breaking news
Visakhapatnam District News
-
అనుమానమే ఉసురు తీసింది...
భార్యను కడతేర్చిన భర్త అరెస్టుయలమంచిలి రూరల్ : యలమంచిలి ధర్మవరం సీపీ పేటలో భార్యను హత్య చేసిన కేసులో భర్తను గురువారం అరెస్ట్ చేసినట్టు యలమంచిలి సీఐ ధనుంజయరావు చెప్పారు. యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి మీడియా సమావేశంలో ఆయన వివరాలు చెప్పారు. ఆయన మాటల్లోనే..ఉత్తరప్రదేశ్ కబీర్నగర్ జిల్లా నందాపూర్ గ్రామానికి చెందిన రాకేష్(27), మాయ(32) పదేళ్ల కితం ప్రేమవివాహం చేసుకున్నారు. జీవనోపాధి నిమిత్తం పరవాడ,యలమంచిలి ప్రాంతాల్లో నివసించేవారు.ఇటీవల రెండు నెలల క్రితం యలమంచిలిలో సొంతంగా తుక్కు దుకాణం అద్దెకు తీసుకున్నారు. భార్యాభర్తలతో పాటు 4 నెలల చిన్నారి పరితో కలిసి పట్టణంలోని ధర్మవరంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. భార్య తరచూ ఎవరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నట్టు గమనించిన రాకేష్,ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్టు అనుమానపడ్డాడు.ఈ విషయమై పలుమార్లు ఆమెను మందలించాడు. నెలరోజులుగా భార్యాభర్తల మధ్య ఈ విషయంపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కుమార్తె పరికి డైపర్లు అవసరమై కొని తెచ్చేందుకు తుక్కు దుకాణంలో భార్యను ఉంచి బయటకు వెళ్లాడు రాకేష్. పని పూర్తి చేసుకుని తిరిగి దుకాణం వద్దకు వచ్చేసరికి భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడడం పసిగట్టి ఆమెను నిలదీశాడు. ఆమె ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో కోపంతో రగిలిపోయిన రాకేష్ నియంత్రణ కోల్పోయి ఆమెను గోడకు గుద్దించి, విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె ప్రతిఘటించడంతో మరింత కోపంతో అక్కడున్న స్క్రూడ్రైవర్తో ఛాతీ పై పలుమార్లు పొడిచి గాయపర్చాడు. తీవ్రంగా గాయపడిన ఆమె స్పృహ కోల్పోవడంతో తుక్కు దుకాణం యజమాని సాయంతో తొలుత స్థానిక కమలా ఆస్పత్రికి, అక్కడ్నుంచి యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే మాయ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించడంతో నిందితుడు రాకేష్ జరిగిన విషయం చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు స్వయంగా నేరం అంగీకరించినట్టు సీఐ తెలిపారు. మృతురాలు ఎవరితో మాట్లాడుతుందనేది నిందితుడికి కూడా తెలియదని చెబుతున్నాడని, కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలతో తెలుసుకోవాల్సి ఉందన్నారు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలుకు వెళ్లడంతో 4 నెలల చిన్నారిని తాత్కాలికంగా జిల్లా పిల్లల సంరక్షణ కమిటీకి అప్పగించామన్నారు. మృతురాలి బంధువులు ఉత్తరప్రదేశ్ నుంచి రావాల్సి ఉందని,వారొచ్చేవరకు మాయ మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి శవాగారంలో భధ్రపరిచామన్నారు.వీఆర్వో పిల్లి మారేశ్వర్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించామన్నారు.. -
● నీటి అద్దంలో.. ప్రకృతి ప్రతిబింబం
కొండల వెనుక నుంచి వచ్చే ఆ వెలుగు చారలు, నిశ్చలంగా ఉన్న నీటిపై పడి ఒక అద్భుతమైన చిత్రాన్ని గీస్తున్నాయి. ప్రకృతిలో దాగి ఉన్న అసలైన ప్రశాంతతను చూడాలంటే ఇలాంటి ప్రదేశాలకు రావాల్సిందే. పడవలు తీరానికి చేరుకున్న వేళ, ఆకాశం గులాబీ రంగును పులుముకున్న వేళ... ఈ దృశ్యం మనసులోని అలజడిని తగ్గించి, ఉత్తేజాన్ని ఇస్తుంది. బిజీ జీవితం నుంచి కాసేపు విరామం తీసుకుని, ప్రకృతితో కలిసిపోవాలనుకునే వారికి సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టులోని మత్స్యగెడ్డ ప్రాంతం చక్కని ప్రదేశం. – ముంచంగిపుట్టు -
ప్రజా ఉద్యమకారులపై పీడీ యాక్టా?
డాబాగార్డెన్స్: బల్క్ డ్రగ్ పరిశ్రమ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని పోరాడుతున్న సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజుపై పీడీ యాక్ట్ ప్రయోగించి అరెస్ట్ చేయడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది. దీనికి నిరసనగా సీపీఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జగదాంబ జంక్షన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు కొత్తపల్లి లోకనాథం, సీహెచ్ నరసింగరావు, జగ్గునాయుడు మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడే వారిపై స్మగ్లర్లకు, నేరస్తులకు వేయాల్సిన పీడీ యాక్ట్ను ప్రయోగించడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ల కోసం ఉద్యమాలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. అప్పలరాజును వెంటనే భేషరతుగా విడుదల చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు ఆర్కేఎస్వీ కుమార్, పి.మణి, బి.పద్మ, వి.కృష్ణారావు, ఈశ్వరమ్మ, ఎం.సుబ్బారావు, పి.పైడిరాజు, ఆర్ఎస్ఎన్ మూర్తి, యూఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అప్పలరాజు అరెస్ట్పై భగ్గుమన్న సీపీఎం -
22–ఏ ఫైళ్లకు మోక్షమెప్పుడో?
మహారాణిపేట: రెవెన్యూ సమస్యల పరిష్కారంలో యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. తహసీల్దార్ కార్యాలయం నుంచి రెవెన్యూ డివిజన్ కార్యాలయం వరకు, చివరకు కలెక్టరేట్లోని పలు విభాగాల్లో కూడా కొర్రీల మీద కొర్రీలు వేస్తున్నారు. అర్జీలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. రెవెన్యూ దస్త్రాల ఊసెత్తడానికే సాహసించడం లేదు. కొంతమంది ఉన్నతాధికారులు అయితే ఫైళ్ల మీద డిస్కస్ అని రాసి చేతులు దులుపుకుంటున్నారు. ముఖ్యంగా నిషేధిత జాబితా(22ఏ)లోని ఫైళ్ల విషయంలో ఈ పరిస్థితి ఉంది. తిరస్కరణకే అధికారుల మొగ్గు జిల్లాలో 22–ఏ జాబితాలో చేరిన భూములను, ఆ జాబితా నుంచి తొలగించేందుకు అధికారులెవరూ సాహసించడం లేదు. జిల్లాలోని ఐఏఎస్ అధికారులు సైతం 22–ఏ ఫైల్ అంటేనే వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ కేటగిరీకి సంబంధించి దాదాపు 80 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో), రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) పోస్టులు చాలా రోజుల నుంచి ఖాళీగా ఉండటంతో కలెక్టరేట్లో ఫైళ్ల కదలికలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. 22–ఏ జాబితా నుంచి తమ భూములను క్లియర్ చేయించుకోవడానికి దరఖాస్తుదారులు తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బాధితులు ఎక్కువగా ఒత్తిడి చేస్తే, ఏదో ఒక సాకు చూపి దరఖాస్తును తిరస్కరిస్తున్నారు. గతంలో అయితే ఫైళ్లు పెండింగ్లో ఉండేవి. కానీ ఇప్పుడు 22–ఏ ఫైళ్లను ఎప్పటికప్పుడు పరిశీలించి తిరస్కరిస్తున్నట్లు సమాచారం. ఇబ్బందుల్లో రైతులు భూములు 22–ఏ జాబితాలో ఉండటం వల్ల అన్నదాత సుఖీభవ వంటి ప్రభుత్వ పథకాలు రైతులకు అందడం లేదు. ఆన్లైన్(1–బి)లో వివరాలు ఉంటేనే ఈ పథకాలు వర్తిస్తాయి. ఎంతోమంది రైతుల భూములను 22–ఏ లోనూ, జీరో ఖాతాల్లోనూ చేర్చారు. వాస్తవానికి హక్కులు కలిగిన రైతుల భూములను కూడా 22–ఏలో చేర్చారన్న విమర్శలు వస్తున్నాయి. ఎంతోకాలంగా రైతులు సాగు చేసుకుంటున్న భూములను, హక్కులతో అనుభవిస్తున్న వారి స్థలాలను జీరో ఖాతాలకు బదిలీ చేయడం వల్ల వారు యజమాన్య హక్కులను కోల్పోతున్నారు. జిరాయితీకి తప్పని 22–ఏ బెడద జిరాయితీ భూములను సైతం 22–ఏ జాబితాలో చేర్చుతున్నారు. ఇది కావాలని చేస్తున్నారో లేక, ఇతర రాజకీయ కారణాల వల్ల జరుగుతోందో ఎవరికీ అంతుపట్టడం లేదు. కొంతమంది రెవెన్యూ అధికారులు జిరాయితీ భూములను నిషేధిత జాబితాలో చేర్చుతుంటే, ఉన్నతాధికారులు సైతం ఆమోదముద్ర వేస్తున్నారు. ఒకసారి 22–ఏలో చేరిన తర్వాత, ఆ జాబితా నుంచి భూమిని బయటకు తీసుకురావడం కష్టంతో కూడుకున్న పనిగా మారింది. అడ్డంకిగా సబ్ డివిజన్ జిల్లాలో కొన్ని సర్వే నంబర్లను మొత్తం 22–ఏలో చేర్చారు. ఈ భూములకు సబ్ డివిజన్ కాకపోవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకే సర్వే నంబరులో ఉన్న వివాదాస్పద భూమి వల్ల, మిగిలిన క్లియర్ భూములు కూడా 22–ఏలో మగ్గుతున్నాయి. సదరు సర్వే నంబర్లకు సబ్ డివిజన్ చేస్తే ఎంతోమంది ఈ సమస్య నుంచి బయటపడతారు. కానీ అధికారులు సబ్ డివిజన్ చేయడానికి సహకరించడం లేదు. దీనివల్ల ఎంతోమంది ఇళ్లు కట్టుకుని కూడా, రిజిస్ట్రేషన్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతూ అక్కడే నివసిస్తున్నారు. -
27న భీమిలిలో జాబ్ మేళా
మురళీనగర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భీమిలి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 27న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి.చాముండేశ్వరరావు తెలిపారు. ఈ మేళాలో 15కు పైగా కంపెనీలు పాల్గొని 800కి పైగా ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి ఏదైనా డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమా అర్హత ఉండి, ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకొని అడ్మిట్ కార్డ్తో హాజరు కావాలని తెలిపారు. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 901475 8949 ఫోన్ నంబర్ను సంప్రదించాలన్నారు. అదే రోజు భీమిలి పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్లో ఐటీ సెక్టార్కి చెందిన సెక్యూరిటీ అనలిసిస్ట్ కోర్స్లో చేరడానికి ఏదైనా డిగ్రీ లేదా ఏదైనా బీటెక్ అర్హత కలిగి ఆసక్తి కలిగిన యువతీయువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శిక్షణ అనంతరం వీరికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. -
వెలుగురేఖ సమైక్య
ఇద్దరు విద్యార్థులను చదివిస్తున్నా శ్రీకాకుళంలో విద్యనభ్యసించి, విశాఖపట్నంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో సత్యనారాయణ సర్ ఆర్థిక సహకారంతో బ్యాంక్ పరీక్షల్లో విజయం సాధించా. 2018లో ఐడీబీఐ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా ఎంపికై , ప్రస్తుతం మధురవాడ బ్రాంచ్ మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. నాపై చూపిన ఉదారతను స్ఫూర్తిగా తీసుకుని, ప్రస్తుతం మా ఊరిలో ఇద్దరు విద్యార్థుల పూర్తి విద్యా ఖర్చులను నేను భరిస్తున్నాను. – రేగాన సింహాచలం, ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ మధురవాడ అమ్మ కష్టాన్ని చూసి ఆదుకున్నారు! ‘మాది రాజాం. మా అమ్మ ఐస్క్రీం పార్లర్లో పనిచేస్తూ మమ్మల్ని చదివించేది. సత్యనారాయణ సార్ నా ప్రతిభను గుర్తించి ఇంటర్ నుంచి సీఏ పూర్తయ్యే వరకు దాదాపు రూ.65 వేలు ఖర్చు చేసి చదివించారు. నేడు విప్రోలో చార్టెడ్ అకౌంటెంట్గా నెలకు రూ.90 వేలు సంపాదిస్తున్నా. సార్ స్ఫూర్తితో నేను కూడా ఇప్పుడు ఒక విద్యార్థిని చదివిస్తున్నా. – భవిరిశెట్టి కోటేశ్వరరావు, సీఏ, విప్రో తాటిచెట్లపాలెం: ఒక చిన్న దీపం వేల జీవితాల్లో వెలుగులు నింపగలదు. ప్రతిభ ఉండి, ఆర్థిక స్థోమత లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న పేద విద్యార్థులకు ఆసరాగా నిలుస్తోంది ‘సమైక్య’ సంస్థ. విశాఖ రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో సీనియర్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న సూరిశెట్టి సత్యనారాయణ (అనకాపల్లి జిల్లా, రాజుపేట గ్రామం) తన మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ సేవా యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. ● చిన్నతనంలో తాను అనుభవించిన పేదరికం, కష్టాలే ఆయన్ని ఈ మార్గంలో నడిపించాయి. ‘చదువు ఒక్కటే తరాల తలరాతను మార్చగలదు‘ అని నమ్మే ఆయన, ఇప్పటివరకు 12 మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఆ సంఖ్యను వందకు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఆయన వద్ద సాయం పొందిన విద్యార్థులు ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తూ, తిరిగి మరికొంతమంది పేద విద్యార్థులను దత్తత తీసుకోవడం ఈ ’సమైక్య’ సాధించిన అసలైన విజయం. ప్రతిభావంతులకు ఆర్థిక ప్రోత్సాహం నా గత అనుభవాలు, పల్లెటూరి విద్యార్థుల కష్టాలను ప్రత్యక్షంగా చూడటం వల్లే ప్రతిభావంతులకు అండగా నిలవాలనే సంకల్పం భగవంతుడు కలిగించాడు.పేదరికం నుంచి విముక్తి , భావితరాల భవిష్యత్తును మార్చగలిగే శక్తి కేవలం విద్యకే ఉంది.ఆకలి బాధ తెలిసిన వాడికే అన్నం విలువ తెలిసినట్లు, పేద విద్యార్థులకు మనం ఇచ్చే ప్రతి రూపాయి వారి కలలకు ప్రాణం పోస్తుంది. సరైన ప్రోత్సాహం, భరోసా ఉంటే ఆ విద్యార్థులు తమ లక్ష్యాల వైపు మరింత దృఢంగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. ఇదే ఆశయంతో, ప్రతిభ గల పేద విద్యార్థుల ఉన్నత చదువులకు వెన్నుముకగా నిలిచేందుకు ‘సమైక్య’ నిరంతరం కృషి చేస్తోంది. – సత్యనారాయణ, ౖరెల్వే అధికారి, విశాఖపట్నం ప్రతి అడుగులో తోడున్నారు! రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను నేడు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈ)లో జూనియర్ ఇంజనీర్గా ఉండటానికి సత్యనారాయణ, సమైక్య టీమ్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. పరీక్షలకు దరఖాస్తు చేయడం దగ్గర్నుంచి, ఉద్యోగంలో చేరే వరకు ప్రతి దశలో వారు నాకు మార్గనిర్దేశం చేశారు. మాలాంటి ఎంతోమంది యువతకు సమైక్య ఒక వెలుగురేఖ. –దాడి వెంకటేశ్వర స్వామి, జూనియర్ ఇంజనీర్, మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ కరపత్రం నా జీవితాన్ని మార్చింది! బిటెక్ చదివే రోజుల్లో గేట్ కోచింగ్కు డబ్బుల్లేక లైబ్రరీలో చదువుకునే వాడిని. అక్కడ నోటీసు బోర్డుపై సత్యనారాయణ నంబర్ చూసి సంప్రదించా. ఆయన నన్ను కోచింగ్లో చేర్పించి, ఆర్థిక సాయంతో పాటు నిరంతరం గైడెన్స్ ఇచ్చారు. నేడు బెంగళూరులోని ఒక ప్రముఖ కంపెనీలో టెక్నికల్ డిజైనర్గా స్థిరపడ్డా. – షేక్ తాజ్ అహ్మద్, ప్యుస్ట్ గ్లోబ్ కంపెనీ పేద విద్యార్థులకు బాసట దత్తత తీసుకుని ప్రోత్సాహం రైల్వే ఉన్నతాధికారి సత్యనారాయణ ఆదర్శం కొనసాగిస్తున్న సేవాయజ్ఞం వంద మందికి ఆసరా ఇవ్వడమే లక్ష్యం -
మధుర ఫలం.. ముందే వచ్చేసింది!
సీతంపేట: ఒకప్పుడు ఉగాదికి మామిడి పిందెలు వచ్చేవి. మామిడి పండ్ల రుచిని ఆస్వాదించాలంటే మే వరకు ఆగాల్సి వచ్చేది. కానీ, కాలం మారింది.. దాంతో పాటు పంట విధానాలూ మారాయి. ఇప్పుడు విశాఖ వాసులకు శీతాకాలంలోనే ఫలరాజు దర్శనమిస్తున్నాడు. సాధారణ సీజన్కు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ.. శంకరమఠం రోడ్డులో మామిడి పండ్లు కనువిందు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ పండ్లను స్థానిక వ్యాపారులు విక్రయిస్తున్నారు. సీజన్ కాని సీజన్లో పసుపు రంగులో మెరుస్తున్న మామిడిని చూసి నగరవాసులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ మామిడి పండ్ల ధర కిలో రూ. 300గా ఉంది. ధర కాస్త ఘాటుగానే ఉన్నా.. మామిడిపై ఉన్న మక్కువతో మ్యాంగో లవర్స్ ఎగబడి మరీ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ.. ఇప్పుడు ఏడాదికి మూడు సార్లు కాపు కాసే కొత్త రకం మామిడి పంటలు వచ్చాయని, దీని వల్ల ఏడాది పొడవునా మామిడి కాయలతో పాటు, పండ్లు కూడా అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు. శీతాకాలంలోనే నోరూరిస్తున్న మామిడి -
ఏయూలో స్టిక్కరింగ్ గందరగోళం
విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరో వివాదాస్పద నిర్ణయానికి అధికారులు తెరతీశారు. క్యాంపస్లో భద్రత పేరుతో వాహనాలకు గుర్తింపు స్టిక్కర్లు ఇవ్వాలని నిర్ణయించారు. అవి ఉన్న వాహనాలనే యూనివర్సిటీలోకి అనుమతించనున్నారు. ఇందుకోసం ఉద్యోగులు, డే స్కాలర్, రీసర్చ్ స్కాలర్ల వాహనాల వివరాలు ఇవ్వాలని అన్ని విభాగాలకు సర్క్యులర్ జారీ చేశారు. అయితే దీనిపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముందస్తు చర్చ లేకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఏయూతోపాటు విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. ఆకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు సైతం విస్తుపోతున్నారు. గుర్తింపు స్టిక్కర్లు ఉన్న వాహనాలను మాత్రమే లోపలకు అనుమతిస్తే.. ఏయూలో బ్యాంక్, పోస్టాఫీస్ సేవలు వినియోగించుకుంటున్న వారి పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పనుల కోసం వచ్చేవారు ఎలా? ఏయూలోకి కేవలం గుర్తింపు స్టిక్కర్లు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించేలా ఆలోచన చేస్తుండడం గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఏయూలో కోర్సులు, ఇతరత్రా సందేహాలు, అవసరాల నిమిత్తం నిత్యం అనేక మంది వస్తుంటారు. ప్రధానంగా క్యాంపస్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోస్టాఫీస్లు ఉన్నాయి. వీటి సేవలను ఏయూ ఉద్యోగులు, విద్యార్థులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు, సిబ్బంది, అలాగే బయట వ్యక్తులు కూడా అనేక ఏళ్లుగా వినియోగిస్తున్నారు. వీరిని ఏయూలోకి అనుమతించని పక్షంలో వారికి బ్యాంక్, పోస్టాఫీస్ సేవలు అందకుండా పోతాయి. అలాగే క్యాంపస్లో ఐఐపీఈ, ఐఐఎం సంస్థలు ఉన్నాయి. వీటిలో పనిచేసే సిబ్బంది పరిస్థితి ఏంటన్న దానిపై అయోమయం నెలకొంది. నిత్యం సర్టిఫికెట్ల కోసం పరీక్షా విభాగానికి, ఇతరత్రా సమాచారం, అవసరాల కోసం అనేక మంది విద్యార్థులు వస్తుంటారు. వీరికి స్టిక్కర్లు ఇచ్చే అవకాశం లేదు. వీరిని ఏయూలోకి అనుమతించని పక్షంలో ఏయూ సేవలు, సమాచారాన్ని ఎలా పొందుతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు వాహనాలకు గుర్తింపు స్టిక్కర్లతో కలిగే ఇబ్బందులపై ఎటువంటి ముందస్తు ఆలోచన చేయకుండా తీసుకున్న నిర్ణయాన్ని వర్సిటీ ఉద్యోగులే వ్యతిరేకిస్తున్నారు. ఏయూ క్యాంపస్లో భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజిస్ట్రార్ అన్ని విభాగాలకు లేఖ పంపించారు. వెంటనే ఏయూలో అన్ని విభాగాల్లో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తోపాటు డే స్కాలర్లు, రీసెర్చ్ స్కాలర్లు తమ వాహనాల వివరాలను ఎక్సెల్ ఫార్మట్లో ఏయూ సెక్యూరిటీ ఆఫీస్లో అందజేయాలని అందులో పేర్కొన్నారు. వీటిని మంజూరు చేసిన తర్వాత.. ఈ స్టిక్కర్లు ఉన్న వాహనాలనే ఏయూలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
సిరుల ట్యూనా.. దళారులకేనా?
● రోజుకు 200 టన్నుల వరకు వలకు చిక్కుతున్న చేపలు ● కేరళతో పాటు వియత్నాం, థాయ్లాండ్ తదితర దేశాల్లో భారీ డిమాండ్ ● కిలో రూ.120 నుంచి రూ.180కే కొనుగోలు చేస్తున్న దళారులు ● విదేశీ మార్కెట్లో కిలో రూ.350 నుంచి రూ.800 పైగా ధర ● మార్కెటింగ్, ప్రాసెసింగ్ సౌకర్యం లేక నష్టపోతున్న మత్స్యకారులు సాక్షి, విశాఖపట్నం: వలకు చిక్కితే సిరులు కురిపిస్తుంది.. తింటే పుష్కలంగా ఆరోగ్యాన్ని అందిస్తుంది.. ఎగుమతి చేస్తున్నామంటే చాలు, కొనుగోలు చేసేందుకు విదేశాలు క్యూ కడతాయి. అలాంటి అపారమైన మత్స్య సంపద తూర్పు తీరానికి సొంతం. ఆరోగ్య ప్రయోజనాలు, ఎగుమతి డిమాండ్ పరంగా అంతా సానుకూలంగా ఉన్నా.. సిరులు కురిపించే విషయంలో మాత్రం మత్స్యకారులకు అన్యాయమే జరుగుతోంది, వారి శ్రమ దోపిడీకి గురవుతోంది. వందల కిలోమీటర్ల దూరం వెళ్లి, గంటల తరబడి వేచి చూస్తే గానీ చిక్కని ట్యూనా చేపలకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో దళారులకే లబ్ధి చేకూరుతోంది. జాతీయ మత్స్య పరిశోధన సంస్థ(ఎఫ్ఎస్ఐ) సర్వే ప్రకారం.. ఇక్కడి నుంచే ట్యూనా అత్యధికంగా ఎగుమతి అవుతున్నా, గంగపుత్రులకు మాత్రం ఆశించిన లాభం చేకూరడం లేదు. అపారమైన సంపద ఎఫ్ఎస్ఐ విశాఖ జోన్ ఇన్చార్జి సి.ధనుంజయరావు నేతృత్వంలో శాస్త్రవేత్త జి.వి.ఎ.ప్రసాద్ ట్యూనా సంపదపై సుదీర్ఘ పరిశోధనలు నిర్వహించారు. 2024 అక్టోబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు విశాఖ ఫిషింగ్ హార్బర్, పెదజాలారిపేట, పూడిమడక, కాకినాడ కేంద్రాలుగా లభ్యమైన సముద్ర ఉత్పత్తులపై సర్వే చేసిన సమయంలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. విదేశీయులకు అత్యంత ఇష్టమైన, డిమాండ్ ఉన్న ట్యూనా చేపలు ఎక్కువ శాతం ఇక్కడే లభ్యమవుతున్నట్లు తేలింది. తూర్పు ఎగువ తీరంలో ట్యూనా చేపల దిగుబడి అధికంగా ఉన్నట్లు గుర్తించారు. విశాఖపట్నం, కాకినాడ తీరాల్లో మత్స్యకారులు జరిపే వేటలో 50 నుంచి 60 రకాల చేపలు లభ్యమైతే.. వాటిల్లో ట్యూనాల వాటా 50 శాతానికి పైగా ఉంటోందంటే.. ఇక్కడ వీటి దిగుబడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎల్లో ఫిన్ ట్యూనా(పసుపురెక్కల సూర), బిగ్ ఐ ట్యూనా(పెద్దకన్ను సూర), స్కిప్జాక్ ట్యూనా (నామాల సూర) తదితర రకాలు విశాఖ ఫిషింగ్ హార్బర్కు రోజుకు 100 నుంచి 120 టన్నుల వరకు వస్తున్నాయి. కాకినాడ తీరంలోనూ 100 టన్నుల వరకు లభ్యత ఉన్నట్లు ఎఫ్ఎస్ఐ శాస్త్రవేత్త ప్రసాద్ సర్వేలో స్పష్టమైంది. శ్రమకు తగిన ధర ఎక్కడ? ఇంత కష్టపడి రోజుల తరబడి సముద్రంలో వేటాడి వస్తే.. ట్యూనా విషయంలో మాత్రం మత్స్యకారులకు ఆశించిన రాబడి రావడం లేదు. స్థానిక ప్రజలు ట్యూనాను తినేందుకు అంతగా ఆసక్తి చూపించరు. దీంతో లోకల్ మార్కెట్లో గిరాకీ ఉండదు. ఇక చేసేది లేక.. దళారులు ఎంత ధర ఇస్తామంటే అంత ధరకు అప్పగించాల్సి వస్తోంది. ఫలితంగా ఇక్కడ ట్యూనా మార్కెట్పై దళారులే పెత్తనం చెలాయిస్తున్న పరిస్థితులు దాపురించాయి. మత్స్యకారులకు కిలోకు రూ.120 నుంచి గరిష్టంగా రూ.180 వరకూ మాత్రమే ముట్టజెబుతున్నారు. ఇక వేట నిషేధ సమయంలో పెదజాలరిపేటకు చెందిన మత్స్యకారులు చిన్న పడవలపై వందల కిలోమీటర్లు వెళ్లి ట్యూనా తీసుకొస్తుంటే.. దళారులు మాత్రం అన్ సీజన్ అంటూ కిలోకి రూ.90 నుంచి రూ.100 మాత్రమే చేతుల్లో పెడుతున్నారని వారు వాపోతున్నారు. 1000 మీటర్ల లోతు వరకు వేట విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ప్రతి రోజూ 300 బోట్ల వరకు ట్యూనా వేట కోసం బయలుదేరుతుంటాయి. తీరం నుంచి 70 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించిన తర్వాత, 700 నుంచి 1000 మీటర్ల లోతులో ట్యూనా సంపద విస్తృతంగా ఉంది. కాకినాడ, విశాఖకు చెందిన మత్స్యకారులు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, శ్రీలంక సముద్ర జలాల వరకూ వెళ్లి వేటను సాగిస్తుంటారు. వేట కోసం సుమారు 90 బాస్కెట్లను సముద్రంలో విడిచిపెడతారు. ఒక్కో బాస్కెట్లో 6 హుక్స్(గాలాలు) ఉంటాయి. 4 గంటల పాటు హుక్స్ని నీటిలో ఉంచి, తర్వాత ఒక్కో బాస్కెట్ని బయటికి తీసి ట్యూనాలను పట్టుకొని తిరిగి వస్తుంటారు. ఇంజిన్ బోట్లతో పాటు సంప్రదాయ మరపడవలపై వెళ్లి మరీ ఈ వేట సాగిస్తుంటారు. ట్యూనా తర్వాత ఎక్కువగా కొమ్ముకోనాం చేపలు ఇక్కడి మత్స్యకారులకు చిక్కుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ట్యూనాయే దిక్కు వేట విరామ సమయంలో చిన్న పడవలు వేసుకొని వెళ్తున్నాం. అప్పుడు ట్యూనా చేపలే మాకు దిక్కవుతున్నాయి. కానీ.. ఇంత కష్టపడి తీసుకొస్తున్నా ఆశించిన ధర రావడం లేదు. ఎంత చెబితే అంతకు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేదు. అందుకే తక్కువ ధరకు అమ్ముకుంటున్నాం. – మేరుగు ఎల్లాజీ, మత్స్యకారుడు, మంగమారిపేట దేశీయ మార్కెట్లో అయితే ఎక్కువగా విశాఖ నుంచి కేరళకు ట్యూనా ఎగుమతి జరుగుతోంది. శుద్ధి చేసిన ట్యూనాలు అమెరికా, థాయ్లాండ్, హాంకాంగ్, మలేసియా, వియత్నాం, చైనా తదితర దేశాలకు అధిక సంఖ్యలో ఎగుమతి అవుతున్నాయి. ఈ చేపల్లో ముళ్లు తక్కువగా ఉంటాయి. అధికశాతం ప్రొటీన్లు, ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు ఎక్కువగా ఉండటంతో డిమాండ్ పెరుగుతోంది. కేరళలో ప్రాసెస్ చేసిన తర్వాత.. కిలో రూ.350 నుంచి రూ.800 వరకూ విక్రయిస్తున్నారు. కానీ.. శ్రమకోర్చి చేపలు పట్టిన మత్స్యకారుడు మాత్రం దోపిడీకి గురవుతున్నాడు. విశాఖ, కాకినాడ తీరాల్లో భారీగా లభిస్తున్న ట్యూనా సంపద మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి ట్యూనా చేపలు హార్బర్కు ఎక్కువగా వస్తున్నాయి. అయితే కష్టానికి సరిపడా ధర అందడం లేదు. ఇక్కడ మార్కెట్ సదుపాయాన్ని కల్పిస్తే మత్స్యకారులంతా లాభపడతారు. అదేవిధంగా కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి తీసుకురావాలి. అప్పుడు నేరుగా ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. అమెరికా, జపాన్, యూరప్, దక్షిణ ఆసియా దేశాల్లో ట్యూనాల వినియోగం అధికంగా ఉంది. అక్కడకు ఎగుమతి చేస్తే మంచి ధర లభిస్తుంది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. –సూరాడ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు, వైశాఖి మరపడవల సంఘం -
అమ్మా అని పిలిచేదెవరు.?
ఆ బుడిబుడి అడుగులకు తెలియదు.. అక్కడ మృత్యువు నోరు తెరుచుకుని ఉందని. ఆడుకునే ఆశతో అడుగు వేసిన చిన్నారిని నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ బలిగొంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు అకాల మరణం ఆ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. ముచ్చర్లలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. – తగరపువలస ఆనందపురం మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన లెంక గణేష్, కనకం దంపతులు నిత్యం కష్టపడితే గానీ ఇల్లు గడవని పేద కుటుంబం. గణేష్ పెట్రోల్ బంకులో పనిచేస్తుండగా, కనకం వ్యవసాయ కూలీ. తమ కష్టమంతా పిల్లల భవిష్యత్తు కోసమే అని బతుకుతున్నారు. వీరికి మూడేళ్ల ఢిల్లీశ్వరి, ఏడాదిన్నర బాబు చాణక్య ఉన్నారు. అక్కా తమ్ముడు ఇల్లంతా సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు తమ కష్టాన్ని మరిచిపోయేవారు. కాగా.. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయం. ఢిల్లీశ్వరి ఆడుకోవడానికి బయటకు వెళ్లింది. ఎప్పుడూ ఇంటి చుట్టుపక్కల ఆడుకుని తిరిగి వచ్చే కూతురు, ఎంతసేపటికీ రాకపోయే సరికి తండ్రి గణేష్ గుండెలో ఆందోళన మొదలైంది. ఊరంతా గాలించాడు. చివరికి గ్రామంలోని రెండో వీధిలో పైడి రాజు అనే వ్యక్తికి చెందిన నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్లో చూడగా.. లోపల తన చిట్టితల్లి విగతజీవిగా కనిపించింది. ఆ దృశ్యం చూసి ఆ తండ్రి గుండె ఆగినంత పనైంది. కూతురిని వెంటనే బయటకు తీసి, గుండెకు హత్తుకుని, ఇంకా ఊపిరి ఉందేమోనన్న చిన్న ఆశతో సంగివలసలోని అనిల్ నీరుకొండ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయిందని, పాప మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. కన్నీటి సంద్రంలో ముచ్చర్ల ‘నా బిడ్డ లేని ఇల్లు చిన్నబోతుంది.. ఇక మాకు అమ్మా అని ఎవరూ పిలుస్తారు?’అంటూ ఆ తల్లిదండ్రులు చేస్తున్న రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. ఢిల్లీశ్వరి స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్తుండేది. గురువారం క్రిస్మస్ సెలవు కావడంతో ఆడుకోవడానికి వెళ్లి మృత్యువాత పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండగ రోజున జరిగిన ఈ ఘటన ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. కాగా చిన్నారి ఎవరితో ఆడుకోవడానికి వెళ్లిందో తెలియరాలేదు. ఆనందపురం సీఐ వాసునాయుడు ఆధ్వర్యంలో ఏఎస్ఐ బాలంనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేటి నుంచి ఆన్లైన్లో అప్పన్న ఉత్తరద్వార దర్శనం టికెట్లు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తర ద్వార దర్శనం టికెట్లను శుక్రవారం నుంచి ఆన్లైన్లో లభ్యం కానున్నాయి. ఈనెల 29 తేదీ సాయంత్రం 5 గంటల వరకు రూ.100, రూ.300, రూ.500 టికెట్లు అందుబాటులో ఉంటాయని దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. www.aptemples.ap.gov.in వెబ్సైట్లో కానీ, మనమిత్ర వాట్సాప్ నెంబరు 9552300009 ద్వారా కానీ భక్తులు టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆఫ్లైన్లో ముక్కోటి దర్శనం టికెట్లు లభ్యం కావని తెలిపారు. 30న ముక్కోటి ఏకాదశి దర్శనం ముగిసిన తర్వాత సింహగిరిపై కౌంటర్లలో యథావిధిగా దర్శనం టికెట్లు విక్రయాలు జరుగుతాయని తెలిపారు. -
గుర్రాల శిక్షణ పార్కు అవసరమే..!
