్లాడారు. గ్యాస్ సరఫరాలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా? సిలిండర్లు సకాలంలో అందుతున్నాయా? అని అడిగి తెలుసుకోగా.. తమకు ఎలాంటి సమస్యలు లేవని వారు బదులిచ్చారు. అనంతరం ఏజెన్సీల్లోని ఆన్లైన్ రికార్డులు, కంప్యూటర్ డేటాను క్షుణ్ణంగా తనిఖీ చేసిన జేసీ.. ఏవైనా అవకతవకలు జరుగుతున్నాయా అనే కోణంలో ఆరా తీశారు. అప్లాండ్ గ్యాస్ ఏజెన్సీగోదాముల్లో ఎల్పీజీ సిలిండర్ల నిల్వలు, భద్రతా ప్రమాణాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. సిలిండర్ల నిల్వ విషయంలో కచ్చితంగా భద్రతా నిబంధనలు పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీల్లో జిల్లా సరఫరా అధికారి (డీఎస్ఓ) వి.భాస్కరరావు, లీగల్ మెట్రోలజీ డిప్యూటీ కంట్రోలర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వాట్సాప్ గొడవలే ప్రాణం తీశాయి
ఎంవీపీకాలనీ: నగరంలోని ఇసుకతోట రామాలయం సమీపంలో జరిగిన బొచ్చు వెంకటేష్ హత్య కేసులో ఎనిమిది మంది నిందితులను ఎంవీపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి శుక్రవారం సాయంత్రం ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. యువకుల మధ్య తలెత్తిన ఘర్షణలు, వాట్సాప్ గ్రూపుల్లో ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకోవడం వంటి కారణాలే ఈ హత్యకు దారితీసినట్లు ఆయన తెలిపారు. హత్య కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) పల్లా అనిల్కుమార్ది హెచ్బీ కాలనీ. గతంలో ఆటోమోటివ్ కూడలి వద్ద జరిగిన హత్య కేసుతో పాటు మరో హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఎంవీపీ పోలీస్ స్టేషన్లో అతనిపై రౌడీషీట్ కూడా ఉంది. అనిల్ గత కొంతకాలంగా రణస్థలంలో నివాసముంటూ ఆటో నడుపుకుంటున్నాడు. అయితే, అప్పుడప్పుడు నగరానికి వస్తూ స్థానిక యువకులతో గ్రూపులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో హత్యకు గురైన వెంకటేష్, గాయపడిన సంతోష్లతో అనిల్కు తగాదాలు ఏర్పడ్డాయి. వీరిద్దరిని అంతం చేసేందుకు అనిల్ ఇద్దరు మైనర్లతో పాటు వెంకటేష్ (ఏ2), నాగేంద్ర (ఏ3), రాజేష్ (ఏ4), చరణ్ (ఏ5), నిశాంత్ (ఏ6)లతో కలిసి పథకం రచించాడు. ఇసుకతోట కూడలి దరిలో పథక రచన చేసిన అనంతరం.. బొచ్చు వెంకటేష్ రామాలయం వద్ద ఉన్నాడని తెలుసుకొని మారణాయుధాలతో అక్కడికి చేరుకున్నారు. అతనిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం బాకి సంతోష్ ఇంటికి వెళ్లారు. సంతోష్ భార్య వరలక్ష్మి, స్నేహితుడు చందులను కొందరు అడ్డుకోగా, అనిల్, ఏ2 వెంకటేష్ సంతోష్పై కత్తి, ఇనుప రాడ్డుతో దాడి చేశారు. సంతోష్ భార్య, స్నేహితుడు పెనుగులాటలో పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు పారిపోయారు. పసల చందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, 10 బృందాలుగా ఏర్పడి నిందితులందరినీ పట్టుకొని రిమాండ్కు తరలించారు. సమావేశంలో ఎంవీపీ సీఐ ప్రసాద్, ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐలు అసిరి తాత, డీడీ నాయుడు, భవ్య, సీతారాం, ఏఎస్ఐ ఆదిరాజు తదితరులు పాల్గొన్నారు. పోలీసుల చొరవ అభినందనీయం ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఎంవీపీ పోలీసులు స్పందించిన తీరుపై ఏసీపీ హర్షం వ్యక్తం చేశారు. సీఐ ప్రసాద్తో పాటు ఎస్ఐలు నాయుడు, సీతారాం కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. అంబులెన్స్ కోసం వేచి చూడకుండా, పెట్రోలింగ్ జీప్లో వెంకటేష్ను, సీఐ ప్రసాద్ తన జీప్లో సంతోష్ను ఎక్కించుకొని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. సంతోష్కు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో, అతనికి అవసరమైన ‘ఓ పాజిటివ్’ రక్తాన్ని సైతం అందుబాటులోకి తెచ్చారు. వారి చొరవ కారణంగానే సంతోష్కు ప్రాణాపాయం తప్పిందని ఏసీపీ పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీలు మెడికవర్ ఆసుపత్రికి చేరుకొని సంతోష్కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం సంతోష్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ ఘటనలో ఎంవీపీ పోలీసుల చొరవ అభినందనీయమని నరసింహమూర్తి వెల్లడించారు. తప్పుడు స్నేహాలతో జీవితాలు నాశనం మొదటి నుంచీ నేరచరిత్ర ఉన్న పల్లా అనిల్ గురించి పూర్తిగా తెలియకపోవడంతోనే నిందితుల్లో పలువురు యువకులు ఈ హత్యకేసులో ఇరుక్కున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఎనిమిది మంది నిందితుల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారికి ఎలాంటి నేరచరిత్ర లేదు. కేవలం ఆధిపత్య పోరు కోసం అనిల్ వారిని రెచ్చగొట్టి, ఈ దారుణానికి ప్రేరేపించాడనే అభిప్రాయం కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యక్తమవుతోంది. ఇలాంటి రౌడీషీటర్లతో స్నేహం చేసే విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. క్షణికావేశం, అనవసర ఉత్సాహం వల్ల నేరాల్లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏసీపీ నరసింహమూర్తి హితవు పలికారు. హత్య కేసులో ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ -
కరెంట్ షాక్
వార్ గ్యాస్సాక్షి, విశాఖపట్నం: ఎక్కడో విదేశాల్లో బాంబు దాడులు జరుగుతుంటేం ఇక్కడ విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. సాగర నగరంలో ఒకవైపు భానుడు నిప్పులు చెరుగుతుంటేం మరోవైపు అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు ఇళ్లల్లో ‘విద్యుత్ మంటలు’ రేపుతున్నాయి. ఈ అసాధారణ పరిస్థితుల ప్రభావంతో నగరంలో విద్యుత్ వినియోగం గతంలో ఎన్నడూ లేని విధంగా గణనీయంగా పెరిగింది. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కోసం ఓవైపు ఏసీలు, కూలర్లు గిర్రున తిరుగుతుండగాం మరోవైపు యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరతకు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టౌవ్ల వినియోగం ఊపందుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంది. గత పది రోజులుగా రోజువారీ వినియోగంలో సుమారు 16 శాతం అదనపు లోడు నమోదవుతోంది. మార్చిలోనే మండుతున్న ఎండలు నగరంలో ఎండల ప్రభావం మంటపుట్టిస్తోంది. నడివేసవి రాకముందే ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం కూడా రికార్డు స్థాయికి చేరుతోంది. గాలిలో ఉష్ణోగ్రతలు 32–34 డిగ్రీల లోపే నమోదవుతున్నా.. ఉక్కబోత మాత్రం 40 డిగ్రీల ప్రభావాన్ని చూపిస్తోంది. ఎల్నినో ప్రభావంతో ఈసారి వేసవి మరింత ఇబ్బందికరంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రజల్లో ఇప్పుడే గుబులు పుట్టిస్తున్నాయి. వేడి నుంచి ఉపశమనం పొందడానికి అంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను విపరీతంగా వినియోగిస్తున్నారు. సాధారణంగా ఈపీడీసీఎల్ పరిధిలో మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి విద్యుత్ వాడకం పెరుగుతుంది. కానీ ఈసారి మార్చి మొదటి వారం నుంచే డిమాండ్ గరిష్ట స్థాయికి చేరింది. 16 మిలియన్ యూనిట్లు అదనం ఈపీడీసీఎల్ పరిధిలో మార్చి నెలలో ప్రతి రోజూ సగటున 78 నుంచి 81 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంటుంది. అయితే భానుడి ప్రతాపంతో ఈ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. గత కొద్ది రోజులుగా రోజువారీ సగటు విద్యుత్ వినియోగం కంటే 14 నుంచి 16 మిలియన్ యూనిట్లు అధికంగా నమోదవుతోంది. ప్రతి రోజూ వినియోగం సెంచరీకి (100 మిలియన్ యూనిట్లు) చేరువలో ఉండటం గమనార్హం. ఈ నెల 7వ తేదీన 96.50 మిలియన్ యూనిట్లు, 12వ తేదీన 96.37 మిలియన్ యూనిట్లుగా నమోదుకావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ‘ఇండక్షన్’ వినియోగం పెరుగుదల విద్యుత్ వినియోగం పెరగడానికి కేవలం ఎండలు మాత్రమే కారణం కాదు.. విదేశాల్లో జరుగుతున్న యుద్ధం కూడా పరోక్షంగా ఈపీడీసీఎల్పై భారం వేసింది. యుద్ధం కారణంగా వంటగ్యాస్ సరఫరాలో అనిశ్చితి, పెరిగిన సిలిండర్ ధరల ప్రభావం నేరుగా సామాన్యుడి వంటగదిపై పడింది. చాలామంది వినియోగదారులు వంటగ్యాస్కు బదులుగా ఇండక్షన్ స్టౌవ్లు, ఎలక్ట్రిక్ స్టౌవ్లు, ఇమ్మెర్షన్ హీటర్లను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా గృహ వినియోగంలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఒక్కో ఇంట్లో వినియోగించే ఇండక్షన్ స్టౌవ్లు గ్రిడ్పై తీవ్రమైన అదనపు భారాన్ని మోపుతున్నాయి. అధికారుల కసరత్తు శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు జిల్లాలతో పోలిస్తే విశాఖ నగరంలో డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. సాధారణంగా విశాఖలో ఈ సమయంలో 25 నుంచి 28 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండాలి.. కానీ ఈసారి అది 31 మిలియన్ యూనిట్లు దాటుతోంది. పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోవడానికి ఏపీఈపీడీసీఎల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. సాయంత్రం వేళల్లో (పీక్ అవర్స్) గరిష్ట డిమాండ్ 4800 మెగావాట్ల మార్కును దాటుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు తలెత్తకుండా తనిఖీలు చేపట్టడంతో పాటు, నిరంతర సరఫరా కోసం గ్రిడ్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. గత కొద్ది రోజులుగా ఈపీడీసీఎల్ పరిధిలో పెరిగిన విద్యుత్ డిమాండ్ ఇలా.. (మిలియన్ యూనిట్లలో..) తేదీ 2025 2026 పెరిగిన వినియోగం మార్చి–7 82.82 96.50 16.5 మార్చి–8 82.64 94.42 14.3 మార్చి–9 82.69 95.43 15.4 మార్చి–10 82.03 95.25 16.1 మార్చి–11 82.41 94.81 15.0 మార్చి–12 83.92 96.37 14.8 మార్చి–13 87.06 95.96 10.2 మార్చి–14 87.11 95.75 9.9 మార్చి–15 85.75 94.67 10.4 మార్చి–16 84.70 94.62 11.7 మార్చి–17 87.02 94.79 8.9 మార్చి–18 88.41 94.14 6.5 మార్చి–19 87.40 88.35 1.1సెంచరీ(మి.యూ.)కి చేరువలో ఈపీడీసీఎల్ విద్యుత్ వినియోగం మార్చి మొదటి వారంలోనే రికార్డు స్థాయికి చేరిన కరెంట్ వాడకం ఈపీడీసీఎల్ పరిధిలో 16 శాతం పెరిగిన విద్యుత్ డిమాండ్ 34 డిగ్రీల ఉష్ణోగ్రతలే వినియోగ పెరుగుదలకు ఒక కారణం గ్యాస్ కొరతతో ఎలక్ట్రిక్ స్టౌవ్లు, ఇండక్షన్ల వినియోగం మరో కారణం గత వారం రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు (సెంటీగ్రేడ్లో..) తేదీ ఉష్ణోగ్రత మార్చి–14 31.6 మార్చి–15 32.4 మార్చి–16 32.3 మార్చి–17 32.4 మార్చి–18 33.0 మార్చి–19 34.2 మార్చి–20 33.0విద్యుత్ పొదుపు పాటించాలి డిమాండ్ పెరుగుతున్నా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. నిరంతరం సర్కిల్స్ వారీగా సమీక్షలు నిర్వహిస్తూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తున్నాం. వినియోగదారులు కూడా అనవసరమైన విద్యుత్ వాడకాన్ని తగ్గించి సహకరించాలి. – పృథ్వీతేజ్ ఇమ్మడి, ఈపీడీసీఎల్ సీఎండీ -
అప్పన్న సన్నిధిలో కశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు జడ్జి
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని జమ్మూకశ్మీర్ అండ్ లద్దాఖ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ పరిహార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆయన ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడామండపంలో ప్రదక్షిణ చేశారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజ చేసి, వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ఆయనకు స్వామి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. 26న వాహనాల ఈ–వేలం మహారాణిపేట: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నిరుపయోగంగా ఉన్న పలు వాహనాలను ఈనెల 26వ తేదీన ఈ–వేలం వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. మొత్తం 20 వాహనాలను ఈ వేలం ప్రక్రియ ద్వారా విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వేలానికి సంబంధించిన పూర్తి వివరాలను, నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కొనుగోలు పోర్టల్ https://konugolu.ap.gov.inలో పొందుపరిచామని వివరించారు. ఆసక్తి గల వారు వెబ్సైట్ను సందర్శించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. -
వంటింట్లో నూనె మంట
మహారాణిపేట: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ మేఘాలు మన వంటింట్లో సెగలు పుట్టిస్తున్నాయి. అటు అంతర్జాతీయ పరిణామాలు, ఇటు ప్రభుత్వ పన్నుల పోటు, మధ్యలో వ్యాపారుల మాయాజాలం.. వెరసి సామాన్యుడి నూనె డబ్బా ఖాళీ అవుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే లీటర్ వంట నూనైపె సగటున రూ.6 నుంచి రూ.30 వరకు పెరగడం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ధరల పెరుగుదల గృహిణుల బడ్జెట్ను తలకిందులు చేస్తోంది. ధరల మంటకు కారణాలు ఇవే.. వంట నూనెల ధరలు ఆకాశాన్నంటడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. గల్ఫ్, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా వంట నూనెల సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతింది. దీంతో దిగుమతులు తగ్గి మార్కెట్లో అనుకోని విధంగా ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాలపై ఇటీవల విధించిన 12 శాతం ట్యాక్స్ ధరలు భగ్గుమనడానికి మరో కారణమైంది. పండగల సీజన్ కావడంతో మార్కెట్లో వంట నూనెలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అంతర్జాతీయ కారణాలను సాకుగా చూపి స్థానిక వ్యాపారులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మార్కెట్లో డిమాండ్ పెరగడాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు, పాత స్టాక్ను గోదాముల్లో బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన పాత స్టాక్ను సైతం పెరిగిన కొత్త ధరలకే విక్రయిస్తూ వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పౌరసరఫరాలు, విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణ కొరవడటం విమర్శలకు తావిస్తోంది. ధరల మోత.. తూకంలో కోత ఒకవైపు ధరలు పెంచుతున్న కంపెనీలు, మరోవైపు ప్యాకింగ్ విషయంలోనూ మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. సాధారణంగా వినియోగదారులు నూనె ప్యాకెట్ కొనేటప్పుడు ధరను గమనిస్తారే తప్ప, అందులో ఎంత పరిమాణం ఉందనేది నిశితంగా చూడరు. ఇదే అదనుగా పలు కంపెనీలు లీటర్ ప్యాకెట్లో ఉండాల్సిన 910 గ్రాములకు బదులుగా కేవలం 850 గ్రాములు లేదా 800 గ్రాముల నూనెను మాత్రమే నింపి మార్కెట్లోకి వదులుతున్నాయి. అంటే పరోక్షంగా ప్రజలు తక్కువ నూనెకు ఎక్కువ డబ్బు చెల్లిస్తున్నారు. వ్యాపారులు సాగిస్తున్న ఈ దందాపై అధికారులు తక్షణమే స్పందించి, బ్లాక్ మార్కెటింగ్కు అడ్డుకట్ట వేయాలని సామాన్యులు కోరుతున్నారు. -
సాహితీ ప్రస్థానంలో ‘అరసం’కు 90 ఏళ్లు
