బలూచిస్తాన్.. పాక్లోని ఈ రాష్ట్రం అపార సహజ సంపదకు నిలయం. అయినా దారిద్య్రం నీడలో మగ్గుతున్న ఈ గడ్డపై ఇప్పుడు విముక్తి నినాదం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. పాకిస్తాన్ సైనిక ఉక్కుపాదం కింద నలిగిపోతున్న బలూచ్ ప్రజల పోరాటం.. కేవలం భూభాగం కోసమే కాదు, అది వారి అస్తిత్వానికి సంబంధించినది. అంతర్గత కల్లోలాలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల మధ్య నలిగిపోతున్న ఈ ప్రాంతానికి నిజంగానే విముక్తి లభిస్తుందా? లేదా ఈ మంట ఇలానే రగులుతుటుందా? ఇదే ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న.
భూభాగంలో 44 శాతం వాటా
పాకిస్తాన్లోని మొత్తం భూభాగంలో 44 శాతం వాటా కలిగిన బలూచిస్తాన్ గత కొన్ని దశాబ్దాలుగా తీవ్రమైన అశాంతికి గురవుతోంది. ఈ ప్రాంతంలో వేర్పాటువాద గ్రూపులు స్వయంప్రతిపత్తితో పాటు సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం దాడులను ముమ్మరం చేస్తున్నాయి. అపారమైన సహజ వనరులు ఉన్నప్పటికీ, తమ ప్రాంతం వెనుకబడి ఉందన్న అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.
మహిళలు సైతం తిరుగుబాటు
బలూచ్ తిరుగుబాటుదారులు కఠినమైన పర్వత ప్రాంతాలను ఆసరాగా చేసుకుని, ఆధునిక ఆయుధాలతో పాక్ భద్రతా బలగాలకు సవాలు విసురుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ పోరాటంలో మహిళలు ఆత్మహుతి దాడులకు సైతం సిద్ధపడటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం అక్కడి సామాజిక అసంతృప్తి ఎంతగా ఉందో స్పష్టం చేస్తోంది.
కీలక సరిహద్దులతో ప్రత్యేక గుర్తింపు
సుమారు 3,47,190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న బలూచిస్తాన్.. విస్తీర్ణంలో భారత్లోని ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల ఉమ్మడి వైశాల్యం కంటే పెద్దది. దీనికి పశ్చిమాన ఇరాన్, ఉత్తరాన ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులు ఉన్నాయి. భారత్తో నేరుగా సరిహద్దు లేనప్పటికీ, అరేబియా సముద్ర తీరంలోని 770 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం దీనికి అంతర్జాతీయ ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది.
చైనా ప్రయోజనాలు
బలూచిస్తాన్లోని గ్వాదర్ నౌకాశ్రయం అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైనదిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా చైనా చేపట్టిన ‘చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్’(సీపీఈసీ) ప్రాజెక్టు ఇక్కడి నుంచే సాగుతుంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’కు ఇది సమీపంలో ఉండటంతో, ఈ ప్రాంతంపై పట్టు కోసం చైనా, పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
సామాజిక స్థితిగతులు
సుమారు 1.5 కోట్ల జనాభా కలిగిన ఈ ప్రావిన్స్లో 52 శాతం మంది బలూచ్లు. 36 శాతం పష్తూన్లు నివసిస్తున్నారు. రాజధాని క్వెట్టా నగరం ఈ ప్రాంతానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ బ్రాహుయి, హజారా వంటి మైనారిటీ వర్గాలు వారు కూడా ఉన్నారు. అయితే స్థానిక వనరులపై తమకు అధికారం లేకపోవడంపై ఇక్కడ నిరంతరం ఘర్షణలు జరుగుతున్నాయి.
పాలకుల తీవ్ర నిర్లక్ష్యం
బలూచిస్తాన్ సహజ వనరుల గని. ఇక్కడ భారీ స్థాయిలో సహజ వాయువు, బంగారం, రాగి, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. కానీ ఈ వనరుల ద్వారా వచ్చే ఆదాయం తమ అభివృద్ధికి కాకుండా, పాక్ కేంద్ర ప్రభుత్వానికే చేరుతోందని బలూచ్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్థిక దోపిడీయే వేర్పాటువాదానికి ప్రధాన కారణంగా మారుతోంది.
‘మహా బలూచిస్తాన్’ ఆకాంక్ష
వేర్పాటువాద గ్రూపులు కేవలం పాకిస్తాన్లోని బలూచిస్తాన్తోనే ఆగకుండా, పక్కనే ఉన్న ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్లోని బలూచ్ ప్రాబల్య ప్రాంతాలను కలిపి ‘మహా బలూచిస్థాన్’ ఏర్పాటు చేయాలని కలలుగంటున్నాయి. అయితే మూడు దేశాల సరిహద్దులతో ముడిపడి ఉండటం వల్ల ఈ లక్ష్యం అత్యంత సంక్లిష్టంగా, సవాలుతో కూడినదిగా మారింది.
ఇదే అతిపెద్ద అవరోధం
బలూచ్ నేతలు తమది స్వతంత్ర దేశంగా చెప్పుకుంటున్నప్పటికీ, ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశం కూడా దీనిని గుర్తించలేదు. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై దౌత్యపరమైన మద్దతు లేకపోవడం దేశ స్వాతంత్ర్య పోరాటానికి పెద్ద అడ్డంకిగా మారింది. చైనా వంటి శక్తులు పాకిస్తాన్కు అండగా నిలుస్తున్నంత కాలం, దౌత్యపరమైన గుర్తింపు లభించడం అంత సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ట్రంప్ సుంకాలు: భారత్కు భారీ ఊరట