జీవీఎంసీ 13వ వార్డు పరిధి ముడసర్లోవ వద్ద రోజ్ పార్కులో అర్ధంతరంగా నిలిచిన గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రంను ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబులు బుధవారం సందర్శించారు. మధ్యలో ఆగిన నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన గుర్రాల శిక్షణ పార్కు అవసరమేనన్నారు. ఇక్కడ గుర్రాల శిక్షణ కేంద్రం పూర్తికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అప్పటి ప్రభుత్వం రూ.6 కోట్లతో దీని ఏర్పాటుకు సంకల్పించిందన్నారు. నెలకు రూ.3 వేలు తక్కువ అద్దెకు నిర్వాహకుడికి ఇచ్చేందుకు ప్రతిపాదించిందని, దాన్ని ఎక్కువ అద్దె వచ్చేలా తాము ప్రయత్నిస్తామన్నారు. -
ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
గాజువాక : ఏటీఎం కార్డుల ద్వారా నగదు మోసాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని గాజువాక క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. క్రైం సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు. చినగంట్యాడ ప్రాంతానికి చెందిన బలిరెడ్డి కుమారి గత నెల 28న గాజువాకలోని ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లింది. ఆ సమయంలో ఏటీఎంలో టోపీ ధరించి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి సహాయం చేస్తున్నట్టు నటించి ఆమె వెనుక నిలబడి పిన్ నంబర్ను గమనించి మోసపూరితంగా ఏటీఎం కార్డును మార్చేశాడు. ఆమె వెళ్లిపోయిన తరువాత నిందితుడు మార్చిన ఏటీఎం కార్డు ద్వారా రూ.26,500 డ్రా చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గాజువాక క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మోసానికి పాల్పడింది తెలంగాణలోని మెహబూబాబాద్ దరి బాబాగుట్ట ప్రాంతానికి చెందిన బానోతు రాజు అలియాస్ నాయక్గా గుర్తించారు. గాజువాకలో అతడిని అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్టు సీఐ తెలిపారు. నిందితుడిపై ఏడు పోలీస్ స్టేషన్లలో 12 కేసులున్నాయన్నారు. నిందితుడి నుంచి రూ.50,500 నగదు, నాలుగు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లోని ఏడు పీఎస్లలో కేసులు -
గిరి నర్తనం.. మురిసిన విశాఖ జనం
మహారాణిపేట: పీసా మహోత్సవ్ సందర్భంగా విశాఖపట్నం పోర్టు స్టేడియంలో జరిగిన రెండు రోజుల కార్యక్రమాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. ఉదయం నుంచి వివిధ రాష్ట్రాల గిరిజన సంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతుల్ని ఎంతగానో అలరించాయి. ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేకమైన గిరిజన సంప్రదాయ నృత్య, సంగీతాలతో హోరెత్తించారు. చాలా ప్రదర్శనలకు ప్రేక్షకులు సైతం పదం కలిపారు. అనంతరం కళాకారులతో అధికారులు బృంద చిత్రాలు దిగి, జ్ఞాపికలు అందించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రన్, కబడ్డీ, ఆర్చరీ పోటీల విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పీసా చట్టంపై అవగాహన పెంచేందుకే.. షెడ్యూల్డ్ ఏరియాస్లో పీసా చట్టం అమలుపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న పీసా మహోత్సవ్ కార్యక్రమాలు విశాఖపట్నం పోర్టు స్టేడియంలో ఘనంగా జరిగాయి. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయమంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘెల్ వీడియో సందేశం ద్వారా గిరిజన హక్కుల కోసం రాజ్యాంగ మద్ధతును తెలిపారు. పీసా పోర్టల్ను ప్రారంభించారు. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, ఏపీ పంచాయతీరాజ్ –గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఏపీ ఎస్ఈఆర్డీ కమిషనర్ రేవు ముత్యాలరాజు, ఎకనామిక్ అడ్వైజర్ విజయకుమార్ బెహరా, విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అడవి తల్లి బాట కింద చేపట్టిన అభివృద్ధి పనుల ఎగ్జిబిషన్ను తిలకించారు. అరకు కాఫీ, ఇతర ఉత్పత్తులతో కూడిన కిట్ను పంచాయతీరాజ్ సెక్రటరీ వివేక్ భరద్వాజ్కు జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ కల్పనాకుమారి అందించారు. -
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో క్రైస్తవులకు మేలు
సాక్షి, విశాఖపట్నం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో క్రైస్తవులకు మేలు జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్వెస్లీ అన్నారు. బుధవారం మద్దిలపాలెంలో గల జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా చర్చి పాస్టర్లకు ప్రతీ నెల రూ.5000 గౌరవ వేతనం ఇచ్చామన్నారు. క్రైస్తవుల సంక్షేమం కోసం రూ.416 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం క్రైస్తవులకు గౌరవ వేతనం ఇవ్వకుండా కాలక్షేపం చేయడమే కాకుండా.. క్రైస్తవులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ క్రైస్తవ్యం అంటేనే శాంతి, కరుణ, దయ, జాలి అన్నారు. క్రైస్తవులందరూ కృతజ్ఞత కలిగి ఉండే వ్యక్తులని తెలిపారు. మహానేత వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో మతాలు, కులాలకతీతంగా సుపరిపాలనను అందించారని, అందుకే తెలుగు ప్రజలంతా గుండెల్లో సుస్థిర స్థానం పొందారన్నారు. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ క్రైస్తవ్యం అంటేనే సేవకు చిహ్నమని తెలిపారు. ప్రతి ఒక్కరూ పొరుగు వారిని ప్రేమించమని యేసు క్రీస్తు చెప్పిన మాటలను అనుసరిస్తే ఈ ప్రపంచం శాంతిమయంగా మారుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ తాను క్రైస్తవ మిషనరీ స్కూళ్లలో చదవడం వల్ల ఎంతో క్రమశిక్షణ నిజాయితీ అలవడిందని, ఆ ప్రేరణతోనే రాజకీయాల్లోకి రావడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రవిబాబు, బిషప్ ఎంఏ పాల్, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్కుమార్, సీహెచ్ వెంకటరామయ్య, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్ కె.సతీష్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీలు ఎంఏ పాల్ సుధాకర్, గరికిముక్కల పాల్ విక్టర్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు చింతాడ శ్రీనివాసరావు, ప్రభాకర్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకుడు నిడిగట్టు రాజశేఖర్, జిల్లా సెక్రెటరీ కందిమల్ల రాజశేఖర్, పాస్టర్స్ పాల్గొన్నారు. -
అప్పన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్కు, శ్రీచరణికి చిత్రపటం, ప్రసాదం అందిస్తున్న ఏఈవో సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని బుధవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్.మానవేంద్రనాథ్రాయ్ దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. స్వామి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రం ఏఈవో తిరుమలేశ్వరరావు అందజేశారు. క్రికెటర్ శ్రీచరణి కూడా.. : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. -
జిల్లాలో రేషన్ దుకాణాలు లబ్ధిదారులు ప్రతి నెలా ఇచ్చే బియ్యం
జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. అడిగితే తిరగబడుతున్నారు.. ఈనెల 7వ తేదీన సీతంపేట ఏరియాలో ఉన్న రేషన్ డిపోకు వెళ్లాను. మా కుటుంబంలో నలుగురికి గాను 20 కిలోల బియ్యం తీసుకున్నాను. బియ్యం తక్కువగా ఉన్నాయన్న అనుమానంతో మా ఇంటి పక్కన ఉన్న చిన్న కిరాణా షాపులో తూకం వేయగా 18 కిలోలు వచ్చాయి. డీలర్ను అడిగితే ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాకు వచ్చిన బియ్యంలో కోత పడుతోంది. అందుకే కార్డుదారుల మీద భారం వేస్తున్నట్టు డీలర్ చెప్పడంతో అవాక్కయ్యాను. – పి.లత, కనకమ్మవారి వీధి, సీతంపేట చర్యలు తప్పవు రేషన్ షాపుల్లో అవకతవకలు చేస్తే చర్యలు తప్పవు. తూకాల్లో తేడా వచ్చినా.. వెంటనే నిలదీయండి. ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే ఫలితం ఉండదు. తూకాల్లో మోసం చేస్తున్న వారిపై ఫిర్యాదు చేయండి. ఆకస్మిక తనిఖీలు చేసి నేరం రుజువైతే చర్యలు తీసుకుంటాం. మోసాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా వదిలే ప్రవక్తే లేదు. – వి.భాస్కరరావు, డీఎస్వో, సివిల్ సప్లయిస్ విభాగం -
సుత్తితో భార్య, అత్తపై దాడి
పెందుర్తి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి సుత్తితో ఇంట్లో వీరంగమాడాడు. భార్య, అత్తను తీవ్రంగా గాయపరడంతో పాటు అడ్డుకునేందుకు వచ్చిన వారిపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడు. జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి పోలీస్ స్టేషన్ సమీపంలోని దొగ్గవానిపాలెంలో బుధవారం జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పుణ్యవత్తుల అప్పారావు, అతడి భార్య కనకమహాలక్ష్మి స్థానికంగా నివాసం ఉంటున్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం కూడా తీవ్రంగా గొడవపడ్డారు. ఆగ్రహానికి గురైన అప్పారావు ఇంట్లోని సుత్తితో భార్య, అత్త లక్ష్మిల తలలపై కొట్టాడు. అదే సమయంలో నిందితుడు అప్పారావుకు ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు స్పందించి దాడిలో గాయపడిన వారితో పాటు అప్పారావును స్థానిక సీహెచ్సీకి చికిత్స నిమిత్తం తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అప్పారావుపై ఇదే తరహా దాడి ఘటనల్లో గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. -
లంకెలపాలెంలో అర్ధరాత్రి హత్య
పరవాడ: లంకెలపాలెం దరి శ్రీరామనగర్ కాలనీ వద్ద మంగళవారం అర్ధరాత్రి కాలనీకి చెందిన ఈగల వెంకినాయుడు(40) దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనకు సంబంధించి పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపిన వివరాలు.. లంకెలపాలెం దరి శ్రీరామనగర్కాలనీ(విలేకరుల కాలనీ)కి చెందిన వెంకినాయుడు.. మొల్లి సరస్వతి అనే మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. హతుడి భార్య, ఇద్దరు పిల్లలు పెద్దినాయుడుపాలెం ఉంటారు. మృతుడు ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడంతో పాటు కూర్మన్నపాలెంలోని ఓ జిమ్లో కోచ్. మంగళవారం రాత్రి కాలనీలోని ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. రాత్రి 1 గంట సమయంలో తేజ అనే వ్యక్తి వచ్చి వెంకినాయుడును బయటకు రమ్మని పిలిచాడు. హతుడు స్వెటర్ వేసుకుని వెళ్లడం చూసిన సరస్వతి, ఏదో పని మీద బయటకు వెళుతున్నారని భావించి నిద్రపోయింది. వేకువ జామున లేచి వెంకినాయుడుకు, తేజకు ఫోన్ చేసింది. అటునుంచి సమాధానం రాలేదు. ఉదయానికి వెంకినాయుడు మృతదేహం సమీపంలోని లేఅవుట్లో పడి ఉందని స్థానికులు చెప్పడంతో.. వెళ్లి చూసి, హత్యకు గురైంది వెంకినాయుడేనని నిర్ధారించుకుని పరవాడ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి షర్ట్ చిరిగి ఉండటంతో స్నేహితుల మధ్య పెనుగులాట జరిగి ఉంటుందని, సమీపంలో లభ్యమైన 10 కిలోల బరువుండే బండ రాయితో తలపై గట్టిగా మోదడంతో తల నుజ్జుయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్, సీఐ ఆర్.మల్లికార్జునరావు సందర్శించారు. క్లూస్ టీంను రంగంలోకి దించి వివరాలు రాబట్టారు. స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి హత్యకు గల కారణాలను ఆరా తీశారు. ల్యాండ్ సెటిల్మెంట్లే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదుచేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. -
బార్లు, పబ్లు నిబంధనలు పాటించాల్సిందే..
విశాఖ సిటీ : నగరంలో బార్లు, పబ్లు నిబంధనలు పాటించాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ–1 మణికంఠ చందోలు, ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి బార్లు, పబ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బార్లు, పబ్లు నిర్ణీత సమయం వరకే నడపాలని ఆదేశించారు. ఎకై ్సజ్ శాఖ నుంచి అనుమతి లేకుండా, గడువు ముగిసిన లైసెన్స్లతో నడపకూడదని, ధ్వని కాలుష్య నియమాలను ఉల్లంఘించరాదని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో అనుమతించిన డెసిబెల్ పరిమితులకు మించి శబ్దంతో సంగీతాన్ని ప్లే చేయకూడన్నారు. బార్లు, పబ్లు సామర్థ్యం మేరకు కస్టమర్లను అనుమతించాలని, సరైన అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలని, భద్రతా ప్రోటోకాల్స్ను తప్పనిసరిగా పాటించాలన్నారు. వయస్సు ధృవీకరణ పత్రాలను సరిగ్గా తనిఖీ చేయాలని, మైనర్లకు మద్యం సరఫరా చేయకూడదని అసభ్యకరమైన సైగలు, అసభ్య ప్రదర్శనలు, అనుచిత ప్రవర్తనతో కూడిన డీజే పార్టీలు, డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు. సిబ్బంది, బౌన్సర్లు, ఇతర ఉద్యోగులను సరైన పోలీసు వెరిఫికేషన్ లేకుండా నియమించుకోకూడదని తెలిపారు. పబ్ ప్రాంగణంలో మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల వినియోగం, పంపిణీని ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదన్నారు. కస్టమర్లు వాహనాలను అడ్డదిడ్డంగా పార్క్ చేయకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి పబ్, వైన్షాప్ బయట స్థానిక పోలీస్ స్టేషన్ నెంబర్తో పాటు సీపీ ఫోన్ నెంబర్ 7995095799 స్పష్టంగా ప్రదర్శించాలని తెలిపారు. -
జాతీయ సైన్స్ ప్రదర్శనకు రెండు ప్రాజెక్టులు
ఆరిలోవ: జిల్లా నుంచి జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్కు రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వాటిలో ఒకటి సదరన్ సైన్స్ ఫెయిర్కు కూడా ఎంపిక కావడం విశేషం. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల, జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు ఇటీవల నిర్వహించారు. బుధవారం జరిగిన రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో కూడా ఉత్తమంగా నిలిచాయి. విజయవాడలో బుధవారంతో ముగిసిన రెండు రోజుల ప్రదర్శనలో విశాఖ జిల్లా శ్రీకృష్ణాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం నుంచి గైడ్ ఉపాధ్యాయుడు(ఫిజికల్ సైన్స్) బి.సీతారాం ఆధ్వర్యంలో 9వ తరగతి విద్యార్థులు బి.మహేష్, కె.యోగి తయారు చేసిన ‘హైడ్–ఫ్రైడ్ వాటర్ టాప్స్’ప్రాజెక్టు జనవరి 19 నుంచి 23 వరకు జరగనున్న సదరన్ వైజ్ఞానిక ప్రదర్శనకు, ఆ తర్వాత జరగనున్న జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై ందని డీఈవో ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. దీంతో పాటు నగరంలోని మధురానగర్ హైస్కూల్లో గైడ్ టీచర్ వి.వి.అశోకవాణి ఆధ్వర్యంలో విద్యార్థులు విష్ణువర్ధన్, పి.రామ్చరణ్ తయారు చేసిన ‘పొల్యూషన్ ఫ్రీ నేచర్ ఫర్ ఫ్యూచర్’ప్రాజెక్టు జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై ందన్నారు. ఆయా ప్రాజెక్టులు తయారుచేసిన విద్యార్థులు, గైడ్ టీచర్లను డీఈవోతోపాటు, జిల్లా సైన్స్ అధికారి పి.రాజారావు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
తూకాల్లో నొక్కుడు
చర్చ్చిలో ఆకట్టుకున్న సెట్టింగ్లుట్రినిటీ లూథరన్ చర్చిలో బుధవారం అర్ధరాత్రి క్రైస్తవుల ప్రార్థనలుబియ్యం పంపిణీలో రేషన్ డీలర్ల చేతివాటంఅల్లిపురం ప్రాంతంలో ఓ మహిళ చౌక దుకాణం నుంచి బియ్యం తీసుకువెళ్లింది. ఇంటికి వెళ్లి తూకం వేయగా 15 కిలోలకుగాను 13.50 కిలోలే వచ్చాయి. వెంటనే వెళ్లి డీలర్ను ప్రశ్నించింది. ఆయన బియ్యం బస్తాను తూకం చూడగా 47.600 కిలోలు వచ్చింది. మధురవాడ వాంబేకాలనీలోని ఓ డిపోలో బియ్యం తూకంలో తేడా రావడంతో లబ్ధిదారుడు డీలర్తో గొడవకు దిగాడు. కావాలంటే సరుకు తీసుకెళ్లు.. లేదంటే అక్కడ పడేసి వెళ్లాలంటూ డీలర్ దబాయించాడు. దీంతో చేసిది లేక లబ్ధిదారుడు ఉన్న సరుకుతో ఇంటికెళ్లాడు. మహారాణిపేట: జిల్లాలో చౌకదుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యంలో అవకతవకలు జరుగుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. డీలర్లు తూకాల్లో మోసాలకు పాల్పడుతుండటంతో అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయమై డీలర్లను ప్రశ్నిస్తే.. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే తూకాలు తక్కువతో సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. వీటిని పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 612 చౌకధరల దుకాణాల షాపుల్లో మొత్తం 5,17,155 కార్డులకు గాను 8,161 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయిస్తోంది. కార్డులో ఉన్న కుటుంబ సభ్యుడికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బియ్యం తూకాల్లో మోసాలు జరుగుతుండటంతో కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిల్వ కేంద్రాల్లోనూ తక్కువగా.. ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని గోదాముల నుంచి డీలర్లు తీసుకొని చౌక ధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు సరఫరా చేస్తారు. విశాఖ జిల్లాలో రెండు సర్కిళ్లకు సంబంధించి మర్రిపాలెం ఎఫ్సీఐ గోదాం, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, గాజువాక మండలాల డీలర్లు వారి పరిధిలో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి బియ్యం తీసుకుంటున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్స్, మర్రిపాలెం గోదాంల నుంచి వస్తున్న బియ్యంలో పెద్ద తేడా కనపడుతోంది. ఇక్కడ నుంచి 50 కిలోల బస్తా తీసుకుంటే 47.60 కిలోలే వస్తోందని డీలర్లు వాపోతున్నారు. ఈ భారాన్ని డీలర్లు కార్డుదారుల మీదకు నెడుతున్నారు. తూకాల్లో తేడాలు వస్తే నిల్వ కేంద్రాల్లో డీలర్లు బియ్యం తీసుకునేటప్పుడు ఎందుకు అడగడం లేదని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. బియ్యం తూనికల్లో తేడా వస్తున్నాయని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నేరుగా బ్లాక్ మార్కెట్లు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డీలర్లను మార్పు చేశారు. తమకు అనుకూలంగా ఉన్నోళ్లకు డీలర్షిప్ ఇవ్వడంతో అవినీతి దందాకు తెరలేపారు. కూటమి పార్టీల నాయకుల కనుసన్నల్లోనే తూకాల్లో తేడా నిర్వాకం జరుగుతోందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. డీలర్ల నుంచి మిగిలిన సరుకును నేరుగా బ్లాక్ మార్కెట్కు గుట్టు చప్పుడు కాకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు తూకాల్లో వ్యత్యాసాన్ని పరిశీలించాల్సిన తూనికలు కొలతల అధికారులు మామూళ్ల మత్తులో కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. ఆర్నెళ్లకు ఓసారి కూడా తనిఖీలు చేయడం లేదు. మరోవైపు పౌరసరఫరాల శాఖాధికారులు ఎలాంటి తనిఖీలు చేయకపోవడంతో డీలర్లు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. అలాగే గోదాముల్లోను, ఎంఎల్ఎస్ పాయింట్లల్లో తనిఖీలు చేయకపోవడంపై మరోవైపు డీలర్లు ప్రశ్నిస్తున్నారు. -
ఏపీలో తగ్గిన హెచ్ఐవీ కేసులు
మహారాణిపేట: ఏపీలో పదేళ్లుగా హెచ్ఐవీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడంపై శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం విశాఖలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, కేజీహెచ్లను సందర్శించిన కమిటీ ప్రజారోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే అవగాహన పెరగడం వల్లే కేసుల సంఖ్య తగ్గిందని సరైన మందులు వాడితే బాధితులు సాధారణ జీవితం గడపవచ్చని పేర్కొన్నారు. పీజీ వైద్య విద్యార్థులు ప్రభుత్వ కోటా కింద ప్రయోజనాలు పొందితే నిబంధనల ప్రకారం పదేళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల్లో , ప్రభుత్వ సేవలో తప్పనిసరిగా పనిచేయాలని లేనిపక్షంలో సర్టిఫికెట్ల రద్దుతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో కమిటీ సభ్యులు బండారు శ్రావణి శ్రీ, కన్నా లక్ష్మీనారాయణ, ఏపీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.విశ్వనాథం, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ కె.పద్మావతి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.వీ.ఎస్.ఎం.సంధ్యాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డాక్టర్ జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవీపై అవగాహన అవసరం: హెచ్ఐవీ, ఎయిడ్స్పై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని తోట త్రిమూర్తులు సూచించారు. మంగళవారం రేసవానిపాలెంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్ రిబ్బన్ క్లబ్లు, యూత్ క్లబ్బులు, కళాజాత బృందాల ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎయిడ్స్ పరిస్థితులను డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు కమిటీకి వివరించారు. -
జూలో నెమళ్ల ఎన్క్లోజర్ ప్రారంభం
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన నెమళ్ల ఎన్క్లోజర్ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీవీ చలపతిరావు మంగళవారం ప్రారంభించారు. ఆలివ్ రిడ్లే తాబేళ్లపై నిర్వహించిన వర్క్షాప్లో పాల్గొన్న ఆయన, అడిషనల్ పీసీసీఎఫ్ డాక్టర్ శాంతిప్రియ పాండే, సీఎఫ్ మైధీన్లతో కలిసి ఈ ఎన్క్లోజర్ను సందర్శించి నెమళ్లను లోపలికి విడిచారు. ప్రస్తుతం ఈ ఎన్క్లోజర్లో పిల్లలతో కలిపి మొత్తం 40 నెమళ్లను ఉంచినట్లు జూ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ జూలోని వన్యప్రాణుల సంరక్షణ విషయంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జూ క్యూరేటర్ జి. మంగమ్మ మాట్లాడుతూ.. జంతు దత్తత కార్యక్రమంలో భాగంగా ఇషాన్వి, మనస్వి అనే వ్యక్తులు ఇక్కడి 15 నెమళ్లను దత్తత తీసుకున్నట్లు వెల్లడించారు. -
పూర్ణామార్కెట్లో 16 దుకాణాలు దగ్ధం
రూ.50 లక్షలు ఆస్తి నష్టంజగదాంబ: పూర్ణామార్కెట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 16 దుకాణాలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.50 లక్షల వరకు నష్టం జరిగింది. సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో మార్కెట్లోని సెంటర్ పాయింట్ వద్ద ఉన్న పూజాసామగ్రి దుకాణాల్లో మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న వ్యక్తులు గమనించి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే 16 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. క్రిస్మస్, జనవరి 1వ తేదీ నేపథ్యంలో వ్యాపారులు భారీగా సరుకులు కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకున్నారు. సుమారు రూ.50 లక్షల వరకు నష్టం జరగడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. సంఘటన అర్ధరాత్రి సంభవించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు, వన్టౌన్ సీఐ పూడి వరప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వాసుపల్లి పరామర్శ దుకాణాలు దగ్ధమైన విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ వెంటనే పూర్ణామార్కెట్కు చేరుకుని పరిశీలించారు. సంబంధిత దుకాణ యాజమానులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ప్రమాద విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఆదుకోవాలని కోరుతామని తెలిపారు. వాసుపల్లి వెంట వార్డు అధ్యక్షుడు అలపన కనకరెడ్డి తదితరులు ఉన్నారు. వారి పనేనా.. పూర్ణామార్కెట్లో సెంటర్ పాయింట్ దరి గతంలో పండ్ల మార్కెట్ ఉండేది. తరువాత పండ్ల మార్కెట్ పాతబస్టాండ్ వద్దకు మార్చడంతో సుమారు 50 దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. వీటి పక్కనే పూజాసామగ్రి దుకాణాలు ఉండడంతో గంజాయి మత్తులో యువకులు మంటలు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీ అధికారులకు గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో మత్తులో యువకులు చెలరేగిపోయి ఇటువంటి ఘాతుకాలకు పాల్పడుతున్నట్టు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఉత్సాహంగా పీసా రన్
ఏయూక్యాంపస్ : పీసా మహోత్సవ్లో భాగంగా మంగళవారం ఉదయం బీచ్రోడ్డులో 10 కిలోమీటర్ల పరుగు పోటీ నిర్వహించారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి తెన్నేటి పార్క్ వరకు.. అక్కడ నుంచి కాళీమాత ఆలయం వరకు ఈ పరుగు పోటీ ఉత్సాహంగా సాగింది. కార్యక్రమాన్ని ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ జెండా ఊపి ప్రారంభించారు. పలు రాష్ట్రాలకు చెందిన క్రీడా కారులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ ముక్త శేఖర్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, ఏపీఎస్ఐఆర్డీ కమిషనర్ ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు. విజేతలు ఇలా.. పురుషుల్లో మహారాష్ట్రకు చెందిన అతుల్ చిత్తోడ్ (34:54.15), సూరజ్ మాషి (34:54.86), మనోజ్ హిలిన్ (35:00.56) మొదటి మూడు స్థానాలలో నిలిచారు. మహిళల విభాగంలో రాజస్థాన్కు చెందిన రాజకుమార్ (43:15.14), జార్ఖండ్కు చెందిన హీరా సంఘ (45:18.14), హిమాచల్ప్రదేశ్కు చెందిన ప్రియా (45:18.14) మొదటి మూడు స్థానాలలో నిలిచారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డీఎస్వో జూన్ గ్యాలయిట్, పంచాయతీరాజ్ అధికారులు, వైజాగ్ వలంటీర్లు పాల్గొన్నారు. -
ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు చర్యలు
ఆరిలోవ: ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు అటవీశాఖ పటిష్ట చర్యలు చేపడుతోందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీవీ చలపతిరావు తెలిపారు. మంగళవారం ఇందిరాగాంధీ జూ పార్కులో అటవీశాఖ, ట్రీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల వలలకు చిక్కి తాబేళ్లు మరణించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం ఇవి గుడ్లు పెట్టే కాలం కావడంతో నిఘా పెంచామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తీరప్రాంతాల్లో 73 హెచరీలు ఉన్నాయని, గత ఏడాది సుమారు 6.80 లక్షల గుడ్లు పొదిగించగా, వాటి నుంచి వచ్చిన 2.40 లక్షల తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టినట్లు వివరించారు. ఈ ఏడాది కూడా ఇదే స్థాయిలో సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అడవుల సమీపంలో మిగిలిపోయిన ఆహారాన్ని బయట పడేయడం వల్ల కోతులు, చిరుతలు, అడవి పందులు వంటి వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయని, ఇది ప్రజలకు ఇబ్బందిగా మారుతోందని చలపతిరావు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగుల దాడిని అరికట్టేందుకు కుంకీ ఏనుగులను తీసుకువస్తున్నామని, మరో మూడు నెలల్లో గుచ్చిమి వద్ద కుంకీ ఏనుగుల క్యాంపును ప్రారంభిస్తామని వెల్లడించారు. అలాగే గ్రామాల్లో కోతుల బెడదను నియంత్రించడానికి ‘హనుమాన్’ కార్యక్రమం చేపడుతున్నామని, వాటికి సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. విశాఖ జాతీయ రహదారిపైకి కంబాలకొండ నుంచి వన్యప్రాణులు రాకుండా రెండు కిలోమీటర్ల మేర కంచె ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో విశాఖ సర్కిల్ సీఎఫ్ బి.ఎం దివాన్ మైథీన్, జూ క్యూరేటర్ బి.మంగమ్మ, వివిధ జిల్లాల డీఎఫ్వోలు రవీంద్రభీమా, వెంకటేష్, ప్రసన్న, కొండలరావు పాల్గొన్నారు.ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీవీ చలపతిరావు -
అట్టహాసంగా పీసా మహోత్సవ్
(7వ పేజీ తరువాయి)మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన గిరిజన మహిళలు కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, మంగళగిరి, వెంకటగిరి చీరలు, చేనేత ఉత్పత్తులు, సాంప్రదాయ ఆహార ఉత్పత్తులు, బాంబూ చికెన్ తదితర ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. ఉత్కంఠగా సాగిన క్రీడా పోటీలు ఖేలో ఇండియా కబడ్డీలో 10 రాష్ట్రాల నుంచి 18 టీమ్లు భాగస్వామ్యమయ్యాయి. అందులో పురుష జట్లు 10, మహిళా జట్లు 8 పాల్గొన్నాయి. పురుషుల విభాగంలో మధ్యప్రదేశ్ విజేతగా నిలవగా, రన్నర్ జట్టుగా ఒడిశా, మూడో స్థానంలో తెలంగాణ, గుజరాత్ జట్లు నిలిచాయి. మహిళల విభాగంలో జార్ఖండ్గా విజేతగా నిలవగా, రన్నర్గా మధ్యప్రదేశ్ జట్టు నిలిచింది. మూడో స్థానంలో మహారాష్ట్ర, ఒడిశా జట్లు ఉన్నాయి. ● ఆర్చరీ క్రీడా పోటీలో 8 రాష్ట్రాలకు చెందిన 20 మంది క్రీడాకారులు భాగస్వామ్యమయ్యారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కృష్ణా పింగువా గోల్డ్ మెడల్, రాజస్థాన్కు చెందిన బద్రీ లాల్ మీనా సిల్వర్ పతకం సాధించుకున్నారు. మూడో స్థానంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన దినేష్ ముర్ము నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించుకున్నారు. మహిళా వ్యక్తిగత విభాగంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఖుషీ ననోమా గోల్డ్ మెడల్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అనురాధ కుమారి సిల్వర్ పతకం సాధించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన అంబికా పాండే మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించారు. ● సాయంత్రం క్రికెట్ స్టేడియంలో నమూనా క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పలు రకాల విన్యాసాలు, నైపుణ్యాలను ప్రదర్శించారు. అధికారులు, క్రీడాకారులు, గిరిజనులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
గో మాంసం పూడ్చివేతపై గొల్లలపాలెంలో ఉద్రిక్తత
తగరపువలస: ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ పరిధిలోని దిబ్బపాలెం శ్రీమిత్రా మైరెన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజీలో సీజ్ చేసిన 189 టన్నుల గో మాంసాన్ని.. కుసులవాడ పంచాయతీ గొల్లలపాలెం శివారులో పూడ్చిపెట్టడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు షిణగం దామోదరరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావు, తొమురోతు సత్యనారాయణల ఆధ్వర్యంలో మంగళవారం పంచాయతీ రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేపట్టారు. సోమవారం కొండవాలు ప్రాంతంలో రహస్యంగా తవ్విన ఐదు అడుగుల గోతుల్లో ఇప్పటికే ఒకచోట మాంసాన్ని పూడ్చిపెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పంచాయతీలో అయితే మాంసాన్ని సీజ్ చేశారో అక్కడే పూడ్చాలి తప్ప, తమ గ్రామంలో వేయడానికి వీల్లేదని వారు తెగేసి చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను బెదిరించే ప్రయత్నం చేయగా, చివరకు మరింత లోతుగా గోతులు తవ్వి పూడ్చేలా అధికారులు హామీ ఇచ్చి గ్రామస్తులను ఒప్పించారు. కుసులవాడ పంచాయతీలో నాలుగు వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నా, అభివృద్ధి పనులకు మాత్రం అధికారులు ఈ గ్రామాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని షిణగం దామోదరరావు విమర్శించారు. కేవలం కాలుష్య కారక పనులకు మాత్రమే తమ పంచాయతీ అధికారులు వినియోగిస్తున్నారని మండిపడ్డారు. గతంలో జీవీఎంసీ డంపింగ్ యార్డు, మైనింగ్ వంటి అంశాల్లోనూ కుసులవాడనే లక్ష్యంగా చేసుకున్నారని, ఇప్పుడు గో మాంసం పూడ్చడానికి కూడా తమ ప్రాంతాన్నే ఎంచుకోవడం దారుణమన్నారు. దిబ్బపాలెం నుంచి పది కిలోమీటర్ల దూరం దాటుకుని ఇక్కడికి తీసుకురావడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. కేవలం తమ ప్రయోజనాలు చూసుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని విస్మరిస్తున్న పంచాయతీ పాలకవర్గం, రెవెన్యూ అధికారుల తీరుపై ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ సిగ్గుమాలిన రాజకీయం మరోవైపు ఈ ఘటనపై టీడీపీ నాయకులు సిగ్గుమాలిన రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు షిణగం దామోదరరావు ఆరోపించారు. స్థానికులు చేస్తున్న ఈ ఆందోళనను కేవలం వైఎస్సార్సీపీ కార్యక్రమంగా ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడుతున్నారని విమర్శించారు. కొండపై పశువులు మేపుకునే వారు ఈ మాంసం పూడ్చివేత వల్ల భయాందోళనలకు గురవుతున్నారని, ప్రభుత్వం పోలీసు బలగాలను అడ్డం పెట్టుకుని ప్రజల గొంతు నొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది గైర్హాజరై కేవలం పోలీసులతో బలవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. -
అట్టహాసంగా పీసా మహోత్సవ్
మహారాణిపేట: పోర్టు స్టేడియంలో పీసా మహోత్సవ్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, ఏపీ పంచాయతీ రాజ్– గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, ఆర్చరీ క్రీడాకారిణి అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ ఉత్సవ్ను ప్రారంభించారు. ముందుగా వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజనులు ఏర్పాటు చేసిన 68 స్టాళ్లు లాంఛనంగా ప్రారంభించి అక్కడ ప్రదర్శనలో ఉంచిన గిరిజన ఉత్పత్తులను, సాంప్రదాయ వంటకాలను పరిశీలించారు. హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, (మిగతా 8లో) -
బ్రహ్మాస్త్రం
● కన్నుకుట్టి కుతంత్రం.. కుంటిసాకుతో అడ్డంకులు చిరుద్యోగిపైవీఎంఆర్డీఏలో రాజకీయాలకు చిరుద్యోగి బలి వైఎస్సార్సీపీ చేరికల కార్యక్రమానికి ముందస్తు అనుమతులున్నా రద్దు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు చిల్డ్రన్స్ ఎరీనాలో చేరికల సమాచారం ఇవ్వలేదన్న కారణంతో ఆర్ఐపై వేటు వై.కిరణ్కుమార్ను సస్పెండ్ చేస్తూ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆదేశాలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలువిశాఖ సిటీ : వీఎంఆర్డీఏ అధికారుల రాజకీయాలకు ఒక చిరుద్యోగిని బలి చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి.. చేసిన తప్పును కప్పిపుచ్చుకోడానికి నిబంధనల్లో డొంకలు వెతుకుతూ ఆర్ఐపై వేటు వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు ఉండడం అధికార పార్టీకి కన్నుకుట్టింది. ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలన్న కుతంత్రంతో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చింది. వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ముందస్తుగా చేసుకున్న బుకింగ్ను కూడా రద్దు చేయించింది. దీనికి అధికారులతో చెప్పించిన కుంటి సాకు దుమారం రేపుతోంది. అంతటితో ఆగకుండా ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయించడం ఇప్పుడు సంస్థలో హాట్ టాపిక్గా మారింది. రాజకీయాలకు కింది స్థాయి సిబ్బందిని బలి చేయడాన్ని ఉద్యోగులు తప్పుబడుతున్నారు. ఏడాదిన్నరలోనే వ్యతిరేకత చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకపోవడం.. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల్లో కోత.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. స్టీల్ప్లాంట్లో కీలక విభాగాలను ప్రైవేటుకు అప్పగిస్తున్నా పట్టించుకోకపోవడం.. విశాఖలో విలువైన భూములను ఊరూపేరు లేని బోగస్ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టడం.. ఇలా చంద్రబాబు వరుస నిర్ణయాల పట్ల ప్రజలో అసంతృప్తి రగులుతోంది. దీంతో ఆ పార్టీల నేతల్లో అంతర్మథనం ప్రారంభమైంది. దీంతో అధికార పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి నేతలు వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. సుమారు 1400 మంది వైఎస్సార్సీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఆ పార్టీ ఈ చేరికలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 22వ తేదీన చేరికల కార్యక్రమం కోసం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాను ముందస్తుగా ఆ పార్టీ నేతలు బుకింగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి రుసుము కూడా చెల్లించారు. ముందస్తు బుకింగ్ ఉన్నప్పటికీ.. వైఎస్సార్సీపీలో చేరికల కార్యక్రమాన్ని అడ్డుకోడానికి చంద్రబాబు సర్కార్ అధికార బలాన్ని ప్రదర్శించింది. వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని వీఎంఆర్డీఏ అధికారులపై ఒత్తిడి చేసింది. దీంతో అధికారులు చేసేదేమీ లేక కుంటి సాకులతో చేరికల కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించారు. ఉదయం 10.30 గంటలకు చిల్డ్రన్స్ ఎరీనా కార్యక్రమం ఉండడంతో ఈలోగానే సిబ్బందితో గేటుకు తాళం వేయించారు. చిల్డ్రన్స్ ఎరీనా ప్రాంగణంలో పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టకూడదన్న నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో వాటిని తొలగించారు. అంతేకాకుండా చిల్డ్రన్స్ ఎరీనా హాల్లో ఆకస్మాత్తుగా ఏసీ పనిచేయడం లేదని, మరమ్మతులు చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. కార్యక్రమం నిర్వహించే అవకాశం లేదని రద్దు చేశారు. ముందస్తు బుకింగ్ చేసుకున్నప్పటికీ.. ఎటువంటి సమాచారం లేకుండా ఎలా రద్దు చేస్తారని అధికారులను ప్రశ్నించగా.. వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఇంతలో పోలీసులు సైతం రంగ ప్రవేశం చేశారు. ఒక పథకం ప్రకారమే తమ కార్యక్రమాన్ని అడ్డుకోడానికి అధికార పార్టీ నేతలు కుయుక్తులు పన్నినట్లు వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. చిల్డ్రన్స్ ఎరీనా గేటు ముందే బైఠాయించి కొంత సేపు నిరసన తెలిపారు. అనంతరం అక్కడే సుమారు 1,400 మందిని పార్టీలో చేర్చుకున్నారు. -
విశాఖ బ్రాండ్ ఖతమ్
కొమ్మాది: చంద్రబా బు ప్రభుత్వంలో విశాఖ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. లక్షల కిలోల గోమాంసం అక్రమ రవాణా, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా జూదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, డ్రగ్స్ సరఫరా వంటి ఘటనలు విశాఖకు అప్రతిష్టను తెచ్చి పెడుతున్నాయి. అధికార పార్టీ నేతల కన్నుసన్నల్లో జరుగుతున్న ఈ వికృత చేష్టలకు స్థానిక పోలీసుల నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆనందపురంలో శివారులో శ్రీమిత్ర మైరెన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజీలో భారీగా గోమాంసం లభించింది. నెలల తరబడి ఈ వ్యవహారాన్ని నాన్చిన పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఇందులో అధికార పార్టీకి చెందిన నేత పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయం మర్చిపోకముందే భీమిలి బీచ్రోడ్డు కె.నగరపాలెం కూడలి సమీపంలో పాత గోకార్టింగ్ వద్ద గల ఓ ప్రైవేటు రిసార్టులో పేకాట స్థావరం ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 21వ తేదీన ఏపీ, తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు ఇక్కడ వనసమారాధన పేరుతో భారీ స్థాయిలో పేకాట నిర్వహించారు. బయటకు పిక్నిక్గా చెప్పినప్పటికీ.. లోపల మాత్రం భారీ స్థాయిలో జూదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో టీడీపీ నేతలే అధికంగా పాల్గొన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా టేబుల్స్ వేసి మరీ పెద్ద ఎత్తున జూదం నిర్వహించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో డబ్బు లెక్కించడానికి కౌంటింగ్ మెషీన్లు ఏర్పాటు చేశారంటే ఏ స్థాయిలో పేకాట జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఒక్కరోజే రూ.1.85 కోట్లు జూదంలో చేతులు మారినట్టు సమాచారం. ఇంతజరిగినా పోలీసులు అటుగా కన్నెత్తి కూడా చూడలేదు. నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రోన్లు ఉపయోగించి మందుబాబులను పట్టుకుంటున్న పోలీసులు.. ఈ పేకాట డెన్ జోలికి ఎందుకు రాలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖను ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్గా తీర్చిదిద్దుతానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. విశాఖను మద్యం, జూదానికి హబ్గా, గోమాంసం విక్రయాలకు కేంద్రంగా మార్చేశారని రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి.సామాన్యులపై కేసు నమోదు ఆదివారం జరిగిన భారీ బహిరంగ జూదంపై పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోంది. ఈ జూదంలో టీడీపీ నేతలు పచ్చ చొక్కాలు వేసుకుని మరీ పాల్గొన్నట్లు స్పష్టంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా.. వారిని వదిలి సామాన్యులపై మాత్రమే కేసులు నమోదు చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. స్థానిక పోలీసులకు నెలవారి మామూళ్లు అందడంతోనే ఈ పేకాట డెన్ వైపు కన్నెత్తి చూడలేదని తెలిసింది. నగరంలో పెట్రోల్ బంక్లు నిర్వహిస్తున్న అధికార పార్టీకి చెందిన నేత ఈ పేకాట డెన్ నిర్వహించినట్లు సమాచారం. ఈ విషయంపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు అందగా.. భీమిలి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే ఈ పేకాట ఆడిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. -
లంకను
ఊదేశారుఅదే జోరు..ఎక్కడ తడబడలేదు..బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్లో మన అమ్మాయిలు అదరగొట్టారు. విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ–20లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. అన్ని విభాగాల్లోనూ సత్తా చాటిన టీమ్ ఇండియా శ్రీలంకను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు కేవలం 128 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 11.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన త్వరగానే అవుటైనప్పటికీ, షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. కేవలం 34 బంతుల్లోనే 69 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో భారత్ సునాయస విజయం సాధించింది. భారత బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపిస్తుంటే గ్యాలరీల్లోని అభిమానులు కేరింతలతో స్టేడియాన్ని హోరెత్తించారు. –విశాఖ స్పోర్ట్స్ -
మా పిల్లలను ఆదుకోవాలి
కండరాల బలహీనత వ్యాధితో బాధపడుతున్న తమ పిల్లలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని పలువురు తల్లిదండ్రులు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్కు విన్నవించారు. విశాఖలో సుమారు 33 మంది పిల్లలు ఈ జబ్బు కారణంగా ఎదుగుదల లేక, కనీసం భోజనం కూడా చేయలేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టినప్పటి నుంచి ఏ పనీ చేసుకోలేక మంచానికే పరిమితమైన తమ బిడ్డలకు అవసరమైన వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కోరారు. చదువుకు దూరమై, రక్త పరీక్షలు చేయించుకోవడం కూడా భారంగా మారిన తమ పిల్లల దీనస్థితిని గమనించి, ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వినతి పత్రం సమర్పించారు. -
వైద్య విద్య జీవోల అమలులో పొరపాట్లు ఉండకూడదు
మహారాణిపేట: మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలులో ఎటువంటి పొరపాట్లకు తావు ఉండరాదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమిటీ సభ్యులు బండారు శ్రావణి శ్రీ, కన్నా లక్ష్మీనారాయణలతో కలిసి హెచ్.ఐ.వి, ఎయిడ్స్ నివారణ చట్టం 2017 అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీజీ వైద్య విద్యార్థులకు సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల అమలు తీరును, ఎయిడ్స్ రిహాబిలిటేషన్ సెంటర్లలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మందుల పంపిణీ, ఉద్యోగ అవకాశాలు, గృహ వసతి, బీమా వంటి సౌకర్యాలపై చర్చించారు. అసెంబ్లీలో ఆమోదించిన అంశాలు, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావాలని, నిబంధనల అమలులో జాప్యం జరిగితే వెంటనే సరిదిద్దాలని చైర్మన్ అధికారులకు సూచించారు. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా స్వయంగా ఆసుపత్రులను సందర్శించి పరిస్థితులను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఎయిమ్స్ వంటి సంస్థలకు కేంద్రం నుంచి అందుతున్న సహకారం, పురోగతిపై కూడా చర్చించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య విద్యా విభాగం పారదర్శకంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఏపీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.విశ్వనాథం, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రెటరీ సౌరబ్ గౌర్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కే.నీలకంఠరెడ్డి, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్డాక్టర్ పద్మావతి, డెరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ రఘునందన్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు 120 ఫిర్యాదులు
విశాఖ సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు వచ్చిన ఫిర్యాదులపై దృష్టి పెట్టి చట్ట ప్రకారం సత్వరమే పరిష్కరించాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్ సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 120 ఫిర్యాదు వచ్చాయి. సీపీ స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. -
పిక్నిక్ పేరుతో జూదం
కొమ్మాది: భీమిలి బీచ్ రోడ్డులో ఆదివారం పిక్నిక్ పేరుతో భారీ ఎత్తున పేకాట శిబిరం నిర్వహించడం స్థానికంగా కలకలం రేపింది. కే నగరపాలెం సమీపంలోని పాత గోకార్టింగ్ ప్రాంతంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ జూద క్రీడలో పాల్గొన్నట్లు సమాచారం. బయటకు వినోద కార్యక్రమంగా కనిపించేలా భారీ షామియానాలు వేసి, లోపల రహస్యంగా లక్షలాది రూపాయలతో పేకాట సాగించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున జూదం జరుగుతున్నా పోలీసులు అటువైపు రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అండదండలతోనే ఈ శిబిరం నిర్వహించారని, పోలీసుల జోక్యం లేకుండా ఆయనే చూసుకున్నారని ప్రచారం జరుగుతోంది. నగరంలో అక్రమ మద్యం, జూదంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ ప్రకటిస్తున్నప్పటికీ, అధికార పార్టీ నేతల విషయంలో నిబంధనలు అమలు కావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.2 లక్షలకే.. రైల్వే ఉద్యోగం!