సీతంపేట: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం(అరసం) విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో అరసం మహాసభ ఘనంగా జరిగింది. ఈ సభకు అరసం విశాఖ ప్రధాన కార్యదర్శి ఉప్పల అప్పలరాజు అధ్యక్షత వహించగా, బసు పోతన స్వాగతోపన్యాసం చేశారు. ఇదే వేదికపై ప్రముఖ రచయిత కె.ఎన్.వై.పతంజలి కథల పుస్తకాన్ని పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూపీఎస్సీ మాజీ సభ్యులు ప్రొఫెసర్ కె.ఎస్.చలం మాట్లాడుతూ.. పతంజలి కథలను ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. అరసానికి ఒక స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం ఉందని తెలిపారు. అభ్యుదయానికి, ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న వైవిధ్యాన్ని సాహితీవేత్తలు సమాజానికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రధాన వక్త, అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ.. అరసం 90 ఏళ్ల చారిత్రక ప్రయాణాన్ని వివరించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి దిగ్గజాలు అరసం వేదికపై ప్రసంగించారని గుర్తుచేశారు. మనిషిని కేంద్ర బిందువుగా చేసుకునే సాహిత్యం రావాలన్నదే అరసం ఆకాంక్ష అని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ పాఠకులు తగ్గుతున్న ప్రస్తుత రోజుల్లో పఠనాసక్తిని పెంచేందుకు అరసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ ప్రచురించిన కె.ఎన్.వై.పతంజలి కథల పుస్తకాన్ని కథా రచయిత ద్విభాష్యం రాజేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం మిత్ర సాహితీ వర్మ ఈ పుస్తకాన్ని సమీక్షించారు. 1971 నాటి పరిస్థితులను అధ్యయనం చేయాలని, సమాజంలో తాను కోరుకున్న మార్పును పతంజలి తన కథల్లో బలంగా గుప్పించారని ఆయన విశ్లేషించారు. ఈ సభలో అరసం రాష్ట్ర కార్యదర్శి శరత్ చంద్ర జ్యోతిశ్రీ, విశాఖ అధ్యక్షుడు అడపా రామకృష్ణ, సాహితీవేత్తలు శేఖర మంత్రి ప్రభాకర్, డా.డి.వి.సూర్యారావు, ఆచార్య వెలమల సిమ్మన్న, డా.బండి సత్యనారాయణ, పి.శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలకు భౌతికకాయం అప్పగింత
కొమ్మాది: నేవల్ డాక్యార్డ్ ఎస్ఏఎక్స్ విభాగం సీఐటీయూ నాయకుడు, ఎండాడ నివాసి జ్యేష్ట వెంకటేశ్వరరావు శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, తెల్లవారుజామున 3 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటేశ్వరరావు మృతికి సీపీఎం విశాఖ జిల్లా కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కార్మిక వర్గ ప్రయోజనాల కోసం చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు. కాగా, వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం వెంకటేశ్వరరావు భౌతిక కాయాన్ని ఆంధ్రా మెడికల్ కళాశాలకు అప్పగిస్తున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు కళాశాల అధికారులకు దేహాన్ని అప్పగించారు. -
ఉద్యోగాల పేరుతో టోకరా: మహిళ అరెస్ట్
అల్లిపురం : నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశచూపి నగదు వసూలు చేస్తున్న ముఠా గుట్టును మహారాణిపేట పోలీసులు రట్టు చేశారు. బాధితుడు సాయిసూర్య ఫిర్యాదుతో ఒక మహిళను అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారయ్యారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు మహిళలు కలిసి నిరుద్యోగులకు నెలకు రూ. 30 వేల జీతంతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. నగరంలోని నోవాటెల్ సమీపంలో ఉన్న ’బ్లాక్ అండ్ వైట్’ హోటల్లో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. నిరుద్యోగుల నుంచి ముందుగా రూ. 5 వేల చొప్పున వసూలు చేశారు. అయితే అదనంగా మరో రూ. 2,500 చెల్లించాలని నిందితులు ఒత్తిడి చేయడంతో బాధితుడు సాయిసూర్యకు అనుమానం వచ్చింది. వెంటనే అతను మహారాణిపేట పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు సదరు హోటల్పై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఒక మహిళను అదుపులోకి తీసుకోగా, మిగిలిన ముగ్గురు మహిళలు తప్పించుకొని పారిపోయారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిరుద్యోగులు ఇటువంటి మోసపూరిత ప్రకటనలు నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
సందర్శకుల కోసం ఆర్వో ప్లాంట్లు
విశాఖ సిటీ: వీఎంఆర్డీఏ కార్యాలయం, చిల్డ్రన్స్ ఎరినా, గురజాడ కళాక్షేత్రంకు వచ్చే సందర్శకులకు రక్షిత తాగునీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్భరత్ పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో సందర్శకుల దాహార్తిని తీర్చేందుకు సామాజిక సేవా కార్యక్రమం(సీఎస్ఆర్)లో భాగంగా ఒక్కో ప్లాంట్ రూ.8 లక్షలతో అందుబాటులోకి తీసుకువచ్చిన దివీస్ సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. -
గేట్లో యశ్వంత్కు 10వ ర్యాంక్
పెదగంట్యాడ : జాతీయ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన గేట్ – 2026 పరీక్షలో జీవీఎంసీ 75వ వార్డు అయ్యన్నపాలేనికి చెందిన గొందేశి ఆదిత్య యశ్వంత్ ప్రతిభ కనబరిచాడు. గురువారం విడుదలైన ఫలితాల్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో జాతీయ స్థాయిలో 10వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం యశ్వంత్ ఐఐటీ కాన్పూర్లో ఎంటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. చదువుకుంటూనే క్రమశిక్షణతో గేట్ పరీక్షకు సిద్ధమై, అందరి అంచనాలను నిజం చేస్తూ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో టాప్ ర్యాంక్ కై వసం చేసుకున్నాడు. యశ్వంత్ సాధించిన ఈ విజయం పట్ల కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా యశ్వంత్ తండ్రి పైడిరెడ్డి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. -
ఆన్లైన్లోనే ‘వీఎంఆర్డీఏ’ టికెట్ల బుకింగ్
విశాఖ సిటీ: వీఎంఆర్డీఏ పరిధిలోని పార్కులు, మ్యూజియాలు, పర్యాటక ప్రాంతాల్లో టికెట్ బుకింగ్ సేవలను మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేక యాప్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చైర్మన్ ఎం.వి.ప్రణవ్గోపాల్, కమిషనర్ ఎన్.తేజ్భరత్ తెలిపారు. నూతనంగా రూపొందించిన విస్టా, టప్పల్స్ యాప్లను గురువారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో వారు ఆవిష్కరించి మాట్లాడారు. ఇప్పటివరకు వీఎంఆర్డీఏకు చెందిన అన్ని పర్యాటక ప్రాంతాలు, పార్కులు, మ్యూజియాల్లో టికెట్లను నేరుగా తీసుకోవాల్సి వచ్చేదని, దీంతో క్యూల్లో పర్యాటకులు ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి తాజాగా వీఎంఆర్డీఏ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ టికెటింగ్ అప్లికేషన్ పేరుతో విస్టా అనే యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ ద్వారా అన్ని పర్యాటక ప్రదేశాల్లో ప్రవేశానికి టికెట్లను సులభంగా పొందవచ్చని వెల్లడించారు. అలాగే వీఎంఆర్డీఏకు చెందిన వేదికలు, కల్యాణ మండపాలను కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ప్రజలందరూ విస్టా యాప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరిపాలనలో పారదర్శకత కోసం నూతనంగా టప్పల్స్ అనే యాప్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి మురళీకృష్ణ, సీఈ వినయ్కుమార్, సీఏవో హరిప్రసాద్, ఎస్ఈలు భవానీ శంకర్, మధుసూదనరావు, ఈఈలు జేసీపీ సింగ్, రామరాజు తదితర అధికారులు పాల్గొన్నారు. -
అప్పన్న అన్నప్రసాద పథకానికి రూ.3.66 లక్షల విరాళం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి శాశ్వత అన్నప్రసాద పథకానికి నగరానికి చెందిన నారాయణ సేవా దళం స్వచ్ఛంద సంస్థ విరాళాన్ని అందజేసింది. గురువారం దేవస్థానం కార్యాలయంలో సంస్థ సభ్యులు రూ.3,66,111 విరాళానికి సంబంధించిన చెక్కును సింహాచలం ఈవో జె.వెంకటరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. భక్తులు అందజేసే ఇటువంటి విరాళాలు అన్నప్రసాద పథకాన్ని మరింత విస్తృతంగా నిర్వహించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. విరాళం అందజేసిన వారిలో నారాయణ సేవా దళం సభ్యులు పవన్కుమార్, రామచంద్రమూర్తి, లక్ష్మి, భారతి, అప్పలరాజు, రాంబాబు, ఉమ, కాసు శ్రీలక్ష్మి తదితరులు ఉన్నారు. రేపు పద్మనాభ రెడ్డి స్మారక న్యాయ సదస్సువిశాఖలీగల్ : న్యాయకోవిదుడు, సీనియర్ న్యాయవాది దివంగత సి.పద్మనాభరెడ్డి స్మారక న్యాయసదస్సు ఈనెల 21న నిర్వహించనున్నట్టు భారత న్యాయవాదుల సమాఖ్య జాతీయ కార్యదర్శి కె.ఎస్.సురేష్ కుమార్, నగర కమిటీ కార్యదర్శి జహారా తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని నూతన భవనంలో శనివారం సాయంత్రం 5 గంటలకు న్యాయసదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాధ్ రాయ్ ముఖ్యఅతిథిగాను, జస్టిస్ చీమలపాటి రవి, తెలంగాణా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ రాజు, న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు చలసాని అజయ్కుమార్, ముప్పాళ్ల సుబ్బారావు తదితరులు హాజరవుతారని తెలిపారు. -
సింహగిరిపై సామూహిక అక్షరాభ్యాసాలు
సింహాచలం: ఉగాదిని పురస్కరించుకుని సింహగిరిపై చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాసాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉగాది రోజున 6(ఎ) కేటగిరీకి చెందిన ప్రధాన ఆలయాల్లో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు.. గురువారం సింహాచలం దేవస్థానంలో ఈ కార్యక్రమాన్ని విశేషంగా జరిపారు. ఆలయ కల్యాణమండపంలో చిన్నారులను వరుసగా కూర్చోబెట్టారు. స్వామి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిల వద్ద పూజలో ఉంచిన పలకలను, బలపాలను చిన్నారులకు ఉచితంగా అందజేశారు. అనంతరం అర్చకులు చిన్నారుల చేత అక్షరాలు దిద్దించి, వేద ఆశీర్వచనాలు అందజేశారు. తదనంతరం వారందరికీ స్వామి దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఉప ప్రధానార్చకులు సాతులూరి నరసింహాచార్యులు, ఏఈవోలు ఎస్.రాధ, తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
అభివృద్ధి దిశగా జిల్లా: పంచాంగకర్తలు
బీచ్రోడ్డు: తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఉగాది వేడుకలు వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పరాభవ నామ సంవత్సరంలో జిల్లా మరింత అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని పంచాంగకర్తలు బ్రహ్మశ్రీ అక్కాజోస్యుల రమేష్, గిరి శ్రీనివాసశర్మ జోస్యం చెప్పారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ తదితరులు హాజరయ్యారు. వేద పండితులు అతిథులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉగాది పచ్చడిలోని ఆరు రుచుల లాగే జీవితంలోని సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. నగర పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన కవి సమ్మేళనం, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన కళాకారులను ఎమ్మెల్యే, కలెక్టర్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో శేషశైలజ, టూరిజం శాఖ అధికారులు కల్యాణి, మాధవి, జగదీశ్, వీఎంఆర్డీఏ సెక్రటరీ మురళీకృష్ణ, సీఈ వినయ్ కుమార్, డీఎస్వో భాస్కరరావు, డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి పాల్గొన్నారు. కనులపండువగా ఉగాది వేడుకలు -
సీనియర్ జర్నలిస్ట్ శ్రీనుబాబుకు ఉగాది పురస్కారం
మహారాణిపేట: పాత్రికేయ, సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేస్తున్న సీనియర్ పాత్రికేయుడు గంట్ల శ్రీనుబాబు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ముఖ్యమంత్రి ఆయన్ని శాలువాతో సత్కరించి, తెలుగు తల్లి జ్ఞాపిక, రూ.10 వేల నగదు పురస్కారం, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబును తోటి పాత్రికేయులు, మిత్రులు అభినందనలు తెలిపారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నాయకుడిగా, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
అహంకారం వీడి వాగ్దానాలను నెరవేర్చాలి
మహారాణిపేట : పరాభవ నామ సంవత్సరంలోనైనా కూటమి ప్రభుత్వ పాలకుల అహంకారం తగ్గి, ప్రజల పట్ల బాధ్యతతో పనిచేసే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల శ్రీనివాస్, దేవన్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ పరాభవ సంవత్సరంలోనైనా కూటమి ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే జ్ఞానాన్ని పాలకులకు భగవంతుడు ప్రసాదించాలని, శ్రీవేంకటేశ్వర స్వామి కటాక్షం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కె.సతీష్, నియోజకవర్గ పరిశీలకులు బాణాల శ్రీనివాస్, పేడాడ రమణికుమారి, ముఖ్యనేతలు పేర్ల విజయచంద్ర, పీలా వెంకట లక్ష్మి, తాడి జగన్నాథ రెడ్డి, అల్లు శంకర్ రావు, కటారి అనిల్రాజు, అల్లంపల్లి రాజబాబు, ద్రోణంరాజు శ్రీవాత్సవ, పీవీ సురేష్, శశికళ, సాడి పద్మారెడ్డి , బిపిన్ కుమార్జైన్, అంబటి శైలేష్, శ్రీదేవి వర్మ, బొండా ఉమామహేశ్వరరావు, ప్రసాద్, జీలకర్ర నాగేంద్ర, బొంగవల్లి గోవింద్, తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్!
● యలమంచిలిలో దొంగల బీభత్సం ● ఒకే రోజు పలు ఇళ్లల్లో ఆభరణాలు, నగదు అపహరణ యలమంచిలి రూరల్: యలమంచిలి పట్టణంలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. ఎవరైనా రెండ్రోజులు ఇంటికి తాళం వేసి ఎక్కడికై నా వెళ్తే తిరిగి వారొచ్చేసరికి ఆ ఇల్లు గుల్లవుతోంది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని రాంనగర్, టిడ్కో గృహ సముదాయాల్లో పలు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారు. తాళాలు, తలుపు గడియలు పగులగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి అందిన బంగారు వెండి వస్తువులతో పాటు నగదు అపహరించుకుపోయారు. రాంనగర్ మన్నా చర్చి పక్కన విశ్రాంత సైనికోద్యోగి మేడిశెట్టి సూరిబాబు తన భార్యతో కలిసి ఇటీవల కొద్ది రోజుల క్రితం హైదరాబాదు వెళ్లారు. ఇంట్లో పెంపుడు కుక్కకు ఆహారం పెట్టమని తమకు తెలిసిన ఒక మహిళకు పురమాయించారు. రోజూలాగే గురువారం మధ్యాహ్నం కుక్కకు అన్నం పెట్టడానికి ఇంటికి వచ్చిన మహిళ తలుపులన్నీ తెరిచి ఉండడం చూశారు. తాళాలు పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగిందని గుర్తించి యజమానికి ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు భావిస్తున్నారు. టిడ్కో కాలనీలో బీ3 బ్లాకులో జీఎఫ్ 7 ప్లాట్లో సీరందాసు మురళి, పూజిత దంపతులు కొత్త అమావాస్య ఉగాది పండుగల సందర్భంగా మంగళవారం పెదపల్లి వెళ్లారు. బుధవారం రాత్రి వారుంటున్న ఇంట్లో చోరీ జరిగింది. సుమారు 10 తులాల వెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే కాలనీలో బీ2 బ్లాకు జీఎఫ్ 6లో నివాసముంటున్న ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న కొండేటి సుధీర్ బుధవారం రాత్రి డ్యూటీకి వెళ్లి గురువారం ఉదయం ఇంటికి వచ్చేసరికి ప్లాటు తాళాలు విరగ్గొట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందర చేసిన దొంగలు పర్సులో దాచిన రూ.3500 నగదు పట్టుకుపోయారని బాధితుడు తెలిపారు. జీఎఫ్ 10లో అద్దెకుంటున్న శెట్టి జ్యోతి పై ఫ్లాట్లో బుధవారం రాత్రి నిద్రపోవడానికి వెళ్లారు. ఉదయం వచ్చి చూడగా తన ఇంట్లో చోరీ జరిగినట్టు గుర్తించారు. ఏ4 బ్లాకులో గంగమ్మ, వెంకన్న ఉంటున్న జీఎఫ్6 ప్లాటులో కూడా చోరీ జరిగింది. వీరిద్దరూ నాలుగు రోజుల క్రితం వేరే ఊరు వెళ్లారు. తాళాలు తొలగించి ఇంట్లోకి చొరబడిన దొంగలు విలువైన వస్తువులు అపహరించుకుపోయారని తెలిసింది. చోరీలకు పాల్పడిన నిందితులు ఇళ్లలో బీరువాలు, కప్ బోర్డుల్లో వస్తువులు, దుస్తులు చిందరవందర చేసి ఆభరణాలు, నగదు అపహరించుకుపోయారు. ఒకేరోజు పలు ఇళ్లలో చోరీలు జరగడంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణ పోలీసులు రాత్రి గస్తీ పెంచి చోరీలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
చందనోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఏర్పాట్లను పరిశీలించిన సీపీ శంఖబ్రత బాగ్చి సింహాచలం : వచ్చే నెల 20న జరిగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని దృష్టిలో ఉంచు కుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీపీ శంఖబ్రత బాగ్చి అధికారులకు సూచించారు. గురువారం సింహగిరిపై జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈవో జె.వెంకటరావు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పలు సూచన లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూల ను క్రమబ ద్ధీకరించాలని ఆదేశించారు. రద్దీ నియంత్రణ కోసం కీలక ప్రాంతాల్లో హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ, పోలీస్ సిబ్బంది స మన్వయంతో భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలని తెలిపారు. ఘాట్ రోడ్డు నుంచి కొండపై, పార్కింగ్ ప్రాంతాల వరకు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నట్లు తెలిపారు. 24న మంత్రుల సమీక్ష : చందనోత్సవం నిర్వహణపై ఈ నెల 24న జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈసారి సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పెద్దపీట వేస్తామని, పక్కా ప్రణాళికతో ఉత్సవాన్ని జరిపిస్తామని పేర్కొన్నారు. ఈనెల 29న జరిగే స్వామివారి వార్షిక కల్యాణోత్సవాన్ని కూడా విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉగాది సందర్భంగా గురువారం సింహగిరిపై స్వామిని దర్శించుకున్న గంటా, పెళ్లిరాట ఉత్సవంలో పాల్గొన్నారు. -
ఏప్రిల్ 4 నుంచి రైల్వే క్రీడా సంబరాలు
విశాఖ స్పోర్ట్స్: వాల్తేరు రైల్వే అంతర విభాగాల క్రీడా పోటీలు ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వివిధ విభాగాలకు చెందిన రైల్వే ఉద్యోగులు మొత్తం 12 క్రీడాంశాల్లో తలపడనున్నారు. తూర్పు కోస్తా రైల్వే క్రీడా సంఘం(వాల్తేరు) ఆధ్వర్యంలో ఈ పోటీలు ఏప్రిల్ 30 వరకు జరగనున్నాయి. పురుషులు, మహిళలకు వేర్వేరుగా టేబుల్ టెన్నిస్, టెన్నిస్, వెయిట్లిఫ్టింగ్, వాలీబాల్, బ్యాడ్మింటన్, చదరంగం, క్యారమ్స్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. పురుషుల విభాగంలో అదనంగా ఫుట్బాల్, బాడీబిల్డింగ్, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. ఈ క్రీడల్లో అకౌంట్స్, వైద్య, ఆపరేటింగ్, ఇంజినీరింగ్, వాణిజ్య, విద్యుత్, మెకానికల్, పర్సనల్, నిర్మాణ, టెలికాం, డీఎల్ఎస్, ఓపీ, టీఆర్ఎస్, టీఆర్టీ, జనరల్, ఆర్పీఎఫ్, భద్రత, స్పోర్ట్స్ విభాగాలకు చెందిన 19 జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోహ్రా గురువారం క్రీడా పోటీల పోస్టర్ను విడుదల చేశారు. ఏడీఆర్ఎంలు కె.రామారావు, క్రీడాధికారి ఎం.హరనాథ్, సహాయాధికారి దేవ్ సాహు, ఎన్.ఉష తదితరులు పాల్గొన్నారు. -
● విశాఖలో ఉగాది వైభవం
డాబాగార్డెన్స్: తెలుగు లోగిళ్లలో కొత్త ఆశల వెలుగులు నింపుతూ ’పరాభవ’ నామ సంవత్సర ఉగాది విశాఖ నగ రంలో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించింది. ప్రకృతి పలకరింపు, మంత్రోచ్ఛారణల పరవశం, భక్తుల జయజయధ్వానాల మధ్య సాగరతీరం భక్తి సాగరమై ఉప్పొంగింది. గురువారం తెల్లవారుజాము నుంచే ఉగాది వేడుకలు నగరంలో అత్యంత వైభవంగా జరిగాయి. స్వర్ణమయీ.. కనకమహాలక్ష్మి : నగరప్రజల ఆరాధ్యదైవం, బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా దర్శనమిచ్చారు. ధగధగలాడే స్వర్ణాభరణాల అలంకరణలో అమ్మవారి రూపం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. తెల్లవారుజాము నుంచే మామిడి తోరణాలు, సుగంధ పుష్పాలతో ముస్తాబైన ఆలయ ప్రాంగణం భక్తుల కోలాహలంతో కిటకిటలాడింది. ఆలయాల్లో ఆధ్యాత్మిక కోలాహలం ఆశీలమెట్టలోని సంపత్ వినాయగర్ ఆలయం ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడింది. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు పూజలు చేయించేందుకు వాహనదారులు పెద్ద సంఖ్యలో తర లివచ్చారు. రమా సత్యనారాయణ స్వామి ఆలయం, అంబికాబాగ్ సీతారామ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం పలుచోట్ల అన్నప్రసాద వితరణ చేపట్టారు. సందడిగా వ్యాపార సముదాయాలు నగరంలోని వాణిజ్య రంగం కూడా ఉగాది జోష్తో నిండిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా నూతన వస్త్రాలు ధరించి పండగ శుభాకాంక్షలు పంచుకున్నారు. ఉగాదిని శుభప్రదంగా భావించి బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుకు జనం ఆసక్తి చూపడంతో షోరూమ్లన్నీ కిక్కిరిసిపోయాయి. -
చల్లని కబురు
వన్యప్రాణులకుఆరిలోవ: భానుడు భగభగలాడుతున్నాడు.. సెగలు పుట్టిస్తున్నాడు. మనుషులే ఎండ వేడికి అల్లాడిపోతుంటే, ఎన్క్లోజర్లలో ఉండే మూగజీవాల పరిస్థితి ఏమిటి? అందుకే, నగరంలోని ఇందిరాగాంధీ జూ పార్కు అధికారులు అప్రమత్తమయ్యారు. వన్యప్రాణులకు వేసవి తాపం తగలకుండా ‘కూల్’ ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. మెనూలో మార్పులు వేసవిలో వన్యప్రాణులు నీరసించకుండా జూ అధికారులు ఆహారంలో కీలక మార్పులు చేశారు. కేవలం మాంసం, గడ్డి మాత్రమే కాకుండా.. శరీరంలో నీటి శాతాన్ని పెంచే పండ్లు, ద్రవ పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పులులు, సింహాలు, ఎలుగుబంట్లకు తాగే నీటిలో గ్లూకోజ్ పౌడర్, పాలిబియాన్ కలిపి అందిస్తున్నారు. చింపాంజీలకు నిత్యం కొబ్బరి బొండాల నీటిని అందిస్తూ వాటిని ఉత్సాహంగా ఉంచుతున్నారు. పులులు, ఎలుగుబంట్లు, కోతులు తదితర జంతువులకు నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంగా అందిస్తున్నారు. గజరాజులకు ‘జల’ విహారం : ఏనుగులకు వేసవిలో నీరు చాలా అవసరం. అందుకే వాటి కోసం ప్రత్యేకంగా 10,000 లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకును, స్నానం చేయడానికి ప్రత్యేక తొట్టిని సిద్ధం చేశారు. నిత్యం వాటిపై నీటిని చిలకరిస్తూ ఎండ దెబ్బ తగలకుండా చూస్తున్నారు. చింపాంజీ నైట్క్రాల్స్లో చల్లదనం కోసం ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. సందర్శకులకు ఆర్వో నీరు కేవలం జంతువులకే కాదు, జూ సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం కూడా పక్కా ఏర్పాట్లు చేశారు. జూ అంతటా ఆరు చోట్ల ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు. సందర్శకులు విశ్రాంతి తీసుకోవడానికి షెడ్లను సిద్ధం చేశారు. ఏనుగులు, పులులు, ఎలుగుబంట్లు, జింకలు, కనుజులు, జిరాఫీలు ఎన్క్లోజర్ల వద్ద, పక్షులు, పాములు, కోతులు జోన్ల వద్ద షెడ్లను సందర్శకుల కోసం శుభ్రం చేయిస్తున్నారు. ఎన్క్లోజర్లలో పందిళ్లు.. సందర్శకులకు ఆర్వో నీళ్లు జూలో ఎండలను తట్టుకునేలా ప్రత్యేక ఏర్పాట్లుఎన్క్లోజర్లలో ‘నేచురల్ ఏసీ’ జంతువుల నివాస ప్రాంతాలను చల్లబరిచేందుకు సహజసిద్ధమైన పద్ధతులను వాడుతున్నారు. జింకలు, కోతులు, పులులు, ఎలుగుబంట్లు, సింహాలు తదితర జంతువుల ఎన్క్లోజర్లలో ఎండ తగలకుండా తాటాకులతో పాకలు వేస్తున్నారు. నైట్క్రాల్స్ పైన వేడి తగ్గడానికి తెల్లటి వైట్ వాష్ వేశారు. పక్షుల ఎన్క్లోజర్లలో వట్టివేళ్ల (కస్కస్ గడ్డి) చాపలను ఏర్పాటు చేసి, వాటిని రోజుకు మూడు నాలుగు సార్లు నీటితో తడుపుతున్నారు. దీని వల్ల లోపల వాతావరణం ఏసీ గదిలా చల్లగా మారుతోంది. పాముల జోన్, ఇతర ఎన్క్లోజర్లలో స్పింక్లర్లు అమర్చి తేమను కాపాడుతున్నారు. -
కత్తెర కాన్పు
కాసుల పాన్పుపై మహారాణిపేట : నెలలు నిండిన గర్భిణి ఆస్పత్రికి వెళితే చాలు.. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులకు కాసుల గలగలే. బిడ్డ అడ్డం తిరిగింది.. ఉమ్మనీరు తగ్గిపోయింది.. తక్షణం ఆపరేషన్ చేయకపోతే ముప్పు పొంచి ఉంది అంటూ అప్పటికప్పుడు భయపెట్టి ఆపరేషన్ థియేటర్కు తరలిస్తున్నారు. మరోవైపు ఫలానా ముహూర్తానికే మా వంశోద్ధారకుడు పుట్టాలి అంటూ కొందరు మూఢనమ్మకాలతో కత్తెర కాన్పులను కోరుకుంటున్నారు. ఫలితంగా జిల్లాలో సిజేరియన్లు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. పాలిచ్చే తల్లుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నా.. ప్రైవేట్ ఆస్పత్రులకు మాత్రం ఇది లాభసాటి వ్యాపారంగా మారింది. గణాంకాలు ఏం చెబుతున్నాయంటే.. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 271 ఆస్పత్రులు ఉండగా, వాటిలో 102 వరకు మాతాశిశు, ప్రసూతి ఆస్పత్రులే ఉన్నాయి. గతంలో గీతం ఆస్పత్రిలో పెద్ద ఎత్తున సిజేరియన్లు జరుగుతున్నాయని గుర్తించిన అప్పటి కలెక్టర్ మల్లికార్జున భారీ జరిమానా విధించారు. అయినా ప్రైవేట్ ఆస్పత్రుల తీరులో మార్పు రాలేదు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు నమోదైన డేటా ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 4,518 సిజేరియన్లు(39.84శాతం) జరగ్గా, 4,309 సాధారణ ప్రసవాలు జరిగాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏకంగా 6,820 సిజేరియన్లు(60.15 శాతం) జరగ్గా, 4,263 సాధారణ ప్రసవాలు జరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం సక్రమంగా అందడం లేదన్న అపోహలతో ఎక్కువ మంది ప్రైవేట్ను ఆశ్రయిస్తుండటమే ఈ దోపిడీకి ప్రధాన కారణం. ముహూర్తాల మోజులో. వైద్యుల కాసుల కక్కుర్తి ఒక వైపైతే.. ప్రజల మూఢనమ్మకాలు మరోవైపు సిజేరియన్లకు కారణమవుతున్నాయి. శుభ ఘడియాలు, నక్షత్రాలు, తిథుల ప్రకారం ఫలానా రోజు, ఫలానా సమయానికే బిడ్డ పుట్టాలంటూ పురోహితుల సూచనలతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి ముహూర్తాలకు వైద్యులు అంగీకరించరు కాబట్టి, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా, కత్తి కోతలతో తల్లి ఆరోగ్యానికి భవిష్యత్తులో హాని అని తెలిసినా.. ముహూర్తాలకే మొగ్గుచూపుతున్నారు. అమాయక ప్రజల ఈ సెంటిమెంట్ను ప్రైవేట్ ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. అసలు సిజేరియన్ ఎప్పుడు చేయాలి? నిజానికి సిజేరియన్ అనేది అత్యవసర పరిస్థితుల్లో తల్లీబిడ్డల ప్రాణాలు నిలపడానికి మాత్రమే చేసే ప్రక్రియ. వైద్య నిబంధనల ప్రకారం బిడ్డ ఎదురు కాళ్లతో ఉన్నప్పుడు, శిశువు బరువు అసాధారణంగా పెరిగినా, కడుపులో అడ్డం తిరిగినా, ఉమ్మనీరు బాగా తగ్గిపోయినా, లేదా శిశువు ఉమ్మనీరు తాగేసినా, తల్లికి బీపీ, షుగర్ తదితర ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు, కవలలు (ఇద్దరు లేదా ముగ్గురు) జన్మించే సమయంలో ఆపరేషన్ చేయాలి. దొండపర్తికి చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం కలెక్టరేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. రెండు రోజుల తర్వాత ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. తొమ్మిది నెలలుగా అంతా బాగుందన్న వైద్యులు.. ఒక్కసారిగా మాట మార్చారు. ‘బిడ్డ అడ్డం తిరిగింది, వెంటనే సిజేరియన్ చేయకపోతే తల్లీబిడ్డల ప్రాణాలకే ప్రమాదం’అంటూ కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేశారు. గత్యంతరం లేక వారు ఆపరేషన్కు అంగీకరించారు. తీరా డిశ్చార్జి సమయంలో అన్ని ఖర్చులు కలిపి రూ.1.20 లక్షల బిల్లు చేతిలో పెట్టడంతో ఆ కుటుంబం కంగుతింది. అప్పులు చేసి మరీ బిల్లు చెల్లించాల్సి వచ్చిందని వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఇది కేవలం ఒక్క మహిళ పరిస్థితే కాదు.. జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న తంతే! అంతా కాసుల కోసమే.. సాధారణ కాన్పు జరిగితే రెండు, మూడు రోజుల్లోనే తల్లీబిడ్డను డిశ్చార్జి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఆస్పత్రికి వచ్చే ఆదాయం తక్కువ. అదే సిజేరియన్ అయితే కనీసం వారం రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచుకోవచ్చు. గది అద్దెలు, వివిధ ల్యాబ్ పరీక్షలు, మందులు, ఆపరేషన్ థియేటర్ చార్జీలు.. ఇలా అన్ని రకాలుగా కలిపి రూ.30 వేల నుంచి లక్ష రూపాయలకు పైగా వసూలు చేయవచ్చు. ఈ కక్కుర్తితోనే కొన్ని ఆస్పత్రులు దాదాపు తొమ్మిది నెలల పాటు నార్మల్ డెలివరీ అని నమ్మబలికి, చివరి నిమిషంలో భయపెట్టి సిజేరియన్ల వైపు మళ్లిస్తున్నాయి. దీనిపై ఆరోగ్య శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, అనవసర సిజేరియన్లు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఘనంగా చిలకల తీర్థం
పాయకరావుపేట: పట్టణంలో గురువారం ఘనంగా పేరంటాలమ్మ తీర్థం ఘనంగా జరిగింది. ఉగాది పురస్కరించుకుని గురువారం మంగవరం రోడ్డులో గల సీతారామ ఆలయానికి పక్కన గల పేరంటాలమ్మ గుడిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. పేరంటాలమ్మకు పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, అరటిపండ్లు, గాజులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు మలిపెద్ది కుటుంబీకులు చేశారు. చిలకల తీర్థంగా పిలుచుకునే ఈ పండగ సందర్భంగా రంగు రంగులతో తయారు చేసిన పంచదార చిలకలు, ఆట వస్తువులు, దేవుని బొమ్మలు, చిన్న పిల్లల బొమ్మలను విక్రయించారు. రంగు రంగుల చేటలు, బెల్లంతో తయారు చేసిన చిన్న సైజు మిఠాయి పొట్లాలను భక్తులు ఆసక్తిగా కొనుగోలు చేశారు. అదేవిధంగా సీతారామ ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించి సీతారాములను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. వానరసేన సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. సీఐ జి.అప్పన్న ఆధ్వర్యంలో పోలీసులు తీర్థంలో ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. -
కేజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స
మహారాణిపేట: తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఓ గర్భిణికి కేజీహెచ్లో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పలు విభాగాల వైద్యుల సమన్వయంతో చికిత్స అందించి తల్లి, బిడ్డను క్షేమంగా డిశ్చార్జ్ చేసినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. నర్సీపట్నం ప్రాంతానికి చెందిన అనిత (20) గర్భిణిగా ఉండగా తీవ్రమైన రక్తహీనత (హీమోగ్లోబిన్ కేవలం 5 గ్రాములు)తో ఈ నెల 27న కేజీహెచ్ గైనకాలజీ విభాగాన్ని సంప్రదించింది. యూనిట్ చీఫ్ డాక్టర్ సౌమిని ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్. గీతావందన పర్యవేక్షణలో అనితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో అనితకు తీవ్రమైన కామెర్లు, చిన్న రక్తకణాల లోపం, జ్వరం, అలాగే గర్భాశయంలో ఉమ్మనీరు (అమ్నియోటిక్ ఫ్లూయిడ్) చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదనంగా మలేరియా, ఆటో ఇమ్యూన్ హీమోలిటిక్ అనీమియా కూడా ఉన్నట్లు తేలింది. ఆమె పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో సుమారు 50–60 యూనిట్ల రక్తాన్ని క్రాస్మ్యాచ్ చేసినప్పటికీ సరిపోలకపోవడంతో జనరల్ మెడిసిన్ సహా పలు విభాగాల వైద్యులు కలిసి ప్రత్యేక చికిత్స అందించారు. అనంతరం ఈ నెల 11న 6.4 గ్రాముల హీమోగ్లోబిన్ స్థాయిలోనే, తక్కువ ఉమ్మనీరుతో సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండడంతో డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్ వాణి తెలిపారు. ఈ సందర్భంగా చికిత్సలో పాల్గొన్న గైనకాలజీ, ఇతర విభాగాల వైద్యులను ఆమె అభినందించారు. -
ఇసుకతోటలో రక్తపాతం
