సీతంపేట: అభ్యుదయ రచయితల సంఘం(అరసం) విశాఖ శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య చందు సుబ్బారావు మృతి పట్ల అరసం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. విశాఖ అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల అప్పలరాజు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చందన చర్చిత, కవికి విమర్శకుడు శత్రువు కాడు, అరసంతో అర్ధ శతాబ్ది వంటి గొప్ప రచనలు చేసిన వ్యక్తి చందు సుబ్బారావు అని, ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు.
ఉపాధ్యక్షుడు ఎస్.హనుమంతరావు, ప్రతినిధులు పి.శ్యామసుందర్, బసు పోతన కూడా ఆచార్య సుబ్బారావు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. అనేక గొప్ప కథలు, నవలలు రాసిన రచయితను, వేలకొద్దీ ప్రసంగాలు చేసిన గొప్ప అభ్యుదయవాదిని కోల్పోవడం సాహితీ రంగానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. అలాగే, ఆచార్య చందు సుబ్బారావు హేతుబద్ధమైన విమర్శకుడని, అభ్యుదయ మానవతావాది అని ప్రముఖ సాహితీ విమర్శకుడు డాక్టర్ డి.వి.సూర్యారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మృతి తెలుగు సాహితీ లోకానికి తీరని లోటన్నారు.