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట దళారుల దగ సాక్షి, విశాఖపట్నం : వాల్తేరు డివిజన్ పరిధిలో రైల్వే ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ విధానంలో ఇప్పిస్తామంటూ దళారులు గాలం వేస్తున్నారు. ప్రస్తుతం గేట్మెన్, పెట్రోలింగ్ విభాగంలో థర్డ్ పార్టీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తున్నారంటూ నిరుద్యోగులకు నమ్మబలుకుతున్నారు. ఈ పోస్టుల్లో చేరిన తర్వాత భవిష్యత్తులో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పోస్టుల భర్తీ అయితే.. పని అనుభవాన్ని బట్టి.. ఉద్యోగం పొందవచ్చంటూ మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని నిరుద్యోగులను దళారులు టార్గెట్ చేశారు. ఏ పోస్టుకై నా రూ.2 లక్షలు చెల్లిస్తే చాలనీ.. మిగిలిందంతా తాము చూసుకుంటామంటూ ఎరవేస్తున్నారు. థర్డ్ పార్టీ ద్వారా అవుట్ సోర్సింగ్లో చేరినా రూ.40 నుంచి రూ.50 వేలకు పైగా జీతం వస్తుందని చెబుతున్నారు. ప్రతి ఏటా రెన్యువల్ అవుతుంటుందనీ.. అప్పుడు రూ.50 వేలు లేదా రూ.లక్ష చెల్లిస్తే చాలనీ.. మళ్లీ మరో ఏడాది పాటు ఉద్యోగానికి ఎలాంటి ఢోకా ఉండబోదని చెబుతున్నారు. ఉద్యోగుల పేరుతో మోసాలు..! తమకు వాల్తేరు రైల్వే డివిజన్లో ఉన్నతాధికారులు తెలుసు అంటూ ఈ దళారులు నమ్మిస్తున్నారు. వారితో మాట్లాడించినట్లుగా చూపిస్తూ దందాకు తెర తీస్తున్నారు. అయితే.. కొందరు ఉద్యోగులు మాత్రం దళారీ ఫోన్ చేసినప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు తీస్తున్నారనీ చెప్పి కొంత మేర కమీషన్ ముట్టేలా బేరసారాలు చేసుకున్నట్లు సమాచారం. ఇలా దళారుల నుంచి ఫోన్ రాగానే.. మాటామాటా కలిపి పోస్టులు భర్తీ వేగంగా జరుగుతోందనీ.. త్వరగా మీ వాళ్లెవరైనా ఉంటే.. మాట్లాడుకోవాలని చెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వయంగా రైల్వే ఉద్యోగులే చెబుతున్నప్పుడు, ఈ పోస్టులు నిజమేనని భావించిన నిరుద్యోగులు దళారీల చేతుల్లో డబ్బులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ మంది నుంచి వసూలు చేసినట్లు సమాచారం. విశాఖపట్నంలోనూ ఇప్పుడిప్పుడే ఈ తరహా మోసాలు మొదలయ్యాయని తెలుస్తోంది. డివిజన్ అధికారులూ స్పందించరా.. ఈ విషయం వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులకు తెలిసినా తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిరుద్యోగులు మోసానికి గురవుతున్నా స్పందించడం లేదు. వాస్తవానికి డివిజన్లో థర్డ్ పార్టీ ద్వారా హౌస్కీపింగ్, సెక్యూరిటీ, డేటాఎంట్రీ పోస్టుల భర్తీకి మాత్రమే ఇటీవల టెండర్లు పిలిచారు. ఏడాది కాలం ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. కానీ గేట్మెన్, పెట్రోలింగ్ పోస్టులకు ఎలాంటి టెండర్లు పిలవకపోయినా.. నిరుద్యోగులను టార్గెట్గా చేసుకుంటూ కొందరు దళారులు రూ.లక్షలు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికై నా డివిజన్ అధికారులు ఈ పోస్టుల భర్తీపై పారదర్శకంగా వ్యవహరించి.. సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ‘రండి బాబూ.. రండి.. ఆలోచించిన ఆశాభంగం.. కేంద్ర ప్రభుత్వ కొలువులిస్తాం. పోటీ ఎక్కువగా ఉంది. అవుట్ సోర్సింగ్ అయినా.. అదిరిపోయే ఉద్యోగం. కేవలం రూ.2 లక్షలు మాత్రమే చెల్లించండి.. రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం పొందండి..’ అంటూ నిరుద్యోగులను కొందరు కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. వాల్తేరు డివిజన్ పరిధిలో ఈ తరహా కొత్త మోసం మొదలైంది. -
ఆన్లైన్లో ఉత్తరద్వార దర్శనం టికెట్లు
సింహాచలం: ఈ నెల 30న జరిగే సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఉత్తరద్వార దర్శనం టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే లభిస్తాయని ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. భక్తులు ఈ నెల 26 నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు www. ap temples.ap.gov.in వెబ్సైట్, 95523 00009 వాట్సాప్ నంబరు ద్వారా రూ.100, రూ.300, రూ.500 టికెట్లను బుక్ చేసుకోవాలి. వీరి దర్శనం ముగిసిన తర్వాతే కౌంటర్లలో టికెట్ల విక్రయం జరుపుతామన్నారు. దర్శనవేళల్లో మార్పులు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు ఈనెల 29 వరకు ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల వరకు లభించవని, భక్తులంతా ఈవిషయాన్ని గమనించాలని సింహాచలం దేవస్థానం ఇచచార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఆలయంలో జరుగుతున్న ధనుర్మాసం పూజల్లో భాగంగా ఈ మార్పు చేసినట్టు తెలిపారు. -
రహదారుల నిర్వహణ ప్రైవేటు సంస్థలకా?
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 99 వినతులు అందాయి. శాఖల వారీగా చూస్తే పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి అత్యధికంగా 42 ఫిర్యాదులు రాగా, ఇంజనీరింగ్కు 22, రెవెన్యూకు 12, అడ్మినిస్ట్రేషన్కు 9, యూసీడీ విభాగానికి 7 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వచ్చిన అర్జీలపై అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. సమస్యలను అదే రోజు పరిశీలించి, నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలని, బాధితులు ప్రతి వారం ఒకే సమస్యపై కార్యాలయానికి రాకుండా చూడాలని జోనల్ కమిషనర్లకు, విభాగాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.అదే సమయంలో నగరంలో రోడ్ల ప్రైవేటీకరణ నిర్ణయంపై రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జీవీఎంసీ పరిధిలోని సుమారు 88.3 కిలోమీటర్ల ప్రధాన రహదారులను పదేళ్ల పాటు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి. గంగారావు మేయర్కు వినతిపత్రం అందజేశారు. మధురవాడ, ఎంవీపీ, గాజువాక వంటి కీలక ప్రాంతాల్లో రోడ్ల నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ రూ. 306 కోట్లు చెల్లించడం భారీ కుంభకోణమని ఆయన ఆరోపించారు. ప్రజల పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమే కాకుండా, అడ్వర్టైజ్మెంట్లు, పార్కింగ్ ఫీజుల పేరిట సామాన్యులపై అదనపు భారం మోపడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసిన సంస్థలకు భారీగా కమీషన్లు చెల్లించడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ విధానం వల్ల జీవీఎంసీ తన ఉనికిని కోల్పోయి ప్రైవేట్ కార్పొరేషన్గా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
అంధకారంలో కలెక్టరేట్
మహారాణిపేట: నగరంలోని కీలక ప్రభుత్వ విభాగాల్లో వరుసగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కేజీహెచ్లో అంధకారం నెలకొనగా, సోమవారం జిల్లా కలెక్టరేట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్యవసర సేవలు అందాల్సిన ఆస్పత్రిలోనూ, పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్లోనూ ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ, పనుల కోసం వచ్చిన సామాన్య పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కీలక కార్యాలయాల్లో బ్యాకప్ వ్యవస్థలు ఎందుకు పనిచేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో విద్యుత్ అంతరాయం కారణంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఉదయం 11:30 గంటల నుంచి విద్యుత్ సరఫరాలో తరచుగా అంతరాయం ఏర్పడటంతో అధికారులు, సిబ్బందికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సిబ్బంది కారణాలను వెతుకుతున్న సమయంలోనే సమావేశ మందిరం బయట ఉన్న విద్యుత్ మీటర్ల వద్ద పెద్ద శబ్దం రావడంతో పాటు ఎంసీబీ ప్లాట్లు, సాకెట్లు కాలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన అందరూ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. కలెక్టరేట్ మొత్తం అంధకారంగా మారింది. కంప్యూటర్లు, ఏసీలు, లైట్లు అన్నీ నిలిచిపోయాయి. సెల్ఫోన్ వెలుగుల్లో అర్జీలను జేసీ మయూర్ అశోక్ స్వీకరించారు. అటు అధికారులు, ఇటు ప్రజలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోయారు. సమాచారం అందుకున్న ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది సుమారు రెండు గంటల పాటు శ్రమించి మధ్యాహ్నం 1.30 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అనంతరం జేసీ మయూర్ అశోక్ దరఖాస్తుదారులతో మాట్లాడి కార్యక్రమాన్ని ముగించారు. -
పింఛన్ నిలిచిపోవడంతో వీధిన పడ్డాం
గత జగనన్న ప్రభుత్వ హయాంలో నెలకు రూ.3 వేలు పింఛన్ వచ్చేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని నిలిపివేయడం వల్ల తమ కుటుంబం వీధిన పడిందని మద్దిలపాలెం మంగాపురం కాలనీకి చెందిన ఆత్మకూరు జయలక్ష్మి, కుమారుడు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త శ్రీనివాస్ పక్షవాతంతో మంచం పట్టాడని, కుమారుడు ట్రై సైకిల్పై ఆధారపడి జీవిస్తున్నాడని పేర్కొన్నారు. పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదో అధికారులు సమాధానం చెప్పడం లేదన్నారు. తక్షణమే పింఛన్ పునరుద్ధరించి, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నాగరాజు విజ్ఞప్తి చేశాడు. -
ఉపాధి హామీ పథకానికి కేంద్రం తూట్లు
బీచ్రోడ్డు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎటువంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగించాలని వామపక్ష పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిర్వహించిన నిరసనలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. రెహమాన్, సీపీఎం నేత పి.మణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించడం వల్ల ఈ పథకం నిర్వీర్యమవుతుందని, దీనివల్ల రాష్ట్రంపై ఏటా నాలుగు వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల కోత వల్ల వ్యవసాయ కూలీలకు తీవ్ర నష్టం జరుగుతుందని, గ్రామాల నుంచి వలసలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర కూటమిలో భాగస్వాములుగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంలో మౌనం వీడి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని నేతలు విమర్శించారు. దశాబ్దాలుగా గ్రామీణ పేదలకు, చేతివృత్తిదారులకు జీవనోపాధిని కల్పిస్తూ చట్టబద్ధమైన హక్కుగా ఉన్న ఈ పథకాన్ని పేరు మార్పులు, నిధుల కోతలతో నిర్వీర్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. పథకాన్ని రద్దు చేసి కొత్తగా తీసుకువచ్చిన జీరాంజీ పథకం కేవలం కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా ఉందని, ఇది గ్రామీణ పేదలను రోడ్డున పడేస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు కె.సత్యనారాయణ, పి.చంద్రశేఖర్, సీపీఎం జిల్లా నాయకుడు ఎం కష్ణారావు, సీపీఐఎంఎల్ ప్రజా పోరు నాయకుడు కె.దేవా, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.పైడిరాజు, ఎం.మన్మథరావు, ఎన్.నాగభూషణం, కె.వనజాక్షి, సీఎన్ క్షేత్రపాల్, జి.రాంబాబు, పి.సూర్య కుమారి, జి.జయ, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పీసా మహోత్సవ్
సీతంపేట: పీసా(పీఈఎస్ఏ–ది పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్) 1996 చట్టం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 23, 24వ తేదీల్లో అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో పీసా మహోత్సవ్ నిర్వహించనున్నట్లు కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ మక్తా శేఖర్, ఏపీ పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణతేజ వెల్లడించారు. పది రాష్ట్రాల నుంచి సుమారు 1,500 మంది క్రీడాకారులు విచ్చేస్తున్నారని, వారి భాగస్వామ్యంతో కబడ్డీ, ఆర్చరీ పోటీలు, గిరిజన సంస్కృతులను, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. సోమవారం పోర్టు స్టేడియంలో విలేకరులతో వారు మాట్లాడుతూ మంగళవారం ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ రోడ్డులో 10కె పీసా రన్ జరుగుతుందని, అనంతరం 9 గంటలకు పోర్టు ఇండోర్ స్టేడియంలో కబడ్డీ సెమీఫైనల్ మ్యాచ్లు ప్రారంభమవుతాయని తెలిపారు. 10 గంటల నుంచి క్రికెట్ స్టేడియంలో మహిళలు, పురుషుల జట్ల ఆధ్వర్యంలో ఆర్చరీ పోటీలు జరుగుతాయని వివరించారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి క్రీడాకారులు, అధికారులు, గిరిజన ప్రజల ఆధ్వర్యంలో డెమో క్రీడాపోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. 24వ తేదీ 11 గంటల నుంచి కళావాణి స్టేడియంలో వివిధ రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయన్నారు. కార్యక్రమాల్లో భాగంగా గిరిజనులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులతో కూడిన స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముందుగా పీసా మహోత్సవ్ మస్కట్ కృష్ణ జింక, పీసా రన్ టీషర్టులను ఆవిష్కరించడంతో పాటు, మహోత్సవ్ బెలూన్ను ఎగుర వేశారు. -
అవగాహనతోనే మోసాలకు అడ్డుకట్ట
మహారాణిపేట: వినియోగదారులు హక్కులను ఆయుధాలుగా మలుచుకొని మోసాలకు అడ్డుకట్ట వేయాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. జాతీయ వినియోగదారుల హక్కుల వారోత్సవాల్లో భాగంగా కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్స్ రూపొందించిన ‘మేలుకో.. హక్కులు తెలుసుకో’ అందరి చుట్టం వినియోగదారుల రక్షణ చట్టం’ బ్రోచర్ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. చైతన్యవంతమైన వినియోగదారులే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి.భాస్కరరావు, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్(నెహ్రౌ యువ కేంద్రం) డిప్యూటీ డైరెక్టర్ జి.మహేశ్వరావు, కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్స్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ, కన్స్యూమర్ రైట్స్ సేఫ్ గార్డింగ్ సొసైటీ అధ్యక్షుడు రెడ్డి సత్యనారాయణ, జిల్లా రెవెన్యూ అధికారి కె.సత్తిబాబు, యూసీడీ పీడీ సత్యవేణి, ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత రామపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్ ఇన్చార్జి ప్రిన్సిపాల్గా డాక్టర్ కేవీ రమణ
మురళీనగర్: కంచరపాలెం (విశాఖపట్నం) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్గా ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ (గైస్) ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ రమణను నియమిస్తూ రాష్ట్ర సాంకేతిక శాఖ డైరెక్టర్ జి. గణేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఇక్కడ పని చేస్తున్న ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. నారాయణరావు బదిలీ కావడంతో, తొలుత మెటలర్జీ విభాగం హెడ్ డాక్టర్ కె. రత్నకుమార్ను ఈ బాధ్యతల్లో నియమించారు. అయితే తాజాగా అనూహ్య పరిణామాల మధ్య డాక్టర్ కేవీ రమణకు ఈ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ కళాశాల పూర్తి స్థాయి ప్రిన్సిపాల్ జీవీవీ సత్యనారాయణమూర్తి సాంకేతిక విద్యా శాఖ ఇన్చార్జి సెక్రటరీగా డిప్యుటేషన్పై వెళ్లడంతో కొంతకాలంగా ఈ కళాశాల ఇన్చార్జిల పాలనలోనే కొనసాగుతోంది. ఈ పదవి కోసం పలువురు ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రభుత్వం చివరికి కేవీ రమణను నియమించడంతో ఆ ప్రయత్నాలకు తెరపడింది. -
● స్నోయగాల నగరి
నీలి సముద్రపు అంచులపై తెల్లని మంచు తెరలు పరచుకుని, సాగర కన్య ముసుగు వేసుకున్నట్లుగా విశాఖ తీరం ఒక అందమైన కావ్యంలా మెరిసిపోతోంది. సాగరనగరిని ముంచెత్తుతున్న పొగమంచు సోయగాలు ఒకవైపు ప్రకృతి ప్రేమికులకు కేరింతలు పుట్టిస్తుంటే, మరోవైపు జిల్లా వ్యాప్తంగా విసురుతున్న చలి పంజా సామాన్యులను వణికిస్తోంది. ఎముకలు కొరికే గాలి, వెన్నులో వణుకు పుట్టించే చల్లదనం వెచ్చని దుప్పటిని వీడనీయడం లేదు. బారెడు పొద్దెక్కినా మంచు వీడక, బయటకు అడుగు పెట్టాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. – ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ఇక ఆన్లైన్లోనే సర్వే సర్టిఫికెట్లు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలోని భవనాలు, ఖాళీ స్థలాలకు సంబంధించిన సర్వే సర్టిఫికెట్లను ఇకపై ఆన్లైన్ ద్వారానే సులభంగా పొందవచ్చని మేయర్ పీలా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి ఆయన ఈ నూతన ఆన్లైన్ అప్లికేషన్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా, పారదర్శక విధానంలో వారం రోజుల్లోనే సర్టిఫికెట్ పొందేందుకు ఈ వినూత్న వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ ఏ దశలో ఉందో కూడా నేరుగా వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని, దీనిపై సచివాలయ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు ప్రక్రియ ఇలా.. పౌరులు అధికారిక జీవీఎంసీ వెబ్సైట్ ద్వారా తమ లాగిన్ వివరాలతో ప్రవేశించి, లేదా కొత్త వినియోగదారులుగా నమోదు చేసుకుని, సర్వేయర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. www.gvmc.gov.in వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత, citizen services-e- Request- Surveyor Certificate విభాగాన్ని ఎంపిక చేసుకుని దరఖాస్తుదారుడి వివరాలు, ఆస్తి వివరాలు నమోదు చేసి, అవసరమైన సహాయ పత్రాలు అప్లోడ్ చేస్తూ ఆన్లైన్ నమోదు ఫారమ్ పూరించాలి. దరఖాస్తు అందజేసిన వెంటనే, దరఖాస్తు స్థితిని అనుసరించేందుకు ప్రత్యేక రిఫరెన్స్ నంబరు కనిపిస్తుంది. ఎంచుకున్న జోన్ ఆధారంగా దరఖాస్తు సంబంధిత టౌన్ సర్వేయర్కు వెళుతుంది. టౌన్ సర్వేయర్ సమర్పించిన వివరాలు, పత్రాలు పరిశీలించి సంబంధిత ప్రక్రియ జరుపుతారు. టౌన్ సర్వేయర్ ఆమోదించిన అనంతరం, దరఖాస్తు ఎస్టేట్ అధికారికి తుది పరిశీలనకు పంపుతారు. ఎస్టేట్ అధికారి ఆమోదించిన తర్వాత, issued surveyor certificate విభాగంలో సర్వేయర్ సర్టిఫికెట్ రూపొందుతుంది. అక్కడ నుంచి డౌన్లోడు చేసుకోవచ్చు. -
అణగదొక్కాలని చూస్తే రెట్టింపు స్పీడ్తో ఎదుగుతాం..
చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ సీపీ కార్యక్రమాలను, పార్టీని అణగదొక్కాలని అనుకుంటే.. గొడకు కొట్టిన బంతిలా అంతకు రెట్టింపు స్పీడ్తో ఎదుగుతామని వైఎస్సార్ సీపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఎదురు తిరిగారని, రానున్న కాలంలో ఆ పార్టీలను బంగాళాఖాతంలో కలపడం ఖాయమని హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి, తమ పార్టీ అధినేత జన్మదిన వేడుకలకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందంటూ మండిపడ్డారు. వీఎంఆర్డీఏ అధికారులు, పోలీసులు టీడీపీ కార్యకర్తలా కాకుండా నిబంధనల లోబడి పనిచేయాలని హితవు పలికారు. -
వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
మహారాణిపేట: ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటికి సకాలంలో, నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదుపై సరైన రీతిలో ఎండార్స్మెంట్ ఇవ్వడమే కాకుండా, బాధితులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 377 వినతులు అందగా అందులో అత్యధికంగా జీవీఎంసీకి సంబంధించి 121, రెవెన్యూ విభాగానికి 106 ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే పోలీస్ శాఖకు 34 వినతులు రాగా, ఇతర శాఖలకు కలిపి 116 వినతులు అందాయి. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్తో పాటు ఇంచార్జి డీఆర్వో సత్తిబాబు, యూసీడీ పీడీ సత్యవేణి, ఏసీపీ ధనుంజయ రెడ్డి , వివిధ విభాగాల అధికారులు పాల్గొని ప్రజల నుంచి సమస్యలను స్వీకరించారు. -
పింఛన్ కోసం దివ్యాంగుడి తల్లి ఆవేదన
తమ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం వెంటనే స్పందించి దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని పూర్ణామార్కెట్ ఏరియాకు చెందిన రామలక్ష్మి జాయింట్ కలెక్టర్ను వేడుకుంది. చిన్న వయసులోనే కుమారుడు సతీష్ పక్షవాతానికి గురికావడంతో అన్నీ తానై చూసుకోవాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం తన కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని స్థితిలో మంచానికే పరిమితమైన కుమారుడిని పోషించడం తమకు భారంగా మారిందని, ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పింఛన్ కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని, ఇప్పటికై నా మానవతా దృక్పథంతో స్పందించి పింఛన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. -
అదే అక్కసు
వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో వైఎస్సార్సీపీ చేరికల కార్యక్రమం అడ్డగింత సోమవారం ఉదయం ఎరీనా గేట్కు తాళం వేసిన పోలీసులు గేటు ముందే బైఠాయించిన వైఎస్సార్ సీపీ నేతలు అక్కడే వైఎస్సార్ సీపీలో 1,400 మంది చేరిక సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు సర్కార్ అధికారులను అడ్డుపెట్టుకొని వైఎస్సార్సీపీపై కుట్రలు చేస్తోంది. నేరుగా ఎదుర్కొనలేక తెర వెనుక కుతంత్రాలకు తెర తీస్తోంది. సోమవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీలో చేరికల కార్యక్రమాన్ని అడ్డుకోంది. ఈ కార్యక్రమం కోసం వైఎస్సార్సీపీ నేతలు ముందుగానే వీఎంఆర్డీఏకి రూ.71,300 చెల్లించి అధికారికంగా అనుమతి తీసుకున్నారు. విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో ప్రముఖ నేత ధర్మాన ఆనంద్ నేతృత్వంలో బీజేపీ, కాంగ్రెస్, జనసేన, టీడీపీకి చెందిన 1,400 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలోకి చేరేందుకు వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా వద్దకు సోమవారం ఉదయం చేరుకున్నారు. వైఎస్సార్సీపీలో భారీ చేరికలని తెలుసుకొన్న చంద్రబాబు ప్రభుత్వం అనుమతి లేదంటూ పోలీసుల అండతో చిల్డ్రన్స్ ఎరీనా సిబ్బందితో గేటుకు తాళం వేయించింది. ఈ ఘటనను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, సమన్వయకర్త మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర మత్స్యకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయచందర్, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్యనేతలు చిల్డ్రన్ ఎరీనా గేటు వద్ద రెండు గంటలపాటు బైఠాయించారు. అక్కడ నుంచి సిరిపురం సర్కిల్ వరకు ర్యాలీ చేసి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ చేరికల కార్యక్రమం అడ్డగింతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు చిల్డ్రన్స్ ఎరీనా గేటు వద్ద ప్రముఖ నేత ధర్మాన ఆనంద్ నేతృత్వంలో కొత్తపల్లి రవిరాజు వర్మ, బొడ్డూరి వాసుదేవరావు, రాయపల్లి ప్రకాష్, రాయపల్లి రాజారావు, వి.వి.రామారావు, పొలిమాటి అశోక్కుమార్, పొలిమాటి నవీన్, దాకే రమేష్బాబు, దాకే వినూత్న, కొత్తపల్లి వీరస్వామి, గుర్ల కిరణ్కుమార్, డి.ఆకాంక్షతో పాటు బీజేపీ, కాంగ్రెస్, జనసేన, టీడీపీకి చెందిన 1,400 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలోకి చేరారు. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, డిప్యూటీ మేయర్ కె.సతీష్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర మత్సకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయచందర్ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మాన ఆనంద్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అందించిన సంక్షేమ పథకాలు పొందిన తామంతా.. గత ఎన్నికల్లో కూటమి పార్టీల అబద్దాలను నమ్మి ఓట్లు వేసి మోసపోయామన్నారు. మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డినే ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని వైఎస్సార్సీపీలో చేరామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అనిల్కుమార్ రాజు, పార్టీ ముఖ్య నాయకులు అల్లంపల్లి రాజబాబు, పీపీ నారాయణ, చొక్కర శేఖర్, ఎం.సునీల్, బెవర జగదీష్, పీతల వాసు, కనక ఈశ్వరరావు, శివారెడ్డి, సీహెచ్ నాగేశ్వరరావు, ఎం.ప్రదీప్, పోతిన హరికృష్ణ, నూకరాజు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. -
కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం మరింత సులభతరం
డాబాగార్డెన్స్: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం, సేవల టికెట్ల జారీ ప్రక్రియను దేవదాయ శాఖ డిజిటలైజేషన్ ద్వారా సులభతరం చేసింది. భక్తులు నగదు రహిత లావాదేవీల ద్వారా దర్శనం, ఆర్జిత సేవలు, ప్రసాదం టికెట్లను సులభంగా పొందే వీలు కల్పించారు. మన మిత్ర యాప్ నంబరు 9552300009, దేవదాయ శాఖ అధికారిక వెబ్సైట్ aptemples. ap. gov.in ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఏపీ టెంపుల్స్ యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని, లాగిన్ అయిన తర్వాత టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా పొందిన టికెట్ను ప్రింట్ తీసుకోవడం, ఫోన్లో చూపించడం ద్వారా స్కాన్ చేయించుకుని భక్తులు వేగంగా దర్శనం పొందవచ్చు. ప్రసాదాల కొనుగోలుకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. ఇప్పటికే 315 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా దర్శనం చేసుకోగా, 74 మంది భక్తులు నగదు రహిత లావాదేవీల ద్వారా ప్రసాదాలను పొందినట్లు ఆలయ ఈవో కె.శోభారాణి తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనాలు, సేవలను వేగవంతం చేసేందుకు ఈ డిజిటల్ విధానం ఎంతో దోహదపడుతుందన్నారు. -
బయటపడిన శ్రీరాముడి విగ్రహం
మధురవాడ: వాంబేకాలనీ వద్ద గల సుద్దగెడ్డ సమీపంలో జరుగుతున్న వీఎంఆర్డీఏ మాస్టర్ప్లాన్ రోడ్డు నిర్మాణ పనుల్లో శ్రీరాముడి విగ్రహం బయటపడింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలివి.. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా బయట వేసిన మట్టి కుప్ప నుంచి.. సుద్దగెడ్డ టిడ్కో హౌసింగ్కాలనీ వద్ద శుక్రవారం రాత్రి ఈ విగ్రహం బయటపడింది. ఆ ప్రాంతంలో పశువులు వెళ్తున్న సమయంలో మట్టి జారిపడటంతో విగ్రహం కనిపించింది. దీంతో శనివారం ఉదయం స్థానికులు ఆ విగ్రహాన్ని బయటకు తీసి, శుభ్రం చేసి పూజలు ప్రారంభించారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. భక్తుల రాకతో ఆ ప్రాంతమంతా జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగింది. పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీరామచంద్రుని కృప తమపై కలిగిందని, ఇదంతా ఆ స్వామి సంకల్పమేనని స్థానికులు భావోద్వేగానికి లోనయ్యారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు సైతం తరలివచ్చి విగ్రహాన్ని దర్శించుకున్నారు. -
నడకతో ఆరోగ్యం : సీపీ
బీచ్రోడ్డు: వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వాకర్స్ క్లబ్ సభ్యులు ఆదర్శనీయులని సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి కొనియాడారు. శనివారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన 34వ వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దైనందిన జీవనంలో నడకను వ్యాయామంగా మార్చుకోవడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుందన్నారు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతకు ఆశ చూపి, వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ దాదాపు రూ. 300 కోట్లు దోచుకున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చైర్మన్ డాక్టర్ కమల్ బయిద్, అధ్యక్షురాలు కె. ప్రభావతి, పూర్వ అధ్యక్షులు ఎస్.పి.రవీంద్ర, డిస్ట్రిక్ట్ గవర్నర్ కె. ద్వారాకానాఽథ్, మీడియా కన్వీనర్లు నండూరి రామకృష్ణ, శ్రీనివాసరాజు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూల్ ఆటో
ఆరిలోవ: రోడ్డుపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ఘటనలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. హనుమంతవాక జంక్షన్కు సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆరిలోవ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.. ఆరిలోవ ప్రాంతం నుంచి ఎంవీపీకాలనీ వైపు పాఠశాల విద్యార్థులను తీసుకువెళ్తున్న ఒక ఆటో.. జాతీయ రహదారిపై హనుమంతవాక పాత మేకల కబేళా సమీపంలోని బస్టాప్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఆటోలో ఉన్న విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు చిన్నారులు భయాందోళనతో వణికిపోయారు. స్థానికులు, వాహనచోదకులు వెంటనే స్పందించి విద్యార్థులకు సపర్యలు చేసి.. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆటో బోల్తా పడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గురైన ఆటోను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి ఆటోలే కారణం కాగా.. బస్టాప్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవడానికి రెండు ఆటోలను వరుసగా నిలిపి ఉంచారు. దీంతో ఆరిలోవ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్.. బస్టాప్లో ఖాళీ లేకపోవడంతో ఆ ఆటోల పక్కనే రోడ్డు మధ్యలో బస్సును నిలిపారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న స్కూల్ ఆటో నియంత్రణ కోల్పోయి బస్సును ఢీకొంది. బస్టాప్ల వద్ద ఆటోలు నిలపకుండా, దూరంగా ఆగేలా ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనచోదకులు డిమాండ్ చేస్తున్నారు. -
నగరంలో క్షీణిస్తున్న వాయు నాణ్యత
మహారాణిపేట: విశాఖ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. నగరంలో క్షీణిస్తున్న వాయు నాణ్యతపై తక్షణమే స్పందించాలని సూచించారు. ఇటీవల విశాఖలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుందన్న వార్తల నేపథ్యంలో.. శనివారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా స్థాయి క్వాలిటీ మానిటరింగ్ టాస్క్ఫోర్స్ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. నగరంలో చెత్త, వ్యర్థాలను తరలించే వాహనాలను పూర్తిగా టార్పాలిన్తో కప్పాలని, పరిమితికి మించి లోడ్తో వెళ్లరాదని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు భవన నిర్మాణాలు చేపట్టేటప్పుడు తప్పనిసరిగా గ్రీన్ మ్యాట్లు కప్పాలని, కూల్చివేసిన భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్ల పక్కన ఎక్కడపడితే అక్కడ పారబోయవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో నిర్మాణ వ్యర్థాలను తరలించే వాహనాలపై నిఘా ఉంచాలని, నిబంధనలు మీరితే వాహనాలను సీజ్ చేయాలన్నారు. పరిశ్రమల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ సక్రమంగా పనిచేసేలా చూడాలని, సిగ్నల్ పడినప్పుడు వాహనదారులు ఇంజిన్ ఆఫ్ చేసేలా చైతన్యం తేవాలన్నారు. బస్టాపుల వద్ద ఆటోలు, బస్సులు ఎక్కువసేపు ఇంజిన్ ఆన్ చేసి ఉంచితే రవాణా, పోలీస్ శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాత వాహనాలకు పొల్యూషన్ చెక్ చేయించాలని, ఆర్టీసీ బస్సుల నుంచి కాలుష్యం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పెట్రోల్ బంకుల్లో కల్తీ జరగకుండా తనిఖీలు చేయాలని పౌర సరఫరాల శాఖ, లీగల్ మెట్రాలజీ అధికారులకు సూచించారు. ప్రతి రోజూ నివేదిక సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ ముకుందరావు, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ రమణమూర్తి, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, డీపీవో శ్రీనివాసరావు, డీఎస్వో భాస్కరరావు, పోర్ట్ అధికారులు, హెచ్పీసీఎల్, కోరమండల్, ఫార్మాసిటీ ప్రతినిధులు, రెడ్క్రాస్, వలంటీర్స్ పాల్గొన్నారు. టాస్క్ఫోర్స్ కమిటీ ఇదే..: చైర్మన్గా కలెక్టర్, కన్వీనర్గా ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (సీపీబీ), సభ్యులుగా నగర పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్, డీటీసీ, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, జిల్లాపరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, జిల్లా పౌర సరఫరాల అధికారి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, ఎస్ఈ ఈపీడీసీఎల్, జిల్లా పంచాయతీ అధికారితో కమిటీని ఏర్పాటు చేశారు. -
డిజిటల్ అరెస్ట్ ముఠా గుట్టురట్టు
అల్లిపురం: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును నగర సైబర్ క్రైం పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు, కూర్గ్, పశ్చిమ గోదావరి, అనంతపురం ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలివి. నిందితులంతా ఒక ముఠాగా ఏర్పడి టెలిగ్రామ్ చానల్ ద్వారా వివిధ వ్యక్తుల నుంచి కరెంట్ అకౌంట్లను సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా డిజిటల్ అరెస్ట్ పేరిట అమాయకులను భయభ్రాంతులకు గురిచేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సైబర్ క్రైం పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. టెక్నికల్ అనాలిసిస్ ద్వారా నిందితులు పెద్ద రుషికొండలోని ఒక ప్రైవేట్ హోటల్లో గదులు తీసుకొని అక్కడి నుంచే బ్యాంక్ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. శనివారం ఆ హోటల్పై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున డెబిట్ కార్డులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయడానికి సిద్ధం చేసుకున్న వివిధ సంస్థల రబ్బర్ స్టాంపులు, క్యూఆర్ కోడ్ స్కానర్లు, సిమ్ కార్డులు, ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఎన్.వినోద్కుమార్, పరసురామ సదానంద అలియాస్ పవన్, సలీమ్ కె.హెచ్, పాల్యం చంద్రశేఖర్, సేరు చంటి, కడలి సత్యవరపు లక్ష్మీ శ్రీనివాస్, ఓంకార్ నాథ్ ఉన్నారు. -
నేడే ‘మహిళా’ పోరు
విశాఖస్పోర్ట్స్: భారత్– శ్రీలంక మహిళా జట్ల మధ్య టీ–20 సిరీస్ సమరానికి తెరలేచింది. నగరంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకు ఫ్లడ్లైట్ల వెలుతురులో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పోరులో గెలిచి సిరీస్లో శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు సిరీస్ను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తుది జట్టులో కీలక మార్పులు చేస్తూ యువతకు అవకాశం కల్పించింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా, రిచా ఘోష్ వంటి స్టార్ ఆటగాళ్లతో భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. శ్రీలంక జట్టు ఈసారి తమ యువ స్పిన్నర్లనే నమ్ముకుంది. శనివారం మైదానంలో ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. ఆదివారం రాత్రి జరగనున్న ఈ మ్యాచ్ కోసం నగర క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
23 నుంచి ‘పీసా’ మహోత్సవాలు
మాట్లాడుతున్న కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: నగరంలో ఈనెల 23, 24 తేదీల్లో ప్రతిష్టాత్మక పీసా మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ వెల్లడించారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పోర్ట్ స్టేడియంలో జరిగే ఈ వేడుకలకు 10 రాష్ట్రాల గిరిజన ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్డులో 10కే రన్తో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన హస్తకళల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు నగరంలో గాలి నాణ్యత తగ్గడంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేస్తూ కాలుష్య నివారణకు కఠిన నిబంధనలు జారీ చేశారు. చెత్త తగులబెట్టడం, భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేయడం వంటి పనులకు పాల్పడితే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఫ్యాక్టరీల్లో పొగ నియంత్రణ, పాత వాహనాల తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారని, విశాఖను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. -
చుట్టమే.. దొంగ
గోపాలపట్నం: కొత్తపాలెంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దాదాపు 40 రోజుల పాటు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి.. 13 1/2 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన దొంగలను పట్టుకున్నారు. గోపాలపట్నం క్రైమ్ పోలీస్ స్టేషన్లో శనివారం జోన్–2 క్రైమ్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొత్తపాలెం, సంతోష్నగర్లో నివసిస్తున్న పెంటకోట చెల్లయ్యమ్మ(65) ఇంట్లో నవంబర్ 10న చోరీ జరిగింది. ఆమె తెల్లవారుజామున 3 గంటల సమయంలో పని మీద బయటకు వెళ్లిన విషయాన్ని గమనించి, దుండగులు ఇంట్లో చొరబడి బంగారాన్ని ఎత్తుకుపోయారు. బాధితురాలు చెల్లయ్యమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెస్ట్ సబ్ డివిజన్ సీఐ చంద్రమౌళి పర్యవేక్షణలో గోపాలపట్నం క్రైమ్ ఎస్ఐ జి.తేజ ఈశ్వరరావు, పెందుర్తి క్రైమ్ ఎస్ఐ సూరిబాబు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు. పాత నేరస్తులపై నిఘా పెట్టినా, తొలుత ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో బాధితురాలి ఇంటి పరిసరాలను పరిశీలించి, బంధువులు, పరిచయస్తులను విచారించారు. ఈ క్రమంలో ఫిర్యాదికి దూరపు బంధువైన పీలా లతపై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. గతంలో చెల్లయ్యమ్మకు, లత కుటుంబానికి ఆస్తి గొడవలు ఉన్నాయి. చెల్లయ్యమ్మ వద్ద బంగారం ఉందని గమనించిన లత, ఎలాగైనా దాన్ని కాజేయాలని పథకం వేసింది. ఈ క్రమంలో ఆర్.ఆర్.వి పురానికి చెందిన పెంటకోట బాలకృష్ణ, డొక్కర లిఖిత్ కుమార్లతో కలిసి చోరీకి పాల్పడింది. నిందితుల నుంచి బంగారాన్ని రికవరీ చేసి, ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలు, స్థానికుల సమాచారం ఎంతగానో దోహదపడ్డాయని ఏసీపీ తెలిపారు. ఇంటి విషయాలు బయటి వారికి తెలియకూడదని, ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇలాంటి నేరాలను అరికట్టవచ్చని సూచించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. -
ఏపీఎస్ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాల ప్రారంభం
అల్లిపురం: ద్వారకా బస్సు స్టేషన్లో ఏపీఎస్ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీస్ డోర్ డెలివరీ మాసోత్సవాలను విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. విజయగీత శనివారం ప్రారంభించారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు ఈ నెల 20 నుంచి జనవరి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రైవేట్ సంస్థల తరహాలోనే ఆర్టీసీ కూడా 2021 సెప్టెంబర్ నుంచి డోర్ డెలివరీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని వివరించారు. ఈ సదుపాయం గురించి వినియోగదారులకు విస్తృతంగా తెలియజేయడమే ఈ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. తక్కువ ధరలకే సులభంగా పార్సిళ్లను ఇంటి వద్దకే చేరవేస్తున్న ఈ సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా ప్రజారవాణా అధికారి బి. అప్పలనాయుడుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, డిపో మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇలాగైతే ఎలా పీల్చగలగాలి
విశాఖ సిటీ: విశాఖలో గాలి విషతుల్యంగా మారుతోంది. నగరంలో కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రమాదకర ధూళి కణాలు ఊపిరాడకుండా చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతూ గాలి నాణ్యత సూచీలు నమోదవుతున్నాయి. ప్రమాదకర కాలుష్యకారక నగరాల జాబితాలో విశాఖ చేరిపోయింది. సిటీ ఆఫ్ డెస్టినీని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ఇప్పుడిదే ఆందోళన కలిగిస్తోంది. విశాఖలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గత వారం రోజులుగా ఈ సూచీలు విశాఖవాసులను కలవరపెడుతున్నాయి. గత 24 గంటల్లో విశాఖలో ఏక్యూఐ 313–329 మధ్య నమోదైంది. పగటి పూట కంటే అర్ధరాత్రి సమయాల్లోనే ఎక్కువగా ఉంటుండడం గమనార్హం. పరిశ్రమలు, వాహనాలతో కాలుష్యం ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు, వాహనాల కారణంగా నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. ఇటీవల కాలంలో విశాఖలో భారీ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలతో పాటు ఐటీ సంస్థలు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో కాలుష్యం మరింత పెరుగుతోంది. వాస్తవానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2009లోనే విశాఖ నగరాన్ని దేశంలోనే అత్యంత తీవ్ర కాలుష్య కోరల్లో ఉన్న నగరంగా పేర్కొంది. కొత్తగా మరే పరిశ్రమకు ఈ నగరంలో అనుమతి ఇవ్వకూడదని కూడా హెచ్చరించింది. అయితే అభివృద్ధికి ఆటంకంగా మారుతుందన్న అభిప్రాయంతో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతూ మళ్లీ 2013లో కాలుష్య నగరాల జాబితా నుంచి విశాఖను తొలగించారు. దీంతో మళ్లీ విశాఖలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పరిశ్రమల రాకతో ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరుగుతున్నప్పటికీ.. అంతే స్థాయిలో కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి. కాలుష్య నివారణకు పరిశ్రమలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పర్యావరణ వేత్తలు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చలికాలంలోనే అధిక కాలుష్యం నగరానికి ఒకవైపు బంగాళాఖాతం ఉండగా.. మిగిలిన మూడు వైపులా తూర్పు కనుములు వ్యాపించి ఉన్నాయి. వీటి మధ్య సుమారు 265 కి.మీ విస్తీర్ణంలో నగరం విస్తరించి ఉంది. నగరానికి నైరుతి దిక్కున భారీ పరిశ్రమలు ఉండడంతో ఏడాదికి 8 నెలల పాటు అంటే మార్చి నుంచి అక్టోబర్ వరకు అవి వెలువరించే వాయు, ధూళి కాలుష్యాలు గాలివాటంతో నగరాన్ని తాకుతున్నాయి. సుమారు 300 నుంచి 500 మీటర్ల ఎత్తుగా ఉండే ఈ కొండలు ఈ కాలుష్య వాయువులకు అడ్డుగా నిలబడి, వెనక్కు నెట్టి వేస్తున్నాయి. ఇక శీతాకాలంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తక్కువ ఉష్ణోగ్రతలు, మంచు కారణంగా కాలుష్యభరిత వాయువులు, హానికర ధూళి పదార్థాలు వాతావరణంలో పైకి పోలేక భూమి మీదనే కేంద్రీకృతం అవుతున్నాయి. సాధారణంగా భూమి మీద వేడి గాలులు, ఆ పైన చల్ల గాలులు ఉంటాయి. ఇవి శీతాకాలంలో తారుమారు అవుతూ ఉంటాయి. దీంతో హానికర ధూళి పదార్థాలను ఉపరితల వాతావరణంలోకి వెళ్లడం లేదు. ఆందోళనకరంగా గాలి నాణ్యత ప్రస్తుతం గాలి కాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలి కాలుష్య రేణువులు క్యూబిక్ మీటరుకు 60 మైక్రో గ్రాములు మించితే ప్రమాదం. కానీ పీఎం 2.5 రేణువులు శనివారం సాయంత్రం 7 గంటలకు 386గా ఉంది. పీఎం 10 రేణువులు కూడా 436 మైక్రోగ్రాములుగా నమోదయ్యాయి. ఈ తరహా వాయు కాలుష్యం ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపుతోంది. ఊపరితిత్తుల ఇన్ఫెక్షన్, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. చిన్నారుల్లో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలుష్య నియంత్రణపై కూటమి ప్రభుత్వం సమీక్షలు నిర్వహించడం మినహా నివారణకు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఆందోళనకరంగా సూచీలు విశాఖలో గాలి నాణ్యత సూచీలు(ఏక్యూఐ) ఆందోళనకరంగా ఉన్నాయి. చలికాలంలో కాలుష్య మేఘాలు ఊపిరి సలవనివ్వకుండా చేస్తున్నాయి. గత వారం రోజులుగా ఢిల్లీతో పాటు ఏక్యూఐ 326 దాటుతోంది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఏక్యూఐ అత్యధికంగా 329గా నమోదైంది. అది శనివారం ఉదయం 8 గంటలకు 322, మధ్యాహ్నం 12 గంటలకు 313గా ఉంది. పగటి పూట కంటే రాత్రి సమయాల్లోనే కాలుష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎయిర్క్వాలిటీ ఇండెక్స్ 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తిగా, అదే ఏక్యూఐ 101 నుంచి 200 అయితే మోడరేట్గా, అంతకు మించి 201 నుంచి 300 అయితే పూర్, 301 నుంచి 400 వరకు అయితే వెరీ పూర్, 401 నుంచి 500 అయితే తీవ్ర ఆందోళనకర పరిస్థితిగా పేర్కొంటారు. అయితే విశాఖలో మాత్రం ప్రతి గంటకు గాలి నాణ్యత సూచీ పెరుగుతూ పోతోంది. సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఏక్యూఐ 290 దాటి అర్ధరాత్రికి 329కి చేరుకుంటోంది. అలాగే పార్టికులేట్ మేటర్(పీఎం) 10 రేణువులు ప్రమాదకర స్థాయిలో 436 చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. -
డ్రెడ్జింగ్ కార్పొరేషన్కు ఎండీ కావలెను!
సాక్షి, విశాఖపట్నం : అక్రమాల పుట్టగా మారిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ను గాడిలో పెట్టేందుకు మరోసారి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డీసీఐ కోసం కొత్త ఎండీ నియామకానికి సంస్థ చైర్మన్, విశాఖపట్నం పోర్టు చైర్మన్ డా.అంగముత్తు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. సీఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దుర్గేష్కుమార్ దూబే బదిలీ అయిన తర్వాత.. గతంలో పనిచేసిన వ్యక్తికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. సదరు అధికారి విద్యార్హతలకు సంబంధించిన నకిలీ ధృవపత్రాలతో అధికారం సంపాదించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన వ్యవహారంపై ‘సాక్షి’లో ‘డ్రెడ్జింగ్కు మళ్లీ నకిలీ బాస్.!’, ‘గోదావరి కోసం అంత తొందరేంటో.?’ శీర్షికలతో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై పోర్టు ఇన్చార్జ్ చైర్మన్ డా.అంగముత్తు విచారణ చేపట్టారు. సమగ్ర విచారణ తర్వాత ఎండీ పోస్టుకు సదరు అధికారి అనర్హులని గుర్తించి.. కొత్త ఎండీ నియామకం తప్పనిసరి అని భావించారు. దీనిపై బోర్డులో చర్చించిన అనంతరం తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. వచ్చే ఏడాది జనవరి 8 వరకూ దరఖాస్తులను ఆహ్వానించారు. జనవరి నెలాఖరు నాటికి డీసీఐకి కొత్త ఎండీ వచ్చే అవకాశం ఉంది. -
జీడీపీ వృద్ధిలో నిర్మాణ రంగం పాత్ర కీలకం
ఎంవీపీకాలనీ: దేశ జీడీపీ వృద్ధిలో నిర్మాణరంగం పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎంవీపీ కాలనీ గాదిరాజు ప్యాలెస్ వేదికగా క్రెడాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 11వ ప్రాపర్టీ ఎక్స్పోను ఆయన శుక్రవారం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజులతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శన ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ , రాష్ట్రాల వృద్ధిరేటు పెంపులో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు దశాబ్దాలుగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తోందని వివరించారు.వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించడమే లక్ష్యంగా క్రెడాయ్ వంటి సంస్థలు పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా క్రెడాయ్ విశాఖ చాప్టర్ చైర్మన్ వి. ధర్మేందర్, అధ్యక్షుడు ఇ. అశోక్కుమార్ మాట్లాడుతూ విశాఖలో ఆస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఎక్స్పో ఒక మంచి వేదిక అని పేర్కొన్నారు. ఎక్స్పో కన్వీనర్ గోవిందరాజు మాట్లాడుతూ నగరాభివృద్ధి, పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఇక్కడ అపార్ట్మెంట్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్లు , వాణిజ్య స్థలాలకు సంబంధించి మొత్తం 71 స్టాల్స్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రదర్శనలో ప్రత్యేక రాయితీలు, స్పాట్ బుక్కింగ్ సౌకర్యం, సులభతరమైన చెల్లింపు పద్ధతులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పట్టాభిరామ్, ఎస్బీఐ విశాఖ డీజీఎం రాహుల్ సాంకృత్య, క్రెడాయ్ కార్యదర్శి వి. శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ కమిషనర్కు ప్రతిష్టాత్మక అవార్డు
డీజీపీ హరీష్కుమార్ గుప్తా నుంచి అవార్డు అందుకుంటున్న సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చిఅల్లిపురం: నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ ప్రతిష్టాత్మక ‘ఏబీసీడీ’ (అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైం డిటెక్షన్) పురస్కారాన్ని అందుకున్నారు. అమరావతిలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఈ అవార్డును అందజేశారు. సంచలనం సృష్టించిన లోన్ యాప్ ఫ్రాడ్ కేసులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, 19 మంది అరెస్టు చేయడంలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా సీపీకి ఈ గౌరవం దక్కింది. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైమ్ సిబ్బందిని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం సత్కరించింది. సీపీ బాగ్చీతో పాటు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్లు కె. భవానీప్రసాద్, బీ.ఎం.డీ. ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ ఈ. మహేశ్వరరావు, కానిస్టేబుళ్లు టి. సన్యాసినాయుడు, బి. చంద్రశేఖర్లు డీజీపీ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. -
న్యాయ విశ్వవిద్యాలయాల
బలోపేతమే లక్ష్యంసబ్బవరం: భారతదేశంలోని న్యాయ విశ్వవిద్యాలయాలు, అమెరికన్ న్యాయ విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తామని హైదరాబాద్లోని యూఎస్ కౌన్సిల్ సిటిజన్ సర్వీసెస్ చీఫ్ ఆడమ్ హల్ స్పష్టం చేశారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సూర్యప్రకాశరావుతో సమావేశమైన ఆయన వర్సిటీలో అమలవుతున్న పాఠ్యాంశాల అభివృద్ధి, జరుగుతున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు. ఇరు దేశాల మధ్య విద్యా సంబంధిత మార్పిడి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆడమ్ హల్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ బోధన సిబ్బంది, సహాయక సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులుపాల్గొన్నారు.పాల్గొన్నారు. -
ఐఈఎస్లో అచ్యుత సాయికి 8వ ర్యాంక్
గోపాలపట్నం: యూపీఎస్సీ విడుదల చేసిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) ఫలితాల్లో విశాఖ ఎన్ఏడీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న దండు అచ్యుత సాయి రామ్ రెడ్డి ఆలిండియా 8వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. 2024లో 14వ ర్యాంక్ సాధించినప్పటికీ, రైల్వే విభాగంపై ఉన్న మక్కువతో ఆయన మళ్లీ పరీక్ష రాసి ఈ ఘనత సాధించారు. తన కోరిక నెరవేరడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ విజయాన్ని దివంగత తల్లికి అంకితమిస్తున్నట్లు సాయి రామ్ రెడ్డి తెలిపారు. ఆయన ప్రతిభను కుటుంబ సభ్యులు, సహచర ఉద్యోగులు అభినందించారు. -
కట్టిపడేస్తున్న కళారూపాలు
ఏయూక్యాంపస్: ఏయూ మైదానం ప్రస్తుతం గ్రామీణ కళా సౌరభాలతో విరాజిల్లుతోంది. అక్కడ జరుగుతున్న సరస్ డ్వాక్రా బజార్ నగరవాసులను అద్భుతమైన హస్తకళల లోకంలోకి తీసుకెళ్తోంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల గర్వకారణమైన ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలతో పాటు ధర్మవరం తోలుబొమ్మలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అంకుడు కర్రను ఆకర్షణీయమైన ఆకృతులుగా మలచి, వాటికి సహజసిద్ధమైన రంగులు అద్ది ప్రాణం పోస్తున్న ఏటికొప్పాక కళాకారుల నైపుణ్యం ప్రతి బొమ్మలోనూ ప్రతిబింబిస్తోంది. ఇక్కడి విగ్రహాలు, గృహాలంకరణ వస్తువులు కేవలం వస్తువులుగా కాకుండా మన సంస్కృతికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మరోవైపు ధర్మవరం కళాకారులు తోలుపై చిత్రించిన పురాణ గాథలు, విభిన్న కళాఖండాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. సంప్రదాయ కళకు కొంత ఆధునికతను జోడించి వీరు రూపొందించిన అలంకరణ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తోలుపై రంగురంగుల కలయికతో తీర్చిదిద్దిన గణపతి, గౌతమ బుద్ధుడు, రాధాకృష్ణుల చిత్రాలు వారి అకుంఠిత దీక్షకు, కళా ప్రతిభకు దర్పణం పడుతున్నాయి. రానున్న పండుగలకు బొమ్మల కొలువు తీర్చాలన్నా లేదా ఇంటిని కళాత్మకంగా అలంకరించుకోవాలన్నా ఈ ప్రదర్శన ఒక అద్భుత వేదికగా మారింది. కుటీర పరిశ్రమల ప్రాముఖ్యతను చాటిచెబుతూ.. గ్రామీణ హస్తకళలు నేటికీ ఎంత సజీవంగా ఉన్నాయో ఈ బజార్ నిరూపిస్తోంది. ఆకట్టుకుంటున్న హస్తకళలు -
ఐఐఎంవీలో ఇండియా ఫైనాన్స్ కాన్ఫరెన్స్
సదస్సులో పాల్గొన్న ఫైనాన్స్ రంగ నిపుణులు తగరపువలస: గంభీరంలోని ఐఐఎం విశాఖ వేదికగా జరుగుతున్న 14వ ఇండియా ఫైనాన్స్ కాన్ఫరెన్స్ రెండో రోజు కార్యక్రమాలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. ఐఐఎం అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా సంస్థల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సులో దేశవిదేశాలకు చెందిన పరిశోధకులు, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. మొత్తం 400 పరిశోధన పత్రాలను సమీక్షించగా.. ఫైనాన్స్, అకౌంటింగ్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి కీలక అంశాలపై 135 పత్రాలను ప్రదర్శనకు ఎంపిక చేశారు. ఎమోరీ, జార్జ్టౌన్, సెయింట్ లూయిస్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు తరుణ్ చోర్డియా, రీనా అగర్వాల్, బిదిషా చక్రబర్తి తమ ప్రసంగాల ద్వారా ఫైనాన్షియల్ మార్కెట్లలోని సరికొత్త పోకడలను వివరించారు. ఐఐఎంవీ డీన్ విజయభాస్కర్, సదస్సు కన్వీనర్ మోనికా దోచక్, కో కన్వీనర్ కావేరి కృష్ణన్, ఇండియా ఫైనాన్స్ అసోషియేషన్ వైస్ ప్రెసిడెంట్ శంకర్షన్ బసు పాల్గొన్నారు. -
పదవీ విరమణ చేసిన రోజునే పెన్షన్ ప్రయోజనాలు
బీచ్రోడ్డు: ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వెంటనే వారికి రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలను అందించాలనే దృఢ సంకల్పంతో ఉన్నామని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతిప్రియ స్పష్టం చేశారు. శుక్రవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన పెన్షన్ అదాలత్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నెల నుంచే కొన్ని విభాగాల ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పత్రాలను ఆన్లైన్ ద్వారా అందజేస్తామని, అలాగే ఆన్లైన్ దరఖాస్తు విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వీడియోను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పెన్షన్ అదాలత్లను నిర్వహిస్తున్నామని, డీడీవోల సమక్షంలో పెన్షనర్ల సమస్యలను నేరుగా విని తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు. పెన్షనర్లు తమ డాక్యుమెంటేషన్ను స్వయంగా ఆన్లైన్లో చేసుకునే సౌకర్యం కల్పించామని, ఆర్బీపీఎస్ ప్రక్రియ ద్వారా ఏజీ కార్యాలయానికి చేరిన పత్రాలను త్వరగా పరిశీలించి బెనిఫిట్స్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె పెన్షన్ గ్రీవెన్స్ రెడ్రస్సల్ పేజీని ప్రారంభించి, దీని ద్వారా పెన్షన్దారులు తమ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. అనంతరం ఖజానా శాఖ డైరెక్టర్ ఎస్.మోహనరావు మాట్లాడుతూ గతంలో పెన్షన్ ప్రయోజనాల మంజూరులో కొంత జాప్యం జరిగేదని, అయితే డిజిటలైజేషన్ వల్ల ఇప్పుడు పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. పెన్షన్ దారులు ఈ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
‘ద్రోణంరాజు’ ఓ రాజకీయ యూనివర్సిటీ