రౌడీషీటర్ ఘాతుకం.. యువకుడి హత్యఎంవీపీకాలనీ: నగరంలోని ఇసుకతోట రామాలయం సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాతకక్షల నేపథ్యంలో బొచ్చు వెంకటేష్(19) అనే యువకుడు రౌడీషీటర్ చేతిలో దారుణ హత్యకు గురవగా, బాకీ సంతోష్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో రౌడీషీటర్ పల్లా అనిల్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడికావడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. నిత్యం రౌడీషీటర్లను పర్యవేక్షిస్తున్నా, తరచూ కౌన్సెలింగ్లు ఇస్తున్నా.. ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. రణస్థలం, పూసపాటిరేగ ప్రాంతాలకు చెందిన బొచ్చు వెంకటేష్, బాకీ సంతోష్ వరుసకు అన్నదమ్ములు. ఉపాధి నిమిత్తం వీరిద్దరూ విశాఖలో ఉంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పల్లా అనిల్పై ఎంవీపీకాలనీ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. గతంలో అతని ఆగడాలు మితిమీరడంతో పోలీసులు నగర బహిష్కరణ కూడా చేశారు. కొంతకాలం రణస్థలంలో ఉన్న అనిల్ ఇటీవల మళ్లీ నగరానికి చేరుకున్నాడు. రణస్థలంలోనే అనిల్కు, వెంకటేష్కు పరిచయాలు ఉన్నాయి. కాగా.. వెంకటేష్ భార్య విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా తగాదాలు నడుస్తున్నాయి. దీనిపై గతంలోనే వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మూడు నెలల కిందట పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అయినా వీరి మధ్య వివాదం సద్దుమణగలేదు. ఇటీవల మరోసారి గొడవ జరగడంతో ‘చూసుకుందాం రా’ అంటూ వెంకటేష్ సవాల్ విసిరినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇసుకతోట రామాలయం వద్ద వెంకటేష్, అనిల్ తరఫు వాళ్లు తలపడ్డారు. ముందస్తు పథకం ప్రకారం కత్తితో సిద్ధంగా వచ్చిన అనిల్, ఒక్కసారిగా వెంకటేష్, సంతోష్లపై దాడి చేశాడు. బలమైన కత్తిపోట్లు తగలడంతో వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సంతోష్ తీవ్ర గాయాలపాలవగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నైట్ బీట్ పోలీసులు అక్కడికి చేరుకుని సంతోష్ను వెంటనే కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనలో సుమారు 12 మంది యువకులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ నరసింహమూర్తి గురువారం తెలిపారు. -
సింహగిరిపై పెళ్లి సందడి
సింహగిరి మాడ వీఽధిలో స్వామికి తిరువీధి నిర్వహిస్తున్న అర్చకులు సింహాచలం: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి సన్నిధిలో పెళ్లి సందడి మొదలైంది. ఈ నెల 29న జరగనున్న స్వామివారి వార్షిక కల్యాణోత్సవానికి అంకురార్పణగా గురువారం అత్యంత వైభవంగా ‘పెళ్లిరాట’ ఉత్సవాన్ని నిర్వహించారు. ముస్తాబైన పెళ్లికుమారుడు.. వేదమంత్రాల సాక్షిగా రాట మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయ ఆస్థాన మండపంలో ఉత్సవ మూర్తి గోవిందరాజస్వామిని పెళ్లికుమారుడిగా అలంకరించి, శ్రీదేవి, భూదేవి సమేతంగా వేంజేపచేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ పుణ్యాహవాచనం నిర్వహించిన అనంతరం.. రాజగోపురం, కల్యాణ వేదిక ప్రాంగణాల్లో ముత్తైదువులు పసుపు కుంకుమలతో పెళ్లిరాటలను ప్రతిష్టించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఈవో జల్లేపల్లి వెంకటరావు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అప్పన్న పంచాంగం: ఆదాయం కంటే వ్యయమే అధికం తులారాశి, స్వాతి నక్షత్ర జాతకుడైన అప్పన్న స్వామి వారికి ఈ ‘పరాభవ’ నామ సంవత్సరంలో ఆదాయం 5 కాగా, వ్యయం 14గా ఉందని ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు పంచాంగ శ్రవణంలో వెల్లడించారు. భక్తులు భారీగా తరలివచ్చి ఈ ఆధ్యాత్మిక విశేషాలను ఆలకించారు. మబ్బుల మాటున ‘భాస్కరుడు’ భక్తులకు తప్పని నిరాశ : ఏటా ఉగాది సాయంత్రం సూర్యకిరణాలు రాజగోపురం గుండా ప్రసరించి, అంతరాలయంలోని మూలవిరాట్ను తాకడం ఇక్కడి ప్రత్యేకత. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు వేచి చూశారు. అయితే ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్మేయడంతో ఈసారి సూర్యకిరణాలు స్వామివారిని తాకలేదు. దీంతో ఈ అపురూప ఘట్టాన్ని చూడాలనుకున్న భక్తులకు నిరాశ తప్పలేదు. -
ఉగాది ఉషస్సు
లేలేత మామిడి ఆకుల తోరణాలు, వీనుల విందు చేసే కోకిలమ్మ కుహు కుహు రాగాలు, గాలితో పాటే వస్తున్న వేప పువ్వు సుగంధాలు.. వెరసిప్రకృతి కాంత పచ్చని పట్టుచీర కట్టి ముస్తాబైన వేళ.. తెలుగులోగిళ్లలోకి చిరునవ్వులతో అడుగుపెడుతున్న తొలి పండగ ఉగాది. తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం... ఈ ఆరు రుచుల కలయికతో సిద్ధమయ్యే ఉగాది పచ్చడి.. జీవితం అంటే కేవలం ఆనందమే కాదు కష్టసుఖాల, భావోద్వేగాల సమ్మేళనం అనే గొప్ప జీవన సత్యాన్ని మనకు బోధిస్తుంది. గడిచిన కాలంలోని చేదు జ్ఞాపకాలను వదిలేసి, కొత్త ఆశలు, మధురమైన స్వప్నాలతో సరికొత్త అడుగులు వేస్తూ.. ఈ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుదాం. –ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
కూటమి వైఫల్యాలపై రాజీలేని పోరాటం చేద్దాం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విశాఖ నగరాన్ని వేదికగా చేసుకుని కూటమి నేతలు సాగిస్తున్న భూఆక్రమణలపై రాజీలేని పోరాటం చేయాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల ఆత్మీయ సత్కారం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగనన్న మాట.. మీకే మా భరోసా! ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రా నున్న జీవీఎంసీ ఎన్ని కల్లో పార్టీ వెంటే ఉన్న కార్పొరేటర్లకు మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటగా హామీ ఇచ్చారు. ‘మీరు ఎక్స్ కార్పొరేటర్లు కాదు.. నెక్ట్స్ కార్పొరేటర్లు‘ అని ఉత్సాహపరిచారు. విలువులు, విశ్వసనీయతతో పనిచేసేవారే మన నాయకుడికి ఇష్టమని, ఆ బాటలోనే నడుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. విశాఖలో భూదోపిడీపై ఉద్యమించాలి: కేకే రాజు వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తు త కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న భూదోపిడీని ప్రజలకు వివరించాలని జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కోరారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులపై ఒత్తిడి తేవాలని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైఎస్సార్సీపీ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అభివృద్ధి శూన్యం: వరుదు కల్యాణి ఏడాది కాలంగా కూ టమి నేతలు కుట్రలు చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారే తప్ప, నగరాభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఎమ్మెల్సీ -
మత్స్యకారుల ప్రాణదాత ట్రాన్స్పాండర్
మహారాణిపేట: సముద్రంలో వేట సాగిస్తుండగా ప్రమాదంలో చిక్కుకున్న బోటును గుర్తించడంలో ట్రాన్స్పాండర్ పరికరం కీలక పాత్ర పోషించింది. ఈ పరికరం అందించిన సమాచారంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సకాలంలో స్పందించి, బోటుతో పాటు అందులోని ఆరుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వివరాలివి.. ఈ నెల 5న ఫిషింగ్ హార్బర్ నుంచి ఎం.ఎం.108 నంబర్ గల బోటు వేట కోసం సముద్రంలోకి వెళ్లింది. 12వ తేదీన తీరం నుంచి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో వేట సాగిస్తుండగా, బోటు ఇంజిన్ అకస్మాత్తుగా పాడైపోయింది. నడి సముద్రంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బోటులోని శ్రీలంకకు చెందిన నలుగురు, విశాఖకు చెందిన ఇద్దరు మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో తమను కాపాడాలని బోటు యజమాని బి.రాజుకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన యజమాని.. మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు ద్వారా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ను సహాయం కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది. అయితే, ఇటీవల ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఆ బోటుకు ట్రాన్స్పాండర్ పరికరాన్ని అమర్చారు. ఆ పరికరం పంపిన సిగ్నల్స్ ఆధారంగా మ త్స్యశాఖ అధికారులు బోటు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి కోస్ట్ గార్డ్కు సమాచారం ఇచ్చారు. దీంతో కోస్ట్ గార్డ్ నౌక గాలింపు చర్యలు చేపట్టి, బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు బోటును గుర్తించింది. సిబ్బందిని సురక్షితంగా రక్షించి ఫిషింగ్ హార్బర్కు తీసుకొచ్చి మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావుకు అప్పగించారు. ఈ సందర్భంగా బోటు యజమాని బి.రాజు మాట్లాడుతూ.. ట్రాన్స్పాండర్ ఉండటం వల్లే తన బోటు, సిబ్బంది ప్రాణాలతో తిరిగి రాగలిగారని హర్షం వ్యక్తం చేశారు. మత్స్యకారులందరూ తప్పనిసరిగా తమ బోట్లకు ఈ పరికరాన్ని అమర్చుకోవాలని కోరారు. తమను ఆదుకున్న కలెక్టర్, కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
నేడు సింహగిరిపై పెళ్లిరాట ఉత్సవం
సింహాచలం: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి పెళ్లిరాట ఉత్సవం వైభవంగా జరగనుంది. ఈ మేరకు ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. శ్రీ పరాభవనామ సంవత్సర ప్రారంభం సందర్భంగా ఉదయం స్వామికి విశేష అర్చనలు నిర్వహించి, ఉగాది పచ్చడిని నివేదిస్తారు. అనంతరం భక్తులకు పచ్చడి ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ స్థానమండపంలో స్వామి వారి ఉత్సవమూర్తులను వేంజేపు చేసి, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు ప్రధాన అర్చకులచే పంచాంగ శ్రవణం ఉంటుంది. అనంతరం 3.30 నుంచి 4.30 గంటల వరకు పెళ్లిరాట ఉత్సవం నిర్వహిస్తారు. ఈ నెల 29న (చైత్ర శుద్ధ ఏకాదశి) జరగనున్న స్వామి వారి వార్షిక కల్యాణోత్సవానికి చిహ్నంగా ఆలయ ఉత్తర ద్వారం, రాజగోపురం, కల్యాణ ప్రాంగణాల వద్ద పెళ్లిరాటలు వేస్తారు. ఈ సందర్భంగా పండితులకు సత్కారాలు, దాతలకు విశిష్ట సేవా పురస్కారాలు అందజేస్తారు. అనంతరం సింహగిరి మాడవీధుల్లో స్వామివారి తిరువీధి ఉత్సవం జరుగుతుంది. కాగా, ఏటా ఉగాది రోజు సాయంత్రం స్వామి వారి మూలవిరాట్ను సూర్యకిరణాలు తాకడం ఇక్కడి విశేషం. ఈ అద్భుత దృశ్యాన్ని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు కోరారు. సాయంత్రం స్వామిని తాకనున్న సూర్యకిరణాలు -
ఒకే రోజు రూ.10.1 కోట్ల ఆదాయం
మధురవాడ జోన్లో రికార్డు స్థాయిలో వసూలు మధురవాడ: జీవీఎంసీ మధురవాడ జోన్కు బుధవారం రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఎన్సీసీ వైజాగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి రెవెన్యూ అధికారులు రూ.10,01,88,000 వీఎల్టీ పన్నును వసూలు చేశారు. అసిస్టెంట్ కమిషనర్, రెవెన్యూ అధికారి నాగేంద్రకుమార్ ఆధ్వర్యంలో ఆర్ఐలు సుభానీ, ప్రదీప్రెడ్డి తదితరులు ఆ సంస్థ నుంచి పన్ను వసూలు చేసి, ఆ చెక్కును జోనల్ కార్యాలయంలో జెడ్సీ అయ్యప్పనాయుడికి అందజేశారు. ఈ సందర్భంగా పన్ను వసూలు చేసిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిని జెడ్సీ అభినందించారు. -
ముగిసిన ఎకై ్సజ్ పోలీసుల క్రీడలు
మధురవాడ: కొమ్మాదిలోని శాప్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పోలీసులకు మూడు రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీలు, ఎంపికలు బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన సుమారు 150 మంది ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళా, పురుష, వెటరన్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో గెలుపొందిన వారు వచ్చే నెలలో అమరావతిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా విజేతలకు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ విశాఖ డివిజన్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీరామచంద్రమూర్తి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిరియాలి
కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం ఆనందంతో జీవించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆకాంక్షించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆయన జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, ఆర్థికంగా ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలన్నారు. జిల్లా పారిశ్రామికంగా, సామాజికంగా మరింత పురోగతి సాధించాలని, స్వర్ణాంధ్ర–2047 సాధనలో ముందంజలో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో గురువారం జరిగే ఉగాది వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశామని, జిల్లా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
సెలూన్ ముసుగులో వ్యభిచారం
ముగ్గురు యువతులు, విటుడు, నిర్వాహకుడు అరెస్ట్ గోపాలపట్నం: ఎన్ఏడీ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. సెలూన్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ చీకటి దందాపై బుధవారం సాయంత్రం ఎయిర్పోర్ట్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ సీఐ శంకరనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఏడీ జంక్షన్ నుంచి మర్రిపాలెం వెళ్లే మార్గంలోని రోబరి హౌస్ ఉన్న భవనంలో హెయిర్ పోర్ట్ సెలూన్ పేరిట ఓ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. అయితే, అక్కడ హెయిర్ కటింగ్ లేదా మసాజ్ వంటి ఎలాంటి సేవలు అందించకుండా, ఆ గదులను కేవలం వ్యభిచారం కోసం విటులకు అద్దెకు ఇస్తున్నారు. బయటి వ్యక్తులకు అనుమానం రాకుండా ఉండేందుకు సెలూన్కు వస్తున్నట్లు కలరింగ్ ఇచ్చేవారు. ఈ దందా కోసం ప్రధాన నిర్వాహకుడు.. చంటి అనే సహాయకుడిని నియమించుకున్నాడు. అతడి ద్వారా అమ్మాయిల ఫొటోలను ముందుగానే విటులకు మొబైల్ ఫోన్లలో పంపించేవాడు. ఆ తర్వాత వారితో బేరం మాట్లాడుకుని సెలూన్కు రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల దాడుల్లో ముగ్గురు యువతులతో పాటు ఒక విటుడు, అలాగే ప్రధాన నిర్వాహకుడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితులను ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించి తదుపరి విచారణ చేపట్టారు. కాగా.. ఎన్ఏడీ జంక్షన్ ప్రాంతం స్పా కేంద్రాల ముసుగులో వ్యభిచార కూపంగా మారుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన వెలుగుచూడటం ఇది రెండోసారి. గతంలో విల్లా కాంప్లెక్స్లో ఉన్న ఎలైట్ వెల్నెస్ అండ్ స్పా సెంటర్పై కూడా టాస్క్ ఫోర్స్, ఎయిర్ పోర్ట్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిర్వాహకులను పట్టుకున్న విషయం తెలిసిందే. -
రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులుగా విశాఖ న్యాయవాదులు
విశాఖ లీగల్: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో విశాఖకు చెందిన ఐదుగురు న్యాయవాదులు విజయం సాధించి కొత్త రికార్డు నెలకొల్పారు. బుధవారం ఎన్నికలు లెక్కింపు పూర్తయింది. నగరానికి చెందిన సీనియర్ న్యాయవాదులు కె.రామజోగేశ్వరరావు, బి.వి.ఆర్.మూర్తి (బాబు) ఎస్ కృష్ణమోహన్, మహిళా న్యాయవాదుల విభాగంలో డి.మంజులత, కె.నాగశ్రీలు విజయం సాధించారు. వీరికి విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్, కార్యదర్శి లాలం పార్వతి నాయుడు సీనియర్ న్యాయవాదులు ఎస్.శ్రీనివాసు మూర్తి, నమ్మి సన్యాసిరావు యాదవ్ తదితరులు అభినందించారు. డి.మంజులత కె. నాగశ్రీ -
దివ్యాంగ చిన్నారులకు కలెక్టర్ ఆత్మీయ విందు
మహారాణిపేట: జిల్లాలోని వివిధ వసతి గృహాలకు చెందిన దివ్యాంగ చిన్నారులతో కలిసి కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆత్మీయ విందు నిర్వహించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులతో కలిసి భోజనం చేస్తూ వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూనే.. చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విందులో సాగర్ నగర్ అంధుల ఆశ్రమ పాఠశాలకు చెందిన అంధ విద్యార్థులు, పెదజాలారిపేట బీసీ వసతి గృహానికి చెందిన బధిర విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి వివిధ రకాల వంటకాలతో భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాల చిన్నారులు చేసిన గీతాలాపన అందరినీ ఆకట్టుకుంది. వారి ప్రతిభకు ముగ్ధులైన కలెక్టర్, ఇతర అధికారులు కరతాళ ధ్వనులతో చిన్నారులను అభినందించారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కె. కవిత, వసతి గృహాల నిర్వాహకులు, కలెక్టరేట్ ఏవో బీవీ రాణి తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మసీ.. ౖపైరవీ!
