ఇస్లామాబాద్: పాకిస్థాన్లో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రాజధాని ఇస్లామాబాద్లో పేలుడు సంభవించి 50 మందికి పైగా మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదు వద్ద పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. బాంబు పేలుడుతో రాజధానిలో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పాక్ ఆంగ్ల మీడియా డాన్ తెలిపింది.
డాన్ మీడియా వివరాల ప్రకారం.. రాజధాని ఇస్లామాబాద్లో షహజాద్ టౌన్ ప్రాంత మజీద్లో రక్తం ఏరులై పారింది. పేలుడు దాటికి మజీద్లో 50మంది ప్రాణాలు కోల్పాయారు. 80మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతను బట్టి మృతులు,క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు.. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.
మజీదులో పేలుడు ఘటనపై రంగంలోకి దిగిన బాంబు క్లూస్ టీం ఇది ఆత్మాహుతి దాడా? లేదంటే బాంబుల్ని అమర్చారా? అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇస్లామాబాద్లో పేలుడు ఘటన జరగడం రెండోసారి. అంతకుముందు నవంబర్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12మందికిపైగా గాయపడ్డారు.
ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ, బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు, కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇరు వర్గాలు తీవ్రంగా గాయపడ్డాయి.