బీచ్రోడ్డు: ఉత్తరాంధ్ర టైగర్గా పేరుగాంచిన ద్రోణంరాజు సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వవిద్యాలయం వంటివారని, నేడు పదవుల్లో ఉన్న ఎంతోమంది ఆయన శిష్యులేనని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పేర్కొన్నారు. ద్రోణంరాజు సత్యనారాయణ 93వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ ఆధ్వర్యంలో సిరిపురంలోని జంక్షన్లోని ద్రోణంరాజు సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడారు. ద్రోణంరాజు కుమారుడు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా నిబద్ధత గల నాయకుడిగా ఎదిగారన్నారు. తండ్రి శ్రీనివాస్ అడుగుజాడల్లో శ్రీవత్సవ నడవడం అభినందనీయమన్నారు. అనంతరం ద్రోణంరాజు శ్రీవత్సవ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తన తాతగారు చేసిన కృషి, తన తండ్రి సంపాదించిన నిష్కళంకమైన పేరు తనకు స్ఫూర్తిదాయకమన్నారు. మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ మేయర్ హరి వెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు , తిప్పల దేవన్ రెడ్డి , పార్టీ నేతలు కోలా గురువులు, డాక్టర్ జహీర్ అహ్మద్, కొండా రాజీవ్ గాంధీ, కార్పొరేటర్లు బాణాల శ్రీనివాస్, చెన్నా జానకీరామ్, బిపిన్ కుమార్ జైన్, ముమ్మన దేముడుు, ఉరుకూటి చందు, కందుల నాగరాజు, మువ్వల లక్ష్మి,, ఆర్.వెంకటరావు, పల్లా దుర్గారావు, వుడా మాజీ చైర్మన్ రవి పాల్గొన్నారు. -
వైజ్ఞానిక ప్రదర్శనలతో మేధోసంపత్తి
తాటిచెట్లపాలెం: విద్యార్థులలో విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని, అవగాహనను పెంచడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు కీలకమని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎన్. ప్రేమకుమార్ అభిప్రాయపడ్డారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో రైల్వే న్యూకాలనీలోని జీవీఎంసీ హైస్కూల్ మరియు కేఎన్ఎం గర్ల్స్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రదర్శనలో జిల్లాలోని 11 మండలాల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం ఏడు సబ్ థీమ్ల కింద 7 ప్రాజెక్టులు, విద్యార్థుల వ్యక్తిగత విభాగం నుంచి రెండు, ఉపాధ్యాయుల వ్యక్తిగత విభాగం నుంచి రెండు చొప్పున.. ఒక్కో మండలం నుంచి 11 ప్రాజెక్టుల వంతున మొత్తం 121 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ పోటీలలో విద్యార్థుల విభాగం నుంచి ఎస్. చైతన్య, వి. సాత్విక్, ప్రసన్న, లావణ్య, బి. కుషాలిని, పి. లావణ్య, జి. విష్ణు, బి. రామచంద్రన్, ఎస్. సాయి, ఎస్. కృష్ణతేజ, బి. శ్రీనివాస్, కే. హర్షవర్ధన్, బి. తనూజ, పి.బి. శృతి, కే. యోగి, పి. మహేష్, బి. సంధాన, బి. లాస్య ప్రతిభ కనబరిచారు. అలాగే ఉపాధ్యాయ విభాగంలో బి. సీతారాం, డి. ప్రసన్నలక్ష్మి రూపొందించిన ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. కార్యక్రమంలో జీవీఎంసీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయిని ఎస్.వి. శేషుకుమారి, కేఎన్ఎం గర్ల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయిని డి. శాంతకుమారి, జిల్లా సైన్స్ అధికారి పి. రాజారావు, జిల్లా ఉప విద్యాశాఖాధికారి సోమేశ్వర్రావు, స్థానిక కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.కేఎన్ఎం బాలిక ఉన్నత పాఠశాలలో విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలు -
పట్టాభిషేకంపై గుర్రు
అతడిని మార్చాల్సిందే..! ● టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పట్టాభి నియామకంపై విమర్శలు ● వెంటనే మార్చాలంటూ చంద్రబాబుకు ఫిర్యాదులు ● సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టారంటూ ఆగ్రహం ● తమను సంప్రదించకుండా నియమించడంపై ఎమ్మెల్యేలు కిన్ను ● సహకరించే ప్రసక్తే లేదని బీసీ నేతల అల్టిమేటం సాక్షి, విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా చోడె పట్టాభిరామ్ నియామకం పార్టీలో చిచ్చు రేపుతోంది. ఏం అర్హత ఉందని పట్టాభికి అధ్యక్ష పదవి కట్టబెట్టారంటూ సీనియర్లు మండిపడుతున్నారు. బీసీలే పార్టీకి వెన్నెముక.. వారికే పార్టీలో పెద్దపీట వేస్తామంటూ ప్రతిసారి చెప్పే చంద్రబాబు, లోకేష్.. తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికే బాధ్యతలు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత సామాజికవర్గానికే తప్ప.. టీడీపీలో అణగారిన వర్గాలకు పదవులివ్వరా అంటూ క్యాడర్లోనూ అసహనం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఈ నియామకంపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పట్టాభి నియామకాన్ని మార్చకపోతే.. సహకరించే ప్రసక్తే లేదంటూ బీసీ నేతలు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. క్యాడర్లోనూ అసహనం కీలకమైన టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవి నుంచి బీసీ నేత గండి బాబ్జీని తప్పించి.. తమ సామాజికవర్గానికి చెందిన చోడే పట్టాభిరామ్కు బాధ్యతలు అప్పగించడంపై బీసీ నేతలంతా ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. పట్టాభిని మించి.. పార్టీకి సేవలందించిన వారు ఎంతో మంది ఉన్నా.. కేవలం సొంత సామాజికవర్గం అనే కారణంతో పదవిని కట్టబెట్టడం సరికాదంటున్నారు. గతంలో పార్టీ నగర కార్యదర్శిగా వ్యవహరించినా.. పట్టాభికి పార్టీని నడిపే అనుభవం లేదనీ.. అలాంటి వ్యక్తికి బాధ్యతలు ఇవ్వడం ఏవిధంగా సముచితమో పార్టీ అధిష్టానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో పోటీకి వెనక్కి? 2023లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ తొలుత పట్టాభిరామ్ పేరుని ప్రతిపాదించారు. ఓడిపోయే ఎన్నికల్లో డబ్బులు పెట్టి పోటీ చేయనంటూ అధిష్టానం ఆదేశాల్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా ఉంటూ కార్పొరేటర్గా పోటీచేయాలని చెప్పినా.. పట్టించుకోలేదు. దీంతో పట్టాభిరామ్పై జిల్లా సీనియర్ నాయకులకు సదాభిప్రాయం లేకుండా పోయింది. అయినా అలాంటి వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే చంద్రబాబుకి దీనిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పట్టాభిరామ్ నియామకంపై పెదవి విరుస్తున్నారు. తమను సంప్రదించకుండానే జిల్లా అధ్యక్షుడిని నియమించడమేంటని సన్నిహితుల వద్ద వాపోయారని సమాచారం. ఇలా ఎవరికీ తెలియకుండా.. కేడర్ అభిప్రాయాన్ని సేకరించకుండా.. పట్టాభిరామ్కు పట్టం కట్టడంపై జిల్లా పార్టీలో చిచ్చురేపుతోంది. వార్డు అధ్యక్షుల నియామకానికి పార్టీ ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాల్ని సేకరిస్తున్న అధిష్టానం.. జిల్లా అధ్యక్షుడి నియామకం విషయంలో ఎందుకు గోప్యతని ప్రదర్శించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని కూడా అడగకపోవడం శోచనీయమంటున్నారు. కేవలం సామాజికవర్గాన్ని దృష్టిలోపెట్టుకొని పట్టాభిరామ్కు బాధ్యతలు అప్పగించడం పూర్తిగా తప్పుడు నిర్ణయమనీ.. వెంటనే నియామకాన్ని రద్దు చేసి.. బీసీ అభ్యర్థికి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టాలన్న డిమాండ్ పార్టీలో మొదలైంది. దీనిపై అధిష్టానం స్పందించకపోతే జిల్లా అధ్యక్షుడికి సహకరించేది లేదని క్యాడర్ అల్టిమేటం జారీ చేయడంతో పచ్చపార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. -
భారత్–శ్రీలంక క్రీడాకారుల ప్రాక్టీస్
విశాఖ స్పోర్ట్స్: విశాఖ వేదికగా భారత్–శ్రీలంక మహిళా జట్ల మధ్య జరగనున్న ద్వైపాక్షిక టీ20 సిరీస్ సందడి మొదలైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ 21న, రెండో మ్యాచ్ 23న ఫ్లడ్లైట్ల వెలుతురులో జరగనున్నాయి. ఈ పోటీల కోసం ఇరుజట్లు గురువారం స్థానిక స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. శ్రీలంక మహిళా జట్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మైదానంలో కసరత్తులు చేయగా, అనంతరం భారత జట్టు సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఫ్లడ్లైట్ల వెలుతురులో ఫిట్నెస్తో పాటు ప్రాక్టీస్ నిర్వహించింది. శిక్షణ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు నోవాటెల్కు, శ్రీలంక ఆటగాళ్లు షెర్టాన్ హోటల్కు చేరుకున్నారు. అంతకుముందు ఇండియన్ టీం ఆంధ్రాయూనివర్సిటీని సందర్శించింది. అక్కడ విద్యార్థులతో కాసేపు గడిపింది. స్టేడియంలో ప్రాక్టీస్ -
ఏపీఈపీడీసీఎల్కు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు
విశాఖ సిటీ: వినియోగదారులకు మెరుగైన సేవలతో పాటు నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తున్న ఏపీఈపీడీసీఎల్కు ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి అవార్డు లభించింది. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) ఆధ్వర్యంలో ‘ఎంపవరింగ్ గ్రోత్, ప్రిజర్వింగ్ రూట్స్–ది పీఆర్ విజన్ ఫర్ 2047’ అనే నినాదంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లో 47వ అఖిల భారత పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్–2025ను మూడు రోజుల పాటు నిర్వహించారు. ఇందులో ఏపీఈపీడీసీఎల్ ప్రతిష్టాత్మక ‘భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జాతీయ అవార్డు’ ను సాధించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, రాష్ట్ర స్పీకర్ రీతూ ఖండూరీ భూషణ్, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమేష్ పోక్రియల్ నిశాంక్, పర్యావరణ–అటవీశాఖ మంత్రి శుభోద్ ఉనియల్, పీఆర్ఎస్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అజిత్ పాఠక్ల సమక్షంలో అవార్డును ప్రదానం చేశారు. ఏపీఈపీడీసీఎల్ తరఫున పీఆర్వో జి.ఎస్.ఎస్.ఎస్.వాసు ఈ అవార్డును అందుకుని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి పృథ్వీతేజ్కు అందజేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖల సహకారంతో ఈపీడీసీఎల్లో పలు రకాల పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పీవీటీజీ గిరిజన ఆవాసాలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ గిరిజన న్యాయ మహా అభియాన్ కార్యక్రమం ద్వారా విద్యుత్ను అందించినట్లు వెల్లడించారు. -
బీమా రంగంలో ఎఫ్డీఐ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
డాబాగార్డెన్స్: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎల్ఐసీ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకత తెలుపుతూ గురువారం డివిజనల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ డివిజన్ ఐసీఈయూ ప్రధాన కార్యదర్శి జి.వరప్రసాద్ మాట్లాడుతూ ప్రతిపాదిత బిల్లులోని లోపాలు, దాని ప్రభావాలను వివరించారు. ఈ బిల్లు అమలులోకి వస్తే దేశ ప్రజలు కష్టపడి దాచుకున్న పొదుపు నిధులు విదేశీ మూలధనానికి బదిలీ అయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో క్లాస్–1 ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్యంబాబు, గణపతిరామ్, ఫణీంద్ర, తిరుమలరావు, బీటీ ప్రసాద్ తదితరులు పాల్గొని తమ గళాన్ని వినిపించారు. వీరికి బ్యాంక్ యూనియన్ నాయకురాలు, ఎన్సీబీఈ సెక్రటరీ జనరల్ సుష్మ సంఘీభావం ప్రకటించారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు, అధిక సంఖ్యలో ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినదించారు. -
పోర్టులో అమెరికా కాన్సులేట్ జనరల్ పర్యటన
సాక్షి, విశాఖపట్నం : హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ గురువారం విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ)ని గురువారం సందర్శించారు. పోర్టు డిప్యూటీ చైర్మన్ దుర్గేష్కుమార్ దూబే, పోర్టు విభాగాధిపతులు, సీనియర్ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోర్టులో ఆధునిక మౌలికవసతులు, సముద్ర వాణిజ్యంలో విశాఖపట్నం పోర్టు పోషిస్తున్న కీలక పాత్ర వంటి అంశాలను పోర్టు అధికారులు కాన్సులేట్ జనరల్కు వివరించారు. సరుకు నిర్వహణా సామర్థ్యం, పోర్టులో కొనసాగుతున్న ఆధునికీకరణ, యాంత్రీకరణ పనులు, పోర్టు కార్యనిర్వహణా సామర్థ్యాలను మెరుగుపరచడం, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే కవర్డ్ స్టోరేజ్ సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను ఆమె పరిశీలించారు. పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించి, కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో చేపట్టిన సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు వంటి గ్రీన్ పోర్టు కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఏయూతో అనుబంధం మరింత బలోపేతం కావాలి మద్దిలపాలెం: ఆంధ్రవిశ్వవిద్యాలయంతో అమెరికన్ కాన్సులేట్ అనుబంధం మరింత బలోపేతం కావాలని హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఆమె ఏయూని సందర్శించి వీసీ ఆచార్య రాజశేఖర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏయూలో నెలకొల్పిన అమెరికన్ కార్నర్ చేపట్టిన కార్యక్రమాలు ఎంతో సంతృప్తిని ఇచ్చాయన్నారు. వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ ఏయూ స్వయంగా కొన్ని కార్యక్రమాలను అమెరికన్ కార్నర్తో కలిసి నిర్వహించడానికి సిద్ధంగా ఉందన్నారు. నోబెల్ గ్రహీతలను ఏయూకు ఆహ్వానిస్తామని, దీనికి సహకారం అందించాలన్నారు. ఫుల్ బ్రైట్ స్కాలర్స్ను కొంత కాలం ఏయూలో ఉండే విధంగా ఆహ్వానిస్తామన్నారు. వీరిని ఏయూతో అనుసంధానం చేయాలన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, అమెరికన్ కార్నర్ సమన్వయకర్త ఆచార్య పాల్ డగ్లస్ పాల్గొన్నారు. -
కళాభారతిలో ముగిసిన బహుభాషా నాటకోత్సవాలు
మద్దిలపాలెం: కళాభారతి ప్రాంగణంలో రసజ్ఞ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన 10వ బహుభాషా నాటకోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన ‘ధన్యోస్మి’, ‘ముళ్లతీగలు’ నాటికలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర సాంస్కృతిక శాఖల సహకారంతో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో డాక్టర్ వేమలి త్రినాథరావు, హేమా వెంకటేశ్వరిల దర్శకత్వంలో రసజ్ఞ సభ్యులు, పీవీఆర్ మూర్తి దర్శకత్వంలో నవరస థియేటర్ ఆర్ట్స్ కళాకారులు తమ నటనతో మెప్పించారు. నాటక ప్రదర్శనకు ముందు రాజేశ్వరి బృందం నిర్వహించిన జానపద, కోలాట నృత్యాలు అలరించాయి. ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.నరసింహరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కళాకారులను ఘనంగా సత్కరించారు. -
సైకిల్ ట్రాక్ల నిర్మాణానికి జీవీఎంసీ కమిషనర్ ఆదేశం
ఆరిలోవ: నగర ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం ముడసర్లోవతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ముడసర్లోవ పార్కు పరిసరాలు, సాగర్ నగర్ సమీపంలోని రాడిసన్ బ్లూ ప్రాంతాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపారు. ముడసర్లోవ పార్కు చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర ఆకర్షణీయమైన సైకిల్ ట్రాక్ నిర్మించాలని అలాగే రాడిసన్ బ్లూ హోటల్ నుంచి సాగర్ నగర్ బీచ్ వరకు మరో ట్రాక్ ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంచనాలను వెంటనే సిద్ధం చేయాలని ప్రధాన ఇంజనీర్ సత్యనారాయణ రాజును ఆదేశించారు. సైకిల్ ట్రాక్ లతో పాటు బీచ్ రోడ్డులోని టీయూ 142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం సమీపంలో సుమారు 75 నుంచి 100 మీటర్ల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని కమిషనర్ ఆదేశించారు. అనంతరం మధురవాడ ప్రాంతంలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని పరిశీలించారు. జీవీఎంసీ పర్యవేక్షక ఇంజినీర్ ఏడుకొండలు ఏపీయూఐఎల్ రీజినల్ హెడ్ చేతన్, సహాయక ఇంజినీర్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మత్స్యకారుల విడుదలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
మహారాణిపేట: బంగ్లాదేశ్ జైలులో మగ్గుతున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులను తక్షణం విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ నేత వాసుపల్లి జానకీరామ్ డిమాండ్ చేశారు. గురువారం విశాఖ ఫిషింగ్ హార్బర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 20న వేటకి వెళ్లి పొరపాటున సరిహద్దు దాటిన 9 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ బంధించిందని తెలిపారు. గతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జైళ్లలో చిక్కుకున్న వారిని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చొరవ తీసుకుని విడిపించిందని, బాధితులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారుల విడుదల కోసం కనీసం లాయర్ను కూడా నియమించలేకపోయిందని విమర్శించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జానకీరామ్ ఆరోపించారు. బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, మత్స్యకారుల క్షేమం కోసం తాను స్వయంగా అక్కడికి వెళ్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మత్స్యకారుల విడుదలకు చర్యలు చేపట్టాలని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంలో చొరవ చూపాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో మత్స్యకారులు గుంటూ దానయ్య, అర్జీల్లా హరి, పుక్కల్లా ప్రకాష్ పాల్గొన్నారు. -
29 నుంచి రాష్ట్ర స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్
మురళీనగర్: కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 29 నుంచి 31 వరకు రాష్ట్రస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్నకుమార్ తెలిపారు. గురువారం కళాశాలలో ఈ క్రీడల గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల నుంచి సుమారు 1000 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. బాలబాలికలకు అథ్లెటిక్స్, వాలీబాల్, షటిల్ బాడ్మింటన్, చెస్ వంటి వివిధ క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోవాలి
డాబాగార్డెన్స్: వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. జగదాంబ జంక్షన్లో సీపీఐ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన 10 వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం జీవో 500 జారీ చేయడం అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు దెబ్బతినడమే కాకుండా పేదలకు ఉచిత వైద్యం దూరమవుతుందని విమర్శించారు. దాదాపు 60 ఏళ్ల పాటు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం అన్యాయమని, యాజమాన్య కోటా సీట్ల అమ్మకం వల్ల పేదలకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 17 కళాశాలలను ఏర్పాటు చేస్తే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని పీపీపీ పరిధిలోకి తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానం వల్ల ప్రభుత్వ భూములు, భవనాలు, వసతులు, కాలేజీల ఆస్పత్రులు దాదాపు 60 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయన్నారు. మొత్తం 1000 సీట్లు త్వరగా అందుబాటులోకి వస్తాయని, అందులో 76 శాతం సీట్లు పేదలకు లభిస్తాయని ప్రభుత్వం చెబుతున్నా 25 శాతం యాజమాన్య కోటా సీట్లను (371 సీట్లు) ఒక్కొక్కటి రూ.50 నుంచి రూ.60 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందన్నారు. తక్షణమే జీవోను ఉపసంహరించి, వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రహ్మన్, కె.సత్యనారాయణ, పి.చంద్రశేఖర్, ఎం.పైడిరాజు, సంత్యాంజనేయ, మన్మధరావు, శ్రీనివాసరావు, క్షేత్రపాల్, బేగం, వనజాక్షి, నాగభూషణం, నాగరాజు, అచ్యుతరావు, రాంబాబు, సత్యనారాయణ, సూర్య పద్మ, జయ, అప్పన్న, ఆదినారాయణ, ఈశ్వరరావు, దేముడమ్మ, పుష్పలత, లక్ష్మణరావు, కాసుబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఆరిలోవ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూనియన్ ఆఫ్ టీచర్స్ ఫెడరేషన్(యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గురువారం డీఈవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలని, ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని, విద్యా హక్కు చట్టంలోని 23(1) సెక్షన్కు తగిన సవరణలు చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు అనకాపల్లి పైడిరాజు, అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు మాట్లాడుతూ టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను మినహాయించడానికి సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. దీని కోసం పార్టమెంట్లో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. పదో తరగతికి సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్లో రెండో శనివారం, ఆదివారం, పండగ రోజులను సెలవు తేదీలుగా ప్రకటించాలన్నారు. యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి టి.ఆర్.అంబేడ్కర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర పనులను రద్దు చేసి, స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధన చేసే అవకాశం కల్పించాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యాచరణలో ప్రతి రోజు పరీక్ష పెట్టే విధానం రద్దు చేయాలన్నారు. సింగిల్ టీచర్ల సెలవులకు ప్రాధాన్యత ఇవ్వాలని, జీవీఎంసీలో అర్హులైన ఎస్జీటీలకు తెలుగు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా పదోన్నతులు కల్పిచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్లో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం డీఈవో ఎన్.ప్రేమకుమార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ కోశాధికారి రాంబాబు, విజయకుమారి, రామకృష్ణ, మహ్మద్ రిజ్వాన్, రాజునాయుడు, సంతోష్తో పాటు జిల్లాలో పలు మండలాలు యూనియన్ అధ్యక్షులు పాల్గొన్నారు. -
చలిపులి పంజా
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాదిన మొదలైన చలి తీవ్రత.. రాష్ట్రాన్ని గజగజా వణికిస్తోంది. పది రోజుల నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. జనవరి రెండో వారం వరకూ ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనా. వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం.. దీనికి తోడు శీతల గాలులు వీస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. అధిక పీడన ప్రభావంతో ఉత్తర భారతం నుంచి బలమైన గాలులు రాష్ట్రం వైపు వీస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువగా పడిపోయినప్పుడు దానిని ‘అతి శీతల గాలులు’ (కోల్డ్వేవ్)గా ప్రకటిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పలు చోట్ల కోల్డ్ వేవ్స్ కొనసాగుతున్నాయి. ఇన్వర్షన్ లేయర్తో ప్రమాదం..! సాధారణంగా భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుంటాయి. కానీ.. ఉపరితలంలో వాతావరణం పూర్తిగా చల్లగా ఉండటంతో ఉష్ణోగ్రతలు పైకి వెళ్లే కొద్దీ పెరుగుతున్నాయి. దీన్నే ఇన్వర్షన్ లేయర్ అని పిలుస్తుంటారు. గ్రీన్హౌస్ ఎఫెక్ట్ మాదిరిగా.. కింది నుంచి వెళ్లే నీటి ఆవిరి, కాలుష్యం, దుమ్ము ధూళి కణాలన్నీ కలిసి ఇన్వర్షన్ లేయర్ కారణంగా మధ్యలోనే ఆగిపోయి పొగమంచులా ఏర్పడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా వాతావరణం అత్యంత ప్రమాదకరమని వాతావరణ నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ఎందుకు చలి పెరుగుతోంది.? భూతాపం పెరగడం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతిని, చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. ఉష్ణోగ్రతల పతనానికి ఉత్తర దిశ నుంచి వీస్తున్న చల్లని గాలులు కూడా కారణమని చెబుతున్నారు. హిమాలయ ప్రాంతాల్లో ఏర్పడిన మంచు తుపాన్లు, వాయు పీడన మార్పులు దక్షిణ భారతదేశం వైపు చల్లని గాలులను వస్తున్నాయి. అదే సమయంలో ఆకాశం స్పష్టంగా ఉండటం, మేఘావరణం లేకపోవడం వల్ల రాత్రివేళ భూమి నుంచి వేడి త్వరగా బయటకు వెళ్లిపోతోంది. దీని ఫలితంగా చలి మరింత పెరుగుతోంది. పొగమంచు మరో సమస్య పొగమంచు కూడా విపరీతంగా కురుస్తోంది. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటోంది. పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో వాహనదారులు, ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు కారణంగా పగటి వేళల్లో ఉదయం 9 గంటల వరకూ లైట్లు వేసుకొని ప్రయాణం చెయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సైబీరియా గాలులూ ఓ కారణమే..! అధిక పీడన ప్రాంతాల నుంచి అల్పపీడన ప్రాంతాల వైపు వేగంగా, భారీగా చల్లని గాలులు కదలడాన్ని ‘కోల్డ్ సర్జ్’ అని పిలుస్తారు. ప్రస్తుత పరిస్థితులకు ఇది కూడా ఒక కారణంగా మారింది. ముఖ్యంగా.. సైబీరియా, మంగోలియా ప్రాంతాల నుంచి ఇటువైపు గాలులు వస్తున్నాయి. ఇవి గంటకు 25 నుంచి 60 కిమీ వేగంతో వస్తున్నాయి. ఇవి ప్రవేశించే ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే దిగువకు పడిపోతాయి. దీనివల్లే చల్లని గాలులకు పొగమంచు తోడవుతోంది. జనవరి వరకూ ఈ పరిస్థితులు కొనసాగనున్నాయి. ఈ తరహా చలి తీవ్రత అనారోగ్యాలకు కారణమవుతుంది. రాత్రి, తెల్లవారుజామున బయటకు వెళ్లేవారు గాలిని తట్టుకునే దుస్తులు ధరించాలి. వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. – ప్రొ.భానుకుమార్, వాతావరణ నిపుణుడు -
సిరులతల్లీ.. ప్రణామం
డాబాగార్డెన్స్: బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం మార్గశిర నాలుగో గురువారం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు బుధవారం అర్ధరాత్రి నుంచే దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. వేకువజామున అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి, స్వర్ణాభరణాలతో విశేషంగా అలంకరించారు. అనంతరం వెండి కవచాల అలంకారంతో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మార్గశిర ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకలను ఆలయ ఈవో కె. శోభారాణి, ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఉత్సవాల సందర్భంగా టౌన్ కొత్తరోడ్డు వద్ద సుమారు 20 వేల మందికి మహా అన్నదానం నిర్వహించారు. శుక్రవారంతో మార్గశిర ఉత్సవాలు ముగియనున్నాయి. క్యూలైన్లలో భక్తులు : అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. టౌన్కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయం నుంచి క్యూలైన్లను ప్రారంభించగా, రీడింగ్ రూమ్ వద్ద ధర్మదర్శనంతో పాటు రూ.20, రూ.100, రూ.200 టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచారు. అలాగే సీతారామస్వామి ఆలయం వైపు నుంచి వీఐపీలు, వృద్ధులు, దివ్యాంగులకు రూ.500 టికెట్లు కలిగిన వారికి ప్రత్యేక దర్శన మార్గాలను కేటాయించారు. దర్శనం అనంతరం భక్తులు బయటకు వచ్చే దారిలో ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఘోషాసుపత్రి, రీడింగ్ రూమ్ ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్లు, మంచినీటి వసతి కల్పించారు. ఆలయ సమీపంలోనే పోలీస్ అవుట్పోస్ట్, వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచారు. టౌన్కొత్తరోడ్డు, ఘోషాసుపత్రి ప్రాంతాల్లో చెప్పుల స్టాండ్లు ఏర్పాటు చేయగా, పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేస్తున్నాయి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. క్యూలైన్లో భక్తులు -
రూ.4 కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు స్కెచ్
కొమ్మాది: సాగర్నగర్ సమీపంలోని గుడ్లవానిపాలెం వద్ద బీచ్ రోడ్డును ఆనుకుని ఉన్న సుమారు రూ.4 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు జరిగిన ప్రయత్నాన్ని రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇక్కడ గతంలో శిథిలావస్థకు చేరుకున్న తుపాను రక్షిత భవనం ఉండేది. ప్రమాదకరంగా ఉండటంతో జీవీఎంసీ అధికారులు ఇటీవల ఆ భవనాన్ని పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి ఈ స్థలం ఖాళీగా ఉండటంతో టీడీపీ వార్డు ప్రధాన నాయకుడి కన్ను దీనిపై పడింది. గ్రామస్తుల సహకారంతో ఈ ఖాళీ స్థలంలో చకచక పునాదులు వేసి ఆక్రమించేందుకు సిద్ధమయ్యాడు. నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో.. స్థానికులు కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం సాయంత్రం రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఆ స్థలం ప్రభుత్వానిదేనని, ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారించుకున్నాక, అక్కడ నిర్మించిన బేస్మెంట్ను వెంటనే తొలగించారు. ఎవరైనా మళ్లీ ఈ స్థలంలో నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. త్వరలోనే ఇక్కడ ప్రభుత్వ భూమిగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. -
కాలుష్య నివారణకు చర్యలు
కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: నగరంలో కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. అమరావతిలోని సచివాలయం ఐదో బ్లాక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఐదో కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. విశాఖలో కాలుష్య స్థాయిలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయని రాష్ట్ర ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. పర్యావరణ విధానాలు, చట్టాలు, నిబంధనలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. కాలుష్య కారకాలను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం : సంక్రాంతి పండగ వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆయా మార్గాల్లో వయా దువ్వాడ మీదుగా పలు స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్కుమార్ తెలిపారు. ● సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్(07288) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 9, 11వ తేదీల్లో రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07289) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 10, 12వ తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి అదేరోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ● సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్(07290) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 10, 12, 16, 18వ తేదీల్లో రాత్రి 7గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07291) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 11, 13, 17, 19వ తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి అదేరోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ● సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్(07292) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 17వ తేదీన రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07293) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 18న మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి అదే రోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ● వికారాబాద్–శ్రీకాకుళం రోడ్(07294) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 13న సాయంత్రం 5.15 గంటలకు వికారాబాద్లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07295) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 14న మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి అదేరోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
స్టీల్ప్లాంట్ ఇన్చార్జి సీఎండీకి అభినందనలు
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ ఇన్చార్జి సీఎండీగా నియమితులైన సెయిల్ డైరెక్టర్ మనీష్ రాజ్ గుప్తాను ఉక్కు అధికారుల సంఘం (సీ) ప్రధాన కార్యదర్శి కె.వి.డి.ప్రసాద్, సెఫీ చైర్మన్ నరేంద్ర కుమార్ బంచార్, వైస్ చైర్మన్ నరేంద్ర సింగ్లు అభినందించారు. బుధవారం వారు న్యూఢిల్లీలోని సెయిల్ కార్యాలయంలో మనీష్ గుప్తాను కలిసి స్టీల్ప్లాంట్ గురించి వివరించారు. గత కొన్నేళ్లుగా స్టీల్ప్లాంట్ యంత్రాలను, ఉద్యోగులను అలక్ష్యం చేశారని, వాటిని చక్కదిద్దాలని కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ కలిసి పనిచేద్దామని.. తద్వారా విశాఖ ఉక్కుకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
భారీగా ఎస్ఐల బదిలీ
పోలీసుల కళ్లుగప్పి.. ఎట్టకేలకు చిక్కి!అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా భారీగా ఎస్ఐల బదిలీలు చేపట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 118 మంది ఎస్ఐలకు స్థానచలనం కలిగించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు పరిపాలన సౌలభ్యం నిమిత్తం నగరంలో పలు పోలీస్ స్టేషన్లు, సీసీఆర్బీ, సైబర్ క్రైం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మంగళవారం రాత్రి 102 మంది ఎస్ఐలను, బుధవారం రాత్రి మరో 16 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలికంగా ఒకే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నవారు, సీపీకే ఫిర్యాదులు వచ్చినవారికి స్థానం కలిగించినట్లు సమాచారం. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు. కాగా రెండు రోజుల క్రితం త్రీటౌన్ క్రైం ఎస్ఐ సల్మాన్ బేగ్, టూటౌన్ క్రైం ఎస్ఐ సునీల్, పీఎం పాలెం ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్, ఫోర్తు టౌన్ క్రైం ఎస్ఐ విజయ్కుమార్, భీమిలీ ఎస్ఐ భరత్ కుమార్రాజులను రేంజ్కి అటాచ్ చేశారు. -
హమ్మయ్యా.. సక్సేనా గండం గడిచింది
సాక్షి, విశాఖపట్నం: గత రెండు నెలలుగా విశాఖ స్టీల్ప్లాంట్ ఉద్యోగుల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇన్చార్జి సీఎండీ ఎ.కె.సక్సేనా పదవీకాలం ముగియడంతో, ఆయన స్థానంలో సెయిల్ డైరెక్టర్ను నియమిస్తూ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం స్టీల్ప్లాంట్ ఉద్యోగులు, సిబ్బంది తలపై పాలుపోసినంత పని చేసింది. సక్సేనా పాలన.. అంతా ఆవేదన గత ఏడాది సెప్టెంబర్లో స్టీల్ప్లాంట్ ఉత్పత్తి సంక్షోభంలో ఉన్న సమయంలో.. అప్పటి సీఎండీ అతుల్ భట్ను సెలవుపై పంపి.. మోయిల్ ఎండీగా ఉన్న ఎ.కె.సక్సేనాకు స్టీల్ప్లాంట్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే, సక్సేనా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన పాలన ఉద్యోగులకు ఒక పీడకలలా మారిందన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు ఉద్యోగులను, కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. దేశంలో మరే పరిశ్రమలోనూ లేని విధంగా, కేవలం ఉత్పత్తి ఆధారంగానే జీతాలు చెల్లిస్తామంటూ సక్సేనా జారీ చేసిన చట్టవిరుద్ధమైన ఉత్తర్వులు కార్మిక లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ఘనత ఆయనకే దక్కుతుందని కార్మిక సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఉద్యోగులకు అందాల్సిన హెచ్ఆర్ఏను పూర్తిగా నిలిపివేశారు. దీనికి తోడు క్వార్టర్ల విద్యుత్ చార్జీలను యూనిట్కు రూ.1.50 నుంచి ఏకంగా రూ. 8కి పెంచేసి, వేతన సవరణ లేక ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల నడ్డి విరిచారు. జీతాలను నెలలో ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి కల్పించారు. ఇచ్చే అరకొర జీతాన్ని కూడా 50 శాతం, 60 టశాతం, 75 శాతం అంటూ విడతల వారీగా చెల్లిస్తూ ఉద్యోగులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశారు. మరోవైపు ప్రభుత్వ విధానామా? లేక నిర్దేశమా? ఏదైనా పొదుపు, సంస్కరణల సాకుతో సుమారు 5 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. వీఆర్ఎస్ పేరుతో 1,500 మందిని ఇంటికి పంపారు. భయంగుప్పిట్లో అధికారులు చిన్నపాటి మానవ, సాంకేతిక తప్పిదాలకు కూడా ఉన్నతాధికారులను సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం వంటి చర్యలతో ప్లాంట్లో భయానక వాతావరణం సృష్టించారు. ఇవన్నీ నిత్యకృత్యంగా మారడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళనలు అధికారుల్లో నెలకొన్నాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేక పలువురు ఉన్నతాధికారులు రాజీనామాలు చేశారు. మరోవైపు, కార్మిక సంఘాల హక్కులను హరిస్తూ, ఆందోళనలు, ధర్నాలపై ఆంక్షలు విధించి ఉక్కుపాదం మోపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలా ఆయన స్టీల్ప్లాంట్లో నియంతగా వ్యవహరించారనే విమర్శలు వినిపించాయి. స్టీల్ప్లాంట్లో సక్సేనా పాలనలో బాధపడని ఉద్యోగి లేరు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు వెళ్లిపోతారా అని ఉద్యోగులు ఎదురుచూపులు చూడటం మొదలు పెట్టారు. సక్సేనాకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ మద్దతు ఉందన్న ప్రచారంతో, ఆయనకే మళ్లీ ఎక్స్టెన్షన్ లభిస్తుందేమోనని రెండు నెలలుగా ఆందోళన చెందారు. ఈ పరిస్థితుల్లో సెయిల్ డైరెక్టర్ను కొత్త ఇన్చార్జి సీఎండీగా నియమించడంతో ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాలన గాడిలో పడుతుందని, తమ కష్టాలు తీరుతాయని కార్మికులు ఆశిస్తున్నారు. -
పోలీసుల కళ్లుగప్పి.. ఎట్టకేలకు చిక్కి!