11 ఫార్మసీ పోస్టులకు 583 దరఖాస్తులు పోస్టుల కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏల ఒత్తిళ్లు తమను కలవమంటూ నిరుద్యోగ అభ్యర్థులకు ఫోన్లు పోస్టుకు రూ.3 నుంచి రూ.5 లక్షలు డిమాండ్ మహారాణిపేట: ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఫార్మసీ పోస్టుల భర్తీ ప్రక్రియలోకి దళారులు ప్రవేశించారు. కేవలం 11 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉండటం, వాటికి వందల సంఖ్యలో నిరుద్యోగులు పోటీ పడుతుండటంతో అక్రమార్కులు దీన్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అధికార పార్టీ నేతల పేరుతో కొందరు, ప్రజాప్రతినిధుల పీఏల పేరుతో మరికొందరు సిఫార్సులు, బెదిరింపులకు దిగుతుండటంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ఒక్కో పోస్టుకు లక్షల్లో డిమాండ్ చేస్తూ దళారులు బేరసారాలకు దిగుతున్న నేపథ్యంలో, ఈ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరుగుతాయని, ఎవరినీ నమ్మి మోసపోవద్దని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్ రాధారాణి స్పష్టం చేశారు. అధికారులపై పీఏల ఒత్తిళ్లు తుది ఎంపిక జాబితా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో దళారులు నేరుగా రంగంలోకి దిగారు. ‘హలో మేము వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఫార్మసీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారా? మీకు ఆ పోస్టు కావాలంటే డబ్బులు ఇవ్వాలి’అంటూ దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి, పోస్టింగ్ ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. ఇందుకు గాను ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కొందరు కూటమి నేతలు సైతం భారీగా బేరసారాలకు దిగి, ఈ పోస్టులను ఆదాయ వనరులుగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు కూడా తీవ్రమయ్యాయి. ఈ పోస్టులను తమ సిఫార్సు చేసిన వారికే కట్టబెట్టాలంటూ కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యక్తిగత సహాయకులు ఆర్డీకి వరుస ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. ఏకంగా సిఫార్సు లేఖలు పంపిస్తూ ఒత్తిడి తెస్తున్నారు. ఒక పక్క దరఖాస్తుల పరిశీలనలో బిజీగా ఉన్న అధికారులకు ఈ ఫోన్ కాల్స్, సిఫార్సుల తాకిడి ఇబ్బందిగా మారింది. దళారులను నమ్మి మోసపోవద్దు పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఫైనల్ మెరిట్ జాబితాను విడుదల చేస్తాం. నియామకాలన్నీ కేవలం అర్హత ప్రమాణాలు, మెరిట్, రోస్టర్ విధానం ఆధారంగానే పారదర్శకంగా జరుగుతున్నాయి. దళారుల మాయమాటలు నమ్మి నిరుద్యోగులు ఎవరూ వారికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. పైరవీలకు ఇక్కడ ఎలాంటి తావులేదు. – డాక్టర్ రాధారాణి, ఆర్డీ, వైద్య ఆరోగ్యశాఖ పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కువ! ఉమ్మడి ఉత్తరాంధ్ర పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 11 ఫార్మసీ గ్రేడ్–2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఏడాది కాల వ్యవధికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ డైరెక్టర్(ఆర్డీ) కార్యాలయం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ 11 పోస్టుల కోసం ఏకంగా 583 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే మెరిట్ జాబితాను కూడా అధికారులు విడుదల చేశారు. అయితే, తీవ్రమైన పోటీ ఉండటంతో పోస్టింగ్ ఎలాగైనా సాధించాలనే అభ్యర్థుల ఆరాటాన్ని దళారులు, కొందరు రాజకీయ నేతలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. -
స్టార్టప్లే రేపటి ఉపాధి కేంద్రాలు
మద్దిలపాలెం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోందని, వీటిని అందుకోవడానికి విద్యార్థులకు నైపుణ్యం ఎంతో అవసరమని సైయంట్ వ్యవస్థాపక చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రమీత బి.వి.ఆర్. మోహన్రెడ్డి అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఏయూ–ఏఐసీటీఈ–సైయంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్స్టిట్యూట్–ఇండస్ట్రీ–ఇన్వెస్టర్స్ కాన్క్లేవ్ను బుధవారం ఆయన ప్రారంభించి, కీలకోపన్యాసం చేశారు. ప్రస్తుతం స్టార్టప్ సంస్థలు ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, 60 శాతానికి పైగా ఉద్యోగ అవకాశాలు వీటి ద్వారానే లభిస్తున్నాయని తెలిపారు. స్టార్టప్లు పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ, వాటిలో వినూత్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయన్నారు. విశాఖపట్నం సిటీ ఇన్నోవేషన్ క్లస్టర్ ద్వారా ఆలోచన దశ నుంచి ఉత్పత్తి దశ వరకు ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ఈ వేదిక దోహదపడుతుందని ఆకాంక్షించారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భాగస్వాములు కావడం ఇక్కడి విద్యార్థుల అదృష్టమని, రాబోయే వందేళ్లలో ఈ యూనివర్సిటీ దేశానికి, ప్రపంచానికి గొప్ప భవిష్యత్తును అందిస్తుందని కొనియాడారు. త్వరలో ఎఫ్డీపీ: ఏయూ వీసీ ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. సైయంట్ సంస్థతో కలిసి త్వరలో ఇన్నోవేషన్ రంగంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఎఫ్డీపీ) నిర్వహిస్తామని ప్రకటించారు. రూసా నిధుల ద్వారా మౌలిక వసతుల కల్పన, స్టార్టప్ల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని, ఏయూలోని ఏ–హబ్తో కలిసి పనిచేయడానికి 30కి పైగా స్టార్టప్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఏఐసీటీఈ ఇన్నోవేషన్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దీపన్ సాహు మాట్లాడుతూ.. గత ఆరు నెలల్లో విశాఖ సిటీ ఇన్నోవేషన్ క్లస్టర్ సాధించిన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా అతిథుల చేతుల మీదుగా ప్రత్యేక నివేదికలను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, స్టార్టప్ సంస్థలు ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనను అతిథులు తిలకించి, యువ ఆవిష్కర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఐసీ అధ్యక్షుడు ఆచార్య జి.ఎం.జె. రాజు, క్లస్టర్ కోఆర్డినేటర్ ఆచార్య కె. రమాసుధ, కన్వీనర్ ఆచార్య డి. లలిత భాస్కరి, సైయంట్ సంస్థ ఉన్నతాధికారి పి.ఎన్.ఎస్.వి.నరసింహం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఉపకులపతి తన కార్యాలయంలో బి.వి.ఆర్.మోహన్ రెడ్డిని ఘనంగా సత్కరించి, ఏయూ జ్ఞాపికను అందజేశారు. -
పోర్టులో మౌలిక సదుపాయాలు బాగున్నాయి
సాక్షి, విశాఖపట్నం: నేషనల్ డిఫెన్స్ కాలేజీ(ఎన్డీసీ)కి చెందిన 16 మంది సభ్యులతో కూడిన ఫ్యాకల్టీ, కోర్సు సభ్యుల బృందం బుధవారం విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ)ని సందర్శించింది. ఈ బృందానికి పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి కొరాటి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోర్టులోని మౌలిక సదుపాయాలు, కార్గో నిర్వహణ సామర్థ్యం, ఆధునికీకరణ, యాంత్రీకరణ పనులపై ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే కవర్డ్ స్టోరేజీ సదుపాయాలు, సౌర శక్తి వినియోగం, పారిశ్రామిక అవసరాల కోసం నిర్వహిస్తున్న ఎస్టీపీ ప్లాంట్, క్రూయిజ్ టెర్మినల్ వంటి కీలక అంశాలను ఎన్డీసీ బృందానికి వివరించారు. పోర్టు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని డిఫెన్స్ కాలేజీ బృందం అభినందించింది. కార్యక్రమంలో పోర్టు కార్యదర్శి ఎం.శంకర బాబు, చీఫ్ ఇంజినీర్ శ్రీరామచంద్రమూర్తి, చీఫ్ మెకానికల్ ఇంజినీర్ రామ్ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్డీసీ బృందం ప్రశంస -
వేటగాడే
● ఏ‘ఛీ’బీ బాగోతంమేతగాడైతే..తనిఖీల ముందే సమాచారం.. దర్జాగా దండుకుంటున్న వైనం కేసుల మాఫీ పేరిట అమాయకులపై ‘దందా’ పండు ముదుసలుల పెన్షన్ సొమ్మునూ వదలని వైనం పదే పదే అదే శాఖలో తిష్ట.. ఉన్నతాధికారులకే సవాల్! వ్యవస్థకే తూట్లు పొడుస్తున్న ‘కలెక్షన్’ వీరుడు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లో మరోసారి అంతర్గత కలకలం రేగుతోంది. తనిఖీల సమాచారాన్ని ముందుగానే లీక్ చేస్తూ, అదే సమయంలో కక్షిదారుల నుంచే భారీగా వసూళ్లు చేస్తున్న ఓ అధికారి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏసీబీలో పనిచేసి, మధ్యలో మరో విచారణ సంస్థకు బదిలీపై వెళ్లిం మళ్లీ అదే శాఖకు చేరిన ఈ వ్యక్తి ఇప్పుడు ‘లీకులు–కలెక్షన్లు’ ద్వంద్వ దందాతో చెలరేగుతున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీల వివరాలను ముందుగానే చేరవేసి అధికారులను అప్రమత్తం చేయడమే కాకుండా, గతంలో కేసులు ఎదుర్కొంటున్న వారిని టార్గెట్ చేస్తూ ‘సహాయం చేస్తాను’ పేరుతో వసూళ్లకు దిగుతున్నాడని సమాచారం. ఇటీవల జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంపై జరగబోయే తనిఖీల సమాచారాన్ని ముందుగానే లీక్ చేయడంతో, సంబంధిత అధికారులు అప్రమత్తమై తప్పించుకున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఏసీబీ ఉన్నతాధికారుల దృష్టికి చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లీకుల వ్యవహారంలో పలువురిపై చర్యలు తీసుకున్న నేపథ్యంలోం ఈ కొత్త ‘లీక్ వీరుడు’ వ్యవహారం ఉన్నతాధికారులను మరింత ఆగ్రహానికి గురిచేస్తోందని సమాచారం. కఠిన వైఖరి కలిగిన ప్రస్తుత ఉన్నతాధికారి ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అటు లీకులు.. ఇటు కలెక్షన్లు! ఒకవైపు కక్షిదారులను భయపెట్టి వసూళ్లు చేయడం.. మరోవైపు ఏసీబీ తనిఖీల విషయాలను బయటకు లీక్ చేస్తూ భారీగా దండుకోవడం సదరు వ్యక్తికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఇటీవల జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంపై దాడులు జరగబోతున్నాయనే అత్యంత రహస్య సమాచారాన్ని ఒక ఏసీపీ, డీసీపీకి ముందే చేరవేశాడన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీంతో భారీ కలెక్షన్ రాయుళ్లుగా ముద్రపడిన ఆ ఇద్దరు అధికారులు ‘లీకు వీరుడి’ పుణ్యమా అని దర్జాగా తప్పించుకున్నారు. ఇప్పటికే ఏసీబీలో 9 మంది లీకు వీరులపై వేటు పడగా.. ఈ ‘పదో అవతారం’ వ్యవహారం ఇప్పుడు ఉన్నతాధికారులకు మింగుడుపడటం లేదు. చర్యలు లేకపోతే మచ్చ తప్పదు! విశాఖలో గత కొంతకాలంగా ఏసీబీపై ప్రజల్లో పెరిగిన గౌరవం ఈ ‘కలెక్షన్ కింగ్’ వల్ల మంటగలిసిపోయే ప్రమాదం ఉంది. ఈ ఇంటి దొంగను వెంటనే ఏరివేయనట్లయితే.. అవినీతి నిరోధక శాఖ తన లక్ష్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ లీకు వీరుడి ఆట కట్టించాలని బాధితులు కోరుతున్నారు. అవినీతిని వేటాడాల్సిన తుపాకీ.. ఇప్పుడు వసూళ్ల గొడ్డలిగా మారింది. నిఖార్సైన అధికారి సారథ్యంలో ఏసీబీ తన ప్రతిష్టను పెంచుకుంటుంటే, ఒకే ఒక్క ‘ఇంటి దొంగ’ ఆ శాఖ గౌరవాన్ని బజారున పడేస్తున్నాడు. తనిఖీల సమాచారాన్ని ముందస్తుగా ‘లీక్’ చేసి అవినీతి తిమింగలాలను కాపాడటమే కాదు.. కేసుల్లో ఇరుక్కున్న కక్షిదారుల నుంచే ‘సహాయం’ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్న ఈ ‘కలెక్షన్ కింగ్’ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ముసలివాళ్ల నోటికాడ ముద్దకూ ఎసరు! ఈ లీకు వీరుడి అరాచకం అంతటితో ఆగలేదు. గతంలో ఏసీబీ కేసుల్లో చిక్కుకుని, ఇప్పుడు పదవీ విరమణ చేసి, పెన్షన్ రాక, రోగాలతో ఇబ్బంది పడుతున్న వృద్ధులను సైతం ఇతగాడు వదలడం లేదు. ‘మీ కేసు పరిష్కరిస్తా.. మీకు సహాయం చేస్తా‘ అంటూ నమ్మించి, వారి దగ్గర ఉన్న కొద్దిపాటి సొమ్మును కూడా మాయమాటలతో గుంజేస్తున్నాడు. వైద్య ఖర్చుల కోసం దాచుకున్న డబ్బును కూడా కనికరం లేకుండా వసూలు చేస్తున్న తీరుపై బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. మళ్లీ మళ్లీ ఏసీబీకే.. ఎందుకో? వసూళ్ల రుచి మరిగిన ఈ వ్యక్తి.. మధ్యలో వేరే విచారణ సంస్థకు వెళ్లినా, పక్కా పైరవీలతో మళ్లీ ఏసీబీకే రావడం వెనుక ఉన్న మతలబు ఏంటో అందరికీ అర్థమవుతూనే ఉంది. వసూళ్లకు అనువైన శాఖ కావడంతోనే మళ్లీ ఇక్కడే తిష్ట వేశాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారి ముక్కుసూటిగా వెళ్తున్నా, ఇతను మాత్రం తన పాత అలవాట్లను మానుకోకుండా సంస్థకు మచ్చ తెస్తున్నాడు. -
తిరుమల పవిత్రతకు ముప్పు
అల్లిపురం: కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవం కొలువైన తిరుమల పవిత్రత నేడు ప్రమాదంలో పడిందని, అనైతిక ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడు అనైతిక వ్యవహారాలపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా తిరుపతిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన మహిళలపై దాడులు చేయించడం, అనంతరం కేసులు పెట్టించి అరెస్టులు చేయించడం వంటి ఘటనలను ఖండిస్తూ మంగళవారం సాయంత్రం డాబాగార్డెన్స్లోని బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి భారీ నిరసన చేపట్టారు. ‘తిరుమలను కాపాడండిం బీఆర్ నాయుడిని తొలగించండి’ అంటూ నినాదాలతో ప్రాంతం మార్మోగింది. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ వీడియోలు, ఫొటోల రూపంలో ఆరోపణలు వెలుగులోకి వచ్చినా బీఆర్ నాయుడు నిర్లజ్జగా పదవిలో కొనసాగడం ఆలయ పవిత్రతకు మచ్చ తెచ్చే చర్య అని తీవ్రంగా విమర్శించారు. మహిళలపై దాడులు చేయించడం అమానుషమని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని మండిపడ్డారు. ఈ ఘటనల వెనుక ప్రభుత్వ ప్రోత్సాహం ఉందని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. గతంలోనే ఒక మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని గుర్తుచేశారు. ఇలాంటి వివాదాస్పద వ్యక్తికి టీటీడీ వంటి పవిత్ర సంస్థలో అత్యున్నత పదవి ఇవ్వడం పెద్ద తప్పిదమని, ఆయన పదవీకాలంలో తిరుమల–తిరుపతిలో అనేక అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరసన తెలిపిన మహిళలపై గూండాలతో దాడులు చేయించడం, కేసులు పెట్టించడం అత్యంత ఖండనీయమన్నారు. నైతిక విలువలు లేని వ్యక్తిని ఇంకా పదవిలో కొనసాగించడం ప్రభుత్వం వైఫల్యమని తేల్చిచెప్పారు. బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే ప్రభుత్వం తక్షణమే ఆయనను తొలగించాలని లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉందా..? ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడును తొలగించాలని శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలపై టీడీపీ గూండాలు దాడిని చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన ఘటనను చూస్తే కూటమి పాలనలో ప్రజాస్వామ్యం అనేది ఉందా..? చచ్చిపోయిందా..? అనే సందేహం కలుగుతుందన్నారు. మహిళలపై దాడి చేయడమే కాకుండా తిరిగి మహిళలపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళలపై కూడా అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతుంటే .. సనాతనవాది అనే పవన్కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎప్పుడైతే పవిత్రమైన తిరుపతి లడ్డూలో జంతుకొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, బీఆర్ నాయుడు అపహాస్యం చేశారో..ఆ నాటి నుంచే వారి పతనం ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర అనుబంధ విభాగం అధ్యక్షులు బొల్లవరపు జాన్వెస్లీ, పేర్ల విజయచందర్, పరిశీలకులు డాక్టర్ జహీర్ అహ్మద్, శోభ స్వాతిరాణి, పేడాడ రమణి కుమారి, రొంగలి జగన్నాథం, బాణాల శ్రీనివాసరావు, పిన్నమరాజు సతీష్ వర్మ, ముఖ్యనేతలు ఎండీ ఫరూఖీ, ద్రోణంరాజు శ్రీవాస్తవ, తాడి జగన్నాథ రెడ్డి, పల్లా దుర్గారావు, మంచ నాగ మల్లేశ్వరి, జీవీ రామచంద్రరావు, చెన్న జానకి రామ్, సేనాపతి అప్పారావు, అంబటి శైలేష్, పి.వి.సురేష్, సనపల రవీంద్ర భరత్, బోని శివరామకృష్ణ, కటికల కల్పన, మేడి ఆనందరావు బాజీ నాయుడు, రాయపురెడ్డి అనిల్ కుమార్, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, సకలభక్తుల ప్రసాద్ రావు, దేవరకొండ మార్కెండేయులు, బోండా ఉమా మహేశ్వర రావు, కోడిగుడ్ల పూర్ణిమ, నీలి రవి, అల్లంపల్లి రాజబాబు, వేంపాడు శ్రీనివాస్ రెడ్డి, మువ్వల లక్ష్మి, సాడి పద్మారెడ్డి, రెయ్యి వెంకట రమణ, కెవి శశికళ, భూపతి రాజు సుజాత, ఎండి ఫరీఫ్, జీలకర నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
ఆక్రమణదారులపై కఠిన చర్యలు
మహారాణిపేట: సమాజంలోని బలహీన వర్గాల పట్ల అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవహరించి, వారికి అండగా నిలవాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 500 మంది నుంచి వినతులు స్వీకరించారు. వీటిని సంబంధిత అధికారులకు పంపించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ స్థలాలు, పట్టాలు, దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను ఇతరులు ఆక్రమించుకున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని, ఆక్రమణదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా భీమిలి, గాజువాక మండలాల్లో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, అక్కడ రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిడిగట్టు, కొత్తవలస, భీమిలి ప్రాంతాల్లో ఎస్సీలు నివసించే ప్రాంతాలకు దారి లేకుండా ముందుగా లేఅవుట్లు వేసి అడ్డుకున్న ఘటనలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. వీఎంఆర్డీఏ పరిధిలో నిర్మించే వాణిజ్య దుకాణాలను నిష్పత్తి ప్రాతిపదికన ఎస్సీ లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుతో పాటు జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, సాంఘిక సంక్షేమ శాఖల ద్వారా చేపట్టే ఇంజినీరింగ్ పనుల్లో దళిత కాంట్రాక్టర్లకు తగిన కోటా, అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. అనంతరం ఆయన శ్రీకృష్ణాపురం పాఠశాలను సందర్శించారు. అక్కడ ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేసి, వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. విశాఖ ఆర్డీవో సుధాసాగర్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కె.రామారావు, డీఎంహెచ్వో జగదీశ్వరరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
డీఆర్వోగా విశ్వేశ్వర నాయుడు
మహారాణిపేట: జిల్లా రెవెన్యూ శాఖలో కీలకమైన జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) పోస్టుకు ప్రభుత్వం ఎట్టకేలకు నియామకం చేపట్టింది. గత ఏడాది అక్టోబర్ 21న డీఆర్వో బి.హెచ్.భవాని శంకర్ను బదిలీ చేసిన తరువాత ఈ పదవి ఇన్చార్జిలతో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇన్చార్జి డీఆర్వోగా ఉన్న గృహ నిర్మాణ సంస్థ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) సత్తిబాబును ఇటీవల విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారిగా నియమించారు. అనంతరం ఈ పోస్టు మళ్లీ ఖాళీ కావడంతో కలెక్టరేట్లో పనిచేస్తున్న కెఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శేష శైలజను ఇన్చార్జి డీఆర్వోగా నియమించారు. ప్రస్తుతం ఆమెనే ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కడప జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ఎం.విశ్వేశ్వర నాయుడును విశాఖ జిల్లా డీఆర్వోగా నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్జీడీసీ)గా పనిచేసిన విశ్వేశ్వర నాయుడు గతంలో విశాఖ జిల్లాలో పలు పదవుల్లో పనిచేశారు. కలెక్టరేట్ పరిపాలనాధికారిగా (ఏవో), రూరల్ తహసీల్దార్గా సేవలందించిన ఆయనకు విశాఖ ప్రాంతంపై మంచి పరిచయం ఉంది. ఆర్డీవోకు బదిలీ ఇన్చార్జి విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) సనపల సుధా సాగర్కు బదిలీ అయింది. గతంలో విశాఖ ఆర్డీవోగా పనిచేసిన పి.శ్రీలేఖను గత ఏడాది అక్టోబర్ 21న బదిలీ చేశారు. అనంతరం హెచ్పీసీఎల్ ఎస్డీసీ (భూసేకరణ అధికారి)గా ఉన్న సుధాసాగర్ను ఇన్చార్జి ఆర్డీవోగా నియమించారు. ఇప్పుడు ఆయన్ని విజయనగరం ఆర్డీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జీవీఎంసీలో ఇక ప్రత్యేకాధికారి పాలన
డాబాగార్డెన్స్: గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి కార్పొరేషన్లో ప్రత్యేకాధికారి పాలన అమలులోకి వచ్చింది. తదుపరి ఎన్నికలు జరిగే వరకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ కంట్రోల్లోనే జీవీఎంసీ పరిపాలన కొనసాగనుంది. 2021లో మొదలైన ఈ పాలకవర్గ ప్రయాణం ఎన్నో రాజకీయ మలుపులకు వేదికై ంది. 2021 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు వైఎస్సార్ సీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్గా వ్యవహరించగా.. రాజకీయ కుట్రలు, కూటమి మద్దతుతో గతేడాది ఏప్రిల్ 28న టీడీపీకి చెందిన పీలా శ్రీనివాసరావు మేయర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే, తన పదవీకాలం ముగుస్తుందనగా చివరి నెల రోజుల్లో జరిగిన సమావేశాల్లో పదుల సంఖ్యలో అంశాలను హడావుడిగా ఆమోదించుకోవడం విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా చిట్టచివరి స్థాయీ సంఘం సమావేశంలో ఏకంగా 294 అంశాలను ఆమోదింపజేసుకున్నారు. మేయర్గా తన 11 నెలల పాలనలో కూటమి పార్టీలకు చెందిన పలువురు కార్పొరేటర్లు దోచుకుతిన్నారనే ఆరోపణలు ఉన్నాయి. సభ్యులు ఆమోదించకపోయినప్పటికీ.. అధికారుల సహకారంతో అజెండా అంశాలను మేయర్ ఆమోదించుకున్నారని సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్లు బాహాటంగా చెప్పుకోవడం గమనార్హం. జీవీఎంసీ చరిత్రలో చీకటి రోజు జీవీఎంసీ చరిత్రలో 2026 జనవరి 30వ తేదీ చీకటి రోజుగా నిలిచిపోయింది. విశాఖ ఎంపీ శ్రీభరత్కు చెందిన గీతం విశ్వవిద్యాలయం ఆధీనంలో ఉన్న రూ.5వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని(ఎండాడ, రుషికొండ) క్రమబద్ధీకరిస్తూ కౌన్సిల్లో నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ, వామపక్షాల ఆందోళనలు, ప్రతిపక్షాల నిరసనలను బేఖాతరు చేస్తూ.. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ ఏకపక్షంగా ఈ నిర్ణయాన్ని ఆమోదింపజేశారు. ఈ క్రమంలో మీడియాను అనుమతించకపోవడం, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ఐటీఐలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
మహారాణిపేట : కంచరపాలెం ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. ఈ ల్యాబ్ ఏర్పాటుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించింది. ఈ నిధులతో కళాశాలలో 25 కంప్యూటర్లు, 25 కుర్చీలు ఏర్పాటు చేసి, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలతో ల్యాబ్ను అభివృద్ధి చేశారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే వేసవి శిక్షణా శిబిరాలను కూడా నిర్వహించాలని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులకు సూచించారు. కార్యక్రమంలో హెచ్డీఎఫ్సీ రీజనల్ హెడ్ సీహెచ్ పవన్కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ జీవీ రమణారావు, అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. -
దుబాయ్ ట్రాన్షిప్మెంట్కు దెబ్బ
యూరప్ దేశాలకు ఎగుమతులకు నేరుగా భారీ కార్గో షిప్స్ లేవు. మొదట్లో విశాఖ, కోల్కతా నుంచి చైన్నెకి పంపించి అక్కడి నుంచి యూరప్ దేశాలకు వెళ్లేవి. ఈ విధానంలో ఇబ్బందులను అధిగమించేందుకు దుబాయ్ని ట్రాన్షిప్మెంట్ హబ్గా అభివృద్ధి చేశారు. ఇటువైపు దేశాల నుంచి యురోపియన్ దేశాలకు సరకు పంపించాలంటే దుబాయ్ జెబెల్ అలీ పోర్టుకు పంపించేవారు. అక్కడి నుంచి ఆయా దేశాలకు ఎగుమతి అయ్యేవి. యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని మూసేయడంతో విశాఖ, చైన్నె పోర్టుల నుంచి దుబాయ్ మీదుగా జరిగే ట్రాన్షిప్మెంట్ నిలిచిపోయింది. దీంతో ఎగుమతిదారులు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాలకు ముంబై, ముంద్రా, చైన్నె, వైజాగ్, కాండ్లా, కొచ్చి పోర్టులతో పాటు దేశంలోని ఇతర పోర్టుల నుంచి రోజూ 15 వేల నుంచి 20 వేల కంటైనర్లు వెళ్తుంటాయి. ప్రస్తుత సంక్షోభం వల్ల ఈ రవాణా 25 నుంచి 30 శాతానికి పడిపోయింది. -
సీనియర్ జర్నలిస్ట్ గంట్ల శ్రీనుబాబుకు ఉగాది పురస్కారం
మహారాణిపేట: సీనియర్ పాత్రికేయుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నాయకుడు గంట్ల శ్రీనుబాబుకు ప్రతిష్టాత్మకమైన పరాభవనామ ఉగాది పురస్కారం లభించింది. జర్నలిజం, సేవా రంగంలో ఆయన చేస్తున్న విశేష సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్, ఇతర ప్రముఖులు చేతుల మీదుగా శ్రీనుబాబు ఈ అవార్డును స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని పలువురు జర్నలిస్టులు అభినందించారు. -
జీవితంలో సంగీతం, నృత్యం అంతర్భాగం
మద్దిలపాలెం: సంగీతం మానసిక ప్రశాంతతకు దివ్యౌషధమని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. ఏయూ సంగీత, నృత్య విభాగం ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన శతాబ్ది కళా ఉత్సవం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు సాధించే ప్రగతి, వారి ప్రవర్తనే విశ్వవిద్యాలయ గౌరవాన్ని పెంచుతాయని, ఏయూ విద్యార్థులు వర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతి వ్యక్తి జీవితంలో సంగీతం, నృత్యం అంతర్భాగం కావాలని సూచించిన ఆయన, వర్సిటీ అభివృద్ధికి పునాదులు వేసిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకోవాలన్నారు. ఏయూ మరో వెయ్యేళ్ల పాటు తన సేవలను దిగ్విజయంగా అందించేలా నేటి తరం బలమైన పునాదులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా విశిష్ట అతిథి, శతాధిక వృద్ధుడు, ప్రముఖ సంగీత విద్వాంసులు పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్నవరపు రామస్వామిని, వర్సిటీ తరపున జ్ఞాపిక, సన్మాన పత్రంతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎన్నడూ మరువకూడదని హితవు పలికారు. తనకు జరిగిన ఈ సన్మానాన్ని సంగీత కళకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, తన ఎదుగుదలకు గురువే కారణమన్నారు. మన ఆరోగ్యానికి సంగీతం ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్న ఆయన, ఏయూలో తనకు జరిగిన ఈ గౌరవం మరువలేనిదని ఆనందం వ్యక్తం చేశారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ, వర్సిటీ శతాబ్ది శోభను ప్రతిబింబించేలా ప్రతిభావంతులైన విద్యార్థులతో ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు. కళారంగంలో విశేష కృషి చేసిన దిగ్గజాలను సన్మానించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ వేడుకలో భాగంగా ప్రముఖ కళాకారులు ఎ.బి.బాలకొండలరావు, మండ సుధారాణి, మండపాక శారద, హరిరామమూర్తి, జి.శారద సుబ్రహ్మణ్యం, వై.హనుమంతరావులను వర్సిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంగీత, నృత్య విభాగాధిపతి ఆచార్య సరస్వతీ విద్యార్థి, వివిధ విభాగాల ప్రిన్సిపాల్స్, డీన్లు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన శాసీ్త్రయ నృత్యాలు, గాన కచేరీలు ఆహూతులను అలరించాయి. కలెక్టర్ హరేందిర ప్రసాద్ పిలుపు -
కకావికలం
● కడలిపై కదన ప్రభావంసముద్ర వాణిజ్యంసాక్షి, విశాఖపట్నం: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ప్రపంచదేశాల సరఫరా గొలుసు (సప్లయ్ చైన్)ను ఛిన్నాభిన్నం చేస్తోంది. ముఖ్యంగా భారత్ నుంచి యూరప్, అమెరికా దేశాలకు వెళ్లే సరుకు రవాణాపై ఇది పెనుప్రభావం చూపుతోంది. భారత్ నుంచి యూరప్ దేశాల ఎగుమతులకు ట్రాన్షిప్మెంట్ హబ్గా వ్యవహరించే దుబాయ్లో యుద్ధప్రభావం తీవ్రంగా ఉండటంతో.. పదిరోజుల్లోనే వెయ్యికిపైగా రిఫ్రిజిరేటర్ కంటైనర్ల ఎగుమతులు నిలిచిపోయాయి. ఈస్ట్కోస్ట్ పోర్టుల నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లిన కంటైనర్ షిప్లన్నీ తిరుగుముఖం పట్టాయి. వీటిలో ఎక్కువ షిప్లను కేరళలోని విజింజం అంతర్జాతీయ పోర్టుకు మళ్లించారు. ఇక్కడ నిండిపోయిన తర్వాత చైన్నెలోని కట్టుపల్లికి తరలించనున్నారు. తర్వాత విశాఖ కంటైనర్ టెర్మినల్ని ప్రత్యామ్నాయ స్థావరంగా ఎంపిక చేశారు. మరోవైపు యుద్ధప్రభావంతో పశ్చిమతీరం నుంచి కూడా సరుకు ఎగుమతులు మందకొడిగా సాగుతున్నాయి. భారత తూర్పుతీరానికి గేట్వేగా ఉన్న విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ (వీసీటీపీఎల్) సాధారణంగా నెలకు 50 వేల నుంచి 60 వేల టీఈయూ (ట్వంటీ–ఫుట్ ఈక్వలెంట్ యూనిట్) సామర్థ్యం ఉన్న కంటైనర్ల హ్యాండ్లింగ్ జరుగుతుంటుంది. తాజా పరిస్థితుల కారణంగా యూరప్కు వెళ్లే సరుకు రవాణాలో 15 నుంచి 20 శాతం మేర మందగమనం కనిపిస్తోంది. డొమెస్టిక్ కంటైనర్ల హ్యాండ్లింగ్ దాదాపు నిలిచిపోయింది. భారత్ నుంచి యూఏఈలోని ఏడుదేశాలకు సరకు హ్యాండ్లింగ్ జరుగుతుంటుంది. విశాఖ నుంచి ఇప్పటికే బయలుదేరిన షిప్లు వెనక్కి వచ్చేస్తున్నాయి. విశాఖ నుంచి రోజుకు 600 చొప్పున 10 రోజుల్లో ఆరువేల కంటైనర్లతో కూడిన నౌకలు బయలుదేరాయి. ఇందులో 1,500కి పైగా కంటైనర్లు సీ ఫుడ్తో ఉన్నాయి. ఒడిశా నుంచి వచ్చిన మినరల్స్ ఫెర్రో, మాంగనీస్ లోడుతో వంద కంటైనర్లు, ఫార్మ కంటైనర్లు 50, ఫార్మా ట్యాంక్ కెమికల్ కంటైనర్లు 50 కూడా తిరుగుముఖం పట్టాయి. సముద్రజలాల్లో నిలిపివేత యుద్ధ ప్రభావం వల్ల భారత్ నుంచి బయలుదేరిన 37 కార్గో కంటైనర్షిప్లు ప్రస్తుతం హార్మూజ్ జలసంధి సమీపంలో సముద్రంలోనే నిలిచిపోయాయి. కొన్ని షిప్పింగ్లైన్లు తమ కంటైనర్లని యూఏఈలోని ఖోర్ఫక్కన్, ఫుజైరా పోర్టుల్లో దిగుమతి చేసుకుంటున్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గాన దుబాయ్లోని జెబెల్ అలీ పోర్టుకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ముంబై పోర్టులో ఎగుమతికి సిద్ధంగా ఉన్న ఐదువేల కంటైనర్లు నిలిచిపోయాయి. ముంద్రా, కాండ్లా పోర్టుల్లో రెండువేలు, వైజాగ్లో వెయ్యి కంటైనర్లు నిలిచిపోయాయి. మన దేశంలోని వివిధ పోర్టుల నుంచి ప్రతినెల 3,500కు పైగా రిఫ్రిజిరేటర్ కంటైనర్లలో సముద్ర ఉత్పత్తులు, పండ్లు, ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు అవన్నీ నిలిచిపోయాయి. యుద్ధం భారతీయ పోర్టులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సముద్రదారులన్నీ కేరళ వైపు ఈస్ట్కోస్ట్ కంటైనర్లన్నీ విజింజం పోర్టులోనే నిలుపుదల భారత తూర్పుతీరం నుంచి తగ్గిపోయిన ఎగుమతులు పశ్చిమతీరం నుంచి మందకొడిగా నడుస్తున్న కంటైనర్ షిప్లు మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే రిఫ్రిజిరేటర్ కంటైనర్ల నిలిపివేత పది రోజుల్లో ఆగిపోయిన వెయ్యి కంటైనర్లు హార్మూజ్ జలసంధి సమీపంలో నిలిచిపోయిన 37 కార్గో షిప్స్ భారత తూర్పుతీరం నుంచి దుబాయ్ మీదుగానే యూరప్కు ఎగుమతులు -
ఆ రెండు విభాగాల పనితీరు బాగోలేదు
డాబాగార్డెన్స్: తాను మేయర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి (గత 11 నెలల కాలంలో) జీవీఎంసీలోని టౌన్ ప్లానింగ్, మెకానికల్ విభాగాల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని తాజా మాజీ మేయర్ పీలా శ్రీనివాసరావు బాహాటంగా అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం తన పదవీ కాలం ముగిసిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన 11 నెలల పాలనలో రూ. 760 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశానని, వార్డుల వారీగా సమస్యలను పరిష్కరించడంలో సఫలమయ్యానని తెలిపారు. ముఖ్యంగా గుడ్ మార్నింగ్ కార్యక్రమం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. కూటమిలో మేయర్ పదవికి ఎవరూ ముందుకు రాని సమయంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు తనను గుర్తించి అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టౌన్ ప్లానింగ్, మెకానికల్ విభాగాల పనితీరుపై పీలా అసంతృప్తి -
గ్యాస్ గోస
గ్యాస్ కొరత లేదు మహారాణిపేట: జిల్లాలో వంట గ్యాస్, వాణిజ్య గ్యాస్కు ఎలాంటి కొరత లేదని, నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి తెలిపారు. రోజుకు సుమారు 18 వేల గ్యాస్ సిలెండర్లు సరఫరా చేస్తున్నామని, రాబోయే రెండు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. అనధికార గ్యాస్ విక్రయాలు లేదా గృహ వినియోగ గ్యాస్ను వాణిజ్య అవసరాలకు ఉపయోగించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సరఫరా, డిమాండ్పై నిరంతరం సమీక్ష చేస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 50 వేల మంది వంట గ్యాస్ కోసం బుకింగ్లు చేసుకున్నారని, ఎక్కడ గ్యాస్ కొరత లేదని తెలిపారు. విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ఔషధ పరిశ్రమకు చెందిన సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించి వంట గ్యాస్ను సరఫరా చేస్తున్నామని వివరించారు. -
కస్టమ్స్ అధికారుల బాధ్యతలకు దర్పణం ‘రైట్ టర్న్’
ఏయూక్యాంపస్: కస్టమ్స్ అధికారుల వృత్తిపరమైన సవాళ్లు, సామాజిక బాధ్యతలను ప్రతిబింబిస్తూ రూపొందించిన లఘు చిత్రం ‘రైట్ టర్న్– కర్మయోగి’ని సోమవారం నగరంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కస్టమ్స్ సెంట్రల్ టాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సంజయ్ రథ్ మాట్లాడుతూ.. నిబంధనలకు లోబడి పనిచేసే అధికారులు తమ బాధ్యతల పట్ల ఎంతటి సామాజిక స్పృహతో ఉండాలో ఈ చిత్రం చక్కగా వివరించిందని పేర్కొన్నారు. 10వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రానికి ‘హానరబుల్ జ్యూరీ మెన్షన్’ లభించడం విశేషమన్నారు. ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్. శ్రీధర్ మాట్లాడుతూ కేవలం విమానాశ్రయాలకే పరిమితం కాకుండా కార్గో క్లియరెన్స్లోనూ కస్టమ్స్ కీలక పాత్ర పోషిస్తుందని, ఆ విధి నిర్వహణలోని భారాన్ని, బాధ్యతను ఈ చిత్రంలో స్పృశించామని తెలిపారు. కస్టమ్స్ సిబ్బందే ఇందులో నటించడం గమనార్హం. కార్యక్రమంలో విశాఖ పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్పర్సన్ కె. రోషిణి అపరంజి, అడిషనల్ కమిషనర్ రజనీష్, ఇతర అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