పెదగంట్యాడ: బెయిల్పై బయటకు వచ్చి.. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు బుధవారం అరెస్ట్ చేశారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. పెదగంట్యాడకు చెందిన సూర్య చలపతిరావు గతంలో తాను నేవీ ఆఫీసర్నని నమ్మబలికి, నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి మోసగించాడు. బాధితుల ఫిర్యాదుతో అప్పట్లో న్యూపోర్టు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం బెయిల్పై విడుదలైన నిందితుడు, కోర్టు విచారణకు హాజరుకాకుండా పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో గాజువాక 8వ అదనపు చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ సదరు నిందితుడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన న్యూపోర్టు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు హైదరాబాద్లో ఉన్నట్లు అందిన సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. -
రక్షణగిరిలో నవదిన ప్రార్థనలు
కంచరపాలెం: జ్ఞానాపురంలోని పునీత పేతురు చర్చి ఫాదర్ రెవరెండ్ జొన్నాడ జాన్ప్రకాష్, పారిస్ పాస్టిల్ కౌనిల్స్ (పీపీసీ) సంయుక్త ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సోమవారం నవదిన ప్రార్థనలు జరిగాయి. విశాఖ ఆర్చి బిషప్ ఉడుముల బాల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 4 గంటలకు కొవ్వొత్తులతో జ్ఞానాపురం వీధుల్లో ప్రదక్షిణలు చేశారు. అనంతరం బాబూ కాలనీ, జేఎన్ఎన్ఆర్యూఎం కాలనీల్లో మహిళలు కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహించారు. క్రీస్తు రాక కోసం ప్రజలు భక్తిశ్రద్ధలతో మెలగాలని ఫాదర్లు తెలిపారు. నవ దినాలు జరిగే దీపారాధనల్లో అన్ని గ్రామాల భక్తులు పాల్గొనాలని కోరారు. ప్రసంగాల అనంతరం దివ్యబలి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్, అలిండియా క్యాథలిక్ యూనియన్ అధ్యక్షుడు బూర శేషుబాబు, పీపీసీ అధ్యక్షుడు రాజేష్, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ చేరుకున్న మహిళా క్రికెటర్లు
భారత్, శ్రీలంక మహిళా క్రికెట్ జట్లు బుధవారం విశాఖ చేరుకున్నాయి. ఈ నెల 21, 23 తేదీల్లో ఇక్కడ జరగనున్న టీ–20 మ్యాచ్ల్లో తలపడేందుకు ఇరు జట్ల క్రీడాకారిణులు నగరానికి విచ్చేశారు. వీరికి విశాఖ విమానాశ్రయంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ మ్యాచ్లు పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. విమానాశ్రయం నుంచి ఆటగాళ్లు రోడ్డు మార్గంలో ప్రత్యేక బస్సుల్లో తమకు కేటాయించిన హోటళ్లకు చేరుకున్నారు. – గోపాలపట్నం -
దేశ ప్రగతిలో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకం
గాజువాక: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులు, సేవలను ప్రభుత్వ సంస్థలు వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు రెండు రోజుల సీపీఎస్ఈ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కమ్ ఎగ్జిబిషన్ 2025 బుధవారం ప్రారంభమైంది. ఎంఎస్ఎంఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బీహెచ్ఈఎల్ ఈడీ గుమ్మళ్ల సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో మొత్తం 20 ప్రభుత్వ రంగ సంస్థల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీహెచ్ఈఎల్ ఈడీ మాట్లాడుతూ.. నాణ్యమైన ఉత్పత్తులను, సరసమైన ధరలకు, సకాలంలో సరఫరా చేస్తే స్థానిక పరిశ్రమలకు ఆర్డర్లు నిరంతరం లభిస్తాయని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ పాలసీని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా జెమ్ పోర్టల్లో సభ్యులుగా చేరితే, దేశవ్యాప్తంగా ఏ పరిశ్రమకై నా తమ ఉత్పత్తులను సరఫరా చేసేందుకు ఆన్లైన్లో కోట్ చేయవచ్చని వివరించారు. ఎంఎస్ఎంఈ జేడీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకమని కొనియాడారు. ప్రభుత్వ రంగ సంస్థలకు, చిన్న తరహా పరిశ్రమలకు మధ్య ఎంఎస్ఎంఈ శాఖ అనుసంధానకర్తగా వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. పీఎస్యూలు తమకు కావాల్సిన విడిభాగాల్లో ఏటా 20 శాతం ఆర్డర్లను తప్పనిసరిగా చిన్న తరహా పరిశ్రమలకే ఇవ్వాలని, దీని అమలు కోసం కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గతంలో పీఎస్యూలను సందర్శించే అవకాశం స్థానిక పారిశ్రామికవేత్తలకు ఉండేదని, దీని వల్ల ఏ సంస్థకు ఎటువంటి ఉత్పత్తులు అవసరమో తెలిసేదని గుర్తుచేశారు. మళ్లీ అటువంటి అవకాశాన్ని కల్పిస్తే ప్రభుత్వ సంస్థలకు కావాల్సిన విడి భాగాలను నాణ్యతతో అందించగలమని కోరారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆదిశేషులు మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపనకు, అభివృద్ధికి ప్రభుత్వం అనేక రకాల సబ్సిడీలను అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో వాసీవా అధ్యక్షుడు పాండురంగ ప్రసాద్, లఘు ఉద్యోగ్ భారత్ కార్యదర్శి ఎ.కృష్ణ బాలాజీ, వివిధ సంస్థల ప్రతినిధులు సత్య సర్వశుద్ధి, వై.సాంబశివరావు, ఎన్.మధుసూదన రెడ్డి, శివరామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సిరులతల్లి సన్నిధిలో నేడు సహస్రఘటాభిషేకం
డాబాగార్డెన్స్: బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల సందర్భంగా చివరి గురువారం పూజలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి సహస్రఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఈవో శోభారాణి తెలిపారు. ఈ కారణంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనాలు నిలిపివేస్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే పంచామృతాభిషేక సేవను కూడా రద్దు చేశారు. రాత్రి 7 గంటల తర్వాత తిరిగి దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం టౌన్ కొత్తరోడ్డులోని జగన్నాథస్వామి ఆలయం వద్ద 20 వేల మంది భక్తులకు మహాన్నదానం ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా జగదాంబ, కాన్వెంట్ జంక్షన్, వన్టౌన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాల పార్కింగ్కు ప్రత్యేక స్థలాలను కేటాయించారు. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. -
రేపటి నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో
డాబాగార్డెన్స్: ఎంవీపీ కాలనీలో గల గాదిరాజు ప్యాలస్ వేదికగా ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు క్రెడాయ్ 11వ ప్రాపర్టీ ఎక్స్పో–2025 నిర్వహించనున్నట్టు క్రెడాయ్ చైర్మన్ ధర్మేంద్ర వారాడ, అధ్యక్షుడు ఇ.అశోక్కుమార్ తెలిపారు. బుధవారం నగరంలోని ఓ హోటల్లో ప్రాపర్టీ ఎక్స్పో–2025 పోస్టర్ ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. గతంలో నిర్వహించిన 10 ప్రాపర్టీ ఎక్స్పోలకు మంచి స్పందన వచ్చిందని, అదే స్ఫూర్తితో విశాఖ నగర పౌరుల కోసం 11వ ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎక్స్పోలో క్రెడాయి సభ్యత్వం గల పలు సంస్థలు భాగస్వామ్యం కానున్నాయని, ఎక్స్పోలో పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్స్కు చెందిన పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొని, వినియోగదారులకు తాము అందించే ఆర్థిక సేవలు వివరిస్తారన్నారు. 71 స్టాళ్లలో 50కి పైగా కన్స్ట్రక్షన్కు సంబంధించినవి కాగా, మిగిలినవి మెటీరియల్, వివిధ బ్యాంకుల స్టాళ్లు ఉంటాయన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రజలకు అవసరమైన.. అందుబాటు ధరల్లో ఫ్లాట్స్ లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎక్స్పో కన్వీనర్ గోవిందరాజు, గౌరవ కార్యదర్శి వి.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్లో పరిశోధనలు పెరగాలి
మురళీనగర్ : ఇంజినీరింగ్ విభాగంలో పరిశోధనలు ఎక్కువగా జరగాలని సీజీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ టి.విశ్వేశ్వరరావు అన్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ‘డిజిటల్ మేకోవర్ ఇన్ ఇంజినీరింగ్ అప్లికేషన్స్.. ఇన్నోవేషన్, టెక్నాలజీ అండ్ సస్టైనబిలిటీ’ అనే అంశంపై నిర్వహించిన ఏఐసీటీఈ అటల్ వాణి జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారతదేశం వేగంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో, ఇంజినీరింగ్ విద్యార్థులు, పరిశోధకులు ఆధునిక సాంకేతికతలను స్వీకరించి పరిశోధనాత్మక దృష్టితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్ సాంకేతికతలు, పారిశ్రామిక అభివృద్ధిలో సస్టైనబుల్ ఇంజినీరింగ్ కీలకమవుతుందన్నారు. సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా విభాగాలకు చెందిన 60 సాంకేతిక పరిశోధన పత్రాలను ప్రదర్శించారు. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, స్మార్ట్ ఇంజినీరింగ్ సిస్టమ్స్, సస్టైనబుల్ టెక్నాలజీలపై డాక్టర్ కె.రత్నకుమార్ ప్రసంగిస్తూ అధిక శక్తి సాంద్రత, కచ్చితత్వం, లోతైన వెల్డ్ పెనెట్రేషన్ వంటి లక్షణాల ద్వారా ఆధునిక తయారీ రంగాల్లో ‘ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్’’ సాంకేతికత ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. ‘స్మార్ట్ సాయిల్ టెస్టింగ్ మెథడ్స్’ అంశంపై డాక్టర్ కె.రాజ్యలక్ష్మి ప్రసంగిస్తూ సెన్సార్ ఆధారిత మట్టి పరీక్షా విధానాలు, ఐవోటీ, రియల్–టైమ్ డేటా విశ్లేషణ, మట్టి పోషకాల అంచనా వంటి ఆధునిక పరిష్కారాలను వివరించారు. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, ఇండస్ట్రీ 4.0, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, డిజిటల్ ట్విన్, డేటా ఆధారిత ఇంజినీరింగ్ అప్లికేషన్లు వివిధ ఇంజినీరింగ్ రంగాలపై చూపుతున్న ప్రభావాన్ని డాక్టర్ రాజు చిట్ల విశ్లేషించారు. కోఆర్డినేటర్ డాక్టర్ కె.నారాయణ రావు పర్యవేక్షణలో జరిగిన సదస్సులో తుమ్మిడి చారిటబుల్ చైర్మన్ ట్రస్ట్ తుమ్మిడి రామ్కుమార్, కో–కోఆర్డినేటర్లు డాక్టర్ రాజు చిట్ల, భరణి మారోజు పాల్గొన్నారు. -
పట్టించుకోరా..?
ప్రజాప్రతినిధులూ..సాక్షి, విశాఖపట్నం : విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన వచ్చి ఆరేళ్లు దాటినా.. కార్యకలాపాలు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. కాగితాలపై చక చకా పనులు జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అడుగు కదలడం లేదు. రైల్వే బోర్డు దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జనరల్ మేనేజర్గా సందీప్ మాథుర్ని నియమించి.. నెలలు గడుస్తున్నా తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభించే విషయంలో మాత్రం స్పందించడం లేదు. ఇప్పటికే జోన్కు కీలకమైన పీసీపీఓ, పీసీఓఎంతో సహా పలు వురు ప్రిన్సిపల్ అధికారులను కూడా నియమించారు. అయితే జోన్కు శాశ్వత కార్యాలయం లేకపోవడంతో జీఎం విశాఖకు అప్పుడప్పుడు వస్తూ పోతున్నారు. ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్న రైల్వే భవనంలో ఉంటూ కొన్ని కార్యకలాపాలపై సమీక్షలు నిర్వహించేందుకు మాత్రమే జీఎం పరిమితమయ్యారు. మిగతా అధికారులు మాత్రం బాధ్యతలు స్వీకరించడానికి వెనుకంజ వేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురాని చంద్రబాబు సర్కారు జోన్ డీపీఆర్ ఆమోదం తెలిపి నెలలు గడుస్తున్నా.. జీఎం నియామకం పూర్తయినా.. గెజిట్ విడుదల చేయకుండా అలసత్వం ప్రదర్శిస్తుండటం వెనుక చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రధాన కారణంగా మారింది. ఎంపీలు కనీసం జోన్ గురించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడకపోవడంతో.. రైల్వే బోర్డుకు గెజిట్ విషయంలో ఎలాంటి ఆదేశాలు అందడం లేదు. అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ జోన్కు ప్రధానాదాయం అయిన వాల్తేరు డివిజన్ను రెండుగా చీల్చేందుకు దాదాపు బోర్డు సిద్ధమైంది. ఇందులో కీలక ఆదాయ వనరు అయిన కేకే లైన్ని రాయగడ డివిజన్కు కేటాయించడంపైనా.. టీడీపీ ఎంపీలు నోరు మెదపడం లేదు. దీంతో చంద్రబాబు ప్రభుత్వానికి జోన్ వ్యవహారంపై ఎలాంటి ఆసక్తి లేదన్న భావన కేంద్రంలో నెలకొనడంతో.. బోర్డు కూడా కీలకమైన అంశాన్ని కూడా గాలికొదిలేసింది. కేవలం ప్రచార ఆర్భాటానికి జోన్ తాత్కాలిక కార్యాలయం పనులు పరిశీలన అంటూ టీడీపీ ఎంపీలు హడావుడి చేస్తున్నారే తప్ప.. గెజిట్ విడుదల ఎప్పుడనే విషయంపై కేంద్రాన్ని నిలదీయకపోవడం సిగ్గు చేటంటూ వాల్తేరు వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇప్పటికై నా టీడీపీ ఎంపీలు షోలు మానేసి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి వీలైనంత త్వరగా గెజిట్ విడుదల చేయించాలని, తద్వారా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కాస్తయినా పనిచేయాలని కోరుతున్నారు. తాత్కాలిక కార్యాలయం సిద్ధమైనా.. వీఎంఆర్డీఏ ది డెక్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం తాత్కాలిక కార్యాలయం నిర్మాణ పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఫర్నిచర్, ఇంటీరియర్ పనులు కూడా 90 శాతం వరకూ పూర్తయ్యాయి. అయితే ప్రారంభం మాత్రం ఇంకా చేసేందుకు గెజిట్ మోకాలడ్డుతోంది. గెజిట్ విడుదలైతే తప్ప.. తాత్కాలిక కార్యకలాపాలకు మోక్షం కలిగే అవకాశం లేదని వాల్తేరు డివిజన్ అధికారులు అంటున్నారు. గెజిట్తో పాటుగా కార్యాచరణ ప్రకటిస్తే, జీఎంతో సహా మొత్తం 180 మంది అధికారులు, ఉద్యోగులు నియమితులవుతారు. అప్పుడు మాత్రమే జోన్ కార్యకలాపాలు మొదలవుతాయి. తొలుత దసరా అనీ.. తర్వాత దీపావళి.. ఇలా పండగలు పేరుతో పబ్బం గడిపేస్తున్నారే తప్ప.. విశాఖ జోన్ విషయంలో బోర్డు అలసత్వం ప్రదర్శిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సంక్రాంతికి కూడా కష్టమేననే నిస్పృహ అందరిలోనూ నెలకొంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ వ్యవహారం.. మూడడుగుల ముందుకు ఆరడుగుల వెనక్కి అన్న చందగా మారిపోయింది. ఓవైపు విశాఖ కేంద్రంగా జోన్కు అధికారుల నియామకం.. ఉద్యోగులకు ఆప్షన్లు.. విభాగాల వారీగా ఉద్యోగుల విభజన అంటూ హడావుడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. గెజిట్ విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. కేంద్రాన్ని నిలదీయాల్సిన ఎంపీలు.. తాత్కాలిక కార్యాలయం పనులు పరిశీలన అంటూ జనాన్ని మభ్య పెడుతున్నారే తప్ప.. రైల్వే బోర్డుపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. జోన్, వాల్తేరు డివిజన్ విభజన విషయంలో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా చలనం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. జోన్ గెజిట్ విడుదల జాప్యంపై నోరు మెదపని చంద్రబాబు ప్రభుత్వం జీఎం తాత్కాలిక కార్యాలయం పూర్తయినా అవరోధాలు గెజిట్ విడుదలైతే తప్ప తాత్కాలిక కార్యకలాపాలకు మోక్షం లేదు కేవలం కార్యాలయాల విజిట్కి మాత్రమే ఎంపీలు పరిమితం ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతున్నా చలనం శూన్యం -
ద్విచక్ర వాహనాల చోరీ కేసు.. నిందితుల్లో ముగ్గురు మైనర్లు
గోపాలపట్నం : ద్విచక్రవాహనాలను దొంగిలించిన ముగ్గురు మైనర్లను గోపాలపట్నం పోలీసులు అదుపులోకి తీసుకొని.. జువైనల్ హోమ్కు తరలించారు. గోపాలపట్నం క్రైమ్ ఎస్ఐ జి.తేజేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తన ఇంటి ముందు పెట్టిన స్కూటీని ఈ నెల 12వ తేదీన రాత్రి ఎవరో ఎత్తుకుపోయారని బాజి జంక్షన్ ఎస్సీ కాలనీకి చెందిన రౌతు తరుణ్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే క్రమంలో కొత్తపాలెం, చంద్రనగర్, బాజి జంక్షన్ ప్రాంతాల్లో తమ ద్విచక్రవాహనాలు చోరీకి గురయ్యాయని చామర్తి సందీప్, బూసల గణేష్, శిరీష, మనుబాల సూరజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెస్ట్ సబ్ డివిజన్ సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఎస్ఐ తేజేశ్వరరావు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాతనేరస్తులపై నిఘా పెట్టారు. జీవీఎంసీ 89వ వార్డు చంద్రనగర్ గ్రౌండ్ వద్ద చంద్రనగర్కు చెందిన ముగ్గురు మైనర్లను పట్టుకున్నారు. వారిని ప్రశ్నించగా పై దొంగతనాలు తాము చేసినట్లుగా అంగీకరించారు. వారి వద్ద నుంచి మొత్తంగా 5 స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. వారిని జువైనల్ హోమ్కు తరలించారు. -
● భీమిలి తీరంలో తాబేళ్ల మృత్యుఘోష
భీమిలి తీరానికి మంగళవారం తాబేళ్ల కళేబరాలు కొట్టుకొచ్చాయి. ఇక్కడి గోస్తనీ నది ముఖద్వారం నుంచి బోయివీధి వరకు సుమారు పది తాబేళ్ల కళేబరాలతో పాటు ఒక డాల్ఫిన్ మృతదేహం కూడా ఒడ్డుకు చేరింది. సముద్రంలో కలుస్తున్న కలుషిత వ్యర్థాలు, రసాయనాల కారణంగా తరచూ ఈ జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. కొద్ది నెలలుగా వీటి మరణాలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. తాజాగా పదుల సంఖ్యలో కళేబరాలు తీరానికి కొట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది. – భీమునిపట్నంతీరంలో డాల్ఫిన్ కళేబరం -
డిజిటల్ ట్విన్స్తో రియల్ టైమ్ పర్యవేక్షణ
ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ మురళీనగర్ : డిజిటల్ ట్విన్స్ ద్వారా రియల్ టైమ్ పర్యవేక్షణ చేయవచ్చని ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ తెలిపారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్లో నిర్వహిస్తున్న అటల్ వాణి జాతీయ సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సాంకేతిక వ్యవస్థ ద్వారా వాహనాలు, యంత్రాల వర్చువల్ నమూనాలు రూపొందించవ్చన్నారు. వాటి పనితీరును నియంత్రించడం, పర్యవేక్షించడంలో కచ్చితత్వం సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్ సాంకేతిక రంగంలో క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థ నిర్ణయాత్మకమైన మార్పులు తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఆటోమోటివ్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు, స్వయంచాలక వాహనాల తయారీ, లాజిస్టిక్ రంగాల్లో క్యాంటం కంప్యూటింగ్ నూతన తరం ఆప్టిమైజేషన్, సిమ్యులేషన్ సాధనంగా అవతరిస్తోందని వివరించారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శశిభూషణ్ మాట్లాడుతూ హై స్పెక్ట్రల్ ఇమేజింగ్ సాంకేతికత ద్వారా అత్యంత స్పష్టతతో మట్టి లక్షణాలు, వివిధ పదార్థాల పరీక్షలు నిర్వహించవచ్చన్నారు. బబుల్ కర్టెన్, బబుల్ షీల్డింగ్ టెక్నాలజీ ఉపయోగించి సబ్మెరీన్ వేగాన్ని పెంచవచ్చని చెప్పారు. అనంతరం సదస్సు సావనీర్ ఆవిష్కరించారు. 60 పరిశోధనా పత్రాలకు ఆమోదం సదస్సులో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన 60 సాంకేతిక పరిశోధన పత్రాలను ఆమోదించారు. మొదటి రోజు యాంత్రిక, విద్యుత్, ఎలక్ట్రానిక్, సివిల్, కమికల్ ఇంజినీరింగు, ఫార్మసీ, ఇంగ్లిష్, గణిత విభాగాల నుంచి 30 పరిశోధనా పత్రాలు ప్రదర్శించారు. సదస్సు కోఆర్డినేటర్ సమన్వయకర్త డాక్టర్ కె.నారాయణరావు, ఎన్ఎస్టీఎల్ మాజీ అదనపు డైరెక్టర్ డాక్టర్ పీవీఎస్ గణేష్ కుమార్, స్టీల్ప్లాంట్ మాజీ జనరల్ మేనేజర్ ఓ.రామ్మోహనరావు, హైడల్ విద్యుత్ సౌధ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లెక్కల నానాబాబు, ఎన్ఎస్టీఎల్ అదనపు డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ ఉపన్యసించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె.ఫణికృష్ణ, కో–కోర్డినేటర్లు డాక్టర్ రాజు చిట్ల, భరణి మారోజు తదితరులు పాల్గొన్నారు. -
281 ఆక్రమణల తొలగింపు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో ఆపరేషన్ లంగ్స్ 2.0 పేరిట మంగళవారం 281 ఆక్రమణలు తొలగించినట్టు ముఖ్య పట్టణ ప్రణాళికాధికారి ప్రభాకరరావు తెలిపారు. కమిషనర్ కేతన్గార్గ్ ఆదేశాల మేరకు నగర పరిధిలో ఫుట్పాత్లు, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా సురక్షిత రవాణా కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు. జోన్–1లో మంగమారిపేట నుంచి భీమిలి బీచ్రోడ్డు వరకు 13 ఆక్రమణలు, జోన్–2లో కార్షెడ్ జంక్షన్ నుంచి పీఎం పాలెం చివరి బస్టాప్ వరకు 18, జోన్–3లో రామాటాకీస్ నుంచి సత్యం జంక్షన్ వరకు, సత్యం జంక్షన్ నుంచి ఏఎస్ఆర్ విగ్రహం వరకు, ఎస్ఎఫ్ఎస్ స్కూల్ రోడ్డు నుంచి పోర్టు స్టేడియం వరకు, ఎన్ఆర్ఐ హాస్పటల్ నుంచి గురుద్వారా జంక్షన్ వరకు 83, జోన్–4లో అగర్వాల్ హాస్పటల్ నుంచి సెయింట్ ఆంతోనీ స్కూల్ వరకు 33, జోన్–5లో అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్డు నుంచి రైల్వే న్యూకాలనీ వరకు 40, జోన్–6లో బీసీ రోడ్డు జంక్షన్ నుంచి గంగవరం పోర్టు రోడ్డు వరకు, శ్రీనగర్ జంక్షన్ నుంచి దుర్గానగర్ రోడ్డు వరకు, అగనంపూడి జంక్షన్ నుంచి విశాఖ స్టీల్ జనరల్ హాస్పటల్ వరకు 67, వెస్ట్ జోన్లో మల్కాపురం నుంచి కోరమండల్ గేట్ వరకు 12, జోన్–8లో వేపగుంట జంక్షన్ నుంచి చినముషిడివాడ వరకు 15 ఆక్రమణలు తొలగించినట్టు చెప్పారు. -
ప్రత్యేక అలంకరణల్లో గ్రామ దేవతలు
తగరపువలస: భీమిలి మండలం మజ్జివలస గ్రామదేవత రాస పోలమాంబకు 133వ అలంకరణలో భాగంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మంగళవారం లిల్లీ, వివిధ రకాల బంతి, తులసి, గజమాలలతో అలంకరించారు. గ్రామంలోని ఆంజనేయస్వామికి ప్రత్యేక అలంకరణ చేశారు. నాలుగేళ్లుగా అమ్మవారిని వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఇదే గ్రామానికి చెందిన తుపాకుల అప్పల రాసయ్య, రాసమ్మ దంపతులు భక్తులకు ప్రసాదాలు పంపిణి చేశారు. దివీస్ రహదారిలో మద్దిపేట వద్ద ఆలయంలో ముత్యాలమ్మను వేరుశనగ కాయలు, తోగాలమ్మను ధాన్యం కంకులతో అలంకరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవార్లను దర్శించుకుని, పూజలు చేశారు. -
అమర జవాన్లకు ఘన నివాళి
ఏయూక్యాంపస్: 1971 యుద్ధంలో పాకిస్థాన్పై భారత్ సాధించిన అద్భుత విజయానికి గుర్తుగా మంగళవారం నగరంలో ‘విజయ్ దివస్’ వేడుక లు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీచ్ రోడ్డులోని విక్టరీ ఎట్ సీ వద్ద అమర జవాన్లకు ఘన నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన డైరెక్టర్ జనరల్ నేవల్ ప్రాజెక్ట్స్, వైస్ అడ్మిరల్ కె.శ్రీనివాస్.. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
● స్నోయగం
మంచు వెన్నముద్దసూర్యోదయం వేళ.. మారేడుమిల్లి–చింతూరు ఘాట్రోడ్డు ప్రాంతం ప్రకృతి రమణీయతకు అద్దంపట్టింది. అడుగడుగునా దట్టమైన వృక్షాలు, భూమిని తాకేటట్టుగా వేలాడుతున్న పచ్చని తీగలు. వనమూలికల సువాసనతో స్వచ్ఛమైన గాలి ఔషధంగా మారిపోయింది. వినసొంపైన పక్షుల కిలకిలారావాలు.. చెట్లపై నుంచి జారే మంచు బిందువుల ’చిటపట’ శబ్దాలు మంచి అనుభూతిని కలిగించాయి. వ్యూపాయింట్ వద్ద మంచు అందాలుసందర్శకులను అబ్బురపరిచాయి. భానుడి స్వర్ణమయ కిరణాలు ఆకులపై పడి మరింత ప్రకాశవంతంగా మారాయి. మన్యం ప్రాంతమంతా స్వచ్ఛమైన ఆకుపచ్చ, గోధుమ, పసిడి రంగుల మేళవింపుతో సరికొత్త అందాన్ని సంతరించుకుంది. – రంపచోడవరం -
మోగిన నెలగంట
సింహాచలం: ధనుర్మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని సింహగిరిపై నెలగంట ఉత్సవాన్ని మంగళవారం మధ్యాహ్నం ఘనంగా నిర్వహించారు. నెలరోజులపాటు జరిగే ధనుర్మాస పూజలను పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా ప్రారంభించారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను, గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తిని, ఆళ్వారులను ఆస్థాన మండపంలో వేదికపై వేంజేపచేశారు. ధనుర్మాస ప్రారంభ నివేదనం, తిరుప్పావై సేవాకాలం, ధనుసంక్రమణ ప్రవేశ పూజలు నిర్వహించారు. అనంతరం గోదాదేవి అమ్మవారిని పల్లకీలో వేంజేపచేసి ఆలయ బేడామండపంలో తిరువీధి జరిపారు. గోదాదేవి సన్నిధిలో తొలి పాశుర విన్నపాన్ని పఠించారు. తదుపరి ఆలయ రాజగోపురంలో మధ్యాహ్నం 1.01 గంటలకు నెలగంటను మోగించారు. ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు చిన్నా తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
న్యాయ సహాయకుల పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం
విశాఖ లీగల్: నగరంలోని న్యాయ సేవా ప్రాధికార సంస్థలో న్యాయ సహాయకులుగా పనిచేయడానికి అర్హులైన న్యాయవాదుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవా ప్రాధికార సంస్థ చైర్మన్ చిన్నంశెట్టి రాజు తెలిపారు. డిఫెన్స్ కౌన్సిల్గా సేవలందించడానికి మూడు కేటగిరిలో న్యాయవాదులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ప్రధాన, ఉప న్యాయ సహాయకులు, లీగల్ అసిస్టెంట్ల పోస్టులకు ఈ నెల 31వ తేదీలోగా న్యాయ సేవా ప్రాధికార సంస్థలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు జిల్లా కోర్టు వెబ్సైట్ను సందర్శించవచ్చని తెలిపారు. -
కస్టమ్స్ కత్తెర!
ఎగుమతులకునిపుణుల బృందం లేక ఎగుమతిదారుల ఇక్కట్లు నాణ్యత ధ్రువీకరణకు పరికరాలు, నైపుణ్యం కొరత సౌకర్యాల లేమితో సరుకు రవాణాకు అంతరాయం చైన్నె, ముంబయి వైపు మళ్లుతున్న ఎగుమతులు ధ్రువీకరించే బృందాలు లేక.. విశాఖ మందులు హైదరాబాద్కు తరలింపుసాక్షి, విశాఖపట్నం: నగరంలోని ప్రధాన ఫర్నిచర్ షోరూమ్లలో విక్రయించే ఫర్నిచర్ అధిక భాగం చైనా నుంచి దిగుమతి అవుతుంటుంది. ఇక్కడ కంటైనర్ టెర్మినల్, పోర్టులు ఉన్నప్పటికీ వ్యాపారులు చైనా నుంచి సరుకును నేరుగా విశాఖకు రప్పించడం లేదు. కోల్కతా లేదా చైన్నె పోర్టులకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విశాఖకు తీసుకురావాల్సిన పరిస్థితి దాపురించింది. ఎందుకంటే.. పదేళ్ల కిందట ఓ వ్యాపారి చైనా నుంచి నేరుగా ఇక్కడికి ఫర్నిచర్ తీసుకురాగా.. దాని ధ్రువీకరించి క్లియరెన్స్ ఇచ్చేందుకు కస్టమ్స్ వారికి ఏడాది సమయం పట్టింది. ఆ అనుభవంతో అప్పటి నుంచి ఏ వ్యాపారీ ఫర్నిచర్ను నేరుగా విశాఖకు తీసుకురాకూడదని నిర్ణయించుకున్నారు. కేవలం ఫర్నిచర్ మాత్రమే కాదు.. అనేక ఉత్పత్తుల విషయంలో విశాఖ కస్టమ్స్ నుంచే ప్రధాన అవరోధాలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అన్నీ ఉన్నా.. అవే లేవు ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా ఉంది విశాఖపట్నం కార్గో ఎగుమతి, దిగుమతుల పరిస్థితి. సామర్థ్యానికి తగ్గట్లుగా సరుకు నిర్వహణలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో, ఏళ్ల తరబడి ఇక్కడ వృద్ధి స్తంభించిపోయింది. విశాఖ పరిధిలో తయారవుతున్న ఉత్పత్తులు కూడా హైదరాబాద్ మీదుగా ముంబయి వెళ్తున్నాయి. సర్టిఫైడ్ ఏజెన్సీల కొరత ఓవైపు వేధిస్తుండగా, ఎగుమతులకు ‘కస్టమ్స్’ తీరు ప్రధాన అవరోధంగా మారింది. వచ్చే కార్గో నాణ్యతను పరీక్షించి, ధ్రువీకరించేందుకు అవసరమైన నిపుణుల బృందాలు విశాఖ కస్టమ్స్ వ్యవస్థలో లేకపోవడం వల్లే ఈ అంతరాయాలు ఏర్పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. 200 ఉత్పత్తులకే పరిమితం! విశాఖ కస్టమ్స్ హౌస్లో నాణ్యత పరిశీలన నిపుణులు లేరనే వాదన బలంగా ఉంది. సరుకు రవాణా అభివృద్ధికి ఇదే ప్రధాన ఆటంకమని వాణిజ్య ప్రతినిధులు చెబుతున్నారు. ముంబయిలో 2000కి పైగా, చైన్నెలో 1500 వరకు కార్గో ఉత్పత్తులను కస్టమ్స్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. వచ్చే ప్రతి సరుకు ఏ గ్రేడ్లో ఉంది? ఎంత నాణ్యమైనది? దానికి ఎంత పన్ను వేయాలి? అనే విషయాలను అక్కడి నిపుణులు క్షణాల్లో చెప్పగలరు. తక్కువ వ్యవధిలోనే ధ్రువీకరించి క్లియరెన్స్ ఇస్తారు. కానీ, విశాఖలో ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకు పసుపు కొమ్ముల ఎగుమతి కోసం వ్యాపారులు విశాఖకు వస్తే, వాటి నాణ్యత పరిశీలనకే రోజుల సమయం తీసుకుంటున్నారు. ఫలితంగా సరుకు ఇక్కడే పాడైపోతోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే చాలావరకు ఉత్పత్తులను చైన్నె లేదా ముంబయికి తరలిస్తున్నారు. ఇక విశాఖలో తయారయ్యే మందుల నాణ్యతను ధ్రువీకరించి, క్లియరెన్స్ ఇచ్చే నిపుణులు ఇక్కడ లేరు. వీటి కోసం ప్రత్యేక ఏజెన్సీలు ఉన్నా, అవి విశాఖలో అందుబాటులో లేకపోవడంతో సరుకును హైదరాబాద్కు తరలించి, అక్కడ సర్టిఫికెట్లు తీసుకొని ముంబయి ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా విశాఖలో కార్గో హ్యాండ్లింగ్ కేవలం 200 ఉత్పత్తులకే పరిమితమైపోయింది. ముంబయితో పోలిస్తే 20 శాతం, చైన్నెతో పోలిస్తే 25 శాతం ఉత్పత్తులు మాత్రమే విశాఖ నుంచి ఎగుమతి, దిగుమతులవుతున్నాయి. కొత్త ఉత్పత్తులకు అవకాశం లేదా? కస్టమ్స్ మదింపు కోసం ప్రత్యేక శిక్షణ ఉంటుంది. వైజాగ్ కస్టమ్స్ హౌస్కు వచ్చే అప్రైజర్లు కేవలం ఈ ప్రాంతంలో రవాణా అయ్యే పరిమిత సరుకులపైనే పట్టు సాధిస్తున్నారు. కొత్తగా ఏదైనా సరుకు వస్తే, దాని నాణ్యతను పరిశీలించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ఉత్పత్తులకు తగ్గట్టుగా కస్టమ్స్ హౌస్ తమ బృందాలను సిద్ధం చేయలేకపోతోంది. ఏవో కొర్రీలు వేసి వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. తాము సిద్ధంగా ఉన్నామని స్టేక్హోల్డర్స్ చెబుతున్నా, కస్టమ్స్ నుంచి స్పందన లేకపోవడంతో పరిమిత కార్గోను మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతున్నారు. కొన్ని ఉత్పత్తులను ఉత్తరాది నుంచి విశాఖ తీసుకొచ్చి, నేరుగా సింగపూర్, ఈశాన్య ఆఫ్రికా దేశాలకు పంపించేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నా.. ఇక్కడ సరైన పరిశీలన బృందాలు లేక వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా.. కార్గో ఎగుమతులు ముందుకు కదలక.. కొత్త ఉత్పత్తుల హ్యాండ్లింగ్కు అవకాశం లేకుండా పోతోందని వాపోతున్నారు. కస్టమ్స్ విభాగంలో మార్పులు వస్తేనే విశాఖలో ఎగుమతులు ఊపందుకుంటాయని వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
కార్పొరేట్ కంపెనీలకు పాలకులు దాసోహం
● దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి ● రైతు కూలీ సంఘం నిరసన ర్యాలీ అనకాపల్లి : కార్పొరేట్ కంపెనీలకు పాలకులు దాసోహమయ్యారని రైతు కూలీ సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ ఆరోపించారు. విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి న్యూకాలనీ వరకూ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం న్యూకాలనీ రోటరీ హాల్లో సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహన్రావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, కార్మికులను, పీడిత ప్రజలను దోపిడీ చేసే విధానాలను వేగవంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. దానిలో భాగంగానే పచ్చని పంట పొలాలను కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నాయన్నారు. జిల్లాలో దశాబ్దల కాలం పాటు రైతులకు, కార్మికులకు ఉపాధిని చూపించిన వ్యవసాయాధారిత సుగర్ ఫ్యాక్టరీలను మూసేశారని, గూగుల్ డేటా సెంటర్, బల్క్ డ్రగ్ పార్కులు, ఫార్మా సిటీలు, హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల పేరుతో ప్రజల భూములను లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజలంతా ఐక్యంగా పోరాడినప్పుడే పాలకుల దోపిడీ విధానాలను అరికట్టవచ్చని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ, తదితరులు పాల్గొన్నారు. -
ఏం బ్యాగుంది?