టౌన్ ప్లానింగ్కు అత్యధిక అర్జీలు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మేయర్ పీలా శ్రీనివాసరావు, అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, పి.నల్లనయ్యతో కలిసి మొత్తం 117 వినతులను స్వీకరించారు. మేయర్ హోదాలో పీలా శ్రీనివాసరావుకు ఇదే చివరి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కావడం గమనార్హం. అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి 64 వినతులు రాగా, రెవెన్యూ విభాగానికి 21, ఇంజినీరింగ్ విభాగానికి 13, ప్రజారోగ్య విభాగానికి 9 వినతులు అందాయి. అలాగే పరిపాలన, అకౌంట్స్ విభాగానికి 5, యూసీడీకి 4, ఉద్యానవన విభాగానికి ఒక వినతి చొప్పున నమోదయ్యాయి. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ (అమృత్) డి.విజయభారతి, ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్, సీసీపీ ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు, కార్యదర్శి బీవీ రమణ, ఏడీహెచ్ వాసుకి, స్పోర్ట్స్ డైరెక్టర్ అప్పలరాజుతో పాటు పలువురు డీసీపీలు, ఏసీపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో అమరజీవికి ఘన నివాళి
మహారాణిపేట: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కే.కే రాజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, పార్టీ ముఖ్య నేతలు కొండా రాజీవ్ గాంధీ, మంచ నాగ మల్లేశ్వరి, పేర్ల విజయ్ చందర్, జీవీ రవి చంద్రరాజు, రవీంద్ర భరత్, పీలా ప్రేమ కిరణ్ జగదీష్ , వంకాయల మారుతీ ప్రసాద్, సకలభక్తుల ప్రసాద్ రావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, కార్పొరేటర్ కేవీ శశికళ, బిపిన్ కుమార్ జైన్, పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రామ రాజు, సాగర, బొండా శ్రీను, పద్మ, శేఖర్ పాల్గొన్నారు. -
విశాఖ ప్రగతికి సరికొత్త ప్రణాళిక
మహారాణిపేట: జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపేందుకు స్వర్ణాంధ్ర–2047లో భాగంగా రూపొందించిన పది సూత్రాల అమలుపై కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో తీసుకున్న కీలక నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాన్ని పేదరికం లేని దిశగా తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ, ప్రతి కుటుంబానికి కనీస అవసరాల కల్పనతో పాటు సామాజిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో రోడ్ల అనుసంధానం, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, వీధి దీపాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా నైపుణ్య శిక్షణను వేగవంతం చేస్తూ, లక్ష మందికి నిర్వహించిన స్కిల్ స్క్రీనింగ్లో అర్హత సాధించిన వారికి తగిన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. ఇకపై జిల్లా ఉపాధి కల్పనాధికారి ‘స్కిల్ ఆఫీసర్’గా కూడా వ్యవహరిస్తారని ఆయన వెల్లడించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇన్చార్జి డీఆర్వో శేషశైలజ, సీపీవో శ్రీనివాసరావు, ఏడీసీ సత్యవేణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు 278 వినతులు
మహారాణిపేట: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి భారీగా వినతులు వచ్చాయి. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై మొత్తం 278 అర్జీలు నమోదయ్యాయి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇన్చార్జి డీఆర్వో శేషశైలజ, ఏడీసీ సత్యవేణిలు వినతులు స్వీకరించారు. వినతుల్లో జీవీఎంసీకి సంబంధించి 94, పోలీస్ శాఖకు 26, ఇతర శాఖలకు సంబంధించి 158 ఉన్నాయి. ప్రధానంగా సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాల మంజూరు, రైతు బజార్లలో దుకాణాల కేటాయింపు, లేఅవుట్ల క్రమబద్దీకరణ, ఇంటి పన్నులు, శాంతిభద్రతల సమస్యలపై ప్రజలు అధికారులకు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు అందరూ పాల్గొన్నారు. -
ఎగిరిన గ్రిల్స్
కూలిన గోడలు..పేలుడు జరిగిన భవనం ఇదే.. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం వెనుక వైపు గోడ పేకమేడలా కూలి పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడింది. కిటికీ ఇనుప గ్రిల్స్ గాలిలో ఎగురుకుంటూ వెళ్లి రెండు వీధుల అవతల పడ్డాయంటే ఆ ధాటి ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు. ‘ఆ సమయంలో వీధిలో ఎవరైనా ఉంటే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఇంట్లో మనుషులుంటే ఆ గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైపోయేవారు’ అని ఘటనా స్థలాన్ని చూసిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగకపోవడం కేవలం అదృష్టంగా భావిస్తున్నారు. ఐదు కేసులున్నా ఆగని ‘వారసత్వ’ అరాచకం బాణసంచా సూత్రధారి స్థానికుడు దామోదర శివకృష్ణ కుమార్ (బాంబుల శివ). తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన బాంబుల వ్యాపారాన్ని ఏకంగా 40 ఏళ్లుగా యథేచ్ఛగా సాగిస్తున్నాడు. ఎక్కడో తక్కువ ధరకు బాంబులు కొనుగోలు చేయడం.. జనావాసాల మధ్య ఉన్న ఇంట్లో నిల్వ ఉంచి అమ్మడం ఇతనికి నిత్యకృత్యం. గతంలో ఇతనిపై 5 సార్లు కేసులు నమోదయ్యాయి. పోలీసులు సామగ్రిని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసినా, శివకృష్ణలో మార్పు రాలేదు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు గుట్టుచప్పుడు కాకుండా సాగే ఈ అక్రమ వ్యాపారం, ఈ పేలుడుతో ఇప్పుడు బహిర్గతమైంది. చట్టాలన్నా, పోలీసులన్నా ఇతనికి లెక్క లేదన్నది బహిరంగ రహస్యం. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే గణబాబు సోమవారం సందర్శించారు. నివాస ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రంగంలోకి యంత్రాంగం.. ఆధారాల సేకరణ క్లూస్ టీం సభ్యులు ఘటనా స్థలంలో సోదాలు నిర్వహించి పేలుడుకు సంబంధించిన కీలక ఆనవాళ్లను సేకరించారు. సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ రామారావు భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకోగా, తహసీల్దార్ రమేష్, వెస్ట్ జోనల్ కమిషనర్ హేమావతి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రామలింగేశ్వరరావు భవన పటిష్టతను పరిశీలించారు. ప్రస్తుతానికి ఆ భవనాన్ని పూర్తిగా ఖాళీ చేయించి సీజ్ చేశారు. ఐదు కేసులు ఉన్నా ఒక వ్యక్తి 40 ఏళ్లుగా ఇంత సాహసం ఎలా చేయగలుగుతున్నాడు? పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే కదా సామాన్యుల ప్రాణాలు ఫణంగా మారుతున్నాయి? ఇప్పటికై నా యంత్రాంగం కళ్లు తెరవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రాణాలు దక్కడం అదృష్టం జనావాసాల మధ్య ఇలా బాంబులు నిల్వ చేయడం చాలా దారుణం. పేలుడు ధాటికి వెనుక వైపు గోడ ఎగిరి వచ్చి మా ఇంటిపై పడటంతో రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఆదివారం కావడంతో మేమంతా బయటకు వెళ్లాం, లేదంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది. బాంబుల తయారీ కేంద్రాలు, అక్రమ నిల్వలను పూర్తిగా నివారించాలి. ఈ ప్రమాదం వల్ల మేము భారీగా నష్టపోయాం. అధికారులు స్పందించి ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. –పి.కాశీనాథ్, ఆదర్శనగర్ చావు అంచుల దాకా.. మా ఇంటి సమీపంలోని ఉన్న భవనంలో బాంబులు తయారు చేస్తున్నారన్న విషయం తెలియదు. పేలుడు సంభవించిన ప్పుడు మేమెంతా బయట లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఆ శబ్దానికి, భయంకరమైన అదురుకు తీవ్ర ఆందోళనకు గురయ్యాం. మా వదిన ఆ ధాటికి భయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాం. కానీ ఆ భయం నుంచి తను ఇంకా కోలుకోలేదు. జనావాసాల మధ్య ఇలాంటి బాంబుల నిల్వలు లేకుండా అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. –హెప్సిబా, ఆదర్శనగర్ ఆదర్శనగర్లో బాణసంచా పేలుడు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం బాంబుల శివ అరాచకం.. పోలీసు కౌన్సెలింగ్ పట్టించుకోని వైనం 40 ఏళ్లుగా వారసత్వ వ్యాపారం.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం అది కేవలం బాణసంచా పేలుడు కాదు.. జనావాసాల మధ్య పొంచి ఉన్న మృత్యువు విసిరిన పంజా..జీవీఎంసీ 89వ వార్డు ఆదర్శనగర్ శ్మశానవాటిక సమీపంలో ఆదివారం రాత్రి సంభవించిన బాణసంచా పేలుడు ఘటన సృష్టించిన బీభత్సం చూస్తుంటే స్థానికులు ఇప్పటికీ వణికిపోతున్నారు. చీకట్లో కేవలం మంటలు, పొగ మాత్రమే కనిపించినా.. సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చిన దృశ్యాలు ఆ ప్రాంతాన్ని రణరంగంగా తలపించాయి. – గోపాలపట్నంనిందితుడిని అదుపులోకి తీసుకున్నాం గతంలోనే బాంబుల శివపై 5 కేసులు నమోదు చేశాం. ఈ ప్రమాదకరమైన వృత్తిని మానుకుని, వేరే పని చూసుకోమని పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు. ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నాం. –సన్యాసినాయుడు, సీఐ, గోపాలపట్నం -
మరణించిన విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి రూ.కోటి బీమా
తాటిచెట్లపాలెం : విధి నిర్వహణలో మరణించిన ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగి కుటుంబానికి కార్పొరేట్ ప్రమాద బీమా కింద రూ. కోటి పరిహారాన్ని అందజేశారు. కాకినాడ సర్కిల్ పెద్దాపురం సెక్షన్లో జెఎల్ఎం గ్రేడ్–2గా పనిచేస్తూ గత ఆగస్టులో ప్రమాదవశాత్తు మరణించిన అరుమిల్లి రామకృష్ణ కుటుంబానికి ఈ ఆర్థిక భరోసా లభించింది. సోమవారం విశాఖలోని సంస్థ కార్యాలయంలో సీఎండీ పృధ్వీతేజ్ ఇమ్మడి చేతుల మీదుగా మృతుని తల్లి సూర్యకుమారికి ఈ చెక్కును అందజేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ శాలరీ సేవింగ్స్ ఖాతాకు అను బంధంగా ఉన్న బీమా పథకం ద్వారా ఈ మొత్తం సమకూరింది. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. క్లిష్ట సమయాల్లో ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడంలో బ్యాంక్ బీమా పథకాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్. హరిబాబు, ఎస్బీఐ అమరావతి డీజీఎం అశోక్ వి సోనునే, విశాఖ ఏజీఎం ఎస్ శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్లు ఏ శ్రీనివాస్, ఎల్ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కుబడిగా ‘రెవెన్యూ క్లినిక్’
మహారాణిపేట: జిల్లా యంత్రాంగం చేపట్టిన ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహణకు సోమవారం గందరగోళం నెలకొంది. సాధారణంగా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జరిగే ఈ కార్యక్రమానికి, ఇతర సమావేశాల కారణంగా ఈసారి వేదిక కరువైంది. అటు కోర్టు హాలులోనూ స్థలం లేకపోవడంతో అధికారులు ఒక్కో మండలానికి ఒక్కో చోట మొక్కుబడిగా వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కంటే రెవెన్యూ క్లినిక్కే జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చినప్పటికీ, సరైన వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూర్తిస్థాయిలో సమస్యలపై చర్చించే అవకాశం లేకపోవడంతో, తహసీల్దార్లు కేవలం వినతులు తీసుకుని బయట నుంచే సమాధానాలు చెప్పి పంపించేశారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశతో వచ్చిన బాధితులు.. సరైన వేదిక, సమయం కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీకి 37 ఫిర్యాదులు
సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఏపీఈపీడీసీఎల్ నిర్వహించిన ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమానికి సోమవారం 37 ఫిర్యాదులు వచ్చినట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంలో 37 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను నేరుగా సీఎండి దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడిలో జాప్యం, విద్యుత్ బిల్లులు, విద్యుత్ లైన్లు, స్తంభాల మార్పిడి, తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టీవీ సూర్యప్రకాష్, ఎస్ హరిబాబు, సీజీఎం లు వి విజయలలిత, ఎల్ దైవప్రసాద్, జీఎంలు వీవీఎస్ఎన్వీ ప్రసాద్, ఎం ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ పోర్టులో ఆధునిక విప్లవం!
సాక్షి, విశాఖపట్నం: ‘ఈస్ట్కోస్ట్ గేట్ వే ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన విశాఖపట్నం పోర్టు అంతర్జాతీయ నౌకాయాన పటంలో తన ముద్రను మరింత బలోపేతం చేసుకుంటోంది. దిగ్గజ పోర్టులతో పోటీపడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 మిలియన్ టన్నుల సరకు రవాణా లక్ష్యాన్ని ఛేదించేందుకు సన్నద్ధమవుతోంది. అటు మౌలిక వసతులు, ఇటు సాంకేతికత.. రెండింటినీ జోడించి నిర్వహణ సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ‘యాంత్రీకరణ’ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ‘ఓ అండ్ ఎం’.. పోర్టు సరికొత్త అస్త్రం! దేశంలోనే తొలిసారిగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పద్ధతిని అమలు చేసి సక్సెస్ అయిన విశాఖ పోర్టు, ఇప్పుడు అదే వ్యూహంతో మరిన్ని బెర్తులను ఆధునికీకరించనుంది. పోర్టు ఖజానాపై ఒక్క రూపాయి భారం పడకుండా, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ. 800 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారు. హెచ్ఎల్సీ క్రేన్లతో.. సూపర్ ఫాస్ట్ హ్యాండ్లింగ్! మల్టీ కార్గో హ్యాండ్లింగ్లో వేగాన్ని పెంచేందుకు అత్యాధునిక హెవీ లిఫ్ట్ క్రేన్లను (హెచ్ఎల్సీ) ఏర్పాటు చేయనున్నారు. ఈక్యూ–3 : మల్టీ పర్పస్ కార్గో కోసం కేటాయింపు. ఈక్యూ–4 : బల్క్ కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం పెంపు. డబ్ల్యూక్యూ–1: బెర్తు పునర్నిర్మాణం, ఆధునికీకరణ. ఈ మూడు బెర్తుల నిర్వహణ బాధ్యతలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. తద్వారా అత్యాధునిక యంత్రాలతో సరకు రవాణా వేగం పెరగడమే కాకుండా, పోర్టు నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. రీటెండర్లతో పక్కా వ్యూహం ముందుగా పిలిచిన టెండర్లలో ఆశించిన మేర పెట్టుబడులు రాకపోవడంతో, పోర్టు ప్రయోజనాల దృష్ట్యా అధికారులు ఇప్పుడు రీటెండర్లకు వెళ్తున్నారు. పోర్టు చైర్మన్ డాక్టర్ అంగముత్తు, డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరాంజి దిశానిర్దేశంలో, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రామ్ ప్రసాద్ పర్యవేక్షణలో ఈ భారీ కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే రూ. 655 కోట్లతో ఈక్యూ–7, వెస్ట్ క్యూ–7, 8 బెర్తుల యాంత్రీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రపంచ వాణిజ్య కేంద్రంగా విశాఖ కేవలం సరకు రవాణాకే పరిమితం కాకుండా, కంటైనర్ టెర్మినల్ విస్తరణ, జెట్టీల ఆధునికీకరణ, లాజిస్టిక్ కనెక్టివిటీ ప్రాజెక్టులతో విశాఖ పోర్టు రూపురేఖలు మారుతున్నాయి. రాబోయే రోజుల్లో 100 శాతం మెకనైజేషన్ పూర్తి చేసుకుని, ప్రపంచ వాణిజ్య కేంద్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలవడమే లక్ష్యంగా ఈ ‘ఆధునిక’ విప్లవం సాగుతోంది. విశాఖ పోర్టు సాధిస్తున్న ఈ పురోగతి, అటు పారిశ్రామిక రంగానికి, ఇటు ప్రభుత్వానికి భారీ ఆదాయ వనరుగా మారబోతోంది. పెట్టుబడుల ప్రవాహం పెరిగితే స్థానికంగా మరిన్ని ఉపాధి అవకాశాలు లభించే వీలుంది. -
గ్యాస్ట్రబుల్
నగర నడిబొడ్డున ఉన్న గురుద్వారా జంక్షన్ సాక్షిగా సామాన్యుడి గ్యాస్ కష్టాలు రోడ్డున పడ్డాయి. ఓ పక్క డిజిటల్ ఇండియా, డోర్ డెలివరీ అని గొప్పలు చెబుతున్నా..క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఆదివారం ఒక్క రోజు సెలవు వస్తే చాలు.. సోమవారం ఉదయానికే గ్యాస్ ఏజెన్సీల ముందు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఖాళీ సిలిండర్లను భుజాన వేసుకుని.. పనులన్నీ మానుకుని గంటల తరబడి ఎండలో పడిగాపులు కాస్తున్నారు. సిలిండర్ ఇంటికి రాకపోవడమే కాకుండా, స్వయంగా వెళ్లి తెచ్చుకోవాలన్నా చుక్కలు కనిపిస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీల నిర్వహణ లోపమో.. సరఫరాలో వైఫల్యమో తెలియదు కానీ సామాన్యుడి పొయ్యి వెలగాలంటే మాత్రం గంటల తరబడి రోడ్ల మీద నిలబడక తప్పడం లేదు. గ్యాస్ ధరల భారంతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యుడికి, ఈ నిరీక్షణ మరిన్ని కన్నీళ్లు మిగులుస్తోంది. అధికారులు, సంబంధిత కంపెనీలు ఇప్పటికై నా స్పందించి ఈ ‘గ్యాస్’ తిప్పలు తప్పించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. –ఫొటోలు : సాక్షి, ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
మహిళలపై దాడులు సిగ్గుచేటు
మహారాణిపేట: తిరుపతిలో మహిళా నిరసనకారులపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం ఎల్ఐసీ జంక్షన్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన చేపట్టనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ప్రకటించారు. సోమవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై శాంతియుతంగా నిరసన తెలిపిన మహిళలపై టీడీపీ శ్రేణులు దాడి చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. బాధితులపైనే పోలీసులు అక్రమ కేసులు బనాయించి, పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు నిరసనగా నిర్వహించే ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కేకే రాజు పిలుపునిచ్చారు. -
తొలిరోజు పదిలంగా..
పదో తరగతి పరీక్షలు ఆరిలోవ: జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలు సజావుగా జరిగాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన పరీక్షలకు విద్యార్థులు సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తమ పిల్లలను పరీక్షలకు తీసుకొచ్చిన తల్లిదండ్రులతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ముఖ్యంగా ప్రధాన రహదారుల పక్కన ఉన్న కొన్ని పాఠశాలల్లో పరీక్ష ప్రారంభం, ముగింపు సమయాల్లో విద్యార్థులు, తల్లిదండ్రుల రద్దీతో వాహన రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఆశీస్సుల కోలాహలం పరీక్షలకు వెళ్లే ముందు పలువురు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆలయాలు, చర్చిలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగరంలోని సంపత్ వినాయకుడి ఆలయం వద్ద విద్యార్థుల కోలాహలం కనిపించింది. ఎక్కువ మంది విద్యార్థులు తమ హాల్ టికెట్లను దేవుడి వద్ద ఉంచి పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు బొట్టు పెట్టి ఆశీర్వదించి పరీక్షలకు పంపించారు. అధికారుల తనిఖీలు పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. పరీక్షల పరిశీలకుడు దేవానందరెడ్డి 5 కేంద్రాలను, ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు విజయభాస్కర్ 4 కేంద్రాలను తనిఖీ చేయగా, డీఈవో స్వయంగా 8 కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు సైతం 10 కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉత్తరాంధ్రలో 99.61 శాతం హాజరు మధురవాడ: ఉత్తరాంధ్రలో జరిగిన 10వ తరగతి పరీక్షలకు 1,23,214 మంది విద్యార్థులకు గాను 1,22,762 మంది హాజరయ్యారని విద్యాశాఖ ఆర్జేడీ విజయభాస్కర్ తెలిపారు. 639 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు 652 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. తనిఖీ చేసి పంపిస్తున్న సిబ్బందిఓపెన్ టెన్త్ పరిస్థితి సార్వత్రిక విద్యా పీఠం ద్వారా పరీక్ష రాస్తున్న విద్యార్థుల హాజరు ఇలా ఉంది: కేటాయించిన కేంద్రాలు 11 పరీక్ష రాయాల్సిన వారు 578 హాజరైన వారు 480 హాజరు శాతం: 83.04%జిల్లాలో హాజరు వివరాలు మొదటి రోజు ప్రథమ భాష (తెలుగు, సంస్కృతం, ఉర్దూ, ఒరియా) పరీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన గణాంకాలను డీఈవో ఎన్.ప్రేమకుమార్ వెల్లడించారు: మొత్తం పరీక్షా కేంద్రాలు: 133 పరీక్ష రాయాల్సిన వారు : 29,042 హాజరైన విద్యార్థులు: 28,955 హాజరు శాతం: 99.70% -
త్వరలో న్యాయవాదుల సంఘానికి ఎన్నికలు
మహారాణిపేట: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాల ప్రకారం న్యాయవాదుల సంఘాలకు ఈనెల 27వ తేదీకి లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరపాలని నిర్ణయించబడింది. ఈ నేపథ్యంలో విశాఖ న్యాయవాదులు సంఘం జిల్లా కోర్టులో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరానికి సంఘంలో ఉపాధ్యక్ష, గ్రంథాలయ కార్యదర్శి, జూనియర్ కార్యనిర్వాహక సభ్యుల స్థానాలు రిజర్వ్లో ఉన్నాయన్నారు. ఈ స్థానాలకు మహిళ న్యాయవాదులు పోటీ చేయవచ్చని చెప్పారు. ఎన్నికల అధికారిగా ప్రభాకరరెడ్డి సీనియర్ న్యాయవాది ఎ.ప్రభాకరరెడ్డిను ఎన్నికల నిర్వహణ అధికారిగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడున్నర దశాబ్దాలుగా న్యాయ వృత్తిలో ఉన్న ప్రభాకరరెడ్డి పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు న్యాయసలహాదారుగా సేవలందిస్తున్నారు. గతంలో కూడా సంఘం ఎన్నికల్లో అధికారిగా పనిచేసిన ఆయన నియామకంపై బార్ కౌన్సిల్ సభ్యులు ఎస్. కృష్ణ మోహన్, పి.నరసింహరావు, కె.రామజోగేశ్వరరావు, బైపా అరుణ్కుమార్, ఇతర న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. -
పుట్టెడు దుఃఖంలోను పరీక్షకు హాజరు
గాజువాక: రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన అనుపమ పదో తరగతి పరీక్షకు హాజరైంది. ఈనెల 15వ తేదీన బీహెచ్ పీవీ వద్ద టిప్పర్ సృష్టించిన బీభత్సంలో అనుపమ తండ్రి రామకృష్ణ దుర్మరణం పాలైన విష యం తెలిసిందే. కుటుంబమంతా విషాదంలో ఉన్నప్పటికీ అనుపమ ఆ దుఃఖాన్ని దిగమింగుకొని గాజువాక జిల్లా పరిషత్ హైస్కూల్లో తొలిరోజు పరీక్షకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమెను పలకరించిన విలేకరులతో మాట్లాడుతూ ‘నాన్నకు చదువంటే ఇష్టం. ఎన్నికష్టాలు వచ్చినా చదువుకోమని చెప్పారు. తనకేం కష్టం వచ్చినా చదువుకు వెనుకాడవద్దని చెప్పారు. అందుకే ఎంత దుఃఖంలో ఉన్నా పరీక్షకు హాజరయ్యా’నని చెప్పింది. -
ఏసీబీ!
● మళ్లీ లీకువీరులుహతవిధీఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులపై అవినీతి ఆరోపణలు ఏసీబీ తనిఖీల సమయంలో అందుబాటులో లేని కీలక అధికారులు అంతర్గత లీకులే కారణమని విమర్శలుఅవినీతి తిమింగలాలను వేటాడాల్సిన ఏసీబీలో ’లీకు వీరుల’ హవా ఏమాత్రం తగ్గడం లేదు. నిఘా వ్యవస్థ కళ్లుగప్పి, అవినీతి అధికారులకు రక్షణ కవచంలా మారుతున్న కొందరు సిబ్బంది వ్యవహారం ఇప్పుడు శాఖలో హాట్ టాపిక్గా మారింది. తాజా సంఘటనలు చూస్తుంటే.. ఏసీబీ వ్యూహాల కంటే లీకు వీరుల నెట్వర్కే బలంగా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్లో ముందస్తు ‘హెచ్చరికల’ కలకలంసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అవినీతి అంతమే లక్ష్యంగా అడుగులు వేయాల్సిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోటలో.. ‘లీకు వీరులు’ లంకంత రంధ్రం చేస్తున్నారు. అధికారుల వ్యూహాలు పక్కాగా ఉన్నా, దాడుల సమాచారం మాత్రం అంతకంటే వేగంగా నిందితులకు చేరిపోతోంది. గతంలో ఎనిమిది మందిపై వేటు పడినా, హెడ్ కానిస్టేబుళ్లు కటకటాల పాలైనా.. విశాఖ ఏసీబీలో ఈ ‘ఇన్ఫార్మర్’ వ్యవస్థ వేళ్లూనుకుపోవడం విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగిన సోదాలే దీనికి సజీవ సాక్ష్యం. ఏసీబీ బృందం అడుగు పెట్టకముందే, ‘వసూళ్ల వీరులు’గా ముద్రపడ్డ ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులు చల్లగా జారిపోవడం వెనుక శాఖలోని ఒక ‘లీగల్’ మేధావి హస్తం ఉన్నట్లు వినిపిస్తున్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. వేటగాడి కంటే ముందే వేట పసిగట్టిన జంతువులా.. అవినీతి అధికారులు తప్పించుకుంటున్నారంటే.. ఏసీబీలోనే ‘డబుల్ ఏజెంట్లు’ రాజ్యమేలుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు లీకువీరుడిపై ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. లీకుల ‘నెట్వర్క్’పై మళ్లీ చర్చ విశాఖ ఏసీబీ విభాగంలో లీకుల వ్యవహారం కొత్తది కాదు. గతంలో కూడా తనిఖీల సమాచారం ముందుగానే అవినీతి అధికారులకు చేరుతోందన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఫిర్యాదులు వచ్చిన అధికారులకే సమాచారం చేరడంతో భారీగా నెలవారీ మాముళ్లు వసూలవుతున్నాయన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించి ఒకేసారి ఎనిమిది మంది సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. అయినప్పటికీ లీకుల వ్యవహారం పూర్తిగా ఆగలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో హెడ్ కానిస్టేబుల్పై వేటు గత ఏడాది జూన్లో జరిగిన మరో ఘటనలో ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలకు వెళ్లిన ఏసీబీ అధికారులు అక్కడి ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఆ సమయంలో ఒక హెడ్ కానిస్టేబుల్ ముందుగానే తనిఖీల సమాచారం సబ్ రిజిస్ట్రార్కు ఫోన్ ద్వారా అందించినట్టు బయటపడింది. సదరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుండగానే ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఫోన్ కాల్ వివరాల్లో నిజం బయటపడడంతో ఆ హెడ్ కానిస్టేబుల్పై చర్యలు తీసుకుని అతని నివాసంలో కూడా సోదాలు నిర్వహించినట్టు సమాచారం. టౌన్ ప్లానింగ్లో ‘సేఫ్’ గేమ్! తాజాగా జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగిన ఏసీబీ సోదాలు అభాసుపాలయ్యాయి. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులకు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అసలు సిబ్బంది దొరకకపోవడం గమనార్హం. ముఖ్యంగా వసూళ్ల వీరులుగా ముద్రపడ్డ ఒక ఏసీపీ, ఒక డీసీపీ స్థాయి అధికారులు తనిఖీలకు సరిగ్గా కొద్ది నిమిషాల ముందే మాయమవ్వడం వెనుక ‘ముందస్తు సమాచారం’ అందిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. చట్టపరమైన ముసుగులో ’లీకు’ డ్రామా? గతంలో క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సమాచారం బయటకు వెళ్లేది. కానీ, ఈసారి వ్యూహం మారింది. రెగ్యులర్ సిబ్బందిపై నిఘా ఉండటంతో, ఈ దఫా చట్టపరమైన వ్యవహారాలు చూసే (లీగల్ సెక్షన్) ఒక కీలక వ్యక్తి ద్వారా ఈ సమాచారం లీక్ అయినట్టు తెలుస్తోంది. సదరు ఏసీపీ, డీసీపీలకు ఆ ’అజ్ఞాత వ్యక్తి’ ముందస్తు హెచ్చరికలు పంపడంతో, ఏసీబీ బృందం వచ్చేసరికి వారు అలెర్ట్ అయిపోయారు. రికార్డులు చూస్తే అక్రమాలు కనిపిస్తున్నా.. అక్రమార్కులు మాత్రం దొరకకుండా దొడ్డిదారిన తప్పించుకున్నారు. తదుపరి వేటు ఎవరిపై? ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న డీఎస్పీ అత్యంత కఠినంగా వ్యవహరిస్తారనే పేరుంది. ఆయన రాకతో లీకు వీరులు సర్దుకుంటారని భావించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదు. జీవీఎంసీ అధికారుల ఎస్కేప్ ఎపిసోడ్ను ఏసీబీ ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. తనిఖీల సమాచారాన్ని బయటకు పంపిన ఆ ’లీగల్’ కింగ్పిన్ ఎవరనే దానిపై ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. త్వరలోనే శాఖలో మరోసారి ప్రక్షాళన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ప్లాస్టిక్ రహిత సింహగిరి కోరుతూ ట్రెకింగ్
సింహాచలం: ప్లాస్టిక్ను అరికట్టి పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పంతో అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ), ఏయూ ఆర్ఎస్ఎస్ విభాగం, ఖే లో భారత్ సంస్థ సంయుక్తంగా ఆదివారం మాధవధార నుంచి సింహాచలం కొండపైకి ట్రెకింగ్ నిర్వహించాయి. సుమారు వంద మంది విద్యార్థులు ఈ ట్రెకింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతిని ప్రేమించా లనే ఉద్దేశంతో ప్లాస్టిక్ను నిషేధించాలి అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రతినిధులు తెలిపారు. ట్రెకింగ్ మార్గ మధ్యలో పడి ఉన్న ప్లాస్టిక్ బా టిళ్లు, కవర్లు, ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి పర్యావరణ స్పృహను చాటారు. అనంతరం సింహగిరికి చేరుకున్న విద్యార్థి బృందాన్ని దేవస్థానం ఈవో జె.వెంకటరావు అభినందించారు. ఖేలో భారత్ కన్వీనర్ విజయ్, సభ్యులు చందు తదితరులు పాల్గొన్నారు. -
కూటమిని ఓడిస్తాం..
సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం పాదయాత్ర సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంతో ముడిపడి ఉన్న పంచ గ్రామాల భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఓడిస్తామని సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం(పంచగ్రామాల భూముల కమిటీ) నాయకులు హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కారం కోరి ఆదివారం సింహాచలంలోని తొలిపావంచా నుంచి ప్రహ్లాదపురం సమీపంలోని విరాట్నగర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి టి.వి.కృష్ణంరాజు మాట్లాడుతూ.. సమస్య మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరు ప్రభుత్వాలు మారాయని, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడమే తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నగర ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. 1903 సర్వే సెటిల్మెంట్ గిల్మాన్ రికార్డుల ప్రకారం రైతులకు భూములపై హక్కులు ఉన్నాయని చెప్పారని, రికార్డులను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారన్నారు. పంచగ్రామాల్లోని రైతులు, గృహ నిర్మాణదారులు, ఇంటి స్థలాల యజమానులు పాతికేళ్లుగా ఇదే విషయాన్ని మొరపెట్టుకుంటున్నారని తెలిపారు. 1903 రికార్డుల ప్రకారం రైతుల హక్కులను గుర్తించాలని, 1996–97లో దేవస్థానానికి ఇచ్చిన రైత్వారీ పట్టాలను రద్దు చేస్తూ శాసనసభలో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పరిధిలోని 1,782 ఎకరాలను దేవస్థానం జాబితా నుంచి మినహాయించాలని, ఇళ్ల నిర్మాణాలకు, క్రయవిక్రయాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఎన్నికల లోపు పరిష్కారం చూపకపోతే కూటమి అభ్యర్థులకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు కె.ఆర్.కె. ప్రసాద్, నాయకులు సిహెచ్. సత్యనారాయణ, చిన్నబ్బాయి, ఎస్.సన్యాసిరావు, అఖిలేష్, అనురాధ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ కష్టాలతో కట్టెల పొయ్యిపై వంటలు
● మళ్లీ పాత రోజుల్లోకి..!ఉషోదయ జంక్షన్లోని ఒక హోటల్ వద్ద గ్యాస్ దొరక్కపోవడంతో, ఖాళీ స్థలంలో టెంట్ వేసి వంటలు చేస్తున్న సిబ్బంది నగరంలో వంట గ్యాస్ కష్టాలు సామాన్యుడిని భయపెడుతున్నా యి. ఒకవైపు గ్యాస్ కృత్రిమ కొరత వేధిస్తుంటే, మరోవైపు ఆన్లైన్ బుకింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో గృహిణులు, ఉద్యోగులు గ్యాస్ సిలిండర్ల కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం జనం ద్విచక్ర వాహనాలపై ఖాళీ సిలిండర్లతో గాలిస్తున్నారు. ఇక గ్యాస్ కొరత ప్రభావం సామాన్యులపైనే కాకుండా వ్యాపార రంగంపైనా తీవ్రంగా పడింది. హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరా పరిమితంగా ఉండటంతో యజమానులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గ్యాస్ లేక వంటలు ఆగిపోయే పరిస్థితి రావడంతో, పలు హోటళ్లలో ఖాళీ ప్రదేశాల్లో టెంట్లు వేసి మరీ కట్టెల పొయ్యిల ద్వారా వంటలు చేస్తున్నారు. మరికొన్ని హోటళ్లలో కొన్ని వంటకాలను పరిమితం చేశారు. గ్యాస్ సరఫరా పునరుద్ధరణ అయ్యే వరకు వ్యాపారం దెబ్బతినకుండా ఉండేందుకు ఈ తరహా పాత పద్ధతులను ఆశ్రయించక తప్పడం లేదని హోటల్ యజమానులు చెబుతున్నారు. – ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
హక్కులపై అవగాహన పెరగాలి
సీపీ శంఖబ్రత బాగ్చి పిలుపు మహారాణిపేట: వినియోగదారులు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వినియోగదారుల హక్కులపై తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన షార్ట్ ఫిలిం, షార్ట్ రీల్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మార్కెట్లో నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందేలా పర్యవేక్షణ పెరగాలన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు జి.తనూజరెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కమిషన్ కట్టుబడి ఉందని తెలిపారు. సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ.. సామాన్యుడికి హక్కులపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్య క్రమాలు, కళారూపాలు దోహదపడతాయన్నారు. ‘పవర్ ఆఫ్ ది సీఆర్సి’కి గుర్తింపు సనారా వంశీ రచన, దర్శకత్వంలో రూపొందించిన ‘పవర్ ఆఫ్ ది సీఆర్సీ’ షార్ట్ రీల్కు ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. సామాన్యుడు అనారోగ్యం పాలై కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను, వాటిని చాకచక్యంగా ఎలా ఎదుర్కోవచ్చనే అంశాన్ని ఈ రీల్లో చక్కగా చూపించారు. ఈ రీల్లో నటించిన నటులు డాక్టర్ కుమార్ నాయక్, బొబ్బది అప్పారావు, అనిల్ గుమ్మల.. అతిథుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి వి.భాస్కరరావు, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రవికుమార్, ఫుడ్ సేఫ్టీ ఏఎఫ్సీ కల్యాణ్ చక్రవర్తి, సీఆర్సీ జాతీయ అధ్యక్షుడు వికాస్ పాండే, ప్రధాన కార్యదర్శి దొడ్డి చంద్రశేఖర్, సినీ రచయిత సత్యాడ నరసింగరావు, జాతీయ ప్రతినిధి అవినాష్ బెంజిమన్ తదితరులు పాల్గొన్నారు.