సర్కారు వారి బ్యాగులు.. చిరుగులు మూణ్నాళ్ల ముచ్చటగా విద్యార్థి మిత్ర కిట్లు బయట కొనుగోలు చేసిన బ్యాగులతో తోటగరువు హైస్కూల్కు వెళ్తున్న విద్యార్థులు ఆరిలోవ: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం అందించిన ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్లు మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. ఈ కిట్లలో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జిల్లాలో విద్యార్థులకు అందించిన స్కూల్ బ్యాగులు నాసిరకంగా ఉండటంతో కొద్ది రోజులకే చిరిగిపోయాయి. మరోవైపు విద్యార్థులకు వారి కాలి కొలతలకు సరిపడే బూట్లను పంపిణీ చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. సాధారణంగా ప్రతి సంవత్సరం వేసవి సెలవులు ముగిసిన వెంటనే, జూన్ రెండో వారంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగులు, బూట్లు, యూనిఫాంతో కూడిన కిట్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఏవైనా కిట్లు సరిపోకపోతే, ఒకటి రెండు వారాల్లో మిగిలిన వారికి పంపిణీ చేయడం ఆనవాయితీ. కానీ, ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం పంపిణీ చేసిన కిట్లలోని వస్తువులు చాలీచాలనివిగా ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడిచిపోతున్నా, ఇంకా చాలా మందికి బూట్లు, బ్యాగులు అందకపోవడం గమనార్హం. హైస్కూల్ విద్యార్థుల పుస్తకాల బరువును తట్టుకునేలా బ్యాగుల నాణ్యత లేకపోవడంతో అవి త్వరగా చిరిగిపోతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి పుస్తకాల బరువును బట్టి బ్యాగు నాణ్యత ఉంటే బాగుండేదని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. చిరిగిపోతున్న బ్యాగులు ఈ ఏడాది జూన్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో కిట్లు అందజేశారు. అయితే, కొన్ని తరగతులకు పాఠ్య పుస్తకాలు కూడా కొరతగానే ఉన్నాయి. పాఠశాలలు తెరిచిన నెల రోజుల తర్వాత పుస్తకాలు ఇవ్వడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు నాణ్యత లేకపోవడంతో, పుస్తకాల బరువుకు రెండు నెలలకే అవి చిరిగిపోయాయి. దీంతో కొందరు విద్యార్థులు చిరిగిన బ్యాగులతోనే పాఠశాలలకు వెళ్లాల్సి వస్తుండగా, కొందరు బయట కొత్త బ్యాగులు కొనుగోలు చేస్తున్నారు. నాసిరకం బ్యాగుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా, పంపిణీ సమయంలోనే కొరత కారణంగా జిల్లాలో 8,789 మంది విద్యార్థులకు అసలు బ్యాగులే అందలేదు. ఇప్పటికీ వారికి బ్యాగులు సరఫరా కాకపోవడం విచారకరం. 6,000 మందికి బూట్లు అందలేదు జిల్లాలో సుమారు 6,000 మందికి పైగా విద్యార్థులకు బూట్లు అందలేదు. అందిన వారికి కూడా సాక్సులు, బూట్లు అరకొరగానే ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్థుల కాలి కొలతల ప్రకారం బూట్లు రాకపోవడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కొన్ని రోజుల కిందట కొన్ని మండలాలకు బూట్లు వచ్చినప్పటికీ, వాటిని ఇంకా సైజుల వారీగా విద్యార్థులకు సర్దుబాటు చేయాల్సి ఉంది. విద్యా సంవత్సరం సగం గడిచిపోవడంతో విద్యార్థులు బయట కొన్న బూట్లు లేదా చెప్పులతోనే బడికి వెళ్తున్నారు. జిల్లాలో మొత్తం 594 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 72,627 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 33,830 మంది బాలురు, 38,697 మంది బాలికలు ఉన్నారు. వీరిందరికీ కిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా, 8,789 మందికి బ్యాగులు అందలేదు. అలాగే సుమారు 6,000 మందికి బూట్లు (ఒక జత), సాక్సులు (రెండు జతలు) అందలేదు. బ్యాగు చిరిగిపోయింది.. నాకు స్కూల్లో ఇచ్చిన బ్యాగు కొద్దిరోజులకే చిరిగిపోయింది. అందుకే కొత్త బ్యాగు కొనుక్కున్నాను. ఇందులో ఎన్ని పుస్తకాలు పెట్టినా తట్టుకుంటోంది. చాలా రోజుల నుంచి ఈ బ్యాగుతోనే స్కూల్కు వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది బ్యాగులు చిరిగిపోయాయి. వారు కూడా కొత్తవి కొనుక్కున్నారు. – హేమంత్, 6వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తోటగరువు -
కొనసాగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మంచు, చలి తీవ్రతకు మన్యంవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం జి. మాడుగులలో 3.8 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 6.4 డిగీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధి అరకువ్యాలీలో 7.2 డిగ్రీలు, పెదబయలులో 8.8 డిగ్రీలు, హుకుంపేటలో 9.0 డిగ్రీలు, పాడేరులో 9.6 డిగ్రీలు, చింతపల్లిలో 1.8 డిగ్రీలు, కొయ్యూరులో 12.8 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. ●రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 10.8 డిగ్రీలు, మారేడుమిల్లిలో 11.3 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 13.5 డిగ్రీలు, అడ్డతీగలలో 15.1 డిగ్రీలు, రంపచోడవరంలో 15.8 డిగ్రీలు, చింతూరు డివివిజన్ చింతూరులో 13.9 డిగ్రీలు, ఎటపాకలో 14.2 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఉదయం 9గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. జి.మాడుగుల: చలి తీవ్రతకు మండల ప్రజలు వణికిపోతున్నారు. పాడేరు–జి.మాడుగుల, చింతపల్లి రోడ్డు, నుర్మతి, సొలభం, గెమ్మెలి మార్గాల్లో పొగమంచు తెరలు కమ్మేశాయి. దీంతో రహదారి కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగించారు. -
సముద్రంలో పడి మత్స్యకారుడు గల్లంతు
మహారాణిపేట: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. తోటి మత్స్యకారులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలివి. విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన వాసుపల్లి రాములు(55) నగరంలోని జాలరిపేటలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఈ నెల 12న ఫిషింగ్ హార్బర్ నుంచి ఐఎన్డీ ఏపీవీ5, ఎంఎం 872 నంబర్ గల బోటులో రాములుతో సహా మొత్తం ఎనిమిది మంది మత్స్యకారులు వేటకు బయలుదేరారు. హార్బర్ నుంచి తూర్పు వైపు విశాఖకు 70 మైళ్ల దూరంలో వారు చేపల వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14న రాత్రి 8.30 గంటల సమయంలో వేటలో ఉండగా.. రాములు ప్రమాదవశాత్తు కాలుజారి సముద్రంలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి మత్స్యకారులు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న ఇతర బోట్ల మత్స్యకారులకు సమాచారం అందించి వారి సాయంతో వెతికినా.. రాములు ఆచూకీ లభించలేదు. దీంతో బోటు డ్రైవర్ వాసుపల్లి లక్ష్మణరావు విషయాన్ని హార్బర్ అసోసియేషన్ నాయకులకు చేరవేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు బోటు హార్బర్కు చేరుకోగానే మత్స్యకారులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త ఆచూకీ కోసం వేడుకోలు
ముంచంగిపుట్టు: తన భర్త కుర్తాడి ప్రసాద్(45) కనిపించడం లేదని, ఆచూకీ తెలియజేయాలని మండలంలో బంగారుమెట్ట పంచాయతీ కించాయిపుట్టు గ్రామానికి డాలమ్మ, కుటుంబ సభ్యులు వేడుకొంటున్నారు. అతని భార్య డాలమ్మ స్థానిక విలేకరులకు మంగళవారం వివరాలు తెలియజేసింది. పదేళ్లుగా విశాఖపట్నం షీలానగర్లో భర్త ప్రసాద్, ఇద్దరు పిల్లలతో నివాసముంటూ భవననిర్మాణ పనులు చేస్తూ జీవిస్తున్నామని తెలిపింది. గత నెల 28న బయటకు వెళ్లిన ప్రసాద్ తిరిగి ఇంటికి రాలేదని, దీంతో పనిచేసే ప్రదేశాలల్లో, బంధువులు, స్నేహితులు వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోయిందని చెప్పింది. ఈ నెల 4వ తేదీన దువ్వాడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు ఆమె చెప్పింది. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేయలేదని, లేనిపోని కారణాలు చెబుతూ తనను పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పించారని వాపోయింది. దీంతో తన స్వగ్రామం కించాయిపుట్టు వచ్చి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్లో తెలియజేసినా ఫలితం లేకపోయిందని తెలిపింది. సంఘటన జరిగిన ప్రాంతం దువ్వాడ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని తెలిపారని ఆమె చెప్పింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆమె రోదించింది. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, ప్రసాద్ ఆచూకీ కనుగొనేలా ఆదేశాలు జారీ చేయాలని డాలమ్మ, ఆమె కుటుంబ సభ్యులు, కించాయిపుట్టు గ్రామస్తులు వేడుకుంటున్నారు. -
నగర భద్రత, అభివృద్ధి కోసం ‘సెవెన్ డ్రీమ్స్’
విశాఖ సిటీ : నగరంలో భద్రత, సంక్షేమం, అభివృద్ధే ప్రధానంగా ‘సెవెన్ డ్రీమ్స్’ అనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. నగరంలో వివిధ పరిశ్రమలు, సంస్థల ప్రతినిధులతో మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో విశాఖ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (వీసీఎస్సీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఉత్తమ పోలీసింగ్ గల నగరంగా, ఆ తర్వాత ప్రపంచంలోనే ఆదర్శ పోలీసింగ్ నగరంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనలో విశాఖ భద్రతా మండలి కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ● 2026 ఏప్రిల్ 1 నుంచి ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను నగరంలో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఆటోమేటిక్ నెంబర్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి చలానా జారీ అవుతుందన్నారు. తద్వారా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణపై మాత్రమే దృష్టి సారిస్తారన్నారు. ● మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ● ఆశ్రయం లేని వారికి, ట్రాన్స్జెండర్లు, జైలు నుంచి విడుదలైన మాజీ ఖైదీలు, డ్రగ్, మద్యం వ్యసనాల నుంచి కోలుకున్నవారికి తగిన ఉపాధి కల్పిస్తే వారు తప్పుడుదారుల్లోకి వెళ్లే అవకాశాలు ఉండవని వివరించారు. ● హోంగార్డుల కోసం హోంగార్డ్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసి ఆరోగ్య బీమా కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. ● ప్రతీ ప్రాంతంలో నైట్ విజన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఫుటేజ్ను క్లౌడ్లో భద్రపరచాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా జాతీయ లేదా రాష్ట్ర క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాబేస్లలో ఉన్న నేరస్తులను గుర్తించి వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తం చేసే విధానం అమలు చేస్తామని తెలిపారు. ● బీచ్ భద్రత, ట్రాఫిక్ ఉపకరణాలపై దృష్టి సారించాలని, మునిగిపోయే అవకాశం ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, లైట్లు, లైఫ్గార్డ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ● వ్యసన విముక్తి కేంద్రాలు సరిపోవడం లేదని, ప్రతి డ్రగ్కు ఉత్తమ చికిత్స అందించే కేంద్రం ఏర్పాటు చేయడానికి భద్రతా మండలి సహకారం అవసరమని తెలిపారు. ప్రజలు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ద్వారా అద్భుతాలు సాధించవచ్చన్నారు. చాలా కాలంగా భద్రతా మండలి నిద్రావస్థలో ఉందని, ఇకపై చురుకుగా పనిచేసే, తనను కూడా నిద్రపోనివ్వని సభ్యులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చంద్రబాబు అహంకారాన్ని ప్రజలే దించుతారు
మెడికల్ కాలేజీల రౖపైవేటీకరణ నిర్ణయం చంద్రబాబు సర్కార్ చారిత్రక తప్పిదమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. అధికారం ఉందన్న అహంకారంతో చంద్రబాబు పేదలకు అందే వైద్య విద్య, వైద్యాన్ని దూరం చేయాలని చూస్తున్నారన్నారు. తన ప్రైవేటు తొత్తులకు కట్టబెట్టేందుకు ఈ పీపీపీ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ నిర్ణయంతో పేదలకు వైద్య విద్య దూరమవుతుందని, వైద్యం కూడా అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మెడికల్ కాలేజీల రౖపైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా మెడికల్ కాలేజీలను ప్రభుత్వంలోనే కొనసాగేలా ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. చంద్రబాబు అహంకారాన్ని ప్రజలే దించుతారన్నారు. -
చంద్రబాబు నిర్ణయానికి నిరసనగా పోటెత్తిన జనం కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన జిల్లాలో 4.15 లక్షల సంతకాల ప్రతులతో భారీ ర్యాలీ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
విశాఖ సిటీ : వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించాలన్న చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. పేద విద్యార్థులకు వైద్య విద్య, వైద్యాన్ని దూరం చేసే ప్రభుత్వ పన్నాగంపై కదం తొక్కింది. మెడికల్ కాలేజీలను కార్పొరేట్లకు దోచిపెట్టే దురాలోచనపై దండెత్తింది. చంద్రబాబు ప్రభుత్వ ప్రైవేటు విధానాలకు వ్యతిరేకంగా నిరసన గళమెత్తింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేదలకు వైద్య విద్య, వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు నిర్మిస్తే.. వాటిని చంద్రబాబు తన తొత్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను లక్షల మంది ప్రజానీకం సంతకాల ద్వారా వ్యతిరేకించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి సేకరించిన 4,15,500 సంతకాల పత్రాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించే కార్యక్రమానికి కూడా జనం పోటెత్తారు. సోమవారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం వరకు జరిగిన ఉద్యమ ర్యాలీ వేలాది మంది జనసందోహంతో నిండిపోయింది. హోరెత్తిన ర్యాలీ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడు కదిరి బాబూరావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పి.రవీంద్రబాబు, నియోజకవర్గాల సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్కుమార్, మళ్ల విజయ్ప్రసాద్, తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, విద్యార్థులు, ప్రజలతో ర్యాలీ బయలుదేరింది. ఒకవైపు కోలాటాలు, కోబ్రా నృత్యాలు, డీజేలతో ఆ ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. సుమారు 2 కిలోమీటర్ల మేర ర్యాలీగా వెళ్లి మద్దిలపాలెం జంక్షన్లో తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంతకాల పత్రాల వాహనానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడు కదిరి బాబూరావు జెండా ఊపి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు, సమన్వయకర్తలు మళ్ల విజయ ప్రసాద్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ కె.సతీష్, సీఈసీ సభ్యులు కోలా గురువులు, కాయల వెంకటరెడ్డి, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, పార్టీ ముఖ్య నాయకులు సిరిసహస్ర(సిరిమ్మ), జియ్యాని శ్రీధర్, ఉరుకూటి అప్పారావు, రొంగలి జగన్నాథం, బాణాల శ్రీనివాసరావు, డాక్టర్ సీఎంఏ జహీర్ అహ్మద్, దాట్ల వెంకటఅప్పలప్రసాద్ రాజు, పిన్నమరాజు సతీష్ వర్మ, పోతిన హనుమంతరావు, తాడి జగన్నాథరెడ్డి, కిరణ్రాజు, గొండేశి మహేశ్వర రెడ్డి, చెన్నాదాస్, పల్లా దుర్గారావు, కోరుకొండ వెంకటరత్నస్వాతిదాస్, గుడ్ల వెంకటరమణిరెడ్డి, మంచా నాగమల్లీశ్వరి, దుప్పలపూడి శ్రీనివాసరావు, బొల్లవరపు జాన్వెస్లీ, పెర్ల విజయ్చంద్ర, పిల్లి సుజాత, ద్రోణంరాజు శ్రీవాస్తవ, చెన్నా జానకిరామ్, పిల్లా సుజాత ,గొలగాని శ్రీనివాస్,రవి రాజు, అల్లు శంకర్రావు, అక్కరమాని పద్మ, రామునాయుడు, దౌలపల్లి ఏడుకొండల రావు, కటారి అనీల్కుమార్, నక్కిల లక్ష్మీ, శాడి పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్, గుండాపు నాగేశ్వరరావు, కోడిగుడ్ల పూర్ణిమ, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, బర్కత్ అలీ, కేవీ శశికళ, బల్ల లక్ష్మణ్, మహమ్మద్ ఇమ్రాన్, గుడివాడ సాయిఅనూష, లతీష్, ఉరుకూటి రామచంద్రరావు, భూపతిరాజు సుజాత, సేనాపతి అప్పారావు, ఎండీ షరాఫీ, అంబటి నాగ వినాయక శైలేష్, ముట్టి సునీల్కుమార్, తుమ్మలూరి జగదేష్ రెడ్డి, నీలపు కాళిదాస్రెడ్డి, పెడాడ రమణికుమారి, బోనిఅప్పలనాయుడు, సనపల రవీంద్రభరత్, బోని శివ రామకృష్ణ, బాజీ నాయుడు, కర్రి రామారెడ్డి, శ్రీదేవి వర్మ, వంకాయల మారుతీప్రసాద్, సకలభక్తుల ప్రసాద్రావు, ఆడేపల్లి రవిబాబు, దేవరకొండ మార్కడేయులు, బోండా ఉమామహేశ్వరరావు, జి.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
రాయ్పూర్ విజయం
విశాఖ స్పోర్ట్స్ : రైల్వే గ్రౌండ్స్లో సోమవారం రాత్రి ఫ్లడ్లైట్ల వెలుతురులో జరిగిన డీఆర్ఎం కప్ ఆహ్వాన ఫుట్బాల్ టోర్నీ మ్యాచ్లో రాయ్పూర్ (ఎస్ఈసీఆర్) జట్టు సంబల్పూర్ రైల్వే జట్టుపై విజయం సాధించింది. ఏ పూల్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరు జట్లు రెండేసి గోల్స్ చేసి సమానంగా నిలిచాయి. దీంతో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేకర్ను నిర్వహించగా, రాయ్పూర్ జట్టు విజయాన్ని అందుకుంది. ఈ ఆహ్వాన ఫుట్బాల్ టోర్నీలో మొత్తం 14 జట్లు రెండు పూల్స్లో పోటీపడుతున్నాయి. -
సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్
విశాఖ సిటీ: నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న మోసగాళ్లకు మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హెచ్బీ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి వాట్సాప్ ద్వారా ‘ఆరాధ్య మిశ్రా’ అనే మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. తాను స్టాండర్డ్ చార్టర్డ్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పిన ఆ మహిళ.. 700 శాతం లాభాలు పొందవచ్చని ఆశ చూపింది. ఆమె పంపిన లింక్ ద్వారా ఫిర్యాదుదారుడు ‘ఎస్ఎల్ ఎలైట్’ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని, ఐపీవోలు, షేర్లు, ఇండెక్స్ ట్రేడింగ్లో మొత్తం రూ. 32 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. అయితే తరువాత నగదు విత్డ్రా చేయాలనుకున్నప్పుడు, అదనపు సర్వీస్ ట్యాక్స్, ప్రాసెసింగ్ చార్జీలు చెల్లించాలని రావడంతో తాను మోసపోయినట్లు గ్రహించి, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంక్ లావాదేవీలను పరిశీలించగా, మ్యూల్ బ్యాంకు అకౌంట్లను సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన విజయవాడకు చెందిన అడుసుమిల్లి శివరాంప్రసాద్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇతడి ద్వారా మరి కొంతమంది నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న వారికి బ్యాంకు అకౌంట్లు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు సమాచారం రాబట్టారు. ప్రస్తుతం వారిపై నిఘా పెట్టారు. -
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
మహారాణిపేట : పీజీఆర్ఎస్ వేదికగా ప్రజలు సమర్పించే వినతుల పరిష్కార క్రమంలో వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టవద్దని, తూతూమంత్రపు చర్యలతో సరిపెట్టవద్దని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించిన సందర్భంగా ఆయన పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధికారులు బాధ్యతగా, జవాబుదారీతనంతో పని చేయాలని, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం, అమర్యాదగా ప్రవర్తించడం, గంటల తరబడి వేచి ఉంచడం చేయకూడదని కలెక్టర్ హెచ్చరించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలు తమ పనితీరు మార్చుకోవాలని, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఫిర్యాదులను నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని సూచించారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు తమ చర్యలను పునఃసమీక్షించుకోవాలని హితవు పలికారు. ఫిర్యాదుల స్థితిగతులను ప్రజలకు తెలియజేయాల్సిన కనీస బాధ్యత అందరిపై ఉంటుందని పేర్కొన్నారు. సర్వే రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు వాటికందిన ఫిర్యాదులను, తీసుకున్న చర్యలను పునఃపరిశీలించుకోవాలని సూచించారు. సోమవారం పీజీఆర్ఎస్కు ప్రజల నుంచి 299 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 132, జీవీఎంసీకి 76, పోలీస్ విభాగానికి సంబంధించినవి 24, ఇతర విభాగాలకు చెందినవి 67 వినతులు ఉన్నాయి. కలెక్టర్తోపాటు ఇంచార్జి డీఆర్వో సత్తిబాబు, ఇంచార్జి ఆర్డీవో ప్రజల నుంచి ఈ వినతులను స్వీకరించగా, అన్ని విభాగాల జిల్లాస్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భర్తను భుజంపై మోసుకుంటూ.. తన కుటుంబాన్ని పోషించడానికి, నివాసం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ.. వేదుళ్లనరవ ప్రాంతానికి చెందిన గృహిణి బి. శాంత సోమవారం కలెక్టరేట్కు చేరుకుంది. దివ్యాంగుడైన భర్తను భుజంపై మోసుకుని నేరుగా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ వద్దకు వెళ్లింది. తమకు నివాసం కోసం స్థలం కేటాయించడంతో పాటు, కుటుంబ పోషణ నిమిత్తం రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ గృహిణి తన భర్తను మోసుకొని కలెక్టర్ను కలవడానికి వచ్చిన దృశ్యం, వారి దీన పరిస్థితికి అద్దం పట్టింది. సొంత ప్రాంతంలోనే స్థలం ఇవ్వాలి వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా దూరంగా కేటాయించిన స్థలం వద్దని పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో నివసిస్తున్న వాడపల్లి సంజీవి అనే వృద్ధురాలు కలెక్టర్ను వేడుకుంది. దివ్యాంగుడైన తన కుమారుడితో కలిసి కలెక్టర్ హరేందిర ప్రసాద్ను కలిసిన ఆమె, అనకాపల్లి మండలంలో మంజూరు చేసిన ఇంటి స్థలం తమకు చాలా దూరం కావడం వల్ల ఉపయోగం లేదని తెలిపింది. తన పరిస్థితిని, వృద్ధాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తాను నివసిస్తున్న రెడ్డిపల్లిలో గానీ, పద్మనాభం మండలంలో గానీ స్థలం కేటాయిస్తే ఇల్లు కట్టుకుంటానని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించింది. -
30న అప్పన్న ఉత్తరద్వార దర్శనం
సింహాచలం: ఈనెల 30న ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనానికి అన్నిశాఖల సమన్వయంతో ఏర్పా ట్లు చేస్తున్నట్టు దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఏర్పాట్లపై సోమవారం పలు శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. 30న తెల్లవారుజామున ఒంటి గంట నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయ, ఆరోజు 5.30 నుంచి 11 గంటల వరకు ఆలయ ఉత్తర రాజగోపురంలో వైకుంఠ ద్వార ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తామన్నారు. 40 వేల మందికి పైగా భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి వస్తారని అంచనా వేసినట్టు తెలిపారు. అన్ని దర్శన క్యూల్లో మంచినీరు అందిస్తామన్నారు. 20 వేల మంది భక్తులకు అన్నప్రసాద భవనంలో పొంగలి, పులుసు ప్రసాదం అందిస్తామన్నారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనాన్ని వీక్షించేందుకు సింహగిరిపై రిసెప్షన్ కేంద్రం, కల్యాణం గ్రౌండ్ల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేస్తామన్నారు. ఈనెల 29 రాత్రి 7 గంటల తర్వాత సింహగిరిపై బస్సులు అనుమతించమని, 30న తెల్లవారుజామున 4 గంటల నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. దేవస్థానం ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు, డిప్యూటీ ఈవో రాధ, ఈఈ రమణ, ఏసీపీ పృథ్వీతేజ్, గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్.నాయుడు, ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్, ఎకై ్సజ్, ఫైర్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
త్వరలోనే సొంత భవనంలోకి ఎన్ఐవో
రుషికొండలో నిర్మితమవుతున్న ఎన్ఐవో శాశ్వత భవనంసాక్షి, విశాఖపట్నం: దశాబ్ద కాలం సుదీర్ఘ పోరాటం తర్వాత నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐవో) ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నంలో సొంత భవనంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. తూర్పు తీరంలో సముద్ర పరిశోధనలకు ఊతమిచ్చే ఏకై క అధ్యయన సంస్థ అయిన ఎన్ఐవో కార్యాలయం 1976 నుంచి పెదవాల్తేరు బస్ డిపో సమీపంలోని అద్దె భవనంలో కొనసాగుతోంది. సుమారు రూ. 30 కోట్ల వ్యయంతో బీచ్కు ఆనుకొని రుషికొండ బే పార్క్ సమీపంలో 3.25 ఎకరాల్లో నూతన భవనం నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ భవనాన్ని జనవరి నెలలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తూర్పు తీరం.. బంగాళాఖాతంలో సముద్ర పరిశోధన కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తున్న ఎన్ఐవో... తీరప్రాంత వాతావరణం, సముద్ర అడుగుభాగంలోని ఖనిజ వనరులు, సెడిమెంట్లు, సీబెడ్ మ్యాపింగ్, అలలు, ప్రవాహాలు, మాన్సూన్, వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తుంది. అంతేకాక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల సముద్ర, తీరప్రాంత సమస్యల పరిష్కారానికి కూడా ఇది కృషి చేస్తుంది. జనవరిలో ప్రారంభోత్సవానికి సన్నాహాలు.! అవరోధాలు తొలగిన తర్వాత ఎన్ఐవో సొంత భవన నిర్మాణ పనులు ప్రారంభమై జోరుగా సాగుతున్నాయి. పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఇంటీరియర్ పనులు, అనుసంధాన రహదారి పనులు జరుగుతున్నాయి. ఎన్ఐవో భవన సముదాయానికి కేంద్ర ప్రభుత్వం రూ.30 కోట్లు మంజూరుచేస్తూ.. నిర్మాణ పర్యవేక్షణ పనులు సీపీడబ్ల్యూడీకి అప్పగించింది. కోల్కతాకు చెందిన కాంట్రాక్టర్ పనుల టెండర్ దక్కించుకున్నారు. రూ.30 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని మూడు బ్లాకుల్లో నిర్మిస్తున్నారు. పరిపాలన భవనమంతా ఒక బ్లాక్లు, రీసెర్చ్ కోసం మరో బ్లాక్, ఇతర అవసరాలకు మూడో బ్లాక్ని వినియోగించనున్నారు. ఎదురుగా ఉన్న సముద్రం నుంచి నేరుగా లేబొరేటరీకి అవసరమైనంత నీరు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సైంటిస్ట్ ఇన్చార్జ్ డా.వీవీఎస్ఎస్ శర్మ తెలిపారు. సంబంధిత కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ దొరికిన వెంటనే ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ భవనం అందుబాటులోకి వచ్చిన తర్వాత.. సముద్ర పరిశోధనల్లో మరింత పురోగతి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సముద్ర నీటిమట్టం పెరుగుదల, కాలుష్యం హెచ్చుతగ్గులు, అంతర్భాగంలో జరిగే మార్పులు అన్నీ ఇక్కడ అధ్యయనం చేస్తామని డా.శర్మ తెలిపారు. 2015లో శంకుస్థాపన జరిగినా.. సొంత భవనం కోసం ఎన్ఐవో సుదీర్ఘ కృషి చేసింది. 2015లో శంకుస్థాపన జరిగినా.. భవనం కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్జెడ్) పరిధిలో ఉండటం వల్ల అనుమతులు పొందడానికి అవస్థలు ఎదురయ్యాయి. స్థానిక ఇబ్బందులను కూడా ప్రభుత్వాల సహకారంతో పరిష్కరించుకున్న తర్వాత ఇప్పుడు కొత్త భవనం సముద్ర పరిశోధనలకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
సమస్యల పరిష్కారం కోసం ఎన్నాళ్లు తిరగాలి
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 92 వినతులు అధికారులకు అందాయి. తాము గత కొంతకాలంగా అధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఇలా ఎంత కాలం తిరిగాలని పలువురు ఫిర్యాదుదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన పౌరులు అనేక ముఖ్య సమస్యలను మేయర్, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా 29వ వార్డులోని దిబ్బలపాలెం రామాలయ వీధికి చెందిన ఒక పౌరుడు, తమ రామాలయం వద్ద ఉన్న శిథిలావస్థ భవనాన్ని తొలగించాలని, అలాగే పరిసర ఇళ్ల గోడలకు రావిచెట్టు వేర్లు పాకుతున్నందున వాటిని కూడా తొలగించాలని గతంలో రెండు మూడు సార్లు విన్నవించినట్లు తెలిపారు. దీనితో పాటు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని మరొకరు, బీటీ రోడ్లు వేయాలని ఇంకొకరు వినతిపత్రాలు సమర్పించారు. నగరంలో ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయని ఇంకో పౌరుడు ఫిర్యాదు చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, ప్రధాన సిటీ ప్లానర్ ప్రభాకరరావు, డీసీఆర్ శ్రీనివాసరావు, డీడీహెచ్ దామోదరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, స్పోర్ట్స్ డైరెక్టర్ ఇఏ రాజుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జీవీఎంసీ పీజీఆర్ఎస్పై నగరవాసుల అసంతృప్తి -
చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేయాలని చూస్తున్నారు
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేదలకు కూడా వైద్య విద్య, వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు నిర్మిస్తే.. చంద్రబాబు మాత్రం వాటిని కార్పొరేట్లకు దోచిపెట్టాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురుసాల కన్నబాబు మండిపడ్డారు. ప్రజల సొమ్ము, ఆస్తులను ధారాదత్తం చేయడానికి సిగ్గనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సీనియార్టీ అంతా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడమేనా.. విశాఖ అంటే అంత తేరగా, ఉత్తరాంధ్ర అంత చవకగా కనిపిస్తుందన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు అత్తింటి ఆస్తిలాగా అమ్మేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఉంటారా? విశాఖలో ఎకరం 99 పైసలకు ఇస్తున్న చంద్రబాబు, పేదల ఇళ్లకు గజం రూ.99కి ఇస్తారా? అని ప్రశ్నించారు. 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఈ కాలేజీలను వెనక్కు తీసుకుని ప్రభుత్వమే నడిపిస్తుందన్నారు. విశాఖలో చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని విశాఖలో ఆస్తులు ముట్టుకోవాలనుకున్నా.. ప్రైవేటు వారికి కట్టబెట్టాలనుకున్నా భయపడేలా ఇక్కడున్న ప్రజలు గళమెత్తాలన్నారు. -
స్కేటింగ్ మారథాన్ విజేతలు ఆనంద్, విశ్వనాథ
విశాఖ స్పోర్ట్స్ : ముడసర్లోవ గోల్ఫ్ క్లబ్ సమీపంలోని రోడ్డుపై జరిగిన జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ చివరిదైన 42 కిలోమీటర్ల మారథాన్ పరుగు పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. మాస్టర్స్, జూనియర్స్, సీనియర్స్ మెన్, ఉమెన్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. మెన్ మారథాన్లో స్కేటింగ్ ప్రపంచ చాంపియన్గా ఇప్పటికే పేరుగాంచిన ఆనందకుమార్ వేల్కుమార్ (తమిళనాడు) 1:14:00 గంటల్లో రేసు పూర్తి చేసి జాతీయ విజేతగా నిలిచాడు. తమిళనాడుకు చెందిన జీవన్రాజ్ ద్వితీయ స్థానంలో, విష్ణు ప్రసాద్ (పుదుచ్చేరి) తృతీయ స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో తమన్నా సైనీ (జమ్మూ కాశ్మీర్) 1:40:09 గంటల్లో పూర్తిచేసి విజేతగా నిలవగా, వర్షిణి అపర్ణ (కర్ణాటక) ద్వితీయ స్థానంలో, అనుష్కా మెహతా (గుజరాత్) తృతీయ స్థానంలో నిలిచారు. 35+ మాస్టర్స్ విభాగంలో రాఘవేంద్ర విశ్వనాథ (కర్ణాటక) విజేతగా, అర్జున్ నిచానీ (మహారాష్ట్ర) ద్వితీయ స్థానంలో, శ్రావణ్ కుమార్ (తెలంగాణ) తృతీయ స్థానంలో నిలిచారు. పోటీల ముగింపు సందర్భంగా రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, కార్యదర్శి పి.థామస్, సమాఖ్య ప్రతినిధి భగీరథ్ సహా నిర్వాహక ప్రతినిధులు లక్ష్మణ్, రవి.. పోటీలను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముగిసిన జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ -
2029లో ఆ కాలేజీలను ప్రభుత్వపరం చేస్తాం
చేతకాని దద్దమ్మ చంద్రబాబు సర్కార్ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించడం దారుణమని విశాఖ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ అన్నారు. జగన్ చదువునిచ్చి అందరినీ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దితే.. చంద్రబాబు మాత్రం యువతను అడుక్కునేలా చేస్తున్నారన్నారు. పేద విద్యార్థులకు జ్ఞానం ఇవ్వాలని జగన్ సంకల్పిస్తే.. చంద్రబాబు వారి నోటి నుంచి చదువును దూరం చేస్తున్నారని వాపోయారు. ఇవి కేవలం ఇంకుతో పెట్టిన సంతకాలు కాదు.. సరిహద్దుల్లో రక్తం చిందించే సైనికుల కంటే విలువైన ఇంకుతో పెట్టిన సంతకాలన్నారు. గవర్నర్ గారు చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా చేయండి. 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని, ప్రైవేటు చేస్తున్న కాలేజీలన్నింటినీ ప్రభుత్వపరం చేస్తారన్నారు. -
దుష్ట ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు
చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యంగా ఉన్నారు కానీ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేకపోయారని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడు కదిరి బాబూరావు అన్నారు. జగన్ ఒక టర్మ్లో రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలను నిర్మించారు.. ఇప్పుడు వాటిని పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించడం దారుణమన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే సీట్లను ధనవంతులే కొనుక్కుంటారని తెలిపారు. పేదలకు వైద్య విద్యను దూరం చేయడం దుర్మార్గమని అన్నారు. చంద్రబాబు నిర్ణయం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.. మాజీ సీఎం పిలుపుతో లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న రాజుల్లో ప్రజలే చంద్రబాబుకు గట్టి బుద్ధి చెబుతారన్నారు. -
క్రీడా సముదాయం, కళావాణి ఆడిటోరియం స్వాధీనం
సీతంపేట: లీజు ఒప్పందాల నిబంధనలు పాటించనందున, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (వీపీఏ) అక్కయ్యపాలెంలోని పోర్టు స్టేడియం, సాలిగ్రామపురంలో ఉన్న నెహ్రూ క్రీడా, సాంస్కృతిక సముదాయంలోని క్రీడా సముదాయం, అలాగే కళావాణి ఏ/సీ ఆడిటోరియంను సోమవారం తిరిగి స్వాధీనం చేసుకుంది. క్రీడా సముదాయాన్ని గతంలో ఎం.ఎస్ విశ్వనాథ్ స్పోర్ట్స్, కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు, కళావాణి ఆడిటోరియంను ఎం.ఎస్ విశ్వనాథ్ అవెన్యూస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్కు లీజుకు ఇచ్చారు. లీజు నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వీపీఏ సెప్టెంబర్ 11న రద్దు నోటీసులను జారీ చేసింది. అవసరమైన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ అధికారుల సమక్షంలో పోర్టు అథారిటీ సోమవారం వీటిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ ప్రక్రియ చట్ట ప్రకారం నిర్వహించినట్టు పోర్టు అథారిటీ పేర్కొంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఈ సౌకర్యాల రక్షణకు చర్యలు తీసుకొని, భవిష్యత్తు వినియోగంపై వీపీఏ పరిశీలించనుందని తెలిపింది. రోడ్డున పడ్డ కుటుంబాలు విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లీజు రద్దు చేసి స్వాధీనం చేసుకోవడంతో.. అందులో పనిచేస్తున్న సుమారు 250 కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి. పర్యాటకులను ఆకర్షించే విధంగా కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసిన ఈ స్టేడియంలో ఫన్ గేమ్స్, అడ్వెంచర్ గేమ్స్, స్నో వరల్డ్, వాటర్ పార్క్, ఫుడ్ జోన్, గో కార్టింగ్, స్విమ్మింగ్ పూల్, 12డి థియేటర్ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బెస్ట్ యూనిక్ టూరిజం ప్రాజెక్టుగా అవార్డులు కూడా అందుకుంది. హఠాత్తుగా పోర్టు అథారిటీ ఈ సముదాయాన్ని మూసివేయడంతో తమకు అన్యాయం జరిగిందంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు. -
వీఐపీ రోడ్డులో సౌత్ ఇండియా షాపింగ్మాల్ ప్రారంభం
బీచ్రోడ్డు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్, విశాఖలోని వీఐపీ రోడ్లో తన 38వ షోరూమ్ను ఘనంగా ప్రారంభించింది. ప్రముఖ సినీతార కీర్తి సురేష్ జ్యోతిని వెలిగించి నూతన షోరూమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైవిధ్యభరితమైన కలెక్షన్లతో ఈ షోరూమ్ పండగ వాతావరణాన్ని ముందుగానే తీసుకువచ్చిందని, ఇది ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆర్.ఎస్. బ్రదర్స్ రిటైల్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్లు వైజాగ్ ప్రజలకు స్వాగతం పలుకుతూ కుటుంబంలోని అన్ని తరాల వారి అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. సంస్థ చైర్మన్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ షోరూమ్ ద్వారా 38వ మైలురాయిని చేరుకోవడం ఆనందదాయకమని, వైజాగ్ వాసుల అభిరుచులను ప్రతిబింబించే వైరెటీలను అందిస్తామని చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్ సీర్ణ రాజమౌళి మాట్లాడుతూ రాబోయే పండుగలకు మరింత శోభనిచ్చే షాపింగ్ అనుభూతిని ఈ కొత్త షోరూమ్ తప్పకుండా అందజేస్తుందని హామీ ఇచ్చారు. హోల్టెం డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు మాట్లాడుతూ, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలకు అనువైన అన్ని రకాల వైరెటీలు తమ షోరూమ్లో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వైజాగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సంప్రదాయం మొదలుకుని సరికొత్త ఫ్యాషన్లను మేళవిస్తూ, పండగ చీరెలు, పట్టు వైరెటీలు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఎథ్నిక్ వేర్, ఇండో–వెస్ట్రన్ కేటగిరీల కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, గణబాబు పాల్గొన్నారు. -
నగరంలో ‘గుర్రం పాపిరెడ్డి’
బీచ్ రోడ్డు : డార్క్ కామెడీ, నవ్వులు, ట్విస్టులతో రాబోతున్న ‘గుర్రం పాపిరెడ్డి’ చిత్రబృందం నగరంలో సందడి చేసింది. సినిమా ప్రచారంలో భాగంగా హీరో నరేష్ అగస్త్య, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, ఇతర నటీనటులు విశాఖకు వచ్చారు. ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నరేష్, హీరోయిన్ ఫరియా మాట్లాడుతూ ఒక శవాన్ని దొంగిలించడానికి శ్రీశైలం అడవిలోకి వెళ్లిన నలుగురు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో జరిగే గందరగోళం, అనూహ్య మలుపులు, హాస్యాన్ని మేళవించి సినిమాను రూపొందించినట్లు చెప్పారు. లెజెండరీ నటుడు బ్రహ్మానందం న్యాయమూర్తి పాత్రలో, అలాగే తమిళ నటుడు యోగిబాబు కీలక పాత్ర పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందన్నారు. ఈ చిత్రానికి మురళి మనోహర్ దర్శకత్వం వహించగా, వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ సంయుక్తంగా నిర్మించారన్నారు. -
నేటి నుంచి ఏఐసీటీఈ అటల్ వాణి సదస్సు
మురళీనగర్: అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆధ్వర్యంలో కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అటల్ వాణి జాతీయ సదస్సు మంగళ, బుధవారాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సదస్సు కోఆర్డినేటర్ డాక్టర్ కె.నారాయణరావు తెలిపారు. సోమవారం పాలిటెక్నిక్ కాలేజీలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నకుమార్తో కలిసి బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘డిజిటల్ మేకోవర్ ఇన్ ఇంజినీరింగ్ అప్లికేషన్స్–ఇన్నోవేషన్, టెక్నాలజీ అండ్ సస్టైనబిలిటీ’ అనే అంశంపై నిపుణులు చర్చిస్తారన్నారు. స్థానిక భాషల ద్వారా సాంకేతిక విజ్ఞానాన్ని ప్రజల జీవన విధానంతో అనుసంధానం చేయడం ఏఐసీటీ అటల్ వాణి ప్రధాన ఉద్దేశమన్నారు. సదస్సులో దేశవ్యాప్తంగా అధ్యాపకులు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు, పీజీ విద్యార్థులు, పరిశోధన పండితులు మొత్తం 60 అత్యున్నత స్థాయి శాసీ్త్రయ పరిశోధనా పత్రాలను ప్రదర్శిస్తారన్నారు. వివిధ విశ్వవిద్యాలయాలు, ప్రముఖ పరిశ్రమల నుంచి 10 మంది నిపుణుల ప్రసంగాలు ఉంటాయన్నారు. సదస్సుకు కో–కోఆర్డినేటర్లుగా సీనియర్ లెక్చరర్ డాక్టర్ రాజు చిట్ల, లెక్చరర్ భరణి మారోజు వ్యవహరిస్తారు. మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ కె.ఫణికృష్ణ పర్యవేక్షిస్తారు. -
ప్రతి మహిళా సంపన్నురాలు కావాలి
మద్దిలపాలెం: రాష్ట్రంలో ప్రతి మహిళా సంపన్నురాలు కావాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రతి జిల్లాలో రూ. 5 కోట్లతో క్లస్టర్ విధానాన్ని తీసుకొస్తామని, రూ. 10 కోట్లతో కామన్ స్పెషాలిటీ సెంటర్ను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సోమవారం డీఆర్డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజార్ – 2025ను స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, విజయనగరం డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జునలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ కల్పించాలనే ఉద్దేశంతోనే సరస్ వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ప్రదర్శనలో 250 స్టాళ్లు ఏర్పాటు చేశామని, బ్యాంకర్లు, నాబార్డు ప్రోత్సాహం అందించాయని తెలిపారు. మహిళలకు అన్ని రకాల వసతులు కల్పించామని, ప్రజలకు ఆహ్లాదం అందించేలా సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా వివిధ బ్యాంకర్లకు, దాతలకు అతిథుల చేతుల మీదుగా సత్కారం చేసి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.సరస్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -
యురేకా...
విజేతలు వీరే... ● 42 కిలోమీటర్ల మారథాన్ పురుషుల విభాగంలో కెబేడ గుమెస్సా 2.29గంటల 39 సెకన్లలో పరుగు పూర్తి చేసి విజేతగా నిలిచారు. ఆ తర్వాత పి. రామ్వెట్టి 2.29గంటల 47 సెకన్లలో, స్టీఫెన్ 2.37గంటల 20 సెకన్లలో పూర్తి చేసి రన్నరప్లుగా నిలిచారు. ● 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ (సబ్మైరెన్ హాఫ్ మారథాన్) మహిళల ఓపెన్ విభాగంలో సంగమిత్ర మెహతా 1.27 గంటల 41 సెకన్లలో పరుగు పూర్తి చేసి విజేతగా నిలిచారు. ఎం. ఉమ, జ్యోతిదుర్గ రన్నరప్ స్థానాలను దక్కించుకున్నారు. 35–50 ఏళ్ల వారి విభాగంలో హర్మీత్, 50+ విభాగంలో అమర్జీత్ విజేతలుగా నిలిచారు. ● 10 కిలోమీటర్ల పరుగు (ఎయిర్క్రాఫ్ట్ రన్) మహిళల విభాగంలో విశాఖకు చెందిన అథ్లెట్ ఎల్. మెర్సీగ్రేస్ 43.10 సెకన్లలో పరుగును పూర్తి చేసి విజేతగా నిలిచారు. ఆమె రూ.25,000 ప్రోత్సాహకాన్ని అందుకున్నారు. టి. వాణి, సౌమ్య రన్నరప్ స్థానాలను దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో ప్రశాంత్ 32 నిమిషాల 54 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలవగా, ఎం. హరీష్, సూర్యజిత్ రన్నరప్లుగా నిలిచారు. ఉరిమే ఉత్సాహం.. -
నేడు ఏపీ పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు
మహరాణిపేట: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం, జెడ్పీ యూనిట్ ఎన్నికలు సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి జరగనున్నాయి. జెడ్పీ ప్రాంగణంలోని పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం భవనంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి డి. సీతారామరాజు ఒక ప్రకటనలో తెలియజేశారు. జెడ్పీ, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ విభాగాలలో పనిచేస్తున్న మినిస్టీరియల్ ఉద్యోగులందరూ ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా రిటైర్డు ఎంపీడీవో యు. కుర్మారావు వ్యవహరించనున్నారు. -
కోటి సంతకాల ఉద్యమ ర్యాలీకి తరలిరండి
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ ప్రజా ఉద్యమం విజయవంతమైందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. రెండు నెలలుగా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని, లక్ష్యాన్ని మించి కోటి సంతకాలను సేకరించామని ఆయన పేర్కొన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సేకరించిన ఈ కోటి సంతకాల పత్రాలను సోమవారం జిల్లా పార్టీ కార్యాలయం నుంచి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించనున్నామన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంతకాల పత్రాల ప్రదర్శన, అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వాటిని తరలిస్తామని తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని కేకే రాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, రాజ్యసభ్యుడు గొల్ల బాబురావు, పార్లమెంట్ పరిశీలకులు కె.బాబూరావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు, కుంబా రవిబాబు, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్కుమార్, మళ్ల విజయప్రసాద్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్రెడ్డి హాజరుకానున్నారు. ర్యాలీ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి సీఎంఆర్ సెంట్రల్ జంక్షన్ వరకు సాగుతుందన్నారు. ర్యాలీలో ప్రజలు, యువత, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
పెద్ద మనసు చాటుకున్న వాసుపల్లి
డాబాగార్డెన్స్: బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన నెల్లిమర్లకు చెందిన 9 మంది మత్స్యకారుల కుటుంబాలకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారం ఇచ్చి భరోసా కల్పించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆశీల్మెట్ట కార్యాలయంలో మత్స్యకార బాధిత కుటుంబాలను ఆదుకున్నారు. మొత్తం 9 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు చొప్పున సాయం అందించడంతో పాటు 25 కేజీల రైస్ బ్యాగ్ ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ స్పందనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్ర దేశంలో బందీగా ఉన్న వారిని విడిపించడానికి చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యాన్ని సూచిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో శత్రుదేశమైన పాకిస్తాన్ చెర నుంచి 20 మంది మత్స్యకారులను విడిపించి ఫ్లైట్లో తీసుకొచ్చి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు తక్షణ సాయం అందించిన మత్స్యకార పక్షపాతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వాసుపల్లి గుర్తు చేశారు. బాధితులు చెర నుంచి విడుదలయ్యే వరకు వారికి రేషన్ కూడా అందిస్తామని వాసుపల్లి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు లండా రమణ, గంగళ్ల రామరాజు, బొడ్డు ఆనంద్, బర్రి కొండలరావు, ఆకుల యేసు, గుంటు ఆనంద్, చోడిపిల్లి శివ, వాసుపల్లి ధనరాజు, దూడ అప్పారావు, దూడ తాతారావు, చేపల నూకరాజు, వేణు, సాగర్, ప్రసాద్, సతీష్, సూరని రాము, దూడ అప్పలరాజు, ముజీబ్ఖాన్, గురజాపు రవి, ఈతలపాక విజయ్, అరుణ, వాసు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోయినా వాసుపల్లి గణేష్కుమార్పెద్ద మనసు చాటుకోవడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. -
సంరంభానికి సిద్ధం
యుద్ధ నౌకల సాక్షి, విశాఖపట్నం : మహాసముద్రాల మధ్య స్నేహపూర్వక బంధాల్ని బలోపేతం చేసేందుకు, అంతర్జాతీయ సమన్వయం, సహకారంతో నావికాదళ పరాక్రమాన్ని చాటిచెప్పేందుకు విశాఖపట్నం సిద్ధమవుతోంది. తూర్పు నౌకాదళ కేంద్రంగా అభివృద్ధి చెందిన విశాఖ తీరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అతిపెద్ద యుద్ధ నౌకల సంరంభానికి ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు పది రోజుల పాటు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)తో పాటు మినీ ఐఎఫ్ఆర్గా పిలిచే మిలాన్–2026, ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం (ఐఓఎన్ఎస్)లను ఏకకాలంలో ఇక్కడ నిర్వహించనున్నారు. ఈ మహోత్సవం కోసం తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు ముగిశాయి. ఆరు నెలల క్రితం నుంచి ఐదుసార్లకు పైగా సమీక్షలు నిర్వహించగా.. తాజాగా శనివారం తుది ప్రణాళిక సమావేశం జరిగింది. ఈఎన్సీ హెడ్క్వార్టర్స్ ఆపరేషన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ మనోజ్ ఝా ఆధ్వర్యంలో జరిగిన ఈ తుది సమావేశానికి 60 దేశాలకు చెందిన నౌకాదళ ప్రతినిధులు ప్రత్యక్షంగా, వర్చువల్గా హాజరయ్యారు. స్నేహభావం, సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. 145 దేశాలకు ఆహ్వానం.. 2001లో భారత్లో తొలిసారి ముంబైలో ఐఎఫ్ఆర్ నిర్వహించిన సమయంలో 25 దేశాలు హాజరయ్యాయి. 2016లో విశాఖలో నిర్వహించినప్పుడు 51 దేశాలు హాజరయ్యాయి. 2025లో ఇండోనేషియాలోని బాలి సముద్ర తీరంలో ఐఎఫ్ఆర్లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో ఐఎఫ్ఆర్, మిలాన్–2026 కోసం ఇప్పటివరకూ 137 దేశాలకు ఆహ్వానం పంపించింది. ఇప్పటి వరకూ 61 దేశాలు నమోదు చేసుకున్నాయి. 61 దేశాలకు సంబంధించి 23 యుద్ధ నౌకలు రాబోతున్నా యి. మిగిలిన దేశాలు త్వరలోనే సమ్మతిని వెల్లడించే అవకాశం ఉంది. ఈ విన్యాసాల్లో భారత నావికా దళానికి చెందిన సర్ఫేస్ యుద్దనౌకలు, జలాంతర్గాములతోపాటు నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ క్లాస్, రాజ్పుత్ క్లాస్, కమోర్తా క్లాస్, విశాఖ క్లాస్, శివాలిక్ క్లుస్, బ్రహ్మపుత్ర క్లాస్, నీలగిరి మొదలైన తరగతులకు చెందిన యుద్ధ నౌకలతో పాటు జలాంతర్గాములు, యుద్ధనౌకలకు అన్నివిధాల సహకారాన్ని అందించే ఫ్లీట్ ట్యాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్, గ్రీన్టగ్స్ సత్తా చాటనున్నాయి. అలాగే కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన నౌకలు ఈ ఫ్లీట్ రివ్యూలో భాగస్వామ్యం కానున్నాయి. అత్యాధునిక సర్ఫేస్ యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఈ విన్యాసాల్లో భారత నావికాదళానికి చెందిన అత్యాధునిక సర్ఫేస్ యుద్ధనౌకలు, జలాంతర్గాములు, నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొననున్నాయి. ఇందులో ఢిల్లీ క్లాస్, రాజ్పుత్ క్లాస్, కమోర్తా క్లాస్, విశాఖ క్లాస్, శివాలిక్ క్లాస్, బ్రహ్మపుత్ర క్లాస్, నీలగిరి వంటి వివిధ తరగతులకు చెందిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో పాటు సహాయకారి నౌకలైన ఫ్లీట్ ట్యాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్ వంటివి తమ సత్తా చాటనున్నాయి. వీటితో పాటు కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వంటి సముద్ర సంస్థలకు చెందిన నౌకలు కూడా ఈ సమీక్షలో భాగస్వామ్యం కానున్నాయి. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ సహకారంతో 2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్ను, 2024 ఫిబ్రవరిలో మరోసారి మిలాన్ విన్యాసాలను విశాఖ విజయవంతంగా నిర్వహించింది. ఇప్పుడు ఐఎఫ్ఆర్కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనల కేంద్రంగా విశాఖ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుంది. ముగిసిన నౌకాదళ సన్నాహక సమావేశాలు విశాఖలో ఐ.ఎఫ్.ఆర్, మిలాన్, ఐఓఎన్ఎస్ నిర్వహణ ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు విశాఖ తీరంలో యుద్ధ వాతావరణం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ముగిసిన మూడు దఫాల సమీక్షలు సమీక్షలకు హాజరైన 60 దేశాలకు చెందిన నౌకాదళ ప్రతినిధులు ఎప్పుడు... ఎలా.. ఎవరెవరు.? ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్–2026, ఐఓఎన్ఎస్ కాంక్లేవ్ ఆఫ్ చీఫ్స్(సీవోసీ) కార్యక్రమాలు ఫిబ్రవరి 15 నుంచి 25 వరకూ విశాఖ వేదికగా వరుసగా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్) ప్రారంభం కానుంది. డాక్టేరియన్, జాయింట్ ఆపరేషన్లపై ఐఎఫ్ఆర్లో మిత్రదేశాలతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 15 నుంచి వివిధ దేశాల నుంచి యుద్ధ నౌకలు, నౌకాదళ ప్రతినిధులు విశాఖకు రానున్నారు. 18న ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఫ్లీట్ని భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సమీక్షించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ విన్యాసాలు, సదస్సు కార్యక్రమాల్లో 19వ తేదీ కీలకమైనది. ఫిబ్రవరి 19న సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పరేడ్ని బీచ్రోడ్డులో నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. అదేవిధంగా మిలాన్–2026 కూడా 19న ప్రారంభం కానుంది. దీంతో పాటు రక్షణ దళం, నౌకాదళంలో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే అంశాలపై చర్చించేందుకు ఇండియన్ ఓషన్ నేషనల్కాంక్లేవ్(ఐఓఎన్ఎస్) సదస్సుని మహాసాగర్ పేరుతో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు 25 సభ్యదేశాల చీఫ్లతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన అతిథులు రాబోతున్నారు. ఐఎఫ్ఆర్, మిలాన్లో 19 నుంచి 20 వరకూ హార్బర్ ఫేజ్ విన్యాసాలు జరుగుతాయి. 21 నుంచి 25 వరకూ సీ ఫేజ్ విన్యాసాలు నిర్వహిస్తారు. -
రన్డే
సండే..సాగరతీరంలో ఉత్సాహంగా నేవీ మారథాన్ తరలివచ్చిన వేలాది మంది ఔత్సాహికులు, క్రీడాకారులువిశాఖ స్పోర్ట్స్ : విశాఖ సాగర తీరం పరుగు వీరులతో కిక్కిరిసిపోయింది. భారత నావికాదళం ఆధ్వర్యంలో పదోసారి నిర్వహించిన వైజాగ్ నేవీ మారథాన్కు వయోబేధం లేకుండా ఔత్సాహికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లేలేత సూర్య కిరణాలు శరీరానికి వేడితో పాటు ఉత్తేజాన్నిస్తుండగా, దాదాపు పదిహేడు వేల మంది ఈ పరుగులో భాగస్వామ్యం అయ్యారు. ఈ మారథాన్లో కొందరు విదేశీ అథ్లెట్లు సైతం పాల్గొని పతకాలను సొంతం చేసుకున్నారు.నేవీ డే వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన ఈ పరుగును ఫిట్నెస్, సముద్ర ఆహ్లాద వాతావరణంపై అవగాహనతో పాటు నేవీ డే స్ఫూర్తిని పెంపొందించేందుకు నిర్వహించారు. విదేశీ అథ్లెట్లు పాల్గొన్న ఈ పోటీల్లో ముఖ్యంగా ఇథియోపియాకు చెందిన పరుగు వీరులు విజేతలుగా నిలిచారు. విశాఖలోని ఐకానిక్ ఆర్కే బీచ్ వెంబడి ఉన్న విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి నాలుగు ప్రధాన కేటగిరీల్లో పరుగు సాగింది. రన్లో పాల్గొన్నవారికి రిఫ్రెషింగ్, 12 హైడ్రేషన్ పాయింట్లతో పాటు వైద్యసౌకర్యాలు కల్పించారు. ఆరేకే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై విజేతలకు పతకాలతో పాటు నగదు ప్రోత్సాహాకాల్ని అందించారు. ఉదయం నుంచి యువతీయుకులు డ్యాన్స్లు చేస్తూ ఉర్రూతలూగించారు. 42 కిలోమీటర్ల రన్ను తూర్పు నౌకాదళ కమాండ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ప్రారంభించగా..21 కిలోమీటర్ల రన్ను నౌకాదళ కమాండ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా సతీమణి ప్రియభల్లా ప్రారంభించారు..నేవీ అధికారులు, వారి కుటుంబసభ్యులతో పాటు కలెక్టర్ హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు. -
కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు డాబాగార్డెన్స్: సీఐటీయూ 28వ ఆలిండియా మహాసభలు ఈ నెల 31 నుంచి జనవరి 4 వరకు తొలిసారిగా విశాఖలో జరగనున్నాయి. ఈ సందర్భంగా జనవరి 4న ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నిర్వహించే మహా ప్రదర్శనకు కార్మిక కుటుంబాలను పెద్ద సంఖ్యలో తరలించాలని సిటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. జగదాంబ జంక్షన్ సమీపంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాసభల విజయవంతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. జిల్లాలో ఇప్పటికే ‘శ్రామిక ఉత్సవాల’ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. సోమవారం వాడవాడలా జెండాలు ఎగురవేసి, ఫ్యాక్టరీల వద్ద, కార్మికుల కాలనీల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని ఆయన సూచించారు. స్టీల్ప్లాంట్తో సహా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ఉద్యమాలను, లేబర్ కోడ్స్ వల్ల కలిగే ప్రమాదాన్ని కార్మికులకు వివరించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు కె.లోకనాథం, ఎం.జగ్గునాయుడు, ఆర్కేఎస్వీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన సంఘాల నాయకులు కూడా హాజరై మహాసభల ఏర్పాట్ల గురించి వివరించారు. -
ఉత్సాహంగా పరుగు
పరుగు సాగిందిలా... ● 42కిలోమీటర్ల ఎయిర్క్రాఫ్ట్ కారియర్ మారథాన్ ఉదయం 4.15 గంటలకే ప్రారంభమైంది. ఇది ఐఎన్ఎస్ కళింగ వద్ద యూ టర్న్ తీసుకుని తిరిగి ప్రారంభ వేదిక వద్దకు చేరుకోవడంతో ముగిసింది. ● 21 కిలోమీటర్ల సబ్మైరెన్ హాఫ్ మారథాన్ ఉదయం 4.30 గంటలకు మొదలై, గాయత్రి కళాశాల వద్ద యూటర్న్ తీసుకుంది. ● 10 కిలోమీటర్ల ఎయిర్క్రాఫ్ట్ రన్ ఉదయం 5.30 గంటలకు ప్రారంభమై, తెన్నేటి పార్క్ వద్ద యూటర్న్ తీసుకుంది. ● 5 కిలోమీటర్ల ఫ్రిగేట్ పరుగు (సరదా పరుగు) ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. చిన్నారులు సైతం హుషారుగా పాల్గొన్నారు. ఇది కురుసురా సబ్మైరెన్ మ్యూజియం మీదుగా వైఎస్సార్ విగ్రహం చెంత యూటర్న్ తీసుకుని ముగిసింది. -
ఖైదీలకు భగవద్గీత పారాయణం
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో ఆదివారం ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ఖైదీల కోసం భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖైదీలకు ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీతలోని సారాంశాన్ని, ముఖ్య సందేశాన్ని వివరించారు. మానవ జీవితంలో సత్యం, ధర్మం పాటించడం ఎంత అవసరమో భగవద్గీత బోధనలు నిజ జీవితంలో ఎలా ఉపయోగపడతాయో వారు ఖైదీలకు సూచించారు. కారాగారంలో ఉన్నవారు తమ జీవితంలో పరివర్తన చెందడానికి, మంచి మార్గంలో నడవడానికి గీత స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఖైదీలకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సంస్థ ప్రతినిధులతో పాటు జైలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జీవీఎంసీకి ప్రతిష్టాత్మక పీఆర్ఎస్–2025 జాతీయ అవార్డులు
డాబాగార్డెన్స్: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో నిర్వహించిన 47వ అఖిల భారత పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్–2025లో జీవీఎంసీ మూడు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను సాధించింది. ఈ విషయాన్ని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ‘ఎంపవరింగ్ గ్రోత్, ప్రిజర్వింగ్ రూట్స్, పీఆర్ విజన్ ఫర్ 2047’ అనే థీమ్తో జరిగిన ఈ సదస్సులో జీవీఎంసీ అమలు చేసిన ప్రజా సంక్షేమం, మహిళా సాధికారత, ఆర్థిక బలోపేతం, సామాజికాభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా అవగాహన కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించింది. ఉత్తరాంఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, శాసనసభ స్పీకర్ రీతూ ఖండూరీ భూషణ్ చేతుల మీదుగా జీవీఎంసీ తరఫున అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, పౌర సంబంధాల అధికారి ఎన్. నాగేశ్వరరావు అవార్డులు అందుకున్నారు. -
వీరెంతో స్పెషల్!
ఏయూ క్యాంపస్: సాధన, ఏకాగ్రత, పట్టుదల.. ఇవి సాధారణ క్రీడాకారులకే ఎంతో సవాలుతో కూడుకున్న అంశాలు. అలాంటిది ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు, శారీరక, మానసిక సవాళ్లను అధిగమించి క్రీడల్లో రాణించడమంటే మాటలు కాదు. అసాధ్యం అనుకునే దానిని సుసాధ్యం చేస్తూ.. చక్రాలపై ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లారు. గెలుపోటములతో సంబంధం లేకుండా.. జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీల్లో ‘స్పెషల్’చిల్డ్రన్స్ చేసిన సందడి అందరి హృదయాలను హత్తుకుంది. నగరంలో జరుగుతున్న 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలు ఆదివారం ప్రత్యేక పోటీలకు వేదికయ్యాయి. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల(దివ్యాంగుల) కోసం సింగిల్ ల్యాప్, డబుల్ ల్యాప్ స్పీడ్ స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. 6 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి జరిగిన ఈ పోటీల్లో ఇన్లైన్, క్వాడ్ విభాగాల్లో కాళ్లకు చక్రాలు కట్టుకుని దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 15 రాష్ట్రాల నుంచి 130 మంది చిన్నారులు ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కేరళ, గుజరాత్, కర్నాటక, బిహార్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, ఒడిశా, ఛండీగఢ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ తదితర 15 రాష్ట్రాల నుంచి దాదాపు 130 మంది క్రీడాకారులు హాజరయ్యారు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఎస్ఎఫ్ఐ) గత నాలుగేళ్లుగా శారీరక వైకల్యం ఉన్న వారితో పాటు, మానసిక వైకల్యం కలిగిన చిన్నారులకు కూడా జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రోత్సహిస్తోంది. కాగా.. ఆటను ఆస్వాదించాలన్న తపన ప్రత్యేక అవసరాల గల పిల్లల్లో ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ఏడీహెచ్డీ, ఆటిజం వంటి సమస్యలున్న చిన్నారులు రింక్లో ఎంతో సమన్వయంతో స్కేటింగ్ చేస్తుంటే, గ్యాలరీలో ఉన్న వారి తల్లిదండ్రులు ఆనందంతో కేరింతలు కొట్టారు. చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం క్రీడలను ఒక థెరపీలా భావిస్తూ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. దీని వల్ల పిల్లల్లో ఏకాగ్రత, స్థిరత్వం పెరగడంతో పాటు, నలుగురిలో కలివిడిగా తిరిగే నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయని వారు తెలిపారు. స్కేటింగ్లో ఉత్సాహంగా ముందుకు సాగుతున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలుమేధో వైకల్య స్కేటింగ్ పోటీల విజేతలు వీరే.. విశాఖ స్పోర్ట్స్: ఇన్లైన్ స్పీడ్ స్కేటింగ్లో 6–8 ఏళ్ల బాలుర విభాగంలో రేయాంశ్, 10–12 ఏళ్ల క్యాడెట్ బాలుర విభాగంలో సూర్యరామ, 12–15 ఏళ్ల సబ్ జూనియర్స్ విభాగంలో రిత్విక్, 15–18 ఏళ్ల జూనియర్స్ విభాగంలో సాయి నిఖిల్ విజేతలుగా నిలిచారు. క్వాడ్ స్పీడ్ స్కేటింగ్లో 6–8 ఏళ్ల బాలుర విభాగంలో కేదార్, బాలికల విభాగంలో లిఖిత శ్రీ ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే 8–10 ఏళ్ల క్యాడెట్ విభాగంలో ఉజ్వల్ శ్రీనివాస్, ధార్మిక, 10–12 ఏళ్ల క్యాడెట్ విభాగంలో సాధిక్, చెన్నకేశవ, 15–18 ఏళ్ల జూనియర్ విభాగంలో సిద్ధార్థ్ తమ ప్రతిభను కనబరిచారు. -
అబ్బాయిలో సానుకూల మార్పు వస్తోంది
మా అబ్బాయికి ఏడీహెచ్డీ, ఆటిజం సమస్యలు ఉన్నాయని గుర్తించి, వైద్యుల సూచన మేరకు స్కేటింగ్లో చేర్పించాం. 8 ఏళ్లుగా సాధన చేస్తున్నాడు. క్రీడలను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం ఇది మూడోసారి. గతంలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించాడు. శారీరక వయసు 14 ఏళ్లు అయినా, మానసిక వయసు 8 ఏళ్లే. కానీ క్రీడల వల్ల ఇప్పుడు అందరితో కలవడం, మాట్లాడటం, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు. – ఎం.నరసింహరాజు, క్రీడాకారుడి తండ్రి -
వ్యక్తిపై కార్పొరేటర్ మూర్తియాదవ్ అనుచరుడి దాడి?
ఎంవీపీకాలనీ: మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు దేవర శంకర్పై రౌడీషీటర్ భోగ రవిశంకర్ రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి కళాభారతి రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి. బాధితుడు దేవర శంకర్ శనివారం రాత్రి కళాభారతి రోడ్డులో ఉండగా, రౌడీషీటర్ రవిశంకర్ ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో శంకర్.. రవిశంకర్ను చూపిస్తూ పరుష పదజాలంతో దూషించాడు. దీంతో ఆవేశానికి లోనైన రవిశంకర్ వెనక్కి వచ్చి దేవర శంకర్పై ఇనుప రాడ్డుతో బలంగా దాడి చేశాడు. ఈ దాడిలో శంకర్ దవడ ఎముక, పళ్లు విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎంవీపీ సీఐ ప్రసాద్ తెలిపారు. రవిశంకర్పై గతంలోనే రౌడీషీట్ ఉందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా.. రౌడీ షీటర్ రవిశంకర్ 22వ వార్డు కార్పొరేటర్ మూర్తియాదవ్కు అనుచరుడిగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కార్పొరేటర్ మూర్తియాదవ్కు, బాధితుడు దేవర శంకర్కు మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. వార్డులో జరుగుతున్న అక్రమాలను శంకర్ సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి కళాభారతి రోడ్డులో ఉన్న అతనిపై రౌడీషీటర్ రవిశంకర్ ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉన్న స్థానికులు శంకర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. అయితే మూర్తియాదవ్పై ఇప్పటికే స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉండగా తాజా అతని అనుచరుడైన రౌడీషీటర్.. శంకర్పై భౌతికదాడులకు దిగడం స్థానికులను మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
విశేష స్పందన
‘సాక్షి’ స్పెల్ బీ సెమీ ఫైనల్స్కుసీతంపేట: ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘స్పెల్ బీ 2025–26’ సెమీఫైనల్ పోటీలకు విశేష స్పందన లభించింది. సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్లోని శ్రీవిశ్వ స్కూల్లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నాలుగు కేటగిరీల్లో ఈ పోటీలు జరిగాయి. రీజనల్ లెవెల్లో జరిగిన ఈ పోటీల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి పలు పాఠశాలలకు చెందిన 120 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు నాలుగు కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. 40 నిమిషాల వ్యవధితో, 40 మార్కులకు ఈ పరీక్ష జరిగింది. ఇందులో గెలుపొందిన విజేతలు హైదరాబాద్లో జరగనున్న ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీలకు ‘డ్యూక్స్ వేఫీ’ప్రధాన స్పాన్సర్గా, ‘ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్(రాజమండ్రి)’అసోసియేట్ స్పాన్సర్గా వ్యవహరించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా ‘సాక్షి’ స్పెల్ బీ పోటీలు దోహదపడుతుండటంతో.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్వయంగా పిల్లలను పరీక్ష కేంద్రాలకు తీసుకువచ్చారు. దీంతో శ్రీవిశ్వ స్కూల్ ఆవరణ సందడిగా మారింది. ఈ పోటీలను ‘సాక్షి’ విశాఖ బ్రాంచి మేనేజర్ వి.వి.ఎస్.చంద్రరావు పర్యవేక్షించగా, శ్రీ విశ్వ విద్యాసంస్థల చైర్మన్ కె.ధర్మరాజు, డైరెక్టర్ పి.సూర్యనారాయణ పాల్గొన్నారు.భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి ‘సాక్షి’స్పెల్ బీ పోటీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా ఒకసారి హాజరయ్యాను. స్పెల్ బీ వల్ల ఉచ్చారణ, భాషాజ్ఞానం పెరుగుతాయి. కొత్త పదాలు తెలుస్తాయి. ప్రతి విద్యార్థి ఇందులో పాల్గొనడం వల్ల, ముఖ్యంగా తెలుగు మాధ్యమం విద్యార్థులు తమ ఇంగ్లిష్ స్పెల్లింగ్ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు. – పి.జీవన్ కుషాల్, వేపగుంట క్రమం తప్పకుండా పోటీలు విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించేలా ‘సాక్షి’మీడియా ఏటా స్పెల్బీ, మ్యాథ్స్బీ పోటీలు నిర్వహిస్తోంది. ఈసారి సెమీఫైనల్ పోటీలకు మా పాఠశాల వేదిక కావడం సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటువంటి పోటీల వల్ల ఇంగ్లిష్, మ్యాథ్స్లో వారు మరింత పట్టు సాధించగలరు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇటువంటి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. – ఎ.ఆర్.కె.శివాజీ, డైరెక్టర్, శ్రీవిశ్వ స్కూల్ ఇంగ్లిష్పై పట్టు సాధించవచ్చు ‘సాక్షి’పేపర్లో ప్రకటన చూసి, మా స్కూల్ టీచర్లు చెప్పడంతో పలాస నుంచి స్పెల్ బీ సెమీఫైనల్ పోటీలకు హాజరయ్యాను. ఇంగ్లిష్ పదాల ఉచ్చారణ, కొత్త పదాలు నేర్చుకున్నాను. ఇంగ్లిష్ వకాబులరీ, ఫోనిక్స్, సౌండ్స్పై అవగాహన పెంచుకుని భాషపై పట్టు సాధించడానికి ‘సాక్షి’నిర్వహించిన ఈ పోటీలు ఎంతగానో సహాయపడతాయి. – దాసరి తేజేశ్వరరావు, 8వ తరగతి, పలాస ఫైనల్స్కు వెళ్తానన్న నమ్మకం ఉంది నేను శ్రీకాకుళంలో 8వ తరగతి చదువుతున్నాను. ఇప్పటి వరకు నిర్వహించిన రౌండ్లలో గెలుపొంది, ఇప్పుడు సెమీ ఫైనల్ పోటీకి చేరుకోవడం ఆనందంగా ఉంది. ఇంగ్లిష్ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి స్పెల్ బీ ఎంతో ఉపయోగపడుతుంది. – రౌతు చైతన్య, 8వ తరగతి, శ్రీకాకుళం -
కొనసాగిన ఆపరేషన్ లంగ్స్ 2.0
319 ఆక్రమణల తొలగింపు డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో చేపట్టిన ‘ఆపరేషన్ లంగ్స్ 2.0’రెండో రోజైన ఆదివారం కూడా కొనసాగింది. నగరంలోని అన్ని జోన్ల పరిధిలో ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, కట్టడాలను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఎనిమిది జోన్లలో కలిపి ఆదివారం ఒక్క రోజే మొత్తం 319 ఆక్రమణలను తొలగించినట్లు ప్రధాన సిటీ ప్లానర్ ప్రభాకరరావు వెల్లడించారు. జోన్–1లో క్లాక్ టవర్ నుంచి తగరపువలస జంక్షన్ వరకు 20, జోన్–2లో ఎండాడ నుంచి రుషికొండ 100 అడుగుల రోడ్డు వరకు 60, జోన్–3లో స్పోర్ట్స్ ఎరీనా నుంచి బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ వరకు, అలాగే మహాలక్ష్మీ అపార్టుమెంట్ నుంచి జాతీయ రహదారి(శివాజీ పార్క్ రోడ్డు) వరకు 42, జోన్–4లో లీలామహాల్ జంక్షన్ నుంచి సౌత్జైల్ రోడ్డు వరకు 27, జోన్–5లో ఇండస్ట్రీయల్ ఎస్టేట్ నుంచి మర్రిపాలెం జంక్షన్ వరకు 34, జోన్–6లో శ్రీనగర్ నుంచి దుర్గానగర్ రోడ్డు, బీసీ రోడ్డు జంక్షన్ నుంచి గంగవరం పోర్టు వరకు 53, జోన్–7లో ఎన్టీఆర్ విగ్రహం నుంచి చింతా వారి వీధి వరకు 18, జోన్–8లో ఆర్ఆర్ వెంకటాపురం నుంచి వేపగుంట వరకు, వేపగుంట జంక్షన్ నుంచి గోపాలపట్నం జంక్షన్ వరకు, అలాగే రైల్వేస్టేషన్ రోడ్డు వరకు మొత్తం 65 ఆక్రమణలను తొలగించినట్లు ప్రధాన సిటీ ప్లానర్ తెలిపారు. -
కనకమహాలక్ష్మి సేవలో నటి శ్రీలీల
డాబాగార్డెన్స్: సినీ నటి శ్రీలీల ఆదివారం విశాఖ ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికిన అర్చకులు.. ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారికి విశేష పూజలు చేయించారు. అనంతరం వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందించగా, ఆలయ ఈవో శోభారాణి అమ్మవారి శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అప్పన్న సన్నిధిలో శ్రీలీల సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం సినీ నటి శ్రీలీల దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో అర్చకులు అష్టోత్తరంపూజ నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రసాదం, శేషవస్త్రాలను సూపరింటిండెంట్ సత్య శ్రీనివాస్ అందజేశారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
ఎంవీపీకాలనీ: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్రావు విమర్శించారు. ఆదివారం ఎంవీపీ కాలనీలోని ఎల్ఐసీ ఐక్యతా భవన్లో జరిగిన యూటీఎఫ్ విశాఖపట్నం జిల్లా 50వ కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా 12వ పీఆర్సీని అమలు చేయకపోవడం, కనీసం చైర్మన్ను కూడా నియమించకపోవడం విచారకరమన్నారు. పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లు దాటిందని, ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలలో ఒక్క డీఏ మాత్రమే చెల్లించారని మండిపడ్డారు. 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహించడం, టెట్ కత్తిని వేలాడదీయడం వంటి అరాచకాలు ప్రభుత్వం పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి టీఆర్ అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు.


